• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

బీహార్‌ ఎన్నికల సమరం : నితీష్‌ కుమార్‌ను -మాయం – చేసిన బిజెపి !

29 Thursday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Elections 2020, BJP, JDU, LJP, Nithish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


చాణక్య భూమి బీహార్‌. అన్ని ప్రధాన పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఏకపక్షం అనుకున్న ఎన్నికలు ఎన్‌డిఏ కూటమికి వణుకుపుట్టిస్తున్నాయి. అక్టోబరు 28న జరిగిన తొలిదశ 71 స్ధానాల ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి వెనుకబడిందని వార్తలు వచ్చాయి. కరోనాను లెక్క చేయకుండా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా 55.69శాతం పోలింగ్‌ జరిగింది. నితీష్‌ కుమార్‌ను వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? నితీష్‌ కుమార్‌-నరేంద్రమోడీ కూటమిని గెలిపించాలనే ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదని పోలింగ్‌కు ముందు వచ్చిన వార్తల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో తొలి దశ ఓటింగ్‌కు రెండు రోజుల ముందు దర్శనమిచ్చిన బిజెపి పోస్టర్లలో నితీష్‌ కుమార్‌ మాయం అయ్యారు. నరేంద్రమోడీ చిత్రమే దర్శనమిచ్చింది. ఇది జెడియు శ్రేణులకు ఆగ్రహం తెప్పించిందని, అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి అభ్యర్ధుల మీద జెడియు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారా ? చాణక్య భూమిగా పేరు గాంచిన బీహార్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.


కరోనా లాక్‌ డౌన్‌ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు. ఎన్నికల ప్రకటన సమయంలో జెడియు నేత నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి విజయం సాధించనుందంటూ సర్వేల పేరుతో తొలి ప్రచారబాణం వదిలారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు మూడున మలి, ఏడున మూడవ చివరి పోలింగ్‌ ముగిసి పదవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అమెరికాలోనే సర్వేలు గాడి తప్పాయి. మన దేశం సంగతి, ప్రత్యేకించి బీహార్‌ సంగతి సరేసరి. గత సర్వేలన్నీ నిజం కాలేదు. అంధులు ఏనుగును వర్ణించిన మాదిరి తొలి దశ ప్రచార ముగింపులో కూడా కొన్ని సంస్ధలు సర్వేల వివరాలను వెలువరించాయి. చివరి క్షణం వరకు ఎటూ తేల్చుకోని ఓటర్లు కొందరు ఉంటారు. వారిని ఆకర్షించటం కోసం ఇలాంటి జిమ్మిక్కులను పార్టీలు ప్రయోగిస్తుంటాయి.


ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది. మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమితో వామపక్షాలు సర్దుబాటు చేసుకుంటాయా లేదా అన్న సందేహాలు కూడా తొలగిపోయి సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.


బిజెపి ఆశలు పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల్లో మోడీ గాలితో ఓట్లు వస్తాయా ? బీహార్‌ విషయానికి వస్తే మోడీ అధికారానికి వచ్చిన ఏడాది తరువాత జరిగిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఆ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజస్దాన్‌, చత్తీస్‌ఘర్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పలుకుబడి పని చేయలేదు. రెండోసారి పెద్ద సంఖ్యలో సీట్లతో గెలిచిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వలన బిజెపి సాధించిందేమీ లేదు. బీహార్‌లో దానికి భిన్నంగా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు బిజెపి వద్ద సమాధానం లేదు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది. చాణక్యుడిగా భావించే అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) విషయానికి వస్తే తాము ఎన్‌డిఏ, బిజెపి నుంచి విడిపోలేదని, నితీష్‌ కుమార్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పదే చెబుతోంది. తాను గతం కంటే బలపడ్డాననే అంచనాకు వచ్చిన బిజెపి నితీష్‌ కుమార్‌ను వదిలించుకొనే ఎత్తుగడలో భాగంగానే ఎల్‌జెపిని రంగంలోకి దింపిందని, నితీష్‌ కుమార్‌ పార్టీతో నిమిత్తం లేకుండానే ఎల్‌జెపితో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలో ఉందన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల ప్రకటన వరకు కలసి ఉండి విడిపోతే ఇద్దరం నష్టపోతామనే భయంతో నితీష్‌ను ఎన్నికల వరకు ఒక ముసుగుగా బిజెపి ఉపయోగించుకుంటోందని, ఫలితాలను బట్టి చూసుకోవచ్చు లెమ్మని భావిస్తున్నదని చెప్పేవారూ లేకపోలేదు.రాముడికి హనుమంతుడు ఎలానో తాను నరేంద్రమోడీకి అలాంటి వాడినని తన గుండెను చీలిస్తే మోడీయే ఉంటారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తన ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నాడు.

రంగంలోకి దిగిన తరువాత నితీష్‌కు పరిస్ధితి గడ్డుగా ఉందని అర్ధమైందని అందుకే స్ధిమితం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు.కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తోడబుట్టిన వారు ఎక్కువగానే ఉన్నారని,నితీష్‌ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి అయి ఉండవచ్చన్నారు.


బీహార్‌లో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్దితుల్లో రాష్ట్ర మంతటా పార్టీ విస్తరించకపోయినా 20శాతానికి లోబడి ఓట్లు ఉన్న నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా అంతకాలం పదవిలో ఉండటం సాధ్యమైంది. ఆర్‌జెడి-బిజెపి మధ్య పోరులో నితీష్‌కు అవకాశం వచ్చింది. కొందరు ఇది నితీష్‌ చాణక్య నీతి అంటారు. బీహార్‌లో లాలూ, నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ముగ్గురూ మండల రాజకీయాల నుంచి ఎదిగినవారే.
సర్వేలను పూర్తిగా నమ్మనవసరం లేదు గానీ కొన్ని సర్వేల తీరు ఆసక్తికరం.2010లో నితీష్‌ కుమార్‌కు మద్దతు పలికిన వారు 77శాతం, 2015లో 80శాతం ఉన్నట్లు అప్పటి సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం 52శాతానికి పడిపోయింది.లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తిరిగి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నవారు 38శాతమే అని వద్దంటున్నవారు 43శాతమని పేర్కొన్నది. సిఓటర్‌ సర్వే ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉన్నామని చెప్పింది 25శాతం, ఆశాభంగం చెందామన్నవారు 46శాతం అని పేర్కొన్నది ఈ కారణంగానే నితీష్‌తో ఇంక ప్రయోజనం లేదని బిజెపి ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత భావిస్తున్నట్లు చెబుతున్నారు.


బీహార్‌లో మండల్‌- కమండల్‌ రాజకీయాలు పెద్ద ఎత్తున నడిచాయి. మండల్‌ త్రయంలోని నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కమండలం పంచన చేరారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్కరే మిగిలారు. బీహార్‌లో అరాజక శక్తులు చెలరేగిన మాట వాస్తవం. దానికి లాలూ కారకుడని చెప్పినప్పటికీ మిగిలిన నేతలు తప్పించుకోలేరు. ఉత్తర ప్రదేశ్‌ ఏమీ దానికి తక్కువ కాదు. రెండు చోట్లా భూస్వామిక శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించటాన్ని కూడా అరాచకంగానే చిత్రించారు. పేదల పోరాటాలను అణచేందుకు భూస్వామిక శక్తులు కులాల వారీ బీహార్‌లో ప్రయివేటు సాయుధ ముఠాలను పెంచిపోషించాయి. దాడులకు పాల్పడ్డాయి. ప్రతిఘటించిన వారిని అరాజక శక్తులుగా వర్ణించారు. ప్రయివేటు సాయుధ ముఠాలను సమర్ధించిన వారిలో నితీష్‌ తక్కువ తినలేదు, బిజెపి నేతలుగా ఉన్న వారూ దూరంగా లేరు. ఇప్పుడు అలాంటి ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.
బీహార్‌ కుల సమీకరణలకు పెట్టింది పేరు. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలేవీ వాటికి అతీతంగా లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితుల్లో ఏ కులం అభ్యర్ది అయినా నితీష్‌ కుమార్‌ నిలబెట్టిన వారిని ఓడిస్తారా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిరంతరం నితీష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట కూడా ఓటర్లు జెడియును ఓడించే అభ్యర్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని బీహార్‌లో పర్యటించిన జర్నలిస్టులు రాస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగానూ, ఎన్‌డిఏ సారధిగా నితీష్‌ కుమారే అని ప్రకటించిన కారణంగా బిజెపి పోటీ చేస్తున్న చోటకూడా అసంతృప్తి చెందిన సాధారణ ఓటర్లకు నితీషే కనిపిస్తారు.

ఖండించినప్పటికీ బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఊహాగానాలు మరింతగా పెరుగుతున్నాయని బిజెపి పక్కా మద్దతుదారు అయిన స్వరాజ్య పత్రిక ఒక విశ్లేషణకు శీర్షికగా పెట్టింది. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇదే అంశం గురించి ఆ పత్రిక రాసింది. తాజా విశ్లేషణలో వ్యాఖ్యాత పేర్కొన్న అంశాల సారం ఇలా ఉంది. తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు. తొలి దశ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యానించటం సరైంది కాదని, ఈ చర్య తమను గాయపరించిందని, బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం బలపడేందుకే ఇది దోహదం చేస్తుందని జెడియు అగ్రనేత ఒకరు చెప్పారు.కేవలం మోడీ బొమ్మలతో ప్రచారం చేయటం తనకు సంతోషం కలిగిస్తున్నదని, మా బిజెపి మిత్రులు నితీష్‌ కుమార్‌ నష్టదాయకం అని గ్రహించారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు. ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.


బిజెపి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అయితే బీహార్‌ ఎన్నికల్లో అది పోటీ చేస్తున్న 110 స్దానాల్లో 51 మంది అగ్రవర్ణాలుగా పరిగణించబడుతున్నవారికే ఇచ్చింది. జనాభాలో వారు కేవలం 16శాతమే. ఇరవై రెండు మంది రాజపుత్రులు,15 భూమిహార్లు, 11 మంది బ్రాహ్మలు, ముగ్గురు కాయస్ధులు ఉన్నారు. 2015 ఎన్నికల్లో 157 స్ధానాలకు పోటీ చేసిన ఆ పార్టీ 65 మంది ఈ సామాజిక తరగతుల వారికే సీట్లు ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడింది వారే గనుక మిగతావారి కంటే వారికే ప్రాధాన్యత ఇవ్వటం సహజమే అని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన సినిమా నటుడు సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఉదంతాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేసి లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి మిత్రపక్షమైన జెడియు పోటీ చేస్తున్న 115 స్ధానాలలో ఈ సామాజిక తరగతులకు కేవలం 19 మాత్రమే ఇచ్చారు.


దేశంలో తొలిసారిగా సంఘపరివార్‌ శక్తులకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాలుగు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వారే ఉన్నారు. బలం లేని స్ధితిలో బిజెపి నేతలుగా ఉన్న అతల్‌-వాజ్‌పేయి ద్వయానికి ప్రస్తుత మోడీ-షా ద్వయం పని తీరు, ఎత్తుగడల్లో ఎంతో తేడా ఉంది. సంఘపరివార్‌ అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరినైనా ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తరువాత పక్కన పడేయటాన్ని చూస్తున్నాము. బీహార్‌లో బిజెపి పెరుగుదల లేదా స్ధిరపడటానికి నితీష్‌ ఎంతగానో సహకరించారన్నది స్పష్టం. అంతర్గతంగా బిజెపి చేయించిన సర్వేలలో పరిస్ధితి క్లిష్టంగా ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండువంతుల మెజారిటీ తమ కూటమికి వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్‌ కుమారే తిరిగి సిఎం అని పార్టీ అగ్రనేతలు చెప్పినప్పటికీ వారి అనుమానాలు వారికి ఉన్నాయి. అందుకే నితీష్‌ కుమార్‌ గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపటం లేదు. ఎన్నికల తరువాత తమను వదిలించుకొని ఆర్‌జెడి నాయకత్వంలోని కూటమితో నితీష్‌ కుమార్‌ చేరితే ఏమిటనే ఆందోళన కూడా బిజెపిలో లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో కలసి పోటీ చేసి బిజెపితో చేతులు కలిపిన పెద్దమనిషి మరోమారు అదే పని చేయరని ఎవరు చెప్పగలరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుష్‌బూతో బిజెపి సినిమా హిట్టా ఫట్టా !

13 Tuesday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, DMK, Kushboo Sunder, Kushboo Sunder in BJP, Tamilnadu politics


ఎం కోటేశ్వరరావు


సినిమా గోలగా చెప్పాలంటే ఒక హీరో లేదా హీరో తమ తదుపరి చిత్రంలో చేసేందుకు అంగీకరించటమే సగం విజయమన్నట్లుగా కొందరు నిర్మాతలు తమ ఖుషీని ప్రకటిస్తారు. ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్‌గా నీరాజనాలందుకున్న ఖుషఉ్బ గతంలో డిఎంకె, కాంగ్రెస్‌ చిత్రాల్లో నటించి ఇప్పుడు బిజెపి సినిమాలో పని చేసేందుకు అంగీకరించారు. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా ఎంతో గొప్ప తారాగణంతో తీసిన సినిమాలను జనం ఇంటికి పంపిన చరిత్ర కూడా సినిమా రంగంలో నమోదైంది.


ఒక వ్యక్తిగా ఏ పార్టీలో చేరేందుకైనా ఉన్న హక్కును ఎవరికీ కాదనలేము. అయితే జనాలకు సుద్దులు చెబితేనే మండుతుంది.పార్టీలు ఫిరాయించేవారు చెప్పే ఇలాంటి కబుర్లు విని విని జనానికి బోరు కొట్టింది. నేను ఎన్ని పార్టీలైనా మారవచ్చు, మార్పు సహజం, మారాలి అని సెలవిచ్చిన ఆమె తన సిద్దాంతాలు మాత్రం మారలేదని చెప్పారు. హీరోయిన్‌గా ఎన్ని సంవత్సరాలైనా ఫిట్‌నెస్‌ మారలేదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాను అంటే నిర్మాతలు అంగీకరించవచ్చు, అలా చేస్తే ప్రేక్షకులు ఆదరించవచ్చు. కానీ రాజకీయాలు సినిమాలు కావు. కుష్‌బూ ఏ పార్టీలో చేరితో ఆమె చెప్పిన సిద్దాంతంతో ఆయా పార్టీలు మారిపోతాయా ? ఇంతకీ ఆమె సిద్దాంతం ఏమిటి ?
తన సిద్దాంతాలు లేదా భావజాలం మారలేదు అని చెబుతున్న కుష్‌బూ పెళ్లికి ముందు కన్యలు పవిత్రంగా ఉండాలనే చాదస్తాల నుంచి సమాజం బయటపడాలని, కోరుకున్న పురుషుడితో జీవించే స్త్రీ వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కూడా కనవచ్చంటూ గతంలో వెలిబుచ్చిన భావజాలానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆమె బిజెపి వేదికల మీద ప్రకటించగలరా ? గతంలో బిజెపి మీద చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా ? డిఎంకెతో రాజకీయాలను ప్రారంభించి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు. రేపు మరొక పార్టీలోకి వెళ్లరనే గ్యారంటీ ఏముంది ? డొల్లు పుచ్చకాయలు, పార్టీలు మారేవారు ఒకే చోట ఉంటారా ? పార్టీ మారటానికి కొద్ది వారాల ముందు నరేంద్రమోడీది జుమ్లా సర్కార్‌ (అవసరానికి అనుగుణంగా మాట్లాడటం) అని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చితే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని తలూపేందుకు జనం గొర్రెలా ?


