• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: March 2023

పగలబడి నవ్వుతున్న గురివిందలు : గుజరాత్‌ సిఎంగా మోడీ సిబిఐని ఏమన్నారో తెలుసా !

31 Friday Mar 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, cbi, ED, Narendra Modi, Narendra Modi Failures, Rahul gandhi


ఎం కోటేశ్వరరావు


” యువత ముందు నిలుచొని చెబుతున్నాను, ఢిల్లీలోని ప్రభుత్వం సిబిఐని చూపి మమ్మల్ని భయ పెట్టలేదు ” ” సిబిఐ మీద దేశం విశ్వాసం కోల్పోయింది” ” సిబిఐకి భయపడని వారిలో నేను ఒకడిని ” ” మీరు ఏమైనా చేసుకోండి, కానీ సిబిఐ భయంతో అభివృద్ధి బాటను వీడేది లేదు ” ” పరిణామాలు ఎలా మారతాయో నాకు తెలుసు, కానీ మేము సిద్ద పడి ఉన్నాం ” పాఠకులకు ఈ మాటలు ఎవరివో అర్ధమయే ఉంటాయి. ఇంకెవరివి ! మోడీ ఏలుబడిలో వేధింపులకు గురవుతున్న ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటనలు అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎం పదవిలో ఉన్నపుడు చేసిన ఆరోపణలు. మోడీ అంటే అవినీతి అని అర్ధం అంటూ గతంలో తాను చేసిన ట్వీట్‌ను తొలగించటం లేదని బిజెపి నేత కుషుబూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సిబిఐ గురించి మోడీ చెప్పిన ఈ అంశాలు నరేంద్రమోడీ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అంతే కాదు మోడీ చెప్పిన సుభాషితాలు ఇంకా ఇలా ఉన్నాయి. ” సిబిఐ అంటే కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ” ” గుజరాత్‌ను కించపరిచేందుకు అబద్దాలు చెప్పవద్దు ” ” సిబిఐని రాజకీయమయం కావించేందుకు సమయాన్ని ఖర్చు చేసే బదులు ఉత్తరాఖండ్‌లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు వెచ్చించండి ” అని కూడా చెప్పారు.2013 జూన్‌ 24న గాంధీనగర్‌లో స్వామి వివేకానంద ఉపాధి వారంలో భాగంగా జరిగిన సభలో నరేంద్రమోడీ ప్రసంగించారు.పైన పేర్కొన్న ఆరోపణలన్నీ అక్కడ చేసినవే.ఈ రోజుల్లో పత్రికల్లో సగం వార్తలు సిబిఐ సంబంధమైన వాటితో నింపుతున్నారు. అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు.వారి రాజకీయ యజమానులను సంతృప్తి పరచేందుకే ఇలా చేస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు.మీరు పోటీ పడాలనుకుంటే పడదాం.ఎవరు ఎన్ని ఉద్యోగాలను ఇవ్వగలమో చూసుకుందాం అని కూడా మోడీ సవాల్‌ చేశారు. అప్పటికే నరేంద్రమోడీని తమ నేతగా లోక్‌సభ ఎన్నికల్లో రంగంలోకి దించేందుకు బిజెపి నిర్ణయించిన పూర్వరంగంలో చేసిన ప్రసంగమది.


అలాంటి మోడీ గుజరాత్‌ సిఎంగా ఉండగా ఒక నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఇరికించేందుకు సహకరించాల్సిందిగా కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా సిబిఐ తనపై వత్తిడి తెచ్చిందని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. తన మీద వత్తిడి తెచ్చినప్పటికీ దాని గురించి బిజెపి ఎన్నడూ రచ్చ చేయలేదని కూడా షా చెప్పారు. కాంగ్రెస్‌ పాలకుల మీద ఎంత ఉదారత ! మరి ఇప్పుడెందుకు చెప్పినట్లు ? అన్న ప్రశ్న జనంలో తలెత్తుతోంది.కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శల మీద అమిత్‌ షా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా ఈ అరోపణ చేశారు అన్నది స్పష్టం. అవినీతి పరులందరూ ఒక దగ్గర చేరుతున్నారంటూ ప్రతిపక్షాల మీద నరేంద్రమోడీ దాడి చేసిన తరువాత అమిత్‌ షా ఈ మాటలను చెప్పి చర్చను పక్కదారి పట్టించేందుకు చూశారు. పరువు నష్టం కేసులో శిక్ష పడిన రాహుల్‌ గాంధీ హైకోర్టులో అప్పీలుకు పోకుండా ప్రధాని మోడీని నిందిస్తూ రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. అప్పీలు చేసుకోవాలా లేదా అనేది రాహుల్‌ గాంధీకి చెందిన అంశం. ఏమి చేయాలో కూడా బిజెపి నేతలు చెబుతారా ? లేక వారు అనుకున్న విధంగా జరగటం లేదని ఉక్రోషమా ? శిక్ష విధించిన కోర్టు అప్పీలుకు ఇచ్చిన గడువు గురించి తెలిసినప్పటికీ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు లోక్‌సభ సచివాలయం ఎందుకు తొందరపడిందో అమిత్‌ షా చెప్పి ఉంటే బాగుండేది.


రాజస్తాన్‌లోని మార్బుల్‌ వ్యాపారులు తమను వేధిస్తున్న గుజరాత్‌కు చెందిన సొహ్రబుద్దీన్‌ షేక్‌ను అదుపు చేయాలని కోరగా నాడు రాష్ట్ర హౌంమంత్రిగా ఉన్న అమిత్‌ షా ఆదేశాల మేరకు పోలీసులు 2005లో సొహ్రబుద్దీన్‌తో పాటు అతని భార్య కౌసర్‌ కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై అమిత్‌ షా రాజీనామా చేశారు, అదే కేసులో సిబిఐ అరెస్టు చేసింది. సొహ్రబుద్దీన్‌ లష్కరే తోయిబాకు చెందిన వాడని, నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు గుజరాత్‌ పోలీసులు ఆరోపించారు. అమిత్‌ షా ఆదేశాల మేరకు అతన్ని చంపినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, దాని గురించి సిఎం నరేంద్రమోడీకి తెలుసా లేదా అని నిర్ధారణ చేసుకొనేందుకు మోడీని కూడా ప్రశ్నించవచ్చని సిబిఐ భావించినట్లు వార్తలు వచ్చాయి. నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసుల భయంతోనే నరేంద్రమోడీ సిబిఐ మీద దాడులు చేస్తున్నట్లు 2013లోనే కాంగ్రెస్‌ విమర్శించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పనిచేస్తోందని కూడా గుర్తు చేసింది.


సిబిఐపై నరేంద్రమోడీ పదే పదే దాడి చేశారు. ఒక్క సిబిఐ మీదనే కాదు, చివరికి కోర్టులు, జడ్జీలను కూడా లాగారు.భావనగర్‌లో 2010 జూలై 31న మాట్లాడుతూ ” గుజరాత్‌ నుంచి కేసులను బదిలీ చేయాలని సిబిఐ చెబుతున్నది. ఇది గుజరాత్‌లోని కోర్టులను, లాయర్లను అమానించటమే, ఎంతకాలం దీన్ని సహించాలి ? మన న్యాయవిశ్వవిద్యాలయాలను మూసుకోవాలా, లాయర్లు రోడ్డున పడాలా ? తొలుత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత పోలీసులు, ఇప్పుడు కోర్టులు. నా రక్తం ఉడికి పోతోంది. గుజరాత్‌ దేశంలో భాగం కాదా, ఒక శత్రు రాష్ట్రంగా ఎందుకు పరిగణిస్తున్నారు. ఉగ్రవాదం మీద పోరు జరపకుండా నన్ను నిరోధిస్తున్నారు.ఓటు బాంకు రాజకీయాల్లో భాగంగా నిందితులను అరెస్టు చేయటం లేదు. నా సన్నిహితుడు అమిత్‌ షా మీద సిబిఐ కేసు నమోదు చేసింది.ఇది ప్రభుత్వాన్ని బలహీనపరిచే రాజకీయ ప్రయత్నమే. నరేంద్రమోడీని భయపెట్టే ప్రయత్నాలు మానుకోండి.అతన్ని భయపెట్టలేరు. ఇది జాతీయవాదులు, జాతి వ్యతిరేకుల మధ్య పోరు, గుజరాత్‌ యుద్ధభూమి. గుజరాత్‌ గెలుస్తుంది.” అని చెప్పారు.


అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒక దగ్గరకు చేరుతున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌తో సహా 14 పార్టీలకు చెందిన వారు సిబిఐ, ఇడిలను తమ నేతల మీద ప్రయోగిస్తున్నారంటూ సుప్రీం కోర్టు తలుపు తట్టగా విచారణకు స్వీకరించింది. దీంతో మో-షా రంగంలోకి దిగారు. యుపిఏ 2004-14 పాలనా కాలంలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి కేవలం రు.ఐదు వేల కోట్ల విలువ గల ఆస్తులు మాత్రమే పిఎంఎల్‌ఏ కేసుల్లో స్వాధీనం చేసుకున్నారని తాము తొమ్మిది సంవత్సరాల్లో లక్షా పదివేల కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాని చెప్పారు. యుపిఏ పాలనా కాలంలో ఇడి 112 దాడులు చేసి రు.5,346 కోట్లు స్వాధీనం చేసుకోగా మోడీ అధికారానికి వచ్చాక ఎనిమిది సంవత్సరాల్లో 3010 దాడులు రు.99,356 కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకున్నట్లుగా 2022 జూలై 27న పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కాంగ్రెస్‌ ఏలుబడిలో సగటున ఒక్కో కేసులో 47.7 కోట్ల వంతున స్వాధీనం చేసుకోగా మోడీ పాలనలో అది రు.33 కోట్లుగా ఉంది. విదేశీమారకద్రవ్య అక్రమాల కేసులు ఇదే విధంగా 8,586 నుంచి 22,320కి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది. దాడులు జరిపిన 3,010 కేసులలో చార్జి షీట్లు దాఖలు చేసింది 888 కేసుల్లో కాగా శిక్షలు పడింది 23 కేసుల్లో, వాటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రు.869 కోట్లని కూడా ప్రభుత్వం తెలిపింది. అందువలన దాడుల సంఖ్య పెరిగినా ఆస్తులను లక్ష కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించినా తేలిన కేసులు, స్వాధీన మొత్తాలను చూస్తే అది నామమాత్రమే అన్నది స్పష్టం.మోడీ ఏలుబడిలో 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి 3,555 మనీలాండరింగ్‌ కేసులు నమోదు కాగా చార్జిషీట్లు దాఖలు చేసింది 2022 మార్చి వరకు 992 మాత్రమే. అవినీతి అక్రమాల పట్ల తామెంత నిబద్దతతో ఉన్నదీ తమ ఏలుబడిలో కేసుల సంఖ్య పెరగటాన్ని సూచిస్తున్నదని ప్రభుత్వం చెప్పుకుంది. వాటిలో ఎక్కువ భాగం బెదరింపులు, కేసుల్లో ఇరికించేందుకు చేసిన దాడులే అన్నది విమర్శ.


