• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

టిబెట్‌ అరచేయి -ఐదువేళ్లు-అఖండ భారత్‌ పగటి కలలేనా ?

07 Tuesday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Akhand Bharat, China, Dalai Lama, Five fingers of Tibet, INDIA, Tibet


ఎం కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమంలోనూ, సాంప్రదాయ మీడియాలోనూ కొన్ని సమస్యల మీద వెల్లడిస్తున్న అభిప్రాయాలూ, సమాచారమూ జనాలను తప్పుదారి పట్టించేదిగా ఉందా ? ఎందుకు అలా చేస్తున్నారు ? దాని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి ? కొంత మంది భిన్న ఆలోచన లేకుండా ఎందుకు నమ్ముతున్నారు ? జనం మెదళ్ల మీద ప్రచార యుద్ధం జరుగుతోందా ? విజేతలు ఎవరు ? వారికి కలిగే లాభం ఏమిటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! అన్నింటినీ తీర్చటం సాధ్యం కాదు. కొన్ని అంశాలను పరిశీలించుదాం.
కమ్యూనిజం గురించి జనంలో భయాలను రేపితే దానివైపు అమెరికన్‌ కార్మికవర్గం చూడదనే అభిప్రాయంతో అక్కడి పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారదాడిని ఒక ఆయుధంగా చేసుకుంది. దాని దెబ్బకు అనేక మంది కోలుకోలేని మానసిక వికలాంగులయ్యారు. అయితే కాలం ఎల్లకాలమూ ఒకే విధంగా ఉండదు. ” కొంత మందిని మీరు వారి జీవితకాలమంతా వెర్రివాళ్లను చేయగలరు, అందరినీ కొంత కాలం చేయగలరు, కానీ అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు” అని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారానికి, పాలకులకు ఇది వర్తిస్తుందా ?
మన దేశ చరిత్ర గురించి చెబుతూ ఎప్పుడైనా పొరుగుదేశం మీద దండెత్తిన చరిత్ర ఉందా అడుగుతారు. మనకు తెలిసినంత వరకు అలాంటి చరిత్ర లేదు. అదే సమయంలో ఇరుగు పొరుగుదేశాలతో స్నేహంగా ఉండటం తప్ప పాలకులు ఇప్పటి మాదిరి విద్వేషం రెచ్చగొట్టిన చరిత్ర కూడా లేదు. మిత్రులుగా ఉండేందుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారం కంటే వాటి మీద నిత్యం ద్వేషాన్ని రెచ్చగొట్టటం, అదే అసలైన దేశభక్తి అని ప్రచారం చేయటం , నరేంద్రమోడీ ఏమి చేసినా సరైనదే, బలపరుస్తాం అనే వెర్రిని జనాల మెదళ్లలోకి ఎక్కించి బిజెపి తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కమ్యూనిస్టు నేత లెనిన్‌ ” ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” అని చెప్పారు. అయన కంటే ఎంతో ముందు వాడైన అబ్రహాం లింకన్‌ చెప్పినట్లు అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు.
” చైనా కుడి చేతి అరచేయి టిబెట్‌ . లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల ప్రదేశ్‌ దాని అయిదు వేళ్లు, వాటిని విముక్తి చేయాలని చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ చెప్పారు ” అన్నది ఒక ప్రచారం. వాస్తవం ఏమిటి ? మావో జెడాంగ్‌ ఆ విధంగా చెప్పిన దాఖలాలు గానీ, కమ్యూనిస్టు చైనాలో అధికారిక చర్చ జరిగినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది ఎలా ప్రచారం అయింది ?
క్రీస్తు పూర్వం 221లో ప్రారంభమైన చైనా క్విన్‌ రాజరిక పాలన నుంచి 1912వరకు సాగిన పలు రాజరికాలు నేపాల్‌, సిక్కిం,భూటాన్‌ తమ టిబెట్‌లో భాగమే అని భావించాయి. 1908లో టిబెట్‌లోని చైనా రాజప్రతినిధి నేపాల్‌ అధికారులకు పంపిన వర్తమానంలో నేపాల్‌ మరియు టిబెట్‌ చైనా అశీస్సులతో సోదరుల్లా కలసి పోవాలని, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యంగామెలగాలని, చైనా, టిబెట్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌లు పంచరంగుల మిశ్రితంగా ఉండాలని, బ్రిటీష్‌ వారిని ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. ఇది బ్రిటన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన ఒక అంశం, చైనా ప్రభువుల వాంఛకు ప్రతిబింబం అని కూడా అనుకోవచ్చు. దానిని ప్రస్తుతం చైనాకు వర్తింప చేస్తూ ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే మరి మావో జెడాంగ్‌ రంగంలోకి ఎలా తెచ్చారు ?
ఇక్కడ అఖండ భారత్‌ గురించి చెప్పుకోవటం అవసరం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన జనాన్ని సమీకరించేందుకు నేను సైతం అన్నట్లుగా అనేక మంది తమ భావజాలం, నినాదాలతో ముందుకు వచ్చారు. వాటితో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ అదొక వాస్తవం. దానిలో ఒకటి అఖండ భారత్‌. దీనికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దీవులు, ఆఫ్రికా ఖండం, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, అస్త్రాలయ(ఆస్ట్రేలియా) ప్రాంతంలోని అనేక దేశాలలోని భాగాలతో కూడినది అఖండ భారత్‌ అన్నది ఒకటి. ఈ ప్రాంతంలోని ఇప్పటి దేశాల పేర్లు పేర్కొనాల్సి వస్తే భారత్‌, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్ధాన్‌, టిబెట్‌, మయన్మార్‌, ఇరాన్‌,యుఏయి, బహరెయిన్‌, తుర్క్‌మెనిస్ధాన్‌, తజికిస్తాన్‌, లావోస్‌, కంపూచియా, వియత్నాం, థాయలాండ్‌, ఇండోనేషియా, బ్రూనె, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాలలోని కొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మహాభారతం, మరికొన్ని పురాణాల్లో అందుకు సంబంధించిన కొన్ని ప్రస్తావనల ఆధారంగా అలా చెప్పారు. ఇవన్నీ చరిత్రలో ఒక మహారాజ్యంగా ఉన్నాయటానికి ఆధారం లేదు గానీ మతపరమైన, సాంస్కృతిక అంశాలలో సారూపత్యల కారణంగా అలా పరిగణించారని చెప్పాలి. ఉదాహరణకు ఇండోనేషియా నేడు ముస్లిం దేశం, అయినా అక్కడి వారి పేర్లు ఎలా ఉంటాయో చూడండి. మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో(సుకర్ణుడు) ఆయన కుమార్తె మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణో పుత్రి.
మన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పేందుకు కెఎం మున్షీ తొలిసారిగా అఖండ హిందుస్తాన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారు. మన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్‌ వారిని విమర్శించే సమయంలో మహాత్మాగాంధీ కూడా దాన్ని ఉదహరించారు. ఖాన్‌ సోదరుల్లో ఒకరైన మజహర్‌ అలీఖాన్‌ కూడా అఖండ హిందుస్తాన్‌ గురించి చెబితే ముస్లిం లీగు వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా, జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిన హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ అఖండ భారత్‌తో పాటు హిందూ రాష్ట్ర భావనను కూడా ముందుకు తెచ్చారు. తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్ధలన్నీ ఇప్పటికీ ఈ భావనలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి, అఖండ భారత్‌ ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నాయి. అది సాధించినపుడే నిజమైన స్వాతంత్య్రం అని ప్రచారం చేస్తాయి.1993లో సంఘపరివార్‌కు చెందిన బిఎంఎస్‌ తన డైరీ మీద ముద్రించిన చిత్రపటంలో పాకిస్ధాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌,శ్రీలంక, థాయలాండ్‌, కంబోడియాలతో కూడిన అఖండభారత్‌ ప్రచురించినట్లు వికీ పీడియా పేర్కొన్నది. నరేంద్రమోడీ కూడా సంఘపరివార్‌కు చెందిన వ్యక్తే గనుక 2012లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింధీల సభలో మాట్లాడుతూ పాకిస్ధాన్‌లో సింధు రాష్ట్రం ఒకనాటికి మన దేశంలో కలుస్తుందని సెలవిచ్చారు.2025 నాటికి పాకిస్ధాన్‌, టిబెట్‌లోని మానస సరోవరం తిరిగి మన దేశంలో కలుస్తుందని, లాహౌర్‌, మానసరోవర ప్రాంతాల్లో భారతీయులు స్ధిర నివాసం ఏర్పరచుకోవచ్చని, బంగ్లాదేశ్‌లో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నందున ఐరోపా యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.
1937 జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించారు. దాంతో చైనీయులు రెండో సారి జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరుసల్పారు. చాంగకై షేక్‌ నాయకత్వంలోని చైనా మిలిటరీతో పాటు లాంగ్‌ మార్చ్‌ జరుపుతున్న కమ్యూనిస్టు గెరిల్లాలు కూడా జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అనేక మంది యుద్ధ ప్రభువులు జపాన్‌కు లొంగిపోయారు. ఈ నేపధ్యంలో చరిత్రలో చైనా పొందిన అవమానాలను గుర్తుచేస్తూ జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు పార్టీనేతగా మావో చైనీయులకు చెప్పారు. ఆ సందర్భంగా చరిత్రను ప్రస్తావిస్తూ సామ్రాజ్యవాదులు చైనాను యుద్దాలలో ఓడించి అనేక సామంత రాజ్యాలను బలవంతగా చైనా నుంచి వేరు చేశారని, జపాన్‌ వారు కొరియా, తైవాన్‌,రైకూ దీవులు, పోర్ట్‌ ఆర్ధర్‌, పెస్కాడోర్స్‌ను, బ్రిటీష్‌ వారు బర్మా, నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్‌లను వేరు చేశారని, ఫ్రాన్స్‌ అన్నామ్‌(ఇండోచైనా ప్రాంతం)ను, చివరకు ఒక చిన్న దేశం పోర్చుగల్‌ చైనా నుంచి మకావోను స్వాధీనం చేసుకుందని మావో చెప్పారు. అంతే తప్ప ఎక్కడా ఐదువేళ్ల గురించి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏనాడూ చెప్పలేదు. తైవాన్‌ చైనా అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, దాని మీద ఎలాంటి వివాదమూ లేదు. అయితే 1948 నుంచి అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉంటూ అమెరికా అండచూసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సామరస్య పూర్వకంగా విలీనం కావాలని చైనా కోరుతోంది తప్ప సైనిక చర్యకు పూనుకోలేదు.
అయితే నిప్పులేనిదే పొగ వస్తుందా ? రాదు.1954లో టిబెట్‌లోని చైనా అధికారులు మాట్లాడుతూ భారత సామ్రాజ్యవాదులు అక్రమంగా పట్టుకున్న సిక్కిం, భూటాన్‌, లడఖ్‌,నీఫా(నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజన్సీ-అరుణాచల్‌ ప్రదేశ్‌)ను విముక్తి చేయాలని చెప్పినట్లు, అదే ఏడాది 1840-1919 మధ్య సామ్రాజ్యవాదులు చైనా ప్రాంతాలను కొన్నింటినీ ఆక్రమించారంటూ రాసిన ఒక స్కూలు పాఠంలో లడఖ్‌, నేపాల్‌,భూటాన్‌, సిక్కిం, ఈశాన్య భారతాన్ని విముక్తి చేయాలని దానిలో రాసినట్లుగా చెబుతారు.1959లో చైనా జనరల్‌ ఝాంగ్‌ గుహువా టిబెట్‌ రాష్ట్ర రాజధాని లాసాలో మాట్లాడుతూ భూటానీలు, సిక్కిమీయులు, లఢకీలు టిబెట్‌ ఉమ్మడి కుటుంబంలో ఐక్యం కావాలని అన్నట్లు వార్తలు ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి. అధికారికంగా అఖండ భారత్‌ గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా పరిగణించుతారు. అందుకే ఆయా దేశాలు ఎన్నడూ మన దేశంతో దాన్నొక సమస్యగా చూడలేదు. మన మీద ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. చైనా నుంచి వేరు పడి స్వాతంత్య్రం కావాలని 1912కు ముందుగానీ తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చేంత వరకు గానీ ఎన్నడూ టిబెట్‌లో ఉద్యమించిన ఉదంతాలు లేవు. అమెరికా జరిపిన కుట్రలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టిన నాటి నుంచి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి, ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చిన గత కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పటికీ టిబెట్‌ తురుపుముక్కను ఉపయోగించాలనే సంఘపరివార్‌ ఎత్తుగడలు కొనసాగుతున్నంత కాలం అటూ ఇటూ అలాంటి రెచ్చగొట్టే, వివాదాస్పద మాటలు వెలువడుతూనే ఉంటాయి. అధికారికంగా పాలకుల వైఖరి ఏమిటనేదే గీటురాయిగా ఉండాలి. అలా చూసినపుడు అఖండ భారత్‌ను ఎలా విస్మరించాలలో, టిబెట్‌ ఐదు వేళ్ల ప్రచారాన్ని కూడా అదేపని చేయాలి. కానీ సంఘపరివారం తన అజెండాలో భాగంగా ఐదువేళ్ల వార్తలను అధికారికమైనవిగా చిత్రించి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఆ ప్రచారానికి కొట్టుకపోతే బుర్రలను ఖరాబు చేసుకోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు.
చైనా ఆక్రమించుకుంటుంది అని చేస్తున్న ప్రచారంలో ఒకటైన సిక్కింను 1975లో మన దేశం విలీనం చేసుకుందని, తరువాత మన దేశ చర్యను చైనా అధికారికంగా గుర్తించిందని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తెలియదా? తెలిసీ ఇంకా ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నట్లు ? దలైలామాను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి మన దేశానికి రప్పించింది అమెరికా. తీరా చైనాతో సర్దుబాటు కుదరగానే ఆ పెద్దమనిషిని, టిటెటన్‌ తిరుగుబాటుదార్లను తాను వదలించుకొని మనకు అంటగట్టింది. తమ దేశానికి రావటానికి కూడా ఆంక్షలు పెట్టింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కాదని మన దేశం ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. ఆ వైఖరిని తీసుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా వేలాది మంది టిబెటన్లు మన దేశంలో విదేశీయులుగా నమోదై ఉన్నారు తప్ప వారికి పౌరసత్వం ఇచ్చేందుకు గానీ, శరణార్ధులుగా గుర్తింపుగానీ ఇవ్వలేదు. అక్రమంగా టిబెట్‌ నుంచి తరలిస్తున్నవారిని అనుమతిస్తున్నది. అనేక చోట్ల వారికి నివాసాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించారు. సంఘపరివార్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను సంతుష్టీకరించటానికి తప్ప దలైలామాను నెత్తికి ఎక్కించుకొని మనం ఎందుకు వీరంగం వేస్తున్నామో, దాని వలన ప్రయోజనం ఏమిటో ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్తి ” ట్రంప్‌ ఆకాశంలో…. మోడీ పాతాళంలోనా ! హతవిధీ !!

