• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

20 Monday Jun 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

Agnipath, Agnipath stir, BJP, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


అగ్నిపథ్‌ పధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం.మనది పాకిస్థాన్‌, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం కాదు. ఈ పధకం మిలిటరీ రూపొందించింది తప్ప తమది కాదు అని తప్పుకొనేందుకా అన్నట్లుగా ప్రధాని, సంబంధిత శాఖ మంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనతో దేశం ముందుకు రాలేదు. పరోక్షంగా సుభాషితాలు పలుకుతున్నారు. ఈ పధకంతో మిలిటరీ ఎంపికలో సమూల మార్పులు చేశారు. ఇదేమీ రహస్యం కాదు. విద్యుత్‌ సంస్కరణల ప్రతిపాదనల మాదిరి. ముందుగానే ప్రతిపాదనలను బహిరంగంగా విడుదల చేసి అభిప్రాయాలను తీసుకోవచ్చు.


ఈ పధకం గురించి వివరించేందుకు గాను మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారని వార్తలు. ఈ పధకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తరువాతనే జూన్‌ 14న ప్రకటించారు. ఇలాంటి కీలకాంశం గురించి ముందుగా ప్రధానికి వివరించకుండానే ఇదంతా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా ? ఒకవేళ అదే జరిగితే నిరసన తలెత్తిన వెంటనే దీని సంగతేమిటని ప్రధాని అడిగి ఉండాలి కదా ! ముందే తెలిపి ఉంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి ? ఈ పధకం ప్రకటనతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య గురించైతే అది మిలిటరీ అధికారులకు సంబంధం లేదు, హౌంశాఖ మంత్రి, ప్రతినిధులు వివరించాలి.తగిన కసరత్తు, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకొనే సంస్కరణలు దేనికి దారితీస్తాయో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మూడు సాగు చట్టాల తీరుతెన్నులను చూశాము. అందుకే నష్టనివారణ చర్యగా ఈ తతంగం జరుగుతోందా అనే సందేహాలు కలగటం సహజం.


ఈ పధకానికి నిరసనగా సోమవారం నాడు భారత బంద్‌కు మిలిటరీ ఎంపికకు సిద్దం అవుతున్నవారు పిలుపుఇచ్చినట్లు వార్తలు.దాంతో ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు. ఝార్కండ్‌లో స్కూళ్లను మూసివేశారు. ఢిల్లీ వంటి చోట్ల పోలీసుల అతి కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. హర్యానాలో రెండు జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ఈనెల 24న నిరసన తెలుపున్నట్లు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ ప్రకటించారు. సోమవారం నాడు బంద్‌ ఎలా జరిగిందన్నది ప్రశ్న కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నదే కీలకం. ఒక్కటి మాత్రం స్పష్టం.అగ్నిపథ్‌ పధకం సంగతేమో గానీ దాని కింద శిక్షణ పొందిన వారు అగ్నివీరులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. ఆ పధకం కింద ఎంపికైన వారికి మిలిటరీ శిక్షణలో భాగంగా ఇతర అంశాలతో పాటు బట్టలుతకటం,క్షౌరం చేయటం, చౌకీదార్లుగా నైపుణ్యం కల్పిస్తారట. ఇక ఈ పధకం గురించి విమర్శల వెనుక టూల్‌కిట్‌ గాంగ్‌ ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ ఆరోపించారు. మరి ఆ గాంగ్‌ చిరునామా ఏమిటో వారి మీద కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో తెలీదు. ఒక వేళ అలాంటి గాంగ్‌ ఉంటే వారు రూపొందిస్తున్న టూల్‌కిట్లకు టూల్స్‌ సరఫరా చేస్తున్నది బిజెపి నేతలే. విమర్శించేవారు చెప్పేది స్పష్టంగా ఉంది. సమర్ధిస్తూ మాట్లాడేవారే అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా దిశ రవి అనే యువతి మీద కేంద్ర ప్రభుత్వం టూల్‌ కిట్‌ కేసు పెట్టి దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఒక చోట చేర్చి సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచటాన్నే టూల్‌కిట్‌గా వర్ణించారు.


తమ ఆఫీసులకు అవసరమైన భద్రతా సిబ్బంది నియామకంలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది కైలాష్‌ విజయవర్గీయ. ఆ పెద్దమనిషి ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, పన్నేండ్లు మంత్రిగా పని చేసి ఇప్పుడు వారసత్వంగా కుమారుడు ఆకాష్‌ను ఎంఎల్‌ఏ చేశారు తప్ప బిజెపి ఆఫీసులో చౌకీదారుగా నియమించలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కైలాష్‌కు కొత్తేమీ కాదు. స్వంత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్‌లో బిజెపి నేత లక్ష్మీకాంత శర్మ వంటి వారి ప్రమేయ ఉన్న వ్యాపం కుంభకోణం గురించి విలేకర్లు అడిగితే అది మీకు పెద్దది కావచ్చు గాని మాకు చిన్న కుంభకోణం అని సెలవిచ్చారు. దాని గురించి వివరాలు సేకరిస్తున్న జర్నలిస్టు అక్షయ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించటం గురించి అడిగితే మరణించిన ఆ జర్నలిస్టును మరచిపోండి, నాకంటే అతను ముఖ్యమా అని ఎదురు ప్రశ్నించారు. అంతేనా దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి అడిగితే మహిళలు వారి హద్దుల్లో వారు లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సెలవిచ్చారు. ఇండోర్‌ నగరంలో ఒక పాతభవన కూల్చివేతను పర్యవేక్షిస్తున్న ఒక అధికారిని కుమారుడు ఆకాష్‌ హాకీ బాట్‌తో కొట్టటాన్ని సమర్ధించి తన పుత్ర ప్రేమను చాటుకున్నారు. వివాదాస్పద మాటలతో ఎప్పుడూ జనం నోళ్లలో నానుతున్న కైలాష్‌ అగ్నివీరులను బిజెపి ఆఫీసులో చౌకీదార్లుగా పెడతామని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది !


దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్దపడి మిలిటరీలో చేరేందుకు సిద్దపడుతున్న వారిని కించపరిచేలా ఉన్న తన వ్యాఖ్యలు దుమారం రేపటంతో తన మాటలను టూల్‌కిట్‌ గాంగ్‌ వక్రీకరించిందని ఎదురుదాడికి దిగారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కైలాష్‌ ఇలా మాట్లాడారు.” నేను గనుక బిజెపి ఆఫీసులో భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వస్తే అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తా, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏండ్ల రిటైర్డ్‌ మిలిటరీ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు, అతని మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. అతను సైనికుడు కాబట్టి తాను భయపడలేదని చెప్పారు.దీని అర్ధం ఏమిటి సైనికుడు అంటే ఆత్మవిశ్వాసం ” అని కైలాష్‌ చెప్పారు. దీని మీద విమర్శలు తలెత్తటంతో వివరణ ఇచ్చుకుంటూ అంతకు ముందు చెప్పినదాన్ని సమర్ధించుకున్నారు.” అగ్ని పథ్‌ పధకం కింద శిక్షణ పొందిన అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసిన తరువాత వారు తప్పనిసరిగా నైపుణ్యం పొందుతారు, తమ విధుల పట్ల అంకిత భావంతో ఉంటారు. మిలిటరీలో తమ సేవ పూర్తైన తరువాత ఎంచుకునే రంగాలలో ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలచుకున్నది. టూల్‌కిట్‌ ముఠాలతో సంబంధం ఉన్న నా మాటలను వక్రీకరించి శ్రమజీవులను కించపరిచేందుకు చూస్తున్నారు. ఇది ఈ దేశ కర్మవీరులకు అవమానం.రాష్ట్ర వీరులు-ధర్మవీరులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ టూల్‌కిట్‌ ముఠా గురించి దేశానికి బాగా తెలుసు.” అన్నారు.నైపుణ్యం, అంకిత భావం ఒక్క మిలిటరీకేనా, ఇతర పౌరసేవల్లో ఉన్నవారికి అవసరం లేదా ?


దేశ యువతను అవమానించవద్దని ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌ అన్నారు. వారు దేశం కోసం పని చేసేందుకు సిద్దం అవుతున్నారు తప్ప బిజెపి ఆఫీసు వెలుపల చౌకీదార్లుగా పనిచేసేందుకు కాదు అన్నారు. 2019లో నేను కూడా చౌకీదారునే అనే బిజెపి ప్రచారం అర్ధం ఏమిటో ఇప్పుడు కైలాష్‌ మాటలద్వారా బోధపడిందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ చమత్కరించారు.బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా విమర్శించారు. మిలటరీ అంటే దేశసేవ కోసం తప్ప కేవలం ఉపాధికోసం కాదన్నారు. కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా అగ్నివీరుల గురించి అనుచితంగానే మాట్లాడారు.” అగ్ని వీరులకు ఇతర అంశాలతో పాటు ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, బట్టలుతికేవారిగా, క్షురకులుగా అన్ని రకాల శిక్షణ ఇస్తారు.” అన్నారు. నైపుణ్య శిక్షణ పేరుతో కార్యక్రమం ఉంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు మిలటరీలో శిక్షణ ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ పన్లు చేసేందుకు మిలటరీలో చేరాలా అనే ప్రశ్న ఎదురవుతుందనే విచక్షణ బిజెపి నేతలకు లేకపోయింది. బట్టలుతికేందుకు మిషన్లున్నాయి. మిలిటరీ, పోలీసు క్రాఫ్‌లు చేసేందుకు నిజానికి పెద్ద నైపుణ్యంతో పనేముంది.


2018 ఏప్రిల్‌ 22న ఢిల్లీలో బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఏల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన హితవచనాలను ఆ పార్టీ నేతలు మరిచినట్లున్నారు. పార్టీ అధికారిక ప్రతినిధి నూపుర్‌ శర్మ చిల్లర మాటలు మాట్లాడి విధిలేని స్థితిలో సస్పెన్షకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్నిపథ్‌ పధకం మీద యువత ఆగ్రహించినపుడు ఆ పార్టీ నేతలు తమ నోటి తుత్తరను ప్రదర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చెప్పిందేమిటి? ” మన మీడియాకు మసాలాను ఇస్తున్నాం. కెమెరాలను చూడగానే మనమేదో పెద్ద సామాజిక శాస్త్రవేత్తలం లేదా మేథావులం అన్నట్లుగా ప్రకటనలు చేసేందుకు దూకుతాం. తరువాత చెరుపు చేసే ప్రకటనలను ఉపయోగించుకొని మన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా చూస్తుంది. ఇది మీడియా తప్పుకాదు. ” అన్నారు. బహుశా ఈ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానిగా మోడీ విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.


భారత్‌ బంద్‌ పిలుపుకు సైతం దారి తీసిన అగ్నిపథ్‌ పధకాన్ని నరేంద్రమోడీ సమర్ధించారు. సోమవారం నాడు బెంగళూరులో మాట్లాడుతూ అనేక నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అనుచితంగానే కనిపించవచ్చు.తరువాత అవి జాతి నిర్మాణానికి తోడ్పడతాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కరణలతోనే దేశం లబ్ది పొందుతుంది. సంస్కరణల బాట మనలను నూతన లక్ష్యాలు, కర్తవ్యాలవైపు తీసుకుపోతుంది అన్నారు. 1990 నుంచి అమలు జరుపుతున్న సంస్కరణలు దేశం అంటే జనానికి చేసిన లబ్ది ఏమిటన్నది బ్రహ్మ పదార్ధం. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్నట్లు ప్రధాని గతంలో చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో అవిచ్చిన ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇలాంటి సుభాషితాలను నమ్మే స్థితి నుంచి జనం క్రమంగా బయటపడుతున్నారు. దానికి ప్రతిరూపమే అగ్నిపథ్‌ పధకంపై తలెత్తిన నిరసన. ఆ పధకాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధం గాక బిజెపి నేతలు రెచ్చగొట్టే-కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ పేరుతో నోరు మూయించాలని చూస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !

19 Sunday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Agneepath scheme, Agneepath scheme protest, BJP, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


పెట్రోలు, డీజిలు మీద వందల రెట్లు పన్నులు పెంచి ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకే అని చెబితే నిజమే కదా అనుకొని మాట్లాడకుండా అంగీకరించారు వారు. నరేంద్రమోడీ మీద ఏర్పడిన నమ్మకం అది.
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు చేరకుండా చూస్తున్నామని చెబితే నోట్ల మార్పిడి కోసం పనులు మానుకొని బాంకుల ముందు వరుసల్లో నిలుచోవటం దేశభక్తి అని భావించారు. ఇదేమిటన్న వారిని ఎంతో అనుభవం ఉన్న నరేంద్రమోడీ అంత తెలివితక్కువ పని చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు.
రైతుల కోసం తెచ్చామని చెప్పిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు ఉద్యమించినపుడు మనం కర్షకులం కాదు కదా అని వారు ప్రేక్షక పాత్ర వహించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ సర్కార్‌ మోసం చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అధికారంలో ఉండగా వారు చేసిందీ అదే కదా ఎవరైనా అంతే అని పెదవి విరిచారు. మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నైపుణ్య అభివృద్ది పధకంతో మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచంలోనే ఉత్తమ నిపుణులుగా తయారవుతామని డాలర్‌ కలలు కన్నారు. ఎక్కడా అలాంటి జాడలు లేవు.
నాలుగుదశాబ్దాలల్లో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగులు పెరిగారన్న వార్తలు రాగానే అబ్బెఅబ్బె లెక్కలన్నీ తప్పు, సరిగా వేయలేదు, పకోడీల బండి పెట్టుకున్నవారికి కూడా ఉపాధికల్పించినట్లే కదా అని నరేంద్రమోడీ అన్నపుడు ఇదేదో తేడా కొడుతోంది అనుకున్నారు తప్ప మరొక రకంగా ఆలోచించలేదు. ఇప్పుడు మూడేండ్ల నాటి కంటే నిరుద్యోగం ఇంకా పెరిగింది.
అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంటు చేయాలని వారు రోడ్ల మీదకు వస్తే మనకేమిటి సంబంధం, అసలు పనే లేదు కదా, మనవంతు వచ్చినపుడు చూసుకుందాంలే అని పక్కన నిలబడి చూశారు వారు. ఇప్పుడు మిలిటరీలో కూడా వాటికి తెరలేపారు.
ఎన్‌పిఎస్‌(నూతన పెన్షన్‌ ) కాదు ఓపిఎస్‌(పాత పెన్షన్‌ ) కావాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే వారికి ఏదో ఒక పెన్షన్‌ ఉంది. మాకసలు ఏ ఉద్యోగమూ లేదు కదా అని పట్టించుకోలేదు వారు. ఇప్పుడు మిలిటరీలో చేరినా మూడో వంతు మందికి ఉద్యోగమూ ఉండదు, నాలుగేండ్ల సర్వీసుకు పెన్షనూ ఉండదు.
ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుంటే, తెగనమ్ముతుంటే మనకు పోతున్నదేమీ లేదు, నష్టాలు వచ్చే వాటిని అమ్మితే మంచిదే కదా అనుకున్నారు. ఇలా దేశంలో ఏం జరుగుతున్నా స్పందించకుండా పాలకుల మీద ఆశ, భ్రమలతో తమ కెరీరే ముఖ్యంగా బతుకుతున్న వారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఎత్తివేసే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేస్తామని నమ్మబలుకుతున్నారు.


దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఇంట్లో పరువు పోతోంది, బతుకుతెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం అని చూస్తే ఎక్కడా పర్మనెంటులేదు, దొరికిన పనికి సరైన వేతనమూ లేదు. గొర్రెతోక బెత్తెడు. జుమాటో, స్విగ్గీ వంటి గిగ్‌ ఉపాధే గతి,ఐనా ఆత్మగౌరవం కోసం తప్పుదనుకున్నారు. అప్రెంటిస్‌ పేరుతో ఏండ్ల తరబడి పర్మనెంటు పని చేయిస్తున్నా కలిసి రాలేదు లేదా మన ఖర్మ అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నింపరు, వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందే, దగా దగా కుడి ఎడమల దగా అన్న నిరాశలో కూరుకుపోయారు తప్ప రోడ్లెక్కలేదు. సరిగ్గా అటువంటి స్థితిలో కరోనా వచ్చింది. ఎవరూ ఏమీ చేయలేం కదా అని సరిపెట్టుకున్నారు. రెండు సంవత్సరాలుగా మిలిటరీ రిక్రూట్‌మెంట్లు లేవు. అర్హత పరీక్షలు కొన్ని పూర్తి చేసుకొని చివరి పరీక్ష, నియామకాల కోసం ఎన్నో ఆశలతో ఈ ఏడాది వాటికి సిద్దమౌతున్న స్థితిలో…….. అగ్నిపథ్‌ పేరుతో చివరికి మిలిటరీలో కూడా తాత్కాలిక ఉద్యోగాలకు తెరలేపటం అగ్గిమీద గుగ్గిలం వేసినట్లయింది. ఏటా లక్షల మందిని మిలిటరీలో చేర్చుకోరు. పరిమితమే కావచ్చుగానీ ఎన్నో ఆశలతో ఉన్నవారికి ఇది ఆశనిపాతంగా మారటంతో ఒక్కసారిగా కడుపు మండి వీధుల్లోకి వచ్చి అగ్గివీరులుగా మారారు.మిలిటరీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం కావటమే, అలాంటి తమను కాంటాక్టు సైనికులుగా మారుస్తామనే సరికి రక్తం సలసలా కాగింది.


మరిగే నీరు వంద డిగ్రీల వేడెక్కిన తరువాతే ఆవిరిగా కొత్త రూపం సంతరించుకుంటుంది. అంటే దాని అర్ధం అప్పటివరకు నీటిలో మార్పేమీ జరగలేదని కాదు. వెలుపలికి కనిపించదు. గుణాత్మక మార్పుల తరువాత పరిణామాత్మక మార్పు సంభవిస్తుంది. మంచి రోజులు తెస్తామన్న పాలకుల మాటలు నమ్మి అవి జుమ్లా అని అర్ధం అవుతున్నా దేశంలో సంవత్సరాల తరబడి అసంతృప్తి పేరుకు పోయిన యువతలో అలాంటి మార్పు ఇప్పుడు కనిపిస్తోందని చెప్పవచ్చు. 2022 జూన్‌ 14న అగ్నిపథ్‌ పధకానికి రక్షణ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిసింది. ఆ మరుసటి రోజున జెడి(యు) – బిజెపి పాలిత బీహారులో ప్రారంభమైన ఆందోళన దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. అనేక చోట్ల ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. శుక్రవారం నాడు సికిందరాబాదులో కాల్పులకు దారితీసి ఒకరిని బలిగొన్నది. శనివారం నాడు బీహార్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. విస్తరిస్తున్న ఆందోళనను నీరుగార్చేందుకు గత రెండు సంవత్సరాలుగా ఎంపికలు లేవు గనుక ఈ ఒక్క ఏడాదికి గరిష్ట వయస్సు పరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సిఆర్‌పిఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని శనివారం నాడు మరొక ప్రకటన చేశారు. అసలు ఈ పధకమే వద్దు అంటుంటే ఈ బుజ్జగింపులతో జోకొట్టాలని చూస్తున్నారు. ఈ రెండు బిస్కెట్లు కాకుండా ఇంకా ఏమైనా వేస్తారేమో చెప్పలేము.


ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచిన పదిలక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసేందుకు పూనుకున్నట్లు ప్రకటన వెలువరించటం, తరువాత అగ్నిపథ్‌ స్కీమును ప్రకటించటం ఒక ఎత్తుగడతో చేసిందే అన్నది స్పష్టం. చేదు మాత్రను మింగించటానికి పంచదార పూత పూసినట్లుగా పదిలక్షల ఖాళీల భర్తీ ప్రకటనగా భావించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పోస్టుల భర్తీ ఎంత ప్రహసనంగా ఉందో మిగతా చోట్ల దానికి భిన్నంగా ఉంటుందని అనుకోలేము. అందుకే పదిలక్షల పోస్టుల ప్రకటన నిరుద్యోగుల్లో పెద్ద స్పందన కలిగించలేదన్నది స్పష్టం. అది ఎంతకాలానికి నెరవేరుతుందో ఈ లోగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ అవుతాయో చెప్పలేము.
ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. దాని వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు, కమిషన్‌ ఏజంట్లు ఉన్నారని తప్పుడు ప్రచారం చేసినట్లుగానే అగ్నిపథ పధకాన్ని వ్యతిరేకిస్తున్న వారి వెనుక ప్రతిపక్షాలున్నట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలకే పరిమితం కాగా ఇది దేశమంతటా తలెత్తింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ వ్యవస్థలో అడితీదార్లు లేదా కమిషన్‌ ఏజంట్లను ఏ పార్టీ కూడా సమర్ధించలేదు. రైతులు ఢిల్లీలో ఏడాదిపాటు తిష్టవేస్తే దానివెనుక వారి పాత్ర ఉందంటూ బిజెపి, గోడీ మీడియాతో సహా దాని మద్దతుదార్లు పెద్ద చర్చ పేరుతో రచ్చ చేశారు. విధిలేక క్షమాపణలు చెప్పి మరీ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నారు మంచిదే, మరి సదరు ఏజంట్లను ఇంకా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎందుకు కొనసాగిస్తున్నట్లు ? వారిని తొలగించవద్దని ఏ రైతు సంఘమూ కోరలేదే ! సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామన్నారు, దాని గురించి ఊసేలేదు. రైతుల మాదిరి మోసపోయేందుకు కుర్రకారు రైతులు కాదని ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము. నిప్పుతో చెలగాటాలాడని నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడుతోందా ?


ఈ పధకాన్ని ఎందుకు తెచ్చారన్నది ప్రశ్న. తక్కువ వేతనాలతో ప్రయివేటు స్కూళ్లలో పని చేసేందుకు టీచర్లు దొరుకుతున్నపుడు ఎక్కువ వేతనాలిచ్చి ప్రభుత్వం ఎందుకు నియమించాలన్న ప్రపంచబాంకును సంతృప్తి పరచేందుకు స్కూళ్లలో విద్యావలంటీర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రైల్వేల వంటి చోట్ల పాక్షిక ప్రయివేటీకరణ, రిటైరైన సిబ్బంది నియామకాలు, వివిధ శాఖల్లో పొరుగుసేవలు, కాంట్రాక్టు సిబ్బంది, అప్రెంటిస్‌ వంటివన్నీ ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల ఫలితమే. వేతనాలు, అలవెన్సులు, సామాజిక భద్రతా పధకాల ఖర్చు లేకుండా చేసేందుకే ఇదంతా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు సైతం వర్తింపచేసి సైనికుల పెన్షన్‌ బిల్లును తగ్గించుకొనేందుకు నాలుగేండ్ల పాటు పని చేసే నియామకాలకు శ్రీకారం చుట్టింది.


2014 లోక్‌సభ ఎన్నికల తరుణంలో మాజీ సైనికులు, సర్వీసులో ఉన్న వారి కుటుంబాల ఓట్లు పొందేందుకు ఒకే రాంకు-ఒకే పెన్షన్‌ వంటి వాగ్దానాల సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగేండ్ల సర్వీసుతో అలాంటి రాంకులు ఉండవు-అసలు పెన్షనే ఉండదు. ఈ పధకంలో చేరిన వారిలో 25శాతం మందిని ప్రతిభ ఆధారంగా పర్మనెంటు చేస్తారట. అంటే శిక్షణ ముగిసిన దగ్గర నుంచి తన తోటివారిని ఎలా వెనక్కు నెట్టి తాను పర్మనెంటు ఎలా కావాలా అన్న తపన తప్ప వారిలో మరొకటి ఉంటుందా ? బుట్టలో తవుడు పోసి కుక్కలను ఉసికొల్పినట్లుగా ఉండదా ! ఇప్పటికే సివిల్‌ సిబ్బందిలో ప్రమోషన్లు, మంచి పోస్టులు, స్థలాల కోసం ఎలాంటి అవాంఛనీయపోటీ, అక్రమాలకు పాల్పడుతున్నారో తెలిసిందే. రేపటి నుంచి అదే మిలిటరీలో పునరావృతం కాదనే హామీ ఏముంటుంది.


