• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

నమో భజనలు, వాట్సప్‌ పుకార్లు, అమెరికా కుట్రలను ఆపలేకపోయిన కరోనా !

28 Saturday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, COVID- 19 pandemic

AAO Alert: Coronavirus Update for Ophthalmologists – Eyewire News

ఎం కోటేశ్వరరావు
కరోనా ! యావత్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది అనుకుంటున్నారు అందరూ !! నిజమా !!! చూస్తే అలా లేదు మరి. కరోనాకు ముందు-కరోనా తరువాత అని వేరు చేసి చూస్తే కరోనా విలయతాండవం తప్ప మిగిలినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏదీ ఆగలేదు !
కాలరెగరేసిన చైనాలో కరోనా తోక ముడిచింది !! నిర్లక్ష్యం వహించిన ఇటలీలో విలయతాండవం చేస్తోంది !!! నాలుగు వందల వెంటిలేటర్లు పంపుతామని అన్నారు అవేమి చాలతాయి 30వేలైనా కావాలి అని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్య మీద రాష్ట్రాలలో కరోనా పాజిటివ్‌ కేసుల గురించి ఎక్కువ చేసి చెబుతున్నారు అంటూ ట్రంప్‌ మహాశయుడు ఫాక్స్‌ న్యూస్‌తో నోరుపారవేసుకున్నాడంటే పౌరుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కరోనాను అదుపు చేసి ఊహాన్‌ నగరంలో సాధారణ జనజీవనానికి, మామూలు ప్రయాణాలకు చైనా తెరతీయగా తమకేమీ కాదులే, తమనేమీ చేయదులే అని నిర్లక్ష్యం చేసిన అనేక దేశాలలో తలుపులు మూస్తున్నారు. తలలోని మెదడు మోకాల్లోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో అమెరికన్లను కాటు వేసేందుకు కోరలు చాస్తోంది, ఇది రాస్తున్న సమయానికి అగ్రస్ధానానికి చేరిన అమెరికాలో కరోనా కేసులు 104,205, మరణాలు 1,701గా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని జనం గంగవెర్రులెత్తుతున్నారు. దాంతో చివరకు …. తుడుచుకొనే టాయిలెట్‌ పేపర్లకోసం కూడా జనాలు ఎగబడుతున్నారు. దెబ్బలాటలకు సైతం దిగుతున్నట్లు వార్తలు. ఇంకేముంది ఒక చోట బకెట్‌ బీరు కొంటే ఒక టాయిలెట్‌ పేపర్‌ ఉండ(రోల్‌) ఉచితం అని ప్రకటించగానే బీరు మొత్తం అమ్ముడు పోయిందట.(వెనెజులా గురించి చెత్త రాసిన ”చూష్కోరా” రచయిత దీని గురించి ఏమంటారో తెలియదు). ఇదే సమయంలో అక్కడ ఎన్ని తుపాకులు కావాలంటే అన్ని పుష్కలంగా అమ్ముతూ లాభాలు పోగేసుకుంటున్నారు. దేశాలన్నీ జనబందీ లేదా గృహబందీలను పాటిస్తుంటే రేపో ఎప్పుడో మనం తిరిగి పనిలోకి పోవాల్సి ఉంటుందని చెబుతున్న ట్రంప్‌ ముది మది తప్పిన స్ధితిలో ఉన్నట్లే కదా !
కత్తులకు, తుపాకుల తూటాలకు, ఎంతో మహత్యం కలిగిందని ప్రచారం చేస్తున్న స్వదేశీ ఆవు మూత్రం, పేడకు, వేద మంత్రాలకు, పూజలు, పునస్కారాలకు, చర్చీలు, మసీదుల్లో ప్రార్ధనలకు లొంగేది కాదని జనానికి చెప్పటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కరోనా వ్యాప్తితో సహా ఏ దుర్మార్గమూ ఆగటం లేదు. కరోనాను అందరం ఐక్యంగా ఎదుర్కొందాం అని చెప్పేది బూటకం. అనేక దేశాల మీద అమెరికా విధించిన దుర్మార్గపూరితమైన ఆంక్షల్లో ఏ ఒక్కదాన్నీ ఎత్తివేయలేదు. జనాన్ని మరింతగా బలిపెట్టేందుకు సిద్దపడుతున్నారు.
కరోనా వ్యాప్తి పూర్వరంగంలో తమ దేశ ఆరోగ్య వ్యవస్ధ పటిష్టతకు అత్యవసర రుణం ఐదు బిలియన్‌ డాలర్లు కావాలంటూ వెనెజులా చేసిన వినతిని ఐఎంఎఫ్‌ తిరస్కరించింది. ఎవరు అధికారంలో ఉన్నారో గుర్తించే విషయంలో సభ్యదేశాలకు స్పష్టత లేనందున దేశ అధ్యక్షుడు మదురో వినతిని పరిగణనలోకి తీసుకోవటం లేదని పేర్కొన్నది. అమెరికా ఆడిస్తున్న ఆటలో పావుగా మారకపోతే తన సభ్యదేశాలలో మదురోను వెనెజులా నేతగా గుర్తించిన రాజ్యాలను ఐఎంఎఫ్‌ ఎందుకు విస్మరించినట్లు ? ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వెనెజులా మీద ఆంక్షలకు అమెరికా పూనుకోవటం కనీస మానవత్వ స్ఫూర్తికి వ్యతిరేకమని చైనా వ్యాఖ్యానించింది.
మరోవైపు అదే మదురో మాదక ద్రవ్యాల అక్రమరవాణాదారులతో చేతులు కలిపాడంటూ అమెరికాలో ఒక తప్పుడు కేసును తాజాగా బనాయించారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింతగా అమలు జరిపి మదురో సర్కార్‌ను కూల్చివేసేందుకే ఈ యత్నం. అమెరికాకు అవసరమైన వైద్య సరఫరాల కోసం రష్యాను తప్ప ఇతర దేశాలను సంప్రదించాలంటూ అమెరికా విదేశాంగశాఖ రాయబారులను ఆదేశించింది.
ఒక వైపు తమను కరోనా కబళిస్తున్నా నిద్రపోతున్న ట్రంప్‌ సర్కార్‌ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు చైనా మీద ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. అనేక దేశాలలో అది పెట్టిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది, ఎక్కడా దాడులు ఆగలేదు. ఇది దుష్ట రాజకీయం తప్ప జనాన్ని ఆదుకొనే వారు చేయాల్సిన పనేనా ? బాధితులైన అమెరికా జనం మీద ఎవరికీ కోపం ఉండాల్సినపనిలేదు గానీ ట్రంప్‌ బాధ్యతా రాహిత్యం, దుర్మార్గాలను ముక్త కంఠంతో ఖండించాల్సిందే. నైతికంగా అతగాడికి అధికారంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు.
దేశాన్ని ఆర్ధికంగా దిగజార్చటం, నిరుద్యోగం పెరగటం అచ్చే దిన్‌కు బదులు జనాలకు చచ్చే దిన్‌ తెచ్చిన పూర్వరంగంలో ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో నరేంద్రమోడీ భజన తగ్గింది. అయితే జనతా కర్ఫ్యూ, జనం ఇండ్లకే పరిమితం(లాక్‌డౌన్‌) కావటం నరేంద్రమోడీ మెదడులోంచి వచ్చిన తెలివితేటలు, మహత్తర ఆలోచనలంటూ తిరిగి భజన ప్రారంభమైంది. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు నమో జ్యోతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలట. చైనాలో రెండు నెలల పాటు జనబందీ అమలు జరిగిన తరువాత ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా అనివార్యమే అయినా ఆకస్మికంగా దేశవ్యాపిత కర్ఫ్యూను ప్రకటించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో చూశాము. చైనాలో ఎలా అమలు జరిపారో కనీసంగా అధ్యయనం చేసినా ఇలా జరిగి ఉండేది కాదు. వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లే ఏర్పాట్లు లేక కంటెయినర్లలో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లినట్లు వచ్చిన వార్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేమికి, నిర్లక్ష్యానికి నిదర్శనం. విదేశాల్లో ఉన్నవారికోసం విమానాలు పంపిన వారికి స్వదేశంలో వలసపోయిన వారిని స్వస్ధలాలకు పంపే బాధ్యతను ఎందుకు తీసుకోరు ?
యావత్‌ సమాజం కష్టకాలంలో ఉన్నపుడు పాలకులు చేసిన సాయానికి వంకలు పెట్టటం ఏమిటి అని అనేక మందికి అనిపించవచ్చు. మన దేశంలో కష్టకాలానికి కరోనా తోడైంది. ఈ సమయంలోనే లీటరు డీజిల్‌, పెట్రోలుకు మూడేసి రూపాయల పన్ను పెంచారు. మరో ఎనిమిది లేదా పది రూపాయలను పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఇది కష్టకాలం అని జనం మీద కనికరం చూపాలని దయగల పాలకులకు అనిపించలేదు. అంతకు ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు 7.78లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన చేతులతో 130కోట్ల మందికి లక్షా 75వేల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఈ మొత్తంలో గత ఏడాదే ప్రకటించిన మూడు వాయిదాల ఆరువేల రూపాయల రైతు సాయంలో ఒకవిడత రెండువేల రూపాయలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏటా 70వేల కోట్లు ఇందుకు అవసరమని గతంలో చెప్పినదాన్ని బట్టి మూడో వంతు ఇరవై వేలను మినహాయిస్తే కరోనా సాయం మరింత తగ్గినట్లే . అది వాస్తవం అయితే రెండు వేల రూపాయలను కరోనా సందర్భంగా రైతులకు చేస్తున్న సాయమని మభ్యపెడుతూనే ఉన్నారు.కంపెనీల యజమానులకు అందచేసే మొత్తాలను (పిఎఫ్‌ వాటా చెల్లింపు) కూడా జనం ఖాతాలో రాస్తున్నారు. బహుశా ఇది వేద గణితం అయి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా బదులు ప్రత్యేక పాకేజి అని చెప్పారు. తీరా చూస్తే కేంద్ర పధకాలన్నింటినీ కలిపి చెప్పారు తప్ప అదనపు సాయం ఏమీ లేదు. ఇప్పుడు కరోనా సాయంలో కూడా కేంద్ర పధకాలు ఏమైనా కలిసి ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.
డెమోక్రాట్ల వత్తిడితో అల్పాదాయవర్గాల వారికి ఈ ఏడాది చివరి వరకు నెలనెలా పెద్ద వారికి ఒక్కొక్కరికి పన్నెండువందల డాలర్లు, పిల్లలకు ఐదువందల డాలర్లు చెల్లించేందుకు ట్రంప్‌ సర్కార్‌ అంగీకరించాల్సి వచ్చింది.(డాలరుకు 75 రూపాయలు) ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ మాత్రం జనధన్‌ ఖాతాలున్న మహిళకు మూడు నెలల పాటు నెలకు ఐదు వందల రూపాయలు జమచేస్తామని చెప్పి తమలో తామే ఉబ్బితబ్బిబ్బు అవుతూ టాంటాం వేసుకుంటున్నారు. అమెరికా, ఇతర దాని తొత్తు దేశాల ఆంక్షలు, అష్టదిగ్బంధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వెనెజులా ఆరునెలల పాటు జనానికి ఉపశమన చర్యలను ప్రకటించింది. మన ఆర్ధిక వ్యవస్ధను ఐదో స్ధానానికి చేర్చామని ఊరూవాడా ప్రచారం చేసిన పెద్దలు తీరా జనానికి సాయం విషయంలో ఎక్కడ ఉన్నారు. ప్రపంచ రాజకీయాల్లో నరేంద్రమోడీ తమ సహభాగస్వామి అని ట్రంప్‌నుంచి పొగడ్తలు అందుకున్నారు. అలాంటి ట్రంప్‌ 150లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్రకటిస్తే ఆ పెద్దమనిషి భాగస్వామి 1.75లక్షల కోట్లు మాత్రమే ప్రకటించారు. వ్యాధిని వారాల తరబడి నిర్లక్ష్యం చేసిన, సముద్రంలో కాకిరెట్ట మాదిరి సాయం ప్రకటించిన నాయకత్వానికి నీరాజనాలా ? సిగ్గు చేటు ! కేంద్రంలో నరేంద్రమోడీ లేదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. కేరళ ముందుగా మేలుకున్నట్లు అందరూ అంగీకరిస్తారు, కానీ అక్కడ అధికార సిపిఎం నేతలు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడి సిఎంను పొగడ్తలతో ముంచెత్తటం లేదు. పొగడ్తలు, భజనలతో అభిమానం సంపాదించుకొనేందుకు అలవాటు పడిన నేతలకు సమయం సందర్భం గురించి సృహ ఉండదని ఇప్పుడు రుజువు చేస్తున్నారు.
ఒక వైపు కరోనా మరణమృదంగాన్ని వాయిస్తుంటే ఇటలీలోని కార్పొరేట్‌ల యజమానులు చట్టాల్లోని లోపాలను వినియోగించుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నించటం కంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆరోగ్య సంబంధ సంస్ధలు మినహా మిగిలిన వాటన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అత్యవసర సేవల చట్టంలోని నిబంధనల లోపాలను వినియోగించుకొని ఆయుధ కంపెనీల యజమానులు ఫ్యాక్టరీలను మూసివేసేందుకు తిరస్కరిస్తున్నారు.దీనికి నిరసనగా కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.

