• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

అమెరికా పాలకవర్గాన్ని మరోసారి భయపెడుతున్న సోషలిజం-పార్లమెంటులో తీర్మానాలతో అడ్డుకోగలరా !

28 Tuesday Feb 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

communism, Democratic party, Republican party, Socialism, US left politics, USA


ఎం కోటేశ్వరరావు


” అమెరికాలోని అనేక మంది జనం, ఐరోపా సోషలిస్టులు ప్రమాదకరంగా కమ్యూనిజానికి దగ్గర అవుతున్నారు.అమెరికా తరహా జీవనానికి ఒక ముప్పుగా మారుతున్నారు.” అమెరికా పత్రిక అట్లాంటిక్‌ 1951 ఫిబ్రవరి సంచికలో ఐరోపాలో సోషలిజం అనే పేరుతో ప్రచురించిన ఒక వ్యాఖ్యానం పై వాక్యాలతో ప్రారంభమైంది. అదే ఫిబ్రవరి రెండవ తేదీ( 2023) న అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) సోషలిజం ఘోరాలను ఖండించే పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.సభలోని మొత్తం 219 రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, 109 మంది డెమోక్రటిక్‌ పార్టీ వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు.డెమోక్రాట్లు 86 మంది వ్యతిరేకించగా 14 మంది సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వ్యతిరేకించిన వారిలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 86 మందిలో అలెగ్జ్రాండ్రియా ఒకాసియో కార్టెెజ్‌, రషీదా లాయిబ్‌, గోరీ బుష్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఉన్నారు. వీరిని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ బలపరిచింది. అక్కడి మీడియా కమ్యూనిస్టులు, సోషలిస్టులని చిత్రించి వారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు గత ఎన్నికల్లో చూసింది.ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో సామ్రాజ్యవాద, యూదు దురహంకారాన్ని విమర్శించినందుకుగాను ఆమెను పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేంత వరకు రిపబ్లికన్‌ పార్టీ నిదురపోలేదు.


ప్రచ్చన్న యుద్ధంలో సోవియట్‌ను ఓడించాం, సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేశాం, కమ్యూనిజానికి కాలం చెల్లింది, దాన్ని ఏడు నిలువుల లోతున పూడ్చిపెట్టాం అంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ అమెరికా, ఐరోపా, ప్రపంచంలోని యావత్తు కమ్యూనిస్టు వ్యతిరేకులు మూడు దశాబ్దాల నాడే పండగ చేసుకున్నారు. సోషలిజం జరిపిన ఘోరాలను ఖండించాలంటూ అమెరికా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అన్నది ఆసక్తి కలిగించే అంశం. బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న ” ప్రతివారూ ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు: పెరిగిన యుగోస్లావియా బెంగ ” అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది.యుగోస్లావియా సోషలిస్టు దేశ స్థాపకుడు మార్షల్‌ టిటో ”ఐక్యత, సోదరత్వం ” అనే నినాదం కింద భిన్నమైన తెగలు, మతాల వారితో ఐక్య దేశాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని,1980 టిటో మరణం తరువాత తలెత్తిన జాతీయవాదంతో అది 1992 విచ్చిన్నానికి దారి తీసిందని ఆ పత్రిక పేర్కొన్నది. టిటో కాలంలో అనుసరించిన కొన్ని విధానాలు, వైఫల్యాలు వాటి మీద జనంలో తలెత్తిన అసంతృప్తి, దాన్ని ఆసరా చేసుకొని అమెరికా, ఐరోపా దేశాల గూఢచార సంస్థలు, క్రైస్తవమత పెద్దల కుమ్మక్కు, కుట్రలతో దాన్ని, ఇతర తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన చరిత్ర, దాన్ని రక్షించుకోవాలని జనం కూడా అనుకోకపోవటం మన కళ్ల ముందు జరిగిందే. ఆకాశంలో మబ్బులను చూసి చేతిలోని ముంతనీళ్లు పారబోసుకున్నట్లు ఆ దేశాల్లో పరిస్థితి తయారైంది. ఆకాశంలో కనిపించిన వెండి మబ్బులు వర్షించలేదు. పూర్వపు పెట్టుబడిదారీ వ్యవస్థను జనాల నెత్తిన రుద్దారు. దానికి తోడు యుద్దాలు, అంతర్యుద్ధాలను బోనస్‌గా ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాల తరువాత గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న చేసిన విశ్లేషణలో ఉనికిలో లేని యుగోస్లావియా గురించి బెంగను, విచ్చిన్నంపట్ల విచారాన్ని వెల్లడించారని పేర్కొన్నది.విడిపోయిన సెర్బియాలో 81శాతం, బోస్నియాలో 77, తొలుతగా ఐరోపా సమాఖ్యలో చేరిన స్లోవేనియాలో 45, కొసావోలో పదిశాతం మంది విచ్చిన్నాన్ని తప్పుపట్టారని వెల్లడించింది.పూర్వపు సోషలిస్టు వ్యవస్థను వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని పోల్చుకొని నిట్టూర్పులు విడిచేవారిని గురించి కూడా ఉటంకించింది. దీని అర్ధం ఆ దేశాల్లో ఉన్నవారందరూ తిరిగి సోషలిజాన్ని కోరుకుంటున్నారని చెప్పలేము.పెట్టుబడిదారీ ప్రపంచం గురించి కన్న కలలు కల్లలౌతున్నపుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఒక మధనం జరుగుతోంది. సోషలిజం పేరెత్తితే అణచివేసేందుకు ప్రజాస్వామ్యముసుగులో నిరంకుశపాలకులు వారి కళ్ల ముందు ఉన్నారు.


ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ బూచిని చూపి దశాబ్దాల పాటు అమెరికన్లను ఏమార్చిన పాలకులకు 1991 తరువాత అలాంటి తమ పౌరులను భయపెట్టేందుకు వెంటనే మరొక భూతం కనిపించకపోవటంతో ఉగ్రవాద ముప్పును ముందుకు తెచ్చారు.అదీ అంతగా పేల లేదు. ఈ లోగా వారు ఊహించని పరిణామం మరొకటి జరిగింది.సోషలిస్టు చైనా పురోగమనం, దాని మీద అన్ని రకాల వినియోగ వస్తువులకు ఆధారపడటం అమెరికన్లలో కొత్త ఆలోచనకు తెరలేపింది. సోషలిస్టు దేశాల్లో అన్నింటికీ కరువే, ప్రభుత్వం కేటాయించిన మేరకు సరకులు తీసుకోవాలి, దుకాణాలన్నీ ఖాళీ అని చేసిన ప్రచారాన్ని నమ్మిన వారిలో కొత్త ప్రశ్నలు. అదే నిజమైతే అమెరికా, ఐరోపా ధనిక దేశాలన్నింటికీ చైనా వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం ప్రారంభమైంది.దానికి తోడు అమెరికాలో ఉపాధి తగ్గటం, నిజవేతనాలు పడిపోవటం వంటి అనుభవాలను చూసిన తరువాత మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? చైనా, వియత్నాంలో ఉన్న సోషలిజమే మెరుగ్గా కనిపిస్తోంది కదా అన్న సందేహాలు మొగ్గతొడిగాయి. దీనికి తోడు తమ పెరటి తోట అనుకున్న లాటిన్‌ అమెరికాలో తమ ప్రభుత్వం బలపరిచిన నియంతలందరూ మట్టి కరిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగిన చోట అమెరికాను వ్యతిరేకించే వామపక్ష శక్తులు అనేక దేశాల్లో ఒకసారి కాదు, వరుసగా అధికారంలోకి రావటాన్ని కూడా అమెరికన్‌ పౌరులు, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. సోషలిజం విఫలం అన్న ప్రచారానికి విలువ లేదు గనుక పాలకులు దాన్ని వదలివేశారు. తమ జీవిత అనుభవాలను గమనించిన వారు సోషలిజం సంగతేమో గానీ పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, అది మనకు పనికి రాదు అనే వైపుగా ఆలోచించటం ప్రారంభించారు.అనేక విశ్వవిద్యాలయాల్లో, పుస్తక దుకాణాల్లో మూలన పడేసిన కాపిటల్‌ తదితర మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులిపినట్లు దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా వారిలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. చైనా తమకు పోటీదారుగా మారుతున్నదన్న అమెరికా నేతల ప్రకటనలూ వారిని ప్రభావితం చేస్తున్నాయి.


ఇదే తరుణంలో అమెరికా రాజకీయవేదిక మీద బెర్నీ శాండర్స్‌ వంటి వారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ప్రారంభించటం, అవును నేను సోషలిస్టునే అని ప్రకటించి మరీ సెనెట్‌కు గెలవటాన్ని చూసిన తరువాత ఇటీవలి కాలంలో మేమూ సోషలిస్టులమే అని చెప్పుకొనే యువత గణనీయంగా పెరిగింది. అమెరికా అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌ ప్రాంతం ఉన్న వార్డు నుంచి పెట్టుబడిదారుల కుంభస్థలం వంటి సియాటిల్‌ నగరంలో వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు క్షమా సావంత్‌(49) అనే మహిళానేత ఇచ్చిన ఉత్తేజంతో పాటు, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి కొంత మంది పురోగామివాదులుగా ఉన్న వారు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నిక కావటం వంటి పరిణామాలు కూడా జరిగాయి.వారు కుహనా వామపక్ష వాదులు అంటూ వామపక్షం పేరుతో ఉన్న కొన్ని శక్తులు కార్పొరేట్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే అందుకున్నాయి. ఎవరు ఎలాంటి వారు అన్నది చరిత్ర చెబుతుంది. ఒక వేళ నిజంగానే కుహనాశక్తులు వామపక్షం ముసుగులో వస్తే అలాంటి వారిని గమనించలేనంత అవివేకంగా అమెరికా కార్మికవర్గం, యువత లేదు.


అందుకే పాలకపార్టీలు రెండూ కంగారు పడుతున్నాయి. లేకుంటే సోషలిజం ఘోరాలను ఖండించేపేరుతో రెండు పార్టీలు ఒకే తీర్మానాన్ని ఎందుకు బలపరుస్తాయి ? కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని, అమెరికాకు తిరుగులేదు అని చేప్పే గొప్పలను నమ్మటానికి అమెరికన్లు సిద్దంగా లేరు.తమ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాను అమెరికాతో పోల్చితే ఎలుక పిల్ల-డైనోసార్‌ వంటివి. అలాంటి క్యూబా దగ్గర అణ్వాయుధాలు లేవు, స్వంత క్షిపణులు లేవు. నిజానికి అమెరికా తలచుకుంటే ఒక్క నిమిషంలో క్యూబా దీవిని నామరూపాల్లేకుండా చేసే శక్తి ఉంది. అయినప్పటికీ మేము మీకెంత దూరమో మీరు కూడా మాకంతే దూరం అని ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. కాస్ట్రో వారసులు ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికాకు తిరుగులేదు అన్నట్లు చిత్రించే హాలీవుడ్‌ సినిమాల బండారం కూడా ఎరిగిందే. వియత్నాం నుంచి 1975లో బతుకు జీవుడా అంటూ హెలికాప్టర్లు, విమానాల వెంట పరుగులు తీసి పారిపోయి వచ్చిన అమెరికా సైనికులు మరోసారి ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతుల్లో కూడా అలాంటి పరాభవాన్నే పొందారంటూ వచ్చిన వార్తలను,దృశ్యాలను అమెరికా యువతీయువకులు చూడకుండా ఉంటారా ?


అమెరికా దిగువ సభ ఆమోదించిన కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఎగువ సభ సెనెట్‌ ఆమోదించటం లాంఛనమే, తిరస్కరిస్తే చరిత్ర అవుతుంది. తీర్మానంలో ఏముందో చెప్పనవసరం లేదు. వెనెజులా,క్యూబా తదితర దేశాలపై విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం గురించి పల్లెత్తు మాట లేదు. అక్కడ జనం ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అమెరికా పుణ్యమే అది.వ్యక్తిగత గౌరవార్హతల ప్రాతిపదిక మీద విశ్వాసం పునాదిగా అమెరికా ఏర్పడింది.సామాహిక వ్యవస్థగా నిర్మితమయ్యే సోషలిజం దానికి పూర్తి వ్యతిరేకం అని దానిలో పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాచిపాట, దాన్ని అమెరికా నూతన తరం అంగీకరించటం లేదని ముందే చెప్పుకున్నాం. ఉక్రెయిన్‌ వివాదానికి కారకులైన అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు దాన్నుంచి గౌరవ ప్రదంగా బయటపడే దారి, పడాలనే చిత్తశుద్ది లేక మరింత తీవ్రంగా మార్చేందుకు పూనుకున్నాయి. తటస్థంగా ఉన్న చైనా పుతిన్‌ మిలిటరీకి మారణాయుధాలు ఇచ్చేందుకు పూనుకున్నదని ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం జి20 దేశాల బృందం అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశాన్ని తమ వెంట నడవాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది.


ప్రతి ఏటా అమెరికాలోని కొన్ని సంస్థలు అభిప్రాయాలను సేకరిస్తాయి. వాటిలో సోషలిజం, పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించటం, వ్యరేకించటం గురించి కూడా ఉంటాయి. ఒక ఏడాది శాతాలు పెరగవచ్చు, తరగవచ్చు మొత్తం మీద గ్రాఫ్‌ ఎలా ఉందన్నదానినే పరిగణనలోకి తీసుకుంటే సోషలిజం పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే దాని మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ఏకంగా పార్లమెంటునే వేదికగా ఎంచుకున్నారు.ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ” పూ ” సంస్థ సర్వే ప్రకారం 2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు.ప్రతికూలంగా ఉన్నవారు 33 నుంచి 39శాతానికి పెరిగారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు, ప్రతికూలంగా ఉన్నవారు 55 నుంచి 60శాతానికి పెరిగినట్లు కూడా పేర్కొన్నది. దేశంలో 3.4 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. వారిలో 90లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారంతా ప్రభుత్వం లేదా దాన ధర్మాలు చేసే సంస్థలు జారీ చేసే ఆహార కూపన్లు (మన దేశంలో ఉచిత బియ్యం వంటివి) తీసుకుంటున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారిలో . 40శాతం మంది తమ వేతనాల్లో 30 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ సర్వేల మీద ప్రభావం చూపుతాయి. దిగజారుతున్న పరిస్థితులు తమ జనాన్ని మరింతగా సోషలిజం వైపు ఆకర్షిస్తాయి అన్నదాని కంటే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే ధోరణులు పెరగటమే అమెరికా పాలకవర్గాన్ని ఎక్కువగా భయపెడుతున్నదంటే అతిశయోక్తి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సియాటిల్‌ నగరంలో కులవివక్షపై నిషేధం – మహిళలందు కమ్యూనిస్టు క్షమా సావంత్‌ వేరయా !

