• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ మొక్కజొన్నల దిగుమతి రైతాంగాన్ని దెబ్బతీస్తుందా -హైకోర్టులో రిట్‌ !

27 Monday Jul 2020

Posted by raomk in AP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

maize imports, maize imports by India, maize imports by modi government


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 25న నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఐక్య జనతా దళ్‌(జెడియు)-బిజెపి-ఎల్‌జెపి, ఇతర చిన్న పార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హౌమం నిర్వహించారు. అంతకు మూడు రోజుల ముందుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఐదులక్షల టన్నుల మొక్క జొన్నలు, పదివేల టన్నుల పాలు, పాలపొడి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. సాధారణంగా దిగుమతి చేసుకోవాలని ఎవరైనా వాంఛిస్తే ధాన్య రకాలపై 50 నుంచి 60శాతం, పాలు, పాల ఉత్పత్తులపై 30 నుంచి 60శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించి తెప్పించుకోవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధ కోటా నిబంధనల మేరకు పైన పేర్కొన్న పరిమాణాలను కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతి చేసుకోనున్నారు.


మొక్కజొన్నలను దిగమతి చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు అక్రమ వాణిజ్య పద్దతులను అనుసరిస్తున్న కారణంగా రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణా హైకోర్టులో దాఖలైన పిటీషన్లలో అనేక మంది రైతులు తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. మొక్కజొన్నలను దిగుమతి చేసుకున్న సంస్దలు వాటిని నూతన విలక్షణ ఉత్పత్తులను మాత్రమే తయారు చేసేందుకు వినియోగించాలనే షరతును పెట్టింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నలను వేయించి పేలాలుగా తయారు చేస్తే అది కొత్త ఉత్పత్తి కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్నవాటిని తిరిగి వేరే సంచులలో నింపి అమ్మితే కుదరదని అటువంటపుడు కేంద్రం ఏవిధంగా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల కారణంగా తమకు రావాల్సిన ధరలు పడిపోయాయాని రైతులు వాదించారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించిన కోర్టు కేసును వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఉద్దీపన పధకాలు ప్రకటించినా మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలకు 90 రూపాయలు పెంచిన తరువాత 2020-21 సంవత్సరానికి రు.1,850గా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి నిర్ణయాన్ని ప్రకటించక ముందే దిగుమతుల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్వింటాలుకు 900 నుంచి 1200 రూపాయల వరకు మాత్రమే రైతులు పొందారని అనేక రాష్ట్రాల వార్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల టన్నులను విధిగా దిగుమతి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వర్తమాన తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ సమయంలో కోళ్ల దాణా తయారీదారులు తక్కువ ధరలకు పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో గుడ్లు, కోడి మాంస వినియోగం కూడా తగ్గిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్‌ పాడి పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. వివాహాల సమయంలో ఐస్‌ క్రీమ్‌ పెద్ద ఎత్తున వినియోగించే విషయం తెలిసిందే. వివాహాలకు అతిధులపై తీవ్ర ఆంక్షలున్న కారణంగా ఈ ఏడాది అసలు అడిగిన వారే లేరు. ఇతర ఉత్పత్తులకు సైతం డిమాండ్‌, ధర కూడా గణనీయంగా పడిపోయింది.


మొక్క జొన్న విషయానికి వస్తే ఆసియా ఖండంలో అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు డిమాండ్‌ తగ్గి 2019లో మార్కెట్‌ పెరిగింది. చైనా 274 మిలియన్‌ టన్నులతో అగ్రస్ధానంలో ఉండగా ఇండోనేషియా 33, భారత్‌ 28 మిలియన్‌ టన్నులతో వినియోగంలో రెండు మూడు స్ధానాల్లో ఉన్నాయి. అందువలన చైనా వినియోగం, సాగులో, కొనుగోలు విధానాల్లో వచ్చే మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తలసరి వినియోగంలో దక్షిణ కొరియా 223 కిలోలతో ప్రధమ స్ధానంలో ఉండగా చైనా 188, వియత్నాం 159 కిలోలతో తరువాతి స్ధానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి విషయంలో 2019లో ఆసియాలో గరిష్ట స్ధాయిలో 379 మి.టన్నులు ఉత్పత్తి కాగా ఒక్క చైనా వాటాయే 270 మి.ట, ఇండోనేషియా 33, భారత్‌ 29 మి.టన్నులు ఉంది.మన దేశంలో వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొంత ఎగుమతి చేస్తున్నాము. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల కారణంగా దిగుమతులు కూడా చేసుకోవాల్సి వస్తోంది.చైనా వినియోగం ఎక్కువ, దానికి తోడు ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనలకు అనుగుణ్యంగా దిగుమతి చేసుకుంటున్నది. వర్తమాన సంవత్సరంలో చైనాలో 260-265 మి.ట, భారత్‌లో 28 మి.ట దిగుబడి ఉండవచ్చని అంచనా.


దిగుబడుల విషయానికి వస్తే ప్రపంచంలో చిలీలో సగటున హెక్టారుకు 13 టన్నులు ఉండగా అమెరికా, మరికొన్ని చోట్ల 11, ఐరోపా యూనియన్‌ దేశాల సగటు 8, చైనాలో ఆరు కాగా మన దేశంలో మూడు టన్నులు మాత్రమే వస్తున్నది.2019లో ఆసియా దేశాల సగటు దిగుబడి 5.5 టన్నులు. దిగుమతి చేసుకొనే దేశాలలో 2019లో జపాన్‌ 18, దక్షిణ కొరియా 11, వియత్నాం 11, ఇరాన్‌ 10, మలేసియా 4, చైనా 3.9 మిలియన్‌ టన్నుల చొప్పున దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది చైనా 7మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోవచ్చని భావిస్తున్నారు. రికార్డు స్ధాయిలో ఈ ఏడాది కూడా పంట ఉంటుందని, ధరలు కూడా తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది వివిధ దేశాలు దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల టన్ను వెల చైనా 222 డాలర్లు, మలేసియా 213, ఇరాన్‌ 182, వియత్నాం 177డాలర్లు చెల్లించాయన్నది సమాచారం. 2020 జూలై 20వ తేదీ కరెన్సీ మారకపు విలువ ప్రకారం మన కనీస మద్దతు ధర రూ.1,850 అంటే డాలర్లలో 24.74 అదే టన్ను ధర 247.4 డాలర్లు. మన దేశం దిగుమతి చేసుకొనే వాటి ధర పైన పేర్కొన్న కనిష్ట-గరిష్ట ధరల మధ్య ఉంటుందని అనుకుంటే అది మన రైతాంగాన్ని దెబ్బతీయటం ఖాయం. దిగుమతుల సాకుతో స్ధానిక వ్యాపారులు కారుచౌకగా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని గడచిన తరుణంలోనే వెల్లడైంది. ఈ నేపధ్యంలో రైతులకు రక్షణ ఏమిటన్నది సమస్య. ఎన్ని రైతు బంధులు, రైతు భరోసాలు ఇచ్చినా ధరలు పడిపోతే వచ్చే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.
గత కొద్ది సంవత్సరాలుగా చైనా మొక్క జొన్న నిల్వలను తగ్గించింది. ఈ కారణంగా 2028 వరకు అవసరాలకు అనుగుణ్యంగా దిగుమతులను పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే పన్ను తక్కువగా ఉండే విధంగా కోటా దిగుమతులను పెంచాలని అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి కోటాను మార్చేది లేదని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చైనా స్పష్టం చేసింది. 2016లో చైనాలో నిల్వలు 260 మిలియన్‌ టన్నులు ఉన్నాయి.2018 నాటికి అవి 80 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. ఆ ఏడాది 3.52 మి.టన్నులు దిగుమతి చేసుకోగా 2020లో 4మి.టకు పెరగవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటా కింద 7.2మి.టన్నులను ఒక శాతం పన్నుతో దిగుమతి చేసుకోనుంది. అదే ఇతరంగా చేసుకొనే దిగుమతులపై 65శాతం పన్ను విధిస్తున్నది. తాము 7.2మి.ట దిగుమతి చేసుకున్నప్పటికీ స్ధానిక రైతాంగం మీద ఎలాంటి ప్రభావం చూపదని, మొత్తం వినియోగంలో రెండుశాతం కంటే ఎక్కువ కాదని అధికారులు చెప్పారు.


గత నాలుగు సంవత్సరాలుగా చైనాలో మొక్కజొన్న ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మూడు నెలల వ్యవధి ఉండే దలియన్‌ వస్తు మార్కెట్‌లో ముందస్తు ధర టన్ను 289 డాలర్లు పలికింది. మన కంటే రెండు రెట్లు అధికదిగుబడి పొందటంతో పాటు మన రైతాంగం గత ఏడాది పొందిన 132డాలర్లతో పోల్చితే ధర కూడా రైతాంగానికి ఎక్కువే గిడుతున్నట్లు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.
మన రైతాంగానికి ధరల రక్షణతో పాటు దిగుబడుల పెంపుదల కూడా ఒక ముఖ్యమైన అంశమే అన్నది స్పష్టం. చైనాలో 120 మిలియన్‌ హెక్టార్ల భూమి సాగులో ఉండగా దానిలో ఉత్పత్తి అవుతున్న పంటల విలువ 1,367 బిలియన్‌ డాలర్లని, మన దేశంలో 156 మిలియన్‌ హెక్టార్లలో ఉత్పత్తి విలువు కేవలం 407 బిలియన్‌ డాలర్లే అని నిపుణులు అంచనా వేశారు. రెండు దేశాల్లో అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ చైనాలో కఠిన మైన నిబంధనలు, బలమైన సంస్కరణలు, ప్రోత్సాహకాలు, పరిశోధనా-అభివృద్దికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వలన చైనా ముందుడుగు వేసేందుకు దోహదం చేశాయి. అశోక్‌ గులాటీ, ప్రెరన్నా టెరవే రూపొందిచిన ఒక నివేదిక ప్రకారం ఒక రూపాయి పరిశోధన-అభివృద్ధికి ఖర్చు చేస్తే జిడిపి రూ.11.20 పెరిగిందని పేర్కొన్నారు. 2018-19లో చైనా వ్యవసాయ పరిశోధనకు 780 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే భారత్‌లో 140 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు.


ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ -ఉత్పత్తిదారులకు మద్దతు అంచనా)ను ధరల్లో చూస్తే సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకుంటే 2018-19లో చైనా రైతుల మొత్తం ఉత్పాదక విలువలో 15.3శాతం పొందగా అదే భారత్‌లో 5.7శాతమే అని చైనా వ్యవసాయ సంస్కరణల వలన అక్కడి రైతాంగం గణనీయంగా లబ్ది పొందినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. ఫలాన పంట వేస్తేనే అందచేస్తామనే మాదిరి షరతులేమీ లేకుండా రైతులు ఏ పంట వేస్తే దానికి నేరుగా నగదు చెల్లింపు విధానాన్ని అమలు జరిపింది. 2018-19లో చైనా 2007 కోట్ల డాలర్లు అందచేయగా భారత్‌లో పిఎం కిసాన్‌ పధకంలో 300 కోట్ల డాలర్లు అందచేశారు. ఇవిగాక రెండు దేశాల్లోనూ ఇతర సబ్సిడీలు ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్‌ పధకాలకు పెద్ద మొత్తంలో చైనా ఖర్చు చేస్తూ 2030 నాటికి 75శాతం భూములకు నీరందించే లక్ష్యంతో పధకాలను అమలు జరుపుతున్నారు. నీటి వాడకం విషయంలో మన కంటే కఠినమైన నిబంధనలను అమలు జరుపుతున్నారు, చార్జీలను వసూలు చేస్తున్నారు.


చైనాలో ప్రస్తుతం మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. అక్కడ పట్టణాల్లో కూడా పరిమితంగా అయినా సాగు చేస్తున్నారు.బీజింగ్‌ మున్సిపాలిటీలో అలాంటి సాగుదార్లను నమోదు చేసి మొక్కల ఆసుపత్రుల ద్వారా చీడపీడల నివారణ సబ్సిడీ పధకాన్ని అమలు జరుపుతున్నారు. రసాయనాల వాడకం, పరిమాణం తగ్గింపు, సహజ పద్దతుల్లో కీటక నివారణ లక్ష్యాలుగా ఇది సాగుతోంది. దీన్ని హరిత తెగుళ్ల నివారణ సబ్సిడీ పధకంగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా మొక్కల ఆసుపత్రులను (మన కళ్లు, కిడ్నీ, ఎముకలు, గుండె, గొంతు,ముక్కు ప్రత్యేక వైద్యశాలల మాదిరి) ఏర్పాటు చేశారు. ఆసుపత్రులను వ్యవసాయ మందుల సరఫరాదారులు, దుకాణదారులతో అనుసంధానించారు.నమోదు చేయించుకున్న రైతులు తమ పంటలకు వచ్చిన తెగుళ్ల గురించి మొక్కల ఆసుపత్రులలో వైద్యులకు వివరిస్తారు. వైద్యులు వాటి నివారణకు అవసరమైన రసాయన లేదా సహజ నివారణ పద్దతుల గురించి సిఫార్సు చేస్తారు. ఇంటర్నెట్‌ ద్వారా ఆయా ప్రాంతాల దుకాణదారులకు వాటిని వెంటనే పంపుతారు. రైతులు అక్కడకు వెళ్లి తమ గుర్తింపును చూపి వైద్యులు సూచించిన వాటిని సస్య రక్షణకు వినియోగిస్తారు. రైతులకు అందచేసిన వాటి వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని ఆయాశాఖలు విడుదల చేస్తాయి. రసాయనేతర సస్య రక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుతుండగా రసాయన ఉత్పత్తుల వినియోగం తగ్గుతున్నట్లు 2015-18 మధ్యకాలంలో వైద్యుల సిఫార్సులను పరిశీలించగా తేలింది. దీని వలన సబ్సిడీ మొత్తాలు కూడా తగ్గుతున్నట్లు గమనించారు. ఫలితాలను మరింతగా మదింపు వేసి విజయవంతమైనట్లు భావిస్తే ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కాఠిన్యం -కర్షకులకు కష్టకాలం, అనిశ్చితి !