27 Saturday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India-China border, China, Donald trump, INDIA, Narendra Modi, Trade Protectionism


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈ నిస్సిగ్గు, పట్టపగలు చమురు దోపిడీ ఇంకెంత కాలం నిర్మలమ్మగారూ ?

02 Saturday May 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Fuel Price in India, Global Crude oil price of Indian Basket, oil price in India

West Bengal Congress on Twitter: "Our Prime Minister is so busy to ...

ఎం కోటేశ్వరరావు
యాభై మంది ప్రముఖులకు 68వేల కోట్ల రూపాయల రణాల రద్దు గురించి రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మనకైనా అంతే కదా ఉన్నమాటంటే ఊరుకుంటామా ! దేశ పౌరులను తప్పుదారి పట్టించేందుకు సిగ్గు లేని రీతిలో ప్రయత్నిస్తున్నారని చాలా పెద్ద మాట వాడారు. అధికారంలో ఉన్నారు , జనం కాంగ్రెస్‌ను చులకనగా చూస్తున్నారు కనుక ఎంతమాటైనా అంటారు. రుణాల రద్దు అంటే రద్దు కాదు కావాలంటే మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. సరే రాహుల్‌ గాంధీ ఇప్పటికీ పరిణితి లేని కుర్రాడు, కాంగ్రెస్‌ కనుక దాని పూర్వీకులు చేసిన నిర్వాకాలను బిజెపి వారు మీ సంగతేమిటని జనం నిలదీసే వరకు నిందిస్తూనే ఉంటారు- ఆ విషయాన్ని వదలి వేద్దాం.
నిర్మలమ్మ గారు తమ నేత ప్రధాని నరేంద్రమోడీ గారిని అడిగి యావత్‌ దేశానికి చెప్పాల్సిన అంశం గురించి ఇక్కడ చూద్దాం. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయిలో పతనమయ్యాయి. వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాత కూడా ధరల పతనం ఆగలేదు. అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవటంతో ఎదురు డబ్బు ఇచ్చి చమురును వదిలించుకోవాల్సి వచ్చింది. చమురు చౌకగా వస్తోంది కనుక కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.
గతేేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం మే ఒకటవ తేదీ నవీకరించిన సమచారం ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. శుక్రవారం నాడు ధర 17.23 డాలర్లకు తగ్గింది. ఒక రోజు తగ్గవచ్చు మరో రోజు పెరగవచ్చు. కానీ ఆమేరకు వినియోగదారులకు మార్పులు జరగటం లేదు. మార్చినెల 16 నుంచి మే రెండవ తేదీ వరకు ఢిల్లీలో పెట్రోలు లీటరు రు.69.59 ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశమంతటా ఇదే విధంగా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ధరల విధానంలో ఏదైనా మార్పులు ప్రకటించిందా అంటే అదేమీ లేదు. మరో పద్దతిలో నిర్మలా సీతారామన్‌ పదజాలంలో చెప్పాలంటే చమురు వినియోగదారులను సిగ్గులేని రీతిలో పట్టపగలే వినియోగదారుల జేబులు కొట్టి వేస్తున్నారు. ప్రభుత్వ చమురు కంపెనీలు దోపిడీ చేస్తూ ప్రయివేటు చమురు కంపెనీలను కూడా దోచుకొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు మీద లీటరుకు మూడు రూపాయల చొప్పున పన్ను పెంచింది. రాబోయే రోజుల్లో మరో ఎనిమిది రూపాయలు పెంచుకొనేందుకు పార్లమెంట్‌లో ముందస్తు ఆమోదం తీసుకుంది. మన పార్లమెంట్‌ సభ్యులు దీనికి ఎందుకు ఆమోదం తెలిపారో అడిగే పరిస్దితి మనకు ఉంటే ఇలా జరిగేదా ?నరేంద్రమోడీగారి అచ్చేదిన్‌లో ఇదేమి దోపిడీ ?

3 reasons why fall in crude prices won't benefit India - Rediff ...
ఇంతగా చమురు ధరలు పడిపోయినా వినియోగదారులకు ఎందుకు తగ్గించటం లేదు ?
చమురు ధరల్లో పెద్దగా తేడాలు లేని రోజుల్లో ప్రతి రోజు ఒక పైసా లేదా రెండు పైసలు తగ్గించిన, పెంచిన రోజులు కూడా ఉన్నాయి. చూశారా మోడీ సర్కార్‌ వినియోగదారుల పట్ల ఎంత నిజాయితీగా ఉందో అని వంది మాగధులు పొగిడారు. ఇప్పుడు అసాధారణ రీతిలో చమురు ధరలు పడిపోయినందున పైసలు కాదు పదుల రూపాయలు తగ్గించాలి. పైసలంటే ఏదో కాని ఇంత పెద్ద మొత్తం తగ్గిస్తామా అన్నట్లుగా ఇప్పుడు సర్కార్‌ వ్యవహరిస్తోంది. గుండెలు తీసిన బంట్లు అంటే ఈ పాలకులేనా ? చమురు ధరలను ఎందుకు తగ్గించటం లేదో చూద్దాం.
1. ఇప్పటికే ధనికులకు ఇచ్చిన రాయితీలు, ధనికులు కావాలని ఎగవేసిన బ్యాంకు రుణాలు రద్దు చెయ్యటం, బ్యాంకులకు ఆ మేరకు ప్రభుత్వం నిధులు సమకూర్చటం. ఈ విధానాల పర్యవసానం ఖజనా గుల్లకావటం, దాన్ని పూడ్చుకొనేందుకు చమురు ధరల రూపంలో అందరి ముందే వినియోగదారుల జేబులు కొల్లగొట్టి లోటును పూడ్చుకొనేందుకు ఈ పని చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చమురు దెబ్బలు తినేందుకు అలవాటు పడి చర్మం మొద్దుబారిన కారణంగా ఇదేమీ అనిపించటం లేదు, దీనికి తోడు గృహబందీల మయ్యాం. నోరెత్తితే దేశద్రోహం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ద్రవ్యలోటు జిడిపిలో 3.5శాతానికి మించకూడదు. ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాల కారణంగా ఈ ఏడాది ద్రవ్యలోటు ఏడుశాతం వరకు ఉండవచ్చని ముంబైకి చెందిన స్టాక్‌బ్రోకరేజ్‌ సంస్ధ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏప్రిల్‌13న ఒక నివేదికలో హెచ్చరించింది. మన జిడిపి వృద్ధి రేటు ఒక శాతానికి అటూ ఇటుకు దిగజారవచ్చన్న అంచనాల పూర్వరంగంలో లోటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. కనుక లోటు పూడ్చుకొనేందుకు ఇదొక మార్గం.
2. చమురు ధరలను తగ్గిస్తే కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం స్ధిరంగానే ఉంటుంది. ధరల మీద శాతాల ప్రాతిపదికన రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నందున చమురు జారీ ధరలు తగ్గితే రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది.అఫ్‌కోర్సు మిగిలిన రాష్ట్రాలకు సైతం ఉపయోగపడినా మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలోనే ఉన్నాయి కనుక వాటికి ఆదాయం తగ్గకూడదు.
3. గృహబందీ కారణంగా రవాణా రంగం స్ధంభించింది, సాధారణ వినియోగం తగ్గింది, తిరిగి ఎంతకాలం తరువాత పూర్వపు స్ధితి ఏర్పడుతుందో తెలియదు కనుక చమురు రంగంలో ప్రయివేటు కంపెనీలు కూడా ఉన్నందున లావాదేవీలు తగ్గినా లాభాలు తగ్గకుండా చూసేందుకు అధిక ధరలను కొనసాగిస్తున్నారు.
4. రూపాయి విలువ పతనాన్ని నిలబెట్టటంలో కేంద్ర సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏడుశాతం పతనమైంది. రికార్డు స్ధాయిలో 76.92కు పడిపోయింది, 80కి దిగజారవచ్చని అంచనాలు. అదృష్టం ఏమిటంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
5. ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గుడ్ల కోసం బంగారు బాతులను కోయాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే భారత్‌ పెట్రోలియంలో వాటాలను అమ్మి ఈ ఏడాది అరవై వేల కోట్ల రూపాయలను ఖజనాకు జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. చమురు ధరలను తగ్గిస్తే ఆ సంస్ధ లాభాలు తగ్గి వాటా విలువపడిపోతుంది. దాంతో తెగనమ్మితే నష్టం కనుక వాటిని అమ్మేంతవరకు కంపెనీకి లాభాలు తగ్గకుండా చూడాలంటే చమురు ధరలను తగ్గించకూడదు. ముందస్తు ధరలకు చమురు కొనుగోలు చేస్తాము. అయితే ఆ ధరలు ఖరారు అయిన తరువాత చమురు ధరలు భారీగా పడిపోయినందున వచ్చే నష్టాలను చమురు కంపెనీలు పూడ్చుకోవాలి కనుక ధరలు తగ్గించటం లేదు. అంతే కాదు ప్రపంచ వ్యాపితంగా శుద్ధి చేసిన చమురుకు డిమాండ్‌ పడిపోయింది. అందువలన శుద్ధి కర్మాగారాలు పూర్తి స్ధాయితో పని చేస్తే చమురు నిల్వ సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో కూడా అదే పరిస్ధితి ఏర్పడింది.తాత్కాలికంగా అయినా అవసరాలకు మించి చమురుశుద్ధి సామర్ద్యం ఉంది. ఈ దశలో డిమాండ్‌ లేనపుడు కంపెనీల వాటాలకు డిమాండ్‌ పడిపోతుంది. ఏనుగు వంటి బిపిసిఎల్‌ను కొనేందుకు ఈ దశలో ఎవరు ముందుకు వస్తారు? కంపెనీ వాటాల అమ్మకపు దరఖాస్తుల గడువును జూన్‌ 13వరకు ప్రభుత్వం గడువు విధించింది. అప్పటికి పరిస్ధితికి ఇంకా దిగజారితే… వేరే చెప్పాల్సిందేముంది ?
6.కేంద్ర ప్రభుత్వం మరో విధంగా కూడా చమురు ధరలతో ఖజనా నింపుతోంది. ఇప్పుడు ధరలు రికార్డు స్ధాయిలో పడిపోయినందున ఎంత ఎక్కువ ముడి చమురుకొని నిల్వచేస్తే ఒక వేళ రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే ప్రభుత్వానికి అంతగా లాభం.ఒక వైపు వినియోగం పడిపోతున్నా కేంద్ర సర్కార్‌ చమురు కొనుగోళ్లను పెంచింది. అయితే చమురు ధరలు తగ్గినపుడల్లా వినియోగదారుల పన్ను రేటు పెంచి 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందింది.
మరికొన్ని అంశాలను కూడా చూద్దాం. వర్తమాన ఖాతా లోటు (కరెంట్‌ ఎకౌంట్‌ ) ఇటీవలి కాలంలో మెరుగుపడింది. అయితే రూపాయి విలువ పతనం ఆ మెరుగుదలను దెబ్బతీస్తుంది. మార్చినెలలో మన విదేశీమారక ద్రవ్య నిల్వలు 475బిలియన్‌ డాలర్లు అయితే వాటిలో 300బిలియన్‌ డాలర్లు ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఎఫ్‌పిఐ) ఖాతాలోనివే. అంటే విదేశీయులు మన దేశంలోని బ్యాంకుల్లో దాచుకొనే సొమ్ము, మన కంపెనీల వాటాలు, మనకు అప్పులు ఇచ్చిన మొత్తాలు. ఇవి కొన్ని సందర్భాలలో స్పెక్యులేషన్‌ కోసం కూడా వస్తాయి. అప్పులకు ఒక కాల పరిమితి ఉంటుంది తప్ప మిగిలిన వాటికి స్ధిరత్వం ఉండదు, లాభసాటిగా ఉంటే ఉంటాయి లేకపోతే నవారు అట లేదా పుల్ల ఆటగాండ్ల మాదిరి బిచాణా ఎత్తివేస్తాయి. మన వర్తమాన ఖాతా లోటు తగ్గటం అంటే మన విదేశీ మారక ద్రవ్య అవసరాలు తగ్గటం లేదా గణనీయంగా ఆ మొత్తాలు ఉండటం. అలా ఉండటం అంటే ఎప్‌పిఐలను మన ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షించే శక్తి పరిమితం అని భావిస్తారు.
చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే ధరల పెరుగుదల రేటు పడిపోతుంది. అయినా కేంద్రం పైన చెప్పుకున్న ఇతర కారణాలతో జనానికి ధరలు పెరిగితే మాత్రం ఏం అన్నట్లుగా చమురు ధరలను తగ్గించటం లేదు. పీపా ముడి చమురు ధరలో ఒక డాలరు తగ్గితే లీటరు డీజిల్‌ లేదా పెట్రోలుకు 50పైసలు తగ్గించవచ్చని చెబుతారు. ఇదే కాదు ముడి చమురు నుంచి వచ్చే నాఫ్తా వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి ఎరువుల ధరలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఎరువుల ధరలు తగ్గించలేదు.

