• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

బ్రెజిల్‌ రాజకీయ వేదికపై తిరిగి వామపక్ష నేత లూలా !

16 Tuesday Mar 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Lula is back, Brazilian politics, Jair Bolsonaro, Latin America, Latin American left, lula da silva


ఎం కోటేశ్వరరావు


లూయిస్‌ ఇనాసియో లూలా డ సిల్వా ! ప్రపంచానికి సుపరిచితమైన పేరు లూలా !! వామపక్ష బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు !!! న్యాయవ్యవస్ద,మీడియా, కార్పొరేట్‌శక్తులు కుమ్మక్కై ”ఆపరేషన్‌ కార్‌వాష్‌ ” పేరుతో చేసిన కుట్రలో జైలు పాలయ్యాడు. వేళ్లేటపుడు లక్షలాది ప్రజల మధ్య జైలుకు వెళ్లాడు. ఆయనకు శిక్ష విధించిన కోర్టుకు మోపిన ఆరోపణలను విచారించే అధికారమే లేదని, రాజధానిలోని మరో కోర్టుకు కేసులను బదలాయిస్తున్నామని, అక్కడ కేసులు తేలేంతవరకు లూలా దోషి కాదని తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో విధించిన 26 సంవత్సరాల శిక్ష రద్దు, కోల్పోయిన రాజకీయ హక్కులు తిరిగి వచ్చాయి. ఈ తీర్పు పచ్చిమితవాది, నియంతగా ఉన్న అధ్యక్షుడు జైర్‌ బోల్సనారోను కుదిపివేసిందనే చెప్పాలి. తిరిగి ప్రభుత్వం కేసును తిరగదోడుతుందా, అది తేలేవరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేవి శేష ప్రశ్నలు. వచ్చే ఏడాది మధ్యనాటికి శిక్ష పడితే తప్ప ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తిరిగి లూలా పోటీ చేయవచ్చు. తప్పుడు కేసులు మోపి జైలు పాలు చేసినపుడు ఒక వీరుడి మాదిరి వీడ్కోలు ఇచ్చిన జనం ఇప్పుడు కేసుల నుంచి బయటపడటంతో తమ ప్రియతమ నేత తిరిగి వచ్చాడంటూ నీరాజనం పట్టారు. లూలా తిరిగి వచ్చాడు అంటూ బ్రెజిల్‌ పాలకవర్గాలకు దడపుట్టించారు.


అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా తప్పుడు కేసులు పెట్టారు. ఇరవైఆరు సంవత్సరాల జైలు శిక్ష, రాజకీయ హక్కులను తొలగిస్తూ 2018లో కోర్టు తీర్పు చెప్పింది. దాని మీద పునర్విచారణ కోరగా అప్పీళ్లు తేలకుండా జైలులో ఉంచటం చట్టవిరుద్దం అని కోర్టు తీర్పు ఇవ్వటంతో 580 రోజుల తరువాత 2019 నవంబరులో లూలా విడుదల అయ్యాడు.శిక్ష విధించిన న్యాయమూర్తి మోరో పక్షపాత రహితంగా వ్యవహరించారో లేదో చెప్పాలని లూలా న్యాయవాదులు కోర్టును కోరారు. దాంతో ఐదుగురు న్యాయమూర్తులలో ఇద్దరు అవునని ఇద్దరు కాదని పేర్కొన్నారు. తాను కొత్తగా నియమితుడైనందున, కేసు గురించి తగినంత అవగాహన లేనందున తన అభిప్రాయాన్ని చెప్పజాలనని ఐదవ న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులలో ఒకరైన ఎడ్సన్‌ ఫాచిన్‌ మార్చి ఎనిమిదవ తేదీన తీర్పు చెబుతూ లూలాకు వ్యతిరేకంగా నమోదు చేసిన నేరాలు వాటిని విచారించిన కోర్టు పరిధిలోనివి జరిగినవి కానందున విచారించే హక్కే లేదని కేసులను రాజధాని కోర్టుకు బదిలీచేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో ఉన్నట్లుగా పరిగణించి అర్హతలేని కోర్టు విధించిన శిక్షలు, రాజకీయ హక్కుల ఉపసంహరణ చెల్లదని తీర్పునిచ్చారు. లూలా నిర్దోషి అనిగానీ లేదా దోషి అని న్యాయమూర్తి నిర్దారించలేదు.అయినప్పటికీ రాజధాని కోర్టులో కేసు తేలేంతవరకు లూలా నిర్దోషిగానే ఉంటారు. అక్కడి నియమ నిబంధనల ప్రకారం 2022వ సంవత్సరం జూన్‌కు ముందుగా కేసుల్లో శిక్షపడితేనే పోటీ చేసేందుకు వీలు కాదని, అయితే అలా జరిగే అవకాశం లేదని తిరిగి కేసులు నమోదు చేసి విచారించేందుకు సంవత్సరాలు పడుతుంది కనుక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ తీర్పుతో 75 సంవత్సరాల లూలా తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే లూలా పోటీ చేస్తారా లేక పార్టీ తరఫున మరొకరిని నిలుపుతారా అన్నది వచ్చే రోజుల్లో మాత్రమే స్పష్టం అవుతుంది.


పులిట్జర్‌ బహుమతి పొందిన జర్నలిస్టు గ్లీన్‌ గ్రీన్‌వాల్డ్‌ నిర్వహిస్తున్న ఇంటర్‌సెప్ట్‌ బ్రెజిల్‌ అనే ఆన్‌లైన్‌ పత్రికలో న్యాయమూర్తి మోరో ఆపరేషన్‌ కార్‌వాష్‌ కుట్రదారులతో జరిపిన సంప్రదింపులు, సూచనలు, సలహాలు తదితర అంశాలన్నీ ప్రచురితమయ్యాయి.దాంతో మోరో 2020ఏప్రిల్లో రాజీనామా చేసి వెంటనే న్యాయశాఖ మంత్రి అవతారమెత్తాడు.తీర్పునకు ప్రతిఫలంగా ఈ బహుమతి పొందారు. నిజానికి పత్రికలో ఈ విషయాలు వెల్లడిగాక ముందే చార్జిషీటులోని పరస్పర విరుద్ద అంశాలు వెల్లడయ్యాయి. లూలాను విడుదల చేయాలనే ఉద్యమం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ పత్రికలో అనేక పత్రాలు వెల్లడి కావటంతో లూలా మీద కేసులు నిలిచేవి కాదని, విడుదల తధ్యమని అభిమానులు, ఇతరులు కూడా భావించారు.


సైన్సును నమ్మని బోల్సనారో మూర్ఖంగా వ్యవహరించి జనాన్ని కరోనా పాలు చేశాడు. దేశాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాననే ఆకర్షణీయ వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన ఆ పెద్దమనిషి ఏలుబడిలో కరోనా సమయంలో 4.1శాతం తిరోగమనంలో ఉంది.1996 తరువాత ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదు. అమెజాన్‌ అడవులను నాశనం చేసే విధంగా పర్యావరణ విధానాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అడవులు అంతరిస్తున్నాయి. చివరికి జోబైడెన్‌, ఐరోపా ధనిక దేశాలు కూడా బ్రెజిల్‌ ఉత్పత్తులను బహిష్కరిస్తామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది.2019లో అధికారానికి వచ్చిన పచ్చి మితవాది బోల్సనారో ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. కరోనాను అరికట్టటంలో వైఫల్యం ఎంత దారుణంగా ఉందో ఏడాది కాలంలో నలుగురు ఆరోగ్యశాఖ మంత్రులను మార్చటమే పెద్ద నిదర్శనం. అమెరికా తరువాత కోటీ పదిహేనులక్షల కేసులు 2.8లక్షల మంది మరణాలతో రెండవ స్ధానంలో బ్రెజిల్‌ ఉంది ఉంది. ఆర్ధికంగా దిగజారటమే కాకుండా ఉద్యమాలను అణచివేయటంలో బోల్సనారో పేరుమోశాడు. గతేడాది అక్టోబరులో 41.2శాతం మంది మద్దతు ఇవ్వగా ఫిబ్రవరి 22న వెల్లడైన సిఎన్‌టి సర్వే ప్రకారం అది 32.9శాతానికి పడిపోయింది. మరింతగా దిగజారుతున్న ధోరణే తప్ప మరొకటి కాదు.


లాటిన్‌ అమెరికాలో రెండు దశాబ్దాల వామపక్ష పురోగమనంలో ఎదురు దెబ్బలు తగిలిన వాటిలో బ్రెజిల్‌ కూడా ఒకటి. వామపక్ష ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌ ప్రజాస్వామ్య ఉద్యమం(ఎండిబి) పార్టీ 2016లో ఆ ప్రభుత్వానికి ద్రోహం చేసింది. పాలకవర్గంతో చేతులు కలిపి అధ్యక్షురాలిగా ఉన్న దిల్మా రౌసెఫ్‌ మీద తప్పుడు ఆరోపణలు మోపి అభిశంసన ద్వారా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎండిబి నేత మిచెల్‌ టెమర్‌ అధ్యక్ష పీఠమెక్కి 2019 జనవరి ఒకటవ తేదీ వరకు పదవిలో కొనసాగాడు. అంతకు ముందు సంవత్సరం జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు.2017లో జరిగిన ఒక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం ఏడు శాతం మంది మాత్రమే టెమర్‌కు మద్దతు ఇవ్వగా 76శాతం మంది రాజీనామా చేయాలన్నారు. 2018 ఎన్నికలలో అతగాడు పోటీ చేయలేదు. వర్కర్స్‌ పార్టీ ప్రతినిధిగా రంగంలోకి దిగిన లూలాను తప్పుడు కేసులతో శిక్షించటంతో పోటీకి అనర్హుడయ్యారు. చివరి నిమిషంలో సావో పాలో మాజీ మేయర్‌ అయిన ఫెర్నాండో హదాద్‌ను పోటీకి నిలిపారు, ఓటర్లకు పెద్దగా పరిచయం లేకపోవటం, అంతకు ముందు దిగజారిన పరిస్ధితులను చక్కదిద్ది మంచి రోజులను తెస్తానన్న బోల్సనారో ప్రజాకర్షక వాగ్దానాల వరదలో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయింది. బోల్సరారో గద్దెనెక్కాడు.


వామపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయి లేదా కుట్రతో మితవాద శక్తులు అధికారానికి వచ్చిన చోట అవి ఎన్నికల్లో పరాజయం పాలుకావటం తిరిగి వామపక్ష శక్తులు గద్దెనెక్కటం చూస్తున్నాము. అర్జెంటీనా, బొలీవియాలో అదే జరిగింది. ఈక్వెడోర్‌లో తొలి దఫా జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ది మొదటి స్దానంలో ఉన్నాడు. ఏప్రిల్‌ 11న జరిగే మలిదఫా ఎన్నికల్లో ఎలాంటి కుట్రలూ చోటు చేసుకోకపోతే విజయం సాధిస్తారనే వాతావరణం ఉంది.వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు తిరిగి పోటీ చేస్తాడని, అతగాడికి తగిన ప్రత్యర్ధి లూలా అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.బోల్సనారోను సమర్ధించేందుకు అవకాశం లేని వారు లూలాను కూడా అతగాడితో జమకట్టి ఆ ప్రమాదం పోతే ఈ ప్రమాదం వస్తుందనే పేరుతో ఇప్పటికే కధనాలను అల్లుతున్నారు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు మీద పునర్విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. గత పాలకులు చార్జిషీట్లను సరిగా రూపొందించని కారణంగా బోల్సనారో సర్కార్‌ తిరిగి లూలాపై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. నిజంగా జరిగితే అదేమీ ఆశ్చర్యం కలిగించదు. అలాంటి పరిస్ధితి లాలూను తిరిగి జైలుకు పంపితే మరొకరు అభ్యర్ధి అవుతారు.


తప్పుడు కేసులో తనను శిక్షించిన జడ్జి సెర్జియో మోరో ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడని తరువాత బోల్సనారో సర్కార్‌లో మంత్రి అయ్యాడని లూలా చెప్పారు.ఐదు వందల సంవత్సరాల చరిత్రలో న్యాయవ్యవస్దకు బలైన అతి పెద్ద బాధితుడనని చెప్పారు. మార్చి పదవ తేదీన వేలాది మంది తన మద్దతుదార్లతో ఎక్కడైతే ఒక లోహకార్మికుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించాడో అదే లోహకార్మిక సంఘకార్యాలయం వద్ద జరిగిన సభలో లూలా ప్రసంగించారు. కరోనా మహమ్మారితోపాటు దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. గతంలో లూలాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామి అయిన అతిపెద్ద మీడియా సంస్ద గ్లోబో గ్రూప్‌తో పాటు కొందరు రాజకీయనేతలు కూడా తమ వైఖరిని మార్చుకోవటం అనేక మంది ఆశ్చర్యం కలిగిస్తున్నది. దానికి కారణం వామపక్షాల స్దానంలో అధికారానికి వచ్చిన మితవాద పక్షాలు ఎన్నికల్లో పరాజయం పాలై తిరిగి వామపక్షాలు అధికారానికి వస్తున్న ధోరణి ఒకటని చెప్పవచ్చు. గ్లోబో గ్రూపు మీడియా సంస్దలు లూలాకు శిక్ష వేసిన మోరోను హీరోగా చిత్రిస్తూ గతంలో ఆకాశానికి ఎత్తాయి. అలాంటిది ఇటీవల దేశ ప్రజాస్వామిక వ్యవస్దలో లూలా నిర్మాణాత్మక పాత్ర పోషించారంటూ సానుకూలంగా స్పందించాయి. దీని అర్ధం ఈ సంస్ధలతో సహా మొత్తంగా మీడియా మారు మనసు పుచ్చుకొని మారిపోయింది అని కాదు, విశ్వసనీయత మరింతగా దిగజారకుండా చూసుకొనే యత్నంలో భాగమే అని గుర్తించాలి. చివరకు పార్లమెంట్‌ స్పీకర్‌ ఆర్ధర్‌ లీరా కూడా న్యాయమూర్తి ఫాచీ ఇచ్చిన తీర్పును రాజకీయ వ్యవస్ద ఆమోదించాలని పేర్కొన్నారు. అంతే కాదు కార్‌వాష్‌ పేరుతో మోపిన కేసుకు దోహదం చేసిన వారిని శిక్షించకుండా వదల కూడదని కూడా చెప్పటం విశేషం. ఈ కేసును కుట్రపూరితంగా నమోదు చేశారనేందుకు అనేక ప్రభుత్వ అంతర్గత పత్రాలు బహిర్గతం కావటంతో లూలాపై మోపిన నేరారోపణలను ఎవరూ బహిరంగంగా సమర్దించలేని స్ధితి ఏర్పడింది.


లూలాపై కేసులు కొట్టివేసిన తీర్పు వెలువడిన తరువాత స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. డాలరుతో స్ధానిక కరెన్సీ రియల్‌ మారకపు విలువ పడిపోయింది. లూలా తిరిగి దేశ రాజకీయాల్లో ముందుకు రావటం కార్పొరేట్లకు ఇష్టం లేదనేందుకు ఇదొక సూచిక. గతంలో ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ అధినేత లూలా, తరువాత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అధికారంలో ఉన్న అదే పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్‌ హయాంలో సంక్షేమ పధకాలు అమలు జరిగాయి. తరువాత 2016లో అభిశంసన పేరుతో జరిపిన పార్లమెంటరీ కుట్రతో అధికారానికి వచ్చిన మిచెల్‌ టెమర్‌, నయా ఫాసిస్టు బోల్సనారో కార్మిక హక్కుల మీద దాడి చేశారు. ఆరోగ్యం, విద్య వంటి అనేక సంక్షేమ పధకాలకు కోతపెట్టారు. అనేక అక్రమాలకు తెరలేపారు, చట్టవిరుద్దమైన చర్యలను అనుమతించారు.అన్నింటికీ మించి కరోనా వైరస్‌ను అదుపుచేసే విషయంలో వ్యవహరించిన తీరును నేరపూరితమైనదిగా జనం భావిస్తున్నారు.అమెరికాలో ట్రంపు మాదిరే బోల్సనారో కూడా జనాన్ని పట్టించుకోలేదు.


లూలా సామాజిక, ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికగా ఆవిర్భవించిన నిజమైన నేత. అదే బోల్సనారో దానికి భిన్నమైన వ్యక్తి.పచ్చిమితవాది, ప్రభుత్వ పదవుల్లో గతంలో నియంతలను బలపరిచిన మాజీ సైన్యాధికారులను అనేక మందికి స్ధానం కల్పించాడు.దేశ ప్రజాస్వామిక వ్యవస్ధలను దిగజార్చిన ఆచరణ ఉన్న వ్యక్తి.అమెరికా సామ్రాజ్యవాదుల నమ్మిన బంటుగా ఉన్నాడు.లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్న తరుణంలో లూలా రాజకీయ హక్కుల పునరుద్దరణ బ్రెజిల్‌ వామపక్ష శక్తులకు పెద్ద ఊరట,మరోసారి అక్కడ జయకేతనం ఎగరవేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిహద్దు రక్షకులకు చలిదుస్తులు కూడా ఇవ్వలేని స్దితిలో ” దేశ రక్షకుడు ” మోడీ ఉన్నారా ?

11 Thursday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#ladakh conflict, BJP anti China, India's biggest trade partner, Indo-China standoff, Indo-China trade, LAC, Ladakh, Narendra Modi, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటవు అన్న సామెత తెలిసిందే. ప్రపంచంలో ఏ మిలిటరీని అయినా ఎదిరించగల సురక్షితమైన (నరేంద్రమోడీ) చేతుల్లో దేశం ఉందని బిజెపి నేతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. నిజమే అని జనం కూడా నమ్మారు.నమ్మినవారెపుడూ చెడ్డవారు కాదు. కానీ తాజాగా అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ ఫిలిప్‌ డేవిడ్సన్‌ చెప్పినదాని ప్రకారం మంచుకొండల్లోని మన సైన్యానికి అవసరమైన చలిదుస్తులు కూడా అందించలేని స్దితిలో మన ప్రభుత్వం ఉందన్న అనుమానం కలుగుతోంది. చలి దుస్తులు, మంచులో ధరించాల్సిన పరికరాలు, కళ్లద్దాలు, బూట్లు, ఆహార కొరత ఉన్నట్లు కాగ్‌ కూడా తన నివేదికలో పేర్కొన్నది. దానిమీద రక్షణ మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ కాగ్‌ 2015-17 సంవత్సరాల వివరాల ప్రకారం అలా చెప్పిందని, ప్రధాన కార్యాలయాల్లో కొరత నిజమే గానీ రంగంలో ఉన్న సైనికులకు అందించామని పేర్కొన్నది. కానీ డేవిడ్స్‌న్‌ చెప్పింది గతేడాది ఉదంతం గురించి అన్నది గమనించాలి. అమెరికా నుంచి ఆయుధాలతో పాటు చివరకు దుస్తులను కూడా తెచ్చుకొనే దుస్దితిలో మన సర్కార్‌ ఉంది. నిజానికి అవి మనం తయారు చేసుకోలేనివి కాదు, సైనికులను చలికి వదలివేసే నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు.


అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు మార్చినెల తొమ్మిదిన హాజరై ముందుగానే తయారు చేసుకు వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడిన డేవిడ్స్‌న్‌ చెప్పిన వాటి సారాంశం ఇలా ఉంది.సరిహద్దు వివాదంలో భారత్‌కు అవసరమైన సమాచారం, చలి దుస్తులు, ఇతర సామగ్రిని అమెరికా అందించింది.ముందుకు వచ్చిన అనేక స్ధానాల నుంచి చైనా ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. సరిహద్దు ఘర్షణలకు చైనాయే కారణం.వివాదాస్పద సరిహద్దుల సమీపంలో నిర్మాణకార్యక్రమాలను చేపట్టిన చైనా దానికి మద్దతుగా దాదాపు 50వేల మంది సైన్యాన్ని దించింది. దానికి ప్రతిగా భారత్‌ కూడా సైన్యాన్ని మోహరించింది. ఇతరులతో సహకారం తమ స్వంత రక్షణ అవసరాలకే అని సరిహద్దు వివాదం భారతదేశ కళ్లు తెరిపించింది.ఇప్పటికీ భారత్‌ తమ అలీన వైఖరికి కట్టుబడి ఉన్నప్పటికీ అత్యంత సమీప కాలంలో చతుష్టయం(క్వాడ్‌ : అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌. ఈ కూటమిని చైనా తన వ్యతిరేక దుష్ట చతుష్టయంగా పరిగణిస్తోంది, పోటీగా తన అస్త్రాలను తీస్తోంది)లో మరింతగా భాగస్వామి అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా అమెరికా,జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇది కీలకమైన అవకాశం.భారత-అమెరికా సంబంధాలు, 21వ శతాబ్దిలో భాగస్వామ్యంలో ఎవరేమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఇదని భావిస్తున్నాను. సంబంధాలను మరింత సన్నిహితంగా మరియు గట్టిపరుచుకొనేందుకు ఒక చారిత్మ్రాక అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఇటీవలి కాలంలో రెండు దేశాలు పునాదుల వంటి మూడు ఒప్పందాలు చేసుకున్నాయి. మిలిటరీ సహకారాన్ని పెంచుకోవటం,అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోలును భారత్‌ పెంచుకోవటం, అమెరికాతో కలసి సంయుక్త విన్యాసాల నిర్వహణ.భారతదేశంతో రక్షణ సంబంధాలు వ్యూహాత్మకంగా తప్పనిసరి.” అన్నారు.


