• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ఎన్‌డిటివీపై నిషేధం- అసంబద్ద వాదనలు !

08 Tuesday Nov 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, emergency, Free press, Modi, ndtv, ndtv ban, press freedom, un declared emergency

మీడియా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు

ఎం కోటేశ్వరరావు

    చచ్చిన చేప వాగు వాలున కొట్టుకుపోతుంది. బతికున్న చేప మాత్రమే ఎదురు ఈదుతుంది. దేన్నయినా ప్రశ్నిస్తేనే రచ్చ, చర్చ ప్రారంభమౌతుంది. ఫలానా రోజు ఫలానా చర్యను ఎందుకు ప్రశ్నించలేదు, దీన్ని మాత్రమే ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే కుదరదు. హేతుబద్దత లేకుండా అసంబద్ధతో మరొకటో వుంటేనే ఎవరైనా నిలదీస్తారు. సమర్ధించుకోవటానికి సరైన కారణాలు దొరకనపుడే చర్చను పక్కదారి పట్టించేందుకు చూస్తారు. వ్యూహాత్మకమైన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని ఆరోపించి ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ ప్రసారాలను నవంబరు తొమ్మిది-పది తేదీలలో ఒక రోజంతా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దండన విధించింది. అత్యవసర పరిస్థితి పేరుతో కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన ఘనత తమకు వుందని కమలనాధులు తరచూ చెప్పుకుంటారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ఒక కారణం, చట్టమూ, అధికారమూ కావాలి. కానీ అనధికారికంగా అమలు జరపటానికి అధికారం వుంటే చాలని నేటి కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చూపింది. హేతుబద్దంగా ఆలోచించే వారందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఒక రోజు నిషేధం మీడియా స్వేచ్చకు, ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్‌ నేతల మాదిరి తమ చర్యను సమర్ధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు పూనుకున్నారు. తమ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.జనానికి విచక్షణా జ్ఞానం వుంటుందనే అంశాన్ని కూడా మరచిపోయి అసంబద్ద వాదనలను ముందుకు తెస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డిటివీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు దేశ, విదేశాలలో నిరసన,మోడీ సర్కార్‌ అప్రజాస్వామిక చర్యపై విమర్శలతో భయపడిన కేంద్రం నిషేధం విషయమై ప్రభుత్వానికి విన్నవించిన కారణంగా ఎన్‌డిటివీ వాదనలు చెప్పుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నామంటూ నిషేధ నిర్ణయం అమలును వాయిదా వేసుకుంది. రద్దు చేయలేదు. ఈ ప్రకటన చేయబోయే ముందు సాయంత్రం వరకు నిషేధాన్ని సమర్ధించిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాత్రికి నిషేధాన్ని నిలిపివేసినట్లు అధికారుల చేత ప్రకటన చేయించారు. నవంబరు ఎనిమిదవ తేదీన ఎన్‌డిటివీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబరు ఐదవ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం విధించిన నిషేధం అమలును వాయిదా వేసినందున ప్రసారంపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వుభయపక్షాల అంగీకరించటంతో కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది.

    సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది, నిషేధాన్ని వాయిదా వేశారు తప్ప ఎత్తివేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకీ చర్యకు పాల్పడింది. మీడియా, ప్రజాస్వామిక వాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యవసానాలేమిటి ? ఎప్పటి మాదిరే దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాసం రాసే సమయం వరకు నోరు విప్పలేదు. కనీసం ట్విటర్‌ ద్వారా కూడా స్పందించలేదు. మన్‌కీ బాత్‌లో ఏమైనా బయటపడతారో లేదో చూడాలి. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై నోరు విప్పకపోవటం నరేంద్రమోడీ వ్యవహార శైలి అన్నది గత రెండున్నర సంవత్సరాల అనుభవం రుజువు చేసింది.

    ప్రతి తరం అత్యవసర పరిస్థితి నాటి కాలాన్ని నిష్పక్షపాతంగా చూస్తే మరొక నేత ఎవరూ అటువంటి తప్పు చేయాలన్న తలంపుకే రారు అని ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక అవార్డుల సభలో వుద్బోధ చేశారు. చిత్రంగా ఆ మరుసటి రోజే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే ఎన్‌డిటివీపై ఆ కాలం నాటి నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తూ ఒక రోజు నిషేధం విధించటం గమనించాల్సిన అంశం. నరేంద్రమోడీకి తెలియకుండానే ఇది జరిగిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదొక ముఖ్యపరిణామం, అందునా మోడీ అంతరంగం అందరికంటే బాగా ఎరిగిన వెంకయ్య నాయుడు శాఖ, మీడియా స్వేచ్చకు సంబంధించింది, దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ, హోం, తదితర అంతర మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సుల మేరకు నవంబరు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు కార్యక్రమాల ప్రసారాన్ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఐదువ తేదీ వరకు పఠాన్‌కోట్‌ సైనిక కేంద్రంపై పాకిస్ధాన్‌ వైపు నుంచి ప్రవేశించిన తీవ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి ప్రసారం చేసిన అంశాలలో మన రక్షణ రహస్యాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను 30 రోజుల పాటు నిషేధం విధించాల్సి వున్నప్పటికీ ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలిపింది.ఈ చర్య మీడియా స్వేచ్ఛను ప్రత్యక్షంగా వుల్లంఘించటమే అని, అత్యవసర పరిస్థితి నాటి అవశేషమిదని కూడా భారత సంపాదకుల మండలి (ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొన్నది.

     జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి వార్తలను ప్రసారం చేయగా 29వ తేదీన సమాచార, ప్రసార శాఖ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. వ్యూహాత్మకంగా రహస్యమైన సమాచారాన్ని ప్రసారం చేసినందున భద్రతా దళాలు చేపట్టిన ప్రతిక్రియలను అడ్డుకొనేందుకు నేరం చేసిన వారు వుపయోగించుకొనే అవకాశం వున్నందున, అది నిబంధనలకు విరుద్దమైనందునా ఎందుకు ప్రసారం చేశారో సంజాయిషీ ఇవ్వాలని దానిలో కోరింది.2015లో సవరించిన 1995 కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం ప్రకారం భద్రతా దళాలు చేపట్టే ఏ విధమైన వుగ్రవాద నిరోధక చర్యలనైనా ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆ చట్టం నిర్దేశించిన ప్రసార స్మృతిలో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వుగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మిలిటరీ జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. తీవ్రవాదులు దాడి కొనసాగుతుండగానే జనవరి నాలుగున ఎన్‌డిటివి రిపోర్టర్‌ ఆ వార్తలో చెప్పిన అంశం ఇలా వుందని ప్రభుత్వం పేర్కొన్నది.’ ఇద్దరు మిలిటెంట్లు ఇంకా సజీవంగానే వున్నారు, వారు మందుగుండు సామగ్రి డిపో పక్కనే వున్నారు. మిలిటెంట్లు మందుగుండు సామగ్రి డిపోను చేరుకున్నట్లయితే వారిని నిర్వీర్యం చేయటం కష్టమౌతుందని దాడిని ఎదుర్కొంటున్న జవాన్లు ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించారని, ఆ ప్రసారంలో వైమానిక స్ధావరం గురించి కూడా సమాచారాన్ని వెల్లడించారంటూ ‘ దానిలో మిగ్‌ యుద్ధ విమానాలు, రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, ఇంధన నిల్వలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వున్నాయని కూడా పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో తెలిపింది.ఈ సమాచారాన్ని స్వయంగా టెర్రరిస్టులు లేదా వారిని ప్రయోగిస్తున్నవారు గానీ వుపయోగించుకోవచ్చని పేర్కొన్నది.

  చట్టం ముందు ఎన్‌డిటివీగానీ మరొక ఛానల్‌ గాని అమలులో వున్న నిబంధనలను పాటించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, ఎవరూ అందుకు విరుద్ధంగా మాట్లాడటం లేదు. ఎవరైనా అలా చేస్త్తే చర్యతీసుకోవాలి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందుకు కోర్టులు, చట్టాలున్నాయి. చట్ట ప్రకారం తప్పుచేస్తే అందరికీ దండన విధించాలి. ఎన్‌డిటివీ, దానిపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న సంపాదకుల మండలి, ప్రయివేటు టీవీ ఛానల్స్‌ సభ్యులుగా వున్న నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఇతర అనేక జర్నలిస్టు సంఘాల అభ్యంతరం కూడా అలాంటి వార్తలనే ఇచ్చిన ఇతర సంస్ధలపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక్కదానిపై మాత్రమే దండన ఎందుకు విధిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. ఏదైనా ఒక శిక్ష అది చిన్నదా పెద్దదా అనేదానితో నిమిత్తం లేకుండా తగిన అధికారాలుగల సంస్ధ లేదా పదవిలో వున్నవారు మాత్రమే విధించాలి. కానీ శిక్ష విధించే అధికారాన్ని సమాచార,మంత్రిత్వశాఖ తనకు తాను పుచ్చుకోవటం ఏమిటని కూడా మీడియా సంస్ధలు సవాలు చేశాయి.

    ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు ఫిబ్రవరి ఐదున ఎన్‌డిటివీ సమాధానమిచ్చింది. తమ వార్త బాధ్యతాయుతంగా,సముచితంగా వుందని, వార్తలో పేర్కొన్న అంశాలు తాము ప్రసారం చేయటానికి ముందే వార్తా పత్రికలలో వచ్చాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి తెలిపింది. జనవరి మూడవ తేదీన ఐఎఎన్‌ఎస్‌ (వార్తా సంస్ధ) ఇచ్చిన వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిందని, దానిలో ‘మిగ్‌ 21 యుద్ధ విమానాలు, ఎంఐ 35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ముఖ్యమైన సొత్తు ‘ వైమానిక స్ధావరంలో వుందని దానిలో పేర్కొన్నారు. జనవరి మూడున టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వుపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నిఘారాడార్లు వున్నాయని తెలిపారు. జనవరి నాలుగున ఒక సైనిక బ్రిగేడియర్‌ను వుటంకిస్తూ హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ‘ ఇద్దరు వుగ్రవాదులు ఒక రెండంతస్ధుల భవనంలో వుండిపోయారని, అక్కడ వైమానిక దళ సిబ్బంది నివాసముంటారని ‘ పేర్కొన్నది. వాటిపై తీసుకోని చర్య తమకు ఎలా వర్తిస్తుందని ఎన్‌డిటివీ ప్రశ్నించింది.

     నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ) సెక్రటరీ జనరల్‌ ఆనీ జోసెఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలను ఇతర మీడియా కూడా ఇచ్చిందని అవన్నీ బహిరంగంగా అందుబాటులోనే వున్నాయని పేర్కొంటూ ఎన్‌డిటివీ ఒక్కదానిపైనే చర్య తీసుకోవటం ఆశ్చర్యంగా వుందన్నారు. అంతర మంత్రిత్వ శాఖల కమిటీ, సమాచార మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని కేబుల్‌ చట్టంలోని పక్కా నిబంధనల మేరకు గాక రాజ్యాంగంలో హామీ ఇచ్చిన మీడియా స్వేచ్చ కోణం నుంచి చూడాలని, ఒక వేళ ఎన్‌డిటివీ నిబంధనలను వుల్లంఘించిదనుకుంటే ఆ విషయాన్ని ఎన్‌బిఏ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ సంస్ధ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్‌ అధారిటీ (ఎన్‌బిఎస్‌ఏ)కు నివేదించి వుండాల్సిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఎన్‌బిఏ కోరింది.

