• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: STATES NEWS

గుజరాత్‌ అభివృద్ధి గురించి నరేంద్రమోడీ నోటికి తాళం ఎందుకు వేసుకున్నట్లు ?

19 Tuesday Mar 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Gujarat, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Gujarat development model, Gujarat Fail In Poverty Alleviation, Gujarat growth, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య కాలంలో టీవీలు, సామాజిక మాధ్యమాలను చూస్తున్నవారికి నరేంద్రమోడీ గ్యారంటీల గురించి చెవుల తుప్పు వదలగొడుతున్నారు. గత పదేండ్లలో ఒకసారి చెప్పిన దానిని మరోసారి మాట్లాడటం లేదు గనుక మామూలుగా చెబితే జనం నమ్మే స్థితి లేదు అందుకే నన్ను నమ్మండి పక్కా గ్యారంటీ అని చెప్పటం తప్ప మరొకటి కాదు.పదేండ్ల క్రితం గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశమంతటా అమలు జరుపుతామని ఎన్నికల సందర్భంగా మోడీ జనానికి ఇచ్చిన గ్యారంటీ గురించి ఎక్కడా ప్రస్తావించటం లేదు. గుజరాత్‌ విజయ గీతాలాపన లేదు.ఎందుకు ? నరేంద్రమోడీ ప్రధానిగా అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నివేదికలను రూపొందించటం, సిఫార్సులు చేయటం తప్ప వాటికి ఎలాంటి గ్యారంటీ లేని నీతి అయోగ్‌ పేరుతో ఒక అజాగళ స్థనం వంటి సంస్థను ఏర్పాటు చేశారు. సదరు సంస్థ వెల్లడించిన సమాచారం 2019-21 సంవత్సరాలలో బహుముఖ దారిద్య్ర సూచికలో గుజరాత్‌ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో రెండింజన్ల పాలన, దానికి స్వయంగా నరేంద్రమోడీ డ్రైవరుగా ఉన్న చోట ఇలా ఉంది గనుకనే దాని గురించి మాట్లాడరు. బిజెపి లేని రాష్ట్రాలలో మాత్రం రెండింజన్లని కబుర్లు చెబుతారు.దశాబ్దాల తరబడి బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్‌ దారిద్య్ర నిర్మూలనలో వెనుకబడింది.


ఇక్కడ అభివృద్ధి అంటే పరిశ్రమల గురించి చెబుతారు. నరేంద్రమోడీ సిఎంగా అధికారానికి రాక ముందే ఉమ్మడి బొంబాయి ప్రోవిన్స్‌లో నేటి గుజరాత్‌ ప్రాంతాలు పారిశ్రామికంగా ముందున్నాయి.ఒకసారి ఒక చోట పరిశ్రమలు కేంద్రీకృతమైతే అక్కడే మరింతగా పెరగటం ప్రపంచ వ్యాపితంగా ఉన్న పరిణామం. పరిశ్రమలు ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదు. అలాగైతే అమెరికాలో ఇప్పటికీ మన ఉచిత బియ్యం పథకం మాదిరి ఉచిత ఆహార కూపన్లు ఉండేవి కాదు. గుజరాత్‌లో పరిశ్రమల వృద్దికి అక్కడి భౌతిక పరిస్థితులే కారణం తప్ప మోడీ గొప్పతనం కాదు.రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపు సగం ఎడారి ప్రాంతం గనుక అక్కడ వ్యవసాయానికి తావుండదు. మన దేశంలో ఇప్పటికీ ఉపాధి వ్యవసాయరంగంలోనే ఉంది, అలాంటి అవకాశం అక్కడ ఉండదు. వాణిజ్య రంగంలో గుజరాతీల వలసలకు అదొక ప్రధాన కారణం.కచ్‌ ప్రాంతంలో ఉప్పు పండిస్తారు, అది ఏడాది మొత్తం ఉండదు. అందుకే గుజరాత్‌ ప్రాంతంలో స్వాతంత్య్రానికి ముందు తరువాత కూడా పరిశ్రమలు, వాణిజ్యం మీద కేంద్రీకరించారు. రేవులు ఒక పెద్ద వనరుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ దారిద్య్రంతో సహా అనేక అభివృద్ధి సూచికల్లో గుజరాత్‌ వెనుకబడి ఉంది.సృష్టించిన సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది తప్ప జనానికి చేరటం లేదు. గతంలో దారిద్య్ర నిర్మూలనలో గుజరాత్‌ కొన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దిగజారుతున్నది. అధికారంలో ఎవరున్నా ఇంతవరకు దారిద్య్ర రేఖ అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు.తమకు అనుకూలమైన అంకెలతో దారిద్య్రం తగ్గిందని జనాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి దేశంలోనూ జిడిపి పెరుగుదలను బట్టి దారిద్య్ర రేఖ నిర్వచనం కూడా మారుతూ ఉంటుంది.


రాజకీయ నేతలు అధికార పార్టీల ప్రాపకం కోసం పాకులాడినట్లే కొందరు మేథావులు కూడా అదేమాదిరి ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన ప్రొఫెసర్‌ వివేక్‌ దేవరారు బుర్ర నుంచి పుట్టిందే ”గుజరాత్‌ తరహా అభివృద్ధి నినాదం”. మోడీ గుజరాత్‌ సిఎంగా నాలుగువేల రోజుల పదవీకాలం పూర్తి కానుండగా తదుపరి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ” వృద్ధి, అభివృద్ధికి గుజరాత్‌ పాలన ” అనే పుస్తకాన్ని రాశారు. తరువాత 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ దాన్ని ఒక నినాదంగా తీసుకొని తాను అధికారంలోకి వస్తే దేశమంతటా అదే విధానాన్ని అమలు చేస్తానని నమ్మబలికారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా భక్తులకు తెలియదు. అదే మాదిరి గుజరాత్‌ గురించి తెలిసిన మోడీ ప్రధాని పీఠం అలంకరించిన తరువాత ఎక్కడా దాని ప్రస్తావన తేవటం లేదు. ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నపుడు ఒక రాష్ట్ర నమూనా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పటమే పెద్ద మోసం. పదేండ్ల నాటి అంకెలను తీసుకొని వివేక్‌ దేవరారు గుజరాత్‌ పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం భారీగా తగ్గిందని చెప్పారు. ఊట మాదిరి అభివృద్ధి ఫలాలు కిందికి దిగినట్లు సూత్రీకరించారు. పాత లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్నపుడు దేశంలో ఏడవ స్థానంలో ఉన్న గుజరాత్‌ తరువాత కాలంలో దిగజారింది. దీన్ని బట్టి పరిశ్రమల వృద్ధి దారిద్య్ర నిర్మూలనకు దోహదం చేయదని కొందరు ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. ఆర్థిక స్వేచ్చలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉందని దేవరారు చెప్పారు. అలాంటి రాష్ట్రం తాజా నీతిఅయోగ్‌ నివేదిక ప్రకారం దారిద్య్ర నిర్మూలనలో 16వ స్థానానికి ఎందుకు దిగజారిట్లు ?


గుజరాత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చారు.వాటిలో పని చేసే కార్మికులకు వేతనాలు తక్కువగా నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు బాగా వెనుక బడిన చత్తీస్‌ఘర్‌లో 2023 అక్టోబరు ఒకటి నాటికి అమల్లో ఉన్నట్లు ప్రకటించిన వేతనాల ప్రకారం నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు రు.12,623, నైపుణ్యం ఉన్నవారికి రు.13,698 కాగా అభివృద్ధి చెందిన గుజరాత్‌ రెండింజన్ల పాలనలో రు.12,012 నుంచి 12,298, నిపుణులైన వారికి రు.12,558 నుంచి 12,870 వరకు నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊడ్చి, శుభ్రం చేసే కార్మికులకు కనీసవేతనం ఏ జోన్‌లో రు.19,136, బి జోన్లో రు.16,016, సి జోన్లో రు.12,844గా 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇదీ గుజరాత్‌ ఆదర్శం, నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌.అందుకే గుజరాత్‌ కార్పొరేట్లు బలిశారు తప్ప కార్మికులు, ఇతరుల పరిస్థితి దిగజారుతోంది. మానవాభివృద్ధి సూచికలే దానికి పక్కా నిదర్శనం. కొన్ని వివరాలు ఎలా ఉన్నదీ చూద్దాం.వీటికి ఆధారం గ్లోబల్‌ డాటా లాబ్‌ వెబ్‌సైట్‌.
ప్రాంతం×××× 1990 ×× 2000 ×× 2010 ×× 2021
దేశం ×××× 0.434 ××0.491 ××0.575 ××0.633
గుజరాత్‌×××× 0.474 ××0.521 ××0.599 ××0.638
కేరళ ×××× 0.550 ××0.593 ××0.709 ××0.752
మహారాష్ట్ర ××× 0.498 ××0.552 ××0.638 ××0.688
మధ్యప్రదేశ్‌ ××× 0.407 ××0.453 ××0.531××0.596
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు పారిశ్రామికంగా, వ్యవసాయకంగా వెనుకబడిన కేరళలో మానవాభివృద్ధి సూచికల కంటే పారిశ్రామికంగా వృద్ధి చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర వెనుకబడి ఉన్నాయి.దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్‌ స్థితినీ చూడవచ్చు.


సంక్షేమ పధకాలను అమలు జరిపితే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని నరేంద్రమోడీ పదే పదే వ్యతిరేకతను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే గుజరాత్‌లో అరవై ఏండ్లు దాటిన వారికి నెలకు వెయ్యి, 80దాటితే రు.1,250 మాత్రమే ఇస్తున్నారు.పోనీ గుజరాత్‌కు అప్పులు లేవా ? 2024-25కు బడ్జెట్‌ అంచనాల ప్రకారం రు.4.26లక్షల కోట్లకు, మరుసటి ఏడాది ఐదులక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు.1995లో బిజెపి పాలన పదివేల కోట్ల అప్పుతో ప్రారంభమై ఈ స్థాయికి పెరిగింది.నరేంద్రమోడీ సిఎంగా అధికారానికి వచ్చే నాటికి రు.45,301 కోట్లు ఉండగా దిగిపోయే నాటికి రు.2.21లక్షల కోట్లకు పెరిగింది.ఈ కారణంగా 2028 నాటికి రు.1.87లక్షల కోట్ల రుణాలను తీర్చాల్సి వస్తోంది. ఇందుకోసం కొత్తగా అప్పులు చేయాల్సి ఉంది. 2016 నుంచి 2021వరకు వార్షిక జిడిపి వృద్ధి రేటు కంటే రుణాల పెరుగుదల రేటు ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదిక చెప్పింది.రెండు సంవత్సరాలకు ఒకసారి గుజరాత్‌ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులను నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించారు. ఆహౌ ఓహ అన్నట్లుగా పెట్టుబడులు వచ్చినట్లు ఊదరగొట్టారు. గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పేందుకు ఇది కూడా కారణమైంది.మోడీ ఏలుబడిలో 2003 నుంచి 2015 వరకు ఏడు సదస్సులు జరగ్గా 84లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేశారు.2017 సదస్సు సందర్భంగా నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెఎన్‌ సింగ్‌ అప్పటి వరకు 61 వాస్తవ రూపం దాల్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక,గణాంకాల శాఖనివేదిక ప్రకారం 2003-11 మధ్య కేవలం ఎనిమిదిశాతమే అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి 2016వరకు మహారాష్ట్రలో 30శాతం, గుజరాత్‌లో 10శాతం మాత్రమే వాగ్దానాల్లో అమల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడులు మోడీ హయాంలోనే గుజరాత్‌కు తగ్గాయి. మూడు దశాబ్దాల బిజెపి, దానిలో 13 సంవత్సరాల నరేంద్రమోడీ ఏలుబడిలో ఆరోగ్య తలసరి ఖర్చు దిగజారింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం 2020లో వేయిమందికి దేశంలో 0.55 ఆసుపత్రి పడకలుంటే గుజరాత్‌లో 0.33 ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు బీహార్‌ కంటే తక్కువ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించారు.


