• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

దక్షిణాఫ్రికా పాలక కూటమిలో తీవ్రమౌతున్న విబేధాలు

07 Friday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

ANC, Jacob Zuma, SACP, south african ruling tripartite alliance

View image on Twitter

ఎం కోటేశ్వరరావు

ఇటీవల దక్షిణాఫ్రికా పాలక కూటమిలో సంభవిస్తున్న పరిణామాలు రానున్న రోజులలో నూతన రాజకీయ సమీకరణలకు సూచనలా ? గత కొద్ది రోజులుగా వేగంగా మారుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న ఘటనలు ప్రపంచ అభ్యుదయశక్తులకు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ పాలక కూటమిలో విబేధాలు తీవ్రం కావటాన్ని సూచిస్తున్నాయి. అవి ఎలా పరిణమించనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జాత్యహంకార పాలన అంతమై 23 సంవత్సరాల క్రితం ప్రజాస్వామిక పాలన ఏర్పడిన తరువాత పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎన్‌ఎన్‌సి)లో భాగస్వాములైన దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసిపి), దక్షిణాఫ్రికా కార్మిక సంఘాల సమాఖ్య(కొసాటు) మధ్య సంబంధాలలో తొలిసారిగా తీవ్ర పొరపొచ్చాలు తలెత్తాయి.

ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌ను తొలగించిన దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా చర్యను కమ్యూనిస్టుపార్టీ వ్యతిరేకించటమేగాక, జుమా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. పదవీకాల ప్రారంభం నుంచి అనేక వివాదాలకు, ఆరోపణలకు, విమర్శలకు కారణమౌతున్న జుమా వ్యవహార శైలి ప్రస్తుత వివాదానికి తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ కూటమిలో అంతర్గతంగా అంతకు మించిన తీవ్ర రాజకీయ, విధానపరమైన విబేధాలు వున్నట్లుగా కనిపిస్తోంది. అనేక వార్తా వ్యాఖ్యలను పరిశీలించినపుడు 2019లో జరగనున్న ఎన్నికలలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు విడివిడిగా తలపడనున్నాయా అన్నంత వరకు ఆలోచనలు పోతున్నాయి.అదే జరిగితే దక్షిణాఫ్రికా రాజకీయ రంగంలో మరొక కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది.

మార్చి 31న అధ్యక్షుడు జాకబ్‌ జుమా ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌, వుప ఆర్ధిక మంత్రి మెకిబిసీ జోన్స్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయటమేగాక అనేక మంది శాఖలను మార్చారు.ఈ చర్యను కమ్యూనిస్టుపార్టీతో పాటు దేశ వుపాధ్యక్షుడు, ఎఎన్‌సి నాయకుడు సిరిల్‌ రాంఫొసా, కొసాటు, తదితర సంస్ధలు, ప్రముఖులు విమర్శించారు. దేశ ప్రయోజనాలరీత్యా జుమా రాజీనామా చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. గోర్దన్‌ను తొలిగించిన తరువాత దేశ రుణ స్థితిపై స్టాండర్డ్‌ అండ్‌పూర్‌ సంస్ధ రేటింగ్‌ను తగ్గించింది. అధ్యక్షుడిని అభిశంసించాలని , ఆమేరకు తాము తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష డెమాక్రటిక్‌ అలయన్స్‌ ప్రకటించింది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యులే అధ్యక్షుడిపై విశ్వాసం లేదని ప్రకటించే తీర్మానం గురించి ఆలోచించాలని కమ్యూనిస్టుపార్టీ సూచించింది. జుమాకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు ప్రదర్శనలు చేయాలని అనేక సంస్ధలు పిలుపునిచ్చాయి. కొన్ని చోట్ల అనుమతి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. కమ్యూనిస్టుపార్టీ శుక్రవారం నాటి ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికాను రక్షించండి అంటూ ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించతలపెట్టిన ప్రదర్శనలను చట్టవిరుద్దమైనవిగా ప్రకటించాలని స్ధానిక అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కారణంగానే అనుమతి నిరాకరించారని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. అయితే కొన్ని చోట్ల స్ధానిక కోర్టులు ప్రదర్శనలకు అనుమతినిచ్చాయి.దీంతో తాను విడిగా జరపతలపెట్టిన ప్రదర్శనలను వాయిదా వేసుకున్న కమ్యూనిస్టుపార్టీ ఇతర సంస్దలు ఇచ్చిన పిలుపు మేరకు వాటిలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.

జాత్యహంకార వ్యవస్ధ వ్యతిరేక పోరాట యోథుడు అహమ్మద్‌ కత్రాడా స్మారక సభలో మాట్లాడిన కమ్యూనిస్టు నాయకులు దేశం కావాలో, గుప్తా కుటుంబంతో సంబంధాలున్న జాకబ్‌ జుమా కావాలో తేల్చుకోవాలని ఎఎన్‌సి నాయకత్వాన్ని బహిరంగంగా కోరారు.కమ్యూనిస్టుపార్టీ రెండవ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సోలీ మాపిలా మాట్లాడుతూ ప్రవీన్‌ గోర్దన్‌ను పదవి నుంచి తొలగించటం పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక వ్యవస్ధల విజయాన్ని వమ్ము చేయటం తప్ప మరొకటి కాదన్నారు.

FILE: An SACP protest. Picture: Rahima Essop/EWN.

ఈనెల ఐదున కమ్యూనిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ‘ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ వర్కింగ్‌ కమిటీ ఈ రోజు మీడియా గోష్టిలో చెప్పిన అంశాలను కమ్యూనిస్టు పార్టీ పరిగణనలోకి తీసుకున్నది. అధ్యక్షుడు జుమా రాజీనామా చేసే సమయం ఆసన్నమైందని పార్టీ నిర్ణయం మేరకు అధికారికంగా మొదట ఎఎన్‌సికి తెలియ చేసింది.పార్టీ నిర్ణయాన్ని బహిర్గతం చేయటానికి ముందే ఈ సమస్యపై చర్చించటానికి అందుబాటులో వుంటామని కూడా తెలియచేసింది. భేటీ కావటానికి ఎఎన్‌సి ఆమోదం తెలపటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది.అయితే అధ్యక్షుడు జాకబ్‌ జుమా సంప్రదింపులు జరపకుండా కమ్యూనిస్టుపార్టీని బలిపశువును చేయటాన్ని ఏ మాత్రం అంగీకరించటం లేదు. కూటమి భాగస్వాములనే కాదు చివరికి ఎఎన్‌సిని కూడా సంప్రదించకుండా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్దీకరించటం, మార్పులు, చేర్పులకు సంబంధించిపేర్లపై నిర్ణయం మరెక్కడో జరిగిందని ఎఎన్‌సి ప్రతినిధుల స్పందనను బట్టే నిర్ధారణ అయింది. గత వారంలో ఎఎన్‌సితో జరిపిన ద్విపక్ష సంప్రదింపులను కమ్యూనిస్టు పార్టీ లీక్‌ చేసి గోప్యంగా వుంచాలన్న అంగీకారానికి తూట్లు పొడిచిందన్న ఆధారం లేని ఆరోపణను కమ్యూనిస్టుపార్టీ తిరస్కరిస్తున్నది. నిజానికి లీకు ఎఎన్‌సి నాయకత్వం వైపు నుంచే జరిగిందన్నది స్పష్టం. మంత్రివర్గ మార్పులలో మాజీ ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌ను తొలగించటానికి కమ్యూనిస్టుపార్టీ అంగీకరించిందని చెప్పటం అవాస్తవం. లీకు వార్తల కారణంగా వాస్తవాలను తెలియ చెప్పేందుకే మార్చి 30 కమ్యూనిస్టు పార్టీ మీడియా గోష్టిని ఏర్పాటు చేసింది. లీకుల ద్వారా కమ్యూనిస్టు పార్టీ సమాచారాన్ని తెలియచేయదు. జుమా రాజీనామా చేయాలని తొలుత పిలుపు ఇచ్చిన కొందరు ఎఎన్‌సి నాయకులు వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తున్నది, అతను రాజీనామా చేయాల్సిందే అన్న వైఖరికి కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి వుంది’ అని ప్రకటనలో కమ్యూనిస్టుపార్టీ స్పష్టం చేసింది.

జుమా రాజీనామా చేయాలని కమ్యూనిస్టు పార్టీ గత కొద్ది నెలలుగా కోరుతున్నట్లు గతేడాదే వార్తలు వచ్చాయి. మంత్రులను తొలగించిన తరువాత జుమా రాజీనామా చేయాలని అధికార కూటమిలోని మూడవ పక్షమైన కొసాటు కూడా కోరింది. పాత మంత్రుల తొలగింపు, కొత్త మంత్రు నియామకం కారణాల గురించి జుమా ఇచ్చిన వివరణతో తాము సంతప్తి చెందినట్లు ఎఎన్సీ ప్రకటించింది. జుమా రాజీనామాతో పాటు తాజా పరిణామాల వెనుక కీలకపాత్రధారిగా పరిగణించబడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా పౌరసత్వం, నివాస హక్కులను రద్దు చేయాలని తాము డిమాండు చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శి జెర్మీ క్రోనిన్‌ వెల్లడించారు. గుప్తా కుటుంబం,జుమా స్నేహితుల ప్రమేయం వున్న సంస్దలు, కంపెనీలన్నింటిపై విచారణ జరపాలని అన్నారు.

దక్షిణాఫ్రికాలో ఎఎన్‌సి నాయకత్వంలోని కూటమి 23 సంవత్సరాల పాలనలో అనేక సంక్షేమ చర్యలు చేపట్టినప్పటికీ ఈ కాలంలో అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాల కొనసాగింపు తప్ప ప్రత్యామ్నాయ మౌలిక విధానాలను అమలు జరపలేదు. పర్యవసానంగా అనేక తరగతులలో ఇటీవలి కాలంలో అసంతృప్తి ప్రారంభమైంది. ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ కూడా ఒక భాగస్వామిగా వున్నప్పటికీ విధానాలలో ఎలాంటి మార్పులేదు. కమ్యూనిస్టు మంత్రులపై ఎలాంటి అవినీతి అక్రమాల ఆరోపణలు లేవు, వారు నిర్వహిస్తున్న శాఖలు కొంత మేరకు మిగతావారితో పోల్చితే మెరుగ్గా వున్నాయి తప్ప మెజారిటీ ఆఫ్రికన్ల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు. దీంతో ఎఎన్‌సి నుంచి కమ్యూనిస్టు పార్టీ విడిపోవాలని, ప్రత్యామ్నాయ విధానాలను అమలు జరపాలని అందుకుగాను ఎన్నికలలో విడిగా పోటీ చేయాలనే ప్రతిపాదనలు గత కొంత కాలంగా కమ్యూనిస్టుపార్టీలో ముందుకు వస్తున్నాయి. జుమా పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు తీవ్రతరం కావటంతో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. జాత్యహంకార వ్యతిరేక శక్తుల మధ్య ఐక్యతను కొనసాగించాలన్న అవగాహనతో వున్న కమ్యూనిస్టుపార్టీ, కొసాటు గత ఇరవై సంవత్సరాల కాలంలో వ్యవహరించిన తీరును గమనిస్తే అధికార కూటమిలో తలెత్తిన సంక్షోభ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. మాజీ అధ్యక్షుడు తాబో ఎంబెకీ చర్యలను వ్యతిరేకించిన జాకబ్‌ జుమాను గతంలో బలపరచటమే కాదు, రెండు పర్యాయాలు అధ్య క్షుడిగా కూడా అంగీకరించింది. అదే కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు మరో రెండు సంవత్సరాల పదవీకాలం వున్నప్పటికీ రాజీనామా చేయాలని, జనం కావాలో-జుమా కావాలో తేల్చుకొమ్మని ఎఎన్‌సిని డిమాండ్‌ చేస్తున్నది. జుమా విధానాలను విమర్శించి వ్యతిరేకించిన కారణంగా తన స్వంత ప్రధాన కార్యదర్శి వెలిన్‌ జిమా వావిని కాసాటు పదవి నుంచి తొలగించింది, అతి పెద్ద మెటల్‌ కార్మిక సంఘాన్ని బహిష్కరించింది. అదే కొసాటు ఇప్పుడు జుమా రాజీనామా కోరుతున్నది. గతంలో ఎఎన్‌సి నుంచి వెలివేతకు గురైన వారు, లేదా తామే తప్పుకున్నవారు రాజీనామా కోరటం సరేసరి. అధికార కూటమిలో తలెత్తిన విభేదాలను వుపయోగించుకొనేందుకు ప్రతిపక్ష డెమొక్రటిక్‌ అలయన్స్‌ అభిశంసన అస్త్రంతో తయారైంది.