నాలుగేండ్ల సర్వీసులో చేరి వెలుపలికి వచ్చిన వారికి సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీలో చేరేందుకు తిరిగి ఫిట్‌నెస్‌ పరీక్ష పెట్టి చేర్చుకుంటారని నమ్మబలుకుతున్నారు. ఈ బిస్కెట్లన్నీ ఎందుకు ? కొనసాగింపుగా వారిని తరువాత పారామిలిటరీ, ఇతర భద్రతా సంస్థల్లో, ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రాల సాయుధ బలగాల్లో చేరుస్తామని చెబితే గొడవే ఉండదు. రాష్ట్రాలకు శిక్షణా భారం తప్పుతుంది. వెంటనే విధుల్లోకి వచ్చే సిబ్బంది దొరుకుతారు కదా ! ఆ విధంగా వివిధ విభాగాల్లో పర్మనెంటుగా నియమిస్తామని, వారి పెన్షన్‌కు ఢోకా ఉండదని ముందుగానే హామీ ఇస్తే ఇంత జరిగేది కాదు కదా ? ఆర్మీలో ఒకసారి చేరిన తరువాత నిరంతరం ఫిట్‌నెస్‌ ఉండేందుకు చూస్తారు, తిరిగి పారామిలిటరీకి పరీక్ష ఎందుకు ? అందుకే ఇవన్నీ తప్పుదారి పట్టించే వాదనలు. దీనికి ఎలాంటి ప్రతిఘటన లేకపోతే తరువాత వంతు సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీ, ఇతర దళాలకు దీన్ని పొడిగిస్తారు. అదే బాటలో రాష్ట్రాలు ఇప్పుడున్న హౌంగార్డులకు తోడు నాలుగేండ్ల పోలీసులను ప్రవేశపెట్టవనే హామీ ఏముంది? విదేశాల్లో ఇలాంటి పద్దతి ఉంది అని చెబుతున్నారు. ఉంటే ఉండవచ్చు, విదేశాల నుంచి అన్ని అంశాలను తీసుకుంటూ దీన్ని కూడా తీసుకుంటే అదొక దారి అలా లేదే. అమెరికాలో ఇలాంటి సైనికులతో పాటు అక్కడ నిరుద్యోగులకు ఉన్న భృతి, సామాజిక భద్రతా పధకాలను ఇక్కడ కూడా ముందు ప్రవేశపెట్టి యువతకు భరోసా కల్పించిన తరువాత ఇలాంటి వాటిని ప్రవేశపెడితే అదొక తీరు, మోడీ సర్కార్‌ అలాలేదే !


రెగ్యులర్‌ ఆర్మీకి వంద మందిని ఎంపిక చేయాలంటే 1000 మందిని పిలిచి ఫిల్టర్‌ చేస్తారట. ప్రతిభావంతులైన యువకులు మిలిటరీలోకి వస్తారట. ఇప్పుడు తీసుకుంటున్నవారికి కూడా అన్ని పరీక్షలు పెట్టే తీసుకుంటున్నారు కదా ! ఆరుపదులు దాటిన వారినేమీ తీసుకోవటం లేదు కదా !యువత మరీ అంత అమాయకంగా ఉందని భావిస్తున్నారా ? ఫిల్టర్‌లో కొత్తేముంది, ప్రతి ఉద్యోగానికి, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి సీట్లకు జరుగుతున్నది అదే కదా ! కానీ అగ్నిపథ్‌లో వంద మందికి గాను ఐదు వందల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారిలో వంద మందిని పర్మనెంటు చేసి మిగతా నాలుగువందల మందికి నాలుగేండ్ల తరువాత పన్నెండు లక్షలు ఇచ్చి ఇంటికి పంపుతారని, ఇతర రంగాల్లో సర్దుబాటు చేస్తారని, నాలుగేండ్లు ఇంటి దగ్గర ఉన్నవారు ఇంత సంపాదించగలరా అంటున్నారు. దేశంలోని యువత అందరికీ ఇలాగే మిలిటరీగాక పోతే ఎవరికి తగిన రంగంలో వారికి శిక్షణ ఇచ్చి అందరికీ నాలుగేండ్ల ఉపాధి, పన్నెండు లక్షలు ఇచ్చే పధకాన్ని కూడా కేంద్రం ప్రవేశపెడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. స్వచ్చందంగా ఎవరికి నచ్చిన దానిలో వారు చేరతారు. ఎలాంటి ఆందోళనలు ఉండవు. దేశానికి నిపుణులైన పనివారు దొరుకుతారు కదా !


ఉట్టికెగరలేని వారు స్వర్గానికి ఎగరగలరా ! కరోనాలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన రైలు ఛార్జీలు ఎవరు భరించాలి అన్న చర్చకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వ పెద్దల నిర్వాకం చూసిన తరువాత ఇంతటి మహత్తర లబ్ది కల్పిస్తారని చెబితే నమ్మేదెవరు ? పకోడీల బండి ద్వారా పొందే ఉపాధి కూడా ప్రభుత్వం కల్పించినదానిలో భాగంగానే లెక్కించాలని ప్రధాని నరేంద్రమోడీ గారు సెలవిచ్చిన సంగతి మరచిపోగలమా ? కార్పొరేట్లకోసం తెచ్చిన మూడు సాగు చట్టాలను రైతుల కోసం అని నమ్మించేందుకు చూశారు, వీలుగాక క్షమాపణ చెప్పి మరీ వాటిని రద్దు చేశారు.అదే సందర్భంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా దాని ఊసులేదు. ఇలాంటి వారి మాటలు నమ్మాలని వాట్సాప్‌ పండితులు బోధలు చేస్తున్నారు. జైకిసాన్‌ అంటూనే వారికి వెన్నుపోటు పొడిచేందుకు చూసిన వారు ఇప్పుడు జై జవాన్లకు పెన్షన్‌ లేకుండా చేసేందుకు పూనుకున్నారు.


ఆందోళనలు చేస్తున్నవారు హింసాకాండకు పాల్పడటాన్ని ఎవరూ సమర్ధించరు,హర్షించరు. అలాంటి చర్యలకు పాల్పడటానికి ప్రత్యేక శిక్షణ ఎలా ఉంటుందో కళ్ల ముందే కరసేవ పేరుతో బాబరీ మసీదును కూల్చివేసిన తీరు వెల్లడించింది. భక్తులుగా వచ్చిన వారు గునపాలు, పెద్ద సుత్తులు ఎందుకు తెచ్చారు, ఎలా తెచ్చారు అని అడిగి తెలుసుకొని ఉంటే, ఈ రోజు రైళ్లు తగులబెడుతున్న వారికి అవి ఎలా దొరుకుతాయో తెలిసి ఉండేది. దేశం కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దపడి సైనిక ఎంపికలకు సిద్దం అవుతున్నవారు కడుపుమండితే ఎంతకైనా తెగిస్తారు. ఇలా చెప్పటమంటే వారిని సమర్ధిస్తున్నట్లు కాదు. బాబరీ మసీదును కూడా కడుపు మండినవారు కూల్చారుతప్ప మాకేమీ సంబంధం లేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు అప్పుడు చెప్పారు కదా ! వాట్సప్‌ గ్రూపుల ఏర్పాటు వాటి ద్వారా సందేశాలు, కుట్రల గురించి చెబుతున్నారు. నిజమే అనుకుందాం కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు ? నివారణ చర్యలేమి తీసుకున్నట్లు ?


. 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నారు. దాన్ని ముందుగా చర్చిస్తే నల్లధనం ఉన్నవారు జాగ్రత్తపడతారని చెప్పకుండా చేశారనుకుందాం. కానీ దాని గురించి కూడా ఆశ్రితులకు ముందుగానే ఉప్పందించారన్న విమర్శలు తెలిసిందే. అందుకే నల్లధనం ఒక్కపైసా కూడా దొరకలేదు. ఒకేదేశం-ఒకే పన్ను పేరుతో తగిన సన్నాహం లేకుండా తెచ్చిన జిఎస్‌టి ఎలాంటి పర్యవసానాలకు దారి తీసిందో చూశాము. జమ్ము కాశ్మీరు అసెంబ్లీ తీర్మానం, చర్చతో నిమిత్తం లేకుండా ఆర్టికల్‌ 370,ఏకంగా ఆ రాష్ట్రాన్నే రద్దు చేసిన తీరు తెలిసిందే. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయం గురించి మూడు సాగు చట్టాలను ఎంత హడావుడిగా ప్రహసన ప్రాయంగా చేసిందీ చూశాము. వాటి అనుభవం నుంచి పాఠాలేమీ నేర్చుకున్నట్లు లేదు. మిలిటరీ రిక్రూట్‌మెంటులో సమూల మార్పులను తలపెట్టి అగ్నిపథ్‌ పధకాన్ని తీసుకువచ్చే ముందు దానిలోని అంశాలను ముసాయిదా రూపంలో చర్చకు పెట్టకుండా మూసిపెట్టి ఆకస్మికంగా అమల్లోకి తీసుకురావటం ఏ రకపు ప్రజాస్వామ్యం ? అదేమీ గుట్టుగా ఉంచాల్సింది కాదు కదా !

యువతలో ఉన్న అసంతృప్తి బిజెపి-జెడియు ఏలుబడిలో ఉన్న బీహార్‌లో ఈ ఏడాది జనవరిలోనే వెల్లడైంది. రైల్వే ఉద్యోగార్దులు నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కేంద్ర పెద్దలు తమకు పార్లమెంటులో మంద మెజారిటీ ఉంది కదా అని నిరంకుశంగా ఏది బడితే అది చేసి ఆమోదం పొందాలనే ఒక అప్రజాస్వామిక వైఖరితో ముందుకు పోతున్నారు. అది కుదరదని అగ్నిపథ్‌పై స్పందన వెల్లడించింది. దీన్నుంచైనా గుణపాఠం తీసుకొని లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికవర్గంపై తలపెట్టిన దాడిని వెనక్కు తీసుకుంటారా ? ఇప్పుడు అగ్నిపథ్‌ గురించి చర్చించేందుకు సిద్దం అని కేంద్ర మంత్రి అంటున్నారు. ఎవరితో చర్చిస్తారు, ఆ పని ముందే ఎందుకు జరగలేదు. ప్రతి ఆందోళనకూ ఉన్నట్లే ఇప్పుడు తలెత్తిన ఆందోళనకు పరిమితులు ఉంటాయి. మిలటరీలో చేరాలనుకొనే వారికి భ్రమలు తొలుగుతున్నాయి. మిగతా వారు వారి మాదిరి స్పందించకపోవచ్చు. రేపు తమ ఉద్యోగాలకూ, ఉపాధికి ఇదే గతి అన్న ఆలోచనకు తాజా ఆందోళన నాంది పలుకుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ మీద పెట్టుకున్న – పెంచుకున్న భ్రమలను పటాపంచలు చేస్తుంది. ప్రతి మహానదీ ప్రారంభంలో చిన్న వాగు-వంక మాదిరే ప్రారంభం అవుతుంది. ఇదీ అంతే !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

15 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Alberto Fernández, Joe Biden, Latin America, Latin American left, Mexican Lopez Obrador, Organization of American States (OAS), Summit of the Americas 2022, The People’s Summit for Democracy


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురులేదని ప్రపంచం ముందు కనిపించేందుకు అమెరికా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల తగులుతున్న ఎదురుదెబ్బలు అంతరంగంలో అమెరికా పాలకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తున్నాయి. 2022 జూన్‌ ఆరు నుంచి పదవ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ(లాటిన్‌) అమెరికా తన వెనుకే ఉందని చెప్పుకునేందుకు చూసిన బైడెన్‌ యంత్రాంగానికి చివరికి భంగపాటే మిగిలింది. శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ చేసిన ప్రకటన అమెరికా ఒక చెంపను వాయిస్తే సమావేశానికి హాజరైన అర్జెంటీనా అధ్యక్షుడు మరో చెంప వాయించినట్లు మాట్లాడాడు.” కచ్చితంగా భిన్నమైన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశం జరగాలని మనం కోరుకుంటాం.హాజరుగాని వారి మౌనం మనల్ని సవాలు చేస్తున్నది. కాబట్టి మరోసారి ఇలా జరగకూడదు. నేను ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో జరిగే సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చే దేశాలకు మన ఖండంలోని సభ్య దేశాల హాజరుపై ఆంక్షలు విధించేే అధికారాన్ని ఇవ్వకూడదు.” అని అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చెప్పారు. లాటిన్‌ అమెరికా కరీబియన్‌ దేశాల సంస్థ(సిఇఎల్‌ఏసి) ప్రోటెమ్‌ అధ్యక్షుడిగా కూడా ఫెర్నాండెజ్‌ పని చేస్తున్నాడు.లోపెజ్‌ బాటలో బొలీవియా, హొండురాస్‌, గౌతమాలా, సెంట్‌ విన్సెంట్‌, గ్రెనడా దేశాధినేతలు నడిచారు.ఎల్‌ సాల్వడార్‌, ఉరుగ్వే నేతలు కూడా ఇతర కారణాలతో పాల్గొనలేదు.


