• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

అదానీ కోసం కేరళలో బిజెపితో సిపిఎం చేతులు కలిపిందా ? నిజా నిజాలేమిటి ?

07 Wednesday Dec 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adani Group, BJP, Kerala LDF, Latin Catholic archdiocese, Pinarayi Vijayan, RSS, Vizhinjam project


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్కెట్‌ సునామీకి విలవిల్లాడుతున్న వనామీ రైతు !

03 Saturday Dec 2022

Posted by raomk in AP, AP NEWS, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Andhra Pradesh Aqua farmers, AP shrimp farmers, Aquaculturists, seafood export, vannamei shrimp


ఎం కోటేశ్వరరావు


దేశంలో దాదాపు రెండు లక్షల 70వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల రకం సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. టైగర్‌ రొయ్యల రకం మరొక లక్షా 50వేల ఎకరాల్లో జరుగుతోంది. ఇది ప్రధానంగా లక్షా పాతికవేల ఎకరాలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరుగుతోంది. ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వనామీ రైతులు వాపోతున్నారు. వివిధ కారణాలతో ప్రపంచంలో రొయ్యల ఎగుమతి మార్కెట్‌ అవకాశాలు తగ్గాయి. ఒక వైపు మేత ధరలు విపరీతంగా పెరగటం మరొక వైపు కొనే వారు లేక చేతికి వచ్చిన వాటిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. రానున్న కొద్ది నెలలు కూడా ఇలాగే కొనసాగితే ఈ రంగం మొత్తం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే రు.25వేల కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా. రొయ్యలను శుద్ది చేసి ఎగుమతికి అనువుగా తయారు చేసే ఫ్యాక్టరీలలో చిన్నా, మధ్యతరగతివి మూసివేతకు దగ్గరగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎగుమతులు లేవనే పేరుతో కొందరు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును సకాలంలో ముట్టచెప్పటం లేదు.


అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలలో క్రిస్మస్‌ సందర్భంగా పలు ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన ఆర్థిక వడిదుడుకుల కారణంగా ఈ ఏడాది దానికి తగిన విధంగా మన దేశం నుంచి దిగుమతి ఆర్డర్లు లేవు. చైనాలో కరోనా కేసులను సున్నాకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్లు ఇతర ఆంక్షలను విధించిన కారణంగా అక్కడి డిమాండ్‌ కూడా తగ్గినట్లు వార్తలు. ఆగస్టు నెల నుంచి ఎగుమతి డిమాండ్‌ తగ్గిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల మార్కెట్‌ సంక్షోభం మొదలైంది. విదేశాల్లో డిమాండ్‌ తగ్గటంతో ధరలు కూడా పడిపోయాయి. 2021-22లో మన దేశం నుంచి 7.76 బిలియన్‌ డాలర్ల మేర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా 8.6బి.డాలర్లను నిర్ణయించింది. అది నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. గిరాకీ తగ్గుదల 30 నుంచి 35శాతం వరకు, ధరల పతనం 20 నుంచి 25శాతం ఉన్నందున జనవరి తరువాత తిరిగి పూర్వపు స్థాయికి చేరితే తప్ప అటు కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం తగ్గుదల ఇటు రైతాంగానికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎగుమతి-దిగుమతి దేశాలన్నింటా శీతల గిడ్డంగులన్నీ ఆక్వా ఉత్పత్తులతో నిండి ఉన్నట్లు వార్తలు.ఈ కారణంగానే కొనుగోళ్లు మందగింపు, పరిస్థితి మెరుగుపడకపోదా అనే ఆశ ఉన్న ఎగుమతిదార్లు రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. మెరుగుపడితే మంచి లాభాలు లేకపోతే నష్టం ఉండదు అన్న అంచనాలే దీనికి కారణం. గతంలో కూడా మార్కెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇలాంటి తీవ్రత గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు.


ధనిక దేశాల్లో తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా జేబులకు చిల్లుపడుతున్నందున జనం తమ అలవాట్లు, అవసరాల ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటారు. అత్యవసరమైన వాటినే కొనుగోలు చేస్తారు.ఈ పరిస్థితికి తోడు గతేడాది ప్రపంచంలో 40లక్షల టన్నుల మేర రొయ్యల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది 50లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. ఇది కూడా ధరల పతనానికి ఒక కారణం అంటున్నారు. ఈక్వెడోర్‌, ఇండోనేషియా, వియత్నాంలో ఉత్పత్తి పెరిగింది. పన్నెండు లక్షల టన్నులతో ఈక్వెడోర్‌ ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగింది.చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు పెరిగింది. మన దేశం నుంచి అమెరికా, తరువాత స్థానాల్లో చైనా ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయి. రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా పక్కనే ఉన్న ఈక్వెడోర్‌ నుంచి దిగుమతి చేసుకోవటం అమెరికాలోని దిగుమతి కంపెనీలకు ఎక్కువ లాభం కనుక అక్కడి ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. చైనా కూడా అక్కడి నుంచి కొంత దిగుమతి చేసుకుంటున్నది.


మన కరెన్సీ విలువ తగ్గినందున ఎగుమతిదార్లకు పెరిగిన రవాణా ఖర్చు కలసి వచ్చి కొనుగోలు చేస్తారని భావిస్తే అమెరికా మినహా మిగిలిన దిగుమతి చేసుకొనే దేశాల కరెన్సీ విలువలు కూడా మన రూపాయి మాదిరి పతనమై ఆ దేశాలలో కొనుగోలు శక్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలోకు వంద తూగే వనామీ రకం రొయ్యలకు కనీసం రు.240 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఎవరూ కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో దాన్ని రు.210కి తగ్గించినా చిత్తశుద్దితో అమలు జరిపేవారు లేరు. నిల్వ ఉండే సరకు కానందున చివరకు రు.180, ఇంకా అంతకు తక్కువకు సైతం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు టైగర్‌ రకం ధర కూడా రు.600 నుంచి 450కి పడిపోయింది. ఈ కారణంగా గతేడాది జరిగిన 9.2లక్షల టన్నుల ఉత్పత్తి ఈ ఏడాది ఎనిమిది లేదా ఇంకా తక్కువకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం ఎగుమతి అవరోధాలు ఉన్నప్పటికీ మలేషియా, వియత్నాం, థాయిలాండ్‌ వంటి దేశాల్లో వంద కౌంట్‌ ఉన్న వాటికి రు.290 నుంచి 310వరకు రైతుకు వస్తుండగా మన దగ్గర రెండువందలకంటే తక్కువకు దిగజారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలోకు రు.300లకు తగ్గితే గిట్టుబాటు కాదని, 270 కంటే తగ్గితే నష్టమని అంటున్నారు.


మన దేశం 123 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వీటిలో ఎక్కువ భాగం రొయ్యలే ఉండటంతో గతేడాది జరిగిన మొత్తం ఆరులక్షల టన్నుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 60శాతం వరకు ఉంది. చైనా తన దిగుమతుల్లో 70శాతం మన దేశం నుంచి చేసుకొనేది ఇప్పుడు ఈక్వెడోర్‌ నుంచి కూడా చేసుకుంటున్నది. వివిధ దేశాలు చేసుకొనే దిగుమతులపై వర్తమాన రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు కూడా ప్రభావం చూపుతాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న అమెరికాతో భారత్‌ చేతులు కలుపుతోందన్న అభిప్రాయం చైనాకు ఉంది. మరోవైపున మనదేశంలో బిజెపి, దానికి మార్గదర్శకంగా పనిచేసే సంఘపరివార్‌ సంస్థల దళాలు, వారికి వంతపాడే మీడియా విశ్లేషకులు సుప్రభాతం మాదిరి రోజు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దానికి బుద్ది చెప్పాలని,మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని ప్రచారం చేస్తుంటారు. ఈ నోటి దూలను చూసిన తరువాత మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతి చేసే దేశాలున్నపుడు వాటి నుంచి దిగుమతుల చేసుకోవాలనే అలోచన కలగవచ్చు. లేకపోతే ఎంతో దూరంలో ఉన్న ఈక్వెడోర్‌ నుంచి చైనా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినట్లు ? వాటికి ప్రతిగా చైనాకు తన వస్తువులను అక్కడికి ఎగుమతి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.మన ప్రభుత్వం విధిస్తున్న ఎగుమతి పన్నులు, మన దేశంతో ఒప్పందాలు లేని కారణంగా దిగుమతి చేసే దేశాలు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు కూడా దిగుమతిదార్లను అవి లేని దేశాలవైపుకు నెడతాయి. అందువలన ఇలాంటి పన్నులు లేకుండా ఉండాలంటే మన దేశం ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కూడా అవసరమే. అయితే అలాంటి ఒప్పందాలకు వెళ్లే ముందు మన దేశ లబ్దిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఐరోపా, ఇతర దేశాలతో వియత్నాం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నందున అవి మనకు బదులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాయి. మన రొయ్యలపై తెల్లమచ్చల కారణంగా ఆస్ట్రేలియా దిగుమతులను నిలిపివేసింది. అందువలన ఎగుమతి చేసే దేశాలు కోరుకున్న ప్రమాణాల మేరకు వ్యాధులు, నిషేధిత మందుల అవశేషాలు లేకుండా మన ఉత్పత్తులుండటం కూడా అవసరమే. ఒక వేళ ఇక్కడ కన్ను గప్పి పంపినా ఎక్కడైనా పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది.


ఇక స్థానిక సమస్యల సంగతులను చూస్తే నాణ్యమైన రొయ్య విత్తన(పిల్లల) లభ్యత కూడా తీవ్రంగానే ఉంది.ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడి ఎత్తివేసేందుకు దారులు వెతికి రైతుల్లో ఆందోళన కలిగించింది. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ అని కొన్ని రోజులు, ఐదెకరాల లోపు, ఆపైవారు అని మరికొన్ని రోజులు, సర్వేల పేరుతో చేస్తున్న కాలయాపన గురించి రైతుల్లో అసంతృప్తి ఉంది. ప్రతి గ్రామంలో సచివాల యాలు, వలంటీర్లు ఉన్నందున ఒక్క రోజులో సమాచారాన్ని సేకరించవచ్చు. మరోవైపు విపరీతంగా పెరుగుతున్న మేత ధరలు అదుపులో ఉండటం లేదు. కనీస మద్దతు ధరను అమలు జరిపే అధికారులు, ఉల్లంఘించిన వారి మీద చర్యలు గానీ ఉండటం లేదు. ఎగుమతి పరిస్థితి మెరుగుపడేంతవరకు పంటవిరామం ప్రకటించాలని కూడా కొందరు రైతులు సూచిస్తున్నారు. లక్షలాది మందికి ఆక్వా ఉపాధి కల్పిస్తున్నది. అందువలన ఈ రంగాన్ని కూడా పరిశ్రమగానే గుర్తించి ఇతర పరిశ్రమలకు మాదిరే ఇస్తున్న విద్యుత్‌, ఇతర రాయితీలను అందరికీ వర్తింప చేయాలని కూడా రైతులు కోరుతున్నారు.సంక్షోభ సమయాల్లో అన్ని రంగాలను ఆదుకున్నట్లుగానే ఆక్వాను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వారి గోడును పాలకులు వినిపించుకుంటారా ? అనుమానమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌పై ప్రపంచ మాంద్య ప్రభావం పడనుందా !

24 Thursday Nov 2022

Posted by raomk in Current Affairs, Economics, employees, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Amazon, CAPITALISM, capitalist crisis, IT Job cuts, layoffs, tech companies


ఎం కోటేశ్వరరావు


నిన్నా మొన్నా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్‌ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్‌లో అమెజాన్‌ కంపెనీ డేటా కేంద్రంతో వేలాది మందికి ఉపాధి కబురు. ఒక వైపు ఆర్థిక మాంద్యం గుబులు-మరోవైపు లాభాల వేటలో కంపెనీల కొత్త కేంద్రాల ఏర్పాటు ! ఐటి కంపెనీల్లో కోతలు, కంపెనీల్లో రోబోట్లు, ఆధునిక యంత్రాల ప్రవేశం వెరసి ఉద్యోగాలు హాంఫట్‌ ! ప్రపంచంలో ఏం జరుగుతోంది ? ఉన్న ఉపాధి కోల్పోయినా, కొత్త ఉద్యోగాలు రాకపోయినా కుటుంబాల మీద దాని ప్రభావం పడుతుంది. అది తిరిగి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో మందగమనం తదుపరి మాంద్యం, అది ముదిరితే ఆర్థిక సంక్షోభం. కుటుంబాల మీద మరింత ప్రతికూల ప్రభావం, ఇదొక విష వలయం. ప్రపంచం, దేశం, రాష్ట్రం, కుటుంబాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచ ధనిక దేశాల్లో మాదిరి తీవ్ర పరిస్థితులు మన దేశంలో తలెత్తుతాయా ? తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ? మనమందరం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. అందువలన ప్రతి చోటా జరిగే ప్రతి పరిణామమూ తరతమ తేడాలతో అందరి మీదా పడుతుంది. అమెరికాలో ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తే వారిలో మన భారతీయులు,తెలుగువారు, ఆంధ్ర, తెలంగాణా వారు కూడా ప్రభావితులైనారు. చివరికి వారిలో మన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా ఉండవచ్చు.


