• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Xi Jinping

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

12 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

100 years Communist Youth League of China, Communist Youth League of China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


యువత దేశభక్తి, నవ ప్రవర్తకులుగా ముందుకు సాగాలని కష్టాలు వచ్చినపుడు తప్పుదారి పట్టటం, బెదిరిపోరాదని చైనా అధినేత షీ జింపింగ్‌ మేనెల పదిన పిలుపు నిచ్చారు. చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ (సివైఎల్‌సి) శతవార్షికోత్సవం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్లో ఘనంగా జరిగింది. ఆ సభలో జింపింగ్‌ పాల్గొని సందేశమిచ్చారు.చరిత్రను పరిశీలించినా, వాస్తవాన్ని చూసినా చైనా యువజనోద్యమంలో కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌ ముందున్నదని, దేశం కోసం స్వార్దరహితంగా పని చేసి ముందుకు తీసుకుపోవాలని కోరారు. ప్రతి దేశానికి, ప్రపంచానికి యువతదే భవిష్యత్‌ అని తన కుటుంబం అనిగాక మానవాళి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత కుదిరిన వర్సెయిల్స్‌ ఒప్పందంలో భాగంగా జర్మనీ ఆక్రమణలో ఉన్న తూర్పు చైనాలోని షాండోంగ్‌ ప్రాంతాన్ని జపాన్‌కు అప్పగించారు. ఈ ఒప్పందంపై చైనా పాలకుల లొంగుబాటును నిరసిస్తూ ప్రారంభమైన జాతీయోద్యమం నూతన చైనా ఆవిష్కరణకు నాంది పలికింది. 1919 మే నాలుగున పెద్ద ఎత్తున విద్యార్దులు బీజింగ్‌లోని తియనన్‌మెన్‌ మైదానంలో ప్రదర్శన జరిపారు. దీన్ని మే ఉద్యమంగా పిలిచారు. అప్పటికే జాతీయవాదులుగా ఉన్న వారు లొంగుబాటును నిరసిస్తూ కొత్త బాటలో పోరు సల్పేందుకు కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.ఆ ఉద్యమంలో పాల్గొన్నవారే చైనా యువజనోద్యమాన్ని ప్రారంభించారు. మే నాలుగు ఉద్యమం 1911 విప్లవం కంటే ఒక అడుగు ముందుకు వేసిందని,కమ్యూనిస్టు విప్లవంలో అది ఒక దశ అని దాని ప్రాముఖ్యత గురించి మావో చెప్పారు.1920లో ప్రారంభమైన చైనా సోషలిస్టు యూత్‌లీగ్‌ స్ధాపక కార్యదర్శి యు షీసాంగ్‌ 1922వరకు కొనసాగారు. బీజింగ్‌లో మొగ్గతొడిగిన ఈ సంస్ధను దేశమంతటా విస్తరిస్తూ 1921 జూలైలో అధికారికంగా ప్రకటించారు. తరువాత 1922లో తొలిమహాసభ మే 5-10 తేదీలలో జరిగింది. తరువాత కాలంలో మే ఐదవ తేదీని చైనా యువజన దినంగా ప్రకటించారు. తరువాత 1925లో జరిగిన మూడవ మహాసభలో సంస్ధ పేరును కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత దేశంలో తలెత్తిన పరిస్ధితి, రాజకీయాల నేపధ్యంలో చైనీస్‌ న్యూ డెమోక్రసీ యూత్‌లీగ్‌గా కొత్త పేరు పెట్టారు. 1957 మే నెలలో తిరిగి కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో హు యావోబాంగ్‌, హు జింటావో కమ్యూనిస్టు పార్టీ అధినేతలుగా, దేశాధ్యక్షులుగా పని చేశారు. గడచిన వంద సంవత్సరాల్లో ఇప్పటి వరకు మొత్తం 17 మంది జాతీయ కార్యదర్శులుగా పని చేశారు. వారిలో హు యావోబాంగ్‌ సుదీర్ఘకాలం 1953 నుంచి 1978వరకు ఉన్నారు. ఈ కాలంలోనే 1968 నుంచి 78వరకు సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న వైఖరి కారణంగా సంస్ధ కార్యకలాపాలను రద్దు చేశారు. 1964 తరువాత మహాసభలు జరగలేదు. 1978 నుంచి తిరిగి క్రమంగా సభలు జరుపుతున్నారు. ప్రస్తుతం 2018లో ఎన్నికైన హి జంకే కార్యదర్మిగా ఉన్నారు.


కమ్యూనిస్టు యూత్‌లీగ్‌లో ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా సభ్యులున్నారు.పద్నాలుగు సంవత్సరాలలోపు వారిని సంఘటితం చేసే బాధ్యతలను కూడా ఈ సంస్ధే నిర్వహిస్తున్నది. అనేక దేశాలలో యువత మాదిరి చైనాలో ఎందుకు యువతరం ఉద్యమాలు నిర్వహించటం లేదంటూ పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు వాపోతుంటారు. తామే తుమ్మి తామే తథాస్తు అనుకున్నట్లుగా చైనా గురించి ప్రత్యేకించి సంస్కరణలు అమలు చేస్తున్న 1978 నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు చైనా కుప్పకూలిపోతుందని జోశ్యాలు చెప్పిన వారందరూ బొక్కబోర్లా పడ్డారు.1989లో తియనన్‌మెన్‌ మైదానంలో కొందరు తప్పుదారి పట్టిన విద్యార్దులు చేపట్టిన ఆందోళనను తూర్పు ఐరోపా దేశాల్లో మాదిరి వినియోగించుకొనేందుకు పశ్చిమ దేశాలు చూసినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం విద్యార్దులతో సహనంగా వ్యవహరించి ముగింపు పలికింది. పశ్చిమ దేశాల కుట్రలను వమ్ముచేసింది.


ప్రతి సమాజంలో కొందరు అసంతృప్తవాదులు, భిన్న అభిప్రాయాలు, అవలక్షణాలు కలిగిన వారు ఉన్నట్లుగానే చైనాలో కూడా ఉండటం సహజం. వారికి తగిన అవకాశాలు కల్పిస్తే పక్కదారి పట్టరు, ఉద్యమాలతో పని ఉండదు. చైనా కొత్తతరంలో తలెత్తిన పశ్చిమ దేశాల క్షీణ సంస్కృతి విస్తరించకుండా అక్కడి సమాజం, ప్రభుత్వం చూస్తున్నది. మొత్తం మీద సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న యువత సహకారం, భాగస్వామ్యం కారణంగానే అమెరికా, ఇతర దేశాలు అనేక ఆటంకాలను కలిగిస్తున్నప్పటికీ చైనా ముందుకు పోతోందన్నది స్పష్టం. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాల్లో యువత భావించటం రోజుకు రోజుకూ పెరగటం చూస్తున్నాం. పెరుగుతున్న ఆర్ధిక అసమానతల గురించి ఆ విధానాల సమర్ధకులే చెబుతున్నారు. చైనాలో కూడా అలాంటి అసమానతలు ఉన్నప్పటికీ తమ ముందు తరాల వారితో పోల్చి చూసినా, ఇతర దేశాలను చూసినా తమకు మెరుగైన అవకాశాలను చైనా ప్రభుత్వం కల్పిస్తున్నట్లు అక్కడి యువత భావిస్తోంది. ఒక సమాజం పురోగమిస్తోంది అని చెప్పేందుకు కొన్ని అంశాలను గీటురాళ్ళుగా తీసుకోవటం తెలిసిందే. ప్రస్తుతం చైనా సగటు ఆయుర్దాయం 77.3 సంవత్సరాలు. అమెరికాను అధిగమించింది. ఏడున్నరదశాబ్దాల క్రితం అది 43 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఒక నాడు పిల్లలను కనవద్దంటూ ఆంక్షలు పెట్టిన చైనా ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఎత్తివేసి కనమని ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటా జననాల రేటు తగ్గటం తెలిసిందే.


1950కి ముందు చైనాలో పరిస్ధితి దారుణంగా ఉండేది. కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చినా దాదాపు పది సంవత్సరాల పాటు అంతర్గత, బాహ్యశత్రువులు సృష్టించిన సమస్యలు ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోనివ్వలేదు. తరువాత సాంస్కృతిక విప్లవం పేరుతో చేపట్టిన చర్యలతో యువత తీవ్రంగా ప్రభావితమైంది.1978లో సంస్కరణలకు తెరలేపిన తరువాత పదేండ్లపాటు ఆశించిన మేరకు అవి ఫలితాలను ఇవ్వకపోవటం,ఇతర అంశాల మీద యువతలో తలెత్తిన అసంతృప్తికి ప్రతిబింబమే పశ్చిమ దేశాలు చిత్రించినంత తీవ్రంగాకున్నా తియనన్‌మెన్‌ పరిణామాలు. తరువాత కాలంలో అభివృద్ధి ఊపందుకుంది.1989లో జిడిపి తలసరి సగటు ఐఎంఎఫ్‌ సిబ్బంది లెక్కల ప్రకారం 406 డాలర్లుండగా అది 2021నాటికి 11,891డాలర్లకు చేరింది.2026 నాటికి 17,493 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది.ఈ దశాబ్ది చివరికి అమెరికా జిడిపి మొత్తాన్ని అధిగమించనుందన్న అంచనాల గురించి తెలిసిందే. ఈ పరిణామాలు, పరిస్ధితి యువతను సానుకూలంగా ప్రభావితం చేసేవే.


తలసరి జిడిపిలో అమెరికా ఎంతో ముందున్నదని తెలిసిందే. ఆ స్ధాయికి చేరేందుకు చైనా ఇంకా కష్టపడాల్సి ఉంది. ఆదాయ అంతరాలున్నట్లు వారే స్వయంగా చెబుతున్నారు. అదే సమయంలో అవకాశాలను ఏ విధంగా కల్పిస్తున్నారో చూద్దాం.2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు వస్తున్న అవకాశాలు వారి తలిదండ్రులకు రాలేదు. అమెరికాలో ఇదే సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఉన్నత విద్య అవకాశాలు 57శాతం మందికి ఉండగా చైనాలో 54శాతం. రెండు దేశాలను పోలిస్తే చైనాలో ఈ శాతం పెరుగుతుండగా అమెరికాలో పదేండ్లనాటికి ఇప్పటికి పదిశాతం తగ్గింది. అమెరికా విశ్వవిద్యాలయంలో ఏడాదికి ఫీజు 64వేల డాలర్లుండగా చైనాలో రెండువేల డాలర్లు మాత్రమే. పశ్చిమ దేశాలతో పోలిస్తే చైనాలో స్ధిరమైన ఉపాధి రేటు ఎక్కువగా ఉంది. చైనా పిల్లలకు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు పార్టీ బుద్దిశుద్ధి చేసి తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుందని పశ్చిమ దేశాల వారు ఆరోపిస్తుంటారు. పాలకులు ఎవరుంటే ఆ భావజాలాన్ని కలిగించటం అన్ని చోట్లా జరుగుతున్నదే. చైనా ప్రభుత్వం, పార్టీ కూడా సామాజిక బాధ్యతను గుర్తు చేయకుండా దాని లక్ష్యమైన సోషలిస్టు సమాజాన్ని నిర్మించటం ఎలా సాధ్యం అవుతుంది? గ్రామాల్లో ఉన్న పరిస్ధితిని తెలుసుకొనేందుకు, దారిద్య్రనిర్మూలన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్వచ్చందగా అనేక మంది ఇప్పటికీ గ్రామాలకు వెళుతున్నారు. మన దేశంలో కాలేజీల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ పధకంలో భాగంగా విదార్ధులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్న సంగతి తెలిసిందే. అది సక్రమంగా జరగటం లేదు, అమల్లో చిత్తశుద్ది లేదనేది వేరే అంశం. మన దేశంలో ఈ స్వాతంత్య్రం మాకేమిచ్చిందని ప్రశ్నించే యువతరం గురించి తెలిసిందే. స్వాతంత్య్రం తరువాత దాని లక్ష్యాలను పాలకులు విస్మరించిన పర్యవసానమే ఇది. చైనాలో దీనికి భిన్నం తమ, తమ తలిదండ్రుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను పిల్లలకు చెబుతున్నారు. పోరాట కేంద్ర స్ధానాలుగా ఉన్న ఏనాన్‌ తదితర ప్రాంతాలను ఏటా కోట్ల మంది సందర్శించి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన 1950 దశకాల్లో చైనా యువత తాము కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల్లో మాదిరి ఉండాలని కలలు కన్నది, దానిలో తప్పేముంది? తన పౌరులను విదేశాలకు వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేస్తారని చైనా మీద ఆరోపణలు చేసే వారి గురించి తెలిసిందే. అదే వాస్తవమైతే ఏటా పదిహేను కోట్ల మంది విదేశాల్లో ఎలా పర్యటిస్తున్నారు? వారికి అవసరమైన ఆదాయం లేకపోతే అలా తిరగ్గలరా ? అలాగే చైనా నుంచి ఏటా ఏడు లక్షల మంది విద్యార్దులు విదేశాలకు వెళుతున్నారు. మన దేశం నుంచి ఏటా ఎందరు వైద్య విద్య కోసం వెళుతున్నారో చూస్తున్నాము. ఇది పరస్పరం పరిస్ధితి ఎక్కడ ఎలా ఉందో తెలుసుకొనేందుకు తోడ్పడదా ? పోల్చుకోరా ? అడ్డుగోడలు ఎక్కడ ఉన్నట్లు ? అమెరికాలో రోజుకు 120 మంది మాదకద్రవ్యాలు లేదా మద్యం తాగి మరణిస్తున్నారు, రోజుకు తుపాకి తూటాలకు 106 మంది మరణిస్తుండగా 210 మంది గాయపడుతున్నారు. ఈ స్ధితిని తమ దేశంలో ఉన్న పరిస్ధితిని చైనా యువత పోల్చుకోదా ? తమ పరిస్ధితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపరచుకోవాలంటే సోషలిస్టు విధానం తప్ప దిగజారే పెట్టుబడిదారీ విధానం కాదని అర్ధం చేసుకోదా ? తమ తాతలు, తండ్రులు ఎలాంటి దారిద్య్రం అనుభవించారో తామెలా ఉన్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు గనుకనే కమ్యూపార్టీ పట్ల అచంచల విశ్వాసంతో ఉన్నారు. 2019లో ఏడు లక్షల మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్లగా 5,80,000 మంది తిరిగి వచ్చారు. తమ దేశంలో పెరుగుతున్న అవకాశాలతో పాటు దేశానికి తోడ్పడాలన్న ఆకాంక్షకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. పరిశోధన అభివృద్ధికి గాను చైనా తన జిడిపిలో రెండున్నశాతం ఖర్చు చేస్తున్నది. ఈ కారణంగానే గత నాలుగు దశాబ్దాల కాలంలో అది ఎన్నో రంగాల్లో అద్బుతాలను సృష్టిస్తున్నది.శ్రమశక్తిని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయటే కాదు, ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా యువత దూసుకుపోతున్నది. ఒకప్పుడు నీలిమందు భాయిలని ఎద్దేవా చేసిన ప్రపంచం ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి నివ్వెరపోతున్నది. యువతలో ఉత్సాహం, దీక్ష, పట్టుదల లేకుండా ఇది జరిగేదేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోటకూరనాడే…. నరేంద్రమోడీ గట్టిగా చెప్పి ఉంటే ఇప్పుడిలా జరిగేదా !

