• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: imperialism

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో లూలా ముందంజ -పార్లమెంటులో మితవాదులది పైచేయి !

05 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Brazil election 2022, Jair Bolsonaro, Latin America’s Right, Latin American left, lula da silva


ఎం కోటేశ్వరరావు


” మనకు విశ్రాంతి లేదు, గెలుపుకోసం గట్టిగా పని చేయాలి. ఇంకా 28 రోజులే గడువు ఉంది ” బ్రెజిల్‌ వామపక్ష నేత లూలా డిసిల్వా అక్టోబరు రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఫలితాలు వెల్లడించిన తరువాత ఇచ్చిన పిలుపు, చెప్పిన మాటలవి. లూలా అంతిమ విజేతగా నిలిచేంత వరకు కార్మికులు, కష్టజీవులు రానున్న నాలుగు వారాలూ వీధులను ఆక్రమించాలని(ఎన్నిక కోసం పని చేయాలని) బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు లూసియానా శాంటోస్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం తొలి దఫాలోనే 50శాతంపైగా ఓట్లు సంపాదించి లూలా డిసిల్వా ఎన్నికౌతారనే ఎన్నికల పండితులు, సర్వేలకు భిన్నంగా 48.4 శాతం(5,72,59,405ఓట్లు) లూలాకు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, పచ్చిమితవాది బోల్సనారోకు 43.2 శాతం(5,10,72,234 ఓట్లు) రాగా మరో మితవాద పార్టీ నేత టిబెట్‌కు 4.2శాతం(49,15,420 ఓట్లు) వచ్చాయి. మూడవ పక్షం మొత్తంగా బోల్సనారోకు బదలాయించినప్పటికీ స్వల్ప తేడాతో లూలా విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. సాధారణంగా అలా జరగదు. ఇవిగాక వామపక్ష వాదినని చెప్పుకొనే సిరో గోమ్స్‌ అనే మరోనేతకు(మూడు శాతం) 36లక్షల ఓట్లు వచ్చా ఇవి లూలా వైపే మొగ్గే అవకాశం ఉంది. ఈ ఓట్ల తీరు తెన్నులను చూసినపుడు పురోగామి వాదులా మితవాదులా అన్నదే గీటురాయిగా ఓటర్లు ఆలోచించారు తప్ప మధ్యేవాదులను పట్టించుకోలేదన్నది స్పష్టం. ఇటీవల జరిగిన లాటిన్‌ అమెరికా ఎన్నికల్లో తొలి దఫా మొదటి స్థానంలో ఉన్నవారే విజేతలుగా నిలిచారు. అయినప్పటికీ ఆ ఖండంలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ను వామపక్షాలకు దక్కకుండా తమ శిబిరంలో ఉంచుకొనేందుకు అమెరికా,ఇతర మితవాద శక్తులూ సర్వశక్తులను ఒడ్డుతాయి గనుకనే ఈనెల 30న జరిగే తుది ఎన్నికల వరకు విశ్రమించరాదని, జాగరూకులై ఉండాలన్నదే లూలా(వర్కర్స్‌ పార్టీ), కమ్యూనిస్టు పార్టీ పిలుపుల ఆంతర్యం. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తంగా చూసినపుడు మితవాద శక్తులు రెండు సభల్లోనూ మెజారిటీ తెచ్చుకున్నాయి.


వర్కర్స్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్‌ పార్టీలు కలసి ” బ్రెజిల్‌ విశ్వాసం ” అనే కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి మరో ఆరుపార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వీటిలోని సోషలిస్టు పార్టీనేత గెరాల్డో ఆల్కమిన్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో బ్రెజిల్‌ విశ్వాసం కూటమి ఒకటిగా, మిగతా ఆరు పార్టీలు విడిగా పోటీ చేశాయి. మరోవైపు మితవాది బోల్సనారోకు స్వంత లిబరల్‌ పార్టీతో పాటు మరో రెండు పార్టీలు మద్దతుగా నిలిచాయి. మరోసారి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బ్రెజిల్‌ వెల్లడించింది. తొలి రౌండ్‌లో విజేత లూలా, తుది దఫాలో కూడా మనమే విజేతలంగా ఉండాలని కమ్యూనిస్టు నేత శాంటోస్‌ చెప్పారు. తామింకేమాత్రం విద్వేషాన్ని,విభజన, హింస, ఆకలి, నిరంకుశత్వాన్ని కోరుకోవటం లేదని జనం వెల్లడించారు. అంతిమ విజయం, ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోనే ఉండి కృషి చేయాలని శాంటోస్‌ పిలుపునిచ్చారు. వీధులను ఆక్రమించండి, ప్రతి మనిషితో మాట్లాడేందుకు కృషి చేయండి, ప్రజాచైతన్యాన్ని పెంచండని శాంటోస్‌ కోరారు.


తాను గనుక గెలవకపోతే ఫలితాన్ని అంగీకరించేది లేదని అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ముందుగానే బోల్సనారో ప్రకటించాడు. రెండవ దఫా పోటీకి అవకాశం కల్పించటంతో ప్రజలు మార్పును కోరుతున్నారని అన్నాడు తప్ప మరొక మాట మాట్లాడలేదు. ఎన్నికలు స్వేచ్చగా జరిగిందీ లేనిదీ తెలుసుకొనేందుకు రక్షణ శాఖ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచమంతటా ఆసక్తి కలిగించిన ఎన్నికల్లో తనకు అవసరమైన 50శాతం పైగా మెజారిటీ రావటం లేదని స్పష్టం కాగానే తుది దఫా పోరుకు సిద్దం కావాలని ఆదివారం రాత్రే లూలా తన మద్దతుదార్లకు పిలుపినిచ్చాడు. గత ఎన్నికల్లో బోల్సనారో తొలిదఫా మొదటి స్థానంలో 46.03 శాతం ఓట్లు తెచ్చుకోగా రెండో స్థానంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ నేత ఫెర్నాండో హదాద్‌కు 29.28 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తుది దఫా ఎన్నికల్లో వారికి 55.13-44.87 శాతాల చొప్పున వచ్చి బోల్సనారో గెలిచాడు. తొలి దఫా పోలింగ్‌లోనే అతగాడు ఈ సారి దౌర్జన్యకాండకు తన మద్దతుదార్లను పురికొల్పే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రానున్న నాలుగు వారాల్లో హింసాకాండ చెలరేగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బోల్సనారో మరింతగా రెచ్చగొట్టటంతో పాటు మిలిటరీ కుట్రకు తెరలేచే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.


అన్నీ సజావుగా ఉంటే ఈ ఎన్నికల్లో లూలా గెలిచినప్పటికీ బోల్సనారో, ఇతర మితవాద పార్టీల ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీలో ఉన్నందున లూలా పధకాలన్నింటినీ ఆమోదించే అవకాశాలు లేవు.లూలాపై మోపిన తప్పుడు కేసులో శిక్ష వేసి జైలుకు పంపి గత ఎన్నికల్లో పోటీలో ఉండకుండా చేసి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ జడ్జి సెర్జీయో ఇతర అనేక మంది పేరు మోసిన మితవాదులందరూ తిరిగి పార్లమెంటుకు వచ్చారు. తొలి దఫా, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బోల్సనారో ముప్పు గురించి అనేక మంది హెచ్చరిస్తున్నారు. మేథావి, జర్నలిస్టు తియాగో ఆంపారో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా బోల్సనారో అనుసరించిన విధానాలకు గాను అతన్ని శిక్షించేందుకు ఈ ఎన్నిక తోడ్పడాలని కోరుకున్నారు. అది జరిగేది కాదు, ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత మనం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకూడదు, వీధుల్లోకి వెళ్లాల్సిన తరుణమంటూ, లేనట్లైతే మరోసారి అంధకార భవిష్యత్‌లోకి వెళతామని అన్నాడు.


తొలి దఫా ఓటింగ్‌లోనే లూలా గెలుస్తాడని వేసిన అంచనాలు ఎందుకు తప్పినట్లు అనే మధనం కొందరిలో ఇప్పుడు ప్రారంభమైంది. సర్వే సంస్థలు పేదలను ఎక్కువగా కలవటం, మితవాద శక్తుల మద్దతుదార్లు స్పందించకపోవటం వలన అంచనాలు తప్పినట్లు ఒక అభిప్రాయం. బోల్సనారోకు 36 లేదా 37శాతం ఓట్లు, లూలాకు 50శాతం పైన ఓట్లు వస్తాయని ప్రముఖ ఎన్నికల పండితులు చెప్పిన లెక్క తప్పింది. ప్రపంచంలో ఇలాంటి లెక్కలు తప్పటం ఇదే మొదటిది కాదు గానీ, బ్రెజిల్‌లో మితవాదులు-పురోగామి వాదుల సమీకరణలు ఇంత తీవ్రంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. ఇటలీలో పచ్చి ఫాసిస్టు శక్తి అధికారానికి రావటం అనేక దేశాల్లో మితవాదులు బలం పుంజుకోవటం శుభ సూచికలు కాదు.2015లో బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ రావటం ఖాయమన్న సర్వేలు తప్పి మితవాద కన్సర్వేటివ్‌ పార్టీ వచ్చింది. తరువాత ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరు పడటం గురించి వెలువడిన అంచనాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి.


పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. మొత్తం 27 రాష్ట్రాలలో, ముఖ్యంగా ధనికులు ఎక్కువగా ఉన్న ఎనిమిది చోట్ల మితవాదులే గెలిచారు.మరో ఆరుచోట్ల ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో రెండవ సారి ఎన్నికలు జరగాల్సి ఉంది.


ప్రస్తుతం వామపక్ష కూటమి తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అల్కమిన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. గతంలో లూలా పాలన, నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. అరెస్టును కూడా సమర్ధించాడు. గతంలో తాను చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కు తీసుకొని వామపక్ష కూటమితో జతకట్టాడు. బోల్సనారో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారితో పాటు మరికొన్ని శక్తులతో కూడా లూలా ఈసారి రాజీపడినట్లు కొన్ని విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.

ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. ఇంత జరిగినా, విముఖత వెల్లడైనా ఊహించినదాని కంటే తొలిదఫా ఓట్లు ఎక్కువగా తెచ్చుకున్నందున బోల్సనారో దేనికైనా తెగించే అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయించాడని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆరోపణలు వెలువడనప్పటికీ సాకు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అతగాడి తీరుతెన్నులను చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. బహుశా అందుకే 30వ తేదీన రెండవ దఫా ఎన్నికల వరకు వామపక్షాలు వీధులను ఆక్రమించి కుట్రలను ఎదిరించాలని పిలుపు ఇవ్వటం అనుకోవాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒక చంకలో భారత్‌ మరొక చంకలో పాకిస్తాన్‌ అంటున్న అమెరికా ! ఎవరి సంతుష్టీకరణకు జైశంకర్‌ విమర్శలు !!

02 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, S Jaishankar, US- Pakistan F-16s deal


ఎం కోటేశ్వరరావు


ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గాను పాకిస్తాన్‌ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ద విమానాలను మెరుగుపరుస్తున్నట్లు అమెరికా చెబితే నమ్మేంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. అది నిజమే ! అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 25 ఆదివారం నాడు వాషింగ్టన్‌ నగరంలో భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గౌతముడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమై బుద్ధుడిగా మారినట్లు చెప్పే అంశం తెలిసిందే. అమెరికా గురించి జైశంకర్‌ లేదా మన పాలకులకు ఎప్పుడు, ఎలా జ్ఞానోదయమైందో తెలుసుకొనే హక్కు దేశపౌరులందరికీ ఉంది. నిజంగా బుద్ది వికసించిందా లేక ప్రశ్నించేవారిని, అమెరికా వైఖరిని బహిరంగంగా సమర్ధించలేని కాషాయ దళాలను సంతుష్టీకరించేందుకు,ప్రచార అవసరార్ధం అలా మాట్లాడారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆ మరుసటి రోజే అదే అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలసి ఉమ్మడిగా విలేకర్ల సమావేశంలో భద్రతా అంశాలకు సంబంధించి అమెరికా ఎంతగానో అంతర్జాతీయ వైఖరితో వ్యవహరిస్తోందని అదే నోటితో జై శంకర్‌ ప్రశంసలు కురిపించటం ఎవరిని వెంగళప్పలను గావించేందుకు ?


అమెరికా-ఇరాన్‌ మధ్య తలెత్తిన వివాదంలో మన మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేయవద్దని బెదిరిస్తే అమెరికాను సంతుష్టీకరించేందుకు చిత్తం అని నిలిపివేసిన మన పాలకుల ధైర్య, సాహసాలు తెలిసినవే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి మన దేశంలో ఉన్న తిబలాజీ పెట్రోకెమ్‌ అనే పెట్రోకెమికల్‌ కంపెనీ లావాదేవీల మీద అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది.ఈ కంపెనీ వివిధ దేశాలతో ఉన్న కంపెనీలతో సమన్వయం చేసుకొని ఇరాన్‌ చమురు, ఇతర ఉత్పత్తులతో లావాదేవీలు నిర్వహిస్తున్నది.ఇరాన్‌ నుంచి పెట్రోకెమికల్స్‌ను తెచ్చి వాటిని ట్రిలియన్స్‌ అనే మరో కంపెనీ ద్వారా చైనాకు సరఫరా చేస్తున్న కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అసలు ఇరాన్‌ మీద ఏకపక్ష ఆంక్షలు విధించటమే తప్పు, వాటికి ఐరాస ఆమోదం లేదు. భాగస్వామ్యం, స్నేహం పేరుతో అమెరికా పాటలకు నృత్యం చేసేందుకు మనం అంగీకరించి ఇరాన్నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాము. ఇప్పుడు దాని కొనసాగింపుగా అది మన దేశంలోని కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఎవరో మనల్ని అదుపు చేయటం ఏమిటి, డామిట్‌ ! మనమే అందరినీ అదుపుచేసే స్థితిలో ఉన్నామని చెప్పుకొనే గిరీశాలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇలా అమెరికా ఆంక్షలకు తలొగ్గితే విదేశాల నుంచి మన దగ్గరకు రావాలనుకొంటున్న కంపెనీలు వస్తాయా ? దేశంలో ఉన్న కంపెనీలు అమెరికా గీచిన గీతల్లోనే నడిచేందుకు పెట్టుబడులు పెడతాయా ?


ఇక మంత్రి జైశంకర్‌ విమర్శలకు సంబంధించిన అంశాన్ని చూద్దాం. నలభై ఐదు కోట్ల డాలర్ల విలువ గల ఎఫ్‌-16 విమానాలకు అవసరమైన మెరుగుదల, పరికరాలకు సంబంధించి అమెరికా-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్‌ సభలో దీనికి సంబంధించిన ప్రశ్నకు జైశంకర్‌ బదులిస్తూ చివరకు ఒకరోజు ఎవరైనా వచ్చి ఉగ్రవాద నిరోధం కోసమే ఇదంతా అని చెబుతారు, మీరు చెబుతున్నది ఎఫ్‌-16 విమానం గురించి కనుక, వాటిని ఎక్కడ మోహరిస్తారో, వాటి ఉపయోగం, సామర్ధ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి మాటలు చెప్పటం ద్వారా మీరు(అమెరికా) ఎవరినీ వెంగళప్పలను చేయలేరు.” అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ పూర్వపు సోవియట్‌ తరువాత రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా 1965 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మన దేశానికి అమెరికా ఎలాంటి మిలిటరీ పరికరాలను విక్రయించలేదని, దీనికి రెండు వైపుల నుంచి కారణాలున్నాయని, అణుఒప్పందంతో ఈ పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు మనం అనేక అమెరికా విమానాలు, హెలికాప్టర్లను వాడుతున్నామని, రెండు దేశాల సంబంధాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.