India imports more oil in 5 years of Modi Govt; 10% import cut by ...
గృహబందీ ఏప్రిల్‌ 14వరకు కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం రెండు నుంచి మూడుశాతం మధ్య పడిపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు మే 17వరకు కేంద్రం పొడిగించింది, తరువాత అయినా ఎత్తివేస్తారన్న హామీ లేదు, కరోనా వ్యాప్తి కేసులు వేగంగా పెరుగుతున్నందున తరువాత కూడా పొడిగించినా ఆశ్చర్యం లేదు. మన దేశంలో 15మిలియన్‌ టన్నుల చమురు నిల్వ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాము. అయితే ప్రస్తుతం 5.3మిలియన్‌ టన్నులు మాత్రమే నిల్వచేయగలం. మిగతా ఏర్పాట్లు పూర్తి కాలేదు. కనుక ప్రపంచ మార్కెట్లో ఎవరైనా ఉచితంగా ఇస్తామని చెప్పినా మనం చమురు తెచ్చుకోలేని పరిస్ధితి.
తాను వస్తే మంచి రోజులను తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ జనం చచ్చేట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత ఎక్సయిజు పన్ను పెట్రోలు మీద 142, డీజిల్‌ మీద 318శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇంకా పెంచేందుకు అనుమతి తీసుకున్నారని ముందే చెప్పుకున్నాము.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. ఈ విధానం నుంచి గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఎందుకు వైదొలగిందో, ఎంతకాలం ఇలా అధిక ధరలకు విక్రయిస్తారో ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు ప్రధాని నరేంద్రమోడీని అడిగి చెబుతారా ?
బిజెపి వారు ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చేందుకు పేటెంట్‌ తీసుకున్నారు, అదే ఇతరులు పోలిస్తే దేశద్రోహం, తుకడే తుకడే గ్యాంగులంటూ దాడి చేస్తారు. గత నెల 27న ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 92 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 60,భూటాన్‌లో 65,నేపాల్లో 79, చైనాలో 83, శ్రీలంకలో 84, మన దేశంలో 95 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో ఆర్ధిక మంత్రి చెబుతారా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఆర్‌ఎస్‌ అధికారులపై వేటు: మోడీ బాబాకు అంత ఆగ్రహం ఎందుకు !

30 Thursday Apr 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A stroke on IRS officers, CBDT, CBDT chargesheets three IRS officers, IRS officers, RBI

