• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Kerala LDF

కేరళ రాజకీయం : నరేంద్రమోడీ, రాహుల్‌ గాంధీ దిగజారుడు – పినరయి విజయన్‌ హుందాతనం !!

18 Thursday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, STATES NEWS

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, BJP, Kerala LDF, Kerala UDF, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇతర ముఖ్యమంత్రులను వేటాడుతున్నట్లుగా బిజెపి కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంట ఎందుకు పడటం లేదంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వయనాడు నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ప్రశ్నించారు. కాషాయ పార్టీని విమర్శించే దమ్ము సిపిఎంకు ఉందా అంటూ మాట్లాడారు.ఎల్‌డిఎఫ్‌-బిజెపి కుమ్మక్కై తమను దెబ్బతీసేందుకు చూస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎల్‌డిఎఫ్‌-యుడిఎఫ్‌ మధ్య సంకుల సమరం సాగుతున్న కేరళలో గతంలో మాదిరి తమకు సీట్లు రావని భావిస్తున్న కాంగ్రెస్‌ ముందుగానే సాకులు వెతుకుతున్నట్లు ఈ ప్రచారం వెల్లడిస్తున్నది.నిజానికి సిపిఎంను దెబ్బతీసేందుకు గతంలో కాంగ్రెస్‌-బిజెపి అనేక చోట్ల కుమ్మక్కైన చరిత్ర ఆ పార్టీలకు ఉందని సిపిఎం అనేక సార్లు చెప్పింది. తమను విమర్శిస్తున్నంత తీవ్రంగా బిజెపిని వామపక్షాలు విమర్శించటం లేదని యుడిఎఫ్‌ ఆరోపిస్తోంది. ఇద్దరు మాజీ సిఎంల బిడ్డలు బిజెపిలో చేరి కాంగ్రెస్‌ను సవాలు చేస్తుంటే, అనేక మంది అటువైపు తొంగి చూస్తుంటే వారికి సమాధానం చెప్పలేని స్థానిక కాంగ్రెస్‌ నేతలు, రాహుల్‌ గాంధీ బిజెపిని వదలి సిపిఎం మీద ఎందుకు విరుచుకుపడుతున్నట్లు ? బిజెపి అభ్యర్ధిగా తన కుమారుడు పోటీ చేస్తున్నచోట కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లటానికి మాజీ సిఎం ఎకె ఆంటోని ఆరోగ్యం బాగులేదని సాకు చెప్పారు. బిజెపిని గట్టిగా విమర్శిస్తే ఎవరి మీద ఏ ఇడి,ఐటి, సిబిఐని వదులుతారో అని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.మాజీ సిఎం కరుణాకరన్‌ కుమార్తె పద్మజ ఆ కారణంగానే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.


” ఎవరైనా బిజెపిని విమర్శిస్తే వారు సిబిఐ, ఇడి,సభ్యత్వాల రద్దు, ఆస్తుల స్వాధీనాలతో ఎదురుదాడి చేస్తారని నాకు తెలుసు.ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే కేరళ సిఎం మీద బిజెపి ఎందుకు దాడి చేయటం లేదు. ఎందుకు ఆయన సంపదలను స్వాధీనం చేసుకోలేదు, ఎందుకు సిఎం పదవిని లాగివేయలేదు, కోర్టు కేసులు ఎందుకు పెట్టలేదు, ఇడి ద్వారా ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పటికే ఇద్దరు సిఎంలు జైల్లో ఉన్నతరువాత కూడా ఎందుకు అలా చేయలేదు ” అని బిజెపిని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మతి తప్పి రాజకీయంగా దిగజారి మాట్లాడటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.” ఇరవై నాలుగు గంటలూ తనను విమర్శిస్తున్న కేరళ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపిని ఎందుకు విమర్శించటం లేదు, కొద్ది సమయమైనా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, నరేంద్రమోడీని విమర్శించాలి కదా ” అని రాహుల్‌ ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ ఈ స్థాయికి దిగజారి ఎందుకు మాట్లాడారన్నది ప్రశ్న.పినరయి విజయన్‌ మీద తప్పుడు కేసులు పెట్టాలని మోడీకి సలహా ఇస్తున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు.


కేరళ ఎన్నికలలో సిఏఏ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ సిఏఏ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చేందుకు తిరస్కరించింది. ఈ రెండు అంశాలను ఎందుకు విస్మరిస్తున్నదని గురువారం నాడు మలప్పురం విలేకర్ల సమావేశంలో, అంతకు ముందు కూడా సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. సిఏఏ గురించి కాంగ్రెస్‌ న్యాయపత్రలో ప్రస్తావన లేదని చివరికి దీన్ని అమెరికా కూడా విమర్శించినా కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. బిజెపిని సిపిఎం గట్టిగా విమర్శించటం లేదన్న కాంగ్రెస్‌ ఆరోపణ గురించి మాట్లాడుతూ ఈ అంశంలో తమకు కాంగ్రెస్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంత మంది కాంగ్రెస్‌ వారి మీద కేసులు నమోదయ్యాయో రాహుల్‌ గాంధీ చెప్పగలరా అని విజయన్‌ సవాల్‌ విసిరారు. సిఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో కలసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరిక్షణంలో కాంగ్రెస్‌ వెనక్కు తగ్గిందని, బహుశా అగ్రనేతల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల కావచ్చని సిఎం అన్నారు.( జమ్మూలోని కథువాలో ఎనిమిదేండ్ల బాలిక మీద అత్యాచారం హత్య చేసిన ఉదంతం దేశంలో తీవ్ర సంచలన కలిగించిన సంగతి తెలిసిందే.) కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు చేసినవారిలో ఒకడైన బిజెపి నేత చౌదరి లాల్‌ సింగ్‌ను స్వయంగా రాహుల్‌ గాంధీ గత నెలలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఇప్పుడు ఉధంపూర్‌ లోక్‌సభ అభ్యర్ధిగా నిలిపారని విజయన్‌ విమర్శించారు. సంఘపరివార్‌ను వ్యతిరేకించటంలో కాంగ్రెస్‌ గట్టి వైఖరి తీసుకోవటం లేదన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బిజెపి ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ రు.1,952 కోట్లు తీసుకొన్నదని అలాంటి పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఎన్నికల బాండ్ల గురించి లూటీ అంటూ కబుర్లు చెబుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు.వాటికి వ్యతిరేకంగా సిపిఎం కేసు వేసిన అంశాన్ని గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణ నిర్వహిస్తున్న ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఒక కేసు నమోదైంది.దానిలో నిజానిజాలను ఆరోపించిన వారు వెల్లడించాలి, దాన్ని కోర్టు విచారించి తీర్పు చెప్పాలి. కానీ ఈ లోగానే దీన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్‌,బిజెపి చూస్తున్నాయి. మీడియా కూడా విజయన్‌న్ను రెచ్చగొట్టేందుకు చేయని యత్నం లేదు.” ఎన్నికల సమయం గనుక సిఎంను ఇబ్బంది పెట్టటం, మౌనంగా ఉండేట్లు చూడటం నరేంద్రమోడీ ఎత్తుగడ. కానీ సిఎం సవాలుగా తీసుకున్నారు.తన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారని పినరయికి తెలుసు. కానీ పార్టీకోసం ఆయన సహించారు ” అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక రాసింది. తన కుమార్తె కంపెనీ మీద వచ్చిన ఆరోపణల గురించి త్రిసూరులో జరిపిన విలేకర్ల సమావేశంలో విజయన్‌ ఇచ్చిన సమాధానాలు విమర్శకుల నోటికి తాళం వేయటమే కాదు, ఆయన హుందాతనాన్ని వెల్లడిస్తున్నాయి.” ఒక కంపెనీ నుంచి సేవలు పొందినందుకు మరొక కంపెనీ ఇచ్చిన ఫీజు అంశమది. దాన్లో రహస్యమేమీ లేదు. అదంతా బాంకు ఖాతాల ద్వారానే జరిగింది.కంపెనీ దాఖలు చేసిన ఆదాయపన్ను పత్రాల్లో కూడా అది ప్రతిబింబించింది. దేశంలో కొత్త అంశమేమంటే పారదర్శకంగా జరిగిన లావాదేవీలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని నూతన సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారు. దాని గురించి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు ” అన్నారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలు, చెప్పుకున్న గొప్పలను విలేకర్లు ప్రస్తావించగా వాటికి ఇచ్చిన సమాధానాలను చూద్దాం.


