• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: tdp

వేతన పెంపుదల : కమ్యూనిస్టులు పోరాడితే సంస్థలకు వ్యతిరేకం-అదే కార్పొరేట్లు కోరితే….?

25 Saturday Jan 2025

Posted by raomk in CPI(M), Current Affairs, Economics, employees, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRS, CHANDRABABU, fair wages, indian corporate, minimum wage, Narendra Modi Failures, Revanth Reddy, tdp

ఎం కోటేశ్వరరావు

బడ్జెట్‌ ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హల్వా వంటకాన్ని ప్రారంభించారు. అంటే బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు సిబ్బంది ముద్రణాలయం నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. గతంలో ఏ వస్తువు మీద ఎంత పన్ను వేస్తారో, ఎంత తగ్గిస్తారో ముందుగానే వెల్లడి కాకూడదని అలా చేసేవారు. ఇప్పుడు పార్లమెంటుతో పని లేకుండానే జిఎస్‌టి కౌన్సిల్లో ముందుగానే అన్నీ నిర్ణయిస్తున్న తరువాత నిజానికి బడ్జెట్‌లో అంత రహస్యమేమీ ఉండదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేబోయే ముందు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులతో సంప్రదింపులు జరపటం ఒక నాటకం తాము కోరుకున్న వారికి పెద్ద పీట వేయటం చేదు వాస్తవం. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరు బడ్జెట్‌లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును అధిగమించారు.మరో బడ్జెట్‌కు సిద్దం అవుతున్నారు. ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా కార్పొరేట్లకు పెద్ద పీటవేయటంలో కూడా ఆమె రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్‌ గురించి అన్ని తరగతులను చర్చలకు ఆహ్వానించారు గానీ రైతులను కావాలనే విస్మరించారు. ఎందుకంటే నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు గనుక. అంచనాలకు దూరంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఉంది. ఎందుకు అంటే జనాల వినియోగం తగ్గిపోవటం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. చిన్నప్పటి ఏడు చేపల కథను గుర్తుకు తెచ్చుకుంటే అందులో ఏడ్చిన పిల్లవాడు ఒక్కడైతే వర్తమాన కథలో ఎందరో. కానీ కేంద్రీకరణ అంతా వారిలో ఒకరైన వినియోగదారు మీదే ఉంది.


కమ్యూనిస్టులు వేతన పెంపుదల కోరగానే అనేక మంది విరుచుకుపడుతుంటారు. వీరికి పరిశ్రమలు,వ్యాపారాలు ఎలాపోయినా ఫరవాలేదు, కార్మికులకు వేతనాలు, అలవెన్సులు, బోనస్‌లు ఇంకా ఏవేవో పెంచాలంటారు, మొత్తం సంస్థలనే అప్పగించాలంటారు, వేరే పనేలేదని దుమ్మెత్తి పోస్తారు. నిజమే, వాటి గురించి చట్టాలు, నిబంధనలు ఉన్నవే కదా, వాటినే కమ్యూనిస్టులు అడుగుతున్నారు, దీనమ్మ జీవితం ! చట్టాలు అమలు జరగాలని, వాటి మేరకు పాలన జరగాలని కోరుకోవటం కూడా తప్పంటారా ? ఇది ప్రమాదకర పోకడ, తమదాకా వస్తే గానీ తెలియదు. కమ్యూనిస్టుల సంగతి సరే సాక్షాత్తూ కార్పొరేట్ల అధిపతులే వేతనాలు పెంచాలని, న్యాయంగా ఉండాలని చెబుతున్న సంగతి కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వారికి ఎలా చెప్పాలి ! బెంగలూరు కేంద్రంగా పని చేస్తున్న వెంచర్‌ కాపిటల్‌ సంస్థ ఆరిన్‌, దాని చైర్మన్‌ మోహనదాస్‌ పాయ్‌. గతంలో ఇన్ఫోసిస్‌ కంపెనీ సిఎఫ్‌ఓగా పని చేశారు. ఆయన వేతనాల గురించి చెప్పిన మాటల సారం ఇలా ఉంది.(ఎకనమిక్‌ టైమ్స్‌ డిసెంబరు 19,2024) ‘‘ 2011లో ఇన్పోసిస్‌లో కొత్తగా చేరిన ఉద్యోగి ఏడాదికి రు.3.25లక్షలు పొందితే ఇప్పుడు రు.3.5 లేదా 3.75లక్షలు మాత్రమే తీసుకుంటున్నారు. పదిహేను శాతం ఎక్కువగా ఇస్తుండవచ్చు, పదమూడేండ్ల తరువాత దీన్ని ఎలా సమర్ధించాలి ? 2011లో కంపెనీ సిఇఓ ఎంత పొందారు ? ఇప్పుడు ఎంత ? న్యాయంగా ఉండాలి కదా ! మన వాణిజ్యం ద్రవ్యాశతో నీచకార్యాలకు పాల్పడే సంస్థలుగా(మెర్సినరీస్‌)గా మారాలని మనం కోరుకోకూడదు.లాభాల కోసం ప్రయత్నించటం తప్పుకాదు.తామెంతో న్యాయంగా ఉంటున్నట్లు యజమానులు చెప్పుకుంటున్నారు గనుక కంపెనీలు కూడా న్యాయంగా ఉండాలి. సిబ్బంది అత్యంత విలువైన సంపద అని చెబుతున్నారు గనుక దయచేసి చెప్పినట్లుగా చేయండి’’ అన్నార్‌ పాయ్‌. ఇదే ఒక కమ్యూనిస్టు చెబితే ఏ మీడియా అయినా దాన్ని అంత ప్రముఖంగా ప్రచురిస్తుందాప్రసారం చేస్తుందా ? అసలు వార్తగా అయినా ఇస్తుందా !

వేతన పెరుగుదల లేదా స్థంభన, నిజవేతనాలు పెరగకపోవటం గురించి తరచూ కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు మాట్లాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇతరులు మాట్లాడుతున్నారంటే నిజంగా వారికి కష్టజీవుల జీవితాల మీద ప్రేమ పుట్టుకువచ్చినట్లా ? ఇటీవలి కాలంలో కార్పొరేట్లకు ఆకాశాన్నంటే రీతిలో లాభాలు రావటం వెనుక నరేంద్రమోడీ అనుసరించే విధానాలు కారణం. అయితే ఆ మేరకు కార్మికులకు వేతనాలు పెరగకపోతే వినిమయ గిరాకీ తగ్గి మొదటికే మోసం వస్తుందని అదే మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ స్వయంగా హెచ్చరించారు. పండుగల సమయాల్లో కూడా అమ్మకాల గురించి వాణిజ్యవేత్తలు పెదవి విరిచారు. ఇంటి దగ్గర భార్య ముఖాన్ని చూస్తూ ఎన్నిగంటలు గడుపుతారు, ఆదివారాలతో నిమిత్తం లేకుండా వారానికి 90గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టి అధిపతి సుబ్రమణ్యన్‌ సెలవిచ్చారు.పిల్లలు, పెద్ద వారిని వదిలేసి ఇద్దరూ 90 గంటలు పని చేయాలని అనలేదు. ఇన్పోసిస్‌ నారాయణ మూర్తి మరో 20 గంటలు తగ్గించి 70 అన్నారు. వీరందరికీ స్ఫూర్తి ఎవరంటే అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రస్తుతం జైలుపాలైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్‌, అతగాడు 120 గంటలు చేయాలన్నాడు. యంత్రాలు కూడా నిరంతరం పని చేస్తే అరిగి చెడిపోతాయి గనుక కొంత విరామం, నిర్వహణ పనులు చేస్తారు. కార్మికులకు అదేమీ అవసరం లేదన్నది ఈ అపరమానవతా మూర్తుల ఉవాచ.

కంపెనీలు వేతనాలు సక్రమంగా ఇస్తున్నాయా అంటే లేదు, పని మాత్రం చేయాలి.నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన 500 కంపెనీలకు 2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపు అనంతరం వచ్చిన లాభాలు 15 ఏండ్ల గరిష్టం అని అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.జిడిపి వృద్ధి రేటు అంచనాలకంటే తగ్గినప్పటికీ ప్రపంచంలో అధికవృద్ధి మన దగ్గరే అని పాలకపార్టీ పెద్దలు తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఉపాధి రహిత వృద్ధి, వేతన వృద్ధి బలహీనంగా ఉన్నపుడు కార్పొరేట్లకు లాభాలు తప్ప శ్రామికులకు ఒరిగేదేమీ లేదు.ద్రవ్యోల్బణం పెరుగుదలతో వారిలో కొనుగోలు శక్తి పడిపోతున్నది. ఐటి రంగంలో వేతన వృద్ధి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే పడిపోయింది. దానికి తోడు రూపాయి విలువ పతనంతో ఎగుమతులు ప్రధానంగా ఉన్న ఆ రంగంలోని కంపెనీలకు లాభాలే లాభాలు. వివిధ రంగాల్లోని నిపుణులైన కార్మికులు(వారిని బ్లూ కాలర్‌ వర్కర్స్‌ అంటున్నారు) జీవన వేతనం కోసం నిరంతరం సతమతం అవుతున్నారు. వర్క్‌ ఇండియా అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 57శాతం మంది ఈ కార్మికుల వేతనాలు నెలకు రు.20 వేలకంటే తక్కువే, 29శాతం మంది 2040వేల మధ్య పొందుతున్నారు. కార్పొరేట్ల నిలయం దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు పడుతున్న తాపత్రయం మంచిదే. కానీ కార్మికులకు ఆర్థిక న్యాయం, గౌరవాన్ని కలిగించేందుకు అవసరమైన వేతనాలు ఇప్పించేందుకు ఏం చేస్తున్నారు. రెండు చోట్లా కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కనీస అవసరాలు తీర్చే విధంగా దశాబ్దాలతరబడి సవరణకు నోచుకోని కనీసవేతనాల గురించి ఒక్క పలుకూ చేతా లేదు. వారి విజన్లలో కార్పొరేట్లు తప్ప కార్మికులకు చోటు లేదు.ఆకలి కేకలతో ఉన్న 80 కోట్ల మందికి మరికొన్ని సంవత్సరాలు ఉచితంగా ఐదేసి కిలోల ఆహార ధాన్యాలు ఇస్తానంటారు తప్ప చేసేందుకు ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో బతకటం విశ్వగురువు నరేంద్రమోడీ అజెండాలో లేదు.శ్రమజీవులు ముష్టిని కోరుకోరుకుంటారా ?

నైపుణ్యం పెంచినట్లు మోడీ పదేండ్లుగా చెబుతున్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రేవంత రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కబుర్లు చెబుతుంటే చంద్రబాబు నాయుడు నిపుణులు ఎంత మంది ఉన్నారో ముందు లెక్కతేలాలంటున్నారు.పదేండ్ల నుంచి నైపుణ్యాలు నిజంగా పెంచితే దానికి తగిన విధంగా వేతనాలు వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలి, కానీ తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ఆటోమేషన్‌ , దాంతో ఉత్పాదకత పెరుగుతోంది ఉపాధి తగ్గుతోంది, కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. న్యాయమైన వేతనాలు చెల్లించటం కేవలం నైతిక విధాయకమే కాదు నిరంతర వినియోగ గిరాకీ పెరగటానికి కూడా అవసరమే అని అనంత నాగేశ్వరన్‌ నొక్కి చెప్పారు. కార్పొరేట్ల లాభదాయకతకార్మికుల సంక్షేమం మధ్య తేడాను తగ్గించకపోతే దీర్ఘకాలంలో దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. దేశంలో కాంటాక్టు కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది, పరిశ్రమలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు, కార్మికులను మాత్రం తాత్కాలికం పేరుతో నియమిస్తారు. ఐటి రంగంలో సిఇఓవేల వేతనాలు చూస్తే గత ఐదేండ్లలో 5060శాతం పెరగ్గా దిగువ 20శాతం సిబ్బంది వేతనాలు 2025శాతం మాత్రమే పెరిగినట్లు మోహనదాస్‌ పాయ్‌ చెప్పారు. దిగువ 50శాతం మంది సిబ్బంది పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని కార్పొరేట్‌ సంస్థలు వారికి మెరుగైన వేతనాలివ్వాలని కూడా చెప్పారు. ఎక్కడైనా కమ్యూనిస్టులు లేదా కార్మిక సంఘాల నాయకత్వాన విధిలేని స్థితిలో కార్మికులు సమ్మెలకు దిగితే ఇంకేముంది సంస్థలు దివాలా అంటూ గుండెలు బాదుకొనే వారు పాయ్‌ చెప్పిందాన్ని ఏమంటారు ? దుకాణాలు, పరిశ్రమల్లో సహాయకులుగా ఉండే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు గత ఐదేండ్లలో ఒకటి రెండుశాతమే పెరిగినట్లు అధ్యయనాలు తెలిపాయి.