అదానీకి 2014లో ఉన్న ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద 2022నాటికి 137 బి.డాలర్లకు పెరిగిందంటే అది సక్రమంగా జరిగింది కాదన్నది జగమెరిగిందే. గత తొమ్మిది సంవత్సరాల్లో మీకది నాకిది అన్నట్లుగా పంచుకుంటున్న ఉదంతాలు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు , పారదర్శకతకు డిజిటల్‌ లావాదేవీలు, నల్లధనాన్ని అరికట్టినట్లు ఎన్నో కబుర్లు చెప్పారు. అంత పకడ్బందీగా చేస్తున్నపుడు అవినీతి పరులు తామర తంపరగా ఎలా పుట్టుకువస్తున్నట్లు ?విదేశీ మారక ద్రవ్య అక్రమాల(ఫెమా) కేసులను చూస్తే యుపిఏ పాలనలో 8,586 కేసులు దాఖలు కాగా 2,780 కేసుల్లో షోకాజ్‌ నోటీసలు ఇచ్చారు.తీర్పులు వచ్చిన 1,312 కేసుల్లో రు.1,754 కోట్ల మేరకు జరిమానా విధించారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో 22,330 కేసుల్లో తీర్పులు వచ్చిన 5,160 కేసుల్లో విధించిన జరిమానా రు.6,376 కోట్లు. అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించని నరేంద్రమోడీ ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి దిగటం ఆశ్చర్యం కలిగించదు. గతంలో సిబిఐ మీద ఆరోపణలు చేసిన మోడీ సర్కార్‌ దాని డైరెక్టర్లుగా తమకు అనుకూలురైన అలోక్‌వర్మ,రాకేష్‌ అస్తానాలను నియమించటం వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవటం, ఆ ఇద్దరినీ తప్పించి మరొక స్వంత మనిషి నాగేశ్వరరావును కూర్చోపెట్టటం తెలిసిందే. ఇలాంటి నిర్వాకం ద్వారా సిబిఐ మీద విశ్వాసం పెంచినట్లు బిజెపి నేతలు చెబుతుంటే వాషింగ్‌ పౌడర్‌ నిర్మా గుర్తుకు వస్తున్నది. గత తొమ్మిది సంవత్సరాలలో సిబిఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన దాడులు, మోపిన కేసులు ప్రతిపక్షాలకు చెందిన వారి మీదనే, కొంత మందిని కేసులు మోపి లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకోవటం, కొందరిని బెదిరించి పార్టీలోకి లాక్కోవటం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు తమ నిర్వాకాలను చూసుకోవాలి. తమ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకోవటం చూస్తుంటే గురివిందలు గుర్తుకు వస్తున్నాయి. ఎదుటి వారి నలుపును చూసి పరిహాసం చేసే గురివిందలు తమ కింది నలుపును చూసుకోవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా యుద్ధోన్మాద రంకెలు !

29 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, imperialism, Joe Biden, south china sea conflict, Taiwan, US war Cry, US war With China, WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఇటీవలి వరకు అమెరికా తొత్తుగా ఉన్న హొండూరాస్‌ ఆదివారం నాడు తైవాన్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడ వామపక్ష శక్తులు అధికారానికి రావటమే ఈ మార్పుకు కారణం. మారుతున్న బలాబలాలకు నిదర్శనంగా 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది దేశాలు తైవాన్ను వదలి చైనాతో సంబంధాలు పెట్టుకున్నాయి. హొండూరాస్‌పై వత్తిడి తెచ్చేందుకు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపిన అమెరికా చివరికి చేసేదేమీ లేక మీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ హొండూరాస్‌కు చెప్పింది. ఈ పరిణామం తైవాన్ను గుర్తిస్తున్న ఇతర దేశాల మీద కూడా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. తైవాన్ను గుర్తించినందుకు ప్రతిఫలంగా అమెరికా, తైవాన్నుంచి కూడా సదరు దేశాలకు పెట్టుబడులు, ఇతరంగా ప్రతిఫలం ముడుతున్నది. అది ఎంతో కాలం కొనసాగించలేరని ఒక్కొక్కటి జారుకుంటున్న తీరు వెల్లడిస్తున్నది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌ ఏడవ తేదీ వరకు తైవాన్‌ ప్రాంత పాలకురాలు తై ఇంగ్‌ వెన్‌ లాటిన్‌ అమెరికా, అమెరికా తదితర దేశాలను సందర్శించనున్నారు. తైవాన్‌ వేర్పాటు వాదులకు ప్రపంచంలో ఎంతో మద్దతు ఉందని చెప్పి విశ్వాసం కల్పించేందుకు ప్రధానంగా ఆమె వెళుతున్నారు. పైకి ఏమి చెప్పినప్పటికీ తమకు చైనా నుంచి ముప్పు వస్తున్నదని ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. ఇదంతా అమెరికా అడిస్తున్న నాటకం అన్నది తెలిసిందే.


ఇటీవలి కాలంలో తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతున్నదనే భయం అమెరికాను పట్టి పీడిస్తున్నది.నడమంత్రపు సిరి నరం మీది పుండు కుదురుగా ఉండనివ్వవు అన్నట్లుగా అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నిరంతరం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత, రక్తపాతాన్ని కోరుకుంటారు. దానికి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం పని చేస్తుంది.గత వారంలో అమెరికా మిలిటరీ జాయింట్‌ ఛీఫ్‌ల చైర్మన్‌ మార్క్‌ మిలే, అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ రక్షణశాఖ పార్లమెంటరీ ఉపకమిటీ ముందు మిలిటరీ విధానం, ఆలోచనల గురించి మాట్లాడారు. రికార్డు స్థాయిలో మిలిటరీ బడ్జెట్‌ ప్రధానంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినదని స్పష్టం చేశారు. చైనాతో పోరుకు తమను సన్నద్దం చేస్తుందని అన్నారు.ఉప సంఘం చైర్మన్‌ కెన్‌ క్లవర్ట్‌ తొలి పలుకులు పలుకుతూ అవసరమైతే ఈ రాత్రికి రాత్రే పోరుకు సిద్దంగా ఉండాలి, ప్రపంచంలో ఎదురులేని శక్తిగా వేగంగా నవీకరించాలని ప్రకటించాడు. చైనా మిలిటరీతో అమెరికా వ్యూహాత్మక పోటీ దృష్టితో రూపొందించిన బడ్జెట్‌ అని ఆస్టిన్‌ చెప్పాడు. మార్క్‌ మిలే మాట్లాడుతూ రానున్న పది సంవత్సరాల్లో పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో చైనా పెద్దదిగా ఉంటుందని, 2049 నాటికి మొత్తంగా సామర్ధ్యంలో అమెరికా మిలిటరీని అధిగమించనుందని వర్ణించాడు.ప్రస్తుతం మొత్తం 10,330 యూనిట్లు ఉన్నాయని, వాటిలో 4,680 చురుకైన విధుల్లో ఉన్నట్లు, అవి ఎంతగా అంటే వాటిలో అరవైశాతాన్ని 30 రోజుల్లో, పదిశాతాన్ని కేవలం 96 గంటల లోపుగానే మోహరించవచ్చని చెప్పాడు. ఈ సన్నద్దతను కొనసాగించేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందన్నారు.దీనితో ప్రతి విభాగాన్ని సంసిద్దం గావించవచ్చన్నారు.మొత్తం లక్ష కోట్ల డాలర్లను బైడెన్‌ సర్కార్‌ సిద్దం చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యను అవకాశంగా తీసుకొని ఎలాంటి టెండర్లతో నిమిత్తం లేకుండా అమెరికాతో సహ అనేక దేశాల్లో నేరుగా పరికరాలు, అస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. మిలిటరీ ఎత్తుగడల గురించి కూడా మిలే, ఆస్టిన్‌ వెల్లడించారు. దేశ ఉద్ధేశ్యాలు శాంతియుతమైనవే, హింసాకాండ జరగవచ్చనే బెదిరింపులతో అమెరికా తన ఆలోచనలను రుద్దాలి అవి విఫలమైతే హింసాకాండకు దిగాలి అన్నారు.యుద్దం కంటే ఖర్చు ఎక్కువ కానప్పటికీ యుద్దసన్నద్దత, నిరోధించటం కూడా అసాధారణ రీతిలో ఖర్చుకు దారితీస్తుంది. ఈ భారీ బడ్జెట్‌ యుద్దాన్ని నిరోధిస్తుంది, అవసరమైతే పోరుకు మనల్ని సన్నద్ద పరుస్తుందని మిలే వాదించాడు. ఇలాంటి మాటలతో అమెరికన్లను, ప్రపంచ జనాలను మభ్యపెట్టేందుకు గతంలో అనేక మంది మిలిటరీ అధికారులు చూశారు. దీని వెనుక మిలిటరీ పరిశ్రమల అధిపతులకు లబ్ది చేకూర్చే ఎత్తుగడ ఉంది. నిజానికి చరిత్రలో హిట్లర్‌ మిలిటరీ అధికారులు కూడా ఇదేవిధంగా మాట్లాడారు, జర్మన్లను మభ్యపెట్టారు. వారిలో ఒకడైన ఎరిక్‌ రాడెర్‌ జర్మన్‌ నావికాదళ అధికారి, రెండవ ప్రపంచ యుద్ద నేరాలను విచారించిన న్యూరెంబర్గ్‌ కోర్టులో చేసిన ఇదే వాదనలను తిరస్కరించి జీవితకాల శిక్ష వేశారు. జర్మనీకి దుష్ట ఆలోచనలు లేవని, మిలిటరీ బలంగా ఉంటే కోరుకున్న ప్రాంతాలను యుద్దంతో నిమిత్తం లేకుండా బలాన్ని చూపి పొందవచ్చని వాదించాడు. నిజానికి మిలిటరీని పెంచటమేగాక, దాడుల పధకంలో కూడా ఎరిక్‌ రాడెర్‌ చురుకైన పాత్రధారి అని కోర్టు నిర్ధారించింది. ఆర్థికంగా దిగజారుడును మిలిటరీ హింసాకాండద్వారా పూడ్చుకోవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు.” ఏ దేశంలోనూ లేని విధంగా చైనాలో సంపద, వృద్ది జరుగుతున్నట్లు మనకు కనిపిస్తున్నది.విపరీతంగా సంపద పెరిగితే ప్రపంచవ్యాపితంగా అధికారం కూడా అలాగే పెరుగుతుంది.ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న మనం ఎల్లవేళలా అదే స్థానంలో ఉండాలని ” మిలే చెప్పాడు.