మరోవైపున జుమా మద్దతుదార్లు కూడా రంగంలోకి దిగారు. వారిలో రెండు రకాలు జుమా అధికారాన్ని ఆసరా చేసుకొని అక్రమలబ్ది పొందిన వాణిజ్య, పారిశ్రామికవేత్తల లాబీతో పాటు సామాజిక మాధ్యమంలో డబ్బుతీసుకొని ఏ ప్రచారం కావాలంటే అది చేసి పెట్టే ట్రోల్స్‌ లేదా మరుగుజ్జు వీరులు కూడా పూర్తి స్ధాయిలో దిగారు. నలుపు-తెలుపు మనో భావాలను రెచ్చగొడుతూ గుప్తా కుటుంబం దేశభక్తి పరులైన జాతీయ బూర్జువా అని, తమ నేత జుమా తెల్లజాతి పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు వ్యతిరేకంగా పని చేస్తున్న కారణంగా ఆ గుత్త సంస్ధలు, నల్లవారి వ్యతిరేకులైన సామ్రాజ్యవాదులు రాజీనామా డిమాండ్‌ వెనుక వున్నారని ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు జుమా వెనుక వున్న గుప్తా కుటుంబానికి చెందిన టీవీ ఛానల్‌, ఇతర మీడియా సంస్దలు కూడా రంగంలోకి దిగాయి. తనకు వ్యతిరేకంగా ప్రవీణ్‌ గోర్దన్‌ కుట్రకు పాల్పడిన కారణంగానే పదవి నుంచి తొలగించినట్లు జుమా చెబుతున్నాడు.

జాత్యహంకార పాలన అంతమైన తరువాత జనంలో ఎన్నో ఆశలు మొలకెత్తాయి. అయితే 1990 దశకం చివరిలో పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలు 2008 నాటికి తీవ్ర సంక్షోభ రూపంలో బయటపడిన విషయం తెలిసినదే. దక్షిణాఫ్రికాలో 1994లో అధికార మార్పిడి తప్ప అంతకు ముందు అభివృద్ధి చేసిన పెట్టుబడిదారీ, నయా వుదారవాద వ్యవస్ధలో ఎలాంటి మౌలిక మార్పులు లేవు. అదే నేటి రాజకీయ సంక్షోభానికి నాంది అని చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో విధానాల మార్పుకు కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించటంలో విఫలమైందనే విమర్శలు వున్నాయి. గోర్డన్‌ తొలగింపును వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుపార్టీ జుమా రాజీనామా డిమాండ్‌ చేసి ప్రదర్శనలకు కూడా పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలోని తన మంత్రులను కొనసాగిస్తున్నది. జుమా రాజీనామా ఒక్క కమ్యూనిస్టుపార్టీ వైఖరిపైనే ఆధారపడి లేదు. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో వున్న జుమా వ్యతిరేకులు ఏం చేస్తారన్నది కూడా చూడాల్సి వుంది. 2019 ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలా లేక త్రిపక్ష కూటమి ఏకాభిప్రాయంతో ఐక్య అభ్యర్ధిని దించాలా అనే ప్రధాన అంశాలపై కమ్యూనిస్టులు తీసుకొనే నిర్ణయంపై దక్షిణాఫ్రికా పరిణామాలు ఆధారపడి వుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈక్వెడోర్‌లో వామపక్ష విజయం-ప్రాధాన్యత, సవాళ్లు !

05 Wednesday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties

≈ 2 Comments

Tags

Ecuador, ecuador presidential race, leftist moreno wins, Lenín Moreno

Image result for lenín moreno ecuador

నిల్చున్న వ్యక్తి రాఫెల్‌ కొరెయా,  కూర్చున్నది లెనిన్‌ మొరేనో

ఎంకెఆర్‌

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగులుతూ మితవాదశక్తులు చెలరేగిపోతున్న తరుణంలో వాటికి అడ్డుకట్ట వేసి ఈక్వెడార్‌లో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. ఆదివారం నాడు జరిగిన తుది విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి లెనిన్‌ మొరేనో సాధించిన విజయం ప్రపంచ అభ్యుదయ శక్తులన్నింటికీ కొత్త శక్తి నిస్తుంది. పోలైన ఓట్లలో 99.65శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 51.16శాతం, ప్రత్యర్ధి గులెర్మో లాసోకు 48.84శాతం వచ్చినట్లు తెలిపిన ఎన్నికల అధికారులు లెనిన్‌ విజయసాధించినట్లు ప్రకటించారు. తాను విజయం సాధించనున్నట్లు మూడు ఎగ్జిట్స్‌ పోల్స్‌లో ప్రకటించారని, తీరా అందుకు భిన్నంగా ఫలితాలు వుండటం అంటే ఎన్నికలలో అక్రమాలు జరగటమే అంటూ తానే అసలైన విజేతనని లాసో ప్రకటించుకోవటమే గాక ఎన్నికల అక్రమాలకు నిరసన తెలపాలని మద్దతుదార్లకు పిలుపు ఇచ్చాడు. న్యాయమూర్తులు కూడా అక్రమాలలో భాగస్వాములయ్యారని ఆరోపిస్తూ తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికలను పర్యవేక్షించిన అమెరికా రాజ్యాల సంస్ధ ప్రతినిధులు తాము తనిఖీ చేసిన 480చోట్ల పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఎక్కడా తేడా బయటపడలేదని, అందువలన లాసో చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు. లాసో మద్దతుదార్లు పలుచోట్ల ప్రదర్శనలకు దిగి హింసాకాండకు పాల్పడ్డారు.

Image result for lenín moreno victory marches

ప్రతిపక్ష అభ్యర్ధి చర్య జనాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చేసిన కుట్ర అని ప్రస్తుత అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా విమర్శించారు. బ్యాలట్‌ ద్వారా సాధించలేని దానిని హింసాకాండద్వారా పొందాలని చూస్తున్నారని దేశ ప్రజలను హెచ్చరించారు. ఫిబ్రవరి19న జరిగిన ఎన్నికల ఫలితాలపై సెడాటోస్‌ అనే ఎన్నికల జోశ్యుడు చెప్పిన అంశాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. విజయం సాధించేందుకు ఎవరికీ అవసరమైన మెజారిటీ రాకపోవటంతో తొలి రెండు స్ధానాలలో వచ్చిన వారు తుది విడత పోటీ పడ్డారు. ఈ పోటీలో ప్రతిపక్ష లాసో ఆరుశాతం మెజారిటీతో విజయం సాధిస్తారని అదే జోశ్యుడు చెప్పాడు. అయితే అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది. ప్రతిపక్ష అభ్యర్ధి ఓటమిని అంగీకరించకుండా, అక్రమాలు జరిగాయని, తానే విజయం సాధించానని ప్రకటించి ఆందోళనకు రెచ్చగొట్టిన నేపధ్యంలో ఏర్పడిన గందరగోళానికి మంగళవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెరదించింది. కమిషన్‌ అధ్యక్షుడు జువాన్‌ పాబ్లో పోజో అధికారికంగా టీవీలో ఒక ప్రకటన చేస్తూ ‘ఫలితాలకు తిరుగులేదు, అక్రమాల ఆనవాళ్లు లేవు, దేశం తమ అధ్యక్షుడిని స్వేచ్చగా ఎంపిక చేసుకుంది’ అని ప్రకటించారు.

Image result for lenín moreno victory marches

 

రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని వామపక్ష అలయన్స్‌ పాయిస్‌ పార్టీ రాజకీయ వారసుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో మేనెల 17న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓట్ల లెక్కింపులో విజయం ఖరారు అయిన వెంటనే పాలకపార్టీ నేతలందరూ అధ్యక్ష భవనం నుంచి జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా లెనిన్‌ హాపీ బర్తడే అంటూ శుభాకాంక్షలు తెలుపగా పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు కొరెయా ఈనెల ఆరున జరుపుకోవాల్సిన తన 54వ పుట్టిన రోజును ముందే జరుపుకుంటూ మూడవ తేదీనే కేక్‌ కట్‌ చేశారు. పది సంవత్సరాల కొరెయా పాలన తరువాత మూడవ సారి కూడా వామపక్షం విజయం సాధించటానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలను ఆసరా చేసుకొని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు, లాటిన్‌ అమెరికా పెట్టుబడిదారులు, మితవాద, క్రైస్తవ మతవాద శక్తులు, అగ్రశ్రేణి మీడియా కుమ్మక్కుతో వామపక్ష శక్తులు అధికారానికి దూరమయ్యాయి.ఈ నేపథ్యంలో తదుపరి వంతు ఈక్వెడోర్‌ అని వామపక్ష వ్యతిరేక శక్తులు సంబరపడ్డాయి. తొలి విడత ఓటింగ్‌లో కూడా అదే ధోరణి వ్యక్తమైంది.ఫిబ్రవరి 19న అధ్యక్ష ఎన్నికతో పాటు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 137 స్థానాలకు గాను వామపక్ష పార్టీ 74 సంపాదించి మెజారిటీ తెచ్చుకుంది. గతం కంటే 26 స్ధానాలు తగ్గాయి. ప్రతిపక్షంలోని ఏడు పార్టీలకు కలిపి 60, స్వతంత్రులకు మూడు స్ధానాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఎవరికీ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలట్‌ పత్రాలను వేసిన వారు 22.1శాతం మంది వున్నారు.

లాటిన్‌ అమెరికాను తమ నయా వుదారవాద విధానాల ప్రయోగశాలగా చేసుకున్న పెట్టుబడిదారీ వర్గం ఆఖండంలోని దేశాల ఆర్ధిక వ్యవస్ధలను వస్తు ఎగుమతి ఆధారితంగా మార్చివేశాయి. కార్మికవర్గ సంక్షేమ చర్యలకు మంగళం పాడటంతో పాటు, రుణవూబిలో ముంచివేశాయి. జనం నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి సైనిక నియంతలను లేదా వారితో కుమ్మక్కైన మితవాద శక్తులను గద్దెలపై ప్రతిష్ఠించాయి. వారిని భరించలేక జనంలో తిరుగుబాట్లు తలెత్తటంతో వారిని పక్కన పెట్టి తమ అడుగుజాడల్లో నడిచే శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఎన్నికలకు కాస్త వెసులుబాటు కల్పించిన పూర్వరంగంలో నయావుదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు, వామపక్షాలు అనేక చోట్ల అధికారానికి వచ్చి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. జనానికి తక్షణం వుపశమనం కలిగించే చర్యలు చేపట్టటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి. అందుకే జనం గత పదిహేను సంవత్సరాలలో వరుసగా అనేక చోట్ల ఆశక్తులకు పట్టం గట్టారు. తమకు రాగల ముప్పును పసిగట్టిన సామ్రాజ్యవాదులు, బహుళజాతి గుత్త సంస్ధలు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయి. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో 2008 నుంచి కొనసాగుతున్న తీవ్ర ఆర్ధిక మాంద్యం, సంక్షోభాల ప్రభావం వామపక్షాలు అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా దేశాలపై కూడా పడటంతో ఆ ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతులలో వాటిపై అసంతృప్తి మొదలైంది. ఈ తరుణంలో మీడియా ప్రచార ఆయుధాలతో మితవాద శక్తులు విజృంభించి జనంలో అయోమయం, వామపక్ష వ్యతిరేకతను రెచ్చగొట్టటం, అప్పటికే వున్న మితవాద శక్తులను మరింత సంఘటిత పరచటం వంటి చర్యలకు పూనుకున్నాయి. మరోవైపు ఆర్ధిక రంగంలో ప్రపంచ మార్కెట్లో పెట్రోలియంతో సహా వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతి ఆధారిత వ్యవస్ధలుగా వున్న దేశాలలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వీటికి ఇతర కారణాలు కూడా తోడు కావటంతో సామ్రాజ్యవాద, మితవాద శక్తుల కుట్రలు ఫలించి అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల వామపక్ష శక్తులకు ఎదురుదెబ్బలు తగిలాయి. దానికి భిన్నంగా ఫలితం రావటమే ఈక్వెడోర్‌ ఎన్నికల ప్రత్యేకత.

Photo by: Reuters

2007లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన అప్పులను తాము తీర్చాల్సిన అవసరం లేదంటూ మూడువందల కోట్ల డాలర్లను చెల్లించేది లేదని ప్రకటించారు. అయితే అప్పులిచ్చిన వారు అంతర్జాతీయ కోర్టులకు ఎక్కారు. అప్పులలో 60శాతం మేరకు రద్దు కావటంలో కొరెయా ప్రభుత్వం విజయం సాధించింది.దాంతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలు కలిగింది. 2006-16 మధ్య కాలంలో దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య తగ్గింపు చర్యల కారణంగా 36.7 నుంచి 22.5శాతానికి తగ్గిపోయింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు రెండదశాబ్దాల కాలంలో తలసరి జిడిపి పెరుగుదల రేటు 0.6శాతం కాగా కొరెయా పదేళ్ల కాలంలో అది 1.5శాతానికి పెరిగింది. అసమానతలను సూచించే జినీ సూచిక 0.55 నుంచి 0.47కు తగ్గింది. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనం ప్రకారం అవినీతి కూడా తగ్గింది. ఇదే సమయంలో చమురు, వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతుల ఆదాయం తగ్గిపోయింది. భూకంప బాధితులను ఆదుకొనేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావటం వంటి కారణాలతో 2014 నుంచి ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులకు లోనైంది.వృద్ధి రేటు పడిపోయింది. మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గిపోయింది. అనేక పరిశ్రమలు, వ్యాపారాలలో కార్మికులు వుద్వాసనకు గురయ్యారు. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతుల్లో అసంతృప్తి మొదలైంది. దీనిని గోరంతను కొండంతగా చిత్రించటంలో మీడియా ప్రారంభం నుంచి ప్రచారదాడి జరిపింది.

