• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

టిబెట్‌ అరచేయి -ఐదువేళ్లు-అఖండ భారత్‌ పగటి కలలేనా ?

07 Tuesday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Akhand Bharat, China, Dalai Lama, Five fingers of Tibet, INDIA, Tibet


ఎం కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమంలోనూ, సాంప్రదాయ మీడియాలోనూ కొన్ని సమస్యల మీద వెల్లడిస్తున్న అభిప్రాయాలూ, సమాచారమూ జనాలను తప్పుదారి పట్టించేదిగా ఉందా ? ఎందుకు అలా చేస్తున్నారు ? దాని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి ? కొంత మంది భిన్న ఆలోచన లేకుండా ఎందుకు నమ్ముతున్నారు ? జనం మెదళ్ల మీద ప్రచార యుద్ధం జరుగుతోందా ? విజేతలు ఎవరు ? వారికి కలిగే లాభం ఏమిటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! అన్నింటినీ తీర్చటం సాధ్యం కాదు. కొన్ని అంశాలను పరిశీలించుదాం.
కమ్యూనిజం గురించి జనంలో భయాలను రేపితే దానివైపు అమెరికన్‌ కార్మికవర్గం చూడదనే అభిప్రాయంతో అక్కడి పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారదాడిని ఒక ఆయుధంగా చేసుకుంది. దాని దెబ్బకు అనేక మంది కోలుకోలేని మానసిక వికలాంగులయ్యారు. అయితే కాలం ఎల్లకాలమూ ఒకే విధంగా ఉండదు. ” కొంత మందిని మీరు వారి జీవితకాలమంతా వెర్రివాళ్లను చేయగలరు, అందరినీ కొంత కాలం చేయగలరు, కానీ అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు” అని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారానికి, పాలకులకు ఇది వర్తిస్తుందా ?
మన దేశ చరిత్ర గురించి చెబుతూ ఎప్పుడైనా పొరుగుదేశం మీద దండెత్తిన చరిత్ర ఉందా అడుగుతారు. మనకు తెలిసినంత వరకు అలాంటి చరిత్ర లేదు. అదే సమయంలో ఇరుగు పొరుగుదేశాలతో స్నేహంగా ఉండటం తప్ప పాలకులు ఇప్పటి మాదిరి విద్వేషం రెచ్చగొట్టిన చరిత్ర కూడా లేదు. మిత్రులుగా ఉండేందుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారం కంటే వాటి మీద నిత్యం ద్వేషాన్ని రెచ్చగొట్టటం, అదే అసలైన దేశభక్తి అని ప్రచారం చేయటం , నరేంద్రమోడీ ఏమి చేసినా సరైనదే, బలపరుస్తాం అనే వెర్రిని జనాల మెదళ్లలోకి ఎక్కించి బిజెపి తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కమ్యూనిస్టు నేత లెనిన్‌ ” ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” అని చెప్పారు. అయన కంటే ఎంతో ముందు వాడైన అబ్రహాం లింకన్‌ చెప్పినట్లు అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు.
” చైనా కుడి చేతి అరచేయి టిబెట్‌ . లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల ప్రదేశ్‌ దాని అయిదు వేళ్లు, వాటిని విముక్తి చేయాలని చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ చెప్పారు ” అన్నది ఒక ప్రచారం. వాస్తవం ఏమిటి ? మావో జెడాంగ్‌ ఆ విధంగా చెప్పిన దాఖలాలు గానీ, కమ్యూనిస్టు చైనాలో అధికారిక చర్చ జరిగినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది ఎలా ప్రచారం అయింది ?
క్రీస్తు పూర్వం 221లో ప్రారంభమైన చైనా క్విన్‌ రాజరిక పాలన నుంచి 1912వరకు సాగిన పలు రాజరికాలు నేపాల్‌, సిక్కిం,భూటాన్‌ తమ టిబెట్‌లో భాగమే అని భావించాయి. 1908లో టిబెట్‌లోని చైనా రాజప్రతినిధి నేపాల్‌ అధికారులకు పంపిన వర్తమానంలో నేపాల్‌ మరియు టిబెట్‌ చైనా అశీస్సులతో సోదరుల్లా కలసి పోవాలని, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యంగామెలగాలని, చైనా, టిబెట్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌లు పంచరంగుల మిశ్రితంగా ఉండాలని, బ్రిటీష్‌ వారిని ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. ఇది బ్రిటన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన ఒక అంశం, చైనా ప్రభువుల వాంఛకు ప్రతిబింబం అని కూడా అనుకోవచ్చు. దానిని ప్రస్తుతం చైనాకు వర్తింప చేస్తూ ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే మరి మావో జెడాంగ్‌ రంగంలోకి ఎలా తెచ్చారు ?
ఇక్కడ అఖండ భారత్‌ గురించి చెప్పుకోవటం అవసరం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన జనాన్ని సమీకరించేందుకు నేను సైతం అన్నట్లుగా అనేక మంది తమ భావజాలం, నినాదాలతో ముందుకు వచ్చారు. వాటితో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ అదొక వాస్తవం. దానిలో ఒకటి అఖండ భారత్‌. దీనికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దీవులు, ఆఫ్రికా ఖండం, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, అస్త్రాలయ(ఆస్ట్రేలియా) ప్రాంతంలోని అనేక దేశాలలోని భాగాలతో కూడినది అఖండ భారత్‌ అన్నది ఒకటి. ఈ ప్రాంతంలోని ఇప్పటి దేశాల పేర్లు పేర్కొనాల్సి వస్తే భారత్‌, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్ధాన్‌, టిబెట్‌, మయన్మార్‌, ఇరాన్‌,యుఏయి, బహరెయిన్‌, తుర్క్‌మెనిస్ధాన్‌, తజికిస్తాన్‌, లావోస్‌, కంపూచియా, వియత్నాం, థాయలాండ్‌, ఇండోనేషియా, బ్రూనె, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాలలోని కొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మహాభారతం, మరికొన్ని పురాణాల్లో అందుకు సంబంధించిన కొన్ని ప్రస్తావనల ఆధారంగా అలా చెప్పారు. ఇవన్నీ చరిత్రలో ఒక మహారాజ్యంగా ఉన్నాయటానికి ఆధారం లేదు గానీ మతపరమైన, సాంస్కృతిక అంశాలలో సారూపత్యల కారణంగా అలా పరిగణించారని చెప్పాలి. ఉదాహరణకు ఇండోనేషియా నేడు ముస్లిం దేశం, అయినా అక్కడి వారి పేర్లు ఎలా ఉంటాయో చూడండి. మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో(సుకర్ణుడు) ఆయన కుమార్తె మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణో పుత్రి.
మన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పేందుకు కెఎం మున్షీ తొలిసారిగా అఖండ హిందుస్తాన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారు. మన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్‌ వారిని విమర్శించే సమయంలో మహాత్మాగాంధీ కూడా దాన్ని ఉదహరించారు. ఖాన్‌ సోదరుల్లో ఒకరైన మజహర్‌ అలీఖాన్‌ కూడా అఖండ హిందుస్తాన్‌ గురించి చెబితే ముస్లిం లీగు వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా, జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిన హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ అఖండ భారత్‌తో పాటు హిందూ రాష్ట్ర భావనను కూడా ముందుకు తెచ్చారు. తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్ధలన్నీ ఇప్పటికీ ఈ భావనలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి, అఖండ భారత్‌ ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నాయి. అది సాధించినపుడే నిజమైన స్వాతంత్య్రం అని ప్రచారం చేస్తాయి.1993లో సంఘపరివార్‌కు చెందిన బిఎంఎస్‌ తన డైరీ మీద ముద్రించిన చిత్రపటంలో పాకిస్ధాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌,శ్రీలంక, థాయలాండ్‌, కంబోడియాలతో కూడిన అఖండభారత్‌ ప్రచురించినట్లు వికీ పీడియా పేర్కొన్నది. నరేంద్రమోడీ కూడా సంఘపరివార్‌కు చెందిన వ్యక్తే గనుక 2012లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింధీల సభలో మాట్లాడుతూ పాకిస్ధాన్‌లో సింధు రాష్ట్రం ఒకనాటికి మన దేశంలో కలుస్తుందని సెలవిచ్చారు.2025 నాటికి పాకిస్ధాన్‌, టిబెట్‌లోని మానస సరోవరం తిరిగి మన దేశంలో కలుస్తుందని, లాహౌర్‌, మానసరోవర ప్రాంతాల్లో భారతీయులు స్ధిర నివాసం ఏర్పరచుకోవచ్చని, బంగ్లాదేశ్‌లో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నందున ఐరోపా యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.
1937 జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించారు. దాంతో చైనీయులు రెండో సారి జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరుసల్పారు. చాంగకై షేక్‌ నాయకత్వంలోని చైనా మిలిటరీతో పాటు లాంగ్‌ మార్చ్‌ జరుపుతున్న కమ్యూనిస్టు గెరిల్లాలు కూడా జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అనేక మంది యుద్ధ ప్రభువులు జపాన్‌కు లొంగిపోయారు. ఈ నేపధ్యంలో చరిత్రలో చైనా పొందిన అవమానాలను గుర్తుచేస్తూ జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు పార్టీనేతగా మావో చైనీయులకు చెప్పారు. ఆ సందర్భంగా చరిత్రను ప్రస్తావిస్తూ సామ్రాజ్యవాదులు చైనాను యుద్దాలలో ఓడించి అనేక సామంత రాజ్యాలను బలవంతగా చైనా నుంచి వేరు చేశారని, జపాన్‌ వారు కొరియా, తైవాన్‌,రైకూ దీవులు, పోర్ట్‌ ఆర్ధర్‌, పెస్కాడోర్స్‌ను, బ్రిటీష్‌ వారు బర్మా, నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్‌లను వేరు చేశారని, ఫ్రాన్స్‌ అన్నామ్‌(ఇండోచైనా ప్రాంతం)ను, చివరకు ఒక చిన్న దేశం పోర్చుగల్‌ చైనా నుంచి మకావోను స్వాధీనం చేసుకుందని మావో చెప్పారు. అంతే తప్ప ఎక్కడా ఐదువేళ్ల గురించి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏనాడూ చెప్పలేదు. తైవాన్‌ చైనా అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, దాని మీద ఎలాంటి వివాదమూ లేదు. అయితే 1948 నుంచి అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉంటూ అమెరికా అండచూసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సామరస్య పూర్వకంగా విలీనం కావాలని చైనా కోరుతోంది తప్ప సైనిక చర్యకు పూనుకోలేదు.
అయితే నిప్పులేనిదే పొగ వస్తుందా ? రాదు.1954లో టిబెట్‌లోని చైనా అధికారులు మాట్లాడుతూ భారత సామ్రాజ్యవాదులు అక్రమంగా పట్టుకున్న సిక్కిం, భూటాన్‌, లడఖ్‌,నీఫా(నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజన్సీ-అరుణాచల్‌ ప్రదేశ్‌)ను విముక్తి చేయాలని చెప్పినట్లు, అదే ఏడాది 1840-1919 మధ్య సామ్రాజ్యవాదులు చైనా ప్రాంతాలను కొన్నింటినీ ఆక్రమించారంటూ రాసిన ఒక స్కూలు పాఠంలో లడఖ్‌, నేపాల్‌,భూటాన్‌, సిక్కిం, ఈశాన్య భారతాన్ని విముక్తి చేయాలని దానిలో రాసినట్లుగా చెబుతారు.1959లో చైనా జనరల్‌ ఝాంగ్‌ గుహువా టిబెట్‌ రాష్ట్ర రాజధాని లాసాలో మాట్లాడుతూ భూటానీలు, సిక్కిమీయులు, లఢకీలు టిబెట్‌ ఉమ్మడి కుటుంబంలో ఐక్యం కావాలని అన్నట్లు వార్తలు ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి. అధికారికంగా అఖండ భారత్‌ గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా పరిగణించుతారు. అందుకే ఆయా దేశాలు ఎన్నడూ మన దేశంతో దాన్నొక సమస్యగా చూడలేదు. మన మీద ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. చైనా నుంచి వేరు పడి స్వాతంత్య్రం కావాలని 1912కు ముందుగానీ తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చేంత వరకు గానీ ఎన్నడూ టిబెట్‌లో ఉద్యమించిన ఉదంతాలు లేవు. అమెరికా జరిపిన కుట్రలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టిన నాటి నుంచి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి, ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చిన గత కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పటికీ టిబెట్‌ తురుపుముక్కను ఉపయోగించాలనే సంఘపరివార్‌ ఎత్తుగడలు కొనసాగుతున్నంత కాలం అటూ ఇటూ అలాంటి రెచ్చగొట్టే, వివాదాస్పద మాటలు వెలువడుతూనే ఉంటాయి. అధికారికంగా పాలకుల వైఖరి ఏమిటనేదే గీటురాయిగా ఉండాలి. అలా చూసినపుడు అఖండ భారత్‌ను ఎలా విస్మరించాలలో, టిబెట్‌ ఐదు వేళ్ల ప్రచారాన్ని కూడా అదేపని చేయాలి. కానీ సంఘపరివారం తన అజెండాలో భాగంగా ఐదువేళ్ల వార్తలను అధికారికమైనవిగా చిత్రించి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఆ ప్రచారానికి కొట్టుకపోతే బుర్రలను ఖరాబు చేసుకోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు.
చైనా ఆక్రమించుకుంటుంది అని చేస్తున్న ప్రచారంలో ఒకటైన సిక్కింను 1975లో మన దేశం విలీనం చేసుకుందని, తరువాత మన దేశ చర్యను చైనా అధికారికంగా గుర్తించిందని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తెలియదా? తెలిసీ ఇంకా ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నట్లు ? దలైలామాను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి మన దేశానికి రప్పించింది అమెరికా. తీరా చైనాతో సర్దుబాటు కుదరగానే ఆ పెద్దమనిషిని, టిటెటన్‌ తిరుగుబాటుదార్లను తాను వదలించుకొని మనకు అంటగట్టింది. తమ దేశానికి రావటానికి కూడా ఆంక్షలు పెట్టింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కాదని మన దేశం ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. ఆ వైఖరిని తీసుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా వేలాది మంది టిబెటన్లు మన దేశంలో విదేశీయులుగా నమోదై ఉన్నారు తప్ప వారికి పౌరసత్వం ఇచ్చేందుకు గానీ, శరణార్ధులుగా గుర్తింపుగానీ ఇవ్వలేదు. అక్రమంగా టిబెట్‌ నుంచి తరలిస్తున్నవారిని అనుమతిస్తున్నది. అనేక చోట్ల వారికి నివాసాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించారు. సంఘపరివార్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను సంతుష్టీకరించటానికి తప్ప దలైలామాను నెత్తికి ఎక్కించుకొని మనం ఎందుకు వీరంగం వేస్తున్నామో, దాని వలన ప్రయోజనం ఏమిటో ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహం-చక్రవ్యూహం : చైనా, భారత్‌ ముత్యాల హారాలు !

03 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Asian Arc of Democracy, China and India strings of pearls, Encirclements, Quad, Quadrilateral Security Dialogue, strategies


