• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ఉప ఎన్నికల్లో బిజెపికి చమురు సెగ -ఐదు రాష్ట్రాల కోసం పన్ను తగ్గింపు !

04 Thursday Nov 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, excise duty, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, VAT Cut


ఎం కోటేశ్వరరావు


పద మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలలో బిజెపికి అనూహ్య ఎదురు దెబ్బలు తగిలాయి. మరో ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.బిజెపి అధికారంలో ఉన్న చలి రాష్ట్రమైన హిమచలప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్ధానంలో ఓటమి బిజెపికి వేడి పుట్టించింది. తమ ఓటమికి కారణం ద్రవ్యోల్బణం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కారణమని ఆ రాష్ట్ర బిజెపి బిజెపి ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ చెప్పారు. అది ఒక్క తమ రాష్ట్రానికి, దేశానికే కాదు, మొత్తం ప్రపంచ సమస్య అన్నారనుకోండి. ఏదైతేనేం తలకు బొప్పికట్టింది , మరో ఐదు రాష్ట్రాల ఎన్నికల దృశ్యం కళ్ల ముందు ఆందోళన కలిగిస్తోంది. కనుక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఎన్నికలకు సంబంధం లేదని బిజెపి చెప్పుకోవచ్చు, ఎందుకు తగ్గించిందో చెప్పాలి.కేంద్ర ప్రకటన వెంటనే పది బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా నాటకీయంగా వ్యాట్‌లో కొన్ని రూపాయలు తగ్గించాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో మోడీ భక్తులు వహ్వా, ఆహా, ఓహౌలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గిస్తాయా లేదా అంటూ అడ్డుసవాళ్లు ప్రారంభించారు. చర్చ జరగటం మంచిదే !


ఇప్పటికీ బిజెపి మద్దతుదారులు చేస్తున్న వాదన ప్రకారం కేంద్రం విధిస్తున్న చమురు పన్ను భారంలో రాష్ట్రాలకు 41శాతం వాటాగా తిరిగి వస్తుంది, కేంద్రం కూడా తన వంతు రాష్ట్రాలలో వివిధ పధకాలకు ఖర్చు చేస్తున్నది కనుక చమురుపై ఎక్కువ భారం మోపుతున్నది రాష్ట్రాలే అని చెబుతున్నది తెలిసిందే. వారి వేద గణితం ప్రకారమే 41శాతం అంటే ఐదులో రు.2.05 పెట్రోలు మీద, డీజిలు మీద రు.4.10 రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తద్వారా ఆ మేరకు రాష్ట్రాల బడ్జెట్ల కేటాయింపులకు కోత పడుతుంది. కేంద్రం చేస్తున్న ఖర్చు కూడా ఆ మేరకు తగ్గుతుంది. అదే జిఎస్‌టి అయితే తగ్గిన మేరకు రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సి వచ్చేది.కనుక ఈ తగ్గింపే ఘనత అనుకుంటే అది రాష్ట్రాలకూ వాటా ప్రకారం దక్కాలి కదా ! బిజెపి మిత్రపక్షం ఒడిషా బిజెడి సర్కార్‌ కూడా పన్ను తగ్గించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున తగ్గించింది. దీనివలన తమ ఖజానాకు రు.1,400 కోట్లు, కేంద్రం పన్ను తగ్గించిన కారణంగా తమ వాటాలో తగ్గే ఏడువందల కోట్ల రూపాయలతో కలుపుకుంటే 2,100 కోట్ల మేరకు తమ మీద భారం పడుతుందని పేర్కొన్నది. వివిధ రాష్ట్రాల మీద ప్రభావం ఇదే మాదిరి ఉంటుంది.


ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్ను తగ్గిస్తాయా లేదా అన్న సవాలు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది. ఇదే సమయంలో బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో ఒక్క శాతం కూడా పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం వాటన్నింటినీ పునరుద్దరించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. గతంలో అంగీకరించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రాలకు ఒకవేళ ఆదాయం తగ్గితే ఆ మేరకు చెల్లించాలి. ఎందుకంటే నోట్లు అచ్చువేసి లోటును పూడ్చుకొనే అవకాశం కేంద్రానికి ఉంది తప్ప రాష్ట్రాలకు లేదు.


కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు పెట్రోలు, డీజిలు మీద ఒక్కొక్క లీటరుకు తగ్గించిన పన్ను మొత్తాలు ఇలా ఉన్నాయి.ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రు.12-12 చొప్పున, గుజరాత్‌, అసోం, కర్ణాటక, గోవా, మణిపూర్‌, త్రిపుర రు.7-7 చొప్పున, బీహార్‌, ఒడిషా మూడేసి రూపాయలు, ఉత్తరాఖండ్‌ రు.2-2, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తగ్గించాయి. బిజెపి అధికార ప్రతినిధి, ఆర్ధికవేత్త సంజు వర్మ నవంబరు ఒకటవ తేదీన ఒక విశ్లేషణ రాశారు. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు మొదటి పక్షం వరకు పద్దెనిమిది నెలల్లో ముడిచమురు ధర పీపా 19 డాలర్ల నుంచి 85డాలర్లకు అంటే నమ్మశక్యం కాని విధంగా 347శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత పెంచుతాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము అనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం ఇదే రీతిలో ధరలను తగ్గించినట్లు ఏ వినియోగదారుడైనా చెప్పగలడా ? అందువలన మన జేబుల నుంచి కొట్టివేసిన మొత్తాలతో పోలిస్తే ఇప్పుడు తగ్గించిన ఐదు, పది రూపాయలు కంటి తుడుపు తప్ప మరొకటి కాదు.


ఈ మేధావి గతం నుంచీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కొనసాగించారు. అదేమంటే గత మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ రు.1.44లక్షల కోట్లకు చమురు బాండ్లను తీసుకున్నదని, దానితో పాటు మరో 70వేల కోట్లు వడ్డీ కూడా తమ మోడీ సర్కార్‌ మీద అదనపు భారం పడిందని సంజు వర్మ మొసలి కన్నీరు కార్చారు. ఆ మొత్తం నాటి ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ తప్ప మరొకటి కాదు. జనాలకు సబ్సిడీ ఇచ్చినందుకు ఈ ఏడుపెందుకు ? ఒక వేళ ఈ మొత్తమే మోడీ సర్కారు మీద పెనుభారం మోపిందా ? ఈ సాకుతో జనాల నుంచి ఏటా వసూలు చేసిన రెండు, మూడులక్షల కోట్లు, రద్దు చేసిస సబ్సిడీల మాటేమిటి ? అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ అసలు అప్పులు చేయలేదా ? 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు రు.54,90,763 కోట్లు కాగా 2020జూన్‌ నాటికి రు.101,30,000 కోట్లు కాగా వచ్చే మార్చి నాటికి అది 130లక్షల కోట్లకు చేరనుందని అంచనా, మరి దీని సంగతేమిటి ? కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరేండ్లలో రెట్టింపు ఎందుకు చేసినట్లు ?


చమురు పన్నుల భారం గురించి అడిగితే బిజెపి మంత్రులు, నేతలు చెబుతున్నదేమిటి ? కరోనా వాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారంటే మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అందుకే చమురు పన్నులు అన్న సంగతులు తెలిసినవే. ఇది నిజమా ? ఆసియా అభివృద్ది బాంకు నుంచి 150 కోట్లు, ఏఐఐబి నుంచి మరో 50 కోట్ల డాలర్లను వాక్సిన్ల పేరుతో మోడీ సర్కార్‌ అప్పు తీసుకున్న సొమ్మును దేనికి ఖర్చు చేసినట్లు మరి ?
బిజెపి ప్రతినిధి సంజువర్మ ఒక లెక్క చెప్పారు. పెట్రోలు ధర లీటరు వంద అనుకోమన్నారు. దానిలో చమురు ధర రు.32.97, కేంద్ర ప్రభుత్వం పన్ను 21.58, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 41.67, డీలరు కమిషన్‌ రు.3.78 దీన్ని చూపి చూశారా కేంద్రం కంటే రాష్ట్రపన్నులే ఎక్కువ అని చెప్పారు. వర్మగారి విశ్లేషణ వెలువడిన నవంబరు ఒకటవ తేదీనే ఢిల్లీలోని హెచ్‌పి సంస్ధ వివరాల ప్రకారం చమురు ధర రు. 47.59, కేంద్ర పన్ను 32.90, ఢిల్లీ ప్రభుత్వ 30శాతం వాట్‌ రు.25.32, డీలరు కమిషన్‌ రు.3.90, అన్నీ కలిపి నీతి రోడ్డులోని బంకులో ధర రు.109.71 ఉంది. మూడవ తేదీ నాటికి అది రు.110.04కు పెరిగింది నాలుగవ తేదీ నుంచి కేంద్రం పెట్రోలు మీద తగ్గించిన ఐదు రూపాయలను పరిగణలోకి తీసుకొని మిగిలిన ధరల్లో మార్పు లేదనుకుంటే 30శాతం వాట్‌ను(రు.5+1.50=6.50, డీజిలు మీద రు.10+3 = 13) తీసివేస్తే రు.103.21 ఉండాలి, కానీ నాలుగవ తేదీ ధర రు. 103.97. ఒకటి-నాలుగవ తేదీ మధ్య చమురు ధర పెరిగింది కనుక దాని మీద వచ్చే 30శాతం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 150పైసల బదులు 76పైసలు తగ్గింది. అందువలన ముందు ముందు ధరలు పెరిగితే రాష్ట్రాలు లోటును పూడ్చుకొంటాయి తప్ప ప్రతి లీటరుకు 150 పైసలు కోల్పోతాయి.


మరి బిజెపి ప్రతినిధి ఆర్ధికవేత్త సంజువర్మ కేంద్ర ప్రభుత్వ పన్ను రు.21.58 అని ఏ గణాంకాల ప్రకారం చెప్పారు ? గట్టిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మొత్తం 41.47, కేంద్ర పన్నులు 21.58శాతం అని చెబుతున్నారు. జనాన్ని తప్పుదారి పట్టించే లెక్క కదా ! రోడ్డు, వ్యవసాసెస్‌ల పేరుతో భారీగా రాష్ట్రాలకు వాటాలేని కేంద్ర వడ్డింపులను దాచిపెట్టి రాష్ట్రాలు విధిస్తున్న స్వల్ప సెస్‌ల గురించి సంజువర్మ గుండెలు బాదుకుంటున్నారు. కేంద్రం విధిస్తున్న పన్నులు నిర్ణీత మొత్తాలు గనుక అంతర్జాతీయంగా ధరలు పెరిగినా తగ్గినా కేంద్రానికి ఒరిగేదేమీ లేదని పెరిగిన కొద్దీ రాష్ట్రాలు ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. నిజమే, పద్దెనిమిది నెలల్లో ముడి చమురు ధర తగ్గినపుడు వర్మగారే చెప్పినట్లు కేంద్రానికి రాబడి పైసా తగ్గలేదు, రాష్ట్రాలకు గణనీయంగా పడిపోయిందా లేదా ? దీన్ని దాచిపెట్టి పెరిగిన అంశం గురించి మాత్రమే చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా ?


దేశంలో ధరల పెరుగుదల గురించి జనం ఆందోళన చెందుతుంటే మోడీ పాలనలో పెరుగుదల రేటు తక్కువ ఉందా, మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఎక్కువ ఉందా చూడండి అంటూ బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. దాని వలన ప్రయోజనం లేదు. మా ఏలుబడిలో తక్కువగా పెరుగుతున్నాయి, వారి పాలనలో ఎక్కువ అంటే కుదరదు.2014 కంటే ధరలు తగ్గాయా పెరిగాయా అన్నది గీటు రాయి. లేకుంటే అచ్చేదిన్‌కు అర్ధం ఏముంది ? మొత్తం ధరల పెరుగుదలలో చమురు ధరల వాటా ఎక్కువగా ఉంది కనుక పన్ను మొత్తాలను తగ్గించాలని గత కొద్ది నెలలుగా రిజర్వుబాంకు కేంద్రానికి ఎందుకు సూచిస్తున్నది ? అదేమీ ప్రతిపక్ష పాలిత సంస్ధ కాదు కదా ! ఆగస్టు నెలలో ఆహార వస్తువుల ధరల ద్రవ్యోల్బణంతో పోల్చితే సెప్టెంబరులో 3.11శాతం కాగా ఏడాది క్రితం సెప్టెంబరుతో పోల్చితే 0.68శాతమే ఉంది. ఇదే చమురు ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల 12.95-13.63శాతాల చొప్పున ఉన్నాయి. అందువలన అనేక చమురు మీద చేస్తున్న జనాలు చేస్తున్న ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. అందుకే రిజర్వుబాంకు పన్నులు తగ్గించి ధరల పెరుగుదలను నివారించాలని కోరింది.


కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు పెంచినా, సబ్సిడీలు తగ్గించినా జనంలో స్పందన లేని మాట నిజం. వాజపాయి ఏలుబడిలో పూర్తి అధికారం లేక మిత్రపక్షాల మీద ఆధారపడ్డార గనుక చేయాల్సింది చేయలేకపోయాం, ఇప్పుడు నరేంద్రమోడీని ముందుకు తెస్తున్నాం చూడండి అనే బిజెపి ప్రచారాన్ని జనం నమ్మారు, తగ్గిస్తారనే భ్రమలకు లోనుకావటం, నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న గుడ్డి విశ్వాసమే దీనికి కారణం. గాడిదలకు సహనం ఎక్కువ అంటారు.నడుము భరించే వరకు ఎంత భారమైనా మోస్తుంది. విరుగుతుంది అనుకుంటే అది కూడా ఆగ్రహిస్తుంది. జనం కూడా అంతే. కరోనాలో తగ్గిన ఆదాయాలు జనం ఆశించినట్లుగా పూర్వపు స్ధాయికి పెరగటం లేదు. మరోవైపు చమురు, ఇతర వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మోడీ మంత్రదండం పని చేయటం లేదు. గత రెండు సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో జనం మోడీ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతోంది. దాని ఫలితమే ఎన్నికలలో ఎదురుదెబ్బలు. అందుకే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అవే పునరావృతం అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అసలుకే ముప్పువస్తుందనే భయం పట్టుకుంది. దాని పర్యవసానమే పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది తగ్గింపు.

భారాలకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి రావాలని గతంలో బిజెపి కూడా జనానికి పిలుపులు ఇచ్చింది. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అనేక మంది సిలిండర్లను పట్టుకొని వీధుల్లో, ధర్నాలు, ప్రదర్శనలు చేశారు. ఏ పార్టీ అయినా ఇదే చేస్తుంది. ప్రభుత్వమే జనమనోభావాలను గ్రహించి నివారణకు పూనుకోవాలనే ఎవరైనా కోరుకుంటారు తప్ప కావాలనే ఆందోళనలకు పురికొల్పరు. ఇప్పుడు జనం ఓటుద్వారా నిరసన తెలుపుతున్నట్లు భావిస్తే, దానివల్లనే స్వల్పంగా అయినా భారం తగ్గిందంటే అది ఆహ్వానించదగిన పరిణామమే. వచ్చే ఎన్నికల్లో జనం తమ ఓటు ఆయుధాన్ని మరింతగా భారాలకు వ్యతిరేకంగా వినియోగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది ! ఇదే సమయరలో అనేక మంది ఓటర్లు ఇంకా భ్రమలతో అబద్దాలు, అవాస్తవాలతో తమ ముందుకు వస్తున్న పార్టీలను తమ ఓటుతో ఇంకా ఆదుకుంటున్నారు. అందుకే ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి పన్నులు పెంచితే ? ఏదో ఒకసాకుతో పెంచరనే హామీ ఏముంది ? మన్యంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వాన గిరిజనులు వినతులు విఫలమైన తరువాత ముందుగా విల్లంబులతోనే ప్రతిఘటన ప్రారంభించి తరువాత తుపాకులు పట్టారు. నైజా నవాబు మీద ప్రతిఘటన తొలి రోజుల్లో వడిసెలలతో ప్రారంభించి చివరికి తుపాకి పట్టారు. అందువలన పాలకుల అణచివేత తీవ్రతను బట్టి తమ ఆందోళన, పోరాట రూపాలను జనం నిర్ణయించుకుంటారు, తేల్చుకుంటారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనాలను వెర్రినాగన్నలుగా పరిగణిస్తున్న కాషాయ దళాలు !

31 Sunday Oct 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Islamophobia in India, LuLu Group International, misuse of facebook, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


వారు కన్నూరు, కాసరగోడ్‌, కోజికోడ్‌, మలప్పురం పట్టణాలలో ఏర్పాటు చేయరు. ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయంలలో చేస్తారు, ఇప్పుడు పాలక్కాడ్‌కు, ఎందుకు అంటూ ఆంగ్లంలో ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. కేరళకు చెందిన ఎంఎ యుసుఫ్‌ అలీ కుటుంబం అబుదాబీ కేంద్రంగా నిర్వహిస్తున్న లూలు గ్రూపు ఏర్పాటు చేస్తున్న షాపింగ్‌ మాల్స్‌ గురించిన పోస్టు అది. దేశంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాల అమ్ముల పొదిలోని అనేక అస్త్రాలలో లవ్‌ జీహాద్‌ ఒకటి. ఇప్పుడు కేరళలో దానికి షాపింగ్‌ మాల్‌ జీహాద్‌ను జత చేశారు. వ్యాపారానికి కూడా మతం రంగు పులిమారు. దాన్లో భాగమే లూలూ గ్రూప్‌ గురించి ప్రచారం. కొన్ని పట్టణాలలోనే మాల్స్‌ ఎందుకట ? ముస్లింలు నిర్వహిస్తున్న చిన్న దుకాణాలకు బదులు హిందువులు, క్రైస్తవులు ఎక్కువగా నిర్వహించే చిన్న దుకాణాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వారిని దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని ఆ పోస్టులో చెప్పారు. ఒక్కో మాల్‌కు ఇరవై వేల మంది సిబ్బందిని తీసుకుంటారట. వారిలో మలప్పురం ప్రాంతం నుంచి ముస్లిం యువకులను15వేల మందిని, ఐదువేల మంది ముస్లిమేతర యువతులను తీసుకుంటారట. ఇలా వారిని ఒక దగ్గరకు చేర్చి లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించుతున్నారట. నోరుమెదిపితే ఉద్యోగం నుంచి తీసివేస్తారు గనుక యువతులు మౌనంగా ఉంటున్నారట. దీనిలో మరొక అంశం పదిహేనువేల మంది విశ్వాసపాత్రులైన ముస్లింకుటుంబాలను ముస్లిమేతర ప్రాంతాలకు వలసలను ప్రోత్సహించటం. ఇది ఎందుకట ? ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాన్ని ప్రభావితం చేయాలంటే 30వేల ఓట్లు అవసరం కనుక ఇలా చేస్తున్నారట. అందుకోసమే ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారట. ఇందుకు గాను, ప్రపంచ ఉగ్రవాదులకు నిధులు అందచేయటంలో పేరు మోసిన ఒక అరబ్‌ దేశం నుంచి లూలు యజమాని పెట్టుబడులు సేకరిస్తున్నాడట. ఈ మాల్స్‌ వచ్చిన చోట ముస్లింల దుకాణాలు పెరిగి ఇతరులవి మూతపడుతున్నాయట. కనుక ఇలాంటి మాల్‌ జీహాద్‌ను అంతమొందించాలంటే రిలయన్స్‌, సెంట్రల్‌, బిగ్‌బజార్‌లకు మద్దతు ఇవ్వాలట. వినేవారుంటే ఏమైనా చెబుతారు, ఒక్కొక్క మాల్‌లో ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారా ?