కార్పొరేట్లు సంపదల పంపిణీకి వ్యతిరేకం, కానీ పరిమితంగా వేతనాలు పెరగాలని కోరకుంటున్నాయి. ఎందుకని ? మనదేశంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుపుతున్నారు, తమ ప్రయాణాలు సుఖవంతం, వేగవంతంగా జరిపేందుకు వేస్తున్నారని జనం భావిస్తారు, దాన్లో వాస్తవం లేకపోలేదు, టోల్‌ రూపంలో తగిన మూల్యం చెల్లిస్తున్నారన్నది వేరే అంశం. అదొక్కటే కాదు, జనం సొమ్ముతో రోడ్లను ప్రభుత్వం వేస్తే కాంట్రాక్టులు తీసుకొని లాభాలు పొందేది, నిర్వహణను తీసుకొని టోలు వసూలు చేసుకొనేది ప్రయివేటు కంపెనీలే.ఆర్థిక వ్యవస్థ మందగించినపుడు అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వివిధ కంపెనీల ఉత్పత్తులు పడిపోకుండా ఉద్దీపన ఇచ్చారు. మనదేశంలో జరుగుతున్నది కూడా అదే. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాణాపాయంగా మారిన గర్భిణులను డోలీల ద్వారా ఆసుపత్రులకు చేర్చటం ఒకవైపు జర్రున జారే రోడ్ల మీద తుర్రుమంటూ ప్రయాణించే తీరు మరోవైపు చూస్తున్నాం. ఎందుకిలా ? ఎక్కడ లాభం ఉంటే అక్కడే పెట్టుబడులు. గతంలో కూడా కార్మికులకు యజమానులు వేతనాలిచ్చేవారు, అవి కుటుంబ సభ్యులు, వారు మరుసటి రోజు పనిచేయటానికి అవసరమైన శక్తినిచ్చేందుకు సరిపడా మాత్రమే. ఇప్పుడు ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సరకులు, సేవలు అమ్ముడు పోవాలంటే తగినంత మంది వినిమయదారులు కూడా ఉండాలి. అందుకే అవసరమైతే జనాలకు సబ్సిడీలు ఇచ్చి ఆ మేరకు మిగిలే సొమ్ముతో కొనుగోలు చేయించేందుకు చూస్తున్నారు. ఇంత చేసినా వినియోగం పెరగటం లేదు. ఎక్కువకాలం ఇలాగే ఉంటే పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాలి. అప్పుడు కార్పొరేట్ల పెట్టుబడి వృధా అవుతుంది. కరోనా సమయంలో ఉచితంగా నగదు బదిలీ కూడా జరగాలని కొందరు సూచించారు, ఇప్పుడు వేతనాలు పెంచాలని తద్వారా జనం జేబుల్లోకి డబ్బు చేరాలని తమ సరకులు, సేవలకు మార్కెట్‌ కల్పించాలని చెబుతున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా హక్కుగా కోరేందుకు మాత్రం అంగీకరించరు.అవసరమైతే అణచివేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

02 Friday Apr 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

chandrababu naidu, jana sena party, Pawan kalyan, special status to Puducherry, tdp, ycp jagan


ఎం కోటేశ్వరరావు


పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బిజెపి చేసిన వాగ్దానం ఆ పార్టీకి ఆంధ్రప్రదేశలో ఎదురు తన్నిందా ? జరిగిన పరిణామాలను చూస్తే పెద్ద ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఐదు సంవత్సరాల క్రితం బీహార్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ స్వయంగా ప్రత్యేక పాకేజ్‌లను ప్రకటించారు. తరువాత వాటికి అతీగతీ లేదు. ఇప్పుడు అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే పుదుచ్చేరి వాసుల విషయంలో జుమ్లా (అవసరార్దం అనేకం చెబుతుంటాం) కూడా కావచ్చు. తరువాత నిబంధనలు అంగీకరించటం లేదు, ఇతర రాష్ట్రాలు అభ్యంతర పెడుతున్నాయంటే చేసేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాను డిమాండ్‌ చేసిన పార్టీగా గొప్పలు చెప్పుకున్న బిజెపి తరువాత ఆ విషయంలో చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ద్రోహిగా ప్రజల ముందు తన స్వరూపాన్ని వెల్లడించుకుంది. ప్రత్యేక హౌదా ముగిసిన అధ్యాయంగా, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హౌదాలేమీ ఉండవు అని చెప్పి ఓట్లు వేసినా వేయకపోయినా దానికే తాము కట్టుబడి ఉంటామని అది కూడా తమ ఘనతే అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు పుదుచ్చేరిలో పాగా వేసేందుకు అక్కడి ప్రజలకు ప్రత్యేక హౌదా ఎరవేసింది. తమకు అధికారం అప్పగిస్తే ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హౌదా కల్పించి జమ్మూకాశ్మీరుకు ఇచ్చిన మాదిరి కేంద్ర పన్నుల వాటాను 25 నుంచి 40శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నది. అదే విధంగా కేంద్ర పధకాలకు గాను ప్రస్తుతం 70శాతం కేంద్ర పాలిత ప్రాంతం, 30శాతం కేంద్ర వాటాగా ఉన్నదానిని 30:70శాతాలుగా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీని మీద తెలుగుదేశం నేత లోకేష్‌ ట్వీట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదాకోసం పోరాడుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హౌదాకోసం ఒక్క ప్రభుత్వం, అధికారపక్షమే కాదు, ఎవరైనా పోరాడవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అలాంటి నైతిక హక్కును కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు కావాలని కోరిన ప్రత్యేక హౌదాకు, పుదుచ్చేరికి ఇస్తామంటున్న హౌదాకు సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్దించుకున్నారు.
కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన కేంద్రం దానికి నలభైశాతం నిధులు ఇవ్వకపోతే అక్కడ దాని పరువు దక్కదు, తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మరొక రాష్ట్రం ఢిల్లీ. అక్కడ ప్రభుత్వానికి అధికారాలను తగ్గించి, లెప్టినెంట్‌ గవర్నరకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. అలాంటిది పుదుచ్చేరికి అధికారాలు, నిధులను ఎలా పెంచుతారు ? ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక ప్రాతిపదిక మరొక రాష్ట్రానికి మరొక ప్రాతిపదికా అన్న ప్రశ్న ముందుకు రానుంది. పుదుచ్చేరికి ఇలాంటి ప్రత్యేక హౌదా ఇచ్చేందుకు ప్రాతిపదిక ఏమిటి అన్నది ప్రశ్న. ఏ కమిటీ లేదా ఏ ఆర్ధిక సంఘం సిఫార్సులు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాకు బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామని చెప్పిన కేంద్రం ఇలాంటిదానినే ఎందుకు అమలు జరపకూడదు ? ఇప్పటికే ఇరకాటంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ పుదుశ్చేరి తరహా హౌదాకోసమైనా కేంద్ర తాట తీసేందుకు, తోలు వలిచేందుకు తన పవర్‌ను చూపుతారా ? పులిలా గాండ్రిస్తారా, పిల్లిలా మ్యావ్‌ అంటారా ?

ఏపిలో ముద్దులాట – తెలంగాణాలో దెబ్బలాట : నాగార్జున సాగర్‌లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఎవరికి ?

ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమి అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్రంలో కొత్త రాజకీయ అంకానికి తెరలేపింది. దాని మీద పవన్‌ కల్యాణ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలు లేకపోయినా ఇప్పుడే ప్రకటించటం గురించి చర్చ జరుగుతున్నది. స్ధానిక సంస్దల ఎన్నికలలో ఫలితాలు, విశాఖ ఉక్కు వంటి ఇతర అంశాలను చూసిన తరువాత బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని కొద్ది రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ చేసినట్లు చెబుతున్న హెచ్చరికల నేపధ్యంలో సోము వీర్రాజు తిరుపతి ఎన్నికల ఆపద మొక్కుగా ఈ ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదన్నది ఒక అభిప్రాయం. పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు సైతం ఎంతో ఇష్టమని, పవన్‌ కల్యాణ్‌ను ఎంతో గౌరవంగా చూడాలని వారు చెప్పారని వీర్రాజు చెప్పారు. బిజెపి ఎక్కడా ఇంత వరకు ఇంత ముందుగా లేదా ఎన్నికల సమయంలో గానీ ముఖ్యమంత్రి అభ్యర్దులను ప్రకటించలేదు, దానికి భిన్నంగా ఈప్రకటన చేయటం రాజకీయ అవకాశవాదం అంటున్నవారు లేకపోలేదు. తిరుపతిలో తమ అభ్యర్దిని రంగంలోకి దించకపోతే బిజెపికి మద్దతు ఇచ్చేది లేదని కాపు సామాజిక తరగతికి చెందిన కొన్ని సంఘాల నేతలు హెచ్చరించిన నేపధ్యంలో వారిని బుజ్జగించి ఏమార్చేందుకు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. రామాయణంలో పిడకల వేట మాదిరి సోము వీర్రాజు ప్రకటనకు వైసిపి అసంతృప్త ఎంపీ రఘురామ కృష్టం రాజు మరో వ్యాఖ్యానం చెప్పారు. తమ పార్టీలో ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లుగా ఈ ప్రకటనతో జరిగేదేమీ లేదని, తిరుపతి ఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు ఒక బిస్కెట్‌ వేశారని వైసిపి నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద వీర్రాజు ప్రకటన నవ్వుల పాలైందని, పవర్‌ స్టార్‌ పరువు తీసిందని కొందరి అభిప్రాయం. అసలు తమది పెద్ద పార్టీ అయితే ముఖ్యమంత్రి అభ్యర్దిగా పవన్‌ కల్యాణ్‌ అని ప్రకటించటానికి వీర్రాజు ఎవరని కొందరు జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి-పవన్‌ కల్యాణ్‌ సంబంధాలు సజావుగా లేవన్నది స్పష్టం. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పోలింగ్‌ జరుగుతుండగా తెరాస అభ్యర్ది సురభి వాణీ దేవికి మద్దతు ప్రకటిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసి ప్రకటనే అందుకు నిదర్శనం. ఎన్ని ఓట్లు ఉన్నాయి లేవు అన్నది పక్కన పెడితే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణా బిజెపి నేతలు తనను అవమానించారనే ఆగ్రహంతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

రుణ ఊబిలో జగనాంధ్ర ప్రదేశ్‌ – నిజాలను ఎంతకాలం దాస్తారు ?

కొన్ని సంక్షేమ పధకాలకు ఏదో ఒక సాకుతో కోత పెట్టక తప్పని స్ధితి, అది ఇంకా పూర్తి కావాల్సిన మండల, జిల్లా పరిషత్‌, అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల మీద పడకుండా చూసుకోవాల్సిన అగత్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఓట్‌ఆన్‌ అకౌంట్‌తో అవన్నీ పూర్తయ్యేంత వరకు కాలక్షేపం చేద్దామనే ఆలోచనతో బడ్జెట్‌ను వాయిదా వేశారన్నది కాదనలేని సత్యం. దానికి అధికార పార్టీ ఏ సాకులు చెప్పినా అవి అతికేవి కాదు. అప్పుల గురించి కాగ్‌ చేసిన హెచ్చరిక, అది మీడియాలో చర్చకు దారి తీయటంతో ప్రభుత్వం తాజాగా సమాచార శాఖ ద్వారా ఒక పెద్ద వివరణ విడుదల చేసింది. దాన్ని రాసిన వారు ప్రభుత్వాన్ని సమర్ధించేందుకు ఎన్నో సాము గరిడీలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే రికార్డు స్ధాయిలో అప్పులు చేసింది, మేమెంత అన్నట్లుగా చివరకు అప్పులు తీసుకురాక తప్పటం లేదు, సమర్ధనీయమే అని సమర్ధనకు పూనుకుంది. పోనీ దీనిలో అయినా నిజాయితీ ఉందా ?

అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పుచేశాడన్నట్లు !