Cartoons: Coronavirus outbreak classified as pandemic
గతంలో బ్రెజిల్‌ వామపక్ష ప్రభుత్వం క్యూబా వైద్యులను రప్పించి పెద్ద ఎత్తున వైద్య, ఆరోగ్యసేవలను అందించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మితవాద బోల్‌సోనోరో సర్కార్‌ క్యూబా మీద వ్యతిరేకతతో ఆదేశ వైద్యులను వెనక్కు పంపింది. మరి కొంత మందిని దేశంలో ఉండేందుకు          అనుమతించినప్పటికీ వారి సేవలను వినియోగించుకోవటం నిలిపివేసింది. . ఇప్పుడు కరోనా వ్యాప్తి కారణంగా అదే క్యూబా వైద్యులు తమకు సేవలు అందించాలని, క్యూబా వెళ్లిన వారు తిరిగి రావాలని బోల్‌సోనోరో సర్కార్‌ వేడుకున్నది.ఐదువేల మంది క్యూబన్‌ వైద్యులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వినియోగించనున్నట్లు ఆరోగ్య మంత్రి జావో గబ్బార్డో ప్రకటించాడు.ఎన్నికల ప్రచారంలో క్యూబా వైద్యులను వ్యతిరేకించటం ఒక ప్రచార అంశంగా బోలోసోనారో ముందుకు తెచ్చారు. క్యూబా నుంచి వచ్చిన పదివేల మంది వైద్యులు బ్రెజిల్‌లో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారని, వారు నిజంగా వైద్యులు కాదని తాను అధికారంలోకి రాగానే వారిని వెనక్కు పంపినట్లు ప్రకటించాడు. క్యూబన్‌ వైద్యుల మీద తప్పుడు ప్రచారం చేసినందుకు బోలోసోనారో క్షమాపణ చెప్పాలని లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.
వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాల ప్రచారం ముమ్మరంగా సాగుతూనే ఉంది. ఇటలీకి వచ్చిన క్యూబా వైద్యుల బృందం ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా దళం అని చిత్రించింది వాటిలో ఒకటి. మూఢనమ్మకాలను పుంఖాను పుంఖాలుగా ముందుకు తెస్తున్నారు. కాషాయ దళాలతో పాటు ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేకుల ప్రచారానికి కరోనా కలసి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనం చచ్చినా సరే -ఆర్ధిక వ్యవస్ధ ముఖ్యం అంటున్న ట్రంప్‌ !

24 Tuesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak in US, Donald trump, Trump on COVID 19, USA COVID 19

Image result for WE CANNOT LET THE CURE BE WORSE THAN THE PROBLEM ITSELF: Donald trump
ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి !! చైనా, ఇటలీ తరువాత మూడో స్ధానంలోకి చేరిన అమెరికా !!! వారం రోజుల క్రితం అమెరికాలో కరోనా మరణాలు 85, మంగళవారం రాత్రికి 622కు చేరిక, కోలుకున్న వారు 361 మంది. ఇదే వ్యవధిలో పాజిటివ్‌ కేసులు 4,600 నుంచి 49,594కు పెరిగాయి. సగం కేసులు న్యూయార్క్‌ నగరంలోనే నమోదయ్యాయి. రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పధకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది.దాంతో ఫెడరల్‌ రిజర్వు(రిజర్వుబ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్ధులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న.
ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా ” వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పది హేను రోజుల తరువాత ఏ మార్గంలో మన పయనించాలనుకుంటున్నామో నిర్ణయిస్తాం ” అని ట్రంప్‌ ప్రకటించాడు. దీని అర్ధం ట్రంప్‌కు విలువైన మానవ ప్రాణాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని వేరే చెప్పనవసరం లేదు. సామాజికంగా జనం దూరం పాటించటం వలన కరోనా వైరస్‌ విస్తరణ తగ్గవచ్చు, కానీ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతింటోందనే భావం కార్పొరేట్ల నుంచి వెలువడుతోంది. ఈ నేపధ్యంలోనే సామాజికంగా దూరం పాటించాలన్న మార్గదర్శక సూత్రాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలిపారు.బాధ్యతా రహితంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని ట్రంప్‌ తీరుతెన్నుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు అంటువ్యాధుల జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫాసీ జవాబిస్తూ ”ట్రంప్‌ మాట్లాడుతుంటే ముందుకు దూకి ఆయనను పక్కకు తోసి మైకు లాక్కోలేను కదా ! మాట్లాడేదేదో మాట్లాడనివ్వండి, రెండవ సారి సరి చేస్తాం ” అని సైన్సు పత్రిక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
కరోనా సాయం పేరుతో సామాన్యులకు బదులు ఎన్నికల సమయంలో తనకు అనుకూల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టే యత్నాలను డెమోక్రాట్లు అడ్డుకున్న పూర్వరంగంలో ట్రంప్‌ ప్రేలాపనలివి. అమెరికా కంటే తీవ్రంగా ప్రభావితమైన చైనాలో వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా ప్రభావితం అవుతున్నా ఖర్చుకు వెనకాడకుండా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకూ, ట్రంప్‌ వైఖరికి ఎంత తేడా ఉందో చూడవచ్చు. అదే జనం పట్ల నిబద్దత ఉన్న కమ్యూనిస్టులకు, కార్పొరేట్ల సేవలో తరించే పెట్టుబడిదారీ ప్రతినిధులకు ఉన్న వ్యత్యాసం. అమెరికాలో వేగంగా వైరస్‌ విస్తరిస్తున్న పూర్వరంగంలో ఇప్పటికే పది కోట్ల మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మరోవైపు దానికి వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడుతున్నాడు. ఇటలీ అనుభవాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నా ఇలా వ్యవహరిస్తాడా ?

Image result for coronavirus Donald trump cartoons
తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఒక్కొక్కరికి పన్నెండు వందల డాలర్ల నగదు అందచేతతో సహా రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పధకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఆసుపత్రులు, నగరాలు, రాష్ట్రాలు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, ట్రంప్‌, ఆర్ధిక మంత్రి విచక్షణ మేరకు కార్పొరేట్లకు నిధులు పందారం చేసే ప్రతిపాదనను సెనెట్‌లో డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం ఇలాంటి పధకాలకు సెనెట్‌లోని వంద మంది సభ్యులకు గాను 60 మంది ఆమోదం అవసరం. ప్రతి పక్షం మద్దతు ఇస్తే తప్ప అది కుదరదు. నిరుద్యోగ భృతి చెల్లించాలని అభ్యర్ధిస్తూ వచ్చిన వినతులు గతవారంలో 20లక్షలకు పైగా వచ్చాయని, ఆర్ధిక పరిస్ధితి బాగోలేదనేందుకు ఇదొక సూచిక అని గోల్డ్‌మన్‌ సాచెస్‌ విశ్లేషకుడు చెప్పారు. రానున్న రోజుల్లో 1930దశకం నాటి మహామాంద్యం కంటే ఎక్కువగా నిరుద్యోగం 30శాతం మించవచ్చని కొందరు చెబుతున్నారు.
అమెరికా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఉద్దీపన పధకాన్ని డెమోక్రాట్లు అడ్డుకున్నట్లు కార్పొరేట్‌ అనుకూల అమెరికా మీడియా వార్తలను ఇచ్చింది. అధికార రిపబ్లికన్లు సామాన్యులకు బదులు కార్పొరేట్లకు ప్రజాధనాన్ని అప్పగించే ప్రతిపాదనలు చేసిన కారణంగానే డెమోక్రాట్లు వ్యతిరేకించారన్న విషయాన్ని దాచి పెట్టేందుకు మీడియా ప్రయత్నించింది. లక్ష కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యల గురించి చెబుతూ ఆమొత్తంలో 50వేల కోట్ల డాలర్లను కార్పొరేట్లకే కట్టబెట్టేందుకు ట్రంప్‌ పూనుకున్నాడు. దీన్ని ఆమోదించాలా వ్యతిరేకించాలా ? అది కూడా ట్రంప్‌, ఆర్ధిక మంత్రి ఎవరికి సిఫార్సు చేస్తే వారికి చెల్లించే ప్రతిపాదనలతో నిండి ఉంది. ఎన్నికలకు ముందు ఇలాంటి విచక్షణ అధికారంతో ఎవరు లబ్ది పొందుతారో, అందుకు ఎలాంటి పధకం వేశారో తెలుస్తూనే ఉంది. సెనెట్‌లోని వందమంది సభ్యుల్లో 60 మంది ఆమోదం అవసరం కనుక డెమోక్రాట్లు దాన్ని అడ్డుకున్నారు.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది. దక్షిణ కొరియాలో సాధారణ పరీక్షలను సులభంగా చేయించుకోవచ్చు, ఇక్కడ పొందలేము. కాబట్టి కరోనా వైరస్‌ను పనిచేసే సమాజంలో మాత్రమే అదుపు చేయగలం, ఇక్కడ చేతులు దాటిపోతోంది. మనం దానికి సిద్ధంగా లేము. మనమూ, మన నేతలూ గత నాలుగుదశాబ్దాలుగా బాగా చేస్తున్నదేమంటే మిగతా అంతా కుప్పకూలి పోతుంటే ధనికులు, కార్పొరేట్ల జేబులు నింపుతున్నాం.” అన్నారు.
భయంకరమైన ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్లను అనుమతించే సమయం కాదిది అని డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీశాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కార్పొరేట్ల ఏజంట్లు(లాబీయిస్టులు) ఆయా పరిశ్రమలకు రాయితీల కోసం పైరవీలు చేస్తున్నారు. ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమ ఐదు, విమానయానం 50, హౌటల్స్‌ 150బిలియన్‌ డాలర్లు కోరితే పారిశ్రామికవేత్తలు లక్షా40వేలు, అంతర్జాతీయ షాపింగ్‌ మాల్స్‌ వారు లక్ష కోట్ల డాలర్ల మేర రాయితీలు కావాలని కోరినట్లు శాండర్స్‌ తెలిపారు. జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ను దేశవ్యాపితంగా మూసివేసినప్పటికీ సభ్యత్వాల చెల్లింపు, ఫిట్‌నెస్‌ పరికరాలకు ముందస్తు పన్ను చెల్లింపు సొమ్మును వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ఆడిదాస్‌ కోరింది. ఒక వైపు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి నిలిపివేస్తే అతిధి కార్మికులకు వీసాలు ఇచ్చేందుకు వెంటనే పార్లమెంట్‌ చర్యలు తీసుకోవాలని పందిమాంస కార్పొరేట్స్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అత్యవసర ఆరోగ్య సేవలకోసం ఈ అసాధారణ సంక్షోభ సమయంలో పార్లమెంట్‌ అసాధారణ చర్యలకు ఉపక్రమించాలని శాండర్స్‌ కోరాడు.
మన దేశం విషయానికి వస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ను ముందుగానే ఆమోదించింది. ఇదే సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది సేవలను అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లు చరచాలని ఇచ్చిన పిలుపును అన్ని పార్టీల వారూ ఆమోదించారు, ఆచరించారు. అనేక రాష్ట్రాలు కరోనా కట్టడిలో భాగంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేస్తూ నిర్ణయించటంతో పాటు పేదలను ఆదుకొనేందుకు తమ శక్తికొద్దీ సాయాన్ని ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు నిధులు ఇస్తామని చెప్పటం తప్ప పేదలను ఆదుకొనే నిర్దిష్ట చర్యలేవీ(ఇది రాస్తున్న సమయానికి) ప్రకటించలేదు. జనానికి ఉపశమనం కల్పించాల్సింది పోయి ఈ సమయంలోనే లీటరు పెట్రోలు, డీజిల్‌కు మూడేసి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచింది. మరో ఎనిమిది, పది రూపాయల వరకు పెంచుకొనేందుకు పార్లమెంట్‌ అనుమతి తీసుకుంది. లీటరుకు ఒక రూపాయి పన్ను పెంపుదల ద్వారా కేంద్రానికి ఏటా పద్నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరుతుంది. గత ఆరు సంవత్సరాల కాలంలో మోడీ సర్కార్‌ పెట్రోలు మీద ఎక్సయిజ్‌ సుంకం రూ.9.48 నుంచి రూ. 22.98కి పెంచిన విషయం తెలిసిందే. అంటే జనం మీద ఏటా లక్షా 90 కోట్ల రూపాయల భారాన్ని అదనంగా మోపుతోంది. అయినా కరోనా సంక్షోభంలో కష్ట జీవులను ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు.
ఉద్దీపన చర్యల్లో భాగంగా రెండులక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించాలని పరిశ్రమలు, వాణిజ్య సంస్ధల వారు కేంద్రాన్ని కోరారు. జనధన్‌ బ్యాంకు ఖాతాలున్న వారికి ఐదు వేల రూపాయల నగదును బదిలీ చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఉద్యోగులు, కార్మికులు పనులకు వెళ్లలేని స్ధితిలో ఉంటే కనీసం 80శాతం వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Image result for coronavirus Donald trump cartoons
వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు సామాన్య జనాన్ని ఆదుకొనేవిగా ఉండాలి తప్ప కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా మారకూడదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వాలు తీసుకొనే చర్యలు విమర్శలకు అతీతంగా ఉంటాయని, కొన్ని కంపెనీల ప్రయోజనాలకు తోడ్పడకూడదని ఎవరైనా ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ ఆ విధంగానే కనిపిస్తున్నది. రాఫెల్‌ విమానాల విషయంలో ప్రభుత్వ రంగ సంస్ధను విస్మరించి అంబానీలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పరీక్షలకు ప్రభుత్వ సంస్ధ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి) ఆమోదించిన అన్ని కిట్లను ఉపయోగించకుండా కేవలం అమెరికా, ఐరోపా యూనియన్‌ ఆమోదించిన వాటికే పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటాన్ని ఏమనాలి. పోనీ అవసరాలకు తగ్గట్లుగా అవి సరఫరా అవుతున్నాయా అంటే, లేదు. అలాంటి వాటిని ఉత్పత్తి చేసే సంస్ధ గుజరాత్‌లో ఒక్కటి మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు కంపెనీలు కిట్లతో లాభాలు పిండుకోవటాన్ని వెంటనే నివారించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగన్‌ మోహనరెడ్డి ఎరక్కపోయి మరింతగా ఊబిలో ఇరుక్కుంటున్నారా ?