26 Sunday Feb 2023

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination, Caste Discrimination Ban in Seattle, Casteism in America, Hindu Fundamentalism, Hinduthwa, Kshama Sawant, RSS, Seattle


ఎం కోటేశ్వరరావు


ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం గర్వంతో తల ఎత్తుకొనే పరిణామం.అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్‌ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ అనే 49 సంవత్సరాల భారతీయ మహిళ.తొలిసారి ఎన్నికైనపుడు కనీస వేతనం గంటకు 15 డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్‌ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు.రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక ” అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి ? ” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నపుడు మేయర్‌ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మితవాదులు, కార్పొరేట్‌ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసిలోని అమెరికా అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ ప్రాంతం కొంత భాగం కూడా క్షమా సావంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ వార్డు(జిల్లా అని పిలుస్తారు) పరిధిలోకి వస్తుంది.


సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. అటువంటి శక్తులకు క్షమా సావంత్‌ ప్రతినిధి. కానీ ఎక్కడకు వెళ్లినా కులవివక్ష కంపును మోసుకుపోతున్న సంస్కారం లేని జనాలు అమెరికాలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలించుకోకపోగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.చివరికి ఇటీవల సినిమా అభిమానులు కొట్టుకొని కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే. అనేక మంది తాము కులవివక్ష పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు అక్కడ కూడా మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు.


సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. వత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిస ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కులాలు లేకపోతే హిందూత్వ వాదులకు ఉలుకెందుకు ? తాజాగా సియాటిల్‌ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలు లేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది ) ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎవరైనా చూడవచ్చు. భుజం మీద చేయివేసి జంధ్యం ఉందా లేదా అని నిర్ధారించుకొనే టెక్నాలజీ మన సొంతం. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్స్‌అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం జరిగింది. అమెరికాలోని స్వామినారాయణ సంస్థ్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా వారే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.


మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్‌ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి.భర్త వివేక్‌ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్ధశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు.సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. మన దేశం నుంచి అనేక మంది అమెరికా వెళ్లారు. ఎంపీలు, మంత్రిపదవులు వెలగబెట్టారు. ఇప్పుడు ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కష్మా సావంత్‌ మాదిరి ఎందుకు ఆలోచించలేదు ? మహిళలకు మాత్రమే వారి సమస్యలు అలాగే దళితులకు మాత్రమే దళితుల వారి సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా మాట్లాడేవారికి దళితురాలు కాని క్షమా సావంత్‌ ఆచరణ ఆలోచింపచేస్తుందా ? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ది కావాలి. అది ఉండబట్టే నాడు ఉన్నవ లక్ష్మీనారాయణను మాలపల్లి నవలా రచనకు పురికొల్పింది. లేనందునే అనేక మంది దళితులమని చెప్పేవారు మనువాదుల చంకనెక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. నాడు దళితుల కోసం పోరాడిన ఇతరులు అనేక మంది వారి సామాజిక తరగతికి ద్రోహం చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, మరి నేడు మనువాదుల వెంట తిరిగే దళితులు ఎవరికి ద్రోహం చేస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

22 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, New START treaty, Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓరి మాయలోడో ఓరి మందులోడో : మోదానీ సినిమాలో ఒక రైల్వే పోర్టర్‌ సంచలనం !!

22 Wednesday Feb 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Modani, BJP, Gautam Adani, George Soros, Hindenburg effect, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.


ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.


భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్‌ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్‌ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఓటమి కోసం డెమోక్రటిక్‌ పార్టీకి సోరస్‌ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్‌ సెల్లింగ్‌ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్‌ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.


హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్‌ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్‌లో 1930లో జన్మించిన సోరస్‌ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్‌ చేరుకున్నాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్‌గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అసలు పడదు. ట్రంప్‌-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్‌ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్‌ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.

సోరస్‌ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్‌ సెల్లింగ్‌ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్‌ బాంకు షేర్లను అలాగే షార్ట్‌ సెల్లింగ్‌ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్‌కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్‌ ప్రభుత్వం పౌండ్‌ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్‌ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్‌ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వియత్నాంలో తమ మిలిటరీ మారణకాండను నిర్ధారించిన దక్షిణ కొరియా కోర్టు !

15 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ho Chi Minh, My Lai Massacre, US imperialism, Viet Cong fighters, Vietnam War, Vietnam War Massacre


ఎం కోటేశ్వరరావు


వియత్నాం ! స్వాతంత్య్రం, మూడు సామ్రాజ్యవాద దేశాల కబంధహస్తాల నుంచి విముక్తి కోసం మూడున్నర దశాబ్దాల పాటు అపార రక్తం ధారపోసి, త్యాగాలు చేసిన ఒక చిన్న దేశం. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. ఖండాలన్నింటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకొనేంత బలం కలిగిన అమెరికా సేనలను ప్రాణాలు దక్కితే చాలు బతుకుజీవుడా అంటూ పారిపోయేట్లు చేసి ప్రజాశక్తితో ఎంత పెద్ద మిలిటరీనైనా మట్టికరిపించవచ్చు అని నిరూపించిన దేశం కూడా అదే !! అలాంటి వీర గడ్డకు చెందిన గుయన్‌ థీ ధాన్‌ (62) వేసిన కేసును తొలిసారిగా విచారించిన దక్షిణ కొరియా కోర్టు వియత్నాంలో మారణకాండకు దక్షిణ కొరియా మిలిటరీ కారణమని ఫిబ్రవరి మొదటి వారంలో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఫ్రెంచి వలసగా ఉన్న వియత్నాంను రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమించింది. అది పతనమైన తరువాత తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమణలోకి వెళ్లింది. దాన్ని ఓడించిన తరువాత అమెరికా రంగంలోకి దిగి ఉత్తర వియత్నాంలోని సోషలిస్టు సమాజాన్ని, కమ్యూనిస్టులను, దక్షిణ వియత్నాంలోని జాతీయవాదులు, కమ్యూనిస్టులను అణచేందుకు చూసింది. దానికి మద్దతుగా తైవాన్‌లో తిష్టవేసిన చాంగ్‌కై షేక్‌ మిలిటరీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌,లావోస్‌, కంపూచియా, ఫిలిప్పైన్స్‌, థాయిలాండ్‌, దక్షిణ వియత్నాం మిలిటరీలు వచ్చాయి. ఉత్తర, దక్షిణ వియత్నాంలలోని కమ్యూనిస్టులకు మద్దతుగా చైనా, సోవియట్‌యూనియన్‌, ఉత్తర కొరియా, లావోస్‌, కంపూచియాల్లోని కమ్యూనిస్టు గెరిల్లాలు బాసటగా నిలిచారు.


వియత్నాంలో అమెరికా కూటమి జరిపిన మారణకాండకు గురికాని గ్రామం, పట్టణం లేదంటే అతియోక్తి కాదు, ప్రతి చెట్టూ, పుట్ట, రాయి, రప్ప దేన్ని కదిలించినా దుర్మార్గాలు-వాటికి ప్రతిగా పోరులో ప్రాణాలర్పించిన వారి కథలు, గాధలు వినిపిస్తాయి. అతివల కన్నీటి ఉదంతాలు కొల్లలు. అలాంటి మారణకాండలో ఏడు సంవత్సరాల ప్రాయంలో గాయపడి కోలుకున్న గుయన్‌ థీ ధాన్‌ అనే 62 సంవత్సరాల మహిళ 2020లో వేసిన కేసులో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక కోర్టు తీర్పునిచ్చింది. దక్షిణ కొరియా మిలిటరీ జరిపిన దారుణంలోనే ఆమె గాయపడిందని చెప్పటమే గాక, కేసులో ప్రభుత్వం చేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చి ఆమెకు మూడు కోట్ల వన్‌లు (24వేల డాలర్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీని మీద ప్రభుత్వ అప్పీలు చేస్తుందా ? మరొకటి చేస్తుందా అన్నది వెంటనే వెల్లడి కాలేదు. ఫాంగ్‌ హట్‌ సమీపంలోని ఫాంగ్‌ నీ అనే వియత్నాం గ్రామంలో 1968 ఏప్రిల్‌ 12న దక్షిణ కొరియా మిలిటరీ మూకలు నిరాయుధులైన పౌరులపై అకారణంగా జరిపిన కాల్పుల్లో 70 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. వారిలో గుయన్‌ థీ ధాన్‌ ఒకరు. ఆ ఉదంతంలో అమెతల్లి, సోదరుడితో సహా కుటుంబంలోని ఐదుగురు మరణించారు.ఈ ఉదంతం గురించి అమెరికా మిలిటరీ రికార్డులలో నమోదు చేశారు. ఒక దక్షిణ కొరియా మిలిటరీ జవాను గెరిల్లాల కాల్పుల్లో గాయపడిన తరువాత ఈ ఉదంతం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే గెరిల్లాలనేమీ చేయలేక సాధారణ పౌరుల మీద కక్ష తీర్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది.ఈ దారుణానికి ఒడిగట్టిన తరువాత గెరిల్లాల దాడికి భయపడి సైనికులు పారిపోయినట్లు అమెరికా రికార్డుల్లో ఉంది.


దశాబ్దాల పాటు సాగిన దుర్మార్గం, దాన్ని ప్రతిఘటిస్తూ సాగిన పోరులో మరణించిన వారి కచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేవు. అనేక మందిని అంతర్ధానం చేశారు, మిలిటరీ మరణాలను దాచారు. వియత్నాం పోరును రెండు భాగాలుగా చూడవచ్చు.1945లో జపాన్‌ దురాక్రమణ నుంచి తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమించిన తరువాత 1954 జూలై 21వరకు ఒకటి, తరువాత జరిగిన పరిణామాలను రెండో అంకంగా చెబుతున్నారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా సమాచారం ప్రకారం 1945 నుంచి 1954వరకు ఫ్రెంచి సామ్రాజ్యవాదులతో కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ తదితరుల నేతృత్వంలో సాగిన పోరును చరిత్రకారులు తొలి ఇండోచైనా వార్‌గా పిలిచారు.ఈ పోరులో కమ్యూనిస్టు గెరిల్లాలు, సాధారణ పౌరులు మూడు నుంచి ఐదులక్షల మంది వరకు ప్రాణాలర్పించారు. ఫ్రెంచి దళాలు, వారితో చేతులు కలిపిన స్థానికులు, కొద్ది మంది ఫ్రెంచి పౌరులు మొత్తం 92 నుంచి లక్షా పదివేల మంది వరకు మరణించారు. ఈ పోరు ముగింపు మరొక కొత్త పరిణామాలకు నాంది పలికింది. జెనీవాలో కుదిరిన ఒప్పందం ప్రకారం వియత్నాంను ఉత్తర – దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తరవియత్నాం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చింది. రెండు సంవత్సరాల్లో దక్షిణ వియత్నాంలో ఎన్నికలు జరిపి రెండు ప్రాంతాల విలీనం జరపాలని దానిలో ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఎన్నికలు జరిగితే దక్షిణ వియత్నాంలో ఫ్రెంచి అనుకూల శక్తులు ఓడిపోవటం ఖాయంగా కనిపించింది. దాంతో ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికన్లు ఫ్రాన్స్‌ స్థానంలో ప్రవేశించి విలీనాన్ని అడ్డుకున్నారు. దక్షిణ వియత్నాంలోని దేశభక్తులు,కమ్యూనిస్టులు వియట్‌కాంగ్‌ పేరుతో ఒక దేశభక్త సంస్థను ఏర్పాటు చేసి అమెరికా, స్థానిక మిలిటరీ నుంచి విముక్తికోసం పోరు ప్రారంభించారు. దానికి ఉత్తర వియత్నాం పూర్తి మద్దతు ఇచ్చింది. అది 1975 ఏప్రిల్‌ 30వరకు సాగింది. అమెరికా దళాలు అక్కడి నుంచి పారిపోయాయి.