20 Sunday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Diplomacy Matters, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Ukraine-Russia crisis, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలి. విశ్వగురువుగా నరేంద్రమోడీ, ప్రపంచమంతా మోడీవైపే చూస్తోంది. అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు అది లేకున్నా నడుస్తుంది. చైనా నుంచి మనం దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మనతో కాళ్ల బేరానికి వస్తుంది. నరేంద్రమోడీ మాత్రమే ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపగలరు. ఇలాంటి కబుర్లన్నీ వాట్సాప్‌ విశ్వవిద్యాలయ పండితుల మొదలు వివిధ మాధ్యమాల ద్వారా మన చెవుల తుప్పు వదిలించారు, మెదళ్లను ఖరాబు చేశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీటిని నిజమే అని నిజంగానే నమ్మిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉక్రెయిన్‌ వివాదంలో మనలను ప్రతివారూ బెదిరించేవారే తప్ప ఇతరత్రా పట్టించుకొనే వారే లేరు. అనేక చిన్న దేశాలనేతలు గళం విప్పినా మన ప్రధానికి నోరు పెగలటం లేదు. చైనా నుంచి దిగుమతులను నిలివేస్తారా అనుకున్నవారికి రికార్డులను బద్దలు కొడుతూ కొనసాగించటం మింగుడుపడటం లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన ఫిబ్రవరి 24కు ముందు మన నేతలు, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. మన జేమ్స్‌బాండ్‌గా ప్రచారంలో ఉన్న అజిత్‌ దోవల్‌ ఉక్రెయిన్‌ పరిణామాలను పసిగట్టలేకపోయారు. తరువాత ఆపరేషన్‌ గంగ పేరుతో అక్కడ చిక్కుకు పోయిన మన విద్యార్ధులను వెనక్కు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలంటూ నష్ట నివారణ చర్యగా నరేంద్రమోడీ సమీక్షల గురించి మన మీడియా చేసిన హడావుడి కూడా ముగిసింది. కేంద్ర మంత్రులను పంపటం, ఇతరత్రా చేసిన ప్రయత్నాల కంటే అసలు నరేంద్రమోడీ గారే వెళ్లి కూర్చుని ఉంటే ఇంకా తొందరగా పూర్తయి ఉండేది, తలిదంద్రుల ఆవేదన పరిమితంగా ఉండేది. ముందే ఆనందం వెల్లివిరిసేది. ఎందుకంటే ఏదేశంలో ఏది ఎక్కడుందో, ఎక్కడకు ఎలా చేరాలో మోడీగారికి తెలిసినంతంగా ఎవరికీ తెలియదు. సీజన్‌ టికెట్‌ తీసుకున్నట్లుగా స్వల్పకాలంలో ఏ ప్రధాని కూడా చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు, అందుకే ప్రతిదేశం కొట్టినపిండి మరి. సరే అది జరగలేదు, ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముఖ్యగనుక ! ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు కదా !


ఎన్నికలు ముగిశాయి, మొత్తం మీద సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగించి అనుకున్నది సాధించారు.యుద్ధం, ప్రేమలో గెలిచేందుకు సాధారణ సూత్రాలు, నీతినియమాలు వర్తించవు అంటారు గనుక ఉత్తర ప్రదేశ్‌లోనూ అదే జరిగిందని అనుకుందాం. ఇప్పుడేమిటి ? ఆపరేషన్‌ గంగ సమయంలో ప్రధాని జరిపిన సమీక్షల గురించి వార్తలేని రోజు లేదు. ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్ధిక రంగంలో ఆందోళనకర పరిస్ధితి, చమురు ధరల పిడుగు ఎప్పుడు ఎలా పడుతుందో అని బిక్కుబిక్కు మంటున్న జనం గురించి కూడా రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా జనాన్ని ఎలా రక్షించాలి అన్న ఆతృత, కార్యాచరణ ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకని ?


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు.అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. మార్చి 18వ తేదీన అమెరికా-చైనా అధిపతులు జో బైడెన్‌- షీ జింపింగ్‌ వీడియో కాన్ఫరెన్సుద్వారా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య మీద మనమూ, చైనా భద్రతా మండలిలో తటస్ధవైఖరినే ప్రకటించాయి. అమెరికా మన సహజ భాగస్వామి, ఒకటే మాట, ఒకటే బాట లేదా ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్లుగా రోజురోజుకూ మరింత సన్నిహితం అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటపుడు అమెరికా నేత బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడకుండా షీ జింపింగ్‌తో చర్చించటం ఏమిటి ? విశ్వగురువుగా విశ్వరూపం ప్రదర్శించే అవకాశాన్ని మోడీ చేజేతులా పోగొట్టుకున్నారా ? లేక మనకు అంతసీన్‌ లేదా ? మన బలం గురించి అతిగా అంచనా వేసుకున్నామా ? ఇవన్నీ కాస్త ఆలోచించేవారిలో ఎవరికైనా తలెత్తే ప్రశ్నలు. కాదంటారా ?


ఉక్రెయిన్‌ వివాదంలో జో బైడెన్‌కు చైనా నేత జింపింగ్‌ స్పష్టం చేసిందేమిటి ? మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వివాద పరిష్కారానికి అమెరికా, నాటో కూటమి రష్యాతో చర్చలు జరపాలి. రష్యా సైనిక చర్యపేరుతో దానిపై విచక్షణా రహితంగా ఆంక్షలను ప్రకటించటాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ఈవివాదాన్ని మేం కోరుకోవటం లేదు.యుద్ద రంగలో చేతులు కలుపుకోవటాన్ని చూడకూడదనుకున్నాం. వివాదం, ఘర్షణ ఎవరికీ ప్రయోజనకరం కాదు అని కుండబద్దలు కొట్టారు.మరి మన దేశం అలాంటి స్పష్టమైన వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు అన్నది ప్రశ్న. మన, చైనా తటస్ధ వైఖరుల్లో ఉన్న తేదా ఇదే. ఆంక్షలను వ్యతిరేకించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మీద, అదే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న మన మీద అమెరికా వైఖరిలో కూడా తేడా ఉంది. చైనా మీద ప్రతీకార చర్యలుంటాయని బహిరంగంగానే అమెరికా బెదిరించింది.దానిపై దాడికి అనేక దేశాలను సమీకరిస్తున్న అమెరికాకు మన అవసరం గనుక రష్యానుంచి చమురు కొనుగోలు చేసినా, ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసినా మింగా కక్కలేకుండా ఉంది. తెరవెనుక బెదిరింపులకు దిగుతోంది.


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. తన పట్టునుంచి ఎటూ కదలకుండా మన దేశాన్ని ఒక్కొక్కటిగా బిగిస్తున్నది. అమెరికాతో బంధం కారణంగా అనేక దేశాలకు మనం దూరమయ్యాం. అందువలన తనకు తాన తందాన అనకుండా ఎలా ఉంటుందనే భరోసాతో ఉంది. చైనాకు వ్యతిరేకంగా చతుష్టయ(క్వాడ్‌) కూటమిలోకి మనలను లాగి రెండు దేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర అనుమానాలు తలెత్తేట్లు అమెరికా చేసింది. మన సరిహద్దుల్లో కదలికలను కూడా అది ఇచ్చిన సమాచారం మీద ఆధారపడేట్లు చేసుకుంది. ఇంత చేస్తే మమ్మల్ని అనుసరించరా అంటూ బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. చమురు కొనుగోలు గురించి బైడెన్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ చెప్పిందేమిటి? చమురు కొనుగోలు మా ఆంక్షలను ఉల్లంఘించినట్లు భావించటం లేదు గానీ వర్తమాన పరిణామాల గురించి చరిత్రను లిఖించినపుడు మీరెక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి.రష్యన్‌ నాయకత్వానికి మద్దతు ఇవ్వటం అంటే( చమురు, ఇతర కొనుగోళ్ల ద్వారా అని అర్ధం) దురాక్రమణకు మద్దతు ఇచ్చినట్లే, అది సహజంగానే వినాశకర ప్రభావాన్ని కలిగిస్తుందని సాకీ హెచ్చరించారు.

ఒక స్వతంత్ర, సర్వసత్తాక దేశానికి ఇటువంటి బెదిరింపులు వచ్చినపుడు కూడా మోడీ నోరు విప్పకపోతే ఏమనాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని మోడీ చేతుల్లో పెట్టిన జనానికి విశ్వాసం ఎలా ఉంటుంది.యుద్దం చేయమని అడగటం లేదుగా ఇలాంటి బెదిరింపులు తగవని మోడీగాక పోతే ఎవరు చెప్పాలి ? ఇలాంటి బలహీనత లేదా పిరికిబారిన వారు విశ్వగురువులు, ప్రపంచ నేతలు ఎలా అవుతారు ? ఇక బుజ్జగింపుల గురించి చెప్పాల్సి వస్తే మార్చి 19వ తేదీన ఢిల్లీ పర్యటనను జపాన్‌ ప్రధాని కిషిదా 15వ తేదీన ఖరారు చేసుకొని రావటం వెనుక అమెరికా హస్తం లేదా ? ఇరు దేశాల వార్షిక సమావేశాలు ఉన్నప్పటికీ వాటికి కిషిదా వస్తాడని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేవు. సహజంగా ఇలాంటి రాకపోకలు ఎంతో ముందుగానే ఖరారవుతాయి. మన దేశంలో 42బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామంటూ మనకు కిషిదా ఒక బిస్కెట్‌ వేశాడు.


ఐరాసలో తటస్ధంగా ఉన్న మన దేశం దానికి కట్టుబడి ఉందా అంటే లేదు. ప్రపంచ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం నుంచి ఎన్నికైన జడ్జి దల్వీర్‌ బండారి అమెరికా కూటమి దేశాల వారితో కలసి ఓటు వేశారు. ఇది అమెరికాను సంతుష్టీకరించేదిగా లేదా ? 2017లో రెండవ సారి దల్వీర్‌ ఎన్నిక నరేంద్రమోడీ సర్కార్‌ దౌత్యవిజయానికి ప్రతీక అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఇదేమిటి అంటే దల్వీర్‌ వ్యక్తిగత హౌదాలో తన వాంఛను బట్టి ఓటు వేశారని విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణ రష్యాను సంతృప్తి పరుస్తుందా ? దేశ విధానాన్ని బట్టి నడుచుకోవాలా వ్యక్తిగత ఇష్టాఅయిష్టాల ప్రకారమా ? దీని ద్వారా మన దేశం ఏమి సందేశం పంపినట్లు ?
తైవాన్‌ సమస్య మీద కూడా జింపింగ్‌ అమెరికాకు గట్టి హెచ్చరిక చేశాడు. తైవాన్‌ అంశం మీద నిప్పుతో చెలగాటాన్ని కొనసాగించినా, చైనా ముఖ్య ప్రయోజనాలను ఉల్లంఘించినా రెండు దేశాల మధ్య స్నేహ లేదా సానుకూల మాటలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.

మనకు అమెరికాతో అలాంటి పరిస్ధితి లేదు కనుక రష్యా అంశంలో మా ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని తెగేదాకా లాగవద్దని ఎందుకు చెప్పకూడదు ? బైడెన్‌-జింపింగ్‌ భేటీ తరువాత కొందరు మీడియా వ్యాఖ్యాతలు అమెరికా దిక్కుతోచని స్ధితిలో ఉందని రాశారు.” పుతిన్‌ వ్యవహారంలో చైనా సాయం కొరకు చూస్తున్న బైడెన్‌ ” అన్న శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. రష్యా చేసినదానికి అమెరికా, దాని ఐరోపా మిత్రులు పెను ముప్పును ఎదుర్కోవలసి రావచ్చని దానిలో పేర్కొన్నారు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వేర్పాటును అమెరికా కోరుతున్న సంగతి పదే పదే చెప్పనవసరం లేదు. అలాంటిది షీ జింపింగ్‌తో భేటీలో బైడెన్‌ చెప్పిందేమిటి? ” చైనాలోని వ్యవస్ధను మార్చేందుకు లేదా చైనాకు వ్యతిరేకంగా కూటమికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు,చైనాతో కొత్త ప్రచ్చన్న యుద్దాన్ని కోరుకోవటం లేదు. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్ధించటం లేదు, చైనాతో ఘర్షణను కోరుకోవటం లేదు” అని బైడెన్‌ చెప్పిన అంశాన్ని షీ జింపింగ్‌ ముఖ్యఅంశంగా పరిగణించినట్లు చెప్పారు. ప్రాణ,విత్త,మాన భంగములందు ఆడితప్ప వచ్చని పెద్దలు సెలవిచ్చారు కదా ! అందుకే అమెరికా దానికి కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న.


ఉక్రెయిన్‌ వివాద నేపధ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని సమర్ధించేందుకు మన అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపాం తప్ప రాజకీయనాయకత్వం ఎందుకు నోరు మెదపటం లేదు. పాకిస్తాన్‌, చైనాల విషయంలో అలా లేరే, సూటిగా కాకున్నా బహిరంగంగా, పరోక్షంగా నైనా హెచ్చరికలు చేశారు కదా ? అమెరికా, నాటో కూటమి పట్ల అంత అణకువ ఎందుకు ? అమ్మా నీకు తోటకూరను దొంగతనంగా తెచ్చి ఇచ్చినపుడే తప్పని చెప్పి ఉంటే ఇప్పుడు నాకీ దుస్ధితి తప్పేది కదా అని జైలు పాలైన కొడుకు అన్న కథ తెలిసిందే. ఇక్కడ దొంగతనం కాదు గానీ అమెరికా, పశ్చిమదేశాల వత్తిడికి గతంలో లొంగిపోకుండా గట్టిగా ఉండి ఉంటే ఇప్పుడు చివరికి జో బైడెన్‌ మీడియా అధికారికి అంత సాహసం ఉండేదా ?


గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలులో తగ్గేదేలే అని ఆ నాడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? ఇరాన్‌ ఎవరి మీదా దాడులకు దిగలేదే ! మన మాదిరే తన రక్షణ కోసం అణుకార్యమం చేపట్టింది తప్ప మరొకటి కాదు. ఆంక్షలతో నిమిత్తం లేకుండానే ఎంతో కాలంగా మనతో ఉన్న సంబంధాల కారణంగా మన రూపాయలు తీసుకొనేందుకు, చెల్లింపు గడువు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించినా మన సర్కార్‌ ఇరాన్నుంచి చమురు కొనుగోలును ఎందుకు నిలిపివేసింది ? మనసుంటే మార్గం దొరికేది కాదా ? ఇదే మాదిరి వెనెజులా నుంచి కూడా నిలిపివేశాము. గతంలో ఎన్నడూ లేనిది అమెరికా నుంచి కొనుగోళ్లకు మరలాం. ఒకసారి మనబలహీనత తెలిసింతరువాత ప్రతివారూ బెదిరిస్తారు. తమ వ్యూహాత్మక ఉద్ధేశ్యాల మీద తప్పుడు అంచనాలకు వచ్చారని షీ జింపింగ్‌ చెప్పినట్లుగా రష్యాతో తమ సంబంధాలను తక్కువ అంచనా వేశారని అమెరికన్లకు మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ? అమెరికాను నమ్ముకుంటే ఐరోపాలో ఉక్రెయిన్‌కు ఏమైందో చూస్తున్నాము. తన లబ్దికోసం ఎవరినైనా బలిపెట్టేందుకు అది సిద్దం.ఇప్పటికైనా మించి పోయింది లేదు, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటం అవసరం.దీనిలో రాజకీయాలు కాదు,దేశ గౌరవ, ప్రతిష్ట, ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు అంగీకరించినా లేకున్నా, విమర్శించినా అభిమానించినా ప్రధానిగా నరేంద్రమోడీ వాటికోసం తగిన విధంగా వ్యవహరించకపోతే చరిత్రలో విమర్శలకు గురవుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పట్టువీడని జీ జింపింగ్‌ – మెట్టు దిగిన జో బైడెన్‌ !

17 Wednesday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Joe Biden, Xi Jinping, Xi-Biden virtual summit


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌, అమెరికా అధినేత జో బైడెన్‌ మధ్య మంగళవారం నాడు ( వాషింగ్టన్‌లో సోమవారం రాత్రి) మూడు గంటల 24నిమిషాల సేపు వీడియో కాన్ఫరెన్సుద్వారా రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. వెలువడిన ప్రాధమిక సమాచారం మేరకు అధినేతలిద్దరూ అనేక అంశాల గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య 1979లో దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత తొలిసారిగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, వివాదాల నడుమ అసలు భేటీ కావటమే ఒక విశేషం. బైడెన్‌ అధికారానికి వచ్చిన 300వ రోజు ఈ భేటీ జరిగింది. సుహృద్భావ సూచికగా రెండు దేశాల నేతలు సమావేశానికి హాజరైన సమయంలో బైడెన్‌ చైనా ఎర్రజెండాకు చిహ్నంగా ఎర్ర రంగు టై ధరించగా, అమెరికా అధికారపార్టీ రంగైన నీలి రంగు టై ధరించి గ్జీ జింపింగ్‌ పాల్గొన్నారు.