తమిళనాడులో నాలుగు సీట్లు సంపాదించుకోవటం ఎలా అనే యావలో బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తలుపు తట్టింది. లేస్తే మనిషిని కాదు అని దారినపోయే వారిని బెదిరించే కుంటి మల్లయ్య సామెత మాదిరి ఇప్పటి వరకు రజనీ వైఖరి ఉంది. ఇంతవరకు లేచింది లేదు, ఇప్పుడు లేస్తారో లేదో తెలియదు. 1996 నుంచి ఏదో ఒక రూపంలో రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పటమో సూచనలు ఇవ్వటమో చేస్తున్నారు. 2021 ఎన్నికలలో తన సత్తా చూపేందుకు సిద్దం అవుతున్నారని కొన్ని కథనాలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. తానే ఒక పార్టీని పెడతానని కూడా 69 ఏండ్ల రజనీ కాంత్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు.
సినిమా తారలు బిజెపిలో చేరటం కొత్తేమీ కాదు. గతంలో గౌతమి, నమిత, రాధారవి ఆ పార్టీలో చేరినా ఒరిగిందేమీ లేదు. కుష్‌బూ తమిళనాడులో పరిచయం అవసరం లేని స్టార్‌, మాట్లాడగల చాతుర్యం ఉంది. అందువలన వస్తారో రారో తెలియని రజనీ కోసం వేచి చూడటం కంటే ఆమెతో ప్రచారం చేయించుకోవచ్చని బిజెపి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.కుష్‌బూ డియంకె నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీకి పోయింది లేదు, కాంగ్రెస్‌లో చేరినపుడు కొత్తగా ఆ పార్టీకి పెరిగిందేమీ లేదు. ఇప్పుడు బిజెపికి కూడా ప్రచారానికి తప్ప ఓట్ల ప్రయోజనం కలగకపోవచ్చు. నేను ఇప్పుడే పార్టీలో చేరాను, ఆరునెలల తరువాత చూడండి అని విలేకర్లతో చేసిన వ్యాఖ్య బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కావచ్చు.

గతంలో కొన్ని అంశాల మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద బిజెపి లేదా హిందూమత శక్తులు సామాజిక మాధ్యమంలో ఎలా విరుచుకుపడ్డాయో, ఎన్ని కేసులు నమోదు చేశాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె బిజెపిలో చేరి సిద్దాంతాల గురించి చెప్పటాన్ని ఆశక్తులు ఎలా జీర్ణించుకుంటాయో చూడాల్సిందే. పచ్చిమితవాదులు ఆమెను అంగీకరిస్తారా ఆమె తన వైఖరిని మార్చుకుంటారా ? గతంలో ఆమె చేసిన బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారకుండా ఉంటాయా ? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన ఆమె ఈ ఏడాది మార్చినెల నుంచి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కుష్‌బూ పేరు నఖత్‌ ఖాన్‌ అంటూ ఆమె మతం గురించి బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) దాడి చేసినపుడు అవును నేను ముస్లింగానే పుట్టాను, దాని గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినపుడు ఆ పార్టీ తన భావజాలానికి సరిపడిందని చెప్పారు. మరి బిజెపి గురించి ఏమి చెబుతారు అంటే ఎవరైనా కులం, మతం, జాతి గురించి మాట్లాడితే నా రక్తం సలసల కాగుతుంది. నేను దేశభక్తురాలిని, లౌకికవాదిని కాషాయ, హిందూత్వవాదాలకు వ్యతిరేకం అని చెప్పారు. అలాంటి హిందూత్వవాదులతోనే ఆమె చేతులు కలిపారు.


ద్రవిడ కజగం పార్టీ స్దాపకుడు, హేతువాది, జీవితాంతం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మలకు వ్యతిరేకంగా ఉన్న ఇవి రామస్వామి నాయకర్‌ మనవడైన సతీష్‌ కృష్ణన్‌ ఆగస్టు నెలలో అన్నాడిఎంకె నుంచి బిజెపిలో చేరారు. ఇలా కాంగ్రెస్‌, డిఎంకె, అన్నాడిఎంకె మూడు పార్టీలలో అసంతృప్తికి గురైన వారందరనీ చేర్చుకొనేందుకు బిజెపి తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యను పార్టీ యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా చేసి ఆ పార్టీలోకి చేర్చుకుంది. నా తండ్రిని చూసి కాదు, నేను ఏమిటన్నది చూడాలని ఆమె చెప్పుకుంది. నా తండ్రి మంచివాడని, జనాలకు సాయం చేసేవాడని నాకు చెప్పారని, తండ్రితో స్ఫూర్తి పొందానని విలేకర్లతో చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా ఎంఎల్‌ఏగా ఎన్నికైతే వారికి పార్టీ తరఫున ఒక ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ పార్టీ సమావేశంలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కనీసం 25 మంది ఎంఎల్‌ఏలను పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. పార్టీ గెలుపుకోసం బాగా పనిచేసినట్లు గుర్తించిన వారికి తమిళనాడులో పార్టీలు బంగారు ఉంగరాలు, గొలుసులు బహుమతిగా ఇవ్వటం సాధారణ విషయం. బిజెపి మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇన్నోవా కార్లనే ఎరగా చూపింది.


ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ముఠాలు పార్టీలో ఆధిపత్యం మాదంటే మాదని కొట్టుకున్నాయి. అది ముదిరితే ఏదో ఒక వర్గం తమతో వస్తుందన్న ఆశలు ఒక దశలో బిజెపిలో కలిగాయి. అయితే తామిద్దరూ ఒకటేనని పళని స్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పని చేసేందుకు నిర్ణయించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. అయితే ఆ సయోధ్య ఎన్నికల వరకు నిలుస్తుందా ఏమి జరుగుతుంది అనేది అప్పుడే చెప్పలేము.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 స్ధానాలకు పోటీ చేసిన బిజెపి 2.86శాతం ఓట్లు తెచ్చుకుంది. అన్నాడిఎంకెకు 40.88శాతం, డిఎంకె కూటమికి 39.1శాతం వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి 55శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది, 39కి గాను 38 సీట్లు గెలుచుకుంది. ఇంతే కాదు 216 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సంపాదించింది. అన్నా డిఎంకె కూటమి 16 చోట్ల మెజారిటీ తెచ్చుకోగా అన్నాడిఎంకె 12, పట్టలి మక్కలి కచ్చి 3, బిజెపి ఒక చోట ఆధిక్యత ప్రదర్శించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిలో సీట్ల పంపకం పెద్ద సమస్యగాక పోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో తామే నాయకత్వం వహిస్తామని బిజెపి చెప్పుకోవటంపై అన్నాడిఎంకె గుర్రుగా ఉంది. ఎన్నికల నాటికి ఆ పార్టీ నేత శశికళ జైలు నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఆమె ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-అన్నాడిఎంకె విడివిడిగా పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసిన పట్టలి మక్కల్‌ కచ్చి 5.36 శాతం ఓట్లు తెచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి పిఎంకె, బిజెపి, తమిళమానిల కాంగ్రెస్‌ అన్నా డిఎంకె కూటమిలో చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు. అన్నాడిఎంకె బలహీనపడిన కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికలలో 20 స్ధానాలకే పరిమితమై పిఎంకెకు 7, బిజెపికి ఐదు, డిఎండికెకు నాలుగు, మరో మూడు పార్టీలకు మూడు సీట్లు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరుగుతుందా ? అన్నాడిఎంకె తన సీట్లను సగానికి తగ్గించుకుంటుందా ?


మరోవైపు డిఎంకె కూటమిలో 2019 లోక్‌ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ డిఎంకె 138, కాంగ్రెస్‌ 49, సిపిఎం, సిపిఐ పన్నెండు చొప్పున, ముస్లింలీగ్‌ ఐదు చోట్ల ఆధిక్యత ప్రదర్శించింది. ఇంతటి భారీ విజయం సాధించిన కారణంగా డిఎంకెలో సీట్ల కోసం పోటీ పడేవారు సహజంగానే ఉంటారు. అసంతృప్తి చెందిన వారిని పిలిచి పార్టీ కండువాలు కప్పేందుకు అన్నాడిఎంకె, బిజెపి సిద్దంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలాల్లో పెను మార్పులు జరిగే పరిణామాలేవీ జరగలేదు. ఈ నేపధ్యంలో ఫలితాలు కూడా లోక్‌సభ మాదిరే ఉంటాయని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పిందేమిటి – నరేంద్రమోడీ సర్కార్‌ చేస్తున్నదేమిటి !

27 Sunday Sep 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Environment, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

Farmers, India Farm bills 2020, Indian agri reforms, indian farmers, Swami nathan commission


ఎం కోటేశ్వరరావు
స్వామినాధన్‌ కమిషన్ను ఏర్పాటు చేసిన యుపిఏ సర్కార్‌ దాన్ని అమలు జరపలేదని తాము ఆపని చేస్తున్నామని నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతోంది. రైతులకు మేలు చేసే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకు వచ్చిన రెండు వ్యవసాయ, ఒక నిత్యావసర వస్తువుల చట్ట సవరణ బిల్లులు నేతి బీరకాయలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు వంటివి అనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతున్నాయి. సంస్కరణలు వాంఛిస్తున్న వారు కూడా మేము కోరుతున్నది ఇవి కాదు, రైతులకు ఉపయోగపడేవి కాదు అంటున్నారు. రైతుల సమస్యలపై 2004 డిసెంబరు నుంచి 2006 అక్టోబరు వరకు పని చేసిన స్వామినాధన్‌ కమిషన్‌ ఐదు నివేదికలను సమర్పించింది. ఏడాది తరువాత వాటి ఆధారంగా రైతుల ముసాయిదా విధానం పార్లమెంట్‌కు సమర్పించారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల్లోని ముఖ్యాంశాలను చూస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆ పేరుతో ఏం చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.


స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల సారాంశం ఇలా ఉంది. 1991-92 వివరాల ప్రకారం గ్రామీణ కుటుంబాలలోని దిగువ 51.35శాతం కుటుంబాల వద్ద ఉన్న భూమి కేవలం 3.8శాతం కాగా, ఎగువ 14.71 శాతం ధనిక రైతుల వద్ద 64.48 54శాతం ఉంది. దిగువన ఉన్న వారిలో 11.24శాతం మందికి అసలు భూమి లేదు. ఎగువన ఉన్న 2.62శాతం మంది వద్ద 15ఎకరాలు అంతకు మించి 26.67శాతం ఉంది కనుక భూసంస్కరణలు అమలు జరపాలి.
కౌలు చట్టాలు, మిగులు భూమి, వృధాగా ఉన్న భూ పంపిణీ సంస్కరణలు చేపట్టాలి. వ్యవసాయ, అటవీ భూములను వ్యవసాయేతర అవసరాలకు కార్పొరేట్‌లకు మళ్లించటాన్ని నిరోధించాలి. అవకాశం ఉన్న చోటల్లా భూమిలేని కుటుంబాలకు కనీసం ఒక ఎకరం చొప్పున భూమి ఇస్తే పెరటి తోటలు, పశుపెంపకానికి వినియోగించుకుంటారు. జాతీయ భూ వినియోగ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి భూ వినియోగం గురించి సలహాలను అందించాలి.నీటిని ప్రజా సంపదగా పరిగణించి సమాన ప్రాతిపదికన పంపిణీకి చర్యలు తీసుకోవాలి. వర్షపు నీటిని నిల్వచేయటం, ఎండిపోయిన నీటి వనరులను పునరుద్దరించటం, మెరుగైన సాగునీటి పద్దతులు, డ్రిప్‌ఇరిగేషన్‌, నీటి చైతన్య ఉద్యమం, ప్రతి గ్రామంలో నీటి పంచాయతీలు, నీటివినియోగదారుల సంఘాల ఏర్పాటు, కరవు,వరద నిబంధనల రూపకల్పన.
రాష్ట్ర స్దాయిలో పశుదాణా, గడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు, జాతీయ పశుసంపద అభివృద్ది మండలి ఏర్పాటు, కోళ్ల పెంపకాన్ని వ్యవసాయంతో సమంగా గుర్తించటం, గృహ కోళ్ల పెంపకందార్లకు మద్దతు, చిన్న కోళ్ల పెంపక కేంద్రాల ఏర్పాటు. అందరికీ చేపలు అనే ఇతివృత్తంతో చేపల పెంపకం, పట్టటం,మార్కెటింగ్‌ గురించి శిక్షణ, సామర్ద్యకేంద్రాల ఏర్పాటు.జీవ వైవిధ్య వనరులపై సాంప్రదాయ హక్కులను గుర్తించటం, జెనోమ్‌ క్లబ్‌లు,జన్యు మార్పిడి అభివృద్ధి.
చిన్న రైతాంగం, ప్రకృతికి అనుకూలమైన పరిశోధనల నిమిత్తం జాతీయ బయోటెక్నాలజీ నియంత్రణ మండలి ఏర్పాటు. మేథో సంపత్తి హక్కుల విధానాలకు రూపకల్పన, వ్యవసాయ విపత్తు నిధి ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు సహకార వ్యవసాయ సేవా సంస్ధల రూపకల్పన, స్వయం సహాయక బృందాల ద్వారా బృంద వ్యవసాయ సంస్దల ఏర్పాటు, చిన్న కమతాల భూ ఖండాలకు రూపకల్పన, ఉత్పత్తిదారులు, కొనుగోలుదార్లు ఉభయులూ లబ్ది పొందే విధంగా ఒప్పంద వ్యవసాయ నిమిత్తం నిబంధనల రూపకల్పన, రైతులు లబ్దిదార్లుగా కంపెనీల ఏర్పాటు, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించే విధంగా తక్కువ వడ్డీలతో పధకాలకు రుణాలు, ఉత్పత్తి మరియు ప్రోసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు తోడ్పాటు.
ఆహారము, చిన్న రైతులకు ఆదాయ భద్రతకు తోడ్పడే విధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరల పరిధి విస్తరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్ధిక సంస్ధల సంయుక్త భాగస్వామ్యంలో మార్కెట్‌ ధరల స్ధిర నిధి ఏర్పాటు, గ్రామాలలో రైతు కుటుంబాలు క్షయ, ఎయిడ్స్‌ వంటి వ్యాధుల బారిన పడినపుడు ఉచితంగా ఔషధాలు అందుబాటులో ఉంచటం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర జీవనానికి తోడ్పాటు, భారత వాణిజ్య సంస్ధ ఏర్పాటు వంటి అంశాలను స్వామినాధన్‌ కమిటీ సిఫార్సు చేసింది.


పైన పేర్కొన్న అంశాలలో గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటంటే ముఖ్యమైన అంశాల జోలికి పోలేదనే చెప్పాలి. వాటిని అమలు జరపకుండా సిఫార్సులను అటక ఎక్కించి మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించి వాటి వెలుపల ప్రయివేటు కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు అవకాశమిస్తూ చట్ట సవరణలు చేశారు. మార్కెట్‌ కమిటీలు, వాటి పరిధి నిర్ణయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎక్కడో ముంబై, ఢిల్లీలో ఒక చోట నమోదు చేసుకుంటే చాలు దేశమంతటా కొనుగోళ్లు చేయవచ్చు. అంటే మరోకొత్త దళారీ వ్యవస్ధకు నాంది పలుకుతున్నట్లే . ఇంట్లో ఎలుకలుంటే అవి చేరకుండా కప్పులను మార్చుకోవాలి, మరొక చర్యతో వాటిని లేకుండా చేసుకోవాలి తప్ప ఇండ్లనే ఎవరైనా కూల్చివేస్తారా ! తగులబెడతారా ?

ఒప్పంద వ్యవసాయం, ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకొనే ఏర్పాటు వంటి చర్యల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయివేటు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా వాణిజ్య సులభతరానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి, అయినా విదేశీ పెట్టుబడులు రాలేదు, స్వదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి ఎందుకు కాలేదు ? 2006లోనే బీహార్‌లో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేశారు. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర కూడా రాక నష్ట పోయిన రైతులు బీహార్‌లో ఈ ఏడాది జూన్‌ చివరి వారంలో కరోనాను కూడా లెక్కచేయకుండా మొక్కజొన్న హౌమం చేసి నితీష్‌కుమార్‌-బిజెపి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మొక్కజొన్నల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కారణంగా మార్కెట్‌ కుదేలయిన విషయం తెలిసిందే. దీని గురించి తెలంగాణా హైకోర్టులో కేసు దాఖలైన సంగతీ తెలిసిందే.


వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవసరమైన గోదాముల ఏర్పాటును ప్రభుత్వాలు దాదాపు నిలిపివేశాయి. ఇదే సమయంలో ప్రయివేటు పెట్టుబడులు రాలేదు. మెట్రో వంటి సంస్ధలు బడా పట్టణాల్లో ఏర్పాటు చేసిన పెద్ద దుకాణాలు, గోదాములు తప్ప గ్రామీణ ప్రాంతాలలో కొత్తవేమీ రాలేదు. నిత్యావసర వస్తువుల నిల్వలపై ప్రభుత్వాల ఆంక్షల కారణంగా తాము గోదాములను ఏర్పాటు చేయటం లేదని బడా సంస్దలు చెబుతున్నాయి. వాటికోసమే అనేక వస్తువులను నిత్యావసరాల జాబితా నుంచి, నియంత్రణ నుంచి ఎత్తివేశారు.
మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించారు. తెలుగు రాష్ట్రాల్లో పాత తాలుకా కేంద్రాలు లేదా కొన్ని పెద్ద ప్రాంతాలలో మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటి వెలుపల కొనుగోలు చేసే బడా సంస్దకు రైతులు తమ సరకులను ఎక్కడికి తరలించాలి? లేదా సదరు సంస్ధ వారే గ్రామాలకు వచ్చి తమ స్వంత ఏర్పాట్లు చేసుకుంటారా ? పన్నులు, కమిషన్లకు పోతున్న మొత్తాలు రైతుల ధరల్లో ప్రతిబింబిస్తాయా? కనీస మద్దతు ధరలకు కంపెనీలు కట్టుబడి ఉంటాయా ? ఒప్పంద వ్యవసాయం కింద రైతులు అమ్మే సరకుల ధరలు వాటి కంటే ఎక్కువ ఉంటాయా ? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.


ఇక గ్రామాలకు ప్రయివేటు పెట్టుబడులు వస్తాయన్న అంశాన్ని చూద్దాం. కేరళలో ఎప్పటి నుంచో మార్కెట్‌ యార్డులు లేవు. అయితే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్లను ఏర్పాటు చేసింది తప్ప ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. కేరళలో టీ, కాఫీ, రబ్బరు,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల వంటి వాణిజ్య పంటలే ఎక్కువ, అయినా పెట్టుబడులు ఎందుకు రాలేదు ? ముందే చెప్పుకున్నట్లు బీహార్‌లో పద్నాలుగేండ్ల క్రితం మార్కెట్‌ యార్డులు రద్దయ్యాయి. అక్కడి గ్రామాలకు వచ్చిన పెట్టుబడులేమిటో బిజెపి పెద్దలు చెప్పగలరా ? అధికారంలో ఉన్నది ఆ పార్టీ, మిత్రపక్షమే.
కేంద్ర బిల్లులు రాకముందే బిజెపి ఏలుబడిలోని గత మహారాష్ట్ర ప్రభుత్వం 2016లోనే పండ్లు, కూరగాయలను మార్కెట్‌ యార్డుల నుంచి తప్పించింది.2018లో చట్టాన్ని మరింత నీరుగార్చి ఒక ఆర్డినెన్స్‌ ద్వారా ఆహార, పశు సంపద లావాదేవీలను యార్డుల వెలుపల అనుమతించింది. అక్కడ కూడా ప్రయివేటు పెట్టుబడుల జాడలేదు.


వ్యవసాయ రంగ నిపుణులు అశోక్‌ గులాటీ చెబుతున్న అంశాల సారం ఇలా ఉంది. తాజా బిల్లులు వ్యవసాయరంగం, సేకరణ, సరఫరా గొలుసుకట్టు ఆటతీరునే మార్చివేస్తాయి. ఇదొక పెద్ద సంస్కరణ, మంచి ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాలి. చివరి క్షణంలో అధికారులు దీన్ని పాడు చేసే అవకాశం ఉంది.1943లో కొరత, కరవు ఏర్పడినపుడు నిల్వలకు సంబంధించిన పరిమితులు పెట్టారు. నిత్యావసర వస్తువుల చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు వందశాతం ధరలు పెరిగినపుడు వారు తిరిగి పరిమితులు పెట్టవచ్చు. ఇప్పుడు మనం మిగులుతో ఉన్నాము. అందువలన పునరాలోచన దృక్ఫధంతో చూడాలి.
ఇది ప్రధానంగా ధరల స్ధిరీకరణ మరియు మార్కెట్‌ తిరిగి పనిచేసేందుకు తలపెట్టిన సంస్కరణ. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలపై నియంత్రణలకు నిత్యావసర సరకులు చట్టం ప్రభుత్వానికి ఎలాగూ అధికారం ఇస్తుంది. ఇప్పుడు నవీకరించిన గోదాముల మీద పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పంటలు మార్కెట్‌కు వచ్చిన తరువాత ఇప్పుడు పెద్ద ఎత్తు ధరలు పడిపోవు, ఏడాది పొడవునా స్ధిరంగా ఉంటాయి. రైతులు ప్రయివేటురంగం మరియు ప్రభుత్వ కనీస మద్దతు ధరలలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లలో వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు, రైతులకు మరొక అవకాశం లేదు.
ప్రస్తుతం మార్కెట్‌ యార్డుల పరిధిలో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు లేదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించారు. ఒక అనుమతితో దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.వ్యాపారులు ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలు లేదా సహకార సంస్ధలు, వ్యవసాయదారుల సంస్ధల కేంద్రాలలో కొనుగోలు చేయవచ్చు. అముల్‌ కంపెనీ ప్రతి రైతు వద్దకు వెళ్లి పాలు కొనుగోలు చేయదు. రైతులు తాము కోరుకున్న ధర ఎక్కడ వస్తే అక్కడ, చెల్లింపులు సకాలంలో జరిపేవారికి విక్రయించుకోవచ్చు.
ఇప్పుడు మార్కెట్‌ యార్డులలో రెండు నిమిషాల లావాదేవీలకు కమిషన్‌ ఏజంట్లు అధికారికంగా ఎనిమిదిశాతం(ముంబై వాషి లేదా అజాద్‌పూర్‌ మార్కెట్‌) తీసుకుంటున్నారు. అనధికారికంగా రెండు వైపులా మొత్తం 14-15శాతం ఉంది. కమిషన్‌ మొత్తాలను నిర్ణయించేది ఎవరు ? మార్కెట్‌ కమిటీ అంటే రాజకీయవేత్తలు-మాజీ ఎంఎల్‌ఏ లేదా ప్రస్తుత ఎంఎల్‌ఏ లేదా వారి దగ్గరివారు కావచ్చు, ఇప్పుడు అసమర్ధ అవినీతి గుత్తాధిపత్యం బద్దలు కానుంది.
తదుపరి అడుగు ఒప్పంద వ్యవసాయానికి అనుమతి. ఇప్పుడు రైతులు మంద మందలుగా సాగు చేస్తున్నారు, అది ఆకస్మికంగా ధరలు పడిపోవటానికి కారణం అవుతోంది. దీన్ని నిరోధించేందుకు పంట చేతికి వచ్చిన తరువాత తమకు వచ్చే ధర ఎంతో రైతులు ఒక అంచనాకు రావాలి.ఒప్పంద వ్యవసాయంతో రైతుల విక్రయ ధర ముందే నిర్ణయం అవుతుంది. పండ్లు, పూల విషయానికి వస్తే నిర్ణీత నాణ్యత లభిస్తుంది. ప్రస్తుతం వినియోగదారు చెల్లిస్తున్న దానిలో రైతుకు మూడో వంతు మాత్రమే లభిస్తోంది. అదే 60శాతం లభిస్తే మనం ఎంతో గొప్పపని చేసినట్లే, ఇది ఇప్పటికే పంచదార, పాలవిషయంలో జరుగుతోంది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్దలో 46శాతం తరుగు ఉంటోందని శాంతకుమార్‌ కమిటీ చెప్పింది.పేదలు నేరుగా నగదు తీసుకుంటారా మరొకటా అనేది వారినే ఎంచుకోనివ్వండి. వారు గుడ్లు లేదా రొట్టె తినదలచుకున్నారా లేక మద్యం తాగుతారా అన్నది వారికే వదలివేద్దాం. నేరుగా మహిళలకు నగదు బదిలీ చేస్తే ఆసక్తికరమైన మార్గదర్శకాలకు దారి తీస్తుంది. మరోసారి చెబుతున్నా, సంస్కరణలు ఎంతో పెద్దవి, మంచి ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూద్దాం.


గతంలో నూతన ఆర్ధిక సంస్కరణలనో మరొకటనో మార్పులు తలపెట్టిన ప్రతివారూ ఇదే కబుర్లు చెప్పారు.ఆచరణ అందుకు భిన్నంగా జరిగింది. నూతన ఆర్ధిక సంస్కరణలు వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పాయి. యజమానులు వ్యవసాయం మానుకోవటం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గటం తదితర కారణాలతో కౌలు రైతులు పెద్ద ఎత్తున పెరిగారు. యాజమాన్య లేదా రక్షిత హక్కులు లేని కారణంగా ప్రభుత్వం అందించే రైతు బంధు, కిసాన్‌ సమ్మాన్‌ వంటి పధకాలేవీ వారికి వర్తించటం లేదు. ఎరువులకు ఇస్తున్న నామ మాత్ర సబ్సిడీ కూడా యజమానుల ఖాతాలకే జమ అవుతున్న కారణంగా నేరుగా నగదు బదిలీ వద్దని వారు చెబుతున్నా వినిపించుకోవటం లేదు.


ఒప్పంద వ్యవసాయం గురించి స్వామినాధన్‌ కమిషన్‌ కూడా సూచించినప్పటికీ తలెత్తే సమస్యలను కూడా వివరించింది. పంటల కొనుగోలుదారులు తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. లాభాలు వచ్చే ఎగుమతి ఆధారిత పంటలకు మాత్రమే ఒప్పందం చేసుకుంటారు. ఆహార భద్రత గురించి పట్టదు. పెద్ద రైతులతోనే ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తారు. పర్యవసానం చిన్న రైతులు పెద్ద రైతులతో ఒప్పందానికి నెట్టబడతారు. కొత్త దొంతర ఏర్పడుతుంది.


కేరళలో ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి ఒక కేసును చూద్దాం. నేలతాడి అనే ఔషధ మొక్కను సఫేద్‌ ముస్లీ అని కూడా అంటారు. 2004లో అంబికా దేవి అనే చిన్న రైతు తన ఒకటిన్నర ఎకరాలలో దాన్ని సాగు చేసేందుకు నందన్‌ బయోమెట్రిక్స్‌ దాని అనుబంధ సంస్ధ హెర్బ్స్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. కనీసం కిలో వెయ్యి రూపాయలకు ఉత్పత్తిని కొనాలనే ఒప్పందం కుదిరింది.కంపెనీ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. దీని గురించి 2008లో కేరళ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. తమ మధ్య కుదిరిన ఒప్పందం వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోకి రాదని వాదించింది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంది. అక్కడ కూడా చుక్కెదురైంది. అలాంటి రైతులను వినియోగదారుల రక్షణ చట్టం నుంచి మినహాయించటం చట్టాన్ని వెక్కిరించటమే అని కోర్టు పేర్కొన్నది.


కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లు ఈ కేసును పరిగణనలోకి తీసుకోలేదని, రైతులకు వినియోగదారు రక్షణ కల్పించలేదని అందువలన ఇది పెద్ద లోపమని చెబుతున్నారు. అందువలన కోర్టుల నుంచి రైతులు రక్షణ పొందలేరు. రక్షణ లేదు అయినా ఒప్పంద వ్యవసాయం వద్దంటే రైతులు ఆగుతారని అనుకోలేము. ఆకర్షణ, ప్రలోభాలకు లొంగిపోయి ఒప్పందం చేసుకొన్న తరువాత కంపెనీ మోసం చేస్తే చేయగలిగేదేమీ ఉండదు. అధికార యంత్రాంగం ఎవరి పక్షాన ఉంటుందో తెలిసిందే. అందువలన ప్రభుత్వం ప్రతి ఒప్పందంలో మూడవ పక్షంగా చేరితేనే రక్షణ ఉంటుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్న ప్రభుత్వాలు అలాంటి ఒప్పందాలలో చేరతాయా ? తాజా బిల్లుల్లో అలాంటి సూచనలేమీ లేవు ? అలాంటపుడు పాలకుల మాటలను ఎలా నమ్మాలి ?స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులన్నీ అమలు చేసిన తరువాత అవసరమైతే మిగతా సంస్కరణల గురించి ఆలోచించవచ్చు.


ఇక అశోక్‌ గులాటీ వంటి వారు చెబుతున్న నేరుగా నగదు బదిలీ గురించి చూద్దాం. ఇది సబ్సిడీల కోత లేదా నామ మాత్రం గావించటానికి ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ముందుకు తెచ్చిన పద్దతులు. గత ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ 70వేల కోట్ల రూపాయలకు అటూ ఇటూగా మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక్క యూరియా తప్ప మిగిలిన వాటిపై ధరల నియంత్రణ ఎత్తివేసింది. మార్కెట్లో ఎంత ధర పెరిగినా ఆ 70వేల కోట్లనే సర్దుబాటు చేస్తున్నారు తప్ప పెంచటం లేదు. ఇదే పద్దతిని అన్ని సబ్సిడీలకు వర్తింప చేసే ఎత్తుగడతో కేంద్రం ముందుకు పోతోంది. ఇప్పుడు తలపెట్టిన విద్యుత్‌ సంస్కరణల లక్ష్యం కూడా అదే. వినియోగదారుకు అందచేసేందుకు ఒక యూనిట్‌కు అయ్యే ఖర్చులో 20శాతానికి మించి రాయితీలు ఇవ్వకూడనే నిబంధనను ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కారణంగానే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం షరతులు విధించింది. అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే రైతుల సంక్షేమం, సాధికారత పేరుతో తీసుకుంటున్న చర్యల వెనుక ఆంతర్యం, సంస్కరణల పర్యవసానాలు ఏమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా రైతులు ఉన్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిఎస్‌టి మాదిరి దేవుడి లీల అంటే మా రైతుల గతేంగాను మోడీ గారూ !

23 Wednesday Sep 2020

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Act of God, Farmers matters, Indian agri reforms, indian farmers, narendra modi promises and facts


అయ్యా నరేంద్రమోడీ గారూ !


ఒక రైతు బిడ్డగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీకు గానీ, మీ అభిమానులకు గానీ నచ్చకపోతే నచ్చ లేదని చెప్పండి, నేను చెప్పినదాంట్లో తప్పేమిటో చర్చించండిగానీ దేశద్రోహులు అని ముద్రవేయటం చాల బాగోదని మీ వారికి చెప్పండి. రైతులను తూలనాడిన వారికి ఈ దేశంలో భవిష్యత్‌ ఉండదు. వెన్ను విరగ కొడతారు.