నెలవారీ తలసరి వినియోగ ఖర్చు ఆయా రాష్ట్రాల్లో జనం ఉన్న స్థితిని అంచనా వేసుకొనేందుకు ఒక అంశంగా తీసుకోవచ్చు. నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్న సమయంలో దేశ సగటులో ఉన్న వృద్ధి కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా గుజరాత్‌ వెనుకబడింది. పదేండ్ల రెండింజన్ల వృద్ధిని చూస్తే దేశ సగటుకు దగ్గరగా మాత్రమే ఉంది. దిగువన తాజాగా కేంద్ర ప్రకటించిన 2022-23 తలసరి వినియోగ ఖర్చు కొన్ని వివరాలను చూద్దాం..ఖర్చు రూపాయలలో.
రాష్ట్రం××××× గ్రామీణ ×× పట్టణ
ఆంధ్రప్రదేశ్‌×× 4,870 ×× 6,782
తమిళనాడు × 5,310 ×× 7,630
కేరళ ××××× 5,924 ×× 7,078
దేశసగటు××× 3,773 ×× 6,459
గుజరాత్‌ ××× 3,798 ×× 6,621
మధ్యప్రదేశ్‌×× 3,384 ×× 4,987
ఉత్తరప్రదేశ్‌×× 3,191 ×× 5,040
2003 నుంచి 2011-12 సంవత్సరాలలో దేశంలో సగటున వినియోగ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 158, పట్టణ ప్రాంతాలలో 157శాతం పెరిగింది. గుజరాత్‌లో 145, 146శాతాలుగా ఉన్నాయి.కేరళ 2003లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది.2011-12లో పట్టణాలలో హర్యాన ముందుండగా కేరళ రెండవదిగా ఉంది.2022-23లో సర్వే ఫలితాలను బట్టి రెండింజన్ల పాలనలో ఉన్నవి లేని రాష్ట్రాల తీరు తెన్నులు పైవిధంగా ఉన్నాయి.గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఉన్న ప్రధాన రాష్ట్రాల వివరాలను ఎగువున చూశాము. ఎందుకని రెండింజన్ల పాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి ? బిజెపి చెప్పే మాటలు బూటకం, అభివృద్ధి నాటకం తప్ప వాస్తవం కాదని స్పష్టం కావటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లక్షాధికారి అక్కలంటూ మునగ చెట్టెక్కించిన నరేంద్రమోడీ !

02 Friday Feb 2024

Posted by raomk in AP, BJP, CHINA, Current Affairs, Economics, employees, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Women, Women

≈ Leave a comment

Tags

BJP, lakhpati Didi, Narendra Modi Failures, Nari Shakti, Nirmala Sitharaman, women labour force


ఎం కోటేశ్వరరావు


ఏదీ ఊరికే రాదు అన్న ఒక ఆభరణాల వాణిజ్య ప్రకటన గురించి అందరికీ తెలిసిందే. అటువంటపుడు ప్రధాని నరేంద్రమోడీ మహిళల గురించి ఊరికే మాట్లాడతారా ? సమస్యేలేదు. అందునా ఎన్నికలు, ఓట్ల కోసం మహిళలను ఎందుకు వదలిపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి(పత్రికా గోష్టి కాదు) మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు. ఆమె ప్రవేశపెట్టింది ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ తప్ప దాన్ని బడ్జెట్‌గా పరిగణించరు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. రామ్‌ రామ్‌ అంటూ మీడియాతో మాటలు ప్రారంభించిన ప్రధాని అలవాటుగా అల్లరి చేసే, ప్రజాస్వామిక విలువలను నిలువునా కాలరాసే ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. చివరిలో కూడా రామ్‌ రామ్‌ అంటూ ముగించారు. ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలలో తొమ్మిది కోట్ల మంది ఉన్నారని, వారిలో కోటి మంది ఎంతో మందికి స్పూర్తినిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో లక్షాధికారి అక్కలు(లక్‌పతి దీదీ)గా మారినట్లు మూడు కోట్ల మందిని లక్‌పతి దీదీలుగా మార్చనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి పండగ చేసుకోవాలని ప్రధాని మోడీ గారు ముక్తాయింపు ఇస్తున్నారు.


గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు మరో కొత్త నినాదంతో ఆకర్షించేందుకు పూనుకున్నారు. దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ అన్నది తెలిసిందే. ఏ దేశంలోనైనా ఎందరు మహిళలు శ్రామికశక్తిలో ఉన్నారన్నది ఒక గీటురాయిగా చూస్తారు. ప్రతిదాన్నీ డబ్బుతో, లాభ నష్టాలతో కొలుస్తున్నారు గనుక శ్రామిక శక్తిలో మహిళలు ఎందరు అంటే లెక్కలతో ఆడుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పన ఎంతవరకు వచ్చిందని గతంలో ప్రధాని నరేంద్రమోడీని అడిగితే పకోడీ బండివారికి కూడా ఉపాధి కల్పించినట్లే లెక్కవేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్సు పకోడీ బండి వేసుకోవటమేమీ తప్పు కాదు. అసలు పకోడీలు కొని తినే శక్తి ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. ఏ దేశమైనా సేవారంగంలో కాకుండా ఉత్పాదక రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారన్నదే ప్రధాన అంశంగా చూస్తారు. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. ఈ పదానికి అర్ధం ఏమిటి ? ఉదాహరణకు సర్వే చేసినపుడు ఒక వ్యక్తి అతడు లేదా ఆమె సదరు ఏడాదిలో తాను ఏడు నెలల పాటు పని చేసినట్లు లేదా పనికోసం అందుబాటులో ఉన్నట్లు గానీ, పని కావాలని కోరినట్లయితే శ్రామికశక్తిలో ఉన్నట్లు లెక్కవేస్తారు. అందుకే ఇది అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోంది. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది అంటే నరేంద్రమోడీ అమలు జరుపుతున్న నైపుణ్యవృద్ధి, మహిళా అనుకూల విధానాలు, మహిళల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఫలితం అని ఠకీమని చెబుతారు. ఒక పదార్ధాన్ని కొలవగలం గానీ గాలిని పట్టుకోలేం, చూడలేం !


ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు వీటికి పొంతన కుదరటం లేదు. అందుకే అమిత్‌ షా మాటల్లో ప్రభుత్వ ప్రకటనలను జుమ్లా (అవసరానికి ఏదో చెబుతుంటాం) అనాల్సి వస్తోంది. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అరబ్బు, ఇస్లామిక్‌ దేశాల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, మహిళలు తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది.


ఇక లక్షాధికారి అక్క (లక్‌పతి దీదీ ) పధకం గురించి చూద్దాం. రెండు కోట్ల మంది లక్షాధికారులైనట్లు నిర్మలమ్మ చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఉన్న సమాచారం ప్రకారం స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలు 9 కోట్ల 17లక్షల రెండువేల 245 మంది.వీరిలో ఏడాదికి పాతికవేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు 44,72,431(ఐదుశాతం) మంది, ఇరవై అయిదు నుంచి 60వేలకు వరకు వచ్చిన వారు 3,99,16,213(48శాతం) మంది, అరవై ఒకటి నుంచి లక్ష వరకు రాబడి వచ్చిన వారు 2,43,09,855(29శాతం) మంది, లక్షకు పైగా వచ్చిన లక్షాధికారి అక్కల సంఖ్య 1,42,53,969(17శాతం)గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లో ఉన్నాయని చెబుతున్న కనీసవేతనాల ప్రకారం నైపుణ్యం లేని వారికి నెలకు రు.12,344, నైపుణ్యం కలిగిన వారికి రు.13,844, అధిక నైపుణ్యం కలిగిన వారికి రు.14,844 కంటే తక్కువ చెల్లించటానికి లేదు. వీరిలో స్వయం సహాయక బృందాల మహిళలను ఏ తరగతిలో చేరిస్తే ఆ మేరకు ఏడాదికి వారికి రావాల్సిన కనీసవేతనాల రాబడి వరుసగా రు.1,48,128, రు.1,66,128, రు.1,78,128గా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణా గురించి చెప్పుకుంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వేతనాలు తప్ప ఇంతవరకు సవరించలేదు గనుక చెప్పుకోకపోవటమే మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షాధికారి అక్కల పరిస్థితి చూస్తే 89,56,262 మందిలో ఏడాదికి రు. పాతికవేల కంటే తక్కువ వచ్చే వారు ఎనిమిది శాతం, పాతిక నుంచి అరవైవేల మధ్య వారు 39, అరవై నుంచి లక్ష వచ్చే వారు 37, అంతకు మించి వస్తున్నట్లు చెబుతున్నవారు 17శాతం(దేశ సగటుతో సమానం) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌ వాడీలను జగన్‌ సర్కార్‌ అధిక నైపుణ్యం కలిగిన వారిగా పరిగణించి, తాము ప్రకటించిన కనీసవేతనాలు అమలు జరిపి ఉంటే నలభై రోజులకు పైగా వారు సమ్మె చేసి ఉండే వారు కాదు, లక్షలాది మంది పిల్లలు, పోషకాహారం అందాల్సిన మహిళలను ఇబ్బంది పెట్టి ఉండేవారు కాదు. అంగన్‌వాడీలకు నైపుణ్యం లేకపోతే ఆ బాధ్యతల్లో నియమించరు.

ఆంధ్రప్రదేశ్‌లో సర్వేచేసిన యాంకర్‌ పరిశోధన సంస్థ 2022 డిసెంబరులో నివేదించిన ప్రకారం ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో గౌరవ ప్రదమైన జీవనంలో ఒక భోజనానికి అయ్యే ఖర్చును రు.81.89గా లెక్కించింది. కుటుంబంలో నలుగురు ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత భోజనం ఉన్నందున ఆ మేరకు తగ్గిస్తే రు.79.16కు తగ్గుతుంది.ఈ లెక్కన ఒక మనిషికి నెలకు రు.2,408, కుటుంబానికి రు.9,632 అవుతుంది. ఇవిగాక బట్టలు, ఇతర అవసరాలను లెక్కిస్తే అవి అదనం. ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక కుటుంబానికి గౌరవ ప్రదమైన జీవన రాబడి నెలకు రు.25,269 ఉండాలని, జీవన వేతనం రు.16,077 ఉండాలని పేర్కొన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం లక్షాధికారి అక్కతో పాటు కుటుంబంలో మరొక సంపాదన వ్యక్తి ఉన్నప్పటికీ వచ్చే రాబడి సరిపోతుందా ? గౌరవ ప్రదమైన జీవనానికి అవసరమైన రాబడి లేదు గనుకనే పోషకాహార లోపంతో పిల్లలు, మహిళలు ఉన్నారు.దానికి పక్కా నిదర్శనం రక్తహీనత ముక్త భారత్‌గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వటమే. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21లో సేకరించిన సమాచారంతో అంతకు ముందు సర్వే వివరాలతో పోలిస్తే దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు, 15-49 సంవత్సరాల మధ్య ఉన్న గర్భిణులు, మొత్తం మహిళల్లో రక్తహీనత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పిల్లల్లో 58.6 నుంచి 63.2 శాతానికి పెరగ్గా మహిళల్లో స్వల్పంగా మాత్రమే తగ్గింది. తెలంగాణాలో పెరిగింది. రెండు రాష్ట్రాలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నప్పటికీ మిగతావాటితో పోల్చినపుడు పరిస్థితి పెద్దగా తేడాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మాదిరి సంక్షేమ పధకాలు లేని కేరళలో రక్తహీనత సమస్య ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించటానికి చూస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా లక్షాధికారి అక్కలు తయారైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఏలుబడిలోనే మొత్తం పరిస్థితి మారిపోయి ఉండేది. అందువలన తుపాకి రాముడి మాటలను నమ్మితే మరోసారి మోసపోవటమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

01 Monday Jan 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, BRS, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల : బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !! ఎన్నికల ఎత్తులు, పొత్తులు !!!

29 Friday Dec 2023

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, tdp, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, AP Assembly Elections 2024, AP Politics, BJP, CHANDRABABU, CPI, CPI(M), Pawan kalyan, YS jagan


మన్నెం కోటేశ్వరరావు


వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీ నేత వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమైంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోపని చేసేందుకు ఒక బాధ్యత అప్పగిస్తారనే వార్తలు, అది రాష్ట్ర అధ్యక్ష పీఠం లేదా దానికి సమానవమైన మరొకటి అనే ఊహాగానాలు వెలువడ్డాయి. 2024 ఎన్నికల పూర్వరంగంలో ఒక మానసిక తంత్ర క్రీడ(మైండ్‌గేమ్‌) ప్రారంభమైంది. రాష్ట్ర బాగు కోసమంటూ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు చండీయాగం,హౌమాలు నిర్వహించారు. వర్తమాన, భవిష్యత్‌ పరిణామాల గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రభావం అన్ని పార్టీల మీదా పడింది. బిజెపి తమతో కలవాలని అంటున్న తెలుగుదేశం-జనసేన కూటమి దానితో నిమిత్తం లేకుండానే సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా సభల నిర్వహణ తదితర అంశాల గురించి కసరత్తు ప్రారంభించింది.ఎన్నికల సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే, సర్వేలు నిర్వహించే సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం సంబంధం లేదని గతంలో ప్రకటించిన ప్రశాంత కిషోర్‌ తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావటం చర్చనీయాంశమైంది. బెంగలూరు విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ భేటీ ఊహాగానాలకు తెరలేపింది. జనంలో, స్వంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలలో కొందరికి ఉద్వానస పలికేందుకు నియోజకవర్గాల బదిలీలకు వైఎస్‌ జగన్మోహనరెడ్డి పూనుకున్నారు. ఇలాంటి మార్పులు 90కిపైగా నియోజకవర్గాలలో జరుగుతాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నప్పటికీ 50 చోట్ల ఉండవచ్చని రాష్ట్ర వైసిపి నేత ఒకరు చెప్పారు. ముఫ్పై మందికి ఉద్వాసన ఉంటుందని, ఇరవై మందిని అటూ ఇటూ మార్చవచ్చన్నారు.


