• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Farmers

సాగు చట్టాల పునరుద్దరణకు కొత్త ఎత్తుగడ – ఆందోళన పేరుతో బికెఎస్‌ను దించిన ఆర్‌ఎస్‌ఎస్‌ !

24 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Bharatiya Kisan Sangh (BKS), BJP, farm laws, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బికెఎస్‌) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్‌-జైకిసాన్‌ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్‌, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.


బికెఎస్‌ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్‌ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్‌ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్‌ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్‌ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్‌ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్‌ సింగ్‌ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్‌ సింగ్‌ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.


లఖింపూర్‌ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్‌ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

11 Saturday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత వ్యవసాయ రంగం – నరేంద్రమోడీ : ఇంతకాలం రైతు ఉద్యమం – ఇక కార్పొరేట్ల వత్తిడి ప్రారంభం !

09 Thursday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

agriculture in india, Farmers agitations, Minimum Support Prices, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.


కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్‌ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్‌ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్‌ ప్రశ్నించారు.


మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్‌ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?


నందకుమార్‌ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్‌ విస్సా, యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్‌ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.

ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్‌, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్‌ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )


నందకుమార్‌ లేదా జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్‌ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.


రైతులు డిమాండ్‌ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్‌ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగాళాదుంప విత్తన హక్కు కేసులో పెప్సీకి ఎదురుదెబ్బ !

05 Sunday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Farmers, patent for a potato, PepsiCo, potato


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


పెప్సీకంపెనీ ” లేస్‌ ” బంగాళాదుంప ”చిప్స్‌” రకంపై హక్కులను కోల్పోయింది. ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్‌ 3న రద్దుచేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం. బంగాళాదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను 2009 లో భారత్‌ లోకి తీసుకువచ్చారు. రైతులకు అందించి బంగాళదుంపలను కొనేలా పెప్సీకో ఒప్పందాలు కుదుర్చుకున్నది, 2016 సం.ఫిబ్రవరి 2 న ఈ రకపు వంగడం పిపిఇవిఆర్‌-2001 చట్టం 64,65 సెక్షన్ల క్రింద అధికారికంగా పెప్సీ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నది.” చిప్స్‌” కోసం ఉపయోగించే ప్రత్యేకమైన బంగాళాదుంప పై పూర్తి హక్కులు తమవేనని పెప్సీ కంపెనీ విర్రవీగుతున్నది. ”పెప్సీకో ఇండియా హౌల్డింగ్‌ యఫ్‌. యల్‌.2027 ” అని పిలవబడే బంగాళాదుంప రకాలను పేటెంట్‌ చట్టం క్రింద నమోదు చేసుకున్నాం కాబట్టి ఈ వంగడం పై పూర్తి హక్కులు తమ స్వంతం అని పెప్సీకో దబాయిస్తున్నది. తమ అనుమతి లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ ప్రత్యేక రకమైన బంగాళాదుంపలను ఉపయోగించి ” లేస్‌ ” అనే బ్రాండ్‌ పేరుతో ”చిప్స్‌” తయారుచేసి అమ్ముకుంటున్నది. . చిరుతిళ్ళు, కూల్‌ డ్రింకులు తయారుచేసే పెప్సీకో ఒక పెద్ద మల్టీనేషనల్‌ ఫుడ్‌ కంపెనీ, 200 దేశాలలోవ్యాపారాన్ని చేస్తున్నది. గతసంవత్సరం అమ్మి మన దేశాన్నుండి 4.52 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకి బంగాళాదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి బంగాళాదుంపలు కొనేటట్లుగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేస్తున్నది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కు పై దాడి చేస్తున్నది. రైతు తన విత్తనాన్ని తనే తయారుచేసుకుని వాడుకోకుండా అడ్డుకుంటున్నది.

ఒక్కొక్క రైతు నుండి ఒక కోటి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్నిడిమాండ్‌ చేసిన పెప్సీ

రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌ లో నలుగురు రైతులపై 4.2 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టారు. 2018 ఏప్రియల్‌ 8 న అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు రైతులను విచారించకుండానే, వారి లాయర్‌ లేకుండానే కంపెనీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. అయితే రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశ వ్యాపిత ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలోకూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలన్నీ ఆందోళన చేశాయి. పెప్సీకంపెనీ చిరుతిళ్ళను, కూల్‌ డ్రింకులను బహిస్కరించాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఎన్నికల ముందు దేశ వ్యాపిత ఆందోళనల ఫలితంగా కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది.

పెప్సీ కంపెనీకి విత్తనం పై హక్కు

కానీ విత్తనం పై హక్కు నాదే అని పెప్సీ ఇప్పుడు కూడా అంటున్నది. తాత్కాలికంగా వెనక్కితగ్గానంటున్నది. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారుచేసుకునే హక్కులేదని కంపెనీ వాదిస్తూనే వుంది. ఇందుకు ప్రతిగా కవిత కురుగంటి రైతుల విత్తన హక్కుకోసం పిటీషన్‌ వేశారు. రైతుల విత్తన హక్కు ను పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని ,పిపిఇవిఆర్‌-2001 చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని పిటీషన్‌ దాఖలుచేశారు. చట్టంలోని సెక్షన్‌ 64 ను పెప్సీ ఉపయోగించుకున్నది. రైతులు అదేచట్టం లోని సెక్షన్‌ 39(1) ను ఉదహరించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశంవున్నది. ఈ చట్టం అమలులోకి రాకముందులాగానే రైతులకు హక్కులన్నీ వుంటాయని కూడా సెక్షన్‌ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంట్‌ ను అనుమతించటంలేదని , పెప్సీ యొక్క యఫ్‌ సీ 5 బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని చేసిన వాదనను పిపిఇవి అధారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదన్నారు. బ్రాండు లేని విత్తనాలను అమ్మకునే హక్కుకూడా రైతుకు వుందన్నారు.

పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళాదుంప వంగడం పై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దుచేస్తూ మొక్కల రకాల పరిరక్షణ, రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ , శుక్రవారం తీర్పుఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. రైతులను నిలవరించటం కుదరదన్నారు. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తమ పేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులు ఎవరూ పండించటానికి వీలులేదని పెప్సీకంపెనీ వాదిస్తూవుంది

ఈ తీర్పువలన మన రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కోర్పోరేట్‌ కంపెనీ ఐనా విత్తనం పై సంపూర్ణ హక్కును పొందే అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పును, పీపీవీ యఫ్‌ఆర్‌ఏ ఛైర్‌ పర్సన్‌ శ్రీ కే వీ ప్రభు గారు ఇచ్చారు. రైతులోకం స్వాగతించవలసిన తీర్పును సాధించిన కవితా కురుగంటి అభినందనీయులు.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

26 Friday Nov 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, farm acts repeal, farm laws, Farmers agitations, Hindutva groups, Jats, Muslims, Narendra Modi, Narendra Modi Failures, RSS, Sikhs


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల చారిత్రాత్మక పోరాట విజయం-ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదు !

25 Thursday Nov 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Indian farmers historic win, Narendra Modi, Narendra Modi Failures, RSS


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


ఉక్కు సంకల్పంతో 2020 నవంబర్‌ 26 నుండి చేస్తున్న రైతులు చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి విజయం లభించింది. పోరాడితే ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదని నిరూపించారు. పార్లమెంటులో మెజారిటీ ఉందన్న అహంకారానికి వ్యతిరేకంగా దఢసంకల్పం సాధించిన విజయం. విపరీతమైన వేగంతో నయా ఉదారవాదాన్ని పెంచి పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ముఖ్యమైన ఎదురుదెబ్బ.మనం ఏమీచేయలేము, ప్రభుత్వం బలమైనది , మొండిగా వున్నది అంటూన్నవారి మాటలను వమ్ము చేశారు.ప్రజలలో ఉన్న నిరాశ,నిస్పహలను పఠాపంచలు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకతప్పలేదు.స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించవలసివచ్చింది. ఎట్టకేలకు 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేబినెట్‌ ఆమోదించింది. ఉపఎన్నికలలో ప్రజలు చూపించిన శాంపిల్‌ దెబ్బకే పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ను కొద్దిగా తగ్గించారు.
అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవటంలేదు. చట్టాలు మంచివే కానీ ప్రజలను ఒప్పించుటంలో వైఫల్యం చెందామంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ల లో రాబోయే ఎన్నికల లో చావుదెబ్బ తినబోతున్నామనే సర్వేల సంకేతాలు భాజపా కు మింగుడు పడలేదు. ఉత్తర భారత దేశంలో తీవ్రంగా ప్రజావ్యతిరేకత రాజుకుంటుందని అర్ధమౌతున్నది. దేశ అధికార పీఠానికి ఉత్తర భారతదేశం కీలకం. అక్కడనే నిప్పు రాజుకుంది. ఎవరితోనైనా పెట్టుకో కానీ.. రైతు కూలీలతో పెట్టుకుంటే నీకు పుట్టగతులుండ వని భారత రైతులు చరిత్రను పునరావత్తం చేస్తున్నారు.


ఈ నిర్ణయం వెనుక అపర చాణుక్య నీతే కారణం అని కొంతమంది సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఇది మాస్టర్‌ స్ట్రోక్‌ అనీ ఈ దెబ్బతో రైతు ఉద్యమం ఖాళీ అనీ డబ్బాకొట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌,పంజాబ్‌ ల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ ఎత్తుగడ గా తాత్కాలిక వెనుకడుగేనంటున్నారు. అవకాశవాదం తప్ప ఉద్యమ ప్రభావంకాదంటున్నారు.
చట్టాలరద్దునిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలు
1) పెరుగుతున్న ఉద్యమ స్పూర్తి-తరుగుతున్న మత విద్వేషం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ లో సెప్టెంబర్‌ 5 న, 10 లక్షల మంది ప్రజలతో భారీ సభ దిగ్విజయంగా జరిగింది.. మహాపంచాయత్‌ పేరున రైతులు, కార్మికులుఒకచోట గుమికూడి రైతువ్యతిరేక నల్లచట్టాలను రద్దుచేయాలని కోరటం నూతన సామాజికచైతన్యానికి దారితీసింది. ఇదే ముజఫర్‌ నగర్‌ లో 2013లో మతపరపమైన అల్లర్లను భాజపా రెచ్చగొట్టింది.మతవిద్వేషాలను పక్కనపెట్టి లౌకికఐక్యతను సాధించుతూరైతులు ఉద్యమంలోకి రావటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
2) సంవత్సరంపాటుసాగిన రైతుల పోరాటంలో 3సార్లు భారత్‌ బంద్‌ కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.సెప్టెంబర్‌ 27న భారత్‌ బంద్‌ పిలుపు అపూర్వ విజయాన్ని సాధించింది. దేశం నలుమూలలనుండి లక్షలాదిమంది. రైతులు, కార్మికులు,యువకులు, విద్యార్ధులు, మహిళలు,వ్యాపారులు, ఉద్యోగులు వీధుల్లోకి రావటమే భాజపా కు ప్రమాదసంకేతాలనుఇచ్చింది.
3) లఖింపూర్‌ ఖేరీ లో భాజపా జరిపిన దారుణమారణకాండ దేశప్రజలనందరినీ కదిలించింది.కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి అజయమిశ్రా ఆదేశాలనుఅనుసరించి గుమికూడిన ప్రజలపైకారును తోలి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపిన ఘటన యావద్భారత ప్రజలందరికీ కోపంతెప్పించింది. భాజపా ను అప్రతిష్టపాలుచేసింది. అక్టోబర్‌ 15,దసరా రోజున దేశవ్యాపితంగా బీజేపీ అగ్రనేతల దిష్చిబొమ్మలను తగలెట్టారు. రైళ్ళను ఆపేసి ఆందోళనలను నిర్వహించారు.
4) దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఆకలికేకల సూచికలు, అసమానతలు, అసంతప్తి, ఆర్ధిక సంక్షోభం, ఆందోళనలు భాజపా పతనానికి దారిచూపుతున్నాయి. మతవిద్వేష ప్రచారం ఒక్కటే ప్రభుత్వాన్ని రక్షించేటట్లు లేదు. పాకిస్ధాన్‌, చైనా వ్యతిరేక జాతీయఉన్మాదాన్ని రెచ్చగొట్టే అవకాశాలు ప్రస్తుతం లేవు.
5)రైతు ఉద్యమ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేస్తూ, పాప్‌ స్టార్‌ రిహన్నా” మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు” అంటూ ట్విట్టర్‌ లోనూ గూగుల్‌ లోనూ లేవనెత్తిన ప్రశ్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు తెచ్చింది.యువ పర్యావరణవేత్త గ్రేటా ధెన్‌ బర్గ్‌ రైతుఉద్యమానికిఎలామద్దతు తెలపాలో సలహఇస్తూ ”టూల్‌ కిట్‌” కార్యాచరణప్రణాలికను దిశా రవి షేర్‌ చేసింది.అందుకు ప్రతిఫలంగా నేరపూరితకుట్ర, శత్రుత్వాన్నిప్రోత్సహించారన్నఆరోపణలతోప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. కెనడా ప్రధానితో సహా, అమెరికాలోని 80 సంఘాలు, లాయర్‌ మీనాహారిస్‌, అంతర్జాతీయ మీడియా,సెలిబ్రిటీలు, సౌహార్ధ్రతను వెలిబుచ్చారు. పెరుగుతున్న అంతీర్జాతీయ మద్దతు భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
6) రాబోయే ఎన్నికలలో పరాజయం తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. మూడు చట్టాలపై వెనకడుగువేసి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతు కార్యకర్తలకు ప్రజాదరణ, విశ్వసనీయత పెరిగింది.
అంతా తమ ప్రయోజకత్వం అనే అంబానీ అదానీలకు మద్దతుగా మోడీ నిలబడి వ్యవసాయంలో కార్పొరేట్‌ సామ్రాజ్యాలను స్థాపించాలని చేస్తున్నప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది. కార్పొరేట్‌ వ్యవసాయక్షేత్రాలను స్ధాపించాలనే పేక మేడలను కూల్చిన ఘనత రైతులకు చెందుతుంది. కార్పొరేట్‌ శక్తులకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంతో సంఘర్షించి రైతు ఉద్యమ చరిత్రను సష్టించారు.

