• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

సామాన్యులకు గోడదెబ్బ-చెంపదెబ్బ : పెరుగుతున్న చమురు – తరుగుతున్న రూపాయి !

07 Thursday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

crude oil price, Fuel Price in India, Rupee depreciation

ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల మీద భారం పెరుగుతోందని ఇంకోసారి చెప్పనవసరం లేదు. బుధవారం నాడు పీపాధర బ్రెంట్‌ రకం 82-83 డాలర్ల మధ్య కదలాడింది. గురువారం నాడు 80.7 డాలర్లతో ప్రారంభమై 81.36 మధ్య ఉంది. మనం దిగుమతి చేసుకొనే రకం ఒకటి-రెండు డాలర్లు తక్కువగా ఉంటుంది. తొంభై డాలర్ల వరకు పెరగవచ్చని గోల్డ్‌మన్‌ శాచస్‌ జోశ్యం చెప్పింది. ఏం జరగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని స్ధితి. జనం జేబులు కొల్లగొట్టటం ఎలా అని తప్ప భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదు. రాష్ట్రాలకు అలాంటి అవకాశం పరిమితం. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి వాటి ఆదాయాలకు హామీ ఇస్తే రాష్ట్రాలు ఆ విధానానికి ఆమోదం తెలుపుతాయి. అందుకు కేంద్రం సిద్దంగా లేదు.


అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్‌+దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం.ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోశ్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు. కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్‌+దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు.


ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి.బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపధ్యంలో అనేక విద్యుత్‌ కంపెనీలు గ్యాస్‌కు బదులు చమురుతో విద్యుత్‌ ఉత్పత్తి చౌక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్‌ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది.ఇది కూడా ఒక తక్షణ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితం చేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్‌ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయలేదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.
రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు.పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్‌, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్‌ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయయి.

రష్యా గ్యాస్‌ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విబేధాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారి తీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తున్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గం లేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తివేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానంవైపు మార్కెట్‌ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీనివలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బతీసే ఎత్తుగడ ఉంది.దీని వలన పదిశాతం ధరలు కూడా తగ్గాయి. గొట్టపు మార్గం పని చేసేందుకు అనుమతించేందుకు జర్మనీ సిద్దంగా ఉంది.


ఐరోపాలో ఒక మెగావాట్‌ అవర్‌ విద్యుత్‌(ఐరోపాలో 330 ఇండ్లలో ఒక గంటపాటు వినియోగించేదానికి సమానంగా పరిగణిస్తారు) ధర రికార్డును బద్దలు కొట్టి 106 యూరోలను తాకింది. ఇది పీపా చమురు ధర 205 డాలర్లకు సమానం. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు. ఆసియా, ఇతర కొనుగోలుదారులకు సౌదీ అరేబియా పీపాకు చమురు ధరలో 0.42 డాలర్లు తగ్గించటంతో చమురు ధరలు గురువారం నాడు స్వల్పంగా తగ్గాయి. రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.


మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమతులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం ఒకటి. అక్టోబరు ఆరవ తేదీన రూపాయి డాలరుకు 75కు పతనమైంది. సెప్టెంబరు 28న 74 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్ధిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిని పెంచకపోగా గత స్ధాయిని కొనసాగించటంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ విఫలమైంది. ఇథనాల్‌ ఉత్పత్తి చేసి ఆమేరకు భారం తగ్గిస్తామని చెప్పిన మాటలు కూడా అమలు కాలేదు. ప్రస్తుతం మన దేశం 80శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్నది.


గతంలో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి కొనుగోలు చేసిన చమురు విలువలో సగం మొత్తాన్ని రూపాయిలలో చెల్లిస్తే సరిపోయేది. మన దేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతులు చేసిన వారికి మన ప్రభుత్వం సర్దుబాటు చేసేది. మన అవసరాల్లో పదిశాతం అక్కడి నుంచే దిగుమతి చేసుకొనే వారం. ఇరాన్‌ దగ్గర చమురు కొన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులతో మన సర్కార్‌ భయపడిపోయి అక్కడి నుంచి పూర్తిగా కొనుగోళ్లను ఆపివేసింది. అందువలన ఆ మేరకు డాలర్లు చెల్లించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీంతో ఇరాన్‌ మన దేశం నుంచి దిగుమతులను కూడా పరిమితం చేసింది. 2018-19లో రెండు దేశాల వాణజ్య విలువ 17బిలియన్‌ డాలర్లు ఉండేది. మరుసటి ఏడాదికి అది 4.77 బి.డాలర్లకు పడిపోయింది. మన ఎగుమతులు 2019తో పోల్చితే 42శాతం తగ్గి 2020లో 2.2బి.డాలర్లకు, 2021లో మరింతగా పడిపోయాయి.

మరోవైపున ఇరాన్‌-చైనా బంధం మరింత గట్టిపడింది.రాయితీలతో కూడిన చమురు నిరంతరాయంగా ఇరాన్‌ సరఫరా చేస్తే చైనా 400 బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెట్టనుంది. అమెరికా బెదిరింపుల కారణంగా మనం ఇరాన్‌తో స్నేహాన్ని ప్రశ్నార్దకం చేసుకోవటంతో పాటు వాణిజ్య అవకాశాలను కూడా కోల్పోయాము. వినియోగదారుల మీద భారం మోపుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇరాన్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్‌లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు.పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేస్తారు. చమురు, గాస్‌ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ రాజధాని చుట్టూ ఇనుప మేకులు పాతి పది నెలలుగా రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్న సర్కార్‌ చమురు భారాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తే ఏం చేయనుందో చూడాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లారు, వచ్చారు ! సాధించింది ఏమిటి ?

28 Tuesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, BJP, India-UNSC, Joe Biden, Narendra Modi US Visit


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్లారు, తిరిగి వచ్చారు. అరవై అయిదు గంటల వ్యవధిలో 20 సమావేశాలలో, ప్రయాణ సమయంలో విమానంలో నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారట. తిరిగి వస్తూనే కొత్త పార్లమెంట్‌ భవన సముదాయ నిర్మాణం ఎలా జరుగుతోందో రాత్రిపూట పర్యవేక్షించారు. రాగానే ప్రధాని నిర్మాణ స్ధలాన్ని సందర్శించటంలో పెద్ద విశేషం ఏమీ లేదు గానీ (కరోనా సమయంలో భరోసా ఇచ్చేందుకు ఏ ఆసుపత్రినీ సందర్శించలేదు గానీ అన్న కాంగ్రెస్‌ విమర్శ వేరే అంశం), విదేశాలకు వెళ్లినా, స్వదేశంలో ఉన్నా మన ప్రధానికి పని యావతప్ప మరొకటి ఉండదనే సందేశాన్ని మోడీ మీడియా మేనేజ్‌మెంట్‌ బృందం ఇచ్చిందని చెప్పవచ్చు. తన శరీర ధర్మాన్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకొనే రహస్యాలు ప్రధాని దగ్గర ఉన్నందున విమాన ప్రయాణ బడలికకు ఏమాత్రం గురికాలేదని, ఎల్లవేళలా ఉత్సాహంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వాటిని అదేదో అంటున్నారుగా డబ్బిచ్చి రాయించుకోవటం అని అదా, విలేకరులే ఉత్తేజితులై రాశారా అంటే, ప్రధాని వెంట ఎప్పుడూ విలేకర్లు ఉండరు, వారి పొడ గిట్టదని తెలిసిందే.


ఇంత హడావుడి చూసిన తరువాత ఒక సినిమాలో నువ్వు ఎవరు అని ప్రశ్నించినట్లుగా ప్రధాని అమెరికా, ఐరాస పర్యటనలో సాధించింది ఏమిటి అనే అంశం ముందుకు వస్తుంది. ఫలితం వస్తేనే పని చేసినట్లుగా భావిస్తున్న రోజులు కనుక అలాంటి ప్రశ్న వేసిన వారి మీద ఆగ్రహించనవసరం లేదు. అమెరికాలో ఇండియన్‌ అమెరికన్‌ వాణిజ్యవేత్తలతో సహా పలు కంపెనీల అధిపతులతో సమావేశం జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారా లేక పెట్టుబడుల విషయమై చర్చించారా అన్నది తెలియదు. సులభతర వాణిజ్యంలో మోడీ ఏలుబడిలో 142 నుంచి 63కు ఎదిగిన తరువాత కొత్తగా వారు తెలుసుకొనేదేమి ఉంటుంది-మోడీగారు చెప్పేది మాత్రం ఏం ఉంటుంది ? వచ్చే నెలలో అమెరికా నుంచి ఒక ఉన్నత స్ధాయి బృందం రానుందని వార్తలు.


ప్రధాని పర్యటన ఫలితాలు-పర్యవసానాలు వెంటనే వెల్లడికావాలనేదేమీ లేదు. ఈ పరిమితులను గమనంలో ఉంచుకొని జరిగిన కొన్ని విషయాల గురించి చూద్దాం. మొత్తం మీద మూడు అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి ఐరాస వార్షిక సమావేశంలో ప్రసంగించటం, రెండవది అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌లతో ఏర్పడిన చతుష్టయ కూటమి శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్‌లకు గట్టి పరోక్ష హెచ్చరిక , ఈ సందర్భంగా వాణిజ్య ప్రముఖులు ఇతరులతో భేటీ కావటంగా చెప్పవచ్చు.బిజెపి నేతలు ఈ పర్యటన ఒక చారిత్రాత్మక మలుపు అన్నట్లుగా చిత్రించారు. వెంపల చెట్లను నిచ్చెనలతో ఎక్కే జనాలున్న రోజులివి. కొత్తగా జరిగిన పరిణామాలేవీ లేవు, కొత్తగా పొరుగుదేశాలకు చేసిన హెచ్చరిక ఏమిటన్నది ఒక బ్రహ్మపదార్దం.ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ బహుముఖ సంస్థలు అసంగతమైనవిగా మారాయని వాటిని సంస్కరించాలని కోరారు. వాస్తవమే, ఇది కూడా పరోక్ష వ్యవహారమే.భద్రతా మండలిలో శాశ్వత స్ధానం కావాలని మనం కోరుతున్నాం. ఆ హౌదా ఉన్న దేశాలు దాన్ని దేనికి వినియోగిస్తున్నాయన్నది వివాదాస్పదం, ప్రజాస్వామ్య విరుద్దం. ఆ హక్కు ఎవరికీ ఉండకూడదు. ఐరాస జనరల్‌బాడీ లేదా భద్రతా మండలి మెజారిటీ తీర్మానాలను ఏ ఒక్కదేశం వీటో చేసినా అవి చెల్లవు. అలాంటి హక్కును మనం కోరుతూ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెబుతున్నాం. అయినా చైనాతో సహా అందరూ మనకు మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో మనతో సహా ఎవరి రాజకీయం వారు చేస్తున్నందున అది ముందుకు పోవటం లేదు, ఆశ కూడా కనిపించటం లేదు.


తిరోగామి దేశాలు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఐరాసలో ప్రధాని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించటాన్ని అనుమతించకూడదని, ఏ దేశమూ అక్కడి పరిస్ధితిని వినియోగించుకొనేందుకు వీల్లేకుండా చూడాలనీ చెప్పారు, నిజమే, ఆ పేరుతో ఇరవై ఏండ్లు ప్రత్యక్షంగా మరో 23 ఏండ్లు పరోక్షంగా అమెరికా చేసింది ఏమిటో పరోక్షంగా అయినా చెప్పి ఉంటే మరింత ఘనంగా ఉండేది. అమెరికా, దానికి ఇంతకాలం మద్దతు ఇచ్చిన మనం ఏ రకమైన దేశాల జాబితాలోకి వస్తాం ? ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా ఆప్ఘనిస్తాన్‌లో మిలిటరీ జోక్యం చేసుకుంది. అక్కడి జనజీవితాలను అతలాకుతలం గావించింది. తాలిబాన్‌, ఇతర ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్‌కు ఆయుధాలతో సహా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. మాదారిన మేం పోతాం మా జోలికి రావద్దు అని వారితోనే ఒప్పందం చేసుకుంది, అయినా ఒక్క మాట అనేందుకు మనకు ధైర్యం లేదు.


ప్రధాని అంతర్జాతీయ వేదిక మీద తన గురించి తాను పొగుడుకోవటాన్ని ఎవరైనా తప్పు పడితే వారి మీద విరుచుకుపడితే కుదరదు. ఇతరులు పొగిడితే అందం చందం. మనల్ని మనమే పొగుడుకుంటే ”చాల బాగోదు ”. ఒక రోజు రైల్వే స్టేషన్‌లో తేనీరు అమ్మేందుకు తన తండ్రికి సహకరించిన ఒక చిన్న కుర్రవాడు నేడు నాలుగోసారి ఐరాస సమావేశంలో ప్రసంగించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని మోడీ తన గురించి చెప్పుకున్నారు. అయితే అదే చిన్న కుర్రవాడు పెద్దయిన తరువాత ఆ రైల్వేస్టేషన్లను ఏం చేయచూస్తున్నారో చూస్తున్నదే. ఆ కుర్రవాడి ఊరి రైల్వే స్టేషన్‌ తేనీరు అమ్మేంత పెద్దది కాదని, అందుకు ఆధారాలేవీ లేవని మన దేశ మీడియాలో వచ్చిన వార్తలను చదువుకున్న విదేశీయులు భారత ప్రధాని గురించి ఏమనుకుంటారు ? కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా మనం వదిలేద్దాం.


అమెరికా పర్యటనలో నరేంద్రమోడీ సాధించిందేమిటి అనే ప్రశ్నకు మోడీ అద్భుత అమెరికా సందర్శన – ప్రదర్శన ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు ఒక మూలమలుపు అని బిజెపి అధికార ప్రతినిధి తుహిన్‌ ఏ సిన్హా ఏకంగా ఒక పెద్ద వ్యాసమే రాశారు. ఎవరికైనా అలా అనిపించిందా ? ప్రతి సందర్భంలోనూ చాతుర్యం ప్రదర్శించారని, సునాయాసంగా, ఎంతో చక్కగా ఐరాసలో ప్రసంగించారని వర్ణించారు. హిందీ, గుజరాతీలో ఆయన మంచి వక్త అని కొత్తగా చెప్పాల్సిందేముంది. మోడీ ప్రసంగం ప్రపంచంలో ఏదైనా కొత్త పరిణామానికి నాంది పలికిందా, దానికి సూచనలు కూడా లేవు. అందుకే ఒరిగిందేమిటి అనాల్సి వస్తోంది. 1950దశకంలో మనకు భద్రతా మండలిలో శాశ్వత స్ధానం దక్కే అవకాశాన్ని నెహ్రూ చైనాకు వదలివేశారని బిజెపి ప్రతినిధి గోబెల్స్‌ ప్రచారాన్ని పునరుద్ఘాటించారు. భద్రతా మండలిలో చైనాకు శాశ్వత స్దానం వచ్చిన 1945లో మనకు అసలు స్వాతంత్య్రం రాలేదు, చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాలేదు, వచ్చిన 1949 నుంచి 1971వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో అసలు గుర్తింపే లేదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనా పేరుతో కథ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు.


ప్రస్తుతం భద్రతా మండలిని విస్తరించాలనే మల్లగుల్లాల్లో భాగంగా భారత్‌, జపాన్‌, జర్మనీ,బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. భారత్‌ విషయంలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప చైనాతో సహా మరేదేశమూ అభ్యంతరం చెప్పలేదు. తమ దేశాలపై యుద్దనేరాలకు పాల్పడిన జపాన్‌ వైపు నుంచి ఇప్పటికీ సరైన పశ్చాత్తాపం లేనందున చైనా, ఉత్తరకొరియా, వియత్నాం వంటి దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఇటలీ పరోక్షంగా జర్మనీకి వ్యతిరేకంగా ఉంది. మరికొన్ని ఐరోపా, ఆఫ్రికాదేశాలు కూడా జర్మనీని వ్యతిరేకిస్తున్నాయి.బ్రెజిల్‌ను కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు అంగీకరించటం లేదు. మన దేశాన్ని తన అనుయాయిగా మార్చుకొనేందుకు తెరవెనుక మంతనాల్లో నెహ్రూ ప్రభుత్వానికి అమెరికా భద్రతా మండలి శాశ్వత స్ధానం అనే బిస్కెట్‌ను వేసింది. మాక్కూడా ఇస్తే అంగీకారమే గాని చైనాను తప్పించి ఆ స్ధానం మాకు అవసరం లేదు అని నెహ్రూ చెప్పారు. ఇప్పుడు మన దేశం జపాన్‌కు మద్దతు ఇస్తున్నది. మీ సంగతి మీరు చూసుకోండి తప్ప జపాన్‌కు మద్దతు మానుకోవాలని మన దేశానికి చైనా చెబుతున్నది. నాటి నెహ్రూ వైఖరిని తప్పుపడుతున్న నేటి నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా ? అలా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.అలాంటి వారికి నెహ్రూను విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఉంది ?


నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో చతుష్టయ(క్వాడ్‌) సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇది మిలిటరీ కూటమి కాదు, చైనాకు వ్యతిరేకం కాదని గతంలో మన దేశ వైఖరి గురించి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. ఇప్పుడు నరేంద్రమోడీ వైఖరిలో అంత స్పష్టత లేదు. అది ఎత్తుగడ లేదా ముసుగు కావచ్చు, కానీ ఒక పార్టీగా బిజెపి అధికార ప్రతినిధి ఏం చెబుతున్నారు ? బ్రెజిల్‌, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి 2006లో ఏర్పడింది. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయం(క్వాడ్‌) 2007లో ఉనికిలోకి వచ్చింది. బ్రిక్స్‌ అవసరార్ధం, ఎడముఖం పెడముఖంగా ఉండేదేశాలతో ఏర్పడిందని, అంతగా అయితే రద్దు చేయకుండానే సార్క్‌ మాదిరి వదలివేయవచ్చట. పురోగామి ప్రజాస్వామిక దేశాలతో కూడిన చతుష్టయం సహజంగా ఉనికిలోకి వచ్చిందట. జగడాలంటే ఇష్టపడటం దాని స్వభావమట. ఎవరి మీద ? ఇది ఎల్లవేళలా చైనాకు వ్యతిరేకంగానే కనిపిస్తుందని,కమ్యూనిస్టు-ఇస్లామిస్టు కూటమికి వ్యతిరేకంగా పని చేసేందుకు అని కూడా బిజెపి ప్రతినిధి సెలవిచ్చారు. లడఖ్‌ సరిహద్దు వివాదం ఎందుకు,ఎలా జరిగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చేమో !అంతేకాదు, భవిష్యత్‌ ప్రపంచ రాజకీయాలను మలచటంలో చతుష్టయం భారత్‌కు అత్యంత అనుకూల స్ధానాన్ని చేకూర్చుతుందని కూడా చెప్పారు. ఇక ఐరాస ప్రసంగంలో మోడీగారు చెప్పిన అంశాలలో ” భారత్‌ అభివృద్ది చెందినపుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది… భారత్‌ సంస్కరణలు అమలు జరిపినపుడు ప్రపంచం మారుతుంది ” దీని మీద వ్యాఖ్యానించనవసరం లేదు. ఒకవైపు చతుష్టయ రాజకీయం చేస్తూనే మరోవైపు అకుస్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానాన్ని అంద చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారు. దీంతో చతుష్టయం కూడా ఒక బాతాఖానీ కేంద్రంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. దీనితో చైనాను దెబ్బతీసే అవకాశం మనకు వచ్చిందని బిజెపి చెబుతోంది.


మోడీ గారి అమెరికా పర్యటనలో పెద్ద జోక్‌ పేలింది. జో బైడెన్‌, నరేంద్రమోడీ ఇద్దరూ మాట్లాడుకొనేందుకు అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు.అప్పుడు బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడుతూ అమెరికా కంటే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తిస్తుంది.మీరు అనుమతిస్తే నేను ఒక్క మాట చెబుతాను. పత్రికల వారిని తీసుకొచ్చేట్లున్నారు. మనం వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే వారు నిర్దిష్ట అంశం మీద ఏ ప్రశ్నా అడగరు” అన్నాడు. మరొక వార్త ప్రకారం అమెరికా జర్నలిస్టులు ఏ అంశం మీదా సరిగా ప్రశ్నలు అడగరని వాటికి మీరు సమాధానం చెప్పలేరని అన్నట్లుగా ఆర్‌ఎన్‌సి రిసర్చ్‌ రాసింది. ఏదైనా జరిగి ఉండవచ్చు గానీ, అసలు నరేంద్రమోడీ భారత్‌లో కూడా మీడియాతో ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు, అస్సలు నోరు విప్పరు అనే అంశం జో బైడెన్‌కు తెలియదా, అంతటి అమాయకండా ఉన్నాడా ? అసలు విషయం ఏమంటే అమెరికా మీడియా నరేంద్రమోడీ గురించి అనేక విమర్శనాత్మక కథనాలు రాసింది. అందువలన తమ దేశ మీడియాను బైడెన్‌ అవమానిస్తూ మాట్లాడి మోడీని సంతోషపెట్టేందుకు ప్రయత్నించారని చెబుతున్నవారు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో అమెరికన్‌ మీడియా మీద జోబైడెన్‌ కూడా వివిధ కారణాలతో ఆగ్రహంతో ఉన్నారు. వారి ఉనికే సహించటం లేదని చతుష్టయ సమావేశాల సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో బైడెన్‌ భేటీ సందర్భంగా వెల్లడైంది. సిబ్బంది విలేకర్లను దాదాపు బయటకు గెంటేసినంత పని చేశారు.