అసలు నిజం ఏమిటి ? లూలూ గ్రూపు బెంగలూరులో మాల్‌ ప్రారంభ సమయంలో అక్టోబరు 11న పిటిఐ వార్తా సంస్ద విలేకరితో యజమాని యుసుఫ్‌ అలీ మాట్లాడారు. కోచి, త్రిసూరులో తమ మాల్స్‌ ఏర్పాటు చేశామని, మొదటి దశలో నాలుగున్నరవేల కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఐదింటిలో మరో రెండు తిరువనంతపురం, లక్నోలో ఏర్పాటు అవుతాయన్నారు. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ టర్నోవర్‌ గత ఏడాది 740కోట్ల డాలర్లు.
ఇక ముస్లిమేతరులు ఉన్న ప్రాంతాల్లోనే మాల్స్‌ ఏర్పాటు అన్న ప్రచార బండారాన్ని చూద్దాం. ఇరవై రెండు దేశాల్లో ఈ కంపెనీకి 215 దుకాణాలున్నాయి. వీటిలో పెద్ద మాల్స్‌ 23. ఒమన్‌లో 50, సౌదీలో 34, కతార్‌లో 13, బహరెయిన్‌ 8,కువాయిత్‌ 6,ఇండోనేసియా 5, ఈజిప్టు, మలేసియాల్లో రెండేసి, సురినామ్‌, ఎమెన్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. మనదేశంలోని ఐదు మినహా మిగిలినవన్నీ ఏడు ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నాయి.మత కళ్లద్దాలతో చూసే వారు దీని గురించి ఏమి చెబుతారు. వాట్సాప్‌ ఉన్న జనాలందరిని వెర్రివాళ్లుగా పరిగణిస్తే తప్ప ఇలాంటి అసంబద్ద, అవాస్తవ పోస్టులను ఎవరైనా పెట్టగలరా ? ఇవన్నీ ముస్లిం దేశాలే కదా, ఇక్కడ ఎవరిని దెబ్బతీసేందుకు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు ? అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక కంపెనీలు మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి ? మరి అవి ఎవరిని దెబ్బతీసేందుకు ? క్రైస్తవులనా ? వ్యాపారులకు లాభాలు తప్ప మతాలవారీ జనాభా కాదు. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తారు. మాల్‌ జీహాద్‌ కథలు కూడా తప్పుడు ప్రచారమే.మనం బుర్రకు పని పెట్టకుండా చెవులు అప్పగిస్తే ఏమైనా ఎక్కిస్తారు.


ఈ బాపతుకు ముస్లిం వ్యతిరేకత తప్ప మరొకటి పట్టదు. బిగ్‌బజార్‌, డీమార్ట్‌, మెట్రో, విశాల్‌, రిలయన్స్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ వంటి కంపెనీల గొలుసు దుకాణాలు, ప్రతి పెద్ద పట్టణంలో వెలుస్తున్న ఇతర మాల్స్‌ ఏ మత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెడుతున్నారు? దేశంలో 80శాతం మంది హిందువులే ఉన్నారు. ఆ ప్రాంతాలన్నింటా చిన్న దుకాణాలను నడిపేది వారే. పైన చెప్పుకున్న కంపెనీల దుకాణాలు దెబ్బతీస్తున్నది ఎవరిని ? ఎందుకీ ఉన్మాదం ? ఎవరిని ఉద్దరించేందుకు ? ఉదాహరణకు ఒక డి మార్ట్‌ దుకాణం చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోని చిల్లర దుకాణాల అమ్మకాలు పడిపోతున్నాయి. అనేకం మూతపడ్డాయి, కొత్తగా పెట్టిన వారు వెంటనే ఎత్తివేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సరకుల అందచేత గురించి చెప్పనవసరం లేదు.


రెడ్‌ సీర్‌ అనే సంస్ధ చేసిన పరిశోధన ప్రకారం దేశంలో కోటీ 50లక్షలు, నీల్సన్‌ సర్వే ప్రకారం కోటీ 20లక్షల చిల్లర దుకాణాలున్నాయి. అన్ని రకాల అంకుర సంస్ధలలో పెట్టుబడులు వంద రూపాయలనుకుంటే ఇంటి అవసరాల సరకుల సరఫరా సంస్దల వాటా 40గా ఉందంటే రానున్న రోజుల్లో ఇవి ఎంతగా విస్తరించనున్నాయో ఊహించుకోవచ్చు. ఆన్‌లైన్‌ విక్రయాల వాటా 0.2 నుంచి 2023 నాటికి 1.2శాతానికి పెరుగుతుందన్నది ఒక అంచనా. కరోనా వీటిని మరింతగా పెంచింది.జనాలు వాటికి అలవాటు పడిపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు, ఆప్‌లు అందుబాటులోకి వచ్చినందున ప్రతిదాన్నీ ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. ఐస్‌క్రీమ్‌, కూరగాయలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అనేక కంపెనీలు చిల్లర దుకాణదారులతో ఒప్పందాలు చేసుకొని తమ సరకుల విక్రయ కేంద్రాలు, ఏజంట్లుగా మార్చుకోబోతున్నాయి. స్టాకిస్టులు, ఏరియా, జిల్లా పంపిణీదారులు, హౌల్‌ సేలర్ల వంటి దొంతరలేమీ లేకుండా కంపెనీలే నేరుగా ఉత్పత్తిదారు నుంచి కొనుగోలు చేసి తమ దుకాణాలు, చిల్లర దుకాణల ద్వారా విక్రయించే, కమిషన్‌ ఏజంట్లుగా మార్చబోతున్నాయి. ఇవి దెబ్బతీసేది ఎవరిని ? హిందువులనా, ముస్లింలనా ?ఇవి దెబ్బతీసే ఉపాధి ఏ మతం వారిది ?


ఇలాంటి ప్రచారాలు చేసేది పనీ పాటాలేని జనాలా ? కానే కాదు. ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం ఇది. దీని వెనుక పాలకుల పని తీరు గురించి జనాల దృష్టి మళ్లించటం ఒక ఎత్తుగడైతే, జనాల్లో పరస్పర అనుమానాలు , విద్వేషం రేకెత్తించటం శత్రుశిబిరాల్లో చేర్చటం మరొకటి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క అజెండా ఉంటుంది. ఉదాహరణకు 5జి టెక్నాలజీలో చైనా ముందుంది గనుక దాన్ని దెబ్బతీయాలంటే వక్రీకరణ ప్రచారం జరపాలి. దాన్లో భాగంగానే చైనా 5జి కారణంగా కరోనా వైరస్‌ పుట్టిందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని ప్రచారం చేసే వారికి కనీస పరిజ్ఞానం లేదన్నది స్పష్టం. రేడియో తరంగాలు వైరస్‌ను వ్యాపింప చేస్తే అవి ఒక్క 5జికే, కరోనాకే ఎందుకు పరిమితం కావాలి ? ఇతర వైరస్‌ల పట్ల వాటికి వివక్ష ఏముంది? కరోనాతో వాటికేమైనా ఒప్పందం ఉందా ?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అంశాలను కావాలనే నియంత్రించటం లేదని గతంలో, తాజాగా వెల్లడైంది. దాని అంతర్గత పత్రాలను ఫ్రాన్సెస్‌ హేగన్‌ బయటపెట్టిన అంశం తెలిసిందే. మన దేశంలో 40కోట్ల మంది వాట్సాప్‌, 34కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారులు ఉన్నారు. ఫేస్‌బుక్‌ బిజెపి, ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా పని చేసినట్లు గతేడాది అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది. హేగన్‌ వెల్లడించిన పత్రాలు దాన్ని నిర్దారించాయి. ఫేస్‌బుక్‌ మాజీ అధికారిణి, బిజెపితో సంబంధాలున్న అంఖీదాస్‌ స్వయంగా ముస్లిం వ్యతిరేక అంశాలను షేర్‌ చేసినట్లు నిర్ధారణైంది. బిజెపితో వ్యాపార సంబంధాలున్నందున కొంత మంది పార్టీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల అంశాలను తొలగించవద్దని సిబ్బందిని ఆమె ఆదేశించినట్లు కూడా వెల్లడైంది.2020 డిసెంబరులో రాసిన అంతర్గత పత్రంలో అమెరికా వెలుపల ఇతర దేశాల్లో ఫేస్‌బుక్‌ స్ధానిక అధికారులను సాధారణంగా అధికార పార్టీలకు చెందిన వారిని, సహజంగా వారికి లొంగేవారిని నియమించారని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే విద్వేష ప్రచారాన్ని అనుమతిస్తున్నారు.


ఈ ఏడాది మార్చినెలలో ఫేస్‌బుక్‌ లోటస్‌ మహల్‌ (కమలం మహల్‌) పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది. కమలం పువ్వు బిజెపి ఎన్నికల గుర్తు అన్నది తెలిసిందే. బిజెపితో సంబంధం ఉన్న వారు పుంఖాను పుంఖాలుగా ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచి లవ్‌ జీహాద్‌తో సహా అనేక అంశాలతో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని నింపినట్లు దానిలో పేర్కొన్నారు. బిజెపి నేత ఒకరు ఢిల్లీలోని రోడ్డు మీద నిరసన తెలుపుతున్న ముస్లింలను తొలగించాలని ఇచ్చిన పిలుపుతో జరిగిన దాడుల్లో 53 మంది మరణించినట్లు దానిలో రాశారు. కరోనాను వ్యాపింప చేశారని, వైద్యుల మీద ఉమ్మారనే కల్పిత అంశాలను ప్రచారం చేశారని, ఇలాంటి ప్రచారం చేసిన హిందూత్వ గ్రూపుల మీద ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా ఉదంతాన్ని ఆసరా చేసుకొని ముస్లిం వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టిందీ తెలిసిందే.


చరిత్రను వక్రీకరించే పోస్టుల ప్రచారం గురించి చెప్పనవసరం లేదు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1945లోనే చైనా శాశ్వత రాజ్యంగా ఉన్న అంశం తెలిసినా మనకు శాశ్వత హౌదా ఇస్తామంటే తిరస్కరించి చైనాకే ఇవ్వాలని నెహ్రూ కోరినట్లు జరుగుతున్న ప్రచారం చేస్తున్నారు. కళ్ల ముందున్న వాస్తవాలను వక్రీకరించి వివిధ అంశాలపై బాహాటంగా చేస్తున్న ప్రచార బండారాన్ని లూలూ, నెహ్రూ ఎవరి గురించైనా ఎవరికి వారు తర్కబద్దంగా ఆలోచించి ఎండగట్టాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? పశ్చిమ దేశాల యువత సోషలిజం వైపు మొగ్గుతోందా ?

29 Friday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Bolshevik Revolution, Communists, october revolution, Vladimir i Lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


రష్యా నవంబరు విప్లవం గురించి ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు అంటూ అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ రాశారు. 1917 నవంబరు ఏడవ తేదీ( పాత కాలెండరు ప్రకారం అక్టోబరు 25)న జారు చక్రవర్తిని కూల్చివేసి కమ్యూనిస్టులు ప్రధమ శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.1991లో దాన్ని కూల్చివేశారు.అయినా ఆ విప్లవం ఇప్పటికీ,ఎప్పటికీ శ్రమజీవుల పోరాటాలకు ఉత్తేజం కలిగించేదే, గుణపాఠాలు నేర్పేదే. దాని గురించి ఎంత రాసినా, ఎన్నిసార్లు రాసినా తరిగేది కాదు. 2017నవంబరు ఆరవ తేదీన అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసిన విశ్లేషణకు ” వందేండ్ల తరువాత తిరిగి వచ్చిన బోల్షివిజం, మనం ఆందోళన పడాలి ” అని శీర్షిక పెట్టారు. నాలుగేండ్లు గడిచాయి. దాని ప్రకారం అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? రష్యాలో తిరిగి సోషలిజం వస్తుందా ? అమెరికాలో కుర్రకారు పెట్టుబడిదారీ విధానాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది ? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు.చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా, లావోస్‌, కంపూచియా సోషలిస్టు దేశాలుగా నిలిచి కొనసాగుతున్నప్పటికీ సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలకు తగిలిన ఎదురు దెబ్బలతో అనేక మంది నిరాశ చెందారు. తరువాత లాటిన్‌ అమెరికా, ఇతర అనేక దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు వామపక్ష శక్తులకు ఉత్తేజమిస్తున్నాయి. నవంబరు విప్లవదినం సోషలిస్టు దేశాలకు ఉత్సవ రోజైతే మిగిలిన వారికి దీక్షాదినం. ఒక్కసారి తాజా పరిణామాలను అవలోకిద్దాం.


తమకు నచ్చనివారిని, విబేధించేవారిని దేశద్రోహులు, అర్బన్‌నక్సల్స్‌, తుకడేతుకడే గాంగ్‌, హిందూవ్యతిరేకులని ముద్రవేయటం మన దేశంలో ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం. నిత్యం స్వదేశీ కబుర్లు చెబుతూ విదేశాల నుంచి తెచ్చుకున్న అనుకరణ ఇది. దీన్ని మెకార్ధిజం అంటారు. అమెరికాలో 1947 నుంచి 1957వరకు జోసెఫ్‌ మెకార్ధీ అనే సెనెటర్‌ ఉండేవాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. మీడియాలో అందరూ వామపక్ష భావజాలం ఉన్నవారే కనుక ఇలాంటి వార్తలు ఎక్కడా రావు అంటూ కల్పిత అంశాలను వాట్సాప్‌లో పంపే అబద్దాల కోర్లు మనకు నిత్యం దర్శనమిస్తుంటారు. వీరికి ఎల్లవేళలా మెకార్ధీ ఉత్తేజమిస్తుంటాడు. వారి స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడూ, ఇప్పుడు పదవి పోయిన తరువాత మెకార్ధీని అనుసరిస్తున్నాడు. మెకార్ధీ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు, నచ్చని వారికి కమ్యూనిస్టు ముద్రవేసేవాడు.రచయితలు, జర్నలిస్టులు, సినిమాతారలు, వాణిజ్యవేత్తలు ఒకరేమిటి లొంగని ప్రతివారినీ బెదిరించేవాడు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసేది. ఎంతగా వాడి ప్రభావం పెరిగిందంటే ఎన్నికల్లో వాడు సమర్ధించిన వారు గెలిచి, వ్యతిరేకించిన వారు ఓడారు. వాడి ఉపన్యాలకు మీడియా విపరీత ప్రచారమిచ్చేది.చివరికి వాడు చెప్పిన అబద్దాలకు సెనెట్‌ మందలించింది. అబద్దాలు, అవలక్షణాలన్నీ విచారణలో బహిర్గతమయ్యాయి.నలభై ఎనిమిది సంవత్సరాలకే పచ్చి తాగుబోతుగా మారి జబ్బులతో దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు అమెరికాలో మెకార్ధీలు తామరతంపరగా పుట్టుకువచ్చారు. డెమోక్రాట్లు, పురోగామివాదులు, తమను ఆక్షేపించేవారిని సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా ముద్రవేసి గతాన్ని పునరావృతం చేసేందుకు పూనుకున్నారు.అయితే బెర్నీశాండర్స్‌ వంటి ప్రముఖులు అవును మేము సోషలిస్టులమే అని ముందుకు రావటంతో లక్షల మంది యువత తాము కూడా సోషలిస్టులమే,కమ్యూనిస్టులమే అని ప్రకటించుకోవటం పెరుగుతోంది.

నవంబరు విప్లవ సమయంలో సోషలిజం ఒక ఊహ. దానికి వ్యతిరేకంగా సైద్దాంతిక చర్చ జరిగింది. పెట్టుబడిదారులు సవాళ్లు విసిరారు. తరువాత సోవియట్‌ , సోషలిస్టు శిబిరం ఏర్పడింది. వైఫల్యాలు ఎదురయ్యాయి. గత వందేళ్లుగా సోషలిజం వైఫల్యం గురించి ప్రచారం చేశారు, దానికి అమెరికా ప్రధాన కేంద్రం. చిత్రం ఏమంటే ఇప్పుడు అక్కడ సోషలిజం వైఫల్యం బదులు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ జరుగుతోంది. ఇదొక అనూహ్య పరిణామం. పెట్టుబడిదారీ సమర్ధకులు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారు. అక్కడ మీడియా సోషలిజానికి అనుకూలం కాదు, బలమైన కమూనిస్టుపార్టీ లేదు. అయినా అక్కడి విదార్ధులు సోషలిజం మంచిది, ప్రైవేటు ఆస్తిహక్కులు రద్దవుతాయి అని చెబుతున్నారు. ఎంత మాట అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా ఇది, వేదంలా విలువైన మాట అనేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు.కాబట్టి ప్రైవేటు ఆస్తి హక్కులను తీసివేసే వారిని ఎన్నుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని ఒక విలేకరి ఒక విద్యార్ధితో అన్నాడు. దానికి లేదు కేవలం పన్ను ఎగవేతకు మాత్రమే ఆస్తి హక్కులు కాదు అన్నాడు విద్యార్ది. డబ్బు అంటే ఆస్తేకదా అని విలేకరి రెట్టించాడు. పన్ను ఎగవేత ఆస్తి హక్కు అనేట్లైతే కచ్చితంగా దాన్ని రద్దు చేయాల్సిందే అని విద్యార్ధి సమాధానమిచ్చాడు. అమెరికా అంతటా ఇలాంటి ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నా. అసమానతలు, తమ రుణాలు కొండల్లా పెరగటం, తీరే దారి కనిపించకపోవటంతో విద్యార్దులు, యువతలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి.


గత వంద సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పుడు 40శాతం మంది అమెరికన్లలో, 49శాతం మంది యువతలో సోషలిజం పట్ల సానుకూలత ఉంది. అమెరికాలో స్కూలు విద్యాకమిటీలు చురుకుగా పని చేస్తున్నాయి. వాటి సమావేశాలు కమ్యూనిస్టు వ్యతిరేకులకు దడపుట్టిస్తున్నాయి. ఆ సమావేశాల్లో రాజకీయాలను చర్చించకూడదనే వారు కొందరైతే, రద్దు కోరుతున్నారు కొందరు. అది ఎంతగా అంటే ఆ కమిటీల ద్వారా తదుపరి అక్టోబరు విప్లవాన్ని త్వరలో కమ్యూనిస్టులు ప్రారంభించనున్నారని ఒక జర్నలిస్టు తాజాగా తన అక్కసును వెళ్లగక్కాడు. వాస్తవాన్ని చూస్తే దేశమంతటి నుంచి డెమోక్రటిక్‌ సోషలిస్టులు వందమంది ఎన్నికయ్యారని, బెర్లిన్‌ గోడ పతనంతో సోషలిజాన్ని వ్యతిరేకించే వారికి నోరుపడిపోయిందని, తరువాత ఒక మంచి అంశంగా తీవ్రవాద ముస్లిం జీహాద్‌ ప్రచారం వచ్చింది. మార్క్సిస్టు టీచర్లు మీ పిల్లల లింగమార్పిడి చేస్తున్నారని మధ్యతరగతి అమెరికన్లను నమ్మించటం కంటే ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధించామని చెప్పటం కష్టమని, ఎందుకంటే అవమానకర రీతిలో ఉగ్రవాదంపై మన ప్రపంచ పోరు ముగిసిందని వాపోయాడు. అమెరికా కమ్యూనిజం వైపు పయనిస్తోందని జనాన్ని రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.చివరకు కరోనా కారణంగా క్రిస్మస్‌ సందర్భంగా ఎక్కువ మంది గుమికూడవద్దని అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్ద డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌసీ సలహా ఇవ్వటం కూడా కమ్యూనిజం దిశగా ప్రయాణంలో భాగమే అని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ జిమ్‌ జోర్డాన్‌ ఆరోపించాడు. పాఠశాల విద్యాకమిటీలు వామపక్ష అధికార కేంద్రాలుగా ఉన్నాయని, వాటి సమావేశాలకు వెళ్లే వారిని స్ధానిక ఉగ్రవాదులుగా ఎఫ్‌బిఐ పరిగణించాలని సెలవిచ్చాడు.