రెండు దేశాల సంబంధాలలో ఒక నిశ్చయాన్ని లేదా విశ్వాసాన్ని ఈ సమావేశం నింపిందని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. పరస్పరం సహకరించుకోవాలనే అభిలాష వ్యక్తం కావటం ప్రపంచానికి సానుకూల సూచికగా పరిగణిస్తున్నారు. సహజంగా ఇలాంటి సమావేశాలలో మాట్లాడే అగ్రనేతలెవరూ సానుకూల వచనాలే పలుకుతారు. ఇక్కడా అదే జరిగింది. తరువాత ఎవరెలా ప్రవర్తించేదీ చూడాల్సి ఉంది. రెండు దేశాలూ పరస్పరం గౌరవించుకోవాలి, శాంతితో సహజీవనం చేయాలి, ఉభయ తారకంగా సహకరించుకోవాలని, సానుకూల మార్గంలో ముందుకు వెళ్లేందుకు రెండు దేశాలూ చురుకైన అడుగులు వేయాలని జింపింగ్‌ చెప్పాడు.దాపరికం లేకుండా నిర్మొగమాటం లేకుండా చర్చల కోసం చూస్తున్నానని, రెండు దేశాల మధ్య ప్రస్తుత మార్గాన్ని ఘర్షణవైపు మళ్లించవద్దని, రెండు దేశాల మధ్య ఉన్న పోటీ బాటను పోరువైపు మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరుదేశాల అగ్రనేతల మీద ఉందని, ఇరుపక్షాలూ పరిస్ధితి చేజారకుండా తగిన జాగ్రత్తలు(గార్డ్‌ రెయిల్స్‌ – మెట్లు, గోడల మీద నడిచేటపుడు పడకుండా పట్టుకొనేందుకు ఇనుప రాడ్లు, కర్రలు, తాళ్లవంటివి ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ఇరు దేశాల వైఖరులు కుప్పకూలిపోకుండా జాగ్రత్తలు) తీసుకోవాలని జోబైడెన్‌ చెప్పాడు. దానికి ప్రతిగా జింపింగ్‌ కూడా స్పందించాడు.చైనా -అమెరికాలు సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు పెద్ద ఓడల వంటివి.ఒకదానినొకటి ఢకొీట్టుకోకుండా ఉండాలంటే అలలను ఛేదించుకుంటూ ముందుకు పోవాలంటే ఒకే వేగం, దిశ మారకుండా సాగేందుకు చుక్కానుల మీద అదుపు కలిగి ఉండాలి అన్నారు.


చైనా తరఫున కమ్యూనిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డింగ్‌ గ్జూఎక్సియాంగ్‌, ఉప ప్రధాని లి హె, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా వైపు నుంచి ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, ఇతరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు ఫిబ్రవరి, సెప్టెంబరు నెలల్లో ఫోన్‌ ద్వారా అధినేతలు మాట్లాడుకున్నారు. వాటిలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ భేటీ కావాలని నిర్ణయించారు. ముఖాముఖీ సమావేశం కావాలని బైడెన్‌ కోరినప్పటికీ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా గ్జీ జింపింగ్‌ విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నందున వీడియో సమావేశం జరిగింది.


ఈ సమావేశానికి ముందు జరిగిన పరిణామాలను బట్టి అమెరికా జో బైడెన్‌ ఒక మెట్టు దిగినట్లుగా సంకేతాలు వెలువడ్డాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విధించిన కొన్ని సుంకాలను ఎత్తివేసేందుకు సముఖంగా ఉన్నట్లు అమెరికా నేతలు సూచన ప్రాయంగా వెల్లడించారు. వాణిజ్య యుద్దాన్ని 2018లో ట్రంప్‌ ప్రారంభించిన తరువాత చైనా కూడా అదే మాదిరి స్పందించింది. అందువలన ముందుగా అమెరికన్లే స్పందించాలనే వైఖరిని చైనా ప్రదర్శిస్తోంది. అహం అడ్డువచ్చిన అమెరికా ఇతర విధాలుగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌, జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో ముస్లింలను అణచివేస్తున్నారని, భారీ సంఖ్యలో చైనా అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నదంటూ చేస్తున్న ప్రచారం, చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం(క్వాడ్‌), అకుస్‌ పేరుతో చేస్తున్న సమీకరణల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.


అమెరికా ఒక మెట్టుదిగటానికి అక్కడి పరిస్ధితులు, జోబైడెన్‌పై సాధారణ జనం, వాణిజ్యవేత్తల నుంచి వస్తున్న వత్తిడి, జోబైడెన్‌ పలుకుబడి దిగజారుతున్నట్లు వెలువడుతున్న సర్వేలు, వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు బైడెన్‌ యంత్రాంగం మీద వత్తిడిని పెంచుతున్నాయి.ఇరునేతల భేటీకి ఒక రోజు ముందు ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ అమెరికాలోని సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ చైనా సరకుల మీద విధించిన దిగుమతి పన్నులు స్దానికంగా ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు. పన్నులను రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు వాటిని తొలగిస్తే కొంత తేడా ఉంటుందని ఆమె అంగీకరించారు. రెండు దేశాల మధó పన్నులు తగ్గించాలని ఒక ఒప్పందం కుదిరినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు, పన్నుల తగ్గింపు కోరికలను తాము గుర్తించామని అమెరికా వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారు.


ప్రస్తుతం అమెరికాలో 31 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 6.2శాతంగా నమోదైంది.సరఫరా వ్యవస్ధలు చిన్నాభిన్నమై అనేక దుకాణాలు సరకులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం ఆర్ధిక రంగం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ ఎప్పుడు కోలుకుంటుందో తెలియటం లేదు. ఈ నేపధ్యంలో సామాన్యులతో పాటు తామూ ప్రభావితులం అవుతున్నామని 24వాణిజ్య సంఘాల ప్రతినిధులు పన్నులను రద్దు చేయాలని కోరారు. అమెరికా-చైనా వాణిజ్య మండలి కూడా అదే కోరింది. సెక్షన్‌ 301పేరుతో విధించిన పన్నుల కారణంగా వందల బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతిదారులు చెల్లించారు, ఆమేరకు వినియోగదారుల మీద భారం పడింది. పన్నులను రద్దు చేస్తే చైనా కంటే అమెరికాకే ఎక్కువ ఉపయోగం కనుకనే బైడెన్‌ మెట్టుదిగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా చైనా కూడా కొన్ని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వెంటనే కోలుకొని వృద్ధి రేటుతో ముందుకు పోతున్నది.చైనాలో ధరలు స్ధిరంగా ఉంటేనే అమెరికాలో కొంత మేరకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలుగుతారని భావిస్తున్నారు. జో బైడెన్‌ విధానాలను సమర్ధిస్తున్నవారు 41శాతం మందే అని ఆదివారం నాడు ఎబిసి సర్వే ప్రకటించింది. ఈగ్రాఫ్‌ క్రమంగా తగ్గుతున్నది. ట్రంప్‌తో పోలిస్తే కాస్తమెరుగ్గా ఉన్నప్పటికీ ఏడాది కూడా గడవక ముందే ఇలా పడిపోవటం అధికార డెమోక్రటిక్‌ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నతీరును 39శాతం మంది మాత్రమే సమర్ధించారు.క్రిస్మస్‌, ఇతర పండుగల సీజన్‌లో ఆహారపదార్ధాలు, ఇతర వస్తువులకు కొరత ఏర్పడవచ్చని జనం భావిస్తున్నారు.


అమెరికన్లు ఒక్క చైనా మీదనే కాదు చివరికి మిత్రదేశాలుగా ఉన్న జపాన్‌, దక్షిణకొరియాల మీద కూడా పన్నుల దాడి చేస్తున్నారు. ఒకవైపున బైడెన్‌-జింపింగ్‌ భేటీ జరుగుతుండగా అమెరికా వాణిజ్యమంత్రి గినా రైమోండో, వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి జపాన్‌, ఇతర ఆసియాల పర్యటనకు వచ్చారు.ఉక్కు, అల్యూమినియంలపై పన్ను తగ్గించాలని కోరుతున్నారు.తనకు దక్కనిది ఇతరులకూ దక్కకూడదన్నట్లుగా అమెరికా తీరు ఉంది. చైనాలో చిప్‌ల తయారీ పరిశ్రమను పెట్టవద్దని ఇంటెల్‌ కంపెనీని బైడెన్‌ అడ్డుకున్నాడు. చైనాకు వాటి సరఫరా నిలిపివేయాలని తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా కంపెనీల మీద వత్తిడి తెస్తున్నాడు. ఇది చైనాతో ఆ దేశాల సంబంధాల మీద కూడా ప్రభావం చూపనుంది.చైనా వస్తువులపై పన్నులను ఎత్తివేయటం చైనాకు ఎంత లాభమో అమెరికాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది.చైనాలో ఆర్ధిక రంగం వేగం తగ్గితే పర్యవసానాలు ప్రపంచం మొత్తం మీద పడతాయని అమెరికా ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ చెప్పారు.


అక్టోబరు నెలలో అనేక చైనా విమానాలు తమ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వైపు పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా ఇటీవలి కాలంలో దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడటమే గాక ఒక వేళ విలీనానికి చైనా బల ప్రయోగం చేస్తే తాము జోక్యం చేసుకుంటామని ప్రకటించి రెచ్చగొట్టింది.తన నౌకలను ఆ ప్రాంతానికి పంపింది. చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం జరిపిందని ప్రచారం చేయటమే గాక 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు సమకూర్చుకోనుందని తప్పుడు ప్రచారం మొదలెట్టింది. ఇప్పటికిప్పుడు అమెరికాలో ఎన్నికలు జరిగితే మెజారిటీ ఓటర్లు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఓటు వేస్తారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఉభయ సభల్లో మెజారిటీని కోల్పోతే రానున్ను మూడు సంవత్సరాల్లో బైడెన్‌ సర్కార్‌ను రిపబ్లికన్లు అటాడుకుంటారు. అదిరింపులు, బెదరింపులు పని చేయకపోతే తమ అవసరాల కోసం అమెరికన్లు దిగి వస్తారని గతంలో అనే సార్లు రుజువైంది. ఇప్పుడు చైనా విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా స్ధానిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని బైడెన్‌ పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.


ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అమెరికా కాస్త వెనక్కు తగ్గుతోందనేందుకు సూచికగా చెప్పవచ్చు. తైవాన్‌ విలీనానికి బలవంతంగా పూనుకుంటే జోక్యం చేసుకుంటామని ప్రకటించి బైడెన్‌ నోరు జారాడు. అది దశాబ్దాల కాలంగా అమెరికా అనుసరిస్తున్న ఒక చైనా వైఖరికి విరుద్దం. వెంటనే అధ్యక్ష భవనం ఒక ప్రకటన విడుదల చేసి తమ ఒక చైనా విధానంలో ఎలాంటి మార్పు లేదని వివరణ ఇచ్చింది. తైవాన్‌ తనను తాను రక్షించుకొనేందుకు సాయం పేరుతో ఆయుధాలు విక్రయిస్తూ సాయుధం గావిస్తోంది. చైనా టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీ హువెయి ఉన్నత అధికారిణి మెంగ్‌ వాన్‌ ఝౌ మీద ఆంక్షలు విధించిన అమెరికా ఆమె మెక్సికో వెళుతుండగా కెనడా విమానాశ్రయంలో అరెస్టు చేయించిన అంశం తెలిసిందే. ఇరాన్‌ మీద తాము విధించిన ఆంక్షలను సదరు కంపెనీ ఉల్లంఘించిందంటూ కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఇద్దరు కెనడియన్లను చైనా అదుపులోకి తీసుకుంది. ఈ ఉదంతంలో అమెరికా దిగివచ్చి కేసు ఎత్తివేసేందుకు అంగీకరించి వాంగ్‌ విడుదలకు చొరవ చూపింది.తైవాన్‌ సమస్యలో అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని, దానితో ఆడుకుంటే ఆ నిప్పుతోనే కాలిపోతుందని గ్జీ జింపింగ్‌ మంగళవారం నాడు మరోసారి హెచ్చరించాడు. కీలక అంశాల మీద ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేయటమే ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో నియంత్రణలు నియంతృత్వ చర్యలా ? నిజా నిజాలేమిటి !

04 Saturday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 5 Comments

Tags

china communist party, China Regulations, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” మదుపుదార్లకు మూడులక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగించిన చైనా ‘ విప్లవం ” అన్నది అమెరికా మీడియా సిఎన్‌ఎన్‌ ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక.వర్తమాన సంవత్సరంలో మన దేశ జిడిపి అంచనాకు అది సమానం. లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టే, తలిదండ్రులను, విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఆన్‌లైన్‌ ట్యూషన్‌ సంస్ధలను మూసివేసిందంటూ మరొక వ్యాఖ్యాత గుండెలు బాదుకున్నాడు. ఇంత మొత్తం నష్టం కలిగించే చర్యలకు చైనా ఎందుకు పాల్పడింది, అందునా కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న స్దితిలో అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులకూ, అభిమానించే వారికీ ఆసక్తి కలిగించే అంశమే. చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ద తప్ప సోషలిజం కాదూ పాడూ కాదు అన్నది ఒక అభిప్రాయం. కమ్యూనిస్టులమని చెప్పుకొనే వారు కూడా కొందరు వారిలో ఉన్నారు. మరి అలాంటి వ్యవస్ధ ఒక్కసారిగా మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు మదుపర్లకు నష్టం కలిగించే చర్యలు ఎందుకు తీసుకుంటుంది అంటే జవాబు ఉండదు. అక్కడ జరుగుతున్నది మంచా చెడ్డా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ముందు అక్కడే జరుగుతోందో తెలుసుకుందాం.


వివాదాస్పదమైన, దేశవ్యతిరేక రాజకీయ వైఖరులు తీసుకొనే మరియు అప్రయోజనమైన పద్దతుల్లో వ్యవహరించే కళాకారులను ప్రోత్సహించవద్దు. కార్యక్రమాలలో పాల్గొనే వారికి, అతిధులుగా వచ్చే వారికి చెల్లించే మొత్తాల మీద పరిమితులు విధించాలి. కళా రంగంలో దేశభక్తి పూరితమైన వాతావరణం ఉండేట్లు చూడాలి. నియంత్రణ చర్యల్లో భాగంగా ఎవరికి ఎంత పలుకుబడి ఉందనే సమాచారాన్ని ప్రచారం చేసే జాబితాల మీద, అభిమానాన్ని ఆదాయంగా మార్చే వైఖరుల మీద నిషేధం. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు వారానికి మూడు గంటలు మాత్రమే వీడియోగేమ్స్‌ ఆడాలి. ఇంటర్నెట్‌ కంపెనీలు సేకరించిన సమాచారం ద్వారా దేశభద్రతకు ప్రమాదం కలిగించే ముప్పు నివారణ, మరియు అమెరికాతో సహా ఇతర దేశాల్లో వాటాల విక్రయం(ఐపిఓ)పై ఆంక్షలు. పౌర సంస్ధలు(కార్పొరేషన్లు, మున్సిపాలిటీలవంటివి) తమ సమాచార(డాటా) నియంత్రణ ప్రయివేటు కంపెనీల్లో గాకుండా ప్రభుత్వ రంగసంస్ధల్లో నిక్షిప్తం చేసేందుకు వీలుగా మార్పులు చేసుకోవాలి.