ఎం కోటేశ్వరరావు
ఒకరు వ్యూహాన్ని పన్నితే మరొకరు చక్రవ్యూహాన్ని రచిస్తారు. ఆర్ధిక లేదా యుద్ద రంగం, పోటీ ఉన్న దేనిలో అయినా పై చేయి సాధించేందుకు పోటీ పడేవారు చేసిందీ, చేసేది, చేస్తున్నదీ ఇదే. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌లకు బాసటగా అటూ ఇటూ మోహరించిన వారిని గమనించాము. ఎటూ చేరకుండా తటస్దంగా ఉంటూ మన ప్రయోజనాలను సాధించుకొనేందుకు, అమెరికా బాధిత దేశాలకు మనవంతు సాయం చేసేందుకు మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని చూశాము.
ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేదు. ప్రచ్చన్న యుద్దం ముగిసింది, తామే విజేతలమని అమెరికా ప్రకటించినప్పటికీ కమ్యూనిజం వ్యాప్తి నిరోధ లక్ష్యంగా ప్రారంభమైన ఆ యుద్దం నిజానికి ముగియలేదు. ప్రచ్చన్న యుద్దం 2.0 ప్రారంభమైందనే చెప్పవచ్చు. అమెరికా ప్రధాన లక్ష్యంగా సోవియట్‌ యూనియన్‌ స్ధానంలో చైనా వచ్చింది. అయితే నాటికీ నేటికీ అగ్రరాజ్యంగా అన్ని రంగాలలో అమెరికాయే ముందున్నది. సామ్రాజ్యవాదుల కుట్రలకు సోవియట్‌ బలైతే చైనా కమ్యూనిస్టు పార్టీ జాగరూకత కారణంగా తియన్మెన్‌ స్వేర్‌ నిరసన రూపంలో అక్కడి సోషలిస్టు వ్యవస్దకు తలపెట్టిన ముప్పును తప్పించారు. మూడు దశాబ్దాల నాటికీ నేటికీ పరిస్ధితిలో ఎంతో మార్పు వచ్చింది.చైనా అన్ని విధాలుగానూ ఎంతో బలపడింది, అమెరికాతో సమంగా ఉందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. అదే సమయంలో నేటి అమెరికా ముందు ఎన్నో సవాళ్లు ఉన్న విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
ఇప్పుడు అలీన విధానమూ లేదు, దాన్ని పునరుద్దరించి నాయకత్వం వహించాలని మన (పాలకవర్గం) దేశమూ కోరుకోవటం లేదు. సోవియట్‌ను చూపి అమెరికా వద్ద, అమెరికాను చూపి సోవియట్‌ నుంచి ప్రయోజనాలు పొందేందుకు అనుసరించిన వ్యూహం నుంచి తప్పుకొని అమెరికాతో రాజీపడి తానూ స్వతంత్రంగా ఎదగాలన్నది మన పాలకవర్గ ఎత్తుగడగా మొత్తం మీద చెప్పవచ్చు. అందకనే కొన్ని అంశాలలో ప్రతిఘటన కూడా ఉంటోంది. అణుపరీక్షలను జరిపినపుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. అయినా మన విదేశాంగ విధానంలో దానికి అనుకూలమైన మార్పు వచ్చింది. ఈ నేపధ్యంలోనే చైనా ముత్యాల హారాన్ని చూడాల్సి ఉంది. అలీన విధానంలో స్వతంత్రంగా ఉండటంతో పాటు అమెరికా దుశ్చర్యలను అనేక సందర్భాలలో వ్యతిరేకించాల్సి వచ్చినపుడు సోవియట్‌ అనుకూల శిబిరంలో ఉన్నట్లు మన దేశం కనిపించింది. కొన్ని విధానాలలో సారూప్యత, సామీప్యత ఉన్నందువలన అలాంటి అభిప్రాయం కలిగింది. దాని వలన మనకు జరిగిన నష్టమేమీ లేదు. ఆర్ధికంగా ఎంతో లబ్ది పొందాము. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో మనం అనేక విజయాలు సాధించామంటే దానికి సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అందిస్తున్న సహకారం తప్ప మరొకటి కాదు. ఈ ప్రయోగాలను దెబ్బతీసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేసింది.
సర్వేజనా సుఖినోభవంతు, వసుధైక కుటుంబాన్ని కోరుకొన్న విశాల భావాన్ని మన పూర్వీకులు వ్యక్త పరిచారు. మన పౌరుల సంక్షేమంలో అగ్రస్ధానంలో అంటే మనం అన్ని రంగాలలో ముందుండాలి అనే భావంతో పోటీపడటం, ఆలోచించటం తప్పు కాదు. భారత్‌ మాత్రమే ఉండాలి అంటే అది జాతీయవాదానికి బదులు జాతీయ దురహంకారం అవుతుంది. సమస్యలు వస్తాయి. ఈ మాట చెప్పిన వారిని దేశద్రోహులు అని చిత్రించినా ఆశ్చర్యం లేదు. జాతీయ దురహంకారానికి అమెరికాయే ఉదాహరణ. అలాంటి అమెరికా అడుగులకు మనం మడుగులొత్తుతున్నామా లేదా అనే అభిప్రాయాలను చర్చించటం,దానిలో భాగంగా విమర్శలు చేయటం జాతి వ్యతిరేకం కాదు, ద్రోహమూ కాదు. అమెరికా అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అనేక విధానాలను అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకించి రోడ్డెక్కిన ఉదంతాలు ఎన్నో. వియత్నాంపై దాడి చేయటాన్ని నిరసిస్తూ యువత ఆ సమయంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. జాతీయంగా వర్ణవివక్షను పాటించటాన్ని, అణచివేయటాన్ని ఎలా నిరసించారో ఇటీవలనే జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంలో చూశాము.
మన పాలకవర్గం లేదా పాలకపక్షం తీసుకుంటున్న విదేశీ, స్వదేశీ విధానాలు, తప్పిదాలు వాటి మద్దతుదార్లకు కనిపించవు. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ పాలకుల మీద విమర్శలు చేసేందుకు సంఘపరివార్‌ సంస్ధలైన బిజెపి వంటివి ఎలా హక్కును కలిగి ఉన్నాయో, పాలక పార్టీగా బిజెపి అనుసరిస్తున్న విధానాలను విమర్శించే హక్కు ఇతరులకూ ఉంటుందా లేదా ?
2020 జూలై ఒకటవ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక బిజెపి ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రామ్‌ మాధవ్‌ ఇంటర్వ్యూను ప్రచురించింది. ”గత నాలుగైదు సంవత్సరాలలో భారత విధానంలో వచ్చిన మార్పు చైనాను అప్రమత్తం గావించింది, డోక్లాం వారికి పెద్ద కుదుపు ” అన్నది దాని శీర్షిక. గత శతాబ్దిలో పసిఫిక్‌ అట్లాంటిక్‌ కేంద్రంగా సాగిన పశ్చిమ ఐరోపా-అమెరికా కూటమి ప్రపంచ అధికార పంపిణీ ఇప్పుడు ఇండో-పసిఫిక్‌ వైపు మారిందని, ఈ ప్రాంతంలో ఒక ముఖ్య అధికార శక్తిగా ఉన్న మనం ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధం కావాలని రామ్‌ మాధవ్‌ చెప్పారు. ఆసియాలో చైనా తరువాత మన దేశానికి ఉన్న స్ధానం తెలిసిందే. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించాలనుకోవటంలో కూడా తప్పులేదు. ఆ పాత్ర స్వభావం ఎలా ఉండాలన్నదే అసలైన ప్రశ్న. అయితే బిజెపినేతలు తామేదో ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యపాత్రకు కొత్తగా తెరలేపుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలీన ఉద్యమం ద్వారా మన దేశం గతంలోనే ఒక ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే.
తమ నేత నరేంద్రమోడీకి ఘనతను ఆపాదించేందుకు గత నాలుగైదు సంవత్సరాలలో మన విధానంలో వచ్చిన మార్పు అని బిజెపి రామ్‌ మాధవ్‌ చెప్పవచ్చుగానీ మన దేశ వైఖరిలో మార్పు యుపిఏ కాలంలోనే ప్రారంభమైంది. అమెరికా అనుకూల వైఖరికి వ్యతిరేకంగా వామపక్షాలు యుపిఏకు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఒక విధాన మార్పు తెల్లవారేసరికి రాదు.
చైనాను దెబ్బతీసేందుకు దాని చుట్టూ అమెరికా ఎప్పటి నుంచో వ్యూహం పన్నుతోంది. సహజంగానే చైనా కూడా ప్రతి వ్యూహాన్ని అమలు జరుపుతోంది. ఏ దేశమూ మిలిటరీ వ్యూహాలు, లక్ష్యాలను బహిరంగంగా చెప్పదు.చైనా కూడా దానికి మినహాయింపు కాదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసి జపాన్‌ లొంగిపోయిన తరువాత ఆరు సంవత్సరాలకు అమెరికా -జపాన్‌ రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. అసలు విషయం చెప్పాలంటే అమెరికా బలవంతంగా జపాన్‌ మీద ఒప్పందాన్ని రుద్దింది. బాధ్యతా రహిత మిలిటరీవాదం ప్రపంచంలో ఇంకా ఉందనే సాకును చూపి నిరాయుధం గావించిన జపాన్‌ మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంది. జపాన్‌లో అమెరికా సైన్యాన్ని, సైనిక స్దావరాలను ఏర్పాటు చేసేందుకు జపాన్‌ అంగీకరించింది. అంతే కాదు అమెరికా అనుమతి లేకుండా మరోదేశం సైనిక కేంద్రాల ఏర్పాటు సైనిక సంబంధ అనుమతులు జపాన్‌ ఇవ్వకూడదు. ఇది వియత్నాంలో 1945లో చైనాలో 1948లో కమ్యూనిస్టులు అధికారానికి రావటం, ఇండోనేషియా, కంబోడియా, లావోస్‌లలో కమ్యూనిస్టులు ఒక బలమైన శక్తిగా ఉన్న నేపధ్యంలో ఇది జరిగిందని గమనించాలి. అప్పటి నుంచి చైనాను ఇబ్బందులు పెట్టేందుకు అమెరికా చేయాల్సిందంతా చేసింది. తైవాన్‌లో కేంద్రీకృతమైన కమ్యూనిస్టు వ్యతిరేక మిలిటరీని బలోపేతం గావించింది. మయాన్మార్‌లో తిష్టవేసిన కమ్యూనిస్టు వ్యతిరేక చైనా సైన్యాన్ని కొంత కాలం అమెరికా పోషించి దాడులు చేయించింది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐక్యరాజ్యసమితిలో స్దానం లేకుండా తిరుగుబాటు తైవాన్‌ను అసలైన చైనాగా చలామణి చేయించింది.
అమెరికా వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు చైనా తన ఎత్తుగడలను తాను అమలు చేస్తోంది. దానికి ముత్యాల హారం పధకం అని మన మీడియా విశ్లేషకులు నామకరణం చేశారు. వాణిజ్య, దౌత్య, సముద్ర మార్గాలు, మిలిటరీ లక్ష్యాలతో చైనా తన పధకాన్ని అమలు జరుపుతోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం ప్రాంతాలలో ఉన్న మయన్మార్‌లోని సిటివెక్యాకుపు, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌, శ్రీలంకలోని హంబంటోటా, పాకిస్ధాన్‌లోని కరాచీ, గ్వాదర్‌ రేవులు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నది. ఇవన్నీ మన దేశం చుట్టూ ఉన్నాయి. ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2017లో అక్కడికి చైనా మిలిటరీ ప్రయాణించింది. ఈ సైనిక కేంద్రం ఎర్ర సముద్ర ప్రారంభంలో ఉంది. మధ్యధరా-ఎర్ర సముద్రాన్ని కలిపే సూయజ్‌ కాలువ ద్వారా ప్రయాణించే తమ నౌకలకు జిబౌటీ పరిసరాల్లోని సముద్రపు దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు, శాంతి పరిరక్షక కార్యకలాపాలకు, మానవతా పూర్వక సాయం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చైనా చెబుతున్నది. చైనా కంటే ముందే ఇక్కడ అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ సైనిక కేంద్రాలు చిన్నా పెద్దవి ఉన్నాయి. ఏ దేశమైనా ఆ కేంద్రాలకు సైన్యాన్ని తరలించవచ్చు, కానీ చైనా మాత్రమే అందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశానికి అతి సమీపంలో మారిషస్‌కు చెందిన డిగోగార్షియాలో అమెరికా సైనిక కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని మారిషస్‌కు అప్పగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది, బ్రిటీష్‌ వారు తమకు లేని అధికారంతో అమెరికాకు ఆ దీవులను కౌలుకు ఇవ్వటం చెల్లదని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. అయినా వైదొలిగేందుకు ఆ రెండు దేశాలు మొరాయిస్తున్నాయి. చైనా-పాకిస్ధాన్‌ ఆర్ధిక నడవా(సిపిఇసి)లో భాగంగా గ్వాదర్‌ రేవును అభివృద్ధి చేశారు. యుద్ధ పరిస్థితి వస్తే మన దేశంమీద పశ్చిమం వైపు నుంచి చైనా దాడి చేసేందుకు దీన్ని ఉద్దేశించారన్న ఆరోపణలు ఉన్నాయి. చిట్టగాంగ్‌ రేవులో చైనా కేంద్రాన్ని కూడా అదే విధంగా చూస్తున్నారు. ఇవిగాక మాల్దీవులు, షెషల్స్‌లో కూడా చైనా సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటోంది.
దక్షిణ చైనా సముద్రం-బంగాళాఖాతాన్ని కలిపే మలక్కా జలసంధి ప్రాంతం చైనాకు ఎంతో కీలకమైనది. చైనా దిగుమతి చేసుకొనే చమురులో 80శాతం మధ్య ప్రాచ్యం నుంచి ఈ మార్గం ద్వారానే చైనాకు రావలసి ఉంది. అందువలన ఈ ప్రాంత దేశాలతో చైనా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేందుకే నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. ఎవరైనా అదే చేస్తారు. తూర్పు కార్యాచరణ విధానం పేరుతో మన దేశం కూడా ఆ ప్రాంత దేశాల మీద పలుకుబడిని పెంచుకొనేందుకు పూనుకుంది. మయన్మార్‌కు 175కోట్ల డాలర్ల గ్రాంటు మరియు రుణం, బంగ్లాదేశ్‌కు 450 కోట్ల డాలర్ల రుణ వాగ్దానం, చైనాకు దగ్గరగా ఉండే మధ్య ఆసియా దేశాలైన తుర్కుమెనిస్ధాన్‌, ఉజ్బెకిస్ధాన్‌, కిర్ఖిజిస్తాన్‌, కజకస్తాన్‌, మంగోలియా దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఆర్ధికపరమైన దౌత్యం ద్వారా ఇతర దేశాలను ఆకట్టుకొనే విషయంలో చైనాతో మనం పోటీ పడే స్ధితిలో లేము అన్నది ఒక మింగుడుపడని వాస్తవం. ఈ నేపధ్యంలో ఏమి చేయాలి అన్నది సమస్య. తమ వస్తువులను కొనుగోలు చేయాలని ఏ దేశాన్ని అయినా చైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. తమ దేశంలో తయారు చేసుకోవటం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకొని విక్రయించటమే లాభదాయకమని అమెరికా కార్పొరేట్లే అందుకు శ్రీకారం చుట్టాయి. మన వ్యాపారవేత్తలు మడి కట్టుకొని ఎలా కూర్చుంటారు ?
2019లో చైనా 421 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్య మిగులుతో ఉండగా మన దేశం 153 బిలియన్‌ డాలర్ల లోటులో ఉంది. కనుక ఆర్ధిక దౌత్యంలో దానితో పోటీ పడే అవకాశం లేదు. అయినంత మాత్రాన చైనాకో మరొక దేశానికో అణగి మణగి ఉండాల్సిన అవసరం లేదు. తిరుగులేని అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాతో చైనా ఏనాడూ రాజీ పడలేదు. మన ప్రయోజనాలను మనం రక్షించుకోవాలి, ఎదగాలి, అందుకు అనువైన స్వంత, స్వతంత్ర మార్గాలను ఎంచుకోవాలి. దానికి బదులు ప్రమాదకరమైన అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా కూటమి కట్టి మన సాధించేదేమిటన్నది ప్రశ్న. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వీరతాడు వేసుకొని వీరంగం వేస్తున్నది. మన దేశంలోని బిజెపి కమ్యూనిజానికి వ్యతిరేకంగా అలాంటి వీరంగం వేస్తోంది. అయితే ఇంతవరకు మన దేశంగా అనుసరించిన విధానం కమ్యూనిస్టు వ్యతిరేకమైనది కాదు. లేదూ మేము కూడా అమెరికా బ్యాండ్‌లో చేరతామంటే అది బహిరంగంగా ప్రకటించాలి.
చతుర్ముఖ భద్రతా సంభాషణ పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా,భారత్‌తో ఒక కూటమిని కట్టేందుకు అమెరికా పావులు కదుపుతోంది. 2007నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఆసియన్‌ ఆర్క్‌ ఆఫ్‌ డెమోక్రసీ (ఆసియా ప్రజాస్వామ్య విల్లు) అని ఒక ముద్దుపేరు పెట్టారు. ఈ విల్లును ఎవరి మీద ఎక్కు పెట్టినట్లు ? ఈ కూటమిని తనకు వ్యతిరేకంగా తయారవుతున్న దుష్ట చతుష్టయం అని చైనా భావిస్తోంది. వాటి ప్రతి చర్యనూ అనుమానంతో చూస్తోంది. నిజానికి ఈ దేశాలకు ఎవరి నుంచి ముప్పు తలెత్తినట్లు ? అమెరికా తన పెత్తనాన్ని రుద్దేందుకు కుట్ర సిద్ధాంతాలను నిరంతరం ముందుకు తెస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు దేశాల మధ్య తంపులు పెట్టి నిరంతరం తన ఆయుధాలను, అదిరించి బెదిరించి తన వస్తువులను అమ్ముకొని లబ్ది పొందే ఎత్తుగడ తప్ప దానికి మరొక పని లేదు.ఐరోపాలో సాగిన అనేక యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ఐరోపా సామ్రాజ్యవాదులు, వారితో చేతులు కలిపిన జపాన్‌ తప్ప మరొక దేశం కారణం కాదు. చతుర్ముఖ భద్రతా సంభాషణ నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రారంభంలోనే ఆస్ట్రేలియా ప్రకటించటంతో కొన్ని సంవత్సరాల పాటు ముందుకు సాగలేదు. అక్కడ పాలకులు మారిన తరువాత 2017లో ఆసియన్‌ సమావేశాల సందర్భంగా తిరిగి ఈ నాలుగు దేశాలు కూటమిని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించాయి. దానిలో భాగంగానే మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరిపాయి. ఈ నేపధ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూలో బిజెపి నేత రామ్‌ మాధవ్‌ ”గత నాలుగైదు సంవత్సరాలలో భారత విధానంలో వచ్చిన మార్పు చైనాను అప్రమత్తం గావించింది, డోక్లాం వారికి పెద్ద కుదుపు ” అంటూ చెప్పిన అంశాలకు, తాజా సరిహద్దు ఉదంతాలకు సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ?
గాల్వాన్‌ లోయలో ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు,అసలేం జరిగింది అన్నది ఇప్పటికీ బ్రహ్మపదార్దంగానే ఉంది. చైనీయులు మన ప్రాంతాల్లో లేరు, మన సైనిక పోస్టులను ఆక్రమించలేదు, చొచ్చుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టాము అని అని మన ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన గందరగోళాన్ని కలిగించింది. ప్రధాని ప్రసంగాన్ని వక్రీకరించారంటూ ప్రభుత్వం చెప్పిన వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలను ముందుకు తెచ్చింది. రామ్‌ మాధవ్‌ మాటల పూర్వరంగంలో గాల్వాన్‌ ఉదంతానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలను చూడకుండా సమగ్రత రాదు. డోక్లాం ప్రాంతం చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం. మన సిలిగురి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. నివాస యోగ్యం గాని ఆ ప్రాంతానికి ఆనుకొన్ని ఉన్న కొంత ప్రాంతాన్ని తమకు అప్పగించి దాని బదులు వేరే ప్రాంతాన్ని తీసుకోవాలని రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సంప్రదింపులు జరుగుతున్నాయి తప్ప అంగీకారానికి రాలేదు.2017లోమన సైన్యం ఆ ప్రాంతానికి వెళ్లి చైనా ప్రాంతంలో ఉన్న చైనా మిలిటరీతో మోహరించింది. అక్కడ తలపెట్టిన నిర్మాణాలను చైనా వాయిదా వేసింది తప్ప వెనక్కు తగ్గిందీ లేదు, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిందీ లేదు. అణు సరఫరా దేశాల గ్రూపులో చేరాలన్న మన దేశ వాంఛను చైనా అడ్డుకుంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందంపై భారత్‌ సంతకం చేస్తేనే తాము అంగీకరిస్తామని చెప్పింది. భారత్‌, పాకిస్ధాన్‌, ఇజ్రాయెల్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ మూడింటితో పాటు కొత్త దేశమైన దక్షిణ సూడాన్‌ కూడా ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు మన ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌, అది చైనా అంతర్భాగమని అధికారయుతంగా మన దేశం గుర్తించింది. కానీ తైవాన్‌లోని చైనా వ్యతిరేకశక్తులు అక్కడ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి బిజెపి ఇద్దరు ఎంపీలను దానికి పంపాలని నిర్ణయించటం చైనాను రెచ్చగొట్టే చర్య అవుతుందా మిత్ర చర్యా ? కరోనా కారణంగా వారు వెళ్లలేదు గానీ ఇంటర్నెట్‌ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత-చైనా సంబంధాలలో దలైలామా ఒక పెద్ద సమస్య.చరిత్రలో టిబెట్‌ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేదు. వివిధ చైనా రాజరికాలలో స్వయంపాలిత ప్రాంతంగా చెప్పుకోవటం తప్ప స్వతంత్ర దేశంగా ఎన్నడూ లేదు.క్వింగ్‌ రాజరికాన్ని కూల్చివేసిన తరువాత 1912లో ఏర్పడి 1949వరకు ఉన్న జాతీయ ప్రభుత్వం కూడా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించలేదు. తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. అమెరికా, ఇతర దేశాల జోక్యంతో దలైలామా తదితరులు కమ్యూనిస్టుల అధికారాన్ని గుర్తించేందుకు తిరస్కరించటమే గాక చివరకు 1959లో తిరుగుబాటు చేశారు. చైనా ప్రభుత్వం దాన్ని అణచివేసిన తరువాత దలైలామా మన దేశానికి పారిపోయి వచ్చి ధర్మశాల కేంద్రంగా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏ దేశమూ గుర్తించలేదు. అమెరికా, మన దేశం కూడా నిధులు సమకూర్చింది. దలైలామా తరువాత దాన్నుంచి వైదొలిగి ఇతరులకు బాధ్యత అప్పగించాడు. దలైలామా, ఇతర తిరుగుబాటు టిబెటన్‌ నేతలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అధికార ప్రతినిధులెవ్వరూ హాజరు కావద్దని 2018లో మన విదేశాంగశాఖ ఆదేశించింది. ఆ చర్య చైనా వత్తిడికి లొంగినట్లు కాదా అన్న ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిధి ప్రశ్నకు తనకు అసలా విషయం తెలియదని రామ్‌ మాధవ్‌ సమాధానమిచ్చారు. ఇది తప్పించుకొనే గడుసుదనం తప్ప నిజాయితీతో కూడింది కాదు. దలైలామా తిరుగుబాటు, భారత రాక, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించటం 1962లో భారత-చైనా యుద్ద పరోక్ష కారణాలలో ఒకటన్నది బహిరంగ రహస్యం. టిబెట్‌ను చైనా ప్రాంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ గుర్తించదు. తాజాగా దలైలామా 84వ జన్మదినంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కొందరు బిజెపి పెద్దలు బహిరంగంగానే చెప్పటాన్ని ఏ విధంగా చూడాలి. ఇప్పుడు కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాలు, రానున్న బీహార్‌ ఎన్నికల నేపధ్యంలోనే సరిహద్దు సమస్యలని ఎవరైనా విమర్శిస్తే వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు అవుతారా ?అన్నింటికీ మించి బిజెపికి అవసరమైనపుడే ఉగ్రవాద దాడులు, సరిహద్దు సమస్యలు తలెత్తుతాయని గతంలో వచ్చిన విమర్శ తెలిసిందే.తాము అటువంటి వాళ్లం కాదు,పునీతులమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత బిజెపి మీద లేదా ! అనేక మంది మన దేశాన్ని డ్రాగన్‌(చైనా) కోరల్లో పెట్టామని చెప్పేవారు ఉన్నారు. ఎవరి అభిప్రాయం వారిది. మన నరేంద్రమోడీ గారు దాన్నుంచి రక్షించేందుకు ఆరు సంవత్సరాల్లో తీసుకున్న చర్యలేమీ లేవు. పాకిస్ధాన్‌ మీద మెరుపుదాడులు చేశామని మన జనాన్ని సంతృప్తి పరచారు. చైనా మీద అటువంటి అవకాశాలు లేవు. దాంతో జన సంతుష్టీకరణలో భాగంగా చైనా తయారీ యాప్‌లను నిషేధించి డిజిటల్‌ స్ట్రైక్‌ చేశాం చూశారా అన్నట్లు జనం ముందు నిలిచారు. ఈ చర్య దిగజారిన మన ఆర్ధిక వ్యవస్ధను ఏమాత్రం మెరుగుపరిచినా సంతోషమే. పెద్ద నోట్ల రద్దుతో ఏదో ఒరగబెడతామని చెప్పి జనాన్ని హతాశులను చెయ్యకుండా ఉంటే సంతోషమే. డ్రాగన్‌ కోరల నుంచి తప్పించుతామంటూ అమెరికా దృతరాష్ట్ర కౌగిలిలోకి తీసుకుపోతున్నారని చెబితే, ఆలోచించాల్సిందే అని ఒక్కరు అనుకున్నా చాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌, ప్రపంచానికి ముప్పు ఎవరి నుంచి ?