కమ్యూనిజానికి వ్యతిరేకంగా గూఢచారిగా పని చేసిన ఒక మాజీ అధికారి అమెరికాలో కమ్యూనిస్టుల కార్యక్రమం ఇదీ అంటూ పత్రికల్లో రాశాడు. ఏమిటట,యువతను సెక్స్‌, మాదక ద్రవ్యాలు, వీడియో గేమ్‌లకు బానిసలుగా చేసి వారి ధృడత్వాన్ని దెబ్బతీసి 17-24 ఏండ్ల వయసున్నవారిలో 71శాతం మందిని మిలిటరీకి పనికి రాకుండా చేయటం.ప్రస్తుతం 1,500 దినపత్రికలు, 1,100 వార,పక్ష,మాసపత్రికలు, 1,500 టీవీ ఛానళ్లు, 9,000వేల రేడియో స్టేషన్లు, 2,400 ప్రచురణ సంస్దలుండగా అవన్నీ కేవలం ఆరు కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్నాయి, వీటిన్నింటి ప్రచారం మీద అదుపుసాధించటం, జనాలను శత్రుబృందాలుగా విడదీయటం, తమ నేతల మీద విశ్వాసం లేకుండా చేయటం, ప్రజాస్వామ్యం గురించి ప్రబోధించి నిర్దాక్షిణ్యంగా, అక్రమాలతో వేగంగా అధికార స్వాధీనం,ప్రభుత్వంతో ఇష్టం వచ్చినట్లు వివిధ పధకాలకు ఖర్చు చేయించటం, ప్రజల్లో అశాంతిని ప్రోత్సహించటం, నైతిక విలువలను కుప్పకూల్చటం, మారణాయుధాలను కొనిపించాలి, తరువాత వాటిని తిరిగి తీసుకొని జనాన్ని ఇబ్బందుల్లో పడేయటం. ఈ కార్యక్రమంతో కమ్యూనిస్టులున్నారు గనుక మన దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, 2022లో వాటిని తొలగించాలంటూ రాశాడు. ఊరూపేరూ లేకుండా లేదా ఏదో ఒక సంస్ద పేరుతో ముస్లింల అజెండా లేక హిందువుల అజెండా ఇది అని రెచ్చగొడుతూ రాసి పంచే కరపత్రాల గురించి మనకు తెలిసిందే. అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి.


అమెరికాలో మాదిరి బ్రిటన్‌ యువతలో కూడా పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు తగ్గుతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేల్లో 80శాతం మంది కుర్రకారు తమ ఇబ్బందులకు పెట్టుబడిదారీ విధానమే కారణమన్నారు. మూడింట రెండువంతుల మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ కావాలన్నారు.పద్దెనిమిదవ శతాబ్దిలో తత్వవేత్త జీన్‌ జాక్విస్‌ రౌసియవు చెప్పిన అంశాలను ఒక విశ్లేషకుడు ఉటంకించారు. ” తినేందుకు జనానికి ఏమీ మిగలనపుడు వారు ధనికులను తింటారు” అన్నాడు. దీనికి సూచికగానే బ్రిటన్‌ సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తున్న టిక్‌టాక్‌, ఇతర వీడియోలలో యువత ఏదైనా తినే సమయంలో వినియోగించే ఫోర్కులతో కార్లలో ఉన్నవారు, ఫ్రిజ్‌ల దగ్గర ఉన్నవారిని చూపుతూ ఇవి మాకు లేకపోవటానికి మీరే కారకులు అనే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కనుక ధనికులు నిద్రించేటపుడు ఒకకన్ను తెరవటాన్ని ప్రారంభించాలన్న మాట అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. లండన్‌ కేంద్రంగా పని చేసే ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ జూలైలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో గృహ సంక్షోభానికి కారణం పెట్టుబడిదారీ విధానమే అని 80శాతం యువత భావిస్తోంది. వాతావరణ అత్యవసర పరిస్ధితి ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని75శాతం మంది చెప్పారు. సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు 67శాతం చెప్పారు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులకు ఇది హెచ్చరిక అని సదరు సంస్ధ పేర్కొన్నది. ఈ లెక్కల గురించి కొందరికి చిన్న చూపు ఉండవచ్చు, వీటిని చెప్పింది వామపక్షవాదులు కాదని గమనించాలి.2019లో బర్నార్డో సంస్ధ జరిపిన సర్వేలో పాతికేండ్ల లోపు వారిలో మూడింట రెండువంతుల మంది తమ తలిదండ్రులతో పోలిస్తే తమ జీవితాలు అధ్వాన్నంగా ఉంటాయనే భయాన్ని వ్యక్తం చేశారు.ఆర్ధిక పరిస్ధితులే యువతను వామపక్ష అభిమానులుగా మారుస్తున్నాయని ” జనరేషన్‌ లెఫ్ట్‌ ” అనే పుస్తక రచయిత కెయిర్‌ మిల్‌బరన్‌ అన్నారు.


బ్రిటన్‌లో సుఖవంతమైన జీవితం గడపాలంటే చేతిలో మంచి జీతం తెచ్చే ఒక డిగ్రీ ఉండాలని చెప్పిన రోజులున్నాయి.2020లో జరిపిన సర్వే ప్రకారం డిగ్రీ ఉన్న-లేని వారి వేతన తేడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. మరోవైపు విద్యార్ధుల అప్పులు సగటున ఒకరికి 40,280 పౌండ్లకు చేరాయి.మూడోవంతుకు పైగా డిగ్రీ ఉన్న వారు డిగ్రీతో పనిలేని ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది.దీనికి తోడు మొత్తంగానే వేతనాలు పడిపోతున్నాయి.మన దేశంలో రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని పాలకులు చెబుతున్నట్లుగానే బ్రిటన్‌ నేతలు కూడా మీకు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది ” స్వయం ఉపాధి పధకంలో చేరండి ” అని చెప్పారు. మూడోవంతు మంది పాతికేండ్ల లోపు కార్మికులు వారానికి ఎంత వేతనం వస్తుందో తెలియని పనులు చేస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో నమోదైన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లవద్ద కనీసవేతనాలు, వేతనంతో కూడిన సెలవులు లేని పనులు చేస్తున్నారు. స్వేచ్చ దొరికింది గానీ పనికి భద్రత లేమి వారికి బహుమతిగా దక్కింది.యువత సోషలిజం వైపు మొగ్గుతున్నదంటే దాని అర్దం వారంతా విప్లవకారులుగా మారుతున్నారని కాదు. ఎలాంటి సంక్షోభాలు లేని సోషలిస్టు చైనా, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న సరకులను వారు నిత్యం చూస్తున్నారు గనుక అలాంటి విధానం మంచిదనే సానుకూలతవైపు మొగ్గుతున్నారు. అవసరమైతే తరువాత విప్లవకారులుగా మారతారు.యువ రచయిత్రి సాలీ రూనే తాజా నవల ” ఇన్‌ ద బ్యూటిఫుల్‌ వరల్డ్‌ వేర్‌ యు ఆర్‌ ” (అందమైన లోకంలో మీరెక్కడున్నారు)లో ఒక పాత్ర చేత ఇలా పలికించారు. ” తొలుత నేను మార్క్సిజం గురించి మాట్లాడినపుడు జనాలు నన్ను చూసి నవ్వారు, ఇప్పుడు అది అందరి నోటా నానుతోంది” దీని అర్ధం ఏమిటి ప్రచ్చన్న యుద్దంలో తాము విజయం సాధించినట్లు పెట్టుబడిదారులు ప్రకటించుకున్న మూడు దశాబ్దాల తరువాత కుర్రకారు మరింత స్వేచ్చగా పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి చర్చిస్తున్నారనే కదా ! అందుకే ఆర్ధికవేత్త జేమ్స్‌ మిడ్‌వే ఇటీవల ఒక తన వ్యాసానికి ” జనరేషన్‌ లెఫ్ట్‌ మైట్‌ నాట్‌ బి దట్‌ లెఫ్ట్‌ ఆఫ్టరాల్‌ ” ( ఆ వామపక్ష వాదులా… వారెంత అని ఉపేక్షించిన మాదిరి కాదు కుర్ర వామపక్షవాదులు ” అని శీర్షిక పెట్టారు.


రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అక్కడి ప్రభుత్వం పట్ల దూకుడుగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. ఇది ఎవరూ తీర్పు ఇచ్చే అంశం కాదు. ” తాజాగా జరిగిన డ్యూమా(పార్లమెంట్‌) ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్లు,యువ కమ్యూనిస్టులు, పార్టీతో కలసిన ఇతర వామపక్ష శక్తులు అధ్యక్షుడు పుతిన్‌కు అనూహ్య సవాలు విసురుతున్నారు. పాత తరం అంతరిస్తున్నది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కొత్త పటాలం, సామాజిక మాధ్యమంతో పనిచేసే కమ్యూనిస్టులు ఎదుగుతున్నారు. వారు సిద్దాంత ఉపన్యాలు చేయకపోవచ్చు, ఎర్రజెండాలను ఊపకపోవచ్చు, వారు పుతిన్‌ ప్రభుత్వ అవినీతి, దేశంలో దారిద్య్రం గురించి నిరసన తెలుపుతున్నారు ” అని ఒకరు పేర్కొనగా, ” ఇది నిజంగా రష్యన్‌ రాజకీయాలలో శక్తివంతమైన టెక్టోనిక్‌ ప్లేట్ల (భూమి ఖండాలుగా విడిపోయి కోట్ల సంవత్సరాలు గడచినా ఆ ముక్కలు సముద్రంలో ఇంకా కుదురుకోలేదు, వాటి కదలికలు సునామీలు, భూకంపాలకు దారితీస్తున్నాయి. వాటినే శిలావరణం అంటున్నారు-రష్యన్‌ యువ వామపక్ష వాదులు రాజకీయ సునామీలు, భూకంపాలు సృష్టించగలిగిన వారని భావం) వంటివి, మార్పునకు ఇది ప్రారంభం ” అని లండన్‌ విశ్లేషకుడు మార్క్‌ గలియోటి అన్నాడు. సెప్టెంబరు పార్లమెంటు ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించిన వాటి కంటే కమ్యూనిస్టులకు ఎక్కువ, అధికార పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని కూడా గలియోటి అన్నాడు. ” అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి వెల్లడైన మద్దతు స్ధాయి గురించి రష్యన్‌ కులీనులకు ఎలాంటి భ్రమలు లేవు ” అని ఆర్‌ పోలిటిక్స్‌ అనే రాజకీయ సలహా సంస్ధను ఏర్పాటు చేసిన తాతియానా స్టానోవయా చెప్పింది. రష్యా రాజకీయాలలో కమ్యూలను ఇంకేమాత్రం విస్మరించకూడదని, వారిని అణచివేస్తే అజ్ఞాతవాసానికి వెళతారని కొందరు పేర్కొన్నారు. ఇంకా అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలు ఉన్నప్పటికీ స్ధలాభావం వలన మరోసారి చర్చించవచ్చు.


చరిత్ర పునరావృతం అవుతుందని పెద్దలు చెప్పారు, దాని అర్ధం గతం మాదిరే జరుగుతుందని కాదు. ప్రతి తరంలోనూ నిరంకుశ పాలకులు తలెత్తినపుడు వారిని ఎదిరించేవారు కూడా అదేమాదిరి తయారవుతారు. ఒకానొక కాలంలో ప్రత్యక్షంగా తలపడ్డారు, కర్రలు, విల్లంబులు, కత్తులతో తిరుగుబాట్లు జరిపారు. తుపాకులు వచ్చిన తరువాత అలాంటి అవసరం లేదు. పద్దతి మారింది తప్ప తిరుగుబాటు లక్ష్యం ఒక్కటే -అదే అణచివేత, దోపిడీ నిర్మూలన, ఇప్పుడూ అదే జరుగుతోంది. ” ఐరోపాను ఒక భూతం వేటాడుతోంది-అది కమ్యూనిస్టు భూతం. పాత ఐరోపాలోని అధికారశక్తులన్నీ ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు అపవిత్ర కూటమి గట్టాయి. పోప్‌, జార్‌, మెట్రినిచ్‌, గుయిజోట్‌, ఫ్రెంచి విప్లవకారులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు చేతులు కలిపారు.” అనే పదాలతో 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ప్రచురితమైన కమ్యూనిస్టు ప్రణాళిక (మానిఫెస్టో) ప్రారంభ పదాలవి. తరువాత పరిస్దితి మారింది. ఆ కమ్యూనిస్టు భూతం అన్ని ఖండాలకు విస్తరించింది. అందువలన ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో దాన్ని అంతమొందించాలని చూస్తూనే ఉన్నారు. ఒక దుర్మార్గుడు మరణిస్తే మరొకడు పుట్టుకువచ్చినట్లుగా ఒక విప్లవకారుడిని అంతమొందిస్తే వేయి మంది కొత్తవారు రంగంలోకి వస్తున్నారు. దోపిడీ శక్తులను ప్రతిఘటించే, పీచమణిచే కమ్యూనిస్టులూ అవతరిస్తున్నారు. ఇరు పక్షాల ఎత్తుగడలూ, రూపాలు అన్నీ మారాయి.


ఈ నేపధ్యంలో చూసినపుడు మహత్తర నవంబరు(పాత కాలెండర్‌ ప్రకారం అక్టోబరు) విప్లవం గతం. అది ఒక్క రష్యాలోనే కాదు, దోపిడీ జరిగే ప్రతిచోటా అనివార్యం. దాని అర్ధం నవంబరులోనే జరగాలని, జరుగుతుందనీ కాదు. నవంబరు విప్లవం అంటే నరజాతి చరిత్రలో తొలిసారిగా రష్యా శ్రామికులు జారు చక్రవర్తి రూపంలో ఉన్న దోపిడీ శక్తులను కూల్చివేసి శ్రామిక రాజ్యఏర్పాటుకు నాందిపలికిన ఉదంతం. తరువాత చైనా విప్లవం అక్టోబరులోనే జయప్రదమైంది. రష్యాలో ఇప్పుడు జారు చక్రవర్తి లేడు. వాడి స్ధానంలో ఇప్పుడు ఉన్న శక్తులు వేరే ముసుగులు ధరించి ఉన్నాయి. ఆ లెనిన్‌, స్టాలిన్లు లేరు, నూతన తరం కమ్యూనిస్టులున్నారు. తిరిగి సోషలిజం స్ధాపన అనివార్యం అని నమ్ముతున్నారు. అయితే గతంలో మాదిరే వింటర్‌ పాలెస్‌ ముట్టడిస్తే కుదరదు. ఎందుకంటే అక్కడ జారు చక్రవర్తి లేడు. అధికార కేంద్రం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కోకు మారింది. అందువలన మరోపద్దతి, మరో రూపం అనుసరించాల్సిందే. విప్లవ కాలంలో రష్యాలో కార్మికులు, రైతులూ, చైనాలో రైతులు ఎక్కువగా కార్మికులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో రైతులు నామమాత్రం. దోపిడీ కొనసాగుతూనే ఉంది, దాన్ని అంతమొందించాల్సిందే. అందువలన అక్కడ విప్లవం రావాలంటే పాత పద్దతులు, ఎత్తుగడలూ పనికి రావు. విప్లవం చుంచెలుక వంటిది. అది నిరంతరం నేలను తవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తుందో తెలియదు, విప్లవం కూడా అలాంటిదే నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ, ఎలా బయట పడుతుందో చెప్పలేము.


వలసవాద కాలంలో శత్రువు ప్రత్యక్షంగా కనిపించేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిస్ధితులు మారాయి. కార్మికులకు తమ శ్రమను దోచుకుంటున్నవాడు ప్రత్యక్షంగా కనిపించడు, అసలు ఫ్యాక్టరీలే లేకుండా కూడా దోపిడీ సాగుతోంది. అందువలన ఎక్కడికక్కడ స్ధానిక పద్దతులు, ఎత్తుగడలు అనుసరించాల్సిందే. ఒక నమూనా అనేది లేదు, సాధ్యం కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పాటు వ్యతిరేకించేశక్తులూ, సవాళ్లూ పెరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలను వివరించటం సాధ్యం కాదు. అందుకే అమెరికా, బ్రిటన్‌, రష్యాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలనే పరిమితంగా సృజించాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆడపిల్లలే తక్కువ, ముస్లింలకు బహు భార్య లు- వారి నుంచి ముప్పా ? నిజాలేమిటి ?

26 Tuesday Oct 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Hindu Population, Hindutva groups, Muslim women, myth of Muslim population explosion, Narendra Modi, RSS

ఎం కోటేశ్వరరావు

మన వాళ్లు వొట్టి వెధవాయలోయి(తెల్లవారు) చుట్టకాల్చటం నేర్పినందుకు థాంకు చెయ్యక అన్నాడు మహాకవి గురజాడ గిరీశం. ఆ పెద్దమనిషి ఇప్పుడు ఉండి ఉంటేనా అసలు సిసలు భారతీయులం అనుకొనే మన వాట్సాప్‌ పండితుల భాష్యాలు, వక్రీకరణలు, వారి జ్ఞానాన్ని జనానికి ఉచితంగా పంచుతున్న మహాదాతృత్వం గురించి ఎలాంటి పదజాలం ఉపయోగించి ఉండేవారో కదా ! వాట్సాప్‌ పండితులు, కాషాయ దళాల ప్రచారంలో భాగంగా ముస్లింల నుంచి ముప్పు లేదా మన దేశంలో మెజారిటీగా మారేందుకు కుట్ర చేస్తున్నారనే ప్రచారం నిరంతరం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24వ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెబ్‌సైట్‌లో ఒక వార్తకు పెట్టిన శీర్షిక ” భారత్‌లో హిందూ జనాభా వృద్ది రేటు తగ్గుదల, ముస్లింలో గర్భధారణ శక్తి (ప్రజనన) ఎక్కువ : పూ సర్వే సంస్ధ నివేదిక” అనే పేరుతో కొన్ని వివరాలు ఇచ్చారు. నిజానికి ఈ నివేదిక గురించి సెప్టెంబరు 21నే పూ సంస్ధ సర్వే వివరాలను ఇచ్చింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా, తప్పుడు ప్రచారం చేసే వారిని సంతుష్టీకరించేదిగా ఉంది.


ఇంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం బిజెపితో సహా దాని సంస్ధలు, వారి ప్రచారదాడి మహమ్మారి సోకిన వారు చేస్తున్న ప్రచారం ఏమిటి ? 2035 నాటికి( సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి గాని సారాంశం ఒక్కటే) మన దేశంలో ముస్లిం జనాభా హిందువుల కంటే ఎక్కువ అవుతుంది. హమ్‌ పాంచ్‌, హమారే పచ్చీస్‌ (మనం ఐదుగురం మనకు ఇరవై ఐదు) దీని అర్దం ఏమిటి ? ప్రతి ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు, వారికి ఐదుగురి చొప్పున పిల్లలు పుడతారు అని చెప్పటమే.2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” అనేకదా ! ఆర్‌ఎస్‌ఎస్‌ వారి ఈ వైఖరిలో మార్పు వచ్చిందా ?2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.


విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషలూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. మతమార్పిడి వద్దనండి, ఘర్‌వాపసికి అవునని చెప్పండి. లవ్‌ జీహాద్‌ వద్దు, ఉమ్మడి పౌరస్మృతి కావాలనండి, బంగ్లా ముస్లింలు వద్దనండి..హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే అంతకు ముందు చెప్పిందేమిటి ?చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. ముస్లింలు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు. ముస్లింలు పాలకులైతే హిందువులు రెండోతరగతి పౌరులౌతారన్నారు. ముస్లిం జనాభా పెరుగుతోందనే ప్రచారం కొనసాగింపుగా ఫలానా సామాజిక తరగతి అనే పేరు లేకుండా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును ముందుకు తెచ్చింది. అసోం కూడా అదే దారిలో ఉంది. రెండు చోట్లా ముస్లింల మీద తప్పుడు ప్రచారం ఎన్నికల లబ్దే అసలు కథ.


పూ సంస్ధ కనుగొన్న ముఖ్యఅంశాలంటూ ఆర్గనైజర్‌ రాసిన కొన్ని అంశాలూ, అది చేసిన వ్యాఖ్యానం ఎలా ఉన్నప్పటికీ వాటి నిజానిజాలేమిటో చూద్దాం. కాషాయ దళాలు చేస్తున్నది గోబెల్స్‌ ప్రచారం, వక్రీకరణ అని అనేక వివరాలు వెల్లడించినా ఆప్రచారం కొనసాగుతూనే ఉంది. ఒక అబద్దాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్‌ సిద్దాంతం. మనకూ బ్రాహ్మణుడు, మేక, నలుగురు దొంగల కథ తెలిసిందే.మన జనాభా వివరాలు 2011లో సేకరించినవి మాత్రమే అధికారికంగా ఉన్నాయి. ఆ తరువాత పెరిగిన జనాభా సంఖ్య అంచనా మాత్రమే. 1951-2011 మధ్య మొత్తం జనాభా 36.1 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో హిందువులు 30.4 కోట్ల నుంచి 96.6కోట్లకు పెరిగింది. ముస్లింలు 3.5 నుంచి 17.2 కోట్లకు, క్రైస్తవులు 0.8 నుంచి 2.8 కోట్లకు, సిక్కులు 0.68 నుంచి 2.08 కోట్లకు, బౌద్దులు 0.27 నుంచి 84లక్షలకు, జైనులు 17 నుంచి 45లక్షలకు పెరిగారు. పార్సీలు 1.2లక్షల నుంచి 60వేలకు తగ్గారు.


