• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2022

ఉక్రెయిన్‌ సమస్య :రణమా ! శరణ్యమా ? నాటోలో కొత్త భయం ! మరో మలుపు తిరిగిన సంక్షోభం !!

12 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Crimea bridge blast, Crimea., NATO, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


కొందరు వర్ణిస్తున్నట్లు ఉక్రెయిన్లో అసలైన పోరు ఇప్పుడే ప్రారంభమైందా లేక మరో పెద్ద మలుపు తిరిగిందా ? రోజులు గడిచే కొద్దీ కొత్త సందేహాలు, సమస్యలు. తాజా పరిణామాలను ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభ పునరుద్భవంగా కొందరు పేర్కొన్నారు. అసలేం జరగనుంది అనే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు 231 రోజుల తరువాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి.గత కొద్ది వారాలుగా ఎలాంటి దాడులు లేవు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు వెళ్లాయి.నాలుగు ప్రాంతాల పౌరులు కోరుకున్నట్లుగా వాటిని రష్యా విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన తరువాత విమర్శలు తప్ప పెద్ద పరిణామాలేవు. అలాంటిది ఒక్కసారిగా సోమ, మంగళవారాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్‌ అంతటా అనేక పట్టణాలపై పెద్ద ఎత్తున రష్యా క్షిపణి దాడులు జరిగాయి. అనేక పట్టణాల్లో అంధకారం అలుముకుంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. మిలిటరీ వ్యవస్థలతో పాటు విద్యుత్‌ కేంద్రాలపై సోమ, మంగళవారాల్లో పుతిన్‌ దళాలు కేంద్రీకరించాయి. రాజధాని కీవ్‌లోని కొన్ని కీలక కేంద్రాలపై క్షిపణిదాడులు జరిగినా జెలెనెస్కీ నివాసం, అధికార కేంద్రాలపై ఇంతవరకు గురిపెట్టలేదు. ఇక ముందు అది జరగదని చెప్పలేము. ఇదంతా ఎందుకు అంటే !


అక్టోబరు 8 తేదీ శనివారం నాడు రష్యా క్రిమియా ద్వీపకల్పంలోని క్రిమియా లేదా కెర్చ్‌ వంతెన మీద పెద్ద పేలుడు జరిగింది. ఐదుగురు మరణించారని వార్తలు. ఉదయం ఆరు గంటలపుడు (మన కాలమానం ప్రకారం 9.30 గంటలు) ఈ ఉదంతం జరిగింది. ఉక్రెయిన్‌ ఉగ్రవాద ఆత్మాహుతి దళం తాము తెచ్చిన ఒక కారు, ట్రక్కును పేల్చివేసినట్లు ఒక కథనం కాగా, వంతెన కింద ఉన్న సముద్ర జలాల్లోనుంచి వచ్చిన ఒక అస్త్రంతో పేల్చివేసినట్లు మరొక విశ్లేషణ. ఈ ఉదంతం జరిగినపుడే ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసిన ఒక మానవరహిత పడవ రష్యా ఓడరేవు సమీపంలో కనిపించటంతో ఈ అనుమానం తలెత్తింది. ఎలా జరిగిందనేది ఇంకా నిర్ధారణగాకున్నా పేలుడు జరిగింది. దానికి ప్రతి స్పందనగా సోమవారం నాడు వివిధ పట్టణాల మీద రష్యా త్రివిధ దళాల క్షిపణుల దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో అనుమానితులుగా ఐదుగురు రష్యన్‌, ముగ్గురు ఉక్రేనియన్‌, ఆర్మీనియన్‌ పౌరులను అరెస్టు చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.


ఈ వంతెన మీదుగా వెళ్లే ప్రతి వాహనం ఒక పెద్ద స్కానర్‌ గుండా వెళుతుంది. వాటిలో ఒకవేళ పేలుడు పదార్ధాలు ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. దాన్ని తప్పించుకొని వాహనాలు వెళ్లాయా, అప్పుడు అది పని చేయలేదా, తనిఖీలోపమా, విద్రోహమా లేక సముద్ర జలాల్లో నుంచి వచ్చిన ఏదైనా పడవ నుంచి పేలుడు జరిపారా అన్నది తేలాల్సి ఉంది. గతంలో అనేక మార్లు ఉక్రెయిన్‌ అధికారులు వంతెనలను పేల్చివేస్తామని ప్రకటించారు.జూలై నెలలో జెలెనెస్కీ సలహాదారు అరెస్తోవిచ్‌ త్వరలో తమ మిలిటరీ దాడి చేస్తుందని చెప్పాడు. వంతెనల మీద దాడి చేసినందుకు బహిరంగంగా ఎస్తోనియా విదేశాంగ మంత్రి అభినందనలు తెలిపాడు.ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రత్యేక కార్యకలాపాల దళపు హస్తం ఉందని కూడా చెప్పాడు. గత కొద్ది సంవత్సరాలుగా సిరియా, ఇతర ఇస్లామిక్‌ తీవ్ర వాదులను జెలెనెస్కీ సర్కార్‌ చేరదీస్తున్నదని, వారు ఐరోపా సమాఖ్య దేశాల్లో తిరిగేందుకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చూసేందుకు ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులు ఇచ్చారని, ఆ ఆత్మాహుతి దళాలతో పేలుడుకు పాల్పడి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
వంతెన మీద పేలుడుతో సంబంధం లేకుండానే తమపై దాడికి ముందుగానే రష్యా పధకం వేసిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. వంతెన పేలుడు గురించి మౌనంగా ఉన్న అమెరికా, ఇతర దేశాలూ మరోవైపు క్షిపణి దాడులను ఖండిస్తూ విమర్శలకు దిగాయి. పుతిన్‌ సేనలను, రష్యాను దెబ్బతీయాలంటే ఎక్కువ దూరం ప్రయాణించి రష్యా మీద బాంబులను కురిపించే క్షిపణులను తమకు ఇవ్వాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ అమెరికా, ఇతర నాటో దేశాలను కోరుతున్నాడు. అందుకు గాను పుతిన్ను మరింత రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగంగా క్రిమియా వంతెన పేల్చి వేతకు పధకం వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అది ఎంతో కీలకమైన రోడ్డు, రైలు వంతెన గనుక పుతిన్‌ తీవ్రంగా స్పందిస్తే ఆ సాకుతో అలాంటి క్షిపణులు ఇవ్వాలన్న ఎత్తుగడ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వేళ అందచేస్తే కొందరు చెబుతున్నట్లు అసలైన పోరు ప్రారంభానికి నాంది అవుతుంది. దానిలో అమెరికా, ఇతర నాటో దేశాల సైనికులు భౌతికంగా పాల్గొంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకమైతే ఆ దేశం ఆధునిక ఆయుధాల ప్రయోగశాలగా మారుతుంది.


క్రిమియా ద్వీపకల్పంలో పేల్చిన వంతెన ఆ ప్రాంతానికి రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే పందొమ్మిది కిలోమీటర్ల రోడ్డు, పక్కనే ఉన్న రైలు వంతెన.పౌరులకు అవసరమైన సరఫరాలతో పాటు మిలిటరీ రవాణాకు సైతం అది కీలకం. ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి జనం తమ ప్రాంతాన్ని తిరిగి రష్యాలో కలపాలని కోరారు. ఆ మేరకు 2014లో విలీనం జరిగింది. తరువాతనే పుతిన్‌ ప్రభుత్వం ఆ వంతెనల నిర్మాణం చేసింది.స్వయంగా పుతిన్‌ కారు నడిపి వంతెనలను ప్రారంభించారు. నిజానికి ఆ వంతెనల వలన రవాణా వేగంగా జరగటం తప్ప ఆ ప్రాంతానికి దారి లేక కాదు. ఇక శనివారం నాటి పేలుడు జరిగిన చోట రోడ్డు వంతెన మీద ఒక వైపున ఉన్న ఇనుపకంచె(రెయిలింగ్‌) కొంత మేర విరిగి సముద్రంలో పడింది. పక్కనే ఉన్న రైలు వంతెన మీద ఉన్న రైలులోని ఇంధన టాంకర్లకు నిప్పంటుకుంది. కొంత సేపు రవాణా నిలిపివేసి అదే రోజు పునరుద్దరించారు. నష్టం పెద్దది కాదు గానీ తరువాత జరిగిన పరిణామాలకు అది నాంది పలికింది. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని చెప్పుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉక్రెయిన్లో సంబరాలు, నర్మగర్భంగా ఆ దేశ నేతలు చేసిన ప్రకటనలు, అది ఉక్రెయిన్‌ చేసిందే అని పేరు చెప్పని వారు తమకు చెప్పినట్లు అమెరికా పత్రికలు ప్రకటించటం వంటి పరిణామాలన్నీ వేలు జెలెనెస్కీవైపే చూపుతున్నాయి. ఇది పౌర, కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ఉగ్రవాద చర్య అంటూ భద్రతా మండలిలోని శాశ్వత దేశాల ప్రతినిధులతో పుతిన్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించాడు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ఉగ్రవాద దళాలు స్వదేశంలోనూ, తమ ప్రాంతంలోనూ దాడులకు పాల్పడినట్లు రష్యా గతంలో కూడా పేర్కొన్నది.హిట్లర్‌ మూకలు పార్లమెంటు భవనాన్ని తగులబెట్టి నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపినట్లుగా జెలెనెస్కీ దళాలు స్వంత అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడులకు పాల్పడి నెపాన్ని తమ మీద మోపేందుకు చూసినట్లు కూడా ఐరాసకు ఫిర్యాదు చేసింది. తమ కురుస్క్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా మూడు సార్లు విద్యుత్‌ లైన్ల మీద దాడులు చేసినట్లు, టర్క్‌ స్ట్రీమ్‌ గాస్‌పైప్‌లైన్‌ పేల్చివేతకు చూసిందని కూడా పేర్కొన్నది. బాల్టిక్‌ సముద్రంలో ఉన్న అంతర్జాతీయ గాస్‌ పైప్‌లైన్ల విధ్వంసానికి జరిపిన పేలుళ్ల విచారణ బృందంలో తమ ప్రతినిధులను అనుమతించలేదని రష్యా పేర్కొన్నది.
క్రిమియా వంతెన పేల్చివేతకు ప్రతిగా రష్యా క్షిపణులు జనావాసాలపై బాంబులు వేసినట్లు జెలెనెస్కీ, పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా తాము ఉక్రెయిన్‌ ఇంథన, మిలిటరీ, సమాచార కేంద్రాల మీద దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పుతిన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. సోమవారం నాటి రష్యా దాడుల్లో 14 మరణించారని, 97 మంది గాయపడినట్లుగా ఉక్రెయిన్‌ పేర్కొన్నది. నిజంగా జనం ఉన్న ప్రాంతాల మీద క్షిపణులు పడి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది.రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రారంభమై మంగళవారం నాటికి 230 రోజులు.(ఫిబ్రవరి 24) అప్పటి నుంచి ఐరాస లెక్కల ప్రకారం అక్టోబరు రెండవ తేదీనాటికి మరణించిన పౌరుల సంఖ్య 6,114 అంటే సగటున రోజుకు పాతిక మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాడు ఒకే సారి అనేక పట్టణాల మీద క్షిపణి దాడి జరిగింది. ఏ కారణంతోనైనా అమాయక పౌరుల మరణాలను సమర్ధించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాడుల స్వభావం గురించి జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకొనేందుకే ఈ వివరాలు. తమ ప్రతీకారం తీవ్రంగానే ఉంటుందని రష్యన్లు బాహాటంగానే చెబుతున్నారు. సోమవారం నాడు పుతిన్‌ సేనలు వదలిన 83క్షిపణుల్లో 43ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైనికులు 60 మంది మరణించినట్లు, అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు , ఒక మిగ్‌ విమానాన్ని కూల్చినట్లు రష్యా లెక్కలతో సహా ప్రకటించింది. నిజానికి ఇప్పటి వరకు 230 రోజుల పోరులో ఎటువైపు ఎంత నష్టం అన్నది ఇంతవరకు నిర్దారణగా వెల్లడికాలేదు. దేశమంతటా తమ విద్యుత్‌ వ్యవస్థకు ముప్పు వచ్చినట్లు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. పదకొండు ప్రధాన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ప్రధాని వెల్లడించాడు. అనేక చోట్ల మంచినీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉక్రెయిన్‌లో ఫ్రెంచి పౌరులందరూ తమ ఇండ్లలోనే ఉండాలని ఫ్రాన్స్‌ కోరగా, దేశం విడిచి పోవాలని తమ పౌరులను అమెరికా కోరింది. అదనపు మిలిటరీ సరఫరాలను పంపుతామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అనేక దేశాల నేతలకు ఫోన్‌ చేసిన జెలెనెస్కీ అందరం కలసి పోరాడాలని కోరాడు.