ప్రపంచ వ్యాపితంగా ఆర్థికరంగం అనిశ్చితంగా ఉంది. వచ్చే ఏడాది అనేక దేశాలు మాంద్యంలోకి వెళ్ల వచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధి రేటును ప్రకటిస్తారు. ఏ దేశంలో వరుసగా ఆరు నెలల పాటు తిరోగమన(మైనస్‌) వృద్ది నమోదైతే అది మాంద్యంలోకి జారినట్లు పరిగణిస్తారు. గతంలో అనేక దేశాలు అలా దిగజారి తిరిగి కోలుకున్నాయి. పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న దేశాల్లో ప్రతి పదేండ్లకు ఒకసారి ఈ పరిస్థితి ఏర్పడినట్లు గత చరిత్ర వెల్లడించింది. 2008లో, 2020లో కరోనా సందర్భంగా తలెత్తిన పరిస్థితి కంటే రానున్న మాంద్యం మరింత తీవ్రంగా ఉండనుందని ఐరాస హెచ్చరించింది. వాణిజ్యం-అభివృద్ది 2022 నివేదిక ప్రకారం ప్రపంచం మాంద్యం అంచున ఉంది, ఆసియాలోని అభివృద్ది చెందుతున్న దేశాలు దీని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది.

ఆర్థికవేత్తలు చెప్పిన వాటన్నింటినీ క్రోడీకరిస్తే మాంద్యానికి ఐదు ప్రధాన అంశాలు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికా డాలరు గత కొన్ని నెలలుగా బలపడుతున్నది, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. మరింత బలంగా మారనుందని అంచనా. బలమైన డాలరు అమెరికాకు బలమూ, నష్టమూ కలిగించినట్లుగానే ప్రపంచ దేశాలకూ ఉంటుంది. బ్రిటీష్‌ పౌండ్‌,ఐరోపా యురో, చైనా, జపాన్‌, మనతో పాటు దాదాపు అన్ని దేశాల కరెన్సీల విలువలను కోల్పోయాయి. ఫలితంగా దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు 2014లో అక్టోబరులో ముడిచమురు పీపా ధర 92 డాలర్లు ఉండగా మన కరెన్సీలో రు.5,650 చెల్లించాము. ఇప్పుడు 91 డాలర్లు ఉండగా పీపాకు రు.7,514 చెల్లించాము. దీనికి కారణం మన కరెన్సీ మారకపు విలువ 61.40 నుంచి 82.26 దిగజారటమే కారణం. అన్ని దిగుమతి వస్తువుల ధరలూ ఇదే మాదిరి పెరిగాయి. మన వారు విదేశాల్లో చదువుకుంటే వారి మీద ఇదే మాదిరి అదనపు భారం పడుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగినపుడు, కరెన్సీ విలువలు పతనమైనపుడు అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇది కొత్త సమస్యలకు కారణం అవుతున్నది. ఇది అమెరికాకూ వర్తిస్తుంది. అక్కడ వడ్డీ రేట్లు పెంచినపుడల్లా ఇతర దేశాల నుంచి డాలర్లు అక్కడకు చేరుతున్నాయి.దీని వలన అమెరికన్లు లాభపడుతున్నారా అంటే అదీ లేదు.ద్రవ్యోల్బణంతో వృద్ధిరేటు దిగజారి మాంద్యంలోకి దిగజారే ముప్పు ఉంది.వడ్డీ రేట్లు పెరిగితే పరిశ్రమలు, వాణిజ్యాల పెట్టుబడులపై భారం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు ఉండవు, పరిశ్రమలూ రావు. రుణాలు తీసుకొని ఇండ్లు కొనుగోలు చేసిన వారికి భారం పెరుగుతుంది. ధరల పెరుగుదలతో జనాల జేబులకు చిల్లిపడి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తారు. అది మాంద్యానికి దారితీస్తుంది. డిమాండ్‌ తగ్గటంతో ఆపిల్‌ ఐఫోన్‌ 14 ఉత్పత్తి తగ్గించింది. దాంతో దాని షేర్ల ధర తగ్గింది.

ఇతర దేశాల్లో మాంద్య పరిస్థితులు ఏర్పడితే వాటి మార్కెట్లపై ఆధారపడిన ప్రతిదేశమూ ప్రభావితం అవుతుంది. పశ్చిమ దేశాల్లో డిమాండ్‌ తగ్గిన కారణంగా రెండు సంవత్సరాల్లో తొలిసారిగా 2022 అక్టోబరులో మన ఎగుమతులు 16.7 శాతం తగ్గాయి. దిగుమతులు పెరిగినందున మన దేశంలో డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. మన పెట్టుబడులు ఎగుమతి ఆధారితంగా ఉన్నందున వృద్ధి రేటు పడిపోనుందని అంచనా వేస్తున్నారు, అదే జరిగితే అంతర్గత డిమాండ్‌ కూడా తగ్గుతుంది. అక్టోబరు నెలలో ఎగుమతి చేసే 30 వస్తువులకు గాను 24 తిరోగమనంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బియ్యం, టీ, చమురు గింజలు, పొగాకు, చమురు గింజల ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల ఉంది. చమురు ఉత్పత్తుల ఎగుమతులు సెప్టెంబరులో 43శాతం పెరగ్గా అక్టోబరులో 11.4శాతం తిరోగమనంలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ వస్తువులు 21.3, ఆభరణాలు 21.6, రసాయనాలు 16.4, రెడీమేడ్‌ దుస్తులు 21.2,డ్రగ్స్‌-ఫార్మా 9.24 శాతాల చొప్పున తిరోగమనంలో ఉన్నాయి. తెలంగాణా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలోని వస్తువుల ఎగుమతులు జరుగుతుంటే వాటి ప్రభావం రాష్ట్ర సంస్థలు, వాటిలో పని చేసే సిబ్బంది మీద కూడా పడుతుంది. రానున్న రోజుల్లో పశ్చిమ దేశాల్లో పరిస్థితులు ఇంకా దిగజారవచ్చని చెబుతున్నందున పరిస్థితిని ఊహించలేము.


పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి గురైనపుడల్లా కార్మికవర్గం మీద దాని భారాలను మోపి తాను తప్పించుకొనేందుకు చూస్తుంది. 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత కూడా అదే జరుగుతోంది. దానిలో భాగంగా ఐటి కంపెనీలన్నీ రోబో ప్రోసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పిఏ) వైపు కేంద్రీకరించాయి. ఇది ఏదో ఒక దేశానికే పరిమితం కాదు. బాంక్‌ ఆఫ్‌ అమెరికా గతంలో ఒక విశ్లేషణలో పేర్కొన్నదాని ప్రకారం 2022 నాటికి మన దేశంలోని కోటీ 70 లక్షల ఐటి, ఐటి సంబంధిత ఉద్యోగాల్లో 30లక్షలు రద్దవుతాయని అంచనా వేసింది. పరిశ్రమల్లో కార్మికుల బదులు రోబోలు పని చేస్తాయి. ఐటి రంగంలో రోబో ప్రాసెస్‌ అంటే ఇంజనీర్ల బదులు రోబోలు అని కాదు, వాటి ప్రోగ్రామ్స్‌లో చేసే మార్పులతో ఎక్కువ మంది సిబ్బందితో పనిలేకుండా చేస్తాయి. డేటా విశ్లేషణ, ఎకౌంటింగ్‌, ఫైనాన్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి సేవలను ఆటోమేషన్‌, కృత్రిమ మేథతో చేసి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొని లాభాలకు ముప్పు లేకుండా చూసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి క్రమంలోనే అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎంతో నిపుణులైన వారిని మాత్రమే ఉంచుకుంటారు. కొన్ని కంపెనీలు తొలగించకపోయినా కొత్తగా సిబ్బందిని తీసుకోకుండా సర్దుబాటు లేదా విస్తరణకు పూనుకుంటాయి.కొత్త కంపెనీలు పరిమిత సిబ్బందిని మాత్రమే చేర్చుకుంటాయి.


గార్టనర్‌ కార్పొరేషన్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం 2022లో ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌ 20శాతం పెరుగుతుందని, అందుకోసం కంపెనీలు 290 కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచమంతటా 2023లో ఈ సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ రెండంకెల వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నది. అంటే అది పెరిగే కొద్దీ తీసివేతలు మరింతగా ఉంటాయి, కొత్త అవకాశాలు తగ్గుతాయి.ఆర్‌పిఏ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే కంప్యూటర్ల మీద పనిచేసేందుకు సాంకేతిక అర్హతలున్నవారే ఉండనక్కరలేదు. మరోవైపున నైపుణ్యాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు, వేతనాలూ పెరుగుతాయి. ఇదే సమయంలో జనాలకు మరింత వేగంగా సేవలు, కంపెనీలకు లాభాలు ఉంటాయి. సేవలు మెరుగుపడినందుకు సంతోషించాలా ? ఉపాధి తగ్గినందుకు విచారపడాలా ? ఇప్పుడు ప్రపంచమంతటా కంపెనీలన్నీ ఆర్‌పిఏ లాభ నష్టాల గురించి మదింపు చేసుకుంటున్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరద ప్రాంతాలకు పోడు అన్న సామెత తెలిసిందే.వర్తమాన సంవత్సరంలో ఇంతవరకు ప్రపంచంలో 853 టెక్‌ కంపెనీలు 1,37,492 మందిని తొలగించినట్లు తాజా సమాచారం. అదే కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి చూస్తే 1,388 సంస్థలు 2,33,483 మందిని ఇంటికి పంపాయని లేఆఫ్స్‌ డాట్‌ ఫై అనే సంస్థ వెల్లడించింది. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి, ఉపాధికోసం చూస్తున్న వారికి 2022 సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది.


2023లో మాంద్యం తలెత్తితే మన దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే తర్జన భర్జన మొదలైంది. మన దేశం ప్రపంచీకరణలో మరీ లోతుగా దిగలేదు గనుక అంతగా మునగం అన్నది ఒక భావం. ప్రతి సంక్షోభంలో తొలుత నష్టపడేది కార్మికులు, సామాన్యులే అన్నది గత అనుభవసారం. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన జిడిపి వృద్ది గురించి అనేక సంస్థలు ప్రతినెలా అంచనాలను తగ్గిస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఎంత ఉండేది చెప్పలేని స్థితి. కరోనా మహమ్మారి తలెత్తకుండా ఉండి ఉంటే 2016 నుంచి ప్రపంచ ఉత్పత్తి 23శాతం పెరిగి ఉండేదని, ప్రస్తుత అంచనా 17శాతమే అని చెబుతున్నారు. నిజమైన జిడిపి కరోనాకు ముందున్నదాని కంటే తక్కువే. దీని వలన 17లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని అంచనా. గతంలో ఎక్కువ వృద్ది రేటు ఉన్న దేశాలే ఎక్కువ భాగం నష్టపడ్డాయి.2019 జిడిపి సూచిక 110 కాగా కరోనా లేకుంటే 2023 నాటికి 123.4 పెరిగి ఉండేది, అలాంటిది ఇప్పుడు 117.3కు మాత్రమే చేరుతుందని అంచనా. ఇటీవలి పరిణామాలు మన ఆర్థిక రంగం మీద తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయి. ఆహార ధరల సూచిక 2021 నవంబరులో 148.2 ఉంటే 2022 అక్టోబరు నాటికి 165.2కు పెరిగింది. మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 2020-21లో సగటున 44.82 డాలర్లుంటే 2021-22లో 79.18, 2022-23లో నవంబరు 22 నాటికి 100.2 డాలర్లు ఉంది. ఇలాంటి భారాలు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు. దేశమంతటా ఉంటాయి.


పశ్చిమ దేశాల్లో ఆర్థికరంగంలో సంభవించే మార్పుల పరిణామాలు, పర్యవసానాల గురించి అందుబాటులో ఉండే సమాచారము ఎక్కువగా ఉంటుంది గనుక విశ్లేషణలు కూడా వెంటనే వెలువడతాయి. మన దేశంలో దానికి విరుద్దం. సమాచార ప్రభావం ఎక్కడ తమ ఎన్నికల లబ్ది మీద పడుతుందో అని అధికారంలో ఉన్నవారు తొక్కి పట్టటం, ప్రభావాన్ని తక్కువగా చూపటం జరుగుతోంది. ఉదాహరణకు 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు నాలుగు దశాబ్దాల రికార్డును నిరుద్యోగం బద్దలు కొట్టిందని సమాచారం తెలుపగా దాన్ని వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. తీరా అది అనధికార మార్గాల ద్వారా బహిర్గతం కావటంతో అది తప్పుల తడక అని దాన్ని నమ్మవద్దంటూ కేంద్రం చెప్పింది. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత అదే వాస్తవమంటూ ఆ విశ్లేషణను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి ప్రపంచ సంస్థలు వెలువరించే అనేక సూచికల్లో మన దేశం వెనుకబడి ఉండటాన్ని చూస్తున్నాము. అన్ని దేశాలకూ వర్తింప చేసే పద్దతినే మన దేశానికీ వర్తింప చేస్తున్నప్పటికీ మన దేశ వాస్తవాలను ప్రతిబింబించటం లేదని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది, నిరాకరిస్తున్నది తప్ప వాస్తవం ఏమిటో తన అంకెలను ఇంతవరకు వెల్లడించలేదు.


