• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

అమెరికా పాలకవర్గాన్ని మరోసారి భయపెడుతున్న సోషలిజం-పార్లమెంటులో తీర్మానాలతో అడ్డుకోగలరా !

28 Tuesday Feb 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

communism, Democratic party, Republican party, Socialism, US left politics, USA


ఎం కోటేశ్వరరావు


” అమెరికాలోని అనేక మంది జనం, ఐరోపా సోషలిస్టులు ప్రమాదకరంగా కమ్యూనిజానికి దగ్గర అవుతున్నారు.అమెరికా తరహా జీవనానికి ఒక ముప్పుగా మారుతున్నారు.” అమెరికా పత్రిక అట్లాంటిక్‌ 1951 ఫిబ్రవరి సంచికలో ఐరోపాలో సోషలిజం అనే పేరుతో ప్రచురించిన ఒక వ్యాఖ్యానం పై వాక్యాలతో ప్రారంభమైంది. అదే ఫిబ్రవరి రెండవ తేదీ( 2023) న అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) సోషలిజం ఘోరాలను ఖండించే పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.సభలోని మొత్తం 219 రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, 109 మంది డెమోక్రటిక్‌ పార్టీ వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు.డెమోక్రాట్లు 86 మంది వ్యతిరేకించగా 14 మంది సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వ్యతిరేకించిన వారిలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 86 మందిలో అలెగ్జ్రాండ్రియా ఒకాసియో కార్టెెజ్‌, రషీదా లాయిబ్‌, గోరీ బుష్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఉన్నారు. వీరిని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ బలపరిచింది. అక్కడి మీడియా కమ్యూనిస్టులు, సోషలిస్టులని చిత్రించి వారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు గత ఎన్నికల్లో చూసింది.ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో సామ్రాజ్యవాద, యూదు దురహంకారాన్ని విమర్శించినందుకుగాను ఆమెను పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేంత వరకు రిపబ్లికన్‌ పార్టీ నిదురపోలేదు.


ప్రచ్చన్న యుద్ధంలో సోవియట్‌ను ఓడించాం, సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేశాం, కమ్యూనిజానికి కాలం చెల్లింది, దాన్ని ఏడు నిలువుల లోతున పూడ్చిపెట్టాం అంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ అమెరికా, ఐరోపా, ప్రపంచంలోని యావత్తు కమ్యూనిస్టు వ్యతిరేకులు మూడు దశాబ్దాల నాడే పండగ చేసుకున్నారు. సోషలిజం జరిపిన ఘోరాలను ఖండించాలంటూ అమెరికా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అన్నది ఆసక్తి కలిగించే అంశం. బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న ” ప్రతివారూ ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు: పెరిగిన యుగోస్లావియా బెంగ ” అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది.యుగోస్లావియా సోషలిస్టు దేశ స్థాపకుడు మార్షల్‌ టిటో ”ఐక్యత, సోదరత్వం ” అనే నినాదం కింద భిన్నమైన తెగలు, మతాల వారితో ఐక్య దేశాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని,1980 టిటో మరణం తరువాత తలెత్తిన జాతీయవాదంతో అది 1992 విచ్చిన్నానికి దారి తీసిందని ఆ పత్రిక పేర్కొన్నది. టిటో కాలంలో అనుసరించిన కొన్ని విధానాలు, వైఫల్యాలు వాటి మీద జనంలో తలెత్తిన అసంతృప్తి, దాన్ని ఆసరా చేసుకొని అమెరికా, ఐరోపా దేశాల గూఢచార సంస్థలు, క్రైస్తవమత పెద్దల కుమ్మక్కు, కుట్రలతో దాన్ని, ఇతర తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన చరిత్ర, దాన్ని రక్షించుకోవాలని జనం కూడా అనుకోకపోవటం మన కళ్ల ముందు జరిగిందే. ఆకాశంలో మబ్బులను చూసి చేతిలోని ముంతనీళ్లు పారబోసుకున్నట్లు ఆ దేశాల్లో పరిస్థితి తయారైంది. ఆకాశంలో కనిపించిన వెండి మబ్బులు వర్షించలేదు. పూర్వపు పెట్టుబడిదారీ వ్యవస్థను జనాల నెత్తిన రుద్దారు. దానికి తోడు యుద్దాలు, అంతర్యుద్ధాలను బోనస్‌గా ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాల తరువాత గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న చేసిన విశ్లేషణలో ఉనికిలో లేని యుగోస్లావియా గురించి బెంగను, విచ్చిన్నంపట్ల విచారాన్ని వెల్లడించారని పేర్కొన్నది.విడిపోయిన సెర్బియాలో 81శాతం, బోస్నియాలో 77, తొలుతగా ఐరోపా సమాఖ్యలో చేరిన స్లోవేనియాలో 45, కొసావోలో పదిశాతం మంది విచ్చిన్నాన్ని తప్పుపట్టారని వెల్లడించింది.పూర్వపు సోషలిస్టు వ్యవస్థను వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని పోల్చుకొని నిట్టూర్పులు విడిచేవారిని గురించి కూడా ఉటంకించింది. దీని అర్ధం ఆ దేశాల్లో ఉన్నవారందరూ తిరిగి సోషలిజాన్ని కోరుకుంటున్నారని చెప్పలేము.పెట్టుబడిదారీ ప్రపంచం గురించి కన్న కలలు కల్లలౌతున్నపుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఒక మధనం జరుగుతోంది. సోషలిజం పేరెత్తితే అణచివేసేందుకు ప్రజాస్వామ్యముసుగులో నిరంకుశపాలకులు వారి కళ్ల ముందు ఉన్నారు.


ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ బూచిని చూపి దశాబ్దాల పాటు అమెరికన్లను ఏమార్చిన పాలకులకు 1991 తరువాత అలాంటి తమ పౌరులను భయపెట్టేందుకు వెంటనే మరొక భూతం కనిపించకపోవటంతో ఉగ్రవాద ముప్పును ముందుకు తెచ్చారు.అదీ అంతగా పేల లేదు. ఈ లోగా వారు ఊహించని పరిణామం మరొకటి జరిగింది.సోషలిస్టు చైనా పురోగమనం, దాని మీద అన్ని రకాల వినియోగ వస్తువులకు ఆధారపడటం అమెరికన్లలో కొత్త ఆలోచనకు తెరలేపింది. సోషలిస్టు దేశాల్లో అన్నింటికీ కరువే, ప్రభుత్వం కేటాయించిన మేరకు సరకులు తీసుకోవాలి, దుకాణాలన్నీ ఖాళీ అని చేసిన ప్రచారాన్ని నమ్మిన వారిలో కొత్త ప్రశ్నలు. అదే నిజమైతే అమెరికా, ఐరోపా ధనిక దేశాలన్నింటికీ చైనా వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం ప్రారంభమైంది.దానికి తోడు అమెరికాలో ఉపాధి తగ్గటం, నిజవేతనాలు పడిపోవటం వంటి అనుభవాలను చూసిన తరువాత మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? చైనా, వియత్నాంలో ఉన్న సోషలిజమే మెరుగ్గా కనిపిస్తోంది కదా అన్న సందేహాలు మొగ్గతొడిగాయి. దీనికి తోడు తమ పెరటి తోట అనుకున్న లాటిన్‌ అమెరికాలో తమ ప్రభుత్వం బలపరిచిన నియంతలందరూ మట్టి కరిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగిన చోట అమెరికాను వ్యతిరేకించే వామపక్ష శక్తులు అనేక దేశాల్లో ఒకసారి కాదు, వరుసగా అధికారంలోకి రావటాన్ని కూడా అమెరికన్‌ పౌరులు, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. సోషలిజం విఫలం అన్న ప్రచారానికి విలువ లేదు గనుక పాలకులు దాన్ని వదలివేశారు. తమ జీవిత అనుభవాలను గమనించిన వారు సోషలిజం సంగతేమో గానీ పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, అది మనకు పనికి రాదు అనే వైపుగా ఆలోచించటం ప్రారంభించారు.అనేక విశ్వవిద్యాలయాల్లో, పుస్తక దుకాణాల్లో మూలన పడేసిన కాపిటల్‌ తదితర మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులిపినట్లు దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా వారిలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. చైనా తమకు పోటీదారుగా మారుతున్నదన్న అమెరికా నేతల ప్రకటనలూ వారిని ప్రభావితం చేస్తున్నాయి.


ఇదే తరుణంలో అమెరికా రాజకీయవేదిక మీద బెర్నీ శాండర్స్‌ వంటి వారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ప్రారంభించటం, అవును నేను సోషలిస్టునే అని ప్రకటించి మరీ సెనెట్‌కు గెలవటాన్ని చూసిన తరువాత ఇటీవలి కాలంలో మేమూ సోషలిస్టులమే అని చెప్పుకొనే యువత గణనీయంగా పెరిగింది. అమెరికా అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌ ప్రాంతం ఉన్న వార్డు నుంచి పెట్టుబడిదారుల కుంభస్థలం వంటి సియాటిల్‌ నగరంలో వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు క్షమా సావంత్‌(49) అనే మహిళానేత ఇచ్చిన ఉత్తేజంతో పాటు, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి కొంత మంది పురోగామివాదులుగా ఉన్న వారు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నిక కావటం వంటి పరిణామాలు కూడా జరిగాయి.వారు కుహనా వామపక్ష వాదులు అంటూ వామపక్షం పేరుతో ఉన్న కొన్ని శక్తులు కార్పొరేట్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే అందుకున్నాయి. ఎవరు ఎలాంటి వారు అన్నది చరిత్ర చెబుతుంది. ఒక వేళ నిజంగానే కుహనాశక్తులు వామపక్షం ముసుగులో వస్తే అలాంటి వారిని గమనించలేనంత అవివేకంగా అమెరికా కార్మికవర్గం, యువత లేదు.


అందుకే పాలకపార్టీలు రెండూ కంగారు పడుతున్నాయి. లేకుంటే సోషలిజం ఘోరాలను ఖండించేపేరుతో రెండు పార్టీలు ఒకే తీర్మానాన్ని ఎందుకు బలపరుస్తాయి ? కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని, అమెరికాకు తిరుగులేదు అని చేప్పే గొప్పలను నమ్మటానికి అమెరికన్లు సిద్దంగా లేరు.తమ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాను అమెరికాతో పోల్చితే ఎలుక పిల్ల-డైనోసార్‌ వంటివి. అలాంటి క్యూబా దగ్గర అణ్వాయుధాలు లేవు, స్వంత క్షిపణులు లేవు. నిజానికి అమెరికా తలచుకుంటే ఒక్క నిమిషంలో క్యూబా దీవిని నామరూపాల్లేకుండా చేసే శక్తి ఉంది. అయినప్పటికీ మేము మీకెంత దూరమో మీరు కూడా మాకంతే దూరం అని ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. కాస్ట్రో వారసులు ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికాకు తిరుగులేదు అన్నట్లు చిత్రించే హాలీవుడ్‌ సినిమాల బండారం కూడా ఎరిగిందే. వియత్నాం నుంచి 1975లో బతుకు జీవుడా అంటూ హెలికాప్టర్లు, విమానాల వెంట పరుగులు తీసి పారిపోయి వచ్చిన అమెరికా సైనికులు మరోసారి ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతుల్లో కూడా అలాంటి పరాభవాన్నే పొందారంటూ వచ్చిన వార్తలను,దృశ్యాలను అమెరికా యువతీయువకులు చూడకుండా ఉంటారా ?


అమెరికా దిగువ సభ ఆమోదించిన కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఎగువ సభ సెనెట్‌ ఆమోదించటం లాంఛనమే, తిరస్కరిస్తే చరిత్ర అవుతుంది. తీర్మానంలో ఏముందో చెప్పనవసరం లేదు. వెనెజులా,క్యూబా తదితర దేశాలపై విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం గురించి పల్లెత్తు మాట లేదు. అక్కడ జనం ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అమెరికా పుణ్యమే అది.వ్యక్తిగత గౌరవార్హతల ప్రాతిపదిక మీద విశ్వాసం పునాదిగా అమెరికా ఏర్పడింది.సామాహిక వ్యవస్థగా నిర్మితమయ్యే సోషలిజం దానికి పూర్తి వ్యతిరేకం అని దానిలో పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాచిపాట, దాన్ని అమెరికా నూతన తరం అంగీకరించటం లేదని ముందే చెప్పుకున్నాం. ఉక్రెయిన్‌ వివాదానికి కారకులైన అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు దాన్నుంచి గౌరవ ప్రదంగా బయటపడే దారి, పడాలనే చిత్తశుద్ది లేక మరింత తీవ్రంగా మార్చేందుకు పూనుకున్నాయి. తటస్థంగా ఉన్న చైనా పుతిన్‌ మిలిటరీకి మారణాయుధాలు ఇచ్చేందుకు పూనుకున్నదని ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం జి20 దేశాల బృందం అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశాన్ని తమ వెంట నడవాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది.


ప్రతి ఏటా అమెరికాలోని కొన్ని సంస్థలు అభిప్రాయాలను సేకరిస్తాయి. వాటిలో సోషలిజం, పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించటం, వ్యరేకించటం గురించి కూడా ఉంటాయి. ఒక ఏడాది శాతాలు పెరగవచ్చు, తరగవచ్చు మొత్తం మీద గ్రాఫ్‌ ఎలా ఉందన్నదానినే పరిగణనలోకి తీసుకుంటే సోషలిజం పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే దాని మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ఏకంగా పార్లమెంటునే వేదికగా ఎంచుకున్నారు.ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ” పూ ” సంస్థ సర్వే ప్రకారం 2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు.ప్రతికూలంగా ఉన్నవారు 33 నుంచి 39శాతానికి పెరిగారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు, ప్రతికూలంగా ఉన్నవారు 55 నుంచి 60శాతానికి పెరిగినట్లు కూడా పేర్కొన్నది. దేశంలో 3.4 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. వారిలో 90లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారంతా ప్రభుత్వం లేదా దాన ధర్మాలు చేసే సంస్థలు జారీ చేసే ఆహార కూపన్లు (మన దేశంలో ఉచిత బియ్యం వంటివి) తీసుకుంటున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారిలో . 40శాతం మంది తమ వేతనాల్లో 30 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ సర్వేల మీద ప్రభావం చూపుతాయి. దిగజారుతున్న పరిస్థితులు తమ జనాన్ని మరింతగా సోషలిజం వైపు ఆకర్షిస్తాయి అన్నదాని కంటే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే ధోరణులు పెరగటమే అమెరికా పాలకవర్గాన్ని ఎక్కువగా భయపెడుతున్నదంటే అతిశయోక్తి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సియాటిల్‌ నగరంలో కులవివక్షపై నిషేధం – మహిళలందు కమ్యూనిస్టు క్షమా సావంత్‌ వేరయా !

26 Sunday Feb 2023

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination, Caste Discrimination Ban in Seattle, Casteism in America, Hindu Fundamentalism, Hinduthwa, Kshama Sawant, RSS, Seattle


ఎం కోటేశ్వరరావు


ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం గర్వంతో తల ఎత్తుకొనే పరిణామం.అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్‌ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ అనే 49 సంవత్సరాల భారతీయ మహిళ.తొలిసారి ఎన్నికైనపుడు కనీస వేతనం గంటకు 15 డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్‌ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు.రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక ” అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి ? ” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నపుడు మేయర్‌ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మితవాదులు, కార్పొరేట్‌ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసిలోని అమెరికా అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ ప్రాంతం కొంత భాగం కూడా క్షమా సావంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ వార్డు(జిల్లా అని పిలుస్తారు) పరిధిలోకి వస్తుంది.


సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. అటువంటి శక్తులకు క్షమా సావంత్‌ ప్రతినిధి. కానీ ఎక్కడకు వెళ్లినా కులవివక్ష కంపును మోసుకుపోతున్న సంస్కారం లేని జనాలు అమెరికాలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలించుకోకపోగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.చివరికి ఇటీవల సినిమా అభిమానులు కొట్టుకొని కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే. అనేక మంది తాము కులవివక్ష పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు అక్కడ కూడా మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు.


సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. వత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిస ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కులాలు లేకపోతే హిందూత్వ వాదులకు ఉలుకెందుకు ? తాజాగా సియాటిల్‌ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలు లేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది ) ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎవరైనా చూడవచ్చు. భుజం మీద చేయివేసి జంధ్యం ఉందా లేదా అని నిర్ధారించుకొనే టెక్నాలజీ మన సొంతం. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్స్‌అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం జరిగింది. అమెరికాలోని స్వామినారాయణ సంస్థ్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా వారే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.


మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్‌ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి.భర్త వివేక్‌ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్ధశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు.సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. మన దేశం నుంచి అనేక మంది అమెరికా వెళ్లారు. ఎంపీలు, మంత్రిపదవులు వెలగబెట్టారు. ఇప్పుడు ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కష్మా సావంత్‌ మాదిరి ఎందుకు ఆలోచించలేదు ? మహిళలకు మాత్రమే వారి సమస్యలు అలాగే దళితులకు మాత్రమే దళితుల వారి సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా మాట్లాడేవారికి దళితురాలు కాని క్షమా సావంత్‌ ఆచరణ ఆలోచింపచేస్తుందా ? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ది కావాలి. అది ఉండబట్టే నాడు ఉన్నవ లక్ష్మీనారాయణను మాలపల్లి నవలా రచనకు పురికొల్పింది. లేనందునే అనేక మంది దళితులమని చెప్పేవారు మనువాదుల చంకనెక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. నాడు దళితుల కోసం పోరాడిన ఇతరులు అనేక మంది వారి సామాజిక తరగతికి ద్రోహం చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, మరి నేడు మనువాదుల వెంట తిరిగే దళితులు ఎవరికి ద్రోహం చేస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోడేళ్లను బుజ్జగిస్తున్న మేకలు : కేరళలో వివాదంగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌ – జమాతే చర్చలు !

23 Thursday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), JIH, Kerala LDF, Muslim League, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమదారికి తెచ్చుకోవటం అసాధ్యమా ? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్‌ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.


జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్‌ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.” ఆర్‌ఎస్‌ఎస్‌తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు.ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్చకు రక్షణ. దాన్ని విచ్చిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం ? సంఘపరివార్‌ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకు మద్దతు ఇస్తాయి.మతశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు.లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్‌ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్‌, సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమా, ముస్లిం లీగ్‌, కేరళ నదవతుల్‌ ముజాహిదీన్‌, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్‌ కాంతాపురం ఏపి అబూబకర్‌ ముస్లియార్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్‌ పేర్కొన్నది.మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది.భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పి పుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ఒక పనిముట్టుగా మారుతున్నది ” అని విమర్శించింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్‌ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్‌ పేర్కొన్నారు.


ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘపరివార్‌ నేతలు ఇంద్రేష్‌ కుమార్‌, రామ్‌లాల్‌, కృష్ణ గోపాల్‌ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్‌, జమాతే ఉలేమా ఇ హింద్‌, అజ్మీర్‌ దర్గా సల్మాన్‌ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, నజీబ్‌ జంగ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హౌటల్‌ ఓనరు సయిద్‌ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్‌ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్‌ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగాస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు భావించారు.ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్‌ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది.అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.


ఆర్‌ఎస్‌ఎస్‌-జమాతే ఇస్లామీ హింద్‌ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్‌ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్‌ పార్టీ, జమాతే పట్ల ముస్లింలీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్‌ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్‌ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్‌ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్‌ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్‌ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు.సిఎం పినరయి విజయన్‌ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.


ఖురాన్‌లో మూడుసార్లు తలాక్‌ అనే పద్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు ? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్‌ అనేదాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు.వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కులవృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు(బ్రాహ్మలు కాదు మేథావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా ! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు.కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారా ? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?


సిపిఐ(ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకువెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, యాత్ర సారధి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు.లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ ఎలా అంటారు ? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లింలీగ్‌ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్‌, సిఎస్‌ సుజాత, ఎం స్వరాజ్‌, కెటి జలీల్‌, జేక్‌ సి థామన్‌ సారధులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రు.40వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రు.9,000 కోట్లు, రెవెన్యూలోటు పరిహారం రు.6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పధకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది.రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపిని భయపెడుతున్న తులసీదాన్‌ ” రామ చరిత మానస్‌ ” !

17 Friday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Literature., NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


” మీరు ఎల్లవేళలా కొంత మందిని, అందరినీ కొంత కాలం వెర్రి వాళ్లను చేయవచ్చు. కానీ మీరు అందరినీ అన్ని వేళలా వెర్రి వాళ్లను చేయలేరు ” ఇది అమెరికా నేత అబ్రహాం లింకన్‌ చెప్పిన సుభాషితం.” ఏ పదజాలం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” కమ్యూనిస్టు నేత లెనిన్‌ చేసిన హెచ్చరిక ఇది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఇది వర్తిస్తుంది.మన దేశంలో ఇదే జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. మరి జనం ఎల్లవేళలా మోసపోతారా ? తెలివిగా ఉంటున్నారా ? తమ తెంపరితనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మోసకారులు మండిపడతారు. తరువాత దెబ్బలాట, అణచివేతలకు పూనుకుంటారు. జనం దాన్ని సహిస్తారా ? లేదు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలకు తెలియని భాష, లిపిలో రాసిన గ్రంధాల్లో ఉన్నదాన్ని కొంత మంది ఏ విధంగా చెబితే దాన్ని జనం నిజమని నమ్మారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీకా తాత్పర్యాలను విడదీసి అర్ధాలను వెల్లడించేవారు భిన్న కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.వాస్తవాన్ని జీర్ణించుకోలేని వారు తమకు అనువైన భాష్యాలను చెబుతూ వివక్షను, గతాన్ని సమర్ధించేందుకు పూనుకున్నారు.


తులసీదాస్‌ రచన రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతులు, మహిలు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్‌ మౌర్య, అయోధ్య హనుమాన్‌ దేవాలయపూజారి రాజు దాస్‌, అయోధ్య తపస్విచావని మహంత్‌ పరమహంస దాస్‌ గురువారం నాడు దాడులకు పాల్పడినట్లు పరస్పరం కేసులు దాఖలు చేశారు.రామచరిత మానస్‌ గ్రంధంలోని వివాదాస్పద అంశాలపై లక్నోలోని ఒక హౌటల్‌లో ఒక టీవీ ఛానల్‌ ఏర్పాటు చేసిన ఒక చర్చలో పాల్గొనేందుకు వారు వచ్చారు.చర్చ ముగిసిన తరువాత తాను హౌటల్‌ నుంచి వెళుతుండగా మౌర్య, అతని అనుచరులు తన మీద దాడిచేసినట్లు రాజుదాస్‌ ఆరోపిస్తూ ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పూజారి, మహంత్‌ తన మీద కత్తి, గొడ్డలితో దాడికి పాల్పడగా తన అనుచరుల కారణంగా తప్పించుకున్నానని ఆ మేరకు కేసు దాఖలు చేస్తున్నట్లు మౌర్య ప్రకటించారు.తనకు అదనపు రక్షణ కల్పించాలని కూడా పోలీసు కమిషనర్‌ను కోరారు. చర్చలో టీవీ యాంకర్‌ తన మీద దాడికి రెచ్చగొట్టినట్లు కూడా విమర్శించారు. అభ్యంతరకర భాగాలను రామచరిత మానస్‌ గ్రంధం నుంచి తొలగించాలి లేదా దాన్ని నిషేధించాలని మౌర్య కోరుతున్నారు. అలాంటివాటిని తాము అంగీకరించేది లేదని సాధు, సంతులు చెబుతున్నారు. చర్చ పక్కదారి పట్టి భౌతికదాడుల వైపు మళ్లటం ఒక ప్రమాదకర సూచన.మౌర్యను విమర్శిస్తూ పోస్టులు పెట్టినందుకు రిచా సింగ్‌, రోలీ తివారీ అనే ఇద్దరు మహిళా ప్రతినిధులను పార్టీ నుంచి సమాజవాది పార్టీ బహిష్కరించింది.సమాజవాదీ ఎంఎల్‌ఏ రాకేష్‌ సింగ్‌ ఈ వివాదంతో స్వంత పార్టీనేతపై ధ్వజమెత్తారు. మౌర్యకు మతి తప్పిందని అన్నారు.అతను సనాతనీ లేదా సోషలిస్టు కానీ కాదన్నారు.ఈ వివాదం జనవరిలో బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌,మౌర్య ప్రకటనలతో మొదలైంది.క్షమాపణలు చెప్పాలన్న బిజెపి నేతల స్పందనకు చెప్పేదే లే అంటూ స్వామి ప్రసాద్‌ మౌర్య జవాబిస్తూ రామచరిత మానస్‌కు ఎవరూ ఎవరూ వ్యతిరేకం కాదు, రామ ప్రభువుకూ కాదు, కొన్ని చరణాలకు మాత్రమే వ్యతిరేకం అన్నారు.మౌర్యను ఉరితీయాలని బిజెపి నేత నందకిషోర్‌ గుజార్‌ సుప్రీం కోర్టుకు లేఖరాశారు.

ప్రతి తరంలోనూ సమాజాన్ని వెనక్కు నడిపించాలని చూసిన వారు మనకు కనిపిస్తారు. కానీ సమాజం ముందుకు, మున్ముందుకు పోతున్నదే తప్ప తలకిందులుగా నడవటం లేదు. పనికిరాని వాటిని విసర్జిస్తూనే ఉంది. మానవ శరీరంలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే భాగం క్రిమిక(అపెండిసైటిస్‌). అలాంటి శక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఏ అంబేద్కరైతే భారత నాగరికత, సమాజానికి మాయనిమచ్చగా ఉందని మనుస్కృతిని దగ్దం చేశారో ఆ మహానుభావుడిని ఒకవైపు గౌరవిస్తున్నామని చెబుతున్నారు కొందరు. ఆ అంబేద్కర్‌ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగ రచనకు ఆ మనుస్మృతిని పరిగణనలోకి తీసుకోలేదు. దానిలో ఉన్న అంశాలకు విరుద్దంగా సమానత్వాన్ని అమలు చేసే నిబంధనలు, స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. సదరు మనుస్మృతిని భారత పురాతన రాజ్యాంగంగా వర్ణిస్తూ దాని తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించేందుకు పూనుకున్న తిరోగమన వాదులకు ఎదురుదెబ్బ తగిలింది.హైదరాబాద్‌ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఒక సభలో ఆవిష్కరించేందుకు అభ్యంతరాలు వెల్లువెత్తటంతో ఇచ్చిన అనుమతిని అధికారులు రద్దు చేశారు. దాంతో నిర్వాహకులు తరువాత దాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఏదో ఒక ప్రైవేటు స్థలంలో ఆ పని చేస్తారు, అది వేరే అంశం. మూడున్నర కిలోల బరువు, రు.2,100 విలువగల పుస్తకాన్ని అచ్చువేసేందుకు అవసరమైన భారీ పెట్టుబడితో ఆ పుస్తకాన్ని జనాలతో చదివించి తిరోగమనంవైపు నెట్టేందుకు పడుతున్న ప్రయాస స్పష్టంగా కనిపిస్తున్నది.


ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే దానికి ప్రతిఘటన ఉండటం సహజం.మనువు చెప్పినట్లుగా బతకటానికి జనం సిద్దంగా లేరు. ఆ బోధనలను బలవంతంగా అమలు జరిపే అవకాశమూ లేదు. ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో షరియాను అమలు జరిపేందుకు పూనుకున్నవారికి , మన దేశంలో మనుస్మృతిని రుద్దాలని చూసే వారికి పెద్ద తేడా లేదు. దేశంలో అనేక మంది రామాయణాన్ని తిరగ రాశారు. వాటిలో పదహారవశతాబ్దినాటి తులసీదాన్‌ రచన ఒకటి.హిందీకి దగ్గరగా ఉండే అవధీ భాషలో రాసినందున జనానికి సులభంగా అర్ధం కావటంతో ప్రాచుర్యం పొందింది.తులసీదాస్‌ కలం నుంచి వెలువడిన రామచరిత మానస్‌ గ్రంధంలోని మనుస్మృతిలో చెప్పిన అంశాలు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో వివాదాన్ని రేపాయి. నల్లేరు మీద బండిలా తమ పథకాన్ని అమలు జరపాలని చూస్తున్న హిందూత్వశక్తులకు ఇది మింగుడు పడక మండిపడుతున్నాయి.శాపాలు పెట్టే శక్తి లేకపోవటం లేదా పని చేయవని తెలిసి గానీ అభ్యంతర అంశాలను విమర్శించిన బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ నాలుక కోస్తే రు. పదికోట్ల బహుమానం ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. స్వామి ప్రసాద్‌ మౌర్య తలనరికితే 21 లక్షలు ఇస్తానని హనుమాన్‌ గుడి పూజారి రాజు దాస్‌ ప్రకటించారు.ఈ ప్రకటనలను చూసిన తరువాత బాబాలు,సాధువులు, సంత్‌లు ఉగ్రవాదులు, కసాయిలుగా మారారని స్వామి ప్రసాద్‌ విమర్శించారు. గతంలో బాబాలు అంటే సన్యాసులుగా ఉండేవారు. గతంలో బాబాలు,సాధువులకు కోపం వచ్చేది కాదు, వచ్చినా శాపాలు పెట్టేవారు. నేటి బాబాలకు అలాంటి తపస్సు లేదు.వారికి నిజంగా శక్తి ఉంటే చైనాను భస్మం చేయమనండి, ఈ రోజు బాబాలు, సాధువులు ఉగ్రవాదులుగా మారారు. కొంత మంది ముక్కులు, నాలుకలు కోసేయమని, తలలు తీసేయమంటూ కసాయిలుగా మారుతున్నారు అని ప్రసాద్‌ అన్నారు. ఈ పూర్వరంగంలోనే గురువారం నాడు లక్నోలో ఇరువర్గాలకు చెందిన అనుచరులు గొడవకు దిగినట్లు చెప్పవచ్చు.


రామచరిత మానస్‌, మనుస్మృతి, పురాణాలు, ఇతర గ్రంధాల్లో ఉన్న అవాంఛనీయ వర్ణనలు, బోధల గురించి దశాబ్దాల క్రితమే తెలుగునాట హేతువాదులు, నాస్తికవాదులు ఎత్తి చూపిన అంశం తెలిసిందే.ఇప్పుడు ఉత్తరాదిన అలాంటి పరిణామం జరుగుతోంది. నాడు ఆ విమర్శ, సమర్థనలు ఎన్నికలతో నిమిత్తం లేవు. ఇప్పుడు వాటితో మిళితం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను కించపరిచే భాగాలను నిషేధిస్తామని స్వామి ప్రసాద్‌ చెప్పారు.


సమాజవాదీ ఎంఎల్‌ఏ ఆర్‌కె వర్మ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. దానిలో ” తులసీదాస్‌ వివక్ష, అంటరానితనం,అసమానతను తలకు ఎక్కించుకున్న ఒక కవి. అతని రామచరిత మానస్‌లో రాజ్యాంగానికి విరుద్దమైన అనేక చరణాలున్నాయి.అవి వెనుబడిన తరగతులు, మహిళలు, దళితులు, సంత్‌ సమాజాన్ని అవమానిస్తున్నాయి.ఆ చరణాలను తొలగించాలి ” అని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ బిజెపి యువమోర్చా వారు ఎంఎల్‌ఏ శవయాత్ర జరిపి బొమ్మను దగ్దం చేశారు. రామచరిత మానస్‌ను అవమానించినందుకు ఆర్‌జెడి,సమాజవాది పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వహిందూపరిషత్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. హిందూ సమాజంలో అపనమ్మకాన్ని కలిగించేందుకు ఆ పార్టీల నేతలు చూస్తున్నారని ఆరోపించింది.