దాడుల్లో 30లక్షల మంది అమెరికా సైనికులు పాల్గొన్నారు. దాడుల్లో అక్కడికక్కడే లేదా గాయాలు తగిలి చచ్చిన వారు గానీ 58,220 మంది, వీరుగాక దక్షిణ వియత్నాం కీలుబొమ్మ మిలిటరీ రెండు నుంచి రెండున్నరలక్షల మంది, మొత్తంగా మరణించిన వారు 3,33,620 నుంచి 3,92,364 మంది ఉంటారని లెక్క. ఈ కూటమికి చెందిన పదకొండు లక్షల మంది సైనికులు గాయపడ్డారని అంచనా. కమ్యూనిస్టు వియత్నాం మిలిటరీ, గెరిల్లాలుగానీ పదకొండు లక్షల మంది ప్రాణాలర్పించారు.అమెరికా దాని తొత్తుల దాడుల్లో ఇరవైలక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఇక సియోల్‌ కోర్టు కేసు అంశానికి వస్తే అసలు దాన్ని అనుమతించటమే ఒక అసాధారణ పరిణామం. ఫాంగ్‌ హీ గ్రామంలో జరిగినట్లు చెబుతున్న మారణకాండలో దక్షిణ కొరియా మిలిటరీ పాత్ర గురించి ఆధారాలు లేవని ఒకసారి,వియట్‌కాంగ్‌లను అణచివేసేందుకు దళాలు ప్రయత్నించినపుడు కొందరు పౌరుల మరణాలు తప్పలేదని మరొకసారి, పౌరుల్లో మిళితమైన వియట్‌కాంగ్‌లు జరిపిన కాల్పుల్లోనే గ్రామస్థులు మరణించి ఉండవచ్చు అని, దక్షిణ కొరియా మిలిటరీ దుస్తులు ధరించి వియట్‌కాంగ్‌లే కాల్పులు జరిపారని ఇలా రకరకాలుగా తప్పించుకొనేందుకు ప్రభుత్వం చూసింది.ఒక వేళ కొరియా సైనికులే కాల్పులు జరిపినా అది గెరిల్లాల నుంచి వచ్చిన ముప్పును తప్పించుకొనేందుకు ఆత్మరక్షణ కోసం జరిపినవి తప్ప మరొకటి కాదని కూడా వాదించింది. ఈ వాదనలన్నింటినీ కోర్టు తోసి పుచ్చింది. ప్రభుత్వం చెప్పిన దానికి ఎలాంటి రుజువులు లేకపోగా అలాంటి ప్రతిఘటనను మిలిటరీ ఎదుర్కొనలేదని, జనాన్ని ఒకదగ్గర చేర్చి సమీపం నుంచి కాల్చి చంపినట్లు మాజీ సైనికుడు చెప్పాడు.ఈ కేసులో వియత్నాం గ్రామీణులు, నాటి దాడిలో పాల్గొన్న మాజీ సైనికుడు యు జిన్‌ సియోంగ్‌ కూడా ఆ రోజు ఏం జరిగిందీ, నిరాయుధులైన మహిళలు, పిల్లల మీద ఎలా కాల్పులు జరిపిందీ కోర్టుకు చెప్పాడు. ఆ దారుణం జరిగిన తరువాత అమెరికా సైనికుడు ఒకడు తీసిన ఫొటోలు ఈ కేసులో సాక్ష్యాలుగా పనికి వచ్చాయి.


దక్షిణ వియత్నాంలో అమెరికా జరుపుతున్నదాడులకు తోడుగా దక్షిణ కొరియా మూడు లక్షల 20వేల మంది సైనికులను అక్కడకు పంపింది.వారు అమెరికన్లతో కలసి లక్షల మందిని చంపారు. దాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఇంతవరకు అంగీకరించలేదు. ఈ దారుణం తరువాత మై లాయి అనేచోట అమెరికా మిలిటరీ ఇలాంటి ఊచకోతకే పాల్పడి పెద్ద సంఖ్యలో చంపింది. విమానాలు, మిలిటరీ శకటాలతో అమెరికా దాడి జరపగా గెరిల్లాలు భౌగోళిక అనుపానులు ఎరిగి ఉన్నందున తప్పించుకొని శత్రువులను దెబ్బతీశారు. వారికి తినేందుకు తిండి కూడా లేని స్థితిలో ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకొంటూ పోరు జరిపారు.అనేక రోజులు పస్తులు కూడా ఉన్నారు. సరైన పడకలు, నిదురలేని రోజులు అనేకం. సొరంగాలు తవ్వి రక్షణ తీసుకోవటమే గాక అమెరికా మిలటరీ మీద దాడి చేసి అడవుల్లో కనిపించకుండా తప్పించుకొన్నారు. ఇదంతా ఒక రోజు, ఒకనెల, ఏడాది కాదు పందొమ్మిది సంవత్సరాల పాటు పోరాడారు.


మై లాయి మారణ కాండ అమెరికా దుష్ట చరిత్రలో చెరగని మచ్చ. ఇలాంటి అనేక దారుణాలు జరిపిన అమెరికా, ఫ్రాన్స్‌, అంతకు ముందు జపాన్‌ జరిపిన దారుణాలను ఇప్పటికీ ఆ ప్రభుత్వాలు అంగీకరించటం లేదు. మరోవైపు మానవహక్కులు, మన్నూ అంటూ ప్రపంచానికి కబుర్లు చెబుతున్నారు. మై లాయిలో మరతుపాకులతో అమెరికన్లు జనాలను ఊచకోత కోశారు. విలియం కాలే అనే లెప్టినెంట్‌ నాలుగు గంటల పాటు ఆ మారణకాండను పర్యవేక్షించాడు. వందలాది మహిళల మీద అత్యాచారాలు జరిపి నరికి చంపటంతో పాటు రెండు వందల మంది పిల్లలతో సహా 504 మందిని చంపారు. వారందరినీ గోతుల్లో దించి ఎటూ వెళ్లకుండా మరతుపాకులతో కాల్చి చంపారు.ఈ ఉదంతాన్ని తరువాత కాలంలో అమెరికా మిలిటరీలో పాఠంగా చెప్పారంటే దుర్మార్గాలను ఎలా జరపాలో శిక్షణ ఇచ్చారన్నది స్పష్టం.వైమానిక దళ మేజర్‌ లాగాన్‌ సిషన్‌ పాఠాలు చెబుతూ మనం వారిని హీరోలుగా పరిగణించవచ్చని, మై లాయిలో ఎవరైనా హీరోలు ఉంటే వారే అని చెప్పాడంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో వేరే చెప్పనవసరం లేదు. ఆ మారణకాండ జరిపినపుడు జనం మీదకు హెలికాప్టర్‌ను తోలిన ముగ్గురు పైలట్లను మూడు దశాబ్దాల తరువాత హీరోలుగా అమెరికా సత్కరించింది.విలియం కాలే మీద తప్పనిసరై విచారణ జరిపి శిక్ష వేశారు. తరువాత దాన్ని గృహనిర్బంధంగా మార్చారు, అది కూడా మూడున్నర సంవత్సరాల తరువాత వదలివేశారు. ఇలాంటి దుర్మార్గులను వదలివేసిన కారణంగానే తరువాత 2005లో ఇరాక్‌లోని హడితా అనే చోట అమెరికా ముష్కురులు మహిళలు, పిల్లలతో సహా 24 మంది పౌరులను ఊచకోత కోశారు.దానికి ఒక్కడిని బాధ్యుడిగా చేసి మందలించి వదలివేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అమెరికన్లు ఇలాంటి దుర్మార్గానికే పాల్పడ్డారు.


వియత్నాంలో దక్షిణ కొరియా మిలిటరీ దుర్మార్గాన్ని కోర్టు నిర్ధారించిన తరువాత కొరియాను ఆక్రమించినపుడు జపాన్‌ చేసిన దుర్మార్గాలను కూడా విచారించాలని, వాటిని జపాన్‌ అంగీకరించాలని దక్షిణ కొరియన్లు కొందరు ప్రదర్శన జరిపి డిమాండ్‌ చేశారు. జపాన్‌ సైనికులకు కొరియా మహిళలను బానిసలుగా మార్చి రాత్రుళ్లు బలవంతంగా అప్పగించి బలిచేశారు. వారిని ”సుఖ మహిళలు ”గా అభివర్ణించి దుర్మార్గానికి పాల్పడ్డారు. జపాన్‌ మాదిరి అక్రమాలు జరగలేదని బుకాయించకుండా మానవహక్కుల పట్ల గౌరవం ఉన్నదిగా కొరియా నిరూపించుకోవాలని కూడా వారు కోరారు. దక్షిణ కొరియా క్రైస్తవ మతాధికారులు కూడా వియత్నాం బాధితులకు క్షమాపణలు చెప్పారు. వియత్నాంలో మారణకాండతో పాటు అమెరికా జరిపిన మరొక దుర్మార్గం ఏమంటే ఏజంట్‌ ఆరెంజ్‌ పేరుతో రసాయన దాడులకు కూడా పాల్పడింది.దీని వలన భూమి, నీరు కలుషితం కావటంతో జనాలు అనేక రుగ్మతలకు గురికావటం, పంటలకు దెబ్బతగిలింది.అమెరికా జరిపిన ఈ దాడి వలన తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కొన్ని కేసులను దాఖలు చేశారు. దీని బాధితులకు కూడా న్యాయం చేయాలి. మరి ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ గురించి కబుర్లు చెప్పే అమెరికా,ఫ్రాన్స్‌, జపాన్‌ ఇండోచైనా దేశాలు, కొరియన్లకు క్షమాపణ చెప్పటమే కాదు, నష్టపరిహారం చెల్లిస్తాయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపన : సుప్రీంకోర్టుకైనా నరేంద్రమోడీ చెబుతారా, కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ?

11 Saturday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, HINDENBURG, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, RSS, SEBI, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దేశం మొత్తాన్ని కుదిపివేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మోడీ తీరు తెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి స్టైల్‌ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్దతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశభద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా ? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ? చూద్దాం !


శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావా వేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్‌ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడి విడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్దీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది.కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్‌ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.


జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,హిండెన్‌ బర్గ్‌ నివేదిక దేశ స్టాక్‌ ఎక్సేంజ్‌ను కుదిపివేయటమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్దతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు.నియంత్రణలు లేకుండా ప్రభుత్వ రంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్‌ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథకంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్రమోడీ-అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్‌ అనుకొనేందుకు అవకాశం ఉంది.


ప్రపంచంలో హిండెన్‌బర్గ్‌ వంటి షార్ట్‌ సెల్లర్స్‌, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరాయె ఎసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిఐఓ రాహుల్‌ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది.” రానున్న 5-10 సంవత్సరాల్లో భారత్‌ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్‌ సెల్లర్స్‌ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి.మార్కెట్‌ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్‌ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను ” అని చద్దా చెప్పారు. ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతి చోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు.


సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్‌ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్దాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు.హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఓ పేరుతో రు.20వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్న చిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్‌ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి.అస్థిరపరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.


ఇక షార్ట్‌ సెల్లర్స్‌ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్‌ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాలను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. దాంతో ఆ కంపెనీలో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని ఇతరులు కూడా మరింత నష్టపోకుండా చూసుకుందామని అమ్మకాలకు పాల్పడతారు. వాటి విలువ పడిపోతుంది.ఆ ఒక్క కంపెనీ వాటాల ధరలే కాదు, స్టాక్‌ మార్కెట్లో ఇతర కంపెనీల ధరలూ పతనం కావచ్చు. దాన్ని ఆసరా చేసుకొని అదే షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా అదే కంపెనీ లేదా ఇతర కంపెనీల వాటాలను తక్కువ ధరలకు కొని పెద్ద మొత్తంలో లాభాలు పొందిన ఉదంతాలతో పాటు చేతులు కాల్చుకున్నవారు లేకపోలేదు. స్టాక్‌ మార్కెట్లో ఇదొక ఖరీదైన జూదం. షార్ట్‌ సెల్లర్స్‌కు వాటాలను అరువుగా ఇచ్చిన బ్రోకర్లకు ఎలాంటి నష్టమూ ఉండదు.లేదూ కొంత మంది బ్రోకర్లే షార్ట్‌ సెల్లింగ్‌కూ పాల్పడి జూదమాడవచ్చు.ఈ షార్ట్‌ సెల్లర్స్‌ ఎలాంటి వారంటే ప్రధాన పట్టణాల బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కొంత మంది ఆటో, టాక్సీ వాలాలు వచ్చిన వారిని ఎక్కించుకొని కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా పగలంతా పడిగాపులు పడి ఎవరైనా అమాయకులు దొరికితే దోచుకొనే ఒక సినిమాలో నిక్కర్‌ నారాయణ పాత్రను గుర్తుకు తెస్తారు.


ఇలాంటి జూదాన్ని స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు.ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్‌మార్కెట్లలో అలా జరగలేదు.అనుమతిస్తూనే ఉన్నారు. భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్‌ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్‌ పరేఖ్‌ అనే నేరస్తుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. వైస్‌ జగన్‌మోహనరెడ్డి సాక్షి పత్రిక, టీవీ కంపెనీలో పది రూపాయల విలువగల వాటాలను వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని మీరెందుకు అలా కొన్నారని ప్రశ్నిస్తే మేం వ్యాపారులం, లాభాలు వస్తాయనే అంచనాతో కొన్నాం, ఒక వేళ రాలేదనుకోండి నష్టపోయేది మేమే కదా మాకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాని వెనుక ఆసలు కథ ఏమంటే అదే వ్యాపారులు రాజశేఖరరెడ్డి సర్కార్‌ నుంచి భారీ మొత్తంలో లబ్ది పొందారని దానికి బల్లకింద గాక బల్లమీదనే బహిరంగంగా చట్టపరంగానే అలా ప్రతిఫలం చెల్లించారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. వాటి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి.దీన్నే నీకది నాకిది అంటారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతంపై సోమవారం నాడు లేదా తరువాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.


షార్ట్‌ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దానివెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.హిండెన్‌బర్గ్‌ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్‌ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు,తన మిత్రదేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్రమోడీని రక్షించేందుకు జో బైడెన్‌ ఎందుకు పూనుకోలేదు ? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్‌ సెల్లర్స్‌ భారీ ఎత్తున లబ్ది పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నారు. అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్‌ సెల్లింగ్‌కు పాల్పడి లబ్దిపొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్‌ కంటే పదమూడుశాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు.అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే.2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్‌ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్‌ సెల్లర్ల దాడికి గురైంది.వారు పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలకపార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్‌ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్‌ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్‌ సెల్లర్లు లబ్ది పొందారు. ఇలా ప్రతిదేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్‌ సెల్లర్లు ఎంచుకొని లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్‌ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్‌ సెల్లర్స్‌ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ది పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా హస్తం నిజానిజాలేమిటి : అదానీని మోస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ” ఆర్గనైజర్‌ ” కట్టుకథలు, పిట్టకతలు !