ఇదంతా లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి క్యూబా, వెనెజులా, నికరాగువా నియంతృత్వదేశాలంటూ వాటిని ఆహ్వానించరాదన్న అమెరికా నిర్ణయానికి నిరసనే. ఈ సమావేశం ద్వారా అమెరికా సాధించదలచుకున్న లక్ష్యం ఏదైనప్పటికీ సమావేశ వేదిక మీద, వెలుపలా జరిగిన పరిణామాలు మరోసారి అమెరికా నలుగురి నోళ్లలో నానింది. ప్రత్యేకించి అమెరికా ఖండ దేశాలలో పెద్ద చర్చకు దోహదం చేసింది. దాని ద్వంద్వనీతిని బయట పెట్టింది. ఇంకేమాత్రం తమ మీద అమెరికా ఆధిపత్యం చెల్లదని లాటిన్‌ అమెరికా దేశాలు చెప్పకనే చెప్పటమే. అమెరికా పలుకుబడి బండారం ఇతర చోట్ల కూడా మరింతగా జనానికి తెలియచేసే పరిణామమిది. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌, నేటి ఉక్రెయిన్‌ సంక్షోభం అమెరికా బలహీనతలను, దాన్ని నమ్ముకుంటే నట్టేట మునగటమే అన్న పాఠం నేర్పింది.1994లో అమెరికాలోనే జరిగిన ఈ సంస్థ సమావేశాలతో పోల్చుకుంటే తాజా పరిణామాలు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద మార్పును సూచిస్తున్నాయి.


ఇటీవలి కాలంలో అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) పని తీరు తీవ్ర విమర్శలకు గురువుతోంది. అది పశ్చిమార్ధగోళంలో కేవలం అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒక పని ముట్టుగా మారిందన్నది స్పష్టం. అమెరికాతో పాటు ఈ సమావేశాల్లో ఓఎఎస్‌ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. బొలీవియాలో ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తిరుగుబాటునేత జెనీనె ఆనెజ్‌ను అధ్యక్షురాలిగా చేశారు.(ఇప్పుడు ఆమె నేరంపై విచారణ జరుగుతున్నది) దానికి ఆమెరికా దేశాల సంస్థ (ఓఎఎస్‌) మద్దతు ప్రకటించింది. ఈ దుర్మార్గానికి అండగా నిలవటంతో పాటు బొలీవియాలోని సంకేత, సకాబా ప్రాంతాల్లో ఆనెజ్‌ ఏలుబడిలో జరిగిన మారణకాండ గురించి మౌనం దాల్చిన సంస్థ ప్రధాన కార్యదర్శి లూయిస్‌ అలమగ్రో పదవిలో కొనసాగటం ఏమిటని కొందరు ప్రతినిధులు లేవనెత్తినపుడు అతగాడికి కంటిచూపు తప్ప నోట మాట లేదు. మూడు దేశాలను ప్రజాస్వామ్యం పేరుతో మినహాయించి హైతీలో మాజీ అధ్యక్షుడు జువనెల్‌ మోషే హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న ఏరియల్‌ హెన్రీ, కొలంబియాలో ప్రతిపక్షాలను ఊచకోత కోయిస్తున్న ఇవాన్‌ డూక్‌ను మానవహక్కుల పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న అమెరికా ఎలా ఆహ్వానించిందని కొందరు ప్రశ్నించారు. క్యూబా, వెనెజులా, నికరాగువా దేశాల ప్రభుత్వ నేతలను మినహాయించిన అమెరికా ఆ దేశాల ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసిన వారిని, అమెరికా ఇచ్చిన నిధులతో వివిధ సంస్థల పేరుతో అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల మీద ధ్వజమెత్తే వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించింది. మరొక సభ్య దేశం గురించి తీర్పులు చెప్పే అధికారం ఏ దేశానికైనా ఎవరిచ్చారని అనేక దేశాల ప్రతినిధులు ప్రశ్నించారు. మూడు దేశాలను మినహాయించటాన్ని ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికా దేశాల సంస్థను సంస్కరించాలని కోరారు. అనేక మంది కరీబియన్‌ దేశాధినేతలతో పాటు బెల్జి, అర్జెంటీనా, చిలీ అధినేతలు కూడా ఇదే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు.


మూడు దేశాలను ఆహ్వానించకపోవటానికి 2001లో లిమాలో జరిగిన అమెరికా ఖండ దేశాల సమావేశం ఆమోదించిన ఆర్టికల్‌ 19ని సాకుగా చూపారు. ప్రపంచ అర్ధగోళంలోని దేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఆటంకం కలిగించటానికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చేందుకు పూనుకున్న దేశాలకు భవిష్యత్‌లో జరిగే అమెరికా ఖండ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదన్నది దాని సారం. బొలీవియాలో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమావేశాన్ని నిర్వహించేందుకే దానికి అర్హత లేదు. సరిగ్గా సమావేశానికి ఒక రోజు ముందు క్యూబా, వెనెజులా, నికరాగువాలను మినహాయించినట్లు ప్రకటించటం ఆమెరికాలో స్థిరపడిన ఆ దేశాలకు చెందిన, అమెరికా ఖండదేశాల్లోని వామపక్ష వ్యతిరేకశక్తులను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోని 42దేశాల్లో నివసించే మూడోవంతు జనాభాపై చట్టవిరుద్దమైన ఆంక్షలను అమలు జరుపుతున్న అపర ప్రజాస్వామిక వాది. తనకు నచ్చని ప్రభుత్వాలను ఆ దేశాల పౌరులతోనే కూల్చివేయించే ఎత్తుగడ దీని వెనుక ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వెనెజులా మీద, తాజాగా రష్యా మీద ఆంక్షలను మరింతగా పెంచటం దానిలో భాగమే. దశాబ్దాల తరబడి క్యూబాను దిగ్బంధనానికి గురిచేసినా,వెనెజులా, నికరాగువా వంటి చోట్ల ప్రతిరోజూ కుట్రలు చేసినా దాని ఎత్తుగడలు ఎక్కడా పారలేదన్నది కూడా వాస్తవం. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, వెనెజులా, ఇప్పుడు రష్యాలకు చెందిన విదేశాల్లోని ఆస్తులు, బంగారం వంటి వాటిని స్వాధీనం లేదా స్థంభింప చేసిన తరువాత అమెరికా ఆంక్షలకు గురైన దేశాలన్నీ అమెరికా డాలరుతో సంబంధం లేని లావాదేవీల కోసం చూడటం పెరుగుతోంది తప్ప అమెరికాకు లొంగటం లేదు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందనే పేరుతో ఐరాస మానవహక్కుల సంస్థలో రష్యాకు స్థానం కల్పించకూడదనే అమెరికా తీర్మానానికి అనుకూలంగా 92 ఓట్లు వస్తే తటస్థం లేదా వ్యతిరేకంగా 13 అమెరికా దేశాలతో సహా 82 దేశాలున్నాయి. జనాభా రీత్యా చూస్తే అత్యధికులు ఈ దేశాల్లోనే ఉన్నారు.
లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి మూడు దేశాలను ఆహ్వానించకూడదన్న అమెరికా ఆలోచనలను ముందే పసిగట్టిన మెక్సికో అధినేత లోపెజ్‌ అదే జరిగితే తాను వచ్చేది లేదని ముందుగానే స్పష్టం చేశాడు. గత కొద్ది నెలలుగా బుజ్జగించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న పురోగామి శక్తుల బంధాన్ని వెల్లడించింది. లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాల్లో ఎగురుతున్న ఎర్రబావుటాల వాస్తవాన్ని గుర్తించేందుకు అమెరికా నిరాకరిస్తున్నది. గత మొరటు పద్దతులతోనే తన పెత్తనాన్ని సాగించాలని విఫలయత్నం చేస్తున్నది. వెనెజులాలో తన కుట్రలు విఫలమైన తరువాత ప్రతిపక్షనేత జువాన్‌ గుయిడో ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వాన్ని గుర్తించిన ట్రంప్‌ అవసరమైతే దాడులకు సైతం తెగబడతానన్న ప్రేలాపనలతో ఊగిపోయాడు. ప్రస్తుత బైడెన్‌ అలా నోరుపారవేసుకోకపోయినా అదేబాటలో నడుస్తున్నాడు. మదురోను తిరస్కరించినా గుర్తించిన జువాన్‌ గుయిడోను ఆహ్వానించే సాహసం చేయలేకపోయాడు.


వామపక్ష శక్తులు అనేక చోట్ల అధికారానికి వస్తుండటం, తాము బలపరిచిన మితవాద శక్తులను జనాలు తిరస్కరిస్తుండటాన్ని గమనించిన తరువాత అక్కడి పరిణామాలు అమెరికన్లకు మింగుడుపడటం లేదు,వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో దానికి తోచటం లేదు. తాజాగా కొలంబియా ఎన్నికల్లో కూడా మితవాదశక్తులకే అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలస వచ్చే వారిని అడ్డుకొనేందుకు అడ్డుగోడ నిర్మాణంతో సహా ట్రంప్‌ తీసుకున్న చర్యలన్నింటినీ బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా ఖండదేశాల మధ్య వలసలు ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేసిన శిఖరాగ్రసభకు అన్ని దేశాల నేతలు వచ్చినపుడే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది. అమెరికాకు మెక్సికో, గౌతమాలా, ఎల్‌సాల్వడార్‌, హొండురాస్‌ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తారు. ఈ దేశాలనేతలెవరూ లేకుండానే సమావేశాలు ముగిశాయి.


అమెరికా ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాలు, వైఖరిని నిరసిస్తూ లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశానికి పోటీగా అదే తేదీల్లో అదే నగరంలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు, ఉద్యమాల ప్రతినిధులతో పోటీగా ” ప్రజాస్వామ్యం కోసం ప్రజాశిఖరాగ్ర సమావేశాలు ” జరిగాయి. వివిధ అంశాలను చర్చించటంతో పాటు అమెరికా వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కూడా చేశారు. జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు మెక్సికోలోని తిజువానాలో కార్మికుల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కూడా వివిధ దేశాలకు చెందిన వారితో పాటు అమెరికా వీసాలు నిరాకరించిన క్యూబా, వెనెజులా, నికరాగువా తదితర దేశాల ప్రతినిధులు ఇక్కడ పాల్గన్నారు. రెండు సమావేశాల్లో అమెరికా నిరంకుశ పోకడలతో పాటు వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఎలా సమీకరించాలో కూడా చర్చించారు. అమెరికా ఖండాల ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాస్‌ ఏంజల్స్‌ సమావేశాల్లో భౌతికంగా, ఆన్‌లైన్‌లో 250 సంస్థలకు చెందిన వారు భాగస్వాములైనారు. ఈ సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అధికారిక సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ కంచెవేసి నిరసనకారులను అడ్డుకున్నారు. నగరంలోని ఒక కాలేజీలో వేదికను ఏర్పాటు చేసుకొని వివిధ అంశాలపై ప్రజాసంస్థలు చర్చలు జరిపాయి. అమెరికా పెత్తందారీ పోకడలకు గురవుతున్న దేశాలకు బాసటగా నిలుస్తామని దీక్ష పూనాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర గాళ్ల దురుసు మాటలు – నోరు విప్పని నరేంద్రమోడీ !

10 Friday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Fringe elements, Narendra Modi, Narendra Modi Failures, Nupur Sharma, Qatar, RSS

ఎం కోటేశ్వరరావు


బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్‌ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్‌ శర్మ, మహమ్మద్‌ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్‌ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.


ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్‌ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్‌ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.


జకీర్‌ నాయక్‌ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్‌ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్‌ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్‌ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్‌ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేత రామ్‌ మాధవ్‌ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్‌ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్‌ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్‌ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !


నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్‌ జిహాద్‌ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్‌ 18 ఛానల్లో అమన్‌ శర్మ అనే యాంకర్‌ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్‌ పేరుతో ఉన్న వారు హనుమాన్‌ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్‌ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.


పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్‌ జైన్‌ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్‌ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్‌ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ సెలవిచ్చారు.


అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్‌ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్‌ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్‌ సింగ్‌ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్‌ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.


కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్‌ దళ్‌ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్‌, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్‌ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్‌ పోర్టల్‌ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్‌ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.


ధర్మ సంసద్‌ తరువాత సుదర్శన్‌ న్యూస్‌ అధినేత సురేష్‌ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్‌ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్‌ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్‌ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్‌ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్‌ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్‌ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.


నూపూర్‌ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్‌ మునిదాస్‌ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్‌ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్‌ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్‌ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్‌ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్‌ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్‌ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?


నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్‌ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్‌ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్‌ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్‌ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్‌ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్‌ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఫ్రింజ్‌ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి నేతల నోటి తుత్తర ఎంత పని చేసిందీ – ఉపరాష్ట్రపతి వెంకయ్యకు అవమానం !

06 Monday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, Nupur Sharma, Prophet Muhammad, RSS


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ నోటి తుత్తర లేదా అదుపులేని తనం కారణంగా తెలుగువాడైన మన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి అవమానం జరిగింది. కతార్‌ పర్యటనలో అధికారిక రాత్రి విందును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. కతార్‌ ఉప ఎమిర్‌ (రాజు)కు కరోనా అన్న అనుమానం అని దానికి సాకు చెప్పారు. ఇప్పటి వరకు ముస్లిం విద్వేష ప్రకటనలు మన అంతర్గత అంశంగా ఉండగా ఇప్పుడు మహమ్మద్‌ ప్రవక్త మీద దాడితో ” మన దేశ ప్రతిష్టను ” నరేంద్రమోడీ అనుచరులు అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారు. ఇస్లామిక్‌ దేశాల్లో మన దేశం గురించి పతాకశీర్షికల్లో వార్తలు వెలువడ్డాయి.దీంతో కతార్‌, కువైట్‌లోని కొన్ని దుకాణాల నుంచి మన దేశ వస్తువులను తొలగించినట్లు బిబిసి పేర్కొన్నది.ఒమన్‌ గ్రాండ్‌ మప్తీ కూడా మన దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.