   ప్రభుత్వ నిర్ణయం అసాధారణమైందని ఖండిస్తూ తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత సంపాదకుల మండలి కోరింది.’ ఒక ఛానల్‌ను ఒక రోజు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం మీడియా, తద్వారా దేశ పౌరుల స్వేచ్చపై ప్రత్యక్ష వుల్లంఘన, అంతేకాదు కఠినమైన సెన్సార్‌షిప్పును విధించటం అత్యవసరపరిస్థితి నాటి అవశేషమే. వార్తలు ఇచ్చిన తీరుతో ఎప్పుడైనా ప్రభుత్వం అంగీకరించకపోతే మీడియా పనిలో జోక్యం చేసుకొనే అధికారాన్ని స్వయంగా పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాధ్యతా రహితంగా వార్తలను ఇచ్చినపుడు పౌరులు, రాజ్యానికి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవటానికి చట్టపరమైన పలు పరిష్కార మార్గాలు వున్నాయి. న్యాయపరమైన జోక్యం లేకుండా నిషేధం విధింపు స్వేచ్చ, న్యాయమనే ప్రాధమిక సూత్రాలను వుల్లంఘించటమే.’ అని తన ప్రకటనలో పేర్కొన్నది. బ్రాడ్‌కాస్టర్స్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన చేసింది.నిషేధం విధించటం భావ ప్రకటనా స్వేచ్చను వుల్లంఘించటమే అని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరింది. ఈ వుదంతంపై తరువాత ఒక సమగ్రనివేదికను తయారు చేస్తామని తెలిపింది.

     ఎన్‌డిటీవిపై నిషేధాన్ని మీడియా రంగానికి చెందిన ఎడిటర్స్‌ గిల్డ్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, అనేక జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకించాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంత మంది మౌనం పాటించారు. నిషేధాన్ని విమర్శిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌డియే పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలకు కోపం వస్తుందని కావచ్చు, కొన్ని మీడియా సంస్ధలు ఆ విషయాన్ని ప్రచురించకుండా లేదా అప్రాధాన్యత ఇచ్చిగానీ మొత్తం మీద ఏదో తప్పనిసరై వార్త ఇవ్వాల్సి వచ్చిందిగానీ ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదన్న సందేశాన్ని చేరవేశాయి. జెఎన్‌యు విద్యార్ధుల జాతీయ వ్యతిరేక నినాదాల ఆరోపణల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసిన జీ మీడియా , ప్రముఖ పారిశ్రామిక సంస్ధ ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి, రాజ్యసభ సభ్యుడిగా వున్న సుభాష్‌ చంద్ర మాత్రం ఎన్‌డిటివీని ఒక రోజు నిషేధించటం అన్యాయం, చిన్న శిక్ష , అసలు పూర్తిగా నిషేధించాలని ప్రకటించారు. ఒక వేళ అది కోర్టుకు వెళ్లినా అక్కడ చీవాట్లు తింటుందని కూడా ముందే చెప్పారు. అంతేకాదు, యుపిఏ హయాంలో తమ జీ న్యూస్‌ను నిషేధించాలనే ప్రతిపాదన వచ్చినపుడు మేథావులు, ఎడిటర్స్‌ గిల్డ్‌, ఎన్‌డిటివీ కూడా మౌనం వహించాయని కూడా సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

    నిబంధనలను వుల్లంఘించినందుకు గాను ప్రభుత్వం 2005 నుంచి 28సార్లు ఇలా నిషేధ నోటీసులు జారీ చేసిందని వాటిలో 21 యుపిఏ హయాంలో జారీ అయినవే అని అధికారుల ద్వారా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకొనేందుకు చూసింది. దానిలో భాగంగానే ఎన్‌డిటీవీ తరువాత మరో రెండు ఛానల్స్‌పై తీసుకున్న చర్యలను వెల్లడించింది. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. నిబంధనలను వుల్లంఘించి అన్ని ఛానల్స్‌, పత్రికలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఒకే తప్పు చేసిన మిగతావారిని వదలి ఒక్క ఎన్‌డిటివీపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అన్నదే ప్రశ్న. గతంలో చర్యలు తీసుకున్నపుడు ఆయా ఛానల్స్‌ నిషేధాన్ని సవాలు చేయలేదు. అంటే అవి తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. వాటిలో బూతు దృశ్యాలను చూపించిన కేసులు కూడా వున్నాయి.

    మీడియాలోని ప్రభుత్వ భక్తులు కొందరు విచిత్ర వాదనలను ముందుకు తెస్తున్నారు. భారత్‌లో మీడియా స్వేచ్చ తక్కువగానే వుందని చెబుతారు. అయితే అంటూ చైనా, బంగ్లాదేశ్‌, టర్కీ వంటి దేశాలలో ఇంతకంటే దారుణంగా వున్నాయనే వాదనలను ముందుకు తెస్తున్నారు.అంటే నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లా ? మనకు కావాల్సిన నేత ఎలా వుండాలంటే ఎవరైనా గాంధీ గురించి చెబుతారు తప్ప అనేక మందితో పోల్చితే గాడ్సే మంచివాడే అన్నట్లుగా వుంది ఈ సమర్ధన. మన కంటే పత్రికా స్వేచ్చ మెరుగ్గా వున్న దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ? ఇలాంటి చర్యలతో మనం ఎక్కడకు పోతున్నాం అన్నది ప్రశ్న.

    తన తప్పుడు చర్యను సమర్ధించుకొనేందుకు ప్రభుత్వం అనేక అసంబద్ద కారణాలను చూపుతోంది. టీవీ ఛానల్స్‌లో విలేకర్లు చెప్పిన సమాచారాన్ని వుగ్రవాదులు వుపయోగించుకొని దాడులు చేసే ప్రమాదం వుందట. వెనుకటి కెవడో అమాయకుడు నా పేరు ఫలానా రెడ్డి నీకు తెలివి వుంటే నా కులం ఏమిటో కనుక్కో అన్నాడట. ఏ దేశంలో అయినా సైనిక శిబిరాలలో సైనికులు, ట్యాంకులు, విమానాలు, మందుగుండు సామాగ్రి వుంటుందని వేరొకరు చెప్పాల్సిన అవసరం వుంటుందా ? అంతెందుకు మన ప్రభుత్వం ప్రకటించినట్లు మన సైన్యం జయప్రదంగా నిర్వహించిన సర్జికల్‌ దాడులు ఎక్కడ జరపాలో మన సైన్యం ఏ టీవీ, పత్రికా వార్తలను చూసి నిర్ణయించుకుందో ఎవరైనా చెప్పగలరా ? గూగుల్‌ మాప్‌లను చూస్తే ఎక్కడ ఏ సంస్ధలు వున్నాయో, ఎలా వెళ్లాలో కూడా ప్రపంచానికంతటికీ తెలుసు. అయినా దాడికి తెగబడిన వుగ్రవాదులు గానీ లేదా వారిని అంతంచేసేందుకు పూనుకున్న సాయుధ బలగాలు గానీ టీవీ వార్తలు చూసి తమ దాడి, ప్రతిదాడి వ్యూహాలను నిర్ణయించుకుంటారా ? ప్రభుత్వ వాదన ప్రకారమైతే దాడులకు ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో టీవీ పట్టుకోవాలి. పోనీ టీవీలో ఒక ఛానల్‌ కాదుగా అనేక ఛానల్స్‌ వుంటాయి. ఏ ఛానల్‌ ఏ సమాచారం తెలుస్తుందో రిమోట్‌లు నొక్కుతూ కాలక్షేపం చేస్తారా ? ఫఠాన్‌ కోట సైనిక శిబిరంపై దాడికి తెగబడ్డ వుగ్రవాదులను అంతం చేసిన మన సైన్యం వారి శవాల వద్ద టీవీ సెట్లు వున్నట్లు చెప్పలేదు. అత్యాధునికమైన ఇతర పరికరాలతో వారు ప్రవేశించినట్లు కదా ప్రకటించారు.

     ఒక వుదంతం గురించి దాదాపు ఒకే విధంగా వార్తలు ఇచ్చిన పత్రికలు, ఛానల్స్‌లో ఒక్క సంస్ధను మాత్రమే వేరు చేసి చర్య తీసుకోవటం వెనుక ఇతర కారణాలు వున్నాయా ? మోడీ సర్కార్‌ వివక్షను ప్రదర్శించిందా ? ఢిల్లీలోని ఆంగ్ల పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌ తమ పార్టీకి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్యాపదేశంగా గతంలో తరచూ ఆరోపించేది. ఇప్పుడు కూడా మీడియా పట్ల ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు సదభిప్రాయం లేదు. విమర్శనాత్మకంగా వుండటమే దానికి కారణం.విలేకర్లను ప్రెస్టిట్యూట్స్‌ అని ఏకంగా కేంద్రమంతి వికె సింగ్‌ నిందించారు. ఇంతకాలమైనా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను కలవకుండా తప్పించుకోవటానికి ఆంగ్ల భాషా సమస్యతో పాటు ఇదొక కారణమని కూడా చెబుతారు.

    ఎన్‌డిటివీ విషయానికి వస్తే ఆ ఛానల్‌ అన్నా, దానిలో పనిచేసిన కొందరు జర్నలిస్టులన్నా నరేంద్రమోడీకి పడదు. బిజెపికి వీరాభిమాని అయిన జర్నలిస్టు, రచయిత్రి అయిన మధు కిష్వెర్‌ 2013లో మోడీ నామా పేరుతో తన పత్రికలో నరేంద్రమోడీ గురించి ఆకాశానికెత్తుతూ అనేక వ్యాసాలు రాశారు, తరువాత వాటిని పుస్తకంగా ప్రచురించారు.2014లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు జర్నలిస్టులు బర్ఖాదత్‌, రాజదీప్‌ సర్దేశాయి కారణంగానే 2002లో గుజరాత్‌లో ఘర్షణలు చెలరేగాయని మోడీ ఆరోపించారు. ‘తొలి 72 గంటలు(నాలుగు రోజులు) ఘర్షణలు అదుపులో వున్నాయి. తరువాత ఏమైంది ? కొన్ని సంఘటనలను జర్నలిస్టులు సంచలనాత్మకం గావించారు. సూరత్‌ నుంచి బర్ఖాదత్‌, ఒక దేవాలయ్యాన్ని విధ్వంసం చేశారని అంజార్‌ నుంచి సర్దేశాయి ప్రత్యక్ష ప్రసారాలలో వార్తలను అందించారు. సూరత్‌ నగరం ప్రశాంతంగా వుందని, అక్కడ పోలీసులెవరూ లేనందున అలజడులు జరిగే అవకాశముందని బర్ఖాదత్‌ పదే పదే చెప్పారని, ఆమెను పిలిచి మీరు విధ్వంసకారులను సూరత్‌కు ఆహ్వానిస్తున్నారా అని నిలదీశానని, ఆరోజే ఆ ఛానల్‌ను తాను నిషేధించానని మోడీ చెప్పారు. అయితే తరువాత తానసలు సూరత్‌ వెళ్లలేదని బర్ఖాదత్‌ వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అనేక ఛానల్స్‌ సంచలనాత్మక కధనాలు ఇచ్చినప్పటికీ నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఒక్క ఎన్‌డిటీవితో తప్ప ఇతర అన్ని ఛానల్స్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో ఢిల్లీ జెఎన్‌యు ఘటనలు, గుజరాత్‌లో అమిత్‌ షా సభను ఆటంక పరిచిన పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన జరిగిన యాత్ర, గుజరాత్‌ దళితనేత జిగ్నేష్‌ మేవానీ, గుజరాత్‌లో అమ్‌ పార్టీ నేత కేజిరీవాల్‌ సభ గురించి బిజెపి, నరేంద్రమోడీ అండ్‌కోకు నచ్చని రీతిలో ఎన్‌డిటివీ వార్తలను ప్రసారం చేసింది. జెఎన్‌యు ఘటనల సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ అరగంటపాటు బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలనే ప్రదర్శించి తనదైన శైలిలో వ్యవహరించింది. ఇది కూడా బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. పాలకపార్టీ, ప్రభుత్వ తీరుతెన్నులను బహిర్గత పరుస్తున్న కారణంగానే ఎన్‌డిటివీ యాజమాన్య నిర్వహణ, ఆర్ధిక వ్యవహారాల గురించి వేధింపులకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. టేకోవర్‌ నిబంధనలను సరిగా పాటించలేదంటూ సెబి, విదేశీ మారక ద్య్రవ నిబంధనలను వుల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ ద్వారా ఒక నోటీసు పంపి వేధింపులకు పూనుకుందన్న విమర్శలు వున్నాయి.

    భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని వుపయోగించి అధికారుల ద్వారా ఈ విధమైన వేధింపులకు పాల్పడటంతో పాటు ఎన్‌డిటివీపై తన అనుచరగణాన్ని వుసిగొల్పి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున దాడి చేయిస్తున్నది. ఇది ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒక సంస్ధ తప్పు చేస్తే దానిపై ఫిర్యాదు చేయవచ్చు, కేసులు దాఖలు చేయవచ్చు. కానీ ఆ సంస్ధలలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత జీవితాలపై సామాజిక మీడియాలో ప్రచారం చేయటం హేయం. అది ముదిరితే ఏదో ఒకనాటికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు బిజెపి, దాని నేతలపైన కూడా దానిని ప్రయోగిస్తారని వారు తెలుసుకోవటం లేదు. వారు ఒక్క జర్నలిస్టుల గురించే కాదు, తమను వ్యతిరేకించే వారందరి పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తారనే విమర్శ వుంది. స్వంత పార్టీలోనే నరేంద్రమోడీని వ్యతిరేకించిన సంజయ్‌ జోషి ఒక మహిళతో వున్నట్లు చూపే బూతు సీడీలను ఆ పార్టీ వారే పంపిణీ చేయించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. ఆ సంజయ్‌ జోషికి తిరిగి పార్టీలో పదవి ఇచ్చినందుకు గాను పదవి నుంచి తొలగించే వరకు తాను పార్టీ సమావేశాలకు రానని 2009లో నరేంద్రమోడీ బెదిరించిన విషయం, అందుకు పార్టీ తలొగ్గిన విషయం తెలిసిందే. అందువలన ఒక ఛానల్‌, ఒక పత్రికపై జరుగుతున్న దాడిగా దీనిని చూస్తే రాబోయే ముప్పును విస్మరించినట్లే. అధికారంలో వున్న పార్టీ ఈ విధంగా తనకు నచ్చని మీడియాను వేధించటమంటే లొంగదీసుకొని భజన చేయించుకొనేందుకే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో వుంటే రేపు మరొక పార్టీ రావచ్చు. అప్పుడు మరికొన్ని ఛానల్స్‌, పత్రికల పని పట్టవచ్చు. తెలంగాణాలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను కేబుల్‌ ఆపరేట్ల ద్వారా అడ్డుకోవటాన్ని ఖండించిన తెలుగు దేశం పార్టీ తాను అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను కూడా అదే పద్దతుల్లో అడ్డుకున్న విషయం చూశాము. ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నపుడు సాక్షి మౌనం వహిస్తే సాక్షిపై దాడి జరిగినపుడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసింది. ఇది మీడియాలో అవాంఛనీయ పోకడ. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆయా సంస్ధలలో పని చేసే జర్నలిస్టులు ఇరకాటంలో పడుతున్నారు. యాజమాన్యాలతో పాటు వారిని కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్‌డిటీవి విషయంలో కూడా కొన్ని మీడియా యాజమాన్యాల వైఖరి అలాగే వుంది. పాలకపార్టీలకు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని చూస్తున్న శక్తులకు కావాల్సింది ఇదే. ముందు విమర్శనాత్మకంగా వున్న వాటిని తొక్కిపెడితే మిగిలిన వాటిని అదుపు చేయటం వాటికి చిటికెలో పని. అందుకే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరితో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరిని కలిగి వుండి, మీడియా, తద్వారా భావ ప్రకటనా స్వేచ్చపై జరిగే దాడిని ఎదుర్కోవటంలో ముందుండటం అవసరం.

గమనిక :నవంబరు నెల వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ సర్కార్‌పై మరో రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ వత్తిడి

04 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CRISIL, Modi, Narendra Modi, narendra modi government, rating agency crisil, s&p

ఎం కోటేశ్వరరావు

    గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతటికీ వర్తింప చేస్తామని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ అండ్‌ కో ఇప్పుడు దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అది మంచిదా, చెడ్డదా అన్న విషయాన్ని పక్కన పెడితే తాను అమలు జరిపినట్లు చెప్పుకున్న దానినే మోడీ ఎందుకు అమలు జరపటం లేదని అది మంచి విధానం అనుకొనే వారు కూడా మోడీని ప్రశ్నించటం లేదు. ఫలితాలు చూపకుండా ఎవరి డబ్బా వారు ఎంత కాలం కొట్టుకుంటారు, ఆ స్ధితిలో ఏదో ఒక సంస్ధ ఇచ్చే కితాబు కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. ఇప్పుడు నరేంద్రమోడీ ఆ స్థితిలో వున్నారు కనుకనే ప్రపంచబ్యాంకు ర్యాంకింగుల  ఇండెక్సు, రేటింగ్‌ సంస్ధల రేటింగ్‌ల కోసం వెంపర్లాడుతున్నారు. గతంలో ఇందిరా గాంధీని ఏవమ్మా ధరలు పెరుగుతున్నాయేమంటే కారణం విదేశీ హస్తం అని చెప్పేవారని జోక్‌ చేసేవారు. ఎందుకంటే విదేశీ హస్తాన్ని ఆమె అంతగా వాడుకున్నారు. చివరకా విదేశీ హస్తానికే ఆమె బలికావటం విషాదం అనుకోండి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు నెలనెలా పడిపోతున్నట్లు వార్తలు రావటమే తప్ప పెరిగినట్లు ఇంతవరకు వినలేదు. కారణం విదేశాలలో పరిస్ధితులు బాగోలేవు అని చెబుతున్నారు. అది ఒక్క మన దేశానికేనా మిగతా దేశాలకు వర్తించవా ? అని ఎవరైనా అడిగితే దేశద్రోహి అన్నట్లుగా విరుచుకుపడతారు.

     మరో రెండు సంవత్సరాల వరకు రేటింగ్‌ను మార్చాల్సినంత సీన్‌ లేదని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ద గాలి తీసింది. దాని కొనసాగింపా అన్నట్లుగా ఇప్పుడు క్రిసిల్‌ అనే మరో సంస్ధ మన ఎగుమతులు పడిపోవటానికి ప్రతికూల పరిస్ధితులే కారణమని సాకు చెపితే కుదరదని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతో పాటు దేశీయంగా వినియోగాన్ని కూడా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తాజాగా రూపొందించిన ఒక విశ్లేషణ పత్రంలో పేర్కొన్నది. ప్రధాని ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేయాలంటే రెండు మార్గాలు అనుసరించాలని సూచిస్తూ ఆ పత్రానికి ‘బైఫోకల్‌ ప్లీజ్‌ ‘ ( దయచేసి రెండు మార్గాల్లో నడవండి ) అని పేరు పెట్టింది.http://www.thehindu.com/business/Economy/global-situation-not-to-blame-for-fall-in-exports-crisil-study/article9301285.ece గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాలను కొనసాగిస్తూ, సంక్షేమ చర్యలకు మరింత కోత విధిస్తూ, పౌరుల ఆదాయాల పెంపునకు అవసరమైన విధానాలు అమలు జరపకుండా దేశీయ వినియోగాన్ని పెంచటం నరేంద్రమోడీ సర్కార్‌కు సాధ్యమేనా అన్నది ప్రశ్న. కుండలో కూడు తరగ కూడదు పిల్లాడు మాత్రం బొద్దుగా తయారు కావాలంటే సాధ్యమేనా ? రేటింగ్‌ సంస్ధలు చేసే విమర్శలు, విశ్లేషణలన్నీ కార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయన్నది గమనంలో వుంచుకోవాలి. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ విశ్లేషణతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అసలదేం చెప్పిందో చూద్దాం.

    ఎగుమతుల పోటీ తత్వాన్ని పెంచేందుకు కార్మిక చట్టాలలో వున్న కాఠిన్యతను తొలగించాలి, భూ సేకరణతో ముడిపడిన సవాళ్లను పరిష్కరించాలి, అరకొరగా వున్న రోడ్లు,రేవులు, విద్యుత్‌ వంటి వాటిని పుష్కలంగా సమకూర్చాలి, నైపుణ్యం లేని మానవశక్తి స్ధానంలో నిపుణులను అందుబాటులోకి తేవాలి. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2014లో ఒక కంటెయినర్లో వస్తువులను ఎగుమతి చేయాలంటే భారత్‌లో ఖర్చు 1332 డాలర్లు, అదే బంగ్లాదేశ్‌కు 1281, చైనాకు 823, వియత్నాంకు 610, ఇండోనేషియాకు 572 డాలర్లుగా వుంది. చైనా తక్కువ విలువ ఆధారిత వుత్పత్తులైన వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, బొమ్మల నుంచి వైదొలగి అధిక విలువ వుండే వస్తువుల వైపు మరలుతున్నందున దాని ఖాళీలో భారత్‌ ప్రవేశించాలంటే పైన పేర్కొన్న చర్యల వంటి వాటిని తీసుకోవాలి. అయితే ఇప్పటివరకు అందుబాటులో వున్న సమాచారం మేరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవు. వుదాహరణకు జౌళి రంగంలో భారత ఎగుమతులు 2001-15 మధ్య కాస్త అటూ ఇటూగా ఒకే విధంగా వున్నాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం ఎన్నో రెట్లు పెంచాయి. పాదరక్షల విషయంలో కూడా భారత వాటా గిడసబారి పోగా వియత్నాం దూసుకుపోయింది.

      ఈ నివేదికలో పేర్కొన్న డిమాండ్లను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు ఇప్పుడేదో కొత్తగా తెచ్చినవి కాదు, ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్ట సవరణకు పూనుకుంది. రూపాయి విలువ పెంచకుండా, సాధ్యమైన మేరకు తగ్గించేందుకు నరేంద్రమోడీ తన సర్వశక్తులు ధారపోస్తున్నారు. ఈ పూర్వరంగంలోనే తెలంగాణా,ఆంధ్రప్రదేశ్‌లలో పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులను అరెస్టు చేస్తున్నారు, బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. కార్మిక చట్టాలు వున్నప్పటికీ వాటి అమలును పక్కన పడేశారు, ఎక్కడైనా కార్మికులు ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దించి పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు భరోసా, ధైర్యం కల్పించే చర్యలకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దివీస్‌ లాబ్‌ విస్తరణ, తుందుర్రులో రొయ్యల శుద్ధి కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది ఇదే. క్రిసిల్‌ చెప్పిన ఒక మార్గంలో ఇవన్నీ భాగమే. ఇక అది చెప్పిన రెండవ మార్గం స్ధానిక వినిమయం లేదా డిమాండ్‌ పెంచటం గురించి చూద్దాం. ఇక్కడే మన దేశానికి చైనాకు కనిపిస్తున్న ప్రధాన వైరుధ్యం. ఎవరైనా దీన్ని ప్రస్తావిస్తే అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది స్వేచ్చా ప్రజాస్వామిక దేశం అన్న సమాధానం టక్కున చెప్పేస్తారు. ప్రజాస్వామ్యంలో వేతనాల పెంపుదల ద్వారా ప్రజల ఆదాయాలు తద్వారా వినిమయాన్ని పెంచవద్దని ఎవరైనా చెప్పారా ? పోనీ కమ్యూనిస్టు నియంతృత్వంలో బలవంతగా వేతనాలు పెంచేట్లు చేశారనుకుందాం, ప్రజాస్వామ్యంలో స్వచ్చందంగా పెంచవచ్చు కదా ? ఎందుకు ఆ పని చేయటం లేదు.