సినిమాలు, టీవీ చిత్రాల ద్వారా అమెరికన్లకు ముప్పు ఎలా ఎటు వైపు నుంచి వస్తున్నదో చూపటం అక్కడ జరుగుతున్నది.వాటిలో గతంలో రష్యన్లు, ఇతర అమెరికా వ్యతిరేకులను ప్రతినాయకులుగా చూపే వారు. వారి మీద అమెరికన్లలో ద్వేషం పుట్టించేవారు. ఇప్పుడు చైనా, ఇతర దేశాల వారిని కూడా ప్రధానంగా చూపుతున్నారు.దానిలో భాగంగానే ఇటీవల కొన్ని అమెరికా సంస్థలు, పార్లమెంటులోని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు కొన్ని ఊహాజనిత యుద్ద క్రీడలను కంప్యూటర్లలో సృష్టించి జనానికి చూపుతున్నారు. వాటి ప్రకారం 2025నాటికి తైవాన్‌ అంశం మీద అమెరికా-చైనా పోరుకు తలపడతాయని, దానిలో చైనా ఓడిపోతుందని చిత్రించారు. ఇది హాలీవుడ్‌ సినిమా వంటిదే. వాటిలో అమెరికా సిఐఏ గూఢచారులను తెలివిగలవారిగా ఇతర దేశాల వారిని దద్దమ్మలుగా చిత్రిస్తారు. నిజానికి ఇంతవరకు ఏ ఒక్క యుద్దంలోనూ అమెరికా గెలిచిన ఉదంతం లేదు. దాన్ని సిఐఏ పసిగట్టి తమ నేతలను హెచ్చరించి పరువు నిలిపిందీ లేదు. అమెరికా రిటైర్డ్‌ నావీ అధికారి మార్క్‌ మాంట్‌గోమరీ ఓర్లాండోలో రిపబ్లికన్‌ ఎంపీలకు చైనాతో పోరు అనే ఒక ఊహా చిత్రాన్ని చూపాడు. దానిలో వేలాది మంది అమెరికన్లు మరణిస్తారని, విమానవాహక నావలను ముంచివేస్తారని చిత్రించాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మిలిటరీలో పని చేస్తున్న వారిలో 15 నుంచి 50 మంది లేదా దేశం మొత్తంగా ఐదు నుంచి ఇరవైవేల మంది ఒక వారంలో మరణిస్తారని చూపాడు. దానిలో తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు చైనా ప్రధాన ప్రాంతంపై ఎలాదాడి చేసేది, దాని నౌకలను ఎలా ముంచేది, మిలిటరీని ఎలా చక్రబంధం చేసేది, వివిధ కోణాల్లో జరిగే పర్యవసానాలను చూపారు. ఇలాంటి వాటిని బూచిగా చూపి అమెరికా తన దుర్మార్గాలను జనంతో ఆమోదింప చేసుకునేందుకు చూస్తున్నది.ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా తైవాన్‌ ఆక్రమణకు చైనా పూనుకుంటే నేరుగా అమెరికా మిలిటరీని దింపుతారా అన్న ప్రశ్నకు జో బైడెన్‌ అవును అని సమాధానమిచ్చాడు.


ప్రజాబలం, పట్టుదలలో ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ మిలిటరీ రీత్యా అమెరికాతో 50 సంవత్సరాల నాడు వియత్నాం సరితూగే స్థితిలో లేదు. అయినా బతుకు జీవుడా అంటూ అమెరికా మిలిటరీ ఎలా పారిపోయిందీ ప్రపంచమంతా చూసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందీ అదే. తాలిబాన్లకు సలాం కొట్టి అమెరికన్లు వెళ్లారు. అలాంటిది చైనాతో ఢకొీనగలమని అమెరికన్లను నమ్మించేందుకు అక్కడి యుద్ధోన్మాదులు చూస్తున్నారు. ” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో 2022 ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు మిలిటరీ డ్రిల్లుల ద్వారా చైనా చూపుతున్నది. వత్తిడి పెంచి రాయితీలు పొందేందుకు, వీలుగాకుంటే దాడికి తెగించేందుకు అమెరికా చూస్తున్నది. దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చాయి. దానికి ప్రతిగానే ఇటీవల షీ జింపింగ్‌ మాస్కో వెళ్లి పుతిన్‌తో మరింత గట్టిగా బంధానికి తెరతీశాడు. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని, ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారని వెల్లడైంది. చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను సిఐఏ ప్రకటించింది.


ఏడు దశాబ్దాల నాడున్న చైనాకు నేటి చైనాకు ఏ విధంగానూ పోలికే లేదు. ఇరాన్‌-సౌదీ ఒప్పందాన్ని కుదిర్చి తన పలుకుబడి ఏమిటో ప్రదర్శించింది. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.డేనియల్‌ ఎల్స్‌బర్గ్‌ బహిర్గతపరచిన పెంటగన్‌ పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటినీ అధిగమించింది. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. అందుకే నిప్పుతో చెలగాటాలాడవద్దని బైడెన్‌తో భేటీలో షీ జింపింగ్‌ హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !

26 Sunday Mar 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, CM Adityanath, Hate-Speech, J P Nadda, Kushboo Sunder, Narendra Modi Failures, Prakash Raj, Rahul gandhi, RSS


ఎం కోటేశ్వరరావు


మాజీ హీరోయిన్‌ కుష్‌బూ తన పార్టీ బిజెపి నేతలను మెప్పించేందుకు తంటాలు పడ్డారు. గతంలో తాను కాంగ్రెస్‌ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు పార్టీ నేతలవే తప్ప తనవి కాదని, అందువలన వాటిని ఇప్పుడు తాను వెనక్కు తీసుకోవాలను కోవటం లేదని చెప్పారు. మోడీలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్‌ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించటం, వెంటనే లోక్‌సభ సచివాలయం రంగంలోకి దిగి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నేతలు గతంలో కుష్‌బూ కూడా రాహుల్‌ మాదిరి వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇప్పుడు బిజెపిలో ఉన్నారని గుర్తు చేశారు. వాటి మీద కుషఉ్బ మండి పడ్డారు. ఆమె ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌గా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 15న కాంగ్రెస్‌ ప్రతినిధిగా కుష్‌బూ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. ” ఇక్కడ మోడీ, అక్కడ మోడీ, ఎక్కడ చూస్తే అక్కడ మోడీ… లేకపోతే ఏమిటి ? మోడీ అనే పదానికి ముందు అవినీతి పరుల పేర్లు ఉంటున్నాయి.దాని అర్ధం తెలియటం లేదు. కనుక మోడీ అంటే అవినీతి పరులని అర్ధం మార్చుదాం. నీరవ్‌, లలిత్‌, నమో అంటే అవినీతి పరులంటే తగినట్లుగా ఉంటుంది.” అని ఉంది.


దీని గురించి కుష్‌బూ పిటిఐ విలేకరితో మాట్లాడుతూ ” నేను కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఒక కాంగ్రెస్‌ ప్రతినిధిగా నా బాధ్యత మాత్రమే నిర్వహించాను. అలాంటి భాషలోనే మేము మాట్లాడాల్సి ఉండేది, నేను సరిగ్గా అదే చేశాను. నేను పార్టీ నేతను అనుసరించాను.ఇది అతని భాష. కాంగ్రెస్‌ పార్టీ ఎంత తెంపరితనంతో ఉందో చూపటమే కాదు, ఈ అంశాన్ని లేవనెత్తటం ద్వారా వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందో కూడా వెల్లడిస్తున్నది. నా ఖాతా నుంచి నేను ఏ ఒక్క ట్వీట్‌ను కూడా తొలగించలేదు. ఇప్పుడు నేనా పని చేయను. నా పేరును ప్రస్తావించటం ద్వారా కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారు ? నన్ను రాహుల్‌ గాంధీతో సమానంగా చూస్తున్నారా ? మోడీలను దొంగలు అని పిలిచే స్థాయికి రాహుల్‌ గాంధీ దిగజారారు, నేను అవినీతి అనే పిలిచాను. తేడాను చూసే సామర్ధ్యం కాంగ్రెస్‌కు లేదు. కానీ వారికి దమ్ముంటే నా మీద కేసును దాఖలు చేయాలని సవాలు చేస్తున్నాను. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను. నేను నా ట్వీట్‌ను తొలగించను.అది అక్కడే ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు పని లేదు. మీ సమయాన్ని వెచ్చింది మరిన్ని ట్వీట్లను వెలికి తీయండి. ” అని. పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీతో తనను సమంగా చూసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని కుష్‌బూ ట్వీట్‌ చేశారు.


కుష్‌బూ రాజకీయ ప్రయాణం 2010లో డిఎంకెతో ప్రారంభమైంది. మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తనకు పార్టీలో తగినంత గుర్తింపు ఇవ్వలేదంటూ అదే ఏడాది రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేదని ఆరోపించారు. తరువాత బిజెపిలో చేరారు.వందకు పైగా సినిమాల్లో నటించిన 52 సంవత్సరాల కుష్‌బూ గత పోకడలను బట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఆ పార్టీ నేత భాషనే మాట్లాడాను తప్ప ఆ విమర్శలు తనవి కాదని చెప్పుకున్న కుష్‌బూ విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్న. బిజెపిలో చేరిన తరువాత ఆమె చెప్పిన మాటలు కూడా ఆ పార్టీ నేతకు అనుగుణంగా మాట్లాడినట్లు భావించాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలని (కాంగ్రెస్‌లో ఉన్నపుడు అలా మాట్లాడాల్సి వచ్చేదని ఆమే చెప్పారు గనుక) బిజెపి నిర్దేశించి ఉంటుంది గనుక నరేంద్రమోడీని పొగుడుతూ కుషఉ్బ మాట్లాడారన్నది స్పష్టం. బిజెపిలో చేరటాన్ని ఖరారు చేసుకున్న తరువాత ఆమె ఏం మాట్లాడిందీ చూద్దాం.” పార్టీ నాకేమి చేస్తుంది అన్నదాన్ని గురించి నేనేమీ ఆశించటం లేదు. కానీ దేశ ప్రజలకు పార్టీ ఏమి చేస్తుందీ అని చూస్తాను.నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది ఒక మనిషిని అదే మన ప్రధానిని నమ్ముతున్నారు. వారు చేస్తున్నది పూర్తిగా సరైనదే అని భావిస్తున్నాను.” అని ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు. అధికార బిజెపిలో చేరే అవసరం కోసం తప్ప ఈ మాటలు నిజాయితీగా చెప్పినట్లు ఆధారం ఏమిటి ?


ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ రాహుల్‌ గాంధీ ఉదంతంపై తనదైన శైలిలో స్పందించి ఆదివారం నాడు ఒక ప్రశ్నను సంధించారు.తన ట్వీట్‌కు ఒక ఫొటోను జత చేశారు. దానిలో ఎడమవైపు లలిత్‌ మోడీ, మధ్యలో నరేంద్రమోడీ, కుడివైపున లలిత్‌ మోడీ చిత్రం ఉంది. అటూ ఇటూ ఉన్నవారు అక్రమాలకు పాల్పడి దేశం వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో పైన ” జనరల్‌ నాలెడ్జ్‌- ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏకైక అంశం ఏమిటి అని కేవలం అడుగుతున్నా అంతే ” అన్న వ్యాఖ్యను పెట్టారు. ముగ్గురి పేరులోనూ మోడీ ఉండటం అన్నది దాని భావం అని వేరే చెప్పనవసరం లేదు.” దొంగలందరికీ మోడీ అనే ఒకే ఇంటి పేరు ఎలా వచ్చింది ” అంటూ రాహుల్‌ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో అన్న మాటలు మోడీ కులం అంతటికీ పరువు నష్టం కలిగించినట్లు సూరత్‌ కోర్టులో బిజెపి నేత దాఖలు చేసిన కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడింది. మోడీ కులంతో సహా ఒబిసి లందరినీ రాహుల్‌ గాంధీ అవమానించారు అని బిజెపి ఒబిసిలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నది. తెలుగు ప్రాంతాల్లో ఒకే ఇంటి పేరు కలిగిన వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఒకే కులంలో అనేక ఇంటి పేర్లు గలవారు ఉన్నారు. ఒబిసిల్లో మోడీ అనే కులమే లేదు. నరేంద్రమోడీ తెలీ ఘంచీ లేదా మోధ్‌ ఘంచీ అనే కులానికి చెందిన వారు. కొన్ని చోట్ల ఘంచీ అని కూడా పిలుస్తారు.(ఈ పేరుతో ముస్లింలు కూడా ఉన్నారు) ఈ కులానికి చెందిన వారు నూనె గానుగ ఆడించటం, నూనెను అమ్మటం ప్రధాన వృత్తిగా చేస్తారు. వీరిని వైశ్యుల్లో ఒక ఉపకులంగా కూడా పరిగణిస్తారు. కర్ణాటకలో ఈ పని చేసే వారిని గనిగ అని పిలుస్తారు.ఇక అవినీతికి పాల్పడి దేశం వదలి పారిపోయిన నీరవ్‌ మోడీదీ నరేంద్రమోడీది ఒకే కులం, మతం కూడా కాదు. నీరవ్‌ మోడీ జైన మతంలో పాలంపూరీ జైన్స్‌ కులానికి చెందిన వ్యక్తి.లలిత్‌ మోడీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. బీహార్‌కు చెందిన బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ వైశ్య, బిసి కాదు. గుజరాత్‌లో పార్వతికి మరో పేరు మోదేశ్వరీ దేవి. అందువలన గుజరాతీలు అనేక మంది ఆమె పేరు కలసి వచ్చేట్లుగా మోడీ అని అడా మగా అందరూ పెట్టుకుంటారు.