मोदी सरकार की 20 बड़ी 'उपलब्धियां ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం, మన దేశం కూడా అత్యంత కష్టకాలంలో ఉంది. గతంలో ప్లేగు, కలరా వంటి మహమ్మారులు ప్రబలినపుడు జనం పెద్ద సంఖ్యలో దిక్కులేని చావులకు గురైయ్యారు తప్ప ఇంతటి ఆర్దిక విపత్కర పరిస్ధితి బహుశా మన దేశంలో ఇదే ప్రధమం కావచ్చు.
మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్ధ కలిగినది అని చెప్పుకుంటాం. అఫ్‌కోర్స్‌ ఆ వైఖరితో విబేధించేవారిని అనుమతించినంత కాలం అది ప్రజాస్వామిక వ్యవస్ధగానే ఉంటుంది. ఎవరైనా కొత్త ఆలోచనను ముందుకు తేవటం లేదా సూచనలు చేయటం తప్పుకాదు. దాన్ని చర్చించి లేదా చర్చించకుండానే పాలకులు పక్కన పెట్టేయవచ్చు. గతంలో అనేక మంది ఎన్నో విలువైన సూచనలు చేశారు. వాటిని పాలకులు చర్చించకుండానే పక్కన పెట్టారు. పాలకులు చేసిన అనేక ప్రతిపాదనలు, చర్యలను జనం తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్య సూత్రం. కానీ అసలు సూచన చేయటమే తలకొట్టివేసే తప్పిదం అన్నట్లుగా ఎవరైనా వ్యహరించటాన్ని ఏమనాలి?
దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అరవైతొమ్మిది వేల కోట్ల రూపాయల పెద్దల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు స్వయంగా రిజర్వుబ్యాంకే ఒక సమాచార హక్కు అర్జీదారుకు సమాధానమిచ్చింది. ఇదే విషయాన్ని గృహబందీకి ముందు ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రుణాల రద్దు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీకి రద్దుకు అర్ధం తెలియకపోతే తమ నేత మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకొమ్మని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో యాభై మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల నిమిత్తం ఆదాయం పెంపుదలకు సూచనలు చేసినందుకు ఐఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ నేతలుగా ఉన్న ముగ్గురు సీనియర్‌ అధికారుల మీద నరేంద్రమోడీ సర్కార్‌ వేటు వేసింది. ఈ ప్రతిపాదనలు దేశం కొంపను ముంచుతాయన్నట్లుగా చిత్రించింది. కొద్ది మంది కార్పొరేట్లకు, ధనికులకు లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు, రాయితీలు ఇచ్చినపుడు మునగని కొంప వారి నుంచి పన్ను రూపంలో తాత్కాలిక అత్యవసర చర్యగా కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తే ఎలాా మునుగుతుంది ? ఒక చర్యను అడ్డగోలుగా సమర్ధించుకున్న కేంద్రం మరొక చర్య మీద ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడకుండా మౌనవృతంలో ఇప్పటికే ప్రపంచ పాలకుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.కోవిడ్‌-19(కరోనా వైరస్‌) మహమ్మారి విషయంలో మోడీ బాబాగా మారుతున్న తీరు తెన్నులు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రుల సమావేశాల్లో, ఇతరంగా దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడిన సందర్భాలలో చెప్పిన మాటలు, ప్రవచనాలే అందుకు పెద్ద నిదర్శనం. వాటిని పునశ్చరణ చేస్తే భక్తులకు ఆగ్రహం, అంతకంటే చదువరులకు సమయం దండగ అవుతుంది. గృహబందీ ప్రకటించటం ద్వారా మోడీ తన తెలివి తేటలను అమోఘంగా వ్యక్తపరిచారని,జనం ప్రాణాలను కాపాడారని భజన చేస్తున్నవారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. చైనాలో మన కంటే రెండు నెలల ముందు అమలు జరిపిన గృహబందీని గుర్తు తెచ్చుకొంటే దాన్నే మన దేశంలో అమలు జరపటం అనితర ఆలోచన, పెద్ద గొప్ప అని ఎవరైనా అంటే ఎందుకు కాదు అని తలవంచుకొని పోవటం తప్ప వారితో వాదించి లాభం లేదు.
భారతీయ జనతా పార్టీ పెద్దలు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంటారు. తమ మోడీ గనుకే జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తేగలిగారని ఊరూ వాడా వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఏడవ స్ధానంలోకి తిరోగమించాం. అంతకంటే దిగజార్చలేదుక కనుక అదీ గొప్పేకదా అంటారేమో, దాన్ని కాసేపు పక్కన పెడదాం. కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఉద్దీపన పధకాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో లోపాల గురించి లేదా కార్పొరేట్‌ రంగానికే పెద్ద పీట అన్న విమర్శలు-వాస్తవాల గురించి కూడా కాసేపు మరచిపోదాం. మన దేశం ఇంతవరకు ప్రకటించిన తక్షణ ప్రత్యక్ష ఉద్దీపన పధకం లక్షా 75వేల కోట్ల రూపాయలు మన జిడిపిలో 0.7శాతం. ఇదే సమయంలో తక్షణ ఉద్దీపన చర్యలకు గాను అమెరికా 9.1, జర్మనీ 6.9, బ్రిటన్‌ 4.5, ఫ్రాన్స్‌ 2.4శాతం ప్రకటించాయి. ఇవిగాక వాయిదా వేసిన, ఇతర ఉద్దీపనలు కూడా కలుపుకుంటే చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనం వీటి సరసన ఎక్కడ ఉన్నాం, ఇంత తక్కువ ప్రకటిస్తే మన నాయకత్వాన్ని అంగీకరిస్తాయా ? ఎందుకు మూట ముడి విప్పటం లేదు, ఆ దేశాలకు మల్లే పరిస్ధితి విషమించిన తరువాత విప్పుతామంటారా ? మరోవైపు మన మోడీ గారి దోస్తు ట్రంప్‌ రెండవ పాకేజీ కూడా ప్రకటించారు. ఆయనకేం నవంబరులో ఎన్నికలున్నాయి కనుక రెండు కాదు నాలుగు ప్రకటిస్తాడు, మనకేం ఎన్నికలున్నాయి అంటారా ? అదైనా చెప్పండి, జనం ఆశలేమీ పెట్టుకోకుండా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు తమదారి తాము చూసుకుంటారు. అసలు సమస్య ఏమిటి ?
మోడీ బాబా గారు ఇంతవరకు చేసిన ప్రసంగాలు, ప్రకటించిన కార్యక్రమాల్లో మన సంకల్పాన్ని ప్రదర్శించే చప్పుట్లు కొట్టటం, నూనె, కొవ్వొత్తి దీపాలు వెలిగించటం, విద్యుత్‌ దీపాలు ఆర్పించటం, రోజూ చేతులు కడుక్కోవాలనే అంశాలు తప్ప మరొకటేమీ లేవు. కావాలంటే ప్రతి రోజూ చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దాం, సంకల్పాన్ని పదే పదే ప్రకటిద్దాం. కానీ అది చాలదే ! గృహబందీ పొడిగింపు, సడలింపులకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడటం తప్ప ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇతరంగా ఆర్ధిక పరిస్ధితి గురించి సూచనలు, సలహాలను కోరుతూ ముఖ్యమంత్రులతో లేదా ఇతరులతో ఎలాంటి ప్రత్యేక వీడియో సమావేశాలను నిర్వహించలేదు, సూచనలు పంపాలని కోరలేదు. మన ఖజానా పరిస్ధితి ఇలా ఉంది ఏం చేద్దామని అడిగితే కేంద్రానికి పోయేదేముంది ?
ఇక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కావాలని ఎగవేసిన యాభై సంస్ధల పెద్దలకు దాదాపు 69వేల కోట్ల రూపాయలను గతేడాది సెప్టెంబరు నాటికి రద్దు చేసినట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ఇలాంటి మొత్తాలు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అయితే సాంకేతిక భాషలో చెప్పాలంటే వీటిని సాంకేతికంగా రద్దు చేయరు. వసూలు చేయాల్సిన పారు బాకీల కింద రోజువారీ చిట్టాల నుంచి తొలగించి తరువాత వసూలు చేసే ఖాతాలో చూపుతారు. అయితే మన ”సమర్ధ ” ప్రధాని మోడీ గారి ఏలుబడిలో ఈ మొత్తంలో ఎంత వసూలు చేశారన్నది ముఖ్యం. గత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులను రద్దు చేస్తే ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు సెలవిచ్చినదాని ప్రకారం కేవలం ”పక్కన పెడితే ” దానిలో 80శాతం నరేంద్రమోడీగారి ఏలుబడిలోనే జరిగింది. ఇవన్నీ ప్రతిపక్షాల బుర్రలో పుట్టినవి కాదు, రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారమే నండోరు.కాంగ్రెస్‌ ఏలుబడిలో కావాల్సిన వారికి అప్పులు ఇప్పించారని చెప్పిన బిజెపి వారు అలాంటి కాంగ్రెస్‌ అనుకూలుర నుంచి గోళ్లూడగొట్టి ఎందుకు వసూలు చేయలేదు ? మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు వంటి వారందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరటమే దీనికి కారణమా ? పక్కన పెట్టిన (రద్దు చేసిన) బాకీలను వసూలు చేస్తున్నామని బ్యాంకులు, ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని లక్షల కోట్లు పక్కన పెట్టారు, ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారో ఎవరికైనా చెబుతున్నారా ? పది హేను నుంచి 20శాతం వరకు మాత్రమే వసూలు శాతం ఉందని ఒక అంచనా, దాని ప్రకారం, నరేంద్రమోడీ తొలి ఏలుబడిలో రద్దు చేసినట్లు చూపిన 5,55,603 కోట్లకు గాను కనిష్టంగా 80వేల కోట్లు, గరిష్టంగా అయితే లక్షా పదివేల కోట్లకు మించి లేవు, అంతకు ముందు రద్దు చేసిన మొత్తంతో సహా ఏడులక్షల కోట్లనుకుంటే లక్షా40వేల కోట్లకు మించి తేలటం లేదు. విజయమల్య తాను చెల్లిస్తాను మహాప్రభో అంటున్నా తీసుకోవటం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతకాలం వసూలును సాగదీస్తారు. వీరికి- వారికి పర్సెంటేజ్‌లు ఇంకా కుదరలేదా అని జనం అనుకుంటున్నారు.
బడా బడా బాబులకు వేల కోట్ల రుణాలు రద్దు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు అది రద్దు కాదు, కావాలంటే మీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకో అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్ల మీద ట్వీట్లతో సమాధానమిచ్చారు. అమ్మా నిర్మలమ్మా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమే అనుకుందాం. అదే రీతిలో అనేక అంశాలకు మీరు కూడా నరేంద్రమోడీ గారిని అడిగి తెలుసుకొని జనానికి చెప్పాలమ్మా ? మచ్చుకు ఒక్కటి, నెలన్నరగా పెట్రోలు, డీజిలు రేట్ల సవరణ చేయకపోవటాన్ని ఏమనాలో కాస్త చెబుతారా ? అసలే ఉపాధిపోయి, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న జనాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ బాదటం లేదా, జేబులు కొల్లగొట్టటటాన్ని ఏమనాలి? గృహబందీకి ముందు చివరిగా మార్చి16న పెట్రోలు, డీజిలు రేట్లను సవరించారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి సవరణ లేదు, ఈ మధ్య కాలంలో రికార్డు స్ధాయిలో ముడి చమురు రేట్లు పడిపోయాయి. అంతర్జాతీయ రేట్లు తగ్గితే తగ్గింపు, పెరిగితే పెంపు విధానం ప్రకారం ప్రతి రోజూ సవరిస్తామన్నారు కదా గత నెలన్నరగా ఎందుకు నిలిపివేశారు ? చమురు బిల్లు తగ్గింది, జనం దగ్గర వసూలు పెరిగింది, పోనీ ఆమేరకైనా జనానికి సంక్షేమ చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. డబ్బు పోగేసి ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు, గతంలో కార్పొరేట్లకు ప్రకటించిన రాయితీలను ఈ విధంగా జనం నుంచి వసూలు చేస్తున్నారా ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
తొలిసారి ప్రకటించిన నామమాత్ర పాకేజి తప్ప మరోసారి ఆలోచన లేదని అన్ని తరగతుల నుంచి విమర్శలు వెల్లువెత్తినా దున్నపోతు మీద వానకురిసినా మిన్నకున్నట్లు ఏమీ మాట్లాడరు. ఐఆర్‌ఎస్‌ అధికారులు ఒక సలహా చెబితే వారినేతలను ఉద్యోగాల నుంచి పక్కన పెట్టి మీ మీద ఇతర చర్యలు ఎందుకు తీసుకో కూడదో సంజాయిషీ ఇవ్వండని నోటీసులు ఇచ్చారు. ఇదెక్కడి విపరీతం ? వారు తయారు చేసిన సిఫార్సుల పత్రాన్ని ప్రధాని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్లకు, ఆర్ధికశాఖకు పంపారు. అదే ప్రతిని మీడియాకు విడుదల చేశారు. యువ అధికారులను తప్పుదారి పట్టించారని, ఆ సూచన పత్రాన్ని అనుమతి లేకుండా బహిరంగ పరిచారు కనుక అది ఉద్యోగ నిబంధనలను అతిక్రమించటమే అంటూ ఈనెల 27వ తేదీలోగా రాతపూర్వకంగా లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈశాన్య ప్రాంత దర్యాప్తు విభాగం ముఖ్య డైరెక్టర్‌ సంజరు బహదూర్‌,ఐఆర్‌ఎస్‌ అధికారుల అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి,డిఓపిటి డైరెక్టర్‌ శ్రీ ప్రకాష్‌ దూబే, ఢిల్లీ ఆదాయపన్ను ముఖ్య కమిషనర్‌ మరియు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అయిన ప్రశాంత భూషణ్‌ మీద చర్య తీసుకున్నారు. వారు చేసిందేమిటి ?
ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ నోటీసు ప్రకారం దూబే, బహదూర్‌ ఆదాయపెంపుదల గురించి ఒక నివేదికను తయారు చేయమని తమ జూనియర్‌ అధికారులను కోరారు. ఆ నివేదికను ప్రశాంత భూషణ్‌ బహిర్గతం చేశారు. ఈ చర్యలు అనుమతి లేనివి, తమ విధులను పక్కన పెట్టి ఇతర పనులు చేయటంగా, ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమైనవి వర్ణించారు. యువ అధికారులు తయారు చేసిన ఈ సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ఉండేది, కానీ ఈ ఉదంతంలో అధికారిక పద్దతుల్లో ప్రభుత్వానికి పంపకుండా బహిరంగ పరచటంతో ఇప్పటికే ఆర్ధిక వ్యవస్ధ వత్తిడికి గురైన స్దితిలో ఈ నివేదిక భయాందోళనలను, పన్ను విధాన అనిశ్చితి పరిస్ధితిని కలిగించిందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ఈ నివేదిక వివరాలు బయటకు వచ్చిన తరువాత భయంతో ఏ ఒక్క పారిశ్రామిక, వాణిజ్యవేత్త లేదా ఇతర ధనికులు భయంతో ఆత్మహత్యల వంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి వార్తలు లేవు. ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశం నుంచి బయటకు పోతామని, ఏ స్వదేశీ సంస్ధ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. కోట్లాది మందికి ఉపాధిపోయినా, వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఆందోళనకు గురైనా, రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురైనా చీమ కుట్టినట్లుగా కూడా లేని కేంద్ర సర్కార్‌ ఈ ప్రతిపాదనల మీద ఎందుకు అంతలా వణికిపోయినట్లు ? అదృష్టం కొద్దీ వారు నివేదికను బహిర్గతం చేసిన సమయంలో మార్కెట్‌లు మూతపడి ఉన్నాయట. అతిశయోక్తి గాకపోతే స్టాక్‌ మార్కెట్‌ ఆ నివేదికకు ముందు ఎన్నివేల పాయింట్లు పతనమైందో జనానికి తెలియదా ? మరి దానికి కారకులెవరు ?
ఐఆర్‌ఎస్‌ అధికారులేమీ ధనికుల ఆస్ధులను స్వాధీనం చేసుకోమని చెప్పలేదే, కోటి రూపాయలకు పైబడిన ఆదాయం వస్తున్నవారి మీద ఆదాయపన్ను 40శాతం విధించాలని, నాలుగుశాతం కోవిడ్‌-19 సెస్‌ విధించాలని, ఐదు కోట్ల రూపాయలకు పైబడిన సంపదలు కలిగిన వారి మీద సంపద పన్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సంఘపరివార్‌ ప్రమాణాల ప్రకారం చూసినా ఇదేమీ దేశద్రోహం కాదు, సూచనలు చేసిన వారు తుకడే తుకడే గ్యాంగు అసలే కాదు, పోనీ వారు చెప్పినట్లు వసూలు చేస్తే వచ్చే సొమ్ము పాకిస్ధాన్‌ లేదా అది పంపే ఉగ్రవాదులకు పోయేది కాదు. సామాన్యులు, మధ్యతరగతి వారి నుంచి ఎంత వీలైతే అంత పిండి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు గత ఐదు సంవత్సరాలుగా అనుసరిస్తున్న పెద్దలకు దానికి భిన్నమైన ఇలాంటి ప్రతిపాదనలు కేంద్ర సర్వీసు ఉన్నతాధికారుల నుంచి రావటం మింగుడు పడలేదు. ఆగ్రహానికి కారణం ప్రతిపాదనలు చేసినందుకు కాదట, వాటిని బహిర్గత పరచినందుకట. ప్రతి రోజూ కేంద్రానికి ఇలాంటి అనేక ప్రతిపాదనలు వస్తుంటాయి, ఇంతవరకు ఎన్నింటిని బయట పెట్టారు. బహుశా తమ ప్రతిపాదనలు కూడా అలా బీరువాలకే పరిమితం అవుతాయని, బహిరంగ పరిస్దే చర్చిస్తారని భావించి బహిర్గత పరచి వుండవచ్చు. ఇలాంటి ప్రతిపాదనల మీద చర్చ జరిగితే లేదా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ధనికులకు ఆగ్రహం కలుగుతుంది. అవును, ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో తాత్కాలికంగా కొంత కాలం అయినా ఎందుకు అమలు జరపరు అని కాస్త బుర్ర ఉన్న జనంలో చర్చ జరుగుతుంది. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం ఎంత జరిగినా పర్లేదు గానీ ఇలాంటి అంశాలు జనం మెదళ్లలోకి ఎక్కితే దాన్ని ” నయా లేదా కాషాయ దేశ భక్తులు ” తట్టుకోలేరు. అందుకే తమదైన శైలిలో ఐఆర్‌ఎస్‌ అధికారులను కొందరు అర్బన్‌ నక్సల్స్‌ అని నిందిస్తూ పోస్టులు పెట్టారు. ఎంత దుర్మార్గం ?
దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు కోటీ 75లక్షల కోట్ల మేరకు ఉద్దీపన ప్రకటించిన కేంద్రం,అంతకు కొద్ది వారాల ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు లక్షా 45వేల కోట్ల రూపాయల పన్ను రాయితీ తగ్గించిన విషయం మరువగలమా ? కొత్త పరిశ్రమలకు పన్ను రేట్లు తగ్గించారు. ఆ విధానాన్ని ఐఆర్‌ఎస్‌ అధికారులు తప్పు పడుతూ బజారుకెక్కితే అది ఉద్యోగ నిబంధనలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కనుక చర్య తీసుకున్నామంటే అర్ధం ఉంది. వారా పని చేయలేదే ! దేశం, ప్రపంచం యావత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగా మరొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా సూచనలు చేయటాన్ని కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్ధ అంగీకరించదా ?దీన్ని ప్రజాస్వామ్యం అనాలో నియంతృత్వం అని వర్ణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.