ఉత్తరాదిలో 120లోక్‌ సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో తలెత్తిన ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది.మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందేమో అని కంగారు పడుతున్న బిజెపి ఇతర సంస్థలు, సాధు సంతులను రంగంలోకి దింపి ఆచితూచి మాట్లాడుతున్నది.సున్నితమైన, మనోభావాలతో ముడిపడిన ఈ వివాదం పెరిగితే తన బిసి ఓటు బాంకుకు గండిపడుతుందన్న భయం దానిలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సంఘపరివార్‌ సంస్థలకు చెందిన అగ్రవర్ణాలుగా అనుకుంటున్న కులాలకు చెందిన వారు హిందూత్వ అజెండాను దెబ్బతీసే ఈ పరిణామంపై మండిపడుతుండగా వారిని మాట్లాడవద్దని బిజెపి ఆదేశించినట్లు వార్తలు. రామచరిత మానస్‌లో తమను కులపరంగా కించపరిచినా తమకేమీ ఇబ్బంది లేదు అని చెప్పగల స్థితి లేనందున వెనుక బడిన తరగతుల నేతలు, మద్దతుదారులు నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. వెనుకబడిన తరగతుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. ఆ జనాభా ఎంత అన్నది తాజా లెక్కలు లేవు. అందువలన కులపరమైన లెక్కలు తేల్చాలన్న డిమాండ్‌ను బిజెపి అంగీకరించటం లేదు. బీహార్‌లో గణాంకాల సేకరణకు ఆర్‌జెడి-జెడియు కూటమి నిర్ణయించటంతో ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఆ డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నది. దాని కోసం ఆందోళన ప్రారంభిస్తామని సమాజవాదీ పార్టీ ప్రకటించింది. రామచరిత మానస్‌ వివాదం గురించి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ను అడగ్గా వివాదం రేపే వారికి దాని గురించి తెలియదని, బిసి లెక్కల గురించి నిర్ణయించాల్సింది కేంద్రమని తప్పించుకున్నారు.


1980దశకంలో ఉత్తరాదిన మండలమా ా కమండలమా అన్న ప్రాతిపదికన ఓటర్లు చీలారు. మండల్‌ కమిషన్‌ నివేదికను సమర్ధించిన పార్టీలు ఒక వైపు బిజెపి మరోవైపు తారసిల్లాయి. తరువాత జరిగిన పరిణామాల్లో 2014 నాటికి ఎంబిసీలు బిజెపికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఎంబిసిలు, కొందరు దళితులను ఆకట్టుకున్న బిజెపి మిగతావారిని కూడా తన వైపు తిప్పుకొనేందుకు పూనుకున్నప్పటికీ అది జరగలేదు. బిసి జనాభా గణనకు తిరస్కరించటంతో అనేక మంది బిజెపి మద్దతుదారుల్లో కూడా పునరాలోచన ప్రారంభమైన దశలో రామచరిత మానస్‌ వివాదం ముందుకు వచ్చింది. ఆ గ్రంధాన్ని లక్నోలో తగులబెట్టిన వారి మీద మీసాతో సహా ఇతర చట్టాల కింద మౌర్యతో సహా పది మందిపై బిజెపి సర్కార్‌ కేసులు పెట్టింది. ఈ వివాదం తలెత్తిన తరువాత సమాజవాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తాను కూడా శూద్రుడనే అని అంటూ బిజెపి మీద అనేక ప్రశ్నలను సంధించారు. అసెంబ్లీలో సిఎం యోగి తులసీదాస్‌ రచనలో ఉన్నవాటిని అనువదించి చదివి శూద్రులు ఎవరో తేల్చాలని సవాలు చేశారు. దళితులను శూద్రులుగా బిజెపి వారు పరిగణిస్తున్నారా లేక మమ్మల్ని బిసిలుగానూ దళితులను శూద్రులుగా పరిగణిస్తున్నారా అన్నది తేల్చాలి అన్నారు.ఇదిలా ఉండగా లక్నోలోని సమాజవాదీ ఆఫీసు సమీపంలో పెద్ద బోర్డు వెలసింది. ” 6,743 కులాలు, శూద్ర సమాజం గర్వంతో చెబుతున్నాం మేం శూద్రులం, జై శూద్ర సమాజం, జై రాజ్యాంగం ” అని దాని మీద రాసి ఉంది. దాన్ని ఆలిండియా కుర్మీ క్షత్రియ మహాసభ( ముంబై) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శూద్ర ఉత్తమ్‌ ప్రకాష్‌ సింగ్‌ పటేల్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


పాము పాలు తాగితే విషంగా మారినట్లుగా దిగువ కులాల వారు విద్యనేర్చుకుంటే విషపూరితం అవుతారని దానిలో రాసినట్లు బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ చెప్పారు.సకల గుణ హీనుడైనా బ్రాహ్మణుడిని పూజించాలి, వేద ప్రవీణులైనా శూద్రులను గౌరవించకూడదని, తెలీ, కుమ్‌హార్‌, కహార్‌,దళితులు, ఆదివాసీలు అధములని పేర్కొన్నట్లు కూడా చెప్పారు. మహిళలు, దళితుల గురించి తులసీదాస్‌ కించపరిచే విధంగా రాశారు, అవి ఒకటో రెండో వాక్యాలు కాదు అనేక చరణాలు రాశారు. ఒక దానిలో ఒక బ్రాహ్మణుడి నిండా చెడు లక్షణాలు ఉన్నా అతన్ని పూజించాలి. ఒక దళితుడు వేద పండితుడైనా అతన్ని గౌరవించకూడదు అని రాశారని, అంత వివక్షతో కూడిన వాటిని ఎలా అంగీకరించాలని జామియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హేమలత మహేశ్వర్‌ ప్రశ్నించారు.డోలు వాయించేవారు,నిరక్షరాస్యులు, మహిళలు,పశువులు, దళితులు దండనార్హులని రామచరిత మానస్‌లో తులసీదాస్‌ చెప్పినట్లు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ 2018 ఆగస్టులో ఒక పోస్టులో పేర్కొన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇది గృహ హింస చట్టం, ఎస్‌సి ఎస్‌టి చట్టాలను ఉల్లంఘించాలని ప్రోత్సహించటం కిందికి రాదా అని కట్జూ ప్రశ్నించారు.దళితులు,ఓబిసిలను శూద్రులని వర్ణించటం పట్ల బిఎస్‌పి నాయకురాలు మాయావతి నిరసన తెలిపారు.సమాజవాదీ వారిని శూద్రులని అప్రతిష్టపాలు చేస్తున్నదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదా అని ప్రశ్నించారు.వారిని ఓటు బాంకుగా పరిగణిస్తున్నదని విమర్శించారు.


తులసీదాస్‌ను సమర్ధించే కొందరు విపరీత తెలివిని ప్రదర్శిస్తున్నారు. అతనేమీ సంస్కర్తకాదు, కనుక అతనిలో వివక్ష ఉంటుంది. వివాదాస్పద అంశాలను అతను సృష్టించిన పాత్రలు చెప్పినవి తప్ప అతని స్వంత అభిప్రాయాలు కాదని వితండవాదం చేస్తున్నారు. అసందర్భంగా ప్రస్తావిస్తున్నారని, వాటి అసలు అర్ధం వారికి అవగతం కాలేదని చెబుతున్నారు.శూద్రులు లేదా బ్రాహ్మలు అనేది చేసే పనులను బట్టి తప్ప పుట్టుకనుబట్టి కాదని కొందరు చెబుతున్నారు. అలాంటి పరిగణన గతంలో ఉందో లేదు తెలీదు ఇప్పుడు ఉనికిలో లేదు. పుట్టుకతోనే కులం, మతం వస్తున్నది. ఆ మేరకు గౌరవ మర్యాదలు, హీనంగా చూడటం జరుగుతున్నది. మొత్తంగా చెప్పాలంటే నల్లేరు మీద బండిలా తమ హిందుత్వ అజెండాను అమలు జరపాలన్న కాషాయ దళాలను ఎదుర్కొనే శక్తులు సదరు హిందూత్వ భావజాలంలో ఉన్న అసంబద్దతలనే ఆయుధాలు చేసుకుంటుంటే మింగా కక్కలేని స్థితిలో బిజెపి గిలగిల కొట్టుకుంటున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వియత్నాంలో తమ మిలిటరీ మారణకాండను నిర్ధారించిన దక్షిణ కొరియా కోర్టు !

15 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ho Chi Minh, My Lai Massacre, US imperialism, Viet Cong fighters, Vietnam War, Vietnam War Massacre


ఎం కోటేశ్వరరావు


వియత్నాం ! స్వాతంత్య్రం, మూడు సామ్రాజ్యవాద దేశాల కబంధహస్తాల నుంచి విముక్తి కోసం మూడున్నర దశాబ్దాల పాటు అపార రక్తం ధారపోసి, త్యాగాలు చేసిన ఒక చిన్న దేశం. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. ఖండాలన్నింటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకొనేంత బలం కలిగిన అమెరికా సేనలను ప్రాణాలు దక్కితే చాలు బతుకుజీవుడా అంటూ పారిపోయేట్లు చేసి ప్రజాశక్తితో ఎంత పెద్ద మిలిటరీనైనా మట్టికరిపించవచ్చు అని నిరూపించిన దేశం కూడా అదే !! అలాంటి వీర గడ్డకు చెందిన గుయన్‌ థీ ధాన్‌ (62) వేసిన కేసును తొలిసారిగా విచారించిన దక్షిణ కొరియా కోర్టు వియత్నాంలో మారణకాండకు దక్షిణ కొరియా మిలిటరీ కారణమని ఫిబ్రవరి మొదటి వారంలో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఫ్రెంచి వలసగా ఉన్న వియత్నాంను రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమించింది. అది పతనమైన తరువాత తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమణలోకి వెళ్లింది. దాన్ని ఓడించిన తరువాత అమెరికా రంగంలోకి దిగి ఉత్తర వియత్నాంలోని సోషలిస్టు సమాజాన్ని, కమ్యూనిస్టులను, దక్షిణ వియత్నాంలోని జాతీయవాదులు, కమ్యూనిస్టులను అణచేందుకు చూసింది. దానికి మద్దతుగా తైవాన్‌లో తిష్టవేసిన చాంగ్‌కై షేక్‌ మిలిటరీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌,లావోస్‌, కంపూచియా, ఫిలిప్పైన్స్‌, థాయిలాండ్‌, దక్షిణ వియత్నాం మిలిటరీలు వచ్చాయి. ఉత్తర, దక్షిణ వియత్నాంలలోని కమ్యూనిస్టులకు మద్దతుగా చైనా, సోవియట్‌యూనియన్‌, ఉత్తర కొరియా, లావోస్‌, కంపూచియాల్లోని కమ్యూనిస్టు గెరిల్లాలు బాసటగా నిలిచారు.


వియత్నాంలో అమెరికా కూటమి జరిపిన మారణకాండకు గురికాని గ్రామం, పట్టణం లేదంటే అతియోక్తి కాదు, ప్రతి చెట్టూ, పుట్ట, రాయి, రప్ప దేన్ని కదిలించినా దుర్మార్గాలు-వాటికి ప్రతిగా పోరులో ప్రాణాలర్పించిన వారి కథలు, గాధలు వినిపిస్తాయి. అతివల కన్నీటి ఉదంతాలు కొల్లలు. అలాంటి మారణకాండలో ఏడు సంవత్సరాల ప్రాయంలో గాయపడి కోలుకున్న గుయన్‌ థీ ధాన్‌ అనే 62 సంవత్సరాల మహిళ 2020లో వేసిన కేసులో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక కోర్టు తీర్పునిచ్చింది. దక్షిణ కొరియా మిలిటరీ జరిపిన దారుణంలోనే ఆమె గాయపడిందని చెప్పటమే గాక, కేసులో ప్రభుత్వం చేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చి ఆమెకు మూడు కోట్ల వన్‌లు (24వేల డాలర్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీని మీద ప్రభుత్వ అప్పీలు చేస్తుందా ? మరొకటి చేస్తుందా అన్నది వెంటనే వెల్లడి కాలేదు. ఫాంగ్‌ హట్‌ సమీపంలోని ఫాంగ్‌ నీ అనే వియత్నాం గ్రామంలో 1968 ఏప్రిల్‌ 12న దక్షిణ కొరియా మిలిటరీ మూకలు నిరాయుధులైన పౌరులపై అకారణంగా జరిపిన కాల్పుల్లో 70 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. వారిలో గుయన్‌ థీ ధాన్‌ ఒకరు. ఆ ఉదంతంలో అమెతల్లి, సోదరుడితో సహా కుటుంబంలోని ఐదుగురు మరణించారు.ఈ ఉదంతం గురించి అమెరికా మిలిటరీ రికార్డులలో నమోదు చేశారు. ఒక దక్షిణ కొరియా మిలిటరీ జవాను గెరిల్లాల కాల్పుల్లో గాయపడిన తరువాత ఈ ఉదంతం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే గెరిల్లాలనేమీ చేయలేక సాధారణ పౌరుల మీద కక్ష తీర్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది.ఈ దారుణానికి ఒడిగట్టిన తరువాత గెరిల్లాల దాడికి భయపడి సైనికులు పారిపోయినట్లు అమెరికా రికార్డుల్లో ఉంది.


దశాబ్దాల పాటు సాగిన దుర్మార్గం, దాన్ని ప్రతిఘటిస్తూ సాగిన పోరులో మరణించిన వారి కచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేవు. అనేక మందిని అంతర్ధానం చేశారు, మిలిటరీ మరణాలను దాచారు. వియత్నాం పోరును రెండు భాగాలుగా చూడవచ్చు.1945లో జపాన్‌ దురాక్రమణ నుంచి తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమించిన తరువాత 1954 జూలై 21వరకు ఒకటి, తరువాత జరిగిన పరిణామాలను రెండో అంకంగా చెబుతున్నారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా సమాచారం ప్రకారం 1945 నుంచి 1954వరకు ఫ్రెంచి సామ్రాజ్యవాదులతో కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ తదితరుల నేతృత్వంలో సాగిన పోరును చరిత్రకారులు తొలి ఇండోచైనా వార్‌గా పిలిచారు.ఈ పోరులో కమ్యూనిస్టు గెరిల్లాలు, సాధారణ పౌరులు మూడు నుంచి ఐదులక్షల మంది వరకు ప్రాణాలర్పించారు. ఫ్రెంచి దళాలు, వారితో చేతులు కలిపిన స్థానికులు, కొద్ది మంది ఫ్రెంచి పౌరులు మొత్తం 92 నుంచి లక్షా పదివేల మంది వరకు మరణించారు. ఈ పోరు ముగింపు మరొక కొత్త పరిణామాలకు నాంది పలికింది. జెనీవాలో కుదిరిన ఒప్పందం ప్రకారం వియత్నాంను ఉత్తర – దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తరవియత్నాం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చింది. రెండు సంవత్సరాల్లో దక్షిణ వియత్నాంలో ఎన్నికలు జరిపి రెండు ప్రాంతాల విలీనం జరపాలని దానిలో ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఎన్నికలు జరిగితే దక్షిణ వియత్నాంలో ఫ్రెంచి అనుకూల శక్తులు ఓడిపోవటం ఖాయంగా కనిపించింది. దాంతో ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికన్లు ఫ్రాన్స్‌ స్థానంలో ప్రవేశించి విలీనాన్ని అడ్డుకున్నారు. దక్షిణ వియత్నాంలోని దేశభక్తులు,కమ్యూనిస్టులు వియట్‌కాంగ్‌ పేరుతో ఒక దేశభక్త సంస్థను ఏర్పాటు చేసి అమెరికా, స్థానిక మిలిటరీ నుంచి విముక్తికోసం పోరు ప్రారంభించారు. దానికి ఉత్తర వియత్నాం పూర్తి మద్దతు ఇచ్చింది. అది 1975 ఏప్రిల్‌ 30వరకు సాగింది. అమెరికా దళాలు అక్కడి నుంచి పారిపోయాయి.