మహమ్మద్‌ ప్రవక్త గురించి అనుచితంగా మాట్లాడిన బిజెపి నేత నూపూర్‌శర్మ (ఆమె ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌పై పోటీచేశారు) మీద ఇంతవరకు ఎలాంటి కేసులు లేవు. రెచ్చగొట్టిన ఆమె మాటలతో తలెత్తిన ఉదంతాల్లో మాత్రం ఎందరి మీదో కేసులు నమోదు చేశారు. మే 27వ తేదీన గ్యాన్‌వాపి మసీదు పేరుతో చర్చ జరిపిన టైమ్స్‌ నౌ ఛానల్‌లో మాట్లాడిన నూపూర్‌ శర్మ మాటలను కోట్లాది మంది చూశారు. అనుచితంగా మాట్లాడుతున్న ఆమెను సదరు ఛానల్‌ మోడరేటర్‌ నివారించలేదు, అలాంటి మాటలు మాట్లాడటం తమ ఛానల్‌ వైఖరి కాదు అని కూడా ప్రకటించలేదు. ముందే చెప్పుకున్నట్లు నూపూర్‌ మీద గాని సదరు ఛానల్‌ మీద గానీ ఎలాంటి కేసులు లేవు. చర్చలో నూపూర్‌ శర్మ మాటలున్న భాగాన్ని తీసుకొని తీసుకొని ట్వీట్‌ చేసిన ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ మీద మాత్రం కేసులు పెడతారు. మామ తిట్టటం కాదు దాన్ని చూసిన తోడల్లుడు కిసుక్కున నవ్వటం ఘోరం అన్నట్లుగా లేదూ !


ముస్లింలు, ఇస్లాం గురించి ఎంత విద్వేషపూరితంగా మాట్లాడితే అంత దేశభక్తి. మేకిన్‌ ఇండియా అంటే కుప్పలు తెప్పలుగా అలాంటి వివాదాలు, మాటల సృష్టే అన్నట్లుగా మారింది. బిజెపి ఫ్యాక్టరీలో పని చేస్తున్న నూపూర్‌ శర్మ ఉత్పత్తి కాన్పూర్‌లో హింసాకాండకు, కేసులకు దారి తీసింది. పలుచోట్ల ముస్లింలు తమ ప్రవక్తమీద మాట్లాడిన అనుచిత పదజాలానికి నిరసన తెలుపుతున్నారు. ఇంత జరిగినా కేంద్ర ప్రభుత్వానికి లేదా, బిజెపిలో ఎలాంటి స్పందన లేదు. కానీ నూపూర్‌ శర్మ నిర్వాకం ఇస్లామిక్‌ దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మన దేశపు సరకులను బహిష్కరించాలన్న పిలుపులు వెలువడ్డాయి. కొన్ని ప్రభుత్వాలు అధికారికంగా స్పందించి మన రాయబారులను పిలిపించి ఇదేం పని అని మందలించటం, నిరసన తెలుపుతున్నాయి. క్షమాపణ చెప్పాలని కోరాయి. ఇంత జరిగిన తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు నష్ట నివారణకు పూనుకున్నారు. మేనెల 27న నూపూర్‌ శర్మ మాట్లాడితే అది పార్టీ విధానం కాదంటూ జూన్‌ ఐదున ఆమెను సస్పెండ్‌ చేయటాన్ని ఏమనాలి ! అందుకే ఈ చర్యలోగానీ, తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటనలో గానీ ఎక్కడా చిత్తశుద్ది కనపడదు.


నూపూర్‌ శర్మ ట్వీట్‌ ద్వారా చేసిన ప్రకటన ఇలా ఉంది.” మన మహదేవ్‌ను అవమానిస్తూ, అగౌరవపరుస్తూ కొనసాగుతున్న టీవీ చర్చలకు నేను గత కొద్ది రోజులుగా హాజరువుతున్నాను. కనిపించింది శివలింగం కాదు ఒక ఫౌంటెన్‌ అని వెక్కిరింతగా మాట్లాడుతూ ఢిల్లీలో రోడ్లపక్క ఉన్న స్థంభాలు, చిహ్నాలంటూ శివలింగాన్ని అపహాస్యం కూడా చేస్తున్నారు.మన మహదేవ్‌ను ఇలా అవమానించటం, అగౌరవపరచటం కానసాగటాన్ని నేను సహించలేను. దానికి స్పందనగానే నేను కొన్ని అంశాలను చెప్పాను. నా మాటలు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగించినా ఎవరి మత భావాలనైనా గాయపరిచినా, ఏదైనా కానివ్వండి బేషరతుగా నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను. ఎవ్వరి మతభావనలను గాయపరచటం నా ఉద్దేశ్యం కాదు.” అని పేర్కొన్నారు. ఈ పశ్చాత్తాపం కలగటానికి తొమ్మిది రోజులు పట్టిందంటే అసలు కథేమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటి ? ఆ సుభాషితాన్ని పూర్తిగా వివరించనవసరం లేదు. వికీపీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అయిషా అనే ఆరేండ్ల బాలికను మహమ్మద్‌ ప్రవక్త వివాహం చేసుకున్నట్లు, ఆమెకు తొమ్మిదేండ్లు వచ్చిన తరువాత సంసారం చేసినట్లు నూపూర్‌శర్మ చెప్పినట్లుగా ఉంది.గ్యానవాపి మసీదులో కనిపించింది ఏమిటో అధికారికంగా నిర్ధారించిన తరువాత అది శివలింగమా-ఫౌంటెనా అన్నదాని గురించి ఎవరి అభిప్రాయం చెప్పుకోవచ్చు. బిజెపి అధికారికంగా ఎక్కడా శివలింగమే అది అని తాము నమ్ముతున్నట్లు ఇంతవరకు చెప్పలేదు. పోనీ దాని గురించి చర్చలో మహమ్మద్‌ ప్రవక్త ప్రస్తావన అవసరం ఏమిటి ?


తన నోటితుత్తర కాన్పూర్‌లో హింసాకాండకు దారి తీసినందుకు నూపూర్‌ శర్మ ఎలాంటి విచారం ప్రకటించలేదు, వివరణ ఇచ్చేందుకు కూడా పూనుకోలేదు. తన మాటలను ఉటంకిస్తూ ఆల్ట్‌ న్యూస్‌ మహమ్మద్‌ జుబేర్‌ విడుదల చేసిన వీడియో చూసిన వారు తన మాన ప్రాణాలను హరిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు అతనే బాధ్యత వహించాలని, తన మాటలను వక్రీకరించి అసందర్భంగా చూపారని ఆరోపించారు. ఒక వేళ అదే నిజం అనుకుంటే తన మాన ప్రాణాలకు నిజంగా ముప్పు తలెత్తిందని భావిస్తే తాను మాట్లాడిన వీడియోను తీసుకొని తానే దాన్ని విడుదల చేసి జనాల్లో తలెత్తిన అనుమానాలను తీర్చవచ్చు, అదేమీ ఆమె వైపు నుంచి లేదు. తామెలాంటి మార్పులు చేయలేదని ఆల్ట్‌ న్యూస్‌ మరొక ప్రతినిధి ప్రతీక్‌ సిన్హా స్పష్టం చేశారు. నూపూర్‌ శర్మ వ్యాఖ్యలు ప్రపంచమంతటా ముఖ్యంగా గల్ఫ్‌ ఇస్లామిక్‌ కౌన్సిల్‌ దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో బిజెపికి పైసా ఖర్చు లేకుండా ఎంతో ప్రచారాన్నిచ్చాయి.దాంతో ముస్లింలు అధికంగా ఉండే దేశాలను సంతుష్టీకరించేందుకు నరేంద్రమోడీని పురికొల్పాయి. కతార్‌ ప్రభుత్వం మన రాయబారిని పిలిపించి తక్షణమే ఖండించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అనేక దేశాల్లో కూడా అదే జరిగింది. అయితే ఆ మాటలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, నోటి తుత్తర శక్తులు చేసిన వ్యాఖ్యలని మన రాయబారులు, విదేశాంగశాఖ సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది.


నూపూర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు తప్ప బహిష్కరించలేదు. ఢిల్లీకి చెందిన మరొక బిజెపి నేత నవీన్‌ జిందాల్‌ చేసిన ఒక ట్వీట్‌లో మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచినందుకు పార్టీ నుంచి తొలగించారు. అతగాడు తన ట్వీట్‌ను తొలగించినప్పటికీ చర్యతప్పలేదు. ఇటీవల పార్టీల్లో పదవుల పందారం జరిగినపుడు అధిష్టానం వారిపేరుతో విడుదల చేసే లేఖలను ప్రదర్శించటం మీడియాలో ఒక ధోరణిగా మారింది. దాని కొనసాగింపులోనే కొన్ని ఛానళ్లు, వెబ్‌సైట్‌లు నూపూర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌కు రాసిన లేఖలను ప్రదర్శించాయి, వాటిలో వారి చిరునామాలున్నాయి. తన కుటుంబానికి హాని ఉన్నందున తన చిరునామాను వెల్లడించవద్దని నూపూర్‌ శర్మ మీడియాను కోరారు. తాను పోలీసు రక్షణ కోరినట్లు జిందాల్‌ పేర్కొన్నారు. ఎఎన్‌ఐ వార్తా సంస్థ ఆ లేఖను తొలగించింది. అయితే అప్పటికే ఆమె అడ్రస్‌ జనాలకు కేరింది. అసలు చిరునామాలను చెరపకుండా బిజెపి ఆఫీసు నుంచి మీడియాకు ఆ లేఖలు ఎలా వచ్చాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.


ధర్మ సంసద్‌ల పేరుతో జరిపిన సభల్లో హిందూత్వ నేతలు ముగ్గురు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల గురించి ఆల్ట్‌ న్యూస్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ చేసిన ట్వీట్లకు గాను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు పెట్టారు. ఈ చర్యను పదకొండు డిజిటల్‌ న్యూస్‌ సంస్థలతో కూడిన డిజిపబ్‌ న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఖండించింది.విద్వేష ప్రసంగాలు చేసిన వారిని వదలివేసి వారి మాటలను జనాలకు నివేదించిన జర్నలిస్టులను వేధించటం తగనిపని అని పేర్కొన్నది.హిందువుల మనోభావాలను కించపరిచినట్లు, ఐటి చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు ఆరోపించారు. మే నెల 27న జుబేర్‌ చేసిన ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.” ఇప్పటికే యాంకర్లు స్టూడియోలనుంచి ఎంతో చేస్తుండగా ఒక సామాజిక తరగతికి లేదా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు యతి నరసింగానంద సరస్వతి, మహంత్‌ బజరంగ్‌ లేదా ఆనంద స్వరూప్‌ వంటి విద్వేషం వెదజల్లే వారికి ధర్మసంసద్‌లను ఏర్పాటు చేయటం ఎందుకు ?” అని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను చూసినపుడు అసలేం జరుగుతోంది అన్న సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో మన దేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులుగా పని చేస్తున్నారు. ఆర్ధికంగా ఆ దేశాలతో అనేక లావాదేవీలు కూడా పెద్దఎత్తునే ఉన్నాయి. బిజెపి నేతల నోటి తుత్తర ఈ సంబంధాల మీద రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ముందుకు తెచ్చిన 80-20 ప్రచారం ఒక అంశాన్ని స్పష్టం చేసింది. తమకు ఇరవైశాతం ముస్లింల ఓట్లు పడకపోయినా ఫరవాలేదని, మెజారిటీ హిందువులు తమను శాశ్వతంగా అధికారంలో కూర్చోబెడతారనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానికి నిదర్శనంగానే ఎక్కడా ముస్లిం అభ్యర్ధులను నిలపటం లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాలు అవసరం గనుక, తన ప్రతిష్టకు మచ్చపడకుండా చూసుకొనేందుకు ఎత్తుగడగా నరేంద్రమోడీ నాయకత్వం ఇప్పుడు ఇద్దరు బిజెపి నేతల మీద చర్యలు ప్రకటించటం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పన్ను తగ్గింపు ఆవిరి – మరోసారి చమురు ధరల మోత !