ఎలక్ట్రానిక్‌ కామర్స్‌(ఆన్లయిన్‌ లావాదేవీలు) నిర్వహించే సంస్ధలు వాణిజ్య నైతిక నియమావళిని, న్యాయబద్దంగా వుండే సూత్రాలను పాటించాలి. వినియోగదారులతో అధిక మొత్తాలను ఖర్చు చేయించే విధంగా వివాదాస్పదంగా మారి సమస్యలు తలెత్తకుండా చూడాలి.( ఒక వ్యాపారి తన వస్తువులను ఒక వేదిక నుంచి అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్న తరువాత మరొక వేదిక నుంచి అమ్మటానికి వీల్లేదని ఆంక్షలు విధించిన అలీబాబా కంపెనీకి 275 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు.) ఆహార సరఫరా కంపెనీలు కార్మికులకు మెరుగైన రక్షణ కల్పించాలి.
లాభాల కోసం పని చేస్తూ విదేశాల్లో పెట్టుబడులు సేకరించే ప్రయివేటు ట్యూషన్‌ కంపెనీలపై నిషేధం.లాభాపేక్ష లేని సంస్ధలు ట్యూషన్లు చెప్పవచ్చు.స్కూళ్లలో చెప్పిన వాటిని బోధించరాదు, వారాంతాలు, సెలవు రోజుల్లో ట్యూషన్లు చెప్పకూడదు. తలిదండ్రులకు భారం లేకుండా టూషన్లు ఉండాలి.ఆన్లయిన్‌ రుణాలపై పరిమితులు విధించారు.ఒక రాష్ట్రంలో నమోదైన కంపెనీలు వేరే రాష్ట్రాల్లో రుణాలు ఇవ్వకూడదు. వ్యక్తులకు ఇచ్చే రుణాలపై పరిమితులు పెట్టారు. ఆన్లయిన్‌ చెల్లింపు సంస్ధలు క్రిప్టో కరెన్సీ(బిట్‌కాయిన్‌) చెల్లింపులు, పరిష్కారాలు చేయకూడదు. బిట్‌ కాయిన్‌ – ప్రభుత్వ కరెన్సీ మార్పిడి సేవలు నిర్వహించకూడదు.ఫండ్ల నిర్వహణ సంస్థలు ఆస్తులుగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెట్టకూడదు. రియలెస్టేట్‌ బుడగలు ఏర్పడి అవి పేలిపోయి నష్టం జరగకుండా ఉండేందుకు అవి తీసుకొనే రుణాలపై నియంత్రణలు విధించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని అంశాల మీద విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొనే చర్యలు అక్కడి శ్రమ జీవుల జీవితాల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయా లేక ఇప్పటి వరకు అనుమతించిన ప్రయివేటు కంపెనీల లాభాపేక్ష, అవినీతి,అక్రమాల మీదనా అన్నదే గీటురాయిగా చూడాలి.


టెక్నాలజీ, విద్య, ఇతర ప్రయివేటు సంస్ధలపై గత కొద్ది వారాలుగా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా వివిధ కంపెనీల మార్కెట్‌ విలువ స్టాక్‌మార్కెట్‌లో ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిపోయిందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగవచ్చు. మావో హయాంలో సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న కొన్ని దుందుడుకు చర్యలతో కొందరు వీటిని పోలుస్తున్నారు. నియంతృత్వ చర్యలు అంటున్నారు. అలాంటిదేమీ లేదని కొందరు చెబుతున్నారు. ఇప్పటికీ దీర్ఘకాల పెట్టుబడులకు చైనాలో పరిస్ధితులు సజావుగానే ఉన్నాయి.ఇటీవల తీసుకున్న నియంత్రణ చర్యలు ఎప్పుడో తీసుకోవాల్సింది, అక్కడి వృద్ధి రేటు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉంది అంటున్నారు. స్విస్‌ ప్రయివేటు బ్యాంకు పిక్‌టెట్‌ గ్రూపుకు చెందిన అసెట్‌ మేనేజిమెంటు ప్రధాన వ్యూహకర్త లూకా పొవోలినీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఢోకాలేదన్నారు. దీని ఆధ్వర్యంలో 746 బిలియన్‌ డాలర్ల ఆస్తుల పర్యవేక్షణ జరుగుతోంది.ప్రపంచంలో అతి పెద్ద ఆస్తుల నిర్వహణ సంస్ధ బ్లాక్‌రాక్‌, ఫిడెలిటీ, గోల్డ్‌మాన్‌ శాచ్స్‌ వంటివి కూడా చైనాలో పెట్టుబడులు, కొనుగోళ్ల సమయంలో ఆచితూచి లావాదేవీలు జరపవచ్చనే చెబుతున్నాయి.ఆర్ధిక స్ధిరత్వం కోసం చైనా నియంత్రణ చర్యలను సమతూకంగా ఉండేట్లు చూస్తారని, అభివృద్ధి మందగించినపుడు, మార్కెట్లో అస్థిర పరిస్థితి ఏర్పడితే నియంత్రణలను సడలించవచ్చని చెబుతున్నాయి. అయితే ఈ చర్యలను సమీపకాలంలో ఎత్తివేయవచ్చు అని భావించలేమని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది.


బడా సంస్ధలపై నియంత్రణ ఆకస్మికంగా సంభవించిన పరిణామం కాదు. జాక్‌ మా సంస్ధలపై గత ఏడాది నవంబరులో తీసుకున్న చర్యలే అందుకు నిదర్శనం.ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని సాధించేందుకు అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ వెల్లడించిన విధాన నిర్ణయంతో పాటు సమాజంలోని సోషలిస్టేతర లక్షణాల పెరుగుదలను అదుపు చేసేందుకు వివిధ చర్యలను ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చైనా మార్కెట్‌ పెట్టుబడిదారుల స్వర్గం అన్న భావనకు స్వస్ది పలికేందుకు విప్లవాత్మక చర్యలను చేపట్టినట్లు సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. అంతర్జాతీయ పెట్టుబడిదారు జార్జి సోరస్‌ ఫైనాన్సియల్‌ టైమ్స్‌లో ఒక విశ్లేషణ రాస్తూ చైనాలో పెట్టుబడులు పెట్టాలనుకొనే విదేశీ మదుపుదార్లు అక్కడి ముప్పును గుర్తించటం కష్టం అన్నారు. మదుపుదార్లకు తెలిసిన చైనా వేరు గ్జీ చైనా వేరు అన్నాడు. మీడియా, వినియోగదారుల సేవలు, విద్య, చిల్లర వ్యాపారం, రవాణా, బయోటెక్‌ రంగాలు సృష్టించి సామాజిక లేదా సాంస్కృతిక సమస్యను పరిష్కరించేందుకు చైనా కేంద్రీకరించిందని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని, ఈ రంగాల కంపెనీల వాటాలు కొనవద్దని కొందరు సలహాయిస్తున్నారు.


ఆన్‌లైన్‌ విద్య, పాఠశాల అనంతర ట్యూషన్లు చెప్పటం చైనాలో కంపెనీలకు పెద్ద ఆదాయవనరుగా ఉంది. ఇప్పుడు వాటిని నిషేధించారు. ఇవి సమాజంలో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండి అసమానతలకు దోహదం చేస్తున్నాయని కమ్యూనిస్టు పార్టీ భావించిన ఫలితమే ఈ చర్య. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన అవకాశాలను కలిగించినట్లయింది. పిల్లలు సెల్‌ఫోన్లకు, పెద్దవాళ్లు లాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారనే ఆవేదన అన్ని చోట్లా ఎప్పుడో ప్రారంభమైంది.కరోనా కారణంగా పాఠశాలల మూత సమయంలో అదింకా పెరిగి ఒక విధంగా ఒక వ్యవసనంగా తయారైంది. చైనాలో వీడియోగేమ్స్‌ ఆడే సమయాన్ని గణనీయంగా తగ్గించి పిల్లలు, యువతను వేరే అంశాలవైపు మళ్లించేందుకు కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. కొంత మంది దీనిని స్వేచ్చను హరించటంగా చిత్రిస్తుండగా, బాధ్యతాయుతమైన యువతను తయారు చేయటంగా ఎక్కువ మంది భావిస్తున్నారు.ఈ చర్య కారణంగా టెక్నాలజీ కంపెనీల ఆదాయం పెద్ద ఎత్తున పడిపోనుంది. వీటిని నిర్వహించే టెక్‌ కంపెనీల మీద గత పదిహేను సంవత్సరాలుగా నియంత్రణ లేదు. పిల్లలు, యువతలో వేలం వెర్రిగా మారటంతో ఇప్పుడు ఆపని చేస్తున్నారు. సమాజాన్ని సరిదిద్దే ఈ చర్యను నియంతృత్వంగా కొందరు చిత్రిస్తున్నారు.అవాంఛనీయమైన తప్పుడు ప్రచారానికి, విచ్చలవిడితనాన్ని, నేరాలను ప్రోత్సహించే సాధనాలుగా మారిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ మాధ్యమాలపై ఇప్పటికే చైనాలో ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో రోజుకు గంటన్నర పాటు, సెలవు రోజుల్లో మూడు గంటల పాటు వీడియో గేమ్స్‌ ఆడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు పేర్కొన్న మూడు గంటలు శుక్రవారం, వారాంతంలో మాత్రమే అనుమతిస్తారు.ప్రభుత్వ సెలవు దినాల్లో ఒక గంట అదనంగా అనుమతిస్తారు.


పాఠశాలల్లో సిలబస్‌ భారాన్ని తగ్గించటంతో పాటు వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతున్న పిల్లల్లో హ్రస్వదృష్టి సమస్యల నివారణ, ఇంటి వెలుపల కార్యకలాపాలను ఎక్కువగా ప్రోత్సహించటం, క్రీడల పట్ల ఆసక్తి పెంచటం వంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆరు సంవత్సరాల లోపు వారిలో దృష్టి సమస్యలను గుర్తించేందుకుగాను 90శాతానికి పైగా పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రోజుకు రెండు గంటల పాటు భౌతిక కార్యకలాపాల్లో ఉండే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి. ఆరు-పన్నెండు సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలతో ప్రతిసారి 20-30 నిమిషాలకు మించి చదివించటం లేదా రాయించకూడదు. వారు కనీసం పది గంటల పాటు నిద్రపోయేట్లు చూడాలి. హౌం వర్క్‌ను పరిమితం చేయాలి. అది నాణ్యమైనదిగా ఉండాలి. హాస్టల్‌ వసతి ఉన్న పాఠశాలల్లో సాయంత్రాలు చదివించే వ్యవధిని తగ్గించాలి.ఆన్లయిన్‌ గేమ్స్‌లో ఎక్కువ సేపు గడపటం వలన తరుణ వయస్సు వారి భౌతిక, మానసిక స్ధితి , చదువు సంధ్యలు,వ్యక్తిత్వ వికాసం మీద కూడా ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. వీడియో గేమ్స్‌ మీద ఏటా 20.71శాతం ఆదాయం పెరుగుతోంది. కంపెనీల వార్షిక మార్కెట్‌ విలువ 2020లో 278.7 బిలియన్‌ యువాన్లు కాగా దానిలో సగం వాటా టెన్‌సెంట్‌ కంపెనీదే ఉంది. సిచువాన్‌ రాష్ట్రంలో జరిపిన ఒక సర్వే ప్రకారం వీడియోగేమ్‌లకు బానిసలైన విద్యార్దులు 26.23శాతం ఉన్నారు. వారిలో రెండు మూడు రోజులకు ఆడేవారు కొందరైతే 11.66శాతం మంది దాదాపు రోజూ ఆడుతున్నారు. ఆన్లయిన్‌ గేమ్స్‌ను పరిమితం చేసేందుకు ఐదు వేల సంస్ధలకు చెందిన పదివేల గేమ్స్‌తో ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యలు స్వేచ్చను హరించేవా, పిల్లలను సరైనదారిలో పెట్టేవా ?


మన దేశంలో, ప్రపంచంలో చైనా గురించి ఒక విచిత్ర మానసిక స్ధితి రోజు రోజుకూ పెరిగిపోతోంది.చైనా సాధించిన విజయాల గురించి చెబితే అవన్నీ తప్పుడు లెక్కలు లేదా నియంతృత్వం కారణమని చెప్పేవారున్నారు. కరోనాను చైనా సృష్టించలేదు, దాని వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టింది, రికార్డు స్ధాయిలో వాక్సిన్లు వేస్తోంది అని ఎవరైనా చెబితే అది దేశద్రోహుల ప్రచారం అంటున్నారు. మరోవైపు ఒకటో అరా కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చినా, రావాలని ప్రకటించినా ఇంకేముంది చైనా కుప్పకూలిపోనుంది, కంపెనీలన్నీ మన దేశానికి వస్తున్నాయనే విపరీత భ్రమలకు లోను కావటం మరోవైపు చూస్తున్నాము. ఇప్పుడు వివిధ అంశాల మీద నియంత్రణ చర్యలు తీసుకుంటే వాటి మీద ప్రపంచమంతటా గుండెలు బాదుకోవటం ప్రారంభమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధనికులపై అదుపు – ఉమ్మడి సౌభాగ్యం దిశగా చైనా అడుగులు !

25 Wednesday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Social Inclusion

≈ Leave a comment

Tags

China’s ‘common prosperity’, common prosperity for all, Xi Jinping


ఎం కోటేశ్వరరావు

చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ఆగస్టు 17న చేసిన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించిన ” ప్రజల ఉమ్మడి సౌభాగ్యం ” అనే పదం గురించి ప్రపంచంలో అనేక మంది దాని అర్ధం ఏమిటబ్బా అని మల్లగుల్లాలు పడుతున్నారు.ముఖ్యంగా సోషలిస్టు విధానం నుంచి వైదొలిగిన చైనా ”ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని” అనుసరిస్తున్నదని సంతృప్తి ( సోషలిజం కాదంటున్నారు గనుక పోనీలే ఏదో ఒక పెట్టుబడిదారీ విధానం అని) చెందుతున్నవారికి ఇది మింగుడు పడటం లేదు. కావాలంటే దిగువ వారిని పైకి తీసుకురావచ్చు తప్ప పెరిగేవారిని అదుపు చేసే పితలాటకం ఏమిటి అని చిరచిరలాడుతున్నారు. అచిర కాలంలోనే అద్భుత విజయాలు సాధించిన చైనా ప్రయాణం మరో మలుపు తిరగనుందా ? తన ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో అడపాతడపా దేశ ఉమ్మడి సౌభాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్న అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌ ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్రసంగంలో క్రీస్తుపూర్వం 571-479 మధ్య కాలంలో జీవించిన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్‌ తన శిష్యులకు చెప్పిన ఒక లోకోక్తిని ఉటంకించారు.” తెలివైన నేత దారిద్య్రాన్ని గురించి కాదు అసమానతల గురించి ఆందోళన చెందుతాడు.తన జనం తక్కువ మందే ఉన్నారని కాదు వారిలో తీవ్ర విభజన ఉందని ఆందోళన చెందుతాడు.” అని చెప్పాడు.


చైనాలో అసమానతలు పెరుగుతున్నాయన్న విమర్శలు, ఆవేదన, ఆందోళనలు గత కొంత కాలంగా ఇంటా బయటా పెరుగుతున్న విషయం తెలిసిందే. చైనా 2021లో 1,058 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉంది, 696మందితో అమెరికా, 177 మందితో మన దేశం మూడవ స్ధానంలో ఉంది. ఈ అంకెలను చూసి చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిస్టు వ్యవస్ధ కాదని కొంత మంది కమ్యూనిస్టులు కూడా భావించుతున్నారు. గ్జీ లేదా కమ్యూనిస్టు పార్టీ మాటలకు అర్ధం తెల్లవారేసరికి చైనాలోని బిలియనీర్ల సంపదలు మొత్తం స్వాధీనం చేసుకొని అందరికీ సమంగా పంచబోతున్నారని కాదు, కొత్తగా ఎవరినీ ధనవంతులను కానివ్వకుండా అడ్డుకోనున్నారనీ కాదు. పేదలు-ధనికుల మధ్య అంతరాన్ని మరింతగా పెరగటాన్ని అనుమతించకూడదని ఈ ఏడాది జనవరిలో జింపింగ్‌ చెప్పాడు. నిర్దిష్టమైన కార్యక్రమం గురించి ఎలాంటి స్పష్టత ఇంకా లేదు.
ఆగస్టు 17 ప్రసంగంలో గ్జీ పదే పదే ఉమ్మడి సౌభాగ్యం గురించి చెప్పటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది కాలంలో తన ప్రసంగాల్లో 30సార్లు అపదాన్ని వినియోగిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 65సార్లు చెప్పినట్లు అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయలో చైనా రాజకీయ పదజాల అధ్యయనవేత్త మరియా రెపినికోవా వెల్లండించారు. గ్జీ ఉద్దేశ్య బలాన్ని ఇది సూచిస్తున్నదన్నారు. నేతల నినాదాలు విధాన దిశ లేదా మార్పును సూచిస్తాయని,కొన్ని సందర్భాలలో అసందిగ్గత, భాష్యాల సర్దుబాటుకు అవకాశం కూడా ఇస్తారని చెప్పారు. ఆగస్టు 17వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆర్ధిక మరియు విత్త వ్యవహారాల కమిటీ సమావేశంలో గ్జింపింగ్‌ ప్రసంగించారు. ఆదాయ పంపిణీ, అక్రమ మరియు సహేతుకంగానీ ఆదాయాల సమస్యలను ఎదుర్కొనేందుకు, అధిక ఆదాయాలను సహేతుకంగా సర్దుబాటు చేసేందుకు గాను అధికపన్నులు, సామాజిక భద్రత, చెల్లింపుల బదలాయింపుల వంటి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు.