టీ కప్పులో తుపాను !
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది.ఈ సభకు హాజరు కావాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పలుకగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా హైదరాబాదులోని పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించటంతో అంగీకరించినట్లు చెబుతున్నారు.ఈ వార్తలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఊహాగానాలే తప్ప ఎవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరికి పవన్‌ కల్యాణ్‌ ఆ సభకు వెళ్లటంతో ఈ అంశం టీకప్పులో తుపానులా ముగిసింది.ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతమైందని తెలుగుదేశం చెబితే, ఘోరంగా విఫలమైందని వైసిపి వర్ణించింది.


ఎన్నికల గోదాలో దిగిన పార్టీలు !
ఇంకా ఎన్నికల ప్రకటన జరగకపోయినా ఒక విధంగా అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమి ఎన్నికల గోదాలోకి దిగాయి. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ నామమాత్రంగా మారటం విశేషం. అవి 2019 అసెంబ్లీ ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. గతంలో వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపిన వాసగిరి వెంకట ( జెడి) లక్మీనారాయణ దానికి భిన్నంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ పేరుతో స్వంత దుకాణం తెరిచారు. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.వైఎస్‌ జగన్‌ మీద నమోదైన కేసులను విచారించిన అధికారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసిపి తిరస్కరించి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయమైతే, ఆయనతో ఒక పార్టీని పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక కాపు ఓట్లను చీల్చేందుకు చూస్తున్నట్లు మరొక ప్రచారం జరుగుతోంది.దేన్నీ కొట్టివేయలేము.ప్రధాన పార్టీలలో అవకాశం రాని వారు అనేక మంది తమ బలాన్ని పరీక్షించుకొనేందుకు, ప్రచారం కోసం ఇలాంటి కొత్త పార్టీల తరఫున పోటీ చేశారు.


వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంత ఉంటుంది !
రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరనున్న వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరితే నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా నేతల సూచన మేరకు అధిష్టానం కూడా ఆమె చేరికను వాయిదా వేసింది. ఆమె చేరగానే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు వస్తాయనుకొనేందుకు తగిన వాతావరణం లేదు. షర్మిలను చేర్చుకొని వెంటనే అధికారానికి రాకున్నా పార్టీని పునరుద్దరించవచ్చనే అంచనాలో కేంద్ర నాయకత్వం ఉంది.తెలుగుదేశం – జనసేన-వైసిపి నేతల మాదిరి బూతులకు దూరంగా ఉన్నప్పటికీ జగన్మోహన రెడ్డి పాలనను షర్మిల తెగనాడితే వైసిపి నేతలు ఊరుకుంటారా అన్నది ప్రశ్న. తిడదామంటే అక్క కూతురు, కొడదామంటే కడుపుతో ఉంది అన్న పరిస్థితి వైసిపికి ఎదురుకావచ్చు. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కూడా జరగవచ్చు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపి కోసం పాకులాడకుండా కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిస్తే షర్మిల ప్రచారం ఆ కూటమి మొత్తానికి ఉపయోగపడుతుంది. స్వంత చెల్లెలికే అన్యాయం చేసినట్లు మాట్లాడుతున్న తెలుగుదేశం-జనసేన నేతల ప్రసంగాల తీరు ఒక ఎత్తు బాధితురాలిగా అన్న మీద వైఎస్‌ షర్మిల ధ్వజం మరొక ఎత్తుగా ఉంటుంది.ప్రచారానికి మంచి ఊపువస్తుంది. తీవ్రమైన పోటీ ఉన్నపుడు ప్రతి ఒక్క ఓటునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.తెలుగుదేశం కూటమి అలాంటి ఆలోచన చేస్తుందా ? తెలుగుదేశం-జనసేనల్లో చేరేందుకు అవకాశం లేని వైసిపి అసంతృప్త నేతలకు కాంగ్రెస్‌ వేదికగా మారవచ్చు. బిజెపితో సంబంధాల గురించి చంద్రబాబు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. ఓట్ల రీత్యా చూసుకుంటే కాంగ్రెస్‌తోనే ప్రయోజనం ఎక్కువ.వాటి సంబంధాల గురించి అలాంటి సూచనలు ప్రస్తుతం లేనప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడేం జరిగేదీ దేన్నీ కాదనలేం. నారా లోకేష్‌కు షర్మిల పంపిన క్రిస్మస్‌ బహుమతి అలాంటిదే. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఎత్తుగడ లేకుండా ఇలాంటివి జరగవు. షర్మిల ప్రభావంతో వైసిపి ఓట్లను కాంగ్రెస్‌ చీల్చినా లేదా బిజెపి లేని పార్టీల కూటమిలో చేరితే దానితో పాటు ఇతర పార్టీలకూ అది ప్రయోజనకరం.


పవన్‌ కల్యాణ్‌కు రోడ్‌ మాప్‌ పంపని బిజెపి !
బిజెపి తమకు రోడ్‌ మాప్‌ ఇవ్వాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే పార్టీ ఆవిర్భావ సభలో కోరిన సంగతి తెలిసిందే.నిజానికి పెద్ద పార్టీగా ఉన్న జనసేన మిత్రపక్షమైన బిజెపికి రోడ్‌ మాప్‌ ఇవ్వాలి. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని 2020లోనే నిర్ణయించుకొని ఒప్పందం కూడా చేసుకున్నందున వారిద్దరూ కూర్చుని రోడ్‌ మాప్‌ను తయారు చేసుకోవాలి. అలాంటిదేమీ జరగలేదు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌ జైల్లో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఇది జరిగింది. జనసేనతో తామింకా భాగస్వామ్య పక్షంగా ఉన్నామని చెబుతూనే ఈ పరిణామం గురించి బిజెపి ఇప్పటి వరకు మౌనంగా ఉంది. జనసేన పార్టీ ఎన్‌డిఏలో చేరింది. తెలంగాణా ఎన్నికల్లో బిజెపితో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు పొగొట్టుకుంది. చివరి క్షణంలో తెలుగుదేశం-జనసేన కూటమితో చివరి క్షణంలో చేరవచ్చనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అదే జరిగితే వచ్చే లాభనష్టాలు ఏమిటన్నది తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. తెలంగాణాలో తమదే అధికారం అన్నట్లుగా ప్రచారం చేసుకున్నప్పటికీ అక్కడ దరిదాపుల్లో లేదు. దాని సిఎం అభ్యర్ధులుగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్‌,బండి సంజరు ఇద్దరూ ఓడిపోయారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బిజెపి బలం 6.98 నుంచి 13.9శాతానికి పెరిగినా తెలంగాణాలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన 19.65 శాతం ఓట్లతో పోల్చుకుంటే 5.75శాతం తగ్గాయి.


బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి. వైసిపి 49.96 , తెలుగుదేశం 39.17, మూడవ కూటమిగా పోటీసిన పార్టీలలో జనసేన(137) 5.53,సిపిఎం(7)0.32, బిఎస్‌పి(21)0.28, సిపిఐ(7)0.11 శాతాలు తెచ్చుకున్నాయి. నోటాకు 1.28 ,కాంగ్రెస్‌కు 1.17, బిజెపికి 0.84 శాతం వచ్చాయి. బిజెపితో తెలుగుదేశం ఉన్నపుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ముస్లిం మైనారిటీల్లో 66శాతం ఓట్లు పొందగా, 2019 ఎన్నికలకు ముందు బిజెపితో సంబంధాల కారణంగా అది 49శాతానికి తగ్గినట్లు, తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నపుడు వారి మద్దతు తగ్గిందని లేనపుడు పెరిగిందని ” పీపుల్స్‌ పల్స్‌ ” పరిశోధకుడు ఐవి.మురళీ కృష్ణ శర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని తెలుగుదేశంలో కొందరు భయపడుతున్నారు. వైసిపి నవరత్నాలతో గ్రామీణ ప్రాంతాలలో గతం కంటే కొంత మద్దతు పెంచుకున్నట్లు చెబుతున్నా పట్టణాల్లో మద్దతు తగ్గిందని, మొత్తంగా మధ్యతరగతి ఉద్యోగులు, టీచర్లు, ఇతర స్కీముల సిబ్బంది, కార్మికులలో మద్దతు కోల్పోయినట్లు, ఆ మేరకు తెలుగుదేశం, జనసేన బలపడినట్లు ఒక అంచనా.ఈ పూర్వరంగంలో ప్రతి ఓటునూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కేవలం 4,81,868 లేదా 2.05శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణాలో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.పైకి ఏమి చెప్పినప్పటికీ ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమితో బిజెపి సంబంధాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు స్పందించిన తీరు ఇలా ఉంది.


వామపక్షాల వైఖరేంటి !
” బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నపార్టీలతో ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాట్లకు మేము సిద్దం కాదు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపితో సంబంధాల గురించి స్పష్టత ఇచ్చినపుడు, రాజకీయంగా దానికి వ్యతిరేక వైఖరి తీసుకుంటే పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం.లేనట్లయితే ఇండియా కూటమిలోని పార్టీలతో కలసి లేదా అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం. జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించిన పార్టీ వివిధ అంశాలపై తీసుకొనే వైఖరి ఏమిటో ఇంకా స్పష్టం కానందున దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేం. మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ఎవరికి మద్దతు ఇచ్చేదీ ఎన్నికలకు ముందు వెల్లడిస్తాం.”
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇలా చెప్పారు.” బిజెపితో సంబంధాలు పెట్టుకోవద్దని అనేక ఉద్యమాలలో కలసి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీతో చెబుతున్నాం. ఒక వేళ పెట్టుకుంటే ఆ కూటమితో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎన్‌డిఏ కూటమిలోని జనసేన బిజెపితో సంబంధం లేకుండా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటే తెలుగుదేశంతో సర్దుబాటుకు అవకాశం ఉంటుంది. జనసేనను లౌకిక పార్టీగానే పరిగణిస్తున్నాం.జెడి లక్ష్మీనారాయణ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎలాంటి విధానాలను అనుసరిస్తారో వేచి చూస్తాం ”


ప్రశాంత కిషోర్‌ కలయిక్‌ మైండ్‌ గేమ్‌లో భాగమా !
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలుసుకొని చర్చలు జరిపారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లేందుకు వచ్చానని మాత్రమే ముక్తసరిగా ఆయన చెప్పారు. దాన్ని ఎవరూ విశ్వసించటం లేదు. ప్రశాంత కిషోర్‌ గెలిచే పార్టీలకే సలహాలు చెబుతారనే ఒక అభిప్రాయం ఉంది.(బిఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికలకు ముందు ప్రశాంత కిషోర్‌తో చర్చలు జరిపినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయింది. కొందరు మంత్రులు, ఎంఎల్‌ఏలను పక్కన పెట్టాలన్న సలహాను కెసిఆర్‌ విస్మరించినందునే అలా జరిగిందని చెప్పేవారు లేకపోలేదు.) ఎన్నికలకు ఇంకా వంద రోజులు కూడా లేని స్థితిలో చంద్రబాబుతో ప్రశాంత కిషోర్‌ భేటీ ఒక మైండ్‌ గేమ్‌లో భాగమని, దాని వలన తెలుగుదేశం కూటమికి కలసి వచ్చేదేమీ లేదని వైసిపి రాష్ట్ర సంయుక్తకార్యదర్శి కారుమూరి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశాంత కిషోర్‌ ప్రస్తుతం అలాంటి సలహాలు ఇవ్వటం లేదని, అతనికి ఎలాంటి బృందాలు కూడా లేవని అన్నారు.జెడి లక్ష్మీనారాయణ పార్టీ వెనుక తమ పార్టీ హస్తం వుందనటం వాస్తవం కాదన్నారు. బిజెపికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని నిలిపేందుకు, కాంగ్రెస్‌తో సయోధ్యకు ఒప్పించేందుకు ప్రశాంత కిషోర్‌ వచ్చినట్లు కూడా చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడట్లుండె, నేడిట్లుండె – దేశంలో తెలంగాణా ఎక్కడుండె !

22 Wednesday Nov 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS, Telangana, Women, Women

≈ Leave a comment

Tags

BRS, KCR, Telagana politics, Telangana BJP, Telangana CM, telangana Congress, Telengana Elections 2023


ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ముందుకు ఎన్నికల ప్రణాళికలు, ఓట్లు దండుకునే ప్రచారం, పధకాలతో ముందుకు వచ్చాయి. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ రంగుల కలను జనం ముందు ఉంచింది. అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రకటించిన ప్రణాళికను ఎలా అమలు జరుపుతుంది ? దానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయా ? ఏమి చూసుకొని జనాన్ని వాగ్దానాల జడివానలో తడుపుతున్నది అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి, కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న బిజెపి ఇతర రాష్ట్రాలలో, కేంద్రంలో అమలు జరపని పధకాలను ఇక్కడ ఎందుకు జనానికి చెబుతున్నది, ఎలా అమలు చేస్తుంది ? రాష్ట్ర అధికారపక్షం బిఆర్‌ఎస్‌ గత పది సంవత్సరాలుగా అమలు జరపని వాటిని రానున్న రోజుల్లో అమలు జరుపుతామంటే నమ్మేదెలా అన్న ప్రశ్న సహజంగానే వస్తున్నది. బిఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తున్నదా ? దాని పని తీరు ఎట్లుండె అన్నది బడ్జెట్లలో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే దాని పని తీరును ఒక్కసారి అవలోకించాల్సిందిగా మనవి.