31 Tuesday May 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు (మే 31వ తేదీ) అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ధర మరోసారి 124 డాలర్లు దాటింది. 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా 2021-22లో అది 79.18 డాలర్లకు పెరిగింది.వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103 డాలర్లుంది. మే నెలలో 108.61డాలర్లకు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పాలనా కాలంలో ఒక లీటరు పెట్రోలు, ఒక లీటరు డీజిలు కొనుగోలు చేస్తే జనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రు.9.48, రు.3.56 మొత్తం రు.13.04. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి జనాలకు మంచి చేసేందుకు గాను దాన్ని రు.32.98, రు.31.83 మొత్తం రు.64.81కు పెంచారు. బిజెపికి చెడు రోజులు రాకుండా చూసుకొనేందుకు దీనిలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒకసారి, 2022లో తగ్గించిన మొత్తం రు.29. అంటే నిఖరంగా ” మంచిరోజుల కోసం ” ఇంకా రు.35.81 పిండుతూనే ఉన్నారు. నరేంద్రమోడీ ఏలుబడి మీద ఇంకా భ్రమలున్నవారికి, భజన చేస్తున్నవారికీ ఈ వివరణ కాస్త చిరాకు తెప్పించటం సహజమే. ఎందుకంటే శ్రీలంక పరిణామాలను గుర్తు చేస్తాయి మరి. గతంలో 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింపచేసిన మోడీ సర్కార్‌ ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి మరోసారి ధరల సవరణ నిలిపివేసింది. దీనివలన తమకు పెట్రోలు మీద లీటరుకు రు.13, డీజిలుకు రు.24 నష్టం వస్తోందని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని ధరలు పెంచి పూడ్చారు. ఇప్పుడు మరోసారి కొంత కాలం తరువాత అదేపని చేస్తారు. జనాలకు ఒరిగేదేమీ ఉండదు. మార్చినెల 21 వరకు 137 రోజుల పాటు స్థిరంగా ఉంచి ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 ధరను ఏప్రిల్‌ ఆరు నాటికి రు.105.41కి, డీజిలు ధరను రు.86.67 నుంచి రు.96.67కు పెంచారు. అంతకు ముందు రెండింటి మీద కేంద్రం రు.15 పన్ను తగ్గించి, మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రు.20 ధర పెంచింది. ఇటీవల రు.14 తగ్గించారు, తరువాత ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. వాటిలో అమెరికా చమురు రాజకీయం కూడా ప్రధానమైనదే. ఆంక్షలు, అలకలు ఏదో ఒక కారణంతో ఐరోపా దేశాలు రష్యానుంచి ముడిచమురు కొనుగోలును తగ్గించేందుకు పూనుకున్నాయి. ఇదే సమయంలో చైనా, భారత్‌ రికార్డు స్థాయిలో దిగుమతులు పెంచాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్‌ పేర్కొన్నది. మే నెలలో సముద్రాల మీద ప్రయాణంలో లేదా లంగరు వేసి ఉన్న ఓడల్లో 79 మిలియన్ల పీపాల రష్యా చమురు ఉంది. ఫిబ్రవరి నెలలో 27మిలియన్ల పీపాలుంది.ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు రష్యా ప్రధానంగా ఐరోపాకే చమురు ఎగుమతి చేసేది. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేసేది లేదంటూ చైనా, మన దేశం ఇప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మార్చినెలలో మన దేశానికి చమురు సరఫరా చేసిన దేశాలలో రష్యా పదవ స్థానంలో ఉండగా ఏప్రిల్లో నాలుగవ స్థానానికి చేరిందని చమురు టాంకర్ల సమాచారం వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ కారణంగానే ఆ దిగుమతులను నిలిపివేయాలంటూ మరోసారి మన మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా పూనుకుంది.ఆసియాలోని కొందర్ని రాజకీయవైఖరి కంటే ఆర్ధిక అంశాలే కొనుగోలుకు పురికొల్పినట్లు సింగపూర్‌లోని కెప్లర్‌ సీనియర్‌ విశ్లేషకుడు జేన్‌ షీ అన్నారు. గతంలో ఒకశాతంగా ఉన్న మన రష్యా దిగుమతులు ఇప్పుడు ఆరుశాతానికి చేరినట్లు, మార్చి నెలలో రోజుకు 66వేల పీపాల దిగుమతి మరుసటి నెలలో 2,77,000కు పెరిగినట్లు, మే నెలలో అది 4,87,500కు పెరుగుతుందని రాయిటర్స్‌ వార్త వెల్లడించింది. ఆఫ్రికా నుంచి మనదేశం చేసుకుంటున్న దిగుమతులు 14.5 నుంచి ఆరుశాతానికి తగ్గాయి, అమెరికా నుంచి మూడుశాతం తగ్గాయి.


రష్యాపై తాను విధించిన ఆంక్షలను అందరూ అనుసరించేట్లు చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన మేరకు మన దేశం మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా సహాయ మంత్రి ఎలిజబెత్‌ రోజెన్‌బర్గ్‌ ఢిల్లీ, ముంబాయి నగరాలకు రానున్నారు. రష్యామీద ఆంక్షలను మరింత కఠినతరంగావించనున్నారనే వార్తల నేపధ్యంలో అమెరికా వత్తిడి పెంచుతోంది. ఆసియా కొనుగోళ్లను అడ్డుకుంటే తప్ప ఆంక్షల వలన ఫలితం ఉండదని ఇప్పటికే తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటికీ ఆసియా ఓడలద్వారా ఎగుమతులు 50శాతం పెరిగాయి. జనవరిలో రోజుకు 15లక్షల పీపాలు పంపితే ఇప్పుడు 23లక్షలకు చేరింది. మొత్తం మీద ఫిబ్రవరి 24కు ముందు స్ధాయికి ఎగుమతులు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు.


అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు ఇప్పుడు అమెరికాకు లాభదాయకంగా మారాయి. చమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చూసినపుడు డాలరు విలువ ఎక్కువగా ఉంటే చమురు ధర తక్కువగానూ చమురు ధర పెరిగితే డాలరు విలువ తక్కువగానూ ఉండేది. అమెరికా గతంలో చమురును దిగుమతి చేసుకొనేది ఇప్పుడు షేల్‌ చమురు ఉత్పత్తితో ఎగుమతిదారుగా మారింది. ప్రపంచ ఉత్పత్తి దేశాల్లో ఒకటో స్ధానంలో ఉంది. గతంలో చమురు దిగుమతి చేసుకున్నపుడు ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తానే ఎగుమతి చేస్తున్నందున ధర ఎక్కువగా ఉంటే ఆర్ధికంగా పెద్ద లబ్దిపొందుతోంది. చమురు ఉత్పత్తి మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉన్నందున వారికి ఎంత ధర పెరిగితే అంతగా లాభాలు వస్తాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోయటం ద్వారా రష్యాను దెబ్బతీసి ఐరోపా చమురు మార్కెట్‌ను తాను ఆక్రమించాలని చూస్తోంది. అది కొంత మేరకు ఇప్పటికే ఫలించింది. ఇటీవల ప్రపంచంలో చమురు ధరతో పాటు అమెరికా డాలరు విలువా పెరుగుతోంది. అమెరికా సరకులు కొనుగోలు చేయాలంటే దిగుమతి చేసుకొనే దేశాలకు భారం పెరుగుతుంది. కనుక నిత్యం ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలను రాజేసి ఆయుధాలను అమ్ముకొని లబ్దిపొందుతున్నది. అవి లేకపోతే దాని వాణిజ్యలోటు ఇంకా పెరుగుతుంది. చైనా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇతర సరకులను దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ది పొందుతున్నది. ఇదే సమయంలో ఖరీదైన తన వస్తువులను అంటగట్టేందుకు బెదిరింపులకు దిగుతోంది. అమెరికా చెలగాటం మన వంటి దేశాల జనాలకు ప్రాణసంకటం కలిగిస్తోంది.


గతంలో చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అమెరికా కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా ఎత్తుగడ కారణంగా ఐరోపా సంక్షోభ కేంద్రంగా మారింది. ఇప్పుడున్న స్థితిని బట్టి రానున్న రోజుల్లో బొగ్గు, చమురు, గాస్‌ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని వలన అమెరికా కంటే ప్రపంచ ఆర్ధికవృద్ది ఎక్కువగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు డాలరు విలువ పెరుగుతుందని కూడా జోశ్యం చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ నిధుల నిల్వలను పెంచినపుడల్లా వడ్డీరేటు పెరుగుతుంది. డాలరును సురక్షితమైనదిగా భావిస్తున్నందున మిగతా కరెన్సీల కంటే డాలర్ల వైపే మొగ్గుచూపుతారు. మదుపుదార్లు అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందని భావించగానే వాటిని అమెరికాకు తరలిస్తారు. అది అమెరికాకు లబ్ది చేకూరుస్తుంది. తనకు విదేశీ పెట్టుబడులు అవసరమైనపుడు కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్న కారణంగా రూపాయి విలువ పతనమైంది. దాన్ని నిలబెట్టేందుకు రిజర్వుబాంకు నానా కష్టాలు పడుతోంది. రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి, చమురుతో సహా దిగుమతుల ధరలు పెరుగుతాయి.2021 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో మన వాణిజ్యలోటు 12.75బిలియన్‌ డాలర్లు, అది 2022 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో 87.79బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో అది వంద బిలియన్‌ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడున్నదానికంటే మరింతగా పడిపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. 2020-21లో మన చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్‌ డాలర్లు కాగా 2021-22లో అది 119.2 బి.డాలర్లకు చేరింది.


ఇటీవల ఎడిపి(రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్స్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022 అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా తమ వేతనాలను పెంచాలని తమ యజమానుల మీద వత్తిడి తెచ్చేందుకు 86శాతం మంది భారతీయ కార్మికులు సిద్దం అవుతున్నారని తేలింది. ఈ సంస్థ 17దేశాల్లో సర్వే చేసింది. ప్రపంచ వ్యాపితంగా వేతన పెంపుదలను కోరుతున్న వారు సగటున 76శాతం కాగా భారత్‌లో అది 86శాతం ఉంది.బిజెపి వారు పదే పదే చెబుతున్న ”80” శాతంలో ఉన్నవారు వీరిలో కూడా అదే దామాషాలో ఉంటారని, వారికి వేరే వెండి పళ్లాల్లో వడ్డించరని చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత వేతనాలు పెంచుతారనే భావనలో ఉన్నారని ఎడిపి భారత విభాగం ఎండి రాహుల్‌ గోయల్‌ చెప్పారు.యజమానులు పట్టించుకోకపోతే కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాల మీదకు మళ్లుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఏదో ఒక పేరుతో ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పని చేయించుకోవటం పెరిగింది. 2020లో మన దేశంలో వారానికి సగటున 7.3 గంటలు పని చేస్తే 2021లో అది 8.5గంటలకు పెరిగింది. ప్రపంచ సగటు 9.2 గంటలు. ఈ దోపిడీకి ధరల పెరుగుదల తోడైతే బతుకు దుర్భరమే. ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్న కారణాల్లో చమురు ధర ఒకటి. అందువలన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ ఏలుబడిలో ఉన్నామనే భ్రమలతో బతుకుతున్నవారు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కొసమెరుపు ఏమంటే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను మరింతగా పెంచాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించిన నేపధ్యంలో చమురు ధరలు 130 డాలర్లకు పెరగవచ్చని ఆ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