దాడుల్లో 30లక్షల మంది అమెరికా సైనికులు పాల్గొన్నారు. దాడుల్లో అక్కడికక్కడే లేదా గాయాలు తగిలి చచ్చిన వారు గానీ 58,220 మంది, వీరుగాక దక్షిణ వియత్నాం కీలుబొమ్మ మిలిటరీ రెండు నుంచి రెండున్నరలక్షల మంది, మొత్తంగా మరణించిన వారు 3,33,620 నుంచి 3,92,364 మంది ఉంటారని లెక్క. ఈ కూటమికి చెందిన పదకొండు లక్షల మంది సైనికులు గాయపడ్డారని అంచనా. కమ్యూనిస్టు వియత్నాం మిలిటరీ, గెరిల్లాలుగానీ పదకొండు లక్షల మంది ప్రాణాలర్పించారు.అమెరికా దాని తొత్తుల దాడుల్లో ఇరవైలక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఇక సియోల్‌ కోర్టు కేసు అంశానికి వస్తే అసలు దాన్ని అనుమతించటమే ఒక అసాధారణ పరిణామం. ఫాంగ్‌ హీ గ్రామంలో జరిగినట్లు చెబుతున్న మారణకాండలో దక్షిణ కొరియా మిలిటరీ పాత్ర గురించి ఆధారాలు లేవని ఒకసారి,వియట్‌కాంగ్‌లను అణచివేసేందుకు దళాలు ప్రయత్నించినపుడు కొందరు పౌరుల మరణాలు తప్పలేదని మరొకసారి, పౌరుల్లో మిళితమైన వియట్‌కాంగ్‌లు జరిపిన కాల్పుల్లోనే గ్రామస్థులు మరణించి ఉండవచ్చు అని, దక్షిణ కొరియా మిలిటరీ దుస్తులు ధరించి వియట్‌కాంగ్‌లే కాల్పులు జరిపారని ఇలా రకరకాలుగా తప్పించుకొనేందుకు ప్రభుత్వం చూసింది.ఒక వేళ కొరియా సైనికులే కాల్పులు జరిపినా అది గెరిల్లాల నుంచి వచ్చిన ముప్పును తప్పించుకొనేందుకు ఆత్మరక్షణ కోసం జరిపినవి తప్ప మరొకటి కాదని కూడా వాదించింది. ఈ వాదనలన్నింటినీ కోర్టు తోసి పుచ్చింది. ప్రభుత్వం చెప్పిన దానికి ఎలాంటి రుజువులు లేకపోగా అలాంటి ప్రతిఘటనను మిలిటరీ ఎదుర్కొనలేదని, జనాన్ని ఒకదగ్గర చేర్చి సమీపం నుంచి కాల్చి చంపినట్లు మాజీ సైనికుడు చెప్పాడు.ఈ కేసులో వియత్నాం గ్రామీణులు, నాటి దాడిలో పాల్గొన్న మాజీ సైనికుడు యు జిన్‌ సియోంగ్‌ కూడా ఆ రోజు ఏం జరిగిందీ, నిరాయుధులైన మహిళలు, పిల్లల మీద ఎలా కాల్పులు జరిపిందీ కోర్టుకు చెప్పాడు. ఆ దారుణం జరిగిన తరువాత అమెరికా సైనికుడు ఒకడు తీసిన ఫొటోలు ఈ కేసులో సాక్ష్యాలుగా పనికి వచ్చాయి.


దక్షిణ వియత్నాంలో అమెరికా జరుపుతున్నదాడులకు తోడుగా దక్షిణ కొరియా మూడు లక్షల 20వేల మంది సైనికులను అక్కడకు పంపింది.వారు అమెరికన్లతో కలసి లక్షల మందిని చంపారు. దాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఇంతవరకు అంగీకరించలేదు. ఈ దారుణం తరువాత మై లాయి అనేచోట అమెరికా మిలిటరీ ఇలాంటి ఊచకోతకే పాల్పడి పెద్ద సంఖ్యలో చంపింది. విమానాలు, మిలిటరీ శకటాలతో అమెరికా దాడి జరపగా గెరిల్లాలు భౌగోళిక అనుపానులు ఎరిగి ఉన్నందున తప్పించుకొని శత్రువులను దెబ్బతీశారు. వారికి తినేందుకు తిండి కూడా లేని స్థితిలో ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకొంటూ పోరు జరిపారు.అనేక రోజులు పస్తులు కూడా ఉన్నారు. సరైన పడకలు, నిదురలేని రోజులు అనేకం. సొరంగాలు తవ్వి రక్షణ తీసుకోవటమే గాక అమెరికా మిలటరీ మీద దాడి చేసి అడవుల్లో కనిపించకుండా తప్పించుకొన్నారు. ఇదంతా ఒక రోజు, ఒకనెల, ఏడాది కాదు పందొమ్మిది సంవత్సరాల పాటు పోరాడారు.


మై లాయి మారణ కాండ అమెరికా దుష్ట చరిత్రలో చెరగని మచ్చ. ఇలాంటి అనేక దారుణాలు జరిపిన అమెరికా, ఫ్రాన్స్‌, అంతకు ముందు జపాన్‌ జరిపిన దారుణాలను ఇప్పటికీ ఆ ప్రభుత్వాలు అంగీకరించటం లేదు. మరోవైపు మానవహక్కులు, మన్నూ అంటూ ప్రపంచానికి కబుర్లు చెబుతున్నారు. మై లాయిలో మరతుపాకులతో అమెరికన్లు జనాలను ఊచకోత కోశారు. విలియం కాలే అనే లెప్టినెంట్‌ నాలుగు గంటల పాటు ఆ మారణకాండను పర్యవేక్షించాడు. వందలాది మహిళల మీద అత్యాచారాలు జరిపి నరికి చంపటంతో పాటు రెండు వందల మంది పిల్లలతో సహా 504 మందిని చంపారు. వారందరినీ గోతుల్లో దించి ఎటూ వెళ్లకుండా మరతుపాకులతో కాల్చి చంపారు.ఈ ఉదంతాన్ని తరువాత కాలంలో అమెరికా మిలిటరీలో పాఠంగా చెప్పారంటే దుర్మార్గాలను ఎలా జరపాలో శిక్షణ ఇచ్చారన్నది స్పష్టం.వైమానిక దళ మేజర్‌ లాగాన్‌ సిషన్‌ పాఠాలు చెబుతూ మనం వారిని హీరోలుగా పరిగణించవచ్చని, మై లాయిలో ఎవరైనా హీరోలు ఉంటే వారే అని చెప్పాడంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో వేరే చెప్పనవసరం లేదు. ఆ మారణకాండ జరిపినపుడు జనం మీదకు హెలికాప్టర్‌ను తోలిన ముగ్గురు పైలట్లను మూడు దశాబ్దాల తరువాత హీరోలుగా అమెరికా సత్కరించింది.విలియం కాలే మీద తప్పనిసరై విచారణ జరిపి శిక్ష వేశారు. తరువాత దాన్ని గృహనిర్బంధంగా మార్చారు, అది కూడా మూడున్నర సంవత్సరాల తరువాత వదలివేశారు. ఇలాంటి దుర్మార్గులను వదలివేసిన కారణంగానే తరువాత 2005లో ఇరాక్‌లోని హడితా అనే చోట అమెరికా ముష్కురులు మహిళలు, పిల్లలతో సహా 24 మంది పౌరులను ఊచకోత కోశారు.దానికి ఒక్కడిని బాధ్యుడిగా చేసి మందలించి వదలివేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అమెరికన్లు ఇలాంటి దుర్మార్గానికే పాల్పడ్డారు.


వియత్నాంలో దక్షిణ కొరియా మిలిటరీ దుర్మార్గాన్ని కోర్టు నిర్ధారించిన తరువాత కొరియాను ఆక్రమించినపుడు జపాన్‌ చేసిన దుర్మార్గాలను కూడా విచారించాలని, వాటిని జపాన్‌ అంగీకరించాలని దక్షిణ కొరియన్లు కొందరు ప్రదర్శన జరిపి డిమాండ్‌ చేశారు. జపాన్‌ సైనికులకు కొరియా మహిళలను బానిసలుగా మార్చి రాత్రుళ్లు బలవంతంగా అప్పగించి బలిచేశారు. వారిని ”సుఖ మహిళలు ”గా అభివర్ణించి దుర్మార్గానికి పాల్పడ్డారు. జపాన్‌ మాదిరి అక్రమాలు జరగలేదని బుకాయించకుండా మానవహక్కుల పట్ల గౌరవం ఉన్నదిగా కొరియా నిరూపించుకోవాలని కూడా వారు కోరారు. దక్షిణ కొరియా క్రైస్తవ మతాధికారులు కూడా వియత్నాం బాధితులకు క్షమాపణలు చెప్పారు. వియత్నాంలో మారణకాండతో పాటు అమెరికా జరిపిన మరొక దుర్మార్గం ఏమంటే ఏజంట్‌ ఆరెంజ్‌ పేరుతో రసాయన దాడులకు కూడా పాల్పడింది.దీని వలన భూమి, నీరు కలుషితం కావటంతో జనాలు అనేక రుగ్మతలకు గురికావటం, పంటలకు దెబ్బతగిలింది.అమెరికా జరిపిన ఈ దాడి వలన తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కొన్ని కేసులను దాఖలు చేశారు. దీని బాధితులకు కూడా న్యాయం చేయాలి. మరి ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ గురించి కబుర్లు చెప్పే అమెరికా,ఫ్రాన్స్‌, జపాన్‌ ఇండోచైనా దేశాలు, కొరియన్లకు క్షమాపణ చెప్పటమే కాదు, నష్టపరిహారం చెల్లిస్తాయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !

29 Sunday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Filims, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Besharam Rang row, BJP, Deepika Padukone, Himanta Biswa Sarma, Kangana ranaut, Narendra Modi, Pathan movie, Pathan's tsunami, RSS, Saffron gang, Shah Rukh Khan


ఎం కోటేశ్వరరావు


మనం ఏదో అనుకుంటాంగానీ అనుకున్నట్లుగా అన్నీ జరుగుతాయా ! పైవాడు ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని చెప్పేవారు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తారు. పైవాడు ఏం రాసిపెట్టాడో తెలియదు, ఈ లోకంలో వారి చేత ఏం పలికించాడో గానీ గానీ షారూఖ్‌ ఖాన్‌, దీపికా పడుకోన్‌ నటించిన పఠాన్‌ సినిమా అనేక రికార్డులను బద్దతు కొడుతూ కొత్తవాటిని నమోదు చేస్తూ త్వరలో రు.600 కోట్ల క్లబ్బులో చేరనుంది. దాన్ని ప్రదర్శించే హాళ్లను తగులబెట్టేందుకు సిద్దపడిన వారంతా కూడా వరుసల్లో నిలిచి ఆ సినిమా చూస్తూ ఉండి ఉండాలి. తొలి మూడు రోజుల్లో కెజిఎఫ్‌2, బాహుబలి 2 సృష్టించిన రికార్డులను ఇది బద్దలు కొట్టింది. హిందీ సినిమాల్లో మూడు వందల కోట్ల రూపాయల వసూళ్లను వేగంగా దాటినచిత్రంగా రికార్డు నెలకొల్పింది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సృష్టిస్తుందో చూద్దాం.


నరేంద్రమోడీ, బిజెపి, కాషాయ దళాలు చేస్తున్న మంచి పనులు మీకు కనిపించవా అని విమర్శకులను కొందరు అడుగుతుంటారు. . బిపాజిటివ్‌ సుభాషితాలు బాగా పని చేసినపుడు ఇలాంటి ప్రశ్నలు సహజం. ప్రస్తుతానికి పఠాన్‌ సినిమా గురించి వారు సరైన పాత్రనే పోషించారని చెప్పకతప్పదు. కాషాయ పెద్దలు గనుక బేషరమ్‌ రంగ్‌ పాట మీద రెచ్చిపోకుండా ఉండి ఉంటే ముందుగానే దానికి ఉచితంగా అంత పెద్ద ప్రచారం లభించేది కాదు. సినిమా హాళ్లను తగులబెడతాం అని దేశభక్తులు నినదించకుండా ఉండి ఉంటే ఆసక్తి అసలు పెరిగి ఉండేది కాదు. పేరు చెప్పకపోయినా ప్రధాని నరేంద్రమోడీ చేత కూడా మద్దతుదార్లు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇవేవీ లేకపోతే, దాన్లో సరకు లేకపోతే అనేక రికార్డులను బద్దలు చేసి ఉండేది కాదు. ” కమలశ్రీ ” కంగన రనౌత్‌ సినిమా విడుదల తరువాత తన పాత్రను తాను పోషించారు. అందరి కంటే అసోం ముఖ్యమంత్రి, బిజెపి నేత హిమంత బిశ్వ శర్మ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. కుక్క మనిషిని కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అన్నట్లుగా షారూఖ్‌ ఖాన్‌ గురించి తెలుసని చెబితే కిక్కు ఏముంటుంది, తనకేం ప్రచారం వస్తుందనుకున్నారో ఏమో, అతను ఎవరు అని ప్రశ్నించి అసోం సిఎం సంచలనం సృష్టించారు. షారూఖ్‌ ఖాన్‌ పేరుతో పాటు తన పేరునూ కలిపి స్వంతంగా ప్రచారం చేసుకున్నారు.


జనవరి 25న విడుదలైన పఠాన్‌ చిత్రం రికార్డులను బద్దలు చేస్తున్నట్లు అన్ని పత్రికలూ రాస్తున్నాయి. షారూఖ్‌ ఖానా అతనెవరు, అసోంలో చాలా మంది షారూఖ్‌ ఖాన్లున్నారు అన్న సిఎం హిమంత బిశ్వ శర్మ మాదిరి పఠాన్‌ సినిమానా ? ఆ పేరుతో ఒక సినిమా తీశారా ? అది విడుదలైందా అన్నట్లు ఏ పత్రికా అమాయకత్వాన్ని నటించలేదు, బిజెపి పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో మనకెందుకు అన్నట్లు విస్మరించలేదు. వచ్చిన వార్తల ప్రకారం ఆ సినిమాకైన ఖర్చు 260 కోట్లు మొదటి మూడు రోజుల్లోనే వసూలైందట.సునామీ మాదిరి బాక్సాపీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్‌ చరిత్రలో తొలి రెండు రోజుల్లోనే అత్యధిక వసూళ్ల ఘనత సాధించింది. ప్రపంచమంతటా తొలిరోజే వంద కోట్లు దాటింది. పది పాత రికార్డులను మూడవ రోజు బద్దలు కొట్టింది.


పఠాన్‌ సినిమాలో పాకిస్తాన్‌, ఐఎస్‌ఐని సానుకూల వైఖరితో చూపారని కంగన రనౌత్‌ చెప్పారు. దీన్ని బట్టి ఆమె ఆ సినిమాను కసితోనో, దేశభక్తి కళ్లద్దాలతోనో ఎక్కడో అక్కడ చూశారనే అనుకోవాలి. చిత్రం ఏమిటంటే ఒక బిజెపి నేత ఆ మాట వచ్చి ఉంటే అదొక తీరు, ఒక నటిగా ఉన్న కంగన నాలుగు సొమ్ములు సంపాదించుకొనేందుకు తాను ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జన్సీ సినిమాను త్వరలో విడుదల చేయబోతూ అలాంటి విమర్శ చేశారు. అదే విధంగా గుజరాత్‌ మారణకాండపై బిబిసి డాక్యుమెంటరీని కూడా చూసి అనుకూలంగానో ప్రతికూలంగానో ఏదో ఒకటి చెపితే ఏమైనా సరే చూసి తీరవలసిందే అంటున్న విద్యార్థులకు ఒక వివరణ, ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది కదా !


నిషేధం నుంచి ఇటీవలే బయటపడి తిరిగి ట్విటర్‌ స్రవంతిలో కలసిన కంగన శుక్రవారం నాడు చెలరేగారు. ” విద్వేషం మీద ప్రేమ విజయం అని పఠాన్‌ సినిమా గురించి చెబుతున్న అందరినీ అడుగుతున్నా ! నేను అంగీకరిస్తా, ఎవరి ప్రేమ ? ఎవరి విద్వేషం అన్నదాని మీద అందరం స్పష్టంగా ఉండాలి. ఎవరు టికెట్లు కొంటున్నారు ? ఎవరు దాన్ని విజయవంతం చేస్తున్నారు ? దేశంలో 80శాతం హిందువులే జీవించుతున్న చోట పఠాన్‌ అని పిలిచే సినిమా బాగా ఆడుతోందంటే ఆ ఖ్యాతి భారత్‌ అనురాగం, అంతరగ్రాహకతకు చెందుతుంది. పఠాన్‌ విజయ వంతంగా నడుస్తున్నదంటే ఆ ఖ్యాతి భారత స్ఫూర్తికి చెందుతుంది. అది విద్వేషం, తీర్పులకు అతీతం. శత్రువుల తుచ్చ రాజకీయాలు, విద్వేషం మీద విజయం. పెద్ద ఆశలు పెట్టుకున్నవారందరూ ఒక్కటి గమనించాలి. పఠాన్‌ కేవలం ఒక సినిమా మాత్రమే, దేశం ఇప్పటికీ జై శ్రీరామ్‌ అని గర్జిస్తోంది. భారతీయ ముస్లింలు దేశభక్తులని నేను నమ్ముతున్నా, ఆప్ఘన్‌ పఠాన్‌లకు వీరికి ఎంతో తేడా ఉంది. కీలకాంశం ఏమంటే భారత్‌ ఎన్నడూ ఆఫ్ఘనిస్తాన్‌ కాదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు, నరకంటే భయంకరం, కనుక పఠాన్‌ సినిమాకు దాని కథనం ప్రకారం ఇండియన్‌ పఠాన్‌ అన్నది తగిన పేరు ” అని ట్వీటారు. ఇతరులకు బుద్దులు చెబుతున్న కంగన కడుపు మంట, విద్వేషం తప్ప ఇందులో మరొకటి కనిపించటం లేదు. పాకిస్తాన్‌, ఐఎస్‌ఐని సానుకూల వైఖరితో చూపారని ఆరోపిస్తూనే సినిమా విజయం సాధించిందని చెప్పటం అంటే సానుకూల వైఖరిని జనం ఆమోదించినట్లా ? ఏం మాట్లాడుతున్నారు ? కంగన ట్వీట్ల మీద స్పందిస్తూ కంగన జీవితకాలంలో సంపాదించిన దాని కంటే పఠాన్‌ సినిమా ఒక వసూళ్లు ఎక్కువ అని ఒక ట్వీటర్‌ అపహాస్యం చేశారు. దాని మీద స్పందిస్తూ ఎమర్జన్సీ పేరుతో తాను ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న సినిమా కోసం తన ఇంటిని, ఆఫీసునూ తాకట్టు పెట్టినట్లు కంగన చెప్పారు.