సాధారణంగా ఒక ప్రాంతానికి అలవాటు పడినవారు మరో చోటికి వెళ్లినపుడు అందునా నిద్రవేళలు పూర్తిగా తారుమారైపుడు నిద్రపట్టకపోవటం, అలసి పోవటం, అక్కడి సమయాలకు వెంటనే అనువుగా అలవాటు పడకపోవటం తెలిసిందే. అయితే నరేంద్రమోడీ ఎక్కడికి వెళ్లితే అక్కడి సమయాలకు అనుగుణంగా విమానం ఎక్కగానే తన శరీర ధర్మాన్ని మార్చుకుంటారని ఆయనను అనుసరించిన వారు చెప్పినట్లు వార్త వెలువడింది. ఇవన్నీ సిబ్బంది చెప్పి రాయించిన వార్తలన్నది స్పష్టం. సాధారణ వ్యక్తులకే ఎంతో పని ఉంటుంది, అలాంటిది ప్రధాని మోడీ తన ముమ్మర కార్యక్రమాలకు అనుగుణ్యంగా ఉన్నత స్ధాయిలో శక్తిని ప్రదర్శించేలా తన శరీరాన్ని ఉంచుకున్నారని, ఎంత వత్తిడి ఉన్నా, ఎన్ని గంటలైనా ఎల్లవేళలా ఉల్లాసంగా విదేశీ ప్రయాణాల్లో ఉంటారని కూడా రాశారు. అలసటను జయించిన ప్రధాని అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, విమానబడలికకు దూరంగా ఉన్న ప్రధాని రహస్యాలు అనే అర్ధంతో హిందూస్తాన్‌టైమ్స్‌ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.వీటిని ఆధారం చేసుకొని పిటిఐ వార్తా సంస్థ తన కథనాన్ని వండి వార్చింది. విమానాల్లో ప్రయాణించేటపుడు శరీరంలోని తడి ఆరిపోతుంది కనుక వైద్యుల సలహామేరకు ప్రధాని నీటిని ఎక్కువగా తాగుతారని పేర్కొన్నది.1990 దశకంలో నెలవారీ టిక్కెట్లు తీసుకొని రైల్లో తిరిగినట్లుగా మోడీ అమెరికా వెళ్లివచ్చేవారట. రాత్రిపూటే ప్రయాణించటం, విమానాలు లేదా విమానాశ్రయాల్లోనే సేద తీరేవారు తప్ప హౌటళ్లకు ఒక రూపాయి కూడా ఖర్చు చేసే వారు కాదట.

గోద్రా ఉదంత అనంతర గుజరాత్‌ మారణకాండ తరువాత నరేంద్రమోడీ పర్యటనకు అమెరికా అసలు వీసా ఇవ్వలేదని తెలిసిందే. ప్రధాని అయిన తరువాతే వెళ్లారు. అంతకు ముందు ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా అంతగా అమెరికాలో పని ఏమి ఉండి ఉంటుంది,1993లో ఒక్కసారి అమెరికా వెళ్లి అక్కడి సినిమా స్టూడియోలను సందర్శించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతరంగా ఫొటోలు అంతర్జాలంలో దర్శనమిచ్చాయి. పోనీ రోజుకు ఒకసారి వెళ్లివచ్చారనే అనుకుందాం. నష్టం ఏముంది ? ఎన్నికల ప్రచారం వంటి సందర్భాలలో ప్రముఖుల ప్రచారశైలి గురించి మీడియా రాయటం తెలిసిందే, దాన్ని అర్ధం చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో శరీరధర్మాన్ని మార్చుకోవటం వంటి అతిశయోక్తులు వ్యక్తిపూజకు నిదర్శనం. ఇలాంటి అంశాలు గతంలో కూడా అనేక మంది ప్రముఖుల గురించి రాసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా ఆ కీర్తి కండూతి జాబితాలో చేరిపోయారు.ప్రత్యేకత ఏముంది ? ఇలాంటి వార్తలు, లేదా వ్యక్తిగత అలవాట్ల గురించి రాసి భక్తులను ఆనందపెట్టటం తప్ప దేశానికి జరిగే ప్రయోజనం ఏముంది ? బిజెపి నేతలు చెబుతున్నట్లు ప్రపంచ రాజకీయాలను మోడీ గారు ఎలా మలుస్తారో, చారిత్రాత్మకం ఏమిటో తరువాతైనా కనిపిస్తాయోమో చూద్దాం !

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఆరాధకులూ, గుడ్డి భక్తులూ జర జాగ్రత్త !

26 Sunday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, AUKUS, Canada, Huawei Technologies, Meng Wanzhou, Quad


ఎం కోటేశ్వరరావు


చైనా మీద ఉక్రోషంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హువెయి కంపెనీ అధికారిని కిడ్నాప్‌ చేయించాడు.దాని పర్యవసానాలను తట్టుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ దిగివచ్చి రాజీ చేసుకున్నాడు. బాధితురాలు చైనాకు చెందిన వాంగ్‌ వాన్‌ఝౌ స్వదేశం చేరుకొనే సమయంలోనే చతుష్టయ దేశాధినేతల తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. చతుష్టయ సమావేశం ముందుగా నిర్ణయించుకున్నదే, మరి మొదటి ఉదంతం ? యాదృచ్ఛికమా ? కానేకాదు ! ఈ చర్య అమెరికా-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదం చేయనుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు ” అకుస్‌” ఒప్పందం చేసుకున్నారు. చతుష్టయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో నాటకీయంగా సుఖాంతమైన కిడ్నాప్‌ ఉదంతం, దీని ద్వారా భారత్‌ సహా మిత్రదేశాలకు అమెరికా ఇచ్చిన సందేశం ఏమిటి ?


చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా టెలికాం కంపెనీ హువెయి సిఎఫ్‌ఓ, కంపెనీ స్ధాపకుడి కుమార్తె మెంగ్‌ వాన్‌ఝౌను 2018డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలో ” రాజకీయ కిడ్నాప్‌ ” చేయించాడు. మెంగ్‌ చైనా నుంచి మెక్సికో వెళుతూ విమానం మారేందుకు కెనడాలోని వాంకోవర్‌ విమానాశ్రయంలో దిగింది. అమెరికా వత్తిడికి లొంగిన కెనడా సర్కార్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి నిర్బంధించింది. ఇదే సమయంలో గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు కెనడీయులను చైనా అరెస్టు చేయటమే కాదు, విచారణ జరిపి శిక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా సంబంధాలు గత నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దిగజారటమే కాదు, కెనడా ఇరుక్కుపోయి చైనాతో వైరాన్ని కొని తెచ్చుకుంది.


ఇంతకీ వాంగ్‌ మీద మోపిన నేరం ఏమిటి ? ఇరాన్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలను వమ్ము చేసేందుకు హుబెయి కంపెనీ కుట్ర చేసిందట, దానికి గాను సిఎఫ్‌ఓను అరెస్టు చేసి తమకు అప్పగించాల్సిందిగా కెనడాను కోరింది. కెనడా అరెస్టయితే చేసింది గానీ చైనాతో వచ్చే ముప్పును గ్రహించి వాంగ్‌ను అమెరికాకు అప్పగించలేదు. ఒకవైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ (క్వాడ్‌) తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరుపుతున్న సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య వాంగ్‌ విడుదలకు చైనాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వాంగ్‌ శనివారం నాడు ప్రత్యేక విమానంలో చైనా చేరుకుంది. ఒప్పంద వివరాలు పూర్తిగా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగే విషయం ఇతర భాగస్వామ్య పక్షాలతో చెప్పకుండానే నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పుడు ఈ పరిణామంతో చతుష్టయంలోని మిగిలిన దేశాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.


ఈ ఒప్పందానికి జో బైడెన్‌ యంత్రాంగాన్ని ప్రేరేపించిన అంశాలేమిటి ? చైనా వైపు నుంచి కొత్తగా పొందిన రాయితీలేమీ లేవు. ఒక వైపు అక్కడి గుత్త సంస్ధలపై అనేక చర్యలను జింపింగ్‌ సర్కార్‌ ప్రకటిస్తున్నది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత పరిజ్ఞానం, వనరులతో అభివృద్ధి వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జనవరిలో అధికారాన్ని స్వీకరించిన బైడెన్‌ వాణిజ్య ప్రతినిధిగా కాథరీన్‌ తాయి నియామకం జరపటంతో వాణిజ్యవేత్తలు తమ సమస్యలను పట్టించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వ్యూహాత్మక ఓపిక పేరుతో కాలం గడుపుతున్న బైడెన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు రాకపోవటంతో కొంత మందిలో ఓపిక స్దానంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. వెంటనే చైనాతో చర్చలు జరిపి సాధారణ సంబంధాలతో తమ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే వత్తిడి తెస్తున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాతో కుదుర్చుకున్నట్లు ప్రకటించిన తొలి దశ వాణిజ్యం ఒప్పందం ఏమేరకు అమలు జరిగిందో స్పష్టత లేదు. కరోనా వైరస్‌ను చైనాయే తయారు చేసి వదలిందని నోరు పారవేసుకున్న ట్రంప్‌ చైనాతో వైరాన్ని మరింత పెంచాడు. ఒప్పందంలో ఏమి చెప్పినప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలిగినా, దాంతో చైనాకు చిర్రెత్తినా నష్టపోయేది అమెరికాయే గనుక అక్కడి వాణిజ్యవేత్తలు బైడెన్‌ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలో అమెరికాలోని అతి పెద్ద వాణిజ్య సంస్ధల సంఘాలు సమావేశమై చైనాతో సర్దుబాటు చేసుకొని వాణిజ్య అవకాశాలను పెంచుతారా లేదా అని బైడెన్‌కు ఒక విధంగా హెచ్చరికను జారీ చేశాయి. కొన్ని ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఉత్పాదకాలు చైనాలో మాత్రమే దొరుకుతాయి, ఇతర దేశాల్లో పరిమితంగా లభ్యమైనా అధికధరలకు వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని, అందువలన చైనా సరఫరాదార్ల మీద ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కార్మికులు, అమెరికా పోటీతత్వాన్ని కాపాడాలంటే చైనాతో రాజీకి రావాలని స్పష్టం చేశాయి.


అమెరికా కంపెనీలను చైనీయులు ఎలా ప్రభావితం చేస్తున్నారో మచ్చుకు విమానాలను తయారు చేసే బోయింగ్‌ కంపెనీ ఉదంతాన్ని చూద్దాం. అసలే ఆ కంపెనీ కష్టాల్లో ఉంది, అది తయారు చేసే విమానాల్లో ఐదోవంతు కొనుగోలు చేసే చైనా నుంచి 2017 తరువాత ఆర్డర్లు లేవు. లాభాలు తెస్తుంది అనుకుంటున్న బోయింగ్‌ 737 మాక్స్‌ రకం తన గగన తలంపై ఎగిరేందుకు చైనా అనుమతించ లేదు. దాంతో ఇతర దేశాలు అనుమతి ఇచ్చినా, విమానాలు కొనుగోలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇదంతా ట్రంపు చేసిన కంపు అని అది మండిపడుతోంది. రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం వంద విమానాలు కొనుగోలు చేస్తుందనుకుంటే వాటిలో 25 చైనా వాటా.ఈ కారణంగా బోయింగ్‌ వాటాదారులు ఇటీవల కంపెనీ మీద ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డుంకులను అధిగమించినా చైనాతో సాధ్యం కావటం లేదు, చైనాతో సర్దుబాటు చేసుకోకపోయినా, ఆలస్యం అయినా మన కంపెనీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిఇఓ దవే కాలహన్‌ వాపోయాడు. మే నెలలో కొత్తగా 73 విమానాలకు అర్డర్లు వస్తే అదే నెలలో 53 ఆర్డర్లు రద్దయ్యాయి. కనుక ఇలాంటి కార్పొరేట్లకు ఆగ్రహం కలిగినా, మద్దతు లేకపోయినా అమెరికాలో ట్రంపూ, బైడెన్‌ ఎవరూ తెరమీద కనిపించరు.


బోయింగ్‌ వంటి కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి ? రానున్న రెండు దశాబ్దాలలో చైనాకు 8,700 విమానాలు అవసరమన్నది ప్రస్తుత అంచనా. చైనా వృద్ధి రేటు, పౌరుల ఆదాయాలు పెరిగితే ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. మరోవైపు 2025నాటికి స్వంత విమానాలను ఎగురవేయాలని చైనా ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది.2008లో ఏర్పాటు చేసిన కంపెనీ రెండు రకాల విమానాలను అభివృద్ది చేస్తోంది. ఎక్కడా ఆగకుండా 5,555 కిలోమీటర్ల దూరం 156 నుంచి 168 మంది, పన్నెండు వేల కిలోమీటర్లు ఆగకుండా 250 నుంచి 320 మంది ప్రయాణీకులను చేరవేయగలిగే విమానాలను తయారు చేస్తున్నారు. వెయ్యి చిన్న విమానాలను ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య అవసరాలకు ప్రవేశపెడతారని, 2025నాటికి పెద్ద విమానం సిద్దమౌతుందని భావిస్తున్నారు. అవి రంగంలోకి వస్తే ఐరోపా ఎయిర్‌బస్‌, అమెరికా బోయింగ్‌లకు పెద్ద పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ లోగా వీలైనన్ని విమానాలను అమ్ముకోవాలని ఆ రెండు కంపెనీలు తొందరపడుతున్నాయి. తమ ప్రభుత్వాల మీద వత్తిడి చేస్తున్నాయి.


వచ్చే ఏడాది నవంబరులో అమెరికా పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల జరగాల్సి ఉంది. చైనాతో ఒప్పందం చేసుకుంటే లొంగిపోయినట్లుగా ట్రంప్‌ గ్యాంగ్‌ ఓటర్లను రెచ్చగొట్టవచ్చని డెమోక్రటిక్‌ పార్టీ భయపడుతోంది. లేకపోతే కార్పొరేట్లు గుర్రుమంటున్నాయి.మరోవైపు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్ధిక వ్యవస్దను నడపాలనే వైఖరితో ముందుకు పోతున్న చైనా నాయకత్వ వైఖరి కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు చతుష్టయంలోని భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలను చైనాకు వ్యతిరేకంగా అమెరికా రెచ్చగొడుతూ దూరం పెంచుతోంది. మరోవైపు తన వ్యాపారాన్ని తాను చక్కపెట్టుకొంటోంది.2021 తొలి ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 36.6శాతం పెరిగి చైనా-అమెరికా వాణిజ్యం రెండు వైపులా రికార్డులను బద్దలు కొట్టి 470బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా నుంచి 48శాతం ఎగుమతులు(111బి.డాలర్లు) పెరిగితే చైనా నుంచి 33.3శాతం(354 బి.డాలర్లు) పెరిగాయి. ఏడాది మొత్తం మీద రెండు దేశాల మధ్య 700 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇది వాణిజ్య యుద్దానికి ముందున్న స్ధాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పుతుందని చెబుతున్నారు.


చైనా నుంచి కంపెనీలు మన దేశం వస్తున్నాయన్న ప్రచారం తెలిసిందే. కరోనా సమయంలో(2020) చైనాలోని తమ అసోసియేషన్‌లోని 95శాతం మంది చైనా మార్కెట్లో లబ్దిపొందారని అమెరికా-చైనా వాణిజ్య మండలి(యుఎస్‌సిబిసి) ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ట్రంప్‌ వైఖరినే బైడెన్‌ కొనసాగిస్తారనే భయం అమెరికన్‌ కార్పొరేట్లలో ఉంది, అందుకే వత్తిడి పెంచారు.అదే జరిగితే చైనా ప్రతిదాడికి దిగితే వాణిజ్యంతో పాటు సామాన్య అమెరికన్లు కూడా ఇబ్బంది పడతారనే భయం వ్యక్తమౌతోంది. అంతర్గతంగా రాయితీలు ఇవ్వటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్ధ కూడా అడ్డుకోలేదు.ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దితో 2025 నాటికి ఒక మైలురాయిని దాటాలని చైనా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ స్ధానిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహిస్తోంది. ఇది కూడా అమెరికన్లకు ఆందోళనకరంగా మారింది. ట్రంప్‌ మార్గంలో పయనిస్తే మరోదారీ, తెన్నూ లేని చోటికి పయనిస్తామని, కనుక వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చర్చలు జరపాలని కార్పొరేట్లు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే సెప్టెంబరు పదిన జో బైడెన్‌-గ్జీ జింపింగ్‌ మధ్య అనేక అంశాలపై ఫోను ద్వారా సంభాషణలు జరిగాయి. పదిహేను రోజుల్లోనేే హుబెయి సిఎఫ్‌ఓ వాంగ్‌ఝౌ విడుదల ఆఘమేఘాల మీద జరిగింది.


అమెరికన్‌ కార్పొరేట్లు బైడెన్‌ సర్కారు మీద మరోవత్తిడిని కూడా ప్రారంభించాయి. ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న వ్యవస్ధను గట్టెక్కించేందుకు ప్రభుత్వం 3.5లక్షల కోట్ల డాలర్లను వివిధ పధకాల మీద ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. అందుకు గాను వాణిజ్య, పారిశ్రామిక సంస్దల నుంచి వసూలు చేసే పన్ను మొత్తాల పెంపుదల, ఇతర చర్యల ద్వారా నిధుల సేకరణ జరపాలన్న ప్రతిపాదనలున్నాయి.ఇదే చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ ఉనికే ప్రశ్నార్దకం అవుతుందని అమెరికా వాణిజ్య మండలి ధ్వజమెత్తింది.దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీవీల్లో ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తోంది. ఈ మొత్తం దేశంలోని 50 రాష్ట్రాల బడ్జెట్లకు రెండు రెట్ల కంటే ఎక్కువని, దీని వలన ఫలితం లేకపోగా మొదటికే ముప్పు వస్తుందని వాణిజ్య మండలి సిఇఓ సుజానే క్లార్క్‌ విమర్శించాడు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని, మద్దతు ఇస్తే ఏ సభ్యుడికీ తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తూ పార్లమెంట్‌ సభ్యులకు ఒక లేఖను కూడా మండలి రాసింది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సిందే అని కొంత మంది ఎంపీలు బహిరంగంగా ప్రకటించారు.


ప్రపంచీకరణ పేరుతో ప్రపంచమార్కెట్లను ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తే అనుకున్నదొకటీ అయింది మరొకటి. ప్రపంచీకరణ శ్రమశక్తి ఖర్చును తగ్గించింది. అది అమెరికా కార్పొరేట్లకు వరంగానూ, కార్మికవర్గానికి శాపంగానూ మారింది. స్ధానిక మార్కెట్ల ద్వారా వృద్ధి సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. అమెరికా వస్తువుల కంటే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం లాభదాయయకంగా మారింది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచీ అంతకు ముందు యాభై సంవత్సరాలతో పోల్చితే అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలు 22శాతం పెరిగాయి.చైనాలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే విధంగా లబ్ది పొందారు. దశాబ్దాల తరబడి క్యూబా, ఉత్తర కొరియా,రష్యా,సిరియా, తదితర దేశాల మీద అమెరికా విధించిన ఆంక్షలు పరిస్ధితిని మరింతగా దిగజారాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. అవన్నీ ఇబ్బందులను భరించాయి తప్ప అమెరికాకు లొంగలేదు. అమెరికా విధించిన ఆంక్షల వలన ఆయా దేశాలు బోయింగ్‌ బదులు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే ఇతర అంశాల్లోనూ జరుగుతోంది. క్రమంగా చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారుతుందని పశ్చిమదేశాలు వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఇప్పుడు అక్కడ బడా సంస్దల మీద నియంత్రణ, ఉమ్మడి సౌభాగ్యం పేరుతో తీసుకుంటున్న చర్యల గురించి అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నాయి.


గత దశాబ్దకాలంలో చైనా సంస్దలు అమెరికా నుంచి 76బిలియన్‌ డాలర్లను సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 13బిలియన్‌ డాలర్లను పొందాయి.2016 నుంచి అమెరికాలోని స్టాక్‌మార్కెట్‌లో వాటాలను విక్రయిస్తున్న చైనా కంపెనీలు రెట్టింపై 400కు చేరాయి. వాటి లావాదేవీల మొత్తం 400 బిలియన్‌ డాలర్ల నుంచి 1.7లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా విదేశాంగ విధానంలో ఆర్ధిక అంశాలు చిన్నచిన్న దేశాలను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. మిలటరీ చర్యలు కూడా ఎలా పరువు తీశాయో ఆప్ఘనిస్తాన్‌ స్పష్టం చేసింది. మిత్రదేశమైన మెక్సికో సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకొనేందుకు ఏకంగా ట్రంప్‌ సర్కార్‌ గోడనే కట్టించిన విషయం తెలిసిందే. చైనా మీద విధించిన ఆంక్షలను ఐరోపాలోని జర్మనీ వంటి దేశాలే ఖాతరు చేయటం లేదు. హువెయి కంపెనీ టెలికాం ఉత్పత్తుల దిగుమతిని వ్యతిరేకించిన జర్మనీ ఇప్పుడు పునరాలోచనలో పడి ఐరోపా యూనియన్‌ మీదనే ఆంక్షలకు వ్యతిరేకంగా వత్తిడి తెస్తోంది. చైనాతో ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది చైనాతో దాని వాణిజ్యం 243 బిలియన్‌ డాలర్లు. ఆర్ధిక ఆంక్షల కొరడాను అమెరికా ప్రయోగిస్తుంటే అదే ఎత్తుగడను చైనా అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా, దక్షిణ కొరియా వంటి అమెరికా అనుకూల దేశాలకు నీవు నేర్పిన విద్యయే అంటూ జవాబిస్తోంది.


మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఎరలు వేసి యువతను ఆకర్షించి వారి చేత తప్పులు చేయించి తమ చక్రబంధంలో ఇరికించుకొని మరిన్ని తప్పులు చేయిస్తాయి.ఆ విషవలయం నుంచి ఎవరైనా బయటపడాలన్నా తమ మీద ఆధారపడటం తప్ప తప్పుకోలేని స్ధితికి నెడతారు. సరిగ్గా అమెరికా కూడా అదే పద్దతులను అనుసరిస్తోంది. పేకాటలో గెలిచేందుకు వేసే ఎత్తుగడల్లో భాగంగా, ఎదుటివారిని మభ్యపెట్టేందుకు కొన్ని పేకలను పడవేయటాన్ని తురుపు ముక్కలు అంటారు. వాటిని చూసి ఎదుటి వారు ఆడితే తప్పుదారి పట్టినట్లే.్ల అమెరికా తన క్రీడలో కూడా అలాంటి తరుపుముక్కలను ఉంచుకుంటుంది. మన దేశం విషాయనికి వస్తే స్వతంత్ర లేదా అలీన విధానాన్ని అనుసరించినపుడు మనకు ఉన్న మిత్రదేశాలెన్ని ఇప్పుడు దూరమయ్యాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆసియాలో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు మన నుంచి దూరం జరిగి చైనాకు సన్నిహితం అవుతున్నాయి.అయినప్పటికీ ప్రస్తుత మనపాలకుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చైనా, లేదా మరొకదేశానికి లొంగిపోవాలని లేదా దాని అనుయాయిగా మారాలని ఎవరూ చెప్పటం లేదు. మన రక్షణ, ప్రయోజనాలూ ముఖ్యం. అమెరికా చెప్పుడు మాటలు విని దాని కోసం మనం ఇరుగు పొరుగు వారితో విబేధాలను కొనితెచ్చుకోవటం సరైన వైఖరికాదు. సరిహద్దు సమస్యను ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా ఆర్చేది కాదు తీర్చేది కాదు.