ధనిక పశ్చిమ దేశాల్లో జరిగే పరిణామాలు వెంటనే మన దేశం మీద పడే అవకాశం లేదు. 2008లో ఆ దేశాల్లో మాదిరి బాంకులు మన దేశంలో కుప్పకూలలేదు.కారణం అవి ప్రభుత్వరంగంలో ఉండటమే. ఇప్పుడు ఐటి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్‌లు, తొలగింపులు ప్రధానంగా అమెరికాలో జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం మహా సంక్షోభంగా మారినపుడు ప్రతి దేశాన్ని ఆవహిస్తుంది. మన జిడిపి వృద్ది రేటు బ్రిటన్‌లో మాదిరి తిరోగమనంలో పడలేదు. తాజాగా బ్రిటన్‌లో తలెత్తిన స్థితిని చూస్తే మాంద్యం కారణంగా ఎనిమిది సంవత్సరాల్లో పెరిగిన గృహస్తుల రాబడి హరించుకుపోయి జీవన వ్యయ సంక్షోభం తలెత్తింది.వంద బిలియన్‌ పౌండ్ల ప్రభుత్వ ఉద్దీపన ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్‌ నాటికి నిజ ఆదాయాలు ఏడుశాతం తగ్గుతాయని అంచనా. ఉత్పత్తి రెండు శాతం తిరోగమనంతో ఐదులక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా.


పశ్చిమ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మన దేశంలో లేదా తెలంగాణాలో లేదు అంటే దాని అర్ధం అసలేమీ సమస్యలు లేవని అంతా సజావుగానే ఉందని కాదు. తెలంగాణా పౌరస్పందన వేదిక నిర్వహించిన ఒక సర్వే, యుటిఎఫ్‌ చెబుతున్న దాని ప్రకారం రాష్ట్ర పాఠశాలల్లో 26వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బంగారు, ధనిక రాష్ట్రం అని చెబుతున్న చోట ఇలాంటి పరిస్థితి ఉండటం ఆర్ధిక ఇబ్బందులకు నిదర్శనంగా చెప్పవచ్చు. మార్చి నెలలో సిఎం కెసిఆర్‌ ఆర్భాటంగా ప్రకటించిన 90వేల ఖాళీల భర్తీ ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాదు. అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల గురించి చెబుతున్న అంకెలకు ఒకదానికి ఒకటి పొంతన ఉండటం లేదు. ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప జనానికి అర్ధం కాదు. ఉన్న సిబ్బంది, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏటా ఏడున్నరవేల కోట్ల మేరకు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ కారణంగానే గత ఎనిమిది సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకు తప్ప ఉద్యోగాల భర్తీకి పూనుకోవటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెబుతున్నారు.ప్రభుత్వం మీద పైసా అదనపు భారం పడని వివిధ రంగాల కనీసవేతనాల సవరణకూ ప్రభుత్వం ముందుకు రావటం లేదు.


తెలంగాణాలో ఉన్న భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు వంటి చర్యల ద్వారా సమకూరుతున్న ఆదాయం సంక్షేమ పథకాలకు తప్ప వనరుల పెంపుదలకు అవసరమైన పెట్టుబడులు పెట్టటం లేదనే విమర్శ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించేందుకు ప్రభుత్వాలు తీసుకొనే రుణాలకు పరిమితులు ఏర్పడటంతో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పులు తీసుకొని వాటికి ప్రభుత్వం హామీదారుగా ఉంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఈ మొత్తాలను కూడా ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని ప్రకటించి వెనుకటి నుంచి అమలు జరుపుతామని ప్రకటించటంతో కొత్తగా తీసుకొనే రుణాల మొత్తం తగ్గే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి అప్పులను బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తీసుకుంటున్న కారణంగా వచ్చే ఏడాది నుంచి అమలు జరుపుతామని చెప్పటంతో కాస్త ఊరట లభించింది. వర్తమాన సంవత్సర జిఎస్‌డిపి పదమూడు లక్షల కోట్లుగా అంచనా వేశారు.దీని ప్రకారం నాలుగుశాతం అంటే 52వేల కోట్ల మేరకు అప్పులు తీసుకోవచ్చు. హామీ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో 43వేల కోట్లకు మించి తీసుకొనే అవకాశం లేకపోయింది. దీంతో నెలవారీ ఖర్చులు – రాబడి తేడా ఒకటి నుంచి రెండువేల కోట్ల వరకు ఉండటంతో ప్రతినెలా ఇబ్బంది పడుతున్నది. అనేక అభివృద్ధి పనులకు కోతలు పెడుతున్నారు.2020-21లో ఇండ్ల నిర్మాణానికి 10,591 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం ఆరువందల కోట్లే. అలాటే పట్టణాభివృద్దికి 13,053 కోట్లకు గాను ఖర్చు 3,816 కోట్లు మాత్రమే. అందుకే రెండు పడకల ఇండ్లు లేవు, పట్టణాల్లో వరదలు వస్తే తట్టుకొనే స్థితిలేదు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్‌లో ఎన్నికోతలు పెట్టేది తరువాత గానీ వెల్లడి కాదు. ప్రపంచం, దేశంలో మాంద్యం తలెత్తితే తెలంగాణాకు మినహాయింపు ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీపై గుజరాత్‌ మారణకాండ మచ్చ : వీసా నిరాకరణపై మరోసారి గుర్తు చేసిన అమెరికా !

21 Monday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, AB Vajpayee, BJP, Immunity, Joe Biden, journalist Jamal Khashoggi, Narendra Modi Failures, RSS, Saudi Crown Prince Mohammed bin Salman


ఎం కోటేశ్వరరావు


పెళ్లికొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్‌ అవసరం లేని అంశాన్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్రమోడీ మీద ఉన్న గుజరాత్‌ మారణకాండ మచ్చను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని గతంలో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్న అభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది. ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణల నుంచి ప్రభుత్వ పరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది.


అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, జింబాబ్వే నేత రాబర్ట్‌ ముగాబే, కాంగోనేత కబిల, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారని విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత పటేల్‌ పేర్కొన్నాడు. వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్య వంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికి పోవటం లేదు.ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్యలో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది . దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్‌ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్‌ సౌదీ రక్షణ, గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పధకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరును చూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్నదానికి ఎంబిఎస్‌ ఆమోదం వుందని పేర్కొన్నారు.
.
ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగశాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ” అంటరాని ” వాని జోబైడెన్‌ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు.వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్‌ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు. సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపై చర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు.ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్‌ చెప్పాడు.


చట్టబద్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్‌ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రి లోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది. దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్రమోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపు వర్తింప చేశామని వేదాంత పటేల్‌ చెప్పాడు. హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్‌ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలు చేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్రమోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్‌ మోడీ అధికారిక పర్యటనతో పాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది.తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్‌, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్‌ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హౌదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్‌ కోర్టు నరేంద్రమోడీకి సమన్లు జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో నరేంద్రమోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్‌ కోర్టుకు తెలిపింది.2015 జనవరిలో న్యూయార్క్‌ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.

సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్దంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్దతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్రమోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్చ అమెరికన్‌ కమిషన్‌ సంస్థ(యు ఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ” ముఖ్యనేతలందరి ” మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్‌ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్రమోడీ, అమిత్‌ షాల గురించే అన్నది స్పష్టం.


జర్నలిస్టు ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ రాజు సల్మాన్‌ హస్తం ఉందని గతంలో చెప్పిన అమెరికా నాలుక మడిచి ఇప్పుడు ఏజంట్ల పాత్ర గురించి చెబుతోంది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పాయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.దీన్ని 2013లో నరేంద్రమోడీ తిరస్కరించటమే గాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పాయి చెప్పారని అన్నారు. ” ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని ” అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్రమోడీ 2014లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్‌ మారణకాండలో సంఘపరివార్‌ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా ? గుజరాత్‌ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

2002 నాటి ఉదంతాలకు నరేంద్రమోడీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని 2012లో సుప్రీం కోర్టు చెప్పింది. తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్‌, సంఘపరివార్‌ సంస్థల తీరు తెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్‌ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్‌ రెండున గార్డియన్‌ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు. వేదాంత పటేల్‌ స్పందనలో నరేంద్రమోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యధాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోడీ తనను కాశ్మీరు వివాదంలో పెద్దమనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు . స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా ? అనుమానం ఎందుకు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పట్టణ జనాలపై ప్రైవేటు భారాల బండ – భారత్‌కు ప్రపంచ బాంకు సిఫార్సు !

18 Friday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Financing India’s Urban Infrastructure Needs, Narendra Modi, Urban infrastructure, World Bank

ఎం కోటేశ్వరరావు


రానున్న పదిహేను సంవత్సరాలలో (2021-2036) మన దేశంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 840 బిలియన్‌ డాలర్లు ( 2020 ధరల ప్రకారం (రూపాయి విలువ 73 చొప్పున ) లేదా రు. 61.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచబాంకు అధ్యయనం సిఫార్సు చేసింది. ఇది జిడిపిలో 1.18శాతానికి సమానం. గత దశాబ్దిలో జిడిపిలో 0.6 శాతం ఖర్చు చేశారు. నవంబరు 14న ఈ నివేదికతో పాటు ఒక ప్రకటనను ప్రపంచబాంకు విడుదల చేసింది.ప్రపంచబాంకు వివిధ దేశాల మీద నివేదికలను రూపొందించేందుకు కొందరిని ఎంపిక చేస్తుంది. వాటిని తనవిగా చెప్పుకోదు. దీనికి కూడా అదే చెప్పింది. దేశాలు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చినపుడు సూచనల పేరుతో వాటిని రుద్దుతుంది. ప్రభుత్వాలు వాటిని తమ విధానాలుగా ముద్రవేసి అమలు చేస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సిఎంగా ఉండగా జరిగింది అదే. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఏమి చేస్తాయో చూడాల్సి ఉంది. పారిశ్రామిక పెట్టుబడుల నుంచి పూర్తిగానూ, సేవా రంగాల నుంచి పాక్షికంగా గత మూడు దశాబ్దాలుగా తప్పుకుంటున్న ప్రభుత్వాలు ప్రయివేటు పెట్టుబడుల మీదే ఆధారపడి అందుకు అనువుగా విధానాలను రూపొందిస్తున్నాయి.


ఈ నివేదికను కూడా అదే విధంగా రుద్దే అవకాశం ఉంది. ప్రపంచబాంకులోని ధనిక దేశాల్లో ఉండే పెట్టుబడి సంస్థలకు మార్కెట్‌ అవసరం, అందునా మన దేశం పెద్దదిగా ఉండటం, సంస్కరణలను వేగంగా అమలు జరుపుతానని ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి చెప్పటం, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా ( లాభాలు వస్తున్న విశాఖ ఉక్కును అమ్మేస్తామని పదే పదే చెప్పటం అందుకు చక్కటి ఉదాహరణ) కొన్ని రంగాల్లో అమలు జరుపుతున్న పూర్వరంగంలో ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని పట్టణ స్థానిక సంస్థల తీరు తెన్నుల గురించి నివేదికలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.


2021లో 47 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు, మొత్తం జనాభాలో 40శాతానికి పెరుగుతుంది.840 బిలియన్‌ డాలర్ల అంచనాలో నీటి సరఫరా, వర్షపు నీరు, మురుగునీటి పారుదల, చెత్తయాజమాన్యం, రోడ్లు, వీధి దీపాలకు గాను 450 బి.డాలర్లు, రవాణా సదుపాయాలకు 300 బి.డాలర్లు అవసరమౌతాయని అంచనా.గతంలో కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి 2032 వరకు ఇరవై సంవత్సరాల్లో మౌలిక వసతులు, సేవల కల్పనకు 560 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి అవసరమని అంచనా వేసింది. మెకెన్సీ నివేదిక ప్రకారం 2000-14 సంవత్సరాలలో చైనా జిడిపిలో 2.8శాతం చేసింది. ఒక అంచనా ప్రకారం 2010లో తలసరి 116 డాలర్లు ఖర్చు చేసింది. చైనా మాదిరి పట్టణీకరణకు ఇతర దేశాల్లో జిడిపిలో నాలుగుశాతం ఖర్చు పెట్టాలని ప్రపంచబాంకు చెప్పింది. గత దశాబ్దిలో సగటున ఏటా 10.6బి.డాలర్లు మాత్రమే భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.


