• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

నరేంద్రమోడీ ప్రభావం : రూపాయి ఉల్లాస లాభం 328, వైఫల్య నష్టం 2,420 పైసలు !

31 Saturday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, BJP, China, Donald trump, India GDP, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


” నరేంద్రమోడీ ప్రభావం : 2014లో ఆసియా-పసిఫిక్‌ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి ” అని 2014 మే 25వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ” 2022లో ఆసియన్‌ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి ” అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. 2014కంటే మరింత బలంతో రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అదే నరేంద్రమోడీ ప్రభావం పెరిగింది తప్ప తగ్గలేదని చెబుతున్నారు. నాడు వార్త రాసినపుడు డాలరుకు రూపాయి మారకం రేటు రు.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రు.82.72. ఎంత పతనం ? మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో పతనాన్ని చూసి గుండెలు బాదుకున్న బిజెపి పెద్దలు ఇప్పుడు తమ ఏలుబడిలో రూపాయి చక్కగా ఉందని బస్తీమే సవాల్‌, చర్చిద్దామా అంటూ తొడగొడుతున్నారు. అదేదో అమెరికా డాలర్‌ రేటు పెరిగింది తప్ప మన రూపాయి తగ్గలేదంటూ వాదనలు చేస్తున్నారు. ఇది ఏ వేద గణిత లెక్కో, ఏ తర్కమో వారే చెప్పాలి.


డాలరు విలువ పెరిగింది తప్ప మన బంగారం బానే ఉందని చెబుతున్నవారు, తాజాగా రాయిటర్‌ వార్తా సంస్థ, అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో మన పతనం ఎక్కువగా ఎందుకుందో చెప్పగలరా ? ఎగువన రాయిటర్‌ గ్రాఫ్‌లో చూపిన దాని ప్రకారం సింగపూర్‌ డాలర్‌ విలువ పెరగ్గా పతనంలో ప్రధమంగా రూపాయి, వరుసగా ఇండోనేషియా రూపయా, ఫిలిఫ్పీన్స్‌ పెసో,చైనా యువాన్‌, దక్షిణ కొరియా వాన్‌, మలేసియా రింగిట్‌, థాయిలాండ్‌ బట్‌ ఉన్నాయి. శుక్రవారం ఉదయం లండన్‌లో ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వాల్‌స్రీట్‌ జర్నల్‌ ఒక వార్త ఇచ్చింది. దాని ప్రకారం 2022లో జపాన్‌ ఎన్‌ 13శాతం, భారత రూపాయి 10, చైనా యువాన్‌ 8.6, ఆస్ట్రేలియా డాలర్‌ 6.5,దక్షిణ కొరియా వాన్‌ 5.5 శాతం చొప్పున క్షీణించింది.


2014 జనవరి ప్రారంభంలో రు.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్రమోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రు.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రు.82.72కు అంటే 839 పైసలు దిగజారింది.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, చైనాను కట్టడి చేసేందుకు, ఇతర అంతర్జాతీయ అంశాల మీద నరేంద్రమోడీ కేంద్రీకరించి రూపాయి పాపాయి సంరక్షణను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు, అదే మోడీ కేంద్రీకరించి ఉంటేనా అని భజన పరులు ఎవరైనా అనవచ్చు. నిజమే అనుకుందాం కాసేపు, మోడీ చూపు ప్రపంచం మీద పెట్టినప్పటికీ ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యా పరిష్కారం కాలేదు, మనకు మాత్రం రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి, పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు. అమెరికాకే అగ్రస్థానం అంటూ అంతకు ముందు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌,తగ్గేదే లే అంటూ వ్లదిమిర్‌ పుతిన్‌, మా దారి మాదే వైదొలిగేది లేదు, అమెరికా కాదు దాని బాబు బెదిరించినా మేమింతే అంటూ షీ జింపింగ్‌ ఇలా ఎవరికి వారు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నారు. అచ్చేదిన్‌ తెస్తానన్న నరేంద్రమోడీ తన అజెండాను పక్కన పెట్టి విశ్వగురువు అవతారమెత్తి ప్రశంసలు పొందటం తప్పమన జనాలకు ఇంతవరకు ఒరగబెట్టింది ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లేదా బాహర్‌ షేర్వాణీ అందర్‌ పరేషానీగా ఉంది.


మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3 శాతం పతనంతో నరేంద్రమోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి – మార్చి నెలల్లో రు.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు.ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి. 2022లో ఇతర ఆసియా కరెన్సీలతో పోల్చితే రూపాయి పతనం ఎక్కువగా ఉంది, 2023లో మిగతా కరెన్సీలతో పాటు కోలుకున్నా దానిలో కూడా దిగువనే ఉంటామని విశ్లేషణలు వెలువడ్డాయి.


నరేంద్రమోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాసకాలం(జూలై – సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీన్ని కరంట్‌ ఖాతా అంటారు) 36.4 బిలియన్‌ డాలర్లు లోటు ఉంది. ఇది జిడిపిలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7 బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తుసేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది.ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు – డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.


డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67బి.డాలర్లకు(17.72శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.


ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025నాటికి దేశ జిడిపిని ఐదులక్షల కోట్లడాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3 లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు.


కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జై శంకర్‌ తదితరులు ఇలాంటి వారి అభిప్రాయాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరా ? జనాన్ని మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా ? 2047నాటికి మన జిడిపి 40లక్షల కోట్లకు చేరుతుందని ముకేష్‌ అంబానీ ప్రకటించారు. ఇక ఆసియాలో అతి పెద్ద ధనవంతుడిగా మారిన గౌతమ్‌ అదానీ వచ్చే పది సంవత్సరాల కాలంలో ప్రతి 12-18 నెలలకు మన జిడిపి లక్ష కోట్ల డాలర్ల వంతున పెరుగుతుందని అన్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జిడిపి కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ఒక 50 ఏండ్ల క్రితం పల్లెటూళ్లలో ఎవరైనా పెద్ద పట్టణాల్లో కొత్త సినిమా చూసి వస్తే దాని కథ, పాటల గురించి చెబుతుంటే జనం గుంపులుగా చేరేవారు. పాటల పుస్తకాలను తీసుకువస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. జిడిపి గురించి కూడా జనానికి బిజెపి నేతలు అలాగే కథలు వినిపిస్తున్నారు. ప్రపంచ జడిపిలో మొత్తం సంపదలో చూస్తే అగ్రస్థానంలో ఉన్న అమెరికా తలసరి జిడిపిలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వస్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వృద్ది సాధించేందుకు పోటీపడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కొనే వారు, ఫుడ్‌ కూపన్లతో కడుపునింపుకొనే జనాలు ఉన్నారంటే సంపదలు పెరగటమే కాదు, అవి జనాలకు చెందితేనే గౌరవ ప్రదమైన జీవితాలను గడుపుతారని చెప్పకనే చెబుతున్నది. మన దేశ పరిస్థితి ఒక్క సారి ఊహించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ కనికట్టు గుజరాత్‌ వైఫల్యాలను దాచగలదా !

25 Sunday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Gujarat model, Narendra Modi, Narendra Modi Failures, RSS, Rural daily wages


ఎం కోటేశ్వరరావు


మన జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడికి అసలు సిసలు వారసులం, శీలవంతులం అని చెప్పుకుంటున్న వారు కూడా అదే విధంగా ఉన్నారా ? 2022 డిసెంబరు 20న రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచికలను విడుదల చేశారు.మౌలిక మానవ అవసరాల ప్రాతిపదికన పోటీ తత్వం, సామాజిక ప్రగతి అవసరం గురించి అధ్యయనం చేసిన ఒక సంస్థ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలికి సూచికలను అందచేసింది. దాన్ని మండలి అధó్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ దేవరాయి అధికారికంగా విడుదల చేశారు. ఉచితాలు-అనుచితాల గురించి దేశంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఒక వైపు ప్రతిపక్షాల మీద అనుచిత దాడి చేస్తూనే మరోవైపు ఉచితాలను చూపి 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి సిద్దం అవుతోంది.దానిలో భాగంగానే మరో ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వేరే చెప్పనవసరం లేదు.


ఈ పధకం గురించి గతంలో బిజెపి ఏమి చెప్పింది, ఇప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటోంది ? 2013లో నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అదెందుకు అని నాడు ప్రతిపక్ష బిజెపి ప్రశ్నించింది. దాని మీద పార్లమెంటు చర్చలో బిజెపి నేత మురళీ మనోహర జోషి ఆ బిల్లు ఆహారం కాదు, కాంగ్రెస్‌ ఓట్ల భద్రత కోసం తెచ్చిందని సెలవిచ్చారు. ఇక బిజెపి మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్‌ పార్టీ అంతరంగాన్ని వెల్లడిస్తూ బహిరంగంగా చెప్పిన అంశాల మీద 2015 జనవరి 23న ఇచ్చిన వార్తకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పెట్టిన శీర్షిక ” జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బిజెపి వ్యతిరేకించిందని చెప్పిన మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్‌ ”, కావాలంటే విదేశీ గూగుల్‌ దేవతను అడిగితే మన స్వదేశీ సమాచారాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే వేదాల్లో అన్నీ ఉన్నప్పటికీ మనకు అలాంటి దేవత లేదు మరి. అదే బిజెపి నేతలు ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్న వాటి గురించి ఇప్పుడు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నదీ తెలిసిందే. కరోనా సాయం పేరుతో 2020 నుంచి 2022 డిసెంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చే పధకం ముగిసింది. దాన్ని 2023 ఆఖరు వరకు పొడిగించాలని తాజాగా కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇది 2024 ప్రారంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసమని ఎవరైనా అంటే అవునో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. జనాలకు తాము ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల విలువగల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని మరో రెండులక్షల కోట్లు వచ్చే ఏడాది ఖర్చు చేస్తామనే ప్రచారాన్ని బిజెపి ఊదరగొట్టనుంది.


శాంత కుమార్‌ (88) బిజెపిలో వెనుకటి తరానికి చెందిన వారు. అలాంటి వారిలో కొంత మంది పార్టీ ఏదైనా కొన్ని సందర్భాలలో సూటిగా మాట్లాడతారు. ఆహార భద్రతా చట్టాన్ని ప్రారంభం నుంచీ బిజెపి వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల ముందు జనంలో చెడుగా చూపే అవకాశం ఉన్నందున సమర్ధించినట్లు చెప్పారు. పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు 67శాతం మందిని ఆ చట్టపరిధిలోకి తేవటం చాలా ఎక్కువని చాలా మంది భావించారు, ఎన్నికలే గనుక లేకపోతే అదే చెప్పేవారు. ఎలాగూ తమ ప్రభుత్వం వస్తుందని, దాన్ని సవరిస్తాం గనుక మేము కూడా ఆమోదించామన్నారు. ఇక నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా కేంద్రానికి ప్రతిపాదిత ఆ బిల్లు మీద ఒక లేఖ రాశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఆహార ధాన్యాలను నెలకు 35 నుంచి 25 కిలోలకు తగ్గించటం ఏమిటని మండిపడుతూ భద్రత సంగతి సరే ఆ మొత్తంతో అవసరమైన కాలరీల వక్తిని ఎలా సమకూర్చుకోగలరని ప్రశ్నిస్తూ ఆ బిల్లు ఒక మనిషికి రెండు పూటలా తిండికి హామీ ఇవ్వటం లేదన్నారు. నిజంగా ఎంత చక్కగా చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆ తరువాత మూడోసారి లోక్‌ సభ ఎన్నికలకు పోతున్నప్పటికీ సరఫరాను ఒక్క కిలో కూడా పెంచలేదు. బిజెపి నేత మురళీ మనోహర జోషి బిల్లుకు ప్రతిపాదించిన సవరణల్లో ఆహార ధాన్యాలతో పాటు పప్పులు, నూనె కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సదరు జోషి ఇప్పుడు బిజెపి మార్గదర్శక మండలి సభ్యుడిగా ఉన్నారు.తన ప్రతిపాదన గురించి మోడీకి చెప్పారో లేదో లేక చెప్పినా ఊడగొట్టిన నాగటి దుంపలతో మనకు పనేమిటని, ఎన్నికలకు ముందు అనేకం చెబుతాం అన్నింటినీ అమలు జరుపుతామా అని మోడీ పట్టించుకోలేదో మనకు తెలియదు.


ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం పడిపోతున్నది తప్ప మెరుగుపడటం లేదు. 2022లో అంతకు ముందున్న 101 నుంచి 107కు దిగజారింది. మదింపు సరిగా జరగటం లేదని ప్రతిసారీ బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. దాని సంగతి పక్కన పెడితే ప్రపంచ సంస్థలు మన సూచికను పెంచే వరకు లేదా అసలు అన్నార్తులు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంత మాత్రాన బిజెపి రాజకీయాన్ని జనం దృష్టికి తేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్ర ఆహార మంత్రి పియుూష్‌ గోయల్‌ గారు తమ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పాటు 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ జరపనున్నట్లు జేజేలు పలికారు. ఈ పధకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అమలు జరపాలి. 2014 నుంచి మూడేండ్ల వరకు అమలు జరపాలని 2013లో నిర్ణయించారు. తరువాత అవసరాన్ని బట్టి అమలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు దారిద్య్రరేఖకు ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం తేల్చలేకపోతోంది. కొన్ని అంచనాల ప్రకారం 22శాతం మంది అంటున్నారు. ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలంటే ఈ లెక్కన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 58శాతంగా చెప్పాలి. మోడీ సర్కార్‌ తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిగా దీన్ని చెప్పుకుంటారా ? లేక పాలక పార్టీకి ఓట్ల కోసం ప్రజల సొమ్ముతో అర్హత లేని వారికి కూడా ఇస్తున్నారా ? సమాధానం చెప్పేవారెవరు ? పరిస్థితి ఇలా ఉంటే పేదలకు అనుచితంగా ఉచితాలను ఇస్తున్నారని, గుజరాత్‌లో అలాంటి పధకాలు, ప్రలోభాలను తిరస్కరించారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది నిజమేనా ?


వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న ఉచితాల మంచి చెడ్డల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉచితాలు వస్తు, ధన, సేవలు ఏ రూపంలో ఉన్నా వాటిని పొందిన వారు ఆమేరకు వాటికోసం ఖర్చు చేయాల్సిన మొత్తాలను ఇతర వాటికి వినియోగదారుల రూపంలో వెచ్చిస్తే ఆ మేరకు మార్కెట్‌ పెరిగి అది దేశాభివృద్దికే తోడ్పడుతుందన్నది ఒక వాదన, కనిపించే వాస్తవం. కానీ పరిశ్రమలను పెట్టక ముందే ఏటా లక్షల కోట్ల మేరకు రాయితీల రూపంలో లబ్ది చేకూర్చుతున్న కార్పొరేట్లకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం మరికొన్ని రాయితీలను ఇస్తున్నది. లబ్ది పొందిన కంపెనీలు ఆ మేరకు పెట్టుబడులు పెట్టి ఉంటే మన పారిశ్రామిక ఉత్పాదకత, ఉపాధి ఎందుకు పెరగటం లేదు ?


ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) 2020లో వేసిన అంచనా ప్రకారం మన దేశంలో తీవ్ర ఆహార కొరతతో 22 కోట్ల మంది, ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్న వారు 62 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రపంచానికి ఆహార ఎగుమతులు చేస్తున్న మన దేశంలో ఆకలి ఏమిటని కొందరు అడుగుతారు. లేదని నమ్మించ చూస్తారు. ఆఫ్రికాలో వజ్రాలు, బంగారు గనులున్నా అక్కడ ఎంత మంది చేతిలో అవి ఉన్నాయి ? అలాగే మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6 నుంచి 67.1శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి ? మెజారిటీ రాష్ట్రాల్లో రెండింజన్ల సర్కార్లే ఉన్నాయి. గుజరాత్‌లో పరిస్థితి మరీ దారుణం. జాతీయ సగటు కంటే ఎక్కువగా గడచిన ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో రక్తహీనత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది, తీవ్ర పరిస్థితిలో ఉన్నవారు 1.7 నుంచి 3.1శాతానికి పెరిగారు. పిల్లలే కాదు,స్త్రీ, పురుషులందరిలో రక్తహీనత పెరిగింది. ప్రతివారం పండ్లు తీసుకొనే వారు దేశంలో సగటున 56.1శాతం ఉంటే అభివృద్ధి చెందిన గుజరాత్‌లో 39.8 శాతమే.(2022 మే 23 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ). దీనికి ఏమంటారు ?జాతీయ వినియోగ ఖర్చు గురించి 2017-18 సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తరువాత అసలు సర్వే ఊసే లేదు.


సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సిఎన్‌ఎన్‌ఎస్‌ ) 2016-18 ఆధారంగా 2022 ఏప్రిల్‌లో రక్తహీనత ముక్త భారత్‌ సంస్థ విడుదల చేసిన వాస్తవాల పత్రం ప్రకారం దేశంలో ఉన్న పరిస్థితితో కేరళను పోల్చితే పరిస్థితి ఇలా ఉంది. (అంకెలు శాతాల్లో )
వయసు సంవత్సరాలు ××× దేశ సగటు ××× కేరళ
1 నుంచి 4 బాలికలు ××× 40.5 ×××××× 13.1
1 నుంచి 4 బాలురు ××× 40.6 ×××××× 12
5 నుంచి 9 బాలికలు ××× 24.7 ×××××× 2.8
5 నుంచి 9 బాలురు ××× 22.3 ×××××× 3.3
10 నుంచి19 బాలికలు××× 39.6 ×××××× 13.7
10నుంచి 19 బాలురు ××× 17.6 ×××××× 4.1
రెండింజన్ల బిజెపి పాలిత రాష్ట్రాలు, సంక్షేమ పధకాల అమలు గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం చూసినా కేరళలో పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగవ సర్వేతో పోలిస్తే ఐదవ సర్వేలో దేశంలో దేశం మొత్తంలో రక్తహీనత సమస్య పెరిగింది.


ఇక 2022 సామాజిక ప్రగతి సూచికను చూస్తే బిజెపి రెండింజన్ల ప్రభుత్వాల వైఫల్యం గురించి చెప్పుకుంటే సిగ్గు చేటు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచికలను చూస్తే 36కు గాను బిజెపి ఏలుబడిలోని అసోం 34, మధ్య ప్రదేశ్‌ 33, ఉత్తర ప్రదేశ్‌ 31, గుజరాత్‌ 22, హర్యానా 21, వైసిపి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణా 26వ స్థానంలో ఉంది.తమిళనాడు, కేరళ 6,9 స్థానాల్లో ఉన్నాయి.తొలి ఐదు స్థానాల్లో పుదుచ్చేరి,లక్ష ద్వీప్‌, గోవా, సిక్కిం, మణిపూర్‌ ఉన్నాయి.


ఉచితాల గురించి ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక నివేదికలో 2022-23 బడ్జెట్లలో కేరళలో సున్నా కేటాయింపులున్నట్లు పేర్కొన్నది.తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 2022 మార్చి ఆఖరుకు మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో పురుష వ్యవసాయ కార్మికులకు అతి తక్కువగా రోజువారీ సగటు వేతనం రు,217.8, 220.3 చొప్పున ఉండగా కేరళలో రు.726.8 ఉంది. నిర్మాణ రంగంలో రు.837.7 కాగా గుజరాత్‌లో రు.373 ఇస్తున్నారు. దేశ కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలో వ్యవసాయెతర పనులకు 2020-21లో సగటు వేతనం రు.315.3 కాగా ఆంధ్రప్రదేశ్‌లో రు.305.3 ఉండగా కేరళలలో అది రు.677.6 ఉంది. అందుకే అంటారు, జనాలకు చేపలను తెచ్చి పెట్టటం ఉచితం అదే చేపలను పట్టటం నేర్పితే సాధికారత. ఏడాదికి వంద రోజులు సగటున పని దొరికిందనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రు.30,530 రాబడి ఉంటుంది. అదే కేరళలో రు.67,776 వస్తుంది. అందుకే అక్కడ ఉచితాలతో పని లేదు, ఉచితాలు ఇచ్చిన చోట, ఇవ్వని చోటా మానవాభివృద్ది లేదు. దేశమంటే అదానీ, అంబానీలు కాదు, మనుషులు అన్నపుడు గుజరాత్‌లో మనుషులెందుకు అంతగా అధ్వాన్న జీవితం గడుపుతున్నారో వేరే చెప్పాలా ? కనికట్టుతో గుజరాత్‌లో అంతా బాగుంది అంతా బాగుంది అని నరేంద్రమోడీ గారడీ చేస్తే కుదరదు, తన పాలన వైఫల్యాలు దాస్తే దాగేవి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో జోడీ కట్టాలా ! విడగొట్టుకోవాలా ! తైవాన్‌ చిప్స్‌ పరిశ్రమ ధ్వంసం అమెరికా బెదరింపు !

21 Wednesday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Decouple from China, Narendra Modi, Narendra Modi Failures, RSS, Taiwan Matters, TRADE WAR, US-CHINA TRADE WAR


ఎం కోటేశ్వరరావు
ఇటీవల మరోసారి చైనాను కట్టడి చేయాలని, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని, లావాదేవీలను నిలిపివేయాలని మన దేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాతో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్సీ వద్ద డిసెంబరు తొమ్మిదవ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన తోపులాటను చైనా దాడిగా, దురాక్రమణగా చిత్రించిన మీడియా రాతలను చూస్తే మహేష్‌ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఎంత వైన్‌ తాగితే అంత జ్ఞానం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తిన పొరపచ్చాలను మరింతగా రెచ్చగొట్టటమే దేశభక్తి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగానే ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ చైనా నుంచి దిగుమతులను ఆపివేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అన్నట్లుగా గాల్వన్‌ ఉదంతం తరువాత రికార్డు స్థాయిలో మన దేశం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతంలో మరణించిన మన సైనికుల గురించి మనోభావాలను ముందుకు తెచ్చిన వారెవరో తెలిసిందే. ఆ తరువాత చైనా నుంచి దిగుమతులలో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. మోడీని పైకి తీసుకువచ్చిందీ, గద్దెమీద కూర్చోపెట్టింది సంఘపరివార్‌ అనీ అది చైనా మీద గతంలో చేసిన వ్యతిరేక ప్రచారం, ఇప్పుడు పరోక్షంగా దాని సంస్థలన్నీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం గురించి జగమెరిగినదే.


కమ్యూనిజంపై ఉన్న సైద్ధాంతిక లేదా గుడ్డి వ్యతిరేకత చైనాను తిరిగి పైకి తేలకుండా పక్కనున్న సముద్రంలో ముంచాలని లేదా శాపాల మహిమ చూపి హిమాలయాల మంచును కరగించి వరదలతో ముంచాలన్న్న కసికొందరిలో కనిపిస్తుంది. వీటిని చూసిన సామాన్యులు అదంతా నిజమే కామోసనుకుంటారు. కొందరు ఆ భావజాలాన్ని మెదళ్లకు ఎక్కించుకోవటం కూడా తెలిసిందే. అలా కనిపించే వారందరూ దానికి కట్టుబడి ఉండటం లేదు, ఉండరు అన్న వాస్తవాన్ని తెలుసుకోవటం అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అని కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌ మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పక ముందే ధనం మూలం ఇదం జగత్‌ అని క్రీస్తు పూర్వం 375లో జన్మించినట్లు భావిస్తున్న చాణుక్యుడు తన అర్ధ శాస్త్రంలో చెప్పాడు అంటే అది అంతకు ముందే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలి. ఇక నటించేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ పాత్రలో లీనం కావాలనుకుంటే దానిలో ఒదిగిపోతారు.


చైనాతో విడగొట్టుకుంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ మేథో సంస్థ షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ హెల్గా జెప్‌ లా రోచీ చెప్పారు. రెండు రోజుల క్రితం అమె చైనా వార్తా సంస్థ సిన్హువాతో మాట్లాడుతూ చైనాతో సంబంధాల విస్తరణ, కొనసాగింపు జర్మనీ ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చైనాతో విడగొట్టుకోవాలనటం భౌగోళిక రాజనీతి ఎత్తుగడ అని, దానితో విడగొట్టుకోవటం జర్మనీకి ఆర్థిక ఆత్మహత్యతో సమానమని రోచీ వర్ణించారు. అమెరికా వత్తిడితో చైనాతో తెగతెంపులు చేసుకుంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టినట్లే అన్నారు.చైనాతో తెగతెంపుల గురించి జర్మనీ, ఐరోపా సమాఖ్యలో తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. చైనాతో జర్మనీ గనుక తెగతెంపులు చేసుకుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వెళ్లిన దానికి ఆరు రెట్లు అదనంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, చైనాతో వాణిజ్య పోరుకు దిగితే ఆటోమోటివ్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపడుతుందని ఒక సంస్థ వేసిన అంచనాను రోచీ ఉటంకించారు. అమెరికా భౌగోళిక రాజనీతి క్రీడలో సేవకురాలిగా ఉండటం కంటే స్వంత ప్రయోజనాల పరిరక్షణకు నిలబడాల్సిన స్థితికి జర్మనీ చేరిందని అన్నారు. విడగొట్టుకోవాలని కోరుతున్నది కేవలం కొన్ని దేశాలు మాత్రమేనని 120కి పైగా దేశాలు, ప్రాంతాలు చైనాతో సహకరించటానికి సుముఖంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.


అమెరికా ఇటీవలి కాలంలో తైవాన్ను అడ్డం పెట్టుకొని చైనాను సాధించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌లో 1949 నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ ఆధ్వర్యంలోని మిలిటరీ అక్కడే కేంద్రీకరించింది. దాన్నే అసలైన చైనాగా గుర్తించి, ప్రధాన భూభాగాన్ని దానిలో అంతర్భాగంగా ఐరాస కూడా పరిగణించింది. తరువాత మారిన పరిణామాల్లో అసలైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నదే అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమని ఐరాస కూడా గుర్తించింది. అందువలన ఏదో ఒక రోజు అది విలీనం గాక తప్పదని తెలిసిందే. ఆ ప్రక్రియను అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తైవాన్‌ తిరుగుబాటుదార్లను చేరదీసి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదంటూ వేర్పాటు, స్వాతంత్య్ర ప్రకటనలు చేస్తున్న శక్తులకు మద్దతు పలుకుతున్నాయి. అటువంటి తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడితే , సంబంధాలు దిగజారితే, జో బైడెన్‌ ప్రకటించినట్లు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే జరిగే పర్యవసానాలు, ప్రపంచానికి జరిగే అర్థిక నష్టం గురించి గురించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


రష్యాకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ను నిలిపేందుకు అమెరికా చూసింది, అదే మాదిరి తైవాన్ను స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో చేరాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా తన భద్రతకోసం ప్రారంభించిన సైనిక చర్య ప్రపంచానికి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తెలిసినవే. ఇప్పటికిప్పుడు ఒక వేళ అమెరికా గనుక తైవాన్‌ ప్రాంతంలో చిచ్చు పెడితే, దాన్ని వమ్ము చేసేందుకు రంగంలోకి దిగిన చైనా ఒక వేళ దిగ్బంధనానికి పూనుకుంటే అన్న కోణంలో చూస్తే తైవాన్‌తో ఇతర ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే ఆంక్షలు, మిలిటరీ ఖర్చు వంటి వాటి పర్యవసానాలను పక్కన పెడితే తైవాన్‌ సరఫరా చేసే చిప్స్‌పై ఆధారపడిన ప్రపంచంలోని కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక సంస్థ అంచనా. ఇది ప్రపంచానికి తెలిసిన అంశాల గురించే, నిగూఢంగా జరిగే చిప్‌ లావాదేవీల వివరాలు తెలిస్తే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదే జరిగితే చైనాతో సహా ప్రపంచ ఆర్థిక రంగానికి సరఫరా గొలుసు విచ్చిన్నం అవుతుంది. ఒక వేళ తన ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు చైనా గట్టి చర్యలు తీసుకున్నా తలెత్తే పరిస్థితి గురించి ఊహాగానాలు చేస్తున్నారు.


అమెరికా దుష్ట పధకం అమలు జరిగి తైవాన్‌ దిగ్బంధానికి గురైతే 2021లో ప్రపంచ దేశాలతో అది జరిపిన 922బిలియన్‌ డాలర్ల విలువగల ఎగుమతి-దిగుమతి లావాదేవీలు నిలిచిపోతాయి. వీటిలో 565 బి.డాలర్ల ఎగుమతులకు కచ్చితంగా ముప్పు వస్తుందని అంచనా. ప్రపంచంలో ఆధునిక చిప్స్‌లో 92శాతం తైవాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమోటిక్‌ మైక్రో కంట్రోలర్స్‌ 35శాతం, స్మార్ట్‌ ఫోన్‌ చిప్‌ సెట్స్‌ 70శాతం అక్కడి నుంచే జరుగుతోంది. ఇవి నిలిచిపోతే వాటి మీద ఆధారపడిన కంపెనీలకు ఏటా 1.6లక్షల కోట్ల డాలర్లమేర రాబడి నష్టం జరుగుతుంది. ఇది తక్షణం జరిగే నష్టమైతే సరఫరాలను పూర్తి స్థాయికి తీసుకు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టేది, పెట్టుబడులు ఎంత అవసరమనేది అంచనా వేయటం కష్టం.


ఒక వేళ చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తైవాన్‌లోని చిప్స్‌ ఇతర ఆధునిక పరిశ్రమలను ధ్వంసం చేయాలని అమెరికన్లు పిలుపునిచ్చారు. నవంబరు పదవ తేదీన వాషింగ్టన్‌ నగరంలో రిచర్డ్‌ నిక్సన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ” మహత్తర వ్యూహ సభ( గ్రాండ్‌ స్ట్రాటజిక్‌ సమిట్‌)లో అమెరికా మాజీ రక్షణ సలహాదారు, రాయబారిగా పనిచేసిన ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ఒక వేళ చైనా గనుక తైవాన్ను విలీనం చేసుకుంటే అక్కడ ఉండే చిప్స్‌, ఇతర పరిశ్రమలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చైనాకు దఖలు పరిచేది లేదని చెప్పాడు. తైవాన్నుంచి మన కార్లు, ఫోన్లకే కాదు మిలిటరీ పరికరాలకు కూడా తైవాన్‌ చిప్స్‌ వస్తున్నట్లు చెప్పాడు. చైనాకు చిప్స్‌ సరఫరా చేయరాదని, తయారీకి సహకరించరాదని జపాన్‌ వంటి తన మిత్ర దేశాలను అమెరికా తన చిప్స్‌ వార్‌లో భాగంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 నవంబరులో అమెరికా ఆర్మీ వార్‌ కాలేజీ ప్రెస్‌ ప్రచురించిన ఒక పత్రంలో కూడా ఒక వేళ చైనా విలీనానికి పూనుకుంటే తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టిఎస్‌ఎంసి)లను ధ్వంసం చేయాలని సిఫార్సు చేశారు. బ్రోకెన్‌ నెస్ట్‌ – డిటరింగ్‌ చైనా ఫ్రం ఇనవాడింగ్‌ తైవాన్‌ అనే పేరుతో ఈ పత్రాన్ని వెలువరించారు. తరువాత నెలల్లో అమెరికా మరింతగా రెచ్చగొట్టటంతో పాటు రూపొందించిన తాత్కాలిక పధకంలో భాగంగా తైవాన్‌లోని చిప్స్‌ ఇంజనీర్లను అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నట్లు అక్టోబరు ఏడున బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. తైవాన్‌తో నిమిత్తం లేకుండా అమెరికాలోనే చిప్స్‌ తయారీకి 280 బి.డాలర్లమేర కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ఆగస్టులో ఏకంగా ఒక చట్టాన్నే చేశారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు వచ్చి రెచ్చగొట్టిన తరువాత ప్రతిగా సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ఇసుక ఎగుమతులను తైవాన్‌కు చైనా నిలిపివేసింది. అమెరికన్లు నిజంగా తైవాన్‌ పరిశ్రమల ధ్వంసానికిి పాల్పడితే సంవత్సరాల పాటు వాటిని పూడ్చుకోవటం సాధ్యం కాదు.


ప్రపంచ ఫ్యాక్టరీగా ఎగుమతులతో పాటు, 140 కోట్ల జనాభాతో అతి పెద్ద దిగుమతుల మార్కెట్‌గా కూడా చైనా ఉంది. ఎగుమతిాదిగుమతి లావాదేవీలకు గాను బాంకులు ఏటా 6.5 నుంచి ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేర రుణాలు ఇస్తున్నాయి. చైనాతో ఇతర దేశాలు వివాదానికి దిగితే ఈ లావాదేవీలు చాలా భాగం నిలిచిపోతాయి. ప్రస్తుతం తైవాన్నుంచి చిప్స్‌ దిగుమతులు చేసుకుంటుంటే, చైనా నుంచి అనేక దేశాలు ఆటోమొబైల్‌ విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా తరుణంలో అక్కడి నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అమెరికా ఇటీవల దాని తీవ్రతను పెంచింది. తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతులను కొనసాగిస్తూనే చైనాకు అవసరమైన సాంకేతిక బదిలీల మీద ఆంక్షలను విధిస్తోంది.దాన్ని అధిగమించేందుకు చైనా పూనుకుంది. ఎగుమతులకు అవకాశాలు తగ్గితే ఆ మేరకు దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు పూనుకుంది.దీని అర్ధం తెల్లవారేసరికి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు చైనా నుంచి వెళ్లిపోతాయని లేదా ఎగుమతులు నిలిచిపోతాయని కాదు. ఈ రోజు చైనా ఉన్న స్థితిలో ఏ దేశమూ దాని దిగుమతులను నిలిపివేసే స్థితిలో లేదు. అంతగా ప్రపంచం దాని మీద ఆధారపడింది. దానిలో భాగంగానే మన దేశం కూడా. కొందరు కోరుతున్నట్లు చైనా దిగుమతులను నిలిపేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ పూనుకోలేదు. కారణం వాటి మీద ఆధారపడిన మన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి.మన దిగుమతులు మన అవసరాల కోసం తప్ప చైనాకు తోడ్పడేందుకు కాదు. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. చైనాతో పోలిస్తే అమెరికా, ఐరోపా దేశాల నుంచి చేసుకొనే దిగుమతి ఖర్చు మన కంపెనీలు భరించలేవు. అందుకే వాటి వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ అనుమతించకతప్పటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవాలయాలపై బూతు బొమ్మలకు ఓకే అంటున్న కాషాయ దళాలు- షారూఖ్‌ ఖాన్‌, దీపిక పఠాన్‌ సినిమా పాటపై దాడి ఎందుకు?

