• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

మామ తిట్టినందుకా, తోడల్లుడు కిసుక్కుమన్నందుకా ? దేశ ఆకలి సూచికలపై మండిపడుతున్న కాషాయ దళాలు !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

BJP, GHI, Global Hunger Report 2022, hunger, India’s GHI-2022, Narendra Modi Failures, RSS, Saffron gangs Furiousness


ఎం కోటేశ్వరరావు


తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. ఇంకేముంది ! సామాజిక మాధ్యమాల్లో, ఇతరంగా కొందరు పెద్ద గగ్గోలు. గుండెలు పగిలేట్లు బాదుకుంటున్నారు, నివేదిక ఇచ్చిన వారిని శాపనార్ధాలు పెడుతున్నారు. తప్పుడు లెక్కలంటున్నారు, దేశ(నరేంద్రమోడీ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదని కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తెచ్చినవారు కొందరు. 2020 ఏప్రిల్‌లో తొలి కరోనా లాక్‌డౌన్‌ నాటి నుంచి 2022 సెప్టెంబరు వరకు ప్రతి నెలా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా 80కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఇంకా ఆకలి ఏమిటి అని నటనా చక్రవర్తులను తలపించిన వారు ఉన్నారు. మహానుభావులారా ఆకలి సూచిక రూపొందించేందుకు తీసుకున్న అంశాలను, వాటిలో ఒకదాని గురించి మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీజీ ఆగస్టు నెల మన్‌కీ బాత్‌లో పోషకాహార లేమి మీద ప్రజా ఉద్యమం జరపాలని పిలుపునిచ్చారని తెలుసుకోండిి అని చెప్పాల్సి వస్తోంది. ఇన్ని నెలలుగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఇస్తే ఇంకా పోషకాహారం లేదంటారేమిటి అని ఆ పెద్దమనిషి చెప్పలేదని గ్రహించండి.మీరు చెబుతున్నదే సరైనదనుకుంటే ప్రజా ఉద్యమం జరపాలని ఎందుకు పిలుపునిచ్చారో ప్రశ్నించండి ! బియ్యం ఇస్తే సరిపోతున్నపుడు అంతకు ఎంతో ముందు నుంచే పోషణ్‌, ఐసిడిఎస్‌ పధకాలు వాటి కింద అంగన్‌వాడీలు గట్రా ఎందుకు నిర్వహిస్తున్నట్లు ?


గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పుపడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్దతే తప్పు, పరిగణనలోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జిఓ) చెప్పేవాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడువేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింప చేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121మాత్రమే. అది స్వచ్చందం తప్ప ఇవ్వకపోతే తలతీసేదేమీ ఉండదు. అమెరికా, ఐరోపా దేశాల్లో సమాచారం ఇవ్వకపోతే మీడియాలో విమర్శించే స్వేచ్చను అక్కడి జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. మన దగ్గర ఇంకా అలాంటి అవకాశాలు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నా అడిగే దమ్మున్న జర్నలిస్టులు లేరు, అడిగేవారున్నా ఇంతవరకు మనది అపర ప్రజాస్వామిక దేశం గనుక మన నరేంద్రమోడీ ఎవరికీ ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అందువలన మనం కూడా అసలు అధికారిక సమాచారం ఇవ్వటం మానేస్తే సూచికల ప్రసక్తి ఉండదు, వాటి మీద విమర్శలు, ఉక్రోషాలు, ఉడుక్కోవటాలు, కుట్ర సిద్దాంతాల ప్రచారం వంటివి ఉండదు. కాషాయదళాలు వేరేపని చూసుకుంటాయి కదా ! మరి ప్రభుత్వం ఆపని ఎందుకు చేయదు ? లేదా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన విశ్లేషణలు అందించవచ్చు, సూచికలు ప్రకటించవచ్చు. దేశానికి మచ్చతెచ్చే వారికి బుద్ది చెప్పవచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితిలో నరేంద్రమోడీ అడిగితే సమాచారం ఇవ్వని దేశం ఉంటుందా ? నిధుల కొరత లేదే, ఎందుకు చేయరు ? కావాలంటే అప్పులు తీసుకురావచ్చు, 55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వమే అంచనా వేసింది, కనుక మరో లక్ష కోట్లు అప్పుచేసి సరైన సూచికలు వెల్లడిస్త్తే మన ప్రతిభ లోకానికి తెలుస్తుంది. అప్పు తీర్చేది జనమే, ఎవరి జేబుల్లోంచి పెట్టటం లేదు కదా !


ఇక ఐరాస సంస్థలకు సమాచారం ఇవ్వకపోతే మచ్చపడుతుంది, అక్కడ మనం సుభాషితాలు మాట్లాడే అవకాశం ఉండదు, అవి టీవీ చర్చలు కాదు గనుక వాటిలో మాదిరి మాట్లాడితే మర్యాద దక్కదు. పవన్‌ కల్యాణ్‌ భాషలో చెప్పాలంటే కొడకా అంటూ తాటతీస్తారు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, వాటికి సమాచారం ఇవ్వకపోతే తిప్పలు తెచ్చుకున్నట్లే ! ప్రపంచవాణిజ్య సంస్థకూడా అంతకంటే ఎక్కువ. అమెరికా వంటి మన ” సోదర ” దేశాలు మనం సమాచారం ఇస్తున్నా అక్కడ కేసులు పెడుతున్నాయి. మన దేశంలో ఆకలి సంబంధిత అంశాల గురించి స్వచ్చంద సంస్థలు ఏమి చెబుతున్నాయో, మన ప్రభుత్వ సంస్థలు ఎలాంటి నివేదికలిస్తున్నాయో ఆకలి సూచికలను తప్పుపడుతున్నవారు జనానికి చెబుతున్నారా ? వారి నిజాయితీ ప్రశ్నార్దకం కాదా ! మన దేశం తప్ప ఈ నివేదికను ఆమోదించటం లేదని గానీ, తప్పుడు పద్దతుల్లో రూపొందించారని గానీ ఎన్నిదేశాలు స్పందించిందీ సమాచారం లేదు, ఎవరైనా అలాంటి వివరాలు అందచేస్తే ఈ విశ్లేషణలో వాటిని చేర్చవచ్చు. ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా ? లేదు, ఎందుకంటే అన్నింటా అధమస్థానాలే.


మోడీ సర్కార్‌, మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సులభతర వాణిజ్య సూచిక గురించి చూద్దాం.2014లో 142లో ఉన్నదాన్ని 2020 నాటికి 63కు తీసుకువచ్చామని, 79 స్థానాలు ఎగబాకిందని చెప్పారు. చివరికి ఈ సూచికలు రూపొందించిన తీరు పెద్ద కుంభకోణమని, సమాచారాన్ని తారు మారు చేశారని, ప్రపంచ బాంకు పెద్దలు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ మరుసటి ఏడాది నుంచి ఏకంగా సూచికల రూపకల్పనకే స్వస్థి పలికారు. పోనీ మన దేశం ఇప్పుడు నిజాలు మాత్రమే చెప్పే సత్యహరిశ్చంద్రుల వారసులని చెబుతున్నారు గనుక సరైన సమాచారమే ఇచ్చారని, నిజంగానే అంత ప్రగతి సాధించిందనే అనుకుందాం, మరి ఆ మేరకు మన దేశానికి ఆ స్థాయిలో ఎందుకు పెట్టుబడులు రాలేదు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా ఎందుకు విఫలమైనట్లు ? సూచికను ఎగబాకించి సాధించిందేమిటి ? రాంకులను చూపినంత మాత్రాన పెట్టుబడులు పెట్టే అమాయకులు ఉండరని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రపంచానికి రుజువు చేసింది.


ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. ఆ ప్రాతిపదికను మన దేశానికి మాత్రమే వర్తింప చేస్తే తప్పే, అన్ని దేశాలకూ ఒకటే పద్దతిని అనుసరించారు కదా ! పోషకాహార లేమికి గాను కేవలం మూడువేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్దతి. ఏ సర్వేకైనా జనాభాలో ఎంత మందిని తీసుకుంటే సరైన వాస్తవాలు వెల్లడౌతాయో ఎవరైనా చెప్పగలరా ? మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు ఎంతమంది మీద జరుపుతున్నారో చెప్పి ప్రభుత్వం ఒప్పించగలదా ? ఒక పద్దతి ప్రకారం మన దేశం గురించి తప్పుగా చూపేందుకు ప్రతి ఏటా తప్పుడు సమాచారమిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ డిమాండ్‌ చేసినట్లు సదరు సూచికలు ఇచ్చే సంస్థలను అంతర్జాతీయ కోర్టుకు లాగి బోనులో నిలబెట్టి వాస్తవాలేమిటో వెల్లడించాలి. ఒట్టి అరుపులెందుకు ? నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడువేల మంది సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. దాని సమాచారాన్నే నివేదికను రూపొందించిన జర్మనీకి చెందిన ” వెల్ట్‌ హంగర్‌ హిల్‌ఫీ ” ఐర్లండ్‌లోని ” కన్సరన్‌ వరల్డ్‌వైడ్‌ ” తీసుకున్నాయి, అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. 2021 ఆకలి సూచిక నివేదిక తప్పుల తడక అంటూ 2021నవంబరు పదవ తేదీ పయనీర్‌ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. దాన్లో దేశంలో కూరగాయలు, గుడ్లు, పండ్లు, పాలు ఇతర ఆహార ఉత్పత్తులు ఎలా పెరిగాయో పేర్కొంటూ ఇవన్నీ ఉన్నపుడు పోషకాహార లోపం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.( వాటిని కొనుగోలు చేసి రోజూ తినేవారెందరో ఆ పెద్దమనిషి చెప్పి ఉంటే అసలు నిజాలు తెలిసేవి. ) ఆకలి సూచికల రూపకల్పనకు నేషనల్‌ శాంపుల్‌ సర్వే సంస్థ(ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) నుంచి ఆహార వినియోగ సమాచారాన్ని తీసుకోవాలని చెప్పారు. 2011-12 తరువాత అసలు అలాంటి సమాచారాన్ని ప్రచురించలేదని, 2015-16 సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నందున అసలు దాన్ని ప్రచురించకుండా వెనక్కు తీసుకున్నారని, అందువలన 2021 ఆకలి సూచిని 2011-12 సమాచారంతో రూపొందించారని మహాజన్‌ ఆరోపించారు. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సరైన సర్వే నిర్వహించలేదు, పోనీ మా దగ్గర తాజా సమాచారం లేనందున మా దేశాన్ని జాబితాలో చేర్చవద్దని ఎందుకు కోరలేదు. సమాచారాన్ని సేకరించేందుకు మోడీ సర్కార్‌ ఎందుకు శ్రద్ద చూపలేదు ? 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తే ఎన్నికలు ముగిసేవరకు దాన్ని వెలుడకుండా అడ్డుకున్నారు, అది వాస్తవం కాదన్నారు, తరువాత అదే వాస్తవమని అధికారికంగా అంగీకరించారు.


గతంలో ఎఫ్‌ఏఓ మన దేశంలో ఆహార వినియోగం గురించి జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణ బోర్డు (ఎన్‌ఎన్‌ఎంబి) సమాచారం మీద ఆధారపడేది. 2011 తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, 2016 తరువాత పట్టణ ప్రాంతాల్లో తాము ఎలాంటి సర్వేలు జరపలేదని ఎన్‌ఎన్‌ఎంబి చెప్పిందని కూడా మహాజన్‌ పేర్కొన్నారు.( ప్రభుత్వం దగ్గర సమాచారం లేనపుడు గాలప్‌పోల్‌ వంటి సంస్థల మీద ఆధారపడి దాన్ని విశ్లేషణకు తీసుకున్నట్లు చెప్పవచ్చు. దానికి ఎవరిది బాధ్యత ఎవరిది ?)
అశ్వనీ మహాజన్‌ సరికొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) 2016లో చేసిన సర్వే ప్రకారం 16 రాష్ట్రాల్లో కార్లు, ఇళ్లు ఉన్న ధనికుల పిల్లల్లో కూడా 17.6శాతం మంది గిడసబారి ఉన్నారని, 13.6 శాతం మంది బలహీనంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెబుతూ, ధనికులకు ఆహారం అందుబాటులో ఉంటుంది కదా ఇలా ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే పిల్లల్లో 22 శాతం మంది గిడసబారటం, 11.8 శాతం బలహీనంగా ఉంటారని చెప్పారు. ఈ వాదన ఎందుకు చేశారంటే డబ్బున్న వారు కూడా సరిగా పిల్లల్ని పెంచటం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు దీనికి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నరేంద్రమోడీ ఏమి చేస్తారని వాదించటం, వాస్తవాన్ని వక్రీకరించటం, వైఫల్యాన్ని అంగీకరించకపోవటమే.
వాస్తవం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను 2014-15లో ఐదవ సర్వేను 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేల మధ్య వచ్చిన మార్పు, ఆకలి సూచికల్లో 2014-2022 కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి ? దిగువ పట్టికలో చూద్దాం. అంకెలను శాతాలుగా గమనించాలి.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రక్తహీనత అంశంలో ఒక్క కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా పరిస్థితి తీవ్రంగా ఉంది.
అంశం××××××× సర్వే 4 ××× సర్వే 5×× 2014××2022
గిడసబారినపిల్లలు×× 38 ××× 36 ××××× 38.7 ×× 35.5
బలహీన పిల్లలు ×× 21 ××× 19 ××××× 15.1 ×× 19.3
శిశుమరణాలు ×× 22.7 ××× 25 ××××× 4.6 ×× 3.3
పోషకాహారలేమి ×× 00 ××× 00 ××××× 14.8 ×× 16.3
బరువు తక్కువపి.×× 36 ××× 32 ××××× 000 ×× 000
రక్తహీన పిల్లలు ×× 58.6 ×× 67 ××××× 000 ×× 000
రక్తహీనమహిళలు×× 53.1 ××× 57 ×××× 000 ×× 000
రక్తహీనపురుషులు×× 22.7 ××× 25 ×××× 000 ×× 000

పైన పేర్కొన్న అంకెల్లో 2014 నుంచి 2022 వివరాలను ఆకలి సూచికల విశ్లేషణలో పేర్కొన్నారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు మన ప్రభుత్వం ప్రకటించినవే. దశాబ్దాల పాటు ఎలాంటి సర్వేలు నిర్వహించని మన ప్రభుత్వాలు, పాలకులకు, వారి మద్దతుదార్లకు సూచికలను రూపొందించే సంస్థలను విమర్శించేందుకు ఉన్న నైతిక అర్హత ఏమిటి ? తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021వరకు ఉన్న ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది.2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు రాంకుల గొడవ ఉండదు కదా !


2014లో పేర్కొన్న76 దేశాల్లో మనది 55వ రాంకు వాస్తవం కాదు అని కొందరు చెబుతున్నారు. మరి ఎంత ? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 122 మన రాంకు 99 అవుతుంది. తాజా రాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా ? మనం తెచ్చుకున్న మార్కులను చూస్తే 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 మాత్రమే ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. మామ తిట్టినందుకు కాదు తోడల్లు తొంగి చూసి కిసుక్కుమన్నందుకు అన్నట్లుగా మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం, తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు !


చివరిగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి చూద్దాం. సమగ్ర శిశు అభివృద్ధి పధకం(ఐసిడిఎస్‌) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మన్మోహన్‌ పాలన చివరి ఏడాది బడ్జెట్‌ 2013-14లో ఈ పధకానికి రు.16,312 కోట్లు కేటాయించారు. తరువాత నరేంద్రమోడీ పాలన తొలి ఏడాది 2014-15లో రు. 16,561, 2015-16లో రు.8,336, 2016-17లో 14,850, 2017-18లో 16,745 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌ 2022-23లో రు.20,263 కోట్లుగా ప్రతిపాదించారు.2013-14 బడ్జెట్‌ ఖర్చు అంచనా రు.16,65,297 కోట్లు కాగా 2022-23 లో అది రు.39,44,909 కోట్లుగా ప్రతిపాదించారు. దీన్ని బట్టి తొమ్మిది సంవత్సరాల నాడు ఐసిడిఎస్‌కు మొత్తం ఖర్చులో 0.98 శాతం కేటాయిస్తే 2022-23 నాటికి అచ్చేదిన్‌ స్వర్ణయుగంలో అది 0.51 శాతానికి తగ్గింది. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు మాత్రం భీముడిలా ఉండాలి అనుకోవటం కాదా ఇది ? నేటి బాలలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం కాదు, ఆచరణ కావాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకలి సూచికలో మరింత దిగజారుడు : పొట్టకూటి పాములోళ్ల బొమ్మ అవమానమైతే….. మరి రాజకీయ ఆవులోళ్ల చిత్రాల సంగతేమిటి ?

16 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK

≈ Leave a comment

Tags

BJP, Congress party, cow politics, Cow pooja, Indian economy, La Vanguardia, Narendra Modi Failures, RSS, snake charmer


ఎం కోటేశ్వరరావు


మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్‌ సింగ్‌ పాలనలో మన దేశపరువు ప్రతిష్టలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్రమోడీ వాటిని తిరిగి ప్రతిష్టించారని, లోకమంతా మనవైపు చూస్తోందని కొందరు చెప్పారు. ఇప్పుడు మోడీ ఏలుబడిలో మన ఆర్ధిక ప్రగతిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, ఐఎంఎఫ్‌ ప్రశంసే దానికి నిదర్శనం చూడండని చెబుతున్నారు. అటువంటి స్థితిలో మనలను అవమానించే వారికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి ఆఫ్టరాల్‌ 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ దేశ వార పత్రిక లా వాన్‌గార్డియా అవమానించటమా ? మన ఆర్ధిక రంగ వృద్ది తీరుతెన్నులను పాములను ఆడించే వ్యక్తి చిత్రంతో పోల్చి చూపి, అందునా మొదటి పేజీలో విశ్లేషించటమా ?ఆర్ధిక రంగం గురించి రాస్తే రాశారు పో, ఆ బొమ్మ తప్ప మరొకటి దొరకలేదా ! దాన్ని మేము ఏల చూడవలె !! హతవిదీ,ó అని కౌరవ రారాజు సుయోధనుడి మాదిరి అనేక మంది రగిలిపోతున్నారు. వారిని అర్ధం చేసుకోవచ్చు. మయసభలో ధుర్యోధనుడికి ఆగ్రహం తాను భ్రమ అనుకున్న నీటి మడుగులో పడినందుకు కాదు, దాన్ని చూసి ద్రౌపది నవ్వినందుకు అన్నది తెలిసిందే. ఈ వార్త కూడా అలాంటిదే. మరో కోణంలో అలాంటి దానికి అవకాశం ఇచ్చిందెవరు అన్న ప్రశ్నను వేసుకోవాలి. ఆక్టోబరు తొమ్మిదవ తేదీన ” భారత ఆర్ధిక వేళ ” అనే అర్ధం వచ్చే శీర్షికతో ప్రచురించిన ఆ వార్త గురించి శుక్ర,శనివారాల్లో మన దేశంలోని అనేక టీవీలు, జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు పుండు మీద కారం చల్లినట్లుగా సదరు చిత్రాన్ని ముద్రించి మరీ మన పాఠకులకు అందచేశారు.మన జనాలు మన పత్రికలనే సరిగా చదవరు, అలాంటిది స్పెయిన్‌ పత్రికను మన దేశంలో కొద్ది మంది ఆ భాష వచ్చిన వారు తప్ప ఎవరూ చదవరు. దాన్ని తీసుకొని మన పత్రికలు బహుళ ప్రచారమిచ్చిన వార్తలు మన ప్రధాని నరేంద్రమోడీకి గౌరవ ప్రదమా ? మీడియా పెద్దలు ఆలోచించకుండా అలా చేశారని అనుకుందామా ? లేక ప్రధాని మెప్పు పొందేందుకు చేసిన విన్యాసమా ?