06 Monday Jul 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Agriculture, Corona Virus impact on farmers, Fuel Price in India, Pandemic Corona Virus, WTO


ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విజృంభణ తగ్గలేదు.రానున్న రోజుల్లో ఏ రంగంపై ఎలాంటి దుష్ట ప్రభావం చూపనుందో అంతుచిక్కటం లేదు. రానున్నది రాకమానదు-కానున్నది కాకమానదు-కాడి పట్టుకోక తప్పదు అన్నట్లుగా రైతాంగ ఏరువాక ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలలో ఖరీఫ్‌ సాగు ముమ్మరంగా సాగుతున్నట్లు వార్తలు. ఇప్పటి వరకు వర్షాలు సకాలంలో, తగిన మోతాదులో పడిన కారణంగా కొన్ని చోట్ల విత్తనాల కొరత ఏర్పడిందని జార్ఖండ్‌, బీహార్‌ వంటి చోట్ల 15 నుంచి 25శాతం మేరకు విత్తన ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఎక్కడైనా పెద్ద రైతులు ముందే కొనుగోలు చేస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది, భారమూ ఉండదు, అప్పటి కప్పుడు కొనుగోలు చేసే చిన్న రైతుల మీద ఇది అదనపు ఖర్చు. కరోనా కారణంగా వలస కార్మికులు తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన కారణంగా పంజాబ్‌, హర్యానా వంటి ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడితే, మరికొన్ని చోట్ల మిగులుగా మారారు. దీనివలన కొన్ని చోట్ల వేతనాలు పెరిగితే, మరికొన్ని చోట్ల పడిపోయే పరిస్ధితి. ప్రపంచీకరణ యుగం కనుక రైతాంగాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలను చూద్దాం.
నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే సంగతి నోరు లేని గోమాత కెరుక. చమురు పన్ను, ధరల పెంపుదల ద్వారా వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని మాత్రం గణనీయంగా పెంచుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు డీజిల్‌ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. గతంలో డీజిల్‌ మీద ఉన్న సబ్సిడీలను తొలగించారు, కొంతకాలం డీజిల్‌ మీద పన్ను తక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా దాదాపు సమం చేసి పెట్రోలు కంటే డీజిల్‌ రేటు ఎక్కువ ఉండేట్లు చేశారు. ఎందుకంటే ఎక్కువగా అమ్ముడు పోతున్నది డీజిలు కనుక కంపెనీలకు బాగా లాభాలు రావాలంటే డీజిల్‌ ధరలు పెంచాలి మరి. దీని ధర పెరిగితే వ్యవసాయం, పంటల రవాణా, పురుగుమందులు, ఎరువులు ఇలా అన్ని రకాల వ్యవసాయ పెట్టుబడుల ధరలూ గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు పంట వేసేందుకు ఎకరం పొలాన్ని సిద్దం చేయాలంటే ఇంతకు ముందు అవుతున్న రెండున్నర వేల రూపాయల ఖర్చు కాస్తా మూడున్నరవేలు అవుతుందని ఒక అంచనా. చేపలు పట్టేందుకు డీజిల్‌ సబ్సిడీ ఇస్తున్నట్లుగానే రైతాంగానికి కూడా సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవటం లేదు. దేశంలోని డీజిల్‌ వినియోగంలో 2013లోనే ట్రాక్టర్లు, నాటు, కోత యంత్రాల వంటి వాటికి 10.8శాతం అయితే పంపుసెట్లకు 3.3శాతంగా అంచనా మొత్తంగా చూసినపుడు 14.1శాతం ఉంది. ఇప్పుడు యాంత్రీకరణ ఇంకా పెరిగినందున వినియోగ వాటా గణనీయంగా పెరుగుతుంది. రవాణా రంగం, అది ప్రయివేటు అయినా, ప్రభుత్వరంగమైనా చమురు ధరలను వినియోగదారుల మీద వెంటనే మోపుతాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచి, అమలు జరిపితే తప్ప రైతాంగానికి అలాంటి అవకాశం లేదు.
లాక్‌డౌన్‌ సమయంలో మొత్తంగా మూతపడటంతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. తమ ఉత్పత్తులను ముఖ్యంగా నిలవ ఉంచటానికి అవకాశం లేని కూరగాయలు, పండ్లు, పూల వంటి వాటిని రవాణా చేయటానికి, విక్రయించటానికి కూడా అవకాశం లేకపోయింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వమూ చెల్లించలేదు. కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన పరిస్ధితిని అధిగమించేందుకు ప్రకటించిన ఉద్దీపన పధకం 21లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌలిస సదుపాయాల నిధిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ఆహార తయారీ సంస్ధలకు పెట్టుబడి అని ఒక ముక్తాయింపు. వ్యాపారుల ఉల్లి, బంగాళా దుంపలు, ధాన్య నిల్వలపై ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులుగా ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. దీని వలన వ్యాపారులంతా వాటిని ఎగబడి కొంటారు, రైతులకు ధరలు పెరుగుతాయి అని మనల్ని నమ్మమంటారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ సంస్ధల పట్టును మరింత పెంచేందుకు తోడ్పడే చర్య ఇది.
ప్రభుత్వం ఒక వైపు చైనాతో పోల్చుతూ ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ పత్రాలలో పుంఖాను పుంఖాలుగా రాస్తుంది. కానీ అదే ఎవరైనా చైనాతో పోల్చితే చూడండి అని చైనా మద్దతుదారులు అంటూ సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు దాడి చేస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఒక కారణం పెట్టుబడులు తగ్గిపోవటం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌లో 18శాతం వ్యవసాయ రంగానికి వస్తే ఇప్పుడు ఎనిమిదిశాతానికి పడిపోయింది. అది కూడా అనుత్పాదక సబ్సిడీల రూపంలో ఎక్కువ భాగం ఉంటున్నందున పెద్ద రైతులకే ఎక్కువ లబ్ది కలుగుతున్నదని ఆ రంగ నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే 2019-20లో చైనాను ఉదహరిస్తూ కార్మికులు ఎక్కువగా పని చేసే వస్తు ఎగుమతుల కారణంగా కేవలం ప్రాధమిక విద్య మాత్రమే ఉన్న వారికి 2001-06 మధ్య 70లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని, మన దేశంలో ఎగుమతుల కారణంగా 1999-2011 మధ్య కేవలం పది లక్షల లోపే అసంఘటిత రంగ ఉద్యోగాలు పెరిగాయని, మనం కూడా చైనా మాదిరి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పని తీరులో అలాంటి చిత్తశుద్ది ఎక్కడా కనపడదు. మేకిన్‌ ఇండియా పిలుపు ద్వారా ఎన్ని కొత్త ఉద్యోగాలు ఆరేండ్లు గడిచినా చెప్పటం లేదు. మన దేశంలో ఒక కమతం సగటు విస్తీర్ణం 1.4హెక్టార్లు కాగా చైనాలో 0.6 మాత్రమే. అయినా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. వ్యవసాయరంగంలో కేంద్ర పెట్టుబడులే కాదు, దిగుబడులు, నాణ్యత పెంచేందుకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, వ్యవసాయ విస్తరణను గాలికి వదలివేశారు. అన్ని పంటల ఉత్పాదకత, దిగుబడులు చైనాలో గణనీయంగా పెరిగేందుకు తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ మార్కెట్లో వచ్చే ఎగుడుదిగుడులు అక్కడి రైతాంగాన్ని పెద్దగా ప్రభావితం చేయటం లేదు. రైతాంగానికి ప్రభుత్వం అందచేసే రాయితీలు కూడా మన కంటే ఎంతో ఎక్కువ.
2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఎన్‌డిఏ ప్రభుత్వం చెప్పింది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర భారత పధకాన్ని అమలు జరపనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలంటే 2022 నాటికి 30 బిలియన్‌ డాలర్లుగా వున్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 60బిలియన్‌ డాలర్లకు పెంచాలని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం మన దేశం వాణిజ్యంలో చైనాతో బాగాలోటులో ఉంది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మిగుల్లో ఉంది. వాటి దిగుమతులను ఇంకా పెంచుకోవాలని వత్తిడి చేస్తోంది, కొంత మేరకు చేసుకుంటామని చైనా కూడా చెప్పింది. 2018-19లో మన దేశం చైనాకు 190 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు చేస్తే మన దేశం 28.2 కోట్ల మేరకే చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ముడిపత్తి, రొయ్యల వంటి ఎగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 117 శాతం ఎక్కువ. అయితే తాజాగా లడఖ్‌ సరిహద్దు వివాదం కారణంగా మన దేశం చైనా వస్తువుల దిగుమతులపై నిషేధాలను విధిస్తామని ప్రకటించింది. అదే జరిగితే మొక్కజొన్న, చింతపండు, కాఫీ, పొగాకు, జీడిపప్పు, నూకల బియ్యం వంటి మన వ్యవసాయ దిగుమతులను చైనా కూడా ఏదో ఒక పేరుతో నిలిపివేయటం లేదా నామమాత్రం చేయటం ఖాయం. యుపిఏ ప్రభుత్వ చివరి ఏడాది మన దేశం గరిష్టంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత ఆరు సంవత్సరాలుగా మధ్యలో కొంత మేరకు తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే అంతకు తగ్గలేదు, అయితే దిగుమతులు గణనీయంగా తగ్గిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఇప్పుడు మిగుల్లోనే ఉన్నాము. ఆర్ధిక సర్వే ప్రకారం 2018-19లో మన వ్యవసాయ ఎగుమతులు 2.7లక్షల కోట్ల రూపాయల మేర ఉంటే దిగుమతులు 1.37లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అయితే ధనిక దేశాలు సబ్సిడీలు ఇచ్చినా, చైనా వంటివి మన దిగుమతులను నిలిపివేసినా ఈ మిగులు హరించిపోతుంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ దేశాలు తమ రైతాంగానికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. కానీ ఆ దేశాలు మాత్రం మన వంటి దేశాలు ఇచ్చే సబ్సిడీల మీద ధ్వజమెత్తుతాయి. ఉదాహరణకు అంబర్‌ బాక్స్‌ వర్గీకరణ కిందకు వచ్చే, ఇతరంగా మొత్తం సబ్సిడీల గురించి మన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డబ్ల్యుటిఓ స్టడీస్‌ అనే సంస్ధ ఒక పత్రాన్ని ప్రచురించింది. దానిలో దిగువ వివరాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు సగటున ఆ ఏడాదిలో సబ్సిడీ మొత్తాన్ని డాలర్లుగా పరిగణించాలి. ఉపాధి పొందుతున్నవారిని మిలియన్లలో సూచించారు.
దేశం == సంవత్సరం ==ఉపాధి పొం సంఖ్య == అంబర్‌బాక్సు == స్ధానిక మద్దతు
ఆస్ట్రేలియా == 2017-18 ==== 0.3 ==== 222 ==== 5357
కెనడా == == 2016 ==== 0.3 ==== 7414 ==== 13010
ఇయు ==== 2016 ==== 9.8 ==== 1068 ==== 8589
జపాన్‌ ==== 2016 ==== 2.3 ==== 3492 ==== 11437
నార్వే ==== 2018 ==== 0.1 ==== 22509 ==== 53697
రష్యా ==== 2017 ==== 4.2 ==== 855 ==== 1378
స్విడ్జర్లాండ్‌==== 2018 ==== 0.1 ==== 9716 ==== 57820
అమెరికా ==== 2016 ==== 2.2 ==== 7253 ==== 61286
బంగ్లాదేశ్‌ ==== 2006 ==== 24.6 ==== 8 ==== 11
బ్రెజిల్‌ ==== 2018 ==== 8.6 ==== 134 ==== 332
చైనా ==== 2016 ==== 212.9 ==== 109 ==== 1065
ఈజిప్టు ==== 2016 ==== 6.7 ==== 0 ==== 9
భారత్‌ ==== 2018-19 ==== 200 ==== 49 ==== 282
ఇండోనేషియా ==== 2018 ==== 37.6 ==== 7 ==== 139
ఫిలిప్పీన్స్‌ ==== 2018 ==== 10.4 ==== 0 ==== 125
ద.కొరియా ==== 2015 ==== 1.4 ==== 547 ==== 5369
థాయలాండ్‌ ==== 2016 ==== 12 ==== 11 ==== 367
ప్రపంచంలోని భారత్‌, చైనాలతో సహా 54 ప్రధాన దేశాలు వ్యవసాయంలో వచ్చే మొత్తం ఆదాయంలో పన్నెండుశాతానికి సమానమైన 700 బిలియన్‌ డాలర్లను ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నట్లు ఓయిసిడి తాజా నివేదిక ఒకటి పేర్కొన్నది. వర్ధమాన దేశాల కంటే ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల రెట్టింపు ఉంటున్నాయి. వర్దమాన దేశాలు 8.5శాతం ఇస్తుంటే ఓయిసిడి దేశాలు 17.6శాతం ఇస్తున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా 40శాతం ఇస్తుండగా, చైనా, ఇండోనేషియా, ఐరోపా యూనియన్‌ ఇస్తున్న సబ్సిడీలు 54దేశాల సగటు 12 నుంచి 30శాతం వరకు ఇస్తున్నాయి.అమెరికాలో ఈ ఏడాది సబ్సిడీలు 33 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని, అవి వ్యవసాయ ఆదాయంలో నేరుగా రైతులకు అందచేసే మొత్తం 36శాతమని కొన్ని వార్తలు సూచించాయి. మన ప్రభుత్వం చైనా స్దాయిలో అయినా రైతాంగానికి రాయితీలు ఇస్తుందా ? నల్లధనం వెలికితీత, దేశమంతటా గుజరాత్‌ నమూనా అమలు, అచ్చేదిన్‌ వంటి అనేక వాగ్దానాలకు ఏ గతి పట్టించారో ఇప్పుడు రైతుల ఆదాయాల రెట్టింపు వాగ్దానానికి కూడా అదే గతి పట్టిస్తున్నారు.
ప్రపంచంలో ధనిక దేశాలు రైతాంగానికి ఎలా సబ్సిడీలు ఇస్తున్నాయో ముందు చూశాము. వాటిని నియంత్రించాల్సిన ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను పని చేయనివ్వకుండా అమెరికా ఆటంకాలు కల్పిస్తున్నది. దానిని నిరసగా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ అజెవీడో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 2013లో ఈ బాధ్యతలను చేపట్టిన బ్రెజిలియన్‌ దౌత్యవేత్త అమెరికా, మరికొన్ని దేశాల వైఖరితో విసిగి పోయారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్దను ఖాతరు చేయకుండా సభ్యదేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకోవటం ఒకటైతే వివాదాల పరిష్కారానికి అమెరికా మోకాలడ్డుతుండటం సంస్ధ పని తీరు, విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. డబ్ల్యుటిఓ సమగ్రమైనది కాకపోవచ్చు గానీ అందరికీ అవసరమైనదే, ప్రపంచమంతటా ఆటవిక న్యాయం అమలుజరుగుతున్న తరుణంలో కనీసం వాణిజ్యానికి ఇది అవసరం అని అజెవీడో రాజీనామా ప్రకటన సమయంలో వ్యాఖ్యానించాడు.
2015లో దోహాదఫా చర్చలను అర్ధంతరంగా వదలి వేసిన తరువాత 164 సభ్యదేశాలు గల ఈ సంస్ధ ఒక పెద్ద అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా కుదర్చలేకపోయింది. అమెరికా-చైనా మధ్య 2018లో ప్రారంభమైన దెబ్బకు దెబ్బ వాణిజ్యపోరు మూడో ఏడాదిలో ప్రవేశించింది. దీనికి కరోనా మహమ్మారి సంక్షోభం తోడైంది. తమ పెత్తనం, తన సరకులను ఇతర దేశాల మీద రుద్దాలనే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్దను ముందుకు తెచ్చింది అమెరికా. అయితే అనుకున్నదొకటీ అయింది ఒకటీ కావటంతో చివరకు ఆ సంస్దనే పని చేయకుండా అడ్డుకోవటం ప్రారంభించింది. సంస్ధలో సభ్య దేశాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినపుడు ఫిర్యాదులను పరిష్కరించటం ఒక ప్రధాన విధి. అందుకుగాను ఏడుగురు సభ్యులతో ఒక ట్రిబ్యునల్‌ ఉంది. దానిలో న్యాయమూర్తుల నియామకం ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. వారి పదవీ కాలం ముగియగానే కొత్తవారిని నియమించాల్సి ఉండగా కుంటి సాకులతో అమెరికా అంగీకరించటం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ వలన చైనాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది కనుక నిబంధనలను మార్చాలని అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు ఒక పల్లవి అందుకున్నాయి. చైనాను తమతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలన్నది వాటి డిమాండ్‌. మన దేశం కూడా వరి, గోధుమల వంటి వాటికి కనీస మద్దతు ధరలను అనుచితంగా పెంచుతున్నదని, పత్తికి కనీస మద్దతు ధర పేరుతో రాయితీలు ఇస్తున్నదని అమెరికా, మరికొన్ని దేశాలు ఫిర్యాదు చేశాయి. అన్నింటికీ మించి వివాదాలు దీర్ఘకాలం కొనసాగటం ఒకటైతే అనేక కేసులలో తీర్పులు తమకు వ్యతిరేకంగా రావటాన్ని అవి సహించలేకపోతున్నాయి. తీర్పులన్నీ నిబంధనలు ఏవి ఉంటే వాటికి అనుగుణ్యంగానే వస్తాయి తప్ప అడ్డగోలుగా ఇవ్వలేరు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చైనా వర్దమాన దేశ తరగతిలోకే వస్తుంది. అందువలన సబ్సిడీలు, ఇతర అంశాలలో దానికి వెసులు బాటు ఉంది. అది ధనిక దేశాల లాభాలకు గండికొడుతోంది. చైనాను ధనిక దేశంగా తీర్పు చెప్పాలన్నది అమెరికా డిమాండ్‌. అమెరికాకే అగ్రస్ధానం అనే నినాదంతో అధికారానికి వచ్చిన ట్రంప్‌ సర్కార్‌ మరింత అడ్డంగా వ్యవహరించింది. ఏడుగురికి గాను కనీసం ముగ్గురు ఉంటే కేసులను విచారించవచ్చు. ఇటీవలి వరకు అదే జరిగింది. ఆరునెలల క్రితం ముగ్గురిలో ఇద్దరి పదవీ కాలం ముగియటంతో వారు తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసులు దాఖలైనా విచారించే వారు లేరు. ప్రపంచ వాణిజ్య సంస్దలో సంస్కరణలు తేవాలి గానీ అవి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉండకూడదని, అంటే తాము చేసిన దాన్ని ప్రశ్నించే అధికారం ఆ సంస్ధకు ఉండకూడదని అమెరికా పరోక్షంగా చెబుతోంది. ఈ నేపధ్యంలో న్యాయమూర్తుల నియామకం జరగదు, సంస్కరణలకు అవకాశం లేదు. అమెరికా అడ్డగోలు కోరికలు, ఆకాంక్షలను మిగిలిన దేశాలు అంగీకరించే ప్రసక్తే లేదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అమెరికా చూస్తుంటే, స్వేచ్చా వాణిజ్య సూత్రాలను పరిరక్షించాలని చైనా వాదిస్తోంది. ఈ సంస్దలో చేరిన 164 దేశాలు ఏడాదికి తమ జిడిపిని 855 బిలియన్‌ డాలర్లు పెంచుకున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. వీటిలో అమెరికా 87, చైనా 86, జర్మనీ 66 బిలియన్‌ డాలర్ల చొప్పున లబ్ది పొందాయని తేలింది. అగ్రరాజ్యాలకే అధిక ఫలం అన్నది స్పష్టం. అయితే ఈ సంస్ద నిబంధనలలో పెద్ద మార్పులు లేకపోయినా అనేక అంశాలలో మార్పులకు ఒక్కో దఫా చర్చలు దోహదం చేస్తున్నాయి. వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను మరింతగా తొలగించేందుకు, సబ్సిడీల తగ్గింపు తదితర అంశాలపై 2001లో దోహాలో మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ముగియలేదు, 2015లో విసుగుపుట్టి వదలివేశారు. అమెరికా-ఐరోపా యూనియన్‌ ధనిక దేశాల మధ్య తలెత్తిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సబ్సిడీ ఒక పెద్ద పీఠముడి. జరుగుతున్న పరిణామాలను చూస్తే న్యాయమూర్తుల నియామకాన్ని ఇలాగే అడ్డుకుంటే చివరకు ప్రపంచ వాణిజ్య సంస్ధ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.
వ్యవసాయ దిగుమతులపై పన్నుల గురించి అమెరికాాఐరోపా యూనియన్‌ తమకు అనుకూలమైన పద్దతుల్లో ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ధనిక దేశాలు వ్యవసాయ సబ్సిడీలను గణనీయంగా తగ్గించకుండా ప్రయోజనం లేదని, వాటి సంగతి తేల్చాలని చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలు పట్టుబట్టటంతో 2005 నుంచి ప్రతిష్ఠంభన ఏర్పడింది. అంతకు ముందు ఉరుగ్వే దఫా చర్చలలో కొన్ని దేశాలు తమలో తాము ఒక ఒప్పందం చేసుకొని ఇతర దేశాలను క్రమంగా వాటిలో చేర్చుకున్నాయి. అయితే దోహా చర్చలలో వర్ధమాన దేశాలు మొత్తంగా ఒప్పందం జరగాలి తప్ప ప్రయివేటు వ్యవహారాలు కుదరవని తేల్చి చెప్పాయి. ఉరుగ్వే దఫా చర్చల నాటికి చైనా ప్రపంచ వాణిజ్యంలో భాగస్వామి కాదు, దోహా చర్చల సమయంలోనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరింది. చర్చల సమయంలోనే చైనా అమెరికా తరువాత రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వృద్ధి చెందింది. దీంతో వర్దమాన దేశాల పట్టు పెరిగింది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకుంటున్నది. మనకు మిత్ర దేశం,సహ భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి చెబుతున్న అమెరికాతో లడాయిలో మన దేశం చైనాతో కలసి వ్యవహరిస్తోంది. ఇప్పుడు లడఖ్‌ లడాయితో చైనా మీది కోపంతో అమెరికా పంచన చేరుతుందా ? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువులు, ఇతర రాయితీలను పెంచకుండా పరిమితం చేసి ధనిక దేశాలను సంతృప్తి పరుస్తోంది. ఇప్పుడు మరింతగా వాటికి లొంగిపోనుందా ?
ప్రపంచమంతటా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆహార ధాన్య నిల్వల గురించి ఎలాంటి ఆందోళన లేదు. అనేక చోట్ల పంటలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ఆహార జాతీయవాదం ప్రబలి కొన్ని దేశాలలో ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షల వంటి రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా,బ్రెజిల్‌, ఐరోపా దేశాలలో కరోనా కారణంగా మాంస పరిశ్రమలు మూతపడ్డాయి. మన దేశం మాదిరే అనేక చోట్ల వలస కార్మికుల సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన పరిస్ధితి లేదు గానీ కరోనా మరింత ముదిరితే ఆహార ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండగా చైనాలో కట్టడి చేసి సాధారణ ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా డోనాల్డ్‌ ట్రంప్‌ తన విజయావకాశాల కోసం పిచ్చి పనులకు పూనుకుంటే రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యం యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ : ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు !

21 Sunday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Boycott china goods, Ladakh border clash, Narendra Modi, swadeshi jagran manch


ఎం కోటేశ్వరరావు
మన ప్రధాని నరేంద్రమోడీ గారేమో చైనా మన భూభాగాన్ని అక్రమించలేదు, పోస్టులను స్వాధీనం చేసుకోలేదు అని అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా చెబుతారు. మరోవైపు ఆయన తెగకు చెందిన వారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు, దానిలో భాగంగానే చైనా వస్తు బహిష్కరణ పిలుపులతో కాషాయ దళాలు ఒక నాటకాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య జరిగిన విచారకర ఘర్షణలో మన వారు 20 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. చైనా తమ వారు ఎందరు మరణించిందీ చెప్పకపోయినా మన బిజెపి నేత, మాజీ సైనిక అధికారి 45 మంది చైనీయులను మన వారు చంపినట్లు చెబుతున్నారు. దాన్ని నమ్ముతున్న వారే ఎక్కువ మందిని మనమే చంపినా చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.
ఏ దేశంలో అయినా పాలకులే మనోభావాలను రెచ్చగొట్టి ముందుకు తెచ్చినపుడు దానికి మీడియా మసాలా కూడా తోడైతే రెచ్చిపోవటం సహజం. రేటింగ్‌లు పెంచుకొనేందుకు అలా చేస్తాయని మనకు తెలిసిందే. ఉద్రేకాలు బాగా ఉన్నపుడు మంచి చెడ్డల విచక్షణ ఉండదు కనుక అది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడదాం. ఈ పిలుపులు ఇస్తున్న వారు, దానికి అనుగుణ్యంగా వీధుల్లో దృశ్యాలను సృష్టిస్తున్నవారిలో అసలు నిజాయితీ, విశ్వసనీయత ఎంత?
ఢిల్లీ-మీరట్‌ ఆర్‌ఆర్‌టిఎస్‌ ( మెట్రో రైల్‌) పధకంలో కొంత మేరకు భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు షాంఘై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ(ఎస్‌టిఇసి)కి కేంద్ర ప్రభుత్వ టెండర్‌ దక్కింది. దాన్ని రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) ఆందోళనకు దిగింది. ఆ టెండర్‌ను పిలిచేటపుడు, అర్హతలను కోరినపుడు, తెరిచినపుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు వీరంగానికి దిగటం ఏమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబ సభ్యుడైన నరేంద్రమోడీ మిగతా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోరా ? క్రమశిక్షణకు మారు పేరు, పద్దతిగా ఉంటాం అని చెప్పుకొనే వారు అంతా అయిపోయాక ఆందోళనకు దిగటం ఏమిటి ?
ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు(ఏడిబి) నుంచి అప్పు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ( మా మోడీ ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధల నుంచి అప్పులు తీసుకోవటం నిలిపివేశారు, అప్పులను తగ్గిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారు దీని గురించి తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు) మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నది.నిబంధనలు అవకాశం ఇచ్చిన మేరకు టెండర్లలో మూడు విదేశీ, రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2019 నవంబరులో టెండర్లు పిలిచి ఈ ఏడాది మార్చి 16న తెరిచారు. చైనా కంపెనీ రూ.1,126.9 కోట్లకు చేస్తామని పేర్కొనగా మన ఎల్‌అండ్‌ టి కంపెనీ రూ.1,170 కోట్లతో రెండవదిగా నిలిచింది. ఈ టెండర్‌ను లాంఛనంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోగా సరిహద్దు వివాదం చెలరేగింది. జూన్‌15న గాల్వాన్‌లోయ సరిహద్దు ఘర్షణల తరువాత స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆందోళనకు దిగి ఆ టెండర్‌ను రద్దు చేయమంది. ఇప్పుడు తమ కాషాయ దళాన్ని సంతృప్తి పరచేందుకు కేంద్రం ఈ టెండరును రద్దు చేస్తుందా ? చేస్తే ఎడిబికి ఏ సంజాయిషీ ఇస్తుంది ? అది అంగీకరిస్తుందా ? సరిహద్దువివాదం సద్దు మణిగిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్‌ చైనా కంపెనీకి అప్పగిస్తుందా ?
ప్రభుత్వ రంగ సంస్ధ బిఎన్‌ఎన్‌ఎల్‌ వ్యవస్ధను మెరుగుపరచేందుకు రూ.8,640 కోట్ల టెండర్‌లో చైనా కంపెనీలు పాల్గొనకుండా చూసేందుకు మార్పులు చేస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ప్రకటించింది. దీని వెనుక వేరే శక్తుల హస్తం ఉందా ? ఎందుకంటే ప్రపంచం 5జి ఫోన్లకు మారేందుకు, 6జి ఫోన్ల అభివృద్దికి పరుగులు పెడుతున్నది. ప్రయివేటు జియో, ఎయిర్‌టెల్‌ వంటి వారికి మార్కెట్‌ను అప్పగించేందుకు మన బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌లను ఇంకా 3జిలోనే ఉంచి దెబ్బతీశారు. ఇప్పుడు 4జి కూడా లేకుండా చేసేందుకు చైనా పేరుతో దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.దీంతో ఉన్న కనెక్షన్లు కూడా పోతాయి. ఆర్ధిక, బ్యాంకింగ్‌, రక్షణ, టెలికామ్‌ రంగాలలో పిపిఇ మార్గంలో వచ్చే పెట్టుబడులలో చైనా కంపెనీల నుంచి వచ్చే వాటిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
అలాంటి ఆలోచన గాల్వాన్‌ ఘటనకు ముందే ఎందుకు లేదు ? మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ముద్దు-చైనా పెట్టుబడులు వద్దు అంటున్నారని భావిద్దాం ! చైనాకు పోయే లాభాలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు పోతాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పిచ్చివారిని సంతృప్తి పరచటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? చైనా కంపెనీలు అనేక దేశాలలో స్దాపించిన అనుబంధ లేదా సోదర కంపెనీల ద్వారా పలు దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, వాటిని కూడా అడ్డుకుంటారా ?
మేకిన్‌ ఇండియా అంటూ నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఓట్లేసిన జనం, బిజెపికి మద్దతుదార్లుగా ఉన్న వ్యాపారులు మేడిన్‌ చైనా వస్తుమయంగా దేశ మార్కెట్‌ను మార్చివేశారు. అంటే వారిలో దేశభక్తిని పెంపొందించటంలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందనుకోవాలా ? నరేంద్రమోడీ తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షించే, చాపకింద నీరులా భలే పని చేస్తుంది అని కొందరు అనుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి చేస్తున్నట్లు ? స్వదేశీ అంటూ బయలు దేరిన తమ నేతలు విదేశీగా మారిపోవటాన్ని ఆ సంస్ధ ఎలా అనుమతించింది? అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటుందా ? పరిణామాలను చూస్తుంటే దాని తీరుతెన్నులపై అనుమానాలు కలగటం లేదా ? ఎవరైనా ఎందుకిలా సందేహించాల్సి వస్తోంది?
” 2014వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పుటి వరకు ప్రకటించిన పెట్టుబడులు, వచ్చినవి మొత్తం 2,600 కోట్ల డాలర్లు, మరో 1500 కోట్ల డాలర్లను వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెడతామని చైనా సంస్దలు వాగ్దానం చేశాయి. ఇవిగాక ప్రభుత్వ నివేదికల్లో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల జాబితాలో చేరనివి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు గ్జియోమీ టెలికాం సంస్ధ సింగపూర్‌ అనుబంధ కంపెనీ ద్వారా 50.4 కోట్ల డాలర్ల పెట్టుబడి ఒకటి. పశ్చిమ దేశాల్లో మాదిరి భారత్‌లో చైనా సంస్ధలు తనిఖీని తప్పించుకున్నాయి టెలికాం రంగంలో 5జి ప్రయోగాల్లో అనేక దేశాలల్లో చైనా సంస్ధ హువెయిపై ఆంక్షలు విధించగా భారత్‌లో ఒక నిర్ణయం తీసుకోకపోయినా తొలి ప్రయోగాల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ( మార్చి 31వ తేదీ ది ప్రింట్‌ వ్యాసం).” ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ నష్టపరిహారం ఇచ్చి రద్దు చేస్తారా ? పరిహారం ఎవరు చెల్లిస్తారు ? పరిహారమేమీ లేకుండా నెత్తిన చెంగేసుకొని పొమ్మంటే పోవటానికి చైనా అంత బలహీనంగా ఉందా ? మనం చేసుకున్న ఎగుమతి ఒప్పందాలను చైనా రద్దు చేయకుండా ఉంటుందా ?
చైనాతో లడాయి ఎవరికి లాభం, ఎవరికి నష్టం ? వీధుల్లో చైనా ఉన్మాదంతో వీరంగం వేస్తున్న వారు కమ్యూనిస్టులు చెబుతున్నది ఎలాగూ వినిపించుకోరు. కమ్యూనిస్టేతరులు చెబుతున్నదైనా పట్టించుకుంటారా ? జూన్‌ 20న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరి అతుల్‌ ఠాకూర్‌ ఒక విశ్లేషణ చేశారు. ఆయనేమీ కమ్యూనిస్టు పార్టీ నేత కాదు.చైనాతో విరోధం ఆదేశం కంటే భారత్‌కే ఎక్కువ నష్టం అన్నది దాని సారం. మన దేశం అమెరికాకు ఎంతశాతం వస్తువులను ఎగుమతి చేస్తున్నదో కాస్త అటూ ఇటూగా రెండవ స్ధానంలో చైనాకు ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు చైనాకు పదకొండుశాతం వరకు ఉంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనేది 2.1శాతంతో పన్నెండవ స్దానంలో ఉన్నామని అతుల్‌ చెప్పారు. మన దేశం నుంచి ఏటా చైనాకు ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తుంటే చైనా నుంచి వస్తున్నవారు రెండున్నరలక్షలు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.
చైనా వస్తువులు మన దేశంలో విస్తరించటానికి కచ్చితంగా కమ్యూనిస్టులైతే కారణం కాదు. ఉదాహరణకు ఢిల్లీ సాదర్‌ బజార్‌లో దాదాపు 40వేల మంది రిటైల్‌ వర్తకులు చైనా వస్తువులను అమ్ముతున్నారు. ఆ దుకాణాల్లో ఒక్కటి కూడా సీతారామ్‌ ఏచూరి లేదా ప్రకాష్‌ కారత్‌కు గానీ లేవు. అక్కడ అమ్మేవారు చెప్పేది ఒక్కటే చైనా ధరలకు భారతీయ తయారీ వస్తువులను సరఫరా చేయండి చైనా వస్తువులను నిలిపివేస్తాం అంటే , తాము కూడా కొనటం మానేస్తామని వినియోగదారులు అంటున్నారు.పాలకులు లేదా చైనా వస్తు బహిష్కరణ వాదులు అందుకు సిద్దమేనా ? భారతీయ వస్తువులను తమకు ఇస్తే తమ దగ్గర ఉన్న చైనా వస్తువులను నాశనం చేస్తామని వినియోగదారులు అంటున్నారు, మరి ఆ పని చేస్తారా ? ఎంతసేపూ నిరసనకారులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ధ్వంసం చేయటం చూపుతున్నారు. చైనా ముడి వస్తువులతో మన దేశంలో తయారు చేస్తున్న ఔషధాల మాటేమిటి ? వాటిని కూడా రోడ్ల మీద పోస్తారా ? జబ్బు చేస్తే జనం దిక్కులేని చావు చావాలా ? అంతే కాదు, చైనా రసాయనాలతో ఔషధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి ఆ ఎగుమతులు నిలిచిపోవాలని కాషాయ తాలిబాన్లు కోరుకుంటున్నారా ?
