• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

మత తటస్థ దేశంలో విద్వేష వాతావరణం ఉందన్న సుప్రీం కోర్టునూ తప్పు పడతారా !

22 Saturday Oct 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, cbi, Hate crime, Hate-Speech, Narendra Modi, Narendra Modi Failures, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకుపోవాలి, ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా ? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా ! నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశమే. ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింప చేయాలి ? ఎవరు పాటించాలి ? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్‌ ప్రకటించారని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని హిందూమత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్‌ అంటే మధ్య యుగాల నాటి మతవిద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో లేదా స్వదేశంలో విమర్శలకు అవకాశం కల్పిస్తున్నదెవరు ? ఏం చెబుతున్నారు ? ఆచరణలో ఏం చేస్తున్నారు ?


ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమౌతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాల ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా ? మన పత్రికలను చదవరా,టీవీలను చూడరా ? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్యులు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేష వాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబల్‌ చెప్పారు. ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన జన అక్రోశ్‌ నిరసన సభలో బిజెపి ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాదన ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయపక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా అని పేర్కొన్నది.దాని మీద సిబల్‌ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా ? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆమ్‌ అద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా ? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా ? ఎవరు సమాధానం చెబుతారు ! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అభిశంసించటమే.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. పదకొండు మంది దోషులు పెరోలు, శిక్ష పడక ముందే జైల్లో ఉన్నారనే పేరుతో సంవత్సరాల తరబడి వెలుపలే ఉన్నారు. గడువు తీరిన తరువాత జైలుకు వచ్చినా ఇదేమిటని అడిగిన వారు లేరు. కారణం వారంతా బిజెపికి చెందిన వారు, అక్కడున్నది వారి ప్రభుత్వమే గనుక. వారిలో ఒకడు పెరోలు మీద వచ్చి ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించాడంటూ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అతడిని విడుదల చేయ కూడదని పోలీసుల డైరీలో రాసినా ఖాతరు చేయకుండా విడుదల చేశారు. మరొకరిని విడుదల చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని బిల్కిస్‌ కుటుంబాన్ని అడగ్గా కూడదని చెప్పినప్పటికీ విడుదల చేశారు, ఇతరుల గురించి అసలు అలా అడగనూ అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలకు మెరుపువేగంతో కదిలింది. గుజరాత్‌ సర్కార్‌ 2022 జూన్‌ 28న కేంద్రానికి లేఖరాస్తే జూలై 11న అనుమతి మంజూరైంది. ఏ కారణంతో విడుదలకు కేంద్రం అనుమతించిందో గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించలేదు. సిపిఎం నాయకురాలు సుభాషిణీ ఆలీ నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాహిత కేసును దాఖలు చేశారు. ఆమెకు ఈకేసుతో ఎలాంటి సంబంధమూ లేదని మూడవ పక్షపు కేసును స్వీకరించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది.నవంబరు 29న కేసు విచారణకు రానుంది.


చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖైదీలను విడుదల చేశారు. ఈ నేరగాండ్లకు దానితో నిమిత్తం లేకుండా అదే రోజున వదిలారు. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ, సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని సిబిఐ కోర్టు జడ్జి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నపుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టటం అంటే దొంగే దొంగని అరవటం తప్ప వేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులు మరొకపేరుతో నిందిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామ తిట్టినందుకా, తోడల్లుడు కిసుక్కుమన్నందుకా ? దేశ ఆకలి సూచికలపై మండిపడుతున్న కాషాయ దళాలు !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

BJP, GHI, Global Hunger Report 2022, hunger, India’s GHI-2022, Narendra Modi Failures, RSS, Saffron gangs Furiousness


