• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

చిల్లర గాళ్ల దురుసు మాటలు – నోరు విప్పని నరేంద్రమోడీ !

10 Friday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Fringe elements, Narendra Modi, Narendra Modi Failures, Nupur Sharma, Qatar, RSS

ఎం కోటేశ్వరరావు


బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్‌ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్‌ శర్మ, మహమ్మద్‌ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్‌ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.


ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్‌ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్‌ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.


జకీర్‌ నాయక్‌ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్‌ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్‌ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్‌ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్‌ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేత రామ్‌ మాధవ్‌ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్‌ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్‌ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్‌ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !


నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్‌ జిహాద్‌ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్‌ 18 ఛానల్లో అమన్‌ శర్మ అనే యాంకర్‌ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్‌ పేరుతో ఉన్న వారు హనుమాన్‌ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్‌ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.


పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్‌ జైన్‌ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్‌ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్‌ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ సెలవిచ్చారు.


అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్‌ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్‌ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్‌ సింగ్‌ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్‌ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.


కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్‌ దళ్‌ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్‌, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్‌ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్‌ పోర్టల్‌ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్‌ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.


ధర్మ సంసద్‌ తరువాత సుదర్శన్‌ న్యూస్‌ అధినేత సురేష్‌ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్‌ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్‌ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్‌ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్‌ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్‌ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్‌ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.


నూపూర్‌ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్‌ మునిదాస్‌ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్‌ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్‌ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్‌ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్‌ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్‌ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్‌ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?


నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్‌ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్‌ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్‌ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్‌ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్‌ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్‌ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఫ్రింజ్‌ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి నేతల నోటి తుత్తర ఎంత పని చేసిందీ – ఉపరాష్ట్రపతి వెంకయ్యకు అవమానం !

06 Monday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, Nupur Sharma, Prophet Muhammad, RSS


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ నోటి తుత్తర లేదా అదుపులేని తనం కారణంగా తెలుగువాడైన మన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి అవమానం జరిగింది. కతార్‌ పర్యటనలో అధికారిక రాత్రి విందును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. కతార్‌ ఉప ఎమిర్‌ (రాజు)కు కరోనా అన్న అనుమానం అని దానికి సాకు చెప్పారు. ఇప్పటి వరకు ముస్లిం విద్వేష ప్రకటనలు మన అంతర్గత అంశంగా ఉండగా ఇప్పుడు మహమ్మద్‌ ప్రవక్త మీద దాడితో ” మన దేశ ప్రతిష్టను ” నరేంద్రమోడీ అనుచరులు అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారు. ఇస్లామిక్‌ దేశాల్లో మన దేశం గురించి పతాకశీర్షికల్లో వార్తలు వెలువడ్డాయి.దీంతో కతార్‌, కువైట్‌లోని కొన్ని దుకాణాల నుంచి మన దేశ వస్తువులను తొలగించినట్లు బిబిసి పేర్కొన్నది.ఒమన్‌ గ్రాండ్‌ మప్తీ కూడా మన దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.


మహమ్మద్‌ ప్రవక్త గురించి అనుచితంగా మాట్లాడిన బిజెపి నేత నూపూర్‌శర్మ (ఆమె ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌పై పోటీచేశారు) మీద ఇంతవరకు ఎలాంటి కేసులు లేవు. రెచ్చగొట్టిన ఆమె మాటలతో తలెత్తిన ఉదంతాల్లో మాత్రం ఎందరి మీదో కేసులు నమోదు చేశారు. మే 27వ తేదీన గ్యాన్‌వాపి మసీదు పేరుతో చర్చ జరిపిన టైమ్స్‌ నౌ ఛానల్‌లో మాట్లాడిన నూపూర్‌ శర్మ మాటలను కోట్లాది మంది చూశారు. అనుచితంగా మాట్లాడుతున్న ఆమెను సదరు ఛానల్‌ మోడరేటర్‌ నివారించలేదు, అలాంటి మాటలు మాట్లాడటం తమ ఛానల్‌ వైఖరి కాదు అని కూడా ప్రకటించలేదు. ముందే చెప్పుకున్నట్లు నూపూర్‌ మీద గాని సదరు ఛానల్‌ మీద గానీ ఎలాంటి కేసులు లేవు. చర్చలో నూపూర్‌ శర్మ మాటలున్న భాగాన్ని తీసుకొని తీసుకొని ట్వీట్‌ చేసిన ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ మీద మాత్రం కేసులు పెడతారు. మామ తిట్టటం కాదు దాన్ని చూసిన తోడల్లుడు కిసుక్కున నవ్వటం ఘోరం అన్నట్లుగా లేదూ !


ముస్లింలు, ఇస్లాం గురించి ఎంత విద్వేషపూరితంగా మాట్లాడితే అంత దేశభక్తి. మేకిన్‌ ఇండియా అంటే కుప్పలు తెప్పలుగా అలాంటి వివాదాలు, మాటల సృష్టే అన్నట్లుగా మారింది. బిజెపి ఫ్యాక్టరీలో పని చేస్తున్న నూపూర్‌ శర్మ ఉత్పత్తి కాన్పూర్‌లో హింసాకాండకు, కేసులకు దారి తీసింది. పలుచోట్ల ముస్లింలు తమ ప్రవక్తమీద మాట్లాడిన అనుచిత పదజాలానికి నిరసన తెలుపుతున్నారు. ఇంత జరిగినా కేంద్ర ప్రభుత్వానికి లేదా, బిజెపిలో ఎలాంటి స్పందన లేదు. కానీ నూపూర్‌ శర్మ నిర్వాకం ఇస్లామిక్‌ దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మన దేశపు సరకులను బహిష్కరించాలన్న పిలుపులు వెలువడ్డాయి. కొన్ని ప్రభుత్వాలు అధికారికంగా స్పందించి మన రాయబారులను పిలిపించి ఇదేం పని అని మందలించటం, నిరసన తెలుపుతున్నాయి. క్షమాపణ చెప్పాలని కోరాయి. ఇంత జరిగిన తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు నష్ట నివారణకు పూనుకున్నారు. మేనెల 27న నూపూర్‌ శర్మ మాట్లాడితే అది పార్టీ విధానం కాదంటూ జూన్‌ ఐదున ఆమెను సస్పెండ్‌ చేయటాన్ని ఏమనాలి ! అందుకే ఈ చర్యలోగానీ, తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటనలో గానీ ఎక్కడా చిత్తశుద్ది కనపడదు.


నూపూర్‌ శర్మ ట్వీట్‌ ద్వారా చేసిన ప్రకటన ఇలా ఉంది.” మన మహదేవ్‌ను అవమానిస్తూ, అగౌరవపరుస్తూ కొనసాగుతున్న టీవీ చర్చలకు నేను గత కొద్ది రోజులుగా హాజరువుతున్నాను. కనిపించింది శివలింగం కాదు ఒక ఫౌంటెన్‌ అని వెక్కిరింతగా మాట్లాడుతూ ఢిల్లీలో రోడ్లపక్క ఉన్న స్థంభాలు, చిహ్నాలంటూ శివలింగాన్ని అపహాస్యం కూడా చేస్తున్నారు.మన మహదేవ్‌ను ఇలా అవమానించటం, అగౌరవపరచటం కానసాగటాన్ని నేను సహించలేను. దానికి స్పందనగానే నేను కొన్ని అంశాలను చెప్పాను. నా మాటలు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగించినా ఎవరి మత భావాలనైనా గాయపరిచినా, ఏదైనా కానివ్వండి బేషరతుగా నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను. ఎవ్వరి మతభావనలను గాయపరచటం నా ఉద్దేశ్యం కాదు.” అని పేర్కొన్నారు. ఈ పశ్చాత్తాపం కలగటానికి తొమ్మిది రోజులు పట్టిందంటే అసలు కథేమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటి ? ఆ సుభాషితాన్ని పూర్తిగా వివరించనవసరం లేదు. వికీపీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అయిషా అనే ఆరేండ్ల బాలికను మహమ్మద్‌ ప్రవక్త వివాహం చేసుకున్నట్లు, ఆమెకు తొమ్మిదేండ్లు వచ్చిన తరువాత సంసారం చేసినట్లు నూపూర్‌శర్మ చెప్పినట్లుగా ఉంది.గ్యానవాపి మసీదులో కనిపించింది ఏమిటో అధికారికంగా నిర్ధారించిన తరువాత అది శివలింగమా-ఫౌంటెనా అన్నదాని గురించి ఎవరి అభిప్రాయం చెప్పుకోవచ్చు. బిజెపి అధికారికంగా ఎక్కడా శివలింగమే అది అని తాము నమ్ముతున్నట్లు ఇంతవరకు చెప్పలేదు. పోనీ దాని గురించి చర్చలో మహమ్మద్‌ ప్రవక్త ప్రస్తావన అవసరం ఏమిటి ?