సమాచార శాఖ వివరణలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్దితి కారణంగా కేంద్ర ప్రభుత్వమే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 18,48,655 కోట్లు అప్పు చేసింది. దేశ చరిత్రలో ఇంత మొత్తం అప్పు ఎన్నడూ చేయలేదు.కేంద్ర ప్రభుత్వ పని తీరు మొత్తం దేశానికి ఒక సూచిక.2014-19 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ అప్పు 56,48,471 కోట్ల నుంచి 84,68,085 కోట్లకు పెరిగింది. వృద్ది 49.92శాతం, వార్షిక వృద్ది రేటు 8.44శాతం. అదే రాష్ట్ర విషయంలో పైన చెప్పుకున్న కాలంలోనే 1,11,528 నుంచి 2,59,087 కోట్లకు పెరిగింది, వృద్ది 132.31శాతం, వార్షిక వృద్ది రేటు 18.36శాతం. ఇదంతా తెలుగు దేశం పాలనా కాలంలో జరిగింది.
కేంద్రంలో మోడీ 2.0, రాష్ట్రంలో వైసిపి 1.0 పాలనా కాలంలో అంటే 2019 మార్చి నుంచి 2021 మార్చినెల వరకు కేంద్ర అప్పులు 84,48,085 కోట్ల నుంచి 1,12,50,391 కోట్లకు, వృద్ది రేటు 32.86, వార్షిక వృద్ది రేటు 15.26శాతం ఉండగా రాష్ట్ర అప్పులు 2,59,087 నుంచి 3,48,998 కోట్లకు, వృద్ది రేటు 34.70, వార్షిక వృద్ది రేటు 16.06 శాతం ఉంది.
ఈ అంకెలతో ఎవరికీ పేచీ లేదు. వాటికి చెప్పే వ్యాఖ్యానాలే వివాదాస్పదం. సమాచార శాఖ విడుదల చేసిన అంకెలు వాస్తవమేనా ? ముఖ్యంగా వైసిపి రెండు సంవత్సరాల పాలనలో అప్పుగా పేర్కొన్న 3,48,998 కోట్ల రూపాయల అంకెలను ఏడాది క్రితం బడ్జెట్‌లోనే పేర్కొన్నారు. వాటిలో మార్పులేమీ లేవా ? సమర్ధనీయంగా పాలన ఉంటే అప్పులు తగ్గాలి, లేకపోతే పెరగాలి, పదిహేను నెలల నాటి అంకెలనే వల్లెవేస్తే కుదరదు. తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 48,295 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. కాగ్‌ చెప్పిన అంశాల ప్రకారం నవంబరు చివరి నాటికే రాష్ట్రం 73,811 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. నెలకు 9,226 కోట్ల రూపాయల చొప్పున ఉంది, మొత్తం అప్పు 3,73,140 కోట్లుగా ఉంది,డిసెంబరు-మార్చినెలల మధ్య ఇదే తీరున అప్పులు తెస్తే మరో 37 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయవచ్చని అంచనా వేసింది. అంటే అప్పు నాలుగు లక్షల పదివేల కోట్ల చేరువలో ఉంటుంది. ఈ మొత్తంగాక వివిధ ప్రభుత్వ సంస్దలు తీసుకున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణించాలి. అయితే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం విధించిన జిఎస్‌డిపిలో మూడుశాతం రుణ పరిమితి దాటలేదు అని లెక్కల్లో చూపేందుకు ఆ మొత్తాలను విడిగా చూపుతున్నారు. చంద్రబాబు నాయుడి సర్కార్‌ చేసిన పనినే జగన్‌ ప్రభుత్వం కూడా చేస్తోంది. అందువలన అప్పు నాలుగున్నరలక్షల కోట్ల వరకు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వెల్లడించకపోయినా మూడు నెలల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వాటిని వెల్లడించకతప్పదు. అందుకే పాత అంకెలను వల్లెవేస్తే తరువాత విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచింది. 2021 మార్చి నాటికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. లక్ష్యానికి మించి అదనంగా చేసిన అప్పు, ప్రభుత్వం హామీ ఇచ్చిన అప్పులు మొత్తం నాలుగున్నర లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2020వరకు నాలుగు సంవత్సరాలలో 27.92శాతంగా ఉన్న అప్పు 2021 మార్చి నాటికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగవచ్చు.
సమాచారశాఖ విడుదల చేసిన వివరణ పత్రంలో చెప్పినదాని ప్రకారం 2014-19 మధ్య రుణాల చెల్లింపు మొత్తం రు.25వేల కోట్లకు పెరిగింది. తెచ్చిన అప్పులను ఉత్పాదక ఖర్చుగా చేసి ఉంటే అనేక రంగాలు గణనీయంగా అభివృద్ది చెంది ఉండేవి, కాని అలా జరగలేదు అని పేర్కొన్నారు. తెలుగుదేశం అలా చేయలేదు సరే తమ రెండు సంవత్సరాల పాలనలో వైసిపి తెచ్చిన అప్పులను నవరత్న అనుత్పాదక సంక్షేమ పధకాలకు తప్ప ఇతరంగా ఏ ఉత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు చేశారు, ఏమి సాధించారు అన్నదే ప్రశ్న.

నూతన ఎన్నికల కమిషనర్‌-పాత సవాళ్లు !


ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనరుగా మాజీ ప్రధాన కార్యదర్శి, తరువాత రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు.సాధారణంగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనరు నియామకం పెద్ద చర్చనీయాంశం కాదు. అనేక మంది కమిషనర్ల నియామకం-పదవీ బాధ్యతల విరమణ వార్తలు కూడా గతంలో తెలిసేవి కాదు. కేంద్రంలో టిఎన్‌ శేషన్‌, రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల కమిషన్లకు ఉన్న అధికారాలు ఎలాంటివో దేశానికి చూపించారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వమూ-రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య జరిగిన ప్రచ్చన్న, ప్రత్యక్ష యుద్దంలో మొత్తం మీద ఎన్నికల కమిషనర్‌దే పై చేయి అన్నది స్పష్టం. కింద పడినా గెలుపు మాదే అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఎంతగా, ఎలా సమర్దించుకున్నా వాస్తవాలు, కోర్టు తీర్పులు దానినే నిర్ధారిస్తాయి. తమ ఇష్టాను సారంగా ఒక ఎన్నికల కమిషనరును తొలగించటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ముక్కు పగల కొట్టించుకుంది. కొత్త ఎన్నికల కమిషనరు ముందు అధికారపక్షం వైపు నుంచి గతం మాదిరి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. అయితే ప్రతిపక్షాల నుంచి అలాంటి పరిస్దితిని ఆశించలేము. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన తరువాత మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీ గడువు ప్రకారం మూడు సంవత్సరాల పాటు అసలు ఎన్నికల కమిషనరు గురించి వార్తలే ఉండకపోవచ్చు.
స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవటంతో జిల్లాపరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని మీద పార్టీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు మరింత నీరుగారి పోతారని భయపడుతున్నారు. ఎన్నికలలో పాల్గొనాలా ? బహిష్కరించాలా అన్న తర్జన భర్జనలో బహిష్కరించాలని మెజారిటీ తెలుగుదేశం నేతలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున బహిష్కరించినా పోటీలో ఉన్న కారణంగా ఎన్నికలైతే జరుగుతాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎదురైన పరాజయాల నేపధ్యంలో తమకు అంతకు మించి భిన్నమైన ఫలితాలు రావన్నది తెలుగుదేశం అభిప్రాయం అన్నది స్పష్టం.
ఇక ఎన్నికల కమిషనరు విషయానికి వస్తే గతేడాది నామినేషన్ల సమయంలో అధికారపార్టీ ప్రత్యర్ధుల మీద దాడి చేసి నామినేషన్లు వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందనే ఆరోపణలు, విమర్శల మీద ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. గత ఎన్నికల కమిషనరు కొందరు పోలీసు, జిల్లా కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఒక వేళ గత కమిషనరు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే నూతన కమిషనరు విమర్శల పాలవుతారు, చర్యలకు ఉపక్రమిస్తే మరోమారు ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోవాల్సి వస్తుంది. కేంద్రానికి గత కమిషనరు రాసిన లేఖలో తన రక్షణ విషయాలతో పాటు ఎన్నికల్లో అక్రమాల గురించిన ప్రస్తావన కూడా ఉన్నందున ఆ లేఖను వెనక్కు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను వెనక్కు నెట్టి వైఎస్‌ జగన్‌ కక్ష కొరడాను తీస్తున్నారా !