ఆ స్పానిష్‌ భాష పత్రికలో మన ఆర్ధిక రంగం మీద చేసిన విశ్లేషణ సారం ఏమిటో అనువాదం కోసం వెతికినా దొరకలేదు. ఏదైనా కావచ్చు, మన ప్రధాని నేతృత్వంలో ఆర్ధికంగా దేశం ఎలా గంతులు వేస్తూ ముందుకు పోతున్నదో రాసి ఉండవచ్చు లేదా ఎలా దిగజారుతున్నదో కూడా చెప్పి ఉండవచ్చు. ఏది రాసినా అసలు అభ్యంతరం అది కాదు. దానికి పాములనాడించే వ్యక్తి చిత్రాన్ని జోడించి ప్రచురించటమే. జనాన్ని కాటువేసే ద్రవ్యోల్బణమనే నాగుపాము బుసలు ప్రపంచమంతటితో పాటు మన దేశంలో కూడా ఉన్నందున దాన్ని బుజ్జగించి బుట్టలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ ఊదుతున్న నాగస్వరానికి చిహ్నంగా ఆ చిత్రాన్ని చూపారా ? అసలు ఆ బొమ్మ వేస్తే తప్పేంటి, పత్రికల్లో అనేక బొమ్మలు వేస్తున్నారు, దాన్ని సానుకూల వైఖరితో ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. ఆర్ధికరంగం మాంద్యంలోకి జారకుండా, మన గానానికి అనుగుణ్యంగా నృత్యం చేయిస్తూ ఉన్నతి వైపు తీసుకువెళ్లే ప్రయత్నానికి ప్రతిబింబంగా దాన్ని ఎందుకు పరిగణించకూడదు, ఆత్మన్యూన్యతకు ఎందుకు గురికావాలి ? చిన్న వ్యంగ్యాన్ని సహించలేని స్థితికి ” ఎదిగామా ” అన్నది వారి ప్రశ్న. నూరు పూవులను పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి.


పాములను ఆడించే వ్యక్తి చిత్రాన్ని మన దేశానికి ప్రతీకగా చూపటం అవమానించటమే అని కొందరు పేర్కొన్నారు.” బలమైన భారత ఆర్ధిక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా పాములోళ్ల బొమ్మలతో మనల్ని చూపటం బుద్దిలేని తనం. వారిని వలసవాద భావన నుంచి మరల్చటం సంక్లిష్టమైనది ” అని స్పెయిన్‌ వారపత్రిక కథనం గురించి బెంగలూరు సెంట్రల్‌ బిజెపి ఎంపీ పిసి మోహన్‌ అన్నారు. నిజమే, వారిని మార్చటం అంత తేలిక కాదు, విదేశీయులు మారకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన దేశంలో పాములోళ్ల కాలం నాటి నుంచి ఉన్న, అంధ, మూఢవిశ్వాసాలను, అశాస్త్రీయ అంశాలను జనాల మెదళ్లకు ఒక పధకం ప్రకారం ఇప్పటికీ సరికొత్త పాకింగ్‌లు, రంగులది ఎక్కిస్తున్న మీడియా, రాజకీయ నేతల సంగతేమిటి అన్నది ప్రశ్న.


మన దేశంలో అశాస్త్రీయ అంశాలను నమ్మి, బహిరంగంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాలను ప్రపంచమంతా చూసి నవ్వుకుంది, దేశాన్ని అపహాస్యం పాలుచేశారు. వినాయకుడికి ఏనుగు తల ఉందంటే అ రోజుల్లోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జన్లు ఉండి ఉండాలని మోడీగారే చెప్పారు. ఇక ఇంథనం, పైలెట్లతో పని లేకుండా ఎక్కిన వారు ఎటు పొమ్మంటే అటు, పైకీ కిందికీ తిరిగే విమానాల గురించి,క్షిపణుల గురించి చెప్పిన పెద్దమనుషుల విన్యాసాలు మూఢవిశ్వాసాలను పెంపొందించేందుకు, జనం చేత వాటిని గుడ్డిగా నమ్మించేందుకే కదా ! పాములనాడించేవారు పొట్ట కూటికోసం పడిన, పడుతున్న తిప్పల్లో భాగం. మరి వీరు ఎందుకు అలా చేస్తున్నట్లు ? అందువలన దేశానికి జరిగిన అవమానం, అపఖ్యాతి తెచ్చిన వారిని వదలి స్పెయిన్‌ పత్రిక అవమానించిందని చెపుతున్నవారి చిత్తశుద్ది ప్రశ్నార్ధకం. విదేశీయులు మన దేశానికి వచ్చినపుడు భారతీయులు నాగుల చవితి పేరుతో పాములను పూజించటం, కోతులకు, ఆవులకు మొక్కటాన్ని, ఆవు మూత్రాన్ని తల మీద చల్లుకోవటాన్ని చూశారు. కనిపించిన చెట్టు, పుట్ట, రాతిని పూజించటాన్ని గమనించారు, భారత్‌ అంటే అలాగే ఉంటుందన్నట్లుగా రాశారు. దానిలో కొంత అతిశయోక్తి, చులకన భావం ఉంది. కానీ వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక శాస్త్రీయ అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జరుగుతున్నదేమిటి ? పాములు పాలు తాగవని తెలిసీ రెచ్చిపోయి పోస్తున్నవారి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా మనోభావాలను కించపరుస్తున్నారని దెబ్బలాటలకు వస్తారు. ఆ మాటకు వస్తే దేవతా రూపాలైన పాములను పూజించాలే తప్ప వాటి కోరలు తీసి ఆడించటం, బుట్టలో పెట్టటం దేవతలను అవమానించటం కాదా అని ఎవరైనా అంటే ? పాములోళ్ల కడుపు మీద కొట్టినట్లే. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు, రాకెట్లను తీసుకువెళ్లి గ్రామ దేవతలు, ఇతర దేవుళ్ల ముందుంచి పడిపోకుండా ఎగిరేట్లు చూడండని వేడుకుంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ గారే గోమాత, కామధేనువు అంటూ ఆవులను పూజిస్తూ ఫోజులిస్తున్న తరువాత, వాటిని ప్రపంచమంతా చూస్తున్నపుడు పాములోళ్ల బొమ్మవేసి ఎవరో అవమానించారు అని గుండెలు బాదుకోవటం కొందరిని సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


ఇక కరోనా మహమ్మారి గురించి ప్రచారం చేసిన మూఢనమ్మకాలు, పిచ్చిపనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంగామాత ఆశీర్వాదం ఉన్నందున గంగలో మునిగితే కరోనా రాదని చెప్పి కుంభమేళాకు అనుమతిచ్చి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి కారకుడైన ఉత్తరాఖండ్‌ బిజెపి సిఎం నిర్వాకం, తరువాత దాన్ని మధ్యలోనే నిలిపివేసిన ప్రహసనం తెలిసిందే. ఇంతకంటే పరువు తక్కువ పనేముంటుంది. ఆవు మూత్ర తాగింపు పార్టీలు, ఆవు పేడ పూసుకొని గంతులు, పాటలు, భజనలు ఇలా ఎన్నని చెప్పుకోవాలి. వీటన్నింటినీ మన టీవీలు తమ రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున చూపిందీ తెలిసిందే. ఇవన్నీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచేవా ? వందల మంది మూత్రం తాగేందుకు, పేడ పూసుకొనేందుకు పోటీపడటంతో మూత్రం లీటరు, పేడ కిలో రు.500 చొప్పున ధర పలికింది. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసి దేశభక్తులందరూ రావాలని కోరారు. అంతే కాదు నరసింహడి అవతారమే కరోనా అని, మాంసాహారం తినేవారిని శిక్షించేందుకే వచ్చిందని సెలవిచ్చారు. ఆవు మూత్రం తన కాన్సర్‌ను మాయంచేసినట్లు బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా చేస్తే కరోనా వైరస్‌ నివారణ అవుతుందని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. దీపాలు వెలిగిస్తే కరోనా నశిస్తుందని అదొక సైన్సు అని చెప్పిన వారు, పో కరోనా పో కరోనా అంటూ శాపాలు పెట్టిన వారు, మంత్రాలు చదివిన వారి గురించీ తెలిసిందే.


పాములోళ్ల బొమ్మ మన దేశానికి ప్రతీకగా ప్రచురించటం అవమానం అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నపుడే ప్రపంచ ఆకలి సూచికల తాజా (2022) నివేదిక వెలువడింది. దీన్లో మన స్థానం దేశానికి ప్రతిష్టను తెచ్చేదిగా ఉందా ? ఈ సూచికల రూపకల్పనకు తగిన సమాచారం ఇచ్చిన దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది అలా ఇచ్చిన 116 దేశాలకు గాను వందవ స్థానంలో ఉన్న నరేంద్రమోడీ ఇప్పుడు 121 దేశాల్లో 107 దగ్గర నిలిచారు. మన దగ్గర ప్రతి ఊర్లో కామధేనువులకు, వాటిని పూజించేవారికీ కొదవ లేదు. కొంత మంది ఓట్ల కోసం నటించినప్పటికీ ఫలితాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్దితో జనం చేసే పూజల్లో విశ్వాసం, నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. మరి ఇంత ఆకలి ఎందుకు ఉన్నట్లు ?2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 అచ్చే దిన్‌ ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. వర్గీకరణ ప్రకారం 9.9 మార్కుల లోపు వచ్చిన దేశాలను ఆకలి లేని లేదా సమస్య తక్కువగా ఉన్నట్లు, పది నుంచి 19.9 వరకు ఒక మితమైన సమస్య, 20 నుంచి 34.9వరకు తీవ్రమైన, 35 నుంచి 49.9 వరకు ఆందోళన కరమైన, 50 దాటితే విషమంగా ఉన్నట్లు పరిగణిస్తారు.ప్రతి ఏటా పరీక్ష పేపరు, ప్రశ్నలు మారుతుంటాయి, వాటికి ఇచ్చే మార్కులూ అంతే గనుక గత సంవత్సరాలతో పోల్చ కూడదని కొందరు వాదిస్తారు. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులున్నప్పటికీ మొత్తంగా వచ్చే మార్కులను బట్టే సూచికల్లో స్థానం ఉంటుంది. దానిలో ఎంత మేరకు ఎదిగామన్నది లెక్క.మన మెరుగుదల ఒక లెక్కలోనిది కాదు, మిగతా దేశాలు మనకంటే ఎక్కువగా మెరుగుపడిన కారణంగానే గత ఏడాది కంటే దిగజారాం.


2013లో మన దేశం 63వ స్థానంలో ఉండగా 2014లో 76 దేశాలకు గాను 55వ స్థానంలో ఉన్నాం. ఆ ఏడాది సూచికల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే దిగువన 57లో, ఎగువన శ్రీలంక 39, నేపాల్‌ 41వ స్థానాల్లో నిలిచాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో పాక్‌, బంగ్లాదేశ్‌ కూడా మన కంటే ఎగువకు చేరాయి. 2022 సూచికలో ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌ 109, మన పాలకులు, కాషాయ దళాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో స్మరించే పాకిస్తాన్‌ 99, బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 81,మయన్మార్‌ 71, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక 64 స్థానాల్లో ఉండగా ప్రపంచానికే ఆహారం అందించగలం అని కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో మన పరిస్థితి ఇలా ఉందేమిటి ? ఇది మన దేశ గౌరవం, ప్రతిష్టలను పెంచేదా ? రేపు మరొక దేశ పత్రిక ఓ కామధేనువూ మా జనాల ఆకలి తీర్చి ప్రపంచ ఆకలి సూచికలో మా స్థానాన్ని పెంచు, మా దిగుమతులను తగ్గించు, ఎగుమతులను పెంచు, ఆవుల మూత్రంలో బంగారం సంగతి తరువాత ముందు దాన్ని ముడిచమురుగా మారిస్తే సంతోషం తల్లీ అని ప్రార్ధిస్తున్నట్లుగా వీధుల్లో ఆవులను చూపుతూ అడుక్కొనే వారి బొమ్మ లేదా నరేంద్రమోడీ ఆవును పూజిస్తున్న బొమ్మను వేస్తే గౌరవంగా ఉంటుందా ? జనాల మనోభావాలతో ఆడుకోవటం తప్ప పాములోళ్ల బొమ్మ గురించి ఇంత రాద్దాంతం అవసరమా ?


జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ వారు అపహాస్యం చేయటమా అంటే అర్ధం ఏమిటి ? అనేక అభివృద్ధి సూచికల్లో అది మన కంటే చాలా ఎగువున వుంది. అందువలన మన మీడియా స్పందన తెలుసుకొని ఆ దేశస్థులు మీ దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ జనాభాకంటే తక్కువగా ఉన్న మేము రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపిని కలిగి ఉంటే అంత పెద్ద దేశం ఇంకా మూడున్నర లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఉండటం ఏమిటో చూసుకోండి, ఒక నాడు చైనా కంటే ముందుండి ఇప్పుడు దాని కంటే ఎంత వెనుక ఉన్నారో తెలుసుకోండి అని స్పందిస్తే మన దగ్గర సమాధానం ఏమిటి ? ఐరోపా వారు తమ వలస కళ్లద్దాలతో గతాన్నే చూస్తున్నారు, వర్తమాన భారతాన్ని చూడటం లేదని సాధించిన ఆర్ధిక ధీరత్వాన్ని చూడలేకపోతున్నారని, బ్రిటన్ను అధిగమించిన అంశం కనపడటం లేదా అని కొందరు అంటున్నారు. నిజమే జనాల ఆకలి తీర్చని జడిపి, ఉన్నత స్థానాలు ఎందుకు ? తరతరాలుగా మరోదారి లేని పాములోళ్లు జీవన పోరాటంలో పాములను అదుపు చేసి బుట్టలో , ఎవరైనా పిలిస్తే పట్టుకొని సాయ పడుతున్నారు, కొత్తగా రంగంలోకి దిగిన రాజకీయ ఆవులోళ్లు అధికార పోరులో దేశ ఆర్ధిక రంగాన్ని తాము చెప్పినట్లుగా కూడా ఎందుకు నడిపించలేకపోతున్నారు ? దేశంలో ఆవు-దూడను గుర్తుగా తీసుకొని కాంగ్రెస్‌ ఆవు రాజకీయం మొదలెట్టింది. ఇప్పుడు బిజెపి దాన్ని మరో రూపంలో కొనసాగిస్తున్నది. నాటి ఆవు-దూడ గరీబీ హఠావో అని చెప్పినట్లుగానే నేటి ఆవులోళ్లు చెప్పిన అచ్చేదిన్‌, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, నల్లధనం వెలికితీత ఏమైనట్లు ? ఒకరిది అన్నం కోసం ఆరాటం, మరొకరిది అధికారం, ఓట్ల కోసం బహుకృత్వ వేషాలు కావా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” మావో ఆలోచనావిధానంలో భాగమే

12 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

China socialist market economy, chinese communist party, Mao Zedong, Mao Zedong thought, People's Republic of China

ఆదిత్య కృష్ణ  

చైనాకీ,  చైనాపరిశీలకులకీ చాలాముఖ్యమైనది ఈ అక్టోబరు16 న మొదలౌతున్న చెనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభ. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలోనూ, చైనా ప్రత్యేక లక్షణాలతోనూ కూడి వున్నది అని అక్కడి నాయకత్వం చెప్తున్నది. 2050 నాటికి ప్రపంచంలోని మధ్యస్థాయి (యూరపు) దేశాల అభివృద్ధి స్థాయిని అందుకొంటుందనీ వారు చెప్తున్నారు. దాన్ని కొట్టిపారేస్తూ – చైనా పాలకులు సోషలిజం ముసుగులో పెట్టుబడిదారీ పాలనను సాగిస్తున్నారని మీడియాలో నిత్యం ప్రచారం సాగుతున్నది. సోషలిజం సార్వజనీనమైనది, మళ్లీ ‘చైనా మాదిరి’ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషలిజానికి ఒకే రకమైన రెడీమేడ్‌ మోడల్‌ ఏమీ లేదు.

అక్కడితో ఆగక, చైనాది సామ్రాజ్యవాదం, లేదా సోషల్‌ సామ్రాజ్యవాదం అని మరి కొందరు – మావో వాదులమని  చెప్పుకొనేవారు ‘సిద్ధాంతాల’ పేరిట – విమర్శిస్తున్నారు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ; గుత్తపెట్టుబడిదారీ విధాన అత్యున్నత రూపం సామ్రాజ్యవాదం అవుతుంది – అని లెనినిజం చెప్తుంది. చైనాలో గుత్త పెట్టుబడిదారీ విధానం అనే పునాదే లేదు; అనేక (పబ్లిక్, సమిష్టి, ప్రైవేటు, వ్యక్తిగత) సెక్టార్లున్న చైనాలో – దానికి ప్రాతిపదిక లేదు. అలాంటిచోట (సోషల్‌) సామ్రాజ్యవాదం ఎలా ఏర్పడుతుంది?

సామ్రాజ్యవాదాన్ని, అమెరికా అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన ప్రపంచ శక్తిగా ఉన్న  చైనాపై అలాంటి ఆరోపణలు అర్థరహితం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మూడవ ప్రపంచదేశాల్లో  చైనాకి  ఉన్న ఆదరణను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల పాలకవర్గాలకు ఈ ప్రచారాలు ఆచరణలో తోడ్పడుతున్నాయి. సిద్ధాంతరీత్యా చూసినా, ఆచరణలో చూసినా చెల్లని ఆరోపణలివి. స్వతంత్ర పరిశీలనకన్నా పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య మేధావులూ వండి వార్చినదే  వారి విమర్శలకి మూలాధారం. చైనా పార్టీతో, వారి డాక్యుమెంట్ల పరిశీలనతో వారికి పనిలేదు. 

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం , అనేక తప్పులు చేసి, ఎదురుదెబ్బలు తిని,విప్లవ గమనంలో కుంటుపడి చిక్కుల్లో ఉన్నది. మనదేశంలో మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనావిధానం పేరిట బలమైన పిడివాదం వుంది. తప్పుడు విమర్శలకు ఒక పునాది అదే. మనదేశంలో చాలా మంది కమ్యూనిస్టులకూ, అభ్యుదయవాదులకూ అల నాటి రష్యాపట్ల అపార అభిమానం. వారికి ఎంగెల్స్‌ నొక్కి చెప్పిన “శాస్త్రీయ సోషలిజం” కన్నా ఆదర్శవాద, ఊహాజనిత సోషలిజమే ఒంట బట్టింది. అందుకే అశాస్త్రీయమైన అవగాహనతో విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం అవసరం. దానికిది క్లుప్త పరిచయం.

అంతర్జాతీయ, చైనా వ్యవహారాల నిపుణులైన జె.యన్‌.యు. ప్రొఫెసర్‌ అల్కా ఆచార్య క్జి జిన్‌పింగ్‌ ఎన్నికపై లోగడ ఒక సమీక్షావ్యాసం రాశారు (EPW 5-5-2018). బీజింగ్‌లో ఒక యువపరిశోధకుడు 2017లో అన్న మాటతో ఆమె తనవ్యాసం ముగించారు: “మావో మమ్మల్ని విముక్తి చేశారు. డెంగ్‌   మ మ్మల్ని సంపన్నులుగా మార్చారు. ఇప్పుడు జిన్‌పింగ్‌ మా పార్టీని, చైనాను శక్తివంతంగా  రూపొందిస్తారు.”  విప్లవ విజయం (1949) తర్వాత  చైనా – సోషలిస్టు నిర్మాణంలో అంచెలంచెలుగా ముందుకుసాగుతున్నది. పై వాక్యాలు అక్కడి పరిణామాల క్రమాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి. 

