• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

ప్రియాంక చోప్రా మీద మౌనం – దియా మీర్జా, రీఆనె ట్వీట్లపై రచ్చ ! బిజెపికి ఎందుకు మండింది ?

11 Thursday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

#Farmers Protest, #Priyanka Chopra, #Rehne, Dia mirza, Narendra Modi, Priyanka Chopra, Rehne, tweets war on farmers agitation


ఎం కోటేశ్వరరావు


” మన రైతులు భారత ఆహార సైనికులు.వారి భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉంది. వారి ఆశలను నెరవేర్చాల్సి ఉంది.వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్య వ్యవస్ధగా తరువాత అని కాకుండా త్వరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించేట్లు చూడాలి ” 2020 డిసెంబరు ఆరవ తేదీన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్‌.
” మనం దీన్ని గురించి ఎందుకు మాట్లాడ కూడదు ” అని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎన్‌లో మన రైతు ఉద్యమం గురించి వచ్చిన ఒక వ్యాసాన్ని, దానిలో చిత్రాన్ని ఉటంకిస్తూ హాలీవుడ్‌ నటి, గాయని రీఆనె 2021 ఫిబ్రవరి రెండున చేసిన ట్వీట్‌. రెండింటికీ నాలుగు రోజులు తక్కువగా రెండు నెలల తేడా !


ప్రియాంక ట్వీట్‌ అసలు చర్చనీయాంశమే కాలేదు. రీఆనె వ్యాఖ్య మీద ఇంత రచ్చ ఎందుకో తెలియదు. మొదటి దానిలో లేని అభ్యంతరం రెండవ ట్వీట్‌లో ఏముందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇద్దరూ సినీరంగానికి చెందిన వారే. ప్రియాంక ట్వీట్‌ మీద వివాదం రేగలేదు. పోనీ ఆమె కోరినట్లుగా సమస్యను పరిష్కరించారా అంటే అదీ లేదు. స్వయం కృతం- మేకులు కొట్టి, కాంక్రీటు పోసి మరింతగా గబ్బు పట్టారు. ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? సుదీర్ఘకాలం ఉద్యమం సాగిన తరువాతనే కదా ప్రపంచ మీడియా కేంద్రీకరించి వార్తలు రాసింది, ఢిల్లీ రోడ్ల మీద మేకుల ఫొటోలు, వీడియోలు చూపింది. విదేశాల్లోని సెలబ్రిటీలు వాటిని చదవరా ? స్పందించరా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు అన్నట్లుగా సిఎన్‌ఎన్‌ రాసిన దాని మీద చేయని రచ్చ దాన్ని ఉటంకిస్తూ చేసిన ట్వీట్‌ మీదకు మళ్లించటం ఏమిటి ? ఒక మహిళ అన్న చులకనా ? భారత్‌లో ఉన్నారు కనుక, ఇక్కడ జరుగుతోంది ఏమిటో, దాని తీవ్రత ఏమిటో ప్రత్యక్షంగా చూశారు కనుక ప్రియాంక వెంటనే స్పందించారు. సుదూరంగా ఉన్నారు గనుక రీఆనె ఆలస్యంగా ట్వీట్‌ చేశారు. నిజంగా సచిన్‌ టెండూల్కర్‌ వంటి వారికి రైతుల మీద ఆసక్తి ఉంటే ప్రియాంక మాదిరి ఎందుకు స్పందించలేదు? పరిష్కరించమని కోరితే వారి సొమ్మేమైనా పోతుందా ? నోటి ముత్యాలు రాలతాయా ? వారికి సామాజిక బాధ్యత లేదా ?

ట్విటర్‌ కంపెనీ మీద వత్తిడి, బెదిరింపు !


రైతు ఉద్యమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నిర్ధారించుకోకుండా అవాస్తవ సమచారంతో దేశద్రోహానికి పాల్పడ్డారంటూ అనేక మంది జర్నలిస్టుల మీద బిజెపి ప్రభుత్వాలు, అనుయాయులు కేసులను దాఖలు చేశారు. వాటి మీద సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. మరోవైపు ప్రభుత్వం సామాజిక మాధ్యమ సంస్ద అయిన ట్విటర్‌ కంపెనీకి 1,178 ఖాతాలను ఇచ్చి వాటిని మూసివేస్తారా మీ మీద చర్య తీసుకోమంటారా అని కత్తి పెట్టి కూర్చుంది. ఇవన్నీ పాకిస్దాన్‌, ఖలిస్తాన్‌ మద్దతుదారులకు చెందినవని చెబుతోంది. మా నిబంధనలకు విరుద్దంగా ఉన్న 500 ఖాతాలను నిలిపివేశాము, ఈ విషయం గురించి మాట్లాడదాము అంటే ససేమిరా కుదరదు, ముందు మేము చెప్పిన ఖాతాలను నిలిపివేయాల్సిందే అని చెబుతోంది. మాట్లాడితే పోయేదేముంది ? ట్విటర్‌ కంపెనీ తీసుకున్న చర్యల ప్రకారం కొన్ని ఖాతాల ట్వీట్లు మన దేశంలో కనిపించవు, ఇతర దేశాల వారికి అందుబాటులో ఉంటాయి. వార్తా సంస్దలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నేతలకు సంబంధించి ఇంతవరకు ఎవరివీ నిలిపివేయలేదని, అలా చేయటం భారత చట్టాల ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చను ఉల్లంఘించటమే అవుతుందని, అందువలన దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని ట్విటర్‌ పేర్కొన్నది. మన చట్టాల గురించి మన పాలకులకే విదేశీ కంపెనీ గుర్తు చేయాల్సిన దుస్ధితి ఎందుకు దాపురించిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీన్నే మరో విధంగా చెప్పాలంటే భావ ప్రకటనా స్వేచ్చను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ రోజు రైతు ఉద్యమం సాకు అయితే రేపు మరొక సాకు చూపుతారు. ప్రభుత్వ ప్రసార సాధనాలను ఆదేశాలతో, ప్రయివేటు మీడియాను పాకేజ్‌లు, అదిరింపులు బెదిరింపులతో ఇప్పటికే భజన కేంద్రాలుగా మార్చారు. ఇప్పుడు సామాజిక మాధ్యమం మీద కేంద్రీకరించారు. తమ ఆదేశాలను ధిక్కరించినట్లయితే జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే సెక్షన్లను ఉటంకిస్తూ ట్విటర్‌ కంపెనీకి నోటీసులు జారీ చేశారు.

బేటీల ఉద్యోగాలను పోగొట్టిన బిజెపి !

పాలకపార్టీని సంతృప్తి పరచేందుకు ట్విటర్‌ కంపెనీ భారత విధాన డైరెక్టర్‌గా ఉన్న మహిమా కౌల్‌ను ఇంటికి పంపింది. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు తప్ప తాజా వివాదానికి సంబంధం లేదని కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఖాతాల తొలగింపు లేదా ప్రభుత్వ ఆదేశాల విషయంలో ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసి ఉండాలి. బిజెపికి లొంగని కారణంగా మహిమా కౌల్‌ ఉద్యోగాన్ని కోల్పోతే ఫేస్‌బుక్‌లో బిజెపికి తోడ్పడిన విషయం బహిర్గతం కావటంతో అంఖీదాస్‌ అనే బిజెపి మద్దతుదారు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బిజెపి కార్యకర్తల విద్వేష పూరిత ప్రచారాన్ని నిరోధించాలనే అంశం ముందుకు వచ్చినపుడు మోడీ పార్టీ, హిందూత్వ ముఠాల ఖాతాలపై చర్యలు తీసుకుంటే కంపెనీ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని అంఖీదాస్‌ అడ్డుపడ్డారని వెల్లడైంది. ముస్లింలు, ఇతర మైనారిటీల మీద విద్వేష పూరిత ప్రచారాన్ని అనుమతించారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌ పరువు మురికి గంగలో కలిసింది. ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

లతా మంగేష్కర్‌, సచిన్‌ పరువు కంటే తన బండారం గురించే బిజెపి భయం !

వివిధ ట్విటర్‌ ఖాతాలలో ఒకే విధమైన మాటలు, సమాచారంతో ట్వీట్లు వెలువడటం తెలిసిందే. అవి భజన లేదా విద్వేష ప్రచారానికి సంబంధించినవి ఏవైనా కావచ్చు. సరిగ్గా అలాంటి ట్వీట్లే రైతు ఉద్యమానికి సంబంధించి భారత రత్నలు లతా మంగేష్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ మరికొందరు ప్రముఖుల పేరుతో వెలువడ్డాయి. తొంభై ఒక్క సంవత్సరాల వృద్ధాప్యంతో ఉన్న లతా మంగేష్కర్‌ పనిగట్టుకొని ట్వీట్‌ చేశారంటే నమ్మటం కష్టమే. ఒక వేళ ట్వీట్లు చేసిన వారందరూ దాదాపు ఒకే పదజాలాన్ని వారంతా ఎలా వినియోగించారన్నది ఆసక్తి కలిగించే అంశం. వాటిని బలవంతంగా వారి చేత ఇప్పించారనే అభిప్రాయం వెల్లడి కావటంతో దాని గురించి విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేముంది భారత రత్నలనే అవమానిస్తున్నారు కనుక కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి రంగంలోకి వచ్చింది.


విదేశీ తారల మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తున్నాయంటూ రుసురుసలాడుతూ బిజెపి ఎంఎల్‌ఏ ఒకరు బజారుకెక్కారు. కాంగ్రెస్‌ తరఫున తాను భారత రత్నలకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. మన నేల గురించి ఏమాత్రం తెలియని వారు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంటే ప్రముఖులు ఏకోన్ముఖ వైఖరి తీసుకొనేందుకు ముందుకు వచ్చారన్నారు. ముందే చెప్పుకున్నట్లు నిజానికి దేశానికి మాయని మచ్చ ఢిల్లీ శివార్లలో రోడ్ల మీద పాతిన ఇనుప మేకులు, కాంక్రీటుతో ఏర్పాటు చేసిన ఆటంకాల చిత్రాలు, వీడియోలు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే కదా ! భారత్‌లో ప్రజాందోళనల అణచివేతకు ఇలాంటి అనాగరిక ఏర్పాట్లు చేస్తారా అని సభ్యసమాజం యావత్తూ విస్తుపోతోంది.
కాంగ్రెస్‌ గానీ, మరొకరు గానీ లతా మంగేష్కర్‌ సంగీతం గురించి లేదా సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌, ఇతర రంగాలలో అనేక మంది చేసిన కృషికి గుర్తింపుగా భారత రత్నలుగా ప్రకటించటాన్ని ఎవరూ తప్పుపట్టలేదు, పట్టాల్సిన అవసరమూ లేదు. ప్రముఖులందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రకమైన పదజాలాలను తమ ట్వీట్లలో ఎలా వినియోగించారన్నదే బయటకు రావాల్సిన అంశం.

నరేంద్రమోడీ బ్రాండ్‌ సృష్టికి ఎన్ని వందల కోట్లు వెచ్చించారు ?

ఎవరైనా తమను విమర్శిస్తే వారి వ్యక్తిగత, సంస్దల లోపాలు, తప్పులు వెతికి వాటిని ఆయుధాలుగా చేసుకొని దాడులు చేయటం తెలిసిందే. లేకపోతే కల్పిత ఆరోపణలతో అదే పని చేస్తారు. ఇటీవలి కాలంలో డబ్బులిచ్చి ఉద్యోగులను పెట్టుకొని పేరు, ప్రతిష్టలను తయారు చేయించుకొనే పెద్ద మనుషుల గురించి తెలిసిందే. రైతులకు మద్దతుగా, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేసిన వారందరూ డబ్బు తీసుకొన్నారనే నిందలను మోపారు. అదే ప్రాతిపదిక అయితే ప్రపంచం నరేంద్రమోడీ నాయకత్వం ఎదురు చూస్తోందన్న ట్వీట్ల వెనుకు ఎంత డబ్బు చేతులు మారి ఉండాలి? అసలు ప్రపంచ నాయకులు ఎవరూ లేరు. లేని గొప్పను ఆపాదిస్తూ ప్రచారం చేసుకోవటమే కదా ! ఆర్ధికవేత్తగా మన్మోహన్‌ సింగ్‌ ఏమిటో అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీగారు ఏమి చదివారో, ఆయన డిగ్రీ ఏమిటో తెలియదు. మా మోడీ ఎంత సాధారణ వ్యక్తో తెలుసుకోండి అంటూ మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రం చేస్తున్న చిత్రాలంటూ సామాజిక మాధ్యమంలో తిప్పిన వారెవరో తెలుసు. చైనాలో కూడా నరేంద్రమోడీకే ఎక్కువ ఆదరణ ఉందని ఆ దేశ పత్రిక సర్వే వెల్లడించిందనే తప్పుడు ప్రచారం చేసింది ఎవరు ? దానికి ఎంత సొమ్ము చెల్లించారు? ఎవరు చెల్లించారు ?
2014లోక్‌ సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి ఒక ప్రతిష్టను సృష్టించేందుకు ఎన్ని సంస్దలను వినియోగించారో, ఎందరు నిపుణులు దానివెనుక ఉన్నారో ? అందుకు మోడీ టీమ్‌ ఎంత ఖర్చు చేసిందో అంచనా వేయలేము. ఇప్పుడు ప్రశాంత కిషోర్‌ వివిధ పార్టీలకు పని చేస్తున్నట్లుగానే మోడీ గారు కూడా అనేక సంస్ధలతో ఆపని చేయించారు. ఆసక్తి ఉన్నవారు దిగువ లింక్‌లోని విశ్లేషణ చదవ వచ్చు.https://www.businesstoday.in/magazine/case-study/case-study-strategy-tactics-behind-creation-of-brand-narendra-modi/story/206321.html


రైతుల ఉద్యమానికి మద్దతుగా పాప్‌ సంగీత గాయని రీఆనె ఇచ్చిన ట్వీట్‌తో దిమ్మ తిరిగింది. దాంతో ఒక సంస్ధ నుంచి ఆమె డబ్బు తీసుకుందనే ప్రచారం చేశారు. దానికి రుజువులు చూపాలంటూ ఆ సంస్ధ సవాలు చేసింది. ఇంతవరకు నోరు మెదపలేదు. బట్టకాల్చి ఎదుటి వారి వేయటమే అసలు లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వినరు జోషీ లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ పేరుతో ఒక స్వచ్చంద సంస్దను ఏర్పాటు చేశారు. కేసులు వేయటమే దాని పని. దాని లక్ష్యం ఏమిటన్నది తెలిసిందే.రీఆనె ట్వీట్‌ చేయగానే ఆ సంస్ధను రంగంలోకి దించారు. ఆమె కంపెనీ ఒకటి 2017 నుంచి తయారు చేస్తున్న సౌందర్య ఉత్పత్తులలో ఝార్కండ్‌లోని గనుల నుంచి సేకరిస్తున్న మైకా(అబ్రకం)కు అవసరమైన నిర్ధారణ పత్రాలు ఉన్నాయా, గనుల్లో బాల కార్మికుల వినియోగం గురించి దర్యాప్తు జరపాలంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు లేఖ రాయించారు. ఒక వేళ నిజంగానే అదే జరుగుతోందని అనుకుందాం ! ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్ధ ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నది ? ఇతర అనేక రంగాలలో బాలకార్మికులను వినియోగిస్తున్న ఉదంతాలపై సదరు సంస్ధ ఎన్ని ఫిర్యాదులు చేసింది? ఇలాంటి వివాదాలను రేపటం వెనుక జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప బాలకార్మికుల మీద ప్రేమ కాదు. మన దేశంలో సరైన తిండి లేక మరణిస్తున్న బాలలు, ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న తల్లులు, ఆకలి, వ్యాధులు, దిగజారుతున్న ప్రజాస్వామ్య సూచికల గురించి ప్రపంచ సంస్ధలు ఇస్తున్న నివేదికల కంటే ఎక్కువగా రైతు ఉద్యమం మీద చేసిన ట్వీట్లు మన దేశ పరువును తీశాయా ? వాటి గురించి భారత రత్నలు ఎప్పుడైనా పట్టించుకున్నారా ? ట్వీట్లతో దేశ పరువు కంటే కృత్రిమంగా తయారు చేసుకున్న నరేంద్రమోడీ, బిజెపి పరువు పోతోందన్నదే అసలు దుగ్ద !

యూ ట్యూబ్‌ మీద వత్తిడి, కమలా హారిస్‌ సోదరి కుమార్తె చిత్ర పటాల దగ్దం !

కేంద్ర ప్రభుత్వం ఒక్క ట్విటర్‌ మీదనే కాదు యూ ట్యూబ్‌ మీద కూడా వత్తిడి తెచ్చింది. రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన పాటలను తీసివేయించింది. అసీ వాద్దేంగే అనే గీతాన్ని తొలగించటానికి ముందు కోటీ 30లక్షల మంది చూశారు. అయిలాన్‌ అనే మరో పాటను కోటి మంది చూశారు. యూట్యూబ్‌ నుంచి అయితే తీసివేయించగలిగారు గానీ రైతుల హృదయాల నుంచి ఎలా తొలగిస్తారని రైతు నేతలు ప్రశ్నించారు. ఈ పాటలను ఎందుకు తొలగించారో యూట్యూబ్‌ ఒక్క ముక్క కూడా చెప్పలేదు.


అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌. ఆమె చెల్లెలు మాయ కుమార్తె మీనా హారిస్‌. ఆమె కూడా రైతుల ఉద్యమానికి సానుకూలంగా స్పందించారు. ఆమె మీద కాషాయ మరుగుజ్జులు దాడి చేశారు. బూతులు తిట్టారు, అనేక చోట్ల ఆమె ఫొటోలను తగులబెట్టారు.ఒక వేళ మేము భారత్‌లో ఉండి ఉంటే వారేమి చేసేవారో తగులబెట్టిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. అయినా నన్నెవరూ బెదరించలేరు, నోరు మూయించలేరు. ధైర్యవంతులైన భారత పురుషులు రైతులకు మద్దతుగా మాట్లాడిన ఒక మహిళ చిత్రాలను తగులబెట్టారు. అది వారికి సర్వసాధారణం అనుకుంటున్నాను అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.కార్మిక హక్కుల కార్యకర్త నవదీప్‌ కౌర్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి లైంగికంగా దాడి చేశారు అని కూడా మీనా ట్వీట్లు చేశారు. కమలా హారిస్‌ కుమార్తె వరుస కావటంతో సహజంగానే మీనా ట్వీట్లకు కూడా పెద్ద స్పందన వెల్లడైంది.భారతీయ వారసత్వం ఉండి కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తుందా అన్న ఉక్రోషం తప్ప మరొకటి కాదు. ఎంత మంది నోరు మూయిస్తారు. అలాంటి చర్యల వలన మరింత మంది నోళ్లలో నానుతారనే విషయం పట్టించుకొనే స్ధితిలో లేరు.

వ్యవసాయం గురించి మాట్లాడే నరేంద్రమోడీ ఎప్పుడైనా మేడి పట్టారా -కాడి మోశారా !

సెలబ్రిటీలు నోరు తెరిస్తే మాకు భజన చేయాలి లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి అన్నట్లుగా ఉంది కాషాయ మరుగుజ్జుల తీరు. ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది చమోలీ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు తీసింది. నదిపై నిర్మించిన అనేక ఆనకట్టల నిర్మాణం వరదలకు దారి తీసిందని, చమోలీ పౌరుల కోసం ప్రార్ధనలు జరపాలని బాలీవుడ్‌ నటి దియా మీర్జా ట్వీట్‌ చేసింది. దానిలో తప్పేముంది, నిజం అదిగాకపోతే కారణాలు వెల్లడైన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. దేశానికి జరిగిన నష్టం ఏముంది ? అయినా ఎందుకు ఆమె మీద దాడి చేశారు ? నాలుగు పదుల వయస్సున్న దియా మీర్జా తండ్రి జర్మన్‌-తల్లి బెంగాలీ. హైదరాబాదులో పుట్టి పెరిగింది. తలిదండ్రులు విడిపోయిన తరువాత దియా తల్లి హైదరాబాదుకు చెందిన అహమ్మద్‌ మీర్జాను వివాహం చేసుకుంది. దియా తన మారు తండ్రి ఇంటి పేరునే తాను స్వీకరించింది.


దియా నటి, పర్యావరణ రక్షణ ఉద్యమ కార్యకర్త. గత పది సంవత్సరాలుగా దానికి సంబంధించిన అంశాల మీద ఆమె మాట్లాడుతోంది. ఆమె కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నిర్దేశించిన నిరంతర అభివృద్ది లక్ష్యాల రాయబారిగా ఆమెను నియమించారు. ఇంతకంటే ఆమె కృషికి గుర్తింపు ఏమి కావాలి. మియా ఖలీఫా ఒక రైతు అయినట్లుగానే దియా ఒక పర్యావరణ వాది అంటూ హేళన చేశారు. మియా ఖలీఫా గానీ మరొక సినిమా నటిగానీ తాము రైతులమని ఎక్కడా చెప్పలేదు, రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు తప్ప మరొకటి కాదు. రైతుల గురించి మాట్లాడిన వారందరూ రైతులే కానవసరం లేదు. ఆమాటకు వస్తే నరేంద్రమోడీ రోజూ రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా మేడి పట్టారా – కాడి మోశారా ? వేరుశనగ కాయలు ఎక్కడ కాస్తాయో తెలుసా ? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? టీ అమ్మాను అని ఆయన చెప్పుకోవటమే గాక నేను చూశాను అని ఇంతవరకు ఒక్కరూ చెప్పలేదు. మోడీ గారు ఏమి చదువుకున్నారో తెలియదు గానీ, ఆయన మాట్లాడుతున్న ఆర్ధిక విషయాలకు మోడినోమిక్స్‌ అని పేరు పెట్టారు. అలాంటి ఆర్ధిక నిపుణుడి ఏలుబడిలో దేశం ఇంతగా ఎందుకు దిగజారినట్లు ? ఒక అంశం గురించి మాట్లాడాలంటే దాని డిగ్రీ కలిగి ఉండాలా ? పాలకులకు నచ్చని విషయాలను రాస్తే లేదా వ్యతిరేకంగా మాట్లాడిన మహిళల మీద నోరుబట్టని బూతులతో దాడి జరగటం చూస్తున్నాం. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. రేప్‌ చేస్తామని బెదరిస్తారు. అవే నోళ్లు మహిళలను గౌరవించాలని, పూజించాలని మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటోందో !


నాడు ఇందిరే ఇండియా – నేడు బిజెపి ప్రభుత్వమే దేశం !

గతంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేసిన డికె బారువా ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అని సెలవిచ్చి వ్యక్తి పూజకు తెరలేపి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ప్రభుత్వమంటే దేశం- దేశమంటే ప్రభుత్వం అనే పద్దతిలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే రైౖతు ఉద్యమం గురించి ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తే అది దేశ భక్తి- విమర్శిస్తే అది దేశద్రోహం అంటూ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం వేరు-దేశం వేరు అని కాషాయ దళాలకు తెలియకనా ? కానే కాదు. తమను గుడ్డిగా నమ్మే వారి మెదళ్లను తప్పుడు అవగాహనతో నింపే పెద్ద పధకంలో భాగమే అది.


రైతు ఉద్యమం గురించి తెలియని వారికి తెలియ చెప్పటంలో ఆ ఉద్యమాన్ని సమర్ధిస్తున్న పార్టీలు లేదా సంస్ధలు ఎంతవరకు జయప్రదమయ్యాయో తెలియదు గానీ బిజెపి మాత్రం ఇప్పుడు నిరంతరం అదే కార్యక్రమంలో ఉంది. అందుకు గాను ఆ పార్టీని ”అభినందించక ” తప్పదు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం మీద ప్రధాని మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం మరింత గట్టిగా సాగేందుకు అవసరమైన పునాది వేశారు. ఆందోళనా జీవి అనే కొత్త పదాన్ని ప్రయోగించారు.సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణాలో ఒక కంపెనీ కొనుగోలు చేసిన భూ వివాదంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరును ఆందోళనా జీవి ఆవహించింది. హైదరాబాద్‌ నగరపాలక సంస్ధ ఎన్నికల సందర్భంగా రోహింగ్యాల మీద మెరుపుదాడులు చేస్తామని ఆ పెద్దమనిషి ప్రకటన చేశారు. నల్లగొండ జిల్లాలో గిరిజనుల కోసం ” కరసేవ ” చేస్తానంటూ రెచ్చగొడుతూ కంపెనీకి చెందిన ఒక షెడ్డును ధ్వంసం చేయించిన దృశ్యాలను చూశాము. భక్తి శివుడి మీద చిత్త బయట ఉన్న చెప్పుల మీద అన్నట్లుగా గుర్రంపోడు గిరిజనుల మీద కంటే సాగర్‌ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేశారన్నది స్పష్టం. నిజానికి ప్రధాని లేదా బిజెపికి ఆందోళనలతో పనిలేకపోతే లేదా పట్టకపోతే ఆ పార్టీకి అనుబంధంగా అనేక సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? నిత్యం అవి ఏదో ఒక ముట్టడి పేరుతో ఆందోళనలకు ఎందుకు దిగుతున్నట్లు ? వాటిని రద్దు చేస్తారా ?


పర్యావరణ ఉద్యమ కార్యకర్తగా అతి చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న గ్రేటా టన్‌బెర్జ్‌ ఇలా చెప్పింది.” సైన్సు మరియు ప్రజాస్వామ్యం ఒకదానితో ఒకటి బలమైన సంబంధం కలిగినవి.అవి భావ ప్రకటనా స్వేచ్చ, స్వాతంత్య్రం, వాస్తవాలు మరియు పారదర్శకత మీద నిర్మితమౌతాయి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే బహుశా మీరు సైన్సుకూ గౌరవం ఇవ్వరు. మీరు సైన్సును గౌరవించపోతే ప్రజాస్వామ్యాన్నీ గౌరవించరు ”.
గ్రేటా టన్‌బర్జ్‌ చెప్పిందే దేశంలో నేడు జరుగుతోం సైన్సును గౌరవిస్తున్నామని ఒక నోటితో చెబుతూ అదే నోటితో మహాభారత కాలంలోనే మన దేశంలో కృత్రిమ గర్భధారణతో పిల్లల్ని పుట్టించే ప్రక్రియ తెలుసనీ, పురాణ కాలంలోనే ఏనుగు తలను మనిషికి అంటించే ప్లాస్టిక్‌ సర్జరీ పరిజ్ఞానం ఉందనీ, ఎలాంటి ఇంధనం లేకుండానే ఎటు కావాలంటే అటు తిరిగే విమానాలు మన దేశంలో ఉండేవని చెబుతున్న వారెవరో మనకు తెలుసు. అలా చెప్పటం సైన్సును అవమానించటం తప్ప గౌరవించటం కాదు. దాన్ని గౌరవించని అధికారంలో ఉన్న ఆ పెద్దలు ప్రజాస్వామ్య వ్యవస్దను కరిమింగిన వెలగ పండులా మారుస్తున్న తీరూ తెలుసు ? ముసురుతున్న చీకట్లు, వేసుకున్న ముసుగులు తొలుగుతాయి. దేనికైనా తగు సమయం రావాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వినాశకాలే విపరీత బుద్ధి : విద్వేష, పుకార్ల బిజెపి వారు దేశభక్తులు – జర్నలిస్టులు దేశద్రోహులా ?

09 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Rajdeep Sardesai, Cases against journalists, journalists, Sedition Case Against Tharoor, Tweets on Farmers' Rally


ఎం కోటేశ్వరరావు
నిర్ధారించుకోకుండా వార్తలు రాశారు, ప్రసారం చేశారు లేదా ట్వీట్‌ చేశారు అని కొంత మంది జర్నలిస్టుల మీద క్రిమినల్‌ కేసులు పెట్టారు. నిజమే అలా చేయకూడదు. ఎవరూ అలాంటి ధోరణులు, పని తీరును సమర్ధించరు. మీడియా ప్రభుత్వ గెజెట్‌ కాదు. కొన్ని సందర్భాలలో నిర్ధారణ కాని వార్తలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ వాస్తవం కానట్లయితే ఆయా మీడియా సంస్దల విశ్వసనీయత దెబ్బతింటుంది, నష్టపోయేది వారే. అందువలన ఎవరూ తమ కొమ్మలను తామే నరుక్కోరు. లేదూ చేస్తే ఏమౌతుంది ?


ప్రభుత్వం లేదా ప్రభుత్వ శాఖలు ఆయా ఉదంతాలకు సంబంధించి వివరణ ఇచ్చి తాము చెప్పిందాన్ని కూడా ప్రచురణ లేదా ప్రసారం చేయమంటాయి. చేయలేదనుకోండి,వివరణ కోరవచ్చు, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ఇతర చర్యలకు ఉపక్రమించవచ్చు.అదేమీ లేకుండానే ఏకపక్షంగా దేశద్రోహం కేసులా ? ఇది ప్రజాస్వామ్య పాలనా, నిరంకుశ ఏలుబడా ? జనవరి 26 ఉదంతాల విషయంలో జరిగిందేమిటి ? జర్నలిస్టులు, ఒక కాంగ్రెస్‌ ఎంపీ మీద దేశద్రోహం వంటి తీవ్ర నేరపూరితమైన కేసుల దాఖలు చేశారు. వారంతా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. రెండు వారాల తరువాత కేసులను విచారణకు తీసుకుంటామని ఇప్పటికైతే అరెస్టు చేయవద్దని మంగళవారం నాడు ఉన్నత న్యాయస్ధానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే జర్నలిస్టుల మీద కత్తి వేలాడుతూనే ఉంది? రెండు వారాల తరువాతేం జరగనుందో తెలియదు.
నిర్దారణ కాని వార్తల ఆధారంగా అంటే ఒక జనవరి 26న ఒక యువకుడి మృతి వార్త గురించి తెలుసుకోకుండా ఆరుగురు జర్నలిస్టులు, ఎంపీ శశిధరూర్‌ ట్వీట్లు చేశారన్నది అభియోగం. పోలీసు కాల్పుల్లో గాయపడి అతను మరణించాడన్నది ఆ సమయంలో అక్కడున్నవారి నివేదన, కాదు ట్రాక్టరు తిరుగబడి మరణించాడన్నది పోలీసుల కధనం. మొదటి కథనాన్ని ట్వీట్‌ చేశారు. కానీ పోలీసులు ఏం చెబుతారో తెలుసుకోకుండా వారి మీద నిందలు మోపే విధంగా, జనాన్ని రెచ్చగొట్టే రీతిలో ట్వీట్‌ చేశారు లేదా తమకు వచ్చిన దాన్ని ఇతరులకు పంచారు(షేర్‌), అది నేరం అని మోడీ సర్కార్‌ అంటోంది. ఈ కేసుపై దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నాయకత్వంలోని బెంచ్‌ విచారిస్తున్నది.


కోర్టుకు ఎక్కిన వారిలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఇండియా టుడే సంపాదకుడు రాజదీప్‌ సర్దేశారు,కాంగ్రెస్‌ దినపత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ సీనియర్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ మృణాల్‌ పాండే, క్వామీ అవాజ్‌ సంపాదకుడు జాఫర్‌ ఆఘా, కారవాన్‌ స్దాపకుడు పరేష్‌ నాధ్‌, సంపాదకులు అనంత నాధ్‌, వినోకే కె జోస్‌ ఉన్నారు. వారి మీద దేశద్రోహం, మత సామరస్యతను దెబ్బతీసే సమాచార వ్యాప్తి, రైతుల నిరసన గురించి తప్పుడు వార్తలు తదితర నేరాలు మోపారు. జర్నలిస్టుల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ నిరంకుశ చర్యల నుంచి పిటీషనర్లకు తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. వివిధ రాష్ట్రాల పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వస్తారని పేర్కొన్నారు. కోర్టు తొలుత విముఖత చూపింది. మీరు వారిని అరెస్టు చేయబోతున్నారా అని ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బుధవారం నాడు దీని గురించి వినాలని మెహతా చెప్పారు. బుధవారం నాడు కాదు, రెండు వారాల తరువాత వింటాం, అప్పటి వరకు వారి అరెస్టు నిలిపివేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.


కారవాన్‌ సంపాదకుడు వినోద్‌ కె జోస్‌ తరఫున వాదించిన సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహతగీ ఆధారాల్లేకుండా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని, రిపోర్టింగ్‌లో నేరం ఎక్కడుంది, మత మనోభావాలు గాయపడేదెక్కడ అని ప్రశ్నించారు. దాని మీద స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ వారి ట్వీట్లను అనుసరించే లక్షలాది మంది మీద భయంకరమైన ప్రభావం పడుతుందని నేను మీకు చూపగలను అన్నారు. ఢిల్లీలో కేంద్రప్రపభుత్వానికి చెందిన న్యాయవాది ఒకరు, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు, గురుగ్రామ్‌, బెంగళూరు, నోయిడాలలో కూడా కేసులు దాఖలు చేశారు. నిందితులు కుట్రపూరితంగా ఒక పధకం ప్రకారం తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని ఆరోపించారు. ఈ కేసులను డియుజె, ఎన్‌ఏజె,మహిళా జర్నలిస్టు సంఘం, ఎడిటర్స్‌ గిల్డు తదితర సంఘాలు ఖండించాయి.


ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రకారం ఎర్రకోట దగ్గర మరో చోట జరిగిన ఉదంతాలను మీడియా ఎలా నివేదించాలి. పోలీసులు జెండా ఆవిష్కరించిన నిందితులను పారిపోనిచ్చేంతవరకు, కొన్ని గంటల తరువాత తాపీగా వచ్చి జెండాలను తొలగించే వరకు ఎలాంటి వార్తలు మీడియా ఇవ్వకూడదు. ఎందుకంటే నిర్ధారించుకోవాలి కదా ! ఆ ఉదంతానికి బాధ్యుడు దీప్‌ సిద్దూ అనే సినిమా నటుడైన బిజెపి కార్యకర్త అని అందరికీ తెలిసినా పోలీసులకు మాత్రం తెలియదు. అతగాడు తాపీగా వెళ్లిపోతుంటే కనీసం ఆపి ఎవరు ఏమిటి అని ప్రశ్నించటం కూడా పోలీసులకు తెలియదు. ఈ తీరు మీద నిర్ధారించుకోకుండా ట్వీట్‌ చేయకూడదు, వార్త రాయకూడు ! తాపీగా వెళ్లిపోయిన అతని మీద అనివార్యమై కేసు పెట్టి 14రోజుల పాటు స్వేచ్చగా తిరగనిచ్చి అరెస్టు చేసేంత వరకు, దాన్ని అధికారికంగా పోలీసులు నిర్దారించి మీడియాకు చెప్పేంత వరకు వార్తలు రాయకూడదు. ట్వీట్‌ చేయకూడదు. దీన్నీ కూడా అంగీకరిద్దాం !


ఇక్కడే మరో దృశ్యాన్ని మనం చూడాలి. తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే అనే దేశం కదా మనది. దాన్ని నాలుగు పాదాలతో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా ! అలాంటపుడు దేశద్రోహం, మతసామరస్యతను దెబ్బతీసినందుకు కేసులూ గట్రా అందరి మీదా పెట్టాలా లేక కేవలం ఎంపిక చేసుకున్న జర్నలిస్టులు, ఇతరులకేనా ? అదీ రైతు ఉద్యమం పట్ల విమర్శనాత్మకంగా లేదా రైతుల పట్ల సానుకూలంగా రాస్తున్న వారిమీదేనా ! ఇదే అసలు సమస్య. జనవరి 26న ఢిల్లీ ఎర్రకోట దగ్గర వందలాది మంది అమిత్‌ షా పోలీసులు కళ్లప్పగించి చూస్తుండగా ఒక యువకుడు అనుమతి లేకుండా సిక్కు మత జెండాను ఎగురవేశాడు. వెంటనే జరిగిందేమిటి ?

రైతులు ఎర్రకోట మీద ఉన్న జాతీయ జెండాను తొలగించి ఖలిస్తానీ పతాకాన్ని ఎగురవేశారు. అని వార్తలు గుప్పుమన్నాయి. టౌమ్స్‌ నౌ ప్రధాన సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ జాతీయ జెండాను తొలగించారని చెబుతూ ఒక మత లేదా రైతు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారని ముక్తాయింపు ఇచ్చారు. ఇది చిన్న నేరమా ? కాదు. ఆ ఛానల్‌ ఏదో గల్లీకి పరిమితం కాదు,సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పినట్లు సంపాదకుడి ట్వీట్లు, ఇచ్చిన వార్తలతో భయంకరమైన ప్రభావం మీద వేసుకొనే జనం కోట్లాది మంది ఉంటారు. దేశ ప్రజలను తప్పుదారి పట్టించి ఉద్యమిస్తున్న రైతుల మీద, సిక్కుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్య ! కాదా ? అయినా అతగాడి మీద ఎలాంటి కేసూ లేదు. ఎందుకని ?


ఒపిఇండియా అనే ఒక వెబ్‌సైట్‌ ఉంది.నిరసనకారులు ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని ఒక వార్తను రాసింది. దాని సంపాదకుడు లేదా రాసిన జర్నలిస్టు మీద కూడా కేసు లేదు. ఇది తప్పుడు వార్తలు, విద్వేష పూరిత ప్రచారానికి పెట్టింది పేరు. కాషాయ తాలిబాన్లు నడుపుతున్న ఒక అబద్దాల, వక్రీకరణల ఫ్యాక్టరీ. ఢిల్లీ బిజెపి ప్రతినిధి హరీష్‌ ఖురానా, పార్లమెంటరీ కార్యదర్శి వరుణ్‌ గాంధీ ఇంకా కొంత మంది బిజెపి నేతలు, కార్యకర్తలు జాతీయ జెండాను అవమానించారని, ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని సామాజిక, సాంప్రదాయ మాధ్యమాల్లో ప్రచారం చేశారు. సిక్కుల మీద విద్వేషం రెచ్చగొట్టారు. నిర్దారించుకోకుండా వారు చేసిన దానిలో ఎలాంటి నేరం కనిపించలేదా ? కేసులు ఎందుకు పెట్టరు ? దున్న ఈనిందంటే గాటన కట్టేయండి అన్నట్లుగా ఈ తప్పుడు వార్తను తెలుగు మీడియాతో సహా దేశమంతటా ప్రచారం, ప్రసారం చేశారు. నిర్దారించుకోకుండా ఆపని చేసినందుకు వీరిలో ఎందరి మీద కేసులు పెట్టారు ?


ఎర్రకోట దగ్గర సిక్కు మత జెండాను ఎగురవేసిన యువకుడి పేరు జుగరాజ్‌ సింగ్‌, పంజాబ్‌ నివాసి. అతను రైతుల ఉద్యమంలో పాల్గనేందుకు వచ్చాడు. అనేక మందితో పాటు ఎర్రకోట వద్దకు వెళ్లాడు. ఒకరు ఒక జెండాను ఇచ్చి అక్కడున్న జెండా దిమ్మ మీద ఎగురవేయమని చెప్పారు. ఎవరూ ఎక్కలేకపోయారు, జగరాజ్‌ సింగ్‌ ఎక్కాడు, ఎగురవేశాడు. దిగి వచ్చాడు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. వారెందుకు నివారించలేదు ? తన మనవడు అమాయకుడని, ఎవరో ఇచ్చిన జెండాను ఎగురవేశాడు తప్ప అతనికి ఇంకేమీ తెలియదని జగరాజ్‌ తాత చెబుతున్నాడు. అ జెండా ఇచ్చిన లేదా ఇప్పించిన వ్యక్తి దీప్‌ సిద్దూ అనే సినిమా నటుడని, ధర్మేంద్ర తీసిన సినిమాల్లో నటించాడని, ధర్మేంద్ర కొడుకు సన్నీ డియోల్‌ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ప్రచారం చేశాడని, బిజెపి అగ్రనేతలతో ఫొటోలు దిగే సాన్నిహిత్యం కలవాడని తరువాత వెల్లడైంది. అతగాడు అనేక మందికి తెలిసిన వాడు, అక్కడ అందరికీ కనిపించచాడు గనుక పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. అదే కుట్రలో భాగంగా మరొకరి చేత జండాను తెచ్చి ఇచ్చి ఉంటే మొత్తం రైతుల మీదుగా పోయేదికాదా ?

నవరీత్‌ సింగ్‌ అనే 25 ఏండ్ల యువకుడు జనవరి 26 సంఘటనల్లో మరణించాడు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆటంకాలను ట్రాక్టరుతో తొలగించేందుకు ప్రయత్నించిన నవరీత్‌ అదే ట్రాక్టరు తిరగబడి ప్రమాదవశాత్తూ మరణించాడని పోలీసులు చెబుతున్నారు. ఆ ఉదంతాన్ని చిత్రించిన వీడియోలో, పోస్టు మార్గం నివేదికలో అతని తల మీద ఒక తుపాకీ తూటా గాయం ఉందని తేలింది. ఆ ఉదంతాన్ని చిత్రించిన వారు చెబుతున్నదాని ప్రకారం పోలీసులు కాల్పులు జరిపిన తరువాత మాత్రమే ట్రాక్టర్‌ బోల్తాపడింది, కాల్పుల కారణంగానే అతను చనిపోయాడని అంటున్నారు. వైద్యులు తమతో ఆ విషయం మౌఖికంగా చెప్పారని, నివేదికలో ఆ విషయాన్ని రాయలేమమని ఒక వైద్యుడు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయాన్ని నిర్దారించుకోకుండా వార్తలు ఇచ్చి పోలీసుల మీద నిందమోపారంటూ కేసు దాఖలు చేశారు. పోస్టు మార్టం నివేదికలో తూటా ప్రస్తావనే లేదని, ట్రాక్టర్‌ తిరగబడే మరణించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసు కాల్పులు జరపటం అసాధారణమేమీ కాదు. కాల్పుల్లోనే మరణించాడని ట్వీట్‌ చేశారు లేదా వార్త ఇచ్చారు. దాన్ని వార్తగా ఇవ్వకపోతే కదా సమస్య ? కాశ్మీరులోయలో ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెబుతారు. అనేక ఉదంతాల్లో మరణించిన వారు ఉగ్రవాదులు కాదు సామాన్య యువకులు, ఉట్టి పుణ్యానికే చంపారని బంధువులు చెబుతారు. ఆ వార్తలను ఇవ్వాలా లేదా ? అలాంటి ఫేక్‌ ఎన్‌కౌంటర్ల గురించి మిలిటరీ కోర్టులు విచారణ జరిపిన ఉదంతాలు లేవా ? వార్తలు సరైనవా తప్పుడువా అన్నది తప్ప దేశద్రోహ అంశం ఏముంది అక్కడ ?


మీడియాలో వచ్చిన వార్తలకు భిన్నంగా జరిగితే పోలీసులైనా మరొకరైనా ఖండనలు లేదా వివరణలు ఇచ్చినపుడు వాటిని ప్రచురించకపోయినా, ప్రసారం చేయకపోయినా ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ఇతరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేరపూరితమైన సెక్షన్లతో కేసులు బనాయించటం రైతుల ఆందోళనల వార్తలను ఇస్తున్నందుకు తీర్చుకుంటున్న కక్ష తప్ప మరొకటి కాదు. కానట్లయితే నిర్దారించుకోకుండా వార్తలు రాసిన ఇతరులు, తప్పుడు ప్రచారం చేసిన బిజెపి పెద్దల మీద కూడా అలాంటి కేసులే ఎందుకు బనాయించలేదు ? తప్పుడు వార్తలను తయారు చేసేందుకు బిజెపి, దాని అనుయాయులు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక సంస్దలను ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా ఉత్పత్తి చేస్తున్న విషయం అందరికీ విదితమే. అవి సమాజంలో ఎంత విద్వేషం రగిలిస్తున్నాయో అందరికీ తెలిసిందే ! రైతుల ఉద్యమంలో ఖలిస్తానీలున్నారని కొందరు, నక్సల్స్‌ ఉన్నారని మరి కొందరు, విదేశీ నిధులతో ఆందోళన చేస్తున్నారని, కమిషన్‌ ఏజంట్లు డబ్బు ఇస్తున్నారని, సిక్కుల వేషాల్లో ముస్లింలు చేరారని ఇలా చేయని తప్పుడు ఆరోపణలు, నకిలీ వార్తలను ఎవరు సృష్టించారు.ఉద్యమాన్ని వ్యతిరేకించే బిజెపి, దాని మిత్రపక్షాలు, వాటి నేతలు, కార్యకర్తలే కదా ? పర్యవసానంగా సిక్కులను, ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను ఎలా నిందిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆ ప్రచారం సమాజంలో ఐక్యతకు తోడ్పడుతుందా విద్వేషాలకు ఆజ్యం పోస్తుందా ? ఇలాంటి అంశాలన్నీ ట్విటర్లలో, ఫేస్‌బుక్‌లో వస్తున్నపుడు వాటిని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరలేదు. అనేక ఉదంతాలలో న్యాయమూర్తులు స్వయంగా పత్రికా వార్తలను తీసుకొని విచారించిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి వార్తల మీద ఎవరూ స్పందించటం లేదు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారని వేలాది ట్విటర్‌ ఖాతాలను స్ధంభింప చేయాలని కేంద్రం ఆదేశిస్తోంది ? ధర్మం ఒంటి కాలు మీదనా నాలుగు పాదాల నడుస్తోందా ? ఒకే పనిని తమ వారు చేస్తే దేశభక్తి, వ్యతిరేకులు చేస్తే ద్రోహమా ? ఏమిటీ విపరీతం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశాఖ ఉక్కును ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?