27 Friday May 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, Modi Govt @ 8, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన గురించి కొన్ని అంశాలను మొదటి భాగంలో విశ్లేషించాము. మరికొన్ని అంశాలను ఈ భాగంలో చూద్దాము. 2025 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోయి, ప్రపంచంలో మూడో స్థానంలో నిలబెడతానని 2019లో నరేంద్రమోడీ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 2028 నాటికి 4.92లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఐదు లక్షల కోట్లు కావాలంటే 2029లోనే సాధ్యమని ఐఎంఎఫ్‌ తాజాగా ప్రకటించింది. తరువాత 2027 అని సవరించింది. అప్పటికి నరేంద్రమోడీ అధికారంలో ఉంటారో లేదో కూడా తెలియదు.2028నాటికి రూపాయి విలువ 2022లో 77.7 నుంచి 94.4కు పతనం కానుందని కూడా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. మరోవైపు మన అధికారులు మాత్రం 2025-26 లేదా మరుసటి ఆర్ధిక సంవత్సరానికి ఐదులక్షల డాలర్లకు చేరతామని అంటున్నారు. ఇక్కడ సమస్య ఎంతకు, ఎప్పుడు చేరుతుందని కాదు, దాని వలన జనానికి ఒరిగేదేమిటి ? ఉపాధి రహిత, వేతన పెంపుదల లేని ఆర్ధిక వ్యవస్థలో సంపదలు పోగుపడితే చెప్పుకోవటానికి గొప్పగా ఉండవచ్చు, కుహనా జాతీయ వాదులను సంతృప్తి పరచవచ్చు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020 నుంచి 2027వరకు తలసరి జిడిపి డాలర్లలో ఇలా ఉండనుంది.
దేశం××× 2020×× 2021×× 2022×× 2023×× 2024×× 2025×× 2026×× 2027
భారత్‌×× 1,935 ××2,185××2,342××2,527××2,720××2,929×× 3,138××3,350
బంగ్లాదేశ్‌× 1,962 ××2,147××2,363 ××2,588××2,814××3,056××3,315××3,587
చైనా×× 10,525 ××12,359××14,029××15,486××16,740××17,991××19,312××20743
తొలిసారి 2020లో భారత తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిందని చెప్పటాన్ని కూడా బిజెపి నేతలు దేశద్రోహం అన్నట్లు చిత్రించారు. కావాలంటే బంగ్లాదేశ్‌కు వెళ్లమని చెప్పారు. ఐఎంఎఫ్‌ చెప్పినదాని ప్రకారం 2021 మినహా 2027వరకు మనకంటే బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి ఎక్కువగా ఉండనుంది. ఇదేమైనా అంకెల గారడీనా ? కరోనా కారణమా ? కానేకాదు.2014లో బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి 1,119 మన దేశంలో 1,574 డాలర్లు ఉంది. మనదేశం ఇతర చోట్ల నుంచి పత్తి దిగుమతి చేసుకొని బంగ్లా పాలకులు దుస్తుల ఎగుమతుల మీద కేంద్రీకరిస్తే మన పాలకులు వాటి బదులు వస్త్రధారణ వివాదాల మీద కేంద్రీకరించటమే అసలు కారణం అని చెప్పవచ్చు. సిఇఐసి సమాచారం ప్రకారం కార్మికశక్తి భాగస్వామ్యం 2021లో మన దేశంలో 45.6శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 57, చైనాలో 68.1శాతం ఉంది.పాకిస్తాన్‌లో 50.1శాతం ఉంది. సిఎంఐఇ సమాచారం ప్రకారం 2022 మార్చినెలలో మన దేశంలో కార్మిక భాగస్వామ్యం 39.5శాతం ఉంది. 2018లో నిరుద్యోగం నాలుగుదశాబ్దాల గరిష్ట స్దాయికి చేరితే తరువాత పెరగటమే తప్ప తగ్గింది లేదు. పని చేసే అవకాశాలు, చేసే వారు పెరగకుండా జిడిపి పెరగదు కదా ! గ్రామీణ ప్రాంతాల్లో పని తగ్గిపోతున్న కారణంగా 2013లో గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద పని చేసిన వారితో పోల్చితే తాజాగా లెక్కల ప్రకారం నాలుగు రెట్లు పెరిగారు. కరోనా కాలంలో ఎనభై కోట్ల మందికి నెలకు తాము ఆరుకిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చామని బిజెపి నేతలు ఒక ఘనతగా చెప్పుకుంటారు. దాన్ని తిరగేసి చూస్తే జనాన్ని ఎంతగా దరిద్రంలో ఉంచారన్నది వెల్లడిస్తున్నది.


నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రపంచంలో ఇంతవరకు నరేంద్రమోడీ తప్ప ఏ పాలకుడూ కరెన్సీని రద్దు చేయలేదు.పోనీ ఇంత చేసి సాధించిందేమైనా ఉందా అంటే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. జనానికి ఇబ్బందులు, ఆర్ధిక రంగాన్ని కుదేలు చేయటం తప్ప జరిగిందేమీ లేదు. మొత్తం నోట్లలో 99.3శాతం బాంకులకు తిరిగి వచ్చాయి, మిగిలినవి కూడా అనేక మందికి తెలియక డిపాజిట్‌ చేయకపోవటం వంటి కారణాలు తప్ప మరొకటి కాదు. ఈ తప్పిదానికి మన్నించమని నరేంద్రమోడీ జనాన్ని కోరలేదు, అసలు ఉలుకూపలుకు లేదు. దేశంలో నల్లధనం ఎప్పటి మాదిరే తనపని తాను చేసుకుపోతున్నదని అందరికీ తెలిసిందే.2016నవంబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం జరిగే కాబినెట్‌ సమావేశానికి మంత్రులెవరూ సెల్‌ఫోన్లు తీసుకురావద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి, కానీ కొందరు ఆశ్రితులకు ముందే ఈ సమాచారాన్ని చేరవేశారని, వారంతా జాగ్రత్త పడినట్లు తరువాత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


నరేంద్రమోడీ వాగ్దానం చేసిన అచ్చేదిన్‌ (మంచి రోజులు)కు అర్ధం ఏమిటో ఇంతవరకు తెలియదు.అమెరికా సంస్ధ పూ అంచనా ప్రకారం 2021 నుంచి ఇప్పటికి రెండున్నర కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, ఏడున్నర కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేసినప్పటికీ గత దశాబ్దకాలంలో ఏటా 43లక్షలకు మించలేదు. ఎనిమిదేండ్ల నాటి ధరల పెరుగుల రికార్డులను ఏక్షణంలోనైనా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అంటే జనాలకు చచ్చే రోజులు తప్ప అచ్చేదిన్‌ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఉపాధి, గౌరవ ప్రదమైన, కనీస అవసరాలు తీరే వేతనాలు, సరసమైన ధరల స్థితి ఉంటే రోజులు మంచిగా ఉన్నట్లు భావిస్తారు. ఇప్పుడు ఆ స్ధితి ఉందా ? అందుకే అసలు ఆ పదాన్ని పురాతన భాండాగారంలో పెట్టాలని, అసలు మర్చిపోవాలని జనాలు జోకులు పేలుస్తున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠం 7.79శాతానికి చేరింది. నాలుగుశాతం వద్ద అదుపులో ఉంచాలన్నది ఆర్‌బిఐ నిర్దేశిత లక్ష్యం కాగా దానికి రెట్టింపు ఉంది. జిడిపి వృద్ధిరేట్లలో మన దేశంలో ఒక నిలకడ లేదు.1997 నుంచి ఉద్థాన పతనాలు నమోదవుతున్నాయి. కరోనాకు ముందు మూడు మాసాల్లో 42 సంవత్సరాల కనిష్ట వృద్ధి రేటు నమోదైంది. వార్షిక వృద్ది రేటు 2014లో ఎనిమిదిశాతం ఉండగా 2020 మార్చినాటికి నాలుగుశాతానికి పడిపోయింది. తరువాత కరోనా వచ్చి నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చర్చకు అవకాశం లేకుండా చేసింది. కరోనా ప్రభావం తొలగి సాధారణ స్థితికి వచ్చింది. కానీ ఆర్ధిక రంగంలో అలాంటి మార్పు కనిపించటం లేదు. దిగజారిన ఆర్ధిక వ్యవస్ధ గణాంకాలను ప్రాతిపాదికగా చేసుకొని 2022లో ఎనిమిదిశాతం వృద్ధి రేటు ఉంటుందని ఊదరగొడుతున్నారు. అది జరిగినా కరోనాతో ముందు పరిస్థితితో పోల్చితే వాస్తవ వృద్ధి ఒకటి రెండుశాతం మాత్రమే ఉంటుందన్నది ఒక అభిప్రాయం. అందువలన తరువాత వృద్ధి అంకెలు అచ్చేదిన్‌ అసలు బండారాన్ని వెల్లడిస్తాయి. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రయివేటు పెట్టుబడుల లేకపోవటం వంటి అంశాలు ప్రతికూలతను వెల్లడిస్తున్నాయి.


గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ బాంకుల వద్ద పేరుకు పోయిన బకాయిలను నిరర్ధక ఆస్తుల పేరుతో రు.11,68,095 కోట్లను రద్దు చేసింది. వాటిని తిరిగి వసూలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఎంత శాతం అన్నది ప్రశ్న. 2021మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రద్దు చేసిన మొత్తం రు.2,02,781 కోట్లు ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఏడు సంవత్సరాల్లో రద్దు చేసిన మొత్తం రు.10.7లక్షల కోట్లు ఉంది. ఇంతవరకు రుణాలు ఎగవేసిన పెద్దల పేర్లు వెల్లడించేందుకు బాంకులు నిరాకరిస్తున్నాయి. రద్దు చేసిన మొత్తాలలో ప్రభుత్వరంగ బాంకుల వాటా 75శాతం ఉంది.నిరర్దక ఆస్తులను ఖాతాల నుంచి తొలగిస్తే బాంకులకు పన్ను భారం తగ్గుతుందని చెప్పారు.వసూలు అవకాశాలన్నీ మూసుకుపోయిన తరువాతే రద్దు చేస్తారు. తన పాలన అంతా సజావుగా ఉందని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడిలో బకాయిలు పేరుకు పోవటం అంటే కావాలని ఎగవేతకు పాల్పడటమే. ప్రజల సొమ్ము ప్రతిపైసాకు జవాబుదారీ అని చౌకీదారునని చెప్పుకున్న మోడీ అలాంటి వారి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించటం లేదన్న ప్రశ్నకు జవాబు లేదు. రద్దు చేసిన బకాయిల్లో వసూలవుతున్న మొత్తం 15-20శాతానికి మించి ఉండటం లేదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు స్వదేశీ ఉత్పత్తిని పెంచి చమురు దిగుమతులు తగ్గిస్తామని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో అంతకు ముందున్న స్ధితి కంటే దేశీయ ఉత్పత్తి తగ్గింది. ఎనిమిది సంవత్సరాల క్రితం రూపాయి విలువ డాలరుకు 58 ఉండేది, ఇప్పుడు అది 77.56కు పడిపోయింది. రూపాయి విలువ పతనం ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనమని ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు ధ్వజమెత్తారు. ఈ అసమర్ధతను నెహ్రూ మీద నెడతారా ? 2014లో పీపా ముడిచమురు ధర 110వద్ద ఉండగా మోడీ అధికారానికి వచ్చారు. తరువాత తగ్గటం తప్ప పెరిగింది లేదు. ఆ మేరకు జనానికి ధర తగ్గించాల్సిన మోడీ సర్కార్‌ తప్పుడు కారణాలు చూపి పెట్రోలు, డీజిలు మీద భారీగా సెస్‌లను పెంచి సొమ్ము చేసుకుంది. రూపాయి విలువను కాపాడలేని మోడీ సర్కార్‌ అసమర్దతకు జనం మూల్యం చెల్లించాల్సి వస్తున్నది.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా.ద్రవ్యోల్బణం పెరుగుదల, విదేశీ అప్పులు డాలర్లలో చెల్లించాలి గనుక రూపాయి విలువ రికార్డు పతనం కొనసాగితే ఇంకా పెరిగినా ఆశ్చర్యలేదు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వరంగ కంపెనీలను తెగనమ్మి పొందిన సొమ్ము, చమురుపై విధించిన భారీ సెస్సుల ఆదాయమంతా ఎటుపోయినట్లు, తెచ్చిన దాదాపు వందలక్షల కోట్లను ఏమి చేసినట్లు ? చివరికి చూసుకుంటే రికార్డు స్దాయి నిరుద్యోగం, వృద్ది రేటు పతనం, కనుచూపు మేరలో లేని అచ్చేదిన్‌ ! కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించలేని స్థితిలో కొత్తగా పెట్టుబడులు పెడితే తమకు వచ్చేదేమిటని ప్రయివేటురంగం ప్రశ్నిస్తోంది. ఆత్మనిర్భర్‌, కరోనా పేరుతో పొందిన రాయితీలతో లబ్దిపొందుతోంది.


ఎనిమిదేండ్ల క్రితం నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చిన అంశాలను చూసినపుడు బలమైన ఆర్ధిక పునాదులు వేస్తామన్నదే వాటి సారాంశం. కానీ తరువాత గత ఎనిమిదేండ్లలో అటు కేంద్రంలో, ఇటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి కేంద్రీకరణ ఆర్ధిక వృద్ధి కంటే మతపరమైన రాజకీయలక్ష్యాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నది స్పష్టం. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా కట్టుబడిన మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అమలుకు అగ్రాసనం వేశారు. దేశాన్ని ప్రామాణిక హిందూ మూలాల్లోకి తీసుకుపోతామని చెబుతున్నారు. గతంలో అలాంటి భావజాలం, మతం దేశాన్ని పారిశ్రామిక విప్లవానికి దూరం చేసింది. తిరిగి అదే స్థితికి తీసుకుపోతామని చెబుతున్నారు. దానికిగాను హిందూమతానికి సంబంధం లేని హిందూత్వను ఆయుధంగా చేసుకొని మధ్య యుగాలనాటి మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశాన్ని ఆర్ధికంగా దిగజారుస్తుందే తప్ప మంచి రోజుల వైపు తీసుకుపోదు. ఒక ఆర్ధిక వ్యవస్థను ఎలా నాశనం చేయవచ్చు అని ఎవరైనా అధ్యయం చేయదలిస్తే ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలనను ఎంచుకోవచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో విఫల నేత అని కొందరు చెప్పవచ్చు. నరేంద్రమోడీ వైఫల్యం, బూటకం గురించి చెప్పింది వాస్తవమే కదా !