అనేక దేశాలలో అమెరికా కూటమి కిరాయి మూకలను రంగంలోకి దించుతోంది. ఉక్రెయిన్లో కూడా అదే జరుగుతోంది. వేలాది మందిని రష్యా మిలిటరీ పట్టుకోవటం, హతమార్చటం తెలిసిందే. ఇంకా వేలాది మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వస్తున్న వార్తలను బట్టి గతంలో తిరుగుబాటుదార్లుగా ఉండి పుతిన్‌ సర్కార్‌కు లొంగిపోయిన చెచెన్‌ సాయుధులను ఉక్రెయిన్‌పై దాడులకు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న అనుభవంతో ఉగ్రవాదుల తీరుతెన్నులు వారికి కొట్టిన పిండేగనుక ఉక్రెయిన్‌ ఉగ్రవాదులను అరికట్టేందుకు వారే సరైన వారని భావిస్తున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే తమ వారు పదివేల మంది ఉన్నారని 70వేల మందిని రంగంలోకి దించనున్నట్లు కొద్ది రోజుల క్రితం రష్యా మిలిటరీలో జనరల్‌గా చేరిన రమజాన్‌ కదరయోవు చెప్పాడు. నాటో కూటమి నేర్పిన పాఠాలను తిరిగి వారికే నేర్పేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. అమెరికా, ఇతర నాటో ప్రధాన దేశాల తీరు తెన్నులను చూసినపుడు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఒక తీరులో దీర్ఘకాలం కొనసాగిస్తూ రష్యాను బలహీనపరిచి తమకు ఎదురులేదని, తమను ప్రతిఘటించేవారికి ఇదే గతి అని ప్రపంచానికి చెప్పేందుకు చూస్తున్నట్లు చెప్పవచ్చు.ఈ క్రమంలో వారు ఊహించని ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత శీతాకాలం గడవటం ఒకటైతే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి నుంచి ఎలా నెగ్గుకు రావాలా అన్నది వాటి ముందున్న ప్రధాన సవాలు.


ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీకి నాటో కూటమి అందచేసిన అస్త్రాలన్నీ పరిమిత ప్రాంతాలకు పరిమితమైనవే. మూడు వందల కిలోమీటర్లు అంతకు మించి వెళ్లగల క్షిపణులను ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని ఇస్తే సంక్షోభ స్వరూపం, స్వభావమే మారుతుంది. నాలుగు ప్రాంతాలను తనలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన తరువాత కూడా ఈ వైఖరిలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. రష్యా భూభాగమైన క్రిమియా వంతెనపై దాడి చేస్తే ఎలాంటి ప్రతి స్పందన ఉంటుందో చూసేందుకు ఒక పధకం ప్రకారం పశ్చిమ దేశాలు చేయించిన దాడి అన్నది స్పష్టం. రెండు రోజులుగా జరుపుతున్న దాడులను పుతిన్‌ నిలిపివేస్తారా, కానసాగిస్తారా? కొనసాగితే ఉక్రెయిన్‌ పౌరుల్లో తలెత్తే భయ, సందేహాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయి, సంక్షోభం ఏ రూపం తీసుకుంటుంది, జెలెనెస్కీని మునగచెట్టు ఎక్కించిన పశ్చిమ దేశాలు ఏం చేస్తాయి. ఇలాంటి అనేక సందేహాలకు ఇప్పట్లో సమాధానం కనిపించేట్లు లేదు.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే మానవ నష్టాన్ని పరిమితం చేసేవిగా రష్యా దాడులున్నాయి. ఇక ముందు అలానే ఉంటాయా లేదా అన్నది ఎర్ర గీతలు దాటి రెచ్చగొడుతున్న పశ్చిమ దేశాలు, వాటిలో కీలుబమ్మగా మారిన ఉక్రెయిన్‌పై ఆధారపడి ఉంది.తనపై విధించిన ఆంక్షల కారణంగా ఐరోపాకు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యాను దెబ్బతీసేందుకు నోర్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్లను కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రష్యామహిళా జర్నలిస్టు దర్యా దుగీనాను హత్య చేశారు. కెర్చ్‌ వంతెనల పేల్చివేతకు చూశారు. రష్యా సరిహద్దులకు టాంకులు, క్షిపణులను తరలిస్తున్నారు.


తొలి రోజుల్లో చర్చలకు సిద్దమన్నట్లు జెలెనెస్కీ కనిపించినా అదంతా ఉత్తిదే అని తేలింది. తదుపరి చర్చలను నిషేధించే ఒక ఫర్మానాను జెలెనెస్కీ విడుదల చేసిన తరువాత అసలు స్వరూపం వెల్లడైంది. రష్యా ఇంథన సరఫరాల్లేకుండా చలికాలాన్ని అధిగమించటం ఐరోపాకు కాస్త ఇబ్బందైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటుంది గానీ, పరిశ్రమల మూత, ద్రవ్యోల్బణం వంటి ఆర్ధికపరమైన అంశాలతో పుట్టి మునుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు చూస్తుంటే జెలెనెస్కీ మీద పుతిన్‌ గురిపెట్టాడు. అన్ని దేశాలకూ ఈ సంక్షోభాన్ని పంచాలని చూస్తున్న అతను లొంగితే ఆ పరాభవం పశ్చిమ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ఆయుధ సరఫరాలు చేస్తున్నాయి. మొదటికే మోసం వస్తే అంటే తమ జీవితాలనే ఈ సంక్షోభం అతలాకుతలం గావిస్తే ఐరోపా జనం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో పుతిన్‌ విజయం సాధిస్తాడేమోనని నాటో భయపడితే ఇప్పుడు ఓడిపోతే అణ్వాయుధాలను రంగంలోకి తెస్తాడేమో అని భయపడుతున్నట్లు ఒక వార్తా సంస్థ కొత్త కథనాన్ని రాసింది. ఇది ఊహాజనితమే గాని దీని వెనుక రష్యా ఓడిపోనుందని, కొద్ది రోజులు ఇబ్బందులను భరించాలనే భావనలోకి పశ్చిమ దేశాల జనాన్ని తీసుకు వెళ్లే ఎత్తుగడ కూడా ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌్‌ఎన్నికల రాజకీయం : వృద్దుల పెన్షన్‌ రు. 1000, ఆవుకు రు. 900 !

09 Sunday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, Gujarat, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Pensioners, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

appeasement politics, BJP, cow politics, Gujarat Election 2022, Gujarat Election politics, Narendra Modi, old age pension, RSS


ఎం కోటేశ్వరరావు


వృద్దులు, ఆధారం లేని ఇతరులకేనా సామాజిక న్యాయం, పెన్షన్‌, వీధుల్లో తిరిగే ఆవులకూ ఇవ్వాలి కదా అంటున్నారు ఓటు రాజకీయనేతలు. గుజరాత్‌లో ప్రతి పార్టీ పోటీ పడుతోంది. డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనుషులతో పాటు ఆవులూ పార్టీలను ప్రభావితం చేస్తాయా అని కొందరు చర్చ చేస్తున్నారు. వట్టి పోయిన(పాలివ్వని) ఆవులను గతంలో రైతులు వధ శాలలకు తరలించే వారు, కొంత రాబడి వచ్చేది. కాషాయ మూకలు దిక్కుమాలిన ఆవు రాజకీయాలను రంగంలోకి తెచ్చిన తరువాత అలాంటి ఆవులను అమ్ముకోలేరు, గో గూండాల దాడులకు భయపడి కొనుగోలు చేసే వారూ లేరు. దాంతో రైతులు వాటిని మేపే స్తోమత లేక లేదా నష్టదాయకంగా భావించి వీధుల్లోకి వదలివేస్తున్నారు. అవి ఇబ్బడి ముబ్బడి కావటంతో గుజరాత్‌ హైకోర్టు అనేక సార్లు వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. దాంతో విధిలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం అలాంటి ఆవులను వదలివేసిన వారికి జరిమానా విధించే నిబంధనలతో తీవ్ర చర్చల తరువాత పట్టణాలలో ఆవుల నియంత్రణ బిల్లు-2022ను తేవాల్సి వచ్చింది. మార్చి నెల 31న మెజారిటీ ఓటింగ్‌తో ఆమోదించిన బిల్లుకు నిరసనగా ఆవుల యజమానుల ఆందోళనలు చేశారు. జుమ్లా, వుత్తినే బిల్లు తెచ్చాం తప్ప అమలు జరపం అని ప్రభుత్వం చెప్పినా వారు తగ్గలేదు, ఎన్నికల్లో బిజెపిని బహిష్కరిస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం, వాటికి ఎక్కడ గండిపడుతుందో అన్న భయరతో సెప్టెంబరు నెల అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవంగా వెనక్కు తీసుకున్నారు.


