• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

మీరు ఎటు వైపో తేల్చుకోండి

10 Sunday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, indian farmers

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

08 Friday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

CCI, Cotton Corporation of India, cotton farmers, Cotton MSP, cotton subsidies


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వాక్సిన్‌ జాతీయవాదం- దేశ ద్రోహం – బిజెపి విపరీత పోకడ !

05 Tuesday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Science, USA

≈ Leave a comment

Tags

Bjp nationalism, COVAX, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్‌ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్‌ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్‌ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్‌ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్‌ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్‌ పూనావాలా అయితే మరొకరు భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.


ఔషధం, వాక్సిన్‌ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్‌ బయోటెక్‌ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !


గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్‌ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్‌ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?


మన దేశంలో కరోనా వాక్సిన్‌ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్‌ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్‌ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్‌ పేరుతో వాక్సిన్‌ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్‌ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?

కోవాగ్జిన్‌ వాక్సిన్‌ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్‌ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్‌ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్‌ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.


కోవాగ్జిన్‌ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్‌ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్‌ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్‌ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.


కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్‌ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్‌ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్‌ శర్మ ఏకంగా కోవాగ్జిన్‌ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్‌ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్‌ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్‌ చేశారు.


తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్‌ చేశారని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్‌ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ వాక్సిన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్‌ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్‌ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్‌ అలయన్స్‌ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్‌ కోవాగ్జిన్‌ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్‌ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్‌ అందచేస్తారు. బిల్‌గేట్స్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్‌ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.


సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్‌ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్‌ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్‌ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్‌ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.


వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్‌ బయోటెక్‌ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్‌ వ్యాపారి బిల్‌ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్‌, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్‌ వాక్సిన్‌ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్‌ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్‌ గేట్స్‌ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ వాక్సిన్‌ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్‌ గురించి భారత్‌ బయోటెక్‌ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.

వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్‌ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్‌ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్‌ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్‌ కేసు బయటపడి, లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్‌ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌, మరొక మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్త ” నరేంద్రమోడీ పాలనలో ” దేశ ద్రోహ ” చైనా దిగుమతులు !

03 Sunday Jan 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Boycott of Chinese Products, Boycott of goods made in China, China goods boycott, India imports from China


ఎం కోటేశ్వరరావు


అమెరికా మీద ఎవరికైనా అంతగా మోజు ఉంటే తీర్చుకోవచ్చు. సరే దాని ఫలితాలు-పర్యవసానాలను కూడా అనుభవించేందుకు సిద్దపడాలి. ఎక్కడో పదమూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని కోసం మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న పొరుగు దేశం చైనాతో సఖ్యత లేకపోతే పో(పా)యే ! విరోధం లేకుండా అన్నా ఉండాలని చెప్పినవారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పోనీ దాన్ని కూడా భరించవచ్చు- తామే సిసలైన దేశభక్తులమని చెప్పుకుంటున్నవారి ఆచరణ ఏమిటి అన్నది అసలు సమస్య ! ఈ మధ్యనే వచ్చిన వార్తల ప్రకారం సూటిగా నిషేధించే దమ్మూ ధైర్యం లేక చైనా నుంచి వచ్చే వారిని చట్టపరంగా నిషేధించలేము గానీ విమాన టిక్కెట్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని సదరు కంపెనీలను కోరినట్లు చదివాము. అంతకు ముందు అమెరికా ప్రభుత్వం చైనా జాతీయులందరినీ కమ్యూనిస్టులుగా పరిగణించి నిషేధం విధించింది. వారిని సంతుష్టీకరించేందుకు ఇంత డొంక తిరుగుడు అవసరమా ?


లడఖ్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఉదంతం తరువాత చైనా పెట్టుబడులు, వస్తువులను అడ్డుకుంటామంటూ వీర,శూర ప్రతిజ్ఞలు చేశారు. అనేక యాప్‌లను నిషేధించారు. దేశభక్తి అని చెప్పారు గనుక ఎవరూ తప్పు పట్టలేదు. ఉల్లిపాయలు తినొద్దని ఊరందరికీ చెప్పాను గానీ నిన్ను కూరల్లో వేయవద్దని చెప్పానా అని ఒక కథకుడు ఇంట్లో భార్యమీద మండిపడ్డాడట. నరేంద్రమోడీ నాయకత్వం పరిహాసం పాలైందని ఎవరైనా అంటే కాషాయ మరుగుజ్జులు గుంజుకుంటారు.తలరాత లేదా విధి మీద నమ్మకం ఉండేవారి ఆలోచన ప్రకారమైతే గతేడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల మధ్య మన దేశ దిగుమతులు మొత్తంగా 32.6శాతం పడిపోతే చైనా నుంచి 17.2శాతమే తగ్గటం విధి వైపరీత్యం, నరేంద్రమోడీకి తలవంపులు గాకపోతే మరేమిటి ?

చైనా వస్తువులను దిగుమతులు చేసుకొనే లేదా వాటిని నియంత్రించే అధికార వ్యవస్దలో సీతారామ్‌ ఏచూరీ, పినరయి విజయన్‌, బృందాకరత్‌ల కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి పార్టీ వారు గానీ లేరు, ఉన్నదంతా ” అసలు సిసలు ” ” దేశభక్తులు, జాతీయవాదు ” లైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే కదా ? మరి ఎందుకు చైనా ఉత్పత్తులు నిలిపివేయలేకపోయారు ? నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చూసీ చూడనట్లు ఉన్నట్లు ? జనాలను బకరాలను చేద్దామనా ?
దిగుమతులు తగ్గటంలో ప్రధానంగా చమురు, బంగారం ఉన్నాయని ఎవరైనా సమర్ధించుకోవచ్చు. అవి మినహాయిస్తే పైన చెప్పిన నెలల్లో దిగుమతులు 25.6శాతం తగ్గాయి, వాటితో పోల్చినా చైనా వాటా తక్కువే కదా ! చైనా నుంచి టీవీల దిగుమతి గణనీయంగా పడిపోయింది, అంతకంటే ఎక్కువశాతం వియత్నాం నుంచి పడిపోయిందని అంకెలు చెబుతున్నాయి. ఈ కాలంలో చైనా నుంచి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వంటివి గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. చైనా నుంచి నేరుగా తగ్గితే మరొక మార్గంలో వయా హాంకాంగ్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి. చిల్లి కాదు తూటు అంటే ఇదే. చైనా నుంచి దిగుమతులు 80.8శాతం నుంచి 65.1శాతానికి పడిపోతే ఇదే సమయంలో హాంకాంగ్‌ నుంచి 9.8 నుంచి 23.4శాతానికి పెరిగాయి. రెండింటినీ కలిపి చూస్తే 90.6 నుంచి 88.5శాతానికి తగ్గాయి. సంఖ్యపరంగా తగ్గింది తక్కువే అయినా విలువ పరంగా 24.7శాతం పెరిగింది. అసలు కారణం ఇంటి నుంచి పని చేసే వారు, వారి అవసరాలు పెరగటమే. ఈ కాలంలో చైనా నుంచి మనం 38.82 బిలియన్‌ డాలర్ల విలువగలవి దిగుమతి చేసుకుంటే 13.64 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేశాము. చైనా వ్యతిరేకత, దేశభక్తి రేటింగ్స్‌ను పెంచుకొనే టీవీ ఛానల్స్‌, కాషాయ దళాల కబుర్లలో తప్ప ఆచరణలో పెద్దగా లేదని, యాప్‌లను నిషేధించినా వాటి ప్రభావం పెద్దగా లేదని అంకెలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులను అడ్డుకొనే ధైర్యం దేశభక్తులకు లేనట్టా ? ఉన్నట్లా ! ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగుపడుతున్నది కనుక రాబోయే రోజుల్లో దిగుమతులు పూర్వ స్ధాయికి చేరుకుంటాయా ?


చైనా, మరొక దేశం దేనికైనా ఏ దేశమూ లొంగిపోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో స్వంత విధానాలను కలిగి ఉండాలి తప్ప ఇతరుల పాటలకు మరొకరు నృత్యం చేయటం తగనిపని. మన కోసం పశ్చిమ దేశాలు చైనాతో పోరాడుతాయి లేదా చైనా మెడలు వంచుతాయి అనుకుంటే అంతకంటే భ్రమ, అత్యాశ మరొకటి ఉండదు. వాటి ప్రయోజనాల కోసం మనతో పాటు ఎవరినైనా వినియోగించుకుంటాయి.
ఉదాహరణకు అమెరికా గత కొద్ది దశాబ్దాలుగా చైనాలో మానవహక్కులు లేవంటూ ప్రచారం చేయటం తెలిసిందే. కానీ చైనాతో వాణిజ్యం పెంచుకున్నదే తప్ప తెంచుకోలేదు. దానిబాటలోనే ఐరోపా యూనియన్‌ కూడా నానా యాగీ చేసింది. అదంతా రాయితీలు పొందేందుకు ఆడిన నాటకం.తాజాగా చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అందుకు నిదర్శనం. ఒప్పంద చర్చల ప్రారంభం-అంగీకారం మధ్య కాలంలో చైనాలో మారిందేమీ లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మనకు మద్దతు ఇస్తామన్నట్లుగా మాట్లాడిన ఐరోపా యూనియన్‌ మనకు కబుర్లు చెప్పి తీరా చైనాతో ఒప్పందం చేసుకుంది.


అమెరికాలో ఈనెల 20 అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమితులౌతాడని భావిస్తున్న ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పిన మాటలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం మరియు అంతిమంగా ప్రతికూల ఫలితాలనిస్తుంది, అదొక తప్పిదమౌతుంది అన్నాడు. కొన్ని అంచనాల ప్రకారం 2028 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారనుంది, ఇప్పటికే 140 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్‌, వారి జీవితాలు మరింతగా పెరిగితే మార్కెట్‌ ఎంతో విస్తరిస్తుంది. ఈ విషయం ధనిక దేశాల కార్పొరేట్లన్నింటికీ తెలుసు గనుకనే చైనాతో తెగేదాకా లాగటం లేదు. మన భుజం మీద తుపాకి పెట్టి చైనా నుంచి రాయితీలు పొందాలన్నది అమెరికా లేదా చతుష్టయంలోని జపాన్‌, ఆస్ట్రేలియా ఎత్తుగడ. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా అదే చేస్తారు. ఒప్పందం ప్రకారం 2049 నాటికి హాంకాంగ్‌ చైనాలో పూర్తిగా విలీనం కానుంది, అదే సమయానికి తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమైనా ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే ఏ దేశానికి ఆ దేశం తన వ్యూహాలను నిర్ణయించుకుంటుంది.

కొందరు చెబుతున్నట్లుగా పశ్చిమ దేశాలు చైనాను కట్టడి చేయగలవని గానీ లేదా వాటితో కలసి మనం అదుపు చేయగలమనే పగటి కలలు కనటం మానుకుంటే మంచిది. మన కోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వచ్చి యుద్దం చేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇప్పటివరకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం తమ గుత్త సొమ్ము అన్నట్లుగా ఉన్న ధనిక పశ్చిమ దేశాలు చైనా పురోగమనాన్ని చూసి విస్తుపోతున్నాయి, తేరుకొని సాధ్యమైన మేరకు అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. అందుకు 5జి టెలికాం వ్యవస్ధ పెద్ద ఉదాహరణ. దాన్ని అడ్డుకుంటూనే మిగతా రంగాలలో చైనాతో సంబంధాలను వదులుకోరాదని నిర్ణయించుకుంటున్నాయి. మన మాదిరి వాటికవి దూరం కావటం లేదు. వాస్తవ పరిస్దితులకు అనుగుణ్యంగా వ్యవహరించటం రాజనీతి లక్షణం.


దిగజారుతున్న ఆర్ధిక పరిస్దితులు, తగులుతున్న ఎదురుదెబ్బల కారణంగా గత నాలుగు సంవత్సరాలలో ప్రపంచ నాయకత్వ పాత్ర నుంచి ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా పదికిపైగా బహుళపక్ష ఒప్పందాల నుంచి తనకు తానే వైదొలిగింది. అవి ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వైదొలగటం వరకు ఉన్నాయి. ఇదే సమయంలో చైనాను బూచిగా చూపుతూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. దాని వలలో పడిన దేశాలన్నీ తమ వనరులను సమర్పించుకోవటం తప్ప పొందేదేమీ ఉండదు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను సృష్టించిన తాలిబాన్లను అది వదిలించుకొని మనకు అంటగట్టింది. వారు పాక్‌ మిలిటరీ అదుపులో ఉంటారని తెలుసు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న నరేంద్రమోడీ తాలిబాన్లలో రాజకీయ కోణాన్ని చూపుతూ వారితో వ్యవహరించేందుకు పూనుకున్నారు. ఆప్ఘనిస్తాన్‌ ఒకవైపు ఉన్న ఇరాన్‌, మరో వైపు ఉన్న పాకిస్ధాన్‌తో మనం కొత్త సమస్యలను తెచ్చుకోవటం తప్ప మరొకటి కాదు. మన అభివృద్ది మనం చూసుకుంటూ ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉంటూ మిలిటరీ ఖర్చు తగ్గించుకొని దాన్ని అభివృద్ధి వైపు మళ్లించటం శ్రేయస్కరం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనవరి 26 ఢిల్లీ : ఒకవైపు రిపబ్లిక్‌ డే కవాతు మరోవైపు రైతన్నల ట్రాక్టర్ల ప్రదర్శన !