ఈ పూర్వరంగంలో ఫిబ్రవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అధికార వామపక్ష నేత లెనిన్‌ మొరేనోకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన 40కిగాను 39శాతమే వచ్చాయి. మిగతా వారికి 28,16 చొప్పున వచ్చాయి. దాంతో తొలి ఇద్దరి మధ్య ఎన్నిక ఈనెల రెండున జరిగింది. పదహారుశాతం వచ్చిన మితవాద క్రైస్తవ పార్టీతో సహా వామపక్ష వ్యతిరేకులందరూ పాలకపార్టీకి వ్యతిరేకంగా నిలిచిన మితవాది లాసోకు మద్దతు ప్రకటించారు. అరవై ఒక్కశాతం ఓట్లు అధికారపక్షానికి వ్యతిరేకంగా పడటంతో ప్రతిపక్ష నేత లాసో గెలుపు తధ్యమని ఎన్నికల పండితులు జోశ్యాలు చెప్పారు. అంతిమ ఎన్నికలలో అందుకు విరుద్దంగా పదకొండుశాతానికి పైగా ఓటర్లు వామపక్షం వైపు మొగ్గటం మితవాద శక్తులను కంగు తినిపించింది.

Image result for lenín moreno victory marches

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో ఎలాంటి మచ్చలు లేని స్వచ్చమైన వామపక్ష కార్యకర్త, సార్ధక నామధేయుడిగా మారారు. ఈక్వెడోర్‌ అమెజాన్‌ ప్రాంతంలో మధ్యతరగతికి చెందిన సెర్వియో తులియో మొరేనో లెనిన్‌ రచనలతో ఎంతో ప్రేరణ పొందాడు. ఆ కారణంగానే 1953 మార్చి 19న జన్మించిన తన కుమారుడు బోల్టెయిర్‌ మొరేనో గ్రేసెస్‌కు ముందు లెనిన్‌ అని చేర్చాడు. తండ్రి ఆకాంక్షకు అనుగుణ్యంగానే లెనిన్‌ మొరేనో వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా జీవించి ఇపుడు దేశాధ్యక్షుడయ్యాడు. ఇంతకు ముందు 2007-13 సంవత్సరాల మధ్య దేశ వుపాధ్యక్షుడిగా పని చేశారు. వికలాంగుల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గాను ఎన్నో ప్రశంసలు పొందారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొంది వుత్తమ గ్రాడ్యుయేట్‌గా గౌరవం పొందిన లెనిన్‌ 1976లో ఒక శిక్షణా కేంద్ర డైరెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.1998 మార్చి మూడవ తేదీన ఒక దుకాణ పార్కింగ్‌లో వున్న సమయంలో వచ్చిన ఇద్దరు యువకులు ఆయనకు తుపాకి చూపి కారు, పర్సు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆయన కారు తాళం చెవి, పర్సు వారికి ఇచ్చారు. వాటిని తీసుకొని వెళ్లిపోతూ వారిలో ఒకడు లెనిన్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యాడు. దాని నుంచి కోలుకోవటం కష్టమని వైద్యులు నిర్ధారించారు. అయితే ధైర్యం కోల్పోకుండా చదివి నవ్వుల చికిత్స ద్వారా స్వస్ధత పొందవచ్చని తాను గతంలో చదివిన దానిని ఆచరణలో పెట్టి నాలుగు సంవత్సరాల తరువాత చక్రాల కుర్చీలో కూర్చొని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే స్ధితికి చేరారు. అదే స్ధితిలో వుపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడై ఒక చరిత్రను సృష్టించారు. నడవలేని వ్యక్తి ఒక దేశాధ్యక్షుడు కావటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు.

ప్రత్యర్ధి లాసో దేశం 1999లో ఎదుర్కొన్న బ్యాంకింగ్‌ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొన్న ఒక బ్యాంకరు. రాజకీయాలకు దూరంగా వున్న ఆయనను మితవాదులు ఎన్నికలపుడు మాత్రమే రంగంలోకి తెచ్చారు. ఆ పెద్దమనిషి ఎన్నికైతే ఇప్పటి వరకు తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుల హక్కులకు పూర్తి భంగం కలుగుతుందని, కార్మికవర్గం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అధ్యక్షుడు కొరెయా పెద్ద ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనాన్ని కోరారు. దీనికి తోడు గత రెండు నెలల కాలంలో మితవాదుల ఆధ్వర్యాన వున్న అర్జెంటీనా, బ్రెజిల్‌ పాలకుల చర్యలకు నిరసనగా అంతకు ముందు వారికి మద్దతు ఇచ్చిన వారితో సహా కార్మికవర్గం పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంది. రెండోవైపు మితవాదులు అధికారంలో వున్న దేశాలన్నింటా ఇదే పరిస్థితి పునరావృతం కావటం తదితర కారణాలతో ఓటర్ల ఆలోచనలో మార్పు వచ్చింది. అంతకు ముందు వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేసిన వారిలో పదకొండుశాతం మంది మనసు మార్చుకొని లెనిన్‌కు ఓటు వేయటంతో మితవాదుల యాత్రకు బ్రేక్‌ పడినట్లయింది.

అమెరికా ప్రభుత్వ, సిఐఏ ఇతర సంస్ధల కుట్రలు, కూహకాలు, బండారాలను బయటపెడుతూ ఇప్పటికీ మిలియన్ల కొలది పత్రాలను బయట పెడుతున్న వికీలీక్స్‌ స్ధాపకుడు, ఆస్ట్రేలియన్‌ అయిన జులియన్‌ అసాంజేను ఎదో ఒక పేరుతో శిక్షించాలని, అంతం చేయాలని చూస్తున్న అమెరికా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో 2012 నుంచి ఈక్వెడోర్‌ వామపక్ష ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షిస్తున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే నెల రోజుల్లో అసాంజేను బయటికి పంపిస్తానని మితవాద అభ్యర్ధి లాసో ప్రకటించగా ఆశ్రయం కొనసాగిస్తానని లెనిన్‌ వాగ్దానం చేశారు. ఇప్పుడు లెనిన్‌ విజయంతో అసాంజేకు ముప్పు తప్పింది. ఫలితాలు స్పష్టమైన తరువాత అసాంజే ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘ పన్నుల స్వర్గాల(అక్రమంగా సంపదలు దాచుకొనే ప్రాంతాలు) లోని మిలియన్ల కొద్దీ దాచుకున్న సంపదలతో గానీ లేకుండా గానీ నెల రోజుల్లో లోపల ఈక్వెడోర్‌ వదలి వెళ్లాలని లాసోకు సవినయంగా మనవి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

అయితే ఈ విజయంతో ఈక్వెడోర్‌ వామపక్షం సంతృప్తి చెందితే అది ఎంతో కాలం నిలవదు.అధికారంలో వున్న లేదా తిరిగి అధికారానికి రావాలని ప్రయత్నిస్తున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులందరి ముందు పెద్ద సవాలు వుంది. నయా వుదారవాద పునాదులను అలాగే వుంచి సంక్షేమ చర్యలు చేపట్టటం ఎల్లకాలం సాధ్యం కాదని అన్ని దేశాల అనుభవాలూ నిరూపించాయి. తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొనేందుకు లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు సంఘటితం కావటానికి అధికారికంగా చేసిన కొన్ని ప్రయత్నాలు రాజకీయంగా చైతన్యవంతులైన జనాన్ని వుత్తేజితం చేస్తాయి తప్ప ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారిని సంతృప్తి పరచజాలవు. నయా వుదారవాద విధానాల నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాహిత వైపు అడుగులు వేస్తూ అందుకు ఆటంకంగా వుంటూ ఆర్ధిక వ్యవస్ధను అదుపులో వుంచుకున్న శక్తులను, వారికి మద్దతుగా ప్రచారదాడి చేస్తున్న స్వప్రయోజన మీడియాను అదుపు చేయకుండా లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు ముందుకు పోజాలవని గత పదిహేను సంవత్సరాల అనుభవాలు విదితం చేస్తున్నాయి. బొలివర్‌ సోషలిజం, 21వ శతాబ్దపు సోషలిజం, ప్రజాస్వామిక సోషలిజం ఇలా ఏ పేరు పెట్టుకున్నప్పటికీ పెట్టుబడిదారీ వర్గ ఆర్ధిక పునాదులను కదిలించకుండా మరొక అడుగు ముందుకు వేయలేము అనే అంశాన్ని అవి గుర్తించకతప్పదు. ప్రపంచీకరణ పేరుతో సకల దేశాలను ఆక్రమించాలని చూసిన అగ్రగామి పెట్టుబడిదారీ వ్యవస్ధలన్నీ మరొక మారు స్వరక్షణ చర్యలకు పూనుకుంటున్న సమయమిది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధలోని బలహీనతకు చిహ్నం. ఇలాంటి రక్షణ చర్యలు, మార్కెట్ల ఆక్రమణ క్రమంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. అందువలన వర్తమాన పరిస్ధితులలో మార్క్సిజం-లెనినిజాలను ఏ దేశానికి ఆదేశం తమ పరిస్థితులకు సక్రమంగా అన్వయించుకొని తదుపరి పోరాట మార్గం, రూపాలు,ఎత్తుగడలను నిర్ణయించుకోవాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్టోబరు విప్లవ ప్రాధాన్యత-ప్రపంచ పర్యవసానాలు

25 Tuesday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, Joseph Stalin, Lenin, october revolution, october revolution it's implications, october revolution today's relevance

ఎం కోటేశ్వరరావు

     ప్రపంచ గతినే ఒక పెద్ద మలుపు తిప్పిన వుదంతం 1917 రష్యన్‌ అక్టోబరు విప్లవం.ఆ మహత్తర ఘటన జరిగి నూరు సంవత్సరాలు కావస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచంలోని పలు కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ విప్లవ ప్రాధాన్యతను నేటి తరాలకు పరిచయం చేసేందుకు పూనుకున్నాయి. ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతివేసి విజయం సాధించామని చంకలు కొట్టుకుంటూనే అనేక చోట్ల పాలకవర్గాలు చివరికి చే గువేరా బొమ్మ, ఎర్ర రంగు టీషర్టులు, కమ్యూనిజానికి చెందిన పుస్తకాలు అమ్మటం కనిపించినా వులిక్కి పడటాన్ని ఇండోనేషియా వంటి అనేక చోట్ల చూస్తున్నాం. వూరంతా కావమ్మ మొగుడు అంటే కామోసనుకున్నాను, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే నాదారిన నే పోతా అన్న మాదిరి 1991లో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చి వేసిన తరువాత అనేక మంది కమ్యూనిస్టు జండాలు తిప్పేశారు.

   పాతిక సంవత్సరాలు గడిచిన తరువాత అనేక చోట్ల పూర్వపు సోషలిస్టు దేశాలలో అంతర్మధనం జరుగుతోంది. వున్న సంక్షేమ వ్యవస్ధ పోయింది, పెట్టుబడిదారీ విధానం అదనంగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగివేసుకుందని, కడుపు మాడుస్తోందని జనం గ్రహించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధకు తలమానికమైన అమెరికాలో నిన్న మొన్నటి వరకు సోషలిస్టు, కమ్యూనిస్టు అని చెప్పుకోవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు అవును మేము సోషలిస్టులమే అయితే ఏమిటి అని మిలియన్ల మంది యువత ప్రశ్నిస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు ! అమెరికాలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం అక్కడి కార్మిక, మధ్యతరగతి పౌరుల జీవితాలను అతలాకుతలం చేయటమే దీనికి కారణం, పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందని అనేక మంది అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటని శోధిస్తున్నారు. ఆ క్రమంలో అనేక మంది అటకెక్కించిన కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలను దించి దుమ్మదులిపి అసలు వాటిలో ఏం రాశారు ? మనకేమైనా పరిష్కారం చూపుతాయా అని అధ్యయనం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?

   ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల విప్లవాలు సంభవించాయి. అనేక పరిణామాలు నాటకీయంగానే ప్రారంభమయ్యాయి. పైకి అలా కనిపించినప్పటికీ వాటికి తగిన భూమిక తయారై వున్నందునే అలా జరిగాయి. అయితే ఎక్కడ, ఏ రూపంలో, ఎలా జరుగుతుందన్నదే అనూహ్యం. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన బ్రిటన్‌, జర్మనీ వంటి చోట్ల సోషలిస్టు విప్లవం వస్తుందని కారల్‌మార్క్సు-ఎంగెల్స్‌ అంచనా వేశారు. అందుకు భిన్నంగా రష్యాలో వచ్చింది. లెనిన్‌తో సహా బోల్షివిక్‌ పార్టీ నాయకత్వం ఎక్కువ భాగం ప్రవాసంలో వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జారు చక్రవర్తుల పాత్రపై జనం ఆగ్రహంతో వున్నారు. ఈ స్ధితిలో బోల్షివిక్‌లకు అవకాశం ఇవ్వకుండా రష్యా పాలకవర్గం 1917ఫిబ్రవరిలో కెరెన్సీని రంగంలోకి దించి తిరుగుబాటు పేరుతో జారును తొలగించి బూర్జువా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అయితే అక్టోబరు నాటికి బోల్షివిక్‌ నేత లెనిన్‌ ప్రవాసం నుంచి తిరిగి వచ్చి కెరెన్సీ ప్రభుత్వాన్ని తొలగించి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపివేసిన పదిరోజులు అనే పేరుతో జాన్‌ రీడ్‌ అనే అమెరికన్‌ రచయిత ఈ మహత్తర విప్లవం పరిణామాలను గ్రంధస్ధం చేశారు.