baba ji ka thullu by modi
నూరు పూవులు పూయనివ్వండి, నూరు ఆలోచనలను తర్కించనివ్వండి ఇది చైనాలో మావో ఇచ్చిన ఒక ఉద్యమ పిలుపు. చైనా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలను, విధానాల మీద సవిమర్శలను వ్యక్తం చేయనివ్వాలన్న కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మావో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.(కొందరు నూరు పూవులు పూయనివ్వండి, వెయి ఆలోచనలను వికసించనివ్వండి అని కూడా దీన్ని వర్ణించారు. దీనిలో కూడా తప్పులేదు). అలాంటి ఆలోచనలను ఆహ్వానించిన కారణంగానే నేడు ప్రపంచంలో రెండవ ధనిక దేశంగా చైనా ఎదిగింది. సరే కొందరు కమ్యూనిస్టు నియంతృత్వం అని ఆరోపించే వారు, అది నిజమే అని నమ్మేవారు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. ఇది చైనా వ్యవహారం కనుక పక్కన పెడదాం. మన దేశం విపత్కర పరిస్ధితుల్లో ఉన్నపుడు ఆదాయ పెంపు సూచనలు చేస్తే వాటితోనే దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులై పోతుందన్నట్లుగా భయపడటం అంటే గత ఐదేండ్లలో మన పెరుగుదల వాపా, బలుపా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: నూతన రాజకీయ సమీకరణలకు నాంది కానున్నాయా ?

09 Sunday Feb 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, BJP motor mouths, Delhi election result, Delhi Polls, political polarization

Image result for delhi election result

ఎం కోటేశ్వరరావు
నోటి తుత్తర గాళ్లు మీడియా ముందు నోరు మూసుకొంటే మంచిదని రెండు సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అదంతా జుమ్లా అని రుజువైంది. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తారని చేసిన నరేంద్రమోడీ వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తే అది జుమ్లా పట్టించుకోవద్దు అని మోడీ ఆత్మ అమిత్‌ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదో చెబుతుంటాం, జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అన్నది జుమ్లా అనే ఉర్దూపదానికి భాష్యం. ఢిల్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతల నోటితుత్తరను యావత్‌ ప్రపంచమూ చూసింది.
మోడీ భజన టీవీ ఛానళ్లతో సహా అన్నీ ఢిల్లీ గద్దె మీద తిరిగి అరవింద్‌ కేజరీవాల్‌నే ప్రతిష్టించేందుకు జనం నిర్ణయించుకున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఏ పార్టీకి ఓటు వేసినా అది కమలం గుర్తుకే పడేట్లుగా ఓటింగ్‌ యంత్రాల్లో మార్పులు చేస్తారనే ప్రచారాన్ని నేను విశ్వసించను గానీ, అనేక మంది అనుమానిస్తున్నట్లుగా అసలు యంత్రాలనే మార్చివేసి కొత్తవాటిని పెట్టి తీర్పును వమ్ము చేస్తే తప్ప ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు తధ్యం. ఎందుకంటే బిజెపి వారు ఎంతకైనా తెగిస్తారని అనేకసార్లు స్పష్టమైంది.
దేశమంతటా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న వారికి దేశపాలనా కేంద్రంలో అధికారం లేకపోతే తలకొట్టేసినట్లు అవుతుంది. అందుకే ప్రధాని మొదలు గల్లీ నేతల వరకు ఎన్ని పాట్లు పడ్డారో చూశాము. జాత్యంహంకార ఉన్మాదాన్ని రెచ్చగొట్టినపుడు అనేక దేశాల్లో ఎలాంటి ప్రమాదకర ధోరణులు వ్యక్తమయ్యాయో, గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన మతోన్మాదం ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. ఈ ఉన్మాదం కేవలం ముస్లింలకే పరిమితం అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్లే. మతం, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమతో విబేధించే అంశాలన్నింటినీ శాసించేందుకు మతోన్మాదం పూనుకుంటుంది.
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటుంది.బిజెపినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ పుత్రరత్నమైన పరవేష్‌ వర్మ పశ్చిమ ఢిల్లీ బిజెపి ఎంపీ. ఎన్నికల సమయంలో కేజరీవాల్‌ను ఉగ్రవాది అని నిందించాడు, షాహిన్‌బాగ్‌లో గుడారాలు వేసిన వారు మీ ఇండ్లలోకి ప్రవేశించి మీ కూతుళ్లను, అక్కచెళ్లళ్ల మీద అత్యాచారాలు చేస్తారు, వారిని చంపేయండి, అక్కడ నిరసన తెలుపుతున్న వారికి కేజరీవాల్‌ బిర్యానీలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారని నోరు పారవేసుకున్నందుకు ప్రచారంలో పాల్గనకుండా రెండు సార్లు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. చివరికి ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను విడుదల చేస్తూ షాహిన్‌బాగ్‌ జనం పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచారు, ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టిన బిర్యానీ తిని, ఇచ్చిన డబ్బులు తీసుకొన్న వారందరూ రుణం తీర్చుకొనేందుకు ఆ పార్టీకే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. దానికి ప్రతిగా ఇండ్లలో ఉన్న జాతీయవాదులంతా బయటకు రావాలి. మీరు దేశానికి ఎంతో రుణపడి ఉన్నారు. పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచి జాతీయ పార్టీకి ఓటు వేయాలి, అది మాత్రమే చాలదు తమ గుర్తింపు కార్డులను చూపుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయాలి, దేశభక్తియుత పార్టీకే ఓటు వేస్తామని చెప్పాలి అని దానిలో పేర్కొన్నాడు. మత విద్వేషాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం గాక దీన్నేమనాలి.
అంతే కాదు కర్ణాటక బిజెపి కూడా రెచ్చగొట్టే ట్వీట్లు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలు కాగితాలను (ఆధారాలను) చూపబోము అనే నినాదాన్ని ప్రదర్శిస్తు నిలుచున్న ఫొటోలను చూపుతూ మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి, రేపు ఎన్‌పిఆర్‌ సందర్భంగా ఇవ్వాల్సి వస్తుందంటూ ట్వీట్లు చేశారు. ఇది మతదురభిమానం తప్ప మరొకటి కాదు. ఒక వైపు ఎన్‌పిఆర్‌కు ఎలాంటి ఆధారాలూ చూపనవసరం లేదని మోడీ సర్కార్‌ చెప్పేదానికి ఇది విరుద్దం. ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ గురించి బిజెపి ఏమి చెప్పినప్పటికీ ఆధారాలు లేవనే పేరుతో తమను ఇబ్బందులు పెడతారని ముస్లింలు, సంచార జాతులు, గిరిజనులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఆందోళన చెందుతున్న తరుణంలో అధికార పార్టీ నుంచి ఇలాంటి ట్వీట్లు వెలువడటం వారి కడుపులో ఏముందో వెల్లడి చేస్తున్నది.
ఢిల్లీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు బిజెపి నేతలు రెచ్చగొట్టుడు ప్రచారానికి ప్రభావితులైన వారు ఎలా ప్రవర్తిస్తారో చూశాము. అలాంటి పరిస్ధితినే బిజెపి కోరుకుంటోందని అనేక మంది భయపడుతున్నది నిజమే అని వెల్లడి అయింది. ఈనెల ఐదవ తేదీ రాత్రి రాజస్ధాన్‌కు చెందిన కవి,రచయిత బప్పతీయ సర్కార్‌ ముంబైలో తన స్నేహితుడిని కలుసుకొనేందుకు ఉబెర్‌ కాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణ సమయంలో తన స్నేహితుడితో ఫోన్‌లో దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి, జైపూర్‌లో ఎలా నిర్వహించాలో చర్చించాడు. కారు డ్రైవర్‌ రోహిత్‌ సింగ్‌ ఆ మాటలు విన్నాడు. గమ్యస్ధానం బదులు శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆపాడు. కొద్ది సేపటిలో వస్తానని చెప్పి ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకు వచ్చాడు. తన కారులో ఒక కమ్యూనిస్టు ఎక్కాడని, దేశాన్ని ఎలా తగులబెట్టాలో ఇతరులతో చర్చించాడని,దేశం మొత్తాన్ని షాహిన్‌బాగ్‌గా మార్చేందుకు చూస్తున్నాడని, తాను ఆ మాటలన్నింటినీ రికార్డు చేశానని కాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు చెప్పాడు. ఇదెక్కడి విడ్డూరమయ్యా బాబూ అని డ్రైవర్‌ను ప్రశ్నిస్తే మీరు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ? నేను గాబట్టి వేరే చోట్లకు తీసుకుపోకుండా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చాను సంతోషించండి అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు సర్కార్‌ తెలిపాడు. పోలీసులు రెండున్నర గంటల పాటు రచయితను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆయన రచనలు,ఇ తర విషయాల గురించి అనేక రకాలుగా ప్రశ్నించి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వదలి పెట్టారు.
భిన్నాభిప్రాయం కలిగి ఉండటం, వ్యక్తం చేయటం దాని ప్రాతిపదికన నిరసన వ్యక్తం చేయటాన్ని దేశద్రోహంగా బిజెపి, ఇతర సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న ప్రచారం ఎలాంటి ప్రభావం కలిగిస్తోందో ఈ ఉదంతం తెలియ చేస్తోంది. అదే డ్రైవర్‌కు ఉన్మాద స్దాయి మరింత పెరిగి ఉంటే రచయిత సర్కార్‌ పరిస్ధితి ఏమై ఉండేదో ఊహించుకోవటానికే భయమేస్తోంది.
ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ శిబిరం వద్దకు వచ్చిన యువకుడు కపిల్‌ గుజ్జార్‌ నిరసన కారులను దూషిస్తూ చంపివేస్తానంటూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం తెలిసిందే. అతడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త అంటూ వెంటనే పోలీసులు ఒక ఫొటోను విడుదల చేసి బిజెపి ఎన్నికల ప్రచారానికి తోడ్పడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీయే అతని చేత అలా చేయించిందని చెప్పటంలో పోలీసులు బిజెపితో కుమ్మక్కయ్యారు. అలా ప్రకటించటం నిబంధనావళికి విరుద్దం. తీరా చూస్తే తమ కుమారుడు నరేంద్రమోడీ భక్తుడు, అమిత్‌ షా అభిమాని తప్ప అరవింద కేజరీవాల్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కపిల్‌ తండ్రి, సోదరుడు మీడియాతో చెప్పారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అందరికీ తమ టోపీలు పెట్టి ఓట్లు అడిగిందని, ఆ సందర్భంగా తీసిన ఫొటోను పోలీసులు విడుదల చేశారని, తమ కుటుంబానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ కుమారుడు ఎప్పుడూ హిందుస్తాన్‌, హిందుత్వ గురించి మాట్లాడుతూ ఉంటాడని కూడా తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి ఎలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుందో ఈ ఉదంతం వెల్లడించింది.
మనకు గిరిరాజ్‌ సింగ్‌ అనే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. నోటి నుంచి ఒక్కటీ సరైన మాట రాదు. బహుశా ఆయన నోట్లో పుట్టే విద్వేష వైరస్‌లు అలా మాట్లాడిస్తూ ఉండి ఉండాలి. షాహిన్‌బాగ్‌ ఆత్మహత్యా దళాలను తయారు చేసే కేంద్రంగా మారిందని ఢిల్లీ ఎన్నికల సమయంలో నోరు పారవేసుకున్నాడు. షాహిన్‌బాగ్‌లో ఒక మహిళ మరణించిన తన కుమారుడు అమరజీవి అంటోంది, ఆత్మహాత్యాబాంబరు కాకపోతే ఏమిటిది అని కూడా ప్రశ్నించాడా పెద్ద మనిషి.
షాహిన్‌ బాగ్‌లో పాకిస్ధాన్‌ ప్రవేశించిందని, ఎన్నికలు భారత్‌-పాకిస్దాన్‌ మధ్య పోటీగా జరగాలని కపిల్‌ మిశ్రా అనే బిజెపి అభ్యర్ధి ప్రకటించారు. అలాంటి వారందరికీ ఉపదళపతి అమిత్‌ షా ఎన్నికల్లో మాట్లాడినదేమిటి ? ఢిల్లీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య పోటీ కాదు. షాహిన్‌బాగ్‌కు మద్దతు ఇస్తున్న రాహుల్‌ బాబా-కేజరీవాల్‌ మరియు దేశాన్ని రక్షిస్తున్న ప్రధాని మోడీ మధ్య పోటీ అని చెప్పారు.
మతోన్మాద భావజాలం తలకెక్కిన గుంజా కపూర్‌ అనే ఒక జర్నలిస్టు తానెవరో బయట పడకుండా ఉండేందుకు బుర్ఖా తగిలించుకొని షాహిన్‌ బాగ్‌ శిబిరంలో ప్రవేశించింది. నిజానికి ఆ శిబిరానికి ఎందరో ఆందోళనతో విబేధించే వారు కూడా సందర్శనకు వచ్చారు గానీ ఎవరూ ఇలాంటి ముసుగులతో రాలేదు. బహుశా అంతకు ముందు జెఎన్‌యులో ముసుగులు వేసుకొని దాడులు జరిపిన ఎబివిపి, వారి మద్దతు దారులనుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. అనుమానం వచ్చిన షాహిన్‌బాగ్‌ మహిళలు అడిగిన ప్రశ్నలకు తడబడటంతో సదరు కాషాయ జర్నలిస్టు అసలు రూపాన్ని బహిర్గతం చేసి మర్యాదగా పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు తుపాకి ధరించిన ఒక వ్యక్తిని శిబిరంలోని వారు పట్టుకున్న విషయం, మరో సందర్భంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ మీద వెళుతూ శిబిరం సమీపంలో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయిన సంగతి తెలిసిందే.
జరియాను షరియాగా చిత్రించిన బిజెపి నేత
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అమంతుల్లా ఖాన్‌ షరియా చట్టాన్ని అమలు జరపాలని కోరాడంటూ బిజెపి నేత సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.హమ్‌ జరియా బనాయేంగే(మనం ఒక మార్గాన్ని కనుగొనాలి) అని వాడిన పదజాలాన్ని షరియా(ఇస్లామిక్‌ చట్టం)గా పేర్కొని సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.ఇలాంటి పనులు చేయటం పాత్రకు అలవాటే. ఉత్తర ప్రదే శ్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు కేసు కూడా నమోదు చేశారు.
భావోద్వేగాలను ముందుకు తేవటంలో, వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవటం మీద ఉన్న శ్రద్ద దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపచటం,జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద లేదని ఆరేండ్ల పాలన రుజువు చేసింది. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసి ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, అన్ని అంశాలను వివరించేందుకు తప్పలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె స్వయంగా ఇబ్బంది పడి చివరి పేజీలను చదవకుండా వదలి వేశారు. అన్నింటికంటే ఆ బడ్జెట్‌ అసలు సమస్యల జోలికిపోలేదు.

