• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

నరేంద్రమోడీ సర్కార్‌ తాలిబాన్లను గుర్తిస్తే భక్తులు తట్టుకుంటారా !

30 Monday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, Narendramodi, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అవునా ? పరిణామాలను చూస్తే ఆ దిశలోనే అడుగులు పడుతున్నాయి. అందువలన తొందరపడి వీరంగం వేస్తూ ఇతరుల గురించి ముందే ఏదిబడితే అది మాట్లాడి ఇబ్బందుల్లో పడతారో లేక సంయమనం పాటిస్తారో భక్తులు ఆలోచించుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటు తధ్యం, అయితే వారిలో ఏ ముఠా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది, దాన్ని మిగతావారు అంగీకరిస్తారా, అంతర్యుద్దం జరుగుతుందా అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వాటికి వెంటనే సమాధానం దొరకదు. కాబూల్‌ విమానాశ్రయ పరిసరాల్లో ఆత్మాహుతిదళం పేలుళ్లు తాలిబాన్లను సవాలు చేసే శక్తులు ఉన్నాయనేందుకు ఒక సూచిక. అవి బలమైనవా లేక బేరమాడేందుకు అలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా ? ఏదీ చెప్పలేం !
మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఆగస్టు 27న మాట్లాడుతూ ఆఫ్ఘన్‌ ప్రభుత్వ గుర్తింపు గురించి అడగ్గా ఏదీ ఇప్పుడేగా దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇంకా అంతవరకు రాలేదు అన్నారు. ఇతర దేశాలు ఏమి చేస్తాయో వేచి చూస్తున్నాం, ఇప్పుడు అక్కడున్నవారిని స్వదేశానికి రప్పించటం గురించే కేంద్రీకరించాం అని చెప్పారు. ప్రాధమికంగా హిందువులు, సిక్కుల మీదనే కేంద్రీకరించినప్పటికీ మనతో ఉన్న ఆప్ఘన్‌లకు కూడా బాసటగా ఉంటాం అన్నారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు. చివరి అమెరికన్‌ సైనికుడు వెళ్లిపోయిన తరువాత మరొక అంకం ప్రారంభం అవుతుంది.


తాలిబాన్లు ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజే మన దేశం అధ్యక్ష స్ధానంలో ఉన్న భద్రతా మండలి చేసిన తీర్మానంలో ఆఫ్ఘన్‌గడ్డ మీద నుంచి ఉగ్రవాద చర్యలను తాలిబాన్లు అనుమతించరాదని కోరింది. ఆగస్టు 27న చేసిన మరో తీర్మానంలో తాలిబాన్లు అనే పదాన్ని తొలగించి ఏ బృందం లేదా వ్యక్తులు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి భారత్‌ ఎంతో ముఖ్యమైనది. ఆర్ధిక, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నాం. గతంలో మాదిరే సంబంధం కొనసాగుతుందని ఆశిస్తున్నాం అని తాలిబాన్‌ ప్రతినిధి స్టానెకజాయి ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కతార్‌లోని దోహాలో అమెరికా-తాలిబాన్ల మధ్య జరిగిన చర్చల ప్రతినిధి బృందానికి స్టానెకజాయి నాయకత్వం వహించాడు. గత కొన్ని నెలలుగా తెరవెనుక మన ప్రభుత్వం తాలిబాన్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పటికీ వారి వైపు నుంచి ఇలాంటి స్పష్టమైన వైఖరి వెల్లడి కాలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాను నమ్ముకొని వ్యవహరించిన తీరుతో ఇరుగుపొరుగు దేశాలన్నింటినీ మనం దూరం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున ఆప్ఘనిస్తాన్‌లో చైనా పెత్తనాన్ని అడ్డుకోవాలంటే భారత్‌ అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించి సంబంధాలు పెట్టుకోవాలనే వాదనలను కొందరు ప్రారంభించారు. చైనాను సాకుగా చూపి తాలిబన్‌ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం గుర్తించినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీని మీద మాజీ దౌత్యవేత్తలు, ఇతర పండితులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలుగుతారనే స్పష్టమైన సంకేతాలు వెలువడినప్పటికీ ఏమి జరిగితే ఎలా వ్యవహరించాలి అనే ముందు చూపు మన వ్యూహకర్తలకు, అక్కడి పరిస్దితి గురించి సరైన అంచనా మన విదేశాంగ శాఖకు ఉన్నట్లు కనపడలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను జేమ్స్‌బాండ్‌ అని పొగుడుతారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల బలం, ప్రభుత్వ బలహీనతలపై అంచనా లేదు. ఒప్పందం ఆరునెలల ముందుగానే కుదిరినప్పటికీ ముందుగానే మన జాతీయులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా లేవు. తొంభై రోజుల్లో కాబూల్‌ తాలిబాన్ల వశం అవుతుందని సిఐఏ అంచనా వెలువడి తొమ్మిది రోజులు కూడా గడవక ముందే కూలిపోయింది. మన గూఢచార వ్యవస్ద దాన్ని పసిగట్టలేకపోయింది.


ఆప్ఘనిస్తాన్‌ నుంచి వైదొలుగుతామని బరాక్‌ ఒబామాయే ప్రకటించినప్పటికీ గత పన్నెండు సంవత్సరాలుగా ఆ పని చేయలేదు. ట్రంపు ప్రకటనలు, తరువాత అధికారానికి వచ్చిన జోబైడెన్‌ ప్రకటనలను ఉత్తుత్తివిగానే మన దేశం పరిగణించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తక్షణమేగాకున్నా పరిస్ధితులు కుదుట పడిన తరువాత అయినా గతంలో మనం విదేశాంగ విధానంలో అనుసరించిన తప్పిదాలను సరి చేసుకొనే చర్యలను ఇప్పుడు మోడీ సర్కార్‌ తీసుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. తాలిబాన్లు అధికారానికి రానున్న నేపధ్యంలో వారి వెన్నంటి ఉన్న పాకిస్తాన్‌, ఇతర దేశాలతో సంబంధాలను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికాతో అంటకాగిన కారణంగా మనం ఇప్పుడు జీహాదీ ఉగ్రవాదం వంటి దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో మునుపటి మాదిరిగానే రాసుకుపూసుకు తిరిగితే కుదరదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా వైదొలిగి, మన భద్రతకు ముప్పు తెచ్చిన తీరును మన ప్రభుత్వం మాట మాత్రంగా అయినా తప్పుపట్టలేని బలహీన స్ధితిలో ఉంది.


భారత ఆందోళనను ఏమాత్రం అమెరికా పట్టించుకోలేదని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న హడ్సన్‌ సంస్ధ దక్షిణాసియా దేశాల డైరెక్టర్‌ అపర్ణ పాండే వ్యాఖ్యానించారు. భారత ఆందోళనను విస్మరించటమే కాదు, పాకిస్తాన్‌ గురించి లేవనెత్తిన వాటిని కొట్టిపారవేసింది, చివరికి పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడిందని కూడా ఆమె చెప్పారు. తాలిబాన్లపై రెండు దశాబ్దాలుగా దాడులు జరిపిన అమెరికాయే వారితో రాజీచేసుకున్నపుడు, అనేక దేశాలతో తాలిబాన్లు సంబంధాలు పెట్టుకున్నపుడు మన ప్రయోజనాల రక్షణకు మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలు ఏమిటన్నదే అసలు ప్రశ్న. సైద్దాంతికంగా తాలిబన్లకు మద్దతు ఇవ్వనవసరం లేదు.వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఒక దేశంతో మరొక దేశ సంబంధాలు ఏమిటన్న సమస్య ముందుకు వస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయనందున భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాషింగ్టన్‌ డిసిలోని విల్సన్‌ కేంద్రంలోని ఆసియా కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ కుగ్లెమాన్‌ అన్నారు. తాలిబాన్లతో సంబంధాలను నెలకొల్పుకోవటంలో భారత్‌ ఆలశ్యం చేసింది. ఈ ఆలస్యం తిరిగి స్నేహాన్ని నెలకొల్పుకొనే క్రమంలో తాలిబాన్ల నూతన ప్రభుత్వ ఏర్పాట్లలో పాత్ర లేకుండా భారత్‌ మూల్యం చెల్లించిందని చెప్పారు.


కాబూల్‌ను స్వాధీనం చేసుకోక ముందు తాలిబాన్లు రష్యా, పాకిస్తాన్‌, చైనా, ఇరాన్‌, తుర్కిమెనిస్తాన్‌ వెళ్లారు తప్ప భారత్‌ వైపు చూడలేదు. వీటిలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప మిగిలిన దేశాలేవీ తాలిబాన్లను సమర్ధించినవి కాదు. అమెరికా చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి చైనా మన మీద దాడికి వస్తోందని గాని మరొకటని గానీ లడక్‌ సరిహద్దులో ఇప్పుడు రెండులక్షల మంది సైన్యాన్ని మోహరించాము. మేము ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బయటకు వచ్చాం గనుక భారత్‌తో సహా అందరం కలసి చైనా మీద కేంద్రీకరించుదామని అంటున్నారు. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవు. ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్దాలు లేకుండా, ఆయుధాలు అమ్ముకోకుండా అమెరికన్లకు పూటగడవదు. ఓకే, రేపు చైనా వారు ఎత్తుగడగా అమెరికా వారికి వాణిజ్య పరంగా కొన్ని రాయితీలు ఇస్తూ దిగుమతులను ఎక్కువ చేసుకొనేందుకు అంగీకరించారనుకోండి. అప్పుడు అమెరికా వాడు తనదారి తాను చూసుకుంటే వాడిని నమ్మి తాయత్తు కట్టుకొని బరిలోకి దిగే మన పరిస్ధితి ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా వెనక్కు తగ్గిన పరిణామం సరిహద్దు వెంట చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకొనే వైపు భారత్‌ను బలవంతంగా నెడుతుందని హడ్సన్‌ సంస్ద డైరెక్టర్‌ అపర్ణ పాండే చెప్పారు. భారత్‌ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మార్చుకొనేందుకు, తనకు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా వైపు నుంచి ప్రయత్నాలు ఉండవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు భారత్‌ను ఏమాత్రం అమెరికాకు మరింత దగ్గరకు చేర్చకపోగా తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వదులుకోకుండా మరింత గట్టిపరుస్తాయి. హిమాలయ ప్రాంతంలో తాను ఒంటరి అని భారత్‌కు తెలుసు గనుక చైనా వైపు మరింతగా దూకే సాహసం చేస్తుందని తాను అనుకోవటం లేదని కూడా అపర్ణ పాండే చెప్పారు.


ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల గురించి భారత్‌ ఆందోళన పడనవసరం లేదు, పాకిస్తాన్‌ వారిని అదుపు చేసే విధంగా రష్యా,చైనా, ఇరాన్‌లను చూసుకోనివ్వండి అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శ్యామ్‌ సరణ్‌ అభిప్రాయపడ్డారు. తాలిబాన్ల ఆధ్వర్యంలో అక్కడ సుస్ధిరత ఏర్పడితే పాకిస్తాన్‌ కంటే వ్యూహాత్మకంగా చైనా మరింత ఎక్కువ లోతుల్లోకి పోతుంది. అది మధ్య ఆసియాలో తన పట్టును మరింత పటిష్టపరచుకుంటుంది అనికూడా చెప్పారు. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ లాల్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా ఉంది.తాలిబాన్లు అధికారంలోకి వస్తే అమెరికా పాత్ర పరిమితం అవుతుంది. ఆసియాకు రక్షణ కల్పించే ప్రధాన దేశంగా చైనా తయారవుతుంది. అది చతుష్టయ కూటమి పెరుగుదలను ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత ప్రాధాన్యత పలుచనవుతుంది. ద్వౌపాక్షిక సమస్యల్లో భారత దేశం అమెరికా మీద ఆధారపడకూడదని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ పర్యటన స్పష్టం చేసింది. అందువలన భారత అవకాశాలు పరిమితం అవుతాయి. అమెరికన్లు ఈ ప్రాంతంతో వ్యవహారించే వ్యూహాన్ని గతంలో మాదిరి తిరిగి పాకిస్తాన్‌తో ఏర్పరచుకుంటారు. అప్పుడు భారత్‌ తిరిగి హామీతో కూడిన, జీవితాంత మిత్రమైన రష్యాతో చేతులు కలపాల్సి ఉంటుంది.దాని కుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. అయినప్పటికీ భారత్‌ వైఖరులను మార్చుకోవటానికి సిద్దపడాలి. అది ఆఫ్ఘనిస్తాన్‌లోని పాలకులకు వ్యతిరేకంగా ఉండకూడదు. చైనా, రష్యా, ఇరాన్‌ వ్యూహాలకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి. భారత భద్రతకు రష్యా, ఇరాన్‌ ఎంతో కీలకం.


కొంత మంది తాలిబాన్లు వారు సైన్యంలో భాగంగా ఉన్నపుడు భారత్‌లో శిక్షణ పొందారు. భారత్‌ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు వారు తోడ్పడతారు. తద్వారా భారత ప్రయోజనాలను కాపాడుకోవచ్చు.కనుక బుర్రను ఉపయోగించకుండా గుడ్డిగా అమెరికాను అనుసరించటం కాకుండా మన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు నేరుగా తాలిబాన్లతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవటం అవసరం. ఆఫ్ఘన్‌ పౌరులలో మనకు పరపతి ఉంది. అందువలన వేచి చూడకుండా ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని గుర్తించే తొలి జాబితాలో మనం ఉండాలి. ముల్లాల నుంచి లబ్దిపొందాలి. ఇది పాకిస్తాన్‌కు ప్రతిగా పలుకుబడిని కలిగిస్తుంది. ఒక వేళ తాలిబాన్లు స్ధిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పంజేష్వర్‌ లోయలోని ప్రతిఘటన బృందంతో చర్చించేందుకు భారత్‌కు సానుకూల అంశం అవుతుంది.ఎందుకంటే గత తాలిబాన్‌ ప్రభుత్వంలో ఉన్న నార్తరన్‌ అలయన్స్‌లో అది భాగం, దాన్ని భారత్‌ సమర్దించింది.ఐఎస్‌కెపి రాష్ట్రంలోని శక్తులు తాలిబాన్ల మీద యుద్దాన్ని ప్రకటించాయి. ఈ అంశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఇబ్బందికర అంశంగా ఉంటుంది. అలా జరిగితే అక్కడ శాంతి, స్దిరత్వాల సాధనపై ప్రభావం చూపేందుకు తాత్కాలికంగా అయినా భారత్‌ చోదకశక్తిగా ఉంటుంది. అని అనిల్‌ కుమార్‌ చెప్పారు.


తాలిబన్లు ఉగ్రవాదులు, మతశక్తులే, మహిళలు, యావత్‌ జనానికి వారి చర్యలు వ్యతిరేకమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాలో భాగంగా గతంలో వారు పాల్పడిన అకృత్యాలను పదే పదే చూపుతూ, పాత వీడియోలు, దృశ్యాలను చూపుతూ మన ప్రధాన స్రవంతి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాషాయ తాలిబాన్ల సంగతి సరేసరి, చెప్పనవసరం లేదు. ఆఫ్ఘన్‌ తాలిబాన్లతో పార్టీగా సంబంధాలు పెట్టుకోవటం వేరు, వారు లేదా వారి ప్రమేయం ఉన్న శక్తులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరిని అనుసరించాలనే అంశం వేరు. అమెరికా మనలను పట్టించుకోకుండా మోసం చేసిందని లోలోపల కుమిలిపోతున్నారు. ఇప్పుడు తాలిబన్లను గుర్తిస్తే వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా మోడీ అభిమానులు, మతశక్తులు ప్రభుత్వ వైఖరిని జీర్ణించుకుంటాయా ?


మొత్తం మీద చూసినపుడు ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి భద్రతా మండలిలో నెల రోజుల మన అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుంది, సెప్టెంబరు నెలలో ఐర్లండు వంతు వస్తుంది. ఒక విధంగా మన దేశం తాత్కాలికంగా ఇరకాటం నుంచి బయటపడుతుంది. అమెరికాతో అంటకాగటం కొనసాగించాలా లేక ఒక స్వతంత్ర వైఖరితో ఉండాలా అన్నది నరేంద్రమోడీ సర్కార్‌ ముందున్న సవాళ్లలో ఒకటి. అమెరికా బెదిరింపులతో ఇరాన్‌ నుంచి నిలిపివేసిన చమురు కొనుగోళ్లను పునరుద్దరిస్తామని ఇప్పటికే ఒక సంకేతం ఇచ్చారు. మన ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్న విషయం తెలిసిందే. అప్పులోడు-చెప్పులోడి వెంట వెళ్ల కూడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. మనల్ని తప్పించుకొనేందుకు అప్పులోడు ఎటు తీసుకుపోతాడో తెలియదు. తనకు చెప్పులున్నాయి గనుక చెప్పులోడు ముళ్ల కంపలు, రాళ్లురప్పల మీదకు మనలను తీసుకుపోతాడు. అమెరికా కూడా అంతే . దాన్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో ఎటు తీసుకుపోతుందో తెలియదు. మనకే కాదు, నాటో కూటమి దేశాలకు సైతం తలబొప్పి కట్టింది. దానికి తన ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఇతరులు ఏమైనా పట్టదు.మన ప్రయోజనాలను పరి రక్షించుకుంటూ ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే వైఖరి, స్వతంత్ర విదేశాంగ విధానం అవసరం. మోడీ సర్కార్‌ ఆ దిశగా ఆలోచిస్తుందా ? అమెరికాను వదలి వెనక్కు తిరిగిరాలేని స్ధితికి వెళ్లి పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడేండ్ల మోడీ ఏలుబడి : నాడు చెప్పింది ఆస్తుల వృద్ది – నేడు చేస్తున్నది ఉన్న వాటి అమ్మకం ?

29 Sunday Aug 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, Monetisation, Narendra Modi Failures, National Monetisation Pipeline, Nirmala Sitharaman


ఎం కోటేశ్వరరావు


ప్రయివేటీకరణ విషయంలో కాంగ్రెస్‌కు -బిజెపికి ఉన్న మౌలికమైన తేడాలు ఏమిటన్నది కొందరికి సందేహం.సూటిగా చెప్పాలంటే ఆస్తులను సృష్టించిన ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ కాంగ్రెస్‌, వాటిని తెగనమ్మేందుకు పూనుకున్న పక్షం బిజెపి. మొదటి పక్షానికి కాస్త బెరుకు ఉండేది, రెండో పార్టీకి అలాంటి వేమీ లేవు, ఎందుకంటే వారి ఏలుబడిలో సృష్టించిన ఆస్తులేమీ లేవు కదా ! కాకపోతే మిగతా అంశాల్లో ఎలా అయితే ముసుగులు వేసుకుందో ఈ విషయంలో కూడా అదే చేస్తోందన్నది పరిశీలకుల భావన. అదే పూర్తిగా కట్టబెట్టటం కాదు, నిర్వహించి ప్రభుత్వానికి కొంత ముట్టచెప్పటం అని చెబుతున్నది దానికే మోనిటైజేషన్‌ అని పేరు పెట్టారు. ప్రయివేటు రంగం గురించి దేశ ప్రజలకు భ్రమలు, మరులు కొల్పించటం, ఆశ్రితులకు కారుచౌకగా ప్రజల ఆస్తులను కట్టబెట్టటం కొత్త కాదు. నయావుదారవాద విధానంలో అవి ఒక ప్రధాన అంశం.జాతీయ మౌలిక సదుపాయాల గొట్టపు పధకం పేరుతో దానికి తెరతీశారు. గత మూడు దశాబ్దాలుగా చెప్పిన కబుర్లు సినిమా నిర్మాణానికి ప్రమోషన్‌ లేదా ప్రచారంలో భాగంగా చెప్పినవి అనుకుంటే ఇప్పుడు సినిమా చూపిస్తమామా అంటూ విడుదల గురించి ఆర్భాటం చేస్తున్నారు. పాలకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు-కార్మికులు అసమర్ధులు, అవినీతి పరులని పరోక్షంగా అంగీకరిస్తూ ప్రయివేటు రంగ మంత్రం జపిస్తున్నారు. మన కళ్ల ముందే బడా కార్పొరేట్‌ కంపెనీలు ఎలా, ఎందుకు విఫలమయ్యాయో చెబితే వాటి బండారాన్ని జనం అర్ధం చేసుకుంటారు. కానీ ఎక్కడా అలాంటి సమాచారం నరేంద్రమోడీ గారు మిత్రోంకు అందచేసిన దాఖలాల్లేవు.