వాస్తవాలకు విరుద్దమైన విమర్శలు : చైనాలో వ్యవసాయ భూమినేటికీ  ప్రభుత్వ ఆస్తిగానే వుంది   

మావోకాలంలో అంతా సవ్యంగా వుందని, మావో తర్వాత డెంగ్‌ అంతా తిరగ దోడారనీ విమర్శలు చేస్తుంటారు. చెనాలో మావో పద్ధతులని పక్కనపెట్టి, “స్వేచ్చామార్కెటు” (డెంగ్‌) విధానాలను అనుసరిస్తున్నారని అంటూ చైనాలో పెట్టుబడిదారీ పునరుద్దరణ జరిగిందన్న సిద్దాంతాన్ని – లోతుపాతులు తెలుసుకోకుండా-కమ్యునిస్టు వ్యతిరేకులు కూడా- ప్రచారం చేస్తున్నారు. నిజానికి అచ్చంగా “స్వేచ్భామార్కెట్‌” విధా నాలు ఈ నాడు ఏ సామ్రాజ్యవాదదేశంలో సైతం అమల్లో లేవు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ . స్వేచ్చా మార్కెటు‌కీ, గుత్త వెట్టుబడికీ పొత్తు కుదరదు. ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో అక్కడితో ఆగలేదు. ప్రొటెక్షనిజం, ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ పద్దతులు గుత్తపెట్టుబడికి తోడైనాయి. చైనా పాలకులు సోషలిజం ముసుగువేసుకొన్నారు;  ఆచరణలో సొంత ఆస్థిని పునరుద్ధరించారు; కమ్యూన్‌లను రద్దు చేసారు అని కొందరు చెప్తున్నారు. చైనాలో కమ్యూన్‌లను రద్దు చేసి “వ్యక్తిగత బాధ్యతావిధానం”  (Individual Responsibility system) అనే వ్యవసాయరంగ సంస్క రణను చేసా రన్నది నిజమే. కానీ సొంత ఆస్తిని పునరుద్ధరించారన్నది వాస్తవం కాదు. చైనాలో వ్యవసాయ భూమి ఈనాడు కూడా ప్రభుత్వ ఆస్తిగానే వుంది. రైతులకు అనుభవించే హక్కు, ఆ హక్కుని తర్వాతి తరం పొందే హక్కు కూడా వుంది. ఆస్తి వ్యవస్థ  వేరు, నిర్వహణా పద్ధతి వేరు. సంస్కరించింది రెండో అంశం మాత్రమే. ఈ కీలకమైన వాస్తవాన్ని విస్మరించి, వ్యాఖ్యానించటం తప్పు. ఇది అవాస్తవం, అశాస్త్రీయం, హేతువిరుద్ధం కూడా.

సోషలిస్ట్ మార్కెట్‌ ఎకానమీ అంటే.. చైనాలో అనుసరిస్తున్నది “స్వేచ్చా మార్కెట్‌ పద్ధతి” కాదు. దాన్ని “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” అంటారు. దానికే “సోషలిస్ట్ ప్లాన్డ్‌ కమోడిటీ ఎకానమీ” అనే పేరు కూడా ఉంది. “పబ్లిక్‌ ఓనర్‌షిప్‌” పైచేయిగా వుండే వ్యవస్థ అది. రాజ్యం మార్కెటుని రెగ్యు లేటు చే స్తుంది; మార్కెట్‌ ఎంటర్ ప్రైజెస్ ని గైడ్ చేస్తుంది” అన్నది దాని ప్రాతిపదిక. ఆ విధంగా ప్లానింగు, మార్కెటు మేళవించబడుతాయి. ఈ అవగాహ నను చైనాపార్టీడాక్యుమెంట్లలో చూడవచ్చును. కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను  తెలుసుకోకుండా, లేదా విస్మరించి, తప్పు అవగాహనలు చలామణీలో వున్నాయి. పెట్టుబడిదారీ విధానం=మార్కెటు; సోషలిజం=ప్లానింగు; ఇవి విడదీయరాని జంటలని ఒక అవగాహన విస్తృతంగా వుంటూ వచ్చింది. ఇది తప్పు అని చైనా పార్టీ, డెంగ్‌ వివరించారు. ఫ్యూడల్‌ యుగంలోనూ మార్కెటు- వాణిజ్యం, ఎగుమతులూ – ఉన్నాయి;  బడా పెట్టుబడిదారీ సంస్థలు ప్లానింగ్ చే సుకొన్నాకే  రంగంలోకి దిగుతాయని గుర్తుచేసారు. దాని అధ్యయనం అవసరం, ఉపయోగకరం. 

‘ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం‘: లెనిన్‌

లెనిన్‌ కాలంలో రష్యా విప్ణవం (1917) విజయవంత మైంది. ఆ వెంటనే సామ్రాజ్యవాదుల జోక్యం, అంతర్యుద్ధం రష్యాని అతలాకుతలం చేశాయి. 1922 దాకా అలాంటి సంక్షోభం కొనసాగింది. సోషలిస్ట్ నిర్మాణం- అభివృద్ధి తొలిదశలోనే 1924 జనవరిలో లెనిన్‌ మరణించారు. ఆ దశలో లెనిన్‌ నూత న ఆర్థిక విధానం ( NEP) పేరిట దేశ, విదేశ పెట్టుబడిదారులనూ, వారి పద్ధతులనూ రష్యా లో  అనుమతించారు. 

ఈ విధానం ప్రమాదకరం కాదా? అంటే అది పెట్టుబడిదారీ అభివృద్ధే అవుతుంది, నిజమే. కానీ ప్రమాదకరం కాదు; ఎందుకంటే అధికారం కార్మికుల, రైతులచేతిలోనే ఉంటుంది. కంట్రాక్టు షరతుల్ని అమలు చేస్తాం; దాని వల్ల కార్మికుల పరిస్థితులు బాగుపడుతాయి… ఇది సరైందే కూడా; ఎందుకంటే ఇతరదేశాల్లో విప్లవం ఆలస్యమైపోయింది; ఈ లోగా మన పారిశ్రామిక తదితర ఉత్పత్తులు పెరుగుతాయి; మన కార్మికుల, రైతుల, ప్రజల పరిస్థితి బాగుపడుతుంది, అది అవసరం.ఈ అవకాశాన్నివదులుకొనే హక్కు మనకిలేదు“…ఈ క్రమంలో (విదేశీ) పెట్టుబడిదారులు కొంత లాభపడుతారు; మనం కొంత వదులుకోవాల్సివస్తుంది నిజమే,  ఈ త్యాగం మృత్యుసమానం కాదు, ప్రమాదకరం కాదు”, అని లెనిన్‌  వివరించారు ( 1921 ఏప్రెల్‌ 25; CW volume 32). ఈ ఏర్పాట్లు ఒక రకం యుద్ధమే;  ఆయుధాలతోకాక, ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం; ఈ యుద్ధంలో మన ఉత్పత్తిశక్తుల్ని ధ్వంసం చేసుకోము; పెంపొందించుకొంటాం. పెట్టుబడిదారులు మనని మోసం చేయ జూస్తారు, నిజమే; వారిని మన రాజ్యం, చట్టాలద్వారా, ఇతరత్రా ఎదుర్కొంటాం; గెల్చి తీరుతాం. మనం వారిని కేవలం ఆయుధాల ద్వారానే ఓడించగల్గుతామని భావించటంలేదు…’ప్రపంచ విప్లవ చెయిన్‌ లో మనమొక లింకుమాత్రమే; మనమొక్కరమే ప్రపంచ విప్లవాన్ని సాధించలేము, ఆ లక్ష్యాన్ని  మనం పెట్టుకోలేదు కూడా.. అని ఆ రోజుల్లోనే ( Lenin On Concessions, 1920 నవంబరు 26; మాస్కో పార్టీ సమావేశంలో ఉపన్యాసం) వివరించారు. సామ్రాజ్యవాదం మరణశయ్యపై ఉన్నదని లెనిన్ సూత్రీకరించి శతాబ్దం దాటిపోయినా, నేటికీ అది ఎంతబలంగా ఉన్నదో చూస్తూనే ఉన్నాం. 

లెనిన్‌ తర్వాత ఆ బాధ్యతల్నిస్టాలిన్‌ చేపట్టి 1953 లో తన మరణందాకా కొనసాగించారు. రష్యాలో ‘సోషలిజం చాలా పరిణతి చెంది, వర్గరహిత కమ్యూనిజంవలె’ రూపొందుతున్నదన్న అతివాద అంచనావేసి, పొరపాటుచేసినట్టు స్టాలిన్ కాలం చివరిలో గుర్తించబడింది. ఆ పొరపాటుని మావో కాలంలోనే చైనా పార్టీ గుర్తించింది. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలో వున్నది; అక్కడ సోషలిస్ట్ మార్కెటు వ్యవస్థకి  కీలక పాత్ర వున్నది – అని డెంగ్‌ నాయకత్వంలో చైనా పార్టీ సూత్రీకరించింది.

‘సోషలిజంలో కూడా  మార్కెట్‌ పాత్ర వుంటుంది’ : మావో  

సోషలిస్ట్  నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆర్థికనియమాలు (EconomicLaws)వున్నాయి, వుంటాయి. వాటిపట్ల శాస్త్రీయ అవగాహన వుండాలని, అవి మన ఇష్టాయిష్టాల ప్రకారం వుండవని లెనిన్‌, స్టాలిన్‌, మావో, డెంగ్  నొక్కి చెప్పారు. వాటి అవగాహన, అన్వయాలలో అనేక ప్రయోగాలు, అనుభవాలు, సాఫల్యవైఫల్యాలు, అంగీకారాలు – అనంగీకారాలు కూడా వున్నాయి, సహజమే. ఆ నియమాలు ఇలా వున్నాయి:

“ఎకనామిక్‌ ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ సోషలిజం ఇన్‌ యు.యస్.‌యస్.‌ఆర్‌” పేరుతో స్టాలిన్‌(1951 లో) రచించిన గ్రంధం ఒకటుంది. మానవాళి చరిత్రలో మొదటిసారిగా శాస్త్రీయ సోషలిజం అమలు జరిగింది రష్యాలోనే.  కార్మికవర్గం అధికారం చేజిక్కించుకోవటం సోషలిస్ట్ విప్లవానికి నాంది. అది బతికి బట్టకట్టాలంటే     ‘సోషలిస్టు నిర్మాణం-అభివృద్ధి’  కీలకం; ఆ రెంటిలోనూ   రష్యాది కొత్త అనుభవం, కొత్త ప్రయోగం. ఆ అనుభవాలనే స్టాలిన్‌ పై పుస్త కంలో చర్చిం చారు; సోషలిజంలో కూడా సరుకుల (కమోడిటీ) ఉత్పత్తి వ్యవస్థ, మార్కెట్‌ పాత్ర వుంటాయని, అవి పెట్టుబడిదారీ సమాజంతోనే ముగియవని స్టాలిన్‌ (1951) నిర్ధారించారు. ఈ పుస్తకంపై మావో ఒక విమర్శతో కూడిన సమీక్షను (క్రిటిక్‌)1958లో రచించారు.  చైనా భవిష్యత్తుకి ఉపయోగ పరచుకునే లక్ష్యంతో రష్యా అనుభవాలను మావో పరిశీలించారు. పారిశ్రామిక రష్యా స్థితి అది;  చైనాలోని వాస్తవ పరిస్థితులతో కలిపి చూడాలని,  వెనుకబడిన వ్యవసాయ దేశమైన చైనాలో మార్కెట్ మరింత అవసరం అని మావో ఆ రచన ప్రారంభంలోనే నొక్కిచెప్పారు. ఆ ‘సమీక్ష’లోని అంశాలు గమనించదగినవి. “సరకుల ఉత్పత్తి వ్యవస్థ అనగానే మనలో కొందరికి చిర్రెత్తుతుంది; అది పెట్టుబడిదారీ విధానమే అని భావిస్తాం. కానీ కోట్లాది రైతుల సంఘీభావాన్ని సమీకరించుకోగలగాలంటే, సరకుల ఉత్పత్తిని, మనీ సప్లయిని పెద్ద  యెత్తున పెంపొందించాల్సి వస్తుందని కన్పడుతుంది- అని వెనుకబడిన, రైతాంగదేశాల ప్రత్యేకతల దృష్ట్యా మావో చెబుతారు.  ప్రయోగాల అవసరం మావో గుర్తిస్తారు. 

“కమ్యూనిస్టు స్వర్గంలోకి ఒక్క అంగలో వెళ్ళలేము, క్రమ క్రమంగానే వెళ్ళగలం. సరకుల వ్యవన్థను, విలువ సూత్రాన్ని, అవి బూర్జువా స్వభావం కలవే అయినా, వాటిని మన ఇష్టానుసారం రద్దు చేయలేము..” పీపుల్స్‌కమ్యూన్లున్నా,  అక్కడ సరుకుల వినిమయాన్ని, విలువ సూత్రాన్ని వినియోగించాల్సి వస్తుంది; సోషలిస్టు పరిణామక్రమానికి అవి తోడ్పడుతాయి అంటారు మావో. వ్యవసాయ ప్రధానదేశంగా, గ్రామీణ జనాభా 80 శాతందాకా వున్న దేశంగా చైనా పరిస్థితులు వేరు (రష్యాలో కన్నా వెనుకబడి వుంటాయి) అని కూడా ఎత్తిచూపారు. అక్కడ మార్కెటు పాత్రని నొక్కి చెప్పారు. ‘పెట్టుబడిదారీ కాలంలో అయినా, సోషలిస్టు కాలంలో అయినా ఆర్థికాభివృద్దికి, రాజకీయార్థిక శాస్త్రానికి చెందిన కొన్ని నియమాలు వర్తిస్తాయని చెప్పాల్సివుంటుంది. ప్రకృతి విజ్ఞాన శాస్త్రంలో వలెనే, ఆర్థికాభివృద్ది నియమాలు కూడా వస్తుగతమైనవి (ఆబ్జెక్టివ్)‌, అవి మానవుని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వుంటాయ’ని మావో రాశారు.  ‘సోషలిస్ట్ ఆర్థికానికి సంబంధించిన “రెడీమేడ్‌” అంశాలేవీ లేనందున,  ‘కొత్తవైన సోష లిస్ట్ ఆర్థిక రూ పాలను సృష్టించాల్సి వుంటుంద’నీ, ఈ క్రమాన్నీ అ-ఆ ల నుంచి మొదలు పెట్టాల్సివస్తుందనీ… నిస్సందేహంగా ఇది “జటిలమైన, సంక్లిష్ట మైన, ఇంతకుముందెన్నడూ లేని కర్తవ్యంగా” వుంటుందనీ మావో చెప్పారు.’సోవియట్‌ యూనియన్‌ నుంచి నేర్చుకుని మనం మెరుగుపరుచుకోవాలని, ఆర్థిక నియమాలను రష్యా రద్దు చేయగలుగుతుందని, కొత్త వాటిని సృష్టించుకోగలుగుతుందని భావిస్తే- అది పూర్తిగా అసత్యం’-అని చెప్పారు మావో. 

‘మన ప్రణాళికా సంస్థలు సామాజిక ఉత్పత్తిని సరిగ్గా (కరెక్ట్‌ గా) ప్లాన్ చేయడం సాధ్యమే…ఐతే దాన్నీ వాస్తవంలో సాధించటాన్నీకలగా పులగం చేయకూడదు. అవి రెండూ వేర్వేరు విషయాలు.’సాధ్యత’ను వాస్తవంగా మార్చగలగాలంటే, ఆర్థికాన్ని అధ్యయనం చేయటం, దానిపై పట్టు సాధించటం, పూర్తి అవగాహనతో దాన్ని అన్వయించగలగటం అవసరం. “ఆయా నియమాలను పూర్తిగా ప్రతిబింబించగల్గినటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి’- అంటారు మావో. అలాంటి నియమాల్లో భాగమే సరకుల వ్యవస్థ, మార్కెటూ. ‘గతంలో మనం అలాటి కొన్ని ప్రణాళికలు రూపొందించాం; కానీ తరచుగా అవి తుఫానులని సృష్టించాయి. ఐతే అతి, కాకపోతే మరీ తక్కువ..అయింది. అనేక వైఫల్యాల తరువాత,“40 అంశాల వ్యవసాయ కార్యక్రమం” రూపొందించుకున్నాం. ఇప్పటికీ-వాస్తవిక ఆచరణలో దీన్ని ఇంకా నిరూపించాల్సే వున్నది-అని ప్రయోగాల అవనరాన్ని మావో నొక్కిచెప్పారు. “మన ప్రణాళికలు వాస్తవిక సూత్రాలను పూర్తిగా ప్రతిబింబించలేదు…అంతిమ పరిశీలనలో సరకుల ఉత్పత్తి ఉత్పాదక శక్తులతోకూడా ముడిపడి వుంటుంది. అందువల్ల – పూర్తిగా సోషలైజు చేయబడిన పబ్లిక్‌ ఓనర్‌ షిప్‌ క్రింద కూడా- సరకుల  వినిమయం అమలులో వుండడం-కొన్ని రంగాల్లో నైనా- తప్పనిసరవుతుంది’ అని మావో అంటారు. “పట్టణాలకు-గ్రామాలకు, పరిశ్రమలకు వ్యవసాయానికి మధ్య ఆర్థిక సంబంధాన్ని గట్టిపరచాలంటే, సర కుల ఉత్పత్తి వ్యవస్థని కొంతకాలం వుంచాల్సిందేనని బోధపడుతుంది. పట్టణాలతో అలాంటి బంధం మాత్రమే రైతాంగానికి ఆమోదయోగ్యంగా వుం  టుంది” -అంటారు మావో. ఇక్కడ కార్మిక రైతాంగ ఐక్యసంఘటన కూడా ఇమిడిఉంది.  ఇంకా ఇలా అంటారు: అభివృద్ది చెందిన పెట్టు బడిదారీ దేశాలకీ, వెనుకబడిన పారిశ్రామిక వ్యవస్థలకూ, వ్యవసాయ ప్రధాన దేశాలకూ తేడా వుంటుంది. ఒకే దేశంలో పరిశ్రమలకూ-వ్యవసాయానికీ, పట్టణ వర్గాలకూ రైతాంగానికీ కూడా తేడాలుంటాయి..కొన్ని వాస్తవిక ఆర్థిక సూత్రాలకు, నియమాలకు లోబడి వుంటాయి; మానవుడి ఇష్టాయిష్టాల ప్రకారం వుండవు. వాటిని అవగాహన చేసుకుని, అన్వయించుకోవలసివుంటుంది.  ‘సరకుల ఉత్పత్తి వ్యవస్థ వద్దే వద్దు’ -అని కొందరనుకుంటారు. కానీ అది తప్పు. ఆ వ్యవనను గురించి లెనిన్‌ నుంచి స్టాలిన్ నేర్చుకున్నారు. స్టాలిన్ నుంచి మనం నేర్చుకోవాలి” అంటారు మావో.”సరకుల ఉత్పత్తి వ్యవస్థ కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినదే కాదు..సరకుల ఉత్పత్తి విడిగా ఒంటరిగా వుండదు. సందర్భాన్నిబట్టి- పెట్టుబడి దారీ విధానంలోనా, సోషలిజంలోనా అని దాన్ని చూడాలి. పెట్టుబడిదారీ సందర్భంలో అది పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి వ్యవస్థ గాను, సోషలిస్ట్ సందర్భంలో అది సోషలిస్ట్ ఉత్పత్తి వ్యవస్థగాను వుంటుంది. నిజానికి సరుకుల ఉత్పత్తి ప్రాచీనకాలం నుంచీ వుంటూ వచ్చింది”-అని మావో అంటారు. సరకుల ఉత్పత్తి వ్యవస్థ అంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థేనని నిర్దారించటానికి వీల్లేదని, దాని చారిత్రిక పూర్వ రంగాన్ని గుర్తు చేస్తారు మావో.

రష్యాలో సోషలిజం నిర్మాణ అనుభవాలతో “రాజకీయ ఆర్థిక శాస్త్రం  పాఠ్యపుస్తకం” ఒకటి రష్యాలో ప్రచురించబడింది. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్‌ ఆర్థిక వేత్తల బృందం దాన్ని రూపొందించింది. దాన్ని సమీక్షిస్తూ మావో ఒక “రీడింగ్‌ నోట్స్‌”ని రచించారు. 1961-62లో రచించిన, 1969లో వెలుగుచూ సిన ఈ సమీక్షలో కూడా పైన పేర్కొన్న అవగాహనే వుంది. రష్యాతో విభేదిస్తూనే, కొన్ని ఆర్థిక నియమాలను గుర్తిస్తూ మావో రచించారు. ఇవన్నీ మావో ఆలోచనావిధానంలో భాగంగా, మార్క్సిజం-లెనినిజం కొనసాగింపుగా అధ్యయనం చేయాల్సినవే. మావో తనజీవితకాలమంతటా నమ్మి, వివ రించిన పై సిధ్ధాంతాల్ని ‘సాంస్కృతికవిప్లవ’ (1966 తర్వాత)  కాలంలో పక్కనపెట్టి, అతివాదమార్గం పట్టారు. డెంగ్ ని పెట్టు బడిదారీ మార్గీ యుడని నిందించి, తొలగించారు. రష్యాలో స్టాలిన్ తర్వాత జరిగిన తప్పుల్ని నివారించాలనే ఆదుర్దాతో అలా చేసారు. 

 ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, ‘సోషలిస్టు నిర్మాణ‘ సిధ్ధాంతాల్ని అభివృధ్ధి చేసిన డెంగ్ 

కానీ అనతికాలంలో తన అతివాద తప్పుని గ్రహించి,1973లోనే  డెంగ్ ని మళ్లీ పిలిచి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పూర్తి బాధ్యతల్ని పునరుధ్ధరించారు. ఈ వాస్తవాల్ని చూడానిరాకరించే పిడివాదులు కొందరు మావోపేరిట డెంగ్ ని తిట్టిపోస్తుంటారు. వారికి ఒక దశలోని మావోయే వేదం, డెంగ్ విషం!   

‌ పై ప్రాతిపదికనే డెంగ్ వివరించి, విస్తరించి,’సోషలిస్టు మార్కెటు ఆర్థికవ్యవస్థను ప్రతిపాదించి, అమలు చేసి, ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, చైనాని అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో బూర్జువా లిబరలైజేషన్ ని వ్యతిరేకించే  ఉద్యమాన్ని నడిపించారు; అలాంటి ధోరణులపట్ల మెతకగా ఉన్న ఇద్దరు (హు యావో బాంగ్‌, ఝావో జియాంగ్‌) నాయకులు ప్రధాన కార్యదర్శి పదవినుంచే – డెంగ్‌ మార్గదర్శకత్వంలోనే – తొలగించబడ్డారు. దేశం మొత్తం విధిగా పాటించాల్సిన సూత్రాలను డెంగ్‌ నొక్కిచెప్పి, తమ పార్టీ మౌలిక సిద్ధాంతంలో భాగం చేసారు: సోషలిస్టు మార్గం, జనతాప్రజాతంత్ర నియంతృత్వం, పార్టీ, మాలెమా సిద్ధాంతం – వీటి నాయకత్వ పాత్ర -ఈ ‘నాల్గు మౌలిక సూత్రాల’కి (Four Cardinal Principles)  లోబడిమాత్రమే ఏ సంస్కరణలైనా సాగాల్సి ఉంటుంద’ని నిర్ణయించారు. రష్యాలో గోర్బచేవ్‌ నేతృత్వంలోని సంస్కరణలు పట్టాలు తప్పి, సోవియట్‌ పతనానికి దారితీసాయి; కాగా చైనా గ్లోబలైజేషన్‌ తుఫాన్లనీ,2008 ఆర్థిక సంక్షోభాన్నీ, కోవిడ్ మహమ్మారి పర్యవసానాల్నీ తట్టుకొని ముందుకు సాగుతున్నది.”సోషలిస్ట్ యుగంలో మనం సరకుల వ్యవస్థని సంపూర్ణ వికనన దశవరకూ అభివృద్ధి చేయాలి..యుద్దాన్ని దశాబ్దాల పాటు సాగించాం…తైవాన్‌ విముక్తి కోసం ఇప్పటికీ ఓపిగ్గా ఎదురు చూస్తున్నాం…అలాగే సోషలిజం పరిణతి కోసమూ ఎదురు చూడాల్సి వస్తుంది. మరీ త్వరగా విజయాలు వచ్చేస్తాయని ఆశించవద్దు”  అంటారు మావో. చైనాలో సోషలిజం అంతిమవిజయానికి ‘వెయ్యేళ్లయినా పట్ట వచ్చు, ఇది సుదీర్ఘ ప్రయాణం’ అన్నా రు (1950లలొ) ఒక సందర్భంలో. చైనాలో సోషలిజం ప్రాథమిక దశలోనే వుంది అని డెంగ్‌ సూత్రీకరించింది ఈ అవగాహనతోనే. 

తొమ్మిది కోట్లమంది కమ్యూనిస్టు సభ్యులూ, మూడుతరాల శ్రేణులూ నాయకుల అవిఛ్చిన్న, పటిష్ట నేతృత్వంలో చైనా తనదైన స్వతంత్ర, సోషలిస్టు అభివృద్ధిపధంలో ముందుకు సాగుతున్నది.  ఎవరో కొద్దిమంది  తూలనాడితే, చైనాకి పోయేదేమీ లేదు; ఆ పిడివాదం మనకే నష్టదాయకం. మనదేశంలో ఏం చేయాలి, ఎలా ఉద్యమాల్ని ముందుకు తీసుకువెళ్లాలి అన్నది మనకి ముఖ్యం. చైనాపార్టీ 20వ మహాసభను కీలకమైనదిగా భావించి, ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నది. ఆ సందర్భంగా పై అవగాహన అవసరం. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒక చంకలో భారత్‌ మరొక చంకలో పాకిస్తాన్‌ అంటున్న అమెరికా ! ఎవరి సంతుష్టీకరణకు జైశంకర్‌ విమర్శలు !!

02 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, S Jaishankar, US- Pakistan F-16s deal


ఎం కోటేశ్వరరావు


ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గాను పాకిస్తాన్‌ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ద విమానాలను మెరుగుపరుస్తున్నట్లు అమెరికా చెబితే నమ్మేంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. అది నిజమే ! అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 25 ఆదివారం నాడు వాషింగ్టన్‌ నగరంలో భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గౌతముడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమై బుద్ధుడిగా మారినట్లు చెప్పే అంశం తెలిసిందే. అమెరికా గురించి జైశంకర్‌ లేదా మన పాలకులకు ఎప్పుడు, ఎలా జ్ఞానోదయమైందో తెలుసుకొనే హక్కు దేశపౌరులందరికీ ఉంది. నిజంగా బుద్ది వికసించిందా లేక ప్రశ్నించేవారిని, అమెరికా వైఖరిని బహిరంగంగా సమర్ధించలేని కాషాయ దళాలను సంతుష్టీకరించేందుకు,ప్రచార అవసరార్ధం అలా మాట్లాడారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆ మరుసటి రోజే అదే అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలసి ఉమ్మడిగా విలేకర్ల సమావేశంలో భద్రతా అంశాలకు సంబంధించి అమెరికా ఎంతగానో అంతర్జాతీయ వైఖరితో వ్యవహరిస్తోందని అదే నోటితో జై శంకర్‌ ప్రశంసలు కురిపించటం ఎవరిని వెంగళప్పలను గావించేందుకు ?


అమెరికా-ఇరాన్‌ మధ్య తలెత్తిన వివాదంలో మన మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేయవద్దని బెదిరిస్తే అమెరికాను సంతుష్టీకరించేందుకు చిత్తం అని నిలిపివేసిన మన పాలకుల ధైర్య, సాహసాలు తెలిసినవే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి మన దేశంలో ఉన్న తిబలాజీ పెట్రోకెమ్‌ అనే పెట్రోకెమికల్‌ కంపెనీ లావాదేవీల మీద అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది.ఈ కంపెనీ వివిధ దేశాలతో ఉన్న కంపెనీలతో సమన్వయం చేసుకొని ఇరాన్‌ చమురు, ఇతర ఉత్పత్తులతో లావాదేవీలు నిర్వహిస్తున్నది.ఇరాన్‌ నుంచి పెట్రోకెమికల్స్‌ను తెచ్చి వాటిని ట్రిలియన్స్‌ అనే మరో కంపెనీ ద్వారా చైనాకు సరఫరా చేస్తున్న కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అసలు ఇరాన్‌ మీద ఏకపక్ష ఆంక్షలు విధించటమే తప్పు, వాటికి ఐరాస ఆమోదం లేదు. భాగస్వామ్యం, స్నేహం పేరుతో అమెరికా పాటలకు నృత్యం చేసేందుకు మనం అంగీకరించి ఇరాన్నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాము. ఇప్పుడు దాని కొనసాగింపుగా అది మన దేశంలోని కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఎవరో మనల్ని అదుపు చేయటం ఏమిటి, డామిట్‌ ! మనమే అందరినీ అదుపుచేసే స్థితిలో ఉన్నామని చెప్పుకొనే గిరీశాలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇలా అమెరికా ఆంక్షలకు తలొగ్గితే విదేశాల నుంచి మన దగ్గరకు రావాలనుకొంటున్న కంపెనీలు వస్తాయా ? దేశంలో ఉన్న కంపెనీలు అమెరికా గీచిన గీతల్లోనే నడిచేందుకు పెట్టుబడులు పెడతాయా ?


ఇక మంత్రి జైశంకర్‌ విమర్శలకు సంబంధించిన అంశాన్ని చూద్దాం. నలభై ఐదు కోట్ల డాలర్ల విలువ గల ఎఫ్‌-16 విమానాలకు అవసరమైన మెరుగుదల, పరికరాలకు సంబంధించి అమెరికా-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్‌ సభలో దీనికి సంబంధించిన ప్రశ్నకు జైశంకర్‌ బదులిస్తూ చివరకు ఒకరోజు ఎవరైనా వచ్చి ఉగ్రవాద నిరోధం కోసమే ఇదంతా అని చెబుతారు, మీరు చెబుతున్నది ఎఫ్‌-16 విమానం గురించి కనుక, వాటిని ఎక్కడ మోహరిస్తారో, వాటి ఉపయోగం, సామర్ధ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి మాటలు చెప్పటం ద్వారా మీరు(అమెరికా) ఎవరినీ వెంగళప్పలను చేయలేరు.” అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ పూర్వపు సోవియట్‌ తరువాత రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా 1965 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మన దేశానికి అమెరికా ఎలాంటి మిలిటరీ పరికరాలను విక్రయించలేదని, దీనికి రెండు వైపుల నుంచి కారణాలున్నాయని, అణుఒప్పందంతో ఈ పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు మనం అనేక అమెరికా విమానాలు, హెలికాప్టర్లను వాడుతున్నామని, రెండు దేశాల సంబంధాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.


భారత్‌ – పాక్‌లతో సంబంధాల అంశంలో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని, దేనికదేనంటూ రెండు దేశాలూ తమకు కావలసినవే అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పాడు. రెండింటితో అవసరాలు వేర్వేరన్నాడు. తమ గడ్డ మీద ఉగ్రవాద నిరోధానికి కృషి చేయటం లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో పాకిస్తాన్‌కు సాయం నిలిపినట్లు ప్రకటించిన తరువాత ఇప్పుడు ఉగ్రవాద నిరోధానికి అనే సాకుతో బైడెన్‌ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు ఏమిటో చెప్పటం లేదు. తాము ఇప్పుడు చేస్తున్న సాయంతో ఇప్పటికే పాక్‌ వద్ద ఎనభైకి పైగా ఉన్న ఎఫ్‌-16 విమానాలు లేదా వాటి ఆయుధ సామర్ధ్యం పెంచటం లేదని మనలను నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. ఇవి యుద్ధాలకు తప్ప ఉగ్రవాదుల నిరోధానికి పనికి వచ్చేవి కాదు. 2019లో బాలకోట్‌ దాడుల తరువాత పాకిస్తాన్‌ వాటిని మన దేశం మీద మోహరించింది. ఒక విమానాన్ని మన దళం కూల్చివేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విమానాల ద్వారా మాత్రమే సంధించే ఆధునిక క్షిపణి శకలాలను తరువాత మన మిలిటరీ ప్రదర్శించింది.


ఈ ఉదంతాల తరువాత ఈ ఏడాది జరిగిన ఒక సంఘటనకు తాజా ఒప్పందానికి సంబంధం ఉందా అన్నదాన్ని కూడా చూడాల్సి ఉంది.2022 మార్చి 9న మన దేశం రష్యా భాగస్వామ్యంతో రూపొందించిన బ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని వదిలింది. అది నలభైవేల అడుగుల ఎత్తులో 124 కిలోమీటర్లు వెళ్లి పాకిస్తాన్‌లోని చన్ను అనే పట్ణణ సమీపంలో పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాని గురించి పాకిస్తాన్‌ వెల్లడించిన తరువాతనే మన దేశం స్పందించి సాంకేతిక లోపంతో వచ్చి మీ గడ్డమీద పడిందని చెప్పింది.తరువాత మరొక ప్రకటనలో మానవ తప్పిదమని పేర్కొన్నది. ఆరునెలల తరువాత ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీన్ని అంగీకరించని పాకిస్తాన్‌ ఈ ఉదంతం మీద ఉమ్మడి విచారణ జరపాలని ఇది అనధికారికంగా వదిలినదా నిజంగా తప్పిదమా అన్నది తేల్చాలని కోరుతోంది.


అమెరికా తన వ్యూహంలో మన దేశాన్ని ఇరికించేందుకు 1947 నుంచి చూస్తున్నది. చైనాను దెబ్బతీసేందుకు బలమైన సాధనంగా మన దేశం, పశ్చిమాసియాలో తన ఎత్తుగడల అమలుకు పాకిస్తాన్‌ పనికి వస్తుందన్నది దాని అంచనా. అందుకోసం రెండు దేశాలనూ చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు చూసింది. ఇప్పుడు కూడా వేర్వేరు అంశాలతో అవసరం ఉందని చెప్పటం దానిలో భాగమే. పాక్‌ భుజం మీద తుపాకి పెట్టి మనలను లొంగదీసుకోవాలని చూసింది. కాశ్మీరు ఆక్రమణకు పాక్‌ను ప్రోత్సహించటం, తరువాత ఉగ్రవాదులను మన మీదకు వదలటం, కాశ్మీరులో చిచ్చు ఇవన్నీ దానిలో భాగమే. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా పధకాలకు పాకిస్తాన్‌ ప్రధాన సాధనంగా తాలిబాన్ల సృష్టి, శిక్షణకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. మన పాలకవర్గం తనకు ప్రయోజనం కలిగించే విదేశీ, స్వదేశీ విధానాలకే ప్రాధాన్యత ఇవ్వటం, స్వంతంగా తాము కూడా ఎదిగేందుకు సోవియట్‌తో సంబంధాలే మెరుగు అని భావించిన కారణంగానే అది ఉనికిలో ఉన్నంత వరకు అమెరికాకు అవకాశం దొరకలేదు. దాని పతనం తరువాత అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉంటూ లబ్ది పొందవచ్చని భావించటం, మరొక మార్గం లేకపోవటంతో ఆవైపు మొగ్గింది. ఎప్పుడైతే ఇది జరిగిందో తనకు కావాల్సిన భారత్‌ దొరికిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలను కొనసాగిస్తూనే మన దేశంలో ఉన్న పాక్‌ వ్యతిరేకతను గమనంలో ఉంచుకొని తన ఎత్తుగడలను మార్చుకుంది. మనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నమ్మించేందుకు చూసింది.

ఎప్పుడైతే మనతో సంబంధాలను బలపరచుకుంటున్నదో ప్రచ్చన్న యుద్దసమయంలో మన పాలకవర్గం అనుసరించిన ఎత్తుగడను తరువాత పాక్‌ అనుసరిస్తున్నది. అమెరికాను వ్యతిరేకించే చైనాకు దగ్గర కావటం దానిలో భాగమే. చైనాకు పాకిస్తాన్‌ అవసరం ఉంది కనుక వచ్చిన అవకావశాన్ని అది అందిపుచ్చుకుంది. ఇది కొత్త పరిణామాలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు తన అవసరాలకు భారత్‌ – పాకిస్తాన్‌ రెండూ అవసరమే గనుక, మన దేశం తమ బంధం నుంచి తప్పుకొనే అవకాశాలు లేకుండా బిగింపు పూర్తైనట్లు భావిస్తున్న కారణంగా, అంతర్జాతీయ అవసరాల రీత్యా అమెరికా ఇప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి తన సాయాన్ని అందిస్తున్నది. నిజానికి దాన్ని ఎన్నడూ వదలిపెట్టలేదు. 1970దశకంలో చైనాతో సంబంధాలు పెట్టుకొనేందుకు అమెరికన్లు పాకిస్తాన్‌ ద్వారానే కథ నడిపించారన్నది తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ను పటిష్టపరచటాన్ని ఎలా చూడాలి. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థం పేరుతో తమ కూటమిలో చేరనందుకు గుర్రుగా ఉన్న అమెరికా దాన్నే గనుక కొనసాగిస్తే మీ ఇష్టం అని పరోక్షంగా హెచ్చరించటం కూడా కావచ్చు. నరేంద్రమోడీ దాన్ని తట్టుకొని నిలబడగలరా ? ఇది మన దేశం మీద మాత్రమే వత్తిడి అనుకుంటే పొరపాటు, పాకిస్తాన్‌పై చైనా ప్రభావం పెరగకుండా చూసుకోవటం కూడా దీని వెనుక దాగి ఉంది.అమెరికా తన ప్రయోజనాలకే ఎల్లవేళలా పెద్ద పీటవేస్తుంది అని మరచిపోరాదు. ముందే చెప్పినట్లు అటు అమెరికా ఇటు చైనా మద్దతు, సాయం పొందేందుకు పాక్‌ పాలకవర్గం చూస్తున్నది.
ఎఫ్‌-16 విమానాలను ఉగ్రవాద నిరోధం కోసం అని అమెరికా ఎందుకు చెబుతున్నది ? టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాల్లో ఉన్న కర్దులు తాము నివసించే ప్రాంతాలతో కర్దిస్తాన్‌ ఏర్పాటు కోరుతూ దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నారు. వారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచేందుకు టర్కీ ఎఫ్‌ -16 యుద్ధ విమానాలతో వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదులపై దాడులకు వాటిని మోహరించలేదు. పాకిస్తాన్‌కు చేస్తున్న సాయాన్ని సమర్ధించుకొనేందుకు చెబుతున్నసాకు తప్ప మరొకటి కాదు. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను అణచేపేరుతో తిష్టవేసిన అమెరికా వాటిని వినియోగించిన దాఖల్లాలేవు. అమెరికా మనకు ఎఫ్‌ – 16 విమానాలు అమ్మితే పాక్‌ వైపు నుంచి కూడా జై శంకర్‌ మాదిరి స్పందనే వస్తుంది. మనం కూడా ఉగ్రవాదుల అణచివేతకే అని చెప్పగలమా ?


మన పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారనే ప్రశ్న సహజంగానే తన మద్దతుదార్ల నుంచే నరేంద్రమోడీ సర్కార్‌కు ఎదురౌతుంది. పాకిస్తాన్‌ మీద విద్వేష ప్రచారంలో తలమునకలైన కాషాయదళాలు ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.బహుశా వారి కోసం జైశంకర్‌ గట్టిగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఎవరి అవసరం వారిది. అమెరికా మనకు మరింత దగ్గర అవుతుందని చంకలు కొట్టుకొనే వారి గాలి తీస్తూ అమెరికా ప్రతినిధి మాత్రం రెండు దేశాలు తమకు సమానమనే చెప్పారు తప్ప మనవైపు మొగ్గుచూపలేదు. గతంలో మనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భావించిన పాకిస్తాన్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేందుకు ఎఫ్‌-16 విమానాల మెరుగుదలకు అంగీకరించటం, ఇద్దరూ సమానమే అని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా వెనుదిరిగినప్పటికీ అమెరికా దాన్ని పూర్తిగా వదులుకోదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అందుకు నిఘా సమాచారంతో సహా అన్ని రకాలుగా పాకిస్తాన్‌ అవసరం ఉంది. ఒసామా బిన్‌ లాడెన్‌ తరువాత ఆల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ నేతగా ఉన్న అల్‌ జవాహిరీని ఈ ఏడాది జూలై 31న ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్‌ ద్వారా అమెరికా మట్టుపెట్టింది. ఇది పాకిస్తాన్‌ సాయంతోనే జరిగిందని అందరూ నమ్ముతున్నారు.


అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఎలాంటి శషభిషలు లేకుండా సరళంగా సూటిగా చెప్పాడు. భారత్‌-పాకిస్తాన్లతో భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన ప్రయోజనాలున్నట్లు చెప్పటమంటే రెండు దేశాలను ఎక్కడ ఎలా అవసరమైతే అక్కడ అలా ఉపయోగించుకుంటామని చెప్పటమే. గతంలో పాకిస్తాన్‌ అలా ఉపయోగపడిన చరిత్ర ఉంది. మన దేశాన్నీ అదే బాటలో నడిపిస్తారా ? ఐరోపాలో హంగరీ నాటో సభ్య దేశం. ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఇతర ధనిక దేశాలు విధించిన ఆంక్షలను అది కూడా సమర్ధించింది. తీరా అవి తమ మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపించటంతో ఈ ఏడాది ఆఖరు నాటికి ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఐరోపా అడగాల్సిన తరుణం వచ్చిందని ఆ దేశ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ పార్లమెంటులో చెప్పాడు. అమెరికా చమురు కంపెనీలు ఈ యుద్ధంతో లాభాలు పొందుతున్నాయని విమర్శించాడు.రష్యాపై ఆంక్షలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు. మరోవైపున ఈ సంక్షోభం కారణంగా రష్యా నుంచి చౌక ధరలకు చమురును తెచ్చుకుంటున్న మన (దేశం) నరేంద్రమోడీ సామరకండ్‌ షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో ఇది యుద్దాల యుగం కాదంటూ పుతిన్‌కు చెప్పి అమెరికాను సంతుష్టీకరించేందుకు తెరతీశారు. ఆరునెలల్లో వారు వీరవుతారు అంటే ఇదేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నేత షీ జింపింగ్‌ నిర్బంధం వార్త : మీడియాను వెర్రి వెంగళప్పలను చేసిన ఫాలున్‌ గాంగ్‌ మహిళ !

28 Wednesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, cia, Coup Attempt in China, fake stories in media, Falun Gong, Jennifer Zeng, Propaganda War, RSS Duplicity, saffron trolls lies- facts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనా నేత షీ జింపింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు, అధికారాలన్నీ లాగేసుకున్నారంటూ మన దేశంలోని కొన్ని మీడిియా సంస్థలు, సామాజిక మాధ్యమంలోని కాషాయ మరుగుజ్జులు (ట్రోల్స్‌), వారిని గుడ్డిగా నమ్మే వారు చేసిన ప్రచారం వామపక్ష శ్రేణుల్లో అనేక మందిని గందరగోళానికి గురిచేసింది. ఈ వార్తలను చూసి అనేక మంది కమ్యూనిస్టు అభిమానులు ఆందోళన చెందారు. చైనా వ్యతిరేకులైతే ఇంకే ముంది జింపింగ్‌ శకం ముగిసింది, చైనా పతనం మన దేశానికి శుభసూచకం అంటూ సంబరపడ్డారు.సామాజిక, సంప్రదాయ మీడియా సంస్థలలో ఉన్న అలాంటి వారంతా వండి, వార్చి, వడ్డించిన దాన్ని తిన్నవారు పండగ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఉత్తిదే అని తేలటంతో వారంతా మానసికంగా తీవ్రంగా గాయపడ్డారు. అసలీ వదంతి ఎలా పుట్టింది, మన దేశంలోని వారు వాటిని ఎందుకు భుజాన వేసుకున్నారు, వారి మానసిక స్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా ముందుకు వచ్చింది. వాట్సప్‌ పండితులు వండి వారుస్తున్న కుహనా వార్తలను ప్రధాన స్రవంతి మీడియా జనాలకు అందించటం ఒక ప్రధాన పరిణామంగా ఉన్నట్లు గత కొంత కాలంగా తెలుస్తున్నప్పటికీ ఈ ఉదంతం మరింతగా నిర్ధారించింది.


అసలే కోతి, దానికి పిచ్చి ఎక్కింది, దొరికిన కల్లుతాగింది,ఆపై నిప్పు తొక్కింది అన్న కథ తెలిసిందే. కొంత మందికి చైనా అంటే అసలే ద్వేషం, అందునా అక్కడి సోషలిస్టు వ్యవస్థ, కమ్యూనిస్టు పార్టీ అంటే పిచ్చి ఎక్కినట్లుంటుంది. గాల్వన్‌ ఉదంతంతో మానసికంగా చికిత్సలేని వ్యాధికి గురైన వారికి అధ్యక్షుడు షీ జింపింగ్‌ గృహ నిర్బంధం, పదవి నుంచి తొలగింపు వార్తలంటే స్టెరాయిడ్స్‌ వంటివి. ఇంకేముంది అలాంటి వారంతా రెచ్చిపో యారు. ఇంతకీ వారికి వాటిని ఇచ్చిందెవరో తెలుసా ? ఉల్లాసయువతుల( ఛీర్‌ గరల్స్‌ ) పెద్దక్క లేదా అమెరికా సిఐఏ ఒళ్లో కూర్చుని చెప్పమన్న కబుర్లు చెప్పే జెన్నిఫర్‌ జెంగ్‌ అనే మహిళ.ఆమె చైనాలో అసంతృప్తవాదిగా మారి అమెరికా చేరుకొని అక్కడి నుంచి పుంఖాను పుంఖాలుగా విషం చిమ్ముతోంది.ఆమెతో సహా అనేక మంది ఫాలున్‌ గాంగ్‌ (ధర్మ చక్రం ) పేరుతో ధ్యానంతో కొన్ని క్రీడలను ప్రచారం చేస్తున్నామనే పేరుతో తలెత్తిన కమ్యూనిస్టు వ్యతిరేక ముఠా. చైనా ప్రభుత్వం తొలుత వారిని ఉపేక్షించినప్పటికీ వారి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించిన తరువాత కత్తెర వేసింది. దాని నేతతో సహా అందరూ ఇప్పుడు అమెరికాలో కొలువుదీరారు. వారి చెత్తను ప్రచారం చేసేందుకు ఎపోచ్‌ టైమ్స్‌ అనే ఒక పత్రికను కూడా సిఐఏ ఏర్పాటు చేసింది. అదిగాక ఇతర పత్రికల్లో కూడా రాస్తుంటారు, స్వంతంగా దుకాణాలు కూడా తెరిచారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు సరేసరి. వారు సముద్రం ఉందన్న చోట ఎడారి తప్ప నీటి చుక్క కనిపించదు.


దేశభక్తి గురించి మన జనానికి ఎవరూ కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో తమ మాన ప్రాణాలను,సంపదలను తృణ ప్రాయంగా అర్పించిన వారు వేగుచుక్కలా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అలాంటి వారు ఒక వైపు ఉంటే అసలు ఉద్యమంతో ఎలాంటి సంబంధాలు లేని, బ్రిటీష్‌ వారికి లొంగి ప్రేమలేఖలు రాసి తెరవెనుక పడి ఉంటామని చెప్పిన వారి వారసులు ఇప్పుడు జనాలకు దేశభక్తి గురించి బోధలు చేస్తున్నారు. వారికైనా ఎవరికైనా దేశభక్తి గురించి చెప్పే అర్హత లేదని ఎవరూ అనటం లేదు. అసలైన దేశభక్తులం మేమే, మేము చెప్పేదే సిసలైన దేశభక్తి అంటున్నందునే కాదన్నవారిది దేశద్రోహం అన్న దగ్గరే సమస్య మొదలౌతున్నది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి.చైనాతో సరిహద్దు వివాదానికి బ్రిటీష్‌ వారు కారకులు, కాశ్మీరు సమస్యకు అమెరికా,బ్రిటన్‌, వారికి మద్దతు ఇస్తున్నదేశాలు బాధ్యులు. వాటి పరిష్కారం కంటే ఆ దేశాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని, వ్యతిరేకతను నూరిపోయటం, దాన్ని బుర్రల నిండా ఎక్కించుకోవటమే దేశభక్తి అని చెబుతున్నారు. తప్పన్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు.ఉచ్చగుంటల్లో చేపలు పట్టేవారి మాదిరి సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగితే ఆ పేరుతో ఓట్లు దండుకోవచ్చని చూస్తున్నారు. పరిష్కారానికి పూనుకోవటం లేదు.


పశ్చిమ దేశాల్లో కూడా జనాలను చైనా వ్యతిరేక వార్తలతో అలరించినప్పటికీ మన దేశంలో మాదిరి జనాల్లో విద్వేషాన్ని ఎక్కించలేదు. రెండవది గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లుగా ఫాలున్‌ గాంగ్‌ చెప్పే కబుర్ల బండారం ఏమిటో మనకంటే ఎక్కువగా వారికి తెలిసి ఉండటం కూడా షి జింపింగ్‌పై పుకార్ల గురించి సంయమనం పాటించటానికి కారణంగా కనిపిస్తున్నది. కాషాయ దళాలు ఒక పధకం ప్రకారం వివిధ సంస్థల్లోకి తమ భావజాలం ఉన్నవారిని పంపటమే గాక వాట్సాప్‌ ఉన్నవారి బుర్రలను చాలావరకు ఖరాబు చేశాయి. పిచ్చి మొక్కలు మొలిచేందుకు అనువైన వాతావరణం ఉంది గనుక షీ జింపింగ్‌ నిర్బంధం అనగానే దున్నఈనిందంటే దూడను కట్టివేయమన్నట్లుగా తాము అనుకుంటున్నదీ లేదా కోరుకుంటున్నది జరిగింది అనగానే వెనుకా ముందూ చూడకుండా ఎలాంటి నిర్ధారణలకు పూనుకోకుండా మీడియాలో ఉన్నవారు రెచ్చిపోయారు. తామే కాదు, తమ వార్తలను గుడ్డిగా నమ్మేవారిని కూడా వెర్రి వెంగళప్పలుగా మార్చివేశారు. ఇప్పటికే మీడియా సంస్థలు విశ్వసనీయత సమస్యలను ఎదుర్కొంటుండగా తాజా వార్తను పతాక శీర్షికలకు ఎక్కించి మరింత ప్రశ్నార్ధకంగా మార్చివేశారు,ప్రతిష్టను దిగజార్చారు.


ప్రపంచంలో కొందరు ప్రధానులు, అధ్యక్షుల మాదిరి కొత్త చొక్కాలు వేసుకొని ప్రతిరోజూ కెమెరాల ముందు చైనా నేతలు ఎప్పుడూ నిలవలేదు. ప్రతి రోజూ టీవీల్లో ఫోజులు కొట్టరు. షి జింపింగ్‌ కూడా అంతే. సామరకండ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చిన తరువాత కరోన జాగ్రత్తల్లో భాగంగా కొద్ది రోజులు కనిపించలేదు. అదే సమయంలో కొందరు ప్రముఖ మాజీల మీద చర్యలు తీసుకున్నట్లు వార్తలు రావటం.ఆరుగురు మాజీ మంత్రులు లేదా ఉన్నతాధికారుల అవినీతి రుజువు కావటంతో ఇటీవలనే వారికి శిక్షలు వేశారు.వారు తిరుగుబాటుకు పూనుకున్నారని చిత్రించారు. గత కొద్ది నెలలుగా జింపింగ్‌ మీద కుట్ర, ప్రత్యర్ధులు సవాలు చేస్తున్నారు, జీరో కరోనా పేరుతో లాక్‌డౌన్లు విధించి జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప దేశ ఆర్ధిక వృద్ధి పట్టలేదు వంటి అంశాలతో కుట్ర విశ్లేషణలను ఒక పధకం ప్రకారం రాస్తున్నవారు ఇప్పుడు చెబితే జనం కచ్చితంగా నమ్ముతారు అంటూ ఏకంగా జింపింగ్‌ను నిర్బంధించారని సృష్టించారు. చైనా గురించి రాసే నిపుణుడిగా పేరున్న మనోజ్‌ కేవల్‌రమణి ఈ తప్పుడు వార్త గురించి చెబుతూ ” భారత మీడియా దాన్ని అందిపుచ్చుకొని పరుగెత్తుతూ దాన్ని టాంటాం వేసింది. ఒక్క తూటా కూడా పేలకుండా ఇలాంటిది జరిగే అవకాశం ఉందని అనుకోవటం విడ్డూరంగా ఉంది. బీజింగ్‌ ఉత్తర కొరియా కాదు, అక్కడ విదేశీ విలేకర్లు జీవిస్తున్నారు. భారత్‌లో చైనా వ్యతిరేకత విశేషంగా ఉంది. అది లడఖ్‌లో రెండు దేశాలు ఘర్షణ పడక ముందునుంచీ ఉంది ” అన్నారు. ” భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ఈ పుకార్లపై స్పందన వారు కోరుకుంటున్నదానికి ప్రతిబింబం, షీ జింపింగ్‌ను అరెస్టు చేశారు అన్న పుకారు షికారు చేసేందుకు కారణం బీజింగ్‌లో సున్నితమైన రాజకీయ కదలికలు ఉండటమే ” అని సింగపూర్‌లోని చైనా అంశాల నిపుణుడు డ్రా థాంప్సన్‌ చెప్పాడు. ” చైనా రాజకీయాలు బ్లాక్‌బాక్స్‌(విమానాల్లో జరిగేవాటిని రికార్డు చేసే ఒక పరికరం. విమానం మొత్తం ధ్వంసమైనా అది చెక్కుచెదరదు. దాన్ని విప్పిచూస్తే జరిగిందేమిటో తెలుస్తుంది) కంటే కఠినంగా ఉంటాయి . సామాజిక మాధ్యమంలోని పుకార్లను ధృవీకరించేందుకు ఈ రోజు బీజింగ్‌లో ఎలాంటి óఆధారం దొరకలేదు ” అని హిందూ పత్రిక బీజింగ్‌ విలేకరి అనంత కృష్ణన్‌ పేర్కొన్నారు.

శుక్రవారం(23వ తేదీ) ప్రారంభమైన వదంతులు శనివారం నాటికి పతాకస్థాయికి చేరాయి. అమెరికాలో ఫాలున్‌ గాంగ్‌ పేరుతో తిష్టవేసిన చైనా అసంతృప్త జీవులు, సిఐఏ కిరాయి మనుషులు సృష్టించిన ఈ పుకారును వారు నడిపే ఎన్‌టిడిటివి అనే మీడియా వదిలింది, దాన్ని ట్విటర్‌, యు ట్యూబ్‌లో ఆ ముఠావారే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దాన్ని మన దేశంలోని సామాజిక మాధ్యమంలోని చైనా వ్యతిరేకులు మరింత పెద్దగా వ్యాపింప చేశారు.చైనాలో ఈ ఏడాది లాక్‌డౌన్లు లేనపుడు మార్చి నెలలో రోజుకు ఆరువేల విమానాలు ఎగిరేవి, లాకడవున్ల కారణంగా తగ్గాయి .అలాంటిది బీజింగ్‌ గగనతల మీద రోజుకు 16వేలు ఎగురుతాయని వాటిలో తొమ్మిదివేలను రద్దు చేశారని ప్రచారం జరిగింది.చైనా నుంచి పారిపోయి జర్నలిస్టుగా చెప్పుకొనే ఝావో లాంజియాన్‌ అనే వాడు విమానాల రద్దు ఈ కథను అల్లాడు. ఆ మేరకు ఉపగ్రహాల చిత్రాలంటూ కొన్నింటిని చూపారు. అదంతా వట్టిదే అని తరువాత కొందరు స్పష్టం చేశారు. శనివారం నాడు అమెరికాలో స్థిరపడిన చైనా మహిళ జెన్నిఫర్‌ జెంగ్‌ ట్వీట్‌ చేస్తూ బీజింగ్‌ వైపుకు కదులుతున్న 80కిలోమీటర్ల పొడవైన మిలిటరీ దళాల బారు అంటూ ఒక వీడియోను జత చేసింది. సంచలనం కోసం ఎదురు చూసే మీడియా దున్న ఈనిన దూడను మనకు చూపెట్టింది. మన దేశంలో జరిగిన ప్రచారాన్ని చూసి బీజింగ్‌లో ఉన్న డెర్‌ స్పీగల్‌ అనే జర్మన్‌ పత్రిక విలేకరి జార్జి ఫారియన్‌ ఒక సైకిల్‌ రిక్షాలో కూర్చున్న ఒక మహిళ, తియనన్‌మెన్‌ మైదానం దగ్గర ఉన్న కొందరు సందర్శకుల చిత్రాలను పోస్టు చేస్తూ వాటి కింద ” ఆశ సన్నగిల్లుతున్నది, కుట్రదారుల అదనపు బలాలు సాయుధశకటాల్లో వచ్చాయని ” అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్‌ను కొన్ని టీవీ ఛానళ్లు మరోరకంగా చెప్పాయి. చైనా మిలిటరీ రకరకాల వేషాల్లో రూపంలో ఉంటుందన్నాయి .

అధికారాలన్నీ లాగేసుకొని వేరేవారికి అప్పగించారంటూ వచ్చిన ఆధారం లేని వార్తలను సరి చూసుకోకుండా రెచ్చిపోయిన వారు అది అవాస్తవం అని తేలిన తరువాత ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కొందరు తేలుకుట్టిన దొంగల మాదిరి నోరు మూసుకుంటే, కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ఉత్తిదే అని ప్రశ్నార్ధకమిచ్చిన వారు కొందరు. సిద్దాంతం పట్ల స్థిరత్వం లేని వారు, అవినీతి అక్రమాల పట్ల చూసీ చూడనట్లు ఉన్నవారు, ప్రధాన అంశాల మీద స్పష్టత లేని వారిని అక్టోబరు 16 నుంచి జరగనున్న కమ్యూనిస్టు పార్టీ మహాసభకు ప్రతినిధులుగా ఎన్నుకోలేదని వార్తలు. ఈ సభకు ఎన్నికైన మొత్తం ప్రతినిధులు 2,296 కాగా వారిలో లడఖ్‌ సరిహద్దులలో పని చేస్తున్న 13 మందితో సహా పిఎల్‌ఏ పశ్చిమ కమాండ్‌కు చెందిన 30 మంది మిలిటరీ అధికారులు, ఇతర కమాండ్‌ల నుంచి మొత్తంగా మిలిటరీ నుంచి 304 మంది ఎన్నికైనట్లు వచ్చిన వార్తలు. పుకార్ల గురించి ప్రస్తావించకుండా చైనాలో ఎలాంటి పరిణామాలూ జరగలేదని అర్ధం వచ్చేలా వాటికి తెరదించుతూ షీ జింపింగ్‌ నేతృత్వంలోని పార్టీ మార్గదర్శకాల మేరకు ఎన్నికైన ప్రతినిధులందరూ పార్టీ మహాసభకు సిద్దమౌతున్నారంటూ కమ్యూనిస్టు పార్టీ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షాంఘై సహకార సంస్థ భేటీ : ఉక్రెయిన్‌పై చైనా వైఖరి కూడా మారితే మోడీతో షీ జింపింగ్‌ను కలిపి అమెరికా మీడియా ఎందుకు పొగడలేదు ?

21 Wednesday Sep 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, US Media, US Media Praises PM Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరమైన సామరకండ్‌లో 2022 సెప్టెంబరు 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశం జరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రాంతీయ కూటమి ఇది.యురేసియా (ఐరోపా-ఆసియా ఖండం) లోని 60శాతం విస్తీర్ణం, ప్రపంచ జనాభాలో 40శాతం, ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న కూటమి ఇది. తొలుత షాంఘై ఐదుగా పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం 27 దేశాలు, మూడు సంస్థలతో ఉంది.2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. సామరకండ్‌ సమావేశంలో ఇరాన్‌ పూర్తి సభ్య దేశంగా చేరింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రపంచ దేశాలను మాతో చేరతారా లేదా మేం చెప్పినట్లు చేస్తారా చస్తారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పూర్వరంగంలో దానికి భిన్నమైన పద్దతుల్లో అభివృద్ధి,ఆర్ధిక, సాంస్కృతిక సహకారం, సమానత్వం ప్రాతిపదికగా ఐరాస నిరంత అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎస్‌సిఓ సామరకండ్‌ ప్రకటన పునరుద్ఘాటించింది.


ఈ కూటమి ఒక దేశానికి లేదా నాటో వంటి మిలిటరీ కూటములకు వ్యతిరేకంగా ఏర్పడినది కాదు. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత దానిలోని పూర్వ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అవి చైనాతో కొత్త సరిహద్దులకు తెరలేపిన పూర్వరంగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, మిలిటరీల మధ్య సమన్వయం-విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు గాను చైనా చొరవతో ఏర్పడింది.ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలతో కొన్నింటికి విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అనేక ఖనిజాలకు కూడా ఈప్రాంతం పెట్టింది పేరు. మరోవైపు అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928 ఉన్నాయి. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ విధంగానూ ఏ దేశానికైనా అంత తేలిక కాదు.


ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల కారణంగా అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ దీన్ని భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా తీరు ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. పరిశీలక దేశాలుగా బెలారస్‌, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్‌ , చర్చల భాగస్వాములుగా టర్కీ, శ్రీలంక, కంపూచియా, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, నేపాల్‌ ఇప్పటికే ఉండగా 2023 నుంచి ఈజిప్టు, సౌదీ అరేబియా, కతార్‌లకు అదే స్థాయి కల్పించేందుకు అవగాహన కుదిరింది. ఈ జాబితాలో చేరేందుకు బహరైన్‌, మాల్దీవులు, కువైట్‌, ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌,మయన్మార్‌లను అంగీకరించారు. బెలారస్‌ శాశ్వత దేశహౌదా పొందనుంది. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ వివాదంలో ఒక వైపు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్‌, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్‌, బెలారస్‌ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో మన దేశం చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు.ఇదే దాని విజయ రహస్యం. ఈ దిశగా మరొక ముందడుగు అని చెప్పవచ్చు.


అజెండాలో సంచలనాత్మక లేదా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే విధంగా సామరకండ్‌ సమావేశంలో ఎలాంటి చర్చలూ, పరిణామాలు లేవు. కానీ ఈ సందర్భంగా వివిధ దేశాల నేతల మధ్య జరిగిన విడి విడి సమావేశాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా విశ్లేషణలు, భాష్యాలు వెలువడ్డాయి. ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్లు ఒక వార్త. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై భారత వైఖరిలో మార్పు వచ్చిందని, పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా దానితో జతకలిసే ఐరోపా పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక అమెరికా మంత్రులు, అధికారులు తమవైన శైలిలో మాట్లాడారు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌ నోట వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం తగినపని కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటానికి, కొత్తగా తంపులు పెట్టటానికి ఇది తగిన తరుణం కాదని నరేంద్రమోడీ ఎన్నడూ అమెరికా కూటమికి ఇంతవరకు చెప్పలేకపోయారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, దాని సెగ మన దేశానికి కూడా తాకింది. తన ప్రభుత్వానికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అది నిలిచిపోతే అంబానీకి వస్తున్న లాభాలకు గండిపడుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. అన్నింటినీ మించి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నందున ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. అయితే ఆ మాత్రం కూడా గత ఆరున్నర నెలలుగా మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని భారత్‌ కూడా తప్పు పట్టింది, మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా పాలకులకు వంతపాడే పత్రికలు చేసిన హడావుడి అది. ఇదే సమయంలో చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ కూటమిలో మోడీ చురుకుగా ఉన్నారు. తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులనుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక వారిని సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు.


ఇది ఒకటైతే చైనా అధినేత షీ జింపింగ్‌ ాపుతిన్‌ భేటీలో ఉక్రెయిన్లో జరుగుతున్నదాని గురించి జింపింగ్‌ ప్రశ్నించినట్లు, ఆందోళన వ్యక్తం చేసినట్లు, మద్దతుపై పునరాలోచనలో పడినట్లుగా కూడా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.” దీని గురించి షి జింపింగ్‌ ప్రశ్నలు, ఆందోళనను మేము అర్ధం చేసుకున్నాం, మా వైఖరిని కూడా వివరించామనుకోండి. దీని గురించి ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ మరింతగా వివరిస్తాం ” అని పుతినే చెప్పారు. వీటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ భాష్యం చెప్పవచ్చు. ఏ తీరులో మాట్లాడిందీ విన్నవారెవరూ లేరు. నిజంగా ప్రతికూలంగా చెప్పినా లేదా చైనా వైఖరిలో మార్పు ఉంటే అమెరికా మీడియాలో నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తినట్లుగా షి జింపింగ్‌ను పొగడలేదేం !


ఉక్రెయిన్‌ సంక్షోభ తీరు తెన్నులు, పూర్వరంగాన్ని చూసినపుడు ప్రపంచ భద్రతకు నూతన రూపకల్పన జరగాల్సిన అగత్యం కనిపిస్తున్నది. తనకు దక్కనిదాన్ని ఇతరులకూ దక్కనివ్వను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏర్పడిన ప్రపంచ వ్యవస్థలపట్ల సామ్రాజ్యవాదులు వ్యవహరిస్తున్నారు. తన నేతృత్వంలో ఏక ధృవ ప్రపంచాన్ని సృష్టించాలని అమెరికా చూస్తుంటే సర్వజన సంక్షేమం కోసం బహుధృవ ప్రపంచాన్ని రూపొందించాలని దాన్ని వ్యతిరేకించే శక్తులు చూస్తున్నాయి.ఐరాస నిబంధనల మేరకు పాలన సాగాలని కోరుకుంటున్న శక్తులే దాన్ని ఖాతరు చేయటం లేదు, పరస్పర సహకారం, అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ సంస్థలను ధనిక దేశాలు తమ వస్తువుల మార్కెట్ల కోసం వత్తిడి చేసే, బలహీన దేశాల మీద షరతులను రుద్దే అస్త్రాలుగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన వారే దాన్ని పక్కన పెట్టి మనం మనం విడిగా చూసుకుందామంటూ ద్విపక్ష వాణిజ్య ఒప్పందాలకు, ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. వాటి గత చరిత్రంతా అదే. వలస దేశాల ఆక్రమణ పోరులో ఎనభై సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్న స్పెయిన్‌-డచ్‌, 30 సంవత్సరాల జర్మన్‌ యుద్ధాలకు రాజీగా 1648లో అమల్లోకి వచ్చిన వెస్ట్‌ ఫాలియా శాంతి ఒప్పందాన్ని తొలి ప్రపంచ వ్యవస్థకు నాందిగా పరిగణిస్తారు. తరువాత ఐరోపాను ఆక్రమించుకొనేందుకు ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ ప్రారంభించిన దురాక్రమణలు, దానికి వ్యతిరేకంగా కట్టిన కూటముల మధ్య రెండు దశాబ్దాల పాటు సాగిన పోరు తరువాత 1815 వియన్నా ఒప్పందం జరిగింది. అది కూడా విఫలమై మొదటి ప్రపంచ యుద్దం తరువాత నానాజాతి సమితి ఏర్పాటు, దాన్ని తుంగలో తొక్కిన కారణంగా రెండవ ప్రపంచ యుద్దం పర్యవసానంగా ఐరాస ఏర్పడింది. ప్రత్యక్ష వలసలకు అవకాశం లేకపోవటంతో మార్కెట్ల ఆక్రమణ కోసం తీసుకు వచ్చిందే 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు గతం మాదిరి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మరో వ్యవస్థ ఏర్పాటు అంత తేలిక కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాను సంతుష్టీకరించిన నరేంద్రమోడీ ! అందుకే అక్కడి మీడియా పొగడ్తలా !!

18 Sunday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, Ukraine-Russia crisis, US Media Praises PM Modi, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికన్‌ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి వస్తే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వారిని కూడా ఆజానుబాహువులుగా వర్ణిస్తాయి.2022 సెప్టెంబరు 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లోని సామరకండ్‌ పట్టణంలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 2022 వార్షిక సమావేశాల్లో మన ప్రధాని నరేంద్రమోడీ-రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ విడిగా భేటీ అయ్యారు.


సదరు భేటీలో ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో చేప్పినట్లు మోడీ యంత్రాంగం వెల్లడించింది. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా పతాక శీర్షికలతో టాంటాం వేసింది. అమెరికా వెంట నడిచే ఐరోపా పత్రికల్లోనూ ఇదే జరిగింది. కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌నుంచి వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన చర్చలను అమెరికా, బ్రిటన్‌ అడ్డం గొట్టి తామిచ్చే అస్త్రాలతో పుతిన్‌ సేనలను ఓడించవచ్చని జెలెనెస్కీని వెనక్కు రప్పించిన సంగతి తెలిసిందే.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం భారత ప్రయోజనం కోసం కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, ఆ కారణంగా తన ప్రభుత్వం-జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎరిగినప్పటికీ పశ్చిమ దేశాల వైఖరిని మిత్రధోరణిలో కూడా ఇంతవరకు తప్పు పట్టలేదు. కాశ్మీరు సమస్యలో తనను మధ్యవర్తిత్వం వహించమని నరేంద్రమోడీ కోరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు కూడా మోడీ స్పందించలేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం చైనా మీద కత్తిగట్టి అమెరికాతో ఉండటం అమెరికా మీడియాకు సంతోషమే. ఆ వైఖరితో ఉన్నా కొన్ని సందర్భాల్లో మోడీని ఏకిపారవేసింది. మరికొన్ని సార్లు ఆకాశానికి ఎత్తింది.


” అవాక్కయ్యేలా దుస్సాహస నిర్ణయాలు, విపత్కర ఫలితాలనిస్తున్న ప్రజారోగ్య విధానం, నివారించదగిన మరణాలు, కరోనా నరకం, లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ” భారత్‌లో కరోనా నివారణ వైఫల్యంపై అమెరికా, ఐరోపా, ఇతర ప్రపంచ పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి.తమ నేత మోడీ మీద బురదజల్లే రాతలు తప్ప వాస్తవాలు కాదని బిజెపి వారు ఆరోపించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలను దాచిపెట్టిన తీరు, బాధ్యత లేకుండా కుంభమేళా వంటి వాటిని అనుమతించటం, పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, కరోనా మీద విజయం సాధించామని ప్రకటించటం, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు రాజధానిలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించటం, వారి మీద తప్పుడు ప్రచారం వంటి అనేక అంశాల మీద అంతర్జాతీయ మీడియాలో విమర్శలతో కూడిన సంపాదకీయాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. వాటిని ఖండించాలని ప్రపంచంలోని భారత దౌత్యవేత్తలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమర్శలు ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి వచ్చాయి తప్ప ఊరికే రాలేదు. ప్రధాని మోడీ మితిమీరిన విశ్వాసం అని గార్డియన్‌, భారత్‌ను రక్షించటానికంటే నరేంద్రమోడీ పేరును కాపాడేందుకు బాధ్యతా రహిత చర్యలకు పాల్పడినట్లు వాషింగ్టన్‌ పోస్టు, మహావిపత్తు పట్ల తాపీగా మోడీ ఉన్నారని ఎకానమిస్టు, ముందుచూపు లేమి, దురహంకారం, వాక్శూరత్వంతో మోడీ వ్యవహరించినట్లు లీమాండే, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు మహమ్మారికి సంబంధం కలిపినట్లు గ్లోబల్‌ టైమ్స్‌, జయధ్వాన ధ్యాసలో పడి తప్పుగా అర్ధం చేసుకోవటం తరువాత స్పందన లేకుండా ఉన్నట్లు కతార్‌ ట్రిబ్యూన్‌, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లేక రోగులు విలవిల్లాడుతుంటే పార్లమెంటు భవన పధకానికి ప్రాధాన్యన ఇచ్చిన అహంకారి, సిగ్గులేని వాక్శూరుడు మోడీ అని, గాంధీ, నెహ్రూ మాదిరి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని డైలీ మెయిల్‌ వంటి పత్రికలు విమర్శించాయి. పశ్చిమ దేశాల మీడియా ఏమిరాసిందనే దాని కంటే మన మీడియా రాయాల్సినవాటిని రాయటం లేదని, సంపాదక పేజీల్లో రాసిన వాటిని భారతీయులు చదవరనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా వారి మీద సునిశిత విమర్శలు చేసే ధోరణి పశ్చిమ దేశాల్లో ఉంది, అదే సమయంలో వారిని కాపాడేందుకు కూడా చూస్తాయి. మన దేశంలో మొదటిదాన్ని వదలి రెండోదానికే ప్రాధాన్యత ఇవ్వటంతో జనం సంపాదక పేజీలను భజన సరకుగా చూస్తున్నారు. అందుకే చదవటం లేదు.


మన దేశంలో 2016నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పెద్ద ప్రహసనమని వివేచనా శక్తి ఉన్నవారందరికీ తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని గొద్దెను కూడా పట్టలేదు. నల్లధనం వెలుపలికి రాకపోగా అది పూర్తిగా లెక్కల్లోని ధనంగా చెలామణిలోకి వచ్చింది. అవినీతి గురించి చెప్పనవసరం లేదు. విధిలేక మాట మార్చి ధనం మొత్తం లెక్కలోకి రావటమే గొప్ప ఘనతగా మోడీ భక్తులు భజన చేశారు. జనం ఎన్ని ఇబ్బందులు పడిందీ వారికి పట్టలేదు. ఏం రాస్తే ఏం మాట్లాడితే ఎటుబోయి ఎటువస్తుందో, ఏం జరుగుతుందో మనకెందుకు లెమ్మని మన మీడియా సంస్థలు వైఫల్యం లేదా విజయం గురించి చెప్పకుండా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి. నోట్ల రద్దు జరిగిన 50 రోజుల తరువాత దేశం బంగారం మాదిరి వెలిగిపోతుందని నరేంద్రమోడీ ఒక సభలో చెప్పారు. జనధన్‌ బాంకు ఖాతాల్లో ఎవరైనా వచ్చి రెండున్నర లక్షలు డిపాజిట్‌ చేసి ఆరునెలల తరువాత మాకు రెండు లక్షలు ఇచ్చి మిగతావి మీరు తీసుకోండి అని చెబితే అలా చేయవద్దు అని కూడా సెలవిచ్చారు. తన చర్య ఉగ్రవాదుల నడుం విరిచేస్తుందని అక్రమార్కులను అంతం చేస్తుందన్నారు.ఇంకా ఎన్నో చెప్పారనుకోండి.
ఇంతకీ జరిగిందేమిటి ? అసలు ఎంత కరెన్సీ తిరిగి వచ్చిందో, ఎంత నల్లధనం వెలికి వచ్చిందో ప్రకటించిన వారే లేరు. ఏమిటి అని అడిగితే ఇంకా లెక్కతేలలేదని చెప్పారు. నోట్లను లెక్కించుకోలేని అసమర్ధ స్థితిలో ఉన్నట్లు అంగీకరించారు. రెండు సంవత్సరాల తరువాత 2018లో 2017-18 సంవత్సర వార్షిక నివేదికలో లెక్కింపు పూర్తైనట్లు ఆర్‌బిఐ పేర్కొన్నది. 2016 నవంబరు ఎనిమిదిన 500, 1000 పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రు.17.74 లక్షల కోట్లు. రద్దుచేసిన నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు, బాంకులకు తిరిగి వచ్చిన నోట్ల విలువ రు. 15.31లక్షల కోట్లు, రాని సొమ్ము కేవలం రు.10,720 కోట్లు మాత్రమే. అంటే నల్లధనం విలువ ఇది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవటం తెలియని మామూలు జనాలెందరో తరువాత గొల్లుమన్నారు. ఇక రద్దు చేసిన వాటి బదులు కొత్త 500, 2,000 నోట్లు అచ్చేసేందుకు ప్రభుత్వానికి లేదా ఆర్‌బిఐకి ఐన ఖర్చు రు.12,927 కోట్లు, జనం ఇబ్బందులు, కొత్త నోట్ల కోసం వరసల్లో నిలిచి పోగొట్టుకున్న పనిదినాలు, వేతనాల నష్టం లెక్కించిన వారెవరూ లేరు. దాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి అయిన జిడ్డు ఆముదం ఖర్చు రు. 2,207 కోట్లు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేసినట్లు ?

ఈ మతిమాలిన పనిని ఐఎంఎఫ్‌, ఐరోపా సమాఖ్య, ప్రపంచబాంక్‌, ఇతర అనేక సంస్థలు, అమెరికా పత్రికలు పెద్ద ఎత్తున పొగిడాయి. ప్రపంచబాంక్‌ అధిపతి మరొక అడుగు ముందుకు వేసి తాను మోడీ అభిమానిని అన్నాడు. ఎంతో పెద్ద మొత్తంలో నగదును బాంకుల్లో జమ చేశారని ఫోర్బ్స్‌ పత్రిక, ఎంతో తెలివైన పని అని పేర్కొన్న ఇద్దరు నిపుణుల మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఉటంకించింది. విత్త నిపుణులు ఇదెంతో ధైర్యవంతం, దేశాన్ని మార్చి వేస్తుందని సెలవిచ్చారు. కొన్ని పత్రికలు భారత్‌లో 400 బిలియన్‌ డాలర్లమేర నల్లధనం ఉందని అదంతా వెలుపలికి వస్తుందని నమ్మబలికారు. ఆ వార్తలను తెలుసుకొని బహుశా నరేంద్రమోడీ కూడా నిజమే అని భ్రమించి ఉంటారు.

షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పుతిన్‌తో మాట్లాడుతూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అంబానీకి లాభం తగ్గుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. ఇప్పుడున్న వాటిని పూర్తిగా పక్కన పెట్టి అమెరికా అస్త్రాలతో మన మిలిటరీని నిర్వహించాలంటే మన జుట్టును దాని చేతికి అందించటమే కాదు, అంత సొమ్ము మన దగ్గర లేదు. అందువలన ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. ఆ మాత్రం కూడా ఇంతవరకు మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని నరేంద్రమోడీ కూడా తప్పు పట్టారు మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా చేసిన కసరత్తు అది. ఎవరు ఏమి చెప్పినా షాంఘై సహకార సంస్థలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికా బాధితులే. ఆ సంస్థలో చేరిన నరేంద్రమోడీ, చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో చురుకుగా ఉన్నారు. అందువలన తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులను సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు మన భూమి అప్పగించారంటున్న సుబ్రమణ్యస్వామి – బిజెపి వ్యూహాత్మక మౌనం ! నిజమేమిటి !!

15 Thursday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Gogra-Hot Springs, Ladakh border clash, Ladakh Pullback, Ladakh stand off, Narendra Modi Failures, Rahul gandhi, RSS, Shanghai Cooperation Organisation, Subramanian Swamy, winter palace

ఎం కోటేశ్వరరావు


” భారత్‌ తన ప్రాంతాన్ని కోల్పోయిందనే మాటల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ముగిసిన సేనల ఉపసంహరణ ” అనే శీర్షికతో డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక ఒక వార్తనిచ్చింది. ఇతర పత్రికలు కూడా వేరే శీర్షికలతో ఈ వార్తను ఇచ్చాయి. లడఖ్‌ సరిహద్దులోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ లేదా పెట్రోలింగ్‌ పాయింట్‌-15(పిపి15) ప్రాంతంతో పాటు పిపి-16 నుంచి రెండు వైపుల చైనా-భారత్‌ మిలిటరీని ఉపసంహరించుకున్నాయి. అంగీకృత ప్రాంతంలోని తాత్కాలిక కట్టడాలు, మిలిటరీ మౌలిక సదుపాయాలను తొలగించారా లేదా అని మిలిటరీ సంయుక్త బృందాలు ఈ మేరకు తనిఖీ పూర్తి చేసినట్లు వార్తలు రాగా అధికారికంగా మన దేశం నిర్ధారించలేదు. ఒప్పందం ప్రకారం రెండు పక్షాలు ఇప్పటి వరకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి సమానదూరం వెనక్కు తగ్గాలి. ఆ ప్రాంతాలలో మిలిటరీ ఉండకూడదు. దానికి వెలుపల ఉండవచ్చు. గతంలో గాల్వన్‌ లోయ నుంచి 2020జూన్‌లో, పాంగాంగ్‌ సో సరస్సు ఉత్తర గట్టు నుంచి 2021 ఫిబ్రవరిలో, ఆగస్టులో గోగ్రా పోస్టు నుంచి ఉపసంహరించుకోవటంతో పాటు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి)కు ఇరువైపులా ఎలాంటి తనిఖీలు లేని ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.