సినిమా విడుదలకు ముందు బేషరమ్‌ రంగ్‌ అనే పాటలో కొన్ని సెకండ్ల పాటు హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ కాషాయరంగు బికినీ ధరించటం మీద కాషాయ దళాలు చేసిన రచ్చ తెలిసిందే. దాని మీద వచ్చిన వత్తిడితో తాను ఇచ్చిన సర్టిఫికెట్‌ను తానే చించి కొన్ని మినహాయింపులతో సెన్సార్‌బోర్డు మరో సర్టిఫికెట్‌ ఇచ్చింది. కోతలు పెట్టిన తరువాత బికినీలో కాషాయ రంగు ఉందా లేదా అని బహుశా కాషాయ దళాలు బూతద్దాలు వేసుకొని చూస్తూ ఉండబట్టే అంత పెద్ద ఎత్తున వసూళ్లు అంటే తప్పులేదేమో ? దీన్ని గురించి తెలిసిన తరువాతనైనా సిఎం హిమంత బిశ్వ శర్మ పఠాన్‌ సినిమా చూస్తారా, షారూఖ్‌ ఖాన్‌ అంటే ఎవరో, ఏమిటో తెలుసుకుంటారా ?


నిజానికి ఆ పెద్దమనిషికి షారూఖ్‌ ఖాన్‌ అంటే ఎవరో తెలీక కాదు. షారూఖ్‌ ఖాన్‌ను చులకన చేసి మాట్లాడితే కొంత మందికి ” అదో తుత్తి ” కనుక వారిని సంతుష్టీకరించే కసరత్తు. బేషరమ్‌ రంగ్‌ పాట మీద చేసిన రచ్చ, బెదిరింపుల గురించి ఒక సిఎం తెలుసుకోలేదంటే తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. దాని మీద వివాదం మొదటికే మోసం తెచ్చేట్లు కనిపించటంతో కొన్ని సినిమాల మీద రచ్చకు పోవద్దంటూ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారు. సదరు బిజెపి కార్యవర్గ సమావేశం 16,17 తేదీలలో శర్మ పాల్గొన్నారు. అన్నింటికీ మించి ప్రధాని హితవును ఖాతరు చేయకుండా జనవరి 20వ తేదీన గౌహతిలోని ఒక సినిమా హాలు వద్ద బిజెపి కనుసన్నలలో నడిచే భజరంగ్‌ దళ్‌ గాంగు పఠాన్‌ సినిమా పోస్టర్లను చించివేసి వీరంగం వేశారు. అది శాంతి భద్రతల విఘాతానికి దారితీస్తుందని పోలీసులు సిఎంకు నివేదించలేదని అనుకోగలమా ? ఆ ఉదంతం, బెదిరింపుల గురించి మరుసటి రోజు(శుక్రవారం) విలేకర్లు అడిగిన ప్రశ్నకు సిఎం షారూఖ్‌ ఖాన్‌ ఎవరు అంటూ చారిత్రాత్మక వ్యాఖ్య చేశారు. తనకు పఠాన్‌ సినిమా గురించి కూడా తెలియదన్నారు. అది ఊహించని రీతిలో ఎదురుతన్నింది. సినిమాకు పెద్ద ప్రచారాన్ని తెచ్చింది.కొన్ని సినిమాల గురించి వివాదాస్పదంగా మాట్లాడవద్దని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు తప్ప సినిమా హాళ్లను తగులబెడతామన్న వారి గురించి అడిగితే అసలు సినిమాల గురించి, ప్రముఖ హీరోల గురించి తెలియదని చెప్పమనలేదు కదా ! షారూఖ్‌ ఖాన్‌ మాట్లాడితే స్పందిస్తానని విలేకర్లతో ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. దానికి దేశమంతటా మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చేదీ కాదు. అది పఠాన్‌ సినిమాకు పైసా ఖర్చులేకుండా పెద్ద ప్రచార అశంగా మారింది. తరువాత నష్ట నివారణకు పూనుకొన్నారు. పోనీ అదైనా వినమ్రంగా చేశారా అంటే అదీ లేదు.


షారూఖ్‌ ఖాన్‌ ఫోన్‌ చేసి ఉంటే దాని సంగతి చూసి ఉండేవాడిని, జరిగింది పెద్ద అంశం కాదు అన్నారు. షారూఖ్‌ ఖాన్‌ ఎవరని మీరు ఎందుకు ప్రశ్నించారని విలేకర్లు సోమవారం నాడు ప్రశ్నించగా అతని గురించి నాకెందుకు తెలియాలి ?అతనంత గొప్పవాడని నాకు నిజంగా తెలియదు, నా కాలపు హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, జితేంద్ర తప్ప నిజంగా నాకు షారూఖ్‌ ఖాన్‌ అంటే ఎవరో పెద్దగా తెలీదు. 2001 తరువాత నేను ఆరు లేదా ఏడు సినిమాల కంటే ఎక్కువ చూడలేదు. నేను అతని సినిమాలు చూడలేదు. తరాలను బట్టి సినిమా తారల ఆకర్షణ భిన్నంగా ఉంటుంది. సిఎంగా నాతో మాట్లాడాలని ఎందరో అడుగుతుంటారు, శనివారం నాడు ” నేను షారూఖ్‌ ఖాన్ను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను ” అన్న ఒక మెసేజ్‌ శనివారం నాడు వచ్చింది. తనకు వచ్చేవాటిని వరుసలో అన్నింటినీ చూసిన తరువాత అది కనిపించగానే మీరు ఇప్పుడు మాట్లాడవచ్చని రెండు గంటల సమయం(తెల్లవారితే ఆదివారం )లో మెసేజ్‌ పెట్టాను. వెంటనే షారూఖ్‌ మాట్లాడారు. తన సినిమా త్వరలో రిలీజ్‌ కానుందని, ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మీ సినిమా పేరు ఏమిటని నేను అడిగాను, పఠాన్‌ అని చెప్పారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పాను ” అని సిఎం సోమవారం నాడు చెప్పారు. ఇది కూడా మరొక కథే.

ఎవరో తెలియని అనేక మంది ఖాన్లలో ఒకరికి ఇప్పుడు మాట్లాడవచ్చని ఒక సిఎం అర్ధరాత్రి రెండు గంటలకు మెసేజ్‌ పెట్టారంటే నమ్మేందుకు జనాలు పిచ్చివారు కాదు. పోనీ మాట్లాడిన అంశాన్ని కూడా పద్దతిగా చెప్పారా అంటే అదీ లేదు. ఎదుటి వారిని కించపరచటం హిమంత బిశ్వ శర్మకు కొత్త కాదు. కాంగ్రెస్‌లో పని చేసి మంత్రిగా పని చేశారు.అలాంటిది కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ అంటే ఎవరో తనకు తెలీదని ఒక సందర్భంగా చెప్పారు. భజరంగ్‌ దళ్‌ చేసిన గూండాగిరిని తక్కువ చేసి చూపేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు మాత్రమే ఏకంగా షారూఖ్‌ అంటే ఎవరో తెలీదన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తం మీద మింగలేక కక్కలేక కాషాయ దళాలు చేస్తున్న పని, చెబుతున్న మాటలు ఎదురుతన్నుతున్నాయి. గుజరాత్‌ మారణకాండపై బిబిసి డాక్యుమెంటరీని అందుబాటులో లేకుండా చేశారు.ఎలాగో సంపాదించి దాన్ని ప్రదర్శిస్తుంటే విద్యుత్‌ నిలిపివేయటంతో పోలీసులతో అడ్డుకోవటం వంటివి చేస్తున్నారు. ఎబివిపిని రంగంలోకి దించి కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాను ప్రదర్శిస్తామంటూ పోటీకి దిగారు. ఇవన్నీ ఎదుటివారిని మరింత రెచ్చగొట్టేవే, ఎదురుతన్నేవే !
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిజబ్‌, హలాల్‌, లౌ జీహాద్‌ తప్ప తల్లీ – బిడ్డల మరణాలు పట్టని కర్ణాటక బిజెపి !

06 Friday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP, Halal, Hijab, Karnataka BJP, love jihad, Narendra Modi Failures, RSS, RSS Double game


ఎం కోటేశ్వరరావు


” ధనిక రాష్ట్రం – అధ్వాన్న సూచికలు : కర్ణాటక నివేదిక ” అంటూ డెక్కన్‌ హెరాల్డ్‌ దినపత్రిక 2022 డిసెంబరు ఏడవ తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది.దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది. వర్తమాన సంవత్సర బడ్జెట్‌లో కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్యశాఖకు 5.8, విద్యకు 12.9శాతం కేటాయించింది. ఇది జాతీయ సగటు 6, 15.2 శాతాల కంటే తక్కువ. దేశ తలసరి సగటు రాబడి రు.1.51లక్షలు కాగా కర్ణాటకలో రు.2.49లక్షలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్‌ ప్రకటించిన 2021 ఆకలి సూచిక దేశ సగటు 47 కాగా కర్ణాటకలో 53 ఉంది. తమిళనాడు 66, కేరళ 80 పాయింట్లతో ఎగువున ఉన్నాయి. ఐదు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి రాబడిలో తెలంగాణా తరువాత కర్ణాటక రెండవ స్థానంలో ఉంది. కానీ ఆకలి సూచికలో మాత్రం రాజస్థాన్‌కు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో దీన్ని, ఇతర మానవాభివృద్ధి సూచికల గురించి ఆలోచించాల్సిన బిజెపి పెద్దలు వాటిని విస్మరించి రాష్ట్ర ప్రజలకు తక్షణం కావాల్సింది లవ్‌ జీహాద్‌ నిరోధం అని, అందుకు గాను తమను ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే ఫలాలు వస్తాయి.


నళిన్‌ కుమార్‌ నిరంజన్‌ షెట్టి కటీల్‌ ! ఒక గల్లీ లీడర్‌ కాదు, పార్లమెంటు సభ్యుడు, కర్ణాటక బిజెపి అధ్యక్షుడు. మంగళూరులో బూత్‌ విజయ అభియాన్‌ పేరుతో జనవరి తొలి వారంలో నిర్వహించిన సమావేశంలో అతగాడి నోటి నుంచి వెలువడిన ఆణి ముత్యాలు ఇలా ఉన్నాయి. ” వేదవ్యాసుడు విధాన సౌధ(అసెంబ్లీ)లో చేతులు ఎత్తలేదని చర్చించవద్దు. నళిన్‌ కుమార్‌కు ఈ అంశం గురించి లేవనెత్తే హక్కు లేదని చెప్పవద్దు. నళిన్‌ కుమార్‌ కటీల్‌ వాటా నుంచి మీకు బంగారమేమీ రాదు.కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. రోడ్లు, మురుగు కాలవల వంటి చిన్న చిన్న అంశాల గురించి మాట్లాడవద్దు. మీ బిడ్డల భవిష్యత్‌ గురించి మీరు ఆందోళన చెందుతుంటే, మీరు లవ్‌ జీహాద్‌ను ఆపాలని కోరుకుంటే మనకు బిజెపి కావాలి. దాన్ని వదిలించుకోవాలంటే మనకు బిజెపి కావాలి.” అని సెలవిచ్చారు. ఎంత మహత్తర ఆలోచన !


ధనిక రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక దానికి అనుగుణంగా వివిధ సూచికల్లో లేదు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో 2020 సమాచారం ప్రకారం కొన్ని సూచికలు ఇలా ఉన్నాయి.
అంశం ×××××××× కర్ణాటక×× ఆంధ్రప్రదేశ్‌×× తెలంగాణా×× తమిళనాడు×× కేరళ
ప్రసూతి మరణాలు×× 83 ×× 58 ×× 56 ×× 58 ×× 30
పుట్టినపిల్లల మరణాలు× 19 ×× 24 ×× 21 ×× 13 ×× 6
పుట్టినవెంటనేమరణాలు× 14 ×× 17 ×× 15 ×× 9 ×× 4
5ఏళ్లలోపుపిల్లలమరణం× 21 ×× 27 ×× 23 ×× 13 ×× 8
కేరళతో పోలిస్తే తల్లీ, పిల్లల మరణాలను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం చేయాల్సిన పనులెన్నో ఉండగా దాని ఊసు లేకుండా మీ పిల్లలను లౌ జీహాద్‌ నుంచి రక్షిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అంటే వారికి సున్నితమైన అంశాలను రెచ్చగొట్టి ఓట్లు పొందటం మీద ఉన్న శ్రద్ద తల్లీ, పిల్లల సంక్షేమం మీద లేదన్నది వేరే చెప్పనవసరం లేదు. కర్ణాటక ఇతర సూచికల్లో కూడా అంత ఘనమైన రికార్డును కలిగి లేదు. 2019 సూచిక ప్రకారం మానవాభివృద్ది సూచికలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు తరగతులుగా వర్గీకరించారు. వాటిలో కర్ణాటక మధ్యతరహా జాబితాలో 0.683తో ఐదవ స్థానంలో, మొత్తంలో 19వ స్థానంలో ఉంది. దేశ సగటు 0.646కు దగ్గరగా ఉంది. కేరళ 0.782తో ప్రధమ స్థానంలో ఉంది. కర్ణాటక స్థానాన్ని మెరుగుపరచటం అనే అజెండా బిజెపికి లేదు.


దేశంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. ఇక ఐటి రంగంలో దేశానికి రాజధానిగా, మేథో కేంద్రంగా ఉంది. అలాంటి చోట 60శాతం మంది పిల్లలు పదకొండవ తరగతిలో చేరకుండానే చదువు మానివేస్తున్నారు.2021-22 వివరాల ప్రకారం తమిళనాడులో 81, కేరళలో 85శాతం మంది పన్నెండేళ్ల పాటు విద్య నేర్చుకున్నవారు ఉండగా కర్ణాటకలో 40శాతానికి మించి లేరు. వారి చదువు సంధ్యల గురించి గాక లౌ జీహాద్‌ గురించి బిజెపి తలిదండ్రులకు చెబుతున్నది.


మే నెలలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న బిజెపి అక్కడ రెండు ఇంజన్ల గురించి చెప్పటం లేదు.ఎందుకంటే రెండు ఇంజన్లు పని చేస్తున్నా అక్కడ స్థితి ఎలా ఉందో చూశాము. అందువలన దాని కేంద్రీకరణ అంతా హిజబ్‌, హలాల్‌, లౌ జీహాద్‌ మీదనే ఉంది. మెజారిటీ హిందువులను మనోభావాలతో సంతుష్టీకరించి ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నది. రెండు రాష్ట్రాలలో ఉన్నది బిజెపి ప్రభుత్వాలే, కేంద్రంలో ఉన్నదీ వారిదే అయినా మహారాష్ట్రతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకపోగా ఆ పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నది. ఆవు చేలో మేస్తుంటే దూడలు గట్టున ఉంటాయా ? కేంద్ర ప్రభుత్వ విజయగానాలకు బదులు ఇటీవల కర్ణాటక వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌ షా మాండ్యలో జరిగిన సభలో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిన, కాశీ, కేదారనాధ్‌,బదరీనాధ్‌లను అభివృద్ది చేసిన నరేంద్రమోడీ కావాలా ? టిప్పు సుల్తాన్ను గొప్పగా చూపిన వారు కావాలో, దేశభక్తులతో ఉన్నవారో విచ్చిన్నకులతో చేతులు కలిపిన వారు కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరారు. ఆ తరువాతే కొనసాగింపుగా రాష్ట్రనేత నళిన్‌ లౌ జీహాద్‌ నివారణకు బిజెపిని ఎంచుకోవాలన్నారు. కర్ణాటకలో వివిధ సామాజిక తరగతుల సమీకరణ, మఠాధిపతులు, పీఠాధిపతుల మద్దతు కోసం ప్రాకులాడటం బిజెపి నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అవి ఎక్కువ కాలం సాగవు గనుక వివాదాస్పద అంశాలను ముందుకు తెస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.