ప్రయివేటు రంగం ఎంత అవినీతి, అక్రమాలతో జనాలను పీక్కుతింటుందో, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో కరోనా మహమ్మారి వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎస్‌బ్యాంకు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలిసర్వీసెస్‌, ఓడాఫోన్‌, సత్యం కంప్యూటర్స్‌, ఇలా అనేక కంపెనీలు ఎలా మోసాలకు పాల్పడ్డాయో తెలిసిందే.ఇలాంటి వారికి ప్రభుత్వ ఆస్తులను అప్పగిస్తే వారు బాగుచేస్తారన్న హామీ ఏమిటి ? రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ -అనిల్‌ అంబానీ ఘోరవైఫల్యం గురించి తెలిసిందే. మన కళ్ల ముందు దివాలా తీసిన అతి పెద్ద ప్రయివేటు కంపెనీ. వారి సామర్ధ్యం ఏమైంది ? పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులున్న సదరు కంపెనీ 50వేల కోట్ల అప్పులతో ఐపి( దివాలా పిటీషన్‌ ) పెట్టింది. దానికే రాఫెల్‌ విమానాల కాంట్రాక్టును కట్టపెట్టారు. పెద్ద మనిషిగా పేరు గాంచిన రతన్‌ టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వివాదం గురించి తెలిసిందే. సైరస్‌ మిస్త్రీ నియామకం, తొలగింపు, కోర్టు వివాదాలు. అసలు ఏం జరుగుతోంది, వారు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారో జనానికి తెలుసా ? పారదర్శకత ఉందా ! వారి సమస్యలనే వారు పరిష్కరించుకోలేక బజారుకు ఎక్కిన వారు దేశాన్ని ఉద్దరిస్తారంటే నమ్మటం ఎలా ? వారుగాకపోతే మరొకరు. బండారం బయటకు రానంతవరకే పెద్దమనుషులు. తెరతొలిగితే విశ్వరూపం కనిపిస్తుంది.


ఐసిఐసిఐ బ్యాంకు-వీడియోకాన్‌ బాగోతం ఏమిటి ? ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌కు 2009లో 300 కోట్ల రుణం ఇస్తే దానిలో 64కోట్లు మరుసటి రోజే నూపవర్‌ అనే కంపెనీకి బదలాయించారు. రుణం ఇచ్చింది ఎవరు ? చందాకొచ్చర్‌ నాయకత్వంలోని బ్యాంకు బృందం. ఐదోవంతు మొత్తాన్ని తరలించిన పవర్‌ కంపెనీ ఎవరిది, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ది. ఆ బృందంలోని మిగతా సభ్యులకు ఏమీ తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా ? అది లంచం తప్ప మరొకటి కాదు అని కేసు నమోదు చేసి ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు-నీరవ్‌ మోడీ రు.11,400 కోట్ల అవినీతి బాగోతం గురించి చెప్పనవసరం లేదు. సత్యం కంప్యూటర్స్‌ అవినీతి గురించి తెలిసిందే. కార్పొరేట్‌ కంపెనీ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు అవలంభించిన కంపెనీగా, అమెరికా అధ్యక్షుడి సరసన కూర్చున్న సత్యం కంప్యూటర్స్‌కు గోల్డెన్‌ పీకాక్‌ గ్లోబల్‌ అవార్డును కూడా బహుకరించారు.తప్పుడు లెక్కలను తయారు చేసి మదుపుదార్లను మోసం చేసింది ఆ కంపెనీ. తన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రెండు కంపెనీలు సత్యమ్‌ను తిరగేసి మైటాస్‌ అని పేరుపెట్టి ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడులను వాటికి మళ్లించేందుకు ప్రయత్నించారు. సత్యం కంపెనీతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదంటూ ప్రపంచబ్యాంకు ఎనిమిది సంవత్సరాల నిషేధం విధించింది. పెద్దలు ఎలా మోసం చేస్తారో ప్రపంచానికి ఎంతో స్పష్టంగా ఈ ఉదంతం తెలిపింది.


ఇక సింగ్‌ సోదరులుగా పేరుమోసిన మాల్విందర్‌ సింగ్‌ – శివిందర్‌ సింగ్‌ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన రాన్‌బాక్సీ తదితర కంపెనీల యజమానులు.రెల్‌గేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకొని ఆ మొత్తాలను వేరే కంపెనీలకు మరలించి ఈ కంపెనీని దివాలా తీయించారు, 2,387 కోట్ల నష్టాల పాలు చేశారు.పది సంవత్సరాల కాలంలో వీరు 22,500 కోట్ల రూపాయలను నొక్కేశారని తేలింది.
మరో మోసకారి కంపెనీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(డిహెచ్‌ఎఫ్‌ఎల్‌).కంపెనీ బాంద్రా శాఖ పేరుతో ఖాతా పుస్తకాలను తయారు చేశారు. అసలు అలాంటి శాఖే లేదు.బాంద్రాబుక్స్‌గా పిలుస్తున్న ఈ కంపెనీ కుంభకోణంలో జరిగిందేమిటి ? రు.23,815 కోట్లను 2,60,315 మందికి రుణాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాశారు. వాస్తవంగా ఇచ్చింది రు.11,755 కోట్లు. వాటిలో కూడా కొన్నింటిని తనిఖీ చేస్తే రుణం తీసుకున్నవారు అదే యాజమాన్యంలోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా తేలింది. లెక్కలను తారుమారు చేస,ి లేని ఆదాయాన్ని చూపి రు.24వేల కోట్ల మేరకు రుణసెక్యూరిటీల రూపంలో మదుపుదార్ల నుంచి వసూలు చేశారు.


ఇతర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు తిరస్కరించిన వారికి రుణాలు ఇచ్చి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసిఅచిర కాలంలోనే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించినదిగా పేరు మోసిన ఎస్‌ బ్యాంక్‌ చివరికి దివాలా తీసింది. ఎలాగూ ఎగవేసేవే గనుక బ్యాంకు కోరినంత ఫీజులు చెల్లించి మోసగాండ్లు రుణాలు తీసుకున్నారు.చివరికి బ్యాంకులో మదుపు చేసిన వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి వచ్చింది. కేఫ్‌ కాఫీ డే కంపెనీ యజమాని సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాఫీ గింజలను పండించటంలో 140 సంవత్సరాల చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చి అత్యాశకు పోయి అప్పులపాలై చివరకు అలా ముగిసింది. విదేశీ కంపెనీల నుంచి రుణాలు తీసుకున్నారు, తగిన ఆదాయం లేక చివరకు 2,700 కోట్లకు అప్పు పెరిగి ఇచ్చిన వారి వత్తిళ్లను తట్టుకోలేక సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్నాడు.దేశంలో రెండవ స్ధానంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ యజమానులు బ్యాంకులకు రు.8,500 కోట్ల బకాయి పడ్డారు. ఇతరులకు మరో 25వేల కోట్ల మేరకు ఇవ్వాల్సి ఉంది. కింగ్‌ఫిషర్‌, సహారా, డెక్కన్‌ ఇలాంటి విమాన సంస్ధలన్నీ తప్పుడు విధానాలకు పాల్పడి తాము మునిగి బ్యాంకులు, ఇతరులను ముంచాయి. పేరుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులు ఉన్నా అవన్నీ వేలుముద్రలు లేదా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవారితో నిండి ఉంటాయి. ఇలాంటి ప్రయివేటు సంస్దలకు ప్రజల ఆస్తులను అప్పగించబోతున్నారు.
ఇక ప్రయివేటు బ్యాంకులు తీరు తెన్నులను చూద్దాం. గతంలో బ్యాంకులను జాతీయకరణ చేసినందుకు ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టారంటే అమాయకులై కాదు. ప్రయివేటు రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు జనానికి టోపీ పెట్టాయి గనుకనే హర్షించారు. ఇప్పుడు జాతీయ సంపదలుగా ఉన్నవాటిని తిరిగి ప్రయివేటు రంగానికి కట్టబెట్టబోతున్నారు.1947 నుంచి 1969వరకు 559 ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ కాలంలో 736 బ్యాంకులను విలీనం లేదా రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించాలని కోరుతున్నారు. వాటిని ప్రయివేటు వారు కరిమింగిన వెలగపండులా మారిస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత తీసుకుంటారు.1969 బ్యాంకుల జాతీయకరణ తరువాత కూడా కొన్ని ప్రయివేటు బ్యాంకులను అనుమతించారు. వాటిలో ఇప్పటి వరకు 36 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డాయి. అవేవీ ఇప్పుడు ఉనికలో లేవు. గ్ల్రోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు వాటిలో ఒకటి, దానిని ఓరియంటల్‌ బ్యాంకుతో విలీనం చేశారు.ప్రయివేటు యాజమాన్యాలు అంత సమర్ధవంతమైనవి అయితే ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది. ఇప్పుడున్న ప్రయివేటు బ్యాంకులు తమ వాటాను ఎందుకు పెంచుకోలేకపోతున్నాయి.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 563 ప్రయివేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అక్కడ మొత్తం ప్రయివేటు రంగానిదే ఆధిపత్యం కదా !


జాతీయ ధనార్జన గొట్టపు పధకాన్ని (మోనిటైజేషన్‌) ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అలాంటి ప్రశ్నలు మన మీడియాలో వచ్చేదే అపురూపం, ఎందుకంటే మీడియా యాజమాన్యాలు ప్రయివేటీకరణకు అనుకూలం గనుక. ప్రయివేటీకరణ లేదా నిర్వహణకు ప్రయివేటు వారికి అప్పగించటం పేరు ఏది పెట్టినా మన పాలకులు వాటిని పాడి గేదెలు లేదా ఆవులుగా మారుస్తామని చెబుతున్నారు. ఒకసారి మన గేదె, ఆవును ఇతరులకు అప్పగించి మేపి, పాలు తీసి అమ్ముకొని మీరు నాలుగు డబ్బులు వెనకేసుకొని మాకు నాలుగు ఇమ్మని చెప్పిన తరువాత వారు ఎంత ధర చెబితే అంతకు మనం కూడా పాలు కొనాల్సిందే, ధర మీద మనకు అజమాయిషీ ఉండదు. ముసలిదైపోయి పాలిచ్చే అవకాశం లేని దశలో మనకు అప్పగిస్తారు.


అందువలన అలాంటి పనులు చేయబోయే ముందు పోటీ తత్వం ఉందో లేదో , వినియోగదారులను అధిక ధరలతో పిండకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆస్ట్రేలియా పోటీతత్వ నిఘా సంస్ద అధ్యక్షుడు రోడ్‌ సిమ్స్‌ చెప్పారు. మరి తామే అసలైన జవాబుదారులం, చౌకీదారులం అని చెబుతున్న మోడీ సర్కార్‌ అలాంటి చర్చ ఎన్నడైనా, ఎక్కడైనా జరిపిందా ? ఆస్ట్రేలియాలో తరచుగా పోటీ లేకుండా ప్రయివేటు వారికి అప్పగిస్తున్నారని సిమ్స్‌ వాపోయాడు.నియంత్రణలు లేకపోతే జనాన్ని పీక్కుతింటారని అన్నాడు. ఆస్తులను పాడిగేదెల మాదిరి మారిస్తే ఆర్ధిక సామర్ధ్యానికి ప్రతిబంధకం అవుతుందన్నాడు. 2013లో పోటీ తత్వం లేకుండా బోటనీ అనే ఆస్ట్రేలియా రేవును ప్రయివేటు వారికి అప్పగించారు. తరువాత న్యూకాజిల్‌ ప్రాంతంలో మరొక కంటెయినర్‌ టెర్మినల్‌ను ప్రతిపాదించారు. దాన్ని నిర్మించితే రేవు నూతన యజమానులకు 510 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ప్రయివేటీకరించిన రేవులు, విమానాశ్రయాలు యజమానుల మార్కెట్‌ శక్తిని తగ్గించటం లేదని సిమ్స్‌ పేర్కొన్నాడు. అంటే పోటీని అనుమతించటం లేదనే అర్దం. ఇదే సిమ్స్‌ ఏడు సంవత్సరాల క్రితం ఇదే హెచ్చరిక చేశాడు. పోటీకి అనుకూల సంస్కృతిని ఆస్ట్రేలియా కోల్పోతోందని చెప్పాడు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో విద్యుత్‌ స్ధంభాలు, వైర్ల ప్రయివేటీకరణ చేసిన తరువాత ఐదు సంవత్సరాల్లో వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. దాంతో ప్రభుత్వం వినియోగదారుల మీద భారం తగ్గించే చర్యలను చేపట్టింది.
సిడ్నీ నగరంలో నిర్మిస్తున్న భూగర్భ రోడ్డు మార్గంలో 51శాతం వాటాను ప్రయివేటు కంపెనీకి అమ్మివేశారు. దాని గురించి సమాచార హక్కు కింద వివరాలు ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని, ఆడిటర్‌కు కూడా పరిమితులు పెట్టారని సిడ్నీమోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక రాసింది.సింగపూర్‌లో రైల్వేలను కొంత మేరకు ప్రయివేటీకరించారు. తీసుకున్న యజమాని తగినంత పెట్టుబడి పెట్టని కారణంగా రైళ్లు ఆగిపోతున్నాయి. అందువలన తిరిగి జాతీయం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.


పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి చార్జీలు తగ్గించిన విషయం తెలిసిందే. ఆలశ్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో వినియోగదారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షించింది. తన ఆర్ధికశక్తిని పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన మార్కెట్‌ను ఆక్రమించింది. పోటీ కంపెనీలు దివాలా దీసిన తరువాత చార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపెనీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే ముకేష్‌ అంబానీ ఎంత చెబితే అంత చెల్లించకతప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్‌ మరొకటి ఏదైనా అంతే మొత్తం ప్రయివేటు వారి నిర్వహణకు పోతే వారెంత చార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే. పజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం మన దేశంలోనే కాదు అనేక దేశాల పాలకులు సమర్పించుకుంటున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న వాటి విలువ కనిష్టంగా 75లక్షల కోట్ల డాలర్లని నాలుగు సంవత్సరాల నాటి ఒక అంచనా.రాష్ట్ర,స్ధానిక ప్రభుత్వాల వాటిని కూడా కలుపుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల అప్పులు అనేక దేశాల్లో జిడిపికి వందశాతం దాటి నందున రాబోయే రోజుల్లో ఆర్ధిక వృద్ధి మరియు ఉపాధి కల్పనకు నిధుల కేటాయింపు మరింత ఇబ్బంది అవుతుందని, అవసరాలకు – కేటాయింపులకు మధ్య తేడా 2040 నాటికి 15లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో కూడా అదే జరుగుతోంది.


1998నాటికి మన కేంద్ర ప్రభుత్వ రుణం 9,896,997,300( దాదాపు పదిలక్షల కోట్లు), అది 2014లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికి 53లక్షల కోట్లకు పెరిగింది.2021 మార్చి నాటికి ఆ మొత్తం 116,217,806,400 కోట్లు( 116లక్షల కోట్లు) వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి అది 132లక్షల కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం-రాష్ర ప్రభుత్వాల రుణాల మొత్తం జిడిపిలో 2019-20నాటికి 70శాతం అయితే, మరుసటి ఏడాదికి అది 90శాతానికి చేరింది. వందశాతం మార్కు దాటటానికి ఎంతో దూరంలో లేము. అందువలన పాలకులు తెగబడి ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి తెగనమ్మి లేదా అనుభవానికి అప్పగించి సొమ్ము చేసుకొని లోటు పూడ్చుకొనేందుకు లేదా అప్పులు తీర్చేందుకు పూనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తరువాత జనం మీద మరిన్ని భారాలు మోపటమే తరువాయి. నిరుపయోగంగా పడి ఉన్న ఆస్తులను ధనార్జన అని నిర్మలమ్మ నమ్మబలుకుతున్నా అసలు విషయం వేరే. 2021 ఫిబ్రవరి 24 మన ప్రధాని నరేంద్రమోడీ జాతికి ఒక సందేశం ఇచ్చారు. మోనిటైజ్‌ అండ్‌ మోడర్నయిజ్‌ (ధనార్జన మరియు నవీకరణ) అనే ఇతివృత్తంతో బడ్జెట్‌ను రూపొందించామని, ప్రభుత్వం ఉన్నది పాలన చేయటానికి తప్ప వాణిజ్యం చేయటానికి కాదు అన్నారు.కేంద్ర ప్రభుత్వశాఖ ” దీపం ”(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేసిన ఒకవెబ్‌నార్‌లో మోడీ మాట్లాడారు. ప్రయివేటీకరణ మరియు ధనార్జన(మోనిటైజేషన్‌) ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు వినియోగిస్తామన్నారు. అంటే వీలైన వాటిని తెగనమ్మేస్తారు, కాని వాటిని మోనిటైజేషన్‌ పేరుతో ప్రయివేటు వారి అనుభవానికి సమర్పిస్తారు. చిత్రం ఏమిటంటే బ్రిటన్‌ కంపెనీ అయిన వోడా ఐడియా కంపెనీ చేతులెత్తేసి మా వాటాలను అప్పగిస్తాం మమ్మల్ని ఊబి నుంచి బయటపడేయండి అని వేడుకోళ్లకు దిగింది. దాన్ని కొనుగోలు చేసేందుకు జియో ఇతరులు పోటీ పడుతున్నాయి. ఇంకా అనేక కంపెనీలు అదే స్ధితిలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్తులతో ఆర్జన మాచేత కావటం లేదు వీటిని తీసుకొని మాకు నాలుగు రూకలిచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ సర్కార్‌ వీధుల్లో నిలబడింది. ఏడు సంవత్సరాల క్రితం మీరు మాదేశానికి రండి, వస్తువులను తయారు చేయండి, ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి అని విదేశీ కార్పొరేట్‌లు, వాణిజ్య సంస్ధలకు విజ్ఞప్తి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు అవే సంస్ధలకు మా ఆస్తులను తీసుకోండి, నిర్వహించండి, మాకు కొంత సొమ్ము ముట్ట చెప్పండి అని వేడుకుంటున్నారు. ఎంతలో ఎంత మార్పు !


బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కేంద్ర ప్రభుత్వ ధనార్జన గొట్టపు మార్గం గురించి చేసిన వ్యాఖ్యతో దీన్ని ముగిద్దాం.” ఆర్ధిక వ్యవస్ధ అధోగతి పాలైనపుడు ప్రజల ఆస్తులను అమ్మటం మానసిక దివాలా మరియు నిరాశకు ఒక సూచిక. ఇది ఆరోగ్యకరమైన సైద్దాంతిక విధాయకత కాజాలదు.2016 నుంచి జిడిపి వృద్ది రేటు ఏడాది తరువాత ఏడాది, త్రైమాసికం తరువాత త్రైమాసికం దిగజారుతున్నదని సిఎస్‌ఓ సమాచారం వెల్లడిస్తున్న అంశాన్ని మోడీ ప్రభుత్వం తిరస్కరించజాలదు.”
ఈ వ్యాసానికి మొదటి భాగ లింక్‌

బిడ్డా రాహుల్‌ గతంలో నోరెత్తలేదేం – నిలదీసిన నిర్మలక్క, స్మృతక్క

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిడ్డా రాహుల్‌ గతంలో నోరెత్తలేదేం – నిలదీసిన నిర్మలక్క, స్మృతక్క

27 Friday Aug 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

BJP, Narendramodi, National Monetisation Pipeline, Nirmala Sitharaman, Niti Aayog, NMP, Rahul gandhi, Smriti Irani

!
ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ద్వారా 2025 నాటికి ఆరులక్షల కోట్ల రూపాయల ధన ఆర్జనకు నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగస్టు 23వ తేదీన ప్రకటించారు. దీనికి నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌-ఎన్‌ఎంపి( జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ) అని నామకరణం చేశారు. గొట్టపు బావుల ద్వారా నీటిని తోడినట్లు ప్రభుత్వ ఆస్తులతో ధనాన్ని సంపాదిస్తామన్నది అర్ధం. సమర్ధించేవారు ముందుకు తెస్తున్న వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వం ఒక కుటుంబం అనుకుందాం. మనింట్లో ఉన్న బావిని మన కుటుంబం ఒక్కటే వినియోగిస్తున్నది. నీళ్లు తోడమంటే కుటుంబసభ్యులే విసుక్కుంటున్నారు. ఎక్కువ సేపు నిరుపయోగంగా పడి ఉంటున్నది. దాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చి రోజంతా నీళ్లు తోడిస్తే మనకు కొంత సొమ్ము ముట్టచెబుతారు. నీళ్లు లేనివారికి నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. కొంత మందికి పని కల్పిస్తారు, తద్వారా ప్రభుత్వానికి పని కల్పించే, నీళ్లు అందించే ఖర్చు తప్పుతుంది. ఒప్పంద గడువు ముగిసే వరకు బావికి వచ్చే మరమ్మతులు, నిర్వహణకు తీసుకున్నవారే పెట్టుబడి పెడతారు. తిరిగి మన బావిని మనకు అప్పగిస్తారు. వారు ఇచ్చే మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగించి మరిన్ని సంపదలు సమకూర్చుకోవచ్చు.