22 Sunday Mar 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

AP local body election 2020, AP SEC letter to MHA, CM YS Jagan

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి యావత్‌ సమాజం ఆందోళన పడుతోంది. దానితో నిమిత్తం లేకుండా రాజకీయాలు చేయటంలో కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు మునిగిపోయారు. మధ్యప్రదేశ్‌లో కమలం వైరస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. అధికార దాహం వైరస్‌ సోకిన 22 మంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయిన తరువాత కమల తీర్ధం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్దానిక సంస్దల ఎన్నికల వైరస్‌ సోకిన వారి వింత లేదా విపరీత ప్రవర్తన చూశాము. అదింకా కొనసాగుతూనే ఉంది. తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలినా ఎదురుదాడులు చేయటం కొనసాగుతూనే ఉంది. మంత్రులు వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలను చూస్తే అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. అంటే మిగతా సమయాల్లోనే ముఖ్యమంత్రి సర్వాధికారి అన్నది దాని అర్ధం. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. ముఖ్యమంత్రి అనుగ్రహం పొందాలనుకొనే పెద్దలు ఇంకా ఆ ప్రయత్నాలను మానుకోలేదు. ప్రయోజనం సంగతి పక్కన పెడితే ఈ ఉదంతం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలకు, బయటి వారికీ తెలిసింది.
తాజాగా శనివారం నాడు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మీడియాతో మాట్లాడిన విషయాలను చూస్తే సుప్రీం కోర్టు తీర్పు స్పూర్తిని గ్రహించినట్లు లేదు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడిందా లేదా ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారా ? ఇది ఒక విపరీతమైతే తనకు, తన కుటుంబానికీ భద్రత లేదంటూ ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్రానికి ఫిర్యాదు చేయటం, తాను పొరుగు రాష్ట్రం నుంచి పని చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని కోరటం కూడా ఒక విపరీత పరిణామం, దేశ చరిత్రలో తొలిసారి.
బుగ్గన రాజేంద్రనాధ్‌ గారు ఎన్నికల కమిషనర్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. కమిషనర్‌కు అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని విస్మరించకూడదు అన్నారు, సమంజసమే. కోవిడ్‌ నియంత్రణ చర్యలు, గురించి సిఎస్‌ను ఎందుకు సంప్రదించలేదు అని బల్ల చరిచి మరీ ప్రశ్నించారు. తీసుకున్న చర్యలు గురించి సిఎస్‌ లేదా ఆరోగ్యశాఖ అధికారులు ఒక కాపీ రూపంలో అయినా అధికారికంగా ఎన్నికల కమిషనర్‌కు పంపారా లేదా ఒక వేళ పంపితే ఇక సంప్రదించాల్సిన అవసరం ఏముందో మంత్రిగారు చెప్పాలి. అసలు సమీక్షలే చేయలేదన్న విమర్శలు, ఆరోపణలను తగిన ఆధారాలతో ఆయన ఖండించి ఉండాల్సింది.

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire
కోవిడ్‌ను నివారించే సందర్భంలో ఎన్నికల నియమావళి (కోడ్‌) వల్ల ప్రభుత్వ పరిపాలన, నిర్ణయాలకు ఇబ్బంది ఏర్పడదా? అని అమాయకంగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే వర్తించేదిగా ప్రత్యేకంగా ఏమైనా రూపొందించారా ? కాదని మంత్రికి తెలియదా? ఒక వేళ ఇబ్బంది అనుకుంటే కమిషనర్‌ను సంప్రదించే అవకాశాన్ని ఎందుకు వినియోగించకోలేదో చెప్పాలి. ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిసి రమేష్‌కుమార్‌ కేవియట్‌ను ఎందుకు వేయించారు? ఇదేమైనా వ్యక్తిగత తగాదానా? అని ప్రశ్నించిన మంత్రిగారికి రమేష్‌ కుమార్‌ వ్యక్తిగా కాదు, ఎన్నికల కమిషనర్‌గా వెళ్లారని తెలియదా ? జగన్‌మోహనరెడ్డి గారు అధికారాల గురించి ఒక వ్యక్తిగా ప్రశ్నించారా లేక ముఖ్య మంత్రిగా ప్రశ్నించారా, అదే విధంగా ఏ హౌదాతో సుప్రీం కోర్టు తలుపు తట్టారు అన్నది మంత్రిగారు చెప్పాలి మరి !
‘జ్వరం వస్తే పారాసెటిమాల్‌ కాక ఇంకేం వాడతారు? ఎవరైనా డాక్టర్లను అడగండి ఏం చెబుతారో! మీడియా పవర్‌ ఉందని చెప్పి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తారా?’ అని ఎల్లో మీడియాపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు అని ఒక పత్రిక రాసింది.
కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం అరగంటకు పైగా వివరిస్తే అదంతా వదిలి ఎల్లో మీడియా సీఎం పారాసెటిమాల్‌పై మాట్లాడిన మాటలను ప్రసారం చేసిందని మంత్రి ఆరోపించారు. కోవిద్‌ నియంత్రణ లేదా నివారణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద లేదా తీవ్రంగా ప్రభావితమైన చైనా చర్యలను ప్రమాణంగా తీసుకోవాలి, ముఖ్యమంత్రి వాటినే చెప్పాలి లేదా వాటిని చెప్పి అవి పనికిమాలిన విషయాలని కొట్టివేసి పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ గురించి చెప్పి ఉండాల్సింది. వాటితో వైరస్‌ నివారణ అంత సులభమైతే మంత్రిగారే చెప్పినట్లు అరగంటకు పైగా వివరించాల్సిన పనేముంది?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసినట్టు చెబుతున్న లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హౌంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఎందుకు కేవియట్‌ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి?
ఈ ప్రశ్నలు వేసినవారు తరువాత ఏమైందో జనానికి చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ?
అధికారపార్టీ నేతలు పోలీసుల దర్యాప్తును కోరబోయే ముందు తమ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదో ఎందుకు తెలుసుకోలేదు ? లేఖ గురించి అధికారికంగానే కేంద్ర హౌంశాఖను సంప్రదించి నిర్ధారణ చేసుకొనేందుకు ఎందుకు ప్రయత్నించలేదు ? ఆ పని చేయకుండా ఎందుకు కాలక్షేపం చేశారు? పోనీ తరువాత ఆ లేఖ ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచే వచ్చిందని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. దాని మీద వైసిపి, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించటమెందుకు ? ఆ లేఖలోని అంశాలేమిటో బహిర్గతం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండిస్తూ లేదా వివరణ ఇస్తూ రాసిన లేదా రాయనున్న లేఖను కూడా బహిర్గతం చేస్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నికల కమిషనర్‌ కొందరు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుందా లేదా అన్నది కూడా నోరువిప్పి చెప్పాలి. ఎన్నికల కమిషనర్‌ ఎందుకు నోరు విప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై కూడా స్పందించటం లేదని విమర్శలు తలెత్తినపుడు కూడా స్పందించలేదు. అప్పుడు వైసిపి నేతలు చిద్విలాసాన్ని ప్రదర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా అని కూడా గుర్తు చేసిన వారు లేకపోలేదు.
ఇక ఎన్నికల కమిషనర్‌ లేఖ గురించి బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చేసిన వాదనలు చిత్రంగా ఉన్నాయి. కేంద్ర హౌంశాఖకు రోజూ అనేక లేఖలు వస్తుంటాయి. వాటి గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఆ శాఖ స్పందిస్తుంది అన్నారు. అది కొంత మేరకు వాస్తవమే కావచ్చు. ఇక్కడ ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మీద ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తీవ్ర విమర్శలు చేసిన పూర్వరంగంలో ఎన్నికల కమిషనర్‌ పేరుతో ఒక లేఖ మీడియా, సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరింది. ఇంత జరుగుతున్నా రాజకీయంగాక పోతే కేంద్ర హౌంశాఖ మౌనంగా ఉండటంలో అర్ధం ఏమిటి ? సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వెంటనే అసాధారణ రీతిలో స్పందించిన వారు అదే విషయాన్ని బహిరంగంగా చెప్పలేరా ? అందినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించిన తరువాత లేఖలోని అంశాల గురించి రాష్ట్రాన్ని వివరణ అడుగుతుందా, తదుపరి చర్యలు ఏమిటి ? ఇవన్నీ ప్రస్తుతానికి ఎదురు చూస్తున్న ప్రశ్నలు.
ఎన్నికల కమిషనర్‌ లేఖ ఎలా బయటకు వచ్చింది అన్న ప్రశ్నకు పెద్దగా బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. గతంలో అనేక అంశాలు బయటకు వచ్చినట్లుగానే ఇదీ వచ్చింది. వైసిపి పెద్దలు పేర్కొనే ఎల్లో మీడియాలో అంతా చూసినట్లుగా, ఆధారాలతో రాసినట్లుగానే జగన్‌గారి సాక్షి పత్రిక, ఛానల్‌లోనూ అలాంటి వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అందువలన ఈ ఉదంతంలో జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవాలని కోరటం గర్హనీయం. ఎవరి మీడియాలో పని చేసినా వారు నిమిత్త మాత్రులు. ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన తొలి, వివాదాస్పద పత్రికా సమావేశంలో కొందరు జర్నలిస్టుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఎంత మంది వస్తారో అంచనా వేయలేని, తగిన ఏర్పాట్లు చేయలేని దుస్ధితిలో ఉన్నట్లు వెల్లడి అయింది. ఒక వేళ తగినంత స్ధలం లేకపోతే ముందు వచ్చిన వారిని కూర్చోనిచ్చి మిగతావారికి ఖాళీ లేకపోతే ఏమి చేయాలో వారికే వదలి వేయాలి తప్ప కొందరికి ప్రవేశం లేదని ప్రకటించటం తగనిపని, గర్హనీయం. కొందరు రావటం ఇష్టం లేకపోతే ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికే ఆహ్వానాలు పంపటం ఒక పద్దతి, వచ్చిన వారిని అవమానించటం ఏమిటి ?
ఎన్నికల కమిషనర్‌ లేఖపై తెలుగుదేశం పార్టీ రాజకీయం సంగతి ఏమిటి అన్నది చూద్దాం. ఆ పార్టీ గవర్నర్‌ను కలిసి చర్య తీసుకోవాలని కోరింది. ఆ లేఖను తాను రాసిందీ లేనిదీ కమిషనర్‌ నిర్ధారించకుండానే అది వాస్తవమే అన్నట్లుగా అది వ్యవహరించింది. లేఖలోని అంశాల ఆధారంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినంత మాత్రాన ఆ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు ?