   మొదటి ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్న పరిస్ధితులలో 1914లో అంతర్జాతీయ సోషలిస్టు వుద్యమం ఒక విధంగా కుప్పకూలిపోయింది. నాటి కార్మివర్గ పార్టీలలో ముఖ్యమైన జర్మన్‌ మ్యూనిస్టుపార్టీ యుద్ధానికి అనుకూలంగా ఓటు చేసింది. కొద్ది మంది మైనారిటీలు మాత్రమే ఇది ప్రజల యుద్ధం కాదు, ప్రజలపై యుద్ధం అని వాదించారు. అలాంటివారిలో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌ పార్టీ ఒకటి. ఆ కారణంగానే అది సరైన ఎత్తుగడలు అవలంభించి పాలకవర్గ బలహీనతను వుపయోగించుకొని మహత్తర సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయగలిగింది.

    అక్టోబరు విప్లవం గురించి 1918లో లెనిన్‌ ఒక సందర్బంగా రాసిన దానిలో ‘ సోవియట్‌ తరహా నూతన రాజ్యాన్ని సృష్టించి కష్టతరమైన సమస్యలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిష్కరించగలిగాము. ప్రధాన ఇబ్బంది ఆర్ధిక రంగంలో వుంది’ అని చెప్పారు. విప్లవ సమయంలో మిగతా ఐరోపాతో పోల్చితే రష్యా అనేక విధాలుగా వెనుకబడే వుంది. అంతర్గతంగా భూస్వామిక శక్తులు, పెట్టుబడిదారులు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించారు. బయట మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజిత దేశాలూ రెండు కూటములూ సోవియట్‌ చుట్టూ దానిని నమిలి మింగేసేందుకు అవకాశం కోసం చూస్తున్న సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు చుట్టుముట్టి వున్నాయి. 1917లో సంభవించిన విప్లవం 1989 నాటికి సామ్రాజ్యవాదుల కుట్రలకు బలై ఎలా కూలిపోయిందీ తెలుసుకోకుండా దాని ప్రాధాన్యతను , నేటికీ దానికి వున్న విలువ ఏమిటో అర్ధం చేసుకోలేము.

    అక్టోబరు విప్లవానికి ముందు విదేశాంగ విధానమంటే సామ్రాజ్యవాదులు ఏ ప్రాంతాన్ని ఎలా ఆ క్రమించుకోవాలి, ఎవరైనా పోటీకి వస్తే వారిని ఎలా దెబ్బతీయాలనేదే తప్ప మరొకటి మనకు కనపడదు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే విదేశాంగ విధానానికి రూపకల్పన జరిపింది సోవియట్‌ యూనియన్‌ వునికిలోకి వచ్చిన తరువాతే. కమ్యూనిస్టు పార్టీలు, సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయ వుద్యమాలు, వివిధ ప్రజా సంఘాలకు రూపకల్పన చేసింది కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అన్నది తెలిసిందే. దాన్ని ఒక విధానంగా ఆచరణలోకి తెచ్చింది, అభివృద్ది చేసిందీ సోవియట్‌ యూనియన్‌. అక్టోబరు విప్లవం ఫలితంగా ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ అనేక దేశాలలో కమ్యూనిస్టు విప్లవ సంస్ధల ఏర్పాటుకు, జాతీయ విముక్తి, విప్లవాలకు తోడ్పాటునందించింది. చైనా విముక్తికి ప్రత్యక్షంగా తోడ్పడింది, సోవియట్‌ లేకుంటే చరిత్ర మరోవిధంగా వుండి వుండేది. సోవియట్‌లో కష్టజీవుల రాజ్యం ఏర్పడిందని, ఎలా వుంటుందో చూద్దామని అష్టకష్టాలు పడి వెళ్లిన వారు అనేక మంది కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కూడా అలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు, 1920 తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఆ విధంగా జరిగిందే . సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ను మన స్వాతంత్య్రం వుద్యమంలో ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. ఈ కారణంగానే తమ దోపిడీకి రాగల ముప్పును గమనించి సామ్రాజ్యవాదులు సోవియట్‌ను మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజితులూ ఇరు పక్షాలూ సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించే లెనిన్‌ ప్రారంభంలోనే జర్మన్‌ సామ్రాజ్యవాదులతో బ్రెస్ట్‌లిటోవస్కీ సంధి చేసుకొని విప్లవ ఫలితాన్ని రక్షించారు. అక్టోబరు విప్లవం జాతీయ స్వాతంత్య్ర, విముక్తి వుద్యమాలకు వూపునివ్వటంతో మన దేశంతో సహా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీల పుట్టుకకు పురుడు పోసింది. పర్యవసానంగా రెండవ ప్రపంచ యుద్దం నాటికి సామ్రాజ్యవాదులు తమ వలసలను ఇంకేమాత్రం నిలుపుకోలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికాతో సహా అన్ని సామ్రాజ్యవాద దేశాలూ జర్మన్‌ నాజీ హిట్లర్‌ను అన్ని విధాలుగా ప్రోత్సహించాయి.ఈ కుట్రను ముందుగా పసిగట్టిన స్టాలిన్‌ హిట్లర్‌ వ్యతిరేక కూటమితో ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నించారు. ముందుగా హిట్లర్‌ను సోవియట్‌పైకి పంపి దానిని పతనం చేసిన తరువాత తాము తేల్చుకోవచ్చని ఇతర సామ్రాజ్యవాదులు దురాలోచన చేశారు.

    అందుకే తగిన సన్నాహాలు చేసుకొనేందుకు మరోసారి 1939తో జర్మనీతో రష్యన్లు పరస్పర దాడుల నిరోధ ఒప్పందం చేసుకున్నారు. సోవియట్‌ను ఏక్షణంలో అయినా లేపివేయవచ్చు, ముందు గతంలో తమను ఓడించిన ఇతర సామ్రాజ్యవాదుల పని బట్టాలని నిర్ణయించుకున్న హిట్లర్‌ తన వ్యూహం అమలు జరిపాడు. వరుసగా విజయాలు సాధించిన వూపులో సోవియట్‌ను కూడా ఆక్రమించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించిన హిట్లర్‌ 1941లో అంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని వుల్లంఘించి సోవియట్‌పై దాడులకు దిగాడు. ఇది ప్రపంచగతిని మరోమలుపు తిప్పుతుందని ఎవరూ వూహించలేదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడటానికి ముందు నానాజాతి సమితి వుండేది. దాని వైఫల్యాల తీరుతెన్నులను గమనించి రెండవ ప్రపంచ యుద్దానికి ముందు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఒక భద్రతా వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది నాటి సోవియట్‌ యూనియన్‌ మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ తరువాత అంతకంటే పటిష్టమైన ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అయితే ఇది కూడా నానాజాతి సమితి వైఫల్యాల బాటలోనే పయనిస్తున్నది, అందుకు బాధ్యత ఎవరిది, నిబంధనలను వుల్లంఘిస్తున్నది ఎవరంటే అమెరికా, దాని మిత్రరాజ్యాలే మనకు కనిపిస్తాయి.

    ఐరోపాను గడగడలాడించిన హిట్లర్‌ సేనలను మట్టుబెట్టటమే గాక, హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చావాల్సిన పరిస్ధితిని కల్పించిన మొనగాడుగా సోవియట్‌ ప్రపంచం ముందు నిలిచింది. అంతే కాదు తూర్పుఐరోపాను, ఆసియాలో వుత్తర కొరియాను విముక్తి చేసి సోషలిస్టు శిబరాన్ని విస్తరింపచేసింది. చైనాలో సోషలిస్టు విప్లవం జయప్రదమయ్యేందుకు ఎంతో తోడ్పడింది.రష్యాలో అక్టోబరు విప్లవం జరగపోయి వుంటే, అది బలపడి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ మూకలను ఓడించకుండా వున్నట్లయితే ప్రపంచంలో ఏమి జరిగి వుండేది ? నాజీలు, ఫాసిస్టులు, ఇతర సామ్రాజ్యవాదులు మరో రూపంలో ప్రపంచాన్ని తిరిగి పంచుకొని వుండేవారు కాదా ? ఆ ముప్పును తప్పించింది, వలస రాజ్యాలన్నింటికీ స్వాతంత్య్రం వచ్చింది కమ్యూనిస్టుల వలనే కాదా ?

Image result for 2nd world war ,stalin

   అక్టోబరు విప్లవంతో ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ఒక కుట్ర ఫలితమని సామ్రాజ్యవాదులు వర్ణిస్తారు. ఒక ప్రయోగంగా కొందరు వర్ణిస్తే , మరికొందరు దానిని అంగీకరించరు. 1871 మార్చి 18 నుంచి మే 28వరకు వునికిలో వున్న పారిస్‌ కమ్యూన్‌ను దిగ్బంధం చేసి అణచివేసిన మాదిరి ప్రపంచంలో ఆరోవంతు వున్న సోవియట్‌ యూనియన్‌ను భౌతికంగా దిగ్బంధం చేయటం సాధ్యం కాదని పెట్టుబడిదారీ వర్గం ప్రారంభంలోనే గుర్తించింది.అందుకే తొలుత అంతర్గత తిరుగుబాట్లు, అంతర్యుద్ధ కుట్రల ద్వారా దానిని దెబ్బతీయాలని చూసింది. ఆ తొలి ఎత్తుగడ విఫలమైంది. అటువంటి వ్యవస్ధ రెండు దశాబ్దాలపాటు కొనసాగి స్ధిరపడటమేగాక అనేక విజయాలు సాధించి ప్రపంచ కార్మివర్గాన్ని ఆకర్షించింది. దీనికి తోడు రెండవ ప్రపంచ యుద్ధంలో అనూహ్యంగా హిట్లర్‌ను ఓడించి ప్రపంచ హీరోగా నిలబడింది. దీంతో భౌతికంగా అంతం చేయలేమని , కార్మిక వర్గం మొత్తంగా తమ దోపిడీకి చరమ గీతం పాడుతుందని పెట్టుబడిదారులు నిర్ధారణకు వచ్చి పన్నిన సుదీర్ఘకుట్ర ఫలితమే ప్రచ్చన్న యుద్దం.

   సోవియట్‌, తదితర దేశాల వ్యవస్ధలను కూల్చివేయటానికి, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదులు దాదాపు పది లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేశారని అంచనా. కమ్యూనిజం పనికిరాదు, అసంగతం అని చెప్పిన వారు దాన్ని దెబ్బతీసేందుకు ఇంత భారీ మొత్తం ఖర్చు చేయటాన్ని బట్టే దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. శ్రామికవర్గంతో ప్రత్యక్ష పోరు సల్పితే ప్రయోజనం లేదన్నది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దోపిడీ వర్గం నేర్చుకున్న పెద్ద పాఠం. కొత్త పద్దతులను ఎంచుకుంది. ఎదుటి పక్షంలోని లోపాలు, బలహీనతలను ఎంచుకొని వాటిమీద కేంద్రీకరించటం ద్వారా సైద్ధాంతిక దాడి, కుట్రలు, అనుమానాలు, గందరగోళంలో పడవేయటం వంటి సకల చాణక్య ఎత్తుగడులను అమలు జరిపి తమ చేతికి మట్టి అంటకుండా దెబ్బతీయటం ప్రచ్చన్న యుద్ద లక్షణం. దాన్ని ఒక్క సోవియట్‌, తూర్పు ఐరోపాకే పరిమితం చేయలేదు. క్యూబాను భౌతికంగా అష్టదిగ్బంధనం గావించారు. కమ్యూనిస్టు చైనాను రెండు దశాబ్దాలకు పైగా అసలు గుర్తించేందుకు, ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించేందుకే లేకుండా అడ్డుకున్నారు. వియత్నాం, కంపూచియా, లావోస్‌లపై దశాబ్దాల తరబడి యుద్ధాలు చేసి కమ్యూనిజాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

