• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Japan

పశ్చిమ దేశాలకు దిగులు పుట్టిస్తున్న చైనా టెక్నాలజీ ప్రగతి !

01 Saturday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Another Cold war, China Technological Self-Reliance, Intel apologize, Made in China 2025, Technology Superpower


ఎం కోటేశ్వరరావు


మాతో మరో ప్రచ్చన్న యుద్దానికి తలపడితే తాట తీస్తాం అని అమెరికా పాలకులను చైనా హెచ్చరించింది. డిసెంబరు చివరివారంలో వాషింగ్టన్‌ నగరంలో అమెరికా మీడియా సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులతో చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ మాట్లాడారు.” మూడు దశాబ్దాల నాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. చైనా మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ కాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా నాటి సోవియట్‌ పార్టీ వంటిది కాదు. ఎవరైనా నిజంగా ప్రచ్చన్న యుద్ధం ప్రారంభించాలనుకుంటే చైనా ఓడిపోదని నేను చెప్పగలను. అమెరికాకు చైనా ఎంత అవసరమో చైనాకూ అమెరికా అంతే అవసరం ఉంది.” అని క్విన్‌ గాంగ్‌ చెప్పారు. ఎటువైపు నుంచి ప్రచ్చన్న యుద్దం వస్తుంది ? అసలు వస్తుందని కొందరు జనాలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అమెరికాలో కొందరు అలాంటి మన:ప్రవృత్తితో ఉన్నారు, సోవియట్‌ మాదిరి చైనా మీదకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.


ఈ దశాబ్ది చివరికి ఆర్ధిక అగ్రరాజ్యంగా అవతరించనున్న చైనా సాంకేతిక రంగంలో కూడా అదే స్ధాయికి చేరుకొనేందుకు అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఇ కామర్స్‌లో పెద్ద సంస్ధగా ఉన్న అలీబాబా గ్రూపు కంపెనీలను అణచివేస్తున్నదంటూ గగ్గోలు పెట్టిన వారు సాంకేతిక రంగంలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకి అదే కంపెనీని ప్రోత్సహిస్తున్నదనే అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. ఇటియాన్‌ 710 పేరుతో తన మూడవ ప్రోసెసర్‌ను అక్టోబరు నెలలో విడుదల చేసింది. మూడు సంవత్సరాల్లోనే ఈ పని చేసింది. దానిని ఇతర దేశాలకు అమ్మేది లేదని చెప్పింది. చిప్‌ రూపొందించినా తయారీ సమస్య ఉంది. ఇతర చైనా కంపెనీలు టెన్‌సెంట్‌, షియామీ అదే పోటీలో ఉన్నాయి. ప్రోసెసర్‌ చిప్‌లు ఫోన్లు, కార్లు, వైద్య, గృహ పరికరాల్లో ఎంతో ప్రాధాన్యవహిస్తున్నాయి. కరోనా కారణంగా సరఫరాలు దెబ్బతింటే, చైనాను ఆర్ధికంగా నష్టపరిచేందుకు కొన్ని కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి.


సెమీకండక్టర్లు లేదా చిప్స్‌ కోసం ప్రస్తుతం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, తన తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌పై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది.ఈ రంగంలో చిప్స్‌ చైనా తనకు తానే సమకూర్చుకోగలిగితే అది మిగతా దేశాల్లో నవకల్పనలను, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వాపోతున్నారు.జాతీయ ఆర్ధిక భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరుల మీద ఆధారపడకూడదని, సాంకేతిక అగ్రరాజ్యంగా మారాలని 2021 మార్చినెలలో చైనా నేత షీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా తన చిప్స్‌ను తానే ప్రత్యేకంగా రూపొందించుకుంటే, తాము రూపొందించినవి చైనా కార్లు, సెల్‌ఫోన్లకు పనికి రాకపోతే, మిగతా దేశాలు కూడా అదే బాట పడితే తాము ప్రతి దేశానికి విడివిడి ప్రమాణాలతో ఎలా తయారు చేయగలం, అందుకు అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని, అభివృద్ధి మందగిస్తుందని అమెరికా, ఐరోపా బడా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచం విడిపోకుండా చూడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అమెరికా-చైనాలను కోరారు. ఒకచేత్తో చప్పట్లు కష్టం కదా !


ప్రస్తుతం చైనాలో తయారవుతున్న సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఏటా 300 బి. డాలర్ల మేర చిప్స్‌ చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, చమురు తరువాత స్ధానం వీటిదే. 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దంలో భాగంగా చైనాలోని హువెయి టెక్నాలజీస్‌ సంస్ధకు అవసరమైన చిప్స్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంది. ఆ కంపెనీ పరికరాలతో ఇతర దేశాల భద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసి, చిప్స్‌ రూపకల్పనకు పూనుకుంది. దీంతో దిగ్గజాలైన క్వాలకమ్‌(అమెరికా) శాంసంగ్‌(దక్షిణ కొరియా, ఆర్మ్‌(బ్రిటన్‌) కంపెనీలకు సవాలు ఎదురైంది. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పరికరాలు, వస్తువులు, ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంలో చైనా వెనుకబడి ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఆ రంగంలో ముందున్న దేశాలు బెదిరిస్తున్నాయి. తన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఫౌండరీల్లో చైనా హువెయి కంపెనీ చిప్స్‌ తయారు చేయరాదని, ఒకవేళ చేసినా ఐదవ తరం ఫోన్లకు అసలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. ఐరోపా యూనియన్‌ కూడా తక్కువేమీ తినలేదు. జర్మనీలో రోబోలను తయారు చేసే కుకా కంపెనీని చైనా కొనుగోలు చేస్తే తమ పెట్టుడుల గురించి సమీక్షించాల్సి వస్తుందని బెదిరించింది.చిప్స్‌ తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఉంది.


్ట మానవహక్కులు, టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌ అంశాలను ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ రాజకీయ దాడులు, మిలిటరీ కవ్వింపులకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సెమికండక్టర్లను తయారు చేస్తున్న దిగ్గజ కంపెనీ ఇంటెల్‌ తాజాగా చైనాకు క్షమాపణ చెప్పింది.చైనాలో ముస్లింలు అధికంగా ఉండే షిజాంగ్‌ రాష్ట్రంలో వారిని అణచివేస్తున్నారను తప్పుడు ప్రచారం సాగించటమే కాదు, ఆంక్షలను కూడా అమెరికా, ఇతర దేశాలు అమలు చేస్తున్నాయి. తైవాన్ను ప్రత్యేకదేశంగా పిలిచినందుకు హాలీవుడ్‌ నటుడు, అమెరికా రెజ్లర్‌ జాన్‌ సెనా చైనాకు క్షమాపణలు చెప్పారు.తన సినిమాలకు చైనాలో టిక్కెట్లు అమ్ముకోవటానికి తప్ప వేరే కారణం లేదు. జెపి మోర్గాన్‌ బాంకు సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ మీద జోక్‌ వేసి తరువాత రెండుసార్లు క్షమాపణలు చెప్పాడు.జర్నలిజం నైతికవిలువలు, మానవత్వం గురించి చైనాకు వ్యతిరేకంగా నోరుపారవేసుకొన్న సిఎన్‌ఎన్‌ తరువాత క్షమాపణలు చెప్పింది. షిజాంగ్‌ రాష్ట్రంలో తయారయ్యే నూలును తాము వినియోగించబోమని ప్రకటించిన నైక్‌ కంపెనీ తరువాత చెంపలు వేసుకుంది.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ చైనా మార్కెట్‌, లాభాల కోసం వేసే నక్కజిత్లులు తప్ప వేరు కాదు.వాణిజ్య సంస్ధలు రాజకీయాల్లో వేలు పెడితే పర్యవసానాలకూ సిద్దపడాలి. లేకుంటే పరువు పోగొట్టుకోవాలి.


తమ సరఫరాదారులు చైనా షిజాంగ్‌ రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యేవస్తువులు లేకుండా చూడాలని ఇంటెల్‌ కోరింది. ఆ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారంటూ ఆ వస్తువులను కొనుగోలు చేయకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించింది. దానికి అనుగుణంగానే తాము అలాంటి లేఖ రాసినట్లు ఇంటెల్‌ తెలిపింది. ఇది తమ దేశాన్ని అవమానించటమే అంటూ ఇంటెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ చైనా సామాజిక మాధ్యమంలో నెటిజన్లు స్పందించటం, ఇంటెల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు చైనా పాప్‌ గాయకుడు వాంగ్‌ జుంకాయి ప్రకటించటం వంటి చర్యలతో కంపెనీ దిగివచ్చింది. షిజాంగ్‌ రాష్ట్రంలో దొరికే సిలికాను చిప్స్‌ తయారీకి వినియోగిస్తారు. ఆసియాలో ఉన్న ఏకైక ఇంటెల్‌ ఫ్యాక్టరీ చైనాలోని దలియాన్‌లో, బీజింగ్‌లో పరిశోధనా కేంద్రం ఉంది. ఇతర కంపెనీల చిప్స్‌ అందుబాటులో ఉండటంతో ఇంటెల్‌ దిగివచ్చింది. 2020లో ఆ కంపెనీ ఆదాయంలో నాలుగో వంతు చైనా నుంచే ఉంది. వేరే మార్కెట్‌ను వెతుక్కోవటం చాలా కష్టం, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావటం, వీటికి తోడు స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకోవటం కూడా ఇంటెల్‌ను ప్రభావితం చేసింది. మానవహక్కుల కోసం నిలబడే అమెరికన్‌ కంపెనీలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ మీడియా అధికారి జెన్‌ సాకీ అన్నారు.


రెండవ ప్రపంచయుద్దానికి ముందు తమతో పోటీ పడుతున్న జపాన్‌ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకొనే క్రమంలో పశ్చిమ దేశాలు జపాన్‌కు అవసరమైన సహజవనరులు, ముడి సరకులను అందకుండా చూశాయి. ఇప్పుడు చైనా ఆర్ధికంగా పోటీపడుతున్న నేపధ్యంలో అడ్డుకొనేందుకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు పశ్చిమ దేశాలు పూనుకోవటం గత పరిణామాలను గుర్తుకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్దంలో ఓడిపోయిన జపాన్‌కు మిలిటరీని లేకుండా ఆంక్షలు విధించారు. మిలిటరీ ఖర్చును జపాన్‌ తన పరిశ్రమలకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, సబ్సిడీలకు మళ్లించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ రంగంలో సవాలు విసిరి వాటికి మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాను కూడా జపాన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అదే దిశగా ఒకవైపుకు నెడుతున్నాయి. చైనా దీన్ని ముందుగానే అంచనావేసి వాటి మీద ఆధారపడకుండా ఉండేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోతున్నది. అమెరికా 2016లో వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ అది ఆచరణలో సాంకేతిక యుద్దంగా పరిణమించిందని చెప్పవచ్చు. మేడిన్‌ చైనా 2025 కార్యక్రమంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.


చైనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు, అంతేకాదు బెంగపట్టుకుందని చెప్పవచ్చు.” ప్రపంచ అశాంతికి దోహదం చేస్తున్న చైనా సాంకేతిక స్వీయ ఆధార బాట ” అనే శీర్షికతో తాజాగా ఏపి వార్తా సంస్ధ ఒక కధనాన్ని వెలువరించింది. ఒక వైపు మార్కెట్లను మరింతగా తెరిచి తమ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా నాలుడేండ్లుగా ప్రత్యక్షంగా సాగిస్తున్న వాణిజ్యయుద్దం, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్న సమీకరణలు, విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా సాంకేతిక రంగంలో స్వీయ ఆధార దిశగా చైనా అనేక చర్యలు తీసుకుంది. అది సాధిస్తున్న పురోగతిని దిగ్జజదేశాలు ఊహించలేదు. తమ కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తామనట్లుగా ఉన్నాయి. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందనే బెంగ పట్టుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీజింగ్‌ ఒలింపిక్స్‌-అమెరికా కపట రాజకీయం!

15 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Sports, UK, USA

≈ Leave a comment

Tags

Beijing Olympics, US imperialism, US-Beijing Boycott, US’s diplomatic boycott


ఎం. కోటేశ్వరరావు


బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలితీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికాలోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.


నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిధ్యదేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగువేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రంలోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.


రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోచూడటం గర్హనీయం. చైనాలోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక బలాత్కారం పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచారదాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

దొంగే దొంగని అరచినట్లుగా అమెరికా చేస్తున్న ఆర్థిక బలాత్కారాలకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. దానికి తన మన పర బేధాలు లేవు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగుపరచేందుకు సముద్రంలో వైర్లద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచబాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా వత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమానకంపెనీ ఎయిర్‌బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు మన నరేంద్రమోడీ కౌగిలించుకున్నా మరొకటి చేసినా మన ఎగుమతులపై రద్దు చేసిన పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్దరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు మన నరేంద్రమోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.

లివర్‌పూల్‌లో జరిగిన జి7దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవహక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలున్నాయి, అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23శాతం, మరణాల్లో 18శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.

చైనాను గుర్తించకుండా తైవానే అసలైనా చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక బలాత్కారం కాదా? తనకంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులను వెతుకుతోంది. మానవహక్కుల పరిరక్షణ అన్నది తన డీఎన్‌ఏలోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవహక్కుల హరణమే దాని డీఎన్‌ఏ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆమొత్తం ఇప్పుడు 97లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66వేల మందిని హిరోషిమాలో, 39వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంతపాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవహక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో దాడిచేసి పదిలక్షల మందిని, ఉగ్రవాదం మీద పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో రెండున్నర లక్షలు, ఎమెన్‌లో నాలుగు లక్షలు, సిరియా, సోమాలియా, లిబియాల్లో మరికొన్ని లక్షల మందిని హతమార్చిన అమెరికా అండ్‌కో హంతక ముఠా చైనాలో షిన్‌జాంగ్‌లోని ముస్లింల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది. మన కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది అమెరికా, దానికి సాధనంగా పని చేసింది పాకిస్థాన్‌. అదే మాదిరి చైనాలో చిచ్చుపెట్టేందుకు షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో రెచ్చగొట్టింది. అక్కడి ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాల ద్వారా ఆయుధాలు, డబ్బు అందచేసింది అమెరికా. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల నుంచి అక్రమంగా వలసలను ప్రోత్సహించి వారిని ఎక్కడా అధికారికంగా నమోదు చేయకుండా సామాజిక రక్షణ కల్పించకుండా తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్న అమెరికా మానవత నిజస్వరూపం తెలియందెవరికి? లాటిన్‌ అమెరికాలో నిత్యం ఏదో ఒక దేశంలో మానవహక్కులను హరించే శక్తులకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామ్య బండారం తెలిసిందే. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.

క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పనిచేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్రదేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నాడు.


అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే వాటిని బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అబద్దాల అమ్ముల పొదిలో మరో అస్త్రం !

05 Friday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's growing nuclear arsenal, New Pentagon report, nuclear triad’, PRC, Taiwan


ఎం కోటేశ్వరరావు


చైనా – అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా ? ఇప్పటి వరకు అమెరికా జరిపిన యుద్దాలలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా చెప్పుకొనేందుకు విజయం లేదు. అవమానాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధమైనా ముందు ప్రచార దాడితోనే ప్రారంభమైంది. అదేమంటే నిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టటం. ఇప్పుడు చైనా మీద అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి ముప్పేట ప్రచారదాడి మొదలైంది. అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌, వాటితో జట్టుకట్టిన దేశాలన్నీ తమ తమ పాత్రలను పోషిస్తున్నాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో ఉన్న యుద్ధోన్మాదులు ఈ పరిణామాలను చూసి రెచ్చిపోతున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. పర్యవసానాలను పట్టించుకోవటం లేదు. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగన్‌ వార్షిక నివేదికలో ఒక ప్రచార అస్త్రాన్ని వదిలింది. దాన్ని పట్టుకొని అనేక మంది పండితులు అది నిజమే అని జనాన్ని నమ్మించేందుకు, చైనాను ఒక బూచిగా చూపేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తున్నారు.


ఇంతకీ పెంటగన్‌ చెప్పిందేమిటి ? చైనా వద్ద రెండువందల వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు, దశాబ్ది చివరికి అవి రెట్టింపు కావచ్చని గతేడాది అమెరికా రక్షణ అంచనా వేసిందట. అప్పటి నుంచి చైనా తన అస్త్రాలను విస్తరించటం ప్రారంభించటంతో 2027నాటికి ఏడువందలకు, 2030 నాటికి 1000కి పెరగవచ్చని, దీంతో ప్రపంచానికి ముప్పు పెరుగుతుందని ఈ ఏడాది పెంటగన్‌ చెప్పింది. ఆధారం లేని అంశాలను, అబద్దాలను చెప్పటంలో పెంటగన్‌ పేరు మోసింది. ఎగిరే పళ్లాలు లేదా గ్రహాంతర వాసులంటూ కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా మీడియా అల్లిన కట్టు-పిట్ట కథలను జనం నమ్మారు, ఇప్పటికీ నమ్మే వారున్నారు. నిజానికి అలాంటి వేమీ లేవు. వియత్నాం యుద్దం గురించి అది ఎలాంటి నివేదికలను రూపొందించిందో, మిలిటరీ, పౌర అధికారులు, విధాన నిర్ణేతలు ఎన్ని అబద్దాలు చెప్పి పార్లమెంటు, స్వంత పౌరులను , ప్రపంచాన్ని తప్పుదారి పట్టించారో తరువాత వివరాలు బయటపడ్డాయి. అందరూ కలిసి చేసిన ఈ దారుణానికి లక్షలాది మంది వియత్నాం పౌరులు దెబ్బతిన్నారు. సైగాన్‌ వంటి నగరాలు, పంట పొలాలను నాశనం చేశారు. ఎందరో మానవతులను చెరబట్టారు. చివరికి ఆ దాడుల్లో ఉత్తిపుణ్యానికి తమ 58వేల మంది సైనికులు మరణించారని, లక్షలాది మంది భౌతికంగా, మానసికంగా దెబ్బతిన్నారంటూ ఆ దాడులను ఆపివేయాలని అమెరికా జనం వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన అంశం తెలిసిందే.వియత్నాం టాస్క్‌ ఫోర్స్‌ పేరుతో రక్షణశాఖ మంత్రిత్వ కార్యాలయం రూపొందించిన నివేదికను పత్రికలు ప్రచురించరాదని అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం వత్తిడి తెచ్చింది. అటార్నీ జనరల్‌ జాన్‌ డబ్ల్యు మిచెల్‌ టైమ్‌ పత్రికకు ఒక టెలిగ్రాం పంపాడు. ఆ నివేదిక ప్రచురణ అమెరికా రక్షణ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని వాదించాడు.(ఈ ప్రబుద్దుడు తరువాత నిక్సన్‌ పాల్పడిన వాటర్‌గేట్‌ కుంభకోణంలో పోషించిన పాత్రకు జైలు పాలయ్యాడు, సదరు నిక్సన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.) తరువాత ఈ అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పత్రికలకు ప్రచురించే హక్కుందని తీర్పు వచ్చింది.