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటి కావటంతో వైసిపి నాయకత్వం తట్టుకోలేకపోయింది. ఆ ఉద్రేకం లేదా ఉక్రోషంలో ముఖ్యమంత్రి జగన్‌మోపాన్‌రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతర కరం. తరువాత స్పీకర్‌తో సహా పార్టీ భజన దళం మరింతగా రెచ్చిపోయింది. వెంట వెంటనే వరుసగా జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి ఇబ్బందుల్లోకి నెట్టారు. రాజకీయ పర్యవసానాలను ఎరక్కపోయి తానే ఇరుక్కున్నారు. కరోనా వైరస్‌ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది, అదే వైరస్‌ తాత్కాలికంగా అయినా రాజకీయంగా మరింత నష్టపోకుండా చూస్తోంది. గత తొమ్మిది నెలలుగా జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే, ఎన్నికల కమిషనర్‌ ప్రమేయం ఉన్న ఉదంతం ఒక ఎత్తు. ఇది వీరాభిమానులను అభిమానుల స్ధాయికి తగ్గించింది. పైకి చెప్పకపోయినా ప్రయివేటు సంభాషణల్లో నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఇతరులు చెప్పిందాన్ని వినకపోగా తానుగా తెలుసుకోలేని స్ధితిలో తమ నేత ఉన్నట్లు భావిస్తున్నారు. అది వైసినేతగా ఉన్నపుడు జనానికి దానితో పని లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కుదరదని చెప్పాల్సి వస్తోంది. ఇదే స్ధితి మరికొంత కాలం సాగితే…..అభిమానం కూడా వేసవి కాలంలో మంచులా కరిగిపోతుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ పతనం- మోడీ నాడేమి చెప్పారు నేడేమి చేస్తున్నారు !

16 Monday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India inflation, Indian Rupee, Narendra modi on Rupee fall

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons

ఎం కోటేశ్వరరావు
రూపాయికి కరోనా వైరస్‌ సోకిందా ?  పతనాన్ని అరికట్టటంలో నరేంద్రమోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందా ? మోడినోమిక్స్‌ గురించి గతంలో పొగిడిన వారు ఇప్పుడు నోరు మెదపరేం ? గతంలో రూపాయి పతనాన్ని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఏమంటారు ? ఇలా ఎన్నో ప్రశ్నలు కేంద్ర పాలకులను చుట్టుముడుతున్నాయి. ఒక్కరూ నోరు విప్పరేం. పోనీ రూపాయి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ గురించి నోరు విప్పరు. కానీ సిఎఎ,ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ వంటి అనేక వివాదాస్పద విషయాల మీద మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు అంటూ నోరు వేసుకొని పడిపోతున్నారే !
రూపాయిని కాపాడుకొనేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించనున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. దాంతో రూపాయి శుక్రవారం నాడు కాస్త కోలుకుంది. సోమవారం నాడు మార్కెట్‌లు ప్రారంభం కాగానే మరోసారి పతనమైంది. రోగం ఒకటైతే మోడీ సర్కార్‌ మందు మరొకటి వేస్తోందా ?
చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. గురువారం నాడు రికార్డు స్దాయిలో పతనమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు కోలుకుంది.ఒక్క రోజులో కరోనా వైరస్‌ తగ్గిందీ లేదు, కొత్తగా పెరిగిందీ లేదు. సోమవారం నాడు తిరిగి భారీ స్ధాయిలో పతనమైంది. అసలేమి జరుగుతోంది ? ఏమి జరగబోతోంది ? ప్రభుత్వం చెప్పదు, చెప్పిన మేథావులకు దేశ వ్యతిరేకులనో, కమ్యూనిస్టులనో మరొకటో ముద్ర వేస్తున్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కాని మేథావులకు మన దేశం గొడ్డుపోయిందా ? లేదే, మరి వారెందుకు చెప్పటం లేదు, చెప్పినా మీడియా జనం ముందుకు తేవటం లేదా ?
ఈ పూర్వరంగంలో మన రూపాయి రక్షణ గురించి చూద్దాం. రూపాయి పతనమైతే ఎగుమతిదారులు సంతోషపడతారు, దిగుమతిదారులు ఆగ్రహిస్తారు. రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులు సంతోషిస్తారు, ఎగుమతిదారులు కన్నెర్ర చేస్తారు. మధ్యలో జనం సంగతేమిటి ? 1961లో వంద రూపాయలకు వచ్చే వస్తువులను నేడు కొనాలంటే రూ.7,557 కావాలి మరి ! లేదూ దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 59 సంవత్సరాల క్రితం వంద రూపాయలుంటే దాని నిజ విలువ ఇప్పుడు రూ.1.40కి దిగజారింది. ఈ లెక్క ఎలా వచ్చిందంటారా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు చెప్పినా లెక్కవేసి పెడతారు. ప్రతి ఏటా ప్రభుత్వం వినిమయదారుల ధరల సూచీని ప్రకటిస్తుంది.             అందువలన ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమాన సంవత్సర వినిమయదారుల సూచీని సదరు ప్రామాణి సంవత్సర సూచీతో భాగహారం చేయగా వచ్చే మొత్తాన్ని వందతో హెచ్చ వేయండి. మీకు ఫలితం వస్తుంది.1961 వినిమయదారుల ధరల సూచి 2.57, 2020 సూచీ 194.25. వీటితో పైన చెప్పిన పద్దతిలో భాగహారం చేస్తే 75.58 వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. దీన్ని వందతో హెచ్చవేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు 1961 తరువాత గరిష్ట ద్రవ్యోల్బణం 1974లో 28.6, అంతకు ముందు సంవత్సరం రెండవ రికార్డు 16.94. (ఈ కారణంగానే ఆ రెండు సంవత్సరాలలో దేశంలో అనేక చోట్ల ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళనలు తలెత్తాయి) నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు 2013లో ద్రవ్యోల్బణం 10.91. తరువాత క్రమంగా 6.35 నుంచి 2017లో 2.49గా ఉంది. దీన్ని మోడీ సర్కార్‌, బిజెపి పెద్ద ఎత్తున తమ విజయంగా,మోడీ ప్రతిభగా ప్రచారం చేసుకున్నాయి. మరుసటి ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ 2019లో 7.66కు చేరింది, ఈ ఏడాది ఇంకా ఖరారు కాలేదు. దీన్ని ఎలా చెప్పాలి ? 2019లో రూ.7,019కి వచ్చిన సరకుల ధర 2020లో రూ.7,557 అవుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ద్రవ్యోల్బణం తిరోగమనంలో పయనించింది. 1976లో అది గరిష్టంగా మైనస్‌ 7.63, అందువలన 1975లో రూ.312 రూపాయలకు వచ్చిన సరకులు 1976లో రూ.288కే వచ్చాయి.

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons
రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అని ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ ఈ మాటలు అన్నారు. అదేమి చిత్రమో, గానీ యుపిఏ నాటి కంటే నేడు మరింత దిగజారినా ప్రధానిగా మోడీ నోటి వెంట ఒక్క మాటా రాదు. ఆ పెద్దమనిషి భక్తులకూ నోట మాట పడిపోయింది. గోమాత శాపమా ?
ఎక్సేంజ్‌ రేట్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ రూపి అని గూగుల్‌ తల్లిని వేడుకుంటే కరుణించి అందచేసే సమచారంలో వికీపీడియాను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కళ్లుండీ చూడలేని నమో భక్తుల గురించి జాలిపడదాం. అడ్డంగా వాదిస్తే వాస్తవాలతో పని పడదాం. గత పది సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి విలువ వార్షిక సగటు విలువ ఎలా ఉందో దిగువ చూడండి.
ఏడాది రూపాయి విలువ
2004-05    44.93
2005-06    44.27
2006-07    45.28
2007-08    40.24
2008-09    45.91
2009-10    47.41
2010-11    45.57
2011-12    47.92
2012-13    53.21
2013-14    60.50
2014-15    61.14
2015-16    65.46
2016-17    67.07
2017-18    64.45
2018-19    69.92
2019-20 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సగటున రూపాయి విలువ 70.40. ఈ ఏడాది గత కొద్ది రోజులుగా పడిపోతూ 2018 అక్టోబరు రెండు నాటి రికార్డు పతనం 74.48కి దగ్గరగా 74.44 వరకు దిగజారింది. ఈ పతనానికి కారణాలేమీ చెప్పలేదు గనుక దీనికి కూడా మోడీ సర్కార్‌ అవినీతే కారణం అనుకోవాలి మరి. ఈ రికార్డు పతనంతో నిమిత్తం లేకుండానే పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు దిగజారాయి. ఇంతగా దిగజారింది కనుకనే రిజర్వుబ్యాంకు డాలర్లను విక్రయించేందుకు పూనుకుంది.
రూపాయి పతనమైతే మన సరకుల ధరలు విదేశాల్లో తగ్గి ఎగుమతులు పెరుగుతాయి కదా ! అలాంటపుడు దాన్ని నివారించేందుకు రిజర్వు బ్యాంకు ఎందుకు పూనుకున్నట్లు ? అసలు విషయం ఏమంటే మన సరకులకు విదేశాల్లో డిమాండ్‌ లేదు. పోనీ నరేంద్రమోడీ విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రతి చోటా, మన దేశానికి వచ్చిన ప్రతి విదేశీ నేతను కౌగలింతలతో ముంచెత్తినా వారి నుంచి తాను ప్రశంసలు, పొగడ్తలు పొందటం తప్ప ఎగుమతి మార్కెట్‌ అవకాశాలను కల్పించలేకపోయారు. మన కరెన్సీ పతనాన్ని ఇంకా కొనసాగనిస్తే మనం దిగుమతి చేసుకొనే చమురు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది జనం మీద, ఆర్దిక వ్యవస్ధ మీద మరింత భారం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న స్ధితిలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కాపాడుకొనేందుకు బిజెపి పాట్లు పడుతోంది.
మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. 1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు.
మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.
నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.
విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?
నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?
వక్రీకరణలతో జనాన్ని మోసం చేయలేరు, భక్తులు మోడీని అసలు గట్టెక్కించలేరు. రూపాయి పతనాలు గతంలో జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. దాన్నొక సమస్యగా చేసింది నరేంద్రమోడీ ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ అన్న మోడీని మీ ఏలుబడిలో సంగతేమిటని అడిగే హక్కు అందరికీ వుంది. ఆయన భక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే కిరాయి జనం వున్నారు. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చే నాటికి 2014 మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి తాజాగా 74.34కు పతనం అయింది.