17 Saturday Dec 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Filims, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

Besharam Rang row, BJP, Deepika Padukone, Pathaan movie, RSS, saffron brigade hypocrisy, saffron talibans, Shah Rukh Khan, Swara Bhaska


ఎం కోటేశ్వరరావు


ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశంలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేనిమీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరుధ్యం వాస్తవం. ఇది కొత్తగా వచ్చిన ధోరణా ? మన దేశ గతంలోనూ ఇలాంటి తీరు తెన్నులు కనిపిస్తాయి. ఈ కారణంగానే రాజరికాలు, విదేశీ దురాక్రమణల వలస పాలన చాలా కాలం ఎదురులేకుండా సాగింది. తాజా అంశానికి వస్తే సినిమాలు ఎలా తీయాలో ఎవరు ఏ దుస్తులు, ఏ రంగువి వేసుకోవాలో కూడా మతశక్తులు నిర్దేశిస్తున్నాయి, లేకుంటే అడనివ్వం, సినిమా హాళ్లను తగుల బెడతాం అని బెదిరిస్తున్నాయి. షారూఖ్‌ ఖాన్‌-దీపికా పడుకొనే జంటగా నటించిన ” పఠాన్‌ ” అనే సినిమా పలు భాషల్లో జనవరి 25న విడుదల కానుంది. దానిలో బేషరమ్‌ సంగ్‌ అనే పాటను డిసెంబరు 12న విడుదల చేశారు. ఇప్పటికే కోట్లాది మంది దాన్ని చూశారు. ఆ పాట తీరు, దానిలో హీరోయిన్‌ దీపిక ధరించిన బికినీ, ఇతర దుస్తుల మీద మతశక్తులు పెద్ద రచ్చ చేస్తున్నాయి. పాటలో దీపికను అసభ్యంగా చూపారన్నది కొందరి అభ్యంతరం.శృంగార భంగిమలతో చూపితే చూపారు పో, ఆమెకు కాషాయ రంగుదుస్తులు వేయటం ఏమిటి అని మరికొందరు, వేస్తే వేశారు పో, ఒక ముస్లిం నటుడు కాషాయ రంగుదుస్తులు వేసుకున్న హిందూ మహిళతో తైతక్కలాడటం ఎంత ఘోరం అన్నట్లుగా స్పందనలు, ప్రచారదాడి తీరు తెన్నులు ఉన్నాయి.


అనేక దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేసే వారు కనిపిస్తారు. కొందరు ఆ బొమ్మలకు అశరీతత్వం, ఆత్మస్వరూపత్వ పరమార్ధం ఉంది అని భాష్యం చెబుతారు. ఖజురహౌ శృంగార శిల్పాలు, వాత్సాయనుడి సచిత్ర కామ సూత్రాల గురించి తెలిసినదే. వాటిని పుస్తకాల మీద ముద్రించి సొమ్ము చేసుకుంటున్నవారు, ఎవరూ చూడకుండా లొట్టలు వేసుకుంటూ ఆ పుస్తకాలను పడక గదుల్లో భాగస్వాములతో కలసి చదివి ఆనందించే, ఆచరించేవారి సంగతీ తెలిసిందే. కానీ వాటి స్ఫూర్తితో సినిమాల్లో కొన్ని దృశ్యాలను పెడితే ఇంకేముంది హిందూత్వకు ముప్పు అంటూ కొందరు తయారవుతున్నారు. దీనిలో భాగంగానే జనవరి 25న విడుదల కానున్న ” పఠాన్‌ ” సినిమాను విడుదల కానివ్వం, విడుదలైనా ఆడనివ్వం, ప్రదర్శించే సినిమా హాళ్లను తగులబెడతాం అంటూ హిందూ-ముస్లిం మతశక్తులు వీరంగం వేస్తున్నాయి.


పఠాన్‌ సినిమాకు సెన్సార్‌బోర్డు అనుమతించిన తరువాతే దానిలో బేషరమ్‌ రంగ్‌ అనే పాటను విడుదల చేశారు. కోట్ల మంది అవురావురు మంటూ చూశారు. ఆ పాటలోని దుస్తులను మార్చకపోతే మధ్య ప్రదేశ్‌లో ఆ సినిమాను ఆడనివ్వం అని రాష్ట్ర హౌంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా బెదిరించారు.మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఆగ్రహంతో చేసిన ట్వీట్‌లో ఇలా ఉంది. ” దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. పాటను కలుషిత బుద్దితో చిత్రించారు. పాట దృశ్యాలు, దుస్తులను సరి చేయాలి. లేకపోతే మధ్య ప్రదేశ్‌లో దాన్ని విడుదల చేయనివ్వాలా లేదా అన్నది పరిశీలించాల్సిన అంశం ” . సినిమాను నిషేధించాలి, బహిష్కరించాలని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ అన్నారు. ఇస్లాంలో నమ్మకం ఉన్న ఒక పఠాన్‌ ముస్లింల చిహ్నాలతో ఒక మహిళతో అలాంటి దృశ్యాలలో నటించవచ్చా అని ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు.లవ్‌ జీహాదీల అసంబద్దతకూ ఒక హద్దు ఉంటుంది అన్నారు. సినిమాలోని దృశ్యాలను సవరించే వరకు చిత్ర విడుదల నిలిపివేయాలని సుప్రీం కోర్టులో వినీత్‌ జిందాల్‌ అనే లాయర్‌ ఒక కేసు దాఖలు చేశారు. వీర శివాజీ బృందం పేరుతో ఉన్న కొందరు ఇండోర్‌లో దీపిక, షారుఖ్‌ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. హిందువుల భావాలను గాయపరచిన సినిమాను నిషేధించాలని కోరారు. మధ్య ప్రదేశ్‌ బిజెపి మంత్రికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ గోవింద్‌ సింగ్‌ జతకలసి సినిమా మీద ధ్వజమెత్తారు.భారత సంస్కృతికి విరుద్దంగా సినిమా ఉందని నేత చెప్పారు. సెన్సార్‌ బోర్డు ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఏమిటి ? అది ఇచ్చిన తరువాత బిజెపి దాని మీద రచ్చ చేస్తుంది, ఇదొక నిగూఢమైన అంశం అని కూడా కాంగ్రెస్‌ నేత చెప్పారు.సదరు నేత తమ రాష్ట్రంలో ఉన్న ఖజురహౌ శిల్పాల గురించి ఏమి చెబుతారు ?


2020 జనవరి మొదటి వారంలో ఢిల్లీ జెఎన్‌యులో ముసుగులతో వచ్చిన ఎబివిపి, దాని మద్దతుదారులు విద్యార్ధులు, టీచర్ల మీద చేసిన దాడికి నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావంగా దీపిక వచ్చారు.వారితో కొద్దిసేపు గడపటం తప్ప అమె ఎలాంటి ప్రకటన, ప్రసంగం చేయలేదు. దాడిలో గాయపడిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ అధ్యక్షురాలు, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐసీ ఘోష్‌ను ఆమె పరామర్శించారు. దాని మీద బిజెపి నేతలు దీపిక సినిమాలను బహిష్కరించాలని అప్పుడే వీరంగం వేశారు. ఇప్పుడు మరోసారి బిజెపి మంత్రి ఆమె తుకడే తుకడే ముఠాకు చెందిన వారంటూ నోరుపారవేసుకొని నాటి ఉదంతాన్ని గుర్తుకు తెచ్చారంటే పాట మీద కంటే ఆమె మీద ద్వేషమే ప్రధానంగా ఉన్నట్లు చెప్పవచ్చు.


హిందూాముస్లిం మతశక్తులు ఒకే నాణానికి బొమ్మా – బొరుసు వంటివి. పఠాన్‌ సినిమా పాట ముస్లిం సమాజ మనోభావాలను దెబ్బతీసిందని, దీన్ని తమ రాష్ట్రంలోనే గాక దేశంలో ఎక్కడా ప్రదర్శించనివ్వబోమని మధ్య ప్రదేశ్‌ ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్‌ అనస్‌ ఆలీ బెదిరించారు. ముస్లిం సమాజాల్లో గౌరవనీయులైన వారిలో పఠాన్లు ఒకరు. పఠాన్లనే కాదు మొత్తం ముస్లిం సమాజాన్నే దీనిలో అగౌరవపరిచారని, సినిమా పేరు పఠాన్‌, దానిలో మహిళ అసభ్యంగా నృత్యం చేసింది. సినిమాలో పఠాన్లను తప్పుగా చూపారని అలీ ఆరోపించారు.హిందూత్వను అవమానించే ఏ చిత్రాన్నైనా మహారాష్ట్రలో ప్రదర్శించనివ్వబోమని బిజెపి ఎంఎల్‌ఏ రామ్‌ కదమ్‌ ప్రకటించారు. పఠాన్‌ సినిమాను బహిష్కరించాలని, ఎక్కడైనా ప్రదర్శిస్తే సినిమా హాళ్లను తగులబెట్టాలని అయోధ్యలోని హనుమాన్‌ ఘరీ రాజు దాస్‌ మహంత్‌ పిలుపునిచ్చారు. చివరకు ప్లేబోయి పత్రికకు అసలు ఏ దుస్తులూ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చిన నటి షెర్లిన్‌ చోప్రా (ఈమె హైదరాబాదీ ) కూడా హిందూత్వ శక్తుల సరసన నిలిచారు. పఠాన్‌ సినిమాలో దీపిక కాషాయరంగు బికినీ ధరించటాన్ని తప్పుపడుతూ ఇది అంగీకారం కాదన్నారు. దీపిక తుకడే తుకడే గాంగు మద్దతుదారని ఆరోపించారు.


కాషాయ రంగు దుస్తులు వేసుకొని అడ్డమైన పనులు చేస్తున్నవారిని చూస్తున్నాము. ఎప్పుడూ ఆ రంగును అభిమానించే వారు వాటిని ఖండించలేదు. అందుకే ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ చక్కగా స్పందించారు. సిగ్గులేని మతోన్మాదులు… కాషాయ దుస్తులు వేసుకున్న పెద్దలు అత్యాచారాలు చేసిన వారికి దండలు వేస్తారు, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తారు.ఎంఎల్‌ఏల బ్రోకర్లుగా ఉంటారు, కాషాయ దుస్తులు వేసుకున్న స్వామీజీలు ముక్కుపచ్చలారని బాలికల మీద అత్యాచారాలు చేస్తారు. ఒక సినిమాలో మాత్రం ఆ రంగు దుస్తులు వేసుకోకూడదా అని అడుగుతున్నానంతే అని ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. షారూఖ్‌ ఖాన్‌ సినిమా రయీస్‌ దర్శకుడు రాహుల్‌ ధోలాకియా మతశక్తుల బెదిరింపులను ఖండించారు. షారూఖ్‌ ఖాన్‌పై విద్వేష దాడులను సినిమా రంగంలోని వారందరూ ఖండించాలని, బుద్దిలేని సిద్దాంతాలతో ముందుకు వస్తున్న మతశక్తులను నోరు మూసుకోమని చెప్పాలని ట్వీట్‌ చేశారు. సినిమా నటి స్వర భాస్కర్‌ అధికారంలో ఉన్న మన నేతలను చూడండి, వారు కొంత పని చేసి ఉండవచ్చు, గుడ్లగూబలా నటుల దుస్తులను చూసేందుకు వారికి వ్యవధి ఉంటుందా అన్నారు. నేరగాండ్లు మంత్రివర్గాల్లో చేరుతుంటే అదేమీ వార్త కాదు. ఆర్థికవేత్తలు యాత్రల్లో చేరుతున్నారు. ఐటం సాంగ్స్‌లో నటి ఏ రంగు దుస్తులు ధరించిందన్నది మాత్రం వార్త అవుతోందని కూడా ఆమె పేర్కొన్నారు.

రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి పేరుతో ఒకరు చేసిన ట్వీట్‌లో నాలుగు డబ్బుల కోసం తన భార్యను బహిరంగంగా అవమానించటాన్ని సహించే లేదా అనుమతించే భర్త ఎలాంటి వాడై ఉంటాడు అని కేవలం అడుగుతున్నానంతే అని పేర్కొన్నారు. దీని గురించి దర్శకుడు ఓనిర్‌ (అనిర్భన్‌ ధార్‌ ) కూడా కాషాయ దళాల దాడిని ఖండించారు.స్పందిస్తూ ” ఛీ ఛీ మానసిక రోగమిది, అనుమతించటం, సహించటం అనే పదాలను ఉపయోగించటాన్ని చూస్తే భర్త ఒక మహిళకు యజమాని అని భావించే తెగకు చెందిన వారిలా కనిపిస్తున్నారు.చౌకబారు ఆలోచనలు గలవారే ఇలా చేస్తారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత బొమ్మలను కళ్లప్పగించి చూడటం, విద్వేష ప్రచారం తప్ప మరేమి చేస్తారు అంటూ ఓనిర్‌ దుయ్యబట్టారు. ఫిలిమ్‌ సర్టిఫికెట్‌ బోర్డు, న్యాయవ్యవస్థ లేదా చట్టాన్ని అమలు పరిచే సంస్థలు కాదు, మనం చూడాల్సిందేమిటన్నది ఇప్పుడు గూండాలు నిర్ణయిస్తారు. భయంకర రోజులు. అని కూడా ఓనిర్‌ అన్నారు.


బూతు బొమ్మలున్న దేవాలయాల సందర్శనలను నిషేధించాలని గానీ, వాటి చుట్టూ ఎత్తైన గోడలు కట్టి మూసివేయాలని గానీ, వాత్సాయన కామసూత్రాలు, వాటి చిత్రాల అమ్మకాలను నిషేధించాలని గానీ ఎన్నడూ హిందూత్వశక్తులు రోడ్డెక్కింది లేదు.వాత్సాయన కామసూత్రాల పేరుతో దుస్తుల్లేకుండా పడకగది దృశ్యాలతో కూడిన వీడియోలు, సినిమాలు చూసేవారికి కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి. కేంద్రంలో ఉన్న పెద్దలు వాటినేమీ నిషేధించలేదు. బేషరమ్‌ పాటను రాసింది కుమార్‌, స్వర పరచింది విశాల్‌-శేఖర్‌, దర్శకుడు సిద్దార్ధ ఆనంద్‌, స్క్రీన్‌ ప్లే శ్రీధర్‌ రాఘవన్‌, గానం చేసింది శిల్పారావు, ఆ పాటను నాలుగు కోట్ల మందికి పైగా వీక్షించారు. వీరందరిని వదలి నటించిన దీపికా, షారుఖ్‌ మీద హిందూత్వ శక్తులు దాడిని కేంద్రీకరించాయి.


దీపికా పడుకోనే-షారూఖ్‌ ఖాన్‌ మీద చిత్రించిన పాటలో దీపిక కాషాయ రంగు దుస్తులు వేసుకోవటాన్ని వారు అంగీకరించటం లేదు. ఇతర రంగు వేసుకుంటే ఫర్లేదా ? ఆ రంగు మీద ఎవరికీ పేటెంట్‌ హక్కులేదు. ఎవరికి ఏ రంగు, ఎలా తగిన విధంగా ఉంటాయో నిర్ణయించేది సినిమా దర్శకులు, వారికున్న హక్కు అది. ప్రధాని నరేంద్రమోడీ ఏ రాష్ట్ర పర్యటనకు పోతే అక్కడి సంప్రదాయ వేషధారణతో కనిపించటం తెలిసిందే. అదే విధంగా కొన్ని రోజులు గడ్డం పెంచారు, తరువాత తగ్గించారు, అది మోడీ స్వంత విషయం. దేశ ప్రధాని లేదా ప్రజాప్రతినిధుల దుస్తులు ఇలా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కదా ! గతంలో ఇందిరా గాంధీ ఇంకా అనేక మంది కూడా అలాగే చేశారు. దుస్తుల కంటే కూడా దీపిక అంటే హిందూత్వ శక్తులకు మింగుడు పడటం లేదు, షారూఖ్‌ ఖాన్‌ ముస్లిం గనుక విద్వేషం వాటి డిఎన్‌ఏలోనే ఉంది. అయినా సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత దాన్ని అంగీకరించం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని చెప్పే హక్కు ఎవరిచ్చారు. ఇది ప్రజాస్వామ్యమా ? మూక వ్యవహారమా ? ఇరాన్‌లో హిజాబ్‌ వద్దంటూ సాగిన ఆందోళనను సమర్ధించిన శక్తులు మన దేశంలో మాత్రం ఇక్కడ ఎవరు ఏ దుస్తులు వేసుకోవాలో – కూడదో చెబుతూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు, ఇరాన్‌లో నైతిక పోలీసులను విమర్శించే వారు మన దేశంలో వారిని పక్కాగా అనుసరిస్తూ సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. తాలిబాన్లు ఏరంగు,ఏ మతం వారైనా సమాజానికి ప్రమాదకారులే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉచితాలు – అనుచితాల చర్చ : నరేంద్రమోడీకి జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా లేక బిజెపి చేస్తే సంసారం…. !