02 Saturday Jan 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi protest, India Republic Day, Indo-US trade agreement, Kisaan tractor parade


ఎం కోటేశ్వరరావు


రైతుల న్యాయమైన డిమాండ్లపై సాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న యత్నాలను చూస్తున్నాము. అవి ఫలించకపోతే ఉక్కు పాదంతో అణచివేస్తారా ? ఇప్పటికి ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు గానీ, ఏం జరుగుతుందో చెప్పలేము.డిసెంబరు 30న జరిగిన చర్చలలో ముసాయిదా విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఎత్తివేస్తామని, పంజాబ్‌, హర్యానా, మరికొన్ని ప్రాంతాలలో పనికిరాని గడ్డిని తగులబెడుతున్న కారణంగా పర్యావరణానికి హాని పేరుతో శిక్షించే ఆర్డినెన్స్‌ నుంచి రైతులను మినహాయిస్తామని కేంద్ర ప్రభుత్వం నోటి మాటగా అంగీకరించింది. ఇతర ముఖ్యమైన డిమాండ్ల విషయంలో అదే మొండి పట్టుదల కనిపిస్తోంది. ఈ రెండు అంశాలను అంగీకరించటానికి(అమలు జరుపుతారో లేదో ఇంకా తెలియదు) ప్రభుత్వానికి నెల రోజులకు పైగా పట్టిందంటే ఎంత మొండిగా, బండగా ఉందో అర్ధం అవుతోంది.


మిగిలిన తమ డిమాండ్ల పట్ల రైతన్నలు పట్టువీడే అవకాశాలు కనిపించటం లేదు.జనవరి నాలుగవ తేదీన జరిగే చర్చలలో ఎలాంటి ఫలితం రానట్లయితే తదుపరి కార్యాచరణను రైతు సంఘాల కార్యాచరణ కమిటీ శనివారం నాడు ప్రకటించింది. జనవరి ఐదవ తేదీన సుప్రీం కోర్టు రైతుల ఆందోళన సంబంధిత కేసుల విచారణ జరపనున్నది. ఆరవ తేదీన హర్యానాలోని కుండిలి-మనేసర్‌-పాలవాల్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు మీద ట్రాక్టర్లతో ప్రదర్శన, 15 రోజుల పాటు నిరసన, జనవరి 23న సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినం సందర్భంగా హర్యానా గవర్నర్‌ నివాసం ఎదుట నిరసన, ఆందోళనకు రెండు నెలలు పూర్తయ్యే సందర్భంగా 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరుపుతామని, అదే రోజు రాష్ట్రాల రాజధానులన్నింటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతుల కార్యాచరణ కమిటీ నేతలలో ఒకరైన డాక్టర్‌ ధర్నన్‌పాల్‌ విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. తమ ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని, మేము చాలా రోజుల క్రితమే చెప్పినట్లు ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి మూడు చట్టాలను వెనక్కు తీసుకోవటం లేదా బల ప్రయోగంతో మమ్మల్ని ఖాళీ చేయించటం అని దర్శన్‌ పాల్‌ చెప్పారు.


ఇది రాస్తున్న సమయానికి రైతుల నిరసన 38వ రోజు నడుస్తున్నది. ఇప్పటికీ సామాన్యులకు అంతుబట్టని-బిజెపి లేదా ఆందోళనను తప్పు పడుతున్న వారు వివరించేందుకు సిద్దపడని అంశం ఏమంటే, మూడు చట్టాలకు ముందు ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన, తెచ్చినదాని మీద పార్లమెంట్‌లో తగిన చర్చకూడా లేకుండా ఆదరాబాదరా ఆమోద ముద్ర వేయాల్సినంత అత్యవసరం ఏమి వచ్చింది అన్నది. ఇవేమీ కొత్తవి కాదు, ఎప్పటి నుంచో చర్చలో ఉన్న అంశాలని చెబుతున్నవారు ఆర్డినెన్స్‌ అవసరం గురించి మాత్రం చెప్పరు. బహుశా వారి నోటి వెంట ఆ వివరాలు రావనే చెప్పవచ్చు. మూడు చట్టాలవలన రైతాంగానికి హాని ఉందంటూ వాటిని వెనక్కు తీసుకోవాలని కొందరు మేథావులు ప్రకటనలు చేశారు. దానికి పోటీగా మేలు జరుగుతుంది, కొనసాగించాల్సిందేనంటూ అంతకంటే ఎక్కువ మంది మేథావుల సంతకాలతో ఒక ప్రకటన చేయించారు. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరు చెప్పినా వినాల్సిందే, ఆలోచించాల్సిందే. క్షీరసాగర మధనం మాదిరి మధించి ఎవరు చెప్పిన దానిలో హాలాహలం ఉంది, ఎవరు చెప్పినదానిలో అమృతం ఉందన్నది తేల్చుకోవాలి.శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు కనుక విషాన్ని పక్కన పెట్టేసి దాన్ని తాగించ చూసిన మేథావులెవరైతే వారికి స్ధానం లేదని చెప్పాలి.

జరిగిన పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే మాలల్లో బయటకు కనిపించని దారం మాదిరి సంబంధాన్ని చూడవచ్చు. అన్ని రంగాలను కార్పొరేట్లకు అప్పగించిన తరువాత మిగిలింది వ్యవసాయమే. కరోనా సమయంలో అన్ని రంగాలు కుప్పకూలిపోగా మూడుశాతంపైగా వృద్ధి రేటు నమోదు చేసింది ఇదే. అందువలన దాన్నుంచి కూడా లాభాలు పిండుకోవాలని స్వదేశీ-విదేశీ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. అందుకు గాను వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగించటం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ ఉత్పత్తులను గుమ్మరించేందుకు అనుమతించటం ఒకటి. మూడు చట్టాల ద్వారా మొదటి కోరికను తీర్చారు. ఇప్పుడు రెండవ కోర్కెను తీర్చాలని విదేశాలు ముఖ్యంగా అమెరికా వత్తిడి చేస్తోంది.
అమెరికన్‌ కార్పొరేట్లు మన వ్యవసాయరంగంలో రెండు రకాలుగా ప్రయత్నించాలని చూస్తున్నాయి. ఒకటి ఉత్పత్తుల కొనుగోలు వ్యాపారంలో గణనీయమైన వాటాను దక్కించుకోవటం. రెండవది తమ ఉత్పత్తులను గుమ్మరించటం. రైతుల ప్రతిఘటన ఎలా ముగుస్తుందో తెలియదు, దాన్నిబట్టి కార్పొరేట్లు తమ పధకాలను రూపొందించుకుంటాయి. మొదటిది ఎంత సంక్లిష్ట సమస్యో రెండవది కూడా అలాంటిదే. అందుకే గతంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌-ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా గుంజాటనలో ఉన్నాయి.


అమెరికాలో నవంబరు ఎన్నికల్లోపే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నరేంద్రమోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ తెగ ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే అమెరికాకు ఎలాంటి పాత్ర లేని, చైనా, ఇతర ఆసియా దేశాలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆర్‌సిఇపి ఒప్పందం నుంచి అమెరికా వత్తిడి మేరకు మన దేశం వెనక్కు తగ్గిందన్నది ఒక అభిప్రాయం. అయితే దానిలో చేరితే మన వ్యవసాయ, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగాలకు ముప్పు కనుక ఆ రంగాల నుంచి వచ్చిన తీవ్రమైన వత్తిడి కూడా వెనక్కు తగ్గటానికి ప్రధాన కారణం గనుక అమెరికా పాత్ర కనిపించలేదని చెబుతారు.
తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకోకపోయినా చిన్న ఒప్పందం అయినా చేసుకోవాలని అమెరికా వత్తిడి తెచ్చింది. దానిలో భాగంగానే 2019 ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ పర్యటన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ చేసిన ప్రకటనలో కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్లుగా ఏడాది ముగిసేలోగా మొదటి దశ ఒప్పందాన్ని చేసుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనాను కూడా లెక్క చేయకుండా ట్రంప్‌ రావటానికి ఇదొక కారణం. ఎన్నికల్లోగా అనేక దేశాలతో చిన్న వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని వాటిని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్నది ట్రంప్‌ దూరాలోచన.(హౌడీమోడీ కార్యక్రమం కూడా దానిలో భాగమే). చిన్న ఒప్పందాలకు అక్కడి పార్లమెంట్‌ ఆమోదం అవసరం ఉండదు. ఎన్నికల తరువాత రాజెవరో రెడ్డెవరో అప్పుడు చూసుకోవచ్చు అన్నది ట్రంప్‌ దురాలోచన.


పది సంవత్సరాల క్రితం 2010లో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాన్‌ కిర్క్‌ అమెరికా సెనెట్‌లో వచ్చిన ఒక ప్రశ్నకు స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి.” మనం తీవ్ర ఆశాభంగం చెందాం. సాధారణంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎక్కడా బయటకు చెప్పం. కానీ వ్యవసాయ అంశాలలో వారి మార్కెట్‌ను తెరిచే అంశంపై భారత్‌ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ పరిశీలిస్తున్నాం.” అన్నాడు. పది సంవత్సరాల తరువాత జరిగిందేమిటి ? 2019లో నరేంద్రమోడీ సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు భారత్‌కు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రంప్‌ ప్రకటించారు. నవంబరులో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్‌సిఇపి నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించింది.

అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు-పర్యవసానాలను క్లుప్తంగా చూద్దాం.ఎవరో అమెరికాతో కలసి తొడ కోసుకున్నారని మనం మెడకోసుకోలేము. ఒప్పందాలు కూడా అంతే. అన్ని దేశాలకూ ఒకే సూత్రం వర్తించదు.అమెరికాతో చైనా ఒప్పందం చేసుకుంటే లేని తప్పు మనం చేసుకుంటే ఉంటుందా అని కాషాయ దళాలు వెంటనే దాడికి దిగుతాయి. త్వరలో అమెరికా జిడిపిని అధిగమించే దిశ, దశలో చైనా ఉంది, మనం ప్రస్తుతానికి పగటి కలలో కూడా ఆ పరిస్ధితిని ఊహించుకోలేమని గ్రహించాలి. ఆర్‌సిఇపి ఒప్పందం కటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలు ప్రపంచంలో మరే దేశమూ ఇవ్వటం లేదు.
మన దేశంలో ఒక కమతపు సగటు విస్తీర్ణం ఒక హెక్టారు. అదే అమెరికాలో 176 ఉంటుంది, అంటే ఆ రైతులతో మనం పోటీ పడాలి. అక్కడ మొత్తం కమతాలు 21లక్షలు, వ్యవసాయం మీద ఆధారపడే జనం కేవలం రెండుశాతం. అదే మన దేశంలో 14 కోట్ల 60లక్షలు. సగం మంది జనం వ్యవసాయం మీదే బతుకు. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ 2018లో పాడి ఉత్పత్తుల మీద ప్రమాణాలను సడలించి అమెరికా నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 30 నుంచి 60శాతం వరకు ఉన్న దిగుమతి పన్నును ఐదుశాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వెయ్యి ఆవుల లోపు డైరీల నుంచి 45శాతం, రెండున్నరవేల ఆవులకు పైగా ఉన్న డైరీల నుంచి అమెరికాలో 35శాతం పాల ఉత్పత్తి ఉంది. పెద్ద డైరీల్లో 30వేల వరకు ఉన్నాయి. అక్కడి డైరీ యాజమాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాడి ఉత్పత్తుల మీద 15, 20 సంవత్సరాల వ్యవధిలో 40శాతంగా ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గిస్తామని 2019లో జపాన్‌ ఒప్పందం చేసుకుంది. దేశంలో పాడి పరిశ్రమలో కార్పొరేట్‌ శక్తులు గుత్తాధిపత్యం వహించటం మీరెక్కడైనా చూశారా అని ఇటీవల రైతులతో సమావేశం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఇప్పుడు లేదు, రేపు విదేశీ ఉత్పత్తులను అనుమతిస్తే పరిస్ధితి ఏమిటి ?


కోడి కాళ్ల దిగుమతులకు మన దేశం మీద అమెరికా తీవ్ర వత్తిడి తెస్తోంది. అది కోరుతున్నట్లుగా పదిశాతం పన్నుతో దిగుమతులకు అనుమతిస్తే 40లక్షల మందికి ఉపాధి ఉండదు. అది ఒక్క కోళ్ల పరిశ్రమనే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్‌ పండిస్తున్న రైతులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అమెరికాలో కోళ్ల పరిశ్రమను ఐదు బడా కార్పొరేషన్లు అదుపు చేస్తున్నాయి.2016లో కోడి, గొడ్డు, పంది మాంస మార్కెట్లో సగం వాటా వాటిదే. అక్కడి రైతులతో అవి ఒప్పందాలు చేసుకుంటాయి. బ్రెజిల్‌ తరువాత కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్న రెండవ దేశం అమెరికా. ఆ రెండు ప్రపంచంలో సగం కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాయి.

అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. విద్యుత్‌ సంస్కరణలకు ముసాయిదా బిల్లును రూపొందించి విడుదల చేశారు, అభిప్రాయాలను కోరారు. అదే మాదిరి ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి వ్యవసాయ బిల్లులకు తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం.


అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు(2034వరకు) 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మెక్సికోతో వాణిజ్యం ఒప్పందం చేసుకున్న అమెరికా తన సబ్సిడీ మొక్కజొన్నలను అక్కడ గుమ్మరించటంతో 20లక్షల మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు.
2016 డిసెంబరులో మోడీ పభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ? పంజాబ్‌, హర్యానా, ఇతరంగా గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతాల రైతాంగం ఆందోళనలో ముందు ఉన్నదంటే ఇలాంటి అనుభవాలే కారణం.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ధాన్య సేకరణ వివరాల ప్రకారం డిసెంబరు 30 నాటికి 479.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా వాటిలో 42.3శాతం పంజాబ్‌, 11.7శాతం హర్యానా నుంచే ఉన్నాయి. అక్కడి రైతాంగం ఎందుకు ముందుగా స్పందించిందో ఇవి కూడా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే. మన ప్రధాని నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నప్పటికీ ట్రంప్‌ మనకు చేసిన మేలేమీ లేదు. ఇప్పుడా పెద్దమనిషి ఇంటిదారి పట్టాడు. త్వరలో అధికారం చేపట్టనున్న జో బైడెన్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలియదు. అమెరికా అధ్యక్ష పీఠం మీద ఎవరు కూర్చున్నా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనలను మరింత ఇరకాటంలో పెట్టేందుకు అమెరికన్లకు అవకాశాలు పెరిగాయి. వారి వత్తిడికి లొంగి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు వ్యవసాయ చట్టాల వలన వచ్చే ముప్పు మరింత పెరుగుతుంది. కోళ్లు, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావటం అనివార్యం. మన పాడి పరిశ్రమ సమస్యలను పట్టించుకోని కారణంగానే ఆర్‌సిఇపిలో చేరలేదని మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అదే పెద్దలు ఇప్పుడు ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనను పట్టించుకొనేందుకు, వద్దంటున్న చట్టాలను వెనక్కు తీసుకొనేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ? రేపు ఏదో ఒకసాకుతో అమెరికాకు, ఇతర ధనిక దేశాలకు లొంగిపోరన్న హామీ ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌లో బిజెపి లౌ జీహాద్‌ – బీహార్‌ జెడియులో ముసలం !

31 Thursday Dec 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Bihar Politics, BJP-JDU, Nithish Kumar, RJD, Trouble in JDU


ఎం కోటేశ్వరరావు


బీహార్‌లో బిజెపి-జెడియు కూటమి కొత్త ప్రభుత్వం వంద రోజులు కూడా పూర్తి చేసుకోక ముందే దాని మనుగడపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిప్పులేనిదే పొగరాదు. రెండు పార్టీల మధ్య అనుమానాలు తలెత్తాయా ? తనకు ముఖ్యమంత్రి కావాలని లేకపోయినా వత్తిడి చేశారని, కొనసాగాలనే ఆసక్తి లేదని, కొత్త నేతను ఎన్నుకోవచ్చని డిసెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాలలో పరిపరి ఆలోచనలను రేకెత్తించింది. ఇది బిజెపిని బెదిరించించేందుకే చేసినట్లు కూడా భావించవచ్చు. నిజంగానే నితీష్‌ కుమార్‌కు సిఎం పదవిపై ఆసక్తి లేదని, అయితే బిజెపి ఇతర ప్రముఖులు వత్తిడి చేసి ఒప్పించారని, ఆయన పూర్తి కాలం కొనసాగుతారని బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ ప్రకటించి నష్టనివారణకు పూనుకున్నారు. మరోవైపు బీహార్‌ మహాకూటమిలో ఆర్‌జెడి, కాంగ్రెస్‌నేతలు ఈ పరిణామం గురించి వ్యాఖ్యానిస్తూ ఎన్‌డిఏ కూటమి నుంచి నితీష్‌ కుమార్‌ బయటకు రావాలని కోరారు. తమ నేత తేజస్వియాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తోడ్పడితే వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి నితీష్‌ను బలపరుస్తామని ఆర్‌జెడి నేతలు చెప్పారు. ఎన్‌డిఏ నుంచి బయటకు రావటానికి ఇది సరైన సమయమని, బిజెపి లౌకిక పార్టీ కాదని, తాను లౌకిక వాదినని నితీష్‌ భావిస్తే బయటకు రావాలని కాంగ్రెస్‌ నేత శర్మ వ్యాఖ్యానించారు.


జెడియు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. మాజీ అయ్యేఎస్‌ అధికారి, పార్టీ నేతగా ఉన్న ఆర్‌సిపి సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజానికి 2022 వరకు నితీష్‌ కుమార్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది వారాలుగా బిజెపి-జెడియు మధ్య పొరపొచ్చాలు తలెత్తాయనే వార్తలు వస్తున్నాయి. బిజెపికి చెందిన వారు స్పీకర్‌గా, ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. గతంలో పెద్ద పార్టీనేతగా తన మాట నెగ్గించుకున్న నితీష్‌ కుమార్‌ ఇప్పుడు జూనియర్‌ భాగస్వామిగా ప్రతిదానికీ బిజెపి వైపు చూడాల్సి వస్తోంది. ఆరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఎంఎల్‌ఏలలో ఆరుగురిని బిజెపి లాగివేసుకోవటం తాజా వ్యాఖ్యలకు మూలం. అయితే బీహార్‌లో కూడా జెడియులో చీలిక తెచ్చేందుకు బిజెపి చేస్తున్న యత్నాలు కూడా కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను బలపరచాలని, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వాల మాదిరి లవ్‌ జీహాద్‌ బిల్లును తేవాలని బిజెపి వత్తిడి చేస్తోంది. లవ్‌ జీహాద్‌ పేరుతో దేశంలో విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాటికి తాము వ్యతిరేకమని జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి ఘాటుగా స్పందించారు.

గతేడాది నవంబరు 16న నితీష్‌ కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బిజెపి నేతలు ఏదో ఒక వ్యాఖ్యలతో తలనొప్పి కలిగిస్తున్నారు. అవినీతిని ఏమాత్రం సహించనని ముఖ్యమంత్రి ప్రకటించగా ఆయన నిర్వహిస్తున్న శాఖల్లోనే అవినీతి తాండవమాడుతోందని బిజెపి మంత్రులు వ్యాఖ్యానించారు.తమకు వ్యతిరేకంగా పోటీ చేసి అనేక చోట్ల ఓటమికి కారణమైన ఎల్‌జెపిని ఎన్‌డిఏ నుంచి బయటకు పంపాలని నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను బిజెపి ఖాతరు చేయలేదు. పదిహేను మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు ఎల్‌జెపి తరఫున గత ఎన్నికల్లో పోటీ చేశారు. మంత్రివర్గ విస్తరణ గురించి కూడా రెండు పార్టీల మధ్య వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం విస్తరణకు అవకాశం లేదని, బిజెపి నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని, ఒక వేళ వస్తే అప్పుడు ఉమ్మడిగా అలోచిస్తామని నితీష్‌ కుమార్‌ చెప్పారు. హౌంశాఖ వంటి ముఖ్యమైన పదవులను తమకు ఇవ్వాలని బిజెపి చేస్తున్న డిమాండ్‌కు నితీష్‌ కుమార్‌ తలొగ్గటం లేదు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో తమ పార్టీ ఎంఎల్‌ఏలను లాగివేసుకోవటం సంకీర్ణ ధర్మ విరుద్దమని జెడియు చెబుతోంది. అయితే వారంతటవారే చేరితే తామేమీ చేయగలమని బిజెపి అమాయకంగా ప్రశ్నిస్తోంది. అక్కడి పరిణామాలకు బీహార్‌లో కూటమికి ఎలాంటి సంబంధం లేదని సుశీల్‌ కుమార్‌ మోడీ వ్యాఖ్యానించారు. జెడియు అధ్యక్షుడిగా ఆర్‌సిపి సింగ్‌ నియామకం వెనుక కారణాల గురించి భిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నితీష్‌ కుమార్‌కు నమ్మిన బంటు అన్నది అసలైన కారణం. బీహార్‌ ఎన్నికల్లో జెడియు రెండవ స్దానానికి దిగజారిన తరువాత గతంలో మాదిరి నరేంద్రమోడీ, అమిత్‌ షా నేరుగా కాకుండా ఇతర నేతలతో నితీష్‌ కుమార్‌తో మాట్లాడించటాన్ని అవమానకరంగా భావించారని, తనతో నేరుగా కాకుండా పార్టీ అధ్యక్షుడితో ముందు మాట్లాడాలనే సంకేతం ఇచ్చేందుకు ఆర్‌సిపి సింగ్‌ను నియమించారన్నది ఒక అభిప్రాయం.

బీహార్‌ మరో కర్ణాటక, మధ్య ప్రదేశ్‌ కానుందా ? పరిణామాలను చూస్తుంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా బిజెపి అనుసరించిన ఎత్తుగడలే బీహార్‌లో బిజెపి-జెడియు కూటమి ప్రభుత్వానికి ఎదురు కానున్నాయా ? తనకు పదవిపై ఆసక్తి లేదని నితీష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండగా జెడియు ఎంఎల్‌ఏలు 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆర్‌జెడి నేతలు ప్రకటించటంతో పరిణామాలు మరో మలుపు తిరిగాయి.తమ పార్టీలో చేరేందుకు 17 మంది ఎంఎల్‌ఏలు సిద్దంగా ఉన్నారని అయితే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘించాలను కోవటం లేదు కనుక 28 మంది వస్తే స్వాగతిస్తామని, త్వరలో అది జరగనుందని ఆర్‌జెడి నేత శ్యామ్‌ రజాక్‌ చెప్పారు. జెడియు చీలిక ఖాయమని సత్తా ఉంటే నివారించుకోవచ్చని ఆర్‌జెడి నేత మృత్యుంజయ తివారీ సవాలు విసిరారు. రాష్ట్ర ప్రజలు అన్నింటికీ సిద్దంగా ఉండాలని, మరోసారి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు, సిద్దంగా ఉండాలని డిసెంబరు మొదటి వారంలో ఒక సందర్భంలో ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.


గతంలో మూడోవంతు సభ్యులు ఫిరాయిస్తే దానిని చీలికగా గుర్తించే నిబంధన ఉండేది. తరువాత దాన్ని సవరించటంతో ఇప్పుడు మూడింట రెండువంతుల మంది బయటకు వస్తేనే గుర్తిస్తున్నారు. కర్ణాట, మధ్య ప్రదేశ్‌లో అధికారానికి దగ్గరగా వచ్చిన బిజెపి అవసరమైన సీట్లు లేకపోవటంతో ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే ప్రత్యర్ధి పార్టీలలో చీలికకు అవసరమైన సంఖ్య లేకపోవటంతో ఎంఎల్‌ఏలతో రాజీనామా చేయించి ప్రభుత్వాలను మైనారిటీలో పడవేసి తాను గద్దెనెక్కింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఆ సీట్లును గెలుచుకొని రెండు రాష్ట్రాలలో పాలన సాగిస్తోంది. ఇప్పుడు అదే అనుభవం బీహార్‌లో బిజెపి-జెడియు సంకీర్ణ కూటమికి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2020 అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్ధానాలకు గాను బిజెపి-జెడియు కూటమికి 125, ఆర్‌జెడి-కాంగ్రెస్‌-వామపక్షాల కూటమికి 110, ఇతరులకు ఎనిమిది స్దానాలు వచ్చాయి. వీటిలో ఒకటి బిజెపిని బలపరిచే ఎల్‌జెపికి, మరొక స్వతంత్ర సభ్యుడు, ఐదుగురు మజ్లిస్‌ సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్ధానాలు అవసరం. పదిహేడు మంది జెడియు సభ్యులు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని, అందువలన అధికారయుతంగా చీలికకు అవసరమైన 28 మంది వచ్చిన తరువాత బయటకు రావచ్చని ఆర్‌జెడి నేతలు చెప్పారు. ఈ వార్తలకు ప్రాతిపదిక లేదని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఒక వేళ 28 మంది వచ్చే అవకాశం లేకపోయినా 17 మంది బయటకు వచ్చి మరో పార్టీలో చేరితే స్పీకర్‌గా బిజెపి నేత ఉన్నందున వెంటనే వారి సభ్యత్వం రద్దవుతుంది, రాజీనామా చేస్తే ఆ స్దానాలు ఖాళీ అవుతాయి. సంకీర్ణ కూటమి సర్కార్‌ మైనారిటీలో పడుతుంది. ఆర్‌జెడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం దొరుకుతుంది.మజ్లిస్‌ సభ్యులు బిజెపికి మద్దతు ఇచ్చినా- లేదా కొత్తగా ఏర్పడే ఆర్‌జెడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసినా మజ్లిస్‌ – బిజెపి మధ్య ఉన్న లోపాయికారీ సంబంధాలు వాస్తవమే అని రుజువు చేసినట్లు అవుతుంది. గతంలో నితీష్‌ కుమార్‌ అటు ఆర్‌జెడిని ఇటు బిజెపిని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికలలో అలాంటి అవకాశం మూసుకుపోయింది. మరోసారి ఆర్‌జెడి నాయకత్వం నితీష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం లేదు. నితీష్‌ నిస్సహాయతను గమనించే అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియు ఎంఎల్‌ఏలు ఏడుగురిలో ఆరుగురిని బిజెపి తనవైపుకు తిప్పుకుంది. నితీష్‌ కుమార్‌ను డమ్మీ చేసి అధికారం చెలాయించాలన్నది బిజెపి ఎత్తుగడ.