Image

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. దాన్నయినా అదుపు చేయాలి, మోడీ గారిని అయినా అదుపులో పెట్టాలి, లేకపోతే మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గరగా రూపాయిని తీసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేనుకు పెత్తనం – నరేంద్రమోడీకి అధికారం !

14 Saturday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Excise Duty & VAT on Oil, Narendra Modi 2.0, Price Build-up of Petrol

Image result for narendra modi authoritarian

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా ఒక్కసారిగా చమురు ధరలు 30శాతం వరకు పతనమయ్యాయి. ఒక్క మంత్రి లేదా సామాజిక మాధ్యమంలో ఒక్క బిజెపి కార్యకర్తగానీ ఈ మేరకు వినియోగదారులకు ధరలు తగ్గుతాయి అని చెప్పటం లేదు. గతంలో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం ప్రారంభం కాగానే దాన్ని మనకు అనుకూలంగా మలచుకుంటామని కబుర్లు చెప్పారు. అదేమిటో ఎక్కడా చెప్పరు. కానీ జరుగుతున్నదేమిటి ? ధరలను మరింతగా పెంచారు. దానిలోకి వెళ్లే ముందు అసలేం జరుగుతోందో చూద్దాం.
2013 సెప్టెంబరు 16న మనం దిగుమతి చేసుకొనే రకం చమురు ధరలు, పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
పీపా ధర రూ. 117.58 డాలర్లు.
డాలరుకు రూపాయి విలువ 66.02.
చమురు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రూ.50.02
డీలర్లకు విక్రయించిన ధర              రూ.52.15
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ   .9.48
డీలర్‌ కమిషన్‌                             రూ. 1.79
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం            రూ.12.68
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ. 76.10
2020 మార్చి 14న వివరాలు
డీలర్లకు విక్రయించిన ధర              రూ.28.50
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ.22.98
డీలర్‌ కమిషన్‌                              రూ. 3.54
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం           రూ.14.85
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ.69.87
నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా రూపాయి విలువ ఎలా పతనమైందో దిగువ వివరాలు ఉన్నాయి.ఇప్పుడు 74 రూపాయలకు పతనమైంది. అదే పతనం కానట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా డీలర్లకు విక్రయించే ధర ఇంకా తగ్గి ఉండేది. వినియోగదారులకు ఇంకా చవకగా అంది వుండేది. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పన్ను మొత్తాన్ని రూ.9.48 నుంచి రూ.22.98కి పెంచింది. అదే లేనట్లయితే డీలరు కమిషన్‌ పెంచినా పెట్రోలు రూ.56.37కు వచ్చి ఉండేది.
చమురు ధరలను గణనీయంగా తగ్గించాల్సిన పెద్ద మనిషి శనివారం నాడు పెట్రోలు మీద రూ.19.98గా ఉన్న ఎక్సయిజ్‌ పన్నును రూ.22.98కి పెంచారు. ఈ పెంపుదల దూరదృష్టితో చేసినదని, ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న ద్రవ్య స్ధితిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వనరులు అవసరమని ఒక అధికారి సన్నాయి నొక్కులు నొక్కారు. గడచిన నాలుగు మాసాల్లో చమురు ధరలు తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకే గణనీయంగా పోయిందని సమర్ధించుకున్నారు. అంటే తగ్గిన మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించకూడదన్నది మోడీ సర్కార్‌ విధానం అన్నది స్పష్టమైంది.పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నది సామెత. మంచి రోజులను తెస్తానని చెప్పిన నరేంద్రమోడీకి అధికారమిస్తే చేసినదాన్ని ఏమనాలి?
మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు, 2020 మార్చి 13వ తేదీన పీపా ముడి చమురు ధర రూ.2,342 గా ఉంది. ఇదే రోజు రూపాయి విలువ 73.74గా ఉంది.నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఆయన సమర్ధత కారణంగా ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు మన కరెన్సీ విలువ పెరిగి వుంటే చాలా చవకగా పెట్రోలు, డీజిలు అందుబాటులోకి వచ్చి ఉండేది. ఒక పీపాలో ముడి చమురు 159 లీటర్లు ఉంటుంది. దాన్నుంచి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్‌,20 లీటర్ల కిరోసిన్‌ లేదా విమాన ఇంథనం, ఆరు లీటర్ల ప్రొపేన్‌, 24 లీటర్ల ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఇవి రావటానికి ముడి చమురుకు ఇతర ఉత్పత్తులను జత చేయాల్సి ఉంటుంది. ఒక పీపా నుంచి ఒక వంద లీటర్లు పెట్రోలు, డీజిల్‌ అనుకుంటే ఇతర ఉత్పత్తుల మీద వచ్చే ఆదాయం శుద్ధి చేసిన ఖర్చుకు పోతుంది అనుకుంటే మోడీ గారి పన్ను బాదుడు లేనట్లయితే చాలా తక్కువకు జనం పొంది ఉండేవారు. అది మిగతా వస్తువుల ధరలను కూడా తగ్గించేందుకు దోహదం చేసి ఉండేది.
మోడీ సర్కార్‌ ఇతర అన్ని రంగాలలో విఫలమైందని అనేక అంశాలు నిరూపించాయి. మన ఎగుమతులతో జనానికి కలిగిన లబ్ది ఏమిటో తెలియదు గానీ దిగుమతుల్లో సింహభాగమైన ముడిచమురును ఒక ఆదాయవనరుగా మార్చుకొని వినియోగదారులను ఎలా లూటీ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ లూటీ అనే పెద్దమాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మోపిన పన్ను భారాన్ని జన సంక్షేమానికి ఖర్చు చేయలేదన్న కారణంగానే.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి పదకొండు రకాల ఖాతాల నుంచి గణనీయ మొత్తంలో ఆదాయం వస్తోంది.2014-15లో అంటే మోడీ సర్కార్‌ తొలి ఏడాదిలో వచ్చిన ఆదాయ మొత్తం రూ.1,72,065 కోట్లు, అది 2018-19 నాటికి రూ. 3,48,041 కోట్లకు పెరిగింది, రెట్టింపైంది. ఇదే కాలంలో ఈ మొత్తంలో ఎక్సైజ్‌ పన్ను రూ.99,068 కోట్ల నుంచి రూ 2,14, 369 కోట్లకు పెరిగింది( ఒక ఏడాది రూ 2,42,691 కోట్లు వచ్చింది), అంటే దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.Image result for narendra modi authoritarian
బిజెపి మరుగుజ్జులు ఈ లూటీని తక్కువ చేసి చూపేందుకు చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలు విధించే వ్యాట్‌ (పన్ను) కారణమని తప్పుడు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలు కూడా పన్ను వేస్తున్నాయి, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టిలోకి తెచ్చి తమ ఆదాయాన్ని పూడ్చాలని రాష్ట్రాలు చేస్తున్న వినతిని కేంద్రం పట్టించుకోవటం లేదు. దీని వెనుక రెండు కారణాలు ఒకటి జిఎస్‌టి పద్దతిని అమలు జరిపితే రాష్ట్రాలకు పంచకుండా దొడ్డిదారిన పన్నులు వేసి తన బొక్కసానికి చేర్చుతున్న మొత్తాన్ని కేంద్రం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవది రాష్ట్రాలకు తగ్గిన మేరకు ఆదాయాన్ని పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు వ్యాట్‌తో సహా ఆరు రకాల ఖాతాల ద్వారా పొందిన ఆదాయం రూ.1,60,554 నుంచి రూ.2,27,591 కోట్లు ఉంది, దీనిలో వ్యాట్‌ పెరుగుదల రూ.1,37,157 నుంచి రూ.2,01,265 కోట్లు మాత్రమే. కేంద్రం మోపిన భారం ఎక్కువన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిడతల దండుపై బాతులు, కోళ్లతో చైనా యుద్దం !

02 Monday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China duck troops, locust attack, Plague of Locusts, worst locust attack