ఇరాన్‌కు ఆయుధాల సరఫరాపై నిషేధం ఉన్నప్పటికీ రీగన్‌ ప్రభుత్వం రహస్యంగా విక్రయించటమే గాక ఆ సొమ్మును నికరాగువాలో వామపక్ష శాండినిస్టా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తయారు చేసిన కిరాయి మూక కాంట్రాలకు అందచేసింది. వారికి నిధులు ఇవ్వటాన్ని పార్లమెంట్‌ నిషేధించింది. దీని గురించి కూడా పెంటగన్‌ పచ్చి అబద్దాలు, అతకని వాదనలు వినిపించింది. తరువాత జార్జి బుష్‌ పాలనాకాలంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు అల్లిన అబద్దాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిలవ చేశాడని ప్రచారం చేసిన అంశం, తరువాత అలాంటివేమీ దొరకలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండోచైనా దేశాలైన వియత్నాం, లావోస్‌, కంపూచియాలను ఆక్రమించుకొనేందుకు, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వరుసగా దాడులు చేశాయి. చివరిగా పాల్గొన్న అమెరికన్లు అవమానకర రీతిలో అక్కడి నుంచి తోకముడిచారు. ఆ ఉదంతం నుంచి అమెరికన్లు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు పేరుతో జోక్యం చేసుకున్నారు. అక్కడా పరాభవాలు ఎదురైనా రెండు దశాబ్దాల పాటు విజయం సాధిస్తున్నట్లు అమెరికన్లను, యావత్‌ ప్రపంచాన్ని ఎలా నమ్మించారో, చివరకు ఆ తాలిబాన్ల కాళ్లు పట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.


సోవియట్‌ యూనియన్నుంచి పశ్చిమ ఐరోపాకు ముప్పువస్తుందనే ముసుగులో నాటో కూటమి ఏర్పాటు చేశారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు. తూర్పు ఐరోపా రాజ్యాలన్నీ ఇప్పుడు రష్యాతో కూడా లేవు, అయినా అమెరికన్లు నాటోను కొనసాగిస్తూ మరింతగా విస్తరిస్తున్నారు ? ఐరోపాకు ముప్పు అని కథలు చెబుతూనే ఉన్నారు. పెంటగన్‌ తన సేనలను కొనసాగిస్తూనే ఉంది.తమ ఆయుధాలను అమ్ముకొని లాభాలు గడిస్తూనే ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆసియాలో విస్తరించేందుకు, ఇక్కడ కూడా నాటో మాదిరి ఆసియా కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దానిలో భాగమే మన దేశం, జపాన్‌,ఆస్ట్రేలియాలను కలుపుకొని చతుష్టయ(క్వాడ్‌) కూటమి, తరువాత బ్రిటన్‌,ఆస్ట్రేలియాలతో చేరి అకుస్‌ ఏర్పాటు సంగతి తెలిసిందే.వాటిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఎత్తుగడతోనే చైనా అణ్వాయుధాల బూచిని చూపటం, ఖండాంతర క్షిపణుల ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం, అంతరిక్షం నుంచి ప్రయోగించే మహావేగ క్షిపణి పరీక్ష అనే తప్పుడు వార్తలు, తైవాన్‌ పేరుతో రెచ్చగొడుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో తిష్టవేసేందుకు అమెరికన్లకు ఒక సాకు కావాలి. దాన్లో భాగమే పెంటగన్‌ ప్రచారదాడి.


ఆయుధాలు కలిగి ఉండే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లుగా, తమ దగ్గర ఉంటే లోక కల్యాణం, ఇతరులు సమకూర్చుకుంటే వినాశనానికి, కనుక అందరం కలిసి అలాంటి వారిని దెబ్బతీద్దాం, అందుకు గాను మా దగ్గర మీరు ఆయుధాలు కొనుగోలు చేయండి అన్నట్లుగా ఉంది అమెరికన్ల తీరు. అమెరికా సైనిక దళాల అధికారుల చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిలే ఒక మీడియా సంస్ధతో మాట్లాడుతూ చైనా గురించి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి.” మీరు గనుక మరోసారి చూస్తే, నాలుగుదశాబ్దాల క్రితం వారికి ఉపగ్రహాలు అసలు లేవు. ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి ఖండాంతర క్షిపణులు లేవు, ఈ రోజు వారికి ఎన్నున్నాయో చూడండి. వారికి అణ్వాయుధాలు లేవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి నాలుగవ లేదా ఐదవ తరం లేదా చివరికి ఆధునిక యుద్ద విమానాలు కూడా లేవు. మరలా చూడండి వారి దగ్గరెన్ని ఉన్నాయో. వారికి నౌకాదళం లేదు, జలాంతర్గాములు లేవు, వారికి ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి.” ఇవన్నీ కలిగి ఉండటం ప్రపంచానికి ప్రమాదమైతే తొలి ముప్పు అమెరికా నుంచే వస్తుంది. వారి దగ్గర ఉన్నన్ని మరొక దేశానికి లేవు. పోనీ ఇవన్నీ ఒక్క చైనాకేనా మిగతా దేశాల దగ్గర లేవా ? వాటిని నుంచి మిగతా దేశాలకు ముప్పు లేదా ? ఇదంతా చైనాను దెబ్బతీసే, అనుమానాలు కలిగించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.


ఈ ఏడాది మొదట్లో ప్రపంచానికి తెలిసిన అంచనా ప్రకారం అమెరికా దగ్గర 5,500 అణ్వాయుధాలున్నాయి.ప్రతి ఏటా లక్షల కోట్ల డాలర్లతో నూతన బాంబర్లు, కొత్త ఆయుధాలను రూపొందిస్తోంది. ఖండాంతర క్షిపణి వ్యతిరేక ఒప్పందం, మధ్య శ్రేణి అణ్వాయుధాల నిరోధ ఒప్పందాల నుంచి వైదొలిగింది.ప్రపంచమంతటా ఏదో ఒక పేరుతో తన క్షిపణులను మోహరిస్తూనే ఉంది. అకుస్‌ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియాకు దొడ్డిదారిన అణుపరిజ్ఞానాన్ని కూడా అంద చేసేందుకు బ్రిటన్‌తో కలసి ఒప్పందం చేసుకుంది. మరి చైనా ఆయుధాలను తయారు చేయటం లేదా ? ప్రతి ఏటా తన వద్ద ఉన్న వాటిని చైనా బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. ప్రతిదేశం అదే చేస్తోంది. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన దేశం కూడా ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో కలసి మిలిటరీ విన్యాసాలు చేస్తున్నది. అమెరికన్లు ప్రపంచ పెత్తనం కోసం ఆయుధాలను వినియోగిస్తుంటే మిగిలిన దేశాలు ఆత్మ రక్షణ కోసం తయారు చేసుకుంటున్నాయి. తొలిసారిగా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయ పెట్టింది అమెరికా తప్ప మరో అణుశక్తి ఏదీ అలాంటి దుర్మార్గానికి పాల్పడలేదు. తాముగా ఎవరి మీద ముందుగా అణుబాంబులను ప్రయోగించబోమని చైనా ప్రకటించింది.


కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం ఎలాగో తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమని అమెరికాతో సహా ప్రతిదేశం అధికారికంగా గుర్తించింది. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు అది తిరుగుబాటు ప్రాంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల చేతిలో ఉండి, ఇప్పటికీ కొనసాగుతోంది. ఐరాసలో చైనా అంటే తైవాన్‌తో కూడినది తప్ప మరొకటి కాదు. కానీ అమెరికా, ఐరోపాయూనియన్‌, తదితర కొన్ని దేశాలు తైవాన్ను బలప్రయోగంతో ఆక్రమించేందుకు చైనా చూస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నాయి. శాంతియుత పద్దతిలోనే విలీనం జరగాలని చైనా చెబుతోంది. గత నెల 27న అమెరికా నావలు తైవాన్‌ తీరంలో సంచరించాయి.తైవాన్‌ మిలిటరీకి ఆధునిక ఆయుధాలను విక్రయిస్తున్నది. పదమూడు మంది సభ్యులున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటరీ కమిటీ తైవాన్‌కు రావటం అమెరికా పధకంలో భాగమే. గత పది నెలల్లో ఐరోపా యూనియన్‌ పార్లమెంటు పన్నెండు తైవాన్‌ అనుకూల తీర్మానాలు చేసింది. ఇవన్నీ చైనాను రెచ్చగొట్టే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చేందుకు చైనా గురించి కట్టుకధలను ప్రచారం చేస్తున్నది. ఇలాంటివి ఇదే ప్రారంభం కాదు, ఇంతటితో ఆగేవి కాదు. 2049 నాటికి చైనాలో కమ్యూనిస్టు పాలనకు వందేళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి హాంకాంగ్‌, మకావూ, తైవాన్‌ దీవులను పూర్తిగా ప్రధాన చైనా భూభాగంలో విలీనం చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. దాన్ని కొనసాగనివ్వకుండా చూసేందుకు అమెరికా, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు పూనుకున్నాయి.పెంటగన్‌ నివేదిక దానిలో భాగమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన్మోహన్‌సింగ్‌ ఆకాంక్ష ,అమలు చేస్తున్నది నరేంద్రమోడీ – రికార్డు స్ధాయిలో చైనా దిగుమతులు, ఏమి దేశభక్తిరా బాబూ ఇది ?

16 Saturday Oct 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India's dependence on China, India's Trade deficit, India-China trade, Manmohan Singh, Narendra Modi, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ఆఖరు నాటికి చైనా-భారత వాణిజ్యం గత రికార్డులను బద్దలు కొట్టి వంద బిలియన్ల డాలర్లకు చేరనుందనివార్త. సెప్టెంబరు ఆఖరుకు 90.7బి.డాలర్లుగా ఉంది. ఈ లెక్కన వచ్చే మూడు నెలల్లో నెల సగటు పది బి.డాలర్ల చొప్పునైతే120బి.డాలర్లు లేదా కనీసంగా వంద బి.డాలర్లు అవుతుందని అంచనా. సరిహద్దులో గాల్వన్‌లోయలో అంత పెద్ద ఉదంతం జరిగినా చైనా వస్తువులను బహిష్కరించాలని ”అపరదేశ భక్తులు” ఎంతగా గొంతు చించుకున్నా, మీడియా ఎంత రచ్చ చేసినా ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఎడం కాలుతో తన్నేసి దిగుమతులకు అనుమతులిచ్చారు.వ్యాపారులు తెచ్చుకున్నారు. దీన్ని కొందరు మింగా లేరు కక్కలేరు.2018లో మనం గరిష్టంగా 76బి.డాలర్ల మేరకు దిగుమతులు చేసుకున్నాం, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పవచ్చు.


రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకున్నా ఆకస్మికంగా వస్తువుల దిగుమతి నిలిపివేయలేరని హాంకాంగ్‌ నుంచి వెలువడే ఆలీబాబా దినపత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది. ఆత్మనిర్భర పేరుతో ముడి పదార్ధాలు, విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడకూడదని నరేంద్రమోడీ కోరుకుంటున్నా వెంటనే సాధ్యం కాదని ఆ పత్రిక పేర్కొన్నది.భారత ఎగుమతి సంస్ధల ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అజయ సాహీ చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో గతేడాదితో పోలిస్తే చైనా నుంచి 51.7శాతం(68.46బి.డాలర్లకు) దిగుమతులు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశ ఎమతులు 42.5శాతం(21.91బి.డాలర్లు) పెరిగాయి. మన దేశ లోటు 46.55బి.డాలర్లు. సంఘపరివార్‌ అనుబంధ సంస్ధ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సిఏఐటి) 500 చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసి 13బి.డాలర్ల మేరకు 2021లో దిగుమతులను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇంకేముంది మనం దిగుమతులు నిలిపివేస్తే చైనా వారు మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే, ఇదే దేశభక్తి అంటూ వీరంగం వేస్తూ అనేక మంది ఎక్కడికో వెళ్లిపోయారు.2020లో చైనా దిగుమతుల్లో మన వాటా (20.86బి.డాలర్లు) కేవలం 1.2శాతం, 18వ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉన్న జపాన్‌ 174.87 (పదిశాతం) మరో పదిశాతం ఉన్న దక్షిణ కొరియా నుంచి 172.76, అమెరికా నుంచి 136(7.9శాతం) ఆస్ట్రేలియా నుంచి 114.84(6.6శాతం) ఉన్న దేశాలే చైనాతో బేరాలాడుతున్నాయి. అలాంటి స్ధితిలో మనం చైనాను కాళ్ల బేరానికి రప్పిస్తామని ఏ ధైర్యంతో కొందరు చెబుతున్నారో తెలియదు.


ఇండియా టుడే సమాచారం ప్రకారం 2010లో మనం వంద వస్తువులను దిగుమతి చేసుకుంటే చైనా నుంచి 10.7 ఉండేవి, నరేంద్రమోడీ ఏలుబడిలో 2018నాటికి 16.4కు పెరిగి, 2020లో 13.8కి తగ్గాయి. ఈ ఏడాది గత రికార్డును అధిగమించేట్లుంది. గతేడాది మనం మొత్తంగా 473 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే 65బి.డాలర్లతో చైనా అగ్రస్ధానంలో, రెండవ స్ధానంలో ఉన్న అమెరికా నుంచి 35.6 బి.డాలర్లు, 7.5శాతం చేసుకున్నాము. మనం వంద వస్తువులను ఎగుమతి చేస్తుంటే చైనాకు చేస్తున్నవి కేవలం(2020) 5.3 మాత్రమే. మన గరిష్ట ఎగుమతులు 2010లో 6.5శాతం. అందుకే నిజాలు తెలిసినా మన ఎగుమతుల మీద చైనా ఆధారపడుతోందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన వాణిజ్య లోటు విషయానికి వస్తే 2010లో 19.2 బి.డాలర్లు కాగా 2018లో గరిష్టంగా 63 బి.డాలర్లు. ఈ ఏడాది ఇప్పటికే 46.55 బి.డాలర్లుంది. పదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి.వాటిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు విధించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చినా ఖరారు కాలేదు. పన్ను విధించినా దిగుమతులు కొనసాగితే ఆ భారం మన వినిమయదారులే భరించాల్సి ఉంటుంది.మనం పన్నులు విధిస్తే చైనా ఊరుకుంటుందా ?


2012లో నాటి చైనా ప్రధాని వెన్‌జియాబావో – మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇరు దేశాల వ్యాపార లావాదేవీలు 2015నాటికి వంద బి.డాలర్లకు పెంచాలని ఆకాంక్షించారు. తాజా సమాచారాన్ని బట్టి మన ఆత్మనిర్భర, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులిచ్చిన నరేంద్రమోడీ దాన్ని ఈ ఏడాది నెరవేర్చేదశలో ఉన్నారు. 2017-18లో గరిష్టంగా 89.6బి.డాలర్లకు చేరగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టారు. త్వరలో 100బి.డాలర్ల రికార్డు నెలకొల్పనున్నారు.కొన్ని వస్తువులను వయా హాంకాంగ్‌ దిగుమతి చేసుకుంటున్నాము. వాటిని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత పరిశ్రమపై చైనా వస్తు ప్రభావం గురించి పేర్కొన్నారు. దిగుమతి పన్ను చట్టాలు సరిగా అమలు కావటం లేదని ఔషధరంగంలో ముడి సరకులు, సోలార్‌ పరికరాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మన ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు మూతపడుతున్నట్లు కూడా తెలిపారు.


చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులు నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న రాజకీయ నేతలు, సంస్ధలు, మీడియాకు, వాటి ప్రచారాన్ని భుజానకెత్తుకున్నవారికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ అంటే అతిశయోక్తి కాదు.వారి విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తారు. దీన్ని మరోకోణం నుంచి చూస్తే వీరి చర్యల పర్యవసానాలేమిటో కూడా చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇలాంటి దిగుమతులు లేవు.1990దశకంలోనే ఎగుమతులు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంఘపరివార్‌ శక్తులే అధికారంలో ఉన్నాయి. వారి హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో 75వరకు వినియోగ వస్తువులను తయారు చేసేవే.అంకుర కంపెనీలలో చైనా పెట్టుబడులు 400 కోట్ల డాలర్లు ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్‌, పేటియం, ఓలా, బైజూస్‌ వంటివి ఉన్నాయి. అనేక ఔషధ పరిశ్రమలు చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. వీటికి ప్రత్నామ్నాయం చూడకుండా తెల్లవారేసరికి చైనా వస్తువులను బహిష్కరిస్తే నష్టపడేది కోట్లాది మంది సామాన్యులే. చైనాకు నష్టం ఉండదు. అత్యవసర జీవన ఔషధాల తయారీకి వినియోగించే ఎపిఐలో 75శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సోలార్‌ పానెల్స్‌, రసాయనాల గురించి చెప్పనవసరం లేదు. జనజీవితాలు, పారిశ్రామిక రంగం నుంచి ఇప్పటికిప్పుడు చైనాను పక్కన పెట్టే అవకాశాలు లేవు. అందుకే నరేంద్రమోడీ సర్కారు ఆత్మనిర్భరత , స్వయం సమృద్ధి వంటి ఎన్నికబుర్లు చెప్పినా దిగుమతులను అనుమతించిందన్నది స్పష్టం. లేకపోతే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో అధికారపార్టీకి కష్టం.చైనాలో తయారైన వస్త్రాలను బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చి అక్కడ దుస్తులు తరాయారు చేసి మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వేరే రూపంలో చైనా వస్తువులు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే మన ఎగుమతులూ ఆగుతాయి. జనానికి చౌకగా వస్తువులూ దొరకవు.