Image result for delhi election
ముందే చెప్పుకున్నట్లు బ్యాలట్‌ బాక్సుల తారుమారుకు పాల్పడకపోతే ఎన్నికలకు ముందు, తరువాత సర్వేల ప్రకారం ప్రకారం ఆమ్‌ ఆద్మీ అధికారానికి వస్తే దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. 2014లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం తరువాత మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్ధానాలను తిరిగి గెలుచుకుంది.ఆమ్‌ ఆద్మీ పద్దెనిమిదిశాతం ఓట్లతో మూడవ స్ధానంలో కాంగ్రెస్‌ 22శాతం, బిజెపి 56శాతం ఓట్లతో ముందంజలో ఉంది.ఎనిమిది నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైతే తమకు ఎదురులేదని అని ఛాతీ విరుచుకొనే వారు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పటికే మోడీ మీద అనేక మందిలో భ్రమలు తొలిగాయి, భావోద్రేకాలు లేదా భావోద్వేగాలతో ఓటు వేసిన వారిలో కూడా ఢిల్లీ ఎన్నికలు పునరాలోచనకు, నూతన రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతాయి. ఒక వేళ ఎన్నికలను తారు మారు చేస్తే ఆ పరిణామం కూడా కొత్త సమీకరణలకు మరో రూపంలో నాంది పలుకుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్‌ఆర్‌సి : నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నం !

30 Thursday Jan 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#CAA Protest, CAA, Narendra Modi, NPR, NRC, Shaheen Bagh, Shaheen Bagh protest

Image result for shaheen bagh"
స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌
జనవరి 26,రిపబ్లిక్‌ దినోత్సవం రోజున రాజ్యాంగం ప్రసిద్దికెక్కుతుంది. కానీ న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో డిసెంబరు 15నే ఆ ఉత్సవం ప్రారంభమైంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వానికి నిరసనగా ముస్లిం మహిళలు ఒక ముఖ్యమైన రోడ్డు మీద ధర్నా ప్రారంభించారు. అయితే అది వెంటనే తాము కూడా రాజ్యాంగానికి బద్దులమైన దేశభక్తులమే అని, దాన్ని ఉల్లంఘిస్తున్న అధికారంలోని వారికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామంటూ ముస్లింల ఉద్రేకపూరితమైన దేశవ్యాపిత ఆందోళనకు మొగ్గ తొడిగింది.
షాహీన్‌బాగ్‌ను సందర్శించిన వారు ఐదువందల మంది మహిళలు ఎంతో కాలం నిలవలేరు లేదా పెద్ద ప్రభావం చూపలేరు అనుకోవచ్చు. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ భారత్‌ను మార్చింది. ఒకనాడు నిర్నినిరోధక శక్తి అనుకున్న నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నమైందంటోంది.
పార్లమెంట్‌లో సిఎఎ గురించి చర్చ జరిగినపుడు ప్రతిపక్ష పార్టీలు దానికి వ్యతిరేకంగా గట్టిగా అభ్యంతరం చెబితే తమను ఎక్కడ దేశవ్యతిరేకులు అంటారోనని పిరికిబారినట్లు కనిపించింది. కానీ తరువాత అనేక నగరాలలో విద్యార్ధుల నిరసనలు చెలరేగాయి. తొలుత షాహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళల ప్రదర్శన తరువాత బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటా ప్రారంభమయ్యాయి. సిఏఏ రాజ్యాంగవ్యతిరేకమని తిరస్కరిస్తూ గళం విప్పేందుకు ప్రతిపక్షాలను ఇది ఉద్యుక్తులను గావించింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో జాతీయ పౌర చిట్టా(ఎన్‌ఆర్‌సి)ను అమలు జరిపేందుకు తిరస్కరించేట్లు చేసింది. దీన్ని అమలు జరపబోమనే దాని అర్ధం సిఎఎ అమలు సాధ్యం కానిదని చెప్పటమే. ఇది షాహీన్‌బాగ్‌లోని మహిళలకు ఒక అపూర్వ విజయమే.
రిపబ్లిక్‌ దినోత్సవం రోజు కేరళలో 620కిలోమీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో మిలియన్ల మంది పాల్గొన్నారు, కొల్‌కతాలో పదకొండు కిలోమీటర్ల హారాన్ని నిర్వహించారు. ఇంతటి ఉద్రేకపూరితమైన, విస్తృత నిరసనను గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఎదుర్కోలేదు.హింసకు గురైన హిందువులకు హానిలేని పద్దతిలో సాయం చేసేందుకే సిఎఎ అని చెప్పుకోవటాన్ని ప్రపంచవ్యాపితంగా అపహాస్యం చేస్తూ కొట్టివేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్‌ పాల్పడిందని మీడియా, అమెరికా, ఐరోపా యూనియన్‌, ఆసియాలోని అగ్ర రాజకీయవేత్తల నిందకు దేశం గురైంది.
భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని మలేసియా ప్రధాని విమర్శించినందుకు ఆ దేశం నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతుల నిలిపివేత ద్వారా బిజెపి దెబ్బతీసింది. మిలియన్ల మంది భారత ముస్లింల వద్ద సరైన పత్రాలు లేవనే పేరుతో ఎన్‌ఆర్‌సి, సిఎఎ అనే పట్టకారులతో అదుపు చేయటం మరియు పౌరసత్వ రద్దుకు పూనుకున్నారని భావిస్తున్న విమర్శకులను ఒప్పించటానికి ఇది మార్గం కాదు.అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ పన్నెండులక్షల మంది హిందువులు, ఏడు లక్షల మంది ముస్లింలతో సహా 19లక్షల మంది దగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడించింది. బంగ్లాదేశ్‌ నుంచి ”అక్రమంగా ప్రవేశించిన వారు మరియు చెదలు ”గా వర్ణించిన వారిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో ఆధారాలు లేని పేదలు దొరికిపోయారు. నమోదు తక్కువగా ఉండే దేశంలో ఇది సాధారణం.
అసోం అనుభవాన్ని బట్టి జాతీయ స్ధాయిలో ఎన్‌ఆర్‌సి ఖర్చు యాభైవేల కోట్ల రూపాయలు కాగలదు, ఎనిమిది కోట్ల మంది నమోదు పత్రాలు లేని వారిని తేల్చుతుంది. మిలియన్ల మంది ముస్లింలను ఖైదు చేయవచ్చనే ఆలోచనతో కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యులు ఉప్పొంగిపోవచ్చు, అది సరైనదే అనుకోవచ్చుగానీ ప్రపంచంలో దేశ గౌరవం మట్టి కొట్టుకుపోతుంది.


జరుగుతున్న ఆందోళన దేశ వ్యతిరేక విద్రోహం అని బిజెపి చిత్రిస్తున్నది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి రాజ్యాంగ పీఠికలోని అంశాలను పెద్ద ఎత్తున ప్రదర్శించే బ్యానర్లు,చిత్రాలు, బోర్టులు కనిపిస్తాయి. దేశ భక్తియుతమైన జాతి పౌరులుగా వాటిని పరిరక్షిస్తామంటూ ముస్లింలు ” భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాత్వత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ” అనే పీఠికను, రాజ్యాంగాన్ని పారాయణం చేయటం చూస్తారు.
ఈ 85పదాలను నిరసన కేంద్రాలలో కేవలం బ్యానర్ల మీద పెద్దగా ప్రదర్శించటమే కాదు, వాటిని ముద్రించిన దాదాపు పదిలక్షల టీషర్టులు పెద్ద ప్రయత్నం చేయకుండానే అమ్ముడు పోయాయి. షాహీన్‌ బాగ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదుల సొమ్ముతో ఏర్పడిన ఒక చిన్న పాకిస్ధాన్‌ అని బిజెపి ప్రతినిధి చిత్రించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఉద్యమానికి పాకిస్ధాన్‌ నిధులు అందచేస్తున్నదని బిజెపి నిజంగానే అనుకుంటున్నదా ? ముస్లింలు నిబద్దులైన దేశభక్త భారతీయులని షాహిన్‌బాగ్‌ చెప్పటం లేదా ? మహాత్మా గాంధీ, బిఆర్‌ అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, సరోజిని నాయుడు బోధనలకు కట్టుబడి లేదా ? షాహీన్‌బాగ్‌ వేదికమీద అలంకరించిన ఈ దిగ్గజాల పెద్ద చిత్రాలు మాట్లాడుతున్నాయి. మహిళలు వంతుల వారీగా ప్రతి రెండు మూడు గంటలకు వచ్చిపోతున్నారు, కాబట్టి గుడారం ఎప్పుడూ నిండుగా ఉంటోంది. ఆందోళన నిరంతరం కొనసాగనున్నట్లు సూచిస్తున్నది. ‘నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను ‘ అని మహిళలు ధరించిన తల నాడాలు(హెడ్‌బాండ్స్‌) చెబుతున్నాయి, జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. బిజెపి పర్యవేక్షణలో ఉన్న దేశ భక్తిని వారు అపహరించారు.
ప్యాసా సినిమాలో గురుదత్‌ పాటను తెలివిగా మలచి ఏర్పాటు చేసిన బ్యానర్‌ నాకు నచ్చింది. ” జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై… కహా హై….కహా హై…( ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?) దానిని షాహిన్‌ బాగ్‌లో ఇలా రాశారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై…యహా హై…యహా హై….యహా హై….( ‘ ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి).

