• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: US imperialism

” లిటిల్‌ బోయి ” ” ఫాట్‌మాన్‌ ” కంటే మరింత ముప్పుగా మారిన అమెరికా, నాటో కూటమి !

05 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Atomic bombings of Hiroshima and Nagasaki, NATO, Ukraine-Russia crisis, US imperialism, world Peace


ఎం కోటేశ్వరరావు

ఆగస్టు నెల వస్తుందంటే ప్రపంచ శాంతి ప్రియులకు గుర్తుకు వచ్చేది హిరోషిమా-నాగసాకీలపై అమెరికా జరిపిన దుర్మార్గ అణుబాంబుల దాడి.1945 ఆగస్టు ఆరున హిరోషిమా, తొమ్మిదిన నాగసాకి నగరాలపై అవసరం లేకున్నా రెండవ ప్రపంచ యుద్దం దాదాపుగా ముగిసిన తరువాత బాంబులు వేసి తన దగ్గర ఎంతటి ప్రమాదకర మారణాయుధాలున్నాయో, అవెలా విధ్వంసం సృష్టిస్తాయో చూడండని భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసిరింది. ఆ తరువాతే దానికి ధీటుగా ఉండేందుకు సోవియట్‌, బ్రిటన్‌,ఫ్రాన్స్‌, చైనా అణ్వస్త్రాలను తయారు చేశాయి. ఇప్పుడు భారత్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాల వద్దకూడా ఉన్నాయి. మరొక భావన ప్రకారం ఏ దేశంలోనైతే అణువిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ ఏ క్షణంలోనైనా బాంబులు తయారు చేసే స్థితిలో ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటైన ఇరాన్‌ అణ్వస్త్రాల తయారీ కార్యక్రమం చేపట్టిన కారణంగానే దాన్ని విరమింప చేసేందుకు అమెరికా తదితర దేశాలు పూనుకోవటం, ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవటం వంటి పరిణామాలన్నీ తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇప్పుడు 1945 నాటి అణు బాంబుల కంటే ఇంకా ఎంతో విధ్వంసాన్ని సృష్టించగలిగినవి, కొన్ని వేల బాంబులు తయారై సిద్దంగా ఉన్నాయి.అవేగాక ఇతర మారణాయుధాలు గుట్టలుగా పేర్చుకొని సిద్దంగా పెట్టుకున్నారు. అమెరికా తాను తయారు చేసిన ప్రతి కొత్త ఆయుధం ఎలా పని చేస్తుందో చూసేందుకు అది సృష్టిస్తున్న యుద్దాలలో జనం మీద ప్రయోగించి చూస్తున్నది. ఇప్పుడు ఐరోపాలోని ఉక్రెయిన్ను అందుకు ప్రయోగశాలగా చేసుకుంది.


రెండవ ప్రపంచ యుద్ద చివరి సంవత్సరం 1945 మే ఎనిమిదవ తేదీన జర్మనీ లొంగిపోయింది. తరువాత ప్రధాన శత్రువుగా ఉన్న జపాన్‌పై భారీఎత్తున దాడి చేసేందుకు మిత్రరాజ్యాలు పూనుకున్నాయి. అప్పటికి అమెరికా తలపెట్టిన అణుబాంబుల తయారీ చివరి దశకు వచ్చింది. జూలై నాటికి ప్లూటోనియంతో తయారుచేసిన ” ఫాట్‌ మాన్‌ ” యురేనియంతో రూపొందించిన ” లిటిల్‌ బోయి ” సిద్దంగా ఉన్నాయి.జపాన్నుంచి స్వాధీనం చేసుకున్న సమీపంలోని మరియానా దీవుల్లో ఒకటైన టినియన్‌లో అమెరికా వాటిని ఉంచింది. జపాన్‌ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26న పోట్స్‌డామ్‌ ప్రకటనలో మిత్రదేశాలు అల్టిమేటం ఇచ్చాయి. అయితే దానికి ముందే అమెరికా-బ్రిటన్‌ కూడబలుక్కొని నాగసాకి, హిరోషిమా,కొకురా, నిజిగటా పట్టణాలపై అణుబాంబులు వేయాలని నిర్ణయించాయి. ఆగస్టు ఆరున హిరోషిమాపై లిటిల్‌బోయి, తొమ్మిదిన నాగసాకిపై ఫాట్‌మాన్‌ బాంబులు వేశారు. లొంగేది లేదని జపాన్‌ బింకంగా ప్రకటించినప్పటికీ అప్పటికే అది చావుదెబ్బలు తిన్నందున మరికొద్ది రోజుల్లో పతనమై ఉండేది. బాంబులు వేసిన రోజు, తరువాత హిరోషిమాలో లక్షా 29వేల మంది, నాగసాకిలో రెండు లక్షల 26వేల మంది మరణించారు.తరువాత అణుధూళితో మరికొన్ని వేల మంది మరణం, రోగాలపాలైనారు.


అణ్వాయుధాల ముప్పును చూసిన తరువాత వాటిని మరొకసారి వినియోగించరాదనే డిమాండ్‌ను ప్రపంచ శాంతి ఉద్యమం ముందుకు తెచ్చింది. ఎవరైనా తమ మీద ప్రయోగించకపోతే తాముగా ముందు ఉపయోగించబోమని (ఎన్‌ఎఫ్‌యు పాలసీ) అణుశక్తి దేశాలు స్వచ్చందంగా ప్రకటన చేసి కట్టుబడి ఉండాలన్నదే దాని సారం.ఇదేగాక అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని భద్రతామండలిలోని ఐదు శాశ్వత, అణుశక్తి దేశాలు ముందుకు తెచ్చాయి.1964లో అణ్వాయుధాలను సమకూర్చుకున్న చైనా ఏ సమయంలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ముందుగా ఉపయోగించబోమని తొలిసారిగా చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉంది. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాను డిమాండ్‌ చేయగా అది తిరస్కరించింది. రష్యా – చైనా పరస్పరం వాటిని ఉపయోగించరాదని ఒప్పందం చేసుకున్నాయి.


మన దేశం 1974లోనే తొలి అణుపరీక్ష జరిపినప్పటికీ, 1998లో రెండవసారి పోఖ్రాన్‌ పరీక్షల తరువాత మాత్రమే తమ మీద ఎవరూ అణుదాడికి దిగకపోతే తాముగా ముందు ప్రయోగించబోమని 1999లో ప్రకటించింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. పరిస్థితులను బట్టి ఆ వైఖరిని సవరించుకోవాల్సి రావచ్చని 2019లో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పినప్పటికీ పాత విధానమే కొనసాగుతోంది.తమ మీద, తమ మిత్ర దేశాల మీద ఎవరైనా దాడి చేస్తే తప్ప తాము ఉయోగించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చెబుతున్నాయి, గతంలో సోవియట్‌, తరువాత రష్యా కూడా అదే చెప్పింది. సోవియట్‌ గనుక దురాక్రమణకు పాల్పడితే అణ్వాయుధాలను వాడతామని నాటో కూటమి చెప్పింది.అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దానిలో భాగస్వాములే.1999లో నాటో పదహారవ సమావేశంలో ఎన్‌ఎఫ్‌యు విధానాన్ని ఆమోదించాలని జర్మనీ చేసిన ప్రతిపాదనను సమావేశం తిరస్కరించింది. అణుయుద్దంలో విజేతలెవరూ ఉండరు, ఎన్నడూ పోరుకు పూనుకోవద్దంటూ ఎన్‌పిటి దేశాలు 2022లో ఒక ప్రకటన చేశాయి. ఎన్‌పిటి వివక్షతో కూడుకున్నదంటూ దాని మీద సంతకం చేసేందుకు మన దేశం తిరస్కరించింది.తమకు ఎన్‌ఎఫ్‌యు విధానం లేదని పాకిస్తాన్‌ చెబుతుండగా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నదీ లేనిదీ ఇజ్రాయెల్‌ నిర్దారించటం లేదు. తాముగా ముందు దాడికి దిగబోమని ఎవరైనా చేస్తే ప్రతిదాడి చేస్తామని ఉత్తర కొరియా చెప్పింది. ఉక్రెయిన్‌ వివాదంలో అవసరమైతే అణుదాడి చేస్తామని పుతిన్‌ హెచ్చరించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.


అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిరంతరం ఉద్రిక్తతలు, యుద్దాలు లేకపోతే నిదురపట్టదు. ఒక దగ్గర ముగిస్తే మరోచోట ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అవమానకరంగా వెన్ను చూపిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అగ్గిరాజేశాయి. రష్యా బలహీనంగా ఉన్నపుడు తమతో కలుపుకుపోయి చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలని చూసిన ధనిక దేశాల జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చాయి. ఇదే సమయంలో ఎప్పుడైనా తమకు సవాలుగా మారవచ్చని భావించిన ఆ కూటమి నాటో విస్తరణ పేరుతో జార్జియా, ఉక్రెయిన్ను చేర్చుకొని రష్యా ముంగిట ఆయుధాలను మోహరించాలని చూశాయి. రష్యా దాన్ని గ్రహించి ప్రతి వ్యూహంతో ఒక వైపు చైనాతో ఉన్న స్వల్ప వివాదాలను పరిష్కరించుకుంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అధికారంలో ఉన్న రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమ తొత్తులను ప్రతిష్టించాయి.రష్యా తన సరిహద్దులో ఉండి నాటోలో చేరాలని చూసిన జార్జియాలో రెండు ప్రాంతాల్లో తలెత్తిన స్వాతంత్య్ర ఉద్యమాలకు మద్దతు ఇచ్చి వాటిని దేశాలుగా గుర్తించింది.ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉన్న మెజారిటీ రష్యన్లు తాము విడిపోయి స్వతంత్ర దేశాలుగా అవతరిస్తామని ప్రారంభించిన తిరుగుబాటుకు మద్దతు తెలిపింది. గతంలో తన భూభాగంగా ఉండి తరువాత ఉక్రెయిన్లో కొనసాగిన క్రిమియా ప్రాంతాన్ని 2014లో రష్యా విలీనం చేసుకుంది. అక్కడ తన సేనలను మోహరించింది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపి జి8 బృందం నుంచి రష్యాను బహిష్కరించారు. అప్పటి నుంచి నాటో కూటమి దేశాలు ఉక్రెయినుకు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి రష్యాను రెచ్చగొట్టాయి.ఐరోపా సమాఖ్య, నాటోలో చేర్చుకొని మిలిటరీని కూడా తరలించాలని చూశాయి. ఇది తమ దేశ భద్రతకు ముప్పు అని, ఉక్రెయిన్ను తమ కూటమిలో చేర్చుకోవద్దని అనేక వేదికల మీద రష్యా చేసిన వినతులను పట్టించుకోలేదు. దీంతో విధిలేని స్థితిలో 2022 ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించింది. డాన్‌బాస్‌ ప్రాంతంపై దాడులు చేస్తున్న మిలిటరీ, కిరాయి మూకల నుంచి విముక్తి చేయటంతో పాటు ఉక్రెయిన్‌ సైనిక పాటవాన్ని దెబ్బతీస్తామని, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేది లేదని ప్రకటించింది. ఆ మేరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా ఆచితూచి దాడులు చేస్తున్నది.


ఈ వివాదంలో రెండు వైపులా మరణించిన సైనికులు, పౌరుల సంఖ్య గురించి కచ్చితమైన వివరాలు ఇంతవరకు లేవు. ఇరుపక్షాలు చెబుతున్నవాటిని విశ్వసించలేము.కిరాయి మూకలు లేవని తొలుత ఉక్రెయిన్‌ చెప్పింది. తరువాత అజోవ్‌ ప్రాంతంలోని ఉక్కు ఫ్యాక్టరీ నుంచి దాడులకు దిగిన వేలాది మంది కిరాయి మూకలు రష్యన్లకు బందీలుగా చిక్కాయి. ఒక వేళ రష్యా దాడులకు దిగితే తాము అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పి ఉక్రెయిన్ను వివాదంలోకి దించిన పశ్చిమ దేశాలు తాము ఎన్ని కావాలంటే అన్ని అస్త్రాలను అందిస్తాం తప్ప మిలిటరీని పంపం, వైమానిక దాడులు జరపం అని చెప్పాయి. తొలి రోజుల్లో ఉక్రెయిన్‌ ప్రతిఘటన, రష్యాను దెబ్బతీస్తున్న తీరు తెన్నులంటూ ప్రపంచాన్ని, తమ ప్రజానీకాన్ని నమ్మింప చూసిన పశ్చిమ దేశాల మీడియా, వాటిని నమ్మి మన జనానికి అందించిన మన మీడియాలో ఇప్పుడు అలాంటి ” కతలు ” కనిపించవు, వినిపించటం లేదు.


పశ్చిమ దేశాలు సృష్టించిన ఈ సంక్షోభానికి ఉక్రేనియన్లు బలిఅవుతున్నారు. జూలై నాలుగు నాటి ఐరాస సమాచారం ప్రకారం 50లక్షల మంది వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. మరో 70లక్షల మంది స్వదేశంలోనే నెలవులు తప్పారు.రష్యాదాడుల కారణంగా ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లిన 35లక్షల మంది తప్ప ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి మూకల దాడులతో 14లక్షల మంది రష్యాలో తలదాచుకుంటున్నారనే అంశం మనకు మీడియాలో కనిపించదు. మన దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ది రేటు కరోనాకు ముందే నాలుగుశాతానికి పడిపోయింది. దీనికి పాలకులు అనుసరించిన విధానాలే కారణం. కానీ ఇటీవల వంటనూనెల ధరలు ఆకాశానికి అంటటానికి,కొరతకు ఉక్రెయిన్‌ కొంత కారణమైతే ఇక్కడి వ్యాపారుల మీద ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా ఉండటం ఒక ప్రధాన కారణం. పామోలిన్‌, సన్‌ఫ్లవర్‌ అంటే దిగుమతులు చేసుకుంటున్నాం, మరి వేరుశనగనూనె ఎందుకు కనిపించటం లేదు ? శ్రీలంక ఆందోళనలు, ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమ నేపధ్యంలో మరోదారి లేక చమురు ధరలు పెరిగినందున ఎరువుల ధరలను రైతులపై మోపకుండా కేంద్రం సబ్సిడీ రూపంలో భరిస్తున్నది, చమురుపై విధించిన పన్నులను కొంత మేరకు తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను నరేంద్రమోడీ సర్కార్‌ స్థంభింప చేసింది తప్ప ఇతర వస్తువుల ధరల పెరుగుదల నుంచి జనాలకు ఎందుకు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు.

