• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

ఇక చాలు నరేంద్రమోడీ గారూ – మీ వైఫల్య భారాన్ని ఇంకేమాత్రం మోయలేం !

04 Sunday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP’s trolling army, india debt, India debt matters, narendra modi bhakts, Narendra Modi Failures, RBI on Debt


ఎం కోటేశ్వరరావు


‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ ఆగండి ఆగండి నరేంద్రమోడీ అభిమానులారా ! ఈ మాటలన్నది రాహుల్‌ గాంధీయో, సీతారామ్‌ ఏచూరో కాదు. ఒక్కసారి గతంలోకి వెళితే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గారి నోటి నుంచి వెలువడిన సుభాషితాలే ఇవి అని మీరు ఇట్టే గ్రహించేస్తారు.


ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రూపాయి విలువ పతనం కారణంగా మన విదేశీ అప్పు గణనీయంగా పెరిగి పోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వుబ్యాంకే తాజాగా చెప్పింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన విదేశీ అప్పు 570 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. గతేడాది మార్చి నాటికి జిడిపిలో విదేశీ అప్పుశాతం 20.6శాతం ఉంటే ఈ ఏడాదికి అది 21.1శాతానికి ” అభివృద్ధి ” చెందింది. గతేడాది మన విదేశీ అప్పు 11.5బిలియన్‌ డాలర్లు పెరిగింది. మన రూపాయి విలువ పతనం కానట్లయితే ఆ పెరుగుదల 4.7 బిలియన్‌ డాలర్లు ఉండేది, పతనం కారణంగా 6.8బి.డాలర్లు అదనం అయింది. మనందరికీ తెలిసిన సాధారణ విషయం ఏమంటే ఒప్పందం ప్రకారం వడ్డీ నెల నెలా కట్టకపోతే అది అసలులో కలిసి అప్పు భారం పెరుగుతుంది. మనం కొత్తగా అప్పులు తీసుకోకపోయినా, వడ్డీ సకాలంలో చెల్లించినా రూపాయి విలువ తగ్గితే మన అప్పు పెరిగి పోతుంది. అందువలన మోడీ గారు చెప్పినట్లు రూపాయి విలువ తగ్గుదల-పెరుగుదల ప్రభుత్వాలదే గనుక ఆ పుణ్యం మన నరేంద్రమోడీ ఖాతాలోకే వేయాలి మరి. మన్మోహన్‌ సింగ్‌కు ఒక న్యాయం నరేంద్రమోడీకి ఒక న్యాయం ఉండదు కదా !


మా నరేంద్రమోడీ గారు అప్పులే చేయలేదు, గతంలో చేసిన అప్పులు తీర్చారు అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ఊదరగొట్టారు. మరి రిజర్వు బ్యాంకు చెబుతున్న వివరాల సంగతేమిటి ? అప్పులు తీరిస్తే ఎందుకు పెరుగుతున్నాయి ? 2014లో 446.2 బిలియన్‌ డాలర్ల అప్పుంటే ఇప్పుడు 570బి.డాలర్లకు పెరిగింది. గత ఏడాది చెల్లించిన అసలు , వడ్డీ కలిపి 8.2శాతం ఉండగా అంతకు ముందు 6.5శాతం ఉంది. గత ఏడు సంవత్సరాలలో అది 5.9 నుంచి 8.2శాతం మధ్య ఉంది తప్ప మోడీ భక్తులు చెబుతున్నట్లుగా ఏ ఒక్క ఏడాదిలోనూ అసాధారణంగా అప్పు తీర్చిన దాఖలా లేదు. ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఇదే కాలంలో 79 బిలియన్‌ డాలర్ల నుంచి 107కు పెరిగాయి. అందువలన గత ప్రభుత్వం మాదిరే మోడీ సర్కార్‌ కూడా అప్పులు తీసుకుంటున్నదీ, చెల్లిస్తున్నది తప్ప 56 అంగుళాల ఆర్ధిక నైపుణ్య ప్రత్యేకత ఏమీ లేదు.


గత ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మోడీ సర్కార్‌ భరించాల్సి వస్తున్నది కనుక సమీప భవిష్యత్‌లో చమురు ధరలు లేదా పన్ను తగ్గించే అవకాశం లేదని అభిమానులు చెబుతారు.మన్‌కీ బాత్‌ అంటూ ప్రతి నెలా మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఏ నెలలో అయినా ఆ విషయం చెప్పారా అందువలన ఏదో ఒక సమయంలో ఆ ముక్కేదో నరేంద్రమోడీ గారినే చెప్పమనండి ! చెప్పలేరు ? ఎందుకని ? మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌, అంతకు ముందు వాజ్‌పారు సర్కార్‌ జారీ చేసిన బాండ్లకు గాను చెల్లించాల్సిన మొత్తం లక్షా 30వేల కోట్ల రూపాయలు. వాటి గడువు ఇంకా ఉంది. అది కూడా వినియోగదారులకు సబ్సిడీగా ఇచ్చిన మొత్తం తప్ప మరొకటి కాదు. ఈ మొత్తానికి గుండెలు బాదుకుంటూ చమురు ధర తగ్గించలేరని చెబుతున్న వారు మోడీ సర్కార్‌ చేసిన అప్పుల గురించి మాట్లాడరు. విదేశీ అప్పు గురించి పైన చెప్పుకున్నాం. గత ఏడు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు ఎంతో తెలుసా ! 2014లో ఉన్న అప్పు 54,90,763 కోట్లు. అది 2021మార్చి 31 నాటికి 116.21 లక్షల కోట్లకు పెరిగింది. చమురు బాండ్లు ఈ మొత్తంలో వందో వంతు కంటే తక్కువే కదా ? మరి ఇంత అప్పు ఎందుకు చేసినట్లు ? ఈ మొత్తంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ? దాని వలన వచ్చిన ఫలితాలేమిటో ఎవరైనా చెప్పేవారున్నారా ?


ఏడు సంవత్సరాల క్రితం ఒక లీటరు పెట్రోలు మీద రు. 9.48 ఎక్సైజ్‌ పన్ను ఉంది. అది ఇప్పుడు 32 రూపాయలకు పెరిగింది. ఒక రూపాయి పన్ను పెరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఏడు సంవత్సరాల కాలంలో ఆదాయం లక్షా 30వేల కోట్ల నుంచి నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది. యుపిఏ చమురు బాండ్ల పేరుతో ఇంత బాదుడా ? జనాన్ని అంత ఆమాయకంగా చూస్తున్నారా ?
2014 మేనెలలో మనం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా ధర డాలర్లలో 107.7 ఉండగా మన రూపాయల్లో చెల్లించిన మొత్తం 6,326. ఇప్పుడు జూన్‌ నెలలో 71.40 డాలర్లు కాగా రూపాయల్లో 5,257, జూలై రెండవ తేదీ ధర 74.75 కాగా రూపాయల్లో 5,560 ఉంది. ఏడు సంవత్సరాల క్రితం అంత తక్కువ ఎందుకు చెల్లించాము, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు చెల్లిస్తున్నాము. అంటే మోడీ గారి ఏలుబడిలో రూపాయి విలువ పతనం కావటమే కారణం. మరి రూపాయి విలువ గురించి గతంలో చెప్పిన మాటలేమైనట్లు ? ఇలా పతనం అవుతుంటే ఎవరు లాభపడుతున్నట్లు ? గోడదెబ్బ-చెంపదెబ్బ మాదిరి వినియోగదారులకు పన్ను పోటు-రూపాయి పోటు రెండూ ఎడాపెడా తగులుతున్నాయి. సమర్ధవంతమైన పాలన ఎక్కడ, అనుభవం ఏమైనట్లు ?


మోడీ పాలనలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంత పెరిగాయి, ఇంత పెరిగాయి చూడండి అంటూ గొప్పలు చెబుతారు. మన వాణిజ్యం ప్రతి సంవత్సరం లోటులోనే నడుస్తున్నది. మరి ఈ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి ? గతేడాది కరోనా కారణంగా వినియోగం తగ్గి దిగుమతులు పడిపోయి వాణిజ్య మిగులు ఉంది తప్ప ఎప్పుడూ మనకు చైనా, జపాన్‌ మాదిరి డాలర్లు మిగల్లేదు. మరి మన దగ్గర ఉన్న డాలర్‌ నిల్వలు ఏమిటి అంటే మన స్టాక్‌ మార్కెట్లో విదేశీయుల పెట్టుబడులు, చేస్తున్న అప్పులు, ప్రవాస భారతీయులు దాచుకుంటున్న నిల్వలు మాత్రమే. మరో విధంగా చెప్పాలంటే మన జేబులో సొమ్ము తప్ప బీరువా ఖాళీయే. మన రూపాయి విలువ తక్కువ, ఎక్కువ ఉండటం గురించి మన వాణిజ్య వేత్తల్లో విబేధాలు ఉన్నాయి. విదేశాల నుంచి రుణాలు తీసుకున్నా లేదా విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా మన దగ్గర డాలర్‌ నిల్వలు పెరుగుతాయి, దాంతో రూపాయి విలువ పెరుగుతుంది. ఇది ఎగుమతి దారుల లాభదాయకతను దెబ్బ తీస్తుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు పోటీ పడలేవు. అందువలన రూపాయి బలంగా ఉండటాన్ని ఎగుమతిదారులు వ్యతిరేకిస్తారు.ఇప్పుడున్న దాని మీద రూపాయి విలువ 20శాతం తగ్గిస్తే మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడి అవుతాయని వారు చెబుతారు.


మన రూపాయి బలంగా ఉంటే చమురు, ఇతర దిగుమతుల ధరలు తగ్గుతాయి. వినియోగదారుల మీద భారం తగ్గుతుంది. కనుక రూపాయి విలువ పతనాన్ని అరికట్టాలని దిగుమతిదారులు డిమాండ్‌ చేస్తారు. 2011 నుంచి మన ఎగుమతులు 300 నుంచి 314 బిలియన్‌ డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఒక సంవత్సరం మాత్రం 330 బి.డాలర్లు ఉన్నాయి.ఇదే సమయంలో దిగుమతులు పెరగటమే తప్ప తరగటం లేదు. ఏడు సంవత్సరాలుగా మేకిన్‌ ఇండియా పేరుతో ప్రధాని మోడీ వస్తు తయారీకి పిలుపులు ఇస్తున్నా ఎగుమతులూ లేవు, దిగుమతులూ తగ్గలేదు. అంటే మనకు అవసరమైన వస్తువులను కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. మొత్తం మీద చెప్పవచ్చేదేమంటే మోడీ సర్కార్‌ వైఫల్యాలు జనం మీద భారాలు పెంచుతున్నాయి. మునిగే పడవ గడ్డిపోచను కూడా భరించలేదన్నట్లుగా పరిస్ధితి దిగజారుతోంది. అందుకే మోడీ గారు మీ భారాలు మోయలేకున్నాం అని చెప్పాల్సి వస్తోంది. వినిపించుకుంటారా ! అధికారంలో ఉన్నవారు అలాంటి మంచి పని చేసిన దాఖలా లేదు మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ అభిమానులూ వంట గ్యాస్‌కు మీ నుంచి కూడా ఎంత పిండుతున్నారో తెలుసా !

01 Thursday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Domestic LPG, LPG Price, LPG Price in India, narendra modi bhakts, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


జూలై ఒకటి నుంచి వంటగ్యాస్‌ సిలిండరు ధర మరో ఇరవై అయిదు రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాదులో 861.50 నుంచి రూ.886.50 అయింది. నలభై రూపాయల సబ్సిడీ పదిహేనుకు పడి పోయింది. ఈ ముష్టి కూడా త్వరలో ఎత్తివేస్తారు. కరోనా కారణంగా కుదేలైన వారికి మరో 6.29లక్షల కోట్ల పాకేజి ప్రకటించిన నిర్మలమ్మ ఘనత గురించి ఇంకా చెప్పుకుంటూ ఉండగానే గ్యాస్‌ ధర పెరిగింది. రోజువారీ పెట్రోలు, డీజిలు ధరలకు జనం అలవాటు పడ్డారు. ఇప్పటికే వంద రూపాయలు దాటింది, 125, 150, 175, మోడీ అభిమానులు ఎదురు చూస్తున్న 200 కూడా త్వరలోనే దాటి పోతుందేమో. కనుక దాని గురించి పదే పదే చెప్పుకున్నా, వామపక్షాలు, కాంగ్రెస్‌ వారు చేసే ఆందోళనవలన ప్రయోజనం లేదు. పెరుగుదల మన ఒక్కరికే కాదు కదా, పెరుగుట విరుగుట కొరకే అన్న వేదాంతంలో నమ్మకం ఉన్న వారం గనుక ఇంకా ఇంకా ఎంత పెంచుతారో అదీ చూద్దాం. త్వరలో వంట గ్యాస్‌ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరి రోజు వారీ పెరుగుతాయా మరొక పద్దతిలోనా అన్నది చూడబోతున్నాం.


2019-20లో వంట గ్యాస్‌ మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.34,085 కోట్లు. 2020-21లో బడ్జెట్‌ అంచనా 37,256 అయితే దాన్ని 36,072 కోట్లకు సవరించారు. 2021-22లో ఆ మొత్తాన్ని 14,073 కోట్లకు తగ్గించి ప్రతిపాదించారు గనుక ఇప్పుడు పాతిక రూపాయలు ధర పెంచారు. ఆ మేరకు సబ్సిడీని తగ్గించారు. వివిధ ప్రాంతాలకు ఇస్తున్న సబ్సిడీలో తేడాలున్నప్పటికీ వడ్డింపులో వివక్ష లేదు కనుక ఆ మేరకు అందరికీ వర్తిస్తుంది.


పెట్రోలు, డీజిలు ధరలతో పాటు తమ ఏలుబడిలో గ్యాస్‌ ధరలు కూడా తక్కువే అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. నమ్మని వారి గురించి వదిలేద్దాం, నరేంద్రమోడీని నమ్మిన వారిని తప్పుదారి పట్టిస్తున్నారనేదే ఆవేదన. దిగువ వివరాలు చూడండి.దిగుమతి ధర డాలర్లలో, వినియోగదారుల ధర, సబ్సిడీ మన రూపాయల్లో అని గమనించాలి. దిగుమతి ధరకు రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి.