Image result for shaheen bagh"
ఇటీవలి కాలంలో అనేక తీర్పుల విషయానికి వస్తే సుప్రీం కోర్టు బిజెపి వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది.రాజకీయ వాతావరణానికి కోర్టులు ప్రభావితమౌతాయని ప్రపంచ అనుభవం చూపుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి ఒక పెనుగాలి మాదిరి సులభంగా విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలు తమ గాయాలను మాన్చుకుంటూ పార్లమెంట్‌లో సిఎఎను దాదాపు ప్రతిఘటించలేదు. కానీ ప్రతి పక్షాలు మరోసారి గళమెత్తటానికి విద్యార్ధులు, షాహిన్‌బాగ్‌ మహిళలు సాయం చేశారు. రాజ్యాంగ హక్కుల రక్షణ పట్ల తల ఒగ్గని సుప్రీం కోర్టు కూడా తన గళాన్ని విప్పుతుందని ఆశిస్తున్నాను.

గమనిక: స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ ప్రముఖ జర్నలిస్టు. ఎకనమిక్‌ టైమ్స్‌, టైమ్స్‌ఆఫ్‌ ఇండియా కన్సల్టింగ్‌ ఎడిటర్‌గా పని చేశారు. ఆయన రాసిన ఈ వ్యాసం తొలుత ఎకనమిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో జనవరి 28వ తేదీన ప్రచురితమైనది,దానికి ఇది అనువాదం, శీర్షిక మార్చటమైనది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నియంత – ది న్యూయార్క్‌ర్‌ !

23 Monday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

CAA, India citizenship amendment act 2019, Narendra Modi an authoritarian, NRC

Image result for Narendra Modi authoritarian, protest keralaఎం కోటేశ్వరరావు
”భారత ఆర్ధిక సంస్కరణకు మంచి భవిష్యత్‌ నరేంద్రమోడీ అని నేను వాదించాను. ఇప్పుడు సంగతులు మారిపోయాయి.” అని చెప్పాడు ది టైమ్‌ జర్నలిస్టు ఇయాన్‌ బ్రెమర్‌. నరేంద్రమోడీ నియంతగా మారారు అని ది న్యూయార్క్‌ర్‌ అనే పత్రిక జర్నలిస్టు డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ వ్యాఖ్యానించారు.
”వివాదాస్పద పౌర సత్వ బిల్లును ఆమోదించటంతో భారత్‌ అంతటా నిరసనలు చెలరేగాయి. దేశ లౌకిక రాజ్యాంగానికి పెద్ద ఒక పెద్ద సవాలుగా భారత్‌ తన 20కోట్ల ముస్లిం మైనారిటీలలో కొందరిని సులభంగా జైల్లో పెట్టటానికి, బయటకు పంపివేయటానికి సులభతరం గావించేందుకు పూనుకుంది.” అని ఈనెల 20న అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్‌ విదేశీ వ్యవహారాల సంపాదకుడైన ఇయాన్‌ బ్రెమర్‌ రాసిన విశ్లేషణ, దాని సారాంశంగా రాసిన వాక్యాలను పైన చూశాము. వెంటనే మన దేశంలోని కాషాయతాలిబాన్లు దీని వెనుక పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్‌ అని వెంటనే వాట్సాప్‌ యూనివర్సిటీ, అసహ్యంగా కనిపించే ఫేస్‌బుక్‌ వంటి వాటిలో దాడులు మొదలు పెడతారని వేరే చెప్పనవసరం లేదు. వాటిని గుడ్డిగా నమ్మే జనానికి మనం చెప్పాల్సిందేమంటే మగాను భావులారా అరచేతిని చూసుకొనేందుకు అద్దం అవసరం లేదు.
”తన ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులను పరీక్షించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నండగా తన పరిమితులు ఏమిటో ప్రపంచానికి చూపేందుకు భారత్‌ తీరిక లేకుండా ఉంది. పొరపాటు చేయవద్దు. మానవతా పూర్వక దృక్కోణంలో చూస్తే ప్రత్యేకించి దేశంలో దాదాపుగా ఉన్న 20కోట్ల మంది ముస్లింలకు భారత్‌లో ఇప్పుడు జరుగుతున్నది విషాదం. అయితే ఇది పనిచేస్తున్న, సంఘటితమైన ప్రజాస్వామ్యానికి, తన 140 కోట్ల మంది పౌరులకు అవసరమైన సేవలు, అవకాశాలను కల్పించగల ఆధునిక మరియు సంక్లిష్ట ఆర్ధిక వ్యవస్ధ ఉన్న భారత భవిష్యత్‌కు సైతం విషాదమే.”
పైన పేర్కొన్న విధంగా తన విశ్లేషణను ప్రారంభించిన బ్రెమర్‌ గతలోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు మే ఒకటవ తేదీ టైమ్‌ సంచికలో తాను నరేంద్రమోడీ గురించి ప్రశంసా పూర్వకంగా రాసిన అంశాలను ఉటంకించారు. గత కొద్ది నెలలుగా(అంటే రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన తరువాత) మరమ్మతులు చేయటానికి వీలులేని విధంగా ఆ ప్రతిమ దెబ్బతిన్నది అని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తమ పౌరులు భారత ప్రయాణాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. టైమ్‌ వంటి కార్పొరేట్‌ పత్రికలు ఇలా రాసిన తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు వాటిని పట్టించుకోకుండా ఉంటారా, హెచ్చరికలుగా తీసుకోరా ? ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలకే పెట్టుబడిదారులు బారులు తీరతారు. బిజెపి మరియు నరేంద్రమోడీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, తాము చెప్పిన మంచి రోజులను తెచ్చేందుకు లేదా ఇంకా దిగజార్చేందుకు చూస్తున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.

Image result for Narendra Modi authoritarian
ఇయాన్‌ బ్రెయిన్‌ తన విశ్లేషణ ముగింపులో పేర్కొన్న అంశాలు ఇప్పటి వరకు బుర్రలకు పని పెట్టని వారికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి సారాన్ని ఇలా చెప్పుకోవచ్చు.(అనుమానాలు ఉన్నవారు, ఆసక్తి కలిగిన వారికి వీలుగా లింక్‌ కూడా ఇస్తున్నాను)https://time.com/5753624/india-narendra-modi-nationalism/ ” భారత్‌ రాజకీయాల్లో స్ధిరపడిపోయిన వ్యక్తులతో విసిగిపోయిన కారణంగా అద్బుతమైన ప్రచారంతో 2014లో బిజెపి, నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చారు గనుక తన పెరుగుదలకు తోడ్పడిన హిందూ జాతీయ వాదం నుంచి పక్కకు తప్పుకొని పాలనా బాధ్యతలను స్వీకరిస్తారని కొంత మంది ఆశించారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్ధ మందగించటం ప్రారంభమైన తరువాత 2019లో తన విజయం కోసం హిందూ జాతీయవాదం వైపు తిరిగారు. ఆర్ధిక అంశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ విధానంలో జాతీయవాదం ప్రముఖపాత్రను తీసుకుంది. రాజ్యాంగబద్దంగా ఆదేశించిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయటం ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేసింది. ఒక ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇంటర్నెట్‌ను సుదీర్ఘకాలం మూసివేసిన ప్రభుత్వంగా అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కింది. జాతీయ పౌరుల నమోదు(ఎన్‌ఆర్‌సి) అమలును ముందుకు తెచ్చింది. ఈ కారణంగా అసోంలో దాదాపు 20లక్షల మంది తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. తాజా నమోదులో పౌరసత్వం కోల్పోయిన వారిలో పన్నెండు లక్షల మంది హిందువులే ఉన్నట్లు తేలింది. ఇది ముస్లింలు కాని ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించాలనే చట్టాన్ని చేసేందుకు పురికొల్పింది. అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కు పంపాలని బిజెపి డిమాండ్‌ చేసింది, బంగ్లాదేశ్‌ వారిని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించే అవకాశం లేదు.” అని బ్రెమర్‌ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి ముందుకు తెచ్చిన అంశాల గురించి వామపక్షాలు ఎన్నో హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం బిజెపి పోకడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు ముందుకు వచ్చిన వారితో సహా ఎక్కువ మంది వాటిని ఖాతరు చేయలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా టెలివిజన్‌ సిఎన్‌ఎన్‌ ప్రతినిధి గతంలో ఎన్నడూ లేని దానికంటే దేశాన్ని ఎన్నికలు మరింతగా విడదీశాయంటూ ఒక విశ్లేషణ రాశారు. బిజెపి, నరేంద్రమోడీ తీరుతెన్నులు, ప్రచార సరళిలో వచ్చిన మార్పును వర్ణిస్తూ 2014లో కొద్ది మందిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న పరిమిత హిందూ జాతీయవాద శబ్దాలను ఇప్పుడు దేశమంతా వినిపించే లౌడ్‌ స్పీకర్లు అక్రమించాయని పేర్కొన్నారు( ఆంగ్లంలో- డాగ్‌ విజిల్‌ వస్‌ రిప్లేస్‌డ్‌ బై ఏ బుల్‌హారన్‌). ఎన్నికల ఫలితాల తరువాత నరేంద్రమోడీ విజయం భారతీయ ఆత్మకు చెడు అని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఎవరి మీద అయినా మరులు గొన్నపుడు మనం మంచి చెడ్డలు, ఎలాంటి వారమో కూడా పట్టించుకోము. ఎవరి హెచ్చరికలను పట్టించుకోము.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగానే వార్తలుగా ఇస్తోంది. అవి పెడుతున్న శీర్షికలు వాటి అవగాహన, అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. ” పెల్లుబుకుతున్న ఆగ్రహం, హిందూ రాజ్యంగా మారేందుకు భారత్‌ దగ్గర అవుతోందా ?” అని అమెరికా నుంచి వెలువడే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ముస్లింలను మినహాయించటం ద్వారా మౌలికంగా వివక్షా పూరితమైనదని, దాన్ని సమీక్షించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకించింది. దేని మీదా ఏకీభావానికి రాని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించింది.
బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక మూడు వార్తలను ప్రచురించింది. వాటిలో ఒక దాని శీర్షిక ఇలా ఉంది.” భారత పౌరసత్వ చట్టం: తీవ్ర అణచివేత మోడీ వ్యతిరేకులను ఐక్యపరచవచ్చు” నిరసనల తీవ్రత గురించి వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరు సంవత్సరాల తరువాత వెల్లడైన ముఖ్యమైన నిరసన అని పేర్కొన్నది.
నరేంద్రమోడీ చివరకు చాలా దూరం పోయారా అని న్యూయార్కర్‌ అనే పత్రిక విశ్లేషించింది.” ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రదర్శనలు రాజకీయాల్లో ఇప్పుడో తరువాతో నియంతలు చాలా దూరం ప్రయాణిస్తారు అని ఎంతగానో నమ్మిన పురాతన సిద్దాంతాన్ని క్రమబద్దీకరించాయి. ఈ ఉదంతంలో నియంత నరేంద్రమోడీ, భారత ప్రధాని ” అని పేర్కొన్నది.డెక్సటర్‌ ఫిల్‌కిన్స్‌ రాసిన విశ్లేషణలో ప్రధాని నాయకత్వం వహిస్తున్న హిందూ జాతీయవాద ప్రభుత్వం ఇరవై కోట్ల ముస్లింలను అంతర్గత శత్రువులుగా మలచింది అని వ్యాఖ్యానించారు.