రాజకీయ కోణమా లేక రైతు ఉద్యమ ఉధతా?

ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక నూటికి నూరు పాళ్ళు రాజకీయకోణం ఉందనీ రైతుల ఉద్యమ ఉధతి కాదని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. మోడీ అపర చాణక్యనీతితో వ్యూహాత్మకంగా వ్యవసాయచట్టాల రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ లతోపాటుఅయిదురాష్ట్రాల లో కీలకమైన ఎన్నికలు జరగబోతునందున వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతా మనే భయానికి కారణం అన్నదాతల ఉద్యమ ఉధతి అన్న సంగతిని గుర్తించ నిరాకరిస్తున్నారు.భాజపా పార్టీనాయకులు ప్రజలలోకి వెళ్ళలేని పరిస్ధితిని మర్చిపోతున్నారు. పట్టుదలతోప్రాణత్యాగాలకు నిలబడ్డ రైతుల పోరాటాన్ని తక్కువ చేయచూస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలవలననే ప్రజలు భాజపా కు దూరమౌతున్నారనే సంగతిని విస్మరిస్తున్నారు. ప్రజలు పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతులౌతున్నారు.


మొక్కవోని దీక్షతో సాగించిన రైతుల పోరాటం కొన్నివిలువైన గుణపాఠాలను నేర్చుకుంది. ఉద్యమాలు అలలు లాగానే కాకుండా నిశ్చలప్రవాహంలాగా ఉధతంగా కూడాసాగించవచ్చని అనుభవం నేర్పింది. ప్రజా పక్షంవహించటమే పార్టీల ఎజెండా కావాలని ఉద్యమం డిమాండ్‌ చేసింది. అందుకనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని సష్టించింది.పార్టీల జెండాలు కాదు ఎజండా ముఖ్యమని చెప్పింది. పదవులు,రాజ్యాధికారమే పరమావధిగావున్నరాజకీయపక్షాలను ఉద్యమ వేదికలకు దూరంగా వుంచవలసిన అవసరాన్ని తెలియచెప్పింది.

”అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కధినాధులమని,

స్థాపించిన సామ్యాజ్యాలూ , నిర్మించిన కత్రిమచట్టాల్‌,

ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై,

పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.

చిరకాలం జరిగిన మోసం,బలవంతుల దౌర్జన్యాలూ,

ధనవంతుల పన్నాగాలు ఇంకానా! ఇకపై చెల్లవు” – అన్న శ్రీశ్రీ స్ఫూర్తి మరింతగా పోరాటాలను ముందుకు తీసుకుపోనుంది.

రైతు సంఘాలన్నీ ఏకమై కనీసమద్దతుధర కోసం..ఉద్యమ క్రమం
2018 నవంబర్‌లో 217 రైతు సంఘాలన్నీ ఏకమై ఐక్యపోరాటానికి పిలుపునిచ్చాయి.నవంబర్‌ లో లక్షలాదిమంది రైతులుఢిల్లీ నగరవీధులలో కదంతొక్కారు. లక్షలాది మంది రైతులు అరుదైన ప్రదర్శన చేసి కనీసమద్దతుధరకు చట్టబధత ను కల్పించి, ఋణవిముక్తిని కల్పించమన్నారు. మరుసటి సంవత్సరం నవంబర్‌ లో రైతు పార్లమెంటును నిర్వహించారు. కనీసమద్దతు ధరకు, ఋణవిముక్తికి ముసాయిదా చట్టాలను తయారుచేసి పార్లమెంటులో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రధాన డిమాండ్లైన కనీసమద్దతు ధరను, ఋణవిముక్తి అంశాలను పక్కనపెట్టి 2020, జూన్‌ 5న మూడుసాగు చట్టాలు తీసుకొస్తున్నట్టు కేంద్రంఆర్డినెన్స్‌ జారీ చేసింది. అప్పటినుండి రైతు కి న్యాయం చేయాలంటూ అన్నంపెట్టే అన్నదాతలు, రైతుసంఘాలు పంజాబ్‌ లోగ్రామగ్రామాన ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్య పరిచారు.. ఐక్యంగా రోడ్డెక్కారు. రైలు పట్టాలపై పడుకున్నారు.సెప్టెంబర్‌ 17 న గందరగోళపరిస్ధితులమధ్య, విపక్షాల నిరసనలమధ్య లోక్‌ సభలో భాజపా కి వున్నమెజారిటీతో ఆమోదంపొందింది. సెప్టెంబర్‌ 20న రాజ్యసభలో బిల్లులను ఆమోదించామని అప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. కనీసం వోటింగ్‌ జరపమన్న డిమాండ్‌ ను కూడా అంగీకరించలేదు. రైతుసంఘాలన్నీ ఏకమై నవంబర్‌ 26 న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. పశుబలంతో ఢిల్లీ సరిహద్దులలోనే ఆపిన ప్రభుత్వ బలగాలను ఎదిరించారు. రోడ్లపై కొట్టిన మేకులు, ముళ్ళకంచెలు రైతుల ప్రస్ధానాన్ని ఆపలేకపోయాయి. నల్ల చట్టాలను రద్దుచేయాలని పట్టువదలకుండా ఉక్కు సంకల్పంతో ప్రభుత్వాన్ని వణికించారు.


ఎముకలు కొరికే చలిని, చండ్ర నిప్పులుకక్కే ఎండలను, భీకర వర్షాలను లెక్కచేయలేదు.ది గజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బందులు, సమ్మెలు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బంధ్‌ లు, సమ్మెలు కు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. ఘోరమైన కోవిడ్‌-19 వేవ్‌ కాలంలో కూడా నిరసనకారులు తమ గుడారాల్లోనే ఉన్నారు.టాక్టర్లనే నివాసాలుగా మార్చుకున్నారు. రోడ్ల పైనే వండుకొని తిన్నారు. సంవత్సరం రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి నూతన తరహాలో చారిత్రక పోరాటాన్ని నిర్మించారు. రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ప్రజలలో వారిని అభాసుపాలు చేయడానికి రకరకాల అసత్య ప్రచారాలను లేవదీశారు. స్థానికులను రెచ్చగొట్టారు. హింసను సష్టించారు. ప్రభుత్వం ఆందోళనకారులను ఆందోళన జీవులనీ,పరాన్న జీవులనీ,ఖలీస్ధానీవాదులనీ, టెర్రరిస్టులనీ, దేశద్రోహులనీ పలు పేర్లతో నిందించారు.జనవరి 26, రిపబ్లిక్‌ డేరోజున రైతులు ట్రాక్టర్ల పెరెడ్‌ ను విజయవంతంగా నిర్వహించారు. కొంతమంది ఎర్రకోటపై జెండాను ఎగరేశారు. లఖింపుర్‌ ఖేరిలో అక్టోబరు 3న శాంతియతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై కేంద్రమంత్రి కుమారుడు కారును పోనిచ్చిరైతులను హత్యచేశాడు.నల్గురు రైతులు ఒక జర్నలిస్టు హత్యకుఅశిష్‌ మిశ్రా కారణమయ్యాడు. ఏడు వందల అరవై మంది రైతులు ప్రాణాలను అర్పించి పోరాటం కొనసాగించారు.


నల్ల చట్టాలను చట్టబద్ధంగా రద్దు చేసేంతవరకూ,కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేంత వరకూతమ నిరసన కొనసాగుతుందని పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంఘర్షణ సమితి ప్రకటించింది. ఉదాహరణకు వరిధాన్యానికి కనీసమద్దతు ధర హామీ అమలులేకపోవడంతోఎకరానికి పదివేల పైగా నష్టపోతున్నారు.రైతు వరిధాన్యాన్ని75 కిలోల బస్తాను రు.1000- 1,200కి విక్రయించవలసి వస్తుంది.కనీస మద్దతు ధర క్వింటాలుకు రు.1960 అంటే 75 కేజీ లో బస్తాకు రు.1470 రావాలి.కనీసమద్దతు ధరకు చట్టబధత ఉంటే బస్తా దాన్యాన్ని 1470 కన్నా తక్కువకు కొంటానికి చట్ట ప్రకారం వీలు లేదు. ఒక్క బస్తాకు రు.300 నుండి 400 నష్టపోతున్నాడు. ఎకరానికి సగటున 30 బస్తాలు దిగుబడి ఉంటుందనుకుంటే, 9000 నుండి 12000 వరకు నష్టపోతున్నాడు. ఢిల్లీ లో రైతుల పోరాటంలో 2018 నుండీ ప్రధాన డిమాండ్‌ ఇదే. నల్ల చట్టాలు, చట్టాల రద్దు కోసం పోరాటం, పోలీసు కేసుల రద్దు,లఖింపుర్‌ ఖేరిలోహత్యలు, 760 మంది రైతుల మరణం – నష్టపరిహారం -అన్నీప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల దుర్మార్గపు విధానాల ఫలితమేనని మరువరాదు.చట్టాలను రద్దు చేశారని సందడిలో పడి అసలు డిమాండ్లను వదలరాదు.కనీసమద్దతు ధరకు చట్టభద్దత కల్పించేవరకూ పోరాడుతూనేవుండాలి.. ఆ పోరాటంలో భాగంకావటం మనందరి కర్తవ్యం.

రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘం నేత.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీకి యావత్‌ దేశం ” కృతజ్ఞతలు ” చెప్పాలి మరి !