09 Tuesday Feb 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Vizag steel agitation, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణద్వారా రూ.1.75 లక్షలకోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రయత్నాలలో ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రజలు ఉవ్వెత్తున తమ వ్యతిరేకతను వెల్లడించారు. దాదాపు అన్నిపార్టీలు,ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకొంటామని శపధాలు చేశాయి. ఆంధ్రుల హక్కైన విశాఖఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కుఉద్యమం తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని నేతలు ప్రకటించారు. ”వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఒక్క అంగుళంకూడా ప్రయివేటుకి అమ్మనివ్వం, మా ఉక్కుజోలికొస్తే తొక్కేస్తాం, బీజేపీ మోడీ ఖబడ్దార్‌” అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరమంతా స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ నినాదాలతో దద్దరిల్లింది.
అసలు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ నష్టాలలో ఉన్నందువలననా? లేక ప్రభుత్వ ఆస్ధిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా? నష్టాలలో ఉన్నపుడు అమ్మకుండా ఎట్లా ఉంటారు అని కొందరు అంటున్నారు. నిజంగా నష్టాలలో ఉందా? నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి?

1. విశాఖ స్టీల్‌ ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. 1971 సం. జనవరి 20 న శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలసముద్రం వద్ద పైలాన్‌ ను ప్రారంభించి విశాఖస్టీల్‌ ప్లాంట్‌ స్ధాపన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడు సంవత్సరాల పాటు నిధులు కేటాయించలేదు. 1978 లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖస్టీల్‌ కు రూ.1000కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. 1979 జూన్‌ లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 82 జనవరిలో మొదటి బ్లాస్ట్‌ ఫర్నెస్‌ , టౌన్‌ షిప్‌ శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు 1 న ప్రధాని పీ.వీ.నరసింహరావు 32 లక్షల టన్నుల సామర్ధ్యంగల విశాఖ స్టీల్‌ ను జాతికి అంకితం చేశారు. తరువాత ్‌ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వ పెట్టుబడులు ఆగిపోయాయి. బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్‌ ప్లాంటు ను విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాలబాటలోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలోవుంది. 2004 సం.లో రూ. 2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆరించింది. ప్లాంట్‌ విస్తరించితే , పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించితే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006 సం.లో ప్లాంట్‌ విస్తరణకు ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంఖుస్ధాపనచేశారు.32లక్షల టన్నులనుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని సాధించారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ”నవరత్న ” గా గుర్తించారు. ఏడాది గడవ కుండానే నవరత్నగా గుర్తించిన సంవత్సరం లోనే ప్లాంట్‌లో 10 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.(2011 జనవరి )

కార్మికుల , ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాలఉపసంహరణ ను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్‌ లో ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్‌ ప్లాంట్‌ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గత అత్యంత ఆధునిక స్టీల్‌ ప్లాంట్‌ ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణకొరియా కంపెనీ ”పోస్కో” కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్‌ విలువ 10 కోట్ల రూ. పైననే వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతఅవుతుందో తెలియదా? స్టీల్‌ ప్లాం ట్‌ నిర్మించటానికి ఎంత అవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం 3.2 లక్షలకోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళాతీసిందా? ఆస్ధులను అమ్ముకుని తింటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.

2 )అన్ని స్టీల్‌ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ. 500, రవాణా ఖర్చులతో 1000 రూ. అయ్యే టన్ను ఇనప ఖనిజానికి 3 వేలు పెట్టి కొనుక్కోవలసివస్తోంది. ప్రతి టన్నుకీ అదనంగా 2వేలు ఖర్చు చేస్తున్నది. స్వంత గనులు వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్‌ ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్‌ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. అసలు కర్మాగారమే లేని బ్రాహ్మణీ స్టీల్స్‌కు గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి ఇతరదేశాలకు ఇనపఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెట్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెట్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్దపెట్టుబడిదారులైన టాటా, మిట్టల్‌, గాలిజనార్ధనరెడ్డిగార్లకు, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజవనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెట్తున్నారు. అదిగో నష్టం వచ్చిందికదాఅని అబద్ధాలు చెప్పి ప్లాంట్‌ అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సీ.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి వాగ్దానాలను, శాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్రప్రజలు ప్రశ్నించారు. అమ తరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారి మాటవిని అమ తరావు అర్దంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్నికొనసాగించారు. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే విశాఖ ఉక్కు సాధ్యమయింది.

విశాఖఉక్కు సాధన లో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేయప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్నికుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగాఅరెస్టులు చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టి సంవత్సరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులను విమానాలద్వారా విశాఖలో దించి కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాత విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ను ఇవ్వక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది లో ప్రజాపోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమి పై హక్కుకోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తికోసం రైతుయాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధపోరాటం, నాగార్జున సాగర్‌ కోసం, విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే సాధించబడింది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్యపెట్టుబడి దెయ్యంలాగా జడలువిప్పుకుని నాట్యంచేస్తున్నది.

ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు కేవలం కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇలా అన్నారు. ”ఆధునీకరణ, పారిశ్రామీకరణ, అభివృద్ధి కోసం ప్రజలు పోరాడటం చాలా అరుదుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు దాన్ని చేసి చూపారు.ఈ ప్లాంట్‌ ఇక్కడ నిర్మాణం అవ్వటానికి తమ ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. విశాఖపట్నం సముద్రతీరంలో వుంది.ప్రపంచానికి ఇది ద్వారాలు తెరుస్తున్నది.బ్రహ్మాండమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. స్టీల్‌ ప్లాంటు విస్తరణ విశాఖపట్నం అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.” అన్నారు .

పోర్టు సిటీగా పేరు పడిన విశాఖ స్టీల్‌ సిటీగా మారింది. మూలపెట్టుబడి రూ. 4898 కోట్లతో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున 3.2 లక్షల కోట్లకు మించిన విలువతో, 22 వేలఎకరాల భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతంచేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలుపరుస్తూ 35 వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను – పన్నులు, డివిడెండ్ల రూపంలో 40 వేల కోట్ల రూపాయలను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రప్రభుత్వానికి సమకూర్చింది. రూ.7977 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్‌ విస్తరణ అప్పులకు వడ్డీ గా రూ.18,000 కోట్లు చెల్లించింది.

గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సాధించిన పనితీరు గమనిస్తే. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది.

అత్యంతవిలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిద్దంగావున్నాయి. రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే ఇది సాధ్యమవుతుంది..

వ్యాస రచయిత గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేత, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కులం పేరుతో కేరళ ముఖ్యమంత్రిని అవమానించిన కాంగ్రెస్‌కు బిజెపి మద్దతు !

07 Sunday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Bjp support to Congress caste slur on Chief Minister Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala Politics, LDF, Pinarayi Vijayan, UDF


ఎం కోటేశ్వరరావు


ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని కోరుకోవటంలో, అందుకోసం గౌరవ ప్రదమైన, ప్రజాస్వామిక పద్దతుల్లో పని చేjటం, ప్రవర్తించటంలో తప్పు లేదు. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారానికి వస్తే తరువాత సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రావటాన్ని చూస్తున్నాము. తాజాగా పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి గత పరంపరకు భిన్నంగా వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వస్తుందని అంకెలు చెబుతున్నాయి. మళయాల మనోరమ అనే పత్రిక 101 సీట్లు వస్తాయని విశ్లేషించింది. అదే పత్రిక సిపిఎం సమీక్షలో 98 వస్తాయనే అంచనాకు వచ్చినట్లు మరొక వార్తను రాసింది. ఇంతవరకు ఎల్‌డిఎఫ్‌ నేతలు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు.

ఏప్రిల్‌ లేదా మే మాసాల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఎల్‌డిఎఫ్‌ అన్నింటికంటే ముందు వుందని, ఓట్లు తగ్గిన, ఓడిపోయిన చోట ఎందుకలా జరిగిందో ప్రతిపార్టీ పరిశీలించుకుంటున్నది, సిపిఎం కూడా అదే చేస్తున్నదని మీడియాలో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. మొత్తంగా కేరళ పరిణామాలను చూసినపుడు సిపిఎం వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే తన వ్యతిరేక ప్రచార శ్రమ వృధా అయింది, జనం ఎందుకు పట్టించుకోలేదనే ఉడుకుమోత్తనంతో మీడియా వుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తిరిగి తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోంది.
మరోవైపున పండుగాడి మాదిరి సిపిఎం కొట్టిన దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌ అయిన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు చౌకబారు, చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలకూ దిగజారాయి. గీత వృత్తిదారు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది తప్ప వారి వ్యాఖ్యలను అవమానించేవిగా భావించటం లేదని విజయన్‌ ఎంతో హుందాగా ప్రతిస్పందించారు. కల్లుగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకుంటారు అని కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ అయిన కె సురేంద్రన్‌ నోరు పారవేసుకున్నారు.


కేరళ ఐశ్వర్య యాత్ర పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్‌ రాజకీయ యాత్ర జరుపుతోంది. కేరళ అభివృద్ది మినహా మిగిలిన అంశాలన్నింటినీ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ సందర్భంగా కన్నూరు జిల్లా తలసెరీలో సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వాటితో తమకు సంబంధం లేదని శాసనసభా పక్షనేత రమేష్‌ చెన్నితల వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ ఏకైక మహిళా ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ ఘాటుగా సురేంద్రన్‌ తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి మరింత నష్టదాయకంగా మారటంతో పాటు ముఠా తగాదాలు బయటకు వచ్చాయి. తన ప్రత్యర్ధుల ప్రోద్బలంతో ఎంఎల్‌ఏ అలా ప్రకటించారని సుధాకరన్‌ మండిపడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యగా పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించానని రమేష్‌ చెన్నితల, ఎవరి ప్రమేయం లేకుండా తానే ఆ ప్రకటన చేశానని ఎంఎల్‌ఏ తన మాటలను తానే మింగారు. సుధాకరన్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో రెచ్చి పోయిన సురేంద్రన్‌ తన వ్యాఖ్యలను పార్టీ సమర్ధించిందని, అన్నదానిలో తప్పులేదంటూ పదే పదే సమర్ధించుకుంటున్నారు.

” సురేంద్రన్‌ నాకు కాలేజీ రోజుల నుంచీ తెలుసు. నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడని నేను గతంలో కూడా చెప్పాను. మా అన్న కూడా గీత కార్మికుడే, వయస్సు మీద పడి వృత్తి మానుకున్నాడు. రెండో సోదరుడికీీ వృత్తి తెలుసు, అయితే ఒక బేకరీని పెట్టుకున్నాడు.మాది ఒక వ్యవసాయ కుటుంబం, సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలతో నేనేమీ నొచ్చుకోలేదు, వాటిని తిట్టుగా భావించటం లేదు.నేను ఒక గీత కార్మికుడి కొడుకును, అందుకు గర్విస్తాను ఎందుకంటే నేను ఒక కష్టజీవి కొడుకును.ఈ అంశాన్ని వివాదాస్పదం గావించారని అలపూజ ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ మీద సుధాకరన్‌ మండి పడ్డారు. ఈ అంశంలో చివరికి రమేష్‌ చెన్నితల కూడా తన వైఖరిని మార్చుకున్నారు. నా జీవన శైలి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే.” అని విజయన్‌ విలేకర్లతో చెప్పారు.

బిజెపిలో చేరతానని బెదిరించి అధిష్టానాన్ని బెదిరించిన సురేంద్రన్‌ ?

సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించటంతో వాటిని వ్యతిరేకించటం కంటే సమర్దించటమే మంచిదని కాంగ్రెస్‌ భావించింది. అందుకే మాట మార్చింది.కాంగ్రెస్‌ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ నేత కెసి వేణుగోపాల్‌ సమర్ధించారు. ఏదో వాడుక భాషలో అన్నారు. సుధాకరన్‌ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని ఏదో సాధారణంగా చెప్పాను. తరువాత ఇది నిజమేనా అని ఆయనతో మాట్లాడితే కాదన్నారు. ఆయన ప్రజానాయకుడు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సంపద వంటి వారు అని చెన్నితల సమర్ధించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఇలా మాట మార్చటం వెనుక తాను బిజెపిలో చేరతానని సురేంద్రన్‌ పార్టీ అధిష్టానాన్ని బెదిరించటమే కారణమని కొందరు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి విలాస జీవితం గురించి చెబుతూ ఆయన కుటుంబ వృత్తి పేరు ప్రస్తావించాను తప్ప మరొకటి కాదని ఢిల్లీలో కూడా సుధాకరన్‌ సమర్ధించుకున్నారు. అనేక మంది నేతలు తామూ కూలీ బిడ్డలమని చెప్పుకుంటారని ఇది కూడా అంతే అన్నారు. నేను వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత కూడా సిపిఎం స్పందించలేదని, వారికి బదులు తమ కాంగ్రెస్‌ వారే స్పందించారనే అదే సమస్య అన్నారు. అంతకు ముందు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వివరించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ నేతల కుల దూషణను బిజెపి సమర్ధించింది. కల్లు గీసే వారు అన్ని కులాల్లో ఉన్నారని అందువలన ఒక కులాన్ని నిందించినట్లుగా తాము భావించటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమర్ధించారు. సిపిఎం వారు దాన్నొక ఆయుధంగా చేసుకున్నారు తప్ప తప్పేమీ లేదన్నారు.

మరోసారి శబరిమలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌ !

స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతుగా మీడియా ఎల్‌డిఎఫ్‌ ప్రత్యేకించి సిపిఎంకు వ్యతిరేకంగా ముందుకు తెచ్చిన ఆరోపణలను జనం పట్టించులేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దాంతో తిరిగి మరోసారి శబరిమల సమస్యను ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పూనుకుంది. మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, దాన్ని అమలు చేసేందుకు పూనుకున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపి వివాదాస్పదం కావించి శాంతి భద్రల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో పునర్విచారణ పిటీషన్‌ ఉంది. అలాంటివే ఇతర వివాదాలు, పిటీషన్లను కలిపి కోర్టు విచారించింది. ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో సమాజంలో సృష్టించిన గాయాలను మాన్పేందుకు తీర్పుకు వ్యతిరేకంగా చట్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము అధికారానికి వస్తే చేయబోయే చట్టం ఇలా ఉంటుందంటూ ఒక ముసాయిదాను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకున్నారు. శబరిమల సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయటంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుదని దానిలో పేర్కొన్నారు.ఈ ప్రచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన తరువాత సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సమీక్షిస్తామని చెప్పింది అంతిమ నిర్ణయం వచ్చిన తరువాతే కదా జోక్యం చేసుకొనే సమస్య ఉదయించేది అని విజయన్‌ అన్నారు.


శబరిమల సమస్య ద్వారా లబ్దిపొందాలని చూస్తున్న మరో పార్టీ బిజెపి కూడా ఓట్లకోసమే కాంగ్రెస్‌ ఇలా చెబుతోందని విమర్శించింది. ఆ సమస్య మీద ఉద్యమించినపుడు కాంగ్రెస్‌ ఎక్కడుంది ? అప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించింది. తాము అధికారానికి వస్తే దేవాలయ బోర్డులను రద్దు చేస్తామని బిజెపి చెప్పుకుంది.
తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కుమారుడు చాండీ ఊమెన్‌ క్రైస్తవ బిషప్పుల కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు.అతగాడు చేసిన వ్యాఖ్యలను మరొకరు చేసి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ గావించి ఉండే వారు.యూత్‌లీగ్‌ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఐరోపాలో చర్చ్‌లు నృత్య కేంద్రాలు, మద్యం బార్లుగా మారిపోయాయని చాండీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. చాండీకి అసలు కేరళ చర్చ్‌ల చరిత్ర తెలియదని బిషప్పుల సంఘం వ్యాఖ్యానించింది.


బిజెపి మిత్రపక్షమైన కేరళ భారత ధర్మ జనసేన(బిడిజెఎస్‌) పార్టీలో చీలిక వచ్చింది. బిజెపి నేతలు ఎల్‌డిఎఫ్‌తో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని దానికి నిరసనగా తాము భారత జనసేన (బిజెఎస్‌) పేరుతో కొత్త పార్టీని పెట్టి యుడిఎఫ్‌ను సమర్ధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే వీరికి బలమేమీ లేదని బిడిజెస్‌ నేతలు తోసి పుచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అసలు ఉమ్మడిగా ఉన్న పార్టీకే బలమేమీ లేదని వెల్లడైంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బిజెపి నేతల తీరు తెన్నులు చూస్తే కేరళలో వచ్చే ఎన్నికలలో తాము అధికారానికి రాకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకొని చక్రం ఇప్పుతామన్నట్లుగా ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కొన్ని సీట్లలో ఓట్లను గణనీయంగా ఎలా పెంచుకోవాలా అని చూస్తోంది, అదే పెద్ద గొప్ప అన్నట్లుగా మీడియా చిత్రిస్తోంది. నూట నలభై స్ధానాలకు గాను 48 చోట్ల 30వేలకు పైగా ఓట్లు వస్తాయని, వాటిలో కూడా 20 చోట్ల గెలిచే అవకాశాలున్నందున అలాంటి స్ధానాల మీద కేంద్రీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నిర్ణయించినట్లు మళయాళ మనోరమ వ్యాఖ్యాత పేర్కొన్నారు. కేరళలో బిజెపి ఎన్ని ఊపులు ఊపినా దాని ఓటింగ్‌ శాతం పదిహేనుశాతానికి లోపుగానే ఉంది తప్ప పెరగలేదు. ఈసారి చూడండి ఈ సారి చూడండి అంటూ ప్రతిసారీ కబుర్లు చెబుతూనే ఉంది. ఇప్పుడూ అదే పల్లవి, అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అనేక మంది నేతలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. కొందరు వెనక్కు తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు, మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నినా, వక్రీకరణలు చేసినా ఎల్‌డిఎఫ్‌ తన కార్యక్రమంతో ముందుకుపోతోంది. మరో విజయాన్ని స్వంతం చేసుకోగలమనే ధీమా వ్యక్తం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శాస్త్ర మిత్రోం వద్దు – మూఢ మూత్రోం ముద్దు !

06 Saturday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Science

≈ Leave a comment

Tags

BJP pseudoscience, cow science exam, cow urine phenyl, love for pseudoscience, No to science, pseudoscience


ఎం కోటేశ్వరరావు


గ్రామం నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ కార్యాలయాలను ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయిల్‌తోనే శుద్ది చేయాలని మధ్య ప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వం జనవరి నెల చివరిలో ఆదేశాలు జారీ చేసింది. ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారీకి ముందే గిరాకీని సృష్టించామని అందువలన మూత్రం వృధా కాకుండా యజమానులు ఒట్టి పోయిన ఆవులను ఇండ్ల దగ్గరే ఉంచుతారని తద్వారా ఆవుల పరిస్ధితి మెరుగుపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్‌ సింగ్‌ పటేల్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వ చర్యను చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన చర్యలు తీసుకుంటారని బిజెపి ప్రతినిధి రాహుల్‌ కొఠారీ సమర్ధించారు.


ఇప్పటికే రామ్‌ దేవ్‌ బాబా పతంజలి కంపెనీ గోనైల్‌ పేరుతో ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారు చేస్తున్నది. దానికి లబ్ది చేకూర్చేందుకే ఈ చర్య తీసుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే పెద్ద ఎత్తున గోమూత్ర సేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వమే గ్రామాల్లో పాలకేంద్రాల మాదిరి ఆవు మూత్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సేకరించిన మూత్రంతో ఫినాయిల్‌ తయారీకి సహకరించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు సరఫరా చేసేందుకు బహుశా మేకిన్‌ ఇండియా పధకం కింద ఎగుమతులు కూడా చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్య ప్రదేశలో ప్రత్యేకంగా ” ఆవు మంత్రి వర్గం ” కూడా ఉంది. వాటి రక్షణ కోసం పశుసంవర్దక, అటవీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, హౌం మరియు రైతు సంక్షేమ శాఖల మంత్రులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గతేడాది నవంబరు 18న ప్రకటించారు. రాజు తలచుకోవాలే గానీ డబ్బులకు – దెబ్బలకూ కొదవేముంటుంది ! బిజెపి తలచుకోవాలే గానీ ఆశ్రితులకు జనం సొమ్ము అప్పగించేందుకు కొత్త పుంతలు ఎన్నో. చివరకు ఆవు మూత్రాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుంది. ఆవు మూత్రం తాగే జనం ఉన్న దేశం మనది.(ఎవరి మనోభావాన్ని కించపరచటం లేదు. ఎవరిష్టం వారిది) అలాంటిది అదీ దేశీయ ఆవు మూత్రంతో ఇండ్లు, ఆఫీసులను తుడిచే ఫినాయిల్‌ తయారు చేస్తామంటే ఎవరైనా అభ్యంతరపెడతారా ?


బిజెపి ప్రభుత్వ నిర్ణయం మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు హాస్యాన్ని పండిస్తున్నారు.సంవాదాలు, రాజకీయ విసుర్లు, విమర్శించిన వారి మీద దాడి సరే సరి ! ప్రస్తుతం రసాయనాలతో ఫినాయిల్‌ తయారు చేస్తున్నారు. దానికి రకరకాల రంగులు, వాసనలు జోడిస్తున్నారు. ప్రపంచంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. చిరుతిండ్లు దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందువలన వాటి వాడకాన్ని నిరుత్సాహపరచేందుకు ” కొవ్వు ” లేదా ఉప్పు పన్ను వేస్తున్నారు. ఈనేపధ్యంలో కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో చూద్దాం !