14 Sunday Jun 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

instead of corona, tdp, ycp jagan, YS jagan, ys jagan targeting opposition

కరోనాను వెనక్కు నెట్టి వైఎస్‌ జగన్‌ కక్ష కొరడాను తీస్తున్నారా !
ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొద్ది వారాల క్రితం వ్యాఖ్యానించారు. ఆ వ్యాధి తీవ్రత గురించి అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో అసందర్భ వ్యాఖ్య చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు కేసులు మరింత ఆందోళనకరంగా పెరుగుతున్నపుడు బతికిన వారు బతుకుతారు, చచ్చేవారిని ఎలాగూ ఆపలేము, మిగతా సంగతులు చూసుకుందాం అన్నట్లుగా పరిస్ధితి తయారౌతోందా అనిపిస్తోంది.
కోర్టుల్లో తగులుతున్న ఎదురు దెబ్బలు తమ ప్రజాపునాదిని దెబ్బతీసేవిగా లేవనే నిర్దారణకు వైసిపి నాయకత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. జనం కులాల వారీ సమీకరణ అయినపుడు, భ్రమల్లో ఉన్నపుడు నిజమే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే కేసులు కోర్టుల్లో కొట్టి వేసినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతిపక్ష నేతలను కొంత కాలమైనా జైలు పాలు చేయాలనే ధోరణితో వైసిపి నాయకత్వం వున్నట్లు జనం అనుకుంటున్నారు. తెలుగుదేశం, వైసిపి, తెరాస వంటి ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వమైనా, అనుచరులైనా అంతా ఒకరే. తెలుగుదేశంలో అంతా చంద్రబాబే, వైసిపిలో సర్వం జగన్మయం, ఏకోపాసన.
తెలుగుదేశం నేతలు పైకి బింకాలు పోవచ్చుగానీ మానసికంగా తామూ ఏదో ఒకనాడు ఏదో ఒక కేసులో శిక్షగా కాకున్నా కస్టడీలో అయినా ఏడు ఊచలు లెక్కపెట్టక తప్పదని చాలా మంది లోలోపల అనుకుంటూ ఉండాలి. అధికార రాజకీయం అన్న తరువాత దేన్నయినా భరించాలి మరి. ఏ కారణంతో జైలుకు వెళ్లి వచ్చినా మంచి చెడ్డలను చూడకుండా నీరాజనాలు పట్టే జనాలు ఎలాగూ ఉన్నారని నిర్ధారణ అయింది కనుక ఎవరూ జైలు గురించి ఆందోళనపడాల్సిన పనిలేదు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళనల్లా తమ కార్యకర్తలు, మద్దతుదార్లను ఎంత మేరకు నిలుపుకోగలమన్నదే.
కరోనా విషయంలో చేయాల్సిందేదో చేస్తున్నాం, ఇప్పుడు అవినీతి అంతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జనానికి కనిపించేందుకు, రాజకీయ రచ్చను కొనసాగించేందుకు వైసిపి పూనుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఉన్న సొమ్మును సంక్షేమ పధకాలకు ఖర్చు చేయటం, అభివృద్ధి పనులకు నిధుల లేమి అన్నది ఒక వాస్తవం. ఏడాది పూర్తి అవుతున్న సమయంలో కొంత మంది ఎంఎల్‌ఏలు, ఎంపీలలో వెల్లడైన అసమ్మతి అధికార పార్టీలో జరుగుతున్న మధనానికి చిహ్నం. అమృతం వస్తుందా హాలా హలం వస్తుందా ? దేన్ని ఎవరికి ఇస్తారు అన్నది వెండి తెరమీద చూడాల్సిందే.
చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెప్పుకొనేందుకు వినసొంపుగానే ఉంటుంది. అనేక ఉదంతాలలో కేసులు బనాయించటం తప్ప అంగుళం కూడా ముందుకు పోని స్ధితి తెలిసిందే. అంటే అవసరమైనపుడు వాటిని బయటకు తీస్తారు. మాజీ మంత్రి, ఎంఎల్‌ఏగా ఉన్న కె అచ్చన్నాయుడిని అరెస్టు చేయటాన్ని తప్పు పట్టనవసరం లేదుగానీ, తీరు కక్షపూరితంగా కనిపిస్తోంది. మైనర్‌ ఆపరేషన్‌ చేయించుకున్న అచ్చన్నాయుడికి స్వస్ధత చేకూరే వరకు, అంతగా అవసరం అయితే కొద్ది రోజుల పాటు గృహనిర్బంధంలోనే ఉంచి తరువాత చట్టపరంగా కోర్టుకు అప్పగించవచ్చు. దానికి బదులు అరెస్టు చేసి గంటల కొద్దీ తిప్పిన తీరుతో ఆపరేషన్‌ గాయం పెద్దది కావటంతో చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. మరోమారు ఆపరేషన్‌ అవసరం లేదు అని వైద్యులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి స్ధితిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాల్సినంత అత్యవసరం ఆ కేసులో ఉందా అంటే నిస్సందేహంగా లేదు.
అనంతపురం జిల్లా మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం నేత జెసి ప్రభాకర రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని మోటారు వాహనాల కొనుగోలు అక్రమాల కేసులో అరెస్టు చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు హాజరవుతానని చెప్పినప్పటికీ పిలవ కుండా కావాలని అరెస్టు చేశారని ఆయన చెబుతున్నారు.దానిలో వాస్తవం ఏమిటో ఎవరూ నిర్ధారణ చేయలేరు. అవినీతి, అక్రమాల కేసుల్లో ఉన్న ప్రతి నిందితుడు న్యాయస్ధానాల్లో రుజువయ్యేవరకు నిర్ధోషినని, కావాలని ఇరికించారనే చెబుతాడు.అప్రూవర్‌లుగా మారిన ఉదంతాలలో తప్ప ఇంతవరకు ఏ నేరగాడూ లేదా నేరగత్తె స్వచ్చందంగా నేరాన్ని అంగీకరించిన ఉదంతం మనకు సాధారణంగా కనపడదు. ప్రస్తుతం అనేక కేసులలో ముద్దాయిలుగా ఉన్న వారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారి వాదనలు ఏమిటో అందరికీ తెలిసిందే.
ఇఎస్‌ఐ అక్రమాల కేసుల్లో మంత్రిగా అచ్చెన్నాయుడి అవినీతి, మోటారు వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జెసి కుటుంబ సభ్యుల అవినీతి నిగ్గు తేలేవరకు వారంతా నిందితులే.అవసరమైతే జైలుకు పోవాల్సిందే. పదహారు నెలల పాటు జైల్లో ఉండి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరుకావాల్సిందే అని కోర్టుతో చెప్పించుకున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. గతంలో వైసిపి నేతలు జైలు పాలయినపుడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇప్పుడు తమ నేతల అరెస్టుల గురించి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేయటం సహజమే. గత ఐదు సంవత్సరాల పాలనలో వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసులు దాఖలైతే మిగిలిన వారు కూడా రిమాండ్‌ లేదా జైలు పాలు కావచ్చన్న భయంలో వారిలో ఉండటం సహజం. తమ ఏలుబడిలో రాజకీయ ప్రత్యర్ధులను, సమస్యల మీద ఉద్యమించినందుకు తప్పుడు కేసులు పెట్టి సామాన్యులను ఎందరిని జైలు పాలు లేదా కస్టడీలకు పంపిందీ గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం నేతలకు వారి మద్దతుదార్లకు కాస్త ఊరట కలుగుతుందేమో !
గతంలో కూడా అధికారంలో ఉన్నవారి మీద ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయటం తెలిసిందే. అయితే వారు అధికారానికి వచ్చిన తరువాత వాటిని మరచిపోయినట్లు వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. అధికారం కోసం ఎంతకైనా తెగించే ధోరణులు ప్రబలిన కారణంగా అంతే స్ధాయిలో కక్షలూ పెరిగాయి. ప్రతిపక్షంలో ఉండి తమను ఎదిరించిన వారిని ఆర్ధికంగా దెబ్బతీయటం, రాజకీయంగా అవమానించటం అనే కక్షపూరిత ధోరణులు దక్షిణాదిలో తొలుత తమిళనాడులో ప్రారంభమయ్యాయి.అధికార రాజకీయ కక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో,నీచ స్ధాయికి దిగజారుతాయో మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో చూశాము. ఎంజిఆర్‌ మరణించినపుడు మృతదేహం దగ్గర ఆమెపై జరిగిన దాడి, గెంటివేత ఒకటైతే ఆ తరువాత రెండు సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న ఆమెపై దాడి, చీరలాగివేసి అవమానించిన తీరు ఎరిగినదే. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి పరిణామాలను చూడాల్సి ఉంటుందో !
ఇలాంటి కక్ష, దెబ్బతీసే ధోరణులు పపంచమంతటా ఉన్నాయి. అందువలన తమ నేతకు కక్ష సాధించే లక్షణం లేదని ఎవరైనా వైసిపి కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ముందే చెప్పుకున్నట్లు కేసుల్లో అరెస్టు చేయటం వేరు. అరెస్టు చేసిన తీరు విపరీతంగా ఉన్నపుడు దానిలో కక్ష పాలు లేదని ఎలా చెప్పగలరు ? అచ్చెన్నాయుడిని అరెస్టు చేయదలచుకుంటే సాధారణంగానే ఆపని చేయవచ్చు గానీ అర్దరాత్రి అంత హైడ్రామా ఆడాల్సిన పనిలేదు. సినిమాల్లో పేరు మోసిన బందిపోటు, గజదొంగలు, లేదా స్మగ్లర్లను పట్టుకొనే మాదిరి దృశ్యాలకు తెరతీయాల్సినపని లేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇప్పటికే బనాయించిన కేసులు,రాబోయే కేసుల గురించి జనానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సాధారణ అంశంగానే తీసుకుంటున్నారు. అందుకే మీడియా ముందు నేతలు గుండెలు బాదుకుంటున్నా అవన్నీ మామూలే అనుకుంటున్నారు. తెలుగుదేశం పాలనలో లేదా అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనలో అవినీతి జరగలేదని ఎవరూ చెప్పటం లేదు సమర్ధించటమూ లేదు. అందుకు బాధ్యులైన వారు రాజకీయ నేతలైనా, వారికి సహకరించి వాటా పొందిన ఉన్నత అధికారులైనా సరే విచారణ, కేసులను ఎదుర్కోవాల్సిందే.
రాజకీయ నేతలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి లేకపోతే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడి ఉదంతం తెలియచేస్తోంది. మాజీ ఎంఎల్‌ఏ పిల్లి అనంత లక్ష్మి కుమారుడికి యనమల స్వగ్రామంలో రెండవ వివాహం చేసేందుకు ఏర్పాటు చేయగా దానికి ఎనమలతో పాటు సోదరుడు కృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. అది తెలిసిన అనంత లక్ష్మి కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని నిలిపివేయించింది. ఆమె దళిత యువతి, తన భర్తకు రెండవ వివాహం చేయించేందుకు ప్రయత్నించారని, తనను బెదిరించారని ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార చట్టం కింద కేసుదాఖలు చేసింది. ఈ ఉదంతంలో పాలకపార్టీ పెద్దల ప్రమేయంతో ఆ యువతి కేసు దాఖలు చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పుకోవచ్చు. ఒక వివాహంలో సమస్యలు వచ్చి విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేయటం, దానికి హాజరు కావటం ఒక అక్రమాన్ని ప్రోత్సహించటమే అవుతుంది. మాకు వివరాలు తెలియదు అంటే చట్టం అంగీకరించదు.
ఆర్ధిక మూలాలను దెబ్బతీసే ఎత్తుగడలు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న పాలకులు కొత్తగా ప్రారంభించినవేమీ కాదు. అంతకు ముందే నాంది పలికారు. దానిలో భాగమే ప్రతి పార్టీలో గెలిచిన నేతలను అధికారపక్షం వైపు ఆకర్షించటం లేదా పరోక్షంగా బెదిరించటం అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే అవి పరాకాష్టకు చేరాయి. రానున్న రోజుల్లో సాధారణం అవుతాయి. ఎన్నికల్లో డబ్బు అన్నది ప్రధాన పాత్ర వహిస్తున్నందున ఓటర్లు కూడా నేతల నైతిక ప్రవర్తనకు బదులు జేబులను చూస్తున్నారు.ఇది పార్టీలు మారేందుకు, అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరేందుకు రాజకీయనేతలకు మరింత వెసులుబాటు కలిగిస్తోంది.
గత పాలకుల అవినీతిపై కేసులు బనాయించటం, జైలు పాలు చేయటం రాబోయే రోజుల్లో ఏ పర్యవసానాలకు దారి తీస్తుంది ? అధికారపక్షంలో ఉన్నవారి అవినీతి మీద ప్రతిపక్షం నిరంతరం ఒక కన్నువేసి ఉంచుతుంది. ఎప్పటికప్పుడు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అధికారగణం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అధికారపక్షం తన అవినీతిని కప్పి పుచ్చుకొనేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కొత్త పుంతలు తొక్కిస్తుంది.
వైఎస్‌ జగన్మోహనరెడ్డి, అనుయాయుల మీద ఉన్న కేసులు ఆశ్రిత పెట్టుబడిదారుల నుంచి లబ్దిపొందారన్న స్వభావం కలిగినవి. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొందరు పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలకు అనుచిత లబ్ది కలిగిస్తే దానికి ప్రతిగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ప్రతి లబ్ది కలిగించారన్నవి, మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎదుర్కొనేవి స్వయంగా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినవి. ఏవైనా చిన్నవా, పెద్దవా అన్నది కాదు. అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్నదే అసలు సమస్య. కోట్లాది రూపాయలను అక్రమంగా వెనుకేసుకొని జైలుపాలైతే కుటుంబ సభ్యులు వాటిని దర్జాగా అనుభవిస్తారు. అలాంటి ఘరానా పెద్దలు జైల్లో ఉన్నా వారి భోగాలకు కొదవ ఉండదు. కొన్నేండ్లు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన సమాజంలో గౌరవానికి ఎలాంటి ఢోకా ఉండటం లేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగవేసిన వారికి సంబంధించి ఆస్తుపాస్తులేవైనా ఉంటే వాటిని జప్తుచేసి ఎంతో కొంత రాబట్టేందుకు అవకాశం ఉంది. అవినీతి కేసులో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినా, లేదా కొన్ని కంపెనీలు, వ్యక్తులకు కట్టబెట్టినా ఆ మొత్తాన్ని రాబట్టినపుడే భవిష్యత్‌లో అవినీతికి పాల్పడే వారికి కాస్త బెరకు ఉంటుంది. అందుకు తగిన విధంగా వైసిపి ప్రభుత్వం బనాయిస్తున్న కేసులు ఉన్నాయా? ప్రజల సొమ్మును తిరిగి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అన్నదే ఇప్పుడున్న సవాలు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుని స్తుతి – సైతాను దూషణ = జగన్‌ సైన్యం

15 Sunday Dec 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, chandrababu naidu, tdp, Ycp, YS jagan, ys jagan vs chandrababu naidu

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు
అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకును చూస్తే చాలు అన్నది గత సామెత. ఇప్పుడు ప్రెషర్‌కుకర్లలో వండుతున్నందున వెలువడే మోతలు లేదా ఈలలను బట్టి ఉడికిందో లేదో చెప్పేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో చోటు చేసుకుంటున్న వాక్‌ ధ్వనులు, మోతలను బట్టి రాబోయే రోజుల్లో ఏమి జరగనుందో, ప్రజాప్రతినిధులు ఎలా ఉండబోతున్నారో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారంటారు. అరునెలలకు ముందు అసెంబ్లీలో తెలుగుదేశం ఎలా వ్యవహరించిందో, ఆరునెలల తరువాత వైసిపి అదే విధంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మేము పరిశుద్ధ రాజకీయాలు చేస్తాము, కొత్త వరవడికి శ్రీకారం చుడతాము, మాటతప్పము మడమ తిప్పము అని చెప్పుకొనేందుకు వైసిపి నాయకత్వానికి నైతికంగా ఇంకే మాత్రం అవకాశం లేదు.తెలుగుదేశం పార్టీ సభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అసెంబ్లీలో తనకు ప్రత్యేక స్ధానం కేటాయించమని అడగటం, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సదరు సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించటం వెంటనే జరిగిపోయింది. ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను పట్టించుకోకుండా స్పీకర్‌ విచక్షణ అధికారాల మేరకు ఇది జరిగింది. వంశీమోహన్‌ వైసిపికి దగ్గర అయ్యారు, అసెంబ్లీ సభ్యత్వానికీ ఢోకా లేదు. అసెంబ్లీలో చంద్రబాబు మీద ధ్వజమెత్తటానికి ఒక సభ్యుడు తోడయ్యారు. కావాల్సిన కార్యాన్ని స్పీకర్‌ తీర్చారు
తెలుగుదేశం నుంచి ఎవరైనా ఎంఎల్‌ఏలు బయటకు వచ్చి సభ్యత్వాలను కోల్పోకుండా మరొక పార్టీలో చేరాలంటే ఒక కొత్త దారిని కనుగొన్నారు. దీనికి వైసిపి దారి లేదా జగన్‌ బాట అని పేర పెట్టవచ్చు. ఎవరైనా పార్టీ మారదలచుకుంటే నాయకత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సస్పెన్షన్‌కు గురి కావటం, తరువాత తమకు ప్రత్యేక స్ధానం కేటాయించాలని స్పీకర్‌ను కోరవచ్చు, నచ్చిన పార్టీతో కలసి ఊరేగవచ్చు అని తేలిపోయింది.అయితే వంశీ ఉదంతం తరువాత ఇతర ఎంఎల్‌ఏలు ఎవరైనా తమ నాయకత్వాన్ని ఎంతగా తూలనాడినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వారిని సస్పెండ్‌ చేయకపోవచ్చు. అయితే అది ఎంతకాలం అన్నది ప్రశ్న. పార్టీ మారాలనుకున్న సభ్యులు సస్పెండ్‌ అయ్యే వరకు విమర్శలు, తిట్లదండకాన్ని కొనసాగిస్తే మీడియా, జనానికి ఉచిత వినోదాన్ని పంచినట్లు అవుతుంది. సస్పెండ్‌ చేస్తే ప్రత్యేక స్ధానాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ సౌకర్యం ఎంఎల్‌సీలకు తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పెద్ద పార్టీగా ఉంది, ఆ పార్టీకి చెందిన షరీఫ్‌ మహమ్మద్‌ మండలి చైర్మన్‌గా ఉన్నందున ప్రత్యేక స్ధానాలు కేటాయించే అవకాశం ఉండదు. అధికారపక్షం మెజారిటీ సాధించి మండలి చైర్మన్‌ను మార్చేవరకు లేదా షరీఫ్‌ మారు మనసు పుచ్చుకుంటే తప్ప అదే పరిస్ధితి కొనసాగుతుంది. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఎందరు మిగులుతారన్నది ప్రశ్న.