21 Sunday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

BJP, farm laws, Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఒక ధుర్యోధనుడు, ఒక రావణుడు, ఒక ముస్సోలినీ, ఒక హిట్లర్‌, ఒక జారు చక్రవర్తి, ఒక ఇందిరాగాంధీ, ఒక నరేంద్రమోడీ చరిత్రను మలుపుతిప్పే మహానుభావుల పరంపర ఇది. కొంత మంది నమ్ముతున్నట్లు విధి లిఖితం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రతినాయకుల జన్మ ప్రతి కాలంలోనూ పునరావృతం అవుతున్నందున ఆ క్రమంలోనే ప్రజా నాయకులు కూడా పుట్టుకువస్తారు. ఇప్పుడు రైతుల రూపంలో అదే జరిగింది. కొందరు త్యాగధనులు ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. రైతు ఉద్యమం అనేక పోరాటాలకు ఊతమిచ్చింది. యాభై ఆరుగాదు 112 అంగుళాల గుండెలున్నవారిని కూడా పిండిచేయగలమని, దిగివచ్చేట్లు చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీష్‌ వారిని పారద్రోలాలనే ఏకైక లక్ష్యం భిన్న రాజకీయ ధోరణులు కలిగిన వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఆ తరువాత అత్యవర పరిస్ధితి విధింపు కొంత మేరకు అందుకు దోహదం చేసింది. ఇప్పుడు అంతకంటే మరింత ప్రాముఖ్యత కలిగినదిగా దేశంలో రైతుల ఆందోళన ఒక మహత్తర దృశ్యానికి తెరతీసింది. అందుకు పురికొల్పిన ” మహానుభావుడు” ప్రధాని నరేంద్రమోడీకి యావత్‌ జాతి కృతజ్ఞతలు చెప్పాలి కదా !


చరిత్రలోని ప్రతినాయకులందరికీ వారి తీరుతెన్నులను చూసి ఇది తగదు, అది తగని పని అంటూ వారి మంచి కోరుకొనే వారు చెప్పినా వినిపించుకోలేదన్నది చరిత్ర, సాహిత్యం చెప్పిన సత్యం. విధి లేదా తలరాత అలా రాసి ఉంటుంది మరి. ముస్లింలపై గుజరాత్‌లో జరిగిన మారణకాండ సమయంలో రాజధర్మాన్ని అనుసరించాలని నాటి ప్రధాని అతల్‌బిహారీ వాజ్‌పాయి హితవు చెప్పారు. వాజ్‌పాయిగారు ఏదైతే చెప్పారో సరిగ్గాదాన్నే పాటిస్తున్నా అని అదే వేదిక మీద ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. పూర్వకాలపు మనిషి గనుక వాజ్‌పాయి మరోదారి లేక అవును ఆయన అదే చేస్తున్నారు అని చెప్పకతప్పలేదు.సీత గీత దాటకపోతే రామాయణమే లేదు. పాండవులకు ఐదూళ్లు ఇచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదు. సాగు రాష్ట్రాల అంశమైనా వాటితో సంప్రదించకుండా కరోనా తాండవిస్తుంటే ఆర్డినెన్సుల రూపంలో రుద్దటం, తరువాత వాటి మీద పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదం, రాష్ట్రపతి ముద్ర వెనుక ఏదో ఒక మహత్తరశక్తి లేకపోతే మానవమాత్రులను అలా చేయిస్తుందా ? అందుకుగాను ” నిమిత్తమాత్రుడైన ” నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం తప్పుకదా !


కరోనా నివారణకు చప్పట్లు, కంచాలు, గిన్నెలు మోగించాలంటే ఆ పని చేశారు. దివ్వెలు వెలిగించమంటే గౌరవభావంతో వెలిగించారు. ఏ కతలు చెబితే వాటిని నమ్మారు కదా అని బతుకు దీపాలనే ఆర్పుతాం అంటే రైతులు సహిస్తారా ? సాగు చట్టాల గురించి కూడా నరేంద్రమోడీకి హితవు చెప్పిన వారు లేకపోలేదు. జనంతో సంబంధం లేని, కార్పొరేట్లకు సేవలు చేసే జయప్రకాష్‌లు, జనాల మీదకు ఎక్కే ఆర్నాబ్‌లు, గుడ్డిగా సమర్ధించే ప్రాంతీయ పార్టీల నేతలమద్దతు, కార్పొరేట్‌లు కళ్ల ముందు కనిపిస్తుంటే రైతుగోడు వినిపించుకొనే తీరిక ఎక్కడుంటుంది పాపం ! విదురనీతి, హితవచనాలు విని ఉంటే రైతు భారతం ఎలా జరుగుతుంది? మోడీ క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమం గురించి పట్టని ఇతర రైతులు, తలకు ఎక్కించుకోని ఇతర జనాలకు కిక్కు దిగేది కాదు, యావత్‌ ప్రపంచానికి తెలిసేది కాదు కదా ! అంతటి కనువిప్పు కలిగించి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పకపోవటం ” క్షంతవ్యం ” కాదేమో !


సంచలనాలు సృష్టించటం బలవంతులకే కాదు బలహీనులకూ, పిరికిబారిన వారికీ సాధ్యమే. తిరుగులేని రామబాణం కలిగినట్లు చెప్పే రాముడూ పరువు కోసం సీతను కష్టాల పాలు చేసిన బలహీనతకు గురైన సంగతి తెలిసిందే. రామాయణంలో రాముడు, రావణ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో రాముడిని తప్పుపట్టిన రజకుడికీ అంతే ఉంది ! నరేంద్రమోడీలో చాలా మందికి వారు రాజకీయంగా వ్యతిరేకించే లేదా అనుకూలించే వారికి ఇప్పటి వరకు ఒక రూపమే కనిపించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చేయదలచుకున్నదానిని చేస్తారని గుజరాత్‌ మారణకాండ సమయంలో అభిమానుల్లో పేరు తెచ్చుకున్నారు. ఇతరుల్లో భయం పుట్టించారు. తాము కోరుకున్న సంస్కరణలను అమలు జరిపేందుకు జనాన్ని అవసరమైతే అణచివేసే బాహుబలుడిని కార్పొరేట్లకు నరేంద్రమోడీలో చూపింది కూడా అదే. కట్టుకున్న ఇల్లాలిని కూడా విస్మరించి దేశం కోసం సంఘపరివార్‌ పెంచిన బిడ్డగా నరేంద్రమోడీకి రెండు బాధ్యతలున్నాయి. ఒకటి సమాజాన్ని వెనక్కు నడపాలనే తిరోగామి హిందూత్వ కాగా, రెండవది దానికి అధికారం, అందుకోసం అవసరమైన కార్పొరేట్ల ఆసరా. రెండూ సాధించారు గానీ రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు.

హిందూత్వను అమలు జరిపేందుకు స్వమతమౌఢ్యం-పరమత ద్వేషం నింపాలి. మన దేశంలో అది చాలా ప్రమాదకరం. కార్పొరేట్లకు అంగీకారం కాదు, కొంత మేరకు వారు రాజీపడతారు తప్ప వాటిది పైచేయి కానివ్వరు. ఐరోపాలో ఫ్యూడల్‌ ప్రభువులను, ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తున్న చర్చిని వదిలించుకున్న చరిత్ర తెలిసిందే. మన దేశంలో ఉన్న పరిస్ధితులను బట్టి కార్పొరేట్లు గుళ్లూ గోపురాలను కట్టించారు, మత, ఉదారశక్తులకూ మద్దతు ఇచ్చారు, భూస్వాములు, ధనిక రైతులతో రాజీపడ్డారు. భూమి కేంద్రీకరణ వారి లాభాలను అడ్డుకుంటుంది కనుక భూ సంస్కరణలను ముందుకు తెచ్చారు. గ్రామాల్లో ఉన్న భూస్వాములను, వారి కండబలాన్ని వదులుకొనేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా లేనందున వాటిని నీరుగార్చింది. ధనిక రైతులను సంతుష్టీకరించే చర్యలను తీసుకుంది.

ఇప్పుడు గ్రామాల్లో కూడా పరిస్ధితులు మారాయి. ఓట్లకొనుగోలులో అక్రమాలను సహించేది లేదని హూజారాబాద్‌లో మహిళలు రోడ్డెక్కే విధంగా పరిణామాలు పురోగమించటాన్ని చూశాము.దళారీలు లేకుండా నేరుగా ఓట్లు కొనుగోలు, అందరికీ ఒకే రేటు ఇవ్వాలని కోరారు. భూస్వాముల పెత్తనం సాగదింక, అంటే కార్పొరేట్ల డబ్బుతోనే ఇక ముందు పార్టీలకు పని. కనుకనే కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. దీనికి తోడు బహుళజాతి గుత్త సంస్దల వత్తిడి కూడా తోడైంది. అవసరమైతే ధనిక రైతులను వదులు కొనేందుకు మోడీ సర్కార్‌ సిద్దమైంది కనుకనే ఆదరాబాదరా మూడు సాగు చట్టాలు. ఇప్పుడు వాటికి మంగళం పాడుతూ అధికారానికి ఎసరు రాకుండా చూసుకొనేందుకు కొత్త నాటకానికి తెరతీశారు. దీనివలన కార్పొరేట్లలో మోడీ మీద ఉన్న భ్రమలు తొలుగుతాయి. కొత్త బొమ్మను వెతుకుతారు. ఏడాది కాలంగా మోడీ తీరుతెన్నులను చూసిన ఏ రైతూ అంత తేలికగా బిజెపిని బలపరచడు. ఏమైనా సరే దేశాన్ని వెనక్కు నడుపుతారు, హిందూత్వను ఏర్పాటు చేస్తారని హిందూ హృదయ సామ్రాట్‌గా భావిస్తున్న శక్తులలోనూ మోడీ అనుమానాలు రేకెత్తించారు. లేదూ అలాంటిదేమీ లేదు, వ్యూహాత్మకంగానే తమ నేత వెనక్కు తగ్గినట్లు, మరింత గట్టిగా తాను చేయదలచుకున్నది చేస్తారని భక్తులు చెబుతున్నారు. కనుక ఏది జరిగినా తలెత్తే అనూహ్యపరిణామాలకు కచ్చితంగా మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.


తమ నేత ఓట్ల కోసం జనాన్ని సంతుష్టీకరించరు, దేశం కోసం అవసరమైతే కఠిన చర్యలను తీసుకొనేందుకూ వెనుకాడరంటూ ప్రజావ్యతిరేక చర్యలను సమర్ధించేందుకు పూనుకున్న వారున్నారు. మోడీ వెనక్కు తగ్గినా వారు తగ్గేట్లు లేరని సాగు చట్టాల రద్దు ప్రకటన తరువాత సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్న తీరు వెల్లడిస్తున్నది. ఒకసారి పులిని ఎక్కిన తరువాత అంత తేలికగా దిగుతారా ! మోడీ నిర్ణయంతో తమకు నిమిత్తం లేదు, ఆ చట్టాలు సరైనవే అని కొందరు ప్రబుద్దులు కొత్త వాదన మొదలు పెట్టారు. నరంలేని నాలికలు, అద్దె నోళ్లు ఏమైనా మాట్లాడగలవు. ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతులు తమకు వ్యతిరేకమైన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు తప్ప ఎవరూ క్షమాపణ కోరలేదే ! ఎవరైనా ఎప్పుడు అలాంటి పని చేస్తారు. తప్పుచేసి తప్పించుకొనే దారిలేక అడ్డంగా దొరికినపుడు, లేదా తీవ్రమైన తప్పిదానికి పాల్పడినపుడు చెబుతారు.