28 Sunday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Alliance Between United States and India, cut troops in Germany, Diego Garcia, Mauritius, Mike Pompeo, NATO, Threat to India from whom


ఎం కోటేశ్వరరావు
చైనా విస్తరణ వాదం వర్తమానకాల సవాలు అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పాడు, దాన్ని ఎదుర్కొనేందుకు తమ వనరులను సమీకరిస్తామని అన్నాడు.జర్మన్‌ మార్షల్‌ ఫండ్‌ బ్రసెల్స్‌ ఫోరమ్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి భారత్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, ఇండోనేషియా, దక్షిణ చైనా సముద్రాలకు ముప్పు ఉందని పాంపియో వ్యాఖ్యానించాడు. ఈ నేపధ్యంలో భారత్‌కు అమెరికా సైన్యం బాసటగా నిలవనున్నదని మీడియా వ్యాఖ్యానాలు చేసింది. ” చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌, ఆగేయాసియాకు అమెరికా మిలిటరీ తరలింపు: పాంపియో ” ఒక ఆంగ్ల దినపత్రిక శీర్షిక. ఈ వార్తలు వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఇంకేముంది అమెరికా సైన్యం భారత్‌కు మద్దతుగా వస్తున్నట్లు, చైనాను అడ్డుకొనేందుకు సిద్దపడటం, అంతా అయిపోయినట్లు దాని మంచి చెడ్డలను చర్చిస్తున్నారు.
భారత్‌ లేదా ప్రపంచానికి అసలు ముప్పు ఎవరి నుంచి ఉంది? చైనా నుంచా ? అమెరికా నుంచా ? విస్తరణ వాదం అంటే ఏమిటి ? రెండవ ప్రపంచ యుద్దంలో పరాజిత జర్మనీ లేదా విజేత సోవియట్‌ యూనియన్‌ గానీ ఒక వేళ దాడి చేస్తే పరస్పరం సహకరించుకుందామంటూ 1947 మార్చి నాలుగున ఫ్రాన్స్‌-బ్రిటన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తరువాత తమ పరిసర దేశాలతో దాన్ని వెస్టరన్‌ యూనియన్‌గా విస్తరించారు.1949 ఏప్రిల్‌ నాలుగున మరికొన్ని ఐరోపా దేశాలు, అమెరికా, కెనడాలకు విస్తరించి నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో)గా మార్పు చేశారు. ఏ జర్మనీ నుంచి ముప్పు అని ఒప్పందం ప్రారంభమైందో ఆ జర్మనీయే 1955లో నాటోలో చేరింది. ఏ సోవియట్‌ యూనియన్‌ అయితే దాడి చేస్తుందనే ప్రచారం చేశారో అది ఏ ఒక్కదేశం మీద కూడా దాడి చేయలేదు.1991లో సోవియట్‌ సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత దాని రిపబ్లిక్‌లు స్వతంత్రదేశాలుగా ప్రకటించుకున్నాయి. సోవియట్‌తో ప్రచ్చన యుద్దంలో తామే విజేతలమని అమెరికన్లు ప్రకటించుకున్న తరువాత నాటో కూటమిని రద్దు చేయాలి. ముప్పు అనుకున్న సోవియట్‌ అసలు ఉనికిలోనే లేదు. అలాంటపుడు ఐరోపాకు ఎవరి నుంచి ముప్పు ఉన్నట్లు ? రద్దు చేయకపోగా ఇతర దేశాల్లో మిలిటరీ జోక్యానికి పూనుకుంది. అనేక దేశాలకు విస్తరింప చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో చేస్తున్న మిలిటరీ ఖర్చులో 70శాతం ఈ కూటమి ఖర్చే ఉంది. ప్రస్తుతం ప్రపంచానికి అది ముప్పుగా పరిణమించింది అంటే అతిశయోక్తి కాదు.1990దశకం నుంచి అనేక దేశాల మీద అమెరికన్లు, దాని మిత్రదేశాలు ఏదో ఒక వంకతో చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం. ఇక విస్తరణ వాదం గురించి చెప్పాల్సి వస్తే 1949 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు విస్తరించారు,పన్నెండు నుంచి 30దేశాలకు సభ్య రాజ్యాలు పెరిగాయి. ఇంకా విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా చేరిన దేశం ఉత్తర మాసిడోనియా. అనేక దేశాలు నాటో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి శత్రువు ఎవరో, ఎవరి నుంచి రక్షణ పొందటానికో అగమ్యగోచరం.
ఇప్పుడు జర్మనీలో ఉన్న సైన్యాలను తగ్గించి భారత్‌, ఆగేయాసియాకు తరలిస్తామని పాంపియో చెబుతున్నాడు. అసలు చైనా విస్తరణ వాదం అనేది ఒక ఊహాజనితం, కుట్ర సిద్ధాంతాలలో భాగం. జర్మనీ నుంచి సైన్యాల తగ్గింపు-భారత్‌కు తరలింపు అన్నది లడఖ్‌ ఉదంతాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొంద చూసే అమెరికా యత్నం తప్ప మరొకటి కాదు. భారత్‌-చైనాల మధ్య తాజా సరిహద్దు ఉదంతాలు జరగటానికి ఎంతో ముందే అమెరికా ఆ నిర్ణయానికి వచ్చింది. భారత్‌కు మేలు చేసేందుకే ఇది అన్నట్లు ఇప్పుడు ఫోజు పెడుతోంది.
జర్మనీలో 35వేల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు. వారిని 25వేలకు కుదిస్తామని అమెరికా చెప్పింది. నాటో నుంచి తాము వైదొలుగుతామని గత ఎన్నికల్లో చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.నాటో నిర్వహణకు అయ్యేఖర్చును తామే ఎందుకు భరించాలని ప్రశ్నించి అదే ట్రంప్‌ వివాదపడిన విషయం తెలిసిందే. అదిరించో బెదిరించో ఖర్చును ఐరోపా దేశాల మీద నెట్టి తమ చేతికి మట్టి అంటకుండా నాయకత్వ స్ధానంలో ఉండాలన్నది అమెరికా ఎత్తుగడ. తనకు లాభం లేదనుకున్న అనేక ప్రపంచ సంస్ధలు, ఒప్పందాల నుంచి అమెరికా వైదొలిగింది.నాటో నుంచి వైదొలుగుతామని బెదిరించటం తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేయటం లేదు. అమెరికా గనుక అంత పని చేస్తే నాటో బలహీనపడి రష్యాకు ఉపయోగపడుతుందని నిపుణులు హెచ్చరించటమే దీనికి కారణం.
నాటోకు చెల్లింపులు చేయటాన్ని జర్మనీ ఒక అపరాధంగా భావిస్తోంది, ఐరోపా దేశాలు తమ రక్షణకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టుకోవాలి, జర్మనీ వైఖరిని మార్చుకోనట్లయితే అక్కడి నుంచి సైన్యాలను తగ్గించాలన్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ట్రంప్‌ చెప్పాడు. అమెరికా సైన్యాలు ఐరోపాలో అట్లాంటిక్‌ దేశాల భద్రత కోసం ఉన్నాయి తప్ప జర్మనీని రక్షించటానికి కాదని అమెరికాలో జర్మనీ రాయబారి ఎమిలీ హార్బర్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నిజానికి జర్మనీలో అమెరికన్‌ సైన్యాల మోహరింపు మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా తదితర చోట్లకు వేగంగా తరలించటానికి అనువుగా ఉండటం తప్ప జర్మనీకో మరో ఐరోపా దేశానికో ముప్పు కారణం కాదు. నాటో సభ్యరాజ్యాలు తమ జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని రక్షణకు ఖర్చు పెట్టాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంటే దాని సైనికులు, ఆయుధాలకు ఐరోపా దేశాలు చెల్లించాలన్నది అసలు విషయం.
జర్మనీతో అమెరికాకు వాణిజ్య పేచీ కూడా ఉంది. వాణిజ్యం విషయంలో అమెరికాను జర్మనీ చాలా చెడ్డగా చూస్తోంది, చర్చలు జరుపుతున్నాం గానీ సంతృప్తికరంగా లేవు. వారి వలన అమెరికాకు కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి, నాటో విషయంలో మా మనసు గాయపడింది. మా సైనికులు చేసే ఖర్చుతో జర్మనీ లబ్ది పొందుతోందని ట్రంప్‌ రుసరుసలాడాడు. తాము రక్షణ కోసం జిడిపిలో 3.42శాతం ఖర్చు చేస్తుంటే జర్మనీ కేవలం 1.8శాతమే కేటాయిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా విమర్శించాడు. నాటో బడ్జెట్‌లో అమెరికా, జర్మనీ 16శాతం చొప్పున భరిస్తున్నాయి. ఈనేపధ్యంలోనే అమెరికన్‌ సైనికుల ఖర్చును భరించే మరో దేశం కోసం ట్రంప్‌ చూస్తున్నాడన్నది స్పష్టం. అది మన దేశం అవుతుందా ? మరొక ఆగేయాసియా దేశం అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే అమెరికాను మన భుజాల మీద ఎక్కించుకొనేందుకు మన పాలకవర్గం సిద్దం కాదు. దానితో చేతులు కలిపి లబ్ది పొందాలని చూస్తున్నదే తప్ప లొంగిపోయి అది విసిరే ఎంగిలి మెతుకులు తినాలని అనుకోవటం లేదు. ఈ వైఖరి నుంచి వైదొలిగే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అమెరికా సైన్యాలు మన గడ్డమీద తిష్టవేసే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.
ప్రపంచంలోని 150దేశాలలో లక్షా 70వేల మంది అమెరికన్‌ సైనికులు విధులలో ఉన్నారు. వారిలో గరిష్టంగా జపాన్‌లో 55వేలు, దక్షిణ కొరియాలో 26, జర్మనీలో 35, ఇటలీలో పన్నెండు, బ్రిటన్‌లో పదివేల మంది ఉన్నారు. మైక్‌ పాంపియో చీకట్లో బాణం వేశాడు. జర్మనీ నుంచి తగ్గించదలచిన తొమ్మిదిన్నరవేల మందిని ఎక్కడకు తరలించాలన్నది ఇంకా తేలాల్సి ఉంది. జర్మనీతో రాజీ కుదిరితే వారిని అక్కడే కొనసాగించవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా నేడు ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దాన్నే విస్తరణవాదంగా అమెరికా, దాని అడుగుజాడల్లో నడిచే దేశాలు చిత్రిస్తున్నాయి. ఈ పేరుతోనే గడచిన మూడు సంవత్సరాలలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన బల ప్రదర్శలో భాగంగా మూడు విమాన వాహక, ఇతర యుద్ద నౌకలను అమెరికా మోహరించింది. వాటిని చూపి మనతో సహా అనేక దాని మిత్ర దేశాలకు మీ వెనుక మేమున్నాం చైనా మీదకు మీరు దూకండి అని అమెరికా సందేశాలు పంపుతోంది. దానికి ప్రతిగా చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది. వాణిజ్య పరంగా పెట్టుబడులు, ఒప్పందాలు తప్ప చైనా మిలిటరీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే అది అనేక చోట్ల నిర్మిస్తున్న రేవులు వాణిజ్యంతో పాటు మిలిటరీని ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయని అమెరికా, దాన్ని అనుసరించే వారు చెబుతున్నారు. కానీ వారు 150దేశాల్లో అమెరికా మిలిటరీ లేదా దాని సైనిక కేంద్రాలు ఎందుకు ఉన్నాయో చెప్పరు.
ప్రస్తుతం అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలంటే నావికులు నడిపే 390, నావికులు లేకుండా కంప్యూటర్లద్వారా నడిచే మరో 45 నౌకలు కావాల్సి ఉంటుందని ఒక సంస్ధ అంచనా వేసింది. దీనికి గాను ప్రస్తుతం అమెరికా వద్ద మొత్తం 294 మాత్రమే ఉన్నాయని, 2030 నాటికి వాటిని 355కు పెంచుకొనేందుకు అమెరికన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. భారత్‌ తమ ప్రధాన రక్షణ భాగస్వామి అని 2016లోనే అమెరికా ప్రకటించింది. ఆ తరువాత మన మిలిటరీతో సంబంధాలను గణనీయంగా మెరుగుపరుకుంది, తొలిసారిగా మన త్రివిధ దళాలతో సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. విశాఖ నుంచి కాకినాడ వరకు అమెరికా నావికా దళం ప్రయాణించింది. ఒక రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. ఇవన్నీ చైనాను ఎదుర్కొనే అమెరికా వ్యూహంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. గతంలో అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ పేరుతో ఉన్న మిలిటరీకి తాజాగా ఇండో -పసిఫిక్‌ కమాండ్‌ అని మార్చారు. ఇవన్నీ భారత్‌ను తనతో తీసుకుపోయే వ్యూహంలో భాగమే. ప్రపంచ పోలీసుగా అమెరికా తనకు తానే బాధ్యత తీసుకొని పెత్తనం చెలాయించ చూడటం ప్రపంచానికే ముప్పు. దానితో జతకట్టిన దేశాలకూ ముప్పే. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్న సామెత తెలిసిందే.
తాజా విషయాన్ని చూద్దాం. ఢిల్లీ నుంచి కన్యాకుమారి దూరం 2,800 కిలోమీటర్లు అయితే మారిషస్‌కు చెందిన చాగోస్‌ దీవుల నుంచి కన్యాకుమారి దూరం కేవలం 1,722 కిలోమీటర్లు మాత్రమే. హిందూ మహాసముద్రంలోని ఈ దీవుల్లో ఒకటైన డిగోగార్షియాలో అమెరికా నావికా దళ కేంద్రం ఉంది. ఈప్రాంతాన్ని ఆక్రమించిన ఫ్రెంచి వారు తరువాత బ్రిటన్‌కు అప్పగించారు.వారు సంయుక్త భాగస్వామ్యం పేరుతో అమెరికాకు అప్పగిస్తే అక్కడ వారు సైనిక కేంద్రాన్ని నెలకొల్పారు. అది మన రక్షణకు ముప్పు అని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతోంది.యావత్‌ ప్రపంచంలో తమది అత్యంత ప్రజాస్వామిక దేశమని బ్రిటన్‌ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అత్యంత అప్రజాస్వామికంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన వలసగా చేసుకుంది. చాగోస్‌ దీవులను బ్రిటన్‌ 2019 నవంబరులోగా మారిషస్‌కు అప్పగించి అక్కడి నుంచి తప్పుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆదేశించింది. బ్రిటన్‌ దాన్ని ధిక్కరించింది.
1968లో బ్రిటన్‌ నుంచి మారిషస్‌ స్వాతంత్య్రం పొందింది. అయితే తాము మారిషస్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుందని గ్రహించిన బ్రిటన్‌ తనకు అధికారం లేకపోయినా చాగోస్‌ దీవుల సముదాయంలో పెద్దదైన డిగోగార్షియా, దానిపక్కనే ఉన్న మరికొన్నిటినీ ఒక మిలిటరీ కేంద్రంగా వినియోగించుకొనేందుకు అనుమతిస్తూ అమెరికాకు కౌలుకు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ దీవులను తమకు అప్పగించాలని మారిషస్‌ డిమాండ్‌ చేస్తూనే ఉన్నా అపర ప్రజాస్వామిక దేశాలైన బ్రిటన్‌, అమెరికా దాన్ని ఖాతరు చేయలేదు.2019 ఫిబ్రవరి 25న వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. తరువాత మే 22న ఐక్యరాజ్యసమితి 116-6ఓట్ల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి బ్రిటన్‌ ఆ దీవులను ఖాళీ చేయాలని ఆదేశించింది. అమెరికా, బ్రిటన్‌ తిరస్కరించాయి. తమ మధ్య కుదిరిన ద్విపక్ష వ్యవహారాల మీద నిర్ణయం చేసేందుకు అంతర్జాతీయ కోర్టు, ఐరాసకు అధికారం లేదని వాదించాయి.
స్వాతంత్య్ర సమయంలో అధికారానికి రానున్న మారిషస్‌ నేత శివసాగర్‌ రామ్‌గులామ్‌ను బ్రిటన్‌ బ్లాక్‌మెయిల్‌ చేసింది, చాగోస్‌ దీవుల గురించి మాట్లాడవద్దని బెదిరించింది.1965లో తాము చేసుకున్న ఒప్పందం చట్టబద్దమే అని సముద్ర చట్టాల ట్రిబ్యునల్‌ 2015లో నిర్ధారించిందని బ్రిటన్‌ వాదిస్తోంది. అయితే ఆ ట్రిబ్యునల్‌ వాదనను ప్రపంచ కోర్టు కొట్టివేసింది. ఐక్యరాజ్యసమితి 1514 తీర్మానాన్ని ఆ ఒప్పందం ఉల్లంఘించిందని కోర్టు పేర్కొన్నది. ఈ ఒప్పందం 2036వరకు అమల్లో ఉంటుంది. మారిషస్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ దీవుల్లో నివాసం ఉంటున్న దాదాపు 1,500 చాగోసియన్లను బలవంతంగా మారిషస్‌, షెషల్స్‌కు తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో తాము చాగోస్‌ దీవులను సందర్శిస్తామని మారిషస్‌ ప్రకటించింది. అది బ్రిటన్‌ ప్రాంతమని, అక్కడ పర్యటించాలనుకోవటం రెచ్చగొట్టటమే అని, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటూ అమెరికా బెదిరించింది. దాంతో మారిషస్‌ రాయబారి ఒక ప్రకటన చేస్తూ 2036లో డిగోగార్సియా దీవి ఒప్పందాన్ని బ్రిటన్‌ పునరుద్దరించలేదని, అయితే తాము అమెరికాకు 99 ఏండ్లకు కౌలుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆ దీవుల్లో వారిని మారిషస్‌ మీద రెచ్చగొట్టేందుకు బ్రిటన్‌-అమెరికా డబ్బు ఆశచూపుతూ విభజించి పాలించే ఎత్తుగడను అమలు చేస్తున్నాయి.
చైనా విషయానికి వస్తే అది ఏ మిలిటరీ కూటమిలోనూ సభ్య దేశం కాదు. 1962లో అది మనతో చేసిన యుద్దం తప్ప అంతకు ముందు, తరువాత కమ్యూనిస్టు చైనా సైన్యానికి యుద్దం చేసిన అనుభవం కూడా లేదు. చైనాతో పోలిస్తే మన మిలిటరీ ఖర్చు తక్కువ, మొత్తంగా చూస్తే బలాబలాల రీత్యా చైనాదే పైచేయి అయినప్పటికీ పాకిస్ధాన్‌తో జరిగిన యుద్ధాల కారణంగా అనుభవం రీత్యా మనమే మెరుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు జరగని మన సరిహద్దుల్లో ఒక్క ఉదంతం కారణంగానే రెండు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశాలు లేవు. అటూ లేదా మన వైపు నుంచి గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అనువైన వాతావరణం కూడా లేదు. అయితే కరోనా, అంతకు ముందునుంచి ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం నుంచి బాధ్యతను ఇతరుల మీదకు నెట్టివేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికి తోడు నవంబరులో జరిగే ఎన్నికలలో లబ్ది పొందేందుకు ట్రంప్‌ అనేక ఎత్తులు వేస్తున్నాడు. వాటిలో మనం చిక్కుకోరాదు.
చాగోస్‌ దీవులను బ్రిటన్‌ ”త్యాగం ” చేస్తే చైనా ఆక్రమిస్తుందని బ్రిటన్‌లో కొందరు రెచ్చగొడుతున్నారు. ముత్యాల హారం పేరుతో చైనా అమలు చేస్తున్న వ్యూహంలో భాగంగా హిందూ మహా సముద్రంలో అనేక చోట్ల అది వాణిజ్య, మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చిత్రిస్తున్నారు. మరోసారి బ్రిటన్‌ ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలంటే చాగోస్‌ దీవులను కలిగి ఉండాల్సిందేనని చెబుతున్నారు. మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండాల మీద నాటో కూటమి ఆధిపత్యం సాధించాలంటే డిగోగార్షియా, ఇతర దీవులు బ్రిటన్‌ ఆధీనంలోనే ఉండాలని వాదిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరికి ముప్పు పరిగణిస్తున్నారో వేరే చెప్పాలా ?(చైనా ముత్యాల హారం వ్యూహం గురించి మరోసారి చెప్పుకుందాం) మైక్‌ పాంపియో చెప్పినట్లు జర్మనీ నుంచి లేదా నేరుగా అమెరికా నుంచే సైనికులను తరలించాల్సి వస్తే మారిషస్‌ నోరు మూయించి నావికా దళ కేంద్రంగా ఉన్న డిగోగార్షియాలో అవసరమైన మార్పులు చేసి మిలిటరీని అక్కడ పెట్టేందుకు అవకాశం ఉంది. అది జరగాలన్నా ఏర్పాట్లకు కొంత సమయం పడుతుంది. అది చైనాకే ముప్పు అనుకుంటే పొరపాటు, అమెరికా రెండంచుల పదును ఉన్న కత్తి వంటిది. తన ప్రయోజనాలే దానికి ముఖ్యం. ఎటు నుంచి అయినా ఎవరిని అయినా దెబ్బతీయగలదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్తి ” ట్రంప్‌ ఆకాశంలో…. మోడీ పాతాళంలోనా ! హతవిధీ !!