తన నోటితుత్తర కాన్పూర్‌లో హింసాకాండకు దారి తీసినందుకు నూపూర్‌ శర్మ ఎలాంటి విచారం ప్రకటించలేదు, వివరణ ఇచ్చేందుకు కూడా పూనుకోలేదు. తన మాటలను ఉటంకిస్తూ ఆల్ట్‌ న్యూస్‌ మహమ్మద్‌ జుబేర్‌ విడుదల చేసిన వీడియో చూసిన వారు తన మాన ప్రాణాలను హరిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు అతనే బాధ్యత వహించాలని, తన మాటలను వక్రీకరించి అసందర్భంగా చూపారని ఆరోపించారు. ఒక వేళ అదే నిజం అనుకుంటే తన మాన ప్రాణాలకు నిజంగా ముప్పు తలెత్తిందని భావిస్తే తాను మాట్లాడిన వీడియోను తీసుకొని తానే దాన్ని విడుదల చేసి జనాల్లో తలెత్తిన అనుమానాలను తీర్చవచ్చు, అదేమీ ఆమె వైపు నుంచి లేదు. తామెలాంటి మార్పులు చేయలేదని ఆల్ట్‌ న్యూస్‌ మరొక ప్రతినిధి ప్రతీక్‌ సిన్హా స్పష్టం చేశారు. నూపూర్‌ శర్మ వ్యాఖ్యలు ప్రపంచమంతటా ముఖ్యంగా గల్ఫ్‌ ఇస్లామిక్‌ కౌన్సిల్‌ దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో బిజెపికి పైసా ఖర్చు లేకుండా ఎంతో ప్రచారాన్నిచ్చాయి.దాంతో ముస్లింలు అధికంగా ఉండే దేశాలను సంతుష్టీకరించేందుకు నరేంద్రమోడీని పురికొల్పాయి. కతార్‌ ప్రభుత్వం మన రాయబారిని పిలిపించి తక్షణమే ఖండించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అనేక దేశాల్లో కూడా అదే జరిగింది. అయితే ఆ మాటలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, నోటి తుత్తర శక్తులు చేసిన వ్యాఖ్యలని మన రాయబారులు, విదేశాంగశాఖ సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది.


నూపూర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు తప్ప బహిష్కరించలేదు. ఢిల్లీకి చెందిన మరొక బిజెపి నేత నవీన్‌ జిందాల్‌ చేసిన ఒక ట్వీట్‌లో మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచినందుకు పార్టీ నుంచి తొలగించారు. అతగాడు తన ట్వీట్‌ను తొలగించినప్పటికీ చర్యతప్పలేదు. ఇటీవల పార్టీల్లో పదవుల పందారం జరిగినపుడు అధిష్టానం వారిపేరుతో విడుదల చేసే లేఖలను ప్రదర్శించటం మీడియాలో ఒక ధోరణిగా మారింది. దాని కొనసాగింపులోనే కొన్ని ఛానళ్లు, వెబ్‌సైట్‌లు నూపూర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌కు రాసిన లేఖలను ప్రదర్శించాయి, వాటిలో వారి చిరునామాలున్నాయి. తన కుటుంబానికి హాని ఉన్నందున తన చిరునామాను వెల్లడించవద్దని నూపూర్‌ శర్మ మీడియాను కోరారు. తాను పోలీసు రక్షణ కోరినట్లు జిందాల్‌ పేర్కొన్నారు. ఎఎన్‌ఐ వార్తా సంస్థ ఆ లేఖను తొలగించింది. అయితే అప్పటికే ఆమె అడ్రస్‌ జనాలకు కేరింది. అసలు చిరునామాలను చెరపకుండా బిజెపి ఆఫీసు నుంచి మీడియాకు ఆ లేఖలు ఎలా వచ్చాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.


ధర్మ సంసద్‌ల పేరుతో జరిపిన సభల్లో హిందూత్వ నేతలు ముగ్గురు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల గురించి ఆల్ట్‌ న్యూస్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ చేసిన ట్వీట్లకు గాను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు పెట్టారు. ఈ చర్యను పదకొండు డిజిటల్‌ న్యూస్‌ సంస్థలతో కూడిన డిజిపబ్‌ న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఖండించింది.విద్వేష ప్రసంగాలు చేసిన వారిని వదలివేసి వారి మాటలను జనాలకు నివేదించిన జర్నలిస్టులను వేధించటం తగనిపని అని పేర్కొన్నది.హిందువుల మనోభావాలను కించపరిచినట్లు, ఐటి చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు ఆరోపించారు. మే నెల 27న జుబేర్‌ చేసిన ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.” ఇప్పటికే యాంకర్లు స్టూడియోలనుంచి ఎంతో చేస్తుండగా ఒక సామాజిక తరగతికి లేదా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు యతి నరసింగానంద సరస్వతి, మహంత్‌ బజరంగ్‌ లేదా ఆనంద స్వరూప్‌ వంటి విద్వేషం వెదజల్లే వారికి ధర్మసంసద్‌లను ఏర్పాటు చేయటం ఎందుకు ?” అని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను చూసినపుడు అసలేం జరుగుతోంది అన్న సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో మన దేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులుగా పని చేస్తున్నారు. ఆర్ధికంగా ఆ దేశాలతో అనేక లావాదేవీలు కూడా పెద్దఎత్తునే ఉన్నాయి. బిజెపి నేతల నోటి తుత్తర ఈ సంబంధాల మీద రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ముందుకు తెచ్చిన 80-20 ప్రచారం ఒక అంశాన్ని స్పష్టం చేసింది. తమకు ఇరవైశాతం ముస్లింల ఓట్లు పడకపోయినా ఫరవాలేదని, మెజారిటీ హిందువులు తమను శాశ్వతంగా అధికారంలో కూర్చోబెడతారనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానికి నిదర్శనంగానే ఎక్కడా ముస్లిం అభ్యర్ధులను నిలపటం లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాలు అవసరం గనుక, తన ప్రతిష్టకు మచ్చపడకుండా చూసుకొనేందుకు ఎత్తుగడగా నరేంద్రమోడీ నాయకత్వం ఇప్పుడు ఇద్దరు బిజెపి నేతల మీద చర్యలు ప్రకటించటం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” నరేంద్రమోడీ శివలింగం మీద తేలు ” బిజెపి తాజా రాజకీయంలో పాత సంగతి !

04 Saturday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP shiva lingam politics, Narendra Modi, RSS, Scorpion on Shiva Linga, Shashi Tharoor


ఎం కోటేశ్వరరావు


శివలింగాల కోసం మసీదులను తవ్వేద్దామన్నారు బిజెపి ఎంపీ బండి సంజయ. ప్రతి మసీదులో శివలింగం కోసం చూడటం ఎందుకు అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సుభాషితం పలికారు. గ్యానవాపి వివాదాన్ని కొత్తగా రేపగా అది కొనసాగుతున్న వివాదమని భగవత్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఇద్దరూ ఒకే సంస్థకు, భావజాలానికి చెందిన వారు. ఇద్దరి ఆలోచనలు పరస్పరం తెలియని స్థితిలో ఉన్నారా ? ఒకరు పిర్రగిల్లాలి, మరొకరు జోలపాడాలి. ఎవరికి తెలియని నాటకమిది ? భలేగా జనాన్ని ఆడుకుంటున్నారు కదా ! బాబరీ మసీదు మీద సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు రాముడి జన్మభూమి రాజకీయం నడిపారు. ఇప్పుడు శివలింగాల మీద కేంద్రీకరించారు.లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. రాజకీయ, మత వ్యాపారులు దీనికి మినహాయింపుగా ఎలా ఉంటారు ?


ఆమె మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి. పదవీ కుమ్ములాటల కారణంగా బిజెపి నుంచి బహిష్కరణకు గురై భారతీయ జనశక్తి పార్టీ పేరుతో స్వంత దుకాణం నడిపి లాభం లేకపోవటంతో తిరిగి బిజెపి దుకాణంలో చేరారు, ఆమె పేరు ఉమా భారతి.రామజన్మభూమి ఆందోళనలో ప్రముఖ పాత్రధారి, బాబరీ మసీదును కూల్చివేసినపుడు అక్కడే ఉన్నారని వార్తలు. ఇప్పుడు ఆమె ఒక శివాలయాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచకపోతే తనకు నిదరపట్టదని, అన్నం మానివేస్తానని బెదిరింపులకు దిగారు. మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్‌ జిల్లాలోని రాయిసేన్‌ కోట భారత పురావస్తుశాఖ (ఎఎస్‌ఐ) ఆధీనంలో ఉంది. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం దాని ఆధీనంలో ఉన్న ఆలయాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచి పూజలకు అనుమతిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు పూజలు చేస్తారు. దాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచాలని ఉమాభారతి డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ నెలలో ఆ కోటను సందర్శించి గేటు వెలుపల నుంచి శివలింగం మీద నీటిని చల్లి అభిషేక తంతు జరిపారు. తాను గంగ నుంచి నీటిని తెచ్చి అధికారులకు అందచేశానని, గుడిని ఎప్పుడు తెరిచేది చెబితే వచ్చి వాటితో అభిషేకం చేస్తానని ఆమె విలేకర్లతో చెప్పారు. తాళాలు బద్దలు కొట్టటం వంటి పనులకు తాను పాల్పడనని అన్నారు. అసలు ఇక్కడ శివాయం ఉన్నట్లే తనకు తెలియదని మత బోధకుడు ప్రదీప్‌ మిశ్రా ప్రకటనల ద్వారా తెలుసుకొని వచ్చానన్నారు. మద్యపాన నిషేధం పేరుతో ఇటీవల ఆమె తన పార్టీకే చెందిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో వివాదపడుతున్నారు. దానిలో భాగంగానే శివాలయ రాజకీయం ప్రారంభించారని భావిస్తున్నారు.