1990దశకకానికి ముందు మొత్తం జనాభా పెరుగుదల రేటు 22శాతం ఉండగా 2000నాటికి 18శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందువుల పెరుగుదల రేటు 24 నుంచి 17శాతానికి తగ్గగా ముస్లింల రేటు తగ్గుముఖం పట్టి 25శాతం వద్ద, క్రైస్తవుల రేటు 16శాతం వద్ద ఉంది. ముస్లింల రేటును చూపే కాషాయ దళాలు కుట్ర సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2, క్రైస్తవులు ఆరుశాతం ఉన్నారు.1951-2011కాలంలో హిందువులు నాలుగుశాతం తగ్గగా ముస్లింలు నాలుగుశాతం పెరిగారు. అలాంటపుడు 2035 నాటికి ముస్లింలు హిందువులను మించి పోతారని ఏ గణాంకాలు లేదా వాస్తవాలను బట్టి ఎలా చెబుతున్నారు ? నమ్మేవారు ఎలా చెవులప్పగిస్తున్నారు ? దేశంలో జరుగుతున్నదేమిటి ? 1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ?ప్రజనన లేదా గర్భధారణకు మహిళల్లో విద్యకు సంబంధం ఉంటుందనేది అంతర్జాతీయంగా రుజువైన అంశం.2015 సమాచారం ప్రకారం క్రైస్తవుల్లో మహిళలు సగటున ఏడున్నర సంవత్సరాలు, హిందువుల్లో 4.2, ముస్లింల్లో 3.2సంవత్సరాలు ఉంది. అందువలన ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది. విద్యతో పాటు మత విశ్వాసాలు, పరిసరాలు, సంపద, ఆదాయం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

2019లో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో జన్మించిన వారు విదేశాల్లో 1.75లక్షల మంది నివసిస్తుండగా విదేశీయులు 52లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆ ఏడాది మన జనాభాలో కేవలం 0.4శాతం మాత్రమే. అందువలన వలసవలన మతపరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదని కూడా తేలింది.కొన్ని వార్తల ప్రకారం మరికొన్ని లక్షల మంది ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చి అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్నారని చెబుతున్నారని అయితే దానికి తగిన రుజువులు లేవని పూ సంస్ధ పేర్కొన్నది.2012 పూ సంస్ధ అంచనా ప్రకారం భారత్‌ను వదలి వెళుతున్నవారిలో ముస్లింలు, క్రైస్తవులే ఎక్కువ ఉంటారని, భారత్‌కు వలస వచ్చే వారిలో మూడింట రెండువంతుల మంది హిందువులని పేర్కొన్నది. మతమార్పిడి ప్రచార బండారాన్ని కూడా పూ సంస్ధ వెల్లడించింది. ఇటీవల జరిపిన తమ సర్వే ప్రకారం 99శాతం హిందువులు,97శాతం ముస్లింలు, 94శాతం క్రైస్తవులు తాము పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నామని చెప్పారని, 0.7శాతం మంది హిందువులుగా పెరిగిన వారు తాము హిందువులుగా ఉండదలచుకోలేదని చెప్పగా హిందూమతానికి వెలుపల పెరిగిన 0.8శాతం మంది తాము ఇప్పుడు హిందువులుగా ఉన్నట్లు చెప్పారు.

దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. మరి హిందువులు ? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. కాషాయ దళాల వేదగణిత లెక్కలు కాకుండా దీనికి భిన్నమైన అధికారిక తాజా సమాచారం ఉంటే సరిచేసుకుందాం.2011లెక్కల ప్రకారం వహిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? అనేక మంది పేదరికం కారణంగా హైదరాబాద్‌ వంటి చోట్ల ముస్లింలు అరబ్‌ షేకులకు తమ పిల్లలను కట్టబెడుతున్నారనే అంశం పలుసార్లు వెలుగులోకి వచ్చింది.


అయితే దేశంలో బహుభార్యాత్వం లేదా ? ఘనమైనదిగా కొందరు చెప్పుకొనే మన చరిత్ర, సంస్కృతిలో ఎక్కువ మంది దేవుళ్లకు, రాజులు, రంగప్పలకు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని లొట్టలు వేసుకుంటూ రంజుగా చెప్పుకుంటాం కదా. ఇక వర్తమానానికి వస్తే దేశమంతటా ముస్లింలకు, గోవాలో హిందువులు ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు. చిత్రం ఏమంటే అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?
2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లింల పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2015 -2060 మధó్య ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువ మంది పిల్లలను కంటారు. ఆ రెండు మతాల మధ్య 2055-60లో తేడా 60లక్షలు. ముస్లింలు 23.2 కోట్లు, క్రైస్తవులు 22.6కోట్లు అని, 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు హిందూమతానికి వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు. ఇదే కాలంలో మన దేశంలో హిందువుల సంఖ్య తగ్గనుందని అంచనా. 2050నాటికి ముస్లింలు ఇప్పుడున్న 14.4 నుంచి 18.4శాతానికి పెరుగుతారని అంచనా వేస్తున్నారు.ఇప్పుడున్న మాదిరి వారిలో కూడా కుటుంబనియంత్రణ వేగం పెరిగితే తగ్గనూ వచ్చు.

ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


భక్తుల నీరాజనాలు, విశ్వగురువు అంటూ ప్రశంసలు అందుకుంటున్న బిజెపి నేత నరేంద్రమోడీ ఏ క్షణాన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారో అది ఎలాంటి ముహూర్తమో తెలియదు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పేరు ఏదైతనేం గానీ ఇచ్చిన పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే మన జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దానికి అవరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు లేదా అక్కడ నైపుణ్య శిక్షణ పొందారు. పుంఖాను పుంఖాలుగా అవివేకం, కుహనావార్తల ఉత్పత్తి జరుగుతోంది, దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రోలు ధరలపై బిజెపి నేతల నోటి తుత్తర – సామాన్య జనానికి విషాదం !

22 Friday Oct 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, BJP motormouth, BJP u turn on Fuel prices, crude oil price, Fuel Price in India, Narendra Modi

ఎం కోటేశ్వరరావు


పెట్రోలు ధరలు లీటరుకు వంద రూపాయలు దాటగానే వచ్చిన విమర్శలను తట్టుకోలేని నరేంద్రమోడీ-బిజెపి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. వంద కాదు రెండు వందలైనా చెల్లిస్తాం, దేశం కోసం తప్ప నరేంద్రమోడీకి ఇస్తున్నారా అంటూ ఎదురుదాడులకు దిగారు. వారిలో ఏ దుష్ట క్షణంలో అలాంటి భావం కలిగిందో గానీ తధాస్తు దేవతలు వారి కోరికను తీర్చనున్నట్లు పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పీపా ధర త్వరలో వంద డాలర్లు కానుంది ఎవరైనా పందెం కాస్తారా అని సవాలు చేసే వారిని మరికొందరు పందెం రాయుళ్లు వందేంటి వచ్చే ఏడాది చివరికి రెండువందల డాలర్లు చూసుకుందామా అంటున్నారు.


శుక్రవారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.106.89, హైదరాబాదులో రు. 111.18 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రాసిన సమయానికి పీపా ముడి చమురు ధర 85.24 డాలర్లుంది. కొద్ది రోజుల క్రితం 86డాలర్లు దాటింది. పెరుగుతున్న ధరల గురించి ఏం చెప్పాలో తెలియక బిజెపి నేతలు నోటి తుత్తర వినోదం పండిస్తుంటే అది జనాలకు విషాదాన్ని నింపుతోంది. మద్దతు ఇచ్చిన మోజో లేక తగ్గకపోతాయా అన్న ఆశ, రోడ్లమీదకొస్తే నీకు దేశభక్తి లేదా, నువ్వు భారతీయుడివి కాదా ? వేయించుకున్న వాక్సినుకు డబ్బు ఇచ్చావా అని కాషాయదళాలు నిలదీస్తాయన్న భయం, ఏదైనా కావచ్చు, వినియోగదారుల నుంచి స్పందన లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలు అపహాస్యంగా మాట్లాడుతున్నా అది ప్రతిపక్ష నేతలను అనుకుంటున్నారు తప్ప తమను కూడా వెర్రివెంగళప్పలను చేస్తున్నారని అనుకోవటం లేదు. గుర్తించటం లేదు.


తాజాగా ఉపేంద్ర తివారీ అనే ఉత్తర ప్రదేశ్‌ మంత్రిగారు ” కార్లున్న కేవలం కొద్ది మందికి మాత్రమే పెట్రోలు అవసరం, 95శాతం మందికి అవసరం లేదు. వందకోట్ల కరోనా వాక్సిన్లు ఉచితంగా వేశారు.తలసరి ఆదాయంతో పోల్చితే పెట్రోలు ధరలు ఇప్పుడు చాలా తక్కువ.” అని చెప్పారు. గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గారేమన్నారంటే ” మన ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చమురు మీద వేసే పన్నుల నుంచే వస్తుంది. కరోనాను ఎదుర్కొనేందుకు మా మంత్రిత్వశాఖ నుంచి ఆరోగ్యశాఖకు నిధులు మళ్లించాము. మీరు గనుక హిమాలయ బ్రాండ్‌ మంచినీరు తాగాలంటే సీసాకు వంద రూపాయలు పెట్టాలి.” కర్ణాటక మంత్రి ఉమేష్‌ విశ్వనాధ్‌ కత్తి ఏం చెప్పారంటే ” కరోనాను కట్టడి చేయాలంటే ఖర్చు అవుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరం గనుక చమురు ధరలు పెరిగాయి.త్వరలో వీటిని పరిష్కరిస్తారు.” అన్నారు. మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌ ఏమని సెలవిచ్చారంటే ” కూరగాయల మార్కెట్‌కు పోవాలంటే సైకిలును ఉపయోగిస్తామా ? అలా చేస్తే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాలుష్యమూ ఉండదు. ధరలు ఎక్కువే కానీ దీని ద్వారా పేదలకు లబ్ది సమకూర్చేందుకు డబ్బులు వస్తాయి. మనకు దేశ ఆరోగ్య సేవలు ముఖ్యమా పెట్రోలు, డీజిలు ధరలు ముఖ్యమా ? ” అని ఎదురుదాడికి దిగారు. అదే రాష్ట్రానికి చెందిన మరొక మంత్రి ఓమ్‌ ప్రకాష్‌ సక్లేచా జనాన్ని వెర్రివెంగళప్పలను ఎలా చేశారో చూడండి.” కష్టాలు వచ్చినపుడే మంచి రోజుల్లో ఉన్న సంతోషం ఏమిటో మీరు గుర్తిస్తారు, ఇబ్బందుల్లేవనుకోండి మీరు సంతోషాన్ని అనుభవించలేరు. ” అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చమురు రేట్లు తక్కువంట అక్కడకు వెళ్లండి అన్న పెద్ద మనుషుల గురించి తెలిసిందే, ఇలాంటి వారు మీకు రోజూ చాలా మంది తగులుతూనే ఉంటారు.


గతేడాది ఏప్రిల్‌ 22న పీపా ముడిచమురు 16డాలర్లకు తగ్గింది. మనకు పైసా కూడా తగ్గించలేదు. ఇప్పుడు ఒక డాలరు పెరిగినా తెల్లవారే సరికి పెంచేస్తున్నారు. 2019-20లో మన దేశం దిగుమతి చేసుకున్న చమురు విలువ 130బి.డాలర్లు, మరుసటి ఏడాది కరోనా కారణంగా 82.4 బి.డాలర్లకు తగ్గింది. వర్తమాన సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే బిల్లు 70.5బి. డాలర్లుగా ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మిగిలిన ఆరునెలల్లో ఏమేరకు పెరుగుతుందో తెలియదు. ఎంత పెరిగితే అంత మన జేబుల నుంచి తీసుకుంటారు, పన్ను తగ్గించరు, పైసా సబ్సిడీ ఇవ్వరు. గతంలో రుపాయి విలువ పడిపోతే మన్మోహన్‌ సింగ్‌ అసమర్దత అని బిజెపి నేతలు సెలవిచ్చారు. గత ఏడు సంవత్సరాల్లో 58 నుంచి 75కు పతనమైంది. ఇది మోడీగారి సామర్ధ్యానికి నిదర్శనం, దేశం కోసమే అని మనం అంగీకరించాలి. ఇది కూడా చమురు ధరలను పెంచుతోంది. 2020 జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో మన చమురు దిగుమతి బిల్లు 8.5బి.డాలర్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 24.7 బి.డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని జనం నుంచి పిండారు. ఈ కారణంగా ధరల పెరుగుదలతో మరెంత భారం పెరిగిందో లెక్కలు లేవు. పీపా ధర పది డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం ప్రాతిపదిక సూచి పది పెరుగుతుంది.


బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 2018లో 85 డాలర్లు ఉంది. ఇప్పుడు దాన్ని దాటింది. ఏడాది క్రితం దీనిలో సగం ధర ఉంది. దానికి ఒకటి రెండు డాలర్లు తక్కువగా మనం వాడే చమురు ధర ఉంటుంది. సహజంగా ఆర్ధిక రంగం కోలుకుంటే సంతోషంగా ఉంటుంది, కానీ పెరుగుతున్న చమురు ధరలను చూస్తుంటే భయమేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో పరిస్ధితి ఎలా ఉందంటే ముందస్తు ఒప్పందం ప్రకారం చమురు తీసుకొనేందుకు కంపెనీలు తిరస్కరించాయి, సరఫరాదార్లకు ఎదురు డబ్బిచ్చి చమురొద్దురా బాబూ నిలవకు జాగా లేదు అన్నాయి. ఇప్పుడు దానికి విరుద్దంగా ఎక్కడ చూసినా ఖాళీ టాంకులే ఉన్నాయట. అంతకు ముందుతో పోలిస్తే నాలుగోవంతు మాత్రమే ఉందట.ఐరోపాలో కూడా నిల్వలు తగ్గాయి. చమురు ధరల పెరుగుదలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 95డాలర్లకు పెరగవచ్చని జెపిమోర్గాన్‌ సంస్ధ జోశ్యం చెప్పింది.


కొందరి అంచనాల ప్రకారం ప్రస్తుతం 83 డాలర్లకు పైగా ఉన్న అమెరికన్‌ రకం ముడి చమురు డిసెంబరు నాటికి వంద డాలర్లకు, వచ్చే ఏడాది డిసెంబరుకు 200 డాలర్లకు చేరవచ్చని చెబుతున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఈ మేరకు బ్రెంట్‌ రకం 200 డాలర్లకు కాల్‌ ఆప్షన్‌ లావాదేవీలు జరిగాయి.2022 డిసెంబరులో 200 డాలర్లు ఉంటుందని ఒకరు పది పీపాల మీద రెండు డాలర్ల చొప్పున 20డాలర్ల ప్రీమియం చెల్లించాడనుకుందాం. గడువు నాటికి చమురు ధర అంతకంటే తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని కోల్పోతాడు. లేదు 210 డాలర్లకు పెరిగిందనుకోండి. ఒక్కొక్క పీపాకు ప్రీమియం పోను ఎనిమిది డాలర్లు అతనికి లాభం వస్తుంది. ఇలా ఎన్ని పీపాల మీద పందెం కాస్తే నష్టం లేదా లాభం దాన్ని బట్టి ఉంటుంది. అమెరికా, ఐరోపాల్లో ఉన్న స్ధితి, ఆర్ధిక రంగం కోలుకుంటున్నది కనుక డిమాండ్‌ పెరిగి చమురు ధరలు పెరుగుతాయనే అంచనాలు దీన్ని సూచిస్తున్నాయి. ఇదొక జూదం, దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు గానీ విస్మరించకూడదు. అమెరికా ముడిచమురు వచ్చే ఫిబ్రవరిలో వంద డాలర్లకు చేరనుందని పందాలు పెరుగుతున్నాయి. 95 నుంచి 180 డాలర్ల వరకు రకరకాల పందాలను కాస్తున్నారు. పెట్రోలు, డీజిలును వాడేది కార్ల యజమానులు మాత్రమే కాదని, వివిధ పరిశ్రమలు కూడా వాడతాయని తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయని బిజెపి మంత్రులకు ఎవరు చెప్పాలి ? కరోనాతో నిమిత్తం లేకుండానే పన్నులు పెంచారని బిజెపి నేతలకు ఎలా చెప్పాలో జనానికే వదిలేద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా – భూటాన్‌ ఒప్పందం ఓ కీలక మలుపు !

20 Wednesday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bhutan and China, BJP, Doklam tri-junction, India-China standoff, Narendra Modi

ఎం కోటేశ్వరరావు


కేవలం ఎనిమిది లక్షలలోపు జనాభా ఉన్న భూటాన్‌తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనా ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. చైనా-భూటన్‌ – భారత్‌ త్రికోణ కూడలికి దగ్గరలో నాలుగు సంవత్సరాల నాడు తీవ్ర వివాదంగా మారిన డోక్లాం ప్రాంతం ఉంది. అది ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ భూటన్‌ తనదిగా చెబుతోంది. దానితో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఆ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు, ఇతర నిర్మాణాలు చేసేందుకు 2017లో చైనా ప్రయత్నించినపుడు మన సైన్యాలు అడ్డుకున్నాయి. డెబ్బైమూడు రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. రోడ్డు నిర్మాణాన్ని చైనా నిలిపివేసిన తరువాత సద్దుమణగింది. వేస్తున్న రోడ్డును ఆపివేసింది తప్ప చైనా ఆప్రాంతంలోనే అప్పటి నుంచీ కొనసాగుతోంది.సిక్కిం వైపు నుంచి నిర్ధారిత సరిహద్దు నుంచి 2017జూన్‌ 18న భారత సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించి అతిక్రమణకు పాల్పడిందని అప్పుడు చైనా విమర్శించింది. మూడు దశలుగా లేదా మూడంచెలలో వివాదాలను పరిష్కరించుకొని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్నది ఒప్పందం, వివరాలు వెల్లడి కాలేదు.


రెండు దేశాల మధ్య 1984 నుంచీ చర్చలు జరుగుతున్నాయి, 24 సార్లు కూర్చున్నా పరిష్కారం కాలేదు.2017లో డోక్లాం ఉదంతం తరువాత అవి కూడా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో పదవసారి జరిగిన నిపుణుల సమావేశం తరువాత తాజా ఒప్పందం కుదిరింది. దీని గురించి ఎవరికి వారు తమ ప్రయోజనాలు, భాష్యాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం గురించి ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదని, ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే అనే అభిప్రాయంవెల్లడించిన వారు కొందరు. నిజానికి దీనికి 2010లోనే పునాది పడింది. వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలను భౌతికంగా పరిశీలించాలని నిర్ణయించారు, ఆ మేరకు 2015నాటికి దాన్ని పూర్తి చేశారు.వివాదం ఉన్న వాటిలో డోక్లాంను తమకు అప్పగిస్తే దానికి బదులు ఇతర ప్రాంతాల మీద హక్కును వదులుకుంటామని చైనా చెబుతోంది. భూటాన్‌ మొత్తం విస్తీర్ణం 38వేల చదరపు కిలోమీటర్లు, నాలుగు వందల కిలోమీటర్ల మేరకు చైనాతో సరిహద్దును కలిగి ఉంది. రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం 765 చదరపు కిలోమీటర్లు. ఈ ఒప్పందాన్ని వీడియో సమావేశంలో చేసుకున్నారు.


త్రికోణ కూడలి ఇటు మన దేశానికి చైనాకు ప్రాధాన్యత కలిగినవే. మన ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం కూతవేటు దూరంలో ఉంది. పరస్పరం అనుమానాలు ఉన్నందున డోక్లాం చైనాలో ఆధీనంలో ఉండేందుకు మన దేశం అంగీకరించటం లేదు. భూటాన్‌ విషయానికి వస్తే అటు చైనా ఇటు మన దేశంతో దానికి భద్రతాపరమైన ముప్పు ఉందని భావించటం లేదు. మనదేశం-భూటాన్‌ మధ్య ఒక చిత్రమైన ఒప్పందం ఉంది. తరువాత అది అనేక మార్పులకు లోనైంది. ఆ ఒప్పందం ప్రకారం భూటాన్‌ మన రక్షిత ప్రాంతమని మన దేశం భావించింది.


