• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

తైవాన్‌పై తాజా వివాదం 3 : ఉలిపికట్టె అమెరికా – సంయమనం పాటిస్తున్న చైనా !

17 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, Joe Biden, Taiwan Matters, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


తైవాన్‌ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది. అమెరికన్‌ పార్లమెంటు దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని పర్యటనకు పంపి చైనా అడ్డుకుంటే రచ్చ చేయాలని చూసింది. సంయమనం పాటించిన చైనా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తైవాన్‌ జలసంధిలో మిలిటరీ డ్రిల్సు నిర్వహిస్తున్నది. అవి జరుగుతుండగానే ఏం చేస్తారో చూస్తాం అన్నట్లుగా కొంత మంది ఎంపీలను తైవాన్‌ పంపిన అమెరికా తమ నౌకా దళాన్ని చైనా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి పంపనున్నట్లు ప్రకటించింది. తన సత్తా ఏమిటో చూపేందుకే చైనా డ్రిల్సు నిర్వహిస్తున్నది. వాటిలో భాగంగా సముద్రంలో నాటిన మందుపాతరలను తొలగించే విన్యాసాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నది. గత నాలుగు నెలలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా మిలిటరీలో ప్రవేశపెట్టిన హెజియన్‌, చిషుయి అనే నౌకలు వీటిలో పాల్గొన్నాయి. ఇవి నీటి మీద తేలుతున్న మందుపాతరలను తొలగించటంలో విజయవంతమైనట్లు వార్తలు. సముద్రాల్లో పైన తేలే వాటితో పాటు నీటిలో ఉండే మందుపాతరలు కూడా ఉంటాయి. పేరుకు రెండే పాల్గొన్నా వాటికి మద్దతుగా అనేక నౌకలు ఇతర పనులు నిర్వహించాల్సి ఉంది.తాజా విన్యాసాలు జరుగుతుండగా సమీపానికి వచ్చిన గుర్తు తెలియని ఒక విదేశీ నౌకను హెచ్చరించి పంపినట్లు చెబుతుండగా అది అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు వచ్చినది కావచ్చని వార్తలు. కొన్ని దేశాలు చేపలు పట్టే నౌకల పేరుతో నిఘా బృందాలను పంపటం తెలిసిందే.


మందుపాతరలను తొలగించే డ్రిల్సు నిర్వహించాల్సిన అవసరం చైనాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న.గత ఏడు దశాబ్దాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ను సైనికంగా పటిష్టపరుస్తున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్న అక్కడి ప్రభుత్వం ప్రతిఘటనకు దిగవచ్చని, దానికి మద్దతుగా అమెరికా,జపాన్‌, మరికొన్ని దేశాలు రావచ్చని చైనా భావిస్తున్నది. బలవంతంగా విలీనానికి పూనుకుంటే తాము మిలిటరీని పంపుతామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్‌ విలీనానికి తప్పనిసరైతే బలప్రయోగానికి పూనుకుంటామని తాజాగా ఒక శ్వేత పత్రంలో ప్రకటించిన చైనాకు మందుపాతరలను కనుగొనటం, తైవాన్ను ఏ విధంగా చుట్టుముట్టాలనే ఎత్తుగడలు అవసరం కావచ్చని, ఆకసరత్తులో భాగంగానే విన్యాసాలని భావిస్తున్నారు. చైనాను అడ్డుకొనేందుకు చుట్టూ మందుపాతరలను అమర్చేందుకు తైవాన్‌కు అమెరికా సాయం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మందుపాతరలను అమర్చే నౌకను తైవాన్‌ మిలిటరీకి అందించారు, మరో మూడింటిని సిద్దం చేస్తున్నారు. చైనా మీద వత్తిడి తెచ్చేందుకు పచ్చ సముద్రం తదితర ప్రాంతాల్లో మందు పాతరలను అమర్చాలని అమెరికా నిపుణులు సలహా ఇచ్చారు. రానున్న వారాల్లో తైవాన్‌ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇది చైనాను మరింతగా రెచ్చగొట్టేందుకు, తైవాన్‌కు భరోసా ఇచ్చేందుకు అన్నది స్పష్టం.


దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తిష్టవేసిన రోనాల్డ్‌ రీగన్‌ అనే విమానవాహక యుద్ద నౌక పరిస్థితులను గమనిస్తున్నదని పేర్కొనటంతో పాటు ఈ నెల తొమ్మిదిన చైనాకు సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో అమెరికా-జపాన్‌ వైమానిక దళ డ్రిల్లు నిర్వహించారు. సాంకేతికంగా తైవాన్ను ఒక దేశంగా అమెరికా గుర్తించనప్పటికీ అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్నది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లులో తైవాన్ను నాటో ఏతర ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నది. తైవాన్‌ విధాన చట్టం 2022 ప్రకారం తైవాన్‌కు 450 కోట్ల డాలర్లు భద్రతాపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.


పైకి ఏమి చెప్పినప్పటికీ చైనా మిలిటరీ సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిందని పశ్చిమ దేశాల మిలిటరీ నిపుణులు, విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం,ఆయుధ కార్పొరేట్‌ సంస్థల నిధులతో నడిచే సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ చైనా పవర్‌ ప్రాజెక్టు పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది.దానిలో చైనా వద్ద ఉన్న పలు రకాల క్షిపణులను ఉటంకిస్తూ పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. మిలిటరీ శక్తికి సాంప్రదాయ క్షిపణుల అవసరం పెరుగుతున్నది.వందలు, వేల కిలోమీటర్ల దూరంలో వాటిని మోహరిస్తున్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఏ) ప్రపంచంలో భూమి మీద నుంచి ప్రయోగించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసిన దేశంగా చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో చైనా క్షిపణి శక్తిని చూస్తే సాధారణ నిర్దుష్టతతో కూడిన స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. తరువాత సంవత్సరాలలో దీర్ఘశ్రేణి, భిన్నమైన ఖండాంతర, క్రూయిజ్‌ క్షిపణులను రూపొందించింది. అవి సాంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకుపోగల సత్తా కలిగినవి. తైవాన్‌తో సహా భూ లక్ష్యాలను దెబ్బతీయగలిగినవి. అమెరికా క్షిపణులను మోసుకుపోగల వాటిని కూడా నాశనం చేయగలినవి. అత్యాధునిక పశ్చిమ దేశాల క్షిపణి వ్యవస్థలలోకి కూడా దూసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను కలిగి ఉంది. ఒక వేళ పశ్చిమ దేశాలక్షిపణులను దెబ్బతీసే సత్తాలేదు అనుకున్నా వాటిని పనికి రాకుండా చేయగలవని ఆ పత్రంలో పేర్కొన్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు చైనా తన క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న ఎస్‌-400 రక్షణ వ్యవస్థలను ఆమెరికా ఆంక్షలను ధిక్కరించి మన దేశం, టర్కీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.వీటితోనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్లో ముందుకు పోతున్నది. 2018-20 మధ్య రెండు ఎన్‌-400 వ్యవస్థలను చైనా కొనుగోలు చేసింది. అంతే కాదు రష్యా ఎస్‌-300 వ్యవస్థ ప్రాతిపదికన చైనా స్వంతంగా రూపొందించేందుకు పూనుకుంది. వాటిలో అమెరికా వద్ద ఉన్న పేట్రియాటిక్‌ వ్యవస్థలలో ఉన్న వాటిని కూడా చేర్చేందుకు పని చేస్తున్నది. ఇవి ఎలా పని చేసేదీ ఇంతవరకు పరీక్షలు జరపలేదు.


చైనా జరిపిన మిలటరీ డ్రిల్స్‌ను తొలుత ఒక అల్లరిగా వర్ణించిన అమెరికా ఇప్పుడు బలవంతంగా విలీనం చేసుకొనేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నదంటూ లోకం ముందు గుండెలు బాదుకుంటూ చైనాను దోషిగా చూపేందుకు పూనుకుంది. మెల్లమెల్లగా తైవాన్‌ ఆక్రమణకు పూనుకుంటోందని ఆరోపిస్తోంది. తైవాన్ను దిగ్బంధనం గావిస్తే దాని రేవులు ప్రభావితమై ఆర్ధికంగా చైనా నష్టపోతుందని కొందరు హెచ్చరికలతో కూడిన బెదిరింపులకు పూనుకున్నారు. చైనా ఆ మంచి చెడ్డలను ఆలోచించలేనంత అమాయకంగా లేదు. ఆ పరిస్థితి తలెత్తితే అది చైనాతో పాటు ఐరోపా, అమెరికా అనేక దేశాలకూ నష్టదాయకమే.


చైనా వద్ద ఉన్న మిలిటరీతో పోలిస్తే తైవాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు చాలా తక్కువ.2019 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అది పెద్దది చైనా మిలటరీ.ఇరవై లక్షల మంది సైనికులున్నారు. తైవాన్‌ వద్ద 1.7లక్షల మంది ఉన్నారు. చైనా వద్ద ఐదు లక్షల మంది రిజర్వు సైనికులుంటే తైవాన్‌ వద్ద మాత్రం పదిహేను లక్షలు ఉన్నారు. పారామిలిటరీ దళాలు చైనా వద్ద 6.24లక్షలు కాగా తైవాన్‌ వద్ద కేవలం 11,500 మంది మాత్రమే. చైనా వద్ద 5,250 టాంకులుండగా తైవాన్‌ వద్ద 1,110, చైనా సాయుధశకటాలు 35వేల కాగా తైవాన్‌ వద్ద 3,472 ఉన్నాయి. చైనా వద్ద విమానాలు 3,285 కాగా, వాటిలో జట్‌లు 1,200, స్పెషల్‌ బాంబర్లు 450, రవాణాకు 286 ఉండగా, తైవాన్‌ వద్ద 741 విమానాలు వాటిలో జట్‌లు 288, 19 రవాణా విమానాలున్నాయి. జలాంతర్గాములు చైనా వద్ద 79, తైవాన్‌ వద్ద నాలుగు, చిన్నా పెద్ద మిలటరీ ఓడలు చైనా వద్ద 777 ఉండగా తైవాన్‌ 117 ఉన్నాయి. చైనా వద్ద తొమ్మిది అణు జలాంతర్గాములు, ఆరు ఖండాంతర క్షిపణి జలాంతర్గాములుండగా తైవాన్‌ వద్ద ఒక్కటి కూడా లేదు. చైనా వద్ద డీజిలుతో నడిచే జలాంతర్గాములు 56 ఉండగా తైవాన్‌ వద్ద రెండున్నాయి.


చైనా వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఉన్నదీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం 200 కాగా, స్టాక్‌హౌం సంస్థ 350 అని, 2030 నాటికి 1000కి చేరవచ్చని చెప్పింది. గత వేసవిలో చైనా జరిపిన కొన్ని పరీక్షలను బట్టి అవి హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలని పశ్చిమ దేశాల అనుమానం. ఇంతటి సైనిక శక్తి ఉన్నా తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకొనేందుకు చైనా ఇంతవరకు పూనుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే అటూ ఇటూ నష్టపోఏది తన జనమే కనుక ఎంతో సంయమనంతో ఉంది. అమెరికాకు అలాంటి జవాబుదారీతనం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ఎందరినైనా బలిపెట్టేందుకు పూనుకుంటుంది. చైనా సోషలిస్టు దేశం కనుక ఆచితూచి ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?

14 Sunday Aug 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor, RSS


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు ఐదవ తేదీతో ముగిసిన వారంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 572.978 బిలియన్‌ డాలర్లని ఆర్‌బిఐ నివేదికలో పేర్కొన్నది. అంతకు ముందు వారంలో ఉన్న మొత్తం 573.875బి.డాలర్లు. జూలై మాస ఆర్‌బిఐ నివేదిక ప్రకారం ఆ నెలలో ఉన్న స్థితిని బట్టి 2022-23లో తొమ్మిదిన్నర నెలల దిగుమతులకు డాలర్‌ నిల్వలు సరిపోతాయి. ఈ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.2014 జూలై 28 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషణ ప్రకారం డాలర్‌ నిల్వలు 317బి.డాలర్లకు పెరిగాయి.అవి ఎనిమిది నెలల దిగుమతులకు సరిపోతాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి(2008) ముందున్న కొనుగోలు శక్తి స్థాయికి తిరిగి పుంజుకోవాలంటే వాటిని 500బి.డాలర్లకు పెంచాల్సి ఉంటుందని, 2008కి ముందు మన దగ్గర ఉన్న నిల్వలు పదిహేను నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని పేర్కొన్నారు. 2013 ఆగస్టులో 275 బి.డాలర్లు ఉండగా 2014 జూలై 18 నాటికి అవి 317.8 బి.డాలర్లకు పెరగటానికి ఆర్‌బిఐ ప్రవాస భారతీయుల డిపాజిట్లకు ప్రోత్సాహాకాలివ్వటం, విదేశీ బాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని ప్రోత్సహించటమని కూడా చెప్పారు. డాలరు అప్పులు 420 బి.డాలర్లు ఉన్నందున ఆ పరిస్థితి మన కరెన్సీని వడిదుడులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడిలో 2022 మార్చినెలాఖరు నాటికి మన విదేశీ అప్పు 620.7 బి.డాలర్లకు పెరిగింది. ఎనిమిదేండ్ల క్రితం డాలరుకు రు.68 ఉండగా ఇప్పుడు 80కి దిగజారిన సంగతి తెలిసిందే.


2022 మార్చి నెలాఖరుకు ఉన్న 607.3 బి.డాలర్లు అంతకు ముందు ఏడాది లావాదేవీలను బట్టి పన్నెండు నెలల దిగుమతులకు సరిపడా ఉన్నట్లు ఏప్రిల్‌ 16న ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. సిఇఐసి సమాచారం ప్రకారం 2022 మే నెలలో ఉన్న నిల్వలు 8.5 నెలల దిగుమతులకు సరిపడా ఉంటే జూన్‌ నాటికి అవి 7.5నెలలకు తగ్గాయి. మన డాలరు నిల్వలు 573 బి.డాలర్లలో సింహభాగం 509.646 బి.డాలర్లు విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సిఏ)గా ఉన్నాయి. అవి నెలనెలా తగ్గుతున్నాయి.(జూలై 8నాటికి 518.089 బి.డాలర్లు) మన రూపాయి విలువ పతనం, పెరుగుదల మీద ఈ నిల్వలు ప్రభావం చూపుతాయి. ఇవిగాక బంగారం నిల్వల విలువ 40.313 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి ఎస్‌డిఆర్‌లు 18.031 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నిల్వలు 4.987 బి.డాలర్లు ఉన్నాయి.
తొలిసారిగా మన డాలరు నిల్వలు 2020 జూన్‌లో 500 బిలియన్‌లకు,2021జూన్‌లో 600, అదే ఏడాది సెప్టెంబరు ఎనిమిదిన మరో రికార్డు 642.453 చేరాయి.2022 జూలై 29కి 573.9 బి.డాలర్లకు తగ్గాయి


చమురు మార్కెట్లో ధరల పెరుగుదల వివరాలను చూస్తే మన విదేశీ మారకద్రవ్యంపై దాని వత్తిడి ఎలా ఉందో అర్ధం అవుతుంది. 2014-15 నుంచి 2021-22వరకు ఎనిమిది సంవత్సరాల్లో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 61.08 డాలర్లు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు13 వరకు అది 106.45 డాలర్లకు పెరిగింది. దీన్ని బట్టి మన దిగుమతి బిల్లు ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని కూడా తన ఘనతగా బిజెపి చెప్పుకోవటమే కాదు, పాత అప్పులు తీర్చేందుకని, మిలిటరీకి ఖర్చు చేసేందుకని, రోడ్లు వేసేందుకని, కరోనా వాక్సిన్ల కోసమనీ పెద్ద ఎత్తున చమురుమీద పెంచిన భారాన్ని సమర్ధించింది. 2014 మే 29 నుంచి జూన్‌ 11 వరకు సగటున ఒక డాలరు రు.59.17 ఉంటే ఇప్పుడది 2022 జూన్‌ 29 నుంచి జూలై 27వరకు రు.79.54 ఉంది. దీన్ని గోడదెబ్బ చెంపదెబ్బ అనవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరను అదుపుచేసే శక్తి నరేంద్రమోడీకి లేదు. కానీ రూపాయి విలువ దిగజారకుండా కాపాడి ఉంటే ఒక డాలరుకు ఇరవై అదనంగా చెల్లించవలసి వచ్చేది కాదు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్‌ నిర్వాకానికి జనం చెల్లిస్తున్న మూల్యమిది.