Image result for china duck army

ఎం కోటేశ్వరరావు

అవును, వినటానికి ఆశ్చర్యంగానే ఉంది, పచ్చి నిజం. ఒక వైపు కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను అదుపులోకి తెచ్చేందుకు అపూర్వరీతిలో ప్రయత్నిస్తున్న చైనా మరోవైపు ముంచుకు వస్తున్న మిడతల దండు ముప్పును ఎదుర్కొనేందుకు తన బాతులు, కోళ్ల వీరులను యుద్ధానికి తరలిస్తోంది. ఎత్తయిన, మంచుతో ఉండే హిమాలయాల కారణంగా మిడతలు చైనా మీద దాడి చేసే అవకాశాలు పరిమితమే అయినప్పటికీ ఇరుగుపొరుగుదేశాలకు సాయ పడేందుకు, తమ దేశంపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. రసాయనాలతో మిడతలను సంహరించే అవకాశాలున్నా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఎరిగిన చైనా సాధ్యమైన మేరకు వాటితో నిమిత్తం లేకుండా హానిలేని ఫంగస్‌లను కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తోంది.
గత కొన్ని దశాబ్దాలలో లేని విధంగా కొద్ది వారాలుగా తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలలో పంటలను తుడిచి పెట్టిన మిడతలు ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్ధాన్‌, మన దేశం, చైనా వైపు పయనిస్తున్నాయి. దాదాపు 360 నుంచి 400 బిలియన్ల మిడతలు దాడుల్లో ఉన్నట్లు అంచనా. చైనా పశ్చిమ సరిహద్దు రాష్ట్రమైన గ్జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో ఉన్న పాకిస్ధాన్‌, భారత్‌ ప్రాంతాలకు విస్తరిస్తున్న మిడతలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే లక్ష బాతు సైన్యాన్ని చైనా సిద్దం చేసింది. వాటిని రాబోయే రోజుల్లో పాకిస్ధాన్‌లోని సింధు, పంజాబ్‌, బెలూచిస్తాన్‌ రాష్ట్రాలకు తరలించేందుకు ఇప్పటికే చైనా అధికారులు కొన్ని ప్రాంతాలను సందర్శించి తీసుకోవలసిన చర్యల గురించి అధికారులు, రైతులతో మాట్లాడారు. బాతులకు నీరు అవసరమైనందున నీరు లేని ఎడారి ప్రాంతాలలో వాటిని వినియోగించటం గురించి పరిశీలన చేస్తున్నారు. మిడతల దండు దాడులతో ఇప్పటికే పాక్‌ ప్రధాని జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. పంటల నష్టంతో ఆహారకొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Image result for china duck army
రసాయనాలతో మిడతలను హతమార్చవచ్చుగానీ, అది మరికొన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది, అందువలన చైనీయులు సహజంగా మిడతల పని పట్టే పద్దతులను పాతిక సంవత్సరాల క్రితమే ప్రయోగించి జయప్రదమయ్యారు. ఇప్పుడు పెద్ద ఎత్తున నివారణ చర్యలకు సిద్దం అవుతున్నారు. ఒక్కొక్క కోడి రోజుకు 70మిడతలను తింటే ఒక బాతు 200లను ఆరగిస్తుంది. ఒక బాతు నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని మిడతలను అదుపు చేయగలదు. ప్రకృతిలో మిడతలు ఒక భాగం. కొన్ని సందర్భాలలో అవి అలవిగాని రీతిలో విపరీతంగా పెరిగిపోవటానికి నిర్దిష్టంగా ఫలానా పరిస్ధితులు కారణమని చెప్పలేని స్దితి. అందువలన వాటిని పర్యవేక్షించి తీవ్రతను అంచనా వేసి చర్యలు తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. బాతులతో పాటు గంటకు 16000 హెక్టార్లలోని మిడతలపై రసాయనాలు చల్లి హతమార్చేందుకు చైనా 50 డ్రోన్లను, విమానాలను కూడా అందచేసేందుకు పాక్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రసాయనాలను ఉపయోగించినపుడు మిడతలతో పాటు మానవాళి, పంటలకు ఉపయోగపడే పరపరాగ సంపర్కానికి దోహదం చేసే తేనెటీగల వంటివి కూడా అంతరిస్తాయి. దాని వలన జరిగే నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకొని సహజ పద్దతుల్లో ఎదుర్కొనేందుకు, తక్కువ ఖర్చుతో కూడిన గువోషాఓ రకం బాతులు మిడతలను తినటంలో ఎంతో నైపుణ్యం గలవిగా పరిగణిస్తున్నారు. వాటిని చైనా ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తున్నది. గాలి వాలును బట్టి హిమాలయాలు అడ్డుగా ఉన్నందున, చలి కారణంగా చైనాకు మిడతల దండు ముప్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయినా ముందు జాగ్రత్తగా బాతు, కోళ్ల సైన్యాన్ని సన్నద్ద పరుస్తున్నారు. అవసరమైన పాకిస్దాన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాజా దండు ప్రారంభాన్ని గతేడాది జూన్‌లో గమనించారు. అయితే అది ఈ ఏడాది జనవరి నాటికి అదుపు తప్పి పెరిగిపోయింది. తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో జనవరినెలలో ఐదువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేంద్రీకృతమై పదివేల కిలోమీటర్లకు పెరిగి అక్కడి పంటలు, పచ్చదనాన్ని హరించి నుంచి గాలివాలును బట్టి పరిసర దేశాల మీద దాడి చేస్తున్నాయి. ఆహార భద్రతకు అసాధారణ ముప్పు వచ్చిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ ప్రకటించింది. గతేడాది చివరిలో ఎమెన్‌, మరికొన్ని దేశాలలో భారీ వర్షాలు పడటంతో మిడతలు తామర తంపరగా పెరగటానికి అనువైన పరిస్ధితి ఏర్పడింది.
ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో పదిహేను కోట్ల మిడతలు ఉంటాయని, గాలి తీవ్రతను బట్టి రోజుకు గరిష్టంగా 150కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.ఒక రోజులో 35వేల మంది ఎంత ఆహారం తింటారో ఒక చదరపు కిలోమీటరులో విస్తరించిన మిడతలు రోజులో అంత మొత్తాన్ని ఖాళీ చేస్తాయని అంచనా. వాతావరణాన్ని బట్టి ఒక దండు దండయాత్ర ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఏడాదిలో రెండు నుంచి ఐదు తరాలు వృద్ధి చెందుతాయి. ఒక మిడత గుడ్డు నుంచి సంపూర్ణంగా ఎదగటానికి మూడునెలల సమయం పడుతుంది. ఒకేసారి అనేక గుడ్లను పెడతాయి.
చైనా విషయానికి ముఖ్యంగా ఆహార భద్రతను గమనంలో ఉంచుకొని దేన్నీ తక్కువగా చూడటం లేదు. గతేడాది దాదాపు కోటి హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి, ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని 44కోట్ల పందులలో సగాన్ని హతమార్చాల్సి వచ్చింది. అక్కడి వారి ఆహారంలో పంది మాంసం ప్రముఖపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Image result for china duck army
కేవలం మిడతలను మాత్రమే హతమార్చే ఫంగస్‌కూడా అందుబాటులో ఉంది. పదిహేను సంవత్సరాల క్రితం మిడతల దండు నివారణకు దానిని ఉపయోగించి ఫలితాలు సాధించారు. అయితే అవి మిడతలను సంహరించేందుకు ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నాయి. చైనాలో ఈ బయో ఫెస్టిసైడ్స్‌ను కూడా వినియోగిస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో ప్రస్తుత వినియోగానికి చైనాలోని ఫ్యాక్టరీలు వేలాది టన్నుల ఫంగస్‌ రకాలను తయారు చేస్తున్నాయి. వాటిలో కొన్ని జన్యుమార్పిడి రకాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ కారణంగా తాత్కాలికంగా మూతవేసిన వాటిలో ఈ ఫంగస్‌ను తయారు చేసేవి కూడా ఉన్నాయి. అయితే ఆఫ్రికా అవసరాల రీత్యా వాటిని తెరిచి పెద్ద ఎత్తున ఫంగస్‌ను తయారు చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కోడి కత్తి కాదు తెలుగువారికి డోనాల్డ్‌ ట్రంప్‌ ” కోడి కాలు, పాల ” కేసులు ముఖ్యం ?

23 Sunday Feb 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Dairy Farmers, Donald Trump India tour, Poultry Industry

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus

ఎం కోటేశ్వరరావు
కేంద్రంతో సంబంధం, రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు ఏమైందో మీకు తెలుసా ! నాకూ తెలియదు, అలాంటి సంచలనాత్మక కేసులు ఎన్నో మరుగునపడ్డాయి, దాని వలన రాజకీయ వ్యాపారులకు తప్ప జనానికి నష్టం లేదు. కానీ కోడి కాలు, పాల కేసు అలాంటిది కాదు. రెండు రాష్ట్రాల్లోని పాడి, కోళ్ల పరిశ్రమను, వాటి మీద ఆధారపడిన వారినీ దెబ్బతీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు వచ్చిన ఆహ్వానాన్ని, సంతోషంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ విందులో కోడి కాలు, పెరుగు లేకుండా ఉండదు. విందును ఆరగించబోయే ముందు తనకు వడ్డించి కోడి కాలు, పెరుగు స్వదేశీయా, అమెరికాదా అని కెసిఆర్‌ కనీసం సందేహిస్తారా ? అందని ద్రాక్ష పుల్లన అలాగే ఆహ్వానం రాలేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డికి అది గొప్ప విందేమీ కాదు. కనీసం ఆయన అయినా కోడి కత్తి కేసుతో పాటు కోడి కాలు, పాల కేసులను పట్టించుకుంటారా ?
ఒకటి కొంటే రెండు ఉచితంగా ఇస్తాం అన్నట్లుగా అమెరికా సర్కార్‌ మన దేశంతో ”కోడి కాళ్ల ” బేరం ఆడుతోంది. లేకుంటే మన కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తోంది. గతంలో మా కాళ్లు మాకున్నాయి మీ కాళ్లు అక్కర లేదంటూ మన సర్కార్‌ నిషేధం విధించింది. అప్పటి నుంచి వత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు విజయవంతమైనట్లు వార్తలు వచ్చాయి. విదేశీ వద్దు-స్వదేశీ ముద్దు అంటూ జపం చేసిన కాషాయ స్వదేశీ జాగరణ మంచ్‌ మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఏమైందో తెలియదు. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 17 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులులో ఉంది. మన దేశంతో ఉన్న ఆ వాణిజ్య లోటును అమెరికా పూడ్చుకోవాలంటే తనకు అవసరం లేని వాటిని మన మీద రుద్ది లబ్దిపొందాలని చూస్తోంది.
అమెరికా జనం కోడి కాళ్లను తినరు. అందువలన అక్కడి కోల్ట్‌ స్టోరేజీల్లో అవి పెద్ద ఎత్తున నిల్వలుండిపోయాయి. వాటిని మన మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తే మన దేశంలోని వేలాది కోళ్ల ఫారాలు మూతపడతాయి. వాటితో పాటు అనుబంధ రంగాలలో కనీసం 40లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ కారణంగానే గత పాలకులు వాటి మీద నిషేధం విధించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగలించుకున్న నరేంద్రమోడీ ట్రంప్‌ను పడేయాల్సింది పోయి తానే పడిపోయారు. కోడి కాళ్ల దిగుమతులపై ఉన్న పన్ను మొత్తాన్ని వంద నుంచి 25శాతానికి తగ్గించి దిగుమతులకు వీలు కల్పిస్తామని ఆమోదం తెలపగా, కాదు పదిశాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ తెలిపింది. ఇది నిజానికి స్పందన తెలుసుకొనేందుకు వదిలిన లీకు వార్త తప్ప మరొకటి కాదు. దీని మీద మన దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో అబ్బే అలాంటిదేమీ లేని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ట్రంప్‌ రాక సందర్భంగా లేదా తరువాత అయినా దానికి అంగీకారం తెలపవచ్చని భావిస్తున్నారు.
కోడి కాళ్ల దిగుమతులపై అమెరికా కోరిన విధంగా పన్ను తగ్గిస్తే అది ఆ ఒక్కదేశానికే పరిమితం కాదు. బ్రెజిల్‌ వంటి ఇతర అనేక దేశాల నుంచి చౌకగా దిగుమతులు వెల్లువెత్తుతాయి. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ ఒక్కటే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయా రైతులు కూడా ప్రభావితం అవుతారు. నాటు కోళ్లను పెంచే సామాన్య గృహస్తుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా అమెరికా మన మీద తెస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు. బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా 2007 మన ప్రభుత్వం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఫ్లూ సమస్య తొలగిన తరువాత కూడా అది కొనసాగింది. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది.2014లో అమెరికా కేసు గెలిచింది. 2017లో కోడి కాళ్ల దిగుమతులను మోడీ సర్కార్‌ అనుమతించింది. మన దేశమే కోళ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాంటిది అమెరికా నుంచి దిగుమతులను పరిశ్రమ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ప్రస్తుతం వందశాతం పన్ను ఉన్నప్పటికీ అమెరికా నుంచి వస్తున్న కోడి కాళ్ల దిగుమతుల కారణంగా అనేక చోట్ల చిన్న చిన్న కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. అమెరికా తన వద్ద ఉన్న నిల్వలను వదిలించుకొనేందుకు కారుచౌకగా ఎగుమతులు చేసేందుకు పూనుకుంది. మన దేశంలో కోడి కాళ్లు ఆయా సీజన్లనుబట్టి కిలో రూ.150 నుంచి 250 వరకు ధరలు పలుకుతున్నాయి. అమెరికా నుంచి పది హేను రూపాయలకే అందుబాటులోకి వస్తాయని అంచనా. అక్కడి వాస్తవ ధరకంటే తక్కువ చూపి సబ్సిడీలతో ఎగుమతులు చేస్తారు. అందువలన మన దేశం దిగుమతి పన్ను వంద కాదు మూడు వందల శాతం వేసినా మన మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో కోడి కాళ్ల సగటు బరువు 70 నుంచి 90 గ్రాములుంటాయి. అదే అమెరికా కాళ్ల సగటు 160 నుంచి 180 గ్రాములు.
ఇక పాలు, పాల ఉత్పత్తుల విషయానికి వస్తే అమెరికా గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి దిగిన కారణంగా అమెరికా ఉత్పత్తుల మీద చైనా 20శాతం, మెక్సికో 28శాతం చొప్పున దిగుమతి పన్ను పెంచాయి. దాంతో ఉత్పత్తుల నిల్వలు పెరిగిపోతున్నాయి. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది అమెరికా గోదాముల్లో 1.4బిలియన్‌ పౌండ్ల(పౌను అరకిలోకు సమానం) జున్ను నిల్వలు మిగిలిపోయాయి. ఇక పాలపొడి సంగతి సరేసరి. మరోవైపు న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ నుంచి పోటీ పెరుగుతోంది. 2023వరకు ఈ పన్నులు కొనసాగితే అమెరికా పాల రైతులు 12.2బిలియన్‌ డాలర్లు నష్టపోతారు. ఈ కారణంగా తన ఉత్పత్తులను మన మీద రుద్దేందుకు అమెరికా పూనుకుంది.2018లో అమెరికా పాల ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరిచేందుకు మోడీ సర్కార్‌ సూత్రప్రాయంగా ఆమోదించింది. అది అమల్లోకి వస్తే దాదాపు ఎనిమిది కోట్ల మంది మన రైతులు ప్రభావితులౌతారు.