మబ్బులను చూసి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా అమెరికాను నమ్మి బొమనం బస్తీమే సవాల్‌ అని గనుక తారసిల్లితే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియా. ఇప్పుడు నిండా మునిగి చైనాతో వైరం కొని తెచ్చుకుంది. వారిని ముందుకు నెట్టి రెచ్చగొట్టిన అమెరికా ఇప్పుడు తన లాభాన్ని తాను చూసుకొంటోంది. చైనాకు వ్యతిరేకంగా నిలవటం ఒక గౌరవ ప్రదమైన ఘనతగా భావించిన ఆస్ట్రేలియా వెనక్కితిరిగి చూసుకుంటే తన నీడ తప్ప మరొకరు కనిపించని స్ధితికి వెళుతోందని సిడ్నీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జేమ్స్‌ లారెన్స్‌సన్‌ హెచ్చరించాడు.ఆర్ధిక లబ్దికోసం చైనా, రక్షణ అవసరాల కోసం అమెరికా మీద ఎలా ఆధారపడకూడదో ఆస్ట్రేలియా పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు.2016 రెండవ అర్దభాగం నుంచి చైనాకు వ్యతిరేకంగా మారటం ప్రారంభమైంది. దీంతో చైనా తీసుకున్న చర్యల కారణంగా మద్యం నుంచి బొగ్గువరకు అనేక ఆస్ట్రేలియా ఎగుమతులు ప్రభావితమయ్యాయి.


బలవంతపు వాణిజ్య పద్దతులను వ్యతిరేకించాలని ఆస్ట్రేలియాతో కలసి జపాన్‌,భారత్‌ ఉమ్మడి ప్రకటనలు చేయ వచ్చు గానీ జపాన్‌, భారత్‌ ఎక్కడా చైనా పేరెత్తేందుకు సిద్దం కాదని, ఇండోనేషియా ఆప్రకటన మీద సంతకం చేసేందుకు సిద్దం కాదని లారెన్స్‌ సన్‌ చెప్పారు. మార్చినెలలో ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారి మైక్‌ గోల్డ్‌మన్‌ మాట్లాడుతూ మీరు చేస్తున్నదానితో విశ్వాసంతో ముందుకు పోండి,ఆమెరికా ఇతర ప్రజాస్వామిక దేశాలు మీ విజయాన్ని ఎంతో ఆసక్తితో చూస్తాయి అన్నాడు. మిమ్మల్ని రోడ్డు మీద వంటరిగా వదిలేది లేదని మేనెలలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ చెప్పాడు. వాణిజ్య దాడులకు ఆస్ట్రేలియా గురైనంత కాలం తాము చైనాతో సంబంధాల మెరుగుదలకు సిద్దం కాదని ఇండో-పసిఫిక్‌ అమెరికా పార్లమెంట్‌ సమన్వయకర్త కర్ట్‌ కాంప్‌బెల్‌ సెలవిచ్చాడు. ఆరునెలల తరువాత వాణిజ్య లావాదేవీల వివరాలను చూస్తే చైనా నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఎగుమతుల స్ధానాన్ని అమెరికా కంపెనీలు తమ సరకులతో నింపుతున్నట్లు తేలింది.ఇదేం పని అని అడిగితే అమెరికా ఏమీ మాట్లాడదు. అంతేకాదు అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో మాట్లాడుతూ చైనా వాణిజ్యాన్ని పెంచుకొనేందుకు తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఉద్రిక్తతలను సడలించేందుకు ముమ్మర వాణిజ్యం తోడ్పడుతుందని సెలవిచ్చాడు.అమెరికా-చైనా వాణిజ్యం తీరుతెన్నులపై ఎనిమిది నెలల సమీక్ష తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి మాట్లాడుతూ తాము చైనాతో విడగొట్టుకొనేందుకు బదులు సంధానం చేసుకోవటం గురించి అజెండాను ముందుకు జరపనున్నామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సదరు ప్రొఫెసర్‌గారు చెప్పిందేమంటే అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నపుడు చైనాతో మనం తగాదా ఎందుకు పడాలని తమ పాలకులను ప్రశ్నించాడు.


ఇది మన దేశానికి వర్తించదా ? మనకూ అలాంటి అనుభవం ఎదురైతేగానీ మోడీ సర్కార్‌ తన వైఖరిని మార్చుకోదా ? చైనాతో స్నేహం చేసేదీ లేనిదీ పక్కన పెడితే తగాదా అవసరమా ? గాల్వన్‌ వివాదం మన సైనికుల మరణం విచారకరమే, కానీ అదే చైనా నుంచి మనం రికార్డు స్ధాయిలో దిగుమతులు చేసుకుంటున్నది ఆ తరువాతే కదా ? మనోభావాలతో ఆడుకుంటూ జనంలో దేశ భక్తి, చైనావ్యతిరేకతను రెచ్చగొడుతూ రాజకీయరగా బిజెపి ఉంటే దిగుమతిదారులు తమ లాభాల సంగతి తాము చూసుకుంటున్నారు. నరేంద్రమోడీ వాటిని అనుమతిస్తున్నారు. ఏమి దేశభక్తిరా బాబూ ఇది.


ఒక సోషలిస్టు దేశంగా చైనాను కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు అభిమానించవచ్చు. దాని మాదిరి మన దేశం, ఇతర దేశాలూ ముందుకు పోవాలనీ కోరుకుంటారు. అందుకోసం ఉద్యమాలు చేస్తారు తప్ప చైనాతో వాణిజ్యం చేయరు. ఇంతకు ముందు అలా చేసిన నేతలూ లేరు, ఇప్పుడూ లేరు, ఇక ముందూ ఉండరు.చేసేదంతా పారిశ్రామిక,బడా బాబులే, వారికి సహకరించేది అధికారంలో ఉన్న పార్టీల నేతలే. వ్యాపారం వ్యాపారమే. ఎవరికైనా లాభం వస్తేనే చేస్తారు. భారత కమ్యూనిస్టులు ఇక్కడి ప్రజల ప్రయోజనాలకే ప్రధమ పీటవేస్తారు తప్ప మరొక దేశానికి దోచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు, చెప్పరు. గాల్వన్‌ లోయ ఉదంతం సందర్భంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చైనా మన ప్రాంతాలను ఆక్రమించలేదని స్వయంగా చెప్పారు. సరిహద్దు వివాదం కొత్తగా తలెత్తింది కాదు. దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం మొదటి నుంచీ చెబుతోంది. అలా చెప్పిన వారిని దేశద్రోహులుగానూ, చైనాతో తగాదా కోరుకున్నవారిని దేశభక్తులుగానూ చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే చైనాను వ్యతిరేకించటంగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆ చైనా నుంచి రికార్డు స్ధాయిలో దిగుమతి చేసుకుంటున్నవారిని, అనుమతిస్తున్నవారిని ఏమనాలి ? దేశద్రోహులా, భక్తులా ?


సామాజిమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు బిజెపి దాని మాతృసంస్ధ సంఘపరివారం వెచ్చించే సమయంలో వెయ్యవ వంతు దేశం మీద కేంద్రీకరించినా – ఎందుకంటే దేశమంతటా తామే ఉన్నామని చెబుతున్నారు గనుక ఇక్కడే ఉత్పత్తి పెరిగి చైనా మీద ఆధారపడటం కాస్తయినా తగ్గి ఉండేదేమో ! మన జనాలకు పనీపాటా దొరికేదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లారు, వచ్చారు ! సాధించింది ఏమిటి ?

28 Tuesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, BJP, India-UNSC, Joe Biden, Narendra Modi US Visit


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్లారు, తిరిగి వచ్చారు. అరవై అయిదు గంటల వ్యవధిలో 20 సమావేశాలలో, ప్రయాణ సమయంలో విమానంలో నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారట. తిరిగి వస్తూనే కొత్త పార్లమెంట్‌ భవన సముదాయ నిర్మాణం ఎలా జరుగుతోందో రాత్రిపూట పర్యవేక్షించారు. రాగానే ప్రధాని నిర్మాణ స్ధలాన్ని సందర్శించటంలో పెద్ద విశేషం ఏమీ లేదు గానీ (కరోనా సమయంలో భరోసా ఇచ్చేందుకు ఏ ఆసుపత్రినీ సందర్శించలేదు గానీ అన్న కాంగ్రెస్‌ విమర్శ వేరే అంశం), విదేశాలకు వెళ్లినా, స్వదేశంలో ఉన్నా మన ప్రధానికి పని యావతప్ప మరొకటి ఉండదనే సందేశాన్ని మోడీ మీడియా మేనేజ్‌మెంట్‌ బృందం ఇచ్చిందని చెప్పవచ్చు. తన శరీర ధర్మాన్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకొనే రహస్యాలు ప్రధాని దగ్గర ఉన్నందున విమాన ప్రయాణ బడలికకు ఏమాత్రం గురికాలేదని, ఎల్లవేళలా ఉత్సాహంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వాటిని అదేదో అంటున్నారుగా డబ్బిచ్చి రాయించుకోవటం అని అదా, విలేకరులే ఉత్తేజితులై రాశారా అంటే, ప్రధాని వెంట ఎప్పుడూ విలేకర్లు ఉండరు, వారి పొడ గిట్టదని తెలిసిందే.


ఇంత హడావుడి చూసిన తరువాత ఒక సినిమాలో నువ్వు ఎవరు అని ప్రశ్నించినట్లుగా ప్రధాని అమెరికా, ఐరాస పర్యటనలో సాధించింది ఏమిటి అనే అంశం ముందుకు వస్తుంది. ఫలితం వస్తేనే పని చేసినట్లుగా భావిస్తున్న రోజులు కనుక అలాంటి ప్రశ్న వేసిన వారి మీద ఆగ్రహించనవసరం లేదు. అమెరికాలో ఇండియన్‌ అమెరికన్‌ వాణిజ్యవేత్తలతో సహా పలు కంపెనీల అధిపతులతో సమావేశం జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారా లేక పెట్టుబడుల విషయమై చర్చించారా అన్నది తెలియదు. సులభతర వాణిజ్యంలో మోడీ ఏలుబడిలో 142 నుంచి 63కు ఎదిగిన తరువాత కొత్తగా వారు తెలుసుకొనేదేమి ఉంటుంది-మోడీగారు చెప్పేది మాత్రం ఏం ఉంటుంది ? వచ్చే నెలలో అమెరికా నుంచి ఒక ఉన్నత స్ధాయి బృందం రానుందని వార్తలు.


ప్రధాని పర్యటన ఫలితాలు-పర్యవసానాలు వెంటనే వెల్లడికావాలనేదేమీ లేదు. ఈ పరిమితులను గమనంలో ఉంచుకొని జరిగిన కొన్ని విషయాల గురించి చూద్దాం. మొత్తం మీద మూడు అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి ఐరాస వార్షిక సమావేశంలో ప్రసంగించటం, రెండవది అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌లతో ఏర్పడిన చతుష్టయ కూటమి శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్‌లకు గట్టి పరోక్ష హెచ్చరిక , ఈ సందర్భంగా వాణిజ్య ప్రముఖులు ఇతరులతో భేటీ కావటంగా చెప్పవచ్చు.బిజెపి నేతలు ఈ పర్యటన ఒక చారిత్రాత్మక మలుపు అన్నట్లుగా చిత్రించారు. వెంపల చెట్లను నిచ్చెనలతో ఎక్కే జనాలున్న రోజులివి. కొత్తగా జరిగిన పరిణామాలేవీ లేవు, కొత్తగా పొరుగుదేశాలకు చేసిన హెచ్చరిక ఏమిటన్నది ఒక బ్రహ్మపదార్దం.ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ బహుముఖ సంస్థలు అసంగతమైనవిగా మారాయని వాటిని సంస్కరించాలని కోరారు. వాస్తవమే, ఇది కూడా పరోక్ష వ్యవహారమే.భద్రతా మండలిలో శాశ్వత స్ధానం కావాలని మనం కోరుతున్నాం. ఆ హౌదా ఉన్న దేశాలు దాన్ని దేనికి వినియోగిస్తున్నాయన్నది వివాదాస్పదం, ప్రజాస్వామ్య విరుద్దం. ఆ హక్కు ఎవరికీ ఉండకూడదు. ఐరాస జనరల్‌బాడీ లేదా భద్రతా మండలి మెజారిటీ తీర్మానాలను ఏ ఒక్కదేశం వీటో చేసినా అవి చెల్లవు. అలాంటి హక్కును మనం కోరుతూ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెబుతున్నాం. అయినా చైనాతో సహా అందరూ మనకు మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో మనతో సహా ఎవరి రాజకీయం వారు చేస్తున్నందున అది ముందుకు పోవటం లేదు, ఆశ కూడా కనిపించటం లేదు.


తిరోగామి దేశాలు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఐరాసలో ప్రధాని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించటాన్ని అనుమతించకూడదని, ఏ దేశమూ అక్కడి పరిస్ధితిని వినియోగించుకొనేందుకు వీల్లేకుండా చూడాలనీ చెప్పారు, నిజమే, ఆ పేరుతో ఇరవై ఏండ్లు ప్రత్యక్షంగా మరో 23 ఏండ్లు పరోక్షంగా అమెరికా చేసింది ఏమిటో పరోక్షంగా అయినా చెప్పి ఉంటే మరింత ఘనంగా ఉండేది. అమెరికా, దానికి ఇంతకాలం మద్దతు ఇచ్చిన మనం ఏ రకమైన దేశాల జాబితాలోకి వస్తాం ? ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా ఆప్ఘనిస్తాన్‌లో మిలిటరీ జోక్యం చేసుకుంది. అక్కడి జనజీవితాలను అతలాకుతలం గావించింది. తాలిబాన్‌, ఇతర ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్‌కు ఆయుధాలతో సహా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. మాదారిన మేం పోతాం మా జోలికి రావద్దు అని వారితోనే ఒప్పందం చేసుకుంది, అయినా ఒక్క మాట అనేందుకు మనకు ధైర్యం లేదు.


ప్రధాని అంతర్జాతీయ వేదిక మీద తన గురించి తాను పొగుడుకోవటాన్ని ఎవరైనా తప్పు పడితే వారి మీద విరుచుకుపడితే కుదరదు. ఇతరులు పొగిడితే అందం చందం. మనల్ని మనమే పొగుడుకుంటే ”చాల బాగోదు ”. ఒక రోజు రైల్వే స్టేషన్‌లో తేనీరు అమ్మేందుకు తన తండ్రికి సహకరించిన ఒక చిన్న కుర్రవాడు నేడు నాలుగోసారి ఐరాస సమావేశంలో ప్రసంగించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని మోడీ తన గురించి చెప్పుకున్నారు. అయితే అదే చిన్న కుర్రవాడు పెద్దయిన తరువాత ఆ రైల్వేస్టేషన్లను ఏం చేయచూస్తున్నారో చూస్తున్నదే. ఆ కుర్రవాడి ఊరి రైల్వే స్టేషన్‌ తేనీరు అమ్మేంత పెద్దది కాదని, అందుకు ఆధారాలేవీ లేవని మన దేశ మీడియాలో వచ్చిన వార్తలను చదువుకున్న విదేశీయులు భారత ప్రధాని గురించి ఏమనుకుంటారు ? కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా మనం వదిలేద్దాం.


అమెరికా పర్యటనలో నరేంద్రమోడీ సాధించిందేమిటి అనే ప్రశ్నకు మోడీ అద్భుత అమెరికా సందర్శన – ప్రదర్శన ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు ఒక మూలమలుపు అని బిజెపి అధికార ప్రతినిధి తుహిన్‌ ఏ సిన్హా ఏకంగా ఒక పెద్ద వ్యాసమే రాశారు. ఎవరికైనా అలా అనిపించిందా ? ప్రతి సందర్భంలోనూ చాతుర్యం ప్రదర్శించారని, సునాయాసంగా, ఎంతో చక్కగా ఐరాసలో ప్రసంగించారని వర్ణించారు. హిందీ, గుజరాతీలో ఆయన మంచి వక్త అని కొత్తగా చెప్పాల్సిందేముంది. మోడీ ప్రసంగం ప్రపంచంలో ఏదైనా కొత్త పరిణామానికి నాంది పలికిందా, దానికి సూచనలు కూడా లేవు. అందుకే ఒరిగిందేమిటి అనాల్సి వస్తోంది. 1950దశకంలో మనకు భద్రతా మండలిలో శాశ్వత స్ధానం దక్కే అవకాశాన్ని నెహ్రూ చైనాకు వదలివేశారని బిజెపి ప్రతినిధి గోబెల్స్‌ ప్రచారాన్ని పునరుద్ఘాటించారు. భద్రతా మండలిలో చైనాకు శాశ్వత స్దానం వచ్చిన 1945లో మనకు అసలు స్వాతంత్య్రం రాలేదు, చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాలేదు, వచ్చిన 1949 నుంచి 1971వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో అసలు గుర్తింపే లేదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనా పేరుతో కథ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు.