ఈ మధ్య కాషాయ దళాలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలకు కట్టుబడి ఉంది కనుక చైనా వస్తువుల మీద చర్య తీసుకుంటే దాని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అందువలన దాన్ని తప్పించుకోవాలంటే జనమే స్వచ్చందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని చెబుతూ తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. అంతే కాదు, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మీద అమెరికా వాడు అణుబాంబులు వేసినప్పటి నుంచి జపనీయులు అమెరికా వస్తువులు కొనటం లేదని, మనం కూడా ఆపని ఎందుకు చేయకూడదనే ప్రచారం చేస్తున్నారు. ఉద్రేకంలో ఉన్నవారు ఇలాంటి అంశాలను నిర్ధారించుకొనేందుకు ప్రయత్నించరు.2019లో జపాన్‌ 23శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఐరోపా యూనియన్‌ నుంచి 12, అమెరికా నుంచి 11శాతం దిగుమతి చేసుకుంది. అణుబాంబులు వేసిన అమెరికా సైనిక స్ధావరాన్ని జపనీయులు సహించారు, అమెరికా రక్షణలో ఉంటామని ఒప్పందం చేసుకున్నారు. అందువలన తప్పుడు ప్రచారంతో జనాన్ని మభ్యపెట్టలేరు.
మన ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని చైనా వస్తువులు దెబ్బతీస్తున్నాయంటూ బహిష్కరణ పిలుపు ఇచ్చేదీ పాలకపార్టీ వారే. చైనా ప్రాణం మనం దిగుమతులనే చిలకలో ఉందని, వస్తువుల దిగుమతులను ఆపివేస్తే చైనా ప్రాణం పోతుందని చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత ? 2019లో మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 13.7శాతమే. వాటితోనే మన ఆర్ధిక వ్యవస్ధ నాశనం అవుతుందా ? చైనా ఎగుమతుల్లో మన వాటా రెండు-మూడుశాతం మధ్యనే అన్నది తెలుసా ? ఆమేరకు దిగుమతులు ఆపివేస్తేనే చైనా దెబ్బతింటుందా ? మతి ఉండే మాట్లాడుతున్నారా ? అదే నిజమైతే మోడీగారు ఏం చేస్తున్నట్లు ? చైనా వస్తువుల మీద అధికపన్నులు వేసి దిగుమతులను నిరుత్సాహపరిస్తే ప్రధాని మోడీ లేదా ఆయన మంత్రి వర్గ సభ్యులను డబ్ల్యుటిఓ లేదా ప్రపంచ నేర న్యాయస్ధానంలో విచారణ జరిపి శిక్షలు వేస్తారా ? వేస్తే వేయనివ్వండి ఎలాగూ వారి పూర్వీకులకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న లేదా త్యాగాలు చేసిన చరిత్ర ఎలాగూ లేదు. ఇప్పుడు దేశం కోసం పోరాడి శిక్షలకు గురైన వారిగా చెప్పుకోవచ్చు కదా ! అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారికి దేశం, జనం ముఖ్యమా ! మనకు హానికరమైన ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు ముఖ్యమా ?
ప్రపంచ వాణిజ్య సంస్ధ వివాదాల ట్రిబ్యునల్‌ ముందు వేలాది కేసులు దాఖలయ్యాయి. ఏ ఒక్కదానిలో కూడా ఒక్క దేశాన్ని లేదా దేశాధినేతను శిక్షించిన దాఖలా లేదు. కేసులు అలాసాగుతూనే ఉంటాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు పూర్తి కాలేదు, అసలు పూర్తవుతాయో లేదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకొని ధనిక దేశాలు వ్యవసాయరంగంలో దొడ్డిదారిన సబ్సిడీలు ఇస్తూనే ఉన్నాయి.
అంతెందుకు మన మోడీగారి జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇక్కడకు వచ్చి కౌగిలింతలతో ముంచెత్తుతాడు. ఒకే కంచం ఒకే మంచం అంటాడు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన మీద కేసులు వేస్తాడు. ఏమిటా కేసులు ? మన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని 2018లో ప్రపంచ వాణిజ్య సంస్ధకు అమెరికా ఫిర్యాదు చేసింది. అదేమిటటా ! సంస్ధ నిబంధనల ప్రకారం పదిశాతంలోపు సబ్సిడీ మాత్రమే ఇవ్వాల్సిన భారత్‌ తన వరి, గోధుమ రైతాంగానికి కనీస మద్దతు ధరల రూపంలో 60-70శాతం ఎక్కువగా సబ్సిడీ ఇస్తున్నట్లు చిత్రించింది. పత్తి మీద కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసింది. ఎంతైనా ” మిత్ర ” దేశం కదా !
అమెరికాలో ఏటా ప్రతి రైతు సగటున 50వేల డాలర్ల మేర సబ్సిడీ పొందుతుంటే మన దేశంలో 200 డాలర్లు మాత్రమే అని నిపుణులు చెప్పారు. అమెరికాను అడ్డుకోలేని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనం చైనా, లేదా మరొక దేశ వస్తువుల మీద పన్నులు వేస్తే ఎలా అడ్డుకోగలదు ? మరి ఎందుకు చేయటం లేదంటే మన బలహీనత, చేతగాని తనం, దాన్ని దాచుకొనేందుకు కుంటి సాకులు ? అసలు విషయం ఏమంటే మనకు విదేశీ పెట్టుబడులు కావాలి, అవి పెట్టే దేశాల వస్తువుల మీద పన్నులు వేస్తే అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి ? నరేంద్రమోడీ హయాంలో ముందే చెప్పుకున్నట్లు లెక్కల్లో చూపిన మేరకే 160 నుంచి 2600 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెరగటంతో పాటు వస్తువుల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. వస్తువులను నిలిపివేస్తే పెట్టుబడులు నిలిచిపోతాయి.
తాజా వివాదం గురించి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిందేమిటి? చైనా వారు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, మన మిలిటరీ పోస్టులను ఆక్రమించ లేదని చెప్పారు. ఈ ప్రకటన తరువాత అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే వారు, వస్తు బహిష్కరణ పిలుపు ఇచ్చి వీధులకు ఎక్కే వారు తమ నాటకాలను ఆపుతారా ? కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తాయి. మన వారి విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టాము. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇన్ని తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ?
చౌకగా వస్తున్న చైనా వస్తువుల కొనుగోలుతో మన వినియోగదారులు లబ్దిపొందారే తప్ప నష్టపోలేదు. చైనావి లేకపోతే అధిక ధరలకు ఇతర దేశాల వస్తువులను కొని జేబులు గుల్ల చేసుకోవాల్సి వచ్చేది. మిగతా దేశాల ధరలతో పోలిస్తే చైనా టెలికాం పరికరాల ధరలు 20శాతం తక్కువ. ప్రభుత్వ రంగ సంస్ధలైన బిఎస్‌ఎన్‌ఎల్‌ చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు చైనాను రంగం నుంచి తప్పించేందుకు పూనుకుంది అంటే అర్ధం ఏమిటి ?అంత మొత్తం ఎక్కువకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందనే కదా ! ప్రయివేటు కంపెనీలు కూడా అదే పని చేస్తాయా ? ప్రభుత్వం వాటికి అలాంటి షరతు విధించి అమలు జరపగలదా ? కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ మాటల్లో చెప్పాలంటే వినాయక విగ్రహాలను కూడా మనం చౌకగా తయారు చేసుకోలేని దుస్ధితిలో ఉన్నాం. చైనా కమ్యూనిస్టులు తయారు చేసిన విగ్రహాలను మన భక్తులు వినియోగిస్తున్నారు. చైనా వస్తువుల నాణ్యత గురించి గట్టి మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని పాస్వాన్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు అడ్డుకున్నారు? ఇప్పటి వరకు నాశిరకం వస్తువులను అనుమతించి మన జనాన్ని ఎందుకు నష్టపెట్టారు ?
చైనా వస్తువుల మీద లేదా కమ్యూనిస్టు చైనా మీద ఒక సంఘపరివార్‌ కార్యకర్తగా నరేంద్రమోడీకి ప్రేమ, అభిమానం ఉంటాయని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఒక వ్యాపారి మాదిరే ఆలోచిస్తారు, వ్యాపారుల వత్తిడికి లొంగిపోతారు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో లాభపడాలన్నది మన దేశ వాణిజ్య, పారిశ్రామిక సంస్ధల ఆశ, ఎత్తుగడ. ఉదాహరణకు అమెరికా పత్తి దిగుమతుల మీద చైనా 25శాతం పన్ను విధించటంతో అది అమెరికా ఎగుమతిదార్లకు గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో మన పత్తి ఎగుమతిదార్లకు వరమైంది. పర్యవసానంగా మన పత్తికి ఆమేరకు డిమాండ్‌ పెరిగి రైతులు కూడా పరిమితంగా అయినా లాభపడ్డారు. చైనాకు పెద్ద ఎత్తున పత్తి దిగుమతులు పెరిగాయి. అయితే పరిస్ధితులెప్పుడూ ఇలాగే ఉండవు. అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకొనే వైఖరులను బట్టి మిగతాదేశాల వైఖరులు మారుతుంటాయి.
గత ఏడాది చైనా వైఖరి కారణంగా మన దేశం నుంచి చైనాకు నూలు ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఒకటి ప్రపంచ వ్యాపితంగా డిమాండ్‌ పడిపోవటం ఒక కారణం అయితే, రెండవది పాకిస్ధాన్‌, వియత్నాం. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పన్నులు లేని నూలు దిగుమతులను చైనా అనుమతించటంతో మన ఎగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. దాని ప్రభావం మన రైతుల మీద కూడా పడిందా లేదా ! చైనాకు వ్యతిరేకంగా అమెరికాను కౌగిలించుకొని అది చెప్పినట్లు చేయటమే దీనికి కారణం అన్నది లోగుట్టు.మనం డబ్ల్యుటిఓ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం కనుక చైనా వస్తువుల మీద పన్నులు విధించలేమని అంటున్నవారు అమెరికా వస్తువుల మీద ఎలా విధించారు? మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువుల మీద గతంలో ఇచ్చిన పన్నురాయితీలను ”మన అపర స్నేహితుడు ” డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశాడు. మన ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై పదిశాతం పన్నులు పెంచలేదా దానికి ప్రతిగా మన మోడీ 28 అమెరికా ఉత్పత్తుల మీద దిగుమతి పన్ను పెంచలేదా ? కొన్నింటి మీద 120శాతం వేశారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ మనమీదేమీ చర్య తీసుకోలేదే? మన దేశం పన్నులను ఎక్కువగా విధిస్తున్నట్లు ట్రంప్‌ మనలను ఆడిపోసుకోలేదా ? తమ వస్తువులను మరిన్ని దిగుమతి చేసుకోవాలని మన మీద వత్తిడి తేవటం లేదా ? సరే దీని మీద కూడా ఇప్పుడు కేసు వేశారనుకోండి. ప్రతి దేశం వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొంటుంది. ఆ విషయంలో ఎవరైనా ఒకటే. పాకిస్ధాన్‌తో ఉన్న వైరం కారణంగా పంచదార దిగుమతులను అడ్డుకొనేందుకు 2018లో మన దేశం 50శాతంగా ఉన్న దిగుమతి పన్నును వందశాతానికి పెంచింది. ఈనెలలోనే మలేసియా నుంచి కాలిక్యులేటర్ల మీద ఒక్కోదానిపై 92సెంట్ల చొప్పున ఐదేండ్ల పాటు వసూలు చేసే విధంగా మన దేశం పన్ను పెంచింది. ఇదే పని చైనా వస్తువుల మీద ఎందుకు తీసుకోకూడదు ? ఎందుకంటే పాకిస్ధాన్‌, మలేషియాలు చైనా వంటివి కాదు గనుక. ఆడలేక మద్దెల ఓడు లేదా ఈ రోజు మంగళవారం కాబట్టి సరిపోయింది అన్నట్లుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఏ దేశమైనా తన మౌలిక ప్రయోజనాలకు భంగం కలిగినపుడు చర్యలు తీసుకొనేందుకు ఆ సంస్ధ నిబంధనలు అవకాశం కలిగిస్తున్నాయి. లేదూ అవి మనకు నష్టదాయకం అనుకుంటే బయటకు వచ్చేయటమే. ఈ రోజు అమెరికా ప్రయోజనాలకే అగ్రస్ధానం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక అంతర్జాతీయ సంస్ధల నుంచి బయటకు రావటం లేదా ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగటం లేదా ? డోనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్న మాదిరి 56 అంగుళాల ఛాతీ మన నరేంద్రమోడీకి లేదా ? ఆయనకు మన ప్రయోజనాలు పట్టవా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయ్యా నరేంద్రమోడీ గారూ మీ ఏలుబడిలో చమురు ధరలింకా ఏమేరకు పెరుగుతాయో తెలుసుకోవచ్చా ?