మరొక ఉదాహరణ. మీకు ఒక ఇల్లు ఉంది. ఉద్యోగ రీత్యా వేరే ఊరు, రాష్ట్రం, దేశం పోతారు. దాన్ని అద్దెకు ఇచ్చుకుంటామా పాడు పెట్టుకుంటామా ? అలాగే ఖాళీ స్ధలం ఉంది, ఎవరికైనా అద్దె లేదా కౌలుకు ఇచ్చుకుంటే నాలుగు రూపాయలు వస్తాయా రావా? అలా చేస్తామా, చెట్లుచేమలను మొలిపిస్తామా, పాములు, పుట్టలను పెరగనిస్తామా ? ప్రభుత్వ ఆస్తులను అమ్మటం లేదు, పధకాలకు అవసరమైన డబ్బుకోసం వినియోగానికి మాత్రమే ప్రయివేటు వారికి ఇస్తున్నారు.యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే, ప్రయివేటు వారు అభివృద్ధి చేసి గడువు తీరిన తరువాత తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. దీని మీద రచ్చ చేయటం ఏమిటి ? ఇది తీరు ! దీనిలో వాస్తవం లేదా ? కాదని ఎలా అంటాం, ఎంత మంచి ఆలోచన !


దేశవ్యాపితంగా దీని గురించి చర్చ జరుగుతోంది. నరేంద్రమోడీ డీమానిటైజేషన్‌ షాకు తిన్న జనానికి ఇప్పుడు నిర్మలమ్మ మానిటైజేషన్‌ ఆశచూపుతున్నారు. సామాన్యులు ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. ఆ పదానికి అసలైన అర్ధం ఏమిటి అని కొందరు పండిత చర్చ చేస్తున్నారు. నిఘంటు అర్ధం గురించి తీరికగా తెలుసుకుందాం. ప్రధాని గారూ డీమానిటైజేషన్‌ ఎందుకు అంటే ఉపయోగంలో లేకుండా ఎక్కడెక్కడో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు, తద్వారా పెట్టుబడులకు అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి కోసం అని చెప్పారు. కమ్యూనిస్టులు, ఇతరులు కొందరు తప్ప అత్యధికులు ఆహౌ ఓహౌ మహత్తర ఆలోచన, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అని నోట్లు మార్చుకొనేందుకు ఎలా వరుసలు కట్టి నిలుచున్నారో తెలిసిందే. ఇంకేముంది సమాంతర ఆర్ధిక వ్యవస్ధను నడుపుతున్న నల్లధనం నడుం విరిగిపోతుంది అని కొందరు జోశ్యం చెప్పారు. అసలు ఆ ”అవిడియా” నాదే అని చెప్పిన చంద్రబాబు గురించీ తెలిసిందే. ఆచర్యతో ఎంతో నష్టం తప్ప నల్లధనం వెలికి వచ్చిందీ లేదు,వృద్ది ఇంకా దిగజారింది తప్ప దేశానికి వీసమెత్తు ఉపయోగం లేదు. (ఇప్పుడు వీసం పదం వినియోగంలో లేదు గనుక సెంటీమీటరు లేదా పావలా ప్రయోజనం లేదు అనుకోవచ్చు) అనేక అంశాలలో తలలు బొప్పి కట్టిన తరువాత మోడీగారు ధనార్జన పధకాన్ని ప్రకటించటానికి నిర్మలమ్మగారికి అప్పగించారు. ఆచరణలో డబ్బు ఆర్జన జరుగుతుందని చెబుతున్నారు గనుక అలాగే పిలుద్దాం. ప్రభుత్వ అంటే ప్రజల ఆస్తులను కొంత మంది పెద్దలు కాజేయటం ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా మిగిలి ఉన్న ఏ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలా అని చాలా కాలం నుంచే తన్నుకుపోయేందుకు రాబందుల్లా ఆకాశంలో కార్పొరేట్‌ శక్తులు తిరుగుతున్నాయి.గోతికాడ నక్కల్లా భూమ్మీద కాచుకు కూర్చున్నాయి.భూమి ప్రమేయం ఉన్న ఆస్తులను తెగనమ్మటానికి ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి అధికారం లేదు. ఎవరికైనా వినియోగహక్కు మాత్రమే ఉంటుంది. అందువలన దాన్ని వేరే రూపంలో కట్టబెట్టేందుకు ఎంచుకున్న సరికొత్త మార్గం ఇది అన్నది స్పష్టం.అంతే కాదు తమ మాదిరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ధనార్జనకు పూనుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు.


బిజెపివారు, కేంద్ర ప్రభువులు, భుజం మార్చుకోకుండా వారిని మోస్తున్నవారు చెబుతున్నట్లుగా నిరుపయోగంగా ఉన్నవాటిని ఎవరైనా వృద్ది చేస్తామంటే ఎవరు అభ్యంతర పెడతారు. సామాన్య జనానికి ప్రయోజనం లేక కేవలం పెద్దల విలాసాలకు మాత్రమే ఉపయోగపడే, ఖజానాకు భారంగా మారిన హౌటళ్లను పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం వదిలించుకుంది. చైనా తరువాత ప్రపంచంలో పెద్ద దేశమైన మనం ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం ఎంత తపించామో, ఏ స్ధితిలో ఉన్నామో తెలిసిందే. వినియోగంలో లేని స్టేడియాలను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించితే ఎవరు వద్దన్నారు. ఆపని చేయకుండా వాటిని కార్పొరేట్లకు అప్పగించితే వాణిజ్య ప్రయోజనాలు తప్ప క్రీడలకు ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది ? ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రణాళికలు లేకుండా ఏ దేశంలో అయినా క్రీడాకారులు అభివృద్ది చెందిన దాఖలా ఉందా ? లేదూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు అటువంటి లక్ష్యం ఉంటే ఏ సంస్ధ ఇప్పటి వరకు ఎంత మందిని తయారు చేసి ఎన్ని పతకాలు సాధించిందో చెప్పమనండి. నరేంద్రమోడీ గారు టీ అమ్మాను అని చెబుతున్న రైల్వే స్టేషన్ల వంటివి చాలా ఉన్నాయి. దేశభక్తులైన కార్పొరేట్‌ సంస్ధలు, వ్యాపారులు అలాంటి వాటిని అభివృద్ధి చేయమనండి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ, సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయని బుర్రలో గుంజున్నవారు ఎవరైనా చెబుతారా ? తిరిగే వాహనాలు లేక జాతీయ రహదారులుపాడుపడి పోయాయని తలలో మెదడు ఉన్నవారు అనగలరా ? విశాఖ, కాకినాడ వంటి రేవులకు ఓడలు రాక బోసిపోతున్నాయని రుజువు చూపగలరా ? అందువలన నిరుపయోగంగా ఉన్నవాటిని ప్రయివేటు వారికి ఇచ్చి డబ్బు సంపాదిస్తామని బిజెపి వారు చెబుతున్నదానిలో వాస్తవం ఎంత ? అందుకే ప్రయివేటీకరణకు మారు పేరే మానిటైజేషన్‌ అంటున్నవారిని తప్పుపడితే ఎలా !


దేశం ముందుకు పోవాలంటే,ప్రపంచ స్ధాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే మోనిటైజేషన్‌ ఒక్కటే ఏకైక మార్గం అని నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పారు. పూర్వం బ్రతుకు తెరువు కోసం గ్రామాల్లో బుర్రకథలు, హరికథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించి సొమ్ము చేసుకొనేందుకు అసలు మీ ఊరి గురించి మీకేమి తెలుసు చుట్టుపట్ల అరవై ఆరు ఊళ్లకు పోతుగడ్డ అనగానే నిజమే కదా అనుకొని పండిన ధాన్యం, పప్పు ధాన్యం వంటివి పెద్ద మొత్తంలో ఇచ్చి సత్కరించే వారు. ఇప్పుడు పాలకులు-అధికారులు ఎవరున్నా ప్రపంచ స్దాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే చేస్తున్నవన్నీ అని చెప్పటం పోతుగడ్డలను గుర్తుకు తెస్తోంది.
ప్రపంచ స్ధాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ పంచ రంగుల చిత్రాన్ని చూపుతున్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని చెప్పినపుడు జరిగిన చర్చ ఏమిటి గ్యాస్‌ స్టౌవ్‌లు ఇస్తే చాలదు వాటి మీద వండుకొనేందుకు సరకులు, అవికొనుగోలు చేసేందుకు అవసరమైన ఆదాయానికి ఉపాధి సంగతి ఏమిటన్నదే కదా ! కరోనా సమయంలో ఆత్మనిర్భర పధకంలో చెప్పింది ఏమిటి ? కార్పొరేట్‌ ఆసుపత్రులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తామనే కదా ? కార్పొరేట్‌లు గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆసుపత్రులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? వినియోగించే జనం ఆర్ధిక స్ధాయి, చెల్లించేశక్తిని బట్టి క్రమంగా సౌకర్యాలను పెంచాలి తప్ప ప్రపంచస్ధాయి పేరుతో ధనికులకు మాత్రమే ఉపయోగపడే, కార్పొరేట్లకు లాభాలు తెచ్చే వాటిని అమలు జరిపితే అసమానతలు మరింతగా పెరుగుతాయి తప్ప అభివృద్ధి ఫలాలు అందరికీ అందవు. రోడ్ల నిర్మాణానికి పెట్రోలు, డీజిలు కొనుగోలు చేసేవారందరూ సెస్‌ పేరుతో పన్ను కడుతున్నారు. వాటితో వేశామని చెబుతున్న రోడ్లను ఉపయోగించినందుకు తిరిగి వారే టోలు టాక్సు కడుతున్నారు. జాతీయ రోడ్ల అభివృద్ది సంస్ద రోడ్లు వేయగలిగినపుడు వాటిని నిర్వహించలేదా ? అంత అసమర్ధంగా ప్రభుత్వం – అధికార యంత్రాంగం ఉందా ? గత కాంగ్రెస్‌కు బిజెపికి ఇంక తేడా ఏముంది ?


ధనార్జన గొట్టపు మార్గ పధకాన్ని ప్రకటించింది నిర్మలా సీతారామన్‌ అయినప్పటికీ ఇది నరేంద్రమోడీ గారి కలకు రూపకల్పన అని ఆమే చెప్పారు. గతంలో ప్రణాళికా సంఘం ద్వారా ఆస్తుల కల్పన జరిగింది. దాని స్ధానంలో మోడీగారు తెచ్చిన నీతి అయోగ్‌ వాటిని కొంత మందికి కారుచౌకగా కట్టబెట్టే పనిలో ఉంది. ఆ సంస్ధ నివేదిక విడుదల-జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ప్రారంభం సందర్భంగా ఆర్ధిక మంత్రి ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.వర్తమాన సంవత్సర బడ్జెట్‌లోనే ప్రభుత్వం దీని గురించి చెప్పిది. ఇదేమీ కొత్త కాదు, వినూత్న పధకమూ కాదు. ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య మెల్లగా అయినా రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక్కడ జర్మన్‌ నాజీ నరహంతకుడు హిట్లర్‌ పాలన గురించి తొలుత భ్రమపడి చివరకు జైల్లో పడిన తరువాత కనువిప్పు కలిగిన ఒక మతాధికారి జైల్లోనే రాసిన ప్రఖ్యాత కవితను ఇక్కడ గుర్తుకు తేవటం సమయోచితంగా ఉంటుంది. మొదటి లైను జర్మను కవిత, రెండవది దానికి సామ్యం.
” వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు గనుక మౌనంగా ఉన్నాను-
తొలుత నష్టాలు తెచ్చే కంపెనీలను వదిలించుకుందాం అని చెప్పారు కనుక నిజమే పోతే పోనీ అనుకున్నా
వారు తరువాత కార్మిక నేతల కోసం వచ్చారు -నేను కార్మికుడిని కాదు కనుక మాట్లాడలేదు-
ప్రయోజనం లేని కంపెనీలు కొనసాగటం అనవసరం అమ్మేద్దాం, మూసేద్దాం అంటే కామోసు అనుకున్నాను
వారు తరువాత యూదుల కోసం వచ్చారు – నేను యూదును కాదు గనుక ప్రశ్నించలేదు-
కొన్ని కంపెనీల్లో కొన్ని వాటాలు అమ్ముతాం అన్నారు, కొన్నే కదా ఇబ్బందేముంది అనుకున్నా
వారు చివరికి నాకోసం వచ్చారు – తీరా చూస్తే నాగురించి ప్రశ్నించేవారు మిగల్లేదు –
చివరిగా లాభనష్టాలతోనిమిత్తం లేకుండా నేను పనిచేస్తున్న కంపెనీ ప్రయివేటుకు ఇస్తా మంటున్నారు, నాకు మద్దతుగా మాట్లాడేవారు లేకుండా పోయారు ”
అన్నట్లుగా అనేక మంది ఇప్పుడు ముప్పు ముంచుకు వస్తున్నందున వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. వారి సంఖ్య పెరిగే లోపు, ప్రతిఘటనకు సిద్దపడేలోగా లాభాలు, సంపదలను సృష్టించే కంపెనీలను కూడా వదిలించుకొనేందుకు విధానపరంగా పూనుకున్నారు. అందువలన ఇక దాచేదేముంది చెప్పేదేదో గట్టిగా చెబితే అటో ఇటో తేలిపోతుందని, ఇంక ఎంత వ్యతిరేకించినా జరిగేది జరగక మానదని జనం నిరుత్సాహంతో నీరుగారి పోవాలనే ఎత్తుగడతో ఆర్భాటంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాము ఎంత కఠినంగా ఉండేది దేశానికి చూపేందుకు రైతులు ఢిల్లీకి రాకుండా రోడ్ల మీద మేకులు కొట్టి, ఎంతకాలం రోడ్ల మీద ఉంటారో ఉండండి అని భీష్మించుకున్న తీరును చూస్తున్నాము. దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిన్నది కనుక దానికి నిధులు అవసరమని ఒక సాకుగా చూపవచ్చు. కొంత మందిని అయినా నమ్మించి వ్యతిరేకతను తగ్గించవచ్చు.


ఇప్పటికే ఉన్న ఆస్తుల ద్వారా స్ధిరమైన ఆదాయాన్ని పొందుతామని చెబుతున్నారు. జాతీయ మౌలిక సదుపాయాల గొట్టం(నేషనల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ పైప్‌లైన్‌-నిప్‌) కోసం 43లక్షల కోట్ల రూపాయలతో రూపొందించిన పధకానికి ధన ఆర్జన గొట్టం ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలని ప్రతిపాదించారు. మరికొన్ని లెక్కల ప్రకారం వీటితో సహా మొత్తం 111 లక్షల కోట్లతో అభివృద్ది అని చెబుతున్నారు. 2022-25 ఆర్ధిక సంవత్సరాల మధ్య రోడ్లను ప్రయివేటు వారికి అప్పగించటం ద్వారా రు.1,60,200 కోట్లు, రైల్వేల ద్వారా రు.1,52,496 కోట్లు, పవర్‌ ట్రాన్సిమిషన్‌ ద్వారా రు.45,200 కోట్లు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 39,832 కోట్లు, సహజవాయు పైప్‌లైన్‌ ద్వారా రు.24,462 కోట్లు, టెలికాం టవర్ల ద్వారా రు.35,100, గోదాముల ద్వారా రు.28,900, గనుల నుంచి రు.28,747, ప్రోడక్ట్‌ పైప్‌లైన్‌ ద్వారా రు.22,504, వైమానిక రంగం నుంచి రు.20,782, పట్టణ రియలెస్టేట్‌ నుంచి రు.15,000, రేవుల ద్వారా రు,12,828, స్టేడియంల ద్వారా రు.11,450 కోట్ల రూపాయలను ఆర్జించాలని ప్రతిపాదించారు. వీటిలో నిరర్దక ఆస్తులు లేదా ఆదాయం రాని ఆస్తులు ఏవో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఈ మధ్య బ్రౌన్‌ ఫీల్డ్‌ మరియు గ్రీన్‌ ఫీల్డ్‌ ఆస్తులు అనే పదాలు వాడుతున్నారు. ఇప్పుడు ఉనికిలో ఉన్న ఆస్తులు మొదటి తరగతి, కొత్తగా ఏర్పాటు చేసేవి రెండవ తరగతి. రెండవ తరగతిని ప్రయివేటు రంగానికి అప్పగించాలన్నది నిర్ణయం. ఉన్న వాటిని ప్రయివేటీకరించటం లేదా కౌలుకు ఇవ్వటం ద్వారా జనాల నుంచి పిండే మొత్తాల విషయాన్ని కూడా పాలకులు చెబితే నిజాయితీని అర్ధం చేసుకోవచ్చు.


ఆస్తులను ప్రయివేటు వారికి అప్పగించే కేంద్ర ప్రకటన, విధానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దాని మీద నిర్మలమ్మ, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతరులకు ఆగ్రహం వచ్చింది. బిడ్డా 2008లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ అభివృద్దికి ప్రయివేటు వారిని ఆహ్వానించినపుడు ఏం చేసినవ్‌, వాటి పత్రాలను నాడు ఎందుకు చించివేయలేదు ? ఎందుకు నోర్మూసుకున్నవ్‌ అని నిర్మలమ్మ ప్రశ్నించారు. మీ అమ్మ సోనియా గాంధీ అప్పుడు దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నించారని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోని రాష్ట్రాలు కూడా చేస్తున్నది ఇదే, దాని అర్ధం అవి కూడా ప్రయివేటీకరిస్తున్నాయా అని నిలదీశారు. ఒకటి స్పష్టం. గతంలో కాంగ్రెస్‌-ఇప్పుడు బిజెపి రెండూ ప్రజల ఆస్తులను ఏదో ఒక సాకుతో ప్రయివేటు పరం చేస్తున్నారని తేలిపోయింది. అప్పుడు పూర్తిగా చేయలేకపోయారు, ఇప్పుడు తెగించి సంపూర్ణం చేయదలచారు. కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కూడా వీటికి మినహాయింపు కాదు. ఏడు దశాబ్దాల్లో సమకూర్చిన రత్నాలను ఇద్దరు ముగ్గురు స్నేహితులైన వాణిజ్యవేత్తలకు బహుమతిగా కట్టబెడుతున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మొత్తం ప్రయివేటీకరణ, మోనిటైజేషన్‌ గుత్తాధిపతులను సృష్టించేందుకే అని ఇదంతా ఎవరికోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు.