   http://www.businesstoday.in/magazine/features/textile-sector-target-one-crore-jobs-in-three-years/story/238641.html బిజినెస్‌ టుడే తాజా సంచికలో జౌళి రంగం గురించి రాసిన వ్యాసంలో వివిధ దేశాలలో ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల వేతనాల గురించి ప్రస్తావన వుంది. దాని ప్రకారం చైనాలో నెలకు 314, వియత్నాంలో 145, భారత్‌లో 120, బంగ్లాదేశ్‌లో 68 డాలర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాలో మన కంటే వేతనాలు తక్కువ కారణంగా అది చౌకగా దుస్తులను ఎగుమతి చేయగలుగుతున్నదని ఎవరైనా వాదిస్తే దీనికి ఏం జవాబు చెబుతారు ? ఒక్క ఈ రంగంలోనే కాదు అన్నింటా వేతనాలు పెరుగుతున్నాయని అమెరికా ఆర్ధికవేత్తలే చెబుతున్నారు. ఈ కారణంగానే 2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన మాంద్మం కారణంగా చైనా ఎగుమతులు తగ్గిపోయినప్పటికీ, వాటి స్ధానాన్ని దేశీయ వినియోగం పెంచటం ద్వారా భర్తీ చేస్తున్నది. అందుకే పెద్దగా సమస్యలు రాలేదు. ఎగుమతి ఆధారిత విధానం నుంచి క్రమంగా దేశీయ డిమాండ్‌ పెంపుదలకు తీసుకుంటున్న చర్యలను విస్మరిస్తే సరైన అంచనాకు రాజాలము.http://www.sify.com/finance/struggling-indian-savers-threaten-modi-s-growth-ambition-news-economy-qk2eEhagffebf.html ఇది గతనెలాఖరులో రాయిటర్స్‌ ఇచ్చిన వార్త. చైనా నుంచి అభివృద్ధి పతాకాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న భారత కలలకు పడిపోతున్న పొదుపు రేటు ఒక హెచ్చరిక అని మన స్ధూల జాతీయాదాయం (జిడిపి)లో జాతీయ పొదుపు మొత్తం 2003వ సంవత్సరం తరువాత అతి తక్కువగా ఈ ఏడాది 30.2శాతానికి పడిపోయిందని, రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఇది తగ్గుతుందని అంతర్జాతీయ వాణిజ్య సంస్ధ అంచనా వేస్తున్నట్లు దానిలో వుంది. రాయిటర్స్‌గానీ, ఐఎంఎఫ్‌ గానీ మోడీ వ్యతిరేక సంస్ధలు కావని గుర్తించాలి. మన జనం పైసా పైసా కూడ బెట్టి బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర సంస్ధలలో దాచుకుంటారు. వుద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్స్‌, బీమా పధకాల వంటి వాటిలో జమ చేస్తారు. ఈ మొత్తాలను పారిశ్రామిక వాణిజ్య వేత్తలు తమ పెట్టుబడులుగా వుపయోగించుకుంటారు. విజయ మాల్య, కావూరు సాంబశివరావు, సుజనా చౌదరి వంటి వారు కూడా వారిలో వుంటారనుకోండి, ఆ కథలు వేరే. దేశీయంగా పొదుపు మొత్తం తగ్గితే వారు మన కంటే తక్కువ వడ్డీకి వచ్చే విదేశీ పెట్టుబడులపై ఆధారపడతారు. అయితే దాని ఇబ్బందులు దానికి వుంటాయి.

    అభివృద్ధిలో చైనాను వెనక్కు నెట్టి వుద్యోగాలు కావాలనే వారి జాబితాలో ప్రతినెలా చేరు తున్న కోటి మంది యువతీ యువకులకు వుపాధి కల్పిస్తామనే నినాదంతో కదా నరేంద్రమోడీ అధికారానికి వచ్చింది. నూట ముఫ్ఫై కోట్ల జనాభాలో మూడింట రెండు వంతుల మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే, ఇంత మొత్తం గతంలో ఎన్నడూ లేరు. వారందరికీ వుపాధి కల్పించాలంటే నిరంతర అభివృద్ధి జరిగేందుకు ప్రధాన షరతుగా చెప్పాలంటే దేశీయ పొదుపు మొత్తం 35శాతానికి తగ్గకూడదని సీనియర్‌ ఆర్ధిక వేత్త హన్నా లుచినకావా చెప్పారు. మన దేశంలో ఏడాది క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మన పొదుపు 29.6శాతానికి పడిపోయింది. చైనా, తూర్పు ఆసియా దేశాలలో దశాబ్దాల తరబడి పొదుపు రేటు 30శాతానికి మించే వుంటున్నది. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఖర్చు చేశారు. ఇంకా అంతరం వున్నందున పూర్తిగా సమకూర్చాలంటే మరొక లక్షా 70వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

    పాలకులు అనుసరించిన విధానాల కారణంగా మరోవైపున సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వుద్యోగ కల్పన, వున్నవి కూడా అరకొరవేతనాలు, అభివృద్ధి మందగింపు వంటి అనేక అంశాలు జనం జేబులను ఖాళీ చేస్తున్నాయి. అప్పులలో ముంచుతున్నాయి. ఈ స్ధితిలో పొదుపు చేయటానికి వారి దగ్గర డబ్బెక్కడ వుంటుంది ? న్యూఢిల్లీలోని ఒక ఎలక్ట్రిక్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న 50 ఏండ్ల టేక్‌ మోహన్‌లాల్‌ గత మూడు సంవత్సరాలుగా తనకు సగటున ఏడాదికి ఎనిమిదిశాతం వేతనం పెరిగిందని అయితే పిల్లల విద్య, తల్లికి మందుల ఖర్చు 40శాతం పెరిగిందని చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ప్రయివేటు వుద్యోగుల పరిస్ధితి దాదాపు అన్ని చోట్లా ఇంతే వుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటూ రిజర్వు బ్యాంకు ఇటీవలి కాలంలో 175 పాయింట్ల మేరకు వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో బ్యాంకులు కూడా ఆ మేరకు డిపాజిటర్లకు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇవి పొదుపు చేసే వారిని ఆకర్షించటం లేదు. కొన్ని ధనిక దేశాలలో ఎవరైనా బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చే పరిస్ధితి వుంది. మన దేశంలో అధిక వడ్డీ రేటు కోసం పొదుపర్లు చూసే విషయం తెలిసిందే. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా గత 53 సంవత్సరాలలో తొలిసారిగా బ్యాంకు డిపాజిట్ల అభివృద్ధి రేటు తగ్గిపోయింది.

   2013 నుంచి సవరించిన వృత్తుల నూతన వర్గీకరణ సమాచారం ప్రకారం http://indianexpress.com/article/india/india-others/rural-wage-growth-lowest-in-10-years-signals-farm-distress-falling-inflation/ మన దేశంలో 2014 నవంబరు మాసంలో గత పది సంవత్సరాలలో అతి తక్కువ గ్రామీణ వేతనం నమోదైంది. సగటున గ్రామీణ ప్రాంత వేతనాలు నవంబరు నెలలో 3.8శాతం వార్షిక పెరుగుదల కాగా 2005 తరువాత అది కనిష్టంగా వున్నట్లు తేలింది. నిజానికి కార్మికశాఖ లెక్కలు వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించవు అనే అభిప్రాయం ఒకటి వున్నప్పటికీ వాటి ప్రకారం కూడా తగ్గింది. 2011 జూన్‌లో గరిష్టంగా 23శాతం వరకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకోవటానికి భలే అవకాశం వచ్చిందిలే అని మరొకడు సంబరపడినట్లుగా గ్రామీణ వేతనాల పెరుగుదల రేటు తగ్గుదల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా వున్నందున వడ్డీ రేట్లు ఇంకా తగ్గించటానికి అవకాశాలు మెరుగుపడ్డాయని రిజర్వుబ్యాంకు విధాన నిర్ణేతలు భావిస్తుండటం ఆందోళనకరం. గ్రామీణ వేతన రేట్ల పెరుగుదల తగ్గటం అంటే వారి ఆదాయాలు పడిపోవటమే, దాని పర్యవసానం కొనుగోలు శక్తి క్షీణిస్తుంది అది దేశీయ డిమాండ్‌ తగ్గటానికి దారితీసి పరిశ్రమల మూత వంటి పరిణామాలకు దారితీస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ వేతనాలు వేగంగా పెరిగినందున అది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసిందనే తప్పుడు సిద్ధాంతాన్ని చెబుతున్నారు. 2007 నుంచి గ్రామీణ వేతనాల పెరుగుదలకు కారణం వ్యవసాయేతర వుపాధి అవకాశాలు పెరగటం, దానికి తోడు వుపాధి హామీ పధకం తోడైందని, రైతాంగ పంటలకు మంచి ధరలు వచ్చినందున పెరిగిన వేతనాలను రైతాంగం భరించగలిగిందని సూత్రీకరిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ, వుత్పాదక రంగం బలహీనపడటం, పంటల ధరలు పడిపోవటం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలలో వేతనాల పెరుగుదల రేటు పడిపోయింది. దానికి తోడు వుపాధి హామీ పధకానికి తూట్లు పొడుస్తున్నందున గ్రామీణ వేతన రేట్లు ఇంకా పడిపోయే అవకాశం వుంది.

   గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారి ఆదాయాలను హరిస్తున్నవాటిలో విద్య, వైద్య ఖర్చులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు గాక రుణ వూబిలో కూరుకుపోవటం గురించి మాత్రమే తెలుసు ఇప్పుడు గ్రామీణ, పట్టణ పేదలు, సామాన్య రైతాంగం విద్య, వైద్య ఖర్చుల రుణ వూబిలో దిగబడిపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి బయటకు రావాలంటే అప్పులు చేయటం మినహా మరొక మార్గం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇటు వంటి స్ధితిలో పొదుపు మరింతగా పడిపోవటం అనివార్యం. దానితో పాటు పారిశ్రామిక వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోతుంది. అపుడు క్రిసిల్‌ పేర్కొన్న రెండవ రోడ్డు మార్గం మూసుకుపోతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్‌ మతలబులో మరిన్ని భారాలు, సబ్సిడీల కోతకు వత్తిడి !

03 Thursday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Congress, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

failure Modi, india debt, Modi Sarkar, Narendra Modi, s&p india, s&p india rating, subsidy, subsidy cuts

ఎం కోటేశ్వరరావు

    వూహల పల్లకిలో తేలుతున్న ప్రధాని నరేంద్రమోడీకి వారం రోజుల్లోనే రెండు చెడువార్తలు. సరళతర వాణిజ్య సూచికలో ప్రపంచ బ్యాంకు మన స్ధానాన్ని 131 నుంచి కేవలం 130కి మాత్రమే తాజాగా సవరించింది. పులి మీద పుట్రలా ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికా రేటింగ్‌ సంస్ధ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌అండ్‌ పి) వచ్చే రెండు సంవత్సరాల వరకు ప్రస్తుతం అత్యంత నాసిగా వున్న భారత్‌ రేటింగ్‌ను సవరించేది లేదని తేల్చి చెప్పింది. అంటే మన ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ ‘పని తీరు మీద అంతగట్టి విశ్వాసం ‘ ఏర్పరుచుకుందన్న మాట. తాను రాగానే అంతర్జాతీయ సమాజంలో గత ప్రభుత్వ హయాంలో గతించిన భారత ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింప చేశానని తనకు తానే కితాబు ఇచ్చుకున్న నరేంద్రమోడీకి దీన్ని పెద్ద తిట్టు, అవమానంగా భావిస్తారా ? లేక సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటారా ? ఆ సంస్ధ మనకు ఇచ్చిన రేటింగ్‌‘ BBB-/A-3’ . దీన్ని వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడులకు సంబంధించి అత్యంత తక్కువ గ్రేడ్‌ ఇది. ఇప్పుడున్న స్ధితి, జోస్యాలను బట్టి ఈ గ్రేడ్‌ అయితే స్ధిరంగా వుంటుందని, వచ్చే ఏడాది కూడా దీనిని సమీక్షించే అవకాశం లేదని, ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్య పరిస్ధితిని మెరుగు పరిస్తే, ప్రభుత్వ రుణం జిడిపికి 60శాతం కంటే తగ్గితే అప్పుడు రేటింగ్‌ సవరణ గురించి సమీక్షిస్తామని చెప్పటం పుండుమీద కారం చల్లటం వంటిది. సెప్టెంబరు నెలలో మూడీస్‌ సంస్ధ కూడా ఇదే విధంగా ఒకటి రెండు సంవత్సరాల తరువాతే సమీక్షిస్తామని చెప్పటాన్ని మరిచిపోరాదు. ప్రస్తుతం మన ప్రభుత్వ రుణ భారం 69శాతం వుంది. అంటే మనకు వంద రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే అప్పు 69 రూపాయలు వున్నట్లు. మన జిడిపి పెరుగుదల గురించి మంచి మాటలు చెప్పిన ఎస్‌ఆండ్‌ పి 2016లో 7.9శాతం, 2016-18 సంవత్సరాలలో సగటున ఎనిమిది శాతం పెరుగుదల వుంటుందని, జిఎస్‌టి వంటి చర్యల పట్ల అభినందనలు కూడా తెలిపింది. అయితే ఈ బలంతో పాటు తక్కువగా వున్న తలసరి ఆదాయం, ప్రభుత్వ ఖజనా బలహీనంగా వుండటం, బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి బలహీనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటదని తేల్చి చెప్పింది.