శివలింగ రాజకీయంలో బిజెపి నేతలు తక్కువ తినలేదు. గ్యానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్న శివలింగం గురించి బిజెపి తన వైఖరి ఏమిటో ఇంతవరకు ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి ప్రస్తుతం స్వదేశీ జాగరణ మంచ్‌ నేతగా ఉన్న పి. మురళీధర రావు మాత్రం వ్యక్తిగతం పేరుతో ప్రకటనలు చేస్తుంటారు. ఇదొక నాటకం. శివలింగపూజను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదని మసీదులో శివలింగం ఉందన్న వాస్తవాన్ని ముస్లింలు అంగీకరించాలని ట్వీట్లు చేస్తారు. అక్కడ శివలింగం దొరికింది కనుక అక్కడ పూజలను అనుమతించాలి, అలా చేసినపుడు 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న యధాతధ స్థితిని కొనసాగించాలని 1991లో చేసిన చట్టం కొనసాగటం అసాధ్యమని వాదించారు. 1991నాటి చట్టం అమల్లో ఉండగా బిజెపి అధికారికంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది కనుక మద్దతుదార్లతో కేసులు వేయిస్తారు, వారితో తమకు సంబంధం లేదంటారు. ఏదో ఒక రూపంలో దాని గురించి రోజూ మాట్లాడుతూ ఉంటారు.

మహారాష్ట్రలో మతవాద రాజకీయాలు నడిపేవాటిలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) ఒకటి.దాని నేత గజానన్‌ కాలే ఒక ట్వీట్‌ చేస్తూ ఔరంగాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉండాల్సిన అవసరం లేదని దాన్ని కూల్చివేయాలంటూ రెచ్చగొట్టాడు. ఆ పని చేస్తే అక్కడికి జనాలు వెళ్లరని అన్నారు. దాంతో కొంత మంది దానికి తాళాలు వేసి రక్షణ కల్పించాలని ప్రయత్నించారు. మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల సమాధిని సందర్శించిన తరువాత ఇది జరిగింది. ఈ సందర్శన కొత్త వివాదాన్ని సృష్టించేందుకే అని ఒవైసీ మీద విమర్శలు వచ్చాయి. ఇలా ఎక్కడికక్కడ ఏదో ఒక పేరుతో మత శక్తులు రెచ్చిపోతున్నాయి.


చివరకు హిందువుల వ్యక్తిగత స్వేచ్చను కూడా బిజెపి సహించటం లేదు. గుజరాత్‌లోని వడోదరా పట్టణానికి చెందిన కష్మా బిందు అనే యువతి జూన్‌ 11న ఒక దేవాలయంలో తనను తానే వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇది హిందూత్వకు వ్యతిరేకం గనుక దాన్ని అనుమతించేది లేదని నగర బిజెపి నాయకురాలు సునీతా షుక్లా ప్రకటించారు. దీని వలన హిందూ జనాభా తగ్గిపోతుందని, మతానికి వ్యతిరేకంగా చేసే వాటిని సహించేది లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే దేశ చరిత్రలో తనును తానే వివాహం చేసుకోవాలనుకోవటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అదే యువతి సాధ్విగా మారి ఉంటే ఎలాంటి అభ్యంతరం, హిందూ జనాభా తగ్గుదల అంశం తలెత్తిఉండేది కాదు.


దేశంలో శివలింగ రాజకీయాలు నడుస్తున్నాయి గనుక ఆసక్తికరమైన అంశాన్ని ఇక్కడ చెప్పుకోకుండా ఉండలేం. ఒక హత్య కేసులో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ దేవుడు శివుడిని అవమానించారని 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర ప్రసాద్‌ ఆరోపించారు. ఒక కాంగ్రెస్‌ ఎంపీ భయంకరంగా హిందూ దేవుళ్లను అవమానించినందుకు శివ భక్తుడిని అని చెప్పుకున్న రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని, హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరు సాహిత్య సమ్మేళనంలో 2018 అక్టోబరు 28న శశిధరూర్‌ ప్రసంగించారు. నరేంద్రమోడీ శివలింగం మీదకు చేరిన తేలు వంటి వారని దాన్ని చేత్తో తీసివేయలేము చెప్పుతో కొట్టనూ లేమని ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉపమాలంకారంగా ఒక జర్నలిస్టుతో అన్నారని ఆ ప్రసంగంలో శశిధరూర్‌ చెప్పినట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ నివేదించింది. దాన్ని హిందూమతాన్ని అవమానించినట్లుగా రవిశంకర ప్రసాద్‌ చిత్రించారు. ఈ మాటను శశిధరూర్‌ పాకిస్తాన్‌లో అని ఉంటే నోరు మూయించేవారు, అతను కేవలం ప్రధాన మంత్రినే కాదు ఈ దేశంలోని కోట్లాది మంది శివభక్తులను అవమానించారు అని మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ మాటలకు గాను శశి ధరూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌ గాంధీని బిజెపి నేత సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు.ఇంతకూ జరిగిందేమిటి ?


శశిధరూర్‌ తన ప్రసంగంలో కారవాన్‌ పత్రిక జర్నలిస్టు వినోద్‌ జోస్‌తో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు నరేంద్రమోడీ శివలింగం మీద తేలుకొండి లాంటివాడని చేత్తో తొలగించలేము, చెప్పుతో కొట్టలేమని అన్న మాటలను ఉటంకిస్తున్నట్లు చెప్పారు.2012 కారవాన్‌ పత్రికలో వినోద్‌ జోస్‌ కథనం ప్రచురితమైంది. దాన్లో ఇలా రాశారు.” నేను గుజరాత్‌ నుంచి వచ్చే ముందు పెద్ద నిట్టూర్పుతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత తన భావాలను నాతో ఇలా పంచుకున్నారు.” శివలింగం మీద తేలుకొండి కూర్చుని ఉంది. అది పవిత్రమైన శివలింగం కావటంతో చేత్తో తొలగించలేము-చెప్పుతో కొట్టనూ లేము ” అన్నట్లు రాశారు. సదరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత పేరు వెల్లడించాలని ఒక ట్విటర్‌ కోరగా ఒక జర్నలిస్టుగా తనకు చెప్పిన వారిని మోసం చేయలేనంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒక్కరే కాదు నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌం మంత్రిగా పని చేసిన గోర్ధన్‌ జడాఫియా కూడా అదే మాట అన్నట్లు వినోద్‌ జోస్‌ సమాధానమిచ్చారు.


2010 సెప్టెంబరు 12న న్యూస్‌ 9 అనే ఆంగ్ల టీవీ ఆరునిమిషాల వీడియో వార్తను ప్రసారం చేసింది. దానిలో మోడీ ఒక తేలుకొండి అంటూ ఒక భాగం ఉంది. తెరమీద ఆ మాటలను చూపిన వెంటనే గోర్ధన్‌ జడాఫియా వ్యాఖ్య ఇలా మొదలైంది.” నేను గనుక చెప్పాల్సి వస్తే శివలింగం మీద తేలుకొండి కూర్చున్నదని చెప్పగలను. సంఘపరివార్‌ కూడా దాన్ని ముట్టుకోలేదు – శివలింగానికి హానీ కలిగేట్లు దేన్నీ విసరలేదు. మొత్తం పరివారమంతా చూస్తున్నది. వారిలో కూడా ఈ భావనలు ఉన్నా వారేమీ చేయలేరు.” అన్నారు. ఈ జడాఫియా విశ్వహిందూపరిషత్‌ నేత. అహమ్మదాబాద్‌ బిజెపి ప్రధాన కార్యదర్శి, రెండుసార్లు ఎంఎల్‌ఏగా, నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌంమంత్రిగా పనిచేశారు.2002 గుజరాత్‌ మారణకాండలో పాత్రధారి అనే విమర్శలున్నాయి. విశ్వహిందూపరిషత్‌కు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను కొన్ని చోట్లకు బదిలీ చేసి హింసాకాండకు తోడ్పడేట్లు చేశారని, అతని ఆదేశం మేరకు పోలీసులు నిర్వాశితులైన బాధితుల మీద శిబిరాల్లోనే దాడులు చేయించినట్లు విమర్శలున్నాయి. నరేంద్రమోడీ పొడగిట్టని విశ్వహిందూపరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా అనుచరుడిగా ఉన్న కారణంగా గుజరాత్‌ హింసాకాండ తరువాత జడాఫియాను మంత్రివర్గం నుంచి మోడీ తొలగించారు. దాంతో 2007 ఎన్నికల్లో మహాగుజరాత్‌ జనతా పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత బిజెపి నుంచి వెలుపలికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ దుకాణమైన గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీలో దాన్ని విలీనం చేశారు.2012 ఎన్నికల్లో అది బిజెపి మీద పోటీకి దిగి భంగపడింది.తరువాత విశ్వహిందూపరిషత్‌ పూర్తిగా నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించింది. గుజరాత్‌ కొట్లాటలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మూడు సార్లు జడాఫియాను ప్రశ్నించింది, నరేంద్రమోడీ పాత్ర గురించి సాక్ష్యం చెప్పేందుకు సుముఖత చూపినట్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు వత్తిడి తెచ్చి వారించినట్లు దాంతో వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. రాజీగా జడాఫియాను తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు ఒప్పందం కుదరటంతో 2014లో గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీని బిజెపిలో విలీనం చేసి పార్టీలో చేరారు.