ఈ సమావేశం జరిగిన మరుసటి రోజు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ఉమ్మడి సౌభాగ్యం అంటే క్లుప్తంగా ఏమిటి అంటూ ఒక గీతల చిత్రాలతో గ్జిన్హువా వార్తా సంస్ధ విడుదల చేసిన ఒక వివరణ ప్రచురించారు.” మరింత న్యాయమైన పంపిణీ మరియు అత్యంత నాణ్యమైన అభివృద్ది మీద చైనా దృష్టి సారించింది. ఉమ్మడి సౌభాగ్యం అంటే ఏమిటి ? భౌతిక మరియు సాంస్కృతిక పరిభాషలో ప్రతి ఒక్కరూ సంపదను పంచుకోవటాన్ని ఉమ్మడి సౌభాగ్యం అనే మాట చెబుతున్నది.కొంత మంది మాత్రమే భాగ్యవంతులుగా ఉండకూడదు. సమానత్వ రహిత విశ్వాసిగా ఉండకూడదు. ఉమ్మడి సౌభాగ్యానికి ప్రాతిపదిక ఏమిటి ? జనాలు తమ అభివృద్ధి సామర్ధ్యాలను వృద్ది చేసుకొనేందుకు మెరుగైన పరిస్ధితులను కల్పించటం. మరింత ఎక్కువ మంది ధనవంతులు అయ్యేందుకు వీలుకలిగించే పరిసర వాతావరణాన్ని కల్పించటం. ఉమ్మడి సౌభాగ్య సూత్రాలేమిటి ? ప్రతి ఒక్కరూ లబ్ది పొందేలా ఒక సహేతుకమైన పంపిణీ వ్యవస్ధను ఏర్పాటు చేయటం. ప్రజల సంక్షేమానికి సదుపాయాలు కల్పించటం. క్రమబద్ద మరియు పురోగామి పద్దతిలో ఉమ్మడి సౌభాగ్యాన్ని ప్రోత్సహించటం. ఉమ్మడి సౌభాగ్యాన్ని సాధించేందుకు మార్గాలేమిటి ? ఆదాయ పంపిణీకి అవసరమైన ప్రాధమిక వ్యవస్ధాపరమైన సదుపాయాలను కల్పించటం.అధిక ఆదాయాన్ని సర్దుబాటు చేయటం, అక్రమ ఆదాయాన్ని నిషేధించటం. మధ్య ఆదాయ తరగతి పరిమాణాన్ని పెంచటం. తక్కువ ఆదాయ తరగతుల సంపాదన పెంచటం. తదుపరి పనిపై కేంద్రీకరణ ఏమిటి ?అందరికీ సమంగా అందేట్లుగా ప్రజా మౌలిక సదుపాయాలను మరిన్ని నిర్మించటం. మేథోసంపత్తి హక్కులను రక్షించటం, చట్టబద్దమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వటం, పెట్టుబడి ఆరోగ్యవంతమైన పద్దతుల్లో పెరిగేందుకు వీలు కల్పించటం. గ్రామీణ ప్రాంతాలు, రైతులలో సంపదలు పెరిగేట్లుగా ప్రోత్సహించటం.”


గ్జిన్హువా ప్రభుత్వ అధికార సంస్ద గనుక కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ ఆలోచనకు ప్రతిబింబంగా తీసుకొని ప్రపంచవ్యాపితంగా మీడియా సంస్దలు ఉమ్మడి సౌభాగ్యం మీద వార్తలు, వ్యాఖ్య, విశ్లేషణలు ఇచ్చాయి. పెద్ద మొత్తాలలో ఆదాయాలున్న కంపెనీల మీద చర్యల గురించి ఊహాగానాలను ప్రచురించారు. ఉమ్మడి సౌభాగ్యం అనే భావనను మావో జెడాంగ్‌ ముందుగా పార్టీలో ప్రవేశపెట్టారని, ముందుగా ఆర్ధిక వృద్ధి మీద కేంద్రీకరించాలని, అది కొంత మంది జనాలు ధనికులు అయ్యేందుకు అనుమతిస్తుందని, ఉమ్మడి సౌభాగ్యం తరువాత వస్తుందని చెప్పిన డెంగ్‌ గ్జియావోపింగ్‌ తన ఉపన్యాసాల్లో ఆ పదాలను ఉపయోగించలేదని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. చైనా సంపదల పంపిణీలో అసమానతల గురించి అక్కడి నాయకత్వం దాచిందేమీ లేదు. అయితే అధికారికమైన సమాచారం లేని కారణంగా విదేశీ మీడియాలో వచ్చే అంకెలను పూర్తిగా విశ్వసించలేము అలాగని తోసిపుచ్చలేము. ఒక సంస్ధ లేదా విశ్లేషకులు ఇచ్చిన సమాచారం మరొక దానికి వెళ్లేసరికి పొంతన ఉండదు. ఉదాహరణకు చైనా ఉమ్మడి సౌభాగ్యం గురించి తాజాగా ఇచ్చి బ్లూమ్‌బెర్గ్‌ వార్త ప్రకారం మధ్యతరగతి వారు 40కోట్ల మంది కాగా అమెరికన్‌ పూ సర్వే సంస్ద ఇచ్చిన ప్రకారం 2018లోనే 70.7 కోట్ల మంది ఉన్నారు. అంటే జనాభాలో 50.8శాతం మంది. వీరిలో కూడా ఆదాయ తేడా ఉంటుంది.ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2000-2018 మధ్య బ్రిక్స్‌ దేశాలలో మధ్య తరగతి జనాభాలో జరిగిన మార్పు వివరాలు ఇలా ఉన్నాయి.(ఆధారం చైనాపవర్‌ డాట్‌ క్రైసిస్‌ డాట్‌ ఓఆర్‌జి)
దేశం××2000లో జనాభాలోశాతం×× 2018లో శాతం×××× మార్పు శాతం
చైనా ×××××× 3.1 ××× 50.8 ×××× 47.7
రష్యా ×××××× 28.2 ××× 71.5 ×××× 43.3
బ్రెజిల్‌ ×××× 30.3 ××× 51.4 ×××× 21.1
ద.ఆఫ్రికా×××× 15.1 ××× 22.5 ×××× 7.4
భారత్‌ ××××× 1.2 ××× 5.7 ×××× 4.5

2035 నాటికి అందరికీ ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎంతో పురోగతి సాధించాల్సి ఉందని గ్జీ జింపింగ్‌ గతేడాదే చెప్పారు. పైలట్‌ ప్రాజెక్టుగా 2025నాటికి 45శాతం ఆదాయాన్ని పెంచటం ద్వారా అంతరాన్ని తగ్గించేందుకు ఝెజియాంగ్‌ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు.అసమానతల తగ్గింపునకు అధిక ఆదాయం ఉన్నవారిపై పన్నులు పెంచాలని ఆమొత్తాలను దిగువ ఆదాయం ఉన్నవారి సంక్షేమానికి ఖర్చు చేయాలన్నది ఒక ఆలోచన. ఎంత ఆదాయం ఉన్నవారి మీద ఎంత పెంచాలి అనే కసరత్తు జరుగుతోంది. అక్రమ ఆదాయం, పన్ను ఎగవేతల మీద ముందుగా దృష్టి పెడతారు. అది ముందుగా పార్టీ కార్యకర్తలతోనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎకానసమిస్టు పత్రిక రాసింది.హాంగ్‌ఝౌ పట్టణంలోని 24,800 మంది కార్యకర్తలు స్ధానికంగా ఉన్న సంస్ధల నుంచి అక్రమంగా రుణాలు తీసుకోవటం లేదా స్వప్రయోజనాలకు పాల్పడిందీ లేనిదీ స్వచ్చందంగా వెల్లడించాలని పార్టీలో అవినీతి నిరోధక విభాగం కోరినట్లు ఆ వార్తలో పేర్కొన్నది. అధిక ఆదాయం కలిగిన వారి నుంచి స్వచ్చందంగా విరాళాల ద్వారా నిధులు సమీకరించాలని కూడా భావిస్తున్నారని, ఆ కారణంగానే ఆగస్టు 17 సమావేశం తరువాత ఇంటర్నెట్‌ బడా కంపెనీ టెన్‌సెంట్‌ 770 కోట్ల డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విడుదల చేసిందని పేర్కొన్నది. రూళ్ల కర్ర మాదిరి అన్ని చోట్లా ఒకే రకమైన నిబంధనల అమలు కాకుండా స్దానికంగా ఉన్న పరిస్దితిని బట్టి వర్తింప చేయాలని కోరటంతో ఆమేరకు పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఝెజియాంగ్‌ రాష్ట్రంలోని పట్టణాలలో కసరత్తు ప్రారంభమైందని, రాష్ట్ర ఆదాయంలో కార్మికుల వాటాను 50శాతానికి పెంచాలన్నది ఒక నిర్ణయమని ఎకానమిస్టు పేర్కొన్నది.


ఉమ్మడి సౌభాగ్య పధకం అమల్లో భాగంగానే ఇటీవల టెక్నాలజీ కంపెనీల మీద నియంత్రణ చర్యల ప్రారంభమని సిఎన్‌బిసి వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆచరణాత్మకంగా అమలు ఉంటుందని ఎకానమిస్ట్‌ పత్రిక ఆర్ధికవేత్త యూ సు వ్యాఖ్యానించారు. అధిక ఆదాయం గలవారు, పెట్టుబడి మీద వచ్చే ఆదాయంపై పన్నులు పెంచుతారని ఈ చర్య పెట్టుబడులు తగ్గేందుకు, బయటకు పోయేందుకు దారితీస్తుందని, ఆర్ధిక వ్యవస్ధ మీద పున:పంపిణీ విధానాల ప్రభావాన్ని చైనా ప్రభుత్వం విస్మరించజాలదని చెప్పారు. ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ బృందం 2019లో తమ విశ్లేషణలో చెప్పినదాని ప్రకారం 1978లో అగ్రభాగంలోని పదిశాతం మందికి 27శాతం ఆదాయం వస్తే 2015 నాటికి అది 41శాతానికి పెరిగింది. తమ దేశంలో దుర్భరదారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు గతేడాది చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ధిక వ్యవస్ధలో మధ్య ఆదాయ తరగతి వాటాను పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటున్నదని మోర్గాన్‌ స్టాన్లే విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాలోని బడా టెక్నాలజీ కంపెనీలు చిన్న సంస్ధలను మింగివేస్తున్నాయనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది. రెండు నెలల కాలంలో ఆలీబాబా, జెడిడాట్‌కామ్‌ కంపెనీల వాటాల ధరలు స్టాక్‌ఎక్సేంజ్‌లో 29శాతం పడిపోయాయి. మరికొన్ని కంపెనీలదీ అదే పరిస్ధితి. ఆర్ధిక విధానంలో వచ్చిన మార్పును విదేశీ మదుపుదార్లు అర్ధం చేసుకొని దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుందని షాంఘైలోని ఒక సంస్ధ ప్రొఫెసర్‌ ఝు నింగ్‌ చెప్పాడు. కొంత మందినైనా ముందు ధనవంతులను కానిద్దాం అనే విధానానికి ఇది విరుద్దమని అన్నాడు.

జాక్‌ మా ఆధీనంలోని అలీబాబా కంపెనీని విదేశీ సంస్దల పోటీ నుంచి తట్టుకొనేందుకు ప్రభుత్వం సంవత్సరాల పాటు కాపాడింది. దాని అనుబంధ యాంట్‌ గ్రూపు వాటాల విక్రయాన్ని గతేడాది నవంబరులో నిలిపివేసింది. ఈఏడాది ఏప్రిల్‌లో 18.23 బిలియన్‌ యువాన్ల అపరాధ రుసుం విధించింది. ఆహార పదార్దాలను సరఫరా చేసే జొమాటో, స్విగ్గీవంటి సంస్ధలలో పని చేసే వారికి స్ధానిక కనీస వేతనాలు చెల్లించాలని నియంత్రణ సంస్ద ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీ వస్తుసరఫరాలో కొన్ని సంస్దల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చిన్న వ్యాపారుల స్వాగతిస్తున్నారు. పోటీ లేని కారణంగా పదిహేను నుంచి 25శాతం వరకు తమ నుంచి కమిషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని, ఎక్కువ కంపెనీలు రంగంలో ఉంటే తమకు బేరమాడే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.యాప్‌ల ద్వారా చిన్న దుకాణాల వారు ఆర్డర్లు తీసుకొని తామే సరఫరా చేస్తున్నారు. చైనాలో 14 కోట్ల మంది చిన్న దుకాణాల వారున్నారని అంచనా. ఇప్పటి వరకు పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు అమెరికా తదితర విదేశీ మదుపుదార్లు పెద్దమొత్తాలను పెట్టుబడులు పెట్టి తలిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ట్యూషన్లు చెప్పే కంపెనీలను లాభాల ప్రాతిపదికన నడపకూడదని, విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని గత నెలలో చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాంటి కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి.


చైనా ప్రభుత్వం అక్కడి టెక్నాలజీ సంస్దలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా అక్కడి సంస్దల్లో పెట్టుబడులు పెట్టేవారు వేరే దేశాలను చూసుకుంటారని, అందువలన మన దేశంలోని అంకుర సంస్దలు లబ్ది పొందవచ్చని కొందరు చెబుతున్నారు. నిజంగా అలాంటి వారు ముందుకు వస్తే అభ్యంతర పెట్టాల్సినపని లేదు. మనం అభివృద్దిలో చైనాతో పోల్చుకుంటున్నాం, వీలైతే దాన్ని అధిగమించి పోవాలని చెబుతున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది.పైన చెప్పుకున్న వివరాల ప్రకారం కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండే మధ్య తరగతి ఆదాయవర్గాన్ని పెంచకుండా అది సాధ్యం కాదు. అందువలన మన దేశంలో దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించటం, క్రమంగా మధ్యతరగతి, ధనికులను ఎలా పెంచటమా అన్నదే సమస్య. ఆచరణను చూస్తే ఆ దిశగా ఎలాంటి ఆలోచనా లేదు, చర్యలూ లేవు.

ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వేతనాల వాటా పడిపోతోంది. దీనికి సాంకేతికంగా వచ్చిన మార్పులతో ఉత్పత్తి పెరగటం, కార్మికులు తగ్గటం వంటి కారణాలు కూడా ఉన్నప్పటికీ వేతనాల శాతం పడిపోతోంది. ఆ ధోరణికి భిన్నంగా వేతనాల శాతాన్ని పెంచాలని చైనా తలపెట్టింది. ఈ కారణంగానే గతంలో తక్కువ వేతనాలు ఉన్నాయని వచ్చిన అనేక కంపెనీలు ఇప్పుడు చైనా కంటే తక్కువ వేతనాలు దొరికే దేశాలకు మారిపోవాలని చూస్తున్నాయి. అయితే అవి బయటకు పోతే అతి పెద్ద చైనా మార్కెట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్లనే అనేక కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. నూతన పరిస్ధితులకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకుంటున్నాయి. సేవారంగంలోని తాత్కాలిక కార్మికుల (జోమాటో, స్విగ్గీ వంటివి) వేతనాలు పెంచిన కారణంగా చైనాలో ఆహార సరఫరా చేసే కంపెనీ మెయిటువాన్‌ షేర్‌ ధర 18శాతం పడిపోయింది. ఎక్కడ అయితే తృప్తి, సమ్మతము ఉంటుందో అక్కడ ప్రజల తిరుగుబాట్లు ఉండవు అన్న కన్ఫ్యూషియస్‌ ప్రవచనాన్ని గ్జీ ఉటంకించారు. ఆ దిశగా చైనా చర్యలు ఉన్నాయని చెప్పవచ్చు.చైనా మాదిరి అభివృద్ది చెందాలని చెబుతున్నవారు దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు జాక్‌ మాకు ఎందుకు చెక్‌ పెట్టారు ?