” నేను దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను..సాగు చట్టాల గురించి రైతులను ఒప్పించలేకపోయాము. మూడు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. దేశ అవసరాలకు అనుగుణంగా పంటల మార్పిడి, కనీస మద్దతు ధరలను మరింత సమర్దవంతంగా, పారదర్శకంగా చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని మోడీ చెప్పారు. నరేంద్రమోడీ తరువాత ప్రధాని పదవికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి అదిత్య నాధ్‌ స్పందిస్తూ ” బహుశా మావైపు నుంచి లోపం ఉన్న కారణంగా మేము చెప్పదలచుకున్నదాన్ని జనాలకు చెప్పటంలో మేము విఫలమయ్యాము ” అన్నారు.సాగు చట్టాలకు రైతాంగంలో ఎక్కువ మంది మద్దతు ఇచ్చారని కూడా సెలవిచ్చారు. గతంలో చట్టాలు చేసినపుడు వాటిని చారిత్రాత్మకమైనవని వర్ణించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు రద్దును కూడా చారిత్రాత్మకంగానే వర్ణించారు. జనానికి మతిమరపు ఎక్కువని భావించేవారే ఇలా సమర్ధించుకోగలరు. మొత్తం మీద సాగు చట్టాలు తేవటం తప్పన్న మాట పెద్దల నోట రాలేదు. అందుకే జనంలో మోడీకి పెద్దగా సానుకూలత రాలేదు. కొంత మందిని కొంతకాలం మోసం చేయ గలరు తప్ప అందరినీ ఎల్లకాలం చేయలేరు. తన పదజాలం వెనుక ఉన్న మర్మాన్ని జనం గ్రహించేట్లు చేసినందుకు నరేంద్రమోడీకి కృతజ్ఞత చెప్పాలి మరి !


సాగు చట్టాలు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ప్రభావితం చేసేవి. వాటి దుష్ఫరిణామాలు తక్కువ కాదు. ముందుగా ఉప్పందుకున్న వేళ్లమీద లెక్కించదగిన అధికారపార్టీ పెద్దలు, ఆశ్రితులైన వారు తప్ప మోడీగారి పెద్ద నోట్ల రద్దు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, జనాన్ని నానా యాతనల పాలు చేసింది-ఘోరంగా విఫలమైంది. అలాంటి పిచ్చిపని ప్రకటించిన లక్ష్యం నెరవేరలేదు, దానికి గాను జనాన్ని ఇబ్బంది పెట్టాను, ఆర్ధిక రంగాన్ని చెప్పరాని ఇబ్బందులపాలు చేశాను అని ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి ఉంటే ఇప్పుడు చేసిన ప్రకటనను జనం నమ్మి ఉండేవారు.తమకళ్ల ముందే జరిగిన పెద్ద నోట్ల రద్దు వైఫల్యాన్ని అంగీకరించకపోగా డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి, పన్ను చెల్లింపుదార్లు పెరిగారంటూ కొత్త కతలు చెప్పారు. పొద్దున్నే రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించగానే వేరే శక్తి అవాహనలోకి వెళ్లారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మహూబా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ కొంత మంది రైతులను పావులుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది ప్రతిపక్షాన్ని విమర్శించటం కంటే రైతులను తెలివితక్కువ దద్దమ్మలుగా నిందించటం తప్ప వేరు కాదు. ఇది కూడా రైతాంగాన్ని చైతన్యపరిచేదే, మరింత కసి పెంచేదే కనుక అందుకూ మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే ?


వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టాల రద్దుకు అవసరమైన తతంగం పూర్తి చేస్తామని చెప్పారు. ఐనా సంయుక్త కిసాన్‌ మోర్చా నమ్మలేదు. ముందుగా ప్రకటించిన ఆందోళనా కార్యక్రమంతో ముందుకు పోవాలని ప్రకటించింది. నెలాఖరులో మరోసారి సమావేశమై మిగతా అంశాల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. విదేశీ-స్వదేశీ కార్పొరేట్ల వత్తిడికి లొంగి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు చేసిన చట్టాలను పార్లమెంటు ఎంత ప్రహసన ప్రాయంగా ఆమోదించిందీ ప్రపంచం చూసింది. 2020జూన్‌లో ఆర్డినెన్స్‌ల ద్వారా వాటిని తెచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుద్వారా ఆమోదముద్ర వేశారు. తరువాత వాటిని వెనక్కు తీసుకొనేందుకు ససేమిరా అన్న పాలకులు రైతాంగాన్ని అపహాస్యంపాలు చేశారు. వారు అసలు రైతులే కాదన్నారు, దళారీలన్నారు, ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని ముద్రవేశారు. విదేశీ నిధులతో ఆందోళనలు చేశారని నిందించారు. చర్చలను ప్రహసన ప్రాయంగా మార్చారు. రైతుల మీద భౌతికంగా దాడులు చేశారు, రెచ్చగొట్టేందుకు చూశారు. తరువాత సుప్రీం కోర్టు వాటి అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది, నివేదిక ఇమ్మంది. ఇంతవరకు ఆ నివేదిక వెలుగు చూడలేదు. దాన్ని కూడా మూసిపెట్టారు.

సాగు చట్టాల రద్దు రైతుల విజయం అని వేరే చెప్పనవసరం లేదు. దానికెంత ప్రాధాన్యత ఉందో రద్దు, మోడీ క్షమాపణల ప్రకటన ఆ చట్టాలను నిస్సిగ్గుగా సమర్దించటానికి తమ మేధాశక్తి నంతటినీ రంగరించి రైతుల మీద రుద్దటానికి ప్రయత్నించిన ప్రబుద్దులకు చెప్పుకోవటానికి వీల్లేని చోట నరేంద్రమోడీ కొట్టిన తిరుగులేని దెబ్బగా కూడా చెప్పవచ్చు.సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, అంతకు ముందు చట్టాలను సమర్ధించిన షేత్కారీ సంఘటన నేత అనిల్‌ గన్వట్‌ గోడు మామూలుగా లేదు. వాటిని రద్దు చేసినంత మాత్రాన ఆందోళనకు తెరపడదు, బిజెపి ఆశించినట్లుగా ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడదని చెప్పారు. ఆ నివేదికలో ప్రభుత్వ చర్యను గుడ్డిగా సమర్ధించి ఉండకపోవచ్చు, అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తే చట్టాలను వెనక్కు తీసుకోవాలని సుప్రీం కోర్టు సలహా ఇస్తే మోడీ సర్కార్‌ పరువు మరింతగా పోతుంది, అందువలన మరింత నష్టం జరగకుండా విధిలేక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మోడీ వెనక్కు తగ్గే అవకాశం లేదని గట్టిగా నమ్మి అతని కంటే ఘనులు అన్నట్లు ఎక్కువగా సమర్ధించిన వారు మోడీ తమను వెన్నుపోటు పొడిచినట్లు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.అందువలన ఇక ముందు మోడీ లేదా మరొకరు ఎవరు ప్రకటించిన లేదా అమలు జరిపే విధానాలనైనా గుడ్డిగా సమర్ధించకూడదని ఇప్పటికే అనే మంది మనసులోనే చెంపలు వేసుకుంటున్నారు. వారిలో అలాంటి మారుమనసు తెచ్చినందుకు నరేంద్రమోడీని అభినందించకుండా ఉండగలమా ?


రైతుల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తుండగా నవంబరు 26వ తేదీ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపి వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే మరో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పరాభవం ఎదురుకానుందనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో నరేంద్రమోడీ సర్కార్‌ వెనక్కు తగ్గింది. తాను నోరు విప్పినా విప్పకపోయినా, పరోక్షంగా రైతులను పరిహసించినా రాజును మించి రాజభక్తిని ప్రదర్శించి సాగు చట్టాలను సమర్ధించిన వారికి వెన్నుపోటు పొడిచి తన లబ్దిని తాను చూసుకున్నారు. మోడీ మొండి వైఖరి కారణంగా కొందరు రైతుల్లో తమ పోరాటం ఫలిస్తుందా అన్న అనుమానాలు తలెత్తటం అసాధారణం కాదు, అలాంటి వారి సంశయం-ఇటు తన మద్దతుదారుల ధృడవిశ్వాసానికి భిన్నంగా రైతు చట్టాల మీద మోడీ తోకముడిచారు. వ్రతం చెడినా ఫలందక్కదు. సాగు చట్టాలకు దారి సుగమం చేసుకొని కార్మిక చట్టాలను దెబ్బతీసేందుకు, ఆర్ధిక రంగంలో పెను మార్పులకు మోడీ సర్కార్‌ అస్త్రాలను ప్రయోగించాలని కాచుకు కూర్చున్నది.వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చూస్తున్న వారికి సాగు చట్టాల రద్దు ఎంతో ఊపునిస్తుంది.రైతుల ఆందోళన వెలుగులో దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతారు. అందుకు దోహదం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం అన్యాయం కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధాన్యం కొనుగోలు వ్యవహారం : తెరాస మాత్రమే కాదు, ఇతర పార్టీలూ రంగంలోకి రావాలి !

18 Thursday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Economics, Farmers, NATIONAL NEWS, Opinion, Others, Politics, Prices, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

BJP, Fci, KCR, Telangana paddy procurement matters


ఎం కోటేశ్వరరావు


తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. వడ్ల కొనుగోలు గురించి ఇప్పటి వరకు ఏ రోజున కేంద్రంతో కెసిఆర్‌ ఏం మాట్లాడారు, ఏ ఒప్పందం చేసుకున్నారు, ఏది ముందు ఏది వెనుక అన్నది గతం. ఇప్పుడు రైతులకు తక్షణం కావాల్సింది వారి పంట కొనుగోలు, వేసవిలో వరి వేసుకోవాలా లేదా అన్నది వారికి చెప్పాలి. కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని కోరుతూ ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం నాడు ధర్నాకు దిగారు. రెండు రోజుల్లోపల కేంద్రం తేల్చని పక్షంలో ఆందోళనను ఢిల్లీకి తీసుకుపోతానని ప్రకటించారు. ఇలాంటి ఉదంతం ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం హడావుడేనా లేక పరిస్ధితి తీవ్రతకు ప్రతిబింబమా ? కేంద్ర ప్రభుత్వం-తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణా రాష్ట్ర సమితి – బిజెపి కేంద్ర నాయకత్వం మధ్య జనం అనుకుంటున్నట్లుగా ఇంతకాలం తెరవెనుక జరిగిన మంతనాలేమిటన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, ఆరుబయట వానకు తడిచి ఎండకు ఎండుతున్న వడ్లను కొంటారా లేదా అన్నదే రైతులకు కావాల్సింది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మూడు వివాదాలు ఆరు రేటింగులు అన్నట్లుగా మీడియాకు రంజుగా ఉండవచ్చు. రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. చేతికొచ్చిన పంటను కొంటారా లేదా రబీ(వేసవి లేదా యాసంగి)లో వరి వేయాలా వద్దా ? అదిగాకపోతే ఏ పంటను సాగు చేయాలి అన్నది వారికి అంతుబట్టటం లేదు. వెంటనే తేల్చాల్సిన తరుణం వచ్చింది.