    పుట్టిన దగ్గర నుంచి కూలిపోయే వరకు ఏడు దశాబ్దాల పాటు సోవియట్‌ వనరులలో ఎక్కువ భాగం దానిని కాపాడు కొనేందుకు ఖర్చు చేసిన ఫలితంగానే అది ఎలాంటి భౌతికదాడులకు గురికాలేదన్నది ఒక వాస్తవం. అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు విసిరిన సవాలును స్వీకరించిన కమ్యూనిస్టులు సోవియట్‌ అభివృద్దికి అనుసరించిన కొన్ని పద్దతులు, ప్రయోగాలు ఎన్నో విజయాలతో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయన్న అభిప్రాయాన్ని కాదనలేము.వాటిలో కమ్యూనిస్టులు బ్యూరాక్రాట్లుగా మారటం ఒకటి. అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సోవియట్‌ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడలేము. స్టాలిన్‌ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ సాధించిన అభివృద్ధి కారణంగానే ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఫాసిస్టు హిట్లర్‌ను మట్టుబెట్టటం సాధ్యమైంది. అణురంగంలో అమెరికాతో ధీటుగా వుండబట్టే మరో నాగసాకి, హిరోషిమాలు పునరావృతం కాలేదు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక వ్యవస్ధను అమలు జరిపి అనేక విజయాలు సాధించి ఈనాడు అనేక దేశాలకు మార్గదర్శకంగా వున్నది కూడా సోవియట్‌ యూనియనే. సోవియట్‌ ప్రయోగాలు ప్రపంచానికి అనేక గుణపాఠాలు కూడా నేర్పాయి.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్న సామెత తెలిసిందే.సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు, పురోగమనం, ఫాసిజంపై యుద్ధ విజయం కారణంగా జనం కమ్యూనిస్టులవైపు మొగ్గకుండా చూసేందుకే పాలకవర్గాలు జనానికి వెసులుబాటునిచ్చే కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టకతప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయని గ్రహించటం అవసరం. ఇదే క్రమంలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంలో నియంతలకు మద్దతు ఇచ్చే విధానాలను అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు విరమించుకోవాల్సి వచ్చింది. తమ లాభాల రేటు తగ్గకుండా చూసుకొనేందుకు మరోవైపు పెట్టుబడిదారీ వర్గం వుత్పత్తిని మరింతగా పెంచే, కార్మికుల సంఖ్యను తగ్గించే పరిజ్ఞానంవైపు కూడా దృష్టి సారించింది. అది సోషలిస్టు దేశాలకు విస్తరించకుండా ఇనుప తెరలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే సోవియట్‌తో సంబంధాలున్న మనవంటి దేశాలకు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసింది. అయినా అంతరిక్ష రంగంలో సోవియట్‌ అమెరికా కంటే ఎంతో ముందుకు పురోగమించింది. గతంలో సోవియట్‌,తరువాత దాని వారసురాలిగా రష్యా మనకు అందించిన అంతరిక్ష ప్రయోగ పరిజ్ఞాన ఫలితమే ఈ రోజు మనం జయప్రదంగా అంతరిక్ష , క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడగలుగుతున్నామన్నది మరిచి పోరాదు. ప్రచ్చన్న యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదులు సాగించిన కుట్రల తీవ్రతను అర్ధం చేసుకోవటంలో, ఎదుర్కోవటంలో వైఫల్యం, వైరిపక్ష బలాన్ని తక్కువగా అంచనా వేయటం, సంస్కరణల అమలులో వైఫల్యం వంటి అంశాలు , రాజకీయంగా మితవాదానికి గురికావటం చివరకు బోరిస్‌ ఎల్సిన్‌ వంటి శక్తులు పార్టీ నాయకత్వ స్ధానాలలోకి ఎదగటంతో సామ్రాజ్యవాదులు తమ కుట్రలను సులభంగా అమలు చేసి సోవియట్‌ను కూల్చివేయగలిగారు.

    సోవియట్‌, తూర్పు ఐరోపా పతనం వలన ఆయా దేశాల పౌరులతో పాటు ప్రపంచం కూడా ఎంతో నష్టపోయింది. అమెరికా చెప్పిందే వేదం. సోవియట్‌ అంతరిస్తే తమ ఖండం నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడతాయని ఆశించిన ఐరోపా ధనిక దేశాల ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ పాలకవర్గ అంచనాలు తప్పాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా అక్కడి సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాత దానిని రద్దు చేయకపోగా గత పాతిక సంవత్సరాలలో మరింతగా పటిష్ట పరుస్తున్నారంటే వారి ఎజండా ఇంకా మిగిలే వుందన్నది సుస్పష్టం. అంటే మిగతా సోషలిస్టు దేశాలు, కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే వున్నారు. ఐరోపా ధనిక దేశాలపై తన పట్టు కొనసాగాలంటే నాటో కూటమిని కొనసాగించటం అవసరం. సోవియట్‌ లేకపోయినా దాని స్ధానంలో వచ్చిన రష్యా నుంచి ఐరోపాకు ముప్పు తొలగలేదనే కొత్త పల్లవిని అమెరికన్లు అందుకున్నారు.

     సోవియట్‌ అంతరించిన తరువాత దాని బూచిని చూపితే నడవదు. అందుకు గాను వుగ్రవాదంపై పోరు పేరుతో సరికొత్త అజెండాకు తెరలేపింది. ఆ పేరుతో పశ్చిమాసియా ఆక్రమణకు పూనుకుంది. ఇజ్రాయెల్‌కు ఇంకా ముప్పు తొలగలేదనే పేరుతో ఆ ప్రాంతంలో కొనసాగేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత పాతిక సంవత్సరాల పాటు ఒక చిన్న కమ్యూనిస్టు దేశం క్యూబాను దెబ్బతీసేందుకు ప్రయత్నించి సాధ్యంగాక దానితో అమెరికన్లు తాత్కాలికంగా అయినా రాజీపడి సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆసియాలో తమకు లాభదాయకంగా వున్న కారణంగా చైనాతో భారీ ఎత్తున వాణిజ్య లావాదేవీలు నడుపుతూనే మరోవైపున దానిని దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతూనే వున్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని చైనా ఆధీనంలో వున్న దీవులపై తమకు హక్కు వుందంటూ జపాన్‌, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు.

    ప్రపంచ మానవాళి సోవియట్‌కు, స్టాలిన్‌కు తీర్చలేని విధంగా రుణపడిందంటే అతిశయోక్తికాదు. స్టాలినే లేకుంటే తరువాత కాలంలో ఆయనను నియంత అని నిందించిన వారు, హిట్లర్‌తో మతిలేని పోలికలు తెచ్చిన వారు బతికి వుండేవారు కాదు, వారి వారసులు అసలు పుట్టివుండేవారు కాదు. ప్రపంచాన్ని హిట్లర్‌ అనే నియంత ఆక్రమించ కుండా కాపాడింది, తమ ప్రాణాలు అర్పించిన రెండు కోట్ల మంది సోవియట్‌ పౌరులు, వారిని అంతటి మహత్తర త్యాగాలకు సిద్దపరిచిన స్టాలిన్‌ నాయకత్వమే. ఒక దుర్మార్గుడు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంటే లొంగిపోయి సలాం కొట్టినవారిని, బానిసలుగా మారిన వారిని, గుడ్లప్పగించి చూసిన వారిని ప్రపంచ చరిత్ర చూసింది గానీ, ఆత్మగౌరంతో బతికేందుకు ఇలాంటి త్యాగాలు చేయటం మరొక వుదంతంలో ఎక్కడా కానరావు.

    ఐరోపాలో లేదా మన వంటి వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను చేపట్టటం రష్యాలో అక్టోబరు విప్లవం, సోవియట్ల ఏర్పాటు తరువాతనే ప్రారంభమైంది అని గుర్తించాలి. ఆ సోవియట్‌ కూలిపోయిన తరువాత గత పాతిక సంవత్సరాలలో ఆ సంక్షేమ చర్యలను ఒక్కొక్కటిగా పెట్టుబడిదారీ దేశాలన్నింటా వుపసంహరించటాన్ని గమనిస్తున్నాము. గతం మాదిరి జనం పోల్చుకోవటానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ లేదని, తమ లాభాల్లో జనానికి వాటా పెట్టాల్సిన అవసరం లేదని పెట్టుబడిదారులు భావిస్తుండటమే సంక్షేమ చర్యలకు కోత, వుపసంహరణ.

   ఇతరులకు జోస్యం చెప్పిన బల్లి కుడితిలో పడి గిలగిలా కొట్టుకున్నట్లు సోషలిస్టు వ్యవస్ధలు ఫలితాలు సాధించలేవని, ఆచరణ సాధ్యం కాదని ప్రచారం చేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధలు తామే తీవ్ర సంక్షోభంలో పడి బయటకు రాలేక దిక్కుతోచకుండా వున్నాయి. మరోవైపున సంక్షుభిత పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లపై ఆధారపడిన చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాల ఎగుమతుల ఆర్ధిక లావాదేవీలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షోభంలో పడలేదు. విజయవంతంగా నడుస్తున్నాయి. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అమలు జరుపుతున్న మనవంటి దేశాలు రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా వాటి దుష్పలితాలను అనుభవిస్తున్నాయి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రపంచంలోని వామపక్షాలు కూడా నూతన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

      కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల వుద్యమాలు వెనుకపట్టు పట్టాయి. యజమానులు తమ షరతులను ముందుకు తెస్తూ ఎదురుదాడులు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తువులను అమ్ముకొనేందుకు తెచ్చిన నూతన సాంకేతిక పద్దతులతో గొలుసుకట్టు ప్రపంచ మార్కెట్‌ను తమ అదుపులోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో సరిహద్దులతో నిమిత్తం లేకుండా వస్తువులు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుతున్నాయి. దీని అర్ధం ఏమంటే తమ ఆర్ధిక వ్యవస్థల మీద ఆయాదేశాలకు అదుపు వుండదు. కార్మికులు యూనియన్లు పెట్టుకోవటానికి, తమ న్యాయమైన హక్కులను సాధించుకొనేందుకు కష్టమౌతుంది. ఎక్కడ కార్మిక శక్తిని దోచుకొనేందుకు అవకాశం వుంటే అక్కడికి పరిశ్రమలను తరలించి లేదా కొత్తగా ఏర్పాటు చేసి వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ కారణంగా మన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా నినాదం ఇచ్చి, తమ దగ్గర ఎటువంటి అవకాశాలు వున్నాయో ప్రపంచదేశాలన్నింటా చెబుతున్నారు. అవసరమైతే కార్మిక చట్టాల రద్దు, నామమాత్రంగా చేసి యజమానుల ఇష్టారాజ్యానికి అవకాశం కల్పిస్తామని ప్రాధేయపడుతున్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును కఠిన తరం చేసే నిబంధనలు చేరుస్తున్నారు.తక్కువ సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమలలో వారిని తొలగించేందుకు, మూసివేసేందుకు యజమానులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అప్రెంటిస్‌ల పేరుతో ఏండ్ల తరబడి నామమాత్ర వేతనాలకు పనిచేయించుకొనే వెసులుబాటును కల్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు వంటి ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పర్యవసానాలే అన్నది గమనించాలి.

    అక్టోబరు విప్లవం ప్రపంచంలో తెచ్చిన మార్పులు, దానికి తగిలిన ఎదురు దెబ్బల కారణంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదుల ఆధిక్యం పెరిగిపోవటం, వారిని ఎదిరించేవారు లేకపోవటంతో వర్ధమాన దేశాలకు తిరిగి ముప్పు ఏర్పడటం, కార్మిక,కర్షక వుద్యమాలు వెనుకపట్టుపట్టం, యజమానుల దోపిడీ పెరగటం,సంక్షేమ చర్యలకు కోత ద్వారా ప్రజలపై భారాలు మోపటం వంటి పర్యవసానాల గురించి చెప్పుకున్నాము. సోవియట్‌ పతనం నుంచి గుణపాఠాలు తీసుకోవటమంటే పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం నుంచి వైదొలగి ఆ దుర్మార్గ విధానానికి సలాం కొట్టటం కాదు. అక్టోబరు విప్లవం గురించి మరింతగా మధనం చేయాలి. లోపాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. దానిని వర్తమాన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు అని అంగీకరిస్తే అక్టోబరు విప్లవం, సోవియట్‌ ప్రయోగం కూడా అలాంటిదే. ప్రస్తుతం సాంప్రదాయ పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తున్నారు. వారి నూతన ఎత్తుగడలను కార్మికవర్గం నూతన పద్దతులలో చిత్తుచేయటం తప్ప మరొక మార్గం లేదు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ సిద్దాంత వేత్తలు ముందుకు తెచ్చే గందరగోళ సిద్ధాంతాలు లేదా వాదనలను వారి తీరుతెన్నుల నుంచే ఎండగట్టాలి. రెండు రెళ్లు నాలుగు అన్నది ఏ కాలంలో అయినా ఒకటే. అలాగే కార్మికులు, కర్షకులు దోపిడీకి గురవుతున్నంత వరకు దానిని ఎలా అంతం చేయాలన్నదానిలోనూ ఎలాంటి గందరగోళం, మార్పూ వుండకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) supports the demand of Muslim women on triple talaq

18 Tuesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

communal forces, CPI(M), Muslim women, triple talaq, Uniform Civil Code

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the following statement on October 18, 2016.
The CPI(M) supports the demand of Muslim women against the practice of arbitrary and instant triple talaq. This specific practice is not permitted in most Islamic countries. Acceptance of this demand will bring relief to affected women.
All personal laws including those for the majority community require reform.
In this context the claims being made by Government spokespersons that personal laws for Hindu women have already been reformed   shows that their interest is not in securing women’s equality but in targeting the  minority communities, particularly the Muslim minority.  Even now laws concerning, adoption, property rights and even the right to choose your own partner discriminate against Hindu women.
With the offensive of the communal forces on the very identity of minority communities, any move to push the agenda of Uniform Civil Code as is being done by the Government directly and through its institutions is counterproductive for the rights of women. Uniformity is not the guarantee for equality.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యన్‌ ఎన్నికల ఫలితాలు – ఓట్లు, సీట్ల మాయాజాలం

23 Friday Sep 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, Duma, Duma elections, RUSSIA, Russia’s Duma, Russia’s Duma Elections

 