రష్యా నుంచి ఎరువులు, గోధుమలు, ఇంథన సరఫరాలు నిలిచిపోవటంతో అనేక దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటికీ ప్రపంచ పెత్తనంపై అమెరికా, దాని మిత్రదేశాల కాంక్ష తప్ప మరొకటి లేదు. ఐరోపా సమాఖ్య,నాటోలో చేరేది లేదని ఉక్రెయిన్‌ అంగీకరిస్తే దాని సార్వభౌత్వానికి, రక్షణకు హామీ ఇస్తామని రష్యా చెబుతున్నప్పటికీ పశ్చిమ దేశాలు పడనివ్వటం లేదు. ఆంక్షలతో రష్యాను దెబ్బతీసేందుకే పూనుకున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు అనుకున్నట్లుగా జరగలేదు. అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరగటంతో అది రష్యాకు వరంగా మారి రాబడిని పెంచింది. మన దేశం, చైనా తదితర దేశాలకు రాయితీలకు చమురు అమ్ముతున్నది. కానీ ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నది.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము.పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కీలుబొమ్మగా మారాడు. రష్యా నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసిన ఐరోపా దేశాల మీద దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.రష్యా మీద కూడా దీని ప్రభావం ఉంది, అయితే ముందుగానే ఊహించినందున ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు. ఉక్రెయిన్‌ ఆర్ధిక వ్యవస్థ 2022లో 45శాతం, రష్యాలో 8-10శాతం వరకు తిరోగమనంలో ఉంటుందని అంచనా. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం గతేడాది ప్రపంచ వృద్ది రేటు 6.1శాతం కాగా వర్తమాన సంవత్సరంలో అది 2.6, 2023లో రెండు శాతానికి తగ్గుతుందని తాజా అంచనా. ఐరోపా, అమెరికాల్లో వచ్చే ఏడాది వృద్ది రేటు సున్నా అంటున్నారు. 1970 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వృద్ది రేటు రెండుసార్లు రెండుశాతానికి పడిపోయింది. ధనిక దేశాల వృద్ది రేటు పడిపోతే మన వంటి దేశాల ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించేందుకు పశ్చిమ దేశాలు ముందుకు రావటం లేదు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్‌ నుంచి ఐరోపాకు ముప్పు ఉంటుందనే పేరుతో బ్రిటన్‌తో చేతులు కలిపిన అమెరికా నాటో కూటమిని ఏర్పాటు చేసి పగ్గాలు తన చేతిలో ఉంచుకుంది.నాటో తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బ్రిటీష్‌ జనరల్‌ హేస్టింగ్‌ ఇస్మే మాటల్లో ” ఐరోపాకు దూరంగా రష్యా (సోవియట్‌ )ను నెట్టటం, అమెరికాను లోనికి రప్పించటం,జర్మనీ పలుకుబడిని తగ్గించటం ” అన్నాడు.ఐరోపాలో శాంతి-స్థిరత్వాలకు అది దోహదం చేస్తుందని ప్రపంచాన్ని నమ్మించారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు, ఐరోపాకు ముప్పూ లేనప్పటికీ గత మూడు దశాబ్దాలుగా దాన్ని కొనసాగించటమే కాదు, విస్తరిస్తున్నారు. అది ఇప్పుడు అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ముప్పుగా మారింది.అమెరికా అణుదాడికి గురైన జపాన్‌ ఇప్పుడు అదే అమెరికాతో చేతులు కలిపింది. చైనా మీద కాలుదువ్వుతోంది. సోవియట్‌ విచ్చిన్నం తరువాత నాటోను కానసాగిస్తున్నారు. నాటో పరిధి వెలుపల మిలిటరీ చర్యలకు వినియోగిస్తున్నారు. వాటికి మానవతాపూర్వక దాడులని పేరు పెట్టారు.1994లో బోస్నియాలో నాటో విమానాలు తొలిసారిగా దాడులు చేసి సెర్బియా విమానాన్ని కూల్చాయి.1999లో సెర్బియా మీద 78రోజులు దాడులు చేసింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఇరాక్‌పై దురాక్రమణను నాటో సమర్ధించింది, తరువాత ఆప్ఘనిస్తాన్‌ దురాక్రమణ, లిబియాపై దాడుల్లో భాగస్వామిగా మారింది.లిబియానేత గడాఫీని హత్య చేసి తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1991లో సోవియట్‌ విడిపోయి నపుడు నాటోను విస్తరించబోమని రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి తూర్పు ఐరోపాలో ఉన్న అనేక దేశాలను చేర్చుకోవటమే తాజా పరిణామాలకు మూలం.తటస్థ దేశాలుగా ఉన్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను చేర్చుకొనేందుకు నిర్ణయించిది. అంటే రష్యా సరిహద్దులో తిష్టకు తెరలేపింది. లాటిన్‌ అమెరికాలో కూడా నాటో అడుగుపెట్టేందుకు పూనుకుంది. మొత్తం ప్రపంచానికి ముప్పు తలపెట్టింది.


నాటోను ఆసియాకు విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడ కొత్త కూటమి ఏర్పాటు, దానిని నాటోకు అనుసంధానించే ఎత్తుగడ ఉంది.ఇదంతా చైనాను కట్టడి చేసేందుకే.ప్రపంచంలోని 80 దేశాల్లో అమెరికాకు 800 మిలిటరీ కేంద్రాలున్నాయి. వాటిలో నాలుగు వందలు చైనా చుట్టూ ఉన్నాయంటే అమెరికా కేంద్రీకరణ దానిమీద ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనా పెద్ద ఎత్తున ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పూనుకుందన్న ప్రచారం మరోవైపు అదే అమెరికా సాగిస్తోంది. ఒక చిన్న దేశం సింగపూర్‌కే ప్రపంచంలో నాలుగు సైనిక కేంద్రాలున్నాయి. ప్రపంచంలోనే పెద్ద దేశమైన చైనా తన చుట్టూ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా తదితరదేశాలు పట్టుబిగిస్తున్నా అలాంటి కేంద్రాల ఏర్పాటుకు పూనుకోలేదు. దానికి కంపూచియాలో ఒక నౌకా కేంద్రం, తజకిస్తాన్‌లో ఒక మిలిటరీ పోస్టు, జిబౌటీలో అనేక దేశాల సైనిక కేంద్రాల సరసన దానికి ఒక చిన్న కేంద్రం ఉంది. ఎక్కడైనా స్వేచ్చగా తిరిగే హక్కు తమకు ఉందంటూ అమెరికా నగరమైన న్యూయార్క్‌ ఇతర సముద్రతీర నగరాల వైపు ఏ విదేశీ మిలిటరీ నౌకలు తిరగటం ఎన్నడూ కనిపించదు. కానీ చైనా చుట్టూ అమెరికా, దాని మిత్రదేశా నౌకలు నిరంతరం తిరుగుతూనే దర్శనమిస్తాయి, ఎందుకని ? దేశమంటే మట్టికాదోయి మనుషులోయి అన్న మహాకవి గురజాడ స్ఫూర్తితో విశ్వమానవాళికోసం హిరోషిమా, నాగసాకి దినం సందర్భంగా ప్రపంచంలోని శాంతి ప్రియులందరూ అమెరికా దాని మిత్ర దేశాల యుద్దోన్మాదాన్ని ఖండించాలి, నిరసించాలి. ప్రపంచాన్ని కాపాడాలి. శాంతి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !

03 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies


ఎం కోటేశ్వరరావు


మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్‌ చక్రవర్తి కైజర్‌ రెండవ విల్‌హెల్మ్‌.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్‌ వారి పత్రిక నార్త్‌ చైనా డైలీ న్యూస్‌ ఒక వార్త ప్రచురించింది. కైజర్‌ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్‌ నాటికి లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్‌ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్‌ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్‌ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్‌ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్‌ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్‌ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ జాన్‌ చార్టరీస్‌ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్‌ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్‌ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్‌ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్‌ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్‌ నాజీ హిట్లర్‌ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్‌ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.


అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్‌ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్‌ విస్నర్‌ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.


పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్‌ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్‌ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్‌ గల్ఫ్‌ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్‌ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్‌ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్‌ హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్‌ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ బయట పెట్టినందుకు అమెరికన్‌ కార్పొరేట్‌ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.


అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్‌ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్‌ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.


అమెరికన్‌ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వం 1953లో బ్రిటీష్‌, అమెరికన్‌ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్‌ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్‌ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్‌ నెల గాలప్‌ పోల్‌ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్‌ పోల్‌ పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్‌ బారోమీటర్‌ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.


మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్‌ 61, రిపబ్లిక్‌ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్‌ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్‌ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్‌ చూస్తామని 53శాతం, వాట్సాప్‌ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్‌ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జి న్యూస్‌ ముందున్నాయి. రిపబ్లిక్‌ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.


మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాతో అమెరికా కాళ్ల బేరానికి వచ్చిందా – మితవాదుల ఆగ్రహం !

25 Monday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Politics, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Joe Biden, Latin American left, Lifting some Sanctions On Venezuela, Nicolás Maduro, US imperialism


ఎం కోటేశ్వరరావు


అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్‌ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని ఆసరా చేసుకొని ఎన్ని కట్టుకథలు, ఎన్ని దెప్పి పొడుపులో ! ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏమిటి ?


2022 జూలై పన్నెండవ తేదీన బిబిసి ముండో( స్పానిష్‌ భాష) అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ మాజీ ముఖ్యకార్యదర్శి కారీ ఫిలిపెట్టీతో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విదేశాంగశాఖలో వెనెజులా, క్యూబా వ్యవహారాలను ఆమె చూశారు.అమెరికా అధికారులు ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో సంప్రదిస్తున్నారని ప్రతిపక్షంతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన మదురో బదులు తాము మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేత జువాన్‌ గుయిడోనే విజేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌, తరువాత ఇటీవలి వరకు జో బైడెన్‌ సర్కార్‌ ఆ వైఖరినే కొనసాగించింది. మదురోను పదవి నుంచి తొలగించాలని అక్కడి మితవాద శక్తులకు అమెరికా చెప్పింది. అన్ని రకాలుగా తోడ్పడుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో తలెత్తిన ఇంథన సంక్షోభం ప్రారంభం వరకు అమెరికా చదరంగంలో గుయిడోనే పావుగా ఉన్నాడు. ఒక ఎత్తుగడగా లేదా అవసరం కొద్దీ గుర్తించను గుర్తించను అన్న అమెరికా ఇప్పుడు తన మాటలను తానే దిగమింగి అధికారికంగా మదురో సర్కార్‌తో చర్చలు జరుపుతోంది.


వెనెజులా పౌరులు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన, ఇప్పటికీ పడుతున్న కష్టాలు, ఇబ్బందులకు అమెరికా కారణం అన్న మౌలిక అంశాన్ని మీడియా కావాలనే విస్మరించి, కట్టుకథలు, పిట్టకతలు చెప్పింది, వాటిని గుడ్డిగా నమ్మి అనేక మంది రకరకాలుగా చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడి జనాలకు వాస్తవాలు తెలుసుగనుక ఎన్ని ఇబ్బందులున్నా వామపక్ష మదురోవైపే మొగ్గుచూపుతున్నారు. మానవహక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్దపాలన పరిరక్షణ పేరుతో అనేక దేశాలపై అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షల ప్రతికూల పర్యవసానాలను నివేదించేందుకు ఐరాస ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదన అధికారిణి ప్రొఫెసర్‌ అలేనా దౌహాన్‌ ఇటీవల చెప్పిన ప్రకారం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు 98శాతం అవి చెప్పిన సుభాషితాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. జింబాబ్వే సందర్శనలో ఆమెతో కొందరు విద్యార్ధులు మాట్లాడుతూ తమ దేశంపై ఆంక్షల కారణంగా టూరిస్టులుగా కొన్ని చోట్లకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చిందని, పరీక్షలకు వెళ్లి రోడ్ల మీద నిద్రించాల్సి వచ్చిందని చెప్పారు. వెనెజులాపై ఆంక్షల కారణంగా 2017 నుంచి 2018వరకు అక్కడ శిశుమరణాల రేటు 31శాతం పెరిగిందని,ఆరోగ్య హక్కుకు భంగం కలిగిందని అలేనా చెప్పారు. వాక్సిన్ల కొనుగోలును అడ్డగించిన కారణంగా 26లక్షల మంది వెనెజులా పిల్లలకు మెనెంజటిస్‌, రోటావైరస్‌, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, మీజిల్స్‌, ఎల్లో ఫీవర్‌ ముప్పు తలెత్తిందన్నారు.


ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా వెనెజులా కరోనా మహమ్మారిని కట్టడి చేసి చావులను గణనీయంగా అరికట్టింది.ప్రతి లక్ష మందికి 20.1శాతం మంది మరణిస్తే అదే అమెరికాలో 304.18శాతం చావులు నమోదయ్యాయి. వెనెజులా మీద 2017 నుంచి 600 రకాల ఆర్ధిక ఆంక్షలను అమెరికా అమలు జరిపింది. ఒక దశలో వీటి కారణంగా 99శాతం రాబడిని కోల్పోయింది. మరోవైపు మితవాద శక్తులను రాజకీయంగా ఉసిగొల్పింది. వీటన్నింటినీ మదురో సర్కార్‌, అధికార సోషలిస్టు పార్టీ ఎదుర్కొన్నది. 2021 డిసెంబరులో జరిగిన ప్రాంతీయ, మున్సిపల్‌ ఎన్నికల్లో 23 గవర్నర్‌ పదవులకు గాను 21, 213 మేయర్‌ పదవుల్లో 120 గెలుచుకుంది.
అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల ఆంక్షల, ఇతర కొన్ని అంశాల కారణంగా గత పది సంవత్సరాల్లో వెనెజులా ఆర్ధికంగా 70శాతం దిగజారింది. అనేక తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఈ ఏడాది ప్రధమార్ధం నుంచి జిడిపి కోలుకోవటం ప్రారంభమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయని, జనం కొనుగోలు ఖర్చు పెరిగిందని తాజా వార్తలు. వెనెజులియన్‌ ఫైనాన్స్‌ అబ్సర్వరేటరీ సంస్థ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ద్రవ్యోల్బణం 53.8శాతం, ఇది గతేడాదితో పోలిస్తే ఆరోవంతు. కరెన్సీ బొలివర్‌ విలువ డాలర్‌తో గతేడాది 50శాతం పతనమైతే ఈ ఏడాది 17శాతం. అనేక నియంత్రణ చర్యలు, ఇతర అంశాలు దీనికి దోహదం చేశాయి.ఈ ఏడాది ఆఖరుకు రోజుకు 20లక్షల పీపాల చమురు ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుండగా ప్రస్తుతం 7.75లక్షల పీపాలు జరుగుతున్నది. కోటి మంది కార్మికులు, ఇతరులకు లబ్ది కలిగించే వేతనాలు, కనీసవేతనాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. లాటిన్‌ అమెరికా-కరీబియన్‌ ఎకనమిక్‌ కమిషన్‌ అంచనా ప్రకారం 2014 తరువాత ఈ ఏడాది వృద్ధి రేటు ఐదుశాతం ఉంటుందని, అది అన్ని లాటిన్‌ అమెరికా దేశాల కంటే ఎక్కువ అని పేర్కొన్నది. 2022 జనవరి నుంచి మార్చి నెలవరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చమురు ఉత్పత్తి రోజుకు 5,33,000 పీపాల నుంచి 7,56,000 పీపాలకు పెరిగింది. ఏడాది పొడవునా ఆరులక్షల పీపాలు ఉంటే జిడిపి వృద్ది రేటు 8శాతం ఉంటుందని మరొక అంచనా. ఐదు సంవత్సరాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలను అమెరికా కొద్దిగా మే 17 నుంచి సడలించింది. వెనెజులా ప్రభుత్వ రంగ చమురు కంపెనీతో లావాదేవీలు జరపవచ్చని అమెరికా, ఐరోపా చమురు కంపెనీలకు సూచించింది.