ఒక పెద్ద మనిషి పదేండ్ల తరువాత బంధువుల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశా ఇప్పుమో నడుస్తూ గంతులేస్తున్నడు, ఎంతగా ఎదిగిండో కదా అన్నడట.పిల్లవాడు పుట్టిన తరువాత పెరగకుండా ఎట్లుంటడు ? ఎలా పెరిగిండు, కడుపు నిండా తింటున్నడా, మంచిగా ఆడుకుంటున్నడా, ఆరోగ్యంగా ఉన్నడా లేడా బడికిపోతున్నడా లేదా అన్నది ముఖ్యం. రాష్ట్రమైనా అంతే పదేండ్లనాడు ఉన్న మాదిరే ఇప్పుడు ఎట్లుంటది, మార్పులు వస్తాయి. అవి ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. రాష్ట్రం, దేశం ఏదైనా అంతే ! దిగువ చూపుతున్న వివరాలలో గత సంవత్సరాల కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలుగా గమనించాలి. అంకెలు రు. కోట్లు అని గమనించాలి. ఓ.మా రుణం అంటే ఓపెన్‌ మార్కెట్‌ రుణం.
అంశం×××× 2014-15 ××× 2022-23 ×× 2023-24
జిడిపి ×××× 5,05,849 ××× 12,93,000 ×× 14,00,000
అప్పులు ×× 75,577 ××× 4.50,000 ×× 5,00,000
ప్ర.రుణచెల్లింపు× 587 ××× 8,336 ×× 9,341
వడ్డీ,అసలు ×× 6,291 ××× 18.912 ×× 22,400
ఓ.మా.రుణం ×× 8,211 ××× 44, 970 ×× 40,615
లిక్కర్‌ రాబడి×× 10,883 ××× 31,077 ×× 35,000
కే.పన్నువాటా ×× 8,185 ××× 19,668 ×× 21,470
కాపిటల్‌ ఖర్చు×× 8,372 ××× 26,934 ×× 37,525
మూలధన పెట్టుబడి అన్నది రాష్ట్రం, దేశానికైనా కీలకమైనది.2014-15లో ఖర్చు బడ్జెట్‌ మొత్తం ఖర్చు రు.62,306 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.11,633 కోట్లు, 18.6శాతం ఉంది. 2022-23లో సవరించిన అంచనా ప్రకారం ఖర్చు బడ్జెట్‌ రు.2,26,010 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.26,934 కోట్లు,11.9శాతానికి దిగజారింది.2023-24 సంవత్సర ఖర్చు బడ్జెట్‌ రు.2,77,690 కోట్లు కాగా మూలధన పెట్టుబడి రు.37,525 కోట్లుగా ప్రతిపాదించారు.దీన్ని మొత్తం ఖర్చు చేస్తే 13.5శాతం అవుతుంది. బడ్జెట్‌ వివరాలను చూసినపుడు 2021-22లో రు.28,874 కోట్లు వాస్తవ ఖర్చు ఉంది. మరుసటి ఏడాది రు.29,728 కోట్లు ప్రతిపాదించి రు.26,934 కోట్లకు సవరించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గవచ్చు. అందువలన వర్తమాన బడ్జెట్‌లో ఎంత కోతపెడతారో తెలియదు. మొత్తం తెలంగాణా వచ్చినపుడు 18.6శాతంగా ఉన్న ఖర్చు క్రమంగా దిగజారటం ఆందోళన కలిగించే అంశం.


పెంచకపోయినా తొలి ఏడాది మూలధన పెట్టుబడి శాతం ఎంత ఉందో దాన్నయినా కొనసాగించాలి కదా ? తెలంగాణా ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో రాష్ట్ర జిడిపిలో అప్పులు16.06శాతం ఉన్నాయి.పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనల(ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం అప్పులు 29.5శాతం ఉండవచ్చు. కాగ్‌ నివేదిక 2020-21 ప్రకారం ఆ సంవత్సరంలో అప్పులు 28.1శాతానికి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు. ఇవిగాక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసిస సంస్థలకు హామీగా ఇప్పించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొంటే 38.1శాతంగా ఉన్నాయి. బంగారు బదులు అప్పుల తెలంగాణాగా మార్చారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన రుణ అర్హత పరిమితి తగ్గింది. పేరుకు పోయిన అప్పుల మొత్తం పెరుగుతున్నట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర జిడిపి ఏటేటా పెరుగుతున్నందున దానితో పోల్చుకున్నపుడు తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంకెలనే తనకు అనుకూలంగా చూపుతుంది. కొత్తగా తీసుకొనే రుణాల మీద కోత విధించటం కూడా తగ్గుదలకు ఒక కారణం.2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రుణభారం జిడిపిలో 23.8శాతంగా ఉంటుందని చూపారు. రానున్న రెండు సంవత్సరాల్లో 2025,26 ఆర్థిక సంవత్సరాల్లో ఆ మొత్తం 25శాతానికి పెరుగుతుందని కూడా పేర్కొన్నారు అంతకు ముందు సంవత్సరం 24.3శాతం ఉంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ప్రభుత్వం హామీగా ఉన్న రుణాల మొత్తం 2022-23లో రు.1,29,244 కోట్లు, ఇది జిడిపిలో 11.3శాతం, దీన్ని కూడా కలుపుకుంటే అప్పుల మొత్తం 35.6శాతం ఉంది.


కొన్ని సంక్షేమ పధకాలను చూపి వాటిని తెలంగాణా నమూనాగా ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుందని అంటున్నారు.ఇది వాస్తవమా ? రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ల వంటి కొన్ని సంక్షేమ పధకాలు అందరికీ తెలిసినవే.ఆరు కీలక రంగాలలో తెలంగాణా దేశంలో ఎక్కడుందో తెలుపుతూ పిఆర్‌ఎస్‌ అనే స్వచ్చంద సంస్థ విశ్లేషణలను అందించింది.2022-23లో తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయింపులను పోల్చి చూపింది.ఎంతో పురోగమించింది, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం, అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా అవతరించాం అని చెప్పుకోవటంలో వాస్తవం ఎంతో చూద్దాం. బిఇ అంటే బడ్జెట్‌ అంచనా, ఆర్‌ఇ అంటే సవరించిన బడ్జెట్‌ అంచనా.ఆయా రంగాలకు మొత్తం ఖర్చులో తెలంగాణా కేటాయింపు శాతం, చివరి కాలంలో అన్ని రాష్ట్రాల సగటు శాతాలు దిగువ విధంగా ఉన్నాయి.ఆర్‌డి అంటే గ్రామీణాభివృద్ధి.ప.అ అంటే పట్టణ అభివృద్ధి,
రంగం×××2021-22××22-23బిఇ××22-23ఆర్‌ఇ××23-24బిఇ××అ.రా 22-23బిఇ
విద్య ××× 8.7 ×× 7.3 ×× 8.0 ×× 7.6 ××14.8
వైద్యం××× 4.2 ×× 5.0 ×× 5.5 ×× 5.0 ×× 6.3
ఆర్‌డి ××× 4.5 ×× 3.9 ×× 4.3 ×× 3.6 ×× 5.7
ప.అ ××× 1.6 ×× 3.0 ×× 3.2 ×× 2.8 ×× 3.5
పోలీస్‌ ××× 4.6 ×× 4.0 ×× 4.4 ×× 3.6 ×× 4.3
రోడ్లు ××× 1.4 ×× 3.2 ×× 3.3 ×× 3.7 ×× 4.5
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు ఆయా రంగాలలో మూడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణా దేశ సగటు కంటే తక్కువే ఖర్చు చేస్తున్నది. కెజి నుంచి పిజి వరకు ఉచితం అని చెబుతున్న పాలకులు విద్యలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్లకు ఈ రంగాన్ని అప్పగించటమే అన్నది స్పష్టం. ప్రభుత్వ విద్యా సంస్థలలో తగిన సౌకర్యాలు, సిబ్బంది, చదువుకొనే వాతావరణం ఉంటే తలిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు చూడరు.


ఇక వైద్యం, తల్లీ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి చూద్దాం.2015-16 సంవత్సరాలలో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2019-21లో ఐదవ సర్వే జరిగింది.ఈ రెండు సర్వేల వివరాలను చూసినపుడు దేశం మొత్తం మీద రక్తహీనత సమస్య పెరిగింది.శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే.రక్తహీనత పెరుగుదల బడుగు, బలహీన వర్గాలలోనే ఎక్కువగా ఉంది.తాము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేందుకు చూసే తలితండ్రులు తమ బిడ్డలను ఆరోగ్యంగా పెంచలేకపోవటానికి ప్రధాన కారణం వారికి తగినంత కుటుంబ ఆదాయం లేక పోషకాహారం తీసుకోకపోవటమే అని వేరే చెప్పనవసరం లేదు.వివరాలు దిగువ చూడవచ్చు.1.ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు, 2.గర్భిణులు కాని మహిళలు 15 నుంచి 49 ఏండ్లు , 3. గర్భిణులు 15 నుంచి 49 ఏండ్లు,4.మహిళందరు 15-49 ఏండ్లు, 5.యువతులు 15-19 ఏండ్లు, 6.యువకులు 15-19 ఏండ్లు.దేశం 4 అంటే నాలుగవ సర్వే, దేశం 5 అంటే ఐదవ సర్వే శాతాలు.
ఏరియా ×× 1 × 2 × 3 × 4 × 5 × 6
దేశం 4 ××58.6 ×52.3 ×50.4×53.1 ×54.1× 29.2
దేశం 5 ××67.1 ×57.2 ×52.2×57.0 ×59.1× 31.2
తెలంగాణా4××60.7 ×56.9 ×48.2×56.6 ×57.9× 19.2
తెలంగాణా5××70.0 ×57.8 ×53.2×57.6 ×64.7× 25.1
పై పట్టిక చూసినపుడు పసిపిల్లలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎలా ! ఒకే వయసు ఉన్న యువతీ యువకుల్లో రక్తహీనత తేడాలు ఎంతగా ఉన్నాయో చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేశంలోని యువకుల్లో రెండు సర్వేల మధ్య తేడా రెండుశాతం కాగా తెలంగాణాలో ఆరుశాతానికి పెరగటాన్ని గమనించవచ్చు. తల్లీ, పిల్లల ఆరోగ్యం, పోషణ అంశంలో దేశం మొత్తం మీద చూపుతున్న నిర్లక్ష్యం కంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి.అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కీలక రంగాలకు తగిన కేటాయింపులు జరపక, తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోక తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్లు ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి దిగజారిందా మెరుగుపడిందా ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా వివక్షకు గురైందని చెప్పిన పాలకులు దేశ సగటు కంటే తక్కువ కేటాయింపులు ఎందుకు చేసినట్లు ?


రాష్ట్ర ప్రభుత్వం రెండులక్షల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని 2016-17బడ్జెట్‌లోనే చెప్పింది. ఒక లక్ష హైదరాబాద్‌, మరోలక్ష ఇతర చోట్ల అని పేర్కొన్నది.దాని ఆచరణ ఎలా ఉందంటే 2021-22 బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి రు.11,151 కోట్లు కేటాయించి ఖర్చు చేసిందెంతో తెలుసా కేవలం రు.299 కోట్లు మాత్రమే.2022-23లో రు.12,172 కోట్లు కేటాయించి రు.8,112కోట్లకు తగ్గించి సవరణ బడ్జెట్‌లో చూపారు. ఆచరణలో ఇంకా తగ్గవచ్చు.కానీ 2023-24లో రు.12,140 కోట్లుగా ప్రతిపాదించి అంతకు ముందు కంటే 50శాతం పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత మేర నిధులు కేటాయించి నామ మాత్రంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామనిపించి వాటినే గొప్పగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా అదే ఏడాది పట్టణాభివృద్ధికి రు.10,555 కోట్లు ప్రకటించి 75శాతం కోత పెట్టి రు.2,665 కోట్లు ఖర్చు చేశారు.సగానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్న పూర్వరంగంలో ఎంత నిర్లక్ష్యం చేసిందీ వేరే చెప్పనవసరం లేదు. అదే బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం-పోషకాహారానికి రు.18,997 కోట్లు కేటాయించి 35శాతం,రోడ్లు, వంతెనలకు రు.5,187 కోట్లు ప్రకటించి 55శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రతిపాదనల్లో 27శాతం కోత పెట్టారు.ఇలా కోతలను దాచి వర్తమాన బడ్జెట్‌లో పెంచినట్లు మాటల్లో కోతలు కోస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండు డిగ్రీల అసలు కతేంటి : ఏకత, శీలము కబుర్లు జనానికేనా ! నోరు విప్పరేం అంటున్న నరేంద్రమోడీ భక్తులు !