Image result for State Duma Building

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు (సెప్టెంబరు 18న) రష్యన్‌ పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ సగానికిపైగా సీట్లను కోల్పోగా అధికార పార్టీ స్వల్పంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని మూడింట రెండువంతులకు సీట్లు పొందింది. అనేక మంది ఎందుకిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం 450 స్ధానాలకు గాను 225 నియోజకవర్గ ప్రాతిపదిన, మిగిలిన 225 దామాషా ఓటింగ్‌ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు కావటం ఒక కొత్త రికార్డు అయితే అధికార పక్షం ఐక్య రష్యా పార్టీ అంతకు ముందున్న 238 ను 343కు పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విధంగా విజయం సాధించటానికి మారిన ఎన్నికల పద్దతి, ఎన్నికలలో అక్రమాలే ప్రధాన కారణం అని ఫలితాల అనంతరం వెలువడుతున్న వార్తలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలలో అన్ని స్ధానాలూ దామాషా ప్రాతిపదికన పార్టీలకు కేటాయించారు. ఈ సారి సగం మాత్రమే వుండటం, అనేక మంది పోటీ పడిన కారణంగా మైనారిటీ ఓట్లతోనే అధికారపక్షం ప్రత్యక్ష ఎన్నికల విభాగంలో అత్యధిక సీట్లను గెలుచుకోవటం సాధ్యమైంది. సాధారణంగా ఓటింగు డిసెంబరులో జరుగుతుంది, అటువంటి దానిని అధికార పార్టీ పట్టుబట్టి సెప్టెంబరుకు మార్పించింది. తక్కువ ఓట్లు పోలు కావటానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీని కంటే ఎన్నికలు ఒక ప్రహసనమని భావించిన మెజారిటీ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత వున్నప్పటికీ ప్రతిపక్షాల మీద విశ్వాసం లేకపోవటం కూడా తోడై ఓటింగ్‌కు దూరంగా వున్నారు. మన దేశంలో మాదిరి ఓట్ల అమ్మకం, కొనుగోలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు లెవడా అనే ఏజన్సీ నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు తమ ఓటును 5000 రూబుళ్లకు అమ్మేందుకు సుముఖంగా వున్నట్లు తేలింది. రష్యా జనాభాలో 2.3 కోట్ల మంది లేక 16శాతం దారిద్య్రరేఖ ప్రమాణం నెలకు 174 డాలర్ల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారు వున్నారు. గత ఎన్నికల మాదిరే ఈ ఎన్నికలలో కూడా అధికార పక్షం పాల్పడిన అక్రమాలు, అవినీతి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్ల కంటే బ్యాలట్‌ బాక్సులలో పడిన ఓట్లు ఎక్కువగా వున్నట్లు , కొన్ని చోట్ల అసలు ఓటర్లు లేకుండానే సిబ్బందే ఓట్లతో బాక్సులను నింపినట్లు తేలటం, మరికొన్ని చోట్ల దొంగ ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ శాతాలను కూడా ప్రకటించటం వంటి అ క్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఫలితాలను రద్దు చేసినట్లు స్వయంగా రష్యా వార్తా సంస్ధ ఇటార్‌ -టాస్‌ పేర్కొన్నది. నిజానికి అవి సముద్రంలో కాకి రెట్ట వంటివి. ఈ సారి పార్లమెంట్‌కు ప్రజాస్వామిక సంస్కరణలకు వ్యతిరేకులైన పచ్చి మితవాదులు పాలక పక్షం నుంచి గణనీయంగా ఎన్నికైనట్లు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

    గత ఎన్నికల్లో పాల్పడిన అవినీతి కారణంగా ప్రపంచవ్యాపితంగా నగుబాట్ల పాలైన అధ్యక్షుడు పుతిన్‌ ఎన్నికలను పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా జరిపేందుంటూ ఎన్నికలకు ముందు మానవహక్కుల న్యాయవాదిగా గౌరవ మన్ననలను పొందిన ఎలా పాం ఫిలోవాను నియమించారు. అయినప్పటికీ దిగువ యంత్రాంగం మొత్తం అధికార పక్ష కనుసన్నలలో పనిచేసేదిగా వుండటంతో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ జరిపి అధికారపక్షం మెజారిటీ సీట్లను తెచ్చుకున్నది. అక్రమాల గురించి సామాజిక మీడియాలో కుప్పలు తెప్పలుగా వెల్లడిస్తున్నారు. తొమ్మిది ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అనేక పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసినట్లు పాం ఫిలోవా గురువారం నాడు ప్రకటించారు. దర్యాప్తులో ఇంకా మరిన్ని అక్రమాలు వెల్లడయ్యే అవకాశం కూడా వుందన్నారు. పరిశీలక సంస్ధలలో ఒకటైన ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓయిసిడి) కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేదని పేర్కొన్నది.

    గతంలో 2007 ఎన్నికలలో అధికార ఐక్య రష్యా గరిష్టంగా 315 సీట్లు , తరువాత కనిష్టంగా 2011లో 238 సీట్లు, తాజాగా 343 సీట్లు తెచ్చుకుంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1993లో జరిగిన తొలి ఎన్నికలలో నమోదైన 54.8శాతంమే ఇప్పటి వరకు కనిష్టంగా వుంది. అలాంటిది తాజా ఎన్నికలలో 48శాతానికి పడిపోయింది.అయితే ఇది కూడా ముందే చెప్పుకున్నట్లు ఓటర్ల కంటే ఎక్కువగా పడిన బ్యాలట్లను కూడా లెక్కిస్తే వచ్చిన సంఖ్య. అందువలన అంతకంటే తక్కువ మందే ఓటర్లు పాల్గొన్నట్లు చెబుతున్నవారు కూడా లేకపోలేదు. రాజధాని మాస్కో, మరో పెద్ద నగరమైన సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 35, 33 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు.

    నాలుగు వందల యాభై స్ధానాలకు గాను అధికారపక్షం 343 పొందగా రెండవ పార్టీగా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ 42, మూడవ పార్టీగా పచ్చిమితవాద పక్షం ఎల్‌డిపిఆర్‌ 39, న్యాయమైన రష్యా పార్టీ 23 గెలుచుకుంది. మరో రెండు పార్టీలు ఒక్కొక్క స్ధానం, నేరగాడిగా గతంలో ఇంటర్‌ పోల్‌ వెతికిన వ్యక్తి ఏకైక స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 225 సీట్లలో అధికారపక్షం 203 గెలుచు కుంది. ఒక పరిశీలకుడు సెర్గీ షిఫిలికిన్‌ చెప్పిన దాని ప్రకారం అధికార పక్షానికి వచ్చినట్లు చెబుతున్న ఓట్లలో 45శాతం లేదా కోటీ 20 లక్షల ఓట్లు బోగస్‌. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు 37శాతానికి మించి లేరు, ఈ లెక్కన పోలైన ఓట్లలో అధికారపక్షానికి వచ్చినట్లు చెబుతున్న 54 శాతం కాకుండా 40శాతమే వాస్తవ ఓట్లు అయి వుండాలి.

    గత మూడు ఎన్నికలలో వరుసగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం , సీట్లు ఎలా వున్నాయో దిగువ పట్టికలో చూస్తే అధికార పార్టీ ఎన్నికల విధానంలో ఎందుకు మార్పు తెచ్చిందో దాని కారణంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడిందో అవగతం అవుతుంది.

ఏడాది        ఐక్య రష్యా       కమ్యూనిస్టు       ఎల్‌పిడిఆర్‌       జస్ట్‌ రష్యా

2007        64.30-315      11.57-57         8.14-40        7.74-38

2011        49.32-238      19.19-92        11.67-56      13.24-64

2016        54.19-343       13.34-42       13.16-39        6.23-23

         గత ఎన్నికలతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీ , జస్ట్‌ రష్యా ఓట్ల శాతం తగ్గిందన్నది స్పష్టం. ఆ మేరకు అధికార పార్టీకి పెద్దగా పెరగపోయినా సీట్లు గణనీయంగా పెరగటానికి ఎన్నికల విధానంలో చేసిన మార్పే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దామాషా ప్రాతిపదికన కేటాయించిన 225 సీట్లలో ఐక్య రష్యాకు 140, కమ్యూనిస్టుపార్టీకి 35,ఎల్‌పిడిఆర్‌కు 34, జస్ట్‌ రష్యాకు 16 వచ్చాయి. నియోజకవర్గాలలో వరుసగా ఈ పార్టీలకు 203, ఏడు, ఏడు, ఐదు, మరో రెండు చిన్న పార్టీలకు ఒక్కొక్కటి దక్కాయి.ఒక స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంటరీ, మీడియా కుట్రలతో ప్రభుత్వాల కూల్చివేత !

13 Tuesday Sep 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ 1 Comment

Tags

Brazil, elected governments, Honduras, parliamentary and media coup, Parliamentary coup, Prague, Turkey

Image result for parliamentary and media coup against elected governments

సత్య

     గత కొద్ది వారాలుగా వివిధ ఖండాలలోని కొన్ని దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు పార్లమెంటరీ వ్యవస్ధలు, మీడియా సంస్ధలు, వ్యక్తుల పాత్రలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పరిహాసం పాలౌతున్నాయి, కుట్రలకు నిలయాలుగా మారుతున్నాయి. మీడియా ‘స్వతంత్ర’ సూచిక వేగంగా పడిపోతున్నది. ఏదో ఒక పక్షాన చేరి తారసిల్లటానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. చాలా కాలంగా కప్పుకున్న మేకతోళ్లను తీసి అవతల పడవేస్తున్నాయి. అందుకే గతంలో పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విష పుత్రికలు అని వర్ణించినపుడు విపరీత వ్యాఖ్యానంగా భావించిన వారు మీడియా పోకడలను చూసి ఇప్పుడు నిజమే అన్న నిర్ధారణలకు వస్తున్నారు. వర్గ సమాజంలో అటో ఇటో చేరకుండా తటస్థంగా వుండటం అసాధ్యమని, అదొక ముసుగు మాత్రమే అని కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారు. ఎవరైనా తాము అటూ ఇటూ కాదు అని చెప్పారంటే మార్పును వ్యతిరేకించి వున్న వ్యవస్ధను వున్నట్లుగా వుంచాలని చెప్పటమే. పర్యవసానం ఆ వ్యవస్ధను కాపాడాలని కోరుకొనే వారికి మద్దతు ఇవ్వటమే. ముందే కూసిన కోయిల కూతలను పరిగణనలోకి తీసుకోనట్లే ఆ కమ్యూనిస్టులు అన్నీ ఇలాగే చెబుతారు అని తోసిపుచ్చిన వారు ఇప్పుడేమంటారో తెలియదు. ఏమన్నా అనకున్నా వాస్తవాలను ఎల్లకాలం దాయటం కష్టం.

      జూలై 15న ఐరోపాలోని టర్కీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మిలిటరీలోని ఒక వర్గం విఫల తిరుగుబాటు చేసింది. కుట్రలో జర్నలిస్టులు కూడా వున్నట్లు తేలటంతో టర్కీ ప్రభుత్వం అనేక మంది ఇతర కుట్రదారులతో పాటు వంద మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేసింది. అమెరికాలో తిష్టవేసిన టర్కీ ముస్లిం ఇమాం ఫతుల్లా గులెన్‌ సిఐఏతో కలసి రూపొందించిన కుట్ర మేరకు సైనికాధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. కుట్రను విఫలం చేసిన తరువాత గులెన్‌కు మద్దతు ఇస్తున్న 130 మీడియా సంస్ధలు మూతపడ్డాయి. వందమంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కొందరు విదేశాలకు పారిపోయారు. ఆగస్టు నెలాఖరులో బ్రెజిల్‌ పార్లమెంట్‌ అభిశంసన తీర్మానం ద్వారా ఆ దేశపు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి)నేత అయిన దిల్మా రౌసెఫ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీన్ని ప్రజాస్వామిక కుట్రగా కొంత మంది వర్ణించారు. కుట్రల జాబితాలోకి కొత్త పదం చేరింది. ఈ ప్రజాస్వామిక కుట్రలో స్వతంత్ర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే మీడియా ఒక ముఖ్యపాత్ర వహించిందన్న విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారుల్లో మీడియా అధిపతులు కూడా వుంటారని చేర్చాల్సి వుంది. ఈ వార్తలు చదువుతున్న సమయంలోనే బంగ్లాదేశ్‌లో వంగ బంధు ముజబుర్‌ రహ్మాన్‌ హత్య, ప్రభుత్వ కూల్చివేతలో భాగస్వామి అయ్యారనే నేరారోపణపై విచారణకు గురై వురి శిక్ష పడిన ఒక మీడియా అధిపతి మీర్‌ ఖాసిం అలీని 1971లో చేసిన నేరాలకు గాను సెప్టెంబరు మొదటి వారంలో వురి తీశారు. నేరం చేసి సమయంలో పాకిస్థాన్‌ అనుకూల విద్యార్ధి సంఘనేతగా వున్నప్పటికీ తరువాత కాలంలో ఒక పెద్ద వాణిజ్య, మీడియా అధిపతిగా ఎదిగాడు.