అమెరికా ఆంక్షలకు గురైన దేశాలలో ఇరాన్‌ కూడా ఒకటి. వెనెజులాాఇరాన్‌ మధ్య వివిధ రంగాలలో 20 సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరుదేశాల నేతలు జూన్‌ 11న సంతకాలు చేశారు. చమురు రంగంలో ఇరాన్‌, ఆహార, ఉత్పత్తి ఎగుమతిలో వెనెజులా సహకరించుకుంటాయి. ఎనిమిది లక్షల పీపాల చమురును రవానా చేసే ఓడలను ఇరాన్‌ అందిస్తుంది. రెండు దేశాలూ అమెరికా సామ్రాజ్యవాద బాధితులే, వ్యతిరేకులే. ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో తలెత్తిన పరిస్థితి పర్యవసానాలను అంచనా గట్టటంలో ఒక విధంగా అమెరికా విఫలమైందనే చెప్పాలి. అమెరికాలో అసాధారణ రీతిలో చమురు ధరల పెరుగుదల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీని దెబ్బతీయవచ్చనే అంచనాలున్నాయి. అసాధారణ రీతిలో పెరిగిన ద్రవ్యోల్బణ దేశ జిడిపి వృద్ది రేటును కూడా దెబ్బతీస్తుంది. వచ్చే ఏడాది మాంద్యంలోకి జారవచ్చన్న హెచ్చరికలూ ఉన్నాయి. చమురు ధరలు తగ్గాలంటే సరఫరాను పెంచాలన్న వినతులను సౌదీ ఇతర దేశాలు అంగీకరించలేదు. రష్యా చమురు ఎంత ఎక్కువగా మార్కెట్‌కు వస్తే అంత అధికంగా దానికి రాబడి వస్తుందని తేలింది. అందువలన వెనెజులాపై గతంలో విధించిన ఆంక్షలను చూసీచూడనట్లు నటిస్తూ అక్కడ చమురు ఉత్పత్తి పెంపుదలకు అమెరికా చొరవ చూపింది.తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే అమెరికాకూ మేలే గనుక ఇది దాని అవసరం కోసం తప్ప వెనెజులా మీద మనసు మారి కాదు. తిరిగి ఎప్పుడైనా పంజా విసరవచ్చు. దొరికిన ఈ వెసులుబాటును వెనెజులా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. గతంలో చమురు ధరల పతనం కూడా దాని ఆర్ధిక ఇబ్బందులకు ఒక కారణం ఇప్పుడు వందడాలర్లకు పైగా ఉన్నందున రష్యా మాదిరి కొన్ని దేశాలకు రాయితీ ఇచ్చినా దానికి రాబడి పెరుగుతుంది. ఇదే తరుణంలో అమెరికాను పక్కాగా ప్రతిఘటించే ఇరాన్‌తో ఒప్పందం కూడా సానుకూల అంశమే. ప్రతిపక్ష నేత గుయిడోను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా, దాని బాటలో నడిచిన ఇతర పశ్చిమ దేశాలు ఇప్పుడు అదే అమెరికా మదురో యంత్రాంగంతో చర్చలకు రావటం అమెరికాకు ప్రపంచంలో పరువు తక్కువ వ్యవహారమే దాన్ని నమ్ముకొని దానికి తాన తందాన అన్న దేశాలకూ పరాభవమే. ఇది మదురోకు పెద్ద నైతిక విజయం.చమురు ఎగుమతుల మీదనే ఆధారపడితే అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ఎప్పుడైనా ముప్పురావచ్చు.అందుకే సమతుల విస్తరణ, దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోవటం వంటి విధానాలవైపు వెనెజులా మళ్లుతున్నది.


ప్రతిపక్ష నేతను దేశాధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా 2019లో వెనెజులాలోని తన రాయబార కార్యాలయాన్ని పక్కనే ఉన్న కొలంబియాకు తరలించింది. అక్కడ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షం అధికారంలోకి రానున్నదని గతేడాదే వివిధ సర్వేలు వెల్లడించాయి, అదే జరిగింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడనున్నాయి.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తధ్యమని ముందుగానే అమెరికాకు తెలుసు గనుకనే అంటరాని వాడిగా పరిగణించిన మదురోతో చర్చలకుగాను మార్చి నెలలోనే బైడెన్‌ సర్కార్‌ వెనెజులాకు ఒక అధికారిక బృందాన్ని పంపింది. అక్కడ బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల సంప్రదింపులకు తప్ప మరొకటి కాదని బుకాయించింది. తరువాత ఆంక్షలను సడలిస్తామని ప్రకటించింది.చమురు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవచ్చని తమ కార్పొరేట్‌ సంస్థ చెవరాన్‌కు అనుమతి ఇచ్చింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దీనివలన అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలవగలమనే ధైర్యం బాధిత దేశాలకు వస్తుందని మితవాద, వామపక్ష వ్యతిరేకశక్తులు గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాను వ్యతిరేకించే చైనా, రష్యా ప్రభావం పశ్చిమార్ధగోళంలో పెరుగుతుందని వాపోతున్నాయి.


ఆగస్టు 13 నుంచి 27వ తేదీ వరకు వెనెజులా రాజధాని కారకాస్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్మీ గేమ్స్‌ జరుగుతున్నాయి.రష్యా ప్రారంభించిన ఈ క్రీడలను తొలిసారిగా పశ్చిమార్ధగోళంలోని వెనెజులా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 37 దేశాల నుంచి 275 టీములు, 36 విభాగాల్లో పోటీ పడేందుకు వస్తున్నట్లు సమాచారం. జరుగుతున్నది క్రీడలే కావచ్చుగానీ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లాటిన్‌ అమెరికాలో ఇప్పటికే తొమ్మిది దేశాల్లో అమెరికా వ్యతిరేక, వామపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో పనామా కూడా వీటి సరసన చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసినపుడు అమెరికా బయట-తన పెరటి తోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలోనూ ఒంటరి అవుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక్కులు ఒక సాకు-వంచన !

20 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

Human Rights, Joe Biden, Oil politics, Ukraine-Russia crisis, US imperialism, west pretence and hypocrisy


ఎం కోటేశ్వరరావు


ఎదుటివారికే చెప్పేటందుకే నీతులు. చరిత్రలో నీతి తప్పిన వారిని చూస్తే పశ్చిమ దేశాలకు మరొకటేదీ సాటి రాదు. మానవహక్కుల వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని తమకు లొంగని వారి మీద దాడులు చేస్తుంటాయి. వాటికి భంగం కలిగించటంలో అవే ముందుంటాయి. ఒక నాడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను భ్రష్టుడు, అక్కడ మానవహక్కులు లేవు అని ధ్వజమెత్తిన అమెరికా అధినేత జో బైడెన్‌ ఇప్పుడు అతగాడినే కౌగలించుకున్నాడు. సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీని సల్మానే టర్కీలో హత్య చేయించినట్లు చెప్పిన అమెరికా 2018 తరువాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను కూడా తెంచుకుంది. తరువాత సౌదీ గానీ, రాజుగానీ మారిందేమీ లేదు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో 2018 అక్టోబరు రెండున ప్రవేశించిన ఖషోగ్గీని అక్కడే హత్య చేయటం వెనుక సౌదీ రాజు హస్తం ఉందని సిఐఏ ఒక నివేదికను బైడెన్‌కు అందచేసింది. జోబైడెన్‌ సౌదీ పర్యటనపై అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీశాండర్స్‌ మాట్లాడుతూ ” చూడండి, వందబిలియన్‌ డాలర్ల ఆస్తికలిగిన కుటుంబమది, అది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది, మహిళలను మూడో తరగతి పౌరులుగా చూస్తుంది.తన ప్రత్యర్ధులను జైలుపాలు చేస్తుంది, మట్టుపెట్టిస్తుంది.” అలాంటి దేశాన్ని సందర్శించి పాలకుడితో చెట్టపట్టాలు వేసుకుంటారా అని విమర్శించాడు. నాలుగు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో జో బైడెన్‌ సాధించిందేమిటి అన్నది ఒక అంశమైతే తమకు అవసరమైతే గతంలో చెప్పిన మాటలను దిగమింగుతాడని స్పష్టమైంది. ఇదంతా ఎందుకు అంటే రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసమే.


అమెరికాలో ఇంథన ధరలు ఆకాశాన్నంటాయి.ద్రవ్యోల్బణం నాలుగుదశాబ్దాల గరిష్టాన్ని తాకింది. అవి పెరిగే కొద్దీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికారపార్టీకి ఆమేరకు ఓట్లు తగ్గేందుకు సెగతగలనుందనే వార్తలు. మరోవైపున పశ్చిమాసియాలో రష్యాకు మద్దతుదారుగా ఉన్న ఇరాన్ను కట్టడి చేసేందుకు, చమురు ఉత్పత్తి, సరఫరాలను పెంచి రష్యాను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు బైడెన్‌ విఫల పరటన చేశాడని, ఖాళీ చేతులతో వెళ్లాడని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్నదాని కంటే అదనపు ఉత్పత్తికి ఎలాంటి హమీ లేదని, ఇప్పటికే రోజుకు పదమూడు మిలియన్‌ పీపాలకు పైగా ఉత్పత్తి చేస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పాడు. అమెరికోసం చైనానో చైనా కోసం అమెరికానో వదులు కోవటం తమ విధానం కాదని, ప్రజలతో వారధి నిర్మిస్తామని సౌదీ విదేశాంగమంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ చెప్పాడు. బైడెన్‌ పర్యటన తరువాత రష్యా అధినేత పుతిన్‌ ఇరాన్‌ వెళుతున్నాడు. బైడెన్‌తో భేటీ తరువాత సౌదీ రాజు సల్మాన్‌ మాట్లాడుతూ తమ భేటీలో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య ప్రస్తావన గురించి చెబుతూ ” జరిగింది విచారకరం, అలాంటివి పునరావృతం కాకుండా చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ప్రపంచంలో అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇరాక్‌లోని అబూ గ్రాయిబ్‌ జైల్లో ఖైదీలపై చిత్రహింసల వంటి అనేక తప్పిదాలకు అమెరికా పాల్పడలేదా” అని ఎదురు ప్రశ్నించాడు.


అమెరికా పధకంలో భాగంగా రష్యాతో వైరం పెంచుకున్న ఐరోపా దేశాలకు ఇంథన సరఫరాలు తగ్గాయి. వేసవి తరువాత చలికాలంలో వెచ్చదనానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఐరోపా చూస్తోంది. ఈ క్రమంలో ఐరోపా సమాఖ్య కూడా ప్రాణ, విత్త, మానభంగములందు ఆడితప్పవచ్చు అన్నట్లుగా మానవహక్కులను ఇంథనం కోసం కొంతకాలం పక్కన పెట్టేందుకు పూనుకుంది.ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు మృగ్యం అని ఏ దేశాల గురించైతే చెప్పారో ఇప్పుడు ఇంథనం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాలకుల నిరంకుశ చర్యల గురించి తెలిసిందే. అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నిహయన్‌ పారిస్‌ పర్యటనకు వెళితే రాచమర్యాదలు జరిపారు.ఇంథన పధకాల్లో పెట్టుబడుల గురించి వారు చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ముఖ్యమైన మిలిటరీ, వ్యూహాత్మకంగా గట్టి బంధం ఉందనేందుకు ఇది నిదర్శనమని, మానవహక్కుల సమస్యల కంటే ఇంథన భద్రతకు ఫ్రాన్స్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలన్నీ సిరియాపై అమలు జరుపుతున్న ఆంక్షలన్నింటినీ ఎమిరేట్స్‌ వ్యతిరేకించటమే కాదు, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నా, అదేమీ తెలియనట్లు ఫ్రాన్స్‌ ఉంది.