ఐరోపా యూనియన్‌కు మోటారు వంటి జర్మనీలో ఇటీవల ఒక నివేదిక వెలువడింది. మన అపర దేశభక్తులు దాని గురించి ఒక్కసారి చూడటం మంచిదేమో ఆలోచించండి. బిట్స్‌ అండ్‌ చిప్స్‌ అనే వెబ్‌సైట్‌లో సెప్టెంబరు ఒకటవ తేదీన ఒక వార్త వచ్చింది. దానికి పెట్టిన శీర్షిక ” చైనా విషయంలో మనం అమెరికా అజండాను గుడ్డిగా అనుసరించకూడదు ”. జర్మన్‌ ఎకనమిక్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించిన ఒక నివేదిక మీద సమీక్ష మాదిరి రాశారు. ఐరోపా ఎగుమతి వస్తాదుగా ఉన్న జర్మనీ ఇటీవలి కాలంలో చైనాతో ఓడిపోతోంది అని పేర్కొన్నారు. ఇదే వెబ్‌సైట్‌లో అంతకు ముందు విశ్లేషణ రాసిన సానే వాన్‌డెర్‌ లగట్‌ ఇలా చెప్పారు.” గావుసియన్‌ అనే చైనా కంపెనీ శుభ్రం చేసే రోబోట్లను ఉన్నతమైన నాణ్యతతో అందచేస్తున్నది. వాటన్నింటి కంటే నేను ఒక ప్రధాన పెద్ద భ్రమ గురించి హెచ్చరిక చేయదలచాను.సాంకేతికంగా ఆసియా దేశాల కంటే ముందున్నామని ఇంకా అనుకుంటున్నాము. దాన్ని మనం కాపాడుకోవాలంటే అపహరించకుండా, కొనుగోలు, కాపీ చేయకుండా చూడాలని అనుకుంటున్నాము. మనం ఒక అంశానికి సిద్దపడటం లేదు, అదేమంటే ఉదారవాద మార్కెట్‌లో మన స్వంత చట్టాల ప్రకారమే మన మాదిరే అనేక కంపెనీలు మరింత ఆధునిక ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.”


ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగితే జరిగే పర్యవసానాల గురించి భాగస్వామ్య దేశమని పొగడ్తలు కురిపించిన మనతో లేదా అక్కడికి సైన్యాన్ని పంపిన నాటో కూటమి దేశాలతో కూడా అమెరికా మాట మాత్రం చెప్పకుండా తనదారి తాను చూసుకుంది. మనం బహిరంగంగా తప్పు పట్టకపోగా తాలిబాన్లతో ప్రయివేటు ఒప్పందాన్ని హర్షించాము. చతుష్టయం పేరుతో మన దేశం, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించి చైనాకు వ్యతిరేకంగా నిలబెడుతోంది. జపాన్‌, మనదేశంతో చెప్పకుండానే మిత్రదేశమైన ఫ్రాన్స్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసి ఆస్ట్రేలియాకు తమ అణుశక్తి జలాంతర్గాములను అమ్ముకొనేందుకు బ్రిటన్‌తో కలసి కొత్త కూటమి అకుస్‌ను ఏర్పాటు చేసింది. మూడు సంవత్సరాలుగా హుబెయి సిఎఫ్‌ఓను కెనడాలో నిర్బంధించిన అమెరికా నాటకీయ రీతిలో కేసులు ఎత్తివేసింది. దాని మాట నమ్మి అరెస్టు చేసిన కెనడా, ఆ చర్యను సమర్ధించిన దేశాలన్నీ ఇప్పుడు తలెత్తుకోలేని స్ధితిలో పడ్డాయి. ఇదంతా ఎందుకు అంటే చైనాతో తన వాణిజ్యాన్ని పెంచుకొనేందుకే అన్నది స్పష్టం. అందుకోసం అమెరికన్లు దేనికైనా సిద్దపడతారు. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయయాణించాం. ఎక్కడకు పోతామో తెలియదు. అందువలన మన దేశంలోని అమెరికా గుడ్డి అరాధకులు, భక్తులు ఇప్పటికైనా దాని తోకను వదలి పెట్టటం గురించి ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య సూచికలను చైనా మార్చిందా-భారత్‌కు మహర్దశ పట్టనుందా !

23 Thursday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

ease of doing business, ease of doing business ranks, World Bank

ఎం కోటేశ్వరరావు


దారుణం, ఘోరం, అన్యాయం, అక్రమం,నీతులు చెప్పే కమ్యూనిస్టు చైనా ఇంతకు తెగిస్తుందా ? ఇప్పటికైనా నిజం బయటపడింది. ఇక మన దేశానికి మంచి రోజులు వస్తాయి, పెట్టుబడులే పెట్టుబడులు అంటూ కొంత మంది నమ్మించ చూస్తున్నారు. నిజంగా పెట్టుబడులు రావటానికి ప్రపంచబ్యాంకు రాంకులు అవసరమా ? మంచి ర్యాంకులున్న దేశాల నుంచి పెట్టుబడులు ఎందుకు తరలిపోతున్నాయి ? అవి లేక ముందు పెట్టుబడులు రాలేదా, వాణిజ్యం జరగలేదా ? అసలు సమస్య ఏమిటి ?


సులభతర వాణిజ్యం చేసుకొనే అవకాశం, తద్వారా లాభాలు పిండుకొనే అవకాశం ఎక్కడ, ఎలా ఉందో సూచించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా ఒక సూచికను ప్రకటిస్తున్నది. 2018లో చైనా ర్యాంకు 78, పందొమ్మిదిలో 46, ఇరవైలో 31. ఒక్కసారిగా ఇలా ఎలా పెరిగిపోతుంది. అంతా చేతివాటం అన్నది ప్రచారం. దాని మీద తనిఖీ చేయించినట్లు చెప్పిన ప్రపంచ బ్యాంకు ఆ సూచికల ప్రకటనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తమ మీద వేసిన నింద మీద పూర్తి స్ధాయిలో దర్యాప్తు జరపాలని చైనా డిమాండ్‌ చేసింది. బ్యాంకు నివేదిక విశ్వసనీయతతో పాటు దాని సభ్యదేశాల గౌరవాన్ని కూడా కాపాడాలని కోరింది. గతంలో ప్రపంచబ్యాంకులో పని చేసి ప్రస్తుతం ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టాలినా జియోర్‌గివే దర్యాప్తు నివేదికలో పేర్కొన్న భాష్యాలతో, తన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా విబేధిస్తున్నట్లు ప్రకటించారు.


కాసేపు కొంత మందిని సంతుష్టీకరించేందుకు చైనా అక్రమాలకు పాల్పడింది, లబ్ది పొందిందే అనుకుందాం ! మన దేశానికి, ప్రపంచానికి జరిగిన నష్టం ఏమిటి ? వెంటనే వచ్చే సమాధానం, మన దేశానికి వచ్చే పెట్టుబడులను చైనా తన్నుకు పోయింది. ప్రపంచ బ్యాంకు ఏర్పడనపుడు, అది ప్రకటించే సులభతర వాణిజ్య సూచికలు లేనపుడు వాణిజ్యం జరగలేదా ? ప్రచారదాడికి గురై మాట్లాడటం తప్ప సూచికలను బట్టి ఎవరైనా వాణిజ్యం చేసే అమాయకులుంటారా ! 2006లో మనదేశ స్ధానం 116 అయినా పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు రాలేదు. అది 2016నాటికి 142వ స్ధానానికి దిగజారింది. సదరు సూచిక 2020 నాటికి 63కు పెరిగింది. ఈ కాలంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి కావాలి, వృద్ధి రేటు తారాజువ్వలా లేవాలి, జిడిపి పరుగులు తీయాలి. అదేమి మహత్యమో మరొకటో ఎనిమిదిశాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగుశాతానికి పతనమైంది. సూచికలు ఎందుకు నిలబెట్టలేకపోయాయి ?భారత రాంకు తక్కువగా ఉన్న 2010 జడిపిలో పెట్టుబడులు 40శాతం ఉంటే గణనీయంగా మెరుగుపడిన తరువాత 2019లో 30శాతానికి పడిపోయాయి.


కమ్యూనిస్టు దేశాలు తప్పుడు పనులకు పాల్పడవచ్చా అన్నది ఒక ప్రశ్న. ఎవరూ పాల్పడకూడదు. కొందరి లెక్క ప్రకారం కమ్యూనిస్టు దేశాలు నిజాయితీగా ఉండాలి, మిగతా దేశాలు మోసాలకు పాల్పడవచ్చు తప్పులేదు అన్నట్లుగా ఉంది. ఒక వేళ చైనా, మరొక దేశం తప్పు చేసిందే అనుకుందాం. ఆ జాబితా నుంచి వాటిని తొలగించి మిగతా దేశాలకు రాంకులు కొనసాగించవచ్చు కదా ? చైనాను సాకుగా చూసి అసలు రాంకులు ఇవ్వటాన్నే తాత్కాలికంగా అయినా ప్రపంచ బ్యాంకు ఎందుకు నిలిపివేసినట్లు ? దాని నిజాయితీ ప్రశ్నార్ధకం కాదా ? అసలు ఈ సూచికలను ఎందుకు ముందుకు తెచ్చారు ? స్వేచ్చా వాణిజ్యం జరిగేందుకు, సభ్య దేశాలు పన్నులను తగ్గించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే అది ఏర్పడిన నాటి నుంచి దానితో నిమిత్తం లేకుండా అనేక దేశాలు, కూటములు ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం ప్రారంభించాయి. 1996లో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఉనికిలోకి తెచ్చారు.2001లో దోహా దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ఎటూ తేలలేదు. అసలు ఒక అంగీకారానికి వస్తారో రారో తెలియదు. ప్రపంచ బ్యాంకు ఇది గమనించే కావచ్చు 2006 నుంచి రాంకింగులను ప్రారంభించింది. రాజు గారి గంగాళంలో నేనొక్కడిని నీళ్లు పోస్తే ఎవరికీ అనుమానం రాదులే అని ప్రతి వారూ పాలకు బదులు నీళ్లు పోసినట్లుగా ఎవరికి వారు స్వేచ్చా వాణిజ్య కబుర్లు చెబుతూనే రక్షణ చర్యలు ప్రారంభించారు. దాంతో దేశాల మధ్య పోటీ పెట్టి వాణిజ్యవేత్తలకు లబ్ది చేకూర్చేందుకు ప్రపంచబ్యాంకు వేసిన ఎత్తు ఇది. దీని లక్ష్యం ఎలాంటి నియంత్రణలు లేకుండా లేదా నామమాత్రంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిస్ధితిని కల్పించటమే. ఈ సూచికలు సామాజిక ప్రగతిని పట్టించుకోవని, అసమమానతలను పెంచుతాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. ఈ అవాంఛనీయ ర్యాంకుల పద్దతిని మన దేశంలో రాష్ట్రాల మధ్యకూడా ప్రవేశపెట్టటంతో అక్రమాలకు తెరలేచిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ చైనా చేసినట్లు చెబుతున్న అక్రమం ఏమిటి ?


ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ర్యాంకుల మీద ఫిర్యాదులు మామూలే. అనేక సార్లు ర్యాంకులకు అవసరమైన మార్కులను ఇచ్చే పద్దతులు, ప్రశ్నలను మార్చారు. వాటిని ఉపయోగించుకొని ప్రతి దేశం ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే ఇచ్చిన ర్యాంకుల మీద అంతర్గత తనిఖీ నిర్వహిస్తారు. 2018 సెప్టెంబరు 12న ఆ ఏడాది నివేదిక గురించి చైనా అధికారులతో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ చర్చించాడట.తరువాత రెండు రోజులకు బ్యాంకు సిఇఓ క్రిస్టాలినా జియోర్‌గియేవా చైనా అధికారులతో చర్చించిన తరువాత ర్యాంకులు మారిపోయాయని అమెరికా కంపెనీ చెబుతోంది. ఏ దేశ అధికారులైనా బ్యాంకు ఉన్నతాధికారులను కలిస్తే అక్రమాలకు పాల్పడినట్లేనా ? ఇదెక్కడి తర్కం ! బ్యాంకు ఉన్నతాధికారి సూచన మేరకు 2020 నివేదికలో జోర్డాన్‌ రాంకును తగ్గించి సౌదీ అరేబియా ర్యాంకును పెంచారట. దీని వెనుక ఎవరున్నారు ?


చైనా అక్రమాలకు పాల్పడిందంటున్నారు గనుక ఇప్పుడు పెట్టుబడులు మన దేశం వైపు మరలుతాయని కొందరు చెబుతున్నారు. సంతోషించాల్సిందే. అదే అయితే మన కంటే ముందున్న వాటిలో చైనాను మినహాయిస్తే ఇంకా అరవై ఒక్క దేశాలుంటాయి వాటన్నింటినీ దాటిన తరువాతే కదా ఎవరైనా మనవైపు చూసేది, కనుక ఆ మాటలను ఎంతవరకు నమ్మాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా ముఖ్యమంత్రుల సమావేశంలో చైనా నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఎర్ర తివాచీలు పరిచేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పారు. ఇంతవరకు ఎన్ని వచ్చాయో, దారి మధ్యలో ఎక్కడ ఆగాయో చెప్పినవారు లేరు. ఇప్పుడు రాంకులు మారిపోయాయి గనుక పెట్టుబడులే పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు చైనా బదులు భారత్‌కు రావాలని చూస్తున్నట్లు కొందరు కొత్త గానాలాపన మొదలు పెట్టారు. చైనా ర్యాంకును పక్కన పెట్టండి, మన ర్యాంకు 142 నుంచి 63కు పెరిగిన కాలంలో చెప్పిన విధంగా పెట్టుబడులు వచ్చాయనేందుకు ఆధారాలు లేవు. వచ్చి ఉంటే కరోనాకు ముందే వృద్ది రేటు, జిడిపి దిగజారేది కాదు కదా !


2018,2020 సూచికల మీద అలాంటి తనిఖీని అమెరికాకు చెందిన విల్మర్‌హేల్‌ అనేక కంపెనీకి అప్పగించారు. వారు తయారు చేసిన నివేదిక ప్రకారం అక్రమాలు జరిగాయని ప్రకటించారు. నాటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యోంగ్‌ కిమ్‌, సిఇఓ క్రిస్టాలినా జియోర్‌గియేవా జోక్యం చేసుకొని చైనా ర్యాంకు పెంచాలని సిబ్బంది మీద వత్తిడి చేశారట.2018లో అలా చేసినందున చైనా ర్యాంకు 85బదులు 78గా ఉందట. వాణిజ్యం ప్రారంభించటం, రుణాలు పొందటం, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో చైనాకు 65.3 పాయింట్లు వచ్చినట్లుగా లెక్కించగా రాంకు 78 వచ్చింది. అమెరికా కంపెనీ తనిఖీలో పాయింట్లు 64.5కు తగ్గాయట. దాని ప్రకారం అయితే 85 వస్తుందట. పాయింట్ల తేడా 0.8, ఈ మాత్రం దాని కోసం ప్రపంచ బ్యాంకు అధిపతులు జోక్యం చేసుకున్నట్లు తేల్చారు. ఏడు రాంకులు పెరిగితే ఏమిటి తగ్గితే ఏమిటి ? తనిఖీ చేసిన అమెరికా కంపెనీ పెద్దలు లెక్కించిన పద్దతి తప్పు కావచ్చు, చైనా వ్యతిరేకతతో అలాంటి నివేదిక ఇచ్చి ఉండవచ్చుగా !


దేశాల మధ్య అనారోగ్యకర పోటీని, అవాంఛనీయ చర్యలను ప్రోత్సహించే రాంకుల మతలబు గురించి విమర్శలు, ఆరోపణలు గతంలోనే వచ్చాయి. అసలా రాంకుల పద్దతి నిలిపివేయాలని అనేక మంది కోరుతున్నారు. 2020ఆగస్టు 31న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషణలో కొన్ని అంశాలను పేర్కొన్నారు. 2015 లాటిన్‌ అమెరికాలోని చిలీ పన్నుల చెల్లింపు రాంకు 33గా ఉంది. మరుసటి ఏడాది దాని రాంకు 120కి పడిపోయింది. ఇదెలా జరిగింది? మితవాద శక్తులు అధికారంలో ఉన్నపుడు పరిస్ధితి మెరుగ్గా ఉంది, సోషలిస్టు పార్టీ అధికారంలోకి రాగానే దిగజారింది అని చిత్రించటం దీని వెనుక ఉందని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నలే రాసింది. దాన్ని ఖండించిన బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్త పాల రూమర్‌ కొద్ది వారాల తరువాత ఇంటిదారి పట్టాడు. సౌదీ అరేబియా రాంకు ఐదు సంవత్సరాల్లో 49 నుంచి 62కు దిగజారటం, అజర్‌బైజాన్‌ రాంకు 80 నుంచి 34కు పెరగటం, యుఏయి 22 నుంచి 16కు పెరగటం, చైనా 90 నుంచి 31 పెరగటం వెనుక కిరికిరి జరిగిందని కూడా ఆ పత్రిక రాసింది. ఇన్ని ఉదంతాలు ఉండగా ఒక్క చైనా మీదనే ఎందుకు దాడి కేంద్రీకరించారు అన్నది ప్రశ్న !

రాంకులను తారుమారు చేయటం ఎంతో సులభమని అనేక మంది చెబుతున్నారు. మన దేశం విషయానికి వస్తే విద్యుత్‌ ధర మిగతా పోటీ దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో ప్రయివేటు సరఫరాదారులున్న ముంబై, ఢిల్లీ సమాచారాన్ని మాత్రమే ప్రపంచబ్యాంకు ప్రమాణంగా తీసుకుందని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. అంటే అర్ధం ఏమిటి కృత్రిమంగా మన దేశ ర్యాంకును పెంచేందుకు ఇలా చేశారనే కదా ! రాంకుల్లో మన స్ధానం ఎంతో మెరుగుపరుచుకున్నా వాణిజ్యం, జిడిపిలో పెరుగుదల లేకపోగా వృద్ది రేటు దిగజారిపోవటం వెనుక మతలబు ఏమిటి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మన దేశం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ర్యాంకు దోహదం చేస్తుందనే అంచనాతో మెరుగుపరుచుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంది.నరేంద్రమోడీ హయాంలో అది మరింత వేగంగా జరిగింది.2020 నాటికి భారత్‌ 50వ స్ధానంలో ఉంటుందని 2018లోనే నరేంద్రమోడీ దవోస్‌లో ప్రకటించారు. దాని కోసం ఏకంగా ఒక కమిటీనే 2015లో ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు లేబరు నియామకానికి అనుమతి, కనీసవేతన చట్టాలకు మంగళం, ఎనిమిది గంటలకు బదులు ఏదో ఒకసాకుతో ఎన్నిగంటలైనా పని చేయించుకొనే వీలు కల్పించటం,వేతనంతో కూడిన వార్షిక సెలవుల రద్దు, ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా కార్మికులను తొలగించే అవకాశాలను కల్పించటం వంటి చర్యలు. మన ర్యాంకు పెరిగేందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికరంగంలో తీసుకురాదలచిన మార్పులు అమల్లోకి వస్తే ఇంకా మెరుగుపడవచ్చు. కానీ కార్మికుల పరిస్ధితి మరింత దిగజారటం ఖాయం. ఇప్పటికే ఆర్ధిక అసమానతల్లో మన దేశ తాజా రాంకు 158కి 141లో ఉన్నాం. మరి దీని సంగతి ఏమిటి ? దీన్ని మెరుగుపరచేందుకు నరేంద్రమోడీ తీసుకున్న చర్యలేమిటి ? వాణిజ్య రాంకు మెరుగుదలకు కమిటీ ఏర్పాటు చేసిన పెద్దలు ఆర్ధిక అంతరాలు తగ్గించటం గురించి ఎందుకు పట్టించుకోరు ?


చైనా ఆర్ధిక రంగంలో సాధించిన అద్భుతాలను కొంత మంది ఎన్నటికీ అంగీకరించరు. దాని వలన వారికి కలిగే లాభం లేదు, చైనాకు వచ్చే నష్టం లేదు. ఈ అభివృద్ధి వెనుక ప్రపంచబ్యాంకు రాంకులు లేవు.1948 జనవరి ఒకటిన ఉనికిలోకి వచ్చిన ”గాట్‌” (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారిఫ్‌ అండ్‌ ట్రేడ్‌ – పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం)లో చైనా స్ధాపక సభ్యురాలు.అయితే 1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కాకుండా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ కేంద్రంగా నడిచిన ప్రభుత్వాన్నే గుర్తించారు.1971లో ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించినా గాట్‌లో, దాని వారసురాలిగా వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో అసలైన చైనాకు స్ధానం ఇవ్వలేదు, 2001డిసెంబరులో మాత్రమే చేర్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసిన 2020లో 2.3శాతం వృద్దిరేటుతో ముందుకు పోయిన ఏకైక పెద్ద ఆర్ధిక వ్యవస్ధ చైనాదే.1948లో దాని విదేశీ వాణిజ్యం 907 బిలియన్‌ డాలర్లయితే 2020లో 4.65లక్షల కోట్ల డాలర్లు. చైనా వాణిజ్యం 1978లో 26వ స్ధానంలో ఉంటే 2017నాటికి ఒకటవ స్ధానానికి చేరి, నాలుగేండ్లుగా అదే స్ధాయిలో కొనసాగుతోంది. 1986లో తలసరి ఖర్చు చేయగల ఆదాయం వెయ్యి యువాన్లయితే(ఒక యువాన్‌ పదకొండు రూపాయలు), 2005నాటికి పదివేలు,2020లో32,129 యువాన్లుంది. గ్రామీణుల సగటు 17,131అయితే పట్టణసగటు 43,834 యువాన్లు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు 1950లో యాభైవేల మంది ఉంటే ఇప్పుడు యాభై లక్షలు దాటారు. పరిశోధన మరియు అభివృద్ది కోసం 1980లో 13 బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తే 2020లో2.4లక్షల కోట్ల యువాన్లు ఉంది.2020లో తొలిసారిగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు వందల కంపెనీలలో 133తో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య సూచికల తారుమారు కారణంగానే జరిగాయని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు.