భారత్‌ – పాక్‌లతో సంబంధాల అంశంలో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని, దేనికదేనంటూ రెండు దేశాలూ తమకు కావలసినవే అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పాడు. రెండింటితో అవసరాలు వేర్వేరన్నాడు. తమ గడ్డ మీద ఉగ్రవాద నిరోధానికి కృషి చేయటం లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో పాకిస్తాన్‌కు సాయం నిలిపినట్లు ప్రకటించిన తరువాత ఇప్పుడు ఉగ్రవాద నిరోధానికి అనే సాకుతో బైడెన్‌ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు ఏమిటో చెప్పటం లేదు. తాము ఇప్పుడు చేస్తున్న సాయంతో ఇప్పటికే పాక్‌ వద్ద ఎనభైకి పైగా ఉన్న ఎఫ్‌-16 విమానాలు లేదా వాటి ఆయుధ సామర్ధ్యం పెంచటం లేదని మనలను నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. ఇవి యుద్ధాలకు తప్ప ఉగ్రవాదుల నిరోధానికి పనికి వచ్చేవి కాదు. 2019లో బాలకోట్‌ దాడుల తరువాత పాకిస్తాన్‌ వాటిని మన దేశం మీద మోహరించింది. ఒక విమానాన్ని మన దళం కూల్చివేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విమానాల ద్వారా మాత్రమే సంధించే ఆధునిక క్షిపణి శకలాలను తరువాత మన మిలిటరీ ప్రదర్శించింది.


ఈ ఉదంతాల తరువాత ఈ ఏడాది జరిగిన ఒక సంఘటనకు తాజా ఒప్పందానికి సంబంధం ఉందా అన్నదాన్ని కూడా చూడాల్సి ఉంది.2022 మార్చి 9న మన దేశం రష్యా భాగస్వామ్యంతో రూపొందించిన బ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని వదిలింది. అది నలభైవేల అడుగుల ఎత్తులో 124 కిలోమీటర్లు వెళ్లి పాకిస్తాన్‌లోని చన్ను అనే పట్ణణ సమీపంలో పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాని గురించి పాకిస్తాన్‌ వెల్లడించిన తరువాతనే మన దేశం స్పందించి సాంకేతిక లోపంతో వచ్చి మీ గడ్డమీద పడిందని చెప్పింది.తరువాత మరొక ప్రకటనలో మానవ తప్పిదమని పేర్కొన్నది. ఆరునెలల తరువాత ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీన్ని అంగీకరించని పాకిస్తాన్‌ ఈ ఉదంతం మీద ఉమ్మడి విచారణ జరపాలని ఇది అనధికారికంగా వదిలినదా నిజంగా తప్పిదమా అన్నది తేల్చాలని కోరుతోంది.


అమెరికా తన వ్యూహంలో మన దేశాన్ని ఇరికించేందుకు 1947 నుంచి చూస్తున్నది. చైనాను దెబ్బతీసేందుకు బలమైన సాధనంగా మన దేశం, పశ్చిమాసియాలో తన ఎత్తుగడల అమలుకు పాకిస్తాన్‌ పనికి వస్తుందన్నది దాని అంచనా. అందుకోసం రెండు దేశాలనూ చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు చూసింది. ఇప్పుడు కూడా వేర్వేరు అంశాలతో అవసరం ఉందని చెప్పటం దానిలో భాగమే. పాక్‌ భుజం మీద తుపాకి పెట్టి మనలను లొంగదీసుకోవాలని చూసింది. కాశ్మీరు ఆక్రమణకు పాక్‌ను ప్రోత్సహించటం, తరువాత ఉగ్రవాదులను మన మీదకు వదలటం, కాశ్మీరులో చిచ్చు ఇవన్నీ దానిలో భాగమే. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా పధకాలకు పాకిస్తాన్‌ ప్రధాన సాధనంగా తాలిబాన్ల సృష్టి, శిక్షణకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. మన పాలకవర్గం తనకు ప్రయోజనం కలిగించే విదేశీ, స్వదేశీ విధానాలకే ప్రాధాన్యత ఇవ్వటం, స్వంతంగా తాము కూడా ఎదిగేందుకు సోవియట్‌తో సంబంధాలే మెరుగు అని భావించిన కారణంగానే అది ఉనికిలో ఉన్నంత వరకు అమెరికాకు అవకాశం దొరకలేదు. దాని పతనం తరువాత అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉంటూ లబ్ది పొందవచ్చని భావించటం, మరొక మార్గం లేకపోవటంతో ఆవైపు మొగ్గింది. ఎప్పుడైతే ఇది జరిగిందో తనకు కావాల్సిన భారత్‌ దొరికిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలను కొనసాగిస్తూనే మన దేశంలో ఉన్న పాక్‌ వ్యతిరేకతను గమనంలో ఉంచుకొని తన ఎత్తుగడలను మార్చుకుంది. మనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నమ్మించేందుకు చూసింది.

ఎప్పుడైతే మనతో సంబంధాలను బలపరచుకుంటున్నదో ప్రచ్చన్న యుద్దసమయంలో మన పాలకవర్గం అనుసరించిన ఎత్తుగడను తరువాత పాక్‌ అనుసరిస్తున్నది. అమెరికాను వ్యతిరేకించే చైనాకు దగ్గర కావటం దానిలో భాగమే. చైనాకు పాకిస్తాన్‌ అవసరం ఉంది కనుక వచ్చిన అవకావశాన్ని అది అందిపుచ్చుకుంది. ఇది కొత్త పరిణామాలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు తన అవసరాలకు భారత్‌ – పాకిస్తాన్‌ రెండూ అవసరమే గనుక, మన దేశం తమ బంధం నుంచి తప్పుకొనే అవకాశాలు లేకుండా బిగింపు పూర్తైనట్లు భావిస్తున్న కారణంగా, అంతర్జాతీయ అవసరాల రీత్యా అమెరికా ఇప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి తన సాయాన్ని అందిస్తున్నది. నిజానికి దాన్ని ఎన్నడూ వదలిపెట్టలేదు. 1970దశకంలో చైనాతో సంబంధాలు పెట్టుకొనేందుకు అమెరికన్లు పాకిస్తాన్‌ ద్వారానే కథ నడిపించారన్నది తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ను పటిష్టపరచటాన్ని ఎలా చూడాలి. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థం పేరుతో తమ కూటమిలో చేరనందుకు గుర్రుగా ఉన్న అమెరికా దాన్నే గనుక కొనసాగిస్తే మీ ఇష్టం అని పరోక్షంగా హెచ్చరించటం కూడా కావచ్చు. నరేంద్రమోడీ దాన్ని తట్టుకొని నిలబడగలరా ? ఇది మన దేశం మీద మాత్రమే వత్తిడి అనుకుంటే పొరపాటు, పాకిస్తాన్‌పై చైనా ప్రభావం పెరగకుండా చూసుకోవటం కూడా దీని వెనుక దాగి ఉంది.అమెరికా తన ప్రయోజనాలకే ఎల్లవేళలా పెద్ద పీటవేస్తుంది అని మరచిపోరాదు. ముందే చెప్పినట్లు అటు అమెరికా ఇటు చైనా మద్దతు, సాయం పొందేందుకు పాక్‌ పాలకవర్గం చూస్తున్నది.
ఎఫ్‌-16 విమానాలను ఉగ్రవాద నిరోధం కోసం అని అమెరికా ఎందుకు చెబుతున్నది ? టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాల్లో ఉన్న కర్దులు తాము నివసించే ప్రాంతాలతో కర్దిస్తాన్‌ ఏర్పాటు కోరుతూ దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నారు. వారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచేందుకు టర్కీ ఎఫ్‌ -16 యుద్ధ విమానాలతో వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదులపై దాడులకు వాటిని మోహరించలేదు. పాకిస్తాన్‌కు చేస్తున్న సాయాన్ని సమర్ధించుకొనేందుకు చెబుతున్నసాకు తప్ప మరొకటి కాదు. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను అణచేపేరుతో తిష్టవేసిన అమెరికా వాటిని వినియోగించిన దాఖల్లాలేవు. అమెరికా మనకు ఎఫ్‌ – 16 విమానాలు అమ్మితే పాక్‌ వైపు నుంచి కూడా జై శంకర్‌ మాదిరి స్పందనే వస్తుంది. మనం కూడా ఉగ్రవాదుల అణచివేతకే అని చెప్పగలమా ?


మన పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారనే ప్రశ్న సహజంగానే తన మద్దతుదార్ల నుంచే నరేంద్రమోడీ సర్కార్‌కు ఎదురౌతుంది. పాకిస్తాన్‌ మీద విద్వేష ప్రచారంలో తలమునకలైన కాషాయదళాలు ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.బహుశా వారి కోసం జైశంకర్‌ గట్టిగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఎవరి అవసరం వారిది. అమెరికా మనకు మరింత దగ్గర అవుతుందని చంకలు కొట్టుకొనే వారి గాలి తీస్తూ అమెరికా ప్రతినిధి మాత్రం రెండు దేశాలు తమకు సమానమనే చెప్పారు తప్ప మనవైపు మొగ్గుచూపలేదు. గతంలో మనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భావించిన పాకిస్తాన్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేందుకు ఎఫ్‌-16 విమానాల మెరుగుదలకు అంగీకరించటం, ఇద్దరూ సమానమే అని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా వెనుదిరిగినప్పటికీ అమెరికా దాన్ని పూర్తిగా వదులుకోదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అందుకు నిఘా సమాచారంతో సహా అన్ని రకాలుగా పాకిస్తాన్‌ అవసరం ఉంది. ఒసామా బిన్‌ లాడెన్‌ తరువాత ఆల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ నేతగా ఉన్న అల్‌ జవాహిరీని ఈ ఏడాది జూలై 31న ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్‌ ద్వారా అమెరికా మట్టుపెట్టింది. ఇది పాకిస్తాన్‌ సాయంతోనే జరిగిందని అందరూ నమ్ముతున్నారు.


అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఎలాంటి శషభిషలు లేకుండా సరళంగా సూటిగా చెప్పాడు. భారత్‌-పాకిస్తాన్లతో భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన ప్రయోజనాలున్నట్లు చెప్పటమంటే రెండు దేశాలను ఎక్కడ ఎలా అవసరమైతే అక్కడ అలా ఉపయోగించుకుంటామని చెప్పటమే. గతంలో పాకిస్తాన్‌ అలా ఉపయోగపడిన చరిత్ర ఉంది. మన దేశాన్నీ అదే బాటలో నడిపిస్తారా ? ఐరోపాలో హంగరీ నాటో సభ్య దేశం. ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఇతర ధనిక దేశాలు విధించిన ఆంక్షలను అది కూడా సమర్ధించింది. తీరా అవి తమ మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపించటంతో ఈ ఏడాది ఆఖరు నాటికి ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఐరోపా అడగాల్సిన తరుణం వచ్చిందని ఆ దేశ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ పార్లమెంటులో చెప్పాడు. అమెరికా చమురు కంపెనీలు ఈ యుద్ధంతో లాభాలు పొందుతున్నాయని విమర్శించాడు.రష్యాపై ఆంక్షలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు. మరోవైపున ఈ సంక్షోభం కారణంగా రష్యా నుంచి చౌక ధరలకు చమురును తెచ్చుకుంటున్న మన (దేశం) నరేంద్రమోడీ సామరకండ్‌ షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో ఇది యుద్దాల యుగం కాదంటూ పుతిన్‌కు చెప్పి అమెరికాను సంతుష్టీకరించేందుకు తెరతీశారు. ఆరునెలల్లో వారు వీరవుతారు అంటే ఇదేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నేత షీ జింపింగ్‌ నిర్బంధం వార్త : మీడియాను వెర్రి వెంగళప్పలను చేసిన ఫాలున్‌ గాంగ్‌ మహిళ !

28 Wednesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, cia, Coup Attempt in China, fake stories in media, Falun Gong, Jennifer Zeng, Propaganda War, RSS Duplicity, saffron trolls lies- facts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనా నేత షీ జింపింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు, అధికారాలన్నీ లాగేసుకున్నారంటూ మన దేశంలోని కొన్ని మీడిియా సంస్థలు, సామాజిక మాధ్యమంలోని కాషాయ మరుగుజ్జులు (ట్రోల్స్‌), వారిని గుడ్డిగా నమ్మే వారు చేసిన ప్రచారం వామపక్ష శ్రేణుల్లో అనేక మందిని గందరగోళానికి గురిచేసింది. ఈ వార్తలను చూసి అనేక మంది కమ్యూనిస్టు అభిమానులు ఆందోళన చెందారు. చైనా వ్యతిరేకులైతే ఇంకే ముంది జింపింగ్‌ శకం ముగిసింది, చైనా పతనం మన దేశానికి శుభసూచకం అంటూ సంబరపడ్డారు.సామాజిక, సంప్రదాయ మీడియా సంస్థలలో ఉన్న అలాంటి వారంతా వండి, వార్చి, వడ్డించిన దాన్ని తిన్నవారు పండగ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఉత్తిదే అని తేలటంతో వారంతా మానసికంగా తీవ్రంగా గాయపడ్డారు. అసలీ వదంతి ఎలా పుట్టింది, మన దేశంలోని వారు వాటిని ఎందుకు భుజాన వేసుకున్నారు, వారి మానసిక స్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా ముందుకు వచ్చింది. వాట్సప్‌ పండితులు వండి వారుస్తున్న కుహనా వార్తలను ప్రధాన స్రవంతి మీడియా జనాలకు అందించటం ఒక ప్రధాన పరిణామంగా ఉన్నట్లు గత కొంత కాలంగా తెలుస్తున్నప్పటికీ ఈ ఉదంతం మరింతగా నిర్ధారించింది.


అసలే కోతి, దానికి పిచ్చి ఎక్కింది, దొరికిన కల్లుతాగింది,ఆపై నిప్పు తొక్కింది అన్న కథ తెలిసిందే. కొంత మందికి చైనా అంటే అసలే ద్వేషం, అందునా అక్కడి సోషలిస్టు వ్యవస్థ, కమ్యూనిస్టు పార్టీ అంటే పిచ్చి ఎక్కినట్లుంటుంది. గాల్వన్‌ ఉదంతంతో మానసికంగా చికిత్సలేని వ్యాధికి గురైన వారికి అధ్యక్షుడు షీ జింపింగ్‌ గృహ నిర్బంధం, పదవి నుంచి తొలగింపు వార్తలంటే స్టెరాయిడ్స్‌ వంటివి. ఇంకేముంది అలాంటి వారంతా రెచ్చిపో యారు. ఇంతకీ వారికి వాటిని ఇచ్చిందెవరో తెలుసా ? ఉల్లాసయువతుల( ఛీర్‌ గరల్స్‌ ) పెద్దక్క లేదా అమెరికా సిఐఏ ఒళ్లో కూర్చుని చెప్పమన్న కబుర్లు చెప్పే జెన్నిఫర్‌ జెంగ్‌ అనే మహిళ.ఆమె చైనాలో అసంతృప్తవాదిగా మారి అమెరికా చేరుకొని అక్కడి నుంచి పుంఖాను పుంఖాలుగా విషం చిమ్ముతోంది.ఆమెతో సహా అనేక మంది ఫాలున్‌ గాంగ్‌ (ధర్మ చక్రం ) పేరుతో ధ్యానంతో కొన్ని క్రీడలను ప్రచారం చేస్తున్నామనే పేరుతో తలెత్తిన కమ్యూనిస్టు వ్యతిరేక ముఠా. చైనా ప్రభుత్వం తొలుత వారిని ఉపేక్షించినప్పటికీ వారి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించిన తరువాత కత్తెర వేసింది. దాని నేతతో సహా అందరూ ఇప్పుడు అమెరికాలో కొలువుదీరారు. వారి చెత్తను ప్రచారం చేసేందుకు ఎపోచ్‌ టైమ్స్‌ అనే ఒక పత్రికను కూడా సిఐఏ ఏర్పాటు చేసింది. అదిగాక ఇతర పత్రికల్లో కూడా రాస్తుంటారు, స్వంతంగా దుకాణాలు కూడా తెరిచారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు సరేసరి. వారు సముద్రం ఉందన్న చోట ఎడారి తప్ప నీటి చుక్క కనిపించదు.