1949 ఆగస్టు 8న కుదిరిన స్నేహ ఒప్పందం ప్రకారం అంతర్గత వ్యవహారాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. అయితే విదేశీ, రక్షణ విషయాలలో పరస్పరం సంప్రదించుకోవాలి, మన దేశం భూటాన్‌కు మార్గదర్శనం చేయాలి. భూటాన్‌ స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించవచ్చుకనుక కొందరు దీన్ని రక్షణ కల్పించే దేశం తప్ప రక్షణలో ఉండేది (అలాంటి దేశాలను అన్నివిధాలుగా నియంత్రిస్తారు) కాదని చెప్పారు.1958లో నాటి ప్రధాని నెహ్రూ భూటాన్‌ సందర్శించిన తరువాత పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ భూటాన్‌ మీద ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే అది భారత్‌ మీద జరిపినట్లే పరిగణిస్తామని ప్రకటించారు. నాడు వేరేదేశంగా ఉన్న సిక్కిం, భూటాన్‌లను చైనా ఆక్రమించనుందనే పుకార్లు (సిక్కింలో తిష్టవేసేందుకు అమెరికా సిఐఏ అల్లిన కట్టుకథలు )వచ్చినపుడు 1959లో పార్లమెంటులో ప్రకటన చేస్తూ భూటన్‌ రక్షణ బాధ్యత భారత్‌ వహిస్తుందని నెహ్రూ ప్రకటించారు. దాన్ని నాటి భూటాన్‌ ప్రధాని ఖండిస్తూ తమది భారత రక్షిత దేశం కాదని ఒప్పందంలో అలాంటి అంశం లేదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ భారత్‌ – భూటాన్‌ సరిహద్దు వివాదాలు 1973-84 కాలంలోనే పరిష్కారమయ్యాయి.

తమ సార్వభౌమత్వం పెంపుదలకు ఒప్పందంలోని కొన్ని అంశాలను తిరిగి రాసుకోవాలని 1970లోనే భూటాన్‌ కోరింది. దానిలో భాగంగానే మన ప్రమేయం లేకుండానే 1971లో అది ఐక్యరాజ్య సమితిలో చేరింది. బంగ్లాదేశ్‌ విముక్తిని గుర్తించి మరుసటి ఏడాది ఒక ఒప్పందం చేసుకుంది. అలీన కూటమిలో చేరింది. కంపూచియా ఖేర్మరోగ్‌ సంస్ధను ఐరాసలో ప్రతినిధిగా గుర్తించాలా లేదా అన్న అంశంపై కొన్ని ఆ ప్రాంత దేశాలు, భారత వైఖరికి భిన్నంగా చైనాతో కలసి అనుకూలంగా ఓటు వేసింది.2007లో 1949నాటి ఒప్పందాన్ని నవీకరించారు. అంతకు ముందు భూటాన్‌ సరిహద్దు సార్వభౌమత్వం గురించిన విదేశాంగ విధానంలో భారత మార్గదర్శనం చేయాలని ఉన్న అంశాన్ని తొలగించారు. ఆయుధ దిగుమతులకు కూడా భారత అనుమతి అవసరం లేదని సవరించారు. ఒప్పందంలో ఈ మార్పులు జరిగినప్పటికీ మన దేశం మీద భూటాన్‌ అనేక అంశాలలో ఆధారపడటం వంటి కారణాలతో ప్రభావితమైంది. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణ సమయం భూటాన్‌ వినతి మేరకు తాము దాని భూభాగాన్ని రక్షించేందుకు వచ్చినట్లు ప్రకటించి మన మిలిటరీని అక్కడకు పంపారు.అయితే భూటాన్‌ ఆ సమయంలో మౌనం పాటించింది. భూటాన్‌ కోరితేనా లేక మనమంతట మనమే మిలిటరీని పంపామా అన్నది ఇప్పటికీ చిక్కుముడే.


సరిహద్దులతో సహా భూటాన్‌ పూర్తి సార్వభౌమత్వ దేశంగా ఉన్నట్లు చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంతో మన దేశానికి, ప్రపంచానికి స్పష్టం చేసింది. ఈ కారణంగానే కావచ్చు లేదా వివరాలు పూర్తిగా వెల్లడి కానందున గానీ మన దేశం జాగ్రత్తగా స్పందించింది. 1997లో ఇచ్చి పుచ్చుకొనే ప్రాతిపదికన చైనా చేసిన ప్రతిపాదనకు భూటాన్‌ అంగీకరించకపోవటానికి మన దేశం తెచ్చిన వత్తిడే అని చైనా చెబుతోంది. డోక్లాం ప్రాంతం ఉన్న చుంబీ లోయ చైనా ఆధీనంలోకి వెళితే భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే సిక్కిం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం మీద సులభంగా దాడి చేయటానికి వీలు కలగటమే గాక ఈశాన్య ప్రాంతంతో సంబంధాలు తెగిపోతాయన్నది మన దేశ భయం. మన దేశం నుంచి తమ టిబెట్‌కూ అలాంటి ముప్పు ఉంటుందని చైనా చెబుతోంది.


రెండు దేశాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ అది సజావుగా ముందుకు పోతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒప్పందం గురించి మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పందిస్తూ అవగాహన కుదిరినట్లు గమనించాము, 1984 నుంచి రెండు దేశాలూ సరిహద్దు గురించి సంప్రదింపులు జరుపుతున్నాయి.మనమూ చైనాతో సంప్రదింపుల్లోనే ఉన్నాం అని క్లుప్తంగా స్పందించారు. భారత్‌కు తెలియచేయ కుండా భూటాన్‌ ఒప్పందం చేసుకుందా అన్న ప్రశ్నకు బాగ్చీ స్పందించలేదు. తమ సరిహద్దు చర్చలకు ఇది నూతన ఉత్సాహాన్నిస్తుందని, విజయవంతంగా ముగుస్తుందనే ఆశాభావాన్ని భూటాన్‌ వ్యక్తం చేసింది. ఒప్పందం భారత్‌కు అవమానమని, తమ దేశానికి విజయం అని చైనా పత్రికలు వర్ణించాయి.చైనాను నిలువరించాలని, సరిహద్దు వివాదాలను ఆయుధమయం కావించాలని చూస్తున్న నరేంద్రమోడీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అని చైనా టీవీ సిజిటిఎన్‌ పేర్కొన్నది.


భూటాన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకోకుండా మనదేశం నిలువరించిందనే విమర్శలను చైనా చేసింది. గతంలో భూటాన్‌ తరఫున సరిహద్దు సమస్యను తమతో చర్చించాలని భారత్‌ ప్రతిపాదించిందని అది విఫలం కావటంతో భూటాన్‌ మీద వత్తిడి తెచ్చినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది ఇప్పుడు రెండు సార్వభౌమ దేశాల మధ్యజరిగిన ఒప్పందం గురించి వేలెత్తి చూపితే బలహీన, చిన్న దేశ సార్వభౌమత్వాన్ని భారత్‌ దెబ్బతీస్తున్నదని ప్రపంచంలో రుజువు అవుతుందని, అందువలనఒప్పందం గురించి భారత్‌ ఒక ప్రకటన చేస్తుందని భావించటం లేదని కూడా పేర్కొన్నది. బహిరంగంగా ఏమీ చెప్పలేదు కనుక అంతర్గతంగా భూటాన్‌ మీద వత్తిడి లేదా ఏం చేయాలో చెప్పేందుకు ప్రయత్నిస్తుందని రాసింది.


ఈ ఒప్పందానికి భూటాన్‌ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృత అవకాశం లేదు.వర్తమాన ప్రపంచ రాజకీయ పరిణామాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది చైనా. వాటిలో మన దేశంతో సహా అనేక దేశాలతో చరిత్ర సృష్టించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వివాదాన్ని చైనా పరిష్కరించుకొనే దిశలో ఉంది. ఆ క్రమంలో ఇదొక కీలక అడుగు. నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఒక్క భూటాన్‌తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అయితే భూటన్‌కు ఐరాస భద్రతా మండలిలోని ఏ ఒక్క శాశ్వత సభ్యదేశంతో కూడా సంబంధాలు లేవు. ఇదొక విచిత్రమైన స్ధితి. ఈ ఒప్పందంతో చైనాతో సంబంధాలు ఏర్పడితే పెనుమార్పులేమీ సంభవించవుగానీ అమెరికా దాని కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంబానీ, అదానీలకు సంపదలు- అభాగ్యులకు అప్పుల తిప్పలు !

18 Monday Oct 2021

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Ambani and Adani, billionaires, India extreme inequality, Richest Indians


ఎం కోటేశ్వరరావు


ముకేష్‌ అంబానీ తరువాత అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీ త్వరలో అంబానీ స్ధానాన్ని ఆక్రమించనున్నారా ? పేదలు,మధ్యతరగతి మరింతగా దిగజారనున్నారా ? తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ? ప్రస్తుతం అంబానీ రోజువారీ సంపాదన 163 కోట్లు కాగా అదానీ రాబడి 1002 కోట్లు మరి. అంబానీ ఆస్తి 7,18,000 కోట్లు కాగా అదానీ దగ్గర 5,05,000 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపద పెరుగుదల తొమ్మిది శాతం కాగా అదానీకి 261శాతం అంటే నోరెళ్లపెట్టకండి. ఇదే సమయంలో ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌.కాం అనే వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం దేశంలో కనీసవేతనం గత ఐదు సంవత్సరాలుగా పెరగలేదు. మన్మోహన్‌ సింగ్‌ దుర్దినాలలో 2011-13లో రోజుకు రు. 115 కాగా మోడీ గారీ అచ్చేదిన్‌ ప్రారంభంలో 2014లో రు.137, తరువాత రెండు సంవత్సరాలు రు.160, గత ఐదు సంవత్సరాలుగా రు.176 ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సగటు రోజు వారీ వేతనం రు.372.33కు, 2022లో రు.397, 2023నాటికి రు.419కి పెరగవచ్చని ఎకనోమెట్రిక్‌ పద్దతిలో అంచనా వేసింది. అంబానీ, అదానీల ఒకేడాది పెరుగుదలకు, అభాగ్యుల ఎనిమిదేండ్ల పెరుగుదలకు ఎంత తేడా ? అచ్చేదిన్‌ ఎవరికి చచ్చేరోజులు ఎవరికి ?


పురుషులందు పుణ్య పురుషులు వేరు (మహిళలకూ ఇదే వర్తిస్తుంది) అన్నట్లుగా పరిశోధకులందు జనపరిశోధకులు ధనశోధకులు వేరు అని నోబెల్‌ బహుమతుల ప్రకటన వెల్లడించింది. ఎందుకంటే ఆ రాణీ ప్రేమపురాణం, ఈ కైఫీయత్‌కైన ఖర్చుల గురించి గాక కార్మికుల కనీసవేతనాలు, ఉపాధి గురించి పరిశోధన గురించి ఈ రోజుల్లో ఎవరుంటారు ! ఆ అంశాన్ని ఎంచుకున్న ముగ్గురు ఉత్తమ పరిశోధకులకు నోబెల్‌ బహుమతి రావటం చిన్న విషయం కాదు కదా ! గుయిడో ఇంబెన్స్‌, జాషువా ఆగెస్‌, డేవిడ్‌ కార్డ్‌ ముగ్గురికీ కలిపి బహుమతి ఇచ్చారు. కార్మిక మార్కెట్‌ మీద కనీసవేతనాలు, విద్య, వలసల ప్రభావం ఎలా ఉంటుందనే అంశపై పరిశోధన జరిపారు.కనీసవేతనాలు పెంచితే కుర్ర కార్మికులు, నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని చేసిన సూత్రీకరణలు తప్పని నిరూపించారు.వేతనాలు పెంచితే కార్మిక లభ్యత పెరుగుతుందని కూడా తేల్చారు. అన్నింటికీ మించి వేతనాలు పెంచితే కంపెనీ లాభాలు తగ్గుతాయన్నది వాస్తవం కాదని ఆమేరకు వస్తు ధరలు పెంచుతారని వెల్లడించారు. మరి కేంద్ర ప్రభుత్వం లేదా మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి పాలకులు ఎవరికోసం కనీసవేతనాలను సంవత్సరాల తరబడి పెంచకుండా ఉన్నట్లు ? సంపద పంపిణీలో అసమానతలను పెంచే చర్య కాదా ఇది.


గౌతమ్‌ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రు.1.04 నుంచి ఏకంగా రు.5.05లక్షల కోట్లకు ఎదిగింది. ఇదంతా కష్టపడితే పెరిగిందేనా ? సాధారణ కార్మికుడి కంటే అదనంగా రోజుకు ఎన్ని గంటలు శ్రమపడి ఉంటారు ? ఇక్కడ కొంత మందికి సంపద పెరిగిందని ఏడవటం కాదు, ఎందరికో ఎందుకు పెరగటం లేదు అన్న ఆవేదనతో ఈ ప్రశ్న.కరోనా కాలంలో కొందరి సంపదలు పెరిగితే ఎందరో దిగజారారు ఎందుకని ? ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021 వెల్లడించిన వివరాల మేరకు ఏడాది కాలంలో కేవలం అదానీ మాత్రమే ఒక లక్ష విలువగల కంపెనీలు ఐదింటిని ఏర్పాటు చేశారు. సోదరుడు వినోద్‌ శాంతిలాల్‌ అదానీ కూడా లక్ష కోట్ల సంపదదాటిని పది మందిలో ఎనిమిదవ స్దానంలో ఉన్నారు. అతగాడి రోజు వారీ సంపాదన రు.245 కోట్లు. ఏడాది కాలంలో ఏకంగా పన్నెండు స్ధానాలు ఎగబాకి రు.1.31లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. ఏడాది కాలంలో ఎవరెవరి సంపాదన ఎలా పెరిగిందో పట్టికలో చూడవచ్చు.


కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయిన వారెందరో అయితే బతికి ఆస్తులు అమ్ముకొని అప్పులపాలైన వారు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలోనే 58 మంది బిలియనీర్లు పెరిగి 237కు చేరారు. ధనవంతుల జాబితాలో 179 మంది చేరి 1,007కు పెరిగారు, 894 మంది సంపదలు పెరిగితే 113 మందికి తగ్గాయట. పాపం కదా ! ఇక ధనికులు విపరీతంగా పెరిగిన రంగాలను చూస్తే ఫార్మాలో 130 మంది, పెట్రోకెమికల్స్‌లో 98 మంది ఉన్నారు. మహమ్మారులు సామాన్య జనం ప్రాణాలు తీస్తే ఔషధ కంపెనీలకు లాభాలను సమకూర్చుతాయని కరోనా నిరూపించింది. ఈ కంపెనీలకు గతేడాది రు.3,45,900 కోట్లు అదనంగా వచ్చిందట.ఇండియా రేటింగ్‌ సంస్ధ విశ్లేషణ ప్రకారం రెండువేల ఆర్ధికేతర కార్పొరేట్‌లలో వేతనాల గురించి విశ్లేషించగా 60శాతం కంపెనీల్లో గతేడాది సెప్టెంబరు, డిసెంబరు త్రైమాసికాల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిబ్బంది ఖర్చు తగ్గించారు. అంటే కుటుంబాలకు ఉపాధి, ఆదాయం తగ్గింది.పోయినవి తిరిగి వచ్చే అవకాశం లేదని ఆ సంస్ద పేర్కొన్నది. అసలే తక్కువ ఆదాయం ఆపై కరోనా కాటుతో అనేక కుటుంబాలు అంతకు ముందు చేసుకున్న పొదుపు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనం బికారులు కావటానికి అదానీ, అంబానీల సంపద మరింత పెరగటానికి కారణాలను కూడా రేటింగ్‌ సంస్ద పేర్కొన్నది. పరోక్ష పన్నులు జనం మీద పెరగ్గా కార్పొరేట్లకు పన్ను తగ్గింది. 2010లో గృహస్తుల మీద పన్ను 60శాతం ఉంటే ఇప్పుడు అది 75కు పెరిగింది. ఇదే కాలంలో కార్పొరేట్‌ పన్ను తగ్గింది. అంతకు ముందు పెంచినదిగాక 2020 మార్చి-మే మాసాల మధ్య పెట్రోలు మీద రు.13, డీజిలుపై రు.16లను కేంద్రం పెంచింది. ఈ కాలంలో పీపాధర 28 డాలర్లు ఉండగా జనానికి తగ్గిందేమీ లేదు, పెరిగిన తరువాత ఆమేరకు జనం నుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ కొత్త రికార్డు నెలకొంటోంది. ఇది కుటుంబాల జేబులను గుల్ల చేస్తోంది. పోనీ అంతకు ముందు నిజవేతనాలు పెరిగాయా అంటే….ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం 2015లో 2.8, 2016లో 2.6, 2017, 18లో 2.5శాతాల చొప్పున పెరిగాయి.తరువాత తగ్గాయి.కనీసవేతనం రు.176 కాగా వివిధ రాష్ట్రాల వేతనాలను విశ్లేషించినపుడు మధ్యగత వేతనం రు.269 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చినెలలో పార్లమెంట్‌లో తెలిపింది. వేతన కోడ్‌ 2019 ప్రకారం ఐదేండ్లలోపు కనీసవేతనాలను సవరించాలని నిర్దేశించటమే గొప్పఅన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.


ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో గత ఏడు సంవత్సరాల్లో ఆదాయాలు పెరిగాయా తరిగాయా అంటే పెరిగినట్లు చిత్రిస్తున్నారు.నిజం ఏమిటి ? లెక్కలతో తికమక చేస్తున్నారు. నిఖర ఆదాయం బదులు చెల్లించిన మొత్తాలనే పరిగణనలోకి తీసుకున్నారనే విమర్శ ఉంది. రికార్డు స్ధాయిలో పంటలు పండితే అది రైతాంగానికి ఆదాయం లేదా సంపద అన్నట్లు చిత్రిస్తున్నారు, గందరగోళపరుస్తున్నారు.పరిస్ధితి మదింపు సర్వే ప్రకారం 2018-19 సంవత్సరంలోసేకరించిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 కాలంలో కుటుంబంలో ఒకరు ఏడాది పాటు పొలంలో పని చేస్తే పంటల ద్వారా రు.4000కు మించి ఆదాయం వస్తే వ్యవసాయ కుటుంబంగా పరిగణిస్తారని ఎన్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది.నాబార్డు సర్వే 2016-17లో ఆ మొత్త రు.5,000లుగా చెప్పారు. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి ? అది తేలేది కాదు వదిలేద్దాం. ప్రభుత్వలెక్కల ప్రకారం పైన పేర్కొన్న సంవత్సరాలలో వచ్చిన ఆదాయాల మార్పు తీరుతెన్నులను చూద్దాం.ఆదాయం రూపాయలు.


వనరు×××××××× 2012-13××××2018-19××××× తేడా శాతం××××35.3శాతం ద్రవ్యోల్బణంతో తేడా
వేతన ఆదాయం××× 2,071 ××× 4,063 ××××× 96.2 ×××× 60.9
పంట ఆదాయం××× 3,081 ××× 3,798 ××××× 23.3 ×××× -12
పశుపోషణఆదాయం× 763 ××× 1,582 ××××× 107.3 ×××× 72
ఇతర ఆదాయం××× 512 ××× 641 ××××× 25.2 ×××× -10.1
మొత్తం ఆదాయం××× 6,427 ××× 10,084 ××××× 56.9 ×××× 21.6
రైతు కుటుంబానికి పంట నిజ ఆదాయం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు తగ్గింది. మిగతా పశు, ఇతరంగా లేకుండా కేవలం పంటల మీదనే ఆధారపడితే నష్టం తప్ప లాభం లేదు. మొత్తంగా తీసుకున్నప్పటికీ పెరుగుదల పెద్దగా లేదన్నది స్పష్టం.గ్రామీణ సంక్షోభంలో ఇదొక ప్రధాన అంశం. ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఖర్చుల పెరుగుదలను విస్మరిస్తే కుదరదు కదా, అందువలన నిఖర ఆదాయం ఎంతో తేలితే అసలు బండారం బయట పడుతుంది. సర్వే జరిగిన సంవత్సరం పంటల పరిస్ధితి మెరుగ్గా ఉండవచ్చు లేదా దిగజారి కూడా ఉండవచ్చు. అందువలన ఒక ఏడాది ప్రమాణం సరైన నిర్ధారణ ఇవ్వదు.