గతంలో వివిధ దేశాలకు చెందిన ర్యాంకుల కోసం సమాచారాన్ని తారు మారు చేసిన ఉదంతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్తగా ఉన్న పాల్‌ రోమర్‌ రాజీనామా చేసి ఇంటి బాట పట్టాడు. వివిధ దేశాల రాజకీయ అవసరాల కోసం లెక్కింపు పద్దతులను పదే పదే మార్పులు చేసిన కారణంగా ర్యాంకుల్లో మార్పులు జరిగాయని రోమర్‌ చెప్పాడు.2006-2017 మధ్య చిలీ ర్యాంకులు తారుమారయ్యాయి. సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచ్‌లెట్‌ హయాంలో దేశ పరిస్ధితి దిగజారిందని, మితవాది, నియంత సెబాస్టియన్‌ పినేరా హయాంలో మెరుగుపడిందని చూపేందుకు కావాలని ఆ పని చేశారు. అందుకు గాను వ్యక్తిగతంగా తాను క్షమాపణలు చెబుతున్నట్లు రోమర్‌ ప్రకటించాడు. వత్తిడి రావటంతో మాట మార్చాడు, చివరికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఆ ఉదంతం తెలిసిన బ్యాంకు అధ్యక్షుడు, సిఇవో చైనాకు అనుకూలంగా మార్పులు చేయాలని కోరారన్న ఆరోపణలు నమ్మదగినవేనా ?


రాంకులను బట్టే పెట్టుబడులు వచ్చేట్లయితే 2006-20 మధ్య అమెరికా రాంకు 3-8, జపాన్‌ రాంకు 10-39 మధ్య, బ్రిటన్‌ 9-10, ఆస్ట్రేలియా 6-18, కెనడా 4-23 మధ్య ఉంది. మరి ఆ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, కంపెనీలు తమ దేశాలను వదలి ఫేక్‌ రాంకులు తెచ్చుకున్నట్లు చెబుతున్న చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టినట్లు ? ఒకవేళ ఎవరైనా మోసపోయి చైనా వెళ్లిన తరువాత అక్కడ అంత సీన్‌ లేదని మిగతా కంపెనీలకు చెప్పి ఉండాలి కదా ? ఒకరిని చూసి ఒకరు పొలోమని ఎందుకు వెళ్లినట్లు ? పోనీ చైనా తప్పుదారి పట్టించింది అనుకుందాం, అక్కడ పెట్టుబడులు పెట్టి దివాలా తీసిన విదేశీ కంపెనీలెన్ని, ఆత్మహత్యలు చేసుకున్న పారిశ్రామికవేత్తలెందరో ఎవరైనా చెప్పగలరా ! చైనాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు కేవలం ఎగుమతుల కోసమే కాదు, అక్కడి అంతర్గత మార్కెట్లో తమ సరుకులు అమ్ముకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కూడా వెళతాయి. అలాంటి అవకాశం ప్రస్తుతం మన దేశంలో ఉందా ? మన దేశంలో వినియోగఖర్చు ఎలా ఉందనే అంశంపై అధికారిక లెక్కలు 2012నాటివే అందుబాటులో ఉన్నాయి. జాతీయ గణాంక సంస్ధ 2017-18లో సేకరించిన సమాచారాన్ని విడుదల కాకుండా నిలిపివేశారు. లీకుల సమాచారం ప్రకారం ఖర్చు తగ్గినట్లు తేలింది, దాన్ని మరోవిధంగా చెప్పాలంటే దారిద్య్రం పెరిగింది. నరేంద్రమోడీ సర్కారుకు ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం దేశ ఆర్ధిక స్ధితి ఐసియులో ఉందని చెప్పారు. ఆర్ధిక వ్యవస్ద మాంద్యంలో ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ అన్నారు.చివరికి ప్రపంచబ్యాంకు కూడా మన ఆర్ధిక వ్యవస్ధ చక్రియ మందగింపు తీవ్రంగా ఉందని చెప్పింది. ఇవన్నీ కరోనాకు ముందు వ్యాఖ్యలు. పెట్టుబడులు పెట్టాలనుకొనే వారు వీటన్నింటినీ చూడరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోమూత్ర, పేడ వినియోగదారులు, వ్యాపారులకు ఒక శుభవార్త !

18 Saturday Sep 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, cow urine, Narendra Modi, RSS, toilet-training cows


ఎం కోటేశ్వరరావు

రోజూ ఆవు మూత్రం తాగితే కరోనాను దూరంగా ఉంచవచ్చని,తాను అలా తాగి కరోనా బారి నుంచి తప్పించుకున్నానని భోపాల్‌ బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల ఉగ్రవాద కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే, అమె అంతకు ముందు కాన్సర్‌ నిరోధం గురించి కూడా సెలవిచ్చారు. నాలుగేండ్ల క్రితమే పతంజలి వ్యాపారి రామదేవ్‌ బాబా కంపెనీ సిఇఓ బాలకృష్ణ ఒక ప్రకటన చేస్తూ తాము రోజుకు ఐదువేల లీటర్ల గోమూత్రం తయారు చేస్తున్నామని, అది కాన్సర్‌, లివర్‌, కిడ్నీ తదితర సర్వరోగ నివారిణిగా పని చేస్తుందని చెప్పారు. ఇప్పుడు గోమూత్ర పానం చేసే వారు, వాటితో వ్యాపారం చేసే వారికి మరొక శుభవార్త.


ఆవు విసర్జనాలైన మూత్రం, పేడ పర్యావరణానికి కలిగిస్తున్న హాని నివారణకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. జర్మన్‌ ఫెడరల్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎనిమల్‌ హెల్త్‌ మరియు రిసర్చి ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఫామ్‌ ఏనిమల్‌ బయాలజీ(ఎఫ్‌బిఎన్‌), న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ విశ్వవిద్యాలయం వారు జర్మనీలో సంయుక్తంగా చేసిన పరిశోధనల ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఆవులు మరుగుదొడ్లను వినియోగించే విధంగా శిక్షణ ఇచ్చి జయప్రదమయ్యారు.విదేశాల్లో రోజుకు ఒక్కో ఆవు 30 నుంచి 40కిలోల పేడ వేస్తుందని, 30 లీటర్ల మూత్ర విసర్జన చేస్తుందని అంచనా.(మన దేశ ఆవుల సామర్ధ్యం ఎంతో తెలియదు) మన దేశంలో మాదిరే అన్ని చోట్లా బయట తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ, గోశాలల్లో అవి తమ పని కానిస్తాయి.ప్రపంచ వ్యాపితంగా ఆవులను పెంచుతారు, పాలు పిండుకుంటారు, బీఫ్‌కు వినియోగిస్తారు. బహుశా మన దేశంలో తప్ప ఎక్కడా ఆవు మూత్రం తాగరు, తాగమని ప్రోత్సహించేవారు కూడా లేరు.


ఆవు మూత్రం, పేడతో విషపదార్ధాలు తయారవుతాయి.( గోమాతను ఇలా అంటారా అని ఎవరైనా మనోభావాలను గాయపరచుకుంటే చేయగలిగిందేమీ లేదు. శాస్త్రం అలా చెబుతోంది మరి ) గోమూత్రం నుంచి నైట్రేట్‌ మరియు నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్భవిస్తాయి. వాటితో జలాశయాలు, నదులు, చెరువులు, కుంటలు కూడా కలుషితం అవుతాయి. అవి ఎంత ప్రమాదకరం అంటే కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే 300 రెట్లు ఎక్కువ శక్తి కలిగినవి. నైట్రేట్‌ కలిసిన నీరు గడ్డి మొక్కలతో పాటు నీటిలో విషపూరితమైన పాచి పెరిగేందుకు దోహదం చేస్తుంది. నైట్రస్‌ ఆక్సైడ్‌ ఎలా ఉంటుందంటే న్యూజిలాండ్‌లో పర్యావరణంలోకి విడుదలయ్యే రేడియో ధార్మిక పరిగ్రహణాన్ని హరించే గ్రీన్‌హౌస్‌ వాయువు వంద అనుకుంటే గోమాతలు 12శాతం వాటాను విడుదల చేస్తున్నాయట. బయట తిరిగే వాటి కంటే గోశాలల్లో ఉండే గోమాతలు మరొక ప్రమాదాన్ని కూడా తెస్తున్నాయని ఐరోపా, అమెరికాల్లో వెల్లడైంది. అదేమంటే వాటిని ఒక చోట కట్టివేసినపుడు విసర్జించే పేడ, మూత్రం రెండూ కలిస్తే అమ్మోనియా వాయువు పుడుతుంది.అది గోమాతల ఆరోగ్యానికేగాక, మానవాళికి కూడా ప్రమాదకారకమే.


ఈ ముప్పులను తప్పించేందుకు మార్గం ఏమిటి అనే ఆలోచనతో శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. అదేమంటే చిన్న పిల్లలకు ఎలా అయితే మరుగుదొడ్డిని అలవాటు చేస్తామో గోమాతల మీద కూడా అదే ప్రయోగం చేసి సఫలీకృతం అయ్యారు. జర్మనీలోని ఓక్స్‌వాగన్‌ ఫౌండేషన్‌ వారి సాయంతో ముందే చెప్పుకున్న ఎఫ్‌బిఎన్‌ సంస్ధలో ఒక నిర్ణీత ప్రదేశంలో మూత్రవిసర్జన చేసే విధంగా ఆవుదూడలకు శిక్షణ ఇచ్చారు. ఒక గదిని ఏర్పాటు చేసి ఒక వైపు దాణాగా బార్లీని ఒక గిన్నెలో పోసి ఆవులను వాటిలోకి వదిలారు. అవి దాణా తింటూ అక్కడే మూత్రం పోయటాన్ని అలవాటు చేసుకున్నాయి. తొలుత ఆవులను ఒక ఇరుకు సందులోకి తోలారట. అవి అక్కడ మూత్ర విసర్జనకు ఉపక్రమించగానే భయంకరమైన శబ్దాలను చేసి మరుగుదొడ్లోకి వెళ్లేట్లు ప్రయత్నించినా ఫలితం కనపడకపోవటంతో చివరికి వాటి మీద నీళ్లు చల్లి వెళ్లేట్లు చేశారు. పక్షం రోజుల పాటు ఇలా రోజుకు 45 నిమిషాల పాటు శిక్షణ ఇచ్చిన తరువాత 16ఆవుల్లో 11 మరుగుదొడ్లోకి వెళ్లటం అలవాటు చేసుకున్నాయట. పిల్లల్ని అలవాటు చేయటానికి పట్టే వ్యవధి కంటే ఆవులు తక్కువ సమయంలోనే ఆ పనిచేశాయట. ఈ ప్రయోగంతో అన్ని అవులు కొద్ది సంవత్సరాల్లో మరుగుదొడ్లకు వెళతాయని ఆవుల మానసిక నిపుణుడు డాక్టర్‌ లాంగ్‌ బెయిన్‌ అంటున్నారు.


అసలు సమస్య ఇక్కడే తలెత్తింది. మానవ ప్రయత్నం లేకుండా ఆవులకు మరుగుదొడ్డి అలవాటు చేయటం ఎలా, పెద్ద సంఖ్యలో బయట తిరిగే ఆవులతో పాటు గోశాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం ఎలా అన్న ఆలోచన మొదలైంది. ఇక్కడ మన దేశంలో ఆవు మూత్రం తాగే వారికి మరింత చౌకగా, విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే పతంజలి వంటి ఆవు మూత్ర వ్యాపారులకు లభ్యత కూడా అవసరం. తక్కువ మొత్తమే అయినప్పటికీ మన దేశం అమెరికా, నెదర్లాండ్స్‌,జర్మనీ,ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, థాయలాండ్‌ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. వాటికి లేని అభ్యంతరాలు మూత్రం దిగుమతి చేసుకొనేందుకు ఉండాల్సిన అవసరం లేదు. అందువలన విదేశాల్లో ఆవు మరుగుదొడ్ల సంస్ధలతో ఒప్పందాలు చేసుకొని దిగుమతి చేసుకుంటే చౌకగా లభ్యం అవుతాయి. లేదా మన దేశంలోనే ఏర్పాటు చేసినా ఖర్చులు కలసి వస్తాయి. అయితే మనుషులకే ఇంకా పూర్తిగా మరుగుదొడ్లు లేని స్ధితిలో ఆవులకు సాధ్యమా ? కేంద్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాధ్‌ వంటి ఆవు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలచుకుంటే అసాధ్యం కాదేమో !


గుజరాత్‌లోని జునాఘడ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవు మూత్రంలో బంగారాన్ని కనుగొన్నట్లు చెప్పారు. ఇతర ప్రభుత్వ సంస్ధలు ఆవు మూత్రంలో ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేస్తున్నాయి. అందువలన విదేశాల్లో పనికి రాని ఆవు మూత్రాన్ని రవాణా, సేకరణ ఖర్చు చెల్లించి మనం ఉచితంగానే దిగుమతి చేసుకోవచ్చు. బంగారంగా మార్చుకోవచ్చు. అవి సర్వరోగ నివారిణి అని నమ్మేవారి కోసం వాటితో పనిచేసే ఆసుపత్రులను ఏర్పాటు చేసి చేరే వారికి చికిత్స చేయవచ్చు. ఈ ఆసుపత్రులకు నిపుణులైన వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలు కూడా అవసరం లేదు. వలంటీర్లతో నడుస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ఆవు పాల కంటే మూత్రం రేటే ఎక్కువగా ఉంది. అమెజాన్‌ ద్వారా తెప్పించుకుంటే లీటరు రు.260కి బదులు 198కే దొరుకుతుందనే ప్రకటనలను ఎవరైనా చూడవచ్చు. అందువలన దిగుమతి చేసుకుంటే ఇంకా తక్కువకే జనాలకు అందచేయవచ్చు. అనేక విదేశీ వస్తువులను తెప్పించుకుంటున్నమనం ఆవు మూత్రానికి అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు.


విదేశీయులు పర్యావరణం అంటూ గొడవ చేస్తున్నారు గనుక వారెలాగూ ఆవు మూత్రాన్ని వదిలించుకోవాలని చూస్తారు. దాన్ని మనం తెచ్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందేమో ! పూజకు పనికి వస్తుందని భావిస్తున్న ఆవు పేడను మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము.ఈ ఏడాది మేనెలలో మన దేశం నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో అమెరికా వెళ్లిన ఒక ప్రయాణీకుడి సూట్‌ కేసులో ఆవు పేడ పిడకలను అక్కడి భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మన వారు పవిత్రంగా భావించే ఆవు పేడను అధికారికంగా అవసరమైతే పెద్ద మొత్తంలో పన్నులు విధించి అయినా దిగుమతికి అనుమతించాలని నరేంద్రమోడీ తన పలుకుబడిని వినియోగించి అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని అక్కడి భారతీయులు కూడా కోరవచ్చు. అమెరికాకు మన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు గనుక బైడెన్‌ సర్కార్‌ అనుమతించవచ్చు కూడా. ఆవులకు మన దేశంలోనే మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే వాటికి శిక్షణ ఇచ్చేందుకు జనం కావాలి కనుక కొంత నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. పకోడీ బండి వేయటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే చెప్పారు కనుక వీటి గురించి కూడా తీవ్రంగా ఆలోచించాలి. కావాలంటే ఆవు మూత్రం అపవిత్రం కాకూడదు అనుకుంటే గోవు పవిత్రతను కాపాడుతున్న వారికే వాటి నిర్వహణ కూడా పూర్తిగా అప్పగించవచ్చు. గో రక్షకుల నుంచి తలెత్తుతున్న శాంతి భద్రతల సమస్య కూడా పరిష్కారం అవుతుంది.


ఇక ఆవు రాజకీయాలకు వస్తే మన దేశంలోనే కాదు నైజీరియాలో కూడా నడుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌, హర్యానాల్లోతప్ప ఇంతవరకు బిజెపి పాలనలోని గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడా బీఫ్‌ తినేవారి మీద గోరక్షకులు దాడులు చేసినట్లు వార్తలు లేవు. నైజీరియాలో గోపాలకులు ఎకె-47 తుపాకులు పట్టుకొని మరీ ఆవులను మేపుతున్నారనే వార్తలు, దృశ్యాలు ఎవరైనా చూడవచ్చు. దేశ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సామాజిక తరగతికి చెందిన వారే ఎక్కువగా ఆవులను పెంచుతారు. వ్యాపారులు ఆవులను ఇచ్చి మేపేట్లు ఒప్పందాలు చేసుకుంటారు. బహిరంగంగా ఆవులు, ఇతర పశువులు గడ్డి మేయటాన్ని నిషేధించటం సైతాను చట్టం అని మియెట్టీ అల్లా కౌతల్‌ హౌర్‌ జాతీయ కార్యదర్శి సాలే అల్‌హసన్‌ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అది ముస్లిం దేశమని తెలిసిందే.2023లో అక్కడ జరిగే ఎన్నికల కారణంగా ఆవు రాజకీయాలు రంగంలోకి వచ్చాయి.ఈ చట్టం అనేక మంది జీవనోపాధికి, ప్రాధమిక హక్కులకు, వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నదని పేర్కొన్నాడు. నైజీరియా దక్షిణాది రాష్ట్రాలలో గోవుల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతుంది. తుపాకులు పట్టుకొని ఆవులను మేపుతున్న వారిని బందిపోట్లని ప్రభుత్వం చిత్రిస్తున్నదని సాలే హసన్‌ విమర్శించాడు.


మనకు సహజమిత్రమని వాజ్‌పాయి నుంచి నరేంద్రమోడీ వరకు చెబుతున్న అమెరికాలో జరుగుతున్నదేమిటి ? ఆవుమాంసం తినటాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి అవసరమైన ప్రచారం, ఇతర అవసరాల కోసం ప్రతి ఆవుకు పెంపకందార్లు ఒక డాలరు చెల్లిస్తున్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా ఉన్న ఈ పధకాన్ని నిలిపివేయాలా లేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రతి ఆవుకు చెల్లిస్తున్న ఒక డాలరుతో స్ధానిక బీఫ్‌ను ప్రత్యేకంగా ప్రోత్సహించటం లేదు కనుక నిలిపివేయాలన్నది ఒక వాదన.ప్రస్తుతం దిగుమతులు పెద్ద ఎత్తున వచ్చిపడుతున్నాయి, నకిలీ మాంస ఉత్పత్తిదారులు లబ్దిపొందుతున్నారన్నది ఆరోపణ. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలనేందుకు ఓటింగ్‌ జరపాలని కొంత మంది సంతకాల సేకరణ ప్రారంభించారు. అందుకు అవసరమైన సంఖ్యలో సంతకాల సేకరణకు అక్టోబరు మూడవ తేదీ వరకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద చెల్లింపులు చేయాలని ప్రభుత్వమే ఆదేశించింది. అయితే ఈ నిధులతో పంది, కోడి మాంసం వంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు, బీఫ్‌ కోసం ప్రచారం తప్ప లాబీయింగ్‌ కూడా చేయకూడదు.కానీ లాబీయింగ్‌కు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీలు చౌకగా లభించే దేశాల నుంచి దిగుమతులు చేసుకొని తమ ముద్రవేసుకొని వినియోగదారులను మోసం చేసే ప్రచారానికి దేశీయ పెంపకందార్లు చెల్లిస్తున్న ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారన్నది విమర్శ.


తగిన ప్రచారం లేనట్లయితే దేశీయ బీఫ్‌ డిమాండ్‌ తగ్గిపోయి ఉండేదని, ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇండ్లకు వచ్చే వారు దుకాణంలో కొన్న బీఫ్‌ను ఇలా స్టౌ మీద పెట్టి అలా తినేందుకు వీలుగా తయారు చేసిన వాటి కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. కేవలం నాలుగు పాకింగ్‌ సంస్ధలు 80శాతం వాటాతో అమెరికా బీఫ్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వాటి గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు బైడెన్‌ సర్కార్‌ చర్య తీసుకుంది. పోటీలేని కారణంగా బీఫ్‌ అమ్మకాల్లో రైతులకు వచ్చే వాటా గత ఐదు సంవత్సరాల్లో 51.5 నుంచి 37.3శాతానికి పడిపోయింది. మరోవైపు ధరలు పెరిగాయి. టైసన్‌, జెబిఎస్‌ యుఎస్‌ఏ, కార్గిల్‌, నేషనల్‌ బీఫ్‌ అనే సంస్ధలు కరోనా సమయంలో ఎగుమతులు జరపటంతో కొరత ఏర్పడి అమెరికా వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.అమెరికాలో సరకులను విక్రయించే దుకాణాలు కూడా నాలుగు బడా కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. వాల్‌మార్ట్‌, టార్గెట్‌, ఆల్బర్ట్‌సన్స్‌, క్రోగర్‌ చేతిలో మొత్తంగా 40శాతం, పట్టణాల్లో 70శాతం దుకాణాలు ఉన్నాయి. నాలుగు మాంసకంపెనీలు సులభంగా మార్కెటింగ్‌ ఒప్పందం చేసుకోవటానికి ఈ పరిస్ధితి కూడా తోడ్పడింది.గత ఏడాది వాల్‌మార్ట్‌ కంపెనీ కూడా మాంస పాకింగ్‌ వ్యాపారంలో ప్రవేశించింది. మాంసపాకింగ్‌ కంపెనీల్లో ఒకటైన జెబిఎస్‌పై ఇటీవల సైబర్‌ దాడి జరగటంతో అమెరికాలో ఐదోవంతు మాంస పాకింగ్‌ కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. దీంతో సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. గుత్తాధిపత్యాన్ని తగ్గించాలని ఈ ఉదంతం బైడెన్ను పురికొల్పి ఉంటుంది. అమెరికా మాంస యుద్దం ఎలా ముగుస్తుందో తెలియదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వగురువా… వినదగునెవ్వరు చెప్పిన !