ప్రస్తుతం భద్రతా మండలిని విస్తరించాలనే మల్లగుల్లాల్లో భాగంగా భారత్‌, జపాన్‌, జర్మనీ,బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. భారత్‌ విషయంలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప చైనాతో సహా మరేదేశమూ అభ్యంతరం చెప్పలేదు. తమ దేశాలపై యుద్దనేరాలకు పాల్పడిన జపాన్‌ వైపు నుంచి ఇప్పటికీ సరైన పశ్చాత్తాపం లేనందున చైనా, ఉత్తరకొరియా, వియత్నాం వంటి దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఇటలీ పరోక్షంగా జర్మనీకి వ్యతిరేకంగా ఉంది. మరికొన్ని ఐరోపా, ఆఫ్రికాదేశాలు కూడా జర్మనీని వ్యతిరేకిస్తున్నాయి.బ్రెజిల్‌ను కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు అంగీకరించటం లేదు. మన దేశాన్ని తన అనుయాయిగా మార్చుకొనేందుకు తెరవెనుక మంతనాల్లో నెహ్రూ ప్రభుత్వానికి అమెరికా భద్రతా మండలి శాశ్వత స్ధానం అనే బిస్కెట్‌ను వేసింది. మాక్కూడా ఇస్తే అంగీకారమే గాని చైనాను తప్పించి ఆ స్ధానం మాకు అవసరం లేదు అని నెహ్రూ చెప్పారు. ఇప్పుడు మన దేశం జపాన్‌కు మద్దతు ఇస్తున్నది. మీ సంగతి మీరు చూసుకోండి తప్ప జపాన్‌కు మద్దతు మానుకోవాలని మన దేశానికి చైనా చెబుతున్నది. నాటి నెహ్రూ వైఖరిని తప్పుపడుతున్న నేటి నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా ? అలా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.అలాంటి వారికి నెహ్రూను విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఉంది ?


నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో చతుష్టయ(క్వాడ్‌) సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇది మిలిటరీ కూటమి కాదు, చైనాకు వ్యతిరేకం కాదని గతంలో మన దేశ వైఖరి గురించి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. ఇప్పుడు నరేంద్రమోడీ వైఖరిలో అంత స్పష్టత లేదు. అది ఎత్తుగడ లేదా ముసుగు కావచ్చు, కానీ ఒక పార్టీగా బిజెపి అధికార ప్రతినిధి ఏం చెబుతున్నారు ? బ్రెజిల్‌, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి 2006లో ఏర్పడింది. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయం(క్వాడ్‌) 2007లో ఉనికిలోకి వచ్చింది. బ్రిక్స్‌ అవసరార్ధం, ఎడముఖం పెడముఖంగా ఉండేదేశాలతో ఏర్పడిందని, అంతగా అయితే రద్దు చేయకుండానే సార్క్‌ మాదిరి వదలివేయవచ్చట. పురోగామి ప్రజాస్వామిక దేశాలతో కూడిన చతుష్టయం సహజంగా ఉనికిలోకి వచ్చిందట. జగడాలంటే ఇష్టపడటం దాని స్వభావమట. ఎవరి మీద ? ఇది ఎల్లవేళలా చైనాకు వ్యతిరేకంగానే కనిపిస్తుందని,కమ్యూనిస్టు-ఇస్లామిస్టు కూటమికి వ్యతిరేకంగా పని చేసేందుకు అని కూడా బిజెపి ప్రతినిధి సెలవిచ్చారు. లడఖ్‌ సరిహద్దు వివాదం ఎందుకు,ఎలా జరిగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చేమో !అంతేకాదు, భవిష్యత్‌ ప్రపంచ రాజకీయాలను మలచటంలో చతుష్టయం భారత్‌కు అత్యంత అనుకూల స్ధానాన్ని చేకూర్చుతుందని కూడా చెప్పారు. ఇక ఐరాస ప్రసంగంలో మోడీగారు చెప్పిన అంశాలలో ” భారత్‌ అభివృద్ది చెందినపుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది… భారత్‌ సంస్కరణలు అమలు జరిపినపుడు ప్రపంచం మారుతుంది ” దీని మీద వ్యాఖ్యానించనవసరం లేదు. ఒకవైపు చతుష్టయ రాజకీయం చేస్తూనే మరోవైపు అకుస్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానాన్ని అంద చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారు. దీంతో చతుష్టయం కూడా ఒక బాతాఖానీ కేంద్రంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. దీనితో చైనాను దెబ్బతీసే అవకాశం మనకు వచ్చిందని బిజెపి చెబుతోంది.


మోడీ గారి అమెరికా పర్యటనలో పెద్ద జోక్‌ పేలింది. జో బైడెన్‌, నరేంద్రమోడీ ఇద్దరూ మాట్లాడుకొనేందుకు అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు.అప్పుడు బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడుతూ అమెరికా కంటే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తిస్తుంది.మీరు అనుమతిస్తే నేను ఒక్క మాట చెబుతాను. పత్రికల వారిని తీసుకొచ్చేట్లున్నారు. మనం వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే వారు నిర్దిష్ట అంశం మీద ఏ ప్రశ్నా అడగరు” అన్నాడు. మరొక వార్త ప్రకారం అమెరికా జర్నలిస్టులు ఏ అంశం మీదా సరిగా ప్రశ్నలు అడగరని వాటికి మీరు సమాధానం చెప్పలేరని అన్నట్లుగా ఆర్‌ఎన్‌సి రిసర్చ్‌ రాసింది. ఏదైనా జరిగి ఉండవచ్చు గానీ, అసలు నరేంద్రమోడీ భారత్‌లో కూడా మీడియాతో ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు, అస్సలు నోరు విప్పరు అనే అంశం జో బైడెన్‌కు తెలియదా, అంతటి అమాయకండా ఉన్నాడా ? అసలు విషయం ఏమంటే అమెరికా మీడియా నరేంద్రమోడీ గురించి అనేక విమర్శనాత్మక కథనాలు రాసింది. అందువలన తమ దేశ మీడియాను బైడెన్‌ అవమానిస్తూ మాట్లాడి మోడీని సంతోషపెట్టేందుకు ప్రయత్నించారని చెబుతున్నవారు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో అమెరికన్‌ మీడియా మీద జోబైడెన్‌ కూడా వివిధ కారణాలతో ఆగ్రహంతో ఉన్నారు. వారి ఉనికే సహించటం లేదని చతుష్టయ సమావేశాల సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో బైడెన్‌ భేటీ సందర్భంగా వెల్లడైంది. సిబ్బంది విలేకర్లను దాదాపు బయటకు గెంటేసినంత పని చేశారు.


సాధారణంగా ఒక ప్రాంతానికి అలవాటు పడినవారు మరో చోటికి వెళ్లినపుడు అందునా నిద్రవేళలు పూర్తిగా తారుమారైపుడు నిద్రపట్టకపోవటం, అలసి పోవటం, అక్కడి సమయాలకు వెంటనే అనువుగా అలవాటు పడకపోవటం తెలిసిందే. అయితే నరేంద్రమోడీ ఎక్కడికి వెళ్లితే అక్కడి సమయాలకు అనుగుణంగా విమానం ఎక్కగానే తన శరీర ధర్మాన్ని మార్చుకుంటారని ఆయనను అనుసరించిన వారు చెప్పినట్లు వార్త వెలువడింది. ఇవన్నీ సిబ్బంది చెప్పి రాయించిన వార్తలన్నది స్పష్టం. సాధారణ వ్యక్తులకే ఎంతో పని ఉంటుంది, అలాంటిది ప్రధాని మోడీ తన ముమ్మర కార్యక్రమాలకు అనుగుణ్యంగా ఉన్నత స్ధాయిలో శక్తిని ప్రదర్శించేలా తన శరీరాన్ని ఉంచుకున్నారని, ఎంత వత్తిడి ఉన్నా, ఎన్ని గంటలైనా ఎల్లవేళలా ఉల్లాసంగా విదేశీ ప్రయాణాల్లో ఉంటారని కూడా రాశారు. అలసటను జయించిన ప్రధాని అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, విమానబడలికకు దూరంగా ఉన్న ప్రధాని రహస్యాలు అనే అర్ధంతో హిందూస్తాన్‌టైమ్స్‌ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.వీటిని ఆధారం చేసుకొని పిటిఐ వార్తా సంస్థ తన కథనాన్ని వండి వార్చింది. విమానాల్లో ప్రయాణించేటపుడు శరీరంలోని తడి ఆరిపోతుంది కనుక వైద్యుల సలహామేరకు ప్రధాని నీటిని ఎక్కువగా తాగుతారని పేర్కొన్నది.1990 దశకంలో నెలవారీ టిక్కెట్లు తీసుకొని రైల్లో తిరిగినట్లుగా మోడీ అమెరికా వెళ్లివచ్చేవారట. రాత్రిపూటే ప్రయాణించటం, విమానాలు లేదా విమానాశ్రయాల్లోనే సేద తీరేవారు తప్ప హౌటళ్లకు ఒక రూపాయి కూడా ఖర్చు చేసే వారు కాదట.

గోద్రా ఉదంత అనంతర గుజరాత్‌ మారణకాండ తరువాత నరేంద్రమోడీ పర్యటనకు అమెరికా అసలు వీసా ఇవ్వలేదని తెలిసిందే. ప్రధాని అయిన తరువాతే వెళ్లారు. అంతకు ముందు ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా అంతగా అమెరికాలో పని ఏమి ఉండి ఉంటుంది,1993లో ఒక్కసారి అమెరికా వెళ్లి అక్కడి సినిమా స్టూడియోలను సందర్శించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతరంగా ఫొటోలు అంతర్జాలంలో దర్శనమిచ్చాయి. పోనీ రోజుకు ఒకసారి వెళ్లివచ్చారనే అనుకుందాం. నష్టం ఏముంది ? ఎన్నికల ప్రచారం వంటి సందర్భాలలో ప్రముఖుల ప్రచారశైలి గురించి మీడియా రాయటం తెలిసిందే, దాన్ని అర్ధం చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో శరీరధర్మాన్ని మార్చుకోవటం వంటి అతిశయోక్తులు వ్యక్తిపూజకు నిదర్శనం. ఇలాంటి అంశాలు గతంలో కూడా అనేక మంది ప్రముఖుల గురించి రాసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా ఆ కీర్తి కండూతి జాబితాలో చేరిపోయారు.ప్రత్యేకత ఏముంది ? ఇలాంటి వార్తలు, లేదా వ్యక్తిగత అలవాట్ల గురించి రాసి భక్తులను ఆనందపెట్టటం తప్ప దేశానికి జరిగే ప్రయోజనం ఏముంది ? బిజెపి నేతలు చెబుతున్నట్లు ప్రపంచ రాజకీయాలను మోడీ గారు ఎలా మలుస్తారో, చారిత్రాత్మకం ఏమిటో తరువాతైనా కనిపిస్తాయోమో చూద్దాం !

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఆరాధకులూ, గుడ్డి భక్తులూ జర జాగ్రత్త !

26 Sunday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, AUKUS, Canada, Huawei Technologies, Meng Wanzhou, Quad


ఎం కోటేశ్వరరావు


చైనా మీద ఉక్రోషంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హువెయి కంపెనీ అధికారిని కిడ్నాప్‌ చేయించాడు.దాని పర్యవసానాలను తట్టుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ దిగివచ్చి రాజీ చేసుకున్నాడు. బాధితురాలు చైనాకు చెందిన వాంగ్‌ వాన్‌ఝౌ స్వదేశం చేరుకొనే సమయంలోనే చతుష్టయ దేశాధినేతల తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. చతుష్టయ సమావేశం ముందుగా నిర్ణయించుకున్నదే, మరి మొదటి ఉదంతం ? యాదృచ్ఛికమా ? కానేకాదు ! ఈ చర్య అమెరికా-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదం చేయనుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు ” అకుస్‌” ఒప్పందం చేసుకున్నారు. చతుష్టయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో నాటకీయంగా సుఖాంతమైన కిడ్నాప్‌ ఉదంతం, దీని ద్వారా భారత్‌ సహా మిత్రదేశాలకు అమెరికా ఇచ్చిన సందేశం ఏమిటి ?


చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా టెలికాం కంపెనీ హువెయి సిఎఫ్‌ఓ, కంపెనీ స్ధాపకుడి కుమార్తె మెంగ్‌ వాన్‌ఝౌను 2018డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలో ” రాజకీయ కిడ్నాప్‌ ” చేయించాడు. మెంగ్‌ చైనా నుంచి మెక్సికో వెళుతూ విమానం మారేందుకు కెనడాలోని వాంకోవర్‌ విమానాశ్రయంలో దిగింది. అమెరికా వత్తిడికి లొంగిన కెనడా సర్కార్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి నిర్బంధించింది. ఇదే సమయంలో గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు కెనడీయులను చైనా అరెస్టు చేయటమే కాదు, విచారణ జరిపి శిక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా సంబంధాలు గత నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దిగజారటమే కాదు, కెనడా ఇరుక్కుపోయి చైనాతో వైరాన్ని కొని తెచ్చుకుంది.


ఇంతకీ వాంగ్‌ మీద మోపిన నేరం ఏమిటి ? ఇరాన్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలను వమ్ము చేసేందుకు హుబెయి కంపెనీ కుట్ర చేసిందట, దానికి గాను సిఎఫ్‌ఓను అరెస్టు చేసి తమకు అప్పగించాల్సిందిగా కెనడాను కోరింది. కెనడా అరెస్టయితే చేసింది గానీ చైనాతో వచ్చే ముప్పును గ్రహించి వాంగ్‌ను అమెరికాకు అప్పగించలేదు. ఒకవైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ (క్వాడ్‌) తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరుపుతున్న సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య వాంగ్‌ విడుదలకు చైనాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వాంగ్‌ శనివారం నాడు ప్రత్యేక విమానంలో చైనా చేరుకుంది. ఒప్పంద వివరాలు పూర్తిగా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగే విషయం ఇతర భాగస్వామ్య పక్షాలతో చెప్పకుండానే నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పుడు ఈ పరిణామంతో చతుష్టయంలోని మిగిలిన దేశాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.


ఈ ఒప్పందానికి జో బైడెన్‌ యంత్రాంగాన్ని ప్రేరేపించిన అంశాలేమిటి ? చైనా వైపు నుంచి కొత్తగా పొందిన రాయితీలేమీ లేవు. ఒక వైపు అక్కడి గుత్త సంస్ధలపై అనేక చర్యలను జింపింగ్‌ సర్కార్‌ ప్రకటిస్తున్నది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత పరిజ్ఞానం, వనరులతో అభివృద్ధి వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జనవరిలో అధికారాన్ని స్వీకరించిన బైడెన్‌ వాణిజ్య ప్రతినిధిగా కాథరీన్‌ తాయి నియామకం జరపటంతో వాణిజ్యవేత్తలు తమ సమస్యలను పట్టించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వ్యూహాత్మక ఓపిక పేరుతో కాలం గడుపుతున్న బైడెన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు రాకపోవటంతో కొంత మందిలో ఓపిక స్దానంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. వెంటనే చైనాతో చర్చలు జరిపి సాధారణ సంబంధాలతో తమ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే వత్తిడి తెస్తున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాతో కుదుర్చుకున్నట్లు ప్రకటించిన తొలి దశ వాణిజ్యం ఒప్పందం ఏమేరకు అమలు జరిగిందో స్పష్టత లేదు. కరోనా వైరస్‌ను చైనాయే తయారు చేసి వదలిందని నోరు పారవేసుకున్న ట్రంప్‌ చైనాతో వైరాన్ని మరింత పెంచాడు. ఒప్పందంలో ఏమి చెప్పినప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలిగినా, దాంతో చైనాకు చిర్రెత్తినా నష్టపోయేది అమెరికాయే గనుక అక్కడి వాణిజ్యవేత్తలు బైడెన్‌ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలో అమెరికాలోని అతి పెద్ద వాణిజ్య సంస్ధల సంఘాలు సమావేశమై చైనాతో సర్దుబాటు చేసుకొని వాణిజ్య అవకాశాలను పెంచుతారా లేదా అని బైడెన్‌కు ఒక విధంగా హెచ్చరికను జారీ చేశాయి. కొన్ని ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఉత్పాదకాలు చైనాలో మాత్రమే దొరుకుతాయి, ఇతర దేశాల్లో పరిమితంగా లభ్యమైనా అధికధరలకు వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని, అందువలన చైనా సరఫరాదార్ల మీద ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కార్మికులు, అమెరికా పోటీతత్వాన్ని కాపాడాలంటే చైనాతో రాజీకి రావాలని స్పష్టం చేశాయి.


అమెరికా కంపెనీలను చైనీయులు ఎలా ప్రభావితం చేస్తున్నారో మచ్చుకు విమానాలను తయారు చేసే బోయింగ్‌ కంపెనీ ఉదంతాన్ని చూద్దాం. అసలే ఆ కంపెనీ కష్టాల్లో ఉంది, అది తయారు చేసే విమానాల్లో ఐదోవంతు కొనుగోలు చేసే చైనా నుంచి 2017 తరువాత ఆర్డర్లు లేవు. లాభాలు తెస్తుంది అనుకుంటున్న బోయింగ్‌ 737 మాక్స్‌ రకం తన గగన తలంపై ఎగిరేందుకు చైనా అనుమతించ లేదు. దాంతో ఇతర దేశాలు అనుమతి ఇచ్చినా, విమానాలు కొనుగోలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇదంతా ట్రంపు చేసిన కంపు అని అది మండిపడుతోంది. రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం వంద విమానాలు కొనుగోలు చేస్తుందనుకుంటే వాటిలో 25 చైనా వాటా.ఈ కారణంగా బోయింగ్‌ వాటాదారులు ఇటీవల కంపెనీ మీద ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డుంకులను అధిగమించినా చైనాతో సాధ్యం కావటం లేదు, చైనాతో సర్దుబాటు చేసుకోకపోయినా, ఆలస్యం అయినా మన కంపెనీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిఇఓ దవే కాలహన్‌ వాపోయాడు. మే నెలలో కొత్తగా 73 విమానాలకు అర్డర్లు వస్తే అదే నెలలో 53 ఆర్డర్లు రద్దయ్యాయి. కనుక ఇలాంటి కార్పొరేట్లకు ఆగ్రహం కలిగినా, మద్దతు లేకపోయినా అమెరికాలో ట్రంపూ, బైడెన్‌ ఎవరూ తెరమీద కనిపించరు.