దేశంలో ప్రస్తుతం ప్రారంభమైన శివలింగాల రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో ! రామజన్మ భూమి మాదిరి ఓట్లను రాలుస్తుందా ? ఈ కొత్త నాటకాన్ని జనం గ్రహిస్తారా ? ఆర్ధిక రంగంలో ఘోరంగా విఫలమై జన జీవితాలు అతలాకుదలం అవుతున్న స్థితిలో వాటి నుంచి జనాన్ని మళ్లించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. దానిలో లింగాల రాజకీయం ఒకటి అన్నది స్పష్టం. శ్రీలంక ఆర్ధిక దిగజారుడు, రాజకీయ పరిణామాల నేపధ్యంలో ధరల అదుపునకు జమ్మిక్కులు చేస్తున్నారు. ఆర్ధిక దిగజారుడు మరింతగా జరగకముందే ఏదో ఒకసాకుతో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

27 Friday May 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

BJP, Modi Govt @ 8, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక గౌరవ ప్రదమైనదిగా జనం చేత ఆమోదింపచేసేందుకు, జాతీయ వాదం పేరుతో సమాజంలో చీలికలు తెచ్చేందుకు నరేంద్రమోడీ, ఇతర పాలకపెద్దలు కేంద్రీకరించిన తీరును ఎనిమిదేండ్లలో చూశాం. దీనిలో వందో వంతైనా సరైన ఆర్ధిక విధానాలపట్ల చూపితే ఎనిమిదేండ్ల తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యాల గురించి జనం చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్నది ఒక అభిప్రాయం. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన ఆర్ధికలక్ష్యాల సాధనలో వైఫల్యం చెందినట్లు బిజెపి నేత సుబ్రమణ్య స్వామి స్వయంగా చెప్పారు.2016 నుంచి వృద్ధి రేటు దిగజారిందన్నారు. మీరెందుకు నరేంద్రమోడీకి సలహా ఇవ్వటం లేదన్న ప్రశ్నకు స్వామి చెప్పిన సమాధానం మోడీని అభిశంచించటమే.” పూర్వకాలపు రుషుల ఉద్బోధనల ప్రకారం వినే శ్రద్ద ఉన్నవారితో మాత్రమే విజ్ఞానాన్ని పంచుకోవాలి” అన్నారు. నరేంద్రమోడీకి సరైన ప్రత్నామ్నాయం లేదని అభిమానులు చెబుతున్నారు కదా అన్నపుడు ” తాము దేశం వదలిపెట్టిన తరువాత భారత్‌ పతనం అవుతుందని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కూడా చెప్పారు, జరిగిందా అని స్వామి ఎదురు ప్రశ్నించారు. మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం లేదని తెలుసుకొని స్వామి ఇలా మాట్లాడుతున్నారని కొందరు చిత్రించవచ్చు గాని వాస్తవం ఏమిటో వారు నోరు విప్పలేరు. ఈ సందర్భంగా దేశ ఆర్ధిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.

2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25శాతానికి పెంచే విధంగా మేక్‌ ఇన్‌ ఇండియా పధకాన్ని 2014లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దీనికి గాను ఏటా 12-14శాతం చొప్పున ఈ రంగంలో వృద్ధి రేటు సాధిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్ల తరువాత చూస్తే ఇరవై ఐదుశాతానికి పెంచే లక్ష్యం 2025కు చేరనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికోసం నడిపించిన ప్రహసనాలు ఎన్నో. తొలి రోజుల్లో నరేంద్రమోడీ ఎడతెరిపిలేకుండా విదేశాలు చుట్టి రావటం గురించి విమర్శ వస్తే దేశంలో పెట్టుబడులు సాధించేందుకు, విదేశాల్లో అడుగంటిన ప్రతిష్టను తిరిగి నెలకొల్పేందుకే పర్యటనలని అధికారపక్షం బుకాయించింది. ప్రపంచ బాంకు సులభతర వాణిజ్య సూచికలో మన స్ధానం 2014లో 134 ఉండగా 2019 నాటికి 63వ స్ధానానికి నరేంద్రమోడీ తీసుకుపోయారు. అంతిమంగా సాధించిందేమిటి అంటే డబ్బాకొట్టుకొనేందుకు రాంకు పనికి వచ్చింది తప్ప జరిగిందేమీ లేదు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3శాతం కాస్తా 2020-21నాటికి 14.3శాతానికి దిగజారింది. కరోనా కారణంగా దిగజారింది అని ఎవరైనా బుకాయించవచ్చు, అసలు అంతకు ముందు పెరిగిందేమైనా ఉంటే కదా ? అందువలన 2025 నాటికి కనీసం 2014నాటి స్థితికైనా చేరతామా అన్నది ప్రశ్న.


ఈ దుస్థితికి కారణమెవరు? రెండు ఇంజన్ల పేరుతో కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నందున దిగజారుతున్న ఆర్ధిక దుస్థితికి వారే బాధ్యులు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్న మనం కరోనా వచ్చిన కారణంగా చైనాలో వృద్ధి రేటు తగ్గింది తప్ప మన మాదిరి తిరోగమనంలో లేదు.చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ప్రాణాంతకం కాకున్నా పరిమితంగా కేసులు నమోదైనప్పటికీ తాజాగా షాంఘై వంటి పట్టణాల్లో లాక్‌డౌన్‌ అమలు జరిపింది చైనా. మన దేశంలో అలాంటి పరిస్థితి లేకున్నా కరోనాకు ముందున్న ఆర్దిక వృద్ధి స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటికి చేరుకుంటుందో కూడా చెప్పలేము.


దేశంలో పారిశ్రామిక రంగం దిగజారటం లేదా స్థిరంగా ఉంటున్న ధోరణి తప్ప పెరుగుదల కనిపించటం లేదు.2006 నుంచి 2012వరకు పారిశ్రామిక కార్మికులు ఏటా 9.5శాతం పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో అది 7.4శాతానికి దిగజారింది. నిజవేతనాల పతనం కారణంగా కరోనాకు ముందే వినియోగం కూడా తగ్గింది.2019లో వార్షిక ప్రాతిపదికన నిజవేతనాలు 2.8శాతం తగ్గగా 2020 జనవరి-మార్చి నెలల్లో తగ్గుదల 5.3శాతం ఉంది.సిఇడిఏ-సిఎంఐఇ సమాచారం ప్రకారం 2017-2021 మధ్య ఉత్పాదక రంగంలో కార్మికుల సంఖ్య ఐదు నుంచి 2.9కోట్లకు తగ్గింది. స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీల వేతన బిల్లు 2018 సెప్టెంబరులో రు.53వేల కోట్లుండగా 2020జూన్‌ నాటికి రు.48,500 కోట్లకు తగ్గింది.2021 సెప్టెంబరులో రు.60వేల కోట్లుగా ఉంది.ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిజవేతనాలు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉపాధి తగ్గటంతో పాటు నిజవేతనాల పతనం కారణంగా గత దశాబ్దిలో గృహస్తుల రుణాలు రెట్టింపైనట్లు ఎస్‌బిఐ నివేదిక వెల్లడించింది.2018 భారత రుణ-పెట్టుబడి నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 84శాతం రుణభారం పెరగ్గా పట్టణాల్లో 42శాతం ఉంది.


మేకిన్‌ ఇండియా పధకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన ఆనవాలు గానీ కనిపించటం లేదు.2021-22 బడ్జెట్‌లో ఆత్మనిర్భర పేరుతో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సహకాల కోసం కేంద్ర ప్రభుత్వం రు.1.97లక్షల కోట్లు కేటాయించింది. చిత్రం ఏమిటంటే ఈ పధకం కింద లబ్ది పొందేందుకు పరుగులు పెట్టాల్సిన కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. ఎగుమతుల కోసం విద్యుత్‌ వాహనాలను తయారు చేసేది లేదని, మీ ప్రోత్సాహం అవసరం లేదని ఫోర్డ్‌ కంపెనీ 2022 మే 12న ప్రకటించింది. ఇక్కడున్న ఉత్పాదక సౌకర్యాలను వేరే దేశాలకు తరలించనున్నట్లుగా తెలిపింది. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్న కారణంగా అమెరికా, చైనాల్లో తయారైన విద్యుత్‌ వాహనాలను మన దేశంలో విక్రయించరాదని మరుసటి రోజే టెస్లా నిర్ణయించింది. ఫోర్డ్‌ కంపెనీ మూత కారణంగా నాలుగువేల ఉద్యోగాలు ప్రత్యక్షంగానూ, దేశమంతటా దాని డీలర్లు పరోక్షంగా సృష్టించిన మరికొన్నివేల ఉద్యోగాలు పరోక్షంగా హరీమంటున్నాయి.2017తరువాత జనరల్‌ మోటార్స్‌, మాన్‌ ట్రక్స్‌, హార్లేడేవిడ్సన్‌,యునైటెడ్‌ మోటార్స్‌ మూతపడిన కారణంగా తమ పెట్టుబడి రు.2,485 కోట్లు హరీ మన్నదని, 64వేల మందికి ఉపాధి నష్టం జరిగిందని డీలర్స్‌ సంఘం పేర్కొన్నది.