తాము నిరంకుశ పాలకుడిగా వర్ణిస్తున్న అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇలహమ్‌ అలియెవుతో ఐరోపా సమాఖ్య(ఇయు) అధ్యక్షురాలు ఉర్సులా వాండెన్‌ లెయన్‌, ఇంథన కమిషనర్‌ కద్రి సిమ్సన్‌ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.సహకార మండలిని ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఏటా 20బిలియన్‌ ఘనపుటడుగుల గాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పుడున్న సహజవాయు సరఫరా 2021లో 8.1బిసిఎంలను ఈ ఏడాది ఆఖరుకు 12బిసిఎంలకు పెంచుతారు. ఈ సంప్రదింపుల సందర్భంగా గతంలో ఇయు లేవనెత్తిన మానవహక్కుల అంశం ఏమైందని విలేకర్లు అడగ్గా తగు సమయంలో వాటిని లేవనెత్తుతామని, ఇప్పుడు కేవలం ఇంథన సహకారంపైనే కేంద్రీకరించినట్లు ఇయు అధికారులు సమర్ధించుకున్నారు. తమ గురించి మంచిగా చెప్పేందుకు ఐరోపా రాజకీయవేత్తలకు అజర్‌బైజాన్‌ అక్రమంగా ఐరోపా బాంకుల ద్వారా మూడుబిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు జర్నలిస్టుల బృందం వెల్లడించింది.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి రష్యా, చైనాలు మినహా ఇతర దేశాల గురించి గతంలో పశ్చిమ దేశాలు గతంలో ప్రస్తావించిన మానవహక్కుల అంశాలను పక్కన పెట్టేశారు.ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం, మానవహక్కుల ఉల్లంఘనల గురించి 2020-24 కార్యాచరణ ప్రణాళికను ఐరోపా సమాఖ్య ప్రకటించింది. నూతన ఇంథన విధానంలో వాటి ప్రస్తావన లేకుండా చేశారు. ఇది ఐరాస నిరంతర అభివృద్ధి లక్ష్యాలకు లోబడి రూపొందించిన న్యాయమైన, సమగ్ర ఇంథన విధానం అని సమర్ధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి నిత్యం కబుర్లు చెప్పే ఐరోపా అగ్రదేశాలు ఇప్పుడు దానికి హాని కలిగించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తికి పూనుకున్నాయి. దానికి రష్యాను దోషిగా చూపుతున్నాయి. రష్యా కోరుతున్నట్లుగా దాని భద్రతకు హామీ కల్పిస్తే ఉక్రెయిన్‌పై మరుక్షణమే దాడులు ఆగుతాయి, ఐరోపాకు అవసరమైన ఇంథనం రష్యా నుంచి లభిస్తుంది. కానీ వాటికి కావాల్సింది అది కాదు, ఆధిపత్యం. అందుకోసం మానవహక్కులు మంటగలిసినా, పర్యావరణానికి భంగం కలిగినా అమెరికా కూటమి దేశాలకు పట్టదు. గాస్‌ సరఫరాలో ఆటంకాల కారణంగా జర్మనీలో కూడా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి మరోసారి పెరుగుతోందని జర్మన్‌ ఛాన్సలర్‌ షఉల్జ్‌ చెప్పాడు.


ఒకవైపు రష్యాను దెబ్బతీసేందుకు తమతో సహకరించాలని జో బైడెన్‌ గతవారంలో సౌదీ అరేబియాను కోరాడు. కానీ అదే సౌదీ తన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన(డీజిలుకు దీనికి కొద్ది తేడా ఉంటుంది) ఇంథనాన్ని రష్యా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొంటోంది. దీనిలో కొంత భాగం తన రేవులకు వచ్చే ఓడలకు ఇంథనంగా కూడా ఆమ్ముతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ వివాదం తరువాత దిగుమతులు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 3,20,000 టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 6,47,000 టన్నులకు పెరిగింది. గతేడాది మొత్తంగా పదిలక్షల 50 వేల టన్నులు దిగుమతి చేసుకుంది. దీని వలన చమురును శుద్ది చేసే ఖర్చు తగ్గుతుంది. తన చమురును అధిక ధరకు ఎగుమతి చేసుకోవచ్చు.మరో వైపు అమెరికా పెత్తనం చెల్లదు అనే సందేశాన్ని పంపవచ్చు. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌, ఇతర దేశాల్లోని రష్యాతో ఇప్పటి వరకు సౌదీకి మంచి సంబంధాలే ఉన్నాయి.


ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నదనే సాకుతో తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా కొన్ని ప్రతిచర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిలో కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియ(సిపిసి) పైప్‌లైన్‌ మూసివేత ఒకటి. కజకస్తాన్‌ నుంచి రష్యా మీదుగా (నోవోరోస్సిక్‌ రేవు) నల్లసముద్రం వరకు ఈ లైన్‌ ఉంది. దీనిలో పశ్చిమ దేశాలు, ఆసియా, రష్యాకు చెందిన కంపెనీలు భాగస్వాములు. వివాదం తలెత్తిన తరువాత ఈ పైప్‌లైన్‌లో ఒక భాగస్వామి కజకస్తాన్‌ ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో జూలై ఆరు నుంచి 30 రోజులపాటు కజకస్తాన్‌ చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మార్చినెలలో సంభవించిన తుపాను వలన ఏర్పడిన చమురు తెట్టు కారణాన్ని చూపినప్పటికీ ఐరోపా దేశాలను దెబ్బతీయాలన్నదే దీని వెనుక అసలు కారణం. ఈ లైన్‌ ద్వారా రోజుకు పదిలక్షల పీపాల సరఫరా జరుగుతోంది. దీనిపై ఆధారపడిన చెవరాన్‌, ఎక్సాన్‌ మోబిల్‌, షెల్‌, ఎని అనే పశ్చిమ దేశాల కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతే అవి ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతాయి. ఇవి కజకస్తాన్‌లో చమురు వెలికితీస్తున్నాయి. ఉక్రెయిన్‌ వివాదం తరువాత ఈ కంపెనీలు కొన్ని రష్యాలో తవ్వకాలను నిలిపివేశాయి.ఒకనాడు భ్రష్టుడన్న సౌదీ రాజు సల్మాన్‌తో జో బైడెన్‌ దిగిన ఫొటో ఒక చర్చగా మారింది. మానవహక్కుల గురించి అమెరికా వంచనకు ఇది పక్కా నిదర్శనమని, వారికి అవసరం అనుకుంటే విలువల వలువలను నిస్సిగ్గుగా విప్పి పక్కన పెడతారంటూ వ్యాఖ్యలు వెలువడ్డాయి.ఐరోపా దేశాలూ దీనిలో తక్కువేమీ కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అతివలకు అగ్రాసనం వేసిన వామపక్ష నికరాగువా !

13 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, Latin America, Left politics, Opinion, USA, Women

≈ Leave a comment

Tags

Daniel Ortega, Nicaragua Women, Sandinista Revolution, US imperialism, Women’s Liberation


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు నిరంతరం మితవాదశక్తులు, వాటికి మద్దతు ఇచ్చే అమెరికా కుట్రలు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్న నికరాగువా వామపక్ష ప్రభుత్వం. గత పదిహేను సంవత్సరాలలో అది సాధించిన ప్రధాన విజయాలలో మహిళా సాధికారత, సమానత్వానికి పెద్ద పీట వేయటం అంటే అతిశయోక్తి కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 76శాతం ఓట్లతో వామపక్షం గెలుపుకు తోడ్పడిన అంశాలలో ఇదొకటి. గెలిచింది వామపక్షం, అందునా అమెరికాకు బద్ద విరోధి కనుక ఆరోపణలు, వక్రీకరణలు సరేసరి. 2007 నుంచి రెండవ సారి అధికారంలో ఉన్న శాండినిస్టా నేత డేనియల్‌ ఓర్టేగా సర్కార్‌ తన వాగ్దానాలను అనేకం నెరవేర్చింది. తన అజెండాలోని అనేక అంశాలకు నాందీ వాచకం పలికింది అప్పటి నుంచే. పార్లమెంటులో కుటుంబ, మహిళా, శిశు,యువజన కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఇర్మా డావిలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గంలో 50శాతం కంటే ఎక్కువ మంది మంత్రులున్న 14 దేశాల్లో స్పెయిన్‌ 66.7శాతంతో ప్రధమ స్ధానంలో ఉంటే ఫిన్లండ్‌ 61.1, నికరాగువా 58.8శాతంతో మూడవ స్ధానంలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో ప్రధమ స్ధానం. ఇదే విధంగా ఎక్కువ మంది మహిళలున్న పార్లమెంట్లు మూడు కాగా మూడవది నికరాగువా. ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన లింగ భేదం సూచికలో ఐదవ స్దానంలో నికరాగువా ఉంది. 2007లో 90వ స్ధానంలో ఉంది. అంటే దీని అర్ధం పురుషులతో సమంగా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులోని 91 స్ధానాల్లో 46 మంది మహిళలు, 45 మంది పురుషులు. దీనికి అనుగుణంగానే మెజారిటీ కమిటీలు, కమిషన్లకు మహిళలే అధిపతులుగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సగం స్ధానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండటమే దీనికి కారణం.వామపక్ష ప్రభుత్వం నిజమైన సమాన భాగస్వామ్యాన్ని చట్టపరంగా కల్పించింది. న్యాయ వ్యవస్ధలో సగానికి పైగా కార్యనిర్వాహక వ్యవస్ధలో 58శాతం మహిళలే ఉన్నారు. చట్టాలు చేయటమే కాదు అమలు వల్లనే ఇది జరిగింది.


1961లో ఏర్పడిన శాండినిస్టా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్‌) 1979లో నియంత సోమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేపట్టింది.1979 నుంచి 1990 వరకు పాలన సాగించింది. అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా తిరుగుబాటుదార్లతో పోరు తదితర కారణాలతో 1990 ఎన్నికల్లో ఫ్రంట్‌ ఓడిపోయింది.2006 వరకు ప్రతిపక్షాలు మితవాదశక్తులు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తిరిగి శాండినిస్టాలు గెలుస్తున్నారు.ఫ్రంట్‌లో చీలికలు, తిరుగుబాట్లు, విద్రోహాలు అనేకం జరిగాయి. లాటిన్‌ అమెరికాలో జరిగిన తిరుగుబాట్లలో మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు చేపట్టిన పరిణామం నికరాగువాలో జరిగింది. విముక్తి పోరాటంలో పెద్ద పాత్ర పోషించటం ఒకటైతే ఆ పోరాటాన్ని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా విద్రోహులలో కూడా మహిళలు ఉన్నారు. శాండినిస్టాలలో 30శాతం మంది ఉండగా కాంట్రాలలో ఏడుశాతం ఉన్నట్లు కొందరు అంచనా వేశారు.

శాండినిస్టాల పాలనలో పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ మితవాద, సామ్రాజ్యవాదశక్తులు వామపక్ష పాలన మీద బురద జల్లుతున్నాయి. తొలిసారి శాండినిస్టాల పాలనలో చేపట్టిన సంక్షేమ, ఇతర చర్యలను తరువాత సాగిన మితవాద పాలనలో పూర్తిగా ఎత్తివేయటం సాధ్యం కాలేదు. రెండవసారి 2007 నుంచి పాలన సాగిస్తున్న శాండినిస్టాలు అనేక వాగ్దానాలను అమలు జరిపారు. మహిళలకు భూమి పట్టాలను ఇవ్వటమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వారు రాణించి ఆర్ధిక సాధికారతను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దేశంలో 55శాతం మంది మహిళలు భూయజమానులుగా మారారు. దాంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడింది, అన్నార్తులు లేకుండా పోయారు. దేశంలో 90శాతం ఆహార అవసరాలను తీర్చటంలో మహిళలు పెద్ద పాత్రను పోషించారు. ప్రపంచంలో మైక్రోఫైనాన్స్‌ వడ్డీ రేటు 35శాతం వరకు ఉండగా నికరాగువాలో అది కేవలం 0.5శాతమే ఉంది.2007 తరువాత 5,900 సహకార సంస్ధలను ఏర్పాటు చేశారు.దారిద్య్రనిర్మూలన 48 నుంచి 25శాతానికి తగ్గగా దుర్భర దారిద్య్రం 17.5 నుంచి ఏడు శాతానికి తగ్గింది. దీంతో మొత్తంగా ప్రత్యేకించి ఒంటరి మహిళలు ఎంతో లబ్దిపొందారు. గృహ హింసకూడా తగ్గింది. 2007 నాటికి పట్టణాల్లో 65శాతం మందికి మంచినీరు అందుబాటులో ఉండగా ఇప్పుడు 92శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 28 నుంచి 55శాతానికి పెరిగింది. విద్యుత్‌ కనెక్షన్లు 54 నుంచి 99శాతానికి పెరిగిగాయి. విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.


2018 ఏప్రిల్‌లో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. వీటిలో క్రైస్తవ మత సంస్ధలు, చర్చ్‌లు ప్రధాన పాత్రపోషించాయి. ఆందోళనకారులకు చర్చ్‌లలో ఆశ్రయం కల్పించటంతో సహా పలు రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకులకు సహకరించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్న వారికి అందుతున్న నిధుల ఖర్చు తీరుతెన్నులను ప్రశ్నించటం, సరైన సమాధానం ఇవ్వని వాటి అదుపు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మార్చినెలలో వాటికన్‌ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.


లాటిన్‌ అమెరికాను తన పెరటితోటగా చేసుకొనేందుకు అమెరికా మొదటి ప్రపంచ యుద్దానికి ఎంతో ముందుగానే చూసింది. దాని లక్ష్యాలలో నికరాగువా ఒకటి. కరిబియన్‌ సముద్రం ద్వారా అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఓడల రవాణాకు ఒక కాలువ తవ్వాలనే ఆలోచన 1825 నుంచి ఉంది. పనామా కాలువ తవ్వకం తరువాత నికరాగువా కాలువను తవ్వేందుకు జపాన్‌ ముందుకు వచ్చింది. ఆ పధకం తనకు దక్కలేదనే కసితో దాన్ని ఎలాగైనా నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా 1911 నుంచి అనేకసార్లు నికరాగువా మీద దాడి చేసింది. వాటిని గెరిల్లా నేత అగస్టో సీజర్‌ శాండినో నాయకత్వాన 1934వరకు తిరుగుబాటుదార్లు వాటిని ప్రతిఘటించారు. అమెరికా కుట్రలో భాగంగా శాండినోను శాంతి చర్చలకు పిలిచి నాడు మిలిటరీ కమాండర్‌గా ఉన్న అనాస్టాసియో సోమోజా గార్సియా అధికారాన్ని హస్తగతం చేసుకొని శాండినోను హత్యచేయించాడు. అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటనకు మారుపేరుగా శాండినో మారారు. తరువాత సోమోజా ఇద్దరు కుమారులు నిరంకుశపాలన సాగించారు.రెండవ వాడైన సోమోజా డెబాయిల్‌ను 1979లో వామపక్ష శాండినిస్టా గెరిల్లాలు గద్దె దింపారు. సోమోజాలు ఏర్పాటు చేసిన నేషనల్‌ గార్డ్స్‌ మాజీలతో కాంట్రాలనే పేరుతో ఒక విద్రోహ సాయుధ సంస్ధను రూపొందించి శాండినిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రపన్నింది. పదేండ్లపాటు వారి అణచివేతలోనే శాండినిస్టాలు కేంద్రీకరించాల్సి వచ్చింది. దాంతో జనంలో తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని అమెరికా మద్దతుతో మితవాదశక్తులు ఎన్నికల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకొని 1990 నుంచి 2006వరకు అధికారంలో ఉన్నాయి. 2007 నుంచి డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా శాండినిస్టాలు తిరిగి అధికారంలో కొనసాగుతున్నారు.