తదుపరి ఫాస్ట్‌ ఫుడ్స్‌, డ్రింకులకు కృత్రిమ వాసనల బదులు విధిగా గో మూత్ర వాసన జోడించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. అలా చేస్తే పన్నుతో నిమిత్తం లేకుండానే జనాలు చిరుతిండ్లు మాని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. డబ్బుకు డబ్బు ఆదా !
ముందు గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ఇళ్లతో ప్రారంభించాలి ! మూత్ర తంత్రం ఎంత గొప్పగా ఉందో కదా !
తరువాత మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉదయాన్నే టీ బదులు గోమూత్రం తాగాలనే ఆదేశాలు జారీ అవుతాయి !
ఇళ్ల నుంచి పని చేసేందుకు ఉద్యోగులకు ఇది పెద్ద ప్రోత్సాహం అవుతుంది !
ఉత్తర ప్రదేశ్‌కు మధ్య ప్రదేశ్‌ గట్టి పోటీనిస్తోంది ! చూద్దాం 2024నాటికి ఎవరు ఎక్కువ గోమూత్రం తాగుతారో !
ఎంపీ, యూపీలలో ఉన్న వారి పట్ల విచారంగా ఉంది !
ఇది ఆవు ప్రభుత్వం, ఆవుల కోసం ఆవులు పని చేస్తున్నాయి ! మోడీ-అమిత్‌ షా బ్రాండ్‌ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు !
ప్రపంచంలో మన దేశాన్ని అపహాస్యం పాలు చేయటానికి ఈ పాలకులు రోజుకు ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు !
దానితో ఇబ్బంది ఏముంది ? రసాయన పరిశ్రమల కంటే కుటీర పరిశ్రమ వృద్ది చెందుతుంది !
మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆవు మూత్రంతో పాటు మనుషుల మూత్రంతో కూడా ఫినాయిల్‌ తయారు చేయించవచ్చు, సులభంగా కూడా దొరుకుతుంది !
మిత్రోం వద్దు – మూత్రోం ముద్దు ! ప్రతిదీ ఆవు పేడ వాసన రావాల్సిందే !
బీఫ్‌ తినే వారు ఆవు మూత్రం గురించి అభ్యంతర పెట్టే నైతిక హక్కులేదు !
నేను బీఫ్‌ తింటా దానికి ఉచ్చతో చేసిన సాస్‌ బదులు మిరియాల సాస్‌ వాడతా, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఉచ్చ సాస్‌ పంపుతా !
జనానికి అభ్యంతరం లేనంత వరకు మనకు సమస్య ఏముంది ?
” పప్పు ” పార్టీ కంటే గోమూత్ర పార్టీలో మెదళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయబ్బా ! ఆవు మూత్రంతో వాహనాలు నడపవచ్చేమో అన్న ఆలోచన వస్తోంది !
ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ ఇది గోమూత్ర సర్కార్‌ అని వ్యాఖ్యానించారు.
వారేమీ దాచుకోవటం లేదని తెలుసుకోవటం సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చింది గనుక గోమూత్రాన్ని వాడుతున్నాం. మీకు అవకాశం వస్తే ఒంటె మూత్రాన్ని వాడండి, అది లౌకిక పద్దతి, మీరు కూడా తాగవచ్చు !


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హానికరమైన రేడియో ధార్మికశక్తిని ఆవు పేడ 60శాతం మేరకు నిరోధిస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు గుజరాత్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం జనవరి చివరిలో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిపినట్లు ప్రకటించారు. దీని గురించి గత అక్టోబరులోనే సంస్ధ అధ్యక్షుడు, క్యాన్సర్‌ చికిత్స నిపుణుడైన డాక్టర్‌ వల్లభారు కథిరియా ప్రకటించారు. దాన్ని అప్పుడే దేశంలోని ఆరువందల మంది శాస్త్రవేత్తలు సవాలు చేశారు. దాన్ని నిర్ధారిస్తూ ఇటీవల విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర అధ్యాపకుల నుంచి ప్రకటన రావటం విచారం కలిగిస్తున్నదని కొందరు శాస్త్రవేత్తలు తాజాగా ఒక ప్రకటనలో విమర్శించారు. ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది. దానికి రేడియో ధార్మికతను నిరోధించే గుణం ఉంది.అది ఇంట్లో ఉంటే రేడియేషన్‌ ఉండదు, ఇది సైన్సులో రుజువైందని వల్లభారు గతంలో చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఒక పరికరాన్ని చూపుతూ సెల్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నిరోధిస్తుందన్నారు.

సౌరాష్ట్ర విశ్వవిద్యాలయ ప్రకటనను సవాలు చేసిన శాస్త్రవేత్తలు అసలా పరిశోధనా పద్దతిలోనే లోపం ఉందన్నారు. రేడియేషన్‌ కొలవటానికి వీలైనది, భిన్నమైన మందాలు గల ఆవు పేడ పిడకలతో ఎంత తేడాతో రేడియేషన్‌ ఉన్నదో కొలవ వచ్చు, కానీ ఆపని చేయకుండా ఒకసారి మాత్రమే కొలిస్తే అసలు పరిశోధన ఎలా అవుతుందన్నారు. ఆవు పేడ కాకుండా ఒంటె లేదా గాడిద పెంటతో ప్రయోగాలు చేసి ఉంటే ఏమి జరిగేదో చెప్పాలన్నారు. పరిశోధనలో లోపాల గురించి వారికి తెలిసి ఉండకపోవచ్చు లేదా ఎవరికోసమో తప్పుడు సమాచారాన్ని తయారు చేసి ఇచ్చి ఉండవచ్చన్నారు. బోధనా రంగంలో ఉన్న కొంత మంది కుహనా శాస్త్రాన్ని బలవంతంగా రుద్దటాన్ని తాము నిరసిస్తున్నామన్నారు. ఆవు పేడ రేడియేషన్‌ నిరోధకత కలిగి ఉందని శాస్త్రవేత్తల ముసుగు వేసుకున్న కుహనా బృందాల నుంచి నుంచి గాక ప్రభుత్వ సంస్ధ నుంచి వచ్చినందున దీన్ని తేలికగా తీసుకో కూడదని కొల్‌కతాలోని ఐఐఎస్‌ఇఆర్‌ సంస్ధ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌ సౌమిత్ర బెనర్జీ అన్నారు. ఆవు పేడ మీద పరిశోధనలకు నిధులు పొందటం సులభమని కొంత మంది శాస్త్రవేత్తలు దృష్టి మళ్లిస్తారని అయితే ఇది శాస్త్ర ఆరోగ్యానికే హానికరమని అన్నారు.


ఆవు సైన్సును ప్రోత్సహించే పేరుతో ఫిబ్రవరి 25న దేశవ్యాపితంగా తొలిసారిగా ఆలిండియా ఆన్‌లైన్‌ కామధేను గో విజ్ఞాన ప్రచార-ప్రసార పరీక్ష పెడుతున్నారు. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు, చదువు సంధ్యలతో, వయస్సుతో పనిలేదు. ఆవు గురించి తెలిస్తే చాలు. పరీక్ష రాసిన వారందరికీ అందరికీ ఆవు ” శాస్త్రవేత్తలు ” గా సర్టిఫికెట్లు ఇస్తారు, అధిక మార్కులు వచ్చిన వారికి అదనంగా బహుమతులు ఇస్తారు. పశుసంవర్ధన ఆధునిక, శాస్త్రీయ పద్దతుల్లో నిర్వహించేందుకు గాను రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆచరణలో అది కుహనా శాస్త్ర ప్రచారాన్ని చేస్తున్నది. ఆ సంస్ధ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ వల్లభారు కథిరియా రాసిన ఒక బహిరంగలేఖలో ఒక వ్యాక్యం చదివితే అదేం చేస్తున్నదో అర్దం చేసుకోవచ్చు. ” ఈ రోజు మనం రామాయణం, మహాభారత్‌, కృష్ణ, చాణక్య, ఉపనిషత్‌ గంగ వంటి సీరియల్స్‌ను చూసినపుడు సామాజిక జీవనంలో మన ఊహకు సైతం అందని అసమాన సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించినట్లు తెలుసుకోవచ్చు ” అని పేర్కొన్నారు. అంతేకాదు నేను క్యాన్సర్‌ ఆపరేషన్ల గురించి చెప్పగలను గానీ ఇతర విషయాలు నాకు తెలియవు, అలాగే ఆవు శాస్త్రం గురించి అందరికీ తెలియకపోవచ్చు అన్నారు.

ఒక వైపు ఆధునిక శాస్త్ర పరిశోధనలు అవసరమని లోకం కోడై కూస్తున్నది.మరోవైపు మన దేశంలో శాస్త్ర పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కోత పెడుతున్నారు.ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 1996లో మన జిడిపిలో 0.64 శాతం కేటాయించారు. అది 2008 నాటికి 0.86శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలో 2018లో 0.65శాతానికి దిగజారింది. తాజాగా ఆర్ధిక సర్వేలో ఖర్చును 0.7 నుంచి రెండుశాతానికి పెంచాలని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌లో అలాంటి సూచనలేమీ లేవు. ప్రపంచ నవకల్పన 2020 సూచీలో మనదేశం 131దేశాలలో 48వ స్ధానంలో ఉందని పేర్కొన్నది. కొందరైతే 2014లో 76వ స్దానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 28 స్ధానాలు పెంచి 48కి తెచ్చారని పొగడ్తలు కురిపించారు. మనతో సమానమైన వారితో పోటీ-పోలిక గౌరవంగా ఉంటుంది.మన దేశం 2014లో 33.7 పాయింట్లతో 76వ స్ధానంలో ఉంది. అది 2020కి 48లోకి వచ్చినా పాయింట్లు 35.6 మాత్రమే. ఇదే కాలంలో చైనా 46 నుంచి 29వ స్ధానానికి 17 స్ధానాలు మెరుగుపరచుకుంది, పాయింట్ల వారీ చూస్తే 46.6 నుంచి 53.3కు పెంచుకుంది. పైకి పోతున్న కొద్దీ పోటీ తీవ్రత పెరుగుతుందన్నది తెలిసిందే. సౌమిత్ర బెనర్జీ చెప్పినట్లు మన పరిశోధనలన్నీ ఆవు పేడ, మూత్రం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలలో దాని పట్ల మక్కువ ఉన్న పాలకులు ఉన్న కారణంగా నిధుల కోసం అలాంటి పరిశోధనల చుట్టూ కొందరు శాస్త్రవేత్తలు ప్రదక్షణలు చేస్తున్నారు. గోమాతలను ప్రార్ధిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎంత పని చేస్తివే ట్వీటా : కంగనా రనౌత్‌ నోటి తుత్తర – తాప్సీ పన్ను తాషా మార్ఫా !

05 Friday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

#i stand with farmers, Farmers Delhi agitation, Kangana ranaut, Taapsee pannu, tweets war on farmers agitation


ఎం కోటేశ్వరరావు
కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఇప్పుడు బిజెపిలో తిరుగులేని నేత, ప్రధాని నరేంద్రమోడీకి కూడా అదే జరుగుతోందా ?ఎవరికి ఎలా తోస్తే అలా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేకపోతే ఏమిటి ? వ్యవసాయ చట్టాల సవరణకు ఏ దయ్యాల ముహూర్తంలో శ్రీకారం చుట్టారో తెలియదు గానీ అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. దాన్ని ఇతర దేశాల్లో నియంతల మాదిరి అణచివేస్తారా ? ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నవారి మాదిరి గౌరవ ప్రదంగా ఉపసంహరించుకుంటారా, ఏం జరుగుతుంది అన్నది చెప్పలేము. ఈ లోగా ప్రపంచ వ్యాపితంగా రైతు ఉద్యమం గురించి విదేశీ నేతల ఆరా, మరింతగా చర్చ జరగటం మాత్రం ఖాయం.
దేశీయంగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వ్యవసాయ చట్టాల మీద చర్చలు లేవన్నారు. దిగి వచ్చారు. సావిత్రీ నీపతి ప్రాణంబు తప్ప అన్న యముడి మాదిరి చట్టాల ఉపసంహరణ మినహా దేన్నయినా చర్చిస్తామన్నారు. రైతులు కోరకపోయినా ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామన్నారు. జనవరి 26 రైతుల పరేడ్‌ మీద కోర్టు ద్వారా అనుమతి రాకుండా చూడాలనుకున్నారు. అనుమతి ఇవ్వక తప్పలేదు. కొంత మంది రైతు ఉద్యమ వ్యతిరేకులతో ఎర్రకోట దగ్గర జెండాలు ఎగుర వేయించి రైతుల మీద నెపాన్ని మోపాలని చూశారు. అదెలా ఎదురు తన్నిందో తెలిసిందే. మీడియా అనివార్యంగా చర్చించాల్సి వచ్చింది, దాంతో అనేక మంది కొత్తగా రైతు ఉద్యమం గురించి-కేంద్ర పాలకుల నిజస్వరూపం తెలుసుకోగలిగారు. తాజాగా అన్నింటికీ మించి, నిజం- ఏమాట కామాటే చెప్పుకోవాలి. ట్వీటా ఎంత పని చేశావే అని బిజెపి నేతలు తలపట్టుకొనే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

స్వీట్లు – ట్వీట్లు ఇంత పని చేస్తాయనుకోలేదు నాయనో !
వర్తమాన చరిత్రలో సాంప్రదాయ మీడియాను-సామాజిక మాధ్యమాన్ని మన దేశంలో నరేంద్రమోడీ, బిజెపి ఉపయోగించుకున్నంతగా మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో మోడీకి సాటి రాగలిగింది ఆయనకు అత్యంత ఆప్తుడు, అధికారం పోయిన తరువాత కూడా భుజాల మీద చేతులు వేసుకొని తిరగ్గలిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే. ట్వీట్లతో అతగాడు ఎంత ప్రాచుర్యం – గబ్బు పట్టాడో యావత్‌ ప్రపంచం చూసింది. చివరికి ట్విటర్‌ శాశ్వతంగా ఖాతా మూసివేసినట్లు ప్రకటించగా మిగిలినవి పరిమితం కాలం, రకరకాలుగా ఆంక్షలు విధించాయి.చరిత్ర చెత్తబుట్టలో పడిన అతనికి తరువాత పునరుద్దించినా ఒకటే లేకున్నా ఒకటే.
సామాజిక మాధ్యమం ఎంత శక్తివంతమైనదో తాజాగా రైతు ఉద్యమం కూడా నిరూపించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాన స్రవంతి మీడియా మూసిపెట్టాలని చూసి పాచిపోయేట్లు చేసింది. జనవరి 26 పరేడ్‌కు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వెనుదిరిగి పోతుంటే ఇంకేముంది ఉద్యమాన్ని ముగించేశారని పదే పదే ప్రసారం చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టింది. దానికి తోడు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ కన్నీళ్ల వీడియో వైరల్‌ కావటంతో కొత్తగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు రావటం ప్రారంభించారు. స్వీట్లు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో చక్కెర వ్యాధి ఉన్నవారికే కాదు లేని వారికి కూడా తెలుసు. ఇప్పుడు ట్విటర్‌లో ఉన్నవారికే కాదు లేని వారికి కూడా అవెంత పని చేస్తాయో తెలుస్తోంది. వ్యాసాలు చేయలేని పనిని నాలుగు ముక్కల ట్వీట్లు చేస్తున్నాయి. అందుకే కొందరు ఎంత పని చేశావే ట్వీటూ అని నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

రైతులు పొలాల్లో విత్తనాలు- రోడ్ల మీద మోడీ ఇనుప మేకులు నాటిస్తున్నారు !
తాజా విషయానికి వస్తే రైతులు పొలాల్లో విత్తనాలు నాటుతుంటే నరేంద్రమోడీ రోడ్ల మీద మేకులు నాటిస్తున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి ఆగ్రహానికి కారణం కావటంతో వాటిని తొలగించారు. ప్రభుత్వం తోక ముడిచిందంటూ సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో లేదు లేదు, వేరే విధంగా అమర్చేందుకు తొలగించాం తప్ప మరొకటి కాదని ప్రకటించారు. ఇదిలా ఉండగా రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అంతర్జాతీయంగా పేరున్న ప్రఖ్యాత పాప్‌ గాయని, నటి రీఅనే చేసిన ట్వీట్‌ కేంద్ర ప్రభుత్వానికి కాక పుట్టించింది. రైతుల నిరసన ప్రాంతంలో ఇంటర్నెట్‌ను ఎందుకు నిలిపివేశారని కూడా ఆమె ప్రశ్నించారు. సామాజిక మాధ్యమంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనుచరులను కలిగి ఉన్న తొలి 50 మందిలో 6.5 కోట్ల మందితో మన నరేంద్రమోడీ పన్నెండవ స్ధానంలో ఉన్నారు. పది కోట్ల పది లక్షల మందితో మోడీ కంటే ఎగువన రీఆనె నాలుగవ స్ధానంలో ఉన్నారు. అందువలన ఆమె ట్వీట్‌తో రైతు ఉద్యమం గురించి ప్రపంచ వ్యాపితంగా చర్చించే వారు పెరిగారు.

పర్యావరణమే కాదు, రైతులూ నాకు ముఖ్యమే అంటున్న గ్రేటా టన్‌బెర్జ్‌ !
రీఆనె ట్వీట్‌ ఒక సంచలనం అయితే అంతకంటే స్వీడన్‌కు చెందిన 18 ఏండ్ల గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్‌ ప్రచారాన్ని మరో మలుపు తిప్పింది.ఆమె తన ట్వీట్‌తో పాటు రైతు ఉద్యమానికి సంబంధించిన సమాచారంతో ఒక కిట్‌ను కూడా తోడు చేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మండి పడింది. అంతేనా ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అయినా ఖాతరు చేయకుండా కిట్‌ను సవరించి మరో ట్వీట్‌ చేస్తూ తాను ఉద్యమానికి ప్రకటించిన మద్దతుకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసింది. విద్యార్దినిగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆమె ప్రారంభించిన సామాజిక మాధ్యమ ప్రచారం ప్రపంచనేతలను ఆకర్షించింది. అతి చిన్న వయస్సులోనే ఒక ప్రముఖ వ్యక్తిగా మారింది. 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీకి కూడా వీడియో ద్వారా ఇతర దేశాధినేతలతో పాటు తన వినతిని పంపింది. దానిలో ఇలా ఉంది.” ప్రియమైన మోడీ గారూ, వాతావరణ సంక్షోభానికి సంబంధించి మీరు చర్య తీసుకోవాలి. కేవలం దాని గురించి మాట్లాడితే చాలదు, ఎందుకంటే మీరు ఇప్పటి మాదిరే మాట్లాడుతూ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తే, పరిమితమైన విజయాల గురించి బేరమాడుతుంటే మీరు వైఫల్యం చెందుతారు. మరియు మీరు గనుక విఫలమైతే భవిష్యత్‌ మానవ చరిత్రలో మిమ్మల్ని కూడా ఒక ప్రతినాయకుడిగా చూస్తారు. మీరు దాన్ని కోరుకోవద్దు ” ఇప్పుడు అదే నరేంద్రమోడీ గారిని ఉద్దేశించి ఇంకా ట్వీట్‌ లేదా వీడియో వినతి చేయకపోయినా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించటమంటే మోడీ గారిని ఒక విధంగా నిలదీసినట్లే !
రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్లు వివాదాస్పదం గాక మందు వారి గురించి మన దేశంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యతో ఎవర్రా ఆ ఆమ్మాయిలు అని రైతులు చర్చించుకొనేట్లు చేశారు. విదేశీ యువతులకు కలిగిన స్పందన మనకెందుకు రాలేదు అని ఉద్యమం గురించి పట్టని యువతులు కొందరైనా ఆలోచిస్తున్నారు. రీఆనె ట్వీట్‌తో దిమ్మతిరిగిన కాషాయ మరుగుజ్జులు తమ సాధారణ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆమె గతంలో వెస్టీండీస్‌ క్రికెట్‌ పతాకాన్ని ప్రదర్శించిన ఫొటోను పాకిస్ధాన్‌తో పతాకంగా మార్చి సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విమర్శిస్తే ప్రతి విమర్శ చేయటం వేరు. మహిళల మాన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు పలికే కాషాయ దళం నోరు పట్టని బూతులతో ఆమె ట్వీట్లు పెడుతున్నారు. భారతీయులు ఇంత లేకిగా కూడా స్పందిస్తారా అని ప్రపంచ నోరు వెళ్లబెట్టేట్లు చేస్తున్నారు.

కంగన నోటి తుత్తర – వాతలు వేసిన తాప్పీ !
గతంలో రైతులను ఉగ్రవాదులంటూ తూలనాడిన సినిమా హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నోటి తుత్తర ట్వీట్ల రచ్చలో లేకుండా ఉంటుందా ? బూతు నటి అంటూ రీఅనెను తిట్టిపోసింది. వామపక్ష పాత్రకు ఆదర్శం అంది. ఆమె స్పందనకు అభినందనగా ఒక పాటను అంకితం చేసిన పంజాబీ గాయకుడు, రచయిత దల్జీత్‌ దోసాంజ్‌ మీద విరుచుకుపడుతూ ఖలిస్తానీ అని తిట్టిపోసింది. అంతేనా అనేక మంది క్రెకెటర్లను ఉద్దేశించి ” రజకుడి కుక్కలు ” అంటూ నోరు పారవేసుకుంది. దాంతో ట్విటర్‌ నిర్వాహకులకే సిగ్గువేసి దాన్ని తొలగించారు. మీరు ఎటువైపో (నరేంద్రమోడీకి అనుకూలమో వ్యతిరేకమో ) తేల్చుకోలేకపోతే రజకుడి కుక్క మాదిరి అటు ఇంట్లోనో ఇటు చాకిరేవు దగ్గరో కాకుండా అటూ ఇటూ తిరుగుతుంటారు అన్నది దాని అర్ధం. ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే వారి మీద దేశద్రోహ ముద్ర వేస్తున్నారు. దాంతో మనకెందుకులే నోరు మూసుకుంటే పోలా అన్నట్లు అనేక మంది మేథావులు- ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలను గుడ్లప్పగించి చూడటం తప్ప స్పందించటం లేదు. అలాంటి వారిని కూడా వారి మానాన వారిని ఉండనివ్వరు. తమకు మద్దతు ప్రకటించకపోవటం కూడా దేశద్రోహమే అని దాడి చేసే రోజులు ముందున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కంగన రనౌత్‌ ట్వీట్‌ భావమదే, ఎటూ తేల్చుకోని వారిని తూలనాడటమే. మేథావుల మౌనం ఏ సమాజానికీ మంచిది కాదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు మేథావులలో ఏటికి ఎదురీదే వారూ ఉన్నారు. చచ్చిన చేపల మాదిరి నీటి వాలున కొట్టుకుపోయే వారూ ఉంటారు. ఇలాంటి సమయాలలో ఎవరెటు ఉన్నారో జనానికి స్పష్టంగా తెలుస్తుంది.
వృత్తి వైరమో లేక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటమో తెలియదు గానీ మరో హీరోయిన్‌ తాప్సీ కంగనాను పరోక్షంగా ట్వీట్లతో ఆడుకుంది.మనం ఇతరులకు ప్రబోధం చేసే బోధకులుగా మారకూడదు అని వ్యాఖ్యానించారు. ” ఒక ట్వీట్‌ మీ ఐక్యతకు దడ పుట్టించినా, ఒక జోక్‌ లేదా ఒక ప్రదర్శన మీ మతవిశ్వాసాన్ని దడదడలాడించినా మీ విలువల వ్యవస్ధను పటిష్టపరుచుకొనేందుకు పని చేసుకోవాలి గానీ ఇతరులకు ప్రబోధించే టీచరుగా మారకూడదు ” అని తన ట్వీట్లలో పేర్కొన్నారు.