కరోనా కల్లోలంలో ఉపాధికి దెబ్బ చెప్పుకోలేనిది, సమగ్ర సమాచారం లేదు. అసలు వలస కార్మికులెంత మందో తెలియని వాస్తవాన్ని కరోనా బయట పెట్టింది. ఉపాధి నష్టం అంచనాలు తప్ప నిర్దిష్టత లేదు.2020-21లో ఆర్ధిక వృద్ది 7.3శాతం లోటు అన్న లెక్కలను కూడా అనేక మంది అంగీకరించటం లేదు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చన్నది అభిప్రాయం. అమెరికాలోని పూ పరిశోధనా సంస్ధ అంచనామేరకు 3.2కోట్ల మంది మధ్యతరగతి జనాలు ఆ వర్గీకరణ నుంచి దిగజారిపోయారు.ప్రపంచంలో వంద మంది పరిస్ధితి అలా దిగజారిందని అనుకుంటే మన వాటా 60 అని చెప్పిందంటే పరిస్ధితి ఎంతదారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే అసలు మధ్య తరగతి ఎందరనేది మౌలిక ప్రశ్న.మన దేశంలో పేదరికానికి తప్ప దీనికి నిర్ధిష్ట ప్రమాణం లేదు. బ్రూకింగ్‌ సంస్ధకు చెందిన హౌమీ ఖరాస్‌ నిర్వచనం ప్రకారం 2011లో 11-110 డాలర్ల మధ్య (రు. 171-1714)ఆదాయం ఉన్న 38 కోట్ల మంది 2015-22లో మధ్యతరగతిలోకి ప్రవేశిస్తారని 2019లో చెప్పాడు. ఎన్‌సిఏఆర్‌ చెప్పిందాని ప్రకారం రెండు నుంచి పదిలక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి అని అలాంటి వారు 2010లో 15.3 కోట్ల మందని చెప్పింది.2012లో అమెరికా సంస్ద గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ పదికోట్లని చెప్పింది.2009-10లో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం పది కోట్లు, గత దశాబ్దిలో వివిధ సర్వేల ప్రకారం ఏడు నుంచి 60 కోట్ల మంది మధ్య ఉన్నట్లు అంచనా వేశారు.కొన్ని సర్వేలు వినిమయాన్ని బట్టి అంచనా వేశాయి. అధికారికంగా వెల్లడించని, అనధికారికంగా బయటకు వచ్చిన ఎన్‌ఎస్‌ఓ వివరాల ప్రకారం తగినంత ఉపాధి లేక గడచిన నాలుగుదశాబ్దాలలో తొలిసారిగా 2017-18లో వినిమయం తగ్గిపోయింది.2015 నుంచి పట్టణ మధ్య తరగతి తగ్గిపోగా గ్రామీణ మధ్యతరగతి గిడసబారిపోయింది. కొందరి విశ్లేషణ ప్రకారం మన దేశ మధ్యతరగతి స్దితి ధనికులకంటే పేదలకు దగ్గరగా ఉంటుంది. కరోనా కాలంలో 23 కోట్ల మంది కనీసవేతన పరిధిలోకి దిగజారినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.


అలాంటి వారి పొదుపు మొత్తాలు, బ్యాంకు డిపాజిట్లు కరోనా సమయంలో ఆవిరయ్యాయి.2020 జూలై ాసెప్టెంబరుమధ్య గృహస్తుల బ్యాంకు డిపాజిట్లు జిడిపిలో 7.7శాతం ఉండగా అక్టోబరు-డిసెంబరు నాటికి మూడు శాతానికి తగ్గాయని ఆర్‌బిఐ నివేదిక చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు సంపద అసమానతలను మరింతగా పెంచేందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. ప్రభుత్వ బాండ్లు, రుణ పత్రాల కొనుగోలు, 5.3లక్షల కోట్ల నగదును ద్రవ్య వ్యవస్దలోకి విడుదల చేశారు. ఈ మొత్తం నిజమైన ఆర్ధికరంగం బదులు స్టాక్‌మార్కెట్‌కు ఎక్కువ భాగం వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక రంగం తిరోగమించినా, పునరుద్దరణతో నిమిత్తం లేకుండా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డులను బద్దలు కొట్టటమే దానికి నిదర్శనం. దీని గురించి ఆర్‌బిఐ ఆందోళన కూడా తెలిపింది. గృహస్తుల సంపద కరిగిపోగా కంపెనీల ఆస్తులు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన చౌకవడ్డీ రుణాలతో అంతకు ముందు అధికవడ్డీలకు తెచ్చిన రుణాలను తీర్చాయి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టలేదని చెబుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది.


దేశంలో పదిశాతంగా ఉన్న ధనికుల కొనుగోలు శక్తి పెరిగితే స్టాక్‌మార్కెట్‌, విలాసవస్తువుల మార్కెట్‌, బంగారం, వజ్రాల దిగుమతి మరింతగా పెరుగుతుంది తప్ప ఉపాధి పెరగదు.మధ్య తరగతి మరింతగా తగ్గిపోతుంది, పేదరికం, దారిద్య్రం పెరుగుతుంది. అదే 90శాతంగా ఉన్నవారి శక్తి పెరిగితే నిత్యావసర వస్తు గిరాకీ పెరిగి పరిశ్రమలు, వాణిజ్యంతో ఉద్యోగాలు పెరుగుతాయి.సంస్కరణలు ప్రారంభమైన మూడు దశాబ్దాలలో అసమానతలు మన దేశంలో మరింతగా పెరిగాయి.కరోనా వాటిని మరింత పెంచింది. ఒకశాతంగా ఉన్న ధనికుల సంపద 1990లో జాతీయ ఆదాయంలో 11శాతం ఉంటే 2019నాటికి 21కి పెరిగింది.ప్రపంచంలో 64దేశాల తీరుతెన్నులను పరిశీలించగా కరోనా కాలంలో ధనికుల ఆదాయాలు మరింతగా పెరగ్గా ఇతరులవి తగ్గాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు తగ్గినట్లు వేరే చెప్పనవసరం లేదు. ఏడునెలల తరువాత 2020 అక్టోబరులో లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో ఉన్న ఆదాయాలు కంటే 15-20శాతం తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే సమాచారం అసమగ్రంగా ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో విస్వసనీయత కోల్పోయింది. సిఎంఐఇ 2020మే నెల అంచనా ప్రకారం అంతకు ముందు నెలలో 12.2కోట్ల ఉద్యోగాలు పోయాయి. అధికారిక అంచనాల ప్రకారం పదిహేనేండ్ల వయసుపైబడిన ఉద్యోగార్ధులు 2020 జనవరి-మార్చినెలల్లో దేశంలో 18.2కోట్ల మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో 7కోట్ల మంది కార్మికశక్తి నుంచి తగ్గారు.ఉద్యోగార్ధులలో మహిళలు 4కోట్ల మందే ఉన్నా, ఉపాధి నుంచి తగ్గిన ఏడు కోట్లలో మూడు కోట్లు ఉన్నారంటే వారి మీద ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరికొన్ని గణాంకాల ప్రకారం 2020 జనవరి-మార్చి నెలల్లో 16.6 కోట్ల మంది పని చేస్తుండగా తరువాత మూడు నెలల్లో వారి సంఖ్య 2.6కోట్లకు తగ్గింది. రోజువారీ కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.కోటీ 90లక్షల మందిలో 90లక్షల మందికి ఉపాధి పోయింది. నెలవారీ వేతనం ఉన్నవారు కోటి మంది తగ్గితే స్వయ ఉపాధి కలిగిన వారు 60లక్షల మందికి ఉపాధి పోయింది.

కరోనా ప్రభావం గురించి అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఆదాయాల కంటే అప్పులు ఆరు రెట్లు ఎక్కువ చేశారని తేలింది. దిగువ 25శాతం జనాభాలో పేద కుటుంబాల అప్పులు నాలుగు రెట్లు, ధనికుల అప్పు 1.4రెట్లు మాత్రమే పెరిగాయి. రానున్న రోజుల్లో అసమానతలను పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.సిఎంఐఇ విశ్లేషణ ప్రకారం 2020చివరి నాటికి ఉపాధి కరోనా ముందు స్దాయికి చేరినా ఆదాయాలు పెరగలేదు.కోటీ 50లక్షల మంది కార్మికులు పనికి దూరంగా ఉన్నారు. కరోనా రెండవ తరం ప్రభావాల గురించి ఇప్పటికీ సరైన అంచనాలు లేవు.ఎవరి పద్దతిలో వారు వేసిన అంచనాలన్నింటినీ తలకు ఎక్కించుకుంటే బుర్రలు తిరుగుతాయి. మొత్తం మీద నడుస్తున్న చరిత్రను చూస్తే రానున్న రోజుల్లో ఆదాయ, సంపదల అసమానతలు పెరుగుతాయి. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.


గమనిక : ఈ వ్యాసం అక్టోబరు 17 ఆదివారం నవతెలంగాణా దినపత్రిక అనుబంధం సోపతి ముఖచిత్ర కథనంగా ప్రచురితమైనది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన్మోహన్‌సింగ్‌ ఆకాంక్ష ,అమలు చేస్తున్నది నరేంద్రమోడీ – రికార్డు స్ధాయిలో చైనా దిగుమతులు, ఏమి దేశభక్తిరా బాబూ ఇది ?

16 Saturday Oct 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India's dependence on China, India's Trade deficit, India-China trade, Manmohan Singh, Narendra Modi, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ఆఖరు నాటికి చైనా-భారత వాణిజ్యం గత రికార్డులను బద్దలు కొట్టి వంద బిలియన్ల డాలర్లకు చేరనుందనివార్త. సెప్టెంబరు ఆఖరుకు 90.7బి.డాలర్లుగా ఉంది. ఈ లెక్కన వచ్చే మూడు నెలల్లో నెల సగటు పది బి.డాలర్ల చొప్పునైతే120బి.డాలర్లు లేదా కనీసంగా వంద బి.డాలర్లు అవుతుందని అంచనా. సరిహద్దులో గాల్వన్‌లోయలో అంత పెద్ద ఉదంతం జరిగినా చైనా వస్తువులను బహిష్కరించాలని ”అపరదేశ భక్తులు” ఎంతగా గొంతు చించుకున్నా, మీడియా ఎంత రచ్చ చేసినా ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఎడం కాలుతో తన్నేసి దిగుమతులకు అనుమతులిచ్చారు.వ్యాపారులు తెచ్చుకున్నారు. దీన్ని కొందరు మింగా లేరు కక్కలేరు.2018లో మనం గరిష్టంగా 76బి.డాలర్ల మేరకు దిగుమతులు చేసుకున్నాం, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పవచ్చు.


రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకున్నా ఆకస్మికంగా వస్తువుల దిగుమతి నిలిపివేయలేరని హాంకాంగ్‌ నుంచి వెలువడే ఆలీబాబా దినపత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది. ఆత్మనిర్భర పేరుతో ముడి పదార్ధాలు, విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడకూడదని నరేంద్రమోడీ కోరుకుంటున్నా వెంటనే సాధ్యం కాదని ఆ పత్రిక పేర్కొన్నది.భారత ఎగుమతి సంస్ధల ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అజయ సాహీ చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో గతేడాదితో పోలిస్తే చైనా నుంచి 51.7శాతం(68.46బి.డాలర్లకు) దిగుమతులు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశ ఎమతులు 42.5శాతం(21.91బి.డాలర్లు) పెరిగాయి. మన దేశ లోటు 46.55బి.డాలర్లు. సంఘపరివార్‌ అనుబంధ సంస్ధ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సిఏఐటి) 500 చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసి 13బి.డాలర్ల మేరకు 2021లో దిగుమతులను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇంకేముంది మనం దిగుమతులు నిలిపివేస్తే చైనా వారు మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే, ఇదే దేశభక్తి అంటూ వీరంగం వేస్తూ అనేక మంది ఎక్కడికో వెళ్లిపోయారు.2020లో చైనా దిగుమతుల్లో మన వాటా (20.86బి.డాలర్లు) కేవలం 1.2శాతం, 18వ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉన్న జపాన్‌ 174.87 (పదిశాతం) మరో పదిశాతం ఉన్న దక్షిణ కొరియా నుంచి 172.76, అమెరికా నుంచి 136(7.9శాతం) ఆస్ట్రేలియా నుంచి 114.84(6.6శాతం) ఉన్న దేశాలే చైనాతో బేరాలాడుతున్నాయి. అలాంటి స్ధితిలో మనం చైనాను కాళ్ల బేరానికి రప్పిస్తామని ఏ ధైర్యంతో కొందరు చెబుతున్నారో తెలియదు.


ఇండియా టుడే సమాచారం ప్రకారం 2010లో మనం వంద వస్తువులను దిగుమతి చేసుకుంటే చైనా నుంచి 10.7 ఉండేవి, నరేంద్రమోడీ ఏలుబడిలో 2018నాటికి 16.4కు పెరిగి, 2020లో 13.8కి తగ్గాయి. ఈ ఏడాది గత రికార్డును అధిగమించేట్లుంది. గతేడాది మనం మొత్తంగా 473 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే 65బి.డాలర్లతో చైనా అగ్రస్ధానంలో, రెండవ స్ధానంలో ఉన్న అమెరికా నుంచి 35.6 బి.డాలర్లు, 7.5శాతం చేసుకున్నాము. మనం వంద వస్తువులను ఎగుమతి చేస్తుంటే చైనాకు చేస్తున్నవి కేవలం(2020) 5.3 మాత్రమే. మన గరిష్ట ఎగుమతులు 2010లో 6.5శాతం. అందుకే నిజాలు తెలిసినా మన ఎగుమతుల మీద చైనా ఆధారపడుతోందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన వాణిజ్య లోటు విషయానికి వస్తే 2010లో 19.2 బి.డాలర్లు కాగా 2018లో గరిష్టంగా 63 బి.డాలర్లు. ఈ ఏడాది ఇప్పటికే 46.55 బి.డాలర్లుంది. పదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి.వాటిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు విధించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చినా ఖరారు కాలేదు. పన్ను విధించినా దిగుమతులు కొనసాగితే ఆ భారం మన వినిమయదారులే భరించాల్సి ఉంటుంది.మనం పన్నులు విధిస్తే చైనా ఊరుకుంటుందా ?


2012లో నాటి చైనా ప్రధాని వెన్‌జియాబావో – మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇరు దేశాల వ్యాపార లావాదేవీలు 2015నాటికి వంద బి.డాలర్లకు పెంచాలని ఆకాంక్షించారు. తాజా సమాచారాన్ని బట్టి మన ఆత్మనిర్భర, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులిచ్చిన నరేంద్రమోడీ దాన్ని ఈ ఏడాది నెరవేర్చేదశలో ఉన్నారు. 2017-18లో గరిష్టంగా 89.6బి.డాలర్లకు చేరగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టారు. త్వరలో 100బి.డాలర్ల రికార్డు నెలకొల్పనున్నారు.కొన్ని వస్తువులను వయా హాంకాంగ్‌ దిగుమతి చేసుకుంటున్నాము. వాటిని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత పరిశ్రమపై చైనా వస్తు ప్రభావం గురించి పేర్కొన్నారు. దిగుమతి పన్ను చట్టాలు సరిగా అమలు కావటం లేదని ఔషధరంగంలో ముడి సరకులు, సోలార్‌ పరికరాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మన ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు మూతపడుతున్నట్లు కూడా తెలిపారు.


చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులు నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న రాజకీయ నేతలు, సంస్ధలు, మీడియాకు, వాటి ప్రచారాన్ని భుజానకెత్తుకున్నవారికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ అంటే అతిశయోక్తి కాదు.వారి విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తారు. దీన్ని మరోకోణం నుంచి చూస్తే వీరి చర్యల పర్యవసానాలేమిటో కూడా చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇలాంటి దిగుమతులు లేవు.1990దశకంలోనే ఎగుమతులు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంఘపరివార్‌ శక్తులే అధికారంలో ఉన్నాయి. వారి హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో 75వరకు వినియోగ వస్తువులను తయారు చేసేవే.అంకుర కంపెనీలలో చైనా పెట్టుబడులు 400 కోట్ల డాలర్లు ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్‌, పేటియం, ఓలా, బైజూస్‌ వంటివి ఉన్నాయి. అనేక ఔషధ పరిశ్రమలు చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. వీటికి ప్రత్నామ్నాయం చూడకుండా తెల్లవారేసరికి చైనా వస్తువులను బహిష్కరిస్తే నష్టపడేది కోట్లాది మంది సామాన్యులే. చైనాకు నష్టం ఉండదు. అత్యవసర జీవన ఔషధాల తయారీకి వినియోగించే ఎపిఐలో 75శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సోలార్‌ పానెల్స్‌, రసాయనాల గురించి చెప్పనవసరం లేదు. జనజీవితాలు, పారిశ్రామిక రంగం నుంచి ఇప్పటికిప్పుడు చైనాను పక్కన పెట్టే అవకాశాలు లేవు. అందుకే నరేంద్రమోడీ సర్కారు ఆత్మనిర్భరత , స్వయం సమృద్ధి వంటి ఎన్నికబుర్లు చెప్పినా దిగుమతులను అనుమతించిందన్నది స్పష్టం. లేకపోతే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో అధికారపార్టీకి కష్టం.చైనాలో తయారైన వస్త్రాలను బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చి అక్కడ దుస్తులు తరాయారు చేసి మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వేరే రూపంలో చైనా వస్తువులు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే మన ఎగుమతులూ ఆగుతాయి. జనానికి చౌకగా వస్తువులూ దొరకవు.

మబ్బులను చూసి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా అమెరికాను నమ్మి బొమనం బస్తీమే సవాల్‌ అని గనుక తారసిల్లితే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియా. ఇప్పుడు నిండా మునిగి చైనాతో వైరం కొని తెచ్చుకుంది. వారిని ముందుకు నెట్టి రెచ్చగొట్టిన అమెరికా ఇప్పుడు తన లాభాన్ని తాను చూసుకొంటోంది. చైనాకు వ్యతిరేకంగా నిలవటం ఒక గౌరవ ప్రదమైన ఘనతగా భావించిన ఆస్ట్రేలియా వెనక్కితిరిగి చూసుకుంటే తన నీడ తప్ప మరొకరు కనిపించని స్ధితికి వెళుతోందని సిడ్నీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జేమ్స్‌ లారెన్స్‌సన్‌ హెచ్చరించాడు.ఆర్ధిక లబ్దికోసం చైనా, రక్షణ అవసరాల కోసం అమెరికా మీద ఎలా ఆధారపడకూడదో ఆస్ట్రేలియా పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు.2016 రెండవ అర్దభాగం నుంచి చైనాకు వ్యతిరేకంగా మారటం ప్రారంభమైంది. దీంతో చైనా తీసుకున్న చర్యల కారణంగా మద్యం నుంచి బొగ్గువరకు అనేక ఆస్ట్రేలియా ఎగుమతులు ప్రభావితమయ్యాయి.