సంవత్సరం××× దిగుమతి ధర××× వినియోగదారు ధర××× సబ్సిడీ
2014 ××× 970 ××× 414 ××× 638
2021 ××× 530 ××× 886 ××× 15


ఈ వివరాలను గమనించినపుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గత ఏడు సంవత్సరాలలో గణనీయంగా పడిపోయినందున ప్రభుత్వం లేదా చమురు కంపెనీలు ఇచ్చే సబ్సిడీ మొత్తం కూడా ఆమేరకు తగ్గిపోతుంది. కానీ అసలు సబ్సిడీ ఎత్తివేయటమే విధానంగా పెట్టుకున్నందున ఇప్పుడు గ్యాస్‌ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరే రోజు వారీ పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే గతేడాది చమురు ధరలు గణనీయంగా పడిపోయినందున దిగుమతి చేసుకున్న ఎల్‌పిజి ధర కూడా 383 డాలర్లకు పడిపోయింది. గత ఏడు సంవత్సరాలలో ఇలా తరగటం తప్ప యుపిఏ కాలం నాటి ధరలకు పెరిగలేదు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందున 2018-19లో ఉన్న 526 డాలర్ల స్ధాయికి తిరిగి చేరాయి. దిగుమతి రవాణా ఖర్చు 2014లో టన్నుకు 46 డాలర్లు ఉంటే 2018 జూన్‌ ఒకటిన 20 డాలర్లు మాత్రమే ఉంది.


దేశం ఇప్పుడు రెండుగా చీలి పోయింది. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని దేశద్రోహుల దొడ్లో వేస్తున్నారు. మిగిలిన వారంతా దేశభక్తులే. ” దేశ ద్రోహుల ” గురించి వదలివేద్దాం. వారి నుంచి ఎంత వీలైతే అంత పెట్రోలు,డీజిలు, వంట గ్యాస్‌ నుంచి పిండమనండి ఇబ్బంది లేదు. కొత్త దేవుడైన నరేంద్రమోడీని విమర్శించినందుకు వారికి ఆ శాస్తి జరగాల్సిందే. గడ్డాలు, దుస్తులను చూసి ఎవరు ఏమతం వారు అన్నది గుర్తించి మరీ దాడి చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అన్ని మతాల వారూ ఒకే మాదిరి గడ్డం పెంచటం ఒక సరదా అయింది కనుక పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. నాజీ జర్మనీలో యూదులను గుర్తించేందుకు హిట్లర్‌ వారికి పసుపు పచ్చ రంగు గుర్తు(బ్యాడ్జి) వేయించాడు. అలాగే మోడీ వ్యతిరేకులందరికీ ఏదో ఒక రంగు గుర్తు వేస్తే గుర్తించటం సులభం అవుతుంది.


దేశద్రోహులు ప్రతి అంశం మీద ఎప్పటి కప్పుడు వాస్తవాలు చెబుతున్నారు. ఇక దేశభక్తులైన మోడీ అభిమానులైన వారిని తోటి వారే మోసం చేయటమే ఆవేదన కలిగించే అంశం. మోడీ కంటే ముందు సంవత్సరాలలోనే గ్యాస్‌ ధరలు ఎక్కువ అంటూ ప్రచారం చేశారు. వారు పేర్కొన్న అంకెలు సబ్సిడీతో నిమిత్తం లేకుండా దిగుమతి, ఇతర ఖర్చులు, డీలరు కమిషన్‌ వంటి వాటిని కలిపి లెక్కిస్తే నిర్ణీత సిలిండరు ధర ఎంత పడుతుంది అన్న అంశాన్ని అవి వెల్లడిస్తాయి. అవి ఒక వైపు ఉన్న బొమ్మ లాంటివి. మరోవైపు ఉండే బొరుసును కూడా చూపితేనే స్పష్టత వస్తుంది. ఉదాహరణకు యుపిఏ పాలనలో 2014 మార్చి ఒకటవ తేదీ నాడు లెక్కించిన మేరకు సిలిండరు ఒకదానికి వసూలు చేయాల్సిన మొత్తం రు.1001.78. అయితే వినియోగదారు నుంచి వసూలు చేసింది రు. 414 మాత్రమే. మోడీ సర్కార్‌ పార్లమెంటులో స్వయంగా చెప్పినదాని ప్రకారం 2018జూన్‌ ఒకటవ తేదీన వసూలు చేయాల్సిన మొత్తం రూ.698 అయితే వినియోగదారుల నుంచి వసూలు చేసింది రూ.493. ఇచ్చిన సబ్సిడీ 205, 2014తో పోల్చితే అంతర్జాతీయంగా ధరలు తగ్గి ప్రభుత్వానికి ఏకంగా సిలిండరుకు మూడు వందల రూపాయలు మిగిలాయి.

దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది. అది లేని రాష్ట్రాలలో కూడా మద్దతుదారులు ఉన్నారు.ఎవరు అవునన్నా కాదన్నా అది పెద్ద పార్టీగా ఉంది. దీన్ని చూసి ఇంక మోడీ శాశ్వతం అని కొందరు చెబుతుంటే ఇప్పట్లో దిగిపోయే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. ఎవరెంత కాలం ఉంటారో ఎవరూ చెప్పలేరు గనుక దాన్ని పక్కన పెడదాం. మోడీ భక్తులుగా మీ నుంచి ఈ ప్రభుత్వం ఎంత పిండుతున్నదో అభిమానులు తెలుసుకోవాలి. మోడీ విధానాలను వ్యతిరేకిస్తారా లేదా అనేది వేరే అంశం. మోడీ మీద మాకు అభిమానం ఉంది, పెట్రోలు రెండు వందలు, గ్యాస్‌ బండ రెండువేలు అయినా మాకేమీ ఇబ్బంది లేదు, అంటారా మీ ఇష్టం అని తప్ప ఇంకేమి చెప్పగలం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా 5జిపై బెదిరింపుల నుంచి ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగిన అమెరికా !

01 Thursday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Chinese 5G, G7, US fight against Chinese 5G, US-China Tech war

మన చుట్టూ జరుగుతున్నదేమిటి : ఐదవ భాగము

ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులు ఎంత గొప్పవో లేదా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎలా వస్తాయో చూడండి అంటూ దేశ విదేశాల్లో రోడ్‌ షోలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇప్పుడు దానికి భిన్నంగా చైనా 5జి పరిజ్ఞానం, పరికరాలను గనుక మీరు తీసుకోకపోతే మేమిచ్చే శిక్షణ, రాయితీల గురించి తెలుసుకోండి అంటూ అమెరికా ఇప్పుడు రోడ్‌ షోలను నిర్వహిస్తోంది. ఇతర ధనిక దేశాలు కూడా అదే యోచనలో ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే జరిగే నష్టాలు ఇతర కంపెనీల నుంచి తీసుకుంటే కలిగే లాభాలు ఇవి అని రాజకీయ నేతలు, నియంత్రణ అధికారులు, ప్రభుత్వాలకు వివరించేందుకు అమెరికా యంత్రాంగం పుస్తకాల పంపిణీ, సమావేశాలను నిర్వహిస్తున్నదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. చైనా హువెయి, జట్‌టిఇ తదితర కంపెనీల పరికరాలను కొనవద్దని గతంలో బెదిరించిన అమెరికా ఇప్పుడు ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగింది. చైనా పరికరాల్లో ఆయా దేశాల సమాచారాన్ని తస్కరించే దొంగ చెవులు ఉన్నాయని ఇతర దేశాలను భయపెడుతోంది.


బ్రిటన్‌లో జూన్‌ 11-13వ తేదీలలో జరిగిన 47వ జి7 సమావేశాలు బి3డబ్ల్యు పధకాన్ని అమలు జరపాలని నిర్ణయించాయి. ఇది చైనా అమలు చేస్తున్న బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పధకానికి పోటీగా అని చెప్పారు గనుక ప్రపంచం మరింత పురోగమిస్తుందని అందరూ భావించారు. వివరాలు ఇంకా వెల్లడిగాకున్నా కానీ దాని తీరు చూస్తే చైనా చొరవను నీరుగార్చే వ్యవహారంగా కనిపిస్తోంది. జి7 దేశాలు ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా చైనా,రష్యా,బ్రెజిల్‌, మన దేశాన్ని పక్కన పెట్టాయి. వాటి భాషలో ఈ విషయాన్ని అంత సూటిగా చెప్పవు. ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ఒక్క చైనా మీద మాత్రమే దాడి చేశారు. అక్కడ మానవహక్కులు లేవని, కరోనా మూలాలు అక్కడే, పర్యావరణాన్ని దెబ్బతీస్తోందంటూ దాడి సాగింది. అందరం కలసి కట్టుగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సూటిగానే చెప్పాయి. జి7 దేశాలు మన సహజ భాగస్వాములని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు గనుక మనకూ ” ఆ మహత్తర కార్యక్రమం ” లో ఏదో ఒక పాత్ర ఉంటుందన్నది స్పష్టం.


మధ్య, తూర్పు ఐరోపా దేశాలు గనుక చైనా బదులు ఇతర దేశాల టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తే ఆర్ధిక సాయం చేసేందుకు వీలు కల్పించే బిల్లును మే నెలలో అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మీరు గనుక చైనా హువెయి పరికరాలను కొనుగోలు చేస్తే మిత్ర దేశాలైనప్పటికీ మా గూఢచారులు సేకరించిన సమాచారాన్ని అందచేయబోమని అమెరికా ఇతర దేశాలను బెదిరించింది. అయితే అది పని చేయకపోవటంతో బుజ్జగింపులకు పూనుకుంది, ఇప్పుడు ప్రలోభాలకూ పాల్పడుతోంది. అమెరికా వత్తిడికి లొంగిన జర్మనీ చాలా కాలం పాటు చైనా పరికరాలను తీసుకొనేందుకు ముందుకు రాలేదు. అయితే హువెయికి పోటీ కంపెనీలైన ఎరిక్స్‌న్‌, ఏబి, నోకియాలు అందచేసే పరికరాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అనేక దేశాలు ఎటూ మొగ్గకుండా తటపటాయిస్తున్నాయి. దీంతో అలాంటి దేశాల దగ్గర తగినంత సొమ్ము లేకపోతే అప్పులిస్తామంటూ అమెరికా ముందుకు వస్తోంది. అమెరికా చట్టాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వటానికి అంగీకరించవు, అయినప్పటికీ మినహాయింపు సవరణలు చేసి 50 కోట్ల డాలర్ల మేరకు రుణాలు ఇచ్చేందుకు సిద్దం చేశారు. అయితే హంగరీ, సెర్బియా వంటి దేశాలు చైనా కంపెనీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతించాయి.


అమెరికా వత్తిళ్లను ఖాతరు చేయని జర్మనీ రెండు సంవత్సరాల తరువాత తమకు అన్ని కంపెనీలు ఒకటే అంటూ ఏప్రిల్‌ ఆఖరులో ఒక చట్టాన్ని చేసింది. తమ భద్రతా ప్రమాణాలను పాటించిన ఏ కంపెనీ ఉత్పత్తి అయినా తమకు సమ్మతమే, రక్షణ గురించి ఎలాంటి భయం లేదని ప్రకటించింది. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చైనా కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా చెప్పినట్లు నడుచుకోజాలమని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించాడు. జర్మనీ-చైనా తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కొన్ని ఐరోపా దేశాలు సంయక్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొనేందుకు ఏర్పాటు చేసిన పధకంలో పెట్టుబడి పెట్టిన జర్మనీ దాని వలన ఫలితం లేదని గ్రహించింది.


అభివృద్దిలో పోటీ బదులు చైనా నియంత్రణపై కేంద్రీకరించాలట !


ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన పరుగులో చైనాను నిరోధించేందుకు చతుష్టయ దేశాలు (అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌) ఉమ్మడిగా పని చేయాలని ముంబైలోని గేట్‌వే హౌస్‌ ఎకానమీ మరియు టెక్నాలజీ కార్యాచరణ సంస్ధ ప్రతినిధులు లిసా కర్టిస్‌, సూర్జిత్‌భల్లా సలహా ఇచ్చారు. చైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ముఖ్యమైన ఖనిజ సంపదతో ప్రపంచ సరఫరా వ్యవస్ధలను నియంత్రించాలని చూస్తోందన్నది వారి ఆరోపణ. దానికి పోటీగా ఆర్ధిక, సాంకేతిక రంగాలలో నాలుగు దేశాలు, సహరించుకొని ఇతర దేశాలను కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. 5జి గురించి రెండు దేశాలూ సహకరించుకోవాలని డోనాల్డ్‌ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ గతంలో కబుర్లు చెప్పినా అడుగు గడపదాటలేదు. అసలు చతుష్టయ దేశాల దగ్గర ఆ పరిజ్ఞానమే లేదు, మరోవైపు చైనా ఆరవ తరం పరిజ్ఞానం గురించి ఆలోచనలు చేస్తున్నది. కీలకమైన సెమికండక్టర్ల రంగంలో అమెరికా వెనుకబడింది. మన దేశంలో సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ వారికి పని లేదు, పెట్టుబడి పెట్టేవారూ లేరు. మన మేథావులు అమెరికా వెళితే వారికి వ్యక్తిగతంగా, అమెరికాకు లాభం తప్ప మనకు ప్రయోజనం లేదని గతం స్పష్టం చేసింది. మన వారిని ఆకర్షించటం తప్ప ముందే చెప్పుకున్నట్లు ఉమ్మడి పరిశోధనలకు అమెరికా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. చైనా మాదిరి పరిశోధన-అభివృద్దికి కేటాయింపుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము.

వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.అయినప్పటికీ చైనా కంటే ఎంతో వెనుకబడే ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాలలో ఉపాధి కల్పనకు వివిధ రంగాలలో 2.25లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇది ఏడాదికి 280 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చైనా ప్రభుత్వం, స్ధానిక సంస్ధల ద్వారా 556 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రానున్న సంవత్సరాలలో ఇదే ధోరణి కొనసాగినా అమెరికా కంటే ఎంతో ముందుంటుంది.పరిశోధన-అభివృద్ధికి గాను 180 బిలయన్‌ డాలర్లని అమెరికా పేర్కొన్నది, అయితే ఇవి ఏమూలకన్నది ప్రశ్న. అయితే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు తప్ప కొత్తగా ఏర్పాటు చేయాల్సినవి పెద్దగా ఉండవు. కనుక సహజంగానే చైనాలో ఏడాది కేడాది పెరుగుదల ఉంటుంది. అయితే మరి చైనా ప్రత్యేకత ఏమిటి అంటే గతేడాదినాటికి అక్కడ 38వేల కిలోమీటర్ల హై స్పీడు రైలు మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మూడవ వంతు ఖర్చుతో అక్కడ నిర్మిస్తున్నట్లు 2019లో ప్రపంచబ్యాంకు చెప్పింది.ఈ వ్యవస్ధ రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అమెరికాతో పోల్చితే తలసరి ఉత్పత్తిలో చైనాలో ఆరోవంతు మాత్రమే ఉంది, అందువలన దాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధన-అభివృద్ధికి చైనా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

చైనా వద్దు గానీ లాభాలు మాత్రం ముద్దు !


చైనా విషయంలో అమెరికాతో జతకట్టిన ఐరోపా ధనిక దేశాలన్నీ ఒకటే. చైనా వద్దుగానీ దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇటలీలోని బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఇది వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అతి పెద్ద టెలికాం కంపెనీ పేరు ఆరెంజ్‌. చైనా పరికరాలను తమ దేశంలో వినియోగించవద్దని నిర్ణయించాం గానీ ఆఫ్రికాలో మాతో సంబంధాలున్న కంపెనీల్లో వాటిని వినియోగించటానికి సిద్దమే అని కంపెనీ స్టీఫెన్‌ రిచర్డ్‌ రాయిటర్‌ వార్తా సంస్దతో చెప్పాడు. ఆఫ్రికాలో యూరోపియన్లు పెట్టుబడులు పెట్టేందుకు విముఖంగా ఉన్నారు, చైనీయులు పెడుతున్నారు అని చెప్పాడు. ఆ ఖండంలోని అనేక దేశాల టెలికాం ఆపరేటర్లు చైనా పరికరాల మీద ఆధారపడుతున్నారు.అందువలన మేము చైనా కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని దాపరికం లేకుండా చెప్పాడు. ఐరోపాలో ఇప్పుడు చైనా కంపెనీలతో కలసి 5జి నెట్‌వర్క్‌లను అభివృద్ది చేయటం ఎంతో కష్టం అన్నది వాస్తవం అన్నాడు. ఆరెంజ్‌ కంపెనీలో ఫ్రెంచి ప్రభుత్వానికి 23శాతం భాగస్వామ్యం ఉంది.


5జి గురించి ధనిక దేశాలు ఎందుకు ఇంతగా చైనాను దెబ్బతీయాలని చూస్తున్నాయి ? దీనిలో రాజకీయంంతో పాటు ఆర్ధికం కూడా ఇమిడి ఉంది. 2030 నాటికి ప్రపంచ జీడిపిలో 5జి ద్వారా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆదాయం తోడవుతుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ తాజా నివేదికలో పేర్కొన్నది.ఆరోగ్య, వినియోగదారుల, ఆర్ధికసేవలు, వస్తు తయారీ, మీడియా రంగాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర అమెరికా ఖండ దేశాల లబ్ది ఎక్కువగా ఉంటుంది. చైనా ఆర్ధిక వ్యవస్ధకు 220 బిలియన్‌ డాలర్లు తోడవుతాయని పేర్కొన్నది. ఎవరైనా అభివృద్ది చెందాలనుకుంటే చూసి నేర్చుకోమన్నారు తప్ప ఎదుటివారిని చూసి ఏడవమని, చెడగొట్టేందుకు ప్రయత్నించమని మన పెద్దలెవరూ చెప్పలేదు. అలాంటి వారు బాగుపడిన దాఖాలాలు కూడా లేవు. వారి శక్తుయుక్తులన్నీ తమ బాగుకోసం గాక ఇతరులను చెడొట్టేందుకు ఉపయోగిస్తే ఫలితం ఏముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిర్మలమ్మ తాయిల పొట్లంలో ఏముంది ? ఎంత మేరకు ప్రయోజనం !

29 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

CPI(M), Narendra Modi Failures, Nirmala Sitaraman stimulus package, SITARAM YECHURY


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను మించి భయపెడుతున్న చమురు – అచ్చేదిన్‌ కాదు జనం చచ్చే రోజులు !

23 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

$100 Oil Predictions Soar, crude oil price, world oil prices



ఎం కోటేశ్వరరావు
కొంత అతిశయోక్తిగానే ఉండవచ్చు గానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న ధరల తీరు తెన్నులను చూస్తే మన జనాలను కరోనా కంటే చమురు ధరలే ఎక్కువగా భయపెట్టేట్లు ఉన్నాయి. బుధవారం నాడు ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం చమురు ధర 75.30 డాలర్లుగా ఉంది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికాతో కరాఖండిగా వ్యవహరించే ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనుక అని ఒక కారణం చెప్పారు. అమెరికా ఇతర దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న అణు చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చని చెబుతున్నారు. అమెరికాలో చమురు నిల్వలు తగ్గిపోవటం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచుతాయో లేదో తెలియని పరిస్ధితి కూడా ఇతర కారణాల్లో ఉన్నాయి. కరోనా తగ్గిపోయి క్రమంగా సాధారణ పరిస్ధితి ఏర్పడితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ముడిచమురు పీపా ధర వంద డాలర్ల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికాలో షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌ తగ్గి ధరలు అదుపులో ఉండటం లేదా కొంత మేరకు తగ్గవచ్చని జోశ్యాలు చెప్పిన వారు పునరాలోచనలో పడ్డారు. దీనితో పాటు ఇరాన్‌కు కొత్త అధ్యక్షుడు వస్తే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఆంక్షలు ఎత్తివేస్తే సరఫరా పెరుగుతుందని ఆశించిన వారంతా అలాంటి అవకాశాలు లేవని భావించటంతో ధరలు భగ్గుమన్నాయి.
అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపిఐ) మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్‌ 18వ తేదీతో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7.199 మిలియన్‌ పీపాలకు తగ్గాయి. అంతకు ముందు వారంలో 8.537 మిలియన్‌ పీపాలు ఉన్నాయి. గతేడాది జనవరితో పోల్చితే ఎక్కువే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరితో పోల్చితే తగ్గాయి.ఇది కూడా ధరల పెరుగుదల మీద ప్రభావం చూపింది. ఊహించినదానికంటే ముందుగానే వంద డాలర్లకు పెరుగుతుందా ? వచ్చే నెలలో ఒపెక్‌+దేశాల అదనపు ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చినా ధరలు తగ్గకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.
ద్రవ్యోల్బణం, చమురు గిరాకీ పెరుగుదల, చమురు కంపెనీల వాటాదార్ల వత్తిడి, పర్యావరణం వంటి కారణాలతో రానున్న మూడు సంవత్సరాలలో ధరల పెరుగుదలతో పాటు చమురు సంక్షోభం తలెత్తవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ వాహనాల తయారీ మీద కేంద్రీకరణ, అమెరికా వంటి దేశాలలో పునరుత్పాదక ఇంథనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరగవచ్చన్నది విశ్లేషణల సారాంశం. ఈ పరిణామాలు, పర్యవసానాలకు సిద్దం గాని మనవంటి దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. అది పాలకుల మీద వత్తిడికి దారి తీసి రాజకీయ పర్యవసానాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రానున్న ఆరునెలల్లో ముడి చమురు ధర వంద డాలర్లకు పెరగవచ్చన్నది ఒక అంచనా అయితే రానున్న సంవత్సరాలలో 130 డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పరిణామాలు ఎలా ఉండేది చెప్పలేని స్ధితి. చమురు మార్కెట్‌ను కృత్రిమంగా అదుపు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో పడిపోయిన 35 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చు లేదా తిరిగి 35 డాలర్లకు దిగిరావచ్చన్నది కొందరి తర్కం. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి, అది జరగాలంటే ఆ రంగంలో పెట్టుబడులు కావాలి. కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వలన ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఇది చమురు కొరతకు దారి తీయవచ్చు. పర్యావరణ సమస్యల కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించాలని డచ్‌ కోర్టు షెల్‌ కంపెనీని ఆదేశించింది. మరోవైపున అంతర్జాతీయ ఇంథన సంస్ధ కొత్తగా నిక్షేపాల అన్వేషణలను నిలిపివేయాలని కోరింది.
అమెరికాలో షేల్‌ చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున, తిరిగి పెరిగినా మార్కెట్‌ పడిపోయే అవకాశం లేదని ఒపెక్‌ దేశాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు కేవలం రెండు లక్షల పీపాలు మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పెరగవచ్చు. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఒపెక్‌ దేశాలు గమనంలోకి తీసుకున్నాయి. గతేడాది రికార్డు స్ధాయిలో చమురు ధరలు పడిపోయినందున షేల్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఆ కంపెనీలు లాభాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సంవత్సరం అమెరికా ఉత్పత్తి రోజుకు 11.2 మిలియన్‌ పీపాలు ఉంటుందని, అది గతేడాది కంటే లక్షా 20వేల పీపాలు తక్కువని తాజా జోశ్యాలు ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్‌ టక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌(డబ్ల్యుటిఐ) రకం చమురు ధర పీపాకు 60 డాలర్లకు మించితేనే అక్కడి కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువే ఉంది. మార్కెట్‌ స్ధిరపడింది అనుకున్న తరువాత వచ్చే ఏడాది ఉత్పత్తి పెంచవచ్చని భావిస్తున్నారు. తమ లాభాలు పెరుగుతాయనుకుంటేనే పెట్టుబడిదారులు మరింత ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను బట్టి ఆగస్టులో ముడి చమురు ఉత్పత్తి పెంచాలా వద్దా అని చమురు ఉత్పత్తి దేశాల సంస్ధ (ఒపెక్‌) చర్చలు జరుపుతోంది.వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్‌లో ఉన్న లోటును పూడ్చేందుకు ఉత్పత్తి పెంచాలా అన్న అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత లండన్‌ మార్కెట్‌లో ముడిచమురు బ్రెంట్‌ ధర 75 డాలర్లు దాటింది. మే నుంచి జూలై మధ్య రోజుకు 20లక్షల పీపాల ఉత్పత్తి పెంచాలన్న అంశాన్ని ఒపెక్‌ దేశాలు సమీక్షిస్తున్నాయి, అయితే ఊహించినదాని కంటే ధరలు పెరగటంతో అంతకంటే ఎక్కువే పెంచాలనే వత్తిడి వస్తోంది. గిరాకీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే నిలిపివేసిన ఉత్పత్తిని పునరుద్దరించటం గురించి పరిశీలిస్తామని ఒపెక్‌ దేశాల నేతగా ఉన్న సౌదీ అరేబియా చమురు మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30లక్షల పీపాల కొరత ఉన్నట్లు గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. ఒపెక్‌+దేశాలు రోజుకు 58లక్షల పీపాలు ఉత్పత్తి చేస్తున్నాయి. సౌదీతో రోజువారీ ఫోన్లో మాట్లాడుతున్న రష్యా తక్షణమే ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాల్సిన పరిస్ధితి లేదని భావిస్తోంది.
అమెరికాలో చమురు నిల్వల గురించి వస్తున్న వార్తల కారణంగా ముందస్తు చమురు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో సరఫరా చేయాల్సిన డబ్య్లుటిఐ చమురు ధర పీపాకు 1.2 డాలర్లు పెరిగింది. గత పద మూడు సంవత్సరాలలో రెండు నెలల మధ్య ఒక డాలరుకు మించిన వ్యత్యాసం కేవలం రెండు సార్లు (2008, 2014)మాత్రమే జరిగింది. ఏడాది క్రితం కొనుగోలు చేసిన చమురును ఎక్కడ నిల్వచేసుకోవాలో తెలియక ఒప్పందం ప్రకారం చమురు సరఫరాను స్వీకరించలేని కంపెనీలు ఎగుమతిదార్లకు ఎదురు డాలర్లు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నాయి.ఇప్పుడు చమురుశుద్ది కర్మాగారాలు అమెరికాలో పూర్తి స్దాయిలో పని చేస్తుండటంతో ఆ నిల్వలన్నీ ఖాళీ అవుతున్న కారణంగా చమురు నిల్వ టాంకులు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జూన్‌ తరువాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచనట్లయితే చమురు కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ హెచ్చరించింది.
ప్రపంచ చమురు నిల్వల్లో 2012 అంచనా ప్రకారం ఐదో వంతు (296.5 బిలియన్‌ పీపాలు) నిర్దారిత చమురు కలిగి ఉంది వెనెజులా. మార్కెట్లో ధరలు పెరిగిన కారణంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తిని పెంచనున్నది. గతేడాది చమురు ధరలు భారీగా పతనమైనందున రోజుకు నాలుగు లక్షల పీపాలకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడులక్షలు జరుగుతోందని చమురుశాఖ మంత్రి ఎల్‌ ఇసామీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి పదిహేను లక్షల పీపాలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నందున ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదార్లు ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు. అందువలన ఆంక్షల గురించి జో బైడెన్‌ సర్కార్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తేనే చర్చలు, ఆంక్షల తొలగింపు అని అమెరికా అంటోంది. మన దేశంలోని రిలయన్స్‌ చమురు కంపెనీ కోసం గతంలో సెనెటర్‌గా బైడెన్‌ ఉన్నపుడు సహాయకుడిగా పని చేసిన భారతీయ లాబీయిస్టు అంకిత్‌ దేశారు ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ చమురు శుద్ది కర్మాగారానికి పని కావాలంటే ముడి చమురు కావాలి. వెనెజులా వద్ద చమురు ఉన్నప్పటికీ డీజిల్‌ తయారీకి అవసరమైన శుద్ది కర్మాగారాలు లేవు. వెనెజులా నుంచి చమురు దిగుమతి చేసుకొని డీజిల్‌ను తయారు చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం ఉన్నందున ఏదో ఒక రూపంలో ఆంక్షలను సడలించి రిలయన్స్‌ కంపెనీకి తోడ్పడాలని అంకిత్‌ దేశారు రాయబారాలు జరుపుతున్నారు. అంబానీలతో నరేంద్రమోడీకి విడదీయరాని సంబంధాలు ఉన్నందున ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే తమ కంపెనీ అమెజాన్‌కు మోడీ మొండి చేయి చూపుతున్నందున బైడెన్‌ యంత్రాంగం ఏమేరకు దిగి వస్తుందో తెలియదు. అమెజాన్‌-రిలయన్స్‌ రాజీపడితే…..ఏమో ఏదైనా జరగవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరల పెరుగుదల : బిజెపికి ముందుంది ముసళ్ల పండగ !