ఉద్యోగాలు రాకపోవటానికి కుర్రాళ్లకు నైపుణ్యం లేదని ఎత్తున శిక్షణా కేంద్రాలంటూ పెద్ద హడావుడి చేశారు. నైపుణ్యం సంగతి దేవుడెరుగు ఆ పేరుతో వేల కోట్ల రూపాయలను ఆ పేరుతో స్వాహా చేశారు. కొత్త ఉద్యోగులు రాకపోగా ఉన్న ఉపాధిపోయింది. మభ్యపెట్టే కళలో మీకు మాత్రం నైపుణ్యం పెరిగిందన్నది స్పష్టం. ఆ చాతుర్యం గురించి గతంలో మా పెద్దలు ఇందిరా గాంధీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మీరు ఆమెను మించిపోయినట్లు చెబుతున్నారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నే వాడు వస్తాడు. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక విషయానికి వస్తా !
పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్ట సవరణ బిల్లులు ఒక మూలమలుపు అని మీరు వర్ణించారు. నిజంగానే, అయితే అది రైతులను ముంచేందుకా తేల్చేందుకా అన్నదే సమస్య. అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట చెప్పకుండా, చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకుండా కొత్త విషయాలను జనానికి చెప్పటంలో దిట్టగా మారారు. ఈ విషయంలో మీకు మరొకరు సాటి రారు. అమెరికా అగ్రనేత అబ్రహాం లింకన్‌ ఒక మాట చెప్పారు. ” మీరు కొంత మంది జనాన్ని ఎల్లవేళలా, అందరినీ కొన్ని వేళల్లో వెర్రి వెంగళప్పలను చేయగలరు. అయితే మీరు అందరినీ, అన్ని వేళలా ఆ పని చేయలేరు ” అన్నారు. ఆ మాదిరిగానో మరో విధంగానో తెలియదు గానీ ఈ సారి మీ మాటలను నమ్మేందుకు సిద్దంగా లేమంటూ కరోనాను సైతం ధిక్కరించి రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మీ సిబ్బంది లేదా మీ పార్టీ వారు మీకు ఈ విషయాలు సరిగా చెబుతున్నట్లు లేదు ? లేక మీరే వినేందుకు సిద్దంగా లేరా ? ఏదైనా కావచ్చు, జనానికి మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. నా అమాయకత్వం గాకపోతే అప్రియములు రాజుగారికి చెప్పకూడదనే వంది మాగధుల లోకోక్తి మీకు తెలియకుండా ఉంటుందా ? మీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి మీరు తరచూ విలేకర్ల సమావేశాలు పెడితే రెండోవైపు ఏం జరుగుతోందో మీకు తెలిసేది. సముద్రాలు ఇంకి పోయినా, భూమ్యాకాశాలు దద్దరిల్లినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇసుక నుంచి తైలం తీసినా, కుందేటి కొమ్ము సాధించినా పదవిలో ఉన్నంత కాలం విలేకర్ల గోష్టి పెట్టను, వారి ముందు నోరు విప్పను అని మీరు పట్టిన పంతం అనితర సాధ్యమే ! మీరు తప్ప ఇంతవరకు ప్రపంచంలో మరొక లేరు, భవిష్యత్తులో ఉండరు !


2022-23 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మీరు గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. దాని గడువు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. 2015-16 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏడు సంవత్సరాల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని మీరు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ తయారు చేసిన ఒక పత్రంలో పేర్కొన్నారు. దీనికి గాను ఏటా వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు దాని ప్రస్తావన లేకుండా కొత్తవిషయాలు చెబుతున్నారు. పాత వాగ్దానం మరచిపోయినట్లుగా కనిపిస్తోంది, దేని మీదా నిలకడ కనిపించటం లేదు. అందుకే మాకు అనుమానం. ఈ విషయంలో మీకు మీరే సాటి కదా ! నల్లధనం అన్నారు, పెద్ద నోట్లను రద్దు చేశారు. సాధించిందేమిటో మీ నోట మేం వినలేదు. గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు, అదీ అంతే, అచ్చే దినాలన్నారు. చచ్చేదినాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో కుక్కలను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఆకలో అన్నమో రామచంద్రా అని జనం అంటుంటే పోషకాహారం తినాలని చెప్పారు. ఎమితిని సెపితివి కపితము అన్నట్లుగా అలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీకు ఏమైందో అని మేమంతా జుట్టు పీక్కుంటున్నాము.


కరోనాతో నిమిత్తం లేకుండానే మీ అచ్చేదిన్‌లోనే ఒక్క ఏడాది కూడా నీతి అయోగ్‌ చెప్పిన 10.4శాతం వృద్ధి రేటు లేదు. అసలు మొత్తం జిడిపి వృద్ధి రేటే ఆ స్దాయిలో లేదు. అయితే ఈ కాలంలో విత్తనాల బిల్లు, నగదు బదిలీ, కనీస మద్దతు ధరల పెంపు, జీరో బడ్జెట్‌, సహజ వ్యవసాయ సాగు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల వ్యాపార సంఘాల గురించి మీరు, మీ మంత్రులు ఎన్ని కబుర్లు చెప్పారో ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటారా ? అవన్నీ పక్కన పెట్టి కొత్త విషయాలు చెబుతున్నారు ? నిజమే, ఇన్ని తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని సాగుపనులు ముగిసిన తరువాత పిచ్చాపాటీలో మేము అనుకుంటూ ఉంటాం.


మాట్లాడితే స్వామినాధన్‌ పేరు చెబుతారు. కనీస మద్దతు ధరల నిర్ణయంలో ఆయన కమిటీ చేసిన సిఫార్సును గత పాలకులు, మీరూ పట్టించుకోలేదు.విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ కూలీలు, దున్నకం,కుటుంబ సభ్యుల శ్రమ, భూమి కౌలును పరిగణనంలోకి దీసుకొని ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉండగా దాన్ని నీరుగార్చారు. చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య సహాయతా సంఘం(సఫాక్‌) పేరుతో ఒక సంస్ధను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి అలాంటి ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అవిగాక కొత్తగా ఐదువేల కోట్ల రూపాయలతో 2023-24 నాటికి పదివేల నూతన సంఘాలను ఏర్పాటు చేయతలపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు వేల సంస్ధలను నాబార్డ్‌ ఏర్పాటు చేసింది. ఇవన్నీ సహకార సంఘాల వంటివే. గతంలో భూస్వాములు, ధనిక రైతులు సహకార వ్యవస్ధలను ఎలా నాశనం చేసిందీ చూశాము. అయితే సహకార సంఘాలకు, వీటికీ తేడా ఉంది. వీటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు, హామీ కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సంస్ధలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గతంలో ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మూతపడ్డాయి, అనేకం నామమాత్రంగా పని చేస్తున్నాయి. సఫాక్‌ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం 30శాతం సంస్దలు మాత్రమే బతికి బట్టగలుగుతున్నాయి, 20శాతం జీవన పోరాటం చేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి, కార్యకలాపాలను ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ప్రతి సభ్యుడికీ రెండువేల రూపాయల చొప్పున లేదా ఒక సంస్దకు గరిష్టంగా 15లక్షలకు మించకుండా మాచింగ్‌ గ్రాంట్‌, రెండు కోట్ల రూపాయల వరకు రుణం ఇస్తుంది. ఈ పరిమితుల కారణంగా అనేక సంస్ధలు చిన్న స్ధాయిలో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయి. అయినా కంఠశోష గాకపోతే మీకు ఈ విషయాలు తెలియవా ? కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లులు చట్ట రూపం దాల్చిన తరువాత బడాకంపెనీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతాయి. పెద్ద కంపెనీలే బడా సంస్ధల దెబ్బకు తట్టుకోలేకపోతున్నపుడు వాటితో రైతు సంస్ధలు ఏమేరకు బతికి బట్టకడతాయన్నది మా ప్రశ్న.


నేరుగా (సబ్సిడీ) నగదు బదిలీ పధకం వలన తమ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, గతంలో మాదిరే సబ్సిడీ ధరలకే ఎరువులను అందించాలని నీతి అయోగ్‌ తరఫున జరిపిన ఒక సర్వేలో 64శాతం మంది రైతులు చెప్పినట్లు తేలింది. అయితే దీన్ని అంగీకరిస్తే సబ్సిడీల ఎత్తివేతకు సోపానమైన నేరుగా నగదు బదిలీ పధకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని గాకపోతే దాన్ని ఎందుకు అంగీకరించలేదో చెబుతారా ? నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది అని గతేడాది పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఒక ప్రభుత్వ నివేదిక వచ్చింది. పకోడీలు అమ్మేవారికి కూడా ఉపాధి కల్పించినట్లే, అలాంటి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదని అప్పుడు చెప్పారు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా దాన్నే ఆమోదించారు. నేరుగా సబ్సిడీ బదిలి గురించి అబ్బే అబ్బే ఇది సమగ్రమైన సర్వే కాదు, తగినంత మంది లబ్దిదారులను ప్రశ్నించలేదు అని నివేదికను తిరస్కరిస్తున్నట్లు 2019నవంబరు 19న పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు చెప్పించిన మీ చతురతను ఎలా మరచిపోగలం !


జీరో బడ్జెట్‌, సేంద్రీయ వ్యవసాయం పేరుతో మీ బిజెపితో కలసి పాలన సాగించిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. అది రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటానికి, రైతులు రుణ విముక్తులు కావటానికి తోడ్పడుతుందని చెప్పారు.ఈ తరహా వ్యవసాయాన్ని చేయించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు 2018లో పెద్ద హడావుడి చేశారు. ఎనభై లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని 60లక్షల మంది రైతులు 2024 నాటికి సాగిస్తారని చెప్పారు. ఏమైనట్లు ? దేశంలో ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదేమి ? ఆవు పేడ, మూత్రం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా వాటితోనే పంటలు పండిస్తున్నారా ? ఇప్పుడు మీరు చెబుతున్న కార్పొరేట్‌ లేదా కాంట్రాక్టు వ్యవసాయం ఆవు పేడ, మూత్రంతోనే చేయిస్తారా ? అమాయక రైతులం మీరు ఏం చెప్పినా వినక చస్తామా ?


కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు వీధుల్లోకి వచ్చారు. దీని వెనుక మార్కెట్లు రద్దయితే ఆదాయం కోల్పోయే వ్యాపారులు ఉండి నడిపిస్తున్నారని మీ పార్టీ బిజెపి ప్రచారం చేస్తోంది. ఒక వైపు మార్కెట్లను రద్దు చేస్తామని మేమెక్క డ చెప్పాం అంటారు , ఏంది సారూ ఇది ! ఆందోళనకు దిగిన వారు దేశద్రోహులని మీవారే సామాజిక మాధ్యమంలో దాడి చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి ప్రధాన కారణం ఈ రంగానికి సబ్సిడీలను రద్దు లేదా గణనీయంగ కోత పెట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవటం, తగిన ధరలు లేకపోవటం, దిగుబడులు పెరగకపోవటం, పరిశోధనలను పక్కన పెట్టటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాపారుల దోపిడీ అనేది ఒక కారణం మాత్రమే. పాలకులకు చిత్తశుద్ది ఉంటే దాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి కనుక ఏదో ఒక సాకు చూపాలి. రైతులకు ప్రత్యక్షంగా కనిపించేది వ్యాపారులు, వారి అక్రమాలే కనుక వారిని చూపి మీరు చేయదలచుకున్నది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాం. పార్లమెంటులో మాదిరి వ్యవసాయ చట్టాలను మా మీద రుద్దటం సాధ్యం కాదని సవినయంగా మనవి.
వ్యవసాయ మార్కెట్‌ యార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. అక్కడ వ్యాపారం చేసే వారు విధిగా ప్రభుత్వం వద్ద నమోదు కావాలి. అక్కడ జరిగే లావాదేవీల వలన ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దళారులను అరికట్టేందుకే జాతీయ ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్‌ (ఇనామ్‌)ను ప్రవేశపెడుతున్నట్లు మీరు 2016లోనే చెప్పారు. అనేక రాష్ట్రాలకు చెందిన మార్కెట్లను వాటితో అనుసంధానం చేశారు. మొత్తం 2,500 మార్కెట్‌ కమిటీలకు గాను 585 ఈ వ్యవస్ధలో ఉన్నాయి. (బీహార్‌లో వాటిని 2006లోనే రద్దు చేశారు) ఇప్పటివరకు దాని వలన గతం కంటే రైతులు పొందిన ప్రయోజనాలు ఏమిటో ఎవరైనా రైతులకు వివరించారా ? అది నిజంగా ప్రయోజనకరంగా ఉంటే అన్నింటినీ అనుసంధానించాలని వత్తిడి తెచ్చి ఉండేవారు కాదా ?ఈ పాటికి రైతులు మొత్తం ఆ వ్యవస్ధ ద్వారానే లావాదేవీలు ఎందుకు జరపటం లేదు ?


ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పాలి. మార్కెట్‌ యార్డుల వెలుపల వాణిజ్య లావాదేవీలు జరిపితే వ్యాపారులు పన్ను చెల్లించాలి. ఇప్పుడు మీరు మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో తెలుగుదేశంతో పోటీపడి మరీ మద్దతు ఇచ్చారు. జగన్‌ నవరత్నాల అమలుకు ఇప్పటికే డబ్బు లేదు. ఇప్పుడు మార్కెట్ల ఆదాయం కూడా పోతే ఏం చేస్తారో తెలియదు. ఆదాయ నష్టానికి కేంద్రం ఒక్క పైసా కూడ ఇవ్వదు మరి. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి అన్నట్లుగా జగన్‌ కష్టాలు జగన్‌వి పాపం !


ఆంధ్రప్రదేశ్‌ను మీరూ కాంగ్రెస్‌ మరికొన్ని పార్టీలు కలసి పోటీ బడి విభజించాయి. అప్పుడు నా సామిరంగా పార్లమెంటులో మీ వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్‌ వంటి నేతలు చేసిన హడావుడి, అబ్బో చూడవలసిందేగానీ చెప్పతరం కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఐదు సంవత్సరాలు పెడతామని మన్మోహన్‌ సింగ్‌ చెబితే మీ వెంకయ్య నాయుడు హడావుడి చేసి ఐదును పదేండ్లకు ఒప్పించటానికి చెమటోడ్చాల్సి వచ్చినట్లు చెప్పారు. తరువాత మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా అదే చెప్పారు. తీరా జరిగిందేమిటి ? ప్రత్యేక హౌదా లేదూ పాడూ లేదు. కాంగ్రెస్‌ నేతలు విభజన చట్టంలో పెట్టి ఉంటే సాధ్యమయ్యేది నేరం వారిదే అంటూ తప్పించుకున్నారు. దాని గురించి మరోసారి మాట్లాడవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇప్పటి సిఎం జగన్మోహనరెడ్డిగారికీ తెగేసి చెప్పారు.
పార్లమెంట్‌లో చర్చనూ విస్మరించారు. నిత్యం దేవుడి గురించి చెప్పే మీరు వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాన్ని ఖాతరు చేయలేదు. వ్యవసాయ చట్ట సవరణల్లో కనీస మద్దతు ధర గురించి, పంటల సేకరణ హామీలను చేర్చకుండా బిల్లులను ఆమోదించారు. మరోవైపు అబ్బే అవేమీ రద్దు కావు అని నమ్మమంటున్నారు. ఒక్క మాట అడిగితే ఏమనుకోరుగా సారూ ! మీరు దేవుడు అని మా వెంకయ్య నాయుడు గారు గతంలో వర్ణించారు. జిఎస్‌టి విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదిరింది. ఐదేండ్ల పాటు పన్ను ఆదాయం తగ్గితే కేంద్రం భర్తీ చేస్తుందని దానిలో అంగీకరించారు. మన నిర్మలమ్మగారు దేవుడి లీల కారణంగా తగినంత ఆదాయం రాలేదు కనుక కేంద్రం చేసేదేమీ లేదు, కావాలంటే అప్పులిప్పిస్తాం అప్పు ఎలా కావాలో తేల్చుకోండి అన్నారు. అదేంటి సారూ మీరు దేవుడై ఉండి ఇంతవరకు మాట్లాడలేదు. పోనీ అదేమి నిర్మలమ్మా అలా మాట్లాడావేమిటి, ఆ లీల లేదా పాపం నాకు అంటుకోదా అన్ని అంతర్గతంగా కూడా ప్రశ్నించినట్లు లీకుల వార్తలు కూడా రాలేదు.


నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా సవరించారు. ఏ సరుకును ఎంతైనా నిల్వచేసుకోవచ్చు. విపరీతంగా ధరలు పెరిగినపుడు మాత్రమే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇదేంటి సారు, నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వటం ఎందుకు, ధరలు విపరీతంగా పెరిగేంతవరకు చోద్యం చూడటం ఎందుకు ? అప్పుడు ఆంక్షలు ఎందుకు ? దీన్నే మేము నక్క పోయిన తరువాత బొక్క కొట్టటం అంటాం. మేం పండిస్తాంగానీ, వినియోగదారులంగా కూడా ఉంటాం. అంటే మా పంటలను మేమే అదానీ, అంబానీ, అమెజాన్‌లకు అమ్ముకోవాలి వారి దగ్గర నుంచి అధిక ధరలకు కొనుక్కోవాలా ఏంది సారూ. దీన్నే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకుంటాం మేము. పాలనా జోక్యం తక్కువ పేరుతో మమ్మల్ని ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా కార్పొరేట్లకు అప్పగిస్తూ చట్టాలు చేసి మీ చేతులు మీరు దులుపుకొని పోతే రేపు మాగతేంగాను ? జిఎస్‌టి మాదిరే రేపు మాకు సైతం అన్యాయం జరిగితే, అప్పుడు కూడా అంతా దైవ లీల, విధి వైపరీత్యం, మనం నిమిత్త మాత్రులం, దేవుడు ఆడించినట్లు ఆడటం, అనుభవించటం తప్ప విధి లేదా తలరాత మార్చలేం అంటే మా గతేంగాను సారూ ?
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాధికారత కాదు రైతులపై దాడి-కార్పొరేట్ల దోపిడీకి అప్పగింత !