చిత్రం ఏమిటంటే గోమాంసం కోసం ఆవులను తరలిస్తున్నారంటూ గో రక్షకుల ముసుగులో చేసిన దాడుల గురించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాపితంగా మన దేశానికి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. అలాంటిది గుజరాత్‌లో గత పది నెలల్లో వీధుల్లో వదిలేసిన ” ఆవులు జరిపిన దాడుల్లో ” 4,860 ఉదంతాల్లో 28 మంది మనుషులు మరణించారని అధికారిక లెక్కలే పేర్కొన్నాయి. ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా ఎనిమిది పెద్ద పట్టణాలు, 162మున్సిపాలిటీల్లో ఇవి జరిగాయి. మాజీ ఉపముఖ్య మంత్రి నితిన్‌ పటేల్‌ను పోరుబందరు పట్టణంలో ఒక ఆవు కుమ్మటంతో కాలు విరిగింది. మరుసటి రోజే కొత్త సిఎం భూపేంద్ర పటేల్‌ ఒక ప్రదర్శనలో ఉండగా ఒక ఆంబోతు దాని మీదకు వచ్చింది. వేశ్యా గృహాలకు తరలించే బాలికలను రక్షించి ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలలో ఉంచటం తెలిసిందే. కబేళాలకు తరలించే ఆవులను కాపాడేందుకు ఏర్పడిన గో దళాలు రక్షించిన ఆవులను సంరక్షించేందుకు ప్రభుత్వం దాతృత్వ సంస్థలు ఏర్పాటు చేసే 450 గోశాలలకు( అవి ఎవరికి కేటాయిస్తారో చెప్పనవసరం లేదు) 2022-23లో గోమాత పోషణ యోజన కింద ఐదు వందల కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆరునెలలు గడిచినా పైసా విదల్చలేదు. ఈ పధకం కింద గోశాలలో చేర్చిన ప్రతి ఆవుకు రోజుకు 30 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం గుజరాత్‌లో అమల్లో ఉన్న వున వృద్దాప్యపెన్షన్‌ పధకం కింద 60ఏండ్లు దాటిన వృద్ధ కుటుంబాలకు నెలకు రు.400, ఎనభై ఏండ్లు దాటిన వారికి రు.700 ఇస్తున్నారు. ఎన్నికల కోసం ఈ మొత్తాలను రు.1000-1250గా పెంచుతామని 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నారు.


ఆవులను గాలికి వదిలేస్తే జరిమానా వేస్తామంటే ఆవుల పెంపకందార్లు ఆగ్రహించారు. ఆ బిల్లును ఎత్తివేసి గోశాలల్లో చేర్చిన ప్రతి ఆవుకు నెలకు రు.900 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఈ కేటాయింపు నిధులు వెంటనే ఇవ్వాలని, ఇది ఒక ఏడాదికి పరిమితం చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,700 గోశాలలు ఉండగా 450కి మాత్రమే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆవుల పెంపకందార్లు వట్టిపోయిన వాటిని వదలి వేస్తే ఇప్పుడు గోశాల నిర్వాహకులు ఆందోళనకు దిగి నిరసనగా గోశాలల్లో ఉన్న ఆవులన్నింటినీ వీధుల్లోకి వదలాలని చూస్తున్నారు. గత నెలాఖరులో వనస్కాంత జిల్లాలోని వీధులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారు. తదుపరి ఆందోళనలో భాగంగా జిల్లా, తాలూకా ప్రభుత్వ ఆఫీసుల్లో గోమూత్రం, పేడ చల్లుతామని ప్రకటించారు.


గతంలో గోశాలల్లోని ప్రతి ఆవుకు రోజుకు రు.8 సబ్సిడీ ఇచ్చే పధకాన్ని 2001లో నరేంద్రమోడీ సిఎం కాగానే నిలిపివేశారని పదివేల మంది గోశాల ట్రస్టీల ప్రతినిధి కిషోర్‌ శాస్త్రి చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ఉత్తర గుజరాత్‌లో తీవ్ర వరదలు వచ్చినపుడు ఒక్కో ఆవుకు రు.25 చొప్పున కేవలం రెండు-మూడు నెలలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లట్‌(కాంగ్రెస్‌) ప్రభుత్వం రోజుకు ప్రతి ఆవుకు రు.50 ఖర్చు చేసిందని, ఉత్తరాఖండ్‌ సర్కార్‌ 1000 గోశాలలను నిర్వహిస్తుండగా గోమాత మీద ప్రమాణం చేసి అధికారానికి వచ్చిన గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం వార్షిక బడ్జెట్లను ఎందుకు కేటాయించదని శాస్త్రి ప్రశ్నించారు. వివిధ కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకు వీధుల్లో తిరుగుతున్న ఆవులను పట్టుకొని దీశా-రాజపూర్‌ గోశాల వంటి వాటికి తరలించిన ప్రభుత్వానికి వాటి సంరక్షణ పట్టదా అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న 8,900 ఆవుల్లో సగం ప్రభుత్వ పంపినవే అన్నారు. పోలీసులు పట్టుకున్న వస్తువులను కూడా అలాగే ఎక్కడో ఒక చోట పడవేస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాలలో గుజరాత్‌ ఒకటి. పరిశ్రమలు, పట్టణాల విస్తరణలో భాగంగా గ్రామాలు వాటిలో కలిసిపోతున్నాయి. ఆవులు, ఇతర పశువుల మేతకు గ్రామాల్లో ఉన్న గడ్డి భూములను కూడా పరిశ్రమలు, గృహనిర్మాణాలకు కేటాయిస్తుండటంతో పశువుల మేత కొరత ఏర్పడింది. దాంతో మరొక దారిలేని పెంపకందార్లు వాటిని వదలివేస్తున్నారు. పట్టణాల్లో ఇది సమస్యలకు దారి తీస్తున్నది.


గుజరాత్‌లో ఆవుల పెంపకందార్లను మాల్దారీలని పిలుస్తారు. సంతుష్టీకరణలో భాగంగా, వారి ఓట్ల కోసం ప్రతి పార్టీ, నేత ఆవుల మీద ప్రేమ ఒలకబోస్తారు. అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను 46 చోట్ల ఈ సామాజిక తరగతికి చెందిన వారు సమీకరణలను తారు మారు చేస్తారని అంచనా. సంతుష్టీకరణ రాజకీయాలకు బద్ద వ్యతిరేకమని, కాంగ్రెస్‌ను నిరంతరం విమర్శించే ప్రధాని నరేంద్రమోడీ దీనికి మినహాయింపు కాదు.ఎక్కడైతే ప్రభుత్వానికి నిరసనగా ఆవులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారో అదే వనస్కాంత జిల్లాలోని అంబాజీలో సెపెంబరు 30 న నరేంద్రమోడీ ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన పథకాన్ని ప్రారంభించారు.ఆగస్టు నెలలో బిజెపి ఆధీనంలోని సూరత్‌ మునిసిపల్‌ అధికారులు అనుమతి లేని ఆవుల షెడ్లంటూ 222 కట్టడాలను కూల్చివేశారు. వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్‌ పాటిల్‌ రంగంలోకి దిగి మాల్దారీ సమాజానికి జోలపాడారు. కూల్చివేతలను నిలిపి వేయించారు. ఎన్నికల రాజకీయమంటే ఇదే, అధికారులతో కూల్చివేయిస్తారు, తరువాత వచ్చి నిలిపివేసినట్లు కనిపిస్తారు. గుజరాత్‌ ప్రభుత్వం మాల్దారీల కోసం కామధేను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నదని, ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి గురించి అక్కడ పరిశోధనలు చేస్తారని బిజెపి మాల్దారీ విభాగ నేత సంజయ దేశాయి చెబుతున్నారు.


ఆవు రాజకీయంలో కాంగ్రెసేమీ తక్కువ తినలేదు. గతంలో పశు సంవర్ధన గురించి పేర్కొన్నప్పటికీ తొలిసారిగా ఆవు సంరక్షణ గురించి ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. ఆవు పాలకు లీటరుకు ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తామని, రాజస్తాన్‌ పధకాలను అమలు జరుపుతామని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లను వెనక్కు నెట్టి అధికారాన్ని పొందుతామని చెబుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ తక్కువ తినలేదు. తమకు అధికారమిస్తే రోజుకు ప్రతి ఆవుకు రు.40ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో ఇస్తున్నట్లు అరవింద కేజరీవాల్‌ చెప్పారు. లంపీ వైరస్‌ కారణంగా గుజరాత్‌లో లక్షకు పైగా ఆవులు మరణించినా ప్రభుత్వం కదల్లేదని తాము వాక్సిన్లు వేస్తామని గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ నేత సుదాన్‌ గధ్వీ ప్రకటించారు. గుజరాత్‌లో రు.40 ఇస్తామని ప్రకటించిన కేజరీవాల్‌ ఢిల్లీలో రు.20 మాత్రమే ఇస్తున్నారని, మరో రు.20 తమ ఏలుబడిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెల్లిస్తున్నదని చెప్పిన బిజెపి ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రు.40 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.


గుజరాత్‌ దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. గర్బా పేరుతో పెద్ద ఎత్తున నృత్యం చేస్తారు. ఈ సందర్భంగా ప్రతిపార్టీ రాజకీయాలు చేసింది. పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ సిఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ గర్బా డాన్సు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అంబాజీలో ఆవు పూజ చేశారు. ఆరు నెల్లనాడు ప్రకటించిన పధకాన్ని ఎన్నికల ముందు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు చూసిన మజ్లిస్‌ పార్టీ గుజరాత్‌లో కూడా అదే పని చేసేందుకు అక్కడ పోటీలో ఉంటానని ప్రకటించిందనే విమర్శలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించని సురక్షిత హస్తం : పిడుగులు, ఉరుములతో డాలర్‌ – భయంతో వణుకుతున్న రూపాయి !

08 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India Exports, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, rupee value


ఎం కోటేశ్వరరావు


” ప్రబల డాలర్‌ ఉరుములతో శాంతి లేని భారత రూపాయి ” అనే శీర్షికతో అక్టోబరు ఏడవ తేదీన రాయిటర్‌ సంస్థ ఒక వార్తను ప్రపంచానికి అందించింది. శనివారం నాడు రూపాయివిలువ 82.82గా ఉన్నట్లు ఎక్సేంజ్‌ రేట్స్‌ అనే వెబ్‌సైట్‌ చూపింది. ఇలా రికార్డుల మీద రికార్డులు నమోదవుతుండటంతో గతంలో సిఎంగా ఉన్నపుడు రూపాయివిలువ పతనం గురించి నిర్దాక్షిణ్యంగా మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను తూర్పారపట్టినది గుర్తుకు వచ్చి ఇప్పుడు నరేంద్రమోడీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండాలి లేదా దానికి విరుద్దంగా ప్రశాంతంగా ఉండి ఉంటారు. కానీ దేశం, జనం అలా ఉండలేరే !


సెప్టెంబరు 30తో ముగిసిన వారంలో దేశ విదేశీమారక నిల్వలు 532.664 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితంతో పోల్చితే 110బి.డాలర్లు తక్కువ. 2008 సంక్షోభ తరుణంలో 20శాతం నిల్వలు తగ్గాయి. ఇప్పుడు కొందరు దాన్ని గుర్తు చేస్తున్నారు. తీవ్ర మాంద్య ముప్పు పొంచి ఉండటంతో డబ్బున్నవారందరూ ఇతర కరెన్సీల్లో ఉన్న ఆస్తులన్ని అమ్మి డాలర్లలో దాచుకోవటం మంచిదని కొందరు, బంగారంలో మంచిదని మరికొందరు వాటి వైపు పరుగుతీస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించేదే ! అన్నీ ప్రతికూల వార్తలే !!