2021లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఓర్టేగా ఐదవసారి భారీ మెజారిటీతో ఎన్నికయ్యాడు.లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదులకు తగిలిన మరొక ఎదురుదెబ్బ ఇది.1985లో కమ్యూనిస్టు చైనాను గుర్తించి ఓర్టేగా సర్కార్‌ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. తరువాత 1990లో అధికారానికి వచ్చిన అమెరికా అనుకూలశక్తులు అంతకు ముందు మాదిరే తైవాన్నే అసలైన చైనాగా తిరిగి గుర్తించారు. 2021లో తిరిగి ఓర్టేగా తైవాన్ను తిరస్కరించి చైనాతో సంబంధాలను పునరుద్దరించాడు. స్వయంగా అమెరికా కమ్యూనిస్టు చైనాను గుర్తించినప్పటికీ తైవాన్ను ఉపయోగించి రాజకీయాలు చేసేందుకు లాటిన్‌ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాల ద్వారా తైవాన్‌తో సంబంధాలతో కొనసాగించింది.2007లో కోస్టారికా, 2017లో పనామా, 2018లో ఎల్‌ సాల్వడార్‌ చైనాను గుర్తించాయి.హొండురాస్‌ కూడా అదే బాటలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో మారుతున్న పరిణామాలకు అద్దంపడుతున్నాయి. మితవాద, మిలిటరీలను ఉపయోగించుకొని అమెరికా తన లబ్ది తాను చూసుకోవటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆశించటంతో అమెరికన్‌ లాబీలకు దిక్కుతోచటం లేదు. చైనా పెట్టుబడులతో అభివృద్ధి పనులు జరిగితే తమ పట్టు మరింత సడలుతుందనే భయం అమెరికాకు పట్టుకుంది. దీంతో నికరాగువా, ఇతర దేశాల వామపక్షాల్లో ఉన్న విబేధాలను మరింత పెంచి కొంత మందిని చీల్చి తన పబ్బంగడుపుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో అది మరిన్ని కుట్రలకు పాల్పడి వామపక్ష ప్రభుత్వాలను కూలదోసే యత్నాలను మరింత వేగిరం చేసేందుకు పూనుకుంది. నికరాగువా సర్కార్‌ ఎప్పటి కప్పుడు అలాంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా మీద ఆంక్షలు – అమెరికా అసలు లక్ష్యం ఇంధన మార్కెట్‌ కబ్జా !

05 Tuesday Apr 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

fuel politics, Narendra Modi, oil, Sanctions on Russia, US crude to India, US imperialism


ఎం కోటేశ్వరరావు


” మన దేశానికి ముందు ఇంధన భద్రత ముఖ్యం, ఎక్కడైనా చౌకగా చమురు దొరికితే అక్కడ ఎందుకు కొనకూడదు ? రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, పెద్ద మొత్తంలో ఇప్పటికే వచ్చింది, మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం ” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజమే కదా ! అభ్యంతర పెడుతున్నది ఎవరు? అమెరికా ! దాన్ని ఒక్కమాట అనలేకపోవటం దేశ ప్రయోజనాలకోసమేనా అన్నది ప్రశ్న. 2021ఏడాది మొత్తంగా మన దేశం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు 16 మిలియన్ల పీపాలు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం 13మి.పీపాలు. ఇది పెద్ద పెరుగుదలే ఐనా మన దిగుమతుల మొత్తంలో రెండుశాతం లోపే అన్నది గమనించాలి.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున మనం కూడా ధరలు పెంచకతప్పటం లేదని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నమ్మబలుకుతున్నారు ఇది పూర్తిగా నిజమా ? నవంబరు నాలుగు నుంచి 137 రోజుల పాటు వినియోగదారుల చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం( ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా) స్ధంభింప చేసింది. మార్చినెల 21వ తేదీ నుంచి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. గతంలో మనకు చెప్పిందేమిటి ? అంతర్జాతీయంగా ఎంత ధర పెరిగితే అంత మొత్తాన్ని జనాల నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత మేరకు రోజూ ఉదయాన్నే తగ్గిస్తామని, ఇది విధాన నిర్ణయం అన్నారు. మరి అది 137 రోజుల పాటు ఎందుకు అమల్లో లేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే అని ప్రతిపక్షాలు అంటే కాదన్నారు తప్ప కారణం చెప్పలేదు. గట్టిగా అడిగితే దేశభక్తులతో గొడవెందుకని సర్దుకుపోదాం రండి అన్నట్లుగా జనం ఉన్నారు. చిత్రం ఏమిటంటే మార్చి 21 నుంచి మన దేశంలో చమురు ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. దీని భావమేమి గోమాతా !


మార్చినెల తొమ్మిదవ తేదీన మనం కొనుగోలు చేసే పీపా చమురు ధర 128.24 డాలర్లు. అది తరువాత క్రమంగా తగ్గుతూ ఏప్రిల్‌ ఒకటవ తేదీన 103.02 డాలర్లు(కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ) ఉన్నట్లు నాలుగవ తేదీన ప్రకటించింది. మరి ఈలెక్కన పెంపుదల-తగ్గించటం ఉంటే జనాలకు ధరలు తగ్గాలి. మార్చి 22వ తేదీ ధరను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అది 113.41 డాలర్లే, దాని ప్రకారం చూసినా తగ్గాల్సింది పోయి ” తగ్గేదేలే ” అన్నట్లుగా పెంచుతున్నారు. ఎందుకని ? ప్రజా ప్రయోజనాల కోసమే అనుకుందామా ? లక్షల కోట్లు ప్రజల కోసం కుమ్మరించామని ఒక నోటితో చెబుతారు, వాటితో పోలిస్తే 137 రోజులో చమురు సంస్ధలకు వచ్చినట్లు చెప్పిన నష్టమెంత కేవలం 19వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్న మొత్తాన్ని భరించలేని దుస్ధితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా ?


నిజానికి ఇది పాక్షిక అంచనాగానే భావించాలి. ఇది వచ్చిన నష్టం, కంపెనీలకు రావాల్సిన లాభాలు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఈ కారణంగానే నిలిపివేసిన మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర నవంబరు నెలలో 80.64డాలర్లు, డిసెంబరులో 73.30, జనవరిలో 84.67, ఫిబ్రవరిలో 94.07, మార్చినెలలో 112.87 డాలర్లుంది. తొలుత ఈ మొత్తాన్ని లెక్కించి వచ్చిన లోటును వసూలు చేస్తారు, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో నిమిత్తం లేకుండా వరుసగా పెంచుతున్నారు. పైసా వసూలు మొత్తం జరిగిన తరువాత పెరుగుదలను బట్టి వడ్డింపు ఉంటుంది.


ప్రస్తుత ధరల(మార్చిచివరి వారం) ప్రకారం చమురు కంపెనీలు లీటరుకు రు.15 తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని, ఈ మేరకు ధరలు పెంచవచ్చన్నది ఒక అంచనా. ఏప్రిల్‌ 5వ తేదీ పెంపుతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రు.104.61 ఉంది, అంటే ఇప్పటికే రు.9.20 పెరిగింది. దీపావళి కానుక పేరుతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయల సెస్‌ తగ్గించింది. గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న దానిలో ఆ మేరకు తగ్గింపు మంచిదే కదా అనుకున్నాం. ఇప్పుడు పెంచిన ధరలతో అది కూడా హరించుకుపోయింది. ఒక లీటరు మీద ఒక రూపాయి సెస్‌ తగ్గిస్తే కేంద్రానికి ఏటా పదిహేనువేల కోట్ల ఆదాయలోటని అంచనా.దీన్నే జనం వైపు నుంచి చూస్తే ఒక రూపాయి పెంచితే అంతే మొత్తం భారం అవుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి చమురు మీద ఎక్సైజ్‌ డ్యూటీ లేదా సెస్‌ ఖాతా కింద వచ్చిన రాబడి 2014-15లో రు.99,068 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లు.


ఇంధన ధరలు బాగా తగ్గినపుడు ఆ మేరకు వినియోగదారులకు తగ్గకుండా మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది.పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ పెంచిన పన్ను, మరోసారి చమురు ధరల పెంపుదల ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అందువలన అది జరిగి జన జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండాలంటే ఇంధనం మీద పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. కేంద్ర పాలకులు దాని గురించి మాట్లాడటం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించవచ్చు కదా అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను పెంచినపుడు బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం ముందుగా తాను పెంచిన వాటిని పూర్తిగా తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. ఆ మేరకు రాష్ట్రాలకు తగ్గిన రాబడిని కేంద్రం భరిస్తే అదొకదారి. ఇప్పటికే పరిమిత ఆదాయ వనరులున్న రాష్ట్రాలను తగ్గించమనటం సబబు కాదు.


ఏప్రిల్‌ మూడుతో ముగిసిన వారంలో అంతర్జాతీయ చమురు ధరలు పదమూడుశాతం తగ్గాయి. ఒక వారంలో ఇంత పెద్ద మొత్తంలో గత రెండు సంవత్సరాల్లో జరగలేదు. ఈ తగ్గుదలకు కారణం సౌదీ అరేబియా – ఎమెన్‌లోని హౌతీ(షియా) తెగ తిరుగుబాటుదార్లతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సరఫరాలకు ఆటంకం తొలగటం ఒక కారణంగానూ, అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి ఒక మిలియన్‌ పీపాల విడుదలకు బైడెన్‌ ప్రకటన దోహదం చేసిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగినపుడు బ్రెంట్‌ రకం ధర 103.38డాలర్లుంటే ఏప్రిల్‌ ఐదున ఇది 109 డాలర్లుగా ఉంది అందువలన చమురు ధరల పెరుగుదలాపతనానికి ఏకైక కారణం ఏదీ కనిపించటం లేదు. ఎవరైనా ఉక్రెయిన్‌ – రష్యా వివాదాన్ని సాకుగా చూపితే కుదరదు.


రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని మన దేశాన్ని అమెరికా వత్తిడి చేస్తోంది. దాన్ని తెరవెనుక నుంచి చూస్తే తమ నుంచి ఇంకా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న వత్తిడి కనిపిస్తుంది. రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్న సమాచారం ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అమెరికా నుంచి మన దేశం కొనుగోలు చేసే చమురు 48శాతం పెరిగింది. దీంతో మన దేశం దిగుమతి చేసుకొనే చమురువాటా అమెరికా నుంచి 14శాతానికి చేరింది. దశాబ్దాల తరబడి మనతో సత్సంబంధాలు కలిగి ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోలు తగ్గించి అమెరికా వైపు నరేంద్రమోడీ సర్కార్‌ మొగ్గటానికి రాజకీయ కారణాలు, అమెరికా చమురు కంపెనీల ప్రభావం ప్రధాన కారణం. మన దిగుమల్లో ఇరాక్‌ ప్రధమ స్ధానంలో ఉండగా ఇప్పటివరకు రెండవదిగా ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అమెరికా వెనక్కు నెట్టేసింది. గతంలో చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అందువలన అక్కడి కార్పొరేట్లకు మార్కెట్‌ను సంపాదించేందుకు వైట్‌హౌస్‌లో పాలకులు ఎవరున్నా ఒకేదెబ్బతో అనేక దేశాలను తమ ఖాతాదారులుగా మార్చుకొనేందుకు పూనుకున్నారు.


మన కంటే ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకొనే చైనాకు అమెరికాతో ఉన్న వైరం కారణంగా అది దిగుమతి చేసుకోవటం లేదు. మన దేశం ఇప్పటికే అమెరికా వలలో పడింది. మధ్యప్రాచ్య లేదా పశ్చిమాసియా నుంచి మన దిగుమతుల్లో 52.7శాతం ఉండగా ఆఫ్రికా నుంచి 15, అమెరికా నుంచి 14శాతం ఉంది. వీటితో పోల్చుకుంటే రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది 1-2శాతం మధ్యలో ఉంది. దీన్ని కూడా నిలిపివేయాలని మన నరేంద్రమోడీని అమెరికా ఆదేశిస్తున్నది. మన దేశ ఎగుమతుల్లో నాలుగో వంతు శుద్ది చేసిన చమురు లేదా చమురు ఉత్పత్తులు ఉన్నాయి. అందువలన చమురు శుద్ది కంపెనీలు రష్యానుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులకు దాన్ని వినియోగిస్తే ఆ కంపెనీలకు లాభం. ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేస్తే ఐరోపా మార్కెట్లో పాగావేసేందుకు అమెరికా పూనుకుందన్నది స్పష్టం. ప్రపంచంలో చైనా తరువాత రెండో పెద్ద దిగుమతిదారుగా ఉన్న మన మార్కెట్‌ను కూడా కబళించేందుకు పూనుకుంది. బహుశా ఆ ఎత్తుగడతో కూడా రష్యాను మన నుంచి వేరే చేసేందుకు పూనుకున్నట్లు భావించవచ్చు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల పాటలకు(ఆంక్షలకు) అనుగుణంగా ఇప్పటికే మనదేశంతో నరేంద్రమోడీ డాన్స్‌ చేయిస్తున్నారు. దాన్లో óభాగంగానే ఇరాన్‌, వెనెజుల నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేశారు. గతంలో వెనెజులా నుంచి మన అవసరాల్లో 12శాతం, ఇరాన్‌ నుంచి ఆరుశాతం దిగుమతి చేసుకున్న ఉదంతాలున్నాయి.ఇలా లొంగిపోయిన కారణంగానే ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు వద్దనే ధైర్యం అమెరికాకు వచ్చింది.


మరో వైపు అదే అమెరికా చేస్తున్నదేమిటి ? రాయిటర్స్‌ మార్చి ఎనిమిదవతేదీ వార్తా కథనం ప్రకారం అమెరికా 2021లో రోజుకు 6,72,000 పీపాల ముడి చమురు లేదా చమురు ఉత్పత్తులను రికార్డు స్దాయిలో రష్యానుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 1,99,000 పీపాల చమురు ఉంది. అమెరికా గల్ఫ్‌ తీరంలో వచ్చిన భారీ తుపాన్ల కారణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంక్షలతో నిమిత్తం లేకుండానే రోజుకు 57వేల పీపాలకు కొనుగోళ్లను తగ్గించి, తిరిగి లక్ష పీపాలకు పెంచినట్లు వార్తలు.ఈ నెల 22లోగా లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా ఆర్ధికశాఖ కోరింది. మనం వెంటనే కొనుగోలు నిలిపివేయాలని చెబుతున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ తాను మాత్రం ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా రష్యా దిగుమతులను నిలిపివేస్తుందట.