మోడీ ఇంటి పేరు గలవారిని అవమానపరిచినట్లు రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు మొత్తం ముస్లిం సామాజిక తరగతినే ఉగ్రవాదులు అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ” ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే ” అంటున్నారా లేదా ?కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ ” నేను ఒక సామాజిక తరగతిని నిందించటం లేదు గానీ ఉగ్రవాద చర్యలలో పట్టుబడిన వారందరూ ఒక సామాజిక తరగతికే చెందిన వారన్నది నిజం కాదా ? లౌకిక పార్టీలం అని చెప్పుకొనేవి ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు ? ” అని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా 2022 మే ఆరవ తేదీన కోజికోడ్‌లో మాట్లాడుతూ ముస్లిం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా కేరళ మారినట్లు మాట్లాడారు. ఇది మొత్తం కేరళనే అవమానించినట్లు కాదా ? దీన్లో పరువు నష్టం అంశం లేదా ? ఎవరైనా కేసు వేసినా లేకున్నా సూరత్‌ కోర్టు తీర్పు స్ఫూర్తితో నడ్డాను రాజ్యసభ సచివాలయం అనర్హుడిగా ప్రకటిస్తుందా ?


బిజెపిలో నోటి తుత్తర మనుషులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ కిషోర్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ గనుక ఒక తెల్లమహిళను కాకుండా ఒక నైజీరియన్‌ మహిళను చేసుకొని ఉండి ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఆమోదించి ఉండేదా అని ప్రశ్నించారు.నిజానికి ఇది ఒక్క నైజీరియన్‌ మహిళలనే కాదు, మొత్తం మహిళలను అవమానించినట్లు ? జాత్యహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. దీని గురించి తాము నిరసన తెలపటం లేదంటూ, ప్రధాని నరేంద్రమోడీ దీన్ని సరిచేయగలరని భావిస్తున్నట్లు మన దేశంలో నైజీరియన్‌ రాయబారి ఓబి ఓకోంగొర్‌ ఎంతో హుందాగా స్పందించాడు. కానీ నరేంద్రమోడీ సరి చేసినట్లు గానీ, గిరిరాజ్‌ సింగ్‌ తన ప్రకటనను సవరించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.ఈ పెద్దమనిషి నోటి నుంచి ఇలాంటి సుభాషితాలకు కొదవ లేదు. నరేంద్రమోడీని వ్యతిరేకించే వారందరూ పాకిస్తాన్‌ పోవాల్సిందే అని 2014 ఎన్నికల ప్రచారం సెలవిచ్చారు.కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో నాడు సిఎంగా ఉన్న నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తూ నరేంద్రమోడీని చూసి ఓర్చుకోలేక ”పల్లెటూరి ఆడదానిలా” పోట్లాడుతున్నట్లు వర్ణించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మహిళలు అందరినీ అవమానించినట్లే కదా ! షహరాన్‌ పూర్‌లోని ముస్లిం మత కేంద్రం దారులు ఉలుం దేవబంద్‌ను ఉగ్రవాద దేవాలయం అని ఇదే మంత్రి వర్ణించారు. బాబరీ మసీదు భూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసినపుడు మంత్రికి కోపం వచ్చింది.” ఈ వంద కోట్ల మంది హిందువులు కూడా మీ సోదరులే అని గుర్తించాలని ముస్లింలను కోరుతున్నాను. మీరు మూడు లక్షల మసీదులను ఏర్పాటు చేస్తే ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పుడు హిందువుల సహనాన్ని పరీక్షించవద్దు.రాముడి మీద నాకు విశ్వాసం, ఆయన ఆలయాన్ని ఆయోధ్యలో నిర్మించాలి.హిందువుల విశ్వాసానికి రాముడు మూలం.దీన్ని హిందూ – ముస్లిం సమస్యగా మార్చాలని చూసింది.హిందువుల్లో సహనం నశిస్తున్నది” అని అన్నారు. హిందువేతరులందరూ అక్రమ సంతానమే అంటూ నోరు పారవేసుకున్న సాధ్వి నిరంజన గురించి తెలిసిందే. పాలకులుగా రాముడిని అనుసరించే వారు కావాలో అక్రమ సంతానానికి పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని 2014 ఎన్నికల సభలో మాట్లాడారు. ఆ మాటలను మోడీ తప్పు పట్టటంతో ఆమె క్షమాపణ చెప్పారు గానీ ఆమెకు కేంద్ర మంత్రిపదవి బహుమానంగా దక్కింది.


ఉగ్రవాదానికి సంబంధించి సౌత్‌ ఆసియన్‌ టెర్రరిజం పోర్టల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎవరి చేతుల్లో ఎందరు మరణించింది దిగువ విధంగా ఉంది. కాశ్మీర్‌ మరణాలను మొత్తంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదుల ఖాతాలో వేసినా, మావోయిస్టు, ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులందరూ హిందువులు, క్రైస్తవులే కదా ? వారిలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారన్నది తెలిసిందే.
సం××ఈశాన్య ××మావోయిస్టు×× కాశ్మీర్‌
2011 ×× 246 ×× 602 ×× 225
2012 ×× 326 ×× 367 ×× 206
2013 ×× 252 ×× 421 ×× 193
2014 ×× 465 ×× 314 ×× 193
ఈ వివరాలను చూసిన తరువాత ఎవరైనా ఉగ్రవాదులందరూ ఒక సామాజిక తరగతి లేదా ముస్లింలే అని ఎలా చెప్పగలరు ? ఉగ్రవాదానికి ముస్లిం మతానికి ముడి పెట్టి విశ్లేషణలు చేస్తున్నవారి సంగతేమిటి ? అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాద చర్యలను ఎలా వర్ణిస్తారు ?


విద్వేషపూరిత ప్రసంగాలకు కాషాయదళాలు పెట్టింది పేరు. కొందరి నోళ్ల నుంచి వెలువడిన ఆ మాటలు పరువు తీసేవిగానూ, సమాజంలో కలతలు రేపేవిగానూ ఉన్నాయి. ఎందరి మీద కేసులు నమోదు చేశారు, ఎందరికి శిక్షలు వేసి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేశారు ? కోర్టులు కూడా తమంతట తాముగా తీసుకోవచ్చు, ఎన్ని ఉదంతాల్లో తీసుకున్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాధ్‌ 34 సందర్భాలలో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసినట్లు వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ నమోదు చేసి ప్రచురించింది. మధ్య ప్రదేశ్‌లో గడ్డం ఉన్న ఒక భవర్‌లాల్‌ జైన్‌ అనే వృద్దుడిని నువ్వు ముస్లిమ్‌వా, ఆధార్‌ కార్డుచూపమంటూ దాడి చేసిన బిజెపి నేత గురించి తెలిసిందే. తరువాత జైన్‌ శవం కనిపించింది. రావణుడ్ని దహనం చేసినట్లు ముస్లింలను కూడా చేయాలని బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ చెప్పారు. వారికి ఓటింగ్‌ రద్దు చేయాలని రెండో తరగతి పౌరులుగా చూడాలన్నారు. బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసు అరెస్టు చేస్తే తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. చేసింది కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఢిల్లీ పోలీసులు అని గమనించాలి. అతన్ని లాయర్‌గా పనికి రాడని ప్రకటించలేదు. ” ఏ హిందువైనా నాకు ఓటు వేయకపోతే వారి నరాల్లో మియా(ముస్లిం) రక్తం ఉన్నట్లే. అతను ఒక ద్రోహి. విద్రోహి జయ చంద్రుడికి పుట్టిన అక్రమ సంతానం.వాడి తండ్రి పాపపు కొడుకే.ఈ సారి నేను హెచ్చరిస్తున్నాను.హిందూ మత ద్రోహులను నాశనం చేస్తాం” ఈ మాటలన్నది బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌. ఎంతో గౌరవ ప్రదమైన మాటలు గనుకనే అతని ఎంఎల్‌ఏ గిరి నిలిచిందనుకోవాలి. అదే రాష్ట్రానికి చెందిన మరొక బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర సింగ్‌ ” హిందువులు గనుక మేలుకుంటే మేము మీ మీగడ్డాలను లాగి గట్టిగా ముడివేస్తాం.మీరు హిందూస్తాన్‌లో ఉండాలంటే రాధే రాధే అనాలి ” అన్నారు. బక్రీద్‌ సందర్భంగా అమాయకపు జంతువులను కాదు మీ పిల్లలను బలి ఇవ్వాలంటూ 2020లో మరో బిజెపి ఎంఎల్‌ఏ నంద కిషోర్‌ గుజార్‌ అన్నారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.వాటి మీద ఎలాంటి కేసులు లేవు, ఉన్నా శిక్షలు పడిన దాఖలాల్లేవు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !

24 Friday Mar 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

#India jobless growth, BJP, India’s GDP, Narendra Modi, Narendra Modi Failures, Narendra Modi problem


ఎం కోటేశ్వరరావు


” భారత్‌కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా ?” అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ” భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ ” మార్చినెల 19వ తేదీ ఆదివారం నాడు లండన్‌ నుంచి వెలువడే మరో పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తన విశ్లేషణకు పెట్టిన శీర్షిక.” ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్లు కోల్పోతున్న గౌతమ్‌ అదానీ, గరిష్ట స్థాయి నుంచి 60శాతం పడిన సంపద ” అని ఎకనమిక్‌ టైమ్స్‌ మార్చి 22న ఒక విశ్లేషణను పాఠకులకు అందించింది. జాతీయవాదం పేరుతో తెలిసో తెలియకో ఊగిపోతున్నవారికి, మోడీ ఏలుబడిలో అచ్చేదిన్‌, అమృత కాలం అని నిజంగా నమ్ముతున్నవారికి లండన్‌ పత్రికల విశ్లేషణలు రుచిస్తాయా ? ఎవరేమి రాశారు ఎందుకు రాశారు అన్నది కాసేపు పక్కన పెట్టి నిజానిజాల గురించి లేవనెత్తిన అంశాల గురించి ఉద్రేకానికి లోనుకాకుండా ఆలోచించాలి.