హిందూత్వ సమీకరణకు ప్రయోగశాలగా ఉన్న కర్ణాటకలో హిజబ్‌ వివాదాన్ని ముందుకు తెచ్చిన తీరు తెన్నులను చూశాము. దాని వలన రాష్ట్ర జిఎస్‌డిపి పెరగలేదు, ఉపాధి అవకాశాలు రాలేదు, ధరలు తగ్గలేదు గానీ జనాల బుర్రలు ఖరాబు చేశారు. వచ్చే ఎన్నికల్లో దానిపని అది చేస్తుంది.ప్రభుత్వ హిజబ్‌ నిషేధాన్ని హైకోర్టు సమర్ధించింది. దాని మీద సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లగా గతేడాది అక్టోబరులో ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు సమర్ధించగా మరొకరు తిరస్కరించటంతో అది పెద్ద డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. దాని మీద తీర్పు వచ్చే వరకు నిషేధం కానసాగుతుంది. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. హిజబ్‌ వివాదం కొనసాగింపుగా హలాల్‌ను ముందుకు తెచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికార పక్షం అంగీకరించకపోతే కొన్ని అంశాలపై ప్రైవేటు బిల్లులు పెట్టటం, వాటి మీద జనంలో చర్చ రేపటం తెలిసిందే. కానీ అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు ప్రైవేటు బిల్లులు పెట్టటం ఏమిటి ? అదీ అలాంటిదే. ఒక పెద్ద నాటకం, దానిలో భాగంగానే బిజెపి ఎంఎల్‌సి రవి కుమార్‌ హలాల్‌ ధృవీకరణ పత్రాల జారీ మీద ఒక బిల్లును పెడతానని ప్రకటించారు. ముస్లిం సంస్థలు హలాల్‌ పత్రాల జారీకి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఒక నిర్ణీత అధికార వ్యవస్థను ఏర్పాటు చేసేంత వరకు ముస్లిం సంస్థలు ధృవీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని కోరనున్నట్లు వార్తలు. దీని గురించి ఇంతకు ముందు రవికుమార్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వమే హలాల్‌ పత్రాలను జారీ చేస్తే ఖజానాకు ఐదువేల కోట్ల మేరకు రాబడి వస్తుందని దానిలో పేర్కొన్నట్లు వార్తలు.

మరొకవైపు హలాల్‌ మాంస ఉత్పత్తులను బహిష్కరించాలని అనేక హిందూత్వ సంస్థలు పిలుపునిచ్చాయి. ముస్లిమేతరులకు అమ్మ వద్దని కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్‌ దుకాణాల ముందు ధర్నాలు కూడా చేశారు. సర్టిఫికెట్ల జారీ మీద నిషేధం వేరు, హలాల్‌ మాంసం మీద నిషేధం వేరు అన్న సంగతి తెలిసిందే. బిజెపి ప్రజాప్రతినిధి సర్టిఫికెట్ల మీద నిషేధం పెట్టాలని కోరుతుండగా సంఘపరివార్‌ తెరవెనుక ఉండి నడిపిస్తున్న సంస్థలు అసలు మాంసాన్నే నిషేధించాలని రోడ్లకు ఎక్కుతున్నాయి. దీంతో కొన్ని పత్రికలు హలాల్‌ మాంసం మీద నిషేధం విధించే దిశగా కర్ణాటక బిజెపి సర్కార్‌ ఉన్నట్లు వార్తలు ఇచ్చాయి. అవన్నీ బిజెపికి కొమ్ముకాసేవే కనుక అంతరంగం ఎరగకుండా అలా రాసినట్లు భావించలేము. పోనీ వాటిని ప్రభుత్వం స్పష్టంగా ఖండించిందా అంటే అదీ లేదు, అందుకనే అనేక అనుమానాలు తలెత్తాయి.


నిజానికి ఇది మనోభావాలతో ఆడుకొనే దుష్ట ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ప్రతి మతానికి కొన్ని క్రతువులు ఉన్నాయి. కొన్ని మతాలకు చెందిన వారు లేదా కొన్ని సామాజిక తరగతులు, ఒక మతంలోనే భిన్న క్రతువులను పాటించేవారు మాంసాహారం తినకూడదనే నిషేధం ఉంది. ఇస్లాం ఆచారాలు, నిబంధనల ప్రకారం తయారు చేసిన ఆహారం మాత్రమే తినాలని, అలా లేనిదాన్ని తినకూడదని ఆ మతంలో నిషేధించారు. అందుకే ఇది తినవచ్చు అని చెప్పేందుకు గాను హలాల్‌ ధృవీకరణ పత్రం ఉందని ఉత్పత్తుల మీద ముద్రిస్తున్నారు.అరబ్బు దేశాలలో హలాల్‌ పత్రాల జారీకి చట్టబద్దమైన సంస్థలు ఉంటాయి. మన దేశంలో అలాంటివి లేవు.హలాల్‌ సర్టిఫికెట్‌, మతం పేరుతో వసూలు చేస్తున్న పెద్ద మొత్తాలను విద్రోహ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి(హెచ్‌జెఎస్‌) పేరుతో ఉన్న సంస్థ ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం తయారైన ఉత్పత్తులను తినాలా లేదా అన్నది ఇతర మతస్థులు ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. దాని మీద బలవంతం ఏమీ లేదు. కానీ దీన్ని కూడా వివాదం చేశారు. గతంలో మాంసం మీద మాత్రమే అలాంటి సర్టిఫికెట్‌ ఉండేదని, ఇప్పుడు అనేక ఉత్పత్తులకు వాటిని జారీ చేస్తున్నారన్నది బిజెపి, హిందూత్వశక్తుల దుగ్ద. ఇది ఒక మానసిక సమస్య.హలాల్‌ చేసినట్లు తాము చెప్పిందే తినాలి లేనిది తినకూడదని ఇస్లామిక్‌ మతం చెబుతున్నది. దాన్ని అనుకరిస్తున్న లేదా అనుససరిస్తున్న కాషాయ దళాలు హలాల్‌ మాంసం తినకూడదని, అమ్మకూడదని చెబుతున్నాయి.ఒకే నాణానికి బొమ్మ బొరుసూ అంటే ఇదే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర సవాళ్లు, కుట్రల మధ్య బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా ప్రమాణ స్వీకారం !

03 Tuesday Jan 2023

Posted by raomk in Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Brazil, Jair Bolsonaro, Latin American left, lula da silva, US imperialism


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి ఆదివారం నాడు బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని స్వీకరించారు. ఇలా మూడు సార్లు అధికారంలోకి రావటం ఒక రికార్డు. పచ్చిమితవాది, నియంత్వ పోకడలకు తెరలేపిన అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మీద అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. దేశంలో అణగారిన తరగతులు- ధనికులుగా, మితవాదులు – పురోగామి వాదులుగా చీలిన రెండు వర్గాల మధ్య సమీకరణలు ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టం.ఓటమిని అంగీరించేందుకు మొరాయించిన బోల్సనారో చివరి వరకు ఎన్నికలను వమ్ము చేసేందుకు, మిలిటరీ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూశాడు. మొత్తం మీద మిలిటరీ అందుకు సిద్దం గాకపోవటంతో విధిలేక అధికార మార్పిడికి అంగీకరించాడు. ఆ తతంగానికి హాజరు కాకుండా రెండు రోజుల ముందే తన పరివారంతో సహా అమెరికా వెళ్లాడు. జనవరి 30వ తేదీ వరకు అక్కడ ఉంటారని చెబుతున్నప్పటికీ గడువులోగా తిరిగి స్వదేశానికి వస్తాడా రాడా అన్నది చూడాల్సి ఉంది. తనకు జైలు, చావు లేదా తిరిగి అధికారానికి రావటం రాసిపెట్టి ఉందంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టాడు.


ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి రెండు నెలలుగా బోల్సనారో మద్దతుదారులు రాజధానిలో కీలక కేంద్రాలు, మిలిటరీ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమం జరిగిందని, లూలా ఎన్నికను అంగీకరించరాదని, మిలిటరీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.తనకు వ్యతిరేకంగా మీడియా-ఎన్నికల సంఘం కుట్ర చేసిందని లేకుంటే తాను తొలి దఫా ఎన్నికల్లోనే గెలిచి ఉండేవాడినని, 60లక్షల ఓట్లు తనకు పడకుండా చేశారని బోల్సనారో ఆరోపించాడు. దేశంలో శాంతి భద్రతల సమస్యల సృష్టికి చేయని కుట్ర, దుండగాలు లేవు. అయినప్పటికీ బోల్సనారో వారిని నివారించలేదు, వెనక్కు వెళ్లిపొమ్మని ఆదేశించలేదు. అనేక మంది నేరగాళ్లకు అధ్యక్ష, ఇతర అధికార భవనాల్లో రక్షణ కల్పించాడు. డిసెంబరు 12వ తేదీన రాజధానిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంపై దాడి చేసేందుకు చూశారు. తమ అనుచరుడిని విడిపించుకొని వెళ్లేందుకు చూసిన వారిని అరెస్టు చేసేందుకు వెళ్లగా తమ ప్రాంగణం వద్ద ఉన్నవారిని అరెస్టు చేయకూడదంటూ మిలిటరీ అడ్డుకున్నది. ఈ ఉదంతం అనేక అనుమానాలకు దారి తీసింది. అదే రోజు విమానాశ్రయంలో దాడికి బాంబులు తీసుకు వెళుతున్న ఒకడిని పట్టుకున్నారు. ఆ ఉదంతాన్ని డిసెంబరు 30న అమెరికా వెళ్లే ముందు మాత్రమే బోల్సనారో సామాజిక మాధ్యమంలో ఖండించాడు. జనవరి ఒకటవ తేదీన లూలా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు దేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఏదో జరగనుందనే వాతావరణం నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి విమానమెక్కి అమెరికా వెళ్లేందుకు బోల్సనారో బ్రెజిల్‌ సరిహద్దులు దాటిన తరువాత మాత్రమే మద్దతుదార్లు ద్రోహి, పిరికి పంద, వంచించాడని తిట్టుకుంటూ తిష్టవేసిన ప్రాంతాల నుంచి వెనుదిరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి పరిస్థితి సాఫీగా ఉన్నట్లు కనిపించినా ఎప్పుడేం జరిగేదీ చెప్పలేని స్థితి.


లక్షలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన లూలాకు పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు ఎంత మేరకు సహకరించేదీ చూడాల్సి ఉంది. మరో లాటిన్‌ అమెరికా దేశమైన పెరూ పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు అక్కడి వామపక్ష నేత కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి తొలగించి అరెస్టు చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. అంతెందుకు బ్రెజిల్లో కూడా గతంలో లూలా తరువాత అధికారానికి వచ్చిన వామపక్ష నేత దిల్మా రౌసెఫ్‌ను కూడా తప్పుడు కారణాలు చూసి అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగించటం, తప్పుడు కేసులు పెట్టి 2018 ఎన్నికల్లో లూలాను జైలుకు పంపి అడ్డుకున్న సంగతి తెలిసిందే.


లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ జనాభా 22 కోట్లు. అమెరికా మద్దతుతో 1964లో మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని 21 సంవత్సరాల పాటు ఉక్కుపాదాలతో కార్మికులు, రైతులను అణచివేసింది. దానికి వ్యతిరేకంగా పోరు సాగించిన వారిలో ఒకరైన లూలా తదితరులు 1980లో వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు.తమది డెమోక్రటిక్‌ సోషలిస్టు సిద్దాంతం అని ప్రకటించారు. 1982లో పార్టీకి గుర్తింపు లభించింది.1988 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రముఖ పట్టణాల్లో ప్రజాదరణ, విజయాలను సొంతం చేసుకుంది. తరువాత జరిగిన మూడు ఎన్నికలలో లూలా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.2002 ఎన్నికలు, తరువాత 2006 ఎన్నికల్లో గెలిచాడు. తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ గెలిచారు.రెండవ సారి ఆమె పదవిలో ఉండగా 2016లో మితవాద శక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో పార్లమెంటులో తమకున్న మెజారిటీని ఆసరాచేసుకొని ఆమెను అభిశంసించి పదవి నుంచి తొలగించారు.మూడవ సారి గెలిచిన లూలా నాలుగేండ్లు అధికారంలో ఉంటారు. ఒక లోహపరిశ్రమ కార్మికుడిగా పని చేసిన లూలా అంతకు ముందు బూట్లకు పాలిష్‌ కూడా చేశారు.


పదవీ స్వీకారం తరువాత లూలా మాట్లాడుతూ తమకు ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవాలని లేదని, అంత మాత్రాన తప్పు చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు.చట్టబద్దమైన పద్దతుల్లోనే తాము చేసిన తప్పిదాలకు సమాధానం చెప్పుకోవాలన్నారు. వైరి పక్షాల సమీకరణలు తీవ్రంగా ఉన్నందున మూడవసారి పాలనా పగ్గాలు చేపట్టిన లూలాకు గతంలో మాదిరి పాలన సజావుగా సాగే అవకాశాలు లేవని అనేక మంది పరిశీలకులు చెబుతున్నారు. తొలిసారి అధికారం చేపట్టినపుడు ఉన్న ఆర్థిక పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ప్రపంచమంతటా వస్తువులకు పెరిగిన డిమాండ్‌ కారణంగా గతంలో లూలా అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపి కోట్లాది మంది జీవితాలను మెరుగుపరిచారు. ఆ కారణంగానే లూలా అధికారం నుంచి తప్పుకున్న నాటికి జనంలో 83శాతం మద్దతు ఉంది. ఇప్పుడు అంతలేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు అమలు జరపనున్న విధానాలను బట్టి జనం స్పందిస్తారు. ఇటీవలి కాలంలో బ్రెజిల్‌ రెండుసార్లు తీవ్ర ఆర్థిక వడిదుడుకులను ఎదుర్కొన్నది.ఈ ఏడాది ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర మాంద్యం తలెత్తనుందని అందరూ చెబుతున్నారు. అందువలన ఎగుమతులపై ఆధారపడిన బ్రెజిల్‌ను కూడా అది వదలి పెట్టదు. దిల్మా రౌసెఫ్‌ పాలనా కాలంలో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా జనంలో తలెత్తిన అసంతృప్తిని మితవాదులు సొమ్ము చేసుకున్నారు.కరోనా మహమ్మారి పట్ల బోల్సనారో అనుసరించిన బాధ్యతా రహిత వైఖరి కారణంగా జనం మరోసారి ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామాలతో జనం మరోసారి దారిద్య్రబారిన పడ్డారు. అందుకే తన ప్రాధాన్యతల్లో దారిద్య్ర నిర్మూలన, విద్య,వైద్య రంగాలపై ఖర్చుకు ప్రాధాన్యత ఇస్తానని, అమెజాన్‌ అడవులను అక్రమంగా ధ్వంసం చేస్తున్నవారిని అరికడతానని లూలా ప్రకటించారు. గత ప్రభుత్వం జారీ చేసిన అనేక ఉత్తర్వులు, నిర్ణయాలను రద్దు చేస్తూ తొలి రోజే సంతకాలు చేశారు. నెల రోజుల్లో గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అనేక అంశాలను తనకు నివేదించాలని కోరారు.స్కూలు పిల్లలకు సరిపడా పుస్తకాలను ముద్రించలేదు. ఉచిత వైద్యానికి, కరోనా వాక్సిన్లకు నిధులు లేవు, ఉన్నత విద్యాసంస్థలు నిధుల్లేక మూతపడే దశలో ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికీ మరోసారి మూల్యం చెల్లించాల్సింది ఎవరు బ్రెజిల్‌ పౌరులే కదా అని లూలా ప్రశ్నించగానే ఎవడినీ క్షమించ వద్దు ఎవరినీ క్షమించవద్దు ఎవరినీ క్షమించవద్దు అంటూ జనం స్పందించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా 37 మందితో కూడిన మంత్రి వర్గంలో పదకొండు మంది మహిళలను లూలా నియమించటం గమనించాల్సిన పరిణామం.