   అధికార రాజకీయాలు- ప్రభుత్వాలపై మీడియా అధిపతులు లేదా సంస్ధల ప్రమేయం లేదా పెత్తనం, ప్రభావం ఎలాంటిదో తెలుగువారికి చెప్పనవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత విబేధాలలో కూడా జోక్యం చేసుకోవటాన్ని ఎన్‌టిరామారావుపై తెలుగుదేశంలో తిరుగుబాటు సందర్భంగా అందరూ చూశారు. కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలపై బహిరంగంగానే విమర్శలు చేయగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఒక పత్రిక, ఛానల్‌ విలేకర్లను తమ పార్టీ సమావేశాలకు రావద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక నేత లేదా పార్టీని కొన్ని పత్రికలు ఎలా పెంచి పెద్ద చేయవచ్చో, నచ్చనపుడు సదరు నేతను వ్యతిరేకించి ఎలా బదనాం చేయవచ్చో, అదే పార్టీలో అంతకంటే ఎక్కువగా తమకు వుపయోగపడతారనుకున్నపుడు ఇతర నేతలు, పార్టీలను ఎలా ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశారు, చూస్తున్నారు, భవిష్యత్‌లో కూడా చూస్తారు. మీడియా ఏకపక్షంగా వ్యవహరించినా లేక ఒక పక్షం వహించిందని జనం భావించినా ఏం జరుగుతుందో కాశ్మీర్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిని జాతీయ మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయి లేదా వాస్తవాల ప్రాతిపదికన వార్తలను అందించటం లేదన్న విమర్శలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. పార్లమెంటరీ అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా కాశ్మీర్‌లోయలో కర్ప్యూను సడలించారు. ఆ సమయంలో ప్రెస్‌ అని స్టిక్కర్‌ పెట్టుకున్న వాహదారులపై అక్కడి నిరసనకారులు దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొంత మంది విలేకర్లు తాము జాతీయ మీడియాకు చెందినవారం కాదు, స్దానిక సంస్ధలలో పని చేస్తున్నామని చెప్పినా జర్నలిస్టులంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తారు, తప్పుడు దృశ్యాలను చూపుతారు అంటూ వరసపెట్టి దాడి చేసిన వుదంతాలు వున్నాయి. ఇది కాశ్మీర్‌కే పరిమితం కాదు, కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలకే పరిమితం కాబోదు. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆ సంస్థలలో పని చేసే జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో తలెత్తనున్న ముప్పును ఇవి సూచిస్తున్నాయి.

   టర్కీలో కుట్ర నుంచి తప్పించుకున్న ఎర్డోగన్‌కు గతంలో మద్దతు ఇచ్చిన శక్తులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మాదిరి టర్కీ, ఇరాక్‌, సిరియా తదితర దేశాలను చీల్చి ఆ ప్రాంతంలో కుర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలన్న పధకాన్ని అమలు జరిపేందుకు అమెరికా పూనుకుందన్న వార్తలతో రష్యన్లు ముందుగానే టర్కీని హెచ్చరించటంతో కుట్రను జయప్రదంగా తిప్పి కొట్టగలిగినట్లు చెబుతున్నారు. కుట్రకు పాల్పడిన వారిలో సైనికాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసి రానున్న రోజుల్లో విచారణ జరిపి శిక్షలు విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందువలన మీడియా పాత్ర ఏమిటనే చర్చ రాబోయే రోజుల్లో పెద్దగా జరగటం అనివార్యం.

   ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటమా లేదా అన్న సమస్యపై జరిగిన ప్రజాభి ప్రాయసేకరణలో మీడియా ఎలా వ్యవహరించిందో చూశాము. చివరకు ప్రభుత్వ నిధులతో నడిచే బిబిసి కూడా ఒకవైపు మొగ్గింది. నిజానికి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వర్గ సమస్య లేదు. కార్పొరేట్‌ శక్తుల లాభనష్టాల విషయంలో తలెత్తిన విభేధాలతో కొన్ని సంస్ధలు విడిపోవటానికి అనుకూలిస్తే మరికొన్ని వ్యతిరేకించాయి. నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల అభ్యర్ధుల ఎన్నిక ప్రక్రియలో మీడియా సంస్ధలు ఎలా జోక్యం చేసుకున్నాయో, ఇప్పుడు అభ్యర్ధులు ఖరారైన తరువాత మొత్తంగా మీడియా రెండు శిబిరాలుగా చీలిపోవటాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎన్నికలే కొంత మంది దృష్టిలో పెద్ద ప్రహసనం అయితే దానిలో మీడియా జోక్యం చేసుకొని తిమ్మినిబమ్మిని చేయటం, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయటం కనిపిస్తుంది. లాటిన్‌ అమెరికాలో జరిగిన పరిణామాలలో మీడియా పాత్రను మరింత అధ్యయనం చేయాల్సి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలలో అనేక మంది నియంతలను రంగంలోకి తెచ్చి తమ కార్పొరేట్‌ అనుకూల వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. లాటిన్‌ అమెరికాలో దాదాపు ప్రతి దేశం సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనలో మగ్గటమే గాక ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధల విధానాలైన నయావుదారవాద ప్రయోగశాలగా మార్చి వేశారు. ఈ క్రమాన్ని అక్కడి మీడియా మొత్తంగా బలపరచటమేగాక, నియంతలు, అభివృద్ధి నిరోధకులను సోపానాలుగా చేసుకొని ప్రతి దేశంలో మీడియా రంగంలో గుత్తాధిపతులు తయారయ్యారు. నీకిది నాకది అన్నట్లుగా నియంతలు, కార్పొరేట్లు, మీడియా అధిపతులు కుమ్మక్కై పంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారందరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకొనేందుకు ఏకం అవుతారని కూడా వేరే చెప్పనవసరం లేదు.

   నయావుదారవాద విధానాలు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతి దేశంలోనూ సాయుధ, ప్రజా పోరాటాలు చెలరేగాయి. దాంతో నియంతలతో ఎల్లకాలం జనాన్ని అణచలేమని గ్రహించిన సామ్రాజ్యవాదం విధిలేని పరిస్థితుల్లో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పునరుద్ధరణకు తలవంచక తప్పలేదు. దాంతో దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నికలు స్వేచ్చగా జరిగిన చోట నియంతలను వ్యతిరేకించిన, పోరాడిన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటిలో కొన్ని చోట్ల వామపక్ష శక్తులున్నాయి. క్రమంగా అనేక దేశాలలో అవి ఎన్నికల విజయాలు సాధించటం, పౌరులకు వుపశమనం కలిగించే చర్యలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వరుసగా అధికారానికి వస్తుండటం, రాజకీయంగా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవటం, తమలో తాము సంఘటితం కావటానికి ప్రయత్నించటం వంటి పరిణామాలు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో తిరిగి కుట్రలకు తెరలేపింది. గతంలో లేని విధంగా పార్లమెంటరీ కుట్ర, ప్రజాస్వామ్య ఖూనీలకు పాల్పడింది. వాటికి మీడియా సంస్ధలు వెన్నుదన్నుగా కత్తి చేయలేని పనిని కలంతో పూర్తి చేస్తున్నాయి.

Image result for parliamentary and media coup against elected manual zelaya

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

    రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చాంది.

Image result for parliamentary  coup against elected governments

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది, తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది. అక్కడి మీడియాకు దీనిలో ఎలాంటి తప్పు కనిపించలేదు.

   ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.పాండవ పక్షపాతి కృష్ణుడికి ముందుగా వచ్చిన ధుర్యోదనుడిని తప్పించుకోవటానికి ముందుగ వచ్చితీవు, మున్ముందుకు అర్జును జూచితి అన్నట్లుగా దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన వారందరూ దాదాపు ఏదో ఒక అవినీతి కుంభకోణం కేసులలో వున్నవారే అయినా మీడియాకు అదేమీ కనిపించలేదు.

  వామపక్ష శక్తులు శక్తివంతమైన మీడియాతో ప్రారంభం నుంచి సర్దుకు పోయేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి రోజుల్లో ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా వున్న పత్రికలు అవకాశం దొరికనపుడల్లా వామపక్షాలపై ఒకరాయి విసురుతూ పని చేశాయి. లాటిన్‌ అమెరికాలోని కార్పొరేట్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు వామపక్ష శక్తులను అదికారం నుంచి తొలగించాలనుకున్నతరువాత మీడియా పూర్తిగా వాటితో చేతులు కలిపింది.మచ్చుకు బ్రెజిల్‌ మీడియా సంస్ధల నేపధ్యాన్ని చూస్తే అవి వామపక్షాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మీడియా సంస్ధలన్నీ దాదాపు కుటుంబ సంస్థలే. బ్రెజిల్‌లోని రెడె గ్లోబో మీడియా సంస్ధ రాబర్ట్‌ మారినిహో కుటుంబం చేతుల్లో వుంది. 1980 దశకం నాటికే అధికారంలో వున్న మిలిటరీ నియంతల ప్రాపకంతో 75శాతం వీక్షకులు, చదువరులపై ఆధిపత్యం సాధించింది. నియంతల పాలన అంతరించిన తరువాత 1989లో జరిగిన తొలి ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలో పిటి పార్టీ నేత లూలా డిసిల్వాను ఓడించిన ఫెర్నాండో కాలర్‌కు ఈ సంస్ధకు చెందిన టీవీ గ్లోబో బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 1990దశకంలో కొత్త సంస్ధలకు అవకాశ ం ఇచ్చినప్పటికీ దాని పట్టు తగ్గలేదు. వామపక్ష పిటి పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కూడా 2005లో బ్రెజిల్‌ ప్రకటనల బడ్జెట్‌లో సగం మొత్తం దానికే వెళ్లింది. అయినప్పటికీ మీడియా తన కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల వైఖరులను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ పూర్వరంగంలో మీడియా రంగాన్ని ప్రజాస్వామీకరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతుండగా, గుత్త సంస్ధలుగా ఎదగకుండా ఆంక్షలు విధించాలని మరికొందరు చెబుతున్నారు. వర్గ వ్యవస్ధలో దోపిడీదారులకు ఒక ఆయుధంగా మీడియా వుపయోగపడుతున్నందున ప్రత్యామ్నాయ మీడియాను కూడా రూపొందించాలనే అభిప్రాయం కూడా వెల్లడి అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలేవీ నిర్ధిష్ట రూపం తీసుకోవటం లేదు.

గమనిక ఈ వ్యాసం ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి ‘ మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) and CPI On the Current Events in the Kashmir Valley

04 Sunday Sep 2016

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Article 370, CPI, CPI(M), India-Pakistan, Kashmir, Kashmir problem, Kashmir Valley, Left parties

The CPI(M)  General Secretary Sitaram Yechury  and the CPI General Secretary S.Sudhakar Reddy have issued the following statement On the Current Events in the Kashmir Valley

The state of Jammu & Kashmir has been a part of India ever since the
accession of the state to the Indian Union in October 1947. Throughout the
chequered history of the past six decades, Kashmir has been not just a
territorial dispute for India but a test of the secular, democratic and
federal nature of the Indian Republic.

For the past nearly two months Kashmir has been in turmoil.  Since the
killing of Burhan Wani, a Hizbul Commander, the people in the Valley have
been out on the streets in mass protests. More than 70 people have died in
the firing by the security forces and a few thousand have been injured. Two
security personnel have also lost their lives. Pellet guns used by the
security forces have blinded and maimed many.  Instead of quelling the
protesters, it only intensified with each death and injury in police firing.
The main force driving these protests are the youth. These mass protests
that have spread into rural Kashmir, graphically illustrate the deep sense
of alienation of the people from the Indian State. At no time has the gulf
between India and the Kashmiri people been so wide. This serious situation
calls for an examination of the entire Kashmir problem.

The consistent stand the Left parties have been taking is that Jammu &
Kashmir has a special status which was reflected in the adoption of Article
370 of the Indian Constitution. At the heart of the matter lies how in
letter and spirit its autonomy and special status, eroded over the years,
can be restored. A political agreement must be reached, which should be
acceptable to the people whereby the state of Jammu & Kashmir would remain
as part of the Indian Union but by fulfilling the commitment, made to the
state and the people in 1948.

The entire geo-political situation has changed in the post-independence
decades. A solution to the Kashmir problem has also the dimension of India
and Pakistan discussing to settle long standing disputes.

These immediate steps must begin by taking certain confidence building
measures:

*       The first of these must be the immediate cessation of the use of
pellet guns.
*       Secondly, withdraw the AFSPA and the army from the civilian areas.
*       Thirdly, order a judicial enquiry into all instances of excesses
committed by the armed forces against civilians.
*       Fourthly, adequate compensation to all families who have suffered
loss of lives and rehabilitation of the injured by ensuring their means of
livelihood must be undertaken immediately.
*       Fifthly, time bound projects for economic development and employment
generation, including transfer of Dulhasti and Uri power projects; opening
of an IIM and IIT in Srinagar.

Further, the initiation of the political dialogue must not be based on any
preconditions.  The earlier recommendations of the various working groups
and the report of the team of interlocutors appointed after the visit of the
all party delegation in 2010 following the then disturbances must be kept in
consideration.

The Left parties suggest the following necessary steps at for arriving
towards a political solution in the current concrete circumstances:

a.    The internal dialogue with all stakeholders in Jammu & Kashmir should
proceed on the basis reversing the erosion of Article 370. The three regions
of the state, Jammu, the valley and Ladakh, should have autonomous
structures within the State of Jammu & Kashmir. This will entail changes in
the constitutional and legal scheme which can begin by revising the existing
orders and laws. Ultimately, a fresh political framework should emerge.

b.    The second dimension is the India-Pakistan factor. Since 2014 India
has been adopting a blow hot-blow cold policy towards a comprehensive
dialogue with Pakistan. This Government of India had announced that this
dialogue will also deal with the question of Kashmir, the government must
carry forward this process safeguarding India’s interests and ensure that
Pakistan is brought to the discussion table.