ప్రపంచాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని, తన కార్పొరేట్లకు యావత్‌ దేశాల మార్కెట్లను అప్పగించాలన్న అమెరికా వ్యూహత్మక ఎత్తుగడలో మన పాలకులు మన దేశాన్ని ఇరికించారన్నది డేవిడ్స్‌న్‌ చెప్పిన అంశాల సారం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అమెరికాను నమ్మి, దాని వెంట నడచి బాగుపడిన దేశం ఒక్కటైనా ఉందని ఎవరైనా చూపితే సంతోషం. సహకారం పేరుతో మన ఇరుగు పొరుగుదేశాలతో మనం లడాయి పెట్టుకొనేట్లు చేయటం, ఆ ముసుగులో తన ఆయుధాలను మనకు అంటగట్టటం, మన మిలిటరీలో చొరబడేందుకు సంయుక్త విన్యాసాల వంటివి నిర్వహించటం ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తాయో దేశభక్తులు(బిజెపి మార్కు కాదు) ఆలోచించటం అవసరం. ఈనెల 12న చతుష్టయ అంతర్జాల సమావేశం జరగనుండటం, ఆ తరువాత అమెరికా నూతన రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ త్వరలో మన దేశాన్ని సందర్శించనున్న తరుణంలో డేవిడ్సన్‌ ఈ విషయాలను వివరించారు.అంతకు కొద్ది రోజుల ముందు అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన ఒక మార్గదర్శక పత్రంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, దాన్ని ఎదుర్కొనేందుకు భాగస్వాములతో కలసి పని చేయాలని పేర్కొన్నది. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా తమ ముగ్గులోకి మనలను లాగే వైఖరిని అమెరికా కొనసాగిస్తూనే ఉందన్నది స్పష్టం. అందువలన పాత ప్రియుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు బ్రేకప్‌ చెప్పి(వదలివేసి) కొత్త ప్రియుడు జో బైడెన్‌ను కౌగలించుకొనే రోజు ఎంతో దూరంలో లేదని గ్రహించాలి.
అమెరికన్‌ కమాండర్‌ డేవిడ్స్‌న్‌ తమ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాలను చెప్పిన మరుసటి రోజే మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఏమి చెప్పింది ? చైనా అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు పోలేదని డేవిడ్స్‌న్‌ చెప్పాడు. ఇది చైనా-మనకు తంపులు పెట్టే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిగా సేనల ఉపసంహరణ పూర్తయిందని, మిగతా సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.


ట్రంపు కంపును మరింతగా పెంచాలనే జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు. పాతికేండ్ల క్రితం చైనా ప్రభుత్వం పంచన్‌లామా నియామకం మత స్వేచ్చను దుర్వినియోగం చేయటమే అని బైడెన్‌ యంత్రాంగం తాజాగా ఒక ప్రకటన ద్వారా ట్రంప్‌ బూట్లలో దూరి నడవనున్నట్లు వెల్లడించింది. టిబెటన్‌ దలైలామా చైనా మీద విఫల తిరుగుబాటు చేసి 1959 మే 17న మన దేశానికి పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. టిబెట్‌ బౌద్దమత చరిత్రను చూసినపుడు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ వేర్వేరు ఆరామాలకు – తెగలకు అధిపతులు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారు. ఒకరి అధికారాన్ని మరొకరు పరస్పరం గుర్తించుకుంటారు. అయితే దలైలామా తరువాత స్ధానం పంచన్‌లామాదిగా బౌద్దులు పరిగణిస్తారు. పదవ పంచన్‌ లామా 1989లో మరణించిన తరువాత ఎవరినీ నియమించలేదు. 1995లో దలైలామా ఒక ఐదేండ్ల బాలుడిని పదకొండవ పంచన్‌ లామాగా నియమించినట్లు ప్రకటించారు. దాన్ని టిబెట్‌ రాష్ట్ర ప్రభుత్వం, చైనా కేంద్ర ప్రభుత్వమూ గుర్తించలేదు. అతని స్దానంలో వేరొకరిని నియమించి, బాలుడిని, అతని కుటుంబాన్ని వేరే ప్రాంతంలో ఉంచారు. ప్రస్తుతం బాలుడు పెరిగి పెద్దవాడై డిగ్రీ చదువుకొని ఉద్యోగం చేస్తున్నట్లు చైనా పేర్కొన్నది తప్ప ఇతర వివరాలు తెలియవు. చైనా సర్కార్‌ నియమించిన పంచన్‌లామాను దలైలామా గుర్తించలేదు కనుక దలైలామాకు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలూ గుర్తించటం లేదు. మధ్యమధ్యలో ఆ వివాదాన్ని ముందుకు తెస్తూ రాజకీయాలు చేస్తుంటాయి. గతేడాది డిసెంబరులో ట్రంప్‌ (ఓడిపోయిన తరువాతే) చివరి రోజుల్లో టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఒక బిల్లును చట్టంగా మారుస్తూ సంతకం చేశారు.


ప్రస్తుత పద్నాలుగవ దలైలామా 62 సంవత్సరాలుగా మన దేశంలోనే ఉన్నారు. అయినా ఆయన స్దానంలో టిబెట్‌లో ఎవరినీ నియమించలేదు. కొత్త దలైలామాను నియమించబోతున్నారంటూ రెచ్చగొట్టే వార్తలను రాయిస్తూ ఉంటారు. అమెరికాతో కలసి గోక్కోవటం మొదలు పెట్టిన తరువాత గత (కాంగ్రెస్‌, చివరికి అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ) పాలకులు కావాలని విస్మరించిన ఈ అంశాన్ని అమెరికాతో పాటు ఎందుకు గోకకూడదనేే ఆలోచన మన మోడీ సర్కార్‌కూ వచ్చిందని వార్తలు వచ్చాయి. బహిరంగ ప్రకటన చేయలేదు గానీ చైనాను రెచ్చగొట్టే చర్యలన్నీ చేస్తోంది. తాజాగా గాల్వన్‌ లోయ ఉదంతాల్లో టిబెటన్‌ తిరుగుబాటుదార్లతో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) పేరుతో ఏర్పాటు చేసిన అనధికార కిరాయి సాయుధ మూకను చైనీయుల మీదకు ఉసిగొల్పి పాపాంగాంగ్‌ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో గతేడాది ఆగస్టులో కొన్ని కొండలను ఆక్రమించుకొనేందుకు పంపటం, ఆ ఉదంతంలో కొందరు మరణించటం తెలిసిందే.

చతుష్టయ సమావేశం సాధించేది ఏమిటి ?


చతుష్టయ కూటమి ఏర్పాటు వెనుక అమెరికా ఎత్తుగడ ఏమిటో వారెన్నడూ దాచుకోవటం లేదు. తెలిసి వారి వలలో చిక్కుకొనే వారి గురించే ఆలోచించాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనాను ఈ కూటమిలోని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ముప్పుగా పరిగణించలేదు. ఇప్పుడు ముప్పు సిద్దాంతం లేదా భయాన్ని ముందుకు తెస్తున్నాయి. నాలుగు దశాబ్దాల్లో ఈ నాలుగు దేశాలూ చైనా నుంచి ఎంతో లబ్దిపొందాయి-అదే సమయంలో దాని ఎదుగుదలకూ దోహదం చేశాయి. ఎవరి ప్రయోజనం కోసం వారు వ్యవహరించారు. ఈ క్రమంలో మొత్తంగా తేలిందేమంటే చైనా అర్ధికంగా అమెరికానే సవాలు చేసే స్ధాయికి ఎదిగింది ? నాలుగు దేశాలు అనుసరించిన దివాలా కోరు విధానాలు చైనాతో పోటీపడలేకపోయాయి. ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా చైనా ముప్పును ముందుకు తెస్తున్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో తెగేదాకా లాగేందుకు భయపడుతున్నాయి. ఇదే సమయంలో ఎవరికి వారు స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేసి చైనాతో బేరసారాలాడుతున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అందరమూ ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తూనే దెబ్బలాట-ముద్దులాట మాదిరి మరోవైపు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.


నిజానికి చైనా నుంచి ముప్పు వచ్చేట్లయితే చతుష్టయ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే చైనా ప్రధాన భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం( ఆర్‌సిఇపి )లో జపాన్‌,ఆస్ట్రేలియా ఎందుకు చేరినట్లు ? మన దేశంతో సరిహద్దులు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని గత ఏడాది మన ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అలాంటి పెట్టుబడులు పెట్టగలిగింది చైనా ఒక్కటే కనుక దాని పెట్టుబడులను అడ్డుకోవాలన్నది అసలు లక్ష్యం. తరువాత తత్వం బోధపడింది, చైనా పెట్టుబడులు రాకుండా గడవదు అని గమనించిన తరువాత ఆ నిబంధనలను సడలించి సమగ్రంగా పరిశీలించిన తరువాత కీలక రంగాలలో స్ధానికంగా చేయలేని వాటిని ఆమోదించవచ్చు అంటూ తలుపులు తెరిచారు. అంతకు ముందు మాత్రం పరిశీలించకుండా అనుమతించాలని ఎవరు కోరారు, ఎందుకు అనుమతించారు ? సమాధానం రాదు.


మన ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడి సరకులు, కొంత మేరకు తయారైన దిగుమతులు చైనా నుంచి రాకుండా ప్రత్యామ్నాయం వెంటనే చూసుకొనే అవకాశం లేకనే ఆ పరిశ్రమ వత్తిడి మేరకు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరవటం వాస్తవం కాదా ? ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని అమలు చేసే పధకాల్లో చైనా కంపెనీలు కూడా టెండర్లను దక్కించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అసలు అప్పులు తీసుకోవటం మానుకోవచ్చుగా ? పైగా మోడీ ఏలుబడిలోకి వచ్చిన తరువాత అసలు బయటి నుంచి అప్పులే తీసుకోవటం లేదని తప్పుడు ప్రచారం ఒకటి. చైనా పెట్టుబడులు వస్తే దాని ముప్పు మనకు తొలిగినట్లుగానే భావించాలా ? అలాంటపుడు చతుష్టయంలో అమెరికాతో గొంతు కలిపి చైనా వ్యతిరేక ప్రగల్భాలు ఎందుకు ? చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకుంటామని ఇప్పుడు చెబుతున్నవారు సంఘర్షణ వరకు ఎందుకు తీసుకుపోయినట్లు ? అమెరికన్లకు చైనా మార్కెట్‌ను మరింతగా తెరిస్తే మిగిలిన మూడు దేశాలను దక్షిణ చైనా సముద్రంలో ముంచి అమెరికా తన దారి తాను చూసుకుంటుందనే జ్ఞానం ఆయా దేశాలకు ఉండవద్దా !

ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసి లబ్ది పొందింది అమెరికానా మిగిలిన సభ్యదేశాలా ? ఆ కూటమి తరువాత ఏ సభ్యదేశం మీద అయినా ఎవరైనా దాడి చేశారా ? ఆ పేరుతో ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నది అమెరికా, అందుకు మూల్యం చెల్లించింది ఐరోపా దేశాలు కాదా ? 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి లేదా తాజా కరోనా కల్లోలం నుంచి నాటో కూటమి దేశాలను అమెరికా ఏమైనా ఆదుకోగలిగిందా ? లేనపుడు మనలను ముందుకు నెట్టి ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ఎత్తుగడలో మనం ఎందుకు పావులుగా మారాలి ? మనల్నే రక్షిస్తున్నామని ఒక వైపు అమెరికా డేవిడ్సన్‌ చెబుతుంటే మన నాయకత్వంలో ఏర్పడే ఆసియా నాటో కూటమి అమెరికా ఆయుధాలను ఆయా దేశాలతో కొనిపించే దళారీగా మారటం తప్ప ఎవరి నుంచి ఎవరిని రక్షిస్తుంది ? యుద్దానికి ఎందుకీ ఉత్సాహం ?
నాలుగు సంవత్సరాల పాటు తన దేశాన్ని ఎలా బాగు చేసుకుందామా అనే ఆలోచనకు బదులు చైనాను ఎలా నాశనం చేద్దాం లేదా దారికి తెచ్చుకుందాం అనే యావలో గడిపిన డోనాల్డ్‌ ట్రంప్‌ చివరికి అమెరికాను ఏమి చేసిందీ చూశాము.కరోనా నివారణలోను, దాని పర్యవసానంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను నిలపటంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.కరోనా మహమ్మారికి అత్యధిక మంది పౌరులను బలిచ్చిన దుష్టుడిగా చరిత్రకెక్కాడు.


చైనా వస్తువులను బహిష్కరించండి, చైనా పెట్టుబడులను బహిష్కరించండి, అసలు చైనానే బహిష్కరించండి అన్నట్లుగా గతేడాది సరిహద్దు ఉదంతాల తరువాత ఎంత పెద్ద రచ్చ చేశారో, ఎవరు చేశారో చెప్పనవసరం లేదు. జనానికి చైనాను వ్యతిరేకించటమే అసలైన దేశభక్తి అని నూరిపోశారు.మీడియా తన రేటింగులకోసం మరింతగా రెచ్చిపోయింది. మరోవైపు జరిగిందేమిటి 2020లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టి చైనాతో ప్రధమ స్ధానంలో వాణిజ్యలావాదేవీలను జరిపారు మన అపర దేశభక్తులని ఎంత మందికి తెలుసు.కరోనా కారణంగా మొత్తం దిగుమతులు తగ్గాయి, దానిలో భాగంగానే 2019లో ఉన్న 85.5 బిలియన్‌ డాలర్లకు చేరలేదు గానీ 77.7 బిలియన్‌ డాలర్లతో చైనా మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా 2020లో ఉంది. మన ఎగుమతులు చైనాకు పెరిగాయి. ఇది తెలియని సామాన్యులు, అమాయకులు ఇంకా తెలిసినప్పటికీ మీడియా ఇంకా చైనా వ్యతిరేకతను వదిలించుకోలేదు.


గత నెలలో జరిగిన మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో అమెరికా – చైనాలలో ఏదో ఒక దాని వైపు తేల్చుకోవాలని జోబైడెన్‌ హెచ్చరించారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ దానిని పూర్వపక్షం చేస్తూ అన్ని రాజకీయ కార్యకలాపాలకు బహుముఖ విధానం అవకాశం కల్పించిందని అటువంటి సంస్దలను పటిష్టపరచాలని ఒక్కాణించారు.అంతకు ముందు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా చైనా ఐరోపా యూనియన్‌ పెట్టుబడి ఒప్పందం చేసుకున్నాయి. అందువలన ఇప్పటికైనా చతుష్టయ కూటమి-దాని వెనుక ఉన్న అమెరికా స్వార్ధం, ఎత్తుగడలు, మన మీద తుపాకి పెట్టి చైనాను కాల్చ చూస్తున్న పన్నాగాన్ని మన పాలకులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

20 Saturday Feb 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#India oil taxes, India oil price, narendra modi bhakts, Narendra Modi Failures, Watsapp fake news


ఎం కోటేశ్వరరావు


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ! అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ? మనం అంటే జనం బుర్రలకు పని పెట్టకుండా, చరిత్రను మర్చిపోతేనే అలాంటి వారు రెచ్చిపోతుంటారు. సమాజం పుచ్చిపోతుంది !
ఇపుడు అదే జరుగుతోంది. కారణాలు ఏవైనా, పేనుకు పెత్తనం ఇచ్చినట్లు మనం మెదళ్లను విదేశీ వాట్సాప్‌కు అప్పగించాం, ఇప్పుడు స్వదేశీ ”కూ ”కు అప్పగించమని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే తప్పు యాప్‌లది కాదు. విదేశీ అయినా, స్వదేశీ అయినా మనం వాటిలో దేన్ని ఉంచితే దాన్నే పదుగురిక పంచుతాయి. అందుకే పళ్లూడ గొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం ? బుర్రలను తాకట్టు పెట్టదలచుకుంటే ఎక్కడైతేనేం ! దాన్ని కూడా చూద్దాం !
వినేవాడికి బుర్రలేకపోతే చెప్పేవాడికి లోకువ ! నేనూ ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాను గనుక మెదడుకు పని పెట్టమనే చెబుతున్నా. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా ఎవరు చెప్పినా వినండి. హంస పాలూ నీళ్లను వేరు చేస్తుందంటారు, మనమూ మంచీ-చెడును వేరు చేసి మంచిని స్వీకరించుదాం !


పెట్రోల్‌ ,డీజిల్‌, ఎల్పిజి ధరలేం ఖర్మ ! రాబోయే రోజుల్లో ప్రతి వస్తువు, సేవ ధర పెరుగుతుంది. ఏమంటే దేశభక్తి అంటారు ! నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌ ఆచరణ అదే కదా ! వాట్సాప్‌లో తిప్పుతున్న అనేక పోస్టులలో ఒక దాని ప్రకారం కేంద్రలోని పెద్దలకు అవగాహన ఉంది కనుకనే వాటిని పెంచుతున్నారట ! వారికి లేదని ఎవరన్నారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించేందుకు కావాలనే చేస్తున్నారు. సందేహం లేదు. తెగించిన వాడికి తెడ్డే లింగం ! ఇంతకు ముందు ధరలు పెంచితే జనం ఆగ్రహిస్తారనే భయం ఉండేది కనుక పాలకులు కాస్త వెనుకా ముందూ చూసే వారు. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా పరిస్దితి ఉందని గ్రహించారు గనుకనే చెప్పి మరీ చేస్తున్నారు.


గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో డిమాండ్‌ లేకపోవటంతో ఒక దశలో ముడి చమురు ధర15 డాలర్లకు పడిపోయినా సౌదీ అరేబియా నుంచి మన దేశం పాత ధరకే కొనుగోలు చేసిందట ? డిమాండ్‌ తగ్గినా సౌదీ నుంచి కొనుగోళ్లను ఆపలేదట, డిమాండ్‌ లేనపుడు ఎందుకు కొనుగోలు చేసినట్లు ? అదీ పాత ధరకు ! స్వంత జనం మీద అంత కోపమెందుకు ? సౌదీ మీద అంత ప్రేమ ఎందుకబ్బా ! మనం చెవులప్పగిస్తే ఫ్రీగా ఉన్నాయి కదా అని ప్రతి చెత్త వాటిలో వేసిపోతారు !
అంతర్జాతీయ మార్కెట్లో ఏరోజు ఎంత ఉంటే ఆరోజు మన వినియోగదారుల నుంచి అంత వసూలు చేయాలన్నది మన విధానం. మన కొనుగోలు కూడా అలాగే ఉంటుంది తప్ప వచ్చే ఏడాది సరఫరా చేసే చమురుకు ముందు సంవత్సరమే ఒప్పందాలేమీ ఉండవు. ధర తగ్గినా సౌదీ నుంచి పాత ధరలకే కొనుగోలు చేయటం అంటే జనానికి శఠగోపం పెట్టటం, కుంభకోణం ఉన్నట్లే ! లేదా రాసిన వారికి అసలు విషయం పరిజ్ఞానం లేకపోయి ఉండాలి.


ఒపెక్‌ (చమురు ఎగుమతి దేశాలు) ధరలు పెంచే ఆలోచనలో ఉండగా మన దేశ విజ్ఞప్తి మేరకు ఆసియా ఖండం వరకు పాత ధరలకే ఇవ్వటానికి ఒప్పుకున్నాయట. అలాంటపుడు సెంచరీ దిశగా ప్రతి రోజూ ధరలను పెంచటం ఎందుకు ? పాత ధరలు ఎంతో ఇప్పుడు ఎంతకు కొంటున్నామో చెప్పమనండి, మన బండారం బయటపడుతుంది.