బోల్సనారో ఓడినా బలుపు తగ్గలేదు. అమెరికా వెళ్లే ముందు తన అనుచరులతో మాట్లాడుతూ ఆశాభంగం చెందామంటున్నారు మీరు, ప్రత్యామ్నాయాల గురించి రెండు నెలల పాటు నోరు మూసుకొని ఉండటం ఎంత కష్టం, నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి, ఈ దేశానికి నాజీవితాన్ని ఇచ్చాను అన్నాడు,బాంబుదాడులను ఖండిస్తున్నానని చెబుతూనే దాడులకు ఇది తరుణం కాదు, దాని బదులు వచ్చే సర్కారుకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించండి.ఒక రంగంలో ఓడాం తప్ప మొత్తం యుద్ధంలో ఓడిపోలేదు. జనవరి ఒకటవ తేదీతో ప్రపంచం అంతం కాదు. అన్నాడు. సంక్షోభంలో ఉన్న జనానికి సంక్షేమ చర్యలతో ఉపశమనం కల్పించటం తప్పుకాదు, తప్పని సరి. కానీ అవే వారి విముక్తికి మార్గం కాదు. వాటిని అమలు జరిపిన వామపక్ష దిల్మారౌసెఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసిన కుట్రకు నిరసనగా లబ్దిపొందిన జనం అంతా వీధుల్లోకి రాలేదన్నది వాస్తవం. అదే విధంగా జన జీవితాలను దిగజార్చిన విధానాల పునాదులను కూల్చి కొత్త వాటిని నిర్మించకుండా జనానికి సాధికారత కల్పించకుండా కేవలం సంక్షేమ విధానాలతోనే గడిపితే కుదరదనే చర్చ కూడా ప్రస్తుతం బ్రెజిల్‌, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల్లో నడుస్తున్నది. మితవాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా గతంలో మాదిరి మొరటు పద్దతులకు బదులు పార్లమెంట్లలో వామపక్షాలకు బలం తక్కువగా ఉండటాన్ని ఆసరా చేసుకొని ఆటంకాలు కలిగించి జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టేందుకు, ఆ పేరుతో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చూస్తున్నారు. తాజాగా పెరూలో జరిగింది అదే.పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు.


బ్రెజిల్‌, రష్యా, భారత్‌, దక్షిణాఫ్రికా, చైనాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి గురించి తెలిసిందే. లూలా గెలుపును అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు కూడా పంపారు. చిత్రం ఏమిటంటే రియో ఒలింపిక్స్‌ కంటే ఎక్కువ మంది దేశాధి నేతలు, దేశాల ప్రతినిధులు లూలా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. భారత్‌ నుంచి ప్రతినిధి లేకపోవటం గమనించాల్సిన అంశం. లూలాను జైలు పాలు చేసిన కుట్ర వెనుక ఉన్న అమెరికా తదితర దేశాల ప్రతినిధులు వచ్చినప్పటికీ మన ప్రభుత్వం ఎందుకు దూరంగా ఉందన్నది ప్రశ్న. ప్రపంచబాంకు నివేదిక ప్రకారం లూలా పాలనా కాలంలో 2003-2009 కాలంలో బ్రెజిల్‌ మధ్యతరగతి కుటుంబాలు 50శాతం పెరిగాయి. గత ఆరు సంవత్సరాల్లో అనేక మంది తిరిగి వెనుకటి స్థితికి వెళ్లారు బ్రెజిల్‌తో సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, మాంద్యం, వృద్ధి రేట్లు పడిపోవటం వంటి పరిణామాలు, పర్యవసానాల నేపధ్యంలో గతంలో మాదిరి సంక్షేమ పధకాలను లూలా ఎలా అమలు జరుపుతారన్నది అనేక మందిలో ఉన్న సందేహం. ఆదాయం పెరిగినకొద్దీ పన్ను రేట్లు పెంచుతామని, ప్రభుత్వ ఖర్చు మీద విధించిన ఆంక్షలను ఎత్తివేస్తానని, కనీసవేతనాల పెంపుదల ద్వారా అర్థిక అసమానతల తగ్గింపు, సామాజిక న్యాయం అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. సవాళ్లతో పాటు లాటిన్‌ అమెరికాలో వామపక్షాల విజయపరంపరలో లూలా గెలుపు కార్మికోద్యమాలకు, అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించే శక్తులకు మరింత బలాన్ని ఇస్తుంది. మితవాదుల సమీకరణలను కూడా తక్కువ అంచనా వేయరాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

2022 అమెరికా పార్లమెంటు ఎన్నికలు : ఫాసిస్టు శక్తులకు ఎదురు దెబ్బ – పురోగామి శక్తులకు హెచ్చరిక !

16 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Politics, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, fascist ideology, Joe Biden, MAGA Republicans, US 2022 midterm elections

ఎం కోటేశ్వరరావు


నవంబరు ఎనిమిదిన అమెరికా పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పదిహేనవ తేదీ మంగళవారం నాటికి కూడా లెక్కింపు పూర్తి కాలేదు. అక్కడ అనుసరిస్తున్న ఓటింగ్‌ , లెక్కింపు విధానాలతో ఫలితాల ఖరారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నది. పార్లమెంటు దిగువ సభలో 435 స్థానాలకు గాను 218 తెచ్చుకున్నవారికి స్పీకర్‌ పదవి దక్కుతుంది.తాజా వివరాల ప్రకారం రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209 స్థానాలతో ఉన్నారు. రిపబ్లికన్లకు మెజారిటీ రానుంది. వంద సీట్లున్న ఎగువ సభ సెనేట్‌లో ఇద్దరు ఇతర పార్టీల వారి మద్దతుతో డెమోక్రటిక్‌ పార్టీ బలం 50 కాగా రెండవసారి ఎన్నిక జరగాల్సిన అలాస్కా సీటు రిపబ్లికన్‌ పార్టీకి కచ్చితంగా దక్కుతుంది కనుక దానికి 50 సీట్లు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. ఉపాధ్యక్ష స్థానపు ఓటుతో డెమాక్రాట్లకు 51 ఓట్లతో మెజారిటీ ఖాయమైంది. కనుక అక్కడి ఓటర్లు కూడా రిపబ్లికన్లను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఇక 50 గవర్నర్‌ పదవులకు గాను ఎన్నికలు జరిగిన 36 చోట్ల రిపబ్లికన్లు రెండు కోల్పోయి 25 రాష్ట్రాలను కైవసం చేసుకోగా, డెమోక్రాట్లు అదనంగా రెండు తెచ్చుకొని 24 చోట్ల పాగావేశారు. మరొక ఫలితం తేలాల్సి ఉంది.


ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్‌ వెంటనే చేసిన వ్యాఖ్యలు ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్‌ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్‌ చెప్పాడు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్‌ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్‌ పార్టీకి 220, రిపబ్లికన్‌ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రిపబ్లికన్లకు మెజారిటీ ఖరారైంది. ఓటింగ్‌ సరళి ప్రకారం రెండు పార్టీల తేడా తొమ్మిది సీట్లు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినపుడు ఏ పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేళ్ల తరువాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. ఈ కారణంగానే లెక్కింపు పూర్తిగాక ముందే అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడటం మొదలు పెట్టాడు. రిపబ్లికన్లతో కలసిపనిచేసేందుకు నేను సిద్దపడ్డాను, రిపబ్లికన్లు నాతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు.


పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఉగ్రవాదాన్ని సమర్ధించిన అనేక మంది ” మాగా ( మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌ ) ” రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీని డోనాల్డ్‌ ట్రంప్‌, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్‌ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం డెమోక్రాట్ల రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. రిపబ్లికన్‌ పార్టీ మొత్తంగా మితవాద శక్తులతో కూడినప్పటికీ దానిలో మాగా రిపబ్లికన్లు పచ్చి మితవాద ఫాసిస్టు, దురహంకార శక్తులు.


ఎన్నికల్లో ఓడినప్పటికీ రోజు రోజుకు పెరుగుతున్న మాగా రిపబ్లికన్ల మీద ఒక కన్నేసి ఉంచాలనిఎఎఫ్‌ఎల్‌-సిఐఓ కార్మిక సంఘం అధ్యక్షురాలు లిజ్‌ షులర్‌ హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్ధారిస్తుందని అందువలన కార్మికులు లెక్కింపును జాగ్రత్తగా అనుసరించాలని పిలుపునిచ్చారు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని చెప్పారు. అబార్షన్‌ హక్కు గురించి రాష్ట్రాలకు వదలి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన అనేక చోట్ల అబార్షన్‌ హక్కుకు మద్దతు ఇచ్చిన డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చారని షులర్‌ చెప్పారు. ఈ శక్తులు ఓడటం వారి పట్ల అమెరికా ఓటర్లలో ఉన్న ఆందోళన, అడ్డుకోవాలనే తపనకు నిదర్శనంగా చెప్పవచ్చు.ఆర్థిక సవాళ్లు, గాస్‌, ఆహార అధిక ధరలు రిపబ్లికన్లవైపు ఓటర్లను నెడతాయని సాధారణ విశ్లేషణలు వెలువడినా మితవాద శక్తుల అజెండాను కూడా కార్మికులు తీవ్రమైనదిగా పరిగణించిన కారణంగానే మాగా శక్తులను ఓడించారు.యువత, మహిళలు, ఆఫ్రికన్‌-అమెరికన్లు, మొత్తంగా కార్మికవర్గం తమ హక్కుల రక్షణకు, ఓటింగ్‌కు ముందుకు వచ్చిన కారణంగానే రిపబ్లికన్లకు చాలా మేరకు అడ్డుకట్ట పడింది. మాగా రిపబ్లికన్లకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినా వారి నేతగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టు పార్టీ మీద ఇంకా ఉంది,రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్దులలో 300 మందికి ట్రంప్‌ మద్దతు ఉంది. వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు. బైడెన్‌ గెలుపును తాను గుర్తించనని ప్రకటించిన ట్రంప్‌ తన మాగా మద్దతుదార్లను ఉసిగొల్పి 2021 జనవరి ఆరున పార్లమెంటు భవనంపై దాడి చేయించిన సంగతి తెలిసిందే. వీరిని ఫాసిస్టులుగా వర్ణిస్తారు.


ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలో ఖర్చు అంశంలో కొత్త రికార్డును సృష్టించాయి. ఓపెన్‌ సీక్రెట్స్‌ అనే సంస్థ అంచనా ప్రకారం 1670 కోట్ల డాలర్ల ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మన కరెన్సీలో ఇది రు.1,37,000 కోట్లకు సమానం. ఇది ఎన్నికలకు వారం ముందు అంచనా, అనధికారికంగా అనేక మంది చేసిన ఖర్చు దీనిలో లేదు. bుార్టీల అభ్యర్ధుల ఎంపిక నుంచే డబ్బు ప్రవాహం మొదలౌతుంది. గత ఎన్నికల్లో పార్టీ వెలుపలి బృందాలు 160 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 190 కోట్లకు పెరిగిందని అంచనా. రకరకాల పేర్లతో ఖర్చు చేస్తారు. జనాభాలో కేవలం 0.0003 శాతం ఉన్న బిలియనీర్లు ఎన్నికల ఖర్చులో పదిశాతం డాలర్లు ఖర్చు చేస్తారని అంచనా. జార్జి సోరస్‌ 12.8 కోట్ల డాలర్ల ఖర్చుతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అభ్యర్ధులే ఎక్కువ మంది గెలిచినట్లు రెండు దశాబ్దాల సమాచారాన్ని క్రోడీకరించిన ఓపెన్‌ సీక్రెట్స్‌ సంస్థ పేర్కొన్నది. పార్లమెంటుకు పోటీ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన వారు 71 నుంచి 98శాతం వరకు గెలిచినట్లు తేలింది. ప్రారంభంలో చేసే ఖర్చును బట్టి ఫలితాలను ఊహించుకోవచ్చు.
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పద్దతి లేదు. బాలట్‌ పత్రాలనే వాడుతున్నారు. పోలింగ్‌ తేదీకి ముందే ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది.మన దగ్గర విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బాలట్‌ మాదిరి ఏ ఓటరైనా వేయ వచ్చు. ఇమెయిల్‌ ద్వారా ఓటు వేసి తరువాత బాలట్‌ పత్రాన్ని పోస్టు ద్వారా పంపుతారు. ఈ కారణంగానే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వారాల తరబడి సాగుతున్నది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా కౌంటీలో ఈ ఏడాది 2,90,000 పోస్టల్‌ బాలట్లు వచ్చాయి. వాటి మీద ఉన్న సంతకాలు నిజమైనవా కాదా అన్నది సరి చూసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా వచ్చే పోస్టల్‌ బాలట్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. నెవడాలో పోలింగ్‌ ముగిసిన నాలుగు రోజుల తరువాత వచ్చే పోస్టల్‌ బాలట్‌ను తీసుకొని లెక్కిస్తారు. ఎన్నికల అక్రమాలకు అమెరికా అతీతమేమీ కాదు. గతంలో అలాంటి తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని చోట్ల రాష్ట్రాల అసెంబ్లీల సెగ్మెంట్ల సరిహద్దులను అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా మార్చివేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎన్నికల నిబంధనలు అన్ని చోట్లా ఒకే విధంగా ఉండనవసరం లేదు, ప్రతి రాష్ట్రం తనదైన నిబంధనలు రూపొందించుకోవచ్చు.


వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పచ్చిమితవాద శక్తులకు ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడి గెలిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓహియోలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగా 33 రాష్ట్ర అసెంబ్లీ సెనెట్‌ సీట్లకు గాను 1951 తరువాత తొలిసారిగా రిపబ్లికన్లు 26 సీట్లు తెచ్చుకున్నారు. సౌత్‌ కరోలినాలో కూడా తొలిసారిగా ఇలాగే మూడింట రెండువంతుల సీట్లు తెచ్చుకున్నారు.డెమోక్రాట్లకు పట్టున్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇలాంటి అక్రమాల కారణంగానే ఈ సారి నలుగురు రిపబ్లికన్లు పార్లమెంటుకు అదనంగా గెలిచారు. 2020 అధక్ష ఎన్నికల లెక్కింపు సందర్భంగా కుట్ర వార్తలు వచ్చాయి. తొలుత రిపబ్లికన్లకు ఎక్కువగా పడినట్లు భావిస్తున్న బాలట్‌ బాక్సులు రావటం, తరువాత డెమోక్రాట్లకు పడిన బాక్సులు రావటంతో అనుమానాలు తలెత్తాయి. కొన్ని వారాల ముందే పోస్టల్‌ బాలట్స్‌ వేయవచ్చు గానీ, వాటిని ముందుగా లెక్కించటానికి వీలులేదు.కొన్ని చోట్ల పోస్టల్‌ బాలట్లే ఎక్కువ. జార్జియాలో 50శాతం ఓట్లు రానట్లయితే, ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నవారి మధ్య రెండోసారి ఎన్నిక జరుపుతారు. అక్కడి రెండు సెనెట్‌ స్థానాలకు డిసెంబరు 6న ఎన్నికలు జరుగుతాయి. అలాస్కా రాష్ట్రంలో పార్టీలకు గుర్తింపు లేదు. పార్టీలు కాండిడేట్లను నిలిపినా వారు స్వతంత్రులుగానే ఉంటారు. ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి ఎన్నివారాలైనా పట్టవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీలను మొత్తంగా చూస్తే డెమోక్రాట్‌లే ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ రాష్ట్రాలల్లో గవర్నర్లు రిపబ్లికన్లు ఎన్నికయ్యారు.1900 సంవత్సరం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమే మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ రాష్ట్రాల చట్టసభల్లో మెజారిటీ సాధించింది.