రూపాయి పతనం ఒక్క చమురుకే కాదు, మనం చేసుకుంటున్న దిగుమతులన్నింటికీ అదనపు భారమే. మన విద్యార్ధుల విదేశీ చదువులు కూడా భారంగా మారాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి కబుర్లతో ఎనిమిదేండ్లుగా జనాన్ని మభ్య పెట్టటం తప్ప దేశం నుంచి ఎగుమతులు పెరగటం లేదు. గత ఏడాది వాణిజ్యలోటు జిడిపిలో 1.2శాతం ఉండగా వర్తమానంలో మూడుశాతం కావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఎగుమతులు 2.14శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే మాసంలో దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.27 బి.డాలర్లకు చేరాయి. గతేడాది జూలై వాణిజ్య లోటు 10.63 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 30బి.డాలర్లకు పెరిగింది.ఏప్రిల్‌-జూలై ఎగుమతులు 157.44 బి.డాలర్ల విలువ గలవి జరగ్గా దిగుమతుల విలువ 256.43 బి.డాలర్లు. వాణిజ్య లోటు గతేడాది 42బి.డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 98.99 బి.డాలర్లకు చేరింది. దిగుమతుల్లో చమురు వాటా గతేడాదితో పోలిస్తే జూలైలో 12.4 నుంచి 21.13 బి.డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో చైనాతో మన వాణిజ్యలోటు 48 బి.డాలర్లు ఉంది. ఒక వైపు చైనా వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ, మరోవైపు భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులకు మోడీ సర్కార్‌ అనుమతిస్తున్నది. కమ్యూనిస్టు వ్యతిరేకులను మానసికంగా సంతృప్తి పరచేందుకు చైనా వ్యతిరేక కబురు, ప్రచారం, కార్పొరేట్ల నుంచి నిధులు పొందేందుకు వారి లాభాల కోసం చైనా నుంచి గత రికార్డులను బద్దలు కొడుతూ వస్తు దిగుమతులకు పచ్చజెండా, జనానికి దేశ భక్తి సుభాషితాలు.విశ్వగురువు లీలలు ఎన్నని చెప్పుకోగలం !


ప్రపంచంలో విదేశీమారకద్రవ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది నాల్గవ స్థానమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆగస్టు ఐదవ తేదీన చెప్పారు. ఇది నరేంద్రమోడీ భజనపరులకు వీనుల విందు, కనులకు పసందుగా ఉంటుంది. ఇదే ప్రాతిపదికైతే మనం అమెరికా కంటే కూడా గొప్పవారం అని చెప్పాల్సి ఉంటుంది. బంగారం మినహా విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం అది పదమూడవ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు వారానికి ఒకసారి మరికొన్ని నెలకు ఒకసారి వివరాలు వెల్లడిస్తాయి. అందువలన అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 2022లో కొన్ని దేశాల విదేశీమారకద్రవ్య వివరాలు బిలియన్‌ డాలర్లలో ఇలా ఉన్నాయి. చైనా 3,275.490(జూలై),జపాన్‌ 1,311.254(జూన్‌), స్విడ్జర్లాండ్‌ 960.084(జూన్‌), రష్యా 574.8(ఆగస్టు 5), భారత్‌ 572.978(ఆగస్టు 5), తైవాన్‌ 548.960(జూన్‌), అమెరికా 234.430(జూలై 8). అంతకు ముందు నెలతో పోలిస్తే చైనా నిల్వలు 28.895, రష్యా 3.6 బి. డాలర్ల చొప్పున పెరిగాయి. కరోనా లాక్‌డౌన్ల కారణంగా చైనా, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఇబ్బందులు పడినప్పటికీ వాటి నిల్వలు పెరగ్గా అంతా సజావుగా ఉందని చెబుతున్న మన దేశ నిల్వలు ఎందుకు తగ్గుతున్నట్లు ? పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనుకుందాం, సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో దేశాన్ని పెట్టామని అనేక మంది చెప్పారు, బిజెపి కూడా స్వంత డబ్బా కొట్టుకుంది. జనం కూడా నిజమే అని నమ్మారు. మరి ఇప్పుడీ పరిస్థితి ఎందుకు తలెత్తినట్లు ?కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో సాధించలేని దానిని నరేంద్రమోడీ ఐదు సంవత్సరాల్లో చేసి చూపారని 2019 ఎన్నికలపుడు ఊదర గొట్టారు. మోడీ సాధించిన ఘనతల్లో విదేశీ మారక ద్రవ్య పెంపుదల ఒకటని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి అంతగా తెలియని(విద్యావంతులైన) జనం ఉన్నారు గనుక బిజెపి ప్రచార దళాలు వాట్సాప్‌ పండితులతో ఏది ప్రచారం చేసినా నడుస్తోందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !

12 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, imperialism, Joe Biden, Mao Zedong, Taiwan independence, Taiwan Matters, US-China standoff over Taiwan, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌( పార్లమెంటు దిగువ సభ ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన మరుసటి రోజు నుంచి తైవాన్‌ చుట్టూ ఐదు రోజుల పాటు (ఆగస్టు 4-7తేదీలు) మిలిటరీ విన్యాసాలు జరిపింది. తరువాత మరుసటి రోజు నుంచి చైనా నిరవధిక విన్యాసాలు కొనసాగిస్తున్నది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు చైనా చూపుతున్నది. తొలుత నాలుగు రోజులు, తరువాత కొనసాగిస్తున్న నిర్ణీత గడువులేని డ్రిల్లు లక్ష్యం అదే అని షీ జింపింగ్‌ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తన వద్ద ఉన్న ఆధునిక ” హైమర్స్‌” క్షిపణి వ్యవస్థలను అంద చేసింది. దానికి ధీటుగా చైనా వద్ద ఉన్న ఎంఎల్‌ఆర్‌ వ్యవస్థలను తైవాన్‌ చుట్టూ జరిపిన డ్రిల్సులో ప్రయోగించినట్లు, ఈ పరిణామం తైవాన్‌పై అమెరికా ఆడుతున్న ఆట తీరునే మార్చి వేస్తుందని యురేసియన్‌ టైమ్స్‌ పత్రిక ఆగస్టు ఎనిమిదిన ప్రకటించింది.చేయాల్సిందంతా చేసి నెపాన్ని ఇతరుల మీద నెట్టినట్లుగా తాజా పరిణామాలపై జో బైడెన్‌ తీరు ఉన్నదని, ఇది మరింతగా రెచ్చగొట్టటమే అని చైనా వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌కు సంబంధించి ఇంతకు మించి వారు చేసేదేమీ ఉండదు కానీ వారి తీరే ఆందోళన కలిగిస్తున్నదని బైడెన్‌ విలేకర్లతో అన్నాడు. చైనా స్పందనకు ప్రతిగా అమెరికా యుద్ధనౌకలను తరలిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదు. దాంతో ఉక్రెయిన్‌ మాదిరి తమను కూడా ముందుకు నెట్టి అమెరికా వెలుపలే ఉంటుందా అని అనేక మందిలో తలెత్తిన సందేహాల పూర్వరంగంలో అమెరికన్లు, తైవాన్‌ వేర్పాటు వాదులను సంతృప్తిపరచేందుకు బైడెన్‌ ఇలాంటి చౌకబారు ప్రకటనలు, జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి తైవాన్‌ ప్రతినిధులను ఆహ్వానించిన తొలి అమెరికా నేతగా కూడా గతేడాది ఇలాంటి జిమ్మిక్కునే చేశాడు.


ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు జో బైడెన్‌ పలుకుబడి గురించి వెలువడుతున్న సర్వేల వివరాలు డెమోక్రటిక్‌ పార్టీకి కంగారు పుట్టిస్తున్నాయి.ఆగస్టు పదిన స్టాటిస్టా ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం పదిశాతం మంది అమెరికన్ల దృష్టిలో మాత్రమే జో బైడెన్‌ బలమైన నేత. మరో 25శాతం మంది కొంత మేరకు అని చెప్పగా నలభైమూడు శాతం చాలా బలహీనుడు, 23శాతం కాంత మేర బలహీనుడు అని వెల్లడైంది. మొత్తం మీద చూసినపుడు 66శాతం మంది బలహీనుడిగా భావిస్తున్నారు. ప్రపంచ చరిత్రను చూసినపుడు పాలకులు బలహీనపడినపుడు పిచ్చిపనులకు, జిమ్మిక్కులకు – ఎన్నికలు వచ్చినపుడు మన దేశంలో ఏదో ఒక ఉదంతం జరుగుతుందని జనం నమ్ముతున్నట్లుగా- పాల్పడతారని తేలింది. ఇప్పుడు జో బైడెన్‌ కూడా అదే స్థితిలో ఉన్నారన్నది కొందరి భావన. తైవాన్ను తురుపుముక్కగా వాడుతున్న అమెరికా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చగొట్టవచ్చని, దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. మరికొన్నింటిని కూడా ప్రయోగించనుంది. బహుశా ఈ కారణంగానే తైవాన్‌ జలసంధిలోకి అమెరికా నౌకలు రాలేదన్నది కొందరి విశ్లేషణ. రానున్న రోజుల్లో తమ దళ నౌకలు చైనా ప్రాంతంలో స్వేచ్చా విహారం చేయవచ్చని అమెరికా పేర్కొన్నది. ఒక వేళ వచ్చినా దూర దూరంగా తిరగటం తప్ప చైనా విధించిన తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు తైవాన్‌ ప్రాంతానికి చైనా విన్యాసాలు ముగిసిన తరువాతే తప్ప జరుగుతుండగా వచ్చే అవకాశం లేదు.


చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి ఆలోచించాల్సి ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాని కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని వార్తలు. ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా గురించి ఇప్పటికే ఆలశ్యం చేసినట్లు కొందరు బైడెన్‌ సమీక్షపై స్పందించారు. అమెరికా తరహా జీవన విధానాన్ని చైనా దెబ్బతీస్తున్న మాదిరి ఉగ్రవాద సంస్థలు చేయలేవని డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జాసన్‌ క్రో అన్నాడు. అవసరానికి మించి ఉగ్రవాదం మీద గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రీకరించామన్నాడు. క్వాంటమ్‌ సైన్సు, కృత్రిమ మేథ,ఇతర సాంకేతిక పరిజ్ఞానాలపై చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని దాని గురించి సమాచారం వెల్లడి కావటం లేదని అమెరికన్లు ఆందోళన చెందటమే తాజా కేంద్రీకరణకు కారణం. చైనా గురించి ఒకటి, చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను గతేడాది సిఐఏ ప్రకటించింది.


అమెరికాకు ప్రజాస్వామ్యం అంటే అక్కడి ఆయుధపరిశ్రమలకు లాభసాటి లావాదేవీ మాత్రమే. ఇతర దేశాల మీద అమెరికా దాడులకు దిగటం తప్ప చరిత్రలో అమెరికా మీద అలాంటి దాడి ప్రయత్నాలు కూడా లేవు. 2022 ఆగస్టు నాటికి ప్రపంచంలోని 14దేశాల వద్ద 47 విమానవాహక యుద్ధ నౌకలు పని చేస్తున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 80 విమానాలను మోసుకుపోగలిగిన పదకొండు అమెరికా వద్దే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కటి 13-14 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పది కొత్త విమానవాహక నౌకల తయారీకి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆర్డరు పెట్టింది. ఇవి అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వీలైనవి.ఇన్ని ఉన్నప్పటికీ లేని చిన్న దేశాలను తప్ప వాటితో చైనా, రష్యాలను అమెరికా బెదిరించలేదు. ఎందుకంటే అవి కూడా స్వంతంగా విమానవాహక నౌకలను రూపొందించగలిగినవే. వాటి వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి.


అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తైవాన్‌ గడ్డ మీద అడుగు పెట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజానికి అమెరికా వ్యూహకర్తల ఎత్తుగడ అది. ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం జనంలో పలుకుబడి లేని జో బైడెన్‌ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ప్రపంచ రాజకీయాలను తాను శాసిస్తున్నట్లు ప్రదర్శించుకొనేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.అమెరికా ప్రభుత్వం బహిర్గతపరచిన కొన్ని పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే ఉన్నత సమావేశం జరిపి తైవాన్‌ రక్షణకు మిలిటరీని పంపుతామని ప్రకటించారు. వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది.


సోవియట్‌ మీద ఆధారపడకుండా స్వంత అణుకార్యక్రమానికి చైనా పూనుకుంది.1964 అక్టోబరు 16న తొలి అణుపరీక్ష జరిపింది. అంతే కాదు అప్పటికి చైనా వద్ద విమానవాహక నౌకలు కూడా లేవు. పాతబడిన ఒక నౌకను ఆస్ట్రేలియా రద్దు కింద అమ్ముతామని 1985లో ప్రకటించగా చైనా దానిని కొనుగోలు చేసింది. దానిలో కీలకమైన భాగాలన్నింటినీ తొలగించినందున పనికి రాదని అందరూ భావించారు. అయితే దాన్ని చైనా రద్దుకింద మార్చకుండా తన మిలిటరీకి శిక్షణకు, తాను సొంతంగా రూపొందించిన నౌకలకు నమూనాగా ఉపయోగించినట్లు తరువాత వెల్లడైంది.1995, 2000 సంవత్సరాల్లో రష్యా నుంచి రెండు నౌకలను కొనుగోలు చేసి వాటినీ రద్దు కింద మార్చకుండా చైనా నిపుణులు పరిశీలించారు. ఒక నౌకను విలాసవంతమైన టూరిస్టు హౌటల్‌గా, మరొక నౌకను ప్రదర్శనశాలగా మార్చారు. మకావు ప్రయివేటు కంపెనీ ద్వారా మరొక రష్యా నౌకను 1998లో కొనుగోలు చేసి దాన్ని 2007 నాటికి పరిమితంగా పునరుద్దరించినట్లు వార్తలు. తరువాత దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి కొత్త పేరుతో 2012లో నౌకా దళంలో తొలి స్వంత నౌకగా ప్రవేశపెట్టారు.తరువాత పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన నౌకను 2017లో ప్రారంభించారు. సరికొత్త నౌక మూడవ దానిని ఈ ఏడాది జూన్‌లో రంగంలోకి దించారు. నాలుగవ నౌక ఇప్పుడు నిర్మాణంలో ఉంది, 2030నాటికి మరో రెండు చేరవచ్చని భావిస్తున్నారు.


ప్రస్తుతం జరుపుతున్న మిలిటరీ డ్రిల్లును అమెరికా, ఇతర దేశాలు కూడా పరిశీలించి తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయని తెలియనంత ఆమాయకంగా నేడు చైనా లేదు. నిజమో కాదో చెప్పలేము గాని ఇప్పుడు చైనా గురించి అమెరికన్లకు ఒక భయం పట్టుకుంది. మెదడును అదుపు చేసే జీవ ఆయుధాలను రూపొందిస్తున్నట్లు అనుమానంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాజెక్టులో భాగస్వాములన్న అనుమానంతో అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు పెట్టింది.ఇది ఒక ప్రచార ఎత్తుగడ, దాడిలో భాగం కూడా కావచ్చు. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. సరిహద్దులో ఉన్న నాటో దేశాలే ఉక్రెయిన్‌కు మిలిటరీని పంపేందుకు సిద్దం కాలేదు. తైవాన్‌ అంశానికి వస్తే దానికి సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో, దక్షిణకొరియాలో ఉన్న అమెరికా మిలిటరీ తప్ప పన్నెండువేల కిలోమీటర్ల నుంచి అమెరికా తన సేనలను తీసుకురావాల్సి ఉంది. చైనాకు మద్దతుగా అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఉంది. పక్కనే రష్యా కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మరోఅణుశక్తి దేశమైన పాకిస్తాన్‌ వివిధ కారణాలతో అమెరికా కంటే చైనాకు దగ్గరగా ఉంది. మరో దేశమైన ఇరాన్‌ కూడా చైనాకు దగ్గరగా ఉంది. మావో కాలంలో ఇలాంటి సానుకూల అంశాలు చైనాకు లేవు. అందుకే షీ జింపింగ్‌ బైడెన్‌తో భేటీలో నిప్పుతో చెలగాటాలాడవద్దని హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !

10 Wednesday Aug 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

first left-wing president in Colombia, Gustavo Petro, Latin American left, leftist Gustavo Petro

ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలోని కొలంబియాలో ఎన్నికైన తొలి వామపక్ష అధ్యాక్షుడు గుస్తావ్‌ పెట్రో,తొలి ఆఫ్రో-కొలంబియన్‌ ఉపాధాóా్యక్షురాలు ప్రాన్సియా మార్ఖ్వెజ్‌ ఆదివారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.రాజధాని బగోటాలో దాదాపు లక్ష మంది జన సమక్షంలో జరిగిన కార్యక్రమానికి స్పెయిన్‌ రాజు ఆరవ పెతిలిపే, తొమ్మిది లాటిన్‌ అమెరికా దేశాధినేతలు వచ్చారు. దేశంలో తీవ్రమైన అవినీతి, అసమానతలు, మాదక ద్రవ్యమాఫియాలు, శాంతికోసం సాయుధ పోరాటాన్ని విరమించిన గెరిల్లాలు జనజీవన స్రవంతిలో కలవటం వంటి అనేక సవాళ్ల మధ్య గుస్తావ్‌ పెట్రో పాలన ప్రారంభమైంది. బలమైన, ఐక్య కొలంబియాను తప్ప రెండు సమాజాల మాదిరి రెండు దేశాలను తాను కోరువటం లేదని తన తొలి ప్రసంగంలో పెట్రో చెప్పాడు.


ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాదిరిగానే వెనెజులాతో సరిహద్దును తెరిచే ప్రక్రియ సాగుతోందని మంగళవారం నాడు విలేకర్లతో గుస్తావ్‌ పెట్రో చెప్పాడు. ఏడు సంవత్సరాల క్రితం రెండు దేశాల మధ్య సంబంధాలు రద్దయ్యాయి. వెనెజులా ప్రభుత్వ వ్యతిరేకులకు కొలంబియాలో ఆశ్రయం కల్పించారు. తిరుగుబాటు నేత గుయిడోకు అక్కడ ఒక ఎరువుల కంపెనీ కూడా ఉంది. కేవలం 50.42శాతం ఓట్లతో అధికారానికి వచ్చిన పెట్రోకు దేశంలోని పచ్చి మితవాదులు, కార్పొరేట్‌లతో పాటు అమెరికన్‌ సామ్రాజ్యవాదుల కుట్రల నుంచి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఐదు కోట్ల మంది జనాభాలో సగం మంది దారిద్య్రంలో ఉన్నందున వారి ఆకలి తీర్చటం తన ప్రధాన కర్తవ్యంగా పెట్రో చెప్పాడు. దానికి గాను ధనికుల నుంచి అదనపు పన్ను వసూలు చేసేందుకు పన్ను సంస్కరణలను ప్రవేశపెడతామని ఆర్ధిక మంత్రి జోస్‌ ఆంటోనియో ఒకాంపా చెప్పాడు. దేశంలో మాదక ద్రవ్యాల ముఠాలు విచ్చలవిడిగా పెరిగేందుకు కారణమైన కోకా ఆకుల సాగు నుంచి రైతులను వేరే పంటల సాగుకు మళ్లించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడులు పెడతామని పెట్రో చెప్పాడు. విశ్వవిద్యాలయ విద్య ఉచితంగా అందిస్తామని, ఆరోగ్య, పెన్షన్‌ సంస్కరణలు తెస్తామని వాగ్దానం చేశాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాళ్ల నుంచి చమురు, గాస్‌ తీయటాన్ని, కొత్తగా చమురుబావుల వృద్ది నిలిపివేస్తామని ప్రకటించాడు.ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో సగం చమురు పరిశ్రమ నుంచే ఉన్నాయి. ఎఫ్‌ఏఆర్‌సి గెరిల్లాలతో కుదిరిన ఒప్పందంలోని అంశాలనే నేషనల్‌ లిబ రేషన్‌ ఆర్మీ సంస్థ(్ణఎల్‌ఎన్‌) తిరుగుబాటుదార్లకూ వర్తింప చేస్తామని గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అది తిరస్కరించింది. ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని పెట్రో వాగ్దానం చేశాడు. నయా ఉదారవాద ప్రయోగశాలగా, వాటి అమలుకు నియంతలను ప్రోత్సహించిన ప్రాంతంగా లాటిన్‌ అమెరికా ఉన్న సంగతి తెలిసిందే. వాటిని వ్యతిరేకిస్తున్న జనం అనేక అనుభవాలను చూసిన తరువాత వామపక్ష భావజాలం ఉన్న వారిని ఎన్నుకుంటున్నారు. శతాబ్దాలు, దశాబ్దాల తరబడి ఉన్న పార్టీలను పక్కన పెడుతున్నారు. కొలంబియాలో కూడా అదే జరిగింది.


ఈ ఏడాది మే 29న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా గుస్తావ్‌ పెట్రో నలభై శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం సగానికి పైగా ఓట్లు రావాల్సి ఉండటంతో రెండవ దఫా జూన్‌ 19న తొలి రెండు స్థానాల్లో ఉన్నవారి మధ్య జరిగిన పోటీలో 50.42 శాతం ఓట్లతో నెగ్గాడు. ప్రత్యర్ధికి 47.35 శాతం రాగా 2.23శాతం ఎవరికీ రాలేదు. మార్చి 13న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో నాయకత్వంలోని వామపక్ష కూటమి ఓట్ల రీత్యాపెద్ద పక్షంగా అవతరించినప్పటికీ ఉభయ సభల్లో మితవాదులు, ఇతర పార్టీల వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తాన్ని 33 విభాగాలుగా చేసి జనాభాను బట్టి 168కి గాను 162 స్థానాలకు ఎన్నికలు జరిపారు. దామాషా ప్రాతిపదికన వచ్చిన ఓట్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. మార్చి ఎన్నికల్లో దిగువ సభలో వామపక్ష కూటమికి 16.78శాతం ఓట్లు 27 సీట్లు రాగా సోషల్‌డెమోక్రటిక్‌ శక్తిగా వర్ణితమైన లిబరల్‌ పార్టీకి 14.27 శాతం ఓట్లు 32 సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లన్నింటిని మితవాదులు, ఇతరులు గెలుచుకున్నారు. ఎగువ సభలోని 100 స్థానాలకు గాను వామపక్ష కూటమి 20, లిబరల్‌ పార్టీ 14 సీట్లు తెచ్చుకుంది. పార్లమెంటులో బిల్లులను ఆమోదించాలంటే ఇతర పార్టీల సహకారం అవసరం. దీనికి గాను ఉన్నంతలో తొలుత లిబరల్‌ పార్టీ దగ్గరగా ఉన్నందున ఆ పార్టీతో పెట్రో అవగాహనకు వచ్చారు. తరువాత ఇతర పార్టీలను సంప్రదించారు. జూలై 20 నాటికి ఎగువ సభలోని 108 స్థానాలకు గాను గుస్తావ్‌ నాయకత్వంలోని హిస్టారిక్‌ పాక్ట్‌ కూటమి 63 స్ధానాలున్న పార్టీలతో ఒక అవగాహనకు వచ్చింది. దిగువ సభలో 186 స్థానాలకు గాను 114 సీట్లున్న పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. రానున్న నాలుగు సంవత్సరాలు ఈ మద్దతు ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఈ పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వటం, వాటి వెనుక ఉన్న లాబీల వత్తిళ్లు రానున్న రోజుల్లో పెట్రో సర్కార్‌కు ఇబ్బందులను కలిగించవచ్చు. కొన్ని దేశాల్లోని వామపక్ష ప్రభుత్వాలకు ఎదురైన అనుభవమిదే. తమ అజెండాలను పూర్తిగా అమలు జరపాలంటే వామపక్షాలకు ఆటంకంగా మారుతుండటంతో రాజీపడాల్సి వస్తోంది. అది ప్రజల్లో అసంతృప్తికి కారణమౌతోంది. గుస్తావ్‌ ఇప్పటికే గత ప్రభుత్వాల్లో పని చేసిన ఇద్దరికి మంత్రిపదవులు ఇచ్చారు.


లాటిన్‌ అమెరికాలో ప్రభుత్వాలన్నీ అధ్యక్ష తరహావే గనుక వామపక్ష ప్రభుత్వాలున్నచోట్ల అవసరమైనపుడు పార్లమెంట్లను తోసి రాజని కొన్ని నిర్ణయాలు అమలు జరపాల్సి వస్తోంది. అవసరమైతే తానూ అదే చేస్తానని ఎన్నికల ప్రచారంలో గుస్తావ్‌ చెప్పాడు.కానీ అది శత్రువులకు అవకాశాలను ఇచ్చినట్లు అవుతున్నది. బ్రెజిల్‌ వంటి చోట్ల పార్లమెంటులో మెజారిటీ లేని కారణంగా వామపక్ష దిల్మా రౌసెఫ్‌ను అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగించారు. అలాంటి పరిణామం ఎక్కడైనా పునరావృతం కావచ్చు. అందువలన వామపక్ష శక్తులు పార్లమెంటు, రాష్ట్రాల్లో కూడా మెజారిటీ ఉన్నపుడే తమ అజెండాలను అమలు జరపగలవన్నది అనేక దేశాల అనుభవం. అధికార వ్యవస్థలో కీలకమైన మిలిటరీ, న్యాయ విభాగాలన్నీ గత కొన్ని దశాబ్దాలుగా మితవాద, ఫాసిస్టు శక్తులతో నింపివేశారు. తమ వర్గ ప్రయోజనాలకు భంగం కలిగితే అవి చూస్తూ ఊరుకోవు.


జనాల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఇటీవలి కాలంలో లాటిన్‌ అమెరికాలో పాలకవర్గ పార్టీలకు జనం చుక్కలు చూపుతున్నారు.ఇప్పటి వరకు 12 దేశాల్లో అలాంటి పార్టీలు మట్టి కరిచాయి. కొలంబియాలో మితవాద పార్టీలతో జనం విసిగిపోయారు.2019,20,21 సంవత్సరాల్లో జరిగిన సామాజిక పోరాటాల్లో వామపక్ష శక్తులు ముందున్నాయి. రాజధాని బగోటా మేయర్‌గా, సెనెటర్‌గా పని చేసిన పెట్రో 2018 ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సామాజిక సంక్షేమానికి కేటాయింపులు పెంచుతానని, ఆర్ధిక అసమానతలను తగ్గిస్తానని, పడావుగా ఉంచిన భూములపై అపరాధ పన్ను వేస్తామని, కార్పొరేట్‌ పన్ను పెంచుతామని, ఒంటరిగా ఉన్న తల్లులకు వేతనాలు పెంచుతామని వాగ్దానం చేశాడు. వేలాది ఎకరాల భూములు కలిగిన వారు, చమురు రంగంలో ఉన్న కార్పొరేట్లు గుస్తావ్‌ పెట్రో ప్రభుత్వ సంస్కరణలు, పన్నుల పెంపుదలను అంతతేలికగా అంగీకరించవు. చమురు రంగంలో గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల నిబంధనలు ఆటంకంగా మారవచ్చు. పర్యావరణ పరిరక్షణకు గాను గనుల తవ్వకం, చమురు ప్రాజక్టుల నిలిపివేత అమలు చేస్తానని గుస్తావ్‌ చెప్పాడు. ఇప్పటికే లోటు బడ్జెట్‌ ఉన్న స్థితిలో ఇవి ఎంతవరకు అమలు జరిగేదీ చెప్పలేము. సంక్షేమ పధకాలు, సబ్సిడీలు పెంచకుండా జనాన్ని సంతృప్తి పరచలేరు. తక్షణం ప్రభుత్వం 22 సంవత్సరాల రికార్డును బద్దలు చేసి 9శాతంపైగా ద్రవ్యోల్బణాన్ని ఆహార, చమురు ధరలను అదుపు చేయాల్సి ఉంది. ఇది గాక ఇప్పటికీ వివిధ బృందాలుగా ఇరవై వేల మంది తిరుగుబాటుదార్లు ఉన్నారు. వారిని ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇవిగాక వెలుపలి నుంచి అమెరికా ఇతర దేశాలు కుట్రలు సరేసరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

08 Monday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

China, China and Taiwan, Nancy Pelosi Taiwan trip, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ 2022 ఆగస్టు రెండవ తేదీ మంగళవారం రాత్రి 10.20కి తైవాన్‌ గడ్డమీద అడుగుపెట్టి రాత్రంగా ఒక హౌటల్లో బసచేసి తెల్లవారగానే తైవాన్‌ ఇచ్చిన విందారగించి పొద్దుగూకక ముందే వెళ్లిపోయారు. అంతకు ముందు సింగపూర్‌ నుంచి మలేసియా వెళ్లి చీకటి పడేవరకు అక్కడ ఉండి రాత్రి కాగానే తైవాన్‌లోని తైపీ చేరుకున్నారు. చివరి క్షణం వరకు అంతా దాగుడుమూతలే. అనేక దినాల మాదిరి చరిత్రలో ఈ రోజు కూడా ప్రముఖంగా మిగిలిపోనుంది. అమెరికా అధికార వరుసలో మూడవ స్థానంలో ఉన్న ఆమె పర్యటన తరువాత తలెత్తిన తక్షణ పరిస్థితులు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. బుధవారం నుంచి ఆదివారం వరకు తైవాన్‌ చుట్టూ ఆరు ప్రాంతాలలో చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. తైపే నగరం నుంచి పలు దేశాలకు విమానరాకపోకలు లేవు. తైవాన్‌ దీవి మీదుగా తిరిగే పలుదేశాల విమానాలను దారి మళ్లించి వేరే రూట్లలో నడిపారు. వాషింగ్టన్‌లోని చైనా రాబారిని పిలిపించి అమెరికా తన నిరసన తెలిపింది. దానికి ప్రతిగా చైనా కూడా స్పందించింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందన్నదన్నది ఇప్పుడే చెప్పలేము. సోమవారం నుంచి పచ్చ సముద్రంలో పదిహేనవ తేదీ వరకు, బోహై సముద్రంలో నెల రోజుల పాటు (కొరియా ద్వీపకల్పం-చైనా మధ్య) మిలిటరీ విన్యాసాలు నిర్వహించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇవన్నీ బలవంతపు విలీనానికి జరిపే కసరత్తే అని తైవాన్‌ పాలకులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అనేక కోణాల నుంచి చూడాల్సి ఉంది. కొంత మంది 1962 నాటి క్యూబన్‌ క్షిపణి సంక్షోభాన్ని గుర్తుకు తెచ్చారు. దానికీ దీనికి ఏమైనా సామ్యం ఉందా ?


ముందుగా క్యూబన్‌ క్షిపణి ఉదంతాన్ని చూద్దాం. అంతర్గతంగా ముందు ఎలాంటి పరిణామాలు జరిగినప్పటికీ ఒక దశదాటిన తరువాత ఉపరితలంలో కనిపించేదాన్ని బట్టి నామకరణం చేసినట్లుగా దీనికి ఆ పేరు పెట్టారు.1953 నుంచి 1961వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఐసెన్‌ హౌవర్‌ ఐరోపాలోని నాటో కూటమి దేశాల్లో క్షిపణులు, ఆయుధాలను మోహరించి ఆ ప్రాంత దేశాలకు భరోసా కల్పించాలని, సోవియట్‌కు ధీటుగా ఉన్నామని ప్రపంచానికి చెప్పేందుకు సంకల్పించారు. ఈ క్రమంలోనే సోవియట్‌ వద్ద మధ్యంతర, దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణులు ఉన్నట్లు 1957లో పసిగట్టిన అమెరికా తన ఉద్ద ఉన్నవాటిని ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టేందుకు, సోవియట్‌ను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. టర్కీలో వాటిని మోహరించేందుకు పూనుకోగా అందుకు అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సోవియట్‌ హెచ్చరించింది. తొలుత తటపటాయించిన టర్కీ ఒత్తిడికి లొంగి1959 అక్టోబరు 25న అమెరికాతో ఒప్పందం చేసుకొని అంగీకరించింది. ఆ మేరకు 1962లో జూపిటర్‌ క్షిపణులను టర్కీలోని ఇమిర్‌ పట్టణంలో, టర్కీలో, థార్‌ క్షిపణులను బ్రిటన్‌లో మోహరించారు. 1959లో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వంలోని పురోగామి వాదులు అమెరికా మద్దతు ఉన్న నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారానికి వచ్చారు. అప్పటి నుంచి అమెరికాలో తిష్ట వేసిన కాస్ట్రో వ్యతిరేకులు సిఐఏ శిక్షణ, ఆయుధాలతో దాడి చేసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విఫలయత్నం చేశారు. 1961 ఏప్రిల్‌ 15న అమెరికా విమానాలు క్యూబా స్థావరాలపై దాడులు చేశాయి, 17వ తేదీన 1,500 విద్రోహులు దాడులకు దిగారు. పందొమ్మిదవ తేదీకల్లా వారందరినీ కాస్ట్రో ప్రభుత్వం బందీలుగా చేసింది. ఈ దాడిని అవకాశంగా తీసుకొని కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా సోవియట్‌ తన క్షిపణులను 1962 సెప్టెంబరులో క్యూబాలో మోహరించింది. వ్యవసాయ నిపుణుల రూపంలో వెళ్లిన వారు అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత గానీ అమెరికా పసిగట్టలేకపోయింది, అక్టోబరు 16న నాటి అధ్యక్షుడు కెన్నడీ సంక్షోభ నివారణకు పావులు కదిపాడు. అమెరికా దిగి వచ్చి టర్కీ, ఇటలీల్లోని తన క్షిపణులను తొలగిస్తామని అంగీకరించటంతో తమ అస్త్రాలను వెనక్కు తీసుకుంటామని సోవియట్‌ పేర్కొన్నది, అదే నెల 29వ తేదీకి ఉద్రిక్తతలు సడలాయి. తరువాత క్యూబాలో బందీలుగా ఉన్న తమ గూఢచారులు, కిరాయి మూకలను అమెరికా నష్టపరిహారం చెల్లించి మరీ విడిపించుకుంది. క్షిపణి ఒప్పందంలో అమెరికా లొంగిన సంగతి 1970వరకు వెల్లడికాలేదు.