చైనా యాప్‌లను నిషేధించినా, వారి వస్తువులను కొనుగోలు చేయం అని బెదిరించినా సరిహద్దుల్లో చెట్టు చివరి ఆకు కూడా ఊగలేదు. మీరూ మూసుకోండి-మేమూ మూసుకుంటాం అన్నట్లుగా ఒప్పందం చేసుకొని సరిహద్దుల్లో చైనా-భారత్‌ సైన్యాలు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెనక్కు వెళ్లాయి. కొండల దిగువన ఉన్న చైనా వారు వెనక్కు తగ్గారు, కంపు ట్రంప్‌ మాటలు నమ్మి ఏదో అనుకొని, ఏదో చేద్దామని కొండలెక్కిన మనం కాళ్లనొప్పులతో దిగాము తప్ప జరిగిందేమీ లేదు.
అలాంటిది కొనుగోలు దేశంగా ఉన్న మనం కోరితే లేదా బెదిరిస్తే ఒపెక్‌ దేశాలు ధరలు తగ్గించాయంటే, ఒక్కసారికేం ఖర్మ 56 అంగుళాల ఛాతీ రోజూ గడ్డం నిమురుకోవటం మాని ఆ పని మీద కేంద్రీకరిస్తే జనం మీద బాదుడు తగ్గుతుంది కదా ! మనం ఎప్పుడు ఏ దేశం నుంచి చమురును ఎంతకు కొనుగోలు చేశామో, అధికారికంగా శ్వేత పత్ర ప్రకటన లేదా ప్రభుత్వ ప్రకటన చేయమనండిి అసలు సంగతి బయటపడుతుంది ! టూల్‌కిట్టూ కాదు, దేశద్రోహం అంతకంటే కాదు. దీన్ని కూడా అడగలేక ఏమి చెప్పినా తలలు ఊపుతాం – ఎందుకంటే మనం గంగిరెద్దులం కదా !


” క్రూడ్‌ ధరలు నిలకడగానే ఉన్నా దేశంలో పెట్రోల్‌ , డీజిలు ధరల పెంపు ఎందుకంటే వీలు ఉన్నంత వరకు వీటి ద్వారా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసమేనట ! లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అల్పదాయ ప్రజల ఆరు నెలల పాటు ఉచిత రేషన్‌ ఇచ్చిందట.” కనుక చమురు ధరలు పెంచటం సమర్దనీయమే అని భజన చేయటం.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఆరు నెలల పాటు కుటుంబానికి నెలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వటానికి 90వేల కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంటే కుటుంబానికి రూ.1,125 కేటాయించారు. ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేశారని సాధికారికంగా సమాచారం చెబితే సవరిస్తా ! కేంద్ర ప్రభుత్వం మార్చి నెల 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు మీద మూడేసి రూపాయలు, మే ఐదవ తేదీన రూ.10,13చొప్పున పెంచింది. తద్వారా కేంద్రానికి అదనంగా వస్తుందని చెప్పిన ఆదాయం ఎంత ? రెండు లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు లీటరు పెట్రోలు మీద రూ.9.48గా ఉన్న పన్ను 22.98కి పెంచారు. అంటే మరో రెండులక్షల కోట్లు ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పెంచినట్లు ? అప్పుడేమీ కరోనా, ఉచిత రేషన్‌ లేదే ? మనకు ఇచ్చింది ఎంత మన జేబుల నుంచి కొల్లగొట్టింది ఎంత ? దేశ భక్తి ఉండాల్సిందే గానీ అది మరీ మత్తులోకి దిగకూడదు. దిగితే మన ఒంటి మీద దుస్తులు కూడా మిగల్చరు ! ఏది చెబితే దాన్ని నమ్మేందుకు మనం గంగిరెద్దులమా ? అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


చమురు ధరల పెంపుదలకు మరో అంశాన్ని మెదళ్లకు ఎక్కించే యత్నం జరుగుతోంది. కరోనా, ఉచిత రేషను అంటే ఎక్కువ కాలం నడవదు . మరి అదేమిటి ? ” 2020 ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకు లడాక్‌ దగ్గర 50,000 మంది సైనికులని మోహరించింది మన దేశం. యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్‌ తో పాటు నిత్యం యుద్ధ విమానాలని గస్తీ లో ఉంచింది. కేవలం సైనికులని తరలించడానికే 10,000 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక మీరేజ్‌ యుద్ధ విమానం ఒక గంట గాలిలో ఎగిరితే అయ్యే ఖర్చు 6 లక్షలు అవుతుంది. ఒక ఎస్‌యు మిగ్‌ అయితే ఒక గంటకి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఒక సి-30 రవాణా విమానం లోడ్‌ తో గాల్లోకి లేచి దింపినందుకు అయ్యే ఖర్చు అక్షరాల 750 కోట్లు అవుతుంది. యావరేజ్‌ గా చూస్తే మొత్తం 10 నెలల కాలానికి రోజుకి 5 వేల కోట్లు ఖర్చు అయ్యింది. పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే రోజుకి లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది – ఇది రెండు లక్షల కోట్లకి కూడా పెరగవచ్చు. మీరేజ్‌, రాఫెల్‌ ల తో వాడే ఒక్కో మిసైల్‌ ఖరీదు 600 కోట్లు ఉంటుంది మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు ? ఎక్కడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో గట్టిగానే నిలబడ్డది. దేశ భద్రత ద ష్ట్యా ఇది తప్పని సరి ఖర్చు. ” అని సమర్ధన !


మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించలేదని గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. తన ప్రకటనను వక్రీకరించారని అనలేదు కనుక ఇప్పటికీ అదే మాటతో ఉన్నారనుకుందాం ! ఒక్క అంగుళం ఆక్రమించినా ఊరుకునేది లేదని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చైనా పది సార్లు సరిహద్దులను అతిక్రమిస్తే మనం 50సార్లు అతిక్రమించాం అని మాజీ సైనికాధిపతి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వికె సింగ్‌ తాజాగా చెప్పారు. సరిహద్దుల వెంబడి మనం తిష్టవేశాం, అది చైనా మీద వత్తిడి పెంచుతోందని కూడా సింగ్‌ చెప్పారు.
ప్రధాని చెప్పినట్లు మన ప్రాంతాన్ని చైనా వారు ఆక్రమించలేదు, రాజనాధ్‌ చెప్పినట్లు ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆక్రమించలేదు ,అయినా వికె సింగ్‌ గారు చెప్పినట్లు మనం వెళ్లి సరిహద్దులో కూర్చున్నాం. అందుకు గాను మనకు వదిలిన చమురు ఎంత. రోజుకు ఐదు వేల కోట్లంటే నెలకు లక్షా యాభై వేల కోట్లు, పది నెలలకు పదిహేను లక్షల కోట్లు ? ఇదంతా ఎందుకు చేసినట్లు ? అంత ఖర్చు భరించే స్దితిలో దేశం ఉందా ? ప్రతి పైసాకు జవాబుదారీ వహిస్తా అని చెబుతున్నవారు చేయాల్సిన పనేనా ఇది ? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్న రామదాసు గుర్తుకు రావటం లేదూ ! తేడా ఏమిటంటే ఆయన నవాబు జైల్లో బందీగా ఉండి వాపోయాడు. మనం హిందూత్వ ప్రజాస్వామ్య బందీలుగా ఉండి నోరు విప్పలేకపోతున్నాం. రామదాసు రక్షణకు రాముడు వచ్చాడంటారు. మన రక్షణకు కనీసం జైల్లో పరామర్శించేందుకు సైతం రాముడు వచ్చే అవకాశం లేదు. వచ్చినా అధికారులు అనుమతించరు.
పోనీ చైనా వారు కొత్తగా మన ప్రాంతాన్ని ఒక్క అంగుళం అయినా ఆక్రమించినట్లు చెప్పి ఉంటే దాన్ని కాపాడుకొనేందుకు పదిహేను లక్షల కోట్లేమిటి, దేశం మొత్తాన్ని అమ్మివేసి ఆ సొమ్ముతో అమెరికా నుంచి తెచ్చుకొనే ఆయుధాలతో సదరు అంగుళాన్ని తిరిగి తెచ్చుకొనేందుకు పూనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు. దేశభక్తిలో ఎవరూ ఎవరికి తీసిపోరు ! ఏమీ లేని దానికి కరోనా కాలంలో ఇంత ఖర్చా ? అనేక దేశాలకు సరిహద్దు సమస్యలున్నాయి. ఎవరైనా కరోనా కాలంలో ఇలాంటి పని చేశారా ? ఇది రాజనీతా – బాధ్యతా రాహిత్యమా ! ఏది చెబితే దానికి తలూపటానికి మనం గంగిరెద్దులమా ! అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


” ఈ ఖర్చు అంతా కోవిడ్‌ టాక్స్‌ పేరు మీదనో లేదా యుద్ధ టాక్స్‌ పేరు మీదనో మన నుండి వసూలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఆయిల్‌ పూల్‌ ఖాతా మీదనే భారం వేస్తున్నది అది కూడా ఇంకో రెండు నెలలు మాత్రమే. మే నెల ఆరంభం నుండి మళ్ళీ పెట్రో రేట్లు తగ్గుతాయి. భయం అవసరం లేదు. ”
జనానికి బుర్రలేదనుకొనే అతి తెలివి వాదనతప్ప పైన పేర్కొన్న లక్షల కోట్ల ఖర్చును జనం నుంచి వసూలు చేయటం లేదట ? ఆయిల్‌ పూల్‌ ఖాతా నుంచి చేస్తున్నారట. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది? నరేంద్రమోడీ గారికి అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం ఏమైనా దొరికిందా ! జనాన్ని ఇంత వెర్రివారిగా జమకడుతున్నవారినా మనం నోరెత్తకుండా అంగీకరిస్తున్నది ? ఎందుకిలా ప్రశ్నించలేని స్ధితికి చేరుకున్నాం ? గంగిరెద్దులమా ?

ఆయిల్‌ పూల్‌ అనండి మరొకటనండి పేరేదైతేనేం గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రానికి రాష్ట్రాలకు వస్తున్న ఆదాయ వివరాలు కోట్ల రూపాయలలో దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్నఅంకెలు కేంద్రం,రాష్ట్రాల పన్నులలో చమురు రంగం వాటాల శాతాలు.

సంవత్సరం 2013-14 ××××× 2014-15 ××××× 2015-16 ××××× 2016-17
కేంద్రం 1,04,163(38.0) ×× 1,22,925(39.2) ×× 2,13,995(57.4) ×× 2,37,388(52.6)
రాష్ట్రాలు 1,27,957(27.2) ×× 1,31,595(25.7) ×× 1,29,214(23.5) ×× 1,53,287(25.1)

కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను భారాన్ని ఈ అంకెలు చెబుతున్నాయి. మనం చెల్లిస్తున్నవే. ఇచ్చిన అంకెలన్నీ కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంవత్సరాలవే. ఈ పెంపుదల సమయంలో కరోనా లేదు, సరిహద్దుల్లో సరాగాలు, పనేమీ లేదు ఒకసారి వచ్చి పోండి అన్న ఆత్మీయ పిలుపులే తప్ప మరొకటి లేదు కదా ! ఎందుకు పెంచినట్లు ? పైన పేర్కొన్న అంకెలకు గత ఏడాది పెంచిన పన్నుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆదాయానికి కలుపుకోవాలి. కేంద్ర పన్నుల మీద కూడా రాష్ట్రాల వాట్‌ ఉంటుంది కనుక ఆ మేరకు కొంత మేరకు రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతుంది తప్ప శాతాలలో పెద్ద మార్పు ఉండదు.
ఒకవేళ ఆయిల్‌ పూల్‌ – మరొకటో ఏదో ఒకటి. కరోనా, సరిహద్దుల కోసమే పన్నులు పెంచా అని విలేకర్ల సమావేశం పెట్టి చెప్పే ధైర్యం ఎలాగూ నరేంద్రమోడీ గారికి లేదు కనుక కనీసం తన మన్‌కీ బాత్‌లో సెలవిమ్మనండి. పార్లమెంటులో చెప్పమనండి. కొద్ది నెలలే గనుక భరిద్దాం.
మనం చర్చిస్తున్న పోస్టులో రాసినట్లు ఆసియా ఖండానికి చమురు రేట్లు తగ్గించిన నరేంద్రమోడీ గారికి మిగతా దేశాల వారందరూ జేజేలు పలుకుతూ ఉండి ఉండాలి. లేకపోతే నేపాల్‌, శ్రీలంకతో సహా ఇరుగు పొరుగుదేశాల్లో కూడా బిజెపిని ఏర్పాటు చేసి అధికారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని త్రిపుర పర్యటనలో హౌం మంత్రి అమిత్‌ షా ఎందుకు చెబుతారు, ఆ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ ప్రపంచానికి ఎలా వెల్లడిస్తారు. బిజెపి నాయకులు జనాన్నే కాదు చివరికి స్వంత పార్టీ వారిని కూడా వెర్రి పుష్పాల కింద జమకడుతున్నారన్నమాట. లేకపోతే విదేశాల్లో బిజెపి ఏర్పాటు ఏమిటి ? నరేంద్రమోడీ ఘనత కారణంగా మన, ఇరుగు పొరుగుదేశాల్లో ఫిబ్రవరి 15న గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం పెట్రోలు, డీజిలు ధరలు, సెంట్లు, మన కరెన్సీలో(ఫిబ్రవరి 18 మారకపు రేటులో) ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఖలిస్తానీ లేదా చైనా, పాకిస్దాన్‌ టూలకిట్టులో భాగం కాదని మనవి.

దేశం ×××××× పెట్రోలు ×××× డీజిలు
భారత్‌ ××××× 126 (91.37) ×× 115 (83.39)
బంగ్లాదేశ్‌ ××× 105 (73.24) ×× 77 (55.84)
చైనా ×××××× 103 (74.69) ×× 90 (65.26)
నేపాల్‌ ××××× 95 (68.89) ×× 80 (58.04)
శ్రీలంక ×××× 83 (60.19) ×× 54 (39.16)
పాకిస్దాన్‌ ××× 70 (50.76) ×× 73 (52.93)
భూటాన్‌ ××× 68 (49.31) ×× 64 (46.41)
మయన్మార్‌× 67 (68.89) ×× 60 (43.51)

మనం కోరితే ఒపెక్‌ సంస్ద ఆసియా ఖండానికి ధరలు తగ్గించిందని చెబుతున్న పెద్దలకు ఒక ప్రశ్న. విదేశాలకే మన మాట మీద అంత ప్రేమ ఉండి అడిగిన మనకే గాక ఆసియా మొత్తానికి ఉదారంగా భారం తగ్గించేందుకు కారకులైన మాననీయ నరేంద్రమోడీ మన దేశంలో ఇంత ఎక్కువకు ఎందుకు అమ్మిస్తున్నారు ? మనకెందుకీ దరిద్రం పట్టుకుంది. ఎక్కడిదీ ఏలినాటి శని ? కరోనా అందరికీ ఉంది. సరిహద్దుల్లో వివాదానికి మనం పదిహేను లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నపుడు చైనా వారికీ అంతే మొత్తం ఖర్చు అవుతుంది కదా ? మరి వారెందుకు ఆయిల్‌పూల్‌లో పన్నులు వసూలు చేయటం లేదు ? గంగిరెద్దుల్లా తలాడించటం తప్ప మనం ఇవేవీ అడగకూడదు !

” 100 రూపాయలు ఉన్న బీరు 160 అయితే ఎవరూ కిక్కురుమనరు కానీ పెట్రోల్‌ లీటర్‌ 100 అయిపోతున్నది అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఒక కుటుంబం రెస్టారెంట్‌ కి వెళ్ళి భోజనం చేస్తే 2000 అవుతున్నది కానీ ఎవరికీ ఇబ్బంది అనిపించడం లేదు. స్టేట్‌ హైవే ల మీద టోల్‌ గెేట్‌లు పెట్టి వసూలు చేస్తుంటే మాత్రం కమ్మగా ఉంటున్నది. అసలు 10 ఖరీదు చేసే ఒక క్వార్టర్‌ విస్కీ ని 150 రూపాయాలకి అమ్ముతుంటే ఎవడూ ఆడగడు. కానీ దేశానికి అవసరం అయ్యే ఖర్చు మీద మాత్రం గొంతులు లేస్తాయి ఇది మన దౌర్భాగ్యం. ”
చమురు ధరలు ఎంత పెరిగినా జనం పట్టించుకోవటం లేదు అన్నది స్పష్టం. అప్పో సప్పో చేసి దేశం కోసం చమురు కొంటున్నవారు ఎక్కడా కనీసంగా నిరసన తెలిపిన పాపాన కూడా పోలేదు. ఒకవైపు రోడ్డు పేరుతో పెట్రోలు మీద సెస్‌ వేస్తున్నారు. మరో వైపు ద్విచక్ర వాహనాల మీద తప్ప మిగిలిన వాటన్నింటికీ ”తోలు” వసూలు చేస్తున్నారు. అయినా సరే నోరు మూసుకొని చెల్లించాల్సిందే ! గంగిరెద్దులం కదా మాట్లాడ కూడదు ! మనసులో కూడా ధరలు పెరిగాయి అనుకోకూడదు అన్నమాట ! ఎక్కడ నోరు తెరుస్తామో అని ముందుగానే మన నోరు మూయించేందుకు తిడుతున్నతిట్లు తప్ప ఇవి మరొకటి కాదు. ఒక వేళ ఎవరైనా చమురు ధరల మీద ఆందోళన చేశారో ! మీ వెనుక ఏపాకిస్ధానో, చైనానో ఉందనో, మీకు ఏదో ఒక ఉగ్రవాద సంస్ద నుంచి నిధులు అందుతున్నాయనో వెంటనే ముద్రవేస్తారు ! రైతులను చూస్తున్నాం కదా ! గంగిరెద్దులం కనుక తలెత్తటం లేదు !


వాట్సాప్‌లో తిరుగుతున్న మరో పోస్టు ఇరాన్‌కు చమురు బిల్లు చెల్లింపు గురించి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చెబితే నిజం అవుతుందన్నగోబెల్స్‌ సూత్రాన్ని పక్కాగా అమలు జరుపుతున్నారు. యుపిఏ పాలనా కాలంలో చమురు ఖాతాలో ఇరవై లక్షల కోట్ల లోటు పెట్టారని, ఇరాన్‌కు అరవైవేల కోట్ల రూపాయల చెల్లింపు గురించి గత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం దాచి పెట్టిందని, ఆ సొమ్మును ప్రభుత్వం వినియోగించుకుందని, మోడీ సర్కార్‌ మీద భారం మోపిందనే ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ?
ఇరాన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలు అమలు జరుపుతున్న సమయంలో మన దేశంలోని మంగళూరు చమురు శుద్ది కర్మాగారం, హెచ్‌పిసిఎల్‌,ఐఓసి, హెచ్‌పిసిఎల్‌ మిట్టల్‌ ఎనర్జీ, ఎస్సార్‌ ఆయిల్‌ కంపెనీలు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకున్నాయి. దానికి గాను నలభైశాతం మొత్తాన్ని మన రూపాయల్లో చెల్లించాయి. అయితే మన దేశం మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దపడినప్పటికీ ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బ్యాంకులు భయపడి సొమ్ము తీసుకొనేందుకు ముందుకు రాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది, ఆంక్షలను సడలించారు. టర్కీకి చెందిన హాక్‌బ్యాంక్‌ ముందుకు వచ్చింది, 6.5బిలియన్‌ డాలర్ల(మన కరెన్సీలో 43వేల కోట్లు) మొత్తాన్ని యూరోలలో చెల్లించాలని బ్యాంకు, ఇరాన్‌ కూడా కోరింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించింది. అప్పటి వరకు ఆ సొమ్ము ఆయా కంపెనీల దగ్గరే ఉండిపోయింది తప్ప మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ వాడుకోలేదు, మోడీ సర్కార్‌ తన బొక్కసం నుంచి చెల్లించిందీ లేదు. అయితే ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం చమురు ఖాతాలోటు పూడ్చుకొనేందుకు గాను పన్ను భారం పెంచామని చెప్పుకొనేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేశారు. మనం గంగిరెద్దుల మాదిరి తలూపాలా ? నిజాల నిగ్గు తేల్చాలా ? మన గత చరిత్ర తలెత్తుకున్నది తప్ప తలూపింది కాదు మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌లో సరికొత్త కుట్ర ?

17 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

#Ecuador's presidential election, #Rafael Correa, Andres Arauz, Ecuador left wing


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికా ! సామ్రాజ్యవాదుల ప్రయోగశాల !! వలసల నుంచి ప్రజాస్వామ్య ఖూనీ- ప్రహసనం వరకు జరగని ప్రయోగాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈక్వెడోర్‌లో ఫిబ్రవరి ఏడవ తేదీన అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు తొలి దఫాలో 50శాతానికి పైగా తెచ్చుకోవాలి, లేదా 40శాతానికి మించి తెచ్చుకొంటే సమీప ప్రత్యర్ధికంటే పదిశాతం ఆధిక్యతలో ఉండాలి. జనవరిలో చేసిన సర్వేల ప్రకారం ఆండ్రెస్‌ అరౌజ్‌కు 43శాతంతో ముందుండగా సమీప ప్రత్యర్దులు 25,19శాతాలతో ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నారు.