Image result for Narendra Modi authoritarian
అంతర్జాతీయ మీడియాలో వెల్లడైన అభిప్రాయాలలో ఇవి కొన్ని మాత్రమే. భారత రాజకీయాలు ఏవైపు పయనిస్తున్నాయనే చర్చ మరోసారి ప్రపంచంలో ప్రారంభమైంది. మన దేశంలో సరేసరి. నరేంద్రమోడీ నియంతా, ఫాసిస్టా, మరొక ప్రమాదకారా ఏ తరగతికి చెందుతారు అన్న అంశంపై అనేక మందిలో ఏకీభావం ఉండకపోవచ్చు. మన విభేదాలను తరువాత చూద్దాం, ఈ అన్ని లక్షణాలు కలిగిన శక్తిని ముందు వ్యతిరేకిద్దాం అనే ఏకాభిప్రాయ క్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓట్ల రాజకీయంలో బిజెపి పోటీ పడి అది ముందుకు తెస్తున్న మతోన్మాదంతో రాజీపడుతున్న రాజకీయ పార్టీల పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హిందూ జాతీయవాదాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా దానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్రమోడీ సర్కార్‌ను బలపరిచేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసిపి వంటి పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకుంటాయా లేదా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. వాటి వెనుక ఉన్న మైనారిటీ తరగతుల వారు ఆలోచనలో పడుతున్నారు. ఒక మెజారిటీ మతోన్మాద శక్తిని ఎదుర్కొనేందుకు మరొక మైనారిటీ మతోన్మాదశక్తి వెనుక సమీకరణ కావటం, బలపరచటం కూడా ప్రమాదకరమే. అలాంటి మొగ్గునే మెజారిటీ మతశక్తులు కోరుకుంటున్నాయి. ఆ ఊబిలో ఎప్పుడు దిగుతారా అని చూస్తున్నాయి. ఎందుకంటే దాన్ని చూపి మెజారిటీ మద్దతును కూడగట్టుకోవటం సులభం కనుక ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్న మైనారిటీలు జాగ్రత్తగా ఉండటం కూడా అవసరమే. లౌకిక, వామపక్ష భావాలవైపు సమీకృతమై ఉమ్మడిగా లౌకిక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొనేందుకు పూనుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యతో బిజెపి రుసరుస !

15 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Not Rahul Savarkar, Rahul Jinnah, vd savarkar

Image result for rahul gandhi ramlila maidan

ఎం కోటేశ్వరరావు
మరోసారి కాషాయ పరివారం హిందుత్వ ప్రతీక విడి సావర్కర్‌ను దేశ భక్తుడిగా దేశం ముందుకు తెచ్చింది. నరేంద్రమోడీ పాలన దేశాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చటానికి బదులు రేప్‌ ఇన్‌ ఇండియా(అత్యాచారాల భారత్‌)గా మార్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్య దీనికి మూలం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బిజెపి పార్లమెంట్‌లోపలా బయటా డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై వివాదం చెలరేగటంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. రాహుల్‌ వ్యాఖ్య దేశాన్ని, మహిళలను అవమానించటమే అని, అత్యాచారాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలకటం వంటిదే అని బిజెపి ఎంపీలు ఆరోపించారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలో దేశద్రోహంతో సమానమని అందుకు రాహుల్‌ను జైల్లో పెట్టాలని సంఘపరివార్‌కు చెందిన వారు డిమాండ్‌ చేశారు. రాహుల్‌ ఇటలీకి పోవాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్‌ ధాకరే బహిరంగంగా రాహుల్‌ గాంధీని కొట్టాలని సావర్కర్‌ మనవడు కోరారు.
‘నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడతారు, అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అది అత్యాచారాల భారత్‌గా కనిపిస్తోంది’ అన్నది రాహుల్‌ గాంధీ వ్యాఖ్య. క్షమాపణ చెప్పాలని బిజెపి చేసిన డిమాండును న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్‌ను రక్షించండి అనే నినాదంతో కాంగ్రెస్‌ నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ తిప్పి కొట్టారు. పదే పదే క్షమాపణలు చెప్పటానికి నేనేమీ రాహుల్‌ సావర్కర్‌ను కాదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు క్షమాభిక్ష పెడితే బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటానని అండమాన్‌ జైలు నుంచి విడి సావర్కర్‌ పదే పదే లేఖలు రాసి వేడుకున్న అంశాన్ని రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యద్వారా ప్రస్తావించారు. దీనిపై చెలరేగిన వివాదం కారణంగా సావర్కర్‌ దే శభక్తుడని నమ్ముతున్నవారికి సావర్కర్‌ అసలు రూపం ఏమిటో చూసేందుకు ఆసక్తి రేకెత్తించినందుకు బిజెపికి ‘అభినందనలు’ చెప్పాల్సిందే.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదంటూ రాహుల్‌ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీని అత్యాచారాల రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బిజెపి పేర్కొన్నదని, సాక్షాత్తూ నరేంద్రమోడీ 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. గుక్కతిప్పుకోలేని బిజెపి నేతలు రాహుల్‌ గాంధీకి తగిన పేరు రాహుల్‌ జిన్నా అని వ్యాఖ్యానించారు. సిపాయి తిరుగుబాటుగా బ్రిటీష్‌ చరిత్రకారులు వర్ణించిన 1857 పరిణామాలను ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని ముందుగా వర్ణించిన సావర్కర్‌ గొప్ప దేశభక్తుడని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
1857 మే పదవ తేదీన బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ప్రారంభమైన మిలిటరీ తీరుగుబాటు తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.1858 జూన్‌ 20న గ్వాలియర్‌లో తిరుగుబాటుదార్లను అణచివేయటంతో వెనుకపట్టు పట్టింది. అయితే సిపాయిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తమ పాలన అంతానికి నాంది అవుతుందని భయపడిన బ్రిటీష్‌ పాలకులు హత్యకేసులతో సంబంధం ఉన్నవారికి మినహా మిగిలిన తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు.1859 జూలై ఎనిమిది తిరుగుబాటు లాంఛనంగా ముగిసింది.
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి నాటి పాలకుల కనుసన్నలలో నడిచే బ్రిటన్‌ పత్రికలు, అధికారిక ప్రకటనలు తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాస్తవ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ తిరుగుబాటు ప్రారంభమైన 50 రోజుల్లోనే కారల్‌ మార్క్స్‌- ఫెడరిక్‌ ఎంగెల్స్‌ దాని స్వభావాన్ని పసిగట్టారు. తరువాత మరొక నెల రోజులకే భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు అని 1857 జూలై 28, 31 తేదీలలోనే కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. 1857 జూన్‌ 30న భారత్‌లోని పరిణామాలను మార్క్స్‌ ఇలా వర్ణించారు. ‘ ముస్లింలు, హిందువుల తమ ఉమ్మడి యజమానులకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఆసియా దేశాలలో తలెత్తిన సాధారణ అసంతృప్తి కాలంలోనే ఇది జరిగింది.’ అని రాశారు.ఆ తిరుగుబాటును అణచివేయటంలో నాటి సంస్ధానాధీశులలో ఒకరైన సింధియా, ఇతర ప్యూడల్‌ శక్తుల పాత్ర గురించి కూడా మార్క్స్‌-ఎంగెల్స్‌ అనుమానించారు.
సిపాయిల తిరుగుబాటులో ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామ లక్షణాల గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌ వ్యాఖ్యానించే నాటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. ఐదు ద శాబ్దాల తరువాత లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో వారి రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు, వారి అవగాహన, అభిప్రాయాన్ని అంగీకరించారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ అసలు ముందుగా వ్యాఖ్యా నించింది సావర్కరే అంటే చరిత్రను వక్రీకరించటమే. సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలో 1909లో మరాఠీలో సిపాయి తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్రం సంగ్రామంగా వర్ణిస్తూ పుస్తకాన్ని రాశారు. దానికి మూలం లండన్‌లో విద్యార్ధి విప్లవకారులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్‌లో ఏర్పడిన పరిచయాలు, అధ్యయనమే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
అభినవ్‌ భారత్‌ లేదా ఇండియా హౌస్‌లో సావర్కర్‌ పని చేసిన కాలంలో ఆయన పాత్ర గురించి ఎవరికీ పేచీ లేదు. బ్రిటీష్‌ వారి అరెస్టు నుంచి తప్పించుకొని ఫ్రెంచి వారికి చిక్కారు. వారు సావర్కర్‌ను బ్రిటీష్‌ వారికి అప్పగించారు.1910లో అరెస్టయిన కేసులో మరుసటి ఏడాది అండమాన్‌ జైలుకు తరలించిన తరువాత సావర్కర్‌ లొంగుబాటు అధ్యాయం ప్రారంభమైంది. 1911,13,17,20 సంవత్సరాలలో లేఖల మీద లేఖలు రాసి క్షమాభిక్ష కోసం ప్రాకులాడిన విషయం దాస్తే దాగదు. ఎలా కావాలంటే అలా బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పని చేస్తానని రాశారు. 1923లో జైలు నుంచి విడుదల అయిన తరువాత ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా స్వాతంత్య్ర పోరాటానికి దూరమయ్యారు. అంతవరకైతే అదొక దారి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారికి తన విధేయతను చాటుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మిలిటరీలో చేరి బ్రిటీష్‌ వారికి తోడ్పడాలని ప్రచారం చేశారు. అదే ఏడాది హిందూ మహాసభ నాయకత్వాన్ని స్వీకరించి తొలిసారిగా హిందుత్వను ప్రతిపాదించి ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. ముస్లిం ద్వేషిగా మారి చివరకు మహాత్మా గాంధీ హత్య కుట్రకేసులో ముద్దాయిగా మారిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను సరిగా ప్రవేశ పెట్టని కారణంగా ఆ కేసునుంచి బయటపడ్డారు.
సావర్కర్‌తో పాటు అనేక మంది దే శభక్తులు అండమాన్‌ జైలు పాలయ్యారు. వారెవరూ బ్రిటీష్‌ వారి దయాదాక్షిణ్యాల కోసం పాకులాడలేదు. అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన విషయం చాలా కాలం వరకు బయటకు రాలేదు. ఆయన 1966లో మరణించారు. 1975లో నాటి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్‌ జైలుకు వెళ్లినవారి గురించి ఒక పుస్తకం ప్రచురించాలని నిర్ణయించింది. దాన్ని ఆర్‌సి మజుందార్‌ అనే చరిత్రకారుడు రాశారు. ఆయన 1857 తిరుగుబాటును ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తి. సావర్కర్‌ అభిమానిగా ఆయన గొప్పతనాన్ని చిత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా బ్రిటీష్‌ వారికి రాసిన లొంగుబాటు లేఖలను దాచిపెట్టలేకపోయారు. అలాంటి సావర్కర్‌కు భారత రత్న బిరుదు ఇవ్వాలని కాషాయ దళాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. మోడీ సర్కార్‌ అందుకు ఇప్పటి వరకు ‘ఆ సాహసానికి ‘పూనుకొనేందుకు జంకింది. అక్టోబరు నెలలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తాము అధికారానికి వస్తే సావర్కర్‌కు భారత రత్న కోసం కృషి చేస్తామని బిజెపి-శివసేన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి.

Image result for rahul gandhi ramlila maidan
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో శివసేన నేతలు సావర్కర్‌ దే శభక్తుడనే తమ పాత వైఖరిని పునరుద్ఘాటించారు. నాటకీయ పరిణామాల మధ్య శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్‌ భాగస్వాములుగా ఉన్నాయి. తాము గాంధీ, నెహ్రూలను గౌరవిస్తామని అలాగే కాంగ్రెస్‌ కూడా సావర్కర్‌ను గౌరవించాలని శివసేన నేత సంజయరౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ ప్రతిదానినీ అంగీకరించలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలంటూ ఎన్‌సిపి నేత ఛాగన్‌ భుజబల్‌ రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఆవు మన మాతృమూర్తి కాదని సావర్కర్‌ అన్నారు, బిజెపి దానితో విబేధిస్తోంది, అదే మాదిరి పెద్ద వారి గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. దేశంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి వచ్చే ముప్పు ఉండదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత – ఎవరు దేశ భక్తులు !

03 Sunday Nov 2019

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్‌ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్‌ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేసింది. ఆరెస్సస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?

Image result for rcep
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్‌ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్‌ ఆయిల్‌, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్‌-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.

Image result for rcep
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్‌ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా నాయకత్వంలోని హైలెవెల్‌ అడ్వయిజరీ గ్రూప్‌(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్‌ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్‌ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్‌ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్‌ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్‌ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్‌ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్‌ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.

Image result for bjp cpim
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d