15 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan, China Factor, imperialism, India foreign policy under narendra modi, Narendra Modi, NATO, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


ఆఫ్ఘనిస్తాన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు జరిగిన ఘోర పరాభవం గురించి ఎంత మూసిపెడదామన్నా, నోళ్లు నొక్కుదామన్నా కుదరటం లేదు. పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు, సమాచారం వరదలా వస్తూనే ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందో, జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. పంజీషర్‌ లోయలో ఉత్తరాది కూటమి(నార్తరన్‌ అలయన్స్‌) కొరకరాని కొయ్యగా ఉంది. అధికారంలో వాటా కావాలని పట్టుబడుతోంది. ఆ కూటమి గురించి ఎలా వ్యహరించాలనే అంశం మీద తాలిబన్లలోని రెండు ప్రధాన ముఠాల మధ్య వివాదం ముదిరి కాల్పుల వరకు వచ్చిందనే వార్తలు నమ్మశక్యం లేవు. కాల్పులు జరగటానికి కారణాలు వేరే ఉండవచ్చు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని రద్దు చేశారు. రష్యా వంటి దేశాల సలహామేరకు అలా చేశారని ఒకవైపు వార్తలు, మరోవైపు పొదుపు కార్యక్రమంలో భాగంగా అలా చేశామని తాలిబన్లు ప్రకటించారు. పోనీ నిరాడంబరంగా అయినా ప్రమాణస్వీకారం చేశారా లేదా ? తెలియదు. అలాంటిదేమీ లేకుండా పాలన సాగిస్తే అదీ కొత్త వరవడే అవుతుంది.


కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదేందుకు పూనుకోవద్దన్నది తెలుగు ప్రాంతాల్లో లోకోక్తి. ఇప్పుడు గోదావరి బదులు అమెరికాను నమ్మి పోవద్దని చెబుతున్నారు. విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారు. మోడీ ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు గనుక పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అనేక మంది అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు. రేపు ఏం జరిగినా చూశారా మేం చెప్పిందే జరిగింది అని తమ జబ్బలను తామే చరుచుకుంటారు.


స్టేట్స్‌మన్‌ అనే ఆంగ్లదిన పత్రిక సంపాదకుడిగా పని చేసిన సునంద కె దత్తా రే(84) తాజాగా ఒక విశ్లేషణ రాశారు. ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఆ విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” భద్రతకు మతం గురించి తెలియదు. హిందూయిస్టు ఇండియా లక్ష్యమైనా ఉగ్రవాదుల దాడులకు నెలవు కాని ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరమైన ప్రభుత్వంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇప్పుడు అమెరికా పొగుడుతూ ఉండవచ్చుగానీ నరేంద్రమోడీ ఆసియా చరిత్రను అవలోకించాలి. అమెరికాతో తృతీయ ప్రపంచ దేశాల సంబంధాలు మృత్యువును ముద్దాడినట్లే అని పదే పదే రుజువైంది. ఇస్లాం మరియు ఉగ్రవాద రాజకీయాలకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హిందూయిస్టు పార్టీ అనుసరించకూడదు. ఇండోనేషియా, పాకిస్తాన్‌ తరువాత 19.5 కోట్ల మంది ముస్లింలకు స్దానం ఉన్న దేశం భారత్‌. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. సహజ భాగస్వాములంటూ అతల్‌బిహారీ వాజ్‌పాయి, అణుఒప్పందంతో మన్మోహన్‌ సింగ్‌, తరువాత చతుష్టయ కూటమి పేరుతో నరేంద్రమోడీ అమెరికాతో ఎంతో సౌఖ్యంగా ఉన్నారు. చతుష్టయం చర్చలతో పాటు సమాంతరంగా అంతకు ముందు లేని సంయుక్త మిలిటరీ విన్యాసాల(మలబార్‌)కు దారి తీసింది.అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో 2007లో ప్రారంభమైన చతుష్టయ కూటమి తనకు వ్యతిరేకమైనదిగా భావించిన చైనా నిరసన తెలిపింది. సదరు కూటమి మిలిటరీ సంబంధాలకు కాదని, చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటం లేదని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాడు చైనా అధినేతగా ఉన్న హు జింటావోకు హామీ ఇచ్చారు.పరిస్ధితులు మారిపోయాయి. లడఖ్‌ ఘర్షణ ముక్కుసూటి తనాన్ని సమర్ధించవచ్చు. అయితే చైనా చరిత్ర మరియు సంప్రదాయాలు అదే విధంగా అమెరికా, ఇతర ఆసియా దేశాలతో దాని సంబంధాల రికార్డును జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉందని పరిస్ధితి చెబుతున్నది.


ఆసియా పాలకులను అమెరికా నట్టేట ముంచిన, మోసం చేసిన ఎన్నో విచారకరమైన ఉదంతాలను నరేంద్రమోడీ గారు తప్పక తెలుసుకోవాలి. దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నగో దిన్‌ దిమ్‌, అతని సోదరుడు నగో దిన్‌ హు మీద జరిగిన మిలిటరీ తిరుగుబాటులో వారు హతమైన ఉదంతాన్ని అమెరికా పట్టించుకోలేదు. మీరు అమెరికాలో ఆశ్రయం పొందుతారా అని హు భార్యను అడిగితే నాకు వెన్నుపోటు పొడిచిన దేశంలో నేను జీవించలేను అని చెప్పింది. దక్షిణ వియత్నాం మరో అధ్యక్షుడు గుయెన్‌ వాన్‌ థీవ్‌ పరిస్ధితిని గమనించి రాజీనామా చేసి తైవాన్‌ పారిపోయాడు.అమెరికా అధ్యక్షుడొకరు ఏ దేశ నియంతను అయినా మా ఒక ఉంపుడు గత్తె కొడుకు అన్నాడంటే అతను దక్షిణ కారియా అధ్యక్షుడు సింగమాన్‌ రీ అయి ఉండవచ్చు. అమెరికా మరియు ఐరాస కమాండర్‌ మార్క్‌ క్లార్క్‌ ఒక రోజు అతన్ని పదవి నుంచి గెంటివేయాలనుకున్నాడు.( అతన్ని సిఐఏ అమెరికా హవాయిలోని హానలూలుకు తరలించింది, అక్కడే చచ్చాడు) అమెరికావదిలించుకొని ఉండకపోతే ఫిలిప్పైన్స్‌ ఫెర్డినాండ్‌ మార్కోస్‌ హానలూలు వెళ్లటం, అక్కడే చచ్చి ఉండేవాడు కాదు( ఇది రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో జరిగింది). అమెరికాతో చేతులు కలిపిన అనేక మందిలో అతనొకడు. ఇరాన్‌ షా అమెరికన్లకు సంకటం తెచ్చాడు. ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు, కోర్టులకు ఒక ప్రామాణికమైన పద్దతి లేదు, నమ్మశక్యం కాని పద్దతుల్లో చిత్రహింసల చరిత్ర ఉందని షా పాలన గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది.( వీడిని సమర్ధించిన అమెరికా పాలకులు ఎంతగా భయపడ్డారంటే పదవీచ్యుతుడైన తరువాత షా అమెరికా వచ్చాడు. న్యూయార్క్‌ ఆసుపత్రిలో స్వంత పేరుతో ఆపరేషన్‌ చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి డేవిడ్‌ డి న్యూసమ్‌ అనే దొంగపేరుతో చేర్పించారు. మెక్సికో, పనామా ఎక్కడకు వెళితే అక్కడ జనం వ్యతిరేకించటంతో చివరికి ఈజిప్టులో ఆశ్రయం ఇప్పించారు.)

అష్రాఫ్‌ ఘనీ(పారిపోయిన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు)ది ఒక అసాధారణ అనుభవం. దోహాలో తాలిబాన్లతో చర్చల నుంచి అమెరికా అతన్ని మినహాయించింది. ట్రంపు మాదిరే బైడెన్‌ కూడా తమ అవసరాల మేరకే వ్యవహరించాడు. కఠినమైన వాస్తవం ఏమంటే చిన్నా చితక భాగస్వాములను అమెరికా పట్టించుకోదు, ఏడు దశాబ్దాల పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న ఫిలిప్పైన్స్‌నే అది వదలివేసింది.భారత సమస్యల మూలాలు దాని భౌగోళిక రాజకీయ స్దానం, సంస్కృతి, గుర్తింపు, ఆకాంక్షల్లో ఉన్నాయి. సీతారామ్‌ ఏచూరి ఒకసారి హెచ్చరించినట్లు మరొక పాకిస్తాన్‌గా మారితే అవి పరిష్కారం గావు. చైనా చెబుతున్నట్లు చతుష్టయం(క్వాడ్‌) ఆసియా నాటో కావచ్చు, కాకపోవచ్చు. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాలను అమెరికా పరిష్కరించుకుంటే, మరిచిపోయిన సీటో( సౌత్‌-ఈస్ట్‌ ఆసియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌), బాగ్దాద్‌ ఒప్పందాలకు పట్టిన గతే పడుతుందనుకొని సిద్దపడాలి. తరువాత ఇంటా బయటా ఉన్న ముస్లింలతో సర్దుబాటు చేసుకోవాల్సిన వాస్తవాన్ని మోడీ సర్కార్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది.” (బ్రాకెట్లలోని అంశాలు నేను జతచేసినవి)
అమెరికా ఎలాంటిదో, దానితో వ్యవహారం గురించి తాజా పరిణామాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలు తెచ్చేవాటిలో యుద్దం ఒకటి. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. గత రెండు దశాబ్దాల్లో అమెరికా యుద్దాలు, వాటిలో పాల్గొన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు ఎనిమిదిలక్షల నుంచి 21లక్షల కోట్ల డాలర్లు. పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త ఒక దానిలో లాభం రాకపోతే మరొక ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. యుద్దం కోసం అంత పెట్టుబడి పెట్టిన దేశం ఒక్కసారిగా తన దుకాణాన్ని మూసుకుంటుందా ? శత్రువులు లేకుండా నిద్రపోతుందా ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తోకముడవటం ఖాయం చేసుకున్న దగ్గర నుంచి అమెరికా యుద్దోన్మాదులు కొత్త రంగాన్ని తెరవటం గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఉగ్రవాదం మీద యుద్దం పేరుతో పశ్చిమ, మధ్య ఆసియాలో ఇప్పటి వరకు కేంద్రీకరించారు. ఇప్పుడు దాన్నుంచి చైనా మీద కేంద్రీకరించారు. తైవాన్‌ జల సంధి, దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు. దానిలో భాగమే చతుష్టయం కార్యకలాపాలు. తైవాన్ను ఆక్రమించేందుకు, దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని దాన్ని అడ్డుకోవాలనే పేరుతో అనేక దేశాలను కూడ గడుతున్నతీరు బహిరంగ రహస్యం. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన ఖర్చును ఇప్పుడు చైనా వైపు మళ్లిస్తారు.2022 సంవత్సరంలో పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ) బడ్జెట్‌ 715బిలియన్‌ డాలర్లుగా బైడెన్‌ ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. దానికి అదనంగా మరో 24బి. డాలర్లతో ఒక పధకానికిపార్లమెంట్‌ ఆయుధ సేవల కమిటీ ఆమోదం తెలిపింది. సెనెట్‌ కమిటీ కూడా అదే పద్దతిలో ఆమోదం ప్రకటించింది.


సునంద దత్తా రే చెప్పినట్లుగా అమెరికా చిన్న దేశాలనే కాదు, పెద్ద వాటిని కూడా పట్టించుకోదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం మీద పోరు సాకుతో దాడులకు దిగింది ఒక్క అమెరికాయే కాదు. నాటో దేశాలు కూడా పాల్గొన్నాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా జరిగిన దాడిలో మరణించిన చివరి పదమూడు మందితో కలిపి 2,461 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. ఇతర దేశాలకు చెందిన వారు 1,145 మంది, వారిలో బ్రిటన్‌ సైనికులు 457, జర్మన్లు 62 మంది చనిపోయారు. ఆ దేశాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా అమెరికా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. విశ్వాసానికి పెద్ద నష్టం జరిగిందని అమెరికాలో జర్మన్‌ మాజీ రాయబారి ఊల్ఫ్‌గాంగ్‌ షింగర్‌ వ్యాఖ్యానించాడు.” ఐరోపాకు నిజమైన గుణపాఠం ఇది. అమెరికా సామర్ద్యం మరియు దాని నిర్ణయాలపై పూర్తిగా ఆధారపడాలా లేదా అంతిమంగా ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక పాత్రధారిగా ఉండాలా లేదా అన్నదాని గురించి ఆలోచన ప్రారంభించగలమా ” అని కూడా అన్నాడు. అమెరికా చలచిత్తంతో నిమిత్తం లేకుండా, అమెరిన్‌-చైనీస్‌ ద్విదాధిపత్యం, స్ధాన భ్రంశం, ప్రాంతీయ శత్రుత్వాలకు మరల కుండా ఐరోపా రక్షణ దళ నిర్మాణం జరగాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ అభిప్రాయపడ్డాడు. కాబూల్‌ నుంచి అమెరికా విమానాలు వెనుదిరిగిన వెంటనే అమెరికా నిర్ణయాలపై ఆధారపడటానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఐరోపా యూనియన్‌ అధికారులు వ్యాఖ్యానించారు.ఐరోపా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, అది జరిగితే నిర్ణయాత్మకం స్వయం ప్రతిపత్తి వస్తుందని, ప్రపంచంలో కార్యాచరణకు పెద్ద సామర్ద్యం సమకూరుతుందని కూడా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం నుంచి బయటపడి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పటమే. అలీన విధానం నుంచి తప్పుకొని అమెరికాకు దగ్గరైన మనం ఇప్పుడు నడి సంద్రంలో ఉన్నాం. ఎటు పోవాలో తేల్చుకోలేక ఇప్పటికీ అమెరికా వైపే చూస్తున్నాం.


అమెరికా, మన దేశం చేసిన తప్పిదాలు, తప్పుడు వైఖరుల కారణంగా దక్షిణాసియాలో, ఇతర ప్రాంతాలలో మన దేశం ఇప్పటికే ఒంటరి అయింది. మరోవైపున మనం నమ్ముకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుందని స్పష్టమైంది. చైనా ప్రభావం పెరగటానికి అమెరికా తప్పుడు వైఖరే కారణం అన్నది అనేక మంది విశ్లేషణ. పసిఫిక్‌ సముద్రం – బాల్టిక్‌ సముద్రాలను కలుపుతూ యూరేసియాలో ఉన్న ప్రపంచ జనాభాలోని 70శాతం మంది, ఉత్పాదకత మీద చైనా ప్రారంభించిన బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ(బిఆర్‌ఐ) ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక్క తుపాకి గుండు కూడా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష కోట్ల డాలర్ల విలువగల ఖనిజ సంపదను అమెరికన్లు చైనాకు అప్పగించారనే అతిశయోక్తులు కూడా వెలువడ్డాయి.ప్రతిదాన్నీ లాభం-నష్టం కోణం నుంచి చూసే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.ఒక వేళ అది నిజమే అయినా దానికి కారకులు ఎవరు ? ఇరాన్‌ విషయమే తీసుకుంటే అమెరికా ఆంక్షల ఆటలో మనం పావులుగా మారినందున చివరికి ఇరాన్నుంచి చమురు కొనుగోలు కూడా నిలిపి అమెరికా నుంచి కొంటున్నాము. తన ఇబ్బందులనుంచి బయటపడేందుకు చైనాతో ఇరాన్‌ 400 బిలియన్‌ డాలర్ల అభివృద్ది పధకాల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ కూడా అదే చేయనుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తమకు విశ్వసించదగిన మిత్రదేశమని తాలిబన్‌ అధిపతి ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో పోల్చితే ఎంతో దగ్గరి సంబంధాలు గలిగిన మన దేశం ఆ స్దానంలో ఎందుకు నిలవలేకపోయింది ? అమెరికా చేసిన పిచ్చిపనికి మనం ఎందుకు నష్టపోతున్నాం.


కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం ఫలితాలు, పర్యవసానాలేమిటి ? దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు జాత్యంహంకార ప్రభుత్వాన్ని అమెరికా బలపరిచింది. పోర్చుగీసు వలసగా ఉన్న అంగోలా విముక్తి కోసం వామపక్ష శక్తులు ప్రారంభించిన సాయుధపోరాటాన్ని అణచివేసేందుకు అమెరికా రెండు దశాబ్దాలపాటు సిఐఏ పర్యవేక్షణలో అమెరికా జోక్యం చేసుకుంది. అనేక దేశాల్లో తమ పలుకుబడిని పెంచుకొనేందుకు నియంతలు, యుద్ద ప్రభువులను అమెరికా అన్ని విధాలుగా బలపరిచింది. మరోవైపున దానికి భిన్నంగా అభివృద్ది పధకాలకు సాయం చేయటం ద్వారా చైనా విధానాలు ఆఫ్రికా ఖండానికి దగ్గర చేశాయి. వాటితో పాటు విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు ఉభయతారకంగా లబ్ది చేకూర్చుతున్నాయి. యూరేసియా, ఆఫ్రికా ఖండంలో చైనా లక్ష కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. జరిగిందేదో జరిగింది. మనం ఎవరికీ లొంగనవసరం లేదు. అమెరికా మెప్పుకోసం ఇతరులను దూరం చేసుకోవటం అసలే తగని పని. వినదగు నెవ్వరు చెప్పిన అన్న వివేచనతో విశ్వగురువుగా వంది మాగధుల పొగడ్తలను అందుకుంటున్న నరేంద్రమోడీ ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా స్వతంత్ర వైఖరితీసుకొనేందుకు వర్తమాన పరిణామాలు దోహదం చేస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇన్ఫోసిస్‌ మీద ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి, భయంతో కార్పొరేట్లు – నోరు విప్పని నరేంద్రమోడీ సర్కార్‌ !

10 Friday Sep 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Infosys, Narendra Modi, Panchajanya, Rahul Bajaj, Rss attack on infosys, Tata Sons


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? ఎవరేం మాట్లాడుతున్నారు ? కొందరు పాత్రధారులైతే – తెరవెనుక సూత్రధారులెవరు ? ఆఫ్టరాల్‌ 164.5 కోట్ల రూపాయల కాంటాక్టును కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన ఇన్ఫోసిస్‌ కంపెనీ మీద ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య దాడి చేసింది. అది టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ? దీని వెనుక ప్రజలను తప్పుదారి పట్టించే ఎత్తుగడ ఉందా ? ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎన్నో !! ఆ దాడితో తమకు సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది, ఆ పత్రిక తమ అధికార వాణి కాదని కూడా చెప్పుకుంది. పత్రికా స్వేచ్చ ఉంది గనుక పాంచజన్య ఏమైనా రాయవచ్చని బిజెపి సమర్ధించింది. లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతున్న కంపెనీ మీద నిరాధార ఆరోపణ చేస్తే, అది అవునో కాదో తానే చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చింది. దాని అర్ధం ఏమిటి ?


ఇన్ఫోసిస్‌ కంపెనీ వార్షిక ఆదాయం రు. 26,823 కోట్లు(2021) నిఖరాదాయం రు.19,423 కోట్లు, కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రు.1,08,386 కోట్లు. దానిలో పని చేస్తున్న సిబ్బంది 2,59,619. అలాంటి కంపెనీ మీద ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న ఒక పత్రిక తప్పుడు రాతల మీద నోరు విప్పని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు పంపుతున్న సందేశం ఏమిటి ? ఇలా ప్రశ్నించటం అంటే కార్పొరేట్లను, వాటి అక్రమాలను సమర్ధించటం కాదు. దేని కదే. సందర్భం వచ్చినపుడూ వాటినీ ప్రశ్నిద్దాం !


ఆర్‌ఎస్‌ఎస్‌ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్‌ దేశవ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు-వలువల గురించి నిత్యం వల్లించే మరో పత్రిక ఏదైనా పాల్పడుతుందా ? ఏమి రాసినా తమను రక్షించేవారు పైన ఉన్నారనే తెగింపు గాకపోతే మరేమిటి ? కొన్ని పత్రికలు ఈ దిగజారుడు రాతలను విమర్శించినా మొత్తంగా మీడియా, కార్పొరేట్‌ రంగం దీని గురించి నోరు విప్పేందుకు భయపడింది. కొన్ని సంస్దల అధికారులు కార్పొరేట్‌ జవాబుదారీ తనం గురించి చెప్పారు. అనేక కార్పొరేట్‌ కంపెనీలు వాటాదార్లను నిలువునా ముంచాయి. అప్పుడు ఈ సుద్దులు చెప్పలేదేం. అవి ఆయా కంపెనీల అంతర్గత వ్యవహారాలైతే ఇదేమిటి ? ఇప్పుడు ఎవరిని సంతృప్తి పరచేందుకు, మెప్పు పొందేందుకు, తద్వారా లబ్ది పొందేందుకు ఈ సుభాషితాలు ?


అవును, ఇన్ఫోసిస్‌ సంస్ధ తయారు చేసిన ఆదాయపన్ను శాఖ పోర్టల్‌ ఆశించిన విధంగా పని చేయటం లేదు.అదొక్కటేనా, అనేకం సరిగా పని చేయటం లేదు. సరిదిద్దుతామని ఆ సంస్ధ చెప్పిన వ్యవధిలోపల పూర్తి కాలేదు. ఏం చేయాలి ? దానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దానికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టాలి లేదా అవకాశం ఉంటే నష్టపరిహారం కూడా రాబట్టాలి. లేదూ సాధ్యం గాకపోతే మరొక సంస్దతో కొత్త పోర్టల్‌ను తయారు చేయించాలి. అది ప్రభుత్వం-ఇన్ఫోసిస్‌ మధ్య వ్యవహారం. అప్పటి వరకు దేశం ఆర్ధికంగా స్థంభించించి పోదుగా ! ఒక సాంస్కృతిక సంస్ధ పత్రిక నుంచి ఎందుకీ దాడి !