21 Monday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP double standards, Fuel Price in India, Fuel tax hike in India, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


నాలుగు నెలల క్రితం లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. దాని ప్రకారం పెరుగుతున్న చమురు ధరల ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51శాతం మంది చెప్పారు. అత్యవసర వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవటం బాధాకరంగా ఉందని 21శాతం మంది అన్నారు. ఆ సర్వే రోజు ఢిల్లీలో పెట్రోలు ధర 90.93, డీజిలు ధర రూ.81.32 ఉంది. జూన్‌ 21న 97.22, 87.97కు పెరిగాయి. అంటే పైన పేర్కొన్న జనాలు ఇంకా పెరుగుతారని వేరే చెప్పనవసరం లేదు. అచ్చేదినాలలో ఉన్నాం కనుక దేశభక్తితో ఇతర ఖర్చులు తగ్గించుకొని దేశం కోసం త్యాగం చేస్తున్నాం. జూన్‌ 21న చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు పీపాధర 73.50కు అటూ ఇటూగా, మన దేశం కొనుగోలు చేసే రకం ధర.72.39 డాలర్లుగా ఉంది. సాధారణంగా బ్రెంట్‌ కంటే ఒక డాలరు తక్కువగా ఉంటుంది.
కొంత మంది పాలకులకు, కొన్ని పార్టీలకు చరిత్ర అంటే మహాచిరాకు. ఎందుకంటే జనాలు వాటి పేజీలను తిరగేస్తే బండారం బయట పడుతుంది. గతంలో ఏమి చెప్పారో ఇప్పుడేమి చెబుతున్నారో జనం చర్చించుకుంటారు. ప్రతిఘటనకు ఆలోచనలే నాంది కనుక, జనాన్ని ఏదో ఒక మత్తులో చేతనా రహితంగా ఉంచాలని చూస్తారు. చమురు ధరల గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమి చెప్పారో, ప్రధానిగా ఉంటూ ఆయనేమి చేస్తున్నారో, సచివులేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం అవసరం.


మరోవైపున చమురు ధరలు పెంచటం వలన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతేడాది జూన్‌30న చెప్పారు. ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ చేసిన ఆందోళనను ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు.కుటుంబంలో సమస్య తలెత్తినపుడు భవిష్యత్‌ అవసరాలను చూసుకొని జనాలు సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చమురు ధరల పెంపును కూడా ఇదే విధంగా చూడాలి. చమురు పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును ఆరోగ్యం, ఉపాధి, ఆర్ధిక భద్రత చేకూరే ఇతర వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పధకం కింద పేదలు, రైతులకు అనేక పధకాల కింది 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించాం. జనాల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. ఆరునెలల పాటు ఉచితంగా రేషన్‌ మరియు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. పేదలకు సంక్షేమ పధకాలను అమలు జరుపుతుంటే సోనియా గాంధీ, కాంగ్రెస్‌ భరించలేకపోతున్నాయి.” అన్నారు. ఏడాది తరువాత కూడా ఇదే పద్దతిలో సమర్ధించుకున్నారు.


సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాం కనుక చమురు ధరలను తగ్గించేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూన్‌ 13న కరాఖండిగా చెప్పేశారు. ధరలు జనానికి సమస్యగా ఉందని తెలిసినప్పటికీ చేసేదేమీ లేదన్నారు. వాక్సిన్ల కోసం 35వేల కోట్లు, ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రధాని మంత్రి గరీబ్‌ కల్యాణయోజన పధకం కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు.వేలాది కోట్ల రూపాయలను కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద బ్యాంకుల్లో జమచేశాము, రైతులకు కనీస మద్దతు ధరలను పెంచాము కనుక ఈ ఏడాది ఇవన్నీ ఉన్నందున చేయగలిగిందేమీ లేదన్నారు.


ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న సాకులు మాత్రమే. ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్రమంగా పెంచటంతో పాటు గతేడాది బడ్జెట్‌ సమయంలోనే చమురు పన్నులు భారీగా పెంచారు. గత మూడు సంవత్సరాలలో చమురు పన్ను ద్వారా వచ్చిన ఆదాయ సంఖ్యలే అందుకు సాక్షి. ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన లోక్‌సభకు మంత్రి ప్రధాన్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వచ్చిన ఆదాయం ఇలా ఉంది.2018-19లో 2.13లక్షల కోట్లు, 2019-20లో 1.78లక్షల కోట్లు, 2020-21లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు (పది నెలలకు) 2.94లక్షల కోట్లు వచ్చింది. కరోనా రెండవ తరంగం వస్తుందని ముందే ఊహించి ఇంత భారీ ఎత్తునపన్నులు విధించినట్లు భావించాలా ? ఇన్ని కబుర్లు చెబుతున్నవారు వాక్సిన్ల భారాన్ని రాష్ట్రాల మీద వేసేందుకు ఎందుకు ప్రయత్నించినట్లు ? 2014-15లో అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్రం పెట్రోలు మీద రు.29,279 కోట్లు, డీజిలు మీద 42,881 కోట్లు వసూలు చేయగా ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది మార్చి 22న లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి వరకు పెట్రోలు మీద రు.89,575 కోట్లు, డీజిలు మీద రు.2,04,906 కోట్లు ఎక్సయిజ్‌ పన్ను వసూలైంది. ఇంత పెంపుదల రైతులు, కరోనా కోసమే చేశారా ? కరోనా నిరోధ పరికరాలు, ఔషధాల మీద జిఎస్‌టి తగ్గించటానికి ససేమిరా అని వత్తిడి తట్టుకోలేక నామ మాత్ర రాయితీ ఇచ్చిన పెద్దలు చెబుతున్నమాటలివి. బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఏమి చెప్పారు ? ఏమి చేశారు ?


కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి చమురు ధరల పెరుగుదల గొప్ప తార్కాణం అని 2012 మే 23న ఒక ట్వీట్‌ ద్వారా నరేంద్రమోడీ విమర్శించారు.బహుశా అప్పటికి ప్రధాని పదవి ఆలోచన లేదా లేక ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకొనే ఎత్తుగడలో భాగంగా చెప్పారా ? ధరల పెంపుదల వలన గుజరాత్‌ పౌరుల మీద వందల కోట్ల భారం పడుతుందని కూడా నాడు ముఖ్యమంత్రిగా మోడీ చెప్పి ఉంటారు. 2012లో రైలు ఛార్జీల పెంపు పేదలు, రైతులకు వ్యతిరేకం అని నిరసన తెలుపుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్రానికి లేఖ రాశారు.అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేశాడన్నట్లుగా 2014లో అధికారానికి వచ్చిన తొలి నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ తన వాగ్దానాల్లో ఒకటైన ధరల పెరుగుదల అరికట్టటం, అచ్చేదిన్‌ అమల్లో భాగంగా రైలు ప్రయాణీకుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా 6.5శాతం పెంచారు. దివంగత సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మాటలను పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్కృతి ఇరానీ తీరుతెన్నులు తెలిసిందే. బిజెపి కనుక కేరళలో అధికారానికి వస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ అరవై రూపాయలకే అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనమ్‌ రాజశేఖరన్‌ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. వాటిని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఆధరకు ఇవ్వవచ్చని చెప్పారు. చమురును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు ఎల్‌డిఎఫ్‌ అంగీకరించటం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ గారు రోజువారీ ధరల పెంపుదల వినియోగదారులకే మంచిదని, తమ ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధించదని చెప్పారు.
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చివరికి అదే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ను బిజెపి పెద్దలు, పిన్నలు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్రం విధించే ఎక్సయిజ్‌ పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకే పోతుందని, అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలని నిరంతరం చెబుతుంటారు. అదే వాస్తవం అయితే బిజెపి పాలిత రాష్ట్రాలు ముందుగా ఆ పని చేసి ఆదర్శంగా నిలిచి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల మీద ఎందుకు వత్తిడి తేవటం లేదు ? ఒక్కటంటే ఒక్క రాష్ట్రమైనా ఆపని ఎందుకు చేయలేదు?


యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో ఎలా ఉందో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం××× ధర డాలర్లలో
2010-11××× 85.09
2011-12××× 111.89
2012-13××× 107.97
2013-14××× 105.52
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.57
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.57
2020-21××× 44.82


2021-22 సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో 66.61, మే నెలలో 72.08 డాలర్లు ఉంది. ఈ సంవత్సరాలలో ధరలు తగ్గితే వినియోగదారులకు ధరలు తగ్గాలి, పెరిగితే పెరగాలి అని చెప్పారు. అదే తర్కాన్ని వర్తింప చేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గాలి. జరిగిందేమిటి ? ఎలా పెరిగిందో ముందే చూశాము. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారుల జేబులు గుల్ల అయ్యాయి. చమురు ధర 72 డాలర్లు ఉంటేనే మోడీ ఏలుబడిలో పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది. అదే పూర్వపు స్ధాయికి చేరితే…… మోత మోగుతుందని వేరే చెప్పాలా ?


సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో బిజెపి చేస్తున్న ప్రచారం పని చేస్తున్న కారణంగానే అనేక మంది పన్ను తగ్గించాల్సింది రాష్ట్రాలే అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పెట్రోలు మీద యూపిఏ హయాంలో లీటరుకు విధించిన రూ.9.48 నుంచి 32.98కి డీజిలు మీద రు.3.56 నుంచి 31.80కి పెంచాలని ఏ రాష్ట్రం కోరిందో చెప్పాలని బిజెపి పెద్దలను నిలదీయండి, సమాధానం ఉండదు. ఈ మొత్తాలలో రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, డ్యూటీలే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఈ మొత్తాల నుంచి 41శాతం లెక్కవేసి దానికి, రాష్ట్రాలు విధించే వాట్‌ను కలిపి చూడండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే ఎక్కువ కదా, కనుక రాష్ట్రాలే తగ్గించాలని బిజెపి పెద్దలు వాదిస్తారు. అందుకే మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా ఆ పని ముందు అక్కడ ఎందుకు చేయలేదు అంటే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం చమురు మీద లీటరు పెట్రోల మీద రెండున్నర, డీజిలు మీద నాలుగు రూపాయల సెస్‌ విధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వినియోగదారులకు పెంచలేదు. మరి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు ? పైన చెప్పుకున్న ఎక్సయిజు పన్ను నుంచి ఈ మొత్తాన్ని సెస్‌ ఖాతాకు మార్చారు. ఈ మొత్తాలనుంచి రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అలాగే లీటరుకు వసూలు చేస్తున్న రు.18 రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్‌. వీటి నుంచే చమురు, గ్యాస్‌ పైప్‌లైన్లు, జాతీయ రహదారులు, రాష్ట్రాలకు రహదారులకు నిధులు ఇస్తున్నారు. మరోవైపు వినియోగదారుల చార్జీల పేరుతో వాటిని వినియోగించుకున్నందుకు జనాల నుంచి వసూలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే మన డబ్బులతో మనమే రోడ్లు వేసుకొని వాటికి టోల్‌టాక్సు మనమే కడుతున్నాం. ఇవన్నీ పోను మిగిలిన మొత్తాల నుంచే రాష్ట్రాలకు 41శాతం వాటా ఇస్తారు. అసలు మోసం ఇక్కడే ఉంది.

కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఏడాదికి ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు ఇస్తున్నట్లు ఎన్నికల కోసం ఒక పధకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపున ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోలు,డీజిలు మీద వ్యవసాయ సెస్‌ పేరుతో ప్రతిపాదించిన మొత్తాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 49వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. జనమంతా చమురు కొంటారా అని వాదించే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాహనాలు నడిపేవారందరూ వ్యవసాయం చేయరు కదా ? వారి కోసం అందరిదగ్గర నుంచి ఎందుకు వసూలు చేయాలి ? కరోనా కారణంగా చమురు వాడకం తగ్గింది గానీ, ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరగటం వెనుక మతలబు పెంచిన పన్నులే. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే రాష్ట్రాల ఖాతాలో వేయటం కరోనా విషయంలో చూశాము. కరోనా మీద విజయం సాధించామని చెప్పుకొన్నపుడు నరేంద్రమోడీ అండ్‌కోకు రాష్ట్రాలు గుర్తుకు రాలేదు, తీరా రెండవ తరంగంలో పరిస్ధితి చేజారటంతో ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాల బాధ్యత అంటూ ప్రచారానికి దిగారు.


2014 మే నెలలో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు ధర రు.71.41. దీనిలో చమురు ధర 63శాతం, కేంద్ర పన్నులు 16శాతం, రాష్ట్ర పన్ను 18శాతం, డీలరు కమిషన్‌ మూడు శాతం ఉంది. అదే 2021 ఫిబ్రవరిలో లీటరు ధర రూ.86.30. దీనిలో కేంద్ర పన్ను 37శాతం, చమురు ధర 36శాతం రాష్ట్ర పన్ను 23శాతం, డీలరు కమిషన్‌ నాలుగుశాతం ఉంది. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నందున ఈ శాతాల్లో మార్పులు ఉంటాయి. దీన్ని రూపాయల్లో చెప్పుకుంటే రు.86.30లో కేంద్రానికి రు.32.98, చమురు కంపెనీలకు రు.29.71, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.19.92, డీలరు కమిషన్‌ రు.3.69 వస్తాయి.