నరేంద్రమోడీ: డిపాజిటర్ల (కరువన్నూరు సహకార బాంకు) డబ్బు తిరిగి ఇచ్చినట్లు సిఎం అవాస్తవం చెబుతున్నారు.బాంకు నుంచి స్వాధీనం చేసుకున్న రు. 90 కోట్ల మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఉందా లేదా అని నేను ఇప్పటికే మాట్లాడాను.
విజయన్‌ : కరువన్నూరు డిపాజిటర్లకు రు.117 కోట్ల వరకు చెల్లించారు.డిపాజిటర్లు కోరితే ఇంకా ఇవ్వటానికి బాంకు సిద్ధంగా ఉంది.బిజెపి కోరుకుంటున్నట్లుగా బాంకు కుప్పకూలిపోలేదు.అది సాధారణ లావాదేవీలు నడుపుతున్నది.
నరేంద్రమోడీ : త్రిసూరు జిల్లా సిపిఎం కార్యదర్శికి వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
విజయన్‌: స్థానిక శాఖల నుంచి జిల్లా కమిటీ కార్యాలయం వరకు జిల్లా అంతటా స్థలాలు, ఆఫీసులు ఉన్నాయి.వాటినే సిపిఎం జిల్లా కార్యదర్శి ఆస్తులని ప్రధాని చెప్పారు. ఇలాంటి అభాండాలు సిపిఎం వంటి పార్టీని దెబ్బతీయలేవు.
నరేంద్రమోడీ : సిపిఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.
విజయన్‌: గత పది సంవత్సరాలలో బిజెపి నాయకత్వంలోని కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తాజా అంశానికి వస్తే ఎన్నికల బాండ్ల కుంభకోణం. దీనికి అనేక కోణాలు ఉన్నాయి.ఇంత పెద్ద అవినీతి అసాధారణ రాజకీయ సంస్కృతిలో భాగం.
నరేంద్రమోడీ : పేదలకు మూడు కోట్ల ఇళ్లు మోడీ హామీ.
విజయన్‌ : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో బిజెపి చెప్పింది. ఈ హామీ ఏమైంది ? 2024 ప్రణాళికలో దీని గురించి మౌనం దాల్చారు. ఇక్కడ కేరళ పని తీరును చూడవచ్చు. ఇల్లులేని వారు ఎవరూ ఉండకూడదు అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పటికే 4.56 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. మరో 1.52లక్షల ఇళ్ల పని పురోగతిలో ఉంది.
నరేంద్రమోడీ : సాధించిన విజయాలుగా చెప్పుకొనేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. కేంద్ర పధకాలనే తన గొప్పలుగా చెప్పుకొంటోంది.
విజయన్‌ : గృహ నిర్మాణంలో కేంద్ర పాత్ర ఏమిటో విశ్లేషిద్దాం.పిఎంఏవై(గ్రామీణ) పధకం కింద 33,517 ఇళ్లకు ఒక్కోదానికి రు.72,000 మంజూరు చేసింది.పిఎంఏవై(పట్టణ) పధకం కింద ఒక్కోదానికి రు.1.5లక్షల చొప్పున 83,261 ఇళ్లకు మంజూరు చేసింది. కేరళ లైఫ్‌ మిషన్‌ పధకం కింద ఇప్పటికి దాదాపు ఐదు లక్షల ఇండ్లకు గాను రు.17,490 కోట్లు ఖర్చు చేశాము. వీటిలో కేంద్రం నుంచి వచ్చింది కేవలం రు.2,081 కోట్లు, మొత్తంలో కేవలం 11.9శాతం మాత్రమే.


కేరళ లోక్‌సభ ఎన్నికలు ఈనెల 26న జరగనున్నాయి.దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కాషాయ దళాలు కేరళలో క్రైస్తవుల ఓట్ల కోసం చర్చీల చుట్టూ తిరుగుతున్నాయి.లవ్‌ జీహాద్‌ పేరుతో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు.వ్రతం చెడ్డా భంగపడ్డారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి 48.48శాతం, 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి 36.29శాతం, 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి 15.64శాతం, 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో కింగ్‌ మేకర్‌గా మారి తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్కసీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఈ సారి మరోసారి ఓటర్లను మభ్య పెట్టేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుక్క కాటుకు చెప్పుదెబ్బ : కేరళ స్టోరీకి పోటీగా మణిపూర్‌ చిత్రం !

14 Sunday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), kerala 2024 loksabha elections, Kerala BJP vote Share, Kerala LDF, Kerala UDF, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేరళలో ఈనెల 26న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం కొనసాగింపుగా పైచేయి సాధించాలని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ చూస్తుండగా 2019 పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన సీట్లను నిలుపుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సీటు సాధించి రాష్ట్రంలో తమకూ స్థానం ఉందని పరువు నిలుపుకొనేందుకు బిజెపి చూస్తోంది. జనసంఘం తరువాత బిజెపిగా ఉన్న పార్టీకి గతంలో ఒకసారి ఒక అసెంబ్లీ స్థానం రావటం తప్ప కేరళ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ద్వారా కేరళ బిజెపి నేతలు ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఒక స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ ఎన్నికలలో అనూహ్యంగా కేరళ స్టోరీ పేరుతో వచ్చిన ఒక సినిమాను సంఘపరివార్‌ ప్రోద్బలంతో క్రైస్తవ మతాధికారులు ప్రదర్శిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ పేరుతో కాషాయ దళాలు ముందుకు తెచ్చిన కుట్ర సిద్దాంతంతో కూడా కూడిన ఊహాజనిత చిత్రమే అది.ముస్లిం యువకులు హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన యువతులకు వలపు వలవేసి మతమార్పిడికి చూస్తున్నారన్నదే ఆ చిత్ర కథ. ఇటీవల బిజెపి వైపు మొగ్గిన కొందరు క్రైస్తవ మతపెద్దలు తమ మతానికి చెందిన యువతులను హెచ్చరించే పేరుతో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని దూరదర్శన్‌లో కూడా ఇటీవల ప్రదర్శించారు. దీంతో ఎంత మంది బిజెపికి ఓటు వేస్తారో తెలియదు. దీనివెనుక ఉన్నవారు ఊహించని విధంగా అదే క్రైస్తవ మతానికి చెందిన వారు మణిపూర్‌లో క్రైస్తవ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల ఉదంతాలతో రూపొందించిన ” అణచివేతకు గురైనవారి ఆక్రందన ”( క్రై ఆఫ్‌ ద అప్రెస్‌డ్‌) పేరుతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీని పోటీగా ప్రదర్శిస్తున్నారు. కేరళలో 18శాతం మంది క్రైస్తవమతాన్ని అవలంభించే జనం ఉన్నారు. ముస్లింలు 26.6శాతం ఉన్నారు. మణిపూర్‌లో కుకీ తదితర గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించి బాధితులకు ఊరటగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి హిందూమతానికి చెందిన మెయితీలకు మద్దతుగా ఉందనే విమర్శలు ఉన్నాయి.


కమ్యూనిజం, కమ్యూనిస్టు పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి కేరళలో మెజారిటీ క్రైస్తవుల ఓట్లు పొందటంలో గతంలో కాంగ్రెస్‌ ఎత్తుగడలు పారాయి. తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనేక చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బిజెపి కూడా రంగంలోకి దిగి వారిని సంతుష్టీకరించేందుకు చర్చీల చుట్టూ చక్కర్లు కొడుతున్నది.కేరళ స్టోరీ చిత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. అర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసి దూరదర్శన్‌లో కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సిపిఎం, కాంగ్రెస్‌ రెండూ విమర్శించాయి.తమకేమీ సంబంధం లేదని బిజెపి బుకాయించింది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం, వయనాడు నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ గెలిస్తే ప్రధాని అవుతారన్న ప్రచారం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని, ఎవరు గట్టిగా నిలబడతారని భావించే వారికి ఓటు వేయనున్నారని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ ఒక సమీక్షలో పేర్కొన్నది.


ముందే చెప్పినట్లు 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి (48.48శాతం) 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి (36.29శాతం) 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి (15.64శాతం) 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత రెండు సంవత్సరాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్క సీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు ఐదు సీట్లు తెచ్చుకుంటామని, పదేండ్లలో రాష్ట్రంలో అధికారానికి వస్తామని బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ చెబుతున్నారు. గతంలో నరేంద్రమోడీ పలుకుబడి, శబరిమల వివాదంపై రెచ్చగొట్టుడు దానికేమీ లాభించలేదు.


శైలజా టీచర్‌పై ముగ్గురు శైలజల పోటీ ! సిఏఏ ప్రస్తావనకు భయపడిన కాంగ్రెస్‌ !!
కేరళ లోక్‌సభ ఎన్నికలు మొత్తంగా ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ సిపిఎం అభ్యర్ధిగా వడకర స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంఎల్‌ఏ కె కె శైలజ టీచర్‌ మీద అదే పేరు గలిగిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున పాలక్కాడ్‌ ఎంఎల్‌ఏ షఫీ పరంబి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రతినిధులు గెలిచారు. కన్నూరు లోక్‌సభ పరిధిలోని మట్టనూర్‌ అసెంబ్లీ నుంచి కెకె శైలజ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 61వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద సిఏఏ(చట్టం)ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో దాని ఊసెత్తలేదు. ప్రశ్నించిన విలేకర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ ఇంకేదైనా ప్రశ్న ఉండే అడగండని సమాధానాన్ని దాటవేశారు. పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హసన్‌ మాట్లాడుతూ మేము అ చట్టాన్ని రద్దు చేయాలని ఆసక్తితో ఉన్నాం అయితే సిపిఎంను మెప్పించేందుకు దాన్ని మానిఫెస్టోలో చేర్చాల్సిన అవసరం లేదు. మార్క్సిస్టులు చెప్పినట్లు మానిఫెస్టోను రాయాల్సిన అవసరం లేదన్నారు.


కుక్కలా మొరుగుతున్నారని తండ్రిని తూలనాడిన కొడుకు !
పత్తానంతిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు ఓడిపోవటం ఖాయమని, అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ గెలుస్తుందని కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోనీ చెప్పారు.కుటుంబం-రాజకీయాలు వేరు వేరని తాను తొలి నుంచి చెబుతున్నానని తన పిల్లల గురించి ఎక్కువగా అడగవద్దని అన్నారు. కాంగ్రెస్‌ నేతల పిల్లలు బిజెపిలో చేరటం తప్పిదమన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా పత్తానంతిట్ట ప్రచారానికి వెళ్లటం లేదని అన్నారు. కేరళలో శబరిమల సమస్య ముగియటంతో బిజెపి స్వర్ణయుగం ముగిసిందని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై కుమారుడు అనిల్‌ ఆంటోనీ స్పందిస్తూ గాంధీ కుటుంబం కోసం నిలబడుతున్నవారిని చూసి విచారిస్తున్నానని, కాలం చెల్లిన నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారని, చంద్రుడిని చూసి కుక్కలు మొరిగినట్లుగా ఈ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తండ్రి పట్ల అనిల్‌ అంటోనీ కాస్త మర్యాదను చూపాలని తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్ధి శశిధరూర్‌ సలహా ఇచ్చారు. బిజెపి నేతల భాషతో తాను పోటీపడలేనన్నారు.