దేశభక్తి గురించి మన జనానికి ఎవరూ కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో తమ మాన ప్రాణాలను,సంపదలను తృణ ప్రాయంగా అర్పించిన వారు వేగుచుక్కలా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అలాంటి వారు ఒక వైపు ఉంటే అసలు ఉద్యమంతో ఎలాంటి సంబంధాలు లేని, బ్రిటీష్‌ వారికి లొంగి ప్రేమలేఖలు రాసి తెరవెనుక పడి ఉంటామని చెప్పిన వారి వారసులు ఇప్పుడు జనాలకు దేశభక్తి గురించి బోధలు చేస్తున్నారు. వారికైనా ఎవరికైనా దేశభక్తి గురించి చెప్పే అర్హత లేదని ఎవరూ అనటం లేదు. అసలైన దేశభక్తులం మేమే, మేము చెప్పేదే సిసలైన దేశభక్తి అంటున్నందునే కాదన్నవారిది దేశద్రోహం అన్న దగ్గరే సమస్య మొదలౌతున్నది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి.చైనాతో సరిహద్దు వివాదానికి బ్రిటీష్‌ వారు కారకులు, కాశ్మీరు సమస్యకు అమెరికా,బ్రిటన్‌, వారికి మద్దతు ఇస్తున్నదేశాలు బాధ్యులు. వాటి పరిష్కారం కంటే ఆ దేశాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని, వ్యతిరేకతను నూరిపోయటం, దాన్ని బుర్రల నిండా ఎక్కించుకోవటమే దేశభక్తి అని చెబుతున్నారు. తప్పన్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు.ఉచ్చగుంటల్లో చేపలు పట్టేవారి మాదిరి సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగితే ఆ పేరుతో ఓట్లు దండుకోవచ్చని చూస్తున్నారు. పరిష్కారానికి పూనుకోవటం లేదు.


పశ్చిమ దేశాల్లో కూడా జనాలను చైనా వ్యతిరేక వార్తలతో అలరించినప్పటికీ మన దేశంలో మాదిరి జనాల్లో విద్వేషాన్ని ఎక్కించలేదు. రెండవది గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లుగా ఫాలున్‌ గాంగ్‌ చెప్పే కబుర్ల బండారం ఏమిటో మనకంటే ఎక్కువగా వారికి తెలిసి ఉండటం కూడా షి జింపింగ్‌పై పుకార్ల గురించి సంయమనం పాటించటానికి కారణంగా కనిపిస్తున్నది. కాషాయ దళాలు ఒక పధకం ప్రకారం వివిధ సంస్థల్లోకి తమ భావజాలం ఉన్నవారిని పంపటమే గాక వాట్సాప్‌ ఉన్నవారి బుర్రలను చాలావరకు ఖరాబు చేశాయి. పిచ్చి మొక్కలు మొలిచేందుకు అనువైన వాతావరణం ఉంది గనుక షీ జింపింగ్‌ నిర్బంధం అనగానే దున్నఈనిందంటే దూడను కట్టివేయమన్నట్లుగా తాము అనుకుంటున్నదీ లేదా కోరుకుంటున్నది జరిగింది అనగానే వెనుకా ముందూ చూడకుండా ఎలాంటి నిర్ధారణలకు పూనుకోకుండా మీడియాలో ఉన్నవారు రెచ్చిపోయారు. తామే కాదు, తమ వార్తలను గుడ్డిగా నమ్మేవారిని కూడా వెర్రి వెంగళప్పలుగా మార్చివేశారు. ఇప్పటికే మీడియా సంస్థలు విశ్వసనీయత సమస్యలను ఎదుర్కొంటుండగా తాజా వార్తను పతాక శీర్షికలకు ఎక్కించి మరింత ప్రశ్నార్ధకంగా మార్చివేశారు,ప్రతిష్టను దిగజార్చారు.


ప్రపంచంలో కొందరు ప్రధానులు, అధ్యక్షుల మాదిరి కొత్త చొక్కాలు వేసుకొని ప్రతిరోజూ కెమెరాల ముందు చైనా నేతలు ఎప్పుడూ నిలవలేదు. ప్రతి రోజూ టీవీల్లో ఫోజులు కొట్టరు. షి జింపింగ్‌ కూడా అంతే. సామరకండ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చిన తరువాత కరోన జాగ్రత్తల్లో భాగంగా కొద్ది రోజులు కనిపించలేదు. అదే సమయంలో కొందరు ప్రముఖ మాజీల మీద చర్యలు తీసుకున్నట్లు వార్తలు రావటం.ఆరుగురు మాజీ మంత్రులు లేదా ఉన్నతాధికారుల అవినీతి రుజువు కావటంతో ఇటీవలనే వారికి శిక్షలు వేశారు.వారు తిరుగుబాటుకు పూనుకున్నారని చిత్రించారు. గత కొద్ది నెలలుగా జింపింగ్‌ మీద కుట్ర, ప్రత్యర్ధులు సవాలు చేస్తున్నారు, జీరో కరోనా పేరుతో లాక్‌డౌన్లు విధించి జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప దేశ ఆర్ధిక వృద్ధి పట్టలేదు వంటి అంశాలతో కుట్ర విశ్లేషణలను ఒక పధకం ప్రకారం రాస్తున్నవారు ఇప్పుడు చెబితే జనం కచ్చితంగా నమ్ముతారు అంటూ ఏకంగా జింపింగ్‌ను నిర్బంధించారని సృష్టించారు. చైనా గురించి రాసే నిపుణుడిగా పేరున్న మనోజ్‌ కేవల్‌రమణి ఈ తప్పుడు వార్త గురించి చెబుతూ ” భారత మీడియా దాన్ని అందిపుచ్చుకొని పరుగెత్తుతూ దాన్ని టాంటాం వేసింది. ఒక్క తూటా కూడా పేలకుండా ఇలాంటిది జరిగే అవకాశం ఉందని అనుకోవటం విడ్డూరంగా ఉంది. బీజింగ్‌ ఉత్తర కొరియా కాదు, అక్కడ విదేశీ విలేకర్లు జీవిస్తున్నారు. భారత్‌లో చైనా వ్యతిరేకత విశేషంగా ఉంది. అది లడఖ్‌లో రెండు దేశాలు ఘర్షణ పడక ముందునుంచీ ఉంది ” అన్నారు. ” భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ఈ పుకార్లపై స్పందన వారు కోరుకుంటున్నదానికి ప్రతిబింబం, షీ జింపింగ్‌ను అరెస్టు చేశారు అన్న పుకారు షికారు చేసేందుకు కారణం బీజింగ్‌లో సున్నితమైన రాజకీయ కదలికలు ఉండటమే ” అని సింగపూర్‌లోని చైనా అంశాల నిపుణుడు డ్రా థాంప్సన్‌ చెప్పాడు. ” చైనా రాజకీయాలు బ్లాక్‌బాక్స్‌(విమానాల్లో జరిగేవాటిని రికార్డు చేసే ఒక పరికరం. విమానం మొత్తం ధ్వంసమైనా అది చెక్కుచెదరదు. దాన్ని విప్పిచూస్తే జరిగిందేమిటో తెలుస్తుంది) కంటే కఠినంగా ఉంటాయి . సామాజిక మాధ్యమంలోని పుకార్లను ధృవీకరించేందుకు ఈ రోజు బీజింగ్‌లో ఎలాంటి óఆధారం దొరకలేదు ” అని హిందూ పత్రిక బీజింగ్‌ విలేకరి అనంత కృష్ణన్‌ పేర్కొన్నారు.

శుక్రవారం(23వ తేదీ) ప్రారంభమైన వదంతులు శనివారం నాటికి పతాకస్థాయికి చేరాయి. అమెరికాలో ఫాలున్‌ గాంగ్‌ పేరుతో తిష్టవేసిన చైనా అసంతృప్త జీవులు, సిఐఏ కిరాయి మనుషులు సృష్టించిన ఈ పుకారును వారు నడిపే ఎన్‌టిడిటివి అనే మీడియా వదిలింది, దాన్ని ట్విటర్‌, యు ట్యూబ్‌లో ఆ ముఠావారే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దాన్ని మన దేశంలోని సామాజిక మాధ్యమంలోని చైనా వ్యతిరేకులు మరింత పెద్దగా వ్యాపింప చేశారు.చైనాలో ఈ ఏడాది లాక్‌డౌన్లు లేనపుడు మార్చి నెలలో రోజుకు ఆరువేల విమానాలు ఎగిరేవి, లాకడవున్ల కారణంగా తగ్గాయి .అలాంటిది బీజింగ్‌ గగనతల మీద రోజుకు 16వేలు ఎగురుతాయని వాటిలో తొమ్మిదివేలను రద్దు చేశారని ప్రచారం జరిగింది.చైనా నుంచి పారిపోయి జర్నలిస్టుగా చెప్పుకొనే ఝావో లాంజియాన్‌ అనే వాడు విమానాల రద్దు ఈ కథను అల్లాడు. ఆ మేరకు ఉపగ్రహాల చిత్రాలంటూ కొన్నింటిని చూపారు. అదంతా వట్టిదే అని తరువాత కొందరు స్పష్టం చేశారు. శనివారం నాడు అమెరికాలో స్థిరపడిన చైనా మహిళ జెన్నిఫర్‌ జెంగ్‌ ట్వీట్‌ చేస్తూ బీజింగ్‌ వైపుకు కదులుతున్న 80కిలోమీటర్ల పొడవైన మిలిటరీ దళాల బారు అంటూ ఒక వీడియోను జత చేసింది. సంచలనం కోసం ఎదురు చూసే మీడియా దున్న ఈనిన దూడను మనకు చూపెట్టింది. మన దేశంలో జరిగిన ప్రచారాన్ని చూసి బీజింగ్‌లో ఉన్న డెర్‌ స్పీగల్‌ అనే జర్మన్‌ పత్రిక విలేకరి జార్జి ఫారియన్‌ ఒక సైకిల్‌ రిక్షాలో కూర్చున్న ఒక మహిళ, తియనన్‌మెన్‌ మైదానం దగ్గర ఉన్న కొందరు సందర్శకుల చిత్రాలను పోస్టు చేస్తూ వాటి కింద ” ఆశ సన్నగిల్లుతున్నది, కుట్రదారుల అదనపు బలాలు సాయుధశకటాల్లో వచ్చాయని ” అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్‌ను కొన్ని టీవీ ఛానళ్లు మరోరకంగా చెప్పాయి. చైనా మిలిటరీ రకరకాల వేషాల్లో రూపంలో ఉంటుందన్నాయి .

అధికారాలన్నీ లాగేసుకొని వేరేవారికి అప్పగించారంటూ వచ్చిన ఆధారం లేని వార్తలను సరి చూసుకోకుండా రెచ్చిపోయిన వారు అది అవాస్తవం అని తేలిన తరువాత ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కొందరు తేలుకుట్టిన దొంగల మాదిరి నోరు మూసుకుంటే, కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ఉత్తిదే అని ప్రశ్నార్ధకమిచ్చిన వారు కొందరు. సిద్దాంతం పట్ల స్థిరత్వం లేని వారు, అవినీతి అక్రమాల పట్ల చూసీ చూడనట్లు ఉన్నవారు, ప్రధాన అంశాల మీద స్పష్టత లేని వారిని అక్టోబరు 16 నుంచి జరగనున్న కమ్యూనిస్టు పార్టీ మహాసభకు ప్రతినిధులుగా ఎన్నుకోలేదని వార్తలు. ఈ సభకు ఎన్నికైన మొత్తం ప్రతినిధులు 2,296 కాగా వారిలో లడఖ్‌ సరిహద్దులలో పని చేస్తున్న 13 మందితో సహా పిఎల్‌ఏ పశ్చిమ కమాండ్‌కు చెందిన 30 మంది మిలిటరీ అధికారులు, ఇతర కమాండ్‌ల నుంచి మొత్తంగా మిలిటరీ నుంచి 304 మంది ఎన్నికైనట్లు వచ్చిన వార్తలు. పుకార్ల గురించి ప్రస్తావించకుండా చైనాలో ఎలాంటి పరిణామాలూ జరగలేదని అర్ధం వచ్చేలా వాటికి తెరదించుతూ షీ జింపింగ్‌ నేతృత్వంలోని పార్టీ మార్గదర్శకాల మేరకు ఎన్నికైన ప్రతినిధులందరూ పార్టీ మహాసభకు సిద్దమౌతున్నారంటూ కమ్యూనిస్టు పార్టీ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షాంఘై సహకార సంస్థ భేటీ : ఉక్రెయిన్‌పై చైనా వైఖరి కూడా మారితే మోడీతో షీ జింపింగ్‌ను కలిపి అమెరికా మీడియా ఎందుకు పొగడలేదు ?

21 Wednesday Sep 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, US Media, US Media Praises PM Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరమైన సామరకండ్‌లో 2022 సెప్టెంబరు 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశం జరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రాంతీయ కూటమి ఇది.యురేసియా (ఐరోపా-ఆసియా ఖండం) లోని 60శాతం విస్తీర్ణం, ప్రపంచ జనాభాలో 40శాతం, ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న కూటమి ఇది. తొలుత షాంఘై ఐదుగా పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం 27 దేశాలు, మూడు సంస్థలతో ఉంది.2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. సామరకండ్‌ సమావేశంలో ఇరాన్‌ పూర్తి సభ్య దేశంగా చేరింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రపంచ దేశాలను మాతో చేరతారా లేదా మేం చెప్పినట్లు చేస్తారా చస్తారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పూర్వరంగంలో దానికి భిన్నమైన పద్దతుల్లో అభివృద్ధి,ఆర్ధిక, సాంస్కృతిక సహకారం, సమానత్వం ప్రాతిపదికగా ఐరాస నిరంత అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎస్‌సిఓ సామరకండ్‌ ప్రకటన పునరుద్ఘాటించింది.


ఈ కూటమి ఒక దేశానికి లేదా నాటో వంటి మిలిటరీ కూటములకు వ్యతిరేకంగా ఏర్పడినది కాదు. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత దానిలోని పూర్వ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అవి చైనాతో కొత్త సరిహద్దులకు తెరలేపిన పూర్వరంగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, మిలిటరీల మధ్య సమన్వయం-విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు గాను చైనా చొరవతో ఏర్పడింది.ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలతో కొన్నింటికి విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అనేక ఖనిజాలకు కూడా ఈప్రాంతం పెట్టింది పేరు. మరోవైపు అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928 ఉన్నాయి. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ విధంగానూ ఏ దేశానికైనా అంత తేలిక కాదు.


ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల కారణంగా అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ దీన్ని భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా తీరు ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. పరిశీలక దేశాలుగా బెలారస్‌, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్‌ , చర్చల భాగస్వాములుగా టర్కీ, శ్రీలంక, కంపూచియా, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, నేపాల్‌ ఇప్పటికే ఉండగా 2023 నుంచి ఈజిప్టు, సౌదీ అరేబియా, కతార్‌లకు అదే స్థాయి కల్పించేందుకు అవగాహన కుదిరింది. ఈ జాబితాలో చేరేందుకు బహరైన్‌, మాల్దీవులు, కువైట్‌, ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌,మయన్మార్‌లను అంగీకరించారు. బెలారస్‌ శాశ్వత దేశహౌదా పొందనుంది. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ వివాదంలో ఒక వైపు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్‌, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్‌, బెలారస్‌ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో మన దేశం చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు.ఇదే దాని విజయ రహస్యం. ఈ దిశగా మరొక ముందడుగు అని చెప్పవచ్చు.


అజెండాలో సంచలనాత్మక లేదా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే విధంగా సామరకండ్‌ సమావేశంలో ఎలాంటి చర్చలూ, పరిణామాలు లేవు. కానీ ఈ సందర్భంగా వివిధ దేశాల నేతల మధ్య జరిగిన విడి విడి సమావేశాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా విశ్లేషణలు, భాష్యాలు వెలువడ్డాయి. ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్లు ఒక వార్త. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై భారత వైఖరిలో మార్పు వచ్చిందని, పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా దానితో జతకలిసే ఐరోపా పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక అమెరికా మంత్రులు, అధికారులు తమవైన శైలిలో మాట్లాడారు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌ నోట వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం తగినపని కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటానికి, కొత్తగా తంపులు పెట్టటానికి ఇది తగిన తరుణం కాదని నరేంద్రమోడీ ఎన్నడూ అమెరికా కూటమికి ఇంతవరకు చెప్పలేకపోయారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, దాని సెగ మన దేశానికి కూడా తాకింది. తన ప్రభుత్వానికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అది నిలిచిపోతే అంబానీకి వస్తున్న లాభాలకు గండిపడుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. అన్నింటినీ మించి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నందున ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. అయితే ఆ మాత్రం కూడా గత ఆరున్నర నెలలుగా మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని భారత్‌ కూడా తప్పు పట్టింది, మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా పాలకులకు వంతపాడే పత్రికలు చేసిన హడావుడి అది. ఇదే సమయంలో చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ కూటమిలో మోడీ చురుకుగా ఉన్నారు. తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులనుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక వారిని సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు.