విదేశాల్లో మన ప్రతిష్ట పెంచామని, పెట్టుబడులను ఆకర్షించినట్లు, సులభతర వాణిజ్య పరిస్థితిని కల్పించినట్లు నరేంద్రమోడీ అండ్‌ కో చెబుతున్నదానిలో ఆర్భాటం-వాస్తవమెంతో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు చికాకు తెప్పిస్తున్నట్లు, వాటి బదులు ఏక రూప పన్నును అమలు చేస్తే ఉత్సాహంగా పెట్టుబడులు పెడతారంటూ జిఎస్‌టిని తెచ్చారు. అది కొన్ని రంగాలను దెబ్బతీసింది తప్ప పరిస్ధితిని చక్కదిద్దలేదన్నది తెలిసిందే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదికల ప్రకారం 2014-2021 కాలంలో నమోదైన విదేశీ కంపెనీల పెరుగుదల 2016లో 3.9శాతం ఉండగా 2021లో అది 1.5శాతానికి తగ్గింది.(216 నుంచి 63కు తగ్గాయి) ఇక చురుకుగా ఉండే కంపెనీలు ఇదే కాలంలో 80 నుంచి 66శాతానికి తగ్గాయి. ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా చైనాను పక్కకు నెట్టేసి మన దేశం ఆవిర్భంచనుందని ఎనిమిదేండ్ల క్రితం ఊదరగొట్టారు. గతేడాది చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు మన దేశానికి రానున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సిఎంల సమావేశంలో చెప్పారు. పత్రికలు అవి1000 అని రాశాయి. నిజమే అనుకొని కొందరు సిఎంలు సదరు కంపెనీలకు ఎర్రతివాచీలు పరిచేందుకు సిద్దం అన్నారు. దీని ప్రహసనం 2021పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో వెల్లడైంది.”కరోనా అనంతర ఆర్ధిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ:భారత్‌కు సవాళ్లు,అవకాశాలు ” అనే శీర్షిక కింద చైనా నుంచి వస్తున్నట్లు చెప్పిన కంపెనీల గురించి ఏం చెప్పారో చూడండి.”’ మీడియాల వార్తల ద్వారా తెలుసుకున్నదేమంటే ఈ కంపెనీల్లో అత్యధికం తమ సంస్థలను వియత్నాం, థాయిలాండ్‌, తైవాన్‌ తదితర దేశాలకు తరలించాయి తప్ప భారత్‌కు వచ్చింది కొన్ని మాత్రమే.” అసలు పార్లమెంటరీ కమిటీ పత్రికా వార్తల మీద ఆధారపడటం ఏమిటి ? ప్రభుత్వం తగ్గర సమాచారం లేదా ? ఉంటే అలా రాసి ఉండేవారు కాదు. చైనా నుంచి కంపెనీలు వెలుపలికి రావటం, విదేశాల నుంచి వెళ్లి అక్కడ కంపెనీలు పెట్టటం కొత్త కాదు. జపాన్‌ నొమురా బాంకు 2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు చైనా నుంచి 56 కంపెనీలు వెలుపలికి తరలితే భారత్‌కు వచ్చింది కేవలం మూడే అని తెలిపింది. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపి) 2013 నుంచి 2022 వరకు వార్షిక పెరుగుదల సగటు 2.9శాతం, కాగా ఇదే కాలంలో జిడిపి సగటు 5.5శాతం ఉంది. అంతకు ముందు 2006 నుంచి 2012వరకు సగటు ఐఐపి 9శాతం ఉంది. సామర్ధ్య వినియోగం 2015 నుంచి 2022 వరకు 70.9శాతం ఉంది, అది పదేండ్ల క్రితం 80శాతం. అంటే ఉన్నదాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాము. ఇదంతా మేకిన్‌ ఇండి పిలుపు తరువాత జరిగిందే సుమా !


తాను వస్తే జనాలకు మంచి రోజులు తెస్తానని మోడీ చెప్పారు. వాటికి వేతనాలు కీలకం. దేశంలో నిజవేతనాల రేటు పెరుగుదల ఎలా ఉందో చూద్దాం. (అంకెలు శాతాలని గమనించాలి.) మొత్తంగా చూసినపుడు 2011-12కు ముందు ఉన్న పెరుగుదలతో పోల్చితే తరువాత కాలంలో గణనీయంగా తగ్గింది. రెగ్యులర్‌ సిబ్బందికి పెరగకపోగా తగ్గిపోవటాన్ని చూడవచ్చు.(ఆధారం ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, వర్కింగ్‌ పేపర్‌ 01-2020)
2004-05 నుంచి 2011-12 ×××××××× 2011-12 నుంచి 2017-18
తరగతి×××మొత్తం×× కాజువల్‌××రెగ్యులర్‌ ×××మొత్తం×× కాజువల్‌××రెగ్యులర్‌
గ్రామీణ×××6.10 ×× 8.04 ×× 3.02 ××× 2.91 ×× 2.34 ×× -0.22
పట్టణ ×××4.55 ×× 6.42 ×× 4.10 ××× -1.49 ×× 1.10 ×× -2.05
పురుష ×××4.77 ×× 7.08 ×× 3.78 ××× 0.75 ×× 2.23 ×× -1.75
మహిళ×××7.92 ×× 8.24 ×× 4.87 ××× 2.31 ×× 1.34 ×× -1.38
మొత్తం ×××5.52 ×× 7.75 ×× 3.91 ××× 1.05 ×× 2.26 ×× -1.76
రైతాంగానికి 2022 నాటికి వారి ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది ప్రధాని నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలలో ఒకటి. అది నెరవేర్చకపోగా వారికి మొత్తంగా ఎసరు పెట్టి కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాలను రుద్దేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. ఏడాది పాటు చారిత్రాత్మకంగా జరిపిన పోరు నేపధ్యంలో క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని ప్రకటించి ఆరునెలలు దాటినా దాని ఊసే లేదు.
2015-16ను ప్రాతిపదికగా చేసుకొని 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. దీనికి గాను ఏటా 10.4శాతం వార్షిక వృద్ది రేటు అవసరమని అంచనా. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇంతవరకు సమగ్ర సమాచారమే లేదు.వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారంగా 2019 జనవరి-డిసెంబరు మధ్య సేకరించిన 77వ దఫా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వివరాలే ఉన్నాయి. దాని ప్రకారం 2012-13లో రైతు కుటుంబ నెలవారీ ఆదాయం సగటున రు.6,426 ఉండగా 2019నాటికి రు.10,218కి పెరిగింది. అంటే నరేంద్రమోడీ ప్రకటనతో నిమిత్తం లేకుండానే ఇది జరిగిందని గమనించాలి. అందువలన ఎలాగూ ఎంతో కొంత పెరుగుతుంది గనుక దాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చన్న ఆలోచన బిజెపికి వచ్చిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.2019నాటి పెరుగుదల వివరాలను గమనిస్తే అసలు కథ తెలుస్తుంది. రైతులు తమ పొలంలో సాగుతో పాటు వేతన కూలీలుగా, కోళ్లు, పాడిపశువుల పెంపకం వంటి ఉప వృత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతారు.రైతుల ఆదాయవనరులు, వాటి తీరు తెన్నులు ఇలా ఉన్నాయి.నెలవారీ ఆదాయం రూపాయల్లో ఉంది.
వనరు×××××2012-13×××× 2018-19
వేతనం××××× 2,071 ×××× 4,043
పంటలు××××× 3,081 ×××× 3,798
పశుపాలన×××× 763 ×××× 1,582
ఇతరం ××××× 511 ×××× 795
మొత్తం××××× 6,426 ×××× 10,218
పై వివరాలను గమనించినపుడు వేతన, పశుపాలన ఆదాయం పెరుగుదల దాదాపు రెట్టింపు ఉంది.పంటల ఆదాయం ఆమేరకు లేదు. ఇతరంగా వచ్చే ఆదాయం అంటే కౌలు ద్వారా ఇతర అవసరాలకు భూమిని ఇవ్వటం ద్వారా పొందేది.2020-21 ఆర్ధిక సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 2014-2021 సంవత్సరాల్లో పరిస్ధితి అంచనా సర్వే(ఎస్‌ఏఎస్‌) ప్రకారం రైతులకు వచ్చే ఆదాయంలో పంటల నుంచి వచ్చే మొత్తం 48 నుంచి 37శాతానికి తగ్గింది.వేతనం ద్వారా వచ్చే మొత్తం 32 నుంచి 40శాతానికి, పశుపాలన ద్వారా వచ్చేది 12 నుంచి 16శాతానికి పెరిగింది. దీన్ని బట్టి పంటలకు తగినంతగా మద్దతు ధర కల్పించకపోవటం, లేదా మార్కెట్‌ శక్తుల దోపిడీ కారణంగా రావాల్సినంత రాకపోవటంగానీ జరుగుతున్నది. ఈ కారణంగానే కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేసేందుకు దారి తీసే మూడు సాగు చట్టాల రద్దుకు రైతాంగం తీవ్రంగా పోరాడిందని, దానికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేసినట్లు భావించవచ్చు.ఆదాయంలో వేతనం ద్వారా పెరిగింది ఎక్కువగా ఉండటాన్ని బట్టి రైతులు కూలి మీద ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా చెప్పవచ్చు.


రైతాంగ ఆదాయం రు.10,218 అన్నది దేశ సగటు. రాష్ట్రాల వారీ ఎగుడుదిగుడులు ఉన్నాయి.పద్దెనిమిది వేలు అంతకు మించి పొందున్నవారు మేఘాలయ, పంజాబ్‌, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌, జమ్ము-కాశ్మీరుల్లో ఉండగా ఎనిమిదివేలకు తక్కువ వచ్చే వారు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషా, ఝార్కండ్‌లో ఉన్నారు. సాగు చట్టాలపై దేశమంతటా రైతులు ఒకే విధంగా స్పందించకపోవటానికి ఇది కూడా కారణం కావచ్చు, ఎక్కువ ఆదాయం పొందుతున్నవారిలో ఉన్న ఆందోళన తక్కువ పొందే వారిలో ఉండకపోవటం సహజం.