తాజాగా అమెరికా తమ నుంచి కొనుగోళ్ల మొత్తాన్ని 43శాతం పెంచినట్లు రష్యా భద్రతామండలి ఉప కార్యదర్శి మిఖాయిల్‌ పొపోవ్‌ ఏప్రిల్‌ మూడున చెప్పాడు. రోజుకు లక్ష పీపాలు దిగుమతి చేసుకుంటున్నట్లు, అత్యవసర వస్తువుల కింద మినరల్‌ ఎరువులను దిగుమతి కూడా చేసుకోవచ్చని అమెరికా కంపెనీలకు అనుమతిచ్చినట్లు తెలిపాడు. అమెరికా వద్ద చమురు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అక్కడి చమురుశుద్ది సంస్ధలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడిచమురుతో లాభాలు ఎక్కువగా వస్తున్నందున దిగుమతి చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముకొని లబ్ది పొందుతున్నాయి. అందుకే 2014 నుంచి అమెరికా సర్కార్‌ రష్యా మీద అనేక ఆంక్షలను విధించినప్పటికీ చమురు జోలికి పోలేదు. బైడెన్‌ ప్రకటించినట్లు నిజంగానే అమెరికా పూర్తి నిషేధం అమల్లోకి వస్తే అక్కడి కార్పొరేట్‌ శక్తులు అంగీకరిస్తాయా ? తమ మార్కెట్‌ను అమెరికాకు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలను ఐరోపా దేశాలు ఆలోచించుకోవా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాడలేని అపర జాతీయవాదులు – ఆచూకీ లేని ఆత్మగౌరవం !

02 Saturday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, imran khan, Narendra Modi Failures, RSS, Russia-Ukraine War, US, US Coup-Pak, US imperialism, US Threatens India

నాడు సావర్కర్‌కు ఎత్తుగడ బొంకు – నేడు నరేంద్రమోడీకి దేశ హితం సాకు !



ఎం కోటేశ్వరరావు


పొరుగుదేశమైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పతనపు అంచుల్లో ఉంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటాను తప్ప రాజీనామా చేసేది లేదని ఇమ్రాన్‌ చెప్పాడు. ఆదివారం నాడు ఓటింగ్‌ జరిగేలోపల ఏమైనా జరగవచ్చు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇమ్రాన్‌ పదవి పోవటం ఖాయంగా కనిపిస్తోంది.2018 జూలై 25న జరిగిన ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో 342 స్ధానాలున్న జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో 149 స్ధానాలతో ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పెద్ద పక్షంగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 172 స్దానాలు అవసరం కాగా ఏడు చిన్న పార్టీలు, ఒక స్వతంత్రుడి మద్దతుతో 176 ఓట్లతో ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాటిలో కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవటంతో మద్దతు ప్రస్తుతం 164కు పడిపోయింది. స్వంత పార్టీవారే కొందరు తిరుగుబాటును ప్రకటించటంతో ఓటింగ్‌ సమయానికి ఇంకా తగ్గవచ్చు. గడువు ప్రకారం తదుపరి ఎన్నికలు 2023 అక్టోబరు 12లోగా జరగాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే ఆగస్టునాటికి ఎన్నికలు జరుపుతానని ఇమ్రాన్‌ ప్రతిపక్షాలకు సందేశం పంపాడు. ఓటింగ్‌ జరిగేలోగా పార్లమెంటును రద్దు చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేము.


ఇమ్రాన్‌ఖాన్‌పై ఆకస్మికంగా ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న. ఎప్పటి నుంచో ఆర్ధికరంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన వైఫల్యాలు లేవు.పోనీ కొత్త ప్రభుత్వం వస్తే తెల్లవారేసరికి పరిష్కారం అవుతాయా అంటే కావు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమదేశాలు కుట్ర చేస్తున్నాయంటూ ఇమ్రాన్‌ ఒక లేఖను మంత్రులకు చూపాడు. దాన్నే ఒక బహిరంగసభలో కూడా ప్రదర్శించారు. కుట్రచేస్తున్న దేశం అమెరికా అని చెప్పి వెంటనే కాదు నోరు జారింది ఒక పశ్చిమ దేశం అని సవరించుకున్నాడు. జనానికి, ప్రపంచానికి వెళ్లాల్సిన సందేశాన్ని పంపి ఎత్తుగడగా నోరు జారిందని చెప్పాడన్నది వేరే చెప్పనవసరం లేదు. అంతకు ముందే మీడియాకు లీకు చేయటం అమెరికా ఖండించటం వంటి పరిణామాలు జరిగాయి.


సోవియట్‌ పతనం తరువాత మన దేశం క్రమంగా అమెరికా వైపు మొగ్గుచూపటం ప్రారంభమైంది. భారత ఉపఖండంలో భారత్‌ ఎంత కీలక స్ధానంలో ఉందో పాకిస్తాన్‌ కూడా వ్యూహాత్మకంగా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకే రెండు దేశాలను చెరోచంకన ఎక్కించుకొని తన పబ్బంగడుపుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. మారుతున్న పరిణామాల నేపధ్యంలో అది దానికి సాధ్యం కావటంలేదు. రష్యా, చైనాలవైపు ఇటీవలి కాలంలో పాక్‌ మొగ్గుదల ఉంది. ఇంతకాలం దాగుడుమూతలాడినా ఉక్రెయిన్‌-రష్యా వివాదం ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అగత్యాన్ని ముందుకు తెచ్చింది. జోబైడెన్‌ అధికారం స్వీకరించిన తరువాత ఇంతవరకు ఇమ్రాన్‌తో మాటల్లేవు. వివాదం ముదురుతుండగా ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటన జరిపి తాము పుతిన్‌వైపే ఉన్నట్లు చెప్పటం, ఐరాసలో తటస్ధ వైఖరి తీసుకోవటం వంటి పరిణామాలు అమెరికా అగ్రరాజ్య దురహంకారాన్ని రెచ్చగొట్టాయి. దాంతో తనకు వెన్నతో పెట్టి విద్యను ప్రయోగించి తనతో చేతులు కలపని వారికి ఏ గతి పడుతుందో చూడండనే సందేశాన్ని మిగతా దేశాలకు ఇస్తోంది. అదే పాక్‌ పరిణామాలకు కారణం. పది సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌ పాలకులు రష్యావైపు మొగ్గినపుడు అక్కడ సిఐఏతో కుట్రలు చేయించి ప్రభుత్వాన్ని కూలదోశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది. పాక్‌ మాదిరి మన దేశం, చైనాతో ఒకే గేమ్‌ ఆడాలంటే కుదరదు. అందుకే వేర్వేరు ఆటలు ఆడుతోంది.


రష్యాను ఖండించేందుకు తమతో గొంతుకలపాలన్న పశ్చిమ దేశాల మీద మార్చి ఆరవ తేదీన ఒక బహిరంగసభలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ మా గురించి ఏమనుకుంటున్నారు, మీరు చెప్పింది చేసేందుకు మీ బానిసలమా అని ప్రశ్నించాడు. మన దేశాన్ని అమెరికా బెదిరించినా, వణుకుతన్నదని ఎద్దేవా చేసినా ప్రధాని నరేంద్రమోడీ స్పందించలేదు. భారతీయ సంతతికి చెందిన అధికారి చేతనే మన దేశాన్ని బెదిరించటం తాజా ఉదంతం. చైనా గనుక వాస్తవాధీన రేఖను అతిక్రమించితే రష్యా సాయపడదని, ఎందుకంటే వారి మధ్య హద్దులు లేని భాగస్వామ్యం ఉందని అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌ సింగ్‌ మన దేశాన్ని బెదిరించాడు. రష్యా మీద తాము విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినట్లైతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. అమెరికా, ఇతర దేశాలు అంతర్జాతీయంగా ఆంక్షలు విధించిన ఇంధనం, ఇతర వస్తువులను రష్యా నుంచి ఎక్కువగా భారత్‌ దిగుమతి చేసుకోవటాన్ని తాము కోరుకోవటం లేదన్నాడు.” స్నేహ స్ఫూర్తితో మా ఆంక్షల తీరుతెన్నుల గురించి వివరించేందుకు, ఉభయుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు (భారత్‌) మాతో కలసి చెప్పాల్సిన ప్రాధాన్యతను స్పష్టం చేసేందుకు నేను ఇక్కడకు వచ్చాను. అవును ఆంక్షలకు తూట్లు పొడిచినా లేదా వమ్ము చేసినా అలాంటి దేశాలు పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నా, ఆంక్షలకు ప్రత్నామ్నాయంగా చెల్లింపుల కోసం భారత్‌-రష్యా చేస్తున్న యత్నాలను కూడా గమనిస్తున్నామని ” అన్నాడు.


అంతేనా ! ” స్నేహితులు పరిమితులను విధించరాదు. డాలరు ప్రాతిపదికగా ఉన్న ద్రవ్య వ్యవస్ధను బేఖాతరు చేసి రూబుల్‌ను ముందుకు తెచ్చేందుకు చేస్తున్న మంత్రాంగాలు చేయవద్దు, మేము అన్ని దేశాలను ప్రత్యేకించి మా మిత్రదేశాలు, భాగస్వాములను చాలా సునిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాతో సంబంధాల్లో రష్యా ఒక చిన్న భాగస్వామిగా మారబోతోంది. చైనా పైచేయి సాధిస్తుంది. అది భారత్‌కు అంతమంచిది కాదు.చైనా గనుక వాస్తవాధీన రేఖను మరోసారి అతిక్రమించితే భారత రక్షణకు రష్యా ముందుకు వస్తుందని ఎవరైనా అనుకుంటారని నేను భావించటం లేదు.” అన్నాడు.


దలీప్‌ సింగ్‌ మాటలు దౌత్య సాంప్రదాయాలకు లేదా ఇద్దరు స్నేహితుల సంబంధాలకూ విరుద్దమని ఐరాసలో భారత మాజీ రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఖండించారు. ఒక ట్వీట్‌తో పాటు ఇండియా టుడే టీవీతో కూడా మాట్లాడారు.” అమెరికా వంటి ఒక మిత్రదేశం ఇలాంటి మొరటు దౌత్యాన్ని ప్రదర్శిస్తుందని ఊహించలేదు. ప్రపంచం నేడు శాంతిగా లేదు, నిజానికి ముక్కలు కాబోతున్నది. ఇటువంటి స్ధితిలో ప్రతివారు తమ స్ధానాన్ని గరిష్టంగా పటిష్టపరచుకొనేందుకు పూనుకోవటం సహజం.ఉక్రెయిన్లో మిలిటరీ వివాదాలతో పాటు ఒక విధంగా అసాధారణ రీతిలో ఆయుధీకరణ వంటి వాటికి కూడా పూనుకుంటున్నారు.అసాధారణ రీతిలో ఒక జి20దేశం మీద ఆంక్షలు విధించారు. పరస్పర ఆధారితమైన ప్రపంచం మీద దీని ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఒక ఆయుధంగా ఆంక్షలు విధించటం ఇదే తొలిసారి కాదు. అంతర్జాతీయచట్టం ముందు అవి నిలిచేవి కాదని ఈ కుర్రవాడికి(దలీప్‌ సింగ్‌) ఎవరో ఒకరు చెప్పాలి.తమ ప్రయోజనాల కోసం కొన్ని దేశాలు వీటిని ఉపయోస్తాయి. అమెరికా చేస్తున్నదాన్నే కొన్ని ఐరోపా దేశాలూ చేస్తున్నాయి. సంబంధం లేని భారత్‌ వంటి దేశాలకు అవి ఆందోళన కలిగిస్తాయి, దూరంగా ఉన్నా మనం ప్రభావితులం అవుతున్నాము. ఇలాంటి వాటి గురించి మనకు వివరించేందుకు అమెరికా ఒక రాయబారిని పంపటం బానే ఉంది. అయితే సదరు దలీప్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవి దౌత్య సంప్రదాయాలు, స్నేహ సంబంధాలకు విరుద్దం. దౌత్యంలో, భారత్‌ వంటి దేశాలతో వ్యవహరించేటపుడు కాస్త లౌక్యంగా ఉండాలని ఆ కుర్రవాడికి చెబుతున్నాను. ఇది జులం తప్ప దౌత్యపరిభాష కాదు.” అని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. సంక్షోభ సమయాల్లో దేశాల ప్రభుత్వాలు తమ పౌరులకు ఏది మంచిదనే చూస్తాయి, ఐరోపా దేశాలు రష్యానుంచి ఇంధన కొనుగోలు చేస్తూనే ఉన్నాయని ఏ దేశం పేరూ ప్రస్తావించకుండా మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఇతరత్రా ఎలాంటి స్పందన లేదు.


అమెరికా బెదిరింపులు, మన దేశ అధికారిక స్పందన తీరు తెన్నులు చూస్తే జాతీయ వాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదు, ఆత్మగౌరవం ఆచూకీ కనిపించటం లేదు. ఎవరి ఛాతీ పొంగటం లేదు. ఎందుకీ పరిస్ధితి ? దీన్ని చూస్తే విడి సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన ప్రేమ (లొంగుబాటు ) లేఖలు గుర్తుకు వస్తున్నాయి. అవి బయపడిన తరువాత అప్పటి వరకు వీరుడు శూరుడు అంటూ పొగిడిన వారు సమర్ధించుకోలేక జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు ఒక ఎత్తుగడగా లేఖలు రాసినట్లు కొందరు టీకా తాత్పర్యం చెప్పారు. పోనీ అదే నిజమైతే తరువాత ఎక్కడా పాల్గొన్నదాఖలాలు లేవెందుకంటే నోట మాటలేదు. మన సర్కార్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు బెదిరిస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ మౌనం దాలుస్తున్నారు. ఏమిటంటే ప్రజల కోసం మౌనం తప్ప చేతకాక కాదని భక్తులు సమర్ధిస్తున్నారు.గతంలో కూడా అమెరికా చేసిన అవమానాన్ని నరేంద్రమోడీ భరించారు. పోనీ దానివలన మన జనానికి కలిగిన మేలు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? మలేరియా చికిత్సకు మనం తయారు చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కరోనా చికిత్సకు పనికి వస్తాయని కొందరు చెప్పారు. అది నిర్దారణ కాలేదు, వాటిని తమకు సరఫరా చేయకపోతే ప్రతికూల చర్యలు తీసుకుంటామని డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశాన్ని బెదిరించగానే నిషేధాన్ని సడలించిన నరేంద్రమోడీ తీరుతెన్నులను చూశాము.అదే అమెరికా మనకు కావాల్సిన కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్దాలు, పరికరాల ఎగుమతులపై నిషేధం విధించినపుడు మౌనం దాల్చటం తప్ప చేసిందేమీ లేదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసింది. ఇలాంటి అనేక ఉదంతాలను చెప్పవచ్చు.అమెరికా, బెదిరింపులకు దిగుతున్న ఇతర దేశాలపై ఎదురుదాడికి దిగమని ఎవరూ చెప్పటం లేదు, కనీస నిరసన తెలపాల్సిన అవసరం లేదా ? ఆత్మగౌరవ ఆచూకీ లేదని, మన అపర జాతీయవాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదంటే కాదని ఎవరైనా చెప్పగలరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్లకు యుద్దం ఒక లాభసాటి బేరం !