బోయింగ్‌ వంటి కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి ? రానున్న రెండు దశాబ్దాలలో చైనాకు 8,700 విమానాలు అవసరమన్నది ప్రస్తుత అంచనా. చైనా వృద్ధి రేటు, పౌరుల ఆదాయాలు పెరిగితే ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. మరోవైపు 2025నాటికి స్వంత విమానాలను ఎగురవేయాలని చైనా ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది.2008లో ఏర్పాటు చేసిన కంపెనీ రెండు రకాల విమానాలను అభివృద్ది చేస్తోంది. ఎక్కడా ఆగకుండా 5,555 కిలోమీటర్ల దూరం 156 నుంచి 168 మంది, పన్నెండు వేల కిలోమీటర్లు ఆగకుండా 250 నుంచి 320 మంది ప్రయాణీకులను చేరవేయగలిగే విమానాలను తయారు చేస్తున్నారు. వెయ్యి చిన్న విమానాలను ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య అవసరాలకు ప్రవేశపెడతారని, 2025నాటికి పెద్ద విమానం సిద్దమౌతుందని భావిస్తున్నారు. అవి రంగంలోకి వస్తే ఐరోపా ఎయిర్‌బస్‌, అమెరికా బోయింగ్‌లకు పెద్ద పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ లోగా వీలైనన్ని విమానాలను అమ్ముకోవాలని ఆ రెండు కంపెనీలు తొందరపడుతున్నాయి. తమ ప్రభుత్వాల మీద వత్తిడి చేస్తున్నాయి.


వచ్చే ఏడాది నవంబరులో అమెరికా పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల జరగాల్సి ఉంది. చైనాతో ఒప్పందం చేసుకుంటే లొంగిపోయినట్లుగా ట్రంప్‌ గ్యాంగ్‌ ఓటర్లను రెచ్చగొట్టవచ్చని డెమోక్రటిక్‌ పార్టీ భయపడుతోంది. లేకపోతే కార్పొరేట్లు గుర్రుమంటున్నాయి.మరోవైపు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్ధిక వ్యవస్దను నడపాలనే వైఖరితో ముందుకు పోతున్న చైనా నాయకత్వ వైఖరి కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు చతుష్టయంలోని భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలను చైనాకు వ్యతిరేకంగా అమెరికా రెచ్చగొడుతూ దూరం పెంచుతోంది. మరోవైపు తన వ్యాపారాన్ని తాను చక్కపెట్టుకొంటోంది.2021 తొలి ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 36.6శాతం పెరిగి చైనా-అమెరికా వాణిజ్యం రెండు వైపులా రికార్డులను బద్దలు కొట్టి 470బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా నుంచి 48శాతం ఎగుమతులు(111బి.డాలర్లు) పెరిగితే చైనా నుంచి 33.3శాతం(354 బి.డాలర్లు) పెరిగాయి. ఏడాది మొత్తం మీద రెండు దేశాల మధ్య 700 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇది వాణిజ్య యుద్దానికి ముందున్న స్ధాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పుతుందని చెబుతున్నారు.


చైనా నుంచి కంపెనీలు మన దేశం వస్తున్నాయన్న ప్రచారం తెలిసిందే. కరోనా సమయంలో(2020) చైనాలోని తమ అసోసియేషన్‌లోని 95శాతం మంది చైనా మార్కెట్లో లబ్దిపొందారని అమెరికా-చైనా వాణిజ్య మండలి(యుఎస్‌సిబిసి) ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ట్రంప్‌ వైఖరినే బైడెన్‌ కొనసాగిస్తారనే భయం అమెరికన్‌ కార్పొరేట్లలో ఉంది, అందుకే వత్తిడి పెంచారు.అదే జరిగితే చైనా ప్రతిదాడికి దిగితే వాణిజ్యంతో పాటు సామాన్య అమెరికన్లు కూడా ఇబ్బంది పడతారనే భయం వ్యక్తమౌతోంది. అంతర్గతంగా రాయితీలు ఇవ్వటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్ధ కూడా అడ్డుకోలేదు.ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దితో 2025 నాటికి ఒక మైలురాయిని దాటాలని చైనా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ స్ధానిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహిస్తోంది. ఇది కూడా అమెరికన్లకు ఆందోళనకరంగా మారింది. ట్రంప్‌ మార్గంలో పయనిస్తే మరోదారీ, తెన్నూ లేని చోటికి పయనిస్తామని, కనుక వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చర్చలు జరపాలని కార్పొరేట్లు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే సెప్టెంబరు పదిన జో బైడెన్‌-గ్జీ జింపింగ్‌ మధ్య అనేక అంశాలపై ఫోను ద్వారా సంభాషణలు జరిగాయి. పదిహేను రోజుల్లోనేే హుబెయి సిఎఫ్‌ఓ వాంగ్‌ఝౌ విడుదల ఆఘమేఘాల మీద జరిగింది.


అమెరికన్‌ కార్పొరేట్లు బైడెన్‌ సర్కారు మీద మరోవత్తిడిని కూడా ప్రారంభించాయి. ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న వ్యవస్ధను గట్టెక్కించేందుకు ప్రభుత్వం 3.5లక్షల కోట్ల డాలర్లను వివిధ పధకాల మీద ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. అందుకు గాను వాణిజ్య, పారిశ్రామిక సంస్దల నుంచి వసూలు చేసే పన్ను మొత్తాల పెంపుదల, ఇతర చర్యల ద్వారా నిధుల సేకరణ జరపాలన్న ప్రతిపాదనలున్నాయి.ఇదే చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ ఉనికే ప్రశ్నార్దకం అవుతుందని అమెరికా వాణిజ్య మండలి ధ్వజమెత్తింది.దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీవీల్లో ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తోంది. ఈ మొత్తం దేశంలోని 50 రాష్ట్రాల బడ్జెట్లకు రెండు రెట్ల కంటే ఎక్కువని, దీని వలన ఫలితం లేకపోగా మొదటికే ముప్పు వస్తుందని వాణిజ్య మండలి సిఇఓ సుజానే క్లార్క్‌ విమర్శించాడు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని, మద్దతు ఇస్తే ఏ సభ్యుడికీ తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తూ పార్లమెంట్‌ సభ్యులకు ఒక లేఖను కూడా మండలి రాసింది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సిందే అని కొంత మంది ఎంపీలు బహిరంగంగా ప్రకటించారు.


ప్రపంచీకరణ పేరుతో ప్రపంచమార్కెట్లను ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తే అనుకున్నదొకటీ అయింది మరొకటి. ప్రపంచీకరణ శ్రమశక్తి ఖర్చును తగ్గించింది. అది అమెరికా కార్పొరేట్లకు వరంగానూ, కార్మికవర్గానికి శాపంగానూ మారింది. స్ధానిక మార్కెట్ల ద్వారా వృద్ధి సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. అమెరికా వస్తువుల కంటే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం లాభదాయయకంగా మారింది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచీ అంతకు ముందు యాభై సంవత్సరాలతో పోల్చితే అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలు 22శాతం పెరిగాయి.చైనాలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే విధంగా లబ్ది పొందారు. దశాబ్దాల తరబడి క్యూబా, ఉత్తర కొరియా,రష్యా,సిరియా, తదితర దేశాల మీద అమెరికా విధించిన ఆంక్షలు పరిస్ధితిని మరింతగా దిగజారాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. అవన్నీ ఇబ్బందులను భరించాయి తప్ప అమెరికాకు లొంగలేదు. అమెరికా విధించిన ఆంక్షల వలన ఆయా దేశాలు బోయింగ్‌ బదులు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే ఇతర అంశాల్లోనూ జరుగుతోంది. క్రమంగా చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారుతుందని పశ్చిమదేశాలు వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఇప్పుడు అక్కడ బడా సంస్దల మీద నియంత్రణ, ఉమ్మడి సౌభాగ్యం పేరుతో తీసుకుంటున్న చర్యల గురించి అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నాయి.


గత దశాబ్దకాలంలో చైనా సంస్దలు అమెరికా నుంచి 76బిలియన్‌ డాలర్లను సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 13బిలియన్‌ డాలర్లను పొందాయి.2016 నుంచి అమెరికాలోని స్టాక్‌మార్కెట్‌లో వాటాలను విక్రయిస్తున్న చైనా కంపెనీలు రెట్టింపై 400కు చేరాయి. వాటి లావాదేవీల మొత్తం 400 బిలియన్‌ డాలర్ల నుంచి 1.7లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా విదేశాంగ విధానంలో ఆర్ధిక అంశాలు చిన్నచిన్న దేశాలను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. మిలటరీ చర్యలు కూడా ఎలా పరువు తీశాయో ఆప్ఘనిస్తాన్‌ స్పష్టం చేసింది. మిత్రదేశమైన మెక్సికో సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకొనేందుకు ఏకంగా ట్రంప్‌ సర్కార్‌ గోడనే కట్టించిన విషయం తెలిసిందే. చైనా మీద విధించిన ఆంక్షలను ఐరోపాలోని జర్మనీ వంటి దేశాలే ఖాతరు చేయటం లేదు. హువెయి కంపెనీ టెలికాం ఉత్పత్తుల దిగుమతిని వ్యతిరేకించిన జర్మనీ ఇప్పుడు పునరాలోచనలో పడి ఐరోపా యూనియన్‌ మీదనే ఆంక్షలకు వ్యతిరేకంగా వత్తిడి తెస్తోంది. చైనాతో ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది చైనాతో దాని వాణిజ్యం 243 బిలియన్‌ డాలర్లు. ఆర్ధిక ఆంక్షల కొరడాను అమెరికా ప్రయోగిస్తుంటే అదే ఎత్తుగడను చైనా అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా, దక్షిణ కొరియా వంటి అమెరికా అనుకూల దేశాలకు నీవు నేర్పిన విద్యయే అంటూ జవాబిస్తోంది.


మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఎరలు వేసి యువతను ఆకర్షించి వారి చేత తప్పులు చేయించి తమ చక్రబంధంలో ఇరికించుకొని మరిన్ని తప్పులు చేయిస్తాయి.ఆ విషవలయం నుంచి ఎవరైనా బయటపడాలన్నా తమ మీద ఆధారపడటం తప్ప తప్పుకోలేని స్ధితికి నెడతారు. సరిగ్గా అమెరికా కూడా అదే పద్దతులను అనుసరిస్తోంది. పేకాటలో గెలిచేందుకు వేసే ఎత్తుగడల్లో భాగంగా, ఎదుటివారిని మభ్యపెట్టేందుకు కొన్ని పేకలను పడవేయటాన్ని తురుపు ముక్కలు అంటారు. వాటిని చూసి ఎదుటి వారు ఆడితే తప్పుదారి పట్టినట్లే.్ల అమెరికా తన క్రీడలో కూడా అలాంటి తరుపుముక్కలను ఉంచుకుంటుంది. మన దేశం విషాయనికి వస్తే స్వతంత్ర లేదా అలీన విధానాన్ని అనుసరించినపుడు మనకు ఉన్న మిత్రదేశాలెన్ని ఇప్పుడు దూరమయ్యాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆసియాలో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు మన నుంచి దూరం జరిగి చైనాకు సన్నిహితం అవుతున్నాయి.అయినప్పటికీ ప్రస్తుత మనపాలకుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చైనా, లేదా మరొకదేశానికి లొంగిపోవాలని లేదా దాని అనుయాయిగా మారాలని ఎవరూ చెప్పటం లేదు. మన రక్షణ, ప్రయోజనాలూ ముఖ్యం. అమెరికా చెప్పుడు మాటలు విని దాని కోసం మనం ఇరుగు పొరుగు వారితో విబేధాలను కొనితెచ్చుకోవటం సరైన వైఖరికాదు. సరిహద్దు సమస్యను ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా ఆర్చేది కాదు తీర్చేది కాదు.


ఐరోపా యూనియన్‌కు మోటారు వంటి జర్మనీలో ఇటీవల ఒక నివేదిక వెలువడింది. మన అపర దేశభక్తులు దాని గురించి ఒక్కసారి చూడటం మంచిదేమో ఆలోచించండి. బిట్స్‌ అండ్‌ చిప్స్‌ అనే వెబ్‌సైట్‌లో సెప్టెంబరు ఒకటవ తేదీన ఒక వార్త వచ్చింది. దానికి పెట్టిన శీర్షిక ” చైనా విషయంలో మనం అమెరికా అజండాను గుడ్డిగా అనుసరించకూడదు ”. జర్మన్‌ ఎకనమిక్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించిన ఒక నివేదిక మీద సమీక్ష మాదిరి రాశారు. ఐరోపా ఎగుమతి వస్తాదుగా ఉన్న జర్మనీ ఇటీవలి కాలంలో చైనాతో ఓడిపోతోంది అని పేర్కొన్నారు. ఇదే వెబ్‌సైట్‌లో అంతకు ముందు విశ్లేషణ రాసిన సానే వాన్‌డెర్‌ లగట్‌ ఇలా చెప్పారు.” గావుసియన్‌ అనే చైనా కంపెనీ శుభ్రం చేసే రోబోట్లను ఉన్నతమైన నాణ్యతతో అందచేస్తున్నది. వాటన్నింటి కంటే నేను ఒక ప్రధాన పెద్ద భ్రమ గురించి హెచ్చరిక చేయదలచాను.సాంకేతికంగా ఆసియా దేశాల కంటే ముందున్నామని ఇంకా అనుకుంటున్నాము. దాన్ని మనం కాపాడుకోవాలంటే అపహరించకుండా, కొనుగోలు, కాపీ చేయకుండా చూడాలని అనుకుంటున్నాము. మనం ఒక అంశానికి సిద్దపడటం లేదు, అదేమంటే ఉదారవాద మార్కెట్‌లో మన స్వంత చట్టాల ప్రకారమే మన మాదిరే అనేక కంపెనీలు మరింత ఆధునిక ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.”


ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగితే జరిగే పర్యవసానాల గురించి భాగస్వామ్య దేశమని పొగడ్తలు కురిపించిన మనతో లేదా అక్కడికి సైన్యాన్ని పంపిన నాటో కూటమి దేశాలతో కూడా అమెరికా మాట మాత్రం చెప్పకుండా తనదారి తాను చూసుకుంది. మనం బహిరంగంగా తప్పు పట్టకపోగా తాలిబాన్లతో ప్రయివేటు ఒప్పందాన్ని హర్షించాము. చతుష్టయం పేరుతో మన దేశం, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించి చైనాకు వ్యతిరేకంగా నిలబెడుతోంది. జపాన్‌, మనదేశంతో చెప్పకుండానే మిత్రదేశమైన ఫ్రాన్స్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసి ఆస్ట్రేలియాకు తమ అణుశక్తి జలాంతర్గాములను అమ్ముకొనేందుకు బ్రిటన్‌తో కలసి కొత్త కూటమి అకుస్‌ను ఏర్పాటు చేసింది. మూడు సంవత్సరాలుగా హుబెయి సిఎఫ్‌ఓను కెనడాలో నిర్బంధించిన అమెరికా నాటకీయ రీతిలో కేసులు ఎత్తివేసింది. దాని మాట నమ్మి అరెస్టు చేసిన కెనడా, ఆ చర్యను సమర్ధించిన దేశాలన్నీ ఇప్పుడు తలెత్తుకోలేని స్ధితిలో పడ్డాయి. ఇదంతా ఎందుకు అంటే చైనాతో తన వాణిజ్యాన్ని పెంచుకొనేందుకే అన్నది స్పష్టం. అందుకోసం అమెరికన్లు దేనికైనా సిద్దపడతారు. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయయాణించాం. ఎక్కడకు పోతామో తెలియదు. అందువలన మన దేశంలోని అమెరికా గుడ్డి అరాధకులు, భక్తులు ఇప్పటికైనా దాని తోకను వదలి పెట్టటం గురించి ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వగురువా… వినదగునెవ్వరు చెప్పిన !

15 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan, China Factor, imperialism, India foreign policy under narendra modi, Narendra Modi, NATO, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


ఆఫ్ఘనిస్తాన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు జరిగిన ఘోర పరాభవం గురించి ఎంత మూసిపెడదామన్నా, నోళ్లు నొక్కుదామన్నా కుదరటం లేదు. పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు, సమాచారం వరదలా వస్తూనే ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందో, జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. పంజీషర్‌ లోయలో ఉత్తరాది కూటమి(నార్తరన్‌ అలయన్స్‌) కొరకరాని కొయ్యగా ఉంది. అధికారంలో వాటా కావాలని పట్టుబడుతోంది. ఆ కూటమి గురించి ఎలా వ్యహరించాలనే అంశం మీద తాలిబన్లలోని రెండు ప్రధాన ముఠాల మధ్య వివాదం ముదిరి కాల్పుల వరకు వచ్చిందనే వార్తలు నమ్మశక్యం లేవు. కాల్పులు జరగటానికి కారణాలు వేరే ఉండవచ్చు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని రద్దు చేశారు. రష్యా వంటి దేశాల సలహామేరకు అలా చేశారని ఒకవైపు వార్తలు, మరోవైపు పొదుపు కార్యక్రమంలో భాగంగా అలా చేశామని తాలిబన్లు ప్రకటించారు. పోనీ నిరాడంబరంగా అయినా ప్రమాణస్వీకారం చేశారా లేదా ? తెలియదు. అలాంటిదేమీ లేకుండా పాలన సాగిస్తే అదీ కొత్త వరవడే అవుతుంది.


కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదేందుకు పూనుకోవద్దన్నది తెలుగు ప్రాంతాల్లో లోకోక్తి. ఇప్పుడు గోదావరి బదులు అమెరికాను నమ్మి పోవద్దని చెబుతున్నారు. విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారు. మోడీ ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు గనుక పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అనేక మంది అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు. రేపు ఏం జరిగినా చూశారా మేం చెప్పిందే జరిగింది అని తమ జబ్బలను తామే చరుచుకుంటారు.