అధ్యక్ష పదవి ఎన్నికలలో ఎన్నికలలో మొత్తం పన్నెండు మంది పోటీ చేశారు. నలుగురు రెండంకెలకుపైగా ఓట్లు సాధించారు. వామపక్ష ఆండ్రెస్‌ అరౌజ్‌కు 32.7, మితవాద పార్టీ గులెర్మో లాసోకు 19.74, హరిత వామపక్షం అని చెప్పుకొనే యకు పెరెజ్‌కు 19.38, మరో అభ్యర్ధి గ్జేవియర్‌ హెరవాస్‌కు 15.69శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్‌ మొరెనా పార్టీ అభ్యర్ధికి కేవలం 1.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆండ్రెస్‌ అరౌజ్‌ తొలి దఫాలోనే ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజారిటీతో ఉన్నట్లు తేలింది. దాంతో తాను విజయం సాధించినట్లు ప్రకటించారు కూడా. ఆ తరువాతే ” లెక్క ” మారిపోయింది.


అక్రమాలు జరిగాయంటూ పచాకుటిక్‌ పార్టీ అభ్యర్ధి యకు పెరెజ్‌ రాజధాని క్విటోలోని కేంద్ర ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేశాడు.తనను రెండవ స్ధానానికి చేరకుండా రాఫెల్‌ కొరెయా, ఎన్నికలలో మరో ప్రత్యర్ధి లాసో, మరొక పార్టీనేతలు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించాడు. తనకు 35శాతం రావాల్సి ఉండగా పదిహేనుశాతమే వచ్చేట్లు, తనకు వచ్చే వాటిని ఇతరులకు బదలాయించారని ఆరోపించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరే ఓట్లను అపహరించారని చిందులు వేశాడు.నిజానికి రెండవ స్దానంలో ఉన్న లాసో ఎన్నికల ఫలితాల మీద తనకెలాంటి సందేహం లేదని, అయితే యకు పెరెజ్‌ కోర్కెకు మద్దతుగా తాను కూడా తిరిగి ఓట్ల లెక్కింపు కోరుతున్నట్లు చెప్పాడు.నిజానికి ఈ ఇద్దరూ ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకున్నారు. బ్యాంకరు లాసోకు ఓటు వేయటం కంటే ఒక నియంతకు వేయటం మంచిదని పెరెజ్‌ వర్ణించాడు. ఓట్ల లెక్కింపు మధ్యలోనే ధోరణి మారిపోవటంతో అక్రమాలు జరిగాయని బెల్జియంలో ఉన్న రాఫెల్‌ కొరెయా ట్వీట్‌ చేశారు. తమ అభ్యర్ధికి 38శాతంపైగా రావాల్సి ఉండగా 31శాతం అని ప్రకటిస్తున్నారన్నారని ఇది అబద్దం అని అందరికీ తెలుసన్నారు.
పార్లమెంట్‌లోని 137 స్ధానాలను మూడు తరగతులుగా విభజించారు. పదిహేను స్దానాలను జాతీయ ప్రాతిపదికన, ఆరింటిలో రెండేసి చొప్పున అమెరికా-కెనడా, లాటిన్‌ అమెరికా, ఐరోపా- ఆసియా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రవాస ఈక్వెడోరియన్లకు, 116 స్దానాలను రాష్ట్రాలలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో అండ్రెస్‌ అరౌజ్‌ నాయకత్వంలోని వామపక్ష పార్టీకి 5,4,40 చొప్పున మొత్తం 49 వచ్చాయి.


అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ తగినన్ని ఓట్లు రానందున రెండవ దఫా ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగాల్సి వుంది. ప్రధమ స్దానంలో వామపక్ష అభ్యర్ధి వచ్చినా రెండవ స్ధానంలో తన మద్దతు ఉన్న యకు పెరేజ్‌ రెండవ స్ధానంలో ఉంటారని, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లన్నింటినీ వేయించి గెలిపించవచ్చని అమెరికన్లు తలచారు. అయితే అదికూడా సాధ్యమయ్యేట్లు కనిపించకపోవటంతో సరికొత్త కుట్రకు తెరలేపారు. రెండవ దఫా ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేదాని కంటే ఎన్నికలను ఎలా బూటకంగా మార్చుతారనే చర్చ ఇప్పుడు ముందుకు వచ్చింది.

కొన్ని రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని మొదట ఆరోపించారు. పెద్ద రాష్ట్రమైన గుయాస్‌లో మొత్తం, మిగిలిన 16 రాష్ట్రాలలో సగం ఓట్ల లెక్కింపు జరపాలని తాజాగా నిర్ణయించారు. ఇక్కడే ప్రహసనానికి నాంది పడింది. మొదటి స్ధానంలో ఉన్న అభ్యర్ధి అభిప్రాయం, అనుమతి, సంప్రదింపులు కూడా లేకుండానే రెండవ, మూడవ స్దానాల్లో ఉన్న అభ్యర్ధులు ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరపటం, వెంటనే ఓట్లను మరోసారి లెక్కించాలని నిర్ణయించటం వెంటవెంటనే జరిగిపోయాయి. దేనికి రెండవ సారి లెక్కింపు జరుపుతున్నారో, ఎంత వ్యవధిలో జరుపుతారో కూడా వెంటనే ప్రకటించలేదు. మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని అసలు ఎన్నికలలోనే పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొరెయాను ఒక తప్పుడు కేసులో ఇరికించి ఆయన పరోక్షంలో ఏకపక్షంగా శిక్ష విధించారు. దాన్ని సాకుగా చూపి కొరెయా, ఆయన నాయకత్వంలోని పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూశారు. అయితే నామినేషన్లకు మరో 48 గంటల సమయం ఉందనగా కొరెయా మినహా ఇతరులు పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ 3-2 ఓట్ల మెజారిటీతో అనుమతి ఇచ్చింది.


మరోసారి ఓట్ల లెక్కింపు పేరుతో ఏ అక్రమాలకు తెరతీయనున్నదీ చెప్పలేము. అక్రమాల పేరుతో మొత్తం ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించటం, రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని పార్టీని ఏదో ఒక సాకుతో పోటీలో లేకుండా చేయటం. బహుశా దీనికోసమే కొరెయా బలపరిచిన అభ్యర్ది అరౌజ్‌ విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన నిధులను ప్రచారంలో వినియోగించారని కట్టుకధలను మీడియాలో రాయించారు. లెక్కింపును తారుమారు చేసి అమెరికా బలపరచిన యకు పెరేజ్‌ను రెండవ స్దానంలోకి తెచ్చి, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేకులందరనీ వీలైతే ఏకం చేయటం, సాధ్యంగాకపోతే పెరెజ్‌ను అడ్డగోలు పద్దతిలో గెలిచినట్లు ప్రకటించటం. ఇవన్నీ సాధ్యంగాకపోయినా, ప్రజాప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని భావించినా బొలివీయాలో మాదిరి వెనక్కు తగ్గటం, ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. గుయాస్‌ రాష్ట్రంలో ఆండ్రెజ్‌ అరౌజ్‌కు 41.82శాతం ఓట్లు రాగా లాసోకు 25.27, గ్జేవియర్‌ హెరవాస్‌కు 9.94, పెరెజ్‌కు 8.73శాతమే వచ్చాయి. ఇక్కడ మొత్తం ఓట్లను లెక్కించటం ద్వారా కొన్ని ఓట్లను పెరెజ్‌కు బదలాయించినా రెండవ స్ధానంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదూ మొత్తంగా తొత్తడం చేస్తే రెండు మూడు స్దానాల్లో ఉన్నవారు తొలి రెండు స్ధానాల్లోకి వస్తే అరౌజ్‌ అసలు పోటీలో ఉండరు. మొదటి ఇద్దరులో ఎవరు గెలిచినా అమెరికాకు, వామపక్ష వ్యతిరేకులకు ఇబ్బంది లేదు.


ఈక్వెడార్‌ పరిణామాలు వామపక్ష శక్తుల ముందు మరో కొత్త సవాలను ముందుకు తెచ్చాయి. అనేక దేశాలలో పర్యావరణం లేద హరిత ఉద్యమ కార్యకర్తలు, కొన్ని చోట్ల పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. పర్యావరణాన్ని కాపాడాలని కోరటం ఒక పురోగామి భావన అనటంలో ఎలాంటి సందేహం లేదు, అవసరం కూడా ఉంది.సాధారణంగా ఇలాంటి శక్తులన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటాయి, పర్యావరణం రక్షణ విషయంలో వామపక్షాలు కూడా సానుకూలమే.అందువలన వారితో చేతులు కలపటం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పశ్చిమ దేశాల మీడియా వీరిని హరిత లేదా హరిత వామపక్షాలు అని వర్ణిస్తోంది. ఈక్వెడార్‌లో స్దానిక తెగల నేత కూడా అయిన యకు పెరేజ్‌ను ఈ కారణంగానే హరిత వామపక్ష వాది అని పిలుస్తున్నారు. అయితే ఇతగాడి నాయకత్వంలోని పార్టీ తీరు తెన్నులను చూసినపుడు వామపక్షాలకు బద్దశత్రువు అయిన అమెరికా పాలకవర్గ ఒళ్లో కూర్చున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.


వామపక్ష వాది, ఆర్ధికవేత్త అయిన రాఫెల్‌ కొరెయా 2007 నుంచి 2017వరకు దేశాధ్యక్షుడిగా పని చేశారు.వామపక్ష విధానాలను అమలు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు పాలకుల హయాంలో చేసిన అప్పు అక్రమం అని మూడు బిలియన్‌ డాలర్లమేరకు చెల్లించేది లేదని ప్రకటించాడు.దాని మీద అంతర్జాతీయ కోర్టుల్లో విచారణ జరిగింది.పర్యవసానంగా అప్పులో 60శాతం పైగా తగ్గింది. రాజ్యాంగ సవరణల కారణంగా 2009లో తిరిగి 2013లో కొరెయా విజయం సాధించారు. లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష నేతలతో చేతులు కలిపారు.2006-16 మధ్య దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 36.7శాతం మందిని 22.5కు తగ్గించారు. అంతకు ముందు రెండు దశాబ్దాలలో జిడిపి వృద్ధి రేటు 0.6శాతంగా ఉన్నదానిని 1.5శాతానికి పెంచాడు. అసమానతలను కొలిచే గిని కోఎఫిసియెంట్‌ 0.55 నుంచి 0.47కు తగ్గింది. 2016లో వచ్చిన భూకంపంలో 650 మంది మరణించారు. ఆస్దినష్టం జిడిపిలో మూడుశాతం ఉంది. దాంతో దేశం మాంద్యంలోకి దిగజారి ప్రభుత్వ ఖర్చులో కోత పెట్టాల్సి వచ్చింది.

రెండు సార్లు అధ్యక్ష పదవిని స్వీకరించిన కారణంగా 2017ఎన్నికలలో కొరెయా పోటీ చేసేందుకు అవకాశం లేకపోయింది.పార్టీ అభ్యర్ధిగా 2007-13 మధ్య ఉపాధ్యక్షుడిగా పని చేసిన లెని(మ్‌)న్‌ మోరెనో పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా అంతకు ముందు అనుసరించిన వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి తిరోగమన విధానాల అమలుకు పూనుకోవటంతో పార్టీలో విబేధాలు వచ్చాయి. కొరెయాను పక్కకు నెట్టి ఆయన మీద అవినీతి కేసులు నమోదు చేయించి జైలు పాలు చేసేందుకు కుట్ర చేశారు. దాన్ని గమనించి అదే ఏడాది తన భార్యతో కలసి బెల్జియం వెళ్లి తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేశారు. కొరెయా ఉన్నత విద్య అక్కడే జరగటం, ఆయన భార్య బెల్జియం పౌరురాలు కావటంతో అక్కడే ఉండిపోయిరు. కొరెయా అధికారంలో ఉన్న 2012లో ప్రత్యర్ధి ఒకరిని కిడ్నాప్‌ చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. దాని విచారణకు కోర్టుకు హాజరు కాలేదనే పేరుతో కొరియాను అరెస్టు చేయాలని 2018 జూలై 3న న్యాయమూర్తి అదేశించాడు.అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరారు. అయితే ఆయన మీద ఉన్న కేసులు రాజకీయ అంశాలుగా ఉండటంతో తాము అరెస్టు చేయలేమని స్పష్టం చేసింది. తరువాత 2020 ఏప్రిల్‌ 7న ఈక్వెడోర్‌ సుప్రీం కోర్టు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


లాటిన్‌ అమెరికాలో వామపక్షాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర బహిరంగ రహస్యం. అంతర్జాతీయ వార్తా సంస్దల కట్టుకథలు వాటిలో ఒక భాగం. అక్కడ మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా మీద తప్పుడువే అయినా కేసులున్నాయి గనుక ఆయనను అడ్డుకున్నారంటే అర్దం చేసుకోవచ్చు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన మద్దతుదారులు కొత్త పార్టీని నమోదు చేసేందుకే అవకాశం ఇవ్వని అపర ప్రజాస్వామ్యం అక్కడ ఉంది. గతేడాది ఆగస్టులో కొరెయాకు మద్దతునిచ్చే ఒక పార్టీని ఎన్నికల సంఘం నిషేధించింది. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్‌ అరౌజ్‌ను పోటీ చేయకుండా చూసేందుకు చివరి క్షణం వరకు ఒక ఎన్నికల కమిషనర్‌ ప్రయత్నించాడు. చిత్రం ఏమిటంటే ఎన్నికలలో కొరెయా చిత్రాన్ని వినియోగించి అనుకూల ప్రచారం చేయవద్దని నిషేధించిన ఎన్నికల సంఘం రాజకీయ వ్యతిరేకులు తమ ప్రచారంలో కొరెయా చిత్రాన్ని ఉంచి తప్పుడు ప్రచారం చేసేందుకు అనుమతించింది. తప్పుడు కేసులు, అరెస్టులకు సిద్దపడటంతో అనేక మంది కొరెయా మద్దతుదారులు విదేశాలకు వెళ్లిపోయారు.


2017 ఎన్నికలలో కొరెయా బలపరిచిన అభ్యర్ధిగా విజయం సాధించిన మొరెనో అమెరికా చంకనెక్కాడు, కొరెయాకే ఎసరు పెట్టాడు.పదవిలోకి వచ్చినపుడు 77శాతం మంది జనం మద్దతు ఉండగా 2019లో అది ఏడుశాతానిక పడిపోయిందంటే ఎంతగా జనానికి దూరమయ్యాడో తేలిపోయింది. అంతకు ముందు పార్లమెంటులో 74సీట్లు ఉన్న మొరెనో పార్టీ తాజా ఎన్నికలలో ఒక్క స్దానం కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్ధికి తాజా అధ్యక్ష ఎన్నికలలో 1.54శాతం ఓట్లు వచ్చాయి.


పచాకౌటిక్‌(హరిత పార్టీ) నేత యకు పెరెజ్‌ అమెరికా నాయకత్వంలో బొలీవియా, బ్రెజిల్‌, వెనెజులా, నికరాగువాలలో జరిపిన కుట్రలన్నింటినీ సమర్ధించాడు. అతని రాజకీయ చరిత్రను చూస్తే వామపక్ష ముసుగు వేసుకున్న ద్రోహిగా కనిపిస్తాడు. లాటిన్‌ అమెరికాలో అలాంటి శక్తులను అమెరికా ఎందరినో తయారు చేసింది. వారికి అవసరమైన నిధులు, జనాన్ని గందరగోళపరిచేందుకు, వామపక్ష శిబిరాల్లో అనుమానాలు రేపేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌డిఐ) అనే సంస్ద ముసుగులో అవసరమైన శిక్షణ ఇచ్చింది. వారికి మద్దతుగా ప్రభుత్వేతర స్వచ్చంద(ఎన్‌జిఓ) సంస్దలను, సిఐఏ ఆధ్వర్యంలోపనిచేసే నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) సంస్ధను ఏర్పాటు చేసింది.2007 అమెరికా ఎన్‌డిఐ పత్రంలో లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా పని చేసేందుకు శిక్షణ ఇచ్చిన పార్టీల పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి పచాకౌటిక్‌ ఒకటి. మన దేశంలో కూడా అలాంటి ఎన్‌జిఓ శక్తులను చూడవచ్చు. 2016-19 మధ్య ఈక్వెడోర్‌లో ఎన్‌జిఓలకు 50లక్షల డాలర్లు ఇచ్చినట్లు బహిరంగంగా ఎన్‌ఇడి జాబితా వెల్లడించింది. రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచాకౌటిక్‌ పార్టీ ఆందోళనలు నిర్వహించింది.2010లో కొరెయాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధాన పాత్రపోషించింది.

ఒక రెడ్‌ ఇండియన్‌ తెగకు చెందిన యకు పెరెజ్‌ లాటిన్‌ అమెరికా ఐదువందల సంవత్సరాల చరిత్రలో తొలి రెడ్‌ ఇండియన్‌ తెగనేతగా బొలీవియాలో అధికారానికి వచ్చిన ఇవో మొరేల్స్‌ను వ్యతిరేకించిన సామ్రాజ్యవాదుల బంటు. అనేక మంది కుహనా వామపక్ష వాదుల మాదిరి పెరెజ్‌ సాధారణ జీవనం గడుపుతున్నట్లు కనిపించినా అమెరికా అజెండాలో భాగం తప్ప నిజాయితీతో కూడింది కాదు. ఈక్వెడోర్‌లో ఎక్కువ సంఖ్యలో కార్లు నడపకూడదని, గనులు తవ్వకూడదని, చమురు తీతను పరిమితం చేయాలంటూ కొరెయా పాలనా కాలంలో ఆందోళనలు నిర్వహించాడు. అక్కడ ఉన్న చమురు, ఖనిజ నిల్వలను వెలికి తీసి పేద దేశంగా ఉన్న ఈక్వెడోర్‌ను అభివృద్ది చేసేందుకు పూనుకున్న కొరెయా మీద కుట్రలో పెరెజ్‌ భాగస్వామి. ఇలాంటి తమ బంటును గద్దెనెక్కించేందుకు చేస్తున్న కుట్రను ఈక్వెడోరియన్లు సాగనిస్తారా ?
” ఎవరైనా కొరెయా తరఫున అభ్యర్ధులుగా పోటీ చేసేట్లయితే వారు పెద్ద ముప్పుకొని తెచ్చుకున్నట్లే ఇంకా దేశం విడిచిపోకపోయినా, కేసుల్లో శిక్షలు పడకపోయినా వ్యవస్ధ వారి మీద కన్నేసి ఉంచుతుంది అని కేంద్ర కాబినెట్‌ కార్యదర్శి స్వయంగా బెదిరింపులకు దిగాడు. అనివార్య పరిస్ధితుల్లో ఒక వేళ వామపక్ష అభ్యర్ధి అభ్యర్ధి ఎన్నికైనా పై బెదిరింపులను చూసినపుడు ఏదో ఒక సాకుతో అధికారంలో కొనసాగనిచ్చే అవకాశం ఉంటుందా ?చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !

25 Monday Jan 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, India oil price, Narendra Modi Failures, OPEC oil war, unabated oil prices in India


ఎం కోటేశ్వరరావు
ఒక వైపు పట్టువీడని రైతు ఉద్యమం-మరో వైపు ఎగబాకుతున్న చమురు ధరలు. గడ్డ కట్టే చలిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి నేతృత్వంలోని పాలక ఎన్‌డిఏ కూటమికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇవి ఏ పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేము. ఇది రాస్తున్న సమయానికి రైతులూ పట్టువిడుపు లేకుండా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా జనం భరిస్తారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎక్కడా ప్రతిఘటన లేదు కనుక ప్రతి రోజూ పెంచుతూనే ఉంది. పన్నుల తగ్గింపు ఆలోచన చేయటం లేదు.


చిత్రం ఏమిటంటే పెరుగుతున్న చమురు ధరల గురించి గతంలో బిజెపి నేత స్మృతి ఇరానీ మాదిరి ఎవరూ గ్యాస్‌ బండల ధర్నాలు లేవు, ఎడ్ల బండ్ల మీద మోటారు సైకిళ్లను పెట్టి ప్రదర్శనలు, ఆటోలను చేత్తో లాగే విన్యాసాల దృశ్యాలు కనిపించటం లేదు. ప్రతిపక్షాలు కిమ్మనటం లేదు గానీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారే మండి పడ్డారు. చమురు ధరల పెరుగుదలకు సౌదీ అరేబియా కారణమని కొద్ది రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలను కూడా తప్పుపట్టలేము. ఎవరైనా ధర్నా చేస్తుంటే మాకు అడ్డుగా ఉన్నారంటూ విసుక్కొని పక్కదారులలో పోయే జనం ఉన్నపుడు కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లుగా ఎవరికి మాత్రం ఎందుకు ? చమురును కొనుగోలు చేసేది మెజారిటీ బిజెపి అభిమానులే కదా ! ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాల్లో వారే కదా అధికారంలో ఉంది. ఇంక ఆ పార్టీ తమది మెజారిటీ హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్నది కనుక అధిక భారం పడుతున్నదీ, మోస్తున్నదీ హిందువులే, కాదంటారా ? ఇష్టమైనపుడు సుత్తితో మోదినా దెబ్బ అనిపించదు. లేనపుడు తమలపాకుతో తాటించినా భరించలేని బాధ అనిపిస్తుంది- తరతరాల మానవ సహజం !