15 Thursday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Freebies, Narendra Modi, Narendra Modi Failures, Politics Of Freebies, Revadi Politics


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్రమోడీ మరోమారు ఉచితాలు – అనుచితాల చర్చకు తెరతీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు అజండాను ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు గనుకనే ఇటీవల నాగపూర్‌లో టికెట్‌ కొని మెట్రో రైలు ఎక్కి తాను ప్రధాని పదవిలో ఉన్నా ఉచితంగా రైలెక్కను అనే సందేశమిచ్చారు.ఏదీ ఊరికే రాదు అన్న ఒక నగల వర్తకుడి వాణిజ్య ప్రకటనను చాలా మంది చూసే ఉంటారు. మోడీ టికెట్‌ కౌంటర్‌లో ఉన్న ఫొటో మాదిరి ఉచితాల వ్యతిరేక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఏది ఉచితం, ఏది కాదు అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతున్నది. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. విశ్వగురువు నరేంద్రమోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రవచనాల సారం ఏమిటి ? రివాదీ (ఉచితాలు) సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరం. ఈ రోజు దేశంలో ఉచితాల ద్వారా ఓట్లను దండుకొనేందుకు కొన్ని పార్టీల వారు చూస్తున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఉచిత సంస్కృతి గురించి జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా మీకు అవసరమైన రహదారులు, విమానాశ్రయాలు లేదా రక్షణ నిర్మాణాలు జరగవు. ఈ ఆలోచనలు చేసే వారిని ఓడించాల్సి ఉంది.


మోడీ గారి వయస్సు ఇప్పుడు 73 నడుస్తున్నది. బహుశా ఇతర మానవ మాత్రుల మాదిరి ఆయనకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. దానిలో పేర్కొన్న అంశాలను చూస్తే ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్దు స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. బహుశా బిజెపి నిఘంటువులో వీటికి వేరే అర్ధం ఏమన్నా ఉన్నట్లా లేక నరేంద్రమోడీ గారికి ఈ సంకల్పం గురించి గుర్తు లేదా లేక నటిస్తున్నారా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


ఈ ఏడాది మాదిరే 2017లో కూడా హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన పక్షం రోజులకు గుజరాత్‌ ఎన్నికలను ప్రకటించారు. ” హిమచల్‌ ఎన్నికల ప్రకటన తేదీ నుంచి గుజరాత్‌లో కురుస్తున్న ఉచితాల వాన ” అని సిఎన్‌ఎన్‌ – న్యూస్‌ 18 అక్టోబరు 26, 2017న ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే 24 గంటల ముందు బిజెపి సర్కార్‌ నాలుగు పెద్ద పధకాలను ప్రకటించిందని దానిలో పేర్కొన్నారు.( మోడీ నైతిక విలువల వెలుగులో పెరిగిన బిజెపి కూడా ఇతర పార్టీల మాదిరే ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోవద్దు, ఎంతవారలైనా కాంతదాసులే అన్న కవి ఇప్పుడుంటే పార్టీలన్నీ అధికార దాసులే అనే వారు) డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల కొనుగోలుపై రైతులకు 18శాతం జిఎస్‌టి రద్దు, రైతులకు సున్నా వడ్డీకి రుణాలు వాటిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతాంశానికి వస్తే అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి కేంద్ర ఆఫీసులో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రాధాన్యత అన్నది బిజెపి విధానమని, ఏది తమకు అనుకూలంగా పని చేస్తుందో ఏది వ్యతిరేకమో ఓటర్లకు తెలుసునని, దగ్గరదారి రాజకీయాలు దేశానికి నష్టమని వారికి తెలుసు అన్నారు. దేశం బాగుపడితే ప్రతి ఒక్కరూ సంపదలు పొందుతారని చెప్పారు. ఉచితాలు కొనసాగితే ఈ రోజు మన పొరుగుదేశాల్లో జరుగుతున్న మాదిరే పరిస్థితి ఉంటుందని, అందువలన అలాంటి ఎత్తుగడలు ఎవరికీ లబ్ది ఉండదు అన్నారు. ఇలాంటి సుభాషితాలను ఒక వైపు వినిపిస్తూ మరోవైపు గుజరాత్‌ నేతలకు ఏ మార్గదర్శనం చేశారో చూడండి.


” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. బిజెపి కూడా ఉచితాల క్రీడా బరిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతిని ఆకర్షించేందుకు పూనుకుంది. గుజరాత్‌ ఆర్థిక వ్యవస్థను(జిఎస్‌డిపి) లక్ష కోట్ల డాలర్లకు పెంచుతామని(2022-23లో అంచనా రు.22 లక్షల కోట్లు, డాలర్లలో 280 బిలియన్లు.2018-19లో రు.15 లక్షల కోట్లు, అది గత ఐదేండ్లలో 22లక్షల కోట్లకే పెరిగింది. అలాంటిది ఐదేండ్లలో లక్షకోట్ల డాలర్లంటే 1000 బి.డాలర్లకు ఎలా చేరుతుంది.) 2036లో అహమ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నది.(గుజరాత్‌పై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 నవంబరు 27 తేదీ సంపాదకీయం). ఆలూ లేదూ చూలూ లేదు, 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ ఎవరికి అప్పగిస్తారనేది 2025-29 సంవత్సరాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది,మన దేశానికి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము.అలాంటిది ఏకంగా నిర్వహిస్తామని ఇప్పుడే బిజెపి చెప్పటం జనాలను అమాయకులుగా పరిగణించటం తప్ప మరొకటి కాదు. తాను ప్రకటించే ఉచితాలు సాధికారతలో భాగమని, ఇతరులు ప్రకటించే వాటిని ప్రలోభాలని బిజెపి చిత్రిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో రైతులకు విద్యుత్‌ సబ్సిడీగా రు.15,700 కోట్లు ఇస్తున్నట్లు 2021 అక్టోబరులో అక్కడి బిజెపి సర్కార్‌ ప్రకటించింది. అదేవిధంగా గృహాలకు 2021-22కు గాను రు.4,980 కోట్లు కేటాయించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమను తిరిగి ఎన్నుకుంటే వృద్దాప్య పెన్షన్‌ మొత్తాన్ని రు.200 నుంచి 1000కి పెంచుతామని మణిపూర్‌ బిజెపి ప్రకటించింది.


నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రధానిగా ప్రతి పైసాకు జవాబుదారీ అన్న సంగతి తెలిసిందే. ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చూస్తున్నారు.గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త).ఇవన్నీ బడాబాబులు, కావాలని ఎగవేసిన రుణాలన్నది అందరికీ తెలిసిందే. పారు బాకీల రద్దు కాదు, వేరు ఖాతాల్లో చూపుతున్నామని అంటున్నారు. ఇంత తక్కువగా వారి నుంచి రాబట్టటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నది స్పష్టం. అలాంటి పెద్ద మనుషుల పేర్లు వెల్లడిస్తే వారి మర్యాదలకు భంగం అని చెబుతున్నారు. వారితో బాంకులు ఉన్నతాధికారులు కుమ్మక్కు కాకుండా అలాంటి రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్ర రుణాలను తీసుకోవటం తప్ప తిరిగి చెల్లించనవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఎగవేసిన వారు చిన్నవారా పెద్దవారా అని కాదు ఎలాంటి సందేశం జనాల్లోకి వెళుతున్నదనేది కీలకం.ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ పధకాల కారణంగానే తిరిగి అధికారానికి వచ్చిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. అక్కడ ముద్రా రుణాల కింద పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పధకం కింద ఇచ్చే రుణాలను క్రెడిట్‌ గారంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ద్వారా మంజూరు చేస్తారు గనుక చెల్లించకున్నా బాంకులు ఎలాంటి ఇబ్బందులు పడవని బాంకు అధికారుల సంఘం పేర్కొన్నది. చిన్న, సన్నకారు సంస్థలకు ఇచ్చే ఈ రుణాల నిరర్ధక ఆస్తుల మొత్తం 2021 మార్చి 31నాటికి 11.98శాతం లేదా రు.2.84లక్షల కోట్లని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం వెల్లడించింది.2018 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఏలు కేవలం 5.38శాతమే. ఇదేమీ చిన్న మొత్తం కాదు, పైసల్లో అంతకంటే లేదు. ఇది కూడా పన్ను చెల్లించిన వారి సొమ్మే మరి.


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లేగా ! తమిళనాడు ప్రభుత్వం కార్పొరేట్లకు రద్దు చేస్తున్న రుణాల గురించి సుప్రీం కోర్టు కేసులో ప్రస్తావించింది. మోడీ తొలి మూడేండ్ల పాలనలో అదానీ తీసుకున్న రుణాల్లో 75వేల కోట్లను మాఫీ చేసిందని పేర్కొన్నది, లేదూ పక్కన పెట్టామంటే ఎంత వసూలు చేసిందీ చెప్పాలి కదా ! ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది, ఏమంటే అవి ఎగుమతికి పనికి వస్తాయట. కాసేపు అంగీకరిద్దాం, రైతులు పండించే వరి, గోధుమలు, చెరకు నుంచి తీసే పంచదార కూడా ఎగుమతి చేస్తున్నాం, మరి వారికి ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వటం లేదు.


దేశ సంపద పెరిగితే జనమూ ధనవంతులౌతారని నరేంద్రమోడీ చెబుతున్నారు. దానికి ఆధారాలుండాలి కదా ! సంపదల పంపిణీలో తీవ్ర అసమానలు ఉన్న దేశాల్లో మనది ఒకటి.1990 నుంచి 2020 నాటికి ధనికులుగా ఉన్న ఒకశాతం మంది వద్ద ఉన్న దేశ సంపద 10.4 నుంచి 21.7 శాతానికి పెరగ్గా, పేదల్లోని దిగువ 50శాతం మంది సంపద వాటా 22 నుంచి 14.7శాతానికి తగ్గింది. ఈ కారణంగానే కదా పేదలు ఉచితాల కోసం ఆకర్షితులౌతున్నది. స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఏది ఉచితమో, ఏది సంక్షేమమో ఏది కాదో టీకా తాత్పర్యాలు చెప్పేవరకు ఇది సాగుతూనే ఉంటుంది. చెప్పేవారెవరు ? దాని మీద ఏకాభిప్రాయం ఎలా వస్తుంది ? ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల వాటాను 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా ఆచరణలో దక్కుతున్నది 29శాతమే అని చెబుతున్నారు. మరి దీని సంగతేమిటి ? ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవటం కాదా ! ఉచితాల పేరుతో అందించే సేవలు లేక నగదు బదిలీగానీ అవి పొందిన వారి కొనుగోలు శక్తిని పెంచి దేశానికి తోడ్పడేవే తప్ప వేరు కాదు. వాటి వలన ప్రభుత్వాలకు జిఎస్‌టి లేదా మరో రూపంలో రాబడి, పారిశ్రామికవస్తువుల కొనుగోలు, తద్వారా ఉపాధి పెరుగుదలకు పరోక్షంగా తోడ్పడే వాటి మీద దాడికి దిగుతున్నారు. మరోవైపు అంతకు మించి కార్పొరేట్లకు సంపదలు దోచిపెడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌ ఓటమి ఎవరిది ! ముస్లిం విద్వేషం రెచ్చగొడితేనే బిజెపికి ఓట్లా ?

11 Sunday Dec 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Gujarat verdict 2022, Himachal verdict 2022, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో 182కు గాను 156 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 సీట్లు తెచ్చుకుంది. గతంలో కాంగ్రెస్‌ తెచ్చుకున్న 149 సీట్ల రికార్డును బిజెపి బద్దలు కొట్టింది. గత ఎన్నికలతో 49.05 శాతం తెచ్చుకున్న బిజెపికి ఈసారి 52.5 శాతం రాగా కాంగ్రెస్‌కు 41.44 నుంచి 27.28 శాతానికి తగ్గగా , ఆమ్‌ ఆద్మీ 12.92శాతం తెచ్చుకుంది. హిమచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు మూడు సీట్లు తెచ్చుకున్నారు. హౌరా హౌరీగా సాగిన పోరులో ఈ సారి బిజెపి ఓట్లు 48.8 నుంచి 43శాతానికి తగ్గగా కాంగ్రెస్‌ 41.7 నుంచి 43.9శాతానికి పెంచుకుంది. ఈ ఫలితాల గురించి వెంటనే కొన్ని సాధారణ విశ్లేషణలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో లోతైన పరిశీలనలు రావచ్చు. ఈ లోగా దేశంలో తిరిగి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో బిజెపి లేదా దాని మిత్రపక్షాల ఏలుబడిలోని త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, మే నెలలో కర్ణాటక, నవంబరులో చత్తీస్‌ఘర్‌ (కాంగ్రెస్‌), మిజోరాం(ఎంఎఎన్‌ఎఫ్‌), మధ్య ప్రదేశ్‌(బిజెపి), డిసెంబరులో తెలంగాణా(బిఆర్‌ఎస్‌), రాజస్తాన్‌(కాంగ్రెస్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి గడువు ప్రకారమే జరిగితే మూడు సార్లు అంటే దాదాపు ఏడాది మొత్తం ఎక్కడో ఒక చోట ఎన్నికల వాతావరణం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకపార్టీల నేతలు ముందుస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ రావని చెప్పలేము. జరుగుతున్న మధింపు, సర్వేలు ముగిశాక ఒక స్పష్టత రావచ్చు. కర్ణాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


కుక్క మనిషిని కరవటం సాధారణం, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అవుతుంది.నరేంద్రమోడీ నాయకత్వానికి ఎదురు లేదు, ఎవరైనా వస్తే పుట్టగతులుండవన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇందిరా గాంధీ గురించి కూడా ఇలాగే చెప్పారు. రెండు సార్లు నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసినట్లుగా భావించాలని మోడీ కోరినప్పటికీ హిమచల్‌ ప్రదేశ్‌లో ఫలితం దక్కలేదు. అందుకే గుజరాత్‌లో గెలుపు కంటే ఇక్కడ ఓటమి వార్తగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా వృద్ది చెందుతాయని గతంలో కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి అంటున్నది. కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీతో సఖ్యతతో ఉంటే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని చెప్పే ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులను చూస్తున్నాము. ” గుజరాత్‌ పర్యటనలో రు. 9.4లక్షల కోట్ల పధకాలను ప్రారంభించనున్న ప్రధాని ” అంటూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్తను 2022 సెప్టెంబరు 30న ప్రచురించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పధకాలే అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్నింటికి శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉండవచ్చు. హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా ఉన్నది బిజెపి ప్రభుత్వమే కదా అక్కడ ప్రారంభించిన పథకాల గురించి అలాంటి వార్తలు కనిపించలేదు. హిమచల్‌ ప్రదేశ్‌లో రు.3,650 కోట్ల మేర వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని అంటూ 2022 అక్టోబరు మూడవ తేదీ దక్కన్‌ క్రానికల్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. పోనీ అంతకు ముందు అక్కడ మరో రెండు రెట్ల విలువగల పథకాలను ప్రారంభించారనుకుందాం అవి గుజరాత్‌కు సాటి వచ్చేవేనా ? ఒకే పార్టీ రెండు ఇంజన్ల పాలన ఉన్నప్పటికీ గుజరాత్‌కు మరొక రాష్ట్రానికి ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా చూపరా గుజరాత్‌ పక్షపాతం అన్నట్లుగా నరేంద్రమోడీ గుజరాత్‌ ప్రధాని అని ఎవరైనా ఎద్దేవా చేస్తే , కాదు దేశానికే ప్రధాని అని బిజెపి పెద్దలు లేదా వారిని సమర్ధించేవారు ఎలానో వెల్లడించాలి.