21 Monday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Agri Bills, agriculture in india, Farmers empowerment, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్‌ యార్డులుండవు. ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్‌ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్‌, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్‌ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్‌ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్‌ నాటకంలో భాగమే.

కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించి మార్కెట్‌ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్‌ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్‌ లను రద్దు చేశారు.మార్కెట్‌ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.

ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్‌ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు.

బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్‌ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్‌ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్‌ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..

వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.

వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్‌ సంస్ధలు, అగ్రిబిజినెస్‌ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్‌ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్‌ వారెంట్‌ లాంటివని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్‌ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్‌ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్‌ యస్‌ యస్‌ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్‌ పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు.

25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు

వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.

గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి !

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.


ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?


విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.


” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్‌ 17న ముస్లింలీగ్‌ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్‌ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.


విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్‌) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్‌ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్‌ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్‌ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కాశ్మీర్‌ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్‌ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్‌ సరాఫ్‌ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్‌ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్‌ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్‌ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.


సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.


ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.

సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.


రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనసులోని మాట వీడియో స్పందనతో మోడీ, బిజెపి మైండ్‌ బ్లాంక్‌ ?

01 Tuesday Sep 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Modi mann ki baat, modi mann ki baat dislikes surge


ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం మన ప్రధాని నరేంద్రమోడీని చైనీయులు తమ నేతల కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారని అక్కడి అధికార దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే వెల్లడించిందని ఒక కల్పిత వార్తను కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు ప్రచురించాయి. ఆహా ఓహౌ అని కొందరు సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఆ సర్వే గురించి సదరు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ ప్రస్తావనే లేదు.


ఇప్పుడు అలాంటి వారందరికీ దిమ్మ దిరిగే స్పందన మన దేశంలో వెల్లడైందని చెప్పవచ్చు. ఆగస్టు 30 ఆదివారం నాడు మన ప్రధాని మన్‌కీ బాత్‌ – మనసులోని మాట – ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే మోడీ అభిమానుల్లో ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. దీని భావమేమి రామచంద్ర ప్రభూ ! అయిష్టత ప్రకటించిన వారందరూ విదేశీయులే, కేవలం రెండు శాతం దేశీయులు మాత్రమే వారిలో ఉన్నారు అని బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సెలవిస్తే, ఇదంతా కాంగ్రెస్‌ చేయించింది అని బిజెపి కేంద్ర ప్రతినిధి విజరు సోంకర్‌ శాస్త్రి తమతో వ్యాఖ్యానించినట్లు ” ది ప్రింట్‌ ” పేర్కొన్నది.
నెటిజన్లు అయిష్టత ప్రకటించిన విషయాన్ని ఏ సీతారామ్‌ ఏచూరో, రాహుల్‌ గాంధీయో లేదా మరొకరో చెప్పలేదు. నరేంద్రమోడీ ప్రచారం కోసం ప్రభుత్వం, బిజెపి ఏర్పాటు చేసిన అధికారిక ఛానల్స్‌ స్వయంగా వెల్లడించిన సమాచారమే. ఆ ఛానళ్లకు ఖాతాదారులుగా చేరిన వారిలో అత్యధికులు బిజెపి కార్యకర్తలు లేదా నరేంద్రమోడీ అభిమానులే ఉంటారన్నది తెలిసిందే. తాజా స్పందన ద్వారా తమ మనసులో ఉన్న మాటలను మోడీ విస్మరిస్తున్నారని అభిమానులు ఆగ్రహిస్తున్నారా ? ఏమిటీ అసందర్భ ప్రసంగాలని విసుక్కుంటున్నారా ?


మనసులోని మాట పేరుతో ప్రధాని కార్యాలయ యంత్రాంగం లేదా పార్టీ యంత్రాంగం రాసి ఇచ్చిన దానిని చెబుతున్నారో లేక నిజంగా తన మనసులోని మాటనే చెబుతున్నారో మనకు తెలియదు. మనకు కనిపించేది, వినిపించేది మోడీయే కనుక అవి స్వంత భావాలుగానే పరిగణించాలి. ఇంత వరకు ప్రతినెలాఖరులో 68 సార్లు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ప్రభుత్వ సామాజిక మాధ్యమ ఖాతాలతో పాటు దూరదర్శన్‌, రేడియో కేంద్రాలు, బిజెపి అధికారిక యూట్యూబ్‌ ఛానల్స్‌, మరికొన్ని ఛానల్స్‌ కూడా ప్రసారం చేస్తున్నాయి.


ప్రధాని మన్‌కీ బాత్‌ కబుర్లను వినేందుకు తొలి నెలల్లో చాలా మంది ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా వింటున్నవారు ఉండవచ్చు. తరువాత అదొక తద్దిన కార్యక్రమంగా మారిందని భావించిన వారు లేకపోలేదు. ఇది మామూలు విషయంగా మారింది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ వార్త. మరి సంచలనం ఏమిటి అంటారా ? మనిషి కుక్కను కరవటం, సంఘటన జరిగిన తరువాత ఆ మనిషి మనోభావాలు ఎలా ఉన్నాయి, తనను కరచిన మనిషి గురించి కుక్క ఏమైనా స్పందించిందా వంటి ప్రశ్నలు వేసే యాంకర్ల తీరు తెన్నులు సరేసరి. ప్రధాని మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని అభిమానించటం సాధారణ అంశం. సంచలనం ఏమిటి ?
ఆగస్టు 30నాటి మన్‌కీ బాత్‌ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే ఎక్కువగా ఉండటమే సంచలన వార్త. గంట గంటకూ తిరస్కరించిన వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల వెల్లడి అవకాశాన్నే నిలిపివేయటం మరింత పెద్ద సంచలన వార్త. ఎందుకిలా జరిగిందో తెలియదుగానీ ఊహించుకోవచ్చు. స్పందనను పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నది స్పష్టం. తమనేతకు మరుసటి రోజు ఏమి నివేదిస్తే ఎలాంటి స్పందన, పర్యవసానాలు వుంటాయో తెలియక అధికారిక ఛానల్‌లో అభిప్రాయాల బటన్‌ పని చేయకుండా నిలిపివేశారన్నది స్పష్టం.


మీడియాలో దీని మీద అనేక వార్తలు వచ్చాయి. కొన్ని సంస్ధలు కనపడీ కనపడకుండా వార్తలను ఇచ్చాయి. లాజికల్‌ ఇండియన్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ దీని గురించి ప్రచురించిన ఒక కధనం గురించి చూద్దాం. నీట్‌, జెయియి పరీక్షల మీద తలెత్తిన ఆగ్రహం కారణంగా బిజెపి యూ ట్యూబ్‌ ఛానల్లో అత్యంత అనిష్టత లేదా అయిష్టత ( నిఘంటువులో అసహ్యించుకున్న అని కూడా ఉంది) చూపిన వీడియోగా ప్రధాని మన్‌కీ బాత్‌ తయారైందనే శీర్షికతో కధనాన్ని వెలువరించింది. దానికి దృష్టాంతంగా విద్యార్ధుల ట్వీట్లు కొన్నింటిని ఉటంకించింది.


టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ముంబై మిర్రర్‌ కూడా ప్రముఖంగానే దీన్ని విశ్లేషించింది. మన్‌కీ బాత్‌ వీడియో విడుదల అయిన 24 గంటల తరువాత వివరాలను చూస్తే బిజెపి ఛానల్‌లో 79 వేల మంది ఇష్టత చూపారని, 5.34 లక్షల మంది అనిష్టత చూపారని పేర్కొన్నది. ప్రధాన మంత్రి అధికారిక యూ ట్యూబ్‌ ఛానల్లో 39వేల మంది ఇష్టత, 85వేల మంది అయిష్టత చూపారని పేర్కొన్నది.
సోమవారం రాత్రి పది గంటల సమయానికి బిజెపి ఛానల్లో 29లక్షల మంది చూస్తే వారిలో అభిమానించిన వారు 1.2లక్షలు, అయిష్టత వ్యక్తం చేసిన వారు 7.4లక్షలని ది ప్రింట్‌ తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవార మంతా బిజెపి అభిమానులు పని కట్టుకొని అభిమానం వ్యక్తం చేసిన తరువాత పరిస్దితి ఇది అని గమనించాలి.
ఇక వ్యాఖ్యల విషయానికి వస్తే మచ్చుకు కొన్ని చూద్దాం. ౖ” ప్రియమైన ప్రధాని గారూ మీరు జెయియి, నీట్‌ గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను. నాకు ఒక సంవత్సరాన్ని వృధా చేసినందుకు కృతజ్ఞతలు ” ఇది లాజికల్‌ ఇండియన్‌ పేర్కొన్నది. ” 2019లో నా కుటుంబం అతనికి ఎందుకు ఓటు చేసిందా అని ఇప్పుడు నేను విచారిస్తున్నాను. ఇంత హీనమైన ప్రధానిని ఎన్నడూ చూడలేదు. హెచ్‌ఆర్‌డి మంత్రి 80శాతం మంది విద్యార్ధులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెబుతున్నారు. దీని అర్ధం మేము పరీక్షలను కోరుకుంటున్నామని కాదు.ఈ మనిషికి నేను మరోసారి ఓటు వేయను ” అని కిరణ్‌ మోరే అనే విద్యార్ధి ట్వీట్‌ చేసినట్లు ముంబై మిర్రర్‌ పేర్కొన్నది.
” మీరు నా దేశాన్ని నాశనం చేశారు. మీ పార్టీకి ఓటు వేసినందుకు ప్రతిక్షణం విచారిస్తాము. నా జీవిత కాలంలో ఈ కుహనా నటుడ్ని సమర్ధించను” అని ఒకరు, ” కుర్రాళ్లూ ఈ ఏడాదిని ఎన్నడూ మరిచి పోవద్దు. గోడీ (మోడీ ప్రభుత్వాన్ని కొందరు అలా పిలుస్తున్నారు) ప్రభుత్వం 30లక్షల మంది విద్యార్దుల ఆర్తనాదాలను, డిమాండ్లను ఎలా అణచివేసిందో కూడా మరవవద్దు.2024లో మనమేమిటో చూపాలి ” అన్న ట్వీట్లను కూడా ముంబై మిర్రర్‌ ప్రచురించింది.


ప్రధాని తన మనసులోని మాటలో లక్షలాది మంది విద్యార్ధులు, వారి తలిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదన్నది పైన పేర్కొన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్ధుల్లో ఆగ్రహం కారణంగా ఇలాంటి స్పందన వచ్చిందని ఇదేదో తాత్కాలికం అన్నట్లుగా చిత్రించే యత్నం కనిపించింది. విద్యార్ధులైనా మరొకరైనా అధికారిక చానళ్లలో ఖాతాదారులుగా చేరిన వారే మోడీ అంటే అభిమానులే కదా ! లేదూ వారంతా కొత్త వారు, తాజా మన్‌కీ బాత్‌ విని అలా స్పందించారని అనుకోవాలా ? అదైనా నరేంద్రమోడీకి ప్రతికూల స్పందనే కదా ! పరీక్షలు రాసేందుకు సిద్దమైన విద్యార్ధుల కుటుంబాలు, స్నేహితుల్లో ఇదొక ప్రధాన చర్చ నీయాంశం అయిందా లేదా ? ఇలాంటి స్పందన గత మన్‌కీ బాత్‌లకు ఎందుకు రాలేదు ? ఒక వేళ వచ్చినా పట్టించుకోకుండా నేను ఏమి చెప్పినా జనం నోరు మూసుకొని వింటారనే భావం ప్రధానిలో ఆయన యంత్రాంగంలో చోటు చేసుకుందా ? ఈ స్పందనతో బిజెపి నేతల మైండ్‌ బ్లాంక్‌ అయినట్లు కనిపిస్తోంది. కాస్త బాణీ మార్చారు. మోడీ వీడియో మీద అయిష్టతకు నెహ్రూయే కారణం అని చెప్పకుండా కాంగ్రెస్‌ అన్నారు. కాంగ్రెస్‌కు విదేశాల్లో అందునా అధికార ప్రతిపక్ష స్ధాయి కూడా లేని కాంగ్రెస్‌కు అంత పలుకుబడి ఉందా లేక నరేంద్రమోడీ వెలుగు ఆరిపోతోందా ? గతంలో నరేంద్రమోడీకి వచ్చిన మద్దతులో విదేశాల నుంచి ఎంత స్వదేశాల నుంచి ఎంతో వివరిస్తే బాగుండేది. కాంగ్రెస్‌కు అంత సత్తా ఉంటే 67 నెలలు ఏమీ చేయకుండా 68వ వీడియో మీద ఎందుకు కేంద్రీకరించింది అన్న ప్రశ్నకు కూడా బిజెపి నేతలు సమాధానం చెప్పాలి. అభిప్రాయాలను ఇలా తారు మారు చేయటం సాధ్యం అయితే గతంలో బిజెపి కూడా నరేంద్రమోడీకి అనుకూలంగా అదేపని చేసినట్లే కదా !


సామాజిక మాధ్యమాల్లో బిజెపికి మద్దతు బండారం ఏమిటో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయట పెట్టింది. తాజాగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. బిజెపికి 2014 ఎన్నికల్లో తాము ప్రచారం చేశామని ఫేస్‌బుక్‌ భారత అధికారిణి అంఖీదాస్‌ పేర్కొన్న విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆగస్టు 30వ తేదీ వార్తలో పేర్కొన్నది. బిజెపి రాజకీయవేత్తలు, వ్యక్తిగతంగా హిందూ మతవాదులు, బృందాల విద్వేష ప్రచారానికి నిబంధనల ఉల్లంఘన నిబంధనను పాటించవద్దని తమ సిబ్బందికి అంఖీదాస్‌ ఆదేశాలు ఇచ్చినట్లు గతంలో అదే పత్రిక వెల్లడించింది. మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకు నిబంధనల ఉల్లంఘన రూల్స్‌ను వర్తింప చేస్తే ఫేస్‌బుక్‌ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి కనుక చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఆమె అదేశించినట్లు బయటపడింది.2014లో మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ఆమె చేసిన ఒక పోస్టులో ” అతని సామాజిక మాధ్యమ ప్రచారానికి మనం అగ్గి అంటించాం, తరువాత చరిత్ర తెలిసిందే అని పేర్కొన్నారు. మరొక పోస్టులో మోడీని ఉక్కు మనిషిగా వర్ణించారు. భారత రాజ్య సోషలిజాన్ని ఓడించటానికి దిగువ స్ధాయి నుంచి చేసిన పనికి 30 సంవత్సరాలు పట్టింది అని కాంగ్రెస్‌ ఓటమి గురించి పేర్కొన్నట్లు అమెరికా పత్రిక వెల్లడించింది.

ఆగస్టు నెల మనసులోని మాటలో చెప్పిందేమిటి ? సెప్టెంబరును పోషకాహార నెలగా పరిగణిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సుభాషితం చెప్పారు. ఫ్రెంచి విప్లవ కాలంలో జనానికి రొట్టెలు కూడా దొరక్క రాణి మేరీ ఆంటోనెటెకు విన్నవించుకున్నపుడు రొట్టెలు దొరక్క పోతే కేకులు తినొచ్చు కదా అని ప్రశ్నించిందట. ప్రజలతో సంబంధాలు లేని పాలకుల స్పందన బాధ్యతా రాహిత్యం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. మనం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్ధాయికి చేరుకున్నామని మన మంత్రులు తమ జబ్బలను తామే చరుచుకొంటున్నారు. జనానికి కొనుగోలు శక్తి లేకపోతే ఆహార ధాన్యాలు మిగిలిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. ఈ స్ధితిలో ఒక నెలను పోషకాహార మాసంగా ప్రకటించటం ఏమిటి ?