కేంద్ర ప్రభుత్వం జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 వైపు పరుగు పెడుతోంది. అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. చైనా యువాన్‌తో కూడా మన కరెన్సీ గత ఐదు సంవత్సరాల్లో రు. 9.8 నుంచి 11.64కు పతనమైంది. మరి ఇదెలా జరిగింది?


అమెరికా ఫెడరల్‌ రిజర్వు మరొక శాతం వడ్డీ రేటు పెంచవచ్చని ముందే సూచించింది. అదే జరిగితే దేశం నుంచి డాలర్లు మరింతగా వెనక్కు పోతాయి. రూపాయి పతనం కొనసాగుతుంది. ఇప్పటికే అంచనాలకు మించిన వేగంతో దిగజారింది. ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మరింతగా తెగనమ్మవచ్చు. ఎగుమతులు తగ్గటం దిగుమతులు పెరగటం, వాణిజ్యలోటు పెరుగుదలకు దారితీస్తోంది. రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో పాల్గ్గొన్న ఆర్ధికవేత్తలు, విశ్లేషకులెవరూ సమీప భవిష్యత్‌లో రూపాయి విలువ పెరిగే అవకాశం లేదని, 82కు దిగజారవచ్చని చెప్పగా శనివారం నాడు 83కు చేరువలో ఉంది. డిసెంబరు నాటికి 82-84 మధ్య కదలాడవచ్చని కొందరు చెప్పారు. ఒక వేళ కోలు కుంటే ఆరు నెలల్లో 81.30కి ఏడాదిలో 80.50కి పెరగవచ్చన్నారు. వర్దమాన దేశాల కరెన్సీ విలువ పెరగాలంటే పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచాలని ఎక్కువ మంది చెప్పారు. అదే జరిగితే పారిశ్రామిక, వాణిజ్య, నిర్మాణ రంగాలు పడకేస్తాయి. ఇప్పటి వరకు విదేశీ వత్తిళ్లకు విదేశీమారక నిల్వలు గురైతే ఇక వడ్డీ రేట్లు కూడా తోడు కానున్నాయి. అక్టోబరులో మన కరెన్సీ విలువ రు.80.17-82.65 మధ్య ఉంటుందని గతనెలలో స్పెక్యులేటర్లు చెప్పగా,అది మొదటి పది రోజుల్లోనే తప్పింది. ఆకస్మికంగా 80.80కి దిగజారవచ్చని చెప్పారు, అది కూడా జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ సమాచారం ప్రకారం అక్టోబరు మూడు నుంచి ఏడువరకు రుణ మార్కెట్‌ నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడుల మొత్తం రు.2,948 కోట్లు కాగా, స్టాక్‌మార్కెట్‌కు వచ్చిన ఎఫ్‌పిఐ మొత్తాలు రు.2,440 కోట్లు. సెప్టెంబరు నెలలో వెళ్లిన మొత్తం రు.7,624 కోట్లు తప్ప వచ్చినవేమీ లేవు. వర్తమాన సంవత్సరంలో మార్కెట్‌ నుంచి వెనక్కు వెళ్లిన మొత్తం రు.1,72,891 కోట్లు.


మన ఇరుగు పొరుగు దేశాల గురించి తమకు అవసరమైనపుడు పోల్చుకొనే కాషాయ దళాల గురించి తెలిసిందే. ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అక్టోబరు ఏడవ తేదీతో ముగిసిన వారంలో ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరెన్సీగా పాకిస్తాన్‌ రూపీ ఉన్నట్లు ఇండియా అబ్రాడ్‌ న్యూస్‌ సర్వీస్‌(ఐఎఎన్‌ఎస్‌) శనివారం నాడు ఒక వార్తనిచ్చింది. ఐదు పని దినాల్లో డాలరుకు రు. 219.92కు చేరి 3.9శాతం బలపడింది. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ దేశంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనా దీనికి కారణంగా పేర్కొన్నారు. పదకొండు రోజులుగా అది బలపడుతూనే ఉంది. జూలై నెలలో రికార్డు కనిష్టంగా 240 నమోదైంది. పాకిస్తాన్‌ దివాలా అంచున ఉన్నట్లు అప్పుడు చెప్పారు.పాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న కారణంగా కరెన్సీ కోలుకుందని విశ్లేషకులు చెప్పారు. అక్టోబరు చివరి నాటికి 200కు పెరగవచ్చని ఆర్ధిక మంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు.దిగుమతులు తగ్గుతుండటం, రానున్న రోజుల్లో 2.3 నుంచి 2.5 బిలియన్‌ డాలర్లవరకు ఏడిబి రుణం ఇవ్వనుందనే వార్తలు పాక్‌ కరెన్సీ విలువ పెరుగుదలకు దోహదం చేస్తోంది. సెప్టెంబరు 20న మన ఒక రూపాయి 2.99 పాకిస్తాన్‌ రూపీకి సమానంగా ఉండగా అక్టోబరు 8వ తేదీకి 2.67కు బలపడింది.


మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో రూపాయి ప్రభుత్వ చేతగాని తనం వల్లనే పతనమైందని ధ్వజమెత్తిన నరేంద్రమోడీ ఇంతవరకు తన పాలనలో పతనం గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా బిజెపి ఎంపీ, మాజీ మంత్రి జయంత్‌ సిన్హా( యశ్వంత సిన్హా కుమారుడు) గతంలో మన కరెన్సీ ఒక్కటే పతనమైందని, ఇప్పుడు మన కంటే ఇతర ప్రధాన కరెన్సీలన్నీ పడిపోతున్నట్లు చెబుతూ గతానికి ఇప్పటికీ పోలికే లేదని సమర్ధించుకున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే వాదనలు చేశారు. కొందరు విశ్లేషకులు కూడా అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదనే వాదనలు ముందుకు తెచ్చారు. కాసేపు అది నిజమే అని అంగీకరిద్దాం. అదో తుత్తి అన్నట్లుగా ఉండటం తప్ప మనకు ఒరిగేదేమిటి ? గతంలో ఇతర కరెన్సీలతో కూడా పతనమైనందున మనకు జరిగిన భారీ ఆర్ధిక నష్టం ఎంతో, ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో విలువ పెరిగినందువలన వచ్చిన లాభం ఏమిటో బిజెపి పెద్దలు వివరిస్తే వారి వాదనల డొల్లతనం వెల్లడవుతుంది. ఇప్పుడు అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నందున మనకు వస్తువులను అమ్మేవారు డాలర్లను తప్ప మరొక కరెన్సీ తీసుకోరు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ? దీనికి కూడా కాంగ్రెస్‌, నెహ్రూ పాలనే కారణమంటారా ?


మా నరేంద్రమోడీ విశ్వగురు పీఠం ఎక్కారు , అందునా పుతిన్‌ -జెలెనెస్కీ మధ్య రాజీకోసం కేంద్రీకరించారు . రూపాయి పతనం గురించి చూసుకోమని నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు గనుక దీన్ని పట్టించుకోలేదు గానీ, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగిసిన తరువాత రూపాయి విలువ పెంచటం చిటికెలో పని అని మోడీ మద్దతుదారులు అంటే అనవచ్చు. కాసేపు వారిని సంతుష్టీకరించేందుకు నిజమే అనుకుందాం. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ స్థానిక వస్తువులనే కొనాలని నినాదమిచ్చిన మోడీ గారు మిగతా దేశాల కరెన్సీలు ఏ గంగలో కలిస్తే మన కెందుకు ముందు లోకల్‌ రూపాయిని రక్షించాలి కదా అని ఎవరైనా అంటే ఉడుక్కోకూడదు మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆందోళన కలిగిస్తున్న ఆర్ధిక రంగం – జాడలేని మోడినోమిక్స్‌, పారని మంత్ర దండం !

07 Friday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, India Economic worries, India GDP, Manmohan Singh, Manmohanomics, modinomics, Narendra Modi Failures, RSS, Rupee Fall, UNCTAD, World Bank


ఎం కోటేశ్వరరావు


మన దేశ ఆర్ధిక పురోగతి గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న జోశ్యాలు గందర గోళం, ఆందోళన కలిగిస్తున్నాయి. మన్మోహానోమిక్స్‌ నుంచి మోడినోమిక్స్‌కు దేశం మారిందని గతంలో అనేక మంది చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. మోడినోమిక్స్‌ అంటే నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న ఆర్ధిక విధానం. అనేక మంది పండితులు 2014 నుంచి అమలు జరుగుతున్నది మోడినోమిక్స్‌ అని తేల్చారు. పత్రికలు చదివే పాఠకులు, టీవీలు చూసే వీక్షకులు సంవత్సరం అంటే ఏదీ అని గందరగోళపడుతున్న అంశం మరొకటి. సంస్థలన్నీ ఒకే విధంగా చెప్పటం లేదు. కొన్ని కాలండర్‌(జనవరి నుంచి డిసెంబరు వరకు) మరికొన్ని ఆర్ధిక సంవత్సరం( ఒక ఏడాదిఏప్రిల్‌ నుంచి తదుపరి ఏడాది మార్చి వరకు) అని పేర్కొంటున్నాయి. ఒక విధంగా ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చుగానీ ”అసలు విషయం ”లో పెద్ద తేడా ఉండదు.


వర్తమానానికి వస్తే ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి కార్పొరేషన్‌(అంక్టాడ్‌) తాజాగా ప్రకటించినదాని ప్రకారం మన దేశ వృద్ధి రేటు కాలండర్‌ సంవత్సరం 2022లో 5.7శాతం, 2023లో4.7 ఉంటుందని ప్రకటించింది. ఆ తరువాత ప్రపంచబాంకు ఆర్ధిక సంవత్సరం 2023(2022-23)లో వృద్ధి రేటు 6.5శాతంఉంటుందని ప్రకటించింది. ఏ సంస్థ చెప్పినా వృద్ధి రేటు ఎంత అంటే సవరించిన ప్రతిసారీ తగ్గించి చెప్పటం తప్ప స్థిరత్వం కనిపించటం లేదు, ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం.అక్టోబరు ఏడవ తేదీన రూపాయి విలువ రు.82.63కు దిగజారి మరో కొత్త రికార్డు నెలకొల్పింది.


2022 ఆగస్టు ఒకటిన లోక్‌సభకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021-22లో వాస్తవ జిడిపి వృద్ది రేటు 8.7శాతమని, కరోనాకు ముందున్న అర్ధిక స్థితికి పూర్తిగా దేశం కోలుకున్నదని, 2019-20 వాస్తవ జిడిపి వృద్ది కంటే 1.5శాతం ఎక్కువని పేర్కొన్నారు. ఇక్కడే ఒక తిరకాసుంది.కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 29న ప్రకటించిన వివరాల ప్రకారం 2019-20 జిడిపి గురించి తొలుత వేసిన అంచనాలన్నింటినీ సవరించి చివరకు వృద్ధి రేటు నాలుగు శాతమని ఖరారు చేశారు. అది కూడా కొత్త సంవత్సరంలో పది నెలల తరువాత అని గమనించాలి. దీని ప్రకారం ఒకటిన్నర శాతం ఎక్కువ అంటే 5.5 కానీ పార్లమెంటుకు 8.7 శాతమని ఎలా చెప్పారు. అంటే ఇది అంచనా మాత్రమే. దీన్ని కచ్చితంగా సవరిస్తారు. 2020-21లో 6.6శాతం తిరోగమనంలో( మైనస్‌) ఉన్నట్లు ప్రభుత్వం ఖరారు చేసింది.