బిజెపి ప్రచార తీరు ఇదా !
వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ జాతీయ మహిళానేత అన్నీ రాజా బరిలో ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు.తాను గెలిస్తే నియోజకవర్గంలోని సుల్తాన్‌ బాతరీ పేరును గణపతి వట్టం అని మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ ఈ ప్రాంతంలోని ఒక పాడుపడిన జైన ఆలయంలో తన ఫిరంగులను ఉంచి బ్రిటీష్‌ వారి మీద యుద్ధం చేశాడు. దాంతో బ్రిటీష్‌ వారు ఆ ప్రాంతాన్ని సుల్తాన్‌ బ్యాటరీ అని పిలిచారని తరువాత అదే సుల్తాన్‌ బాతరీగా మారిందని చెబుతున్నారు. అక్కడ ఒక చిన్న గణపతి ఆలయం ఉందని, అందువలన గణపతి వట్టం అని కూడా పిలిచారని కొందరు చెబుతారు. ఇది టిప్పు సుల్తాన్‌ ప్రాంతం కాదు గనుక గణపతివట్టంగా పేరు మార్చాలని బిజెపి నేత చెప్పారు. ఎన్నికల్లో చెప్పుకొనేందుకు ఏమీలేక బిజెపి జోకులు పేలుస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొందరు అపహాస్యం చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోడేళ్లను బుజ్జగిస్తున్న మేకలు : కేరళలో వివాదంగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌ – జమాతే చర్చలు !

23 Thursday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), JIH, Kerala LDF, Muslim League, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమదారికి తెచ్చుకోవటం అసాధ్యమా ? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్‌ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.


జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్‌ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.” ఆర్‌ఎస్‌ఎస్‌తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు.ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్చకు రక్షణ. దాన్ని విచ్చిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం ? సంఘపరివార్‌ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకు మద్దతు ఇస్తాయి.మతశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు.లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్‌ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్‌, సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమా, ముస్లిం లీగ్‌, కేరళ నదవతుల్‌ ముజాహిదీన్‌, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్‌ కాంతాపురం ఏపి అబూబకర్‌ ముస్లియార్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్‌ పేర్కొన్నది.మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది.భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పి పుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ఒక పనిముట్టుగా మారుతున్నది ” అని విమర్శించింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్‌ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్‌ పేర్కొన్నారు.


ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘపరివార్‌ నేతలు ఇంద్రేష్‌ కుమార్‌, రామ్‌లాల్‌, కృష్ణ గోపాల్‌ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్‌, జమాతే ఉలేమా ఇ హింద్‌, అజ్మీర్‌ దర్గా సల్మాన్‌ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, నజీబ్‌ జంగ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హౌటల్‌ ఓనరు సయిద్‌ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్‌ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్‌ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగాస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు భావించారు.ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్‌ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది.అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.


ఆర్‌ఎస్‌ఎస్‌-జమాతే ఇస్లామీ హింద్‌ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్‌ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్‌ పార్టీ, జమాతే పట్ల ముస్లింలీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్‌ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్‌ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్‌ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్‌ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్‌ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు.సిఎం పినరయి విజయన్‌ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.


ఖురాన్‌లో మూడుసార్లు తలాక్‌ అనే పద్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు ? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్‌ అనేదాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు.వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కులవృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు(బ్రాహ్మలు కాదు మేథావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా ! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు.కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారా ? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?


సిపిఐ(ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకువెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, యాత్ర సారధి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు.లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ ఎలా అంటారు ? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లింలీగ్‌ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్‌, సిఎస్‌ సుజాత, ఎం స్వరాజ్‌, కెటి జలీల్‌, జేక్‌ సి థామన్‌ సారధులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రు.40వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రు.9,000 కోట్లు, రెవెన్యూలోటు పరిహారం రు.6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పధకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది.రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అదానీ కోసం కేరళలో బిజెపితో సిపిఎం చేతులు కలిపిందా ? నిజా నిజాలేమిటి ?

07 Wednesday Dec 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adani Group, BJP, Kerala LDF, Latin Catholic archdiocese, Pinarayi Vijayan, RSS, Vizhinjam project


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేట్రేగుతున్న కేరళ గవర్నర్‌ : 15న రాజభవన్‌ వద్ద ధర్నా , ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సుబ్రమణ్య స్వామి డిమాండ్‌ !

29 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Arif Mohammed Khan, BJP, Kerala LDF, Narendra Modi, Pinarai Vijayan, RSS, Subramanya swamy


ఎం కోటేశ్వరరావు


కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తనకు పదవి ఇచ్చిన కేంద్ర పెద్దలను సంతుష్టీకరించేందుకుగాను నానా పాట్లు పడుతున్నారు. దానిలో భాగంగానే ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా పేట్రేగుతూ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతున్నారు. పచ్చి అవాస్తవాలు కూడా చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు బిజెపి కేంద్ర నేత సుబ్రమణ్య స్వామి మరింతగా రెచ్చిపోయారు. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వెంట్రుకను ముట్టుకున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఒక ట్వీట్‌ ద్వారా డిమాండ్‌ చేశారు.” రాజ్యాంగం ప్రకారం కేరళ గవర్నర్‌ అంటే భారత రాష్ట్రపతి ప్రతినిధి అని కేరళలోని వెర్రి కమ్యూనిస్టులు తెలుసుకొనేట్లు చేయండి. ఒక వేళ గవర్నర్‌ వెంట్రుకను ముట్టుకున్నా మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు సిద్దం కావాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అని ఒక ట్వీట్‌ చేశారు. తాజా వివాదానికి వస్తే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో యుజిసి నిబంధనలను పాటించని కారణంగా వారంతా రాజీనామా చేయాలని గవర్నర్‌ ఆదేశించారు. దీని గురించి పరోక్షంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ చేసిన సాధారణ విమర్శ తన గురించే అని ఊహించుకొని ఏకంగా మంత్రిని తొలగించాలని లేఖ రాశారు.


కేరళ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో బాలగోపాల్‌ మాట్లాడుతూ ” ఉత్తర ప్రదేశ్‌ వంటి చోట్ల ఉన్న పరిస్థితులకు అలవాటు పడి అక్కడి నుంచి వచ్చిన కొందరికి కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామికంగా పని చేస్తున్న తీరును అర్ధం చేసుకోవటం కష్టం. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ భద్రతా సిబ్బంది ఐదుగురు విద్యార్దుల మీద కాల్పులు జరిపారు. నేను అప్పుడు ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లాను. వైస్‌ ఛాన్సలర్‌కు 50 నుంచి 100 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారు.అక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అది.” అన్నారు. గవర్నర్‌ ఖాన్‌ పేరు ప్రస్తావించినట్లుగా ఏ పత్రిక కూడా వార్తలు ఇవ్వలేదు. కానీ ఆమాటలను తనకు వర్తింప చేసుకొని, మంత్రిగా బాలగోపాల్‌ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున తాను ఇచ్చిన సమ్మతిని వెనక్కు తీసుకుంటున్నానని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అక్టోబరు 25న ఒక లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. దాన్ని విజయన్‌ తిరస్కరించుతూ, గవర్నర్‌కు అలాంటి అధికారం లేదని, బాలగోపాల్‌ మంత్రిగా కొనసాగటానికి గవర్నర్‌ అనుమతి అవసరం లేదు కనుక ఎలాంటి చర్య అవసరం లేదని అన్నారు. తొలగించాలన్న పదాన్ని గవర్నర్‌ పేర్కొనకపోయినా మంత్రిని తొలగించాలన్నదే దాని తార్కిక ముగింపు.


ముఖ్యమంత్రి గనుక మంత్రిని తొలగించకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళతారని శుక్రవారం నాడు ఢిల్లీలో గవర్నర్‌ ఖాన్‌ ది ప్రింట్‌ పత్రిక ప్రతినిధితో చెప్పారు. ఆర్ధిక మంత్రి బాలగోపాల్‌ను తొలగించాలని తాను కోరలేదని, తన సమ్మతి లేకుండా పదవిలో కానసాగే అవకాశం లేదని రాజ్యాంగం చెప్పిన దానిని కేవలం వివరించానని గవర్నర్‌ వివరించారు. తన లేఖ మీద నిర్ణయం ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిందని, అయితే ఈ అంశం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ప్రమాణం చేయించాల్సింది గవర్నర్‌,నేనాపని చేశాను. దేశ ఐక్యత సమగ్రతలను కాపాడతానని అతను ప్రమాణం చేశాడు. అతను( బాలగోపాల్‌ ) దాన్ని ఉల్లంఘించారు. విద్యావ్యవస్థను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తే అది ఉల్లంఘన కాదా ! అతనికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అని కూడా తెలియదు, అంతేకాదు దాని వైస్‌ ఛాన్సలర్లను ఉత్తరాది నుంచి గాక దక్షిణాది నుంచి నియమిస్తారు అని గవర్నర్‌ చెప్పారు.( ఆ విశ్వవిద్యాలయ ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ సుధీర్‌ కె జైన్‌.2000 సంవత్సరంలో తెలుగువాడైన విసి సింహాద్రి, 2003లో పచ్చా రామచంద్రరావు పనిచేశారు. వారికి ముందు 1952 వరకు-తరువాత జాబితాను చూస్తే ఉత్తరాది, ఇతర ప్రాంతాల వారు, ఒకరిద్దరు తప్ప దక్షిణాది వారు కనిపించరు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు ఈ అంశాలు తెలియవనుకోవాలా ? లేక బుకాయించారా. జాబితాను ఎవరైనా చూడవచ్చు. ) తనకు కేరళలోని ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని గవర్నర్‌ చెప్పుకున్నారు.