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

22 Sunday May 2022

Posted by raomk in Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !

20 Friday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Haj quota, Kerala CPI(M), Kerala LDF, Narendra Modi, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు హజ్‌ యాత్ర సంబంధిత అంశాల గురించి కాషాయ దళాలు చేసిన, చేస్తున్న నానా యాగీ గురించి తెలిసినదే.మరోవైపు హిందూత్వ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ భారత్‌ నుంచి హాజ్‌ యాత్రకు భారత్‌ నుంచి కోటా పెంచాలని, పురుషుల తోడు లేకుండా మహిళలను అనుమతించాలని కోరుతూ సౌదీ అరేబియాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని భారత్‌ హాజ్‌ కమిటీ అధ్యక్షుడు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన ఎపి అబ్దుల్లా కుట్టి స్వయంగా చెప్పారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కేరళ సందర్శించిన సందర్భంగా కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విశ్వాసులకు నరేంద్రమోడీ ఒక బోధకుడి వంటి వారని ఆకాశానికి ఎత్తారు.హజ్‌ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో హజ్‌యాత్ర గురించి హంగామా చేసే వారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అబ్దుల్లాకుట్టి ఆరోపించారు. అబ్దుల్లా కుట్టి గతాన్ని చూస్తే సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికై 2008లో నరేంద్రమోడీని పొగడటంతో పాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బహిష్క్‌రణకు గురైన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.ఆ పార్టీలో ఉంటూ 2019లో మరోమారు నరేంద్రమోడీని పొగటంతో కాంగ్రెస్‌ కూడా సాగనంపింది. అక్కడి నుంచి బిజెపి ఆశ్రయం పొందారు.నరేంద్రమోడీని పొగడటంలో అబ్దుల్లాకుట్టి పేరుమోశారు. కోజికోడ్‌ సభలో దాని కొనసాగింపుగానే పొగడ్తలు కురిపించిన తీరు మీద నెటిజన్లు తరువాత అబ్దుల్లాకుట్టితో ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో నష్ట నివారణ చరó్యకు పూనుకున్నారు. కోజికోడ్‌ సభలో హజ్‌ యాత్రకు సంబంధించి నరేంద్రమోడీ గురించి చెప్పిన మాటలు తప్పిదమేనని, నోరు జారినట్లు పది రోజుల తరువాత సంజాయిషి ఇచ్చుకున్నారు. తాను సభలో మాట్లాడుతున్నపుడు తమ నేత కృష్ణదాస్‌ తనకు మంచి నీరు ఇచ్చారని, తాగిన తరువాత తన ప్రసంగం అదుపు తప్పిందని అబ్దుల్లా కుట్టి చెప్పినట్లు కేరళ కౌముది పత్రిక రాసింది.


అబ్దుల్లాకుట్టిని హజ్‌కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మేనెల మొదటి వారంలో ఒక సంస్ధ ఇచ్చిన ఇప్తార్‌ విందు, కుట్టి అభినందన కార్యక్రమానికి ముస్లిం లీగు నేతలు కొందరు హాజరుకావటం వివాదాస్పదమైంది. ఎవరూ అభినందన సభలకు హాజరు కావద్దని లీగ్‌ నాయకులు ఆదేశించిన తరువాత ఇది జరిగింది. అది అభినందన సభగా మారుతుందని తమకు తెలియదని ఇప్తార్‌ ఇచ్చింది తమ బంధువు కావటంతో వెళ్లినట్లు లీగు కన్నూరు జిల్లా కార్యదర్శి తాహిర్‌ సంజాయిషి ఇచ్చుకున్నారు.


మరోమారు నోరు పారవేసుకున్న పిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్‌
కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె సుధాకరన్‌కు నోటి దురుసు ఎక్కువ. ఒక కల్లుగీసేవాడి కొడుకు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గతంలో నోరు పారవేసుకున్నారు. తన తండ్రి ఒక గీత కార్మికుడు, తన అన్న ఇప్పటికీ గీత వృత్తిమీదనే బతుకుతున్నాడని, అలాంటి కష్టజీవుల కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అప్పుడు విజయన్‌ తిప్పికొట్టారు. తాజాగా త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుధాకరన్‌ మాట్లాడుతూ గొలుసు తెంచుకున్న కుక్క మాదిరి విజయన్‌ త్రిక్కకర నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ మరోసారి అదేపని చేశారు. ఒక డివైఎఫ్‌ఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నేత నోటవెలువడిన సంస్కారహీనమైన పదజాలాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ సమర్ధించారు. కన్నూరు ప్రాంతంలో అలాంటి పదజాలం సాధారణమే కనుక తప్పేంలేదని వెనుకేసుకు వచ్చారు. విజయన్‌ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నందున అలా అన్నానని, దానికి ఎవరైనా బాధపడితే మాటలను వెనక్కు తీసుకుంటానంటూ సుధాకరన్‌ అహంకారంతో మాట్లాడారు.


ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ఎంబి మురళీధరన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సిపిఎం అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఎల్‌డిఎఫ్‌తో కలసి పని చేస్తానని చెప్పారు. 2020 ఎన్నికల్లో ఓడిపోక ముందు కొచ్చి కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. త్రిక్కకర ఉప ఎన్నికల్లో చర్చి నిలిపిన అభ్యర్ధులెవరూ లేరని ఏ ఎన్నికలోనూ ఎప్పుడూ ఒక అభ్యర్ధికి మద్దతు ఇవ్వలేదని సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ జార్జి అలంచెరీ చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమా థామస్‌, మాజీ సిఎం ఊమెన్‌ చాందీ తదితర కాంగ్రెస్‌ నేతలు అలంచెరీని కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తరువాత అలంచెరీ విలేకర్లతో మాట్లాడారు. సిపిఎం అభ్యర్ధి డాక్టర్‌ జో జోసెఫ్‌ను చర్చికి సంబంధించిన భవనంలో అభ్యర్ధిగా ప్రకటించటం గురించి అడగ్గా అదొక యాదృచ్చిక ఘటన తప్ప చర్చికి దానికి సంబంధం లేదన్నారు. డాక్టర్‌ జోసెఫ్‌ పని చేస్తున్న ఆసుపత్రి ఒక చర్చి నిర్వహణలో ఉంది, ఆ ఆసుపత్రిలోనే మీడియాకు అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. దాంతో ఇంకేముంది చర్చి తరఫునే నిలుపుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీని వెనుక పెద్ద కుట్ర వుందంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఎన్నికలో సిపిఎం, కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులతో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.


పన్నెండు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల వార్డులకు గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో 42కు గాను 24 చోట్ల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గెలిచింది.కాంగ్రెస్‌కు 12, బిజెపికి ఆరు వచ్చాయి. ఎన్నికల్లో 31పంచాయతీ, ఏడు మున్సిపాలిటీ, రెండు కార్పొరేషన్‌ వార్డులకు పోలింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ మొత్తం మీద గతంలో ఉన్ని ఎనిమిది వార్డులను కోల్పోయింది. ఎల్‌డిఎఫ్‌ నుంచి మూడు సీట్లను కాంగ్రెస్‌, రెండింటిని బిజెపి గెలుచుకుంది.కొన్ని చోట్ల కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి కూడా రెండు స్దానాలను కోల్పోయింది.


సిపిఎం నేతల సమక్షంలో మతాంతర వివాహం
కోజికోడ్‌ జిల్లా కొడంచెరికి చెందిన భిన్న మతాలకు చెందిన ఎంఎస్‌ షెజిన్‌, జోస్నా మేరీ జోసెఫ్‌ సిపిఎం కార్యకర్తల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌ నెలలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం పెద్ద వివాదానికి దారి తీసింది. లవ్‌ జీహాద్‌ పేరుతో కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. షెజిన్‌ కన్నోత్‌ ప్రాంత డివైఎఫ్‌ఐ కార్యదర్శి, స్దానిక సిపిఎం కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహం జరిగింది. డివైఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు దీపు ప్రేమనాధ్‌,తిరువంబాడి సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు షిజి అంటోనీ, కెపి చాకోచన్‌ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తెను బలవంతం, బందీగా చేసి వివాహానికి ఒప్పించినట్లు ఆరోపిస్తూ జోస్నా మేరీ తండ్రి జోసెఫ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర వెలుపలి సంస్ధతో విచారణ జరిపించాలని కోరారు. జోస్నాను కోర్టుకు రప్పించి తండ్రి ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించగా తాను మేజర్‌నని, తననెవరూ బలవంతపెట్టలేదని ఆమె చెప్పటంతో కోర్టు ఆ పిటీషన్‌ కొట్టివేసి వివాహానికి అనుమతించింది. దాంతో మరుసటి రోజే వివాహం చేసుకున్నారు.ఈ వివాహం వలన స్దానికంగా పార్టీకి దగ్గర అవుతున్న కైస్తవ సామాజిక తరగతిని దూరం చేస్తుందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఏ జిఎం థామస్‌ చెప్పటాన్ని సిపిఎం తప్పు పట్టటమే కాదు తగని పని బహిరంగంగా అభిశంచింది. తాను తప్పుమాట్లాడినట్లు థామస్‌ అంగీకరించటంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో లబ్దిపొందేందుకు బిజెపి చూసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ జోస్న తలిదండ్రులను కలసి కేంద్ర సంస్దలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీని వెనుక పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హస్తం ఉందని ఆరోపించారు. మీ కుమార్తె ఆ సంస్ధ అలప్పూజ ఆఫీసులో ఉంటుందని అన్నాడు. కొందరు పగలు డివైఎఫ్‌ఐ కార్యకర్తలుగాను వారే రాత్రి ఫ్రంట్‌ కార్యకర్తలుగా ఉంటారని ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !

18 Wednesday May 2022

Posted by raomk in CHINA, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain IRD, fake news, Indonesian Communist Party (PKI)., Propaganda War, UK black propaganda


ఎం కోటేశ్వరరావు


భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్ధంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్‌ ప్రచార వ్యవస్ధ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్‌ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్ధలు ప్రత్యేకించి- సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన వివిధ సంస్ధలు, పలు ముస్లిం సంస్ధలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్‌ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్‌ రిసర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్‌ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటీష్‌ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్‌ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్ధించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.


సిఐఏ, బ్రిటీష్‌ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యగావించి ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాల్లో రెచ్చగొట్టారు.ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు.1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్‌ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది, నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్ధారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని 32 సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది.తప్పుడు వార్తలు,నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్ధల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్ధలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్ధల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్‌ వార్తా సంస్ధ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్దంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్‌ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్ద పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్‌హుడ్‌ పేరుతో ప్రచారంలో పెట్టారు.ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్ధ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.


ఆఫ్రికా దేశాల్లో సోవియట్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్‌ అనుకూల సంస్దల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది.సోవియట్‌ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్‌ విద్యార్ధులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్ధను ఉపయోగించటంలో లేబర్‌, కన్సర్వేటివ్‌ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్‌ ప్రధాని అలెక్‌ డగ్లస్‌ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా – ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్‌ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్‌ గార్డన్‌ వాకర్‌ కోరాడు. 1977లో ఈ సంస్దను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్దను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్ధలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్‌ ఒక ప్రధాన పాత్రధారి.


సోవియట్‌ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా , బ్రిటన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్ధలో 360 మంది పని చేశారు.వారి పని కమ్యూనిజం, సోవియట్‌ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేథావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్‌ గూఢచార, భద్రతా సంస్దలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంఐత్ర సంస్దల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్ధలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ” కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ ” ఒకటి. ఇది మరొక సంస్దను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్‌ ఆఫ్‌ బిలీవర్స్‌). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేకపోవటమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది.” ఈ తరుణంలో అరబ్‌ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది ?విపత్తుకు గురైంది ? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు ? సమాధానాలు కనుగొనటం సులభమే ! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాము. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాము.” అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్‌ మీద వ్యతిరేకతను చొప్పిస్తారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.


ఐఆర్‌డి సంస్ధ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు బ్రిటన్‌ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది.ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటీష్‌ వలస ప్రాంతం. 1965లో ఇయాన్‌ స్మిత్‌ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్ధితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్‌, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d