సిఎంగా నరేంద్రమోడీ గుజరాత్‌ను ఎంతో వృద్ది చేశారని అందుకే దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ను అమలు చేస్తామని 2014లో చెప్పారు, మోడీ ప్రధాని పీఠమెక్కారు గానీ సదరు మోడల్‌ను చివరికి తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో కూడా అమలు జరపలేదు, అసలు ఇంతవరకు ఎక్కడా దాని ప్రస్తావన కూడా తేలేదు. ఇది నరేంద్రమోడీ విశ్వసనీయతను ప్రశ్నించటం లేదూ ! ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి తన పేరును శాశ్వతంగా తలచుకొనే విధంగా మోడీ నీతిఅయోగ్‌ను రంగంలోకి తెచ్చారు. అది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 దేశ ఆరోగ్యసూచికలో మొత్తం మీద పని తీరులో కేరళకు 82.2 పాయింట్లు రాగా దేశానికే నమూనా అని పేర్కొన్న గుజరాత్‌కు వచ్చింది 63.59 మాత్రమే. నరేంద్రమోడీ ఏలుబడిలో ఏమి సాధించించినట్లు ? రెండో ఇంజను తగిలించిన తరువాత కూడా కేరళ కంటే అంత వెనుకబడి ఎందుకు ఉన్నట్లు ? అక్కడే కాదు మధ్య ప్రదేశ్‌లో కూడా దశాబ్దాల తరబడి బిజెపి పాలనే కొనసాగుతున్నది దానికి వచ్చిన పాయింట్లు 36.72 , పందొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ చివరన ఉన్నాయి, గుజరాత్‌లో, ఇతర చోట్ల తమ పని తీరును చూసి జనం ఓటేశారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. వారి ముందు నవ్వటానికి జనానికి భయం అన్నది తెలిసిందే. అదే అభివృద్దని బిజెపి చెప్పినా జనం భావించినా ఎవరూ చేసేదేమీ లేదు.దారిద్య్రనిర్మూలనలో ఆర్‌బిఐ ప్రకటించిన 2013 నివేదిక ప్రకారం గుజరాత్‌ 14వ స్థానంలో ఉంది.అది నరేంద్రమోడీ పన్నెండేళ్ల పాలన తరువాత. తాజా వివరాల ప్రకారం దేశంలో సగటున 2021-22లో 21.92 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉంటే గుజరాత్‌లో 16.63 శాతం ఉన్నారు. కేరళలో 0.71శాతం మాత్రమే ఉన్నారు. రెండింజన్లు ఉండి ఏమి సాధించినట్లు ? ఇది దేశానికి ఆదర్శం(మోడల్‌) ఎలా అవుతుంది.


గుజరాత్‌లో ఘన విజయానికి కారకుడు నరేంద్రమోడీ అని బ్రహ్మరధం పడుతున్నారు.అమిత్‌ షా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. వరుసగా గెలవటమే గొప్ప అనుకుంటే గతంలో కాంగ్రెస్‌కూ అలాంటి రికార్డులున్నాయి. అక్కడ బిజెపి ఏలుబడి ప్రారంభం నుంచి చూస్తే క్రమంగా తగ్గుతూ 2017ఎన్నికల్లో 182కు 99 (మెజారిటీ 92 ) మాత్రమే బిజెపి తెచ్చుకుంది. తమ నేత ప్రధానిగా ఎదిగిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడి జనం పెద్దగా స్పందించలేదు. అంతకు ముందు మోడీ నేతగా ఉన్నపుడు వచ్చిన 115 సీట్లు 99కి తగ్గాయి. దీనికి కారకులెవరు ? అమిత్‌ షా మంత్రాంగం అప్పుడు ఎందుకు పని చేయలేదు. నరేంద్రమోడీ తరువాత 2014 నుంచి ముగ్గురు సిఎంలను అక్కడ బిజెపి మార్చింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయించి 99 నుంచి 112కు పెంచుకుంది.ఇదంతా నీతి సూత్రాలు వల్లించే నరేంద్రమోడీకి తెలియకుండా జరిగిందనుకోలేము. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరిగినా మోడీ వలనే అని చెబుతున్నారు గనుక దీనికి మినహాయింపు ఎందుకివ్వాలి ?


గుజరాత్‌లో బిజెపి ఈ సారి ముందు జాగ్రత్త పడింది. అనేక సామాజిక తరగతులను సంతుష్టీకరించింది. ముస్లిం విద్వేషాన్ని కొనసాగించింది. అనేక చోట్ల కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలనే పునరావృతం గావించింది. ఆ పార్టీ నుంచి డజన్ల కొద్దీ నేతలను తెచ్చుకొని బరిలో నిలిపింది. బలమైన పటేల్‌ సామాజిక తరగతి లేకుండా గెలవలేమని గ్రహించి జైన్‌ బనియా సామాజిక తరగతికి చెందిన విజయ రూపాని చేత అవమానకరంగా సిఎం పదవికి రాజీనామా చేయించి 2021 సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గద్దె నెక్కించారు. రూపాని నాయకత్వంలో 2017లో ఎన్నికలు జరిగినపుడు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి దూరంగా లేరు. ఆ ఎన్నికల్లో 99 రావటానికి రూపాని బలహీన నాయకత్వమే కారణమని, బలహీనమైన సిఎం అని, కరోనాను ఎదుర్కోవటంలో విఫలం చెందారని ప్రచారం చేసి రాజీనామా చేయించారు. అలాంటపుడు ఐదేండ్లు ఎందుకు కొనసాగించినట్లు? మోడీ-షా ఏం చేస్తున్నట్లు ? ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లకు కారకుడు నరేంద్రమోడీ అంటున్నారు. అంటే గెలుపు మోడీ ఖాతాకు, పరాజయం ఇతరుల ఖాతాకు వేస్తారని స్పష్టమైంది. ప్రస్తుత సిఎం భూపేందర్‌ పటేల్‌ ఎక్కువ మంది జనానికి తెలియదని రాష్ట్ర బిజెపి ప్రధాన ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ చెప్పినట్లు 2022 డిసెంబరు ఐదవ తేదీ అవుట్‌లుక్‌ పత్రిక పేర్కొన్నది. అంటే పలుకుబడి కలిగిన పటేల్‌ సామాజిక తరగతి మద్దతు కోసమే ఒక బొమ్మగా సిఎం గద్దె మీద కూర్చోపెట్టారన్నది స్పష్టం. రూపాని కాబినెట్‌లోని మంత్రులందరినీ తొలగించారు. తాజా ఎన్నికల్లో 41మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. రాష్ట్ర పార్టీ సారధినీ మార్చివేశారు. చిత్రం ఏమిటంటే మూడు దశాబ్దాల పాలన తరువాత గుజరాత్‌ ఆత్మగౌరవం అంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. ఎవరి నుంచి దాని గౌరవానికి ఎసరు వచ్చినట్లు ?


ఇక ఏకత, శీలము అంటూ కబుర్లు చెప్పే సంఘపరివార్‌కు గుజరాత్‌ పెట్టని కోట. ఆ కోటలోకి కాంగ్రెస్‌ నుంచి2007, 2012లో గోద్రాలో గెలిచిన సికె రావుల్జీ 2017 ఎన్నికల ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున అదే ఏడాది కేవలం 258 ఓట్ల తేడాతో గెలిచారు.అతగాడు 2002 గోద్రా మారణకాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న 11 మంది శిక్షా కాలం తగ్గించి వెలుపలికి రప్పించేందుకు కృషి చేసిన అపర శీలవంతుడు. 2022 ఆగస్టు 19న కోర్టు నిర్ధారించి నేరగాండ్లుగా తేల్చిన 11మంది గురించి మాట్లాడుతూ ” వారు నేరానికి పాల్పడిందీ లేనిదీ నాకు తెలియదు. వారు బ్రాహ్మలు, బ్రాహ్మలు మంచి సంస్కారవంతులని తెలిసిందే ” అని అప్పటికే ఏడు సార్లు గెలిచి ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిన ఆ పెద్దమనిషి సెలవిచ్చారు.తాజా ఎన్నికల్లో 35వేల 198 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు. గుజరాత్‌లో తిరుగులేని ప్రభావం చూపుతున్న సంఘపరివార్‌ సంస్థలు అక్కడి జనాలకు నేర్పిన ” సంస్కారానికి ” ఫలితమిది. ఇలాంటి వారిని బరిలోకి దించిన బిజెపి తప్ప గుజరాత్‌ గౌరవాన్ని మరో పార్టీ ఎలా దెబ్బతీస్తుంది ? జర్మనీలో హిట్లర్‌ యుూదుల మీద ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టినపుడు అక్కడి జనం నీరాజనాలు పలికిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు హిట్లర్‌ను నెత్తిమీద పెట్టుకున్న జర్మన్లు నేడు వాడి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా రోజులన్నీ ఒకే విధంగా ఉండవు.


హిమచల్‌ ప్రదేశ్‌లో ఓటమికి అక్కడ ఒకసారి కాంగ్రెస్‌ ఉంటే మరోసారి బిజెపి అధికారానికి రావటం రివాజుగా ఉందని దాని కొనసాగింపు తప్ప వేరేఏమీ కాదని బిజెపిని సమర్ధించే వారు కొట్టి పారవేస్తున్నారు. ఆ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఈ వుంటే అది వేరుగా ఉండేది. నరేంద్రమోడీ పరువు దక్కేది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఫలితాల తరువాత చెబుతున్నారు. దేశంలో రివాజులను మార్చటమే మోడీ గొప్పతనమని, ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని వాటిని ఐదేండ్లలో మోడీ చేసి చూపించారని నీరాజనాలు పలికారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాగే ఉన్న రివాజును మార్చివేశామని, హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా అదే జరగనున్నట్లు బిజెపి పెద్దలు చెప్పారు. పార్టీ అభ్యర్ధులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తనకు వేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కమలం ఓడి వాడింది కనుక నరేంద్రమోడీ కూడా అక్కడ ఓడినట్లా కాదా ? తిరుగుబాటు అభ్యర్ధులు బిజెపిని దెబ్బతీశారని ఒక ముక్తాయింపు. జెపి నడ్డా బిజెపి పార్టీ దేశ అధ్యక్షుడు కావచ్చుగానీ హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపిలో ఒక ముఠానేత అని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నది. లేకుంటే దానికి ఇంకా సీట్లు వచ్చేవేమో ? అయినా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి పెద్ద పీటవేస్తే బిజెపిలో అధికార రుచిమరిగిన వారు మడి కట్టుకు కూర్చుంటారా ? వారంతా రంగంలో ఉన్నప్పటికీ తమదే అధికారం అని చెప్పినవారు ఇప్పుడు అంతా వారే చేశారు అంటే కుదురుతుందా ? ఒకసారి అధికారం వస్తే వారు వీరవుతారన్నది స్పష్టం.


బిజెపి అంటే మోడీ – మోడీ అంటే బిజెపి అంటున్నారు. దేశంలో మోడీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఇడి చురుకుగా పని చేస్తుందని జనం గ్రహిస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా ఉంటే వారి మద్దతుదార్ల మీద దాడులు జరుగుతాయి, భయపెడతారు. అత్యాచారం చేసిన వారు సంస్కారవంతులని కితాబునిచ్చిన గుజరాత్‌ బిజెపి ఎంఎల్‌ఏ తిరిగి రికార్డు మెజారిటీతో గెలిచిచారంటే అక్కడి జనానికి కాషాయ దళాలు కలిగించిన అపర చైతన్యానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ సాదర్‌లో తొలిసారిగా ఒక హిందువు అసెంబ్లీకి ఎన్నికైనట్లు మరొక వార్త. వీటి గురించి మరొక విధంగా చెప్పాలంటే ఎక్కడ ముస్లిం విద్వేషాన్ని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొడితే అక్కడ బిజెపికి ఓట్ల పంట ఎక్కువగా పండుతున్నది. గుజరాత్‌లో గోద్రా మారణకాండ ఇంకా లబ్ది చేకూర్చుతూనే ఉంది. అక్కడ జనాభాలో 2011లెక్కల ప్రకారం 88.6శాతం హిందువులు, 9.7శాతం ముస్లింలు ఉన్నారు. గోద్రా మారణకాండకు ముందు 1960, 80దశకాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన పూర్వరంగం ఉంది. అదే హిమచల్‌ ప్రదేశ్‌లో ముస్లింలను బూచిగా చూపేందుకు అవకాశం లేదు.అక్కడ జనాభాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 95.17శాతం మంది హిందువులే ఉన్నారు. అక్కడ 2.18శాతం మందే ముస్లిం జనాభా ఉంది. ఈ కారణంగా అక్కడ ముస్లిం విద్వేష భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం లేనందున మోడీ-బిజెపి ఎత్తుగడలు పారలేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరును బట్టే జనం ఓట్లేశారని, ఆమేరకు బిజెపి వైఫల్యం ఓటమికి దారి తీసిందని అభిప్రాయపడుతున్నారు. హిందూమతానికి ముప్పు వచ్చిందని, లవ్‌ జీహాద్‌, ఉమ్మడి పౌరస్మృతి, వెనుకబడిన తరగతుల వంటి అంశాలు అక్కడ ఓటర్లను ఆకర్షించేవికాదు.జనాభాలో మూడోవంతు మంది ఠాకూర్లు, 25.2శాతం దళితులు(33శాతం మంది ఉన్న పంజాబ్‌ తరువాత ఇంత మంది మరొక రాష్ట్రంలో ఎక్కడా లేరు) 18శాతం బ్రాహ్మణులు,13.5శాతం వెనుకబడిన తరగతులు 5.7శాతం మంది గిరిజనులు ఉన్నారు. ఇక్కడ మరొక పార్టీ ఎదగలేదు. జనాభాలో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్నవారే ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక సమీకరణలకూ అవకాశం లేదు. పంజాబ్‌లో కూడా ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీలుగా అక్కడ ఆ సామాజిక తరగతి జనాభా లేకపోవటంతో బిజెపి ఓటు బాంకును ఏర్పరుచుకోలేకపోయిందని సూత్రీకరించిన వారున్నారు.

ఉత్తర ప్రదేశలో చేసిన మాదిరి పదమూడు శాతం ఉన్న ముస్లింలు ఉన్న కర్ణాటకలో రెచ్చగొడుతున్న వివాదాలు, తెలంగాణాల టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నది మజ్లిస్‌ అని ప్రచారం చేయటం, కేరళలో ముస్లిం మతశక్తుల గురించి చేస్తున్న ప్రచారం వంటివన్నీ ఈ సూత్రీకరణలకు ఊతం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొడితే కుదరదు, జగన్మోహన్‌ రెడి ్డ క్రైస్తవమతానికి చెందిన వారు గనుక హిందూ మతానికి ముప్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో తీవ్ర విద్వేషాన్ని రెచ్చగొట్టినా పదిహేను సంవత్సరాలు మున్సిపల్‌ పాలన సాగించిన బిజెపి తాజాగా దెబ్బతిన్నది. కేరళలో దాని ఎత్తుగడలు పారలేదు, ఉన్న ఒక్క సీటును, గతంలో తెచ్చుకున్న ఓట్లనూ అది పోగొట్టుకుంది. శబరిమల పేరుతో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టాలని చూసినా కుదరలేదు. క్రైస్తవుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది. బెంగాల్లో కొంత మేరకు ముస్లిం విద్వేషం ఫలించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అంతకు ముందు తెచ్చుకున్న ఓట్లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బిజెపికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నా దాని ముస్లిం విద్వేషం తగ్గలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌, వికాస్‌ అని చెబుతున్న ఆ పార్టీ గుజరాత్‌లో పదిశాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ముస్లిం సంతుష్టీకరణ పార్టీలని ముద్రవేస్తున్నది. స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కూడగట్టేందుకు కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలు, తరువాత మైనారిటీలను ఓటు బాంకుగా మార్చుకున్న తీరును బిజెపి బాగా ఉపయోగించుకుంది.అసలు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని సంఘపరివార్‌, తరువాత దాని రాజకీయ ముసుగులుగా ముందుకు వచ్చిన జనసంఘం, బిజెపి డిఎన్‌ఏలోనే ముస్లిం విద్వేషం ఉంది. షాబానో కేసు వంటి వాటితో మైనారిటీలను సంతుష్టీకరిస్తూనే బిజెపిని ఎదుర్కొనేందుకు బాబరీ మసీదును కూడా తెరిపించి మెజారిటీ మతస్తుల సంతుష్టీకరణకు కాంగ్రెస్‌ తెరలేపింది. రెండింటికీ చెడింది. బిజెపి గతంలో జరిగిన వాటి పేరుతో ముస్లిం విద్వేషం, మెజారిటీ హిందువుల సంతుష్టీకరణకు తెరతీసింది. కానీ ఎక్కడా దానికి మెజారిటీ హిందువుల మద్దతు ఇంతవరకు రుజువు కాలేదు. ప్రతిపక్షాల్లో చీలికల కారణంగానే అది ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నది.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అదానీ కోసం కేరళలో బిజెపితో సిపిఎం చేతులు కలిపిందా ? నిజా నిజాలేమిటి ?