దేశాన్ని సాధారణ పరిస్థితికి తిరిగి తీసుకు వచ్చామని చెబుతున్నారు. కనుకనే జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి దేశాన్ని పైకి లాగామన్నారు. అంతకంటే కావాల్సిందేముంది. మనం దిగుమతి చేసుకొనే లేదా ఎగుమతి చేసే వస్తువులకు సరఫరా వ్యవస్థల అంతరాయాల్లేవు. గాల్వన్‌ ఉదంతాల పేరుతో కాషాయ దళాలు తాట తీస్తాం,తోలు వలుస్తా అన్న పవర్‌స్టార్‌ మాదిరి ఎంతగా రెచ్చగొట్టినా చైనా మనకు వస్తువులను విక్రయిస్తూనే ఉంది. చైనాతో గత రికార్డులను బద్దలు కొట్టి నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులు చేసుకున్నట్లు తిరుగులేని ఆధారాలుగా అంకెలున్నాయి. రష్యా నుంచి రికార్డులు సృష్టిస్తూ తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నాము. మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు జనానికి కొనుగోలు శక్తిని పెంచిన కారణంగానే పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నట్లు పాలకపార్టీ పెద్దలు వర్ణిస్తున్నారు. కాసేపు అంగీకరిద్దాం ! ఉత్పాదకతతో ముడి పేరుతో ప్రభుత్వం వేల కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? లేక అదంతా అమిత్‌ షా మార్కు జుమ్లానా ! కార్పొరేట్‌లకు పన్ను తగ్గింపు, ఇతర నజరానాల వలన ఖజానాకు కచ్చితంగా రాబడి తగ్గుతుంది. దాన్ని పూడ్చుకొనేందుకు కొన్ని వస్తువుల మీద జిఎస్‌టి పెంచుతున్నారు. ఇక అప్పుల సంగతి సరేసరి. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల ఏలుబడి చివరిలో రు.55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2022 నాటికి 136లక్షల కోట్లకు పెంచారు. 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ఇదంతా అభివృద్ది కోసమే అంటున్నారు, ఇంత చేస్తున్నా వృద్ధి రేటు ఎందుకు తగ్గుతున్నట్లు ? అడిగినా సమాధానం చెప్పేదెవరు ?వివిధ సూచికల్లో ఎక్కడో వెనుక లేదా దిగజారటం తప్ప మెరుగుపడింది లేదు.


నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు కొందరు పండితులు మోడినోమిక్స్‌ అంటూ కొత్త అర్ధాలు చెప్పేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2004 నుంచి 2020 వరకు దేశ వార్షిక జిడిపి వృద్ధిరేటు 6.8 శాతం ఉంది. మంత్రదండం ఉందని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో 2014 నుంచి 2020వరకు వార్షిక సగటు కూడా 6.8శాతమే ఉంది. మన్మోహన్‌ ఏలుబడి సగటు కూడా అంతే. మోడీ పాలన పది సంవత్సరాల సగటు తగ్గటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఇక గృహస్తులు చేసిన ఖర్చును చూస్తే 2004-14 మధ్య జిడిపిలో 10.56శాతం ఉండగా, 2014-20లో 10.61 శాతం ఉంది. ప్రభుత్వ ఖర్చును చూస్తే ఈ కాలంలో 56.54-59.23 శాతాలుగా ఉంది. ఇక చేసిన అప్పులను చూస్తే మాక్రో ట్రెండ్స్‌.నెట్‌ సమాచారం ప్రకారం దేశం వెలిగిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల బరిలో దిగిన వాజ్‌పాయి ఏలుబడిలో 1998లో జిడిపిలో 50.32 శాతంగా ఉన్న అప్పు 2004 నాటికి 62.59శాతానికి పెరిగింది. అది తరువాత మన్మోహన్‌ సింగ్‌ కాలంలో 2013 నాటికి 50.31 శాతానికి తగ్గింది. స్టాటిస్టా సంస్థ సమాచారం మేరకు 2017లో 69.68 శాతం ఉన్న అప్పు 2020లో 90.06 శాతానికి పెరిగింది.2021 నుంచి 2027 వరకు 86.76 నుంచి 84.18 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. గతంలో రిజర్వు బాంకు పేర్కొన్న ప్రకారం మన పరిస్థితుల్లో దేశ అప్పు జిడిపిలో 61శాతం లోపుగా ఉండాలని పేర్కొన్నది. అప్పులను తగ్గించిన మన్మోహన్‌ కాలంలో, విపరీతంగా పెంచిన మోడీ ఏలుబడిలోనూ సగటు వృద్ధి రేటు ఒకే విధంగా ఉంది.అభివృద్ది కోసమే అప్పులైతే తెచ్చిన అప్పులకు అనుగుణ్యంగా ఖర్చు పెరగలేదు.తేడా ఏమిటంటే మన్మోహనామిక్స్‌ పదేండ్ల కాలంలో మూడు సార్లు అంతకు ముందు సంవత్సరాల కంటే వృద్ధి రేటు తగ్గితే మోడినోమిక్స్‌లో ఏడు సంవత్సరాల్లోనే నాలుగేండ్లు తిరోగమనంలో పడింది. ఎందుకిలా ?


ఇదేమీ సమాధానం లేని అపూర్వ చింతామణి లేదా నువ్వు ఎవరు ప్రశ్న కాదు. జిడిపి ఖర్చులో ఫిక్స్‌డ్‌ గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌ అంటే సులభంగా చెప్పుకోవాలంటే పెట్టుబడి 2004-14 సంవత్సరాల్లో 33.38 శాతం ఉండగా అది అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ధిని తెచ్చినట్లు చెప్పుకుంటున్న 2014-2020 మధ్య (కరోనాకు ముందే సుమా) 28.88 శాతానికి పడిపోయింది. పిండి కొద్దీ రొట్టె, పెట్టుబడి కొద్దీ వృద్ధి, కబుర్లతో కడుపునిండదు. వివిధ సంస్థలు మన జిడిపి గురించి వేసిన అంచనాలు- సవరించటంలో అంత తేడా ఎందుకు ఉంటోంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా నరేంద్రమోడీ దగ్గర మంత్ర దండం ఉందని అవి కూడా నమ్మినట్లా ? అంచనాలే గనుక పిసినారి తనం ఎందుకు మోడీని సంతోష పెడదామని అనుకున్నట్లా ? వివిధ సంస్థలు గతంలో వేసిన, తాజాగా సవరించిన అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంస్థ పేరు ×××× గతంలో చెప్పినది×× తాజా అంచనా
ప్రపంచ బాంకు ×× 8.7 ××× 6.5
ఎస్‌ అండ్‌ పి ×××× 00. ××× 7.3
ఫిచ్‌ రేటింగ్స్‌ ×××× 7.8 ××× 7.0
ఇండియా రేటింగ్స్‌×× 7.0 ××× 6.9
ఓయిసిడి ×××× 00 ××× 7.0
అంక్టాడ్‌ ×××× 00 ××× 5.7
ఏడిబి ×××× 7.5 ××× 7.0
ఐఎంఎఫ్‌ ×××× 8.2 ××× 7.4
నొమురా ×××× 5.4 ××× 4.7
ఫిక్కి ×××× 7.4 ××× 7.0
ఎస్‌బిఐ ×××× 7.5 ××× 6.8
క్రిసిల్‌ ×××× 7.8 ××× 7.3
ఆర్‌బిఐ ×××× 7.2 ××× 7.0
ప్రపంచ ఆర్ధిక పురోగతి మందగించటం, దేశంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుదల వలన మన ఎగుమతులకు, ఇతరంగా దెబ్బ అని అందరూ చెబుతుంటే ఆ పరిస్థితి మన దేశానికి సానుకూలమని, ముడి చమురు,ఇతర వస్తువుల ధరలు, పారిశ్రామిక లోహాలు, ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వృద్ది రేటు 7.2-7.4 శాతం మధ్య ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. అంకెలతో జనంలో గందరగోళం, ఆందోళనకరంగా పరిణామాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో లూలా ముందంజ -పార్లమెంటులో మితవాదులది పైచేయి !

05 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Brazil election 2022, Jair Bolsonaro, Latin America’s Right, Latin American left, lula da silva


ఎం కోటేశ్వరరావు


” మనకు విశ్రాంతి లేదు, గెలుపుకోసం గట్టిగా పని చేయాలి. ఇంకా 28 రోజులే గడువు ఉంది ” బ్రెజిల్‌ వామపక్ష నేత లూలా డిసిల్వా అక్టోబరు రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఫలితాలు వెల్లడించిన తరువాత ఇచ్చిన పిలుపు, చెప్పిన మాటలవి. లూలా అంతిమ విజేతగా నిలిచేంత వరకు కార్మికులు, కష్టజీవులు రానున్న నాలుగు వారాలూ వీధులను ఆక్రమించాలని(ఎన్నిక కోసం పని చేయాలని) బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు లూసియానా శాంటోస్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం తొలి దఫాలోనే 50శాతంపైగా ఓట్లు సంపాదించి లూలా డిసిల్వా ఎన్నికౌతారనే ఎన్నికల పండితులు, సర్వేలకు భిన్నంగా 48.4 శాతం(5,72,59,405ఓట్లు) లూలాకు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, పచ్చిమితవాది బోల్సనారోకు 43.2 శాతం(5,10,72,234 ఓట్లు) రాగా మరో మితవాద పార్టీ నేత టిబెట్‌కు 4.2శాతం(49,15,420 ఓట్లు) వచ్చాయి. మూడవ పక్షం మొత్తంగా బోల్సనారోకు బదలాయించినప్పటికీ స్వల్ప తేడాతో లూలా విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. సాధారణంగా అలా జరగదు. ఇవిగాక వామపక్ష వాదినని చెప్పుకొనే సిరో గోమ్స్‌ అనే మరోనేతకు(మూడు శాతం) 36లక్షల ఓట్లు వచ్చా ఇవి లూలా వైపే మొగ్గే అవకాశం ఉంది. ఈ ఓట్ల తీరు తెన్నులను చూసినపుడు పురోగామి వాదులా మితవాదులా అన్నదే గీటురాయిగా ఓటర్లు ఆలోచించారు తప్ప మధ్యేవాదులను పట్టించుకోలేదన్నది స్పష్టం. ఇటీవల జరిగిన లాటిన్‌ అమెరికా ఎన్నికల్లో తొలి దఫా మొదటి స్థానంలో ఉన్నవారే విజేతలుగా నిలిచారు. అయినప్పటికీ ఆ ఖండంలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ను వామపక్షాలకు దక్కకుండా తమ శిబిరంలో ఉంచుకొనేందుకు అమెరికా,ఇతర మితవాద శక్తులూ సర్వశక్తులను ఒడ్డుతాయి గనుకనే ఈనెల 30న జరిగే తుది ఎన్నికల వరకు విశ్రమించరాదని, జాగరూకులై ఉండాలన్నదే లూలా(వర్కర్స్‌ పార్టీ), కమ్యూనిస్టు పార్టీ పిలుపుల ఆంతర్యం. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తంగా చూసినపుడు మితవాద శక్తులు రెండు సభల్లోనూ మెజారిటీ తెచ్చుకున్నాయి.