రిపబ్లికన్ల గాలిని అడ్డుకున్నప్పటికీ అమెరికా కార్మికవర్గానికి వారి నుంచి ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయ కూడదు. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నందున కార్మిక అనుకూల ప్రతిపాదనలను అడ్డుకొనే అవకాశం ఉంది.ఆ మెజారిటీని ఆసరా చేసుకొని బైడెన్‌, కుటుంబ సభ్యులు, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల మీద విచారణల పేరుతో వేధింపులకు పాల్పడి తమ అజెండాను ముందుకు తీసుకుపోవచ్చు. జడ్జీల నియామకాలకు ఆటంకం కల్పించవచ్చు. ట్రంప్‌ పిలుపుతో పార్లమెంటు మీద దాడిచేసిన ఉదంతంలో ట్రంప్‌, పార్టీ వారి మీద ఉన్నకేసులను నీరుగార్చేందుకు పూనుకుంటారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకొనేందుకు ఇప్పటి నుంచే పూనుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అధికారంలో బైడెన్‌ ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు లేకుండా పురోగామి అజెండాను అమలు జరిపే అవకాశం ఉండదు. నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండుశాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్ధికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. పాఠశాల కమిటీల్లో రాజకీయాలను చొప్పించిన వారిని, తిరోగామి భావాలు, పుస్తకాలను రుద్దేందుకు, ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిన వారిని వారిని ఓడించారు. అమెరికాలో ఎవరు గెలిచినా తమ ప్రయోజనాల రక్షణకు కార్మికులకు పోరుబాట తప్ప మరొక మార్గం లేదు. ఫాసిస్టు, పచ్చిమితవాద శక్తులు ఓటమి చెందటం తాత్కాలిక ఊరటతప్ప పరిష్కారం కాదు. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నుంచి కంపెనీలు ఏ దేశం వెళుతున్నాయి ? నిజానిజాలేమిటి ?

09 Wednesday Nov 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, exodus of manufacturing from China, factory of the world, Narendra Modi Failures, US-CHINA TRADE WAR, Vietnam


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వెలుపలికి వస్తున్నాయి. అదింకేమాత్రం ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండదు. చైనా వైఫల్యం – భారత అదృష్టం ఇలాంటి వార్తలు, విశ్లేషణలు ఇటీవల మరోసారి పెరిగాయి. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. చైనా దానికి మినహాయింపు కాదు.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమని చెప్పి పాలు పితికేందుకు పూనుకున్నట్లుగా కొందరున్నారు.ఆత్ర పడినంత మాత్రాన లేదా అదృష్టాన్ని నమ్ముకుంటే కంపెనీలు వస్తాయా ? మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా, పోటీ పడి మారాలని కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అది వాస్తవాల ప్రాతిపదికగా ఉండాలి. ఇంతకూ అసలు నిజానిజాలేమిటి ?


2022 అక్టోబరు చివరి వారంలో అమెరికాకు చెందిన సిఎన్‌బిసి ఒక విశ్లేషణను ఇచ్చింది.2016 నుంచి 2022లో ఇప్పటి వరకు వచ్చిన మార్పులను అది పేర్కొన్నది. దాని ప్రకారం ప్రపంచ దుస్తులు, వాటి సంబంధిత వస్తువుల ఎగుమతుల్లో చైనా వాటా 41 నుంచి 37శాతానికి, ఫర్నీచర్‌లో 64 నుంచి 53కు, పాదరక్షలు 72 నుంచి 65, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 83 నుంచి 70శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వియత్నాం వాటా ఫర్నీచర్‌లో 8 నుంచి 17 శాతానికి, పాదరక్షలు 12 నుంచి 16, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 6 నుంచి 10శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు పది నుంచి 12 శాతానికి పెరగ్గా, మలేషియా నుంచి దుస్తులు 14 నుంచి 19శాతానికి పెరిగి తిరిగి 14శాతానికి తగ్గాయి. మన దేశ వివరాలను అది అసలు పరిగణనలోకే తీసుకోలేదు. కఠినమైన కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా తగ్గటానికి ఒక కారణంగా సిఎన్‌బిసి పేర్కొన్నది. జీరో కరోనా విధానాల కారణంగా ఉత్పత్తిమీద తిరోగమన ప్రభావం పడటంతో దిగుమతిదారులు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారని ఎండిఎస్‌ ట్రాన్స్‌మోడల్‌ సలహాదారు ఆంటోనెలా టియోడోరో చెప్పాడు. చైనా వాటా తగ్గినందున అత్యధికంగా లబ్ది పొందింది వియత్నాం తప్ప మరొక దేశం కాదని అందరూ చెబుతున్నారు.2014 నుంచి అది సుదూర వాణిజ్యాన్ని 360 శాతం పెంచుకుందని ఆంటోనెలా చెప్పాడు. కరోనా నిబంధనలను ఎత్తివేస్తే తిరిగి చైనా వాటా పెరగనూ వచ్చు.


మన దేశంలో ఉన్న వారు ఆలోచించాల్సింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో నరేంద్రమోడీ సర్కార్‌ఎందుకు విఫలమైందన్నదే. వస్తూత్పత్తి చౌకగా అంటే చౌకగా దొరికే శ్రామిక శక్తి వియత్నాంలో ఉన్నందున పరిశ్రమలు, పెట్టుబడులు అక్కడకు వెళుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అదే గనుక అసలు కారణమైతే ఈ పాటికి మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉండాలి. వికీపీడియా సమాచారం ప్రకారం వియత్‌నామ్‌లో 2020 వివరాల ప్రకారం ఏడాది కనీస వేతనం సగటున 1,591 డాలర్లు, మన దేశంలో 2015 వివరాల ప్రకారం 664 డాలర్లు, చైనాలో 2018 ప్రకారం 2,084 డాలర్లు ఉంది.( తాజా వివరాల ప్రకారం అదింకా పెరిగింది) పోనీ నరేంద్రమోడీ అచ్చేదిన్‌లో భాగంగా ఇప్పటికి కనీసవేతనం రెట్టింపు చేశారని అనుకున్నా, వియత్‌నామ్‌ కంటే తక్కువే ఉంటుంది.మోడీ సర్కార్‌ నైపుణ్యశిక్షణ ఇచ్చింతరువాత కూడా మరెందుకు చైనా కంపెనీలు మన వైపు రాకుండా అక్కడికి పోతున్నట్లు ?


ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది చైనా నుంచి గానీ మరొక దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను అమెరికా లేదా ఐరోపాలోని ధనిక దేశాలు ఉత్పత్తి చేయలేనివి, అసాధ్యమైనవి అంతకంటే కాదు. శ్రమశక్తికి చెల్లించే వేతనాలు అసలు అంశం. తమ దగ్గర ఉన్న రేట్లను పోల్చి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి ధనిక దేశాల పెట్టుబడిదారులు అక్కడికి పోతున్నారు. చైనాలో తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు, జనాభా, అక్కడి మౌలిక సదుపాయాలు, మార్కెట్‌, తదితర అవకాశాలను చూసి గత నాలుగు దశాబ్దాల్లో చలో చైనా బాట పట్టారు.చైనాలో వేతనాలను పెంచుతున్న కొద్దీ చైనాలో ఉన్న విదేశీ కంపెనీల లాబీలు ప్రభుత్వాన్ని బెదిరించి వేతనాలు పెంచకుండా చూసేందుకు విశ్లేషణల పేరుతో కథనాలను వండివారుస్తున్నాయి. ఉదాహరణకు 2010 జూన్‌ నెలలో ఫైబర్‌ టు ఫాషన్‌ అనే వెబ్‌సైట్‌(పత్రిక)లో కార్మికవేతన ఖర్చు పెరుగుతున్న కారణంగా వస్తున్న వత్తిడితో అమెరికా దుస్తుల కంపెనీల సంస్థలు చైనా నుంచి వెలుపలికి పోయి ఇతర దేశాల్లో తమ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని భారత్‌తో సహా ఆసియాలోని సహదేశాలు వినియోగించుకుంటాయా అనే పద్దతిలో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. చిల్లర అమ్మకాల దిగ్గజాలైన కోచ్‌,ఆన్‌ టైలర్‌ స్టోర్స్‌,గస్‌,జె సి పెనీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నది. 2010 ఒక నివేదిక ప్రకారం గంటలకు కార్మికవేతన వేతనం( పెట్టుబడిదారుల పదజాలంలో ఖర్చు ) 1.84 డాలర్లని అంతకు ముందు ఏడాది కంటే 17శాతం పెరిగినట్లు అదే భారత్‌లో గంటకు 2.99 డాలర్లు, వియత్నాంలో 0.49 డాలర్లు ఉన్నట్లు తెలిపింది. చైనా వేతన ప్రమాణాలను పెంచటం, కరెన్సీ ఎన్‌ విలువ పెరగటం వంటి కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు.


ఆ తరువాత గడచిన పది సంవత్సరాల్లో కరోనాకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలను ప్రచురించని ఏడాది లేదంటే అతియోక్తి కాదు. అయినప్పటికీ పొలోమంటూ మొత్తంగా చైనాను ఖాళీ చేసి విదేశీ బాట పట్టిందేమీ లేదు. దాని ఎగుమతుల్లో వచ్చిన మార్పును పైన చూశాము. 2022 నవంబరు ఏడవ తేదీన అంతకు ముందు ప్రచురించిన వివరాలను నవీకరించి చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారికోసం అనేక వివరాలను ప్రచురించింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కనీసవేతనాలు, నిబంధనలు తదితర అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం 31రాష్ట్రాలలో షాంఘైలో కనీసవేతనం గరిష్టంగా నెలవారి 2,590యువాన్లు లేదా 400 డాలర్లు ఉండగా బీజింగ్‌లో గంటకు 25.3 యువాన్లు లేదా 3.99 డాలర్లు ఉంది. మిగతా చోట్ల రాష్ట్రాల వారీ అంతకంటే తక్కువ ఉన్నాయి. కనిష్టంగా అన్‌హులో 1,340యువాన్లు లేదా 212 డాలర్లు ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో చివరిది ఒకటవ జోన్‌లో 1,650యువాన్లు ఉంది. ప్రతి చోటా ఇలా జోన్ల వారీ హెచ్చు తగ్గులుంటాయి. నవంబరు 8వ తేదీన ఒక డాలరుకు మన కరెన్సీ మారకం విలువ రు.81.80కి అటూ ఇటుగా, ఒక యువానుకు రు.11.26 ఉంది.
మన కనీస వేతనాల్లో వైద్య బీమా – ఇఎస్‌ఐ నిమిత్తం కార్మికులు,యజమానులు చెల్లించాల్సి వాటాలు ఎలానో చైనాలో ఇతర అంశాలతో పాటు ఇంటి బీమా కోసం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రితపు ఏడాదిలో మూడు నెలల సగటు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగం దానిలో కార్మికుడు చెల్లిస్తే మరో సగం కంపెనీ చెల్లిస్తుంది. ఆ నిధులను కార్మికులు గృహాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మొత్తాలు కనీస వేతనం పెరిగినపుడల్లా దానికి అనుగుణంగా పెరుగుతాయి. ఇవి కనీసవేతనాలు మాత్రమే. ఉదా షాంఘై నగరంలో 2020లో సగటు నెల కనీసవేతనం 1,632 డాలర్లు అంటే రు.1లక్షా 33వేలు. ఇది ప్రభుత్వం ప్రకటించిన నాటి కనీసవేతనం కంటే నాలుగు రెట్లు. మొత్తం వేతనంతో పాటు ఇతర సామాజిక రక్షణ పధకాలకు గాను యజమానులు చెల్లించాల్సిన మొత్తం 37శాతం ఉంటుందని వీటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ సమాచారం పేర్కొన్నది.


చైనా ఉత్పత్తులు నాసిరకమని అనేక మంది ప్రచారం చేశారు. నిజానికి చైనా బజార్ల పేరుతో మన దేశంలో విక్రయించే వస్తువులన్నీ చైనావి కాదు. తక్కువ ధరలకు వచ్చేవన్నీ నాసిరకమనే భావన మనలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అమెరికా, ఐరోపా దుకాణాలన్నింటా చైనా వస్తువులే అన్నది తెలిసిందే. చైనా తన ఎగుమతుల్లో కేవలం రోజువారీ అవసరమైనవే గాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. ఈ రంగంలో ఇప్పటికీ అమెరికా, ఐరోపా ధనిక దేశాలదే అగ్రస్థానం. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మేడిన్‌ చైనా 2025 పేరుతో అక్కడి ప్రభుత్వం 2015 ప్రారంభించిన పారిశ్రామిక విధానంలో ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే వాటికి గండితో పాటు పోటీ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గుతాయి. ఇది తమకు ముప్పు అని అందరికంటే ముందు గుర్తించింది అమెరికా, అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు.తమ ఉత్పత్తులకు ఎదురుకానున్న పోటీ గురించి చెప్పటానికి బదులు చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరించిందని, తమ భద్రతకు ముప్పు ఉందంటూ అమెరికా ప్రచారం చేస్తున్నది.


ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన పేర్లతో ఇలాంటి విధానాలనే చేపట్టింది.” పరిశ్రమలు 4.0 అభివృద్ధి ప్రణాళిక ” పేరుతో జర్మనీ ప్రకటించింది. మన మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి వాటి గురించి తెలిసిందే. ప్రపంచం వంద సెమీ కండక్టర్లను వాడుతుంటే అందులో చైనా వాటా 60, దానికి గాను అది ఉత్పత్తి చేస్తున్నది పదమూడు మాత్రమే. చైనా ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2025నాటికి ఈ రంగంలో 70శాతం స్వయం సమృద్ధి సాధించాలని, 2049లో వందేళ్ల చైనా కమ్యూనిస్టు పాలన నాటికి హైటెక్‌ పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే దుస్తులు, పాదరక్షల వంటి వాటి మీద పని చేస్తూనే ఇతర కీలక రంగాల మీద కేంద్రీకరించారు.లాభాలను మాత్రమే చూసుకొనే విదేశీ కంపెనీలు చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు, ఇతర రాజీలేని నిబంధనల కారణంగా ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. అందువలన కొన్ని పరిశ్రమలు వెళ్లవచ్చు. అలా వెళితే వాటికే నష్టం. వాటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశం ఉండదు. అందువలన ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, పారిశ్రామికవేత్తల ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి.

చైనా చేపట్టిన సంస్కరణల గురించి భిన్న అభిప్రాయం వెల్లడించే కొందరు వామపక్ష వాదులు గానీ, అది కూలిపోతుంది, వాలిపోతుంది అని గత నాలుగు దశాబ్దాలుగా జోశ్యాలు చెబుతున్న చైనా వ్యతిరేకులకు గానీ ఇంత కాలం ఆశాభంగమే తప్ప మరొకటి లేదు. అయితే చైనాకు ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేవా ? లేవని ఎవరు చెప్పారు ! పెట్టుబడిదారీ సమాజాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నవారికి అంతా పూలబాటగా ఎలాంటి ప్రతిఘటన, సవాళ్లు లేకుండా అంతా సాఫీగా నడిచిందా, ఆధిపత్యం కోసం ఖండాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకున్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణంలో పెట్టుబడిదారుల నుంచి ప్రతిఘటన లేకుండా ఎలా ఉంటుంది ?


చైనా ఒక విధానాన్ని అనుసరించి అనూహ్య విజయాలను సాధించింది. ఆ…. అది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం ఎక్కడుంది అనే వారు కొందరు. నిజమే, సోషలిజం లేనపుడు అది వద్దని కోరుకొనే వారు ఆ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో చైనా మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదు ? అక్కడంతా నిరంకుశత్వం ఉంటుంది అనే వాదన మరొకటి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశపాలనలో ఉన్నాయి,మరి అవెందుకు చైనా మాదిరి పురోగమించలేదు. పత్రికల రాతలను చూసి గతంలో కంపెనీలు చైనాకు వరుసలు కట్టలేదు. ఇప్పుడు వీటిని చూసి తిరుగుముఖం పడితే ఏం చేయాల్సిందీ చైనా వారు చూసుకుంటారు. వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవా, అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే దేశంలో చైనా ఆర్థికంగా దెబ్బతింటే బాగుపడేది మనమే లేదా మనకు మంచి అవకాశం అనే ఆలోచనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. చైనా మీద విద్వేషాన్ని విపరీతంగా రెచ్చ గొట్టిన పర్యవసానమిది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి కష్టపడకుండా లక్కు మీద ఆధారపడి పనీ పాటా లేకుండా తిరిగే సోంబేరుల మాదిరి ఉండి బాగుపడిన వారెవరూ లేరు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా దెబ్బతింటే తప్ప మనకు అవకాశాలు రావని చెప్పే ప్రబుద్దుల మాటలు విని దాని కోసం ఎదురు చూస్తూ చేయాల్సినవి చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదని పాలకులకు, ఇతరులకు ఎవరు చెప్పాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d