వైస్‌ ఛాన్సలర్లు రాజీనామాలు సమర్పించాలని తాను సూచించానే తప్ప ఉత్తరువులు ఇవ్వలేదని, తన సూచనలను నిర్ణీత గడువులో ఖాతరు చేయనందున సంజాయిషి కోరుతూ నోటీసులు జారీ చేశానని గవర్నర్‌ చెప్పారు. తన మార్గదర్శకాలను కోర్టు పక్కన పెట్టిందని చెప్పటం తప్పని గవర్నర్‌ అన్నారు. కేసు విచారణ రోజున విసిలకు పదకొండు గంటల వరకు గడువు ఇచ్చానని ఎలాంటి స్పందన లేకపోవటంతో 11.30 నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అదే రోజు కోర్టు సాయంత్రం నాలుగు గంటలకు విచారించిందని అప్పటికే నోటీసులు జారీ చేశానని అన్నారు. సమాధానం చెప్పేందుకు వారికి నవంబరు మూడవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు చెప్పారు.


గవర్నర్‌ చేస్తున్న పనులన్నీ సంఘపరివార్‌ అజెండా మేరకే ఉన్నాయని, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నందున నవంబరు 15న రాజభవన్‌ ఎదుట, జిల్లా కేంద్రాలలో ఎల్‌డిఎఫ్‌ నిరసన తెలుపుతుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ప్రకటించారు. రాజభవన్‌ వద్ద సిఎం కూడా పాల్గొంటారని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేస్తున్నారని, విసిలను తరచూ బెదిరిస్తున్నారని అన్నారు. ఏదో విధంగా సెనెట్‌, సిండికేట్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని దూర్చేందుకు చూస్తున్నారని, వాటిని సాగనివ్వబోమని అన్నారు. నవంబరు రెండవ తేదీన భావ సారూప్యత కలిగిన వారితో పెద్ద సభ నిర్వహిస్తామని, పదవ తేదీలోగా జిల్లాల్లో సభలు, పన్నెండవ తేదీన కాలేజీల్లో జరుగుతాయని చెప్పారు.


గవర్నర్‌ విధుల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదని, అంతకు మించి ఇతర అధికారపరిధిలోకి ఒక్క అంగుళం మేర ప్రవేశం గురించి కూడా ఊహించుకోవద్దని, తలదూర్చుదామనుకుంటే కుదరదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హితవు చెప్పారు.వ్యక్తిగత హౌదాతో పని చేసేందుకు గవర్నర్లకు అధికారాలు లేవని స్పష్టం చేశారు. వైస్‌ ఛాన్సలర్ల రాజీనామా కోరటం లేని అధికారాన్ని చెలాయించ చూడటమే అన్నారు. కెటియు వైస్‌ ఛాన్సలర్‌ నియామకాన్ని కోర్టు కొట్టివేయటాన్ని అవకాశంగా తీసుకొని తొమ్మిది మంది విసీలను తప్పు కోమని కోరుతున్నారని, ఒక వేళ నిబంధనలకు విరుద్దంగా నియామకం జరిగితే నియమించే అధికారర ఉన్న గవర్నర్‌దే దానికి దానికి ప్రాధమిక బాధ్యత అవుతుందని అన్నారు. కెటియు విసి ఉదంతంలో అకడమిక్‌ అర్హతలు లేవని సుప్రీం కోర్టు చెప్పలేదని, అనుసరించిన పద్దతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ఈ వివాదం హైకోర్టులో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం తీర్పును సమీక్షించాలని పిటీషన్‌ వేసే అవకాశం ఉందని, ఈ లోగా దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్‌ రాష్ట్రం మొత్తంలో యంత్రాంగాన్ని అస్థిరపచేందుకు చూస్తున్నారని సిఎం చెప్పారు. సుప్రీం తీర్పు ఒక్క కెటియుకే పరిమితమని అన్నారు.


వైస్‌ ఛాన్సలర్లను తొలగించేందుకు రెండు కారణాలుండాలని వాటిలో నిధుల దుర్వినియోగం, చెడునడతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే వాటి మీద హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి విచారణ జరిపి నిర్దారిస్తేనే తొలగించాలి తప్ప ఛాన్సలర్లకు తొలగించే అవకాశం లేదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గవర్నర్‌ తీరు ప్రజల తీర్పునే అవమానించేదిగా ఉంది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయటం, రాజ్యాంగమిచ్చిన అధికారాల మేరకు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లను సకాలంలో ఆమోదించకపోవటంతో పదకొండింటికి గడువు ముగిసింది.2019లో గవర్నర్‌గా వచ్చిన దగ్గర నుంచీ ఏదో ఒక వివాదాన్ని గవర్నర్‌ ముందుకు తెస్తున్నారు. మంత్రి వర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదివేందుకు తిరస్కరించి తన స్వంత ప్రసంగం చేశారు. తాను కోరిన అధికారిని విధుల నుంచి మార్చకపోతే గవర్నర్‌ ప్రసంగ ప్రతిపై సంతకాలు చేసేది లేని భీష్మించారు. మంత్రుల నియామకం, తొలగింపులో గవర్నర్లకు విచక్షణ అధికారాలు లేవు. గవర్నర్‌ ఖాన్‌ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రారంభించి, సెనెట్‌, సిండికేట్‌ మెంబర్స్‌, చివరికి విసీలను కూడా రచ్చ చేస్తున్నారు. పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంఘపరివార్‌ శక్తులు అడుగుపెట్టిన జెఎన్‌యు, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల్లో జరిగిందేమిటో తెలిసిందే, కేరళ సంస్థలను కూడా అలాంటి వారితో నింపేందుకు చూస్తున్నారని ఎల్‌డిఎఫ్‌ విమర్శిస్తోంది.


గవర్నర్‌ తీరుతెన్నులను కాంగ్రెస్‌ కూడా విమర్శించింది. ప్రశ్నించటానికి వీల్లేని దేవుడేమీ కాదు అంటూ ప్రతిపక్ష నేత విడి సతీషన్‌ చెప్పారు. మంత్రిని తొలగించాలనే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రి తొలగింపు కోరుతూ గవర్నర్‌ రాసిన లేఖకు పూచికపుల్లకున్న విలువ కూడా లేదని మాజీ మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ అన్నారు. ఈ వివాదం చివరకు ఏమౌతుంది, ఎలా ముగుస్తుందన్నది చూడాల్సి ఉంది.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వద్దకు కేరళ గవర్నర్‌ : పదవి గౌరవాన్ని మంటకలిపిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ! అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !!

21 Wednesday Sep 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arif Mohammed Khan, BJP, CPI(M), Kerala BJP, Kerala Governor Arif Mohammed Khan, Kerala LDF, Pinarai Vijayan, RSS



ఎం కోటేశ్వరరావు


తన ఆహ్వానాన్ని మన్నించి రాజ్‌భవన్‌ కార్యక్రమానికి రాలేదని, తనను కలవటం లేదని, ప్రోటోకాల్‌ మర్యాదలను మంట గలుపుతున్నారని తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ తమిళశై వాపోవటం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి, ఆమె రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చారనే విమర్శలకు గురైన అంశం తెలిసినదే. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మరొక అడుగు ముందుకు వేసి స్వయంగా ప్రోటోకాల్‌ను తీసి గట్టున పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను 2022 సెప్టెంబరు 17న ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. అంతే కాదు, మరీ ఎక్కువ మాట్లాడితో మరోసారి వెళ్లి కలుస్తా, నా ఇష్టం అంటూ చిందులు వేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే త్రిసూర్‌లో పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు గవర్నర్‌ కలిసినట్లు అధికారులు చెప్పారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. తరువాత గవర్నర్‌ విలేకర్లతో మాట్లాడుతూ 2019లో కన్నూరులో తనపై దాడికి యత్నించినవారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులను ప్రభుత్వం అడ్డుకుంటున్నదని గవర్నర్‌ ఆరోపించారు.


రాజభవన్‌ వెలుపలికి తానుగా వెళ్లి ప్రయివేటు వ్యక్తులను గవర్నర్లు కలిసిన దాఖలా లేదు. 2015లో ఉత్తర ప్రదేశ్‌ రాజభవన్లో నాటి గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను కలిశారు. వేరే చోట కలిసిన కేరళ గవర్నర్‌ సోమవారం నాడు(19వ తేదీ) తొలిసారిగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన చర్యను సమర్ధించుకోవటమే కాదు, మోహన్‌ భగవత్‌ రాష్ట్రానికి వస్తే మరోసారి వెళ్లి కలుస్తా అని చెప్పారు. తాను అధిపతిగా ఉన్న రాష్ట్రానికి భగవత్‌ వచ్చారు, అసలు ఆయన వస్తున్నట్లు నాకు తెలియదు, తెలియగానే వెళ్లి కలిశాను. మరోసారి గనుక వస్తే తిరిగి కలుస్తాను అంటూ తన చర్య గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని తరువాత గవర్నర్‌ వస్తారు. అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారు అనేక రాజభవన్ల పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురుదాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు. సిపిఎం హింసాత్మక భావజాలంతో పని చేస్తున్నదని ఆరోపిస్తూ కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలు తనకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని గవర్నర్‌ చెప్పుకున్నారు. వాటిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర కూడా ఉందని విలేకర్లు చెప్పగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ అధికారంలో లేదు, ప్రభుత్వం అలాంటి హింసాకాండను అదుపులో పెట్టాలి అన్నారు.