స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ట్రం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల కారణంగా మౌలిక సదుపాయాల మీద చేస్తున్న ఖర్చు నానాటికీ తగ్గుతున్నది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు నిధుల బదలాయింపు పెరిగినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల మొత్తం రాబడి 2011-18లో జిడిపిలో ఒక శాతం లోపుగానే ఉంది. స్వంత వనరుల రాబడి తక్కువగా, నానాటికీ తగ్గుతున్నది, దానికి సేవలకు వసూలు చేస్తున్న మొత్తాలు తక్కువ. స్వంత వనరుల రాబడి (ఓఎస్‌ఆర్‌)లో ఇంటి పన్ను అతి పెద్ద భాగమైనా తోటి దేశాలతో చూస్తే చాలా తక్కువ, ఈ మొత్తం జిడిపిలో 0.15శాతం కాగా మధ్య తరహా ఆదాయ దేశాల్లో 0.3 నుంచి 0.6 శాతం వరకు ఉంది. ఓయిసిడి దేశాల్లో 1.1 శాతం, అమెరికా, కెనడా, బ్రిటన్లో 2-3శాతం వరకు ఉంది. అనేక దేశాల్లో ఇతర పన్నుల కంటే ఆస్థిపన్ను వేగంగా పెరుగుతోంది. నిర్వహణ ఖర్చుల కంటే కూడా సేవా రుసుములు తక్కువగా ఉండటానికి విధాన పరమైన నిర్ణయాలే కారణం. కొన్ని పెద్ద పట్టణాలతో సహా నీరు, మురుగునీటి పారుదల రుసుము వసూలు ఖర్చులో సగం కూడా లేదు. ఇటీవలి సంవత్సరాలలో మూడింట రెండువంతులు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీస్‌,అమృత్‌ పథకాల కింద ఆమోదించిన మొత్తాలలో కేవలం ఐదో వంతు మాత్రమే గడచిన ఆరు సంవత్సరాల్లో ఖర్చు చేశారు.


విధానపరమైన, రాజకీయ ఆర్ధిక విధాన నిర్ణయాలు రాబడి స్థాయిలను ఆచరణను ప్రభావితం చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులకు ఇవి ఆటంకంగా ఉన్నాయి. భారీ పెట్టుబడులను ఇముడ్చుకోగల స్థితి లేదు. అవసరమైన పెట్టుబడులకు ప్రోత్సాహకాలతో పాటు తిరిగి చెల్లించే విధంగా పన్నులు, వినియోగ చార్జీలను పెంచాల్సి ఉంది.వీటన్నింటికీ ద్రవ్య, సంస్థాపరమైన ప్రాధమికంగా ఆటంకంగా ఉన్నాయి. వీటిని తొలగించటానికి వ్యవస్థాగతమైన సంస్కరణలు తేవాలి. అది ఎంతో కష్టం ఎందుకంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి.భారత పూర్వపరాలను చూసినపుడు ఇది పెద్ద సవాలుగా ఉంటుందని రుజువైంది. కొన్ని నగరాల్లోనైనా స్వల్ప, మధ్యకాల ప్రైవేటు వాణిజ్య పెట్టుబడులకు అవకాశం కల్పించేందుకు పూనుకోవాలి.భారత్‌లో పట్టణాల మౌలిక సదుపాయాలకుఅవసరమైన పెట్టుబడుల్లో కేవలం ఐదుశాతమే ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతున్నాయి. గుజరాత్‌లో కేవలం ఒకశాతమే ఉండగా తమిళనాడులో 12శాతం ఉన్నాయి.ఇవి కూడా ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్నవే. పదిహేనవ ఆర్థిక సంఘ సిఫార్సుల మేరకు 2025 నాటికి జిడిపిలో 0.32శాతం షరతులు లేని మొత్తాలను పట్టణ సంస్థలకు ఇవ్వాలి. చక్కగా రూపొందించిన షరతులతో కూడిన మొత్తాలతో కూడా ఫలితాలను మెరుగుపరచవచ్చు. కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో మరింత స్థిరమైన,సూత్రాలతో కూడిన, షరతులు లేని నిధుల బదలాయింపు పద్దతిని పాటించాలి. ప్రస్తుతం సగం నిధులు షరతులతో కూడిన నిధుల బదలాయింపు జరుగుతోంది. పట్టణాల్లో ద్రవ్య పునాది విస్తరణ, రుణయోగ్యత పెంపుదలకు రాబడి ఆటంకాలను తొలగించాలి. ప్రస్తుతం తక్కువగా ఉన్న ఆస్థిపన్ను, వినియోగ, సేవా రుసుములను గణనీయంగా పెంచాలి. గణనీయంగా వాణిజ్య రుణాలు తీసుకొనే విధంగా స్వంత వనరులు ప్రతి ఐదు సంవత్సరాలకు రెట్టింపు పెరిగే విధంగా పెంపుదల ఉండాలి.


పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రపంచ నివేదికలో పేర్కొన్నవే.ఈ సిఫార్సుల సారం ఒక్కటే .పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులను వాణిజ్య సంస్థల నుంచి తీసుకోవాలి. వాటిని తీర్చేందుకు వీలుగా పట్టణ స్థానిక సంస్థలకు రాబడి వనరుల పెంపుదల, అందుకోసం జనం నుంచి వసూలు చేసేందుకు అవసరమైన సంస్కరణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ నివేదికను తు.చ తప్పక అమలు జరిపితే ఎన్నో రెట్ల భారం పౌరుల మీద పడుతుంది.రాజును చూసిన కళ్లతో అన్నట్లుగా ధనిక దేశాలను చూసి అక్కడి మాదిరి మనదేశంలో కూడా అమలు జరపాలని ప్రపంచబాంకు బృందం చెప్పింది. అక్కడి మాదిరి మన దేశంలో కూడా జనాలకు రాబడి ఉంటే ఇప్పటికంటే ఎక్కువ మొత్తాలను సేవలకు చెల్లించేందుకు ఇబ్బంది ఉండదు. తమ ఇండ్ల మీద హెలికాప్టర్లు దిగేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్న అపర కుబేరులొకవైపు ఉంటే వారి పక్కనే ఉండే మురికి వాడల్లో ఎండకూ వానకు రక్షణకు ప్లాస్టిక్‌ షీట్లను అమర్చుకొనే పేదరికం మరొకవైపు కనిపిస్తున్నది. మన దేశంలోని పట్టణాల్లో ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.


అనేక దేశాల్లో ధనికుల మీద మనకంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు. మన దేశంలో వారికి అనేక రాయితీలు ఇస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల్లో ఇంటి పన్ను పెంచారు. ఎవరి చెత్తను వారు తొలగించేందుకు చెత్తపన్ను విధించారు. అదెక్కడా పన్ను రూపంలో కనిపించదు, చెత్తసేకరణకు వచ్చే వారికి ఇచ్చే మొత్తాలుగా ఉంటాయి. త్వరలో గ్రామాలకూ దీన్ని వర్తింప చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న కారణంగా మౌలిక సదుపాయాలపై వత్తిడి, కొరత ఏర్పడుతున్నది. వాటిని ఉపేక్షిస్తే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ నివేదికలో 2021 నుంచి అమలు జరపాలని చెప్పటాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి ముందే అందచేసి ఉండాలి. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచాయి.2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పట్టణ జనాభా మీద విపరీత భారాలను మోపి ఓట్లడిగే సాహసానికి పూనుకోదన్నది స్పష్టం. అందువలన ఎన్నికల తరువాత వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైనా భారాల బండను జనం మీద మోపటం ఖాయమని చెప్పవచ్చు. 2020 సంవత్సర ధరల ఆధారంగా ఖర్చు అంచనా వేశారు, రూపాయి విలువ 73 నుంచి 82కు పతనం కావటం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే 840 బి.డాలర్లు లేదా రు.61లక్షల కోట్ల అంచనా ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవినీతి నిరోధంపై సుభాషితాలు,సుద్దులు : ప్రధాని మోడీ ఆచరణ చూస్తే విస్తుపోతారు !

13 Sunday Nov 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Anna Hazare, BJP, Central Vigilance Commission, Lokayukta, Lokpal India, Narendra Modi, Narendra Modi Failures, Vigilance Awareness Week, War on Corruption


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అందరూ శాకాహారులే రొయ్యలబుట్ట మాయం అన్నట్లుగా దేశంలో అందరూ సత్యహరిశ్చంద్రుల వారసులం, అవినీతి అంటే అదేమిటో తెలియని వారం అన్నట్లుగా ఉంటారు. అయినా అవినీతి గురించి మాట్లాడని రోజు లేదు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఒక నిపుణుల కమిటీని వేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే బిజెపి నేతలు మరొక వైపు దేశంలో అవినీతి లేదు అక్రమాలు లేవంటూ రోజూ ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. స్వచ్చత సూచికలను ప్రకటిస్తున్న మాదిరి నెల లేదా మూడు నెలలకు ఒకసారి అవినీతి అధికారుల మీద ఉన్న కేసుల ఆధారంగా వివిధ శాఖలకు కూడా సూచికలను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతారు. ఆచరణ చూస్తే విస్తుపోతారు. అవినీతి గురించి 2014 తరువాత చెప్పిన వాటిని అమలు చేయకుంటే బిజెపికి వ్యతిరేకంగా తమ బృందం ఆందోళనకు దిగుతుందని అన్నాహజారే కార్యదర్శి కల్పనా ఇనాందార్‌ ప్రకటించారు. కొంత మంది నమ్ముతున్నట్లుగా ఆ జగన్నాటక సూత్రధారి ఎవరిని ఎలా ఆడిస్తున్నాడో, ఎందుకు అలా ఆడిస్తున్నాడో అర్ధం కావటం లేదు.


అవినీతి సూచికలో మన దేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాలు అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలు, అవగాహన ఏమిటో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిపుణులతో కమిటీలు వేసేవిధంగా, దేశ అవినీతి సూచిక మెరుగుపడే విధంగా అవగాహనకు సూచనలు చేసే విధంగా లా కమిషన్ను ఆదేశించాలని అశ్వినీ ఉపాధ్యాయ పిటీషన్‌ దాఖలు చేశారు. సంబంధిత అంశాలపై పని చేస్తున్న వారిని సంప్రదించాలని, మన దగ్గర ఇప్పటికే ప్రత్యేక చట్టాలున్నాయని, అవినీతి నిరోధానికి చర్యల గురించి లా కమిషన్ను అడుగుతామంటూ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. నరేంద్రమోడీకి అధికారాన్ని కట్టబెట్టంలో కాంగ్రెస్‌ నేతల అవినీతి, అక్రమాలు ప్రధాన పాత్ర పోషించిన అంశం తెలిసిందే.ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ (టిఐ) ప్రకటించిన అవినీతి సూచికలో 2012, 13 సంవత్సరాల్లో మన దేశం 94వ స్థానంలో 2014లో 85, 2015లో 76కు ఎదిగింది. తరువాత క్రమంగా దిగజారుతూ 2020లో 86, 2021లో 85లో ఉంది.2022 సూచికను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. అవినీతి అంతం గురించి చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో తిరిగి అది కోరలు చాస్తోందన్నది స్పష్టం. టిఐ సూచికలు సరైనవా కాదా అన్న చర్చకు వస్తే కాంగ్రెస్‌ పాలనలో-బిజెపి ఏలుబడిలో సూచికలను ఇచ్చింది కూడా అదే సంస్థ కనుక మోడీ పాలన గురించి ఇచ్చింది తప్పైతే కాంగ్రెస్‌ పాలన గురించి చెప్పింది కూడా తప్పే అవుతుంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది కనుకనే అసలు దాని గురించి చర్చకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వచ్చినా మా మోడీ మీద ఇంతవరకు ఒక్క ఆరోపణలేదుగా అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ మాటకొస్తే మన్మోహన్‌ సింగ్‌ మీద కూడా ఏమీ లేవు.


ఇటీవల నిఘా చైతన్య వారోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు పలికారు. అధికారుల మీద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను బట్టి వివిధ శాఖలకు సూచికలు ఇవ్వాలని సూచించారు. ఆ నిర్ణయం చేసి ఆ సభలో పాల్గొని ఉంటే విశ్వసనీయత ఉండేది.ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర నిఘా సంస్థలో ఫిర్యాదుల యాజమాన్య వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. అవినీతి నిరోధక సంస్థలలో పని చేస్తున్నవారి మీద బురద చల్లేందుకు, పని చేయనివ్వకుండా చూసేందుకు స్వప్రయోజనపరులు చూస్తారని,ఆ క్రమంలోనే తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, కానీ జనం దేవుళ్లు వారికి నిజం తెలుసు, తరుణం వచ్చినపుడు వారు నిజానికి మద్దతుగా నిలుస్తారు అన్నారు. కేంద్ర నిఘా సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిపై వచ్చిన 1,09,214 ఫిర్యాదుల్లో ప్రధాని తరువాత స్థానంలో ఉన్న అమిత్‌ షా నిర్వహిస్తున్న హౌంశాఖ మీద వచ్చినవి 37,670, తరువాత 11,003తో రైల్వే, 6,330తో బాంకులు ఉన్నాయి. 2013లో సివిసికి 35,332 వచ్చాయి. ఆ తరువాత నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. దీని భావమేమి తిరుమలేశా ! మోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికారుల్లో అవినీతి పెరిగినట్లా తగ్గినట్లా !!