దేశవ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తూ పని గట్టుకొని దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరం గావించేందుకు ప్రయత్నిసోందని, నక్సలైట్లు, వామపక్షవాదులు, మరియు టుకడే టుకడే గ్యాంగ్‌(దేశాన్ని విచ్చిన్నం చేసే ముఠాలు)కు నిధులు ఇస్తోందని ” తీవ్ర ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి నిర్ధిష్టమైన ఆధారం తమ వద్ద లేదని చరిత్ర మరియు పరిస్ధితులను బట్టి ఇలా చెప్పాల్సి వచ్చిందని కూడా వ్యాసంలో పేర్కొన్నారు. ఇలాంటి అనుమానాస్పద కంపెనీ చైనా, ఐఎస్‌ఐ(పాక్‌ గూఢచార సంస్ద)తో కలసి దేశద్రోహానికి పాల్పడే అవకాశం ఉందని రాసింది. దీని మీద దేశం అంతటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నష్ట నివారణ చర్యకు పూనుకుంది. ఇన్ఫోసిన్‌ నిర్వహిస్తున్న పోర్టల్‌తో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు.అయితే పాంచజన్య ఈ నేపధ్యంలో ప్రచురించిన ఒక వ్యాసం కేవలం వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి సునీల్‌ అంబేద్కర్‌ ప్రకటించారు. ఆ పత్రిక తమ భావజాలాన్ని తీసుకొని ఉండవచ్చు తప్ప ఆ పత్రిక తమ సంస్ధ అధికార పత్రిక కాదని పత్రికను, దానిలోని అంశాలను తమ సంస్ధకు అంటగట్ట కూడదన్నారు. అయితే పత్రిక సంపాదకుడు హితేష్‌ శంకర్‌ మాత్రం తాము ప్రచురించినదానికి కట్టుబడి ఉన్నామని, ఆర్‌ఎస్‌ఎస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.బిజెపి జాతీయ ప్రతినిధి నళిన్‌ కోహ్లి పరోక్షంగా పాంచజన్యను సమర్దించారు. ప్రతివారికి తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది కదా ! పత్రికా స్వేచ్చను మనం కాపాడుతున్నాం అన్నారు. దీన్నే పిర్రగిల్లి జోలపాడటం అంటారు.

దేశంలో ఒక పెద్ద సంస్ధ గురించి ఇంత రచ్చ జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలెవరూ నోరు విప్పలేదు. పాంచజన్యం ఇన్ఫోసిన్‌ మీద దాడిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ సంస్ధ రూపొందించిన పోర్టల్‌ లోపాలను ఎత్తి చూపవచ్చు. ఇలాంటి దానికి ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. కానీ రెండవ అంశంలో దేశ విచ్చిన్న ముఠాలకు నిధులు ఇస్తున్నారని, దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరం గావిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక పోర్టల్‌ అదీ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సరిగా నడవనంత మాత్రాన దేశ ఆర్ధిక వ్యవస్ధ విచ్చిన్నం అవుతుందా ? మతి ఉండి రాసిన రాతలేనా ? అంత ద్రోహం జరుగుతుంటే కేంద్ర పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?


పాంచజన్య దాడి వెనుక అజెండా లేకుండా ఉండదు. కార్పొరేట్‌ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకనాటికి బయటకు రాకపోదు. ప్రభుత్వ వైఖరులు, విధానాలను విమర్శించే కొన్ని న్యూస్‌ పోర్టల్స్‌, వెబ్‌సైట్లకు ఇన్ఫోసిస్‌ సంస్ధ నిధులు అందచేస్తున్నదనే ప్రచారాన్ని ఆర్‌ఎస్‌్‌ఎస్‌లో కొందరు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. వారు కూడా దీని వెనుక ఉండవచ్చు. తమకు నచ్చని లేదా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించి ప్రచారం చేయటం గత ఏడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను కూడా ఆ జాబితాలో చేర్చి దాడి ప్రారంభించారు. ఇన్ఫోసిస్‌ కంపెనీ స్ధాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకని 2014లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వ ”భావజాలాన్ని” నారాయణ మూర్తి వ్యతిరేకించటం ఏమాత్రం దాచలేరని, ఒక నిర్ణీత భావజాలానికి చెందిన వారిని ముఖ్యమైన బాధ్యతల్లో నియమించటం, అలాంటి కంపెనీ ముఖ్యమైన ప్రభుత్వ కాంట్రాక్టులను పొందటం,చైనా మరియు ఐఎస్‌ఐ ప్రభావితం చేసే ముప్పు లేదా అని కూడా ఆ వ్యాసకర్త పేర్కొన్నారు. అసలు విషయం పోర్టల్లో లోపం కాదన్నది ఈమాటలను బట్టి అర్ధం అవుతోంది.


ఇన్ఫోసిస్‌పై పాంచజన్య దాడే జాతీయ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నదని , భారతీయ కార్పొరేట్లు నోరువిప్పాలని, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయం రాసింది. భావ ప్రకటన స్వేచ్చ గురించి రెండు నాలికలతో మాట్లాడుతున్నారని బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొన్నది.ప్రత్యర్ధుల మీద, ముస్లింల మీద నోరు పారవేసుకున్న వారెవరి మీద ఇంతవరకు బిజెపి లేదా సంఘపరివార్‌ చర్య తీసుకున్నది లేదు. మహా అయితే అదివారి వ్యక్తిగత అభిప్రాయం మాకేమీ సంబంధం లేదని తప్పించుకుంటారు. అందుకే పదే పదే అవి పునరావృతం అవుతున్నాయి. ఉదాహరణకు కేంద్ర మంత్రి నిరంజన్‌ జ్యోతి ముస్లింల మీద వ్యాఖ్యలు చేసి విధిలేక క్షమాపణ చెప్పారు. తిరిగి రెండవసారి ఆమెకు మంత్రిపదవిని బహుకరించారు. కంపు మాటలు సంపదలను నాశనం చేస్తాయనే శీర్షికతో ఎకనమిక్‌ టైమ్స్‌ తప్పు పట్టింది. పాంచజన్యకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. పోర్టల్‌ సరిగా పనిచేయకపోతే కంపెనీని సంప్రదించేందుకు గౌరవ ప్రదమైన పద్దతులు ఉన్నాయి. ఆర్దిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్‌ ద్వారా అంత పెద్ద కంపెనీ సిఇఓ తమను కలవాలని ఆదేశించింది. ఇది ఎవరి గౌరవానికి భంగం ?


ఇన్ఫోసిస్‌ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన టాటా గ్రూపు కంపెనీ మీద కూడా ఆగస్టు నెలలో వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ దాడి చేశారు. అంబానీ గ్రూపు కోసం అమెజాన్ను అడ్డుకుంటున్న దేశభక్తి ఒకవైపు మనకు కనిపిస్తూనే ఉంది. అనేక మంది అమెజాన్‌పై దాడిని సమర్ధించి మన స్వదేశీ కార్పొరేట్లకు మద్దతు ఇస్తే తప్పేమిటి అని ఎదురుదాడికి దిగిన వారున్నారు. మరి ఇప్పుడు ఇన్ఫోసిస్‌, టాటా కంపెనీల మీద జరుగుతున్నదాడి గురించి ఏం చెబుతారు ? ఇలా విదేశీ-స్వదేశీ కంపెనీల మీద దాడులకు దిగితే బయటి నుంచి ఎవరైనా పెట్టుబడులు పెడతారా ? స్వదేశీ కార్పొరేట్లు తమకు అనువైన విదేశాలకు పెట్టుబడులను తరలించవా ? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ఏం సమాధానం చెబుతారు ? ఆవు-ఆక్సిజన్‌-గోమూత్రంలో బంగారం, దాని పేడను మండిస్తే ఏదో జరుగుతుందన్నది తప్ప వారి దగ్గర వేరే సమాధానాలున్నాయా ?


ఒక కంపెనీ వైఫల్యం గురించి ఇంతగా గుండెలు బాదుకుంటున్నవారు, దేశద్రోహాన్ని, ఆర్ధిక వ్యవస్ద విచ్చిన్నాన్ని చూస్తున్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ తప్పిదాలు, దిద్దుబాటులో వైఫల్యాలు కనిపించవా ? నల్లధనాన్ని వెలికి తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశానని 2016 నవంబరు ఎనిమిదిన ప్రకటించిన నరేంద్రమోడీ ఇప్పటి వరకు వెలికితీసిన నల్లధనం ఎంతో నోరు విప్పి చెప్పారా ? నాలుగు సంవత్సరాల తరువాత తీరికగా సెలవిచ్చిందేమిటి ? తన చర్యతో దేశంలో నల్లధనం తగ్గిందట, బ్యాంకులావాదేవీలు పెరిగాయట ? దేనితో నవ్వాలో జనానికి అర్ధం కాలేదు. నోట్ల రద్దు, తగిన కసరత్తులేకుండా చేసిన జిఎస్‌టి వలన జరిగిన నష్టాన్ని సంవత్సరాలు గడిచినా పూడ్చలేని మోడీ సర్కార్‌ ఘోర వైఫల్యం కనపడలేదు గానీ పాంచజన్యానికి ఇన్ఫోసిస్‌ దేశద్రోహం కనిపించిందా ? నరేంద్రమోడీ సర్కార్‌ ఇవన్నీ జవాబుదారీతనంతో చేసిన నిర్వాకాలని చెబుతారా ?పాంచజన్య చేసిన దాడి గురించి వ్యాఖ్యానించాలని కోరగా ఇన్ఫోసిస్‌, టాటా కంపెనీలు స్పందించలేదని రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్నది. తమతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నోరు విప్పితే సంభవించే పర్యవసానాల గురించి భయపడ్డారని కూడా రాసింది. ఈ వార్త ప్రపంచవ్యాపితంగా మీడియాలో ప్రాచుర్యం పొందింది. విదేశీ పెట్టుబడిదారులు ఈ పరిణామాన్ని గమనించరా ?


ఇ కామర్స్‌ నిబంధనలను విమర్శించినందుకు గాను వాణిజ్య మంత్రి పియుష్‌ గోయల్‌ టాటా గ్రూప్‌ కంపెనీపై ధ్వజమెత్తారు. స్ధానిక వ్యాపారులు కేవలం లాభాల గురించే ఆలోచించకూడదని సుభాషితం పలికారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేరు ప్రస్తావిస్తూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులకు లబ్దిచేకూర్చేందుకు తాను తెస్తున్న చట్టాలను టాటా సన్స్‌ అభ్యంతర పెడుతున్నారు, అదెంతో బాధ కలిగించింది. కొన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత జాతీయ ప్రయోజనం కంటే అది మరింత ముఖ్యమైంది. నేను, నాది, నా కంపెనీ అనే వైఖరి నుంచి మనం ముందుకు పోవాలి. జాతీయవాద దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాల్లో మీ ఉక్కు ఉత్పత్తులను అమ్మేందుకు ప్రయత్నించి చూడండి. దేశంలోని ఎంఎస్‌ఎంఇల నుంచి ధర ఎక్కువైనా జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని వాటిని కొనుగోలు చేయాలని మంత్రి అన్నారని వార్తలు వచ్చాయి. పియూష్‌ గోయల్‌ సిఐఐ ఏర్పాటు చేసిన నాలుగు గోడల మధ్య జరిగిన వార్షిక సమావేశంలో ఆ విమర్శ చేశారు. అధికారికంగానే సమావేశం తరువాత సదరు మంత్రి ప్రసంగం ఉన్న వీడియోను సిఐఐ యూట్యూబ్‌ ఛానల్లో పెట్టారు. అయితే దాని మీద విమర్శలు రావటంతో ప్రభుత్వమే ఉపసంహరించాలని కోరింది. దాంతో వివాదాస్పద అంశాలను కత్తిరించి తిరిగి విడుదల చేశారు. తరువాత కారణాలు చెప్పకుండానే తరువాత దాన్ని తొలగించారు.పియూష్‌ గోయల్‌ స్ఫూర్తితో పాంచజన్య బహిరంగదాడికి పాల్పడింది.


ప్రతి క్షణం నరేంద్రమోడీ సర్కార్‌ విదేశీ కంపెనీలు రావాలంటూ ఎర్ర తివాచీలు పరుస్తుంటారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అప్పగిస్తాం ప్రభుత్వానికి నాలుగు రూపాయలిమ్మని ఆహ్వానాలు, విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దారులు తెరుస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు లాభాల కోసం గాక ప్రజాసేవకోసం వస్తాయా ?సులభతర వాణిజ్యం, మరొక పేరుతో విదేశీ పెట్టుబడులు, కంపెనీలు, కొనుగోళ్లు, అమ్మకాలను అనుమతిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మన మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు, వస్తువులకు ఎప్పుడో తెరిచారు. వాటి పర్యవసానాలకు నిదర్శనమే పియూష్‌ గోయల్‌ మండిపాటు అన్నది స్పష్టం. పోటీలో చిన్న సంస్ధలు నిలవలేవు, దేశీయ వ్యాపారాలకు ఎసరు ముంచుకు వస్తున్నది. సూదీ, దారాల మొదలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేని వస్తువు లేదు. మార్కెట్లో ఉన్న రేట్ల కంటే తక్కువకు మన ఇంటికి ఉచితంగా తెచ్చి ఇస్తున్నారు. ఆ పోటీ కారణంగానే ఆ రంగంలో ప్రవేశించిన బడా సంస్దలు విదేశీ కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. తమకు అనుకూలమైన నిబంధనల కోసం పట్టుబడుతున్నాయి. లేనపుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వాటిని పూర్తిగా అంగీకరిస్తే బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న, చిల్లర వ్యాపారులు దెబ్బతింటారు. చిన్న, సన్నకారు పరిశ్రమలు మరింతగా మూతపడతాయి. ఉపాధి గల్లంతు అవుతుంది. ఇప్పటికే ఈ సెగ నరేంద్రమోడీ సర్కార్‌కు తగలటం ప్రారంభమైంది. అందువల్లనే చిన్న పరిశ్రమల నుంచి వస్తువులను కొనుగోలు చేయాలంటూ పియూష్‌ గోయల్‌ మాట్లాడాల్సి వస్తోంది. అయితే దానికీ ఒక పద్దతి ఉంటుంది. సాధారణ వ్యాఖ్యలు చేయటం వేరు, ప్రత్యేకించి ఒక కంపెనీ మీద దాడి చేయటం వేరు. ఆ బాటను గోయల్‌ చూపారు కనుకనే పాంచజన్య తాజాగా ఇన్ఫోసిస్‌ మీద దాడికి దిగింది.


టాటా గ్రూపు నిర్వహించే ప్రోగ్రెసివ్‌ ఎలక్ట్రరల్‌ ట్రస్టు నుంచి 2018-19లో బిజెపికి రు.356 కోట్ల విరాళం ముట్టింది.ఆ ఏడాది అంత మొత్తం ఏ కార్పొరేట్‌ కంపెనీ నుంచి బిజెపికి రాలేదు. ఎందుకు అంతేసి మొత్తాలు కార్పొరేట్‌లు ఇస్తున్నాయంటే తమకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని ఇచ్చే అధికారిక ముడుపులే అవి. అనధికారిక మొత్తాలు చేతులు మారటం గురించి చెప్పనవసరం లేదు.


కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన విధానాలను అనుసరించినంత కాలం బడా సంస్దలు మౌనంగా ఉంటాయి. లేనపుడు పాలకులనే మార్చివేసేందుకు పావులు కదుపుతాయి. మన్మోహన్‌ సింగ్‌ కంటే మరింతగా, నిర్దాక్షిణ్యంగా తమకు దోచిపెడతారనే కారణంతోనే నరేంద్రమోడీని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్దలు, వాటి ఆధీనంలోని బడా మీడియా ఆకాశానికి ఎత్తిందన్నది బహిరంగ రహస్యం. ద్విచక్ర వాహనాల మీద 28శాతంగా ఉన్న జిఎస్‌టిని తగ్గింపు గురించి ఆలోచిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్‌ ప్రకటనను బజాజ్‌ కంపెనీ సహజంగానే స్వాగతించింది. పద్దెనిమిది శాతానికి తగ్గించే అవకాశం ఉందని, మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల వెల ఎనిమిది నుంచి పదివేల మేరకు తగ్గుతుందని ఒక టీవీ ఇంటర్వ్యూలో బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. ఎగుమతి ప్రోత్సహాకాలను రద్దు చేసినందుకు అదే ఇంటర్వ్యూలో రాజీవ్‌ బజాజ్‌ కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. దాని వలన తమ కంపెనీ రు.300 కోట్లు నష్టపోయిందని చెప్పారు.ఎగుమతుల ప్రోత్సాహకపధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, 2017-18లో ఎగుమతి ప్రోత్సాహాల కింద వివిధ సంస్థలకు చేకూర్చిన లబ్ది రు.34,750 కోట్లు. 2020లో ఏప్రిల్‌-డిసెంబరు మాసాల మధ్య ఆ మొత్తాన్ని తొమ్మిదివేల కోట్లకు కుదించారు. తరువాత కొత్త దరఖాస్తులను స్వీకరించటాన్నే నిలిపివేశారు.


కేసుల నుంచి తప్పుకొనేందుకు తమది రాజకీయ సంస్ద కాదు కేవలం సాంస్కృతిక సంస్ద అని రాజకీయాల్లో పాల్గొనబోమని రాతపూర్వకంగా జాతి పిత గాంధీ హత్య సందర్భంగా రాసి ఇచ్చిన సంస్ద. అప్పటి నుంచి అది చేస్తున్న రాజకీయం ఏమిటో తెలిసిందే. అందువలన అవసరార్ధం అవాస్తవాలు చెప్పవచ్చని మార్గం చూపిన ఆదర్శం దానిది. ఈ నేపధ్యంలో పాంచజన్య తమ అధికార పత్రిక కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి చెప్పారు. ఇది వాస్తవమా ? అతల్‌ బిహారీ వాజ్‌పాయి సంపాదకుడిగా 1948లో అది ప్రారంభమైంది. రాష్ట్ర ధర్మ ప్రకాషన్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రచురణ కేంద్రాన్ని ప్రారంభించింది. 1977లో పత్రిక ప్రచురణ హక్కులను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన మరో సంస్ధ భారత ప్రకాషన్‌ ఢిల్లీ లిమిటెడ్‌కు బదలాయించింది. అందువలన పత్రిక మాది కాదంటే దబాయింపు తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరిని అర్ధం చేసుకోలేని స్ధితిలో జనం ఉన్నారా ?


లోక్‌సభ ఎన్నికలు ముగిసి రెండవ సారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత బజాజ్‌ గ్రూప్‌ అధిపతి రాహుల్‌ బజాజ్‌ మాట్లాడింది గుర్తుందా ? గోరక్షకుల పేరుతో మూకలు చెలరేగి హత్యాకాండకు పాల్పడుతున్నవారి మీద, పార్లమెంట్‌లో జాతిపిత హంతకుడు గాడ్సేను స్తుతించిన బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఎలాంటి చర్య తీసుకోలేదని రాహుల్‌ బజాజ్‌ నరేంద్రమోడీని విమర్శించారు. ఇదెక్కడో ఎసి గదుల్లో గుసగుసలాడింది కాదు. మోడీ కంటే ఎక్కువ పలుకుబడి కలిగిననేతగా ప్రాచుర్యం పొందిన అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌, నిర్మలాసీతారామన్‌ సమక్షంలోనే బహిరంగంగా 2019 డిసెంబరు ఒకటిన చెప్పిన మాటలు. అంతేనా ! మోడీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారని, కార్పొరేట్‌లు భయంతో జీవిస్తున్నారని కూడా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదని, ఇన్ఫోసిస్‌పై దాడిని మౌనంగా చూస్తున్న కార్పొరేట్‌ల వైఖరి వెల్లడించటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం సాధించారని నరేంద్రమోడీ స్తోత్ర పారాయణాలు !

07 Tuesday Sep 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi ‘Seva and Samarpan’, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి నరేంద్రమోడీ పుట్టిన రోజును సేవా దినంగా పాటించిన బిజెపి 71వ జన్మదినాన్ని ఇరవై రోజుల భజన దినోత్సవంగా పాటించేందుకు పిలుపునిచ్చింది.ఈ నెల 17 నుంచి ఇరవై రోజుల పాటు అక్టోబరు ఏడవ తేదీవరకు ప్రధాని నరేంద్రమోడీ రెండు దశాబ్దాల రాజకీయ సేవ మరియు అంకిత బాట గురించి స్తోత్ర పారాయణం చేయాలని బిజెపి పిలుపు ఇచ్చింది. ఆ సందర్భంగా మోడీకి కృతజ్ఞతలను తెలుపుతూ దేశ వ్యాపితంగా పెద్ద ప్రకటనల ఫలకాలు(హౌర్డింగ్‌లు) ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఉచితంగా వాక్సిన్‌, ఆహార ధాన్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ మోడీ బొమ్మవేసి రాస్తారు. మోడీ జీవిత చిత్రమాలికలతో ప్రదర్శనలు,రక్తదానాలు, పారిశుధ్యకార్యక్రమాల వంటి వాటిని చేపడతారు. పార్టీ ప్రజాప్రతినిధులందరూ రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి ఉచితంగా బియ్యం, గోధుమలను ఇచ్చింది ఇదిగో మా మోడీగారే అంటూ వీడియోలను చూపుతూ కృతజ్ఞతలు చెబుతారు. ఇంకా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశమంతటి నుంచీ ఐదు కోట్ల పోస్టు కార్డులతో ప్రతి ఎన్నికల బూత్‌ ప్రాంతం నుంచి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో అయితే కార్యకర్తలు ప్రత్యేకంగా71 చోట్ల గంగా నదిని శుద్ధి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికీ మేథావులు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తారు. మీడియాలో వ్యాసాలు, విశ్లేషణలు రాయిస్తారు.ప్రధానికి వచ్చిన బహుమతులన్నింటినీ వెబ్‌సైట్‌ ద్వారా వేలం వేస్తారు. పార్టీ కిసాన్‌ మోర్చా కార్యకర్తలు ఈ సందర్భంగా రైతులు-జవాన్లను సన్మానిస్తారు. రాజు తలచుకొంటే దేనికైనా కొదవేముంది ! ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు బిజెపి జాతీయ నేతలలో దగ్గుబాటి పురందరేశ్వరి ఉన్నారు.