నేటి తైవాన్‌ ఉదంతానికి నాటి క్యూబా పరిణామాలకు పోలికే లేదు. పెలోసి పర్యటన బహిరంగ రహస్యం. అధికారికంగా ప్రకటించే దమ్ము అమెరికాకు లేకపోయింది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ద్వారా లీకు వార్తలతో వెల్లడించి బైడెన్‌తో సహా అందరూ తెలియదంటూనే చర్చించారు. చివరికి పెలోసీ సైతం విలేకర్లతో మాట్లాడుతూ తన విమానాన్ని కూల్చివేస్తారని మిలిటరీ అనుకొంటుండవచ్చు అని చెప్పారు. మీడియాలో కట్టుకథలను రాయించారు. బుధవారం నుంచి ఆదివారం వరకు జరిగిన చైనా మిలిటరీ విన్యాసాలను చూసిన తరువాత పెలోసీ విమానం తైవాన్‌ గడ్డమీద దిగకుండా చూడటం చైనాకు పెద్ద సమస్య కాదన్నది స్పష్టం. మలేసియా-తైవాన్‌ సమయాల ఒకటే. రెండు ప్రాంతాల ప్రయాణ వ్యవధి నాలుగున్నర గంటలు. ఒక దొంగ మాదిరి చీకటి మాటున ఆమె వచ్చారు.


విప్లవకాలం చివరి రోజుల్లో ఓటమి తప్పదని గ్రహించిన తరువాత చైనా మిలిటరీ, ఆయుధ సంపత్తినంతటినీ నాటి చాంగ్‌కైషేక్‌ ప్రభుత్వం అమెరికా, బ్రిటీష్‌ వారి సలహామేరకు తైవాన్‌ దీవికి తరలించింది.1949లో చైనా జనాభా 54 కోట్లు, తైవాన్‌ దీవి జనాభా 55 లక్షలు. నాటి బర్మా వైపు నుంచి దాడులు, టిబెట్‌లో తిరుగుబాట్లు, తైవాన్నుంచి దాడులు.యాభై నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న ప్రధాన భూభాగంలో విప్లవ విజయాలను పటిష్టపరుచుకోవటం ముఖ్యమా తైవాన్‌ మీద కేంద్రీకరణకా అన్నపుడు మావో నాయకత్వం మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాలు తైవాన్‌ మిలటరీని మరింత పటిష్ట పరిచాయి. ఇదే సమయంలో సామ్రాజ్యవాదులు ఒక తప్పుడు అంచనాకు వచ్చారు. చైనాలో కమ్యూనిస్టులను అధికారం నుంచి తొలగించగలమనే భ్రమతో ఐరాసలో అప్పటికే శాశ్వత దేశంగా ఉన్న చైనా అసలైన ప్రతినిధి తైవాన్‌లోని కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వాన్నే ఐరాసలో గుర్తించారు. అలాగాక తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే భద్రతా మండలిలో తమకు తోడుగా ఉండే తైవాన్‌కు ఒక శాశ్వత దేశ హౌదా రద్దవుతుంది. సోవియట్‌కు చైనా తోడవుతుందని అమెరికా ఆలోచించింది. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించింది.1945లో ఐరాస ఏర్పడినపుడు నాటి చైనాతో కదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి కమ్యూనిస్టుల ఆధీనంలో ఉన్న చైనాను గుర్తించటం చైనా సమగ్రతను ఉల్లంఘించటమేనంటూ ఐరాసలో 1949లో అమెరికా కూటమి ప్రవేశపెట్టిన తీర్మానానికి నాడున్న బలాబలాల్లో అనుకూలంగా 25 దేశాలు, సోవియట్‌కు అనుకూలంగా తొమ్మిది దేశాలు ఓటు చేయగా 24 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఆ తరువాత ఐరాసలో అమెరికా, బ్రిటన్‌లను వ్యతిరేకించే దేశాలు పెరిగి కమ్యూనిస్టు చైనాకు మద్దతు పెరిగింది.1961లో తొలిసారిగా ఐరాస సాధారణ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండువంతుల దేశాలు చైనాకు అనుకూలంగా ఓటు వేశాయి. తరువాత ప్రతి ఏటా తీర్మానాలను ఆమోదిస్తున్నా అమెరికా అడ్డుకున్నది.అసలు రెండు చైనాలు ఉనికిలో లేవని ఉన్నది కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వంలోని చైనా అసలైనదని అమెరికా కూటమి వాదించగా, కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉన్నదే అసలైన చైనా అని సోవియట్‌ కూటమి వాదించింది.తరువాత మారిన పరిస్థితుల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా, టర్కీ వంటి అనేక పశ్చిమ దేశాలు కమ్యూనిస్టు చైనాను గుర్తించి సంబంధాలు పెట్టుకున్నాయి. తాను ఒంటరిపాటౌతున్నట్లు గమనించిన అమెరికా చివరకు దిగివచ్చి చైనా అంటే కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉన్నదే అని గుర్తించేందుకు అంగీకరించింది. దీనికి మరొక ప్రధాన కారణం కూడా ఉంది. అంతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో విబేధాలు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలు తీవ్రంగా ఉన్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా సోవియట్‌కు వ్యతిరేకంగా చైనాను నిలబెట్టాలన్న ఎత్తుగడ కూడా అమెరికాను ముందుకు నెట్టింది.


భద్రతా మండలి చైనా శాశ్వత దేశ ప్రతినిధులుగా తైవాన్‌ ప్రభుత్వం నియమించిన వారిని అనుమతించటంపై 1971 జూలై 15 సమావేశంలో సోమాలియా అభ్యంతర పెట్టింది. దాన్ని నిర్ణయించాల్సింది భద్రతా మండలి కాదని అమెరికా అడ్డుకుంది.తరువాత సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన తెచ్చింది. దాని ప్రకారం ఐరాస ఆధ్వర్యంలో తైవాన్‌లో మూడు అంశాల మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అంతవరకు ఐరాసలో తైవాన్‌కు సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఒకటి తటస్థ దేశంగా ఉంటూ స్వతంత్ర దేశంగా కొనసాగటం, రెండు, పరిమిత అధికారాలతో ప్రజాచైనాతో సమాఖ్యగా ఉండటం, మూడు, స్వతంత్ర దేశంగా చైనాతో కాన్ఫెడరేషన్‌గా ఏర్పడటం. దీన్ని అమెరికా తిరస్కరించింది. మరోవైపున అమెరికా రహస్యంగా చైనాతో సంప్రదింపులకు దిగింది. పాకిస్తాన్‌ మీదుగా నిక్సన్‌ ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న హెన్రీ కిసెంజరు చైనా వెళ్లి చర్చలు జరిపి చైనాను గుర్తించేందుకు అంగీకరించి వచ్చాడు. మరోవైపు ఐరాసలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి అమెరికా ఒక మెలిక పెట్టి వివాదానికి నాంది పలికింది. భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాకు శాశ్వత ప్రాతినిధ్యం, సాధారణ అసెంబ్లీలో తైవాన్‌ ప్రతినిధి కొనసాగాలన్న దాని తీర్మానం వీగిపోయింది.చివరకు 1971 నవంబరు 23న భద్రతా మండలి, తరువాత సాధారణ అసెంబ్లీలో కమ్యూనిస్టు చైనాకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించటంతో తైవాన్‌ వివాదానికి తెరపడింది. దాన్ని చైనాలో భాగంగా గుర్తించారు.


తరువాత అమెరికా రాజకీయం మొదలు పెట్టింది. ఐరాస తీర్మానానికి వక్రభాష్యం చెబుతూ తైవాన్‌ ప్రజలు పూర్తిగా ఆమోదించే వరకు బలవంతంగా విలీనం జరగరాదని చెప్పింది. తీర్మానంలో తైవాన్‌ గురించి స్పష్టంగా పేర్కొనలేదంటూ అనధికారికంగా తైవాన్‌ పాలకులతో సంబంధాలు పెట్టుకొన్నది.1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగరిచ్‌ పర్యటన గురించి పెలోసి రాక సందర్భంగా కొందరు విశ్లేషకులు వక్రీకరించారు. ఇప్పుడున్నంత బలంగా అప్పుడు చైనా లేదు కనుక అంగీకరించినట్లు చిత్రించారు. నిజానికి చైనా ఎన్నడూ తైవాన్‌పై రాజీపడలేదు. గింగరిచ్‌ అధికారికంగా బీజింగ్‌ పర్యటనకు వచ్చాడు. తైవాన్‌ వెళ్లి ఒక వేళ బలవంతంగా విలీనానికి చైనా పూనుకుంటే తైవాన్‌ రక్షణకు తాము వస్తామని గింగరిచ్‌ చెప్పాడు. అంతకు ముందు తెరవెనుక జరిగిన సంప్రదింపుల్లో ఒకే చైనా అన్నతమ వైఖరి గురించి ఎలాంటి భయాలుపెట్టుకోవద్దని, గింగరిచ్‌ తైవాన్‌ కూడా వెళ్లాలనుకుంటున్నారని అక్కడ తైవాన్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడరని, శాంతియుతంగా విలీనం జరగాలని తాము కోరుకుంటున్నామని, జోక్యం చేసుకోబోమని చెప్పిన అమెరికా మాట తప్పినట్లు నాడు చైనా ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలన్నీ చైనా గురించి ఒకే వైఖరితో ఉండాలని స్పష్టం చేసింది. తమకు చెెప్పింది ఒకటి మాట్లాడింది ఒకటి కావటంతో తాము కొంత గందరగోళానికి గురైనట్లు చైనా ప్రతినిధి అన్నట్లు వార్తలు వచ్చాయి. గింగరిచ్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత కాగా అప్పుడు అధికారంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన బిల్‌ క్లింటన్‌ ఉన్నాడు. ఇప్పుడు స్పీకర్‌, అధ్యక్షుడు ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. నాడు గింగరిచ్‌ చైనా అనుమతితోనే తైవాన్‌ వెళ్లాడు. నేడు నాన్సీ పెలోసి పర్యటనలో అసలు బీజింగ్‌ సందర్శన అసలు భాగమే కాదు. అనుమతి లేకుండా, అనధికారికంగా తైవాన్‌ వెళతారని ముందే ప్రచారం జరిగింది కనుక అమెరికా నాటకం ఇప్పుడు మరింత స్పష్టం.


పెలోసీ రాకను చైనా ఎందుకు నివారించలేకపోయింది అని అనేక మంది అనుకుంటున్నారు. అందుకు పూనుకోవటం అంటే అమెరికా పన్నిన వలలో చిక్కుకోవటమే. తప్పా ఒప్పా అన్న అంశాన్ని పక్కన పెడితే గతంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా అమెరికాకు ధీటుగా సోవియట్‌ స్పందించిన గతం తెలిసిన వారికి అలా అనిపించటం సహజం. స్పందించలేదు గనుక అది బలహీనత అని ఎవరైనా అంటే అది ఒక అభిప్రాయం మాత్రమే. ప్రపంచం మొత్తంలో సమసమాజం ఏర్పడాలని కమ్యూనిస్టులు కోరుకోవటం వేరు, దాన్ని ఒక తక్షణ అజండాగా తీసుకోవటం వేరు. మార్క్సిజం-లెనినిజాలను తమ దేశ పరిస్థితులకు అన్వయించుకొని ఏ దేశానికి ఆదేశం జాతీయ విముక్తిని పొందేందుకు పార్టీలు చూస్తున్నాయి.పరిస్థితులు అనుకూలించిన చోట విప్లవాన్ని సాధించి కొంత కాలం సోషలిస్టు సమాజ నిర్మాణంతో ముందుకు పోవటం తరువాత విఫలం కావటం చూశాము. అదే సమయంలో చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలు గతం నుంచి అనుభవాలు నేర్చుకొని తమవైన పద్దతుల్లో సోషలిస్టు సమాజ నిర్మాణంతో ముందుకు పోతున్నాయి. ఇప్పుడు అసలు సోషలిస్టు దేశమంటూ ఏదీ లేదు అని సూత్రీకరించే అపర సూత్రధారులను కూడా చూస్తున్నాము. ఒక ఉదంతం పట్ల అనుసరించిన ఒక వైఖరి సరైనదా కాదా అన్నది చరిత్ర తేల్చాల్సిందే. అనేక పరిణామాల్లో చేతులు కాల్చుకున్న అమెరికా తన వైఫల్యాల జాబితా పెరిగిపోతున్న కొద్దీ అది మరింత రెచ్చగొడుతున్నది. అది దాని అజెండా, చైనా అజెండా వేరు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చటం, గౌరవ ప్రదమైన జీవనాన్ని ఇవ్వటం ప్రధమ కర్తవ్యం.


అందుకోసం చైనా కమ్యూనిస్టు పార్టీ కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టింది. చైనా మార్కెట్‌ను విదేశాలకు తెరిచే ముందు నాటి నేత డెంగ్‌సియా పింగ్‌ ఒక మాట చెప్పాడు. కిటికి తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా వస్తాయని తెలుసు, వాటిని అరికట్టగలమని అన్నాడు.అంతే కాదు, వర్తమాన చరిత్రలో మరేదేశానికి లేని సమస్యలు చైనా ముందుకు వచ్చాయి. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రాలలో ఒకటిగా రూపొందిన హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి 99 సంవత్సరాల కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం కావటం ఒకటి.అదే విధంగా పోర్చుగీసు వారి కౌలులో ఉన్న మకావో దీవులు ప్రపంచ పేరు మోసిన జూద కేంద్రాల్లో ఒకటిగా మారింది. అది కూడా చైనాలో విలీనం కావాల్సి ఉంది. తెల్లవారే సరికి వాటిని కలిపేయటం పెద్ద సమస్య కాదు. తమ ఆర్ధిక వృద్ధి కోసం ప్రపంచమంతటి నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న చైనా తనలో విలీనం కానున్న ప్రాంతాల్లోని పెట్టుబడులను తిరస్కరించాల్సిన అవసరం లేదు. అందుకే 50 సంవత్సరాల పాటు విలీనానికి ముందున్న వ్యవస్థలనే కొనసాగిస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అక్కడి పెట్టుబడి సంస్థలకు భరోసానిచ్చింది. 1949 నాటికి అన్ని ప్రాంతాలను విలీనం చేసేందుకు సిద్దం అవుతున్నది. అప్పటి వరకు అమెరికా, ఇతర దేశాలూ రెచ్చగొడుతూనే ఉంటాయి. రష్యాను తమతో కలుపుకు పోవాలని చూసిన పశ్చిమ దేశాలు అది జరిగేది కాదని తేలటంతో దాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు వేశాయి. దాని పర్యవసానాలను పశ్చిమ దేశాలు ఊహించలేదు లేదా సరిగా అంచనాగట్టలేకపోయాయి.


రష్యా పొరుగునే ఉన్న జార్జియాలో అడుగుపెట్టేందుకు 1994 నుంచి నాటో పావులు కదిపింది. జార్జియాలో రష్యన్‌ భాష మాట్లాడే అబ్‌ఖాజియా, దక్షిణ ఒసెటీ ప్రాంతాలలో తలెత్తిన వేర్పాటువాద ఆందోళపకు మద్దతు ఇవ్వటమే కాదు, వాటిని స్వతంత్ర దేశాలుగా రష్యా మరికొన్ని దేశాలు గుర్తించాయి. దాంతో 2008లో జార్జియా-రష్యా మధ్య 12 రోజుల పాటు యుద్దం జరిగింది. రెండు చోట్లా రష్యా తన సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాటో అప్పటి నుంచి వెనక్కు తగ్గింది. తరువాత ఉక్రెయిన్లో పాగా వేసేందుకు నాటో పూనుకుంది. అది 2014లో క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా విలీనం చేసుకుంది. తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్‌పై జరుగుతున్న సైనిక చర్య, డాన్‌బాస్‌ ప్రాంతంలోని రెండు ప్రాంతాలను దేశాలుగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి మూకలను వెనక్కు కొట్టటం తెలిసిందే.దాన్నుంచి ఎలా బయట పడాలో తెలియని అమెరికా ఇప్పుడు తైవాన్ను ముందుకు తేవాలని చూస్తున్నది. తెగేదాకా లాగితే దాని విలీన ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” లిటిల్‌ బోయి ” ” ఫాట్‌మాన్‌ ” కంటే మరింత ముప్పుగా మారిన అమెరికా, నాటో కూటమి !