స్టేట్స్‌మన్‌ అనే ఆంగ్లదిన పత్రిక సంపాదకుడిగా పని చేసిన సునంద కె దత్తా రే(84) తాజాగా ఒక విశ్లేషణ రాశారు. ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఆ విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” భద్రతకు మతం గురించి తెలియదు. హిందూయిస్టు ఇండియా లక్ష్యమైనా ఉగ్రవాదుల దాడులకు నెలవు కాని ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరమైన ప్రభుత్వంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇప్పుడు అమెరికా పొగుడుతూ ఉండవచ్చుగానీ నరేంద్రమోడీ ఆసియా చరిత్రను అవలోకించాలి. అమెరికాతో తృతీయ ప్రపంచ దేశాల సంబంధాలు మృత్యువును ముద్దాడినట్లే అని పదే పదే రుజువైంది. ఇస్లాం మరియు ఉగ్రవాద రాజకీయాలకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హిందూయిస్టు పార్టీ అనుసరించకూడదు. ఇండోనేషియా, పాకిస్తాన్‌ తరువాత 19.5 కోట్ల మంది ముస్లింలకు స్దానం ఉన్న దేశం భారత్‌. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. సహజ భాగస్వాములంటూ అతల్‌బిహారీ వాజ్‌పాయి, అణుఒప్పందంతో మన్మోహన్‌ సింగ్‌, తరువాత చతుష్టయ కూటమి పేరుతో నరేంద్రమోడీ అమెరికాతో ఎంతో సౌఖ్యంగా ఉన్నారు. చతుష్టయం చర్చలతో పాటు సమాంతరంగా అంతకు ముందు లేని సంయుక్త మిలిటరీ విన్యాసాల(మలబార్‌)కు దారి తీసింది.అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో 2007లో ప్రారంభమైన చతుష్టయ కూటమి తనకు వ్యతిరేకమైనదిగా భావించిన చైనా నిరసన తెలిపింది. సదరు కూటమి మిలిటరీ సంబంధాలకు కాదని, చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటం లేదని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాడు చైనా అధినేతగా ఉన్న హు జింటావోకు హామీ ఇచ్చారు.పరిస్ధితులు మారిపోయాయి. లడఖ్‌ ఘర్షణ ముక్కుసూటి తనాన్ని సమర్ధించవచ్చు. అయితే చైనా చరిత్ర మరియు సంప్రదాయాలు అదే విధంగా అమెరికా, ఇతర ఆసియా దేశాలతో దాని సంబంధాల రికార్డును జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉందని పరిస్ధితి చెబుతున్నది.


ఆసియా పాలకులను అమెరికా నట్టేట ముంచిన, మోసం చేసిన ఎన్నో విచారకరమైన ఉదంతాలను నరేంద్రమోడీ గారు తప్పక తెలుసుకోవాలి. దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నగో దిన్‌ దిమ్‌, అతని సోదరుడు నగో దిన్‌ హు మీద జరిగిన మిలిటరీ తిరుగుబాటులో వారు హతమైన ఉదంతాన్ని అమెరికా పట్టించుకోలేదు. మీరు అమెరికాలో ఆశ్రయం పొందుతారా అని హు భార్యను అడిగితే నాకు వెన్నుపోటు పొడిచిన దేశంలో నేను జీవించలేను అని చెప్పింది. దక్షిణ వియత్నాం మరో అధ్యక్షుడు గుయెన్‌ వాన్‌ థీవ్‌ పరిస్ధితిని గమనించి రాజీనామా చేసి తైవాన్‌ పారిపోయాడు.అమెరికా అధ్యక్షుడొకరు ఏ దేశ నియంతను అయినా మా ఒక ఉంపుడు గత్తె కొడుకు అన్నాడంటే అతను దక్షిణ కారియా అధ్యక్షుడు సింగమాన్‌ రీ అయి ఉండవచ్చు. అమెరికా మరియు ఐరాస కమాండర్‌ మార్క్‌ క్లార్క్‌ ఒక రోజు అతన్ని పదవి నుంచి గెంటివేయాలనుకున్నాడు.( అతన్ని సిఐఏ అమెరికా హవాయిలోని హానలూలుకు తరలించింది, అక్కడే చచ్చాడు) అమెరికావదిలించుకొని ఉండకపోతే ఫిలిప్పైన్స్‌ ఫెర్డినాండ్‌ మార్కోస్‌ హానలూలు వెళ్లటం, అక్కడే చచ్చి ఉండేవాడు కాదు( ఇది రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో జరిగింది). అమెరికాతో చేతులు కలిపిన అనేక మందిలో అతనొకడు. ఇరాన్‌ షా అమెరికన్లకు సంకటం తెచ్చాడు. ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు, కోర్టులకు ఒక ప్రామాణికమైన పద్దతి లేదు, నమ్మశక్యం కాని పద్దతుల్లో చిత్రహింసల చరిత్ర ఉందని షా పాలన గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది.( వీడిని సమర్ధించిన అమెరికా పాలకులు ఎంతగా భయపడ్డారంటే పదవీచ్యుతుడైన తరువాత షా అమెరికా వచ్చాడు. న్యూయార్క్‌ ఆసుపత్రిలో స్వంత పేరుతో ఆపరేషన్‌ చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి డేవిడ్‌ డి న్యూసమ్‌ అనే దొంగపేరుతో చేర్పించారు. మెక్సికో, పనామా ఎక్కడకు వెళితే అక్కడ జనం వ్యతిరేకించటంతో చివరికి ఈజిప్టులో ఆశ్రయం ఇప్పించారు.)

అష్రాఫ్‌ ఘనీ(పారిపోయిన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు)ది ఒక అసాధారణ అనుభవం. దోహాలో తాలిబాన్లతో చర్చల నుంచి అమెరికా అతన్ని మినహాయించింది. ట్రంపు మాదిరే బైడెన్‌ కూడా తమ అవసరాల మేరకే వ్యవహరించాడు. కఠినమైన వాస్తవం ఏమంటే చిన్నా చితక భాగస్వాములను అమెరికా పట్టించుకోదు, ఏడు దశాబ్దాల పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న ఫిలిప్పైన్స్‌నే అది వదలివేసింది.భారత సమస్యల మూలాలు దాని భౌగోళిక రాజకీయ స్దానం, సంస్కృతి, గుర్తింపు, ఆకాంక్షల్లో ఉన్నాయి. సీతారామ్‌ ఏచూరి ఒకసారి హెచ్చరించినట్లు మరొక పాకిస్తాన్‌గా మారితే అవి పరిష్కారం గావు. చైనా చెబుతున్నట్లు చతుష్టయం(క్వాడ్‌) ఆసియా నాటో కావచ్చు, కాకపోవచ్చు. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాలను అమెరికా పరిష్కరించుకుంటే, మరిచిపోయిన సీటో( సౌత్‌-ఈస్ట్‌ ఆసియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌), బాగ్దాద్‌ ఒప్పందాలకు పట్టిన గతే పడుతుందనుకొని సిద్దపడాలి. తరువాత ఇంటా బయటా ఉన్న ముస్లింలతో సర్దుబాటు చేసుకోవాల్సిన వాస్తవాన్ని మోడీ సర్కార్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది.” (బ్రాకెట్లలోని అంశాలు నేను జతచేసినవి)
అమెరికా ఎలాంటిదో, దానితో వ్యవహారం గురించి తాజా పరిణామాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలు తెచ్చేవాటిలో యుద్దం ఒకటి. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. గత రెండు దశాబ్దాల్లో అమెరికా యుద్దాలు, వాటిలో పాల్గొన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు ఎనిమిదిలక్షల నుంచి 21లక్షల కోట్ల డాలర్లు. పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త ఒక దానిలో లాభం రాకపోతే మరొక ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. యుద్దం కోసం అంత పెట్టుబడి పెట్టిన దేశం ఒక్కసారిగా తన దుకాణాన్ని మూసుకుంటుందా ? శత్రువులు లేకుండా నిద్రపోతుందా ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తోకముడవటం ఖాయం చేసుకున్న దగ్గర నుంచి అమెరికా యుద్దోన్మాదులు కొత్త రంగాన్ని తెరవటం గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఉగ్రవాదం మీద యుద్దం పేరుతో పశ్చిమ, మధ్య ఆసియాలో ఇప్పటి వరకు కేంద్రీకరించారు. ఇప్పుడు దాన్నుంచి చైనా మీద కేంద్రీకరించారు. తైవాన్‌ జల సంధి, దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు. దానిలో భాగమే చతుష్టయం కార్యకలాపాలు. తైవాన్ను ఆక్రమించేందుకు, దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని దాన్ని అడ్డుకోవాలనే పేరుతో అనేక దేశాలను కూడ గడుతున్నతీరు బహిరంగ రహస్యం. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన ఖర్చును ఇప్పుడు చైనా వైపు మళ్లిస్తారు.2022 సంవత్సరంలో పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ) బడ్జెట్‌ 715బిలియన్‌ డాలర్లుగా బైడెన్‌ ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. దానికి అదనంగా మరో 24బి. డాలర్లతో ఒక పధకానికిపార్లమెంట్‌ ఆయుధ సేవల కమిటీ ఆమోదం తెలిపింది. సెనెట్‌ కమిటీ కూడా అదే పద్దతిలో ఆమోదం ప్రకటించింది.


సునంద దత్తా రే చెప్పినట్లుగా అమెరికా చిన్న దేశాలనే కాదు, పెద్ద వాటిని కూడా పట్టించుకోదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం మీద పోరు సాకుతో దాడులకు దిగింది ఒక్క అమెరికాయే కాదు. నాటో దేశాలు కూడా పాల్గొన్నాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా జరిగిన దాడిలో మరణించిన చివరి పదమూడు మందితో కలిపి 2,461 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. ఇతర దేశాలకు చెందిన వారు 1,145 మంది, వారిలో బ్రిటన్‌ సైనికులు 457, జర్మన్లు 62 మంది చనిపోయారు. ఆ దేశాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా అమెరికా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. విశ్వాసానికి పెద్ద నష్టం జరిగిందని అమెరికాలో జర్మన్‌ మాజీ రాయబారి ఊల్ఫ్‌గాంగ్‌ షింగర్‌ వ్యాఖ్యానించాడు.” ఐరోపాకు నిజమైన గుణపాఠం ఇది. అమెరికా సామర్ద్యం మరియు దాని నిర్ణయాలపై పూర్తిగా ఆధారపడాలా లేదా అంతిమంగా ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక పాత్రధారిగా ఉండాలా లేదా అన్నదాని గురించి ఆలోచన ప్రారంభించగలమా ” అని కూడా అన్నాడు. అమెరికా చలచిత్తంతో నిమిత్తం లేకుండా, అమెరిన్‌-చైనీస్‌ ద్విదాధిపత్యం, స్ధాన భ్రంశం, ప్రాంతీయ శత్రుత్వాలకు మరల కుండా ఐరోపా రక్షణ దళ నిర్మాణం జరగాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ అభిప్రాయపడ్డాడు. కాబూల్‌ నుంచి అమెరికా విమానాలు వెనుదిరిగిన వెంటనే అమెరికా నిర్ణయాలపై ఆధారపడటానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఐరోపా యూనియన్‌ అధికారులు వ్యాఖ్యానించారు.ఐరోపా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, అది జరిగితే నిర్ణయాత్మకం స్వయం ప్రతిపత్తి వస్తుందని, ప్రపంచంలో కార్యాచరణకు పెద్ద సామర్ద్యం సమకూరుతుందని కూడా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం నుంచి బయటపడి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పటమే. అలీన విధానం నుంచి తప్పుకొని అమెరికాకు దగ్గరైన మనం ఇప్పుడు నడి సంద్రంలో ఉన్నాం. ఎటు పోవాలో తేల్చుకోలేక ఇప్పటికీ అమెరికా వైపే చూస్తున్నాం.


అమెరికా, మన దేశం చేసిన తప్పిదాలు, తప్పుడు వైఖరుల కారణంగా దక్షిణాసియాలో, ఇతర ప్రాంతాలలో మన దేశం ఇప్పటికే ఒంటరి అయింది. మరోవైపున మనం నమ్ముకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుందని స్పష్టమైంది. చైనా ప్రభావం పెరగటానికి అమెరికా తప్పుడు వైఖరే కారణం అన్నది అనేక మంది విశ్లేషణ. పసిఫిక్‌ సముద్రం – బాల్టిక్‌ సముద్రాలను కలుపుతూ యూరేసియాలో ఉన్న ప్రపంచ జనాభాలోని 70శాతం మంది, ఉత్పాదకత మీద చైనా ప్రారంభించిన బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ(బిఆర్‌ఐ) ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక్క తుపాకి గుండు కూడా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష కోట్ల డాలర్ల విలువగల ఖనిజ సంపదను అమెరికన్లు చైనాకు అప్పగించారనే అతిశయోక్తులు కూడా వెలువడ్డాయి.ప్రతిదాన్నీ లాభం-నష్టం కోణం నుంచి చూసే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.ఒక వేళ అది నిజమే అయినా దానికి కారకులు ఎవరు ? ఇరాన్‌ విషయమే తీసుకుంటే అమెరికా ఆంక్షల ఆటలో మనం పావులుగా మారినందున చివరికి ఇరాన్నుంచి చమురు కొనుగోలు కూడా నిలిపి అమెరికా నుంచి కొంటున్నాము. తన ఇబ్బందులనుంచి బయటపడేందుకు చైనాతో ఇరాన్‌ 400 బిలియన్‌ డాలర్ల అభివృద్ది పధకాల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ కూడా అదే చేయనుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తమకు విశ్వసించదగిన మిత్రదేశమని తాలిబన్‌ అధిపతి ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో పోల్చితే ఎంతో దగ్గరి సంబంధాలు గలిగిన మన దేశం ఆ స్దానంలో ఎందుకు నిలవలేకపోయింది ? అమెరికా చేసిన పిచ్చిపనికి మనం ఎందుకు నష్టపోతున్నాం.


కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం ఫలితాలు, పర్యవసానాలేమిటి ? దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు జాత్యంహంకార ప్రభుత్వాన్ని అమెరికా బలపరిచింది. పోర్చుగీసు వలసగా ఉన్న అంగోలా విముక్తి కోసం వామపక్ష శక్తులు ప్రారంభించిన సాయుధపోరాటాన్ని అణచివేసేందుకు అమెరికా రెండు దశాబ్దాలపాటు సిఐఏ పర్యవేక్షణలో అమెరికా జోక్యం చేసుకుంది. అనేక దేశాల్లో తమ పలుకుబడిని పెంచుకొనేందుకు నియంతలు, యుద్ద ప్రభువులను అమెరికా అన్ని విధాలుగా బలపరిచింది. మరోవైపున దానికి భిన్నంగా అభివృద్ది పధకాలకు సాయం చేయటం ద్వారా చైనా విధానాలు ఆఫ్రికా ఖండానికి దగ్గర చేశాయి. వాటితో పాటు విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు ఉభయతారకంగా లబ్ది చేకూర్చుతున్నాయి. యూరేసియా, ఆఫ్రికా ఖండంలో చైనా లక్ష కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. జరిగిందేదో జరిగింది. మనం ఎవరికీ లొంగనవసరం లేదు. అమెరికా మెప్పుకోసం ఇతరులను దూరం చేసుకోవటం అసలే తగని పని. వినదగు నెవ్వరు చెప్పిన అన్న వివేచనతో విశ్వగురువుగా వంది మాగధుల పొగడ్తలను అందుకుంటున్న నరేంద్రమోడీ ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా స్వతంత్ర వైఖరితీసుకొనేందుకు వర్తమాన పరిణామాలు దోహదం చేస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మా దేశం సోవియట్‌ కాదు – మాతో పెట్టుకోవద్దు : అమెరికాను హెచ్చరించిన చైనా రాయబారి !

01 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Qin Gang, RUSSIA, UNSC Resolution on Afghanistan, US


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యపై అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్‌ యూనియన్‌ కాదు, మాతో పెట్టుకొనేటపుడు ఆలోచించుకోండి అన్నట్లుగా అమెరికాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ వాషింగ్టన్‌ సభలో హెచ్చరిక. రెండూ మంగళవారం నాడు జరిగాయి. అమెరికా-చైనా సంబంధాలు జాతీయ కమిటీ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన స్వాగత సభలో రాయబారి మాట్లాడాడు. రెండు దేశాలు అపార్దాలకు, తప్పుడు అంచనాలకు, వివాదాలు లేదా ఘర్షణలకు తావివ్వ కూడదు.చారిత్రక అవకాశాలను మనం కోల్పోవద్దు, అన్నింటికీ మించి మనం చారిత్రక తప్పిదాలు చేయవద్దు అన్నారు. చైనా అంటే సోవియట్‌ యూనియన్‌ కాదు, స్వయంకృతం వలన అది కుప్పకూలిందని, ప్రచ్చన్న యుద్ద ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు.


ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని అమలు జరుపుతూనే మరో యుద్ద రంగాన్ని ఎక్కడ ప్రారంభించాలా అనే ఆలోచనలో అమెరికా వ్యూహకర్తలు నిమగమయ్యారు. ప్రచ్చన్న యుద్దం తరువాత జరిపిన అతిపెద్ద సైనిక విన్యాసాల్లో ఒకదానిని ఆగస్టు నెలలో పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా నిర్వహించాయి. పాతికవేల మంది మెరైన్‌లు పెద్ద సంఖ్యలో యుద్దనావలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. మా భాగస్వాములు అది తైవాన్‌ కావచ్చు, అది ఇజ్రాయెల్‌, మరొకటి ఏదైనా మాతో భాగస్వామ్య కలిగిన వాటన్నింటికి బాసటగా నిలుస్తామని అమెరికా అధికారి ప్రకటించాడు. చైనాకు సమీపంలోని జపాన్‌కు చెందిన ఒకినావా దీవుల్లో 50వేల మంది, దక్షిణ కొరియాలో 29వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. తైవాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియాలతో మిలిటరీ సమన్వయానికి మరింత సామర్ధ్యాన్ని అమెరికా జత చేస్తుందని వార్తలు వచ్చాయి.