ప్రభుత్వం, అధికారపార్టీ వరి వేయవద్దని చెబుతోంది, ప్రతిపక్షం, కేంద్రంలో అధికారపార్టీ వరి సాగు చేయండి ఎలా కొనుగోలు చేయరో చూస్తాం అంటూ సవాలు విసిరింది. మాటలకే పరిమితం కాకుండా బిజెపి కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో రాజకీయ యాత్రలకు పూనుకుంది. పరిశీలించవచ్చు, తప్పుపట్టనవసరం లేదు, వందల కార్లు,జనంతో అట్టహాసం ఏమిటి ? బిజెపి నేతలు పరిశీలిస్తే టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమిటి ? అది కూడా పోటాపోటీగా కొనుగోలు కేంద్రాల వద్దకు తన మద్దతుదార్లను దింపింది. బిజెపి నేత మీద రాళ్ల దాడి జరిగింది.ఆగ్రహించిన రైతులే ఆ దాడి చేసినట్లు టిఆర్‌ఎస్‌ చెబుతోంది. సరే రాళ్లంటే పొలాల్లో, రోడ్ల మీద దొరుకుతాయి గనుక ఆగ్రహించి రైతులే విసిరారు అనుకుందాం. మరి కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిజెపి వారి వెంట రౌడీషీటర్లు ఉన్నారంటూ అధికారపక్షం ఫొటోలు కూడా చూపుతోంది. అధికారం కోసం పాకులాడే రాజకీయం పార్టీల వెంట అందునా బిజెపితో రౌడీలు, గూండాలు ఉండటం ఆశ్చర్యం లేదు. ఎవరినైనా చంపినపుడు నక్సల్స్‌ ఎవరు చంపారంటే జనమే ఖతం చేశారు అని చెప్పినట్లుగా బిజెపి మీద ఆగ్రహిస్తున్న రైతులే ఆ పార్టీ నేతల మీద దాడి చేసినట్లు అధికారపార్టీ చెబుతోంది. ఎవరైనా ముందుగా పధకాన్ని రూపొందించుకోకపోతే కోడి గుడ్లను వెంట తీసుకుపోరు అన్న సామాన్యుల సందేహానికి సమాధానం ఏమిని చెబుతారు. అలాగే బిజెపి నేతల వెంట రౌడీలు, గూండాలు అనుసరించాల్సిన అవసరం ఏమిటి అన్నదానికి కూడా వారు చెప్పాలి.


ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు, పార్టీల నేతలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలను చూద్దాం. పంజాబ్‌ తరహాలోనే మొత్తం వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి. ఈ డిమాండ్‌లో తప్పులేదు. ఏడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు ఇంతకాలం దాని గురించి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అన్నది రైతులకు, ఇతర జనాలకు తెలియాలి కదా. పంజాబ్‌లో రైతులు పండించిన వడ్లలో ఒక్క గింజను కూడా అక్కడి జనం తినరు, వాటిని విక్రయించటానికే వేస్తారు. తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలు అలా కాదే, వినియోగమూ, అమ్మకమూ రెండు కలిసి ఉంటాయి.అందువలన అన్ని చోట్లా ఒకే పరిస్ధితి లేదు. కేంద్రం తన బాధ్యతను తప్పించుకోజాలదు.


ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని మరోసారి అడగను అని కెసిఆర్‌ రాతపూర్వకంగా కేంద్రానికి రాసి ఇచ్చిన సంగతి రైతులకు చెప్పలేదు. అదనపు కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ప్రచారం చేసుకున్నారు.ప్రసాదాన్ని దేవుడు తినడు అనే అంశం పూజారికి మాత్రమే తెలుసు. అలాగే రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చినందున ఉప్పుడు బియ్యం కొనరనే అంశం కెసిఆర్‌కు మాత్రమే తెలుసు. అందుకనే కొద్ది నెలల క్రితం సన్నవరి రకాలు వేసుకోవాలని, ఆ రైతులకు అదనంగా ప్రోత్సాహక మొత్తాలను ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం బదులు అంత మేరకు గతం కంటే అదనంగా పచ్చి బియ్యం కొంటుందనే హామీ లేకపోవటంతో కెసిఆర్‌కు తత్వం తలకెక్కి రోడ్డెక్కారు. రైతుల కోసమే గనుక ఆందోళనకు దిగటాన్ని తప్పుపట్టనవసరం లేదు. ఈ సంగతులన్నీ రైతులకు, ఇతర జనాలకు చెప్పకుండా దాచటంలో ఆంతర్యం ఏమిటన్నదే ప్రశ్న.


రాజకీయంగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేని బిజెపి కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకొని వడ్ల సంగతి తేల్చకుండా రైతుల్లో కెసిఆర్‌ను గబ్బు పట్టించాలన్న దురా,దూరాలోచన ఉంది కనుకనే కొనుగోలు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయటం లేదన్నది తేలిపోయింది. రెండు అవకాశాలున్నాయి. ఒకటి మరికొద్ది రోజులు సమస్యను ఇలాగే నానబెట్టి రైతాంగాన్ని కెసిఆర్‌, అధికారపార్టీ మీదకు రెచ్చగొట్టటం, కెసిఆర్‌ విఫలమైనట్లు చెప్పటం, తరువాత రాష్ట్ర బిజెపి పెద్దలు ఢిల్లీ పర్యటనలు జరిపి కేంద్రాన్ని ఒప్పించినట్లు తతంగం జరిపి మావల్లనే వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొనేందుకూ అవకాశం ఉంది. కేంద్రం, ఎఫ్‌సిఐ నిమ్మకునీరెత్తినట్లుగా రైతుల ఆందోళనను పట్టించుకోకుండా స్పందించకుండా ఉందంటే ఏమనుకోవాలి ?
కెసిఆర్‌ రోడ్డుమీదకు రావటం వెనుక బహుశా ఇతర కారణాలు కూడా ఉండి ఉండాలి. విద్యుత్‌ సంస్కరణలను అమలు జరపాలని కేంద్రం వత్తిడి తెస్తోంది. దానికి లొంగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించి ప్రకటన చేసింది. తదుపరి తెలంగాణా వంతు రానుంది. పంపుసెట్లకు మీటర్లు అంటే తక్కువ సంఖ్య ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోనే రైతులు గుర్రు మంటున్నారు. తెలంగాణాలో అది పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ సంస్కరణల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దళిత బంధు పేరుతో నిండా మునిగి ఏమి చేయాలో దిక్కుతోచని కెసిఆర్‌ కొంత కాలమైనా దాని గురించి చర్చ జరగకుండా వడ్ల సమస్యను తెచ్చారా ? కేంద్రం కూడా వెంటనే వత్తిడి తేలేదు, ఏం జరుగుతుందో చెప్పలేము.


కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికే ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తోంది. ఇది సేకరణ బాధ్యతనుంచి తప్పుకొనే ఎత్తుగడలో ఒక ప్రచారం. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత వివిధ సూచికల్లో మన దేశం మెరుగుపడకపోగా దిగజారుతోంది. సులభతర వాణిజ్య సూచికలో మెరుగుదలను ప్రకటించినపుడేమో దాన్లో ఎలాంటి లోపాలు కనిపించవు, కానీ దిగజారిన మిగతావాటి గురించి లెక్కించిన పద్దతి తప్పు, మన స్ధానం మరింత మెరుగుపడిందనే వితండవాదానికి దిగుతోంది. ఇదే బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఆ సూచికలను చూపే గత ప్రభుత్వాలను తూర్పారపట్టిందని మరచిపోరాదు. అప్పుడు లెక్కింపు పద్దతి దానికి గుర్తుకు రాలేదు. ప్రపంచ ఆకలి సూచిక 2021 వివరాలను అక్టోబరులో ప్రకటించారు. చైనాతో సహా పద్దెనిమిది దేశాలు ఒకటో స్దానంలో ఉంటే 116దేశాలకు గాను మనం 101వ స్ధానంలో ఉన్నాం.మోడీ ఏలుబడిలో 2016లో 97గా ఉన్నది ఇప్పుడు 101కి దిగజారింది.మన తరువాత 103వదిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. శ్రీలంక 65, మయన్మార్‌ 71, బంగ్లాదేశ్‌, నేపాల్‌ 76, పాకిస్తాన్‌ 92వ స్ధానాల్లో ఉన్నాయి. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నప్పటికీ ఇలా జరిగింది. ఈ సూచికకు నాలుగు అంశాలు ప్రాతిపదిక. తగిన్ని కాలరీలు తీసుకోలేని ఆహారలేమి, ఐదేండ్లలోపు పిల్లల పెరుగుదల గిడసబారుతనం, తగినంత ఆహారలేమి, ఐదేండ్లలోపు మరణించేవారి రేటు ప్రాతిపదికగా తీసుకొని లెక్కిస్తారు.


ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే మెజారిటీ జనానికి ఆహారధాన్యాల కొనుగోలు శక్తి పెరగాలి. అది జరగాలంటే అందుకు సరిపడా వేతనాలు లభించే ఉపాధిని వారికి చూపాలి.దేశంలో మొత్తంగా చూసినపుడు ఆ రెండూ లేవు.మరోవైపున జనానికి సబ్సిడీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కోత పెడుతున్నది. రోజు రోజుకూ ఆహారానికి చేసే ఖర్చును జనం తగ్గించుకొని ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. గోదాముల్లో గోధుమ, బియ్యాలను ఎలుకలు, పందికొక్కులకు పెట్టటాలు, ముక్కిపోయిన తరువాత పనికిరాని వాటిని పారపోసేందుకైనా కేంద్రం సిద్దపడుతోంది, లేదా సబ్సిడీలిచ్చి విదేశాలకు ఎగుమతులు చేస్తోంది గానీ మన జనానికి అందించేందుకు ముందుకు రావటం లేదు. కరోనా కారణంగా ఇరవైలక్షల కోట్లతో ఆత్మనిర్భర పాకేజ్‌లంటూ ఆర్భాటం చేసిన పాలకులు తెలంగాణాలో ఉప్పుడు బియ్యాన్ని కొనేందుకు ముందుకు రావటం లేదు. గత వేసవిలో అంగీకరించిన మేరకు ఇంకా ఐదు లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉండగా దాని గురించి ఎటూతేల్చటం లేదు. ఖరీఫ్‌లో పండిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చేస్తారో అదీ చెప్పదు. ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని ముందే చెప్పిన కేంద్రం పచ్చిబియ్యాన్ని ఎంత పరిమాణంలో కొంటారో ఎందుకు చెప్పటం లేదు. ఎఫ్‌సిఐ ముందుగానే ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేయాలో ప్రణాళికలను రూపొందించుకోదా ? సిబిఐ, ఆదాయపన్ను, ఇడి, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్దలను తనకు లొంగని లేదా తనతో చేరని నేతల మీద ప్రయోగిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరాసను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎఫ్‌సిఐని ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదకర పోకడ.

ప్రతిపక్ష పార్టీల పట్ల కెసిఆర్‌ అనుసరిస్తున్న వైఖరి, తూలనాడుతున్న తీరు అభ్యంతరకరమే. ఎన్నికలు వచ్చినపుడు ఎవరి వైఖరిని వారు తీసుకోవచ్చు. వడ్ల కొనుగోలు లేదా బలవంతపు విద్యుత్‌ సంస్కరణల వంటి వాటి మీద పోరాడాల్సి వచ్చినపుడు వాటిని వ్యతిరేకించే పార్టీలన్నీ రోజువారీ విబేధాలను పక్కన పెట్టి పెట్టి రైతాంగం, ఇతర పీడిత జనం కోసం కేంద్రం మీద వత్తిడి తేవాల్సిన తరుణం ఆసన్నమైంది. తెరాసతో కలిసేందుకు ఇబ్బందైతే ఎవరి కార్యాచరణతో వారు ముందుకు రావాలి.కెసిఆర్‌ది కేవలం హడావుడే అయితే విశ్వసనీయత మరింత దిగజారుతుంది. రైతాంగ ఆగ్రహం, ఆవేశాలు కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నేతల మీదకు మళ్లుతాయి.రాజకీయంగా తగిన ఫలితం అనుభవిస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర సంస్కరణల అమలు : నరేంద్రమోడీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి ?