09 Thursday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, China, Donald trump, Explosive BBC documentary, Hindenburg Controversy, HINDENBURG RESEARCH, Joe Biden, Narendra Modi Failures, Propaganda War, RSS, SJM


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అనేక మందిని తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పక్కా నిజాలే చెబుతారు, సత్యహరిశ్చంద్రుడి తరువాత కారణజన్ములు వీరే అన్నట్లు నమ్ముతున్న కొన్ని సంస్థలకు చెందిన వారు పచ్చి అబద్దాలను అలవోకగా ఎలా చెప్పగలుగుతున్నారు ? వారికా తెగింపు ఎలా వచ్చింది ? అన్నింటికీ మించి మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏం చేస్తున్నారు అన్నది బ్రహ్మపదార్ధంగా ఉంది. బుధవారం నాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఒక్కసారి కూడా అదానీ గురించి, అతని కంపెనీల మీద వచ్చిన ఆరోపణలను ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో జరిగిన కుంభకోణాల పునశ్చరణతో దేశాన్ని ముందుకు నడిపించగలరా ? అదానీ కంపెనీలపై వచ్చిన విమర్శలతో ప్రపంచంలో మన మీద విశ్వసనీయత సడలిందని ప్రధాని గుర్తించలేదా ? లేక నటిస్తున్నారా ? అదానీ కంపెనీలపై విచారణ జరిపి అక్రమాలేం లేవు అని తేలిస్తే మన ప్రతిష్ట ఇంకా పెరగేది కదా ! ప్రతిపక్షాలు కోరిన విచారణ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదు. అంటే అదానీ కంపెనీలకు మద్దతు ఇచ్చినట్లేనా ! ఆ ముక్కే సూటిగా ఎందుకు చెప్పలేదు. పాత కుంభకోణాలను ముందుకు తెచ్చి అదానీ కంపెనీల అక్రమాలను మూసిపెట్టాలని చూస్తే కుదురుతుందా ? ఇలా ఎన్నో కొత్త ప్రశ్నలు. ప్రతిపక్షాల కంటే తనను తానే ఇరుకున పెట్టుకుంటున్నారా అని నిజంగా మోడీని నమ్మినవారు కూడా ఆలోచిస్తున్న స్థితి ? మక్కువ పడ్డ మగువ కోసం రాజ్యాలనే పోగొట్టుకున్న రాజుల కథలు విన్నాం. ఒక కంపెనీకోసం నరేంద్రమోడీ ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు?


అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ సంస్థ.ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్యకు పాల్పడితే తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన నరేంద్రమోడీ పుతిన్‌తోనూ జో బైడెన్‌తోనూ మాట్లాడి సర్దుబాటు చేసేందుకు చూశారు. అమెరికా నరేంద్రమోడీకి జిగినీ దోస్తు. తన కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ వదలిన క్షిపణి మన దేశం మీద జరిగిన దాడిగా అదానీ వర్ణించారు. ఉక్రెయిను మీద చూపిన శ్రద్దలో వందో వంతైనా లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మన మదుపర్ల మీద ఎందుకు లేదు అన్నది మోడీ అభిమానులకు సైతం అంతుచిక్కని ప్రశ్న. అమెరికానే మన కాళ్ల దగ్గరకు తెస్తున్న మోడీ అన్న వందిమాగధుల గురించి తెలిసిందే. మిత్రోం లేదా ఏ మోయి జో బైడెనూ మీకు నేను కావాలా వద్దా కావాలనుకుంటే హిండెన్‌బర్గ్‌ మా మీద చేసిన దాడి గురించి చప్పుడు(మాట్లాడవు) చెయ్యవేమిటి అని ఫోన్‌ చేసి అడుగుతారేమో అని ఎదురు చూసిన వారికి ఇప్పటి వరకు నిరాశేమిగిలింది.మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్నట్లుగా జనం భావించక ముందే మోడీ స్పందిస్తారా ? ఇది సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి ప్రశ్నగా మారుతుందా ?


హిండెన్‌బర్గ్‌కు ముందు దేశంలోని ఏ సంస్థ లేదా పార్టీ కూడా అదానీ కంపెనీల మీద అలాంటి అంశాలను ముందుకు తేలేదు. ఆరోపణలు చేయలేదు. అది 129 పేజీలలో చెప్పిన అంశాల మీద అదానీ 413 పేజీల వివరణ ఇచ్చారు. ఆ ఒక్కటి మినహా అన్నట్లుగా కీలకమైన అంశాలను వదలి ఇతర గాలిపోగేశారని చెబుతున్నారు. అందుకే దీని మీద నిగ్గుదేల్చాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీసినా మహామౌనమునిగా పేరుతెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అవి నిజమనో కాదనో, అదానీ పరమపునీతుడనో ఏదో ఒకటి చెప్పమంటే మిన్నువిరిగి మీద పడినా నోరు విప్ప అన్నట్లుగా ఉన్నారు. పార్లమెంటు సమయం, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అవుతున్నా, లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనా ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీకి పట్టలేదు.


గుజరాత్‌కు చెందిన స్టాక్‌ బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌ కుంభకోణం గురించి దర్యాప్తు జరిపేందుకు 2001లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ జాయింట్‌ పార్లమెంటరీ కమిటి(జెపిసి)ని వేసింది. గుజరాత్‌లోని సహకార బాంకులను ముంచినందున అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ సారధి నరేంద్రమోడీకి దెబ్బతగులుతుందని భావించిన కారణంగా అనివార్యమై ఆనాడు అంగీకరించాల్సి వచ్చింది. ఆ కుంభకోణం వందల కోట్లలోనే ఉంది. కంపెనీలు, వాటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కుమ్మక్కై కేతన్‌ పరేఖ్‌ ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణమది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. ఇప్పుడు అదానీ కంపెనీల వాటా ధరలను కూడా అదే విధంగా లేని విలువను పెంచారన్నదే ప్రధాన ఆరోపణ. నాటి జెపిసి విచారణ జరిపి కుంభకోణం వాస్తవమని తేల్చింది. ఇప్పుడు కూడా అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద అలాంటి కమిటీని వేసేందుకు మోడీ ఎందుకు అంగీకరించటం లేదన్నది ప్రశ్న. నిజం కాదనైనా తేల్చి అదానీ మీద పడిన మచ్చను తొలగించవచ్చు కదా ! వాజ్‌పాయిని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు ? దారినపోయే దానయ్య ఒకడు ఏదో అన్నాడని రాముడు సీత పవిత్రతను లోకానికి నిరూపించేందుకు అగ్నిప్రవేశం చేయించిన ఆదర్శవంతుడంటూ గొప్పగా చెప్పే బిజెపి పెద్దలు అదానీ గురించి విచారణకు ఎందుకు జంకుతున్నారు ? రాముడి ఆదర్శం ఓట్లు దండ్లుకొనేందుకు చెప్పుకోవటం తప్ప దాని స్ఫూర్తిని అనుసరించరా ? అదానీ అగ్నిప్రవేశం గురించి ఎవరూ అడగటం లేదుగా !


మరోవైపున నరేంద్రమోడీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార్‌ కాషాయ దళాలు అదానీని సమర్ధించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం కట్టుకథలు, పిట్టకతలు చెబుతున్నాయి. జనానికి నిర్ధారించే ఆలోచన, అవకాశాలు ఉండవని కాబోలు పచ్చి అవాస్తవాలను వండి వారుస్తున్నాయి. మన దేశ చరిత్రలో ఒక పారిశ్రామిక, వ్యాపార సంస్థ మీద వచ్చిన తీవ్ర ఆరోపణలు విచారించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటం, సాంస్కృతిక సంస్థ ముసుగువేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధనకు దిగటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. డాక్టర్‌ సునీల్‌ గుప్తా అనే పెద్దమనిషి 2023 ఫిబ్రవరి ఆరవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” లో హిండెన్‌బర్గ్‌ వివాదం అంటూ ఒక విశ్లేషణ రాసి అదానీకి కితాబునిచ్చారు. అది భారత్‌ మీద జరిపిన కుట్రగా వర్ణించారు. బిబిసి విదేశీ, అది చెప్పినదానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలా, దాని విశ్వసనీయత ఏమిటి? హిండెన్‌బర్గ్‌ ఒక విదేశీ సంస్థ దాని నిజాయితీ ఏమిటీ అంటూ అనేక మంది ఒక తర్కాన్ని ముందుకు తీసుకువచ్చారు. వారంతా సంఘపరివార్‌కు చెందిన వారు లేదా దాని మాటలను గుడ్డిగా విశ్వసించే వారు అన్నది తెలిసిందే. నిజమే, ఏ సంస్థనూ ఎవరూ ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బంగారం స్వచ్చతను కొలిచేందుకు కారట్ల ప్రమాణాలు ఉన్నాయి. ఏ సంస్థకూ దాని స్వచ్చతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలేమీ లేవు. కానీ ఆర్గనైజర్‌ విశ్లేషకులు దవోస్‌లో ప్రపంచ ఆర్థికవేదిక మీద భారత ఆర్థిక రంగం మహా గొప్పగా ఉందని బాంక్‌ ఆఫ్‌ జపాన్‌ గవర్నర్‌ పొగిడారని, అదే సమావేశంలో ఉన్న నోకియా సిఇఓ, ఎరిక్స్‌న్‌ అధిపతి తదితర అగ్రశ్రేణి ప్రపంచ సిఇఓలు నిజమే అన్నారన, సిఎన్‌బిసితో అనేక ప్రముఖ మీడియా సంస్థలు దేశ ఆర్థిక పురోగతి, వచ్చే రోజుల్లో సాధించనున్న విజయాల గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. మరి ఈ సంస్థలు, సిఇఓలకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ? రిలయన్స్‌, టాటాల వంటి సంస్థలతో పాటు అదానీ కంపెనీలు దేశ వృద్దిలో భాగస్వాములౌతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ ప్రశ్న 2014లో ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎలా ఎదిగారు, వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నటాటా వంటి వారికి సాధ్యం కానిది అదానీకి ఎలా వచ్చింది, ఎందుకు రాలేదు అన్నది చెప్పాలి.


హిండెన్‌బర్గ్‌ అదానీ కంపెనీ మీద విడుదల చేసిన నివేదికను దేశం మీద దాడిగా చిత్రించటం అంటే గతంలో ఇందిరే ఇండియా- ఇండియా అంటే ఇందిర అన్న కాంగ్రెస్‌ నేత డికె బారువా భజనను గుర్తుకు తెస్తున్నది. అదానీయే ఇండియా-ఇండియా అంటే అదానీ అనటమే. ఇదే హిండెన్‌బర్గ్‌ గతంలో అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్‌ అనే సంస్థ గురించి కూడా పరిశోధన నివేదికను వెలువరించటంతో ఆ కంపెనీ వాటాల ధర కుప్పకూలింది. అంటే అది అమెరికా మీద దాడి, మాతృ దేశానికి ద్రోహం చేసినట్లా ? దాని వెనుక ఎవరున్నారు ? తీరా తరువాత తేలిందేమిటి నికోలా కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణైంది. అందువలన నడమంత్రపు సిరి వచ్చిన ఏ కంపెనీని ఎవరూ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. కానీ విలువలు-వలువల గురించి చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎందుకు కొమ్ముకాస్తున్నట్లు ? గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌కు చెందిన బిబిసి చెప్పిందాన్ని నమ్మాల్సిన అవసరం లేదని వాదిస్తున్నవారు అదే బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్టు పత్రిక రాసిందాన్ని నమ్మి తన విశ్లేషణలో దాన్ని ఉటంకించి అదానీ తప్పు చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎలా సమర్ధించుకుంటుంది ? తమకు అనుకూలంగా ఉంటే విదేశీ కితాబు ఫర్వాలేదా ? విమర్శిస్తే దేశం మీద దాడా ?ఎకానమిస్టు చెప్పిందాన్ని వారు నమ్మే వేద ప్రమాణంగా తీసుకుంటారా ? నిజాన్ని నిగ్గుతేల్చమన్న డిమాండ్‌ను అంగీకరించటానికి నోరెందుకు రాదు.ఆత్మవంచన, పర వంచన, రెండునాలికలతో మాట్లాడటం తప్ప మరొకటికాదు.


ఎవడు కొడితే మైండు బ్లాకై దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు అన్నట్లు హిండెన్‌బర్గ్‌ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన వారు ఎవరేేం మాట్లాడుతున్నారో పొంతన లేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఆర్గనైజర్‌ పత్రికలో 2023 ఫిబ్రవరి 4వ తేదీన వెబ్‌డెస్క్‌ పేరుతో సరికొత్త కథనాన్ని వండి వడ్డించారు.దానిలోని అంశాలను కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విజయ గజేరా, ద హాకీఎక్స్‌ అనే వారి ట్వీట్ల ఆధారంగా యధార్ధ సిక్కా దాన్ని పేర్చినట్లు పేర్కొన్నారు.అసలు వారెవరు ? వారి ట్వీట్లకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ?


ఆర్గనైజర్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ” బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్‌ థారులాండ్‌ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ చేసిన కుట్రను పోలి ఉంది. వాస్తవంగా అదానీ కంపెనీలపై దాడి జనవరి 25న హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత ప్రారంభం కాలేదు. ఒక ఆస్ట్రేలియన్‌ ఎన్‌జివో నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ 2016-17లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాల్సిన ఎన్‌జిఓ అదాని వాచ్‌ డాట్‌ ఓఆర్‌జి పేరుతో అదానీ బొగ్గు గనులకు వ్యతిరేకం అని చెప్పినప్పటికీ దానికే పరిమితం కాలేదు. ఇప్పుడు అదానీకి సంబంధం లేని అంశాలను కూడా ప్రచురిస్తోంది. రవీష్‌ కుమార్‌ ఎన్‌డిటివీని వదిలితే దానికేమిటి పని ? ఒక పర్యావరణ ఎన్‌జిఓకు బిబిసి డాక్యుమెంటరీ మీద ట్వీట్‌ను సమర్ధించాల్సిన అవసరం ఏమిటి ? ఎన్‌ఎఫ్‌ఐ అనే భారత్‌ ఎన్‌జివో జార్జిసోరస్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, రాక్‌ఫెల్లర్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీల నుంచి నిధులు పొందుతున్నది. అజీమ్‌ ప్రేమ్‌ జీ ఏర్పాటు చేసిన ఎన్‌జిఓ ఐపిఎస్‌ఎంఎఫ్‌ ఆల్ట్‌ న్యూస్‌, ద వైర్‌, ద కారవాన్‌, ది న్యూస్‌ మినిట్‌ తదితర సంస్థలకు నిధులు ఇస్తున్నది. సిపిఐ(ఎం) నేత సీతారామ్‌ ఏచూరి భార్య సీమా చిస్తీ ఎన్‌ఎఫ్‌ఐకి మీడియా ఫెలోషిప్‌ సలహాదారు. ఆమె ద వైర్‌ ఎడిటర్‌. వైర్‌కు సోరోస్‌, ఫోర్డ్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, రాక్‌ఫెల్లర్‌, ఓమిడియార్‌తో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. 2017లో అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి వైర్‌ ఐదు కథనాలను రాసింది.