ఇంతకీ ధర్మేంద్ర ప్రధాన్‌ గారికి సౌదీ అరేబియా మీద ఎందుకు కోపం వచ్చింది ? మౌన యోగి ప్రధాని నరేంద్రమోడీ గారి మాదిరి మాట్లాడకుండా ఉంటే నాటకం రక్తి కట్టదు కదా ! నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన కొత్తలో పీపా చమురు ధర 107 డాలర్లు ఉన్నది కాస్తా తరువాత గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఒక దశలో 23 డాలర్లకు తగ్గింది. ఇప్పుడు 55-56డాలర్ల మధ్య ఉంది. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజుల చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా చమురు ధరలు తగ్గినపుడు కరోనా ఉన్నా కరుణ చూపలేదు. పెరిగినపుడు మాత్రం మడమ తిప్పకుండా వాయించేస్తున్నారని పదే పదే చెప్పుకోనవసరం లేదు.

ఏడాది క్రితం గణనీయంగా ధరలు తగ్గినపుడు కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల పన్ను పెంచటంతో వినియోగదారుడికి ఎలాంటి ఉపశమనం లేకుండా పోయింది. జనాల జేబులు కొట్టి మార్కెటింగ్‌ కంపెనీలకు లబ్ది చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వానికి 43వేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఒక రూపాయి పన్ను పెంచితే ఏడాదికి 14వేల కోట్ల రూపాయలు వస్తుంది. మరి మంత్రిగారికి కోపం ఎందుకు వచ్చిందంటే ఇప్పటికే చమురు ధరలు 73 సంవత్సరాల రికార్డులను బద్దలు కొట్టాయి, రైతుల ఉద్యమ స్ఫూర్తితో చమురు మీద కూడా ఆందోళనలు ప్రారంభమైతే అన్న గగుర్పాటు మంత్రిగారికి కలిగి ఉండాలి. భజన గోడీ మీడియా, సానుకూల కాషాయ మేథావుల కోళ్లు కూయకుండా మూసుకుంటే తెల్లవారకుండా ఆగుతుందా ? రైతుల ఉద్యమాన్ని ఆపగలిగారా ? రైతులకు భయపడి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలను రద్దు చేయగలిగారు గానీ బడ్జెట్‌ సమావేశాలను అలా చేయగలరా ? భజన చేసే తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, వైసిపి వంటి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉన్నా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వాన్ని చమురు ధరల మీద నిలదీయకుండా ఉంటారా? అందుకే మంత్రిగారు నేరం మాది కాదు సౌదీది అనే చెప్పేందుకు ముందస్తుగానే వాదన సిద్దం చేసుకున్నారనిపిస్తోంది.


గతేడాది కొన్ని దేశాల మధ్య చమురు యుద్దం కారణంగా పోటీపడి చమురు ఉత్పత్తిని పెంచిన విషయం, వద్దురా బాబు నిల్వచేసేందుకు ఖాళీలేదు, ఒప్పందం చేసుకున్నాం గనుక మీకే ఎంతో కొంత ఎదురు ఇస్తాం సరకు పంపకండి అన్న పరిస్ధితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన యుద్దం మనకే నష్టం అని గమనించిన చమురు దేశాలు తమ లాభం తాము చూసుకుంటున్నాయి. డిమాండ్‌ పడిపోయింది కదా అని ఉత్పత్తిని తగ్గిస్తే చమురు ఎగుమతి దేశాల మార్కెట్‌ను అమెరికా వంటి దేశాలు ఆక్రమిస్తే పరిస్దితి ఏమిటన్న గుంజాటన మీద తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్యంగా రష్యా ఈ వాదనను ముందుకు తెచ్చింది. అయితే కరోనా నుంచి కాస్త కోలుకుంటున్నందున ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి.
గతంలో చమురు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోజుకు 97లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంది. దానికి అదనంగా ఫిబ్రవరి, మార్చి నెలలో రోజుకు పదిలక్షల పీపాల చమురు ఉత్పత్తిని స్వచ్చందంగా తగ్గిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పడిపోతే దానికి విరుద్దంగా చైనాలో పరిస్ధితి ఉండటంతో చమురు దేశాలు కాస్త నిలబడ్డాయి. అంతర్జాతీయ చమురు సంస్ధ తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో డిమాండ్‌ తగ్గనుంది.

మన దేశం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే దిగుమతి ఇంకా తక్కువే ఉన్నప్పటికీ గత కొద్ది నెలలుగా పెరుగుతున్నది. ఇలా ధరలు పెరిగేట్లు చేస్తే మేము ప్రత్యామ్నాయం, కొత్త వ్యాపార విధానాలను చూసుకోవాల్సి ఉంటుందని మన మంత్రి హెచ్చరించారు. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పుడున్న స్దితి నుంచి ఏమాత్రం పెరిగినా అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ వెలికి తీత లాభదాయకంగా మారుతుంది. అందువలన అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, కనుక మీ దగ్గర బదులు అక్కడి నుంచే కొంటాం అన్న బెదిరింపు కూడా లేకపోలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ నాయకత్వం అమెరికాతో స్నేహం పేరుతో దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు ప్రారంభించింది. ఎక్కడన్నా బావే గానీ చమురు దగ్గర కాదన్నట్లుగా ఇతర దేశాల ధరకే మనకు ఇస్తున్నారు తప్ప మోడీ గారి గడ్డం పొడుగు చూసి ఒక్క సెంటు కూడా మాజీ డోనాల్డ్‌ ట్రంప్‌ తగ్గించలేదు, తాజా జో బైడెన్‌ తగ్గించేది లేదు. పశ్చిమాసియా, ఇతర దారులు మూసుకుపోతే అమెరికా కాళ్ల మీద పడాలి. పోటీదారులను పడగొట్టిన తరువాత రిలయన్స్‌ జియో ధరలు పెంచిన మాదిరే అమెరికా కూడా చేస్తే ?


ఇవన్నీ మంత్రిగారి తెలియవా ? జనానికంటే ఎక్కువ తెలుసు ! సౌదీని విమర్శించి, ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా ? చెరువు మీద అలిగితే ఏం జరుగుతుందో అదే అవుతుంది. మంత్రిగారి ప్రకటన వెనుక ప్రభుత్వ భయం కనిపిస్తోంది. ధరలు పెంచుకుంటూ పోతే భరించే జనంలో అసంతృప్తి తలెత్తుతుంది. అభిమానులు సైతం ఎంతకాలం భజన చేస్తారు, ఎంతైనా భరిస్తామని గొప్పలు చెబుతారు. మిగతా దేశాలతో ముఖ్యంగా పాకిస్ధాన్‌తో పోల్చుకుంటే పరువు తక్కువ. కేంద్ర ప్రభుత్వం పన్నులు ఎందుకు తగ్గించదు అనే సమస్య ముందుకు వస్తుంది. అదే జరిగితే తగ్గించే స్దితిలో మోడీ సర్కార్‌ ఉందా ? చమురు ధరలు పెరిగిపోతే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తయారు చేస్తుున్న బడ్జెట్‌ హల్వా తినటానికి వస్తుందా ?


మార్చినెలాఖరుతో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో లోటు ఎంత ఉంటుందో, దేనికి కోత పెడతారో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్దల వాటాలను అమ్మి 2.1లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ లోటు నింపుకోవాలనుకున్నది కుదరలేదు. అయినా చమురు పన్నుల బాదుడుతో 1.4లక్షల కోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి కొంత మేర ఆ లోటును పూడ్చుకున్నారని సరిగ్గా బడ్జెట్‌ సమయంలో క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ద నివేదికలో చెప్పటం, అది మీడియాలో రావటం, కొందరైనా చదవటం కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడని విషయమే. శుద్దమైన చమురు సాకుతో పన్నుల తగ్గింపు జరిగే అవకాశాలు లేవని మరోవైపు వార్తలు.2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌రూ.16.86 ఉంది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జనవరి ఒకటవ తేదీన నీతి మార్గ్‌లోని హెచ్‌పిసిఎల్‌ బంకులో లీటరు పెట్రోలు ధరలో ఏవేవి ఎంత ఉన్నాయో దిగువ చూడవచ్చు.
డీలర్లకు ఇస్తున్న ధర ××××××× రూ.27.25
కేంద్ర ఎక్సయిజు డ్యూటీ ×××× రూ.32.98
డీలరు కమిషన్‌ ××××××××× రూ.3.67
ఢిల్లీ రాష్ట్ర వ్యాట్‌ ××××××××× రూ.19.32
వినియోగదారుడి ధర ×××××× రూ.83.71
వివిధ రాష్ట్రాలలో వ్యాట్‌ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. డీలరు కమిషన్‌ మీద కూడా ఢిల్లీలో వ్యాట్‌ 30శాతం వసూలు చేస్తున్నారు. ముంబైలో గతంలో బిజెపి సర్కార్‌ విధించిన 39.12శాతం వ్యాట్‌ను తరువాత అధికారానికి వచ్చిన శివసేన సంకీర్ణ కూటమి కూడా కొనసాగిస్తున్నది. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ కారణంగానే జనవరి 18న ముంబైలో రూ.91.80 ఉంటే చెన్నరులో రూ.87.85 ఉంది. జనవరి 18న కొన్ని దేశాలలో పెట్రోలు, డీజిలు లీటరు ధరలు ఇలా ఉన్నాయి. ధర డాలర్లు, సెంట్లలో(బ్రాకెట్లలోని ధరలు మన రూపాయల్లో అని గమనించాలి
దేశం××××××××××పెట్రోలు×××× ×××× డీజిలు
వెనెజులా×××××× 0.020 (1.46) ×××× 0.000 (0000)
సౌదీ అరేబియా×× 0.467 (34.07) ×××× 0.139 (10.14)
మయన్మార్‌ ×××× 0.627 (45.74) ×××× 0.556 (40.56)
భూటాన్‌ × ×××× 0.677 (49.39) ×××× 0.633 (46.17)
పాకిస్ధాన్‌× ×××× 0.682 (49.75) ×××× 0.706 (51.50)
శ్రీలంక ×××××× 0.839 (61.20) ×××× 0.542 (39.54)
నేపాల్‌ ×× ×××× 0.941 (68.64) ×××× 0.795 (57.99)
చైనా ××× ×××× 1.013 (73.89) ×××× 0.882 (64.34)
బంగ్లాదేశ్‌ ×××× 1.052 (76.74) ×××× 0.769 (56.09)
భారత్‌ ×× ×××× 1.201 (87.61) ×××× 1.083 (79.00)
అనేక దేశాల్లో మన కంటే పన్నులు తక్కువ ఉన్నాయి, మరికొన్నింటిలో ఎక్కువ ఉన్నాయి. కొన్ని చోట్ల చెల్లింపు శక్తిని బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? క్రిసిల్‌ సంస్ధ అధ్యయనం ప్రకారం 2020లో ఉన్న బ్రెంట్‌ రకం ముడి చమురు ధర సగటున 42.3 డాలర్లు ఉంటే 2021లో అది 50-55 డాలర్ల మధ్య ఉంటుందని పేర్కొన్నది. దానికి అనుగుణ్యంగానే మనం కొనే చమురు ధరలు కూడా ఉంటాయి. ఈ మేరకు పెరిగినా లేక అనూహ్యంగా ఇంకా పెరిగినా మన విదేశీమారక నిల్వలు, బడ్జెట్‌ అంచనాలు తప్పుతాయి. అందుకే మంత్రిగారు ఆందోళన, ఆక్రోశం వెలిబుచ్చారు తప్ప వినియోగదారులకు మేలు చేకూర్చుదామని కాదు.

ఇది రాసిన సమయానికి మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు పీపా ధర 55-56 డాలర్ల మధ్య నడుస్తున్నది. ప్రతి పెరుగుదలనూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ కంపెనీలు జనం మీద ఏ రోజుకు ఆరోజు రుద్దుతున్నాయి. ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా వాటిని చెల్లించి కొనుగోలు చేస్తున్నాము. వినియోగదారులెవరూ పట్టించుకోవటం లేదు, రైతుల మాదిరి చమురు వినియోగదారులు కూడా ఉద్యమించే రోజులు వస్తాయా ? ఇప్పుడు దేశభక్తి మత్తులో ముంచారు గనుక దేశం కోసం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ? అనూహ్య పరిణామాలు ఏ రూపంలో ఉంటాయో తెలియదు. ఎవరి దగ్గరైనా చిత్రగుప్తుడి చిట్టా ఉంటే నరేంద్రమోడీనో జనాన్నో కాపాడేందుకు బయటపెడితే మంచిదేమో !


రైతు ఉద్యమం రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి నిస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్ర పునరావృతం అవుతుందన్నది నిజం, అయితే గతం మాదిరే అయిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఉద్యమాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. గతంలో రైతులు బోట్‌ క్లబ్‌ వద్ద తిష్టవేశారు. ఆ అనుభవంతో బిజెపి సర్కార్‌ ఇప్పుడు అసలు ఢిల్లీలో ప్రవేశించకుండా శివార్లలోనే అడ్డుకుంది. రైతులు అక్కడే నిరవధిక ఆందోళన ప్రారంభిస్తారని ఊహించలేదు. దేశమంతటా ఉద్యమించే విధంగా ఒక్క రైతులనే కాదు, వివిధ తరగతుల వారిని మేల్కొలిపింది. దోపిడీ శక్తులు తమ భూమి, పరిశ్రమలు, కార్యాలయాల్లో పని చేసే వారినే కాదు, తమ దోపిడీని అంతం చేసే శ్రామిక శక్తులను కూడా తయారు చేస్తాయి. సుత్తీ, కొడవళ్లు పనిసాధానాలుగానే కాదు, అవసరమైతే దోపిడీ శక్తుల పని పట్టే సాధానాలుగా కూడా మారతాయి ! 1975లో అత్యవసర పరిస్థితిని విధించటం ద్వారా కాంగ్రెస్‌ తన వ్యతిరేకశక్తులందరినీ ప్రజాస్వామ్య పరిరక్షణ సమస్య మీద ఐక్యం చేసింది. ఇప్పుడు రైతాంగ సమస్యల మీద అదే మాదిరి ఐక్యతను ప్రదర్శించటానికి వ్యవసాయ సంస్కరణల పేరుతో మోడీ సర్కార్‌ తెచ్చిన చట్టాలు దోహదం చేశాయి. దీనికి నరేంద్రమోడీ ఆయనను నడిపిస్తున్న సంఘపరివార్‌కు ఒక విధంగా ” అభినందనలు ” చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !

22 Friday Jan 2021

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Joe Biden, Patriot Party, Trump’s Patriot Party, US politics


ఎం కోటేశ్వరరావు


2021 జనవరి 20కి అమెరికాయే కాదు ప్రపంచ చరిత్రలో ఒక ప్రాముఖ్యత ఉంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. నూటయాభై సంవత్సరాలలో తొలిసారిగా నూతనంగా ఎన్నికైన వారికి పదవీ బాధ్యతలు అప్పగించే కనీస మర్యాదను పాటించకుండా అధ్యక్ష భవనం నుంచి నిష్క్రమించిన వ్యక్తిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రకెక్కాడు. ట్రంప్‌ చేసిన పనులకు ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలను చూడాల్సి వస్తుందో ట్రంప్‌ చివరి రోజుల్లో సూచన ప్రాయంగా వెల్లడించాడని చెప్పవచ్చు.


మరో రూపంలో తాను తిరిగి వస్తానని ట్రంప్‌ తన మద్దతుదార్లకు సందేశమిచ్చాడు. రిపబ్లికన్‌ పార్టీని వీడి పేట్రియాటిక్‌ పార్టీ(దేశ భక్త పార్టీ) పేరుతో కొత్త దుకాణం తెరుస్తారనే వార్తలు వచ్చాయి. నిజంగానే పెడతారా లేక తన మద్దతుదార్లను సంతృప్తి పరచేందుకు అలా చెప్పారా, ఒక వేళ ముందుకు పోతే ఏ సమస్యలు-సవాళ్లు ఎదురవుతాయి అన్నది చూడాల్సి ఉంది. ఒక పార్టీ పెట్టటానికి అవసరమైన నిధులతో పాటు ట్రంప్‌ను గుడ్డిగా అనుసరించే వారు కూడా గణనీయంగా ఉన్నట్లు ఇటీవలి ఎన్నికలు, అనంతర పరిణామాలు రుజువు చేశాయి. అయితే ట్రంప్‌కు ప్రధాన సవాలు రిపబ్లికన్‌ పార్టీ నుంచే ఎదురు కానుంది.


అమెరికాలో శతాబ్దాల తరబడి అధికారం రెండు పార్టీల మధ్యనే అధికారం చేతులు మారుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండటం లేదు. అందువలన ఒకసారి మూడో పార్టీ రంగంలోకి వస్తే అది మరికొన్ని పార్టీలు ఉనికిలోకి వచ్చేందుకు దారితీయవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీలో కార్పొరేట్లను వ్యతిరేకించే పురోగామి శక్తులు బలపడుతున్నాయి. ఈ పరిణామాన్ని అడ్డుకొనేందుకు కార్పొరేట్‌, మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది ఇప్పటికీ అంతర్గత మధన స్ధాయిలో ఉంది తప్ప పరిణామాత్మక మార్పుకు దారి తీసే స్దితిలో లేదు. రిపబ్లికన్‌ పార్టీలో అలాంటి పరిణామం సంభవిస్తే డెమోక్రటిక్‌ పార్టీ ఉన్నది ఉన్నట్లుగా ఉంటుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
ఇప్పటి వరకు అధికారంలో ఎవరు ఉన్నా తమ ప్రయోజనాలకు తోడ్పడుతున్నందున యధాతధ స్ధితిని కొనసాగించాలనే కార్పొరేట్‌లు కోరుకుంటాయి. ట్రంప్‌ పార్టీ తమకు దెబ్బ అని గనుక భావిస్తే ఇప్పటి వరకు బలపరచిన కార్పొరేట్లే అడ్డుకున్నా ఆశ్చర్యం లేదు. ట్రంప్‌ పెద్ద వ్యాపారి కనుక ఈ లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసుకొనే ముందుకు సాగుతాడన్నది స్పష్టం. ప్రధాన పశ్చిమ దేశాల్లో రెండు పార్టీల వ్యవస్ధ స్ధిరపడింది. దీని అర్ధం అక్కడ ఇతర పార్టీలు లేవని కాదు. ఎన్నికల్లో అదో ఇదో మాత్రమే వచ్చే రెండు పెద్ద పార్టీలే ఉనికిలో ఉన్నాయి.కార్పొరేట్‌ సంస్ధలు లేదా మీడియా కూడా వాటినే తప్ప మిగిలిన వాటిని పట్టించుకోదు. జనం కూడా అంతే తయారయ్యారు.


ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం మీద మితవాద శక్తులు బలం పుంజుకోవటం గమనించాల్సిన పరిణామం. లాటిన్‌ అమెరికా అయినా, ఐరోపాలోని పూర్వపు సోషలిస్టు దేశాలైనా అదే జరుగుతోంది. రెండు పార్టీల వ్యవస్ధ స్ధిరపడిందని అనుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి చోట్ల ఇటీవలి కాలంలో మూడో పక్షాలు ఉనికిలోకి రావటమే కాదు, బలపడుతున్నాయి. అయితే అవన్నీ పచ్చిమితవాద లేదా ఫాసిస్టు తరహా పార్టీలు. అందువలన అమెరికాలో కూడా అలాంటి శక్తులు డోనాల్డ్‌ ట్రంప్‌ వారి నాయకత్వాన సంఘటితం కావటం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. తాను విజయం సాధించకపోతే ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లే అని, ఓటమిని అంగీకరించను అని ముందే చెప్పిన, ఎన్నికల ఫలితాన్ని ఖరారు చేయకుండా అడ్డుకోవాలని దాడికి పురికొల్పిన ట్రంప్‌ను చూశాము. అధికార కుమ్ములాటలు మరింత ముదిరితే రేపు ట్రంప్‌గాకపోతే మరొక ఫాసిస్టు తిరుగుబాట్లనే రెచ్చగొట్టరన్న హామీ ఏముంది ?