Image result for trump , india ,poultry and milk products cartoons
మొహమాటానికి పోతే…. ఏదో అయిందన్నది ఒక ముతక సామెత. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం పలికి నరేంద్రమోడీ అదే ఇబ్బందులను కొని తెచ్చుకున్నారా ? గత ఏడాది హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన నరేంద్రమోడీ పనిలో పనిగా మీరు ఒకసారి మా దేశానికి రండి అని ట్రంప్‌కు ఆహ్వానం పలికారు. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి డంగై పోయిన ట్రంప్‌తో వీళ్లదేముంది, మీరు ఊహించలేరు, మాదేశం వచ్చినపుడు మిలియన్ల మంది మీకు దారిపొడవునా స్వాగతం పలుకుతారు చూడండి అని నరేంద్రమోడీ గొప్పగా చెప్పి ఉండాలి. లేకపోతే మిలియన్ల మంది నాకోసం వస్తారని మోడీ చెప్పారు, వారు 50 నుంచి 70లక్షల మంది వరకు ఉంటారని మోడీ చెప్పారు అని ఒకసారి, అరవై నుంచి కోటి మంది వరకు వస్తారని మోడీ చెప్పినట్లుగా మరోసారి అమెరికాలో ట్రంప్‌ ప్రకటించారు. అది మన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. రేపు మూడో కుర్ర భార్య, మొదటి భార్య కూతురు, అల్లుడితో సహా వస్తున్న ట్రంప్‌ జనాన్ని చూసి ఎంత మంది ఉంటారని తన వాళ్లను ప్రశ్నించకమానరు. మీ స్వాగతం గురించి మీ మోడీ చెప్పినవన్నీ జుమ్లా(ఏదో అవసరానికి అలా చెబుతాం)యే. మిలియన్ల మంది ఎక్కడా కనిపించలేదు, భారత్‌ మనలను సరిగా చూసుకోవటం లేదు, మోడీ అలాంటి వ్యక్తి కాదు అన్నారు, ఇప్పుడు చూడండి ఎలా అవమానించారో, ఇంత తక్కువ సంఖ్యలో జనమా, ఇది వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం కలిగించదా అని భార్య, కూతురు, అల్లుడు నిషఉ్టరాలాడకపోరు. ట్రంప్‌ను చూసేందుకు గుజరాత్‌లో ఎంత మంది వచ్చిందీ కొందరు విలేకర్లయినా నిజాలను రాయకుండా ఉండరు కదా ! స్వాగతం పలికే జన సంఖ్య గురించి మోడీ ఆంగ్లం ట్రంప్‌కు అర్ధం కాలేదో లేక మోడీయే ట్రంప్‌కు అర్ధమయ్యే రీతిలో చెప్పలేదో ఏం జరిగిందో చెప్పటానికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు గనుక దీన్ని వదలివేద్దాం.

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus
డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలేవీ ఉండవు అని అమెరికా అధికారులు మరింత స్పష్టంగా చెప్పారు. అలాంటపుడు ట్రంప్‌ ఎందుకు వస్తున్నట్లు ? మన ప్రధాని ఎందుకు ఆహ్వానించినట్లు ? ఈ ఏడాది నవంబరు 3న జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా కార్పొరేట్లకు గరిష్ట లబ్ది చేకూర్చేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంతో సహా అన్ని దేశాలపై వత్తిడి పెంచుతున్నారు. దీనికి నరేంద్రమోడీ లొంగుతారా ? లేకపోతే మన దేశం మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా తెస్తున్న వత్తిడి మరింత పెరుగుతుంది. మరి మన మోడీ తట్టుకొని నిలుస్తారా, దేశపిత వంటి మెరమెచ్చు మాటలకు జావగారి లొంగిపోతారా, కోట్లాది మంది రైతాంగ జీవితాలను ఫణంగా పెడతారా ?అమెరికాకే అగ్రస్ధానం అన్న ట్రంప్‌ వైఖరికి అనుగుణ్యంగానే ఈ పర్యటన సాగనున్నట్లు స్పష్టమై పోయింది. మన ప్రయోజనాలే మనకు ముఖ్యం అని చెప్పే మన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు రాజీపడుతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్ట్‌ ట్రంప్‌ భారత్‌ రాక : ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

20 Thursday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald Trump India tour, Namastee Trump, Naredra Modi

Image result for donald trump india tour : who are patriots and who are not

ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24,25 తేదీలలో మన దేశ పర్యటన జరపనున్నారు. ఆ పెద్ద మనిషి రాకను నిరసిస్తూ తాము ప్రదర్శనలు జరుపుతామని వామపక్షాలు ప్రకటించాయి. ట్రంప్‌ రాక సందర్భంగా గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం(కేంద్ర పెద్దల ఆదేశాలతోనే అన్నది స్పష్టం) చేస్తున్న హడావుడి చూస్తుంటే మన దేశం బ్రిటీష్‌ రాజరికంలో మాదిరి ఇప్పుడు అమెరికా బానిసత్వంలోకి పోయిందా అనిపిస్తోంది. అంతర్జాతీయంగా మీడియాలో ఇప్పటికే అపహాస్యం ప్రారంభమైంది. ఇంత చేసి సాధించేదేమిటి అన్నది అపూర్వచింతామణి ప్రశ్న. సమాధానం చెప్పకపోతే తలలు తెగవు గానీ, గత ఆరు సంవత్సరాలలో మోడీ గారు ఖరీదైన కోట్లు తొడుక్కొని విదేశాలు తిరటం తప్ప సాధించిందేమీ లేదు కనుక, ట్రంప్‌ రాకతో అటు సూర్యుడు ఇటు పొడుస్తాడు అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు.
డోనాల్డ్‌ ట్రంప్‌ రాకను సిపిఎంతో సహా వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌ రాకకోసం ఎందుకు తహతహలాడుతున్నారు అన్నది ప్రశ్న. ట్రంప్‌ను ఆహ్వానించే వారు ఇప్పుడు అసలు సిసలు దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు లేదా చలామణి అవుతున్నారు. వ్యతిరేకించే వారిని దేశ ప్రయోజనాలను వ్యతిరేకించే వారిగా, దేశద్రోహులుగా సామాజిక మాధ్యమంలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశ భక్తులో తటస్దులు ఆలోచించాలి.
తన భారత పర్యటన గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ విలేకర్లతో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీతో పాటు మన దేశ గౌరవాన్ని గంగలో కలిపాయి. ట్రంప్‌ నోటి వెంట వెలువడిన ఆణిముత్యాల సారాంశం ఇలా ఉంది. ” వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల భారత్‌ సరిగా వ్యవహరించలేదు. నరేంద్రమోడీ ఎంతో మంచి వ్యక్తి గనుక పర్యటన పట్ల ఆసక్తితో ఉన్నా. భవిష్యత్‌ కోసం భారత్‌తో ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటాం. అది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందా అన్నది తెలియదు. ఈ పర్యటనలో ఒప్పందం ఉండకపోవచ్చు.నేను మోడీని ఎంతగానో ఇష్టపడుతున్నా. విమానాశ్రయం నుంచి కార్యక్రమాలు జరిగే ప్రాంతం, స్టేడియంలో 70లక్షల మంది పాల్గొంటారని నరేంద్రమోడీ నాతో చెప్పారు. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం నిర్మాణం జరుగుతున్నదని అనుకుంటున్నాను. అందువలన అది ఎంతో ఉత్సుకత కలిగిస్తోంది. కాబట్టి మనమంతా ఖుషీగా గడపవచ్చు”.
మన దేశంలో పర్యటించే ఒక విదేశీ నేత ఇలా మాట్లాడటం అహంకారానికి సూచిక. మన దేశంలో స్ధానికంగా ఒక నేత పర్యటిస్తుంటే మద్దతుదారులు ఎంతెంత మంది జనాన్ని సమీకరిస్తారో ముందుగానే సదరు నేతకు చెప్పినట్లుగా మన ప్రధాని స్వయంగా ట్రంప్‌తో మీ కార్యక్రమానికి 70లక్షల మందిని సమీకరిస్తా, బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పటం సిగ్గుగా లేదూ ! అందుకే ట్రంప్‌ మన దేశం వస్తే కమ్యూనిస్టులకు పోయేదేమిటి ? ఎందుకు వ్యతిరేకించాలి అని సామాజిక మాధ్యమంలో లేవనెత్తుతున్న ప్రశ్నలను నిజమే కదా అని భావిస్తున్న తటస్దులు కమ్యూనిస్టుల వ్యతిరేకతకంటే బిజెపి పాలకుల బానిసబుద్ది మన దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందా అని ఆలోచించాలి. అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలలో అమెరికన్లు శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో, ఎందరిని బలిచేస్తారో తెలియదు. అందువలన అలాంటి వాటిని వ్యతిరేకించే కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సహజంగానే వ్యతిరేకిస్తారు? మన దేశానికి, మన రైతాంగం, కార్మికుల ప్రయోజనాలకు అమెరికన్లు ముప్పు తేవటం లేదా ? లేక వాటిని చూసేందుకు మనం తిరస్కరిస్తున్నామా ? అసలవి సమస్యలుగా కనిపించటం లేదా ? వాటిని వివరంగా చర్చించబోయే ముందు క్లుప్తంగా ట్రంప్‌ పర్యటన వివరాలను చూద్దాం.