28 Wednesday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

India Reforms @ 30, India reforms matters, Narendra Modi Failures


ఎం కోటేశ ్వరరావు
మన్మోహన్‌ సింగ్‌ నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడచింది. 1991 జూలై 24న పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా మన్మోహన్‌సింగ్‌ సంస్కరణలతో కూడిన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి ఆద్యులం మేమే అని గతంలో ఛాతీలు విరుచుకున్న కాంగ్రెస్‌, వాటిని పొగిడి అమలు జరిపేందుకు పోటీ పడిన తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు, అదే సంస్కరణలను మరింత గట్టిగా అమలు చేస్తున్న బిజెపిలోగానీ ఎక్కడా సంతోషం కాదు గదా కనీస చిరు హాసం కూడా కనిపించటం లేదు. ఎందుకు ?


సంస్కరణలను గతంలో సమర్ధించిన వారు గానీ ఇప్పుడు భజన చేస్తున్న పెద్దలు గానీ చెప్పేది ఏమిటి ? అంతకు ముందు టెలిఫోను కావాలంటే పార్లమెంట్‌ సభ్యుడి సిఫార్సు కావాలి, ఎక్కువ సేపు మాట్లాడితే జేబులు ఖాళీ, స్కూటర్‌ కొనుక్కోవాలంటే సంవత్సరాలు ఆగాలి, గ్యాస్‌ కావాలన్నా ఏండ్లు పూండ్లు గడిచేవి. ఇప్పుడు వద్దన్నా సరే తీసుకోండి బాబూ అంటూ జనాన్ని వదల – కదలకుండా సతాయిస్తున్నాయి. పరిస్ధితి మరింత మెరుగుపడాలి, ఇంకా అందుబాటులోకి రావాలంటే మరిన్ని సంస్కరణలు అవసరం అన్నది కొందరి వాదన. ప్రపంచ వ్యాపితంగా 2019లో వంద మంది జనాభాకు సగటున 104 ఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయి. మన దగ్గర 2020లో 110.18, చైనాలో 113.38, క్యూబాలో 11.6(2011) ఉన్నాయి. అంటే మనం చైనాకు దగ్గరగా ఉన్నాం, ఎంత అభివృద్ది ? క్యూబా అందనంత దూరంలో వెనుకబడి ఉంది చూడండి అని అంకెలను చూసి ఎవరైనా చెబుతారు. మరి దీనిలో వాస్తవం లేదా ? కంటికి కనిపిస్తుంటే లేదని ఎలా చెప్పగలం !

గతి తార్కిక సూత్రాల ప్రకారం ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. అందువలన సంస్కరణలు, మరొకదానిని వద్దని చెప్పటం అంటే రివర్స్‌ గేర్‌లో నడపాలని చూడటమే. పురోగమనం ఏ దారిలో నడవాలన్న దగ్గరే అసలు సమస్య. దాన్ని తమవైపు మళ్లించుకోవాలని కార్పొరేట్‌ సంస్దలు చూస్తాయి. తమ వైపు రావాలని సామాన్య జనం కోరుకుంటారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్దలు(ఐఎంఎఫ్‌) ఏం చెబుతాయి ? వాటిని రూపొందించింది ధనిక దేశాలు గనుక వాటి ప్రయోజనాలకు అనుగుణ్యమైన సిఫార్సులే చేస్తాయి. దాని అర్ధం సమాజంలో ఒక తరగతి ఆ సంస్కరణలతో లబ్దిపొందుతుంది. భిన్నమైన ఆచరణ అయితే మరో తరగతికి ప్రయోజనం.


ఐక్యరాజ్యసమితి 2020 మానవాభివృద్ది సూచికలో 189 దేశాలకు గాను క్యూబా 70వ స్ధానంలో, చైనా 85, మన దేశం 131, బంగ్లాదేశ్‌ 133లో ఉంది. సంస్కరణల లక్ష్యం సెల్‌ఫోన్ల కనెక్షన్ల పెరుగుదలా లేక మానవాభివృద్దిగా ఉండాలా ? మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత కరోనా సమయంలో ఆక్సిజన్‌ కోసం విదేశీ దానం, దిగుమతుల మీద ఆధారపడాల్సిన దుస్ధితిని ఎలా వర్ణించాలి ? అందుకే సంస్కరణల లక్ష్యం ఏమిటి అన్నది గీటురాయిగా ఉండాలి. మన దేశం స్వంతంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకే మన జబ్బలను మనం చరుచుకుంటున్నాం. నరేంద్రమోడీ ఉండబట్టే అది సాధ్యమైందన్న భజన తెలిసిందే. సున్నా కంటే ఒకటి విలువ అపారం. సెల్‌ఫోన్ల కనెక్షన్లలో త్వరలో మనం చైనాను అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వాక్సిన్‌కే మనం తబ్బిబ్బు అవుతుంటే చైనా 20వాక్సిన్ల ప్రయోగాలు జరుపుతోంది. అమెరికా ఆర్ధిక దిగ్బంధనం ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నంతలోనే పెద్ద మొత్తం వెచ్చించి క్యూబా ఐదు కరోనా వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. కావాలంటే ఇతర దేశాలు ఉత్పత్తి చేస్తామంటే ఫార్ములా ఇస్తామని ప్రకటించింది. ఇలా ఉదహరించుకుంటూ పోతుంటే విదేశాలను పొగిడే దేశద్రోహులుగా ముద్రవేస్తారు. టూల్‌కిట్ల కేసులు బనాయిస్తారు. పెగాసస్‌ను ప్రయోగిస్తారు.


మూడు దశాబ్దాల క్రితం మన్మోహన్‌ సింగ్‌ ఆర్ధిక మంత్రిగా సంస్కరణల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ పదిహేను రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం ఉందని చెప్పారు. ఇప్పుడు మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే అప్పుడూ పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు సంస్కరణలు కావాలని కోరారు. మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడూ మరిన్ని సంస్కరణలు కావాలని కోరుతున్నది వారే. సామాన్య జనంలో నాడున్నంత మోజు, క్రేజు ఇప్పుడు లేదు. ఎందుకని ? స్వాతంత్య్రం వచ్చిన పద్నాలుగు సంవత్సరాలకు వెలుగు నీడలు(1961) అనే సినిమా వచ్చింది. మహాకవి శ్రీశ్రీ పాడవోయి భారతీయుడా అంటూ రాసిన పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. స్వాతంత్య్రం వచ్చెనని సంబరపడబోకోయి, స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.. ఆకామందుకొనే ధరలకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలుముకున్న నీ దేశమెటు దిగజారూ, కాంచవోయి నేటి దుస్ధితీ ఎదిరించవోయి ఈ పరిస్ధితీ, పదవీ వ్యామోహాలు కులమత బేధాలూ భాషా ద్వేషాలూ చెలరేగేనేడు ప్రతి మనిషి మరియొకనీ దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే అంటూ ఆరుదశాబ్దాల క్రితమే పరిస్ధితిని ఎదిరించమని సందేశమిచ్చాడు శ్రీశ్రీ . మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత అవన్నీ మరింత పెరిగాయి.


1991నాటి సంస్కరణలకు విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తటం ఒక ప్రధాన కారణం. నరేంద్రమోడీ హయాంలో విదేశీమారక ద్య్రవ్యం పెరుగుదలను ఒక ఘన విజయంగా ఊరూ వాడా ఊదరగొడుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మొత్తం మీద మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం లోటులోనే ఉంది. ఎవరి ఘనత అయినా మిగులు సాధించినపుడే. ఇప్పుడు 612 బిలియన్‌ డాలర్లు (జూలై 16నాటి ఆర్‌బిఐ సమాచారం) దాటినప్పటికీ ప్రముఖ ఆర్ధికవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. మరోసారి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చని, జాగ్రత్తపడాలని చెప్పేవారు కొందరు, ఐఎంఎఫ్‌ను ఆశ్రయించవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.” ఊహించని విదేశీ అఘాతాల(షాక్‌లు)లను తట్టుకొనే శక్తిని విదేశీమారక ద్రవ్య స్ధాయిలు కల్పిస్తాయని చెప్పటం మోసకారితనం ” అని రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేవవ్రత పాత్ర రిజర్వుబ్యాంకు బులిటెన్‌లో రాశారు. జూన్‌ నాలుగవ తేదీ నాటికి 605 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రధమ స్ధానంలో ఉన్న చైనా, జపాన్‌, స్విడ్జర్లాండ్‌, రష్యా తరువాత అధిక విదేశీమారక డాలర్ల ద్రవ్యం ఉన్న దేశంగా ఐదవ స్ధానానికి చేరింది. ఈ మొత్తం పదిహేను నెలల పాటు మనం దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని చెబుతున్నారు. వారం వారం ఇవి పెరగటానికి ప్రత్యక్ష పెట్టుబడులు రావటం, దేశ ఆర్ధిక వ్యవస్ధ సరిగా లేనప్పటికీ కంపెనీల వాటాల కొనుగోలుకు విదేశీ మదుపుదార్లు ఎగబడటం కారణాలు అన్నది స్పష్టం. స్విడ్జర్లాండ్‌ దగ్గర ఉన్న నిధులు 39 నెలలు, జపాన్‌ 22, రష్యా 20, చైనా 16నెలల పాటు దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నందున మన పరిస్ధితి మెరుగ్గా ఉందని కొందరు నమ్మబలుకుతున్నారు.చైనా వాణిజ్య మిగులులో ఉంది తప్ప తరుగులో లేదు. అందువలన మన పరిస్ధితిని ఇతరులతో పోల్చుకుంటే ప్రయోజనం ఏముంది ? మన దేశ అంతర్జాతీయ నిఖర పెట్టుబడులను విశ్లేషిస్తే సంపదలకంటే అప్పులు 12.9శాతం ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఆచరణాత్మక విశ్లేషణలు చేయటం అవసరం. మనకంటే వేరే దేశాల్లో లాభం అనుకుంటే పొలో మంటూ ఆ పెట్టుబడులన్నీ తెల్లవారే సరికి మాయాబజార్‌లా మాయం అవుతాయి. అప్పుడు పరిస్ధితి ఏమిటన్నది సమస్య.


విదేశీ మదుపుదారులు తమ దేశాల్లో కంటే తక్కువ ప్రతిఫలం వస్తున్న కారణంగానే మన మార్కెట్లోకి వస్తున్నారు. అందువలన వారికి ఎక్కడ వాటంగా ఉంటే అక్కడికి ఎప్పుడైనా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. మన్మోహన్‌ సింగు చెప్పినట్లు పదిహేను రోజులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలున్నపుడు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ ఆదేశాల మేరకు సంస్కరణలు తీసుకువచ్చారు. అందువలన సహజంగానే అవి కొన్ని తరగతులను సంతృప్తి పరచాయి, సంపదలను పెంచాయి. వాటిని చూసి అనేక మంది తాము కూడా ఆ జాబితాలో చేరేందుకు మహదావకాశం వచ్చిందనే ఆశతో వెనుకా ముందూ చూడకుండా వాటిని సమర్ధించారు. యుపిఏ పాలనలో దేశంలో ఆర్ధిక పరిస్దితి దిగజారటం, కొత్త పద్దతుల్లో దేశ సంపదలను దోచుకొనే క్రమంలో జరిగిన అక్రమాల కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. దాన్ని ఉపయోగించుకొని నరేంద్రమోడీ రంగంలోకి వచ్చారు.


ఏడు సంవత్సరాల తరువాత అనేక వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా ప్రధాని మోడీ పలుకుబడి తగ్గలేదని కొందరు చెబుతున్నారు. అంగీకరిద్దాం. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యం గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నాడు పివి నరసింహారావు, మన్మోహన్‌ సింగులు చేసిన మాదిరి కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు నరేంద్రమోడీ అద్భుతాలు చేయగలరా లేదా అని కొందరు పోల్చి చూస్తున్నారు. కొందరు పండితులు, విధాన నిర్ణేతలు ఆశపడుతున్నారు గానీ అంత సీన్‌ లేదు, ఆశాభంగం చెందుతారు అని కొందరు హెచ్చరిస్తున్నారు. వారు చెబుతున్న కారణాల సారాంశం ఇలా ఉంది. 1991 నాటి ఏకీభావం ఇప్పుడు లేదు. అవి ఆకస్మికంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. సంస్కరణలతో చైనా పురోగమనం, ఆసియాలో మరికొన్ని దేశాల పురోగమన ప్రభావం, అన్నింటికీ మించి సోవియట్‌ యూనియన్‌ పతనం వంటి అంశాలన్నీ ప్రభావితం చేశాయి.