పంటల దిగుబడి పెంచటం ద్వారా రైతాంగ ఆదాయం పెంచవచ్చని కొందరు చెబుతారు. అది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సాగు ఖర్చులు స్థిరంగా ఉంటే దిగుబడి పెరిగితే రాబడి పెరుగుతుంది. కానీ దేశంలో ఆ పరిస్థితి ఉందా ? పెరుగుతున్న ఎరువులు, పురుగుమందులు ధరలు, వేతన, యంత్రాల వినియోగ ఖర్చు పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదన్న అభిప్రాయంతో అనేక మంది సాగుమాని కౌలుకు ఇవ్వటం వంటి వాటికి మరలుతున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితంతో పోల్చితే 2013-14లో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 265.05మిలియన్‌ టన్నుల నుంచి 2021-22లో 305.43మి.టన్నులకు పెరిగిందని అంచనా. ఇదే కాలంలో వరి,గోధుమల కనీస మద్దతు ధరలు రెట్టింపు కాలేదు. వరి ధర రు.1,310 నుంచి 1,940, గోధుమలకు రు.1,400 నుంచి 2,015కు పెరిగింది. కేవలం 14శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరల వలన లబ్దిపొందుతున్నట్లు అంచనా.కనీస మద్దతు, గిట్టుబాటు ధరలను కల్పించే బాధ్యతను తీసుకొనేందుకు మొరాయిస్తున్న పాలకులు రైతాంగానికి గిట్టుబాటు కల్పించే పేరుతో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారు. దీని వలన వ్యవసాయకార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతున్నది. మేకిన్‌ ఇండియా మాదిరిగానే రైతుల ఆదాయాల రెట్టింపు అన్నది ఒక కలగానే ఉంది.

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాషాయదళాల ముస్లిం వ్యతిరేక ప్రచారం -నిందలూ, నిజాలు !

29 Friday Apr 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, RSS, Saffron gang


ఎం కోటేశ్వరరావు


” 2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు ” హిందువులారా బహుపరాక్‌, జాగ్రత్త పడండి,హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వశక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాలదృక్పధం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి ? ఇప్పటికి దేశంలో జకీర్‌ హుసేన్‌, ఫకృద్దీన్‌ అలీ అహమ్మద్‌, అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ రాష్ట్రపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి ? రాష్ట్రపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?


ఐరోపాలో, ఆసియాలో తలెత్తిన జాతీయవాదాలు భిన్నమైన నేపధ్యాలు, లక్ష్యాలతో ముందుకు వచ్చాయి. ప్రతి చోటా వినాశనానికే దారి తీశాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం కులాలు, మతాలు, భాషా, ప్రాంతీయతలకు అతీతంగా జరిగింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం, హిందూమహాసభలు ముందుకు తెచ్చిన జాతీయవాదానికి ప్రాతిపదిక పరమత విద్వేషం – హిందూత్వ. జర్మనీలో జర్మన్‌ జాతి పవిత్రతను కాపాడేపేరుతో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారు, అది ఐరోపా అంతటినీ ప్రభావితం చేసింది. అనేక దేశాల్లో యూదుల ఊచకోతకు దారి తీసింది. మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.


” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041నాటికి దేశంలో ముస్లిం జనాభా 84శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృత్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.


వాస్తవం ఏమిటి ? మన జనాభాలెక్కల ప్రకారం 1951లో 84.1శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగుదశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ” పూ ” వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్దాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్టరూపం దాల్చితే 80శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?


” బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్‌ వచ్చిందా జెండాపై రంజాన్‌ చంద్రుడే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో ! ” అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ” కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్‌ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు ” మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విషసర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తంగావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్‌ తరాల మతమార్పిడులకు అడ్డుకట్టవేశారు. మోడీగారు చాలా కష్టపడాలి, పడతారు కూడా. అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి. అని పేర్కొన్నారు. ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడు నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్దం ప్రచారంలో పెట్టారు. నరేంద్రమోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత ఐదు సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే ” చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” అన్నారు. 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు.


1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.


దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. .2011లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?


2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.


ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి బుకాయింపులు – అసలు రంగు !

15 Tuesday Mar 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, BSP, Narendra Modi, RSS, Samajwadi Party, UP election 2022


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి తాళం కప్ప బహుమతి – ఒక మంత్రి, 15 మంది ఎంఎల్‌ఏలు రాం రాం !

12 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, Hinduthwa, Narendra Modi, OBC, Swami Prasad Maurya, UP BJP poll fate, UP poll 2022, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపికి అనూహ్య బహుమతి లభించగా, ఊహించని దెబ్బ తగిలింది. దాదాపు 60 మంది ఎంఎల్‌ఏలను తప్పించి కొత్త ముఖాలతో బరిలోకి దిగేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు. కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య పదవికి రాజీనామా చేసి సమాజవాది పార్టీ నేతతో ఫొటోకు ఫోజిచ్చారు. మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు కూడా అదే బాట పట్టారు. పదమూడు మంది బిజెపి ఎంఎల్‌ఏలు రాజీనామా చేయనున్నట్లు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. తన బాటలో నడిచే వారు 15 మంది వరకు ఉన్నట్లు మౌర్య చెబుతున్నారు. మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సయానీ కూడా ఇదే బాటపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. సీట్లు రాని వారు, బిజెపి గెలిచే అవకాశాలు లేవని గ్రహించిన వారు ఎందరు రాం రాం చెబుతారో తెలియదు. మార్చి పదవ తేదీ తరువాత పార్టీ కార్యాలయాన్ని మూసుకోవాల్సి వస్తుంది కనుక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌కు తాళం కప్పను బహుమతిగా పంపినట్లు సమాజవాది పార్టీ నేత ఐపి సింగ్‌ ప్రకటించారు. ” ఓం ప్రకాష్‌ రాజభర్‌, జయంత్‌ చౌదరి, రాజమాత కృష్ణపటేల్‌, సంజయ చౌహాన్‌, ఇప్పుడు స్వామి ప్రసాద్‌ మౌర్య మాతో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయానికి తాళం కప్పను బహుమతిగా పంపాను. మార్చి పదవ తేదీ(ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) తరువాత తాళం వేసి ఇంటికి వెళ్లి పోండి. ఇది అలకాదు, ఎస్‌పి తుపాను ” అని ట్వీట్‌ చేశారు.


యోగి సర్కార్‌ ఒబిసిలు, దళితులు, రైతులు,చిన్న సన్నకారు వ్యాపారులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఇది వెలువడిన కొన్ని నిమిషాల్లోనే మౌర్య సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసిన ఫొటో దర్శనమిచ్చింది.స్వామి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అఖిలేష్‌ ప్రకటించారు. ఐదు సార్లు ఎంఎల్‌ఏగా, మంత్రిగా పనిచేసి మాయావతి తరువాత నేతగా పేరున్న మౌర్య 2016లో బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు సమాజవాదిలో నేరుగా చేరతారా లేక గతంలో ఏర్పాటు చేసిన వేదికను పునరుద్దరించి మిత్రపక్షంగా బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల గురించి వివిధ సర్వేలు వెలువడుతున్నాయి. ఏబిపి-సి ఓటర్‌ 2021 మార్చి 18న ఒక సర్వే, తాజాగా జనవరి 10న సర్వే వివరాలను ప్రకటించింది.మధ్యలో మరోనాలుగు సర్వేలను నిర్వహించింది.తొలి, తాజా సర్వేల అంచనా సీట్లు, ఓట్లశాతాలు ఇలా ఉన్నాయి.తొమ్మిది నెలల కాలంలో బిజెపి పలుకుబడి ఎలా పడిపోతోందో ఈ వివరాలు సూచిస్తున్నాయి. నామినేషన్లు, ఉపసంహరణల లోగా జరిగే పరిణామాలు పార్టీ ప్రభావాన్ని మరింతగా దిగజార్చేవే తప్ప పెంచేవిగా లేవు.


తేదీ××××××ఎన్‌డిఏ ×××××××ఎస్‌పి×××××××బిఎస్‌పి×××××××కాంగ్రెస్‌×× ఇతరులు
18.3.21××284-294(41)×××54-64(24.4)×××33-43(20.8)××1-7(5.9)××10-16(7.9)
10.1.22××223-235(41.5)××145-157(33.3)××8-16(12.9)××3-7(7.1)××4-8(5.3)
గతఫలితాలు××312(41.4)××47(23.6)××××19(22.2)××××××× 7(6.3)××××ు(6.5)


తన వంటి ఉదారవాదులు బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌లో అదే జరిగితే దేశంలో సంస్కరణలు వెనుకపట్టు పడతాయని కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ అంక్లేశ్వరియా అయ్యర్‌ పేర్కొన్నారు. ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రతినిధితో మాట్లాడుతూ సాగు చట్టాల ప్రహసనంతో ఇప్పటికే సంస్కరణలు వెనుకపట్టు పట్టాయి.మానిటైజేషన్‌, కార్మిక సంస్కరణలు కూడా అదే విధంగా మారతాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెలువడుతున్న చెడు సంకేతాల కారణంగా మానిటైజేషన్‌ మందగించిందన్నారు. బిజెపి గెలిస్తే సంస్కరణలు వేగంగా అమలు జరుగుతాయని, ఓడితే మిగతా రాష్ట్రాల సంస్కరణల మీద కూడా ప్రభావం ఉంటుందన్నారు. దేశ ఆర్ధిక రంగం ఏ బాటలో నడుస్తుందన్నది వచ్చే బడ్జెట్‌ మీదగాక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. బిజెపి మతతత్వ వైఖరిని అయ్యర్‌ వంటి వారు ఆమోదించనప్పటికీ సమాజం ఏమైనా ఫరవాలేదు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గెలవాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ల అంతరంగానికి ఇది ప్రతిబింబం.