నరేంద్రమోడీ ప్రభుత్వ పరంగా, రాజకీయంగా ఈ ఏడాది ఇప్పటి వరకు తిన్నన్ని ఎదురు దెబ్బలు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రుచిచూసి ఉండరు. అయినా అవేమీ తెలియనట్లు, దేశమంతా వెలిగిపోతున్నట్లు పొగడ్తలకు పూనుకున్నారంటే జనానికి జ్ఞాపకశక్తి తక్కువనే చిన్న చూపు తప్ప మరొకటేమైనా ఉందా ? మచ్చుకు కొన్నింటిని చూద్దాం. వర్తమాన అర్ధిక సంవత్సరం 2021-22 తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి 20.1శాతంతో రికార్డు సృష్టించిందని, దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నట్లుగా ప్రచారం సాగింది. దీన్ని ఘనవిజయం చెప్పుకుంటే ఇబ్బందుల్లో పడేది నరేంద్రమోడీ, పాలక బిజెపి ఎన్‌డిఏ కూటమే అని అభిమానులు గుర్తించాలి. కొంత మంది రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యల వలన ఇది సాధ్యమైందని అన్నారు. 2019-20 సంవత్సరం తొలి మూడు మాసాల్లో జిడిపి విలువ రు.35.96లక్షల కోట్లు. ఈ మొత్తం మీద 24.4శాతం దిగజారి మరుసటి ఏడాది 2020-21లో విలువ రు.26.95 లక్షల కోట్లకు తగ్గింది. ఈ మొత్తం మీద వర్తమాన సంవత్సరంలో అది 20.1శాతం పెరిగి రు.32.38లక్షల కోట్లకు చేరింది. దీన్నే ఘనతగా చిత్రిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి దేశవ్యాపితమైన లాక్‌డౌన్‌ లేదు, కార్మికుల వలసలూ అంతగా లేవు. అఫ్‌కోర్సు ఉపాధి కూడా లేదనుకోండి. అయినా ఇలా ఉందంటే పరిస్ధితి ఆందోళనకరమే అన్నది స్పష్టం.


పెట్రోలు, డీజిలు ధరలు, వాటి పెరుగుదలకు మూలమైన పన్నుల గురించి జనానికి పట్టకపోయినా ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. వినియోగం ఎంత పెరిగితే కేంద్రానికి, ధరలు ఎంత పెరిగితే రాష్ట్రాలకు అంతగా ఆదాయం పెరుగుతున్నది. వెనెజులా మాదిరి దాదాపు ఉచితంగా జనానికి అందించకపోయినా స్ధానికంగా ఉత్పత్తి పెరిగితే వినియోగదారుల మీద భారం, అన్నింటికీ మించి విలువైన విదేశీమారక ద్రవ్యం ఎంతో ఆదాఅవుతుంది. తమ ప్రభుత్వ సామర్ద్యం గురించి బిజెపి చెప్పుకోని రోజు లేదు. 2013-14లో 37.8 మిలియన్‌ టన్నుల ముడి చమురు ఉత్పత్తిచేస్తే అది 2020-21 నాటికి 30.5 మి.టన్నులకు దిగజారింది. ఈ ఏడాది ప్రతినెలా తగ్గుదలే తప్ప ఉత్పత్తి పెరుగుదల లేదు. ఎందుకు ఈ వైఫల్యమో ఇంతవరకు చెప్పిన కేంద్ర పాలకులు లేరు. మరోవైపు దిగుమతులపై ఆధారం 2012లో 81శాతం ఉండగా 2020 నాటికి 87.6 శాతానికి పెరిగింది.కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలతో తలెత్తిన వివాదాల కారణంగా వెనుకటి తేదీల నుంచి వసూలు చేయాల్సిన పన్నులను రద్దు చేయాలని నిర్ణయించి వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్‌ కంపెనీలకు లబ్దిని, సంతోషాన్ని కలిగించింది. కానీ కోట్లాది మంది చమురు వినియోగదారులకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాలకు కొన్ని రెట్లు అదనంగా ఇప్పుడు వినియోగదారుల నుంచి మోడీ సర్కార్‌ వసూలు చేస్తోంది. అడిగేవారు లేకపోవటం అంటే ఇదే. కాంగ్రెస్‌ హయాంలో జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మీద పడిందని, వాటిని తాము తీర్చాల్సి వస్తోందని గత ఏడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆమొత్తం ఎంత ? లక్షా 34వేల కోట్లు. ఈ మొత్తం కూడా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉండగా వినియోగదారులకు ఇచ్చిన రాయితీలకు గాను చమురు సంస్ధలకు ప్రభుత్వం చెల్లించాల్సిస సబ్సిడీ మొత్తం ఇది. ఆ మేరకు చమురు సంస్ధలకు బాండ్ల రూపంలో ఇచ్చారు. అంటే వడ్డీ మరియు అసలు చెల్లించే ప్రామిసరీ నోట్ల వంటివి ఇవి. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే క్రమంగా పెంచి రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా ఏడాదికి 2020-21లో కేంద్రానికి 3.35లక్షల కోట్లు సమకూరింది. వినియోగం పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుంది.


ఆత్మనిర్భర కార్యక్రమం పేరుతో 26లక్షల కోట్ల రూపాయల సాయాన్ని చేస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేశారు.అసలా కార్యక్రమం ఏమిటో, సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుందో అసలు ప్రయోజనమో కాదో కూడా ఇప్పటికీ, ఎప్పటికీ తెలియని వారెందరో. చట్ట సభల్లో అధికార పార్టీ సభ్యులు సాధారణంగా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టని, గొప్పలు చెప్పుకొనేందుకు వీలయ్యే ప్రశ్నలే అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయపధకం(ఎన్‌ఎస్‌ఎపి-వృద్ధాప్య, ఇతర పెన్షన్‌ పధకాలు) కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని బిజెపి సభ్యుడు వసంత కుమార్‌ పాండా లోక్‌సభలో అడిగారు. దానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అలాంటి ప్రదిపాదన తమ వద్ద లేదు సార్‌ అంటూ ఆగస్టు మూడవ తేదీన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 41కింద సామాజిక సహాయ పధకాన్ని అమలు జరపాలని ఉంది. ఆ మేరకు 1995లో దీన్ని ప్రారంభించి రు.75గా నిర్ణయించారు. తరువాత 2006లో రు.200కు పెంచారు. 2013లో జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ మొత్తాన్ని రు.300కు పెంచాలని సిఫార్సు చేసింది. ఎనిమిది సంవత్సరాల తరువాత తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజాలు పలుకుతున్నారా, అబద్దాలు చెబుతున్నారా ?


అసలు ఒక వృద్దుడు లేదా వృద్దురాలు రెండువందల రూపాయలతో నెల రోజులు ఏ విధంగా గడపగలుగుతారో ఎవరైనా చెప్పగలరా ? మంత్రి సమాధానాన్ని బట్టి అపర మానవతా మూర్తులైన పాలకులకు అలాంటి ఆలోచన కూడా లేదన్నది స్పష్టం. మన దేశం జిడిపిలో సామాజిక భద్రతా పెన్షన్‌ పధకాలకు ఖర్చు చేస్తున్న మొత్తం 0.04శాతం కాగా, ఆఫ్రికాలోని బోట్సవానాలో 0.3, పొరుగునే ఉన్న నేపాల్లో 0.7, లాటిన్‌ అమెరికా ఖండదేశమైన బొలీవియాలో 1.3 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నారు. వృద్దులకు రు.200, ఎనభైశాతంపైగా వికలాంగులైన వారికి, నలభై దాటిన వితంతువులకు 300, ఎనభై దాటిన వృద్దులకు 500 రూపాయల చొప్పున ఇప్పుడు కేంద్రం చెల్లిస్తున్నది. ఈ మొత్తాలకు అదనంగా జతచేసి తెలంగాణాలో వృద్ధాప్య పెన్షన్‌ రు.2000, ఆంధ్రప్రదేశ్‌లో రు.2250 చెల్లిస్తున్నారు. హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఇస్తున్నారు. దేశంలోని వృద్దులు, వికలాంగులు, వితంతువులలో పదికోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం నెలకు మూడువేల రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తే ఏడాదికి రు.3.6లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది జిడిపిలో 1.8శాతం. అనేక దేశాలలో మాదిరి సంపదపన్ను, లేదా కార్పొరేట్‌ పన్ను ద్వారా ఈ మొత్తాన్ని సేకరించవచ్చు. లేదూ ప్రభుత్వమే ఖర్చు చేసినా నష్టం ఉండదు. పెన్షనర్లు ఆ మొత్తాన్ని తమ రోజు వారీ అవసరాలకే వినియోగిస్తారు తప్ప బ్యాంకుల్లో డిపాజిట్లు చేయరు లేదా నల్లధనంగా మార్చి విదేశీ బ్యాంకులో పెట్టరు. ఆ మొత్తం ఖర్చు చేస్తే జిడిపి రెట్టింపు 3.8శాతం అవుతుంది. దానిలో సగటున పదిహేనుశాతం పన్నుగా తిరిగి కేంద్రం, రాష్ట్రాలకు చేరుతుంది. ఆ మొత్తం జిడిపిలో 0.54శాతం అవుతుంది. అంటే కేంద్రం నిఖరంగా ఖర్చు చేసే మొత్తం 1.26శాతమే అవుతుంది. మరి కేంద్రానికి ఎందుకు చేతులు రావటం లేదు ?


వృద్దులు, అనాధల పరిస్ధితి ఇలా ఉంటే వారిని ఆదుకోవాల్సిన యువత పరిస్ధితి ఏమిటి ? జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో పదిహేను లక్షల ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని సిఎంఐయి తెలిపింది. నిరుద్యోగశాతం 6.96 నుంచి 8.32కు చేరింది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం ఉద్యోగ అవకాశాలు తగ్గటానికి కారణమని సదరు సంస్ధ అధిపతి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ముందే చెప్పుకున్నట్లు ఆర్ధిక కార్యకలాపాలు పెరిగి తొలి మూడు మాసాల్లో జిడిపి 20.1శాతం వృద్ది చెందింది అని సంబరాలు చేసుకుంటున్న తరుణంలోని పరిస్ధితి ఇది. ఎనిమిది రాష్ట్రాల్లో హర్యానాలో 35.7, రాజస్తాన్‌లో 26.7, ఝార్ఖండ్‌ 16, బీహార్‌, జమ్మూ అండ్‌ కాశ్మీరులో 13.6, ఢిల్లీలో 11.6శాతాల చొప్పున నిరుద్యోగులను కలిగి ఉన్నాయి. తగినంత ఉపాధి లేని కారణంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే కడుపు చేత పట్టుకొని వలస కార్మికులు తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు.2021 జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఉపాధి పధకం కింద పని చేసిన వారు 58శాతం తగ్గారు. దీనికి వ్యవసాయ పనులు కూడా ఒక కారణంగావచ్చుగానీ పట్టణాలకు వలసలే ప్రధానం అన్నది స్పష్టం. ఉపాధిని కల్పించే పర్యాటక, ఆతిధ్య రంగాలలో వృద్ధి లోటులోనే ఉంది. మన ఎగుమతులు పెరిగాయని సంతోషించవచ్చుగానీ, ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో ప్రయివేటు వినిమయం అంతకు ముందు మూడు మాసాలతో పోల్చితే 8.9శాతం తగ్గిపోయింది. ఉపాధిలేకపోవటం, అవసరమైన వాటినే జనం కొనుగోలు చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధన ఆర్జన పధకం కింద ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెడితే పర్మనెంటు ఉద్యోగాలకు కోత పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తక్కువ వేతనాలు, తక్కువ సిబ్బందితో ప్రయివేటు సంస్ధలు లాభాలు పిండుకొనేందుకు చూస్తాయన్నది తెలిసిందే.


ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదన్నది స్పష్టం. అంకెల గారడీతో ఎంతగా దాచిపెట్టాలని చూసినా కుదరదు.ద్రవ్యోల్బణం పెరగటం అంటే ధరలు పెరగటం. ఉదాహరణకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఏలుబడిలో 1961లో వంద రూపాయల వస్తువులు కొన్నాం. ఆ ఏడాది ద్రవ్యోల్బణం రేటు 1.7శాతం. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం 3.63శాతం పెరిగింది. ఆ కారణంగా అదే వస్తువులకు మనం 103.63 చెల్లించాం. అంటే మన రూపాయి విలువ తగ్గినట్లా పెరిగినట్లా ? మనం ఒక్కసారిగా బిజెపి వాజ్‌పాయి గారి పాలనకు వద్దాం. 1999లో ఆ వంద రూపాయల వస్తువుల విలువ రు.2,032.56 అయింది. వారి పాలనలో దేశం వెలిగిపోయింది అని చెప్పారు కదా ! 2004లో అది రు.2,464.60కు చేరింది. మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయిన 2014 నాటికి రు.5,483.69కి పెరిగింది. ఇక మంచి రోజులు తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ గారి ఏలుబడిలో 2021నాటికి ఆ మొత్తం రు.7,646.39కి చేరింది.( 2021లో జూలైలో అంతకు ముందు పన్నెండు నెలల సగటు మేరకు వేసిన లెక్క. ఏడాది పూర్తయిన తరువాత ఇంకా మొత్తం పెరుగుతుందే తప్ప తగ్గదు). ఈ అంకెలకు ప్రపంచబ్యాంకు సమాచారం ఆధారం.ఆరు దశాబ్దాల సగటు ద్రవ్యోల్బణం రేటు 7.64శాతం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే నెహ్రూ కాలంలో ఒక రూపాయి ఇప్పుడు మోడీగారి హయాంలో 76.46కు సమానం. ఈ మేరకు కార్మికుల వేతనాలు, జన ఆదాయాలు పెరిగాయా ?


మనం తగినంత చమురును ఉత్పత్తి చేయని కారణంగా లేదా బంగారం వంటి నిరుత్పాదక వస్తువులను దిగుమతి చేసుకోవటం ద్వారా వాటితో పాటు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేస్తున్నాం. ఎలా అంటే, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో రూపాయి విలువ ఒక డాలరుకు 58 ఉంది. ఇప్పుడు 73-74 మధ్య కదలాడుతోంది. అంటే ఒక లీటరు పెట్రోలు దిగుమతి చేసుకుంటే ఏడు సంవత్సరాల్లో దాని ధర అంతర్జాతీయ మార్కెట్లో స్ధిరంగా ఉందని అనుకుంటే మన వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 58 నుంచి 73-74 పెరుగుతుంది. అదే చమురు ధర పెరిగిందనుకోండి ఆ మేరకు అదనంగా పెరుగుతుంది. అదే మన రూపాయి విలువ దిగజారకుండా డాలరుతో స్ధిరంగా ఉంటే 58 మాత్రమే చెల్లించాలి.అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత అదనం అవుతుంది. నరేంద్రమోడీ, బిజెపి నేతల మాటల ప్రకారం రూపాయి విలువ 58 నుంచి 40కి తగ్గిందనుకోండి మనం చెల్లించే మొత్తం తగ్గి ఉండేది. మనం ఏడు సంవత్సరాల్లో రెండింటికీ చెడ్డాం. కరెన్సీ విలువ తగ్గితే ఎగుమతులు పెరగాలి. 2014లో జిడిపిలో ఎగుమతుల విలువ 25.43శాతం, డాలర్లలో 472.18 బిలియన్లు కాగా 2020 నాటికి అవి 18.08 శాతం, 474.15బిలియన్లుగా ఉన్నాయి. ఎగుమతులు పెరగకపోగా తగ్గాయి. మరోవైపు దిగుమతులు పెరిగాయి.


ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నందుకు, కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేస్తున్నందుకు నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలట. మోడీగారు తాను చిన్న తనంలో అమ్మినట్లు చెబుతున్న టీ సంపాదన డబ్బు నుంచి తీసి జనానికి అందిస్తే నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిదేమీ కాదే, జనం చెల్లించిన పన్నులు, కార్పొరేట్‌ టాక్సులు, జాతి మొత్తానికి చెందిన ప్రకృతి వనరుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఏ మూలకూ చాలని ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇచ్చినందుకు మోడీగారికి కృతజ్ఞతలు చెప్పాలంటూ బిజెపి ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా అన్న భక్తరామదాసు గుర్తుకు రావటం లేదూ ! కరోనా వాక్సిన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగా జనం నోళ్లలో నానిందో, గబ్బుపట్టిందో తెలిసిందే. విధిలేని స్ధితిలో ఉచిత వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నారు. దీనికీ జనం సొమ్మేగా ఖర్చు చేస్తోంది. ఆపద కాలంలో ఉన్న వారిని ఆదుకోవటం, మహమ్మారుల నుంచి జనాలను రక్షించటం పాలకుల బాధ్యత. దానికి కృతజ్ఞతలను ఆశించటం ఏమిటి ? ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకొని మోడీ స్తోత్రపారాయణం చేయటం ద్వారా పడిన మచ్చలను కనిపించకుండా చేయాలనే కార్యక్రమం తప్ప ఏం సాధించారని ఇరవై రోజుల పాటు మోడీ గారిని పొగడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో నియంత్రణలు నియంతృత్వ చర్యలా ? నిజా నిజాలేమిటి !

04 Saturday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 5 Comments

Tags

china communist party, China Regulations, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” మదుపుదార్లకు మూడులక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగించిన చైనా ‘ విప్లవం ” అన్నది అమెరికా మీడియా సిఎన్‌ఎన్‌ ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక.వర్తమాన సంవత్సరంలో మన దేశ జిడిపి అంచనాకు అది సమానం. లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టే, తలిదండ్రులను, విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఆన్‌లైన్‌ ట్యూషన్‌ సంస్ధలను మూసివేసిందంటూ మరొక వ్యాఖ్యాత గుండెలు బాదుకున్నాడు. ఇంత మొత్తం నష్టం కలిగించే చర్యలకు చైనా ఎందుకు పాల్పడింది, అందునా కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న స్దితిలో అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులకూ, అభిమానించే వారికీ ఆసక్తి కలిగించే అంశమే. చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ద తప్ప సోషలిజం కాదూ పాడూ కాదు అన్నది ఒక అభిప్రాయం. కమ్యూనిస్టులమని చెప్పుకొనే వారు కూడా కొందరు వారిలో ఉన్నారు. మరి అలాంటి వ్యవస్ధ ఒక్కసారిగా మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు మదుపర్లకు నష్టం కలిగించే చర్యలు ఎందుకు తీసుకుంటుంది అంటే జవాబు ఉండదు. అక్కడ జరుగుతున్నది మంచా చెడ్డా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ముందు అక్కడే జరుగుతోందో తెలుసుకుందాం.


వివాదాస్పదమైన, దేశవ్యతిరేక రాజకీయ వైఖరులు తీసుకొనే మరియు అప్రయోజనమైన పద్దతుల్లో వ్యవహరించే కళాకారులను ప్రోత్సహించవద్దు. కార్యక్రమాలలో పాల్గొనే వారికి, అతిధులుగా వచ్చే వారికి చెల్లించే మొత్తాల మీద పరిమితులు విధించాలి. కళా రంగంలో దేశభక్తి పూరితమైన వాతావరణం ఉండేట్లు చూడాలి. నియంత్రణ చర్యల్లో భాగంగా ఎవరికి ఎంత పలుకుబడి ఉందనే సమాచారాన్ని ప్రచారం చేసే జాబితాల మీద, అభిమానాన్ని ఆదాయంగా మార్చే వైఖరుల మీద నిషేధం. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు వారానికి మూడు గంటలు మాత్రమే వీడియోగేమ్స్‌ ఆడాలి. ఇంటర్నెట్‌ కంపెనీలు సేకరించిన సమాచారం ద్వారా దేశభద్రతకు ప్రమాదం కలిగించే ముప్పు నివారణ, మరియు అమెరికాతో సహా ఇతర దేశాల్లో వాటాల విక్రయం(ఐపిఓ)పై ఆంక్షలు. పౌర సంస్ధలు(కార్పొరేషన్లు, మున్సిపాలిటీలవంటివి) తమ సమాచార(డాటా) నియంత్రణ ప్రయివేటు కంపెనీల్లో గాకుండా ప్రభుత్వ రంగసంస్ధల్లో నిక్షిప్తం చేసేందుకు వీలుగా మార్పులు చేసుకోవాలి.


ఎలక్ట్రానిక్‌ కామర్స్‌(ఆన్లయిన్‌ లావాదేవీలు) నిర్వహించే సంస్ధలు వాణిజ్య నైతిక నియమావళిని, న్యాయబద్దంగా వుండే సూత్రాలను పాటించాలి. వినియోగదారులతో అధిక మొత్తాలను ఖర్చు చేయించే విధంగా వివాదాస్పదంగా మారి సమస్యలు తలెత్తకుండా చూడాలి.( ఒక వ్యాపారి తన వస్తువులను ఒక వేదిక నుంచి అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్న తరువాత మరొక వేదిక నుంచి అమ్మటానికి వీల్లేదని ఆంక్షలు విధించిన అలీబాబా కంపెనీకి 275 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు.) ఆహార సరఫరా కంపెనీలు కార్మికులకు మెరుగైన రక్షణ కల్పించాలి.
లాభాల కోసం పని చేస్తూ విదేశాల్లో పెట్టుబడులు సేకరించే ప్రయివేటు ట్యూషన్‌ కంపెనీలపై నిషేధం.లాభాపేక్ష లేని సంస్ధలు ట్యూషన్లు చెప్పవచ్చు.స్కూళ్లలో చెప్పిన వాటిని బోధించరాదు, వారాంతాలు, సెలవు రోజుల్లో ట్యూషన్లు చెప్పకూడదు. తలిదండ్రులకు భారం లేకుండా టూషన్లు ఉండాలి.ఆన్లయిన్‌ రుణాలపై పరిమితులు విధించారు.ఒక రాష్ట్రంలో నమోదైన కంపెనీలు వేరే రాష్ట్రాల్లో రుణాలు ఇవ్వకూడదు. వ్యక్తులకు ఇచ్చే రుణాలపై పరిమితులు పెట్టారు. ఆన్లయిన్‌ చెల్లింపు సంస్ధలు క్రిప్టో కరెన్సీ(బిట్‌కాయిన్‌) చెల్లింపులు, పరిష్కారాలు చేయకూడదు. బిట్‌ కాయిన్‌ – ప్రభుత్వ కరెన్సీ మార్పిడి సేవలు నిర్వహించకూడదు.ఫండ్ల నిర్వహణ సంస్థలు ఆస్తులుగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెట్టకూడదు. రియలెస్టేట్‌ బుడగలు ఏర్పడి అవి పేలిపోయి నష్టం జరగకుండా ఉండేందుకు అవి తీసుకొనే రుణాలపై నియంత్రణలు విధించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని అంశాల మీద విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొనే చర్యలు అక్కడి శ్రమ జీవుల జీవితాల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయా లేక ఇప్పటి వరకు అనుమతించిన ప్రయివేటు కంపెనీల లాభాపేక్ష, అవినీతి,అక్రమాల మీదనా అన్నదే గీటురాయిగా చూడాలి.