ఈ పెద్దమనిషి ప్రజాస్వామ్యాన్ని కూడా వద్దంటారు : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌పై పినరయి విజయన్‌


కమ్యూనిజం విదేశీ సిద్దాంతమంటున్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా అలాగే తృణీకరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్‌ చెప్పారు. సోమవారం నాడు కన్నూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పదవి గౌరవాన్ని మంటకలిపి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల స్థాయి దిగజారవద్దని గవర్నర్‌కు హితవు చెప్పారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ స్వామిభక్తిపరుడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదన్నారు. వామపక్ష ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం విదేశీ, ఇక్కడికి తీసుకువచ్చారని, అసమ్మతిని అణచేందుకు హింసను అనుమతిస్తుందని అంతకు ముందు గవర్నర్‌ విలేకర్ల సమావేశంలో ఆరోపించారు.దాన్ని ప్రస్తావించిన విజయన్‌ ఇటలీలోని ఫాసిజం ప్రాతిపదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని దాన్ని అక్కడి నుంచి, కమ్యూనిజం, క్రైస్తవం, ముస్లిం వ్యతిరేకతను హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ రోజు కమ్యూనిజం విదేశీ అంటున్న గవర్నర్‌ రేపు ప్రజాస్వామ్యం కూడా అలాంటిదే వద్దంటారని ధ్వజమెత్తారు.


గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా దిగజార్చమే కాదు, పార్టీ నేత మాదిరి అవకాశం వచ్చినపుడల్లా ప్రభుత్వం, పాలక సిపిఎం మీద విరుచుకుపడుతున్నారు. 2019 డిసెంబరులో కన్నూరులో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడిస్తానంటూ 2022 సెప్టెంబరు 19న విలేకర్లను రాజభవన్‌కు రప్పించారు. కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ప్రహసన ప్రాయంగా ముగించారు. మూడు సంవత్సరాల నాడు కన్నూరులో జరిగిన భారత చరిత్రకారుల సభలో ప్రారంభ ఉపన్యాసం పేరుతో చేసిన గవర్నర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు తీవ్ర నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది.చరిత్రకారుల సభలో సంబంధిత అంశాలు గాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ(సిఎఎ), ఎన్‌ఆర్‌సికి మద్దతు పలుకుతూ వ్యతిరేకిస్తున్నవారిని విమర్శించటంతో సభలో కొందరు తీవ్రనిరసన తెలిపారు. ఆ సభలో వేదిక మీద ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ చర్యకు నిరసన తెలుపుతూ ఈ విధంగా మీరు మాట్లాడేట్లయితే గాంధీ బదులు గాడ్సే గురించి చెప్పండనటాన్ని పత్రికలు ప్రస్తావించాయి. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందంటూ నిరసన తెలుపుతున్నవారితో గవర్నర్‌ వాదులాటకు దిగారు.ఈ తరుణంలో వేదిక మీద ఉన్న సిపిఎం నేత కెకె రాగేష్‌ పోలీసులు-నిరసన తెలుపుతున్నవారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌ను గవర్నర్‌ విలేకర్లకు అందచేశారు.


ఆ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రాగేష్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం, తనను అవమానించటం,భయపెట్టటం కుట్రలో భాగమని ఆరోపించారు.ఆ సభకు తనను ఆహ్వానించిన కన్నూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోపీనాధ్‌ రవీంద్రన్‌ కూడా కుట్రలో భాగస్వామే అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారన్న ప్రశ్నకు తనకు ఇటీవలే నాటి వీడియో దొరికిందని, దాన్లో పోలీసులను అడ్డుకుంటున్న రాగేష్‌ను చూశానని గవర్నర్‌ చెప్పుకున్నారు. ఈ కుట్ర గురించి ఇటీవలే తెలిసిందని కూడా చెప్పారు. అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు కన్నూరులో ఏం జరగనుందో తమకు ఐదు రోజుల ముందే తెలుసునని చెప్పాడని కేరళ ఇంటిలిజెన్స్‌ ఏం చేస్తున్నదని కూడా అడిగాడంటూ గవర్నర్‌ కథ వినిపించారు. ప్రముఖ చరిత్ర కారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తనపై హత్యాయత్నం చేశాడని చెప్పటం అతిశయోక్తి కాదా అన్న ప్రశ్నకు గవర్నర్‌ ఇర్ఫాన్‌ హబీబ్‌ను కించపరుస్తూ దూషణలకు దిగి హబీబ్‌ తనను బెదిరించేందుకు, భయపెట్టేందుకు చూశారని ఆరోపించారు. అంతే కాదు అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయరోజుల నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడేవారని, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్నారని, దెబ్బలాటలకు దిగేవారని అందువలన ఇక్కడ కూడా అదే చేశారని అనుకున్నానని కానీ తరువాత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని తెలిసిందని ఆరోపించారు. గవర్నర్‌ ప్రదర్శించిన క్లిప్పింగ్‌ను చూసిన వారెవరికీ ఇర్ఫాన్‌ హబీబ్‌ అనుచితంగా ప్రవర్తించినట్లు ఏమాత్రం అనిపించలేదు.అయితే దాన్ని చూసినపుడు గవర్నర్‌ చేసిన అనుచిత ప్రసంగం హబీబ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపించింది.మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ గురించి తప్పుగా ఉటంకిస్తున్నారని దాని బదులు గాడ్సే గురించి చెప్పాలని తన స్ధానం నుంచి లేచి ఇర్ఫాన్‌ హబీబ్‌ అన్నట్లు దానిలో ఉంది. గవర్నర్‌ ఆరోపణలు పసలేని, కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ఆ సభలో సంబంధం లేని అంశాలను గవర్నర్‌ మాట్లాడతారని ఎవరికైనా ముందుగా ఎలా తెలుస్తుంది. ఈ పత్రికా గోష్టిలోనే గవర్నర్‌ కమ్యూనిజం మీద, పాలకపార్టీ నేతల మీద నోరుపారవేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు.


వివాదాస్పద బిల్లులపై తాను ఆమోదం వేసేది లేదని ప్రకటించిన గవర్నర్‌ అదే చేశారు.అసెంబ్లీ ఆమోదించిన పదకొండింటికి గాను ఐదింటి మీద సంతకం చేసి అక్టోబరు మూడు వరకు ఢిల్లీలో ఉండేందుకు బుధవారం నాడు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ప్రతిదాని మీద సంతకం చేసేందుకు తాను రబ్బరు స్టాంపును కానని కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ ప్రకటించారు. అసెంబ్లీలకు బిల్లులను ఆమోదించే అధికారం ఉంటే వాటిని తన ఆమోదానికి పంపినపుడు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం తనకు ఉన్నదని అన్నారు. ఒకసారి తిప్పి పంపిన బిల్లులను మరోసారి సవరణలతో లేదా వాటినే తిరిగి అసెంబ్లీ పంపితే వాటిని ఆమోదించటం మినహా మరొక మార్గం గవర్నర్లకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వంతో లడాయి పెట్టుకొనేందుకు గవర్నర్‌ సిద్దపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.


కాంగ్రెస్‌ జోడో యాత్రలో సావర్కర్‌ చిత్రం !
తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి లొంగి వారి సేవ చేసుకుంటానంటూ లేఖలు రాసి జైలు నుంచి బయపడిన వివాదాస్పద హిందూత్వ నేత విడిసావర్కర్‌ చిత్రాన్ని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల సరసన బానర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ నిర్వాకం కేరళలో జరిగింది.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర బుధవారం నాడు ఎర్నాకుళం జిల్లా ఆలువలో ప్రవేశించినపుడు ఏర్పాటు చేసిన బానర్లలో ఇది ఒకటి. ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌ నేతలు సావర్కర్‌ బొమ్మ మీద మహాత్మా గాంధీ చిత్రాన్ని అంటించారు. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగింది. దీనికి చెంగన్మాడ్‌ నియోజకవర్గ ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సురేష్‌ కారకుడంటూ అతడిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనికి కాంగ్రెస్‌కు లేదా జోడో యాత్ర నిర్వాహకులకు సంబంధం లేదని, స్థానిక కార్యకర్తలు చేసినపని అని కాంగ్రెస్‌ సంజాయి షి చెప్పుకుంది.


అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !
ఆదివాసి గోత్ర మహాసభ నేతగా కేరళలో ప్రాచుర్యం పొందిన సికె జాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు, బిజెపి కూటమిలోకి వచ్చేందుకు గాను లంచం ఇచ్చిన కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అడ్డంగా దొరికారు. జనాధిపత్య రాష్ట్రీయ సభ పేరుతో 2016లో ఆమె ఏర్పాటు చేసిన పార్టీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ పేరుతో బిజెపితో కలసి పోటీ చేసింది.ఎన్‌డిఏ నుంచి విడిపోతున్నట్లు 2018లో ప్రకటించింది. తిరిగి 2021 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేయాలని కోరిన బిజెపి ఆమెకు డబ్బు ఇచ్చింది. మంతన్‌వాడి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తొలి విడతగా పది లక్షలు ఇచ్చారు. ఫోన్లో మాట్లాడారు. మరో పాతిక లక్షలు ఇస్తానని చెప్పారు. ఈ అంశాన్ని జాను సహచరిగా ఉన్న ప్రసీత చెప్పటమే గాక ఆధారంగా ఫోన్‌ సంభాషణ రికార్డులను వెల్లడించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సురేంద్రన్‌, ఇతరుల గళాలను రికార్డు చేసి ఫోరెన్‌సిక్‌ లాబ్‌ పరీక్షకు పంపారు. బుధవారం నాడు వెలువడిన పరీక్ష నివేదికలో ప్రసీత విడుదల చేసిన రికార్డుల్లో ఉన్న గళం సురేంద్రన్‌ గళం ఒక్కటే అని నిర్ధారణైంది. ఇప్పుడు పోలీసులు చార్జిషీట్లను దాఖలు చేయాల్సి ఉంది. సురేంద్రన్‌పై మరొక అవినీతి కేసు ఉంది. 2016 ఎన్నికల్లో మంజేశ్వరమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్‌ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిఎస్‌పి తరఫున కె సుంద్ర పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు పక్క పక్కనే ఒకే విధంగా ఉండటంతో తనకు పడాల్సిన ఓట్లు సుంద్రకు పడి తాను ఓడినట్లు బిజెపి నేత భావించారు.తిరిగి 2021 ఎన్నికల్లో కె సుంద్ర పోటీకి దిగారు. దాంతో పోటీ నుంచి తప్పుకుంటే కొంత డబ్బుతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇల్లు, ఒక వైన్‌ షాపు ఇప్పిస్తానని బిజెపి నేత ప్రలోభపెట్టారు. ఆ ఎన్నికల్లో 1,143 ఓట్ల తేడాతో ఓడారు. తనకు కేవలం రెండున్నర లక్షల నగదు, పదిహేను వేల విలువ గల సెల్‌ ఫోన్‌ మాత్రమే ఇచ్చారని, వాగ్దానం మేరకు ఇతరంగా ఏమీ ఇవ్వలేదని కె సుంద్ర వెల్లడించాయి .దాంతో పోలీసులు అవినీతితో పాటు ఎస్‌సి,ఎస్‌టి వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !

20 Friday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Haj quota, Kerala CPI(M), Kerala LDF, Narendra Modi, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు హజ్‌ యాత్ర సంబంధిత అంశాల గురించి కాషాయ దళాలు చేసిన, చేస్తున్న నానా యాగీ గురించి తెలిసినదే.మరోవైపు హిందూత్వ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ భారత్‌ నుంచి హాజ్‌ యాత్రకు భారత్‌ నుంచి కోటా పెంచాలని, పురుషుల తోడు లేకుండా మహిళలను అనుమతించాలని కోరుతూ సౌదీ అరేబియాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని భారత్‌ హాజ్‌ కమిటీ అధ్యక్షుడు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన ఎపి అబ్దుల్లా కుట్టి స్వయంగా చెప్పారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కేరళ సందర్శించిన సందర్భంగా కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విశ్వాసులకు నరేంద్రమోడీ ఒక బోధకుడి వంటి వారని ఆకాశానికి ఎత్తారు.హజ్‌ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో హజ్‌యాత్ర గురించి హంగామా చేసే వారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అబ్దుల్లాకుట్టి ఆరోపించారు. అబ్దుల్లా కుట్టి గతాన్ని చూస్తే సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికై 2008లో నరేంద్రమోడీని పొగడటంతో పాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బహిష్క్‌రణకు గురైన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.ఆ పార్టీలో ఉంటూ 2019లో మరోమారు నరేంద్రమోడీని పొగటంతో కాంగ్రెస్‌ కూడా సాగనంపింది. అక్కడి నుంచి బిజెపి ఆశ్రయం పొందారు.నరేంద్రమోడీని పొగడటంలో అబ్దుల్లాకుట్టి పేరుమోశారు. కోజికోడ్‌ సభలో దాని కొనసాగింపుగానే పొగడ్తలు కురిపించిన తీరు మీద నెటిజన్లు తరువాత అబ్దుల్లాకుట్టితో ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో నష్ట నివారణ చరó్యకు పూనుకున్నారు. కోజికోడ్‌ సభలో హజ్‌ యాత్రకు సంబంధించి నరేంద్రమోడీ గురించి చెప్పిన మాటలు తప్పిదమేనని, నోరు జారినట్లు పది రోజుల తరువాత సంజాయిషి ఇచ్చుకున్నారు. తాను సభలో మాట్లాడుతున్నపుడు తమ నేత కృష్ణదాస్‌ తనకు మంచి నీరు ఇచ్చారని, తాగిన తరువాత తన ప్రసంగం అదుపు తప్పిందని అబ్దుల్లా కుట్టి చెప్పినట్లు కేరళ కౌముది పత్రిక రాసింది.


అబ్దుల్లాకుట్టిని హజ్‌కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మేనెల మొదటి వారంలో ఒక సంస్ధ ఇచ్చిన ఇప్తార్‌ విందు, కుట్టి అభినందన కార్యక్రమానికి ముస్లిం లీగు నేతలు కొందరు హాజరుకావటం వివాదాస్పదమైంది. ఎవరూ అభినందన సభలకు హాజరు కావద్దని లీగ్‌ నాయకులు ఆదేశించిన తరువాత ఇది జరిగింది. అది అభినందన సభగా మారుతుందని తమకు తెలియదని ఇప్తార్‌ ఇచ్చింది తమ బంధువు కావటంతో వెళ్లినట్లు లీగు కన్నూరు జిల్లా కార్యదర్శి తాహిర్‌ సంజాయిషి ఇచ్చుకున్నారు.


మరోమారు నోరు పారవేసుకున్న పిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్‌
కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె సుధాకరన్‌కు నోటి దురుసు ఎక్కువ. ఒక కల్లుగీసేవాడి కొడుకు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గతంలో నోరు పారవేసుకున్నారు. తన తండ్రి ఒక గీత కార్మికుడు, తన అన్న ఇప్పటికీ గీత వృత్తిమీదనే బతుకుతున్నాడని, అలాంటి కష్టజీవుల కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అప్పుడు విజయన్‌ తిప్పికొట్టారు. తాజాగా త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుధాకరన్‌ మాట్లాడుతూ గొలుసు తెంచుకున్న కుక్క మాదిరి విజయన్‌ త్రిక్కకర నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ మరోసారి అదేపని చేశారు. ఒక డివైఎఫ్‌ఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నేత నోటవెలువడిన సంస్కారహీనమైన పదజాలాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ సమర్ధించారు. కన్నూరు ప్రాంతంలో అలాంటి పదజాలం సాధారణమే కనుక తప్పేంలేదని వెనుకేసుకు వచ్చారు. విజయన్‌ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నందున అలా అన్నానని, దానికి ఎవరైనా బాధపడితే మాటలను వెనక్కు తీసుకుంటానంటూ సుధాకరన్‌ అహంకారంతో మాట్లాడారు.


ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ఎంబి మురళీధరన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సిపిఎం అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఎల్‌డిఎఫ్‌తో కలసి పని చేస్తానని చెప్పారు. 2020 ఎన్నికల్లో ఓడిపోక ముందు కొచ్చి కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. త్రిక్కకర ఉప ఎన్నికల్లో చర్చి నిలిపిన అభ్యర్ధులెవరూ లేరని ఏ ఎన్నికలోనూ ఎప్పుడూ ఒక అభ్యర్ధికి మద్దతు ఇవ్వలేదని సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ జార్జి అలంచెరీ చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమా థామస్‌, మాజీ సిఎం ఊమెన్‌ చాందీ తదితర కాంగ్రెస్‌ నేతలు అలంచెరీని కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తరువాత అలంచెరీ విలేకర్లతో మాట్లాడారు. సిపిఎం అభ్యర్ధి డాక్టర్‌ జో జోసెఫ్‌ను చర్చికి సంబంధించిన భవనంలో అభ్యర్ధిగా ప్రకటించటం గురించి అడగ్గా అదొక యాదృచ్చిక ఘటన తప్ప చర్చికి దానికి సంబంధం లేదన్నారు. డాక్టర్‌ జోసెఫ్‌ పని చేస్తున్న ఆసుపత్రి ఒక చర్చి నిర్వహణలో ఉంది, ఆ ఆసుపత్రిలోనే మీడియాకు అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. దాంతో ఇంకేముంది చర్చి తరఫునే నిలుపుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీని వెనుక పెద్ద కుట్ర వుందంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఎన్నికలో సిపిఎం, కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులతో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.


పన్నెండు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల వార్డులకు గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో 42కు గాను 24 చోట్ల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గెలిచింది.కాంగ్రెస్‌కు 12, బిజెపికి ఆరు వచ్చాయి. ఎన్నికల్లో 31పంచాయతీ, ఏడు మున్సిపాలిటీ, రెండు కార్పొరేషన్‌ వార్డులకు పోలింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ మొత్తం మీద గతంలో ఉన్ని ఎనిమిది వార్డులను కోల్పోయింది. ఎల్‌డిఎఫ్‌ నుంచి మూడు సీట్లను కాంగ్రెస్‌, రెండింటిని బిజెపి గెలుచుకుంది.కొన్ని చోట్ల కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి కూడా రెండు స్దానాలను కోల్పోయింది.