19 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba, china communist party, Jack Ma, U.S. Cold War on China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


జాక్‌ మా, అలీ బాబా పేరు ఏదైనేం, వ్యక్తి-సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలు-పిట్టకథలకు తెరపడింది. తాజాగా చైనా ప్రభుత్వం జాక్‌ మా కంపెనీల పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించిందన్న సమాచారంతో మరోసారి వార్తలకు ఎక్కాడు. ఆలీబాబా, ఆంట్‌ తదితర గ్రూపు కంపెనీల నుంచి అతగాడు బయటికి పోవటం, కొన్ని వాటాల విక్రయం, మరికొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి అంశాల గురించి వార్తలు వస్తున్నాయి. తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని నవంబరు నెలలోనే జాక్‌ మా ప్రతిపాదించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. జనవరి నుంచి పీపుల్స్‌ బాంక్‌ ఆఫ్‌ చైనా( మన రిజర్వుబ్యాంకు వంటిది), బ్యాంకింగ్‌, బీమా నియంత్రణ కమిషన్‌ వివిధ అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. ఇంత వరకు ఏ విషయమూ ఇదమిద్దంగా తెలియదు.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. దేశంలోని ఇతర ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా ఒక వైపు అడుగులు వేస్తూ మరో వైపు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మందిలో తలెత్తే సందేహం ఏమంటే అసలు అలాంటి బడా సంస్ధలను మొగ్గలోనే తుంచి వేయకుండా ఎందుకు ఎదగనిచ్చింది ? ప్రపంచ కార్పొరేట్‌ శక్తుల ప్రతినిధులు చెబుతున్నట్లుగా ఈ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడతాయా ? అభివృద్ధికి ఆటంకం కలుగుతుందా ? కొంత మంది చైనాలో జాక్‌ మా యుగం ప్రారంభమైందని ప్రచారం చేశారు.అది నిజమే అని అతగాడు భ్రమించి చైనా వ్యవస్ధనే సవాలు చేశాడా ? వాస్తవానికి చైనా యుగంలో జాక్‌ మా వంటి వారు కొందరు తప్ప వ్యక్తుల యుగాలు ఉండవు.


దీన్ని వివరిస్తే కొంత మందికి జీర్ణం గాకపోవచ్చు, అయినా తప్పదు . అందువలన క్లుప్తంగా చెప్పుకుంటే పెట్టుబడిదారీ విధానం అంటే శ్రమను అమ్ముకొనే ఒప్పందం మేరకు పని, ఆ మేరకు వేతనం. మిగతా వాటితో సంబంధం ఉండదు. సోషలిజం అంటే శక్తికొద్దీ పని, శ్రమకొద్దీ ప్రతిఫలం. మొదటిదానిలో లాభం లేదా మిగులు పెట్టుబడిదారుల స్వంతం అవుతుంది. రెండవ దానిలో శ్రామికులకు గౌరవప్రదమైన వేతనాలతో పాటు మిగులు సామాజిక పరం అవుతుంది. దాన్ని వివిధ రూపాలలో అందరికీ వినియోగిస్తారు. సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. మరి దీనికి ప్రాతిపదిక లేదా అంటే, ఉంది. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచటం ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే ఎవరమూ చెప్పలేము. వ్యక్తిగత ఆసక్తి కొద్దీ ఒకరు కత్తి పట్టుకొని వైద్య పరమైన శస్త్ర చికిత్సలు చేయవచ్చు, మరొకరు అదే కత్తితో అందమైన క్రాఫులూ చేయవచ్చు. ఏది చేసినా సమాజం తగిన గుర్తింపు, గౌరవంతో పాటు వారి పూర్తి అవసరాలు తీరుస్తుంది. దోపిడీ, పీడన, యుద్దాలు ఉండవు, మారణహౌమాలు జరగవు. అదే కమ్యూనిజం భావన.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై దుస్తులు కూడా వేసుకోని ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్ధ సంక్షోభంలో ఉన్నపుడు దాని బలహీనపు లింకును తెగగొట్టి సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేయవచ్చు అన్నది రష్యాలో కమ్యూనిస్టులు నిరూపించారు. అయితే దాన్ని విఫలం చేశారు అని కొందరి అభిప్రాయం, కాదు అంతర్గత లోపాల కారణంగా అది విఫలమైంది అని కొందరు చెబుతారు. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ అని కొందరు భావిస్తే అలాంటి బిడ్డను బతికించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకోని కారణంగా అంతరించిందని కొందరు చెప్పవచ్చు. దేన్నీ పూర్వపక్షం చేయకుండా అనుభవాలు తీసుకోవటం ఇక్కడ ముఖ్యం. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేసిన వారు ఈ అనుభవాన్ని తీసుకొని తమదైన శైలిలో ఆ వ్యవస్ధను ముందుకు తీసుకుపోతున్నామని చెబుతున్నారు.


దానిలో భాగమే జాక్‌ మా వంటి వారు, ఆంట్‌ వంటి సంస్ధలూ వాటి మీద చర్యలూ అని చెప్పవచ్చు. రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. పెట్టుబడిదారీ విధానం ఉన్నత స్ధాయిలోకి రావటం అంటే ఉత్పాదకశక్తులు గణనీయంగా అభివృద్ది చెంది ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడి కావటం. దానితో పాటు దోపిడీ విపరీతంగా పెరిగి దాన్ని కూలదోసే సైన్యాన్ని కూడా అది పెంచుతుందన్నది కమ్యూనిస్టులు చెప్పే సిద్దాంతం. ఈ నేపధ్యంలో చూసినపుడు చైనాలో సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా పరిమితుల మేరకు అనుమతించారు. దీనికి తోడు జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుందా ?


జాక్‌ మా వంటి వారి పెరుగుదలను చూసి ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టుల్లో కొంత మంది ఇంకేముంది అక్కడ పెట్టుబడిదారీ విధానం అమల్లోకి వచ్చింది అని సూత్రీకరించారు, విచారపడ్డారు. ఇదేమిటని పెదవి విరిచారు. అదే జాక్‌ మా మీద ఆంక్షల విషయం వెల్లడికాగానే ప్రపంచంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులందరూ గుండెలు బాదుకున్నారు. మేము ఇలా అనుకోలేదు అంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇంకేముంది చైనా తిరోగమనం ప్రారంభం అయిందని చంకలు కొట్టుకున్నారు. ఒకటి స్పష్టం, గ్లాస్‌నోస్త్‌ పేరుతో నాటి సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలీబాబా, ఆంట్‌ ఇతర కంపెనీల్లోని జాక్‌ మా వాటాలను చిన్న మదుపర్లకు విక్రయిస్తారని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఏమి జరిగినప్పటికీ ప్రభుత్వ అనుమతుల మేరకు ఉంటాయి.

గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. చైనాలో వాటి అమలుకు నిదర్శనమే తాజా పరిణామాలు అని చెప్పవచ్చు.ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా గతేడాది డిసెంబరులో చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ ప్రత్యర్ధులుగా ఉంటూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారి మీదనే దాడులు జరుగుతాయి. ఆ రీత్యా చూసినపుడు చైనాలో అలాంటి వాటికి అవకాశం లేదు. మూడు సంవత్సరాల క్రితం జాక్‌ మా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.(మన దేశంలో మాదిరి మేం వ్యాపారం చేయటం లేదు అని ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎసరు తెస్తున్నదానికి విరుద్దం).


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. స్వాతంత్య్రం వచ్చినపుడు మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని ప్రయివేటు సంస్ధలు ఇప్పుడు ప్రభుత్వ అండతో బడా సంస్ధలుగా ఎదిగి ప్రభుత్వ రంగాన్నే కొనుగోలు చేసే స్ధాయికి ఎదిగినట్లుగా, తమకు అనుకూలమైన విధానాలను అనుసరించాలని శాసిస్తున్నారు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా గతేడాది అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. ఇవి చైనా వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారానికి ప్రతిబింబం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే. అలీబాబా ప్రభావం ఎంతగా పెరిగిపోయిందంటే దాన్ని అదుపులోకి తేవాల్సినంతగా అని సాంగ్‌ క్వింగ్‌హురు అనే ఆర్ధికవేత్త వ్యాఖ్యానించాడు.

చైనా మీద తరువాత కాలంలో వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులను తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక పారిశ్రామికవేత్తగా అలా చెప్పటాన్ని తప్పు పట్టనవసరం లేదు. తమ దేశ అవసరాలు, వ్యూహంలో భాగంగా చైనా ప్రభుత్వమే జాక్‌ మా వంటి వాణిజ్యవేత్తలను ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి వేదికల మీద రాజులు, రాణులు, దేశాల అధ్యక్షులు, ప్రధానుల సరసన కూర్చో పెట్టింది. దాన్ని చూసి అది తన పలుకుబడే, గొప్పతనమే అనుకుంటే అది పతనానికి నాంది. ఎంత పెద్ద వారైనా తిరుగుతున్న చట్రం మీద కూర్చున్న జీవులు తప్ప చట్రాన్ని తిప్పే వారు కాదు. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వ్యక్తులు,సంస్ధల కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.


ఇదే సమయంలో ఒక దేశం – రెండు వ్యవస్ధలు అనే అవగాహనకు చైనా కమ్యూనిస్టు నాయకత్వం దూరంగా పోతున్నదనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌ కౌలు గడువు తీరిన తరువాత 1997లో హాంకాంగ్‌ ప్రాంతం, అదే విధంగా పోర్చుగీసు నుంచి మకావో ప్రాంతాలు చైనాలో విలీనం అయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఒప్పందం అది. ఆ మేరకు 2047 నాటికి ఈ రెండు ప్రాంతాలూ పూర్తిగా చైనా ప్రధాన వ్యవస్ధలో అంతర్భాగంగా మారాల్సి ఉంది. అప్పటి వరకు హాంకాంగ్‌లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ, మకావూలో ఉన్న జూద కేంద్రాల కొనసాగింపు, పెట్టుబడులకు స్వేచ్చ ఉంటుంది. ఆ తరువాత అక్కడ కూడా ప్రధాన ప్రాంతంలోని చట్టాలు, వ్యవస్ధలోకి మారాల్సి ఉంటుంది. దీనికి అక్కడి పౌరులు సిద్దం కావాల్సి ఉంటుంది. అయితే అమెరికా, బ్రిటన్‌, ఇతర దేశాలు జోక్యం చేసుకొని హాంకాంగ్‌కు స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ చేస్తూ ఆందోళనలకు పూనుకొనే విధంగా అక్కడి జనాలను రెచ్చగొడుతున్నారు. దాన్ని ఎదుర్కొంటూ విలీనానికి అవసరమైన చర్యలను ఒక్కొక్కటిగా చైనా తీసుకొంటోంది. అది పూర్తిగా చైనా అంతర్గత వ్యహారం, అయినా ఏదో ఒక పేరుతో మన దేశంతో సహా అనేక దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి.

తైవాన్‌ మీదకు చైనా యుద్ద విమానాలు వెళ్లాయంటూ ఇటీవల కొన్ని సంచలనాత్మకంగా వార్తలను మీడియా ముందుకు తెచ్చింది. అది నిరంతర ప్రక్రియ. చైనా ప్రధాన భూ భాగానికి దూరంగా ఉన్న ఒక దీవి రాష్ట్రం తైవాన్‌.అది తిరుగుబాటు రాష్ట్రంగా విడిగా ఉంటోంది. తైవాన్‌ ప్రత్యేక దేశం కాదని, చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో గుర్తించింది. బలవంతంగా విలీనం చేసుకోవాలంటే చైనాకు పెద్ద సమస్య కాదు, సామరస్యపూర్వకంగా విలీనం జరగాలని కోరుకుంటోంది. అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌లో జోక్యం చేసుకొని దానికి ఆయుధాలు అందిస్తున్నాయి, దాని తీరాలకు యుద్ద నావలను పంపి విన్యాసాల పేరుతో చైనాను రెచ్చగొడుతున్నాయి. ఇలా చేసినపుడల్లా విదేశీ జోక్యం దారులకు హెచ్చరికా చైనా నౌకలు విన్యాసాలు చేస్తుంటాయి, విమానాలు ఎగిరి వెనక్కు వస్తుంటాయి తప్ప ఎన్నడూ దాడులు చేయలేదు.తైవాన్‌లో, హాంకాంగ్‌లో జోక్యం ద్వారా చైనాను రెచ్చగొట్టి యుద్దానికి దింపాలన్నది సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. వాటి వలలో పడకుండా చైనా తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. తన జన జీవితాలను మెరుగుపరచటమే చైనాకు ప్రధమ ప్రాధాన్యత తప్ప యుద్దం కాదు.అదే సమయంలో అనివార్యం అయితే అందుకు అనుగుణ్యంగా తన ఆయుధాలకూ పదును పెడుతోంది. దాని బలం అమెరికా, ఇతర దేశాలనూ దుందుడుకు చర్యలకు పాల్పడకుండా నిలువరిస్తోంది.

అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు చైనా మీద సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దంలో చైనాలోని గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం కేంద్ర స్ధానంగా మారింది. అక్కడ ఉన్న ముస్లిం మైనారిటీలను సర్కార్‌ అణచివేస్తున్నదని, నిర్బంధంగా చాకిరీ చేయిస్తూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నదని కొంత కాలం ప్రచారం చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మానవహక్కులకు భంగం కలిగించే ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చైనా వస్తువులను బహిష్కరించాలని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలు ప్రకటించింది, మరికొన్ని దేశాలు అప్రకటితంగా అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రం చుట్టూ రష్యా, మంగోలియా, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, మన దేశ సరిహద్దులు ఉన్నాయి. కోటీ 30లక్షల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. పొరుగుదేశాల నుంచి జోక్యం చేసుకుంటున్న శక్తులు అక్కడ వేర్పాటు వాదులను, ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నాయి. అనేక దేశాల మాదిరే చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నది. వాటిని మానవహక్కుల హననంగా చిత్రించి ప్రచారం చేస్తున్నారు. ఇస్లామిక్‌ దేశాలను రెచ్చగొడుతున్నారు. ప్రపంచ మార్కెట్లో మూడో వంతు దుస్తులు, వస్త్రాలు చైనా నుంచి వస్తున్నాయి. ఏటా చైనా చేస్తున్న 300 బిలియన్‌ డాలర్ల వస్తు ఎగుమతుల్లో 120బిలియన్‌ డాలర్లు వీటి నుంచే వున్నాయి. చైనాలో ఉత్పత్తి అయ్యే పత్తిలో 87శాతం గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం నుంచే ఉంది.ఆ రాష్ట్రం కొత్తగా చైనాలో చేరింది కాదు, జౌళి ఉత్పత్తులు కొత్తగా జరుగుతున్నవీ కాదు. వాటిని దిగుమతి చేసుకొని లబ్ది పొందని పశ్చిమ దేశమూ లేదు. అందువలన అక్కడ మానవ హక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో చైనా జౌళి ఎగుమతులను దెబ్బతీయాలన్నది అమెరికా అండ్‌కో ఎత్తు గడ. అందుకోసం ప్రచార, దౌత్య, ఆర్ధిక యుద్ద రంగాలను తెరిచి చైనాను ఉక్కిరి బిక్కిరి చేయటం అసలు లక్ష్యం.అదే జరుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిహద్దు రక్షకులకు చలిదుస్తులు కూడా ఇవ్వలేని స్దితిలో ” దేశ రక్షకుడు ” మోడీ ఉన్నారా ?

11 Thursday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#ladakh conflict, BJP anti China, India's biggest trade partner, Indo-China standoff, Indo-China trade, LAC, Ladakh, Narendra Modi, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటవు అన్న సామెత తెలిసిందే. ప్రపంచంలో ఏ మిలిటరీని అయినా ఎదిరించగల సురక్షితమైన (నరేంద్రమోడీ) చేతుల్లో దేశం ఉందని బిజెపి నేతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. నిజమే అని జనం కూడా నమ్మారు.నమ్మినవారెపుడూ చెడ్డవారు కాదు. కానీ తాజాగా అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ ఫిలిప్‌ డేవిడ్సన్‌ చెప్పినదాని ప్రకారం మంచుకొండల్లోని మన సైన్యానికి అవసరమైన చలిదుస్తులు కూడా అందించలేని స్దితిలో మన ప్రభుత్వం ఉందన్న అనుమానం కలుగుతోంది. చలి దుస్తులు, మంచులో ధరించాల్సిన పరికరాలు, కళ్లద్దాలు, బూట్లు, ఆహార కొరత ఉన్నట్లు కాగ్‌ కూడా తన నివేదికలో పేర్కొన్నది. దానిమీద రక్షణ మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ కాగ్‌ 2015-17 సంవత్సరాల వివరాల ప్రకారం అలా చెప్పిందని, ప్రధాన కార్యాలయాల్లో కొరత నిజమే గానీ రంగంలో ఉన్న సైనికులకు అందించామని పేర్కొన్నది. కానీ డేవిడ్స్‌న్‌ చెప్పింది గతేడాది ఉదంతం గురించి అన్నది గమనించాలి. అమెరికా నుంచి ఆయుధాలతో పాటు చివరకు దుస్తులను కూడా తెచ్చుకొనే దుస్దితిలో మన సర్కార్‌ ఉంది. నిజానికి అవి మనం తయారు చేసుకోలేనివి కాదు, సైనికులను చలికి వదలివేసే నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు.


అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు మార్చినెల తొమ్మిదిన హాజరై ముందుగానే తయారు చేసుకు వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడిన డేవిడ్స్‌న్‌ చెప్పిన వాటి సారాంశం ఇలా ఉంది.సరిహద్దు వివాదంలో భారత్‌కు అవసరమైన సమాచారం, చలి దుస్తులు, ఇతర సామగ్రిని అమెరికా అందించింది.ముందుకు వచ్చిన అనేక స్ధానాల నుంచి చైనా ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. సరిహద్దు ఘర్షణలకు చైనాయే కారణం.వివాదాస్పద సరిహద్దుల సమీపంలో నిర్మాణకార్యక్రమాలను చేపట్టిన చైనా దానికి మద్దతుగా దాదాపు 50వేల మంది సైన్యాన్ని దించింది. దానికి ప్రతిగా భారత్‌ కూడా సైన్యాన్ని మోహరించింది. ఇతరులతో సహకారం తమ స్వంత రక్షణ అవసరాలకే అని సరిహద్దు వివాదం భారతదేశ కళ్లు తెరిపించింది.ఇప్పటికీ భారత్‌ తమ అలీన వైఖరికి కట్టుబడి ఉన్నప్పటికీ అత్యంత సమీప కాలంలో చతుష్టయం(క్వాడ్‌ : అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌. ఈ కూటమిని చైనా తన వ్యతిరేక దుష్ట చతుష్టయంగా పరిగణిస్తోంది, పోటీగా తన అస్త్రాలను తీస్తోంది)లో మరింతగా భాగస్వామి అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా అమెరికా,జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇది కీలకమైన అవకాశం.భారత-అమెరికా సంబంధాలు, 21వ శతాబ్దిలో భాగస్వామ్యంలో ఎవరేమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఇదని భావిస్తున్నాను. సంబంధాలను మరింత సన్నిహితంగా మరియు గట్టిపరుచుకొనేందుకు ఒక చారిత్మ్రాక అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఇటీవలి కాలంలో రెండు దేశాలు పునాదుల వంటి మూడు ఒప్పందాలు చేసుకున్నాయి. మిలిటరీ సహకారాన్ని పెంచుకోవటం,అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోలును భారత్‌ పెంచుకోవటం, అమెరికాతో కలసి సంయుక్త విన్యాసాల నిర్వహణ.భారతదేశంతో రక్షణ సంబంధాలు వ్యూహాత్మకంగా తప్పనిసరి.” అన్నారు.


ప్రపంచాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని, తన కార్పొరేట్లకు యావత్‌ దేశాల మార్కెట్లను అప్పగించాలన్న అమెరికా వ్యూహత్మక ఎత్తుగడలో మన పాలకులు మన దేశాన్ని ఇరికించారన్నది డేవిడ్స్‌న్‌ చెప్పిన అంశాల సారం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అమెరికాను నమ్మి, దాని వెంట నడచి బాగుపడిన దేశం ఒక్కటైనా ఉందని ఎవరైనా చూపితే సంతోషం. సహకారం పేరుతో మన ఇరుగు పొరుగుదేశాలతో మనం లడాయి పెట్టుకొనేట్లు చేయటం, ఆ ముసుగులో తన ఆయుధాలను మనకు అంటగట్టటం, మన మిలిటరీలో చొరబడేందుకు సంయుక్త విన్యాసాల వంటివి నిర్వహించటం ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తాయో దేశభక్తులు(బిజెపి మార్కు కాదు) ఆలోచించటం అవసరం. ఈనెల 12న చతుష్టయ అంతర్జాల సమావేశం జరగనుండటం, ఆ తరువాత అమెరికా నూతన రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ త్వరలో మన దేశాన్ని సందర్శించనున్న తరుణంలో డేవిడ్సన్‌ ఈ విషయాలను వివరించారు.అంతకు కొద్ది రోజుల ముందు అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన ఒక మార్గదర్శక పత్రంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, దాన్ని ఎదుర్కొనేందుకు భాగస్వాములతో కలసి పని చేయాలని పేర్కొన్నది. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా తమ ముగ్గులోకి మనలను లాగే వైఖరిని అమెరికా కొనసాగిస్తూనే ఉందన్నది స్పష్టం. అందువలన పాత ప్రియుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు బ్రేకప్‌ చెప్పి(వదలివేసి) కొత్త ప్రియుడు జో బైడెన్‌ను కౌగలించుకొనే రోజు ఎంతో దూరంలో లేదని గ్రహించాలి.
అమెరికన్‌ కమాండర్‌ డేవిడ్స్‌న్‌ తమ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాలను చెప్పిన మరుసటి రోజే మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఏమి చెప్పింది ? చైనా అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు పోలేదని డేవిడ్స్‌న్‌ చెప్పాడు. ఇది చైనా-మనకు తంపులు పెట్టే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిగా సేనల ఉపసంహరణ పూర్తయిందని, మిగతా సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.


ట్రంపు కంపును మరింతగా పెంచాలనే జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు. పాతికేండ్ల క్రితం చైనా ప్రభుత్వం పంచన్‌లామా నియామకం మత స్వేచ్చను దుర్వినియోగం చేయటమే అని బైడెన్‌ యంత్రాంగం తాజాగా ఒక ప్రకటన ద్వారా ట్రంప్‌ బూట్లలో దూరి నడవనున్నట్లు వెల్లడించింది. టిబెటన్‌ దలైలామా చైనా మీద విఫల తిరుగుబాటు చేసి 1959 మే 17న మన దేశానికి పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. టిబెట్‌ బౌద్దమత చరిత్రను చూసినపుడు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ వేర్వేరు ఆరామాలకు – తెగలకు అధిపతులు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారు. ఒకరి అధికారాన్ని మరొకరు పరస్పరం గుర్తించుకుంటారు. అయితే దలైలామా తరువాత స్ధానం పంచన్‌లామాదిగా బౌద్దులు పరిగణిస్తారు. పదవ పంచన్‌ లామా 1989లో మరణించిన తరువాత ఎవరినీ నియమించలేదు. 1995లో దలైలామా ఒక ఐదేండ్ల బాలుడిని పదకొండవ పంచన్‌ లామాగా నియమించినట్లు ప్రకటించారు. దాన్ని టిబెట్‌ రాష్ట్ర ప్రభుత్వం, చైనా కేంద్ర ప్రభుత్వమూ గుర్తించలేదు. అతని స్దానంలో వేరొకరిని నియమించి, బాలుడిని, అతని కుటుంబాన్ని వేరే ప్రాంతంలో ఉంచారు. ప్రస్తుతం బాలుడు పెరిగి పెద్దవాడై డిగ్రీ చదువుకొని ఉద్యోగం చేస్తున్నట్లు చైనా పేర్కొన్నది తప్ప ఇతర వివరాలు తెలియవు. చైనా సర్కార్‌ నియమించిన పంచన్‌లామాను దలైలామా గుర్తించలేదు కనుక దలైలామాకు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలూ గుర్తించటం లేదు. మధ్యమధ్యలో ఆ వివాదాన్ని ముందుకు తెస్తూ రాజకీయాలు చేస్తుంటాయి. గతేడాది డిసెంబరులో ట్రంప్‌ (ఓడిపోయిన తరువాతే) చివరి రోజుల్లో టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఒక బిల్లును చట్టంగా మారుస్తూ సంతకం చేశారు.


ప్రస్తుత పద్నాలుగవ దలైలామా 62 సంవత్సరాలుగా మన దేశంలోనే ఉన్నారు. అయినా ఆయన స్దానంలో టిబెట్‌లో ఎవరినీ నియమించలేదు. కొత్త దలైలామాను నియమించబోతున్నారంటూ రెచ్చగొట్టే వార్తలను రాయిస్తూ ఉంటారు. అమెరికాతో కలసి గోక్కోవటం మొదలు పెట్టిన తరువాత గత (కాంగ్రెస్‌, చివరికి అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ) పాలకులు కావాలని విస్మరించిన ఈ అంశాన్ని అమెరికాతో పాటు ఎందుకు గోకకూడదనేే ఆలోచన మన మోడీ సర్కార్‌కూ వచ్చిందని వార్తలు వచ్చాయి. బహిరంగ ప్రకటన చేయలేదు గానీ చైనాను రెచ్చగొట్టే చర్యలన్నీ చేస్తోంది. తాజాగా గాల్వన్‌ లోయ ఉదంతాల్లో టిబెటన్‌ తిరుగుబాటుదార్లతో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) పేరుతో ఏర్పాటు చేసిన అనధికార కిరాయి సాయుధ మూకను చైనీయుల మీదకు ఉసిగొల్పి పాపాంగాంగ్‌ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో గతేడాది ఆగస్టులో కొన్ని కొండలను ఆక్రమించుకొనేందుకు పంపటం, ఆ ఉదంతంలో కొందరు మరణించటం తెలిసిందే.

చతుష్టయ సమావేశం సాధించేది ఏమిటి ?


చతుష్టయ కూటమి ఏర్పాటు వెనుక అమెరికా ఎత్తుగడ ఏమిటో వారెన్నడూ దాచుకోవటం లేదు. తెలిసి వారి వలలో చిక్కుకొనే వారి గురించే ఆలోచించాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనాను ఈ కూటమిలోని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ముప్పుగా పరిగణించలేదు. ఇప్పుడు ముప్పు సిద్దాంతం లేదా భయాన్ని ముందుకు తెస్తున్నాయి. నాలుగు దశాబ్దాల్లో ఈ నాలుగు దేశాలూ చైనా నుంచి ఎంతో లబ్దిపొందాయి-అదే సమయంలో దాని ఎదుగుదలకూ దోహదం చేశాయి. ఎవరి ప్రయోజనం కోసం వారు వ్యవహరించారు. ఈ క్రమంలో మొత్తంగా తేలిందేమంటే చైనా అర్ధికంగా అమెరికానే సవాలు చేసే స్ధాయికి ఎదిగింది ? నాలుగు దేశాలు అనుసరించిన దివాలా కోరు విధానాలు చైనాతో పోటీపడలేకపోయాయి. ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా చైనా ముప్పును ముందుకు తెస్తున్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో తెగేదాకా లాగేందుకు భయపడుతున్నాయి. ఇదే సమయంలో ఎవరికి వారు స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేసి చైనాతో బేరసారాలాడుతున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అందరమూ ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తూనే దెబ్బలాట-ముద్దులాట మాదిరి మరోవైపు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.


నిజానికి చైనా నుంచి ముప్పు వచ్చేట్లయితే చతుష్టయ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే చైనా ప్రధాన భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం( ఆర్‌సిఇపి )లో జపాన్‌,ఆస్ట్రేలియా ఎందుకు చేరినట్లు ? మన దేశంతో సరిహద్దులు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని గత ఏడాది మన ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అలాంటి పెట్టుబడులు పెట్టగలిగింది చైనా ఒక్కటే కనుక దాని పెట్టుబడులను అడ్డుకోవాలన్నది అసలు లక్ష్యం. తరువాత తత్వం బోధపడింది, చైనా పెట్టుబడులు రాకుండా గడవదు అని గమనించిన తరువాత ఆ నిబంధనలను సడలించి సమగ్రంగా పరిశీలించిన తరువాత కీలక రంగాలలో స్ధానికంగా చేయలేని వాటిని ఆమోదించవచ్చు అంటూ తలుపులు తెరిచారు. అంతకు ముందు మాత్రం పరిశీలించకుండా అనుమతించాలని ఎవరు కోరారు, ఎందుకు అనుమతించారు ? సమాధానం రాదు.


మన ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడి సరకులు, కొంత మేరకు తయారైన దిగుమతులు చైనా నుంచి రాకుండా ప్రత్యామ్నాయం వెంటనే చూసుకొనే అవకాశం లేకనే ఆ పరిశ్రమ వత్తిడి మేరకు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరవటం వాస్తవం కాదా ? ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని అమలు చేసే పధకాల్లో చైనా కంపెనీలు కూడా టెండర్లను దక్కించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అసలు అప్పులు తీసుకోవటం మానుకోవచ్చుగా ? పైగా మోడీ ఏలుబడిలోకి వచ్చిన తరువాత అసలు బయటి నుంచి అప్పులే తీసుకోవటం లేదని తప్పుడు ప్రచారం ఒకటి. చైనా పెట్టుబడులు వస్తే దాని ముప్పు మనకు తొలిగినట్లుగానే భావించాలా ? అలాంటపుడు చతుష్టయంలో అమెరికాతో గొంతు కలిపి చైనా వ్యతిరేక ప్రగల్భాలు ఎందుకు ? చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకుంటామని ఇప్పుడు చెబుతున్నవారు సంఘర్షణ వరకు ఎందుకు తీసుకుపోయినట్లు ? అమెరికన్లకు చైనా మార్కెట్‌ను మరింతగా తెరిస్తే మిగిలిన మూడు దేశాలను దక్షిణ చైనా సముద్రంలో ముంచి అమెరికా తన దారి తాను చూసుకుంటుందనే జ్ఞానం ఆయా దేశాలకు ఉండవద్దా !

ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసి లబ్ది పొందింది అమెరికానా మిగిలిన సభ్యదేశాలా ? ఆ కూటమి తరువాత ఏ సభ్యదేశం మీద అయినా ఎవరైనా దాడి చేశారా ? ఆ పేరుతో ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నది అమెరికా, అందుకు మూల్యం చెల్లించింది ఐరోపా దేశాలు కాదా ? 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి లేదా తాజా కరోనా కల్లోలం నుంచి నాటో కూటమి దేశాలను అమెరికా ఏమైనా ఆదుకోగలిగిందా ? లేనపుడు మనలను ముందుకు నెట్టి ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ఎత్తుగడలో మనం ఎందుకు పావులుగా మారాలి ? మనల్నే రక్షిస్తున్నామని ఒక వైపు అమెరికా డేవిడ్సన్‌ చెబుతుంటే మన నాయకత్వంలో ఏర్పడే ఆసియా నాటో కూటమి అమెరికా ఆయుధాలను ఆయా దేశాలతో కొనిపించే దళారీగా మారటం తప్ప ఎవరి నుంచి ఎవరిని రక్షిస్తుంది ? యుద్దానికి ఎందుకీ ఉత్సాహం ?
నాలుగు సంవత్సరాల పాటు తన దేశాన్ని ఎలా బాగు చేసుకుందామా అనే ఆలోచనకు బదులు చైనాను ఎలా నాశనం చేద్దాం లేదా దారికి తెచ్చుకుందాం అనే యావలో గడిపిన డోనాల్డ్‌ ట్రంప్‌ చివరికి అమెరికాను ఏమి చేసిందీ చూశాము.కరోనా నివారణలోను, దాని పర్యవసానంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను నిలపటంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.కరోనా మహమ్మారికి అత్యధిక మంది పౌరులను బలిచ్చిన దుష్టుడిగా చరిత్రకెక్కాడు.


చైనా వస్తువులను బహిష్కరించండి, చైనా పెట్టుబడులను బహిష్కరించండి, అసలు చైనానే బహిష్కరించండి అన్నట్లుగా గతేడాది సరిహద్దు ఉదంతాల తరువాత ఎంత పెద్ద రచ్చ చేశారో, ఎవరు చేశారో చెప్పనవసరం లేదు. జనానికి చైనాను వ్యతిరేకించటమే అసలైన దేశభక్తి అని నూరిపోశారు.మీడియా తన రేటింగులకోసం మరింతగా రెచ్చిపోయింది. మరోవైపు జరిగిందేమిటి 2020లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టి చైనాతో ప్రధమ స్ధానంలో వాణిజ్యలావాదేవీలను జరిపారు మన అపర దేశభక్తులని ఎంత మందికి తెలుసు.కరోనా కారణంగా మొత్తం దిగుమతులు తగ్గాయి, దానిలో భాగంగానే 2019లో ఉన్న 85.5 బిలియన్‌ డాలర్లకు చేరలేదు గానీ 77.7 బిలియన్‌ డాలర్లతో చైనా మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా 2020లో ఉంది. మన ఎగుమతులు చైనాకు పెరిగాయి. ఇది తెలియని సామాన్యులు, అమాయకులు ఇంకా తెలిసినప్పటికీ మీడియా ఇంకా చైనా వ్యతిరేకతను వదిలించుకోలేదు.