నిజానికి నితీష్‌ను అడ్డుతొలగించుకోవటం దానికి ఒక సమస్య కాదు. అయితే రాజకీయ నాటకం రంజుగా కొనసాగాలంటే అలాంటి పాత్రలు అవసరం. ఇప్పటికే బిజెపి నమ్మిన బంటు అనుకున్న ఆకాలీదళ్‌ స్నేహానికి స్వస్తి చెప్పింది. అంతకు ముందే మహారాష్ట్రలో శివసేన ఏమి చేసిందో చూశాము. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అన్నాడిఎంకె నాయకత్వాన్ని బెదిరించే యత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. మాతో ఉంటారో లేదో తేల్చుకోండి అన్నట్లుగా అన్నాడిఎంకె నేతలు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ కూడా లేకపోతే రాజకీయంగా అది ఒంటరి పాటు కావటమే కాదు, తమనెక్కడ మింగివేస్తుందో అన్న భయంతో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు దరికి చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందువలన తనంతటతానుగా నితీష్‌ కుమార్‌కు బిజెపి పొగపెట్టకపోయినా, జెడియు ఎంఎల్‌లు ప్రభుత్వంలో రెండవ తరగతి వారిగా సహజీవనం చేయగలరా అన్నది ప్రశ్న. బీహార్‌లో తలెత్తిన ఈ పరిణామం టీ కప్పులో తుపానులా సమసిపోతుందా ? కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లేదా ఏకంగా అసెంబ్లీ రద్దుకే దారి తీస్తుందా ? అధికార రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా ఐదేండ్లు ముందుకు, భారత్‌ వెనక్కు – మోడినోమిక్సు నిర్వాకం !

27 Sunday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

China vs India GDP, modinomics, Modinomics a farce


ఎం కోటేశ్వరరావు


చప్పట్లు కొట్టించి – దీపాలు వెలిగించగానే కరోనా పోలేదు. పోనీ మోడినోమిక్స్‌తో అయినా దేశం ముందుకు పోతోందా ? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించామని కరోనాను అధిగమించి ఆర్ధికంగా ముందుకు పోతామని చెప్పారు. నరేంద్రమోడీ కారణంగానే దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందన్న విజయగానాలు మూగపోయాయి. ఈ మధ్యకాలంలో కొత్తవేమీ దొరక్క వంది మాగధులకు ఉపాధిపోయింది. ఆర్దిక వ్యవస్ధ మరింత దిగజారకుండా అన్నదాతలు నిలబెట్టారు. కానీ వారి వెన్ను విరిచే వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో నెల రోజులకు పైగా తిష్టవేసి వాటిని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నారు. సరైన సమాధానం లేక ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు పిల్లిమొగ్గలు వేస్తూ రైతులను బదనాం చేసేందుకు పూనుకున్నారు.


సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ జిడిపిలో ఐదవ స్దానానికి దేశం ఎదగటానికి నరేంద్రమోడీ నాయకత్వమే కారణమన్న భజనను ఐదేండ్లు ఆపివేయాలని లండన్‌ మేథో సంస్ధ సెంటర్‌ ఫర్‌ ఎకనోమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసర్చ్‌(సిఇబిఆర్‌) డిసెంబరు 26న తన నివేదికలో చెప్పింది. జిడిపి ముందుకు పోవటానికి తమ గొప్ప అన్నవారు వెనక్కు పోయినందుకు బాధ్యత ఎవరిదో చెబుతారో కరోనా మీద నెడతారో చూద్దాం. మనం ఐదు నుంచి ఆరవ స్ధానంలోకి ఎందుకు పడిపోయాం ? మన కరెన్సీ విలువ బలహీనంగా ఉండటం ఒక కారణం అని సిఇబిఆర్‌ చెప్పింది. దీనికి తోడు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌ మధ్య పెద్ద తేడాలు లేకపోవటమే దీనికి కారణం. 2017వ సంవత్సర వివరాల ప్రకారం భారత్‌ జిడిపి విలువ 2.651లక్షల కోట్ల డాలర్లు కాగా బ్రిటన్‌ 2.638, ఫ్రాన్స్‌ 2.583 లక్షల కోట్ల డాలర్లు.


సిఇబిఆర్‌ విశ్లేషణ ప్రకారం అంచనా వేసినదానికంటే ఐదు సంవత్సరాలు ముందుగానే చైనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అగ్రస్ధానాన్ని చేరుకుంటుందని చెప్పింది. ఇదే సమయంలో గతంలో సాధించిన ఐదవ స్ధానాన్ని కోల్పోయిన భారత్‌ తిరిగి దాన్ని 2025లో పొందనుందని అంచనా వేసింది. చైనాను వెనక్కు నెట్టేసి దేశాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని చెబుతున్న బిజెపి మరి దీన్ని గురించి ఏమి చెబుతుందో తెలియదు. 2019లో బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐదవ స్ధానానికి ఎదిగిన భారత్‌ ఆరవ స్ధానానికి దిగజారిందని,2025లో తిరిగి ఐదవ స్ధానం, 2030 నాటికి మూడవ స్దానంలోకి రావచ్చని సిఐబిఆర్‌ వార్షిక నివేదికలో జోశ్యం చెప్పింది. ఆ సంస్ధ చెప్పిన అంచనాలు ఇలా ఉన్నాయి. భారత ఆర్దిక వ్యవస్ధ 2021లో తొమ్మిది, 2022లో ఏడుశాతం చొప్పున విస్తరిస్తుంది. ఆర్ధికంగా పురోగమించే కాలదీ సహజంగానే వేగం తగ్గి 2035నాటికి వృద్ది రేటు 5.8శాతానికి పడిపోతుంది. 2025 నాటికి బ్రిటన్‌, 2027నాటికి జర్మనీ, 2030నాటికి జపాన్‌ను వెనక్కు నెట్టి భారత్‌ మూడవ స్ధానానికి చేరుతుంది.


గతంలో వేసిన అంచనాకు భిన్నంగా చైనా 2028 నాటికే అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ద స్ధానానికి చేరనుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం దీనికి కారణం.జపాన్‌ 2030వరకూ మూడవ స్ధానంలో ఉండి, అప్పటికి నాలుగవ స్దానంలో ఉన్న జర్మనీని దిగువకు నెట్టి నాలుగవ స్ధానంలో ఉంటుంది.కరోనాతో నిమిత్తం లేకుండానే దానికి ముందే భారత ఆర్ధిక వ్యవస్ద వేగాన్ని కోల్పోతున్నది. 2016లో 8.3శాతం, 2018లో 6.1శాతం కాగా 2019లో పదేండ్ల కనిష్టమైన 4.2శాతం నమోదైంది.


దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంత ఎదిగిందని కాదు, జన జీవితాల నాణ్యత ఎంత పెరిగిందన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు అంతర్జాతీయ సంస్దలు రూపొందించిన అనేక సూచికల్లో మన దేశం నరేంద్రమోడీ హయాంలో మొత్తం మీద దిగజారింది తప్ప పెరగలేదు. అందువలన ఒక దేశాన్ని వెనక్కు నెట్టేశామా, ఏ దేశం మీద ఎన్ని గంతులు వేశామన్నది ముఖ్యం కాదు. వెనకటికి ఎవడో బజార్లో మాది 101 అరకల వ్యవసాయం అని కోతలు కోశాడట. మీది అంటున్నావు, ఎంత మంది ఉన్నారు, నీది ఎంత అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. ప్రత్యేక విమానాల్లో తిరిగే అంబానీ ఒక వైపు, కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్దాలకు వెళ్లిన వలస కార్మికులను మరోవైపు కరోనా కాలంలో చూశాము. అందువలన అంబానీలుాఅభ్యాగ్యులను కలిపి చెబితే పైన చెప్పిన కోతలరాయుడి మాదిరి గొప్పగానే ఉండవచ్చు. 138 కోట్లు దాటిన మన జనాభా జీవితాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. సిఇబిఆర్‌ అంచనా ప్రకారం 2021-25 మధ్య చైనా వార్షిక వృద్దిరేటు 5.7శాతం, 2026-30 మధ్య 4.5శాతంగానూ, ఇదే అమెరికా విషయానికి వస్తే 2022-24 మధ్య 1.9శాతం తరువాత 1.6శాతం వృద్దిరేటు ఉంటుంది.

చైనా వృద్ధి రేటు పైన చెప్పిన మాదిరి ఉంటుందా లేదా తగ్గుతుందా-పెరుగుతుందా, 2028 నాటికి అమెరికాను అధిగమిస్తుందా అన్నది పక్కన పెడితే వృద్ది రేటు అమెరికా కంటే ఎక్కువ అన్నది స్పష్టం. దీన్నే అంటే అభివృద్దినే తనకు ముప్పుగా అమెరికా ప్రపంచానికి చూపుతోంది. కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తోంది. కొన్ని అంతర్జాతీయ సంస్ధలు చెబుతున్నట్లు చైనా నిజానికి అమెరికాను అధిగమించటం అంత తేలిక కాదు. వైఫల్యంతో అమెరికా దిగజారితే అది అసాధ్యమూ కాదు. మన కాషాయ మరుగుజ్జుల మాదిరి గొప్పల కోసం, ప్రధమ స్దానం గురించి చైనీయులు తాపత్రయ పడటం లేదు. గత నాలుగు దశాబ్దాల సంస్కరణల చరిత్ర, తీరుతెన్నులు చూసినపుడు జనజీవితాలు ఎంతగా మెరుగుపడ్డాయన్నదే కీలకంగా భావించారు. 2049లో చైనా విప్లవానికి వందేండ్లు నిండే సమయానికి మరింతగా ఎలా మెరుగుపరచాలా అన్నదాని మీదే కేంద్రీకరణ ఉంది. ఇటీవలనే 2021లో ప్రారంభమయ్యే 14వ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది.


ఇదే సమయంలో తమ వృద్ది రేట్లను ఎలా పెంచుకోవాలా అన్నదాని కంటే అమెరికా, ఇతర దేశాలు, వాటితో కలసి మన పాలకులు చైనాను ఆర్దికంగా, ఇతర విధాలుగా దెబ్బతీసేందుకు ఏమి చేయాలా అన్నదాని మీద ఎక్కువ కేంద్రీకరించారు. చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం జన కష్టార్జితాన్ని అమెరికా ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తున్నాం. గుజరాత్‌ తరహా అభివృద్ది అన్నారు. మేడిన్‌ ఇండియా పిలుపునిచ్చారు. మోడినోమిక్స్‌ అని చెప్పారు. ప్రపంచాభివృద్దికి చేసిన కృషికి గాను నరేంద్రమోడీ సియోల్‌ అవార్డును కూడా పొందారు. బయట పల్లకీ మోతను చూసి మోడీ గొప్ప అని చెప్పిన వారు ఇంట్లో ఈగల మోతకు కారణం ఏమిటో చెప్పరు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటాన్ని ఊహించలేకపోయినట్లుగా మోడీ పాలనలో దేశ ఆర్ధిక వృద్ది దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.

జనానికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోందో లేక పాలకుల మీద భ్రమలు పెరుగుతున్నాయో తెలియటం లేదు. దేశ ఎగుమతులను 2015-20 సంవత్సరాలలో 900 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని మోడీ సర్కార్‌ ప్రకటించింది. వికీపీడియా అంకెల మేరకు 2014 నుంచి 2020 మధ్య ఏడు సంవత్సరాల కాలంలో వార్షిక సగటు ఎగుమతులు 302 బిలియన్‌ డాలర్లు.2014లో 318.2బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగితే 2020లో 314.31 బిలియన్‌ డాలర్లు. లక్ష్యం ఎంత ? సాధించింది ఎంత ? ఈ పరిస్ధితికి కారణం ఏమిటో కనీసం ఏకపక్ష ప్రసంగమైన మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ఇదే సమయంలో మన దిగుమతుల వార్షిక సగటు 446 బిలియన్‌ డాలర్లు.2014లో 462.9 బి.డాలర్లు ఉంటే 2020లో 467.19 బి.డాలర్లు. మేక్‌(తయారు) ఇన్‌ ఇండియా కాస్తా మెస్‌ (తారు మారు లేదా గందరగోళం) ఇన్‌ ఇండియాగా మారింది. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పారు.అదే చేశారు. ఏమైంది ?


తమ విదేశీ వాణిజ్యం (ఎగుమతులుాదిగుమతుల విలువ) నిమిషానికి 91.9లక్షల డాలర్లు దాటిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబరు 25న ప్రకటించింది.2015తో పోల్చితే 2020లో 30శాతం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ద వివరాల ప్రకారం 2015లో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.8శాతం ఉంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేసినా వారి ఎగుమతుల మీద పెద్ద ప్రభావం చూపలేదు. నవంబరు నెలలో ఎగుమతులు 21.1శాతం పెరిగితే దిగుమతులు 4.5శాతం పెరిగాయి.(చైనా చెప్పేది ఎలా నమ్మగలం అనేవారికి సమాధానం లేదు) కరోనా వైరస్‌ తొలుత బయట పడింది చైనాలో అన్నది తెలిసిందే. దాన్ని నిర్ణయాత్మకంగా నిరోధించింది కూడా అక్కడే. నిర్లక్ష్యం చేసి ఇప్పటికి కోటీ 85లక్షల మందికి అంటించిన అమెరికా, కోటి మంది దాటిన మన దేశం, ఇతర ధనిక దేశాలూ వైఫల్యానికి నిదర్శనాలు. మిగిలిన అగ్రశ్రేణి దేశాలన్నీ మాంద్యంలో కూరుకుపోతే రెండుశాతం వృద్దితో చైనా తన ప్రత్యేకతను ప్రదర్శించింది.