ఇందిరా గాంధీ హయాంలోనే ప్రపంచబ్యాకు,ఐఎంఎఫ్‌ చెప్పిన వాటిని అమలు చేయటం ప్రారంభించారు, దాని వలన ప్రయోజనం లేదని అరకొర అవీ పైపైన గాక కచ్చితంగా వాటిని అమలు జరపటం, రక్షణాత్మక విధానాల బదులు స్వేచ్చా మార్కెట్‌, ఉదారవాదవిధానాలు తప్ప మరొక మార్గం లేదనే అభిప్రాయాలు బలపడటం వంటి అంశాలున్నాయి. ప్రభుత్వ రంగ విస్తరణ, పెట్టుబడుల విధానాన్ని పక్కన పెట్టి సర్వం ప్రయివేటుకే అప్పగించారు. అయినా సేవారంగంలో వచ్చిన మార్పులు తప్ప పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో సాధారణ పెరుగుదల తప్ప సంస్కరణల ప్రభావం ప్రత్యేకంగా కనిపించటం లేదు. మన దిగుమతులు తప్ప ఎగుమతులు పెరటం లేదు. సంస్కరణలను మరింతగా అమలు జరపాలని అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే వాదనలు మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే ఇంటా బయటి నుంచి వత్తిళ్లు ప్రారంభమయ్యాయి. యుపిఏ ఒకటి హయాంలో వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడవటం వలన కార్పొరేట్ల కోరికలు తీర్చటం సాధ్యం కాలేదు. యుపిఏ 2 హయాంలో వామపక్షాలతో నిమిత్తం లేకుండానే పాలన సాగినా ధరల పెరుగుదల, అవినీతి అక్రమాల కుంభకోణాలతో పరువు పోయిన సమయంలో వెనకడుగు వేయక తప్పలేదు.

గుజరాత్‌-గోద్రా-మారణకాండ నేపధ్యంలో అవసరమైతే జనాన్ని అణచి తమ అజెండాను అమలు జరిపే సాహసవంతుడు కార్పొరేట్లకు నరేంద్రమోడీలో కనిపించారు. అంతకంటే కావాల్సింది ఏముంది.అవసరమైన ప్రచారం, హంగు, అర్భాటాలతో కొత్త దేవుడు వచ్చాడన్నట్లుగా పరిస్ధితిని తయారు చేశారు. ఒక అజెండాను కూడా రూపొందించారు. పారిశ్రామికవేత్తలు కోరిన విధంగా భూమి పొందేట్లు నిర్ణయాలు తీసుకోవాలి, కార్మిక చట్టాలను నీరు గార్చాలి, పన్ను సంస్కరణలను అమలు జరపాలి, బ్యాంకులు, బీమా రంగం నుంచి తప్పు కోవాలి.మిగిలిన ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటీకరించాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి. ఇందుకు అవసరమైన ఇతర అనుబంధ చర్యలు తీసుకోవాలి. దానిలో భాగంగానే అంతకు ముందు తాము వ్యతిరేకించిన జిఎస్‌టిని మోడీ అమలు చేశారు. మిగతావాటికీ రంగం సిద్దం చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి పిచ్చిపనితో తలెత్తిన ఇబ్బందులు, జిఎస్‌టితో వచ్చిన సమస్యలు, ఆర్ధిక రంగంలో వృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి పడిపోవటం, దాదాపు అన్ని రంగాలలో వైఫల్యం కారణంగా మిగతా అంశాల అమలును వేగం చేస్తే జనం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయమే ఇప్పుడు నరేంద్రమోడీని పీడిస్తోంది. మొరటుగా ముందుకు పోతే అధికారానికే మోసం వస్తుందనే బెరుకు మొదలైంది.


అన్ని వ్యవస్ధలను దిగజార్చుతున్న మాదిరే మోడీ హయాంలో ఏకాభిప్రాయ సాధన, భిన్నాభిప్రాయాల వెల్లడి లేదా చర్చకు అవకాశాలు ఇవ్వని నిరంకుశ ధోరణి పెరుగుతోంది. గతంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 60-70శాతం కమిటీల చర్చకు పంపేవారు ఇప్పుడు అవి పదిశాతానికి పడిపోయాయి. ప్రవేశపెట్టే బిల్లుల గురించి ముందుగా చర్చించటం కూడా తగ్గిపోయింది. తొలి ఐదు సంవత్సరాలలో 186 బిల్లులను ప్రవేశపెడితే వాటిలో 44 మీదే ముందుగా సంప్రదింపులు జరిపారు. కరోనా సమయంలో వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా సరైన సంప్రదింపులు, చర్చలు లేకుండా మూడు బిల్లులను ఆమోదించుకున్న తీరు, వాటికి వ్యతిరేకంగా రైతాంగం ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఉద్యమం గురించి తెలిసిందే. ఆ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. వ్యవసాయ చట్టాల తరువాత కార్మిక చట్టాలకు రంగం సిద్దం చేశారు. అయితే అనూహ్యంగా కరోనా వచ్చింది. సహాయక చర్యలు, దాన్ని గుర్తించటంలో నిర్లక్ష్యం, వైఫల్యం ఒకటైతే ఆర్ధికంగా దేశం కుదేలు కావటం వలన సంస్కరణల కిక్కు జనానికి ఎక్కించటం సాధ్యం కాదు. ఏ చమురు ధరలైతే మోడీ అధికారానికి రాగానే గణనీయంగా పడిపోయి ప్రభుత్వం మీద భారం తగ్గించటంతో పాటు ఆమేరకు జనం మీద భారం మోపి అదనపు వనరులను సమకూర్చుకొనేందుకు దోహదం చేశాయో ఇప్పుడు అవే రాబోయే రోజుల్లో మెడకు చుట్టుకోనున్నాయి. ఇప్పుడు మోడీ తలపెట్టిన సంస్కరణల అజెండా యుపిఏ హయాంలోనే ఉంది.వాటి అమలు, తటపటాయింపు మన్మోహనసింగు ఇష్ట అయిష్టాల కారణంగా వాయిదా పడలేదు. ధరల పెరుగుదల వంటి అంశాలతో పాటు అవినీతి అక్రమాలు ఆ ప్రభుత్వాన్ని కుదిపివేసిన కారణంగా తగ్గారు. అందుకే కార్పొరేట్లు సింగును పక్కన పెట్టి మోడీకి జై కొట్టారు.


ఏడు సంవత్సరాల తరువాత ఆర్ధిక వ్యవస్ధ కుదేలు కావటం, పన్నుల కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయికి చేరటం, వాక్సిన్‌పై పిల్లిమొగ్గలు, ఆక్సిజను కూడా అందించలేని కరోనా వైఫ్యల్య నేపధ్యం అన్నింటికీ మించి రైతుల ప్రతిఘటన వంటి అంశాల నేపధ్యంలో మోడీ మీద ఇంకా మోజు ఉన్నప్పటికీ మరిన్ని సంస్కరణల గురించి కబుర్లు చెబితే నమ్మే స్ధితిలో జనం లేరు. అదే అసలు సమస్య. చెప్పిన మాట, చేసిన వాగ్దానాలను మరోసారి చెప్పటం, మాట్లాడే అలవాటులేని మోడీ గారికి పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. మొరటుగా ముందుకు పోతే జనంలో ప్రతిఘటన, కోరిక తీర్చకపోతే కార్పొరేట్లు చేయాల్సింది చేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరల పెరుగుదల : బిజెపికి ముందుంది ముసళ్ల పండగ !

21 Monday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, Health, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP double standards, Fuel Price in India, Fuel tax hike in India, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


నాలుగు నెలల క్రితం లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. దాని ప్రకారం పెరుగుతున్న చమురు ధరల ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51శాతం మంది చెప్పారు. అత్యవసర వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవటం బాధాకరంగా ఉందని 21శాతం మంది అన్నారు. ఆ సర్వే రోజు ఢిల్లీలో పెట్రోలు ధర 90.93, డీజిలు ధర రూ.81.32 ఉంది. జూన్‌ 21న 97.22, 87.97కు పెరిగాయి. అంటే పైన పేర్కొన్న జనాలు ఇంకా పెరుగుతారని వేరే చెప్పనవసరం లేదు. అచ్చేదినాలలో ఉన్నాం కనుక దేశభక్తితో ఇతర ఖర్చులు తగ్గించుకొని దేశం కోసం త్యాగం చేస్తున్నాం. జూన్‌ 21న చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు పీపాధర 73.50కు అటూ ఇటూగా, మన దేశం కొనుగోలు చేసే రకం ధర.72.39 డాలర్లుగా ఉంది. సాధారణంగా బ్రెంట్‌ కంటే ఒక డాలరు తక్కువగా ఉంటుంది.
కొంత మంది పాలకులకు, కొన్ని పార్టీలకు చరిత్ర అంటే మహాచిరాకు. ఎందుకంటే జనాలు వాటి పేజీలను తిరగేస్తే బండారం బయట పడుతుంది. గతంలో ఏమి చెప్పారో ఇప్పుడేమి చెబుతున్నారో జనం చర్చించుకుంటారు. ప్రతిఘటనకు ఆలోచనలే నాంది కనుక, జనాన్ని ఏదో ఒక మత్తులో చేతనా రహితంగా ఉంచాలని చూస్తారు. చమురు ధరల గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమి చెప్పారో, ప్రధానిగా ఉంటూ ఆయనేమి చేస్తున్నారో, సచివులేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం అవసరం.


మరోవైపున చమురు ధరలు పెంచటం వలన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గతేడాది జూన్‌30న చెప్పారు. ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ చేసిన ఆందోళనను ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు.కుటుంబంలో సమస్య తలెత్తినపుడు భవిష్యత్‌ అవసరాలను చూసుకొని జనాలు సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చమురు ధరల పెంపును కూడా ఇదే విధంగా చూడాలి. చమురు పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును ఆరోగ్యం, ఉపాధి, ఆర్ధిక భద్రత చేకూరే ఇతర వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పధకం కింద పేదలు, రైతులకు అనేక పధకాల కింది 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించాం. జనాల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. ఆరునెలల పాటు ఉచితంగా రేషన్‌ మరియు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. పేదలకు సంక్షేమ పధకాలను అమలు జరుపుతుంటే సోనియా గాంధీ, కాంగ్రెస్‌ భరించలేకపోతున్నాయి.” అన్నారు. ఏడాది తరువాత కూడా ఇదే పద్దతిలో సమర్ధించుకున్నారు.


సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాం కనుక చమురు ధరలను తగ్గించేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూన్‌ 13న కరాఖండిగా చెప్పేశారు. ధరలు జనానికి సమస్యగా ఉందని తెలిసినప్పటికీ చేసేదేమీ లేదన్నారు. వాక్సిన్ల కోసం 35వేల కోట్లు, ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రధాని మంత్రి గరీబ్‌ కల్యాణయోజన పధకం కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు.వేలాది కోట్ల రూపాయలను కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద బ్యాంకుల్లో జమచేశాము, రైతులకు కనీస మద్దతు ధరలను పెంచాము కనుక ఈ ఏడాది ఇవన్నీ ఉన్నందున చేయగలిగిందేమీ లేదన్నారు.


ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న సాకులు మాత్రమే. ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్రమంగా పెంచటంతో పాటు గతేడాది బడ్జెట్‌ సమయంలోనే చమురు పన్నులు భారీగా పెంచారు. గత మూడు సంవత్సరాలలో చమురు పన్ను ద్వారా వచ్చిన ఆదాయ సంఖ్యలే అందుకు సాక్షి. ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన లోక్‌సభకు మంత్రి ప్రధాన్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వచ్చిన ఆదాయం ఇలా ఉంది.2018-19లో 2.13లక్షల కోట్లు, 2019-20లో 1.78లక్షల కోట్లు, 2020-21లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు (పది నెలలకు) 2.94లక్షల కోట్లు వచ్చింది. కరోనా రెండవ తరంగం వస్తుందని ముందే ఊహించి ఇంత భారీ ఎత్తునపన్నులు విధించినట్లు భావించాలా ? ఇన్ని కబుర్లు చెబుతున్నవారు వాక్సిన్ల భారాన్ని రాష్ట్రాల మీద వేసేందుకు ఎందుకు ప్రయత్నించినట్లు ? 2014-15లో అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్రం పెట్రోలు మీద రు.29,279 కోట్లు, డీజిలు మీద 42,881 కోట్లు వసూలు చేయగా ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది మార్చి 22న లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి వరకు పెట్రోలు మీద రు.89,575 కోట్లు, డీజిలు మీద రు.2,04,906 కోట్లు ఎక్సయిజ్‌ పన్ను వసూలైంది. ఇంత పెంపుదల రైతులు, కరోనా కోసమే చేశారా ? కరోనా నిరోధ పరికరాలు, ఔషధాల మీద జిఎస్‌టి తగ్గించటానికి ససేమిరా అని వత్తిడి తట్టుకోలేక నామ మాత్ర రాయితీ ఇచ్చిన పెద్దలు చెబుతున్నమాటలివి. బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఏమి చెప్పారు ? ఏమి చేశారు ?


కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి చమురు ధరల పెరుగుదల గొప్ప తార్కాణం అని 2012 మే 23న ఒక ట్వీట్‌ ద్వారా నరేంద్రమోడీ విమర్శించారు.బహుశా అప్పటికి ప్రధాని పదవి ఆలోచన లేదా లేక ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకొనే ఎత్తుగడలో భాగంగా చెప్పారా ? ధరల పెంపుదల వలన గుజరాత్‌ పౌరుల మీద వందల కోట్ల భారం పడుతుందని కూడా నాడు ముఖ్యమంత్రిగా మోడీ చెప్పి ఉంటారు. 2012లో రైలు ఛార్జీల పెంపు పేదలు, రైతులకు వ్యతిరేకం అని నిరసన తెలుపుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్రానికి లేఖ రాశారు.అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేశాడన్నట్లుగా 2014లో అధికారానికి వచ్చిన తొలి నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ తన వాగ్దానాల్లో ఒకటైన ధరల పెరుగుదల అరికట్టటం, అచ్చేదిన్‌ అమల్లో భాగంగా రైలు ప్రయాణీకుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా 6.5శాతం పెంచారు. దివంగత సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మాటలను పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్కృతి ఇరానీ తీరుతెన్నులు తెలిసిందే. బిజెపి కనుక కేరళలో అధికారానికి వస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ అరవై రూపాయలకే అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనమ్‌ రాజశేఖరన్‌ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. వాటిని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఆధరకు ఇవ్వవచ్చని చెప్పారు. చమురును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు ఎల్‌డిఎఫ్‌ అంగీకరించటం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ గారు రోజువారీ ధరల పెంపుదల వినియోగదారులకే మంచిదని, తమ ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధించదని చెప్పారు.
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చివరికి అదే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ను బిజెపి పెద్దలు, పిన్నలు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్రం విధించే ఎక్సయిజ్‌ పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకే పోతుందని, అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలని నిరంతరం చెబుతుంటారు. అదే వాస్తవం అయితే బిజెపి పాలిత రాష్ట్రాలు ముందుగా ఆ పని చేసి ఆదర్శంగా నిలిచి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల మీద ఎందుకు వత్తిడి తేవటం లేదు ? ఒక్కటంటే ఒక్క రాష్ట్రమైనా ఆపని ఎందుకు చేయలేదు?


యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో ఎలా ఉందో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం××× ధర డాలర్లలో
2010-11××× 85.09
2011-12××× 111.89
2012-13××× 107.97
2013-14××× 105.52
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.57
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.57
2020-21××× 44.82


2021-22 సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో 66.61, మే నెలలో 72.08 డాలర్లు ఉంది. ఈ సంవత్సరాలలో ధరలు తగ్గితే వినియోగదారులకు ధరలు తగ్గాలి, పెరిగితే పెరగాలి అని చెప్పారు. అదే తర్కాన్ని వర్తింప చేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గాలి. జరిగిందేమిటి ? ఎలా పెరిగిందో ముందే చూశాము. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారుల జేబులు గుల్ల అయ్యాయి. చమురు ధర 72 డాలర్లు ఉంటేనే మోడీ ఏలుబడిలో పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది. అదే పూర్వపు స్ధాయికి చేరితే…… మోత మోగుతుందని వేరే చెప్పాలా ?


సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో బిజెపి చేస్తున్న ప్రచారం పని చేస్తున్న కారణంగానే అనేక మంది పన్ను తగ్గించాల్సింది రాష్ట్రాలే అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పెట్రోలు మీద యూపిఏ హయాంలో లీటరుకు విధించిన రూ.9.48 నుంచి 32.98కి డీజిలు మీద రు.3.56 నుంచి 31.80కి పెంచాలని ఏ రాష్ట్రం కోరిందో చెప్పాలని బిజెపి పెద్దలను నిలదీయండి, సమాధానం ఉండదు. ఈ మొత్తాలలో రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, డ్యూటీలే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఈ మొత్తాల నుంచి 41శాతం లెక్కవేసి దానికి, రాష్ట్రాలు విధించే వాట్‌ను కలిపి చూడండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే ఎక్కువ కదా, కనుక రాష్ట్రాలే తగ్గించాలని బిజెపి పెద్దలు వాదిస్తారు. అందుకే మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా ఆ పని ముందు అక్కడ ఎందుకు చేయలేదు అంటే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం చమురు మీద లీటరు పెట్రోల మీద రెండున్నర, డీజిలు మీద నాలుగు రూపాయల సెస్‌ విధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వినియోగదారులకు పెంచలేదు. మరి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు ? పైన చెప్పుకున్న ఎక్సయిజు పన్ను నుంచి ఈ మొత్తాన్ని సెస్‌ ఖాతాకు మార్చారు. ఈ మొత్తాలనుంచి రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అలాగే లీటరుకు వసూలు చేస్తున్న రు.18 రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్‌. వీటి నుంచే చమురు, గ్యాస్‌ పైప్‌లైన్లు, జాతీయ రహదారులు, రాష్ట్రాలకు రహదారులకు నిధులు ఇస్తున్నారు. మరోవైపు వినియోగదారుల చార్జీల పేరుతో వాటిని వినియోగించుకున్నందుకు జనాల నుంచి వసూలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే మన డబ్బులతో మనమే రోడ్లు వేసుకొని వాటికి టోల్‌టాక్సు మనమే కడుతున్నాం. ఇవన్నీ పోను మిగిలిన మొత్తాల నుంచే రాష్ట్రాలకు 41శాతం వాటా ఇస్తారు. అసలు మోసం ఇక్కడే ఉంది.

కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఏడాదికి ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు ఇస్తున్నట్లు ఎన్నికల కోసం ఒక పధకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపున ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోలు,డీజిలు మీద వ్యవసాయ సెస్‌ పేరుతో ప్రతిపాదించిన మొత్తాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 49వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. జనమంతా చమురు కొంటారా అని వాదించే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాహనాలు నడిపేవారందరూ వ్యవసాయం చేయరు కదా ? వారి కోసం అందరిదగ్గర నుంచి ఎందుకు వసూలు చేయాలి ? కరోనా కారణంగా చమురు వాడకం తగ్గింది గానీ, ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరగటం వెనుక మతలబు పెంచిన పన్నులే. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే రాష్ట్రాల ఖాతాలో వేయటం కరోనా విషయంలో చూశాము. కరోనా మీద విజయం సాధించామని చెప్పుకొన్నపుడు నరేంద్రమోడీ అండ్‌కోకు రాష్ట్రాలు గుర్తుకు రాలేదు, తీరా రెండవ తరంగంలో పరిస్ధితి చేజారటంతో ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాల బాధ్యత అంటూ ప్రచారానికి దిగారు.


2014 మే నెలలో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు ధర రు.71.41. దీనిలో చమురు ధర 63శాతం, కేంద్ర పన్నులు 16శాతం, రాష్ట్ర పన్ను 18శాతం, డీలరు కమిషన్‌ మూడు శాతం ఉంది. అదే 2021 ఫిబ్రవరిలో లీటరు ధర రూ.86.30. దీనిలో కేంద్ర పన్ను 37శాతం, చమురు ధర 36శాతం రాష్ట్ర పన్ను 23శాతం, డీలరు కమిషన్‌ నాలుగుశాతం ఉంది. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నందున ఈ శాతాల్లో మార్పులు ఉంటాయి. దీన్ని రూపాయల్లో చెప్పుకుంటే రు.86.30లో కేంద్రానికి రు.32.98, చమురు కంపెనీలకు రు.29.71, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.19.92, డీలరు కమిషన్‌ రు.3.69 వస్తాయి.


పేదలందరూ పెట్రోలు కొంటారా ? వాహనాలు లేని వారు కూడ కొని తాగుతారా అంటూ వితండవాదనలు చేసే వారిని చూస్తాము. అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ముందుకు తెచ్చిన ప్రచార అస్త్రాలు. ప్రతి వస్తువు ధర పెరుగుదల, పన్నుల పెంపు మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఆ సూచికలను నిర్ణయించేందుకు అన్ని రకాల వినియోగ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రతి నెలా సూచిక తగ్గిందా లేదా అని నిర్ధారిస్తారు. ఉద్యోగులకు, కార్మికులకు, ఇతర వేతన జీవులకు ఆ ప్రాతిపదికనే కరువు భత్యాన్ని నిర్ణయిస్తారు.ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. డీజిలు ధరలు పెరిగితే ప్రజారవాణాకు వినియోగించే బస్సుల నిర్వహణ, సరకు రవాణా లారీ, వ్యవసాయదారుల ట్రాక్టర్లు, పంపుసెట్ల ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల్లో జనరేటర్లను వాడితే అక్కడ తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా యావత్‌ జనజీవనం మీద చమురు ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.


రానున్న కొద్ది వారాల్లో పీపా చమురు 80డాలర్లకు చేరవచ్చని జోశ్యం చెబుతున్నారు. గత రెండు నెలల్లో మార్కెట్‌ తీరుతెన్నులను చూసినపుడు ముందుగానే పెరిగినా ఆశ్చర్యం లేదు. వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆర్ధిక కార్యకలాపాల పెరుగుదల దానికి ఒక కారణంగా చెబుతున్నారు. జోశ్యాలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే 70-80 డాలర్ల మధ్య చమురు ధరలు ఉన్నప్పటికీ మన వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగానే ఉంటుంది. ఇదే జరిగితే వినియోగదారులకు, ముందే చెప్పుకున్నట్లు యావత్‌ జనానికి ధరల సెగ, అది పాలకులకు రాజకీయ సెగగా తగలటం అనివార్యం. యుపిఏ చివరి మూడు సంవత్సరాలలో జరిగింది అదే. అదే నరేంద్రమోడీ సర్కార్‌కూ పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d