పేదలందరూ పెట్రోలు కొంటారా ? వాహనాలు లేని వారు కూడ కొని తాగుతారా అంటూ వితండవాదనలు చేసే వారిని చూస్తాము. అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ముందుకు తెచ్చిన ప్రచార అస్త్రాలు. ప్రతి వస్తువు ధర పెరుగుదల, పన్నుల పెంపు మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఆ సూచికలను నిర్ణయించేందుకు అన్ని రకాల వినియోగ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రతి నెలా సూచిక తగ్గిందా లేదా అని నిర్ధారిస్తారు. ఉద్యోగులకు, కార్మికులకు, ఇతర వేతన జీవులకు ఆ ప్రాతిపదికనే కరువు భత్యాన్ని నిర్ణయిస్తారు.ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. డీజిలు ధరలు పెరిగితే ప్రజారవాణాకు వినియోగించే బస్సుల నిర్వహణ, సరకు రవాణా లారీ, వ్యవసాయదారుల ట్రాక్టర్లు, పంపుసెట్ల ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల్లో జనరేటర్లను వాడితే అక్కడ తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా యావత్‌ జనజీవనం మీద చమురు ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.


రానున్న కొద్ది వారాల్లో పీపా చమురు 80డాలర్లకు చేరవచ్చని జోశ్యం చెబుతున్నారు. గత రెండు నెలల్లో మార్కెట్‌ తీరుతెన్నులను చూసినపుడు ముందుగానే పెరిగినా ఆశ్చర్యం లేదు. వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆర్ధిక కార్యకలాపాల పెరుగుదల దానికి ఒక కారణంగా చెబుతున్నారు. జోశ్యాలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే 70-80 డాలర్ల మధ్య చమురు ధరలు ఉన్నప్పటికీ మన వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగానే ఉంటుంది. ఇదే జరిగితే వినియోగదారులకు, ముందే చెప్పుకున్నట్లు యావత్‌ జనానికి ధరల సెగ, అది పాలకులకు రాజకీయ సెగగా తగలటం అనివార్యం. యుపిఏ చివరి మూడు సంవత్సరాలలో జరిగింది అదే. అదే నరేంద్రమోడీ సర్కార్‌కూ పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భవిష్యత్‌ కోసమే మోడీ చమురు బాదుడా – తల్లికి కూడు పెట్టని వారు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తారా !

12 Saturday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP’s trolling army, India oil bonds, India oil Tax, Narendra Modi Failures, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


మన జనాల సహనానికి (బి పాజిటివ్‌ వైఖరి) ముందుగా శతకోటి నమస్కారాలు చెప్పక తప్పదు. భరతమాత ఆమెను పక్కకు నెట్టేసి పెత్తనం చేస్తున్న గోమాత మహత్తులో, నరేంద్రమోడీ గమ్మత్తులో గానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధిరంగా ఉన్న చమురు ధరలు అదేమిటో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచీ పెరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాల్లో చమురు ధరల పెంపు ఉద్యమాలకు దారితీసి పాలకులను గడగడలాడించింది, వెనక్కు తగ్గేట్లు చేసింది. మన జనం సహనంతో ఇంతగా సహకరిస్తున్నా ఖాతరు చేయటం లేదు. జనాన్ని వెర్రివెంగళప్పలుగా భావిస్తున్నారు కొందరు, అయినా భరిస్తున్నాం, మన మీద మనకే జాలి వేస్తోంది కదా ! సామాజిక మాధ్యమాల్లో కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఊరూ పేరూ లేకుండా కొన్ని పోస్టులు తిప్పుతున్నారు. భవిష్యత్‌ కోసమే నరేంద్రమోడీ చమురు బాదుడు కొనసాగిస్తున్నారంటూ రంగుల కలను చూపుతూ జనాన్ని తప్పుదారి పట్టించే పోస్టు ఒకటి తిరుగుతోంది. దాని మంచి చెడ్డలను, ముఖ్య అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించుదాం.


” మీ చుట్టూ జరుగుతున్న మార్పులను మీరు నిశితంగా గమనిస్తే, ఇది అందరి వల్ల కాదు. మోడీ ప్రభుత్వం మీ కోసం మరియు మీ సౌలభ్యం కోసం ఏమి మన భవిష్యత్‌ తరాల కోసం ఏమి చేస్తుందో మీకు అర్థం అవుతుంది.”
ఏ పాలకులైనా వర్తమాన, భవిష్యత్‌ తరాలకోసమే తప్ప గతించిన వారికోసం చేయరు. వర్తమానం వాస్తవం, భవిష్యత్‌ ఆశ. అందువలన ఇప్పుడు ఏమి చేస్తున్నారనేది కీలకం. జనాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మోడీ ఇంకా కొనసాగుతున్నారు గనుక ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది, ఏమి చేస్తున్నదీ చెప్పకుండా పిట్టల దొర లేదా తుపాకీ రాముడి కబుర్ల వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు తల్లికి కూడు పెట్టని వాడు రేపు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తానంటే నమ్మగలమా ? పది రూపాయల నుంచి 33 రూపాయలకు పెంచిన చమురు ఎక్సయిజు పన్ను నిర్వాకం గురించి చెప్పతరమా ? దేశమంతటికీ ఉచితంగా వాక్సిన్లు వేయించేందుకు సిద్దపడని పెద్దలు పెద్దలు మహమ్మారి నివారణ, నిరోధానికి ఉపయోగపడే పరికరాలు, వాక్సిన్లపై జిఎస్‌టి ఎత్తివేసేందుకు గీచిగీచి బేరాలాడుతున్నారు. అలాంటి వారు డబ్బుదా(దో)చి రాబోయే వారికి ఖర్చు చేస్తారంటే నమ్మాలట !

గతంలో బిజెపి పెద్దలు చేసిన హడావుడి గురించి మరిచిపోతే ఎలా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలపై మన చుట్టూ చాలా మంది హడావిడి చేస్తారు ఎందుకంటే వారికి భారత్‌ భవిష్యత్‌ ఎలా. వున్నా ఈ పుట గడిస్తే చాలు సరే ఆ విషయాలు పక్కన పెడితే…”
ఇదొక తప్పుడు ప్రచారం ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో స్మృతి ఇరానీ సిలిండర్లు వేసుకొని చేసిన ప్రదర్శనలు, బిజెపి నేతలు చేసిన ఆర్భాటాలూ జనానికి తెలుసు. కాస్త ఓపిక తెచ్చుకొని గూగులమ్మను కోరుకుంటే వాటన్నింటినీ భక్తా ఇంద అంటూ వారి నాటకాల చిత్రాలు, వార్తలను మన ముందు ప్రత్యక్షం చేస్తుంది. మోడీ అనుచరుల బండారాన్ని బయటపెడుతుంది. గతంలో ఆందోళన చేసినపుడు ఈ పెద్దలకు భారత భవిష్యత్‌ గురించి తెలియదా లేక శ్రద్దలేదా ? పోనీ ఎందుకు ఆందోళన చేశారో అయినా చెప్పాలి. చిత్తశుది,్ద నిజాయితీ లేని రాతలు, ఆరోపణలు.

మోడీ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న రోజుల నుంచే శుభ్రమైన చమురు !

” ప్రస్తుతం ప్రపంచంలోనే పరిశుభ్రమైన యూరో 6 గ్రేడ్‌ పెట్రోల్‌ ఈ రోజు భారతదేశంలో దొరుకుతోంది.”
ఇది ఎలా ఉందంటే అరే పాతికేండ్ల క్రితం నువ్వు పుట్టినపుడు చాలా చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఎత్తు, బరువు పెరిగావో గ్రేట్‌ కదా అన్నట్లుంది. పుట్టినోళ్లు ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటారు ! పెట్రోలు, డీజిలు వాడకం పెరుగుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నందున ప్రతి దేశం, ప్రతి ఖండం దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇదేదో నరేంద్రమోడీతోనే దేశంలో ప్రారంభమైందన్నట్లుగా నమ్మబలుకుతున్నారు. ఆ పెద్దమనిషి నిక్కర్లు వేసుకొని(ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా) తిరుగుతున్న రోజుల్లోనే అంటే 1990దశకంలోనే ఇంధన శుద్ధి కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. 1994లో ఢిల్లీ, ముంబై, కొల్‌కతా, చెన్నరు నగరాల్లో తక్కువ సీసం ఉండే పెట్రోలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సీసం, గంధకం వంటి వాటిని తగ్గించటానికి, తొలగించటానికి మన చమురు శుద్ది కర్మాగారాల్లో మార్పులు చేసుకోవాలి, దానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ఇప్పటికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలు 95వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అన్నింటికీ మించి అలాంటి చమురును వాడే విధంగా వాహనతయారీదారులు కూడా ఇంజన్లలో మార్పులు చేయాలి.ఇవన్నీ మంత్రదండాలతో జరిగేవి కాదు.యూరో-3కు సమానమైన భారత్‌-3 రకం చమురు 2010 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఆరో గ్రేడ్‌కు వచ్చాము. ఇది మనవంటి అన్ని దేశాల్లోనూ ఉంది. ఇది నరేంద్రమోడీ గొప్ప అని చెబితే జనాలకు దేనితో నవ్వాలో అర్ధం కావటం లేదు. ఏ గ్రేడ్‌ అయినా దాని ఉత్పత్తి ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసేదే తప్ప రాయితీలేమీ లేవు కదా. దాన్ని బట్టే ఉత్పాదక ఖర్చు నిర్ణయిస్తున్నారు. పోనీ చమురు సంస్దలకు ప్రభుత్వం 95వేల కోట్లు ఇస్తే అది మోడీగారి ఘనత అని చెప్పుకుంటే అర్ధం ఉంది. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జనం సొమ్ముతో మోడీకి ప్రచారం అంటే ఇదే.

ముందేం మాట్లాడుతున్నారో తరువాతే చెబుతున్నారో స్పృహ ఉందా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌పై మొత్తం పన్నులో 71% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది, కేంద్రానికి 29% మాత్రమే లభిస్తుంది.”
తిమ్మిని బమ్మిని చేయటంలో కాషాయ దళాలకు మించిన మాయగాండ్లు మరొకరు లేరు. సముద్రాలున్నయన్న దగ్గర ఎడారి ఉంటుంది. ఏడు సంవత్సరాల మోడీ ఏలుబడిలో పెట్రోలు మీద లీటరుకు రు.10.38 నుంచి రు. 32.98( రెండు వందల శాతం)డీజిలు మీద రు.4.58 నుంచి రు.31.83 (600శాతం) పెంచింది. రాష్ట్రాలు పెంచిన మొత్తం ఈకాలంలోనే 60, 68శాతాలకు అటూ ఇటూగా ఉన్నాయి తప్ప ఎక్కడా వందల రెట్లు పెరగలేదు. కేంద్రం పెంచిన దానిలో ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 41శాతం తిరిగి రాష్ట్రాలకు బదలాయిస్తారు, అందువలన మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటాయే ఎక్కువ అని వాదిస్తారు. ఇక్కడే అసలు మోసం ఉంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి ఏలుబడిలోనే ఉన్నాయి కదా ? ఎన్ని రాష్ట్రాలు, ఎంత మొత్తం పన్నుతగ్గించాయో ఎవరినైనా చెప్పమనండి. కేంద్రం ఎక్సయిజ్‌ పేరుతో విధించే పన్నులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్సయిజ్‌, రెండవది సెస్‌. మొదటిదానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది. సర్‌ఛార్జీలు, సెస్‌లో ఉండదు.
ఇలాంటి జిమ్మిక్కుల కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి , రోడ్లను ఉపయోగించినందుకు టోలు పన్ను వసూలుకూ నాంది పలికారు. మన దగ్గర నుంచి వసూలు రోడ్లు వేసి మన చేతనే పన్ను కట్టిస్తున్నారు. ఎంత మోసం ?
ప్రస్తుతం ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది.

” మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సరఫరాను వేగవంతం చేయటానికి మొబైల్‌ రీఫిల్లింగ్‌ యూనిట్‌ నడుస్తోంది. ”
వీటితో జనానికి ఒరిగేదేమిటి ? జొమాటో, స్వీగ్గీ వంటి కంపెనీల ద్వారా తెప్పించుకొనే ఆహారానికి ఎక్కువ వెల చెల్లించాలి. అలాగే వీటికీ అదనంగా సేవా రుసుము చెల్లించాలి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో గతంలో కిరోసిన్‌ డీలర్లు చిన్న పీపాల్లో తెచ్చి వినియోగదార్లకు అందించేవారు. ఇది అలాంటిది కాదు, కనీసం రెండు వందల లీటర్లు, అంతకు మించి ఆర్డరు పెట్టిన వారికే అందచేస్తారు, అందుకు ఛార్జీ వసూలు చేస్తారు. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమా ?

” ఇవే కాకుండా, కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పదవీకాలంలో తీసుకున్న 2026 నాటికి చెల్లించవలసి ఉన్న 2.48 లక్షల కోట్ల ఆయిల్‌ బాండ్‌ రుణం కూడా మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ”

ఇది హిమాలయమంత పచ్చి అబద్దం, జనాన్ని మోసపుచ్చే వ్యవహారం. ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. 2010వరకు అంతకు ముందున్న వాజ్‌పారుతో సహా ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయి. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది వక్రీకరణ. వినియోగదారుల మీద వడ్డించే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరో విధంగా చెప్పాలంటే గతంలో వినియోగదారులు పొందిన సబ్సిడీ మొత్తాలను ఇప్పుడు వారి నుంచి మోడీ సర్కార్‌ తిరిగి వసూలు చేస్తోంది. లేదూ మంత్రి చెప్పిందే నిజమైతే, అప్పు తీరింది కదా పన్ను ఎందుకు తగ్గించటం లేదు ? అసత్యాలను చెప్పటంలో కాషాయ దళం ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ?పన్నులు పెంచకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని ఒకసారి అంటారు, సరిహద్దు రక్షణకు పన్నులేయకపోతే ఎలా అని మరోసారి సెంటిమెంట్‌ రెచ్చగొడతారు. ఇవన్నీ మోడీ పాలనలోనే కొత్తగా వచ్చిన సమస్యలా ?