” కష్టాల్లో కూరుకుపోయిన శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి గత ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్ల రూపాయలమేర దెబ్బతగిలింది. అతని సంపద 53 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని (మార్చి 22న విడుదల చేసిన) ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితా 2023లో చూపారు ” అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషకుడు ఒకరు విశ్లేషణను ప్రారంభించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎన్ని రోజులైనా పార్లమెంటు జరగకపోయినా సరే అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించేది లేదంటూ భీష్మించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టుదల పట్టుదల ఒకవైపు. ఎలాగైతేనేం ఎంత డబ్బు సంపాదించారనేదే ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్న సమాజం మరొక వైపు కనిపిస్తున్నపుడు తరిగిపోతున్న అదానీ సంపదల గురించి గుండెలు బాదుకోక ఏమి చేస్తారు.


2022 సెప్టెంబరు చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ జాబితా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో అదానీ కుటుంబం రోజుకు రు.1,612 కోట్లు, ముకేష్‌ అంబానీ రు.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రు. రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడులక్షల కోట్లు ఎక్కువ, అంటే ఏడాదిలో ఐదులక్షల కోట్లు సంపాదించాడు. అబ్రకదబ్ర, మాయలు మంత్రాలు చేసే గంధర్వులకు, మిత్రమా ఏమి నీ కోరిక, తథాస్తు అనే పైవారు ఉంటే తప్ప మానవ మాత్రులకు సాధ్యమా ? 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరోవంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది, ఇతరులకు ఎందుకు రాలేదు అన్నది ఎప్పుడైనా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషించిందా ? మిగతా పత్రికల తీరుతెన్నులు కూడా అవే. బ్లూమ్‌బెర్గ్‌ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 24న 119 బి.డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బి.డాలర్లకు దిగజారారు.హరూన్‌ సంస్థ అంచనా 53బి.డాలర్లుగా ఉంది. ముకేష్‌ అంబానీ 82బి.డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.


దేశం వృద్ది చెందటం లేదని ఎవరూ చెప్పరు. దాని ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊటసిద్దాంతం ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్చేదిన్‌, తాజాగా అమృత కాలం అని చెప్పిన నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల పాలన తరువాత మన్‌కీ బాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు.దేశంలో జనవరిలో 7.14శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45శాతానికి పెరిగిందన్న సిఎంఐఇ సమాచారాన్ని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్మోహన్‌ సింగ్‌ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్రమోడీ ప్రచారం చేసుకున్నారు. నిజం ఏమిటి ? ” మనది ప్రధానంగా కార్పొరేట్‌ వృద్ది మాత్రమే. ఒక యూనిట్‌ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది జనాలను నియమించటం లేదు.ఒక వైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని ఆకాంక్షిస్తున్నారు, నూటనలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాలా తక్కువ.” అని ప్రణాళికా సంఘ మాజీ ప్రధాన సలహాదారు ప్రణబ్‌ సేన్‌ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ” నైపుణ్యాలు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి.భారత్‌లో ఫైనాన్స్‌, బీమా, రియలెస్టేట్‌, పొరుగుసేవలు, టెలికాం, ఐటి రంగాలలో ఎక్కువ వృద్ది ఉంది. కానీ ఇవి ఉపాధిని సృష్టించేవి కాదు ” అని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ఫ్రొఫెసర్‌ అమిత్‌ భోసలే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది.


భారత్‌లో ఉపాధి సమస్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాల పాటు వార్షిక వృద్ది రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేండ్ల క్రితం ప్రపంచబాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా జిడిపి వృద్ది రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. మోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదుశాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుత 7-8శాతం మధ్య ఉంటున్నది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3శాతంతో కతార్‌ ఒకటవ స్థానంలో ఉంది. మన దేశంతో సమంగా జనాభా ఉన్న చైనా 68.6శాతంతో 42వది కాగా మన దేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది. కరోనా కాలంలో 40శాతంలోపుకు పడిపోయింది. ఇరవై -ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వారిలో 2022 అక్టోబరులో పట్టణ నిరుద్యోగం 42శాతం ఉండగా అదే చైనాలో 16-24 తరగతిలో 18శాతమే ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఏండ్ల లోపు వారు సగం మంది ఉన్నారు. అంటే ఉపాధి అవసరం ఎంత ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడున్న ధోరణుల ప్రకారం 2040నాటికి 59 ఏండ్లు పైబడిన వారు దేశంలో ఎక్కువ మంది ఉంటారని అంచనా.2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రకటించింది. ఇవన్నీ సంవత్సరాల తరబడి నింపకుండా ఉంచిన ఖాళీలు.మెకెన్సీ సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల మేరకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.


దేశంలో ఉపాధి రహిత వృద్ది ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62శాతం కాగా మన దేశంలో 40శాతమని(2022) చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030నాటికి ఎనిమిది కోట్లు కల్పించగలమని, చైనా తరహా వృద్ది విధానాన్ని అనుసరించాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు.వృద్ధికి అనుగుణంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామమాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. స్థానిక కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగానే ఎగుమతి మార్కెట్లో తేడాలు వచ్చినా చైనా తట్టుకోగలుగుతోంది. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా ?


ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమెరికాలోని యుబిఎస్‌ సంస్థ ప్రపంచంలో ధరలు, రాబడి గురించి విశ్లేషణ వెల్లడిస్తుంది. న్యూయార్క్‌ నగరాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచంలోని ఇతర నగరాల్లో పరిస్థితిని అది పోలుస్తుంది. దాని తాజా నివేదిక ప్రకారం కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.నగదు డాలర్లని, కార్‌మెకానిక్‌, భవన నిర్మాణ కార్మికుల మొత్తాలను వార్షిక వేతనంగానూ, బ్రాకెట్లలో ఉన్న అంకెలు వారంలో పనిగంటలుగా గమనించాలి. న్యూయార్క్‌లో వంద డాలర్ల వేతనం ఉంది అనుకుంటే చైనాలోని షాంఘైలో 20.9, బీజింగ్‌లో 17, ముంబైలో 8.5, ఢిల్లీలో ఏడుగా ఉంది.
నగరం పేరు××వేతన స్థాయి ×× గంటవేతనం×× ఏడాది పనిగంటలు×× కార్‌మెకానిక్‌××నిర్మాణ కార్మికుడు
న్యూయార్క్‌ ×× 100 ×× 25.2 ×× 2,062 ×× 50,000(43) ×× 69,300
షాంఘై ×× 20.9 ×× 5.4 ×× 1,967 ×× 9,300 (40) ×× 6,700
బీజింగ్‌ ×× 17 ×× 4.5 ×× 1,979 ×× 8,500 (40) ×× 7,600
ముంబై ×× 8.5 ×× 2.3 ×× 2,251 ×× 2,100 (70) ×× 1,300
ఢిల్లీ ×× 7 ×× 2.1 ×× 2,265 ×× 1,900 (51) ×× 1,300
ఒక దేశ వృద్ధి రేటును నిర్దేశించే అంశాలలో వేతనాలు, కొనుగోలు శక్తి కూడా పాత్ర పోషిస్తాయి. మెరుగైన వేతనం లేకపోతే అంతర్గత డిమాండ్‌ పెరగదు. మన దేశం, చైనాల్లో కనీస వేతనాల పెరుగుదల తీరుతెన్నుల గురించి కంట్రీ ఎకానమీ డాట్‌కామ్‌ ఇచ్చిన సమాచార వివరాలు ఇలా ఉన్నాయి.వేతనాలు యూరో కరెన్సీలో ఉన్నాయి. మార్చి 24వ తేదీన ఒక యూరో రు.88.67గా ఉంది. మన దేశంలో 2020తో పోలిస్తే 2023 నాటికి కనీసవేతనం తగ్గినట్లు విశ్లేషణలో ఉంది.
కనీసవేతనం××2000×× 2010×× 2015×× 2020 ×× 2023
చైనా ×× 49.5 ×× 88 ×× 202.4×× 228.9×× 268.2
భారత్‌ ××26.8 ×× 38.8 ×× 54.2 ×× 57.7 ×× 55
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే చైనాలో వేతనాలు పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి కొన్ని విదేశీ కంపెనీలు వెళుతున్నాయని కొన్ని వార్తలు.చైనా నుంచి వెలుపలికి వెళ్లే కంపెనీలు అవి ఎన్నైనా ఇతర దేశాలకు వెళుతున్నాయి తప్ప మన ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాల ఆశ చూపినా మన వైపు చూడటం లేదు. కంపెనీలకు ఎక్కడ వేతనాలు తక్కువగా ఉంటే అక్కడకు వెళతాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ మన దేశానికి ఆ మేరకు రావటం లేదు, వచ్చిన దాఖల్లాలేవు.ఎందుకు రావటం లేదో, అనేక కంపెనీలు మన దేశం నుంచి ఎందుకు తరలిపోతున్నాయో ఆలోచించుకోవాలి. భారత అధిక వృద్ది రేటు, ఉద్యోగాలు తక్కువ నరేంద్రమోడీ సమస్య కాదు. కార్పొరేట్లకు అమృతకాలం, అచ్చేదిన్‌, దేశ యువత భవిష్యత్‌కు ముప్పు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు 2019 ఎన్నికల్లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు. దిశ, దశ తెలుసుకొనేందుకు తొమ్మిదేండ్లు తక్కువ కాదు. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోకి నెట్టారు. ఎన్నికల వాతావరణం ఏర్పడింది కనుక దీని గురించి మోడీ భక్తులు ఎలా స్పందిస్తారో చెప్పనవసరం లేదు. నిజానికి ఇది నరేంద్రమోడీ వ్యక్తిగత సమస్య కాదు. తమది కాంగ్రెస్‌కు భిన్నమైన పార్టీ అని జనాన్ని నమ్మించేందుకు చేసిన ప్రచారం తప్ప వాజ్‌పాయి ఏలుబడిలో గానీ ఇప్పుడు నరేంద్రమోడీ పాలనలో అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలు గానీ గతంలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టినవే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) మన దేశం మీద రుద్దిన విధానాలకు భారతీయ ముద్ర వేసి అమలు జరుపుతున్న ఫలితమే. మరి కాంగ్రెస్‌కు బిజెపికి తేడా లేదా అంటే ఉంది. ఆర్థిక విధానాల వైఫల్యాలకు తోడు గోబెల్స్‌ సమాచారాన్ని జనాలకు అందించే వాట్సాప్‌ విశ్వవిద్యాలయం, మత విద్వేషాన్ని బిజెపి బోనస్‌గా ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !

22 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's peace plan, Donald trump, imperialism, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping, Xi Jinping-Vladimir Putin summit : west in a tight spot on China's peace plan


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్‌ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్‌-పుతిన్‌ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్‌ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్‌ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్‌ వెల్లడించాడు.


షీ జింపింగ్‌-వ్లదిమిర్‌ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్‌ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్‌ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.


జింపింగ్‌ పర్యటన ఖరారు కాగానే పుతిన్‌ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్‌ నుంచి పొందిన మిగ్‌ 29 విమానాలను పోలాండ్‌, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్‌ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్‌ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్‌ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్‌ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్‌ రాక ముందు జరిగాయి.


షీ జింపింగ్‌ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్‌ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్‌ అవసరమైతే ఉక్రెయిన్‌ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్‌ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్‌ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్‌ మీద అరెస్టు వారంట్‌ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్‌ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.


గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్‌ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్‌ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్‌ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్‌ మాస్కో వెళ్లారు.


అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్‌ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్‌ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్‌ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్‌ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్‌ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.


ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్‌ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్‌ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్‌ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్‌ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్‌ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్‌ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.


కరోనా, తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్‌ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్‌-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్‌ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్‌ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !

18 Saturday Mar 2023

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Asle Toje, BJP, BJP Propaganda, fake news, godi media, Narendra Modi, Nobel peace prize, PM Modi


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ – ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన కుహనా(ఫేక్‌), వక్రీకరణ సమాచారం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజమే అని నమ్మిన మీడియా కూడా భుజాన వేసుకొని తరువాత తేలుకుట్టిన దొంగల్లా ఉన్న ఉదంతాలు ఎన్నో. తాజాగా నరేంద్రమోడీని అపహాస్యం పాలు చేసే ఉదంతం జరిగింది. అది ఏ బిబిసి లేదా మరొక విదేశీ సంస్థ చేసి ఉంటే ఇంకేముంది ? నోబెల్‌ శాంతి బహుమతికి నరేంద్రమోడీ అతిపెద్ద పోటీదారుగా ఉన్నట్లు, విశ్వసనీయత ఉన్న పెద్దవాడైన రాజనీతిజ్ఞుడిగా గుర్తించినట్లుగా నోబెల్‌ బహుమతి కమిటీ ఉపనేత అస్లీ టోజె చెప్పారని జాతీయ మీడియా ప్రచారం చేసింది.రామ రామ తానసలు అలా చెప్పలేదని టోజె ఖండించాడు. అది ఫేక్‌ వార్త అని దానికి శక్తి లేదా ప్రాణ వాయువును అందించవద్దని అన్నాడు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించే ప్రబుద్దుల మాదిరి మోడీకి శాంతి బహుమతి లాంఛనంగా ప్రకటించటమే తరువాయి అన్నట్లుగా మీడియా పెద్దలు కథలు అల్లారు. ఎవరో ఒక కొత్త రిపోర్టరు లేదా సబ్‌ ఎడిటర్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. ఒక టీవీ సంపాదకుడు, బడా టీవీ ఛానళ్లు, పత్రికలు దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా వ్యవహరించాయి.


నోబెల్‌ కమిటీ నిబంధనల ప్రకారం ఫలానా సంవత్సర బహుమతుల కోసం ఎందరు, ఎవరు పోటీ పడ్డారు అన్న వివరాలను 5 దశాబ్దాల పాటు వెల్లడించకూడదు అన్నది నిబంధన. అలాంటిది కమిటీ ఉపనేతే మోడీ ప్రధాన పోటీదారు అని చెప్పాడంటే వాస్తవమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. అసలు గతంలో పోటీ పడుతున్నారంటూ ఎవరి గురించీ అలాంటి వార్తలు రాలేదు.ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అస్లీ టోజెతో విలేకర్లు మాట్లాడారు.టోజె చెప్పినదానిని వక్రీకరించారు. తాను నోబెల్‌ కమిటీ ఉపనేత హౌదాలో ఢిల్లీ రాలేదని, అంతర్జాతీయ శాంతి మరియు అవగాహన సంస్థ డైరెక్టర్‌గా ఇండియా సెంటర్‌ ఫౌండేషన్‌(ఐసిఎఫ్‌) స్నేహితుడిగా వచ్చానని టోజె ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు.” ఒక కుహనా వార్త ట్వీట్‌ను చేశారు.దాన్ని కుహనా వార్తగా చూడాలి. ఇక్కడకు భారత రాజకీయాలు, అభివృద్ది గురించి మాట్లాడటానికి వచ్చాను.కుహనా వార్త గురించి చర్చించకూడదు లేదా దానికి శక్తి లేదా ప్రాణవాయువును అందించాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్‌లో రాసినట్లుగా నేనేమీ చెప్పలేదని విస్పష్టంగా చెబుతున్నాను.” అన్నాడు.


అస్లీ టోజె టైమ్స్‌నౌ ఛానల్‌ విలేకరితో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ సంక్షోభంలో ప్రధాని నరేంద్రమోడీ ఒక సానుకూల వైఖరితో స్పందించారు.అణ్వాయుధాలను వాడవద్దని రష్యాను హెచ్చరించారు.వర్తమానం యుద్ధాల యుగం కాదని వ్లదిమిర్‌ పుతిన్‌కు చెప్పారు.ప్రపంచంలో బాధ్యత కలిగిన ఏ నేత అయినా ఇలాంటి సందేశమివ్వటానికే ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యమైనదేమంటే భారత్‌ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఇలాంటి సందేశం వచ్చింది.” అని చెప్పాడు.ఫేక్‌న్యూస్‌ను వండి వార్చింది టైమ్స్‌ నౌ అని తేలింది. ఏకంగా దాని సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ తప్పుదారి పట్టించే ట్వీట్లు చేశారు. నరేంద్రమోడీని పొగడటాన్ని అవకాశంగా తీసుకొని నోబెల్‌ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు చిత్రించి ఆ మాటలను టోజె నోట్లో పెట్టారు.దీంతో మోడీని ఆకాశానికి ఎత్తుతూ మిగతా వారంతా నిర్ధారించుకోకుండా ప్రచారం చేశారు. టైమ్స్‌నౌ ఛానల్‌తో మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా అసలు ఆ ప్రస్తావన లేదు. ఐసిఎఫ్‌ చైర్మన్‌ వైభవ్‌ కె ఉపాధ్యాయ ఈ వార్త గురించి మాట్లాడుతూ టోజె చెప్పిన మాటలను తప్పుడుగా చిత్రించారన్నారు.టీవీ ఛానళ్లు పొరపాటున లేదా అత్యుత్సాహంతో అలా చేసి ఉండవచ్చు.పధకం ప్రకారం చేసి ఉంటే అది నేరపూరితం అన్నారు. ఐసిఎఫ్‌ కార్యక్రమం కోసం ఏర్పడిన కమిటీ సభ్యుడైన మనోజ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ తాను పూర్తిగా అస్లీ టోజెతోనే ఆ రోజు మౌర్య షెరటన్‌ హౌటల్లో ఉన్నానని, టైమ్స్‌ నౌ విలేకరితో సహా ఇతరులతో మాట్లాడినపుడు తాను విన్నానని వారితో లేదా ప్రధాన ప్రసంగంలో గానీ మోడీ గురించి అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. న్యూ ఇండియన్‌ ఛానల్‌ యాంకర్‌ మోడీ-బహుమతి గురించి అడిగిన అంశం మీద టోజె మాట్లాడుతూ ఏ నాయకుడైనా బహుమతిని గెలుచుకొనేందుకు తగినంత కృషి చేయాలి, ముందు పని జరగాలి తరువాత బహుమతులు వస్తాయి ” అన్నాడు తప్ప మోడీ పోటీదారనో మరొకటో చెప్పలేదు.నోబెల్‌ బహుమతి సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 2023 బహుమతికి 305 నామినేషన్లు రాగా వాటిలో 212 మంది వ్యక్తులు, 93 సంస్థలవి ఉన్నాయి. అసలు నరేంద్రమోడీ నామినేషన్‌ ఉన్నదో లేదో కూడా తెలియదు.


మన పత్రికలు, టీవీ ఛానళ్ల తీరు తెన్నులు, అవి ప్రచారం చేసే ఫేక్‌ వార్తల గురించి గత సంవత్సరంలో లాజికల్‌ ఇండియా పేర్కొన్నవాటిని కొన్నింటిని చూద్దాం. టిప్‌ టిప్‌ భర్సాపానీ అనే మన హిందీ పాటకు పాకిస్తాన్‌ రాజకీయవేత్త అమీర్‌ లియాకత్‌ హుసేన్‌ డాన్స్‌ చేసినట్లు ఒక వీడియో వైరలైంది.నిజానికి అతను సొహాయిబ్‌ షుకూర్‌ అనే డాన్స్‌మాస్టర్‌. టైమ్స్‌ నౌ, నవభారత్‌ రాజకీయవేత్తగా చిత్రించాయి. అసోంలోని ఒక టీ అమ్మే కుర్రాడు రాహుల్‌ కుమార్‌ దాస్‌ నీట్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రాంకు తెచ్చుకొని ఎయిమ్స్‌లో సీటు పొందినట్లు మీడియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టింది. తీరా చూస్తే అతను పరీక్ష రాసింది నిజమే కానీ వచ్చిన రాంకు 9,29,881. మార్కులను తిమ్మినిబమ్మిని చేసి అతను చెప్పిన కథనాన్ని గుడ్డిగా ప్రచారం చేశారు. నిజం వెల్లడి కాగానే అతను, అతని సోదరి, తల్లి కనిపించకుండా పోయారు. టీవీ9 భరత్‌వర్ష్‌ ఛానల్‌ శ్రీ లంకలోని హంబంటోటా రేవు గురించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ ప్రాంతమంతా చైనా అదుపులో ఉందని, మొత్తం 500 వందల తనిఖీ కేంద్రాలున్నట్లు, పైకి కనిపించకుండా చైనా మిలిటరీ ఉందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలను బానిసలుగా తెచ్చి అక్కడ పని చేయిస్తున్నారని దానిలో పేర్కొన్నది. అదంతా అవాస్తవం అని, సంచలనం కోసమే అలాంటి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది.


అసోంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో ఒక వంతెన కూలినట్లు ఆజ్‌తక్‌, టీవీ9, ఇండియాటీవి,ఆసియానెట్‌, ఇతర సంస్థలు ప్రసారం చేశాయి.నిజానికి ఆ వంతెన ఏడాది క్రితం ఇండోనేషియాలో కూలింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ముస్లిం దుండగులు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు మీడియా సంస్థలన్నీ ప్రసారం చేశాయి.నిజానికి ఆ ఉదంతంలో పాల్గొన్నది హిందువులని తేలింది. తెలంగాణాలో వరదలు అంటూ టీవీలు ఒక వీడియోను ప్రసారం చేశాయి. జెసిబి ట్రాక్టర్‌ నుంచి వరద బాధితులను కాపాడుతున్న హెలికాప్టర్‌ దృశ్యమది. నిజానికి ఆ ఉదంతం 2021నవంబరులో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదిలో జరిగింది. ఒక కామెడీ కథనాన్ని నిజమని నమ్మి చైనా అధినేత షీ జింపింగ్‌ను అరెస్టు చేశారంటూ సాగించిన తప్పుడు వార్తలు, దృశ్యాల గురించి తెలిసిందే. పదకొండు సంవత్సరాల నాటి 2జి కుంభకోణం అరెస్టయిన మాజీ మంత్రి ఏ రాజా అంటూ ఒక వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అనేక పత్రికలు, టీవీలు గుడ్డిగా తాజా వార్తగా ప్రసారం చేశాయి.పీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మీద గెలిచిన సౌదీ అరేబియా క్రీడాకారులందరికీ రోల్స్‌రాయిస్‌ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు వచ్చిన తప్పుడు వార్తను ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఇచ్చాయి.