సీట్ల సంఖ్య తగ్గినా తిరిగి అధికారం ఖాయం అనే ముక్తాయింపులు తప్ప గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లశాతం పెరుగుతుందని ఏ సర్వే కూడా చెప్పటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెబుతున్నపుడు ఓట్లు తగ్గకుండా ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది.తన ఓటు బాంకును నిలుపుకొనేందుకు యోగి ఆదిత్యనాధ్‌ రాష్ట్ర ఎన్నికలు 80-20శాతాల మధ్య జరగనున్నాయంటూ మతాన్ని ముందుకు తెచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 80శాతం హిందువులు, 20శాతం ముస్లింలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.403కు గాను 140 నియోజకవర్గాలలో 70 చోట్ల ఓటర్లలో 30శాతం, మిగిలిన చోట్ల 25-30శాతం వరకు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారున్నారని అంచనా. బిజెపి బీ టీమ్‌గా భావిస్తున్న మజ్లిస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది, ఐనప్పటికీ అత్యధిక ఓటర్లు ఎస్‌పి వైపు మొగ్గు చూపనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిఎస్‌పిలో మాయావతి తరువాత స్ధానంలో ఉన్న మౌర్య తమ పార్టీలో చేరినపుడు గొప్ప పరిణామంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఒక రోజు సంచలన వార్త తప్ప ఏదో ఒక రోజు ఇలా చేస్తారని తమకు తెలుసు అని బిజెపి చెబుతోంది. కుమార్తె సంఘమిత్ర ఎంపీగా ఉన్నారని, తన కుమారుడికి సీటు ఇవ్వాలన్న కోర్కెను పార్టీ తిరస్కరించినందున ఇలా చేశారని ఆరోపించింది.(గత ఎన్నికల్లో సీటు ఇచ్చారు, సమాజవాదీ చేతిలో ఓడారు) బిజెపి విధానానికి వ్యతిరేకంగా ఓబిసి జన గణన చేయాలని కోరిన వారిలో మౌర్యఒకరు.


సమాజవాదితో మౌర్య చేతులు కలిపితే యాదవేతర ఓబిసిల్లో కొంత శాతం బిజెపికి దూరమైనా ఫలితాలు చాలా చోట్ల తారుమారౌతాయి. వెనుకబడిన తరగతుల్లో మౌర్య, కుష్వాహ సామాజిక తరగతికి చెందిన వారిలో స్వామి ప్రసాద్‌ మౌర్య పలుకుబడి కలిగిన నేత. ఇదే సామాజికి తరగతికి చెందిన కేశవ ప్రసాద్‌ మౌర్య ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అంతపలుకుబడి కలిగిన వారని కాదని చెబుతారు. ఇప్పటికే బిజెపి కూటమి నుంచి మరో రెండు బిసి సామాజిక తరగతుల నేతలు సమాజవాది పార్టీతో చేతులు కలిపారు.యాదవులు మినహా మిగిలిన ఓబిసిలందరూ తమతో ఉన్నారని బిజెపి చెప్పుకొనేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కాంగ్రెస్‌కు చెందిన బలమైన నేత ఇమ్రాన్‌ మసూద్‌ కూడా తాను ఎస్‌పిలో చేరుతున్నట్లు ప్రకటించారు. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీల వెనుక చీలి ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ఇప్పుడు ఎస్‌పి వెనుక సమీకృతులౌతున్నట్లు చెబుతున్నారు. గతంలో ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో మతఘర్షణల్లో జాట్లు-ముస్లింలు మతాల వారీ చీలినప్పటికీ ఇటీవలి రైతు ఉద్యమం వారిని సన్నిహితం చేసిందని వార్తలు వచ్చాయి. ఏడు దశలుగా జరిగే ఎన్నికల్లో తొలి రెండు దశలకు జనవరి 14న నామినేషన్లు ప్రారంభమౌతాయి. ఈ దశల్లోని 113 సీట్లకు ముందుగా బిజెపి అభ్యర్దులను ఖరారు చేయనుంది. సమాజవాది కూడా అదే పద్దతిని పాటించవచ్చు. తాను పోటీ చేయటం లేదని ప్రకటించిన మాయావతి బిఎస్‌పి తరఫున అన్ని చోట్లా పోటీ పెట్టనున్నట్లు ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

26 Friday Nov 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, farm acts repeal, farm laws, Farmers agitations, Hindutva groups, Jats, Muslims, Narendra Modi, Narendra Modi Failures, RSS, Sikhs


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతోన్మాదం దేన్నీ వదలదు : రామాయణ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది దుస్తులు – శబరిమల హలాల్‌ బెల్లం !

23 Tuesday Nov 2021

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

BJP, halal issue in Kerala, RSS, supremacism, uniform of Ramayan Express staff


ఎం కోటేశ్వరరావు


ఉజ్జయని పీఠాధిపతులకు కోపం వచ్చింది. ఢిల్లీలో రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. వెంటనే రైల్వే అధికారులు వారి డిమాండ్‌కు తలొగ్గారు. రైతులు కూడా మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ముందు కేంద్రాన్ని కోరారు. వినలా, తరువాతే ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. బిజెపి పాలకులు ఏడాది పాటు వారిని నానా ఇబ్బందులకు గురిచేశారు. దేశంలో అనేక మంది పీఠాధిపతులు, లక్షలాది మంది సాధువులున్నారు. కానీ ఉజ్జయని వారికే ఆగ్రహం వచ్చింది. కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది.లక్షలాది మంది రైతులకు లేని బలం, పలుకుబడి కొద్ది మంది పీఠాధిపతులకు ఉందంటే దేశాన్ని నడిపిస్తున్నది మతశక్తులే అన్నది మరోసారి రుజువైంది.


ఇంతకీ వారికి కోపం ఎందుకు వచ్చింది ? రామాయణ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైల్వే ఒక ప్రత్యేపాకేజ్‌తో పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుపుతున్నది. దానిలో ప్రయాణించే వారికి అవసరమైన భోజన సదుపాయాలను సమకూర్చే సిబ్బందికి సాధువుల మాదిరి కాషాయ రంగు బట్టలు,రుద్రాక్షలతో ఏకరూప దుస్తులను ఇచ్చారు. ఇలా దుస్తులు వేసి సేవలందించటం హిందూమతాన్ని అవమానించటమే అని ఉజ్జయని పీఠాధిపతులకు ఆగ్రహం వచ్చింది. వాటిని విప్పించకపోతే డిసెంబరు 12న ఢిల్లీలో రైలును ఆపివేస్తామని చెప్పారు. రెండురోజుల్లో అధికారులు మార్చివేశారు. సాధువుల మాదిరి ఏకరూప దుస్తులు మతాన్ని, పీఠాధిపతులను అవమానించటమే అని ఉజ్జయని అఖారా పరిషత్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేష్‌ పూరీ చెప్పారు.హిందూమతాన్ని రక్షించుకొనేందుకు రైలు మార్గంపై బైఠాయిస్తామన్నారు.


ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఢిల్లీ అధికారపెద్దలకు కాషాయ రంగంటే ప్రీతి కనుక వారి మనసెరిగి రైల్వే అధికారులు సాధువుల మాదిరి సిబ్బందికి దుస్తులను నిర్ణయించారు. కొత్తగా రూపొందిచిన వాటిలో నల్లపాంట్లు, తెల్ల షర్టులతో పాటు కాషాయ రంగు మాస్కులు, చేతులకు అదే రంగు తొడుగులను ఏర్పాటు చేసి సగం హిందూత్వను కాపాడామన్నట్లుగా అధికారులు పెద్దలను సంతుష్టీకరించారు. ఒక సారి ఉన్మాదాన్ని ఎక్కించిన తరువాత అది మెజారిటీ – మైనారిటీ, జాతీయవాదం ఏదైనా సరే ఎక్కించిన వారు కూడా దాన్ని అదుపు చేయలేరు. ఒకసారి వెర్రితలలు వేసిన తరువాత వారు చేసేదేమీ లేదు. అదుపు చేసేందుకు పూనుకుంటే వారు కూడా దానికి బలైనా ఆశ్చర్యం లేదు. వారి చేతిలో ఉండదు.