గత నెలలో జరిగిన మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో అమెరికా – చైనాలలో ఏదో ఒక దాని వైపు తేల్చుకోవాలని జోబైడెన్‌ హెచ్చరించారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ దానిని పూర్వపక్షం చేస్తూ అన్ని రాజకీయ కార్యకలాపాలకు బహుముఖ విధానం అవకాశం కల్పించిందని అటువంటి సంస్దలను పటిష్టపరచాలని ఒక్కాణించారు.అంతకు ముందు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా చైనా ఐరోపా యూనియన్‌ పెట్టుబడి ఒప్పందం చేసుకున్నాయి. అందువలన ఇప్పటికైనా చతుష్టయ కూటమి-దాని వెనుక ఉన్న అమెరికా స్వార్ధం, ఎత్తుగడలు, మన మీద తుపాకి పెట్టి చైనాను కాల్చ చూస్తున్న పన్నాగాన్ని మన పాలకులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో ప్రచ్చన్న యుద్ధాన్ని తీవ్రం చేసిన అమెరికా !

25 Saturday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Communist China, Mike Pompeo, US cold war with China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.


గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్‌ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్‌ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్‌ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్‌ ఫ్రాంకెస్టయిన్‌ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.


నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !


అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.


సోవియట్‌ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్‌ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్‌ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్‌ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్‌ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.


అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్‌ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్‌ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్‌ మిలిటరీ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్‌ మంత్రి జోసెఫ్‌ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్‌ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్‌ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.


చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్‌-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్‌ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్‌ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్‌, హాంకాంగ్‌, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.


వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్‌, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్‌ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్‌ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్‌ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్‌ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్‌ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్‌ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్‌ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్‌ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్‌ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్‌ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.


రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్‌ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్‌ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.


మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్‌( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.


చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్‌ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.


అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.


అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్‌ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్‌ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్‌ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.


కరోనా వైరస్‌ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్‌ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్‌ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్‌ గార్డియన్‌ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా, చైనా, చైనా – రెచ్చగొట్టిన అమెరికా నూతన రక్షణ మంత్రి

04 Friday Jan 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

china china china, Message to Compatriots in Taiwan., patrick shanahan, Taiwan, Taiwan independence, US provocation, Xi Jinping

Image result for china china china patrick shanahan

ఎం కోటేశ్వరరావు

జనవరి రెండవ తేదీన ప్రపంచంలో జరిగిన పరిణామాలలో రెండు ఆసక్తికరంగా వున్నాయి. ఒకటి అమెరికా రక్షణశాఖ తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాట్రిక్‌ షహనాహన్‌ పెంటగన్‌ అధికారులతో మాట్లాడుతూ మనం ఒకవైపు సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో ఇస్లామిక్‌ తీవ్రవాదులతో పోరాడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో కేంద్రీకరించాల్సింది చైనా, చైనా, చైనా అని వ్యాఖ్యానించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్ధలు అదే శీర్షికతో వార్తలను ఇచ్చాయి. దానికి కొద్ది సేపటి ముందే చైనా రాజధాని బీజింగ్‌లో మాట్లాడిన దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తోటి తైవాన్‌ సోదరులకు ఒక విన్నపం అంటూ 1979లో చైనా చేసిన ప్రకటన 40వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య ఇంతకాలం నెలకొన్న స్ధిరమైన సంబంధాల దశ నుంచి పునరేకీకరణకు చొరవ చూపాల్సిన సమయమాసన్నమైందని చెప్పారు. బలవంతంగా విలీనం చేసుకొనేందుకు తమకు అవకాశం వున్నా శాంతియుత పద్దతులకే ప్రాధాన్యత ఇస్తామని జింపింగ్‌ చెప్పారు. నిజానికి ఇది తైవాన్‌ కంటే అమెరికాకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాల్సి వుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వుద్రిక్తతలకు ఇది ఒక సూచికగా కూడా చెప్పవచ్చు.

ఏడు దశాబ్దాల క్రితం చైనాలో విప్లవం జయప్రదమై కమ్యూనిస్టులు అధికారానికి వచ్చే సమయానికి తైవాన్‌ అనే రాష్ట్రం, కమ్యూనిస్టుల ఆధీనంలోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండున్నర కోట్ల మంది జనం వున్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి కౌలు కింద, మకావో దీవులు పోర్చుగీసు కౌలు కింద వున్నాయి. చుట్టూ సామ్రాజ్యవాదుల కుట్రలు. ఇంటా బయటి శత్రువుల కుట్రలను అధిగమించి ప్రధాన భూభాగం చైనాలో కమ్యూనిస్టులు నిలదొక్కుకోవటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది.ఈలోగా జరిగిన అనేక పరిణామాల పర్యవసానంగా తైవాన్‌ విలీనం సంక్లిష్టంగా మారింది. కొత్త సమస్యలను ముందుకు తెచ్చింది.

చైనా సంస్కరణలతోపాటు కమ్యూనిస్టు చైనా ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించి, తైవాన్‌కు సాంకేతికంగా గుర్తింపు రద్దు చేసి కూడా 40సంవత్సరాలు గడిచాయి. 1978 డిసెంబరు 15న తాము చైనాను గుర్తిస్తున్నట్లు, తైవాన్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం 1979 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఆ రోజు నుంచి తైవాన్‌ సంబంధాల చట్టం పేరుతో అమెరికా తైవాన్‌తో నూతన సంబంధాలకు కూడా నాలుగు దశాబ్దాలు నిండాయి. ఆ చట్టం ప్రకారం అమెరికా ఒక దేశాన్ని అధికారికంగా గుర్తించినపుడు ఎలాంటి సంబంధాలుంటాయో ఒక్క రాయబారకార్యాలయం, రాయబారి నియామకం తప్ప ఆయుధాల విక్రయంతో సహా మిగిలినవన్నీ అనధికారికంగా కొనసాగుతాయి. అందుకుగాను తైవాన్‌లో అమెరికన్‌ సంస్ధ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఆధునిక ఆయుధాలు, విమానాలు, జలాంతర్గాములతో సహా అన్నింటినీ తైవాన్‌కు విక్రయించిన అమెరికా గతేడాది తైవాన్‌లో జోక్యానికి ప్రాతిపదికవేసుకుంది. తైపే లోని అమెరికన్‌ సంస్ద రక్షణకు మెరైన్‌ దళాలను పంపాలని అమెరికా విదేశాంగశాఖ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరింది. అంతకు ముందు తొలిసారిగా 2017లో రెండు యుద్ధనౌకలను తైవాన్‌ జలసంధిలోకి అమెరికా తరలించింది. మరోసారి జెట్‌ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా పూనుకుంది. ఈ పూర్వరంగంలో గ్జీ జింపింగ్‌ ప్రకటన, హెచ్చరికలను చూడాల్సి వుంది.

1949లో చైనాలో మావో జెడాంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలుఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మూడు దశాబ్దాల పాటు అసలైన చైనాగా కొనసాగింది. అయితే 1960 దశకంలో సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తలెత్తిన నేపధ్యం, విదేశీ పెట్టుబడులు అవసరమని చైనా నాయకత్వం భావించిన తరుణంలో ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌లో ప్రవేశానికి అవకాశాలు వచ్చాయని అంచనా వేసిన అమెరికా పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వత్తిడి మేరకు 1970దశకం రెండవ అర్ధభాగంలో కమ్యూనిస్టు చైనాతో సయోధ్యకు అమెరికా సిద్దపడింది. రాజకీయంగా సోవియట్‌ మీద వత్తిడి పెంచే లక్ష్యం కూడా దాగి వుండటంతో అమెరికా నేతలు చైనాకు దారితీశారు. పరస్పరం లాభదాయకమని గుర్తించి 1979 జనవరి ఒకటి నుంచి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకే చైనాను సాంకేతికంగా గుర్తించినప్పటికీ తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేంత వరకు, తైవాన్‌ పౌరులు ఆమోదించే వరకు తైవాన్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించటం లేదని, యథాతధ స్ధితిని మార్చేందుకు తైవాన్‌ లేదా చైనా ప్రయత్నించకూడదని, చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే తైవాన్‌కు మద్దతు ఇస్తామని తన చట్టంలో రాసుకుంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యమే అని ఆ చట్టం మీద చైనా వ్యాఖ్యానించింది.

అంతర్భాగమైన తైవాన్‌ దీవులను విలీనం చేసుకొనే అవకాశం వున్నప్పటికీ చైనా తన అధికారాన్ని వుపయోగించలేదు. దీనికి వివిధ అంశాలు దోహదం చేశాయి. 1949లో చైనా పాలకుడిగా వున్న చాంగ్‌కై షేక్‌ తైవాన్‌కు పారిపోతూ తనతో పాటు మొత్తం బంగారు నిల్వలను త్రిదళాలకు చెందిన ఇరవైలక్షల మంది సైనికులను కూడా తరలించాడు. అంతర్యుద్ధ సమయంలో బర్మా సరిహద్దులతో సహా అనేక చోట్ల నిధుల కోసం నల్లమందు సాగును ప్రోత్సహించి పెద్ద మొత్తంలో నిధులు పోగేశాడు. దాదాపు పన్నెండువేల మంది సైనికులు బర్మా సరిహద్దు ప్రాంతాలలో తిష్టవేసి అమెరికా సాయంతో 1954వరకు తిరుగుబాట్లు చేయించాడు. చైనా అధికారం తనదే అని ప్రకటించుకున్నాడు. తైవాన్‌ను సైనిక పరంగా విలీనం చేసుకొనేందుకు మావో నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో 1950లో వుత్తర కొరియాపై అమెరికా నాయకత్వంలోని సేనలు దక్షిణ కొరియా రక్షణ పేరుతో దాడులకు దిగాయి. వుత్తర కొరియాను కాపాడుకొనేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా తన సైనికబలగాలను ఇటువైపు మళ్లించాల్సి వచ్చింది. దాంతో తైవాన్‌ విలీనం వాయిదా పడింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా అండతో నాడున్న బలాబలాల్లో చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్నే అధికారికమైనదిగా గుర్తింపును కొనసాగించారు. తరువాత అమెరికన్లు తైవాన్‌ను ఒక బలీయమైన సైనికశక్తిగా నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తూనే వున్నారు.

తైవాన్‌ వెన్నుదన్నుగా అమెరికా వున్న పూర్వరంగంలో దాన్ని ఎదిరించి తైవాన్‌ను విలీనం చేసుకోగలిగిన శక్తి చైనాకు ఇటీవలి వరకు లేదన్న విశ్లేషకుల అంచనా వాస్తవానికి దగ్గరగా వుంది. ఇప్పుడు అజెండా, మార్గాన్ని నిర్దేశించే శక్తి వచ్చినట్లు గ్జీ ప్రకటనను బట్టి భావిస్తున్నారు.హాంకాంగ్‌లో 1992లో పాక్షిక అధికారాలు కలిగిన చైనా-తైవాన్‌ ప్రతినిధులు జరిపిన సమావేశంలో చైనా అంటే ఒక్కటే అనే ఒక ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రెండు ప్రాంతాల మధ్య సంబంధాల పునరుద్దరణకు నాంది పలికింది. అయితే దానిని గుర్తించేందుకు తైవాన్‌లోని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నిరాకరిస్తోంది. భిన్న భాష్యాలు చెబుతోంది. చైనా ఒక్కటే, అవిభక్త దేశానికి ఏకైక ప్రతినిధి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పిఆర్‌సి), ఒకే దేశంలో రెండు వ్యవస్ధలు, విలీనం శాంతియుతంగా జరగాలి, తప్పని సరి అయితే బలప్రయోగం తప్పదు అన్నది బీజింగ్‌ భాష్యం. తైవాన్‌ కేంద్రంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ, మరికొందరి భాష్యం ప్రకారం చైనా ఒక్కటే, దాని అసలైన ప్రతినిధి రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(ఆర్‌ఓసి), జలసంధికి రెండువైపులా వున్న ఒకే దేశం. రెండు ముక్కలూ సార్వభౌమత్వం కలిగినవే. రెండు దేశాలూ సంప్రదించుకోవచ్చు. విలీనానికి బల ప్రయోగం జరపబోమని మేము వాగ్దానం చేయటం లేదు, అన్ని రకాల అవసరమైన పద్దతులను కలిగి వుంటాం. తైవాన్‌ స్వాతంత్య్రం అనేది చరిత్ర ధోరణికి వ్యతిరేకం, మరొక మార్గం లేని చోటుకు అది తీసుకుపోతుంది. శాంతియుత విలీనం తరువాత తైవాన్‌ సోదరుల సామాజిక వ్యవస్ధను జీవన విధానాన్ని పూర్తిగా గౌరవిస్తాం, ప్రయివేటు ఆస్ధులు, మతవిశ్వాసాలను, న్యాయమైన హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తాం అని జనవరి రెండవ తేదీన గ్జీ స్పష్టం చేశారు. గతేడాది జరిగిన స్ధానిక ఎన్నికలలో 1992ఏకాభిప్రాయాన్ని గుర్తించని, వ్యతిరేకించే డిపిపి, కొమింటాంగ్‌ పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణ ఎన్నికలు 2020లో జరగనున్నాయి. హాంకాంగ్‌, మకావూల విలీనం సమయంలో అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలను 2049 డిసెంబరు 31వరకు కొనసాగిస్తామని చైనా ప్రభుత్వం పేర్కొన్నది.ఇదే అంశాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేస్తామన్నదే గ్జీ తాజా సందేశ అంతరార్ధం.

Image result for angry  patrick shanahan

చైనా పట్ల కఠిన వైఖరిని తీసుకోవాలనే వైఖరి కలిగిన షహనాహన్‌ పెంటగన్‌లో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించదు. బస్తీమే సవాల్‌ అంటూ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌కు సై అంటే సై అనే రక్షణ మంత్రి తోడయ్యాడు. 2018 జాతీయ రక్షణ వ్యూహం పేరుతో పెంటగన్‌ రూపొందించిన పత్రంలో వ్యూహాత్మక పోటీదారు చైనా అని పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి తలెత్తుతున్న ముప్పులు అగ్రభాగాన వున్నాయని, వారినియంత్రత్వ వైఖరులకు అనుగుణ్యంగా ప్రపంచాన్ని మలచాలని, పెంటగన్‌ ప్రాధాన్యతల్లో వాటిని ప్రధానమైనవిగా చేర్చాలని పేర్కొన్నారు. అమెరికా రక్షణ ఖర్చులో సింహభాగాన్ని పొందుతున్న ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌లో మూడు దశాబ్దాలపాటు వున్నత అధికారిగా షహనాహన్‌ పని చేశాడు. సిరియా నుంచి సేనల వుపసంహరణ ప్రకటనకు నిరసనగా రక్షణ మంత్రి మాటిస్‌ రాజీనామా చేసిన తరువాత వుప మంత్రిగా వున్న షహనాహన్‌ తాత్కాలిక మంత్రిగా వుంటారని ప్రకటించిన రోజే ట్రంప్‌ సర్కార్‌ బోయింగ్‌ నుంచి యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అతగాడిని వుప మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని వచ్చిన వార్తల గురించి సెనెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వున్న జాన్‌ మెకెయిన్‌ వ్యాఖ్యానిస్తూ కోళ్ల గూటిలో నక్కను పెడతారని అనుకోవటం లేదన్నాడు.

షహనాహన్‌ మాటలను బట్టి రానున్న రోజుల్లో ఒకవైపు వాణిజ్య యుద్ధంతో పాటు మిలిటరీ రీత్యా మరింతగా చైనాపై కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న బలాబలాను బట్టి అమెరికాను అతిక్రమించే శక్తి చైనాకు లేదు. అయితే అమెరికా అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే తగిన మూల్యం చెల్లించే విధంగా ప్రతిఘటించే శక్తి చైనా సంతరించుకుంది. అమెరికా ఖండాంతర అణు క్షిపణులతో సమానమైన డాంగ్‌ఫెంగ్‌ 41క్షిపణి చైనా అమ్ములపొదిలో 2017లో చేరింది. అణుయుద్ధమే సంభవిస్తే విజేతలంటూ ఎవరూ వుండరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d