Image result for ys jagan vs chandrababu naidu
ఇక అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను చూస్తే వైసిపి సభ్యులు దేవుని స్తుతి, సైతాను నింద కొనసాగించేందుకు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో పంటలు మార్కెట్‌కు రావటం ఇప్పుడే ప్రారంభమైంది. వాటిని అమ్ముకోవటం,గిట్టుబాటు ధరల సంగతి దేవుడెరుగు కనీసం మద్దతు ధరలు అయినా వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులకు ఏదో ఒక రూపంలో లాభాలు వచ్చే విధంగా పాలకులు చూడగలరు గానీ, రైతాంగానికి ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశాలు ఉండవు. ప్రభుత్వ విధానాల వలన తమకు నష్టం వస్తున్నట్లు గ్రహించిన తరువాత వైసిపి అభిమానం ఆవిరిగావటానికి ఎక్కువ సమయం పట్టదు. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాల హౌరులో వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తెలుగుదేశం నేతలపై ధ్వజం, గతపాలన తీరుతెన్నులను విమర్శిస్తూ వైసిపి ఎంతకాలం కాలం కాలక్షేపం చేయగలదు ?
దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అదే చేసింది. తీరా అది వివాదాస్పదం అయిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఇసుక వారోత్సవాలను ప్రకటించాల్సి వచ్చింది. రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడి పర్యటన తరువాత సిఆర్‌డిఏ పరిధిలో నిర్మాణాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. రాజధానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మారుస్తామని మేమెక్కడ చెప్పామంటారు? రాజధాని అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సిందిగా ఒక కమిటీని వేశామని, దాని సిఫార్సులు వచ్చిన తరువాత స్పష్టత వస్తుందని మరోవైపు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమంగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన అంశాల మీద ప్రతిపక్షాలు, సామాజిక సంస్ధలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల జగన్మోహనరెడ్డి సర్కార్‌కు విశ్వాసం, వైఖరి లేదనేది స్పష్టమైంది. నెలల తరబడి జాప్యం చేసి ప్రకటించిన ఇసుక విధానం, వివాదాస్పద ఆంగ్లమాధ్యమం అమలు- తెలుగు మాధ్యమ విద్యాబోధన ఎత్తివేత నిర్ణయాలు స్పష్టం చేశాయి.
వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తానొక ముఖ్యమంత్రి అని మరచిపోయినట్లున్నారు. దిశపై అత్యాచారం, హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌పేరుతో పోలీసులు హత్యచేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆచర్యను సమర్ధించటం, తెలంగాణా ప్రభుత్వం, పోలీసులకు అభినందనలు చెప్పటం, ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణకు రాజ్యాంగబద్ద సంస్ధ జాతీయ మానవహక్కుల సంఘం విచారణకు రావటాన్ని తప్పు పట్టటం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు. ఏ ముఖ్య మంత్రీ గర్హనీయమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కేంద్రంతో ప్రతి విషయం మీద ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అడుగులకు మడుగలొత్తటం, మోసేందుకు పోటీపడటం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన పార్టీల వైఖరిగా ఉంది. వివాదాస్పద అంశాలైన ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్ర రద్దు, పౌరసత్వ సవరణ బిల్లువంటి మీద కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం, వైసిపి పోటీ పడ్డాయి. కనీసం తటస్ధంగా కూడా లేవు. ‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేంద్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం. ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు, మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో… ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించిందో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుంది, రాజకీయాలు ఇలా ఉంటాయంటూ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇంత చక్కటి తెలుగులో చెప్పిన తరువాత దానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ బాట చే గువేరాతో ప్రారంభమై అమిత్‌ షా వైపు పయనిస్తున్నదని మరొకరు చెప్పనవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడాలంటే దానికి రాష్ట్రంలో అధికారం కూడా ముఖ్యం. పార్లమెంట్‌ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా వారిని ఆకర్షించటం దానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ భాగం రాష్ట్రం వెలుపలే ఉంటాయి లేదా వారి లాబీ కంపెనీలు ఎక్కడైనా ఉండవచ్చు గనుక కేంద్రంతోనే ఎక్కువ అవసరాలుంటాయి. దీనికి వైసిపి ఎంపీలు అతీతులు కాదు గనుక కొత్తగా ఎంపీలైనవారు, పారిశ్రామిక, వాణిజ్యాలను ఇంకా ప్రారంభించని వారు మినహా మిగిలిన వారు జగన్‌తో కంటే నరేంద్రమోడీ, అమిత్‌ షాలకే గ్గరగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
రాష్ట్రంలో స్ధానిక నేతలు బిజెపిలోకి రావాలంటే వారికి రాష్ట్రంలో అధికారం ముఖ్యం. అది ఉంటేనే వారికి లాభం. తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ అధికారాన్ని పంచుకున్నపుడు ఇదే రుజువైంది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను ఒకవైపు రంగంలోకి దించి మరోవైపున వైసిపిని దారికి తెచ్చుకొనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. తమ ప్రయోజనం నెరవేర్చుకొనేందుకు ఎన్ని పార్టీలు, ఎన్నికశక్తులనైనా తన మందలో చేర్చుకోగల శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ మీద ఇప్పటికే కావలసినన్ని కేసులు ఉన్నందున బిజెపి పని సులువు అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ వత్తిడిని తట్టుకొని వైసిపి ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేము.
రక్తం రుచి మరిగిన పులిని బోనులో బంధిస్తే దాన్నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే వైసిపిలో అధికార రుచిమరగిన నేతలకు కొదవలేదు. అవినీతికి దూరంగా ఉండాలని వైసిపి నాయకత్వం ఎంతగా చెబితే అంతగా వారిలో అసహనం పెరుగుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఎవరిని కదిలించినా ఇట్టే తెలిసిపోతుంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్‌ నేత నెల్లూరు జిల్లాలో పరిస్ధితి గురించి బహిరంగంగానే బయటపడ్డారు. అలాంటి వారిని తాత్కాలికంగా నోరు మూయించగలరు తప్ప ఎక్కువ కాలం కట్టడి చేయగలరా ? ప్రభుత్వ వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ, పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రాలు కుదురుకున్నతరువాత వాటిలో చోటు దక్కని వారిని అదుపు చేయటం అంత తేలిక కాదు.

Image result for ys jagan vs chandrababu naidu
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో చూపిన మేరకు వచ్చే అవకాశ ం లేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన ప్రకటించిన లేదా అమలు జరుపుతున్న పధకాలకు కోత పెట్టటం అనివార్యం. అదే జరిగితే జనంలో అసంతృప్తి ప్రారంభం అవుతుంది. పార్టీ క్యాడర్‌లో, జనంలో అలాంటి పరిస్ధితి ఏర్పడితే ఇంక చెప్పాల్సిందేముంటుంది ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గతంలో తెలుగుదేశం-చంద్రబాబు నాయకత్వ వైఖరి, తీరు తెన్నులను విమర్శించిన వారు, ఇప్పుడు వైసిపి-జగన్‌ నాయకత్వ తీరు తెన్నులను హర్షిస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెంట తిరిగే హచ్‌ కుక్కలు – చంకనెక్కే బొచ్చు కుక్కలు !

05 Thursday Dec 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్‌ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్‌ కల్యాణ్‌ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ (పవన్‌ కల్యాణ్‌)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Image result for pawan kalyan chandrababu naidu jagan
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్‌ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్‌ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్‌ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్‌ అంటే, వైఎస్‌ఆర్‌ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్‌ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్‌ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.

Image result for pawan kalyan chandrababu naidu jagan

ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్‌ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇసుక సమస్య జగన్‌ సర్కార్‌ స్వయంకృతం !

01 Friday Nov 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion

≈ 1 Comment

Tags

sand crisis in Andhra Pradesh, tdp, Ycp, ys jagan government

Image result for sand crisis : ys jagan government brought on by one's self

ఎం కోటేశ్వరరావు
ఎవరు అవునన్నా కాదన్నా, అధికార పార్టీ నేతలు ఎంత గింజుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఒక ప్రధాన సమస్యగా మారింది. దీని వలన లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే పనుల్లేని రాజకీయవేత్తలకు చేతి నిండా పని దొరుకుతోంది. దీనికి కారకులు ఎవరు అంటే అధికార పక్షం ప్రకృతి మీద నెడుతోంది. నదులు, వాగులు, వంకలకు వరదలు తగ్గి ఇసుక తీసుకొనే పరిస్ధితి ఎంత త్వరగా రప్పిస్తావో భగవంతుడా అన్నట్లుగా ఉగ్గపట్టుకొని ఉంది. కారణాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద నెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగంగా ఈ సమస్య మీద నోరు విప్పటం లేదు. అధికారులతో సమీక్షల సందర్భంగా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తప్ప ప్రత్యక్షంగా విన్నవారు లేరు.
ప్రస్తుతం రాష్ట్రంలో వివాదంగా మారిన ఇసుక సమస్యకు ప్రధాన కారణం జగన్‌ సర్కార్‌ స్వయం కృతమే అని చెప్పాల్సి ఉంది. అధికారానికి వచ్చిన తరువాత అంతకు ముందున్న విధానాన్ని నిలిపివేసి మూడునెలల తరువాత కొత్త విధానాన్ని నిర్ణయించారు. పోనీ అదేమన్నా విప్లవాత్మకమైనదా అంటే కాదు. అంతకు ముందు ఉచితం పేరుతో ఇచ్చినా అధికార పార్టీ పెద్దలకు కప్పం చెల్లించి ఇసుకను తెచ్చుకోవాల్సి వచ్చింది, రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియాలు తయారయ్యాయన్నది కాదనలేని సత్యం. జగన్‌ సర్కార్‌ విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. టన్నుకు రూ 370 ధర, కిలోమీటర్‌కు రూ 4.90 రవణా చార్జీలు చెల్లించాలని నిర్ణయించారు. ఆచరణలో దొరుకుతున్న కొద్ది మొత్తం కూడా ఆ ధరలకు రావటం లేదన్నది వాస్తవం.
ముమ్మరంగా నిర్మాణాలు జరిగే సమయంలో దాదాపు మూడు నెలల పాటు ఇసుక క్వారీలను మూసివేయటాన్ని జగన్‌ అనుభవరాహిత్యం అనాలా, సలహాదారులు తప్పుదారి పట్టించారని భావించాలా ? ఏ నిర్ధారణకు వచ్చినా అంతిమంగా ముఖ్యమంత్రిగా జగన్‌దే బాధ్యత అవుతుంది.జూన్‌, జూలై మాసాల్లోనే పనులు పోతున్నాయని కార్మికులు గగ్గోలు పెడుతున్నపుడే మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి తలెత్తి ఉండేది కాదు. ఇసుక విధానం ప్రకటించక ముందు కొన్ని చోట్ల అధికారపార్టీ పెద్దలు అనధికారికంగా ఇసుకను దండుకున్నారనే విమర్శలు వచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో నిమగం కావటం, సాధారణంగా వర్షాకాలంలో, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోయిన తరువాత తుపాన్ల కారణంగా అత్యవసరం అయితే తప్ప నిర్మాణాలు జరగవు. పట్టణాల్లో కూడా పరిమితమే. ఈ ఏడాది అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు, నదులకు వరదల కారణంగా ఇసుక తీయటంలో కొంత అసౌకర్యం ఏర్పడిందన్నది వాస్తవం. అధికార పార్టీ, ప్రభుత్వం ఈ కారణాలను చెప్పి సమస్య నుంచి తప్పుకోవాలని చూస్తోంది. నిర్మాణాలు ముమ్మరంగా జరిగే సమయంలో కార్మికులు నాలుగు డబ్బులు వెనకేసుకొని పనులు తక్కువగా లేదా లేని సమయంలో వాటితో కుటుంబాలను నెట్టుకొస్తారు. ఈ ఏడాది అటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వమ్ము చేసింది. అదే జగన్‌ ప్రతిపక్షంలో ఉంటే ఈ పాటికి ఓదార్పు యాత్రలను ప్రారంభించి ఉండేవారు కాదా ! ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ఓదార్పు అనేందుకు అవకాశం లేదు, సహజంగానే ఇప్పుడు ఆ పాత్రను ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం నానాటికీ పెరుగుతున్న కారణంగా ఆ రంగంలో పని రోజులు తగ్గిపోతున్నాయి. గతంలో వ్యవసాయం తరువాత చేనేత ప్రధాన వృత్తిగా ఉండేది. ఆ రంగంలో యాంత్రీకరణ కారణంగా నేత కార్మికులు వ్యవసాయ కార్మికులుగా, నిర్మాణ కార్మికులుగా, ఇతర రంగాల్లోకి మారిపోయారు. వివిధ కారణాలతో నిర్మాణ రంగం నేడు వ్యవసాయం తరువాత ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్మిక శాఖ వద్ద నమోదు అయిన నిర్మాణ కార్మికుల సంఖ్య 30 లక్షలు. వీరు గాక నిర్మాణ రంగ అనుబంధ కార్యకలాపాల్లో కనీసం మరో పదిలక్షల మందికి ఉపాధి దొరుకుతున్నట్లు అంచనా. ప్రతి రోజు కనీసం లక్ష టన్నుల ఇసుక అవసరమన్నది నిర్మాణ రంగం వారి అంచనా. దానికి గాను దొరకుతున్నది ఎంత అంటే వర్షాలు పడి నదులు, వాగులు, వంకలు పొంగుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో అసలు లేదంటే అతిశయోక్తి కాదు. దొరికినా అది ఏమాత్రం చాలటం లేదు. అధికారులు రోజుకు 40వేల టన్నుల ఇసుక దొరుకుతోందని, కొన్ని నిమిషాల్లోనే విక్రయాలు అయిపోతున్నాయని చెబుతున్నారు. ఏ రోజు ఎంత విక్రయిస్తున్నారో, పరిస్ధితి ఎలా మెరుగుపడుతోందో అధికారికంగా సమాచారాన్ని వెల్లడించినపుడే ఏం చెప్పినా విశ్వసనీయత ఉంటుంది. తప్పు పట్టిన వారి మీద ఎదురు దాడి చేయటం తప్ప అలాంటిదేమీ లేదు.
ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమస్య మీద అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి పరిస్ధితిని వివరించి, సలహాలు కోరి ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవి. అదేమీ లేకపోగా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు వత్తిడి పెరిగిన తరువాత అధికారులతో సమీక్ష జరిపారు. నవంబరులో ఇసుక వారాన్ని పాటించి కొరత రాకుండా చూడాలని కోరినట్లు అధికారికంగా వెల్లడించారు. అంతే కాదు, సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని దాన్ని అరికట్టాలని డిజిపిని ఆదేశించినట్లు చెప్పటం సమస్య తీవ్రతను అంగీకరించటమే. సరిహద్దు ప్రాంతాల ఇసుక సమస్య విషయానికి వస్తే ఇటు నుంచి అటు ఎలా వెళుతోందో అటు నుంచి ఇటు కూడా రావటం కొత్త విషయమేమీ కాదు. కొరతకు అది ప్రధాన కారణం కాదు. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్ధితి కూడా లేదని గ్రహించటం అవసరం.ఈ ఏడాది వరదల కారణంగా ఇసుక లభ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత ఇసుక తవ్వకం కూడా సులభం అవుతుంది.
సమస్యలు ఉన్నపుడు సహజంగానే ప్రతిపక్షాలు దాన్ని పట్టించుకోకపోతే తప్పు అవుతుంది. అధికార పక్షం వాటికి అలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి తప్ప వారికేమి హక్కు ఉంది అంటే కుదరదు. తెలుగుదేశం పార్టీ, బిజెపి వంటి పార్టీలు రంగంలోకి రాకముందే భవన నిర్మాణ కార్మిక సంఘాలు, వాటికి మద్దతుగా వామపక్షాలు ఈ సమస్యను ముందుగా ప్రభుత్వ దృష్టికి తెచ్చాయి. వారేమీ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాలు కాదు, అక్రమాలకు పాల్పడలేదు. ప్రారంభంలోనే ఈ సమస్యకు తెరదించి కార్మిక సంఘాలు, పార్టీలతో చర్చించి ఉంటే నేడు నిజంగా ఇసుకను రాజకీయం చేస్తున్న వారికి అవకాశాలు వచ్చేవి కాదు.