ప్రధాని నోటి నుంచి మరొక ఆణిముత్యం కుక్కలను, అదీ దేశీయ జాతులను పెంచండి. ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా దిగజారనుందో ప్రభుత్వం లెక్కలు ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు ప్రధాని నోటి నుంచి ఇలాంటి సందేశం రావటంతో జనం విస్తుపోతున్నారు. దేశంలో ఎలుకలు రైతుల పంట పొలాల్లో తరువాత గోదాముల్లో ఆహార ధాన్యాలను ఎంత నష్టపరుస్తున్నాయో తెలిసిందే. పది నుంచి 20శాతం వరకు ఉంటుందనే ఆ నష్టాన్ని అరికట్టేందుకు ఎలుక నివారణ సాధ్యంగాకపోతే పిల్లులను పెంచాలని పిలుపు ఇచ్చినా ఒక అర్ధం వుంటుంది. అదే విధంగా దోమలతో ఎంత మంది అనారోగ్యం పాలవుతున్నారో, ఎంత నష్టం జరుగుతోందో తెలుసు. దోమల నివారణ పిలుపు ఇచ్చినా అదో అందం. కుక్కలను అదీ దేశీయ కుక్కలను పెంచాలనటం ఏమిటో అర్ధం కాదు. కుక్కలు దేశీయమా విదేశీయా అని కాదు పోలీసు, మత్తుపదార్ధాలు, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను పసిగడతాయా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ కూడా జాతీయ భావనలను చొప్పిస్తున్నారా ?


కరోనా నేపధ్యంలో వాక్సిన్‌ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని అత్యవసరమైన వాటికే ఖర్చు చేస్తున్నారని ప్రపంచం నలుమూలల నుంచి వార్తలు వస్తున్న సమయంలో ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయాలని , మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేసే వారు ఉండాలి కదా ! బొమ్మల కంటే సెల్‌ఫోన్ల మార్కెట్‌ ఎక్కువ, ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ వదలి ఒక ప్రధాని బొమ్మల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమే. బొమ్మలైనా, మరొకటైనా తయారు చేయవద్దని గత ఆరు సంవత్సరాలలో మన దేశంలోని వారిని ఎవరు అడ్డుకున్నారు. అదేమీ కొత్తగా పెరుగుతున్న మార్కెట్‌ కాదే ! నిజంగా అలాంటి మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు ఉంటే మన దేశంలోని తయారీదారులు ప్రధాని పిలుపు ఇచ్చే వరకు ఆగుతారా ?
కరోనాకు ముందు, కరోనా సమయంలో, తరువాత కూడా తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి నరేంద్రమోడీ, మంత్రులు ఎన్నడూ దాచుకోలేదు. రైళ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, బీమా, చమురు సంస్ధలు, గనులు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతిదానిని ప్రయివేటీకరణ చేయటం గురించి నిరంతరం చెబుతూనే ఉన్నారు. వీటన్నింటినీ వదిలించుకున్న తరువాత నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు ఇంక చేసేదేమి ఉంటుంది ? పనేమీ లేకపోతే నెమలి ఆటలను చూపుతామని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే సూచన ప్రాయంగా జనానికి చెప్పారు. అనేక చోట్ల భారీ వర్షాలతో జనం వరదలు, ఇతర వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతుంటే ఒక్క రాష్ట్రాన్ని అయినా ప్రధాని సందర్శించకుండా నెమళ్లకు మేత వేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న సందేశం ఇప్పటికే జనంలోకి పోయిందా లేదా ?


నెమలిని పెంచటం చట్టరీత్యా నేరం కనుక మరోసారి అలాంటి ఆటలు ప్రధాని నుంచి రాకపోవచ్చు. మంత్రులకు పనేమీ ఉండదు కనుక కోతులు, కొండముచ్చులను ఆడించటం, పగటి వేషాలతో తుపాకి రాముడిలా, వీరతాళ్లతో పోతురాజుల్లా జనాన్ని అలరించటం, సాము గరిడీలకు దిగినా ఆశ్చర్యం లేదు ! ఆ చర్యలతో కడుపునింపుకొనే పొట్టగొట్టినట్లు అవుతుంది. ఇలాంటి వినోదం కోసమే అయితే మోడీ అండ్‌కోను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా ? ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి అధికారం కావాలని నరేంద్రమోడీ ప్రజలను కోరింది దేనికి ? ప్రజలు ఆయనను చూసి దేనికి ఓటు వేశారు ? ప్రజలెదుర్కొంటున్న తక్షణ లేదా ప్రధాన సమస్యలను వదలి ఇలాంటి కబుర్లను మన్‌కీ బాత్‌లో చెబితే వినటానికి సిద్దంగా లేరనేందుకు తాజా మన్‌కీ బాత్‌ వీడియోపై వెల్లడైన వ్యతిరేక స్పందన ఒక సూచిక. నెమళ్లను ఆడించటానికి, కుక్కలను పెంచండి, ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయండి, పౌష్టికాహారం తీసుకోండనే సుభాషితాలను వినేందుకా ఓటు వేసింది అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందా లేదా ? ఆలోచించండి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

దొంగ బంగారం కేసు : కేరళ సర్కారు మీద కుట్రకు బిజెపి తెరలేపిందా ?

23 Thursday Jul 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Kerala Gold Smuggling Case, Kerala LDF, NIA, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు
రాజకీయాలకు – నైతిక సూత్రాలకు సంబంధం లేదని ఇటాలియన్‌ దౌత్యవేత్త మాకియవెల్లీ ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేరళలో పట్టుబడిన దొంగబంగారం కేసును ఆసరా చేసుకొని సిపిఐ(ఎం) నాయకత్వలోని కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, బిజెపి అనైతిక రాజకీయాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది.
దుబాయిలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఇ) కాన్సులేట్‌ కార్యాలయం నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి దౌత్య సిబ్బంది ఉపయోగించే ఒక సంచిలో పంపిన దొంగబంగారం కేసును దర్యాప్తు జరిపించాలని కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ఎలాంటి శషభిషలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ దర్యాప్తు పూర్తిగాక ముందే విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) అధికారులు వెల్లడిస్తున్న సమాచారం, సిపిఎంను వ్యతిరేకిస్తున్నశక్తులు చేస్తున్న ప్రచార, ఆందోళనల తీరు తెన్నులు కొన్ని ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఎవరూ కోరకుండానే పట్టుబడింది విమానాశ్రయంలో కనుక అది కేంద్ర పరిధిలో ఉంటుంది కనుక కేరళ సర్కారు వెంటనే లేఖ రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయలేదంటూ కాంగ్రెసు, బిజెపి పార్టీలు వింత వాదనను ముందుకు తెచ్చాయి. విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు తమ ఎత్తుగడలతో ఆ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయా లేక ఎదురు తన్ని తామే దెబ్బ తింటాయా ? ఒక వైపు కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందుతూ కేరళలో కూడా కొత్త సమస్యను సృష్టిస్తుంటే దాన్ని కూడా కట్టడి చేసేందుకు దాని మీద కేంద్రీకరించిన ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు దొంగబంగారం రాజకీయాలు, మరో వైపు కరోనా కట్టడి పోరు !
దొంగబంగారం ఎలా బయట పడింది !
జూన్‌ 30వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయానికి దుబాయి నుంచి వచ్చిన దౌత్యవేత్తల సంచి ఏముంది అనే అంశంపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి చిరునామాదారులకు విడుదల చేయకుండా నిలిపివేశారు.
జూలై ఒకటవ తేదీన కేరళ ఐటి శాఖలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న స్వప్న సురేష్‌ అనే మహిళ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి తాను తిరువనంతపురం యుఏయి కాన్సులేట్‌ కార్యాలయ కాన్సులర్‌ కార్యదర్శిని అని, సదరు సంచిని విడుదల చేయాలని కోరింది. అధికారులు అంగీకరించలేదు.
రెండవ తేదీన కస్టమ్స్‌ అధికారులకు పలు చోట్ల నుంచి సదరు సంచిని వదలి పెట్టాలని ఫోన్లద్వారా వత్తిడి వచ్చింది. అయినా తిరస్కరించి ఎవరి పేరుతో అయితే సంచి వచ్చిందో వారు వచ్చి తీసుకుపోవాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ సిబ్బంది స్పష్టం చేశారు.అయితే కాన్సులేట్‌ కార్యాలయంలో గతంలో పిఆర్‌ఓగా పని చేసిన సరిత్‌ కుమార్‌ అరబ్బు వేషంతో ఉన్న ఒక వ్యక్తితో కలసి వచ్చి సంచిని తమకు అందచేయాలని వత్తిడి చేసినా అధికారులు అంగీకరించలేదు.
మూడవ తేదీన కాన్సులేట్‌ అధికారులను పిలిపించేందుకు కస్టమ్స్‌ అధికారులు అనుమతి తీసుకున్నారు.
నాలుగవ తేదీన సదరు సంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపివేయాలంటూ ఒక లేఖ కస్టమ్స్‌ అధికారులకు అందింది. అయితే ఐదవ తేదీన ఆ సంచిలో ఏముందో తనిఖీ చేయాలని నిర్ణయించినందున ఆ సమయంలో అక్కడకు ఒక ప్రతినిధిని పంపాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ అధికారులు వర్తమానం పంపారు.
ఐదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని హైకమిషనర్‌ కార్యాలయ సీనియర్‌ అధికారి సమక్షంలో కస్టమ్స్‌ సిబ్బంది సంచి తనిఖీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆ సంచి ఎవరి పేరుతో వచ్చిందో యుఏయి కార్యాలయంలోని సదరు అధికారి కూడా ఉన్నారు. దానిలో 14.8 కోట్ల రూపాయల విలువ చేసే 30కిలోల బంగారం ఉంది. బంగారంతో తమకు సంబంధం లేదని, తమకు పంపింది కాదని కాన్సులేట్‌ అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 3.15 సమయంలో అంతకు ముందు సంప్రదించిన స్వప్న సురేష్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ తతంగం అంతా సాయంత్రం ఆరుగంటలవరకు జరిగింది. మాజీ పిఆర్‌ఓ సరిత్‌ను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు.
ఏడవ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, ఐటి కార్యదర్శి అయిన ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌కు దొంగబంగారం కేసులో అనుమానితులతో సంబంధాలున్నాయనే అనుమానంతో బాధ్యతల నుంచి సిఎం కార్యాలయం తప్పించింది.
తొమ్మిదవ తేదీన జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) విచారణను చేపట్టింది. స్వప్న సురేష్‌ మాట్లాడిన ఆడియో మీడియాలో ప్రసారమైంది. పదవ తేదీన నలుగురు అనుమానితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పదకొండవ తేదీన రెండవ నిందితురాలు స్వప్న సురేష్‌, నాలుగవ నిందితుడు సందీప్‌ నాయర్‌ను బెంగళూరులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నకిలీ సర్టిఫికెట్‌తో స్వప్న సురేష్‌ ఐటిశాఖలో చేరిందన్న అంశంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పన్నెండవ తేదీన స్వప్న, సందీప్‌ నాయర్‌ అరెస్టును ప్రకటించిన ఎన్‌ఐఏ వారిని కరోనా సంరక్షణ కేంద్రాలకు తరలించింది.
పద్నాలుగవ తేదీన దర్యాప్తు అధికారులు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ఇంట్లో తనిఖీలు జరిపారు. కస్టమ్స్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొదటి నిందితుడు సరిత్‌ కుమార్‌ ఈ బంగారం విషయంలో శివశంకర్‌కు ఎలాంటి సంబంధం లేదని అయితే ఆయన నివాసంలో బంగారం గురించి తాము మాట్లాడినట్లు వెల్లడించాడని వార్తలు వచ్చాయి.
పదిహేనవ తేదీన ఐటి పార్కుల మార్కెటింగ్‌ మరియు కార్యకలాపాల డైరెక్టర్‌ అరుణ్‌ బాల చంద్రన్‌ను బాధ్యతల నుంచి ఐటి శాఖ తొలగించింది.శివశంకర్‌ను ప్రభుత్వ సస్పెండ్‌ చేసింది.
పదహారవ తేదీన తిరువనంతపురం యుఏఇ కాన్సలేట్‌ అధికారి రషీద్‌ అల్‌ సలామీ దేశం వదలి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతని పేరుమీదే బంగారం ఉన్న సంచి వచ్చింది.
కనిపించకుండా పోయినా కాన్సులేట్‌ కార్యాలయ గన్‌మన్‌ చేతికి గాయాలతో 17వ తేదీన కనిపించాడు. ఐటి శాఖలో స్వప్న సురేష్‌ చేరటంలో శివశంకర్‌ పాత్ర ఉన్నట్లు అతనికి జారీ చేసిన సస్పెన్షన్‌ నోటీసులో పేర్కొన్నారు. పందొమ్మిదవ తేదీన కేసులోని మూడవ నిందితుడైన ఫైజల్‌ ఫరీద్‌ను దుబారులో అరెస్టు చేశారు.

ముఖ్య మంత్రి మీద ఆరోపణలేమిటి ? నిందితులు-వారికి తోడ్పడిన వారి కథేమిటి ?


ఐటిశాఖను ముఖ్యమంత్రే చూస్తున్నారు. ఆ శాఖ అధికారి సిఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా కూడా ఉన్నాడు, అతని ప్రమేయంతోనే స్వప్న సురేష్‌ను ఐటి శాఖలో నియమించారు కనుక ముఖ్యమంత్రి నియమించినట్లుగా భావించి ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు యుగళగీతాలు పాడుతూ రోడ్లెక్కుతున్నారు.
కేరళలో జనం టీవీ ఛానల్‌ బిజెపికి చెందినది. దాని వార్తల సమన్వయకర్త మరియు సంపాదకుడు అయిన అనిల్‌ నంబియార్‌ దొంగ బంగారం ఉదంతంలో నిందితులైన స్వప్న సురేష్‌, సందీప్‌ నాయర్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడైంది. వారు పోలీసులకు దొరకకుండా దాక్కొనేందుకు అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో ఉన్న సంబంధాలతో సహకరించినట్లు మీద విమర్శలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసిన రోజునే నిందితులు పరారయ్యారు. స్వప్న సురేష్‌ -అనిల్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను ఎన్‌ఐఏ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం సదరు జనం టీవీ సంపాదకుడు అనిల్‌ నంబియార్‌కు కేంద్ర మంత్రి వి మురళీధరన్‌, బిజెపి నేత కె సురేంద్రన్‌, కర్ణాటక బిజెపి అగ్రనేతలతో సంబంధాలున్నట్లు బయటకు వచ్చింది. తిరువనంత పురం నుంచి బయటపడిన స్వప్న-సందీప్‌ బెంగళూరు వెళ్లబోయే ముందు వర్కల లోని హిందూ ఐక్యవేది నేతకు చెందిన రిసార్టుకు వెళ్లారు. జూలై ఐదవ తేదీన బంగారం సంచిలో ఏముందో తెరిచి చూసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ప్రారంభం కావటానికి కొద్ది సేపటికి ముందు అంటే మధ్యాహ్నం 12.42 నిమిషాలకు అనిల్‌ నంబియార్‌ నుంచి స్వప్నకు ఫోన్‌ వచ్చింది, 262 సెకండ్లు మాట్లాడుకున్నారు. అంతకు ముందు అనిల్‌- సందీప్‌ మధ్య కూడా ఫోన్‌ సంభాషణలు చోటు చేసుకున్నట్లు నమోదైంది. దీన్ని బట్టి బంగారం దొంగరవాణా గురించి అనిల్‌కు ముందే తెలుసు అని భావిస్తున్నారు.
దొంగబంగారం వార్త మీడియాలో గుప్పుమన్న తరువాత అనిల్‌ నంబియర్‌ తన ఫేస్‌బుక్‌ పోస్టులో స్వప్నకు తాను ఫోన్‌ చేసినట్లు అంగీకరిస్తూ వార్తల అదనపు సమాచారం కోసం కాంటాక్టు చేశానని చెప్పాడు. సాధారణంగా మీడియా సంస్ధలలో సంపాదకులకు బదులు విలేకరులే వివరణలకోసం ప్రయత్నిస్తారు. సంపాదకుడు అనిల్‌ నంబియారే రంగంలోకి దిగారు అనుకుంటే దానికి అనుగుణ్యంగా జనం టీవీలో వార్తలే దర్శనమివ్వలేదని వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు ముస్లిం లీగ్‌ కార్యకర్తలను కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇంకా మరి కొందరి కోసం గాలిస్తున్నారు.