ఇది ఒకటైతే చైనా అధినేత షీ జింపింగ్‌ ాపుతిన్‌ భేటీలో ఉక్రెయిన్లో జరుగుతున్నదాని గురించి జింపింగ్‌ ప్రశ్నించినట్లు, ఆందోళన వ్యక్తం చేసినట్లు, మద్దతుపై పునరాలోచనలో పడినట్లుగా కూడా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.” దీని గురించి షి జింపింగ్‌ ప్రశ్నలు, ఆందోళనను మేము అర్ధం చేసుకున్నాం, మా వైఖరిని కూడా వివరించామనుకోండి. దీని గురించి ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ మరింతగా వివరిస్తాం ” అని పుతినే చెప్పారు. వీటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ భాష్యం చెప్పవచ్చు. ఏ తీరులో మాట్లాడిందీ విన్నవారెవరూ లేరు. నిజంగా ప్రతికూలంగా చెప్పినా లేదా చైనా వైఖరిలో మార్పు ఉంటే అమెరికా మీడియాలో నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తినట్లుగా షి జింపింగ్‌ను పొగడలేదేం !


ఉక్రెయిన్‌ సంక్షోభ తీరు తెన్నులు, పూర్వరంగాన్ని చూసినపుడు ప్రపంచ భద్రతకు నూతన రూపకల్పన జరగాల్సిన అగత్యం కనిపిస్తున్నది. తనకు దక్కనిదాన్ని ఇతరులకూ దక్కనివ్వను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏర్పడిన ప్రపంచ వ్యవస్థలపట్ల సామ్రాజ్యవాదులు వ్యవహరిస్తున్నారు. తన నేతృత్వంలో ఏక ధృవ ప్రపంచాన్ని సృష్టించాలని అమెరికా చూస్తుంటే సర్వజన సంక్షేమం కోసం బహుధృవ ప్రపంచాన్ని రూపొందించాలని దాన్ని వ్యతిరేకించే శక్తులు చూస్తున్నాయి.ఐరాస నిబంధనల మేరకు పాలన సాగాలని కోరుకుంటున్న శక్తులే దాన్ని ఖాతరు చేయటం లేదు, పరస్పర సహకారం, అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ సంస్థలను ధనిక దేశాలు తమ వస్తువుల మార్కెట్ల కోసం వత్తిడి చేసే, బలహీన దేశాల మీద షరతులను రుద్దే అస్త్రాలుగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన వారే దాన్ని పక్కన పెట్టి మనం మనం విడిగా చూసుకుందామంటూ ద్విపక్ష వాణిజ్య ఒప్పందాలకు, ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. వాటి గత చరిత్రంతా అదే. వలస దేశాల ఆక్రమణ పోరులో ఎనభై సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్న స్పెయిన్‌-డచ్‌, 30 సంవత్సరాల జర్మన్‌ యుద్ధాలకు రాజీగా 1648లో అమల్లోకి వచ్చిన వెస్ట్‌ ఫాలియా శాంతి ఒప్పందాన్ని తొలి ప్రపంచ వ్యవస్థకు నాందిగా పరిగణిస్తారు. తరువాత ఐరోపాను ఆక్రమించుకొనేందుకు ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ ప్రారంభించిన దురాక్రమణలు, దానికి వ్యతిరేకంగా కట్టిన కూటముల మధ్య రెండు దశాబ్దాల పాటు సాగిన పోరు తరువాత 1815 వియన్నా ఒప్పందం జరిగింది. అది కూడా విఫలమై మొదటి ప్రపంచ యుద్దం తరువాత నానాజాతి సమితి ఏర్పాటు, దాన్ని తుంగలో తొక్కిన కారణంగా రెండవ ప్రపంచ యుద్దం పర్యవసానంగా ఐరాస ఏర్పడింది. ప్రత్యక్ష వలసలకు అవకాశం లేకపోవటంతో మార్కెట్ల ఆక్రమణ కోసం తీసుకు వచ్చిందే 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు గతం మాదిరి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మరో వ్యవస్థ ఏర్పాటు అంత తేలిక కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాను సంతుష్టీకరించిన నరేంద్రమోడీ ! అందుకే అక్కడి మీడియా పొగడ్తలా !!

18 Sunday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, Ukraine-Russia crisis, US Media Praises PM Modi, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికన్‌ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి వస్తే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వారిని కూడా ఆజానుబాహువులుగా వర్ణిస్తాయి.2022 సెప్టెంబరు 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లోని సామరకండ్‌ పట్టణంలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 2022 వార్షిక సమావేశాల్లో మన ప్రధాని నరేంద్రమోడీ-రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ విడిగా భేటీ అయ్యారు.


సదరు భేటీలో ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో చేప్పినట్లు మోడీ యంత్రాంగం వెల్లడించింది. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా పతాక శీర్షికలతో టాంటాం వేసింది. అమెరికా వెంట నడిచే ఐరోపా పత్రికల్లోనూ ఇదే జరిగింది. కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌నుంచి వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన చర్చలను అమెరికా, బ్రిటన్‌ అడ్డం గొట్టి తామిచ్చే అస్త్రాలతో పుతిన్‌ సేనలను ఓడించవచ్చని జెలెనెస్కీని వెనక్కు రప్పించిన సంగతి తెలిసిందే.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం భారత ప్రయోజనం కోసం కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, ఆ కారణంగా తన ప్రభుత్వం-జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎరిగినప్పటికీ పశ్చిమ దేశాల వైఖరిని మిత్రధోరణిలో కూడా ఇంతవరకు తప్పు పట్టలేదు. కాశ్మీరు సమస్యలో తనను మధ్యవర్తిత్వం వహించమని నరేంద్రమోడీ కోరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు కూడా మోడీ స్పందించలేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం చైనా మీద కత్తిగట్టి అమెరికాతో ఉండటం అమెరికా మీడియాకు సంతోషమే. ఆ వైఖరితో ఉన్నా కొన్ని సందర్భాల్లో మోడీని ఏకిపారవేసింది. మరికొన్ని సార్లు ఆకాశానికి ఎత్తింది.


” అవాక్కయ్యేలా దుస్సాహస నిర్ణయాలు, విపత్కర ఫలితాలనిస్తున్న ప్రజారోగ్య విధానం, నివారించదగిన మరణాలు, కరోనా నరకం, లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ” భారత్‌లో కరోనా నివారణ వైఫల్యంపై అమెరికా, ఐరోపా, ఇతర ప్రపంచ పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి.తమ నేత మోడీ మీద బురదజల్లే రాతలు తప్ప వాస్తవాలు కాదని బిజెపి వారు ఆరోపించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలను దాచిపెట్టిన తీరు, బాధ్యత లేకుండా కుంభమేళా వంటి వాటిని అనుమతించటం, పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, కరోనా మీద విజయం సాధించామని ప్రకటించటం, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు రాజధానిలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించటం, వారి మీద తప్పుడు ప్రచారం వంటి అనేక అంశాల మీద అంతర్జాతీయ మీడియాలో విమర్శలతో కూడిన సంపాదకీయాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. వాటిని ఖండించాలని ప్రపంచంలోని భారత దౌత్యవేత్తలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమర్శలు ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి వచ్చాయి తప్ప ఊరికే రాలేదు. ప్రధాని మోడీ మితిమీరిన విశ్వాసం అని గార్డియన్‌, భారత్‌ను రక్షించటానికంటే నరేంద్రమోడీ పేరును కాపాడేందుకు బాధ్యతా రహిత చర్యలకు పాల్పడినట్లు వాషింగ్టన్‌ పోస్టు, మహావిపత్తు పట్ల తాపీగా మోడీ ఉన్నారని ఎకానమిస్టు, ముందుచూపు లేమి, దురహంకారం, వాక్శూరత్వంతో మోడీ వ్యవహరించినట్లు లీమాండే, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు మహమ్మారికి సంబంధం కలిపినట్లు గ్లోబల్‌ టైమ్స్‌, జయధ్వాన ధ్యాసలో పడి తప్పుగా అర్ధం చేసుకోవటం తరువాత స్పందన లేకుండా ఉన్నట్లు కతార్‌ ట్రిబ్యూన్‌, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లేక రోగులు విలవిల్లాడుతుంటే పార్లమెంటు భవన పధకానికి ప్రాధాన్యన ఇచ్చిన అహంకారి, సిగ్గులేని వాక్శూరుడు మోడీ అని, గాంధీ, నెహ్రూ మాదిరి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని డైలీ మెయిల్‌ వంటి పత్రికలు విమర్శించాయి. పశ్చిమ దేశాల మీడియా ఏమిరాసిందనే దాని కంటే మన మీడియా రాయాల్సినవాటిని రాయటం లేదని, సంపాదక పేజీల్లో రాసిన వాటిని భారతీయులు చదవరనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా వారి మీద సునిశిత విమర్శలు చేసే ధోరణి పశ్చిమ దేశాల్లో ఉంది, అదే సమయంలో వారిని కాపాడేందుకు కూడా చూస్తాయి. మన దేశంలో మొదటిదాన్ని వదలి రెండోదానికే ప్రాధాన్యత ఇవ్వటంతో జనం సంపాదక పేజీలను భజన సరకుగా చూస్తున్నారు. అందుకే చదవటం లేదు.


మన దేశంలో 2016నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పెద్ద ప్రహసనమని వివేచనా శక్తి ఉన్నవారందరికీ తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని గొద్దెను కూడా పట్టలేదు. నల్లధనం వెలుపలికి రాకపోగా అది పూర్తిగా లెక్కల్లోని ధనంగా చెలామణిలోకి వచ్చింది. అవినీతి గురించి చెప్పనవసరం లేదు. విధిలేక మాట మార్చి ధనం మొత్తం లెక్కలోకి రావటమే గొప్ప ఘనతగా మోడీ భక్తులు భజన చేశారు. జనం ఎన్ని ఇబ్బందులు పడిందీ వారికి పట్టలేదు. ఏం రాస్తే ఏం మాట్లాడితే ఎటుబోయి ఎటువస్తుందో, ఏం జరుగుతుందో మనకెందుకు లెమ్మని మన మీడియా సంస్థలు వైఫల్యం లేదా విజయం గురించి చెప్పకుండా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి. నోట్ల రద్దు జరిగిన 50 రోజుల తరువాత దేశం బంగారం మాదిరి వెలిగిపోతుందని నరేంద్రమోడీ ఒక సభలో చెప్పారు. జనధన్‌ బాంకు ఖాతాల్లో ఎవరైనా వచ్చి రెండున్నర లక్షలు డిపాజిట్‌ చేసి ఆరునెలల తరువాత మాకు రెండు లక్షలు ఇచ్చి మిగతావి మీరు తీసుకోండి అని చెబితే అలా చేయవద్దు అని కూడా సెలవిచ్చారు. తన చర్య ఉగ్రవాదుల నడుం విరిచేస్తుందని అక్రమార్కులను అంతం చేస్తుందన్నారు.ఇంకా ఎన్నో చెప్పారనుకోండి.
ఇంతకీ జరిగిందేమిటి ? అసలు ఎంత కరెన్సీ తిరిగి వచ్చిందో, ఎంత నల్లధనం వెలికి వచ్చిందో ప్రకటించిన వారే లేరు. ఏమిటి అని అడిగితే ఇంకా లెక్కతేలలేదని చెప్పారు. నోట్లను లెక్కించుకోలేని అసమర్ధ స్థితిలో ఉన్నట్లు అంగీకరించారు. రెండు సంవత్సరాల తరువాత 2018లో 2017-18 సంవత్సర వార్షిక నివేదికలో లెక్కింపు పూర్తైనట్లు ఆర్‌బిఐ పేర్కొన్నది. 2016 నవంబరు ఎనిమిదిన 500, 1000 పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రు.17.74 లక్షల కోట్లు. రద్దుచేసిన నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు, బాంకులకు తిరిగి వచ్చిన నోట్ల విలువ రు. 15.31లక్షల కోట్లు, రాని సొమ్ము కేవలం రు.10,720 కోట్లు మాత్రమే. అంటే నల్లధనం విలువ ఇది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవటం తెలియని మామూలు జనాలెందరో తరువాత గొల్లుమన్నారు. ఇక రద్దు చేసిన వాటి బదులు కొత్త 500, 2,000 నోట్లు అచ్చేసేందుకు ప్రభుత్వానికి లేదా ఆర్‌బిఐకి ఐన ఖర్చు రు.12,927 కోట్లు, జనం ఇబ్బందులు, కొత్త నోట్ల కోసం వరసల్లో నిలిచి పోగొట్టుకున్న పనిదినాలు, వేతనాల నష్టం లెక్కించిన వారెవరూ లేరు. దాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి అయిన జిడ్డు ఆముదం ఖర్చు రు. 2,207 కోట్లు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేసినట్లు ?

ఈ మతిమాలిన పనిని ఐఎంఎఫ్‌, ఐరోపా సమాఖ్య, ప్రపంచబాంక్‌, ఇతర అనేక సంస్థలు, అమెరికా పత్రికలు పెద్ద ఎత్తున పొగిడాయి. ప్రపంచబాంక్‌ అధిపతి మరొక అడుగు ముందుకు వేసి తాను మోడీ అభిమానిని అన్నాడు. ఎంతో పెద్ద మొత్తంలో నగదును బాంకుల్లో జమ చేశారని ఫోర్బ్స్‌ పత్రిక, ఎంతో తెలివైన పని అని పేర్కొన్న ఇద్దరు నిపుణుల మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఉటంకించింది. విత్త నిపుణులు ఇదెంతో ధైర్యవంతం, దేశాన్ని మార్చి వేస్తుందని సెలవిచ్చారు. కొన్ని పత్రికలు భారత్‌లో 400 బిలియన్‌ డాలర్లమేర నల్లధనం ఉందని అదంతా వెలుపలికి వస్తుందని నమ్మబలికారు. ఆ వార్తలను తెలుసుకొని బహుశా నరేంద్రమోడీ కూడా నిజమే అని భ్రమించి ఉంటారు.

షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పుతిన్‌తో మాట్లాడుతూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అంబానీకి లాభం తగ్గుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. ఇప్పుడున్న వాటిని పూర్తిగా పక్కన పెట్టి అమెరికా అస్త్రాలతో మన మిలిటరీని నిర్వహించాలంటే మన జుట్టును దాని చేతికి అందించటమే కాదు, అంత సొమ్ము మన దగ్గర లేదు. అందువలన ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. ఆ మాత్రం కూడా ఇంతవరకు మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని నరేంద్రమోడీ కూడా తప్పు పట్టారు మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా చేసిన కసరత్తు అది. ఎవరు ఏమి చెప్పినా షాంఘై సహకార సంస్థలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికా బాధితులే. ఆ సంస్థలో చేరిన నరేంద్రమోడీ, చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో చురుకుగా ఉన్నారు. అందువలన తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులను సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ది ” ప్రచార విజయమా ” !