మరోవైపు తన మిత్రరాజ్యాల పట్ల అమెరికా సంబంధాలలో తీవ్ర అనిశ్చితలను ముందుకు తెస్తాయని కూడా భావిస్తున్నారు. ” అమెరికా విశ్వసనీయత, దాని మీద ఆధారపడటం గురించి జపాన్‌ అవగాహన మీద తీవ్రమైన దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయని టోకియో సమీపంలోని మెకై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ టెసు కొటానీ వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు తూర్పు ఆసియా మీద కేంద్రీకరించేందుకు దృష్టి సారించింది.అయితే అమెరికా అభిప్రాయాన్ని చూస్తే తన మిత్రదేశాలకు ఎంతకాలం మద్దతు కొనసాగిస్తుందో చెప్పలేము అని కూడా అన్నాడు. బైడెన్‌కు ప్రతిస్పందించే తెలివి తేటలు ఉన్నాయా లేదా అని రష్యన్లు లేదా చైనీయులు పరీక్షించబోతున్నారని ఐరోపా వ్యూహాల అధ్యయన సంస్ద సలహాదారు ఫ్రాంకోయిస్‌ హెయిస్‌బర్గ్‌ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా విశ్వసనీయతను అందరూ అంగీకరించటం లేదు అన్నాడు.


ఉగ్రవాద ముఠాలను నిరోధించాలని, ఇతరుల మీద దాడులు, విద్రోహ చర్యలు జరిపేందుకు తమ గడ్డను అడ్డాగా చేసుకోనివ్వొద్దని, దేశం వదలి పోవాలనుకుంటున్న ఆప్ఘన్లను సురక్షితంగా వెళ్లిపోనివ్వాలనే వాగ్దానానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలంటూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఆగస్టు నెలలో మన దేశ అధ్యక్ష పదవి చివరి రోజున ఈ పరిణామం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ? గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష జోక్యం, అంతకు ముందు 23 ఏండ్లు పరోక్ష జోక్యం చేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన, దాన్ని అడ్డాగా చేసుకొని ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు.తాము వ్యక్తం చేసిన ఆందోళనను తీర్మానం ప్రతిబింబింబించటం సంతృప్తి కలిగించిందని మన దేశం పేర్కొన్నది. తీర్మానాన్ని వీటో చేయలేదు గాని చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు .తగినంత కసరత్తు చేసి ఏక గ్రీవానికి ప్రయత్నించకపోవటం లేదా రాజకీయాలు దీని వెనుక ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సెలలో ఆమోదించబోయే మరొక తీర్మానంలో స్పష్టత రావచ్చు. తాలిబన్లను అమెరికాయే గుర్తించి ఒప్పందం చేసుకుంది. అందువలన ఎవరైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఒప్పందానికి, వారు చేస్తున్న ప్రకటనలకు కట్టుబడి ఉండేవిధంగా వత్తిడి చేయటం తప్ప మరొకమార్గం ఏమిటన్నది ప్రశ్న. తాలిబన్లను అధికారికంగా గుర్తించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. కతార్‌లో మన రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబాన్‌ రాజకీయ విభాగనేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెకజారును కలుసుకొని మన వైఖరిని వివరించారు.


ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మధ్య ఆసియాలో అమెరికా శకం ప్రస్తుతానికి ముగిసింది. ఆఫ్ఘన్‌ బదులు మరొక దేశాన్ని తమ స్దావరంగా మార్చుకోవాలని అమెరికా పధకం వేసిందనే వార్తలు వచ్చాయి. ఇరాక్‌ నుంచి వైదొలిగేది లేదని అమెరికాయే బహిరంగంగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో పరాభవం, చావు దెబ్బతిన్నంత మాత్రాన అమెరికా ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావం, ప్రాభవం తగ్గి చైనా, రష్యాలు పై చేయి సాధించనున్నాయి.


భద్రతా మండలి తీర్మానానికి ఈ రెండు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి. ఆఫ్ఘన్‌ దుస్ధితికి తాలిబాన్లు ఎంత బాధ్యులో, వారిని తయారు చేసి వారితో పాటు తాము కూడా సర్వనాశనం చేసిన అమెరికా, ఇతర దేశాలది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తమ నిర్వాకాన్ని విస్మరించి బాధ్యతను ఇతరుల మీద నెట్టేయత్నం ఈ తీర్మానంలో కనిపించిందని అవి చెబుతున్నాయి. అన్ని ఉగ్రవాద ముఠాల పేర్లు ప్రత్యేకించి ఇస్లామిక్‌ స్టేట్‌ మరియు ఉఘుర్‌ ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మువ్‌మెంట్‌ వంటి వాటి పేర్లను తీర్మానంలో చేర్చలేదని అభ్యంతరం తెలిపాయి. అమెరికా బాధ్యతను దోషరహితం చేయటం, ఉగ్రవాద ముఠాలను రెండు తరగతులుగా చేసి కొందరిని మినహాయించటాన్ని రష్యా, చైనా తప్పుపడుతున్నాయి. ఆఫ్ఘన్‌ ఆర్ధిక ఆస్తులను స్ధంభింప చేయటాన్ని రష్యా తప్పు పట్టింది. సంప్రదింపుల సమయంలో రెండు దేశాలూ లేవనెత్తిన అంశాలు, చేసిన సూచనలను పూర్తిగా పట్టించుకోలేదని చైనా పేర్కొన్నది.


ఆఫ్ఘన్‌ వ్యవహారంలో మూడు విధాలుగా అమెరికా, దాని మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఒకటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, రెండవది ప్రజాస్వామిక సంస్కరణలు, బాధ్యతా రహితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వెళ్లిపోవటం. తన తప్పిదాలను గుర్తించకపోగా ఈ స్ధితికి ఇరుగుపొరుగుదేశాలే బాధ్యత వహించాలని మాట్లాడటం. ప్రతి యుద్దంలో అమెరికా తన ఆయుధాలను పరిక్షించుకోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దళ చర్యలో తమ సైనికుల మరణానికి ప్రతిగా జరిపినట్లు చెప్పిన దాడిలో ఉగ్రవాదుల మరణాల సంగతేమోగాని పౌరులు మరణించినట్లు నిర్దారణ అయింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి చర్యల వలన వేలాది మంది అమాయకులు బలైన కారణంగానే సామాన్య జనంలో అమెరికా, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకపోవటం, వారిని వ్యతిరేకిస్తున్న తాలిబాన్ల విధానాలను వ్యతిరేకించటంతో పాటు వారి పట్ల ఒక విధమైన సానుకూలత ఏర్పడటానికి దారి తీసింది.


ఫోర్బ్స్‌ పత్రిక ఆగస్టు 16 నాటి సమాచారం ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు(కొందరి అంచనా మూడు) అంటే రోజుకు 30 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 2,200 కోట్లు) అమెరికా ఖర్చు చేసింది. అమెరికా సైనికులు రెండున్నరవేల మంది మరణించారు.ఆప్ఘన్‌ మిలిటరీ, పోలీసులు 69వేలు, సామాన్య పౌరులు 47వేల మంది మరణించారు. ఆప్ఘన్‌ వ్యవహారం అమెరికా చరిత్రలో చెరిగిపోని మచ్చ, ప్రపంచ వ్యవహారాలను ఎంత దరిద్రంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికీ వెల్లడించింది. అమెరికా కనుసన్నలలోని ప్రభుత్వాలు మూడులక్షల మంది మిలిటెంట్లను నిర్బంధించటం లేదా పౌరజీవనంలోకి అనుమతించాయని అంచనా. ఇప్పుడు వారంతా తిరిగి ఆయుధాలు పట్టుకొని తెగబడితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న.


మన దేశం విషయానికి వస్తే తీసుకోవాల్సిన గుణపాఠం ఏమిటి ? అమెరికా, ఇతర దాని మిత్రపక్షాలు ఏమి చేస్తాయి అనేదానితో నిమిత్తం లేకుండా చైనా-రష్యా అఫ్ఘన్‌ ప్రభుత్వంతో స్వతంత్రంగా వ్యవహరించాలని రష్యన్‌ పరిశీలకుడు అలెగ్జాండర్‌ వి లోమనోవ్‌ చెప్పారు. ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు గనుక వారి మాటలు వినండి- వారి చర్యలను గమనించండి అన్న కన్ఫ్యూసియస్‌ బోధనల సారాన్ని గమనంలో ఉంచుకొని రెండు దేశాలూ వ్యవహరించాలి.దాని అర్ధం చూస్తూ ఉండమని కాదు అని లోమనోవ్‌ అన్నారు. పశ్చిమ దేశాల వార్తా సంస్దలు, మీడియా కథనాలు గత కొద్ది వారాలుగా అతిశయోక్తులను ప్రచారం చేశాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఆఫ్ఘన్‌ పౌరులు తప్ప సామాన్య జనం పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా ఇరుగు పొరుగు దేశాలకు తరలిపోతున్న సమాచారం, పరిస్ధితిగానీ లేదు. తమ దేశాల్లో ఉన్న నగదు, ఇతర ఆస్తులను వినియోగించుకోనివ్వకుండా నూతన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అమెరికా కూటమి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమ దేశాలకు భిన్నంగా తాముంటామని చైనా,రష్యా స్పష్టం చేశాయి. మన దేశం ఇప్పటికైనా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తుందా, అమెరికా తోక పట్టుకొని వెళుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వియత్నాం,ఆఫ్ఘనిస్తాన్‌ – కమ్యూనిస్టులు, కానివారికీ తేడా !!

24 Tuesday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RELIGION, USA, WAR

≈ Leave a comment

Tags

Communists, Taliban, Vietnam and Afghanistan


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకు, దాని తోకపట్టుకు తిరిగిన వారికి ఆఫ్ఘనిస్తాన్లో చెప్పుకోలేని చోటదెబ్బలు తగిలాయి. తమ సైనికులు, పౌరులకు ఎలాంటి హాని లేకుండా దేశం విడిచి పోనివ్వాలనేదే తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం. అయినా అనేక మంది అమెరికన్‌ సైనికులను తాలిబాన్లు చావుదెబ్బలు కొట్టినట్లు వచ్చిన వార్తలను మిలిటరీ అధికారులు పరోక్షంగా అయినా అంగీకరించకతప్పలేదు.అధ్యక్షుడు జో బైడెన్‌ నిస్సహాయ స్ధితిలో తాను దేనికీ హామీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. అంగీకరించిన గడువు ఆగస్టు 31లోగా దేశం విడిచి పోవాల్సిందే లేకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని తాలిబాన్లు హెచ్చరించారు. దాంతో ఎన్నడూ లేని విధంగా తరలింపు ప్రక్రియను చేపట్టారని వార్తలు వస్తున్నాయి. అక్కడేం జరగనుంది. నల్లేరు మీద బండిలా తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అంతర్యుద్దం జరుగుతుందా ? సెప్టెంబరు ఒకటవ తేదీ తరువాత స్పష్టత వస్తుందా ? ఏం జరగనుంది అనేది ఎవరూ చెప్పలేని స్ధితి ఉంది.


తాలిబాన్లు కాబూల్‌ను వశం చేసుకొనేందుకు కనీసం తొంభై రోజులు పడుతుందని అమెరికా సిఐఏ వేసిన అంచనాను మీడియాకు అందించారు. అయితే తొమ్మిది రోజుల్లోపలే పతనమైంది. సిఐఏ పప్పులో కాలేసింది. ఆ సందర్భంగా వచ్చిన వార్తలు, ఫొటోలను పేర్కొంటూ సరిగ్గా వియత్నాం నుంచి అమెరికా సైనికులు పారిపోతున్న మాదిరే దృశ్యాలు ఉన్నట్లు కొందరు వర్ణించారు. ఆ పోలిక సరైనదేనా ? అంతకు మించి ఏమీ లేదా ?
నాలుగున్నర దశాబ్దాల క్రితం అమెరికన్ల దాడిలో వియత్నాంలో సర్వనాశనమైన నాటి సైగాన్‌ పట్టణం మన ముంబయి వంటిది. తరువాత హౌచిమిన్‌ సిటీగా మారి ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. దేశ జిడిపిలో కోటి మంది జనాభాతో ఆ నగరం పరిసరాల నుంచి 22శాతం వస్తున్నదంటే దాని ప్రాధాన్యతను అర్దం చేసుకోవచ్చు.

ఇండో చైనా అంటే ఇప్పటి వియత్నాం, లావోస్‌, కంపూచియా, మయన్మార్‌, థాయిలాండ్‌, చైనాలోని గ్వాంగ్‌జూ ప్రాంతాలు. వీటిలో మొదటి మూడు దేశాలను ఫ్రాన్సు తన వలసలుగా చేసుకుంది. మనం ఇప్పుడు వాడుకలో ఇండోచైనా అని పిలుస్తున్నవి ఈ మూడింటినే. వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మిలిటరీ ఫ్రెంచి దళాలపై దాడులు చేసింది. అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో వియత్నాంను 1945లో స్వాతంత్య్ర దేశంగా కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర వియత్నాం మాత్రమే పూర్తిగా కమ్యూనిస్టులు, జాతీయవాదుల ఆధీనంలోకి వచ్చింది. రాజు తన అధికారాన్ని వదులుకున్నాడు. అయితే ఆ యుద్దంలో జపాన్‌ ఓడిపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఫ్రాన్స్‌ తిరిగి వియత్నాంను ఆక్రమించుకుంది.దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టారు. కమ్యూనిస్టులు విజయం సాధించే అవకాశాలు కనిపించటంతో 1949లో ఫ్రెంచి పాలకులు మాజీ వియత్నాం రాజును రంగంలోకి దించి దక్షిణ వియత్నాంలో సైగాన్‌ రాజధానిగా ఇదే అసలైన ప్రభుత్వం అని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1953లో లావోస్‌, కంపూచియా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ఆరు సంవత్సరాల పాటు అమెరికా మద్దతుతో జరిపిన యుద్దంలో పరాజయం పాలైన ఫ్రాన్స్‌ జెనివా ఒప్పందం చేసుకొని 1954 ఆ ప్రాంతం నుంచి వైదొలిగింది.

1956లో ఎన్నికలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం.ఆ దశలో రంగంలోకి వచ్చిన అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జెనివా ఒప్పందాన్ని తాము అంగీకరించటం లేదని, ఎన్నికలు జరిపేది లేదని ప్రభుత్వం అడ్డం తిరిగింది. అమెరికా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఆయుధాలు చేపట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం యోధుల మీద అమెరికా యుద్దాన్ని ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమెరికన్‌ సైనికులు మరణిస్తుండటంతో వియత్నాం యుద్దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంతో 1968లోనే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ శాంతి ప్రతిపాదనలు చేశాడు. మరోవైపున దాడులు కొనసాగించాడు. దశలవారీ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. యుద్దం జరుగుతుండగానే 1969 సెప్టెంబరు రెండున 79 సంవత్సరాల వయస్సులో హౌచిమిన్‌ మరణించారు. అయినా కమ్యూనిస్టులు ముందుకు సాగిపోయారు. శాంతి గురించి మాట్లాడిన తరువాత ఏడు సంవత్సరాలు దాడులు చేసి 1975లో అమెరికా పారిపోయింది. అఏడాది ఏప్రిల్‌ 29న సైగాన్‌ విమానాశ్రయం నుంచి ఒక్కరోజే ఏడువేల మంది చివరి అమెరికన్‌ సైనికులు, వారి తొత్తులను తరలించారు.

సరిగ్గా ఇటీవల కాబూల్‌లో కనిపించిన దృశ్యాలే అప్పుడూ దర్శనమిచ్చాయి. అందుకే కొందరు నాటి నేటి ఉదంతాలను పోల్చారు. మరుసటి రోజు సైగాన్‌ కమ్యూనిస్టుల వశమైంది. అదే రోజు సైగాన్‌ నగరాన్ని హౌచిమిన్‌ పేరుతో తిరిగి నామకరణం చేశారు. ఈ యుద్దంలో అమెరికన్లు ఇరవై లక్షల మంది వియత్నాం మిలిటరీ, సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. వేల టన్నుల రసాయనిక బాంబులు వేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను సాగుకు , నీరు తాగేందుకు పనికిరాకుండా చేశారు. అమెరికా యుద్ద చరిత్రలో అత్యధికంగా 58వేల మంది తన సైనికులను కోల్పోయింది. లక్షలాది మంది మానసిక రోగులుగా తయారయ్యారు. తమకు తొత్తులుగా పనిచేసిన వేలాది మంది వియత్నామీయులకు అమెరికా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతున్నారని చెబుతున్నవారు కూడా అలాంటి వారే. తాలిబాన్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అమెరికా సేనలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాలిబాన్లు వదలివేసే అవకాశం లేదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వీలైతే అక్కడికి పోవాలని చూస్తున్నారు. అమెరికా, దానితో పాటు యుద్దంలో పాల్గొన్న ఐరోపా దేశాలు తప్ప మిగిలిన దేశాలేవీ వారికి ఆశ్రయం కల్పించే లేదా శరణార్ధులుగా అంగీకరించే అవకాశం లేదు.


పరాభవం పాలైన అమెరికా తరువాత కాలం ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక ఐరోపా దేశాలతో కలసి వియత్నాం మీద ఆర్ధికదాడిని ప్రారంభించింది. వాణిజ్య ఆంక్షలతో పాటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. చివరికి ఫోన్‌, మెయిల్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో లేకుండా చేసింది.1986లో వియత్నాం సంస్కరణల బాట పట్టి విదేశీ, ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించింది. కార్పొరేట్ల వత్తిడి మేరకు అనివార్య పరిస్ధితిలో 1994లో ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ వియత్నాంను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడికా చరిత్రకెక్కాడు.


అమెరికా విదేశాంగ , మిలిటరీ విధానాలు ఎంత లోపభూయిష్టమైనవో, అదెంత సంక్షోభంలో ఉందో తాజా ఆప్ఘన్‌ ఉదంతం కూడా నిర్ధారించింది. మూడులక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసి తనకు అనుకూలమైన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదు. ఇంతా చేసి పరువు పోగొట్టుకొని తమ ప్రభుత్వం సాధించింది ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అమెరికా సమాజంలో తలెత్తింది. అసలు అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఎందుకు ముజాహిదీన్లు, తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది ? మీడియాలో ఇరవై సంవత్సరాల గురించే చెబుతున్నారు.1970దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ముజాహిదీన్ల పేరుతో అక్కడి భాషా, తెగల నేతలను రెచ్చగొట్టటంలో అమెరికా పాత్రను మూసిపెడుతున్నారు. ఆ సమయంలో అమెరికన్ల చేతిలో పాకిస్తాన్‌ కీలుబొమ్మగా ఉంది. ఆ కారణంగా అఫ్ఘన్‌ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌ అక్కడ స్ధిరపడిన తరువాత తమ దేశంపై కూడా దాడి చేయవచ్చనే తప్పుడు అంచనాకు పాక్‌ నాయకత్వం వచ్చింది. ఆ కారణంగానే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చేరదీసి శిక్షణ ఇచ్చింది.