కేసుల గురించి సూచికలు ఇమ్మని ప్రధాని చెప్పారు సరే, తన ఏలుబడిలోని ప్రభుత్వ శాఖలు ఎలా పనిచేస్తున్నట్లు ? కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషిఏటివ్‌ సంస్థ ఒక సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని వెల్లడించింది. దాని ప్రకారం 2013 ఏప్రిల్‌ నుంచి 2017 ఫిబ్రవరి వరకు డిజిఎఫ్‌టి కార్యాలయాలకు అందిన 181 అవినీతి ఫిర్యాదులపై ఒక్కదాని మీద కూడా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని, 2009లో వచ్చిన వాటిలో ఒక కేసులో ఒక అధికారిపై విధించిన పెనాల్టి వివరాలను కూడా సమాచార హక్కు కింద ఇవ్వలేదని తేలింది.దరఖాస్తులకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. కర్ణాటక లోకాయక్త సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మరింత దారుణంగా ఉంది. అవినీతి కేసులు,తాను దర్యాప్తు చేసిన వాటి వివరాలను గణాంకాలను నిర్వహించాల్సిన బాధ్యత తమకు లేదని, 2006లో కేంద్ర సమాచార కమిషన్‌ జారీ చేసిన ఉత్తరువు ప్రకారం పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప సమాచారం ఇవ్వనవసరం లేదని, సమాచారం గనుక ఇస్తే నిందితులైన అధికారుల గోప్యతకు భంగం కలుగుతుందని కూడా సమాధానమిచ్చింది. నిఘా చైతన్య వారోత్సవాల్లో ఇలాంటి సంస్థలు, వ్యవస్థ అధికారులకే నరేంద్రమోడీ సుభాషితాలను వినిపించారు.


నరేంద్రమోడీ పాలనలో అవినీతి పెరిగిందని, గ్రామాల సంపదలను పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉందని అన్నా హజారే కార్యదర్శి కల్పన నవంబరు పదవ తేదీన లక్నోలో రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.2011లో అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఆందోళన కారణంగా కాంగ్రెస్‌కు మారుగా బిజెపి అధికారానికి వచ్చిందని ఎనిమిది సంవత్సరాలుగా చేసిందేమీ లేదన్నారు. గతంలో కూడా అన్నా హజారే ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఇడి తదితర సంస్థల దాడులు విపరీతంగా పెరిగాయి. అవినీతి మీద పోరులో తమ తీరుకు ఇది నిదర్శనం అని బిజెపి చెప్పుకుంటుంది. అసలు కథలు వేరే అన్నది తెలిసిందే. ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేదంటున్నారు, మరి గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు కారణం ఏమిటి ? 2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 దాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు , 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ఇలా అవినీతి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.


ఇటీవలి కాలంలో సమాచార కేంద్రాల అనుసంధానం కారణంగానే చట్టబద్దంగా జరిగే లావాదేవీల మీద నిఘాతో పాటు అక్రమాలను కనుగొనటం కూడా సులభతరమైంది. వాటి ఆధారంగా అక్రమార్కుల మీద తీసుకొంటున్న చర్యలే ప్రశ్నార్దకం. రెండవది అక్రమాలకు పాల్పడుతున్నవారు గతంలో మాదిరి నగదుతోనే పని నడిపిస్తున్నారు. అందుకే దాడులు జరిపితే టన్నుల కొద్దీ నగదు పట్టుబడుతున్నది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్ధిక రంగంలో నగదు సరఫరా 17.7లక్షల కోట్ల నుంచి 32లక్షల కోట్లకు పెరిగింది. అవినీతి పెరుగుదలకు ఇదొక సూచిక. మోడీ సర్కార్‌ చెబుతున్నట్లు లావాదేవీలన్నీ బాంకుల ద్వారా జరిగితే ఇటీవల తెలంగాణాలోని మునుగోడు, అంతకు ముందు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు గుట్టువెల్లడికావాలి. అలాంటిదేమీ లేదు.


2014కు ముందు అవినీతి ప్రభుత్వానికి ఒక అత్యవసరమైన భాగంగా ఉండేది, ఇప్పుడు ఏ మాత్రం సహించని విధానం అనుసరిస్తున్నామని నరేంద్రమోడీ హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సభల్లో చెప్పారు. మాటలు కాదు ఆచరణ అన్నది అసలు జరుగుతున్నదేమిటో మనకు చూపుతుంది.లోక్‌ పాల్‌ జోక్‌ పాల్‌గా మారిందని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ సభ్యుడు శైలేష్‌ గాంధీ చమత్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఆందోళనకు మోడీ అండ్‌ కో మద్దతు ఇచ్చింది. దాన్నే ఒక ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకొని లబ్ది పొందింది. అలాంటి పెద్దలు సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాతనే ప్రధాని పీఠం ఎక్కిన ఐదు సంవత్సరాల తరువాత ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లు లోక్‌పాల్‌ నియామకం జరిపారు.
అన్నా హజారే తదితరుల ఆందోళన, అనేక అవినీతి ఆరోపణల పూర్వరంగంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాలను చేసింది. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత ఏర్పాటు చేశారు. లోక్‌పాల్‌ వ్యవస్థలో బిజెపి అనుకూలురను నింపి దాన్ని ఒక ప్రహసన ప్రాయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. అన్నా హజారే బృందంలోని కిరణ్‌ బేడి తరువాత బిజెపిగా అసలు రూపాన్ని వెల్లడించారు.అరవింద్‌ కేజరీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన లోక్‌పాల్‌ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు నాలుగు సంవత్సరాలు నరేంద్రమోడీ ఆ కమిటీతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదని 2018లో సమాచర హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వెల్లడించిందని అంజలీ భరద్వాజ తెలిపారు. అంతకు ముందు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయకుంటే ఆందోళన చేస్తానని 2015లో అన్నా హజారే ప్రకటించారు. రెండేళ్ల తరువాత 2017లో మోడీని ప్రశ్నిస్తూ ఒక ప్రకటన చేశారు.2018లో ఆరు రోజులు నిరసన దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌ అంశం సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు అది ” ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ” అని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సుప్రీం కోర్టు అన్నది. చివరకు 2019లో నియమించారు. ఎంపిక కమిటీ కూడా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాని అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్‌, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రతినిధి, ప్రతిపక్ష నేత, మరో ప్రముఖ న్యాయవాది, అంటే ముగ్గురు అధికారపార్టీ వారే ఉంటారు లేదా మద్దతుదారులు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను కమిటీ ఆహ్వానితుడిగా మాత్రమే పిలిచారు.ఎంపికలో తన పాత్ర ఉండదు కనుక సమావేశాన్ని బహిష్కరించారు. ఆ కమిటీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చినెలలో లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన పినాకి చంద్రను ఎంపిక చేశారు.


ఇక లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల తీరుతెన్నులను చూస్తే 2019-20లో వచ్చిన 1,427లో 85 శాతం తమ పరిధిలోకి రావని, ఆరుశాతం సరైన పద్దతిలో నింపలేదని తిరస్కరించారు. మిగిలిన వాటిని విచారించి నిగ్గుతేల్చిందేమిటో జనానికి తెలియదు. నియామకం జరిగి ఏడాది కూడా నిండక ముందే లోక్‌పాల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న దిలీప్‌ భోంసలే 2020 జనవరి ఆరున ” వ్యక్తిగత కారణాల ”తో రాజీనామా చేశారు. తరువాత వెల్లడైనదేమంటే భోంసలేకు ఆఫీసు లేదా అధికారిక పనిగానీ లేదంటూ మూడు లేఖలు రాసినా లోక్‌పాల్‌ చైర్మన్‌ పట్టించుకోలేదు.” తొలి రోజు నుంచీ పని చేయకపోవటాన్ని, మబ్బుగా ఉండటాన్ని చెబుతూనే ఉన్నాను. చైర్మన్‌ నా సూచనలను పూర్తిగా పక్కన పడేశారు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు, స్పందన ప్రతికూలంగా ఉంది ” అని భోంసలే చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం నిరర్థకమైనవని, వాటి గురించి మూడు సంవత్సరాల తన పదవీకాలాన్ని గడిపితే సమయం వృధా తప్ప మరొకటి కాదని భోంసలే అన్నారు. పని చేయాల్సిన పద్దతి ఇది కాదు, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చైర్మన్‌ ఎలాంటి చొరవ చూపలేదని అన్నారు.


జస్టిస్‌ భోంసలే రాజీనామా తరువాత మరొక జడ్జి కరోనాతో మరణించారు. ఆ రెండు పోస్టులను ఇంతవరకు నింపలేదు. విచారణ, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్ల పోస్టులతో పాటు అవసరమైన ఇతర సిబ్బందిని కూడా కేంద్రం నియమించలేదు. కేటాయించిన నిధుల్లో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదని 2021లో పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వెల్లడించింది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ లోకాయక్త గురించి అనుసరించిన వైఖరిని చూస్తే లోక్‌పాల్‌ జోక్‌ పాల్‌గా ఎందుకు మారిందో అర్ధం చేసుకోవచ్చు. పదేండ్ల పాటు గుజరాత్‌ లోకాయక్త నియామకం జరపలేదు లేదా వ్యతిరేకించారు. 2011లో నాటి గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి జస్టిస్‌ ఆర్‌ఏ మెహతాను నియమించగా తొలగించాలంటూ నరేంద్రమోడీ సుప్రీం కోర్టు తలుపు తట్టి విఫలమయ్యారు. నరేంద్రమోడీ తీరు తెన్నులతో ఆగ్రహించిన జస్టిస్‌ మెహతా బాధ్యతలను తీసుకొనేందుకు తిరస్కరించారు. లోకాయక్తలు ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో ఉండకూడదని మోడీ సర్కార్‌ వాదించింది. జస్టిస్‌ మెహతా తిరస్కరణ తరువాత ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చారు. నియామక ప్రక్రియలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా చేశారు.మొత్తం ప్రభుత్వానికే అధికారాన్ని కట్టబెట్టారు. నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత 2016లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాన్ని నీరుగార్చారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లతో దాచుకుంటారు. సవరణల ప్రకారం అధికారుల పేరుతో ఉన్నవి తప్ప మిగతా కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ సమాచారం వెల్లడించాలో లేదో నిర్ణయించే అధికారం సమాచార కమిషన్‌కు ఇచ్చింది.

ప్రస్తుత లోక్‌పాల్‌, కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సమావేశాల మినిట్స్‌ ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఇవ్వనవసరం లేదని 2021లో ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర సమాచార కమిషనర్ల ప్రక్రియలోనూ మోడీ సర్కార్‌ ఇలాగే తిరస్కరించింది. ఆచరణ ఇలా ఉంటే మరోవైపు బహిరంగ వేదికల మీద చెబుతున్న సుభాషితాలను చూస్తే దగా దగా కుడి ఎడమల దగా దగా అన్న మహాకవి శ్రీశ్రీ గుర్తుకు రావటం లేదూ ! ” నేను తినను ఇతరులను తిననివ్వను ” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అనుకున్నారు. ఇప్పుడెవరూ చౌకీదార్‌ అని చెప్పుకోవటం లేదు. లోక్‌పాల్‌కు ఫిర్యాదులు ఎందుకు రావటం లేదంటే తమ పాలనలో అవినీతి లేనపుడు ఎలా వస్తాయంటూ బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు ! మహిమ కలికాలానిది అందామా నరేంద్రమోడీది అందామా ?అవినీతి గురించి అందరికీ తెలిసినందున ఎవరికి తోచింది వారు అనుకోవచ్చు. పైకి అంటే పంచాయితీ గానీ లోలోపల అనుకునేందుకు ఇంకా స్వేచ్చ ఉంది. మహాభారతంలో ధర్మపీఠం ఎక్కిన శకుని కౌరవులను నాశనం చేయాలనేఅంతరంగాన్ని వెల్లడిస్తాడు. మన పూర్వీకుల దగ్గర ఆ పాత పీఠాలు ఎక్కడైనా ఉన్నా లేదా దేశ భక్తులైన మన సంస్కృత పండితులు ఆ పరిజ్ఞానాన్ని వెలికి తీసి వాటిని రూపొందించి పుణ్యం కట్టుకుంటే మన పాలకులను వాటి మీద ఎక్కించి అంతరంగాలను బయట పెట్టించవచ్చు, అది తప్ప మరొక మార్గం లేదు, దేశం కోసం వారా పని చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నుంచి కంపెనీలు ఏ దేశం వెళుతున్నాయి ? నిజానిజాలేమిటి ?