15 Monday Jun 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

Fuel Price in India, Fuel tax hike in India, Global Crude oil price of Indian Basket, oil price in India

ఎం కోటేశ్వరరావు
అబ్బో ఆరోజులే వేరు. మన జనం ఎంత త్యాగశీలురు, సహనమూర్తులుగా ఉండేవారు. జేబులను కొల్లగొడుతున్నా స్వేచ్చా వాయువులను పీలుస్తూ మైమరచి పోయే వారు. అప్పటి వరకు సహనంలో మనకు మనమే సాటి అని ఒకదాని నొకటి వెనుక కాళ్లతో తన్నుకొని పరస్పరం అభినందించుకున్న గాడిదలు కూడా విస్తుపోయేలా జనం సహనశీలురుగా ఉండేవారు అని చరిత్ర గురించి కొత్త తరాలకు తాతయ్యలు, తాతమ్మలు చెప్పే రోజు వస్తుందా ?
చూస్తుంటే అదే అనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయిన మేరకు వినియోగదారులకు ధర తగ్గించకపోయినా నోరెత్తలేదు. వరుసగా పెట్రోలు, డీజిలు ధరలు (ఇది రాసే సమయానికి తొమ్మిది రోజులు) పెంచుతున్నా ఇదేమిటి అన్నట్లుగా కూడా చూడటం లేదు. మన మెదళ్లలో ఎందుకు అని ప్రశ్నించే సాప్ట్‌వేర్‌ పని చేయటం లేదా లేక హార్డ్‌వేర్‌ చెడిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. అసలు ఏదీ పట్టించుకోని వారికి అంధులకు ఇంధ్రధనుస్సును చూపించినట్లు ఎన్ని వివరాలు చెప్పినా ప్రయోజనం ఏముంది ! ఉండబట్టలేక వామపక్షాలు పిలుపులు ఇచ్చినా జనం పట్టించుకోనపుడు మిగులుతున్నది కంఠశోష మాత్రమే.
2019 మే నెలలో మనం సగటున ఒక పీపా ముడి చమురును రూ.4,664కు, జూన్‌ నెలలో రూ.4,149కి కొనుగోలు చేస్తే ఈ ఏడాది జూన్‌ 15 ధర రూ.2,642 ఉంది. అంతకు ముందు పదిహేను రోజులుగా దీనికి కాస్త అటూ ఇటూగా ఉంది తప్ప మిన్ను విరిగి మీద పడినట్లు పెరగలేదు. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.69.59గా ఉన్నదానిని మార్చి 16 నుంచి 82 రోజుల పాటు ఎలాంటి మార్పు చేయలేదు. తొమ్మిది రోజులుగా పెంచిన ఫలితంగా అది రూ.76.26కు పెరిగింది.
గతేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం 2020 జూన్‌ 11వ తేదీన నవీకరించిన ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. మే నెలలో 30.60 డాలర్లకు పెరిగింది. జూన్‌ 15న ధర 40.66 డాలర్లు ఉంది తప్ప వెనుకటి అరవై డాలర్ల స్ధాయికి చేరకపోయినా తొమ్మిది రోజులుగా ఎందుకు పెంచుతున్నట్లు ? 2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ రూ.16.86లు ఉంది.
ఈ అన్యాయం గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు బిజెపి దృష్టిలో జాతి వ్యతిరేకులు కనుక మాట్లాడటం లేదు అనుకుందాం. మరి అసలు సిసలు జాతీయ వాదులుగా పిలుచుకొనే బిజెపి ఈ ధరల దోపిడీ గురించి మాట్లాడదేం ? లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. ధర పెంచితే పెట్రోలియం కంపెనీలకు లాభం వస్తుంది. వినియోగదారు జేబుకు చిల్లిపడుతుంది.
గొప్పలు చెప్పుకోవటంలో బిజెపి తరువాతే . కానీ అది తమకు ప్రయోజనం అనుకున్నవాటి విషయంలోనే సుమా ! సిగ్గుపడాల్సిన వాటిని ప్రస్తావించేందుకు సైతం భయపడతారు. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ ప్రతి వారం అధికారిక సమాచారం అధారంగా ధరలను సమీక్షిస్తుంది. ఈ మేరకు జూన్‌ ఎనిమిది నాటి సమాచారం ప్రకారం ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 95 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 46,మయన్మార్‌లో 48, భూటాన్‌లో 66,నేపాల్లో 80, చైనాలో 83, శ్రీలంకలో 87, మన దేశంలో 101 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చెప్పగలదా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?
మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఆరు సంవత్సరాల తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు.
వరుసగా చమురు ధరలను ఎందుకు పెంచుతున్నారు అన్నది ప్రశ్న. కనిష్టానికి పడిపోయిన ముడి చమురు ధరలు పూర్వపు స్ధితికి చేరకపోయినా తిరిగి పెరుగుతున్నాయి. మన దేశంలో 2019-20 సంవత్సరంలో చమురు కంపెనీలకు ఒక లీటరుకు లాభం సగటున రూ.2.20 ఉంది. చమురు ధరలు భారీగా తగ్గిన కారణంగా కేంద్ర ప్రభుత్వం పన్ను భారాన్ని మోపినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో రూ.13 నుంచి 19 వరకు లాభాలు వచ్చాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సమాచారం ప్రకారం మే నెల 1-5 తేదీల మధ్య లీటరుకు రూ.16.10 ఉన్న లాభం కాస్తా కేంద్ర ప్రభుత్వం మే ఆరు నుంచి పెట్రోలు మీద 10 డీజిలు మీద 13 రూపాయల పన్ను పెంచిన కారణంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీల లాభం రెండింటి సగటు లాభం రూ.3.90కి పడిపోయింది. తరువాత ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగినందున మే మధ్య నాటికి కంపెనీలకు ఒక లీటరుకు రూ.1.84, మే ఆఖరు నాటికి 1.56 తరుగు వచ్చిందట. దాంతో తిరిగి ధరలను పెంచటం ప్రారంభించాయి, ఒక్క రోజులో పెంచితే సంచలనాత్మకంగా ఉంటుంది కనుక రోజూ కాస్త కాస్త పెంచుతున్నాయి. అంటే తరుగుపోయి మిగుల్లోకి వచ్చేంత వరకు పెంచుతూనే ఉంటాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాలలో సగటున లీటరుకు రూ.7.9 మిగులు ఉంటుందనుకుంటే అది తరుగులోకి వచ్చింది. అందు వలన కనీసం రూ.5.10 మిగులు ఉండేట్లు చూడాలని నిర్ణయించారని వార్తలు. అంటే ఆ మేరకు లాభాలు వచ్చే వరకు పెంచుతూనే ఉంటారు. చమురు వినియోగం పడిపోయిన సమయంలో చమురు శుద్ధి కర్మాగారాలు కూడా ఆమేరకు తగ్గించాల్సి వచ్చింది. ఆ సమయంలో వాటికి వచ్చిన నష్టాలను కూడా ఇప్పుడు పూడ్చుకుంటున్నాయి. అందువలన ఇప్పుడున్న ముడి చమురు ధర ఇంకా పెరిగితే వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేయటం తప్ప కేంద్రం పన్ను తగ్గించదు. ధరలూ తగ్గవు.
మన దేశంలో ఉన్న చమురు పన్ను ప్రపంచంలో మరెక్కడా లేదంటే మోడీ గారి మంచి రోజులకు, ఇంత పన్ను భరించటం మన జనాల సహనానికి చిహ్నం. కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం ఫిబ్రవరి 2020 నాటికి కేంద్రం, రాష్ట్రాలు విధిస్తున్న పన్ను సగటున పెట్రోలుపై 107, డీజిల్‌పై 69శాతం ఉంది. మార్చి 16వ తేదీన ఆ పన్నులు 134,88శాతాలకు పెరిగాయి. మే మొదటి వారంలో అవి 260,256 శాతాలకు చేరాయి. జర్మనీ, ఇటలీ దేశాల్లో 65శాతం, బ్రిటన్‌లో 62, జపాన్‌లో 45, మోడీ దోస్తు ట్రంప్‌ ఏలుబడిలో 20శాతం వరకు పన్నులు ఉన్నాయి. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈ నిస్సిగ్గు, పట్టపగలు చమురు దోపిడీ ఇంకెంత కాలం నిర్మలమ్మగారూ ?

02 Saturday May 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Fuel Price in India, Global Crude oil price of Indian Basket, oil price in India

West Bengal Congress on Twitter: "Our Prime Minister is so busy to ...