29 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

politics of war, Ukraine war, US imperialism, war cost, wh war is a profitable business for US


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య ఇంకా ఎన్ని రోజులో సాగుతుందో, జనాలకు ఎన్ని ఇబ్బందులను తెస్తుందో అన్న ఆందోళన చెందుతున్నవారెందరో ! అలా ఆలోచించటం, దాడులను ఆపాలని కోరుకోవటంలో సహజం అదేమీ గొంతెమ్మ కోరిక కాదు. కానీ అమెరికా, నాటో దేశాల పాలకులు అలా అనుకోవటం లేదు. వాటికి వంతపాడే పశ్చిమ దేశాల మీడియా రాస్తున్న కథనాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. మన దేశంలోని టీవీలు, పత్రికలు వాటినే మనకూ అందిస్తున్నాయి. ఉక్రెయిన్‌ జనం కన్నీళ్ళు, మానవహక్కులు, ఇతర అంశాలను ముందుకు తెస్తున్న మీడియా అమెరికా, దాని కనుసన్నలలో నడుస్తున్న ఐరోపా ధనిక దేశాలు దశాబ్దాల తరబడి ఇతర దేశాలపై చేస్తున్న దాడులు, దుర్మార్గాలు, మానవహననం గురించి విస్మరిస్తున్నది.
ఇటీవలి ఉదంతాలను చూస్తే పశ్చిమాసియాలోని సిరియాపై 2009 నుంచి ఇప్పటికీ అమెరికా, దానితో చేతులు కలిపిన కిరాయి మూకలు దాడులు జరుపుతున్నాయి. బరాక్‌ ఒబామా, డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌ ఎవరు అమెరికా గద్దెపై ఉన్నా దాడులు ఆపటం లేదు.లిబియా మీద 2009 నుంచి 2021జనవరి వరకు దాడులు చేసిన పుణ్యం, నాటో, బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు దక్కింది. ఇరాక్‌ మీద రెండవసారి దాడులు 2009 నుంచి 2021వరకు ఏదో రూపంలో కొనసాగాయి.2001 నుంచి సోమాలియాలో జోక్యం చేసుకొని ఏదో ఒకసాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. జార్జి డబ్ల్యు బుష్‌ ఏలుబడిలో ప్రారంభమయ్యాయి. ఎమెన్‌లో 2001 నుంచి అమెరికా, దాని మిత్రపక్షం సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాలు ఇప్పటికీ దాడులు జరుపుతూనే ఉన్నాయి.2001 నుంచి 2021వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా, ఇతర దేశాల దాడుల గురించి తెలిసిందే.వీటి గురించి మీడియాకు ఎందుకు పట్టటం లేదు. ఎందుకీ వివక్ష ? ఆ దేశాల్లోని వారు మనుషులు కాదా, వారికి శాంతి అవసరం లేదా ?


తాజ్‌మహల్‌ నిర్మించిందెవరు కాదు, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరన్నది ముఖ్యమని శ్రీశ్రీ అన్నట్లుగా యుద్ధానికి ఎంత మూల్యం చెల్లిస్తున్నారని కాదు అడగాల్సింది దాని వలన లబ్ది పొందిందెవరన్నది కీలకమైన ప్రశ్న.2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్యకేంద్రంపై ఉగ్రవాదదాడి జరిగింది. అదేనెల 18న ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులకు జార్జి డబ్ల్యు బుష్‌ ఆదేశాలు జారీ చేశాడు. అక్కడి నుంచి జో బైడెన్‌ ఏలుబడిలో అమెరికన్‌ మిలిటరీ స్వదేశానికి పారిపోయి వచ్చేంతవరకు సగటున రోజుకు 30 కోట్ల డాలర్ల వంతున అమెరికా చేసిన ఖర్చు మొత్తం 2.26లక్షల కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరు పేరుతో సాగించిన ఈ దాడుల ప్రత్యేకత ఏమంటే ప్రయివేటు కాంట్రాక్టర్లపై ఆధారపడటం.చిత్రం ఏమంటే చివరికి 2021 ఆగస్టులో అమెరికన్‌ సేనలు బతుకుజీవుడా అంటూ అఫ్ఘనిస్తాన్‌ నుంచి స్వదేశం చేరేందుకు కూడా 37 హెలికాప్టర్ల కోసం ప్రయివేటు కంపెనీలకు 45 కోట్ల డాలర్లు చెల్లించింది. వాటిని లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసింది.


ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌పై దాడులకు అమెరికా చేసిన ఖర్చు మొత్తం ఐదు లక్షల కోట్ల డాలర్లని అంచనా. ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల్లో పాల్గొన్నవారిలో ప్రయివేటు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఆయుధ కంపెనీలతో పాటు దాడులకు అవసరమైన వారిని,ఆయుధాలను సరఫరా చేసేందుకు అవసరమైన చమురును కూడా ప్రయివేటు వారే సరఫరా చేసి లబ్ది పొందారు. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియాలో జరిపిన దాడుల్లో అమెరికా రక్షణశాఖ 27వేల మంది కాంట్రాక్టర్లను వినియోగించింది. 2008-2018 మధ్య 380 మంది ఉన్నత స్ధాయి అధికారులు ఇలాంటి వారి అవతారమెత్తారని తేలింది.రెండు దశాబ్దాల క్రితం ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల వాటాలను పదివేల డాలర్ల విలువగలవి కొంటే ఇప్పుడు వాటి విలువ లక్ష డాలర్లకు పెరిగినట్లు అంచనా. అమెరికా దాడులకు చేస్తున్న ఖర్చులో లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌, జనరల్‌ డైనమిక్స్‌, బోయింగ్‌, నార్తరప్‌ గ్రుమ్మన్‌ అనే ఐదు కంపెనీలకు 60శాతం మొత్తం దక్కింది.గతంలో పని చేసిన ఐదుగురు అమెరికా రక్షణ మంత్రుల్లో నలుగురు ఈ కంపెనీలతో లావాదేవీల్లో ఉన్నవారే అంటే కుమ్మక్కు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల సొమ్ముతో ఆయుధాలు, ఇతర పరికరాలను కొనుగోలు చేయిస్తారు.


అందువలన అమెరికా, బ్రిటన్‌ వంటి సామ్రాజ్యవాదులు జరిపే యుద్దాలకు మూలం లాభార్జనే. గతంలో దేశాలకు దేశాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు గనుక ఏదో ఒకసాకుతో దేశాలను ఆక్రమించుకొని అక్కడ తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదంతాలు(ఉదా ఇరాక్‌, లిబియా) కొన్ని కాగా, సంస్కరణల పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటం ఒకటి. వీటికి తోడు ఇలా యుద్దాలను సృష్టించి అలా లబ్దిపొందేందుకు దగ్గరదారినెంచుకున్నాయి అమెరికన్‌ కార్పొరేట్‌ రాబందులు. దానికి అనుగుణంగానే దేశ విధానాలను రూపొందించి అమలు చేయిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్దసమయంలో ముందుకు వచ్చిన ఈ వ్యవస్ధకు ఏదో ఒక మూల ఏదో ఒక ఉద్రిక్తత లేకపోతే గడవదు. దీనిలో కార్పొరేట్‌లు, మిలిటరీ, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు ఉంటారు. అందుకే అమెరికాకు యుద్దం ఒక లాభదాయక వాణిజ్యం, దానికోసం అదెంతకైనా తెగిస్తుంది. అందుకే అమెరికాలో నాలుగువేలకు పైగా లాబీలు(అన్ని రకాలుగా ప్రభావితం చేసే బృందాలు) మిలిటరీ-పారిశ్రామిక సంస్ధల కోసం నేడు పని చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఏదో ఒక లాబీలో ఉంటారన్నది బహిరంగ రహస్యం. అందుకే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధాలకు కారకులు ఆయుధకంపెనీల యజమానులే. వారు నిర్దేశించిన మేరకే అమెరికా స్వదేశీ, విదేశీ విధానాలు ఉంటాయి. దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు లేని మన దేశం-చైనా మధ్య ఉద్రిక్తతలను సృష్టించి మన దేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ ఇప్పటికే ఫలించింది. అదింకా కొనసాగుతోంది. గతంలో పాకిస్దాన్ను మనమీదకు ఉసిగొల్పిన అంశం తెలిసిందే. చైనా వారు అమెరికా, ఇతర దేశాల వద్ద ఆయుధాలు కొనాల్సినపని లేదు. వారే ఎగుమతులు చేసే స్ధితిలో ఉన్నారు.


అంతర్జాతీయ పోలీసు బాధ్యతను ఐరాస లేదా మరొక సంస్ధగానీ అమెరికాకు అప్పగించలేదు. తన ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచంలో ప్రజాస్వామ్యపరిరక్షణ, కమ్యూనిజవ్యాప్తి నిరోధం, ఉగ్రవాదంపై పోరు మరొకసాకుతో ఆధిపత్యకోసం చూస్తున్నది. అమెరికా కార్పొరేట్లకు యుద్దాలు ఎలా లాభాలు చేకూర్చుతున్నాయో చాలా మందికి అర్ధం కావటం లేదు. గతంలో సోవియట్‌ను బూచిగా చూపి ఆయుధాల అమ్మకాల కోసం ఉద్రిక్తతలను సృష్టిస్తే ఇప్పుడు చైనాను చూపి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకొనేందుకు చూస్తున్నారు. ఇతర దేశాలనే కాదు, అమెరికా రక్షణ బడ్జెట్‌నూ పెంచుతున్నారు. నౌకదళంలో ఇప్పుడున్న 300పెద్ద ఓడలను 350కి పెంచాలని ప్రతిపాదించారు. ఎఫ్‌35 విమానాల కొనుగోలు సంగతి చెప్పనవసరం లేదు. అణ్వాయుధాలను నవీకరించేందుకు 1.5లక్షల కోట్ల డాలర్లతో పధకాన్ని రూపొందించారు. ఇప్పుడున్న త్రివిధ దళాలకు అదనంగా అంతరిక్ష సేన ఏర్పాటుకు, దానికి శిక్షణ,ఆయుధాల పేరుతో పెద్ద ఎత్తున ఖర్చుపెట్టనున్నారు.ఇదంతా ప్రయివేటు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు, ప్రపంచాధిపత్యం కోసమే అన్నది స్పష్టం.


నిజానికి అమెరికా రెండవ ప్రపంచయుద్ధం నుంచే కుట్రలు మొదలు పెట్టింది. చైనాలో కమ్యూనిస్టులు సాధిస్తున్న విజయాలు అమెరికా,బ్రిటన్‌లకు దడపుట్టించాయి. చైనా పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ను పటిష్టపరచాలని చూసి విఫలమయ్యాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో అధికారానికి వచ్చిన జాతీయవాది అంగసాన్‌ (అంగసాన్‌ సూకీ తండ్రి)తో మొత్తం మంత్రులను హతమార్చిన కుట్రలో బ్రిటన్‌ హస్తం ఉంది. రెండు కొరియాల విలీనాన్ని అడ్డుకొనేందుకు అమెరికా యుద్దానికి తలపడిన సంగతి తెలిసిందే. ఇండో చైనాలో వందేండ్ల ఫ్రెంచి పాలనకు కమ్యూనిస్టులు స్వస్తిపలికారు.1954లో హౌచిమిన్‌ సారధిగా కమ్యూనిస్టులు ఫ్రెంచి సేనలను ఓడించారు. రెండుగా చీల్చిన వియత్నాం విలీనానికి 1956ను గడువుగా నిర్ణయించారు. అంతకు ముందే తెరవెనుక ఉన్న అమెరికా నేరుగా రంగంలోకి వచ్చి దక్షిణ వియత్నాంను కేంద్రంగా చేసుకొన్నది. దక్షిణ వియత్నాంలోని మిలిటరీ, కమ్యూనిస్టు వ్యతిరేకులకు శిక్షణ, ఆయుధాలను సరపరా చేసి ఉత్తర వియత్నాంను దెబ్బతీసేందుకు చూసింది. వారివల్ల కాదని తేలటంతో 1964లో టోంకిన్‌ గల్ఫ్‌లో తన నౌకలపై ఉత్తర వియత్నాం దాడి చేసిందనే కట్టుకధను ముందుకు తెచ్చి నేరుగా దాడులకు దిగింది.1975 ఏప్రిల్‌ 29-30 తేదీలలో అక్కడి నుంచి అమెరికా సేనల్లో చివరి బృందం పారిపోవటంతో ఆ దురాక్రమణ యుద్దం ముగిసింది.


వియత్నాం కమ్యూనిస్టులు అమెరికాకు పెద్ద గుణపాఠం నేర్పారు. వియత్నాంపై దాడులకు అమెరికా 5,43,000 మంది సైనికులను పంపింది. దక్షిణ వియత్నాంలో ప్రజాస్వామికశక్తులకు మద్దతు పేరుతో ఈదారుణానికి పాల్పడింది. ఈ సైనికుల్లో 58,200 మంది దాడుల్లో, ఇతరత్రా మరో 32వేల మంది మరణించారు. గాయపడిన వారు 3.03,000 మంది ఉన్నట్లు అంచనా. వీరుగాక రెండున్నరలక్షల మంది వరకు దక్షిణ వియత్నాం సైనికులు మరణించారు. ఇది ఒక వైపే మరో వైపు అమెరికా, దక్షిణ వియత్నాం మిలిటరీని ఎదిరించేందుకు జరిగిన పోరులో 20లక్షల మంది సామాన్య పౌరులు మరణించారు. తొమ్మిదిన్నరలక్షల మంది వియత్నాం మిలిటరీ,దక్షిణ వియత్నాం గెరిల్లాలు ప్రాణాలను త్యాగం చేశారు, ఆరులక్షల మంది గాయపడ్డారు. ఇరవై ఒక్క సంవత్సరాలు అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క అణ్వాయుధాలు తప్ప అన్ని రకాల మారణ, రసాయన ఆయుధాలను పెద్ద ఎత్తున ప్రయోగించిన దుర్మార్గానికి పాల్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు సాగుకు పనికిరాకుండా కలుషితమయ్యాయి.