The people in the rest of the country are being fed various stereotypes
about the Kashmiri people. Kashmiris are being depicted as secessionists,
terrorists and pro-Pakistan. This must be put to an end. Reports of attacks
on Kashmiri youth in other parts of the country must be immediately
investigated and culprits punished.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫేస్‌బుక్‌లో వామపక్ష భావజాలంపై బుర్రలేని కువ్యాఖ్యలు

24 Wednesday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Political Parties

≈ 1 Comment

Tags

facebook, filmmaker, leftists, Olympics, PV Sindhu, Sanal Kumar Sasidharan, stupid comments

Image result for stupid funny comments

ఎం కోటేశ్వరరావు

     మీడియా అంటే జనాలకు నమ్మకం పోతోంది. రాబోయే రోజుల్లో అదింకా వేగం పుంజుకోనుంది. ఎందుకంటే ఎవరి అజెండాను వారు అమలు జరుపుతూ నిజాలను ఏడు నిలువుల లోతున పాతరేస్తున్నారు. కత్తిపీటను కనుగొన్న వారి లక్ష్యం గొంతులు కోయటం కాదు. వంటగదిలో మహిళల పనిని సులభం చేయటానికో, ఇతర అలాంటి వుపయోగం కోసమో వాటిని రూపొందించారు. కానీ కొందరు గొంతులు కోయటానికి వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌, దానిలో సామాజిక మాధ్యమంగా పరిగణించబడే ఫేస్‌బుక్‌ వంటి వాటిని కూడా అలాగే దుర్వినియోగం చేస్తున్నారు. తాజా వుదంతం విషయానికి వస్తే కేరళకు చెందిన మళయాల సినీ దర్శకుడు సనల్‌ కుమార్‌ శశిధరన్‌ ఒలింపిక్‌ రజత పతక గ్రహీత పివి సింధుపై చేసిన ఒక వ్యంగ్య వ్యాఖ్యపై చెలరేగిన దుమారం.http://www.opindia.com/  ఈ వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారం అంతా కమ్యూనిస్టు, వామపక్ష వ్యతిరేకత, బురద చల్లుడు, బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌కు అనుకూలమైన రాతలు రాసి జనానికి వడ్డించటం. ఇటీవలి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేయించిన అనేక వెబ్‌సైట్లలో ఇదొకటి. దీనిలో సనల్‌ కుమార్‌ శశిధరన్‌ వ్యాఖ్యపై వెబ్‌సైట్‌ సిబ్బంది వండి వార్చిన ఒక వంటకానికి Left leaning filmmaker says he will like to spit on PV Sindhu అని పేరు పెట్టారు. దీని అర్ధం ఏమంటే ‘ పివి సింధుపై వుమ్మటాన్ని తాను ఇష్టపడతానని వామపక్ష భావజాలం వున్న సినిమా దర్శకుడు చెబుతున్నాడు ‘. కాళిదాసు కవిత్వానికి తమ వామపక్ష వ్యతిరేక పైత్యం జోడించి మొత్తం వామపక్షంపై తప్పుడు అభిప్రాయం కలిగించటానికి, రాళ్లేయటానికి చేస్తున్న నిరంతర యత్నాలలో ఇదొకటి. ఇంకే ముంది కాషాయ దురద అంటించుకున్నవారు దీన్ని చూసి మరింతగా గోక్కోవటం మొదలు పెట్టి వామపక్ష భావజాలం, వామపక్ష వాదులపై రాళ్లు వేయటం ప్రారంభించారు. ఇలాంటి బాపతుకు వాస్తవం తెలుసుకొనే శ్రద్ధ వుండదు, ఒక వ్యాఖ్య, విమర్శ చేయబోయే ముందు తమకూ ఒక బాధ్యత వుంటుందని భావించరు. వాస్తవం తెలిసిన తరువాత పోనీ దానిని సవరించుకుంటారా అంటే అదీ వుండదు. వారి సాఫ్ట్‌వేర్‌ అలాంటిది.

     సనల్‌ కుమార్‌ శశిధరన్‌ తాను వామపక్ష వాదిని అని చెప్పుకున్నట్లు ఎక్కడా మనకు గూగులమ్మ దేవత వెతుకులాటలో కనిపించదు. అతనొక సినిమా దర్శకుడు మాత్రమే. ఆ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యపై దుమారం చెలరేగటంతో తట్టుకోలేక తన ముఖపుస్తకం (ఫేస్‌బుక్‌ ఖాతాలో పెద్ద వివరణ ఇచ్చుకున్నాడు. సంఘపరివార్‌ను నిత్యం మోసే జీ న్యూస్‌ కూడా చివరికి దాని పూర్తి పాఠం ప్రచురించి అసలు శశిధరన్‌ ఏమి వ్యాఖ్యానించాడు అంటూ ఒక వార్తను ఇచ్చింది. దాని లింక్‌http://zeenews.india.com/sports/rio-olympics-2016/did-sanal-sasidharan-actually-try-to-humiliate-pv-sindhu-with-spit-remark-heres-the-truth_1921757.html దాని పూర్తి పాఠం ఇలా వుంది.’ మనం చాలా కష్టకాలంలో జీవిస్తున్నాం. వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కనీసంగా కూడా అర్ధం చేసుకోలేని జనం మీడియాను ఏలుతున్నారు. సంచలనాత్మక వార్తల కోసం వారు మొహం వాచిపోయి వున్నారు. ఒలింపిక్స్‌లో పివి సింధు విజయాన్ని న్యూనత పరచాలని ఎవరైతే చూస్తున్నారో ఆ నకిలీ మేథావులు నేను చేసిన వ్యాఖ్యను విమర్శించటాన్ని చూడటం భయం కొల్పేదిగా వుంది. కొన్ని జాతీయ మీడియాలు కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవటం, తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పి నాకు వ్యతిరేకంగా వుపయోగిస్తున్నాయి. ఇదంతా కైరాలీ జనం టీవీ ఒక అవాంఛనీయ స్క్రోలింగ్‌ వేయటంతో ప్రారంభం కావటం విచారకరం. దాన్నొక వామపక్ష మీడియా అని పిలుస్తారు. ఇప్పుడు సంచలనాత్మక మీడియా నన్నొక వామపక్ష భావజాల సినిమా దర్శకుడిగా చెబుతూ ఈ వార్తను నాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నది.నేను చేసిన వ్యాఖ్య ఏమిటో స్పష్టత కలిగి వుండటం, దానికి కట్టుబడి వున్న కారణంగా నా వైఖరిని స్పష్టం చేయాలని నేను అనుకోలేదు. నేనేమి చెప్పానో, దాని అర్ధం ఏమిటో నన్ను అనుసరించే వారికి బాగా అర్ధం అవుతుంది. ఇప్పుడు కొంత మంది స్నేహితులు కూడా నా వ్యాఖ్యలను దుర్వినియోగం చేసిన వారి పాటనే పాడటం విచారకరం.ఇది భయానకమైన పరిస్థితి. వాస్తవంగా నేను ఏం చెప్పానో అర్ధం చేసుకోవటానికి కొన్ని క్షణాలు కూడా ఖర్చు చేయకుండా కేవలం నామీద దాడి చేయటానికి, దుర్వినియోగం చేయటం మాత్రమే కోరుకుంటున్న పిచ్చి గుంపుకు వివరించటం వలన ప్రయోజనం లేదు.నేను ఒకటే విషయం చెప్పదలచుకున్నాను, అదేమిటంటే మన పితృస్వామ్య దేశంలో మొత్తం మహిళా సమాజంలో పోరాడి పతకం సాధించిన మహిళను న్యూనత పరిచే వున్మాదిని కాదు నేను. శతాబ్దాల తరబడి మహిళల అణచివేతతో బాధపడుతున్న ఒక దేశం నుంచి ఆమె పోరాడి ఒలింపిక్స్‌లో గొప్ప విజయం సాధించటం ఒక గొప్ప విషయం.అత్యాచారాలు, అవమానాలకు గురయ్యే యువతుల వేషధారణ గురించి చర్చించటానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే దేశం మనది. గర్భంలోనే ఆడశిశువుల ప్రాణాలు తీస్తున్న సిగ్గుమాలిన వుదంతాలు ఇప్పటికీ జరుగుతున్న దేశం మనది. తోటి పౌరులారా నేను ఇలా చెబుతున్నందుకు మీరు నన్ను దేశ ద్రోహి అని పిలవటం ప్రారంభిస్తారని నాకు తెలుసు, నేను దానికి సిద్ధమే, ఎందుకంటే నా దేశభక్తిని ఎవరి ముందూ నిరూపించుకోవటానికి సిద్దంగా లేను. కానీ నేను పివి సింధు గురించి మాట్లాడిన దానిని పూర్తిగా దుర్వినియోగ పరచిన వార్తలను వ్యాపింప చేయవద్దు. ఇది నిరాధారమైన, పూర్తిగా వాస్తవ విరుద్ధమైది.’

   ఈ వివరణ చదివిన తరువాత ఈ దేశంలోని వామపక్షాలు పివి సింధు విజయాన్ని కించపరుస్తాయని మెదడు అరికాల్లో వుంటే తప్ప తలమీద వున్నవారెవరూ అనుకోరు. శశిధరన్‌ రాజకీయ భావాలేమిటి అన్నదికాదు, ఆయన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని వామపక్ష భావజాలంపై దాడి చేయటం గర్హనీయం. వామపక్ష సిద్దాంతాలు, రాజకీయాలను విమర్శించదలచుకుంటే అందుకు వేదికలు వున్నాయి, వాటిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపని చేయవచ్చు. ఇలాంటి సందర్బాలను దాడికి వుపయోగించుకోవటం నీచాతి నీచం.

   కొన్ని సందర్భాలలో అమ్మా అన్నా కూడా బూతుగా చిత్రించే దౌర్భాగ్య స్ధితిలో మనం వున్నామన్నది నగ్నసత్యం. హ్యాస్యం, వ్యంగ్యాన్ని భరించే, సహించగలిగే స్ధితికి, అర్దం చేసుకోగల స్ధాయికి మన సమాజం ఎదగలేదు. అసలు అలాంటి ప్రయోగాలు వున్నవనే విషయమే చాలా మందికి తెలియదు. శశిధరన్‌ చెప్పినట్లు కైరాలీ టీవీ తొలుత ఆయనను తప్పు పట్టింది. దానిని ప్రసారం చేసిన బాధ్యుడికి సైతం ఆ వ్యంగ్యం, హాస్యం తెలిసి వుండకపోవచ్చు. దానిని ఒక వామపక్ష వాది విమర్శగా ప్రసారం చేసే అవకాశమే లేదు. అంతేకాదు శశిధరన్‌ నిజంగా వామపక్ష వాది అయి వుంటే దానిని ప్రసారం చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వుండేవారన్నది గ్రహించాలి. శశిధరన్‌ తన సినిమాలలో మహిళల పట్ల పురోగామి వైఖరిని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. బహుశా ఆ కారణంగా ఆయను వామపక్ష శిబిరంవైపు నెట్టి దాడికి ఆయుధంగా చేసుకున్నారా ? పురోగామి భావాలు వామపక్షాల సొత్తేమీ కాదు, మానవత్వం వున్నవారెవరైనా కలిగి వుంటారు. మొరటోడికి మల్లె పూవు ఇస్తే ఏం జరుగుతుందో తెలిసిందే కదా ! అందువలన శశిధరన్‌ చెప్పినట్లు ఆయన గురించి తెలిసిన స్నేహితులే అపార్ధం చేసుకున్నారు కనుక సమాజం, తోటి వారు అర్ధం చేసుకోగలిగిన వ్యంగ్యం, హాస్యం మాత్రమే వుపయోగించాలని కూడా తెలుసుకోవటం అవసరం.

    ఇక సామాజిక మాధ్యమంలో ఇష్టపడటాలు(లైకులు) పంచుకోవటాలు(షేర్‌) వ్యాఖ్యలు చేయటానికి http://www.opindia.com/ వ్యాఖ్యానం అటూ ఇటూ తిరుగుతున్నది. ఇంకా ఇతర వార్తలున్నాయోమో నా దృష్టికి రాలేదు. ఈ వెబ్‌ సైట్‌ను ఏర్పాటు చేసింది ఒక సంఘపరివార్‌ భక్తుడు. కిరాయి రాతగాడు కూడా అయి వుండాలి.అతగాడి పేరు రాహుల్‌ రాజ్‌. సంఘపరివార్‌ను కాపు కాసే, తాను మితవాద స్వరాన్ని అని కాలర్‌ ఎగరేసి చెప్పుకొనే స్వరాజ్య అనే పత్రికhttp://swarajyamag.com/culture/interview-rahul-raj-co-founder-of-opindia-com సరిగ్గా ఏడాది క్రితం ఇంటర్వూ చేసింది. దానిలో రాహుల్‌ రాజ్‌ చెప్పిన ఒక ఆణిముత్యం ఎలా వుందో చూడండి.’ 2013లో ఢిల్లీలో అన్నా హజారే ఆందోళన జరిగిన సమయంలో దానిలో భాగస్వామిని, ఆమ్‌ ఆద్మీ పార్టీతో వుండాలని నేను అనుకున్నాను.ఆ తరువాత నేను రాజకీయాల గురించి రాయటం ప్రారంభించాను. కానీ కొంత కాలం గడిచాక అరె నేను వుండాల్సింది వారితో కాదని అర్ధం చేసుకున్నాను, అప్పటి నుంచి బిజెపి అనుకూల రాతలు రాయటం ప్రారంభించాను.’ అలాంటి పెద్ద మనిషి సారధ్యంలో నడిచే వెబ్‌ సైట్‌లో వామపక్ష భావజాలంపై రాళ్లు వేయించటం, నాలుగు రాళ్లు సంపాదించుకోవటం అతని వృత్తి. అలాంటి వారి వెబ్‌ సైట్‌ నుంచి వార్తలను చదివి బుర్రను వుపయోగించుకుండా తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ఏమనాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d