05 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Atomic bombings of Hiroshima and Nagasaki, NATO, Ukraine-Russia crisis, US imperialism, world Peace


ఎం కోటేశ్వరరావు

ఆగస్టు నెల వస్తుందంటే ప్రపంచ శాంతి ప్రియులకు గుర్తుకు వచ్చేది హిరోషిమా-నాగసాకీలపై అమెరికా జరిపిన దుర్మార్గ అణుబాంబుల దాడి.1945 ఆగస్టు ఆరున హిరోషిమా, తొమ్మిదిన నాగసాకి నగరాలపై అవసరం లేకున్నా రెండవ ప్రపంచ యుద్దం దాదాపుగా ముగిసిన తరువాత బాంబులు వేసి తన దగ్గర ఎంతటి ప్రమాదకర మారణాయుధాలున్నాయో, అవెలా విధ్వంసం సృష్టిస్తాయో చూడండని భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసిరింది. ఆ తరువాతే దానికి ధీటుగా ఉండేందుకు సోవియట్‌, బ్రిటన్‌,ఫ్రాన్స్‌, చైనా అణ్వస్త్రాలను తయారు చేశాయి. ఇప్పుడు భారత్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాల వద్దకూడా ఉన్నాయి. మరొక భావన ప్రకారం ఏ దేశంలోనైతే అణువిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ ఏ క్షణంలోనైనా బాంబులు తయారు చేసే స్థితిలో ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటైన ఇరాన్‌ అణ్వస్త్రాల తయారీ కార్యక్రమం చేపట్టిన కారణంగానే దాన్ని విరమింప చేసేందుకు అమెరికా తదితర దేశాలు పూనుకోవటం, ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవటం వంటి పరిణామాలన్నీ తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇప్పుడు 1945 నాటి అణు బాంబుల కంటే ఇంకా ఎంతో విధ్వంసాన్ని సృష్టించగలిగినవి, కొన్ని వేల బాంబులు తయారై సిద్దంగా ఉన్నాయి.అవేగాక ఇతర మారణాయుధాలు గుట్టలుగా పేర్చుకొని సిద్దంగా పెట్టుకున్నారు. అమెరికా తాను తయారు చేసిన ప్రతి కొత్త ఆయుధం ఎలా పని చేస్తుందో చూసేందుకు అది సృష్టిస్తున్న యుద్దాలలో జనం మీద ప్రయోగించి చూస్తున్నది. ఇప్పుడు ఐరోపాలోని ఉక్రెయిన్ను అందుకు ప్రయోగశాలగా చేసుకుంది.


రెండవ ప్రపంచ యుద్ద చివరి సంవత్సరం 1945 మే ఎనిమిదవ తేదీన జర్మనీ లొంగిపోయింది. తరువాత ప్రధాన శత్రువుగా ఉన్న జపాన్‌పై భారీఎత్తున దాడి చేసేందుకు మిత్రరాజ్యాలు పూనుకున్నాయి. అప్పటికి అమెరికా తలపెట్టిన అణుబాంబుల తయారీ చివరి దశకు వచ్చింది. జూలై నాటికి ప్లూటోనియంతో తయారుచేసిన ” ఫాట్‌ మాన్‌ ” యురేనియంతో రూపొందించిన ” లిటిల్‌ బోయి ” సిద్దంగా ఉన్నాయి.జపాన్నుంచి స్వాధీనం చేసుకున్న సమీపంలోని మరియానా దీవుల్లో ఒకటైన టినియన్‌లో అమెరికా వాటిని ఉంచింది. జపాన్‌ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26న పోట్స్‌డామ్‌ ప్రకటనలో మిత్రదేశాలు అల్టిమేటం ఇచ్చాయి. అయితే దానికి ముందే అమెరికా-బ్రిటన్‌ కూడబలుక్కొని నాగసాకి, హిరోషిమా,కొకురా, నిజిగటా పట్టణాలపై అణుబాంబులు వేయాలని నిర్ణయించాయి. ఆగస్టు ఆరున హిరోషిమాపై లిటిల్‌బోయి, తొమ్మిదిన నాగసాకిపై ఫాట్‌మాన్‌ బాంబులు వేశారు. లొంగేది లేదని జపాన్‌ బింకంగా ప్రకటించినప్పటికీ అప్పటికే అది చావుదెబ్బలు తిన్నందున మరికొద్ది రోజుల్లో పతనమై ఉండేది. బాంబులు వేసిన రోజు, తరువాత హిరోషిమాలో లక్షా 29వేల మంది, నాగసాకిలో రెండు లక్షల 26వేల మంది మరణించారు.తరువాత అణుధూళితో మరికొన్ని వేల మంది మరణం, రోగాలపాలైనారు.


అణ్వాయుధాల ముప్పును చూసిన తరువాత వాటిని మరొకసారి వినియోగించరాదనే డిమాండ్‌ను ప్రపంచ శాంతి ఉద్యమం ముందుకు తెచ్చింది. ఎవరైనా తమ మీద ప్రయోగించకపోతే తాముగా ముందు ఉపయోగించబోమని (ఎన్‌ఎఫ్‌యు పాలసీ) అణుశక్తి దేశాలు స్వచ్చందంగా ప్రకటన చేసి కట్టుబడి ఉండాలన్నదే దాని సారం.ఇదేగాక అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని భద్రతామండలిలోని ఐదు శాశ్వత, అణుశక్తి దేశాలు ముందుకు తెచ్చాయి.1964లో అణ్వాయుధాలను సమకూర్చుకున్న చైనా ఏ సమయంలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ముందుగా ఉపయోగించబోమని తొలిసారిగా చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉంది. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాను డిమాండ్‌ చేయగా అది తిరస్కరించింది. రష్యా – చైనా పరస్పరం వాటిని ఉపయోగించరాదని ఒప్పందం చేసుకున్నాయి.


మన దేశం 1974లోనే తొలి అణుపరీక్ష జరిపినప్పటికీ, 1998లో రెండవసారి పోఖ్రాన్‌ పరీక్షల తరువాత మాత్రమే తమ మీద ఎవరూ అణుదాడికి దిగకపోతే తాముగా ముందు ప్రయోగించబోమని 1999లో ప్రకటించింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. పరిస్థితులను బట్టి ఆ వైఖరిని సవరించుకోవాల్సి రావచ్చని 2019లో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పినప్పటికీ పాత విధానమే కొనసాగుతోంది.తమ మీద, తమ మిత్ర దేశాల మీద ఎవరైనా దాడి చేస్తే తప్ప తాము ఉయోగించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చెబుతున్నాయి, గతంలో సోవియట్‌, తరువాత రష్యా కూడా అదే చెప్పింది. సోవియట్‌ గనుక దురాక్రమణకు పాల్పడితే అణ్వాయుధాలను వాడతామని నాటో కూటమి చెప్పింది.అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దానిలో భాగస్వాములే.1999లో నాటో పదహారవ సమావేశంలో ఎన్‌ఎఫ్‌యు విధానాన్ని ఆమోదించాలని జర్మనీ చేసిన ప్రతిపాదనను సమావేశం తిరస్కరించింది. అణుయుద్దంలో విజేతలెవరూ ఉండరు, ఎన్నడూ పోరుకు పూనుకోవద్దంటూ ఎన్‌పిటి దేశాలు 2022లో ఒక ప్రకటన చేశాయి. ఎన్‌పిటి వివక్షతో కూడుకున్నదంటూ దాని మీద సంతకం చేసేందుకు మన దేశం తిరస్కరించింది.తమకు ఎన్‌ఎఫ్‌యు విధానం లేదని పాకిస్తాన్‌ చెబుతుండగా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నదీ లేనిదీ ఇజ్రాయెల్‌ నిర్దారించటం లేదు. తాముగా ముందు దాడికి దిగబోమని ఎవరైనా చేస్తే ప్రతిదాడి చేస్తామని ఉత్తర కొరియా చెప్పింది. ఉక్రెయిన్‌ వివాదంలో అవసరమైతే అణుదాడి చేస్తామని పుతిన్‌ హెచ్చరించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు.


అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిరంతరం ఉద్రిక్తతలు, యుద్దాలు లేకపోతే నిదురపట్టదు. ఒక దగ్గర ముగిస్తే మరోచోట ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అవమానకరంగా వెన్ను చూపిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అగ్గిరాజేశాయి. రష్యా బలహీనంగా ఉన్నపుడు తమతో కలుపుకుపోయి చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలని చూసిన ధనిక దేశాల జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చాయి. ఇదే సమయంలో ఎప్పుడైనా తమకు సవాలుగా మారవచ్చని భావించిన ఆ కూటమి నాటో విస్తరణ పేరుతో జార్జియా, ఉక్రెయిన్ను చేర్చుకొని రష్యా ముంగిట ఆయుధాలను మోహరించాలని చూశాయి. రష్యా దాన్ని గ్రహించి ప్రతి వ్యూహంతో ఒక వైపు చైనాతో ఉన్న స్వల్ప వివాదాలను పరిష్కరించుకుంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో అధికారంలో ఉన్న రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమ తొత్తులను ప్రతిష్టించాయి.రష్యా తన సరిహద్దులో ఉండి నాటోలో చేరాలని చూసిన జార్జియాలో రెండు ప్రాంతాల్లో తలెత్తిన స్వాతంత్య్ర ఉద్యమాలకు మద్దతు ఇచ్చి వాటిని దేశాలుగా గుర్తించింది.ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉన్న మెజారిటీ రష్యన్లు తాము విడిపోయి స్వతంత్ర దేశాలుగా అవతరిస్తామని ప్రారంభించిన తిరుగుబాటుకు మద్దతు తెలిపింది. గతంలో తన భూభాగంగా ఉండి తరువాత ఉక్రెయిన్లో కొనసాగిన క్రిమియా ప్రాంతాన్ని 2014లో రష్యా విలీనం చేసుకుంది. అక్కడ తన సేనలను మోహరించింది. ఈ ఉదంతాన్ని సాకుగా చూపి జి8 బృందం నుంచి రష్యాను బహిష్కరించారు. అప్పటి నుంచి నాటో కూటమి దేశాలు ఉక్రెయినుకు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేసి రష్యాను రెచ్చగొట్టాయి.ఐరోపా సమాఖ్య, నాటోలో చేర్చుకొని మిలిటరీని కూడా తరలించాలని చూశాయి. ఇది తమ దేశ భద్రతకు ముప్పు అని, ఉక్రెయిన్ను తమ కూటమిలో చేర్చుకోవద్దని అనేక వేదికల మీద రష్యా చేసిన వినతులను పట్టించుకోలేదు. దీంతో విధిలేని స్థితిలో 2022 ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించింది. డాన్‌బాస్‌ ప్రాంతంపై దాడులు చేస్తున్న మిలిటరీ, కిరాయి మూకల నుంచి విముక్తి చేయటంతో పాటు ఉక్రెయిన్‌ సైనిక పాటవాన్ని దెబ్బతీస్తామని, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేది లేదని ప్రకటించింది. ఆ మేరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా ఆచితూచి దాడులు చేస్తున్నది.


ఈ వివాదంలో రెండు వైపులా మరణించిన సైనికులు, పౌరుల సంఖ్య గురించి కచ్చితమైన వివరాలు ఇంతవరకు లేవు. ఇరుపక్షాలు చెబుతున్నవాటిని విశ్వసించలేము.కిరాయి మూకలు లేవని తొలుత ఉక్రెయిన్‌ చెప్పింది. తరువాత అజోవ్‌ ప్రాంతంలోని ఉక్కు ఫ్యాక్టరీ నుంచి దాడులకు దిగిన వేలాది మంది కిరాయి మూకలు రష్యన్లకు బందీలుగా చిక్కాయి. ఒక వేళ రష్యా దాడులకు దిగితే తాము అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పి ఉక్రెయిన్ను వివాదంలోకి దించిన పశ్చిమ దేశాలు తాము ఎన్ని కావాలంటే అన్ని అస్త్రాలను అందిస్తాం తప్ప మిలిటరీని పంపం, వైమానిక దాడులు జరపం అని చెప్పాయి. తొలి రోజుల్లో ఉక్రెయిన్‌ ప్రతిఘటన, రష్యాను దెబ్బతీస్తున్న తీరు తెన్నులంటూ ప్రపంచాన్ని, తమ ప్రజానీకాన్ని నమ్మింప చూసిన పశ్చిమ దేశాల మీడియా, వాటిని నమ్మి మన జనానికి అందించిన మన మీడియాలో ఇప్పుడు అలాంటి ” కతలు ” కనిపించవు, వినిపించటం లేదు.


పశ్చిమ దేశాలు సృష్టించిన ఈ సంక్షోభానికి ఉక్రేనియన్లు బలిఅవుతున్నారు. జూలై నాలుగు నాటి ఐరాస సమాచారం ప్రకారం 50లక్షల మంది వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. మరో 70లక్షల మంది స్వదేశంలోనే నెలవులు తప్పారు.రష్యాదాడుల కారణంగా ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లిన 35లక్షల మంది తప్ప ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి మూకల దాడులతో 14లక్షల మంది రష్యాలో తలదాచుకుంటున్నారనే అంశం మనకు మీడియాలో కనిపించదు. మన దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ది రేటు కరోనాకు ముందే నాలుగుశాతానికి పడిపోయింది. దీనికి పాలకులు అనుసరించిన విధానాలే కారణం. కానీ ఇటీవల వంటనూనెల ధరలు ఆకాశానికి అంటటానికి,కొరతకు ఉక్రెయిన్‌ కొంత కారణమైతే ఇక్కడి వ్యాపారుల మీద ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా ఉండటం ఒక ప్రధాన కారణం. పామోలిన్‌, సన్‌ఫ్లవర్‌ అంటే దిగుమతులు చేసుకుంటున్నాం, మరి వేరుశనగనూనె ఎందుకు కనిపించటం లేదు ? శ్రీలంక ఆందోళనలు, ఏడాదికిపైగా సాగిన రైతుల ఉద్యమ నేపధ్యంలో మరోదారి లేక చమురు ధరలు పెరిగినందున ఎరువుల ధరలను రైతులపై మోపకుండా కేంద్రం సబ్సిడీ రూపంలో భరిస్తున్నది, చమురుపై విధించిన పన్నులను కొంత మేరకు తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను నరేంద్రమోడీ సర్కార్‌ స్థంభింప చేసింది తప్ప ఇతర వస్తువుల ధరల పెరుగుదల నుంచి జనాలకు ఎందుకు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు.

రష్యా నుంచి ఎరువులు, గోధుమలు, ఇంథన సరఫరాలు నిలిచిపోవటంతో అనేక దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటికీ ప్రపంచ పెత్తనంపై అమెరికా, దాని మిత్రదేశాల కాంక్ష తప్ప మరొకటి లేదు. ఐరోపా సమాఖ్య,నాటోలో చేరేది లేదని ఉక్రెయిన్‌ అంగీకరిస్తే దాని సార్వభౌత్వానికి, రక్షణకు హామీ ఇస్తామని రష్యా చెబుతున్నప్పటికీ పశ్చిమ దేశాలు పడనివ్వటం లేదు. ఆంక్షలతో రష్యాను దెబ్బతీసేందుకే పూనుకున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు అనుకున్నట్లుగా జరగలేదు. అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరగటంతో అది రష్యాకు వరంగా మారి రాబడిని పెంచింది. మన దేశం, చైనా తదితర దేశాలకు రాయితీలకు చమురు అమ్ముతున్నది. కానీ ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నది.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము.పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కీలుబొమ్మగా మారాడు. రష్యా నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసిన ఐరోపా దేశాల మీద దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.రష్యా మీద కూడా దీని ప్రభావం ఉంది, అయితే ముందుగానే ఊహించినందున ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు. ఉక్రెయిన్‌ ఆర్ధిక వ్యవస్థ 2022లో 45శాతం, రష్యాలో 8-10శాతం వరకు తిరోగమనంలో ఉంటుందని అంచనా. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం గతేడాది ప్రపంచ వృద్ది రేటు 6.1శాతం కాగా వర్తమాన సంవత్సరంలో అది 2.6, 2023లో రెండు శాతానికి తగ్గుతుందని తాజా అంచనా. ఐరోపా, అమెరికాల్లో వచ్చే ఏడాది వృద్ది రేటు సున్నా అంటున్నారు. 1970 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వృద్ది రేటు రెండుసార్లు రెండుశాతానికి పడిపోయింది. ధనిక దేశాల వృద్ది రేటు పడిపోతే మన వంటి దేశాల ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించేందుకు పశ్చిమ దేశాలు ముందుకు రావటం లేదు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్‌ నుంచి ఐరోపాకు ముప్పు ఉంటుందనే పేరుతో బ్రిటన్‌తో చేతులు కలిపిన అమెరికా నాటో కూటమిని ఏర్పాటు చేసి పగ్గాలు తన చేతిలో ఉంచుకుంది.నాటో తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బ్రిటీష్‌ జనరల్‌ హేస్టింగ్‌ ఇస్మే మాటల్లో ” ఐరోపాకు దూరంగా రష్యా (సోవియట్‌ )ను నెట్టటం, అమెరికాను లోనికి రప్పించటం,జర్మనీ పలుకుబడిని తగ్గించటం ” అన్నాడు.ఐరోపాలో శాంతి-స్థిరత్వాలకు అది దోహదం చేస్తుందని ప్రపంచాన్ని నమ్మించారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు, ఐరోపాకు ముప్పూ లేనప్పటికీ గత మూడు దశాబ్దాలుగా దాన్ని కొనసాగించటమే కాదు, విస్తరిస్తున్నారు. అది ఇప్పుడు అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ముప్పుగా మారింది.అమెరికా అణుదాడికి గురైన జపాన్‌ ఇప్పుడు అదే అమెరికాతో చేతులు కలిపింది. చైనా మీద కాలుదువ్వుతోంది. సోవియట్‌ విచ్చిన్నం తరువాత నాటోను కానసాగిస్తున్నారు. నాటో పరిధి వెలుపల మిలిటరీ చర్యలకు వినియోగిస్తున్నారు. వాటికి మానవతాపూర్వక దాడులని పేరు పెట్టారు.1994లో బోస్నియాలో నాటో విమానాలు తొలిసారిగా దాడులు చేసి సెర్బియా విమానాన్ని కూల్చాయి.1999లో సెర్బియా మీద 78రోజులు దాడులు చేసింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఇరాక్‌పై దురాక్రమణను నాటో సమర్ధించింది, తరువాత ఆప్ఘనిస్తాన్‌ దురాక్రమణ, లిబియాపై దాడుల్లో భాగస్వామిగా మారింది.లిబియానేత గడాఫీని హత్య చేసి తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1991లో సోవియట్‌ విడిపోయి నపుడు నాటోను విస్తరించబోమని రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి తూర్పు ఐరోపాలో ఉన్న అనేక దేశాలను చేర్చుకోవటమే తాజా పరిణామాలకు మూలం.తటస్థ దేశాలుగా ఉన్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను చేర్చుకొనేందుకు నిర్ణయించిది. అంటే రష్యా సరిహద్దులో తిష్టకు తెరలేపింది. లాటిన్‌ అమెరికాలో కూడా నాటో అడుగుపెట్టేందుకు పూనుకుంది. మొత్తం ప్రపంచానికి ముప్పు తలపెట్టింది.