వర్కర్స్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్‌ పార్టీలు కలసి ” బ్రెజిల్‌ విశ్వాసం ” అనే కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి మరో ఆరుపార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వీటిలోని సోషలిస్టు పార్టీనేత గెరాల్డో ఆల్కమిన్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో బ్రెజిల్‌ విశ్వాసం కూటమి ఒకటిగా, మిగతా ఆరు పార్టీలు విడిగా పోటీ చేశాయి. మరోవైపు మితవాది బోల్సనారోకు స్వంత లిబరల్‌ పార్టీతో పాటు మరో రెండు పార్టీలు మద్దతుగా నిలిచాయి. మరోసారి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బ్రెజిల్‌ వెల్లడించింది. తొలి రౌండ్‌లో విజేత లూలా, తుది దఫాలో కూడా మనమే విజేతలంగా ఉండాలని కమ్యూనిస్టు నేత శాంటోస్‌ చెప్పారు. తామింకేమాత్రం విద్వేషాన్ని,విభజన, హింస, ఆకలి, నిరంకుశత్వాన్ని కోరుకోవటం లేదని జనం వెల్లడించారు. అంతిమ విజయం, ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోనే ఉండి కృషి చేయాలని శాంటోస్‌ పిలుపునిచ్చారు. వీధులను ఆక్రమించండి, ప్రతి మనిషితో మాట్లాడేందుకు కృషి చేయండి, ప్రజాచైతన్యాన్ని పెంచండని శాంటోస్‌ కోరారు.


తాను గనుక గెలవకపోతే ఫలితాన్ని అంగీకరించేది లేదని అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ముందుగానే బోల్సనారో ప్రకటించాడు. రెండవ దఫా పోటీకి అవకాశం కల్పించటంతో ప్రజలు మార్పును కోరుతున్నారని అన్నాడు తప్ప మరొక మాట మాట్లాడలేదు. ఎన్నికలు స్వేచ్చగా జరిగిందీ లేనిదీ తెలుసుకొనేందుకు రక్షణ శాఖ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచమంతటా ఆసక్తి కలిగించిన ఎన్నికల్లో తనకు అవసరమైన 50శాతం పైగా మెజారిటీ రావటం లేదని స్పష్టం కాగానే తుది దఫా పోరుకు సిద్దం కావాలని ఆదివారం రాత్రే లూలా తన మద్దతుదార్లకు పిలుపినిచ్చాడు. గత ఎన్నికల్లో బోల్సనారో తొలిదఫా మొదటి స్థానంలో 46.03 శాతం ఓట్లు తెచ్చుకోగా రెండో స్థానంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ నేత ఫెర్నాండో హదాద్‌కు 29.28 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తుది దఫా ఎన్నికల్లో వారికి 55.13-44.87 శాతాల చొప్పున వచ్చి బోల్సనారో గెలిచాడు. తొలి దఫా పోలింగ్‌లోనే అతగాడు ఈ సారి దౌర్జన్యకాండకు తన మద్దతుదార్లను పురికొల్పే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రానున్న నాలుగు వారాల్లో హింసాకాండ చెలరేగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బోల్సనారో మరింతగా రెచ్చగొట్టటంతో పాటు మిలిటరీ కుట్రకు తెరలేచే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.


అన్నీ సజావుగా ఉంటే ఈ ఎన్నికల్లో లూలా గెలిచినప్పటికీ బోల్సనారో, ఇతర మితవాద పార్టీల ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీలో ఉన్నందున లూలా పధకాలన్నింటినీ ఆమోదించే అవకాశాలు లేవు.లూలాపై మోపిన తప్పుడు కేసులో శిక్ష వేసి జైలుకు పంపి గత ఎన్నికల్లో పోటీలో ఉండకుండా చేసి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ జడ్జి సెర్జీయో ఇతర అనేక మంది పేరు మోసిన మితవాదులందరూ తిరిగి పార్లమెంటుకు వచ్చారు. తొలి దఫా, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బోల్సనారో ముప్పు గురించి అనేక మంది హెచ్చరిస్తున్నారు. మేథావి, జర్నలిస్టు తియాగో ఆంపారో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా బోల్సనారో అనుసరించిన విధానాలకు గాను అతన్ని శిక్షించేందుకు ఈ ఎన్నిక తోడ్పడాలని కోరుకున్నారు. అది జరిగేది కాదు, ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత మనం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకూడదు, వీధుల్లోకి వెళ్లాల్సిన తరుణమంటూ, లేనట్లైతే మరోసారి అంధకార భవిష్యత్‌లోకి వెళతామని అన్నాడు.


తొలి దఫా ఓటింగ్‌లోనే లూలా గెలుస్తాడని వేసిన అంచనాలు ఎందుకు తప్పినట్లు అనే మధనం కొందరిలో ఇప్పుడు ప్రారంభమైంది. సర్వే సంస్థలు పేదలను ఎక్కువగా కలవటం, మితవాద శక్తుల మద్దతుదార్లు స్పందించకపోవటం వలన అంచనాలు తప్పినట్లు ఒక అభిప్రాయం. బోల్సనారోకు 36 లేదా 37శాతం ఓట్లు, లూలాకు 50శాతం పైన ఓట్లు వస్తాయని ప్రముఖ ఎన్నికల పండితులు చెప్పిన లెక్క తప్పింది. ప్రపంచంలో ఇలాంటి లెక్కలు తప్పటం ఇదే మొదటిది కాదు గానీ, బ్రెజిల్‌లో మితవాదులు-పురోగామి వాదుల సమీకరణలు ఇంత తీవ్రంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. ఇటలీలో పచ్చి ఫాసిస్టు శక్తి అధికారానికి రావటం అనేక దేశాల్లో మితవాదులు బలం పుంజుకోవటం శుభ సూచికలు కాదు.2015లో బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ రావటం ఖాయమన్న సర్వేలు తప్పి మితవాద కన్సర్వేటివ్‌ పార్టీ వచ్చింది. తరువాత ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరు పడటం గురించి వెలువడిన అంచనాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి.


పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. మొత్తం 27 రాష్ట్రాలలో, ముఖ్యంగా ధనికులు ఎక్కువగా ఉన్న ఎనిమిది చోట్ల మితవాదులే గెలిచారు.మరో ఆరుచోట్ల ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో రెండవ సారి ఎన్నికలు జరగాల్సి ఉంది.


ప్రస్తుతం వామపక్ష కూటమి తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అల్కమిన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. గతంలో లూలా పాలన, నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. అరెస్టును కూడా సమర్ధించాడు. గతంలో తాను చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కు తీసుకొని వామపక్ష కూటమితో జతకట్టాడు. బోల్సనారో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారితో పాటు మరికొన్ని శక్తులతో కూడా లూలా ఈసారి రాజీపడినట్లు కొన్ని విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.

ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. ఇంత జరిగినా, విముఖత వెల్లడైనా ఊహించినదాని కంటే తొలిదఫా ఓట్లు ఎక్కువగా తెచ్చుకున్నందున బోల్సనారో దేనికైనా తెగించే అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయించాడని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆరోపణలు వెలువడనప్పటికీ సాకు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అతగాడి తీరుతెన్నులను చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. బహుశా అందుకే 30వ తేదీన రెండవ దఫా ఎన్నికల వరకు వామపక్షాలు వీధులను ఆక్రమించి కుట్రలను ఎదిరించాలని పిలుపు ఇవ్వటం అనుకోవాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

5జి వశీకరణ మంత్రం : మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ, జోడీగా కార్పొరేట్‌ మహా మాంత్రికుడు ముకేష్‌ అంబానీ !

04 Tuesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, GDP growth, India GDP, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ముందుగా పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్‌ గురించి చెప్పాలి. సార్‌ మన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ గల్లీలో కూర్చుని అదేదో ఐరోపా దేశమంట అక్కడి కారు నడిపిండట నిజమేనా అని ఒకతను అడిగాడు. నిజమే అన్నాను. మా పక్కింటి పిల్లోడు ఆఫీసుకు పోకుండా ఇంటి నుంచే పని చేస్తే కంపినోళ్లు నెలాఖరుకు బాంకులో పైసలేస్తున్నరు. నేను కూడా అదే చేస్త అన్నాడు. ఇంతకూ నువ్వేం చేస్తావని అడిగా , ఓలా కాబ్‌ డ్రైవర్‌ను సార్‌ అన్నాడు. అలాగా , నువ్కొక్కడివే ఏమిటి మీ ఇంటిలో అందరి పేరా తలా ఒక కారు కొని అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, బిర్యానీ తింటూ, టీ తాగుతూ మజా చేసుకుంటూ కార్లు నడుపుతూ మస్తుగా సంపాదించుకోవచ్చు అని చెప్పా. ఏంది సార్‌ మజాక్‌ చేస్తున్నరా అని అనుమానంగా అడిగాడు.మజాక్‌ చేసేందుకు, మభ్య పెట్టేందుకు నేనేమన్నా నరేంద్రమోడీ, కెసిఆర్‌,జగనన్న, చంద్రబాబు అనుకుంటున్నవా ఏమిటి, నిజమే చెబుతున్నా అన్నా. ఏం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేసిండో బాలన్స్‌ లేక అదే ఆగిందో తెలియదు గానీ, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయా !


మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహాభారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్ధాలను ఎలా సృష్టించారో మాయాబజార్‌ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపునింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్‌ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్‌ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే ! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ సదరు డ్రైవర్‌ అడిగినట్లు అక్కడి నుంచి ఐరోపాలోని ఒక దేశంలో కారు నడిపినట్లు అందరూ చూశారు. ఏదో ఒక పెద్ద బొమ్మకారు ముందు చక్రాలు కదులుతున్నట్లు నాకుమాత్రమే కనిపించిందా, అందరికీనా అన్న సందేహం, అడిగితే ఏమనుకుంటారో అన్న సంకోచం. తీర్చితే దేశానికి వచ్చే లాభం సంగతి తెలీదు, తీర్చకపోతే నాకు ఎలాంటి నష్టమూ ఉండదు.