బలవంతపు వాణిజ్య పద్దతులను వ్యతిరేకించాలని ఆస్ట్రేలియాతో కలసి జపాన్‌,భారత్‌ ఉమ్మడి ప్రకటనలు చేయ వచ్చు గానీ జపాన్‌, భారత్‌ ఎక్కడా చైనా పేరెత్తేందుకు సిద్దం కాదని, ఇండోనేషియా ఆప్రకటన మీద సంతకం చేసేందుకు సిద్దం కాదని లారెన్స్‌ సన్‌ చెప్పారు. మార్చినెలలో ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారి మైక్‌ గోల్డ్‌మన్‌ మాట్లాడుతూ మీరు చేస్తున్నదానితో విశ్వాసంతో ముందుకు పోండి,ఆమెరికా ఇతర ప్రజాస్వామిక దేశాలు మీ విజయాన్ని ఎంతో ఆసక్తితో చూస్తాయి అన్నాడు. మిమ్మల్ని రోడ్డు మీద వంటరిగా వదిలేది లేదని మేనెలలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ చెప్పాడు. వాణిజ్య దాడులకు ఆస్ట్రేలియా గురైనంత కాలం తాము చైనాతో సంబంధాల మెరుగుదలకు సిద్దం కాదని ఇండో-పసిఫిక్‌ అమెరికా పార్లమెంట్‌ సమన్వయకర్త కర్ట్‌ కాంప్‌బెల్‌ సెలవిచ్చాడు. ఆరునెలల తరువాత వాణిజ్య లావాదేవీల వివరాలను చూస్తే చైనా నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఎగుమతుల స్ధానాన్ని అమెరికా కంపెనీలు తమ సరకులతో నింపుతున్నట్లు తేలింది.ఇదేం పని అని అడిగితే అమెరికా ఏమీ మాట్లాడదు. అంతేకాదు అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో మాట్లాడుతూ చైనా వాణిజ్యాన్ని పెంచుకొనేందుకు తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఉద్రిక్తతలను సడలించేందుకు ముమ్మర వాణిజ్యం తోడ్పడుతుందని సెలవిచ్చాడు.అమెరికా-చైనా వాణిజ్యం తీరుతెన్నులపై ఎనిమిది నెలల సమీక్ష తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి మాట్లాడుతూ తాము చైనాతో విడగొట్టుకొనేందుకు బదులు సంధానం చేసుకోవటం గురించి అజెండాను ముందుకు జరపనున్నామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సదరు ప్రొఫెసర్‌గారు చెప్పిందేమంటే అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నపుడు చైనాతో మనం తగాదా ఎందుకు పడాలని తమ పాలకులను ప్రశ్నించాడు.


ఇది మన దేశానికి వర్తించదా ? మనకూ అలాంటి అనుభవం ఎదురైతేగానీ మోడీ సర్కార్‌ తన వైఖరిని మార్చుకోదా ? చైనాతో స్నేహం చేసేదీ లేనిదీ పక్కన పెడితే తగాదా అవసరమా ? గాల్వన్‌ వివాదం మన సైనికుల మరణం విచారకరమే, కానీ అదే చైనా నుంచి మనం రికార్డు స్ధాయిలో దిగుమతులు చేసుకుంటున్నది ఆ తరువాతే కదా ? మనోభావాలతో ఆడుకుంటూ జనంలో దేశ భక్తి, చైనావ్యతిరేకతను రెచ్చగొడుతూ రాజకీయరగా బిజెపి ఉంటే దిగుమతిదారులు తమ లాభాల సంగతి తాము చూసుకుంటున్నారు. నరేంద్రమోడీ వాటిని అనుమతిస్తున్నారు. ఏమి దేశభక్తిరా బాబూ ఇది.


ఒక సోషలిస్టు దేశంగా చైనాను కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు అభిమానించవచ్చు. దాని మాదిరి మన దేశం, ఇతర దేశాలూ ముందుకు పోవాలనీ కోరుకుంటారు. అందుకోసం ఉద్యమాలు చేస్తారు తప్ప చైనాతో వాణిజ్యం చేయరు. ఇంతకు ముందు అలా చేసిన నేతలూ లేరు, ఇప్పుడూ లేరు, ఇక ముందూ ఉండరు.చేసేదంతా పారిశ్రామిక,బడా బాబులే, వారికి సహకరించేది అధికారంలో ఉన్న పార్టీల నేతలే. వ్యాపారం వ్యాపారమే. ఎవరికైనా లాభం వస్తేనే చేస్తారు. భారత కమ్యూనిస్టులు ఇక్కడి ప్రజల ప్రయోజనాలకే ప్రధమ పీటవేస్తారు తప్ప మరొక దేశానికి దోచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు, చెప్పరు. గాల్వన్‌ లోయ ఉదంతం సందర్భంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చైనా మన ప్రాంతాలను ఆక్రమించలేదని స్వయంగా చెప్పారు. సరిహద్దు వివాదం కొత్తగా తలెత్తింది కాదు. దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం మొదటి నుంచీ చెబుతోంది. అలా చెప్పిన వారిని దేశద్రోహులుగానూ, చైనాతో తగాదా కోరుకున్నవారిని దేశభక్తులుగానూ చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే చైనాను వ్యతిరేకించటంగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆ చైనా నుంచి రికార్డు స్ధాయిలో దిగుమతి చేసుకుంటున్నవారిని, అనుమతిస్తున్నవారిని ఏమనాలి ? దేశద్రోహులా, భక్తులా ?


సామాజిమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు బిజెపి దాని మాతృసంస్ధ సంఘపరివారం వెచ్చించే సమయంలో వెయ్యవ వంతు దేశం మీద కేంద్రీకరించినా – ఎందుకంటే దేశమంతటా తామే ఉన్నామని చెబుతున్నారు గనుక ఇక్కడే ఉత్పత్తి పెరిగి చైనా మీద ఆధారపడటం కాస్తయినా తగ్గి ఉండేదేమో ! మన జనాలకు పనీపాటా దొరికేదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ దేశం చుట్టుపక్కల అరవై ఆరు దేశాలకు పోతుగడ్డ మోడీ మహా ప్రభో !

12 Tuesday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Bilateral trade pacts, India trade gap, Narendra Modi, Narendra Modi Failures, RSS, SJM


ఎం కోటేశ్వరరావు


దేశంలో అధికార రాజకీయ క్రీడ ఒక వైపు, దానిలో ఓడిపోకుండా ఉండేందుకు వెంపర్లాట మరోవైపు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య ఒకవారం ఇన్ఫోసిస్‌ దేశభక్తిని శంకిస్తే మరో వారం కథనంలో అమెజాన్‌ రెండో తరం ఈస్టిండియా కంపెనీ అని వర్ణించింది. అది ఒక కంటితోనే చూస్తోంది. మరోకంటితో అవలోకిస్తే విదేశీ ఒప్పందాల కోసం నరేంద్రమోడీ సర్కార్‌ వెంపర్లాడుతున్న దృశ్యం కూడా కనపడి ఉండేది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే అంశం తెలిసినా సర్దుబాటు చేసేందుకు పూనుకున్నారు. చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం మధ్య ప్రభుత్వ వాణిజ్య విధానంలో పెద్ద మార్పు అనే పేరుతో ఒక వార్తా సంస్ధ విశ్లేషణ వెలువడింది. పెద్ద మార్పు అంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ త్వరత్వరగా ప్రయోజనాలు పొందే ఒప్పందాలు చేసుకోనున్నది అని కూడా దానిలో చెప్పారు. కేంద్ర మంత్రులు లేదా ఉన్నతాధికారులతో జర్నలిస్టులు సంభాషించిన తరువాతనే ఇలాంటి విశ్లేషణలు వస్తుంటాయి లేదా పని కట్టుకొని రాయిస్తుంటారు. ఇది మొదటి కోవకు చెందినదే.


ఎందుకు ఇలాంటి విశ్లేషణలు అంటే ప్రతిదాని వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నరేంద్రమోడీ ఎందుకు తొందరపడుతున్నారు ? అధికారానికి వచ్చిన తొలిరోజుల నుంచి కొన్ని సంవత్సరాల పాటు చమురు ధరలు పడిపోవటంతో వచ్చిన వెసులుబాటు నరేంద్రమోడీ ఘనతే అన్నట్లుగా ప్రచారం చేశారు. మీడియా కూడా అదే భజన చేసింది. అది నూతన సాధారణ స్ధాయికి చేరటం, చమురు ధరలు పెరగటంతో ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరు సంవత్సరాల కాలంలో దేశవృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారింది. అప్పటి నుంచి ప్రతిదానికీ కరోనాను సాకుగా చూపుతున్నారు. ఇంకేమాత్రం ఆ కబుర్లు నమ్మేందుకు జనం సిద్దంగా లేరు. తొలి నెలల్లో విదేశాల్లో, విమానాల్లోనే మోడీ ఎందుకు కాలం గడుపుతున్నారు అంటే పెట్టుబడుల కోసం అని చెప్పారు. కొత్తగా వచ్చిందేమీ లేదు. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా అన్నారు. ఉన్న ఎగుమతులు కూడా తగ్గాయి. తరువాత చైనా నుంచి ఇతర దేశాల కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. వాటి జాడలేదు.


ఇప్పుడు ఆత్మనిర్భరత, ఉత్పత్తి, ఎగుమతుల ఆధారిత రాయితీలంటూ విఫల పధకాన్ని మరోసారి ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు విదేశాలతో ఒప్పందాలని హడావుడి చేస్తున్నారు.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలు ఒకవైపు ఎగుమతులు-మరోవైపు తమ పౌరుల కొనుగోలు శక్తి పెంచేవిధంగా ఆదాయాల పెంపు వంటి విధానాలను అనుసరిస్తున్న కారణంగా అవి ముందుకు పోతున్నాయి. రెండవది జరగకుండా ఎగుమతులతో ముందుకు పోవాలని మోడీ సర్కార్‌ ఆత్రంగా ఉంది. అలాంటి విధానాలను అనుసరించిన లాటిన్‌ అమెరికా దేశాల అనుభవాలను ఏమాత్రం పట్టించుకున్నట్లు కనపడదు.


ఎగుమతులు, పెట్టుబడుల ఆకర్షణకు సమగ్ర ఒప్పందాలు కుదరాలంటే ఏండ్లూ పూండ్లూ పడుతుంది. ఏ దేశానికి ఆ దేశం తమకే పెద్ద పీట అంటే మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తావు, మాదేశం వస్తే మాకేం తెస్తావు అన్నట్లుగా ఉన్నాయి. బేరాలాడుతున్నాయి. చైనాతో తగాదా పెట్టుకొన్న మోడీ కౌగిలింతల భాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌కు ఏ గతి పట్టిందో చూసిన తరువాత ఎవరికి మాత్రం ఆందోళన, ఆత్రం ఉండదు ! ఎన్నికలు, రాజకీయాలు నిలవనీయవు కదా ! తక్షణ ఫలితాలను జనానికి చూపాలి, అందుకు గాను ఏదో ఒకటి చేయాలి మరి. అందుకే వెంటనే అమల్లోకి వచ్చే తాత్కాలిక ఒప్పందాలు అని చెబుతున్నారు. నిజమే కదా… చేసుకుంటే తప్పేమిటి ? కోడలు మనవడిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న సామెత తెలిసిందే.(ఇది ఆడపిల్లల పట్ల వివక్షే అని వేరే చెప్పనవసరం లేదు) మన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ గారు గత ఏడాది జరిగిన 290బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 2022లో 400బి.డాలర్లకు(40వేల కోట్లు) పెంచాలని, 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని చెపుతున్నారు. ప్రస్తుతం కనీసం ఇరవై దేశాలతో ఒప్పందాల సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రేలియా,బ్రిటన్‌, ఐరోపాలోని మరికొన్నింటితో క్రిస్మస్‌లోగా ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చూస్తున్నారు.గతంలో మేకిన్‌, మేడిన్‌ ఇండియా ప్రచారంలో భాగంగా ఇలాంటి రాయితీల ఆశ చూపినా ప్రయోజనం కలగలేదు. తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యం కనుక దేశాలతో ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలమే అని స్వదేశీ జాగరణ మంచ్‌ సహకన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పారు. కరోనా సమయంలో వాణిజ్యలోటు తగ్గింది, ఇప్పుడు తిరిగి గణనీయంగా పెరుగుతోంది.


2019లో కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)ని జనవరి నుంచి అమల్లోకి తెచ్చేందుకు చైనా, ఇతర ఒప్పంద దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే 15దేశాలకు గాను పది దేశాలు సంతకాలు చేశాయి. ఇది ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య ఒప్పందం. ఆసియన్‌ కూటమిలోని ఆరు, ఇతర దేశాల్లో మూడు సంతకాలు చేసిన తరువాత రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది. అనుకున్నట్లుగా అమల్లోకి వస్తే ఆ దేశాలకు చెందిన 91శాతం వస్తువులు ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులపై పన్నులు పూర్తిగా రద్దు లేదా నామమాత్రం అవుతాయి. తాను లేని ఈ ఒప్పందాన్ని అమెరికా ముందుకు పోనిస్తుందా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. ఒకవేళ అమలైతే మన దేశానికి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఏ దేశం ముందుకు వస్తే వారితో వెంటనే ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతుల్లో పురోగతి లేక దిగుమతులు పెరిగి చెల్లింపుల సమస్య తలెత్తితే 2024 ఎన్నికల్లో ఎదురీదక తప్పదు.


మన దేశానికి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కొత్త కాదు.మన దేశం ఇప్పటి వరకు వివిధ దేశాలతో పెట్టుబడులకు సంబంధించి 86 ఒప్పందాలు చేసుకుంది. వాటిలో పదమూడు మాత్రమే అమల్లో ఉన్నాయి.వివాదాల కారణంగా అనేక ఒప్పందాల నుంచి వైదొలిగాము. అయితే గత అనుభవం ఏమంటే మన ఎగుమతులకు బదులు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అంటే లబ్ది ఇతర దేశాలకు కలిగింది.2001లో మన వాణిజ్యలోటు ఆరుబిలియన్‌ డాలర్లు ఉంటే 2017నాటికి 109బి.డాలర్లకు పెరిగింది. ఒప్పందం చేసుకున్న దేశాలలో ఒక్క శ్రీలంకతో మాత్రమే మనకు మిగులు ఉంది. 2011-17 మధ్య జపాన్‌, దక్షిణ కొరియాతో వాణిజ్యలోటు రెట్టింపైంది. చైనా విషయానికి వస్తే 50శాతం పెరిగింది. దీంతో రెండు అంశాలు ముందుకు వచ్చాయి. దిగుమతి వస్తువులతో వాణిజ్యం చేసే వారు లబ్ది పొందారు. అవే వస్తువులను మన దేశంలో తయారు చేసే సంస్ధలు పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో, అంతకు ముందు చేసుకున్న ఒప్పందాల సారమిదే. వాటికి వ్యతిరేకంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఒక సంస్ధనే రంగంలోకి తెచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ చివరి సంవత్సరాలలో కొన్ని ఒప్పందాలను సమీక్షించాలన్నంత వరకు ఆలోచన చేశారు. దాని ప్రభావం తరువాత ఏలుబడిలోకి వచ్చిన మోడీ సర్కార్‌ మీద పడి కొత్త ఒప్పందాలేవీ చేసుకోలేదు. ఆర్‌సిఇపిలో చేరకూడదని నిర్ణయించింది.


ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ అది ఆ దేశ వాణిజ్య పోటీతత్వం మీద ఆధారపడి ఉంటుంది. స్విడ్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఐఎండి సంస్ధ ప్రకటించే ప్రపంచ పోటీతత్వ సూచికలో 64దేశాలలో మనం 2021లో 43వ స్ధానంలో ఉండగా చైనా 16 దగ్గర ఉంది. గత ఐదు సంవత్సరాల సూచికలను చూస్తే మనం 45 నుంచి 43కు పెంచుకుంటే చైనా 18 నుంచి 16కు ఎదిగింది. 2017 నుంచి వరుసగా 45,44,43,43,43 సూచికలతో మనం ఉండగా చైనా 18,13,14,20,16తో ఉంది. ప్రస్తుతం మనం ఒప్పందాల కోసం సంప్రదింపులు చేసే దేశాలన్నీ మన కంటే మెరుగైన సూచికలతో ఉన్నందున మనం పోటీ పడగలమా ?

తమ వైఫల్యాలను జనం గ్రహించకముందే ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో మోడీ సర్కార్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి దేశమూ రక్షణాత్మక చర్యలను అమలు జరుపుతోంది. మనం ఆర్‌సిపిఇలో చేరకపోవటం కూడా దానిలో భాగమే.గత స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి ముందే చెప్పుకున్నాము. ఆ కారణంగానే గత ఏడు సంవత్సరాలలో వాటి పట్ల మోడీ సర్కార్‌ పెద్దగా మొగ్గుచూపలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) అలాంటి ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయటం కూడా దీని కారణాల్లో ఒకటి. అయితే వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి ఇటీవలి కాలంలో వత్తిడి పెరుగుతోంది. అందుకే వారి ఉత్పత్తులకు మార్కెట్లను వెతికేపనిలో భాగంగా ఐరోపా యూనియన్‌, విడివిడిగా వివిధ దేశాలో ఒప్పందాలు చేసుకొనేందుకు పూనుకుంది. అయితే ఆ దేశాలు విధించే షరతులు బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న వ్యాపారులు, చివరికి పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైతం మింగుడు పడక ముందుకు సాగటం లేదు. మరోవైపు అలాంటి ఒప్పందాలను ప్రపంచ వాణిజ్య సంస్ధలో సవాలు చేసే అవకాశం కూడా ఉంది. అందువలన తాత్కాలిక ఒప్పందాల ముసుగులో పని కానివ్వాలని చూస్తున్నారు.


కరవమంటే కప్పకు కోపం-విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్ధితి ఉంది. అనేక వస్తు దిగుమతులపై రక్షణాత్మక చర్యల్లో భాగంగా పన్నులను పెంచారు. ఇప్పుడు వాటిని తగ్గించకపోతే విదేశాలు ముందుకురావు, తగ్గిస్తే స్ధానిక సంస్ధలు నష్టపోతాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యరాజ్యాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు కుదిరితే మిగతా దేశాలకు కూడా వాటిని వర్తింప చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే వివాదాలే. తాత్కాలిక ఒప్పందాలకు కాలపరిమితిని స్పష్టం చేయాల్సి ఉంటుంది, అది అనిశ్చితికి దారితీస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో నామమాత్ర పన్నులు విధించే చర్యలకు త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. ఏ బహుళజాతి కంపెనీ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా పదిహేనుశాతం పన్ను విధించాలన్న ఒప్పందాన్ని అంగీకరించిన 140కి గాను 136 దేశాలు సంతకాలు చేశాయి. దీనివలన దేశాల మధ్య పోటీ నివారణ అవుతుందని భావిస్తున్నారు. అది అమల్లోకి వస్తే ద్విపక్ష ఒప్పందాలు ఏమౌతాయో తెలియదు.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, ద్విపక్ష పెట్టుబడి ఒప్పందాల తీరుతెన్నులు చూసినపుడు కొన్ని అంశాలు స్పష్టం అయ్యాయి.ప్రజల,పర్యావరణాన్ని ఫణంగా పెట్టి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేసే సాధనాలుగా పని చేస్తాయి. 1950-70దశకం వరకు నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాల్లోని వలస దేశాల పెట్టుబడుల రక్షణకు వీటిని సాధానాలుగా చేసుకున్నారు. తరువాత స్వేచ్చామార్కెట్‌ పేరుతో వాటిని మరింత ఎక్కువ చేశారు. ఇప్పుడు మూడువేలకు పైగా పెట్టుబడి రక్షణ ఒప్పందాలున్నాయని అంచనా.వీటిని ఆధారం చేసుకొని అనేక కంపెనీలు ప్రభుత్వాలతో వివాదాలకు దిగాయి. పన్నుల తగ్గింపు లేదా అసలు కొన్నింటిపై పన్ను లేకుండా చేస్తారు. ఈక్రమంలో వాణిజ్యపోటీలో నిలిచే పేరుతో కార్మికుల వేతనాల తగ్గింపు, బేరమాడేశక్తి లేకుండా చేసే కార్మిక చట్టాలను వారి మీద రుద్దుతారు.ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు జనాన్ని అప్పగిస్తాయి. ఐరోపా ఫ్రీ ట్రేడ్‌ ఏరియా(ఇఎఫ్‌టిఏ), ఐరోపా యూనియన్‌తో 2007-08లోనే చర్చలకు నాంది పలికాము. వారి కార్లు, మద్యం దిగుమతులకు అంగీకరించాము. మన ధాన్యసేకరణ రంగం, బీమా, బాంకు, ఇతర ఆర్ధిక సేవల రంగంలో ప్రవేశానికి అనుమతించాలన్న వత్తిడి కారణంగా 2013లో అవి నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో ధాన్యసేకరణ ప్రయివేటును అనుమతించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా సమయంలో ఎలాంటి చర్చకు వీల్లేకుండా ఆదరాబాదరా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆ క్రమంలో భాగమే. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తున్నది, పదినెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం దానిలో భాగమే.దీన్ని అణచివేసిన తరువాత కార్మిక హక్కులను హరించేందుకు అవసరమైన బిల్లులను సిద్దం చేశారు. అనూహ్యమైన రైతు ఉద్యమం కారణంగా సమయం కోసం చూస్తున్నారు. కార్పొరేట్లపై పన్ను తగ్గింపు కారణంగా తలెత్తిన లోటును పూడ్చుకొనేందుకు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించేందుకు ప్రజల మీద పన్ను భారాలు మోపుతారు. పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను, సెస్సుల మర్మమిదే. పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా రైతులకు సబ్సిడీలను పెంచకుండా నామమాత్రం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ ఏటా 70-80వేల కోట్ల మధ్యనే ఉంచటమే దానికి నిదర్శనం. ప్రతిపాదిత విద్యుత్‌ బిల్లు ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదని చెప్పటం కూడా దానిలో భాగమే. రాష్ట్ర ప్రభుత్వాలకు క్రాస్‌ సబ్సిడీ అవకాశాలను ఎత్తివేస్తారు. ముందుగా వినియోగదారులనుంచి వసూలు చేసి తరువాత వారి ఖాతాలో జమచేసే విధానాన్ని తీసుకురానున్నారు. వంటగ్యాస్‌ మాదిరి ధరలు పెంచుకుంటూపోయి నామమాత్రం చేస్తారు. రాష్ట్రాలకు అధికారం లేకుండా నియంత్రణ కమిషన్ల పేరుతో చట్టసభల అవకాశాలను పరిమితం చేసి కాలక్షేప కేంద్రాలుగా మార్చివేస్తారు. ఇవి చట్టసభలకు జవాబుదారీగా ఉండవు.