నాటోను ఆసియాకు విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడ కొత్త కూటమి ఏర్పాటు, దానిని నాటోకు అనుసంధానించే ఎత్తుగడ ఉంది.ఇదంతా చైనాను కట్టడి చేసేందుకే.ప్రపంచంలోని 80 దేశాల్లో అమెరికాకు 800 మిలిటరీ కేంద్రాలున్నాయి. వాటిలో నాలుగు వందలు చైనా చుట్టూ ఉన్నాయంటే అమెరికా కేంద్రీకరణ దానిమీద ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనా పెద్ద ఎత్తున ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పూనుకుందన్న ప్రచారం మరోవైపు అదే అమెరికా సాగిస్తోంది. ఒక చిన్న దేశం సింగపూర్‌కే ప్రపంచంలో నాలుగు సైనిక కేంద్రాలున్నాయి. ప్రపంచంలోనే పెద్ద దేశమైన చైనా తన చుట్టూ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా తదితరదేశాలు పట్టుబిగిస్తున్నా అలాంటి కేంద్రాల ఏర్పాటుకు పూనుకోలేదు. దానికి కంపూచియాలో ఒక నౌకా కేంద్రం, తజకిస్తాన్‌లో ఒక మిలిటరీ పోస్టు, జిబౌటీలో అనేక దేశాల సైనిక కేంద్రాల సరసన దానికి ఒక చిన్న కేంద్రం ఉంది. ఎక్కడైనా స్వేచ్చగా తిరిగే హక్కు తమకు ఉందంటూ అమెరికా నగరమైన న్యూయార్క్‌ ఇతర సముద్రతీర నగరాల వైపు ఏ విదేశీ మిలిటరీ నౌకలు తిరగటం ఎన్నడూ కనిపించదు. కానీ చైనా చుట్టూ అమెరికా, దాని మిత్రదేశా నౌకలు నిరంతరం తిరుగుతూనే దర్శనమిస్తాయి, ఎందుకని ? దేశమంటే మట్టికాదోయి మనుషులోయి అన్న మహాకవి గురజాడ స్ఫూర్తితో విశ్వమానవాళికోసం హిరోషిమా, నాగసాకి దినం సందర్భంగా ప్రపంచంలోని శాంతి ప్రియులందరూ అమెరికా దాని మిత్ర దేశాల యుద్దోన్మాదాన్ని ఖండించాలి, నిరసించాలి. ప్రపంచాన్ని కాపాడాలి. శాంతి ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !

03 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies


ఎం కోటేశ్వరరావు


మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్‌ చక్రవర్తి కైజర్‌ రెండవ విల్‌హెల్మ్‌.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్‌ వారి పత్రిక నార్త్‌ చైనా డైలీ న్యూస్‌ ఒక వార్త ప్రచురించింది. కైజర్‌ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్‌ నాటికి లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్‌ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్‌ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్‌ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్‌ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్‌ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్‌ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ జాన్‌ చార్టరీస్‌ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్‌ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్‌ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్‌ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్‌ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్‌ నాజీ హిట్లర్‌ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్‌ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.


అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్‌ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్‌ విస్నర్‌ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.


పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్‌ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్‌ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్‌ గల్ఫ్‌ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్‌ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్‌ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్‌ హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్‌ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ బయట పెట్టినందుకు అమెరికన్‌ కార్పొరేట్‌ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.


అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్‌ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్‌ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.


అమెరికన్‌ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వం 1953లో బ్రిటీష్‌, అమెరికన్‌ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్‌ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్‌ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్‌ నెల గాలప్‌ పోల్‌ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్‌ పోల్‌ పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్‌ బారోమీటర్‌ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.


మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్‌ 61, రిపబ్లిక్‌ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్‌ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్‌ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్‌ చూస్తామని 53శాతం, వాట్సాప్‌ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్‌ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జి న్యూస్‌ ముందున్నాయి. రిపబ్లిక్‌ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.


మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

2024 ఎన్నికలు : పనామాలో కూడా ఎర్రజెండా ఎగురుతుందా ?

30 Saturday Jul 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Latin America’s Right, Latin American left, panama, panama canal, protests in Panama


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష అలలను కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్‌ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్‌ పెట్రోను ఎన్నుకోవటంతో ప్రతిదీ మారుతోందంటూ గుండెలు బాదుకున్నాడు.2010దశకం నుంచి పెరుగుతున్న ఎర్ర మంటను ఆర్పలేకపోయినట్లు వాపోయాడు. రష్యా, చైనాలను అడ్డుకోవటం ఎలా అన్నదానిమీదే అమెరికా కేంద్రీకరిస్తోంది తప్ప లాటిన్‌ అమెరికాలో వాటి ప్రభావాన్ని అడ్డుకొనేందుకు చూడటం లేదన్నాడు. వెనెజులాను దెబ్బతీయటంలో కొలంబియా ప్రధాన పాత్రధారిగా ఉంది. ఇప్పుడు గుస్తావ్‌ పెట్రో వెనెజులాతో సంబంధాలను పునరుద్దరించుకుంటానని చెప్పటం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబా, నికరాగువాలను ఆహ్వానించనందుకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ప్రకటించటం అమెరికాకు చెంపదెబ్బ వంటిది.


జో బైడెన్‌ శ్రద్దలేమి వలన దూరంగా ఉన్న చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, తూర్పు ఐరోపాలనే కాదు, మూర్ఖత్వం, అచేతనం, పట్టించుకోని కారణంగా పెరటి తోటగా ఉన్న లాటిన్‌ అమెరికాను కూడా కోల్పోతున్నామంటూ మరో విశ్లేషకుడు వాపోయాడు.రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే అమెరికా అనుకూల పెరూ, కొలంబియాలను బైడెన్‌ ఏలుబడిలో కోల్పోయాము. బ్రెజిల్‌ నుంచి పనామా, గౌతమాల నుంచి మెక్సికో వరకు ఎక్కడ చూసినా వామపక్ష శక్తులు ముందుకు పోతున్నాయి. జనాలను చైతన్యవంతులను గావించేందుకు గత రెండు దశాబ్దాల్లో మనం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు దేనికీ పనికి రాలేదు. మన పెరటితోటలోనే పలుకుబడి కోల్పోవటాన్ని ప్రపంచంలోని మన స్నేహితులు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తున్న చైనా చిరునవ్వులు చిందిస్తోంది, మన స్థానాన్ని ఆక్రమించేందుకు చూస్తోంది. గత పాతిక సంవత్సరాల్లో మన అధ్యక్షులతో భేఠీ వేసిన వారందరూ ఒక్కొరొక్కరుగా జారిపోతుంటే గుండెలు బద్దలువుతున్నాయి. దీర్ఘకాలం మన అనుంగు దేశంగా ఉన్న కొలంబియా వామపక్ష శక్తుల వశమైందని కూడా బైడెన్‌ గ్రహించినట్లు లేదు. చైనా తమ ప్రాంతంలోనే కాదు చివరికి మన దగ్గర కూడా కమ్యూనిజాన్ని ముందుకు నెడుతోందని సదరు విశ్లేషకుడు గుండెలు బాదుకున్నాడు.


లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి కొందరు అమెరికా భక్తుల కడుపు మంట ఇది. వెనెజులాలో ఆగస్టు నెలలో జరిగే మిలిటరీ క్రీడలనే కాదు, పనామాలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కూడా పట్టించుకోకపోతే అది కూడా వామపక్షాల వశం కానుందని ఒక విశ్లేకురాలు రాసినదానికి వాల్‌స్ట్రీట్‌ జనరల్‌తో సహా అనేక పత్రికలు ప్రాధాన్యత ఇచ్చాయి. పశ్చిమార్ధగోళంలో తొలిసారిగా రష్యా నిర్వహించే క్రీడలివి.లాటిన్‌ అమెరికాలో రష్యా,ఇరాన్‌, చైనా నిరంతరం కనిపిస్తూనే ఉంటాయని చెప్పటమే మిలిటరీ క్రీడల లక్ష్యమని మరింతగా చెప్పాలంటే ఈ ప్రాంతం వెలుపల అమెరికాను వ్యతిరేకించే మిలిటరీలను ఇక్కడి దేశాలు ఆహ్వానించే, సమ్మతికి బాటవేయటమేనని కూడా ఆమె పేర్కొన్నారు.


అసలు పనామాలో ఏం జరుగుతోంది ? పనామా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పనామా కాలువ. అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలిపే 81కిలోమీటర్ల పొడవైన కాలువ. పనామా జనాభా నలభై లక్షలు కాగా, సగం మంది రాజధాని పనామా సిటీలోనే ఉంటారు. ఉత్తర- దక్షిణ అమెరికాలను అనుసంధానించే దేశం పనామా. జూలై ఆరవ తేదీన శాంటియాగో డి వెరాగువాస్‌ అనే చిన్న పట్ణణంలో ( ఇది పనామా కాలువ నుంచి ఇతర లాటిన్‌ అమెరికా దేశాలకు వస్తువులను రవాణా చేసే కీలక రహదారి ప్రాంతంలో ఉంది. దాన్ని మూసివేస్తే రవాణా మొత్తం ఆగిపోతుంది) ప్రభుత్వ విధానాలు,జనం మీద మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సమ్మె రూపంలో టీచర్ల సంఘం తొలుత నిరసన తెలిపింది. బిల్లు- బెల్లు తప్ప మిగతావాటితో మనకేం పని అని వారు అనుకోలేదు. తరువాత దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరసన పాకింది.బలమైన నిర్మాణ సంఘ కార్మికులు కలిశారు. తరువాత రైతులు, విద్యార్ధులు, మూలవాసులు అందరూ గళం విప్పారు. కార్మికుల సమ్మెతో విమానాలు ఎక్కాల్సిన వారు నడిచి పోవాల్సివచ్చింది. శ్రీలంక పరిణామాలు గుర్తుకు వచ్చి లేదా తోటి దేశాల్లో పరిణామాలను చూసి కావచ్చు, పదిహేడవ తేదీన గాలన్‌(3.78లీటర్లు) పెట్రోలు ధరను ఆరు నుంచి 3.25 డాలర్లకు తగ్గించారు. మన ప్రధాని నరేంద్రమోడీ కొంత మేర సెస్‌లను తగ్గించారు.ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్థంభింప చేశారు. పనామా టీచర్లు సమ్మె విరమించలేదు. ఇరవయ్యవ తేదీన పనామా కాథలిక్‌ బిషప్పును రంగంలోకి తెచ్చారు. ప్రభుత్వం-నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులతో కూర్చోపెట్టారు.ఆహార, ఔషధాల ధరల అదుపు, విద్యపై ఖర్చు పెంపు, విద్యుత్‌ సబ్సిడీల వంటి ఎనిమిది అంశాలపై ప్రజాసంఘాలు ఆమోదం తెలిపినట్లు బిషప్‌ ప్రకటించారు తప్ప ఆందోళనలు ఆగలేదు.అస్తవ్యస్తంగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్దం కాలేదు. ధరల పెరుగుదలే కాదు, రాజకీయ అవినీతిపై చర్యలు, రాజకీయ సంస్కరణలు చేపట్టాలనే డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా తదుపరి ఏం జరగనుందో చెప్పలేము.


రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ దర్శనమిచ్చినట్లుగా జనం తీవ్ర ఇక్కట్లపాలైన స్థితిలో పనామా పాలక పార్టీ ఎంపీలు ఖరీదైన విస్కీ తాగుతూ మజా చేస్తున్న వీడియోలు జనానికి ఆగ్రహం తెప్పించాయి.ఆశ్రితులను అందలాలెక్కించటం, సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులను హరించటం, ఖరీదైన విదేశీ ఔషధాల దిగుమతులకు అనుమతుల వంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత జన ఇబ్బందులకు ఇవ్వలేదు. ఔషధాల లేమి, వేతనాల కోత, చివరికి డాక్టర్లకు సైతం వేతనాల నిలిపివేత, చేసేందుకు పని లేకపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. ఆపరేషన్‌ చేయాల్సిన చోట బాండ్‌ ఎయిడ్‌ వేసినట్లుగా అరకొర చర్యలు జనాన్ని సంతృప్తి పరచలేదు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకుంది. జనవరి తరువాత చమురు ధరలు 50శాతం పెరిగాయి, నిరుద్యోగం పదిశాతానికి చేరింది.ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మిగతా దేశాల పాలకులు చెప్పినట్లే ధరల పెరుగుదలకు కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం కారణమని అధ్యక్షుడు కార్టిజో తప్పించుకో చూశాడు. దేశం ఆరున్నరశాతం రేటుతో అభివృద్ది చెందుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేకపోతోందన్న ప్రశ్నకు జవాబు లేదు.


లాటిన్‌ అమెరికాలో ఆర్ధిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పనామా ఒకటి. అది అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలతో అసమానత మరింత పెరిగింది. కరోనాతో జన జీవితాలు మరింతగా దిగజారాయి. అంతకు ముందు 2018లోనే ఇరవై శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉండగా పదిశాతం మంది దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. కరోనాకు ముందు ప్రయివేటు రంగంలో 8,73,750 మంది వేతన జీవులుండగా కరోనాలో 37శాతం మందిని తొలగించారు, 30శాతం మందినే కొనసాగించారు, 33శాతం మంది కాంట్రాక్టు ఒప్పందాలను సస్పెండ్‌ చేశారు, అంటే వారికి కూడా ఉపాధి లేదు.2021లో వారిని తిరిగి తీసుకున్నారు. ప్రభుత్వం పొదుపు పేరుతో పదిశాతం ఖర్చు కోతపెట్టి 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఆర్ధిక అవినీతి సంగతి చూస్తే 2009 నుంచి 2019వరకు 46బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు ఎగవేసిన వారి మీద ఎలాంటి చర్యలూ లేవు. ఒక్క 2019లోనే ఆరు బిలియన్‌ డాలర్ల మేరకు ఎగవేశారంటే ఇప్పుడు ఇంకా పెరిగిందన్నది స్పష్టం. ఇదంతా అనేక పన్ను రాయితీలు ఇచ్చిన తరువాత జరిగిన అవినీతి.


ఒకవైపు జనజీవితాలు దిగజారుతుంటే ఎంపీల వేతనాలు పెద్ద మొత్తంలో పెంచటమే కాదు, అనేక మందికి లాభాలు పొందే కాంట్రాక్టులను అప్పగించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న జీవన వ్యయానికి ఇటీవలి వెలపలి కారణంగా తోడై కార్మికుల్లో అసంతృప్తిని మరింత పెంచినట్లు వామపక్ష నేత, గత ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేసిన సాల్‌ మెండెజ్‌ చెప్పాడు. పాలకులు అవినీతిని సంస్థాగతం గావించారని ప్రముఖ గాయకుడు, రచయిత రేబెన్‌ బేడ్స్‌ విమర్శించారు, ప్రజాధనాన్ని లూటీ చేశారన్నాడు. అవినీతిని అరికట్టాలన్న జనం డిమాండ్‌ను పట్టించుకోకుండా ఎంపీలకు కాంట్రాక్టులు అప్పగించినట్లు పౌరశక్తి సంస్థ నేత చెప్పాడు. సంస్కరణలకు ఒక ప్రణాళికను ప్రకటించాలని ఐదు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. గత మూడు సంవత్సరాలలో సంక్షేమ చర్యలకు చేసిన ఖర్చుతో 16.5బి. డాలర్లు అప్పు పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది.