14 Wednesday Sep 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Germany, NATO, Propaganda “Victory”, Ukraine war, Ukraine-Russia crisis, Ukraine’s counteroffensive, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు

రష్యా సైనిక చర్యలో కోల్పోయిన ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు, పుతిన్‌ సేనలను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరుసటి రోజు దాన్ని ఆరువేలని, మంగళవారం నాడు ఎనిమిది వేలని చెప్పారు. నిజమే, ఇదిగో చూడండి పారిపోతున్న రష్యా సేనలు అంటూ పశ్చిమ దేశాల టీవీలు కొన్ని దృశ్యాలను చూపటం, విశ్లేషణలు, వాటి ప్రాతిపదికగా అనేక దేశాల వారు స్పందించటం, వాటిని మన దేశంలోని మీడియా ఎప్పటికప్పుడు అందించటం చూస్తున్నాము.ఖారకైవ్‌ ప్రాంతం నుంచి తమ సేనలను వెనక్కు మళ్లించినట్లు మాస్కో అధికారులు ప్రకటించారు. అందువలన ఆప్రాంతం ఎంతైతే అన్ని వేల కిలోమీటర్లను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పుకోవటంలో తప్పులేదు, ఆశ్చర్యమూ ఉండదు. దాని నేత జెలెనెస్కీ అధికారానికి రాక ముందు సినిమాల్లో విదూషక పాత్రధారి. గత ఆరున్నర నెలలుగా అనేక ప్రకటనలు చేశాడు. తమ మూలనున్న ముసలమ్మలు ఊతకర్రలు పట్టుకొని, పాలుతాగే పసివాళ్లు కూడా ఉయ్యాళ్ల నుంచి దూకి దేశ రక్షణకు వచ్చినట్లుగా గతంలో చెప్పిన కబుర్లను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.


మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఒక ఎత్తుగడగా మాస్కో సేనలు భారీ దాడులకు సిద్దం కావటంలో భాగంగా వెనక్కు వెళ్లినట్లు చెబుతున్నారు. అందువలన ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నదా ? నాలుగు నెలలుగా సాధ్యం కానిది ఈనెల మొదటి వారంలో ఆకస్మికంగా నాలుగు రోజుల్లో రష్యా సేనలను తరిమికొట్టే శక్తిని జలెనెస్కీ ఎలా సంపాదించినట్లు ? పశ్చిమ దేశాలు జనాల ప్రాణాలు తీసే లేదా ఆస్తులను విధ్వంసం చేసే అస్త్ర శస్త్రాలే కాదు జనాల మెదళ్ల మీద దాడి చేసే ప్రచార ఆయుధాలను కూడా సమకూర్చుతున్నాయి. ప్రాణాంతక అస్త్రాలను దాడులు జరిగే చోటనే ప్రయోగిస్తే ప్రచారదాడికి ఎల్లలు లేవు. తాజాగా ఉక్రెయిన్‌ ప్రతిఘటన అనేది ఒక ప్రచార ” విజయం ” గా కొందరు వర్ణించారు. జరిగిన దాన్ని తమ వైఫల్యాలు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో తలెత్తిన ఆర్ధిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇంకొక్క ఊపు ఊపితే పుతిన్‌ పతనం ఖాయం అనే అభిప్రాయాన్ని, వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా కనిపిస్తున్నది.


తాము జరుపుతున్నది దురాక్రమణ దాడి కాదని రష్యా చెబుతున్నది, కాదు అదేనని దాన్ని వ్యతిరేకించే దేశాలు వర్ణిస్తున్నాయి. ఏ కారణంతో పశ్చిమ దేశాలు చెప్పినప్పటికీ 1,27,484 చదరపు కిలోమీటర్ల మేర జెలెనెస్కీ సర్కార్‌ ఏలుబడిలో లేదు, దీనిలో ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని పెద్ద విజయంగా చిత్రించుతున్నారు. ఒక పోరు జరుగుతున్నపుడు ఇలాంటివి సాధారణం. ఇదేమీ నిర్ణయాత్మక పరిణామం కాదు. దీంతోనే ముగిసేది లేదు. అందుకే దీన్ని ప్రచార ” విజయం ” అంటున్నారు. దశాబ్దాల పాటు ఆప్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికన్లు అక్కడ సాధించిన విజయ గాధలను ప్రపంచానికి ఎలా వినిపించారో, తప్పుదారి పట్టించారో, చివరికి తాలిబాన్ల కాళ్లు పట్టుకొని ప్రాణాలతో స్వదేశానికి పారిపోయారో తెలిసిందే. ఖార్‌కైవ్‌ ప్రాంతం నుంచి రష్యా సైనికులు టాంకులు, వాహనాలు, తుపాకులను ఎక్కడి వక్కడ వదిలేసి ఉక్రేనియన్లు దాచుకున్న సైకిళ్లను అపహరించి వాటి మీద పారిపోయారట. మరి జెలెనెస్కీ సేనలు వారిని ఎందుకు బందీలుగా చేయలేదు. ఎవడైనా పారిపోవటానికి ఉన్న వాహనాలను వదలి సైకిళ్లెందుకు ఎక్కుతారు?


మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకోవటం గొప్పే అనేవారిని కాసేపు సంతృప్తిపరుద్దాం. ఐరాస కాందిశీకుల సంస్థ వివరాల ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత మంది కాందిశీకులు ఏ సంక్షోభంలోనూ రాలేదు. ఆగస్టు 30 నాటికి 70లక్షల మంది కాందిశీకులు వివిధ దేశాల్లో ఉన్నారు. అత్యధికంగా 24లక్షల మంది రష్యాకే వెళ్లారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, నాజీ కిరాయి మూకలు జరిపిన దాడుల కారణంగా వారు వలస పోవాల్సి వచ్చింది. మిగిలిన వారు రష్యా మిలటిరీ దాడుల కారణంగా ఇతర ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. వీరు గాక అంతర్గతంగా మరో 80లక్షల మంది తమ నెలవులు తప్పారు. విదేశాలకు వెళ్లిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు, వారికి ఎందరికి తిరిగి పూర్వపు జీవనాన్ని కల్పించారన్నది ముఖ్యం. ఆ వివరాలు మనకు ఎక్కడా కనపడవు, వినపడవు.తామే ఇంథన కొరతతో ఇబ్బందులు పడుతుంటే కాందిశీకులకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తామంటూ అనేక దేశాల్లో గుసగుసలు.


ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఉక్రెయిన్‌ మిలిటరీ, ఆర్ధిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా రష్యా దాడులను జరుపుతున్నది. జన నష్టం జరగకుండా ఎంపిక చేసుకున్న వాటి మీదనే దాడులు చేస్తోంది. రెండు వైపులా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. చెబుతున్నది నమ్మదగినవిగా లేవు. దాడుల్లో జననష్టం జరిగితే దాన్ని చూపి రష్యాను మరింత ఒంటరి చేసి ఎండగట్టాలన్న అమెరికా ఎత్తుగడ పారలేదు. అదే విధంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున జెలెనెస్కీ సేనలకు ఆయుధాలు అందిస్తాయనే అంచనా ఉన్నప్పటికి ఆధునిక అస్త్రాలతో తమను ఎదుర్కొంటారని పుతిన్‌ ఊహించినట్లు కనపడదు. ఇలా ఊహించనివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఇంథనాన్ని ఆయుధంగా మలచాలని చూసిన అమెరికాకు అది ఎదురుతన్నటమే కాదు మాస్కోకు అదనపు రాబడి తెచ్చిపెడుతున్నది. ఇంథన సంక్షోభంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అది ఏ రూపంలో జనంలో ఆగ్రహం కలిగిస్తుందో చెప్పలేము. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అమెరికాలో ద్రవ్యోల్బణం, మాంద్య ముప్పు పొంచి ఉంది. మేము కావాలో రష్యా కావాలో తేల్చుకోవాలని అమెరికా విసిరిన మతిమాలిన సవాలు దానికే ఎదురుతన్నింది. డాలరును పక్కన పెట్టి తమ కరెన్సీలతో లావాదేవీలు జరుపుకోవాలని మరింతగా గట్టిగా చెప్పేందుకు ఈ సంక్షోభం అవకాశం ఇచ్చింది. పెద్దన్న ప్రాభవం తగ్గుతున్నదని లోకానికి స్పష్టం చేసింది. చివరికి ప్రతిదానికి అమెరికా నేతలను కావలించుకున్న నరేంద్రమోడీ ఈ అంశంలో మాత్రం దూరంగా ఉన్నారు. గొంతు కలిపేందుకు వెనుకాడుతున్నారు.

రెండవ ప్రపంచయుద్దంలో జర్మనీ,జపాన్‌ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సోవియట్‌తో భుజం కలిపి పోరాడిన అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్సులు తరువాత దాన్నే బూచిగా చూపి ప్రపంచానికే శత్రువులుగా రుజువైన జర్మనీ,జపాన్‌లను చంకనెత్తుకున్నాయి. అన్నింటికంటే విపరీతం ఏమంటే నాటో పేరుతో జర్మనీని, రక్షణ ఒప్పందం పేరుతో జపాన్ను కాపాడేందుకు పూనుకున్నాయి. అన్నీ కలసి ప్రపంచానికి ముప్పు తలపెట్టాయి. గతంలో ఐరోపాలో యుద్దానికి జర్మనీ కారణమైతే ఇప్పుడు దాన్ని కూడా కలుపుకొని ఉక్రెయిన్‌ యుద్దానికి అమెరికా కారణమైంది. ఏదో ఒకదాన్ని బూచిగా చూపకపోతే తమ దుష్టపధకాలను జనం ప్రశ్నిస్తారు గనుక ఊహాజనిత బూచిని చూపుతున్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం రష్యాను, దానికి మద్దతు ఇస్తున్నదంటూ చైనాను బూచిగా చూపుతున్నారు. చివరికి స్విడ్జర్లాండ్‌, ఫిన్లాండ్‌ వంటి తటస్థ దేశాలను కూడా తమ కూటమిలోకి లాగాయి. లాటిన్‌ అమెరికాలో నియంతలను ప్రోత్సహించి ప్రజా ఉద్యమాలను అణచేందుకు పూనుకుంటే అక్కడా ఎదురుతన్నింది.వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ముందుకు వస్తుండగా మితవాద శక్తులను జనం ఛీకొడుతున్నారు.


అమెరికా డాలరు దెబ్బకు తమ కరెన్సీ యురో, బ్రిటీష్‌ పౌండ్‌ కూడా విలవిల్లాడుతున్నాయి. వాటి పర్యవసానాలు ఇప్పుడే తెలియదు. ఇంథనాన్ని ఆయుధంగా మార్చాలని చూసిన అమెరికా ఎత్తుగడకు విరుగుడుగా దాన్నే తన అస్త్రంగా మార్చుకున్న రష్యా ప్రయోగానికి ఐరోపా గింగిరాలు తిరుగుతోంది. చమురు, చమురు ఉత్పత్తుల మీద డిసెంబరు ఐదు, 2023 ఫిబ్రవరి ఐదు నుంచి రెండు దశలుగా రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు పూనుకున్నారు. తాము నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేసే టాంకర్లకు బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తామని అమెరికా, కెనడా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌, ఇటలీలతో కూడిన జి7దేశాల కూటమి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సిద్దము సుమతీ అన్నట్లుగా ఐరోపా సమాఖ్య వంతపాడింది. ఓడలు, టాంకర్ల బీమా వాణిజ్యం 90శాతం ఈ దేశాల చేతుల్లోనే ఉంది. ఈ పధకానికి ఆమోదం తెలిపే, ఆంక్షలను సమర్ధించే ఏ దేశానికి తమ ఉత్పత్తులను వేటినీ విక్రయించేది లేదని మాస్కో అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ తెగేసి చెప్పాడు. ఐరోపాకు చమురు, గాస్‌ను సరఫరా చేసే నార్డ్‌ స్రీమ్‌ ఒకటవ సహజవాయు సరఫరాను రష్యా నిలిపివేసింది. చెప్పిన గడువు తరువాత కూడా మూసివేత కొనసాగుతోంది. దాంతో ఇంథనాన్ని ఆయుధంగా చేసుకొని ఐరోపా దేశాల మీద వత్తిడి తేవటం తొండి ఆట అంటూ అమెరికా గుండెలు బాదుకుంటోంది.

ఆంక్షలు అమల్లోకి రాక ముందే రష్యా నుంచి అందినంత మేరకు ఇంథనాన్ని కొని నిలువ చేసుకోవాలని ఐరోపా దేశాలు చూశాయి. ఇప్పటికే అనేక ప్రభుత్వాలు కోతలు, పరిశ్రమల మూతలు ప్రారంభించి పొదుపు మంత్రాన్ని జనాలకు ప్రవచిస్తున్నాయి.చలికాలాన్ని ఎలా తట్టుకోవాలా అని తలలు పట్టుకుంటున్నాయి. సిగ్గువిడిచి రష్యాను అడగలేవు, జనానికి సంతృప్తి కలిగించలేని స్థితి. ఇంథన బ్లాక్‌మెయిల్‌, తమను చీల్చేందుకు కుట్ర అంటూ ఐరోపా సమాఖ్య మండిపడుతోంది. నీవు నేర్పినే విద్యే కదా అన్నట్లుగా పుతిన్‌ ఉన్నాడు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు వద్దు అన్న జర్మనీ ఇప్పుడు తమకు అవే ముద్దు అన్నట్లుగా తిరిగి తెరుస్తున్నది. జర్మనీతో సహా అనేక దేశాలజనం పెరిగిన ఇంథన ధరలను తాము తట్టుకోలేమంటూ వీధులకు ఎక్కుతున్నారు.మన ఆర్‌బిఐ మాదిరే ఐరోపా బాంకు వడ్డీ రేట్లు పెంచుతున్నది.1970దశకం తరువాత ఇలాంటి తీవ్ర పరిస్థితిని ఐరోపా ఎన్నడూ ఎదుర్కోలేదు, ఈ స్థితి ఎంతకాలం ఉంటుందో అంతుబట్టటం లేదు.రెండు సంవత్సరాల పాటు సాధారణ జనానికి, ఆరునెలల పాటు వాణిజ్య సంస్థలకు విద్యుత్‌ చార్జీలను పెంచబోమని బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ అంటున్నారు. ఇతర దేశాల నుంచి ఎల్‌ఎన్‌జి, ఇతర ఇంథనం అందుబాటులో ఉన్నా ఐరోపా దేశాలకు నిల్వచేసుకొనే ఏర్పాట్లు లేవు. ఇంతకాలం రష్యా నుంచి నిరంతర సరఫరా ఉండటంతో నిల్వ అవసరం లేకపోయింది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు కుదిరేవి కాదు. జర్మనీలో రసాయనకర్మాగారాల మూత లేదా విద్యుత్‌ లేక కోతలుండటంతో చైనా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.


ఖారకైవ్‌ ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాం,మిగతా ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలు, డబ్బు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కోరుతున్నాడు. ఇచ్చినడబ్బులో కొంత నొక్కేశాడని వార్తలు. మా సమస్యలు మాకుంటే ఇదేమి గొడవ అని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. తాము ఇస్తున్న వాటిని పెంచే అవకాశం లేదని జర్మన్‌ రక్షణ మంత్రి క్రిస్టిని లాంబ్రెచెట్‌ అన్నారు. మా దగ్గర ఉన్న ఆయుధాలు నిండుకుంటున్నాయి, మా అవసరాలకే మేము కొనుక్కోవాలి అన్నారామె. మరొక ముఖ్య దేశమైన ఫ్రాన్స్‌ అంటీముట్టనట్లుగా నాకేంటి అన్నట్లుగా ఉంది. బ్రిటన్‌, జర్మనీ, పోలెండ్‌, ఇస్తోనియా, డెన్మార్క్‌ తరువాతే అది ఇస్తున్న సాయమొత్తం ఉంది. గొడవలెందుకు అన్న ధోరణితో ఫ్రాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. మీరు తలచుకుంటే అందరికంటే ఎక్కువ సాయం చేయగలరంటూ జర్మనీని మునగ చెట్టు ఎక్కించేందుకు అమెరికా పూనుకుంది. మొత్తం మీద రానున్న కొద్ది రోజులు లేదా చలికాలంలో లేదా ముగిసిన తరువాత కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమ్మో భయంకరి : బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌పై జనం !

07 Wednesday Sep 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

Boris Johnson, Liz Truss, Rishi Sunak, Tory party, UK Conservative party, UK Prime Minister, UK Tory party


ఎం కోటేశ్వరరావు


సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ నూతన ప్రధానిగా మంగళవారం నాడు గద్దెనెక్కిన కన్సర్వేటివ్‌ పార్టీ(టోరీ) నాయకురాలు లిజ్‌ ట్రస్‌ తక్షణమే రంగంలోకి దిగుతారు అంటూ అక్కడి మెజారిటీ పత్రికలు, ఆమె గెలిచారు గానీ రానున్న సంక్షోభాన్ని నివారించగలరా అన్న సందేహాలతో కొన్ని ఆమె గురించి శీర్షికలు పెట్టాయి. ద్రవ్యోల్బణం ఇతర ఆర్ధిక దిగజారుడు కారణంగా జీవితాలు గడపటం కష్టమైన కార్మికులు సమ్మెలకు దిగిన నేపధ్యంలో ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడవచ్చని భావిస్తున్నారు. బ్రిటన్‌ తదుపరి ఎన్నికలు 2025 జనవరి 28న జరగాల్సిన పూర్వరంగంలో లేబర్‌ పార్టీ నుంచి ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎలాంటి చర్యలతో కార్యాచరణకు పూనుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. జీవన వ్యయ పెరుగుదల నుంచి బ్రెక్సిట్‌ అనంతర పరిస్థితి, ఉక్రెయిన్‌ సంక్షోభం వరకు అనేక అంశాలు ఆమె ముందున్నాయి. గతంలో ఉక్కు మహిళగా పేరు గాంచిన మార్గరెట్‌ థాచర్‌ తరువాత ఇన్ని సమస్యలతో గద్దె నెక్కిన వారు మరొకరు లేరు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను పార్టీ ఎన్నికల్లో ఓడించిన లిజ్‌ ఆరు సంవత్సరాల్లో నాలుగవ ప్రధాని. అక్కడి సంక్షోభానికి ఇన్ని ప్రభుత్వాలు మారటం ఒక సూచిక. ఆమె ఏలుబడిలో 1970 మాదిరి మరోసారి చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని డచ్‌బాంక్‌ సోమవారం నాడు హెచ్చరించింది. పౌండ్‌ విలువను 30శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే స్థితిలో బ్రిటన్‌ లేదని పేర్కొన్నది.వచ్చే ఏడాది 30 బిలియన్‌ పౌండ్ల మిగులు బడ్జెట్‌ బదులు 60 బిలియన్ల లోటు ఉండే విధంగా లిజ్‌ ఆలోచనలు ఉన్నట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.మార్గరెట్‌ థాచర్‌, థెరెస్సా మే తరువాత లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌కు మూడవ మహిళా ప్రధాని, ముగ్గురూ కన్సర్వేటివ్‌ పార్టీకి చెందినవారే.


లిజ్‌ ట్రస్‌ గురించి దేశ ప్రజల్లో 52శాతం మంది ఆమెను ఒక భయంకర మనిషిగా భావిస్తున్నారు.యు గవ్‌ విశ్లేషణా సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం కేవలం పన్నెండుశాతం మంది మాత్రమే ఆమె మీద విశ్వాసం ప్రకటించారు.ఆమె ఒక భయంకరి అని 52శాతం భావిస్తున్నారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ను భయంకరుడిగా 55శాతం భావించారని వెల్లడైంది. ఈ సర్వే ఆమె ఎన్నికకకు వారం రోజుల ముందు జరిగింది. లిజ్‌ ట్రస్‌ గొప్ప అన్న వారు రెండుశాతం, మంచిది అన్నవారు పదిశాతం, ఫరవాలేదని 20శాతం, అధ్వానం అని 17శాతం, భయంకరమని 35, తమకు తెలియదని 16శాతం మంది చెప్పారు.


జనానికి ఉపశమనం కలిగిస్తే తమ వాటా తగ్గుతుందని కార్పొరేట్లకు ఆగ్రహం, లేకపోతే జనాందోళనలు మరింత ఉధృతం కావటం తధ్యం. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంథన ఛార్జీల విధానాన్ని స్థంభింపచేసి 2,300 డాలర్లు. అంతకు లోపు చెల్లిస్తున్న గృహ వినియోగదారులకు వచ్చే ఎన్నికల వరకు బిల్లులు పెరగకుండా చేసేందుకు 130 బిలియన్‌ డాలర్లతో ఒక పధకాన్ని రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. తొలిసారిగా బ్రిటన్‌ చరిత్రలో శ్వేతజాతికి చెందిన వారినెవరినీ ప్రధాన మంత్రి పదవుల్లోకి తీసుకోకూడదని లిజ్‌ భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. జాత్యహంకార పార్టీ అన్న ముద్రను తొలగించుకొనేందుకు, శ్వేతేతర జాతుల వారి ఓట్ల కోసం ఇదంతా అన్నది స్పష్టం. లిజ్‌-సునాక్‌ మధ్య పోటీలో కూడా శ్వేతజాతి ఆధిపత్య భావజాలం పని చేసిందన్నది స్పష్టం. మంత్రులుగా ఎవరున్నారన్నది ప్రధానం కాదు, ప్రభుత్వ విధానాలు ఏమిటన్నదే గీటురాయి. మరో టోరీ ప్రధాని అని తప్ప లిజ్‌ ట్రస్‌ విధానాల మీద కార్మికుల్లో ఎలాంటి భ్రమలు లేవు.


ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఎన్నికల ప్రచారంలో ఆమె ధనికులకు అనుకూలమైన అంశాల గురించి స్పష్టంగా చెప్పారు. అధికాదాయం ఉన్నవారికి పన్నులు తగ్గించటం న్యాయం అన్నారు. వచ్చే ఏడాది కార్పొరేట్‌ పన్నును 19 నుంచి 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చు. బీమా పధకాల్లో ఆమె ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం పేదలకు ఏడాది 7.66 పౌండ్లు మాత్రమే లబ్ది కాగా ధనికులకు 1,800 పౌండ్లు మిగులుతాయి. బ్రిటన్‌లో కార్మికవర్గంతో పాటు పెట్టుబడిదారీ విధానం కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నది. దాని భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు పూనుకుంది.ఐరోపా సమాఖ్యలో కొనసాగటం కంటే వెలుపల ఉంటేనే తమకు ఎక్కువ లబ్ది అని అక్కడి కార్పొరేట్‌లు భావించిన కారణంగానే దాన్నుంచి వెలుపలికి వచ్చింది. వాటికి మార్కెట్‌ను సంపాదించి పెట్టటం లిజ్‌ సర్కార్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఇదే తరుణంలో కరోనా, ఉక్రెయి, తదితరాల కారణంగా తలెత్తిన సమస్యల నుంచి బయటపడటం అంత తేలికేమీ కాదు. గత దశాబ్దన్నర కాలంగా బ్రిటన్‌ పెట్టుబడిదారులు ప్రభుత్వం మీదనే ఎక్కువగా ఆధారపడ్డారు.


రష్యా, చైనాల పట్ల రిషి సునాక్‌ మెతకగా ఉంటారంటూ ఎన్నిక ప్రచారంలో లిజ్‌ ట్రస్‌ విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్‌ రాజీని చెడగొట్టటంలో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక పాత్రపోషించాడు. ఇప్పుడు అతని బూట్లలో కాళ్లు పెట్టిన లిజ్‌ ఎలా నడుస్తారో చూడాల్సి ఉంది. నిజానికి రిషికి చైనా అంటే ప్రత్యేక అభిమానమేమీ లేదు. ఒక పెట్టుబడిదారుగా చైనాతో వచ్చే లబ్దిపొందాలన్నదే తప్ప మరొకటి కాదు. లిజ్‌ ట్రస్‌తో ఎన్నికల పోటీలో భాగంగా చైనా మీద ధ్వజమెత్తిన సునాక్‌ సరిగ్గా ఏడాది క్రితం మాట్లాడుతూ చైనాతో సన్నిహిత ఆర్ధిక సంబంధాలు పెట్టుకోవాలని ప్రబోధించాడు. 2021 జూలై ఒకటవ తేదీన మాన్షన్‌ హౌస్‌ వార్షిక విధాన ఉపన్యాసం చేస్తూ 55లక్షల కోట్ల విలువగల చైనా ఆర్ధిక సేవల మార్కెట్‌ గురించి ఐరోపా సమాఖ్య ఒప్పందానికి రావటంలో విఫలమైందని, బ్రిటన్‌ సంస్థలు దాన్ని దక్కించుకొనే లక్ష్యంతో పని చేయాలని సునాక్‌ ఉద్బోధించాడు. అమెరికా కంటే కూడా చైనా మీద ఎక్కువగా కేంద్రీకరించి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వచ్చిన తరువాత 2021 జనవరి ఒకటి నుంచి సమాఖ్య షేర్‌ మార్కెట్‌ లావాదేవీల సేవలు లండన్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌, పారిస్‌, న్యూయార్క్‌ నగరాలకు తరలాయి.ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ బయటపడింది. సమాఖ్యతో పోలిస్తే భిన్నమైన షరతులను చైనా అంగీకరించే అవకాశం ఉన్నందున మన విలువలతో రాజీపడకుండా పరస్పరం లబ్ది పొందే విధంగా బ్రిటన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునాక్‌ వాదించాడు. ఇప్పుడు ట్రస్‌ ఈ అంశాల గురించి ఎలా స్పందిస్తారు, ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.పార్టీ సభ్యులలో 81,326 ఓట్లు లిజ్‌కు రాగా 60,399 రిషి సునాక్‌ పొందారు. బిబిసి పేర్కొన్నదాని ప్రకారం 82.6శాతం మంది ఎన్నికలో పాల్గొన్నారు.


నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగానే బ్రిటన్‌లో వివిధ రంగాల్లోని కార్మికులు సమ్మెలకు పూనుకున్నారు.ఈ నెల 15న పన్నెండు కంపెనీలకు చెందిన 40వేల మంది రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. పొదుపు పేరుత ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా, ప్రభుత్వ సేవలను పరిరక్షించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతోంది. తరువాత కూడా వివిధ తేదీలలో రైల్వే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. రైల్వే కార్మికులకు వేతన స్థంభన లేదా వేతన కోతల ప్రతిపాదనలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో బ్రిటన్‌లో కార్మికుల జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏప్రిల్‌ నాటికి ఇంథన బిల్లులు 50శాతం పెరిగ్గా, అక్టోబరు నాటికి 80శాతానికి చేరనున్నాయి. గత వేసవిలో సగటున 1,277 పౌండ్ల మేర బిల్లులు రాగా ఈ ఏడాది 3,549 పౌండ్లకు పెరగనున్నాయి. ఇవి ముందుగా బిల్లు చెల్లించేవారికి, తరువాత కట్టే పేదవారికి 3,608 పౌండ్లకు పెరుగుతాయి. గృహస్తులకే గాక స్కూళ్లు, సంరక్షణ కేంద్రాలు, చిన్న దుకాణాలు అన్నింటికీ పెరగనున్నాయి. వచ్చే జనవరి తరువాత మరింతగా పెరుగుతాయి.మొత్తం 70లక్షల పేద కుటుంబాల మీద దీని ప్రభావం పడనుంది. ఇంథన దారిద్య్రాన్ని అంతమొందించాలనే ఉద్యమ సంస్థ అంచనా ప్రకారం రాబడిలో పదిశాతాన్ని ఖర్చు చేస్తున్నారని,105లక్షల కుటుంబాల మీద ప్రభావం ఉందని పేర్కొన్నది. మరొక అంచనా ప్రకారం 2023 జనవరి నాటికి ఇంథన దారిద్య్రంలో మూడింట రెండు వంతుల కుటుంబాలు కూరుకుపోతాయి. ప్రభుత్వం జనం కంటే ఇంథన కంపెనీల లాభాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. ఒక వైపు జనం ఇబ్బందులు పడుతుంటే బోరిస్‌ జాన్సన్‌ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చేందుకు ఆగస్టు పదిహేను నాటికి 2.3బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.


రానున్న రోజుల్లో ఆహార, ఆరోగ్య సంక్షోభం కూడా పెరగనుంది. 2009-10లో బ్రిటన్‌లోని స్వచ్చంద సంస్థలు ఆహారాన్ని అందచేసేవి నామమాత్రం. వాటిలో ఒకటైన ట్రస్సెల్‌ట్రస్టు 35 కేంద్రాలను నిర్వహించి 61వేల ఆహార పొట్లాలను అందచేసింది. తరువాత 2019-20 నాటికి కేంద్రాలు 1,400కు పెరగ్గా పది లక్షల 90వేలకు, 2020-21లో 26లక్షలు, 2021-22లో 22లక్షల ఆహార పొట్లాలు అందచేసింది. కరోనాకు ముందు దేశంలోని నాలుగు శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార భద్రత సమస్యను, మరో నాలుగుశాతం పరిమితమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడించాయి.ఆహార కేంద్రాలు ఎక్కువ భాగం చర్చ్‌లలో ఉండటంతో కొంత మంది ఆకలిని భరించటానికి ఇష్టపడ్డారు తప్ప అక్కడికి వెళ్లేందుకు సిగ్గుపడ్డారని, దూరంగా ఉండటం, అవి తెరిచే సమయాల వలన కూడా కొందరు వెళ్లటం లేదని కూడా వెల్లడైంది. గత పన్నెండు నెలల్లో సర్వే చేసి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారినట్లు తేలి ఉండేదని అమెరికా సర్వే సంస్థ ఒకటి పేర్కొన్నది. జీవన వ్యయం పెరుగుతున్న కొద్దీ ఈ కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నది.
లిజ్‌ ట్రస్‌ సారధ్యంలో భారత్‌-బ్రిటన్‌ సంబంధాలు ఎలా ఉంటాయని కొందరు చర్చ ప్రారంభించారు. గతంతో పోలిస్తే పెద్ద మార్పులు ఉండే అవకాశాలు లేవు. తమ వస్తువులకు మన మార్కెట్‌ను తెరవాలంటూ గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న వత్తిడి కొనసాగనుంది. ద్రవ్యోల్బణం దాని తరువాత మాంద్యంలోకి జారనుందనే పరిస్థితిలో మన ఎగుమతులైన వస్త్రాలు,దుస్తులు, ఆభరణాల వంటి వాటికి ఏ మేరకు డిమాండ్‌ ఉంటుందో చెప్పలేము.2020-21లో ఇరు దేశాల లావాదేవీలు 13.2 నుంచి మరుసటి ఏడాది 17.5 బి.డాలర్లకు పెరిగాయి. మన ఎగుమతులు 10.5 బి.డాలర్లు కాగా దిగుమతులు ఏడు బిలియన్‌ డాలర్లు. రెండు దేశాల మధ్య కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించాలని రెండు దేశాలూ భావిస్తున్నాయి. దీపావళి నాటికి రెండు దేశాలూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఆర్ధికంగా ఐరోపా సమాఖ్య నుంచిదూరమైన బ్రిటన్‌ అంతర్జాతీయ మార్కెట్ల వేటలో అమెరికాతో జతకట్టటం తప్ప మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాను రెచ్చగొడుతున్న అమెరికా : తాజాగా తైవాన్‌ జలసంధికి రెండు యుద్ద నౌకలు !

31 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Nancy Pelosi Taiwan trip, Taiwan Matters, US provocative actions, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ అని తాలిబాన్లను వేడుకొని ఆఫ్ఘనిస్తాన్నుంచి అవమానకరంగా వెనుదిరిగిన అమెరికా కొద్ది నెలలు గడవకుండానే ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెరదీసింది. అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో అంతుబట్టని స్థితిలో ఇప్పుడు తైవాన్‌ పేరుతో చైనాను రెచ్చగొడుతోంది.ఏదో ఒక సాకుతో యుద్ధాలు, మిలిటరీ జోక్యాలు చేసుకోవటం సులభం కానీ వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలో వియత్నాంపై ఫ్రాన్సు, అమెరికా జరిపిన యుద్ధాలు, ఇరాక్‌లో.ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిత్రపక్షాల మిలిటరీ జోక్యం, దాడులు స్పష్టం చేశాయి. ప్రకృతిలో రాబందులు పశువుల, మనుషుల మృతకళేబరాల కోసం నిరంతరం చూస్తుంటాయి, అవే వాటి ఆహారం. అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ రాబందులు మాత్రం నిరంతరం యుద్ధాల కోసం చూస్తుంటాయి.అవసరమైతే తమ సైనికులను కొందరిని బలిపెట్టి లాభాలను పిండుకోవటమే దాని పని. ఇప్పటి వరకు అమెరికా గడ్డమీద ఎలాంటి యుద్దాలు జరగకపోవటం, ప్రత్యక్షంగా పర్యవసానాలను అనుభవించకపోవటంతో అక్కడి జనాలు కూడా మొత్తం మీద యుద్ధాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.ఆమోదిస్తున్నవారు ఉండటం ఆందోళనకరం.