డిజిపబ్‌ పేరుతో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లతో ఒక గ్రూపును ధన్యా రాజేంద్రన్‌ ఏర్పాటు చేశారు. దీనికి న్యూస్‌క్లిక్‌ ప్రబీర్‌ పురకాయస్థ ఉపాధ్యక్షుడు.దీనిలోని సైట్లన్నింటికీ ఐపిఎస్‌ఎంఎఫ్‌ నిధులు ఇస్తుంది.ఈ సైట్లతో ప్రమేయం ఉన్న వారందరి ఖాతాలను చూస్తే సమన్వయంతో అదాని మీద దాడిచేసిన ట్వీట్లను చూడవచ్చు. విదేశీ ఎన్‌జివోలు, దేశంలోని వారి భాగస్వాముల నుంచి నిధులు, శిక్షిణను పొందిన వీరంతా దేశంలోని జాతీయ వాదులు లేదా సంస్థల మీద దాడి చేస్తారు. అదానీ, అంబానీల మీదనే వీరు దాడి చేస్తారు. టాటా, ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, వాద్రా లేదా ఇతరుల మీద ఎందుకు చేయరు ? ” ఆర్గనైజర్‌ కథనం ఇలా సాగింది.


ఆర్గనైజర్‌ బాధ అదానీ కంపెనీలను విమర్శించినందుకైతే అంతవరకు పరిమితం కావాలి. కానీ ఇతరుల మీద దాడి ఎందుకు చేయరు అని ప్రశ్నించటం ఏమిటి ? ఒక సాంస్కృతిక సంస్థ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుంది. అది నడిపే పత్రికకు ఇతర అంశాలెందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. హిండెన్‌బర్గ్‌ నివేదిక మీద 413పేజీల వివరణ ఇచ్చిన అదానీ తన మీద దేశంలోని కొన్ని వెబ్‌సైట్‌లు నిజంగా దాడి చేస్తుంటే ఇంతవరకు ఒక్క నివేదికా విడుదల చేయలేదేం ? కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు అదానీకి లేని దురద ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజర్‌కు ఎందుకు ? అతని కంపెనీలనుంచి ఎంత ముట్టిందేమిటి ? దాని రాతలో పేర్కొన్న సంస్థలు అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు.అమెరికాలోని అనేక సంస్థలు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటపుడు వాటి గురించి నరేంద్రమోడీ గతంలో బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు, ఇప్పుడు జో బైడెన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? జాతీయవాదుల మీద ఆ సంస్థల నిధులతో కొందరు దాడి చేస్తుంటే అసలు సిసలు జాతీయవాదినని చెప్పుకొనే నరేంద్రమోడీ మన దేశంలో వాటి కార్యకలాపాలను ఎందుకు అదుపు చేయరు ? ఈ అంశాలన్నింటినీ ఆర్గనైజర్‌ ఎందుకు ప్రశ్నించదు ?


సుమీత్‌ మెహతా, వినయకుమార్‌ సింగ్‌ ద్వయం 2023 ఫిబ్రవరి 25న ఆర్గనైజర్‌లో ఒక విశ్లేషణ రాసింది. అదానీ నివేదిక, బిబిసి డాక్యుమెంటరీ కూడా చైనా కుట్రే అన్నది సారం. తమిళనాడులోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారం మూసివేత వెనుక, ఢిల్లీ శివార్లలో రైతులు ఉద్యమించిన సందర్భంగా జరిగిన రిలయన్స్‌ జియో టవర్ల ధ్వంసం వెనుకా ఉన్నది కూడా చైనా అని ఎందుకంటే దాని 5జి టెలికాం పరికరాలను నిషేధించి రిలయన్స్‌కు ప్రాధాన్యమివ్వటమే చైనా కోపానికి కారణమని సూత్రీకరించారు. భారత కంపెనీల మీద అనుమానాలు రేకెత్తించటం తద్వారా ఆర్థికరంగాన్ని దెబ్బతీయటం,భారత కంపెనీలు నిధులు సేకరించకుండా అడ్డుకోవటం దాగి ఉందన్నారు. స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీ వివాదం చాలా కాలం నుంచి ఉంది. దాన్ని మూసివేత కోరిన సంస్థల వెనుక చైనా ఉన్నదని, తన వద్ద ఉన్న రాగి నిల్వలను అమ్ముకొనేందుకే ఆపని చేసిందని ఆరోపించారు. అసలు విషయ ఏమంటే ఆ కర్మాగార మూసివేతకు ముందు 2017లో మన దేశం నుంచి చైనా 210 కోట్ల డాలర్ల విలువ గల రాగిని దిగుమతి చేసుకుంది.(ఐబిఇఎఫ్‌, 2021 సెప్టెంబరు 20).2021లో చైనా పది దేశాల నుంచి రాగి, రాగి ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా గరిష్టంగా చిలీ నుంచి 19.4శాతం(7.3 బి.డాలర్లు) కాగా తొమ్మిదవ స్థానంలో ఉన్న మన దేశం నుంచి 3.28శాతం(1.18 బి.డాలర్లు) ఉంది. అదే విధంగా చైనా దిగుమతులతో పాటు ఎగుమతులు కూడా చేస్తున్నది. వాటిలో కొరియాకు 31శాతం ఉంది. చైనా దిగుమతుల విలువ 2,738 కోట్ల డాలర్లు కాగా ఎగుమతుల విలువ 24.23 కోట్ల డాలర్లు మాత్రమే.(ట్రెండ్‌ ఎకానమీ డాట్‌కామ్‌ ప్రచురణ తేదీ 2022నవంబరు 14) అందువలన చైనా దగ్గర ఉన్న రాగిని అమ్ముకొనేందుకు స్టెరిలైట్‌ మీద కుట్ర చేసిందనటం పచ్చి అవాస్తం. ఇది ఒక్కటి చాలు ఆర్గనైజర్‌ అబద్దాలకు, వక్రీకరణలకు ఇది పక్కానిదర్శనం.

భారత కంపెనీలు చైనా సంస్థలకు పోటీ ఇస్తున్నందున చైనా హిండెన్‌బర్గ్‌, బిబిసి వంటి వాటి వెనుక ఉండి దాడులు చేయిస్తున్నదని చెబుతున్నారు. ఏ రంగంలో మన దేశం చైనాతో పోటీ పడుతున్నదో చెప్పగలరా ?ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవు కోసం ప్రయత్నించినా చైనాకు దక్కుతుందా ? అసలు చైనా అలాంటి ప్రయత్నం చేసినట్లు దానికి అదానీ అడ్డుపడినట్లు ఏ ఆధారంతో చెబుతున్నారు. హైఫా రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని ఇజ్రాయల్‌, అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! బోడిగుండుకు మోకాలికి ముడిపెడితే కుదురుతుందా ?


అలాంటి చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటూ రికార్డులను బద్దలు కొడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ను ఇంతవరకు ఆర్గనైజర్‌ ఎన్నడైనా ప్రశ్నించిందా ? మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నట్లు ? నిజంగా చైనా కుట్రలు పన్నుతుంటే మన ప్రభుత్వం వాటిని నిజమని నమ్మితే మన ప్రభుత్వం చైనాకు నిరసన తెలుపుతూ కనీసం లేఖ కూడా ఎందుకు రాయలేదు, పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించటం లేదు ? గాల్వన్‌ ఉదంతం తరువాత ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత దేశభక్తి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రతిదాన్నీ చైనా మీదకు నెట్టివేస్తే జనం గుడ్డిగా నమ్ముతారని భావిస్తున్నట్లున్నారు. తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వక్రీకరణలు, తప్పుడు రాతలతో కొందరిని కొంత కాలం మోసపుచ్చగలరు తప్ప అందరినీ ఎల్లకాలం మభ్య పెట్టలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !

08 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BALLOON MANEUVERS, China's balloon over America, Joe Biden, Joseph Stalin, spying history, surveillance balloon


ఎం కోటేశ్వరరావు


తమ మీద నిఘాకోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి ? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. జనవరి 28న బెలూన్ను అమెరికా గుర్తించింది. అమెరికా గగనతలంలోని ఒక లక్ష్యాన్ని కూల్చివేసేందుకు స్వంత యుద్ద విమానాన్ని విని యోగించటం ఇదే ప్రధమం.


ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది.దాన్నొక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరిక కూడా చేసింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. అది మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్‌, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసిందని కొందరు చెప్పారు. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది. దానిలో ఎవరేమి రాస్తారో చూద్దాం !


ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరుశాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగన తలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిని చిత్రాల సంగతి తెలిసిందే. ఆగ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాస లేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేము.


ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీ చేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సినపని లేదు. ప్రతిదేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.


వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు-2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించినట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చెవ్‌ ప్రకటించి అమెరికా గాలితీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చివేశాయి, పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హౌవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం గురించి చూడాలి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్దించుకొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్‌ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడనుకోండి.

స్టాలిన్‌ తరువాత కృశ్చెవ్‌ అధికారానికి వచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్‌ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది.అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్‌ పసిగట్టింది.1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారు చేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికా బండారాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికాను ఢ కొంటున్న చైనా నాటి సోవియట్‌ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా లేదా కాస్త పైచేయిగా ఉంది. అందువలన పాతబడిన బెలూన్‌ ప్రయోగాలతో అమెరికా మీద నిఘా పెట్టాల్సిన స్థితిలో లేదు. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగన తలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు.యుద్ద విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేదుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘాకెమేరాలను కూడా పెడతారని చెబుతారు.


పరస్పర విశ్వాసం లేని కారణంగా 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడుతున్నదనే అనుమానంతో సోవియట్‌ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ.మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘాకోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. 1962లో భారత్‌-చైనా యుద్దం తరువాత కోపంతో చైనా మీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ-భారత గూఢచార సంస్థ ప్రతినిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పని చేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఏర్పాటు చేసిన ఆ పరికరాలతో అటు చైనా ఇటు మనదేశం మీద కూడా నిఘావేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అమెరికాను గుడ్డిగా నమ్మి నాటి మన పాలకులు అంగీకరించారు. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. నిఘా అంశంలో ఎవరూ తక్కువ తినటం లేదు.


సూదికోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్‌ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కూల్చివేత గురించి జో బైడెన్‌ తాత్సారం చేయటం చైనా పట్ల మెతకవైఖరే కారణమని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ దాడికి దిగింది. అంతే కాదు తమకు మెజారిటీ ఉన్న ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని బెదరింపులకు దిగింది. ప్రతిపక్షం చేసిన దాడిని ఎదుర్కొనేందుకు ట్రంప్‌ ఏలుబడిలో కూడా చైనా బెలూన్లు ఎగిరినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అది నిజమే అని అప్పుడు పెంటగన్‌ నివేదించినా గుట్టుగా ఉంచారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని అనేక మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చైనా పట్ల తమ నేత ట్రంప్‌ గట్టిగా ఉన్నారని రిపబ్లికన్లు చెబుతుంటే కాదు తమ నేత తక్కువేమీ కాదని బెలూన్‌ కూల్చివేత, మంత్రి బ్లింకన్‌ పర్యటన రద్దును అధికార డెమోక్రాట్లు చూపుతున్నారు. చైనాను ఎవరు గట్టిగా ప్రతిఘటిస్తే వారు అంత పెద్ద దేశభక్తులని అమెరికన్ల ముందు ప్రదర్శించుకొనే పోటీలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.


చైనా బెలూన్‌ ఎగిరిందని చెబుతున్న మోంటానా ప్రాంతంలో అమెరికా అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులను నిలువ చేసే 150 సిలోస్‌( పురులు లేదా పాతర్ల వంటివి ) ఉన్నట్లు జనం భావిస్తున్నందున నిఘావేసినట్లు చెబుతున్నారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో అణుబాంబులు, క్షిపణులు ఉన్నది బహిరంగ రహస్యం. వాటిని దాచిన సిలోస్‌ ఎవరికైనా కనిపించేట్లు ఎవరూ పెట్టరు.వ్యూహాత్మక ప్రాంతాల్లోనే మోహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాలు అనేక అంశాలను పసిగట్టినప్పటికీ కొన్నింటిని తెలుసుకోవాలంటే బెలూన్లే అవసరమన్నది కొందరి వాదన.రేడియో, సెల్యులర్‌, ఇతర సంకేతాలను బెలూన్లకు అమర్చిన శక్తివంతమైన సెన్సర్లు మాత్రమే గ్రహిస్తాయని చెబుతున్నారు. చైనా పంపిన బెలూన్‌ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘాపరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా ? లేదూ నిజంగానే చైనా నిఘాపరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా. అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి.చైనా టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ హువెయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్‌ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం,బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి.అది వాటికి ఉన్న హక్కు, బాధ్యత.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !

05 Sunday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, Chang Chung Ling, Gudami International, HINDENBURG RESEARCH, Narendra Modi, Narendra Modi Failures, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్నాడు గురజాడ గిరీశం. అంటే నిష్ప్రయోజకులు అని అర్ధం. శాస్త్రంలో ఉన్న ప్రతిదానికీ మినహాయింపులుంటాయని మన పండితులెప్పుడో సెలవిచ్చారు గనుక గిరీశం చెప్పినదానికి మినహాయింపు ఏమిటంటే అది అందరికీ వర్తించదు. వాట్సాప్‌ ” విజ్ఞానాన్ని ” గుడ్డిగా నమ్మే అజ్ఞానులకు మాత్రమే అని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మీద విదేశీ బిబిసి చెప్పిందాన్ని మనం నమ్మాలా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, దేశభక్తుడు అదానీ కంపెనీల గురించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ ఇచ్చిన నివేదికను విశ్వసించాలా అని 56 అంగుళాఛాతీ విరుచుకొని ప్రశ్నిస్తున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. నిజమే దేన్నీ గుడ్డిగా నమ్మకూడదు. వాళ్లే ఇంకా ఏమంటారంటే మన దేశంలో నరేంద్రమోడీని విమర్శించే దేశద్రోహులకు మోడీ గురించి విదేశాల వారు చెప్పే ప్రశంసలు కనిపించవా అని తర్కానికి దిగుతారు. పాకిస్తాన్‌ వాళ్లు ఏమంటున్నారో చూడండి అంటూ మనకు వీడియోలు పంపుతారు. వాటిని మనం చూడాలి, తరించాలి. బిబిసి డాక్యుమెంటరీ చూడకుండా లింకులను నిషేధిస్తారు. మోడీని ప్రశంసించిన తమవారి వీడియో లింక్‌లను పాక్‌ ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదు ? సదరు వీడియో మోడీ భక్తుల కల్పితం అనుకోవాలా లేక పాక్‌లో భావ ప్రకటన స్వేచ్చ ఉందనుకోవాలా ?


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని సుమతీ శతకకారుడు చెప్పాడు. ఆ రోజుల్లో గిరీశం, వాట్సాప్‌ ఉండి ఆ మాటలు బద్దెన గారి చెవినపడి లేదా చేరి ఉంటే తప్పించుకు తిరుగువారు వాట్సాప్‌ పండితులు సుమతీ అని కచ్చితంగా రాసి ఉండేవాడు. స్వదేశీయులు విమర్శించినపుడు మీకు పొగిడే విదేశీయులు కనిపించరా అంటారు. అదే విదేశీయులు విమర్శిస్తే, దాని సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే శత్రువులను భుజాన వేసుకుంటారా అని మాటలమారులు దెబ్బలాడతారు. వారి నాలికలకు నరం ఉండదు. ఇదే గాంగు వాట్సాప్‌లలో తిప్పుతున్న ఒక అంశాన్ని చాలా మంది చదివే ఉంటారు. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ జోసెఫ్‌ హౌప్‌ రాసిన సంపాదకీయం అంటూ నరేంద్రమోడీ గొప్పతనం గురించి అనేక అంశాలను పేర్కొన్నారు.బిబిసి విమర్శిస్తే దురుద్దేశం ఉంది అన్నారు. మరి ఈ సంపాదకీయం మోడీని బుట్టలో వేసుకొనేందుకు మునగ చెట్టు ఎక్కించినట్లా ? ఇక జోసెఫ్‌ సంపాదకీయంలో చెప్పిందేమిటో కొన్ని ఆణిముత్యాలను చూద్దాం. లేకపోతే మోడీ భక్తుల మనోభావాలు గాయపడితే ప్రమాదం.


” నరేంద్రమోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు. ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు( నిజమే పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపని తెలిసిందే).ఆయన చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశభక్తుడున్నాడు.( ఇదేమీ వర్ణన రాబాబూ, ఏ దేశభక్తుడినైనా ఇలా వర్ణించటం చూశారా, అసలు నరేంద్రమోడీలో ఎవరైనా చిరునవ్వును చూశారా). పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లకు అమెరికాతో సంబంధాలను తెగ్గొట్డాడు.ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తాడు.యుద్దం చేయకుండానే పాకిస్తాన్ను సర్వనాశనం చేశాడు. ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని నిరూపించాడు.రష్యా,జపాన్‌లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.” ఇలాంటి అనేక అంశాలను చెప్పి ఇంతవరకు ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు అని జోసెఫ్‌ హౌప్‌ రాసినట్లుగా దానిలో పేర్కొన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమంటే బిబిసి, హిండెన్‌బర్గ్‌ వాస్తవం.జోసెఫ్‌ హౌప్‌ అనే జీవి అసలు ఉనికిలో లేడు, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అసలు అలాంటి సంపాదకీయం రాయలేదు.ఇది ఫేక్‌ న్యూస్‌ అని అనేక సంస్థలు దాని బండారాన్ని చెప్పాయి. పోనీ ఇది వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించిందా అంటే అదెక్కడా కనపడదు. నమో భారతీయం వంటి పేర్లతో ఆంగ్లంలో ప్రచారం చేసినదానిని తెలుగులో పాక్షికంగా అనువందించి వాట్సాప్‌లో తిప్పుతున్నారు.


ఇక వాట్సాప్‌లో చాడా శాస్త్రి పేరుతో ఒక తేడా పోస్టును తిప్పుతున్నారు.జోసెఫ్‌ హౌప్‌ మాదిరి సదరు శాస్త్రి నకిలీ పాత్రో ఉనికిలో ఉన్నదీ తెలీదు. ఏదైనా కావచ్చు, దీన్లో కూడా ఎన్నో అతిశయోక్తులు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ” అసలు మన దేశంపై చైనా గుర్రుకు కారణం ఏమిటి ? ఆ దేశ సంస్థలకి పోటీగా మన దేశ వ్యాపార సంస్థలు ఎదిగి ప్రపంచంలో వారి వ్యాపారానికి పోటీకి రావటం, చైనాకు రావాల్సిన వ్యాపారాలను భారత సంస్థలు తన్నుకుపోవటం ” పగటి కలలు కనటం అంటే ఇదే. రికార్డులను బద్దలు కొడుతూ మనం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అన్నది తెలిసే ఇలా రాస్తున్నారా ? మన సంస్థలు తన్నుకుపోతే మన దిగుమతులు తప్ప ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు. అమెరికా మన దేశంపై ఎందుకు గుర్రుగా ఉందంటూ రాసిన అంశం ఆసక్తికరం. రష్యా నుంచి రోజుకు 17లక్షల పీపాల చమురును 47 డాలర్ల వంతున దిగుమతి చేసుకొనటంతో 70బిలియన్‌ డాలర్ల ఎగుమతి ఆదాయం మన దేశానికి వచ్చిందని చెప్పారు. దానికి చేసిన ఖర్చు కూడా ఎంతో చెప్పలేదు. దాన్ని శుద్ధి చేసి రోజుకు ఆరులక్షల పీపాల డీజిల్‌ కొరత ఉన్న ఐరోపా దేశాలకు దానిలో 60శాతం మనం ఎగుమతి చేస్తున్నాం అన్నారు.దీని వలన వచ్చే లాభం అంబానీ, మరొక ప్రైవేటు కంపెనీకే కదా ! మన జనానికి కలిగే మేలు ఏమిటి ? ఒక్క లీటరైనా తక్కువ ధరకు మన జనానికి అమ్మారా ? దీనితో ప్రపంచ ఇంథన ఆర్థిక ఆటలో మనం ప్రధాన ఆటగాడిగా ఎదుగుతున్నాం అన్నారు. జనం చెవుల్లో పూలు దూర్చటం అంటే ఇదే.ఉక్రెయిన్‌పై దాడికి దిగిందంటూ రష్యా మీద ఆంక్షలు విధించి అక్కడి నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసింది ఐరోపా. తటస్థంగా ఉన్నామని చెబుతున్న మనం ఐరోపా కోసం రష్యా నుంచి కొనుగోలుకు మన విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని అంబానీ, నయారా కంపెనీలకు ఇస్తూ మనకు ఆదాయం వస్తుందని జనానికి కబుర్లు చెబుతారా ? ఇదొక గొప్ప రాజకీయమా, తటస్థం పేరుతో ఎవరికి ఉపయోగపడుతున్నట్లు ?


వారం రోజుల తరువాత స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ మేలుకున్నది.గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టటం అంటే ఇదే.హిండెన్‌బర్గ్‌ నిర్వాహకుడు అమెరికాలో స్థిరపడిన ఇజ్రాయలీ. ప్రపంచంలో కంపెనీల వాటాలను షార్ట్‌ సెల్లింగ్‌ చేసే సంస్థ హిండెన్‌బర్గ్‌ ఒక్కటే కాదు. దానికి నిధులు ఇవ్వటం ఎందుకు ? స్వయంగా చైనా అలాంటి కంపెనీని పెట్టవచ్చు. ప్రపంచంలో డాలర్‌ నిల్వలు ఎక్కువ ఉన్న దేశం అది. ఒక్క అదానీని మాత్రమే ఎందుకు అన్ని పారిశ్రామిక సంస్థలను అదే విధంగా చేయవచ్చు కదా ? చైనా గనుక హిండెన్‌బర్గ్‌కు నిధులు ఇస్తే మన జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ను పంపి బయట పెట్టించవచ్చు. ఎవరన్నా అడ్డుపడ్డారా ? కాసేపు నిజంగానే చైనా నిధులు ఇచ్చి ఆపని చేసిందని అనుకుందాం. పార్లమెంటును కుదిపివేస్తున్న ఈ ఉదంతం మీద మాట్లాడి దాని బండారాన్ని వెల్లడించవచ్చు.ఇదేమీ దేశ రహస్యం కాదు. ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? ఆడలేక మద్దెల ఓడంటే కుదరదు.


హిండెన్‌బర్గ్‌ నివేదికను ఆసరా చేసుకొని చైనా మీద ప్రచారదాడి మొదలు పెట్టటం వెనుక అసలు అంశాన్ని పక్కదారి పట్టించి అదానీ కంపెనీలను రక్షించే ఎత్తుగడ ఉంది.హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో అదానీకి చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే చైనా జాతీయుడికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తనదిగా చాంగ్‌ ఇచ్చాడని, అతనితో ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిగ్గదీసింది. ప్రపంచంలో ఉన్న చైనా జాతీయులందరూ చైనా పౌరులు కానట్లే ఇతగాడూ కాదు. తైవాన్‌కు చెందిన వాడు. (ఎగువున చాంగ్‌ – అదానీ కలసి ఉన్న చిత్రం కూడా తైవాన్‌ మీడియా ప్రచురించినదే.) హిండెన్‌బర్గ్‌ 129 పేజీల నివేదికలో లేవనెత్తిన ప్రశ్నలకు గాను అదానీ ఇచ్చిన 413 పేజీల వివరణలో కీలకమైన వాటిని విస్మరించారు. చాంగ్‌ గురించి హిండెన్‌బర్గ్‌ నివేదికలో నాలుగు చోట్ల ప్రస్తావన ఉంది. ఒక్కదానికీ అదానీ సమాధానం ఇవ్వలేదు. నిజానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే అంతా ఉత్తిదే అని ఒక ట్వీట్‌ చేసి ఊరుకునేదానికి అంత వివరణ ఎందుకు ఇవ్వాలి.


హిండెన్‌బర్గ్‌ నివేదికలో ” గుడామీ ఇంటర్నేషనల్‌ ” అనే సంస్థ గురించి పేర్కొన్నారు.దానిలో చాంగ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అది తమకు సంబంధించినదే అని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2002 కంపెనీ వివరాల్లో పేర్కొన్నది. ఈ గుడామీ ఇంటర్నేషనల్‌ 2018 వార్తల్లో ఉంది. కాంగ్రెస్‌ నేతలు, మిలిటరీ అధికారులు ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చిన అగస్టా వెస్ట్‌ లాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో అనుమానిత మూడు సింగపూర్‌ సంస్థలలో ఇదొకటి. మాంటెరోసా ఇన్వెస్ట్‌మెంట్‌ హౌల్డింగ్స్‌ అనే సంస్థ అదానీ కంపెనీల్లో 450 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది.ఈ కంపెనీలో గుడామీ పెట్టుబడులు పెట్టింది.చాంగ్‌ అనేక అదానీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు హిండెన్‌బర్గ్‌ పేర్కొంటే మన దేశానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజన్స్‌(డిఆర్‌ఐ) ఇచ్చిన ఒక తీర్పు ఉత్తరువులో, సంస్థ రికార్డుల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తన అడ్రస్‌గా చాంగ్‌ ఇచ్చినట్లు ఉంది.


ఇదిగాక హిండెన్‌బర్గ్‌ మరొక ఉదంతాన్ని పేర్కొన్నది. గ్రోమోర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీ 2011లో 42.3 కోట్ల డాలర్ల లాభంతో అదానీ పవర్‌లో విలీనమైంది.దీనికీ చుంగ్‌కు సంబంధం ఉంది.భారత చట్టాల ప్రకారమే దాన్ని విలీనం చేసుకున్నాం తప్ప అక్రమాలేమీ జరగలేదని అదానీ తన సమాధానంలో పేర్కొన్నది.హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88ప్రశ్నల్లో మూడు పిఎంసి ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు చెందినవి. దీనికి అదానీ కంపెనీలు చెల్లింపులు జరిపినట్లు డిఆర్‌ఐ నివేదికలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ కంపెనీ అదానీ బినామీనా కాదా చెప్పాలని కోరింది. ఇది చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ కుమారుడిదని, తైవాన్‌లో అదానీ కంపెనీ ప్రతినిధి అని పేర్కొంటూ వారంతా కలసి ఉన్న చిత్రాన్ని కూడా జత చేసి వారి సంబంధాలపై అనుమానాలున్నట్లు పేర్కొన్నది. పిఎంసితో తమకెలాంటి సంబంధాలు లేవని అదానీ తన వివరణలో పేర్కొన్నారు. తాము అడిగిన దానికి సూటిగా చెప్పకుండా కలగాపులగం చేసి చెప్పారని హిండెన్‌బర్గ్‌ పేర్కొన్నది.