నియంతలు, నరహంతకులు శాశ్వతం కాదు గానీ వారి ధోరణులు శాశ్వతమే కదా ! ఫాసిజం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన జర్మన్లే జర్మనీకి ప్రత్యామ్నాయం(ఎఎఫ్‌డి) అనే పేరుతో 2013లో ఏర్పడిన ఫాసిస్టు పార్టీకి 2017 పార్లమెంటు ఎన్నికలలో 709 స్ధానాలకు గాను 94, 12.6శాతం ఓట్లు వేశారు. అందువలన అమెరికాలో శ్వేతజాతి దురహంకారం నరనరానా జీర్ణించుకుపోయిన సమాజంలో ఫాసిస్టు శక్తులు బలం వేగంగా పుంజుకోవటం ఆశ్చర్యం కలిగించదు. ఆర్ధిక సమస్యలు తీవ్రతరం అవుతున్న దశలో అలాంటి శక్తులు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. జర్మన్‌ నాజీలు రెండవ ప్రపంచ యుద్దానికి, అనేక దేశాలను ఆక్రమించుకొనేందుకు కారకులు.వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో సోవియట్‌ యూనియన్‌ నాయకత్వాన కమ్యూనిస్టులు ముందున్నారు. ఇది దాస్తే దాగేది కాదు. దీన్ని దాచి పెట్టి రెండవ ప్రపంచ యుద్దంలో ప్రాణనష్టానికి నాజీలు-కమ్యూనిస్టులూ ఇద్దరూ కారకులే అనే తప్పుడు ప్రచారాన్ని చేయటమే కాదు. ఐక్యరాజ్యసమితిలో నాజీజంపై విజయాన్ని అంగీకరించేందుకు కూడా అమెరికా, ఐరోపా ధనికదేశాలు సిద్దంగా లేవు.


జో బైడెన్‌ అధికారాన్ని స్వీకరిస్తూ చేసిన ప్రసంగం సాధారణమైనదే. ఒక్క అమెరికాయే కాదు, యావత్‌ పెట్టుబడిదారీ సమాజం గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో సోషలిజం విఫలమైంది అని ప్రచారం చేసే పెద్దలు ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలం అయింది అనే భావనకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.డెమోక్రటిక్‌ పార్టీలోని లక్షలాది మంది యువత అలాంటి భావనతోనే డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ వెనుక సమీకృతులైన విషయం తెలిసిందే.శాండర్స్‌ను వెనక్కు నెట్టి డెమోక్రటిక్‌ పార్టీ వెనుక ఉన్న కార్పొరేట్‌ శక్తులు తమ ప్రతినిధిగా జో బైడెన్‌ను ముందుకు తెచ్చారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీలోని సాంప్రదాయ మితవాదుల కంటే ముదుర్లయిన ఫాసిస్టు శక్తులు తలెత్తుతున్నాయనే అంశం గతం కంటే ఇప్పుడు మరింత స్పష్టంగా ట్రంప్‌ రూపంలో వెల్లడైంది. అతగాడి ప్రోద్బలంతో జనవరి ఆరవ తేదీన దేశరాజధాని కేంద్రంలో సమావేశమైన పార్లమెంట్‌ ఉభయ సభల మీద దాడి చేసిన వారందరూ ఫాసిస్టు భావజాలం కలిగిన సంస్ధలకు చెందినవారే.అనేక మంది అధికారాంతమందు అనేక మంది నేరగాండ్లకు క్షమాభిక్ష పెట్టిన ట్రంప్‌ రాజధాని మీద దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేసినట్లు మనకు ఎక్కడా కనపడదు-వినపడదు.


దేశ చరిత్రలో బహుశా రాజధాని ప్రాంతంలో అప్రకటిత లాక్‌డౌన్‌ ప్రకటించి వేలాది మంది సాయుధ, గూఢచారుల నడుమ అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. అక్కడ ఎలాంటి పరిస్ధితులు ఏర్పడుతున్నాయో ఇది వెల్లడిస్తోంది. జో బైడెన్‌ పేరును ఉచ్చరించటానికి కూడా అధ్యక్షుడిగా చివరి ప్రసంగంలో కూడా ట్రంప్‌ సిద్దపడలేదు. అమెరికా రాజకీయ వ్యవస్ధను కూల్చివేసేందుకు జరిగిన కుట్ర వెనుక ఉన్న ట్రంప్‌ దుశ్చర్యలను జో బైడెన్‌ కూడా ఖండించలేదు.తన ఎన్నికను వమ్ము చేసేందుకు జరిగిన ఉదంతాన్ని కుట్ర అనేందుకు కూడా ఆ పెద్దమనిషి ముందుకు రాలేదు, కేవలం ‘హింస’ అని మాట్లాడారు. దానికి పాల్పడిన శక్తులను కూడా సంతుష్టీకరించేందుకు ఐక్యతా మంత్రాన్ని పఠించారు. అయినా తోడేళ్ల వంటి కార్పొరేట్లు మేక పిల్లల వంటి సామాన్యులు అందరూ ఒకటే అంటే అర్ధం ఏమిటి ?

చివరి నిముషంలో డోనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టింది ఎవరికి ? స్టీఫెన్‌ బనాన్‌ అనే ఒక ఫాసిస్టు ట్రంప్‌ 2016ఎన్నికల బాధ్యతలను చూశాడు.తరువాత అధ్యక్ష భవనంలో పని చేశాడు. మితవాదులారా(ఫాసిస్టు) ఏకం కండు అనే నినాదంతో 2017లో చార్లోట్స్‌విలేలో ప్రదర్శన నిర్వహించినందుకు పదవిని పోగొట్టుకున్నాడు. ట్రంప్‌తో ఎన్నడూ సంబంధాలను వదులుకోలేదు. తాజాగా కాపిటల్‌ మీద జరిగిన దాడిలో అతని హస్తం ఉంది. ఆ రోజు కాపిటల్‌కు రావాలని నాలుగు లక్షల మందికి వర్తమానాలు పంపాడు. అందువలన భవిష్యత్‌లో తనతో కలసి రావాల్సిన వ్యక్తి అనే ముందుచూపుతో అతన్ని క్షమించాడు. పెద్ద అవినీతి కేసులో అరెస్టయిన ఇలియట్‌ బ్రోయిడీ మరొకడు. 2016 ఎన్నికల్లో ట్రంప్‌కు మిలియన్ల డాలర్లు విరాళాల రూపంలో సంపాదించాడు.మలేసియా బిలియనీర్‌ ఝా లోవ్‌ మీద జరుగుతున్న దర్యాప్తు దర్యాప్తు నిలిపివేయిస్తానంటూ 90లక్షల డాలర్లు లంచంగా తీసుకున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ మాజీ ఎంపీ, డెట్రాయిట్‌ మేయర్‌గా పని చేసిన క్వామే కిల్‌పాట్రిక్‌ ప్రతి అవకాశాన్ని డాలర్లుగా మార్చుకున్న అవినీతిపరుడు. ఇరవై ఎనిమిదేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జార్జి గిల్‌మోర్‌ అనేవాడు న్యూ జెర్సీలో రిపబ్లికన్‌ పార్టీ రాజకీయ బ్రోకర్‌. అవినీతి, అక్రమాలకేసులో జైల్లో ఉన్నాడు. ప్లోరిడా రాష్ట్రంలో వృద్ద రోగుల వైద్య సంరక్షణ పేరుతో 730లక్షల డాలర్లు కొట్టేసిన కంటి వైద్యుడు సలోమాన్‌ మెల్‌జెన్‌ ఒకడు.పదిహేడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకా అనేక మందిని తన పదవీ కాలంలో ట్రంప్‌ క్షమాభిక్షతో విడుదల చేశాడు. వారంతా ట్రంప్‌తో సంబంధాలు ఉన్నవారు, భవిష్యత్‌లో ఉపయోగపడతారనే ముందుచూపుతోనే చేశాడు. తాజా ఎన్నికల్లో ఉపయోగించుకున్నాడు.


ట్రంప్‌ ఏర్పాటు చేస్తారని చెబుతున్న పేట్రియాట్‌ పార్టీ నమోదుకు ఆటంకాలు ఏర్పడతాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే కొందరు పేట్రియాట్‌ పార్టీ పేరుతో తమ ఉత్పత్తులకు ట్రేడ్‌ మార్క్‌ను నమోదు చేసుకున్నారు.2007లోనే అలాంటి పార్టీ ఒకదానిని నమోదు చేసి ఉన్నారు. అయితే కార్యకలాపాలు లేకపోవటంతో పదేండ్ల తరువాత అది రద్దయింది. మూడు సంవత్సరాల క్రితం మరో రెండు నమోదయ్యాయి. వారు తమ హక్కు వదులుకొని బదలాయిస్తేనే ట్రంప్‌కు లభిస్తుంది లేకుంటే ఆ పేరుకు చట్టపరమైన ఆటంకాలు ఏర్పడతాయన్నది ఒక అభిప్రాయం. ట్రంప్‌ కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యికిపైగా ట్రేడ్‌ మార్క్‌లు నమోదై ఉన్నాయి. ఒక వాణిజ్యవేత్తగా వాటి మంచి చెడ్డలు లేక చట్టపరమైన ఆటంకాలు ట్రంప్‌కు తెలియవని అనుకోలేము. ఒక వేళ ఆ పేరుతో పార్టీ ఏర్పడినా ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక మీడియాలో ప్రచారానికి మాత్రమే వినియోగిస్తారా అన్నది కూడా తెలియదు.ఈ పేరుతో పాటు మూడవ పక్షం, కొత్త పక్షం అనే పేర్లను కూడా ట్రంప్‌ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బయటికి రాగానే పేట్రియాట్‌ పార్టీ పేరుతో ఇప్పటికే ఉన్న సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆలూ చూలూ లేని ఈ పార్టీకి ఇప్పటికే కొందరు పార్టీ చిహ్నాలను కూడా పోస్టు చేస్తున్నారు.


రాజధానిపై జరిగిన తీవ్ర హింసాకాండకు ట్రంపే బాధ్యుడని సెనెట్‌లో రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న మిట్చ్‌ మెకనెల్‌ బహిరంగంగానే విమర్శించాడు. ఇతగాడు ట్రంప్‌ చివరి రోజుల్లో తీవ్రంగా వ్యతిరేకించాడని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ట్రంప్‌ను గుడ్డిగా సమర్ధించిన వారు కూడా మరోవైపు తారసిల్లారు. ఒక వేళ ట్రంప్‌ కొత్త పార్టీ పెడితే తొలుత రిపబ్లికన్‌ పార్టీతోనే వైరుధ్యాలు తలెత్తే అవకాశం ఉంది. కాలూనేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తే మొగ్గలోనే తుంచి వేసేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తారు. కొత్త పార్టీ ఏర్పడితే రిపబ్లికన్లు లేదా ట్రంప్‌ పార్టీ గానీ సమీప భవిష్యత్‌లో అధికారానికి వచ్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌-నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడే చెప్పలేము.


వివిధ దేశాలతో అనుసరించే వైఖరి, ఒక సామ్రాజ్యవాదిగా అమెరికా పాలకవర్గం తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఏమి చేయనుందో త్వరలోనే స్పష్టం అవుతుంది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా కార్పొరేట్ల సేవలో ఉండేవారే తప్ప మరొకటి కాదు. అనుసరించే పద్దతులు, ప్రవర్తనలో తేడా తప్ప మౌలిక మార్పులు ఉండవు. తాను అనుసరించిన విధానాలను బైడెన్‌ అనుసరిస్తాడా లేదా అనేందుకు ట్రంప్‌ చివరి రోజుల్లో ప్రాతిపదిక వేశాడు. అమెరికా రహస్య వ్యూహాలు, ఎత్తుగడలను వాటి అవసరం తీరిపోయి, కొత్తవి ఉనికిలోకి వచ్చినపుడు రెండు దశాబ్దాల తరువాతనే బహిర్గతం చేస్తారు. అలాంది అనేక పత్రాలను ముందుగానే లీకుల ద్వారా లేదా అధికారయుతంగానే విడుదల చేశారు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని వినియోగించుకోవాలనే వ్యూహ పత్రాన్ని కూడా అనూహ్యంగా ట్రంప్‌ సర్కార్‌ బహిర్గతం కావించింది. ఆ వ్యూహం తరువాతనే నరేంద్రమోడీ వైఖరిలో వచ్చిన చైనా వ్యతిరేకత, అమెరికా చంకనెక్కిన తీరుతెన్నులు చూశాము.లాభం లేనిదే వ్యాపారి వరదలోకి వెళ్లడు అన్న సామెత తెలిసిందే.తాను అనుసరించిన విధానాల నుంచి వైదొలగకుండా చేసే ముందస్తు ఎత్తుగడా లేక స్వల్ప మార్పులు ఉంటే అదిగో చూడండి నేను ముందే చెప్పా అనే రాజకీయ దాడికి ప్రాతిపదిక కూడా కావచ్చు. అందువలన వీటి వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి అన్నది ముందు ముందు వెల్లడి అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

16 Saturday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

FIMI, iron ore, Iron Ore Exports, ISA, steel companies, steel prices in India, Trading with China



ఎం కోటేశ్వరరావు


దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తోంది. నేను పుట్టాను లోకం మెచ్చిందీ-నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది..నాకింకా లోకంతో పని ఏముంది… అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… ఐ డోన్ట్‌ కేర్‌ ….అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమనగర్‌ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది.


ఈ మధ్య కార్పొరేట్‌లు దేశభక్తులు, వారు లేకపోతే సెల్‌ఫోన్లు లేవు, ఉపాధి లేదు, అసలు మన జీవితమే లేదు, వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరిగిపోతోంది. కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన. అరే నీకు తెలుసా లండన్‌లో చిన్న పిల్లలు, చివరికి కూరగాయలు అమ్మేవారు, రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారంట అంటే అవునా అని చిన్న తనంలో ఎబిసిడిలు నేర్చుకోవటానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. అందువలన ఇప్పుడా స్దితి కాదు గనుక అన్నీ కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా ! కనుక కార్పొరేట్‌లను, వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను. అలాంటి దేశభక్తులు నువ్వు ద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు. జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు. కోవాక్స్‌ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వాక్సిన్‌ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్ధ-స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్‌ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పిందీ చూశాము. నీది హానిలేని నీటితో సమానమైందని ఒకరంటే, అసలు నీ వాక్సిన్‌తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచి పెట్టలేదా అని ఇద్దరూ గోదాలోకి దిగారు. మీ రెండు వాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెరవెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దాంతో ఇద్దరం గొడవ పడకుండా ఎవరిది వారు అమ్ముకుందా అని రాజీపడ్డారు. జనం కళ్ల ముందే ఇది ఇద్దరు కార్పొరేట్‌ కరోనా వాక్సిన్‌ దేశభక్తులు-వారికి వెన్నుదన్నుగా ఉన్న వారి వాస్తవ కధ !


ఇటీవల సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వస్తున్నవార్తల గురించి తెలిసిందే. ముడి ఇనుప ఖనిజపు ధరలు రెట్టింపు అయ్యాయి. పదేండ్ల నాటి రికార్డులతో పోటీ పడ్డాయి. ఎగుమతిదార్లతో పాటు ఆ పేరు చెప్పి ఉక్కు ఉత్పత్తిదారులూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడి వినియోగదారుడి కాళ్లను నెత్తిమీద పెట్టుకుంటాయని కథలు చెప్పినవారు, దానికి ఉదాహరణగా సెల్‌ ఫోన్‌ కంపెనీలను ఉదాహరించే వారు గానీ మనకు ఎక్కడా కనిపించటం లేదు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఏకంగా కేంద్ర మంత్రులే గగ్గోలు పెడుతున్నారు. ఇక గృహనిర్మాణ కంపెనీల దేశభక్తులు సిమెంట్‌, ఉక్కు కంపెనీలే కారణమని గగ్గోలు పెడుతుంటే మీరు మాత్రం తక్కువగా మీ నిర్మాణంలో మా సిమెంటు పాలెంత మీరు ఎంతకు అమ్ముతున్నారో ఎలా సొమ్ము చేసుకుంటున్నారో మాకు తెలియదా, లెక్కలు చెప్పమంటారా అని సిమెంట్‌ దేశభక్తులు ఎదురుదాడికి దిగారు. ఇది ఇంతటితో ఆగలా !


ఇనుప ఖనిజం తవ్వకం,ఎగుమతి-ఉక్కుతయారీ దేశభక్తులు కూడా తక్కువ తినలేదు. రాజకీయ నేతలు మనోభావాలను వాడుకుంటున్నపుడు మనం ఎందుకు తగ్గాలంటూ వారు కూడా నీ దేశభక్తి ఎంత అంటే నీది ఎంత అని దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ తమ కోవెల అయినా ప్రధాని కార్యాలయంలో కొలువు తీరిన పెద్దాయనకు లేఖలు రాస్తున్నారు. తమ దేశభక్తిని శంకించటం ఉక్కుకు( ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌-ఐఎస్‌ఏ) తగని పని అని ఇనుపఖనిజం (భారతీయ ఖనిజ పరిశ్రమల ఫెడరేషన్‌-ఫిమి) మండిపండింది. ఒకవైపు చైనాతో వాణిజ్యం సాగిస్తున్న ఉక్కుగాళ్లు మేము ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నామంటూ మా దేశభక్తిని శంకించటం తగిని పని అని ఫిమి పేర్కొన్నది. లడఖ్‌ సరిహద్దులో తలెత్తిన వివాదం తరువాత చైనాతో లావాదేవీల విషయంలో అనేక ఆంక్షలు ఉండగా గనుల యజమానులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 92శాతం ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారని ప్రధానికి ఉక్కు రాసిన లేఖలో మనోభావాన్ని గుర్తు చేసింది.

ఇనుప ఖనిజం నుంచి వేరు చేసిన ముడి ఇనుప గుళికలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ద కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. గత ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో 7.52 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని గనుల యజమానులు ఎగుమతి చేశారు. వాటిపై నిషేధం విధించాలంటున్న ప్రాధమిక ఉక్కు తయారీ(గుళికలు)దారులు గతేడాది అక్రమంగా 10.63 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేశారని, ఇనుప ఖనిజానికి దేశంలో కొరత లేదని ఇది వెల్లడించటం లేదా అని ఫిమి వాదించింది. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన 33 మిలియన్‌ టన్నుల ఖనిజంలో 19మి.టన్నులు 58శాతం లోపు ఇనుము ఉండే ముడి ఖనిజం ఎగుమతి అయిందని, మన ఉక్కు కంపెనీలు 63శాతంపైగా ఇనుము ఉన్న ఖనిజాన్నే వినియోగిస్తాయని అందువలన తాము ఎగుమతి చేయటం వలన కొరత అనటం అర్ధం లేదని ఫిమి చెబుతోంది. అంతేనా గత ఆరునెలల్లో ఇనుప ఖనిజం ధరలు టన్నుకు రూ.1,950 నుంచి 4,110కి పెరిగితో మరోవైపు ఉక్కు రూ.16,700 నుంచి 51,590కి పెరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.ఉక్కు పరిశ్రమ యజమానులు తమ స్వంత లేదా స్దానిక గనుల నుంచి ఉన్నతస్దాయి ఖనిజాన్ని పొందుతూ ధరలు మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో వసూలు చేస్తూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారని ఫిమి పేర్కొన్నది.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ? ఎవరు చెబుతున్నది, ఏది నిజం ? జనం జేబుల ఖాళీ పచ్చినిజం. మేం ఇటు జనానికి దేశభక్తి , లవ్‌ జీహాద్‌, హిందూత్వను ఎక్కిస్తుంటాం, వారు వెంటనే ఈ మత్తునుంచి తేరుకోలేరు గనుక మీరు అటు చైనాతో ఎగుమతి వ్యాపారం ద్వారా, ఇటు జనానికి ధరలు పెంచి రెండు చేతులా లాభాలు పిండుకోండి, ఎన్నికల సమయంలో మా సంగతి చూడండి అని ఖనిజ,ఉక్కు కార్పొరేట్‌ దేశభక్తులకు చెప్పారన్నది అర్ధం కావటం లేదూ !


ఇలాంటి పరిస్ధితి ఉంటే ఏమౌతుంది ? రికార్డు స్ధాయిలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి, ఏమైంది ? మోడీభక్తితో సమర్పించుకోవటంలా ? ఉక్కు ధరలు పెరగటం, తరచూ మారటం ఒక సమస్య అని వీల్స్‌ ఇండియా( ఆటోమొబైల్స్‌ పరిశ్రమకు అవసరమైన ఉక్కు విడిభాగాలు తయారు చేసే కంపెనీ) ఎండీ శ్రీవత్స రామ్‌ అంటున్నారు. వాణిజ్య పధకాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది, మోడీగారి ఎగుమతి పధకమైన మేకిన్‌ ఇండియా మూలనపడుతుంది. ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది,కొనుగోలు శక్తి తగ్గుతుంది. దరిద్రం పెరుగుతుంది. ఇంతకంటే ఏం జరగదు. కార్పొరేట్‌ లాభాలకు కరోనా కాలంలోనే ఢోకా లేదు గనుక ఇప్పుడు ఏమీ కాదు.