సుపరిపాలన అందిస్తామని చెబుతున్న పాలకులు ప్రభుత్వ రంగంలో పని చేసే వారిని దారిలో పెట్టి కమశిక్షణ కలిగిన జాతిగా రూపొందించే కృషిలో పని సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ఎందుకు ప్రయత్నించరు , వారు చెప్పే జాతి నిర్మాణం అంటే ఏమిటి ? ప్రభుత్వ రంగం అంటే అసమర్ధకు మారు పేరు అంటున్న వారు ప్రయివేటు రంగం అసమర్ధత గురించి ఎందుకు చెప్పరు ? నరేంద్రమోడీ ప్రపంచనేత అని చెబుతున్నారు, ధనార్జన ఆయన కలల సాకారం అని కూడా చెప్పారు. అనేక దేశాలను పర్యటించిన అనుభవం కూడా ఉంది. గనుక ఇలాంటి ధనార్జన చేస్తున్న ఇతర దేశాల అనుభవాలను జనానికి ఎందుకు చెప్పరు ? అన్ని దేశాల సంగతి వదిలేద్దాం. చతుష్టయంలో భాగమైన ఆస్ట్రేలియా గురించి అయినా ఎందుకు ప్రస్తావించలేదు ? అక్కడేం జరిగింది ? మరో భాగంలో చూద్దాం !

ఈ వ్యాసానికి రెండవ ముగింపు భాగ లింక్‌
https://vedikaa.com/2021/08/29/national-monetisation-pipeline-part-two-modi-inviting-failed-private-sector-to-take-over-public-assets/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధనికులపై అదుపు – ఉమ్మడి సౌభాగ్యం దిశగా చైనా అడుగులు !

25 Wednesday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Social Inclusion

≈ Leave a comment

Tags

China’s ‘common prosperity’, common prosperity for all, Xi Jinping


ఎం కోటేశ్వరరావు

చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ఆగస్టు 17న చేసిన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించిన ” ప్రజల ఉమ్మడి సౌభాగ్యం ” అనే పదం గురించి ప్రపంచంలో అనేక మంది దాని అర్ధం ఏమిటబ్బా అని మల్లగుల్లాలు పడుతున్నారు.ముఖ్యంగా సోషలిస్టు విధానం నుంచి వైదొలిగిన చైనా ”ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని” అనుసరిస్తున్నదని సంతృప్తి ( సోషలిజం కాదంటున్నారు గనుక పోనీలే ఏదో ఒక పెట్టుబడిదారీ విధానం అని) చెందుతున్నవారికి ఇది మింగుడు పడటం లేదు. కావాలంటే దిగువ వారిని పైకి తీసుకురావచ్చు తప్ప పెరిగేవారిని అదుపు చేసే పితలాటకం ఏమిటి అని చిరచిరలాడుతున్నారు. అచిర కాలంలోనే అద్భుత విజయాలు సాధించిన చైనా ప్రయాణం మరో మలుపు తిరగనుందా ? తన ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో అడపాతడపా దేశ ఉమ్మడి సౌభాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్న అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌ ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్రసంగంలో క్రీస్తుపూర్వం 571-479 మధ్య కాలంలో జీవించిన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్‌ తన శిష్యులకు చెప్పిన ఒక లోకోక్తిని ఉటంకించారు.” తెలివైన నేత దారిద్య్రాన్ని గురించి కాదు అసమానతల గురించి ఆందోళన చెందుతాడు.తన జనం తక్కువ మందే ఉన్నారని కాదు వారిలో తీవ్ర విభజన ఉందని ఆందోళన చెందుతాడు.” అని చెప్పాడు.


చైనాలో అసమానతలు పెరుగుతున్నాయన్న విమర్శలు, ఆవేదన, ఆందోళనలు గత కొంత కాలంగా ఇంటా బయటా పెరుగుతున్న విషయం తెలిసిందే. చైనా 2021లో 1,058 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉంది, 696మందితో అమెరికా, 177 మందితో మన దేశం మూడవ స్ధానంలో ఉంది. ఈ అంకెలను చూసి చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిస్టు వ్యవస్ధ కాదని కొంత మంది కమ్యూనిస్టులు కూడా భావించుతున్నారు. గ్జీ లేదా కమ్యూనిస్టు పార్టీ మాటలకు అర్ధం తెల్లవారేసరికి చైనాలోని బిలియనీర్ల సంపదలు మొత్తం స్వాధీనం చేసుకొని అందరికీ సమంగా పంచబోతున్నారని కాదు, కొత్తగా ఎవరినీ ధనవంతులను కానివ్వకుండా అడ్డుకోనున్నారనీ కాదు. పేదలు-ధనికుల మధ్య అంతరాన్ని మరింతగా పెరగటాన్ని అనుమతించకూడదని ఈ ఏడాది జనవరిలో జింపింగ్‌ చెప్పాడు. నిర్దిష్టమైన కార్యక్రమం గురించి ఎలాంటి స్పష్టత ఇంకా లేదు.
ఆగస్టు 17 ప్రసంగంలో గ్జీ పదే పదే ఉమ్మడి సౌభాగ్యం గురించి చెప్పటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది కాలంలో తన ప్రసంగాల్లో 30సార్లు అపదాన్ని వినియోగిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 65సార్లు చెప్పినట్లు అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయలో చైనా రాజకీయ పదజాల అధ్యయనవేత్త మరియా రెపినికోవా వెల్లండించారు. గ్జీ ఉద్దేశ్య బలాన్ని ఇది సూచిస్తున్నదన్నారు. నేతల నినాదాలు విధాన దిశ లేదా మార్పును సూచిస్తాయని,కొన్ని సందర్భాలలో అసందిగ్గత, భాష్యాల సర్దుబాటుకు అవకాశం కూడా ఇస్తారని చెప్పారు. ఆగస్టు 17వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆర్ధిక మరియు విత్త వ్యవహారాల కమిటీ సమావేశంలో గ్జింపింగ్‌ ప్రసంగించారు. ఆదాయ పంపిణీ, అక్రమ మరియు సహేతుకంగానీ ఆదాయాల సమస్యలను ఎదుర్కొనేందుకు, అధిక ఆదాయాలను సహేతుకంగా సర్దుబాటు చేసేందుకు గాను అధికపన్నులు, సామాజిక భద్రత, చెల్లింపుల బదలాయింపుల వంటి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు.


ఈ సమావేశం జరిగిన మరుసటి రోజు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ఉమ్మడి సౌభాగ్యం అంటే క్లుప్తంగా ఏమిటి అంటూ ఒక గీతల చిత్రాలతో గ్జిన్హువా వార్తా సంస్ధ విడుదల చేసిన ఒక వివరణ ప్రచురించారు.” మరింత న్యాయమైన పంపిణీ మరియు అత్యంత నాణ్యమైన అభివృద్ది మీద చైనా దృష్టి సారించింది. ఉమ్మడి సౌభాగ్యం అంటే ఏమిటి ? భౌతిక మరియు సాంస్కృతిక పరిభాషలో ప్రతి ఒక్కరూ సంపదను పంచుకోవటాన్ని ఉమ్మడి సౌభాగ్యం అనే మాట చెబుతున్నది.కొంత మంది మాత్రమే భాగ్యవంతులుగా ఉండకూడదు. సమానత్వ రహిత విశ్వాసిగా ఉండకూడదు. ఉమ్మడి సౌభాగ్యానికి ప్రాతిపదిక ఏమిటి ? జనాలు తమ అభివృద్ధి సామర్ధ్యాలను వృద్ది చేసుకొనేందుకు మెరుగైన పరిస్ధితులను కల్పించటం. మరింత ఎక్కువ మంది ధనవంతులు అయ్యేందుకు వీలుకలిగించే పరిసర వాతావరణాన్ని కల్పించటం. ఉమ్మడి సౌభాగ్య సూత్రాలేమిటి ? ప్రతి ఒక్కరూ లబ్ది పొందేలా ఒక సహేతుకమైన పంపిణీ వ్యవస్ధను ఏర్పాటు చేయటం. ప్రజల సంక్షేమానికి సదుపాయాలు కల్పించటం. క్రమబద్ద మరియు పురోగామి పద్దతిలో ఉమ్మడి సౌభాగ్యాన్ని ప్రోత్సహించటం. ఉమ్మడి సౌభాగ్యాన్ని సాధించేందుకు మార్గాలేమిటి ? ఆదాయ పంపిణీకి అవసరమైన ప్రాధమిక వ్యవస్ధాపరమైన సదుపాయాలను కల్పించటం.అధిక ఆదాయాన్ని సర్దుబాటు చేయటం, అక్రమ ఆదాయాన్ని నిషేధించటం. మధ్య ఆదాయ తరగతి పరిమాణాన్ని పెంచటం. తక్కువ ఆదాయ తరగతుల సంపాదన పెంచటం. తదుపరి పనిపై కేంద్రీకరణ ఏమిటి ?అందరికీ సమంగా అందేట్లుగా ప్రజా మౌలిక సదుపాయాలను మరిన్ని నిర్మించటం. మేథోసంపత్తి హక్కులను రక్షించటం, చట్టబద్దమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వటం, పెట్టుబడి ఆరోగ్యవంతమైన పద్దతుల్లో పెరిగేందుకు వీలు కల్పించటం. గ్రామీణ ప్రాంతాలు, రైతులలో సంపదలు పెరిగేట్లుగా ప్రోత్సహించటం.”


గ్జిన్హువా ప్రభుత్వ అధికార సంస్ద గనుక కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ ఆలోచనకు ప్రతిబింబంగా తీసుకొని ప్రపంచవ్యాపితంగా మీడియా సంస్దలు ఉమ్మడి సౌభాగ్యం మీద వార్తలు, వ్యాఖ్య, విశ్లేషణలు ఇచ్చాయి. పెద్ద మొత్తాలలో ఆదాయాలున్న కంపెనీల మీద చర్యల గురించి ఊహాగానాలను ప్రచురించారు. ఉమ్మడి సౌభాగ్యం అనే భావనను మావో జెడాంగ్‌ ముందుగా పార్టీలో ప్రవేశపెట్టారని, ముందుగా ఆర్ధిక వృద్ధి మీద కేంద్రీకరించాలని, అది కొంత మంది జనాలు ధనికులు అయ్యేందుకు అనుమతిస్తుందని, ఉమ్మడి సౌభాగ్యం తరువాత వస్తుందని చెప్పిన డెంగ్‌ గ్జియావోపింగ్‌ తన ఉపన్యాసాల్లో ఆ పదాలను ఉపయోగించలేదని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. చైనా సంపదల పంపిణీలో అసమానతల గురించి అక్కడి నాయకత్వం దాచిందేమీ లేదు. అయితే అధికారికమైన సమాచారం లేని కారణంగా విదేశీ మీడియాలో వచ్చే అంకెలను పూర్తిగా విశ్వసించలేము అలాగని తోసిపుచ్చలేము. ఒక సంస్ధ లేదా విశ్లేషకులు ఇచ్చిన సమాచారం మరొక దానికి వెళ్లేసరికి పొంతన ఉండదు. ఉదాహరణకు చైనా ఉమ్మడి సౌభాగ్యం గురించి తాజాగా ఇచ్చి బ్లూమ్‌బెర్గ్‌ వార్త ప్రకారం మధ్యతరగతి వారు 40కోట్ల మంది కాగా అమెరికన్‌ పూ సర్వే సంస్ద ఇచ్చిన ప్రకారం 2018లోనే 70.7 కోట్ల మంది ఉన్నారు. అంటే జనాభాలో 50.8శాతం మంది. వీరిలో కూడా ఆదాయ తేడా ఉంటుంది.ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2000-2018 మధ్య బ్రిక్స్‌ దేశాలలో మధ్య తరగతి జనాభాలో జరిగిన మార్పు వివరాలు ఇలా ఉన్నాయి.(ఆధారం చైనాపవర్‌ డాట్‌ క్రైసిస్‌ డాట్‌ ఓఆర్‌జి)
దేశం××2000లో జనాభాలోశాతం×× 2018లో శాతం×××× మార్పు శాతం
చైనా ×××××× 3.1 ××× 50.8 ×××× 47.7
రష్యా ×××××× 28.2 ××× 71.5 ×××× 43.3
బ్రెజిల్‌ ×××× 30.3 ××× 51.4 ×××× 21.1
ద.ఆఫ్రికా×××× 15.1 ××× 22.5 ×××× 7.4
భారత్‌ ××××× 1.2 ××× 5.7 ×××× 4.5

2035 నాటికి అందరికీ ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎంతో పురోగతి సాధించాల్సి ఉందని గ్జీ జింపింగ్‌ గతేడాదే చెప్పారు. పైలట్‌ ప్రాజెక్టుగా 2025నాటికి 45శాతం ఆదాయాన్ని పెంచటం ద్వారా అంతరాన్ని తగ్గించేందుకు ఝెజియాంగ్‌ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు.అసమానతల తగ్గింపునకు అధిక ఆదాయం ఉన్నవారిపై పన్నులు పెంచాలని ఆమొత్తాలను దిగువ ఆదాయం ఉన్నవారి సంక్షేమానికి ఖర్చు చేయాలన్నది ఒక ఆలోచన. ఎంత ఆదాయం ఉన్నవారి మీద ఎంత పెంచాలి అనే కసరత్తు జరుగుతోంది. అక్రమ ఆదాయం, పన్ను ఎగవేతల మీద ముందుగా దృష్టి పెడతారు. అది ముందుగా పార్టీ కార్యకర్తలతోనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎకానసమిస్టు పత్రిక రాసింది.హాంగ్‌ఝౌ పట్టణంలోని 24,800 మంది కార్యకర్తలు స్ధానికంగా ఉన్న సంస్ధల నుంచి అక్రమంగా రుణాలు తీసుకోవటం లేదా స్వప్రయోజనాలకు పాల్పడిందీ లేనిదీ స్వచ్చందంగా వెల్లడించాలని పార్టీలో అవినీతి నిరోధక విభాగం కోరినట్లు ఆ వార్తలో పేర్కొన్నది. అధిక ఆదాయం కలిగిన వారి నుంచి స్వచ్చందంగా విరాళాల ద్వారా నిధులు సమీకరించాలని కూడా భావిస్తున్నారని, ఆ కారణంగానే ఆగస్టు 17 సమావేశం తరువాత ఇంటర్నెట్‌ బడా కంపెనీ టెన్‌సెంట్‌ 770 కోట్ల డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విడుదల చేసిందని పేర్కొన్నది. రూళ్ల కర్ర మాదిరి అన్ని చోట్లా ఒకే రకమైన నిబంధనల అమలు కాకుండా స్దానికంగా ఉన్న పరిస్దితిని బట్టి వర్తింప చేయాలని కోరటంతో ఆమేరకు పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఝెజియాంగ్‌ రాష్ట్రంలోని పట్టణాలలో కసరత్తు ప్రారంభమైందని, రాష్ట్ర ఆదాయంలో కార్మికుల వాటాను 50శాతానికి పెంచాలన్నది ఒక నిర్ణయమని ఎకానమిస్టు పేర్కొన్నది.


ఉమ్మడి సౌభాగ్య పధకం అమల్లో భాగంగానే ఇటీవల టెక్నాలజీ కంపెనీల మీద నియంత్రణ చర్యల ప్రారంభమని సిఎన్‌బిసి వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆచరణాత్మకంగా అమలు ఉంటుందని ఎకానమిస్ట్‌ పత్రిక ఆర్ధికవేత్త యూ సు వ్యాఖ్యానించారు. అధిక ఆదాయం గలవారు, పెట్టుబడి మీద వచ్చే ఆదాయంపై పన్నులు పెంచుతారని ఈ చర్య పెట్టుబడులు తగ్గేందుకు, బయటకు పోయేందుకు దారితీస్తుందని, ఆర్ధిక వ్యవస్ధ మీద పున:పంపిణీ విధానాల ప్రభావాన్ని చైనా ప్రభుత్వం విస్మరించజాలదని చెప్పారు. ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ బృందం 2019లో తమ విశ్లేషణలో చెప్పినదాని ప్రకారం 1978లో అగ్రభాగంలోని పదిశాతం మందికి 27శాతం ఆదాయం వస్తే 2015 నాటికి అది 41శాతానికి పెరిగింది. తమ దేశంలో దుర్భరదారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు గతేడాది చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ధిక వ్యవస్ధలో మధ్య ఆదాయ తరగతి వాటాను పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటున్నదని మోర్గాన్‌ స్టాన్లే విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాలోని బడా టెక్నాలజీ కంపెనీలు చిన్న సంస్ధలను మింగివేస్తున్నాయనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది. రెండు నెలల కాలంలో ఆలీబాబా, జెడిడాట్‌కామ్‌ కంపెనీల వాటాల ధరలు స్టాక్‌ఎక్సేంజ్‌లో 29శాతం పడిపోయాయి. మరికొన్ని కంపెనీలదీ అదే పరిస్ధితి. ఆర్ధిక విధానంలో వచ్చిన మార్పును విదేశీ మదుపుదార్లు అర్ధం చేసుకొని దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుందని షాంఘైలోని ఒక సంస్ధ ప్రొఫెసర్‌ ఝు నింగ్‌ చెప్పాడు. కొంత మందినైనా ముందు ధనవంతులను కానిద్దాం అనే విధానానికి ఇది విరుద్దమని అన్నాడు.

జాక్‌ మా ఆధీనంలోని అలీబాబా కంపెనీని విదేశీ సంస్దల పోటీ నుంచి తట్టుకొనేందుకు ప్రభుత్వం సంవత్సరాల పాటు కాపాడింది. దాని అనుబంధ యాంట్‌ గ్రూపు వాటాల విక్రయాన్ని గతేడాది నవంబరులో నిలిపివేసింది. ఈఏడాది ఏప్రిల్‌లో 18.23 బిలియన్‌ యువాన్ల అపరాధ రుసుం విధించింది. ఆహార పదార్దాలను సరఫరా చేసే జొమాటో, స్విగ్గీవంటి సంస్ధలలో పని చేసే వారికి స్ధానిక కనీస వేతనాలు చెల్లించాలని నియంత్రణ సంస్ద ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీ వస్తుసరఫరాలో కొన్ని సంస్దల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చిన్న వ్యాపారుల స్వాగతిస్తున్నారు. పోటీ లేని కారణంగా పదిహేను నుంచి 25శాతం వరకు తమ నుంచి కమిషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని, ఎక్కువ కంపెనీలు రంగంలో ఉంటే తమకు బేరమాడే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.యాప్‌ల ద్వారా చిన్న దుకాణాల వారు ఆర్డర్లు తీసుకొని తామే సరఫరా చేస్తున్నారు. చైనాలో 14 కోట్ల మంది చిన్న దుకాణాల వారున్నారని అంచనా. ఇప్పటి వరకు పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు అమెరికా తదితర విదేశీ మదుపుదార్లు పెద్దమొత్తాలను పెట్టుబడులు పెట్టి తలిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ట్యూషన్లు చెప్పే కంపెనీలను లాభాల ప్రాతిపదికన నడపకూడదని, విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని గత నెలలో చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాంటి కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి.


చైనా ప్రభుత్వం అక్కడి టెక్నాలజీ సంస్దలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా అక్కడి సంస్దల్లో పెట్టుబడులు పెట్టేవారు వేరే దేశాలను చూసుకుంటారని, అందువలన మన దేశంలోని అంకుర సంస్దలు లబ్ది పొందవచ్చని కొందరు చెబుతున్నారు. నిజంగా అలాంటి వారు ముందుకు వస్తే అభ్యంతర పెట్టాల్సినపని లేదు. మనం అభివృద్దిలో చైనాతో పోల్చుకుంటున్నాం, వీలైతే దాన్ని అధిగమించి పోవాలని చెబుతున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది.పైన చెప్పుకున్న వివరాల ప్రకారం కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండే మధ్య తరగతి ఆదాయవర్గాన్ని పెంచకుండా అది సాధ్యం కాదు. అందువలన మన దేశంలో దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించటం, క్రమంగా మధ్యతరగతి, ధనికులను ఎలా పెంచటమా అన్నదే సమస్య. ఆచరణను చూస్తే ఆ దిశగా ఎలాంటి ఆలోచనా లేదు, చర్యలూ లేవు.

ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వేతనాల వాటా పడిపోతోంది. దీనికి సాంకేతికంగా వచ్చిన మార్పులతో ఉత్పత్తి పెరగటం, కార్మికులు తగ్గటం వంటి కారణాలు కూడా ఉన్నప్పటికీ వేతనాల శాతం పడిపోతోంది. ఆ ధోరణికి భిన్నంగా వేతనాల శాతాన్ని పెంచాలని చైనా తలపెట్టింది. ఈ కారణంగానే గతంలో తక్కువ వేతనాలు ఉన్నాయని వచ్చిన అనేక కంపెనీలు ఇప్పుడు చైనా కంటే తక్కువ వేతనాలు దొరికే దేశాలకు మారిపోవాలని చూస్తున్నాయి. అయితే అవి బయటకు పోతే అతి పెద్ద చైనా మార్కెట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్లనే అనేక కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. నూతన పరిస్ధితులకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకుంటున్నాయి. సేవారంగంలోని తాత్కాలిక కార్మికుల (జోమాటో, స్విగ్గీ వంటివి) వేతనాలు పెంచిన కారణంగా చైనాలో ఆహార సరఫరా చేసే కంపెనీ మెయిటువాన్‌ షేర్‌ ధర 18శాతం పడిపోయింది. ఎక్కడ అయితే తృప్తి, సమ్మతము ఉంటుందో అక్కడ ప్రజల తిరుగుబాట్లు ఉండవు అన్న కన్ఫ్యూషియస్‌ ప్రవచనాన్ని గ్జీ ఉటంకించారు. ఆ దిశగా చైనా చర్యలు ఉన్నాయని చెప్పవచ్చు.చైనా మాదిరి అభివృద్ది చెందాలని చెబుతున్నవారు దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాల్సింది ఎవరు ? నిర్మలక్క, స్మృతక్క, కంగనక్క, సాధ్వులు, ప్రచారక్‌లా ? ఇతరులా !!

20 Friday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, Akhand Bharat, BJP, BJP’s trolling army, China, Donald trump, Narendra Modi, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


” అరెస్టు స్వర భాస్కర్‌ ” ఇప్పుడు సామాజిక మాధ్యమంలో నడుస్తున్న మరుగుజ్జుదాడి. ఎందుకటా ! ఆ సినీ నటి తాలిబాన్ల భయానికి – హిందూత్వ భయానికి(టెర్రర్‌) పెద్ద తేడా లేదని తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఏకీభావం ఉంటే సరే లేకపోతే విభేదించవచ్చు, అభిప్రాయం చెప్పినంత మాత్రాన్నే ఆమెను అరెస్టు చేయాలనటం ఏ ప్రజాస్వామిక న్యాయం? ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది ఎవరు ? ఇంతకీ స్వర భాస్కర్‌ చెప్పిందేమిటి ? ” తాలిబాన్‌ భయంతో దిగ్భ్రాంతికి గురైనట్లు, సర్వనాశనం అయిందని అనుకుంటున్నారు అందరూ, హిందూత్వ భయాన్ని కూడా మనం అంగీకరించకూడదు. తాలిబాన్‌ భయంతో నీరుగారి పోకూడదు, హిందూత్వ భయం మీద అందరం ఆగ్రహించాలి. అణిచివేసిన మరియు అణచివేతకు గురైన వారెవరు అన్న ప్రాతిపదికన మన మానవత్వం మరియు నైతిక విలువలు ఉండకూడదు.” దీన్లో తప్పేముంది. అమెఎవరినీ పేరు పెట్టి కూడా విమర్శ చేయలేదు.


ఆమె మీద ప్రచారదాడికి దిగిన వారు అంటున్నదేమిటి ? తాలిబాన్‌ – హిందుత్వ రెండింటినీ ఒకేగాటన కట్టకూడదు. ఆ మాటే చెప్పండి. అరెస్టు చేయాలనటం ఏమిటి ? ఈ డిమాండ్‌ ఎందుకు వచ్చింది ?మహారాష్ట్రలో బిజెపికి చెందిన ఒక లాయర్‌గారు ఆమె మీద పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. మతం పేరుతో జనాల్లో శత్రుత్వాన్ని పెంచుతున్నారు అన్నది ఆరోపణ. అంతవరకే పరిమితం కాలేదు. స్వరభాస్కర్‌ను అరెస్టు చేయాలనే హాషటాగ్‌తో సామాజిక మాధ్యమంలో ప్రచారానికి కూడా దిగారు. దాన్ని అందుకొని మిగతావారు తలా ఒకరాయి వేస్తున్నారు. ఎవరు వారంతా… బిజెపి వారే. స్వర భాస్కర్‌ మీద కాషాయ తాలిబాన్ల దాడి కొత్త కాదు. గతంలో ఇజ్రాయెల్‌ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్ల నిరసనలకు ఆమె మద్దతు ప్రకటిస్తూ ఇజ్రాయెల్‌ను జాతివివక్ష దేశంగా వర్ణించారు. దానికి గాను ఆమెను తూలనాడుతూ దాడి చేశారు. ఇజ్రాయెల్‌ను ఆమె విమర్శిస్తే వారికి ఇబ్బంది ఏమిటి ? పెగాసెస్‌ ఉప్పు తిన్నందున కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌ను పొగడండి, పూజించండి. ఎవరిష్టం వారిది. భగవద్గీతను కూడా అంత నిష్టగా, సంఘటిత పద్దతిలో పంచరు. హంతకుడు గాడ్సే నేనెందుకు గాంధీని చంపాను అంటూ కోర్టులో చేసిన వాదనను పుస్తకంగా ప్రచురించి పంచుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది సరైనదో జనం నిర్ణయించుకుంటారు. ఏ దేశాన్ని ఎలా విమర్శించకూడదో మీరే నిర్ణయిస్తారా ? విమర్శకుల మీద దాడి ఫాసిస్టు లక్షణం తప్ప మరొకటి కాదు. ఇస్లామ్‌కు షరియత్‌ ఎలాగో హిందూ మతం అని చెప్పుకొనే వారికి మనుస్మృతి కూడా అలాంటిదే కదా ! మన రాజ్యాంగంలో మనుస్మృతి ప్రతిబింబించలేదని, దానికి అడ్డుపడింది అంబేద్కరే అనే విమర్శలు చేస్తున్నదెవరు ? మనువాద భావజాలం ఉన్నవారే కదా ! స్వర భాస్కర్‌ వంటి వారు చెబుతున్నది అదే కదా !


ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘన్‌ మహిళల ఉనికికే ముప్పు ముంచుకు వచ్చిందని సాంప్రదాయ, సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజమే, ఉగ్రవాదం అది మత లేదా మరొక ఉగ్రవాదం అయినా ముందు బలయ్యేది మహిళలే. భావజాలం రీత్యా, రాజకీయంగా వ్యతిరేకులైన మహిళానేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని పార్టీల వారి పేర్లతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని ఎద్దేవా చేస్తూ ఊరూ పేరూ లేకుండా కొందరు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక పోస్టులో ఇలా ఉంది.” సంధ్యక్క, దేవక్క, పుణ్యవతక్క, మలాలా,బర్ఖదత్‌, అమీర్‌ ఖాన్‌, జావేద్‌ అక్తర్‌, హమీద్‌ అన్సారీ, నసీరుద్దీన్‌ షా, దీపికా పడుకొనే, తమన్నా బాటిల్‌, మిర్చి దేశారు, రాజ్‌దీప్‌ సర్దేశాయి, దయచేసి ఆప్ఘాన్‌ ఆడపిల్లలను రక్షించండి. తక్షణమే మీ అవసరం వారికి ఉంది. మోడీ పెద్ద ఫాసిస్టు ….. ఆయన చేయలేరు. మీరే వెళ్లండి…. వారిని రక్షించండి. ఒవైసీ దయచేసి వారికి నేతృత్వం వహించండి. కావాలి అంటే దేశంలో పెద్ద యువకుడు కరాటే కుంగ్ఫు లాంటి విలువిద్యల్లో నైపుణ్యుడు రాహుల్‌ గాంధీని, పెళ్లికాని యువకురాలు, రెండు చేతులతో రాళ్లు రప్పలు సోడాలు విసరగల మమతా బేగాన్నీ సహాయకంగా తీసుకు వెళ్లండి. అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించండి. ఎలాగూ లాయర్‌ కప్ప చీబల్‌ ఉన్నాడు… మర్చి పోకండి పిల్లిజ్‌ ” అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాల మీద సామాజిక మాధ్యమంలో ఊరూ పేరు చెప్పుకొనేందుకు సిగ్గుపడే కొంత మంది పేరు లేకుండా ఒక పధకం ప్రకారం లౌకివాదులు, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారి మీద చేస్తున్న దాడి ఇది.


వారు వెళతారా లేదా అన్నది తరువాత చూద్దాం. ముందు వెళ్లాల్సిన వారు వెళ్లకుండా ఇతరుల మీద ఎదురుదాడికి దిగారు. కొంతమంది ప్రవచించే అఖండభారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఉందా లేదా ! అది ఉందని చెబుతూ మడికట్టుకున్నట్లు ప్రచారం చేసుకొనే ప్రచారక్‌లు, సాధ్వులు, సాధువులు, వారికి మద్దతు ఇస్తున్న కాషాయ దళాలు కదా ముందుగా ఆఫ్ఘన్‌ వెళ్లాల్సింది. ఒకనాడు అఖండభారత్‌లో భాగమై, ఇప్పుడు విడిగా ఉంటున్న దేశాలన్నీ( ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనా-టిబెట్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌) ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే అని చెబుతున్నవారు కదా ముందుగా కదలాల్సింది ! అందులోనూ నిన్నటి వరకు ఉగ్రవాదుల మీద పోరు సలిపామని చెప్పుకొనే వారు ఇప్పుడు ఇతరులు వెళ్లాలని చెప్పటం ఏమిటి ?తాలిబాన్లు వచ్చారు కనుక మహిళలకు ముప్పు వచ్చిందని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి. వారితో ఒప్పందం చేసుకున్నది అమెరికా ! దాన్ని హర్షించింది నరేంద్రమోడీ సర్కార్‌ ! తాము మారినట్లు తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు తప్ప ఒప్పంద సమయంలో స్వయంగా వారు గానీ-అమెరికా వారు గానీ చెప్పలేదు. అయినా దాన్ని దాన్ని మనంఎందుకు హర్షించినట్లు ? (2020 ఫిబ్రవరి 29, హిందూ పత్రిక) ఏమాత్రమైనా బాధ్యత ఉందా ? అమెరికా వాడు ఏది చేస్తే అదే కరెక్టు అనే గుడ్డి అనుసరణ కాదా ? దోహాలో జరిగిన సంతకాల కార్యక్రమానికి కతార్‌ ప్రభుత్వం మనలను ఆహ్వానించగానే మనం ఎందుకు హాజరు కావాలి? రాజుగారు నందంటే నంది పందంటే పంది అనాలన్నట్లుగా ఉగ్రవాదులుగా ప్రకటించిన తాలిబాన్లతో అమెరికా వాడు ఒప్పందం చేసుకోవటం ఏమిటి ? వారి మీద పోరాడుతున్నట్లు చెప్పుకున్న మనం దాన్ని హర్షించటం ఏమిటి ? మనకు ఒక స్వతంత్ర వైఖరి లేదా ? అమెరికాతో పాటు మనమూ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని చెప్పినట్లే కదా ? మరి ఇప్పుడు బిజెపి మద్దతుదార్లు తాలిబాన్ల గురించి గుండెలు బాదుకోవటం నటన తప్ప నిజాయితీ ఉందా ? ఏకత, శీలము ఉన్నవారు చేయాల్సిన పనేనా ?


ఈ ఒప్పందానికి ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ మధ్య భేటీ జరిగింది. ఆ తరువాతే తాలిబాన్‌ ఉగ్రవాదులతో ప్రజాస్వామ్య అమెరికా చేసుకున్న ప్రయివేటు ఒప్పంద సమయంలో మనం సాక్షులుగా దోహా సమావేశంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా మనకు వినిపించిన కహానీలను 2020 ఫిబ్రవరి 29వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ కథనంలో చూడవచ్చు. ఏమిటటా ! పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరిన కోరికలు వ్యక్తిగత స్ధాయిలో ఏవగింపు కలిగించినా ఆఫ్ఘనిస్తాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అతనితో మాట్లాడాల్సి వచ్చిందని అమెరికా మనకు చెప్పిందట.పాకిస్తాన్‌ తమకు నమ్మదగిన మిత్రుడు కాదని కూడా చెప్పారట. అలా అయితే సరే అని మనం అన్నామట. గత 19 సంవత్సరాలుగా మనం సాధించిన ఆఫ్ఘన్‌ రాజ్యాంగం, మహిళల, మైనారిటీల హక్కులు, ఆఫ్‌ఘన్‌ రక్షణ దళాలను నష్టపోకూడదనే అంశం గమనంలో ఉంచుకోవాలని కూడా అమెరికాకు చెప్పామట. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే బాణాకర్రను (బిక్‌ స్టిక్‌) ప్రయోగించే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటామని అమెరికా మనకు చెప్పిందట. అమెరికా-తాలిబాన్ల మధ్య అవగాహనలో పాకిస్తాన్‌ కీలకపాత్రధారి అని ప్రపంచానికి కంతటికీ తెలిసినప్పటికీ మనకు ఇలాంటి లీకు కథలను వినిపించారు.


తీరా జరిగిందేమిటి ? గడువు కంటే ముందే బతుకు జీవుడా అంటూ అమెరికన్లు పారిపోయారు.తమకు సహకరించిన వారి రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆప్ఘన్‌ సైన్యం చేతులెత్తేసి లొంగిపోయింది. రాజ్యాంగమూ లేదు పాడూ లేదు. తాలిబాన్లు చెప్పిందే వేదం. మహిళలకు రక్షణ లేకపోయిందని మన పరివార్‌ దళాలే చెబుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే అమెరికా బాణా కర్ర ప్రయోగం ఏమైనట్లు ? మనం ఎందుకు అడగలేకపోతున్నాము. నరేంద్రమోడీ నోరు మెదపటం లేదేం? ఆగస్టుమాసం అంతా భద్రతా మండలి అధ్యక్ష స్ధానం మనదేగా, అక్కడ మానవ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, దానికి చొరవ ఏమిటి ? అది చేతగాక మలాలా,సంధ్యక్క, దేవక్క, పుణ్యక్క ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని అడుగుతున్నారు. నిజానికి అఖండ భారత్‌లో ఎప్పటికైనా అంతర్భాగం చేస్తామని చెబుతున్న ఆఫ్ఘానిస్తాన్‌కు ముందుగా వెళ్లాల్సింది ఎవరు ? అక్కడి తోటి మహిళలను కాపాడే బాధ్యత నిర్మలక్క, స్మృతక్క, మీనాక్షక్క, కంగనక్క, శాపాలశక్తి గలిగిన సాధ్వీమణులకు లేదా ?


తాలిబాన్ల వెనుక చైనా ఉన్నదని పెద్ద ఎత్తున చెబుతున్నారు, రాస్తున్నారు ? మీడియా వంటవారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ? అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నపుడు, దాన్ని మనం హర్షించినపుడు గానీ ఎవరైనా తాలిబాన్ల వెనుక చైనా ఉంది అని చెప్పిన వారున్నారా ? ఎందుకు చెప్పలేదు ?తోటి ముస్లిం దేశంలో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇతర ముస్లిం దేశాలు, వాటి మిత్ర దేశం చైనా ఎందుకు జోక్యం చేసుకోవు, అక్కడి శరణార్ధులకు ఆశ్రయం ఎందుకు కల్పించవు అంటూ ఒక ప్రచారం. మరికొందరైతే ఇంకొంచెం ముందుకు పోయారు. ఇప్పటి వరకు ముస్లిం దేశాల్లో పరిస్ధితులు బాగోలేనపుడు శరణార్ధులుగా వచ్చిన వారందరినీ పశ్చిమ దేశాల వారే ఆదరించారు. అయితే సదరు ముస్లింలందరూ అక్కడ తమ జనాభాను పెంచి వేసినందున ఇప్పుడు ఆయా దేశాల వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం మొత్తాన్ని ముస్లింలతో నింపటానికి వేసిన ఒక పధకం కనుక ఇతర దేశాల వారెవరూ వారిని అనుమతించటం లేదన్నది మరొక ప్రచారం. ఇలాంటి ప్రచారాలకు ప్రాతిపదికలు, వాస్తవాలతో నిమిత్తం లేదు. మన దేశాన్ని కూడా ముస్లింలతో నింపి వేయటానికి కుటుంబ నియంత్రణ పాటించటం లేదనే ప్రచారం తెలిసిందే.


ఆఫ్ఘనిస్తాన్‌లో 1978లో కొంత మంది అభ్యుదయ వాదులు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నాటి సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ గుర్తించింది. అప్పుడు అక్కడ జనమూ ముస్లింలే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారూ ముస్లింలే. ఆ ప్రభుత్వానికిి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారే కదా ! తొలుత ముజాహిదీన్లు, తరువాత తాలిబాన్లకు మద్దతు, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది ఎవరు ? ఒసామా బిన్‌ లాడెన్‌ను తయారు చేసింది ఎవరు ? వారు ఏకు మేకైన తరువాత అక్కడికి సైన్యాన్ని పంపి దాడులకు రెండు నుంచి మూడులక్షల కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు ? పునర్‌నిర్మాణం చేస్తున్నామని చెప్పింది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వారితో స్నేహం చేసిన మన దేశమే కదా ? ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలేవీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు, తమ సైన్యాన్ని పంపలేదు, దాడులకు దిగలేదు. పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పలేదు, పెట్టుబడులూ పెట్టలేదు. చేసిందంతా అమెరికా, దాని మిత్రులుగా ఉన్న నాటో దేశాల వారైతే ముస్లిం దేశాలు ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వరెందుకంటూ అతి తెలివి ప్రదర్శనలెందుకు ? ఇప్పటి వరకు ఎంత మంది అలా శరణు కోరారు ? అంటే ఏది చెప్పినా బుర్ర ఉపయోగించకుండా వినే జనాలుంటారన్న చిన్న చూపా ? మానవత్వం మాయమై మతోన్మాదం పెరిగిపోయిన ప్రతి వారికి ప్రతిదానిలో అదే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మత ప్రాతిపదికన శరణార్ధులను ఆదుకున్న దేశాలు ఉన్నాయా ?


ఈ ప్రచారం చేస్తున్న వారే చైనా గురించి చెబుతున్నదేమిటి ? ఆప్ఘన్‌ సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రమైన గ్జిన్‌గియాంగ్‌లో ముస్లింలను ప్రభుత్వం ఊచకోతకు గురి చేస్తుంటే ముస్లిం దేశాలు చైనాను ఖండించవు, దానితో లావాదేవీలను ఎందుకు నిలిపివేయవు అని ప్రచారం చేశాయి. ఇప్పుడు తాలిబాన్లకు-చైనాకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ? అదే తాలిబాన్లు, అమెరికా ఇతర దేశాల మద్దతు ఉన్న ఉఘిర్‌ ముస్లిం తెగకు చెందిన కొందరు చైనాలో ఉగ్రవాద, విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతూ ఆప్ఘన్‌ గడ్డ మీద ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా వెళ్లిపోయిన తరువాత మరొక దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డను ఉపయోగించుకొనే శక్తులకు తాము తావివ్వబోమని తాలిబాన్లు రష్యాతో చెప్పారు. చైనాతో చర్చల సమయంలో ఇక ముందు తాము ఉఘిర్‌ తీవ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వబోమని చెప్పారు. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గుర్తింపు గురించి నిర్ణయిస్తామని చెనా చెప్పింది. తాలిబాన్లు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా, ఉల్లంఘిస్తారా ? అప్పుడు చైనా ఏం చేస్తుంది అన్నది ఊహాజనిత ప్రశ్న. తాలిబాన్లు ఉగ్రవాదులా మరొకటా ఏమిటన్నది ఒక సమస్య. ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరైనా దానికి గుర్తింపు వేరే అంశం. మన పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు చేసి అక్కడి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని చేపట్టింది. ఆ కారణంతో ఏ దేశమైనా వారితో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుందా ? మిలిటరీ చర్య సరైనదే అని సర్టిఫికెట్లు ఇచ్చాయా ? అంతెందుకు, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గోద్రా ఉదంతం అనంతర జరిగిన మారణకాండకు కారకుడంటూ అమెరికా సందర్శనకు అక్కడి ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక ఆపని చేయగలిగింది. అదే అమెరికా ప్రభుత్వం ప్రధాని అయిన తరువాత నరేంద్రమోడీపై చేసిన విమర్శను వెనక్కి తీసుకోకుండానే ఎర్రతివాచీ స్వాగతం పలికిందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ?