ఇంతకూ మన ప్రధాని మోడీ చెప్పిందేమిటి ? 5జి(ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ది, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారధిగా దేశం ఉంటుంది.(2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్‌ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41రాంకులు పెంచుకుంటే పాకిస్తాన్‌ 44 పెంచుకుంది.అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారధి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి) 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేండ్ల క్రితం ఒక జిబి(సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రు.300 ఉంటే, ఇప్పుడు రు.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జిబిలు వాడుతున్నారు. అంటే నెలకు రు.4,200 గా ఉండేది రు.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేసింది. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ ( పేటిఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్దిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు ఇది భారత శతాబ్దం.నాల్గవతరం పారిశ్రామిక విప్లవానికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మనిర్భర్‌ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి.


బహుశా నరేంద్రమోడీ గారు గంగిరెద్దుల వారిని చూసి ఉండరు. ఆ ఎద్దుల మొహాల మీద కూడా యుపిఐ అట్టలను వేలాడదీస్తున్నారు. ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి,కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిన్నరేండ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్చేదిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం ,అలాంటిది మోడీ ఏలుబడిలోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు ? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా ? ఇక పెంచిన చమురు పన్నులు, గాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?


ఇక అరవై ఐదేండ్ల ముకేష్‌ అంబానీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు ? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి తాలుకా కేంద్రం వరకు తమ 5జి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ 5జిలో ఎక్కువ భాగం భారత్‌లోనే రూపొందినందున దీన్ని ఆత్మనిర్భర్‌ ముద్రతో ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.


ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా ? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే ,ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు ? ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్‌ ఫోను, పరిజ్ఞానం వచ్చింది.1979లో నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ మరియు టెలిఫోన్‌ కంపెనీ జపాన్‌లో ఒకటవ తరం సెల్‌ఫోన్‌ను టోకియో నగరంలో ప్రవేశపెట్టింది.1984 నాటికి దేశమంతటికీ విస్తరించింది.1983లో అమెరికా, తరువాత కెనడాలకు వచ్చింది.1991లో ఫిన్లండ్‌ 2జిని, 2001లో జపాన్‌ 3జి, నార్వే 2009 చివరిలో 4జి, 2019లో దక్షిణ కొరియా 5జిని ప్రవేశపెట్టింది. 1995 జూలై 21న మన దేశంలో తొలి సెల్‌ఫోన్‌తో పశ్చిమ బెంగాల్‌ సిఎం జ్యోతిబాసు నాటి టెలికాం మంత్రి సుఖరామ్‌తో మాట్లాడారు. అది మూడవ తరం ఫోను. తరువాత 2012లో అదే కొల్‌కతాలో 4జి ఫోన్లను ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ 5జిని ప్రారంభించారు.


మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి.2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు.2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్లడాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.


2010లో అమెరికాలో 4జిని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దాని జిడిపి వృద్ధి రేటు 2.71 శాతం, ఆ ఏడాదితో సహా 2021నాటికి పన్నెండు సంవత్సరాల సగటు వృద్ధి రేటు 2.06శాతం. అందువలన జిడిపి వృద్ధి రేటుకు 4జి తోడ్పడినట్లా అడ్డుపడినట్లా ? అక్కడి 4జి వేగానికి మన దేశంలో 4జి వేగానికి ఎక్కడైనా పొంతన ఉందా ? సమాచార విశ్లేషణ, దాన్ని బట్టి ఉత్పత్తులు, మార్కెటింగ్‌ ఎత్తుగడల వంటివాటితో కంపెనీల లాభాలను పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మనుషులు తప్ప కార్పొరేట్స్‌ కాదు కదా ! 5జి, తరువాత వచ్చే ప్రతితరం కూడా చేసేది అదే.


5జి వస్తే జరిగేదేమిటి ? నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్‌ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్ధిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పధకాలకు సంబంధించి రు. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రు 1.1లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21లక్షల కామన్‌ సర్వీసు సెంటర్స్‌(సిఎస్‌సి) ద్వారా పదిలక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పధకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరులక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్‌ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018నాటికే సిమ్మీ చెప్పినట్లు 22లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి ? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది ?


జిఎస్‌ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్ధిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455బిలియన్‌ డాలర్ల లబ్ది ఉంటుంది. ముకేష్‌ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40లక్షల కోట్లడాలర్లని చెప్పారు తప్ప ఏ పద్దతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్‌ పద్దతిలో ఆ నాటికి 30లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్దతిలో 40లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు, అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్‌ అంచనాను తీసుకొని పిపిపి పద్దతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు. కనుక దీన్ని అంగీకరించాలా ? 2021 జూన్‌ 21న ప్రకటించిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం మన నామినల్‌ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్దతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011నవంబరు 12 ఎకనమిక్‌ టైమ్స్‌లో మిన్హాజ్‌ మర్చంట్‌ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్దతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. మరి దీన్ని తిరస్కరించాలా, అంబానీ అంచనాను అంగీకరించాలా? ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఇక ఫోన్‌ చేసిన కాబ్‌ డ్రైవర్‌కు నేను చెప్పదలచుకున్నదేమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి కాబ్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఓలా కంపెనీ నీకు ఎందుకు ఇస్తుంది. కార్లు కొని తక్కువ ఖర్చుతో ఇతరులతో అదే ఆపని చేస్తది, కలలు కనొద్దు బాబూ అని ! కలలు కనేందుకు, అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకని పెద్దలు మందలిస్తారు. మాయ మహామాయ లోకంలో ఉన్నాం ! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్రమోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్‌ అంబానీ కార్పొరేట్‌ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడి కుదిరిందని ఎనిమిదేండ్ల అనుభవం చెబుతోంది మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒక చంకలో భారత్‌ మరొక చంకలో పాకిస్తాన్‌ అంటున్న అమెరికా ! ఎవరి సంతుష్టీకరణకు జైశంకర్‌ విమర్శలు !!

02 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, S Jaishankar, US- Pakistan F-16s deal


ఎం కోటేశ్వరరావు


ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గాను పాకిస్తాన్‌ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ద విమానాలను మెరుగుపరుస్తున్నట్లు అమెరికా చెబితే నమ్మేంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. అది నిజమే ! అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 25 ఆదివారం నాడు వాషింగ్టన్‌ నగరంలో భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గౌతముడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమై బుద్ధుడిగా మారినట్లు చెప్పే అంశం తెలిసిందే. అమెరికా గురించి జైశంకర్‌ లేదా మన పాలకులకు ఎప్పుడు, ఎలా జ్ఞానోదయమైందో తెలుసుకొనే హక్కు దేశపౌరులందరికీ ఉంది. నిజంగా బుద్ది వికసించిందా లేక ప్రశ్నించేవారిని, అమెరికా వైఖరిని బహిరంగంగా సమర్ధించలేని కాషాయ దళాలను సంతుష్టీకరించేందుకు,ప్రచార అవసరార్ధం అలా మాట్లాడారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆ మరుసటి రోజే అదే అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలసి ఉమ్మడిగా విలేకర్ల సమావేశంలో భద్రతా అంశాలకు సంబంధించి అమెరికా ఎంతగానో అంతర్జాతీయ వైఖరితో వ్యవహరిస్తోందని అదే నోటితో జై శంకర్‌ ప్రశంసలు కురిపించటం ఎవరిని వెంగళప్పలను గావించేందుకు ?


అమెరికా-ఇరాన్‌ మధ్య తలెత్తిన వివాదంలో మన మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేయవద్దని బెదిరిస్తే అమెరికాను సంతుష్టీకరించేందుకు చిత్తం అని నిలిపివేసిన మన పాలకుల ధైర్య, సాహసాలు తెలిసినవే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి మన దేశంలో ఉన్న తిబలాజీ పెట్రోకెమ్‌ అనే పెట్రోకెమికల్‌ కంపెనీ లావాదేవీల మీద అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది.ఈ కంపెనీ వివిధ దేశాలతో ఉన్న కంపెనీలతో సమన్వయం చేసుకొని ఇరాన్‌ చమురు, ఇతర ఉత్పత్తులతో లావాదేవీలు నిర్వహిస్తున్నది.ఇరాన్‌ నుంచి పెట్రోకెమికల్స్‌ను తెచ్చి వాటిని ట్రిలియన్స్‌ అనే మరో కంపెనీ ద్వారా చైనాకు సరఫరా చేస్తున్న కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అసలు ఇరాన్‌ మీద ఏకపక్ష ఆంక్షలు విధించటమే తప్పు, వాటికి ఐరాస ఆమోదం లేదు. భాగస్వామ్యం, స్నేహం పేరుతో అమెరికా పాటలకు నృత్యం చేసేందుకు మనం అంగీకరించి ఇరాన్నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాము. ఇప్పుడు దాని కొనసాగింపుగా అది మన దేశంలోని కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఎవరో మనల్ని అదుపు చేయటం ఏమిటి, డామిట్‌ ! మనమే అందరినీ అదుపుచేసే స్థితిలో ఉన్నామని చెప్పుకొనే గిరీశాలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇలా అమెరికా ఆంక్షలకు తలొగ్గితే విదేశాల నుంచి మన దగ్గరకు రావాలనుకొంటున్న కంపెనీలు వస్తాయా ? దేశంలో ఉన్న కంపెనీలు అమెరికా గీచిన గీతల్లోనే నడిచేందుకు పెట్టుబడులు పెడతాయా ?


ఇక మంత్రి జైశంకర్‌ విమర్శలకు సంబంధించిన అంశాన్ని చూద్దాం. నలభై ఐదు కోట్ల డాలర్ల విలువ గల ఎఫ్‌-16 విమానాలకు అవసరమైన మెరుగుదల, పరికరాలకు సంబంధించి అమెరికా-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్‌ సభలో దీనికి సంబంధించిన ప్రశ్నకు జైశంకర్‌ బదులిస్తూ చివరకు ఒకరోజు ఎవరైనా వచ్చి ఉగ్రవాద నిరోధం కోసమే ఇదంతా అని చెబుతారు, మీరు చెబుతున్నది ఎఫ్‌-16 విమానం గురించి కనుక, వాటిని ఎక్కడ మోహరిస్తారో, వాటి ఉపయోగం, సామర్ధ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి మాటలు చెప్పటం ద్వారా మీరు(అమెరికా) ఎవరినీ వెంగళప్పలను చేయలేరు.” అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ పూర్వపు సోవియట్‌ తరువాత రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా 1965 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మన దేశానికి అమెరికా ఎలాంటి మిలిటరీ పరికరాలను విక్రయించలేదని, దీనికి రెండు వైపుల నుంచి కారణాలున్నాయని, అణుఒప్పందంతో ఈ పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు మనం అనేక అమెరికా విమానాలు, హెలికాప్టర్లను వాడుతున్నామని, రెండు దేశాల సంబంధాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.