ప్రస్తుత ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు దాని అవసరం లేదని, మన ప్రధాని మోడీ చక్రం తిప్పుతున్నట్లు ఒకవైపు ప్రచారం. అమెరికా మనకు జిగినీ దోస్తుగా ఉంది, మన ప్రధాని మోడీ దాని అధ్యక్షులతో భుజాల మీద చేతులు వేసి తిరిగే చనువు ఉంది. నిజంగా దానికి మన అవసరం ఉంటే హిండెన్‌బర్గ్‌ గురించి ఇంతవరకు జో బైడెన్‌ నోరువిప్పడేం. మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరవుతుంటే నరేంద్రమోడీ ఫోన్‌ చేసి మాట్లాడరేం ! హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా ఉందని మన వాట్సాప్‌ మరుగుజ్జులకు తెలిసిన పరమ రహస్యం మోడీ సర్కార్‌కు తెలియని దుస్థితిలో ఉందా ? తెలిస్తే హెచ్చరిక ఎందుకు చేయరు ? దేశం, మదుపర్ల కంటే మౌనమే ప్రధానమా ? ఇంతటి సంచలనం చెలరేగితే ఏ దేశాధినేతైనా మౌనంగా ఉంటారా ? జనాలకు భరోసా ఇవ్వాల్సిన రాజధర్మం తెలియదా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలేమిటి అని ఆలోచించకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్కులో మోడీ, అదానీ, తదితరుల గురించి ప్రచారం చేసే అతియోక్తుల మీద స్వంత బుర్రలను ఉపయోగించకుండా వాటిని ఇతరులకు పంచే, ప్రచారం చేసే, సమర్దించే పెద్దమనుషులను గిరిశం చెప్పినట్లుగా వర్ణిస్తే తప్పా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !

02 Thursday Feb 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Prices, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Agriculture, Fertilizers, Fertilizers subcidies, world agriculture challenge 2023


ఎం కోటేశ్వరరావు


సమస్యలను ఎదుర్కొనే అంశంలో తప్ప ప్రపంచమంతటా రైతాంగం ఒకే విధంగా లేదు. పురాతన పద్దతుల్లో విత్తనాలు చల్లి పండిన మేరకు పంట తీసుకొనే రైతుల మొదలు ఆధునిక పద్దతుల్లో మొత్తం యంత్రాలతో సాగు చేసే వారు ఉన్నారు. కడుపు నింపుకొనేందుకు మాత్రమే పండించుకొనే వారు ఎందరో ఉంటే అమ్ముకొని లాభాలు పోగేసుకొనేందుకు చూసే వారు కొందరు. అందువలన సమస్యలు కూడా ఒకే విధంగా లేవు. మనుషులందరూ ఒకటే గానీ కొందరికి ఆకలి జబ్బు మరికొందరికి తిన్నది అరగని జబ్బు మాదిరి ఎవరి సమస్య వారిది. రైతులు అంటే కేవలం పంటలు పండించేవారే కాదు, అనుబంధ రంగాలలో పని చేసేవారు కూడా అదే కోవకు చెందుతారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల్లో రైతాంగం తీరు తెన్నులు, వారి ముందున్న కొన్ని సవాళ్లు-సమస్యల గురించి చూద్దాం.


ఏ రైతుకైనా కావాల్సిన వాటిలో ఎరువు ఒకటి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ – రష్యా వివాదం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల రైతాంగాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నది.2022లో ఎరువుల ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. అనేక దేశాల్లో మాంద్యం రానుందనే హెచ్చరికల నేపధ్యంలో రైతులు, ఆహార సరఫరా మీద 2023లో మరింత వత్తిడి పెరగనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాతావరణ అనుకూల ప్రతికూలతలకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నది రైతులే. ఉదాహరణకు ఉక్రెయిన్‌ సంక్షోభం, చమురు, గాస్‌ ధరల పెరుగుదుల, రవాణా అంశాల కారణంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి సాగు ఖర్చు ఇబ్బడి ముబ్బడై అనేక దేశాల రైతాంగం ఇబ్బంది పడింది.2022 రెండవ అర్ధకాలంలో పొటాష్‌, ఫాస్పేట్‌ వినియోగం పది నుంచి 40శాతం తగ్గింది, దాంతో ధరలూ తగ్గాయి.చైనా ఎగుమతులు నిలిపివేసిన తరువాత ప్రపంచమార్కెట్లో 2022 ఏప్రిల్‌లో టన్ను డిఏపి ధర వెయ్యి డాలర్లు ఉండగా తరువాత 713కు తగ్గింది. ఈ ఏడాది 550 డాలర్లకు తగ్గుతుందని ఒక అంచనా. మన దేశంలో ఏడాది పాటు సాగిన రైతాంగ ఆందోళన, వివిధ రాష్ట్రాలు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఎరువుల ధరలు ప్రభావం చూపకుండా చూసేందుకు సబ్సిడీలను పెంచి రైతుల మీద భారం పడకుండా చూసింది. అనేక దేశాలలో రైతులే వాటిని భరించారు. సబ్సిడీ ఎరువులు మినహా, ఇతర పెట్రోలు,డీజిలు, రవాణా ఖర్చులు, పురుగుమందుల ధరల పెరుగుదల వంటి భారాలను మన రైతులే భరించారు. 2022 జూలైలో ఉక్రెయిన్‌ వ్యవసాయ ఉత్పత్తుల దిగ్బంధననాన్ని రష్యా ముగించటంతో ఎగుమతులు పెరిగి ధరల తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల ఎగుమతులు తగ్గిన మేరకు రైతులకు నష్టం జరిగింది. అందువల ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము, దాని పర్యవసానాలు, ప్రభావాలు ఎలా ఉండేదీ అనూహ్యమే.

ప్రపంచంలో ఫాస్పేట్‌ను ఎక్కువగా 2021లో చైనా 85మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేయగా రష్యా 14మి.టన్నులతో నాలుగవ స్థానంలో ఉంది.
అంతర్జాతీయ ఫర్టిలైజర్స్‌ సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ భూముల్లో 85శాతం నత్రజని కొరత, 73శాతానికి ఫాస్పేట్‌, 55శాతానికి పొటాష్‌ కొరత ఉంది. ధరల పెరుగుదల కారణంగా అనేక మంది రైతులు వీటి వాడకాన్ని తగ్గించారు. అది పంటల ఆరోగ్యం, దిగుబడుల మీద ప్రతికూల ప్రభావం చూపింది.పొటాష్‌ ఉత్పత్తిలో 14మి.టన్నులతో కెనడా ప్రధమ స్థానంలో ఉండగా రష్యా,బెలారస్‌ కలసి 17 మి.టన్నులు ఉత్పత్తి చేశాయి.2022కు ముందు ప్రపంచంలో 40శాతం ఉత్పత్తి వీటిదే. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంఓపి టన్ను ధర 221 డాలర్లుండగా తరువాత 562 డాలర్లకు చేరింది. 2009 తరువాత ఇదే అధికం.పొటాష్‌కు డిమాండ్‌ తగ్గింది. 2022లో ఆంక్షల కారణంగా రష్యా,బెలారస్‌ నుంచి ఎగుమతులు ఆగాయి. దీన్ని కెనడా సొమ్ము చేసుకొని విపరీత లాభాలు పొందింది. ఈ విధంగా అమెరికా, నాటో కూటమి దేశాలు రైతాంగాన్ని, సాగును దెబ్బతీశాయి.


వివిధ దేశాలలో మన దేశంలో మాదిరి కనీస మద్దతు ధరలు లేవు. ఉన్నవాటిని కూడా ఒకదానితో మరొకదానిని పోల్చలేము. చైనా వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ముందే చెప్పుకున్నట్లు ఎక్కడ ఎంత ఉన్నా అక్కడి సాగు ఖర్చులతో పోలిస్తే సాగు గిట్టుబాటు కావటం లేదన్నది స్పష్టం. అందుకే అనేక ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి.లేని చోట రైతాంగం నష్టపోతున్నది. ఎగుమతులకు సైతం సబ్సిడీలు ఇచ్చే అమెరికా వంటి ప్రభుత్వాల గురించి తెలిసిందే. వివిధ దేశాలలో ఉన్న పంటల దిగుబడి కూడా రైతాంగ రాబడిని ప్రభావితం చేస్తుంది. దిగవన కొన్ని దేశాల వివరాలను చూద్దాం. వాతావరణాన్ని బట్టి అంచనాలు మారుతూ ఉంటాయి. ఒక హెక్టారుకు దిగుబడి అంచనాలు కిలోల్లో ఇలా ఉన్నాయి.2023 జనవరి అంచనాలని గమనించాలి. ఆఫ్రికా ఖండానికి సూచికగా ఈజిప్టును తీసుకున్నప్పటికీ పంటల దిగుబడి మిగతా దేశాలలో దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నదని గమనించాలి.


దేశం ××× గోధుమ ××వరి×× ముతక ధాన్యం×× పత్తి ×× చమురు గింజలు××మొక్కజొన్న
ప్రపంచం×× 3,550 ×××4,590××× 4,290 ××× 787 ××× 2,330 ××× 5,740
అమెరికా×× 3,130 ×××8,280××× 10,130×××1,062 ××× 3,150 ×××10,880
ఐరోపా××× 5,500 ××× 6,060××× 4,980××× నిని ××× 2,640 ××× 6,010
బ్రిటన్‌ ××× 8,610 ××××××××××× 6,320××× ×× ××× 3,400 ××× ×××××××
చైనా ××× 5,860 ××× 7,080××× 6,270××× 2,032××× 2,560 ××× 6,440
భారత్‌ ××× 3,370 ×××4,120××× 2,030××× 444 ××× 1,030 ×××3,200
బ్రెజిల్‌ ××× 3,060 ×××7,000××× 5,330××× 1,777××× 3,490 ××× 5,510
ఈజిప్టు ××× 6,410 ×××8,700××× 7,130××× 703 ××× 1,040 ×××8,000


పైన పేర్కొన్న వివరాల అంచనాల్లో స్వల్ప మార్పులు తప్ప దిగుబడుల ధోరణులను వెల్లడిస్తాయి. మన దేశంలో పత్తి కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదని తెలిసిందే. చైనాలో కూడా అంతే ఇచ్చినప్పటికీ అక్కడ దిగుబడులు ఎక్కువ కారణంగా రైతాంగానికి నష్టం ఉండదు. పత్తి పండే దేశాల్లో అనేక ఆఫ్రికా దేశాలకు దగ్గరగా తక్కువ దిగుబడి ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశంలో కనీస మద్దతు ధరలు ఇవ్వటాన్ని సబ్సిడీ ఇవ్వటంగా చిత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిగుబడులు ఎక్కువగా ఉండటం, సబ్సిడీలు ఇచ్చి తక్కువ ధరలకే ఎగుమతులు చేస్తూ మన వంటి దేశాలను అమెరికా,ఇతర ధనిక దేశాలు దెబ్బతీస్తున్నాయి.

ప్రపంచమంతటా 2022లో పెరిగిన సాగు ఖర్చులు, రైతులను ఎలా ప్రభావితం చేసిందీ ఇంకా సమగ్రమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ప్రతి డాలరును పట్టి పట్టి చూస్తారు గనుక మిగతా దేశాలతో పోలిస్తే ఆ లెక్కలు కూడా వేగంగా రూపొందుతాయి. భూమి,యంత్రపరికరాలు, ఇంథనం, ఎరువులు, పురుగుమందుల ధరలు బాగా పెరిగినందున ఉత్పత్తి ఖర్చు పెరుగుదల తీరు గురించి కొంత విశ్లేషణ అందుబాటులోకి వచ్చింది. సాగు పద్దతులు, మెట్ట, తరి వంటి తేడాలు, దిగుబడులు కూడా సాగు ఖర్చులను ప్రభావితం చేస్తాయి. అమెరికాలోని నెబరస్కా లో వివిధ పంటలకు పెరిగిన ఖర్చు ఇలా ఉంది. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటు దిగుబడి బుషెల్స్‌ (25.4 కిలోలకు సమానం)లో, ఒక్కో బుషెల్‌కు ఖర్చు డాలర్లలో అని గమనించాలి.
పంట××××××× సగటు దిగుబడి××× 2021 ×××2022
మెట్ట మొక్కజొన్న×× 150 ××× 2.34 ××× 2.87
తరి మొక్కజొన్న×× 239 ××× 2.28 ××× 2.83
మెట్ట గోధుమ ×× 62 ××× 3.36 ××× 4.55
తరి గోధుమ ×× 98 ××× 3.11 ××× 4.20
మెట్ట సోయా ×× 47 ××× 5.53 ××× 6.46
తరి సోయా ×× 73 ××× 4.64 ××× 5.55
యంత్రాల వినియోగాన్ని బట్టి అమెరికాలో శ్రమశక్తి-కార్మికుడి ఖర్చును లెక్కిస్తారు. అది సగటున గంటకు 25డాలర్లు ఉంది.ఇతర అంశాల్లో తప్ప ఈ ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. ఎరువుల ఖర్చు 30 నుంచి 70శాతం వరకు పురుగుమందుల ఖర్చు 16 నుంచి 60శాతం పెరిగింది. అది ఎలా పెరిగిందో చూద్దాం.( డాలర్లలో)
పంట, ఏడాది×× ఎరువు ××పురుగుమందు ××మెటీరియల్‌×× నిర్వహణ×× భూమి
మెట్ట మొక్కజొన్న×× —- ××× — ××× —- ××××× —×××——
2020 ×× 49 ××× 60 ××× 226 ×××××× 66 ××× 132
2021 ×× 42 ××× 62 ××× 221 ×××××× 75 ××× 135
2022 ×× 84 ××× 69 ××× 280 ×××××× 78 ××× 144
తరి మొక్కజొన్న×× — ××× — ××× — ××××× —××× —-
2020 ×× 95 ××× 70 ××× 344 ×××××× 144 ××× 260
2021 ×× 82 ××× 59 ××× 320 ×××××× 152 ××× 259
2022 ×× 167 ××× 86 ××× 489 ×××××× 152 ××× 281
ఇదే విధంగా మిగతా పంటల పెట్టుబడి ఖర్చుల్లో కూడా పెరుగుదల ఉంది.