” పెట్రోల్‌ లో 2025 నాటికి 20% దేశీయ ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 5 లేదా 10 సంవత్సరాల్లో, హైబ్రిడ్‌ వాహనాలు అందుబాటులో రానున్నాయి, ఇవి 100% పెట్రోల్‌, డీజిల్‌, ఇథనాల్‌, సిఎన్జి మరియు బ్యాటరీపై నడుస్తాయి.


సాధారణ పెట్రోల్‌ బుంకుల వద్ద ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా విద్యుత్‌ రహదారిని నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాలలో, రోడ్‌ రైల్‌ ట్రక్కులు కూడా భారతదేశ రహదారులపై పరుగులెత్తనున్నాయి. ఎల్‌పిజి గ్యాస్‌ను దేశవ్యాప్తంగా ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా అందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. డీజిల్‌ ట్రాక్టర్‌ను సిఎన్‌జి ట్రాక్టర్‌గా మార్చడానికి కిట్‌ వచ్చింది. దీంతో డీజిల్‌ కోసం ఖర్చు చేసే రైతులకు వేల రూపాయల ఆదా అవుతుంది. హైడ్రోజన్‌ ఇంధన బ్యాటరీలు మరియు అల్యూమినియం ఎయిర్‌ బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై భారతదేశంలో వేగంగా పరిశోధన మరియు అభివ ద్ధి జరుగుతోంది. ఇది కొత్త భారత్‌ యొక్క భవిష్యత్తు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆగమనంతో, మనము క్రమంగా పెట్రోల్‌ మరియు డీజిల్‌పై ఆధారపడవలసిన అవసరం వుండదు. రాబోయే పదేళ్లలో ఇవన్నీ జరగబోతున్నాయి.ఇవన్నీ మన సౌలభ్యం కోసం భవిష్యత్‌ కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇందనాల పై వస్తున్న కేంద్ర 29% పన్నుల ద్వారా మౌలిక సదుపాయాల అభివ ద్ధి, సైనిక దళాల ఆధునీకరణ సశక్తికరణ సాధికారత మొదలైన వాటిపై ఖర్చు జరుగుతున్నాయి. ”

ఇవన్నీ చేస్తున్నాం, చేయబోతున్నాం కనుక జనం మీద ఎంత పన్ను భారం మోపినా నోరు మూసుకొని చెల్లించాలి అని చెప్పటమే. రాజీవ్‌ గాంధీ దేశాన్ని కొత్తశతాబ్దంలోకి తీసుకు పోబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్‌ 2020 అన్నారు. కేబుల్‌ టీవీ రాక ముందు విదేశాల్లో చూసివచ్చి సెటప్‌బాక్సుల గురించి వాటి ద్వారా కొన్ని వందల ఛానళ్లు రావటం గురించి కథకథలుగా చెప్పారు. అందువలన నవీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరున్నా లేకపోయినా ఆగేది కాదు. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు. అవన్నీ ఎక్కడా కానరావటం లేదు గనుక ఇప్పుడు కొత్త కహానీలు వినిపిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదివేల కోట్ల కోసం కక్కుర్తి – స్వయంగా పరువు తీసుకున్న ప్రధాని మోడీ !

09 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, BJP, Modi’s Vaccine U-Turn, Narendra Modi Failures, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

కరోనా బాధితుల పట్ల రాష్ట్రాలకు బాధ్యత లేదా, అసలు వైద్యం, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కదా, అన్నీ కేంద్రమే చేయాలంటే సాధ్యమేనా అంటూ జనం చెవుల తుప్పు వదిలేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి పెద్దలు తమ టూల్‌కిట్‌లోంచి ఒక ప్రచార ఆయుధాన్ని ప్రయోగించారు. జనానికి రాజ్యాంగం గురించి బోధ చేయటంతో పాటు ప్రతిపక్షాల మీద దాడికి కత్తులు, కటార్లు, మొరటు బాంబులు, విషపూరిత ఆయుధాలను సిద్దం చేసుకున్న భక్తులందరినీ విశ్వగురువు, దేవుడు లేదా దేవదూత నరేంద్రమోడీ దారుణంగా దెబ్బతీశారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వాక్సిన్‌ వేయించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని నాటకీయ పద్దతుల్లో స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయుధాలన్నింటినీ ఎక్కడికక్కడ పడవేసి పాలాభిషేకాలు, పాదాభిషేకాలు చేయటంతో పాటు భజన ప్రారంభించారు. భక్తుల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో ఇవి లేదా వీటికి అనుబంధ అంశాలు మాత్రమే ఉంటాయి. పరిమిత ప్రయోజనం కోసమే వారిని తయారు చేస్తారు. ఇది విశ్వజనీన సత్యం.

గతంలో ప్రకటించిన వాక్సిన్‌, ధరల విధానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అయితే నరేంద్రమోడీ ప్రకటించిన తాజా విధానానికి ముందు అలాంటి సమావేశం జరిగినట్లుగానీ, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగానీ ఎలాంటి సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం విధానపరమైన నిర్ణయాలు ఫెడరల్‌ వ్యవస్ధలో మంత్రివర్గం తీసుకోవాలి. అధ్యక్ష తరహా వ్యవస్ధలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని తరువాత మంత్రివర్గఆమోదానికి పెడతారు. ఇక్కడ నరేంద్రమోడీ గారు చేసిందేమిటి ? పెద్ద నోట్ల రద్దు అంటే రహస్యం కనుక ఆకస్మికంగా చేశారని అనుకుందాం. వాక్సిన్‌ విధానం అలాంటిది కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చీమకుట్టలేదు. సుప్రీం కోర్టు స్వయంగా పూనుకున్న తరువాత కూడా స్పర్శలేనట్లుగానే వ్యవహరించారు. తీరా గట్టిగా నిలదీసి కేటాయించిన 35వేల కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ గడువు పెట్టటంతో మరోదారి లేకపోయింది. మోడీ స్వయంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణయాన్ని ప్రకటించేశారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చివేశారు. తొలుత ప్రకటించిన దానికీ దానికీ మంత్రి వర్గ ఆమోదం లేదు, దీనికీ అవసరం ఏముంది అంటారా ?

తామేం చేసినా ప్రశ్నించేవారు లేరు, ఉండకూడదు, ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన అవసరం లేదు అనే యావలో పడిన బిజెపి పెద్దలకు ఈ మధ్య వాస్తవ పరిస్ధితులు అర్ధం కావటం లేదు. కరోనా రెండవ దశ నిర్లక్ష్యంతో తలెత్తిన పరిస్ధితి మీద వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఉంటే వాక్సిన్‌ విధానంలో ఇంత షాక్‌ తగిలి ఉండేది కాదు. నిజానికిది కరోనా కంటే పెద్ద దెబ్బ. సుప్రీం కోర్టు వాక్సిన్‌ విధానం గురించి ఇలా నిలదీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో చేసిన నిర్ణయాలకే విధానం అనే ముద్రవేసి కోర్టుకు సమర్పించి ఉంటే రాజ్యాంగబద్దమా కాదా అన్నది చూస్తాం తప్ప విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు చెప్పి ఉండేవారేమో ! కానీ ఇది ఎవరో వేసిన కేసు కాదు, స్వయంగా చేపట్టిన అంశం. యాభై ఆరు అంగుళాల గుండె పిరికిబారినట్లుంది. లేకపోతే కోట్లాది భక్తులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పరువు తీస్తూ ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు అన్న అనుమానాలు కలగటం సహజం కాదంటారా ?

మరి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా ? స్వాగతించాల్సిందే. కేంద్రమే వాక్సిన్‌ బాధ్యత చేపట్టాలని, మూడు ధరల విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేసిన వారు తప్పకుండా ఆ పని చేస్తారు, చేశారు.అయితే స్వాగతించటానికి – భజన చేయటానికి తేడా ఉంది. బిజెపి ముఖ్యమంత్రులకు భజన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా చేస్తే జనం దృష్టిలో మరింత పలుచన అవుతారు. నలభైఅయిదు సంవత్సరాల లోపు వారికి వాక్సిన్‌ గురించిన నిర్ణయం రాష్ట్రాలకే వదలి వేయాలని డిమాండ్‌ చేశారని చెబుతున్న బిజెపి ముఖ్యమంత్రులు, ఆ వాదనలతో కొండెక్కి కూర్చున్నవారు ఏ నోటితో స్వాగతిస్తారు, ఏ ముఖాలతో దిగివస్తారు ? కేంద్ర వాక్సిన్‌ విధానం గురించి విమర్శలు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ నాలుగుసార్లు ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వారం రోజుల క్రితం ఏం మాట్లాడారు ? ” ఎంతో చక్కటి, పక్కాగా ఉన్న కేంద్ర వాక్సిన్‌ విధానాన్ని రాష్ట్రాల వత్తిడి మేరకే కేంద్రం మార్చింది. ముఖ్యమంత్రులందరూ ఒక దగ్గరకు వచ్చి కేంద్రీకృత విధానం కావాలని ప్రధానిని కోరితే ఆయన కూడా పరిశీలిస్తారు.రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నపుడు కేంద్రం కూడా ఒకే రకమైన విధానాన్ని తీసుకురాలేదు, అందుకే రాష్ట్రాలకు వదిలిపెట్టింది ” అన్నారు. మా వాక్సిన్‌ మేం కొనుక్కుంటాం అని బిజెపి ముఖ్యమంత్రులు చెప్పారు. కాదు కేంద్రమే మొత్తంగా ఇవ్వాలి లేదా సేకరించి ఒకే ధరకు రాష్ట్రాలకు ఇవ్వాలి తప్ప ద్వంద్వ ధరలేమిటని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చెప్పారు. ఎద్దు-దున్నతో అరక కడితే ఏమౌతుంది. ఎండ ముదిరే కొద్దీ ఎద్దు నీడవైపు లాగుతుంది-దున్న ఎండవైపు మొగ్గుతుంది. అలాగే భిన్న వైఖరుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అప్పుడు కేంద్రం ఏమి చేయాలి, ధర చెల్లించగలిగిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, మాకంత శక్తిలేదు అని అన్నవారికి మేమే ఇస్తామని చెప్పాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర ప్రభుత్వ పధకం దాన్ని అమలు జరపాలా లేదా అన్నది రాష్ట్రాలకే వదలి వేసినట్లు వాక్సిన్‌ విషయంలో ఎందుకు చేయలేకపోయింది. దురుద్ధేశ్యాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని రాష్ట్రాల పేరుతో ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఆ పక్కా పధకం ఏమైంది ? రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రధాని ఏకపక్షంగా ఎలా ప్రకటించారు. మేమే కొనుక్కుంటాం అన్న రాష్ట్రాల మనోభావాలను గాయపరచి, ముఖ్యమంత్రులను అవమానించినట్లు కాదా ?

ఐదూండ్లు కాదు కదా సూదిమొన మోపినంత కూడా ఇచ్చేది లేదన్న రారాజు మాదిరి గత కొన్ని వారాలుగా భీష్మించిన విశ్వగురువు ఆకస్మికంగా అందరికీ మేమే వేయిస్తాం అని ఎందుకు చెప్పారు? ఇది వైఫల్యాన్ని అంగీకరించటమే, పోనీ ఆ చెప్పిందైనా సక్రమంగా ఉందా ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా లేదూ ! పోయిన పరువును తిరిగి తెచ్చుకొనే యత్నమన్నది ఏకాభిప్రాయం. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? రారాజు దిగి వచ్చారు సరే, మంచిదే , మళ్లా 25శాతం ప్రయివేటు ఆసుపత్రులద్వారా వేయించుకోవచ్చనే పితలాటకం ఏమిటి ? ఫార్మా, కార్పొరేట్‌ మాఫియాకు లాభాలు చేకూర్చే ఎత్తుగడ అనే విమర్శలను ఎందుకు భరిస్తున్నారు. వారిచ్చే నిధుల ముందు విమర్శలు ఒక లెక్కా ?

ఉచితంగా ఇస్తామనే ప్రకటన హుందాగా చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు, ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ప్రధాని స్వయంగా రాష్ట్రాల మీద నెపం మోపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేవీ వాక్సిన్‌ సేకరణ తమకు వదిలేయాలని అడగలేదు. చివరకు బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్‌ నుంచి కూడా అలాంటి డిమాండ్‌ లేదు. సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఊపిరి సలుపుకోలేక తప్ప చిత్తశుద్ది లేదు.గతంలో వాక్సిన్‌ వేసి నందుకు వంద రూపాయల సేవా రుసుం ప్రయివేటు ఆసుపత్రులు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దాన్ని 150కి పెంచారు. ఇంతలోనే ఇంత పెంపుదల ఎందుకు ? అదనపు ఖర్చులు ఆసుపత్రులకు ఏమి వచ్చాయి ?

నరేంద్రమోడీ దిగిరావటం వాక్సిన్‌కంటే ముందే ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ కుంభమేళాను మధ్యలో ఆపివేయాలనటం అదే కదా ? అంతకు ముందు అనేక మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది మందిని సామూహిక స్నానాలకు అనుమతించటం ప్రమాదకరం అని హెచ్చరిస్తే పెడచెవిన పెట్టారు. మొరటుగా ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జనాన్ని మునగమని చెప్పారు. తీరా కొందరు అఖారాలు మరణించటం, కరోనా సోకటం, మీడియాలో వార్తలు రావటంతో విధిలేక ప్రధాని మోడీ జోక్యం చేసుకొని నిలిపివేయించారు.