ఎం కోటేశ్వరరావు


తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. ఇంకేముంది ! సామాజిక మాధ్యమాల్లో, ఇతరంగా కొందరు పెద్ద గగ్గోలు. గుండెలు పగిలేట్లు బాదుకుంటున్నారు, నివేదిక ఇచ్చిన వారిని శాపనార్ధాలు పెడుతున్నారు. తప్పుడు లెక్కలంటున్నారు, దేశ(నరేంద్రమోడీ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదని కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తెచ్చినవారు కొందరు. 2020 ఏప్రిల్‌లో తొలి కరోనా లాక్‌డౌన్‌ నాటి నుంచి 2022 సెప్టెంబరు వరకు ప్రతి నెలా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా 80కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఇంకా ఆకలి ఏమిటి అని నటనా చక్రవర్తులను తలపించిన వారు ఉన్నారు. మహానుభావులారా ఆకలి సూచిక రూపొందించేందుకు తీసుకున్న అంశాలను, వాటిలో ఒకదాని గురించి మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీజీ ఆగస్టు నెల మన్‌కీ బాత్‌లో పోషకాహార లేమి మీద ప్రజా ఉద్యమం జరపాలని పిలుపునిచ్చారని తెలుసుకోండిి అని చెప్పాల్సి వస్తోంది. ఇన్ని నెలలుగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఇస్తే ఇంకా పోషకాహారం లేదంటారేమిటి అని ఆ పెద్దమనిషి చెప్పలేదని గ్రహించండి.మీరు చెబుతున్నదే సరైనదనుకుంటే ప్రజా ఉద్యమం జరపాలని ఎందుకు పిలుపునిచ్చారో ప్రశ్నించండి ! బియ్యం ఇస్తే సరిపోతున్నపుడు అంతకు ఎంతో ముందు నుంచే పోషణ్‌, ఐసిడిఎస్‌ పధకాలు వాటి కింద అంగన్‌వాడీలు గట్రా ఎందుకు నిర్వహిస్తున్నట్లు ?


గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పుపడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్దతే తప్పు, పరిగణనలోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జిఓ) చెప్పేవాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడువేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింప చేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121మాత్రమే. అది స్వచ్చందం తప్ప ఇవ్వకపోతే తలతీసేదేమీ ఉండదు. అమెరికా, ఐరోపా దేశాల్లో సమాచారం ఇవ్వకపోతే మీడియాలో విమర్శించే స్వేచ్చను అక్కడి జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. మన దగ్గర ఇంకా అలాంటి అవకాశాలు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నా అడిగే దమ్మున్న జర్నలిస్టులు లేరు, అడిగేవారున్నా ఇంతవరకు మనది అపర ప్రజాస్వామిక దేశం గనుక మన నరేంద్రమోడీ ఎవరికీ ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అందువలన మనం కూడా అసలు అధికారిక సమాచారం ఇవ్వటం మానేస్తే సూచికల ప్రసక్తి ఉండదు, వాటి మీద విమర్శలు, ఉక్రోషాలు, ఉడుక్కోవటాలు, కుట్ర సిద్దాంతాల ప్రచారం వంటివి ఉండదు. కాషాయదళాలు వేరేపని చూసుకుంటాయి కదా ! మరి ప్రభుత్వం ఆపని ఎందుకు చేయదు ? లేదా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన విశ్లేషణలు అందించవచ్చు, సూచికలు ప్రకటించవచ్చు. దేశానికి మచ్చతెచ్చే వారికి బుద్ది చెప్పవచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితిలో నరేంద్రమోడీ అడిగితే సమాచారం ఇవ్వని దేశం ఉంటుందా ? నిధుల కొరత లేదే, ఎందుకు చేయరు ? కావాలంటే అప్పులు తీసుకురావచ్చు, 55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వమే అంచనా వేసింది, కనుక మరో లక్ష కోట్లు అప్పుచేసి సరైన సూచికలు వెల్లడిస్త్తే మన ప్రతిభ లోకానికి తెలుస్తుంది. అప్పు తీర్చేది జనమే, ఎవరి జేబుల్లోంచి పెట్టటం లేదు కదా !