సిపిఎం నేతల సమక్షంలో మతాంతర వివాహం
కోజికోడ్‌ జిల్లా కొడంచెరికి చెందిన భిన్న మతాలకు చెందిన ఎంఎస్‌ షెజిన్‌, జోస్నా మేరీ జోసెఫ్‌ సిపిఎం కార్యకర్తల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌ నెలలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం పెద్ద వివాదానికి దారి తీసింది. లవ్‌ జీహాద్‌ పేరుతో కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. షెజిన్‌ కన్నోత్‌ ప్రాంత డివైఎఫ్‌ఐ కార్యదర్శి, స్దానిక సిపిఎం కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహం జరిగింది. డివైఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు దీపు ప్రేమనాధ్‌,తిరువంబాడి సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు షిజి అంటోనీ, కెపి చాకోచన్‌ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తెను బలవంతం, బందీగా చేసి వివాహానికి ఒప్పించినట్లు ఆరోపిస్తూ జోస్నా మేరీ తండ్రి జోసెఫ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర వెలుపలి సంస్ధతో విచారణ జరిపించాలని కోరారు. జోస్నాను కోర్టుకు రప్పించి తండ్రి ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించగా తాను మేజర్‌నని, తననెవరూ బలవంతపెట్టలేదని ఆమె చెప్పటంతో కోర్టు ఆ పిటీషన్‌ కొట్టివేసి వివాహానికి అనుమతించింది. దాంతో మరుసటి రోజే వివాహం చేసుకున్నారు.ఈ వివాహం వలన స్దానికంగా పార్టీకి దగ్గర అవుతున్న కైస్తవ సామాజిక తరగతిని దూరం చేస్తుందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఏ జిఎం థామస్‌ చెప్పటాన్ని సిపిఎం తప్పు పట్టటమే కాదు తగని పని బహిరంగంగా అభిశంచింది. తాను తప్పుమాట్లాడినట్లు థామస్‌ అంగీకరించటంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో లబ్దిపొందేందుకు బిజెపి చూసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ జోస్న తలిదండ్రులను కలసి కేంద్ర సంస్దలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీని వెనుక పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హస్తం ఉందని ఆరోపించారు. మీ కుమార్తె ఆ సంస్ధ అలప్పూజ ఆఫీసులో ఉంటుందని అన్నాడు. కొందరు పగలు డివైఎఫ్‌ఐ కార్యకర్తలుగాను వారే రాత్రి ఫ్రంట్‌ కార్యకర్తలుగా ఉంటారని ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !

12 Thursday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala LDF, Thrikkakara by-election, UDF Kerala


ఎం. కోటేశ్వరరావు


ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్‌, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు పిటి థామస్‌ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌ తరఫున థామస్‌ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్‌ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్‌ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్‌ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..


ఆమ్‌ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్‌ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్‌ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్‌ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్‌, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.


సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్‌ చర్చ్‌ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కెవి థామస్‌ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్‌ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్‌, నార్కోటిక్‌ జీహాద్‌ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.


ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సంస్ధలో దొంగబంగారం కేసు నిందితురాలు – పక్కా బిజెపి ప్రతినిధిగా కేరళ గవర్నర్‌ !

18 Friday Feb 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arya Rajendran, BJP, CPI(M), governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పక్కా బిజెపినేతగా పని చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధానపరమైన ప్రసంగంపై సంతకం చేయకుండా బ్లాక్‌మెయిలుకు పాల్పడ్డారు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన కేరళ దొంగబంగారం కేసులో నిందితురాలుగా ఉండి పదహారు నెలల పాటు జైలులో ఉన్న స్వప్న సురేష్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ లేదా దానికి సంబంధించిన నేతలు నడిపే ఒక స్వచ్చంద సంస్ధలో డైరెక్టర్‌గా చేరారు. బంగారం కేసులో అరెస్టయినపుడు ప్రభుత్వ స్పేస్‌ పార్క్‌ పధకంలో ఒక కన్సల్టెంట్‌గా ఉన్నారు. అంతకు ముందు యుఏఇ కాన్సులేట్‌లో పని చేశారు. ఆ సంబంధాలను వినియోగించుకొని బంగారాన్ని అక్రమంగా తెప్పిస్తున్నట్లు ఆమె, మరికొందరి మీద కేసు దాఖలు చేశారు. దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుండగానే స్వచ్చంద సంస్దలో చేరారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా అనే సంస్ధ తరఫున కేరళలోని పాలక్కాడ్‌ కేంద్రంగా ఆమె పని చేస్తారు. మళయాల మనోరమ పత్రిక కథనం ప్రకారం ఈ సంస్ధకు తొలుత పాట్రన్‌గా తరువాత అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌ కృష్ణ కుమార్‌ కాంగ్రెస్‌లో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా పని చేశారు.2004 ఆపార్టీ నుంచి వెలుపలికి వచ్చి బిజెపిలో చేరారు. తరువాత తిరిగి కాంగ్రెస్‌లో , 2019 తిరిగి బిజెపిలో చేరారు.


హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్దలో కేరళకు చెందిన అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కెజి వేణుగోపాల్‌ ఉపాధ్యక్షుడు. ఆ సంస్దలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత విభాగ డైరెక్టర్‌గా యుఏఇ , ఇతర కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకురావటం ఆమె విధిగానూ వాటితో పేద గిరిజనులకు అట్టపాడి ప్రాంతంలో ఉచితంగా ఇండ్లు నిర్మిస్తారని కేరళకౌముది పత్రిక పేర్కొన్నది. కోర్టులో ఉన్న కేసులు, తన ప్రస్తుత బాధ్యతలకు ముడి పెట్టవద్దని స్వప్ప మీడియాను కోరారు. కేసులు కేసులే ఉద్యోగం తన కడుపు నింపుకొనేందుకు అన్నారు.హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్ద మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనుల భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిందని, అనుమతులు లేకుండా గిరిజనులకు కొన్ని ఔషధాలను పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఔషధాల ప్రయోగాలకు స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్నవారితో గ్రామీణులు, గిరిజనులను వినియోగించుకోవటం తెలిసిందే.


కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ సంయమనం కారణంగా ఒక వివాదాన్ని నివారించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావటం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం రూపొందించి ఇస్తుంది. దానిలోని అంశాలను చదవటం తప్ప గవర్నర్‌ తన స్వంత అభిప్రాయాలను చొప్పించకూడదు. గతంలో ఒకసారి అలాంటి చర్యకు పాల్పడి కొన్ని పేరాలను చదివేందుకు నిరాకరించారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, జర్నలిస్టుగా ఉన్న హరి ఎస్‌ కర్తాను తన సహాయకుడిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ కోరారు. రోజువారీ రాజకీయాల్లో ఉన్నవారిని సాధారణంగా సిబ్బందిగా తీసుకోరు. అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదించింది. ఐతే ప్రభుత్వ అభ్యంతరాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ (జిఏడి) ముఖ్యకార్యదర్శి కె జ్యోతిలాల్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. అది మీడియాకు వెల్లడైండి. ఆ పని జ్యోతిలాలే చేయించినట్లు భావించిన గవర్నర్‌ సదరు అధికారిని జిఏడి నుంచి తప్పిస్తే తప్ప తాను అసెంబ్లీ ప్రసంగాన్ని ఆమోదిస్తూ సంతకం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ప్రభుత్వం సదరు అధికారిని వేరే బాధ్యతలకు బదిలీ చేస్తామని చెప్పిన తరువాతనే సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.


శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరిగి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఆమోదం తెలిపిన తరువాత మార్చి 23న ముగుస్తాయి. తరువాత పూర్తి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్‌ సభలో ప్రసంగం చదవటం మొదలు పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ గవర్నర్‌ గోబాక్‌ అంటూ నినాదాలు చేశారు. తరువాత సభనుంచి వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం చదువుతుండగా సాధారణంగా అధికారపక్ష సభ్యులు తమ ప్రభుత్వ విజయాలను పేర్కొన్నపుడు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేస్తే ప్రతిపక్షం నిరసన తెలుపుతుంది. దీనికి భిన్నంగా పాలక సభ్యులు మౌనంగా ఉంటూ గవర్నర్‌ తీరుతెన్నులకు నిరసన తెలిపినట్లు మీడియా పేర్కొన్నది. ప్రభుత్వం బిజెపి నేత నియామక పత్రంతో పాటు అభ్యంతరం తెలిపే లేఖను కూడా గవర్నర్‌కు పంపింది. దీన్ని గవర్నర్‌ అవమానంగా భావించి భరించలేకపోయారు.


మంత్రుల వద్ద సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ ఇవ్వటం కేరళలో ఒక పద్దతిగా ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారు. రాజభవన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన వారిని గవర్నర్‌ సిబ్బందిగా నియమించటం అసాధారణం అని ప్రభుత్వం రాసిన లేఖలో ఉంది. దానికి ప్రతిగా ఎక్కడా మంత్రుల సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ చెల్లింపు పద్దతి లేదని దాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించటమే కాదు వెంటనే అమలు జరపాలని గవర్నర్‌ కోరారు. ఈ అంశాన్ని మరింతగా చర్చించాలని ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా లీకైంది. జ్యోతిలాల్‌ను తొలగించినట్లు రాజభవన్‌కు సమాచారం అందిన తరువాతే గవర్నర్‌ ప్రసంగంపై సంతకం చేశారు.


గవర్నర్‌ను వెనకేసుకు వస్తూ బిజెపి రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని మంత్రుల సిబ్బందిగా నియమించుకోవటం, వారికి పెన్షన్లు చెల్లించటం చట్టబద్దమో కాదో ఆలోచించాలని కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. రాజభవన్ను నియంత్రించాలని సిఎం విజయన్‌ చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల సిబ్బందికి పెన్షన్‌ చెల్లించటం గురించి సిపిఎం నేత, మాజీ మంత్రి ఎంఎం మణి మాట్లాడుతూ ఐదు పార్టీలు మారిన తరువాత ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బిజెపిలో చేరారని, గవర్నర్‌ పదవిలో ఉంటూ చౌకబారు ఆటలు ఆడుతున్నారని, పెన్షన్‌ సొమ్ము ఖాన్‌ కుటుంబ సంపద నుంచేమైనా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. మరోమారు గవర్నర్‌ పదవి కోసం చెత్త మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారాని అన్నారు. గవర్నర్‌- ప్రభుత్వం నాటకాలాడుతున్నాయని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత విడి సతీషన్‌ ఆరోపించారు. కేరళలో బిజెపి అధికార ప్రతినిధిగా గవర్నర్‌ పని చేస్తున్నారని విమర్శించారు.