అసలు గమనించాల్సిందేమంటే ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి చేసిన కృషి ఏమిటి అన్నది ప్రశ్న. తటస్థంగా ఉండటం, ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి మాట్లాడిన వారిలో మోడీ ఒకరు తప్ప నివారణకు ఇతరుల కంటే భిన్నంగా చేసిందేమీ లేదు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో విశ్వగురువు, ప్రపంచ నేత అని ఎవరెన్ని చెప్పినా ఏ అంశంలోనూ నిర్దిష్టపాత్రను పోషించి ఒక అంశాన్ని కొలిక్కితెచ్చిన ఉదంతం లేదు. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా రెండూ మనకు మిత్రదేశాలే. అలాంటి స్థితిలో అమెరికా బెదిరింపులు, వత్తిడికి లొంగి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అంటే అమెరికా వైపు నిలిచినట్లు సందేశమిచ్చాము. ఆ రెండు దేశాలూ ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసినా మన దేశం వైపు నుంచి చేసిందేమీ లేదు. చిత్రం ఏమంటే ఇష్టం ఉన్నా లేకున్నా వెంటనే అమెరికా సానుకూలంగా స్పందించింది. ఆరు రోజుల తరువాత మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ సమస్యల పరిష్కార చర్చలకు మన దేశం ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందని ముక్తసరిగా మాట్లాడారు.ఇరాన్‌-సౌదీ ఒప్పందం కుదరటానికి చైనా నిర్వహించిన పాత్ర చివరి క్షణం వరకు ప్రపంచానికి బహిరంగంగా తెలియదు. ఇలాంటి చొరవ తొమ్మిదేండ్ల కాలంలో నరేంద్రమోడీ వైపు నుంచి ఎక్కడా లేదు. మన దేశంలోని జాతీయ టీవీలు, పత్రికలకు దీని గురించి తెలియదని అనుకోగలమా ? ప్రపంచ శాంతికి నరేంద్రమోడీ ఏమి చేశారని నోబెల్‌ బహుమతి వస్తుందని అలాంటి కుహనా వార్తలకు తావిచ్చినట్లు ?ఎవరినైనా ప్రభావితం చేయగల నరేంద్రమోడీ నోబెల్‌ కమిటీని పైరవీ చేసి బహుమతి తెచ్చుకోగల సమర్థత ఉందని జర్నలిస్టులు నిజంగా నమ్ముతున్నారా ? నోబెల్‌ కమిటీ ఉపనేత గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన అంశాన్ని ప్రపంచ మీడియా మూసిపెడుతుందా ? విశ్వగురువుగా చెబుతున్న నరేంద్రమోడీకి ప్రపంచంలో ఎంత పరువు తక్కువ ? ప్రపంచ నేతలకు ఈ వార్తలు చేరకుండా ఉంటాయా ? భారత్‌ గురించి విదేశీ మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు మోడీ మద్దతుదార్లు ఊరూవాడా నానా యాగీ చేస్తున్నారు. తమ నేత పరువు తీసిన ఈ ఉదంతం గురించి ఎలా స్పందిస్తారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

17 Friday Mar 2023

Posted by raomk in AP, AP NEWS, BRS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2023-24, AP CM YS Jagan, AP debt, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్‌ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్‌ పత్రాల్లో ఎకౌంట్స్‌ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్‌ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.


చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్‌ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్‌ సర్కార్‌ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్‌ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్‌ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.


గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్‌ సర్కార్‌ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?


ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్‌ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్‌ఆర్‌ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్‌ సర్కార్‌ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్‌సి (సబ్‌ప్లాన్‌ )నిధులుగా రు.20,005, ఎస్‌టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్‌ఆర్‌ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.


పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?


ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్‌ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్‌ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్‌ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !

15 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Iran Tanker, Israel, Narendra Modi Failures, Saudi Arabia, Saudi-Iran Deal, U.S. Mideast designs, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్య ప్రాచ్యంలో ఉప్పు నిప్పు మాదిరి ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మార్చి నెల పదవ తేదీన కుదుర్చుకున్న ఒప్పందం కొన్ని దేశాలను కంపింప చేస్తే, అనేక మందికి నిజమా అన్న ఆశ్చర్యానికి గురి చేసిందనే వర్ణనలు వెలువడ్డాయి. ఈజిప్టులోని సూయజ్‌ కాలువ 1956 వివాదం తరువాత బ్రిటిష్‌ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడినట్లే ఈ ఒప్పందం ఆమెరికా పెత్తనానికి తెరదించేందుకు నాంది అన్నట్లుగా కొందరు వర్ణించారు. దీని కంటే ఆ ఒప్పందం చైనా రాజధాని బీజింగ్‌లో కుదరటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ఇరాన్‌-సౌదీ ప్రత్యక్ష పోరుకు తలపడనప్పటికీ అనేక చోట్ల ఏదో ఒక పక్షానికి మద్దతు ఇస్తూ గడచిన నాలుగు దశాబ్దాలుగా పరోక్షంగా శత్రుదేశాలుగా మారాయి. గత ఏడు సంవత్సరాలుగా దౌత్య సంబంధాలు కూడా లేవు. బీజింగ్‌ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు నెలల్లోగా రాయబార కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది.ఇటీవలి కాలంలో దేశాలు ఏదో ఒక పక్షాన చేరటం లేదా తటస్థంగా ఉండటాన్ని ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం స్పష్టం చేసింది. అమెరికా, పశ్చిమ దేశాలకు తాన తందాన అనేందుకు పేద, వర్ధమాన దేశాలు సిద్దంగా లేవు అనే సందేశాన్ని కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఇరాన్‌-సౌదీ ఒప్పందం ఈ కూటమికి మింగుడుపడకపోయినా అమెరికా హర్షం ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం నాటి వరకు మన దేశం దీని గురించి ఎలాంటి స్పందన వెల్లడించలేదు.


రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి దారితీసిన కారణాలేమిటి ? షియా మతపెద్ద నిమిర్‌ అల్‌ నిమిర్‌తో సహా 50 మందిని సౌదీ అరేబియా 2016 జనవరి రెండున ఉరితీసింది. దీనికి నిరసనగా టెహరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం మీద ఇరానియన్లు దాడి చేశారు. ఇరాన్‌ అధిపతి అయాతుల్లా అలీ ఖమేనీ కక్ష తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. జనవరి మూడవ తేదీన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ ప్రకటించింది. ఎమెన్‌లోని తమ రాయబార కార్యాలయం మీద సౌదీ వైమానిక దాడులు చేసినట్లు ఏడవ తేదీన ఇరాన్‌ ఆరోపించింది. వాస్తవం కాదని సౌదీ ఖండించింది. వార్షిక హాజ్‌ యాత్రకు వెళితే రక్షణకు హామీ లేదని, సౌదీ కుట్రకు పాల్పడవచ్చంటూ తన యాత్రీకుల మీద ఇరాన్‌ మేనెల 29న నిషేధం విధించింది.తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడికి ఇరాన్‌ కారకురాలని, దాని వలన తమ దేశంలో సగం సరఫరా నిలిచిందని సౌదీ చేసిన ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ గ్రూపు తామే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ మిలిటరీ అధికారి ఖాశిం సొలిమనీ బాగ్దాద్‌లో 2020జనవరి మూడున అమెరికా డ్రోన్‌దాడిలో మరణించారు. అతను ఇరాన్‌-సౌదీ మధ్య సంబంధాల పునరుద్దరణకు కృషి చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత 2021 ఏప్రిల్‌ తొమ్మిదిన బాగ్దాద్‌లో సౌదీ-ఇరాన్‌ తొలి చర్చలు జరిగాయి. ఐదవ దఫా చర్చలు జరగనుండగా 41 మంది షియా ముస్లింలను సౌదీలో ఉరితీశారు. దాంతో ఎలాంటి కారణం చూపకుండా 2022 మార్చి 13న చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 21న ఐదవ దఫా చర్చలు జరిగాయి. అక్టోబరు 19న రాయబార కార్యాలయాలను రెండు దేశాలూ తెరవాలని ఇరాన్‌ అధిపతి ఖమేనీ సలహాదారు ఒక ప్రకటన చేశాడు. డిసెంబరు తొమ్మిన చైనా అధినేత షీ జింపింగ్‌ సాదీ సందర్శన జరిపి రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపాడు.ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బిజింగ్‌ను సందర్శించి షీ జింపింగ్‌తో చర్చలు జరిపాడు. మార్చి పదవ తేదీన ఒప్పందం కుదిరింది.


ఒప్పందం కుదరటమే గొప్ప ముందడుగు. సంవత్సరాల తరబడి తెరవెనుక చైనా మంత్రాంగంతో రెండు దేశాలనూ ఒక దగ్గరకు తేవటం ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం అని చెప్పటం కంటే తరుగుతున్న అమెరికా, పశ్చిమ దేశాల పలుకుబడి అనటం సముచితంగా ఉంటుంది. ఈ ఒప్పందం ఇరాన్‌-సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యం, చైనా విజయంగా కొందరు చూస్తున్నారు. ప్రపంచం అమెరికా చెప్పినట్లు నడిచే రోజులు గతించాయనే సందేశాన్ని కూడా ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉన్న చమురు సంపదలు, భౌగోళికంగా ఉన్న ప్రాధాన్యత రీత్యా గతంలో బ్రిటన్‌, తరువాత అమెరికా ఆప్రాంతంపై పట్టుకోసం చూశాయి.దానిలో భాగంగా చిచ్చు రేపాయి.ఏదో ఒక పక్షం వహించి రెండోదాన్ని దెబ్బతీసి తన అదుపులో పెట్టుకోవటం, చివరకు నాటో తరహా కూటమిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తన పట్టులో బిగించుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. సాధారణ సంబంధాల ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ఇరాన్‌-సౌదీ మధ్య తలెత్తిన వివాదాలు, పరస్పర అనుమానాలు కూడా పరిష్కారం కావాల్సిఉంది. ఈ ఒప్పందానికి హామీదారుగా ఉన్న చైనా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వివాదాల్లో ఏదో ఒక పక్షంవైపు మొగ్గుచూపిన దాఖలాల్లేని కారణంగానే రెండు దేశాలూ దాన్ని నమ్మి ముందుడుగువేశాయి. ఇది మిగతా వివాదాలకూ విస్తరిస్తే అమెరికాను పట్టించుకొనే వారే ఉండరు గనుక దీన్ని ముందుకు పోకుండా చూసేందుకు చేసేందుకు అది చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.1979లో అమెరికా మద్దతు ఉన్న ఇరాన్‌ షా ప్రభుత్వం పతనమైన తరువాత అమెరికా ఆ ప్రాంతంలో తలెత్తిన వివాదాల్లో ఇరాన్‌-సౌదీ ఘర్షణ పెరిగింది. ఇరాన్ను శత్రువుగా, సౌదీని మిత్రదేశంగా అమెరికా పరిగణించింది.