అవి నోళ్లా ? మురికి కాలువలా ?
కొందరివి నోళ్లో మురిక్కాలువలో తెలియదు, తెరిస్తే కంపు భరించలేము. రీఆనె గురించి కంగనా చేసిన ట్వీట్లో ” ఆమె ప్రత్యేకత ఏమిటంటా పాటలు పాడుతూ కెమెరా ముందు తన పిరుదులు కదిలిస్తుంది-ముందున్న…ని ప్రదర్శిస్తుంది. అంతకు మించి ఏముంది ? ఇక గ్రేటా అదొక ఎలుక, బడికి పోవాలనుకోదు, చదువంటే ద్వేషం, అంతర్జాతీయ కుట్రలో ఆమె ఒక భాగం అని పేర్కొన్నది. నేను కంగన సినిమాలను చూడలేదు కనుక ఆమె ఏమి చూపిందో తెలియదు, ఒక వేళ చూసినా ఆ స్ధాయికి దిగజారలేను.
ట్వీట్ల మీద మండిపడిన కంగన పరోక్షంగా తాప్సీని తూలనాడుతూ ” చౌకబారు వ్యక్తి, బుద్దిలేని, ఊరికే తినిపోయే రకం ” అంటూ విరుచుకుపడింది. ” అవన్నీ కొంత మంది డిఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ మౌలిక లక్షణాలు లేదా చివరికి రక్తకణాలైనా మనం ఏం చేయగలం ” అంటూ తాప్సీ బదులిచ్చింది. ఈ వివాదాన్ని గమనించిన వారిలో మీరు ” క్వీన్‌ ” అండీ అని ఒకరు తాప్సీని వర్ణించారు. ” హ హ హ అరె ఉంగరాల జుత్తు, నోరేసుకొని పడిపోవటం మాదిరి ఈ పదం ఒకరి స్వంతం కదా ” అని తాప్సీ స్పందించింది. క్వీన్‌ అనే సినిమాలో కంగన హీరోయిన్‌, ఆమెకు ఉంగరాల జుట్టు ఉన్న విషయం తెలిస్తే తాప్సీ చెప్పిందేమిటో వివరించనవసరం లేదు.
గుక్క తిప్పుకోలేని కంగన హిందీలో తిట్టిపోసింది.(తరువాత వాటిని సిగ్గుపడి లేదా మరొక కారణంతో తానే ట్విటర్‌ నుంచి తొలగించింది) ” నేను జాతీయ వేదికల మీ అమ్మను అవమానిస్తే నీ విశ్వాసం గడగడలాడుతుందే బుద్దిలేని దానా, పెంపుడు జంతువుల మాదిరి రొట్టె ముక్కల కోసం నీవు ప్రేమను చూపుతావని నాకు తెలుసు. అవి అంతకు మించి మరేమీ చెయ్యవు, నోరు మూసుకుంటే మంచిది ” అని వ్యాఖ్యానించింది. అంతటితో ఆగలేదు ” చౌకబారు వారి ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరైనా మాతృదేశం మీద కుటుంబం మీద విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అది మన పెద్ద బాధ్యత, దేశానికి భారం కావద్దు, అందుకే అలాంటి వారిని నేను చౌకబారు అని పిలుస్తాను… ఇలాంటి ఊరికే తినే రకాలను పట్టించుకోవద్దు ” అని కూడా సెలవిచ్చింది.
ఒక సారి ఎవరైనా ప్రజా జీవితంలో వ్యాఖ్యానించటం మొదలు పెట్టిన తరువాత మిగతావారికీ స్పందించే హక్కుంది. రాణికి ఎదురు దెబ్బ తగిలింది అంటూ పరోక్షంగా కంగన గురించి మరో నటి కుబ్రా సేథ్‌ ట్వీట్‌ చేసింది. గతేడాది కుబ్రా చేసిన ట్వీట్‌ మీద ఆగ్రహించిన కంగనా ఆమెను తన జాబితాలో లేకుండా నిలిపివేసింది. ముంబై పర్యటన సమయంలో కేంద్ర ప్రభుత్వం కంగనకు వై ప్లస్‌ తరగతిలో భద్రతా సిబ్బందిని కేటాయించిన విషయం తెలిసిందే. దాని మీద స్పందిస్తూ వేరే ఏమీ లేదు నేను చెల్లించిన పన్ను నుంచి అందుకోసం ఏమైనా ఖర్చు చేస్తున్నారా అని తనిఖీ చేస్తున్నా అంటూ కుబ్రా సేథ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.

సినిమాల్లో నిషేధించినా సరే మద్దతు ప్రకటిస్తా అంటున్న అమందా !
అమందా చెర్నీ అనే హాలీవుడ్‌ నటి కూడా రైతులకు మద్దతుగా ట్వీట్‌ చేసింది. అలా చేసినందుకు నేను క్షమాపణ చెప్పను. మీరు సినిమాలను అభిమానించండి. కనీస మానవ హక్కుల అవసరం గురించి గళమెత్తినందుకు గాను బాలీవుడ్‌ (హిందీ) నిషేధించాలనుకుంటే నన్ను సినిమాల్లో చూడలేరు అని ఊహించుకోగలను.తన మద్దతును పునరుద్ఘాటిస్తూ మరో ట్వీట్‌ చేసింది. అంతే కాదు భారత్‌ను నాశనం చేసేందుకు డబ్బు తీసుకొని కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ మీద మండి పడింది.రీఆనె చేసిన ట్వీట్లకు సొమ్ము పుచ్చుకుందన్న ఆరోపణలను తిప్పికొట్టింది. ఆమె ఇప్పటికే ధనవంతురాలు, మీరు చెబుతున్నజాబితాలోని వారందరికీ సొమ్ము చెల్లించినట్లయితే నేను కూడా సమాచారం వెల్లడించేందుకు డబ్బు తీసుకొనేందుకు సిద్దమే, వెంటనే అందుకు ఏర్పాట్లు చేయండి అని ట్వీటింది. అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రైతుల ఉద్యమ స్ధలంలో ఉన్న ఒక వృద్దురాలి ఫొటోను షేర్‌ (పంచటం) చేస్తూ సమస్యను అర్ధం చేసుకోవటానికి మీరు ఇండియన్‌, పంజాబీ లేదా దక్షిణ ఆసియన్‌ అయి ఉండనవసరం లేదు. మీరంతా మానవత్వాన్ని పట్టించుకోండి. పౌర హక్కులు, సమానత్వం, కార్మికులకు గౌరవం,మరియు కనీస మానవ హక్కుల కోసం భావ ప్రకటనా, పత్రికా స్వేచ్చను డిమాండ్‌ చేయండి అని అమందా పేర్కొన్నది.
రైతు ఉద్యమానికి మద్దతుగా రీఆనె చేసిన ట్వీట్ల మీద దేశంలో కాషాయ మరుగుజ్జు దళాలు దాడి చేస్తుంటే ట్విటర్‌ సిఇఓ జాక్‌ డోర్సే ప్రశంసించటం కొసమెరుపు. వాషింగ్టన్‌ పోస్టు జర్నలిస్టు కరేన్‌ అటియా దీని గురించి రాస్తూ గతంలో సూడాన్‌, నైజీరియా, ఇప్పుడు భారత్‌, మయన్మార్‌లో సామాజిక న్యాయ ఉద్యమాల గురించి రీఆనె స్పందించారని, నిజమైన కార్యకర్త అని ఆమె పేర్కొన్నారు. రైతుల ఉద్యమం చారిత్రాత్మక అంతర్జాతీయ నిరసనగా మారినందున దానికి సూచికగా ఒక ఎమోజీ (చిత్రాన్ని) రూపొందించాలని ట్విటర్‌ యాజమాన్యాన్ని కోరారు.

అక్షయ కుమార్‌ ఇప్పుడు భారతీయుడే కాదు ! ట్వీట్‌కు డబ్బు తీసుకున్నాడా ?
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తొలిసారిగా రైతుల ఉద్యమం మీద స్పందించారు. కొద్ది రోజుల క్రితం దాని మీద మీ వైఖరి ఏమిటని మీడియా వెంటపడింది. ” మంచి పని తప్పకుండా చేయాలి. అత్యంత సరైన పని చేయాలి. అత్యంత మహత్తరమైన దానిని చేయాలి” అని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అటో ఇటో తెలియకుండా ఉంది అని చెప్పవచ్చు. దీని మీద కూడా కంగన్‌ స్పందిస్తారేమో తెలియదు.
ప్రభుత్వానికి మద్దతుగా రైతులకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటులు అక్షయ కుమార్‌, అజయ దేవగన్‌, కరణ్‌ జోహార్‌, సునీల్‌ షెట్టి వంటి వారు రీఆనె ట్వీట్ల మీద ద్వజమెత్తారు. అక్షయ కుమార్‌ ఇప్పుడు అసలు భారతీయుడు కాదు, కెనడా పౌరుడు, మన అంతర్గత వ్యవహారాల మీద అతనికి పనేమిటి ? సినిమాల్లో నటించినందుకు పారితోషికం తీసుకున్నట్లుగానే ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు, ప్రకటన చేసినందుకు డబ్బు తీసుకుంటున్నాడా ? ఇలాంటి వారు ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన ప్రకటనను సినీ రంగానికి చెందిన తాప్సీ పన్ను, స్వర భాస్కర్‌, సోనాక్షి సిన్హా, ఓనిర్‌, అర్జున్‌ మాధుర్‌ వంటి వారు ఖండించారు.

మన చేస్తే సంసారం -ఇతరులు చేస్తే మరొకటా ! అసలు మనం మడి కట్టుకున్నామా !
మన అంతర్గత విషయాల మీద స్పందించటానికి బయటి వారెవరు అని జాతీయ ఉన్మాదాన్ని రేపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. మీడియా తన రేటింగ్‌ పెంచుకొనేందుకు పూనుకుంది. రైతు ఉద్యమాన్ని అంతర్జాతీయం గావించింది ప్రభుత్వమూ, బిజెపి అన్నది తెలిసిందే. దీని వెనుక విదేశాల్లోని ఖలిస్తానీ సంస్ధలు ఉన్నాయని ఆరోపించింది తొలుత బిజెపి నేతలే కదా ! మన అంతర్గత విషయాల గురించి విదేశాలు, విదేశీయుల కెందుకు అన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నారు. లక్ష ట్రాక్టర్లతో ప్రపంచంలో ఏదేశ రాజధానిలో అయినా రైతులు ప్రదర్శన జరిపారా ? అది ఢిల్లీలో జరిగింది, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించకుండా ఎలా ఉంటుంది.అమెరికా ఎన్నికలకు ముందు మన ప్రధాని నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమం పేరుతో హూస్టన్‌ నగరంలో ఏర్పాటు చేసిన సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రకటించటం అమెరికా ఎన్నికలు, అంతర్గత వ్యహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా ? ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు అప్పుడు నరేంద్రమోడీ చేసింది తప్పని ఎందుకు చెప్పలేకపోయారు ?
హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో ఐక్యరాజ్యసమితి వేదిక మీద మన ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. అంతెందుకు తాజాగా పక్కనే ఉన్న మయన్మార్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం. మరి మన విదేశాంగ శాఖ ఆందోళన ప్రకటిస్తూ ప్రకటన ఎందుకు చేసినట్లు ? అక్కడేం జరిగితే మనకేంటి ?
చైనాలో అంతర్భాగం టిబెట్‌. అక్కడ ఉంటున్న మతాధికారి దలైలామా చైనా సర్కారు మీద తిరుగుబాటు చేశాడు.పారిపోయి మనదేశం వస్తే మనం ఎందుకు ఆశ్రయం కల్పించినట్లు ? ఒక్క ఆశ్రయమేనా ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చామా లేదా ? గత ఆరు దశాబ్దాలుగా దలైలామా, అతగాడి పరివారాన్ని పోషిస్తున్నామా లేదా ? ఇది చైనా అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టటం కాదా ?

మన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు జోక్యం కాదా ?
వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలు మన అంతర్గత విషయాలు అనుకుందాం కాసేపు. వాటి మీద ఇంత ఆందోళన, రచ్చ జరుగుతున్న సమయంలో వాటికి తాము మద్దతు ఇస్తున్నట్లు అమెరికా ఎందుకు ప్రకటించింది. ఇది ప్రభుత్వ అనుకూల జోక్యం కాదా ? దీనికి మోడీ సర్కార్‌ ఏ రూపంలో ప్రతిఫలం చెల్లించినట్లు ? ఇదే ప్రకటన గతేడాది ఆర్డినెన్స్‌ ద్వారా సవరణలు తెచ్చినపుడు వెంటనే అమెరికా ఆ విధంగా స్పందించి ఉంటే అదొక దారి. మరి ఇప్పుడెందుకు ప్రకటించినట్లు ? రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రకటన కాదా ? ఒక వేళ జోక్యంగా పరిగణిస్తే దాన్ని మన ప్రభుత్వం, కంగనా రనౌత్‌, సచిన్‌ టెండూల్కర్‌, సామాజిక మాధ్యమ మరుగుజ్జులు కానీ ఎందుకు ఖండించటం లేదు. మనం తీసుకున్న చర్యలు దేశ మార్కెట్ల సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయని, ప్రయివేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాయని అమెరికా ఆహ్వానించింది అని మన విదేశాంగ శాఖ ప్రతినిధి సమర్ధించారు. ఒక్క అమెరికానే కాదు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద కూడా వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించింది. దానికేం పని ? అది జోక్యం కాదా ?

రైతులకు మద్దతు తప్ప మోడీ సర్కార్‌ను కూల్చాలని ఎవరూ చెప్పలేదే !
అమెరికా చేసిన వ్యాఖ్యలను మొత్తంగా చూడాలి తప్ప విడి విడిగా చూడకూడని మన విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇదే వైఖరిని రైతులకు మద్దతు ప్రకటించిన వారి విషయంలో ఎందుకు చూడటం లేదు ? వారు కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణ్యంగానే రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు తప్ప మోడీ సర్కార్‌ను కూల్చివేయాలని రెచ్చగొట్టలేదే ? దాన్ని కూడా సహించరా ? ఆ మాటకు వస్తే అనేక మంది అమెరికా పార్లమెంటు సభ్యులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా రైతుల ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ? ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని మీనా హారిస్‌ వ్యాఖ్యానించారు. ఇంతకంటే మోడీ సర్కార్‌కు అవమానం మరేమి ఉంటుంది ? మరి వారి మీద కూడా కేసులు పెడతారా ?
అమెరికా ప్రభుత్వం ఏమి చెప్పింది ? విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతియుత నిరసన ప్రజాస్వామ్యానికి ప్రామాణికమని చెప్పింది. ఇది జోక్యం కాదా ? ఎలా పరిష్కరించుకోవాలో వారు చెప్పకపోతే మన నరేంద్రమోడీకి తెలియదా ? మోడీ నాయకత్వం కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని బిజెపి వారు చెబుతారు, అలాంటపుడు అమెరికాతో, అదీ తాను వ్యతిరేకించిన జో బైడెన్‌ యంత్రాంగంతో చెప్పించుకోవటం ఏమిటి ? ఇంతవరకు మోడీ స్వయంగా చర్చలకు పూనుకోలేదని ఎత్తిపొడవటంగా ఆ ప్రకటనను చూడాలా ?
ట్వీట్లు చేసిన వారు జత చేసి కిట్‌ ఎక్కడ తయారైందో తెలుసుకొనేందుకు కేసు పెట్టామని, కెనడా, అమెరికా సాయం కోరుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదంతా సమస్యను పక్కదారి పట్టించే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఎర్రకోట వద్ద ఒక మత జెండాను ఎగురవేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించిన నరేంద్రమోడీ పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు, అందుకు బాధ్యులైన వ్యక్తులను పట్టుకోవాల్సిన పోలీసులు దానికి బదులు రోడ్ల మీద మేకులు కొడుతూ కూర్చున్నారు. అలాంటి వారు మరింతగా ఈ సమస్యను రచ్చ చేసి ప్రపంచ మీడియాలో గబ్బు పట్టటం తప్ప బార్బడోస్‌, స్వీడన్‌, ఇతర దేశాలకు చెందిన వారి ట్వీట్ల మీద తీసుకొనే చర్యలేమిటి ? సాధించేదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచంలో అరుదైన రైతుల ప్రదర్శన

02 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Delhi farmers agitation, Farmers agitations, unique farmers tractors rally


డాక్టర్‌ కొల్లారాజమోహన్‌

రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్స్‌ పెరేడ్‌ లో లక్షకు పైగా ట్రాక్టర్లతో , అంతకుమించిన సంఖ్యలో రైతులు ప్రశాంతంగా పాల్గొని అపూర్వ ప్రదర్శన చేశారు. రైతువ్యతిరేక చట్టాలను రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ నగర వీధులలో కదం తొక్కారు. ఢిల్లీ నగరవాసులు ఈ అపూర్వ ప్రదర్శనకు సంఘీభావంగా పూలవర్షం కురిపించారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పటినుండీ పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌, రాజస్ధాన్‌, బీహార్‌ లలో తీవ్ర స్ధాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఉద్యమం ఏఒక్క రైతు సంఘమో లేక ఏ ఒక్కరి నాయకత్వం కాకుండా 500 రైతుసంఘాలన్నీ సమైక్యంగా పోరాడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో ఎముకలు కొరికే చలి ని ఎదుర్కొంటూ, రోడ్డు పై గుడారాలలో 2 నెలలుగా చేస్తున్నఆందోళనను ప్రభుత్వం ఆలకించనందున, ప్రభుత్వం పై వత్తిడి తేవటానికి రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో మహా ప్రదర్శన తలపెట్టారు. ఈ మహా ప్రదర్శనను విఫలం చేయడానికి, ఉద్యమాన్ని విచ్చిన్నం చేయటానికి ప్రభుత్వం పన్నిన కుట్రలను కుతంత్రాలను రైతాంగం అడుగడుగునా తిప్పికొట్టింది. జనవరి 26 న వివిధ రాష్ట్రాల రాజధానులలో, జిల్లా కేంద్రాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి.

రిపబ్లిక్‌ డే ట్రాక్టర్స్‌ పెరేడ్‌ ను అప్రతిష్టపాలు చేయటానికి ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనకు చాలా ఎక్కువ ప్రచారంచేశారు. ట్రాక్టర్లను సామూహిక విధ్వంస ఆయుధాలుగా ”టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా” పత్రిక చిత్రించింది. ట్రాక్టర్‌ లు ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదు. రోడ్లను ధ్వంసం చేయలేదు. ప్రభుత్వ సంస్ధలను, ప్రైవేటు సంస్ధలను ఎక్కడా తాకలేదు. అల్లర్లను, భయోత్పాతాన్ని స ష్టించలేదు. పౌరుల ఆస్దులను ధ్వంసం చేయలేదు. దొంగిలించలేదు. అనుమతించిన మార్గాలలో కూడా రైతులు ఢిల్లీ లోకి రాకుండా బారికేడ్డ్లను ఎందుకు పెట్టారు ?. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్డ్లను తొలగించటానికి ట్రాక్టర్లను ఉపయోగించారు. వారు హింసాత్మకంగా వుంటే ప్రజలు పువ్వులతో స్వాగతించేవారా ?

దీప్‌ సింగ్‌ సిధ్దు ఎవరు?
రిపబ్లిక్‌ డే ట్రాక్టర్స్‌ పెరేడ్‌ ను అప్రతిష్టపాలు చేయాలని ఫ్రభుత్వం ప్రయత్నించింది. సినీ నటుడు, గాయకుడు ఐన దీప్‌ సింగ్‌ సిద్దును సాధనంగా ఎన్నుకున్నారు. బీజేపీ యమ్‌ పీ. సన్నీ డయోల్‌ కి దీపు సిద్దు సన్నిహితుడు. 2019 ఎన్నికలలో సన్నీ డయోల్‌ గెలుపు కోసం క షిచేశాడు. ప్రధానమంత్రి మోడీ గారితో ఫొటోలు దిగేటంత సాన్నిహిత్యం వుంది. ”ఆందోళనకారులను రెచ్చగొట్టి దారి తప్పించి ఎర్రకోట వైపు నడిపించాడు ” అని హర్యానా బీకేయూ నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ ఛాదుని అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి సన్నిహితుడైన బీజేపీ సభ్యుడొకరు ఏజెంట్‌ ప్రొవోకేటర్‌ గా ఎర్రకోట వద్ద అల్లర్లను రెచ్చగొట్తున్న వార్తను పరిశీలించమని ఉదయం 10 గంటలకే ట్విట్టర్‌ లో రాజ్యసభసభ్యులు శ్రీ సుబ్రమణ్యస్వామి గారు పేర్కొన్నారు.

రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పూర్తయిన తరువాత రైతుల ట్రాక్టర్‌ రాలీ ప్రారంభంకావాలని రైతు సంఘాలన్నీ అంగీకరించాయి. మార్గాన్ని కూడా నిర్దేశించాయి. సింఘూ సరిహద్దు వద్ద నుండి నిర్దేశించిన సమయానికన్నా ముందే, ఉదయం 8గంటలకే దీప్‌ సింగ్‌ సిద్దూనాయకత్వాన ఒక చిన్న బ ందం బయల్దేరింది. నిర్దేశించిన మార్గాన్ని వదిలేసి ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. కిసాన్‌ సంయుక్త కమిటీ వద్దని నివారించినా వారిమాటను వినలేదు.ఎర్రకోట వైపు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ముందురాత్రే తెలుసు. అయినాపోలీసులు వారిని నివారించే ప్రయత్నాలు చేయలేదని యోగేంద్రయాదవ్‌ తెలిపారు. రైతుల ట్రాక్టర్‌ రాలీలకు అడుగడుగునా అడ్డంకులను సృష్టించిన పోలీసులు దీపు సిద్దూ బ ందానికి ఎర్రకోటకు దారి చూపారు. ట్రాఫిక్‌ అంతరాయాలు లేకుండా ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. జాతీయ జెండాకు దగ్గరలో ఒక మతానికి చెందిన నిషాన్‌ జెండాను ఎర్రకోటపై ఎగరేశారు.టీవీ ఛానల్స్‌ జెండా ఎగరవేసిన ఘటనను పదే పదే చూపించాయి. ఈ ఘటన జరిగే సమయంలో అక్కడనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మిలిటరీ, పారామిలిటరీ దళాల నిరంతర పర్యవేక్షణ క్రింద వుండే ఎర్రకోటను ఎక్కి, ఒక జెండాను ఎగరవేయటానికి ముందే అనుమతిని పొందారా ? లేక ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలా చేశారా? అనేది చర్చనీయాంశం. వారి తప్పు లేకపోయినా రైతుసంఘాల సమన్వయ సమితి నైతిక బాధ్యత వహించింది. ఎర్రకోట సంఘటన మినహాయించి మరెక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదన్న సంగతి గుర్తించాలి.