    ఈ ప్రకటనతో హతాశురాలైన ప్రభుత్వం పెట్టుబడిదార్ల ఆలోచన, రేటింగ్‌ ఏజన్సీల మధ్య సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నదని ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ద్వారా వ్యాఖ్యానించింది.ఆర్ధిక వ్యవస్ధను పటిష్ట పరిచేందుకు, జిడిపి అభివృద్ధిని పెంచేందుకు, వుద్యోగ కల్పనకు ప్రయత్నిస్తామని కూడా దాస్‌ చెప్పారు.రేటింగ్‌ను మెరుగు పరచనంత మాత్రాన ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందటం లేదని, సంస్ధ నివేదికలో పేర్కొన్నట్లుగా వివిధ అంశాలను పోల్చుకుంటే భారత్‌తో సమంగా మరొక ఆర్ధిక వ్యవస్ధ వుందా అని ప్రశ్నిస్తూ రేటింగ్‌ ఇవ్వబోయే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలని కూడా దాస్‌ అన్నారు. భారత రేటింగ్‌ను తక్కువ చూపుతున్నారని ప్రపంచ మదుపుదార్లు భావిస్తున్నారని, వారి ఆలోచనలు- రేటింగ్‌ సంస్ధలకు మధ్య సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.

    మన ప్రభుత్వ రుణ భారం 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించిన సమయంలో జిడిపిలో 75.33 శాతం వుండేది. అది 1998లో బిజెపి నేత వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ అధికారానికి వచ్చే నాటికి 68.09 శాతానికి తగ్గింది. తమ పాలనలో భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగి బిజెపి ఓడిపోయిన సమయానికి 2003లో అప్పును రికార్డు స్ధాయికి 84.24 శాతానికి బిజెపి సర్కార్‌ తీసుకుపోయింది. ఆ తరువాత 2013 నాటికి 67.96 శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015 నాటికి 69.07 శాతానికి పెరిగింది.http://countryeconomy.com/national-debt/india 2015 వివరాల ప్రకారం ప్రపంచంలోని 184 దేశాల జాబితాలో జడిపి-రుణం నిష్పత్తిలో మన దేశం 140 స్ధానంలో తలసరి అప్పులో 69లో వుంది.

Image result for worried arun jaitly

    మన దేశంలో కొంత మంది దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో వుండేందుకు ప్రయత్నిస్తారు. అనేక సందర్భాలలో చైనా, పాకిస్తాన్‌లతో మన దేశాన్ని పోల్చుకుంటారు. తప్పులేదు. అందుకే మచ్చుకు కొన్ని పోలికలు చూడండి.http://countryeconomy.com/countries/compare/china/india సమాచారం ప్రకారం 2015వ సంవత్సరంలో కొన్ని వివరాలు ఇలా వున్నాయి. జిడిపి మిలియన్‌ డాలర్లలో, తలసరి ఆదాయం డాలర్లుగా గమనించాలి.

                                చైనా                    భారత్‌                 పాకిస్తాన్‌

జిడిపి                  11,181,556             2,073,002             271,050

జిడిపి తలసరి                8,141                   1,581                 1,428

జిడిపిలోరుణశాతం           42.92                   69.07                 63.57

జిడిపిలోలోటుశాతం            2.69                     6.91                   5.24

     నరేంద్రమోడీ లేదా గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమైనా అనుసరిస్తున్నది విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ అనుకూల విధానాలే అన్నది స్పష్టం. వివిధ దేశాలలోని రేటింగ్‌ సంస్ధలన్నీ వారి కనుసన్నలలో నడిచేవే, వారి లాభాలను కాపాడేవే అన్నది గమనంలో వుంచుకోవాలి. ఈ పూర్వరంగంలో ప్రపంచబ్యాంకు సూచికను చూసినా, ప్రస్తుత ఎస్‌ఆండ్‌ పి రేటింగ్‌ను గమనించినా మన దేశ పాలకవర్గం నుంచి ఇంకా మరిన్ని రాయితీలు, మరింతగా మన ఆర్ధిక వ్యవస్ధను తెరవాలని వత్తిడి చేస్తున్నాయన్నది స్పష్టం. జిఎస్‌టి అమలు వలన సమీప భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. గత రెండు దశాబ్దాల తీరుతెన్నులను గమనిస్తే సంస్కరణలు అమలు జరుపుతున్నామని చెబుతున్నప్పటికీ రెండు దశాబ్దాలలో జిడిపిలో ద్రవ్యలోటు 8.8శాతం, గత ఐదు సంవత్సరాల సగటు ఏడు శాతంగా వుంది. దీని పర్యవసానంగా మన దేశ రుణ భారంతో పాటు దానికి చెల్లించే వడ్డీ కూడా గణనీయంగా పెరుగుతోంది. జిడిపిలో మన ఆదాయం 21శాతం తక్కువగా వున్నదని, ఖర్చులో సబ్సిడీలు గణనీయంగా వున్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు. అంటే అర్ధం పన్నులు,సెస్సుల వంటి వాటిని పెంచి ఆదాయం పెంపు, సబ్సిడీలకు మరింత కోత విధించి పొదుపును పెంచాలని పరోక్షంగా వత్తిడి చేయటమే. జిఎస్‌టి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని అయితే అది వెంటనే ఫలితాలను ఇవ్వదని, సబ్సిడీ కోతలు ఆలశ్యమౌతాయని స్పష్టంగా చెప్పింది. బ్యాంకులు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోలేని పక్షంలో బాసెల్‌-3 ప్రమాణాల ప్రకారం 2019 నాటికి 45 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి నిధులను సమకూర్చాల్సి వుంటుందని, ప్రస్తుతం ప్రభుత్వం వాగ్దానం చేసిన 11 బిలియన్‌ డాలర్లను గణనీయంగా పెంచాలని తెలిపింది. ద్రవ్యోల్బణం రేటును 2017 మార్చి నాటికి ఐదు శాతానికి రిజర్వుబ్యాంకు పరిమితం చేయగలదనే ఆశాభావాన్ని వెలిబుచ్చింది. సంస్కరణల నిలిపివేత, అభివృద్ధి గిడసబారటం, నిర్ధేశిత లక్ష్యాలను అమలు జరపటంలో వైఫల్యం లేదా విదేశీ చెల్లింపుల పరిస్ధితి దిగజారితే రేటింగ్‌ను తగ్గించే అవకాశం వుంది. వీటిపై మోడీ ప్రబుత్వం తీసుకొనే చర్యల పట్ల విశ్వాసం లేక లేదా గట్టిగా అమలు జరిపించేందుకు రేటింగ్‌ ఏజన్సీలు ప్రస్తుతం ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచబ్యాంకు,రేటింగ్‌ ఏజన్సీలను సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటమంటే రానున్న రోజులలో కార్మికులు, వుద్యోగులు, సామాన్య జనానికి మరిన్ని కష్టాలు మూడబోతున్నట్లే భావించాలి.

    రేటింగ్‌ ఏజన్సీల వత్తిడి ఇప్పుడేదో ఆకస్మికంగా ప్రారంభం అయింది కాదు. ద్రవ్య పరిస్ధితిని పటిష్ట పరచేందుకు రూపొందించిన పధకానికి కట్టుబడి వుండకపోతే అనుకున్న ప్రకారం ఆదాయం పెరగకపోవటం, సబ్సిడీల కోత ఆలస్యం కావచ్చని ఇదే ఎస్‌ అండ్‌ పి సంస్ధ ఈ ఏడాది జనవరిలోనే హెచ్చరించింది. http://articles.economictimes.indiatimes.com/2016-01-31/news/70222497_1_services-tax-subsidy-cuts-finance-minister-arun-jaitley సంస్ధ విశ్లేషకుడు కైరన్‌ కరీ పిటిఐ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోవటాన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసి 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం దారి తప్పిందని, అనుకున్న విధంగా ఆదాయం రాకపోవటం, ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీల కోతపై ఆటంకాలను ఎదుర్కొన్నదని చెప్పాడు. కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి, రేటింగ్‌ సంస్ధలను సంతృప్తి పరచటం కోసమే నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్‌ సుంకం, సేవాపన్ను పెంపు,కిరోసిన్ పై నెలవారీ సబ్సిడీ తగ్గింపు , స్వచ్చభారత్‌, కృషి కల్యాణ్‌ వంటి రకరకాల సెస్సులను ఈ కాలంలో విధించి మరో ఔరంగజేబుగా మారిన విషయం తెలిసిందే. అయితే జనంపై మరిన్ని భారాలు మోపి 2019లో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్ర పక్షాలు ఓట్ల కోసం జనం ముందుకు వెళతాయా? అధికారం కోసం విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు కోరుతున్న సంస్కరణలను ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచీకరణకు అనుకూలమెవరు, వ్యతిరేకమెవరు ? ఎందుకు ?

01 Tuesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Others, UK, USA

≈ Leave a comment

Tags

anti globalisation, anti globalization movement, anti-neoliberal, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు ర్యాంకుల పోటీలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడిన మోడీ !

30 Sunday Oct 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

anti globalization movement, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ఎన్‌కౌంటర్లు – జన స్పందన ‘

27 Thursday Oct 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AOB encounter, malkangir encounter, maoists, maoists encounter

ఎంకెఆర్‌

   ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని ఒడిషా మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఎన్‌కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నక్సల్స్‌ దుర్మరణం చెందారు. ఆ పార్టీకి ఇదొక పెద్ద దెబ్బ, విషాద, విచారకర వుదంతం. ఎప్పటి మాదిరే విరసం నాయకులు బంధుమిత్రులతో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి గుర్తించిన మృతదేహాలను తీసుకువచ్చారు. అది ఎన్‌కౌంటర్‌ కాదు నిదురపోతున్నవారిని కాల్చి చంపారని చెబుతున్నారు. లేదు ఎన్‌కౌంటర్లన్నీ తెల్లవారు ఝామునే జరుగుతాయి కనుక అది వాస్తవ ఘటనే అని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ప్రకటించారు. ఎవరే డిమాండ్లు చేసినా, ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న వుదంతంపై విచారణ జరపని కోరినా ఈవాళపోతే రేపటికి రెండు అన్నట్లుగా గతంలో జరిగినట్లు చెప్పిన ఎన్‌కౌంటర్ల తరువాత ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని జనం భావిస్తున్నారు. ఏం జరిగినా పట్టించుకోకపోవటం జనానికి అలవాటయి పోయిందా, అంగీకరిస్తున్నారా అన్న సందేహం కొంతమందికి కలుగుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు మావోయిస్టు సానుభూతి పరులకే ఈ అనుమానం రానక్కర లేదు, వారి రాజకీయాలు, ఆచరణతో విబేధించేవారిలో కూడా ఏం జరుగుతున్నా జనం పట్టించుకోవటం లేదేమిటన్న ఆలోచన రావటం సహజం. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, మత కొట్లాటలకు పాల్పడుతున్నదెవరో, నేరగాళ్లెవరో, మంచివారెవరో అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లుగా తెలిసినా ఎన్నికలలో జనం ఏం చేస్తున్నారో చూస్తున్నదే. తమ పొట్టకొడుతున్నా, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోవటం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు దుర్బేధ్యమైన అడవులలో జరిగిందని చెబుతున్న ఘటనల గురించి, నిర్ధారణ కాకుండా అందునా పోలీసులకు వ్యతిరేకంగా జనం స్పందిస్తారని ఆశించగలమా ? వూహించగలమా ?రెండు వైపులా విశ్వసనీయత సమస్య లేదా ?