చైనా ప్రపంచమంతటి నుంచి చేసుకుంటున్న వస్తు దిగుమతులు 2020 సంవత్సరాన్ని కాపాడాయని, ఇదొక చారిత్రక పాఠం, హెచ్చరికగా తీసుకోవాలని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతటా గిరాకీ పడిపోతే ఒక పెద్ద దేశంగా సహజ వనరులను కొనుగోలు చేసిన తీరు చరిత్ర. అయితే చైనా తాజాగా విడుదల చేసిన డిసెంబరు గణాంకాలను చూస్తే దాని కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశాలు వెల్లడయ్యాయి. ఇది వస్తుమార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుగా పరిణమిస్తున్నారు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో దిగుమతులు తగ్గిపోయాయి. వీటిలో చమురు, రాగితో పాటు ఇనుప ఖనిజం కూడా ఉంది. చైనా వారు ఆకలితో మాడుతున్నారు గనుక మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేవారు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఆకలితో మాడేవారు ఇనుపఖనిజం ఏం చేసుకుంటారు అంటే ఏం చెబుతారో తెలియదు.

ఇక మన ఇనుప ఖనిజ ఎగుమతి దేశ భక్తులు ఖజానాకు చెల్లించాల్సిన 7,08,000 కోట్ల రూపాయల డ్యూటీ ఎగవేసి చైనాకు ఎగుమతులు చేశారని, 61 సంస్ధల నుంచి ఆ మొత్తాలను వసూలు చేయాలని సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎగుమతి సంస్ధలకు నోటీసులు జారీ చేసి చేసింది. డ్యూటీని ఎగవేసేందుకు తప్పుడు టారిఫ్‌ కోడ్‌ను చూపి 2015 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన సంస్దలలో ఎస్సార్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీలు మరియు పవర్‌ కంపెనీ ఉన్నాయని, 30శాతం డ్యూటీ వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించి ఈ అక్రమాలకు పాల్పడిన వారి మీద నిర్ణీత వ్యవధిలోపల విచారణ పూర్తి చేయాలని వారి నుంచి ఎగవేసిన డ్యూటీ, జరిమానా వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. ఇప్పుడున్న విధాన ప్రకారం ముడిఖనిజంలో 58శాతం లోపు ఇనుము ఉంటే ఎలాంటి పన్నులు లేకుండా చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చు. అంతకు మించితే 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.


దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ఇనుప ఖనిజ ఎగుమతులపై స్వల్పకాలం పాటు నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నవంబరు చివరివారంలో చెప్పారు. సిమెంట్‌, ఉక్కు ఉత్పత్తిదారులు కూటములుగా ఏర్పడి ధరలు పెంచారని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోడ్ల వంటి మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాణ్యత తక్కువ ఉన్న ఖనిజం నుంచి కూడా గరిష్టంగా ఇనుము ఉత్పత్తి చేయగల నైపుణ్యం చైనాతో సహా విదేశాల్లో ఉందన్నది ఒక అంశం. టెక్నాలజీలో ఎంతో ముందున్నాం అని చెప్పుకొనే మనం ఎందుకు వినియోగించటం లేదు ? అభివృద్ది గురించి చైనా చెప్పే లెక్కలను నమ్మలేం అని చెప్పే నిత్య శంకితులు ప్రతి తరంలోనూ శాశ్వతంగా ఉంటారు. అదే నిజమైతే మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేసి వారేమి చేసుకుంటారు అంటే నోరు విప్పరు. 2020లో కూడా గణనీయంగా దిగుమతులు చేసుకున్నదంటే అక్కడ కరోనాను కట్టడి చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించటం, డిమాండ్‌ పెరగటమే కారణం. ప్రపంచ ఉక్కు సమాఖ్య సమాచారం ప్రకారం గతేడాది జనవరి-నవంబరు మధ్య 64దేశాల్లో ఉక్కు ఉత్పత్తి 1.3శాతం తగ్గితే చైనాలో 5.5శాతం పెరిగింది. చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలు కూడా దీనికి దోహదం చేశాయి. అనేక దేశాలు కూడా ఉద్దీపన ప్రకటించినా అక్కడ డిమాండ్‌ పెరగలేదు.


నీతి, దేశభక్తి, దేశద్రోహం వంటివి ఇప్పుడు మన దేశంలో బాగా అమ్ముడు పోతున్న సరకులు. అంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంతకాలం అనేది వేరే విషయం. చైనాను వ్యతిరేకించటం దేశభక్తుడి విధి. చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవటం నేటి మహత్తర కర్తవ్యం అంటూ సామాజిక మాధ్యమంలో, సంప్రదాయ మాధ్యమాల్లో మనం వింటున్నామా-చూస్తున్నామా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా కుమ్మరిస్తున్నారు. గతేడాది జూన్‌లో లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత-చైనా సైన్యం మధ్య జరిగిన సంఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇది మరీ ఎక్కువైంది. మధ్యలో మన నరేంద్రమోడీ కౌగిలింతల భాగస్వామి అమెరికా ట్రంపు కంపు కారణంగా కాస్త తగ్గింది గానీ లేకపోతేనా…..రేటింగ్స్‌ కోసం టీవీ ఛానల్స్‌ ఇంకా రెచ్చిపోతుండేవి.

చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి చైనీయులను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పటాన్ని దేశభక్తిగా చిత్రిస్తున్నారు. చైనాతో ఇనుప ఖనిజం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు.అడ్డా మీదకు వచ్చి మాకు ఇనుప ఖనిజం ఎంతకు సరఫరా చేస్తారు అని ఎప్పటికప్పుడు బేరమాడి చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మన అవసరాలకు ఖనిజాన్ని నిల్వ చేసుకోవటం అవసరమా లేక చైనా నుంచి వచ్చే నాలుగు డాలర్లు ముఖ్యమా ? చైనా మాదిరి ఉక్కు తయారీ మనకు చేతకాదా ? మనం ఎగుమతులు చేయలేమా ? వారికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి మరింతగా బలపడేట్లు చేస్తున్నట్లా కాదా ? చైనాకు ఎగుమతులు చేయటం ఎందుకు ? దాంతో మన దేశంలో ఉక్కు ధరలు పెరగటం ఎందుకు ? జనం గగ్గోలు పెడుతుంటే అచేతనంగా చూస్తూ కూర్చోవటం శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న బిజెపికి మేలు చేస్తుందా ?తనదైన ప్రత్యేక ఆర్ధిక శాస్త్రం(మోడినోమిక్స్‌)తో దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ గారికి ఈ చిన్న లాజిక్కు తెలియదా లేక కార్పొరేట్ల చేతిలో బందీ అయ్యారా ? అనేక మంది అంటున్నట్లు ఆయనకు గడ్డం, జులపాల మీద శ్రద్ద పెరిగిపోయి దేశం మీద తగ్గిందా ? దేశ భక్తి నీతులు కేవలం సామాన్యులకేనా ? కార్పొరేట్లకు ఉండవా ? అసలేం జరుగుతోంది ? అర్ధం కావటం లేదా, కానట్లు నటిస్తున్నారా ? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎంతకాలమో !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

14 Thursday Jan 2021

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti-Communist, Anti-Communist Playbook, communism, communist-themed restaurant, Penang restaurant, specter of communism


ఎం కోటేశ్వరరావు


ఐరోపాను ఒక భూతం వెన్నాడుతున్నది. ఆ భూతమే కమ్యూనిజం అంటూ 1848లో కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ తొలిసారిగా వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక రచన ప్రారంభం అవుతుంది. ప్రచ్చన్న యుద్దంగా వర్ణించిన సమయంలో అది తీవ్రమైంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు కమ్యూనిజంపై విజయం సాధించాం అని ప్రకటించారు. అలా చెప్పిన వారే ఇప్పుడు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాల పుస్తకాల దుమ్ము దులిపి మరోసారి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. ఎరుపును భూతంగా చూపిన తొలి రోజుల్లోనే ఎరుపంటే భయం భయం కొందరికి-పసిపిల్లలు వారికన్నా నయం నయం అన్న కవిత్వం తెలుగునాట వచ్చింది. వర్తమానంలో కవులు ఎలా స్పందిస్తారో చూద్దాం.


ఇప్పుడు అమెరికాలో ఇంకా అనేక చోట్ల ప్రతిదీ ఎరుపుమయంగా కనిపిస్తోంది, అనేక మంది కలవరింతలతో ఉలిక్కిపడుతున్నారు. వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి పుంఖాను పుంఖాలుగా సినిమాలు, సీరియల్స్‌, రచనలను జనం మీదకు వదులుతున్నారు. సామాజిక మాధ్యమం, వాట్సాప్‌ ఫేక్‌ యూనివర్సిటీ బోధన ఎలాగూ ఉంది.
అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన డెమోక్రటిక్‌ పార్టీని సోషలిస్టులు, కమ్యూనిస్టులు నడుపుతున్నారని ముద్రవేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికాను ఆక్రమించినట్లు చెబుతున్నారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కమ్యూనిస్టులంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీకీ ఇప్పటికీ అసలు పోలికే లేదని, ఆ పార్టీలో ఇప్పుడు సోషలిస్టులు, కమ్యూనిస్టులు నిండిపోయారని, దానిలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన బెర్నీశాండర్స్‌ చివరికి అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పోటీ పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ డెవిన్‌ న్యూన్స్‌ ఒక రాజకీయ కరపత్రంలో పేర్కొన్నాడు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక చైనా నుంచి నిధులు పొందుతూ 2011 నుంచి నెలకు ఒక అనుబంధం ప్రచురిస్తున్నదని ( అది డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే పత్రిక) ఆరోపించాడు. నల్లజాతీయుల విషయాల ఉద్యమానికి గతేడాది జూన్‌లో పది కోట్ల డాలర్లు విరాళంగా వచ్చాయని, వారి హింసాకాండలో ఎందరో మరణించగా వంద నుంచి రెండువందల కోట్ల డాలర్ల ఆస్ధి నష్టం జరిగిందన్నాడు. ఎన్నికలలో అక్రమాల గురించి ట్రంప్‌ చేసిన ఆరోపణలన్నింటినీ పునశ్చరణ కావించాడు. రిపబ్లికన్లు లేదా మితవాదులెవరూ ప్రధాన స్రవంతి మీడియాతో మాట్లాడవద్దన్నాడు. డెమోక్రాట్లు అధ్యక్ష భవనం, పార్లమెంట్‌ ఉభయసభలను అదుపులోకి తెచ్చుకున్నారని వాపోయాడు.


ఈనెలలో జార్జియా రాష్ట్ర సెనెట్‌కు జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఇద్దరూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులే ఎన్నికయ్యారు. దాంతో సెనెట్‌పై ఆధిపత్యం వహించి జో బైడెన్‌కు ఆటంకాలు కల్పించాలన్న ఆశలు అడియాసలయ్యాయి. కొత్తగా ఎన్నికైన సెనెటర్లిద్దరూ కమ్యూనిస్టులే అని సౌత్‌ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టి నియోమ్‌ (రిపబ్లికన్‌) వర్ణించారు. గత 33 సంవత్సరాలుగా రిపబ్లికన్లు తప్ప మరొకరు అక్కడి నుంచి ఎన్నిక అవలేదు. జార్జియా నుంచి ఇద్దరు కమ్యూనిస్టులు సెనెట్‌కు ఎన్నిక అవుతారని ఊహించుకోవటమే పరిహాసాస్పదంగా ఉంది అని ఆమె ఒక వ్యాసంలో వాపోయింది.
అమెరికా మీడియాలో, రిపబ్లికన్‌ పార్టీలో, ఇతర మితవాద శక్తులలో ఈ ధోరణి పెరిగిపోయింది కనుకనే పార్లమెంట్‌, దేశ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌పై దాడికి తన అనుచరులను డోనాల్డ్‌ ట్రంప్‌ పురికొల్పాడు. అలాంటి శక్తులు రేపు సైనిక తిరుగుబాటును ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.


మలేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ఉలికిపాటు !
మలేసియాలోని పదమూడింటిలో ఒక రాష్ట్రం పెనాంగ్‌, దాని జనాభా పద్దెనిమిది లక్షలు.ఆ దీవిలోని పులావ్‌ టైకుస్‌ మరియు జురు అనే రెండు చోట్ల ఓ 40 ఏండ్ల వ్యక్తి చిన్న రెస్టారెంట్లను ఏర్పాటు చేశాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. మలేసియా బహుళ జాతుల నిలయం. ఆ రెస్టారెంట్‌ యజమాని చైనా జాతీయుడు. ఆహార పదార్దాలకు హాస్యం పుట్టించే విధంగా చైనా పేర్లతో పాటు మావో, ఇతర కమ్యూనిస్టు బొమ్మలను కూడా వాల్‌ పేపర్ల మీద ముద్రించి అందంగా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది మలేసియాలో తిరిగి కమ్యూనిస్టులు తలెత్తారు, లేకపోతే ఆ గుర్తులతో హౌటల్‌ ఎలా ఏర్పాటు చేస్తారంటూ కొందరు కమ్యూనిస్టు వ్యతిరేకులు గగ్గోలు పెట్టారు. జనవరి మొదటి వారంలో పోలీసులు దాని మీద దాడి చేసి పోస్టర్లన్నీ చింపివేశారు. కమ్యూనిజానికి-యజమానికి సంబంధం ఏమిటి ? దీని వెనుక కమ్యూనిస్టులున్నారా అంటూ పరిపరివిధాలా బుర్రలు చెడగొట్టుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు సరేసరి. పెనాంగ్‌లో కమ్యూనిస్టు ఉద్యమం ఉందనటానికి హౌటలే నిదర్శనం అని కమ్యూనిస్టు వ్యతిరేక ”ఉమనో ” గా పిలిచే ఒక పార్టీ నేత బహిరంగ ప్రకటన చేశాడు. చైనాతో మలేసియాకు సంబంధం ఉన్న కారణంగానే ఇది జరిగిందని ఆరోపించాడు. ఇది అత్యంత బాధ్యతా రహిత ప్రకటన అంటూ ప్రత్యర్ధి పార్టీలు రంగంలోకి దిగాయి. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆ అలంకరణ చేసిన హౌటల్‌ యజమాని కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నాడు. కమ్యూనిజమూ లేదు ఏమీ లేదు, అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని అలా చేశానని మొత్తుకున్నాడు. అతడు చైనా జాతీయుడు కనుక ఇంత రచ్చ చేశారన్నది స్పష్టం.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్న వస్తుంది. జనవరి 13వ తేదీన పోలీసులు రెస్టారెంట్ల యజమానిని విచారించగా తాను ఒక చోట రెండు సంవత్సరాల క్రితం మరోచోట నాలుగేండ్ల నుంచి ఆ అలంకరణలతో నడుపుతున్నానని అప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం పెట్టలేదు ఇప్పుడేమిటని అడిగాడట.


మలేసియా, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాలలో గణనీయ సంఖ్యలో చైనా జాతీయులున్నారు.ఉడిపి హౌటల్‌, ఆంధ్రా భోజన హౌటల్‌ పేరుతో తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మావో జన్మించిన చైనాలోని హునాన్‌ రాష్ట్రంలో మావో జియా కారు లేదా మావో కుటుంబ వంటలు అంటే ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆపేరుతో అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి.దానిలో భాగంగానే పెనాంగ్‌ రెస్టారెంట్‌ అన్నది స్పష్టం.దీన్ని వివాదాస్పదం చేసిన వారు బుద్ధిహీనులు అని అనేక మంది నిరసించారు.జపనీస్‌ రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన జపాన్‌ ఆక్రమణను ప్రోత్సహించినట్లు, పశ్చిమ దేశాల రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన ఆ దేశాల అలవాట్లను ప్రోత్సహిస్తున్నట్లా అని గడ్డి పెట్టారు. మలేసియాలో చైనా యాత్రీకులు మావో చిత్రం ఉన్న కరెన్సీ యువాన్లు ఇస్తే తీసుకోవటం లేదా ? అది కమ్యూనిజాన్ని ప్రోత్సహించినట్లా? దాడి చేయబోయే ముందు పోలీసులు ఇలాంటివన్నీ ఆలోచించరా అన్నవారూ లేకపోలేదు. హౌటల్‌ అలంకరణలో కమ్యూనిస్టు సిద్దాంతాలేవీ లేవని, ఒకవేళ ఉన్నా కూడా తప్పేమిటి, కమ్యూనిస్టు చైనా నుంచి అనేకం నేర్చుకోవటం లేదా దానితో వాణిజ్యం చేయటం లేదా అని ప్రశ్నించిన విశ్లేషకులూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కమ్యూనిజాన్ని ముందుకు తెచ్చే చౌకబారు ఎత్తుగడ అన్న వ్యాక్యానాలు వెలువడ్డాయి. 1930లో ఏర్పడిన మలయా కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ దురాక్రమణకు,తరువాత బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసింది.1957లో స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా బ్రిటీష్‌ పాలనలో విధించిన నిషేధం కొనసాగటంతో సాయుధపోరాటాన్ని కొనసాగించింది.1989లో సాయుధ పోరాటాన్ని విరమించింది.ఈకాలంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన నేపధ్యంలో రెస్టారెంట్‌ అలంకరణ వివాదాస్పదమైంది.


ఇండోనేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత !
కొద్ది సంవత్సరాల క్రితం ఎరుపు రంగు టీ షర్టులు అమ్ముతున్నవారిని కమ్యూనిస్టులని, కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నారని ఇండోనేసియాలో అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి పశ్చిమ జావా ప్రాంతంలో సుత్తీ కొడవలి చిహ్నాలతో నిర్మించిన ఒక బస్టాప్‌ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఇంకే ముంది ఇండోనేసియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. తీరా చూస్తే ఇదే చిత్రాన్ని నాలుగు సంవత్సరాల క్రితం అనేక మంది సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారని తేలింది. అసలు విషయం ఏమంటే 2015లో కేరళలోని కొల్లం జిల్లాలో ఒక చోట ఏర్పాటు చేసిన బస్టాప్‌ చిత్రం అది. అంటే కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు వ్యతిరేకులు ప్రతి అవకాశాన్ని ఎంతగా ఎలా వినియోగించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కమ్యూనిస్టులు పనిగట్టుకొని ఓడించారని కాషాయ దళాలు చేసే ప్రచారం ఇలాంటిదే. అంబేద్కర్‌ బొంబాయిలోని ఒక రిజర్వుడు-జనరల్‌ ద్వంద్వ లోక్‌సభ స్దానం నుంచి పోటీ చేశారు. జనరల్‌ సీటులో నాటి కమ్యూనిస్టు నేత ఎస్‌ఏ డాంగే, రిజర్వుడు సీటులో అంబేద్కర్‌ పోటీ చేశారు.

రైతులకు కమ్యూనిస్టు ముద్రవేసిన హర్యానా బిజెపి సిఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ !
రైతాంగ ఉద్యమం వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కిసాన్‌ మాహాపంచాయత్‌ పేరుతో కేంద్ర చట్టాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఒక సభలో ముఖ్యమంత్రి పాల్గనాల్సి ఉంది. అయితే రైతులు ఆ సభను వ్యతిరేకిస్తూ ప్రదర్శనగా వెళ్లి సభా స్ధలిని, హెలిపాడ్‌ను ఆక్రమించుకోవటంతో ఆ సభ రద్దయింది. దాంతో ముఖ్యమంత్రి ఆరోపణలకు దిగారు. నిజంగా రైతులు ఆ పని చేయరని వారి ముసుగులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారే చేశారన్నారు.


కాపిటల్‌ హిల్‌ దాడిలో కమ్యూనిస్టు వ్యతిరేకులు !
అమెరికా అధికార కేంద్రం వాషింగ్టన్‌ డిసిలోని కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేసిన దుండగులందరూ పచ్చిమితవాద, కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులే.వారిలో కొందరు లాయర్లు,ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిలో ఒకడి పేరు మెకాల్‌ కాల్‌హౌన్‌. మూడు దశాబ్దాలుగా లాయర్‌గా పని చేస్తున్నాడు. అతగాడి ట్విటర్‌ వివరాల్లో తాను ఒక కమ్యూనిస్టు వ్యతిరేకిని అని చచ్చేంత వరకు డెమోక్రాట్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తా అని రాసుకున్నాడు. అమెరికా మీద ప్రేమతో తామీ చర్యకు పాల్పడ్డామని, దానిని దాడి అనకూడదు, అక్రమంగా ప్రవేశించటం అనాలి, నేను ఆ పని చేశాను అని చెప్పుకున్నాడు.