మంచి నీరు, కరెంటు, ఇంటర్నెట్‌, ట్విట్టర్‌ అకౌంట్లను ఆపేశారు. కర్రలతో, రాళ్ళతో దాడులు చేసినా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ల పెరేడ్‌ విజయవంతం కావటం ఒక చారిత్రాత్మక ఘటన. రైతాంగ ఆందోళనను అప్రతిష్ట పరచటానికి ఎర్రకోట ఘటనను సాకుగా ఛూపించిన మీడియా కొంతమందిని గందరగోళపరచగల్గింది. త్రివర్ణ పతాకాన్ని తొలగించారనే తప్పుడు వార్తలు కూడా ప్రచారమయ్యాయి. లక్షలాదిమంది రైతుల ప్రదర్శనను మీడియా చూపలేదు. సోషల్‌ మీడియా ద్వారా రైతులు కొన్నివార్తలనందుకున్నారు. క్రమశిక్షణ తో విజయవంతంగా చేసిన రైతుల ప్రదర్శనను చూసి కేంద్ర ప్రభుత్వ కళ్ళు తిరిగాయి. చర్చలకు స్వస్తిచెప్పి సామ దాన బేధ దండోపాయాలలో చివరి అస్త్రాన్ని ఉపయోగించ పూనుకున్నారు. దాడులు, అరెస్టులు, కేసులు మొదలుపెట్టారు. శిబిరాలలో ఉన్నవారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తున్నారు.రైతు ఉద్యమకారుల శిబిరాలపై దాడులు చేసి గుడారాలను ధ్వంసం చేస్తున్నారు. సైనికుల కవాతులను నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులను భయభ్రాంతులను చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఎర్రకోటవద్ద జరిగిన ఘటనలపై 44 మంది రైతు నాయకులపై దేశద్రోహ కేసులను బనాయించారు. రైతులు నివసిస్తున్న సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఆపేశారు. మంచి నీటి వాహనాలను కూడాఆపేశారు. అర్ధరాత్రిలోగా ఖాళీచేయాలంటూ అల్టిమేటంను ప్రభుత్వ అధికారులు జారీ చేశారు. అక్కడినుండి వెళ్ళిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించాడు.ప్రజలు గుమికూడకుండా సెక్షన్‌ 144 విధించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారు. మూడు సరిహద్దుప్రాంతాలలో ఇంటర్నేట్‌ ను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆపేసింది. రైతులు సమాచారాలను పంచుకోవటానికి వీలులేకుండా ఇంటర్నెట్‌ కట్‌ చేశారు. ప్రవాహంగా వస్తున్న రైతులు రాకుండా సింఘూ వద్ద ప్రభుత్వం బారికేడ్లతోపాటు ముళ్ళకంచె వేసి తాత్కాలికంగా గోడను నిర్మిస్తున్నారు.ప్రజలు అందోళనా ప్రాంతాలకు రాకుండా రైళ్లను దారి మళ్ళించారు. రైతులను, జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారు.

స్ధానికుల పేరున గూండాల దాడి- బీబీసీ ప్రత్యక్ష కధనం.

స్ధానికుల పేరున కొంతమంది వాహనాలలో తరలివస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీసుల కళ్ళముందే గుడారాలను పీకేస్తుంటే నివారించటానికి ప్రయత్నించలేదు. పైగా రైతులపై లాఠీఛార్జి చేశారు. స్ధానికుల పేరున వచ్చిన బీజేపీ కార్యకర్తలు రాళ్ళతోనూ కర్రలతోనూ రైతులపై దాడిచేశారు. రైతులు వారి ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రతిఘటించారు. అయినా నాయకుల మాటలు విని ప్రశాంతంగా దెబ్బలు తిన్నారు. ఆందోళనను ఎట్టిపరిస్ధితులలోనూ విరమించేది లేదని తేలిó చెప్పారు.

. సింఘూ ప్రాంతాన్ని సందర్శించిన బీబీసీ ప్రతినిధి దిలీప్‌ సింగ్‌ టిక్రీ గ్రామస్ధులతో మాట్లాడాడు. ” మరి వాళ్ళు నిజంగా స్దానికులేనా? అని అడిగితే .. ఈ రోజు వచ్చిన వాళ్ళంతా బీజేపీ పంపించిన గూండాలే” అని గ్రామస్ధులు చెప్పారు. ” ఉద్యమం శాంతియుతంగా సాగుతోంది. క్రమశిక్షణతో సాగుతోంది. స్ధానికులు వ్యతిరేకిస్తున్నారనేది అబద్ధం. టిక్రీ గ్రామ పంచాయితీ ప్రజలందరూ వచ్చి మద్దతు ప్రకటించి వెళ్ళారు.ఏది అవసరమయినా మేమున్నామని టిక్రీ గ్రామంరైతులు హామీ ఇచ్చి వెళ్ళారు. ఇప్పటికి 51 వేల రూపాయలు విరాళంఇచ్చారు. ఇంకా పాలు, లస్సీ ,డబ్బులు, ఏది కావాలన్నా సేకరించి ఇస్తామన్నారు. చుట్టుపక్కలగ్రామాల ప్రజలకు ఈ ధర్నాతో ఎలాంటి సమస్యా లేదు. తాము పస్తులుండైనా సరే ,రోడ్డుపక్కన పూరిగుడెసెలలో వుండే పేదలకు మూడుపూటలా అన్నందొరికేలా చూస్తున్నారు.ఈ నల్లచట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ రైతులు వెనక్కి వెళ్ళరు. మేంకూడా వెనక్కి వెళ్ళేదిలేదు.” అని ఒక పెద్దాయన చెప్పాడు. ” నేను రైతు బిడ్డను. కొందరు జాతీయజెండాలను పట్టుకు రావటం కనిపించింది.ఇందులో మాప్రాంతం వారు ఎవరున్నారో చూద్దామని అక్కడకు వెళ్ళాను. అక్కడ బీజేపీ కార్యకర్త గజేంద్రసింగ్‌ కన్పించాడు. నీకు సిగ్గు అనిపించటంలేదా నువ్వు ఈ ప్రాంతం వాడివికూడాకాదు,ద్వారకా వాడివి, రైతువి కాదు , ప్రాపర్టీ డీలర్‌ వి కదా? చెడగొట్టటానికే వచ్చావా? అని అతనిని మందలించాను.అంతలో ఒక యువకుడు నేను గేవ్రా గ్రామంవాడినన్నాడు..అబద్ధం చెప్పకు ఈప్రాంతంలో ప్రతి ఒక్కవ్యక్తీ నాకు తెలుసు అన్నాను.ఈ ప్రాంతం వాళ్ళు ఒక్కళ్ళుకూడాలేరు. ఉంటే చూపండి అని సవాల్‌ చేశాను.ఈ మోసాలు సాగవు. మేం సహించము అని హెచ్చరించాను” అని ఒక స్థానిక రైతు చెప్పాడు. మరొక మహిళ ఇలా చెప్పింది,”ఎవరికీ ఏసమస్యాలేదు. ఉద్యమంవలన ఎవరూ ఇబ్బందిపడటంలేదు. ఇక్కడ టిక్రీ, లేకారాం పార్క్‌,మమా చౌక్‌, చోటూరామ్‌ నగర్‌,గ్రామాలన్నీ మార్కెట్‌ కోసం ఇక్కడికే వస్తురీంటారు. కానీ ఈ గ్రామాలలో ఎవరికీ ఇబ్బందిలేదు” అని ఆమెచెప్పింది

ఘాజీపూర్‌ బోర్డర్‌ -బీ బీ సీ. వార్త
ఘాజీపూర్‌ బోర్డర్‌ లో ధర్నా ఎలా కొనసాగుతోందో బీబీసీ ప్రతినిది సమీర్‌ ఆత్మ మిశ్రా ఇలా వివరించారు.
” గురువారం ఘాజీపూర్‌ బోర్డర్‌ లో రైతులను ఖాళీ చేయించటానికి అధికారయంత్రాంగం ప్రయత్నించింది. రాకేష్‌ తికాయత్‌ పైకేసు నమోదయంది. అరెస్టుకావటానికి కూడా తయారయ్యారు.” స్ధానికులపేరున కొంతమందిని తెచ్చి ఖాళీచేయించ ప్రయత్నంపై తికాయత్‌ ఆవేదన పొందారు. మంచినీటిని కూడా ఆపేశారు. దానికి స్పందనగా రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ”మావూరునుండి మంచినీరు వచ్చిందాకా మంచినీరు ముట్టనని ” శపధం చేసి, నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పటికపుడు మహాపంచాయత్‌ నిర్వహణకు పిలుపునిచ్చారు. ముజఫర్పూర్‌ లో రైతు సంఘాల నేతలు రైతులతో మహా పంచాయతీ నిర్వహించారు. ఢిల్లీకి 150 కి మీ దూరంలో వున్న ఈ ప్రాంతం రైతాంగఉద్యమాలకు పెట్టని కోట. రైతునేత మహేంద్ర తికాయత్‌ స్వస్ధలం సిసోలీ గ్రామం. మహేంద్రతికాయత్‌ కుమారుడు నరేష్‌ తికాయత్‌ బీకేయూకి అధ్యక్షుడిగా వున్నాడు. రాకేష్‌ తికాయత్‌ మరొక కుమారుడు. ఇద్దరూ ప్రస్తుతం రైతు ఉద్యమంలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ కి నాయకత్వం వహిస్తున్నారు.ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని మహా పంచాయత్‌ నిర్ణయం తీసుకున్నది. మీరట్‌, షామ్లీ, షాహన్పూర్‌ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ల లోని రైతులందరూ ఘాజీపూర్‌ సరిహద్దు లో జరుగుతున్న ధర్నా లో ఇక పై ప్రతిరోజూ పాల్గొనాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని, ప్రతి ఇంటినుంచీ ధర్నాలో పాల్గోవాలని నిర?యమైంది. ధర్నా ముగిసిపోయినట్లు కనిపించిన స్ధలం ప్రజలతో కిటకిట లాడుతోంది. నినాదాలతో హౌరెత్తిపోతోంది.ప్రధాన రోడ్డులకు అడ్డంగా బస్సులు నిలిపారు. పోలీసులకు ఇనుప లాఠీలను సరఫరా చేస్తున్నారు. అయినా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ ల తోపాటుగా ఉత్తరప్రదేశ్‌ రైతులు తికాయత్‌ సోదరుల నాయకత్వాన ఉద్యమం లోకి ఉరుకుతున్నారు. పంజాబ్‌- హర్యానా లనుంచి ప్రయాణించే పంజాబ్‌ మెయిల్‌ తో సహా రెండు రైళ్ళను దారి మళ్ళించారు.

అధికారుల వేధింపులకు, నిర్భంధాలకు నిరసనగా , కనీస మద్దతు ధర కావాలనీ, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ దేశవ్యాప్తంగా ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలనుండి 3 గంటలవరకు రహదారులను దిగÄంధించాలని రైతుసంఘాల సమన్వయ సంఘం పిలిపునిచ్చింది. ప్రజలందరూ పాల్గొన ప్రార్ధన.
వ్యాసరచయిత డాక్టర్‌ కొల్లారాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బడ్జెట్‌ పదనిసలు1: కేంద్ర సెస్‌ల మోత – రాష్ట్రాల నిధుల కోత !

02 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

cesses, India budget 2021-22, state finances, surcharges


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తన మూడవ, దేశ వందవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెన్‌ను చూస్తే ఆరునెల్లు సాము గరిడీలు నేర్చుకొని పాతకుండలు పగలగొట్టారన్న సామెత గుర్తుకు వచ్చింది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు క్రియాశీల బడ్జెట్‌ అని వర్ణించారు.గతంలో ప్రతి ప్రధాని ప్రతి బడ్జెట్‌ను ఇలాగే పొగిడిన స్వంత డబ్బాల గురించి వేరే చెప్పనవసరం లేదు. గత బడ్జెట్‌ రూ.34,50,305 కోట్లుగా సవరిస్తే తాజా బడ్జెట్‌ను రూ.34,83,236 కోట్లతో ప్రతిపాదించారు. తేడా రూ.32,931 కోట్లు.విపరీతం గాకపోతే ఈ మాత్రానికి అంత ఆయాసపడాలా ?


బడ్జెట్‌లో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఈ బడ్జెట్‌లో కొట్ట వచ్చినట్లు కనిపించిన ఒక అంశానికి పరిమితం అవుదాం. కోవిడ్‌ సెస్‌ వేస్తారని బడ్జెట్‌కు ముందు వచ్చిన ఊహాగానాలకు తెరదించి కొత్త సెస్‌లను ముందుకు తెచ్చారు. అనేక పధకాలకు ప్రధాని అని తగిలించారు గనుక వీటికి కూడా ప్రధాని లేదా మోడీ సెస్‌లని పెట్టి ఉంటే అతికినట్లు ఉండేది. జనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు పెట్రోలు మీద లీటరుకు రూ.2.50, డీజిల్‌ మీద రూ.4.00ల కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ విధించారు. నిర్మలమ్మ చెప్పినట్లు ఈ మాత్రం దానికి అంత మల్లగుల్లాలు పడాలా ? ఇలాగే బంగారం దిగుమతుల మీద కస్టమ్స్‌ సుంకాన్ని పన్నెండు నుంచి ఏడు శాతానికి తగ్గించి రెండున్నరశాతం సెస్‌ విధించారు. ఇలాగే మద్యం మరికొన్నింటి మీద ఇలాంటి కసరత్తే చేశారు. వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం పడదు. అని చెబుతున్నారు. అసలు పెంచిన పన్నులు తగ్గించటమే చిల్లి కాదు తూటు అన్నట్లు కొత్త పేరుతో అవే భారాలను కొనసాగిస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ఎందుకు తీసుకున్నట్లు ? పనీపాటాలేక ఇలాంటి పిచ్చిపని చేస్తున్నారా ?


కానే కాదు, కేంద్ర ప్రభుత్వ తెలివి, ఇంకా చెప్పాలంటే అతి తెలివితో రాష్ట్రాలకు శఠగోపం పెట్టే వ్యవహారం. ఎలా ? దీని గురించి చెప్పుకోబోయే ముందు కేంద్ర ప్రభుత్వం కాశ్మీరుకు మాత్రమే వర్తించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి తన దుశ్చర్యను బయటపెట్టుకుంది. నిజానికి దాని బదులు ఆర్టికల్‌ 270ని రద్దు లేదా రాష్ట్రాల కోరికలకు అనుగుణంగా సవరించి ఉంటే అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అభినందించి ఉండేవి. సదరు ఆర్టికల్‌లో కేంద్రం-రాష్ట్రాలు పంచుకోవాల్సిన పన్నుల జాబితా ఉంది. వాటిలో సెస్‌లు, సర్‌ఛార్జీలు లేవు. అందువలన ఆ పేరుతో పన్ను విధిస్తే మోడీ భక్తులతో సహా జనం అందరి జేబులు ఖాళీ అవుతాయి గాని రాష్ట్రాలకు వాటిలో వాటా ఇవ్వనవసరం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని గతంలో కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించిన రాష్ట్రాల వ్యతిరేక చర్యను ఇప్పుడు బిజెపి ఏలికలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు.

రాష్ట్రాలలో స్ధానిక సంస్ధలు పన్నులతో పాటు గ్రంధాలయ సెస్‌ను వసూలు చేస్తాయి. ఎందుకు ? గ్రంధాలయాలను ఏర్పాటు చేసి జనానికి పత్రికలు, పుస్తకాలను అందుబాటులోకి తేవటానికి. తెలంగాణాలో గత ఏడు సంవత్సరాలుగా ఆ సెస్‌ మొత్తాలతో ఒక్క పుస్తకమూ కొనలేదని పుస్తక ప్రచురణకర్తలు గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌తో మొరపెట్టుకున్నారు. అంటే సదరు మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. ఇదే పని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఖాతాల లావాదేవీలను తనిఖీ చేయగా 2018-19లో వసూలు చేసిన సెస్‌ మొత్తంలో 40శాతం మొత్తాన్ని దేనికోసం వసూలు చేస్తున్నారో దానికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ ఖాతాకు మరలించుకుంటున్నట్లు తేలింది. ఇదీ చట్టవ్యతిరేకమే. సెస్‌ అంటే పన్ను మీద విధించే పన్ను. సర్‌ఛార్జీ కూడా ఇలాంటిదే.2018వరకు కేంద్ర ఇలాంటివి 42సెస్‌లను విధించింది. తరువాత మరికొన్నింటిని జత చేసింది. తొలి సెస్‌ అగ్గిపెట్టెల మీద తరువాత ఉప్పు మీద కూడా విధించారు. అంటే ఆయా పరిశ్రమల అభివృద్ధితో పాటు కొన్ని రంగాలలో పని చేసే కార్మిక సంక్షేమానికి కూడా కొన్ని సెస్‌లను విధిస్తున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని తెచ్చిన తరువాత సెస్‌లన్నీ దానిలో కలసిపోయాయి.ప్రస్తుతం 35వరకు ఉన్నాయి. వాటిలో ఎగుమతులు, ముడిచమురు, ఆరోగ్యం-విద్య, రోడ్డు మరియు మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం, జాతీయ విపత్తు, పొగాకు, దాని ఉత్పత్తులు, జిఎస్‌టి పరిహార సెస్‌, ఆరోగ్య పరికరాల సెస్‌, తాజాగా బడ్జెట్‌లో ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల వంటివి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2013లో ” చట్ట విధాన నిమిత్త కేంద్రం పేరుతో- విధి ” అనే లాభాలతో నిమిత్తం లేని ఒక మేథో కంపెనీని ఏర్పాటు చేసింది. అది తయారు చేసి పదిహేనవ ఆర్ధిక సంఘానికి ఇచ్చిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 వరకు మొత్తం కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌ మరియు సర్‌ఛార్జీల మొత్తం 7-2శాతాల నుంచి 11.9-6.4శాతాలకు పెరిగాయి. 2002 తరువాత అప్పటికి ఇవి గరిష్ట మొత్తాలు. నగదు మొత్తాలలో చెప్పాలంటే 2017-18 నుంచి 2018-19 మధ్య సెస్‌ మొత్తం 2.2(11.1శాతం) లక్షల రూపాయల నుంచి రూ.2.7లక్షలకు, సర్‌ఛార్జీ రూ.99,049(5శాతం) నుంచి రూ.1.4లక్షలకు పెరిగింది.1980-81 కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేవలం 2.3శాతం మాత్రమే ఉండేది.


సెస్‌లు, సర్‌ఛార్జీలు పెరుగుతున్న కారణంగా తమ నిధుల వాటా తగ్గుతోంది కనుక ఆర్టికల్‌ 270ని సవరించి వీటిలో కూడా వాటా కల్పించాలని రాష్ట్రాలు ఆర్ధిక సంఘాన్ని కోరాయి. తాజా సమాచారం ప్రకారం పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం 42శాతం పన్ను ఆదాయాన్ని అందచేస్తున్నది. పదిహేనవ ఆర్దిక సంఘం సిఫార్సు ప్రకారం ఈ మొత్తం 41శాతానికి తగ్గింది. అయితే వివరాల్లోకి వెళ్లినపుడు వాస్తవంగా మొత్తం పన్ను ఆదాయంలో 35శాతం కంటే తక్కువే బదలాయిస్తున్నట్లు తేలింది. ఇంతే కాదు కాగ్‌ నివేదిక ప్రకారం 2018-19 సంవత్సరానికి లెవీల ద్వారా రూ.2.7లక్షల కోట్ల రూపాయలకు గాను కేవలం రూ.1.64లక్షల రూపాయలు మాత్రమే దేనికోసమైతే సెస్‌,సర్‌ఛార్జీలు విధించారో అందుకు కేటాయించారని పేర్కన్నది. మిగిలినవి కేంద్ర నిధిలో వేసుకున్నది. ముడి చమురు మీద వసూలు చేసిన రూ.1.25లక్షల కోట్ల రూపాయలను చమురు పరిశ్రమ అభివృద్దికి ఖర్చు చేయలేదు. అదే విధంగా ఐదు శాతంగా వసూలు చేస్తున్న ఆరోగ్య మరియు విద్యా సెస్సులో పరిమితంగా విద్యకు కేటాయించారు తప్ప ఆరోగ్యానికి లేదని కాగ్‌ పేర్కొన్నది. పన్నులలో ఇస్తున్న వాటా మాదిరి సెస్‌ మరియు సర్‌చార్జీగా వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా రాష్ట్రాలు ఆయా రంగాలలో మాత్రమే ఖర్చు చేసే విధంగా కేటాయించాలి. జిఎస్‌టిని ప్రవేశపెట్టినపుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదు సంవత్సరాల పాటు నిర్ణీత జిఎస్‌టి మొత్తం రాష్ట్రాలకు వసూలు కానట్లయితే ఆయా సంవత్సరాలలో ఎంత తగ్గితే అంత చెల్లించేందుకు కేంద్రం జిఎస్‌టి సెస్‌ వసూలు చేస్తున్నది.

2018లో కేంద్రం లీటరుకు రెండు రూపాయల పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ను పెంచింది. వినియోగదారుడికి ధరలో ఎలాంటి మార్పులేదు గానీ రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గిపోయాయి. రెండు రూపాయల్లో 42శాతం అంటే లీటరుకు రూ.0.84పైసలు తగ్గింది. ఇప్పుడు పెట్రోలుకు రూ.2.50, డీజిలుకు రూ.4.00 అదే విధంగా మార్చారు దీని ఫలితంగా కాత్తగా నిర్ణయించిన 41శాతం వాటా ప్రకారం పెట్రోలు మీద రూ.1.03, డీజిలు మీద రూ.1.64 రాష్ట్రాలకు తగ్గుతుంది. ఇదే పద్దతి మిగతా సెస్‌లకూ వర్తిస్తుంది. 2017 ఏప్రిల్‌-2020 మే మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు పన్నులో పెట్రోలు మీద సెస్‌ మరియు సర్‌ఛార్జీ 150శాతం పెంచితే, డీజిలు మీద 350శాతాన్ని పెంచింది. ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69 మరియు 57శాతాలు మాత్రమే పెరిగాయి. ఇలాంటి గారడీ కారణంగా గతేడాది కరోనా సమయంలో ఏప్రిల్‌-నవంబరు మధ్య చమురు వినియోగం 18శాతం తగ్గినప్పటికీ కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎనిమిది శాతం మాత్రమే తగ్గగా రాష్ట్రాలకు 21శాతం పడిపోయింది.కేంద్రం చేస్తున్న ఇలాంటి గారడీలే పద్నాలుగ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 32శాతం వాటాను 42శాతానికి పెంచటంలో ప్రభావం చూపాయనే అభిప్రాయం ఉంది.