04 Tuesday Apr 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Education, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, Modi’s Educational Qualifications, Modi’s Two Degrees, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీకి రెండు డిగ్రీలు ఉన్నాయట, అవి నకిలీవని కొందరంటున్నారు. అయితే ఏమిటటా ? ఈ దేశంలో వివాదం కానిది ఏముంది ! కొందరికి ప్రతిదాన్నీ రచ్చ చేయకపోతే నిదుర పట్టదు. ఇదీ అంతే, మోడీ నిజం, మోడీ పాలన నిజం, ప్రపంచంలోని పలు దేశాల నేతలతో పోలిస్తే జనాదరణలో మోడీకి 76శాతం మంది నీరాజనం పడుతున్నట్లు తాజాగా ఒక అమెరికా సంస్థ మోర్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది చూడలేదా ! చూడకేం, మనల్ని విమర్శిస్తేనేమో చూడండి విదేశీ సంస్థలు మన జాతీయవాదుల మీద ఎలా దాడి చేస్తున్నాయో అంటారు. పొగిడితేనేమో చూడండి ఆహా విదేశాల వారే మనల్ని పొగుడుతుంటే మన దేశంలోని వారు ఎలా విమర్శిస్తున్నారో అని కూడా రుసరుసలాడతారు. అంటే మాకు రెండు నాలికలు ఉన్నాయంటున్నారా ? రామ రామ అలా అని బతకటమే, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి(డు) అన్నారు కదండీ. చర్చలు ఇలా సాగుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రధాని రెండు డిగ్రీలు, రెండు భారత్‌లు, ఇతర అంశాల గురించి చూద్దాం !


నరేంద్రమోడీ రెండు డిగ్రీల వివాదం గురించి మీడియాలో, రాజకీయనేతల ప్రకటనల్లో చర్చ జరుగుతోంది.వీటిని ఎందరు విద్యావంతులు పట్టించుకున్నారు, అసలు పట్టించుకోని వారు ఎందరు ? ఒకటి మాత్రం చేదు నిజం, అదేమిటంటే పట్టించుకొనేది ఒక చిన్న భారత్‌, అసలు దాని జోలికి వెళ్లనిది పెద్ద భారతం. అందుకే కొందరు ఏం చెప్పినా తాత్కాలికంగానైనా సాగుతోంది. అసలు వివాదం ఏమిటి ? దేశంలో అనేక మంది దొంగ డిగ్రీలు సమర్పించి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరే వారి గురించి తెలిసిందే. నరేంద్రమోడీ చిన్న తనంలోనే టీ అమ్ముతూ తండ్రికి తోడ్పడినట్లు చెప్పారు గనుక చదువు కోలేదు. అనేక మంది కాలేజీకి వెళ్లకుండానే దూరవిద్య ద్వారా పరీక్షలు రాసి డిగ్రీలు పొందారు. వారిలో తాను ఒకరిని అని మోడీ చెప్పారు. ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌కు నరేంద్రమోడీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన డిగ్రీల మీద అనుమానం వచ్చింది. అదేమీ నేరం కాదు.సమాచార హక్కు చట్టం కింద మోడీ గారు ఢిల్లీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీలకు సంబంధించి ఏ రోల్‌ నంబరు, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిందీ వివరాలు కావాలని అడిగారు. కేంద్ర సమాచార కమిషన్‌ దానికి స్పందించి ఆ వివరాలు సమర్పించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరింది.తద్వారా జనాలకు వాటి గురించి తెలుసుకోవటానికి సాయపడుతుందని కూడా పేర్కొన్నది. కేజరీవాల్‌ మాదిరే అనేక మంది సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు అడిగితే ప్రధాని కార్యాలయం, విశ్వవిద్యాలయాలు కూడా తిరస్కరించాయి. నరేంద్రమోడీ డిగ్రీలు దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కనుక వాటిని వెల్లడించకూడదని చెప్పి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు.అలాంటి అంశాలకు సమాచార హక్కుచట్టం వర్తించదు. తన ఎన్నికల అఫిడవిట్‌లో నరేంద్రమోడీ తాను దూరవిద్యద్వారా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి 1983లో ఎంఎ పట్టా పొందినట్లు పేర్కొన్నారు. కనుక అవి దేశ రహస్యాలు కాదు.


ఫలానా పదవికి ఫలానా విద్యార్హత ఉండాలని రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో గానీ నిర్దేశించలేదు కదా మరి మోడీ డిగ్రీల గురించి ఇంత రచ్చ ఎందుకు అని సందేహం రావచ్చు.నాది వానాకాలం చదువు అని మోడీ రాసి ఉంటే గొడవ ఉండకపోను.తప్పుడు సమాచారమిచ్చారన్నదే అరోపణ.డిగ్రీ ఉంటే చూపాలి, లేకుంటే ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు గనుక అది అనర్హత కిందికి వస్తుంది. మోడీ గుజరాత్‌ అసెంబ్లీకి పోటీ చేసినపుడు తాను అవివాహితుడనని అఫిడవిట్లలో పేర్కొన్నారు.కానీ 2014 లోక్‌సభ ఎన్నికలపుడు తాను యశోదాబెన్‌ అనే ఆమెను వివాహం చేసుకున్నట్లు రాశారు. జాతికి ఏకత, శీలము నేర్పుతామని చెప్పుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పని చేసిన మోడీ నిజాలను దాచవచ్చా ? వివాహం గురించే నిజాలు దాచారు గనుక డిగ్రీల గురించి కూడా అనుమానం తలెత్తింది.అది పెనుభూతం అవుతోంది.ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ చెప్పుకోవాలి. కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అసలేం చదివారో తెలీదు గానీ ఆమె పెద్ద చదువులు చదువుకున్న వారికి మార్గదర్శకత్వం వహించే మానవవనరుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. పూర్తిగా రాజకీశాస్త్ర పాఠాలే చదివి ఎంఎ డిగ్రీ చదివినట్లు చెప్పిన ప్రధాని అనేక మందికి పెద్ద ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అందుకే మోడినోమిక్స్‌ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. అదంతా వైఫల్యాల మయం అని విమర్శకులు అనవచ్చు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య గొప్పదనం అది.


స్మృతి ఇరానీ ఒక ఎన్నికల అఫిడవిట్‌లో తాను 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బిఏ డిగ్రీ పొందినట్లు రాశారు.మరొక ఎన్నికలో బికాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొన్నారు.2014లో కేంద్ర మంత్రిగా ఉండగా తాను అమెరికాలోని ఏలే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందినట్లు చెప్పారు.2017లో ఆమె డిగ్రీ గురించి సమాచారహక్కు కింద అడగ్గా వెల్లడించవద్దని ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని కోరారు.ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును కొట్టివేశారు.చివరకు విధిలేక 2019లో తనకు డిగ్రీ లేదని ఆమె అంగీకరించారు. అసలింతకీ ఆమె ఏలే కథ ఎలా చెప్పారంటే 2013లో భారత్‌ నుంచి వెళ్లిన పదిమంది ఎంపీల బృందంలో ఆమె ఒకరు. సదరు సంస్థలో ఆరు రోజుల పాటు నాయకత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి వాటికి హాజరైతే సర్టిఫికెట్లు ఇస్తారు. దాన్నే డిగ్రీగా బుకాయించేందుకు చూశారు. ఇక ప్రధాన కథలోకి వస్తే ఎవరెలాంటి సమాధానాలిచ్చారో చూద్దాం. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక దరఖాస్తుకు ప్రధాని కార్యాలయం ” ప్రధాని విద్యార్హతల వివరాలు ప్రధాని కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.మీ ప్రధాని గురించి తెలుసుకోండి అన్నదానిలో దొరుకుతాయి.కోరిన సమాచారం కావాలంటే ఎన్నికల కమిషన్ను అడగండి ” అని సమాధానం చెప్పింది. దానికి ఇసి ఏమి చెప్పిందంటే ఈ సమాచారం మా వద్దలేదని, సిసిఐ.ఎన్‌ఐసి.ఇన్‌లో అభ్యర్ధుల అఫిడవిట్లు అన్న విభాగంలో చూడవచ్చు అని పేర్కొన్నది. మోడీ ఎంఎ డిగ్రీ గురించి సమాచారం అడిగితే గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఒక్క ముక్కలో ” ఆర్‌టిఐ చట్టం 2005 ప్రకారం ఈ సమాచారాన్ని బహిర్గతపరచకూడదు ” అని జవాబిచ్చింది.


మోడీ డిగ్రీల వ్యవహారం మరో మలుపు తిరిగింది.తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదంటూ కమిషన్‌ అప్పిలేట్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. దాన్ని విచారించిన కమిటీ ఏం చెప్పిందటే ” ప్రజా సంబంధ అధికార వ్యవస్థ తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆఫీసు రికార్డులో లేనిదాన్ని ఇవ్వలేరు. ప్రధాని కార్యాలయం కూడా అదే వివరాలను ఇవ్వాలనటం సరైంది కాదు.సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(జె) ప్రకారం ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయ విడుదల చేయనవసరం లేదు. ప్రధాన మంత్రి కావటానికి కనీస అర్హతలను నిర్వచించలేదు గనుక మోడీ డిగ్రీల గురించిన వివరాలను ప్రధాని కార్యాలయం కలిగి ఉండాల్సిన అవసరం లేదు ” అని పేర్కొన్నది. అడిగిన సమాచారం సాధారణంగా ఉందని, రోల్‌ నంబరు లేకుండా తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ఢిల్లీ విశ్వవిద్యాలయం చేసిన వాదనను అంగీకరించింది. ఈ పరిణామం తరువాత అరవింద్‌ కేజరీవాల్‌ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులకు లేఖ రాశారు. దాన్నే సమాచార హక్కు దరఖాస్తుగా పరిగణించి నరేంద్రమోడీ డిగ్రీల రోల్‌ నంబర్లు అందచేస్తే వివరాలను తెలుసుకోవచ్చునంటూ ప్రధాని కార్యాలయాన్ని శ్రీధర్‌ కోరారు.


రెండు విశ్వవిద్యాలయాలు కూడా నరేంద్రమోడీకి ఎలాంటి డిగ్రీలు ఇవ్వలేదని చెబితే ఏమౌతుంది ? ప్రస్తుతం ఉన్న శిక్షాస్మృతి లోని సెక్షన్‌ 191 ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వటం నేరపూరితమైన తప్పిదం. దానికి శిక్ష ఏమిటో స్పష్టంగా లేదు. ప్రజాస్వామిక సంస్కరణల కోసం పనిచేసే సంస్థ(ఏడిఆర్‌) 1999లో వేసిన ప్రజాప్రయోజన దావా, తరువాత కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ నేర, ఆర్థిక, విద్యకు సంబంధించిన వివరాలను నామినేషన్‌ పత్రాల్లో విధిగా సమర్పించాలి. వాటిలో అక్రమాలుంటే నేరపూరితం అవుతుంది. ఈ వివరాలు వాస్తవమా కాదా అన్నది ఎన్నికల కమిషన్‌ విచారించదు, తప్పని తేలినా శిక్షించే అధికారం దానికి లేదు. అందుకే కోర్టులకు వెళుతున్నారు. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను ఇంటిలిజెన్సీ సంస్థల ద్వారా తనిఖీ చేయించవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. అలా చేయ కూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. స్వల్పకాలంలో తనిఖీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ కూడా పేర్కొన్నది. తరువాత కనీసం గెలిచిన వారి వివరాలను ఆరు నెలల్లో తనిఖీ చేయించాలని ఏడిఆర్‌ కోరినా ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవటం లేదు, అఫిడవిట్లన్నీ ఆదాయపన్ను శాఖకు పంపుతున్నామని మాత్రమే చెప్పింది, ఐటి శాఖ చేస్తున్నదేమీ లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన వివాహ స్థితి గురించి నరేంద్రమోడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ సునీల్‌ సరవాగి దాఖలు చేసిన పిటీషన్‌పై 2013లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్‌ కోరిన వివరాలను ఇవ్వని వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నది. దాంతో విధిలేక నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో తనకు యశోదాబెన్‌తో వివాహం జరిగినట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనవలసి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరు సంఘపరివార్‌ అని చెప్పుకొనే వారు కూడా కోర్టు ఆదేశిస్తే తప్ప నిజాలు చెప్పరన్నమాట !