09 Wednesday Nov 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, exodus of manufacturing from China, factory of the world, Narendra Modi Failures, US-CHINA TRADE WAR, Vietnam


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వెలుపలికి వస్తున్నాయి. అదింకేమాత్రం ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండదు. చైనా వైఫల్యం – భారత అదృష్టం ఇలాంటి వార్తలు, విశ్లేషణలు ఇటీవల మరోసారి పెరిగాయి. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. చైనా దానికి మినహాయింపు కాదు.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమని చెప్పి పాలు పితికేందుకు పూనుకున్నట్లుగా కొందరున్నారు.ఆత్ర పడినంత మాత్రాన లేదా అదృష్టాన్ని నమ్ముకుంటే కంపెనీలు వస్తాయా ? మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా, పోటీ పడి మారాలని కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అది వాస్తవాల ప్రాతిపదికగా ఉండాలి. ఇంతకూ అసలు నిజానిజాలేమిటి ?


2022 అక్టోబరు చివరి వారంలో అమెరికాకు చెందిన సిఎన్‌బిసి ఒక విశ్లేషణను ఇచ్చింది.2016 నుంచి 2022లో ఇప్పటి వరకు వచ్చిన మార్పులను అది పేర్కొన్నది. దాని ప్రకారం ప్రపంచ దుస్తులు, వాటి సంబంధిత వస్తువుల ఎగుమతుల్లో చైనా వాటా 41 నుంచి 37శాతానికి, ఫర్నీచర్‌లో 64 నుంచి 53కు, పాదరక్షలు 72 నుంచి 65, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 83 నుంచి 70శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వియత్నాం వాటా ఫర్నీచర్‌లో 8 నుంచి 17 శాతానికి, పాదరక్షలు 12 నుంచి 16, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 6 నుంచి 10శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు పది నుంచి 12 శాతానికి పెరగ్గా, మలేషియా నుంచి దుస్తులు 14 నుంచి 19శాతానికి పెరిగి తిరిగి 14శాతానికి తగ్గాయి. మన దేశ వివరాలను అది అసలు పరిగణనలోకే తీసుకోలేదు. కఠినమైన కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా తగ్గటానికి ఒక కారణంగా సిఎన్‌బిసి పేర్కొన్నది. జీరో కరోనా విధానాల కారణంగా ఉత్పత్తిమీద తిరోగమన ప్రభావం పడటంతో దిగుమతిదారులు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారని ఎండిఎస్‌ ట్రాన్స్‌మోడల్‌ సలహాదారు ఆంటోనెలా టియోడోరో చెప్పాడు. చైనా వాటా తగ్గినందున అత్యధికంగా లబ్ది పొందింది వియత్నాం తప్ప మరొక దేశం కాదని అందరూ చెబుతున్నారు.2014 నుంచి అది సుదూర వాణిజ్యాన్ని 360 శాతం పెంచుకుందని ఆంటోనెలా చెప్పాడు. కరోనా నిబంధనలను ఎత్తివేస్తే తిరిగి చైనా వాటా పెరగనూ వచ్చు.


మన దేశంలో ఉన్న వారు ఆలోచించాల్సింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో నరేంద్రమోడీ సర్కార్‌ఎందుకు విఫలమైందన్నదే. వస్తూత్పత్తి చౌకగా అంటే చౌకగా దొరికే శ్రామిక శక్తి వియత్నాంలో ఉన్నందున పరిశ్రమలు, పెట్టుబడులు అక్కడకు వెళుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అదే గనుక అసలు కారణమైతే ఈ పాటికి మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉండాలి. వికీపీడియా సమాచారం ప్రకారం వియత్‌నామ్‌లో 2020 వివరాల ప్రకారం ఏడాది కనీస వేతనం సగటున 1,591 డాలర్లు, మన దేశంలో 2015 వివరాల ప్రకారం 664 డాలర్లు, చైనాలో 2018 ప్రకారం 2,084 డాలర్లు ఉంది.( తాజా వివరాల ప్రకారం అదింకా పెరిగింది) పోనీ నరేంద్రమోడీ అచ్చేదిన్‌లో భాగంగా ఇప్పటికి కనీసవేతనం రెట్టింపు చేశారని అనుకున్నా, వియత్‌నామ్‌ కంటే తక్కువే ఉంటుంది.మోడీ సర్కార్‌ నైపుణ్యశిక్షణ ఇచ్చింతరువాత కూడా మరెందుకు చైనా కంపెనీలు మన వైపు రాకుండా అక్కడికి పోతున్నట్లు ?


ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది చైనా నుంచి గానీ మరొక దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను అమెరికా లేదా ఐరోపాలోని ధనిక దేశాలు ఉత్పత్తి చేయలేనివి, అసాధ్యమైనవి అంతకంటే కాదు. శ్రమశక్తికి చెల్లించే వేతనాలు అసలు అంశం. తమ దగ్గర ఉన్న రేట్లను పోల్చి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి ధనిక దేశాల పెట్టుబడిదారులు అక్కడికి పోతున్నారు. చైనాలో తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు, జనాభా, అక్కడి మౌలిక సదుపాయాలు, మార్కెట్‌, తదితర అవకాశాలను చూసి గత నాలుగు దశాబ్దాల్లో చలో చైనా బాట పట్టారు.చైనాలో వేతనాలను పెంచుతున్న కొద్దీ చైనాలో ఉన్న విదేశీ కంపెనీల లాబీలు ప్రభుత్వాన్ని బెదిరించి వేతనాలు పెంచకుండా చూసేందుకు విశ్లేషణల పేరుతో కథనాలను వండివారుస్తున్నాయి. ఉదాహరణకు 2010 జూన్‌ నెలలో ఫైబర్‌ టు ఫాషన్‌ అనే వెబ్‌సైట్‌(పత్రిక)లో కార్మికవేతన ఖర్చు పెరుగుతున్న కారణంగా వస్తున్న వత్తిడితో అమెరికా దుస్తుల కంపెనీల సంస్థలు చైనా నుంచి వెలుపలికి పోయి ఇతర దేశాల్లో తమ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని భారత్‌తో సహా ఆసియాలోని సహదేశాలు వినియోగించుకుంటాయా అనే పద్దతిలో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. చిల్లర అమ్మకాల దిగ్గజాలైన కోచ్‌,ఆన్‌ టైలర్‌ స్టోర్స్‌,గస్‌,జె సి పెనీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నది. 2010 ఒక నివేదిక ప్రకారం గంటలకు కార్మికవేతన వేతనం( పెట్టుబడిదారుల పదజాలంలో ఖర్చు ) 1.84 డాలర్లని అంతకు ముందు ఏడాది కంటే 17శాతం పెరిగినట్లు అదే భారత్‌లో గంటకు 2.99 డాలర్లు, వియత్నాంలో 0.49 డాలర్లు ఉన్నట్లు తెలిపింది. చైనా వేతన ప్రమాణాలను పెంచటం, కరెన్సీ ఎన్‌ విలువ పెరగటం వంటి కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు.


ఆ తరువాత గడచిన పది సంవత్సరాల్లో కరోనాకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలను ప్రచురించని ఏడాది లేదంటే అతియోక్తి కాదు. అయినప్పటికీ పొలోమంటూ మొత్తంగా చైనాను ఖాళీ చేసి విదేశీ బాట పట్టిందేమీ లేదు. దాని ఎగుమతుల్లో వచ్చిన మార్పును పైన చూశాము. 2022 నవంబరు ఏడవ తేదీన అంతకు ముందు ప్రచురించిన వివరాలను నవీకరించి చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారికోసం అనేక వివరాలను ప్రచురించింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కనీసవేతనాలు, నిబంధనలు తదితర అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం 31రాష్ట్రాలలో షాంఘైలో కనీసవేతనం గరిష్టంగా నెలవారి 2,590యువాన్లు లేదా 400 డాలర్లు ఉండగా బీజింగ్‌లో గంటకు 25.3 యువాన్లు లేదా 3.99 డాలర్లు ఉంది. మిగతా చోట్ల రాష్ట్రాల వారీ అంతకంటే తక్కువ ఉన్నాయి. కనిష్టంగా అన్‌హులో 1,340యువాన్లు లేదా 212 డాలర్లు ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో చివరిది ఒకటవ జోన్‌లో 1,650యువాన్లు ఉంది. ప్రతి చోటా ఇలా జోన్ల వారీ హెచ్చు తగ్గులుంటాయి. నవంబరు 8వ తేదీన ఒక డాలరుకు మన కరెన్సీ మారకం విలువ రు.81.80కి అటూ ఇటుగా, ఒక యువానుకు రు.11.26 ఉంది.
మన కనీస వేతనాల్లో వైద్య బీమా – ఇఎస్‌ఐ నిమిత్తం కార్మికులు,యజమానులు చెల్లించాల్సి వాటాలు ఎలానో చైనాలో ఇతర అంశాలతో పాటు ఇంటి బీమా కోసం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రితపు ఏడాదిలో మూడు నెలల సగటు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగం దానిలో కార్మికుడు చెల్లిస్తే మరో సగం కంపెనీ చెల్లిస్తుంది. ఆ నిధులను కార్మికులు గృహాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మొత్తాలు కనీస వేతనం పెరిగినపుడల్లా దానికి అనుగుణంగా పెరుగుతాయి. ఇవి కనీసవేతనాలు మాత్రమే. ఉదా షాంఘై నగరంలో 2020లో సగటు నెల కనీసవేతనం 1,632 డాలర్లు అంటే రు.1లక్షా 33వేలు. ఇది ప్రభుత్వం ప్రకటించిన నాటి కనీసవేతనం కంటే నాలుగు రెట్లు. మొత్తం వేతనంతో పాటు ఇతర సామాజిక రక్షణ పధకాలకు గాను యజమానులు చెల్లించాల్సిన మొత్తం 37శాతం ఉంటుందని వీటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ సమాచారం పేర్కొన్నది.


చైనా ఉత్పత్తులు నాసిరకమని అనేక మంది ప్రచారం చేశారు. నిజానికి చైనా బజార్ల పేరుతో మన దేశంలో విక్రయించే వస్తువులన్నీ చైనావి కాదు. తక్కువ ధరలకు వచ్చేవన్నీ నాసిరకమనే భావన మనలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అమెరికా, ఐరోపా దుకాణాలన్నింటా చైనా వస్తువులే అన్నది తెలిసిందే. చైనా తన ఎగుమతుల్లో కేవలం రోజువారీ అవసరమైనవే గాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. ఈ రంగంలో ఇప్పటికీ అమెరికా, ఐరోపా ధనిక దేశాలదే అగ్రస్థానం. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మేడిన్‌ చైనా 2025 పేరుతో అక్కడి ప్రభుత్వం 2015 ప్రారంభించిన పారిశ్రామిక విధానంలో ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే వాటికి గండితో పాటు పోటీ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గుతాయి. ఇది తమకు ముప్పు అని అందరికంటే ముందు గుర్తించింది అమెరికా, అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు.తమ ఉత్పత్తులకు ఎదురుకానున్న పోటీ గురించి చెప్పటానికి బదులు చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరించిందని, తమ భద్రతకు ముప్పు ఉందంటూ అమెరికా ప్రచారం చేస్తున్నది.


ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన పేర్లతో ఇలాంటి విధానాలనే చేపట్టింది.” పరిశ్రమలు 4.0 అభివృద్ధి ప్రణాళిక ” పేరుతో జర్మనీ ప్రకటించింది. మన మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి వాటి గురించి తెలిసిందే. ప్రపంచం వంద సెమీ కండక్టర్లను వాడుతుంటే అందులో చైనా వాటా 60, దానికి గాను అది ఉత్పత్తి చేస్తున్నది పదమూడు మాత్రమే. చైనా ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2025నాటికి ఈ రంగంలో 70శాతం స్వయం సమృద్ధి సాధించాలని, 2049లో వందేళ్ల చైనా కమ్యూనిస్టు పాలన నాటికి హైటెక్‌ పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే దుస్తులు, పాదరక్షల వంటి వాటి మీద పని చేస్తూనే ఇతర కీలక రంగాల మీద కేంద్రీకరించారు.లాభాలను మాత్రమే చూసుకొనే విదేశీ కంపెనీలు చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు, ఇతర రాజీలేని నిబంధనల కారణంగా ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. అందువలన కొన్ని పరిశ్రమలు వెళ్లవచ్చు. అలా వెళితే వాటికే నష్టం. వాటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశం ఉండదు. అందువలన ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, పారిశ్రామికవేత్తల ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి.

చైనా చేపట్టిన సంస్కరణల గురించి భిన్న అభిప్రాయం వెల్లడించే కొందరు వామపక్ష వాదులు గానీ, అది కూలిపోతుంది, వాలిపోతుంది అని గత నాలుగు దశాబ్దాలుగా జోశ్యాలు చెబుతున్న చైనా వ్యతిరేకులకు గానీ ఇంత కాలం ఆశాభంగమే తప్ప మరొకటి లేదు. అయితే చైనాకు ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేవా ? లేవని ఎవరు చెప్పారు ! పెట్టుబడిదారీ సమాజాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నవారికి అంతా పూలబాటగా ఎలాంటి ప్రతిఘటన, సవాళ్లు లేకుండా అంతా సాఫీగా నడిచిందా, ఆధిపత్యం కోసం ఖండాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకున్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణంలో పెట్టుబడిదారుల నుంచి ప్రతిఘటన లేకుండా ఎలా ఉంటుంది ?