27 Saturday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India-China border, China, Donald trump, INDIA, Narendra Modi, Trade Protectionism


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వీసాల రద్దుపై మౌనమేల మోడీ మహాశయా !

24 Wednesday Jun 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 2 Comments

Tags

Donald trump, H1B Visa issue, Narendra modi and BJP silent on H1B visa issue


ఎం కోటేశ్వరరావు
లక్షలాది మంది యువత ఆశల మీద నీళ్లు చల్లుతూ తమ దేశంలోకి విదేశీ కార్మికులు రావద్దంటూ వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్‌ తాజా చర్య గురించి మోడీ లేదా ఆయన పరివారం ఇంతవరకు నోరు మెదపలేదు. పచ్చిగా చెప్పాలంటే కరోనాతో సహజీవనం చేయాలంటూ కనీస చర్యలకు సైతం తిలోదాకాలు ఇస్తున్న పాలకులు ట్రంప్‌ చర్యపై మౌనానికి అర్ధం మీ చావు చావండి అనటమే. అమెరికన్లు ఎందరో నిరుద్యోగంతో ఉన్నందున కొన్ని మినహాయింపులలో తప్ప విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో మా దేశంలో ప్రవేశించటానికి లేదు అని మన ప్రధాని జిగినీ దోస్త్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించేశాడు. ఆ నిషేధం ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని చెప్పాడు. ట్రంప్‌ ప్రకటనను గూగుల్‌ సిఇఓ సుందర పిచ్చయ్యతో సహా అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులందరూ తప్పు పట్టారు.
డాలర్‌ కలలు కంటున్న అనేక మంది లబోదిబో మంటున్నారు. డాలర్‌ దేవుడు చిలుకూరు బాలాజీ ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ ఉద్యోగాలు లేక అమెరికా పోలేక మన యువత తీవ్ర నిరాశకు గురవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గత చర్యల కొనసాగింపుగా డోనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని కోరుతూ మన ప్రధాని నరేంద్రమోడీ చప్పుట్లు కొట్టిస్తారో, వీసాల నిషేధంపై మనసు మార్పించాలని ప్రార్ధిస్తూ దీపాలు ఆర్పించి కొవ్వొత్తులు వెలిగించమని చెబుతారో లేక మరేదైనా ఖర్చులేని వినూత్న కార్యక్రమం ఏమైనా ప్రకటిస్తారో తెలియదు.
ట్రంప్‌ నిర్ణయం వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఎలాంటి స్పందన వచ్చిందో ఒక్కసారి చూద్దాం.
అమెరికా కలలు కంటున్నవారికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం.భారత అభివృద్ధి కథ ఇప్పుడే ప్రారంభమైంది-తిరిగి రండి దేశాన్ని నిర్మిద్దాం. నమస్తే ట్రంప్‌కు భారత ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేసింది-దానికి బదులుగా డిసెంబరు వరకు హెచ్‌1బి వీసాలను ట్రంప్‌ రద్దుచేశాడు. మచ్చుకు కొన్ని ఇవి, యువతలో ఉన్న నిరాశను, మన పాలకులపై ఉన్న ఆశ-భ్రమలు, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి.
అసలెందుకు ట్రంప్‌ ఈ పని చేశాడు ? అమెరికా ఎన్నికలు 133 రోజులు ఉన్నాయనగా ఎన్నికల ఫలితాలను తారు మారు చేసేందుకు విదేశాలు మిలియన్ల కొద్దీ బ్యాలట్‌ పత్రాలను ముద్రిస్తాయని, వర్తమానంలో ఇది పెద్ద కుంభకోణమని సోమవారం నాడు ప్రకటించిన ట్రంప్‌ మంగళవారం నాడు వీసాల రద్దు నిర్ణయాన్ని వెలువరించాడు. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో గత వారాంతంలో జరిగిన ఎన్నికల సభకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని కలలు కన్న ట్రంప్‌కు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటంతో హతాశుడయ్యాడు.మన దేశంలో పోస్టల్‌ బ్యాలట్ల మాదిరి విదేశాలలో ఉన్న అమెరికన్లకు ఇమెయిల్‌ ద్వారా అటువంటి సౌకర్యం ఉంది. గతంలో ఎవరు అధికారంలో ఉంటే వారు అలాంటి నకిలీ బ్యాలట్లను తమకు అనుకూలంగా తెప్పించుకున్న ఉదంతాలేమైనా జరిగి ఉన్న కారణంగానేే ట్రంప్‌ ముందే ఎదురుదాడికి దిగారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఓడిపోతే నేను ముందే దొంగ ఓట్ల గురించి చెప్పాను అని చెప్పేందుకు ఒక సాకును వెతుక్కుంటున్నారా ? అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా బ్యాలట్‌ పత్రాలను ముద్రించే విధానం ఉన్నందున ఏవి నకిలీవో ఏవి కాదో గుర్తించటం అంత సులభం కాదని వార్తలు వచ్చాయి.
ఇక గూగుల్‌,ఇతర బడా కంపెనీల ప్రతినిధులు ట్రంప్‌ నిర్ణయంపై ఆశాభంగం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబరు వరకే అని చెప్పినా వారి నుంచి అలాంటి స్పందన వెలువడిందంటే ఒక వేళ ట్రంప్‌ ఓడిపోయి డెమోక్రాట్లు గెలిచినా ఒక వేళ అనూహ్యంగా ట్రంపే గెలిచినా అమెరికా యువతను సంతృప్తి పరచేందుకు ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తే తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళన వారిలో కలిగిందా ? ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం ఎప్పుడు తొలుగుతుందో, ఇంకెంతగా దిగజారుతుందో ఎవరి ఊహకూ అందటం లేదు. అసలే ఆర్ధిక సంక్షోభం దానికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటులా కరోనా వైరస్‌ జమిలిగా ప్రపంచ ధనిక దేశాలను ఊపివేస్తున్నాయి.
గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసిన భారతీయులు తక్కువ మందే అయినప్పటికీ తాజా పరిణామంతో తాము ట్రంప్‌ చేతిలో మోసపోయినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తగినంత మంది నిపుణులు ఉన్పప్పటికీ భారత్‌, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తక్కువ వేతనాలకు పని చేసేందుకు ముందుకు వస్తారు. ఆ విధంగా వారి శ్రమదోపిడీని కొనసాగించేందుకు తప్ప అమెరికన్‌ కార్పొరేట్‌లకు విదేశీయుల మీద ప్రేమ, అనురాగాలు ఉండి కాదు. వీసాల మీద ఆంక్షలు విధించి విదేశీ కార్మికులను అడ్డుకుంటే కంపెనీలే కెనడా వంటి దేశాల్లో దుకాణాలు తెరిచి అక్కడి నుంచి పని చేయించుకుంటాయి.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 2019లో తాత్కాలికంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు గరిష్టంగా పని చేసేందుకు వీలు కల్పించే 1,33,000 హెచ్‌1బి వీసాలను, ఆయా దేశాలను బట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు పని చేసేందుకు ఇచ్చే పన్నెండువేల ఎల్‌1 వీసాలను, విదేశీ కార్మికులను పనిలో పెట్టుకొనేందుకు యజమానులకు వీలు కల్పించే 98వేల హెచ్‌2బి వీసాలను అమెరికా జారీ చేసింది. కరోనా పేరుతో ఇలాంటి వీసాలను నిలిపివేయాలని ట్రంప్‌ నిర్ణయించాడు.
అమెరికా సంపదల సృష్టిలో విదేశీ కార్మికుల శ్రమ భాగం తక్కువేమీ కాదు. స్ధానిక కార్మికులకు ఇచ్చే వేతనం కంటే బయటి దేశాల వారికి తక్కువ ఇస్తారు. అనేక దేశాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే కార్మికులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. వారికి వేతనాలు తక్కువే కాదు, అసలు ఎక్కడా వారి నమోదు ఉండదు, యజమానులకు కార్మిక చట్టాలను అమలు జరపాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయితే అక్కడ స్ధానికుల్లో అసంతృప్తి తలెత్తినపుడు విదేశీ కార్మికుల మీద ఆంక్షల చర్యల వంటి హడావుడి చేస్తారు. అమెరికాలో పని చేసే కార్మికుల్లో హెచ్‌1బి వీసాలతో వచ్చి పని చేసే వారు 0.05శాతమే అని చెబుతున్నారు. ఆ మేరకు కూడా అనుమతించే పరిస్ధితి లేదంటే స్ధానికుల్లో ఉన్న అసంతృప్తి లేదా నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులకు వీసాలు నిరాకరించటం లేదా గడువు తీరిన వీసాలను పొడిగించకుండా తిరస్కరించటం ద్వారా నవంబరు ఎన్నికలలోపు కనీసం ఐదు లక్షల ఉద్యోగాలను స్ధానికులకు కల్పించాలన్నది ట్రంప్‌ లక్ష్యంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన సమయం, అమెరికాలో ఆర్ధిక సమస్యలు తీవ్రతరం అవుతున్న కారణంగా ప్రాజెక్టులు లేక అక్కడి కంపెనీలు(ఇన్ఫోసిస్‌, విప్రో వంటి మనదేశానివి కూడా) గత కొద్ది సంవత్సరాలుగా విదేశీ కార్మికుల నియామకాలను గణనీయంగా తగ్గించాయి. ఇన్ఫోసిస్‌ 2017లో హెచ్‌1 బి వీసాలున్న వారిని 14,586 మందిని నియమిస్తే 2019 నాటికి 60శాతం తగ్గించి 5,496 మందినే నియమించింది. అలాగే విప్రో 56, టిసిఎస్‌ 52, హెసిఎల్‌ 46, కాగ్నిజంట్‌ 56శాతం మందిని తగ్గించాయి. 2016-2019 మధ్య ఈ కంపెనీల నియామకాలు 59,478 నుంచి 32,350కి తగ్గాయి.
అమెరికా వీసాల నిరాకరణ కారణంగా కంపెనీలు ఎక్కడ ఖర్చు తక్కువ ఉంటే అక్కడకు తరలిపోతాయి.ఈ రీత్యా కొన్ని విదేశీ కంపెనీలు మన వంటి దేశాలకు రావచ్చు.అయితే అది పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ సుందర పిచ్చయ్య, ఇతర అమెరికన్‌ కంపెనీల ప్రతినిధుల అసంతృప్తికి కారణం లేకపోలేదు.హెచ్‌1బి వీసాల మీద పని చేసే కార్మికుల మీద ఆధారపడటం భారతీయ కంపెనీలు 50శాతానికి పైగా తగ్గిస్తే, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి కంపెనీల ఆధారం 43శాతం పెరిగింది. అందువలన ట్రంప్‌ చర్యతో వెంటనే ఈ కంపెనీల మీద ప్రభావం పడుతుంది కనుకనే స్పందించాయి. ఈ కంపెనీలు 2016లో17,810 మంది విదేశీ కార్మికులను పెట్టుకోగా 2019కి 25,441కి పెరిగారు. ఈ నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికల తరువాత తిరిగి గెలిస్తే ట్రంప్‌ లేదా అధికారానికి వచ్చే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి జో బిడెన్‌ మీద ఈ కంపెనీలు వత్తిడి తీసుకు వచ్చి ఆంక్షలను ఎత్తివేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి భారతీయుల మీద ప్రేమ కాదు స్ధానిక కార్మికుల కంటే విదేశీ కార్మికులకు ఇచ్చే వేతనాలు తక్కువ, పని ఎక్కువ చేయించుకొనే వీలు ఉండటమే అసలు రహస్యం.
అమెరికా వెళ్లి డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించమని చెప్పి వచ్చారు-మన దేశానికి పిలిపించి పెద్ద పీట వేసి మేము మీ వెంటే అని మరోసారి చెప్పి పంపారు మన ప్రధాని మోడీ గారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సమస్య గురించి ట్రంప్‌ ప్రతి సారీ బహిరంగంగానే తన మనసులోని మాట చెబుతున్నాడు. అలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ మోడీ, ప్రభుత్వం కూడా అమెరికాతో చర్చిస్తున్నది అనే లీకు వార్తలు తప్ప ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారైనా నరేంద్రమోడీ బహిరంగంగా అభ్యంతరాల వెల్లడి సంగతి గోమాత ఎరుగు అసంతృప్తి అయినా వ్యక్తం చేసిన ఉదంతం ఉందా ? పోనీ మౌనంగా ఉండి సాధించిందేమిటి ? గతంలో దీని గురించి వార్తలు వచ్చినపుడు మై హూనా అన్నట్లు ఫోజు పెట్టిన వారు ఇప్పుడేమయ్యారని యువత ప్రశ్నిస్తోంది. వారికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పటానికి కూడా నోరు రావటం లేదా అంటున్న వారికి ఏమి చెబుతారు ? మన దేశంలో ఏమి జరిగినా కారకులు మోడీయే అని చెబుతున్నారు కనుక దీన్ని గురించి కూడా అడగాల్సింది మోడీనే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ : ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు !

21 Sunday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Boycott china goods, Ladakh border clash, Narendra Modi, swadeshi jagran manch


ఎం కోటేశ్వరరావు
మన ప్రధాని నరేంద్రమోడీ గారేమో చైనా మన భూభాగాన్ని అక్రమించలేదు, పోస్టులను స్వాధీనం చేసుకోలేదు అని అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా చెబుతారు. మరోవైపు ఆయన తెగకు చెందిన వారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు, దానిలో భాగంగానే చైనా వస్తు బహిష్కరణ పిలుపులతో కాషాయ దళాలు ఒక నాటకాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య జరిగిన విచారకర ఘర్షణలో మన వారు 20 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. చైనా తమ వారు ఎందరు మరణించిందీ చెప్పకపోయినా మన బిజెపి నేత, మాజీ సైనిక అధికారి 45 మంది చైనీయులను మన వారు చంపినట్లు చెబుతున్నారు. దాన్ని నమ్ముతున్న వారే ఎక్కువ మందిని మనమే చంపినా చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.
ఏ దేశంలో అయినా పాలకులే మనోభావాలను రెచ్చగొట్టి ముందుకు తెచ్చినపుడు దానికి మీడియా మసాలా కూడా తోడైతే రెచ్చిపోవటం సహజం. రేటింగ్‌లు పెంచుకొనేందుకు అలా చేస్తాయని మనకు తెలిసిందే. ఉద్రేకాలు బాగా ఉన్నపుడు మంచి చెడ్డల విచక్షణ ఉండదు కనుక అది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడదాం. ఈ పిలుపులు ఇస్తున్న వారు, దానికి అనుగుణ్యంగా వీధుల్లో దృశ్యాలను సృష్టిస్తున్నవారిలో అసలు నిజాయితీ, విశ్వసనీయత ఎంత?
ఢిల్లీ-మీరట్‌ ఆర్‌ఆర్‌టిఎస్‌ ( మెట్రో రైల్‌) పధకంలో కొంత మేరకు భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు షాంఘై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ(ఎస్‌టిఇసి)కి కేంద్ర ప్రభుత్వ టెండర్‌ దక్కింది. దాన్ని రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) ఆందోళనకు దిగింది. ఆ టెండర్‌ను పిలిచేటపుడు, అర్హతలను కోరినపుడు, తెరిచినపుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు వీరంగానికి దిగటం ఏమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబ సభ్యుడైన నరేంద్రమోడీ మిగతా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోరా ? క్రమశిక్షణకు మారు పేరు, పద్దతిగా ఉంటాం అని చెప్పుకొనే వారు అంతా అయిపోయాక ఆందోళనకు దిగటం ఏమిటి ?
ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు(ఏడిబి) నుంచి అప్పు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ( మా మోడీ ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధల నుంచి అప్పులు తీసుకోవటం నిలిపివేశారు, అప్పులను తగ్గిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారు దీని గురించి తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు) మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నది.నిబంధనలు అవకాశం ఇచ్చిన మేరకు టెండర్లలో మూడు విదేశీ, రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2019 నవంబరులో టెండర్లు పిలిచి ఈ ఏడాది మార్చి 16న తెరిచారు. చైనా కంపెనీ రూ.1,126.9 కోట్లకు చేస్తామని పేర్కొనగా మన ఎల్‌అండ్‌ టి కంపెనీ రూ.1,170 కోట్లతో రెండవదిగా నిలిచింది. ఈ టెండర్‌ను లాంఛనంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోగా సరిహద్దు వివాదం చెలరేగింది. జూన్‌15న గాల్వాన్‌లోయ సరిహద్దు ఘర్షణల తరువాత స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆందోళనకు దిగి ఆ టెండర్‌ను రద్దు చేయమంది. ఇప్పుడు తమ కాషాయ దళాన్ని సంతృప్తి పరచేందుకు కేంద్రం ఈ టెండరును రద్దు చేస్తుందా ? చేస్తే ఎడిబికి ఏ సంజాయిషీ ఇస్తుంది ? అది అంగీకరిస్తుందా ? సరిహద్దువివాదం సద్దు మణిగిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్‌ చైనా కంపెనీకి అప్పగిస్తుందా ?
ప్రభుత్వ రంగ సంస్ధ బిఎన్‌ఎన్‌ఎల్‌ వ్యవస్ధను మెరుగుపరచేందుకు రూ.8,640 కోట్ల టెండర్‌లో చైనా కంపెనీలు పాల్గొనకుండా చూసేందుకు మార్పులు చేస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ప్రకటించింది. దీని వెనుక వేరే శక్తుల హస్తం ఉందా ? ఎందుకంటే ప్రపంచం 5జి ఫోన్లకు మారేందుకు, 6జి ఫోన్ల అభివృద్దికి పరుగులు పెడుతున్నది. ప్రయివేటు జియో, ఎయిర్‌టెల్‌ వంటి వారికి మార్కెట్‌ను అప్పగించేందుకు మన బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌లను ఇంకా 3జిలోనే ఉంచి దెబ్బతీశారు. ఇప్పుడు 4జి కూడా లేకుండా చేసేందుకు చైనా పేరుతో దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.దీంతో ఉన్న కనెక్షన్లు కూడా పోతాయి. ఆర్ధిక, బ్యాంకింగ్‌, రక్షణ, టెలికామ్‌ రంగాలలో పిపిఇ మార్గంలో వచ్చే పెట్టుబడులలో చైనా కంపెనీల నుంచి వచ్చే వాటిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
అలాంటి ఆలోచన గాల్వాన్‌ ఘటనకు ముందే ఎందుకు లేదు ? మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ముద్దు-చైనా పెట్టుబడులు వద్దు అంటున్నారని భావిద్దాం ! చైనాకు పోయే లాభాలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు పోతాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పిచ్చివారిని సంతృప్తి పరచటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? చైనా కంపెనీలు అనేక దేశాలలో స్దాపించిన అనుబంధ లేదా సోదర కంపెనీల ద్వారా పలు దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, వాటిని కూడా అడ్డుకుంటారా ?
మేకిన్‌ ఇండియా అంటూ నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఓట్లేసిన జనం, బిజెపికి మద్దతుదార్లుగా ఉన్న వ్యాపారులు మేడిన్‌ చైనా వస్తుమయంగా దేశ మార్కెట్‌ను మార్చివేశారు. అంటే వారిలో దేశభక్తిని పెంపొందించటంలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందనుకోవాలా ? నరేంద్రమోడీ తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షించే, చాపకింద నీరులా భలే పని చేస్తుంది అని కొందరు అనుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి చేస్తున్నట్లు ? స్వదేశీ అంటూ బయలు దేరిన తమ నేతలు విదేశీగా మారిపోవటాన్ని ఆ సంస్ధ ఎలా అనుమతించింది? అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటుందా ? పరిణామాలను చూస్తుంటే దాని తీరుతెన్నులపై అనుమానాలు కలగటం లేదా ? ఎవరైనా ఎందుకిలా సందేహించాల్సి వస్తోంది?
” 2014వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పుటి వరకు ప్రకటించిన పెట్టుబడులు, వచ్చినవి మొత్తం 2,600 కోట్ల డాలర్లు, మరో 1500 కోట్ల డాలర్లను వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెడతామని చైనా సంస్దలు వాగ్దానం చేశాయి. ఇవిగాక ప్రభుత్వ నివేదికల్లో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల జాబితాలో చేరనివి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు గ్జియోమీ టెలికాం సంస్ధ సింగపూర్‌ అనుబంధ కంపెనీ ద్వారా 50.4 కోట్ల డాలర్ల పెట్టుబడి ఒకటి. పశ్చిమ దేశాల్లో మాదిరి భారత్‌లో చైనా సంస్ధలు తనిఖీని తప్పించుకున్నాయి టెలికాం రంగంలో 5జి ప్రయోగాల్లో అనేక దేశాలల్లో చైనా సంస్ధ హువెయిపై ఆంక్షలు విధించగా భారత్‌లో ఒక నిర్ణయం తీసుకోకపోయినా తొలి ప్రయోగాల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ( మార్చి 31వ తేదీ ది ప్రింట్‌ వ్యాసం).” ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ నష్టపరిహారం ఇచ్చి రద్దు చేస్తారా ? పరిహారం ఎవరు చెల్లిస్తారు ? పరిహారమేమీ లేకుండా నెత్తిన చెంగేసుకొని పొమ్మంటే పోవటానికి చైనా అంత బలహీనంగా ఉందా ? మనం చేసుకున్న ఎగుమతి ఒప్పందాలను చైనా రద్దు చేయకుండా ఉంటుందా ?
చైనాతో లడాయి ఎవరికి లాభం, ఎవరికి నష్టం ? వీధుల్లో చైనా ఉన్మాదంతో వీరంగం వేస్తున్న వారు కమ్యూనిస్టులు చెబుతున్నది ఎలాగూ వినిపించుకోరు. కమ్యూనిస్టేతరులు చెబుతున్నదైనా పట్టించుకుంటారా ? జూన్‌ 20న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరి అతుల్‌ ఠాకూర్‌ ఒక విశ్లేషణ చేశారు. ఆయనేమీ కమ్యూనిస్టు పార్టీ నేత కాదు.చైనాతో విరోధం ఆదేశం కంటే భారత్‌కే ఎక్కువ నష్టం అన్నది దాని సారం. మన దేశం అమెరికాకు ఎంతశాతం వస్తువులను ఎగుమతి చేస్తున్నదో కాస్త అటూ ఇటూగా రెండవ స్ధానంలో చైనాకు ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు చైనాకు పదకొండుశాతం వరకు ఉంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనేది 2.1శాతంతో పన్నెండవ స్దానంలో ఉన్నామని అతుల్‌ చెప్పారు. మన దేశం నుంచి ఏటా చైనాకు ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తుంటే చైనా నుంచి వస్తున్నవారు రెండున్నరలక్షలు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.
చైనా వస్తువులు మన దేశంలో విస్తరించటానికి కచ్చితంగా కమ్యూనిస్టులైతే కారణం కాదు. ఉదాహరణకు ఢిల్లీ సాదర్‌ బజార్‌లో దాదాపు 40వేల మంది రిటైల్‌ వర్తకులు చైనా వస్తువులను అమ్ముతున్నారు. ఆ దుకాణాల్లో ఒక్కటి కూడా సీతారామ్‌ ఏచూరి లేదా ప్రకాష్‌ కారత్‌కు గానీ లేవు. అక్కడ అమ్మేవారు చెప్పేది ఒక్కటే చైనా ధరలకు భారతీయ తయారీ వస్తువులను సరఫరా చేయండి చైనా వస్తువులను నిలిపివేస్తాం అంటే , తాము కూడా కొనటం మానేస్తామని వినియోగదారులు అంటున్నారు.పాలకులు లేదా చైనా వస్తు బహిష్కరణ వాదులు అందుకు సిద్దమేనా ? భారతీయ వస్తువులను తమకు ఇస్తే తమ దగ్గర ఉన్న చైనా వస్తువులను నాశనం చేస్తామని వినియోగదారులు అంటున్నారు, మరి ఆ పని చేస్తారా ? ఎంతసేపూ నిరసనకారులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ధ్వంసం చేయటం చూపుతున్నారు. చైనా ముడి వస్తువులతో మన దేశంలో తయారు చేస్తున్న ఔషధాల మాటేమిటి ? వాటిని కూడా రోడ్ల మీద పోస్తారా ? జబ్బు చేస్తే జనం దిక్కులేని చావు చావాలా ? అంతే కాదు, చైనా రసాయనాలతో ఔషధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి ఆ ఎగుమతులు నిలిచిపోవాలని కాషాయ తాలిబాన్లు కోరుకుంటున్నారా ?
ఈ మధ్య కాషాయ దళాలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలకు కట్టుబడి ఉంది కనుక చైనా వస్తువుల మీద చర్య తీసుకుంటే దాని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అందువలన దాన్ని తప్పించుకోవాలంటే జనమే స్వచ్చందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని చెబుతూ తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. అంతే కాదు, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మీద అమెరికా వాడు అణుబాంబులు వేసినప్పటి నుంచి జపనీయులు అమెరికా వస్తువులు కొనటం లేదని, మనం కూడా ఆపని ఎందుకు చేయకూడదనే ప్రచారం చేస్తున్నారు. ఉద్రేకంలో ఉన్నవారు ఇలాంటి అంశాలను నిర్ధారించుకొనేందుకు ప్రయత్నించరు.2019లో జపాన్‌ 23శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఐరోపా యూనియన్‌ నుంచి 12, అమెరికా నుంచి 11శాతం దిగుమతి చేసుకుంది. అణుబాంబులు వేసిన అమెరికా సైనిక స్ధావరాన్ని జపనీయులు సహించారు, అమెరికా రక్షణలో ఉంటామని ఒప్పందం చేసుకున్నారు. అందువలన తప్పుడు ప్రచారంతో జనాన్ని మభ్యపెట్టలేరు.
మన ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని చైనా వస్తువులు దెబ్బతీస్తున్నాయంటూ బహిష్కరణ పిలుపు ఇచ్చేదీ పాలకపార్టీ వారే. చైనా ప్రాణం మనం దిగుమతులనే చిలకలో ఉందని, వస్తువుల దిగుమతులను ఆపివేస్తే చైనా ప్రాణం పోతుందని చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత ? 2019లో మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 13.7శాతమే. వాటితోనే మన ఆర్ధిక వ్యవస్ధ నాశనం అవుతుందా ? చైనా ఎగుమతుల్లో మన వాటా రెండు-మూడుశాతం మధ్యనే అన్నది తెలుసా ? ఆమేరకు దిగుమతులు ఆపివేస్తేనే చైనా దెబ్బతింటుందా ? మతి ఉండే మాట్లాడుతున్నారా ? అదే నిజమైతే మోడీగారు ఏం చేస్తున్నట్లు ? చైనా వస్తువుల మీద అధికపన్నులు వేసి దిగుమతులను నిరుత్సాహపరిస్తే ప్రధాని మోడీ లేదా ఆయన మంత్రి వర్గ సభ్యులను డబ్ల్యుటిఓ లేదా ప్రపంచ నేర న్యాయస్ధానంలో విచారణ జరిపి శిక్షలు వేస్తారా ? వేస్తే వేయనివ్వండి ఎలాగూ వారి పూర్వీకులకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న లేదా త్యాగాలు చేసిన చరిత్ర ఎలాగూ లేదు. ఇప్పుడు దేశం కోసం పోరాడి శిక్షలకు గురైన వారిగా చెప్పుకోవచ్చు కదా ! అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారికి దేశం, జనం ముఖ్యమా ! మనకు హానికరమైన ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు ముఖ్యమా ?
ప్రపంచ వాణిజ్య సంస్ధ వివాదాల ట్రిబ్యునల్‌ ముందు వేలాది కేసులు దాఖలయ్యాయి. ఏ ఒక్కదానిలో కూడా ఒక్క దేశాన్ని లేదా దేశాధినేతను శిక్షించిన దాఖలా లేదు. కేసులు అలాసాగుతూనే ఉంటాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు పూర్తి కాలేదు, అసలు పూర్తవుతాయో లేదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకొని ధనిక దేశాలు వ్యవసాయరంగంలో దొడ్డిదారిన సబ్సిడీలు ఇస్తూనే ఉన్నాయి.
అంతెందుకు మన మోడీగారి జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇక్కడకు వచ్చి కౌగిలింతలతో ముంచెత్తుతాడు. ఒకే కంచం ఒకే మంచం అంటాడు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన మీద కేసులు వేస్తాడు. ఏమిటా కేసులు ? మన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని 2018లో ప్రపంచ వాణిజ్య సంస్ధకు అమెరికా ఫిర్యాదు చేసింది. అదేమిటటా ! సంస్ధ నిబంధనల ప్రకారం పదిశాతంలోపు సబ్సిడీ మాత్రమే ఇవ్వాల్సిన భారత్‌ తన వరి, గోధుమ రైతాంగానికి కనీస మద్దతు ధరల రూపంలో 60-70శాతం ఎక్కువగా సబ్సిడీ ఇస్తున్నట్లు చిత్రించింది. పత్తి మీద కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసింది. ఎంతైనా ” మిత్ర ” దేశం కదా !
అమెరికాలో ఏటా ప్రతి రైతు సగటున 50వేల డాలర్ల మేర సబ్సిడీ పొందుతుంటే మన దేశంలో 200 డాలర్లు మాత్రమే అని నిపుణులు చెప్పారు. అమెరికాను అడ్డుకోలేని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనం చైనా, లేదా మరొక దేశ వస్తువుల మీద పన్నులు వేస్తే ఎలా అడ్డుకోగలదు ? మరి ఎందుకు చేయటం లేదంటే మన బలహీనత, చేతగాని తనం, దాన్ని దాచుకొనేందుకు కుంటి సాకులు ? అసలు విషయం ఏమంటే మనకు విదేశీ పెట్టుబడులు కావాలి, అవి పెట్టే దేశాల వస్తువుల మీద పన్నులు వేస్తే అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి ? నరేంద్రమోడీ హయాంలో ముందే చెప్పుకున్నట్లు లెక్కల్లో చూపిన మేరకే 160 నుంచి 2600 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెరగటంతో పాటు వస్తువుల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. వస్తువులను నిలిపివేస్తే పెట్టుబడులు నిలిచిపోతాయి.
తాజా వివాదం గురించి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిందేమిటి? చైనా వారు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, మన మిలిటరీ పోస్టులను ఆక్రమించ లేదని చెప్పారు. ఈ ప్రకటన తరువాత అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే వారు, వస్తు బహిష్కరణ పిలుపు ఇచ్చి వీధులకు ఎక్కే వారు తమ నాటకాలను ఆపుతారా ? కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తాయి. మన వారి విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టాము. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇన్ని తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ?
చౌకగా వస్తున్న చైనా వస్తువుల కొనుగోలుతో మన వినియోగదారులు లబ్దిపొందారే తప్ప నష్టపోలేదు. చైనావి లేకపోతే అధిక ధరలకు ఇతర దేశాల వస్తువులను కొని జేబులు గుల్ల చేసుకోవాల్సి వచ్చేది. మిగతా దేశాల ధరలతో పోలిస్తే చైనా టెలికాం పరికరాల ధరలు 20శాతం తక్కువ. ప్రభుత్వ రంగ సంస్ధలైన బిఎస్‌ఎన్‌ఎల్‌ చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు చైనాను రంగం నుంచి తప్పించేందుకు పూనుకుంది అంటే అర్ధం ఏమిటి ?అంత మొత్తం ఎక్కువకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందనే కదా ! ప్రయివేటు కంపెనీలు కూడా అదే పని చేస్తాయా ? ప్రభుత్వం వాటికి అలాంటి షరతు విధించి అమలు జరపగలదా ? కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ మాటల్లో చెప్పాలంటే వినాయక విగ్రహాలను కూడా మనం చౌకగా తయారు చేసుకోలేని దుస్ధితిలో ఉన్నాం. చైనా కమ్యూనిస్టులు తయారు చేసిన విగ్రహాలను మన భక్తులు వినియోగిస్తున్నారు. చైనా వస్తువుల నాణ్యత గురించి గట్టి మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని పాస్వాన్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు అడ్డుకున్నారు? ఇప్పటి వరకు నాశిరకం వస్తువులను అనుమతించి మన జనాన్ని ఎందుకు నష్టపెట్టారు ?
చైనా వస్తువుల మీద లేదా కమ్యూనిస్టు చైనా మీద ఒక సంఘపరివార్‌ కార్యకర్తగా నరేంద్రమోడీకి ప్రేమ, అభిమానం ఉంటాయని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఒక వ్యాపారి మాదిరే ఆలోచిస్తారు, వ్యాపారుల వత్తిడికి లొంగిపోతారు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో లాభపడాలన్నది మన దేశ వాణిజ్య, పారిశ్రామిక సంస్ధల ఆశ, ఎత్తుగడ. ఉదాహరణకు అమెరికా పత్తి దిగుమతుల మీద చైనా 25శాతం పన్ను విధించటంతో అది అమెరికా ఎగుమతిదార్లకు గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో మన పత్తి ఎగుమతిదార్లకు వరమైంది. పర్యవసానంగా మన పత్తికి ఆమేరకు డిమాండ్‌ పెరిగి రైతులు కూడా పరిమితంగా అయినా లాభపడ్డారు. చైనాకు పెద్ద ఎత్తున పత్తి దిగుమతులు పెరిగాయి. అయితే పరిస్ధితులెప్పుడూ ఇలాగే ఉండవు. అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకొనే వైఖరులను బట్టి మిగతాదేశాల వైఖరులు మారుతుంటాయి.
గత ఏడాది చైనా వైఖరి కారణంగా మన దేశం నుంచి చైనాకు నూలు ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఒకటి ప్రపంచ వ్యాపితంగా డిమాండ్‌ పడిపోవటం ఒక కారణం అయితే, రెండవది పాకిస్ధాన్‌, వియత్నాం. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పన్నులు లేని నూలు దిగుమతులను చైనా అనుమతించటంతో మన ఎగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. దాని ప్రభావం మన రైతుల మీద కూడా పడిందా లేదా ! చైనాకు వ్యతిరేకంగా అమెరికాను కౌగిలించుకొని అది చెప్పినట్లు చేయటమే దీనికి కారణం అన్నది లోగుట్టు.మనం డబ్ల్యుటిఓ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం కనుక చైనా వస్తువుల మీద పన్నులు విధించలేమని అంటున్నవారు అమెరికా వస్తువుల మీద ఎలా విధించారు? మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువుల మీద గతంలో ఇచ్చిన పన్నురాయితీలను ”మన అపర స్నేహితుడు ” డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశాడు. మన ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై పదిశాతం పన్నులు పెంచలేదా దానికి ప్రతిగా మన మోడీ 28 అమెరికా ఉత్పత్తుల మీద దిగుమతి పన్ను పెంచలేదా ? కొన్నింటి మీద 120శాతం వేశారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ మనమీదేమీ చర్య తీసుకోలేదే? మన దేశం పన్నులను ఎక్కువగా విధిస్తున్నట్లు ట్రంప్‌ మనలను ఆడిపోసుకోలేదా ? తమ వస్తువులను మరిన్ని దిగుమతి చేసుకోవాలని మన మీద వత్తిడి తేవటం లేదా ? సరే దీని మీద కూడా ఇప్పుడు కేసు వేశారనుకోండి. ప్రతి దేశం వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొంటుంది. ఆ విషయంలో ఎవరైనా ఒకటే. పాకిస్ధాన్‌తో ఉన్న వైరం కారణంగా పంచదార దిగుమతులను అడ్డుకొనేందుకు 2018లో మన దేశం 50శాతంగా ఉన్న దిగుమతి పన్నును వందశాతానికి పెంచింది. ఈనెలలోనే మలేసియా నుంచి కాలిక్యులేటర్ల మీద ఒక్కోదానిపై 92సెంట్ల చొప్పున ఐదేండ్ల పాటు వసూలు చేసే విధంగా మన దేశం పన్ను పెంచింది. ఇదే పని చైనా వస్తువుల మీద ఎందుకు తీసుకోకూడదు ? ఎందుకంటే పాకిస్ధాన్‌, మలేషియాలు చైనా వంటివి కాదు గనుక. ఆడలేక మద్దెల ఓడు లేదా ఈ రోజు మంగళవారం కాబట్టి సరిపోయింది అన్నట్లుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఏ దేశమైనా తన మౌలిక ప్రయోజనాలకు భంగం కలిగినపుడు చర్యలు తీసుకొనేందుకు ఆ సంస్ధ నిబంధనలు అవకాశం కలిగిస్తున్నాయి. లేదూ అవి మనకు నష్టదాయకం అనుకుంటే బయటకు వచ్చేయటమే. ఈ రోజు అమెరికా ప్రయోజనాలకే అగ్రస్ధానం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక అంతర్జాతీయ సంస్ధల నుంచి బయటకు రావటం లేదా ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగటం లేదా ? డోనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్న మాదిరి 56 అంగుళాల ఛాతీ మన నరేంద్రమోడీకి లేదా ? ఆయనకు మన ప్రయోజనాలు పట్టవా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా పెట్టిన పేరే ” జకర్తా పద్దతి ” !