కేంద్రం ఇలా రాష్ట్రాలకు తొండి చేయి చూపుతున్న మొత్తం తక్కువేమీ కాదు. ఈ తొండి బిజెపి పాలిత రాష్ట్రాలకూ జరుగుతోంది. వివిధ రకాల కేంద్ర సెస్‌లు, సర్‌ఛార్జీల మొత్తం వసూలు 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో రూ.58,797 కోట్ల నుంచి 256శాతం పెరిగి రూ.2,09,577 కోట్లకు చేరాయి. 2020-21లో జిఎస్‌టి, విద్య, ఆరోగ్య సెస్‌లు మినహా మిగిలిన సెస్‌ల మీద రూ.3,04,485 కోట్లు వస్తుందని అంచనా వేశారంటే వాటి పెరుగుదల ఎంత వేగంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.జిఎస్‌టి సెస్‌ విషయానికి వస్తే డిసెంబరు చివరి నాటికి బడ్జెట్‌ అంచనాలో 53.5శాతం రూ.59,081 కోట్లు వసూలైంది. ఐదేండ్ల పాటు వసూలైన మొత్తం నుంచి అవసరమైనపుడు రాష్ట్రాలకు పరిహారంగా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గడువు మీరిన తరువాత రాష్ట్రాలకు పంచాలన్నది నిర్ణయం. ఒక్క సెస్‌లే కాదు సర్‌ఛార్జీల మొత్తం కూడా రూ.31,879 కోట్ల నుంచి రూ.1,42,530 కోట్లకు పెరిగింది. 2020-21లో రూ.1,76,277 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌ఛార్జీల వైపు మొగ్గుచూపుతున్న కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదలాయింపు మొత్తం క్రమంగా తగ్గిపోతోంది.2019 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2020లో బదిలీ అయిన నిధుల శాతం 36.6 నుంచి 32.4కు తగ్గిపోయింది. జిఎస్‌టి ఉనికిలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల పన్నుల వనరులు పరిమితం అవటంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


రానున్న ఐదు సంవత్సరాలలో 15వ ఆర్ధిక సంఘం కేటాయింపులలో తెలంగాణాకు కేంద్ర పన్ను వాటా 2.47 నుంచి 2.1శాతానికి తగ్గింపు కారణంగా ఆరువేల కోట్ల రూపాయల నష్టం జరగనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు నివేదించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విధమైన తగ్గుదల ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. కేంద్రం ఇదే మాదిరి పన్నుల స్ధానంలో సెస్‌లను పెంచుకుంటూ పోయినట్లయితే మరోసారి రాష్ట్రాల హక్కుల సమస్య ముందుకు రావటం అనివార్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !

25 Monday Jan 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, India oil price, Narendra Modi Failures, OPEC oil war, unabated oil prices in India


ఎం కోటేశ్వరరావు
ఒక వైపు పట్టువీడని రైతు ఉద్యమం-మరో వైపు ఎగబాకుతున్న చమురు ధరలు. గడ్డ కట్టే చలిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి నేతృత్వంలోని పాలక ఎన్‌డిఏ కూటమికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇవి ఏ పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేము. ఇది రాస్తున్న సమయానికి రైతులూ పట్టువిడుపు లేకుండా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా జనం భరిస్తారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎక్కడా ప్రతిఘటన లేదు కనుక ప్రతి రోజూ పెంచుతూనే ఉంది. పన్నుల తగ్గింపు ఆలోచన చేయటం లేదు.


చిత్రం ఏమిటంటే పెరుగుతున్న చమురు ధరల గురించి గతంలో బిజెపి నేత స్మృతి ఇరానీ మాదిరి ఎవరూ గ్యాస్‌ బండల ధర్నాలు లేవు, ఎడ్ల బండ్ల మీద మోటారు సైకిళ్లను పెట్టి ప్రదర్శనలు, ఆటోలను చేత్తో లాగే విన్యాసాల దృశ్యాలు కనిపించటం లేదు. ప్రతిపక్షాలు కిమ్మనటం లేదు గానీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారే మండి పడ్డారు. చమురు ధరల పెరుగుదలకు సౌదీ అరేబియా కారణమని కొద్ది రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలను కూడా తప్పుపట్టలేము. ఎవరైనా ధర్నా చేస్తుంటే మాకు అడ్డుగా ఉన్నారంటూ విసుక్కొని పక్కదారులలో పోయే జనం ఉన్నపుడు కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లుగా ఎవరికి మాత్రం ఎందుకు ? చమురును కొనుగోలు చేసేది మెజారిటీ బిజెపి అభిమానులే కదా ! ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాల్లో వారే కదా అధికారంలో ఉంది. ఇంక ఆ పార్టీ తమది మెజారిటీ హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్నది కనుక అధిక భారం పడుతున్నదీ, మోస్తున్నదీ హిందువులే, కాదంటారా ? ఇష్టమైనపుడు సుత్తితో మోదినా దెబ్బ అనిపించదు. లేనపుడు తమలపాకుతో తాటించినా భరించలేని బాధ అనిపిస్తుంది- తరతరాల మానవ సహజం !


ఇంతకీ ధర్మేంద్ర ప్రధాన్‌ గారికి సౌదీ అరేబియా మీద ఎందుకు కోపం వచ్చింది ? మౌన యోగి ప్రధాని నరేంద్రమోడీ గారి మాదిరి మాట్లాడకుండా ఉంటే నాటకం రక్తి కట్టదు కదా ! నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన కొత్తలో పీపా చమురు ధర 107 డాలర్లు ఉన్నది కాస్తా తరువాత గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఒక దశలో 23 డాలర్లకు తగ్గింది. ఇప్పుడు 55-56డాలర్ల మధ్య ఉంది. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజుల చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా చమురు ధరలు తగ్గినపుడు కరోనా ఉన్నా కరుణ చూపలేదు. పెరిగినపుడు మాత్రం మడమ తిప్పకుండా వాయించేస్తున్నారని పదే పదే చెప్పుకోనవసరం లేదు.

ఏడాది క్రితం గణనీయంగా ధరలు తగ్గినపుడు కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల పన్ను పెంచటంతో వినియోగదారుడికి ఎలాంటి ఉపశమనం లేకుండా పోయింది. జనాల జేబులు కొట్టి మార్కెటింగ్‌ కంపెనీలకు లబ్ది చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వానికి 43వేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఒక రూపాయి పన్ను పెంచితే ఏడాదికి 14వేల కోట్ల రూపాయలు వస్తుంది. మరి మంత్రిగారికి కోపం ఎందుకు వచ్చిందంటే ఇప్పటికే చమురు ధరలు 73 సంవత్సరాల రికార్డులను బద్దలు కొట్టాయి, రైతుల ఉద్యమ స్ఫూర్తితో చమురు మీద కూడా ఆందోళనలు ప్రారంభమైతే అన్న గగుర్పాటు మంత్రిగారికి కలిగి ఉండాలి. భజన గోడీ మీడియా, సానుకూల కాషాయ మేథావుల కోళ్లు కూయకుండా మూసుకుంటే తెల్లవారకుండా ఆగుతుందా ? రైతుల ఉద్యమాన్ని ఆపగలిగారా ? రైతులకు భయపడి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలను రద్దు చేయగలిగారు గానీ బడ్జెట్‌ సమావేశాలను అలా చేయగలరా ? భజన చేసే తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, వైసిపి వంటి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉన్నా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వాన్ని చమురు ధరల మీద నిలదీయకుండా ఉంటారా? అందుకే మంత్రిగారు నేరం మాది కాదు సౌదీది అనే చెప్పేందుకు ముందస్తుగానే వాదన సిద్దం చేసుకున్నారనిపిస్తోంది.


గతేడాది కొన్ని దేశాల మధ్య చమురు యుద్దం కారణంగా పోటీపడి చమురు ఉత్పత్తిని పెంచిన విషయం, వద్దురా బాబు నిల్వచేసేందుకు ఖాళీలేదు, ఒప్పందం చేసుకున్నాం గనుక మీకే ఎంతో కొంత ఎదురు ఇస్తాం సరకు పంపకండి అన్న పరిస్ధితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన యుద్దం మనకే నష్టం అని గమనించిన చమురు దేశాలు తమ లాభం తాము చూసుకుంటున్నాయి. డిమాండ్‌ పడిపోయింది కదా అని ఉత్పత్తిని తగ్గిస్తే చమురు ఎగుమతి దేశాల మార్కెట్‌ను అమెరికా వంటి దేశాలు ఆక్రమిస్తే పరిస్దితి ఏమిటన్న గుంజాటన మీద తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్యంగా రష్యా ఈ వాదనను ముందుకు తెచ్చింది. అయితే కరోనా నుంచి కాస్త కోలుకుంటున్నందున ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి.
గతంలో చమురు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోజుకు 97లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంది. దానికి అదనంగా ఫిబ్రవరి, మార్చి నెలలో రోజుకు పదిలక్షల పీపాల చమురు ఉత్పత్తిని స్వచ్చందంగా తగ్గిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పడిపోతే దానికి విరుద్దంగా చైనాలో పరిస్ధితి ఉండటంతో చమురు దేశాలు కాస్త నిలబడ్డాయి. అంతర్జాతీయ చమురు సంస్ధ తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో డిమాండ్‌ తగ్గనుంది.

మన దేశం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే దిగుమతి ఇంకా తక్కువే ఉన్నప్పటికీ గత కొద్ది నెలలుగా పెరుగుతున్నది. ఇలా ధరలు పెరిగేట్లు చేస్తే మేము ప్రత్యామ్నాయం, కొత్త వ్యాపార విధానాలను చూసుకోవాల్సి ఉంటుందని మన మంత్రి హెచ్చరించారు. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పుడున్న స్దితి నుంచి ఏమాత్రం పెరిగినా అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ వెలికి తీత లాభదాయకంగా మారుతుంది. అందువలన అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, కనుక మీ దగ్గర బదులు అక్కడి నుంచే కొంటాం అన్న బెదిరింపు కూడా లేకపోలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ నాయకత్వం అమెరికాతో స్నేహం పేరుతో దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు ప్రారంభించింది. ఎక్కడన్నా బావే గానీ చమురు దగ్గర కాదన్నట్లుగా ఇతర దేశాల ధరకే మనకు ఇస్తున్నారు తప్ప మోడీ గారి గడ్డం పొడుగు చూసి ఒక్క సెంటు కూడా మాజీ డోనాల్డ్‌ ట్రంప్‌ తగ్గించలేదు, తాజా జో బైడెన్‌ తగ్గించేది లేదు. పశ్చిమాసియా, ఇతర దారులు మూసుకుపోతే అమెరికా కాళ్ల మీద పడాలి. పోటీదారులను పడగొట్టిన తరువాత రిలయన్స్‌ జియో ధరలు పెంచిన మాదిరే అమెరికా కూడా చేస్తే ?


ఇవన్నీ మంత్రిగారి తెలియవా ? జనానికంటే ఎక్కువ తెలుసు ! సౌదీని విమర్శించి, ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా ? చెరువు మీద అలిగితే ఏం జరుగుతుందో అదే అవుతుంది. మంత్రిగారి ప్రకటన వెనుక ప్రభుత్వ భయం కనిపిస్తోంది. ధరలు పెంచుకుంటూ పోతే భరించే జనంలో అసంతృప్తి తలెత్తుతుంది. అభిమానులు సైతం ఎంతకాలం భజన చేస్తారు, ఎంతైనా భరిస్తామని గొప్పలు చెబుతారు. మిగతా దేశాలతో ముఖ్యంగా పాకిస్ధాన్‌తో పోల్చుకుంటే పరువు తక్కువ. కేంద్ర ప్రభుత్వం పన్నులు ఎందుకు తగ్గించదు అనే సమస్య ముందుకు వస్తుంది. అదే జరిగితే తగ్గించే స్దితిలో మోడీ సర్కార్‌ ఉందా ? చమురు ధరలు పెరిగిపోతే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తయారు చేస్తుున్న బడ్జెట్‌ హల్వా తినటానికి వస్తుందా ?


మార్చినెలాఖరుతో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో లోటు ఎంత ఉంటుందో, దేనికి కోత పెడతారో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్దల వాటాలను అమ్మి 2.1లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ లోటు నింపుకోవాలనుకున్నది కుదరలేదు. అయినా చమురు పన్నుల బాదుడుతో 1.4లక్షల కోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి కొంత మేర ఆ లోటును పూడ్చుకున్నారని సరిగ్గా బడ్జెట్‌ సమయంలో క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ద నివేదికలో చెప్పటం, అది మీడియాలో రావటం, కొందరైనా చదవటం కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడని విషయమే. శుద్దమైన చమురు సాకుతో పన్నుల తగ్గింపు జరిగే అవకాశాలు లేవని మరోవైపు వార్తలు.2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌రూ.16.86 ఉంది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జనవరి ఒకటవ తేదీన నీతి మార్గ్‌లోని హెచ్‌పిసిఎల్‌ బంకులో లీటరు పెట్రోలు ధరలో ఏవేవి ఎంత ఉన్నాయో దిగువ చూడవచ్చు.
డీలర్లకు ఇస్తున్న ధర ××××××× రూ.27.25
కేంద్ర ఎక్సయిజు డ్యూటీ ×××× రూ.32.98
డీలరు కమిషన్‌ ××××××××× రూ.3.67
ఢిల్లీ రాష్ట్ర వ్యాట్‌ ××××××××× రూ.19.32
వినియోగదారుడి ధర ×××××× రూ.83.71
వివిధ రాష్ట్రాలలో వ్యాట్‌ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. డీలరు కమిషన్‌ మీద కూడా ఢిల్లీలో వ్యాట్‌ 30శాతం వసూలు చేస్తున్నారు. ముంబైలో గతంలో బిజెపి సర్కార్‌ విధించిన 39.12శాతం వ్యాట్‌ను తరువాత అధికారానికి వచ్చిన శివసేన సంకీర్ణ కూటమి కూడా కొనసాగిస్తున్నది. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ కారణంగానే జనవరి 18న ముంబైలో రూ.91.80 ఉంటే చెన్నరులో రూ.87.85 ఉంది. జనవరి 18న కొన్ని దేశాలలో పెట్రోలు, డీజిలు లీటరు ధరలు ఇలా ఉన్నాయి. ధర డాలర్లు, సెంట్లలో(బ్రాకెట్లలోని ధరలు మన రూపాయల్లో అని గమనించాలి
దేశం××××××××××పెట్రోలు×××× ×××× డీజిలు
వెనెజులా×××××× 0.020 (1.46) ×××× 0.000 (0000)
సౌదీ అరేబియా×× 0.467 (34.07) ×××× 0.139 (10.14)
మయన్మార్‌ ×××× 0.627 (45.74) ×××× 0.556 (40.56)
భూటాన్‌ × ×××× 0.677 (49.39) ×××× 0.633 (46.17)
పాకిస్ధాన్‌× ×××× 0.682 (49.75) ×××× 0.706 (51.50)
శ్రీలంక ×××××× 0.839 (61.20) ×××× 0.542 (39.54)
నేపాల్‌ ×× ×××× 0.941 (68.64) ×××× 0.795 (57.99)
చైనా ××× ×××× 1.013 (73.89) ×××× 0.882 (64.34)
బంగ్లాదేశ్‌ ×××× 1.052 (76.74) ×××× 0.769 (56.09)
భారత్‌ ×× ×××× 1.201 (87.61) ×××× 1.083 (79.00)
అనేక దేశాల్లో మన కంటే పన్నులు తక్కువ ఉన్నాయి, మరికొన్నింటిలో ఎక్కువ ఉన్నాయి. కొన్ని చోట్ల చెల్లింపు శక్తిని బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? క్రిసిల్‌ సంస్ధ అధ్యయనం ప్రకారం 2020లో ఉన్న బ్రెంట్‌ రకం ముడి చమురు ధర సగటున 42.3 డాలర్లు ఉంటే 2021లో అది 50-55 డాలర్ల మధ్య ఉంటుందని పేర్కొన్నది. దానికి అనుగుణ్యంగానే మనం కొనే చమురు ధరలు కూడా ఉంటాయి. ఈ మేరకు పెరిగినా లేక అనూహ్యంగా ఇంకా పెరిగినా మన విదేశీమారక నిల్వలు, బడ్జెట్‌ అంచనాలు తప్పుతాయి. అందుకే మంత్రిగారు ఆందోళన, ఆక్రోశం వెలిబుచ్చారు తప్ప వినియోగదారులకు మేలు చేకూర్చుదామని కాదు.

ఇది రాసిన సమయానికి మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు పీపా ధర 55-56 డాలర్ల మధ్య నడుస్తున్నది. ప్రతి పెరుగుదలనూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ కంపెనీలు జనం మీద ఏ రోజుకు ఆరోజు రుద్దుతున్నాయి. ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా వాటిని చెల్లించి కొనుగోలు చేస్తున్నాము. వినియోగదారులెవరూ పట్టించుకోవటం లేదు, రైతుల మాదిరి చమురు వినియోగదారులు కూడా ఉద్యమించే రోజులు వస్తాయా ? ఇప్పుడు దేశభక్తి మత్తులో ముంచారు గనుక దేశం కోసం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ? అనూహ్య పరిణామాలు ఏ రూపంలో ఉంటాయో తెలియదు. ఎవరి దగ్గరైనా చిత్రగుప్తుడి చిట్టా ఉంటే నరేంద్రమోడీనో జనాన్నో కాపాడేందుకు బయటపెడితే మంచిదేమో !


రైతు ఉద్యమం రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి నిస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్ర పునరావృతం అవుతుందన్నది నిజం, అయితే గతం మాదిరే అయిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఉద్యమాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. గతంలో రైతులు బోట్‌ క్లబ్‌ వద్ద తిష్టవేశారు. ఆ అనుభవంతో బిజెపి సర్కార్‌ ఇప్పుడు అసలు ఢిల్లీలో ప్రవేశించకుండా శివార్లలోనే అడ్డుకుంది. రైతులు అక్కడే నిరవధిక ఆందోళన ప్రారంభిస్తారని ఊహించలేదు. దేశమంతటా ఉద్యమించే విధంగా ఒక్క రైతులనే కాదు, వివిధ తరగతుల వారిని మేల్కొలిపింది. దోపిడీ శక్తులు తమ భూమి, పరిశ్రమలు, కార్యాలయాల్లో పని చేసే వారినే కాదు, తమ దోపిడీని అంతం చేసే శ్రామిక శక్తులను కూడా తయారు చేస్తాయి. సుత్తీ, కొడవళ్లు పనిసాధానాలుగానే కాదు, అవసరమైతే దోపిడీ శక్తుల పని పట్టే సాధానాలుగా కూడా మారతాయి ! 1975లో అత్యవసర పరిస్థితిని విధించటం ద్వారా కాంగ్రెస్‌ తన వ్యతిరేకశక్తులందరినీ ప్రజాస్వామ్య పరిరక్షణ సమస్య మీద ఐక్యం చేసింది. ఇప్పుడు రైతాంగ సమస్యల మీద అదే మాదిరి ఐక్యతను ప్రదర్శించటానికి వ్యవసాయ సంస్కరణల పేరుతో మోడీ సర్కార్‌ తెచ్చిన చట్టాలు దోహదం చేశాయి. దీనికి నరేంద్రమోడీ ఆయనను నడిపిస్తున్న సంఘపరివార్‌కు ఒక విధంగా ” అభినందనలు ” చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !

23 Saturday Jan 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP rank opportunism, halal or jhatka, Hindu Aikya Vedi, Religious tag to meat, SDMC on Halal


ఎం కోటేశ్వరరావు


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట
అన్న పోతన పద్యం తెలిసిందే. దానికి వికట కవితను చెప్పుకుంటే పలికెడిది వసుధైక కుటుంబమట, పలికించెడిది కాషాయదళమట అని రాయవచ్చు. వసుధైక కుటుంబం – సర్వజనులూ ఒకటే అని చెప్పేవారికి ఒకే నాలిక ఉంటుందని అనుకుంటాం. కానీ కొందరికి ఎన్ని నాలికలు ఉంటాయో, ఒకే నోటితో ఎన్ని మాటలు మాట్లాడతారో తెలియదు. కానీ వాటన్నింటినీ పలికించేది మెదడు లేదా నియంత్రించే మెదడు వంటి సంస్ధలు అని తెలిసిందే.


ఇక అసలు విషయానికి వస్తే బిజెపి ఏలుబడిలోని దేశ రాజధాని నగరంలో ఒకటైన దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈనెల 21న ఒక నిర్ణయం చేసింది. తమ పరిధిలోని హౌటళ్లలో సరఫరా చేసే మాంసం హలాల్‌ చేసిందా లేక ఝట్కానో తెలియ చేస్తూ హౌటళ్లలో విధిగా బోర్డులు పెట్టాలని ఆదేశించింది. ఉల్లంఘించిన వారి మీద కేసులు పెడతారని వేరే చెప్పనవసరం లేదు.
దీనికి కసరత్తు జరుగుతున్న సమయంలోనే కేరళలోని ఎర్నాకుళం జిల్లా కురమసెరీ అనే పట్టణంలో ఒక బేకరీ యజమాని తన దుకాణం ముందు తాము విక్రయించే తినుబండారాలలో ” హలాల్‌ ” చేసిన మాంసాన్ని వినియోగిస్తామని ఒక నోటీసు పెట్టారు. ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అన్నట్లుగా అలా పెట్టటం అంటరానితనంతో సమానం-నేరపూరితమని దాన్ని తొలగించకపోతే ఆందోళన చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ అయిన హిందూ ఐక్యవేది ప్రతినిధులు నోటీసులు జారీ చేసి బెదిరించారు. వారెలాంటి వారో తెలిసిన ” మోడీ ” పేరుతో ఉన్న ఆ బేకరీ యజమాని వెంటనే నోటీసును తొలగించాడు. ఇది జనవరి మొదటి వారంలో జరిగింది.దాదాపు ఒకే సమయంలో, ఒకే సంస్ధ, ఒకే భావజాలానికి చెందిన వారు కేరళలో ఒకలా ఢిల్లీలో ఒకలా వ్యవహరించటాన్ని రెండు నాలికలనాలా నాలుగనాలా ?