07 Wednesday Dec 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adani Group, BJP, Kerala LDF, Latin Catholic archdiocese, Pinarayi Vijayan, RSS, Vizhinjam project


ఎం కోటేశ్వరరావు


నూటనలభై రోజులుగా లాటిన్‌ కాథలిక్‌ చర్చి తిరువనంతపురం పెద్దల మార్గదర్శనంలో నడిచిన విఝంజమ్‌ రేవు నిర్మాణ వ్యతిరేక కమిటీ డిసెంబరు ఆరవ తేదీన బేషరతుగా ఆందోళనను విరమించింది. ఇది తాత్కాలికమని కూడా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిఎంతో చర్చలు జరిపిన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కమిటీ అంతకు ముందు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో రేవు నిర్మాణం ఆపాలన్నదాన్ని మినహ మిగిలిన ఆరింటిని ప్రభుత్వం ఎప్పుడో అంగీకరించింది. అయినప్పటికీ తరువాత కూడా దాన్ని కొనసాగించేందుకు, శాంతి భద్రతల సమస్య సృష్టికి చూసినప్పటికీ సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, పోలీసు శాఖ ఎంతో సంయమనం పాటించిన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మంగళవారం నాడు చర్చల్లో ఆందోళన కమిటీ కొత్తగా లేవనెత్తిన ఏ డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అంతకు ముందు ఈ ఆందోళనను ఆసరా చేసుకొని ప్రభుత్వం, సిపిఎం గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు, వాస్తవాలను వక్రీకరించేందుకు చూశారు. వాటిలో ఒకటి ” అదానీ విఝంజమ్‌ రేవు నిర్మాణానికి చేతులు కలిపిన సిపిఐ(ఎం)-బిజెపి ” అంటూ పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.నవంబరు 26, 27 తేదీలలో రేవు నిర్మాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలన్న వినతిని హైకోర్టు తిరస్కరించింది. అదానీ కంపెనీ కోరినట్లుగా రేవు రక్షణకు కేంద్ర బలగాల ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిపిఎం చెప్పగా బిజెపి వ్యతిరేకించింది. తాము కూడా రేవు నిర్మాణానికి అనుకూలమే అన్న కాంగ్రెస్‌ దాన్ని అడ్డుకోచూసిన ఆందోళన కారులకు పరోక్షంగా వత్తాసు పలికింది. తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ రేవు నిర్మాణం జరగాలంటూనే ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు విలేకర్లతో చెప్పారు. వాస్తవాలను వివరించేందుకు ప్రజల వద్దకు వెళతామని సిపిఎం ప్రకటించింది. మరోవైపున మతం రంగు పులిమేందుకు, రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు విఫలయత్నం చేశాయి. రేవు నిర్మాణం ఆపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటిని చూసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టికి కుట్ర జరిగిందా అన్న అనుమానం తలెత్తింది. కేరళలో తాజా పరిణామాలు వెల్లడిస్తున్న అంశాలేమిటి?


కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర నిర్మితమౌతున్న రేవు నిర్మాణం మీద తలెత్తిన వివాదం గురించి జరుగుతున్న పరిణామాలపై వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్రచారానికి పైన పేర్కొన్న వార్తా శీర్షిక ఒక ఉదాహరణ. వాటిని పట్టుకొని అదానీని ఇతర చోట్ల వ్యతిరేకించి తమ పాలనలో ఉన్న కేరళలో కమ్యూనిస్టులు సమర్దించారంటూ కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో రెచ్చి పోయారు. రేవు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న వారు లేవనెత్తిన ఏడు డిమాండ్లలో ఆరింటిని అంగీకరించామని, నిర్మాణం ఆపాలి, వద్దు అన్న ఏడవ అంశాన్ని అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమ ఆందోళన ఒక దశకు వచ్చినందున తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళన కమిటీ కన్వీనర్‌ ఫాదర్‌ ఫెరీరా మంగళవారం సాయంత్రం ప్రకటించారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధి వర్గం సిఎంను కలిసింది.విఝంజమ్‌ రేవు వద్ద జరిగిన ఉదంతాలపై న్యాయవిచారణ జరిపించాలని, సముద్ర పోటుకు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేంత వరకు నెలకు ఎనిమిది వేలు అద్దెగా చెల్లించాలని, దీనిలో రేవు కంపెనీ అదాని కంపెనీ సొమ్ము ఉండకూడదని, ఈ ప్రాంతంలో సముద్రతీర కోతపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసే కమిటీలో స్థానిక ప్రతినిధి ఒకరు ఉండాలని ఆందోళనకారులు ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. దేన్నీ ప్రభుత్వం అంగీకరించలేదు. అద్దెగా చెల్లించాలన్న ఎనిమిది వేలలో ప్రభుత్వం ఐదున్నరవేలు, అదానీ రేవు కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మరో రెండున్నరవేలు చెల్లించేందుకు చూస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను చర్చి పెద్దలు తిరస్కరించారు. తాము అదానీ కంపెనీ డబ్బు తీసుకోబోమని, ఐదున్నరవేలకే పరిమితం అవుతామని చెప్పారు. చర్చి అధికారులు, ఇతరులపై మోపిన తీవ్రమైన కేసుల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


విఝంజమ్‌ రేవును మూడు దశల్లో నిర్మించాలన్నది పథకం.2019 డిసెంబరు నాటికి తొలి దశ పూర్తి కావాలనుకున్నది జరగలేదు, తరువాత 2020 ఆగస్టుకు పొడిగించారు, కరోనా, భూసేకరణ పూర్తిగానందున అది కూడా జరగలేదు. 2023 సెప్టెంబరు నాటికి పూర్తి చేసేందుకు జరుగుతున్న పనులను రేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారికి స్థానిక చర్చి నేతలు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రయాణీకులు, కంటెయినర్‌, ఇతర సరకు రవాణా ఓడలను నడిపేందుకు కేరళ ప్రభుత్వం విఝంజమ్‌ ఇంటర్నేషనల్‌ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌(విఐఎస్‌ఎల్‌) పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ రేవు అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ఓడల రవాణా మార్గానికి చాలా దగ్గరగా ఉన్నందున ఇతర దేశాల నుంచి వచ్చే వాటిని కూడా ఆకర్షించి ఇతర రేవుల నుంచి వచ్చే సరకుల ఎగుమతి-దిగుమతి ఓడల అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. కొలంబో, సింగపూర్‌, దుబాయి రేవులకు వెళ్లే కొన్ని ఓడలు ఇటు మరలుతాయి. దీని నిర్మాణం గురించి పాతిక సంవత్సరాలుగా చర్చ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో చేపట్టేందుకు గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఫలించలేదు. తొలుత ఒక చైనా కంపెనీకి టెండరు దక్కినా కేంద్రం నుంచి దానికి భద్రతా పరమైన అనుమతి రానందున రద్దైంది. తరువాత లాంకో గ్రూపుకు ఇవ్వటాన్ని జూమ్‌ డెవలపర్స్‌ అనే సంస్థ కోర్టులో సవాలు చేసింది. దాంతో అదీ జరగలేదు. మూడవసారి 2014లో పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ ఒక్కటే వచ్చింది, దాంతో 2015లో నాటి యుడిఎఫ్‌ (కాంగ్రెస్‌కూటమి) ప్రభుత్వం అదానీ కంపెనీకే ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి సిఎం ఊమెన్‌ చాందీ శంకుస్థాపన కూడా చేశారు. దీని ప్రకారం వెయ్యి రోజుల్లో రేవు నిర్మాణం పూర్తి కావాలి. రు.7,525 కోట్ల ఈ పథకానికి నిరసనగా 2022 ఆగస్టు 16 నుంచి స్థానిక మత్స్యకారులు ఆందోళనకు పూనుకున్నారు. దానికి చర్చి పెద్దలు నాయకత్వం వహించారు. ప్రతి ఆదివారం చర్చి ప్రార్ధనల్లో ఆదేశాలు జారీ చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు కూడా రేవును వ్యతిరేకిస్తున్నారు.దీని వలన తీర ప్రాంతం మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వారి వాదన. సముద్ర తీరం కోతకు గురవుతుందని, తమ జీవనాధారం దెబ్బతింటుందని చేపలు పట్టేవారు అంటున్నారు. అలాంటిదేమీ ఉండదని పరిశీలన జరిపిన కమిటీ చెప్పింది. ఆందోళన ప్రారంభం నాటికి సగం రేవు పనులు పూర్తైనందున ఆపే అవకాశం లేదని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. గతంలో చర్చలకు వచ్చిన ప్రతినిధులు సమావేశాల్లో సంతృప్తిని ప్రకటించి వెలుపలికి వచ్చిన తరువాత ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోసారి చర్చలకు రావాలంటే ముందుగా నిర్మాణ పనులు ఆపాలనే షరతు విధిస్తున్నారు.ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. వారు లేవనెత్తిన మిగిలిన ఆరు డిమాండ్లను అమలు జరిపేందుకు, పరిశీలించేందుకు అంగీకరించింది.


ఆగస్టు నుంచి నిరసన తెలుపుతున్నవారు ఆందోళనకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఉన్నవారిని, ఇతరులను రేవు పనులను అడ్డుకుంటున్నందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయాలనే నెపంతో నవంబరు 26 రాత్రి 27వ తేదీన తీవ్ర హింసాకాండకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేశారు, పరిసరాల్లో ఉన్న ఇండ్లపై రాళ్లు వేశారు. రెండు వాహనాలను దగ్దం చేసి అనేక మంది పోలీసులను గాయపరిచారు. వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లటాన్ని కూడా అడ్డుకున్నారు. రోడ్లను ఆక్రమించారు. రేవు నిర్మాణంలో తమకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ దళాలను రప్పించాలని అదానీ గ్రూపు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు కేంద్ర దళాల అవసరం లేదని, కావాలని అదానీ కంపెనీ కోరింది తప్ప తాము కాదని రాష్ట్ర రేవుల శాఖ మంత్రి అహమ్మద్‌ దేవరకోవిల్‌ స్పష్టం చేశారు. కేంద్రం పంపితే తమకేమీ అభ్యంతరం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.


ఈ రేవు నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్దతికి మారుగా కౌలు పద్దతిని పాటించాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ కోరింది. పిపిపి పద్దతిలో రు.7,525 కోట్లకు గాను అదానీ రు.2,454 కోట్లు మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదాన్ని తరువాత వచ్చిన ప్రభుత్వం తిరగదోడితే నిర్మాణ హక్కు పొందిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువలన తాను వ్యతిరేకించినప్పటికీ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలుకు కట్టుబడి ఉంది.ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి, తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి వేరే విధంగా మాట్లాడటం వెనుక ఓట్ల రాజకీయం ఉంది. లాటిన్‌ కాథలిక్‌ మతపెద్దలు గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినందున ఆ పార్టీ లబ్ది పొందింది. 2021 ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చినా దక్షిణ, మధ్య కేరళలోని చర్చి ప్రభావితం చేసే 34 చోట్ల నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. రేవు ప్రాంతంలోని రెండు సీట్లను కూడా ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరిగి చర్చి మద్దతు పొందేందుకు రేవు ఆందోళనను ఆసరాగా చేసుకోవాలని కాంగ్రెస్‌ చూసింది, సకాలంలో నిర్మించలేదని, చర్చి డిమాండ్లను పరిశీలించలేదని ఆరోపించింది.


రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటూ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అడ్డుగా నిలిచారు. దాంతో పనులను కొనసాగనివ్వాలని నవంబరు చివరి వారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆందోళనకారులు ఉల్లంఘించి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. ఒక వైపు క్రైస్తవ మత పెద్దలు పల్లెకారులను రెచ్చగొట్టి ఆందోళనకు పురికొల్పుతుంటే మరోవైపు దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి మద్దతు ఉన్నశక్తులు రేవుకు మద్దతు పేరుతో హిందూ ఐక్యవేదిక వంటి సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు కాషాయ జండాలతో మరోవైపున టెంట్లు వేసి రెచ్చగొట్టేందుకు, మత రంగు పులిమేందుకు చూశారు.ఈ అంశంలో రెచ్చగొట్టేందుకు క్రైస్తవ మత పెద్దలు కూడా తక్కువ తినలేదు.రేవు నిర్మాణ వ్యతిరేక ఆందోళన కారుల సంస్థ నే తలలో ఒకరైన ఫాదర్‌ థియోడోసియస్‌ డి క్రజ్‌ జనాన్ని రెచ్చగొడుతూ మత్స్యశాఖ మంత్రి అబ్దుర్‌రహిమాన్‌ పేరులోనే ఒక ఉగ్రవాది దాగి ఉన్నాడని నోరుపారవేసుకున్నారు. ఎల్‌డిఎఫ్‌కు చెందిన వివిధ సంస్థలు, ఇతరుల నుంచి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు రావటం, హింసాకాండను ప్రోత్సహించినందుకు చివరికి మద్దతు ఇస్తున్న వారిలో, సాధారణ జనంలో సానుభూతి కనుమరుగు కావటం, పోలీసులు వివిధ కేసులను పెట్టిన పూర్వరంగంలో సదరు ఫాదర్‌ నోరు జారి మాట్లాడానని క్షమించాలని కోరారు.


కొన్ని స్వార్దపరశక్తులు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, కొందరు ప్రతిఘటించి బెదరించినంత మాత్రాన విశాల ప్రయోజనాలకోసం ఉద్దేశించిన దానిని నిలిపివేసే ప్రసక్తి లేదని సిఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.అదే జరిగితే రాష్ట్రం విశ్వసనీయత కోల్పోతుందని అన్నారు.విఝింజమ్‌ రేవు పరిరక్షణ సమితి పేరుతో ఉన్న వారు ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగిన ప్రదర్శనలలో పార్టీలతో నిమిత్తం లేకుండా రేవు నిర్మాణం జరగాలని కోరుకోనే వారందరూ పాల్గొన్నారు. అది ఒక పార్టీకి చెందిన వేదిక కాదు. దానిలో సిపిఎం, బిజెపి ఇతర సంస్థల స్థానిక నేతలు పాల్గొన్నారు. దాన్నే రెండు పార్టీలు చేతులు కలిపినట్లుగా కొందరు చిత్రించారు. కేంద్ర దళాలను పంపాలని అదానీ కంపెనీ కేరళ హైకోర్టును కోరింది, ఇప్పటికే కొన్ని సంస్థలను కేంద్ర దళాల పరిధిలో ఉన్నందున మరొకదానికోసం పంపితే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీని మీద వైఖరిని తెలపాలని కేంద్రాన్ని కోర్టు కోర్టు కోరింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.


కేంద్ర దళాలు వస్తే తమకు అభ్యంతరం లేదని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలపటం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉన్నందున కేంద్ర పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర బిజెపి నేతలు నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. ఒక వేళ కేంద్ర దళాలు వచ్చినపుడు ఏదైనా అవాంఛనీయ ఉదంతం జరిగితే ఒక్క లాటిన్‌ కాథలిక్‌ చర్చ్‌కు చెందిన వారే కాదు మొత్తం క్రైస్తవులు పార్టీకి మరింత దూరం అవుతారని బిజెపి భావిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ” కొంత కాలంగా వివిధ క్రైస్తవ సమూహాలకు చేరువ కావాలని బిజెపి, సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది. వీరిలో ఒక తరగతి మద్దతైనా లేకుండా రాష్ట్రంలో ఎన్నికలలో నిలబడలేమని బిజెపికి తెలుసు. ఇటీవలి కాలంలో వివిధ చర్చ్‌ల అధికారులతో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వం, ప్రధాని నరేంద్రమోడీ కూడా పలుసార్లు మీటింగ్‌లు జరిపారు.ఈ వెలుగులో హైకోర్టుకు ఎల్‌డిఎఫ్‌ వెల్లడించిన వైఖరి వెనుక రాజకీయం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌,రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌తో కేంద్ర మంత్రి మురళీధరన్‌తో కలసి రాష్ట్ర నేతలు దీన్ని గురించి చర్చించనున్నారు. విఝుంజమ్‌లో కేంద్ర దళాల గురించి విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మురళీధరన్‌ ఆరోపించారు. రేవు వద్ద ఏదైనా జరిగితే దానికి బాధ్యత బిజెపిదే అని, కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకమని చిత్రించేందుకు ఎల్‌డిఎఫ్‌ చూస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్‌ చెప్పారు.సిపిఎం, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో ఉంది అది కుదరదు ” అన్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది.


ఇక్కడే బిజెపి దుష్ట ఆలోచన వెల్లడైంది. ఏదైనా జరుగుతుందని ముందే ఆ పార్టీ కోకిల ఎందుకు కూస్తున్నట్లు ? రేవు వద్ద ఒక పథకం ప్రకారం జరిపిన హింసాకాండ వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడ తెలుసుగనుకనే పోలీసులు ఎంతో నిబ్బరంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అందోళన చేస్తున్న వారు తిరిగి విధ్వంసకాండకు పాల్పడతారని బిజెపికి ముందే తెలుసా ? అందుకే కేంద్ర దళాలు వద్దని చెప్పిందా అన్న అనుమానాలు కలగటం సహజం. గతంలో శబరిమల పేరుతో హింసాకాండను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు చూసిన సంగతి తెలిసిందే.


తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిధరూర్‌ డిసెంబరు ఐదున క్రైస్తవమత పెద్దలను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ రేవు నిర్మాణం ఆపాలనటాన్ని తాను సమర్ధించటలేదంటూ, నిలిపివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వారికి మాత్రం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి ఆర్చిబిషప్‌ మార్‌ జార్జి ఆలెన్‌ చెరీ విలేకర్లతో మాట్లాడుతూ రేవు అంశాన్ని కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. శశి ధరూర్‌తో జరిపిన సమావేశంలో ఏదో ఒక అంశం గురించి మాత్రమే గాక అనేక అంశాలను చర్చించినట్లు చెప్పారు. సిరో-మలంకర కాథలిక్‌ చర్చి కార్డినల్‌ బేసిలోస్‌ క్లీమిస్‌తో ప్రతి రోజూ చర్చిస్తున్నట్లు శశిధరూర్‌ చెప్పారు. రేవు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారు గతంలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐఏ అందించిన సొమ్ముతో అన్ని రకాల మతశక్తులు, కాంగ్రెస్‌ కలసి విముక్తి సమరం సాగించినట్లుగా మరోసారి చేస్తామని కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. కొన్ని శక్తుల కుట్రల గురించి తెలుసుగనుకనే గత నాలుగున్నర నెలలుగా ఎంతగా రెచ్చగొడుతున్నా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహనంతో ఉంది. చివరికి ఆందోళన కారులే దాడికి దిగారు. అది వికటించటంతో బేషరతుగా వెనక్కు తగ్గారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీపై గుజరాత్‌ మారణకాండ మచ్చ : వీసా నిరాకరణపై మరోసారి గుర్తు చేసిన అమెరికా !

21 Monday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, AB Vajpayee, BJP, Immunity, Joe Biden, journalist Jamal Khashoggi, Narendra Modi Failures, RSS, Saudi Crown Prince Mohammed bin Salman


ఎం కోటేశ్వరరావు


పెళ్లికొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్‌ అవసరం లేని అంశాన్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్రమోడీ మీద ఉన్న గుజరాత్‌ మారణకాండ మచ్చను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని గతంలో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్న అభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది. ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణల నుంచి ప్రభుత్వ పరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది.


అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, జింబాబ్వే నేత రాబర్ట్‌ ముగాబే, కాంగోనేత కబిల, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారని విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత పటేల్‌ పేర్కొన్నాడు. వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్య వంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికి పోవటం లేదు.ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్యలో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది . దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్‌ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్‌ సౌదీ రక్షణ, గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పధకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరును చూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్నదానికి ఎంబిఎస్‌ ఆమోదం వుందని పేర్కొన్నారు.
.
ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగశాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ” అంటరాని ” వాని జోబైడెన్‌ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు.వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్‌ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు. సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపై చర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు.ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్‌ చెప్పాడు.


చట్టబద్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్‌ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రి లోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది. దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్రమోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపు వర్తింప చేశామని వేదాంత పటేల్‌ చెప్పాడు. హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్‌ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలు చేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్రమోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్‌ మోడీ అధికారిక పర్యటనతో పాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది.తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్‌, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్‌ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హౌదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్‌ కోర్టు నరేంద్రమోడీకి సమన్లు జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో నరేంద్రమోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్‌ కోర్టుకు తెలిపింది.2015 జనవరిలో న్యూయార్క్‌ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.

సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్దంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్దతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్రమోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్చ అమెరికన్‌ కమిషన్‌ సంస్థ(యు ఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ” ముఖ్యనేతలందరి ” మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్‌ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్రమోడీ, అమిత్‌ షాల గురించే అన్నది స్పష్టం.


జర్నలిస్టు ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ రాజు సల్మాన్‌ హస్తం ఉందని గతంలో చెప్పిన అమెరికా నాలుక మడిచి ఇప్పుడు ఏజంట్ల పాత్ర గురించి చెబుతోంది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పాయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.దీన్ని 2013లో నరేంద్రమోడీ తిరస్కరించటమే గాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పాయి చెప్పారని అన్నారు. ” ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని ” అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్రమోడీ 2014లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్‌ మారణకాండలో సంఘపరివార్‌ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా ? గుజరాత్‌ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

2002 నాటి ఉదంతాలకు నరేంద్రమోడీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని 2012లో సుప్రీం కోర్టు చెప్పింది. తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్‌, సంఘపరివార్‌ సంస్థల తీరు తెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్‌ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్‌ రెండున గార్డియన్‌ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు. వేదాంత పటేల్‌ స్పందనలో నరేంద్రమోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యధాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోడీ తనను కాశ్మీరు వివాదంలో పెద్దమనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు . స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా ? అనుమానం ఎందుకు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పట్టణ జనాలపై ప్రైవేటు భారాల బండ – భారత్‌కు ప్రపంచ బాంకు సిఫార్సు !

18 Friday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Financing India’s Urban Infrastructure Needs, Narendra Modi, Urban infrastructure, World Bank

ఎం కోటేశ్వరరావు


రానున్న పదిహేను సంవత్సరాలలో (2021-2036) మన దేశంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 840 బిలియన్‌ డాలర్లు ( 2020 ధరల ప్రకారం (రూపాయి విలువ 73 చొప్పున ) లేదా రు. 61.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచబాంకు అధ్యయనం సిఫార్సు చేసింది. ఇది జిడిపిలో 1.18శాతానికి సమానం. గత దశాబ్దిలో జిడిపిలో 0.6 శాతం ఖర్చు చేశారు. నవంబరు 14న ఈ నివేదికతో పాటు ఒక ప్రకటనను ప్రపంచబాంకు విడుదల చేసింది.ప్రపంచబాంకు వివిధ దేశాల మీద నివేదికలను రూపొందించేందుకు కొందరిని ఎంపిక చేస్తుంది. వాటిని తనవిగా చెప్పుకోదు. దీనికి కూడా అదే చెప్పింది. దేశాలు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చినపుడు సూచనల పేరుతో వాటిని రుద్దుతుంది. ప్రభుత్వాలు వాటిని తమ విధానాలుగా ముద్రవేసి అమలు చేస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సిఎంగా ఉండగా జరిగింది అదే. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఏమి చేస్తాయో చూడాల్సి ఉంది. పారిశ్రామిక పెట్టుబడుల నుంచి పూర్తిగానూ, సేవా రంగాల నుంచి పాక్షికంగా గత మూడు దశాబ్దాలుగా తప్పుకుంటున్న ప్రభుత్వాలు ప్రయివేటు పెట్టుబడుల మీదే ఆధారపడి అందుకు అనువుగా విధానాలను రూపొందిస్తున్నాయి.


ఈ నివేదికను కూడా అదే విధంగా రుద్దే అవకాశం ఉంది. ప్రపంచబాంకులోని ధనిక దేశాల్లో ఉండే పెట్టుబడి సంస్థలకు మార్కెట్‌ అవసరం, అందునా మన దేశం పెద్దదిగా ఉండటం, సంస్కరణలను వేగంగా అమలు జరుపుతానని ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి చెప్పటం, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా ( లాభాలు వస్తున్న విశాఖ ఉక్కును అమ్మేస్తామని పదే పదే చెప్పటం అందుకు చక్కటి ఉదాహరణ) కొన్ని రంగాల్లో అమలు జరుపుతున్న పూర్వరంగంలో ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని పట్టణ స్థానిక సంస్థల తీరు తెన్నుల గురించి నివేదికలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.


2021లో 47 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు, మొత్తం జనాభాలో 40శాతానికి పెరుగుతుంది.840 బిలియన్‌ డాలర్ల అంచనాలో నీటి సరఫరా, వర్షపు నీరు, మురుగునీటి పారుదల, చెత్తయాజమాన్యం, రోడ్లు, వీధి దీపాలకు గాను 450 బి.డాలర్లు, రవాణా సదుపాయాలకు 300 బి.డాలర్లు అవసరమౌతాయని అంచనా.గతంలో కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి 2032 వరకు ఇరవై సంవత్సరాల్లో మౌలిక వసతులు, సేవల కల్పనకు 560 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి అవసరమని అంచనా వేసింది. మెకెన్సీ నివేదిక ప్రకారం 2000-14 సంవత్సరాలలో చైనా జిడిపిలో 2.8శాతం చేసింది. ఒక అంచనా ప్రకారం 2010లో తలసరి 116 డాలర్లు ఖర్చు చేసింది. చైనా మాదిరి పట్టణీకరణకు ఇతర దేశాల్లో జిడిపిలో నాలుగుశాతం ఖర్చు పెట్టాలని ప్రపంచబాంకు చెప్పింది. గత దశాబ్దిలో సగటున ఏటా 10.6బి.డాలర్లు మాత్రమే భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.


స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ట్రం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల కారణంగా మౌలిక సదుపాయాల మీద చేస్తున్న ఖర్చు నానాటికీ తగ్గుతున్నది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు నిధుల బదలాయింపు పెరిగినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల మొత్తం రాబడి 2011-18లో జిడిపిలో ఒక శాతం లోపుగానే ఉంది. స్వంత వనరుల రాబడి తక్కువగా, నానాటికీ తగ్గుతున్నది, దానికి సేవలకు వసూలు చేస్తున్న మొత్తాలు తక్కువ. స్వంత వనరుల రాబడి (ఓఎస్‌ఆర్‌)లో ఇంటి పన్ను అతి పెద్ద భాగమైనా తోటి దేశాలతో చూస్తే చాలా తక్కువ, ఈ మొత్తం జిడిపిలో 0.15శాతం కాగా మధ్య తరహా ఆదాయ దేశాల్లో 0.3 నుంచి 0.6 శాతం వరకు ఉంది. ఓయిసిడి దేశాల్లో 1.1 శాతం, అమెరికా, కెనడా, బ్రిటన్లో 2-3శాతం వరకు ఉంది. అనేక దేశాల్లో ఇతర పన్నుల కంటే ఆస్థిపన్ను వేగంగా పెరుగుతోంది. నిర్వహణ ఖర్చుల కంటే కూడా సేవా రుసుములు తక్కువగా ఉండటానికి విధాన పరమైన నిర్ణయాలే కారణం. కొన్ని పెద్ద పట్టణాలతో సహా నీరు, మురుగునీటి పారుదల రుసుము వసూలు ఖర్చులో సగం కూడా లేదు. ఇటీవలి సంవత్సరాలలో మూడింట రెండువంతులు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీస్‌,అమృత్‌ పథకాల కింద ఆమోదించిన మొత్తాలలో కేవలం ఐదో వంతు మాత్రమే గడచిన ఆరు సంవత్సరాల్లో ఖర్చు చేశారు.


విధానపరమైన, రాజకీయ ఆర్ధిక విధాన నిర్ణయాలు రాబడి స్థాయిలను ఆచరణను ప్రభావితం చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులకు ఇవి ఆటంకంగా ఉన్నాయి. భారీ పెట్టుబడులను ఇముడ్చుకోగల స్థితి లేదు. అవసరమైన పెట్టుబడులకు ప్రోత్సాహకాలతో పాటు తిరిగి చెల్లించే విధంగా పన్నులు, వినియోగ చార్జీలను పెంచాల్సి ఉంది.వీటన్నింటికీ ద్రవ్య, సంస్థాపరమైన ప్రాధమికంగా ఆటంకంగా ఉన్నాయి. వీటిని తొలగించటానికి వ్యవస్థాగతమైన సంస్కరణలు తేవాలి. అది ఎంతో కష్టం ఎందుకంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి.భారత పూర్వపరాలను చూసినపుడు ఇది పెద్ద సవాలుగా ఉంటుందని రుజువైంది. కొన్ని నగరాల్లోనైనా స్వల్ప, మధ్యకాల ప్రైవేటు వాణిజ్య పెట్టుబడులకు అవకాశం కల్పించేందుకు పూనుకోవాలి.భారత్‌లో పట్టణాల మౌలిక సదుపాయాలకుఅవసరమైన పెట్టుబడుల్లో కేవలం ఐదుశాతమే ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతున్నాయి. గుజరాత్‌లో కేవలం ఒకశాతమే ఉండగా తమిళనాడులో 12శాతం ఉన్నాయి.ఇవి కూడా ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్నవే. పదిహేనవ ఆర్థిక సంఘ సిఫార్సుల మేరకు 2025 నాటికి జిడిపిలో 0.32శాతం షరతులు లేని మొత్తాలను పట్టణ సంస్థలకు ఇవ్వాలి. చక్కగా రూపొందించిన షరతులతో కూడిన మొత్తాలతో కూడా ఫలితాలను మెరుగుపరచవచ్చు. కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో మరింత స్థిరమైన,సూత్రాలతో కూడిన, షరతులు లేని నిధుల బదలాయింపు పద్దతిని పాటించాలి. ప్రస్తుతం సగం నిధులు షరతులతో కూడిన నిధుల బదలాయింపు జరుగుతోంది. పట్టణాల్లో ద్రవ్య పునాది విస్తరణ, రుణయోగ్యత పెంపుదలకు రాబడి ఆటంకాలను తొలగించాలి. ప్రస్తుతం తక్కువగా ఉన్న ఆస్థిపన్ను, వినియోగ, సేవా రుసుములను గణనీయంగా పెంచాలి. గణనీయంగా వాణిజ్య రుణాలు తీసుకొనే విధంగా స్వంత వనరులు ప్రతి ఐదు సంవత్సరాలకు రెట్టింపు పెరిగే విధంగా పెంపుదల ఉండాలి.


పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రపంచ నివేదికలో పేర్కొన్నవే.ఈ సిఫార్సుల సారం ఒక్కటే .పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులను వాణిజ్య సంస్థల నుంచి తీసుకోవాలి. వాటిని తీర్చేందుకు వీలుగా పట్టణ స్థానిక సంస్థలకు రాబడి వనరుల పెంపుదల, అందుకోసం జనం నుంచి వసూలు చేసేందుకు అవసరమైన సంస్కరణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ నివేదికను తు.చ తప్పక అమలు జరిపితే ఎన్నో రెట్ల భారం పౌరుల మీద పడుతుంది.రాజును చూసిన కళ్లతో అన్నట్లుగా ధనిక దేశాలను చూసి అక్కడి మాదిరి మనదేశంలో కూడా అమలు జరపాలని ప్రపంచబాంకు బృందం చెప్పింది. అక్కడి మాదిరి మన దేశంలో కూడా జనాలకు రాబడి ఉంటే ఇప్పటికంటే ఎక్కువ మొత్తాలను సేవలకు చెల్లించేందుకు ఇబ్బంది ఉండదు. తమ ఇండ్ల మీద హెలికాప్టర్లు దిగేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్న అపర కుబేరులొకవైపు ఉంటే వారి పక్కనే ఉండే మురికి వాడల్లో ఎండకూ వానకు రక్షణకు ప్లాస్టిక్‌ షీట్లను అమర్చుకొనే పేదరికం మరొకవైపు కనిపిస్తున్నది. మన దేశంలోని పట్టణాల్లో ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.


అనేక దేశాల్లో ధనికుల మీద మనకంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు. మన దేశంలో వారికి అనేక రాయితీలు ఇస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల్లో ఇంటి పన్ను పెంచారు. ఎవరి చెత్తను వారు తొలగించేందుకు చెత్తపన్ను విధించారు. అదెక్కడా పన్ను రూపంలో కనిపించదు, చెత్తసేకరణకు వచ్చే వారికి ఇచ్చే మొత్తాలుగా ఉంటాయి. త్వరలో గ్రామాలకూ దీన్ని వర్తింప చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న కారణంగా మౌలిక సదుపాయాలపై వత్తిడి, కొరత ఏర్పడుతున్నది. వాటిని ఉపేక్షిస్తే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ నివేదికలో 2021 నుంచి అమలు జరపాలని చెప్పటాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి ముందే అందచేసి ఉండాలి. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచాయి.2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పట్టణ జనాభా మీద విపరీత భారాలను మోపి ఓట్లడిగే సాహసానికి పూనుకోదన్నది స్పష్టం. అందువలన ఎన్నికల తరువాత వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైనా భారాల బండను జనం మీద మోపటం ఖాయమని చెప్పవచ్చు. 2020 సంవత్సర ధరల ఆధారంగా ఖర్చు అంచనా వేశారు, రూపాయి విలువ 73 నుంచి 82కు పతనం కావటం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే 840 బి.డాలర్లు లేదా రు.61లక్షల కోట్ల అంచనా ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవినీతి నిరోధంపై సుభాషితాలు,సుద్దులు : ప్రధాని మోడీ ఆచరణ చూస్తే విస్తుపోతారు !