భారత్‌ – పాక్‌లతో సంబంధాల అంశంలో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని, దేనికదేనంటూ రెండు దేశాలూ తమకు కావలసినవే అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పాడు. రెండింటితో అవసరాలు వేర్వేరన్నాడు. తమ గడ్డ మీద ఉగ్రవాద నిరోధానికి కృషి చేయటం లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో పాకిస్తాన్‌కు సాయం నిలిపినట్లు ప్రకటించిన తరువాత ఇప్పుడు ఉగ్రవాద నిరోధానికి అనే సాకుతో బైడెన్‌ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు ఏమిటో చెప్పటం లేదు. తాము ఇప్పుడు చేస్తున్న సాయంతో ఇప్పటికే పాక్‌ వద్ద ఎనభైకి పైగా ఉన్న ఎఫ్‌-16 విమానాలు లేదా వాటి ఆయుధ సామర్ధ్యం పెంచటం లేదని మనలను నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. ఇవి యుద్ధాలకు తప్ప ఉగ్రవాదుల నిరోధానికి పనికి వచ్చేవి కాదు. 2019లో బాలకోట్‌ దాడుల తరువాత పాకిస్తాన్‌ వాటిని మన దేశం మీద మోహరించింది. ఒక విమానాన్ని మన దళం కూల్చివేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విమానాల ద్వారా మాత్రమే సంధించే ఆధునిక క్షిపణి శకలాలను తరువాత మన మిలిటరీ ప్రదర్శించింది.


ఈ ఉదంతాల తరువాత ఈ ఏడాది జరిగిన ఒక సంఘటనకు తాజా ఒప్పందానికి సంబంధం ఉందా అన్నదాన్ని కూడా చూడాల్సి ఉంది.2022 మార్చి 9న మన దేశం రష్యా భాగస్వామ్యంతో రూపొందించిన బ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని వదిలింది. అది నలభైవేల అడుగుల ఎత్తులో 124 కిలోమీటర్లు వెళ్లి పాకిస్తాన్‌లోని చన్ను అనే పట్ణణ సమీపంలో పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాని గురించి పాకిస్తాన్‌ వెల్లడించిన తరువాతనే మన దేశం స్పందించి సాంకేతిక లోపంతో వచ్చి మీ గడ్డమీద పడిందని చెప్పింది.తరువాత మరొక ప్రకటనలో మానవ తప్పిదమని పేర్కొన్నది. ఆరునెలల తరువాత ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీన్ని అంగీకరించని పాకిస్తాన్‌ ఈ ఉదంతం మీద ఉమ్మడి విచారణ జరపాలని ఇది అనధికారికంగా వదిలినదా నిజంగా తప్పిదమా అన్నది తేల్చాలని కోరుతోంది.


అమెరికా తన వ్యూహంలో మన దేశాన్ని ఇరికించేందుకు 1947 నుంచి చూస్తున్నది. చైనాను దెబ్బతీసేందుకు బలమైన సాధనంగా మన దేశం, పశ్చిమాసియాలో తన ఎత్తుగడల అమలుకు పాకిస్తాన్‌ పనికి వస్తుందన్నది దాని అంచనా. అందుకోసం రెండు దేశాలనూ చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు చూసింది. ఇప్పుడు కూడా వేర్వేరు అంశాలతో అవసరం ఉందని చెప్పటం దానిలో భాగమే. పాక్‌ భుజం మీద తుపాకి పెట్టి మనలను లొంగదీసుకోవాలని చూసింది. కాశ్మీరు ఆక్రమణకు పాక్‌ను ప్రోత్సహించటం, తరువాత ఉగ్రవాదులను మన మీదకు వదలటం, కాశ్మీరులో చిచ్చు ఇవన్నీ దానిలో భాగమే. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా పధకాలకు పాకిస్తాన్‌ ప్రధాన సాధనంగా తాలిబాన్ల సృష్టి, శిక్షణకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. మన పాలకవర్గం తనకు ప్రయోజనం కలిగించే విదేశీ, స్వదేశీ విధానాలకే ప్రాధాన్యత ఇవ్వటం, స్వంతంగా తాము కూడా ఎదిగేందుకు సోవియట్‌తో సంబంధాలే మెరుగు అని భావించిన కారణంగానే అది ఉనికిలో ఉన్నంత వరకు అమెరికాకు అవకాశం దొరకలేదు. దాని పతనం తరువాత అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉంటూ లబ్ది పొందవచ్చని భావించటం, మరొక మార్గం లేకపోవటంతో ఆవైపు మొగ్గింది. ఎప్పుడైతే ఇది జరిగిందో తనకు కావాల్సిన భారత్‌ దొరికిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలను కొనసాగిస్తూనే మన దేశంలో ఉన్న పాక్‌ వ్యతిరేకతను గమనంలో ఉంచుకొని తన ఎత్తుగడలను మార్చుకుంది. మనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నమ్మించేందుకు చూసింది.

ఎప్పుడైతే మనతో సంబంధాలను బలపరచుకుంటున్నదో ప్రచ్చన్న యుద్దసమయంలో మన పాలకవర్గం అనుసరించిన ఎత్తుగడను తరువాత పాక్‌ అనుసరిస్తున్నది. అమెరికాను వ్యతిరేకించే చైనాకు దగ్గర కావటం దానిలో భాగమే. చైనాకు పాకిస్తాన్‌ అవసరం ఉంది కనుక వచ్చిన అవకావశాన్ని అది అందిపుచ్చుకుంది. ఇది కొత్త పరిణామాలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు తన అవసరాలకు భారత్‌ – పాకిస్తాన్‌ రెండూ అవసరమే గనుక, మన దేశం తమ బంధం నుంచి తప్పుకొనే అవకాశాలు లేకుండా బిగింపు పూర్తైనట్లు భావిస్తున్న కారణంగా, అంతర్జాతీయ అవసరాల రీత్యా అమెరికా ఇప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి తన సాయాన్ని అందిస్తున్నది. నిజానికి దాన్ని ఎన్నడూ వదలిపెట్టలేదు. 1970దశకంలో చైనాతో సంబంధాలు పెట్టుకొనేందుకు అమెరికన్లు పాకిస్తాన్‌ ద్వారానే కథ నడిపించారన్నది తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ను పటిష్టపరచటాన్ని ఎలా చూడాలి. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థం పేరుతో తమ కూటమిలో చేరనందుకు గుర్రుగా ఉన్న అమెరికా దాన్నే గనుక కొనసాగిస్తే మీ ఇష్టం అని పరోక్షంగా హెచ్చరించటం కూడా కావచ్చు. నరేంద్రమోడీ దాన్ని తట్టుకొని నిలబడగలరా ? ఇది మన దేశం మీద మాత్రమే వత్తిడి అనుకుంటే పొరపాటు, పాకిస్తాన్‌పై చైనా ప్రభావం పెరగకుండా చూసుకోవటం కూడా దీని వెనుక దాగి ఉంది.అమెరికా తన ప్రయోజనాలకే ఎల్లవేళలా పెద్ద పీటవేస్తుంది అని మరచిపోరాదు. ముందే చెప్పినట్లు అటు అమెరికా ఇటు చైనా మద్దతు, సాయం పొందేందుకు పాక్‌ పాలకవర్గం చూస్తున్నది.
ఎఫ్‌-16 విమానాలను ఉగ్రవాద నిరోధం కోసం అని అమెరికా ఎందుకు చెబుతున్నది ? టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాల్లో ఉన్న కర్దులు తాము నివసించే ప్రాంతాలతో కర్దిస్తాన్‌ ఏర్పాటు కోరుతూ దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నారు. వారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచేందుకు టర్కీ ఎఫ్‌ -16 యుద్ధ విమానాలతో వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదులపై దాడులకు వాటిని మోహరించలేదు. పాకిస్తాన్‌కు చేస్తున్న సాయాన్ని సమర్ధించుకొనేందుకు చెబుతున్నసాకు తప్ప మరొకటి కాదు. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను అణచేపేరుతో తిష్టవేసిన అమెరికా వాటిని వినియోగించిన దాఖల్లాలేవు. అమెరికా మనకు ఎఫ్‌ – 16 విమానాలు అమ్మితే పాక్‌ వైపు నుంచి కూడా జై శంకర్‌ మాదిరి స్పందనే వస్తుంది. మనం కూడా ఉగ్రవాదుల అణచివేతకే అని చెప్పగలమా ?


మన పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారనే ప్రశ్న సహజంగానే తన మద్దతుదార్ల నుంచే నరేంద్రమోడీ సర్కార్‌కు ఎదురౌతుంది. పాకిస్తాన్‌ మీద విద్వేష ప్రచారంలో తలమునకలైన కాషాయదళాలు ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.బహుశా వారి కోసం జైశంకర్‌ గట్టిగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఎవరి అవసరం వారిది. అమెరికా మనకు మరింత దగ్గర అవుతుందని చంకలు కొట్టుకొనే వారి గాలి తీస్తూ అమెరికా ప్రతినిధి మాత్రం రెండు దేశాలు తమకు సమానమనే చెప్పారు తప్ప మనవైపు మొగ్గుచూపలేదు. గతంలో మనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భావించిన పాకిస్తాన్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేందుకు ఎఫ్‌-16 విమానాల మెరుగుదలకు అంగీకరించటం, ఇద్దరూ సమానమే అని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా వెనుదిరిగినప్పటికీ అమెరికా దాన్ని పూర్తిగా వదులుకోదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అందుకు నిఘా సమాచారంతో సహా అన్ని రకాలుగా పాకిస్తాన్‌ అవసరం ఉంది. ఒసామా బిన్‌ లాడెన్‌ తరువాత ఆల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ నేతగా ఉన్న అల్‌ జవాహిరీని ఈ ఏడాది జూలై 31న ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్‌ ద్వారా అమెరికా మట్టుపెట్టింది. ఇది పాకిస్తాన్‌ సాయంతోనే జరిగిందని అందరూ నమ్ముతున్నారు.


అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఎలాంటి శషభిషలు లేకుండా సరళంగా సూటిగా చెప్పాడు. భారత్‌-పాకిస్తాన్లతో భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన ప్రయోజనాలున్నట్లు చెప్పటమంటే రెండు దేశాలను ఎక్కడ ఎలా అవసరమైతే అక్కడ అలా ఉపయోగించుకుంటామని చెప్పటమే. గతంలో పాకిస్తాన్‌ అలా ఉపయోగపడిన చరిత్ర ఉంది. మన దేశాన్నీ అదే బాటలో నడిపిస్తారా ? ఐరోపాలో హంగరీ నాటో సభ్య దేశం. ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఇతర ధనిక దేశాలు విధించిన ఆంక్షలను అది కూడా సమర్ధించింది. తీరా అవి తమ మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపించటంతో ఈ ఏడాది ఆఖరు నాటికి ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఐరోపా అడగాల్సిన తరుణం వచ్చిందని ఆ దేశ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ పార్లమెంటులో చెప్పాడు. అమెరికా చమురు కంపెనీలు ఈ యుద్ధంతో లాభాలు పొందుతున్నాయని విమర్శించాడు.రష్యాపై ఆంక్షలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు. మరోవైపున ఈ సంక్షోభం కారణంగా రష్యా నుంచి చౌక ధరలకు చమురును తెచ్చుకుంటున్న మన (దేశం) నరేంద్రమోడీ సామరకండ్‌ షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో ఇది యుద్దాల యుగం కాదంటూ పుతిన్‌కు చెప్పి అమెరికాను సంతుష్టీకరించేందుకు తెరతీశారు. ఆరునెలల్లో వారు వీరవుతారు అంటే ఇదేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d