మన ఆర్దిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో, అనుసరించిన విధానాలు ఎంత దివాలాకోరుగా ఉన్నాయో కరోనాకు ముందే వెల్లడైంది. కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్ధితుల్లో వినియోగాన్ని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలన్న అనేక మంది ఆర్ధికవేత్తల సూచనలను నరేంద్రమోడీ సర్కార్‌ విస్మరించింది. పేదలకు డబ్బు ఇవ్వకూడదన్నవారు చెప్పిన తర్కం ఏమిటి ? జనం చేతుల్లో డబ్బులు పెడితే సమస్య పరిష్కారం కాదు. జనం ఇప్పటికీ దేనికి ఖర్చు చేయాలో చేయకూడదో అని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఇస్తే రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జనం పాత రుణాలను చెల్లించటానికి దాన్ని వినియోగించవచ్చు లేదా భవిష్యత్‌లో తలెత్తే అనిశ్చిత అవసరాలకు పొదుపు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి డబ్బూపోయి, జనం ఖర్చు చేయక దగ్గర దాచుకుంటే కొనుగోళ్లు పెరగ ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలా సాగింది.


దీన్ని మరో విధంగా చెప్పాలంటే కరోనాకు ముందే జనం అప్పులపాలయ్యారు( ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటారు అంటే అర్దం అదే కదా ) కడుపు కాల్చుకొని డబ్బు ఎప్పుడు దాచుకుంటారు అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న విశ్వాసం లేనపుడు, దారీ తెన్నూ కనిపించనపుడే. అంటే ఆరేండ్ల మోడీ పాలన అలాంటి పరిస్ధితిని తయారు చేసింది. కరోనా వస్తే చికిత్సకు అయ్యే ఖర్చు గురించి జనం ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే. సిఎంఐయి సమాచారం ప్రకారం 2019లో వేతన జీవులు 8.7 కోట్ల మంది ఉన్నారు.2020 నవంబరులో ఆ సంఖ్య 6.8కోట్లకు తగ్గింది. అంటే ప్రతి వంద మందిలో 21 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల్లో ఉన్నవారి వేతనాల్లో కోతల గురించి తెలిసిందే.


అంతా ముగిసిపోయింది, మామూలు పరిస్ధితులు ఏర్పడ్డాయి అని చెబుతున్నవారికి రిజర్వుబ్యాంకు సమాచారం రుచించకపోవచ్చు. నవంబరు ఆర్‌బిఐ సర్వేలో 63శాతం మంది తమ ఆదాయాల్లో ఈ ఏడాది కోతపడిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే తమ ఉపాధి పరిస్ధితి దిగజారిందని 80శాతం చెప్పారు. ఏడాది క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు పెరిగాయని 90శాతం చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందు తాము వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తామని 25ా30శాతం మంది గృహస్తులు చెబితే, మేనెలలో అది 1.25శాతానికి పడిపోతే అక్టోబరులో 7.4శాతానికి పెరిగింది తప్ప కరోనా ముందు స్ధాయికి రాలేదు. ఉన్న పొదుపును తప్పని సరి అవసరాలకే వినియోగిస్తారు. ఆదాయం లేక పోయినా వినిమయ వస్తువుల కొనుగోలు రద్దు లేదా వాయిదా వేసుకుంటారు. ధరలు పెరిగితే అంతకు ముందు పొదుపు చేసుకున్న మొత్తాలు హరించుకుపోతాయి లేదా అప్పులపాలు అవుతారు.

లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దసరా, దీపావళి ఇతర పండుగలు వచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుంది, పెద్ద మొత్తంలో జనాలు కొనుగోలు చేస్తారనే వాతావరణం కల్పించారు. కానీ జరిగిందేమిటి ? అంతసీన్‌ లేదు. పెద్ద సంఖ్యలో నిలువ చేసిన వస్తువులు పెరిగాయి. కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా ఉన్నాయని నవంబరు లెక్కలు చెప్పాయి. గృహౌపకరణాల పరిస్దితీ అంతే. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉందని చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరగటాన్ని కొందరు చూపుతున్నారు. దీనికి ఉద్దీపనల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన రాయితీలు ఒక కారణం. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాపితంగా వివిధ ముడివస్తువులు, ఇతర పారిశ్రామిక వినియోగ వస్తువుల ధరలు పడిపోయి, ఉత్పాదక ఖర్చు తగ్గటం. ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, ఇతర ఖర్చుల తగ్గుదల అందుకు దోహదం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించేది లేదని రిజర్వుబ్యాంకు చెబుతోంది. అలాంటపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్దలు ఖర్చు తగ్గింపులో భాగంగా సిబ్బందిని తగ్గించి లేదా పని భారం పెంచి వేతన బిల్లును తగ్గించుకుంటారు. అది మరొక ఆర్ధిక దిగజారుడుకు నాంది అవుతుంది.


2021-25 మధ్య బ్రిటన్‌ నాలుగుశాతం వృద్ది రేటుతో అభివృద్ది చెందనుందనే అంచనాతో అప్పటికి మన దేశం దాన్ని అధిగమిస్తుందని సిఇబిఆర్‌ విశ్లేషకులు చెప్పారు. అక్టోబరులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద చెప్పిన జోస్యం ప్రకారం మన ఆర్ధిక వ్యవస్ధ 2021 నుంచి 2025 మధ్య 8.8 నుంచి 7.2శాతం వృద్ది రేటుతో అభివృద్ధి చెందుతుంది. ఒక వేళ అదే నిజమైతే కోల్పోయిన మన జిడిపి ఇంకా ముందుగానే పెరగవచ్చు. మరి సిఇబిఆర్‌ నిపుణులకు ఐఎంఎఫ్‌ అంచనాలు తెలియవా? వాటిని పరిగణనలోకి తీసుకోలేదా ? అంతకంటే తక్కువ వృద్ధి రేటు అంచనా ఎందుకు వేసినట్లు ? కోల్పోయిన ఐదవ స్దానాన్ని సాధించటానికే ఐదేండ్లు పడుతుందని జోస్యం చెబుతుంటే మరి రెట్టింపుతో 2024నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని చెప్పిన మాటల సంగతి ఏమిటి ? మోడినోమిక్స్‌ విఫలమైందని అనేక మంది విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు ఎప్పుడో చెప్పారు. కరోనా నుంచి దేశం బతికి బట్ట కట్టగలదని రుజువైంది గానీ మోడినోమిక్స్‌తో కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్‌ను ఉద్దరించినట్లు ఊదరగొట్టారు. దాన్నే దేశమంతటా అమలు చేస్తానని 2014 ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. 2016 నవంబరు ఎనిమిదిన మోడీ పెద్ద నోట్ల రద్దు షాక్‌ నుంచే ఇంకా తేరుకోలేదు. తరువాత జిఎస్‌టితో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల వారిని ఎంత ఇబ్బంది పెట్టారో దాని ప్రతికూల పర్యవసానాలు ఏమిటో చూస్తున్నాము. కనుక ఏడు సంవత్సరాల క్రితం అచ్చే దిన్‌ గురించి నరేంద్రమోడీ చెప్పిన అంశాలను జనం మరచిపోయారు. ప్రయివేటు రంగం గురించి నరేంద్రమోడీ సర్కార్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. వారికి ఇవ్వని రాయితీలు లేవు. నిజానికి మన బడా ప్రయివేటు రంగం ఎంత అసమర్ధంగా ఉందో జనానికి తెలియదు. యాభై కోట్ల డాలర్లకు పైబడి ఆదాయం వచ్చే పెద్ద కంపెనీలు తత్సమానమైన చైనా, మలేసియా వంటి దేశాల్లోని కంపెనీలతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు, దక్షిణ కొరియా వాటితో పోల్చితే మూడున్నర రెట్లు తక్కువగా జిడిపికి జమ చేస్తున్నాయి. అదే విధంగా ఉత్పాదకత స్దాయిలు చూస్తే 10-25శాతం మధ్య ఉన్నాయి. కేవలం 20శాతం కంపెనీలు మాత్రమే 80శాతం లాభాలను సమకూర్చుతున్నాయి.


జిడిపిలో ఐదవ స్ధానాన్ని తిరిగి సంపాదించటం గురించి లండన్‌ సంస్ద చెప్పిన అంశం ఒకటైతే అంతకంటే ముఖ్యమైనవి ఉన్నాయి.2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. వాటిలో ఆరు కోట్ల కొత్త వారికైతే, మూడు కోట్లు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మారే వారికోసం సృష్టించాల్సి ఉంది. ఇది సాధ్యం కావాలంటే నిఖర ఉపాధిని కల్పించే అభివృద్ధి రానున్న పది సంవత్సరాలలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరశాతం చొప్పన అభివృద్ధి రేటు ఉండాలి. చైనా జిడిపితో పాటు అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నది తిరుగులేని సత్యం. కనుక మోడినోమిక్స్‌ అన్నా మరొకటి అన్నా జిడిపి పెరుగుదల జనానికి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా అన్నదే ముఖ్యం. గత ఆరున్నర సంవత్సరాలలో వీటి జాడలు లేవు. సంపదల పంపిణీ అసమానత పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎండమావుల వెంట పరుగుపెడుతున్నట్లుగా జనం ఉన్నారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డిసెంబరు 27: నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ -నిరసనగా రైతుల తాలీ బజావ్‌ !

25 Friday Dec 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi on Farmers


ఎం కోటేశ్వరరావు
” సానుభూతి పరులుగా దగ్గరకు చేరి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారికి భవిష్యత్‌లో జనం పాఠం చెబుతారు ” ఈ మాటలు చెప్పింది పోతులూరి వీరబ్రహ్మంగారు కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ కొలువులోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పని ఎవరు చేస్తే వారికి నిజంగానే జనం బుద్ది చెబుతారు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకూ, వారి ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల పెద్దలూ, ఇతర భజన బృందం ఎవరైనా కావచ్చు. డిసెంబరు 25నాటికి రైతాంగ నిరవధిక ఆందోళనకు నెల రోజులు నిండాయి. మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని ” సుపరిపాలనా రోజు ”గా పాటిస్తూ రైతులు దుష్పరిపాలనా చర్యగా పరిగణిస్తున్న వ్యవసాయ చట్టాలను సమర్ధించుకొనేందుకు నరేంద్రమోడీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒక విడత పంపిణీ పేరుతో ఆరు రాష్ట్రాల రైతులు కొందరిని పోగుచేసి ప్రధాని నరేంద్రమోడీ, ఆయన గణం రైతుల ఉద్యమం మీద దాడి చేశారు. ఎవరి పాత్రను వారు రక్తికట్టించారు. మరోవైపు నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ వినిపించే సమయంలో జన్‌కీ బాత్‌ను జనం దృష్టికి తెచ్చేందుకు డిసెంబరు 27వ తేదీన తాలీ బజావ్‌ (చప్పట్లు కొట్టటం) కార్యక్రమానికి రైతులు పిలుపు నిచ్చారు. అంబానీ-అదానీ ఉత్పత్తులను బహిష్కరించటం, ఇంకా మరికొన్ని కార్యక్రమాలను రైతు సంఘాలు ప్రకటించాయి.


సంస్కరణల పేరుతో జనానికి వ్యతిరేకమైన చర్యలకు పూనుకోవటం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. అంతకంటే ముందు అనేక దేశాల్లో పాలకులు అదేపని చేశారు. జనం చేత పాఠాలు చెప్పించుకొని ఇంటిదారి పట్టారు. నిజానికి ఇది తెలుసుకొనేందుకు ఇతర దేశాలకు పోనవసరం లేదు. ఏ నినాదాలు ఇచ్చినా పేర్లు ఏమి పెట్టినా కాంగ్రెస్‌ పాలనలో జరిగిందంతా ప్రజావ్యతిరేకమైన చర్యలే, అనుసరించినవి దివాలాకోరు విధానాలే.దీని అర్ధం నూటికి నూరూ అవే అని కాదు. బేరీజు వేసినపుడు త్రాసు ఎటు మొగ్గిందన్నదే గీటు రాయి. కొన్ని క్రతువుల సమయంలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులను బలి ఇవ్వబోయే ముందు వాటిని ఎన్నడూ లేని విధంగా మేత పెట్టి, శుభ్రం చేసి, అలంకరించి, పూజలు మరీ చేసి బలి ఇస్తారు. ఇక్కడ బలి క్రతువు ముఖ్యం. ప్రభుత్వ విధానాలూ, సంక్షేమ చర్యలు కూడా అంతే.