17 Wednesday Jun 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

annihilation of communists Jakarta Method, Indonesian Communist Party (PKI)., Jakarta Method, US anti communism


జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న మీడియా సంస్ద అల్‌ బవాబా డాట్‌ కామ్‌ లండన్‌ ప్రతినిధి నికోలస్‌ ప్రిట్‌చర్డ్‌ ఇటీవల అమెరికన్‌ జర్నలిస్టు విన్సెంట్‌ బెవిన్స్‌తో ఇంటర్వ్యూ చేశాడు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు , వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా, దాని అండతో వివిధ దేశాలు అనుసరించిన దుర్మార్గ పద్దతుల గురించి వర్తమాన తరాలకు ఆసక్తి కలగించే అంశాలను వెల్లడించారు.1960దశకంలో ఇండోనేషియాలో నియంత సుహార్తో అమెరికన్ల అండతో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టులని అనుమానించిన వారిని ఎలా చంపివేశారో విన్సెంట్‌ బెవిన్స్‌ అధ్యయనం చేశాడు. ఇండోనేషియాలో పరిమితంగానే బయలు పరచిన నాటి రహస్య పత్రాలను పరిశీలించాడు. అంతకు ముందు తరువాత అనేక దేశాలలో జకర్తా పద్దతి పేరుతో అమలు జరిపిన మారణకాండ గురించి ఈ క్లుప్త ఇంటర్వ్యూలో వివరించాడు.(జకర్తా మెథడ్‌ : వాషింగ్టన్స్‌ యాంటీ కమ్యూనిస్టు క్రూసేడ్‌ అండ్‌ ద మాస్‌ మార్డర్‌ ప్రోగ్రామ్‌ దట్‌ షేప్‌డ్‌ అవర్‌ వరల్డ్‌ ” అనే పేరుతో విన్సెంట్‌ బెవిన్స్‌ రాసిన పుస్తకాన్ని మే నెలలో పబ్లిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ ప్రచురించింది. ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూను జూన్‌ పదకొండున అల్‌ బవాబా ప్రచురించింది.) 2017లో పత్రాలను విడుదల చేసిన సమయంలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ అనువాదకుడు రాసిన వ్యాసపు లింక్‌ చివరిలో ఉంది.

నికొలస్‌ ప్రిచర్డ్‌ : జకర్తా పద్దతి అంటే ఏమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: వామపక్ష వాదులు లేదా వామపక్ష వాదులని ముద్రవేసిన అమాయక పౌరులను కావాలని సామూహికంగా హతమార్చటమే జకర్తా పద్దతి. ప్రచ్చన్న యుద్ద సమయంలో ఈ ఎత్తుగడను వినియోగించారు. ఇది ముఖ్యమైన మూలమలుపు. అమెరికా మరియు ప్రపంచ వ్యవస్దను రూపొందించాలని చూసిన వారి వైపు నుంచి చూస్తే పెద్ద విజయం, అంతిమంగా విజయం సాధించింది. ఈ విజయం రూఢి అయింది కాబట్టే అమెరికా దాని అనుయాయి దేశాలు ఈ పద్దతిని కాపీ చేయటం ప్రారంభించాయి.1970దశకం ప్రారంభంలో చిలీ, బ్రెజిల్‌లో తమకు ముప్పుగా పరిణమిస్తారు లేదా అనిపించిన అమాయకులను హతమార్చేందుకు ఈ పద్దతిని అనుసరించారు. సామూహిక హత్యలని అర్ధమిచ్చే విధంగా జకర్తా పదాన్ని వినియోగించారు. అయితే ప్రతి దేశం ఆ పదాన్ని వినియోగించలేదు గానీ ఇరవైకి పైగా అమెరికా అనుయాయి దేశాల్లో నిరాయుధులైన వామపక్ష శక్తులను సామూహికంగా హతమార్చటానికి ప్రభుత్వాలు జకర్తా పద్దతి పధకాలను అమలు జరపటాన్ని గమనించాను.