తైవాన్‌ జలసంధిలో తిరుగుతున్న అమెరికా మిలిటరీ నౌకలు ఆయుధాలు, వాటి ప్రయోగ వ్యవస్థలను కట్టివేసుకొని ఏమీ తెలియనట్లు సంచరిస్తున్నాయని, ఇది రెచ్చగొట్టుడుకే తప్ప మరొకటి కాదని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. తైవాన్‌ విలీన ప్రక్రియను అడ్డుకొనే క్రమంలో ఒకవేళ యుద్దమే గనుక వస్తే జలసంధిలో ప్రవేశించే అమెరికా మిలిటరీ నౌకలు చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటాయని భూమి మీద నుంచి చైనా సంధించే క్షిపణులను అవి తట్టుకొని నిలవలేవని అందువలన తైవాన్‌ జలసంధిలో సంచారానికి అర్ధం లేదని చైనా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా పంపిన నౌకలు దాని వద్ద ఉన్న పాత తరానికి చెందినవని, చైనా వద్ద అంతకంటే మెరుగైనవి ఉన్నందున వాటితో తైవాన్‌ వేర్పాటు వాదులను సంతుష్టీకరించటం, తన మిత్ర దేశాలకు భరోసాను ప్రదర్శించటం తప్ప చైనాను భయపెట్టలేరని పశ్చిమ దేశాల విశ్లేషకులు పేర్కొన్నారు. అంతే కాదు చైనాలో తైవాన్‌ విలీనం తమకు అంగీకారం కాదని ప్రపంచానికి చెప్పటం కూడా దీని వెనుక ఉందని అంటున్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటికి ధీటుగా చైనా కూడా తన బలాన్ని పెంచుకుంటున్నది. అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది.


ఆసియాలో చిచ్చు పెట్టేందుకు పూనుకున్న అమెరికా తీరుతెన్నులు చైనా – రష్యా మిలిటరీల సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఇటీవలి నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. రెండున్నర దశాబ్దాల నాడు రష్యా నుంచి ఆయుధాలను కొనుక్కోవాల్సిన స్థితిలో ఉన్న చైనా నేడు కొన్నింటిని అమ్మే దశకు ఎదిగింది.ఆధునిక అస్త్రాలను అది రూపొందిస్తున్నది. నాన్సీ పెలోసీ రాక తరువాత తన సత్తా ఏమిటో చూపుతున్నది. తాను స్వంతగా రూపొందించుకున్న రెండు విమానవాహకయుద్ద నౌకలను అనేక ఇతర నౌకలు, విమానాలతో డ్రిల్స్‌ నిర్వహించింది. తమకు అడ్డు వచ్చే వారిని క్షణాల్లో ఎదిరించే సత్తా ఉందని ప్రపంచానికి వెల్లడించింది.

ఇప్పటికే ఉక్రెయిన్లో రష్యా మీద పరోక్ష దాడులు జరుపుతున్న అమెరికా ఒకేసారి చైనా మీదకు దిగే అవకాశం అంత సత్తా లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఆయుధాల అంశంలో రష్యాతో కొన్ని చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అమెరికా ఎదిరించేందుకు వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టటానికి రెండు దేశాలూ సిద్దపడతాయి. పరిమితులు లేని భాగస్వాములుగా ఉన్నట్లు రెండు దేశాలూ ప్రకటించిన సంగతి తెలిసిందే.తైవాన్‌ అంశం మీద అమెరికా ఇలా ఇంకా రెచ్చగొట్టుడు కొనసాగిస్తే మిలిటరీ సహకారం కూడా రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగనుందనే సంకేతాలు, అమెరికాలో మాంద్య ప్రమాదం, పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందనే విశ్లేషణల నేపధ్యంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బైడెన్‌ క్రమంగా తైవాన్‌ అంశం మీద ఒకే చైనా అన్న అంగీకృత విధానానికి తిలోదకాలిచ్చే దిశగా పావులు కదుపుతున్నాడు.చైనాకు వ్యతిరేకంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటుకు పధకం వేశారు.


ఇటీవలి అమెరికా బుద్దిపూర్వక చర్యలు, రష్యా వ్యతిరేక వైఖరి ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నది.దీన్నుంచి కూడా లబ్ది పొందేందుకు అమెరికా చూస్తున్నది. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో అమెరికా ప్రాణ నష్టాలు నాలుగు లక్షల లోపే.మరో ఆరులక్షల మంది తమ వారు కనిపించటం లేదని అమెరికా చెప్పింది. ఇతర దేశాలలో మరణించిన ఆరు కోట్ల మందితో పోలిస్తే నిజానికి ఇది పెద్ద సంఖ్యకాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చిన లాభాలతో అమెరికాలో 22వేల మంది మిలియనీర్లను సృష్టించింది, 28.6బిలియన్‌ డాలర్లు లాభాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో లాభాలు రెట్టింపు వచ్చాయి.రక్తంతో తడిచిన లాభాలు మరిగిన అమెరికన్‌ కార్పొరేట్లు అప్పటి నుంచి జనాలకు కావాల్సిన వస్తువుల కంటే ప్రాణాలు తీసే ఆయుధాల తయారీకే ప్రాధాన్యత ఇచ్చారు. చైనాలో చౌకగా దొరికే శ్రమతో తక్కువ ధరలకు వినిమయ వస్తువుల తయారీకి పెట్టుబడులు పెట్టటం, పరిశ్రమలను తరలించటం కూడా కార్పొరేట్ల లాభాల వేటలో భాగమే.

నాలుగేండ్ల రెండవ ప్రపంచ యుద్దం అమెరికాలో బిలియనీర్లను 32 నుంచి 44కు వారి ఆస్తులు 103బి.డాలర్లకు పెంచింది. ప్రపంచానికి ఆ యుద్ద ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా కాగా అమెరికా వాటా కేవలం 336 బి.డాలర్లు మాత్రమే.ఆ యుద్దంలో సర్వనాశనమైన ఐరోపా పునరుద్దరణ పేరుతో అమెరికా ముందుకు రావటానికి దానికి వచ్చిన లాభాలే పెట్టుబడి. ఆ పధకంలో కూడా అమెరికా లబ్దిపొందింది.ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందనే ఉందనే బూచిని చూపి నాటో కూటమి ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంగతి జగమెరిగినదే. ఇప్పుడు ఉక్రెయిన్‌ నాశనానికి దానికి ఆయుధాలమ్మి సొమ్ము చేసుకోవటంతో పాటు దాని పునరుద్దరణ పేరుతో తన కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా చేసింది అదే తన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించింది. అనేక యుద్ధాల అనుభవం చూసిన తరువాత తన పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా ఇతరులను బలితీసుకుంటూ ఆయుధాలమ్మి సొమ్ము చేసుకుంటోంది. అది పెట్టే తంపులన్నీ తనకు సుదూరంగా ఉన్న ప్రాంతాలు దేశాల్లోనే.అమెరికాకు ఇరుగు పొరుగుదేశాలతో పేచీ లేదు కనుక వాటి నుంచి ముప్పులేదు.


రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి 2001వరకు ప్రపంచంలోని 153 ప్రాంతాల్లో అమెరికా పెట్టిన చిచ్చు, చేసిన యుద్దాలు 258గా లెక్కవేశారు. వీటన్నింటిలో అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలే వచ్చాయి. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉందంటే అమెరికాకు నిదరపట్టదు.వియత్నాంపై దాడిలో పెద్ద సంఖ్య అమెరికన్లు మరణించటంతో దానికి వ్యతిరేకంగా జనంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. దాంతో అప్పటి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తన పౌరులు మరణించకుండా మిత్రపక్షాల పేరుతో ఇతర దేశాలను దించుతోంది. కావాల్సిన పెట్టుబడులు పెడుతోంది, ఆయుధాలు అమ్ముకుంటోంది. ఇరాక్‌పై దాడిచేసి అక్కడి చమురు సంపదలపై పట్టు సంపాదించిన సంగతి తెలిసిందే. అదే ఎత్తుగడను ఇరాన్‌ మీద కూడా అమలు చేసేందుకు పూనుకొని ఎదురు దెబ్బలు తిన్నది. దాన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకొనేందుకు ఆంక్షల పేరుతో పరోక్ష దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తైవాన్‌ మీద చైనాను రెచ్చగొట్టటం వెనుక అనేక అంశాలున్నాయి. చైనా ఆయుధాల సత్తాను తెలుసుకోవటం, ఉక్రెయిన్‌ వివాదంలో రష్యాకు మద్దతు మానుకోవాలని బ్లాక్‌మెయిల్‌, తైవాన్‌ జలసంధిలో విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి గనుక ఆర్ధికంగా నష్టపెట్టటం, మిలిటరీ ఖర్చు పెరిగేట్లు చూడటం వంటి అనేక కోణాలున్నాయి. వీటన్నింటినీ మదింపు వేసుకొనే తైవాన్‌ అంశంలో రాజీలేదని చైనా ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌పై తాజా వివాదం 3 : ఉలిపికట్టె అమెరికా – సంయమనం పాటిస్తున్న చైనా !

17 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, Joe Biden, Taiwan Matters, US-China standoff over Taiwan


ఎం కోటేశ్వరరావు


తైవాన్‌ విలీనం అంశం మీద అమెరికా మరింతగా చైనాను రెచ్చగొట్టేందుకే పూనుకుంది. అమెరికన్‌ పార్లమెంటు దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని పర్యటనకు పంపి చైనా అడ్డుకుంటే రచ్చ చేయాలని చూసింది. సంయమనం పాటించిన చైనా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తైవాన్‌ జలసంధిలో మిలిటరీ డ్రిల్సు నిర్వహిస్తున్నది. అవి జరుగుతుండగానే ఏం చేస్తారో చూస్తాం అన్నట్లుగా కొంత మంది ఎంపీలను తైవాన్‌ పంపిన అమెరికా తమ నౌకా దళాన్ని చైనా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి పంపనున్నట్లు ప్రకటించింది. తన సత్తా ఏమిటో చూపేందుకే చైనా డ్రిల్సు నిర్వహిస్తున్నది. వాటిలో భాగంగా సముద్రంలో నాటిన మందుపాతరలను తొలగించే విన్యాసాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నది. గత నాలుగు నెలలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా మిలిటరీలో ప్రవేశపెట్టిన హెజియన్‌, చిషుయి అనే నౌకలు వీటిలో పాల్గొన్నాయి. ఇవి నీటి మీద తేలుతున్న మందుపాతరలను తొలగించటంలో విజయవంతమైనట్లు వార్తలు. సముద్రాల్లో పైన తేలే వాటితో పాటు నీటిలో ఉండే మందుపాతరలు కూడా ఉంటాయి. పేరుకు రెండే పాల్గొన్నా వాటికి మద్దతుగా అనేక నౌకలు ఇతర పనులు నిర్వహించాల్సి ఉంది.తాజా విన్యాసాలు జరుగుతుండగా సమీపానికి వచ్చిన గుర్తు తెలియని ఒక విదేశీ నౌకను హెచ్చరించి పంపినట్లు చెబుతుండగా అది అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు వచ్చినది కావచ్చని వార్తలు. కొన్ని దేశాలు చేపలు పట్టే నౌకల పేరుతో నిఘా బృందాలను పంపటం తెలిసిందే.


మందుపాతరలను తొలగించే డ్రిల్సు నిర్వహించాల్సిన అవసరం చైనాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న.గత ఏడు దశాబ్దాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ను సైనికంగా పటిష్టపరుస్తున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్న అక్కడి ప్రభుత్వం ప్రతిఘటనకు దిగవచ్చని, దానికి మద్దతుగా అమెరికా,జపాన్‌, మరికొన్ని దేశాలు రావచ్చని చైనా భావిస్తున్నది. బలవంతంగా విలీనానికి పూనుకుంటే తాము మిలిటరీని పంపుతామని జో బైడెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్‌ విలీనానికి తప్పనిసరైతే బలప్రయోగానికి పూనుకుంటామని తాజాగా ఒక శ్వేత పత్రంలో ప్రకటించిన చైనాకు మందుపాతరలను కనుగొనటం, తైవాన్ను ఏ విధంగా చుట్టుముట్టాలనే ఎత్తుగడలు అవసరం కావచ్చని, ఆకసరత్తులో భాగంగానే విన్యాసాలని భావిస్తున్నారు. చైనాను అడ్డుకొనేందుకు చుట్టూ మందుపాతరలను అమర్చేందుకు తైవాన్‌కు అమెరికా సాయం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో మందుపాతరలను అమర్చే నౌకను తైవాన్‌ మిలిటరీకి అందించారు, మరో మూడింటిని సిద్దం చేస్తున్నారు. చైనా మీద వత్తిడి తెచ్చేందుకు పచ్చ సముద్రం తదితర ప్రాంతాల్లో మందు పాతరలను అమర్చాలని అమెరికా నిపుణులు సలహా ఇచ్చారు. రానున్న వారాల్లో తైవాన్‌ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇది చైనాను మరింతగా రెచ్చగొట్టేందుకు, తైవాన్‌కు భరోసా ఇచ్చేందుకు అన్నది స్పష్టం.


దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తిష్టవేసిన రోనాల్డ్‌ రీగన్‌ అనే విమానవాహక యుద్ద నౌక పరిస్థితులను గమనిస్తున్నదని పేర్కొనటంతో పాటు ఈ నెల తొమ్మిదిన చైనాకు సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో అమెరికా-జపాన్‌ వైమానిక దళ డ్రిల్లు నిర్వహించారు. సాంకేతికంగా తైవాన్ను ఒక దేశంగా అమెరికా గుర్తించనప్పటికీ అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తున్నది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లులో తైవాన్ను నాటో ఏతర ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నది. తైవాన్‌ విధాన చట్టం 2022 ప్రకారం తైవాన్‌కు 450 కోట్ల డాలర్లు భద్రతాపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.


పైకి ఏమి చెప్పినప్పటికీ చైనా మిలిటరీ సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిందని పశ్చిమ దేశాల మిలిటరీ నిపుణులు, విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం,ఆయుధ కార్పొరేట్‌ సంస్థల నిధులతో నడిచే సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ చైనా పవర్‌ ప్రాజెక్టు పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది.దానిలో చైనా వద్ద ఉన్న పలు రకాల క్షిపణులను ఉటంకిస్తూ పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. మిలిటరీ శక్తికి సాంప్రదాయ క్షిపణుల అవసరం పెరుగుతున్నది.వందలు, వేల కిలోమీటర్ల దూరంలో వాటిని మోహరిస్తున్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఏ) ప్రపంచంలో భూమి మీద నుంచి ప్రయోగించే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసిన దేశంగా చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో చైనా క్షిపణి శక్తిని చూస్తే సాధారణ నిర్దుష్టతతో కూడిన స్వల్పశ్రేణి క్షిపణులు ఉన్నాయి. తరువాత సంవత్సరాలలో దీర్ఘశ్రేణి, భిన్నమైన ఖండాంతర, క్రూయిజ్‌ క్షిపణులను రూపొందించింది. అవి సాంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకుపోగల సత్తా కలిగినవి. తైవాన్‌తో సహా భూ లక్ష్యాలను దెబ్బతీయగలిగినవి. అమెరికా క్షిపణులను మోసుకుపోగల వాటిని కూడా నాశనం చేయగలినవి. అత్యాధునిక పశ్చిమ దేశాల క్షిపణి వ్యవస్థలలోకి కూడా దూసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను కలిగి ఉంది. ఒక వేళ పశ్చిమ దేశాలక్షిపణులను దెబ్బతీసే సత్తాలేదు అనుకున్నా వాటిని పనికి రాకుండా చేయగలవని ఆ పత్రంలో పేర్కొన్నారు.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు చైనా తన క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసిన విశ్లేషణ ప్రకారం ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న ఎస్‌-400 రక్షణ వ్యవస్థలను ఆమెరికా ఆంక్షలను ధిక్కరించి మన దేశం, టర్కీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.వీటితోనే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్లో ముందుకు పోతున్నది. 2018-20 మధ్య రెండు ఎన్‌-400 వ్యవస్థలను చైనా కొనుగోలు చేసింది. అంతే కాదు రష్యా ఎస్‌-300 వ్యవస్థ ప్రాతిపదికన చైనా స్వంతంగా రూపొందించేందుకు పూనుకుంది. వాటిలో అమెరికా వద్ద ఉన్న పేట్రియాటిక్‌ వ్యవస్థలలో ఉన్న వాటిని కూడా చేర్చేందుకు పని చేస్తున్నది. ఇవి ఎలా పని చేసేదీ ఇంతవరకు పరీక్షలు జరపలేదు.