17 Tuesday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, UK, Uncategorized, WAR

≈ 1 Comment

Tags

75 years India Independence, BJP, CPI(M), indian national flag matters, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. అలాంటపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా సిపిఎం అయినా మారకుండా ఎలా ఉంటుంది. తన వైఖరిలో మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించుకున్నపుడు, సిపిఎం వైఖరిలో మార్పు మీద వ్యాఖ్యాతలకు అంత ఉక్రోషం ఎందుకు ? మార్పు సరైనదిగాక పోతే విమర్శించవచ్చు. అది ఎవరికైనా ఉన్న హక్కు. సంఘపరివార్‌ దాని సోదర సంస్ధలు జమాతే ఇస్లామీ, ముస్లింలీగ్‌, మజ్లిస్‌ వంటివి మతాన్ని ఇంటికి పరిమితం చేసి ఆరోగ్యకర రాజకీయాల్లో పాల్గొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాంటి పార్టీలు సరైన వైఖరి తీసుకోమనే ఎవరైనా చెప్పేది. అదే సూత్రంతో కమ్యూనిస్టులకూడా తప్పు చేస్తున్నారని ఎవరికైనా అనిపిస్తే వారికీ అలాంటి సలహా ఇవ్వవచ్చు. ఏ సంస్ధలు, పార్టీలు ఏం మార్చుకుంటాయి, ఏం మార్చుకోవు అన్నదాని మీద నిరంతరం చర్చ, విమర్శలు చేసేందుకు ఎవరికైనా హక్కుంది.” జాతీయ జెండా ఆవిష్కరణ అంశం : గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ” అనే శీర్షికతో ఆ సంస్ద తీరుతెన్నుల గురించి చర్చించాము. దిగువ లింకులో దాన్ని చదవవచ్చు. ఇప్పుడు సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పు, కారణాల గురించి చూద్దాం.


స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషి, భారత్‌ అన్న భావనను పటిష్టపరచటం, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారితో ఆర్‌ఎస్‌ఎస్‌ కుమ్మక్కు, వర్తమానంలో రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివరించాలని, వివిధ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు ఆగస్టు తొమ్మిదిన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపటం, జాతీయ జెండాను ఎగురవేయటమే దేశభక్తికి నిదర్శనం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అధికారిక సంస్దలు స్వాతంత్య్రదినం, రిపబ్లిక్‌ దినోత్సవం, గాంధీ జయంతి రోజులలో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే నిబంధనలు ఉన్నాయి తప్ప ప్రయివేటు సంస్ధలు, పార్టీలు విధిగా జరపాలని, జాతీయ జెండాలను ఎగురవేయాలనే అంశం రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు కొత్తగా మారిందేమీ లేదు. స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోవటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు, బలవంతం ఏమీ లేదు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు జండా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది కనుకనే అది అవాస్తవం చెబుతోందని,పైన చెప్పిన మూడు రోజుల్లో ఎవరైనా ఆపని చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలను పేర్కొనాల్సి వచ్చింది. కానీ ఎన్నడూ కమ్యూనిస్టులు అలాంటి నిబంధనల కుంటి సాకులు చెప్పలేదు. సిపిఎం నిర్ణయాన్ని కొందరు 75 సంవత్సరాల్లో తొలిసారి అని శీర్షికలు పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. సిపిఎం ఏర్పడిందే 1964లో అంటే 57 సంవత్సరాల క్రితం ఏర్పడింది. రాయి వేసేవారికి ఈ చిన్న విషయం కూడా తెలియదంటే ఏమనుకోవాలి. ఇది చిన్న విషయం వదిలివేద్దాం.


కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం వారు తమ కార్యాలయాల మీద జాతీయ జెండాలను ఎగురవేసి ఉత్సవాలు జరపలేదుగాని ముఖ్యమంత్రులుగా లేదా స్ధానిక సంస్థల అధిపతులుగా ఎన్నికైన సందర్భాలలో రాజ్యాంగవిధిగా దాన్ని పాటించారు, పాటిస్తున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినప్పటి నుంచీ సిపిఐ జాతీయ జెండాలను ఎగురవేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుతున్నది. సిపిఎం నుంచి విడిపోయి సాయుధ పోరాటం పేరుతో రహస్యంగా పని చేస్తున్న కమ్యూనిస్టు గ్రూపుల వారు అసలు స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్నే గుర్తించటం లేదు గనుకు వారు ఎగురవేసే సమస్యే ఉత్పన్నం కాదు. తరువాత పలు ముక్కలై తమదే అసలైన కమ్యూనిస్టు పార్టీ అని ప్రకటించుకున్న వివిధ బృందాలలో కొన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పాల్గొంటున్నా జండా పండగలకు దూరంగా ఉంటున్నాయి.


స్వాతంత్య్రానికి ముందే తెలంగాణాలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు. వచ్చిన తరువాత నిజాం బదులు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మిలిటరీని పంపి కమ్యూనిస్టులను అణచివేసిన చరిత్ర తెలిసిందే. ఆ నేపధ్యం, దానితో పాటు దేశ రాజ్యాంగం స్వాతంత్య్ర ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదనే వైఖరి కారణంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కమ్యూనిస్టుల్లో ఉంది. స్వాతంత్య్రం ఒక మేడి పండు అన్నట్లుగా భావించారు. అంతే తప్ప తాము స్వాతంత్య్రాన్ని, జాతీయ పతాకాన్ని గుర్తించటం లేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎక్కడా చెప్పలేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి జండా గురించి రచ్చచేసిన దాఖలాలు అంతకంటే లేవు. సిపిఎం నుంచి విడిపోయిన తరువాత రాజ్యాంగాన్ని గుర్తించని నక్సల్‌ గ్రూపులు చెప్పిన అంశాలకు, భాష్యాలకు సిపిఎంకు సంబంధం ఉండదు. రాజ్యాంగాన్ని గుర్తించి దానికి అనుగుణ్యంగా తొలి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పాల్గొన్నది, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికయింది. మరి ఇప్పుడు ఎందుకు ఎగురవేయాలని సిపిఎం నిర్ణయించింది అనే ప్రశ్న వస్తుంది.


కమ్యూనిస్టు సిద్దాంతం ఒక దేశానికి పరిమితమైంది కాదు. అందువలన దాన్ని పాటించిన వివిధ కమ్యూనిస్టు పార్టీలు వివిధ సమస్యల పట్ల ఎప్పుడు ఎలాంటి వైఖరులు తీసుకున్నాయో అర్ధం చేసుకుంటే తప్ప వాటిలో వచ్చిన మార్పులు తలకు ఎక్కవు. మార్క్సిజం-లెనినిజం అనే సిద్దాంతాలు గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు, వేదాల్లో, ఉపనిషత్తులో, మనుస్మృతి, ఫలానా పురాణం లేదా బైబిల్‌, ఖురాన్‌లలో ఫలాన చోట ఫలానా విధంగా చెప్పబడింది, అవి అంతే అన్నట్లుగా కమ్యూనిస్టు సిద్దాంతం పిడివాదం కాదు. అది ఒక పురోగామి శాస్త్రం. అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా మార్పులు జరుగుతాయి. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా మూసపోసినట్లుగా పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా పని చేయవు.


పొరుగునే ఉన్న చైనా, ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీల చరిత్రను చదివిన వారికి అర్ధం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను ఓడించేందుకు సోవియట్‌ యూనియన్‌తో బ్రిటన్‌ చేతులు కలిపింది. సోవియట్‌ బలపడాలనే అభిప్రాయంతో భారత కమ్యూనిస్టులు ఆ రోజుల్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఇచ్చిన క్విట్‌ ఇండియా పిలుపుకు దూరంగా ఉన్నారు. తరువాత కాలంలో అలా వ్యవహరించటం తప్పని గుణపాఠం నేర్చుకున్నారు. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినట్లు ? బ్రిటీష్‌ వారికి సహకరిస్తామని ఎందుకు చెప్పినట్లు ? కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి దూరంగా ఉంది తప్ప పాల్గొన్నవారిని తప్పు పట్టలేదు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ వారికి తోడ్పడలేదు. అలాంటి ఉదాహరణలు ఉంటే ఎవరైనా చూపవచ్చు.


ఇన్ని దశాబ్దాలుగా స్వాతంత్య్ర దినం పాటించని కమ్యూనిస్టులు ఎందుకు వైఖరి మార్చుకున్నారు ? పరిస్ధితులే వారిని అలా మారేందుకు పురికొల్పాయి. చైనాలో కొమింటాంగ్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం, యుద్ద ప్రభువులను పక్కన పెట్టేందుకు పోరాడింది, విజయం సాధించి 1911లో రాజరికాన్ని కూలదోసి స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే రాజరిక పాలన అయితే తప్పింది గానీ సామాన్యులు ముఖ్యంగా రైతాంగంపై జరిగే దోపిడీకి అడ్డుకట్టపడలేదు. యుద్ద ప్రభువులు తిరిగి తలెత్తి సవాలుగా మారారు. దాంతో చైనా జాతిపితగా పరిగణించబడిన సన్‌ఏట్‌ సేన్‌ 1921లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానించి 1924లో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి యుద్ద ప్రభువుల అణచివేతకు పూనుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే కాన్సర్‌తో మరణించాడు. కొమింటాంగ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన చాంగ్‌కై షేక్‌ తమతో కలసి పోరాడుతున్న కమ్యూనిస్టులు రోజు రోజుకూ బలం పెంచుకోవటం చూసి వారిని ఊచకోత కోయించాడు. 1927 నాటికి రెండు పార్టీలు వైరిశిబిరాలుగా మారిపోయాయి.1931లో జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకోవటం మొదలు పెట్టారు. దాంతో 1936లో తమ కార్యకర్తలను ఊచకోత కోయించిన ఆ చాంగ్‌కై షేక్‌తోనే ఐక్యసంఘటనగా ఏర్పడిన కమ్యూనిస్టులు జపాన్‌ సామ్రాజ్యవాదులను తరిమి వేశారు. తరువాత ఆ చాంగ్‌కై షేక్‌నే తరిమికొట్టి దేశాన్ని విముక్తి చేశారు. అనేక మంది ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. మన కార్యకర్తలు, నాయకులను చంపించిన వాడితో చేతులు కలపటం ఏమిటని చర్చ జరిగింది. అక్కడ అందరికీ ఉమ్మడి శత్రువైన జపాన్ను తరిమి వేయాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టులను ఐక్య సంఘటనకు పురికొల్పింది.


జయప్రకాష్‌ నారాయణ ప్రారంభించిన ఉద్యమంలో నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి. జయప్రకాష్‌ నారాయణ మతశక్తి కానప్పటికీ జనసంఘం ఉన్న కారణంగా దానిలో పాల్గొనాలా లేదా అన్న అంశం మీద సిపిఎంలో తీవ్ర చర్చలు జరిగాయి. తరువాత 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌, సిపిఎం, సోషలిస్టు ఇతర తనను రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల వారందరినీ జైలు పాలు చేశారు. ఆ నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే అంశం ప్రధానంగా ముందుకు వచ్చింది. ఆ కారణంగానే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసిన తరువాత జనసంఘం, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇతర పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. దానిలో జనసంఘం-ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి అని తెలిసినప్పటికీ సిపిఎం తన రాజకీయ కర్తవ్యంలో భాగంగా జనతా పార్టీని బలపరిచింది. జనతా పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న సిపిఎం అభ్యర్ధులకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జనతా పార్టీలోని జనసంఘం కార్యకర్తలు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కుల రక్షణ కోసం తన వైఖరిని మార్చుకొనేందుకు నాడు సిపిఎం తన వైఖరిని సవరించుకుంది.


మన స్వాతంత్య్రానికి చైనాలో జరిగిన మాదిరి విదేశాల నుంచి ప్రత్యక్ష ముప్పు లేకపోయినా అంతర్గతంగా బిజెపి పాలకులు అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను దిగజార్చటం ప్రజాస్వామ్యం, పౌరహక్కులకే ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని కమ్యూనిస్టులు కాని వారు కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి వారసులు నేడు ఆ పరిమిత స్వాతంత్య్ర లక్ష్యాలు, ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారని గత కొద్ది సంవత్సరాలుగా సిపిఎం హెచ్చరిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ జెండాలకు దూరంగా ఉంటూ వాటిని కాపాడేందుకు జనం ముందుకు రావాలని పిలుపు ఇస్తే అర్ధం ఉండదు. అందుకే సిపిఎం వైఖరిలో ఈ మార్పు అన్నది స్పష్టం.
సంబంధిత వ్యాసం మొదటి భాగం లింకు దిగువ ఉంది. .

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ! https://vedikaa.com/2021/08/16/indian-national-flag-matter-why-rss-disowned-ms-golwalkar-thoughts/

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి !

16 Monday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75 years India Independence, CPI(M), India Flag, MS Golwalkar, RSS Duplicity, RSS Hindutva, RSS Mohan Bhagavat, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


చారిత్రాత్మక దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకసారి చెప్పింది మరొకసారి మాట్లాడని ప్రధాని నరేంద్రమోడీ తన శైలి, సంప్రదాయాన్ని తప్పి వరుసగా మూడవ సంవత్సర ప్రసంగంలో కూడా వంద లక్షల కోట్ల పెట్టుబడుల గురించి పునశ్చరణ చేశారు. మార్పు ఏమంటే దానికి ” ప్రధాన మంత్రి గతిశక్తి ” అని పేరు పెట్టారు. ఈ మాత్రానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే దాని అమలు గురించి చెప్పుకుంటే చాల బాగోదు. కరోనా సందర్భంగా ప్రకటించిన 25లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి బండారం ఏమిటో తెలిసిందే. 75వారాల ముందే అమృతోత్సవంగా ఈ సందర్భాన్ని ప్రారంభించుకున్నాము. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూసిన తరువాత వాటిని మరోమారు సమీక్షించుకుందాం.
డెబ్బయి అయిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం గురించి మీడియాలో చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఇంకా రావచ్చు. కొత్త బిచ్చగాడికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమే లేకపోగా లేకపోగా బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాల వారసులు సిపిఎం నిర్ణయం మీద ఉక్రోషాన్ని దాచుకోలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు తమ విజయం అని బిజెపి నేతలు కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. మార్క్సిస్టుల నిర్ణయాన్ని మీడియాలో ఇంత సంచలనాత్మకంగా ఎందుకు చేశారు ? కమ్యూనిస్టుల్లో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారా లేక వారిమీద వేసే రాళ్ల సంఖ్య తగ్గిపోయిందనే దుగ్దా ? ఏమైనా కావచ్చు.


సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో స్పందించాయి. ప్రజాజీవనంలో ఒక ఉదంతం జరిగినపుడు స్పందించటం ఒక ప్రజాస్వామిక హక్కు. అందువలన దాన్ని తప్పు పట్టనవసరం లేదు. స్పందనలో ఉన్న విషయం ఏమిటనే అంశంపై ఇతరులకూ అదే హక్కు ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు, కాషాయవాదుల్లో వచ్చిన మార్పుల తీరుతెన్నుల గురించి ఒక పరిశీలన ఇది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌-దేశభక్తి, జాతీయ జెండా బండారాన్ని చూద్దాం. నిజాలను తట్టుకొనగలిగే, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ముందుకు పోవచ్చు. లేని వారు ఇంతటితో ముగించవచ్చు.


అతల్‌ బిహారీ వాజపాయి ప్రధాన మంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో లోక్‌సభలో జాతీయ పతాకం గురించి చర్చ జరిగింది. బిఆర్‌ అంబేద్కర్‌ మనవడు, తొలుత రిపబ్లికన్‌ పార్టీ తరువాత భరిపా బహుజన మహాసంఘ పార్టీ తరఫున ఎన్నికైన ప్రకాష్‌ అంబేద్కర్‌ జీరో అవర్‌లో మాట్లాడుతూ నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని, మువ్వన్నెల జెండా అంటే గౌరవం లేదని విమర్శించారు. అప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ కొల్‌కతాలో సిపిఎం కార్యాలయం మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదని గొంతు కలిపారు. అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న ప్రమోద్‌ మహాజన్‌ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నానని సంస్ధ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేశారని చెప్పారు. అలాంటి ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందటం తగదన్నారు. కావాలంటే జనవరి 26న ప్రకాష్‌ అంబేద్కర్‌ను నాగపూర్‌ తీసుకు వెళ్లి ఆయనతోనే జెండా ఎగురవేయిస్తామన్నారు.మంత్రి మాటలను ఖండిస్తూ 1998లో నాగపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించాలని ప్రతినిధి వర్గాన్ని పంపాలని, ఒక వేళ వారే స్వంతంగా ఎగురవేయకపోతే వెళ్లిన వారు ఎగురవేయాలని నిర్ణయించినట్లు ప్రకాష్‌ అంబేద్కర్‌ గుర్తు చేశారు.1999లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లి జండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారి మీద లాఠీచార్జి జరిగిందని, 2000 సంవత్సరంలో కూడా అదే ప్రయత్నం చేయగా తమ భవనం మీద జెండా ఎగురవేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకున్నదని ప్రకాష్‌ అంబేద్కర్‌ చెప్పారు. వ్యక్తులు, సంస్ధలు ఎవరైనా తమ ఇండ్ల మీద భవనాలపై జెండాను ఎగురవేయవచ్చని, ఈ సందర్భంగా ఎంపీలు అందరూ తమ ఇండ్ల మీద జెండాలు ఎగురవేయటాన్ని తాను చూడలేదని, అంతమాత్రాన వారు దేశభక్తి లేని వారని అర్ధమా అని మంత్రి మహాజన్‌ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జెండా ఎగురవేయటం గురించి మహాజన్‌ నిజం చెప్పులేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సభను తప్పుదారి పట్టించారు.


2002 జనవరి 26న తొలిసారిగా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆగస్టు 15న రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్ధకు చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ముందు జండా ఎగురవేశారు. జాతీయ జండాను ఎందుకు ఎగురవేయటం లేదు అని అడిగితే జెండా నిబంధనల ప్రకారం ప్రయివేటు వ్యక్తులు ఎగురవేయకూడదనే నిబంధన ఉందని, 2002లో దాన్ని సవరించినందున అప్పటి నుంచి ఎగురవేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెబుతారు. వారు ప్రచారం చేసే పచ్చి అబద్దాల్లో ఇది ఒకటి. పోస్ట్‌ కార్డ్‌ న్యూస్‌ పేరుతో నిరంతరం ఫేక్‌ న్యూస్‌ వండి వడ్డించే విక్రమ్‌ హెగ్డే, ఓప్‌ ఇండియా పేరుతో వక్రీకరణ రాతలు రాయించే నూపూర్‌ శర్మ వంటి అనేక మంది ఈ మేరకు ట్వీట్లు చేశారు. జండా నిబంధనలను సడలించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ ఎగురవేస్తున్నదని చెప్పారు. వాస్తవం ఏమిటి ?


1995 ఫిబ్రవరిలో నవీన్‌ జిందాల్‌ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు.తన ఫ్యాక్టరీ వద్ద అన్ని రోజులూ జాతీయ జెండాను ఎగురవేయకుండా అధికారులు ఆటంకాలు కల్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పౌరులు జాతీయ జెండాను ఎగురవేయరాదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తరువాత 2002 జనవరి 15న ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నియమించిన పిడి షెనారు కమిటీ నివేదికను ఆమోదించారు. అదే జనవరి 26 నుంచి అన్ని రోజులూ ఎవరైనా ఎగురవేయవచ్చని ప్రకటించారు. అయితే 1971 జూన్‌ 15న హౌంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలో ఈ మూడు రోజులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చని పేర్కొన్నారు.1982లో పంజాబ్‌ ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఆ మూడు రోజులతో పాటు జలియన్‌వాలాబాగ్‌ అమరజీవుల సంస్మరణ వారమైన ఏప్రిల్‌ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు, జాతియావత్తూ సంతోష పడే ఏదైనా రోజు కూడా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా మరొకరు గానీ ఆ పని చేయవచ్చు, కానీ అనుమతి లేనందున తాము ఎగురవేయటం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల భాష్యం కుంటి సాకు,అవాస్తవం తప్ప మరొకటి కాదు.