హొనికొలస్‌ ప్రిచర్డ్‌ :వలసల అనంతర స్వాతంత్య్ర దేశాలను పురికొల్పిందేమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: ప్రచ్చన్న యుద్ద సందర్భంలో తృతీయ ప్రపంచ దేశాల ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఈ పదాన్ని తరచూ నీచ అర్ధంలో వాడుతున్నారు. కానీ ఆ సమయంలో అది పూర్తిగా సానుకూల మరియు ఆశావాదంతో ఉండేది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ఈ ఉద్యమ స్ధాపక ప్రముఖులు, దార్శనికులలో ఒకరు.1955లో ఆసియా, ఆఫ్రికా దేశాలను దగ్గరకు చేర్చారు.వాషింగ్టన్‌(అమెరికా)కు ఇది ఒక సమస్యగా మారింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: అనేక తృతీయ ప్రపంచ దేశాలు అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాయి. కానీ సుకర్నో అమెరికా శత్రువు అయ్యాడు, అప్పుడు ఏమైంది?
విన్సెంట్‌ బెవిన్స్‌: అంతకు ముందు ఉనికిలో లేని ఒక పెద్ద అగ్రరాజ్యంతో దెబ్బలాడేందుకు ఎలాంటి కారణం లేదు. వలస అనంతర కమ్యూనిస్టులలో కొందరు అమెరికాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించారు.1945లో ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం ప్రకటించిన సమయంలో వియత్నాం నేత హౌచిమిన్‌ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ప్రస్తావించారు. సుకర్నో కూడా అమెరికా విమోచన యుద్ద వారసత్వ పరిధిలోనే 1955 సభ నిర్వహించారు.అయితే చివరికి అమెరికా పరిష్కరించాల్సిన సమస్యలు లేదా ఇతర కారణాలతో శత్రువులుగా తేలారు.అది విషాదకర ఫలితాలకు దారి తీసింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఇండోనేషియాలో మిలిటరీకి మద్దతుగా అమెరికా నిలిచేందుకు దారి తీసిన కీలక విధాన నిర్ణయాలేమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: ప్రచ్చన్న యుద్దం తొలి రోజులలో అమెరికా తీసుకున్న వైఖరి గురించి మాట్లాడుకున్నట్లయితే తటస్ధంగా ఉన్నప్పటికీ ప్రతి తృతీయ ప్రపంచ దేశాన్ని అది వ్యతిరేకించింది. దానికి రెండు విరుద్ద వివరణలు ఉన్నాయి. ఒకటేమి చెబుతుందంటే కమ్యూనిజం, జాతీయ భావనలతో ఉన్న దేశాలతో తమకు ముప్పు అనే తీవ్ర మానసిక వ్యాధికి అమెరికా గురైంది. ప్రపంచంలో దోపిడీ చేస్తున్న దేశాలను కుదురుగా ఉంచాలంటే ప్రపంచ వ్యవస్దలో హింసాత్మక ఆధిపత్యం చలాయించే స్దితిని అమెరికా వారసత్వంగా పొందింది అని రెండో వివరణ చెప్పింది. వందల సంవత్సరాలుగా ఐరోపా దేశాలు చేస్తున్న మాదిరి విధానాలను కొనసాగించేందుకు ఒక సాకుగా కమ్యూనిస్టు వ్యతిరేకత పని చేసింది. నేనయితే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందనుకోను. ఒకదానినొకటి పరస్పరం బలపరుచుకుంటాయి.
ఇండోనేషియా విషయానికి వస్తే అమెరికా తీసుకున్న ఈ వైఖరి అత్యంత భయంకర పర్యవసానాలకు దారితీసింది. అంతకు ముందు దశాబ్దకాలంగా ” ఒక సమస్యను ” పరిష్కరించాలని చూస్తున్న అమెరికా చివరి యత్నంగా సామూహిక వధే పరిష్కారం అని నిర్ణయించుకుంది. తొలి యత్నంగా ఎన్నికల్లో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ విజయాన్ని అడ్డుకుంటుంది అనే ఆశతో 1955లో ఒక మితవాద ముస్లిం పార్టీని స్ధాపించేందుకు సిఐఏ నిధులు ఇవ్వటం ప్రారంభించింది. అది పని చేయలేదు. రెండవ యత్నంగా ఇండోనేషియా దీవులపై బాంబులు వేస్తూ సిఐఏ పైలట్లు దొరికి పోయారు. మూడవ యత్నంగా వాషింగ్టన్‌ తన బలం మొత్తాన్ని ఒక హింసాత్మక పరిష్కారానికి అందించింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: అమెరికా ఏమి చేసింది ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ, మితవాద మిలిటరీ మధ్య ఘర్షణలు సృష్టించేందుకు 1964-05లో సిఐఏ, ఎం16 రహస్యంగా పని చేశాయి. వివాదం తలెత్తగానే కమ్యూనిస్టులను అణచివేయటానికి అది సరైన సమయం అని అమెరికా రాయబారి గుర్తించాడు. అది వాస్తవం కాదని తెలిసినా కమ్యూనిస్టులు కుట్రపన్నారంటూ అమెరికా తనశక్తికొద్దీ ప్రచారం చేసింది. ఇండోనేషియా మిలిటరీకి కావాల్సిన వాటన్నింటినీ అందించింది. బ్యాంకాక్‌లో ఉన్న సిఐఏ కేంద్రం నుంచి ఆయుధాలను అందచేసేందుకు అనుమతించింది. సమాచార వ్యవస్ధకు అవసరమైన పరికరాలను అందచేసింది.
హత్యాకాండ ప్రారంభం కాగానే అమెరికా అధికారులు నిరంతరం నివేదికలు తెప్పించుకున్నారు. జరుగుతున్నదాని పట్ల తాము సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని హత్యలను ప్రోత్సహించారు.హత్య చేయాల్సిన వారి జాబితాలను అందచేశారు. ఒక ఉద్యోగి జాబితాల్లోని వారిని అంతం చేశారా లేదా అని సరి చూసేవాడు. అది ఎంత భయంకరంగా ఉండేదో మీరు ఊహించుకోవాల్సిందే. అయితే ఇలా చేయటం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు నుంచీ జరుగుతోందనే ఆధారాలు మనకు ఉన్నాయి.1954లో గౌతమాలాలో, సిఐఏ మద్దతుతో ఇరాక్‌లోని బాత్‌ పార్టీ తిరుగుబాటు సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలో, ఇతర వామపక్ష కార్యకర్తల్లో హతమార్చవలసిన వారి జాబితాలను 1963లో అమెరికా అధికారులు అందచేశారు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఇండోనేషియాలో ఎంత మందిని చంపారు ?
విన్సెంట్‌ బెవిన్స్‌: షుమారు పది లక్షల మంది ఉంటారని నేను చెబుతున్నా. అనేక మంది నిపుణులు ఐదు నుంచి పదిలక్షల మంది ఉన్నారని చెప్పారు. తాజాగా జరిగిన సంచలనాత్మక అధ్యయనం ప్రకారం దాదాపుగా పది లక్షల మంది అని చెప్పారు.ఈ అనిశ్చితికి కారణం లేకపోలేదు.విచారణల్లో సరైన సంఖ్య ఇంతవరకు రాకపోవటానికి ఇప్పటికీ అమెరికా మద్దతు ఉన్న మిలిటరీ ఎంతో పట్టుకలిగి ఉండటమే కారణం. అసలేమి జరిగింది అని తెలుసుకొనే ఆసక్తి ఇండోనేషియా ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేదు.దీనికి తోడు ఏమి జరిగిందో వెలికి తీయాలంటూ ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా తగిన వత్తిడి కూడా రాలేదు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: హత్యల మీద అమెరికాలో స్పందన ఏమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ఉల్లాసం. విధాన నిర్ణేతలు, మరియు జర్నలిస్టులు స్వీకరించిన తీరు అమెరికాలో ఎంతో ఉల్లాసంగా ఉంది. బాబీ కెన్నడీ మాత్రమే ప్రముఖుల్లో వ్యతిరేకంగా గళం విప్పారు. సంతోషం, సంబరాల సముద్రంలో అది గులకరాయి విసిరినట్లుగా ఉంది. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక ప్రముఖ ఉదారవాది ఆసియాలో మిణుగురు వెలుగు పేరుతో రాసిన దాన్ని నేను నా రచనలో ఉటంకించాను. అత్యంత అనారోగ్య పద్దతిలో వారికి సరైనదే. వారికి అది విజయం. భౌగోళిక రాజనీతి ప్రాధాన్యతల ప్రకారం 1960దశకంలో వియత్నాం కంటే వారికి ఇండోనేషియా ముఖ్యం. పశ్చిమదేశాల ప్రవాహంలో ఇండోనేషియా పడితే వియత్నాంను నిలువరించటం ప్రాధాన్యత సంతరించుకుంటుందని రాబర్డ్‌ మెక్‌నమారా తన జ్ఞాపకాల్లో రాశాడు. ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పతనం వియత్నాంలో అమెరికాకు ముప్పును ఎంతగానో తగ్గించింది, ఇప్పుడు ఇంకా కొన్ని పాచికలు మాత్రమే ఉన్నాయి అవి సులభంగానే పడిపోయేట్లు కనిపిస్తున్నాయి అని కూడా మెక్‌నమారా రాశాడు. సోవియట్‌ యూనియన్‌ ఊచకోతను ఆపేందుకు ప్రయత్నించలేదు లేదా వాస్తవానికి ఖండించలేదు. మౌలికంగా చూస్తే నిరాయుధ ఇండోనేషియన్‌ కమ్యూనిస్టు పార్టీని అంతం చేయటాన్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోలేదు.

హొనికొలస్‌ ప్రిచర్డ్‌: జకర్తా పద్దతిని ఇరాక్‌లో ఎలా ఉపయోగించారు ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ, గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌, సుకర్ణో వంటి వారి నాయకత్వాన తృతీయ ప్రపంచం ఒక్కటైనపుడు ఆఫ్రో-అసియన్‌ ప్రపంచంలో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(అధికారంలో లేని పార్టీలలో) మొదటి స్ధానంలో, ఇరాక్‌ పార్టీ రెండవ, సూడాన్‌ పార్టీ మూడవ స్ధానంలో ఉన్నాయి. ఈ మూడింటిని దాదాపుగా తుడిచిపెట్టారు.
1963లో బాత్‌ పార్టీ తిరుగుబాటు చేసింది, కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష శక్తులను అంతం చేసింది. నేను ఒక ప్రముఖ ఇరాకీ జర్నలిస్టును ఇంటర్వ్యూ చేశాను. ఇరాకీ వామపక్ష శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన సమయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన వారిలో ఒకడిగా సద్దామ్‌ హుసేన్‌ పేరు మోశాడు. ఎవరెవరిని అంతం చేయాలో సూచిస్తూ బాత్‌ పార్టీకి అమెరికా అధికారులు జాబితాలను అందచేశారు. తరువాత ఇండోనేషియాలో అదే పద్దతిని అమలు జరిపారు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఈ ఉదంతాలలో విదేశాల్లో అమెరికా చేసిన దానికీ, స్వంత గడ్డమీద తలెత్తే ఘర్షణల పట్ల స్పందించటానికి ఏదైనా సంబంధం ఉందా ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ప్రపంచంలో తిరుగుబాట్లను అణచివేసేందుకు అనుసరించిన పద్దతులు, తన స్వంత పౌరుల పట్ల అనుసరించిన విధానాల గురించి ఎంతో ఆసక్తికరమైన పరిశోధనలు ఉన్నాయి. స్టువర్డ్‌ ష్క్రాడర్‌ రాసిన బాడ్జెస్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అనే పుస్తకం ఉంది. విదేశాల్లో తిరుగుబాట్లను అణచివేసే అర్ధ సామ్రాజ్యవాద పోలీసుగా పనిచేసిన అమెరికా తన స్వంత జనంపైనే యుద్ధం చేసేదిగా ఎలా పరిణమించిందో దానిలో వెల్లడించారు.అమెరికా సెటిలర్‌ వలసవాదం, జాత్యహంకార నేపధ్యంలో తృతీయ ప్రపంచ దేశాలలో అమెరికా జోక్యాన్ని చూడాల్సి ఉంది. అది ఆఫ్రికా, అసియాల్లో అత్యాచారాలకు పాల్పడిన పూర్తి జాత్యహంకార ప్రభుత్వంగానే వ్యవహరించింది. అంతేకాదు ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక విధానాలు మరియు తిరుగుబాట్ల అణచివేత యుద్ధ చరిత్ర పరిధిలో వర్తమాన అమెరికా పోలీసు వ్యవస్ధ ఎలా పని చేస్తున్నదో చూడాల్సి ఉంది. ప్రపంచ మంతటా అదే పద్దతుల్లో వ్యవహరించిందో తన స్వంత గడ్డమీద కూడా అదే విధంగా ఉంది.
https://vedikaa.com/2017/10/19/us-hand-in-1960s-indonesia-anti-communist-massacre-revealed/
అనువాదం : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

11 Thursday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, G7, G7 summit, G7 Summit in Camp David, G7 to G12


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం, బెదిరింపుల వెనుక అసలు కథేంటి !

31 Sunday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald Trump threats and intolerance on WHO, G7 summit, WHO Controversy, WTO


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ – చైనా మధ్యలో దూరే అవకాశం లేదు ట్రంప్‌ గారూ !