నరేంద్రమోడీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 50ఏండ్లలో చేయలేని వాటిని తాము ఐదేండ్లలో చేశామని ప్రాసకోసం ప్రసంగాలు చేశారు. అంతవేగంగా పని చేస్తున్నవారికి జనం మరో యాభైయేండ్లు అవకాశం ఇవ్వరు. అందువలన కేంద్రమంత్రి తోమర్‌ చెప్పినట్లుగా రైతులు తమకు మద్దతు ఇచ్చిన వారికా లేదా తమను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, కమిషన్‌ వ్యాపారుల సొమ్ముతీసుకొని కిరాయి ఉద్యమం నడుపుతున్నారని నిందించిన బిజెపికా ఎవరికి పాఠం చెబుతారో తొందరపడనవసరం లేదు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పంపిణీని గతంలో ఎన్నడూ ఇలా ఆర్భాటంగా జరపలేదు. ఇదేదో అదనపు మొత్తం అని రైతులు భ్రమ పడేవిధంగా హడావుడి చేసి రైతులతో మాట్లాడే పేరుతో ప్రధాని, మంత్రులు రైతు ఉద్యమం మీద విరుచుకుపడ్డారు. పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్పారా ? పాడిందే పాడరా అన్నట్లుగా వేసిన నిందనలే వేశారు, పసలేని వాదనలే చేశారు. వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. నిజానికి కేంద్రానికి, బిజెపికి చిత్తశుద్ది ఉంటే మరోసారి చర్చలకు ఆహ్వానించి ఇలా చేయటాన్ని ఏమంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎదుటి వారికి ఇంకా మండుతుంది అన్న విషయం తెలిసిందే.


కొన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ రాజకీయ అజెండాను ముందుకు తెస్తున్నాయని ప్రధాని చెప్పారు. నిన్నగాక మొన్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా తమకు ఓటేస్తే కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పి కరోనాను కూడా రాజకీయం చేసిన పార్టీ నేత మోడీ. ఇలా చెప్పటానికి ఆయనకు 56 అంగుళాల ఛాతీతో పాటు దానితో పాటు పెంచుకుంటున్న బారు గడ్డం, జులపాలు ఉండటమే అన్నది స్పష్టం. రైతు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న ఏ పార్టీ అయినా ఆ పేరుతో ఎక్కడైనా ఓట్లడిగిందా ? కేంద్ర ప్రభుత్వం తర్కబద్దమైన పరిష్కారానికి సిద్దంగా ఉందని, ఇతర సమస్యలేవైనా ఉంటే చెప్పాలని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి రైతు సంఘాలకు లేఖ రాశారు. తర్క వితర్కాలు జరపాల్సిన సర్వోన్నత ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటులో అలాంటి అస్కారం ఇవ్వకుండా ఆమోదతతంగం జరిపిన ప్రభుత్వం, కరోనా పేరుతో ఏకంగా శీతాకాల సమావేశాలనే రద్దు చేసిన పాలకులు తర్కానికి తావిస్తారంటే నమ్మేదెలా ? అసలు దానిలో తర్కం ఏముంది. సావిత్రీ నీపతి ప్రాణంబుదక్క వరాలు కోరుకో అన్నట్లుగా చట్టాల గురించి మాట్లాడుతున్నారు.


గతంలో రైతులు అనేక సమస్యలను ముందుకు తెచ్చారు. ఇతర సమస్యలుంటే రైతులు సందర్భం వచ్చినపుడు చెబుతారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత చేకూర్చాలని చేసిన సిఫార్సును ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారో చెప్పేందుకు నోరెత్తరా ? కౌలు మొత్తాన్ని కూడా మద్దతు ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు సంగతి తెలియని అమాయకుల్లా ఫోజు పెడతారా ? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడలో భాగంగా ఎవరికైనా విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి రాయితీ ఇవ్వకూడదన్న ప్రతిపాదన గురించి అసలేమీ ఎరగని నంగనాచిలా ప్రవర్తిస్తారా ? రైతులు ఏడుదశాబ్దాల క్రితం మట్టి పిసుక్కొనే స్ధితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు, అంత అమాయకులు కాదని తెలుసుకుంటే మంచిది.

కేంద్ర మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముందు ఒక ఏడాది పాటు అమలు జరగనివ్వండి, ఫలితం లేదనుకుంటే అప్పుడు సవరించుకుందాం అని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సెలవిచ్చారు. దీని అర్ధం ఏమిటి ? వారు చేసిన దాని మీద వారికే నమ్మకం లేకపోవటం, రైతుల ఉద్యమాన్ని నీరు కార్చే వాదన. ఈ ప్రయోగం చేసేందుకు ఆర్డినెన్స్‌, చర్చ కూడా లేకుండా పార్లమెంటులో ఆమోద ముద్రకోసం ఎందుకు తాపత్రయపడినట్లు ? ఎవరి మెప్పుకోసం ఇది ? కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు చెబుతున్నారని, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్పారు. అవేంటో నిజమేమిటో చెప్పకుండా మీ బావ రైతుల భూమిని ఆక్రమించుకున్నాడు, మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా ఆ మాట అంటే కేంద్ర మంత్రి సూటిగానే ఆరోపించారు. నిజంగా అదే జరిగితే చర్య తీసుకోండి-దానికి రైతుల సమస్యకు సంబంధం ఏమిటి ?


తాము అమలు జరుపుతున్న రైతు అనుకూల విధానాలను 2019 కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదా అని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు, అందువలన ఆ పార్టీ ఏమి చెప్పిందన్నది రైతులకు అనవసరం. ఆ పార్టీని రైతులు ఇందుకే తిరస్కరించారని, రైతులకు అనుకూలంగా ఉంటారని బిజెపిని ఎన్నుకున్నారని అనుకోవచ్చు కదా ! కాంగ్రెస్‌ సంస్కరణల గురించి చెప్పింది తప్ప చట్టాలు ఇలా ఉంటాయని నమూనాను ప్రదర్శించలేదే. పోనీ ఇలాంటి చట్టాలను తెస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో బిజెపి నేతలు ఆదిత్య 369 చూస్తే మంచిది.


గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులను వారి పాటికి వారిని వదలి వేశారని ప్రధాని చెప్పారు. నిజమే, వారు వదలివేశారు. కానీ మోడీగారు తమను తీసుకుపోయి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగిస్తున్నారని కదా ఇప్పుడు రైతులు భయపడుతోంది. అసలు మార్కెట్‌ కమిటీలే లేని కేరళలో అధికారంలో ఉన్న వారు ఫొటోల కోసం పంజాబ్‌ రైతులతో చేతులు కలుపుతున్నారని మరొక విసురు. అసలు కేరళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్ధ లేదు.బీహార్‌లో ఉన్న కమిటీలను రద్దు చేయటాన్ని బిజెపి సమర్ధించింది. దేశంలో మిగతా చోట్ల ఉన్నవాటిని నామమాత్రం చేసేందుకు, పనికిరాకుండా చేసేందుకు పూనుకున్న పెద్దలు కేరళలో మార్కెట్‌ యార్డుల కోసం ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించటమే అసలు రాజకీయం. అనేక రాష్ట్రాలలో అనేకం లేవు. కేరళ స్ధానిక సంస్ధలకు ఇచ్చిన అధికారాలు మరొక రాష్ట్రంలో లేవని అందరూ చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా, అంతకు ముందు ఒక దఫా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేదా పార్టీ ఎన్నడైనా కేరళలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎందుకు అడగలేదో చెప్పగలవా ?


కేంద్రం సవరించిన మూడు చట్టాలు కేవలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించినవే కాదు, అదొక ముఖ్య అంశం మాత్రమే, కనుక ప్రధాని ఢిల్లీ నుంచి గల్లీ స్ధాయికి దిగి విమర్శ చేశారనుకోవాలి. చట్టాలలోని అంశాలు రైతులకు హానికరం కనుక కేరళ ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరింది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్‌ తిరస్కరించారు. కేరళ గురించి చెప్పే ముందు ఎవరైనా కొన్ని విషయాలు గమనంలో ఉంచుకోవాలి. గతేడాది అక్కడి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,695 రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరం రూ.2,748 రూపాయలకు పెంచి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రూ.1,868 కాగా అదనంగా ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ రూ.880 అదనంగా ఇస్తోంది. ఎక్కడైనా ఇంతధర ఇస్తున్నారా ?( ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే అందుకయ్యే వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని, ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సిన కోటా మేరకే మద్దతు ధరకు తీసుకుంటారని, మిగతా సేకరణతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 18న ఎఫ్‌సిఐ చైర్మన్‌కు పంపిన ఫైల్‌లో స్పష్టం చేసింది.) మార్కెట్‌ కమిటీలు లేవని, మాకేమీ సంబంధం లేదని, నిధుల కొరత అనిగానీ వదలివేయలేదు, రైతాంగాన్ని ఆదుకోవటం ముఖ్యం.


నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని రైతువ్యతిరేక చర్యలు తీసుకున్నా తమను ఆదుకొనే వామపక్ష ప్రభుత్వం ఉందన భరోసా అక్కడి రైతుల్లో ఉండవచ్చు. అయినా ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు తెలపటం తప్పెలా అవుతుంది. అన్నింటికీ మించి కేరళలో ప్రధానమయిన పంటలు వరి, గోధుమలు కాదు.అక్కడి భౌగోళిక పరిస్ధితుల్లో తోట పంటలు, టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పంటలు ఎక్కువ. వాటికోసం దేశమంతటి నుంచి వ్యాపారులే రావటం లేదా తమ ఏజంట్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిగుమతి, పన్ను విధానాలు రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు లేవు. మోడీ సర్కార్‌ చెబుతున్నదాని ప్రకారం కార్పొరేట్‌ సంస్దలు లేదా వ్యాపారులు పోటీపడి అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాంటి ప్రత్యేక లావాదేవీలేమీ అక్కడ లేవు. కేరళ లేదా యార్డులను రద్దు చేసిన బీహారుకు గానీ ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రబ్బరు పారిశ్రామికవేత్తల వత్తిడి కారణంగా పన్నుతగ్గింపుతో రబ్బరు దిగుమతులు రబ్బరు ధరల పతనానికి, ఖాద్య తైలాల దిగుమతులతో కొబ్బరి ధర పతనం, వేరేదేశాల నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న సుగంధ ద్రవ్యాల కారణంగా వాటి ధరలు పడిపోతున్నాయి. ఇవేవీ మార్కెట్‌ యార్డుల పరిధిలోని అంశాలు కాదు. అందుకే అక్కడి రైతులకు మార్కెట్‌ యార్డులు ఉన్నాయా లేవా అన్నదాని కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్యం. కేంద్రానికి చిత్తశుద్ది, శ్రద్ద ఉంటే నరేంద్రమోడీ వాటి గురించి మాట్లాడి ఉంటే విస్వసనీయత ఉండేది.


తాను తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితాలు రావటం ఆరంభమైందని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతుల్ని నమ్మమంటున్నారు. నెల రోజుల క్రితం క్వింటాలు బంగాళాదుంపలను రూ.3,400కు అమ్ముకున్న రైతులు ఇప్పుడు 700కు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నల కనీస మద్దతు ధర 1850 ఉండగా కొన్ని చోట్ల నాలుగైదు వందలకు తక్కువకు రైతులు అమ్ముకుంటున్నారిప్పుడు.పత్తి కూడా తక్కువకే ఆమ్ముకున్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరలకంటే ఎవరూ తక్కువకు కొనకూడదు, కొంటే నేరం అనే విధంగా చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు చేసిన చట్టసవరణలు నిజంగా కార్పొరేట్లు,ఇతర వ్యాపారుల మధ్య పోటీని పెంచి రైతాంగానికి కనీస మద్దతు ధరల కంటే ఎక్కువే వస్తే రైతుల కంటే ఎక్కువ లబ్ది పొందేది ప్రభుత్వాలే. పంటల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, వాటిని నిలువ చేసేందుకు గోదాములతో పని లేదు, సిబ్బందీ అవసరం ఉండదు. కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నపుడే, చట్టబద్దత కల్పించిన చట్టంతో పని ఉంటుంది తప్ప ఎక్కువ ఉంటే దాని అమలు కోసం ఏ రైతూ ముట్టడి ఉద్యమాలకు పూనుకోరు కదా ? అలాంటపుడు కనీస మద్దతు ధరల చట్టం కుదరదు అని కేంద్రం అడ్డం తిరిగి ఎందుకు మాట్లాడుతోంది ? పోనీ ఆటంకం ఏమిటో చెప్పాలి కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

101 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎల్‌డిఎఫ్‌ ఆధిక్యత – వచ్చే ఎన్నికలలో నూతన అధ్యాయం !

20 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Kerala BJP, Kerala CPI(M), Kerala Local Body Election Results 2020, LDF, UDF


ఎం కోటేశ్వరరావు
కేరళ స్ధానిక సంస్దల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి కూటములు రెండూ శబరిమల వివాదం, ప్రమాదవశాత్తూ ఏనుగు మృతి, బంగారం స్మగ్లింగ్‌ ఉదంతం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ కుమారులు కేసుల్లో ఇరుక్కొని అరెస్టు కావటాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపధ్యంలో సాధించిన విజయం సామాన్యమైంది కాదు.


ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణలను బట్టి కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు జరిపిన ఆహార కార్యక్రమం, కరోనా చికిత్సలో చూపిన ప్రత్యేక శ్రద్ద, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా మత శక్తుల పట్ల అనుసరించిన సూత్రబద్దవైఖరి జనామోదం పొందింది కనుకనే ఎల్‌డిఎఫ్‌ విజయం సాధ్యమైంది.పైన పేర్కొన్న అంశాలతో పాటు యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గం కారణంగా దాని ప్రభావం కేరళ మధ్య జిల్లాల్లో విజయావకాశాలను పెంచింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు కేరళలో సరికొత్త పరిణామాలకు తెరలేపినట్లు చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంతో ఊగిసలాడిన ఓటర్లు, గతంలో మద్దతుదార్లుగా ఉండి ఎల్‌డిఎఫ్‌కు దూరమైన వారు ఈ పరిణామంతో తిరిగి చేరువ కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని మరింతగా కూడగట్టేందుకు వివిధ తరగతుల నుంచి సూచనలు పొందేందుకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదమూడు జిల్లాల పర్యటన ఖరారైంది. మరొక జిల్లా కార్యక్రమాన్ని రూపొందించవలసి ఉంది. రానున్న రోజుల్లో ఎల్‌డిఎఫ్‌ మరిన్ని కార్యక్రమాలను రూపొందించి, అందరికంటే ముందుగానే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతోంది.


గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఒక సారి ఎల్‌డిఎఫ్‌ కూటమి అధికారానికి వస్తే మరోసారి యుడిఎఫ్‌ రావటం ఒక ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికలలో ఓటర్లు దానికి మంగళం పాడతారని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానించటం ప్రారంభించారు. ఎన్నికల నాటికి అసాధారణ పరిస్దితులు ఏర్పడితే తప్ప ఎల్‌డిఎఫ్‌ ఇదే విజయ పరంపరను కొనసాగించవచ్చని, వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారానికి రావచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికలలో కొత్తగా కేరళ కాంగ్రెస్‌(ఎం) వచ్చి చేరింది. ఎల్‌డిఎఫ్‌లోని కొన్ని పార్టీలు తమ సీట్ల గురించి ఆందోళన చెంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలలో సీట్ల పంపిణీ, ఐక్యంగా పని చేయటంలో అదెక్కడా కనిపించలేదు. ఇదే సర్దుబాటు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష యూడిఎఫ్‌లో కుమ్ములాటలు బజారున పడ్డాయి. ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలో, ఏమి చేయాలో రెండవ భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు మార్గనిర్దేశనం చేయటం కాంగ్రెస్‌ దుస్దితిని తెలియ చేస్తోంది. మరోవైపు మత అజెండాను ముందుకు తెచ్చినా భంగపడిన బిజెపి తాను తిరిగి గెలుచుకున్న పాలక్కాడ్‌ మున్సిపల్‌ కార్యాలయంపై శ్రీరాముడి చిత్రం ముద్రించిన కాషాయ జెండాను ఎగురవేయటం, దానికి అభ్యంతరం తెలపటంపై అది చేస్తున్న వాదనల ద్వారా తన అజెండాను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించిందన్నది స్పష్టం.

స్ధానిక సంస్ధల ఎన్నికలలో అత్యధిక చోట్ల పార్టీలు పూర్తి మెజారిటీ సాధించాయి. మరికొన్ని చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికైన సభ్యులు పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఈ నెల 21, 22 తేదీలలో సమావేశం కానున్నారు. కీలకంగా మారిన వార్డు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనేదానిని బట్టి కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఎవరి ఆధిపత్యం ఏర్పడ నుందో తేలుతుంది. ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీలు వచ్చిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి. రెండు కార్పొరేషన్లలో పెద్ద పక్షంగా ఎల్‌డిఎఫ్‌ ఉంది. కేరళ ఎన్నికల నిబంధనల ప్రకారం హంగ్‌ ఏర్పడినపుడు అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలుత సీట్లు సంపాదించిన పార్టీలన్నీ పోటీ చేయవచ్చు. సగం కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికీ రాకపోతే మొదటి రెండు స్దానాలలో ఉన్న పార్టీలు రెండవ సారి పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీలో లేని పార్టీలు ఓట్లు వేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగానూ ఉండవచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. కేరళలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో స్వతంత్రులు ఏ వైఖరి అయినా తీసుకోవచ్చు గానీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని బలపరిచే పరిస్ధితి లేదు. ఈ కారణంగానే రెండు కార్పొరేషన్లలో ఎల్‌డిఎఫ్‌ పెద్ద పక్షంగా అవతరించినందున అక్కడ కూడా వారే విజయం సాధిస్తారనే భావనతో మీడియాలో ఎల్‌డిఎఫ్‌ ఐదు మేయర్‌ స్దానాలను గెలుచుకున్నట్లు రాస్తున్నారు. జిల్లా పంచాయతీలలో ఒక చోట ఎల్‌డిఎఫ్‌ పెద్ద పార్టీగా అవతరించగా మరొక చోట రెండు కూటములకు సమానంగా స్ధానాలు వచ్చాయి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌×××యుడిఎఫ్‌×××ఎన్‌డిఏ×××ఇతరులు×××హంగ్‌××× మొత్తం
గ్రామపంచాయతీలు×× 514(-2) ×××321(-51) ××19(+5) ×× 23(+15) ×× 64 ××× 941
బ్లాక్‌ పంచాయతీలు×× 108(+20)××× 38(-24) ×× 0(0) ×× 0(-5) ×× 6 ××× 152
జిల్లా పంచాయతీలు×× 10(+3) ××× 2(-3) ×× 0(0) ×× 0(0) ×× 2 ××× 14
మున్సిపాలిటీలు ×××× 35 ××× 39 ×× 2(+1) ×× 3 ×× 7 ××× 86
కార్పొరేషన్లు ×××× 3 ××× 1 ×× 0(0) ×× 0 ×× 2 ××× 6
వివిధ స్ధానిక సంస్ధలలో వార్డుల వారీగా వచ్చిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌-××××యుడిఎఫ్‌×××××ఎన్‌డిఏ×××××ఇతరులు××× మొత్తం
గ్రామపంచాయతీలు×7,262(-361) ×5,893(-431) ×1,182(+249) ×1,620(+542) ×15,962
బ్లాక్‌ పంచాయతీలు ×1,266(+178) ××727(-190) ×× 37(+16) ×× 49(-4) ××× 2,080
జిల్లా పంచాయతీలు×× 212(+42) ××110(-35) ×× 2(-1) ××××× 6(+2) ×××× 331
మున్సిపాలిటీలు ××1,167(-96) ×× 1,173(-145) ×× 320(+84) ××416(+157) ××3,076
కార్పొరేషన్లు ××× 207(+11) ×× 120(-23 ×× 59(+8) ×× 27(+3) ××× 414
పై వివరాలను పరిశీలించినపుడు వెల్లడైన ధోరణులు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ రెండూ 792 స్ధానాలు కోల్పోగా వాటిలో ఇతరులు 542 సాధించగా బిజెపికి పెరిగింది 249, బ్లాక్‌ పంచాయతీలలో కాంగ్రెస్‌ కోల్పోయిన 190లో ఎల్‌డిఎఫ్‌ 178, బిజెపి 16 అదనంగా సాధించింది. మున్సిపల్‌ వార్డులలో ఎల్‌డిఎఫ్‌, యూడిఎఫ్‌ కోల్పోయిన 241 స్ధానాలలో ఇతరులు 157 పొందగా బిజెపి 84 అదనంగా సాధించింది. కార్పొరేషన్‌ వార్డులలో యుడిఎఫ్‌్‌ 23 కోల్పోగా ఎల్‌డిఎఫ్‌ 11, బిజెపి 8, ఇతరులకు మూడు అదనంగా వచ్చాయి. ఈ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు, 40 గ్రామ పంచాయతీలలో విజయం సాధిస్తామని బిజెపి చెప్పుకున్నది. ఏమి జరిగిందో చూశాము. ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పిన బిజెపి కంటే ఇతరులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు కోల్పోయిన స్ధానాలను ఎక్కువగా పొందారు. శబరిమల ప్రాంతంలోని పండలం మున్సిపాలిటీని బిజెపి అదనంగా సంపాదించింది. స్ధానిక ఎన్నికలలో గతంలో గెలిచిన స్ధానాలను కొన్నింటిని పోగొట్టుకోవటం, కొత్తవాటిని సాధించిన ఉదంతాల గురించి ప్రతి పార్టీ పరిశీలన జరుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లోటు పాట్లను సరి చేసుకొనేందుకు ప్రయత్నించటం సహజం.
గత 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. శబరిమల ఉదంతం, బంగారం స్మగ్లింగ్‌ కేసులను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు అటు మతాన్ని, ఇటు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకొని ఎల్‌డిఎఫ్‌పై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బహిర్గతమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాల గురించి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూటముల వారీ సాధించిన స్ధానాలు, 2019 లోక్‌ ఎన్నికలు, 2020 స్ధానిక ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిది పై చేయిగా ఉందో దిగువ చూద్దాం. 2016 వివరాలలో బ్రాకెట్లలో ఉన్న అంకెలు అంతకు ముందు అసెంబ్లీ స్ధానాలతో పోల్చితే అదనంగా తెచ్చుకున్నవీ, కోల్పోయినవని గమనించాలి.
ఏడాది ××××××× ఎల్‌డిఎఫ్‌ ××××× యూడిఎఫ్‌×××××× బిజెపి
2016 ×××××× 91(+23) ×××××× 47(-25) ×××××× 1(+1)
2019××××××× 16 ×××××× 123 ×××××× 1
2020××××××× 101 ×××××× 38 ××××××× 1
గత లోక్‌ సభ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు చోట్ల బిజెపి రెండవ స్ధానంలో ఉంది, తాజా స్ధానిక ఎన్నికల్లో ఐదు చోట్ల రెండవ స్ధానంలో ఉంది.2016లో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎంఎల్‌ఏగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటికీ పరిస్ధితిలో వచ్చిన మార్పును, కాంగ్రెస్‌కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బనూ ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. 2015 స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి యుడిఎఫ్‌ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌కు యుడిఎఫ్‌ మధ్య ఓట్ల తేడా అసెంబ్లీ ఎన్నికలలో యుడిఎఫ్‌ కంటే ఎల్‌డిఎఫ్‌ ఓట్ల శాతం కేవలం 0.2శాతమే ఎక్కువ. తాజా ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉండి, ప్రతిపక్షాలు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా యుడిఎఫ్‌ కంటే 4.5శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. కనుకనే 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో పై చేయి సాధించింది. ఇదే ఆదరణను ఎల్‌డిఎఫ్‌ నిలుపు కుంటే కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా తిరిగి 2021 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కేరళలో ఎల్‌డిఎఫ్‌ కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పాలనలో ప్రపంచ సూచికలన్నింటా పతనం ! పతనం !!

17 Thursday Dec 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India HDI, world indicators-India


ఎం కోటేశ్వరరావు


ఆరున్నర సంవత్సరాల క్రితం – అప్పటి ప్రధాని నరేంద్రమోడీ చిత్రాన్ని చూసిన వారికి ఇప్పుడు మోడీ పెరిగిన గడ్డం కొట్చొచ్చినట్లు కనిపిస్తుంది. అది వ్యక్తిగతం, దేనికి పెంచుతున్నారో తెలియదు-దేశానికి ఇబ్బంది లేదు. కానీ దానికి తగినట్లుగా ఆయన ఏలుబడిలో దేశ అభివృద్ది, ఇతర అనేక సూచికల విషయంలో పెరుగుదల లేకపోగా వెనక్కు పోతోంది, ఇది ఆందోళన కలిగించే అంశం. అన్నీ నెహ్రూయే చేశారు, అన్నింటికీ కాంగ్రెసే కారణం చెప్పుకొనేందుకు ఇంకే మాత్రం అవకాశం లేని విధంగా సూచికలు దర్శనమిస్తున్నాయి. మీరు చేసింది ఏమిటో చెప్పమని అడిగే రోజులు ప్రారంభమయ్యాయి. సామాజిక మాధ్యమ కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరిపడటం ఇప్పటికే తగ్గింది, ఇంకా తగ్గనుంది.


తాజా విషయానికి వస్తే 2019 ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచికలను డిసెంబరు 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.(దీన్ని మీడియాలో 2020 సూచిక అని కూడా రాస్తున్నారు. గత ఏడాది సూచికను తదుపరి ఏడాదిలో ప్రకటిస్తారు) దీని ప్రకారం 189 దేశాలలో మన స్ధానం 129 నుంచి 131కి పడిపోయింది. 2014నుంచి చూస్తే 132-129 మధ్యనే ఉన్నది. ” అభివృద్దిలో మనతో పోటీ పడుతోంది ” అని కొందరు వర్ణించే చైనా ర్యాంకు 97 నుంచి 85కు పెరిగింది. మన బిజెపి నేతలు నిత్యం స్మరించే లేదా పోల్చుకొనే పాకిస్ధాన్‌ ర్యాంకు 156 నుంచి 154కు పెరిగింది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ ర్యాంకు 141 నుంచి 133కు పెంచుకుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్‌ మానవాభివృద్దిలో మనలను వెనక్కు నెట్టేందుకు ఎక్కువ కాలం పట్టదు. మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పేవారు వీటిని ఏమంటారో, అసలు వీటిని అంగీకరిస్తారో లేదో తెలియదు. మన యంత్రాంగం అందించిన గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి ఈ సూచికలను నిర్ణయిస్తుంది కనుక లెక్కల్లో తేడా అంటే కుదరదు. బ్రిక్స్‌ దేశాలలో మన దేశం 2018తో పోల్చితే (131) రెండు, రష్యా (52)మూడు స్ధానాల దిగువకు పడిపోయాయి. బ్రెజిల్‌ 84 యథాతధంగా ఉంది. చైనా రెండు స్దానాలను మెరుగుపరచుకొని 85కు, దక్షిణాఫ్రికా ఒక స్ధానం పెంచుకొని 114కు పెరిగింది.శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ ఒక్కో స్దానాన్ని పెంచుకున్నాయి.