Image result for sand crisis : ys jagan government brought on by one's self
గత ప్రభుత్వంలో ఆర్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా మార్చివేశారనటంలో ఎలాంటి మినహాయింపులు లేవు. ఎన్నికల్లో ఎంఎల్‌ఏలు, ఎంపీలుగా గెలిచిన వారు, వారి ప్రత్యర్ధులుగా పోటీ చేసి ఓడిన వారు ఎన్నేసి కోట్లు ఖర్చు పెట్టారో తెలియంది కాదు. ఆ మొత్తాలను వడ్డీతో అసలే కాదు, రాబోయే ఎన్నికలకు అంతకంటే ఎక్కువ పెట్టుబడులను సమకూర్చుకొనేందుకు సంపాదించాలంటే అడ్డదారులు తప్ప మరొక మార్గం లేదు. అందుకే రాజకీయనేతలు,ప్రజా ప్రతినిధులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు చేరుతున్నారు. వారంతా చేతి వాటం ప్రదర్శించకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటారనే భ్రమల్లో ఎవరూ ఉండనవసరం లేదు. ఎన్నికల్లో భారీ పెట్టుబడులు పెట్టిన వైసిపి ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, ఇతర నేతలు అవకాశాల కోసం ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నారు. వారిని అదుపు చేయటానికి ప్రయత్నిస్తే అధికార పార్టీలో అసమ్మతికి, వదలి వేస్తే రాజకీయంగా పతనానికి నాంది అవుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతల మీద తీవ్ర విమర్శలు చేసి అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారానికి వచ్చిన నేతలు అనేక మంది ఆచరణలో అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడిన ఉదంతాలు ఎన్నో. నేడు అధికారమే పరమావధిగా భావించే పార్టీలలో నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఎక్కడైనా ఒకరో అరో ఉండొచ్చు తప్ప మిగిలిన వారందరూ సంపాదనకు తెరతీసిన వారే. వైసిపి కూడా అదే కోవకు చెందినదే. తెలుగుదేశం అవినీతిని ఎన్నికలకు ముందూ తరువాత ఉతికిపారేస్తున్న వైసిపి నాయకత్వం సహజంగానే అందుకు భిన్నంగా ప్రవర్తించాలనే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశించవచ్చా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్‌, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు వంద రోజులు !

12 Thursday Sep 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

100 days : ys jagan as cm- chandrababu as opposition leader, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి పాలనకు, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీవీల్లో జరిగిన చర్చల్లో యాంకర్లు మీరు జగన్‌ తొలి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది ఒకటి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి ఆందోళనగా చేపట్టిన చలో ఆత్మకూరు యాత్ర గురించి కూడా మీడియాలో చర్చ జరిగింది.

జగన్‌ పాలన విషయానికి వస్తే నవరత్నాల సంక్షేమ చర్యల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కొన్ని చర్యలను ప్రకటించారు. కొండంత రాగం తీసిన విద్యుత్‌ ఒప్పందాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంప్రదాయేతర విద్యుత్‌ వుత్పత్తి సంస్ధలు విద్యుత్‌ పంపిణీ సంస్ధలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటన్నింటిలో కేంద్రంలో బిజెపి సర్కార్‌లో భాగస్వామి అయిన తెలుగుదేశం, రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కార్‌లో చేరిన బిజెపి నేతలు, వారి లాబీయిస్టులు, ప్రభుత్వాలు భాగస్వాములు. ఆ విద్యుత్‌ కంపెనీలన్నీ విదేశీ బడా సంస్ధలకు చెందినవి. వాటి వత్తిడి మామాలుగా వుండదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తాము అన్ని ఒప్పందాలను తిరగదోడబోమని, అక్రమాలు జరిగిన వాటికే పరిమితం అవుతామని జగన్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అందువలన పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండంకె వేసి తప్పని కొట్టేసి ఒకటిగా చివరికి సున్నాగా మారుస్తారా అన్నది చూడాల్సి వుంది. నవయుక కంపెనీ ఒప్పందం రద్దు కోర్టులో వుంది. రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ఏమౌతుందో చూడాల్సి వుంది. టెండర్ల జారీకి ముందే పరిశీలనకు ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తితో పరిశీలనకు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో అన్నీ రివర్స్‌ టెండర్లే వుంటాయని ప్రకటించిన సర్కార్‌ మరో వైపు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన నవరత్నాల గురించి జనం మరచిపోయే విధంగా రాజధాని వివాదాన్ని తలకు చుట్టుకోవటంలో వైసిపి జయప్రదమైంది. రాజధాని నిర్మాణం గురించి అనవసర చర్చకు తెరలేపింది, దాన్ని సమర్ధించుకొనేందుకు ఆ ప్రాంతంలో భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పింది. ఇది ఒక ఎత్తుగడగా ముందుకు తీసుకు వచ్చారా? అది తప్పుడు ఎత్తుగడా అన్నది పక్కన పెడితే వైసిపి కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నది. మార్కుల భాషలో చెప్పుకోవాలంటే ఆ పార్టీ తన సిలబస్‌లో లేని అంశాలను తానే ముందుకు తెచ్చి తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాయలేక ఇబ్బందులకు గురి అవుతోంది. అందువలన దానికి అత్తెసరు తప్ప పెద్దగా మార్కులు రాలేదు. రాజధాని సమస్యపై రగడ సృష్టించిన మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయనను సమర్ధించిన పార్టీ వారిని చుట్టుముట్టిన ప్రశ్నలకు వుక్కిరి బిక్కిరై రాజధాని మారుస్తామని మేము చెప్పామా అంటున్నారు. అభివృద్ది మొత్తం ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేస్తే ఎలా మిగతా ప్రాంతాలలో జరగనవసరం లేదా అనే ఎదురుదాడికి దిగారు. ఇక రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయటం వేరు. అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే ఆరోపణలు చేస్తే ఫలితం లేదు. వాటిని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత తమదే అని మర్చిపోరాదు. తగు సమయంలో బయట పెడతాం అంటే కుదరదు.

ప్రజాకర్షక సంక్షేమ పధకాలకు సంబంధించి తప్ప వైసిపి వద్ద అభివృద్ధి ఆలోచనలు లేదా పధకాలు గానీ లేవు. వర్షాధారిత రైతు మాదిరి ప్రయివేటు పెట్టుబడుల కోసం ఎదురు చూడటం తప్ప, ప్రభుత్వంగా పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించటానికి ఎలాంటి ఆలోచనా లేదు. చర్చల్లో నిలదీస్తే మా నాయకుడు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మౌన ముద్ర వహించినట్లుగానే మూలవిరాట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధాని గురించి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. వైసిపి వుత్స విగ్రహాలే మాట్లాడుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు వుపాధి కలిగించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనానికి 237 సేవలను అందిస్తామంటున్నారు. లక్ష్యం మంచిదే, ఇవి కార్యరూపం దాల్చితే తప్ప వాటి గురించి చెప్పలేము. అయితే ఇదే అభివృద్ధి, నాలుగు లక్షల మంది వలంటీర్లనియామకాన్ని నాలుగు లక్షల వుద్యోగాల కల్పనగా చిత్రిస్తే ఎదురు దెబ్బలు తగలటం ఖాయం.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు పేరుతో తొలి ఆందోళనా యాత్రకు తెరతీశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ముఠా కక్షలకు నిలయమైన గ్రామాల్లో అదొకటి. అక్కడ ఎక్కువ మంది జనాభా దళితులే. అయినా తెలుగుదేశం, వైసిపి పెత్తందార్ల మధ్య చీలిపోయి వున్నారు. పరస్పర దాడులు, కేసుల్లో బాధితులుగా కూడా వారే వుంటారు. గ్రామాల్లో ముఠా కక్షలకు ఎవరు తెరతీసినా, వాటిని ఎవరు కొనసాగించినా గర్హనీయమే. ఎక్కువ సందర్భాలలో ఎక్కడైనా బాధితులుగా వెనుకబడిన తరగతులు, దళితులే ఎక్కువగా వుంటారు. పెత్తందార్లు రెండు పార్టీల మద్దతుదార్లుగా మోహరించినపుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెత్తందార్లదే ఆ గ్రామంలో పెత్తనం. వారికి అదొక ఆదాయ మార్గం కూడా, అందుకే అధికారం లేనపుడు పెట్టుబడులు పెడతారు, ముఠాలను నిర్వహిస్తారు. అధికారం రాగానే వడ్డీతో సహా రాబట్టుకుంటారు.