చైనా జరిపిన మిలటరీ డ్రిల్స్‌ను తొలుత ఒక అల్లరిగా వర్ణించిన అమెరికా ఇప్పుడు బలవంతంగా విలీనం చేసుకొనేందుకు ఇదంతా కావాలనే చేస్తున్నదంటూ లోకం ముందు గుండెలు బాదుకుంటూ చైనాను దోషిగా చూపేందుకు పూనుకుంది. మెల్లమెల్లగా తైవాన్‌ ఆక్రమణకు పూనుకుంటోందని ఆరోపిస్తోంది. తైవాన్ను దిగ్బంధనం గావిస్తే దాని రేవులు ప్రభావితమై ఆర్ధికంగా చైనా నష్టపోతుందని కొందరు హెచ్చరికలతో కూడిన బెదిరింపులకు పూనుకున్నారు. చైనా ఆ మంచి చెడ్డలను ఆలోచించలేనంత అమాయకంగా లేదు. ఆ పరిస్థితి తలెత్తితే అది చైనాతో పాటు ఐరోపా, అమెరికా అనేక దేశాలకూ నష్టదాయకమే.


చైనా వద్ద ఉన్న మిలిటరీతో పోలిస్తే తైవాన్‌ వద్ద ఉన్న ఆయుధాలు చాలా తక్కువ.2019 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అది పెద్దది చైనా మిలటరీ.ఇరవై లక్షల మంది సైనికులున్నారు. తైవాన్‌ వద్ద 1.7లక్షల మంది ఉన్నారు. చైనా వద్ద ఐదు లక్షల మంది రిజర్వు సైనికులుంటే తైవాన్‌ వద్ద మాత్రం పదిహేను లక్షలు ఉన్నారు. పారామిలిటరీ దళాలు చైనా వద్ద 6.24లక్షలు కాగా తైవాన్‌ వద్ద కేవలం 11,500 మంది మాత్రమే. చైనా వద్ద 5,250 టాంకులుండగా తైవాన్‌ వద్ద 1,110, చైనా సాయుధశకటాలు 35వేల కాగా తైవాన్‌ వద్ద 3,472 ఉన్నాయి. చైనా వద్ద విమానాలు 3,285 కాగా, వాటిలో జట్‌లు 1,200, స్పెషల్‌ బాంబర్లు 450, రవాణాకు 286 ఉండగా, తైవాన్‌ వద్ద 741 విమానాలు వాటిలో జట్‌లు 288, 19 రవాణా విమానాలున్నాయి. జలాంతర్గాములు చైనా వద్ద 79, తైవాన్‌ వద్ద నాలుగు, చిన్నా పెద్ద మిలటరీ ఓడలు చైనా వద్ద 777 ఉండగా తైవాన్‌ 117 ఉన్నాయి. చైనా వద్ద తొమ్మిది అణు జలాంతర్గాములు, ఆరు ఖండాంతర క్షిపణి జలాంతర్గాములుండగా తైవాన్‌ వద్ద ఒక్కటి కూడా లేదు. చైనా వద్ద డీజిలుతో నడిచే జలాంతర్గాములు 56 ఉండగా తైవాన్‌ వద్ద రెండున్నాయి.


చైనా వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఉన్నదీ తెలియదు. అమెరికా అంచనా ప్రకారం 200 కాగా, స్టాక్‌హౌం సంస్థ 350 అని, 2030 నాటికి 1000కి చేరవచ్చని చెప్పింది. గత వేసవిలో చైనా జరిపిన కొన్ని పరీక్షలను బట్టి అవి హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షలని పశ్చిమ దేశాల అనుమానం. ఇంతటి సైనిక శక్తి ఉన్నా తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకొనేందుకు చైనా ఇంతవరకు పూనుకోలేదు. అలాంటి పరిస్థితే వస్తే అటూ ఇటూ నష్టపోఏది తన జనమే కనుక ఎంతో సంయమనంతో ఉంది. అమెరికాకు అలాంటి జవాబుదారీతనం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ఎందరినైనా బలిపెట్టేందుకు పూనుకుంటుంది. చైనా సోషలిస్టు దేశం కనుక ఆచితూచి ముందుకు పోతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !

12 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, imperialism, Joe Biden, Mao Zedong, Taiwan independence, Taiwan Matters, US-China standoff over Taiwan, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌( పార్లమెంటు దిగువ సభ ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన మరుసటి రోజు నుంచి తైవాన్‌ చుట్టూ ఐదు రోజుల పాటు (ఆగస్టు 4-7తేదీలు) మిలిటరీ విన్యాసాలు జరిపింది. తరువాత మరుసటి రోజు నుంచి చైనా నిరవధిక విన్యాసాలు కొనసాగిస్తున్నది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు చైనా చూపుతున్నది. తొలుత నాలుగు రోజులు, తరువాత కొనసాగిస్తున్న నిర్ణీత గడువులేని డ్రిల్లు లక్ష్యం అదే అని షీ జింపింగ్‌ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తన వద్ద ఉన్న ఆధునిక ” హైమర్స్‌” క్షిపణి వ్యవస్థలను అంద చేసింది. దానికి ధీటుగా చైనా వద్ద ఉన్న ఎంఎల్‌ఆర్‌ వ్యవస్థలను తైవాన్‌ చుట్టూ జరిపిన డ్రిల్సులో ప్రయోగించినట్లు, ఈ పరిణామం తైవాన్‌పై అమెరికా ఆడుతున్న ఆట తీరునే మార్చి వేస్తుందని యురేసియన్‌ టైమ్స్‌ పత్రిక ఆగస్టు ఎనిమిదిన ప్రకటించింది.చేయాల్సిందంతా చేసి నెపాన్ని ఇతరుల మీద నెట్టినట్లుగా తాజా పరిణామాలపై జో బైడెన్‌ తీరు ఉన్నదని, ఇది మరింతగా రెచ్చగొట్టటమే అని చైనా వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌కు సంబంధించి ఇంతకు మించి వారు చేసేదేమీ ఉండదు కానీ వారి తీరే ఆందోళన కలిగిస్తున్నదని బైడెన్‌ విలేకర్లతో అన్నాడు. చైనా స్పందనకు ప్రతిగా అమెరికా యుద్ధనౌకలను తరలిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదు. దాంతో ఉక్రెయిన్‌ మాదిరి తమను కూడా ముందుకు నెట్టి అమెరికా వెలుపలే ఉంటుందా అని అనేక మందిలో తలెత్తిన సందేహాల పూర్వరంగంలో అమెరికన్లు, తైవాన్‌ వేర్పాటు వాదులను సంతృప్తిపరచేందుకు బైడెన్‌ ఇలాంటి చౌకబారు ప్రకటనలు, జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి తైవాన్‌ ప్రతినిధులను ఆహ్వానించిన తొలి అమెరికా నేతగా కూడా గతేడాది ఇలాంటి జిమ్మిక్కునే చేశాడు.


ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు జో బైడెన్‌ పలుకుబడి గురించి వెలువడుతున్న సర్వేల వివరాలు డెమోక్రటిక్‌ పార్టీకి కంగారు పుట్టిస్తున్నాయి.ఆగస్టు పదిన స్టాటిస్టా ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం పదిశాతం మంది అమెరికన్ల దృష్టిలో మాత్రమే జో బైడెన్‌ బలమైన నేత. మరో 25శాతం మంది కొంత మేరకు అని చెప్పగా నలభైమూడు శాతం చాలా బలహీనుడు, 23శాతం కాంత మేర బలహీనుడు అని వెల్లడైంది. మొత్తం మీద చూసినపుడు 66శాతం మంది బలహీనుడిగా భావిస్తున్నారు. ప్రపంచ చరిత్రను చూసినపుడు పాలకులు బలహీనపడినపుడు పిచ్చిపనులకు, జిమ్మిక్కులకు – ఎన్నికలు వచ్చినపుడు మన దేశంలో ఏదో ఒక ఉదంతం జరుగుతుందని జనం నమ్ముతున్నట్లుగా- పాల్పడతారని తేలింది. ఇప్పుడు జో బైడెన్‌ కూడా అదే స్థితిలో ఉన్నారన్నది కొందరి భావన. తైవాన్ను తురుపుముక్కగా వాడుతున్న అమెరికా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చగొట్టవచ్చని, దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. మరికొన్నింటిని కూడా ప్రయోగించనుంది. బహుశా ఈ కారణంగానే తైవాన్‌ జలసంధిలోకి అమెరికా నౌకలు రాలేదన్నది కొందరి విశ్లేషణ. రానున్న రోజుల్లో తమ దళ నౌకలు చైనా ప్రాంతంలో స్వేచ్చా విహారం చేయవచ్చని అమెరికా పేర్కొన్నది. ఒక వేళ వచ్చినా దూర దూరంగా తిరగటం తప్ప చైనా విధించిన తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు తైవాన్‌ ప్రాంతానికి చైనా విన్యాసాలు ముగిసిన తరువాతే తప్ప జరుగుతుండగా వచ్చే అవకాశం లేదు.


చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి ఆలోచించాల్సి ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాని కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని వార్తలు. ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా గురించి ఇప్పటికే ఆలశ్యం చేసినట్లు కొందరు బైడెన్‌ సమీక్షపై స్పందించారు. అమెరికా తరహా జీవన విధానాన్ని చైనా దెబ్బతీస్తున్న మాదిరి ఉగ్రవాద సంస్థలు చేయలేవని డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జాసన్‌ క్రో అన్నాడు. అవసరానికి మించి ఉగ్రవాదం మీద గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రీకరించామన్నాడు. క్వాంటమ్‌ సైన్సు, కృత్రిమ మేథ,ఇతర సాంకేతిక పరిజ్ఞానాలపై చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని దాని గురించి సమాచారం వెల్లడి కావటం లేదని అమెరికన్లు ఆందోళన చెందటమే తాజా కేంద్రీకరణకు కారణం. చైనా గురించి ఒకటి, చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను గతేడాది సిఐఏ ప్రకటించింది.


అమెరికాకు ప్రజాస్వామ్యం అంటే అక్కడి ఆయుధపరిశ్రమలకు లాభసాటి లావాదేవీ మాత్రమే. ఇతర దేశాల మీద అమెరికా దాడులకు దిగటం తప్ప చరిత్రలో అమెరికా మీద అలాంటి దాడి ప్రయత్నాలు కూడా లేవు. 2022 ఆగస్టు నాటికి ప్రపంచంలోని 14దేశాల వద్ద 47 విమానవాహక యుద్ధ నౌకలు పని చేస్తున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 80 విమానాలను మోసుకుపోగలిగిన పదకొండు అమెరికా వద్దే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కటి 13-14 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పది కొత్త విమానవాహక నౌకల తయారీకి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆర్డరు పెట్టింది. ఇవి అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వీలైనవి.ఇన్ని ఉన్నప్పటికీ లేని చిన్న దేశాలను తప్ప వాటితో చైనా, రష్యాలను అమెరికా బెదిరించలేదు. ఎందుకంటే అవి కూడా స్వంతంగా విమానవాహక నౌకలను రూపొందించగలిగినవే. వాటి వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి.


అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తైవాన్‌ గడ్డ మీద అడుగు పెట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజానికి అమెరికా వ్యూహకర్తల ఎత్తుగడ అది. ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం జనంలో పలుకుబడి లేని జో బైడెన్‌ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ప్రపంచ రాజకీయాలను తాను శాసిస్తున్నట్లు ప్రదర్శించుకొనేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.అమెరికా ప్రభుత్వం బహిర్గతపరచిన కొన్ని పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే ఉన్నత సమావేశం జరిపి తైవాన్‌ రక్షణకు మిలిటరీని పంపుతామని ప్రకటించారు. వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది.


సోవియట్‌ మీద ఆధారపడకుండా స్వంత అణుకార్యక్రమానికి చైనా పూనుకుంది.1964 అక్టోబరు 16న తొలి అణుపరీక్ష జరిపింది. అంతే కాదు అప్పటికి చైనా వద్ద విమానవాహక నౌకలు కూడా లేవు. పాతబడిన ఒక నౌకను ఆస్ట్రేలియా రద్దు కింద అమ్ముతామని 1985లో ప్రకటించగా చైనా దానిని కొనుగోలు చేసింది. దానిలో కీలకమైన భాగాలన్నింటినీ తొలగించినందున పనికి రాదని అందరూ భావించారు. అయితే దాన్ని చైనా రద్దుకింద మార్చకుండా తన మిలిటరీకి శిక్షణకు, తాను సొంతంగా రూపొందించిన నౌకలకు నమూనాగా ఉపయోగించినట్లు తరువాత వెల్లడైంది.1995, 2000 సంవత్సరాల్లో రష్యా నుంచి రెండు నౌకలను కొనుగోలు చేసి వాటినీ రద్దు కింద మార్చకుండా చైనా నిపుణులు పరిశీలించారు. ఒక నౌకను విలాసవంతమైన టూరిస్టు హౌటల్‌గా, మరొక నౌకను ప్రదర్శనశాలగా మార్చారు. మకావు ప్రయివేటు కంపెనీ ద్వారా మరొక రష్యా నౌకను 1998లో కొనుగోలు చేసి దాన్ని 2007 నాటికి పరిమితంగా పునరుద్దరించినట్లు వార్తలు. తరువాత దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి కొత్త పేరుతో 2012లో నౌకా దళంలో తొలి స్వంత నౌకగా ప్రవేశపెట్టారు.తరువాత పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన నౌకను 2017లో ప్రారంభించారు. సరికొత్త నౌక మూడవ దానిని ఈ ఏడాది జూన్‌లో రంగంలోకి దించారు. నాలుగవ నౌక ఇప్పుడు నిర్మాణంలో ఉంది, 2030నాటికి మరో రెండు చేరవచ్చని భావిస్తున్నారు.


ప్రస్తుతం జరుపుతున్న మిలిటరీ డ్రిల్లును అమెరికా, ఇతర దేశాలు కూడా పరిశీలించి తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయని తెలియనంత ఆమాయకంగా నేడు చైనా లేదు. నిజమో కాదో చెప్పలేము గాని ఇప్పుడు చైనా గురించి అమెరికన్లకు ఒక భయం పట్టుకుంది. మెదడును అదుపు చేసే జీవ ఆయుధాలను రూపొందిస్తున్నట్లు అనుమానంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాజెక్టులో భాగస్వాములన్న అనుమానంతో అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు పెట్టింది.ఇది ఒక ప్రచార ఎత్తుగడ, దాడిలో భాగం కూడా కావచ్చు. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. సరిహద్దులో ఉన్న నాటో దేశాలే ఉక్రెయిన్‌కు మిలిటరీని పంపేందుకు సిద్దం కాలేదు. తైవాన్‌ అంశానికి వస్తే దానికి సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో, దక్షిణకొరియాలో ఉన్న అమెరికా మిలిటరీ తప్ప పన్నెండువేల కిలోమీటర్ల నుంచి అమెరికా తన సేనలను తీసుకురావాల్సి ఉంది. చైనాకు మద్దతుగా అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఉంది. పక్కనే రష్యా కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మరోఅణుశక్తి దేశమైన పాకిస్తాన్‌ వివిధ కారణాలతో అమెరికా కంటే చైనాకు దగ్గరగా ఉంది. మరో దేశమైన ఇరాన్‌ కూడా చైనాకు దగ్గరగా ఉంది. మావో కాలంలో ఇలాంటి సానుకూల అంశాలు చైనాకు లేవు. అందుకే షీ జింపింగ్‌ బైడెన్‌తో భేటీలో నిప్పుతో చెలగాటాలాడవద్దని హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d