పది ప్రధాన దేశాల వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు ఇలా ఉన్నాయి.1చైనా : ప్రపంచంలో పదిశాతం సాగుభూమి ఉన్న చైనా నాలుగో వంతు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది.గోధుమ, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. ప్రపంచ కూరగాయల్లో సగం సరఫరా చేస్తూ 50 కోట్ల టన్నులను ఉత్పత్తి చేస్తున్నది.2019లో అమెరికా, ఐరోపా సమాఖ్యలను వెనక్కు నెట్టి అగ్రశ్రేణి వ్యవసాయ ఎగుమతిదారుగా ఉంది.2.అమెరికా: మొక్కజొన్న, సోయా, పత్తి ప్రధాన పంటలు. ఆధునిక సాగు పద్దతుల్లో అగ్రస్థానంలో ఉంది. 3.బ్రెజిల్‌ : ప్రపంచంలో కర్రపెండలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది గాక కాఫీ, చెరకు, సోయా ప్రధాన పంటలు. ప్రపంచంలో కాఫీ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. జిడిపిలో 25శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది.4.భారత్‌ : పాలు, జనపనార, పప్పుదినుసుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దది.వరిలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం 58శాతం మందికి జీవనాధారంగా ఉంది.జీడిపిలో 19.9శాతం(2020-21) కలిగి ఉంది.పాల ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. 5.రష్యా: గోధుమ, బార్లీ, ఓట్స్‌ ప్రధాన పంటలు.ఐదోవంతు భూమిలో గోధుమ సాగు చేస్తారు. పదహారు శాతం మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది.6. ఫ్రాన్స్‌ : గోధుమ, తృణ ధాన్యాలు, బంగాళాదుంపల వంటి పంటలతో ఫ్రాన్స్‌ ఐరోపాలో ముందుంది. ప్రపంచంలో ద్రాక్షతో ఉత్పత్తి చేసే వైన్‌లో ప్రధమ స్థానంలో ఉంది.ఏడుశాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. 7.మెక్సికో : పండ్లు, మొక్కజొన్న ప్రధాన పంటలు. చెరకు, కాఫీ వాణిజ్య పంటలు.పశుపోషణ ఎక్కువ.8.జపాన్‌ : ప్రధాన పంట వరి. జిడిపిలో రెండుశాతం వాటా ఉంది, పదిశాతం మందికి ఉపాధి కల్పిస్తోంది.సగటు కమతం విస్తీర్ణం మూడు ఎకరాలు మాత్రమే. 9.జర్మనీ : ప్రపంచంలో బీట్‌రూట్‌ ద్వారా పంచదార ఉత్పత్తి చేసే దేశాల్లో నాలుగో స్ధానంలో ఉంది. తరువాత ప్రధాన పంటగా బార్లీ, గోధుమలు ఉన్నాయి. సాగు రంగంలో ఐరోపాలో నాలుగవదిగా ఉంది. 10.టర్కీ : గోధుమ, బీట్‌రూట్‌ ప్రధాన పంటలు. హాజల్‌నట్స్‌, చెస్ట్‌నట్స్‌,అప్రికోట్స్‌, చెరీస్‌ వంటి వాటిని ఎగుమతి చేస్తుంది. ఇరవై ఐదుశాతం మందికి ఉపాధి కల్పిస్తూ జిడిపికి ఎనిమిది శాతం అందిస్తున్నది.


వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఒక మిత్ర వైరుధ్యంగా చెప్పవచ్చు. తమకు గిట్టుబాటు కావాలంటే యంత్రాలు తప్పవని రైతులు, వాటితో తమ ఉపాధి పోతుందని కూలీలు. రైతులకు గిట్టుబాటు కాకపోవటానికి కూలీల వేతనం కానే కాదు. అదేగనుక వాస్తవమైతే అమెరికాలో కూలీల్లేకుండా చేస్తున్న సాగుదార్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు ? ఐరాస ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2022 నివేదికలో యాంత్రీకరణ గురించి చెప్పిన అంశాల సారాన్ని చూద్దాం. దారిద్య్రం, ఆకలిని పోగొట్టాలంటే యాంత్రీకరణ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.అది చిన్న రైతులకు అందుబాటులోకి రాకుంటే అసమానతలను పెంచుతుంది. డిజిటల్‌ విప్లవం, యాంత్రీకరణలో దేశాల మధ్య, దేశంలోనే ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ పరికరాలు ఉండాలి.యాంత్రీకరణ ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వేతనాలు పెరుగుతున్నపుడు, కూలీల కొరత ఉన్నపుడు అది రైతులు, కార్మికులకు లాభసాటి, నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలను సృష్టిస్తుంది. గ్రామీణ కూలీలు ఎక్కువగా, వేతనాలు తక్కువగా ఉన్నపుడు నిరుద్యోగానికి దారితీస్తుంది. సబ్సిడీలు ఎంత ఎక్కువ ఇస్తే అంతగా, వేగంగా యాంత్రీకరణ చేయవచ్చు.కూలీలు అగ్గవగా ఉన్నపుడు విధాననిర్ణేతలు సబ్సీడీలు ఇవ్వకూడదు.అంతగా ఇవ్వాలనుకున్నపుడు సంధికాలంలో పని కోల్పోతున్న వారికి సామాజిక భద్రత కల్పించాలి. మన దేశం, ఇతర అనేక దేశాల అనుభవం చూసినపుడు అలాంటి భద్రత కల్పించిన దాఖలాలు లేవు.


పేదరికం, ఆకలి తాండవించే ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి.ప్రపంచంలో 2030నాటికి ఆకలితో ఉండేవారు ఉండకూడదన్నది లక్ష్యం. గడచిన వంద సంవత్సరాలలో ఆఫ్రికాలో తీవ్రమైన కరవులు 300 సంభవించాయంటే అక్కడి పరిస్థితిని ఊహించుకోవచ్చు. 2021లో ఆ ఖండంలో 30 కోట్ల మంది అన్నార్తులున్నారు. అక్కడి ఆహార ఉత్పత్తిలో 70శాతం చిన్న రైతులే చేస్తున్నారు. నిరంతర సాగు వృద్ది, దిగుబడుల పెంపు,ఉపాధి అక్కడి ప్రధాన సవాళ్లు. ఆహార ఉత్పత్తిలో 40శాతం మంది మహిళలు ఉన్నారు. ఆఫ్రికా సాగు వృద్దికి గాను 2030 నాటికి 600 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం. అందుకనే ధనిక దేశాలు అక్కడ పెట్టుబడి పెడితే అంటూ పెట్టుబడి-లాభాలు-నష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి.


అడవిని కొట్టి కొంత కాలం సాగు చేసి ఆ భూమిని వదలి మరోచోట సాగు చేసే పోడు పద్దతిని అనుసరించే అడవి బిడ్డల నుంచి ఆకాశం నుంచి డ్రోన్లు, విమానాల ద్వారా మందులు చల్లే ఆధునిక సాగుదార్లు ఉన్న ప్రపంచంలో దవోస్‌లో జనవరిలో కొలువు దీరిన ప్రపంచ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డిజిటల్‌ సాగు గురించి సలహాలు ఇచ్చారు. మూడు సాగు చట్టాల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తీసుకువచ్చిన అంశాలవే. ఇంటర్నెట్‌లో రైతులు తమ వద్ద ఉన్న పంట గురించి వివరాలు పెడితే, మార్కెట్లో కొనుగోలు చేసే వారు, అప్పులు ఇచ్చేవారు ముందుకు వచ్చి అంతా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుపుతారు, రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని దవోస్‌లో చెప్పారు. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు అని చెపితే సెల్‌ఫోన్లకు ఇంటర్నెట్‌ సంకేతాల కోసం చెట్లు ఎక్కిన పిల్లల మాదిరి మారుమూల రైతులు పొలాలను వదలి చెట్లెక్కాల్సి ఉంటుంది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు 86శాతం మంది ఉన్నారు. ప్రపంచ జిడిపి నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లలో నాలుగుశాతం వాటా, నాలుగోవంతు మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం గురించి ప్రపంచ కార్పొరేట్లు పట్టించుకోవటం వెనుక అసంఘటితంగా ఉన్న రైతుల నుంచి ఎలాంటి పెట్టుబడి, రిస్కు తీసుకోకుండా ఉత్పత్తులను కారుచౌకగా కొట్టేసి లాభాలు పోగేసుకోవాలన్న ఎత్తుగడ తప్ప ఉద్దరించేందుకు కాదు. ప్రపంచంలో మూడో వంతు ఆహారాన్ని 60.8కోట్ల మందిగా ఉన్న చిన్న రైతులు పండిస్తున్నారు. వారికి నిరంతర జీవనం గురించి ఎలాంటి హామీ లేదు.


కార్పొరేట్‌ శక్తుల ధనదాహం, విచక్షణ రహితంగా రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్న రసాయనాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల కారణంగా ఏటా కోటీ 20లక్షల హెక్టార్ల భూమి సాగుకు పనికి రాకుండా పోతున్నది. దాన్ని అరికట్టి జనాలకు ఉపాధి చూపటం ఒక పద్దతి. దానికి బదులు కృత్రిమ సాగు గురించి కార్పొరేట్‌ సంస్థలు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయి. వాటిని ఎందుకు తెచ్చినప్పటికీ వీటిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వారు కడుపునిండా తినేందుకు అవసరమైన మొత్తంలో ఆహారం కావాలంటే 70శాతం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అంచనా. ఇతర అవసరాలకోసం చేసే పరిశోధనలు అనేక సందర్భాలలో ఇతర రంగాలలో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించాయి. అంతరిక్ష పరిశోధనలే అందుకు ఉదాహరణ. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహణకు చేసిన వార్షిక ఖర్చుతో పోల్చితే అది చేసిన పరిశోధనల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూడు రెట్లు ఆర్థిక లబ్ది కలుగుతోంది.హరికేన్ల గురించి హెచ్చరించటం మొదలు రోబోటిక్స్‌ వరకు ఆరోగ్యం నుంచి ఆహార నిల్వ పద్దతుల వరకు అనేక రూపాల్లో అది ఉంది. ఇప్పుడు అంతరిక్షంలో సాగు గురించి పరిశోధిస్తున్నారు. అంతరిక్ష నౌకలలో వెళ్లి పరిశోధనలు చేసే వారి మీద అంతరిక్ష వెలుగు ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశంపై చేసిన పరిశోధనలలో వచ్చిన ఫలితాలతో ఇండ్లలో ఎల్‌ఇడి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియతో మొక్కలను పెంచవచ్చని చేసి చూపారు. దీంతో కొన్ని దేశాల్లో సాగుభూమి కొరతను అధిగమించేందుకు అనేక అంతస్తుల భవనాలను నిర్మించి వాటిలో ఆహారానికి అవసరమైన ఆకుకూరల వంటి వాటిని పండిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో ఒక ఎకరం విస్తీర్ణం అందుబాటులోకి వచ్చి అక్కడ పండించే పంటల మొత్తం భూమి మీద నాలుగు-ఆరు ఎకరాలలో పండేదానికి సమానంగా ఉంటున్నది. ఈ భవనాల్లో ఏడాది అంతటా సాగు చేయవచ్చు. వాటికి భారీ యంత్రాల వంటి పరికరాలు అవసరం ఉండదు, ఇతర ఖర్చులూ తక్కువే. ఇలాంటి పరిశోధనలు, ప్రయోగాలు మరింతగా అవసరం. అదే విధంగా ఆస్ట్రోనాట్లకు నిల్వవుండే ఆహార పదార్దాలను ఎలా అందచేయాలన్న పరిశోధన వెలుపల ఆహార నిల్వ ప్రక్రియకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలు నూతన వంగడాల మొదలు ఆవిష్కరించిన అనేక నూతన ప్రక్రియలను రైతాంగానికి తక్కువ ధరలతో అందుబాటులోకి తేవాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్‌ సంస్థలకు లాభాల కోసం అప్పగిస్తున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యవసాయ సబ్సిడీలు, వాణిజ్యం మీద దోహా దఫా చర్చలు ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా కనుచూపు మేరలో ఒప్పందం కుదిరే అవకాశం కనిపించటం లేదు. ఇంతకాలం చర్చలు చేసి సాధించిందేమిటంటే ఇప్పుడున్న స్థితిని మరింతగా అస్థిరపరచవద్దనే ఏకాభిప్రాయానికి తాజా (2022 జూన్‌) జెనీవా సమావేశం వచ్చింది. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత అని చెప్పారు తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం అంటూ సాకులతో కాలం గడుపుతున్నారు. ఒప్పందం కుదిరితే ధనిక దేశాలకు నష్టం గనుక అవి ముందుకు సాగనివ్వటం లేదు. ప్రపంచీకరణకు ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజన్‌ మొరాయించలేదు గాని వాహనాన్ని ముందుకు లాగలేకపోతోంది అన్నట్లుగా దాని పరిస్థితి ఉంది. సర్వేజనా సుఖినోభవంతు దానికి ప్రతిదేశం సంపద్వంతం కావాలన్నది ప్రపంచీకరణ సుభాషితం. అందుకు గాను స్వేచ్చామార్కెట్‌ ఉండాలని చెప్పింది. మార్కెట్‌ అంటేనే లాభాలు, కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లు అవి మార్కెట్లో పట్టున్నవారికే వస్తాయి. ఇప్పుడు ఆ పట్టుకోసం కుమ్ములాట, ధనికదేశాలు తాము చెప్పిన పద్దతిల్లో ఆట నిబంధనలు ఉండాలని చెబుతున్నాయి.వాటిలో కూడా విబేధాలు. ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి ముందు ఉన్న పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) గానీ మీరు పప్పులు తీసుకు రండి మేము పొట్టు తీసుకువస్తాం రెండింటినీ కలిపి ఊదిన తరువాత మిగిలిన వాటిని పంచుకుందాం అన్నట్లుగా పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా ఏర్పరచుకున్నవే. దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకోవటం కుదరదు గనుక మార్కెట్లను ఆక్రమించే ఎత్తుగడదానిలో ఉంది. అది పారలేదు గనుక కొత్త దారులు వెతుకుతున్నాయి. భారత్‌, చైనా వంటివి కొరకరాని కొయ్యలుగా మారాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d