రైతాంగానికి, పరిశ్రమలకు నష్టం అనే వైఖరి తీసుకున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వత్తిడి, ఆందోళనల కారణంగా, హిందూ మత, మితవాదుల మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్ధల వైఖరి వలన మోడీ సర్కార్‌ ఆర్‌సిఇపిలో చేరలేదు.అది హ్రస్వ దృష్టికి నిదర్శనమని విదేశాంగశాఖ మాజీ అధికారి శ్మామ్‌ సరణ్‌ వంటి వారు విమర్శించారు. మరోవైపు అదే మోడీ సర్కార్‌ ఇతర దేశాలతో స్వేచ్చా, ద్విపక్ష ఒప్పందాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పుడు అదే జాగరణమంచ్‌ దేశం కోసం ఇవి అవసరం అని కొత్త పల్లవి అందుకుంది. తాము బహుళ దేశాలతో కూడిన వాటికి తప్ప ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలం అంటోంది. చిల్లు కాదు తూటు అన్నట్లుగా ఆర్‌సిఇపి ఒప్పందంలోని అంశాలే వీటిలో కూడా ఉంటాయి, నాడు దాన్నెందుకు తప్పన్నారు, నేడు వీటినెందుకు ఒప్పంటున్నారు ? విదేశీ రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు వరుసలు కట్టి వస్తున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా యూనియన్‌, గల్ఫ్‌ సహకార సంస్ధ, యుఏయి, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఉన్నాయి. పూర్వం గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు, ఇతర కళారూపాలను ప్రదర్శించేవారు. గ్రామపెద్దలు, పౌరుల నుంచి పెద్ద మొత్తంలో కానుకల కోసం అబ్బో మీ ఊరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ, మీది పెద్ద చేయి అంటూ పొగిడేవారు. ఇప్పుడు మన మార్కెట్‌ మీద కన్నేసిన దేశాలన్నీ అలాంటి పొగడ్తలే కురిపిస్తున్నాయి, మనకు బిస్కెట్లు వేస్తున్నాయి.


స్వదేశీ కంపెనీలకు రక్షణకు కట్టుకున్న మడిని పక్కన పెట్టి మోడీ సర్కార్‌ మంత్రులు, అధికారులు వీటితో మాట్లాడుతున్నారని గ్రహించాలి. వచ్చే ఏడాది మార్చినాటికి బ్రిటన్‌తో, తరువాత ఆస్ట్రేలియాతో తాత్కాలిక ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారు. ఐరోపా,ఆస్ట్రేలియా వంటి దేశాలతో అంటే వాటి పాల ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అప్పుడు పాల ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీ వద్ద నిరసనలకు దిగకతప్పదు. ఐరోపా యూనియన్నుంచి బయటకు వచ్చిన బ్రిటన్‌కు ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు అవసరం గనుక అది వెంటపడుతోంది. చైనాతో వివాదం వచ్చింది కనుక ఆస్ట్రేలియా తన ఉత్పత్తులను మన దేశంలో విక్రయించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్‌, టెలికాం పరికరాల కోసం చైనా మీద ఆధారపడకుండా ఉండాలంటే బ్రిటన్‌తో ఒప్పందం అవసరమని స్వదేశీ జాగరణ మంచ్‌ నేత అశ్వనీ మహాజన్‌ వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులుతో ఉంది. కనుక తన వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులను మన మార్కెట్లో కుమ్మరించాలని చూస్తోంది. దానికి అంగీకరిస్తే మన రైతాంగం నష్టపోతుంది. తన ఆయుధాలు, చమురుతో పాటు వీటిని కూడా దిగమతులు చేసుకోవాలని మన మీద వత్తిడి తెస్తోంది.

అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాలు కుదుర్చుకొనే ద్విపక్ష ఒప్పందాలలో కార్మికులకు సంబంధించి ప్రపంచ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) ఆమోదించిన ఎనిమిది కీలక అంశాల అమలును ఒక షరతుగా పెడతాయి. యజమానులకు ఇష్టమైనపుడు కార్మికులను పెట్టుకొనే, లేనపుడు తొలగించే, అసలు సంఘాలు పెట్టుకోవటాన్నే అసాధ్యం చేసే విధంగా కార్మిక చట్టాలను మార్చేందుకు పూనుకన్న మోడీ సర్కార్‌ మరి వాటిని ఎలా అంగీకరిస్తుంది. అంగీకరించి అమలు జరపకపోతే కార్మికులు ఊరుకుంటారా ? ఈ మార్పులను చివరికి సంఘపరివార్‌ సంస్ధ బిఎంఎస్‌ కూడా అంగీకరించటం లేదు. నిజంగా దేశానికి తద్వారా మన జనాలకు మేలు కలిగించే ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటానికి చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం వంటి పరిణామాలను సాకుగా చూపటం అవసరమా అనే ప్రశ్నలు అడగకూడదు. అపర దేశభక్తులు చెప్పింది వినాలి తప్ప బుర్రతో ఆలోచించకూడదు. మోడీ ప్రారంభించిన ఒప్పందాల తీరుతెన్నులు గతంలో మన్మోహన్‌ సింగ్‌కు తెచ్చిన తలనొప్పులనే పునరావృతచేస్తాయా ? మోడీ దూకుడు అలానే ఉంది మరి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై అయ్యో పాపం అని కూడా నరేంద్ర మోడీ అనలేరా !

08 Friday Oct 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Lakhimpur Kheri killings, Narendra Modi, Navjot Singh Sidhu, Supreme Court of India, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు మూడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై బిజెపి నేతల వాహనాలను ఎక్కించి నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఆ వాహనాల్లో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అషిష్‌ మిశ్రా ఉన్నాడా, అతనే స్వయంగా వాహనాన్ని రైతుల మీద ఎక్కించాడా లేక వాహనంలో ఉండి డ్రైవర్‌ను అందుకు పురికొల్పాడా అన్నది ఇప్పటివరకు వివాదాస్పద అంశంగా ఉంది. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్ర మంత్రి నమ్మబలుకుతున్నారు. దారుణ, గర్హనీయ ఉదంతం జరిగింది తమ ఏలుబడిలోని రాష్ట్రం, పోలీసులు, పాలకులూ తమ వారే, కేసులో ఇతర నిందితులు ఎవరైనా మంత్రిగారి కొడుకు ఉన్నందున పోలీసు కస్టడీ అయినా, రిమాండ్‌లో ఉన్నా ఇతర సాధారణ నిందితుల మాదిరి పోలీసు మర్యాదలేమీ ఉండవు, మంచిగానే చూసుకుంటారు. అయినా అక్టోబరు మూడున ఉదంతం జరిగితే ఇది రాస్తున్న సమయానికి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. లేదా మంత్రిగారు అమాయకుడని చెబుతున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగించలేదు. చట్టాన్ని అమలు జరపాల్సిన వారు, దాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన వారి తీరూ ఇలా ఉంది.

ఆరోగ్యం సరిగా లేని కారణంగా గురువారం నాడు తన కుమారుడు పోలీసుల ఎదుట హాజరుకాలేదని, శనివారం నాడు వెళతాడని మంత్రి అజయ మిశ్రా చెప్పారు. అమాయకుడని మరోసారి చెప్పారు. కాగా శనివారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలనే నోటీసును శుక్రవారం నాడు పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు అంటించారు. రుజువులు లేకుండా వత్తిడి తెచ్చినంత మాత్రాన ఎవరి మీదా ఎలాంటి చర్యలూ ఉండవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా రైతు ఉద్యమం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై స్పందించిన బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ, మాజీ మంత్రి, వరుణ్‌ తల్లి అయిన మేనకా గాంధీని బిజెపి కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మరణించిన జర్నలిస్టు రామన్‌ కాశ్యప్‌ కుటుంబాన్ని శుక్రవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ నిందితులను అరెస్టు చేసేంత వరకు తాను అక్కడే మౌన వ్రత దీక్ష చేయనున్నట్లు ప్రకటించి ప్రారంభించారు.


విశ్వగురువుగా భజంత్రీలు కీర్తిస్తున్నారు గనుక నిజమే అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే లఖింపూర్‌ ఖేరీ ఉదంతం తన స్థాయికి తగినదని భావించలేదా లేక ఇంకా పెద్దవి జరిగితే తప్ప స్పందించరో గానీ మొత్తం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చిందని బహుశా యంత్రాంగం మోడీగారికి నివేదించి ఉండకపోవచ్చు. రాజును బట్టే కదా బంట్లు . అనూహ్యమైన ఈ పరిణామాన్ని బిజెపి పెద్దలు ఊహించి ఉండరు.అందుకే షాక్‌లో ఉన్నారు, గుక్క తిప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా తిరిగి గద్దెను దక్కించుకొనేందుకు పధకాల మీద పధకాలను రచిస్తున్న వారి జాబితాలో వేరే ఉంటాయి తప్ప ఇలాంటి మెడకు చుట్టుకునే దారుణాలు ఉండవు. రైతు ఉద్యమం మీద నిరంతరం బురద చల్లటం, ఎద్దేవా చేయటం, అసహనానికి గురై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఇలాంటివి జరగటం సాధారణం. నేను ప్రజాప్రతినిధిని గాక ముందు మనిషిగా ఉండి ఉంటే రెండు నిమిషాల్లో తేల్చేసి ఉండేవాడిని అని ఒక సారి రౌడీ షీటరుగా నమోదైన అజయమిశ్రా సెప్టెంబరు 25న ఆప్రాంతంలోనే మంత్రి వేషంలో ఉండి చెప్పారంటే ఏమనుకోవాలి. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వంటి జాతి రత్నాలు తక్కువ తినలేదు. సమూహాలుగా ఏర్పడి కర్రలు తీసుకొని తిరగండి, జైలుకు పోవటం గురించి ఆలోచించవద్దని బిజెపి కార్కకర్తలకు కర్తవ్యబోధ చేశారంటే పుత్రరత్నాలు వాహనాలను జనం మీదకు నడపటం లేదా నడిపించటంలో ఆశ్చర్యం ఏముంది.

లఖింపూర్‌ ఖేరీ కేసు ఏమౌతుంది. అనేక కేసులు ఏమయ్యాయో ఇది కూడా అదే అవుతుంది. కేసు గురించి కాదు, పాలకపార్టీ ప్రమాదకర పోకడల గురించి తీవ్రంగా ఆలోచించాలి. సుప్రీం కోర్టుకు రాసిన లేఖలను తీసుకొని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేత్రత్వంలోని బెంచ్‌ కేసును విచారణ జరుపుతోంది. ఇంకా ఎందుకు మంత్రి పుత్రరత్నాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇతర కేసుల్లో ఇలాంటి విచారణకు ఉన్నత న్యాయస్ధానానికి అవకాశం ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు. చిత్రం ఏమంటే సుప్రీం కోర్టు కేసు చేపట్టినట్లు తెలిసిన తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆషిష్‌ మిశ్రాను అరెస్టు చేయలేదు. ఏం చేస్తారో చూద్దామనో లేక సుప్రీం కోర్టు అయితే ఏంటి అన్న వైఖరో తెలిదు. ఇతర హత్యకేసుల్లో కూడా మీరు ఇలాగే పని ప్రవర్తిస్తారా అని కోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. తాను పోలీసుల ముందుకు రావటానికి మరింత సమంయం కావాలని ఆషిష్‌ మిశ్రా కోరాడని శనివారం ఉదం పదకొండు గంటల వరకు వ్వధి ఇచ్చినట్లు, అప్పటికీ రాకపోతే అరెస్టు వారంటు జారీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.ఎంతైనా యోగుల పాలన గనుక నిందితుల మనోభావాలను గౌరవించటంగా దీన్ని భావించవచ్చు.

కేసును ఈనెల 20కి వాయిదా వేసినందున మరో పది రోజుల పాటు ఏదో ఒక సాకుతో పోలీసులు కాలం గడపవచ్చు. లేదా కోర్టును సంతృప్తిపరచేందుకు అరెస్టు చూపవచ్చు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగిన ఢిల్లీలో ఉదంతంలో కుట్రదారైన బిజెపికి చెందిన నటుడు దీప్‌ సిద్దు తమ కళ్ల ముందునుంచే వెళుతున్నా అడ్డగించని పోలీసులు అతగాడిని పదిహేను రోజుల తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఉదంతాలలో ప్రభుత్వ వ్యతిరేకుల మీద మోపిన కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా అరెస్టులు చేశారో చూశాము. కానీ లఖింపూర్‌ ఖేరీ ఉదంతంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా యోగి సర్కార్‌ ఉంది. సమస్య సున్నితత్వం కారణంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదదని, కేసులో ఉన్న వ్యక్తుల కారణంగా సిబిఐ గురించి ఏమీ చెప్పనప్పటికీ అది పరిష్కారం కాదని,ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారులతో దర్పాప్తు సరిగా జరగదని, ఉన్న సాక్ష్యాలను నాశనం చేయకూడదని ప్రధాన న్యామూర్తి ఎన్‌వి రమణ అన్నారంటే కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. బిజెపికి ఈ సున్నితత్వం అర్దం అవుతుందా ?


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ” ఈ ఉదంతం సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది.ఆషిష్‌ మిశ్రాతో పాటు 15-20 మంది ఆ వాహనాలలో ఉన్నారు. నిరసన తెలుపుతున్న బబీర్‌పూర్‌ వద్దకు మూడు వాహనాల్లో వచ్చారు. ఆషిష్‌ మిశ్రా తన మహింద్రా తార్‌ వాహనంలో ఎడమవైపు కూర్చున్నాడు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న రైతుల మీదకు వాహనాలను పోనిచ్చిన తరువాత రైతుల మీద కాల్పులు జరిపాడు. గుర్విందర్‌ సింగ్‌ అనే రైతు కాల్పుల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వాహనాలు బోల్తాపడిన కారణంగా పక్కనే ఉన్నవారు గాయపడ్డారు. తరువాత ఆషిష్‌ కాల్పులు జరుపుతూ చెరకు తోటలవైపు వెళ్లి అక్కడ దాక్కున్నాడు.” అని ఉంది. ఇలాంటి తీవ్రనేరారోపణ చేసిన కేసుల్లో ఇతరులైతే అరెస్టుకు మీనమేషాలు లెక్కిస్తారా ? అయితే తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ నేరారోపణ చేసే సమయానికి దానిలో మార్పులు చోటు చేసుకోవని చెప్పలేము. మంత్రి కుమారుడి కాల్పుల కారణంగా మరణించినట్లు చెబుతున్న గుర్విందర్‌ సింగ్‌ పోస్టు మార్టంలో తుపాకి గాయాల ప్రస్తావన లేదు. దాంతో కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు రెండోసారి చేసినా అదే మాదిరి ప్రస్తావన లేని అంతకు ముందు నివేదికే ఇచ్చారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు ఇది జరిగిందనే అనుమానాలు రావటం సహజం.


ఈ దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీదే కేసులు కూడా పెట్టారు. అంటే ప్రజాస్వామ్యం సంగతి రాముడెరుగు బాధిత కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలిపేందుకు యోగి అంగీకరించరన్నది స్పష్టం. ఇది హత్రాస్‌ ఉదంతంలో కూడా జరిగింది. చివరికి పోలీసులే అంత్యక్రియలను కూడా ఎలా చేశారో చూశాము. మంత్రి అనుచరుల కార్ల మీద రైతులు దాడి చేసినపుడు అవి బోల్తాపడి రైతులు మరణించారని ముందు చెప్పారు. తరువాత కార్లను ఎక్కిస్తున్న వీడియో బయటకు రావటంతో వేరే కథలు వినిపిస్తున్నారు. కార్లను రైతుల మీద నడిపించినపుడు నిజంగా మంత్రి కుమారుడు ఉంటే ఆగ్రహించిన రైతులు అతన్ని ప్రాణాలతో బతకనిచ్చి ఉండేవారా అని ఎదురుదాడి చేస్తున్నారు. కారు డ్రైవరు, మరో ఇద్దరు బిజెపి కార్యకర్తల మాదిరి చంపివుండేవారు కదా అని తర్కిస్తున్నారు. అయితే అతను ఆ సమయంలోవేరే చోట ఉన్నట్లు చెప్పటం తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలను ఈ వాదన చేస్తున్న మంత్రిగానీ, అనుచరులుగానీ వెల్లడించలేదు.


లఖింపూర్‌ ఖేరీ ఉదంత రాజకీయ పర్యవసానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐ లేదా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా తేలుతుందన్నది అనుమానమే.ఆలస్యం జరిగినా లేక మంత్రి కుమారుడి ప్రమేయం లేదని చెప్పినా లేదా విధిలేక అతగాడే దారుణానికి కారకుడని తేలినా బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమం ఈ ఉదంతంతో మరోమలుపు తిరిగింది. మరణించిన రైతుల కర్మకాండలు ముగిసేలోగా నిందితులను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని కోరుతున్నారు. మంత్రిని తొలగిస్తే తప్పిదాన్ని అంగీకరించినట్లు లేకపోతే తమ వారిని రక్షించుకొనేందుకే బిజెపి పూనుకున్నదనే సందేశం రైతుల్లోకి వెళుతుంది. అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో ప్రతి చోటా బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాల సందర్భంగా రైతుల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ చెప్పినట్లు బిజెపి కార్యకర్తలు కర్రలు తీసుకొని దాడులకు దిగితే, మరిన్ని లఖింపూర్‌ ఖేరీ ఉదంతాలు జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేము.


లఖింపూర్‌ ఖేరీ దారుణం జరిగి 48 గంటలు కూడా గడవక ముందే అక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని లక్నో నగరానికి అక్టోబరు 5వ తేదీన ఎన్నికల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మూడు రోజుల అజాదీ కా అమృత మహౌత్సవం ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. ఉపన్యాసం చేశారు.ఎన్నికల పధకాల్లో భాగంగా నయా భారత్‌కా నయా ఉత్తర ప్రదేశ్‌ పేరుతో 75 పధకాలను ప్రధాని ప్రారంభించారు. దేశాన్ని కుదిపివేసిన లఖింపూర్‌ ఉదంతం ప్రస్తావనే చేయలేదు. ఆ కార్యక్రమం ఎంతో ముందుగానే రూపొందించి ఉండవచ్చు, వాయిదా వేస్తే భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళతాయని దాన్ని కొనసాగించి ఉండవచ్చు. తమ మంత్రి, అతని కుమారుడి నిర్వాకం కారణంగా జరిగిన ఉదంతం మంచి చెడ్డలను ప్రస్తావించకపోవచ్చు గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎనిమిది విలువైన ప్రాణాలు పోతే కుటుంబాలకు సానుభూతి ప్రకటన చేస్తే సొమ్మేం పోతుంది. మరణించిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, మంత్రి కారు డ్రైవర్‌, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారుగా. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణాలకు లేదా ?
.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d