చైనా ఒక విధానాన్ని అనుసరించి అనూహ్య విజయాలను సాధించింది. ఆ…. అది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం ఎక్కడుంది అనే వారు కొందరు. నిజమే, సోషలిజం లేనపుడు అది వద్దని కోరుకొనే వారు ఆ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో చైనా మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదు ? అక్కడంతా నిరంకుశత్వం ఉంటుంది అనే వాదన మరొకటి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశపాలనలో ఉన్నాయి,మరి అవెందుకు చైనా మాదిరి పురోగమించలేదు. పత్రికల రాతలను చూసి గతంలో కంపెనీలు చైనాకు వరుసలు కట్టలేదు. ఇప్పుడు వీటిని చూసి తిరుగుముఖం పడితే ఏం చేయాల్సిందీ చైనా వారు చూసుకుంటారు. వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవా, అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే దేశంలో చైనా ఆర్థికంగా దెబ్బతింటే బాగుపడేది మనమే లేదా మనకు మంచి అవకాశం అనే ఆలోచనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. చైనా మీద విద్వేషాన్ని విపరీతంగా రెచ్చ గొట్టిన పర్యవసానమిది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి కష్టపడకుండా లక్కు మీద ఆధారపడి పనీ పాటా లేకుండా తిరిగే సోంబేరుల మాదిరి ఉండి బాగుపడిన వారెవరూ లేరు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా దెబ్బతింటే తప్ప మనకు అవకాశాలు రావని చెప్పే ప్రబుద్దుల మాటలు విని దాని కోసం ఎదురు చూస్తూ చేయాల్సినవి చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదని పాలకులకు, ఇతరులకు ఎవరు చెప్పాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

30 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Boris Johnson, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, RSS, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంగ్లేయుల దోపిడీ, అణచివేతలపై బ్రిటన్‌ అధినేతగా రిషి సునాక్‌ భారతీయులకు క్షమాపణ చెబుతారా !

26 Wednesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Jallianwala Bagh massacre, Liz Truss, Rishi Sunak, RSS


ఎం కోటేశ్వరరావు


కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ కొత్త చరిత్రను సృష్టించాడు.పంజాబు మూలాలున్న తొలి ఆసియన్ను బ్రిటన్‌ నూతన ప్రధానిగా బకింగ్‌హామ్‌ పాలెస్‌లో మంగళవారం నాడు రాజు ఛార్లెస్‌ నియమించాడు. హిందువు, భారతీయుడు,మనవాడు అంటూ మన మీడియా స్పందించింది. ఏడు వారాలలో ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారటం బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు తాజా పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు. అంతకు ముందు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా కారణంగా ప్రధాని పదవికి కన్సర్వేటివ్‌ పార్టీలో జరిగిన పోటీలో సునాక్‌ను వెనక్కు నెట్టి ట్రస్‌ మొదటి స్థానంలో నిలవటంతో సెప్టెంబరు ఆరున ఆమె పదవిలోకి వచ్చారు.(బ్రిటన్‌ పార్టీల నిబంధనల ప్రకారం పార్లమెంటులో పార్టీ నేతగా ఎన్నిక కావాలంటే నిర్ణీత సంఖ్యలో పార్టీ ఎంపీల మద్దతు పొందిన వారు పోటీ పడతారు, తొలి రెండు స్థానాల్లో వచ్చిన వారికి ఆ పార్టీల సాధారణ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక్కరే ఉంటే ఏకగ్రీవం అవుతారు). ప్రధానిగా సునాక్‌ తొలిసారి మాట్లాడుతూ దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సి ఉందన్నాడు.ప్రతిపక్ష లేబర్‌ పార్టీ, ఇతరులు డిమాండ్‌ చేసినట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశాడు.


ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు భిన్నంగా పన్ను రాయితీలు ప్రకటించటంతో విమర్శలపాలు కావటమే కాదు, స్వంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత తలెత్తటంతో లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. తొలుత తాను రాజీనామా చేసేది లేదని బీరాలు పలికినా చివరకు తలొగ్గక తప్పలేదు. దీంతో మరోసారి పార్టీలో పోటీ తలెత్తింది. ఈ సారి ప్రధాని పదవికి పోటీ పడేవారికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉన్నవారే అర్హులని నిర్ణయించారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రేసులో నిలిచేందుకు పావులు కదిపినా ఆశించిన మద్దతురాకపోవటంతో వెనక్కు తగ్గి పరువు నిలుపుకున్నాడు. పార్లమెంటులో పార్టీ నాయకురాలు పెనీ మోర్డాంట్‌ అర్హతకు అవసరమైన మద్దతును కూడగట్టటంలో విఫలం కావటంతో చివరి క్షణంలో ఆమె కూడా తప్పుకోవటంతో సునాక్‌ ఒక్కరే మిగిలారు. లండన్‌ కాలమానం ప్రకారం అక్టోబరు 25వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు(మన దేశం కంటే నాలుగున్నర గంటలు వెనుక) తన చివరి కాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించి రాజు ఛార్లెస్‌కు అందచేశారు. చివరి మంత్రి వర్గ సమావేశం తరువాత లిజ్‌ ట్రస్‌ పన్నుల తగ్గింపు తన చర్యను సమర్ధించుకున్నారు.అధికారంలో ఉన్న వారు ధైర్యంగా ఉండాలన్నారు.


సునాక్‌ పదవి నిజానికి ముళ్ల కిరీటం వంటిదే. లిజ్‌ ట్రస్‌ సెప్టెంబరు 23న మినీ బడ్జెట్‌గా పిలిచిన చర్యలలో కొన్ని ఇలా ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థల మీద పన్ను మొత్తాన్ని 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు భిన్నంగా 19శాతానికి తగ్గించారు. జి20 దేశాలలో ఇది కనిష్టం. మౌలిక ఆదాయపన్ను 20 నుంచి 19శాతానికి తగ్గించారు.లక్షన్నర పౌండ్లకు మించి రాబడి ఉన్నవారికి పన్ను మొత్తాన్ని 45 నుంచి 40శాతానికి తగ్గించారు. బీమా పధకానికి పెంచిన 1.25 శాతం చెల్లింపును రద్దు చేశారు. ఇండ్ల కొనుగోలుపై పన్నుల తగ్గింపు, పన్ను తగ్గింపు జోన్ల ఏర్పాటు, అక్కడ నిబంధనలను నీరు గార్చటం, టూరిస్టులు తాము చెల్లించిన అమ్మకపు పన్నును తిరిగి తీసుకొనే వెసులుబాటు, మద్యంపై పెంచిన పన్నుల తగ్గింపు. నలభై ఐదు బిలియన్‌ పౌండ్ల మేర ఖజానాకు గండిపడేచర్యలివి. నిజానికి ఈ కారణంగా ఆమె పదవిని కోల్పోవటం పెట్టుబడిదారీ వ్యవస్థలో చిత్రంగానే కనిపించవచ్చు. దీని వలన దేశ లోటు, రుణ భారం మరింతగా పెరగనుంది, సంక్షేమ చర్యలకు కోత పడుతుంది. ఇప్పటికే కార్మికులు, మధ్యతరగతి వారి మీద గతంలో పెంచిన పన్నులు, ఇటీవలి కాలంలో ధరల పెరుగుదలతో జీవన వ్యయం విపరీతంగా పెరిగి జనజీవితాలు అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో కార్పొరేట్‌లు, ధనికులకు ప్రకటించిన రాయితీలు తీవ్ర విమర్శలకు, అధికారపార్టీలో కుమ్ములాటలకు దారి తీశాయి.


ఏక్షణంలోనైనా ఆర్ధిక రంగం మాంద్యంలోకి జారనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 10.1శాతం దాటింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రుణాల భారం పెరుగుతుంది. మరోవైపు పౌండు విలువ దారుణంగా దిగజారింది. అధికారపక్ష పలుకుబడి అధమ స్థాయికి పడిపోయింది. ట్రస్‌ – రిషి ఇద్దరూ ఒకే తానులో ముక్కలైనా అనుసరించే పద్దతుల్లో మాత్రమే తేడా. 2024 వరకు పార్లమెంటు గడువు ఉన్నందున వెంటనే ఎన్నికలు జరగాలని టోరీ పార్టీ కోరుకోవటం లేదు. ఇంకా తగినంత గడువు ఉన్నందున ఆర్ధిక రంగాన్ని పునరుజ్జీవింపచేసి, జీవన ప్రమాణాలను పెంచి ఓటర్ల ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోవటం ఖాయం. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు ద్వారా లోటు బడ్జెట్‌ తగ్గింపు, పన్నుల పెంపును ఐఎంఎఫ్‌ కోరుతున్నది.ఇదే జరిగితే కార్మికుల జీవితాలు మరింతగా దిగజారతాయి. అందువలన రానున్న రోజుల్లో రిషి సునాక్‌ కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న తన విధానాల గురించి సునాక్‌ చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


పెరిగిన ఇంథన, ఆహార, ఇతర వస్తువుల ధరల తగ్గింపు, నిజవేతనాల పెరుగుదల కోసం జనాలు చూస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని సునాక్‌ చెప్పాడు.2020 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ 1950 దశకం తరువాత తొలిసారిగా పన్నుల భారాన్ని పెంచాడు. ప్రభుత్వ ఖర్చునూ పెంచాడు. ద్రవ్యోల్బణం తగ్గి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పన్నులను తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడినపుడు రిషి చెప్పాడు. 2029 నాటికి ఆదాయపన్నును 20 నుంచి 16శాతానికి తగ్గిస్తామని చెప్పాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్సర్వేటివ్‌ పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగానే బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరుపడాలన్న వైఖరిని రిషి సమర్ధించాడు. అది పొరపాటని తిరిగి చేరాలంటూ కొందరు ఇప్పుడు వత్తిడి చేస్తున్నారు. వెలుపల ఉండటం ద్వారా బ్రిటన్‌కు కలిగే ప్రయోజనాలను వెంటనే చూపకపోతే ఆ డిమాండ్‌ మరింతగా పెరగవచ్చు. విదేశీ వలసలను అరికట్టాలని కన్సర్వేటివ్‌ పార్టీలో మెజారిటీ కోరుతున్నారు. అయితే అలాంటి వలసవచ్చిన వారి సంతతికి చెందిన సునాక్‌ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినందుకు తాను గర్వస్తానని అన్నాడు. ఆర్ధిక రంగ సమస్యలను నిర్ధారించి, పార్టీని ఐక్య పరచి దేశాన్ని ముందుకు తీసుకుపోతానని సునాక్‌ చెప్పాడు. విధ్వంసం జరిగిన ప్రాంతంలోకి సునాక్‌ అడుగుపెడుతున్నాడని ఒక టీవీ వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రభుత్వ ఖర్చును 30బిలియన్‌ పౌండ్ల మేర తగ్గించటం లేదా ఆ మేరకు అదనపు రాబడిని చేకూర్చాల్సి ఉంది.రానున్న మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ రుణభారాన్ని తగ్గిస్తామన్న వాగ్దానాన్ని కూడా అమలు జరపాల్సి ఉంది.


బ్రిటన్‌లో ప్రధాని పదవిని చేపట్టిన రెండవ క్రైస్తవేతరుడిగా, తొలి హిందువుగా రిషి సునాక్‌ చరిత్రకెక్కారు. అతడు భారతీయ మూలాల కంటే హిందువు కావటంతోనే మన దేశంలో మీడియా, సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నది. నిజానికి సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతంలోని గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. అక్కడే సునాక్‌ తండ్రి జన్మించాడు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980లో రిషి సునాక్‌ బ్రిటన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. సునాక్‌ నానమ్మ ఆఫ్రికన్‌. వారి కుటుంబం పుట్టింది, పెరిగిందీ ఆఫ్రికాలోనే ఉగండాలో ఇడీ అమీన్‌ పాలనలో జరిగిన దాడులపుడు అనేక మంది బ్రిటన్‌ ఇతర దేశాలకు వలస వెళ్లారు. అలాంటి కుటుంబాలలో సునాక్‌ తండ్రి ఒకరు. అందువలన నిజంగా చెప్పాల్సి వస్తే ఆఫ్రికా మూలాలు లేదా తాతలు పుట్టిందీ పెరిగినదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే పాక్‌ మూలాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. మన మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ కుటుంబాలు విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చినవే. అలాగే పాక్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ కుటుంబం భారత్‌ నుంచి పాక్‌ వలస వెళ్లింది. వారు పదవుల్లోకి వచ్చినపుడు వారి మూలాల గురించి ఎలాంటి చర్చ లేదు. సోనియా గాంధీ 1983లోనే పూర్తిగా భారత పౌరురాలిగా మారినప్పటికీ తరువాత 2004లో బిజెపి లేని వివాదాన్ని ముందుకు తెచ్చి ప్రధాని గాకుండా మనోభావాలతో ఆడుకొనేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇటలీ మూలాల గురించి ఏదో రూపంలో ప్రస్తావిస్తూనే ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. వసుధైక కుటుంబం కబుర్లు చెప్పేది కూడా వారే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిషి సునాక్‌ మూలాలు భారత్‌లో ఉన్నట్లు మన మీడియా చిత్రిస్తున్నది, దాన్ని ఏ ప్రాతిపదికన చెబుతారు. దాని వలన ఒరిగేదేమిటి ? అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా తొలి ఆఫ్రికన్‌ సంతతికి చెందినవాడు. లాటిన్‌ అమెరికా, ఐరోపాలోని అనేక దేశాల్లో ఇలా వలస వచ్చిన వారు, వారి సంతతి ఉన్నత పదవులను పొందారు. అందువలన అదేమీ వింత కాదు.