29 Friday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, India and China, India-China border stand off

ఎం కోటేశ్వరరావు
భారత్‌ాచైనాల మధ్య వివాదాస్పర సరిహద్దు సమస్యలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెండు దేశాలకూ తెలియచేశానని కూడా చెప్పారు. మరుసటి రోజు ఇదే అంశంపై మాట్లాడుతూ ” మోడీతో మాట్లాడాను. చైనాతో తలెత్తిన పరిస్ధితి గురించి ఆయన మంచి మానసికస్దితిలో(గుడ్‌ మూడ్‌) లేరని నేను చెప్పగలను.రెండు దేశాలూ సంతోషంగా లేవు” అని కూడా ట్రంప్‌ చెప్పారు. ఇది ఎంతో తెలివిగా చేసిన వ్యాఖ్య. నిజంగా మోడీ ఎలా ఉన్నారో తెలియదు. నీవు నీ భార్యను కొట్టటం మానుకున్నావా అని ఎవరైనా అడిగినపుడు ఏ సమాధానం చెప్పినా తంటాయే. మామూలుగానే మన ప్రధానికి మాట్లాడే అలవాటు లేదు కనుక స్పందన తెలియదు. అయితే మన విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ చైనాతో శాంతియుతంగా పరిష్కరించే పనిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా చైనా కూడా స్పందించింది. ట్రంప్‌ ప్రస్తావన లేకుండా చైనా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ చైనా-భారత్‌ సరిహద్దు విషయంలో చైనా వైఖరి స్పష్టం. శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రంప్‌ జోక్యం అవసరం లేదని చైనా మీడియా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు లడఖ్‌ ప్రాంతంలో తలెత్తిన తాజా పరిణామాల గురించి చైనా వ్యాఖ్యాతలు పరిస్ధితి అదుపులోనే ఉందని చెబుతున్నారు తప్ప మన దేశంలో మీడియా మాదిరి యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్లు చిత్రీకరించటం లేదు.
కరోనా వైరస్‌తో సహజీహనం చేయాలంటూ పాలకులు తమ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు పూనుకున్నారు.దరిద్రం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, అక్రమాలు, రోగాలు, రొష్టులు, అంటరానితనం, కులతత్వం, మతోన్మాదం, సామాజిక వివక్ష, అణచివేత ఇలా చెప్పుకొంటే శతకోటి అవాంఛనీయాలతో సహజీవనం చేయటానికి, దేనికీ స్పందించలేని స్ధితికి అలవాటు పడ్దాం.
కరోనా వైరస్‌ మీద కేంద్రీకరించిన మీడియాకు ఇప్పుడు భారతాచైనా సరిహద్దు వివాదం ఒక రేటింగ్‌ సాధనంగా మారింది. యుద్దం వస్తే బాగుండు అన్నట్లుగా కొందరి వ్యవహారం ఉంది. ఎంత రంజుగా రాస్తే అంత గొప్ప, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత కసి ఉన్నట్లు, ఎంతగా జాతీయ(దురహంకారం)వాదాన్ని ప్రదర్శిస్తే అంత గొప్ప దేశభక్తులని భావిస్తున్న ఈ రోజుల్లో భిన్న అభిప్రాయం సంగతి దేవుడెరుగు, భిన్న సమాచారాన్ని పాఠకులు, వీక్షకుల ముందుంచటం కూడా దేశద్రోహంగా ముద్రవేస్తున్న ఒక ప్రమాదకర స్ధితిలో ఉన్నాం.
రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే ముందు బలయ్యేది నిజం. ఇప్పుడు అదే జరుగుతోందా ? చైనా-భారత్‌ సరిహద్దు వివాదం బ్రిటీష్‌ పాలకుల పుణ్యం. కాగితాల మీద గీసిన సరిహద్దుల ప్రకారం ప్రాంతాలు లేవు. ఆయా దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల ప్రకారం సరిహద్దు గీతలు లేవు. తమ ఆధీనంలో లేని ప్రాంతాల మీద హక్కులు తమవే అని రెండు దేశాలూ చెప్పటమే వివాదాలకు కారణం. పరస్పరం సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకోవటం తప్ప మిలిటరీ చర్యల ద్వారా పరిష్కారాలు సాధ్యం కావన్నది ప్రపంచ అనుభవం. రష్యాతో, ఇతర పూర్వం సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి తరువాత స్వతంత్రులుగ మారిన మధ్య ఆసియా దేశాలతో చైనా ఈ పద్దతిలోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది. మన దేశం కూడా ఇలాగే పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వెలిబుచ్చినందుకు కొందరు కమ్యూనిస్టులను 1962లో నాటి పాలకులు జైల్లో పెట్టారు. చైనాతో యుద్దానికి మద్దతు ఇచ్చిన మరి కొందరు కమ్యూనిస్టులను బయట తిరగనిచ్చారు.
ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప అనుభవం రాదని పెద్దలు చెబుతారు.1962 యుద్దం తరువాత పదమూడు సంవత్సరాలకు 1975లో భారత్‌-చైనా ఒక అవగాహనకు వచ్చాయి. దాని ప్రకారం సరిహద్దుల్లో ఏదైనా వివాదం తలెత్తితే ఏ వైపు నుంచి తుపాకులు పేలకూడదు, తూటాలు బయటకు రాకూడదు. దానికి రెండు దేశాలూ ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాయి.అయితే మధ్యలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదా ? రెండు దేశాల మధ్య ఉందని చెబుతున్న వాస్తవాధీన రేఖ ఒక ఊహ, తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. దాన్ని అధికారికంగా ఎవరూ గుర్తించటం లేదు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని వారు సంరక్షించుకోవటం, దానిలో భాగంగా కాపలా ఏర్పాట్లు తప్ప నిర్దారణ లేదు. దాన్ని లేదా ఇతర మార్పులు చేర్పులతో గుర్తిస్తే అదే అధికారిక సరిహద్దు అవుతుంది.
సరిహద్దు ఉల్లంఘనలు జరిగాయి అని భావించిన ప్రతిసారీ గతంలో అటూ ఇటూ మోహరించిన సైనికులు చేతులతో తోసుకున్నారు, కాస్త ముదిరితే ముష్ఠిఘాతాలకు తలపడ్డారు, రాళ్లు విసురుకున్నారు. ఈ లోగా రెండు వైపులకూ సమాచారం చేరటం, జోక్యంతో సర్దుమణగటం మామూలైంది.2017 డోక్లాం వివాదంలో 72రోజుల పాటు రెండు వైపులా సైనికులు మోహరించటం తప్ప ఒక్క తూటా, ఫిరంగి పేలలేదు. తాజాగా జరుగుతున్న ఉదంతాలలో ఇనుపరాడ్లు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అసలెందుకు ఇది జరిగింది, జరుగుతోంది ?
సరిహద్దులలో రెండు వైపులా మౌలిక వసతులు క్రమంగా మెరుగుపడుతున్న కారణంగా పహారా పెరుగుతోంది. ఆ ప్రాంతాలకు సరిహద్దు భద్రతా దళాలు చేరేందుకు పెద్దగా వ్యవధి అవసరం లేకపోతోంది. పర్యవసానంగా ఉల్లంఘనలు జరిగాయని భావించినపుడు వివాదాలు చెలరేగేవి.సర్దుబాటు చేసుకొనే వారు. అనేక ఉదంతాలు మీడియా వరకు వచ్చేవి కాదు. వచ్చిన వాటికి వాస్తవం గోరంత అయితే కొండంత కల్పనలతో చెలరేగిపోయేవి.
భారత్‌-చైనా మధ్య లడఖ్‌ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆక్సారు చిన్‌ ఒక వివాదాస్పద ప్రాంతం. అక్కడ యుద్దం కూడా జరిగింది.అది తొలి నుంచీ తమ ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. కాదు మనదే అని మన దేశం అంటోంది. మన ఏలుబడిలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతం కనుక తమదే అని చైనా చెబుతోంది. ఎన్నడూ టిబెట్‌లో భాగంగా లేదు, మాతోనే ఉంది అని మనం చెబుతున్నాం. ఈ వివాదాన్ని ఎవరు తేల్చాలి ? మూడో పక్షానికి అవకాశం ఇచ్చామా ? అవి అక్కడ తిష్టవేస్తాయి. రెండు దేశాల జుట్లూ చిక్కించుకుంటాయి. మరి ఎలా తేలాలి. సంప్రదింపులు, సంప్రదింపులు, సంప్రదింపులు. రెండు వైపులా చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం అసాధ్యం కాదు.
తాజా వివాదానికి కారణం ఏమిటి ? సరిహద్దు సమస్య పరిష్కారం కానప్పటికీ ఏ దేశానికి ఆదేశం తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో రోడ్లు వేసుకోవటం, మిలిటరీ ఏర్పాట్లు చేసుకోవటానికి ప్రయత్నించినపుడు అదిగో మా ప్రాంతంలో మీరు ఆక్రమణకు పాల్పడ్డారు అని ఉభయులూ వివాదపడతారు. లడక్‌ ప్రాంతంలోని గలవాన్‌ లోయ. సముద్ర మట్టానికి పదిహేనువేల అడుగున ఎత్తు ఉంటుంది. అక్కడ రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ కాశ్మీర్‌ నుంచి మయన్మార్‌ వరకు ఉంది. దాన్ని ఇద్దరూ అంగీకరించరు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో వారు తమ తమ బలగాలను పటిష్టపరచుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గలవాన్‌లోయ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముందుగా భారత్‌ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని వార్తలు. ఇది వివాదాస్పద ప్రాంతంలో జరుగుతోందంటూ అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నించింది. చైనా మిలిటరీ కదలికల తరువాతనే మన ప్రాంతంలో మిలిటరీ వ్యవస్దల నిర్మాణానికి చైనా పూనుకుందంటూ మన దేశం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండు వైపులా సైనికులు గుడారాలు వేసుకొని అడ్డుకొనేందుకు కాచుక్కూర్చున్నారు. చైనా వైపున 80 నుంచి వంద గుడారాలు, భారత్‌ అరవై గుడారాలు వేసినట్లు వార్తలు. అటు అన్నివేల మంది సైనికులు ఉన్నారు, ఇటు ఇన్నివేల మంది సిపాయిలున్నారనే వార్తలు అటూ ఇటూ మీడియా విభాగాలు ఒక పధకం ప్రకారం ఇచ్చే లీకులు, ఇష్టాగోష్టి వార్తలు తప్ప ఎవరూ తలలు లెక్కపెట్టింది లేదు. ఇంతకు మించి అటూ ఇటూ ఎలాంటి ఒప్పంద ఉల్లంఘనలు జరిగినట్లు విమర్శలు లేవు.
లడఖ్‌లో దౌలత్‌ బేగ్‌ ఓల్డీ విమానస్దావరాన్ని గతేడాది అక్టోబరులో మన దేశం ప్రారంభించింది.దానికి దారితీసే 66 రోడ్లను 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో మన దేశం నిర్మిస్తోంది. వాటిలో కొన్ని చైనా ఆధీనంలోని గలవాన్‌లోయకు దగ్గరగా ఉన్నాయి. ఒక ప్రధాన రోడ్డు వాస్తవాధీన రేఖకు సమాంతరంగా అనేక పాయింట్లను కలుపుతూ నిర్మితమౌతోంది. దీన్ని చైనా అభ్యంతర పెడుతోంది.ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలు తమవని చైనా చెబుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 2017లో డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్లు నిర్మించటాన్ని మన దేశం అభ్యంతరం పెట్టింది. అది వాస్తవానికి భూటాన్‌ -చైనా మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతం. అయితే భూటాన్‌తో మనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, భూటాన్‌ కోరిక మేరకు డోక్లాంలో చైనాను అడ్డుకున్నట్లు మన ప్రభుత్వం చెప్పింది. అయితే అసలు వాస్తవం ఏమిటంటే డోక్లాం మన సిలిగురి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నందున మన భద్రతా ప్రయోజనాలకు ముప్పు అన్నది మన వ్యూహకర్తల ఆందోళన. గత ఏడాది మన దేశం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. మన మ్యాపులో తమ ఆధీనంలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతాన్ని కూడా లడఖ్‌ ప్రాంతంగా చూపటాన్ని అప్పుడే చైనా అభ్యంతర పెట్టింది. మ్యాపులో చూపినా వాస్తవాధీన రేఖ యథాతధ స్దితి కొనసాగుతుందని మన దేశం ప్రకటించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించిన రోడ్లపై కూడా చైనా అభ్యంతరాలు తెలిపింది.
గత నాలుగు వారాలలో నాలుగు చోట్ల రెండు దేశాల కాపలా బృందాలు తారసపడ్డాయి. వాటిలో మూడు లడఖ్‌లో, నాలుగోది సిక్కిం దగ్గర టిబెట్‌ను కలిపే నుకాలా కనుమవద్ద అని వార్తలు వచ్చాయి.1993లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎవరైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించినపుడు మీరు అతిక్రమించారు, వెనక్కు పోండి అని చెప్పటం, అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా సైనికులు చొచ్చుకు వచ్చారని మన మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనా కూడా అదే చెబుతోంది, తమ గలవాన్‌లోయలో భారత్‌ రోడ్డు నిర్మిస్తోందని అంటున్నది. భారత దళాల సాధారణ పహారాకు ఆటంకం కలిగించే విధంగా చైనా వ్యవహరిస్తోందని భారత విదేశాంగశాఖ విమర్శించింది.
మన దేశం-నేపాల్‌ మధ్య ఉత్తరాఖండ్‌లో 62చదరపు కిలోమీటర్ల కాలపానీ ప్రాంతం మన ఆధీనంలో ఉంది. అయితే అది తమ ప్రాంతమని నేపాల్‌ 1998 నుంచి వివాదాన్ని రేపింది. అది పరిష్కారం కాలేదు. మేనెల ప్రారంభంలో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ రిమోట్‌తో ఆ ప్రాంతంలో ఒకరోడ్డు ప్రారంభోత్సవం చేశారు. ఆ చర్యను నేపాల్‌ నిరసించింది. వేరే వారి ప్రమేయంతో నేపాల్‌ ఆ చర్యకు పాల్పడిందంటూ చైనాను ఉద్దేశించి పరోక్షంగా మన సైనికాధికారి ఎంఎం నవరానే వ్యాఖ్యానించారు.1816లో నేపాల్‌, నాటి బ్రిటీష్‌ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందంలో మహాకాళీ నది నుంచి నేపాల్‌ పడమటి సరిహద్దు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అయితే ఆ నది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నదానిపై రెండు దేశాల మధ్య స్పష్టత లేకపోవటం వివాదానికి కారణం.
తాజా పరిణామాలపై రెండు దేశాల సామాజిక, సాంప్రదాయ మాధమాల్లో అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వాటిని ఇక్కడ పేర్కొంటున్నామంటే ఏకీభవించినట్లు కాదు. మన దేశంలో ట్విటర్లలో వెలువడుతున్న అభిప్రాయాల ఒక మచ్చుతునక ఇలా ఉంది.” సింధు జలాలపై మోడీ పాకిస్ధాన్‌ను బెదిరించినపుడు చైనా బ్రహ్మపుత్ర నీటితో చేస్తుంది.లిపులేఖ్‌ దగ్గర సరిహద్దును మార్చాలని మోడీ నేపాల్‌ మీద వత్తిడి తెచ్చినపుడు చైనా లడఖ్‌లోని వాస్తవాధీన రేఖను దాటుతుంది. మోడీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటమే చైనా పధకం” దీనిలో వాస్తవాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే ప్రతి దేశం తన రాజకీయాలను తాను చేస్తుందన్నది కనిపిస్తోంది.
చైనా మీడియాలో వచ్చిన వార్తలు, విశ్లేషణల సారాంశం ఇలా ఉంది.” తాజా సరిహద్దు వివాదం ఏదో యాదృచ్చికంగా జరిగింది కాదు. భారత్‌ ఒక పధకం ప్రకారమే వ్యవహరించింది. గాలవాన్‌ లోయ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉందని భారత్‌కు స్పష్టంగా తెలుసు. మే తొలి వారంలో చైనా ప్రాంతంలోకి భారత్‌ ప్రవేశించింది, సైన్యం కావాలని రెచ్చగొట్టింది. చైనా పహరా బృందాలకు ఆటంకాలు కల్పించింది. ఆ లోయలో చైనా మిలిటరీది పైచేయి అని తెలుసు కనుక భారత సైన్యం తెగేదాకా లాగుతుందని అనుకోవటం లేదు. ఒక వేళ పరిస్ధితిని దిగజార్చితే భారత మిలిటరీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో వైఫల్యం వలన భారతీయ సమాజం నుంచి వచ్చిన వత్తిడి పెరిగింది. ఇంతకు ముందే బలహీన పడిన భారత ఆర్ధిక పరిస్ధితి కరోనా కారణంగా మరింతగా దిగజారి మాంద్యలోకి పోనుందని గోల్డ్‌మన్‌శాచస్‌ పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీ పలుకుబడి ఉన్నత స్ధాయిలోనే ఉన్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను అధిగమించటానికి అది పని చేయదు.కనుక స్ధానిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి మరోసారి చైనాతో సరిహద్దు సమస్యను పెంచి పెద్దది చేసేందుకు నిర్ణయించింది. ఆర్ధిక, వైద్య సహాయం కోసం చైనాతో బేరమాడేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సరిహద్దు వివాదాలను రోజువారీ సాధారణ వ్యవహారంగా మార్చేందుకు భారత్‌ పూనుకుంది.ఎందుకంటే సరిహద్దులకు తరచుగా సైన్యాన్ని పంపేందుకు దానికి భౌతిక సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి.కనుక ఇదొక దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. చైనా కంటే భారత్‌కు అంతర్జాతీయ వాతావరణం అనుకూలంగా ఉందని భారత్‌లోని కొందరు పండితులు నమ్ముతున్నారు.చైనా-అమెరికా మధ్య విబేధాలు తీవ్రతరమైతే అమెరికాకు దగ్గరయ్యేందుకు భారత్‌కు అవకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఒకటైతే అంతర్జాతీయ రాజకీయాల కారణంగా తీసుకుంటున్న వైఖరులు కూడా వివాదాన్ని ముదిరేట్లు చేస్తున్నాయి. టిబెట్‌, తైవాన్‌ రెండు ప్రాంతాలూ చైనాలో అంతర్భాగమే అన్నది మన ప్రభుత్వ అధికారిక వైఖరి. అయితే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల మద్దతుతో టిబెట్‌లో తిరుగుబాటు చేసిన దలైలామాను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అణచివేసింది. దాంతో దలైలామా పారిపోయి మన దేశం వచ్చాడు. ప్రాణభయంతో ఆశ్రయం కోరిన వారికి రక్షణ కల్పించటాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ జరిగిందేమిటి ? దలైలామా మన దేశంలోని హిమచల్‌ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రవాస ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ ఆ పేరుతో సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించింది. చైనా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పించింది. అనేక చోట్ల నివాసాలను ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగం అని చైనా చెబుతున్నది. అక్కడి తవాంగ్‌ పట్టణాన్ని దలైలామా సందర్శించేందుకు 2009లో యుపిఏ పాలనా కాలంలోనూ, 2017లో మోడీ ఏలుబడిలో మరోసారి సందర్శించేందుకు అనుమతించటాన్ని చైనా వ్యతిరేకించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లు పెట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, తైవాన్‌లను తమ ప్రాంతాలుగా చూపకుండా ముద్రించిన ప్రపంచ మ్యాప్‌లను 2019లో చైనా కస్టమ్స్‌ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
భారత-చైనాల మధ్య ఉన్న మరో వివాదాస్పద అంశం దక్షిణ చైనా సముద్రంలో జోక్యం. ఈ సముద్ర ప్రాంతం మన దేశానికి ఎంతో దూరంగా ఉంది, దానితో మనకు ఎలాంటి సంబంధం లేదు. మనకంటే ఇంకా ఎంతో దూరంలో ఉన్న అమెరికా ఈ ప్రాంత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రెచ్చగొడుతోంది.దానికి మన దేశం వంతపాడుతున్నట్లు చైనా భావిస్తోంది. ఆ సముద్రంలో ఉన్న కొన్ని దీవులపై హక్కు తమదే అని చైనా చెబుతోంది. మరో సోషలిస్టు దేశమైన వియత్నాంతో సహా ఫిలిఫ్పీన్స్‌, బ్రూనే,మలేషియా, ఇండోనేషియాలు చైనా హక్కు వాదనతో విబేధిస్తున్నాయి. ఆ దీవులలో చమురు, ఇతర సంపదలు ప్రధానమైన అంశం. ఈ వివాదాన్ని అంతర్జాతీయం చేయవద్దని చెబుతూనే దక్షిణ చైనా సముద్రంలో తాము స్వేచ్చగా ప్రయాణించే హక్కు కలిగి ఉండాలని మన దేశం కోరుతోంది. ఈ జలాలపై చైనా హక్కును గుర్తిస్తే ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలు వినియోగ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మనకూ ాచైనా మధ్య ఏవైనా తీవ్ర విబేధాలు తలెత్తితే మనకు ఇబ్బందులు వస్తాయి. మన దేశ వాణిజ్యంలో 55శాతం ఈ ప్రాంతంలోని మలక్కా జలసంధి ద్వారా జరుగుతోంది. ఈ ప్రాంతంలో బలహీనపడుతున్న అమెరికా తన ప్రతినిధిగా భారత్‌ ఉండాలని కోరుకుంటోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యక్ష స్ధానానికి తాజాగా మన దేశం ఎన్నికైంది. ఈ సంస్ధలో స్వతంత్ర రాజ్యాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. అయితే తైవాన్‌కు సభ్యత్వం ఇవ్వాలని, అధికారయుతంగా సమావేశాలకు ఆహ్వానించాలని అమెరికా పట్టుపడుతోంది. అందుకు చైనా ససేమిరా అంటోంది. మన దేశం తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందిందే అని అధికారిక వైఖరిని కలిగి ఉన్నప్పటికీ బిజెపి దానికి కట్టుబడి ఉండటం లేదు. అమెరికా క్రీడలో పావుగా వ్యవహరిస్తోంది. చైనాకు చెందిన ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌. అక్కడ జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన పార్టీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటీవల అధ్యక్షురాలు శారు ఇంగ్‌ వెన్‌ అధికారస్వీకారోత్సవానికి బిజెపికి చెందిన మీనాక్షీ లేఖి మరొక ఎంపీని ఆహ్వానించారు. ఆ మేరకు వారు ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది తమను రెచ్చగొట్టే చర్యగా చైనా పరిగణిస్తోంది.
ఈ నేపధ్యంలో తాజా పరిణామాలను ఏ విధంగా చూడాలి అన్నది సమస్య. అంతర్జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలలో ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరొక దగ్గర లైట్‌ వెలగటం తెలిసిందే. ఏ దేశంతో అయినా ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రత్యేకించి ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉండటం ఎంతో అవసరం. దాని వలన బోలెడు మిలిటరీ ఖర్చు తగ్గిపోయి, అభివృద్ధికి వెచ్చించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ, జపాన్‌లు ఆ యుద్దం ముగిసిన తరువాత రెగ్యులర్‌ మిలిటరీ కలిగి ఉండటానికి వీల్లేదని విజేతలు శాశించారు. అప్పటి నుంచి ఆత్మరక్షణ దళాల పేరుతో పరిమితి సాయుధ బలగాలే ఉన్నాయి. మిలిటరీకి చేసే ఖర్చును ఆ రెండు దేశాలు పరిశోధన, అభివృద్ధికి ఉపయోగించి పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో అభివృద్ది చెందాయి. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధలే ఉన్నందున దానిలోని అంతర్గత వైరుధ్యాల కారణంగా అవి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నా మిగతా దేశాల కంటే మెరుగ్గానే ఉన్నాయి.
ఏ రీత్యా చూసినా ఇప్పుడు ఏ దేశమూ యుద్దం చేయగల స్ధితిలో లేదు. అటు గ్జీ జింపింగ్‌, ఇటు నరేంద్రమోడీ వెనుక 140 కోట్ల మంది చొప్పున జనం ఉన్నారన్నది మర్చిపోకూడదు. ప్రస్తుత పరిస్ధితుల్లో రెండు దేశాల సరిహద్దు భద్రతా బలగాల మధ్య తలెత్తిన వివాదం గతంలో ముందుకు వచ్చిన వాటికంటే భిన్నమైనది, తీవ్రమైనది అని చెబుతున్నవారితో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇది ఇంతకు మించి మిలిటరీ చర్యలకు దారి తీసే అవకాశాలు పరిమితం. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం పేరుతో దూరేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్ధితుల్లోనూ నెరవేరదు. అది తన అనుయాయులను సంతృప్తిపరచినా ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అంగీకరించే అవకాశం లేదు. 1. రెండు దేశాలూ కరోనా వైరస్‌ మీద పోరాడుతున్నాయి. చైనాలో కరోనాను కట్టడి చేసినా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మన దేశంలో కట్టడి చేశామని చెబుతున్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. గతంలో కంటే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విదేశాల నుంచి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి నుంచి కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మనకు ఇంకా ముప్పు తొలగలేదు. 2.కరోనా కారణంగా చైనాలో ఒక్క హుబెరు రాష్ట్రమే లాక్‌డౌన్‌లో ఉంది. మన దేశం మొత్తం ఉంది. అక్కడ ఆర్ధిక కార్యకలాపాలూ పూర్తిగా కొద్ది వారాల క్రితమే ప్రారంభం అయ్యాయి. మన దగ్గర ఇంకా అనిశ్చితంగానే ఉంది. 3.కరోనాకు ముందే మన దేశం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. చైనాలో అలాంటి పరిస్ధితి లేకపోయినా వృద్ది రేటు తగ్గింది. కరోనా అనంతరం దాని వృద్ధి రేటు రెండున్నరశాతం వరకు ఉండవచ్చని అంచనాలు వెలువడుతుండగా మనది మైనస్‌ ఆరుశాతం వరకు ఉండవచ్చు అంటున్నారు. స్వల్ప యుద్దం జరిగినా రెండు దేశాలూ నష్టపోతాయి, ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు, ఎంతో మిగులులో ఉన్న చైనాతో పోలిస్తే వాణిజ్య లోటుతో ఉన్న మన నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
భారత్‌-చైనాలు రెండూ అణ్వస్త్రదేశాలే కనుక యుద్దమంటూ వస్తే పరస్పరం నాశనం తప్ప విజేతలంటూ ఉండరు. రెండూ వర్ధమాన దేశాలే కనుక యుద్దం కంటే జనజీవితాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి.భారత-పాకిస్ధాన్‌ మధ్య యుద్దం వస్తే ఆయుధాలు అమ్ముకొని లాభపడేది అమెరికా.భారత-చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా జరిగేది అదే. కనుక సంప్రదింపుల ద్వారా తాజాగా తలెత్తిన ఉద్రిక్తతలను ఉపశమింప చేసేందుకు ప్రయత్నించాలి. జాతీయవాదం, దురహంకారాన్ని రెచ్చగొట్టటం సులభం, దాన్నుంచి వెనక్కు రావటం ఎంతో కష్టం. అది సామాన్యుల్లో తలెత్తితే సమసిపోతుంది, కానీ పాలకులకే ఆ వైరస్‌ అంటుకుంటే ఏం జరుగుతుందో గతంలో చూశాము. చరిత్ర పునరావృతం కారాదని కోరుకుందాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d