టెక్నాలజీ, విద్య, ఇతర ప్రయివేటు సంస్ధలపై గత కొద్ది వారాలుగా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా వివిధ కంపెనీల మార్కెట్‌ విలువ స్టాక్‌మార్కెట్‌లో ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిపోయిందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగవచ్చు. మావో హయాంలో సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న కొన్ని దుందుడుకు చర్యలతో కొందరు వీటిని పోలుస్తున్నారు. నియంతృత్వ చర్యలు అంటున్నారు. అలాంటిదేమీ లేదని కొందరు చెబుతున్నారు. ఇప్పటికీ దీర్ఘకాల పెట్టుబడులకు చైనాలో పరిస్ధితులు సజావుగానే ఉన్నాయి.ఇటీవల తీసుకున్న నియంత్రణ చర్యలు ఎప్పుడో తీసుకోవాల్సింది, అక్కడి వృద్ధి రేటు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉంది అంటున్నారు. స్విస్‌ ప్రయివేటు బ్యాంకు పిక్‌టెట్‌ గ్రూపుకు చెందిన అసెట్‌ మేనేజిమెంటు ప్రధాన వ్యూహకర్త లూకా పొవోలినీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఢోకాలేదన్నారు. దీని ఆధ్వర్యంలో 746 బిలియన్‌ డాలర్ల ఆస్తుల పర్యవేక్షణ జరుగుతోంది.ప్రపంచంలో అతి పెద్ద ఆస్తుల నిర్వహణ సంస్ధ బ్లాక్‌రాక్‌, ఫిడెలిటీ, గోల్డ్‌మాన్‌ శాచ్స్‌ వంటివి కూడా చైనాలో పెట్టుబడులు, కొనుగోళ్ల సమయంలో ఆచితూచి లావాదేవీలు జరపవచ్చనే చెబుతున్నాయి.ఆర్ధిక స్ధిరత్వం కోసం చైనా నియంత్రణ చర్యలను సమతూకంగా ఉండేట్లు చూస్తారని, అభివృద్ధి మందగించినపుడు, మార్కెట్లో అస్థిర పరిస్థితి ఏర్పడితే నియంత్రణలను సడలించవచ్చని చెబుతున్నాయి. అయితే ఈ చర్యలను సమీపకాలంలో ఎత్తివేయవచ్చు అని భావించలేమని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది.


బడా సంస్ధలపై నియంత్రణ ఆకస్మికంగా సంభవించిన పరిణామం కాదు. జాక్‌ మా సంస్ధలపై గత ఏడాది నవంబరులో తీసుకున్న చర్యలే అందుకు నిదర్శనం.ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని సాధించేందుకు అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ వెల్లడించిన విధాన నిర్ణయంతో పాటు సమాజంలోని సోషలిస్టేతర లక్షణాల పెరుగుదలను అదుపు చేసేందుకు వివిధ చర్యలను ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చైనా మార్కెట్‌ పెట్టుబడిదారుల స్వర్గం అన్న భావనకు స్వస్ది పలికేందుకు విప్లవాత్మక చర్యలను చేపట్టినట్లు సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. అంతర్జాతీయ పెట్టుబడిదారు జార్జి సోరస్‌ ఫైనాన్సియల్‌ టైమ్స్‌లో ఒక విశ్లేషణ రాస్తూ చైనాలో పెట్టుబడులు పెట్టాలనుకొనే విదేశీ మదుపుదార్లు అక్కడి ముప్పును గుర్తించటం కష్టం అన్నారు. మదుపుదార్లకు తెలిసిన చైనా వేరు గ్జీ చైనా వేరు అన్నాడు. మీడియా, వినియోగదారుల సేవలు, విద్య, చిల్లర వ్యాపారం, రవాణా, బయోటెక్‌ రంగాలు సృష్టించి సామాజిక లేదా సాంస్కృతిక సమస్యను పరిష్కరించేందుకు చైనా కేంద్రీకరించిందని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని, ఈ రంగాల కంపెనీల వాటాలు కొనవద్దని కొందరు సలహాయిస్తున్నారు.


ఆన్‌లైన్‌ విద్య, పాఠశాల అనంతర ట్యూషన్లు చెప్పటం చైనాలో కంపెనీలకు పెద్ద ఆదాయవనరుగా ఉంది. ఇప్పుడు వాటిని నిషేధించారు. ఇవి సమాజంలో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండి అసమానతలకు దోహదం చేస్తున్నాయని కమ్యూనిస్టు పార్టీ భావించిన ఫలితమే ఈ చర్య. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన అవకాశాలను కలిగించినట్లయింది. పిల్లలు సెల్‌ఫోన్లకు, పెద్దవాళ్లు లాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారనే ఆవేదన అన్ని చోట్లా ఎప్పుడో ప్రారంభమైంది.కరోనా కారణంగా పాఠశాలల మూత సమయంలో అదింకా పెరిగి ఒక విధంగా ఒక వ్యవసనంగా తయారైంది. చైనాలో వీడియోగేమ్స్‌ ఆడే సమయాన్ని గణనీయంగా తగ్గించి పిల్లలు, యువతను వేరే అంశాలవైపు మళ్లించేందుకు కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. కొంత మంది దీనిని స్వేచ్చను హరించటంగా చిత్రిస్తుండగా, బాధ్యతాయుతమైన యువతను తయారు చేయటంగా ఎక్కువ మంది భావిస్తున్నారు.ఈ చర్య కారణంగా టెక్నాలజీ కంపెనీల ఆదాయం పెద్ద ఎత్తున పడిపోనుంది. వీటిని నిర్వహించే టెక్‌ కంపెనీల మీద గత పదిహేను సంవత్సరాలుగా నియంత్రణ లేదు. పిల్లలు, యువతలో వేలం వెర్రిగా మారటంతో ఇప్పుడు ఆపని చేస్తున్నారు. సమాజాన్ని సరిదిద్దే ఈ చర్యను నియంతృత్వంగా కొందరు చిత్రిస్తున్నారు.అవాంఛనీయమైన తప్పుడు ప్రచారానికి, విచ్చలవిడితనాన్ని, నేరాలను ప్రోత్సహించే సాధనాలుగా మారిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ మాధ్యమాలపై ఇప్పటికే చైనాలో ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో రోజుకు గంటన్నర పాటు, సెలవు రోజుల్లో మూడు గంటల పాటు వీడియో గేమ్స్‌ ఆడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు పేర్కొన్న మూడు గంటలు శుక్రవారం, వారాంతంలో మాత్రమే అనుమతిస్తారు.ప్రభుత్వ సెలవు దినాల్లో ఒక గంట అదనంగా అనుమతిస్తారు.


పాఠశాలల్లో సిలబస్‌ భారాన్ని తగ్గించటంతో పాటు వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతున్న పిల్లల్లో హ్రస్వదృష్టి సమస్యల నివారణ, ఇంటి వెలుపల కార్యకలాపాలను ఎక్కువగా ప్రోత్సహించటం, క్రీడల పట్ల ఆసక్తి పెంచటం వంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆరు సంవత్సరాల లోపు వారిలో దృష్టి సమస్యలను గుర్తించేందుకుగాను 90శాతానికి పైగా పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రోజుకు రెండు గంటల పాటు భౌతిక కార్యకలాపాల్లో ఉండే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి. ఆరు-పన్నెండు సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలతో ప్రతిసారి 20-30 నిమిషాలకు మించి చదివించటం లేదా రాయించకూడదు. వారు కనీసం పది గంటల పాటు నిద్రపోయేట్లు చూడాలి. హౌం వర్క్‌ను పరిమితం చేయాలి. అది నాణ్యమైనదిగా ఉండాలి. హాస్టల్‌ వసతి ఉన్న పాఠశాలల్లో సాయంత్రాలు చదివించే వ్యవధిని తగ్గించాలి.ఆన్లయిన్‌ గేమ్స్‌లో ఎక్కువ సేపు గడపటం వలన తరుణ వయస్సు వారి భౌతిక, మానసిక స్ధితి , చదువు సంధ్యలు,వ్యక్తిత్వ వికాసం మీద కూడా ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. వీడియో గేమ్స్‌ మీద ఏటా 20.71శాతం ఆదాయం పెరుగుతోంది. కంపెనీల వార్షిక మార్కెట్‌ విలువ 2020లో 278.7 బిలియన్‌ యువాన్లు కాగా దానిలో సగం వాటా టెన్‌సెంట్‌ కంపెనీదే ఉంది. సిచువాన్‌ రాష్ట్రంలో జరిపిన ఒక సర్వే ప్రకారం వీడియోగేమ్‌లకు బానిసలైన విద్యార్దులు 26.23శాతం ఉన్నారు. వారిలో రెండు మూడు రోజులకు ఆడేవారు కొందరైతే 11.66శాతం మంది దాదాపు రోజూ ఆడుతున్నారు. ఆన్లయిన్‌ గేమ్స్‌ను పరిమితం చేసేందుకు ఐదు వేల సంస్ధలకు చెందిన పదివేల గేమ్స్‌తో ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యలు స్వేచ్చను హరించేవా, పిల్లలను సరైనదారిలో పెట్టేవా ?


మన దేశంలో, ప్రపంచంలో చైనా గురించి ఒక విచిత్ర మానసిక స్ధితి రోజు రోజుకూ పెరిగిపోతోంది.చైనా సాధించిన విజయాల గురించి చెబితే అవన్నీ తప్పుడు లెక్కలు లేదా నియంతృత్వం కారణమని చెప్పేవారున్నారు. కరోనాను చైనా సృష్టించలేదు, దాని వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టింది, రికార్డు స్ధాయిలో వాక్సిన్లు వేస్తోంది అని ఎవరైనా చెబితే అది దేశద్రోహుల ప్రచారం అంటున్నారు. మరోవైపు ఒకటో అరా కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చినా, రావాలని ప్రకటించినా ఇంకేముంది చైనా కుప్పకూలిపోనుంది, కంపెనీలన్నీ మన దేశానికి వస్తున్నాయనే విపరీత భ్రమలకు లోను కావటం మరోవైపు చూస్తున్నాము. ఇప్పుడు వివిధ అంశాల మీద నియంత్రణ చర్యలు తీసుకుంటే వాటి మీద ప్రపంచమంతటా గుండెలు బాదుకోవటం ప్రారంభమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మా దేశం సోవియట్‌ కాదు – మాతో పెట్టుకోవద్దు : అమెరికాను హెచ్చరించిన చైనా రాయబారి !

01 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Qin Gang, RUSSIA, UNSC Resolution on Afghanistan, US


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యపై అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్‌ యూనియన్‌ కాదు, మాతో పెట్టుకొనేటపుడు ఆలోచించుకోండి అన్నట్లుగా అమెరికాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ వాషింగ్టన్‌ సభలో హెచ్చరిక. రెండూ మంగళవారం నాడు జరిగాయి. అమెరికా-చైనా సంబంధాలు జాతీయ కమిటీ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన స్వాగత సభలో రాయబారి మాట్లాడాడు. రెండు దేశాలు అపార్దాలకు, తప్పుడు అంచనాలకు, వివాదాలు లేదా ఘర్షణలకు తావివ్వ కూడదు.చారిత్రక అవకాశాలను మనం కోల్పోవద్దు, అన్నింటికీ మించి మనం చారిత్రక తప్పిదాలు చేయవద్దు అన్నారు. చైనా అంటే సోవియట్‌ యూనియన్‌ కాదు, స్వయంకృతం వలన అది కుప్పకూలిందని, ప్రచ్చన్న యుద్ద ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు.


ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని అమలు జరుపుతూనే మరో యుద్ద రంగాన్ని ఎక్కడ ప్రారంభించాలా అనే ఆలోచనలో అమెరికా వ్యూహకర్తలు నిమగమయ్యారు. ప్రచ్చన్న యుద్దం తరువాత జరిపిన అతిపెద్ద సైనిక విన్యాసాల్లో ఒకదానిని ఆగస్టు నెలలో పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా నిర్వహించాయి. పాతికవేల మంది మెరైన్‌లు పెద్ద సంఖ్యలో యుద్దనావలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. మా భాగస్వాములు అది తైవాన్‌ కావచ్చు, అది ఇజ్రాయెల్‌, మరొకటి ఏదైనా మాతో భాగస్వామ్య కలిగిన వాటన్నింటికి బాసటగా నిలుస్తామని అమెరికా అధికారి ప్రకటించాడు. చైనాకు సమీపంలోని జపాన్‌కు చెందిన ఒకినావా దీవుల్లో 50వేల మంది, దక్షిణ కొరియాలో 29వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. తైవాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియాలతో మిలిటరీ సమన్వయానికి మరింత సామర్ధ్యాన్ని అమెరికా జత చేస్తుందని వార్తలు వచ్చాయి.


మరోవైపు తన మిత్రరాజ్యాల పట్ల అమెరికా సంబంధాలలో తీవ్ర అనిశ్చితలను ముందుకు తెస్తాయని కూడా భావిస్తున్నారు. ” అమెరికా విశ్వసనీయత, దాని మీద ఆధారపడటం గురించి జపాన్‌ అవగాహన మీద తీవ్రమైన దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయని టోకియో సమీపంలోని మెకై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ టెసు కొటానీ వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు తూర్పు ఆసియా మీద కేంద్రీకరించేందుకు దృష్టి సారించింది.అయితే అమెరికా అభిప్రాయాన్ని చూస్తే తన మిత్రదేశాలకు ఎంతకాలం మద్దతు కొనసాగిస్తుందో చెప్పలేము అని కూడా అన్నాడు. బైడెన్‌కు ప్రతిస్పందించే తెలివి తేటలు ఉన్నాయా లేదా అని రష్యన్లు లేదా చైనీయులు పరీక్షించబోతున్నారని ఐరోపా వ్యూహాల అధ్యయన సంస్ద సలహాదారు ఫ్రాంకోయిస్‌ హెయిస్‌బర్గ్‌ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా విశ్వసనీయతను అందరూ అంగీకరించటం లేదు అన్నాడు.


ఉగ్రవాద ముఠాలను నిరోధించాలని, ఇతరుల మీద దాడులు, విద్రోహ చర్యలు జరిపేందుకు తమ గడ్డను అడ్డాగా చేసుకోనివ్వొద్దని, దేశం వదలి పోవాలనుకుంటున్న ఆప్ఘన్లను సురక్షితంగా వెళ్లిపోనివ్వాలనే వాగ్దానానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలంటూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఆగస్టు నెలలో మన దేశ అధ్యక్ష పదవి చివరి రోజున ఈ పరిణామం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ? గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష జోక్యం, అంతకు ముందు 23 ఏండ్లు పరోక్ష జోక్యం చేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన, దాన్ని అడ్డాగా చేసుకొని ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు.తాము వ్యక్తం చేసిన ఆందోళనను తీర్మానం ప్రతిబింబింబించటం సంతృప్తి కలిగించిందని మన దేశం పేర్కొన్నది. తీర్మానాన్ని వీటో చేయలేదు గాని చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు .తగినంత కసరత్తు చేసి ఏక గ్రీవానికి ప్రయత్నించకపోవటం లేదా రాజకీయాలు దీని వెనుక ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సెలలో ఆమోదించబోయే మరొక తీర్మానంలో స్పష్టత రావచ్చు. తాలిబన్లను అమెరికాయే గుర్తించి ఒప్పందం చేసుకుంది. అందువలన ఎవరైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఒప్పందానికి, వారు చేస్తున్న ప్రకటనలకు కట్టుబడి ఉండేవిధంగా వత్తిడి చేయటం తప్ప మరొకమార్గం ఏమిటన్నది ప్రశ్న. తాలిబన్లను అధికారికంగా గుర్తించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. కతార్‌లో మన రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబాన్‌ రాజకీయ విభాగనేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెకజారును కలుసుకొని మన వైఖరిని వివరించారు.


ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మధ్య ఆసియాలో అమెరికా శకం ప్రస్తుతానికి ముగిసింది. ఆఫ్ఘన్‌ బదులు మరొక దేశాన్ని తమ స్దావరంగా మార్చుకోవాలని అమెరికా పధకం వేసిందనే వార్తలు వచ్చాయి. ఇరాక్‌ నుంచి వైదొలిగేది లేదని అమెరికాయే బహిరంగంగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో పరాభవం, చావు దెబ్బతిన్నంత మాత్రాన అమెరికా ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావం, ప్రాభవం తగ్గి చైనా, రష్యాలు పై చేయి సాధించనున్నాయి.


భద్రతా మండలి తీర్మానానికి ఈ రెండు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి. ఆఫ్ఘన్‌ దుస్ధితికి తాలిబాన్లు ఎంత బాధ్యులో, వారిని తయారు చేసి వారితో పాటు తాము కూడా సర్వనాశనం చేసిన అమెరికా, ఇతర దేశాలది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తమ నిర్వాకాన్ని విస్మరించి బాధ్యతను ఇతరుల మీద నెట్టేయత్నం ఈ తీర్మానంలో కనిపించిందని అవి చెబుతున్నాయి. అన్ని ఉగ్రవాద ముఠాల పేర్లు ప్రత్యేకించి ఇస్లామిక్‌ స్టేట్‌ మరియు ఉఘుర్‌ ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మువ్‌మెంట్‌ వంటి వాటి పేర్లను తీర్మానంలో చేర్చలేదని అభ్యంతరం తెలిపాయి. అమెరికా బాధ్యతను దోషరహితం చేయటం, ఉగ్రవాద ముఠాలను రెండు తరగతులుగా చేసి కొందరిని మినహాయించటాన్ని రష్యా, చైనా తప్పుపడుతున్నాయి. ఆఫ్ఘన్‌ ఆర్ధిక ఆస్తులను స్ధంభింప చేయటాన్ని రష్యా తప్పు పట్టింది. సంప్రదింపుల సమయంలో రెండు దేశాలూ లేవనెత్తిన అంశాలు, చేసిన సూచనలను పూర్తిగా పట్టించుకోలేదని చైనా పేర్కొన్నది.


ఆఫ్ఘన్‌ వ్యవహారంలో మూడు విధాలుగా అమెరికా, దాని మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఒకటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, రెండవది ప్రజాస్వామిక సంస్కరణలు, బాధ్యతా రహితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వెళ్లిపోవటం. తన తప్పిదాలను గుర్తించకపోగా ఈ స్ధితికి ఇరుగుపొరుగుదేశాలే బాధ్యత వహించాలని మాట్లాడటం. ప్రతి యుద్దంలో అమెరికా తన ఆయుధాలను పరిక్షించుకోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దళ చర్యలో తమ సైనికుల మరణానికి ప్రతిగా జరిపినట్లు చెప్పిన దాడిలో ఉగ్రవాదుల మరణాల సంగతేమోగాని పౌరులు మరణించినట్లు నిర్దారణ అయింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి చర్యల వలన వేలాది మంది అమాయకులు బలైన కారణంగానే సామాన్య జనంలో అమెరికా, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకపోవటం, వారిని వ్యతిరేకిస్తున్న తాలిబాన్ల విధానాలను వ్యతిరేకించటంతో పాటు వారి పట్ల ఒక విధమైన సానుకూలత ఏర్పడటానికి దారి తీసింది.


ఫోర్బ్స్‌ పత్రిక ఆగస్టు 16 నాటి సమాచారం ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు(కొందరి అంచనా మూడు) అంటే రోజుకు 30 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 2,200 కోట్లు) అమెరికా ఖర్చు చేసింది. అమెరికా సైనికులు రెండున్నరవేల మంది మరణించారు.ఆప్ఘన్‌ మిలిటరీ, పోలీసులు 69వేలు, సామాన్య పౌరులు 47వేల మంది మరణించారు. ఆప్ఘన్‌ వ్యవహారం అమెరికా చరిత్రలో చెరిగిపోని మచ్చ, ప్రపంచ వ్యవహారాలను ఎంత దరిద్రంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికీ వెల్లడించింది. అమెరికా కనుసన్నలలోని ప్రభుత్వాలు మూడులక్షల మంది మిలిటెంట్లను నిర్బంధించటం లేదా పౌరజీవనంలోకి అనుమతించాయని అంచనా. ఇప్పుడు వారంతా తిరిగి ఆయుధాలు పట్టుకొని తెగబడితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న.


మన దేశం విషయానికి వస్తే తీసుకోవాల్సిన గుణపాఠం ఏమిటి ? అమెరికా, ఇతర దాని మిత్రపక్షాలు ఏమి చేస్తాయి అనేదానితో నిమిత్తం లేకుండా చైనా-రష్యా అఫ్ఘన్‌ ప్రభుత్వంతో స్వతంత్రంగా వ్యవహరించాలని రష్యన్‌ పరిశీలకుడు అలెగ్జాండర్‌ వి లోమనోవ్‌ చెప్పారు. ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు గనుక వారి మాటలు వినండి- వారి చర్యలను గమనించండి అన్న కన్ఫ్యూసియస్‌ బోధనల సారాన్ని గమనంలో ఉంచుకొని రెండు దేశాలూ వ్యవహరించాలి.దాని అర్ధం చూస్తూ ఉండమని కాదు అని లోమనోవ్‌ అన్నారు. పశ్చిమ దేశాల వార్తా సంస్దలు, మీడియా కథనాలు గత కొద్ది వారాలుగా అతిశయోక్తులను ప్రచారం చేశాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఆఫ్ఘన్‌ పౌరులు తప్ప సామాన్య జనం పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా ఇరుగు పొరుగు దేశాలకు తరలిపోతున్న సమాచారం, పరిస్ధితిగానీ లేదు. తమ దేశాల్లో ఉన్న నగదు, ఇతర ఆస్తులను వినియోగించుకోనివ్వకుండా నూతన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అమెరికా కూటమి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమ దేశాలకు భిన్నంగా తాముంటామని చైనా,రష్యా స్పష్టం చేశాయి. మన దేశం ఇప్పటికైనా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తుందా, అమెరికా తోక పట్టుకొని వెళుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d