కరోనా మొదటి తరంగం సమయంలో జనానికి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టారు, రెండోసారి వాటి ఊసే లేదు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలివేసి పర్యవసానాలకు బాధ్యత తమదేమీ లేదన్నట్లు వ్యవహించారు. అందుకే రెండో సారి దీపాలు వెలిగించటం, గ్లాసులు,కంచాలు మోగించటం వంటి పిలుపులకు దూరంగా ఉన్నారు. కానీ వాక్సిన్‌ భారాన్ని రాష్ట్రాల మీద మోపాలన్న ఎత్తుగడ పారకపోగా వికటించింది.మోడీ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని అతిశయోక్తులు పలికి మునగ చెట్టు ఎక్కించిన వారికి కరోనా రెండవ దశ తీవ్రతను గుర్తించటంలో వైఫల్యాన్ని చూసి దిమ్మతిరిగినోట మాట రావటం లేదు.

ఆత్మనిర్భర పాకేజ్‌ కింద మేడిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తయారు చేసి దేశ ప్రజలకు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇది వాస్తవమా ? కోవాగ్జిన్‌ ఒక్కటే మన దేశంలో తయారు చేసిందని జనానికందరికీ తెలిసిందే. అనేక మంది అది స్వదేశీ అని మరొక వ్యాక్సిన్‌ వేసుకోము అని ఆలస్యం చేసిన వారు కూడా ఉన్నారు. కోవీషీల్డ్‌ విదేశీ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారీ, కంపెనీ అనుమతితో ఇక్కడ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అయినా రెండు వాక్సిన్లు ఇక్కడే రూపొందించినట్లు చెప్పటం భావ్యమేనా ? జనాన్ని మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ?

వాక్సిన్ల విముఖతను విడనాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కాషాయ దళాలు చెబుతున్నదేమిటి ? ఆవు పేడ పూసుకొని మూత్రం తాగితే కరోనా అంటదనే వీడియోలను ప్రపంచమంతా చూసింది. తాజాగా బిజెపి ఎంపీ, అలనాటి హీరోయిన్‌ హేమమాలిని కరోనా నుంచి రక్షణకు హౌమాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందే అనేక మంది చేశారు. స్ఫూర్తికోసం ప్రధాని దీపాలు వెలిగించమని కోరితే దాంతో కరోనాను నాశనం చేయవచ్చని ప్రచారం చేసిన ప్రబుద్దులు ఉన్నదేశం మనది, గో కరోనా గో కరోనా అంటూ భజనలు చేయించిన పెద్దలున్నారు. గంగలో మునిగితే కరోనా అంటదు అని ప్రబోధించిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలన్నింటీని ప్రోత్సహించటంలో అన్ని మతాలూ ఒకటిగానే ఉన్నాయి, ప్రోత్సహించాయి.జనాభా రీత్యా చూస్తే వాక్సిన్‌కు విముఖత చూపితే ఎక్కువగా నష్టపోయేది నూటికి 80శాతంగా ఉన్న మతానికి చెందిన వారే. మరి హిందూత్వ శక్తులు ఇంతగా మూఢత్వాన్ని ఎందుకు ఎక్కించినట్లు ? ఇప్పుడు ఒక్క మాటతో దాన్ని పోగొట్టుకోమంటే అంత తేలికగా మత్తు దిగుతుందా ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలు దిమ్మతిరిగేట్లు చేస్తే , ఉత్తర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. ప్రధాని వారణాసి జిల్లాలోనే బిజెపి బొక్కబోర్లా పడింది. రాష్ట్రాల నుంచి డిమాండ్‌ వచ్చిన కారణంగానే వికేంద్రీకరణ విధానాన్ని ప్రకటించామని, ఇప్పుడు కొన్ని అనేక రాష్ట్రాలు తిరిగి కేంద్రీకరణ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయని మోడీ చెప్పారు.మీడియాలో కొన్ని తరగతులు కూడా ఈ డిమాండ్‌ గురించి ప్రచారం చేశాయి. ఇతర దేశాలు పని ప్రారంభించక ముందే మన దేశంలో శాస్త్రవేత్తలు, తయారీదార్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఇది అతిశయోక్తి, అర్ద సత్యం తప్ప ప్రధాని నోటి నుంచి రావాల్సింది కాదు.

గత కొద్ది వారాలుగా చర్చలను చూసినపుడు కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. దేశంలో వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు లేక సీరం సంస్ద ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలుసు, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువనీ తెలిసినా రాష్ట్రాలు వాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని, అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర పెద్దలు ఎలా భావించారు.ఇతర వాక్సిన్ల తయారీకి అవసరమైన పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేసింది. విదేశీ కంపెనీలు వాక్సిన్ల సరఫరాకు పెట్టిన షరతులకు అంగీకరించటమా లేదా అన్నది నిర్ణయించాల్సింది కేంద్రం అయినపుడు దిగుమతులు ఎలా చేసుకుంటాయని భావించారు. కొన్ని రాష్ట్రాల టెండర్లకు ఎలాంటి స్పందన లేదని తెలిసి కూడా కేంద్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించిందా లేదా ? ఒకే వాక్సిన్‌కు వివిధ ధరలకు అనుమతించిన విధాన హేతుబద్దతు ఏమిటి ? మిగతా దేశాల మాదిరి తగినంత ముందుగా వాక్సిన్ల కోసం కేంద్రం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు. ప్రభుత్వ రంగంలోని వాక్సిన్‌ తయారీ సంస్ధల గురించి ముందుగానే ఎందుకు కేంద్రం పరిశీలన జరపలేదు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఏడాది గడచిన తరువాత దాన్ని జాతీయ సమస్యగా చూడాలా, రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య సమస్యగా పరిగణించాలా అన్న చర్చ కేంద్రం వైపు నుంచి ఎందుకు జరపలేదు. ఆరోగ్యం గురించి రాజ్యాంగంలో ఉంది తప్ప మహమ్మారులను ప్రత్యేక అంశంగా పరిగణించాలని పేర్కొనలేదా ? జాతీయ విపత్తుల యాజమాన్య చట్టానికి అర్దం ఏమిటి ?

గతేడాది కరోనా పేరుతో 21లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి ప్రకటించామని ఊరూ వాడా ప్రచారాన్ని ఎలా అదరగొట్టారో చూశాము. నరేంద్రమోడీ గడ్డం ఎందుకు పెంచుతున్నారో తెలియనట్లుగానే ఆ పాకేజి ఏమిటో దాని వలన సామాన్య జనానికి కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. అన్ని లక్షల కోట్లు ప్రకటించినపుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు పెట్టి వాక్సిన్లు వేయించలేని దుస్ధితిలో మోడీ సర్కార్‌ ఉందా ? వాక్సిన్లకోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పద్దెనెమిదేండ్లు పైబడిన అందరికీ వేస్తే అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఈ మాత్రం భరించలేని స్ధితిలో కేంద్రం ఉందా ? లేదూ పిల్లలకూ వేస్తే మరొక పదివేల కోట్లు అవుతుంది, మరొక అంచనా ప్రకారం 80వేల కోట్లతో అందరికీ వేయించ వచ్చు, 138 కోట్ల మందికి ఆ మాత్రం ఖర్చు చేయలేరా ? ఐదులక్షల కోట్ల జిడిపి లక్ష్యమైనా, మరొకటైనా దేనికోసం ? అంబానీ, అదానీలకు కట్టబెట్టటానికా ? ఎందుకీ కక్కుర్తి పనులు ? ఇంతచిన్న తర్కాన్ని కూడా సలహాదారులు,మంత్రులు ఆలోచించే స్ధితిలో లేరా లేక చెబితే వినే పరిస్ధితి లేదా ? మోడీ సర్కార్‌ను తెరవెనుక నుంచి నడుపుతున్న సంఘపరివార్‌ మేథావులకు సైతం ఇది ఎందుకు తట్టలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

టీకాల్లేక జనం చావులు – భారత్‌, చైనా తీరుతెన్నులు !

05 Saturday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, USA

≈ Leave a comment

Tags

anti china, China's vaccine diplomacy, Global COVID vaccine diplomacy, India vaccine diplomacy, India Vaccine Matters, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సలహాదారులెవరో గానీ అచ్చతెలుగులో చెప్పాలంటే దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు.అఫ్‌కోర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దగ్గర కూడా అలాంటి వాటిని ఇచ్చేవారు పుష్కలంగా ఉన్నారనుకోండి. లేకపోతే వధువు-వరుడు లేకుండా పెళ్లి చేసినట్లు టీకాలు లేకుండా నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవాలు జరపటం ఏమిటి ? అత్యున్నత న్యాయస్ధానం కరోనాటీకా విధానం గురించి తీవ్ర ఆక్షేపణ తెలియచేయటం వ్యక్తులు ఎవరని కాదు ఒక దేశ ప్రధానికి ఎంత నామర్ధా ! ఒక విధానం అంటూ లేదని వ్యాఖ్యానించటాన్ని చూసి అడ్డగోలు పాలన నడుస్తున్నట్లుగా ప్రపంచమంతా అనుకుంటుంటే ఎంత అవమానం!


మన జనానికి జ్ఞాపకశక్తి తక్కువ అన్నది మోడీ భక్తులకు పూర్తి విశ్వాసం. ఒక్క విషయాన్ని గుర్తు చేసి అసలు విషయానికి వద్దాం. పదమూడు కోట్ల వాక్సిన్లు వేసేందుకు నరేంద్రమోడీ నాయకత్వం కేవలం 95 రోజులే తీసుకుంటే అగ్రరాజ్యం అమెరికాకు 101, చైనాకు 109రోజులు పట్టిందని పెద్ద ఎత్తున కాషాయ దళాలు ప్రచారం చేశాయి. భారత్‌ ఎంత వేగంగా స్పందించిందో చూడండి అంటూ దాన్నొక పెద్ద విజయంగా విర్రవీగాయి. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా రెండవ తరంగం గురించి స్పందించకుండా నిర్లక్ష్యం చేశారన్న దుమారం నేపధ్యంలో ఈ విజయగాధను గానం చేశారు.


ఇప్పుడు పరిస్ధితి ఏమిటి ? ప్రపంచంలో మే నెలాఖరుకు 209 కోట్ల మందికి కనీసం ఒక డోసు వాక్సిన్లు వేశారు. ఒక్క చైనా లోనే 72 కోట్ల మందికి వేయగా మన దేశం 22 కోట్ల దగ్గర ఉంది. జూన్‌ నాలుగవ తేదీ నాటికి మన దేశంలో రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నవారు 4.44 కోట్ల మంది, జనాభాలో కేవలం 3.3శాతమే. చైనా గురించిన సమాచారం లేనప్పటికీ అంతకంటే ఎక్కువే అన్నది స్పష్టం. వారిని పక్కన పెడదాం ఫైనాన్సియల్‌ టైమ్స్‌ జూన్‌ మూడవ తేదీ నాటి సమాచారం ప్రకారం బ్రిక్స్‌లోని బ్రెజిల్‌లో 10.6, రష్యాలో 8.9శాతం చొప్పున పూర్తిగా వేస్తే మనం ఎక్కడ ఉన్నాం అని ఆలోచించాలి. ఆలశ్యంగా ప్రారంభించినా ఈ ఏడాది చివరికి చైనాలో 80శాతం మందికి పూర్తిగా రెండు డోసులూ వేస్తారంటూ వార్తలు రాస్తున్నారు. మనం ఆస్ధాయిలో ఉన్నామా ? కొంత మంది మన దేశంలో వాక్సిన్లు వేయటం గురించి ఆలోచించకుండా చైనాలో ఎడతెగని వరుసల్లో జనం రోజుల తరబడి వేచి చూస్తున్నారంటూ ఈ మధ్య కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమంలో తిప్పారు.ఇది కూడా నరేంద్రమోడీ వైఫల్యాన్ని సమర్ధించుకొనే యత్నంలో భాగమే. లేదూ సదరు వీడియోలు నిజమే అనుకుందాం. మోడీ తప్పేమీ లేదు, అంతా అలాగే ఉంది అని చెప్పేందుకు గాకపోతే దాని వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ? రోజుకు ఇప్పుడు కోటీ 90 లక్షల వాక్సిన్లు చైనాలో వేస్తున్నట్లు వార్తలు. ఎవరైనా అవన్నీ మేం నమ్మం అంటే అది వారిష్టం. చైనా గురించి కొన్ని నమ్ముతున్న వారు కొన్నింటిని ఎందుకు నమ్మటం లేదు ? లోకంలో నిత్యం ప్రతిదాన్నీ చివరికి తమను తామే నమ్మకుండా శంకించేవారు కొందరు ఉంటారు. మరికొందరు అతి తెలివి గలవారు అది కమ్యూనిస్టు నియంతృత్వం అండీ అవసరమైతే బలవంతంగా వాక్సిన్‌ వేస్తారు, మనది ప్రజాస్వామ్యం అని చెప్పే బాపతు కూడా తగలవచ్చు. దేశంలో ఇంతగా వ్యాధిని పుచ్చబెట్టమని, చంపమని ప్రజాస్వామ్యం చెప్పిందా ?

గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ డైరెక్టర్‌ రే ఇప్‌ చైనా గురించి వంకర బుద్దిని బయట పెట్టుకుంటూ అమానుష వ్యవస్ధలో భాగంగా ప్రతి గ్రామంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉంటారు, అయితే వారు ఎంతో శక్తివంతంగా జనాన్ని సమీకరిస్తారు కూడా అని వాక్సినేషన్‌కు జనాన్ని సమీకరించటం గురించి చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కంటే తమ పార్టీలో ఎక్కువ మంది సభ్యులున్నారని బిజెపి చెప్పుకుంటుంది కదా ఇప్పుడు వారంతా ఏమయ్యారు? మైనారిటీ మతాల వారి మీద విద్వేషం రెచ్చగొట్టటం, మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప వారు చేస్తున్నది ఏమిటి ? నిజంగా కరోనాపై పోరులో రంగంలోకి దిగితే నరేంద్రమోడీ ఖ్యాతి ఇంకా పెరుగుతుంది కదా ? ఏప్రిల్‌ నెలలో అమెరికాలో గరిష్ట స్దాయిలో వాక్సినేషన్‌ జరిగింది. రోజుకు 34 లక్షల మందికి వేశారు, అదే చైనాలో ఏడు రోజుల సగటు కోటీ 90లక్షల మంది అని ఏపి వార్తా సంస్ధ తన కథనంలో పేర్కొన్నది. రాజధాని బీజింగ్‌లో 87శాతం మందికి ఒక డోసు వేశారు. సినోవాక్‌, సినోఫామ్‌ అనే రెండు రకాల వాక్సిన్ల తయారీకి అంతకు ముందున్న ఫ్యాక్టరీలేగాక కొత్తగా నిర్మించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఫ్లూ(జలుబు) మాదిరి కరోనా వైరస్‌ కూడా పదే పదే వచ్చే అవకాశం ఉన్నందున నివారణకు రానున్న రోజుల్లో కూడా వాక్సిన్‌ అవసరం అని కొంత మంది నిపుణులు భావించటం, అవసరమైతే మూడో డోసు కూడా వేయాల్సి రావచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అవసరం లేకపోతే ఆ ఫ్యాక్టరీలను వేరే ఔషధాలు లేదా వాక్సిన్ల తయారీకి వినియోగిస్తారు. గతేడాది కరోనా కట్టడికి కొద్ది రోజుల్లోనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించిన విషయం తెలిసిందే. సినోవాక్‌ ఏడాదికి రెండు వందల కోట్లు, సినోఫామ్‌ మూడు వందల కోట్ల డోసుల తయారీ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. అనేక దేశాలలో మాదిరి వాక్సిన్ల తయారీకి చైనా ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినప్పటికీ దాని తీరు వేరేగా ఉంది. మిగతాదేశాల మాదిరి వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్దాలకు అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడినందున మన దేశంలో సీరం సంస్ధ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. చైనా కంపెనీలు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
కొంత కాలం తరువాత వాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతుంది కనుక రాబోయే రోజుల్లో తిరిగి తీసుకోవాల్సి రావచ్చని షాండోంగ్‌ రాష్ట్రంలోని క్వింగ్‌డావోలో ఉన్న బోయావో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా సంస్ద ప్రతి ఝాంగ్‌ చెప్పారు. కొత్త రూపాన్ని సంతరించుకున్న వైరస్‌ల మీద వాక్సిన్ల ప్రభావం ఇంకా రుజువు కానందున మరింత సమాచారాన్ని పరిశీలించిన తరువాత గానీ మరోసారి వాక్సిన్లు తీసుకోవాలా లేదా అనేది చెప్పజాలమన్నారు. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ మాదిరి కరోనా కూడా మారవచ్చని కొందరు భావిస్తున్నారు. అమెరికా వంటి కొన్ని చోట్ల ఇప్పటికీ ఫ్లూ కారణంగా జనం మరణిస్తున్నప్పటికీ మనవంటి అనేక దేశాలలో జనంలో రోగనిరోధకశక్తి పెరిగి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి మాయం అవుతున్నది. గతంలో పది కోట్ల డోసుల లభ్యతకు 25 రోజులు పడితే తరువాత క్రమంగా 16,9, 7 రోజులకు తగ్గి ఇప్పుడు ఐదు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే డోసు 0.5 మిల్లీ లీటర్లు ఉంటుంది. చైనాలో ఇలాంటి వాటితో పాటు ఒక కంపెనీ 0.1 మిల్లీలీటరును ముక్కుతో పీల్చుకొనే విధంగా ఒక వాక్సిన్‌ తయారు చేసి పరీక్షలు నిర్వహించింది. అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి వస్తే వాక్సిన్‌ లభ్యత ఇబ్బడి ముబ్బడి అవుతుంది, రవాణా కూడా సులభంగా చేయవచ్చు.

కరోనా రెండవ దశ గురించి చేసిన హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పట్టిందనే విమర్శలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది, అంగీకరిద్దాం. కరోనా నిరోధానికి వాక్సిన్‌ అవసరాన్ని గుర్తించారు కదా ! తానే స్వయంగా ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారని జనం అనుకొనే విధంగా ప్రధాని నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌ పర్యటనలను జరిపారు కదా ! దాని మీద చూపిన శ్రద్ద ప్రణాళిక మీద ఎందుకు పెట్టలేదు, సుప్రీం కోర్టుకు సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయింది ? నరేంద్రమోడీ సర్కార్‌ మనోవైకల్యం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ విమర్శించారు. ప్రభుత్వంలో గందరగోళంలో పడిన కారణంగానే సత్తా అంతటినీ చూపలేకపోయిందన్నారు. ఆర్ధిక రంగంలో, సామాజిక సంబంధాల వైఫల్యం మహమ్మారి దాడిని ఎదుర్కోవటంలో వైఫల్యానికి ప్రాతిపదిక అన్నారు.


వాక్సిన్‌ తయారీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప మూడు ధరల విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకురావటంలో మరొక పరమార్ధం లేదు.ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధానమిది. కేంద్రానికి 150 రూపాయలకు ఇచ్చిన కంపెనీలు రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు భారీ మొత్తాలను వసూలు చేయటంలో ఆంతర్యం ఏమిటి ? కేంద్రానికి ఇచ్చిన రాయితీలను కూడా ఈ రూపంలో పూడ్చుకోవాలన్న కంపెనీల ఎత్తుగడ, వాటితో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దల అతి తెలివి తప్ప మరొకటి కాదు. నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటంతో పాటు కంపెనీలకు లాభం చేకూర్చటమే దీని అంతరార్ధం. ముడిపదార్దాలు, అవసరమైన పరికరాల ఎగుమతులపై అమెరికా ఇంతవరకు ఆంక్షలు ఎత్తివేయలేదు. మరోవైపు రాష్ట్రాలు వాక్సిన్ల కోసం ప్రపంచ స్ధాయి టెండర్లను పిలిచినా కంపెనీల నుంచి స్పందన లేదు. అవి పెడుతున్న షరతుల మీద నిర్ణయం తీసుకోవాల్సిందీ, పరిష్కరించాల్సిందీ కేంద్ర తప్ప రాష్ట్రాలు చేయగలిగినది కాదు. ఇంత జరుగుతున్నా, వాక్సిన్‌ విధానం మీద కేంద్రం చురుకుగా కదులుతున్న దాఖలాలు లేవు.


కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటైతే దాని కొనసాగింపుగా వాక్సిన్‌ దౌత్యంతో దూరమైన ఇరుగు పొరుగు, ఇతర దేశాలకు దగ్గర కావాలని మోడీ సర్కార్‌ ఆలోచన చేసింది. ఇప్పుడు ఇటు దేశంలో తీవ్ర విమర్శలపాలు కావటమే గాక దౌత్య రంగంలో కూడా అనుకున్నది సాధించే స్ధితిలో లేవని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు చైనా వైపు చూస్తున్నాయి. ప్రతి దేశానికి దౌత్య సంబంధమైన, అంతర్జాతీయ సహకారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేద దేశాలకు కోవాక్స్‌ పేరుతో వాక్సిన్లు అందచేసేందుకు నిర్ణయించింది. వాక్సిన్‌ తయారీ దేశాలన్నీ తమ శక్తిమేరకు దానికి విరాళంగా వాక్సిన్లు అందచేస్తున్నాయి. మన దేశం కూడా అలాంటి బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఓకే. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) మార్చినెల 23న ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో పేర్కొన్న సమాచారం ప్రకారం 74 దేశాలకు గ్రాంట్‌ (ఉచితం) వాణిజ్యం, కోవాక్స్‌ కార్యక్రమానికి గాను వాక్సిన్లు ఎన్ని డోసులు అందచేసిందీ వివరంగా ఉంది. మూడు తరగతులకు సంబంధించి మొత్తం 5.959 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. వీటిలో గ్రాంట్లుగా 81.25లక్షలు, కోవాక్స్‌ కార్యక్రమానికి కోటీ 75లక్షల డోసులు ఇవ్వగా వాక్సిన్‌ ఎగుమతి చేసే కంపెనీలు వాణిజ్య పరంగా ఎగుమతి చేసినవి 3.396 కోట్ల డోసులు ఉన్నాయి. విశ్వగురువు నరేంద్రమోడీ పేరుతో ప్రచారం మాటున ఇదంతా జరిగింది. అంటే దానం, విరాళం అనే పేరుతో దౌత్యం దాని వెనుక పక్కా లాభసాటి వ్యాపారం. మరోవైపు నరేంద్రమోడీ కార్పొరేట్ల తాట తీస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో భక్తుల ప్రచారం. మార్చినెలలో మన రాయబారి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ భారత్‌ దేశీయంగా ఉపయోగించే వాటి కంటే ఎగుమతులు చేసిందే ఎక్కువ అని గొప్పగా చెప్పుకున్నారు.


దేశంలో వాక్సిన్ల కొరత తలెత్తటంతో అబ్బే అంతా ఉత్తిదే అని జనాన్ని నమ్మించేందుకు కొత్త నాటకం. ప్రపంచం అంతా రాజకీయమయంగా ఉన్నపుడు ఎవరికి అవకాశం దొరికితే వారు ఉపయోగించుకుంటారన్నది జగమెరిగిన సత్యం. చైనా అదే చేస్తున్నది, ఎవరెంత గింజుకున్నా చేయగలిగిందేమీ లేదు. మనల్ని నమ్ముకొని వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన వారు ఇప్పుడు మన మీద జాలి చూపుతూ చైనా వైపు చూస్తున్నారు. చిన్న దేశమైన భూటాన్‌ మన మీద ఆధారపడుతున్న దేశం, డోక్లాం వివాదంలో మన మిలిటరీ వెళ్లి చైనా వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇండియా మాకు విశ్వసనీయమైన మిత్ర దేశమే, మేము అడిగితే రెండో డోసుకు వాక్సిన్లు ఇవ్వగలదు కానీ ఆ దేశంలోనే ప్రాణాలను నిలిపేందుకు ఎంతో అవసరం పడుతున్నపుడు మేము వత్తిడి చేయలేము అని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌ గత నెలలో ప్రకటించాడు.చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకు పూనుకున్నారు.నేపాల్‌దీ అదే పరిస్ధితి. మన వాక్సిన్ల కంటే చైనావి ధర ఎక్కువే అయినప్పటికీ, అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎగుమతులు చేయనందున మిగతా ప్రపంచ దేశాలు చైనా వైపు చూడక తప్పని స్ధితి.

చైనాలో తయారు చేస్తున్న సినోఫామ్‌, సినోవాక్‌ వాక్సిన్‌న్లకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం తెలపటంతో ఇప్పుడు అనేక దేశాలు అంతకు ముందు వచ్చిన వార్తలతో సందేహాలు వెలిబుచ్చినవి కూడా ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా, ఐరోపాల వెలుపల తయారు చేసిన వాక్సిన్లలో ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదం పొందిన వాటిలో ఇంతవరకు చైనావి మాత్రమే ఉన్నాయి. మన దేశానికి చెందిన కోవాక్సిన్‌కు ఇంతవరకు ఆమోదం లేదు. ఒకసారి వాగ్దానం చేస్తే అది గ్రాంటు అయినా వాణిజ్య ప్రాతిపదిక అయినా కచ్చితంగా చైనా సరఫరా చేస్తుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఉంది. ఎనిమిది కోట్ల డోసులను అందచేస్తామని అమెరికా ప్రకటించటమే తప్ప వారాలు గడుస్తున్నా ఎటూ తేల్చటం లేదు. ఈ నెలాఖరుకు వస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని మనకు అమెరికా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆవి అక్కడి గోడౌన్లలో పడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలకు 26.5కోట్ల డోసులు సరఫరా చేసిన చైనా మరో 50కోట్ల డోసుల సరఫరా చేయనుందని ఎయిర్‌ ఫినిటీ అనే సంస్ద నెల రోజుల క్రితం వెల్లడించింది. చైనా తరువాత ఐరోపా యూనియన్‌ వంద దేశాలకు 6.7 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. మన దేశం నుంచి వాక్సిన్లు వస్తాయని ఆశించిన ఫిలిప్పైన్స్‌ అధికారి ఒకడు వాస్తవ పరిస్ధితిని అర్ధం చేసుకోకుండా దక్షిణ చైనా సముద్ర దీవుల వివాదంలో చైనాను విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. ప్రభుత్వం ఒకవైపు వాక్సిన్‌కోసం సంప్రదింపులు జరుపుతుంటే ఇలాంటి చర్యలేమిటని సదరు అధికారిని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెరేట్‌ మందిలించాడు. చైనాతో వివాదం ఉన్నంత మాత్రాన దాని పట్ల దురుసుగా, అమర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నాడు. మన దేశం వాక్సిన్‌ ఎగుమతులపై నిషేధం విధించటంతో ఇండోనేషియా ప్రభుత్వం చైనా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. చైనాతో వివాదం పేరుతో వాక్సిన్లు కొనుగోలు చేయకుండా జనం ప్రాణాలను ఫణంగా పెట్టటమా వివాదం ఉంటే తరువాత తేల్చుకుందాం ముందు ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని వాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తారా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాల్సి ఉంది.


అవసరమైతే మనం కూడా చైనా నుంచి వాక్సిన్లు ఎందుకు దిగుమతి చేసుకోకూడదనే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. మన మాదిరే చైనా కూడా గ్రాంటుగా ఇచ్చేది ఇస్తోంది, మరోవైపు వాక్సిన్లను ఆమ్ముతోంది. గత నెలాఖరులో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా వెళ్లి వాక్సిస్లు ఆమ్ముతారా అంటూ వాకబు చేసి వచ్చారు. అమెరికన్లు ఏవీ ఉచితంగా ఇవ్వరు. ఒక వేళ ఒకదాన్ని ఇచ్చినా మరొకదానితో మొత్తం రాబడతారు. చైనా నుంచి ఆక్సిజన్‌ పరికరాలు, ఇతర సరఫరాలకు ఆటంకం లేకుండా సరకు రవాణా విమానాలు నడపాలని అదే జైశంకర్‌ చైనాను అడిగారు గానీ వాక్సిన్ల దగ్గర మొహమాట పడ్డారు. వాక్సిన్లు లేక జనం చస్తుంటే ఇదేమి వైఖరో, రాజకీయమో అర్ధం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d