    తమపై లేదా గిరిజనులపై జరుపుతున్నదాడులకు ప్రతీకారంగా లాండ్‌మైన్‌లు పేల్చి, దాడులు చేసి, బలిమెల జలాశయంలో లాంచీపై దాడిచేసి పోలీసులను, ప్రత్యేక దళాలను, తమ గురించి సమాచారం ఇచ్చిన పోలీసు ఇన్ఫార్మర్లను ప్రజాకోర్టులో విచారించి ప్రజలే హతమార్చినట్లు నక్సల్స్‌ చేసిన ప్రకటనలను కూడా పోలీసులు చెప్పే ఎన్‌కౌంటర్ల మాదిరే జనం ఒకే విధంగా స్వీకరించటానికి అలవాటు పడిపోయారన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు జరగటం లేదు గానీ గతంలో పలు ప్రాంతాలలో సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీల నాయకులను కూడా ప్రజలే చంపివేసినట్లు ప్రకటించినపుడు, ఒక దశలో తమతో విభేదించిన వారందరికీ రివిజనిస్టులనే ముద్రవేసి నక్సలైట్లు ఏ గ్రూపు వారు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని గందరగోళ సమయంలో, అమాయకులైన కాకతీయ రైలు ప్రయాణీకులను సజీవ దహనం చేసినపుడు కూడా జనం మామూలుగానే తీసుకున్నారు. తరువాత ప్రయాణీకులను చంపటం తప్పిదమేనని ప్రకటించటాన్ని కూడా అలాగే తీసుకున్నారు. కోవర్టులు పోలీసులలో వున్నట్లే నక్సల్స్‌లో కూడా వుండటం కూడా మామూలేనని జనం భావించటం సాధారణమైపోయింది. గతాన్ని విస్మరించి జన స్పందన గురించి ఆలోచిస్తే ప్రయోజనం వుంటుందా ? బెంగాల్లో సిపిఎంకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వంటి వారికి మద్దతు ఇచ్చి జనాన్ని సానుకూలంగా స్పందింప చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని(మల్లోజుల కోటేశ్వరరావు) మట్టుబెట్టించినపుడు కూడా అదే జనం అదే విధంగా స్పందించటాన్ని చూశాము.

   తాము విశ్వసించని వ్యవస్ధను, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని హతమార్చటానికి తమకు హక్కుందని తిరుగుబాటుదారులు చెప్పినపుడు, రాజ్యానికి వ్యతిరేకంగా వున్న తిరుగుబాటుదారులను అదుపులోకి తెచ్చేందుకే తామున్నట్లు రాజ్యవ్యవస్ధ, దాని అంతర్భాగాలు చెప్పినపుడు ఎవరి వాదన వారికి సరైనదిగానే జనం భావిస్తున్నారు. తమ కులం వాడైతే గూండా అయినా, రౌడీ అయినా, అవినీతి, పార్టీ ఫిరాయింపు రాజకీయ నాయకుడు, వుద్యోగి ఎవరైనా సమర్ధించే దుస్థితిలో వున్నాం. చరిత్రలో అనేక మంది తిరుగుబాటుదార్లను రాజ్యవ్యవస్ధ అణచివేసినపుడు జనం పెద్ద ఎత్తున స్పందించి వీధులలోకి వచ్చిన వుదంతాలు ఎన్నో వున్నాయి. ఇప్పుడయినా మరొకపుడైనా అలాంటి స్పందన రావటం లేదంటే జనానికి ఏమైందని వారి గురించి ఆలోచించ వద్దని కాదు గానీ దానితో పాటు రెండోవైపు నుంచి ఏదైనా లోపమున్నదా అని అవలోకించాల్సిన అవసరం లేదా ? సాధారణ జనం కంటే తిరుగుబాట్లను, తిరుగుబాటుదార్లను సమర్ధించేవారు, వారి చర్యల ద్వారా ఏదో సాధించామని నమ్ముతున్నవారు మరింత ఎక్కువగా అంతర్మధనం చేసుకోవాలి.

    మల్కన్‌గిరి వుదంతానికి ప్రతీకారంగా మావోయిస్టులు రాసినట్లు చెబుతున్న లేఖ గురించి కూడా చర్చ జరుగుతున్నది. దానిలో వాడిన భాష, పేర్కొన్న ప్రతీకార చర్యలను చూస్తే అది రాసింది నక్సల్స్‌ కాదని మీడియాలో వార్తలు వచ్చాయి. కాదు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల వారే దానిని రాశారని విశాఖ ఎస్పీ వెంటనే ప్రకటించారు. వివిధ సందర్బాలలో పోలీసులు అనుసరించే పద్దతుల ప్రకారం నకిలీ లేఖలు తయారు చేసి మీడియాకు పంపి జనాన్ని తప్పుదారి పట్టించటం, గందరగోళ పరచటం, తమ చర్యలను సమర్ధించుకోవటం బహిరంగ రహస్యం. బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినపుడు మావోయిస్టు లేదా ఇతర నక్సల్స్‌ నుంచి ఇలాంటి లేఖలు రావటం కూడా సాధారణమే. అందువలన దాన్ని నిర్ధారించటం కష్టం. ఒక వేళ పోలీసులే రాసి వుంటే దానిలోని ఆత్మాహుతి దాడి, కుటుంబ సభ్యుల ప్రస్తావన ఇంతవరకు లేని కొత్త ఆలోచనలను కలిగించటం, ముందుకు తేవటం తప్ప వేరు కాదు. ఒక వేళ నిజంగా నక్సల్సే రాసి వుంటే తీవ్రమైన ఎదురు దెబ్బతగిలిందన్న కసితో కొత్త పద్దతుల్లో దాడులకు పూనుకుంటారని అనుకోవాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు అక్కర తీర్చే తహ తహ ! ఔరా ఏమిటీ వైపరీత్యము !!

26 Wednesday Oct 2016

Posted by raomk in AP, Current Affairs, Economics, Gujarat, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Doing business, Doing business India rank, Doing business rankings, WB Doing business ranking

ఎం కోటేశ్వరరావు

   వ్యాపార సరళతరం సూచికలో భారత్‌ తన స్ధానాన్ని 131 నుంచి 130కి పెంచుకొని గత ఏడాది కంటే ఒక పాయింట్‌ అదనంగా సాధించిందని ప్రపంచబ్యాంక్‌ 2017 నివేదికలో ప్రకటించింది. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రకటించిన సంస్కరణలన్నీ వూకదంపుడు వుపన్యాసాలే తప్ప ఆచరణ రూపం దాల్చనందున ప్రపంచ బ్యాంకు వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. భారత్‌లో వ్యాపార విషయాలను చూసే కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తాజా సూచికపై స్పందిస్తూ ప్రభుత్వం అమలు జరుపుతున్న 12 సంస్కరణలను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది నివేదికలో ఈ అంశాలను చేర్చేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు అక్కర లేదా ఆవేదనలను తీర్చుతామని కూడా వెల్లడించారు. దివాలా, ఐపి నిబంధనలను ఈ ఏడాది చివరికి ఖరారు చేస్తామని, జిఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అమలు జరిపితే మన సూచిక గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.http://www.livemint.com/Industry/uOrtVTE4CgFpPnwV3wATmK/India-ranked-130-in-World-Banks-Doing-Business-survey.html

    భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకోవటానికి చర్యలు తీసుకోవటం అంటే ఏమిటో ఈ పాటికే కొంత అర్ధమయ్యే వుంటుంది. సూటిగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా వచ్చి వ్యాపారాన్ని పెట్టి అలా లాభాలు తీసుకుపోయేందుకు అనువైన పరిస్ధితులు కల్పించటమే. ఒక వేళ అలా వచ్చిన వారు ఎవరైనా ఇలా దివాలా తీస్తే వారికి నష్టం కలగకుండా చూసేందుకు దివాలా, ఐపి నిబంధనలను కూడా సరళతరం చేస్తామన్నదే మన పరిశ్రమల శాఖ కార్యదర్శి వివరణ ఆంతర్యం. వీటికి సంస్కరణలని ముద్దు పేరు. మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌, పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచి వారందరూ సులభంగా వ్యాపారం చేసుకొనేందుకే కదా వచ్చారు. వారికి నాటి మన రాజులు, రంగప్పలు సులభంగా అనుమతులు ఇవ్వబట్టే కదా ఏకులా వచ్చి మేకులా మారి మన తలపై కూర్చున్నారు. మరి దానికీ దీనికీ పెద్ద తేడా ఏమిటి అన్నది మౌలిక ప్రశ్న. నాడు వంశపారంపర్య రాజులు అనుమతిస్తే నేడు వారి స్ధానంలో ప్రజలెన్నుకున్న ప్రభువులు ఇవ్వటం తప్ప మరొకటి ఏమైనా వుందా ? విదేశీ కంపెనీలను అనుమతిస్తే అవి మన మూలుగులను పీల్చి పిప్పి చేయటమే కాదు, మన మీద పెత్తనం చెలాయిస్తాయని నాటి మేథావి వర్గానికి తెలిసినా లేదా వేదాల్లో అవి కూడా రాసి వున్నాయని నాటి సంస్కృత పండితులు ఎవరికైనా అనుమానం వచ్చినా కచ్చితంగా వ్యతిరేకించి వుండేవారు. కానీ ఇప్పుడు అన్నీ వేదాల్లో వునాయష అని చెబుతున్నవారు, చరిత్రను తిరగేసి మరగేసి చూసిన మేథావులనబడేవారు కూడా విదేశీ కంపెనీలకు స్వదేశీ ఎర్రతివాచీ పరిచి, దేశ భక్తి భాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు. నాడు తెలియక చేస్తే నేడు తెలిసి చేస్తున్నారు. దీనికి భిన్నమైనదేమైనా వుంటే చరిత్రకారులు, మేథావులు చెప్పాలి.

    ప్రపంచబ్యాంకును సంతృప్తి పరచటం అంటే అది ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ కార్పొరేేట్ల అక్కర తీర్చటమే. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌తో నరేంద్రమోడీ పోటీ పడుతున్నారు. తానే పెద్ద సంస్కరణ వాదిని అని నిరూపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. సింగ్‌ గారి హయాంలో అంటే 2012లో సరళతర వ్యాపారంలో మన దేశ ర్యాంకు 131 అన్న విషయం గుర్తు చేయటం అవసరం.http://www.thehindu.com/business/Economy/india-slips-in-ease-of-doing-business-list-world-bank/article5286594.ece తరువాత అది 134కు పడిపోయింది.అందువలన ఈ ర్యాంకులను చూసి లేదా చూపి పాలకులు తాము సాధించిన ఘనత అని చెప్పుకుంటే జనాన్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ప్రతి ఏటా ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు కేటాయించే పద్దతులలో మార్పులు చేస్తూ వుంటుంది. దేశాల సంఖ్య కూడా మారిపోతూ వుంటుంది. నిజానికి ఇదొక అంకెల గారడీ. మన దేశ ర్యాంకు పెరగటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న అంశాలలో విద్యుత్‌ సరఫరా, కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయటం ప్రధానంగా పని చేస్తున్నది.

  మన దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వటానికి రైతాంగాన్ని ఎంత సతాయిస్తారో తెలిసిందే. కానీ అదే పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే పరిశ్రమ పెట్టకుండానే కనెక్షన్‌ సిద్ధం అన్నట్లుగా వుంటుంది. వుపాధి కల్పిస్తున్నదనే పేరుతో దానికి రాయితీలు అదనం. మన పాలకులు ప్రతి ఏటా అన్ని లక్షల కోట్లు ,ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా తెచ్చామని ఎంత వూదర గొడుతున్నప్పటికీ మన దేశంలో విద్యుత్‌ వినియోగంలో పరిశ్రమల వాటా తగ్గిపోతున్నది.2012లో 32శాతం వుండగా 2014నాటికి 29శాతానికి పడిపోయింది. దానిలో స్వల్ప మార్పు లేదా స్ధిరంగా వుంటున్నది తప్ప పెరగటం లేదు. దానికి కారణాలలో పరిశ్రమల మూత, ఖాయిలా ఒక ప్రధాన కారణం,అయితే వాటి స్ధానంలో కొత్తవి రాకపోవటం మరొకటి. విద్యుత్‌ సరఫరా మెరుగు పడటానికి గతంలో శంకుస్థాపన చేసిన అనేక విద్యుత్‌ కేంద్రాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో వుత్పాదన ప్రారంభించటం కూడా ఒకటి. అందువలన సరేంద్రమోడీ సంస్కరణలకు దీనికి సంబంధం వుందని చెప్పలేము.

   గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ దేశమంతటా చేసిన ప్రచారంలో గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి ఒకటి. ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడా నేను వినలేదు. తిరిగి వచ్చే ఎన్నికలలో చెబుతారేమో తెలియదు. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ సంక్షేమాన్ని తాము తప్ప మరొకరు పట్టించుకోరు అని అక్కడ ఎన్నికల సభల్లో చెబుతున్నారు.http://indianexpress.com/article/business/economy/gujarat-clocks-over-48000-sick-msme-units-in-2014/ నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వుండి గుజరాత్‌ను ఎలా అభివృద్ధి చేశారో పై వార్తను చూస్తే ఆ ప్రచార బండారం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 2014లో రిజర్వుబ్యాంకు రూపొందించిన సమాచారంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ లోక్‌సభలో మోడీ సర్కారే ఒక ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన సమాచార సంక్షిప్త వివరాలు ఇలా వున్నాయి. 2014 మార్చి ఆఖరు నాటికి వుత్తర ప్రదేశ్‌లో 63,268, గుజరాత్‌లో నమోదైన చిన్న, సన్నకారు పరిశ్రమలలో ఐదో వంతు అంటే 48,000 ఖాయిలా పడ్డాయి. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పాలన చివరి సంవత్సరంలో మూత పడిన వాటి సంఖ్య 20,452 నుంచి 48వేలకు పెరిగాయి. అంతకు ముందు 2011లో ఖాయిలా యూనిట్లు 4321 మాత్రమే. 2013 సచేతన గుజరాత్‌( వైబ్రంట్‌ గుజరాత్‌) పేరుతో నిర్వహించిన హంగామాకు ముందు స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కేవలం ఐదుశాతం మాత్రమే చిన్న పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. కానీ సచేతన గుజరాత్‌ వుత్సవాల సందర్భంగా తీసిన లఘుచిత్రాలలో చిన్న పరిశ్రమలు ఎంతో గొప్పగా వున్నట్లు చిత్రించారు. ఏ ఏటికాయేడు ఎన్నో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవగాహనా ఒప్పందాలు జరిగినట్లు అంకెలను ప్రకటించారు.

   నరేంద్రమోడీయే సచేతన గుజరాత్‌ పేరుతో అంత హడావుడి చేసి చిన్న పరిశ్రమల మూతకు పుణ్యం కట్టుకుంటే అంతకంటే పెద్ద జాదూతనంతో అలరిస్తున్న చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌ వారి వారసులు తెస్తున్నట్లు చెబుతున్న పెట్టుబడుల గురించి చెప్పాల్సిందేముంది. రాష్ట్రాలలో వాణిజ్య సంస్కరణల విషయమై ర్యాంకుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు.అసలు పరీక్ష రాయకుండానే మొదటి ర్యాంకులు ఎలా తెచ్చుకుంటారో ఇటీవల మనం చూశాం. అందువలన రాష్ట్రాల ర్యాంకులు కూడా అదే విధంగా వున్నాయా ?ఏమో తెలియదు. ప్రస్తుతం 99.09శాతంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో వున్నాయట. ప్రశ్నా పత్రం ముందే లీకైతే తప్ప ఒకే మార్కులు ఎలా సాధ్యం అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు.ఈ ఏడాది ర్యాంకులను త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలు. ర్యాంకులు అనేవి సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకోవటానికి తప్ప సామాన్య జనానికి కల్పిస్తున్న వుపాధి, మరొక ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ఒక పాత సినిమాలో మీలో పెద్ద వెధవను నేను ప్రేమిస్తాను అంటే ఎవరు ఎలాంటి ‘ఘనకార్యం’ చేశారో చెప్పుకొనేందుకు పోటీ పడతారు. ఇక్కడ మెరుగైన వాణిజ్య వాతావరణం అంటే గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన నీకది, నాకిది పద్దతిలో వాటాల లెక్కలను మరింత పకడ్బందీగా అమలు జరపటం, ప్రజల సొమ్మును పంచుకోవటం తప్ప మరొకటి కాదని ఇప్పటికే తెలుగు జనాలందరికీ అర్ధం అయింది. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Swachh Bharat Mission(Urban) toilets construction

24 Monday Oct 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Swachh Bharat, Swachh Bharat Mission, toilet construction

35% of Mission target for construction of individual household toilets met in 40% of mission period

Gujarat, Andhra Pradesh meet Mission target much ahead of time

 Kerala meets 68% of Mission target;  Chattisgarh-61%, MP-46%, Tamil Nadu-43%

UP, Maharashtra, Karnataka, Jharkhand construct over 30% of targeted toilets

 During the two years of Swachh Bharat Mission, 22,97,389 individual household toilets have so far been constructed in urban areas of the country as against the  five year mission target of 66,42,221 such toilets to be built by 2019. With 35% of mission target being met in two years i.e 40% of the mission duration, construction of toilets meant for ending Open Defecation in urban areas is broadly on course.

Gujarat and Andhra Pradesh have met the mission targets three years ahead  in September this year with Gujarat fulfilling the target of 4,06,388 toilets and Andhra Pradesh building 1,93,426 toilets in urban areas and have declared them Open Defecation Free in urban areas.

Minister of Urban Development Shri M.Venkaiah Naidu reviewed the progress of the mission in urban areas today.

Other leading performers are kerala having built 62,450 which comes to 68% of the mission target of 90,986, Chattisgarh-1,83,726 (61% of 3,00,000), Madhya Pradesh -2,34,377 (46% of 5,12,389) and Tamil Nadu -2,57,781 (43% of mission target of 6,02,029 toilets).

The States that have met over 30% of mission targets are: Maharashtra -33% having built 2,07,888 toilets out of the mission target of 6,29,819, Uttar Pradesh-31% (2,53,979/8,28,237), Karnataka-31% (1,09,704/3,50,000) and Jharkhand -30% (47,968/ 1,61,713).

Telangana has met  28%  of the mission target having built 59,967 of the 2,16,075 toilets, followed by West Bengal-23% (1,20,628/5,15,419), Puducherry -22% (2,135/9,626), Punjab-19% (26,188/1,38,010).

States and Union Territories who have built less than 10% of mission targets are : Manipur (9%), Bihar (7.40%), Uttarakhand (7%), Odisha (4.40%), Mizoram (3.34%) and Arunachal Pradesh (1.60%).

Swachh Bharat Mission was launched on October 2,2014 targeting construction of 1.04 cr individual household  toilets in urban areas based on 2011 Census. Subsequently, taking in to consideration the construction of toilets during 2011-14, mission target in this regard has been revised to 66,42,221 toilets based on the assessment of States/UTs.

As per the  revised targets 14 States and the UT of Delhi account for 80% of the target. These 15 States/UT have till September this year built 21,64,860 toilets accounting for 94% of the total toilets so far built and 32% of the total mission target. States and UTs lagging behind proportionate targets are expected to catch up as mission progresses.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనంపై దాడులకు ఎవరు అడ్డు పడ్డారు మోడీ గారూ !

24 Monday Oct 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, black money unearth, Modi, surgical strikes

సత్య

     కొంత మంది రాజకీయ నాయకుల మాటలు చూస్తే నేను లేస్తే మనిషిని కాదు అన్న దివ్యాంగుడైన మా మల్లయ్య మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒక ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మల్లయ్య కాలక్షేపానికి అరుగుమీద కూర్చుంటే కొంటె పిల్లలు ఆట పట్టించేవారు. తన చేతిలోని కర్రను చూపుతూ రేయ్‌ నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అని హూంకరించే వాడు. పిల్లలు భయపడినట్లుగా నటించే వారు. మరుసటి రోజు కథ మళ్లా మామూలే. నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా మల్లయ్య కథ మాదిరే వున్నాయంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా, మరొకటొచ్చినా పట్టక తప్పనట్లే రాజకీయాలలో వున్నతరువాత పొగడ్డలు వచ్చినపుడు జబ్బలు చరుచుకోవటం లేదా రొమ్ము విరుచుకోవటమే కాదు విమర్శలు వచ్చినపుడు ‘సహించాలి ‘ మరి.

      నరేంద్రమోడీ రెండున్నర సంవత్సరాల క్రితం చేసిన అనేక బాసలు, వూసులతో పాటు నల్లధనం వెలికితీత వాగ్దానాన్ని కూడా జనం మరచిపోయిన సమయంలో దాని గురించి మౌనం దాల్చకుండా మాట్లాడటం ఎందుకు చెప్పండి ? అది కూడా సర్జికల్‌ దాడులతో ముడిపెట్టి ‘మేం కనుక ఈ విషయంలో కూడా సర్జికల్‌ దాడులు చేస్తే ఎంత బయటికి వస్తుందో మీరు వూహించుకోవచ్చు ‘ అని నల్లధనం గురించి గుజరాత్‌లోని వడోదరాలో ప్రధానే ఆశ్చర్యం వ్యక్తం చేశారట.http://indianexpress.com/article/india/india-news-india/pm-narendra-modi-warns-of-surgical-strikes-against-blackmoney-corruption-3097294/ ప్రధాని అంతటి వ్యక్తి ఏదైనా అనూహ్యమైన విషయాన్ని ప్రకటిస్తే జనం, ప్రతిపక్షం, పాకిస్థాన్‌ ఆశ్చర్యపోవాలి గానీ ఆయన చెప్పినదానికి ఆయనే ఆశ్చర్యపోవటం వింతైన విషయమే. తనే జోక్‌ వేసి తానే అందరికంటే ముందుగా పెద్దగా నవ్వే వారిని గుర్తుకు తెచ్చారు కదూ ! నల్లధనం సంగతేమోగానీ సర్జికల్‌ దాడుల ఘనత తమదే అని స్వయంగా ప్రధాని చెప్పుకోవటం దీనిలో స్పష్టమైంది. కాంగ్రెస్‌, ఇతర అధికార యావ రాజకీయ పార్టీల వారి మాదిరే విజయాలన్నీ తన ఖాతాలో వేసుకొనే తహ తహ, తపనలో మోడీ కూడా పోటీ పడుతున్నారనుకుందాం.

     నల్ల ధనాన్ని వెలికి తీసిన ఖ్యాతిని కూడా మూట కట్టుకోమనే కదా దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. అందుకోసం సర్జికల్‌ దాడులు చేయకుండా మీ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారన్నదే ప్రశ్న. నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పధకం ఘోరంగా విఫలమైందని మీడియాలో విశ్లేషణలు వచ్చిన తరువాత బహుశా వాటిని జనం మరిచిపోయి వుంటారనే గట్టి నమ్మకంతో నరేంద్రమోడీ దానినొక పెద్ద విజయంగా చెప్పి తన భుజాన్ని తానే చరుచుకున్నారు. మన ప్రభుత్వాలు నిజాయితీగా వేతనం నుంచే పన్ను మొత్తాన్ని చెల్లించే వుద్యోగులకు రాయితీలు ఇవ్వటానికి ముందుకు రావన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా గాదె కింది పందికొక్కుల్లా బలిసి పోతున్న వారికి మాత్రం క్షమాభిక్ష లేదా స్వచ్చందంగా ఆదాయ వెల్లడికి పధకాలను ప్రకటించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశమిస్తాయి. అందువల్లనే ప్రతి ఏటా పన్ను చెల్లించటం ఎందుకు? ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచి పన్ను ఎగవేతదార్లకు అవకాశం ఇచ్చినపుడు ఎంతో కొంత చెల్లిద్దాము లెమ్మనే దేశ భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

   మెరిల్‌ లించ్‌ కంపెనీ వెల్లడించిన నివేదికల ప్రకారం 2007 నాటికి మన దేశంలో అధిక నిఖర సంపద వున్నవారి సంఖ్య లక్ష దాటింది. గతేడాది నాటికి ఆ సంఖ్య 4.2లక్షలకు చేరింది. 1997లో నల్లధనం దాచుకున్నవారికి క్షమా భిక్ష పేరుతో నాటి కాంగ్రెస్‌ పాలకులు ఒక పధకాన్ని ప్రకటించారు. దానిలో 33వేల కోట్ల రూపాయలను ప్రకటించి పది వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించి గౌరవం పొందారు.అప్పటితో పోల్చితే ఇప్పుడు కనీసం పది రెట్లు దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరిగింది. ఆ లెక్కన కనీసం మూడులక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని వెల్లడించి వుండాలి. కానీ 65వేల కోట్లే అదీ ఒక్కొక్కరు సగటున ఒక కోటి వంతున మాత్రమే వెల్లడించారంటే మోడీ గారి పధకం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం 40శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పాతికవేల కోట్ల రూపాయలకు పైబడే, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.