కేరళలో అధికారానికి అవసరమైన సీట్లను తెచ్చుకుంటామని ప్రగల్భాలు పలికి, మెట్రోమాన్‌ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించుకున్న బిజెపి పొందిన పరాభవం తెలిసిందే. అంతకు ముందున్న ఒక్కసీటును, ఓట్లను కూడా గణనీయంగా పోగొట్టుకుంది. గతంలో శబరిమల ఆందోళనపేరుతో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఎన్నికల్లో లబ్దిపొందాలని చూశారు, రెచ్చగొట్టారు, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు.చివరికి దొంగడబ్బు పంపిణీలో వాటాలు కుదరక దొరికిపోయి కేసులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనేమీ లేక ఇప్పుడు కొత్త వివాదంతో జనాల మనోభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అదేమంటే శబరిమల ఆలయానికి హలాల్‌ చేసిన బెల్లాన్ని సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మాంసానికి కోసే కోడి,మేక వంటిది కాదు బెల్లం, దానికి హలాల్‌ ఏమిటి ? బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టగల సమర్దులు. శబరిమలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు కనుగొన్నారట. మన దేశం నుంచి గల్ఫ్‌దేశాలకు ఎగుమతి చేసే వాటిలో మాంసంతో సహా అనేక ఉత్పత్తులు ఉంటాయి. వాటిని దిగుమతి చేసుకొనే దేశాల వ్యాపారులు హలాల్‌ ధృవీకరణ పత్రం ఉందా లేదా అని అడుగుతారు. ఉంటేనే కొనుగోలు చేస్తారు.


అందువలన అలాంటి లావాదేవీలు నిర్వహించేవారు ముస్లింలైనా మరొక మతం వారైనా హలాల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిందే. దాన్ని కూడా రాజకీయం చేసి పోగొట్టుకున్న మద్దతునైనా తిరిగి తెచ్చుకోవాలని బిజెపి పూనుకున్నట్లు కనిపిస్తోంది. హలాల్‌ చేసేందుకు ముస్లిం మతపెద్దలు ఆహారం మీద ఉమ్మివేస్తారంటూ సామాజికమాధ్యమంలో రెచ్చగొడుతున్నారు.శబరిమల ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్న బెల్లాన్ని వాడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌జెఆర్‌ కుమార్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ వేశారు.వివరాల్లోకి వెళితే గతేడాది బెల్లం సరఫరా టెండరు పొందిన మహారాష్ట్ర కంపెనీల యజమానులెవరూ అసలు ముస్లింలు కాదు. ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి సరఫరా చేస్తున్న ఎస్‌పి ఆగ్రోప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్లు సమీర్‌ సురేష్‌ పాటిల్‌, సురేష్‌ సాహెబ్‌రావు పాటిల్‌,సరితా సురేష్‌ పాటిల్‌, మతి ఉండి చేసే ఫిర్యాదులేనా ఇవి. ఆ కంపెనీ గల్ఫ్‌ దేశాలకూ బెల్లం ఎగుమతులు చేస్తోంది. వారికి హలాల్‌ సర్టిఫికెట్‌ అవసరం కనుక తీసుకున్నారు. ప్రతి సంచిమీద దాని నంబరు ముద్రించారు. దాన్ని పట్టుకొని బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఈ వివాదం ద్వారా దేవస్ధానానికి నష్టం కలిగించే కుట్రవుందని అయ్యప్పతో సహా అనేక దేవాలయాలను పర్యవేక్షించే తిరువాన్కూర్‌ దేవస్ధానం బోర్డు హైకోర్టుకు తెలిపింది.


ఇదిలా ఉండగా కేరళ అంతటా పలుదుకాణాల ముందు హలాల్‌ బోర్డులు కొత్తగా వెలిశాయంటూ వాటిని నిషేధించాలని బిజెపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నవంబరు 25న ప్రదర్శనలు జరుపుతామని ప్రకటించింది. ఇదిసాంఘిక దురాచారమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధీర్‌ వర్ణించారు.హలాల్‌ ఒక మతాచారమని తాము భావించటం లేదని ఇస్లామిక్‌ పండితులు కూడా సమర్ధిస్తారని తాను అనుకోవటం లేదని, ఉగ్రవాద సంస్ధలు కేరళ సమాజంలో మతపరమైన అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్నాయని, మతపరంగా చేస్తే పెద్దలు పూనుకొని సరి చేయాలన్నారు. బిజెపి నేతలు మత అజెండా గురించి మాట్లాడటం దొంగేదొంగ అనటమే. సుధీర్‌కు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ మాట్లాడుతూ హలాల్‌ బోర్డులు అమాయకంగా, అనుకోకుండా పెట్టినవి కాదన్నారు. జనాన్ని చీల్చేందుకు చేస్తున్నారన్నారు. హిందూత్వ బిజెపితో కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే క్రైస్తవ పార్టీ నేత పిసి జార్జి కూడా గొంతుకలిపారు.హలాల్‌ ఆహారం మతఛాందసంలో భాగమే అన్నారు. ఆహారం మీద ఉమ్మటం ముస్లింలకు ఒక విధి, మూడుసార్లు ఉమ్ముతారని, శబరిమల ప్రసాదానికి హలాల్‌ బెల్లాన్ని వినియోగించరాదని క్రైస్తవమత టీవీ ఛానల్‌ ఒకదానిలో చెప్పారు.

బెల్లానికి హలాల్‌తో ముడిపెట్టటాన్ని బిజెపి అధికార ప్రతినిధి సందీప్‌ వారియర్‌ ఫేస్‌బుక్‌లో రాస్తూ తప్పుపట్టారు. మతాల వారు ఒకరి మీద ఒకరు ఆర్ధికపరమైన ఆంక్షలతో జీవించలేరని పేర్కొన్నారు. కోజికోడ్‌లోని పారగాన్‌ హౌటల్‌ మీద సామాజిక మాధ్యమంలో చేస్తున్న దాడిని తాను ఖండించానని అయితే దానిని మీడియా పార్టీ వ్యతిరేఖ వైఖరిగా వక్రీకరించిందని, దాంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశం మేరకు పోస్టును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి సందీప్‌ స్పందన తరువాత బిజెపి ఇరకాటంలో పడి అతని మీద వత్తిడి తెచ్చిందన్నది స్పష్టం. ఇతర మతాల మీద విశ్వాసం ఉన్నవారు కూడా హలాల్‌ హౌటళ్లలో తినేందుకు, పని చేసేందుకు వస్తారని, సేవారంగం దెబ్బతింటే ఎన్నోకుటుంబాలు దారిద్య్రంలోకి కూరుకుపోతాయని, ఇలాంటి అంశాలపై చర్చలో ఉండాల్సింది హేతువు తప్ప ఉద్రేకం కాదన్నారు సందీప్‌.


వివిధ సామాజిక తరగతుల మధ్య లౌకిక వారధిగా ఉన్న ఆహారం మీద సంఘపరివార్‌ దాడిని కేంద్రీకరించిందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. సమాజంలోని మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, కొడియరి బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేసినా మొత్తం మీద కేరళలో ఫలించలేదని బాలకృష్ణన్‌ అన్నారు.హలాల్‌ చర్చ అనవసరమని తెలిసి కూడా ఇక్కడ వివాదాన్ని సృష్టించేందుకు పూనుకున్నారని అన్నారు.


హలాల్‌ ఆహారంపై విష ప్రచారం చేస్తున్న శక్తుల మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర రెస్టారెంట్లు, హౌటల్స్‌ సంఘం ముఖ్యమంత్రి విజయన్ను కోరింది. గుజరాత్‌లో సంఘపరివార్‌ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి విభజన తేవటంలో విజయం సాధించిందని, అక్కడ ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు నిర్వహించే వాటిని పాకిస్తాన్‌ హౌటల్స్‌ అని పిలుస్తారని ఎంఏ బేబీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని శక్తులకు పోటీగా ఇతర మతాలకు చెందిన ఛాందసవాదులు కొత్త డిమాండ్లను ముందుకు తేవచ్చని స్వచ్చమైన శాఖాహారం వంటి బోర్డులకు వ్యతిరేకంగా డిమాండ్లు ముందుకు రావచ్చని అన్నారు.నిజానికి ఇలాంటి బోర్డుల వలన వినియోగదారులు తాము కోరుకుంటున్న ఆహారం, పానీయాలు దొరికేదీ లేనిదీ తెలుసుకుంటారని అన్నారు.ఇలాంటి ఛాందసడిమాండ్లకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హలాల్‌ డిమాండ్‌ సమాజ-జాతీయ-రాజ్యాంగ వ్యతిరేక వైఖరని, కేరళలో అది కుదరదని బేబీ చెప్పారు.
తెలుగునాట ఇప్పటికీ అనేక ప్రాంతాలలో హౌటళ్లు, మెస్‌లకు బ్రాహ్మణ, ఆర్య-వైశ్య, రెడ్డి, క్షత్రియ, చౌదరి అని కులాలు, విజయవాడ, ఏలూరు, గుంటూరు భోజనం అనీ, హైదరాబాద్‌ బిర్యాని, ఉడిపి, కల్కూర ఇలా అనేక రకాల పేర్లను తగిలించటం తెలిసిందే. రంజాన్‌ మాసంలో అనేక పట్టణాలలో ప్రత్యేక వంటకంగా ముస్లింలు నిర్వహించే హౌటళ్లలో విక్రయించే హలీంను కుల,మతాలతో నిమిత్తం లేకుండా అందరూ లొట్టలు వేసుకుంటూ తినే అంశం తెలిసిందే. ఇక బిర్యాని సంగతి చెప్పనవసరం లేదు.అక్కడ హలాల్‌ క్రతువు నిర్వహిస్తారని తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d