ప్రజాస్వామిక వ్యవస్థలను పటిష్ట పరుస్తామని చెప్పుకొనే బిజెపి, కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ చేసిన ఒక చక్కటి సిఫార్సును పక్కన పడేశాయి. తప్పుడు అఫిడవిట్లు ఇస్తే అనర్హత వేటు వేయాలని, ఇప్పుడున్న ఆరు నెలల శిక్షను రెండు సంవత్సరాలకు పెంచాలని, ఈ కేసులను రోజు వారీ విచారించాలని, నామినేషన్ల దాఖలు ఆఖరి గడువుకు తనిఖీకి వారం రోజుల వ్యవధి ఉంటే ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే వాటి మీద అభ్యంతరాలు దాఖలు చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుందని చెప్పింది. కానీ గత తొమ్మిదేండ్లుగా మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు, అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపించటం లేదు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ డిగ్రీల గురించి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది, అనేక అనుమానాలకు తెరలేపింది. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశానికి సంబంధించిన ఉదంతంలో నరేంద్రమోడీ డిగ్రీ వివరాలను ఢిల్లీ సిఎం కేజరీవాల్‌కు అందచేయాలని గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని కోరటం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పటమే కాదు కేజరీవాల్‌ రు.25వేల జరిమానా కూడా విధించింది. దీని మీద కేజరీవాల్‌ ధ్వజమెత్తారు. మోడీ డిగ్రీల మీద అనుమానాలను పెంచిందన్నారు. తమ సంస్థలలో మోడీ డిగ్రీలు పొందినందుకు పండగ చేసుకోవాల్సిన గుజరాత్‌ లేదా ఢిల్లీ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని దాచేందుకు చూస్తున్నాయన్నారు.


ఇక గుజరాత్‌ హైకోర్టులో కేసుకు సంబంధించి వాదనలను చూద్దాం. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌(సిఐసి) ఉత్తరువులు జారీ చేశారు.కేజరీవాల్‌ ఎన్నికల గుర్తింపు కార్డు మీద వచ్చిన దరఖాస్తును పరిష్కరించకుండానే తమకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నది.తన వివరాలు అందచేసేందుకు సిద్దమేనని, మోడీ డిగ్రీ వివరాలను కూడా సమర్పించాలని కమిషన్‌ అడగాలని కేజరీవాల్‌ కమిషన్‌ ముందు వాదించారు. తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలించామని నరేంద్రమోడీ పొందిన 1978 డిగ్రీ వాస్తవమైనదేనని ఢిల్లీ విశ్వవిద్యాయం వాదించింది. ఆ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించాలన్న సిఐసి ఉత్తరువును 2017లో ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఆ కేసు ఇంకా తేలలేదు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం తరఫున గుజరాత్‌ హైకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.ప్రత్యర్ధుల మీద క్షక్ష తీర్చుకొనేందుకు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయటం పిల్లచేష్టలన్నారు.విశ్వవిద్యాలయం మోడీ డిగ్రీని బహిరంగంగా అందుబాటులో ఉంచిందన్నారు.ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1) జె ప్రకారం వివరాలను వెల్లడించనవసరం లేదన్నారు. ఏదైనా బహిరంగ కార్యకలాపం లేదా ప్రజాప్రయోజనం కాని లేనపుడు, ఒక వ్యక్తి గోప్యతలో అనవసరంగా చొరబడినపుడు, సమాచార వెల్లడిద్వారా విస్తృత ప్రజాప్రయోజనం కలుగుతుందని సబంధిత అధికారులు సంతృప్తి చెందితే తప్ప సమాచారం పొందలేరు.విశ్వవిద్యాలయం విశ్వాసపాత్రను పోషించేదిగా ఉన్నందున చట్టంలోని పై సెక్షన్‌ ప్రకారం సమాచారం ఇవ్వనవసరం లేదు అని వాదించారు.దాన్ని గుజరాత్‌ హైకోర్టు అంగీకరించింది.


” కొంత మంది జనాలు గౌరవనీయ ప్రధాని డిగ్రీలు నకిలీవని అంటున్నారు. పూర్తి రాజకీయ శాస్త్రంలో మోడీ పొందిన డిగ్రీ చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనదని నేను నిజంగా నమ్ముతున్నాను. కనుక దానిని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవన ప్రధాన ప్రవేశద్వారం వద్ద ప్రదర్శించాలి, తద్వారా దాని గురించి సందేహాలు లేవనెత్తే వారి నోళ్లను మూయించవచ్చని శివసేన(ఉద్దావ్‌ థాకరే) నేత సంజయ రౌత్‌ అన్నారు.డిగ్రీలు నకిలీవని తేలితే ఉన్న లోక్‌సభ్యత్వం రద్దవుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదని ఆప్‌ ఎంపీ సంజయ సింగ్‌ అన్నారు. నరేంద్రమోడీ పొందిన డిగ్రీలంటూ బిజెపి నేతలు గతంలో ప్రదర్శించిన కాపీలలో రోల్‌ నంబరు గానీ, తండ్రిపేరు గానీ లేదు. అందువలన అవి నకిలీ అని అనేక మంది భావిస్తున్నారు.1978లో డిగ్రీలను చేతిరాత ద్వారా జారీచేసేవారు. కానీ బిజెపి నేతలు చూపిన వాటిని కంప్యూటర్‌ అక్షరాలతో ప్రచురించినట్లుగా ఉంది.1994లో ఆ అక్షరాలకు మైక్రోసాప్ట్‌ పేటెంట్‌ హక్కు పొందింది. అలాంటిది 1978 డిగ్రీలో ఎలా ముద్రించారన్నది ప్రశ్న. అవీ తప్పుల తడకలు. ఎంఏ మొదటి భాగంలో నరేంద్రకుమార్‌ దామోదరదాస్‌ మోడీ అని ఉంటే రెండవ భాగంలో నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అని ఉంది.
ఇంత రచ్చ జరుగుతున్నా నరేంద్రమోడీ నోరు మెదపటం లేదు. నిబంధనలకు భాష్యం,వాటిని కోర్టు ఆమోదించటం ద్వారా రక్షణ పొందుతున్నట్లుగా కనిపిస్తున్నది. అనేక మంది మోడీ భక్తులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. నిందల పాలైన సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి పునీతగా వెలికివచ్చినట్లుగా నరేంద్రమోడీ కూడా వాస్తవాలు చెప్పి విమర్శకుల నోళ్లు ఎందుకు మూయించటం లేదని వారిలో వారు మధనపడుతున్నారు. కోర్టులు, నిబంధనలు ఎలా ఉన్నా నైతిక బాధ్యతగా ఎందుకు వెల్లడించరు,ఎందుకు పిరికిబారుతున్నారు అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

17 Friday Mar 2023

Posted by raomk in AP, AP NEWS, BRS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2023-24, AP CM YS Jagan, AP debt, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్‌ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్‌ పత్రాల్లో ఎకౌంట్స్‌ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్‌ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.


చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్‌ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్‌ సర్కార్‌ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్‌ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్‌ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.


గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్‌ సర్కార్‌ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?


ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్‌ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్‌ఆర్‌ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్‌ సర్కార్‌ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్‌సి (సబ్‌ప్లాన్‌ )నిధులుగా రు.20,005, ఎస్‌టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్‌ఆర్‌ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.


పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?


ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్‌ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్‌ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్‌ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

22 Sunday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Filims, Gujarat, INDIA, International, INTERNATIONAL NEWS, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, UK

≈ Leave a comment

Tags

BJP, block out on BBC documentary, Explosive BBC documentary, Gujarat files, Gujarat pogrom, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం. ప్రజాస్వామ్య పుట్టిల్లు బ్రిటన్‌ అని చెబుతారు గానీ నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలోనే ఉందని చెప్పేవారి గురించీ తెలిసిందే. బిబిసి ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో పేర్కొన్న అంశాలు ” ప్రేరేపిత ఆరోపణల పత్రం ” అని 302 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా శనివారం నాడు అందమైన, పొందికైన పదజాలంతో ఒక ప్రకటన చేశారు. దానిలో మాజీ జడ్జీల నుంచి మాజీ పౌర, ఇతర ప్రముఖులు, సగం మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కనుక భాషకోసం తడుముకోవాల్సినపని లేదు. ఆ చిత్రంలో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దాన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిన మాటలు ఇంకా గింగురు మంటుండగానే వీరు రంగంలోకి దిగారంటే డాక్యుమెంటరీ ఎంత సెగ పుట్టించిందో అర్ధం చేసుకోవచ్చు.


మన పెద్దలు ప్రజాస్వామ్య గొప్పదనంతో పాటు దానికి పొంచి ఉండే ముప్పును గురించి కూడా హెచ్చరించారు. అదేమిటంటే సదరు చిత్రాన్ని ఎవరూ చూడకుండా తొలగించాలని యుట్యూబును, పంచుకోనివ్వకుండా చూడాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త కూడా శనివారం నాడే జనాలకు తెలిసింది. సదరు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిన దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నదాన్ని పక్కనపెడితే అసలు దానిలో ఏం చెప్పారు, ఏం చూపారు అన్న ఆసక్తిని ఈ రెండు పరిణామాలూ తెగ పెంచేశాయి. నిషేధం తీరు తెన్నులలోనూ, నరేంద్రమోడీ ఏలుబడి గురించి చర్చ జరుగుతుంది. గీత దాటొద్దు అన్న మాటను సీత పాటించి ఉంటే అసలు రామాయణం, పాండవులు కోరినట్లుగా ఐదూళ్లిచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదనట్లుగా చూడొద్దు అంటే చూడాలనే కిక్కే వేరు ! నిషేధించిన పుస్తకాలను, సినిమాలను మనం లేదా పూర్వీకులు చూడకుండా ఉన్నారా ? దేశంలోకి రావద్దని నిషేధిస్తే రాకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా ? మన ప్రజాస్వామిక వ్యవస్థలో జనానికి అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, ప్రపంచమంతటినీ చూడకుండా ఆపలేరు కదా ! నేను గాంధీని ఎందుకు చంపాను అన్న గాడ్సే ప్రకటనను పుస్తకాలుగా అచ్చువేసి అనధికారికంగా పంచుతున్నవారికి ఇది తెలియదా !


హిందూ-ముస్లిం ఉద్రికత్తలను పునరుజ్జీవింప చేసేందుకు పోలీసు, జడ్జి, తలారీ ఒకరే అన్నట్లుగా భారత్‌లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు పూర్వరూపంగా బిబిసి చిత్రం ఉన్నదని 302 మంది ప్రముఖులు చెప్పారు. నల్లమందు తింటే మన్నుదిన్న పాముల్లా పడి ఉంటారు అని చెబుతారు. కానీ మత మత్తుమందు జనాలను రెచ్చగొట్టి పిచ్చివారిగా మారుస్తుంది. వర్తమానంలో దాని విత్తనాలను చల్లి, దేశమంతటా సాగు చేస్తూ ఎవరు పెంచి పోషిస్తున్నారో, ప్రేరేపిస్తున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఆ డాక్యుమెంటరీలో ఉన్న అంశాలే అవి కదా ! అందువలన 302 మంది కాదు ముప్పై రెండువేల మంది ప్రముఖులు రాసినా మన ఘనమైన చరిత్ర పుటల్లోకి ఎక్కించిన చెరగని గుజరాత్‌ మారణకాండ మచ్చను చెరిపివేయలేరు.” తోటి భారతీయుడు మరియు మన నేతకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రేరేపిత ఆరోపణల పత్రం అని, విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజ్యవిధానానికి అనుగుణంగా ఉందని ” ఆ ప్రముఖులు బిబిసి చిత్రం గురించి తమకున్న భావ ప్రకటనా స్వేచ్చ మేరకు చెప్పారు. బహుశా వారికి 80-20 అంటూ బిజెపి నేతలు చేసిన ” ఐక్యత ” ప్రవచనాలు, ప్రసంగాల సారం అర్ధం కాలేదా లేక వినలేదా ? అదే బ్రిటన్‌కు సేవ చేసుకుంటామని రాసి ఇచ్చిన అపర దేశభక్తుల గురించి వేనోళ్ల పొగుడుతున్న వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ బ్రిటన్‌తోనే చెట్టపట్టాలు వేసుకొని ఊరేగుతున్నాం. ఆ ప్రముఖులు తమ ప్రకటనలో పౌరసత్వ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలపై రోజూ బిజెపి పెద్దలు, దాన్ని సమర్ధించేవారు చెబుతున్న అంశాలన్నింటినీ తుచ తప్పకుండా పునశ్చరణ చేశారు. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షిక బదులు ” బిబిసి : నైతిక ప్రశ్న (బిబిసి ది ఎథికల్‌ క్వొశ్చన్‌) అని పెట్టి ఉంటే బాగుండేదని ముక్తాయింపు ఇచ్చారు. ఇబ్బందేముంది ? దేనికి దాన్ని పరిగణనలోకి తీసుకొని బిబిసి కథనాలన్నింటిని పరిశీలించి బేరీజు వేద్దాం.