సయోధ్య అవసరమని రెండు దేశాలూ గుర్తించినందువల్లనే ఈ ఒప్పందానికి దారి తీసింది తప్ప చైనా వత్తిడేమీ దీనిలో లేదు.దీనిలో చైనా ప్రయోజనాలు లేవా అంటే దాని కంటే ఆ రెండు దేశాల, ప్రాంత ప్రయోజనాలు ఎక్కువ అన్నది స్పష్టం. ప్రస్తుతం ఉన్న కొన్ని వివాదాలను చూద్దాం. లెబనాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో హిజబుల్లా సంస్థకు ఇరాన్‌, ప్రత్యర్ధి పక్షాలకు సాదీ మద్దతు ఉంది. సిరియాలో దశాబ్దికాలానికి పైగా సాగుతున్న పోరులో సౌదీ మద్దతు ఉన్న జీహాదీలకు, ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హిజబుల్లా, ఇతర మిలిటెంట్లకు వైరం ఉంది. ఎమెన్‌లో అమెరికా మద్దతుతో సౌదీ దాడులకు దిగుతున్నది. అక్కడ హౌతీ మిలిటెంట్లకు ఇరాన్‌ మద్దతు ఉంది.వారు కొన్ని సందర్భాలలో సౌదీ చమురు టాంకర్ల మీద కూడా దాడులు జరిపారు. ఇరాన్‌లో అత్యధికులు షియా తెగ ముస్లింలు కాగా సౌదీలో సున్నీలు ఉన్నారు.ఇరాక్‌, బహరెయిన్‌లో, చివరికి సౌదీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సున్నీ-షియా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో అవి క్రమంగా తగ్గుతాయి తప్ప పెరగవు అన్నది అందరూ చెబుతున్నారు. ఇంతకాలం సౌదీ-ఇరాన్‌ వివాదాలతో లాభపడిన అమెరికాకు ఈ పరిణామం సుతరామూ అంగీకారం కాదు. దానికి నిరంతరం ఉద్రిక్తతలు, ఘర్షణలు ఉండాల్సిందే. ప్రపంచంలో అస్థిరతకు అమెరికా చూస్తుంటే సుస్థిరతకు చైనా చేయూత నందిస్తోంది. అమెరికా ఎక్కడ కాలుపెట్టినా తన ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకొనే ఉద్రిక్తతల సృష్టి తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదు.


ఎందుకు సౌదీ అరేబియా అమెరికా నుంచి దూరంగా జరుగుతోంది ? పెట్రో డాలరు బదులు పెట్రో యువాన్‌కు సౌదీ మొగ్గుచూపుతున్నదన్న వార్తలు అమెరికా నేతలకు రక్తపోటును పెంచుతున్నాయి. దీనికి తోడు బ్రెజిల్‌,రష్యా,భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు, తద్వారా రష్యా, చైనాలకు దగ్గర కావాలని సౌదీ చూడటం కూడా దానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఒప్పందాన్ని వ్యతిరేకిస్తే మరింత నష్టమని కావచ్చు, మంచిదేగా అన్నట్లు తడిపొడిగా స్పందించింది. నిజానికి ఒప్పందం కుదరకుండా తెరవెనుక ఎంత చేసినా సాధ్యం కాలేదు.” దీని గురించి మాకు ఎప్పటికప్పుడు సౌదీ చెబుతూనే ఉంది. మేము చేసేది మేము చేస్తున్నాంగానీ నేరుగా ప్రమేయం పెట్టుకోలేదు.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గటానికి చేసే యత్నాలకు మేము మద్దతు ఇస్తాం, అది మాకూ అవసరమే, మా పద్దతిలో మేమూ చేశాం ” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ అన్నాడు. ఇరాన్‌ పట్ల అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనత కారణంగానే సౌదీ తన దారులు తాను వెతుక్కొంటోందని ఒప్పంద ప్రకటన వార్త వెలువడగానే ఇజ్రాయెల్‌ స్పందించింది. అమెరికా పధకాల ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాల మీద దాడులు జరపాలన్న తమ కలనెరవేరదనే దుగ్గదానికి ఉంది. పాతిక సంవత్సరాల పాటు అమెరికా విదేశాంగశాఖలో మధ్య ప్రాచ్య విధాన సలహాదారుగా పనిచేసిన అరోన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఎన్‌బిసి టీవీతో మాట్లాడుతూ ” ఆ ప్రాంతంలో అమెరికా పలుకుబడి, విశ్వసనీయత తగ్గుతున్నట్లుఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కొత్త అంతర్జాతీయ ప్రాంతీయ పొందికలు చోటు చేసుకుంటున్నాయి, అవి చైనా, రష్యాలకు సాధికారతను, వాటి స్థాయిని పెంచినట్లుగా ఉంది ” అన్నాడు.ఉక్రెయిన్‌ వివాదం పేరుతో రష్యామీద ప్రకటించిన ఆంక్షలను అనేక దేశాలు తిరస్కరించిన నేపధ్యంలో అమెరికా పలుకుబడి గురించి ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు తన విధానాలను సమీక్షించుకుంటుంది. దానికి సౌదీ అరేబియా మినహాయింపు కాదని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


మధ్య ప్రాచ్యపరిణామాల్లో అమెరికా వైఖరిని చూసిన తరువాత ఇరాన్‌-సౌదీ రెండూ పునరాలోచనలో పడటంతో పాటు, సర్దుబాట్లకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి అమెరికా విధించిన ఆంక్షలతో ఆ ప్రాంత దేశాల నుంచి ఇరాన్‌ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. సౌదీదీ అదే పరిస్థితి, అమెరికాను నమ్ముకొని దాని పధకంలో భాగంగా పని చేస్తే సాధించేదేమీ ఉండదని తేలింది. ఇరాన్‌తో చైనా, రష్యాల సంబంధాలు మరింతగా బలపడటంతో అమెరికాతో వైరం కారణంగా ఇరాన్‌ మరింత బలపడుతుందనేది సౌదీకి అర్దమైంది.దీనికి తోడు ఈ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా మాదిరి ఏ ఒక్క దేశంతోనూ అది ఘర్షణాత్మకవైఖరిని ప్రదర్శించటం లేదు.తన ఎత్తుగడలు, భావజాలాన్ని రుద్దటం లేదు. ఒకదానితో మరొకదానికి తంపులు పెట్టి పబ్బంగడుపుకోవటం లేదు.పరస్పర లబ్ది పొందే పెట్టుబడులు పెడుతున్నది.అందువల్లనే దానితో ప్రతి దేశమూ సంబంధాలు పెట్టుకొనేందుకు చూస్తున్నది. ఇరాన్‌-సౌదీ ఒప్పందం గురించి తొలుత ఇరాక్‌, ఒమన్‌ వంటి ప్రాంతీయ తటస్థ దేశాల్లో ఐదు దఫాలు ప్రాధమిక చర్చలు జరిగాయి. 2030నాటికి ప్రపంచంలో అగ్రశ్రేణి పది దేశాల్లో స్థానం సంపాదించాలంటే అమెరికా ఆధారిత విధానాలతో లాభం లేదని సౌదీకి అర్ధమైంది. అన్నింటి కంటే ఇరుగు పొరుగుదేశాల్లో అస్థిరత్వం, ఘర్షణల వాతావరణం ఉంటే అది ప్రారంభించిన హరిత చొరవ ముందుకు వెళ్లే అవకాశం లేదు. సౌదీతో సర్దుబాటు చేసుకుంటే ఇతర అరబ్బుదేశాలు తమ మీద దాడికి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని ఇరాన్‌కు అర్ధమైంది. ఒంటరి తనం నుంచి అభివృద్ధి వైపు వెళ్లాలంటే మరొక దగ్గరదారి లేదు.తనను బూచిగా చూపి మధ్య ప్రాచ్య నాటో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు మరొక మార్గం లేదు. ఒప్పందాలకు చైనా హామీదారుగా ఉన్నందున రెండు దేశాలకు పెద్ద భరోసా అన్నది స్పష్టం. చైనాకు తెరవెనుక అజండా లేదు. బిఆర్‌ఐ పేరుతో అది రూపొందించిన పథకంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. తమ మీద వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన పోరుకు దిగిన అమెరికాను ఎదుర్కొనేందుకు అంతర్గతంగా మార్కెట్‌ను సృష్టించుకోవటంతో పాటు తన ఎగుమతులకు ఇతర మార్కెట్లను వెతుక్కోవలసిన అవసరాన్ని పశ్చిమ దేశాలు ముందుకు నెట్టాయి. ఇరాన్‌-సౌదీ ఒప్పందం మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

12 Sunday Mar 2023

Posted by raomk in Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adolf Hitler, anti communists, Joseph Stalin, Joseph Vissarionovich Stalin, USSR, world war 2


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

11 Saturday Mar 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, kavitha, Narendra Modi, Narendra Modi Failures, SITARAM YECHURY, women reservation, Women's Quota Bill


ఎం కోటేశ్వరరావు


ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది ! మన గడ్డ అలాంటిదేమరి అంటూ తెగమురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం !! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం.ఎంతటి ఆత్మవంచన ! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా ? ఆమె దీక్ష తెరవెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెరముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా ? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛన ప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు.నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మాగాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది.తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పధకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వుచేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992,93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడోవంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దుకావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఏ సర్కార్‌ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్‌ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది.మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199-1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్టరూపందాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు.


రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడోవంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది.అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిదిశాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్‌ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా(61.25) , క్యూబా( 53.22),బొలీవియా(53.08), న్యూజిలాండ్‌( 50.42), యుఏయి (50), మెక్సికో(48.2), నికరాగువా(47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40శాతంపైగా, ప్రపంచవ్యాపితంగా సగటున 26శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్‌ 43, బంగ్లాదేశ్‌ 98, పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182వదిగా ఉంది.


మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెనమెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు.పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్‌ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీచేసే వారిలో నిర్ణీతశాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.


చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడోవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీటవేసేందుకు ముందుకు వస్తున్నాయి. దోషులుగా తేలేంతవరకు నిందితులు తప్ప ఎవరూ నేరస్థులు కాదనే నిబంధనను అవకాశంగా తీసుకొని వారి కండబలాన్ని తోడు చేసుకొనేందుకు బరిలో నిలుపుతున్నాయి.తొలి లోక్‌సభలో ధనికులు, నేరచరితులు ఎందరు అని వెతికేందుకు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ధనికులు కానివారు ఎందరు, నేర చరిత లేనివారు ఎందరు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది.


గతంలో రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం మూడోవంతు సీట్లను చట్ట సభల్లో మహిళలకు కేటాయించాలి. షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయించిన సీట్లలో కూడా మూడోవంతు మహిళలుండాలి.ఏ రాష్ట్రంలోనైనా మూడు కంటే తక్కువ లోక్‌సభ సీట్లుంటే అక్కడ మూడోవంతు సూత్రం వర్తించదు.ఎక్కడైనా మూడు సీట్ల కంటే తక్కువ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తే అక్కడ కూడా రిజర్వేషన్‌ ఉండదు. రిజర్వుడు సీట్లను రొటేషన్‌ పద్దతిలో కేటాయించాలి. మైనారిటీ,ఓబిసి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు.రాజ్యసభ, శాసనమండళ్లకు రిజర్వేషన్‌ వర్తించదు.పదిహేను సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.


ఎన్నికల నిబంధనవాళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్‌ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43శాతం మంది ఉన్నారు.లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీల వారీగా బిజెపి 116(39శాతం), కాంగ్రెస్‌ 19(57శాతం), జెడియు 13(81శాతం), డిఎంకె 10(43శాతం) తృణమూల్‌ 9(41) మంది ఉన్నారు.గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162(30శాతం) నుంచి 2014లో 185(34శాతం), 2019లో 233(43శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేరచరితుల మీద ఉన్న కేసులలో 29శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి.బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌,ఎన్‌సిపి,వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్యకేసులు, బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఉగ్రవాద కేసు ఉంది.ఆమె భోపాల్‌ నుంచి గెలిచారు, మాలెగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియకోస్‌ మీద దొంగతనంతో సహా 204కేసులు గరిష్టంగా ఉన్నాయి.


ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు.2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్దిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కాశ్మీరు రాష్ట్ర రద్దు, ఆర్టికల్‌ 370 రద్దును ఆఘమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d