ఎం కోటేశ్వరరావు
యాభై మంది ప్రముఖులకు 68వేల కోట్ల రూపాయల రణాల రద్దు గురించి రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మనకైనా అంతే కదా ఉన్నమాటంటే ఊరుకుంటామా ! దేశ పౌరులను తప్పుదారి పట్టించేందుకు సిగ్గు లేని రీతిలో ప్రయత్నిస్తున్నారని చాలా పెద్ద మాట వాడారు. అధికారంలో ఉన్నారు , జనం కాంగ్రెస్‌ను చులకనగా చూస్తున్నారు కనుక ఎంతమాటైనా అంటారు. రుణాల రద్దు అంటే రద్దు కాదు కావాలంటే మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. సరే రాహుల్‌ గాంధీ ఇప్పటికీ పరిణితి లేని కుర్రాడు, కాంగ్రెస్‌ కనుక దాని పూర్వీకులు చేసిన నిర్వాకాలను బిజెపి వారు మీ సంగతేమిటని జనం నిలదీసే వరకు నిందిస్తూనే ఉంటారు- ఆ విషయాన్ని వదలి వేద్దాం.
నిర్మలమ్మ గారు తమ నేత ప్రధాని నరేంద్రమోడీ గారిని అడిగి యావత్‌ దేశానికి చెప్పాల్సిన అంశం గురించి ఇక్కడ చూద్దాం. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయిలో పతనమయ్యాయి. వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాత కూడా ధరల పతనం ఆగలేదు. అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవటంతో ఎదురు డబ్బు ఇచ్చి చమురును వదిలించుకోవాల్సి వచ్చింది. చమురు చౌకగా వస్తోంది కనుక కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.
గతేేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం మే ఒకటవ తేదీ నవీకరించిన సమచారం ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. శుక్రవారం నాడు ధర 17.23 డాలర్లకు తగ్గింది. ఒక రోజు తగ్గవచ్చు మరో రోజు పెరగవచ్చు. కానీ ఆమేరకు వినియోగదారులకు మార్పులు జరగటం లేదు. మార్చినెల 16 నుంచి మే రెండవ తేదీ వరకు ఢిల్లీలో పెట్రోలు లీటరు రు.69.59 ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశమంతటా ఇదే విధంగా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ధరల విధానంలో ఏదైనా మార్పులు ప్రకటించిందా అంటే అదేమీ లేదు. మరో పద్దతిలో నిర్మలా సీతారామన్‌ పదజాలంలో చెప్పాలంటే చమురు వినియోగదారులను సిగ్గులేని రీతిలో పట్టపగలే వినియోగదారుల జేబులు కొట్టి వేస్తున్నారు. ప్రభుత్వ చమురు కంపెనీలు దోపిడీ చేస్తూ ప్రయివేటు చమురు కంపెనీలను కూడా దోచుకొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు మీద లీటరుకు మూడు రూపాయల చొప్పున పన్ను పెంచింది. రాబోయే రోజుల్లో మరో ఎనిమిది రూపాయలు పెంచుకొనేందుకు పార్లమెంట్‌లో ముందస్తు ఆమోదం తీసుకుంది. మన పార్లమెంట్‌ సభ్యులు దీనికి ఎందుకు ఆమోదం తెలిపారో అడిగే పరిస్దితి మనకు ఉంటే ఇలా జరిగేదా ?నరేంద్రమోడీగారి అచ్చేదిన్‌లో ఇదేమి దోపిడీ ?

3 reasons why fall in crude prices won't benefit India - Rediff ...
ఇంతగా చమురు ధరలు పడిపోయినా వినియోగదారులకు ఎందుకు తగ్గించటం లేదు ?
చమురు ధరల్లో పెద్దగా తేడాలు లేని రోజుల్లో ప్రతి రోజు ఒక పైసా లేదా రెండు పైసలు తగ్గించిన, పెంచిన రోజులు కూడా ఉన్నాయి. చూశారా మోడీ సర్కార్‌ వినియోగదారుల పట్ల ఎంత నిజాయితీగా ఉందో అని వంది మాగధులు పొగిడారు. ఇప్పుడు అసాధారణ రీతిలో చమురు ధరలు పడిపోయినందున పైసలు కాదు పదుల రూపాయలు తగ్గించాలి. పైసలంటే ఏదో కాని ఇంత పెద్ద మొత్తం తగ్గిస్తామా అన్నట్లుగా ఇప్పుడు సర్కార్‌ వ్యవహరిస్తోంది. గుండెలు తీసిన బంట్లు అంటే ఈ పాలకులేనా ? చమురు ధరలను ఎందుకు తగ్గించటం లేదో చూద్దాం.
1. ఇప్పటికే ధనికులకు ఇచ్చిన రాయితీలు, ధనికులు కావాలని ఎగవేసిన బ్యాంకు రుణాలు రద్దు చెయ్యటం, బ్యాంకులకు ఆ మేరకు ప్రభుత్వం నిధులు సమకూర్చటం. ఈ విధానాల పర్యవసానం ఖజనా గుల్లకావటం, దాన్ని పూడ్చుకొనేందుకు చమురు ధరల రూపంలో అందరి ముందే వినియోగదారుల జేబులు కొల్లగొట్టి లోటును పూడ్చుకొనేందుకు ఈ పని చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చమురు దెబ్బలు తినేందుకు అలవాటు పడి చర్మం మొద్దుబారిన కారణంగా ఇదేమీ అనిపించటం లేదు, దీనికి తోడు గృహబందీల మయ్యాం. నోరెత్తితే దేశద్రోహం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ద్రవ్యలోటు జిడిపిలో 3.5శాతానికి మించకూడదు. ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాల కారణంగా ఈ ఏడాది ద్రవ్యలోటు ఏడుశాతం వరకు ఉండవచ్చని ముంబైకి చెందిన స్టాక్‌బ్రోకరేజ్‌ సంస్ధ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏప్రిల్‌13న ఒక నివేదికలో హెచ్చరించింది. మన జిడిపి వృద్ధి రేటు ఒక శాతానికి అటూ ఇటుకు దిగజారవచ్చన్న అంచనాల పూర్వరంగంలో లోటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. కనుక లోటు పూడ్చుకొనేందుకు ఇదొక మార్గం.
2. చమురు ధరలను తగ్గిస్తే కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం స్ధిరంగానే ఉంటుంది. ధరల మీద శాతాల ప్రాతిపదికన రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నందున చమురు జారీ ధరలు తగ్గితే రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది.అఫ్‌కోర్సు మిగిలిన రాష్ట్రాలకు సైతం ఉపయోగపడినా మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలోనే ఉన్నాయి కనుక వాటికి ఆదాయం తగ్గకూడదు.
3. గృహబందీ కారణంగా రవాణా రంగం స్ధంభించింది, సాధారణ వినియోగం తగ్గింది, తిరిగి ఎంతకాలం తరువాత పూర్వపు స్ధితి ఏర్పడుతుందో తెలియదు కనుక చమురు రంగంలో ప్రయివేటు కంపెనీలు కూడా ఉన్నందున లావాదేవీలు తగ్గినా లాభాలు తగ్గకుండా చూసేందుకు అధిక ధరలను కొనసాగిస్తున్నారు.
4. రూపాయి విలువ పతనాన్ని నిలబెట్టటంలో కేంద్ర సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏడుశాతం పతనమైంది. రికార్డు స్ధాయిలో 76.92కు పడిపోయింది, 80కి దిగజారవచ్చని అంచనాలు. అదృష్టం ఏమిటంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
5. ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గుడ్ల కోసం బంగారు బాతులను కోయాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే భారత్‌ పెట్రోలియంలో వాటాలను అమ్మి ఈ ఏడాది అరవై వేల కోట్ల రూపాయలను ఖజనాకు జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. చమురు ధరలను తగ్గిస్తే ఆ సంస్ధ లాభాలు తగ్గి వాటా విలువపడిపోతుంది. దాంతో తెగనమ్మితే నష్టం కనుక వాటిని అమ్మేంతవరకు కంపెనీకి లాభాలు తగ్గకుండా చూడాలంటే చమురు ధరలను తగ్గించకూడదు. ముందస్తు ధరలకు చమురు కొనుగోలు చేస్తాము. అయితే ఆ ధరలు ఖరారు అయిన తరువాత చమురు ధరలు భారీగా పడిపోయినందున వచ్చే నష్టాలను చమురు కంపెనీలు పూడ్చుకోవాలి కనుక ధరలు తగ్గించటం లేదు. అంతే కాదు ప్రపంచ వ్యాపితంగా శుద్ధి చేసిన చమురుకు డిమాండ్‌ పడిపోయింది. అందువలన శుద్ధి కర్మాగారాలు పూర్తి స్ధాయితో పని చేస్తే చమురు నిల్వ సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో కూడా అదే పరిస్ధితి ఏర్పడింది.తాత్కాలికంగా అయినా అవసరాలకు మించి చమురుశుద్ధి సామర్ద్యం ఉంది. ఈ దశలో డిమాండ్‌ లేనపుడు కంపెనీల వాటాలకు డిమాండ్‌ పడిపోతుంది. ఏనుగు వంటి బిపిసిఎల్‌ను కొనేందుకు ఈ దశలో ఎవరు ముందుకు వస్తారు? కంపెనీ వాటాల అమ్మకపు దరఖాస్తుల గడువును జూన్‌ 13వరకు ప్రభుత్వం గడువు విధించింది. అప్పటికి పరిస్ధితికి ఇంకా దిగజారితే… వేరే చెప్పాల్సిందేముంది ?
6.కేంద్ర ప్రభుత్వం మరో విధంగా కూడా చమురు ధరలతో ఖజనా నింపుతోంది. ఇప్పుడు ధరలు రికార్డు స్ధాయిలో పడిపోయినందున ఎంత ఎక్కువ ముడి చమురుకొని నిల్వచేస్తే ఒక వేళ రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే ప్రభుత్వానికి అంతగా లాభం.ఒక వైపు వినియోగం పడిపోతున్నా కేంద్ర సర్కార్‌ చమురు కొనుగోళ్లను పెంచింది. అయితే చమురు ధరలు తగ్గినపుడల్లా వినియోగదారుల పన్ను రేటు పెంచి 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందింది.
మరికొన్ని అంశాలను కూడా చూద్దాం. వర్తమాన ఖాతా లోటు (కరెంట్‌ ఎకౌంట్‌ ) ఇటీవలి కాలంలో మెరుగుపడింది. అయితే రూపాయి విలువ పతనం ఆ మెరుగుదలను దెబ్బతీస్తుంది. మార్చినెలలో మన విదేశీమారక ద్రవ్య నిల్వలు 475బిలియన్‌ డాలర్లు అయితే వాటిలో 300బిలియన్‌ డాలర్లు ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఎఫ్‌పిఐ) ఖాతాలోనివే. అంటే విదేశీయులు మన దేశంలోని బ్యాంకుల్లో దాచుకొనే సొమ్ము, మన కంపెనీల వాటాలు, మనకు అప్పులు ఇచ్చిన మొత్తాలు. ఇవి కొన్ని సందర్భాలలో స్పెక్యులేషన్‌ కోసం కూడా వస్తాయి. అప్పులకు ఒక కాల పరిమితి ఉంటుంది తప్ప మిగిలిన వాటికి స్ధిరత్వం ఉండదు, లాభసాటిగా ఉంటే ఉంటాయి లేకపోతే నవారు అట లేదా పుల్ల ఆటగాండ్ల మాదిరి బిచాణా ఎత్తివేస్తాయి. మన వర్తమాన ఖాతా లోటు తగ్గటం అంటే మన విదేశీ మారక ద్రవ్య అవసరాలు తగ్గటం లేదా గణనీయంగా ఆ మొత్తాలు ఉండటం. అలా ఉండటం అంటే ఎప్‌పిఐలను మన ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షించే శక్తి పరిమితం అని భావిస్తారు.
చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే ధరల పెరుగుదల రేటు పడిపోతుంది. అయినా కేంద్రం పైన చెప్పుకున్న ఇతర కారణాలతో జనానికి ధరలు పెరిగితే మాత్రం ఏం అన్నట్లుగా చమురు ధరలను తగ్గించటం లేదు. పీపా ముడి చమురు ధరలో ఒక డాలరు తగ్గితే లీటరు డీజిల్‌ లేదా పెట్రోలుకు 50పైసలు తగ్గించవచ్చని చెబుతారు. ఇదే కాదు ముడి చమురు నుంచి వచ్చే నాఫ్తా వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి ఎరువుల ధరలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఎరువుల ధరలు తగ్గించలేదు.

India imports more oil in 5 years of Modi Govt; 10% import cut by ...
గృహబందీ ఏప్రిల్‌ 14వరకు కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం రెండు నుంచి మూడుశాతం మధ్య పడిపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు మే 17వరకు కేంద్రం పొడిగించింది, తరువాత అయినా ఎత్తివేస్తారన్న హామీ లేదు, కరోనా వ్యాప్తి కేసులు వేగంగా పెరుగుతున్నందున తరువాత కూడా పొడిగించినా ఆశ్చర్యం లేదు. మన దేశంలో 15మిలియన్‌ టన్నుల చమురు నిల్వ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాము. అయితే ప్రస్తుతం 5.3మిలియన్‌ టన్నులు మాత్రమే నిల్వచేయగలం. మిగతా ఏర్పాట్లు పూర్తి కాలేదు. కనుక ప్రపంచ మార్కెట్లో ఎవరైనా ఉచితంగా ఇస్తామని చెప్పినా మనం చమురు తెచ్చుకోలేని పరిస్ధితి.
తాను వస్తే మంచి రోజులను తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ జనం చచ్చేట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత ఎక్సయిజు పన్ను పెట్రోలు మీద 142, డీజిల్‌ మీద 318శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇంకా పెంచేందుకు అనుమతి తీసుకున్నారని ముందే చెప్పుకున్నాము.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. ఈ విధానం నుంచి గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఎందుకు వైదొలగిందో, ఎంతకాలం ఇలా అధిక ధరలకు విక్రయిస్తారో ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు ప్రధాని నరేంద్రమోడీని అడిగి చెబుతారా ?
బిజెపి వారు ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చేందుకు పేటెంట్‌ తీసుకున్నారు, అదే ఇతరులు పోలిస్తే దేశద్రోహం, తుకడే తుకడే గ్యాంగులంటూ దాడి చేస్తారు. గత నెల 27న ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 92 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 60,భూటాన్‌లో 65,నేపాల్లో 79, చైనాలో 83, శ్రీలంకలో 84, మన దేశంలో 95 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో ఆర్ధిక మంత్రి చెబుతారా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ పతనం- మోడీ నాడేమి చెప్పారు నేడేమి చేస్తున్నారు !