తమ చలో ఆత్మకూరు పిలుపును సాగనివ్వలేదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకత్వం గుండెలు బాదుకొని ప్రజాస్వామ్యం గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చింది. నిజానికి వారికి నైతికంగా వున్న హక్కు వున్నదా ? తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారికంగా, పార్టీగా తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ప్రతి చలో పిలుపును పోలీసు యంత్రాంగంతో, పార్టీ పరంగా సాగకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. అంతే కాదు, చంద్రబాబు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడి సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవటం, దూర ప్రాంత పోలీసు స్టేషన్లకు తరలించటం అందరికీ తెలిసిన అంశమే. కొన్ని సందర్భాలలో వైసిపి నేతలను కూడా అక్కడక్కడా అలా ముందుస్తుగా నిర్బంధించిన వుదంతాలు కొన్ని లేకపోలేదు. అదే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడులో దళితులమీద జరిగిన దాడిని ఖండించేందుకు సిపిఎం, ఇతర పార్టీలు, సంస్ధలు ఇచ్చిన పిలుపును తెలుగుదేశం సర్కార్‌ సాగనివ్వలేదు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూ సమస్య మీద కూడా అదే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్రులో అంబేద్కర్‌ విగ్రహం, సామాజిక బహిష్కరణ వివాదంలో ఒక్క ఆగ్రామానికి రానివ్వకపోవటమే కాదు పది కిలోమీటర్ల దూరంలో వున్న భీమవరంలో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మూడూ దళితుల ప్రమేయం వున్న సామాజిక న్యాయ వుదంతాలు, ఆత్మకూరు మాదిరి పెత్తందార్ల ముఠాకక్షల సమస్య కాదు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాలుష్యకారక తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలోనూ తప్పుడు కేసులు పెట్టి మహిళలతో సహా ఎందరినో జైలు పాలు చేసింది చంద్రబాబు సర్కార్‌. అక్కడ కూడా అంతే పరిసర పట్టణాల్లో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పార్టీ తమ పెత్తందార్లకు మద్దతుగా ఆత్మకూరు యాత్ర జరపాలని ప్రయత్నించింది. అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు,ఇతర అనేక చిరుద్యోగ సంఘాలు చలో అమరావతి పిలుపు ఇస్తే (వారేమీ సచివాలయం దగ్గరకు వెళ్లేందుకు కాదు) విజయవాడకు రాకుండా చేసేందుకు రైళ్లలో,బస్సులో బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ దింపివేసి అడ్డుకున్న చరిత్రను చెరిపేస్తే చెరగదు. తాను రెండు కాళ్లతో నడుస్తూ వెళుతున్నా అడ్డగించారని అసెంబ్లీలో తెలుగుదేశం వుపనేత కె అచ్చన్నాయుడు వాపోయారు. ఆయన మంత్రిగా వున్న సమయంలో వివిధ చలో పిలుపులు ఇచ్చిన వారు కూడా కాలినడకనే వెళ్లేందుకు ప్రయత్నించారు. వారేమీ అనుమతి లేని ఆయుధాలు తీసుకొని రాలేదు. అంగన్‌ వాడీలు, ఆశాలు అందరూ మహిళలు కూడా. అధికారంలో వుంటే ఒక పాట ప్రతిపక్షంలో వుంటే మరొక పల్లవి.

Image result for ys jagan vs chandrababu naidu

అయితే చలో ఆత్మకూరు విషయంలో అధికార వైసిపి లేదా ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి. పైన పేర్కొన్న పెదగొట్టిపాడు, గరికపర్రు, తుందుర్రు వుదంతాల్లో వైసిపి జనం తరఫున నిలబడేందుకు ముందుకు రాలేదు. గరికపర్రు దళితులను ఓదార్చాలనే ఆలోచనే జగన్‌కు రాలేదు. అంటే ఆ ప్రాంతాల్లో వున్న పెత్తందార్లు వారికి ముఖ్యంగా కనిపించారు తప్ప జనం కాదు. ఆత్మకూరు విషయంలో కూడా పెత్తందారీ పోకడలనే వైసిపి ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు వైసిపి బాధితుల శిబిరం పేరుతో గుంటూరులో హడావుడి చేస్తే, దానికి పోటీగా తెలుగుదేశం బాధితుల పేరుతో తాను కూడా సమీకరించింది. చలో ఆత్మకూరుకు పోటీగా తమ మద్దతుదార్లకు అనుకూలంగా పోటీగా అదే చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చింది. ఒక అధికార పార్టీ ఇలా వ్యవహరించటం సమస్యను పరిష్కరించటంగాక తమ శిబిరాన్ని నిలబెట్టుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పార్టీ రేపు మరొక సామాజిక న్యాయ సమస్య మీదో, ప్రజాసమస్యల మీదో వామపక్షాలో, ప్రజా సంస్ధలో ఇచ్చిన పిలుపును కూడా సాగనిస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికే అలాంటి కొన్ని సూచనలు వున్నాయి. తెలుగుదేశం చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చేంత వరకు గుంటూరు శిబిరంలో వున్న ఆత్మకూరు, ఇతర గ్రామాల వారికి భరోసా కల్పించి వారిని గ్రామాలకు పంపించి తగు రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. తీరా ఆందోళన రోజు ఆ పని చేసింది? అదే ముందు ఎందుకు చేయలేదు ? చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నలలో పని చేస్తే జగన్‌ ఏలుబడిలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించనుందని ఈ వుదంతం వెల్లడించింది.

తెలుగుదేశం వైఖరిని సమర్ధించటమా, దెబ్బకు దెబ్బ, వారి పాఠం వారికే తిరిగి చెప్పారు అనుకుంటే పొరపాటు. గత ఐదేండ్ల చంద్రబాబు పాలనలో లెక్కలు తీస్తే ముందస్తు అరెస్టులు, నిరసనలను అడ్డుకోవటాలు ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసిపి పట్లకాదు, బలం పరిమితంగానే వున్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య జనం మీదనే దాడిని ఎక్కు పెట్టారు. ఇది న్యాయమైన ప్రజాస్వామ్య లేదా ఆర్ధిక హక్కుల మీదనే దాడి అన్నది గ్రహించాలి. అందువలన గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఏ ప్రభుత్వం పాల్పడినా ప్రశ్నించాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని జనం గ్రహించాలి.

గమనిక : చంద్రబాబు నాయుడు 2004,2009లో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పదేండ్లు కొనసాగటాన్ని ఒక విడతగా, తాజాగా నిర్వహిస్తున్న పాత్రను రెండోదిగా పరిగణించి ఈ విశ్లేషణలో రెండుసార్లు అని పేర్కొన్నాను. సాంకేతికంగా చూస్తే మూడవ సారి, అందువలన ఆ మేరకు శీర్షికను, విశ్లేషణ అంశంలో ఆ మేరకు సవరించాను.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి పాటలు -వైసిపి, తెరాస, తెలుగుదేశం డిస్కో డ్యాన్సులు !

11 Sunday Aug 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

370 article, Abrogation of Article 370 and 35A, abrogation of j&k state, Article 370 and 35A, BJP, tdp, trs, Ycp

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు చర్చలు – కొన్ని ప్రశ్నలూ !

10 Saturday Aug 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

Abrogation of Article 370 and 35A, Article 370 and 35A, BJP, Kashmir Valley, tdp, Ycp

ఎం కోటేశ్వరరావు

1.గతంలో ఏం జరిగిందనేది వదిలేద్దాం !

గతంలో జరిగిందాన్ని వదిలేద్దాం, ఎందుకు వదలి వేయాలి, ఎలా వదలి వేస్తాం, సరే వాదన కోసం అంగీకరిద్దాం. ఒక్క కాశ్మీర్‌ విషయమేనా లేక భారత చరిత్ర మొత్తాన్ని వదలి వేయాలా ? మనం ఒకదారిలో కొంతదూరం ప్రయాణించాం. ఎటువైపు నుంచి వచ్చామో గుర్తులేకపోతే, మననం చేసుకోకపోతే ఎటుపోవాలో ఎలా తెలుస్తుంది. కాశ్మీర్‌ విషయంలో చారిత్రక తప్పిదం జరిగింది, దానికి నెహ్రూ అసలు కారకుడని బిజెపి, సంఘపరివార్‌ లేదా వారి మద్దతుదారులు, వారు రాసిందాన్ని గుడ్డిగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నవారంతా చేస్తున్న గోబెల్స్‌ ప్రచారానికి ఆధారం ఏమిటి? గత చరిత్రే కదా. వారు దాన్ని విస్మరించనపుడు మిగతా వారెందుకు వదిలివేయాలి. తమకు ఒక ప్రమాణం, ఇతరులకు మరొకటా ? చరిత్రను, వాస్తవాలను వక్రీకరించే కదా ఇంతవరకు తెచ్చింది. అందువలన చరిత్రలోకి పోవద్దు అనటం అంటే వారి బండారం బయటపడుతుందనే భయమే కారణమా ?

2.వారి బండారం, చరిత్ర అంటున్నారు, అసలు వారెవరు ?

బ్రిటీష్‌ ఇండియాలో అఖిల భారత హిందూ మహాసభను ఏర్పాటు చేస్తే జమ్మూలోని డోగ్రా హిందువులను సమీకరించేందుకు ఆల్‌ జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తే జమ్మూలో 1939లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ ఏర్పడింది. తరువాత దాన్ని మరింత విస్తరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ను తొలుత జమ్మూకు, తరువాత కాశ్మీర్‌ లోయకు పంపారు. సదరు హిందూ సభ నేత ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌చాలక్‌ ప్రేమనాధ్‌ డోగ్రా. దేశ విభజన నిర్ణయం జరిగిన తరువాత 1947 మే నెలలో కాశ్మీర్‌ సంస్ధాన భవిష్యత్‌ గురించి రాజు హరి సింగ్‌ ఏ వైఖరి తీసుకుంటే అదే తమ వైఖరి అని హిందూ సభ చెప్పింది. అపర దేశభక్తి అంటే ఇదేనా ? రాజు స్వతంత్ర దేశంగా వుంటామని ప్రకటించాడు. అయితే అదే ఏడాది అక్టోబరులో పాకిస్ధాన్‌ మూకలు కాశ్మీర్‌ ఆక్రమణకు పూనుకుంటే రాజు భారత రక్షణ కోరాడు. రాజుగారితో పాటు దేశభక్తులూ మారారు. తరువాత హిందూ సభను ప్రజాపరిషత్‌ పార్టీగా మార్చారు. దీని లక్ష్యం ఏమిటయ్యా అంటే కాశ్మీర్‌ను దేశంతో పూర్తిగా విలీనం గావించటం, కమ్యూనిస్టుల ఆధిపత్యం వున్న డోగ్రా వ్యతిరేక షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం అని బలరాజ్‌ మధోక్‌ ప్రకటించాడు. మరి ఈ చరిత్రను కూడా మరచి పోవాలా ?

2. ఆర్టికల్‌ 370,35ఏ రద్దు దేశానికే మంచిది? అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి జరగలేదు. ఈ చర్యతో దేశంలో పూర్తి విలీనం జరిగింది.

సదరు ఆర్టికల్స్‌ కాశ్మీర్‌కే పరిమితం, వాటి రద్దు వలన దేశానికి లేదా ఇతర రాష్ట్రాలకు జరిగే మంచేమిటి ? ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు రద్దయితే మొత్తం దేశానికి వచ్చేదేమిటి? పూర్తి విలీనం జరగకపోతే గత ఏడు దశాబ్దాలుగా అక్కడ ఏడులక్షల మంది సైనికులు, ఇతర భద్రతా బలగాలు ఎందుకు, ఎలా వున్నట్లు ? ఇప్పుడు పూర్తి విలీనం అయింది కనుక వారంతా వెనక్కు వస్తారా ? జమ్మూకాశ్మీర్‌లో చేసిన ఖర్చు మొత్తం ఆ రాష్ట్ర ప్రజలకు చేసినట్లు ఎలా అవుతుంది. మిలిటరీ, సిఆర్‌పిఎఫ్‌, సరిహద్దు రక్షణ ఖర్చును కూడా కాశ్మీరీల ఖాతాలో వేస్తారా ? అదే అయితే చైనా, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కూడా సరిహద్దులు, వాటి రక్షణకు సైనిక బలగాలు వున్నాయి, ఆ ఖర్చు మొత్తాన్ని ఆయా పరిసర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఇచ్చిన నిధులుగా పరిగణిస్తారా ?

3. ఇప్పుడు ఆర్టికల్స్‌ రద్దువద్దని చెప్పే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారు వుగ్రవాదుల దాడుల సమయంలో కాశ్మీర్‌ పండిట్లను తరిమివేసినపుడు ఎ్కడ వున్నారు ?

కాశ్మీరీ పండిట్లపై కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, పాక్‌ మద్దతువున్న మతశక్తులు జరిపిన దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వేర్పాటు, వుగ్రవాద సంస్ధలు తప్ప కమ్యూనిస్టులతో సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సమర్ధించలేదు. ఖండించాయి. పండిట్ల పేరుతో గుండెలు బాదుకుంటున్న బిజెపి ఇతర పార్టీలు అంతకు మించి అదనంగా చేసింది ఏమిటి?

4.పాకిస్తానీ యువకులు కాశ్మీర్‌కు వచ్చి అక్కడి యువతులను వివాహం చేసుకొని పౌరసత్వం పొందుతున్నారు.!

గత ఐదు సంవత్సరాలుగా బిజెపి కేంద్రంలో అధికారంలో వుంది, మధ్యలో పిడిపితో కలసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ కాలంలో ఎంత మంది పాక్‌ యువకులు వచ్చి కాశ్మీరీ యువతులను వివాహం చేసుకొని భారత పౌరసత్వం పొందారో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి వారు లెక్కలు చెప్పగలరా ? పాకిస్ధాన్‌ నుంచి ఎవరైనా భారత్‌కు రావాలంటే వీసా వుండాలి. లేదా దొంగచాటుగా రావాలి. కేంద్రప్రభుత్వం ఎందరికి వీసా ఇచ్చింది? లేదా దొంగచాటుగా వచ్చే వారిని కేంద్ర ఆధీనంలోని సరహద్దు భద్రతా దళాలు లేదా ఇతర భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నట్లు ? భద్రతా సిబ్బంది గానీ, లవ్‌ జీహాద్‌ను వ్యతిరేకిస్తున్నామని తిరిగే హిందూత్వ సంస్ధలవారు గాని ఎంత మంది దొంగ పెళ్లికొడుకులను పట్టుకున్నారో చెబుతారా ?