నిందితులకు బిజెపితో సంబంధాలు !
వివిధ పార్టీల నేతలతో పలువురు కలుస్తున్న సందర్భాలను బట్టి కలిసే వారు చేసిన నేరాలతో పార్టీల నేతలకు సంబంధాలు ఉన్నాయని చెప్పటం కొన్ని సందర్భాలలో వాస్తవ విరుద్దం కూడా కావచ్చు. ఈ కేసులో స్వప్న సురేష్‌ అనే మహిళ పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని, అరెస్టయిన మాజీ పిఆర్‌ఓ సరిత్‌ పూర్వాశ్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌లో సభ్యుడని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. స్వప్న సురేష్‌ వివరాల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం ఆమె పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని తలిదండ్రులు హిందువులని ఉంది. భర్త పేరు, ఇతర వివరాలు లేవు. ఒక వేళ ఆమె మతాంతర వివాహం చేసుకొని పేరు మార్చుకొని ఉండవచ్చు. ఇక సరిత్‌ పూర్వాశ్రమంలో ఏ సంస్ధతో ఉన్నాడని కాదు, వర్తమానంలో ఎవరితో ఉన్నారన్నది ముఖ్యం.
మరో నిందితుడు సందీప్‌ నాయర్‌కు బిజెపికి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు నమ్మబలుకుతున్నారు. ఆ పార్టీనేత కుమనమ్‌ రాజశేఖరన్‌తో కలసి ఉన్న ఫొటో బయటకు రాగానే అనేక మందితో తమ నేత కలుస్తారని, అంత మాత్రాన వారితో సంబంధం ఉన్నట్లు కాదని, సందీప్‌ ఎవరో తెలియదని బిజెపి సమర్ధించుకుంది.అయితే తన కుమారుడు బిజెపిలో చురుకైన కార్యకర్త అని సందీప్‌ తల్లి చెప్పింది ( జూలై 11వ తేదీ టెలిగ్రాఫ్‌) విదేశాంగ శాఖ సహాయ మంత్రి, కేరళ బిజెపి నేత వి. మురళీధరన్‌ బంగారం ఉన్న సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది కాదని చెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం మంత్రికి ఏమి వచ్చింది. కస్టమ్స్‌ క్లియరింగ్‌ ఏజంట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడి హౌదాలో ఆ సంచి విడుదల గురించి కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడినట్లు హరిరాజ్‌ అనే వ్యక్తి చెప్పాడు. అతని ఫేస్‌బుక్‌లో నరేంద్రమోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానిగా చెప్పుకున్నాడు, తనకు బిఎంఎస్‌ లేదా బిజెపితో సంబంధం లేదని కూడా చెప్పుకున్నాడు. వచ్చిన సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది అయితే హరిరాజ్‌కు సంబంధం ఏమిటి ? అతని సిఫార్సుల అవసరం ఎందుకు ఉంటుంది? ఏ దౌత్యవేత్త తరఫున దాన్ని విడుదల చేయాలని అడిగినట్లు ? ఒక వేళ దౌత్యవేత్తది కానట్లయితే, దాని మీద చిరునామా దౌత్యకార్యాలయ అధికారి పేరు ఎందుకు ఉంది? ఎవరి కోరిక మీద హరిరాజ్‌ జోక్యం చేసుకున్నట్లు ?
విమానాశ్రయ సిసిటీవీలో చిత్రాలను పరిశీలించినపుడు గతంలో కూడా అనేక సార్లు స్వప్న సురేష్‌ విమానాశ్రయంలో కనిపించినట్లు బిజెపినేతలు చెబుతున్నారు ? వాస్తవం కూడా కావచ్చు, విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, అక్కడ భద్రత, తనిఖీ బాధ్యత కేంద్రానిదే, అలాంటపుడు ఆమె మీద అంతకు ముందు ఎందుకు అనుమానం రాలేదు ? ఇలా ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తాయి. స్వప్న సురేష్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారితో సంబంధాలున్నాయనే ఒక్క అంశం తప్ప ఈ కేసులో సిఎం లేదా కార్యాలయానికి ఉన్న సంబంధాల గురించి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
బిజెపి నేతల ప్రకటనలు, వారు వీధులకు ఎక్కుతున్న తీరు తెన్నులను చూస్తే అనుమానాలు తలెత్తటం సహజం. కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా, సిపిఎం నేతలను ఎక్కడ ఇరికించాలా అని అవకాశం కోసం బిజెపి ఎదురు చూస్తున్నదనేది బహిరంగ రహస్యం. రాజ్యాంగ వ్యవస్ధలు, సిబిఐ, ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) వంటి సంస్దలు, వ్యవస్ధలను దుర్వినియోగ పరచి ప్రత్యర్ధి పార్టీలు, ప్రభుత్వాలను బదనామ్‌ చేయటంలో యాభై సంవత్సరాలలో కాంగ్రెస్‌ ఎంత అపవాదు మూటకట్టుకుందో బిజెపి తొలి ఐదేళ్లలోనే అంతకంటే ఎక్కువ సంపాదించుకుంది. ఇప్పుడు ఎన్‌ఐఏను కూడా దుర్వినియోగ పరచి ఏదో విధంగా కేరళ ప్రభుత్వాన్ని, పాలక పార్టీలను ఇరుకున పెట్టేందుకు బంగారం అవకాశాన్ని వినియోగించుకుంటుందా అని కూడా ఆలోచించాల్సి వుంది. ఎందుకంటే బిజెపి నేతల మాటలే అందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌ ఒక్క కేరళలోనే జరుగుతున్నట్లు, అది దేశ భద్రతకు ముప్పు అనీ, ఉగ్రవాదులకు డబ్బు అందచేసేందుకు వినియోగిస్తున్నారని, హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది కనుక దీని మూలాలు అక్కడ కూడా ఉన్నాయని, దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే లక్ష్యంతో బంగారాన్ని అక్రమంగా తీసుకు వస్తున్నారని ఎన్‌ఐఏ అధికారులు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
ఉగ్రవాదులు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వారి ఉనికి, కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతూ ప్రమాదకరంగా పరిణమించి గతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన వాటిలో కేరళ ఎన్నడూ లేదు. బంగారాన్ని ఉగ్రవాదుల కోసమే వినియోగిస్తున్నారనే నిర్ధారణకు గతంలో మన నిఘా సంస్ధలు ఎలాంటి నిర్దారణలకు రాలేదు. వారికి నిధుల అందచేసే పద్దతులలో అది కూడా ఒక అంశం కావచ్చు. దొంగ బంగారం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయ చూస్తున్నారన్న ప్రచారం వెనుక అతిశయోక్తి, ఇతర అంశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌, చైనా రిజర్వుబ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే మన దేశంలో ప్రయివేటు వ్యక్తుల వద్ద ఇరవై వేల టన్నుల బంగారం ఎక్కువగా ఉంది అన్నది ఒక అంచనా. బంగారం మీద మన దేశంలో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం, దేశంలో డిమాండ్‌ బాగా ఉంటున్న కారణంగా అధికారికంగా దిగుమతి చేసుకుంటున్నదానిలో మూడవ వంతు అక్రమంగా వస్తున్నట్లు చెబుతున్నారు. కెనడాకు చెందిన ఇంపాక్ట్‌ అనే సంస్ధ గత ఏడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. ఏటా వెయ్యి టన్నుల వరకు వినియోగిస్తుండగా దానిలో 800-900 టన్నులు దిగుమతి అవుతోందని, 200 టన్నుల మేరకు అక్రమంగా వస్తున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ఎవరైనా బంగారం దిగుమతి చేసుకుంటే 12.5శాతం కస్టమ్స్‌ సుంకం, మూడు శాతం జిఎస్‌టి చెల్లించాలి, దిగుమతి చేసుకున్నదానితో ఆభరణాలు తయారు చేస్తే మరో ఐదుశాతం అదనపు జిఎస్‌టి చెల్లించాలి.
ఒక కిలోబంగారాన్ని అక్రమ పద్దతుల ద్వారా రప్పించుకుంటే ఆరు లక్షల రూపాయల మేర లాభం ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నందున అక్రమ రవాణా లాభసాటిగా ఉంటోంది. ఆఫ్రికాలోని గ్రేట్‌ లేక్స్‌ ప్రాంతం నుంచి బంగారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. మన దేశంలోకి వస్తున్న అక్రమ బంగారంలో 75శాతం యుఏఇ నుంచి వస్తోందని ఇంపాక్ట్‌ నివేదిక అంచనా. అందువలన అక్కడ మన భారత గూఢచారులు ఏమి చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, భూటాన్‌ నుంచి కూడా బంగారం అక్రమంగా వస్తున్నట్లు గుర్తించారు.
దౌత్యవేత్తల సంచుల ద్వారా బంగారాన్ని గత ఏడాది కాలంలో 250 కిలోల వరకు తరలించి ఉంటారని ఎన్‌ఐఎ అధికారులు అంచనా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారుల అంచనా 20 సంచుల ద్వారా 180కిలోలు ఉండవచ్చని ఒక వార్త. వ్యక్తిగత లబ్ది కోసమా లేక దేశాన్ని అస్ధిరం కావించేందుకు బంగారాన్ని తరలిస్తున్నారా అనే కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఎన్‌ఐఏ నలుగురిని, కస్టమ్స్‌ సిబ్బంది 13మందిని ఇంతవరకు పట్టుకున్నారు.(సంఖ్యలో మార్పులు ఉండవచ్చు)
ప్రపంచంలోనే బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగే దేశాల్లో మనది ఒకటి. అది ఎలా జరుగుతోందో గత ఏడాది నవంబరులోనే ఇంపాక్ట్‌ సంస్ధ తన నివేదికలో వెల్లడించినా మన కేంద్ర అధికారులు, నిఘా సంస్ధలు యుఏయి-దుబాయి మీద కేంద్రీకరించలేదన్నది స్పష్టం. ఒకటి శుద్ధి చేసిన బంగారం, రెండవది పాక్షికంగా శుద్ధిచేసిన బంగారు కడ్డీలు, బిస్కట్ల రూపంలో రవాణా అవుతోంది. మన దేశానికి చెందిన బంగారు వర్తకులు ఆఫ్రికాలోని తూర్పు ఆఫ్రికా టాంజానియా, ఉగాండాల నుంచి సేకరించి టాంజానియాలోని మవాంజా నుంచి దుబాయి తరలిస్తున్నారు. అక్కడి నుంచి మన దేశం వస్తోంది. ఉగాండా నుంచి సమీర్‌ భీమ్‌జీ అనే వ్యాపారి తరచూ భారత్‌ను సందర్శిస్తున్నట్లు అతనికి ప్రత్యక్షంగా భారత్‌తో బంగారం వ్యాపార లావాదేవీలు ఉన్నాయో లేదో తెలియదు గానీ ఉగాండాలోని ముగ్గురు ప్రముఖ ఎగుమతిదారుల్లో ఒకడని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం గుర్తించింది. అయితే ముంబాయి స్మగ్లర్‌ ఒకడు సమీర్‌ అక్రమవ్యాపారి అని నిర్ధారించినట్లు ఇంపాక్ట్‌ నివేదిక పేర్కొన్నది.2016లో ఉగాండా అధికారులు జరిపిన దాడిలో అతని ఇంటిలో51.3కిలోల బంగారం దొరికింది. అతనికి మన దేశానికి చెందిన బంగారు రాజుగా పేరు పడిన ప్రధ్వీరాజ్‌ కొఠారీకి సంబంధాలు ఉన్నట్లు మన దేశ అధికారులకు సైతం తెలుసు.
మన దేశంలో బంగారు శుద్ధి రంగాన్ని ప్రోత్సహించేందుకు 2013లో నాటి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిన కారణంగా 2012లో శుద్ధి చేయని బంగారం దిగుమతి 23 టన్నులు ఉండగా 2015 నాటికి 229 టన్నులకు పెరిగింది. శుద్ధి చేయని బంగారం పేరుతో పరిశుద్దమైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే అసలు ఆయా దేశాల్లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతోంది, అసలు ఉత్పత్తి జరుగుతోందా లేదా, ఎగుమతి చేయగలదా లేదా అని కూడా తెలుసుకోకుండా మన దేశం కొన్ని దేశాల నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు 2014-17 మధ్య మన దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి 100.63 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది, నిజానికి అదేశానికి అంత ఎగుమతి చేసే స్ధాయి లేదు.


ఇత్తడి రద్దు పేరుతో 4,500 కిలోల బంగారం దిగుమతి !
మన నిఘా అధికారులు నిద్రపోవటం లేదా కుమ్మక్కు కారణంగా ఇత్తడి రద్దు పేరుతో 2017 ఫిబ్రవరి నుంచి 2019 మార్చినెల వరకు 4,500 కిలోల బంగారాన్ని కంటెయినర్ల ద్వారా అక్రమంగా రవాణా చేశారని మళయాళ మాతృభూమి పత్రిక 2019 నవంబరు 24న ఒక వార్తను ప్రచురించింది. ఎక్స్‌రే యంత్రాలు కూడా వాటిని పసిగట్టలేని విధంగా దాన్ని తరలించారు.షార్జా పారిశ్రామిక ప్రాంతం నుంచి భారత్‌కు చేరింది. ఈ రవాణా వెనుక నిసార్‌ అలియార్‌ అనే వ్యక్తి ఉన్నాడు.అతనికి షార్జాలో గోడవున్లు ఉన్నాయి.అధికారుల కన్ను గప్పేందుకు అక్కడ బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి దానికి నల్లని రంగు పూసేవారు, ఇత్తడి రద్దు మధ్య దానిని ప్రత్యేకంగా అమర్చి కంటెయినర్లకు ఎక్కించి నట్లు ఆ పత్రిక రాసింది.ఆ బంగారాన్ని గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో ఉన్న బ్లూ సీ మెటల్స్‌ కంపెనీ పేరు మీద రప్పించేవారు, జామ్‌ నగర్‌ చేరిన తరువాత దానిని శుద్ది చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపేవారు. కేరళలోని పెరుంబవూర్‌కు చెందిన బంగారు చక్రవర్తులుగా పేరు మోసిన వ్యక్తులు మధ్యవర్తులుగా బంగారాన్ని సరఫరా చేసేవారు. గత ఏడాది మార్చి 29న నిసార్‌ అలియార్‌ నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డిఆర్‌ఐ) వారు 185కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. దాంతో బంగారం స్మగ్లింగ్‌ సంబంధాలు అనేకం బయటకు వచ్చాయి.
దేశంలో 2016కు ముందు రెండున్నర సంవత్సరాలలో రెండువేల కోట్ల రూపాయల విలువగల ఏడువేల కిలోల బంగారాన్ని అక్రమంగా చేరవేసినట్లు అదే ఏడాది సెప్టెంబరు 26న డిఆర్‌ఐ ఢిల్లీ జోనల్‌ విభాగం గుర్తించింది. గౌహతి నుంచి 617 సందర్భాలలో ఢిల్లీకి బంగారాన్ని విమానాల్లో తరలించినట్లు విచారణలో వెల్లడైంది.ఈ బంగారం మయన్మార్‌ నుంచి వచ్చినట్లు తేలింది. ప్రతి ఏటా అనేక చోట్ల ఇలాంటి ఉదంతాలు బయటపడటం అధికారులు నేరగాండ్లను అరెస్టు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. 2015 మార్చినెలలో సిలిగురిలో 87కిలోలు, మరుసటి ఏడాది ఆగస్టులో కొల్‌కతాలో 58 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ రెండు ఉదంతాల్లో నిమగమైన ముఠా మొత్తం 200 కోట్ల రూపాయల విలువైన 700 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు తేలింది. ఒక ఉదంతంలో సిలిగురి నుంచి మణిపూర్‌కు తరలిస్తున్న ఐదుకోట్ల రూపాయలకు సమానమైన ఏడున్నరలక్షల డాలర.్లను కనుగొన్నారు.ఈ సొమ్ముతో మయన్మార్‌లో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు .274 టన్నుల బంగారం అక్రమంగా తరలించారని అంచనా వేసిన అధికారులు కఠిన చర్యలు తీసుకున్న తరువాత గత ఏడాది కొంతమేర తగ్గింది.
బిజెపి నేతలు ముందుకు తెస్తున్న తర్కం ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారి నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్‌కు పొరుగుసేవల ఉద్యోగం ఇచ్చారు. కనుక సిఎంకు వారితో సంబంధం ఉంది. ఇదే తర్కాన్ని మిగతా దొంగబంగారం కేసులకు కూడా వర్తింప చేస్తే మొత్తంగా బిజెపి నేతలకే చుట్టుకుంటుంది. కస్టమ్స్‌ శాఖ, ఇతర కేంద్ర సంస్దల వైఫల్యం కారణంగానే దేశంలోకి బంగారం అక్రమ రవాణా జరుగుతోంది కనుక నరేంద్రమోడీ లేదా ఆ శాఖలను చూసే మంత్రులు అధికారులను చూసీ చూడనట్లు వ్యవహరించమని ఆదేశించారని అనుకోవాలా ? దుబాయి అక్రమ రవాణా కేంద్రమని కేంద్రానికి తెలియదా ? దౌత్యవేత్తల సంచుల్లో లేదా తనిఖీకి అవకాశం లేనందున స్వయంగా వారే తరలించినా బాధ్యత ఎవరిది ? ఏ రాష్ట్రంలో దొంగబంగారం లేదా మరొక అక్రమం జరిగితే ఆ రాష్ట్రాల పాలకులకు సంబంధం ఉందంటే మిగిలిన కేసుల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాజీనామా చేయాలని ఎందుకు కోరలేదు ? దొరికింది విమానాశ్రయంలో, అదుపులోకి తీసుకున్నది కస్టమ్స్‌ అధికారులు, నిందితులు దొరికింది బిజెపి పాలనలోని బెంగళూరులో, ఆ పార్టీ కార్యకర్తలకూ సంబంధం ఉంది, ఒకడిని అరెస్టు చేశారు. అందువలన అసలు రాజీనామా చేయాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం అధిపతిగా నరేంద్రమోడీ నైతికంగా ఆపని చేయాలా వద్దా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌ దలైలామా :అమెరికా వదిలించుకుంది- భారత్‌ తగిలించుకుంది ‌ !