16 Monday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India inflation, Indian Rupee, Narendra modi on Rupee fall

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons

ఎం కోటేశ్వరరావు
రూపాయికి కరోనా వైరస్‌ సోకిందా ?  పతనాన్ని అరికట్టటంలో నరేంద్రమోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందా ? మోడినోమిక్స్‌ గురించి గతంలో పొగిడిన వారు ఇప్పుడు నోరు మెదపరేం ? గతంలో రూపాయి పతనాన్ని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఏమంటారు ? ఇలా ఎన్నో ప్రశ్నలు కేంద్ర పాలకులను చుట్టుముడుతున్నాయి. ఒక్కరూ నోరు విప్పరేం. పోనీ రూపాయి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ గురించి నోరు విప్పరు. కానీ సిఎఎ,ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ వంటి అనేక వివాదాస్పద విషయాల మీద మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు అంటూ నోరు వేసుకొని పడిపోతున్నారే !
రూపాయిని కాపాడుకొనేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించనున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. దాంతో రూపాయి శుక్రవారం నాడు కాస్త కోలుకుంది. సోమవారం నాడు మార్కెట్‌లు ప్రారంభం కాగానే మరోసారి పతనమైంది. రోగం ఒకటైతే మోడీ సర్కార్‌ మందు మరొకటి వేస్తోందా ?
చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. గురువారం నాడు రికార్డు స్దాయిలో పతనమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు కోలుకుంది.ఒక్క రోజులో కరోనా వైరస్‌ తగ్గిందీ లేదు, కొత్తగా పెరిగిందీ లేదు. సోమవారం నాడు తిరిగి భారీ స్ధాయిలో పతనమైంది. అసలేమి జరుగుతోంది ? ఏమి జరగబోతోంది ? ప్రభుత్వం చెప్పదు, చెప్పిన మేథావులకు దేశ వ్యతిరేకులనో, కమ్యూనిస్టులనో మరొకటో ముద్ర వేస్తున్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కాని మేథావులకు మన దేశం గొడ్డుపోయిందా ? లేదే, మరి వారెందుకు చెప్పటం లేదు, చెప్పినా మీడియా జనం ముందుకు తేవటం లేదా ?
ఈ పూర్వరంగంలో మన రూపాయి రక్షణ గురించి చూద్దాం. రూపాయి పతనమైతే ఎగుమతిదారులు సంతోషపడతారు, దిగుమతిదారులు ఆగ్రహిస్తారు. రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులు సంతోషిస్తారు, ఎగుమతిదారులు కన్నెర్ర చేస్తారు. మధ్యలో జనం సంగతేమిటి ? 1961లో వంద రూపాయలకు వచ్చే వస్తువులను నేడు కొనాలంటే రూ.7,557 కావాలి మరి ! లేదూ దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 59 సంవత్సరాల క్రితం వంద రూపాయలుంటే దాని నిజ విలువ ఇప్పుడు రూ.1.40కి దిగజారింది. ఈ లెక్క ఎలా వచ్చిందంటారా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు చెప్పినా లెక్కవేసి పెడతారు. ప్రతి ఏటా ప్రభుత్వం వినిమయదారుల ధరల సూచీని ప్రకటిస్తుంది.             అందువలన ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమాన సంవత్సర వినిమయదారుల సూచీని సదరు ప్రామాణి సంవత్సర సూచీతో భాగహారం చేయగా వచ్చే మొత్తాన్ని వందతో హెచ్చ వేయండి. మీకు ఫలితం వస్తుంది.1961 వినిమయదారుల ధరల సూచి 2.57, 2020 సూచీ 194.25. వీటితో పైన చెప్పిన పద్దతిలో భాగహారం చేస్తే 75.58 వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. దీన్ని వందతో హెచ్చవేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు 1961 తరువాత గరిష్ట ద్రవ్యోల్బణం 1974లో 28.6, అంతకు ముందు సంవత్సరం రెండవ రికార్డు 16.94. (ఈ కారణంగానే ఆ రెండు సంవత్సరాలలో దేశంలో అనేక చోట్ల ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళనలు తలెత్తాయి) నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు 2013లో ద్రవ్యోల్బణం 10.91. తరువాత క్రమంగా 6.35 నుంచి 2017లో 2.49గా ఉంది. దీన్ని మోడీ సర్కార్‌, బిజెపి పెద్ద ఎత్తున తమ విజయంగా,మోడీ ప్రతిభగా ప్రచారం చేసుకున్నాయి. మరుసటి ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ 2019లో 7.66కు చేరింది, ఈ ఏడాది ఇంకా ఖరారు కాలేదు. దీన్ని ఎలా చెప్పాలి ? 2019లో రూ.7,019కి వచ్చిన సరకుల ధర 2020లో రూ.7,557 అవుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ద్రవ్యోల్బణం తిరోగమనంలో పయనించింది. 1976లో అది గరిష్టంగా మైనస్‌ 7.63, అందువలన 1975లో రూ.312 రూపాయలకు వచ్చిన సరకులు 1976లో రూ.288కే వచ్చాయి.

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons
రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అని ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ ఈ మాటలు అన్నారు. అదేమి చిత్రమో, గానీ యుపిఏ నాటి కంటే నేడు మరింత దిగజారినా ప్రధానిగా మోడీ నోటి వెంట ఒక్క మాటా రాదు. ఆ పెద్దమనిషి భక్తులకూ నోట మాట పడిపోయింది. గోమాత శాపమా ?
ఎక్సేంజ్‌ రేట్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ రూపి అని గూగుల్‌ తల్లిని వేడుకుంటే కరుణించి అందచేసే సమచారంలో వికీపీడియాను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కళ్లుండీ చూడలేని నమో భక్తుల గురించి జాలిపడదాం. అడ్డంగా వాదిస్తే వాస్తవాలతో పని పడదాం. గత పది సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి విలువ వార్షిక సగటు విలువ ఎలా ఉందో దిగువ చూడండి.
ఏడాది రూపాయి విలువ
2004-05    44.93
2005-06    44.27
2006-07    45.28
2007-08    40.24
2008-09    45.91
2009-10    47.41
2010-11    45.57
2011-12    47.92
2012-13    53.21
2013-14    60.50
2014-15    61.14
2015-16    65.46
2016-17    67.07
2017-18    64.45
2018-19    69.92
2019-20 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సగటున రూపాయి విలువ 70.40. ఈ ఏడాది గత కొద్ది రోజులుగా పడిపోతూ 2018 అక్టోబరు రెండు నాటి రికార్డు పతనం 74.48కి దగ్గరగా 74.44 వరకు దిగజారింది. ఈ పతనానికి కారణాలేమీ చెప్పలేదు గనుక దీనికి కూడా మోడీ సర్కార్‌ అవినీతే కారణం అనుకోవాలి మరి. ఈ రికార్డు పతనంతో నిమిత్తం లేకుండానే పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు దిగజారాయి. ఇంతగా దిగజారింది కనుకనే రిజర్వుబ్యాంకు డాలర్లను విక్రయించేందుకు పూనుకుంది.
రూపాయి పతనమైతే మన సరకుల ధరలు విదేశాల్లో తగ్గి ఎగుమతులు పెరుగుతాయి కదా ! అలాంటపుడు దాన్ని నివారించేందుకు రిజర్వు బ్యాంకు ఎందుకు పూనుకున్నట్లు ? అసలు విషయం ఏమంటే మన సరకులకు విదేశాల్లో డిమాండ్‌ లేదు. పోనీ నరేంద్రమోడీ విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రతి చోటా, మన దేశానికి వచ్చిన ప్రతి విదేశీ నేతను కౌగలింతలతో ముంచెత్తినా వారి నుంచి తాను ప్రశంసలు, పొగడ్తలు పొందటం తప్ప ఎగుమతి మార్కెట్‌ అవకాశాలను కల్పించలేకపోయారు. మన కరెన్సీ పతనాన్ని ఇంకా కొనసాగనిస్తే మనం దిగుమతి చేసుకొనే చమురు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది జనం మీద, ఆర్దిక వ్యవస్ధ మీద మరింత భారం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న స్ధితిలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కాపాడుకొనేందుకు బిజెపి పాట్లు పడుతోంది.
మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. 1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు.
మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.
నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.
విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?
నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?
వక్రీకరణలతో జనాన్ని మోసం చేయలేరు, భక్తులు మోడీని అసలు గట్టెక్కించలేరు. రూపాయి పతనాలు గతంలో జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. దాన్నొక సమస్యగా చేసింది నరేంద్రమోడీ ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ అన్న మోడీని మీ ఏలుబడిలో సంగతేమిటని అడిగే హక్కు అందరికీ వుంది. ఆయన భక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే కిరాయి జనం వున్నారు. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చే నాటికి 2014 మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి తాజాగా 74.34కు పతనం అయింది.

Image

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. దాన్నయినా అదుపు చేయాలి, మోడీ గారిని అయినా అదుపులో పెట్టాలి, లేకపోతే మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గరగా రూపాయిని తీసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేనుకు పెత్తనం – నరేంద్రమోడీకి అధికారం !

14 Saturday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Excise Duty & VAT on Oil, Narendra Modi 2.0, Price Build-up of Petrol

Image result for narendra modi authoritarian

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా ఒక్కసారిగా చమురు ధరలు 30శాతం వరకు పతనమయ్యాయి. ఒక్క మంత్రి లేదా సామాజిక మాధ్యమంలో ఒక్క బిజెపి కార్యకర్తగానీ ఈ మేరకు వినియోగదారులకు ధరలు తగ్గుతాయి అని చెప్పటం లేదు. గతంలో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం ప్రారంభం కాగానే దాన్ని మనకు అనుకూలంగా మలచుకుంటామని కబుర్లు చెప్పారు. అదేమిటో ఎక్కడా చెప్పరు. కానీ జరుగుతున్నదేమిటి ? ధరలను మరింతగా పెంచారు. దానిలోకి వెళ్లే ముందు అసలేం జరుగుతోందో చూద్దాం.
2013 సెప్టెంబరు 16న మనం దిగుమతి చేసుకొనే రకం చమురు ధరలు, పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
పీపా ధర రూ. 117.58 డాలర్లు.
డాలరుకు రూపాయి విలువ 66.02.
చమురు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రూ.50.02
డీలర్లకు విక్రయించిన ధర              రూ.52.15
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ   .9.48
డీలర్‌ కమిషన్‌                             రూ. 1.79
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం            రూ.12.68
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ. 76.10
2020 మార్చి 14న వివరాలు
డీలర్లకు విక్రయించిన ధర              రూ.28.50
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ.22.98
డీలర్‌ కమిషన్‌                              రూ. 3.54
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం           రూ.14.85
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ.69.87
నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా రూపాయి విలువ ఎలా పతనమైందో దిగువ వివరాలు ఉన్నాయి.ఇప్పుడు 74 రూపాయలకు పతనమైంది. అదే పతనం కానట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా డీలర్లకు విక్రయించే ధర ఇంకా తగ్గి ఉండేది. వినియోగదారులకు ఇంకా చవకగా అంది వుండేది. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పన్ను మొత్తాన్ని రూ.9.48 నుంచి రూ.22.98కి పెంచింది. అదే లేనట్లయితే డీలరు కమిషన్‌ పెంచినా పెట్రోలు రూ.56.37కు వచ్చి ఉండేది.
చమురు ధరలను గణనీయంగా తగ్గించాల్సిన పెద్ద మనిషి శనివారం నాడు పెట్రోలు మీద రూ.19.98గా ఉన్న ఎక్సయిజ్‌ పన్నును రూ.22.98కి పెంచారు. ఈ పెంపుదల దూరదృష్టితో చేసినదని, ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న ద్రవ్య స్ధితిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వనరులు అవసరమని ఒక అధికారి సన్నాయి నొక్కులు నొక్కారు. గడచిన నాలుగు మాసాల్లో చమురు ధరలు తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకే గణనీయంగా పోయిందని సమర్ధించుకున్నారు. అంటే తగ్గిన మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించకూడదన్నది మోడీ సర్కార్‌ విధానం అన్నది స్పష్టమైంది.పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నది సామెత. మంచి రోజులను తెస్తానని చెప్పిన నరేంద్రమోడీకి అధికారమిస్తే చేసినదాన్ని ఏమనాలి?
మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు, 2020 మార్చి 13వ తేదీన పీపా ముడి చమురు ధర రూ.2,342 గా ఉంది. ఇదే రోజు రూపాయి విలువ 73.74గా ఉంది.నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఆయన సమర్ధత కారణంగా ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు మన కరెన్సీ విలువ పెరిగి వుంటే చాలా చవకగా పెట్రోలు, డీజిలు అందుబాటులోకి వచ్చి ఉండేది. ఒక పీపాలో ముడి చమురు 159 లీటర్లు ఉంటుంది. దాన్నుంచి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్‌,20 లీటర్ల కిరోసిన్‌ లేదా విమాన ఇంథనం, ఆరు లీటర్ల ప్రొపేన్‌, 24 లీటర్ల ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఇవి రావటానికి ముడి చమురుకు ఇతర ఉత్పత్తులను జత చేయాల్సి ఉంటుంది. ఒక పీపా నుంచి ఒక వంద లీటర్లు పెట్రోలు, డీజిల్‌ అనుకుంటే ఇతర ఉత్పత్తుల మీద వచ్చే ఆదాయం శుద్ధి చేసిన ఖర్చుకు పోతుంది అనుకుంటే మోడీ గారి పన్ను బాదుడు లేనట్లయితే చాలా తక్కువకు జనం పొంది ఉండేవారు. అది మిగతా వస్తువుల ధరలను కూడా తగ్గించేందుకు దోహదం చేసి ఉండేది.
మోడీ సర్కార్‌ ఇతర అన్ని రంగాలలో విఫలమైందని అనేక అంశాలు నిరూపించాయి. మన ఎగుమతులతో జనానికి కలిగిన లబ్ది ఏమిటో తెలియదు గానీ దిగుమతుల్లో సింహభాగమైన ముడిచమురును ఒక ఆదాయవనరుగా మార్చుకొని వినియోగదారులను ఎలా లూటీ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ లూటీ అనే పెద్దమాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మోపిన పన్ను భారాన్ని జన సంక్షేమానికి ఖర్చు చేయలేదన్న కారణంగానే.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి పదకొండు రకాల ఖాతాల నుంచి గణనీయ మొత్తంలో ఆదాయం వస్తోంది.2014-15లో అంటే మోడీ సర్కార్‌ తొలి ఏడాదిలో వచ్చిన ఆదాయ మొత్తం రూ.1,72,065 కోట్లు, అది 2018-19 నాటికి రూ. 3,48,041 కోట్లకు పెరిగింది, రెట్టింపైంది. ఇదే కాలంలో ఈ మొత్తంలో ఎక్సైజ్‌ పన్ను రూ.99,068 కోట్ల నుంచి రూ 2,14, 369 కోట్లకు పెరిగింది( ఒక ఏడాది రూ 2,42,691 కోట్లు వచ్చింది), అంటే దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.Image result for narendra modi authoritarian
బిజెపి మరుగుజ్జులు ఈ లూటీని తక్కువ చేసి చూపేందుకు చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలు విధించే వ్యాట్‌ (పన్ను) కారణమని తప్పుడు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలు కూడా పన్ను వేస్తున్నాయి, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టిలోకి తెచ్చి తమ ఆదాయాన్ని పూడ్చాలని రాష్ట్రాలు చేస్తున్న వినతిని కేంద్రం పట్టించుకోవటం లేదు. దీని వెనుక రెండు కారణాలు ఒకటి జిఎస్‌టి పద్దతిని అమలు జరిపితే రాష్ట్రాలకు పంచకుండా దొడ్డిదారిన పన్నులు వేసి తన బొక్కసానికి చేర్చుతున్న మొత్తాన్ని కేంద్రం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవది రాష్ట్రాలకు తగ్గిన మేరకు ఆదాయాన్ని పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు వ్యాట్‌తో సహా ఆరు రకాల ఖాతాల ద్వారా పొందిన ఆదాయం రూ.1,60,554 నుంచి రూ.2,27,591 కోట్లు ఉంది, దీనిలో వ్యాట్‌ పెరుగుదల రూ.1,37,157 నుంచి రూ.2,01,265 కోట్లు మాత్రమే. కేంద్రం మోపిన భారం ఎక్కువన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కోడి కత్తి కాదు తెలుగువారికి డోనాల్డ్‌ ట్రంప్‌ ” కోడి కాలు, పాల ” కేసులు ముఖ్యం ?