ఒక వస్తువును నాశనం చేయగలరు గానీ ఒక భావజాలాన్ని పాతిపెట్టి విజయం సాధించిన వారెవరూ లేరు. అది కష్టజీవులకు సంబంధించింది అయితే ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా తిరిగి లేస్తుంది.శక్తి రూపం మార్చగలం తప్ప నశింపచేయలేము. కమ్యూనిజమూ అంతే. ప్రచ్చన్న యుద్దంలో కమ్యూనిస్టులను ఓడించామని చెప్పిన తరువాత అమెరికాలో సోషలిజం పట్ల మక్కువ పెరిగింది. కమ్యూనిస్టులు లేదా సోషలిస్టులుగా ముద్రపడిన అనేక మంది స్ధానిక, జాతీయ ఎన్నికలలో విజయం సాధించారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించగలిగినదే అయినప్పటికీ మరింత పెరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఒక వైపు యువత కమ్యూనిస్టు పుస్తకాల దుమ్ముదులిపి అధ్యయం చేసేందుకు ఆసక్తి చూపుతుంటే మరోవైపు దానికి ప్రతిగా దోపిడీదారులు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార పుస్తకాల దుమ్ముదులుపుతున్నారు. 1996 తరువాత అమెరికాలో పుట్టిన వారిలో పెట్టుబడిదారీ విధానం మీద ఆసక్తి తగ్గిపోతుండగా సోషలిజం మీద పెరుగుతున్నది. గతంలో కమ్యూనిజం విఫలం అయిందనే మాటే వినిపించేది. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయం పెరుగుతోంది. సోషలిస్టుచైనా ఆర్ధిక రంగంలో అనేక విజయాలు సాధిస్తుండగా అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎందుకు వెనుకబడుతున్నాయన్న మధనం ఆ సమాజాల్లో ప్రారంభం కావటం దోపిడీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

10 Sunday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, USA

≈ Leave a comment

Tags

Amit Malviya, Capitol hill rioters, Donald trump, Donald Trump's Twitter account, Tejaswi Surya


ఎం కోటేశ్వరరావు
డోనాల్డ్‌ ట్రంప్‌ ! అతగాడిని ఇప్పుడెలా వర్ణించాలో తెలియటం లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యముంటేనే లేకపోతేనేం, ట్రంపూ అంతే ! నిర్ణీత వ్యవధి జనవరి 20వరకు పదవిలో ఉంటాడా, అభిశంసన లేదా మరో ప్రక్రియ ద్వారా మెడపట్టి వైట్‌ హౌస్‌ నుంచి గెంటి వేస్తారా అన్నది పెద్దగా ఆసక్తి కలిగించే అంశం కాదు. నిండా మునిగిన వారికి చలేమిటి-కొత్తగా పోయే పరువేమిటి ! ట్రంప్‌ అంటే ఏమిటో ఇంకా తెలియని వారు ఉండవచ్చు. తెలిసిన వారు అతగాడి స్నేహితుల గురించి ఆలోచించాలి, ఆందోళనపడాలి !


ఆ పిచ్చోడు ఏమి చేస్తాడో తెలియదు కనుక మిలటరీ పరంగా ఎలాంటి నిర్ణయాలనూ ఆమోదించవద్దు, అణ్వాయుధాల మీటల దగ్గరకు రానివ్వవద్దంటూ మిలిటరీ అధికారులకు అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ లేఖ రాసి జాగ్రత్తలు చేప్పారు. ఏ విద్వేషాలు రెచ్చగొట్టి మరింతగా ముప్పు తలపెడతాడో అని సామాజిక మాధ్యమాలు తాత్కాలికంగా అతని ఖాతాలను నిలిపివేశాయి. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్దం, ట్రంప్‌ భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం అంటూ బిజెపి నేతలు మీడియాకు ఎక్కటం వారేమిటో తెలియనివారికి తెలుస్తున్నది, వీరు కూడా ట్రంప్‌ బాటలో పయనిస్తారా అన్న ఆందోళనకు తావిస్తోంది.


జనవరి ఆరవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని అమెరికా అధికార పీఠం ఉన్న కాపిటల్‌ హిల్స్‌ భవనంలో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపు- విజేతల నిర్ధారణకు పార్లమెంట్‌ ఉభయ సభలు సమావేశం జరిపాయి. ఆ ఎన్నికలను గుర్తించవద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ట్రంప్‌ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలతో ఆ సమావేశం మీద ఒక్కసారిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మూకలు దాడికి దిగాయి, ఎంపీలు బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశారు. నేల మాళిగలో దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. మూకదాడిలో ఐదుగురు మరణించగా 50 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు వార్తలు వచ్చాయి.


అమెరికాలో, ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టగల వేగు యంత్రాంగం, అత్యాధునిక పరికరాలు కలిగినవని చెప్పుకొనే వారికి ఇది తలవంపులు తెస్తున్నది, వారి సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు, భద్రతా సిబ్బంది ఏకంగా తమ కాపిటల్‌ మీద జరగనున్న దాడిని ఎలా పసిగట్టలేకపోయారు? వీరు ప్రపంచాన్ని రక్షిస్తామంటే, సమాచారాన్ని అందిస్తామంటే నమ్మటం ఎలా ? భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిది ? మూకలను పురికొల్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ మీద, మూకల కుట్రను పసిగట్టలేకపోయిన యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను ఈ పాటికే పదవి నుంచి తొలగించి ఉగ్రవాద చట్టం కింద అరెస్టు చేసి ఉండాల్సింది.
బొలీవియా, వెనెజులా వంటి దేశాలలో గెలిచిన వారిని గుర్తించేది లేదని ప్రకటించినపుడు వారు వామపక్ష శక్తులు గనుక ఏమైపోతే మనకేమిలే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించారు. ఇప్పుడు తాము నిజంగా ఓటువేసిన ఎన్నికలను గుర్తించేది లేదంటూ, ఆ ప్రక్రియను వమ్ము చేసేందుకు మూకలను పంపి అధికార కేంద్రంపై దాడికి ట్రంప్‌ ఉసిగొల్పటాన్ని చూసి వారు, యావత్‌ ప్రపంచం విస్తుపోతోంది. విదేశాల్లో అమెరికా దుశ్చర్యలను ప్రజాస్వామిక వాదులందరూ గట్టిగా ఖండించి ఉంటే ట్రంప్‌ ఇంతకు బరితెగించి ఉండేవాడా ?

తాను ఓడిపోతే ఓటమిని అంగీకరించను అని ఎన్నికలకు ముందే తెగేసి తేల్చి చెప్పిన అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌. తోటకూర నాడే అన్నట్లుగా అప్పుడే ప్రియమైన స్నేహితుడా ఇది నీకు తగదు అని నరేంద్రమోడీ చెప్పి ఉంటే ఇంతటి దురాగతానికి పాల్పడి ఉండేవాడు కాదేమో ! అతగాడి చర్యలను చూస్తూ దు:ఖితుడనయ్యానని చెప్పుకోవాల్సిన దుస్ధితి వచ్చేది కాదేమో ! అలా చెప్పాల్సిన అవసరం మోడీకి ఏమిటి అని మరుగుజ్జులు ఎగిరి పడవచ్చు. ట్రంప్‌ మద్దతుదార్ల దాడిని చూసిన తరువాత అనేక మంది దేశాధినేతలు అధికారమార్పిడి సజావుగా జరగాలంటూ సుభాషితాలు చెప్పారు. కానీ నరేంద్రమోడీగారికి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఏడాది క్రితమే తిరిగి వచ్చేది ట్రంప్‌ సర్కారే (అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌) అని, మీరంతా మద్దతు ఇవ్వండని అమెరికాలోని భారతీయులకు చెప్పి, తరువాత అహమ్మదాబాద్‌కు తీసుకు వచ్చి ఊరేగించిన మోడీగారు కూడా ఇతరుల మాదిరే సుభాషితాలు చెబితే ? కొట్టినా, తిట్టినా, ముద్దు పెట్టుకున్నా ఇష్టమై కౌగిలించుకున్నవారికే కదా అవకాశం ఉండేది.


మన పార్లమెంట్‌ మీద జరిగిన దానిని ఉగ్రవాద దాడి అన్నాము. కాపిటల్‌ భవనం మీద ట్రంప్‌ మద్దతుదార్లు చేసిన దాడి, హత్యలను మూర్తీభవించిన ప్రజాస్వామిక పరిరక్షక మహత్తర కర్తవ్యంలో భాగం అంటారా ? తనకు ఓటు వేసిన వారిని దేశభక్తులు అని ట్రంప్‌ వర్ణించారు, వారిలో కొందరు దాడికి పాల్పడ్డారు కనుక వారిని కూడా దేశ భక్తులుగానే పరిగణించాలా ? లేకపోతే మోడీ నోట దు:ఖం తప్ప ఖండన మాట రాలేదేం !


ప్రపంచంలో ట్రంపు ముఖ్యస్నేహితులు కొద్ది మందిలో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, మన ప్రధాని నరేంద్రమోడీ సరేసరి. వీరి మధ్య ఉన్న ఉల్లాసం, సరసత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. ఆ చెట్టపట్టాలు-ఆ కౌగిలింతలను చూసిన తరువాత అదొక అనిర్వచనీయ బంధం వాటిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం అందరికీ కలగదు కదా అని ఎందరో మురిసిపోవటాన్ని చూశాము.

ఎంతలో ఎంత మార్పు ! ” వాషింగ్టన్‌ డిసి.లో కొట్లాటలు మరియు హింసా కాండ వార్తలు చూడాలంటే దు:ఖం కలిగింది. అధికార మార్పిడి పద్దతి ప్రకారం మరియు శాంతియుత పద్దతుల్లో కొనసాగాలి. చట్టవిరుద్దమైన నిరసనలతో ప్రజాస్వామిక ప్రక్రియను కూలదోయకూడదు ” అని నరేంద్రమోడీ నోటి నుంచి అదే లెండి ట్విటర్‌ ద్వారా స్పందన వెలువడుతుందని ఎవరైనా, ఎప్పుడైనా ఊహించారా ? దీన్ని విధిరాత అందామా ? లేక మోడీ గారి సిబ్బంది రాసింది అనుకోవాలా ? దు:ఖితులైన సామాన్యులు కోలుకోవాలంటే సమయం పడుతుంది. నరేంద్రమోడీ అసామాన్య వ్యక్తి గనుక త్వరలోనే మామూలు మనిషి కావచ్చు. అయినా ప్రపంచమంతా చీత్కరించుకుంటున్న వ్యక్తి ప్రేరేపిత చర్యల గురించి ఒక ప్రధాని దు:ఖితులు కావటంలో నిజాయితీ ఉందా అని ఎవరికైనా అనుమానం వస్తే… చెప్పలేం !


అమెరికా అధికార కేంద్రంపై తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ట్రంప్‌ వైఖరి మీద ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం కావటంతో విధిలేక మాట మాత్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన చేశాడు.చిత్రం ఏమంటే మన నరేంద్రమోడీ గారి నోట ఖండన రాలేదు. నిజానికి ట్రంప్‌ ఖండన కూడా ఒక నాటకమే. కాపిటల్‌ మీద మూక దాడికి సిద్దమౌతున్న సమయంలో కూడా ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఎన్నిక అపహరణను అడ్డుకోవాలని, తనకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికలను అంగీకరించేది లేదని గతంలో చేసిన ఆరోపణలను పునశ్చరణ గావిస్తూ ట్రంప్‌ ఉపన్యాసం చేశాడు. నా అద్భుతమైన మద్దతుదారులారా మీరు ఆశాభంగం చెందుతారని నాకు తెలుసు. నమ్మశక్యం కాని మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని మీరు తెలుసుకోవాలి అంటూ మాట్లాడాడు. దాడులకు పాల్పడిన వారి ఆశాభంగానికి నా సానుభూతి అని ఒక వీడియో ద్వారా తొలి స్పందనలో పేర్కొన్నాడు. (మరుసటి రోజు మాట మార్చాడు.)

కాపిటల్‌ మీద దాడి జరుగుతున్న సమయంలో ఒక తాత్కాలిక గుడారంలో ట్రంప్‌ తన చుట్టూ ఉన్నవారితో నృత్యాలు చేయటం, దాడుల దృశ్యాలను టీవీల్లో ఉత్సాహంతో చూసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ట్రంప్‌తో పాటు కుమారుడు ఎరిక్‌, కుమార్తె ఇవాంక, సలహాదారు కింబర్లే గుయిల్‌ ఫోయిల్‌, అధ్యక్ష భవన సిబ్బంది ప్రధాన అధికారి మార్క్‌ మెడోస్‌ తదితర సీనియర్‌ అధికారులందరూ అక్కడే టీవీల ముందు ఉన్నారు. అయితే ఆ వీడియోలు మూకలను రెచ్చగొడుతూ పోరాడాలని, తాను కూడా వస్తానంటూ ట్రంప్‌ ప్రసంగం చేయటానికి ముందు చిత్రీకరించినవని ఒక కధనం.
పిచ్చి పట్టిన ట్రంప్‌ అధికారపు చివరి రోజుల్లో మిలటరీ లేదా అణుదాడికి పాల్పడకుండా అణ్వాయుధాల సంకేతాలు అందకుండా చూడాలని మిలిటరీ ఉన్నతాధికారి మార్క్‌ కెలీకి చెప్పినట్లు అమెరికన్‌ కాంగ్రెస్‌(మన లోక్‌సభ వంటిది) స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు ప్రయివేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాటితో అవి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. ప్యాకేజీలు ఇవ్వని వారికి వ్యతిరేకంగా ఇచ్చిన వారికి అనుకూలంగా పని చేస్తాయి. కాపిటల్‌పై దాడి తరువాత ట్రంప్‌ ఖాతాలను పూర్తిగా స్ధంభింప చేశారని, తాత్కాలికంగా నిలిపివేశారని భిన్నమైన వార్తలు వచ్చాయి. ఆ చర్యలు ప్రజాస్వామ్య బద్దమా కాదా అన్న చర్చను కొందరు లేవదీశారు. ట్రంప్‌ ఖాతాలను నిలిపివేయటం అక్రమం అని గుండెలు బాదుకుంటున్నారు. ట్రంప్‌కు పిచ్చి పట్టింది పట్టించుకోవద్దు, ఎలాంటి కీలకాంశాలు అందుబాటులో ఉంచవద్దని నాన్సీ పెలోసీ వంటి వారు మిలిటరీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అలాంటి పిచ్చివాడు జనాన్ని మరింతగా రెచ్చగొట్టకుండా ఖాతాలను నిలిపివేసి కట్టడి చేయకుండా ఇంకా అగ్నికి ఆజ్యం పోసేందుకు అనుమతించాలా ?అనుమతించాలనే సంఘపరివార్‌ కోరుతోంది. ఎందుకంటే వారికి ఆ స్వేచ్చ అవసరం కదా !


తన ట్వీట్లను తొలగించగానే స్పందిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్లలో మరో ప్రత్నామ్నాయ సామాజిక వేదికలను ఏర్పాటు చేయాలని చెప్పాడు. ” నన్ను అడిగే వారందరికీ ఇదే చెబుతున్నా జనవరి 20వ తేదీ ప్రారంభోత్సవానికి నేను వెళ్లటం లేదు. ఏడున్నర కోట్ల మంది అమెరికన్‌ దేశ భక్తులు నాకు ఓటు వేశారు. అమెరికాదే అగ్రస్ధానం, మరోసారి అమెరికాను గొప్పదిగా చేయండి, భవిష్యత్‌లో మరింత పెద్ద గొంతుకను కలిగి ఉండబోతున్నాం. వారు ఏవిధంగానూ, ఏ రూపంలోనూ మనల్ని కించపరలేరు ” అని పేర్కొన్నాడు. తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ కూడా ఇదే మాదిరి హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో దేశభక్తులు కావాలో దేశద్రోహులు కావాలో తేల్చుకోమని ఓటర్లకు సవాలు విసిరిన విషయం తెలిసిందే. తమకు ఓటు వేస్తే ఓటర్లు దేశభక్తులు, ఇతరులకు వేస్తే దేశద్రోహులు. ట్రంపు – సంజయ ఇద్దరూ ఎన్నడూ మాట్లాడుకొని ఉండరు,కానీ చెట్టుమీది కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్లు భావజాలం ఎలా కలుపుతుందో, కలుస్తుందో చూడండి.
ఈ రోజు ట్రంప్‌ ఖాతాలను మూసివేసిన వారు రేపు ఎవరి దాన్నయినా అదే చేసే ప్రమాదం ఉందంటూ బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఈ చర్య మేలుకొలుపు, నియంత్రణలేని బడా కంపెనీల నుంచి పొంచి ఉన్న ముప్పు అని గుండెలు బాదుకున్నారు. పొద్దున లేస్తే అసత్యాలు, అర్ధసత్యాలు, నకిలీ వార్తలను పుంఖాను పుంఖాలుగా సృష్టించే కాషాయ ఫ్యాక్టరీల పర్యవేక్షకుడు అమిత్‌ మాలవీయ, బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య ఇప్పుడు ట్రంప్‌ హక్కులు హరించారంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక వేళ సామాజిక మాధ్యమాలు తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తే తక్షణమే ” అమిత్‌ మాల్‌వేర్‌ ” మీద తీసుకోవాలని ట్విటరైట్స్‌ స్పందించారు.(మాల్‌వేర్‌ అంటే కంప్యూటర్‌ వైరస్‌ ) అమెరికా అధ్యక్షుడి విషయంలోనే వారా పని చేయగలిగితే ఎవరినైనా అదే చేస్తారు. మన ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచేందుకు త్వరలో భారత్‌ వీటిని సమీక్షంచ నుంది అని బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాల నిలిపివేత ప్రమాదకరమైన సంప్రదాయం అని బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టటం, తప్పుడు వార్తలను ప్రచారంలో బెట్టటంలో దేశంలో ముందున్నది ఎవరో అందరికీ తెలిసిందే. కనుకనే మాలవీయ వంటి వారు రేపు తమ మీద కూడా అదే డిమాండ్‌ వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారు. ట్రంప్‌ అభిప్రాయాల మీద చేయగలిగింది తక్కువే అయినా విభేదించే వాటిని సహించకపోవటం ఎక్కువ కావచ్చు అని అమిత్‌ మాలవీయ చెప్పారు. సహనం గురించి ఆ పెద్దమనిషి చెప్పటాన్ని చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా లేదూ ! ప్రజాస్వామ్యంలో అసమ్మతి ప్రాధమికమైనది, ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తుంది(బిజెపి ?) అయితే దాని సహేతుకతను రాజ్యాంగబద్దమైన అధికారవ్యవస్ధలే నిర్ణయించగలవు. బడా టెక్‌ కంపెనీలు ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నాయి, వాటిని నియంత్రించేందుకు సమయం ఆసన్నమైంది అని తేజస్వి సూర్య చెప్పారు. ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకోవటం, మాట విననపుడు తమదారికి తెచ్చుకోవటం-పాలన నియంత్రణ తక్కువ, స్వేచ్చ ఎక్కువ అని కబుర్లు చెప్పిన వారి సిజరూపం ఇది.

అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేసిన ట్రంపు ప్రేరేపిత నేరగాండ్ల మీద బిజెపి నేతలు ” తమలపాకుల ”తో కొడుతున్నారు ఎందుకు అన్న అనుమానం రావచ్చు. 2001 డిసెంబరు 13న పాక్‌ ప్రేరేపిత జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఢిల్లీలోని మన పార్లమెంట్‌ భవనం మీద దాడి చేశారు. ఆ దుండగుల స్ఫూర్తితో మూడు రోజుల తరువాత 16వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టించిన విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, దుర్గావాహినీ సంస్ధలకు చెందిన వారు ఒడిషా అసెంబ్లీ భవనం మీద దాడి చేశారు. అంతకు ముందు రోజు అసెంబ్లీలో కొందరు ఎంఎల్‌ఏలు విశ్వహిందూ పరిషత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారట. అందువలన వాటిని ఉపసంహరించుకోవాలని, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిని అప్పగించాలని, తమ నేత గిరిరాజ కిషోర్‌ను విడుదల చేయాలనే నినాదాలతో త్రిశూలాలు, కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి జై శ్రీరామ్‌, వాజ్‌పేయి జిందాబాద్‌ నినాదాలతో అరగంటపాటు విధ్వంసం సృష్టించారు. అనేక మంది మీద దాడి చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారిలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప సారంగితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ఈ దాడిని అంతకు ముందు మూడు రోజలు ముందు పార్లమెంట్‌ మీద జరిగిన దాడిని ఒకే విధంగా చూడకూడదని,అంతకు ముందు కొన్ని సంస్ధల వారు వివిధ సందర్భాలలో అసెంబ్లీని ముట్టడించారని బిజెపి నేతలు అప్పుడు సమర్ధించుకున్నారు. ఇప్పుడు ట్రంప్‌ సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత తగదని చెప్పటంలో కూడా రేపు తమకూ అదే ప్రాప్తించవచ్చనే ముందు చూపు ఉందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

08 Friday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

CCI, Cotton Corporation of India, cotton farmers, Cotton MSP, cotton subsidies


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d