Image result for donald trump india tour : who are patriots and who are not
గతేడాది అమెరికాలో హౌడీ మోడీ సభ సందర్భంగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ను మన దేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఈనెల 24న వస్తున్న ట్రంప్‌ దంపతులకు అహమ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోడీ స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల దూరం రోడ్‌ షో నిర్వహిస్తారు. సబర్మతి ఆశ్రమం దగ్గర మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. తరువాత వల్లభారు పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మూడున్నరకు అహమ్మదాబాద్‌ నుంచి బయలు దేరి ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ సందర్శన, తరువాత ఢిల్లీ వెళతారు. రెండవ రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ దంపతులు స్వాగతం పలుకుతారు. తరువాత రాజఘాట్‌లో మహాత్మాగాంధీకి మరోసారి నివాళి అర్పిస్తారు. తరువాత హైదరాబాద్‌ హౌస్‌లో అధికారిక చర్చలు జరుగుతాయి.ఆ సమయంలో ట్రంప్‌ సతీమణి మెలానియా ఢిల్లీలోని ఒక పాఠశాలను సందర్శిస్తారు. మూడు గంటలకు అమెరికా రాయబార కార్యాలయంలో ముఖ్య వాణిజ్యవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ పాల్గొంటారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు, తరువాత పది గంటలకు అమెరికాకు తిరుగు ప్రయాణమౌతారు.
గుజరాత్‌లో కొద్ది గంటలు మాత్రమే గడిపే ట్రంప్‌ దంపతుల కోసం సర్కార్‌ పదివేల మంది పోలీసులను, వందల మంది అధికారులను దింపుతోంది. నిన్నటి వరకు బిజెపి మిత్రపక్షంగా ఉన్న శివసేన పత్రిక సామ్నా మోడీ చేస్తున్న హడావుడిని బానిస మనస్తత్వంగా వర్ణించింది. రోడ్ల మీద ఉండే పాన్‌ దుకాణాల మూత మొదలు, వీధి కుక్కల పట్టివేత, పేదరికం, పేదలు కనపడకుండా అహమ్మదాబాదులో కొన్ని చోట్ల గోడల నిర్మాణం, కొన్ని చోట్ల కుటుంబాల తొలగింపు వంటిచర్యలకు ప్రభుత్వం పాల్పడింది. కొద్ది గంటల పాటు ట్రంప్‌ దంపతులకు మురికివాడలు కనపడకుండా చేసేందుకు అహమ్మదాబాదులో దాదాపు వందకోట్ల రూపాయలు తగలేసి గోడ కట్టిన మన నిర్వాకాన్ని చూసి ఎవరైనా ఏమనుకుంటారు? అహమ్మదాబాద్‌ విమానాశ్రయానికి అరవైకి పైగా అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు రోజూ ఉంటాయి. కేవలం పది విమానాలను మాత్రమే అనుమతిస్తూ మిగతా వాటిని ఇతర ప్రాంతాలకు మరల్చేందుకు నిర్ణయించారు. స్టేడియంకు జనాలను తరలించేందుకు 2,200 బస్సులు ఏర్పాటు చేశారు. రోడ్డు పొడవునా దోమలు లేకుండా చేసేందుకు ఫాగింగ్‌ యంత్రాలను అమర్చారు. రోడ్ల మీద లక్ష మొక్కలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ట్రంప్‌కు జయజయ ధ్వానాలు పలికేందుకు రోడ్ల మీద ఇరవై ఎనిమిది వేదికలను ఏర్పాటు చేశారు.
గతేడాది సెప్టెంబరులో నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపి హౌడీ మోడీ పేరుతో భారత సంతతి వారిని సమీకరించి మన దేశం ఎంతో బాగుందని ఎనిమిది సార్లు ఎనిమిది భాషల్లో చెప్పి, ట్రంప్‌ను తాను పొగిడి, ప్రతిగా దేశ పిత అని ట్రంప్‌ చేత పొగిడించుకొని కౌగిలింతలతో తిరిగి వచ్చారు తప్ప సాధించిందేమిటి? మన ఎగుమతుల పెంపుదలకు ఎలాంటి ఒప్పందం నాడు లేదు, ఇది రాసిన సమయానికి వచ్చిన వార్తలను బట్టి ఇప్పడూ లేదు. అసలు కీలకమైన అమెరికా వాణిజ్య ప్రతినిధే ట్రంప్‌తో రావటం లేదు. ఇప్పుడు పరస్పరం ఎలా పొగుడు కుంటారో దేశం చూడనుంది. అసలు ట్రంప్‌ పర్యటనను ఎందుకు వ్యతిరేకించాలి ?
అలీన దేశంగా ఉన్న భారత్‌ను తమ చంకనెక్కించుకొని తన ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మన దేశానికి భద్రతా రీత్యా, ఆర్ధికంగా మోయలేని భారాలను మోపుతుంది. ఇరుగుపొరుగుదేశాలతో శతృత్వాలను పెంచుతుంది. ఈ రోజు మన ప్రాధాన్యత యావత్‌ దేశ జనాభా అవసరాలు తీరే విధంగా ఆర్ధిక వ్యవస్దను అభివృద్ధి చేయటానికి ఉండాలి తప్ప ఇరుగుపొరుగుదేశాలతో మిలిటరీ ఉద్రిక్తతల నడుమ మన సంపదలన్నీ అమెరికా లేదా మరొక దేశ ఆయుధాలకొనుగోలుకు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగుదేశాలతో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాతో చెలిమి ఏ విధంగానూ మనకు ఉపయోగపడదు.పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో తన ప్రయోజనాలకోసం మన దేశాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో తన మిలిటరీ వ్యూహంలోకి అమెరికా లాగుతోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో తన భారాన్ని మన మీద మోపేందుకు మన భుజం మీద తుపాకిని పెట్టి చైనాను కాల్చేందుకు ప్రయత్నిస్తోంది. తనకు అవసరం లేని, ఇతర దేశాలకు కూడా విక్రయిస్తున్న ఆయుధాలను మనకు కట్టబెట్టటం తద్వారా మన మిలిటరీ భవిష్యత్‌ను తన చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాకే అగ్రస్ధానం అనే పద్దతుల్లో ముందుకు పోతున్న అమెరికా మనలను ఎలా ముందుకుపోనిస్తోందో అందరూ ఆలోచించాలి.
మన దేశం చైనాతో అయినా మరొక దేశంతో అయినా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే అభివృద్ధి మీద కేంద్రీకరించాలి. అమెరికన్లు చైనాను శత్రుదేశంగా పరిగణించటం వేరు, వారు వారు చూసుకుంటారు, వారి తరఫున మనలను కూడా అదే విధంగా వ్యవహరించాలని చూడటం మనకు ఏమాత్రం మంచిది కాదు. అనేక ప్రాంతాలలో గతంలో అమెరికా తన సైన్యాలను దించి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనేది, ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలు ఆ పని చేయాలని వత్తిడి చేస్తోంది. అమెరికా ఆయుధాలకు మార్కెట్‌గా మారేందుకు, ఇరుగుపొరుగుదేశాలను శత్రువులుగా చేసుకోవటం మనకు అవసరమా ?
2018 నుంచి అమెరికన్లు చైనా మీద వత్తిడి తెచ్చి తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారు తప్ప మన దేశం నుంచి దిగుమతులకు పూనుకోవటం లేదు. మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు, దానికి ప్రతిగా మనం కూడా అమెరికా వస్తువులపై పన్నులు పెంచాల్సి వచ్చింది. మనమేదో పత్తి రైతులకు కనీస మద్దతు ధరల రూపంలో సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్దలో మన మీద దావా వేసింది అమెరికా. 2019 జనవరి-సెప్టెంబరు మాసాల మధ్య ఉభయ దేశాల వాణిజ్య వృద్ధి రేటు 8.4 నుంచి 4.5శాతానికి పడిపోయింది. రెండు దేశాల మధ్య సేవలు, వస్తువుల వాణిజ్య నిష్పత్తి 62:38శాతం ఉండగా చైనాతో వస్తువుల శాతమే ఎక్కువగా ఉంది.
అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలంటే తలసరి ఆదాయం 12,375 డాలర్లు ఉండాలి, మన దేశంలో రెండువేల డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటికీ మనలను అభివృద్ధి చెందిన తరగతి దేశాలతో జమకట్టిన ట్రంప్‌ సర్కార్‌ కొద్ధి రోజుల క్రితమే మనకు ఆరు రకాల సబ్సిడీలు దక్కకుండా చేసింది. ఆర్ధికంగా కొన్ని వందల కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగించింది. ఒక వైపు మన పరిస్ధితి ఇంట్లో ఈగల మోతగా ఉంటే అమెరికా ఈ పల్లకీ మోత కారణంగా అనేక దేశాలు మనలను సతాయించుకు తింటాయి. అలాంటి ట్రంప్‌ మనకు మిత్రుడా ?
ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనావళిలో సాధారణ ప్రాధాన్యత వ్యవస్ధ(జిఎస్‌పి) ప్రకారం రాయితీలు పొందుతున్న మనకు అభివృద్ది చెందుతున్న దేశ లబ్దిదారు(డిబిసి) హౌదాను అమెరికా రద్దు చేసింది. పర్యవసానంగా మన ఎగుమతులకు ఇస్తున్న వందలాది కోట్ల రూపాయల సబ్సిడీలు పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల నియంత్రణ వంటి అంశాలపై అమెరికా పాల ఉత్పత్తిదారులు, ఆధునిక వైద్య సాంకేతిక అసోసియేషన్‌ వంటి సంస్ధల వత్తిడి మేరకు ఇలా జరిగింది. జిఎస్‌పి రద్దు వలన ప్రధానంగా ప్రభావితులవుతున్నది చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. దీనివలన మన ఎగుమతులతో పాటు కార్మికుల వేతనాలు కూడా పడిపోతాయి. నిరుద్యోగమూ పెరుగుతుంది. మనకు జిఎస్‌పి రద్దు చేసిన ట్రంప్‌ బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, కాంబోడియా, దక్షిణాఫ్రికాలకు కొనసాగిస్తున్నాడు. అంటే ఈ దేశాల నుంచి మనకు పోటీ పెరిగినట్లే, దాన్ని తట్టుకొనేందుకు ఆయా సంస్ధలకు సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పరిస్ధితికి నెట్టిన వ్యక్తిని మనం ఆహ్వానించటమా ?
ప్రపంచ వాణిజ్య సంస్దలో వివాదాల తీర్పులపై అప్పీలు చేసుకొనేందుకు ఒక సంస్ధ ఉంది. దానిలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు ఉద్యోగ విరమణ చేశారు. కొత్త వారిని నియమించకుండా ట్రంప్‌ సర్కార్‌ అడ్డుకుంటున్న కారణంగా అది పని చేయటం లేదు.గతేడాది డిసెంబరు నుంచి అప్పీళ్లను చేపట్టలేదు. వాటిలో మనదేశానికి చెందినవి కూడా ఉన్నాయి. మన దేశం ఎంఇఐఎస్‌ పధకం ద్వారా, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, ఎస్‌ఇజెడ్‌లు, సెజ్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోట్‌ కాపిటల్‌ గూడ్స్‌ వంటి వాటి ద్వారా చేసే ఎగుమతులు, వాటికి రాయితీలు ఇవ్వటాన్ని అమెరికా సవాలు చేసింది, వాటి కారణంగా తమ కంపెనీలకు నష్టం వాటిల్లుతోందని డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన కమిటీ అవన్నీ నిబంధనలకు విరుద్దమని ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని తేల్చింది.2017లోనే తమ సబ్సిడీలు పరిమితిని దాటాయని అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా తాము సబ్సిడీలు ఇవ్వవచ్చని మన దేశం ఆ నివేదికను సవాలు చేసింది. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు అమెరికా పరిగణించటం వెనుక ఇలాంటి రాయితీలను రద్దు చేయించే ఎత్తుగడ స్పష్టంగా ఉంది.ఇలాంటి సర్కార్‌ నేత ట్రంప్‌ మన భాగస్వామి ఎలా అవుతాడు ?

Image result for donald trump india tour : who are patriots and who are not
మన దేశం నిబంధనల మేరకు ఇస్తున్న సబ్సిడీలను అభ్యంతర పెడుతున్న అమెరికా మరోవైపు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు అక్రమం అని ప్రపంచ వాణిజ్య సంస్ద పదే పదే చెబుతున్నా, తీర్పులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయటం లేదు. భారతీయ స్టీలు పైపుల తయారీదార్లకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నారనే పేరుతో కొన్ని రకాల పైపుల దిగుమతులపై 2012లో అమెరికా 300శాతం పన్ను విధించింది. అది అక్రమం అని 2014లో డబ్ల్యుటిఓ తీర్పు చెప్పింది. అయినా అమెరికా ఖాతరు చేయలేదు. గతేడాది కొన్ని మార్పులు చేసినప్పటికీ అమెరికా వైఖరిని తప్పుపట్టినా అదే పరిస్ధితి కొనసాగుతోంది. తమ 28వస్తువులపై భారత్‌ దిగుమతి పన్నులు పెంచిందంటూ అమెరికా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డబ్ల్యుటిఓలో మన దేశానికి సంబంధించి 14వివాదాలు ఉన్నాయి. పప్పుధాన్యాల దిగుమతులపై మన దేశం విధించిన నిషేధాన్ని అమెరికాతో సహా అనేక దేశాలు వివాదాస్పదం కావిస్తున్నాయి. ఇలాంటి దేశాల నేతలను నమ్మటం, వారిని కౌగలించుకోవటం ఏమిటి ? ఇలాంటి ట్రంప్‌ను వ్యతిరేకించటం దేశ ద్రోహమా లేక ఆహ్వానించి ఎర్రతివాచీ పరచటం దేశద్రోహమా ? ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d