10 Friday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

14th Dalai Lama, Dalai Lama, Five fingers of Tibet, Tibet


ఎం కోటేశ్వరరావు


బిజెపి నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” మాజీ సంపాదకుడు శేషాద్రి చారి (లడఖ్‌ ఉదంతం జరగక ముందు ) డెబ్బరు సంవత్సరాలుగా టిబెట్‌ సందిగ్దత, నెహ్రూ చేయలేనిదానిని మోడీ చేయగలరు అంటూ జూన్‌లో ఒక విశ్లేషణ రాశారు. టిబెట్‌ కుడి అరచేతికి ఉన్న సిక్కిం, భూటాన్‌, నేపాల్‌, లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ అనే ఐదు వేళ్లను ఆక్రమించాలని చైనా నేత గ్జీ జింపింగ్‌ కోరుతున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచంలో చైనా వ్యతిరేకత కనిపిస్తోందని, మన దేశం టిబెట్‌ తురుపు ముక్కను వినియోగించుకోవాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చారు. టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించాలని, దలైలామాకు భారత రత్న ఇవ్వాలన్నది మొత్తం వ్యాస సారాంశం.
టిబెట్‌ను చైనా నుంచి వేరు చేసి అక్కడ పాగా వేసి మన దేశాన్ని, చైనాను దెబ్బతీయాలని చూసింది అమెరికా. అందుకు గాను బౌద్దమత నేత, అధికారాన్ని చెలాయించే దలైలామాను తిరుగుబాటుకు రెచ్చగొట్టటమే కాదు, అనుచరులకు ఆయుధాలిచ్చి విఫల తిరుగుబాటు చేయించింది. విధిలేని స్ధితిలో కొత్త ఎత్తుగడల్లో భాగంగా దలైలామాను వదిలించుకున్న అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అసలైన ప్రతినిధిగా కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు దిగి వచ్చారు. అలాంటి దలైలామాను మనం తలకెక్కించుకొన్నాం. దీంతో సాధించేదేమిటి ? గుడ్డి చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత జబ్బుతో ప్రేలాపనలు తప్ప అంత పెద్ద అమెరికాయే వదలి పెట్టిన టిబెట్‌ సమస్యను తురుఫు ముక్కగా వాడు కోవటం ఏమిటి ? పర్యవసానాలను ఆలోచించే, అసలు ఆట తెలిసిన వారు ఇచ్చే సలహాయేనా ఇది !
టిబెట్‌ తిరుగుబాటుదార్లను సృష్టించి వారికి ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన వారిలో ఒకడైన సిఐఏ అధికారి జాన్‌ కెన్నెత్‌ నాస్‌ రాసిన పుస్తకంలో 1950దశకం నుంచి రెండున్నర దశాబ్దాల పాటు టిబెట్‌లో అమెరికా నిర్వాకం గురించి వివరించాడు. మావో జెడాంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులను నిలువరించి సోషలిస్టు దేశంగా మారకుండా చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వం చైనాను కాపాడుతుందన్న అంచనాకు వచ్చిన అమెరికా, అది అసాధ్యమని చాలా ఆలస్యంగా గ్రహించింది. దాంతో దింపుడు కళ్లం ఆశ మాదిరి టిబెట్‌లో దలైలామాతో తిరుగుబాటుకు కుట్ర చేసింది. టిబెట్‌ సరిహద్దులోని నేపాల్‌ ముస్టాంగ్‌ కేంద్రంగా చేసుకొని సిఐఏ ఆయుధాలను అందచేసి తిరుగుబాటు దార్లను టిబెట్‌లోకి ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వమ్ము చేసింది.1969 వరకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేసింది. అమెరికన్ల మాటలు, అంచనాలను నమ్మి దలైలామా నాయకత్వంలోని తిరుగుబాటుదార్లు టిబెట్‌ను స్వాధీనం చేసుకుంటారని భావించిన నెహ్రూ, తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ కూడా టిబెటన్లకు సాయం చేశారు. చివరికి అది సాధ్యం కాదని అమెరికా చేతులెత్తేసింది. తిరుగుబాటుదార్లకు ఆశ్రయం కల్పించిన నేపాల్‌ కూడా చివరకు గెరిల్లాలు ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని వత్తిడి తీసుకు వచ్చింది.1974జూలై 23న విధిలేని పరిస్ధితుల్లో దలైలామా తన అనుచరులు లొంగిపోవాలని వర్తమానం పంపాడు. అయితే దాన్ని ఉల్లంఘించిన ఒక బృందం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా నేపాలీ దళాలు హతమార్చాయి. దాంతో దలైలామా తిరుగుబాటు ముగిసినట్లయింది.
అప్పటికే అంటే 1970దశకం ప్రారంభం నాటికే అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అనుమతించేందుకు అంగీకరించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌, టిబెట్‌తో సహా చైనా ఒక్కటే అని గుర్తించారు. కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌లో అనేక విజయాలు సాధిస్తూ ఒక్కో ప్రాంతం మీద పట్టుసాధిస్తున్న సమయంలో రెండవ ప్రపంచ యుద్దం తరువాత చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని మిలిటరీకి నేపాల్‌, సిక్కిం, భారత్‌ ద్వారా టిబెట్‌ మీదుగా ఆయుధాలు చేరవేయాలని కొల్‌కతా రాయబార కార్యాలయం కేంద్రంగా అమెరికా పధకాలు వేసింది. టిబెట్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేందుకు అవసరమైన కుట్ర చేసింది. అయితే చాంగ్‌కై షేక్‌ దాన్ని అడ్డుకున్నాడు. టిబెట్‌లోని శక్తులు స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ అది చైనాలో టిబెట్‌ అంతర్భాగమే అనే వైఖరిని తొలి నుంచీ కొమింటాంగ్‌ పార్టీ తీసుకుంది. టిబెట్‌కు స్వాతంత్య్రం ప్రకటించితే తీరా కమ్యూనిస్టులను ఓడించి చాంగ్‌కై షేక్‌ చైనాపై ఆధిపత్యం సాధిస్తే ఆ స్వాతంత్య్రం నిలవదని అమెరికాకు తెలుసు. అందుకే తొందరపడలేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టుల ఆధిపత్యానికి తిరుగులేదని, వారిని అడ్డుకొనే సత్తా కొమింటాంగ్‌ సేనలకు లేదని తేలిపోయిందో, టిబెట్‌ను కూడా విముక్తి చేసేందుకు కమ్యూనిస్టు దళాలు ప్రవేశించాయో అప్పుడు అమెరికన్లు టిబెట్‌కు స్వాతంత్య్రం, చైనా ఆక్రమణ వంటి ఆరోపణలతో తిరుగుబాటును రెచ్చగొట్టారు. ఇదంతా 1950 తరువాతే జరిగింది. అప్పటికి చైనాలో అనేక చోట్ల కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు తమ సంపూర్ణ అధికారాన్ని ఇంకా నెలకొల్పని స్ధితి ఉంది. ముందు ప్రధాన భూభాగంలో అధికారాన్ని స్ధిరపరచుకొని తైవాన్‌లో తిష్ట వేసిన చాంగ్‌కై షేక్‌ సేనల సంగతి చూడవచ్చని కమ్యూనిస్టులు భావించారు. ఈ నేపధ్యంలో తమ పని సులువు అవుతుందనే అంచనాతో అమెరికన్లు తమ కుట్రలతో ముందుకు పోయి భంగపడ్డారు.
అమెరికా పధకాలకు అనుగుణ్యంగా మన పాలకులు ద్వంద్వ వైఖరిని అనుసరించారు. టిబెట్‌ ప్రాంతంతో సహా చైనా ఒక్కటే అని గుర్తిస్తూనే అమెరికన్ల సలహామేరకు దలైలామాకు మతపెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటం, ప్రవాస తిరుగుబాటు ప్రభుత్వం కొనసాగటానికి అనుమతి, వారి అవసరాలను చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమెరికన్లు టిబెట్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో చర్చనీయాంశంగా చేసేందుకు సర్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మానవహక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.న్యూయార్క్‌, లండన్‌, జెనీవాలలో కార్యాలయాల ఏర్పాటుకు దలైలామాకు సాయం చేశారు.
సోవియట్‌ యూనియన్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య 1960 దశకంలో తలెత్తిన వివాదాలను సాకుగా తీసుకొని చైనాతో చేతులు కలిపి సోవియట్‌ను దెబ్బతీయాలని అమెరికన్లు పధకం వేశారు. దానిలో భాగంగానే చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు, చైనాతో అమెరికన్లు దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారన్నది ఒక అభిప్రాయం. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ బీజింగ్‌ పర్యటన జరిపాడు. ఇరు దేశాల చర్చలలో ఎక్కడా టిబెట్‌ ప్రస్తావన లేదు. అంతకు ముందు నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకు విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్‌ రాక సమయంలో చైనా నాయకత్వం టిబెట్‌ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. 1975లో డెంగ్‌సియావో పింగ్‌ తనదైన శైలిలో న్యూయార్క్‌లో దలైలామా ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు విన్నాం అన్నట్లుగా అమెరికన్లతో ప్రస్తావించారట. అప్పుడు అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ టిబెట్‌కు సంబంధించినంత వరకు ప్రభుత్వ పరంగా మేము ఎలాంటి చర్యలనైనా వ్యతిరేకిస్తాం, మద్దతు ఇవ్వం. అంతే కాదు టిబెట్‌కు సంబంధించి భారతీయులు తీసుకొనే చర్యలను కూడా మేము సమర్ధించం అని స్పష్టం చేశాడు.దాంతో డెంగ్‌ నవ్వుతూ అయితే దలైలామా అక్కడ ఉండటం భారతీయులకు భారంగా మారుతుందన్నమాట అంటూ ఆ ప్రస్తావనను ముగించారు.
ఆ తరువాతే దలైలామా దూకుడు తగ్గించారు. దలైలామాను చైనాకు అనుమతించటం గురించి డెంగ్‌ సియావో పింగ్‌ మాట్లాడుతూ ఆయన చైనా పౌరుడిగా తిరిగి రావాలి, అదే దేశభక్తి అని చెప్పారు. అయితే ఎలాంటి షరతులు విధించకుండా ఉంటేనే తాను చైనా వెళతానని దలైలామా చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దలైలామాతో రాజకీయం చేయాలని చూస్తున్నది. దానివలన మన దేశానికి ఒరిగేదేమీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఒక పెద్ద బౌద్ధ కేంద్రం ఉన్న తవాంగ్‌ ప్రాంతం నుంచే దలైలామా టిబెట్‌ నుంచి పారిపోయి మన దేశంలో ప్రవేశించాడు. దలైలామా ఆ పట్టణాన్ని సందర్శించటాన్ని తాము అభ్యంతర పెడుతున్నామని చైనా మోడీ సర్కార్‌కు తెలియచేసింది. మక్‌మోహనరేఖ ప్రకారం తవాంగ్‌తో సహా కొన్ని ప్రాంతాలు తమ టిబెట్‌లోని దక్షిణ భూభాగాలని చైనా చెబుతున్నది. అయితే అవి ఎన్నడూ చైనాలో లేవు. చైనా అభ్యంతరాలను తోసి పుచ్చి అరుణాచల్‌పై ఆధిపత్యం మనదే అని స్పష్టం చేసే ప్రక్రియలో భాగంగా దలైలామా పర్యటనను మోడీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సమస్యకు, దలైలామా పర్యటనకు ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.
దలైలామా మన దేశంలో ఎంతకాలం ఉంటారు, కాందిశీకులుగా మనం గుర్తించని ఏ దేశానికీ చెందని వారిగా పరిగణిస్తున్న టిబెటన్లు ఎంతకాలం చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిస్తారు ? వంటి సమస్యలు దలైలామా, ఆయన గణం ముందు ఉన్నాయి. ఎక్కువకాలం వారు బతకలేరన్నది వాస్తవం. టిబెట్‌ మీద చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించనంత వరకు వారి పరిస్ధితి అగమ్యగోచరమే. అమెరికా వదిలించుకున్న దలైలామాను కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పుడు బిజెపి పాలకులు తగిలించుకొని భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నారు. బిజెపి నేతలు మరొక అడుగు ముందుకు వేసి ఆయనకు భారత రత్న ఇవ్వాలని మోడీ సర్కార్‌కు వినతులు పంపారు. తమ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమకు తామే సంతుష్టీకరించుకొనేందుకు తప్ప దీని వలన సాధించేదేమీ ఉండదని వారికి చెప్పినా ప్రయోజనం లేదు ! దలైలామాకు మద్దతు ఇచ్చిన సమయంలో అమెరికన్లు చెప్పిన మాటలు, సమాచారాన్ని ఇంకా వదలని సంఘపరివార్‌ శక్తులు ఆ పాతబడిన అంశాలనే పట్టుకు వేలాడుతుంటాయి. వాస్తవ, వర్తమానాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అసాధ్యమైన అంశాన్ని తలకెత్తుకొని చైనాతో తలపడి సాధించేదేమిటి ? చైనాతో తలెత్తిన సరిహద్దు సమస్య వేరు, టిబెట్‌ వేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో సహా సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిజంగానే కోరుకుంటే టిబెట్‌తో లంకె పెట్టటం తగని పని ? చైనా తిరుగుబాటు దారు దలైలామాకు, ఖలిస్ధాన్‌ లేదా వేర్పాటు కాశ్మీర్‌ పేరుతో విదేశాల్లో తిష్టవేసిన మన దేశ వేర్పాటు వాదులకు పెద్ద తేడా ఏముంది ? మత పెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటమే ఒక తప్పిదం. ప్రతిదానికి జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాన్ని విమర్శించే బిజెపి దలైలామా విషయంలో తప్పిదం చేసిన అదే నెహ్రూ బూట్లలో కాళ్లు పెట్టి నడవటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d