ఇరాన్‌ – ఇరాక్‌ దేశాల మధ్య ఉన్న వివాదాలను ఆసరా చేసుకొని అమెరికా వాటి మధ్యతంపులు పెట్టింది. రెండు దేశాలకూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంది. పరస్పర దాడులతో రెండు దేశాలూ బలహీనపడితే వాటి మీద పెత్తనం, రెండు చోట్లా ఉన్న చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలన్నది దాని ఆలోచన. ఏడు సంవత్సరాల పదకొండునెలల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇరాన్‌ వైపున ఆరులక్షల మంది ఇరాక్‌ వైపున ఐదులక్షల మంది సైనికులు మరణించారని అంచనా. విజేతలు లేరు. కొరియా యుద్దంలో పదిహేనున్నరలక్షల మంది ఉత్తర కొరియన్లు, పదిలక్షల మంది దక్షిణ కొరియన్లు మరణించారు. పదిలక్షల మంది ఉత్తర కొరియా, రెండు లక్షల మంది దక్షిణ కొరియా సైనికులు మరణించారు. ఈ దుర్మార్గాలు, మానవ నష్టాలకు కారణం అమెరికా ఆధిపత్యకాంక్షే అన్నది స్పష్టం. ఇప్పుడు అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాకు ముప్పు తెచ్చేందుకు ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటూ రెచ్చగొట్టి రష్యాను ఉసిగొల్పిదాడులకు కారణమయ్యాయి. ఉక్రెయిన్‌ పౌరులను, ఇతర దేశాల వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్న వాటి దుష్ట రాజకీయాన్ని విరమించాలని వత్తిడి తేవాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్దమిది, కాదంటారా !

26 Saturday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

corporate loves a good war, Fuel Price in India, profiting from war, Ukraine-Russia crisis, US imperialism, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్‌ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు పొరుగుదేశాలకు వెళ్లారు, దాదాపు కోటి మంది కొలువులు, నెలవులు తప్పినట్లు వార్తలు. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాటో కూటమి దేశాల్లోని వారు బావుకున్నదేమీ లేదు. అయినప్పటికీ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా కూటమి చూస్తోంది. మే నెల తొమ్మిదవ తేదీ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీపై విజయం సాధించిన రోజని అందువలన అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని రష్యా నేతలు ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతినిధులు చెప్పారు. అంటే అప్పటి వరకు పశ్చిమ దేశాలు ఈ వివాదాన్ని మరింతగా ఎగదోస్తూనే ఉంటాయా? ఉక్రెయిన్‌, ఇతర దేశాల పౌరులను యాతనలకు గురి చేస్తాయా ?


వాస్తవాల పత్రం పేరుతో మార్చి 16వ తేదీన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు శాంతిని కోరుకుంటున్నట్లు, నిత్యం మానవహక్కుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్న అమెరికా కూటమిలోని 30దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తూ మంటలను ఎగదోస్తున్నాయి. జో బైడెన్‌ తాజాగా ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయంతో బైడెన్‌ గత పనిహేను నెలల కాలంలో ఉక్రెయినుకు ఇచ్చినది రెండువందల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇదంతా అమెరికా యుద్ద పరిశ్రమల వారికి కట్టబెట్టిన మొత్తమే. మూడో దేశం ద్వారా సరఫరా చేసిన వాటితో సహా ఏఏ ఆయుధాలు, ఎంత మందుగుండు సరఫరా చేసిందీ దానిలో ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. లాభం లేకుండా పశ్చిమ దేశాలు భారీసాయం చేస్తే వాటికి వచ్చేదేముంటుంది ?
చైనా, పాకిస్తాన్లను బూచిగా చూపి మన దేశంతో ఆయుధాలకు ఎలా ఖర్చు పెట్టిస్తున్నదో తద్వారా అమెరికా ఎంతగా లాభపడుతున్నదో తెలిసిందే. ఇప్పుడు రష్యాను బూచిగా చూపుతూ నాటో దేశాలన్నింటితో తమ తమ ఆయుధాలను కొనిపిస్తున్నది. ఉక్రెయిను ఒక్కదానికే 350 కోట్లతో సహా తూర్పు ఐరోపా దేశాలకు 650 కోట్ల డాలర్లను ఆయుధాల కోసం బైడెన్‌ బడ్జెట్‌ కేటాయించాడు. ఐదుసార్లు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఒప్పందం కుదిరితే, శాంతి నెలకొంటే ఈ బడ్జెట్‌ నిధులు అవసరం ఉండదు కనుక కనీసం వాటిని ఖర్చు చేసేంత వరకైనా వివాదం-దాడులు కొనసాగాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్నుంచి తరువాత ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తుంది, ఈలోగా తానే ఆయుధాలు కొని కార్పొరేట్ల ఆకలి తీరుస్తుంది.టాంకులను ధ్వంసం చేసే 2,600 జావెలిన్‌(ఈటె) క్షిపణులను ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసింది. వాటిని తయారు చేసేది లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ అనే కంపెనీలు. పెద్ద అలలు వచ్చినపుడు నౌకలన్నీపైకి లేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పోటీ పడుతున్నాయి. మిలిటరీ మాజీ అధికారులే సలహాదారులు, మధ్యవర్తులుగా ఉంటారు.యుద్దాలు లేకపోతే ఈ కంపెనీలన్నీ మూతపడతాయి కదా !


రష్యాదాడులను సాకుగా చూపి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసే ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు 35 కొనుగోలు చేయాలని జర్మనీ నిర్ణయించింది. నాటో దేశాలన్నీ ఇదే బాటలో ఉండటంతో ఆయుధకంపెనీల వాటాల ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్నాయి. ఐరోపా, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా తమ పంట పండుతున్నదని సిఇఓలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అనేక దేశాలు గతంలో కొనుగోలు చేసినవి ఉపయోగించకపోవటం లేదా పాతపడటంతో పనికిరానివిగా పక్కన పడేసి కొత్తవి కొంటున్నాయి. ఫ్రాన్స్‌,బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా ఆయుధకంపెనీలున్నా సింహభాగం అమెరికన్లకే పోతోంది. అందుకే నేషనల్‌ డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ అసోసియెషన్‌ జనవరిలోనే అమెరికా పార్లమెంట్‌ సభ్యుల మీద వత్తిడి చేసింది.” రక్షణ ఖర్చు పద్దుల ఆమోదంలో వైఫల్యం ” ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, తూర్పు ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవటంలో, సమర్దత, తీవ్రంగా పరిగణించకపోవటం ముప్పును సూచిస్తున్నదని ” పేర్కొన్నది.ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ రాజీకి సంసిద్దను ప్రకటించినా బైడెన్‌, ఇతర దేశాలు పడనీయకుండా సంక్షోభాన్ని కొనసాగించేందుకు పూనుకోవటం వెనుక ఎవరి వత్తిడి, లబ్ది ఉందో అరటితొక్క వలచి పండు పెట్టినట్లుగా చెప్పాల్సిన పని లేదేమో ! ఒక్క ఆయుధకంపెనీలేనా లబ్ది పొందుతున్నది ?


గత నెల రోజుల్లో అమెరికా ఇంధన కంపెనీల విలువ పదిశాతం పెరిగింది. ఆ మొత్తం 239 బిలియన్‌ డాలర్లని అంచనా. ఈ కాలంలో బ్రెంట్‌ రకం ముడిచమురు ధరలు 32శాతం పెరిగాయి. దానితో బాటే ఇతర రకాల ధరలూ పెరిగి కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక కంపెనీ యజమాని ప్రపంచంలోని ఐదువందల మంది ధనికుల జాబితాలో చేరాడు. హరోల్డ్‌ హామ్‌ అనే కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ కంపెనీ కుబేరుడి ఆస్తి విలువ 19.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి కంపెనీ వాటాల ధరలు పెరిగి మూడు నెలలు కూడా గడవక ముందే 5.75బి.డాలర్లు(41.2శాతం) పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ ధనవంతుల జాబితాలో అతని స్దానం 84నుంచి 37కు పెరిగింది. జెఫ్రీ హిల్డెబ్రాండ్‌ సంపద విలువ ఇదే కాలంలో 6.63 బి.డాలర్లు (101శాతం) పెరిగి 13.2 బి.డాలర్లకు చేరింది. అందరి సంపదల్లో ఇలాంటి పెరుగుదల లేకున్నా మొత్తం మీద ఇంథన కంపెనీలన్నీ లబ్దిపొందాయి.


మన దేశంలో చమురు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. రిలయన్స్‌, బిపి వంటి కొన్ని కంపెనీలు రంగంలో ఉన్నా పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. ముడి చమురు ధరలు పెరిగినదానికి అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు నవంబరు నాలుగు నుంచి మార్చి 21వరకు ధరలను పెంచకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి లబ్దికి స్ధంభింప చేసిన సంగతి తెలిసిందే. దీంతో అపరదేశ భక్తులలైన అంబానీలు తమ బంకులను మూసివేశారు. వారికోసం, ప్రభుత్వ కంపెనీల నష్టాలు తగ్గించేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి డీజిలు ధరలను లీటరుకు రు. 25 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీని వెనుక మరొక ఎత్తుగడ కూడా ఉంది. ఆ మేరకు సాధారణ వినియోగదారులను కూడా భరించేందుకు మానసికంగా సిద్దం చేయటమే అది. కొత్త పద్దతులను కనుగొనటంలో బిజెపి సర్కార్‌ తీరు అనితరసాధ్యం. ఇప్పుడు ప్రతి రోజూ వడ్డించటం ప్రారంభించారు.జనం కూడా కిక్కురు మనకుండా ఇంకా దేశభక్తి మత్తులోనే ఉన్నందున కొనుగోలు చేస్తున్నారు. ఇహలోకంలో పరమ దరిద్రాన్ని అనుభవించి పుణ్యం చేసుకుంటే పరలోకంలో స్వర్గం ప్రాపిస్తుందని నమ్మే మనకు చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల, ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలు ఒక లెక్కా ! ఏ జన్మలోనో చేసుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం, మోడీ మాత్రం ఏం చేస్తారు, మనం వస్తువులను కొనకుండా ఉంటే పోయె, అంత ధరలకు కొనాలని మనల్నేమైనా వత్తిడి చేశారా అనే వేదాంతాన్ని జనం వల్లిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర 2021నవంబరు నెల సగటు 81.51 డాలర్లు, మార్చి 24న 117.71 ఉంది. మార్చి 26వ తేదీన ఇది రాసిన సమయానికి ముడిచమురు బ్రెంట్‌ రకం ధర 120.65 డాలర్లు. మనం కొనుగోలు చేసేది దానికి ఒక డాలరు తక్కువగా ఉంటుంది. పీపా 81.51 డాలర్లు ఉన్నపుడు నిర్ణయించిన ధరల మీద ప్రతిరోజూ కొంత పెంచుతున్నారు. మొత్తం పాతిక రూపాయలా, ఇంకా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పలేము. చమురు ధరల పెరుగుదల వృద్ది రేటును దెబ్బతీస్తుంది. నోట్ల ముమ్మరాన్ని(ద్రవ్యోల్బణం) పెంచుతుంది, అది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీన్నే స్టాగ్‌ఫ్లేషన్‌ అంటున్నారు. ఇది జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. జనాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది, తద్వారా వృద్ధి రేటు మరింత పడిపోతుంది. అది వేతనాల మీద పడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసే ఒక వలయం ఇది.

చమురుతో పాటు గృహావసరాలకు వాడే గాస్‌ ధరను రు.50 పెంచి వెయ్యిదాటించారు. ఇది 70శాతం గృహస్తులను ప్రభావితం చేస్తుంది. వీరిలో ఆమ్‌ ఆద్మీ నుంచి అంబానీల వరకు అందరూ ఉంటారు. సమస్య సామాన్యులకే స్వంత విమానాలను కలిగి ఉన్నవారికి ఏముంటుంది. సౌదీ ఆరామ్‌ కో కంపెనీ టన్ను గాస్‌ ధరను తాజాగా 729 నుంచి 769 డాలర్లకు పెంచింది. గతేడాది నవంబరులో ధర 376డాలర్లు మాత్రమే. అందువల్లనే అప్పటి నుంచి మన దేశంలో కూడా విపరీతంగా ధర పెరిగింది. గాస్‌ మీద ఇస్తున్న సబ్సిడీని రు.40కి తగ్గించి ఎంత పెరిగితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా పెంచినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండరుకు ఇంకా రు.100-125 నష్టమే అని చెబుతున్నందున ఆ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి కోసం పెట్రోలు, డీజిలు ధరలను స్ధంభింప చేసిన కారణంగా 137 రోజుల్లో మూడు చమురు సంస్ధలకు వచ్చిన నష్టమే రు.19,000 కోట్లని అంచనా, వాటికి రావాల్సిన లాభాలను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తాలను జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకున్నారు. ఎంత తెలివి ?


ధరల పెరుగుదలను ఆరుశాతంలోపుకు పరిమితం చేయాలన్నది రిజర్వుబాంకు లక్ష్యం. జనవరిలో 6.01గా ఉన్నది ఫిబ్రవరిలో 6.07శాతానికి పెరిగింది. ఫిబ్రవరితో ముగిసిన ఏడాదిలో పదకొండు నెలల పాటు రెండంకెలకు మించి టోకు ధరలు పెరిగి ఫిబ్రవరిలో 13.11శాతంగా నమోదైంది. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణం మదింపులోనే లోపం ఉందన్నది ఒకటైతే, వాటిని కూడా తొక్కి పెట్టి తక్కువగా చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెబుతారు. సంక్షోభానికి కారణంగా అమెరికా, నాటో కూటమి అనుసరించిన దేశాలే అన్నది అందరికీ తెలుసు. కానీ వారి వైఖరి తప్పని చెప్పటానికి మాత్రం నోరు రాదు. ఎందుకటా దేశ ప్రయోజనాల రీత్యా ఎవరినీ నొప్పించకూడదట. మరి ధరల పెరుగుదల సంగతేమిటి ? జన ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టవా ? ఏమి రాజకీయం నడుస్తోందో మనం గమనిస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d