నాగపూర్‌లో బిజెపిఏతర పార్టీలు, సంస్ధలకు చెందిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేసేందుకు చేసిన యత్నాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశం కావటం, సరిగ్గా ఆ సమయంలో వాజపాయి ప్రధానిగా ఉండటంతో విధిలేక తన వ్యతిరేకతను దిగమింగి ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ జెండాను ఎగురవేయటం ప్రారంభించింది. ఒకసారి అధికార రుచి మరిగిన తరువాత మైనారిటీలు, ఇతరుల సంతుష్టీకరణలో భాగంగా, ప్రపంచంలో ఉన్న మత శక్తి అనే ముద్రను చెరిపివేసుకొనేందుకు గురువుగా దశాబ్దాలుగా పిలుస్తున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రచనలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేంతవరకు వెళ్లింది. ఆయన ప్రఖ్యాత రచన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుచ్చము), ఇతర పుస్తకాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రామాణికంగా తీసుకొని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. ఆ సంస్ధ చెప్పే జాతీయతకు గోల్వాల్కర్‌ చెప్పిన అర్ధం ఏమిటి ? ” మేము లేదా మన జాతి గుర్తింపు నిర్వచనం(ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ )” అనే శీర్షికన 1938లో రాసిన పుస్తకంలో ” హిందూస్తాన్‌లో హిందూయేతరులు వారు విధిగా హిందూమతంలోకి మారాలి లేదా హిందూ రాజ్య చేతికిందివారుగా(రెండవ తరగతి) దేశంలో ఉండవచ్చు.ఎలాంటి ప్రత్యేకహక్కులు, చివరికి పౌరహక్కులు కూడా కోరకూడదు.” 1940 నుంచి 1973లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన గోల్వాల్కర్‌ ఆ కాలమంతా తన భావాలను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు నూరిపోశారు. తరువాత కూడా అదే సాగింది.


2004లో దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బిజెపి ఎన్నికల్లో దిగి పరాజయం పాలు కావటం, దాని సిద్దాంతాలను చూసి కొన్ని పార్టీలు ఇబ్బంది పడటం తదితర కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ తన పులిచారలను కనపడకుండా చేసేందుకు ప్రయత్నించింది. దానిలో భాగంగానే 2006లో తొలిసారిగా గోల్వాల్కర్‌ జాతి గుర్తింపు నిర్వచన పుస్తకానికి – తమకూ సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ” గోల్వాల్కర్‌ పుస్తకంతో తమకు సంబంధం లేదని అధికారికంగా చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ ” అనే శీర్షికతో 2006 మార్చి 9న అక్షయ ముకుల్‌ అనే విలేకరి రాసిన వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. ” అందరూ నమ్ముతున్నట్లుగా ఉరు పుస్తకం ఆర్‌ఎస్‌ఎస్‌ బైబిలు కాదు. అది నిజంగా బైబిల్‌ అయి ఉంటే సంఘకార్యకర్త ప్రతిఒక్కరూ దాన్ని చదివి ఉండేవారు, ప్రతి వారి ఇంట్లో ఉండేది, అలా జరగలేదు ” అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధిగా పని చేసిన ఎంజి వైద్య చెప్పిన మాటలను ఆ వార్తలో పేర్కొన్నారు. చిత్రం ఏమిటంటే గోల్వాల్కర్‌ బతికి ఉన్నంతవరకు మూడుదశాబ్దాలకు పైగా ఆ పుస్తకంలోని అంశాలను పక్కన పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. మరణించిన తరువాత మరో మూడు దశాబ్దాలు కూడా ఎవరూ మాట్లాడలేదు.


ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లెక్చరర్‌ రాకేష్‌ సిన్హా 2006లో ”శ్రీ గురూజీ-ముస్లింలు ” అనే పేరుతో రాసిన పుస్తకంలో సరికొత్త కథను ముందుకు తెచ్చారు. గోల్వాల్కర్‌ రచన ఉరు పుస్తకంలోని అంశాలు నిజానికి గూరూజీవీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదట. ఆ పుస్తకంలోని అంశాలు తనవి కాదని గురూజీ బతికి ఉండగా చెప్పేవారట. జిడి సావర్కర్‌ రాసిన ” రాష్ట్ర మీమాంస” అనే పుస్తక సంక్షిప్త రూపం తప్ప గోల్వాల్కర్‌ భావాలు కాదని, కానీ వాటిని గురూజీకి ఆపాదించి లౌకిక సామాజిక శాస్త్రవేత్తలు ఉపశమనం పొందారని రాకేష్‌ సిన్హా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఆ పుస్తకం మినహా గోల్వాల్కర్‌ ఇతర పుస్తకాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచురించి బోధ చేస్తూనే ఉంది. గోల్వాల్కర్‌ పేరుతో సాగిన బోధనల గురించి సిగ్గుపడటం సరే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి ? ఆ పుస్తకంలోని భావాలు, సూత్రీకరణలను ఆరు దశాబ్దాల పాటు సంఘపరివార్‌లోని వారెవరికీ అభ్యంతరం అనిపించలేదా ? భిన్నాభిప్రాయం వెల్లడికాలేదా ? ఎవరూ నోరుమెదపలేని పరిస్ధితి పరివార్‌లో ఉన్నట్లే అని భావించాలా ? జిడి సావర్కర్‌ పేరుతో సదరు పుస్తకాన్నే సంక్షిప్తం చేసి ప్రచురించవచ్చు, కానీ దాని సంక్షిప్త రూపానికి పేరు మార్చి గోల్వాల్కర్‌ తన పేరు ఎందుకు పెట్టుకున్నట్లు ? గోల్వాల్కర్‌ స్వయంగా చెప్పారు అంటున్నవారు అలా ఎందుకు చేశారనే ప్రశ్నించే స్వేచ్చ పరివార్‌లో లేకపోయిందా ? పోనీ ఆయన బతికి ఉండగా పక్కన పెట్టేందుకు ధైర్యం లేకపోతే మరణించిన తరువాత అయినా వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు ? మొత్తం ఆరు దశాబ్దాల పాటు దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రచారం చేసింది. అందుకే విశ్వసనీయత సమస్య ముందుకు వస్తోంది. అది గురూజీది కాదంటున్నారు గనుక ఆయన పెద్ద కాపీ మాస్టర్‌ అని తేలిపోయింది.


2018 సెప్టెంబరు 20న న్యూస్‌ 18 టీవీ, ఇతర పత్రికలు కూడా ఒక వార్తను ప్రచురించాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా ఉన్న మోహనభగవత్‌ ఒక కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 1966లో గురు గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచన గుచ్చము) అనే పుస్తకం తమకు నిత్య అఖండజ్యోతి కాదని వాటిలో కొన్ని కాలానుగుణ్యంగా లేవని అన్నారు. హిందూయేతర మతపరమైన మైనారిటీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి గురించి భయాలున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిలో చెప్పిన అంశాలు కొన్ని పరిస్ధితులు, ఒక నిర్దిష్ట పూర్వోత్తర సంబంధంగా చెప్పినవి. మేము ”గూరూజీ- విషన్‌ అండ్‌ మిషన్‌ ” (గురూజీ ఊహ-కార్యక్రమం) అనే పుస్తకాన్ని ప్రచురించాము. వాటిలో కొన్ని పరిస్ధితుల్లో చెప్పిన వాటిని తొలగించాము. గురూజీ అనశ్వర ఆలోచనలను కొనసాగించాము” అన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గురించి చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ పరిధీకృత సంస్ధ కాదు (గీసుకున్న గిరికి పరిమితం), కాలంతో పాటు మా ఆలోచనలు, వాటి స్పష్టత వక్కాణింపులో కూడా మార్పులు ఉంటాయి. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌లో రాసిన అంశాల ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ అనే సందేహాలుంటే మా పనేమిటో చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ కానట్లయితే మహిళలకు, మైనారిటీ మతస్ధులకు సభ్యత్వాన్ని, బాధ్యతలు లేదా నాయకత్వ స్దానాలను ఎందుకు అనుమతించటం లేదు.


ఇక జాతీయ జెండా విషయానికి వస్తే ఆర్‌ఎఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 1947 జూలై 17తేదీ సంచిక, తరువాత రాసిన సంపాదకీయాల్లో చెప్పిందేమిటి ? తంతే గారెల బుట్టలో పడ్డట్లు జనాలు అధికారానికి వచ్చి మన చేతుల్లో మూడు రంగుల జండాను పెట్టవచ్చు, కానీ హిందువులెవరూ ఎన్నడూ దాన్ని గౌరవించరు, తమదానిగా చేసుకోరు. మూడు అనే పదమే ఒక దుశ్శకునం, జండాకు ఉన్న మూడు రంగులు మానసిక ప్రభావాన్ని కలుగ చేస్తాయి, జెండా దేశాన్ని గాయపరుస్తుంది” అని పేర్కొన్నారు. 1946 జూలై 14న గోల్వాల్కర్‌ నాగపూర్‌ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే మన ఘనమైన సంస్కృతికి ప్రతీక, అది దేవుని అవతారం, అంతిమంగా యావత్‌ జాతి కాషాయ జెండా ముందు మాత్రమే తలవంచుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం ‘అన్నారు.


శ్యామ ప్రసాద ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ తమ హీరోగా పరిగణిస్తుంది. ఆయన 1943 నుంచి 46వరకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయాలని బెంగాల్‌ కాబినెట్‌ మంత్రిగా ఉంటూ 1942 జూలై 26న నాటి బెంగాల్‌ గవర్నర్‌ జాన్‌ హరబర్టుకు లేఖ రాసిన అపర దేశభక్తుడు. బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని సదరు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ దేశభక్తుడిని పార్టీలో చేర్చుకొనేందుకు, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు నాడు నెహ్రూకు అభ్యంతరం లేకపోయింది. కొద్ది కాలంలోనే నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేరదీసి 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేయించింది.


సంఘపరివారం వీర సావర్కర్‌గా పిలిచే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జాతీయ జెండాను గురించి చెప్పిందేమిటి ? ( ఆయనకు వీర బిరుదు ఎవరిచ్చారంటే ఎవరూ సమాధానం చెప్పరు ) ” మూడు రంగుల జండాను హిందూస్తాన్‌ జాతీయ జండాగా ఎన్నటికీ గుర్తించలేము. కాషాయ జెండా మాత్రమే ఉండాలి… హిందువులు మరొక జెండాకు ఏ స్దాయిలోనూ విధేయులుగా వందనం చేయరు.” అన్నారు. పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలని 1940లో ముస్లింలీగ్‌ డిమాండ్‌ చేసింది.దానికి మూడు సంవత్సరాల ముందే 1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ 19వ సమావేశంలో సావర్కర్‌ మాట్లాడుతూ రెండుదేశాల సిద్దాంతాన్ని సమర్ధించారు. ఈ రోజు దేశం ఇంకేమాత్రం ఐక్యంగా ఒకటిగా ఉండలేదు, హిందూ, ముస్లిందేశాలుగా ఉన్నాయి. జిన్నా రెండు దేశాల సిద్దాంతంతో నాకేమీ పేచీ లేదు, చారిత్రకంగా చూస్తే హిందూ ముస్లింలు రెండుదేశాలుగా ఉన్నారని 1943ఆగస్టు 15న నాగపూర్‌ సమావేశంలో సావర్కర్‌ చెప్పారు. తిరువాన్కూర్‌ సంస్ధాన దివానుగా ఉన్న సిపి రామస్వామి అయ్యర్‌ తమ సంస్దానం ప్రత్యేక దేశంగా ఉంటుందని 1947జూన్‌ 11న ప్రకటించారు.అఖండ భారత్‌ గురించి చెప్పిన సావర్కర్‌ జూన్‌ 20 ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టెలిగ్రామ్‌ పంపారు. ” తిరువాన్కూరును మన హిందూ స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు ముందు చూపు, దైర్యం కావాలి” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన జనం దాన్ని వ్యతిరేకించి విలీనానికి పోరాడారు. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి మెరుగని వాటిని ప్రపంచమంతా ఆరాధిస్తుంటే మన రాజ్యాంగ పండితులకు అది పట్టలేదని 1949నవంబరు 30 ఆర్గనైజర్‌ పత్రిక రాసింది.


నిషేధాన్ని ఎత్తివేయించుకొనేందుకు రాజకీయాల్లో పాల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా ఉంటా మంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సంతకాల తడి ఆరక ముందే జనసంఫ్‌ును ఏర్పాటు చేయించి తమవారిని నేతలుగా పెట్టింది. ఇప్పుడు బిజెపిలో ఉన్నవారందరూ వారే. అయినా తమది రాజకీయ సంస్ద కాదని ఇప్పటికీ చెప్పుకుంటుంది. నిత్యం స్వదేశీ అని పశ్చిమ దేశాలను విమర్శించే ఆర్‌ఎస్‌ఎస్‌ తన యూనిఫామ్‌ విషయానికి వస్తే ఆ పశ్చిమ దేశాల నుంచే అరువు తెచ్చుకుంది.నిక్కర్ల నుంచి పాంట్లకు మారినా స్వదేశీ ఊసులేదు.ఆరు సార్లు యూనిఫామ్‌లో మార్పులు చేసుకుంది. తమ వెనుక ఇన్ని పిల్లి మొగ్గలు, అవగాహనలను మార్చుకున్న చరిత్ర తమ వెనుక ఉంచుకొని సిపిఎం వైఖరి మార్చుకున్నదని చెప్పటం విశేషం. ఇక్కడ గమనించాల్సిందేమంటే గోల్వాల్కర్‌ పుస్తకాలను పక్కన పెట్టినా, జెండా ఎగరవేయటం గురించి విధానాన్ని మార్చుకున్నా, అవగాహన మారిందని చెప్పుకున్నా అదంతా పైపై వ్యవహారం తప్ప అసలైన హిందూత్వ అజెండాలో ఎలాంటి మార్పు లేదు. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే గతంలో తాము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు పునశ్చరణ చేసినా, ముందుకు తీసుకుపోయినా కుదరదు కనుకనే పులిచారలు కనిపించకుండా కొత్త దుస్తులు వేసుకుంటోంది, మాటలను మారుస్తోంది. మరి కమ్యూనిస్టుల సంగతేమిటి ? వారెందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు, జాతీయ జండాను ఎగురవేసేందుకు నిర్ణయించుకున్నారు ? మరో భాగంలో చూద్దాం !

సంబంధిత వ్యాస రెండవ భాగ లింకు దిగువ ఉంది.

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? https://vedikaa.com/2021/08/17/indian-national-flag-matters-what-changed-in-cpim-stand/

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసహనంతో ఉన్న అమెరికా -చైనా మీద యుద్దానికి దిగుతుందా !

12 Thursday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

US and China, US war With China, world superpowers


ఎం కోటేశ్వరరావు


అమెరికన్లు ఇప్పుడు అసహనంతో ఉన్నారు . ప్రపంచంలో తిరుగులేని శక్తి అన్న భావన క్రమంగా తగ్గిపోతోంది. దాని అర్దం అది బలహీనపడిందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని ప్రతి చిన్న దేశమూ సవాలు చేస్తోంది. అందువలన చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని చూస్తోందా ? అందుకుగాను చేయబోయే తదుపరి యుద్దం చైనాతోనా ? దానికి అనుగుణ్యంగానే పావులు కదుపుతున్నారా ? రెండవ ప్రపంచ యుద్దరంగం ఐరోపా అయితే మూడవ యుద్దం ఆసియా కేంద్రంగా జరగనుందా ? ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్‌ రెండవ యుద్దానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారిపోతోందని భావిస్తున్న అమెరికా తెగింపు మూడవ యుద్దానికి దారి తీస్తుందా ? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలుగానే ఇప్పుడు కనిపించవచ్చుగానీ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే నిజంగానే యుద్దం జరుగుతుందా? సామ్రాజ్యవాద కార్పొరేట్‌ల లాభాల కోసం వాటి చౌకీదార్లుగా ఉండే పాలకులు ఎంతకైనా తెగిస్తారన్నది గత అనుభవం. ఇప్పుడు యుద్దం లాభమా ? ఆ వాతావరణం సృష్టించి మార్కెట్‌ వాటాను దక్కించుకోవటం ముఖ్యమా అన్న మధనం జరుగుతోంది !


మరోవైపు తమ జోలికి వస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనా తన వ్యతిరేకులకు సందేశాలు పంపుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు(9 నుంచి 13వ తేదీ) చైనాలో జరిపే రష్యాతో కలసి జరిపే సంయుక్త మిలిటరీ విన్యాసాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక దేశంతో జరిపే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె-20 యుద్ద విమానాలను తరలించటం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అంబుల పొదిలో ఇవి కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలోని నింగ్జియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ద విమానాలతో పాటు బడా రవాణా విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్‌యు-30 ఫైటర్‌ జెట్‌లు గతనెలలోనే ఇక్కడకు చేరుకున్నాయి. ఉభయదేశాల నిపుణులు, సిబ్బంది ఆయుధాల ప్రయోగం, మెళకువలను తెలుసుకుంటారు. యుద్ధ రంగంలో ఎలా వ్యవహరిస్తారో అదేమాదిరి ఇక్కడ ఆయుధాలను ప్రయోగించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. పదివేల మంది మిలిటరీ సిబ్బంది దీనిలో పాల్గొంటారు. ఈ చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, సవాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నత స్ధాయికి చేరినట్లు ప్రదర్శితం అవుతుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ విభాగాల సంక్లిష్టమైన సైనిక విన్యాసాలకు, శిక్షణకు అనువుగా ఉంటుంది. గత ఏడాది రష్యాలోని కవకాజ్‌ ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగాయి. వాటిలో రష్యా తన ఆధునిక ట్యాంకులు, క్షిపణులు, ఇతర ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది.


ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న వారు అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. వాటిని వేటిని కొట్టిపారవేయలేము, అలాగని యథాతధంగా స్వీకరించలేము. ఆసియా కీలకం లేదా ఇరుసు అన్న సామ్రాజ్యవాదుల పధకం ఎప్పుడో ప్రారంభమైంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా కొనసాగుతోంది. దానిలో భాగంగానే చైనా చుట్టూ వందలాది సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. మూడింట రెండువంతుల నౌకా, వైమానిక దళాలను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి తరలిస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంత పెద్ద మిలిటరీ కేంద్రీకరణ లేదు.ఇరవై ఒకటవ శతాబ్దివిజయాన్ని స్వంతం చేసుకొనేందుకు చైనాతో పోటీ పడుతున్నామని జోబైడెన్‌ పార్లమెంట్‌ తొలి ప్రసంగంలోనే చెప్పాడు.ఐరోపాలో నాటోతో ఎలా చేస్తున్నామో ఆసియాలో కూడా ఇండో-పసిఫిక్‌ అలాంటిదే అని కూడా దాచుకోకుండా చెప్పాడు. చైనాను బూచిగా చూపి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచివేస్తున్నారు. ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికా మూడు దశాబ్దాల తరువాత అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.


దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఇటీవలి కాలంలో అమెరికా యుద్ద నౌకలు పదే పదే సంచరిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టటం ఒకటైతే, ఆ ప్రాంత అనుపానులు-చైనా కదలికల మీద కన్నువేయటం రెండవది, చూశారా చైనా సమీపంలోకి మేము వచ్చాం అని పరిసర ప్రాంతదేశాలలో విశ్వాసం కలిగించే లక్ష్యం వంటివి ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, మేము సైతం యుద్ద అగ్నికి అన్నట్లుగా ఈ ప్రాంతంలో రెండు యుద్ద నౌకలను శాశ్వతంగా ఉంచుతామని జపాన్‌తో కలసి బ్రిటన్‌ ప్రకటించింది.ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదని చెబుతున్నప్పటికీ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ కూటమిని ఆసియా నాటోగా మార్చాలన్న ఎత్తుగడ ఉంది. తైవాన్‌ విలీనానికి చైనా బలప్రయోగం చేయనున్నదనే ప్రచారం వెనుక కూడా తమ మిలిటరీ చర్యలను సమర్దించుకొనేందుకే అన్నది స్పష్టం. తైవాన్‌ రక్షణకు తాము, అమెరికా ఉమ్మడిగా వ్యవహరిస్తామని జపాన్‌ ఉప ప్రధాని తారో అసో చెప్పాడు. తైవాన్‌ సమీపంలోని ఒకినావా, ఇతర జపాన్‌ దీవుల్లో 50వేల మంది సైనికులతో అమెరికా అనేక స్దావరాలను నిర్వహిస్తున్నది. అమెరికాలోని ఇండో-పసిఫిక్‌ వ్యవహారాల అధిపతి కర్ట్‌ కాంప్‌బెల్‌ మాట్లాడుతూ తొలిసారిగా తమ వ్యూహాత్మక, ఆర్ధిక ప్రయోజనాలు, మిలిటరీ కేంద్రీకరణను ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి మళ్లిస్తున్నామని వెల్లడించాడు. ఒబామా హయాంలో పన్నెండు సార్లు యుద్ద నావలను తైవాన్‌ జలసంధివైపు నడిపిస్తే ట్రంప్‌ 13సార్లతో ఆ రికార్డును తిరగరాశాడు. బైడెన్‌ ఆరునెలల్లోనే ఏడుసార్లు నడిపి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నాడు.


తన ఉపగ్రహం లేదా తొత్తు దేశమైన ఇజ్రాయెల్‌ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే పెగాసస్‌ నిఘా, చొరబాటు గురించి అమెరికా ఇంతవరకు స్పందించలేదు, అనధికారికంగా జర్నలిస్టుల మీద నిఘావేయటాన్ని ఖండిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించింది.కానీ అదే అమెరికా గతంలో రష్యా మీద, ఇప్పుడు చైనా మీద రుజువు కాని ఆరోపణలతో ఆంక్షలకు తెగబడుతోంది. తమ దేశ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జోక్యం చేసుకున్నట్లు, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ను దెబ్బకొట్టేందుకు, సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఇప్పుడు పెగాసెస్‌ మీద మౌనం ఎందుకు ? చైనాకు వ్యతిరేకంగా సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ(సిఎన్‌ఏఎస్‌) పేరుతో ఆసియా ఇరుసు పధకాన్ని రూపొందించిన కాంప్‌బెల్‌, యుద్ద నేరగాడు మైఖేల్‌ ఫ్లోర్‌నోరు ఏర్పాటు చేసిన సంస్ధకు పెద్ద మొత్తంలు మైక్రోసాఫ్ట్‌ నిధులు ఇచ్చింది. యుద్దమంటూ వస్తే 72 గంటల్లో యావత్‌ చైనా పౌర, మిలిటరీ నౌకలను నాశనం చేసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని పెంటగన్‌కు సమకూర్చటమే తమ లక్ష్యమని బహిరంగంగానే చెప్పాడు.ఈ సంస్ద, దానితో సంబంధాలు ఉన్న అనేక మంది ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంలో తిష్టవేశారు.ఈ సంస్ధకు అమెరికా విదేశాంగశాఖ,తైవాన్‌ ప్రభుత్వం, నార్త్‌రాప్‌ గ్రుమన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, కామ్‌కాస్ట్‌, ఎక్సాన్‌, మాస్టర్‌కార్డ్‌, అమెరికాలోని జపాన్‌ రాయబార కార్యాలయం, సిటీగ్రూప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, రేథియాన్‌, జార్జిటౌన్‌ యూనివర్సిటీ వంటి సంస్దలు పెద్ద మొత్తాలలో నిధులు అందచేస్తున్నాయి. ఇలాంటి సంస్ధలు ఒక్క చైనాకే వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అనేక దేశాలలో అమెరికన్‌,మిలిటరీ, కార్పొరేట్లకు, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియావంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. రష్యాకు వ్యతిరేకంగా 2014లో దాని ముంగిట ఉన్న ఉక్రెయిన్‌లో నయా నాజీలను అధికారంలో కూర్చోబెట్టాయి.ఇలా అనేక దేశాల్లో వ్యవహరిస్తున్నాయి.


ప్రపంచంలో ప్రతివారి నుంచి తమకు ప్రమాదం ఉందనే ప్రచారంతో అమెరికన్లను మభ్యపెట్టి ఆ దేశ పాలకులు 70దేశాలలో 800వందల సైనిక స్దావరాలు, కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖండాంతర క్షిపణులు, మధ్యశ్రేణి అణ్వాయుధాల పరిమితి ఒప్పందం, గగనతలాన్ని స్వేచ్చగా ఉంచాలనే ఒప్పందాల నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది.ఇది ఆయుధ పోటీకి దారితీస్తోంది. రెండువేల సంవత్సరం వరకు అమెరికా తన సేనలను ప్రధానంగా జర్మనీ, ఉత్తర ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలో అధికంగా మోహరించింది.2011 సెప్టెంబరులో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి తరువాత మధ్యప్రాచ్యంలో కేంద్రీకరించారు. ఒక దశలో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్ష మంది చొప్పున అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తరువాత తూర్పు ఆసియాలో మోహరించారు.


సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించిన రిపబ్లిక్‌లు మిలిటరీల్లో 50శాతం వరకు తగ్గించాయి. ఇదే సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌, మన దేశం 40,30,15శాతం చొప్పున మిలిటరీని, బడ్జెట్లను పెంచాయి.జిడిపిలో ఒకశాతం లోపుగానే ఖర్చు చేయాలని స్వయంగా విధించుకున్న నిబంధనను జపాన్‌ పక్కన పెట్టింది.తనను చక్రబంధంలో బిగించేందుకు అమెరికా పూనుకున్నదని అర్ధం చేసుకున్న చైనా తన బలగాలను గణనీయంగా పెంచుకుంటున్నది. వాటికి సంబంధించి అంచనాలే తప్ప నిర్ధిష్ట సమాచారం బయటికి తెలియదు.1995లో కేవలం 50 స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న చైనా 2019లో 750 నుంచి 1500వరకు, 950 మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు సమకూర్చుకున్నట్ల్లు వార్తలు వచ్చాయి.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికన్లు చేసిన ప్రతి యుద్దంలోనూ, ప్రతి చిన్న దేశం చేతిలోనూ ఓడిపోయారు. అలాంటిది చైనాతో పెట్టుకొని నెగ్గుకు రావటం అన్నది కలలో మాట.మొదటి ప్రపంచ యుద్దంలో ఓటమి, విజేతలు రుద్దిన ఒప్పందాలు జర్మన్‌ కార్పొరేట్ల అవకాశాలను దెబ్బతీసిన పరిస్ధితి, దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్‌ మాదిరి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం చైనాకు లేదు. తన ప్రయోజనాల రక్షణకు వెనుకడుగువేసే అవకాశమూ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా తప్పుకున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆసియాలో తన ప్రయోజనాల కోసం మరొక చోట దుకాణం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది ఆ ప్రాంత దేశాలతో పాటు రష్యా, చైనాలకు ముప్పుతెచ్చే పరిణామం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కట్టు కథలు. పిట్ట కథలు, అతిశయోక్తులు !

09 Monday Aug 2021

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

fake news, fake stories, RSS Propaganda


ఎం కోటేశ్వరరావు


మన జీవితాలు ఎలా తయారయ్యాయంటే రోజుకు ఒక కుహనా వార్త లేదా వక్రీకరణ అంశం లేకుండా గడవని పరిస్ధితి. నరేంద్రమోడీ గారు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి చైనాను మించి పోవాలని చెప్పారు. దానికి బదులు కొద్ది పెట్టుబడితో పుంఖాను పుంఖాలుగా కుహనా వార్తలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇటీవలి కాలంలో పుట్టుకువచ్చాయి. మంచి వార్తలు రాసే వారికి జీతాలు సరిగా ఉండవు గానీ వక్రీకరణ వార్తలు, వీడియోలు తయారు చేసే వారికి ఎలాంటి సమస్యలూ లేవు. కరోనాతో అనేక మీడియా సంస్దలు సిబ్బందిని తొలగించాయి గానీ కుహనా వార్తల తయారీ ఇంకా పెరిగింది. లేని గొప్పలు చెప్పుకోవటంలో భాగంగా కట్టు కధలు అల్లటం, పిట్టకథలు చెప్పటం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగి పోయింది. ముఖ్యంగా వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు, పట్టభద్రులు పెరిగిపోయిన తరువాత ఇక చెప్పనవసరం లేదు. చెబుతున్న కథలు కూడా కాపీ, పేర్లు మారతాయంతే ! కొందరికి అభిమానులుగా ఉన్న వారు నిజానిజాలను నిర్దారించుకోకుండా వారి గురించిన అతిశయోక్తులను తాము నమ్మటమే కాకుండా ఇతరులకూ పంపిణీ చేస్తుంటారు. కొన్నింటిని పరిశీలించుదాం.


వియత్నాంలోని హౌచిమిన్‌ సిటీలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారన్నది వాటిలో ఒకటి. వియత్నాం ఒక చిన్న దేశం. జపాన్‌, ఫ్రెంచి, అమెరికన్‌ సామ్రాజ్యవాదులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాగించి తమ గడ్డమీది నుంచి పారదోలిన వీరగడ్డ. అంత పెద్ద దేశం మీద మీరు ఎలా విజయం సాధించారు అని ఒక విలేకరి అడిగితే మాకు ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ద పద్దతి ఉపయోగపడింది అని వియత్నాం అధ్యక్షుడు చెప్పాడట. నేను గొప్ప రాజైన శివాజీ వ్యక్తిత్వం,చర్యల గురించి చదివాను, యుద్దతంత్రం నన్ను ఎంతో ఉత్తేజపరించింది. అమెరికా దళాలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించాం, విజయం సిద్దించింది. అలాంటి రాజు గనుక మా దేశంలో జన్మించి ఉంటే ప్రపంచాన్ని ఏలి ఉండేవారం.
శివాజీకి నివాళిగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారన్నది ఒక పిట్టకధ. తన సమాధిరాయి మీద శివాజీ మహరాజ్‌ గురించి రాయించుకున్నాడని కూడా కథలు చెప్పారు. తరువాత కొన్నేండ్లకు వియత్నాం మహిళా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చి ఎర్ర కోట, మహాత్మాగాంధీ సమాధులను సందర్శించినపుడు శివాజీ సమాధి ఎక్కడ అని అడిగారట. కంగారు పడిన అధికారులు మహారాష్ట్రలోని రైగఢ్‌లో ఉందని చెప్పగా తాను అక్కడికి వెళ్లాలని చెప్పినట్లు, తరువాత సమాధిని సందర్శించి అక్కడి మట్టి తీసుకొని తన బ్రీఫ్‌కేసులో వేసుకున్నట్లు, విలేకర్లు ఎందుకా మట్టి అని అడగ్గా తమ దేశమట్టిలో దాన్ని కలుపుతానని, అలా చేస్తే శివాజీ వంటి ధైర్యవంతులు అక్కడ పుడతారని ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ విలేకరి రాసినట్లు పేర్కొన్నారు. అసలు విషయం ఏమంటే అమెరికా మీద యుద్దం ముగిసిన తరువాత ముగిసిన తరువాత వియత్నాం విదేశాంగ మంత్రిగా మహిళలెవరూ పని చేయలేదు. అమెరికా దురాక్రమణలో ఉన్న దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన తిరుగుబాటు ప్రభుత్వంలో 1969-76 మధ్య కాలంలో గుయెన్‌ తీ దిన్‌ అనే కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అన్నింటికీ మించిన పెద్ద అబద్దం ఏమంటే హౌచిమిన్‌ సిటీలో ఉన్నట్లు చెబుతున్న విగ్రహం అసలు శివాజీది కాదు. వియత్నాం మాజీ రాజు ట్రాన్‌ నగాన్‌ హన్‌ విగ్రహమది.


మరొక కధలో శివాజీతో పాటు రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ పేరు చేర్చి ప్రచారం చేశారు. రెండు కథల్లోను రాసిన మరొక అంశం ఏమంటే వియత్నాం అధ్యక్షుడు తాను మరణించిన తరువాత తన సమాధి మీద ” ఇతడు శివాజీ, రాణాప్రతాప్‌ ఆరాధకుడు ” అని రాయించాలని ఆదేశిస్తే అలాగే చేశారట ఇక్కడ మనం గమనించాల్సింది. శివాజీ, రాణా ప్రతాప్‌ సింగ్‌లు వియత్నాం కమ్యూనిస్టులకు ఉత్తేజమిచ్చారని చెప్పటం కట్టుకధలు తప్ప మరొకటి కాదు. భారత చరిత్ర గురించి అధ్యయనం చేసిన పండితులు ఒకరిద్దరికి ఆ పేర్లు తగిలి ఉండవచ్చు తప్ప కమ్యూనిస్టు పార్టీకి ఉత్తేజమిచ్చేంత సీన్‌ లేదు.వియత్నామీయులకు ఉత్తేజమిచ్చింది మార్క్సిజం-లెనినిజం, సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప శివాజీ, రాణాలు కాదు. వారి నుంచి మన దేశంలోని వారే ఉత్తేజం పొందలేదు. అదే జరిగి ఉంటే మొగలాయీల పాలనకు, తరువాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ఉండేవారు. అదేమీ లేదు.


శివాజీ, రాణా ప్రతాప్‌ కథలను ప్రచారం చేసింది కాషాయ దళాలు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని కాపీకొట్టిన వారు వారి పేర్ల బదులు అంబేద్కర్‌ పేరు చేర్చి మరొక కథను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అదెలా ఉందో చూడండి. ” వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం. అది అమెరికా లాంటి బలమైన దేశం మెడలు వంచింది.దాదాపు 20 సంవత్సరాల వరకు జరిగిన యుద్ధంలో అమెరికా పరాజయం చెందింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత వియత్నాం దేశాధ్యక్షున్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.ప్రశ్న అందరికీ విదితమే, మీరు యుద్ధం ఎలా గెలిచారు? అమెరికాను ఎలా తలవంచేలా చేశారు.కాని,ఆ ప్రశ్న కు ఇచ్చిన జవాబు మీరు వింటే కేవలం ఆశ్చర్యమే కాదు. మీ గుండె గర్వం తో నిండి పోతుంది.ఇచ్చిన జవాబును మీరు చదవండి. దేశాలన్నీంటిలోకీ అమెరికా చాల బలమైన దేశాన్ని ఓడించుటకు భారతదేశానికి చెందిన ఒక గొప్ప మహా నేత చరిత్ర ను చదివాను.ఆయన జీవితం యొక్క ప్రేరణను ఆచరించి నేను సులభంగా విజయాన్ని సాధించాను.ఎవరు ఆ గొప్ప నాయకుడు అని జర్నలిస్ట్‌ అడిగాడు.


”మిత్రులారా! ఇది నేను చదినప్పటినుండి నా గుండె గర్వంతో ఉప్పొంగినది. అలాగే మీ గుండె కూడ గర్వంతో నిండి పోతుంది. వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఇలా సమాధానం చెప్పాడు.ఆయనే భారతదేశ మహానాయకుడు భీంరావ్‌ అంబేద్కర్‌. ఆయన అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అన్నారు. బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే సమయంలో తన కళ్ళలో వీరత్వం మెరిసిసింది.అంతేకాదు, ఒకవేళ ఆ వ్యక్తి మా దేశంలో పుట్టిఉంటే నేను ప్రపంచాన్నే పాలించేవాన్ని అన్నారు.కొన్ని సంవత్సరాలకు ఆ దేశాధ్యక్షుడు మరణించిన తరువాత తన సమాధి పై ఏం రాయించుకున్నాడో తెలుసా! ”ఈ సమాధి ఒక భీంరావ్‌ అంబేద్కర్‌ శిష్యుని సమాధి అని”. కొన్ని సంవత్సరాల తరువాత వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన కు వచ్చాడు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం మొదట ఎర్రకోట తరువాత గాంధీ సమాధి చూపించారు. ఇదంతా చూచిన తరువాత ఆ మంత్రి మహానీయ భీంరావ్‌ అంబేద్కర్‌ సమాధిó ఎక్కడ అని అడిగాడు.అప్పుడు భారత అధికారి ఆశ్చర్య పోయి ముంబై లోని దాదర్‌లో ఉన్న చైత్య భూమి అని చెప్పాడు.ఆ వియత్నాం విదేశాంగ మంత్రి ముంబై వెళ్ళారు.అక్కడ బాబాసాహేబ్‌ సమాధిని దర్శించుకున్నారు. సమాధి వద్ద కొంత మట్టిని తిసుకుని బ్యాగ్‌ లో నింపుకున్నాడు.ఓ విలేకరి ఆ మట్టి గురించి అడగగా ఆ మంత్రి ఇలా అన్నారు.”ఈ మట్టి బాబాసాహేబ్‌ పాదాల వద్ద ఉన్నది. ఈ మట్టిని నాదేశ మట్టితో కలుపుతాను ,దీనితో నాదేశంలో ఇలాంటి నాయకుడు జన్మిస్తాడని ఆశిస్తున్నాను.బాబాసాహేబ్‌ భీం రావ్‌ అంబేద్కర్‌ కేవలం భారత దేశానికే కాకుండా సమస్త విశ్వానికే గర్వ కారణం.” ఈ కథ ఇప్పుడు వాట్సాప్‌లలో తిరుగుతున్నది. అంబేద్కర్‌ ఒక సంస్కర్తగా దేశ చరిత్రలో ఆయన స్దానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అతిశయోక్తులు చెప్పటం ద్వారా సాధించేదేమిటి ? కాపీ కథ ఆయనకు గౌరవం పెంచుతుందని భావిస్తున్నారా ?


ఇక అతిశయోక్తులు, ఘనతల చెప్పుకోవటాలు సరేసరే ! ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి రోజువారీ అంశాల గురించి చర్చ జరుపుతుంది. దాని నిబంధనల ప్రకారం శాశ్వత, రెండు సంవత్సరాల పాటు సభ్యులుగా ఉండే దేశాలలో నెలకు ఒకరు చొప్పున అధ్యక్షత వహిస్తుంటారు. సాధారణంగా ఐరాసలో శాశ్వత అధికారులుగా ఉన్న ఆయా దేశాల ప్రతినిధులే ఆ పని చేస్తారు. ఆగస్టు నెల అధ్యక్ష పదవి మన దేశానికి వచ్చింది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వంతులను నిర్ణయిస్తారు. ఇదేదో ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడికి నిదర్శనం అన్నట్లుగా కొందరు ప్రచారం చేశారు. భద్రతా మండలికి మన దేశం ఎన్నిక కావటం మొదటిసారి కాదు, ఎన్నికైన ప్రతిసారీ మనవంతు వచ్చినపుడు ఆ బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టిఎస్‌ తిరుమూర్తి మన శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. గతంలో మోడీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న హర్దీప్‌ సింగ్‌ పూరీ రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరొకటి తొలిసారిగా ఒక భారత ప్రధాని భద్రతా మండలి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారంటూ అదొక ఘనతగా ప్రచారం చేస్తున్నారు. భద్రతా మండలిలో ప్రతినెలా వివిధ అంశాల మీద బహిరంగ చర్చలు జరుగుతుంటాయి. భద్రతా మండలి సభ్యదేశాల అధిపతులు లేదా ప్రతినిధులు వాటిలోప్రత్యక్షంగా పాల్గొంటారు, కాని దేశాల వారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పిస్తారు. అలాంటి నెలవారీ కార్యక్రమంగా ఈనెలలో సముద్రయాన భద్రత అంశం గురించి చర్చిస్తున్నారు. దానికి మన ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మంది దేశాధినేతలు పాల్గొంటారో తెలియదు. ఇదొక గోష్టి వ్యవహారం తప్ప అంతకు మించి ప్రాధాన్యత ఉండదు. పెగాసస్‌ భూతంతో అనేక అంశాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీకి ఈ గోష్టి ప్రపంచ మీడియాలో చోటు కల్పిస్తుంది. ఇలాంటి వాటిని గొప్పగా చెప్పుకోవటమా లేదా అన్నది ఎవరి అభిరుచి వారిది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d