గుజరాత్‌ మారణకాండకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ లింకులన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌, యుట్యూబ్‌లను ఆదేశించింది. దీని అర్ధం దాన్నింక ఎవరూ చూడలేరని కాదు. బిబిసి సైట్‌లో తప్ప వాటిని షేర్‌ చేసే ఇతర వెబ్‌సైట్లలో మాత్రమే అది కనిపించదు. దానిపై ఉన్న 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తొలగించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి డిరెక్‌ ఓ బ్రియన్‌ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తామాపని చేసినట్లు ట్విటర్‌ తనకు తెలిపిందని కూడా వెల్లడించారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021 ప్రకారం కేంద్రం తొలగించాలని కోరినందున తాము అనుసరించటం మినహా మరొకమార్గం లేదని ట్విటర్‌ చెప్పినట్లు కొందరు చెప్పారు. ఇప్పటికే ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమంద్వారా ఇతరులకు ఎవరికైనా పంపాలన్నా ఇక కుదరదు. చూడాలని పట్టుదల ఉన్న వారికి వేరే పద్దతుల్లో దొరుకుతుంది. ” భారత తనయ ” (ఇండియాస్‌ డాటర్‌) పేరుతో గతంలో ప్రసారం చేసిన నిర్భయ చిత్రాన్ని తొలగించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం బిబిసికి నోటీసు పంపింది. ఆ మేరకు మన దేశంలో ప్రదర్శన నిలిపివేశారు. తాజా చిత్రంపై అలాంటి నోటీసు ఇచ్చింది లేనిదీ తెలియదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న నేరగాడు ముకేష్‌ సింగ్‌ను తగిన అనుమతి లేకుండా బిబిసి ఇంటర్వ్యూ చేసిందని, దాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించటం, మహిళల గౌరవాన్ని భంగపరిచినందున ప్రదర్శించవద్దని కోరినా వినకుండా ప్రసారం చేయటంతో తొలగించాలని కేంద్రం కోరింది.


గతంలోనే బతకాలని భారత ముస్లింలెవరూ కోరుకోవటం లేదని దాన్నుంచి ముందుకు పోవాలని కోరుకుంటున్నారంటూ బిబిసి చిత్రాన్ని ఉటంకిస్తూ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ ఒక పత్రికలో రాశారు. దాన్ని తప్పుపట్టాల్సినపని లేదు గానీ గతాన్ని విస్మరించాలన్న సందేశం ఇవ్వటం పెద్దలకు తగని పని. గతాన్ని పునరుద్దరించాలని, ఇస్లాం, ముస్లింలు మన దేశానికి రాకముందు ఉన్న పరిశుద్ద హిందూత్వ దేశాన్ని పునరుద్దరించాలని రోజూ ప్రచారం చేస్తుండటం, దానికి పోటీగా కోల్పోయిన తమ పూర్వపాలనను పునరుద్దరిస్తామని కొందరు ముస్లిం ఛాందసులు రంగంలోకి దిగటమే కదా విద్వేషాలకు మూలం. శ్వేతేతరులను ఉద్దరించే బాధ్యత తమదంటూ వారికి వారే ప్రకటించుకున్న శ్వేతజాతీయుల మాదిరే ఇప్పుడు శ్వేత జాతి మీడియా గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నదని తారిఖ్‌ మన్సూర్‌ చెప్పిందానితో అంగీకరించటానికి కూడా ఇబ్బంది లేదు.హిందూత్వ ఉద్దారకులమంటూ ఊరేగుతున్నవారి గురించి కూడా పెద్దలు చెబితే బాగుండేది. ఇక బిబిసి డాక్యుమెంటరీ గురించి మోడీ దళాలు చెపుతున్నదానినే పునరుద్ఘాటన చేశారు గనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. సదరు అభిప్రాయాలతో అంగీకరించటమా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.


ఇక తారిఖ్‌ మన్సూర్‌తో సహా అనేక మంది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా బిబిసి ఇలాంటి చిత్రాన్ని తీయటం ఏమిటి, అది సుప్రీం కోర్టుకు అతీతమా అని ప్రశ్నిస్తున్నారు.నిజమే వారికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు గుజరాత్‌ ఉదంతాల మీద తీర్పు ఇచ్చిన మాట నిజం. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఈ రచయితతో సహా ఎవరూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. తమ ముందుకు వచ్చిన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతమాత్రాన వాటి మీద భిన్నాభిప్రాయం వెల్లడించకూడదని ఎక్కడా లేదు. అనేక హత్యకేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని కోర్టులు నిర్దోషులని తీర్పు చెప్పాయి. అంత మాత్రాన హత్యలు జరగలేదని, ఎవరో ఒకరు ప్రాణాలు తీయలేదని చెబుతామా ? సాక్ష్యాలను సమర్పించాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కు కావచ్చు, అసమర్ధంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు, ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా వాదించలేకపోవచ్చు.
కోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపట్టకూడదని వాదిస్తే జర్మనీలో హిట్లర్‌ ఆధ్వర్యంలో జరిగిన మారణకాండలను నాటి జర్మన్‌ కోర్టులు తప్పు పట్టలేదు.యూదులు, వారి ప్రభావం నుంచి జర్మన్‌ సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న జనాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన జడ్జీల సంగతి తెలిసిందే. తరువాత అలాంటివారితో సహా నేరాలకు పాల్పడిన వారిని న్యూరెంబర్గ్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన సంగతి తెలిసిందే. తమ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా బిబిసి చిత్రాన్ని నిర్మించి తమను ధిక్కరించిందని సుప్రీం కోర్టు భావిస్తే ఆ మేరకు తనంతట తాను ముందుకు పోవచ్చు.

గుజరాత్‌ ఉదంతాల తరువాత కూడా జనం నరేంద్రమోడీని ఎన్నుకున్నారని, దాన్ని బిబిసి గమనంలోకి తీసుకోవద్దా అని చెబుతున్నారు. ఇదెక్కడి వాదన ? 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌరహక్కులను పక్కన పెట్టిన ఇందిరా గాంధీని తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించిన జనం తిరిగి ఆమెకు పట్టం కట్టారు. అంతమాత్రాన ఎమర్జన్సీని అంగీకరించినట్లా ? జర్మనీ, ఇటలీ,తదితర అనేక దేశాల్లో నియంతలనే జనం పదే పదే ఎన్నుకున్నారు. అని చెబితే మా నరేంద్రమోడీని నియంత అంటారా అని ఎవరైనా అడగవచ్చు. మోడీ విధానాలను చూసి ఇదే ప్రజాస్వామ్యం అని అనేక మంది పొగుడుతున్నట్లుగానే వాటిలో నియంతృత్వపోకడలు ఉన్నట్లు అనేక మంది విమర్శిస్తున్నారు తప్ప నియంత అనలేదు.
భారత్‌లో తమ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రస్తుతం తాము అనుకోవటం లేదని, దాన్ని తీసింది తమ దేశం వారికోసమని బిబిసి పేర్కొన్నది. దీని నిర్మాణంలో భారత్‌లో ఉన్న సిబ్బంది ఎవరూ భాగస్వాములు కాలేదని కూడా చెప్పింది. రెండవ భాగాన్ని బ్రిటన్‌లోని బిబిసి ఛానల్‌-2లో జనవరి 24న ప్రసారం చేస్తామని వెల్లడించింది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలన్నింటిని చూపేందుకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో మెజారిటీ హిందూ, ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటి మీద భారత ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉన్న ఆసక్తి కారణంగా వాటి మీద నివేదించేందుకు నిర్మించినట్లు బిబిసి చెప్పింది.


డాక్యుమెంటరీని అడ్డుకోవటం పిరికి చర్య అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. దీన్లో పేర్కొన్న అంశాలు నిజం గాకపోతే మోడీ రాజీనామా చేయాలని వత్తిడి తెచ్చినట్లు, రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రిటన్లో అంతర్గతంగా స్పందన కలిగించింది. బ్రిటన్‌లోని భారత మితవాద స్నేహితుల సంస్థ( కన్సర్వేటివ్‌ ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఇండియా ) మాజీ సహ అధ్యక్షుడు, ప్రభువుల సభ( పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడు రామీ రాంగర్‌ బిబిసి అధిపతి టిమ్‌ డేవీకి ఒక నిరసన లేఖ రాశాడు. ఈ చెత్త వెనుక పాకిస్తానీ మూలాలున్న మీ సిబ్బంది ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరాడు. ఎవరిని సంతుష్టీకరించేందుకు ఇలాంటి లేఖలు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ హిందువులు-ముస్లింల మధ్య ఈ చిత్రం మానిన గాయాలను రేపిందని, తానెంతో దిగులుపడ్డానని దానిలో పేర్కొన్నాడు. గుజరాత్‌ మారణకాండలో అత్యాచారానికి గురై, హత్యాకాండలో బంధువులను కోల్పోయిన బిల్కిస్‌ బానో కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాండ్లు సంస్కార వంతులైన బ్రాహ్మలు అని కితాబిచ్చి శిక్షను పూర్తిగా అమలు జరపకుండా గుజరాత్‌ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతం,దాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన తీరు కొత్త భయాలను ముందుకు తెచ్చిన అంశం ఆ పెద్దమనిషి దృష్టికి రాలేదా లేక నిద్ర నటిస్తున్నాడా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

20 Friday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Gujarat, History, NATIONAL NEWS, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, BJP, Explosive BBC documentary, Gujarat pogrom, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యం కాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశంలో కూడా అనేక మంది పాత సంగతులను అలాగే ఎందుకు వెల్లడించకూడదు అనుకుంటారు. గోద్రా రైలు దుర్ఘటన పేరుతో జరిపిన 2002 గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌ రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన నివేదికల్లోని అంశాలను బహిర్గతం చేస్తే కొంత మంది ఇప్పుడు ధూం ధాం అంటూ మండిపడుతున్నారు. తమ రాయబారి పంపిన అంశాలను బ్రిటన్‌ సరికొత్త పద్దతుల్లో వెల్లడికావించింది. బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌( బిబిసి ) రెండవ ఛానల్‌ ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) పేరుతో 2023 జనవరి 17న ప్రసారం చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ తొలి భాగం ఆ దురంతాలను గుర్తుకు తెచ్చి మరోసారి నరేంద్రమోడీ, సంఘపరివార్‌ సంస్థల పేర్లను జనం నోళ్లలో నానేట్లు చేసింది. బిబిసికి సమాచారం ఇచ్చిన తీరు మీద బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఖండించలేని నిస్సహాయ స్థితికి ప్రపంచంలో ఎదురులేదని చెబుతున్న నరేంద్రమోడీని నెట్టింది. ప్రతిస్పందిస్తే మరింత పరువు పోతుంది అన్నట్లుగా మాట్లాడకూడదని నిర్ణయించింది. పైకి మాట్లాడినా మాట్లాడకున్నా ప్రపంచమంతా మోడీ గురించి మరోసారి అవలోకిస్తుంది.


ఈ డాక్యుమెంటరీ వక్రీకరణలతో ప్రచారం కోసం నిర్మించిందని, ఒక నిర్ధిష్టమైన పరువు తక్కువ కథనాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రూపొందించినదని, దాని మీద ఇంతకు మించి స్పందించి గౌరవించదగినది కాదని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ పేర్కొన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. వివాదం తలెత్తటంతో ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్‌ నుంచి తొలగించారు. ఈ నెల 24న మరొక భాగం ప్రసారం కావాల్సి ఉంది.తమ కథనాన్ని బిబిసి సమర్ధించుకుంది. ఉన్నతమైన సంపాదక ప్రమాణాలకు అనుగుణంగా తీవ్రంగా పరిశోధించిన తరువాత రూపొందించినట్లు పేర్కొన్నది. భిన్న గళాలు, అభిప్రాయాలు వెలిబుచ్చే వారిని, నిపుణులను తాము కలిశామని, బిజెపికి చెందిన వారి స్పందనలతో సహా పలు అభిప్రాయాలకు దానిలో తావిచ్చామని, తమ డాక్యుమెంటరీలో లేవనెత్తిన అంశాలకు తగిన సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా స్పందించేందుకు తిరస్కరించినట్లు బిబిసి తన ప్రకటనలో పేర్కొన్నది. గుజరాత్‌ ఉదంతాలు, నరేంద్రమోడీ పాత్ర గురించి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అది ప్రసారంగాక ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అని బిబిసి ప్రకటన చెబుతున్నది. చర్చ మరింత జరిగితే నరేంద్రమోడీ, బిజెపికి మరింత నష్టం గనుక కేంద్రం నుంచి లేదా బిజెపి దీని గురించి ముందు ముందు ప్రస్తావించకపోవచ్చు. మొత్తంగా మీడియా నరేంద్రమోడీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పరిమితంగానైనా వార్తలు ఇవ్వకపోవచ్చు, చర్చలు జరపకపోవచ్చు. అంత మాత్రాన రచ్చగాకుండా ఉంటుందా జనం చర్చించకుండా ఉంటారా ?