     బిజెపి, ఎన్‌డిఏ పక్షాలు కాంగ్రెస్‌ అవినీతిని గురించి నిత్య పారాయణం చేస్తుంటాయి. తప్పులేదు, ఆ పార్టీ అందుకు తగినదే. కానీ బిజెపి పాలనలో నరేంద్రమోడీ ఏలుబడి కుంభకోణం మాటేమిటి ? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పంపేందుకు తోడ్పటమే కదా అవినీతి అంటే.తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా విదేశాలకు పారిపోతుంటే ఎటు పోతున్నాడో చూడండి తప్ప అరెస్టు చేయటం వంటి అమర్యాద పనులు చేయవద్దని ఆదేశించిన ఘనత నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే జరిగింది. ఆ మాల్యనే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అలాంటి మల్లయ్యలు బ్యాంకుల నుంచి తీసుకొని దాదాపు ఎగవేసిన సొమ్ము పదకొండులక్షల కోట్ల రూపాయలు. వారిలో ఏ ఒక్కడూ కూడా వ్యాపారంలో, పరిశ్రమలో నష్టం వచ్చిందని మన రైతుల మాదిరి ఆత్మహత్య చేసుకున్నవారు లేరు. వారి ఆస్థుల నుంచి కనీసం పదో వంతు వసూలు చేసినా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చి వుండేది. ఆ పనేమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు రద్దు చేసిన అలాంటి బాకీల మొత్తం 1.12లక్షల కోట్ల రూపాయలున్నదన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఎందుకంటే ఈ విజయాన్ని ఎక్కడా మోడీ భక్తులు కీర్తించరు ! రైతుల రుణాలు రద్దు చేయమంటే డబ్బు లేదంటారు . మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ? గత సంవత్సరం ప్రభుత్వం అందచేసిన లెక్కల ప్రకారమే వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు, ఎగుమతి దిగుమతులకు ఇచ్చిన రాయితీల వలన ప్రభుత్వానికి రావాల్సి రాకుండా పోయిన ఆదాయం ఆరులక్షల పదకొండువేల కోట్లు. ఈ మొత్తంలో లక్షా పదహారు వేల కోట్లరూపాయలు బంగారం, వజ్రాల దిగుమతులు చేసుకున్న మన దేశంలోని ‘ అత్యంత నిరుపేదలకు ‘ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన రాయితీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి రాయితీలు కాంగ్రెస్‌ హయాంలో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ హయాంలో కూడా పెరిగాయి తప్ప తరగలేదు ! కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్రమోడీకి ఆశ్చర్యం కలగలేదు, సర్జికల్‌ దాడులు గుర్తుకు రాలేదు !! చంద్రబాబు నాయుడి వూతపదం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈ పాలన ఇలా ముందుకు పోవాల్సిందేనా ? జనానికి కబుర్లు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాల్సిందేనా ? అన్నింటి కంటే ప్రహసనం ఏమంటే నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో వంద రూపాయల నోట్లను రద్దు చేస్తే సగం అంతరిస్తుందనుకున్నారు. ఇప్పుడు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు బహిరంగంగానే సలహా ఇచ్చారు. కానీ కేంద్ర త్వరలో రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తేనున్నదని వార్తలు అంటే నల్లధన కుబేరులకు మరింత సౌకర్యం కల్పించటమేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేక చిందులు !-సరిహద్దుల్లో భారత్‌, చైనా మిలిటరీ విన్యాసాలు !

23 Sunday Oct 2016

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

anti china, military exercise in Ladakh, RSS Outfits anti china, RSS Outfits anti china feets, Sino-Indian joint military exercise in Ladakh

సత్య

    అర  నుంచి ఇటీవలనే పొడుగు లాగూలకు మారిన ఖాకీ వాలాలు వీధులు, ఇంటర్నెట్‌ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక చిందులు వేస్తున్నారు. వాటి బదులు మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ మేకిన్‌ ఇండియా ‘ పిలుపు మేరకు ఒక చిన్న వస్తువునైనా తయారు చేసి కసితో చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తే వారి ‘దేశ భక్తి ‘ మరింత ఇనుమడించి వుండేది. ఏం చేయాలనేది ఎవరిష్టం వారిది కనుక వీరంగం వేసే వారిని వదిలేద్దాం. గత వారంలో మన సైనికులు సరిహద్దులలో చైనా సైన్యంతో కలిసి మన భూభాగంపై సంయ్తు విన్యాసాలు చేశారు. అదీ యురీ సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు దాడి జరిపి మన సైనికుల ప్రాణాలు బలిగొనటం, ఆ విషయంలో మనకు గాక పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తున్నదని పెద్ద ఎత్తున ‘ ప్రచారం’ జరిపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగంలో చైనా మిలిటరీతో కలసి విన్యాసాలు జరిపినట్లు మన సైన్యమే అధికారికంగా ప్రకటించింది. తేడా ఏమిటంటే సర్జికల్‌ దాడులకు మాదిరి సైన్యంగానీ లేదా అంతకు మించి యుద్ధం చేస్తున్న మన మీడియా గానీ ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యత, ప్రచారం ఇవ్వలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు గనుక సైన్యానికి ఎలాంటి వుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. కానీ మీడియా విషయానికి వస్తే దాని రేటింగ్‌ పెరగదని మార్కెటింగ్‌ విభాగం చెబితే ఎంత పెద్ద వార్తనైనా పక్కన పడేస్తుంది సంపాదక విభాగం, ఎందుకంటే మీడియాను నడిపేది సంపాదకులు కాదు, బిజినెస్‌ మేనేజర్‌, డబ్బు సంపాదించే విభాగాలే.

  అసలు కంటే కొసరు హడావుడి ఎక్కువ చేస్తుందన్న విధంగా మన ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ సైని కమాండర్లు మాత్రం బాణా సంచాలకు మినహా మిగిలిన పెద్ద వస్తువుల దిగుమతికి మినహాయింపులు ప్రకటిస్తుంటే దిగువ సైన్యం మాత్రం వీరంగం వేయటం ఇంకా కొనసాగిస్తూనే వుంది. నిజానికి బాణ సంచా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ నిషేధం వుంది. దాన్ని సక్రమంగా అమలు జరపకపోవటమే దేశ ద్రోహం. చైనా మిలిటరీతో కలసి మనం జమ్మూలో విన్యాసాలు జరపటం దేశ భక్తా, ద్రోహమా లేక చైనా అనుకూలమా ? పిల్లలను స్టెరాయిడ్లతో వుద్రేక పరిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి మరి ?

    అణు సరఫరా గ్రూపులో మన సభ్యత్వానికి చైనా మోకాలు అడ్డిందని, పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్నది అనే విషయాలపై అనేక మంది తమ రచనలలో ఖండన మండనలు జరుపుతున్న సమయంలో వాటిని పట్టించుకోకుండా మిలిటరీ విన్యాసాలు కొనసాగించటం విశేషమే. సర్జికల్‌ దాడులకు రాజకీయ నాయకత్వం అనుమతి ఇచ్చిందని, దానికి తాము ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పెరగటమే కారణమని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇప్పటికే ప్రకటించారు కనుక ఈ విన్యాసాల గురించి ఏం చెబుతారు ? అనుమతించినట్లా లేదా ?

    సాధారణంగా రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు అనగానే మూడో దేశాన్ని భయపెట్టటానికో, బెదిరించటానికో అన్నది సాధారణంగా అందరూ అనుకుంటారు. అమెరికా వంటి సామ్రాజ్యవాదుల మిలిటరీ ప్రమేయం వున్నపుడు అందులో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ చైనాతో మన వారు జరిపింది మరొక దేశాన్ని బెదిరించటానికో మరొకందుకో కాదు. ప్రకృతి ప్రళయాలు సంభవించినపుడు సరిహద్దులలోని జనాన్ని ఎలా ఆదుకోవాలో నేర్పేందుకు, నేర్చుకునే లక్ష్యంతో చేసినవి ఇవి. సరిహద్దులలో భూ కంపం వచ్చినపుడు ఒక గ్రామంలోని వారిని ఎలా ఆదుకోవాలన్న విషయమై విన్యాసాలు రోజంతా సాగాయి. వైద్య సహాయంతో సహా జనాన్ని రక్షించేచర్యలు తీసుకోవటంలో పెద్ద విజయం సాధించామని, వుభయ సైనికుల మధ్య విశ్వాసం,సహకారం మరింతగా పెరిగాయని మన మిలిటరీ ప్రకటించింది. సరిహద్దులలో శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు కూడా వీటిని తలపెట్టినట్లు పేర్కొన్నది. లడక్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చైనా ప్రాంతంలో ఫిబ్రవరి ఆరున జరిపిన విన్యాసాల కొనసాగింపుగా ఇది కొనసాగింది. ‘చేతిలో చేయి ‘ అన్న కార్యక్రమాలలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగానే నవంబరు 15-27 మధ్య మన మిలిటరీ దక్షిణాది ప్రధాన కార్యాలయం వున్న పూనేలో మన సైన్యంతో కలిసి చైనా సైన్యం వుగ్రవాద వ్యతిరేక చర్యలపై విన్యాసాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది చైనాలోని ఏనాన్‌ రాష్ట్రంలోని చెంగ్‌డూ మిలిటరీ ఏరియాలో మన దేశం నుంచి వెళ్లిన నాగా రెజిమెంట్‌ సైనికులు చైనీయులతో కలసి ఇలాంటి విన్యాసాలే జరిపి వచ్చారు.

    ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలతో పాటు భారత్‌ను కూడా తనవైపు లాక్కునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవి కానసాగటాన్ని గమనించాలి. ప్రస్తుతం చైనా ఆధీనంలో వున్న కొంత లడఖ్‌ ప్రాంతం మనదే అని మన దేశం, మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ మాదని చైనా వాదిస్తున్న విషయం తెలిసినదే. 1962లో వుభయ దేశాల మిలిటరీ యుద్ధానికి తలపడిన ప్రాంతంలోనే ఇప్పుడు చేయి చేయి కలిపి రెండు మిలిటరీలు విన్యాసాలు చేశాయి. సరిహద్దు వ్యవహారాలపై తగు పద్దతుల్లో వ్యవహరించేందుకు వుభయ సరిహద్దు సేనల మధ్య జరిగే సాధారణ విన్యాసాలు తప్ప మూడో దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా విదేశాంగ శాఖ కూడా అక్టోబరు 19న జరిపిన విన్యాసాల గురించి ప్రకటించింది. కాశ్మీర్‌ సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే తమ వైఖరిలో కూడా ఎలాంటి మార్పు లేదని రాతపూర్వక వివరణలో చైనా స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలు కనుక మంచో చెడో మన రెండు దేశాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరపటం ద్వారా వుభయుల మధ్య అనుమానాలు తొలగిపోవటానికి దారి తీస్తుంది. కానీ గతేడాది అమెరికా, జపాన్‌ సైన్యంతో కలసి మలబార్‌ విన్యాసాలు జరపటం, ఈ ఏడాది మన దేశంలోని వుత్తరాఖండ్‌లో అమెరికా మిలిటరీతో కలసి మన సైన్యం విన్యాసాలు జరపనుండటం గురించి కొంత మందిలో అనుమానాలు లేకపోలేదు. ఎవరి అనుమానాలు, ఎవరి అభిప్రాయాలు వారికి వున్నా ఇటీవలి కాలంలో మిలిటరీ విన్యాసాలు అనేవి ఒక బల ప్రదర్శన, దౌత్య ఎత్తుగడలలో భాగంగా జరుగుతున్నాయి. అన్నీ శాంతియుత ప్రయోజనాలకే అని చెప్పలేము, అదే విధంగా యుద్ధ చర్యలలో భాగమని అనలేము. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే మనం ఇతరులతో కలసి విన్యాసాలు జరుపుతున్నట్లే ఇతరులు కూడా జరుపుతారు. వ్యతిరేకించాల్సి వస్తే అన్నింటి పట్ల ఒకే వైఖరిని తీసుకోవాలి. మనం చేసేదే సరైనది, ఇతరులు చేసేది మనకు వ్యతిరేకం అనుకుంటేనే తేడాలు వస్తాయి. ఇదే సమయంలో మన భద్రతా చర్యలు మనం తీసుకోకతప్పదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d