తాజా ఉపసంహరణ గురించి చుషుల్‌ నుంచి లడఖ్‌ స్వయంపాలిత కాండ ప్రాంతాల అభివృద్ధి మండలి(ఎల్‌ఏహెచ్‌డిసి)కి ఎన్నికైన సభ్యుడు కాంచోక్‌ స్టాంజిన్‌ అసమ్మతిని వెల్లడించారు. మంగళవారం నాడు డెక్కన్‌ హెరాల్డ్‌ ప్రతినిధితో మాట్లాడుతూ రెండు మిలిటరీ దళాలు మోహరించిన పిపి-15 నుంచే గాక పిపి-16 నుంచి కరమ్‌ సింగ్‌ కొండవరకు మన ప్రాంతాన్ని తనిఖీలు లేని బఫర్‌ జోన్‌గా మన దేశం అంగీకరించిందని ఆరోపించారు. దశాబ్దాల తరబడి పిపి-16 వద్ద ఉన్న శాశ్వత పోస్టును ఎత్తివేసేందుకు మన దేశం అంగీకరించిందని, దాంతో స్థానికులు పశువులను మేపుకొనే క్రుగాంగ్‌ లోయను వివాదాస్పద ప్రాంతంగా అంగీకరించిందని, స్థానికుల అభిప్రాయాలను ఎవరు పట్టించుకుంటారని నిర్వేదాన్ని వెల్లడించారు. తాజా పరిణామాలపై బిజెపి నేత సుబ్రమణ్య స్వామి ట్విటర్‌లో స్పందించారు.” వాస్తవాధీన రేఖ వెంబడి రెండు వైపులా చైనా-భారత్‌ మిలిటరీ ఉపసంహరణ జరిగిందని మోడీ ప్రభుత్వ ప్రకటనను ఉటంకిస్తూ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చైనీయులు నవ్వుతున్నారు. నిజం ఏమంటే, భారత్‌ వైపు ప్రాంతం నుంచి చైనా, భారత ప్రాంతం నుంచి భారత్‌ ఉపసంహరించుకుంది. ” మాది ఏదైతే ఉందో అది మాదే, మీది ఏదైతే ఉందో అది కూడా మాదే ” అని దీని అర్ధంగా చైనా చెబుతోందని” పేర్కొన్నారు. తమ పార్టీ ప్రముఖుడే ఆరోపించినందున కేంద్ర ప్రభుత్వం, బిజెపి దీని మీద స్పందించి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. వాస్తవాలకు భిన్నంగా స్వామి ప్రకటనలు, ప్రచారం ఉన్నట్లయితే తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు స్వామి మీద చర్య తీసుకుంటుందా ?


గాల్వన్‌ వివాదం గురించి గతేడాది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు స్వామి అడిగిన ప్రశ్నను స్వీకరించేందుకు రాజ్యసభ ఆఫీసు తిరస్కరించింది. లడఖ్‌లో వాస్తవాధీన రేఖను చైనా అతిక్రమించిందా అన్న స్వామి ప్రశ్నలో సున్నితమైన సమస్యలు ఇమిడి ఉన్నందున సంబంధిత మంత్రిత్వశాఖ సిఫార్సు మేరకు సదరు ప్రశ్నను అంగీకరించటం లేదని పేర్కొన్నారు. గాల్వన్‌ ఉదంతం తరువాత ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ ఎవరూ మన ప్రాంతంలోకి ప్రవేశించలేదు, ఆక్రమించలేదు అని ప్రకటించారు. జాతీయ ప్రయోజనాల రీత్యా తన ప్రశ్నను ఆమోదించటం లేదని రాజ్యసభ సచివాలయం చెప్పటం విషాదం గాకపోతే హాస్యాస్పదం అని స్వామి స్పందించారు. తైవాన్‌, టిబెట్‌ ప్రాంతాలు చైనావే అని అంగీకరించటం నెహ్రూ, వాజ్‌పాయి తెలివి తక్కువ తనమని వారి కారణంగానే మనం జనం కూడా ఆమోదించారన్నారు.లడఖ్‌లో చైనా అక్రమంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్లు నరేంద్రమోడీ చెప్పటం లేదని కూడా కొద్దివారాల క్రితం స్వామి సెలవిచ్చారు. ఎవరూ ఆక్రమించలేదని చెప్పే మూర్ఖస్థితిలో ఉన్నారని అన్నారు.


గతంలో ఉపసంహరించుకున్న ప్రాంతాలలో కూడా మన దేశం కొంత ప్రాంతాన్ని కోల్పోయినట్లు కొందరు మాజీలు చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొన్నది. లడఖ్‌ ప్రాంతంలో ఘర్షణ ఉన్న వివిధ ప్రాంతాల్లో మిలిటరీ ఉండని లేదా గస్తీ లేని ప్రాంతాలను ఏర్పాటు చేయటం పరిష్కారం కాదని, చైనా షరతులకు మనం అంగీకరిస్తున్నామని ఒక మాజీ లెప్టినెంట్‌ జనరల్‌ అన్నట్లు రాసింది. సేనల ఉపసంహరణల క్రమంలో భారత భూభాగంలో బఫర్‌జోన్లకు ఎందుకు అంగీకరిస్తున్నట్లు అని ప్రశ్నించినట్లు పేర్కొన్నది. గతంలో సేనల ఉపసంహరణజరిగినచోట్ల కూడా బఫర్‌జోన్లను ఏర్పాటు చేశారు. రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతాలను బఫర్‌ జోన్లు అని పిలుస్తున్నారు. ప్రాంతాలను బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. డెప్సాంగ్‌ మైదానాల నుంచి రెండు వైపులా సేనల ఉపసంహరణ జరగాల్సి ఉంది. బఫర్‌ జోన్లను అంగీకరించటం అంటే అది వాస్తవాధీన రేఖకు రెండు వైపులా జరుగుతుంది. దాని అర్ధం ఆ ప్రాంతంపై సదరు దేశం హక్కును వదులుకున్నట్లు ఎలా అవుతుంది.

ఎలాంటి పోరు లేకుండానే వెయ్యి చదరపు కిలోమీటర్లమేర మన ప్రాంతాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ చైనాకు అప్పగించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.2020 ఏప్రిల్‌ నాటి స్థితిని పునరుద్దరించేందుకు చైనా తిరస్కరిస్తోందని, అప్పగించిన ప్రాంతాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారని ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఒక సమస్య పరిష్కారమైందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. సుబ్రమణ్య స్వామి, రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణల మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేదు. మహమ్మద్‌ ప్రవక్త గురించి బిజెపి నేత నూపుర్‌ శర్మ నోటి దూల మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాటిని మన దేశం ఖండించటమే గాక వాటితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. పార్టీ పరంగా ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు బిజెపి ప్రకటించింది.నూపుర్‌ శర్మ మాటలు మత ఉద్రిక్తతలకు దారితీసేవిగానూ, ముస్లిం దేశాలతో మన సంబంధాలు దెబ్బతినేవిగా ఉండటంతో ప్రభుత్వమూ, బిజెపి అలా స్పందించింది. ఒక ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణ జవాబుదారీతనంతో కూడుకున్నది కాదు.ఈ మేరకు వచ్చిన వార్తల మీద నిలదీసే హక్కు రాహుల్‌కు వుండవచ్చు తప్ప నిర్ధారించి చెప్పటం ఏమిటి ? సుబ్రమణ్యస్వామి వ్యవహారం అది కాదు, అధికారపార్టీలో ఉంటూ మన విదేశాంగ విధానాన్ని తప్పుపట్టటం ఏమిటి ? పోనీ స్వామి చెప్పిన అంశాలు, వైఖరి పార్టీ విధానం కాదని బిజెపి ప్రకటించాలి కదా ! దాని మౌనానికి అర్ధం ఏమిటి ? స్వామి వంటి వారు చేస్తున్న వాదనలు, విమర్శలు సామాజిక మాధ్యమం, మీడియా, వివిధ సంస్థలలో తిష్టవేసిన బిజెపిని బలపరిచే కాషాయ దళాలు చేస్తున్నవే. పార్టీ నుంచి వెలుపలికి వచ్చి స్వామి తనకు తోచిందాన్ని మాట్లాడితే అదొక తీరు.


భారత్‌ – చైనా సరిహద్దులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా కాగితాల మీద బ్రిటీష్‌ వారు గీచిన రేఖ వలన వివిధ ప్రాంతాలు తమవంటే తమవని రెండు దేశాలూ చెబుతున్నాయి. రెండు దేశాలకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనదని చెబుతున్న ఆక్సాయిచిన్‌ చైనా ఆధీనంలో, తమది అని చైనా చెబుతున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉన్నది. ఇంకా ఇలాంటివి ఉన్నాయి. వీటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటం మినహా మరొక మార్గం లేదు. ప్రస్తుతం డెప్సాంగ్‌ మైదానాల్లో మనది అని చెబుతున్న చోట్ల పద్దెనిమిది కిలోమీటర్ల లోపలికి చైనా మిలిటరీ వచ్చిందని చెబుతున్నారు. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మన ప్రాంతాల ఆక్రమణ జరగలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పటాన్ని బట్టి ఆ ప్రాంతం ఎప్పటి నుంచో చైనా ఆధీనంలో ఉన్నదని భావించాల్సి ఉంటుంది. మాజీ మిలిటరీ అధికారులు, నిపుణులు అని చెప్పుకుంటున్నవారు, కొందరు రాజకీయనేతలు, దేశభక్తుల ముసుగులో ఉన్నవారు చెప్పే భాష్యాలు జనంలో మనోభావాలను రగిల్చేందుకు తప్ప ఇతరంగా పనికి రావు. చైనాతో అధికారిక చర్చల్లో పాల్గొనే పౌర, మిలిటరీ ఉన్నతాధికారులకు ఇవేమీ తెలియవని, వారికి దేశభక్తి లేదని, మన భూభాగాన్ని రక్షించుకోవాలనే తపన లేని వారని అనుకోవాలా ? గత 28 నెలలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ, పరస్పర అనుమానాలు తొలగాలంటే సంప్రదింపులు తప్ప మరొక మార్గం లేదు. ఇప్పటి వరకు 16దఫాల చర్చలు జరిగాయి.


దాదాపు ఏడాది పాటు స్థంభించిన చర్చలు ఆకస్మికంగా ఫలించి మరొక అడుగు ముందుకు పడి మరొక ప్రాంతం నుంచి సేనలు వెనక్కు తగ్గటం వెనుక కారణాల గురించి చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ఇప్పట్లో ముగిసేట్లు కనిపించకపోవటం,ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. సోవియట్‌ విచ్చిన్నం తరువాత ఏర్పడిన మధ్య ఆసియా రిపబ్లిక్‌లతో సరిహద్దుల్లో మిలిటరీల మధ్య విశ్వాసాన్ని మరింతగా పెంచేందుకు కుదిరిన అవగాహనను మరింత ముందుకు తీసుకుపోవటానికి ఏర్పడినదే షాంఘై సహకార సంస్థ.అమెరికా, మరికొన్ని పశ్చిమ దేశాల కుట్రలో భాగంగా చైనాలో ఉన్న ఏకైక రాష్ట్రం షింజియాంగ్‌లో ఉగ్రవాదులను రెచ్చగొట్టేందుకు, వారికి శిక్షణ ఇచ్చేందుకు మధ్య ఆసియా రిపబ్లిక్‌లను కేంద్రాలుగా చేసుకున్నాయి. చైనాతో ఉన్న సరిహద్దుల వివాదాల పరిష్కారం కూడా ఎస్‌సిఓ ఏర్పాటు వెనుక ఉంది.తొలుత షాంఘై ఐదు అని పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది. తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది,2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్‌ పరిశీలక దేశాలు, బెలారస్‌, శ్రీలంక, టర్కీ, కంపూచియా,నేపాల్‌,ఆర్మీనియాలు సంప్రదింపుల భాగస్వాములుగా ఉన్నాయి. బెలారస్‌కు కొన్ని సంవత్సరాల తరువాత పరిశీలక హౌదా ఇచ్చారు. ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లను ఏ దేశమూ గుర్తించని కారణంగా అక్కడి నుంచి ప్రతినిధులెవరూ ఉండరు. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. పరిశీలక దేశంగా ఉన్న ఇరాన్‌కు సామరకండ్‌లో జరిగిన ఎస్‌సిఓ-2022 భేటీలో తొమ్మిదవ పూర్తి సభ్య దేశంగా తీసుకున్నారు.దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రాంతీయ సంస్థగా ఇప్పటికే ఉంది. ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు జరుపుతారు. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధినేత షీ జింపింగ్‌ భేటీ కావచ్చని వార్తల నేపధ్యం లడక్‌ ప్రాంతంలో సేనల ఉపసంహరణకు దారితీసిందని కొందరు భావిస్తున్నప్పటికీ ఇదే ప్రధాన కారణంగా చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి గోల్‌ మాల్‌ గోవిందాలు : ఆర్ధిక రంగ అంకెలతో జనాన్ని ఆడుకుంటున్నారు !

06 Tuesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani, Ambani and Adani, BJP, India GDP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, Per Capita Income in the India, UK GDP


ఎం కోటేశ్వరరావు


గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి.రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం కలిగినవే అయినా నేరుగా జనాన్ని తాకేవి కాదు గనుక అంతగా పట్టించుకోరు. దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయనేతలు, అందునా అధికారంలో ఉన్నవారు అంకెలతో గారడీలు చేస్తూ జనాలను ఆడుకుంటున్నారు. కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం.


బ్రిటన్ను వెనక్కు నెట్టి మన దేశం జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి వచ్చిందని కొంత మంది సంతోషం ప్రకటిస్తున్నారు, మంచిదే. వెనుకటికి ఎవరో మాది 101 అరకల వ్యవసాయం తెలుసా అని మీసాలు మెలివేశాడట. మాది అంటున్నావు ఎవరెవరిది అని అడిగితే మా భూస్వామికి వంద, నాటి ఒకటి అన్నాడట. అలాగే మరొకడు మా ఇంటి పక్కనే ముకేష్‌ అంబానీ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడట.ఆ చెప్పిన వాడి ఇల్లు చిరిగిన ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన గుడారం వంటిది కాగా అంబానీ ఇల్లు 27అంతస్తులు, మూడు హెలిపాడ్లు కలిగి ఉంది. కరోనాకు ముందు కేవలం పది బిలియన్‌ డాలర్ల సంపద కలిగి అదానీ ఇప్పుడు 141 బి.డాలర్లకు చేరిందని తాజా వార్త.పేద వాడి ప్లాస్టిక్‌ పాక, వీధుల్లో అడుక్కొనే బిచ్చగాండ్ల రాబడి అంబానీ ఇల్లు, అదానీ సంపదలు అన్నింటినీ కలిపే దేశ జిడిపిగా పరిగణిస్తారు. దీన్ని నరేంద్రమోడీ సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా కొందరు వర్ణిస్తున్నారు. అంకెలను ఎవరూ తారు మారు చేయలేరు గానీ ఎవరి భాష్యం వారు చెప్పవచ్చు. నాలుగు ఎలా వచ్చిందంటే నాలుగు ఒకట్లను కలిపితే అని, రెండును రెండుతో హెచ్చవేస్తేఅని, కాదు కలిపితే అనీ చెప్పవచ్చు. ఏప్రిల్‌-జూన్‌ మూడు మాసాల జిడిపిని లెక్కలోకి తీసుకుంటే మన దేశానిది 823 బిలియన్‌ డాలర్లుండగా బ్రిటన్‌లో 763బి.డాలర్లని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అదే సంస్థ జనవరి-మార్చి మాసాల్లో మనది 864, బ్రిటన్‌లో 813 బి.డాలర్లు ఉన్నట్లు కూడా పేర్కొన్నది. అంటే గడచిన మూడు నెలల్లో మన జిడిపి 41బి.డాలర్లు తగ్గింది.బ్రిటన్‌తో పోల్చుకొని సంతోష పడాలా మన తీరు తెన్నులను చూసి విచారపడాలా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.


ఇవన్నీ డాలరు లెక్కల్లో చెబుతున్న అంకెలు. ఈ కాలంలో మన కరెన్సీ, బ్రిటన్‌ పౌండ్‌ విలువ కూడా డాలరుతో పోలిస్తే తగ్గింది కనుక రెండు దేశాల జిడిపి తగ్గినట్లు ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. కనుక ఈ అంకెలను చూపి విరగబాటును ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మన కరెన్సీ విలువ మరింత తగ్గి, బ్రిటన్‌ పౌండ్‌ విలువ పెరిగినా లేక తారుమారైనా భౌతిక సంపదలతో నిమిత్తం లేకుండానే విలువలు మారతాయి.ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2022 చివరినాటికి బ్రిటన్‌ జిడిపి 3.38 లక్షల కోట్ల డాలర్లుగా, మనది 3.54లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ మాత్రానికే సంబరాలు చేసుకుంటే ఎలా ! అదే ఐఎంఎఫ్‌, దాని కవల సోదరి ప్రపంచబాంక్‌ మన దేశం గురించి చెప్పిన ఇతర అంకెల గురించి ఇలాంటి సంబరాలు చేసుకున్నామా ? ఐదో స్థానానికి చేరినందుకు సంతోషపడితే తలసరి జిడిపిలో మనం 159వ స్థానంలో ఉన్నామని, పక్కనే ఉన్న శ్రీలంక 148లో ఉందని ఎంత మందికి తెలుసు. 2021లో అదే బ్రిటన్‌ 47,334 డాలర్లుండగా మనది 2,277 డాలర్లు, చైనాలో 12,556 డాలర్లుంది.


కనీసం చైనా స్థాయికి చేరాలంటే ఇప్పుడున్న జిడిపి ఐదున్నర రెట్లు పెరగాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ గారిని తన మంత్రదండంతో పెంచమనండి. కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అనే పాత సామెత తెలిసిందే. మన జిడిపి తొలి త్రైమాసికంలో రెండంకెల 13.5శాతం పెరుగుదల ఉన్నా ఏడాది చివరకు అది ఒక అంకెకు పడిపోతుందని రిజర్వుబాంకే చెప్పింది. ఒకవైపు అది 6 లేదా ఆరున్నర శాతం అని కొందరు చెబుతుంటే ఎస్‌బిఐ 6.7 నుంచి 7.7శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. అప్పుడు విచార ప్రదర్శనలకు దిగుతామా ? మన వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు, ఉండవచ్చు, గతంలో మన కంటే తక్కువ ఉన్న స్థితి నుంచి జిడిపిలో మనల్ని వెనక్కు నెట్టి చైనా ఎలా ముందుకు పోతోందని ఎవరైనా ప్రశ్నిస్తే వారితో మనకు పోలిక ఎందుకని తప్పించుకుంటారు. ఇంకా పొడిగిస్తే మనది ప్రజాస్వామ్యం వారిది నిరంకుశత్వం అని చెబుతారు. చైనాలో ఉన్నది నిరంకుశమో కాదో కాసేపు పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్దతుల్లో మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నామో తర్కానికి నిలిచే సమాధానం చెప్పాలి. మన దేశంలోకి రానున్న పెట్టుబడులు వాటి మంచి చెడ్డల గురించి చెబితే ఒకటి, దాని కంటే చైనా నుంచి తరలివచ్చే పెట్టుబడులు, సంస్థల గురించి కొందరు ఎక్కువగా చెబుతున్నారు. పోనీ ఆ వచ్చే కొన్ని వియత్నాం లేదా మరొక చోటికో వెళుతున్నట్లు వార్తలు తప్ప మన దేశానికి ఎన్ని వచ్చాయో ఎవరినైనా చెప్పమనండి.


జిడిపి గురించి గొప్పలు చెబుతున్నవారు ఆగస్టు చివరివారంలో మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రెండేళ్ల నాటి కనిష్ట స్థాయికి ఎందుకు తగ్గినట్లో చెప్పాలి. ఆగస్టు 26తో ముగిసిన వారంలో నిల్వలు 561 బి.డాలర్లకు తగ్గాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభం తరువాత 27 వారాలకు 21 వారాల్లో తగ్గుదల నమోదైంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే 80బి.డాలర్లు తగ్గాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో జడిపి వృద్ది రేటు 16.2 శాతం వరకు ఉంటుందని ఆర్‌బిఐ చెప్పగా 13.5శాతం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 20.1శాతం నమోదైంది. అంటే పురోగమనంలో ఉన్నట్లా తిరోగమనంలో ఉన్నట్లా ? ఇది ఒక అంకెల గారడీ. వచ్చే రోజుల్లో మన జిడిపి పెరిగి 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్ను వెనక్కు నెట్టి మూడవ స్థానంలోకి వెళుతుందని ఎస్‌బిఐ చెప్పింది. దానికి ఎస్‌బిఐ చెబుతున్నదేమిటి ? చైనాలో కొత్త పెట్టుబడులు మందగిస్తాయని, ఆ మేరకు మన దేశంలో పెరుగుతాయని చెబుతూ చైనాలో జరుగుతున్నదానిలో ఐదో వంతు ఉత్పత్తిని భారత్‌కు తరలించనున్నట్లు చెప్పిన యాపిల్‌ కంపెనీ ప్రకటన ఆశాభావానికి దోహదం చేస్తున్నట్లు చెప్పింది. అదే కంపెనీ ఐపాడ్‌ల ఉత్పత్తిని వియత్నాంకు తరలించనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.యాపిల్‌ కంపెనీ బ్రెజిల్‌,భారత్‌లో తలపెట్టిన ఉత్పత్తులు స్థానిక అవసరాలకు తప్ప ఎగుమతుల కోసం కాదని ఆగస్టు ఏడవ తేదీన లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక రాసింది.