ఏ దేశంలోనైనా పెద్ద ఉదంతాలు జరిగినపుడు ఆ దేశంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు మనదేశంతో సహా తమ వనరులు, సంబంధాల ద్వారా సమాచారాన్ని సేకరించి వాటిని తమ దేశాలకు చేరవేస్తాయి. వికీలీక్స్‌ వెల్లడించిన కోట్ల కొద్దీ పత్రాలవే. గుజరాత్‌ ఉదంతాల గురించి బ్రిటీష్‌ రాయబార కార్యాలయం అలాంటి నివేదికనే ఇచ్చినట్లు దానిలోని అంశాలను డాక్యుమెంటరీ వెల్లడించింది. బిబిసికి వాటిని అందించారంటే బ్రిటన్‌ ప్రభుత్వం తొలిసారిగా వాటిని బహిర్గత పరిచినట్లే. అందువలన ఈ డాక్యుమెంటరీ గురించి, దానిలో పేర్కొన్న అంశాల సంగతి ఏమిటని పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ ప్రస్తావించినపుడు నోరు మూయించేందుకు ప్రధాని రిషి సునాక్‌ చూశాడు. సమాధానంగా ఏమి చెప్పినప్పటికీ అది మొహమాటంతో చెప్పినవిగానే పరిగణించాలి. నివేదికలోని అంశాలు వాస్తవమా కాదా అని చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానమిచ్చాడు.పాకిస్థాన్‌ మూలాలున్న ఎంపీ ఇమ్రాన్‌ హుసేన్‌ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించగా దానితో తమకు సంబంధం లేదని, దానిలో భారత ప్రధాని గురించి చిత్రీకరించిన తీరును తాను అంగీకరించటం లేదని రిషి సునాక్‌ చెప్పాడు. మత విద్వేష హింస ఎక్కడ జరిగినా తాము సహించబోమని, అయితే నరేంద్రమోడీ పాత్రను చిత్రించిన తీరును తాను అంగీకరించనని అన్నాడు. ఇంత రచ్చ జరిగిన తరువాత కూడా బిబిసి చిత్రంలో వెల్లడించిన అంశాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరో భాగాన్ని ప్రసారం చేస్తారా లేదా అన్నది చెప్పలేదు.


డాక్యుమెంటరీలో పేర్కొన్నదాని ప్రకారం నాటి బ్రిటన్‌ దౌత్యవేత్త పంపిన సమాచార పత్రానికి పెట్టిన శీర్షిక, సంగ్రహము ఇలా ఉంది. ” విషయము: గుజరాత్‌ మారణకాండ ” వెల్లడైనదాని కంటే హింస చాలా ఎక్కువగా ఉంది. కనీసం రెండువేల మంది మరణించారు. పధకం ప్రకారం పెద్ద ఎత్తున ముస్లిం మహిళల మీద అత్యాచారాలు జరిగాయి.లక్షా 38వేల మంది నిరాశ్రయులయ్యారు. హిందువులు ఉండే చోట, హిందువులు-ముస్లింలు కలసి ఉన్న ప్రాంతాలలో ముస్లింల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం కావించారు. పధకం ప్రకారం హింస జరిగింది. కొన్ని నెలల ముందుగానే పధకం వేసి ఉండవచ్చు. రాజకీయ ప్రేరేపితమైనది.హిందువులుండే ప్రాంతాల నుంచి ముస్లింలను తరమివేయటమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో దీనికి విహెచ్‌పి (హిందూ ఉగ్రవాద సంస్థ) నాయకత్వం వహించింది. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా ఐకమత్యము అసాధ్యం. వారి(హిందూ మూకలు) పధకం ప్రకారం సాగించిన హింసలో నిర్దిష్ట జాతి నిర్మూలన లక్షణాలన్నీ ఉన్నాయి. శిక్షలేమీ ఉండవనే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా విహెచ్‌పి అంత ఎక్కువ నష్టం కలిగించి ఉండేది కాదు. దీనికి నరేంద్రమోడీ నేరుగా బాధ్యుడు.”


ఇంతే కాదు, డాక్యుమెంటరీ వెల్లడించిన దాని ప్రకారం బ్రిటన్‌తో పాటు ఐరోపా సమాఖ్య కూడా విచారణ జరిపింది. వాటిసారం ఒక్కటే. హింసాకాండలో మంత్రులు చురుకుగా భాగస్వాములయ్యారు. దాడుల్లో జోక్యం చేసుకోవద్దని సీనియర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయమైన వారు చెప్పినదాని ప్రకారం 2002 ఫిబ్రవరి 27న నరేంద్రమోడీ సీనియర్‌ పోలీసు అధికారులతో సమావేశమై జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అసలు అలాంటి సమావేశం జరగలేదని పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు కూడా బిబిసి తన కథనంలో పేర్కొన్నది. సమావేశం జరిగిందని అంగీకరిస్తే మోడీ ఆదేశాలను అమలు జరిపినట్లుగా అంగీకరించినట్లవుతుంది, ఆ ఉదంతాలకు స్వయంగా కారకులని అంగీకరించినట్లవుతుంది కనుక అసలు సమావేశమే జరగలేదని చెప్పినట్లు కూడా పేర్కొన్నది. నాడు ఇంటలిజెన్స్‌ విభాగ అధిపతిగా ఉన్న ఆర్‌బి శ్రీకుమార్‌, మరో అధికారి సంజీవ భట్‌, మరో అధికారి మాత్రం నరేంద్రమోడీ ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సదరు సమావేశంలో అసలు వారెవరూ పాల్గొనలేదని అదే కథనంలో మరొక పోలీసు అధికారి చెప్పిన అంశాన్ని కూడా డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. మరొక కేసులో సంజీవ భట్‌ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.


ఈ కథనంలో లేదా నరేంద్రమోడీ మద్దతుదార్లు, బిజెపి ఏమి చెప్పినా కొన్ని సందేహాలకు సరైన సమాధానం రాలేదు. అంతటి తీవ్ర శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు ఏ సిఎం అయినా ఇంటలిజెన్స్‌ అధికారిని పిలిపించకుండా,ఉన్నతాధికారుల సమావేశం జరపకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారా ? ” స్నేహపూర్వకంగా ఉన్న ఒక దేశాధినేత గురించి గతంలో బిబిసిలో అలాంటి విమర్శ వచ్చినట్లు నాకు గుర్తు లేదు. కనుక సహజంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని గట్టిగా కోరుకుంటూ ప్రస్తుతం బ్రిటన్‌ ప్రభుత్వం సున్నితమైన చర్చల్లో మునిగి ఉన్నపుడు గుజరాత్‌ కొట్లాటలపై విస్ఫోటకం వంటి చిత్రాన్ని ప్రసారం చేయాలని బిబిసి ఎందుకు నిర్ణయించినట్లు ” అని మన విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఒకరు ప్రశ్నించినట్లు బిబిసి పేర్కొన్నది. నిజమే, వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి అంశాలతో కూడిన చిత్రాన్ని ప్రసారం చేస్తే హానికలిగే అవకాశం ఉంటుంది, ఇతర సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. కనుక ఏ ప్రభుత్వమైనా తన దగ్గర ఉన్న సమాచారాన్ని, అందునా ప్రభుత్వ నిధులతో నడిచే ఒక మీడియా(బిబిసి) సంస్థకు అందచేసి బహిర్గతపరిచేందుకు అనుమతిస్తుందా ? కారణం ఏదైనా బ్రిటన్‌ ప్రభుత్వం అందించింది, ప్రసారానికి కూడా అనుమతి ఇచ్చింది.


గుజరాత్‌ మారణకాండ జరిగినపుడు బ్రిటన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న జాక్‌ స్ట్రా ఆ ఉదంతాలపై నివేదిక ఇవ్వాలని కోరాడు.హౌంమంత్రిగా జాక్‌ స్ట్రా పనిచేసినపుడు బ్రిటన్‌ సమాచార స్వేచ్చ చట్టాన్ని 2000లో తెచ్చారు. దాన్ని సమీక్షించేందుకు 2015లో ఏర్పాటు చేసిన ఒక కమిటీలో కూడా జాక్‌ ఉన్నాడు. బహుశా సమాచార కమిషన్‌తో ఉన్న దగ్గరి సంబంధాల కారణంగా గుజరాత్‌ నివేదికలను బహిర్గతం కావించేందుకు అతగాడు ఒక పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు. జాక్‌ స్ట్రా లేబర్‌ పార్టీ నేత కనుక టోరీ పార్టీ ప్రధాని రిషి సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చూసి ఉండవచ్చు అనుకుంటే, అధికారంలో ఉన్న పార్టీ, మంత్రులు, అధికారులు ఎందుకు సహకరించినట్లు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.


రాయబార కార్యాలయం పంపిన నివేదికలో నరేంద్రమోడీ పాత్ర గురించి స్పష్టంగా చెప్పిన కారణంగానే ఆ తరువాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. బ్రిటన్‌లోని హిందూత్వ సంస్థల ఆహ్వానం మేరకు 2003లో నరేంద్రమోడీ అక్కడికి వెళ్లారు. దాని మీద తలెత్తిన విమర్శలతో ” నరేంద్రమోడీ బ్రిటన్‌ సందర్శన గురించి మాకు తెలుసు, ప్రభుత్వ ఆహ్వానం మేరకు అతను రావటం లేదు, ఇక్కడ ఉన్నపుడు అతనితో ఎలాంటి సంబంధాలూ ఉండవు ” అని బ్రిటన్‌ సర్కార్‌ ప్రకటించింది. మోడీ బ్రిటన్‌ వెళ్లినపుడు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా ఉన్న సత్యవ్రత పాల్‌ తరువాత రాసిన దానిలో ఇలా ఉంది. ” విదేశాంగశాఖ మంత్రి (యశ్వంత సిన్హా) ప్రధాని వాజ్‌పాయి దగ్గరకు వెళ్లారు. ఆ పర్యటన వాంఛనీయం కాదు, రద్దు చేసుకోవాల్సిందే అన్న వైఖరితో ప్రధాని కూడా అంగీకరించారు.” ఐనా సరే జరిగింది అంటే సంఘపరివార్‌ వత్తిడి కారణం అన్నది స్పష్టం. ఇక మోడీ బ్రిటన్‌లో ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ అనే లాయరు మోడీని అరెస్టు చేయాలని అక్కడ కోర్టుకు వెళ్లారు, కోర్టు అంగీకరించలేదు. ఇప్పుడు బిబిసి వెల్లడించిన సమాచారం గనుక ఆ నాడు తన వద్ద ఉండి ఉంటే మోడీ అరెస్టుకు దారితీసేదని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నాడు. అదే సర్కార్‌ తరువాత 2005లో మోడీ వీసాను రద్దు చేసింది. అమెరికా కూడా వీసాను రద్దు చేసింది.సిఎంగా ఉన్నపుడు మోడీ రాకను అడ్డుకుంది. తరువాత 2014లో నరేంద్రమోడీ ప్రధాని కాగానే ఈ రెండు దేశాలూ వీసాను పునరుద్దరించి దేశాధినేతగా స్వాగతం పలికాయి. ఒక దేశంలో ఒక రాష్ట్రానికి సిఎంగా ఉండటం వేరు, ప్రధానిగా దేశాధినేతగా ఉండటం వేరు గనుక తామాపని చేశామని, ఒక్క నరేంద్రమోడీకే కాదు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు సైతం వీసా పునరుద్దరించామని, అది సంప్రదాయమని 2022 నవంబరులో అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.


తమ ప్రాణాలకు భద్రత గురించిన భయంతో భారత్‌కు చెందిన 30 మంది డాక్యుమెంటరీలో మాట్లాడేందుకు తిరస్కరించినట్లు బిబిసి పేర్కొన్నది.భారత ప్రభుత్వం కూడా దానిలో పేర్కొన్న అంశాలపై స్పందించేందుకు నిరాకరించింది అనికూడా వెల్లడించింది.ఈ నెల 24న ప్రసారం కానున్న రెండవ భాగంలో 2019 తరువాత మోడీ సర్కార్‌ తీరు తెన్నుల గురించి వివరించనుంది. ఈ చిత్రం గురించి పలు కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ ఎత్తులు జిత్తులలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్‌ ముందుకు తెచ్చిన కూటముల్లో మన దేశం చురుకుగా ఉంది. మన మీడియా వర్ణించినట్లుగా ”మనవాడు” రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు మోడీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తరువాత కూడ బిబిసి ఇలాంటి చిత్రాన్ని ప్రసారం చేయటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే బ్రిటన్‌ విదేశాంగ శాఖ వద్ద ఉన్న నివేదికలను కూడా సుప్రీం కోర్టుకు సమర్పించి దాని మీద విచారణ జరిగిన తరువాత బిబిసి ఆపని చేసి ఉంటే ఆ వాదనకు అర్ధం ఉంది. అలా జరగలేదే. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్రమోడీని బదనాం చేసేందుకు ఇలా చేశారని చెబుతున్నారు. బ్రిటన్ను ప్రభావితం చేసే స్థితిలో ఇప్పుడు అమెరికా తప్ప మరొక దేశం లేదు. అదే వాస్తవమైతే ఆ పని 2014, 2019 ఎన్నికలపుడే చేసి ఉండవచ్చు. దాని వలన బిబిసికి, బ్రిటన్‌ ప్రభుత్వానికి కలిగే లబ్ది ఏమిటి ? ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా బిబిసి ఉత్తినే ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తుందా ? దీని వెనుక ఉన్న అసలు సంగతి ఏమిటో వెల్లడిగాక తప్పదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d