13 Sunday Nov 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Anna Hazare, BJP, Central Vigilance Commission, Lokayukta, Lokpal India, Narendra Modi, Narendra Modi Failures, Vigilance Awareness Week, War on Corruption


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అందరూ శాకాహారులే రొయ్యలబుట్ట మాయం అన్నట్లుగా దేశంలో అందరూ సత్యహరిశ్చంద్రుల వారసులం, అవినీతి అంటే అదేమిటో తెలియని వారం అన్నట్లుగా ఉంటారు. అయినా అవినీతి గురించి మాట్లాడని రోజు లేదు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఒక నిపుణుల కమిటీని వేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే బిజెపి నేతలు మరొక వైపు దేశంలో అవినీతి లేదు అక్రమాలు లేవంటూ రోజూ ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. స్వచ్చత సూచికలను ప్రకటిస్తున్న మాదిరి నెల లేదా మూడు నెలలకు ఒకసారి అవినీతి అధికారుల మీద ఉన్న కేసుల ఆధారంగా వివిధ శాఖలకు కూడా సూచికలను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతారు. ఆచరణ చూస్తే విస్తుపోతారు. అవినీతి గురించి 2014 తరువాత చెప్పిన వాటిని అమలు చేయకుంటే బిజెపికి వ్యతిరేకంగా తమ బృందం ఆందోళనకు దిగుతుందని అన్నాహజారే కార్యదర్శి కల్పనా ఇనాందార్‌ ప్రకటించారు. కొంత మంది నమ్ముతున్నట్లుగా ఆ జగన్నాటక సూత్రధారి ఎవరిని ఎలా ఆడిస్తున్నాడో, ఎందుకు అలా ఆడిస్తున్నాడో అర్ధం కావటం లేదు.


అవినీతి సూచికలో మన దేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాలు అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలు, అవగాహన ఏమిటో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిపుణులతో కమిటీలు వేసేవిధంగా, దేశ అవినీతి సూచిక మెరుగుపడే విధంగా అవగాహనకు సూచనలు చేసే విధంగా లా కమిషన్ను ఆదేశించాలని అశ్వినీ ఉపాధ్యాయ పిటీషన్‌ దాఖలు చేశారు. సంబంధిత అంశాలపై పని చేస్తున్న వారిని సంప్రదించాలని, మన దగ్గర ఇప్పటికే ప్రత్యేక చట్టాలున్నాయని, అవినీతి నిరోధానికి చర్యల గురించి లా కమిషన్ను అడుగుతామంటూ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. నరేంద్రమోడీకి అధికారాన్ని కట్టబెట్టంలో కాంగ్రెస్‌ నేతల అవినీతి, అక్రమాలు ప్రధాన పాత్ర పోషించిన అంశం తెలిసిందే.ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ (టిఐ) ప్రకటించిన అవినీతి సూచికలో 2012, 13 సంవత్సరాల్లో మన దేశం 94వ స్థానంలో 2014లో 85, 2015లో 76కు ఎదిగింది. తరువాత క్రమంగా దిగజారుతూ 2020లో 86, 2021లో 85లో ఉంది.2022 సూచికను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. అవినీతి అంతం గురించి చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో తిరిగి అది కోరలు చాస్తోందన్నది స్పష్టం. టిఐ సూచికలు సరైనవా కాదా అన్న చర్చకు వస్తే కాంగ్రెస్‌ పాలనలో-బిజెపి ఏలుబడిలో సూచికలను ఇచ్చింది కూడా అదే సంస్థ కనుక మోడీ పాలన గురించి ఇచ్చింది తప్పైతే కాంగ్రెస్‌ పాలన గురించి చెప్పింది కూడా తప్పే అవుతుంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది కనుకనే అసలు దాని గురించి చర్చకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వచ్చినా మా మోడీ మీద ఇంతవరకు ఒక్క ఆరోపణలేదుగా అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ మాటకొస్తే మన్మోహన్‌ సింగ్‌ మీద కూడా ఏమీ లేవు.


ఇటీవల నిఘా చైతన్య వారోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు పలికారు. అధికారుల మీద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను బట్టి వివిధ శాఖలకు సూచికలు ఇవ్వాలని సూచించారు. ఆ నిర్ణయం చేసి ఆ సభలో పాల్గొని ఉంటే విశ్వసనీయత ఉండేది.ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర నిఘా సంస్థలో ఫిర్యాదుల యాజమాన్య వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. అవినీతి నిరోధక సంస్థలలో పని చేస్తున్నవారి మీద బురద చల్లేందుకు, పని చేయనివ్వకుండా చూసేందుకు స్వప్రయోజనపరులు చూస్తారని,ఆ క్రమంలోనే తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, కానీ జనం దేవుళ్లు వారికి నిజం తెలుసు, తరుణం వచ్చినపుడు వారు నిజానికి మద్దతుగా నిలుస్తారు అన్నారు. కేంద్ర నిఘా సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిపై వచ్చిన 1,09,214 ఫిర్యాదుల్లో ప్రధాని తరువాత స్థానంలో ఉన్న అమిత్‌ షా నిర్వహిస్తున్న హౌంశాఖ మీద వచ్చినవి 37,670, తరువాత 11,003తో రైల్వే, 6,330తో బాంకులు ఉన్నాయి. 2013లో సివిసికి 35,332 వచ్చాయి. ఆ తరువాత నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. దీని భావమేమి తిరుమలేశా ! మోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికారుల్లో అవినీతి పెరిగినట్లా తగ్గినట్లా !!


కేసుల గురించి సూచికలు ఇమ్మని ప్రధాని చెప్పారు సరే, తన ఏలుబడిలోని ప్రభుత్వ శాఖలు ఎలా పనిచేస్తున్నట్లు ? కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషిఏటివ్‌ సంస్థ ఒక సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని వెల్లడించింది. దాని ప్రకారం 2013 ఏప్రిల్‌ నుంచి 2017 ఫిబ్రవరి వరకు డిజిఎఫ్‌టి కార్యాలయాలకు అందిన 181 అవినీతి ఫిర్యాదులపై ఒక్కదాని మీద కూడా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని, 2009లో వచ్చిన వాటిలో ఒక కేసులో ఒక అధికారిపై విధించిన పెనాల్టి వివరాలను కూడా సమాచార హక్కు కింద ఇవ్వలేదని తేలింది.దరఖాస్తులకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. కర్ణాటక లోకాయక్త సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మరింత దారుణంగా ఉంది. అవినీతి కేసులు,తాను దర్యాప్తు చేసిన వాటి వివరాలను గణాంకాలను నిర్వహించాల్సిన బాధ్యత తమకు లేదని, 2006లో కేంద్ర సమాచార కమిషన్‌ జారీ చేసిన ఉత్తరువు ప్రకారం పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప సమాచారం ఇవ్వనవసరం లేదని, సమాచారం గనుక ఇస్తే నిందితులైన అధికారుల గోప్యతకు భంగం కలుగుతుందని కూడా సమాధానమిచ్చింది. నిఘా చైతన్య వారోత్సవాల్లో ఇలాంటి సంస్థలు, వ్యవస్థ అధికారులకే నరేంద్రమోడీ సుభాషితాలను వినిపించారు.


నరేంద్రమోడీ పాలనలో అవినీతి పెరిగిందని, గ్రామాల సంపదలను పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉందని అన్నా హజారే కార్యదర్శి కల్పన నవంబరు పదవ తేదీన లక్నోలో రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.2011లో అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఆందోళన కారణంగా కాంగ్రెస్‌కు మారుగా బిజెపి అధికారానికి వచ్చిందని ఎనిమిది సంవత్సరాలుగా చేసిందేమీ లేదన్నారు. గతంలో కూడా అన్నా హజారే ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఇడి తదితర సంస్థల దాడులు విపరీతంగా పెరిగాయి. అవినీతి మీద పోరులో తమ తీరుకు ఇది నిదర్శనం అని బిజెపి చెప్పుకుంటుంది. అసలు కథలు వేరే అన్నది తెలిసిందే. ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేదంటున్నారు, మరి గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు కారణం ఏమిటి ? 2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 దాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు , 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ఇలా అవినీతి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.


ఇటీవలి కాలంలో సమాచార కేంద్రాల అనుసంధానం కారణంగానే చట్టబద్దంగా జరిగే లావాదేవీల మీద నిఘాతో పాటు అక్రమాలను కనుగొనటం కూడా సులభతరమైంది. వాటి ఆధారంగా అక్రమార్కుల మీద తీసుకొంటున్న చర్యలే ప్రశ్నార్దకం. రెండవది అక్రమాలకు పాల్పడుతున్నవారు గతంలో మాదిరి నగదుతోనే పని నడిపిస్తున్నారు. అందుకే దాడులు జరిపితే టన్నుల కొద్దీ నగదు పట్టుబడుతున్నది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్ధిక రంగంలో నగదు సరఫరా 17.7లక్షల కోట్ల నుంచి 32లక్షల కోట్లకు పెరిగింది. అవినీతి పెరుగుదలకు ఇదొక సూచిక. మోడీ సర్కార్‌ చెబుతున్నట్లు లావాదేవీలన్నీ బాంకుల ద్వారా జరిగితే ఇటీవల తెలంగాణాలోని మునుగోడు, అంతకు ముందు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు గుట్టువెల్లడికావాలి. అలాంటిదేమీ లేదు.


2014కు ముందు అవినీతి ప్రభుత్వానికి ఒక అత్యవసరమైన భాగంగా ఉండేది, ఇప్పుడు ఏ మాత్రం సహించని విధానం అనుసరిస్తున్నామని నరేంద్రమోడీ హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సభల్లో చెప్పారు. మాటలు కాదు ఆచరణ అన్నది అసలు జరుగుతున్నదేమిటో మనకు చూపుతుంది.లోక్‌ పాల్‌ జోక్‌ పాల్‌గా మారిందని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ సభ్యుడు శైలేష్‌ గాంధీ చమత్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఆందోళనకు మోడీ అండ్‌ కో మద్దతు ఇచ్చింది. దాన్నే ఒక ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకొని లబ్ది పొందింది. అలాంటి పెద్దలు సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాతనే ప్రధాని పీఠం ఎక్కిన ఐదు సంవత్సరాల తరువాత ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లు లోక్‌పాల్‌ నియామకం జరిపారు.
అన్నా హజారే తదితరుల ఆందోళన, అనేక అవినీతి ఆరోపణల పూర్వరంగంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాలను చేసింది. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత ఏర్పాటు చేశారు. లోక్‌పాల్‌ వ్యవస్థలో బిజెపి అనుకూలురను నింపి దాన్ని ఒక ప్రహసన ప్రాయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. అన్నా హజారే బృందంలోని కిరణ్‌ బేడి తరువాత బిజెపిగా అసలు రూపాన్ని వెల్లడించారు.అరవింద్‌ కేజరీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన లోక్‌పాల్‌ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు నాలుగు సంవత్సరాలు నరేంద్రమోడీ ఆ కమిటీతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదని 2018లో సమాచర హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వెల్లడించిందని అంజలీ భరద్వాజ తెలిపారు. అంతకు ముందు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయకుంటే ఆందోళన చేస్తానని 2015లో అన్నా హజారే ప్రకటించారు. రెండేళ్ల తరువాత 2017లో మోడీని ప్రశ్నిస్తూ ఒక ప్రకటన చేశారు.2018లో ఆరు రోజులు నిరసన దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌ అంశం సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు అది ” ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ” అని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సుప్రీం కోర్టు అన్నది. చివరకు 2019లో నియమించారు. ఎంపిక కమిటీ కూడా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాని అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్‌, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రతినిధి, ప్రతిపక్ష నేత, మరో ప్రముఖ న్యాయవాది, అంటే ముగ్గురు అధికారపార్టీ వారే ఉంటారు లేదా మద్దతుదారులు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను కమిటీ ఆహ్వానితుడిగా మాత్రమే పిలిచారు.ఎంపికలో తన పాత్ర ఉండదు కనుక సమావేశాన్ని బహిష్కరించారు. ఆ కమిటీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చినెలలో లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన పినాకి చంద్రను ఎంపిక చేశారు.


ఇక లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల తీరుతెన్నులను చూస్తే 2019-20లో వచ్చిన 1,427లో 85 శాతం తమ పరిధిలోకి రావని, ఆరుశాతం సరైన పద్దతిలో నింపలేదని తిరస్కరించారు. మిగిలిన వాటిని విచారించి నిగ్గుతేల్చిందేమిటో జనానికి తెలియదు. నియామకం జరిగి ఏడాది కూడా నిండక ముందే లోక్‌పాల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న దిలీప్‌ భోంసలే 2020 జనవరి ఆరున ” వ్యక్తిగత కారణాల ”తో రాజీనామా చేశారు. తరువాత వెల్లడైనదేమంటే భోంసలేకు ఆఫీసు లేదా అధికారిక పనిగానీ లేదంటూ మూడు లేఖలు రాసినా లోక్‌పాల్‌ చైర్మన్‌ పట్టించుకోలేదు.” తొలి రోజు నుంచీ పని చేయకపోవటాన్ని, మబ్బుగా ఉండటాన్ని చెబుతూనే ఉన్నాను. చైర్మన్‌ నా సూచనలను పూర్తిగా పక్కన పడేశారు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు, స్పందన ప్రతికూలంగా ఉంది ” అని భోంసలే చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం నిరర్థకమైనవని, వాటి గురించి మూడు సంవత్సరాల తన పదవీకాలాన్ని గడిపితే సమయం వృధా తప్ప మరొకటి కాదని భోంసలే అన్నారు. పని చేయాల్సిన పద్దతి ఇది కాదు, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చైర్మన్‌ ఎలాంటి చొరవ చూపలేదని అన్నారు.


జస్టిస్‌ భోంసలే రాజీనామా తరువాత మరొక జడ్జి కరోనాతో మరణించారు. ఆ రెండు పోస్టులను ఇంతవరకు నింపలేదు. విచారణ, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్ల పోస్టులతో పాటు అవసరమైన ఇతర సిబ్బందిని కూడా కేంద్రం నియమించలేదు. కేటాయించిన నిధుల్లో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదని 2021లో పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వెల్లడించింది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ లోకాయక్త గురించి అనుసరించిన వైఖరిని చూస్తే లోక్‌పాల్‌ జోక్‌ పాల్‌గా ఎందుకు మారిందో అర్ధం చేసుకోవచ్చు. పదేండ్ల పాటు గుజరాత్‌ లోకాయక్త నియామకం జరపలేదు లేదా వ్యతిరేకించారు. 2011లో నాటి గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి జస్టిస్‌ ఆర్‌ఏ మెహతాను నియమించగా తొలగించాలంటూ నరేంద్రమోడీ సుప్రీం కోర్టు తలుపు తట్టి విఫలమయ్యారు. నరేంద్రమోడీ తీరు తెన్నులతో ఆగ్రహించిన జస్టిస్‌ మెహతా బాధ్యతలను తీసుకొనేందుకు తిరస్కరించారు. లోకాయక్తలు ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో ఉండకూడదని మోడీ సర్కార్‌ వాదించింది. జస్టిస్‌ మెహతా తిరస్కరణ తరువాత ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చారు. నియామక ప్రక్రియలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా చేశారు.మొత్తం ప్రభుత్వానికే అధికారాన్ని కట్టబెట్టారు. నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత 2016లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాన్ని నీరుగార్చారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లతో దాచుకుంటారు. సవరణల ప్రకారం అధికారుల పేరుతో ఉన్నవి తప్ప మిగతా కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ సమాచారం వెల్లడించాలో లేదో నిర్ణయించే అధికారం సమాచార కమిషన్‌కు ఇచ్చింది.

ప్రస్తుత లోక్‌పాల్‌, కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సమావేశాల మినిట్స్‌ ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఇవ్వనవసరం లేదని 2021లో ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర సమాచార కమిషనర్ల ప్రక్రియలోనూ మోడీ సర్కార్‌ ఇలాగే తిరస్కరించింది. ఆచరణ ఇలా ఉంటే మరోవైపు బహిరంగ వేదికల మీద చెబుతున్న సుభాషితాలను చూస్తే దగా దగా కుడి ఎడమల దగా దగా అన్న మహాకవి శ్రీశ్రీ గుర్తుకు రావటం లేదూ ! ” నేను తినను ఇతరులను తిననివ్వను ” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అనుకున్నారు. ఇప్పుడెవరూ చౌకీదార్‌ అని చెప్పుకోవటం లేదు. లోక్‌పాల్‌కు ఫిర్యాదులు ఎందుకు రావటం లేదంటే తమ పాలనలో అవినీతి లేనపుడు ఎలా వస్తాయంటూ బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు ! మహిమ కలికాలానిది అందామా నరేంద్రమోడీది అందామా ?అవినీతి గురించి అందరికీ తెలిసినందున ఎవరికి తోచింది వారు అనుకోవచ్చు. పైకి అంటే పంచాయితీ గానీ లోలోపల అనుకునేందుకు ఇంకా స్వేచ్చ ఉంది. మహాభారతంలో ధర్మపీఠం ఎక్కిన శకుని కౌరవులను నాశనం చేయాలనేఅంతరంగాన్ని వెల్లడిస్తాడు. మన పూర్వీకుల దగ్గర ఆ పాత పీఠాలు ఎక్కడైనా ఉన్నా లేదా దేశ భక్తులైన మన సంస్కృత పండితులు ఆ పరిజ్ఞానాన్ని వెలికి తీసి వాటిని రూపొందించి పుణ్యం కట్టుకుంటే మన పాలకులను వాటి మీద ఎక్కించి అంతరంగాలను బయట పెట్టించవచ్చు, అది తప్ప మరొక మార్గం లేదు, దేశం కోసం వారా పని చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d