దేశంలోని మేయర్లలో పిన్న వయస్కురాలైన ఆర్య రాజేంద్రన్‌(తిరువనంతపురం-సిపిఎం) కేరళ అసెంబ్లీలో పిన్న వయస్కుడైన సచిన్‌దేవ్‌ ఒకింటివారు కాబోతున్నారు. వారిద్దరూ బాలసంగం నుంచి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవారే. రెండు కుటుంబాలూ ఆమోదం తెలిపాయి. మార్చినెలలో వివాహం జరగవచ్చు.ఆర్య ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నపుడు సచిన్‌ దేవ్‌ ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ఆలిండియా సహాయకార్యదర్శి. తామిద్దరం ఒకే భావజాలంతో ఉన్నామని, ఇద్దరం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశామని, మంచి స్నేహితులమని ఆర్య విలేకర్లతో చెప్పారు. తామిద్దం ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత రెండు కుటుంబాలకు, పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందున పార్టీకి తెలిపామని, రెండు కుటుంబాలు, పార్టీతో చర్చించిన తరువాత వివాహతేదీని ఖరారు చేసుకుంటామని తెలిపారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ : రచ్చకీడ్చిన కేరళ గవర్నర్‌, బిజెపి – కాంగ్రెస్‌లో చిచ్చు !

02 Sunday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

D.Litt to President row, governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, Ramesh Chennithala


ఎం కోటేశ్వరరావు


రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ను ఇమ్మని తాను సిఫార్సు చేసినట్లు చెబుతూ కొందరు బాధ్యతారహిత, తెలివితక్కువ ప్రకటనలు చేస్తున్నారని, అవి జాతీయ వ్యవస్ధల గౌరవ, మర్యాదలను దెబ్బతీస్తున్నాయని, ఆందోళనకరమైన ధోరణులను చూస్తున్నానని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు కోచిలో విలేకర్లతో చెప్పారు.రాష్ట్రపతి, గవర్నర్‌ జాతీయ వ్యవస్ధలని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ ప్రకారం వాటిని గౌరవించాలని అన్నారు.వాటి గురించి ఆషామాషీగా చర్చించకూడదన్నారు.ఒక రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇచ్చి సత్కరించాలా ? అలాంటి ప్రోటోకాల్‌ ఉంటే దాన్ని అమలు జరపటం రాష్ట్రాల విధి. లేనపుడు విశ్వవిద్యాలయాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. లేనపుడు రచ్చ చేస్తే రాష్ట్రపతికి అవమానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేరళలో అదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొంత మంది కాంగ్రెస్‌ నేతలు, బిజెపికి అందుకు పూనుకున్నారు. డిసెంబరు 21 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కేరళ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా గౌరవ పట్టాతో సత్కరించకపోవటం అవమానించటమే అని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠానేత రమేష్‌ చెన్నితల, పరోక్షంగా రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఈ అంశాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇవ్వాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేరళ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ను కోరినట్లు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు మీడియాలో కథలు వచ్చాయి. దీని గురించి కాంగ్రెస్‌ సిఎల్‌పి మాజీ నేత రమేష్‌ చెన్నితల తన ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ గవర్నర్‌ సిఫార్సు నిజమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించే హక్కు ఉందా ? దాని సంగతి తేల్చాలని కోరారు.సిఎల్‌పి నేత విడి సతీషన్‌ స్పందిస్తూ చెన్నితల చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని, ఏదైనా ఒక అంశం మీద పార్టీ వైఖరి నిర్ణయించేది పిసిసి అధ్యక్షుడు, తాను మాత్రమే అన్నారు. పద్దతికి విరుద్దంగా ఎవరికైనా గౌరవడాక్టరేట్‌ను ఇమ్మని గవర్నర్‌ గనుక సూచించి ఉంటే అది చట్టవిరుద్దమని, గవర్నర్లకు అలాంటి అధికారం లేదని కూడా సతీషన్‌ చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వంతపాడుతున్నారంటూ సతీషన్‌ మీద బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు, సిఫార్సు చేసేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిందని ఆరోపించారు.


కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన గోపీనాధ్‌ రవీంద్రన్‌ పునర్నియాకాన్ని గవర్నర్‌ తిరస్కరించి వివాదం రేపారు. ఆమోదిస్తూ సంతకం చేసిన తరువాత నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వివాదంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌కు హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకొనేందుకు తిరస్కరించి తాను ఛాన్సలర్‌గా లేనని, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలని గవర్నర్‌ కోరారు. డిసెంబరు ఎనిమిది నుంచి ఛాన్సలర్‌ బాధ్యతల్లో లేనని చెబుతున్నారు.తనకు వచ్చే ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టమైన హామీ ఇస్తేనే తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ ఇవ్వాలని తాను కోరిందీ లేనిదీ, ఎప్పుడు కోరిందీ, అసలేం జరిగిందన్నది గవర్నర్‌ చెప్పాలి, కానీ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల సదరు అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అన్నది సమస్య. ఒక పౌరుడిగా, ఎంఎల్‌ఏగా తనకు తెలుసుకోవాల్సిన అవకాశం, హక్కు ఉందనుకుంటే గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వానికి రాసి తెలుసుకోవచ్చు, బహిరంగ రచ్చ ద్వారా గవర్నర్‌ పదవి, రాష్ట్రపతిని కూడా అవమానించటమే అని విమర్శలు వచ్చాయి.చెన్నితల, బిజెపి నేతల ప్రకటనలతో ఇబ్బంది పడిన గవర్నర్‌ వారిది బాధ్యతా రాహిత్యం, తెలివితక్కువతనమని చెప్పారు. తాను డిసెంబరు ఎనిమిది నుంచే ఛాన్సలర్‌గా తప్పుకున్నట్లు చెబుతున్న గవర్నర్‌ గౌరడాక్టరేట్‌ గురించి ఎప్పుడు సిఫార్సు చేశారు అన్నది ఒక సందేహమైతే, ఛాన్సలర్‌కు అలాంటి అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఇంత రచ్చ జరిగిన తరువాత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నరుకు లేదా ? గౌరవ పట్టా గురించి ఏదైనా సమస్య ఉంటే గవర్నర్‌ తప్ప మూడవ పక్షం ఎందుకు మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ ప్రశ్నించారు. సిఫార్సు చేసి ఉంటే గవర్నరే స్వయంగా వివరణ ఇవ్వాలి, ఈ సమస్య పార్టీ, ప్రభుత్వం ముందుకు రాలేదు అన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందిస్తూ గవర్నర్‌ నుంచి ఈ అంశంలో వచ్చిన సిఫార్సులను తిరస్కరించలేదని స్పష్టం చేశారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గవర్నర్‌గా కంటే బిజెపి ప్రతినిధిగా పని చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు తిరస్కరించిన అంశం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా జరిపేందుకు అనుమతి నిరాకరించి వివాదం రేపారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. పౌరసత్వ చట్ట సవరణ( సిఎఎ)కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా గవర్నర్‌ విమర్శలకు దిగారు. రాజ్యాంగ విరుద్దం, పనికిరాదని అన్నారు. కన్నూరు విసి నియామకాన్ని నిరసిస్తూ డిసెంబరు ఎనిమిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక ఛాన్సలర్‌గా అనుమతించాల్సింది తానేనని, మంచి చెడులను తానే బాగా నిర్ణయించగలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఘర్షణకు దిగారు. ఈ వివాదం గురించి ముఖ్యమంత్రి హుందాగా స్పందించారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే విసి ఎంపిక జరిగిందన్నారు.గవర్నర్‌ మనస్సాక్షికి విరుద్దంగా పని చేయాలని తాము కోరటం లేదని, గవర్నర్‌ తన వైఖరిని మార్చుకుంటే అది నియామక ఉత్తరువు మీద సంతకం చేయక ముందు జరగాలని, తరువాత నిరసన వెల్లడించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏదో ” జోక్యం లేదా వత్తిడి ” వచ్చి ఉండాలని అన్నారు.


రాజభవన్‌లను రాజకీయ కేంద్రాలుగా మార్చటంలో బిజెపి ఏలికలు కాంగ్రెస్‌ను తలదన్నారు. బిజెపికి అధికారం వచ్చే అవకాశం ఉంటే సాధనాలుగా మారటం, లేని చోట ఏదో ఒక రచ్చ చేస్తూ గవర్నర్‌ పదవులకు మచ్చ తెస్తున్నారు. వివాదాస్పద గవర్నర్ల జాబితాలో ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అగ్రభాగాన ఉంటారు. ఒక రాజకీయవేత్తగా ఆయన ప్రస్తానాన్ని చూసినపుడు సంఘపరివార్‌ నమ్మినబంటుగా మనకు కనిపిస్తారు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో 2019 భారత చరిత్ర కారుల(ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) 80వ మహాసభ జరిగింది. దాన్ని ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని తరువాత గవర్నర్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని పేర్కొన్నారు. కన్నూరు సభలో ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు.


షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d