సోవియట్‌ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా వారు ఉపసంహరించుకున్న తరువాత కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా అంతకు ముందు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాడులు చేసిన వారందరూ ఎవరికి వారు తమదే అక్షయ పాత్ర అన్నట్లుగా కీచులాడుకున్నారు. ఈ స్ధితిలో తాము స్వచ్చమైన పాలన అందిస్తామని తాలిబాన్లు పుట్టుకు వచ్చారు. కుమ్ములాటలు లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రారంభమయ్యారు. తమ అవసరాల కోసం, అమెరికా ఎత్తుగడల ప్రకారం తాలిబాన్లకు శిక్షణ ఇవ్వటమే కాదు, ముజాహిదీన్‌ నేతలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్దాన్‌ వేల మంది కిరాయి మూకలను కూడా అఫ్ఘనిస్తాన్‌లోకి పంపింది. అదే విధంగా వారు సృష్టించిన ఐఎస్‌ తీవ్రవాదులు తరువాత ఏకు మేకయ్యారు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని పెంజేష్వర్‌ లోయలో తాలిబాన్లను ప్రతిఘటిస్తున్న దేశ ఉపాధ్యక్షుడు సాలేV్‌ా వెనుక ముజాహిదిన్ల ఒక ముఠానేత అహమ్మద్‌ షా మసూద్‌ సోదరులు, కుమారులు ఉన్నారు. ఇతర ముుఠాలతో రాజీచేసుకొని అధికారానికి వచ్చిన మసూద్‌ను 2001 సెప్టెంబరు తొమ్మిదిన విషమిచ్చి చంపారు. తరువాత రెండు రోజులకే న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం మీద ఆల్‌ఖైదా ఆత్మాహుతి విమానదాడికి పాల్పడింది. మసూద్‌ హత్యకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. ఆ దాడిని ఆసరా చేసుకొని తాలిబాన్లు, ఆల్‌ఖైదాను అంతమొందించాలనే పేరుతో అమెరికా అదే ఏడాది జోక్యం చేసుకొని రెండు దశాబ్దాలు దాడులు చేసింది.ఆల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది, అతని అనుపానులు తెలియచేసి హతమార్చేందుకు సహకరించింది పాకిస్తాన్‌ అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు మసూద్‌ అనుచరులకు నాయకత్వం వహిస్తున్న సాలేV్‌ాకు గతంలో అమెరికా సిఐఏ శిక్షణ ఇచ్చి ఆఫ్ఘన్‌ గూఢచార వ్యవస్ధ అధిపతిగా ఏర్పాటు చేసింది.తరువాత ఉపాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న ఆ ముఠాకు అమెరికా మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.


వియత్నాం-ఆఫ్ఘన్‌ పరిణామాలను చూసినపుడు అమెరికా ఆయుధ శక్తి ఆదేశాల మీద పని చేయలేదు. ఒక చోట కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తే మరొక చోట మతవాదులు ఆపని చేశారు. అమెరికాను తరిమివేసిన తరువాత కమ్యూనిస్టుల నాయకత్వంలోని వియత్నాం వినాశనం నుంచి దేశాన్ని తిరిగి నిర్మించి నేడు అభివృద్ది బాటలో ఎలా నడుస్తున్నదో చూస్తున్నాము. ఆప్ఘనిస్తాన్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత ఏర్పడిన ముజాహిదీన్ల,తాలిబాన్ల ప్రభుత్వం, గత రెండు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం గానీ దేశ ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు దశాబ్దాలలో పరిస్ధితి దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది అమెరికన్‌ సైనికులు మరణించినప్పటికీ దానికి నాలుగు రెట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘన్‌ మిలిటరీ, పోలీసుల శిక్షణకు 90బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఫలితం లేదని స్పష్టమైంది. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేందుకు పది బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసిన తరువాత నల్లమందు సాగు పెరిగింది. ఆర్ధిక వృద్ధికి 24బి.డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మూడులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే లాభపడింది అమెరికన్‌ కంపెనీలు, ఆఫ్ఘనిస్తాన్‌లో అవినీతి పరులు తప్ప మరొకరు కాదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు గత రెండు దశాబ్దాలలో 104 బిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. ఆఫ్ఘన్‌ పార్లమెంటులో తొలి మహిళా సభ్యురాలు మలాలై జోయా అమెరికా సేనల ఉపసంహరణకు ముందు రాసిన ఒక వ్యాసంలో తమకు ముగ్గురు శత్రువులున్నారని పేర్కొన్నారు. తాలిబన్లు, ప్రభుత్వ ముసుగులో ఉన్న యుద్ద ప్రభువులు, అమెరికా మిలిటరీ అని పేర్కొన్నారు. ఇప్పుడు తాలిబాన్లు తప్ప మిగిలిన ఇద్దరు శత్రువులు లేరు.తాలిబాన్లు దేశాన్ని బాగు చేస్తారా ? గతంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేసే అవకాశమూ కనిపించటం లేదు. అమెరికాను తరిమివేయటంలో వియత్నాంతో పోలిక ఉండవచ్చు గానీ అభివృద్ది, జనం విషయంలో తాలిబాన్లకు అలాంటి లక్షణాలు, లక్ష్యమూ లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసహనంతో ఉన్న అమెరికా -చైనా మీద యుద్దానికి దిగుతుందా !

12 Thursday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

US and China, US war With China, world superpowers


ఎం కోటేశ్వరరావు


అమెరికన్లు ఇప్పుడు అసహనంతో ఉన్నారు . ప్రపంచంలో తిరుగులేని శక్తి అన్న భావన క్రమంగా తగ్గిపోతోంది. దాని అర్దం అది బలహీనపడిందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని ప్రతి చిన్న దేశమూ సవాలు చేస్తోంది. అందువలన చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని చూస్తోందా ? అందుకుగాను చేయబోయే తదుపరి యుద్దం చైనాతోనా ? దానికి అనుగుణ్యంగానే పావులు కదుపుతున్నారా ? రెండవ ప్రపంచ యుద్దరంగం ఐరోపా అయితే మూడవ యుద్దం ఆసియా కేంద్రంగా జరగనుందా ? ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్‌ రెండవ యుద్దానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారిపోతోందని భావిస్తున్న అమెరికా తెగింపు మూడవ యుద్దానికి దారి తీస్తుందా ? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలుగానే ఇప్పుడు కనిపించవచ్చుగానీ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే నిజంగానే యుద్దం జరుగుతుందా? సామ్రాజ్యవాద కార్పొరేట్‌ల లాభాల కోసం వాటి చౌకీదార్లుగా ఉండే పాలకులు ఎంతకైనా తెగిస్తారన్నది గత అనుభవం. ఇప్పుడు యుద్దం లాభమా ? ఆ వాతావరణం సృష్టించి మార్కెట్‌ వాటాను దక్కించుకోవటం ముఖ్యమా అన్న మధనం జరుగుతోంది !


మరోవైపు తమ జోలికి వస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనా తన వ్యతిరేకులకు సందేశాలు పంపుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు(9 నుంచి 13వ తేదీ) చైనాలో జరిపే రష్యాతో కలసి జరిపే సంయుక్త మిలిటరీ విన్యాసాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక దేశంతో జరిపే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె-20 యుద్ద విమానాలను తరలించటం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అంబుల పొదిలో ఇవి కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలోని నింగ్జియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ద విమానాలతో పాటు బడా రవాణా విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్‌యు-30 ఫైటర్‌ జెట్‌లు గతనెలలోనే ఇక్కడకు చేరుకున్నాయి. ఉభయదేశాల నిపుణులు, సిబ్బంది ఆయుధాల ప్రయోగం, మెళకువలను తెలుసుకుంటారు. యుద్ధ రంగంలో ఎలా వ్యవహరిస్తారో అదేమాదిరి ఇక్కడ ఆయుధాలను ప్రయోగించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. పదివేల మంది మిలిటరీ సిబ్బంది దీనిలో పాల్గొంటారు. ఈ చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, సవాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నత స్ధాయికి చేరినట్లు ప్రదర్శితం అవుతుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ విభాగాల సంక్లిష్టమైన సైనిక విన్యాసాలకు, శిక్షణకు అనువుగా ఉంటుంది. గత ఏడాది రష్యాలోని కవకాజ్‌ ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగాయి. వాటిలో రష్యా తన ఆధునిక ట్యాంకులు, క్షిపణులు, ఇతర ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది.


ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న వారు అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. వాటిని వేటిని కొట్టిపారవేయలేము, అలాగని యథాతధంగా స్వీకరించలేము. ఆసియా కీలకం లేదా ఇరుసు అన్న సామ్రాజ్యవాదుల పధకం ఎప్పుడో ప్రారంభమైంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా కొనసాగుతోంది. దానిలో భాగంగానే చైనా చుట్టూ వందలాది సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. మూడింట రెండువంతుల నౌకా, వైమానిక దళాలను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి తరలిస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంత పెద్ద మిలిటరీ కేంద్రీకరణ లేదు.ఇరవై ఒకటవ శతాబ్దివిజయాన్ని స్వంతం చేసుకొనేందుకు చైనాతో పోటీ పడుతున్నామని జోబైడెన్‌ పార్లమెంట్‌ తొలి ప్రసంగంలోనే చెప్పాడు.ఐరోపాలో నాటోతో ఎలా చేస్తున్నామో ఆసియాలో కూడా ఇండో-పసిఫిక్‌ అలాంటిదే అని కూడా దాచుకోకుండా చెప్పాడు. చైనాను బూచిగా చూపి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచివేస్తున్నారు. ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికా మూడు దశాబ్దాల తరువాత అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.


దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఇటీవలి కాలంలో అమెరికా యుద్ద నౌకలు పదే పదే సంచరిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టటం ఒకటైతే, ఆ ప్రాంత అనుపానులు-చైనా కదలికల మీద కన్నువేయటం రెండవది, చూశారా చైనా సమీపంలోకి మేము వచ్చాం అని పరిసర ప్రాంతదేశాలలో విశ్వాసం కలిగించే లక్ష్యం వంటివి ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, మేము సైతం యుద్ద అగ్నికి అన్నట్లుగా ఈ ప్రాంతంలో రెండు యుద్ద నౌకలను శాశ్వతంగా ఉంచుతామని జపాన్‌తో కలసి బ్రిటన్‌ ప్రకటించింది.ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదని చెబుతున్నప్పటికీ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ కూటమిని ఆసియా నాటోగా మార్చాలన్న ఎత్తుగడ ఉంది. తైవాన్‌ విలీనానికి చైనా బలప్రయోగం చేయనున్నదనే ప్రచారం వెనుక కూడా తమ మిలిటరీ చర్యలను సమర్దించుకొనేందుకే అన్నది స్పష్టం. తైవాన్‌ రక్షణకు తాము, అమెరికా ఉమ్మడిగా వ్యవహరిస్తామని జపాన్‌ ఉప ప్రధాని తారో అసో చెప్పాడు. తైవాన్‌ సమీపంలోని ఒకినావా, ఇతర జపాన్‌ దీవుల్లో 50వేల మంది సైనికులతో అమెరికా అనేక స్దావరాలను నిర్వహిస్తున్నది. అమెరికాలోని ఇండో-పసిఫిక్‌ వ్యవహారాల అధిపతి కర్ట్‌ కాంప్‌బెల్‌ మాట్లాడుతూ తొలిసారిగా తమ వ్యూహాత్మక, ఆర్ధిక ప్రయోజనాలు, మిలిటరీ కేంద్రీకరణను ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి మళ్లిస్తున్నామని వెల్లడించాడు. ఒబామా హయాంలో పన్నెండు సార్లు యుద్ద నావలను తైవాన్‌ జలసంధివైపు నడిపిస్తే ట్రంప్‌ 13సార్లతో ఆ రికార్డును తిరగరాశాడు. బైడెన్‌ ఆరునెలల్లోనే ఏడుసార్లు నడిపి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నాడు.


తన ఉపగ్రహం లేదా తొత్తు దేశమైన ఇజ్రాయెల్‌ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే పెగాసస్‌ నిఘా, చొరబాటు గురించి అమెరికా ఇంతవరకు స్పందించలేదు, అనధికారికంగా జర్నలిస్టుల మీద నిఘావేయటాన్ని ఖండిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించింది.కానీ అదే అమెరికా గతంలో రష్యా మీద, ఇప్పుడు చైనా మీద రుజువు కాని ఆరోపణలతో ఆంక్షలకు తెగబడుతోంది. తమ దేశ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జోక్యం చేసుకున్నట్లు, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ను దెబ్బకొట్టేందుకు, సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఇప్పుడు పెగాసెస్‌ మీద మౌనం ఎందుకు ? చైనాకు వ్యతిరేకంగా సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ(సిఎన్‌ఏఎస్‌) పేరుతో ఆసియా ఇరుసు పధకాన్ని రూపొందించిన కాంప్‌బెల్‌, యుద్ద నేరగాడు మైఖేల్‌ ఫ్లోర్‌నోరు ఏర్పాటు చేసిన సంస్ధకు పెద్ద మొత్తంలు మైక్రోసాఫ్ట్‌ నిధులు ఇచ్చింది. యుద్దమంటూ వస్తే 72 గంటల్లో యావత్‌ చైనా పౌర, మిలిటరీ నౌకలను నాశనం చేసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని పెంటగన్‌కు సమకూర్చటమే తమ లక్ష్యమని బహిరంగంగానే చెప్పాడు.ఈ సంస్ద, దానితో సంబంధాలు ఉన్న అనేక మంది ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంలో తిష్టవేశారు.ఈ సంస్ధకు అమెరికా విదేశాంగశాఖ,తైవాన్‌ ప్రభుత్వం, నార్త్‌రాప్‌ గ్రుమన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, కామ్‌కాస్ట్‌, ఎక్సాన్‌, మాస్టర్‌కార్డ్‌, అమెరికాలోని జపాన్‌ రాయబార కార్యాలయం, సిటీగ్రూప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, రేథియాన్‌, జార్జిటౌన్‌ యూనివర్సిటీ వంటి సంస్దలు పెద్ద మొత్తాలలో నిధులు అందచేస్తున్నాయి. ఇలాంటి సంస్ధలు ఒక్క చైనాకే వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అనేక దేశాలలో అమెరికన్‌,మిలిటరీ, కార్పొరేట్లకు, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియావంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. రష్యాకు వ్యతిరేకంగా 2014లో దాని ముంగిట ఉన్న ఉక్రెయిన్‌లో నయా నాజీలను అధికారంలో కూర్చోబెట్టాయి.ఇలా అనేక దేశాల్లో వ్యవహరిస్తున్నాయి.


ప్రపంచంలో ప్రతివారి నుంచి తమకు ప్రమాదం ఉందనే ప్రచారంతో అమెరికన్లను మభ్యపెట్టి ఆ దేశ పాలకులు 70దేశాలలో 800వందల సైనిక స్దావరాలు, కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖండాంతర క్షిపణులు, మధ్యశ్రేణి అణ్వాయుధాల పరిమితి ఒప్పందం, గగనతలాన్ని స్వేచ్చగా ఉంచాలనే ఒప్పందాల నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది.ఇది ఆయుధ పోటీకి దారితీస్తోంది. రెండువేల సంవత్సరం వరకు అమెరికా తన సేనలను ప్రధానంగా జర్మనీ, ఉత్తర ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలో అధికంగా మోహరించింది.2011 సెప్టెంబరులో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి తరువాత మధ్యప్రాచ్యంలో కేంద్రీకరించారు. ఒక దశలో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్ష మంది చొప్పున అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తరువాత తూర్పు ఆసియాలో మోహరించారు.


సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించిన రిపబ్లిక్‌లు మిలిటరీల్లో 50శాతం వరకు తగ్గించాయి. ఇదే సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌, మన దేశం 40,30,15శాతం చొప్పున మిలిటరీని, బడ్జెట్లను పెంచాయి.జిడిపిలో ఒకశాతం లోపుగానే ఖర్చు చేయాలని స్వయంగా విధించుకున్న నిబంధనను జపాన్‌ పక్కన పెట్టింది.తనను చక్రబంధంలో బిగించేందుకు అమెరికా పూనుకున్నదని అర్ధం చేసుకున్న చైనా తన బలగాలను గణనీయంగా పెంచుకుంటున్నది. వాటికి సంబంధించి అంచనాలే తప్ప నిర్ధిష్ట సమాచారం బయటికి తెలియదు.1995లో కేవలం 50 స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న చైనా 2019లో 750 నుంచి 1500వరకు, 950 మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు సమకూర్చుకున్నట్ల్లు వార్తలు వచ్చాయి.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికన్లు చేసిన ప్రతి యుద్దంలోనూ, ప్రతి చిన్న దేశం చేతిలోనూ ఓడిపోయారు. అలాంటిది చైనాతో పెట్టుకొని నెగ్గుకు రావటం అన్నది కలలో మాట.మొదటి ప్రపంచ యుద్దంలో ఓటమి, విజేతలు రుద్దిన ఒప్పందాలు జర్మన్‌ కార్పొరేట్ల అవకాశాలను దెబ్బతీసిన పరిస్ధితి, దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్‌ మాదిరి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం చైనాకు లేదు. తన ప్రయోజనాల రక్షణకు వెనుకడుగువేసే అవకాశమూ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా తప్పుకున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆసియాలో తన ప్రయోజనాల కోసం మరొక చోట దుకాణం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది ఆ ప్రాంత దేశాలతో పాటు రష్యా, చైనాలకు ముప్పుతెచ్చే పరిణామం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d