పనామాలో తలెత్తిన ఆందోళనకు మూలం నూతన ఉదారవాద విధానాల పేరుతో ధనికులకు దోచి పెట్టే విధానపరమైనది తప్ప మరొకటి కాదు. రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ జనవరిలో చెప్పినదాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణ భారం జిడిపిలో 68.5 నుంచి 2021లో 64.2శాతానికి తగ్గింది. సామాజిక భద్రతా పధకాల రుణాలను పక్కన పెడితే అది 57.7శాతానికి తగ్గుతుంది.2020లో 17.9 ప్రతికూల వృద్ది రేటు నుంచి కోలుకొని 2021లో అంచనా వేసిన 12ను అధిగమించి 15శాతం వృద్ది నమోదైంది.2022, 2023లో వరుసగా 7,5శాతాల చొప్పును పెరుగుతుంది. దీర్ఘకాల మందగమనం నుంచి బయటపడుతుంది. పనామా కాలువ టోల్‌ ద్వారా, రాగి ఎగుమతులు ఆర్ధిక వృద్దికి చోదకాలుగా ఉన్నాయి.2021 నవంబరు వరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 0.9 బి.డాలర్లుగా ఉన్న రాగి ఎగుమతులు 2.5బి డాలర్లకు పెరిగాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. ఏటా 13-14వేల ఓడలు ప్రయాణించే పనామా కాలువ ద్వారా కూడా గణనీయంగా రాబడి వస్తున్నది.


లాటిన్‌ అమెరికాలో తనకు తైనాతీలుగా ఉన్న వారిని అధికారంలో కూర్చోపెట్టిన గతం, వర్తమానం అమెరికాకు ఉంది. పనామా కూడా అలాంటిదే. పనామా కాలువను తన ఆధీనంలో ఉంచుకున్న అమెరికా అన్ని విధాలుగా లబ్దిపొందింది. కాలువ ప్రాంతంలో తన సైనిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన కొలంబియాలో నేటి పనామా ఒక ప్రాంతం. స్వచ్చందంగానే కొలంబియాలో చేరినప్పటికీ అక్కడ వేర్పాటు భావనలు తలెత్తాయి.పనామా కాలువ ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని అమెరికా తలపెట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని విడగొట్టి స్వతంత్ర దేశంగా మార్చేందుకు చేయాల్సిందంతా చేసింది. వేర్పాటువాదులను పాలకులుగా గుర్తించి 1903లో వారితో ఒప్పందం చేసుకుంది.2000 నాటికి కాలువను పనామా ప్రభుత్వానికి అప్పగించేందుకు 1979లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తరువాత 1984 కుట్రచేసి మిలిటరీ జనరల్‌ నోరిగానూ గద్దెపై కూర్చోపెట్టింది. అదే నోరిగా అటు అమెరికా సిఐఏ నుంచి ఇటు మాదకద్రవ్యాల మాఫియా నుంచి నిధులు పొందుతూ ఏకు మేకై అమెరికా పెత్తనాన్ని సవాలు చేశాడు. దాంతో 1989లో అమెరికా మిలిటరీ దాడి చేసి నోరిగాను గద్దె దించి తనకు అనుకూలమైన శక్తులకు మద్దతు ఇచ్చింది.
పనామా చరిత్రను చూసినపుడు మితవాద, అమెరికా అనుకూల శక్తులదే అక్కడ పెత్తనం.2013లో బ్రాడ్‌ఫ్రంట్‌ పేరుతో నిర్మాణరంగ కార్మికనేత సాల్‌మెండెజ్‌ వామపక్ష పార్టీని ఏర్పాటు చేశాడు.2019 ఎన్నికల్లో అతనికి కేవలం 0.69శాతం, పార్లమెంటు ఎన్నికల్లో ఫ్రంట్‌కు 1.26శాతం ఓట్లు వచ్చాయి. తదుపరి ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. వామపక్ష శక్తుల బలం పరిమితంగా ఉన్న పనామాలో 1930దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. బలం పెద్దగా లేకున్నా పనామా కాలువను జాతీయం చేయాలన్న ఆందోళనలో చురుకుగా ఉండటమే గాక తరువాత అధికారానికి వచ్చిన ఉదారవాదులకు మద్దతు ఇచ్చింది. వారు ప్రజానుకూల విధానాలకు తిలోదకాలివ్వటంతో 1984లో వెలుపలికి వచ్చింది, 1991లో పార్టీ గుర్తింపును రద్దు చేశారు.


వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ జూలై నెలలో జరిగిన ప్రజా ఉద్యమాలు ఆశక్తులు బలపడేందుకు దోహదం చేస్తాయనే భయాన్ని మితవాద శక్తులు ముందుగానే వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు వామపక్ష శక్తులను ముందుకు తీసుకురావటం, జనం ఆదరించటమే దీనికి కారణం. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటి మాదిరే కొనసాగితే 2024 పనామా ఎన్నికల్లో వామపక్షాలు ఒక ప్రధాన శక్తిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన – కాలు మోపితే ఖబర్దార్‌ అన్న చైనా !

28 Thursday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

China stern warning, Joe Biden, Nancy Pelosi, Nancy Pelosi Taiwan trip, Taiwan Matters


ఎం కోటేశ్వరరావు


అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్‌లో అడుగు పెడతారా ? హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆమె మొండిగా వస్తే చైనా చూస్తూ ఊరుకుంటుందా ? తైవాన్ను నిషేధిత గగనతలంగా ప్రకటించే అవకాశం ఉందా ? ఒక వేళ నాన్సీ పెలోసీ విమానం గనుక తైవాన్‌ ప్రాంతానికి వస్తే చైనా విమానం లేదా విమానాలు దాన్ని వెంబడిస్తాయని, తైవాన్‌ గడ్డపై దిగకుండా చూస్తాయని అనధికార వార్తలు. ఒక వేళ అమెరికా విమానవాహక యుద్ద నౌకలు గనుక తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోంది ? ఉక్రెయిన్‌ వివాదంలో ఆశించినట్లుగా రష్యాను దెబ్బతీయలేకపోతున్నందున ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పధకం వేసిందా ? పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో గెలుపుకోసం బైడెన్‌ పడుతున్న పాట్లా ? లేక నిజంగానే చైనాతో లడాయి పెట్టుకొనేందుకు బైడెన్‌ యంత్రాంగం సిద్దపడుతోందా ? అమెరికాకు అంత సత్తా ఉందా ? చైనాను రెచ్చగొట్టి దాని స్పందన చూడండి అంటూ ప్రచారదాడిలో భాగంగా అమెరికా పథకం వేసిందా ? చివరికి టీ కప్పులో తుపానులా ముగుస్తుందా? ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతోంది.పెలోసీ పర్యటన నేపధ్యం లేదా తైవాన్‌ వేర్పాటు వాదులకు హెచ్చరికలో భాగం కావచ్చు తైవాన్‌ జలాల్లోకి ప్రవేశించే అమెరికా విమానవాహక నౌకలను లక్ష్యంగా చేసుకొని ఆధునిక క్షిపణులతో విన్యాసాలు నిర్వహించాలని మిలిటరీని చైనా ఆదేశించింది.


ప్రధాన భూభాగానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్‌ దీవి చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం అన్న సంగతి తెలిసిందే.1949 నుంచి అది వివిధ కారణాలతో విడిగా ఉంది. 1971 వరకు చైనా అంటే ఐరాస, భద్రతా మండలిలో దాన్నే గుర్తించారు, వీటో అధికారం కూడా ఉంది. 1971 నవంబరు 15 నుంచి చైనా అంటే తైవానుతో సహా కమ్యూనిస్టుల ఆధిపత్యంలోని ప్రభుత్వమే అసలైన ప్రతినిధిగా ఉంది. తరువాత అమెరికా కూడా విధిలేక తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించింది. అయినప్పటికీ తైవాన్‌ పౌరులను ఒప్పించిన తరువాతే తప్ప బలవంతంగా విలీనం చేయకూడదంటూ అమెరికా, దాని అనుకూల దేశాలు తైవాన్‌లోని విలీనవ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నాయి. అక్కడి ప్రభుత్వానికి ఆయుధాలు అందిస్తున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలు చేయిస్తున్నాయి. దీనిలో భాగంగానే నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన. అమెరికా అధికార వ్యవస్థ వరుసలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ ఉంటారు.ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ నిబంధనల మేరకు చైనా అనుమతి లేకుండా వీరిలో ఎవరు తైవాన్‌లో అడుగుపెట్టినా అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుంది.నిబంధనలను పాటించాలని ఇతర దేశాలకు ఉద్బోధించే అమెరికాకు అది వర్తించదా !


చైనా తీవ్ర హెచ్చరికల నేపధ్యంలో అమెరికాలో ఇప్పుడు పెద్ద నాటకం నడుస్తోంది. ప్రభుత్వ సహకారం లేకుండా నాన్సీ పెలోసి పర్యటన జరగదు. ఆమె నిజంగా పరó్యటిస్తారో లేదో అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ పర్యవసానాల గురించి బహిరంగ చర్చ జరుగుతోంది. తైవాన్‌ వెళితే తలెత్తే ముప్పు గురించి పెలోసికి నచ్చ చెప్పేందుకు బైడెన్‌ యంత్రాంగం తెరవెనుక మంతనాలు జరుపుతోందని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. ఏమైనా సరే వెళ్లాల్సిందేనని డెమోక్రటిక్‌-రిపబ్లికన్‌ పార్టీల్లోని చైనా వ్యతిరేకులు రెచ్చగొడుతున్నారు. జపాన్‌, ఇతర ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌ కూడా ఆగస్టు తొలివారంలో వెళ్ల వచ్చని అనధికార వార్తలు. ఆమె పర్యటనను రద్దు చేయాలని చైనా జాతీయ రక్షణ శాఖ బహిరంగంగా ప్రకటించింది.తమ సార్వభౌత్వాన్ని రక్షించుకొనేందుకు గట్టి కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ముందుకుపోతే మిలిటరీ చేతులు ముడుచుకు కూర్చోదని పేర్కొన్నది.


పెలోసీ పర్యటనను మిలిటరీ వ్యతిరేకించినట్లు గతవారంలో జోబైడెన్‌ స్వయంగా చెప్పాడు. బైడెన్‌ చెప్పిందానికి అర్ధం ఏమిటో తనకు తెలియదని బహుశా తాను ప్రయాణించే విమానాన్ని కూల్చివేయటం లేదా అలాంటిదే ఏమైనా జరగవచ్చునని మిలిటరీ భయపడుతోందేమో నాకు తెలియదని పెలోసీ కూడా గతవారంలో విలేకర్లతో అన్నారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. స్పీకర్‌కు మేం చెప్పాల్సింది చెప్పాం, ఒకే చైనా అన్న వైఖరిలో ఎలాంటి మార్పులేదని,వెళ్ల దలచుకుంటే ప్రభుత్వం నివారించలేదని ఒక అధికారి చెప్పాడు.” నాన్సీ నేను మీతో వస్తాను, నామీద చైనాలో నిషేధం ఉండవచ్చుగానీ స్వేచ్చను కోరుకొనే తైవాన్‌లో లేదు కదా, అక్కడ మిమ్మల్ని చూస్తాను ” అని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో రెచ్చగొట్టాడు. పెలోసి గనుక వెళ్లకపోతే చైనా వత్తిడికి అమెరికా లొంగినట్లే అని పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన రిపబ్లికన్లు, మితవాదులు రెచ్చగొడుతున్నారు.


అక్టోబరులో జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలో మరోసారి పార్టీ, అధికార పగ్గాలు చేపడతారని భావిస్తున్న చైనా అధినేత షీ జింపింగ్‌ నాయకత్వాన్ని అవమానించటం, రెచ్చగొట్టటం కూడా అమెరికా ఎత్తుగడలో భాగం అని చెబుతున్నారు. తైవాన్ను నిషేధిత గగన తలంగా ప్రకటించి పెలోసి విమానాన్ని చైనా గనుక వెంబడిస్తే అది ఆమె పర్యటన నిరోధం కంటే ఆ ప్రాంతం తమదే అని ప్రపంచానికి మరోసారి స్పష్టం చేయటం, అమెరికాకు పెద్ద హెచ్చరిక దాని వెనుక దాగుందని భావిస్తున్నారు. కనుక ఇప్పుడు బంతి అమెరికా చేతిలో ఉందని చెబుతున్నారు. పెలోసి గనుక సంయమనం పాటించి వెనక్కు తగ్గకపోతే తరువాత పర్యవసానాలను ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీ ఎదుర్కోవలసి ఉంటుంది. గతంలో తైవాన్‌ తిరుగుబాటు నేత లీ టెంగ్‌ హుయి 1996లో అమెరికా పర్యటన జరిపినపుడు తైవాన్‌ దీవి చుట్టూ చైనా క్షిపణి పరీక్షలు జరిపింది. ఇప్పుడు పెలోసీ రాక దానికంటే తీవ్రమైనది కనుక తీవ్రంగా పరిగణిస్తున్నది.


నాలుగు దశాబ్దాల ద్రవ్యోల్బణ రికార్డు, ధరల పెరుగుదల ఒక వైపు, రష్యాతో వివాదంలో సాధించిందేమీ లేకపోవటంతో తైవాన్‌ సమస్య పేరుతో చైనాను రెచ్చగొట్టి హడావుడి చేసి వాణిజ్య పరంగా కొన్ని రాయితీలు పొందటం లేదా ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు ఇస్తున్న మద్దతు నుంచి వెనక్కు మరల్చే ఎత్తుగడతో అమెరికా ఉందని, ఈ రెండూ జరిగేవి కాదని పరిశీలకులు చెబుతున్నారు. వీలైనంత వరకు లబ్ది పొందేందుకు పెలోసీని తురుపుముక్కగా బైడెన్‌ ప్రయోగిస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. పెలోసీ పర్యటనతో నిమిత్తం లేకుండానే ఇటీవలి కాలంలో రెండు దేశాల సంబంధాలు దిగజారుతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పిచ్చిపనుల గురించి తెలిసినా వెనక్కు తగ్గితే చులకన అవుతామన్న భయం, తగ్గకపోతే నష్టపోతామన్న ఆందోళన బైడెన్‌కు ఉంది. చైనా వస్తువులపై ట్రంప్‌ విధించిన దిగుమతి పన్ను విలువ 32బిలియన్‌ డాలర్లు అమెరికన్లపైనే భారంగా పడింది. ఇప్పటికీ కొనసాగుతున్న పన్నులను తగ్గిస్తే ఒక శాతం ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా. చైనాతో అంతం లేని వివాదం మంచిది కాదని విదేశాంగశాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ కూడా బైడెన్‌కు సలహా చెప్పాడు. ఇలా అనేక వత్తిళ్ల కారణంగా షీ జింపింగ్‌తో చర్చలు జరుపుతానని బైడెన్‌ చెప్పాల్సి వచ్చింది.