23 Sunday Feb 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Dairy Farmers, Donald Trump India tour, Poultry Industry

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus

ఎం కోటేశ్వరరావు
కేంద్రంతో సంబంధం, రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన కోడి కత్తి కేసు ఏమైందో మీకు తెలుసా ! నాకూ తెలియదు, అలాంటి సంచలనాత్మక కేసులు ఎన్నో మరుగునపడ్డాయి, దాని వలన రాజకీయ వ్యాపారులకు తప్ప జనానికి నష్టం లేదు. కానీ కోడి కాలు, పాల కేసు అలాంటిది కాదు. రెండు రాష్ట్రాల్లోని పాడి, కోళ్ల పరిశ్రమను, వాటి మీద ఆధారపడిన వారినీ దెబ్బతీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు వచ్చిన ఆహ్వానాన్ని, సంతోషంగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ విందులో కోడి కాలు, పెరుగు లేకుండా ఉండదు. విందును ఆరగించబోయే ముందు తనకు వడ్డించి కోడి కాలు, పెరుగు స్వదేశీయా, అమెరికాదా అని కెసిఆర్‌ కనీసం సందేహిస్తారా ? అందని ద్రాక్ష పుల్లన అలాగే ఆహ్వానం రాలేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డికి అది గొప్ప విందేమీ కాదు. కనీసం ఆయన అయినా కోడి కత్తి కేసుతో పాటు కోడి కాలు, పాల కేసులను పట్టించుకుంటారా ?
ఒకటి కొంటే రెండు ఉచితంగా ఇస్తాం అన్నట్లుగా అమెరికా సర్కార్‌ మన దేశంతో ”కోడి కాళ్ల ” బేరం ఆడుతోంది. లేకుంటే మన కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తోంది. గతంలో మా కాళ్లు మాకున్నాయి మీ కాళ్లు అక్కర లేదంటూ మన సర్కార్‌ నిషేధం విధించింది. అప్పటి నుంచి వత్తిడి తెస్తున్న అమెరికా ఇప్పుడు విజయవంతమైనట్లు వార్తలు వచ్చాయి. విదేశీ వద్దు-స్వదేశీ ముద్దు అంటూ జపం చేసిన కాషాయ స్వదేశీ జాగరణ మంచ్‌ మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఏమైందో తెలియదు. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 17 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులులో ఉంది. మన దేశంతో ఉన్న ఆ వాణిజ్య లోటును అమెరికా పూడ్చుకోవాలంటే తనకు అవసరం లేని వాటిని మన మీద రుద్ది లబ్దిపొందాలని చూస్తోంది.
అమెరికా జనం కోడి కాళ్లను తినరు. అందువలన అక్కడి కోల్ట్‌ స్టోరేజీల్లో అవి పెద్ద ఎత్తున నిల్వలుండిపోయాయి. వాటిని మన మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తే మన దేశంలోని వేలాది కోళ్ల ఫారాలు మూతపడతాయి. వాటితో పాటు అనుబంధ రంగాలలో కనీసం 40లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ కారణంగానే గత పాలకులు వాటి మీద నిషేధం విధించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగలించుకున్న నరేంద్రమోడీ ట్రంప్‌ను పడేయాల్సింది పోయి తానే పడిపోయారు. కోడి కాళ్ల దిగుమతులపై ఉన్న పన్ను మొత్తాన్ని వంద నుంచి 25శాతానికి తగ్గించి దిగుమతులకు వీలు కల్పిస్తామని ఆమోదం తెలపగా, కాదు పదిశాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ తెలిపింది. ఇది నిజానికి స్పందన తెలుసుకొనేందుకు వదిలిన లీకు వార్త తప్ప మరొకటి కాదు. దీని మీద మన దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో అబ్బే అలాంటిదేమీ లేని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ట్రంప్‌ రాక సందర్భంగా లేదా తరువాత అయినా దానికి అంగీకారం తెలపవచ్చని భావిస్తున్నారు.
కోడి కాళ్ల దిగుమతులపై అమెరికా కోరిన విధంగా పన్ను తగ్గిస్తే అది ఆ ఒక్కదేశానికే పరిమితం కాదు. బ్రెజిల్‌ వంటి ఇతర అనేక దేశాల నుంచి చౌకగా దిగుమతులు వెల్లువెత్తుతాయి. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ ఒక్కటే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయా రైతులు కూడా ప్రభావితం అవుతారు. నాటు కోళ్లను పెంచే సామాన్య గృహస్తుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా అమెరికా మన మీద తెస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు. బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా 2007 మన ప్రభుత్వం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఫ్లూ సమస్య తొలగిన తరువాత కూడా అది కొనసాగింది. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది.2014లో అమెరికా కేసు గెలిచింది. 2017లో కోడి కాళ్ల దిగుమతులను మోడీ సర్కార్‌ అనుమతించింది. మన దేశమే కోళ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అలాంటిది అమెరికా నుంచి దిగుమతులను పరిశ్రమ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ప్రస్తుతం వందశాతం పన్ను ఉన్నప్పటికీ అమెరికా నుంచి వస్తున్న కోడి కాళ్ల దిగుమతుల కారణంగా అనేక చోట్ల చిన్న చిన్న కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. అమెరికా తన వద్ద ఉన్న నిల్వలను వదిలించుకొనేందుకు కారుచౌకగా ఎగుమతులు చేసేందుకు పూనుకుంది. మన దేశంలో కోడి కాళ్లు ఆయా సీజన్లనుబట్టి కిలో రూ.150 నుంచి 250 వరకు ధరలు పలుకుతున్నాయి. అమెరికా నుంచి పది హేను రూపాయలకే అందుబాటులోకి వస్తాయని అంచనా. అక్కడి వాస్తవ ధరకంటే తక్కువ చూపి సబ్సిడీలతో ఎగుమతులు చేస్తారు. అందువలన మన దేశం దిగుమతి పన్ను వంద కాదు మూడు వందల శాతం వేసినా మన మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో కోడి కాళ్ల సగటు బరువు 70 నుంచి 90 గ్రాములుంటాయి. అదే అమెరికా కాళ్ల సగటు 160 నుంచి 180 గ్రాములు.
ఇక పాలు, పాల ఉత్పత్తుల విషయానికి వస్తే అమెరికా గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూస్తోంది. వాణిజ్య యుద్ధానికి దిగిన కారణంగా అమెరికా ఉత్పత్తుల మీద చైనా 20శాతం, మెక్సికో 28శాతం చొప్పున దిగుమతి పన్ను పెంచాయి. దాంతో ఉత్పత్తుల నిల్వలు పెరిగిపోతున్నాయి. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది అమెరికా గోదాముల్లో 1.4బిలియన్‌ పౌండ్ల(పౌను అరకిలోకు సమానం) జున్ను నిల్వలు మిగిలిపోయాయి. ఇక పాలపొడి సంగతి సరేసరి. మరోవైపు న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ నుంచి పోటీ పెరుగుతోంది. 2023వరకు ఈ పన్నులు కొనసాగితే అమెరికా పాల రైతులు 12.2బిలియన్‌ డాలర్లు నష్టపోతారు. ఈ కారణంగా తన ఉత్పత్తులను మన మీద రుద్దేందుకు అమెరికా పూనుకుంది.2018లో అమెరికా పాల ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరిచేందుకు మోడీ సర్కార్‌ సూత్రప్రాయంగా ఆమోదించింది. అది అమల్లోకి వస్తే దాదాపు ఎనిమిది కోట్ల మంది మన రైతులు ప్రభావితులౌతారు.

Image result for trump , india ,poultry and milk products cartoons
మొహమాటానికి పోతే…. ఏదో అయిందన్నది ఒక ముతక సామెత. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం పలికి నరేంద్రమోడీ అదే ఇబ్బందులను కొని తెచ్చుకున్నారా ? గత ఏడాది హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన నరేంద్రమోడీ పనిలో పనిగా మీరు ఒకసారి మా దేశానికి రండి అని ట్రంప్‌కు ఆహ్వానం పలికారు. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి డంగై పోయిన ట్రంప్‌తో వీళ్లదేముంది, మీరు ఊహించలేరు, మాదేశం వచ్చినపుడు మిలియన్ల మంది మీకు దారిపొడవునా స్వాగతం పలుకుతారు చూడండి అని నరేంద్రమోడీ గొప్పగా చెప్పి ఉండాలి. లేకపోతే మిలియన్ల మంది నాకోసం వస్తారని మోడీ చెప్పారు, వారు 50 నుంచి 70లక్షల మంది వరకు ఉంటారని మోడీ చెప్పారు అని ఒకసారి, అరవై నుంచి కోటి మంది వరకు వస్తారని మోడీ చెప్పినట్లుగా మరోసారి అమెరికాలో ట్రంప్‌ ప్రకటించారు. అది మన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. రేపు మూడో కుర్ర భార్య, మొదటి భార్య కూతురు, అల్లుడితో సహా వస్తున్న ట్రంప్‌ జనాన్ని చూసి ఎంత మంది ఉంటారని తన వాళ్లను ప్రశ్నించకమానరు. మీ స్వాగతం గురించి మీ మోడీ చెప్పినవన్నీ జుమ్లా(ఏదో అవసరానికి అలా చెబుతాం)యే. మిలియన్ల మంది ఎక్కడా కనిపించలేదు, భారత్‌ మనలను సరిగా చూసుకోవటం లేదు, మోడీ అలాంటి వ్యక్తి కాదు అన్నారు, ఇప్పుడు చూడండి ఎలా అవమానించారో, ఇంత తక్కువ సంఖ్యలో జనమా, ఇది వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం కలిగించదా అని భార్య, కూతురు, అల్లుడు నిషఉ్టరాలాడకపోరు. ట్రంప్‌ను చూసేందుకు గుజరాత్‌లో ఎంత మంది వచ్చిందీ కొందరు విలేకర్లయినా నిజాలను రాయకుండా ఉండరు కదా ! స్వాగతం పలికే జన సంఖ్య గురించి మోడీ ఆంగ్లం ట్రంప్‌కు అర్ధం కాలేదో లేక మోడీయే ట్రంప్‌కు అర్ధమయ్యే రీతిలో చెప్పలేదో ఏం జరిగిందో చెప్పటానికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు గనుక దీన్ని వదలివేద్దాం.

Image result for poultry and milk products cases not chicken knife case important for telugus
డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలేవీ ఉండవు అని అమెరికా అధికారులు మరింత స్పష్టంగా చెప్పారు. అలాంటపుడు ట్రంప్‌ ఎందుకు వస్తున్నట్లు ? మన ప్రధాని ఎందుకు ఆహ్వానించినట్లు ? ఈ ఏడాది నవంబరు 3న జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా కార్పొరేట్లకు గరిష్ట లబ్ది చేకూర్చేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంతో సహా అన్ని దేశాలపై వత్తిడి పెంచుతున్నారు. దీనికి నరేంద్రమోడీ లొంగుతారా ? లేకపోతే మన దేశం మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ప్రపంచ వాణిజ్య సంస్ధ ద్వారా తెస్తున్న వత్తిడి మరింత పెరుగుతుంది. మరి మన మోడీ తట్టుకొని నిలుస్తారా, దేశపిత వంటి మెరమెచ్చు మాటలకు జావగారి లొంగిపోతారా, కోట్లాది మంది రైతాంగ జీవితాలను ఫణంగా పెడతారా ?అమెరికాకే అగ్రస్ధానం అన్న ట్రంప్‌ వైఖరికి అనుగుణ్యంగానే ఈ పర్యటన సాగనున్నట్లు స్పష్టమై పోయింది. మన ప్రయోజనాలే మనకు ముఖ్యం అని చెప్పే మన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు రాజీపడుతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d