5.కాశ్మీర్‌ హిందువులు, సిక్కులు మైనారిటీలు,దళితులు, గిరిజనులు, బిసిల వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు !

మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీర్‌లో రిజర్వేషన్లు లేవన్నది పచ్చి అబద్దం. దేశంలో అన్ని చోట్లా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వుంటే ఎక్కడా లేని విధంగా కాశ్మీరులో వెనుకబడిన ప్రాంతాల వారికి రిజర్వేషన్లు వున్నాయి.2005 రిజర్వేషన్‌ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి.

6. పాకిస్ధాన్‌ నుంచి వలస వచ్చిన వారికి కాశ్మీర్‌లో పునరావాసం కల్పించే అవకాశం లేదు !

పాకిస్ధాన్‌ లేదా మరొక దేశం ఎక్కడి నుంచి వలస వచ్చినా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వారికి ఎక్కడైనా పునరావాసం కల్పించవచ్చు. కాశ్మీర్‌లోనే అని ఎందుకు పట్టుబడుతున్నారు? గతంలో పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా , శ్రీలంక, టిబెట్‌ నుంచి వచ్చిన వారికి దేశంలో అనేక ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. తెలుగు ప్రాంతాల్లో బర్మా కాలనీల పేరుతో అనేకం వున్నాయి. ఏదో ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయలేదు. ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనటం వెనుక వున్న వుద్ధేశ్యాలేమిటి ?

7. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కలిగించినందువలన ప్రయోజనం లేదని తేలిపోయింది !

ఈ అంశంపై బిజెపికి ఎప్పుడు జ్ఞానోదయం అయింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరింది తామే అని ప్రచారం చేసుకున్న అంశం, 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ వాగ్దానాన్ని మరచిపోయారా ? పార్లమెంట్‌లో కాశ్మీర్‌ హోదా రద్దుకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, వైసిపి పార్టీలు 70ఏండ్లుగా కాశ్మీర్‌కు ప్రయోజనం లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పదేండ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఎందుకు అడుగుతున్నట్లు ? ఏమిటీ రెండు నాలుకల వైఖరి ?

8. కాశ్మీర్‌పై ఇంతకంటే ఏమి చర్చించాలి?

అదే ప్రాతిపదిక అయితే రేపు మరొక అంశానికి ఈ మాత్రం కూడా చర్చించాల్సిన పనేమిటి, ఎలాగూ వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు కనుక మేము చేయదలచుకున్నది చేశాం, పార్లమెంట్‌,అసెంబ్లీల్లో మాకు మెజారిటీ వుంది కనుక ఆమోదించుకుంటాం అంటే ఏం చేస్తారు ? ప్రజాస్వామ్యం అంటే ఇదా ? ఒక బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టాలంటే ముందుగా సభానిర్వహణ సలహా కమిటీకి తెలియచేయాలి, సభ్యులకు ముసాయిదా బిల్లులను ముందుగా అందచేయాలి. కాశ్మీర్‌ విషయంలో అదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంట్‌ తలుపులు మూసి చేశారు మేము, తెరిచే చేశాము అంటున్నారు. అప్పుడు తలుపులు మూసినపుడు ఆ చీకట్లోనే బిజెపి, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ కలిసే కదా చేసింది. నాడు చేయని విమర్శ బిజెపి ఇప్పుడెందుకు చేస్తున్నట్లు ? ఏ ఒక్క రాష్ట్ర విభజన సమయంలో అయినా ఆ రాష్ట్రాల్లో కాశ్మీరులో మాదిరి 144సెక్షన్లు, కర్ఫ్యూలు, పోన్లు, ఇంటర్నెట్‌ బంద్‌ పెట్టలేదు, వ్యతిరేకించినా, అనుకూలించినా అసెంబ్లీల్లో చర్చకు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎందుకు జరపలేదు. అసెంబ్లీ లేని సమయంలో బిల్లులు పెట్టాల్సిన తొందరేమొచ్చింది?

9. పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత వ్యతిరేకించటం ఏమిటి ?

పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన ప్రజలకు, పార్టీలకు వ్యతిరేకించే హక్కులేదా ? ప్రపంచంలో ప్రతి నియంత అన్నింటినీ చట్టబద్దంగానే చేశారు. వాటిని ప్రజలెందుకు వ్యతిరేకించినట్లు ? 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితికి అంతర్గత కల్లోలం, విదేశీ ముప్పు కారణాలుగా చూపారు. పార్లమెంట్‌లో పూర్తి ఆమోదం పొందారు. దాన్ని బిజెపి పూర్వరూపం జనసంఘం ఆమోదించిందా వ్యతిరేకించిందా, ఇంకా అనేక పార్టీలు ఎందుకు వ్యతిరేకించినట్లు ? జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ కూడా అంతా పార్లమెంట్‌ ఆమోదం పేరుతోనే ప్రపంచాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నాడు. మరి హిట్లర్‌ను ఎందుకు వ్యతిరేకించినట్లు ?

10. రిజర్వేషన్లు కూడా ఆయా తరగతుల వారిని వుద్దరించింది లేదు !

కాశ్మీర్‌ విషయంలో 370 చేకూర్చిన ప్రయోజనం లేదని వాదిస్తున్న వారిలో అనేక మంది విద్యా, వుద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఆయా తరగతులను వుద్దరించలేదు, గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు నిషేధ చట్టాల వలన గిరిజనులు కూడా అభివృద్ధి చెందలేదు, అక్కడ పరిశ్రమలు రావటం లేదు కనుక ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజమే కదా అని వాటిని కూడా రద్దు చేస్తే పరిస్ధితి ఏమిటి ?

వక్రీకరణలు – వాస్తవాలు !

పాకిస్తానీయులు కాశ్మీర్‌ వచ్చి అక్కడి యువతిని వివాహం చేసుకొని స్ధానికులుగా మారి వుగ్రవాదానికి పాల్పడుతున్నారు- ఒక ప్రచారం.

పాకిస్ధానీ యువకులే కాదు, ఏ విదేశీయువకులైనా కాశ్మీరీ యువతినే కాదు, ఇష్టమైతే ఏ రాష్ట్ర యువతిని అయినా వివాహం చేసుకోవచ్చు. భారతీయ పౌరసత్వం తీసుకోవచ్చు. చట్టంలో అటువంటి అవకాశం వుంది. వుగ్రవాదానికి పాల్పడుతున్నారంటారా? వారే కాదు, మన గడ్డమీద పుట్టి పెరిగిన వారు అయినా వుగ్రవాదానికి పాల్పడితే చర్యలు తీసుకోవటానికి కూడా చట్టాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల యువతీ యువకులు అనేక మంది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎందరో వెళుతున్నారు. వారు అక్కడి యువతీ, యువకులను వివాహాలు చేసుకొని పౌరసత్వం పొందుతున్నారా లేదా ? ఏ విదేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్టు, వీసాలు కావాలి.మనం విదేశాలకు వెళుతున్నట్లే పాకిస్ధాన్‌ లేదా మరొక దేశ వాసులు ఎవరైనా అలాంటి చట్టబద్ద పద్దతుల్లో మన దేశం రావటానికీ అవకాశం వుంది.

పాకిస్ధాన్‌ గురించి ముస్లింల గురించీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలూ వారిని అనుసరించే వ్యక్తులూ నిరంతరం విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రచారాలను చేస్తున్నారు. వాటిని అనేక మంది నమ్ముతున్నారు. ఆ తప్పుడు ప్రచారం చేసే వారూ వాటిని గుడ్డిగా నమ్ముతున్నవారికి ఒక చేదు నిజం చెప్పకతప్పదు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ చివరి మూడు సంవత్సరాల్లో విదేశీయులకు మంజూరు చేసిన పౌరసత్వం కంటే నరేంద్రమోడీ మొదటి మూడు సంవత్సరాల్లో మంజూరు చేసిన వారి సంఖ్య రెట్టింపుకు పైగా వుంది. రెండు ప్రభుత్వాల ఆరు సంవత్సరాల కాలంలో 5,477 మందికి భారతీయ పౌరసత్వం ఇస్తే మోడీ గారు వచ్చిన తరువాత 3,800 మందికి ఇచ్చారు. మొత్తం ఆరు సంవత్సరాల కాలంలో 2,157 మంది పాకిస్ధానీయులు,1,461 మంది ఏ దేశానికీ చెందని వారు,918 మంది ఆఫ్ఘన్స్‌, 218 బంగ్లా, 145 బ్రిటన్‌, 108 శ్రీలంక, 66 ఇరాన్‌, 61 మంది అమెరికా నుంచి వచ్చిన వారితో సహా మొత్తం 56దేశాల నుంచి వచ్చిన వారు పౌరసత్వం పొందారు. రామన్‌ శర్మ అనే జమ్మూ ప్రాంతానికి చెందిన సమాచార హక్కు దరఖాస్తుదారుకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ 2017లో ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలున్నట్లు 2017 మార్చి 31న ట్రిబ్యూన్‌ పత్రిక ప్రచురించింది. ‘ 2014 నుంచి 2016 డిసెంబరు మధ్య కాలంలో భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 3,801, ఇదే అంతకు ముందు ప్రభుత్వ(కాంగ్రెస్‌ సర్కార్‌) హయాంలో 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకు భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 1,676 ‘ అని సమాధానంలో వున్నట్లు ట్రిబ్యూన్‌ రాసింది.

సంవత్సరాల వారీ చూస్తే 2016లో గరిష్టంగా 660 మంది పాకిస్ధానీయులకు పౌరసత్వం ఇచ్చారు.అంతకు ముందు 2014,2015లో 267,263 చొప్పున ఇచ్చారు. మొత్తం 918 మంది ఆఫ్ఘన్‌ జాతీయులకు పౌరసత్వం ఇస్తే 204ా16 మధ్య ఇచ్చిన వారే 700 మంది వున్నారు. పాకిస్తానీయులకు మోడీ సర్కార్‌ పౌరసత్వం ఇచ్చిందంటే దాని అర్ధం వుగ్రవాదులకు ఇచ్చినట్లా ?

మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కానట్లయితే, ఎవరైనా విదేశీయులు భారత పౌరులను వివాహం చేసుకుంటే చట్టబద్దంగా మన దేశంలో ఏడు సంవత్సరాలు నివశించిన తరువాత వారు స్ధానిక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే వారికి మంజూరు చేస్తారు. మన పౌరులు విదేశీయులను వివాహం చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. ఇందాద్‌ షామిల్‌ అనే కేరళ అబ్బాయి, మరయం యూసఫ్‌ అనే పాకిస్ధాన్‌ అమ్మాయి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం లాహోర్‌లోనూ, పాలక్కాడ్‌లోనూ వివాహం, వివాహం, విందులు ఇచ్చి ఒక్కటయ్యారు. 2008లో మరయం కేరళకు వచ్చింది. వారికి ఇద్దరు పిల్లులు, ఏడు సంవత్సరాల భారత నివాస నిబంధన పూర్తి అయిన తరువాత 2017లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది జనవరిలో మంజూరైనట్లు మళయాళ మనోరమ పత్రిక తెలిపింది.

ఇలా పాకిస్ధానీయులు కాశ్మీర్‌ యువతులను లేదా భారతీయులు పాక్‌ యువతులనే కాదు, ఏ ప్రాంతం, రాష్ట్రం, మతం, కులం వారైనా ఏదేశం వారినైనా వివాహాలు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఎందరికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసిందో, వారిలో ఎందరు వుగ్రవాదులుగా మారారో, ఎంత మందిని పట్టుకున్నారో తెలుపుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచార పూర్వరంగంలో అధికారయుతంగా ప్రకటించి వక్రీకరణలకు తెరదించాల్సిన అవసరం వుందా లేదా ?

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికనేతను కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు గనుక నోరు మూసుకున్నాను

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం మాట్లాడేవారు ఎవరూ మిగల్లేదు

ఇది హిట్లర్‌ నాజీ మూకల గురించి జైల్లో ఒక మతాధికారి రాసిన ప్రఖ్యాత కవిత. కాశ్మీరీల ప్రత్యేక హక్కుల మీద జరిగిన దాడిని వ్యతిరేకించకపోతే రేపు తమదాకా వస్తే ఏమిటో ప్రతివారూ ఆలోచించాలా వద్దా ? అది రెండు తెలుగు రాష్ట్రాల్లో జోనల్‌ వ్యవస్ధ కావచ్చు,లోకల్‌, నాన్‌ లోకల్‌ కావచ్చు. వుద్యోగుల వేతన సంఘాలు కావచ్చు, కార్మిక చట్టాలు, ఇతర సంక్షేమ చట్టాలు ఏవైనా దాడికి, రద్దుకు గురి అయితే ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d