ఒక వేళ నాన్సీ పెలోసి మొండిగా ప్రవేశిస్తే 2001లో చైనాలోని హైనాన్‌ దీవిలో జరిగిన అమెరికా-చైనా విమానాల ఢ కంటే తీవ్రపరిణామాలు జరగవచ్చని కొందరు గుర్తు చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని పార్సెల్‌ దీవులు తమవేనని చైనా వాదిస్తున్నది. అమెరికా దాన్ని అంగీకరించటం లేదు. అంతర్జాతీయ జలాల్లో తిరిగే స్వేచ్చ తమకు ఉందంటూ జపాన్‌లోని తమ సైనిక కేంద్రం నుంచి నిఘా విమానాలు, ఓడలను తిప్పుతున్నది. దానిలో భాగంగా 2001 ఏప్రిల్‌ ఒకటవ తేదీన ఒక నిఘా విమానం చైనా సైనిక స్థావరం ఉన్న హైనాన్‌ దీవులకు దగ్గరగా వచ్చింది. దాన్ని అడ్డుకొనేందుకు చైనా మిలిటరీ విమానం కూడా ఎగిరింది. రెండూ దీవుల వద్ద ఢకొీన్నాయి. ఈ ఘటనలో చైనా పైలట్‌ మరణించగా దెబ్బతిన్న అమెరికా విమానం హైనాన్‌ దీవిలో దిగింది. దాని సిబ్బంది 24 మందిని చైనా అరెస్టు చేసి, విమానాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే అనూహ్య పరిణామంతో దిక్కుతోచని సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కంప్యూటర్లపై కాఫీ, నీళ్లను పోశారు. తరువాత అమెరికా ప్రభుత్వం చైనాకు క్షమాపణలు చెబుతూ లేఖలు రాసి ఖర్చులను చెల్లించి తమ సిబ్బంది, విమానాన్ని విడిపించుకుంది. తరువాత జరిగిందానికి చింతిస్తున్నట్లు, విచారపడుతున్నట్లు లేఖల్లో పేర్కొన్నాం తప్ప క్షమాపణ కాదని అమెరికా చెప్పింది. హైనాన్‌ దీవుల్లో ప్రస్తుతం చైనా జలాంతర్గాముల కేంద్రం ఉంది. అక్కడి నుంచి జలాంతర్గాముల ద్వారా ఖండాంతర అణుక్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే తరువాత కూడా చీటికి మాటికి దాని సమీపంలోకి అమెరికా నిఘావిమానాలు, ఓడలను పంపుతున్నారు. చైనా కూడా దానికి ధీటుగా విమానాలతో సమాధానం చెబుతున్నది. రెండు మూడు సార్లు రెండు దేశాల విమానాలు సమీపానికి వచ్చినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే చైనా మిలిటరీ సామర్ధ్యం ఎంతో పెరిగిన సంగతి తెలిసిందే.ఇటీవలి కాలంలో తైవాన్‌ వేర్పాటు వాదులు అమెరికా సాయంతో స్వాతంత్య్రం సంపాదించుకుంటామని పదే పదే చెప్పటం, చైనా గనుక విలీనానికి బలాన్ని వినియోగిస్తే తాము మిలిటరీ జోక్యం చేసుకుంటామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


నూటయాభై ఆరు సంవత్సరాల పాటు బ్రిటీష్‌ పాలనలో ఉన్న హాంకాంగ్‌ 1997 జూలై ఒకటిన చైనాలో విలీనమైంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉన్నందున తమ ప్రత్యేకపాలన ప్రాంతంగా పరిగణించి 50 సంవత్సరాల పాటు అక్కడి వ్యవస్థలను కొనసాగిస్తామని చైనా సర్కార్‌ అంగీకరించింది. అదేవిధంగా పోర్చుగీసు ఏలుబడిలో అంతర్జాతీయ జూద కేంద్రంగా మార్చిన మకావూ దీవులను కూడా అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నది. ఆ గడువు 2048 వరకు ఉంది. విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన హామీల మాదిరే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడులకూ అదే వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. తైవాన్నుంచి పెట్టుబడులే కాదు, ఎవరైనా వచ్చి ఉపాధికూడా పొందవచ్చని అవకాశం ఇచ్చింది. అందువలన తైవాన్‌న్ను కూడా అప్పటి వరకు వాటి మాదిరిగానే కొనసాగనిస్తుందని, తరువాత పూర్తిగా విలీనం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఆగడువు దగ్గర పడుతున్నకొద్దీ విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకు చైనా చూస్తుండగా ప్రజాస్వామ్యం, స్వేచ్చ,స్వాతంత్య్రం పేరుతో చిచ్చుపెట్టేందుకు అమెరికా,జపాన్‌ తదితర దేశాలు చూస్తున్నాయి.


తైవాన్‌, హాంకాంగ్‌,టిబెట్‌, షింజియాంగ్‌ రాష్ట్రంలో మానవహక్కుల గురించి అమెరికా సంధిస్తున్న అస్త్రాలేవీ పని చేసేవి కాదు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా తమ ప్రయోజనాలకు హానికలిగే వాటిని వేటినీ సహించేది లేదని చైనా పదే పదే స్పష్టం చేస్తోంది. హాంకాంగ్‌, మకావు దీవుల విలీన సమయంలో 50 సంవత్సరాలపాటు(2048 వరకు) అక్కడి యధాతధ స్థితిని కొనసాగనిస్తామని ఒకే దేశం-రెండు వ్యవస్థలన్న తన వైఖరిని చైనా ఎప్పుడో స్పష్టం చేసింది. వాటి మాదిరే అదుపులో ఉన్నంత వరకు తైవాన్‌ అంశంలో కూడా చైనా అప్పటి వరకు తొందరపడే ధోరణిలో లేదు. ఈ లోగా అమెరికా కూటమి దేశాలు దుస్సాహసానికి పాల్పడి తెగేదాకా లాగితే పరిణామాలు వేరుగా ఉంటాయి.విచక్షణను ఉపయోగించి వెనక్కు తగ్గితే పెలోసీ పర్యటన వివాదం టీకప్పులో తుపానులా ముగుస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దుమ్మెత్తి పోసుకుంటున్న టోరీ నేతలు రిషి సునాక్‌ – లిజ్‌ ట్రస్‌ : ఇలాగైతే లేబర్‌ పార్టీకి అవకాశమంటూ పెద్దల గగ్గోలు !

27 Wednesday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, Liz Truss, Rishi Sunak, Tory leadership contest, UK Conservative party, UK Labour party


ఎం కోటేశ్వరరావు


బ్రిటన్‌, ప్రపంచ భద్రతకు చైనా అతి పెద్ద ముప్పుగా ఉందని, స్వేచ్చా దేశాలు చైనా సాంకేతిక దాడిని ఎదుర్కొనేందుకు కొత్త కూటమి ఏర్పడాలని బ్రిటన్‌ కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ నేత రిషి సునాక్‌ అన్నాడు. ఇలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని, దీని వలన వారి సమస్యలు పరిష్కారం కావని చైనా పేర్కొన్నది. బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ ఆర్ధిక విధానాలతో విబేధాల వలన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ జూలై ఐదున రాజీనామా చేశాడు.తరువాత రెండు రోజులకే ప్రధాని జాన్సన్‌ కూడా రాజీనామా ప్రకటించాడు.దాంతో కన్సర్వేటివ్‌ పార్టీ పార్లమెంటరీ నేతగా(ప్రధాని పదవికి) తాను పోటీ చేయనున్నట్లు ఎనిమిదవ తేదీన వెల్లడించాడు.ఆ పరుగులో చివరికి సునాక్‌తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మిగిలారు.కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టు బాలట్‌ ద్వారా ఒకరిని ఎన్నుకుంటారు. ఫలితం సెప్టెంబరు ఐదున ప్రకటిస్తారు. అప్పటి వరకు ఇరువురు నేతలు మద్దతుదార్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిలో భాగంగా టీవీ చర్చలో ఇద్దరు నేతలు పరస్పరం చేసుకుంటున్నదాడులతో పార్టీ నష్టపడి వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి అవకాశం ఇచ్చేట్లున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. మాటలదాడులతో పరస్పరం గోతులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పన్నుల విధింపు, బ్రెక్సిట్‌, చైనా చివరికి తాము చదువుకున్న స్కూళ్లను కూడా వారి దాడులలో ప్రస్తావించారు. తొలి టీవీ చర్చలో ఎవరు బాగా మాట్లాడారన్న సర్వేలో సునాక్‌కు 39శాతం మంది, ట్రస్‌ను 38శాతం బలపరిచారు. కాగా టోరీ పార్టీ మద్దతుదార్లలో ట్రస్‌ను 47శాతం, సునాక్‌ను 38శాతం బలపరిచారు. దీన్ని బట్టి కొత్త ప్రధానిగా ట్రస్‌కే అవకాశాలు ఎక్కువని కొందరు సూత్రీకరించారు.


పార్లమెంటులో అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే నూతన ప్రభుత్వం లేదా ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా ప్రకటించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ మొత్తం ప్రభుత్వం మీదనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అధికార పార్టీ దానికి పోటీగా విశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంటులో నెగ్గింది. అందువలన సాంకేతికంగా బోరిస్‌ జాన్సన్‌ మీద మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు కానీ పార్టీ నేతగా విశ్వాసం కోల్పోయాడు. నూతన నేతను ఎన్నుకొనేందుకు నిర్ధిష్ట కాలపరిమితేమీ లేదు. కన్సర్వేటివ్‌ పార్టీలో 1922 కమిటీ అనేది ఒకటి ఉంది. పార్లమెంటులో వెనుక బెంచీలలో కూర్చునే వారితో దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. మెజారిటీ వచ్చినపుడు ప్రధాని పదవికి లేదా ప్రతిపక్షంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే ప్రక్రియలో దీని పాత్ర ఉంటుంది.గతంలో 2016 థెరెస్సా మే ఎన్నిక మూడువారాల్లోపే ముగిసింది. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడినందున ఒక్కొక్కరిని తొలగించే ప్రక్రియతో ఆలశ్యమైంది. అక్టోబరులో కన్సర్వేటివ్‌ పార్టీ మహాసభ జరిగే లోగా ఎన్నిక జరగాలని 1922 కమిటీ నిర్ణయించిది.సెప్టెంబరు ఐదున ప్రకటించే విజేతను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు బోరిస్‌ జాన్సన్‌ పదవిలో ఉంటారు, పార్టీ విశ్వాసం కోల్పోయినందున విధానపరంగా, ఇతర మౌలిక నిర్ణయాలేవీ తీసుకోరు.


పార్టీ నేత ఎన్నిక పోటీలో తొలుత రిషి సునాక్‌ ముందున్నట్లు ఓటింగ్‌ తీరు వెల్లడించింది. దాంతో అతనే నూతన ప్రధాని అవుతాడన్నట్లుగా మన దేశ మీడియా వార్తలు ఇచ్చింది. అయితే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ దూసుకువచ్చి సవాలు విసరటంతో పోటీ రసవత్తరంగా మారింది. రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్ధిరపడిన పంజాబీ కుటుంబంలో పుట్టాడు.నలభై రెండు సంవత్సరాల రిషి విద్యార్ధిగా ఉన్నపుడు మన దేశంలో ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షితతో ఏర్పడిన పరిచయం 2009లో వివాహానికి దారి తీసింది. వారికి ఇద్దరు పిల్లలు. సనక్‌-అక్షితలు బ్రిటన్‌లోని సంపన్నుల్లో 2022లో 73 కోట్ల పౌండ్లతో 222వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు అనేక దేశాల్లో ప్రముఖులుగా, దేశాధినేతలుగా కూడా పనిచేశారు. అమెరికాకు చెందిన ఇండియాస్పోరా అనే స్వచ్చంద సంస్థ 2021లో వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రవాస భారతీయ సంతతిలో పదిహేను దేశాల్లో 200 మంది వరకు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షరాలుగా ఉన్న కమలా హారిస్‌, అక్కడే లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన బాబీ జిందాల్‌, సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిమ్రతా నిక్కీ హేలీ, బ్రిటన్‌ హౌం మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్‌,ప్రధాని పదవికి ఇప్పుడు పోటీ పడుతున్న రిషి సునాక్‌ వంటి వారు ఎందరో ఉన్నారు. వివిధ దేశాధినేతలుగా 30 మంది భారతీయ మూలాలు ఉన్నవారు పని చేశారు. వారిలో బ్రిటీష్‌ గుయానా అధ్యక్షుడిగా పనిచేసి చెడ్డీ జగన్‌ వంటి ఒకరిద్దరు వామపక్ష వాదులను మినహాయిస్తే మిగిలిన వారందరూ ఆయా దేశాల్లో పాలకవర్గాలకు ఇష్టులుగా, అనుకూలంగా పని చేసిన వారే అన్నది స్పష్టం.ప్రస్తుతం కెనడా, బ్రిటన్‌ వంటి చోట్లమంత్రులుగా ఉన్నవారు కూడా అదే తరగతికి చెందిన వారే. అమెరికాలో తొలిసారిగా ఆఫ్రో-అమెరికన్‌ సామాజిక తరగతికి చెందిన బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. నల్లజాతీయుల పట్ల వివక్ష, దాడులు ఏమాత్రం తగ్గలేదు. అంతకు ముందు పాలకులు అనుసరించిన విధానాలనే తు.చ తప్పకుండా అనుసరించాడు. అందువలన ఇప్పుడు ఒక వేళ రిషి సునాక్‌ విజేతగా నిలిచి గడువు మేరకు 2025వరకు పదవిలో ఉన్నా ఇంతకు ముందు బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానాల కొనసాగింపే తప్ప మౌలికమార్పులేమీ ఉండవు.


ప్రస్తుతం రిషి సునాక్‌ాలిజ్‌ ట్రస్‌ కన్సర్వేటివ్‌ పార్టీ మద్దతుదార్లకు తమ విధానాలను వివరించే పనిలో ఉన్నారు. బ్రిటన్‌తో సహా అమెరికా నుంచి భారత్‌ వరకు అనేక దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు రుజువుందని, తాను అధికారానికి వచ్చిన తొలిరోజే బ్రిటన్‌లోని 30 చైనా కన్ఫ్యూసియస్‌ సంస్థలను మూసివేస్తానని, చైనా సైబర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక కొత్త నాటో కూటమిని ఏర్పాటు చేస్తానని రిషి సునాక్‌ ప్రకటించాడు. బ్రిటన్‌ సాంకేేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తున్నదని, విశ్వవిద్యాలయాల్లోకి తన మద్దతుదార్లను చొప్పిస్తున్నదని, వారిని పంపివేస్తానని, రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌ దురాక్రమణను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాడు. చైనా-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధి అంశంలో పోటీలో ఉన్న వారిలో సునాక్‌ ఒక్కరే స్పష్టమైన,ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉన్నారని ఇటీవల చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దాన్ని పట్టుకొని చైనా, రష్యా పట్ల సునాక్‌ మెతకగా ఉంటారని లిజ్‌ ట్రస్‌ ఆరోపించినదానికి ప్రతిగా చైనా పట్ల కఠినంగా ఉంటానంటూ సునాక్‌ ఎదురుదాడి ప్రారంభించాడు. బ్రిటన్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థలను చైనా కొనుగోలు చేయటాన్ని అధ్యయనం చేస్తానని, నిషేధిస్తానని పేర్కొన్నాడు.తన స్వంత షింజియాంగ్‌, హాంకాంగ్‌ పౌరులను చిత్రహింసలపాలు చేస్తూ అణచివేస్తుదని,తన కరెన్సీ విలువ పెరగకుండా చూస్తూ ప్రపంచ ఆర్ధికరంగాన్ని తనకు అనుకూలంగా రిగ్గింగ్‌ చేస్తున్నదని అన్నాడు. గుడ్డిగా చైనాను సమర్ధిస్తూ పశ్చిమదేశాలన్నీ దానికి ఎర్ర తివాచీ పరిచాయని జరిగిందేదో జరిగింది, తాను అధికారానికి వచ్చిన తొలి రోజునుంచి ఆ వైఖరిని మార్చివేస్తానని అన్నాడు.


తన కంటే పోటీలో ముందున్న లిజ్‌ ట్రస్‌ను ఎదుర్కొనేందుకు కన్సర్వేటివ్‌ పార్టీలోని చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు సునాక్‌ యత్నించారన్నది స్పష్టం. మరోవైపు ట్రస్‌ కూడా చైనా మీదనే దాడిని కేంద్రీకరించింది. జి7 కూటమిని ” ఆర్ధిక నాటో ”గా మార్చాలని, అంతర్జాతీయ నిబంధనలను అమలు జరపని పక్షంలో చైనా మీద ఆంక్షలు ప్రకటించాలని చెప్పింది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమిస్తున్నా, తైవాన్ను బెదిరిస్తున్నా, హాంకాంగ్‌లో ఉద్యమాన్ని అణచివేస్తున్నా, ఉఘీర్‌లపై మారణకాండ జరుపుతున్నా గత రెండు సంవత్సరాలలో చైనాతో ఆర్ధిక ఒప్పందాల కోసం ఆర్ధిక మంత్రిగా సునాక్‌ చూశారని, ఇప్పుడు కబుర్లు చెబుతున్న మీరు అప్పుడెక్కడ ఉన్నారని కన్సర్వేటివ్‌ పార్టీ నేత ఇయాన్‌ డంకన్‌ స్మిత్‌ ధ్వజమెత్తాడు. దేశంలో జీవన వ్యయం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపధ్యంలో తాను దుబారాకు దూరంగా ఉంటానని ప్రకటించిన సునాక్‌ ఓట్లకోసం జనం ముందుకు వస్తూ 450 పౌండ్ల విలువగల బూట్లు, మూడున్నరవేల పౌండ్ల ఖరీదైన సూటు ధరించి వస్తున్నారని, అదే తమనేత లిజీ ట్రస్‌ కేవలం నాలుగున్నర పౌండ్ల విలువ గల చెవిపోగులు ధరించి దేశంలో తిరుగుతున్నారని కన్సర్వేటివ్‌ పార్టీ సాంస్కృతిక శాఖ మంత్రి నాదిన్‌ డోరిస్‌ విమర్శించారు.


చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు.
కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బ్రిటన్‌కు అనేక సవాళ్లను తెస్తున్నాయి. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన తరువాత ఇతర దేశాలతో ఒప్పందాలకు పూనుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నది. కుంభకోణాలు, అవినీతి అక్రమాల కారణంగా రెండుగా చీలిన కన్సర్వేటివ్‌ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సునాక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ మంత్రులుగా ఉండి ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు చైనా పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నారు. అంతర్గత అంశాలపై ఏమి చెప్పినప్పటికీ విదేశాంగ విధానం గురించి చైనా మీద కేంద్రీకరించటం మద్దతుదార్లను తప్పుదారి పట్టించటం,చైనా వ్యతిరేకతతో సంతుష్టీకరించేందుకు పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d