అయితే తాజాగా కర్బన ఉద్గారాల విడుదల-వాటి ప్రభావాన్ని కూడా మానవాభివృద్ధి సూచికల నిర్ధారణలకు పరిగణనలోకి తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) నిర్ణయించింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటే మన సూచిక ఎనిమిది స్దానాల ఎగువన ఉంటుందని కూడా నివేదిక పేర్కొన్నది. ఇంతే కాదు అత్యంత ఎక్కువ మానవాభివృద్ధి జాబితాలో ఉన్న 50దేశాలు పూర్తిగా దిగువకు పడిపోతాయి. ఉదాహరణకు ఇప్పుడు మొదటి స్ధానంలో ఉన్న నార్వే పదిహేనవ స్దానానికి, చైనా 101వ స్దానానికి దిగజారుతాయి.ఆస్ట్రేలియా 72, అమెరికా 45, కెనడా 40 స్ధానాల దిగువకు చేరతాయి. అంటే ఇవన్నీ కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలు. పరిశ్రమలు, చమురు వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. కనుక మన స్ధానం మెరుగుపడుతుందని సంతోషించాలా ? పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉన్నామని విచారించాలా ? అందువలన కొత్త ప్రమాణాలతో కొత్త నివేదికలు వచ్చినపుడు వాటి మంచి చెడ్డలను చూద్దాం.


ప్రస్తుతం మానవాభివృద్ధి సూచికల్లో ఆయా దేశాల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ప్రతిబింబిస్తున్నాయి. తాజా నివేదిక కరోనాతో నిమిత్తం లేని 2019వ సంవత్సరానిది. కరోనా ప్రభావం ఏ దేశాన్ని ఎక్కడ ఉంచుతుందో చూడాల్సి ఉంది. దానితో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న అంశాలను తీసుకొని మనం ఎక్కడ ఉన్నామో, పాలకులు మనలను ఎక్కడ ఉంచారో ఒకసారి అవలోకిద్దాం. 2018లో పిపిపి ప్రాతిపదికన మన తలసరి జాతీయ ఆదాయం 6,829 డాలర్లు కాగా 2019లో అది 6,681డాలర్లకు పడిపోయింది. ఐక్యరాజ్యసమితిలోని 189 దేశాలను మానవాభివృద్దిలో నాలుగు తరగతులుగా విభజించారు. వాటిలో అత్యంత అభివృద్ది చెందిన దేశాలుగా 0.957 – 0.804 పాయింట్ల మధ్య ఉన్న 66, అభివృద్ది చెందినవిగా 0.796 – 0.703 ఉన్న దేశాలు 53, మధ్యతరహా దేశాలలో 0.697-0.554 పాయింట్ల మధ్య ఉన్నవి 37, అంతకంటే తక్కువగా ఉన్న దేశాలు 33 ఉన్నాయి. వీటిలో మన దేశం మూడవ జాబితాలో ఉంది. మనతో పాటు మన కంటే ఎగువన భూటాన్‌, దిగువన వరుసగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, పాకిస్దాన్‌ ఉన్నాయి. మన కంటే ఎగువన అభివృద్ధి చెందిన దేశాలలో శ్రీలంక, చైనా ఉన్నాయి.


2000 సంవత్సరంలో ప్రణాళికా సంఘం విజన్‌ 2020 పేరుతో ఒక పత్రాన్ని రూపొందించి అభివృద్ధి ఎలా ఉండాలో, ఉంటుందో పేర్కొన్నది. ఈ ఇరవై సంవత్సరాలలో వాజ్‌పేయి హయాంను కూడా కలుపుకుంటే బిజెపి ఏలుబడి పది సంవత్సరాలు, కాంగ్రెస్‌ వాటా పదేండ్లు ఉంది. ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పిందేమిటి ? రానున్న రెండు దశాబ్దాల కాలంలో జిడిపి వృద్ది రేటు 8.5-9శాతం మధ్య ఉంటుంది. దీంతో దారిద్య్రం పూర్తిగా తొలగిపోతుంది. ఎగువ మధ్య తరగతి జాబితాలోకి దేశం వెళుతుంది. ఇవేవీ నిజం కాలేదు. జనాభా పెరుగుదల గురించి వేసిన అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. ఈ రెండు దశాబ్దాలలో ఉపాధి రహిత అభివృద్ది మాత్రమే నమోదైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందేందుకు నైపుణ్యం కలిగిన 50 కోట్ల మంది కార్మికులు కావాలని చెప్పారు. రెండువేల సంవత్సరంలో నైపుణ్యం కలిగిన యువకులు రెండుశాతం ఉంటే 2019 నాటికి 4.4శాతానికి మాత్రమే పెరిగింది. అందరికీ ఉద్యోగాలు అన్న నినాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద నోట్ల రద్దు, తగిన కసరత్తులేని జిఎస్‌టి అమలు వలన కోటీ పదిలక్షల ఉద్యోగాలు పోయాయి.


విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం, రద్దు చేయాలని కోరేవారు పెరుగుతున్నారు. గిరిజనులకు సంబంధించి జనాభాలో వారు ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 2.3శాతానికి మించి లేరు. నాణ్యమైన విద్య ఒక అంశమైతే మన జనాభాకు తగిన విధంగా విశ్వవిద్యాలయాలు పెరగలేదు.1998లో 229 ఉంటే ఇప్పుడు 993కు పెరిగాయి,2020 నాటికి మొత్తం 1500 కావాల్సి ఉంది. ప్రస్తుతం 18-24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే కాలేజీకి వెళుతున్నారు. దాదాపు కోటి మంది ఏటా డిగ్రీలు పొందుతున్నారు.వారి పరిజ్ఞానం, నైపుణ్యం చాలా తక్కువ స్ధాయిలో ఉంది. ఉపాధి అవసరాలకు తగినట్లుగా లేదు. ఏటా రెండులక్షల మంది ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డిలు పొందుతున్నారు. వారి పరిశోధన, బోధనా స్దాయిలు ఉండాల్సినంతగా లేవు. విద్య మీద మన పెట్టుబడిలో ప్రపంచంలో మనది 158, అత్యంత వెనుకబడిన సూడాన్‌ మనకంటే ఒక స్ధానంలో ముందుంది, నమీబియా 159లో ఉంది. అమెరికా 27, చైనా 44వ స్దానాల్లో ఉన్నాయి.


2019 ప్రపంచ ఆకలి సూచికలో 117 దేశాల జాబితాలో మనది 102, పదే పదే చెప్పాలంటే సిగ్గువేస్తోంది, శ్రీలంక 66, నేపాల్‌ 73,బంగ్లా 88, పాకిస్ధాన్‌ 94లో ఉంది, మనువాదులు చెప్పే అఖండ భారత్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్దానంలో ఉంది. ఇదంతా ఎప్పుడు, చైనా కంటే వేగంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, త్వరలో దాన్ని అధిగమిస్తున్నాం అని చెప్పిన తరువాత అని గమనించాలి. అందరికీ ఆహారం సంగతి తరువాత అందరికీ ఆరోగ్యం సంగతి చూద్దాం. ఆదాయం తగినంతలేక భరించలేని ఆరోగ్య ఖర్చుతో అప్పుల పాలై ప్రతి ఏటా ఆరుకోట్ల మంది జనం దారిద్య్రంలోకి దిగజారుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం గోవాలో ప్రతి 614 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి పడక ఉంటే బీహార్‌లో 8,789 మందికి ఒకటి ఉంది. వాటిలో సౌకర్యాలు, ఆధునిక పరికరాల సంగతి సరేసరి. కేంద్ర పెద్దలు చెప్పే ఆయుష్మాన్‌ భారత్‌ స్దితి ఇది. ఇలాంటి అంశాలన్నీ మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబిస్తాయి.


మన దేశ జిడిపి పెరుగుతున్నది. కానీ జనం చేతుల్లోకి పోతే మానవాభివృద్ది మెరుగుపడుతుంది. అదే వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైతే అంకెల్లో గొప్పలు చెప్పుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ ఆర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ఏమి చెప్పింది. గణనీయమైన ఆర్ధికపురోగతి సాధించినప్పటికీ భారత్‌లోని సామాజిక ఆర్ధిక అసమానత జనంలో గణనీయమైన భాగాన్ని దానికి దూరంగా ఉంచినట్లు పేర్కొన్నది. అల్పాదాయ తరగతి కుటుంబాల్లో జన్మించిన వారు సరాసరి ఆదాయాన్ని పొందేందుకు ఏడు తరాలు పడుతుందని కూడా చెప్పింది. 2013 నాటి వివరాల ప్రకారం తలసరి రోజుకు 32 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు దేశంలో 22 కోట్ల మంది ఉన్నారు. జాతీయ గణాంక సంస్ద అంచనా ప్రకారం 2019-20లో తలసరి వార్షిక జాతీయ ఆదాయం రూ.1,12,835 ఉంది. పేదలు దీన్ని చేరుకోవాలంటే ఏడు తరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక చెప్పింది.ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ప్రకారం 82దేశాల జాబితాలో మనది 76వ స్ధానం.


మానవాభివృద్ధికి ఉపాధి, తద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్యపాత్ర వహిస్తుందన్నది తెలిసిందే. మన దేశంలో జనాభా తప్ప ఉపాధి అవకాశాలు, అవసరాలకు తగినట్లుగా వేతనాలు పెరగటం లేదు. 2005 మార్చి నుంచి 2012 మార్చి నాటికి 459.4 నుంచి 474.2 మిలియన్లకు మొత్తం ఉపాధి పెరిగింది. 2018 నాటికి అది 465.1మిలియన్లకు తగ్గిపోయింది. ఈ కాలంలో కార్మికశక్తి 470.2 నుంచి 495.1 మిలియన్లకు పెరిగింది.కార్మికశక్తి భాగస్వామ్యం 43 నుంచి 36.9శాతానికి తగ్గిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు కారణమైందని తెలిసిందే. పురుష వ్యవసాయ కార్మికుల వేతనాలు 2014 డిసెంబరులో 5.13శాతం పెరిగితే 2016లో 6.77, 2018లో 4.84శాతం పెరుగుదల రేటు ఉంది. అంటే నిజవేతనాలు గణనీయంగా పడిపోయాయి.నిపుణులైన కార్మికుల వేతనాల పెరుగుదల రేటు ఈ కాలంలో 6.16 నుంచి 4.06శాతానికి పడిపోయింది. ఇది తలసరి వినియోగం తగ్గటానికి దారి తీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు.


వివిధ అంతర్జాతీయ సూచికలు, పోలికల్లో మన దేశ స్ధానం గౌరవ ప్రదమైనదిగా లేనప్పటికీ మన ప్రధాని, బిజెపి నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచామని పదే పదే చెప్పుకుంటున్నారు. మనం సాధించామని చెబుతున్న ప్రచారానికి విశ్వసనీయత చేకూర్చే ఆధారాలు ఎక్కడా కనిపించటం లేదు. అది యాభై ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలోనూ, ఆ యాభై ఏండ్లలో చేయలేని దానిని ఐదేండ్లలో చేసి చూపించామని చెప్పుకొనే బిజెపి ఏలుబడిలోనూ కనిపించటం లేదు. అప్పుడూ ఇప్పుడూ అసలు సమస్యల నుంచి జనాన్ని పక్కదారి మళ్లించే నినాదాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఆర్ధిక విషయానికి వస్తే కరోనా పూర్వపు దిగజారిన స్ధితికి అయినా ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేని స్ధితి. వివిధ అంతర్జాతీయ సంస్ధలు రూపొందించిన సూచికల్లో మన స్దానం ఎలా ఉందో చూద్దాం. ఏడాది కాలంలో కనీసం 15అంశాల్లో దిగజారిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ద రూపొందించే ఆర్ధిక స్వేచ్చ సూచికలో మన దేశం 2019 సూచికలో 79వ స్ధానంలో ఉంటే 2020లో 105కు పడిపోయింది. ప్రజాస్వామ్య సూచికలో 2018తో పోల్చితే పదిస్ధానాలు దిగజారి 2019లో 51వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 27వ స్ధానంలో ఉండేది. పత్రికా స్వేచ్చలో 142, మహిళలకు భద్రతలో 133, ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. శాంతి సూచికలో ఐదు స్ధానాలు దిగజారి 163 దేశాలలో 141కి, ప్రపంచ పోటీతత్వ సూచికలో పది స్ధానాలు దిగజారి 68కి, స్త్రీ పురుష నమానత్వ సూచికలో 112కు దిగజారింది. పాస్‌పోర్టు సూచికలో 199 దేశాలలో మనది 84వ స్దానం. ఇలా అనేక సూచికలు దిగజారటం నరేంద్రమోడీ పాలనలో కనిపిస్తోంది. వాటి కొనసాగింపే మానవాభివృద్ధి సూచిక పతనం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d