సులభతర వాణిజ్య సూచికలో 2014లో 142వ స్దానంలో ఉన్న దేశాన్ని 2020 నాటికి 63కు తెచ్చామని బిజెపి నేతలు తమ విజయగానాల్లో ఒకటిగా పాడుకుంటారు. దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ జనవరి 21న చేసిన చేసిన నిర్ణయం తమను ఇబ్బందుల పాలు చేస్తుందని, సదరు ఆదేశాన్ని వెనక్కు తీసుకోవాలని హౌటళ్ల యజమానులు మొత్తుకుంటున్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న తమ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ ఉత్తరువు ఆటంకంగా మారుతుందని ఫస్ట్‌ ఫిడిల్‌ కంపెనీ యజమాని ప్రియాంగ్‌ సుఖిజియా వాపోయారు.


ఇంతకీ హలాల్‌ – ఝట్కా అంటే ఏమిటి ? ప్రవక్త మహమ్మద్‌ ప్రవచనాలతో కూడిన ఖురాన్‌లో చెప్పిన పద్దతుల్లో కోళ్లు, మేకల వంటి వాటిని మాంసం కోసం వధించే క్రతువును హలాల్‌ అంటారు. ఇది అరబిక్‌ పదం, దీని అర్ధం అనుమతి. ముస్లిం మతం అనుమతించిన మేరకు అంటే ఒక ముస్లిం అల్లాను ప్రార్ధిస్తూ మత పవిత్ర స్ధలంగా భావించే కాబా వైపు పెట్టి జంతువుల మెడనరాన్ని కొద్దిగా కత్తిరించి రక్తం పూర్తిగా ఆగిపోయి చల్లబడేవరకు ఆగి తరువాత పూర్తి వధిస్తారు. అదే ఝట్కా అంటే ఒకే ఒక్క వేటుతో మెడనరకటం. ప్రత్యేకించి సిక్కులు ఒక్క వేటుతో తెగిపడిన జంతు మాంసాన్ని మాత్రమే భుజిస్తారు. ఒక వేళ ఒక వేటుకు పూర్తిగా తెగనట్లయితే దాన్ని పక్కన పడేస్తారు. మిగిలిన సామాజిక తరగతులకు అలాంటి ప్రత్యేక పద్దతులేవీ లేవు. నిజానికి ఏ ప్రక్రియలో అయినా జంతువు ప్రాణం పోయేదే. అందుకే సంత్‌ కబీర్‌దాస్‌ పద్దతి ఏదైనా హింసే కదా అంటాడు.


హౌటళ్లకు వచ్చే వినియోగదారులు అత్యధికులు ఏ పద్దతి మాంస వంటకాలు వడ్డిస్తున్నారని ఎవరూ అడగరని, ఉదారవాద విధానాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ హౌటళ్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే బిజెపి ఆధ్వర్యంలోని కార్పొరేషన్‌ తమ మీద కఠిన ఆంక్షలను పెడుతున్నదని ప్రియాంక సుఖీజా విమర్శించారు. రెండు రకాల మాంసాలను నిల్వచేయటం, తెచ్చుకోవటంలో సమస్యలు వస్తాయని, వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సర్వర్లకు సమస్యలు వస్తాయని మరికొందరు యజమానులు వాపోయారు. ఇలాంటి ఉత్తరువులు ఢిల్లీ మొత్తానికి ఉంటే ఒక పద్దతి అలాగాక కొన్ని ప్రాంతాలకే వర్తింప చేస్తే గందరగోళం ఏర్పడుతుందని నగరంలోని అన్ని ప్రాంతాలలో హౌటళ్లు ఉన్న యజమానులు మొత్తుకుంటున్నారు.


ప్రతి అంశంలోనూ మతకోణాన్ని చొప్పిస్తున్న కాషాయదళాలు చివరికి మాంసాన్ని కూడా వివాదాస్పదం గావించాయి. ముస్లిం మత పద్దతిలో వధించే జంతు మాంసాన్ని ఇతర మతాల వారు ఎందుకు తినాలి అని రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. హలాల్‌ చేసిన ఆహారాన్ని తినటం సిక్కు, హిందూ మతాలకు వ్యతిరేకమని, నిషేధించారని దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఏ పద్దతిలో మాసం విక్రయిస్తున్నదీ తెలియ చేస్తూ విధిగా బోర్డులు పెట్టాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. ఇస్లాంకంటే ఎన్నో వందల సంవత్సరాల ముందు ఉనికిలోకి వచ్చిన హిందూమతం తనకు తెలియని హలాల్‌కు వ్యతిరేకం అని ఎలా చెప్పగలదు ? ఎవరైనా ఇది ఇంతే అని చెబితే దాన్ని నోరుమూసుకొని అంగీకరించాలా ?


అక్రమంగా ఉన్న జంతు వధశాలలంటూ ఉత్తర ప్రదేశ్‌ యోగి సర్కార్‌ మూడు సంవత్సరాల క్రితం మూసివేత చర్యలు తీసుకుంది. ఆ వృత్తిలో ఉన్న ముస్లింల నోట్లో మట్టికొట్టటమే అసలు లక్ష్యం. ఒకవైపు జీవహింసకు వ్యతిరేకమని కబుర్లు చెబుతూ మరోవైపు గొడ్డుమాంసాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతిస్తూ నాలుగు డాలర్ల కోసం కక్కుర్తిపడుతున్నారనే విమర్శ నరేంద్రమోడీ సర్కారు మీద ఉంది. నిజానికి మన దేశం నుంచి గొడ్డు మాంసం ఎగుమతి చేసే వారిలో అత్యధికులు మతాల రీత్యా చెప్పాలంటే హిందువులదే ఆధిపత్యం. అది కూడా ఎలా ? తమ సంస్ధలకు ముస్లిం పేర్లు పెట్టుకొని !
తాజా గణాంకాల ప్రకారం 2020లో కోటీ ఆరులక్షల 57వేల టన్నుల గొడ్డు మాంసం ప్రపంచవ్యాపితంగా ఎగుమతి జరిగింది. దీనిలో 23.93శాతంతో బ్రెజిల్‌, ఆస్ట్రేలియా,భారత్‌, అమెరికాలు పదమూడు శాతం చొప్పున తొలి నాలుగు అగ్రస్ధానాల్లో ఉన్నాయి. పాకిస్దాన్‌ ఎగుమతులు కేవలం 0.52శాతమే. అమెరికా ఒకవైపు ఎగుమతులు చేస్తూనే మరోవైపు ప్రపంచంలో అత్యధిక దిగుమతి దేశంగా కూడా ఉంది. 2018లో 83లక్షల 80వేల టన్నులు వివిధ దేశాలు దిగుమతి చేసుకోగా వాటిలో అమెరికా 16.38, చైనా 14.32శాతాలతో తొలి రెండు స్ధానాల్లో ఉన్నాయి.


మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న బడా కంపెనీలు, వాటి యజమానులెవరో చూద్దాం. దేశంలో అతి పెద్ద గొడ్డుమాంస ఎగుమతి సంస్ధ పేరు అల్‌ కబీర్‌ ఎక్స్‌పోర్ట్స్‌. ఇది హైదరాబాద్‌ సమీపంలోని రుద్రారంలో ఉంది. దీని యజమానులు సతీష్‌, అతుల్‌ సబర్వాల్‌. మరో కంపెనీ అరేబియన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని సునీల్‌ కపూర్‌, ఎంకెఆర్‌ ప్రోజన్‌ ఫుడ్స్‌ యజమాని మదన్‌ అబోట్‌, పిఎంఎల్‌ యజమాని ఎఎస్‌ బింద్రా (షఉటర్‌ అభినవ్‌ బింద్రా తండ్రి), ఆల్‌ నూర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని సునీల్‌ సూద్‌, ఎఓబి ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఓపి అరోరా. స్టాండర్డ్‌ ప్రోజన్‌ ఫుడ్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని కమల్‌ వర్మ, మహారాష్ట్ర ఫుడ్‌ ప్రోసెసింగ్‌ ఓనరు సన్నీ ఖట్టర్‌.


కావాలంటే దిగుమతి చేసుకొనే దేశాలను బట్టి హలాల్‌ మాంసం అని ముద్రవేసుకోవచ్చు, సర్టిఫికెట్లు తీసుకోవచ్చు తప్ప లేనట్లయితే విధిగా అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జనవరి మొదటి వారంలో నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎగుమతి చేస్తున్న మాంసం హలాల్‌ చేయబడినది అని అలిండియా జమాత్‌ ఉలేమాల ద్వారా నిర్ధారణ పత్రాలను తీసుకోవాలని కేంద్రం నిబంధనల్లో పేర్కొన్నది. ఇప్పుడు దాన్ని తొలగించింది.దిగుమతి చేసుకొనే దేశానికి అనుగుణ్యంగా జంతువులను వధిస్తారని పేర్కొన్నది. విశ్వహిందూపరిషత్‌, ఇతర హిందూత్వ సంస్దల నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఈ మార్పులు చేశారు. విదేశాలకు ఎగుమతి చేసే వాటి మీద కావాలంటే హలాల్‌ అని ముద్రించుకోవచ్చు తప్ప దేశంలో వాటికి ఎందుకన్నది వాటి వాదన.

ఇలాంటి వాదనలన్నీ ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఒక పధకంలో భాగమే. పోనీ వీరు ఒకే మాట, ఒకే వైఖరికి కట్టుబడి ఉంటారా ? అవకాశవాదం-పచ్చి అవకాశవాదం ! కేరళలోని హిందూ ఐక్యవేది ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఒక మతసంస్ధ. దాని ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కుమనం రాజశేఖర్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అందువలన వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పనవసరం లేదు. ముందే చెప్పుకున్నట్లుగా దక్షిణ ఢిల్లీలో హౌటళ్లలో సరఫరా చేసే పదార్దాలు హలాల్‌ లేదా ఝట్కా పద్దతిలో చేసిన మాంసానివో బోర్డులు పెట్టాలని లేక పోతే శిక్షిస్తామని బిజెపి చెప్పింది. అలాంటి వాటిని తీసివేయకపోతే ఆందోళన చేస్తామని కేరళలోని బిజెపి సోదర సంస్ద హిందూ ఐక్యవేది బెదిరింపులకు దిగింది. ఒకే కుటుంబం నుంచి రెండు వైఖరులు. ఎంత తేడా !


కేరళ ఎర్నాకుళం జిల్లా కురమ్‌సెరీలో రెండు నెలల క్రితం ” మోడీ ” పేరుతో ఒక బేకరీని ఏర్పాటు చేశారు. హలాల్‌ చేసిన మాంసాన్ని తమ ఆహార పదార్ధాలలో వినియోగిస్తామని తెలిపే ఒక నోటీసును యాజమాన్యం బేకరీ ముందు ఏర్పాటు చేసింది. ఇష్టమైన వారు కొనుగోలు చేయవచ్చు, అభ్యంతరం ఉన్నవారు మరో బేకరికి వెళ్ల వచ్చు. ఆక్సిజన్‌ బదులు హిందుత్వ ప్రాణవాయువుతో జీవిస్తున్న హిందూ ఐక్యవేది ఆ ప్రాంతంలో మతోన్మాద బీజాలు వేసేందుకు ఆ నోటీసును ఎంచుకుంది. స్దానిక నేతలు డిసెంబరు 28న యజమానులకు ఒక లేఖ రాసి వారం రోజుల్లో దాన్ని తొలగించకపోతే కొనుగోళ్లను బహిష్కరించటంతో పాటు ఆందోళన చేస్తామని బెదిరించారు. అలా పేర్కొనటం అంటరానితనం వంటి నేరమని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి వివక్షాపూరితమైన అంశాలతో దుకాణదారు ప్రచారం చేయకూడదని, చేస్తే ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు.

దానికి ముందు హిందూ ఐక్యవేది ప్రతినిధులు ఆ బేకరీకి వెళ్లి హలాల్‌ చేయని మాంసంతో చేసిన పదార్ధాలు కావాలని అడిగారు. కావాలంటే హలాల్‌ చేసింది ఉందా అని అడుగుతారు కదా అలాంటి బోర్డు ఎందుకు పెట్టారని నిలదీశారు. స్ధానికులే గాక ఆ వైపుగా రాకపోకలు సాగించే వారు కూడా ఉంటారని వారిని ఆకర్షించేందుకు ఆ నోటీసు పెట్టామని చెప్పిన బేకరీ యజమాని వెంటనే తొలగించాడు. ఈ ఉదంతాన్ని ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదని ఎల్‌డిఎఫ్‌కు చెందిన ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతీష్‌ చెప్పారు. హిందూ ఐక్యవేది నోటీసు ఇవ్వటం అవాంఛనీయమని, దాని గురించి పరిశీలిస్తామని చెప్పారు.


విద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే 2019లో జొమాటో సంస్ధ తరఫున ఆహార పదార్ధాన్ని ఒక ముస్లిం యువకుడు సరఫరా చేశాడనే కారణంతో తిరస్కరించిన ఉదంతం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. గాల్వాన్‌లోయ ఉదంతం తరువాత చైనా యాప్‌లను నిషేధించినట్లుగా కొందరు జొమాటో ఆప్‌లను తొలగిస్తామని ఆ సమయంలో బెదిరింపులకు దిగారు. ఆహారానికి కులం, మతం, ప్రాంతం లేదు. కానీ వినియోగదారులను ఆకర్షించేందుకు,ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొన్ని విషయాలను సూచించేందుకు హౌటళ్ల యజమానులు పేర్లు పెట్టటం తెలిసిందే. ఆంధ్రా,ఉడిపి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, చౌదరి,క్షత్రియ, మిలిటరీ, జైన్‌, కోషర్‌(యూదు) హౌటల్స్‌ వంటివన్నీ ఆ కోవకే చెందుతాయి.
హైదరాబాద్‌, ఇతర అనేక చోట్ల బిర్యానీ హౌటల్స్‌కు , రంజాన్‌ సమయంలో హలీం కోసం వెళ్లే వారు అక్కడ పదార్ధాలు ఎంత రుచిగా ఉంటాయో చూస్తున్నారు తప్ప మాంసం హలాల్‌ చేసిందా లేదా అని చూస్తే, కాషాయ మతోన్మాదాన్ని తలకెక్కించుకుంటే అవన్నీ మూతపడతాయి లేదా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే. అయ్యప్పమాల ధారణ సమయంలో వారికి ప్రత్యేకం అనే బోర్డుల గురించి తెలిసిందే. ఇవేవీ ఎన్నడూ వివాదం కాలేదు.

ముస్లింల క్రతువు అయిన హలాల్‌ మీద ఇంత రాద్దాంతం అవసరం ఎందుకంటే దాని లక్ష్యం స్పష్టమే.హలాల్‌ నిర్ధారణ పత్రాలు తీసుకోవాలని బలవంతం చేయటం న్యాయమైన వాణిజ్య పద్దతి కాదని కొందరు సూత్రీకరిస్తున్నారు. ఎవరు బలవంతం చేశారు ? దిగుమతి చేసుకొనే వారు, వినియోగదారులకు అభ్యంతరం లేకపోతే ఎలాంటి ముద్రలు లేకుండానే ఎగుమతి చేయవచ్చు. ఒక మతానికి చెందిన వినియోగదారులను కూడా ఆకర్షించి నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే వ్యాపారులకు తప్ప సర్టిఫికెట్లు ఎవరికి అవసరం. ఉదాహరణకు బ్రాహ్మణ భోజన హౌటల్‌ అనే పేరు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆ సామాజిక తరగతివారు నిర్వహించే హౌటల్‌ కనుక వారు వచ్చి భోజనం చేయవచ్చనే సూచన దానిలో ఉంది. ఆ హౌటల్లో వండే, వడ్డించే, ప్లేట్లు లేదా ఆకులు ఎత్తేవారందరూ బ్రాహ్మణులే పనివారిగా ఉన్నారా లేదా అని ఎవరూ సర్టిఫికెట్లు అడగరు. ఆ పేరు పెట్టుకున్నదానికి వెళ్లి ఎవరైనా బిర్యానీ ఉందా అని అడుగుతారా ?


హలాల్‌, ఝట్కా, కోషర్‌, జైన్‌ అయినా అన్నీ మత కోవకు చెందినవే. ముస్లింల అసహనం, హలాల్‌ కావాలనే మంకు పట్టుతో లొంగని కారణంగానే హలాల్‌ నిర్దారణ పత్రాలు తీసుకోవాల్సి వస్తోందని సూత్రీకరించే మెజారిటీ అసహన శక్తుల వాదనలు కూడా మీడియాలో వచ్చాయి. ఇలా చెప్పేవారి అసలు లక్ష్యం ముస్లింలను లొంగదీసుకోవటమా ? వ్యాపారం చేసుకోవటమా ? వాటివలన అదనపు ఖర్చు అని కూడా లెక్కలు చెబుతున్నారు. పోనీ హలాల్‌ చేయని మాంసం వడ్డించే హౌటల్స్‌లో రేట్లు ఎక్కడైనా తక్కువ ఉంటున్నాయా ? హిందుత్వ గురించి కబుర్లు చెప్పే బాబారామ్‌ దేవ్‌ తన పతంజలి ఉత్పత్తులకు హలాల్‌ నిర్దారణ పత్రాలు తీసుకొనే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఎంత మందికి తెలుసు ? ఆయన కంపెనీ మీద ఎవరు వత్తిడి తెచ్చారు ?

మతోన్మాదం వైరస్‌ ఒకసారి తలెత్తితే అది మెజారిటీ వారికే పరిమితం కాదు మైనారిటీలకూ పాకుతుంది.కేరళలో హలాల్‌ మాంసాన్ని బహిష్కరించాలని కొందరు కాసా పేరుతో ఉన్న క్రైస్తవ సంఘాల పేరుతో ఉన్నవారు పిలుపులు ఇచ్చారు.ఆ మాంసం లేదా వాటితో తయారైన వాటిని తినటం క్రైస్తవానికి వ్యతిరేకం అని చెప్పారు. అందువలన మాంసం కోసం మనమే జంతువులను కొనుగోలు చేసి మనమే వధించి తిందామని చెప్పారు. హలాల్‌ ఉత్పత్తులు అమ్మే, కొనుగోలు చేసే విధంగా వత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వారికి హిందూ ఐక్యవేది మద్దతు ప్రకటించింది. తెల్లారితే క్రైస్తవులు, ముస్లింలు మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ ఊదరగొడుతున్న హిందూ ఐక్యవేది లాంటి సంస్ధలు ఇలాంటి సమస్యలు వచ్చే సరికి క్రైస్తవుల మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకపోస్తాయి. అయితే మతపరంగా తామెలాంటి అనుకూలతలు, వ్యతిరేకతలు వ్యక్తం చేయలేదని ఎవరి ఇష్టానికి వారికి వదలివేస్తున్నామని కొందరు చర్చినేతలు ప్రకటించారు. జంతువులు లేదా పక్షుల మాంసాన్ని తినేందుకు దేవుడు అనుమతించలేదని కొందరు క్రైస్తవ పెద్దలు భాష్యాలు చెబుతున్నవారూ ఉన్నారు.


అవకాశవాదానికి అడ్డదారులు వెతకటంలో, అతితెలివి ప్రదర్శనలో ఎవరైనా బిజెపి తరువాతే. ఒకవైపు ఇతర పార్టీలన్నీ సంతుష్ట రాజకీయాలు చేస్తున్నాయని, తాము మాత్రమే మాట తప్పని, మడమ తిప్పని ముక్కుసూటి వారమని చెప్పుకుంటారు. గోవా, ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి వారికి గొడ్డుమాంసం మహా ప్రియం.లొట్టలు వేసుకుంటూ తింటారు. అక్కడి వారి ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు పెట్టవు. పెట్టేందుకు తిరస్కరిస్తాయి, ఎందుకంటే పెడితే ఓట్లు రావు కదా ? అందుకే సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయాల్లో భాగంగా ఆ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. స్ధానిక ఆహారపు అలవాట్లను తాము గౌరవిస్తామని చెప్పుకున్నారు. గో వధ నిషేధానికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయించుకొనే వెసులుబాటు కల్పించామని బిజెపి ప్రకటించటం సంతుష్టీకరణ తప్ప ఏమిటి ? ఆ వెసులు బాటు, ఆహారపు అలవాట్లు దేశమంతటా ఎందుకు వర్తించదు, ఎందుకు గౌరవించరు ? గో మాంసం కలిగి ఉన్నారనే పేరుతో కొట్టి చంపటం ఎందుకు ? పాలకోసం గోవులను తరలిస్తున్నా వధకే అంటూ దాడులు ఎందుకు చేస్తున్నట్లు ?

ఎన్నికల్లో బిజెపి ఓట్ల కక్కుర్తి ఎలా ఉందో కేరళలో చూశాము. అక్కడి మలప్పురం జిల్లాలో 65శాతం మంది ముస్లింలు, ఐదుశాతం క్రైస్తవులు. మిగిలినవారు ఇతరులు. కేరళలో గొడ్డు మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేవు. 2017లో మలప్పురం లోక్‌సభ స్దానం ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ బిజెపి తరఫున శ్రీ ప్రకాష్‌ పోటీ చేశారు. కేరళలో ఎలాంటి నిషేధం లేదు కనుక తనను ఎన్నుకుంటే నాణ్యమైన గొడ్డు మాంసం అందచేయిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే బిజెపి గొడ్డు మాంస దుకాణాలను ప్రారంభిస్తుందా ? గొడ్డు మాంసంపై నిషేధం గురించి తమ పార్టీని చెడుగా చిత్రిస్తున్నారని, తనను ఎన్నుకుంటే మంచి నాణ్యమైన గొడ్డుమాంసం దొరికేట్లు చేస్తా నన్ను నమ్మండి అన్నట్లుగా మాట్లాడారు. అంతకు ముందు రోజే నాడు చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత రామన్‌ సింగ్‌ ఆవులను వధించిన వారికి ఉరిశిక్ష వేయాలని ప్రతిపాదించారు. దీన్నే ఏ రోటి కాడ ఆ పాట పాడటం అంటారు. వీరు విలువలు, వలువల గురించి జనానికి నీతులు చెబుతారు.


మాంసమైనా మరొకటైనా ఆరోగ్యానికి హాని లేని ప్రమాణాలతో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం తప్ప దాన్ని ఏ మత క్రతువు ప్రకారం కోశారన్నది కాదు. ఆగ్‌ మార్క్‌, ఐఎస్‌ఐ ప్రమాణాలకు బదులు కాషాయ దళాలు మాంసానికి మత ముద్రలు వేయటం ద్వారా సమాజాన్ని ఎక్కడకు తీసుకుపోతున్నారో, ఎందుకీ ఉన్మాదమో, వారి ద్వంద్వ ప్రమాణాలేమిటో ప్రతివారూ ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d