ఈ దేశంలో పుట్టిన ముస్లింలను పాకిస్తాన్‌ పోవాలని చెబుతున్న విద్వేష శక్తులే రిషి సునాక్‌ మూలాల గురించి ఎక్కువగా ముందుకు తెస్తున్నాయి.బ్రిటన్‌లో కూడా జాత్యహంకార శక్తులు లేకపోలేదు. వారికి భారత్‌, పాకిస్తాన్‌, చైనా ఇలా ఎక్కడ నుంచి వలస వచ్చిన కుటుంబాలనైనా ఆసియన్లంటూ చులకనగా చూసేవారున్నారు.మొత్తం మీద చూస్తే అలాంటి సంకుచిత భావాలకు అతీతంగా అక్కడి సమాజం ఎదిగిన కారణంగానే సునాక్‌తో సహా అనేక మంది ఇతర ఖండాల మూలాలు ఉన్న సంతతికి చెందినప్పటికీ మంత్రులుగా, ఏకంగా ఇప్పుడు ప్రధానిగానే అంగీకరించారు. రిషి సునాక్కు అమెరికా గ్రీన్‌ కార్డు కూడా ఉందని కూడా తెలిసిందే. రిషి సునాక్‌ కుటుంబం మీద విమర్శలు కూడా ఉన్నాయి. భార్య అక్షిత 20లక్షల పౌండ్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విమర్శలు రాగా తరువాత ఆ మొత్తాన్ని తాను చెల్లిస్తానని ఆమె వివాదానికి స్వస్థిపలికారు. సునాక్‌ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది కాదు, వర్తమానంలో ఎవరి కోసం పని చేస్తున్నాడు అన్నది కీలకం. ఆ విధంగా చూస్తే కార్పొరేట్లకు చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ నేతగా వారి సేవలోనే తరిస్తున్నాడు. ఒకనాడు తెల్లవారు మన దేశాన్ని పరిపాలిస్తే నేడు మన వాడు బ్రిటన్‌ పాలకుడిగా ఉన్నారని కొందరు చెబుతున్నారు. గతంలో ఎంపీగా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు మురిసిపోతున్నారు. ఎవరి విశ్వాసం వారిది. వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన సంపదలను కొల్లగొట్టి తమ దేశానికి తరిలించారు. అణచివేతలో భాగంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. వారు చేసిన నేరాలకు ఎన్నడూ క్షమాపణ కాదు కదా తమ పూర్వీకులు తప్పు చేసినట్లు విచారం కూడా ప్రకటించలేదు. చెప్పేందుకు సిద్దంగా కూడా లేరు.అందరూ చెబుతున్నట్లు భారత మూలాలు ఉన్న ఒక పంజాబీగా జలియన్‌వాలా బాగ్‌ దురంతాన్ని రిషి గుర్తు చేసుకోగలరా ? ఇదే రిషి సునాక్‌ ఆర్ధిక మంత్రిగా తమ దేశానికి లబ్ది చేకూర్చే వాణిజ్య ఒప్పందాల చర్చలను కొనసాగించారని తెలుసా ? వాటితో మన దేశాన్ని కొత్తగా కొల్లగొట్టకుండా ప్రధానిగా తన గడ్డ రుణం తీర్చుకుంటారని అతను మనవాడని భుజాన వేసుకుంటున్న వారు చెప్పగలరా ? అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి తన జాతికి చేసిన అన్యాయాలకు బ్రిటన్‌ అధినేతగా క్షమాపణ సరే కనీసం విచారమైనా ప్రకటించగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఘోర వైఫల్యం : ఆరేండ్ల నాటి పెద్ద నోట్ల రద్దుకు నేడు అడ్డగోలు సమర్ధనలా !

26 Wednesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Ashima Goyal, BJP, Demonetisation, Indian economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ నోట రెండోసారి పలికేందుకు ఇబ్బంది పడిన పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ రిజర్వుబాంకు ద్రవ్యవిధాన పర్యవేక్షక కమిటీ సభ్యురాలుద, ఆర్ధికవేత్త అషిమా గోయల్‌ ఇటీవల ముందుకు వచ్చారు. దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడకల, పాలకులకు ఘోర వైఫల్యం. దీని గురించి ఆరు సంవత్సరాల తరువాత ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం కోర్డు డివిజన్‌ బెంచ్‌ పెద్ద నోట్ల రద్దు లక్షా˜్యన్ని సాధించిందా అన్న అంశాన్ని విచారించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ విధానాల సమీక్ష మీద తమకు ఉన్న లక్ష్మణ రేఖ గురించి తెలుసునని కూడా కోర్టు పేర్కొన్నది. అందువలన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం గురించి ఊహాగానాలు అవసరం లేదు. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి, పాలకుల మాటలను, నాటి పరిస్థితి, ప్రహసనాలను జనాలకు మరోసారి గుర్తుకు తెస్తాయి.


పెద్ద నోట్ల రద్దు బడా వైఫల్యమని తెలిసినప్పటికీ పన్ను వసూళ్ల ప్లవనశక్తి వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఉన్నదని అషిమా గోయల్‌ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమా, ఆ వైఖరితో అందరూ ఏకీభవించాలా? అఫ్‌ కోర్సు ఇదే తర్కం ఆర్ధికవేత్తలందరికీ వర్తిస్తుంది కదా అని ఎవరైనా అనవచ్చు. నిజమే, ఎవరేం చెప్పినా వారు చెప్పినదానికి ప్రాతిపదికలే విశ్వసనీయతను వెల్లడిస్తాయి. ఇదే అషిమాకూ వర్తిస్తుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు- తరువాత పన్ను వసూళ్ల అంకెలు ఏమి చెబుతున్నాయి ? ఇలా అనేక అంశాలను చూడాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లలో ఏమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశమే. అషిమా గోస్వామి చెప్పిన అంశాల ప్రాతిపదిక, వాదనే వాటిలో ఉంటుందా ? చూద్దాం.


పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులు, ఇతర విద్రోహశక్తులకు నిధులు అందకుండా చూస్తామని,సమాంతర ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తామని, తెరవెనుక లావాదేవీలను బహిర్గతపరుస్తామని ప్రధాని నరేంద్రమోడీ 2016నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో చెప్పారు. ” ప్రభుత్వ అధికారుల పరుపుల కింద కరెన్సీ కట్టలు లేదా గోనె సంచుల్లో నగదు దొరికింది అనే వార్తలతో నిజాయితీపరులైన పౌరులు బాధపడకూడదనే ” పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్‌) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణాలో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఇప్పుడు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా ? ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇండ్లలో అధికారికంగా ప్రకటించిన రు.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు ? ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిది. ఆ పెద్దమనిషి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు గనుక, మమతాబెనర్జీకి కూడా వాటా వుండి చూసీ చూడనట్లు ఉన్నారనుకుందాం, మరి కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నట్లు ? నిజానికి చిత్తశుద్దితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సినపని లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు దాని ఫలాలు అందుతున్నట్లు అషిమా చెప్పారు. ఫలాలంటే ఏమిటి ? ఆర్ధిక వ్యవస్థ క్రమబద్దీకరణ జరిగింది, డిజిటైజేషన్ను పెంచింది, పన్నుల ఎగవేతను నిరోధించింది అని ఆమె చెప్పారు. గత ఏడాదితో పోల్చితే వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను చెల్లింపు 24శాతం పెరిగి రు.8.98లక్షల కోట్లకు, జిఎస్‌టి గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది 26శాతం చేరినట్లు అక్టోబరు 9న పన్నుల శాఖ చెప్పిన అంశాన్ని ఆమె తన వాదనకు రుజువుగా పేర్కొన్నారు.


పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నరలక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా ఉన్న సౌమ్యకాంతి ఘోష్‌ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్‌ స్టాండర్డ్‌ అనే పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు.( అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ది చేకూరినట్లే) అంతే కాదు ఇప్పటికే ఉన్న ఢిల్లీ పొగను మరింత పెంచేవిధంగా అంత మొత్తాన్ని తగుల పెట్టబోరనే చతురోక్తిని కూడా విసిరారు. అషిమా అభిప్రాయం కూడా అలాంటిదేనా ? ఇద్దరూ ఆర్ధికవేత్తలే కదా ! చివరికి ఏమైంది, ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్లు తగలబెట్టలేదు, పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి.ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా భలే ఉందే అన్న సామెతను గుర్తుకు తెచ్చారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు.కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరోసాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.

2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు.


పెద్ద నోట్ల రద్దు గురించి దివంగత ఆరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా 2017 ఫిబ్రవరి రెండున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో చెప్పిందేమిటి ? 2016 నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు 30వరకు రెండు నుంచి 80లక్షల వరకు డిపాజిట్లు చేసిన ఖాతాలు 1.09 కోట్లు కాగా ఒక్కొక్క ఖాతా సగటు మొత్తం రు.5.03 లక్షలు, 80లక్షలకు మించి దాఖలు చేసిన ఖాతాలు 1.48 లక్షలు, వీటి సగటు రు.3.31 కోట్లు. వీటిని మరొక విధంగా చెప్పారు కొందరు. రు.80లక్షల లోపు డిపాజిట్లు చేసిన ఖాతాల్లో చేరిన మొత్తం రు.5.48 లక్షల కోట్లు కాగా అంతకు మించి చేసిన ఖాతాల మొత్తం రు.4.89 లక్షల కోట్లు.ఆర్‌బిఐ ప్రకటించిన దాని ప్రకారం 99శాతంపైగా నగదు వెనక్కు వచ్చింది, రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. రద్దు చేసిన నోట్ల విలువ రు.15.44లక్షల కోట్లు. మూడోవంతు(31శాతం) సొమ్ము రు.4.89 లక్షల కోట్లు 80లక్షలకు పైగా డిపాజిట్లు కేవలం 1.48 లక్షల మంది నుంచే వచ్చిందంటే నోట్ల రద్దు వలన లబ్ది పొందింది నల్ల మహా ధనికులా మరొకరా ?


పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్‌, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పేవారితో నాకు పేచీ లేదు. అది వేరే సమస్య. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్రమోడీ గారే చెప్పారు.” పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవినీతి స్థాయితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అవినీతి పద్దతుల్లో నగదు సమీకరణతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. పేదలు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు స్వయంగా అనుభవించి ఉంటారు. భూమి లేదా ఇంటినో కొనుగోలు చేసినపుడు చెక్కు ద్వారా చెల్లించేదానితో పాటు పెద్ద మొత్తంలో నగదును డిమాండ్‌ చేస్తారు. ఒక నిజాయితీ పరుడు ఆస్తిని కొనుగోలు చేసినపుడు సమస్యలను సృష్టిస్తుంది. నగదును దుర్వినియోగం చేస్తే వస్తువుల ధరలు, సేవలైన ఇండ్లు, భూమి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ ఇంకా ఎన్నింటి ధరలో కృత్రిమంగా పెరుగుతాయి.” ఇవన్నీ చెప్పింది మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గారే. నోట్ల రద్దు జరిగి ఆరేండ్లు కావస్తోంది, నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే. నిజాయితీపరులైన వారు చెక్కుల ద్వారా ఇండ్లు కొనుక్కున్న ఉదంతం ఒక్కదాన్ని ఎవరైనా చూపగలరా ? ఆత్మవంచన చేసుకోకుండా ఎవరికి వారు అవలోకించుకోవాలి.


పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015 -16లో నగదు చెలామణి జిడిపిలో 12.1శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి – అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది. మోడినోమిక్స్‌ ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.


పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జూలైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకువచ్చారు.ఆ తరువాత కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి ? పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది.మరుసటి ఏడాది కరోనాతో 7.3శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు అషిమా గోయల్‌ ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు ? అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు.యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016ఏప్రిల్‌ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు.2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు. ఈ లావాదేవీల పెరుగుదలకు వాటి మీద అవగాహన పెరగటం, ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ జనాలకు అందుబాటులోకి రావటం, వేగం పెరగటమే కారణంగా చెప్పవచ్చు. దీన్ని ఆర్ధిక రంగ క్రమబద్దీకరణ అని చెప్పగలమా ?


ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు ఏ భాష్యం చెబుతారు ? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి.2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు సగటున 47.73 కోట్లు కాగా 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమలావాదేవీలు ఇంతేనా ? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించే అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టులో తన చర్యను కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో ఏ వాదనలను ముందుకు తెస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d