మన దిగుమతులు పెరిగి దానికి అనుగుణంగా ఎగుమతులు లేక వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు జిడిపి ఐదవ స్థానానికి ఎదుగుదల వార్తలతో పాటే ప్రభుత్వం వెల్లడించింది. ఇన్వెంటియా డాట్‌కామ్‌ విశ్లేషణ ప్రకారం 2022 ఏప్రిల్‌-ఆగస్టు నెలల్లో మన ఎగుమతులు 192.59 బి.డాలర్లు కాగా దిగుమతులు 317.81 కాగా లోటు 125.22 బి.డాలర్లు. గతేడాది ఇదే నెలల లోటు 53.78 బి.డాలర్లు మాత్రమే. గతేడాది ఆగస్టుతో పోల్చితే లోటు 13.81 నుంచి 28.68 బి.డాలర్లకు పెరిగింది. ఎగుమతులు0.8శాతం తగ్గగా దిగుమతులు 31శాతం పెరిగాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన ఎగుమతులు పెరిగి మన జనానికి పని కల్పించే ఎగుమతులు పెరగకుండా మనలను నిరుద్యోగులుగా మార్చే దిగుమతులు పెరుగుతున్నపుడు జిడిపి పెరుగుదలతో సామాన్యులకు ఒరిగేదేమిటి ? సంతోషించే వారు దీనికేమి చెబుతారు.2001 నుంచి చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న కారణంగా 2018 నాటికి అమెరికాలో 40లక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఇదే కాలంలో చైనాతో అమెరికా వాణిజ్య లోటు 83 నుంచి 420 బి.డాలర్లకు పెరిగింది. దిగుమతులు పెరిగితే మన పరిస్థితి ఇంతే కదా !


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నది తెలిసిందే. ఇది సుమతీ శతకంలోనిది. రచయిత బద్దెన లేదా భద్రభూపాలుడు అని చెబుతారు. సదరు శతకకారుడు ఇప్పుడు బతికి ఉంటే దీన్ని రాజకీయపార్టీలకు వర్తింప చేసి ఉండేవాడు. గతంలో కాంగ్రెస్‌ పాలనా కాలంలో డాలరుతో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి పెద్దలు మౌనంగా ఉంటే అదొక దారి. దానికి బదులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మన కరెన్సీ పతనం కాలేదు, డాలరు విలువ పెరిగితే మనమేం చేస్తాం, ఇతర కరెన్సీలతో పోల్చి చూడండి మనది బలపడింది అని చెబుతున్నారు.గతంలో మన్మోహన్‌ సింగు ఏలుబడిలో ఇదే జరిగినపుడు కూడా జరిగింది అదే కదా ! అప్పుడు ఎందుకు విమర్శించినట్లు ? మన కరెన్సీ బలపడితే లేదా దిగజారితే తలెత్తే పరిణామాలు ఏమిటన్నది గీటురాయి. ముందుగా మన బలపడిందని చెబుతున్న మన కరెన్సీ, ఇతర వాటిని చూద్దాం. ఒక రూపాయికి వివిధ కరెన్సీల మారకపు విలువ.
దేశం ××××× సంవత్సరం,నెల, తేదీ ×× విలువ ×××××సంవత్సరం,నెల, తేదీ××× విలువ
బంగ్లాదేశ్‌ ××× 2021.9.04 ×××××× 1.16649××× 2022.9.4 ××××××× 1.7507
పాకిస్తాన్‌ ××× 2022.3.08 ×××××× 2.3235 ××× 2022.9.3 ××××××× 2.19289
శ్రీలంక ××× 2022.3.08 ×××××× 2.9515 ××× 2022.9.3 ××××××× 4.5166
చైనా ××× 2022.3.08 ×××××× 0.082244 ×× 2022.9.3 ××××××× 0.086548
రష్యా ××× 2022.3.08 ×××××× 1.6893 ××× 2022.9.3 ××××××× 0.75604
ఐరోపా ××× 2022.3.08 ×××××× 0.011933 ××× 2022.9.3 ××××××× 0.012603
అమెరికా ××× 2022.3.08 ×××××× 0.013004 ××× 2022.9.3 ××××××× 0.012544
పై వివరాలను గమనించినపుడు బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, చైనా, ఐరోపా కరెన్సీలతో పోల్చినపుడు మన రూపాయి కాస్త బలపడింది. రష్యా, అమెరికా డాలరుతో పోలిస్తే బలహీనపడింది.ఏ దేశ కరెన్సీ అయినా బలపడితే దాని ఎగుమతులకు దెబ్బ, కరెన్సీ విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. మన కరెన్సీ విలువ పతనం అవుతున్నా ఆ మేరకు మన ఎగుమతులు పెరగటం లేదు, రెండింటికీ చెడ్డ రేవడిలా మారాము.


మన నరేంద్రమోడీ ఘనత కారణంగా రష్యా మనకు తక్కువ ధరలకు అదీ మన రూపాయలు తీసుకొని చమురు విక్రయిస్తున్నదని ప్రచారం చేస్తున్నారు. అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ధిక్కరించి తమకు మద్దతు ఇస్తున్నవారికి వారి చమురు కొనుగోలు చేస్తున్న చైనాతో ఇతర అనేక దేశాలకు కూడా తక్కువ ధరలకే ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభానికి ముందు మనం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు నామమాత్రం. ఇప్పుడు అక్కడి నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాము.భారత్‌ నాటి సోవియట్‌, తరువాత రష్యాతో రూపాయి-రూబుల్‌ సంబంధాలు కొనసాగాయి, ఇప్పుడేదో కొత్తగా మొదలైనట్లు చెప్పటం వాస్తవదూరం.2019లో రెండు దేశాల వాణిజ్యంలో సగం డాలర్లలో చెల్లించాము, అది 2021లో 38.3శాతానికి తగ్గి 53.4శాతం రూబుళ్లలో చెల్లించాము. ఇక వర్తమానానికి వస్తే మన చమురు దిగుమతుల్లో కేవలం 0.2శాతంగా ఉన్న రష్యా చమురు ఆరునెలల్లో ఇప్పుడు పదిశాతానికి చేరింది. రూపాయి-రూబుల్‌ లావాదేవీలతో ఆర్‌బిఐకి విదేశీమారక ద్రవ్యం పదహారు శాతానికి పైగా మిగిలింది. అసలే మన డాలర్లు దేశం వదలి పోతున్న తరుణంలో ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. ఇక మన దిగుమతులు చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి డాలర్లలో చెల్లిస్తే మనకు కలిగే లబ్ది ఏమీ ఉండదు, అదే యువాన్‌ – రూపాయి లావాదేవీలు జరిగితే స్వల్పంగా మన కరెన్సీ విలువ పెరిగినందున కొంతమేరకు లబ్ది ఉంటుంది. కానీ చైనాకు మన ఎగుమతులు తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఇప్పుడు రూపాయితో పోల్చితే రూబుల్‌ విలువ కూడా పెరిగినట్లు పై వివరాలను చూస్తే తెలుస్తుంది. మీ డాలరు విలువ పెరిగింది తప్ప మా రూపాయి తగ్గలేదని చెబుతున్న బిజెపి నేతలు తమ పిల్లల విదేశీ విద్యకు అవసరమైన డాలర్లను ఏ ధరకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి లేదా జనం అడగాలి. మనం వాడే సెల్‌ఫోన్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర పరికరాల ధరలు ఎంత పెరిగాయో ఎవరికి వారు తెలుసుకోవచ్చు.2021లో 57బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్‌ వస్తువులను దిగుమతి చేసుకున్నాము.


మన దేశం డాలర్లు చెల్లించి విదేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది.2014 ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 పక్షం రోజుల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 99.52 డాలర్లు, ఆ రోజుల్లో సగటున మన కరెన్సీ మారకపు విలువ డాలరుకు రు.60.54, ఈ రేటున ఒక పీపాకు మనం చెల్లించిన మొత్తం రు.6,020.94, అదే చమురుకు 2022 జూలై 27 నుంచి ఆగస్టు 26వరకు సగటున పీపాను 98.18 డాలర్లకు కొనుగోలు చేశాము, దీనికి గాను మన రూపాయల్లో డాలరుకు రు.79.52 చొప్పున పీపాకు రు.7,807.27 చెల్లించాము. 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పినట్లు మన కరెన్సీ విలువను డాలరుతో మారకం రు.40కి పెంచే సామర్ధ్యాన్ని నరేంద్రమోడీ లేదా ప్రభుత్వం గానీ ప్రదర్శించి ఉంటే మనకు ఇప్పుడు ముడిచమురు పీపా రు.3,927.20కే వచ్చేది, ధరల పెరుగుదల ఆమేరకు తగ్గి జనానికి ఎంతో భారం తగ్గేది. నిజంగా మోడీ చెప్పిన అచ్చేదిన్‌ వచ్చి ఉండేవి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాను రెచ్చగొడుతున్న అమెరికా : తాజాగా తైవాన్‌ జలసంధికి రెండు యుద్ద నౌకలు !

31 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Nancy Pelosi Taiwan trip, Taiwan Matters, US provocative actions, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ అని తాలిబాన్లను వేడుకొని ఆఫ్ఘనిస్తాన్నుంచి అవమానకరంగా వెనుదిరిగిన అమెరికా కొద్ది నెలలు గడవకుండానే ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెరదీసింది. అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో అంతుబట్టని స్థితిలో ఇప్పుడు తైవాన్‌ పేరుతో చైనాను రెచ్చగొడుతోంది.ఏదో ఒక సాకుతో యుద్ధాలు, మిలిటరీ జోక్యాలు చేసుకోవటం సులభం కానీ వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలో వియత్నాంపై ఫ్రాన్సు, అమెరికా జరిపిన యుద్ధాలు, ఇరాక్‌లో.ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిత్రపక్షాల మిలిటరీ జోక్యం, దాడులు స్పష్టం చేశాయి. ప్రకృతిలో రాబందులు పశువుల, మనుషుల మృతకళేబరాల కోసం నిరంతరం చూస్తుంటాయి, అవే వాటి ఆహారం. అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ రాబందులు మాత్రం నిరంతరం యుద్ధాల కోసం చూస్తుంటాయి.అవసరమైతే తమ సైనికులను కొందరిని బలిపెట్టి లాభాలను పిండుకోవటమే దాని పని. ఇప్పటి వరకు అమెరికా గడ్డమీద ఎలాంటి యుద్దాలు జరగకపోవటం, ప్రత్యక్షంగా పర్యవసానాలను అనుభవించకపోవటంతో అక్కడి జనాలు కూడా మొత్తం మీద యుద్ధాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.ఆమోదిస్తున్నవారు ఉండటం ఆందోళనకరం.


తైవాన్‌ జలసంధిలో తిరుగుతున్న అమెరికా మిలిటరీ నౌకలు ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలను కట్టివేసుకొని ఏమీ తెలియనట్లు సంచరిస్తున్నాయని, ఇది రెచ్చగొట్టుడుకే తప్ప మరొకటి కాదని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. తైవాన్‌ విలీన ప్రక్రియను అడ్డుకొనే క్రమంలో ఒకవేళ యుద్దమే గనుక వస్తే జలసంధిలో ప్రవేశించే అమెరికా మిలిటరీ నౌకలు చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటాయని భూమి మీద నుంచి చైనా సంధించే క్షిపణులను అవి తట్టుకొని నిలవలేవని అందువలన తైవాన్‌ జలసంధిలో సంచారానికి అర్ధం లేదని చైనా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా పంపిన నౌకలు దాని వద్ద ఉన్న పాత తరానికి చెందినవని, చైనా వద్ద అంతకంటే మెరుగైనవి ఉన్నందున వాటితో తైవాన్‌ వేర్పాటు వాదులను సంతుష్టీకరించటం, తన మిత్ర దేశాలకు భరోసాను ప్రదర్శించటం తప్ప చైనాను భయపెట్టలేరని పశ్చిమ దేశాల విశ్లేషకులు పేర్కొన్నారు. అంతే కాదు చైనాలో తైవాన్‌ విలీనం తమకు అంగీకారం కాదని ప్రపంచానికి చెప్పటం కూడా దీని వెనుక ఉందని అంటున్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటికి ధీటుగా చైనా కూడా తన బలాన్ని పెంచుకుంటున్నది. అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది.


ఆసియాలో చిచ్చు పెట్టేందుకు పూనుకున్న అమెరికా తీరుతెన్నులు చైనా – రష్యా మిలిటరీల సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఇటీవలి నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. రెండున్నర దశాబ్దాల నాడు రష్యా నుంచి ఆయుధాలను కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్న చైనా నేడు కొన్నింటిని అమ్మే దశకు ఎదిగింది.ఆధునిక అస్త్రాలను అది రూపొందిస్తున్నది. నాన్సీ పెలోసీ రాక తరువాత తన సత్తా ఏమిటో చూపుతున్నది. తాను స్వంతగా రూపొందించుకున్న రెండు విమానవాహకయుద్ద నౌకలను అనేక ఇతర నౌకలు, విమానాలతో డ్రిల్స్‌ నిర్వహించింది. తమకు అడ్డు వచ్చే వారిని క్షణాల్లో ఎదిరించే సత్తా ఉందని ప్రపంచానికి వెల్లడించింది.

ఇప్పటికే ఉక్రెయిన్లో రష్యా మీద పరోక్ష దాడులు జరుపుతున్న అమెరికా ఒకేసారి చైనా మీదకు దిగే అవకాశం అంత సత్తా లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఆయుధాల అంశంలో రష్యాతో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అమెరికా ఎదిరించేందుకు వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టటానికి రెండు దేశాలూ సిద్దపడతాయి. పరిమితులు లేని భాగస్వాములుగా ఉన్నట్లు రెండు దేశాలూ ప్రకటించిన సంగతి తెలిసిందే.తైవాన్‌ అంశం మీద అమెరికా ఇలా ఇంకా రెచ్చగొట్టుడు కొనసాగిస్తే మిలిటరీ సహకారం కూడా రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగనుందనే సంకేతాలు, అమెరికాలో మాంద్య ప్రమాదం, పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందనే విశ్లేషణల నేపధ్యంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బైడెన్‌ క్రమంగా తైవాన్‌ అంశం మీద ఒకే చైనా అన్న అంగీకృత విధానానికి తిలోదకాలిచ్చే దిశగా పావులు కదుపుతున్నాడు.చైనాకు వ్యతిరేకంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటుకు పధకం వేశారు.


ఇటీవలి అమెరికా బుద్దిపూర్వక చర్యలు, రష్యా వ్యతిరేక వైఖరి ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది.దీన్నుంచి కూడా లబ్ది పొందేందుకు అమెరికా చూస్తున్నది. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో అమెరికా ప్రాణ నష్టాలు నాలుగు లక్షల లోపే.మరో ఆరులక్షల మంది తమ వారు కనిపించటం లేదని అమెరికా చెప్పింది. ఇతర దేశాలలో మరణించిన ఆరు కోట్ల మందితో పోలిస్తే నిజానికి ఇది పెద్ద సంఖ్యకాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చిన లాభాలతో అమెరికాలో 22వేల మంది మిలియనీర్లను సృష్టించింది, 28.6బిలియన్‌ డాలర్లు లాభాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో లాభాలు రెట్టింపు వచ్చాయి.రక్తంతో తడిచిన లాభాలు మరిగిన అమెరికన్‌ కార్పొరేట్లు అప్పటి నుంచి జనాలకు కావాల్సిన వస్తువుల కంటే ప్రాణాలు తీసే ఆయుధాల తయారీకే ప్రాధాన్యత ఇచ్చారు. చైనాలో చౌకగా దొరికే శ్రమతో తక్కువ ధరలకు వినిమయ వస్తువుల తయారీకి పెట్టుబడులు పెట్టటం, పరిశ్రమలను తరలించటం కూడా కార్పొరేట్ల లాభాల వేటలో భాగమే.

నాలుగేండ్ల రెండవ ప్రపంచ యుద్దం అమెరికాలో బిలియనీర్లను 32 నుంచి 44కు వారి ఆస్తులు 103బి.డాలర్లకు పెంచింది. ప్రపంచానికి ఆ యుద్ద ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా కాగా అమెరికా వాటా కేవలం 336 బి.డాలర్లు మాత్రమే.ఆ యుద్దంలో సర్వనాశనమైన ఐరోపా పునరుద్దరణ పేరుతో అమెరికా ముందుకు రావటానికి దానికి వచ్చిన లాభాలే పెట్టుబడి. ఆ పధకంలో కూడా అమెరికా లబ్దిపొందింది.ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందనే ఉందనే బూచిని చూపి నాటో కూటమి ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంగతి జగమెరిగినదే. ఇప్పుడు ఉక్రెయిన్‌ నాశనానికి దానికి ఆయుధాలమ్మి సొమ్ము చేసుకోవటంతో పాటు దాని పునరుద్దరణ పేరుతో తన కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా చేసింది అదే తన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించింది. అనేక యుద్ధాల అనుభవం చూసిన తరువాత తన పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా ఇతరులను బలితీసుకుంటూ ఆయుధాలమ్మి సొమ్ము చేసుకుంటోంది. అది పెట్టే తంపులన్నీ తనకు సుదూరంగా ఉన్న ప్రాంతాలు దేశాల్లోనే.అమెరికాకు ఇరుగు పొరుగుదేశాలతో పేచీ లేదు కనుక వాటి నుంచి ముప్పులేదు.


రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి 2001వరకు ప్రపంచంలోని 153 ప్రాంతాల్లో అమెరికా పెట్టిన చిచ్చు, చేసిన యుద్దాలు 258గా లెక్కవేశారు. వీటన్నింటిలో అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలే వచ్చాయి. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉందంటే అమెరికాకు నిదరపట్టదు.వియత్నాంపై దాడిలో పెద్ద సంఖ్య అమెరికన్లు మరణించటంతో దానికి వ్యతిరేకంగా జనంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. దాంతో అప్పటి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తన పౌరులు మరణించకుండా మిత్రపక్షాల పేరుతో ఇతర దేశాలను దించుతోంది. కావాల్సిన పెట్టుబడులు పెడుతోంది, ఆయుధాలు అమ్ముకుంటోంది. ఇరాక్‌పై దాడిచేసి అక్కడి చమురు సంపదలపై పట్టు సంపాదించిన సంగతి తెలిసిందే. అదే ఎత్తుగడను ఇరాన్‌ మీద కూడా అమలు చేసేందుకు పూనుకొని ఎదురు దెబ్బలు తిన్నది. దాన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకొనేందుకు ఆంక్షల పేరుతో పరోక్ష దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తైవాన్‌ మీద చైనాను రెచ్చగొట్టటం వెనుక అనేక అంశాలున్నాయి. చైనా ఆయుధాల సత్తాను తెలుసుకోవటం, ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు మద్దతు మానుకోవాలని బ్లాక్‌మెయిల్‌, తైవాన్‌ జలసంధిలో విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి గనుక ఆర్ధికంగా నష్టపెట్టటం, మిలిటరీ ఖర్చు పెరిగేట్లు చూడటం వంటి అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ మదింపు వేసుకొనే తైవాన్‌ అంశంలో రాజీలేదని చైనా ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d