ఇక ఐరాస సంస్థలకు సమాచారం ఇవ్వకపోతే మచ్చపడుతుంది, అక్కడ మనం సుభాషితాలు మాట్లాడే అవకాశం ఉండదు, అవి టీవీ చర్చలు కాదు గనుక వాటిలో మాదిరి మాట్లాడితే మర్యాద దక్కదు. పవన్‌ కల్యాణ్‌ భాషలో చెప్పాలంటే కొడకా అంటూ తాటతీస్తారు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, వాటికి సమాచారం ఇవ్వకపోతే తిప్పలు తెచ్చుకున్నట్లే ! ప్రపంచవాణిజ్య సంస్థకూడా అంతకంటే ఎక్కువ. అమెరికా వంటి మన ” సోదర ” దేశాలు మనం సమాచారం ఇస్తున్నా అక్కడ కేసులు పెడుతున్నాయి. మన దేశంలో ఆకలి సంబంధిత అంశాల గురించి స్వచ్చంద సంస్థలు ఏమి చెబుతున్నాయో, మన ప్రభుత్వ సంస్థలు ఎలాంటి నివేదికలిస్తున్నాయో ఆకలి సూచికలను తప్పుపడుతున్నవారు జనానికి చెబుతున్నారా ? వారి నిజాయితీ ప్రశ్నార్దకం కాదా ! మన దేశం తప్ప ఈ నివేదికను ఆమోదించటం లేదని గానీ, తప్పుడు పద్దతుల్లో రూపొందించారని గానీ ఎన్నిదేశాలు స్పందించిందీ సమాచారం లేదు, ఎవరైనా అలాంటి వివరాలు అందచేస్తే ఈ విశ్లేషణలో వాటిని చేర్చవచ్చు. ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా ? లేదు, ఎందుకంటే అన్నింటా అధమస్థానాలే.


మోడీ సర్కార్‌, మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సులభతర వాణిజ్య సూచిక గురించి చూద్దాం.2014లో 142లో ఉన్నదాన్ని 2020 నాటికి 63కు తీసుకువచ్చామని, 79 స్థానాలు ఎగబాకిందని చెప్పారు. చివరికి ఈ సూచికలు రూపొందించిన తీరు పెద్ద కుంభకోణమని, సమాచారాన్ని తారు మారు చేశారని, ప్రపంచ బాంకు పెద్దలు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ మరుసటి ఏడాది నుంచి ఏకంగా సూచికల రూపకల్పనకే స్వస్థి పలికారు. పోనీ మన దేశం ఇప్పుడు నిజాలు మాత్రమే చెప్పే సత్యహరిశ్చంద్రుల వారసులని చెబుతున్నారు గనుక సరైన సమాచారమే ఇచ్చారని, నిజంగానే అంత ప్రగతి సాధించిందనే అనుకుందాం, మరి ఆ మేరకు మన దేశానికి ఆ స్థాయిలో ఎందుకు పెట్టుబడులు రాలేదు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా ఎందుకు విఫలమైనట్లు ? సూచికను ఎగబాకించి సాధించిందేమిటి ? రాంకులను చూపినంత మాత్రాన పెట్టుబడులు పెట్టే అమాయకులు ఉండరని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రపంచానికి రుజువు చేసింది.


ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. ఆ ప్రాతిపదికను మన దేశానికి మాత్రమే వర్తింప చేస్తే తప్పే, అన్ని దేశాలకూ ఒకటే పద్దతిని అనుసరించారు కదా ! పోషకాహార లేమికి గాను కేవలం మూడువేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్దతి. ఏ సర్వేకైనా జనాభాలో ఎంత మందిని తీసుకుంటే సరైన వాస్తవాలు వెల్లడౌతాయో ఎవరైనా చెప్పగలరా ? మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు ఎంతమంది మీద జరుపుతున్నారో చెప్పి ప్రభుత్వం ఒప్పించగలదా ? ఒక పద్దతి ప్రకారం మన దేశం గురించి తప్పుగా చూపేందుకు ప్రతి ఏటా తప్పుడు సమాచారమిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ డిమాండ్‌ చేసినట్లు సదరు సూచికలు ఇచ్చే సంస్థలను అంతర్జాతీయ కోర్టుకు లాగి బోనులో నిలబెట్టి వాస్తవాలేమిటో వెల్లడించాలి. ఒట్టి అరుపులెందుకు ? నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడువేల మంది సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. దాని సమాచారాన్నే నివేదికను రూపొందించిన జర్మనీకి చెందిన ” వెల్ట్‌ హంగర్‌ హిల్‌ఫీ ” ఐర్లండ్‌లోని ” కన్సరన్‌ వరల్డ్‌వైడ్‌ ” తీసుకున్నాయి, అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. 2021 ఆకలి సూచిక నివేదిక తప్పుల తడక అంటూ 2021నవంబరు పదవ తేదీ పయనీర్‌ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. దాన్లో దేశంలో కూరగాయలు, గుడ్లు, పండ్లు, పాలు ఇతర ఆహార ఉత్పత్తులు ఎలా పెరిగాయో పేర్కొంటూ ఇవన్నీ ఉన్నపుడు పోషకాహార లోపం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.( వాటిని కొనుగోలు చేసి రోజూ తినేవారెందరో ఆ పెద్దమనిషి చెప్పి ఉంటే అసలు నిజాలు తెలిసేవి. ) ఆకలి సూచికల రూపకల్పనకు నేషనల్‌ శాంపుల్‌ సర్వే సంస్థ(ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) నుంచి ఆహార వినియోగ సమాచారాన్ని తీసుకోవాలని చెప్పారు. 2011-12 తరువాత అసలు అలాంటి సమాచారాన్ని ప్రచురించలేదని, 2015-16 సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నందున అసలు దాన్ని ప్రచురించకుండా వెనక్కు తీసుకున్నారని, అందువలన 2021 ఆకలి సూచిని 2011-12 సమాచారంతో రూపొందించారని మహాజన్‌ ఆరోపించారు. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సరైన సర్వే నిర్వహించలేదు, పోనీ మా దగ్గర తాజా సమాచారం లేనందున మా దేశాన్ని జాబితాలో చేర్చవద్దని ఎందుకు కోరలేదు. సమాచారాన్ని సేకరించేందుకు మోడీ సర్కార్‌ ఎందుకు శ్రద్ద చూపలేదు ? 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తే ఎన్నికలు ముగిసేవరకు దాన్ని వెలుడకుండా అడ్డుకున్నారు, అది వాస్తవం కాదన్నారు, తరువాత అదే వాస్తవమని అధికారికంగా అంగీకరించారు.


గతంలో ఎఫ్‌ఏఓ మన దేశంలో ఆహార వినియోగం గురించి జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణ బోర్డు (ఎన్‌ఎన్‌ఎంబి) సమాచారం మీద ఆధారపడేది. 2011 తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, 2016 తరువాత పట్టణ ప్రాంతాల్లో తాము ఎలాంటి సర్వేలు జరపలేదని ఎన్‌ఎన్‌ఎంబి చెప్పిందని కూడా మహాజన్‌ పేర్కొన్నారు.( ప్రభుత్వం దగ్గర సమాచారం లేనపుడు గాలప్‌పోల్‌ వంటి సంస్థల మీద ఆధారపడి దాన్ని విశ్లేషణకు తీసుకున్నట్లు చెప్పవచ్చు. దానికి ఎవరిది బాధ్యత ఎవరిది ?)
అశ్వనీ మహాజన్‌ సరికొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) 2016లో చేసిన సర్వే ప్రకారం 16 రాష్ట్రాల్లో కార్లు, ఇళ్లు ఉన్న ధనికుల పిల్లల్లో కూడా 17.6శాతం మంది గిడసబారి ఉన్నారని, 13.6 శాతం మంది బలహీనంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెబుతూ, ధనికులకు ఆహారం అందుబాటులో ఉంటుంది కదా ఇలా ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే పిల్లల్లో 22 శాతం మంది గిడసబారటం, 11.8 శాతం బలహీనంగా ఉంటారని చెప్పారు. ఈ వాదన ఎందుకు చేశారంటే డబ్బున్న వారు కూడా సరిగా పిల్లల్ని పెంచటం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు దీనికి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నరేంద్రమోడీ ఏమి చేస్తారని వాదించటం, వాస్తవాన్ని వక్రీకరించటం, వైఫల్యాన్ని అంగీకరించకపోవటమే.
వాస్తవం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను 2014-15లో ఐదవ సర్వేను 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేల మధ్య వచ్చిన మార్పు, ఆకలి సూచికల్లో 2014-2022 కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి ? దిగువ పట్టికలో చూద్దాం. అంకెలను శాతాలుగా గమనించాలి.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రక్తహీనత అంశంలో ఒక్క కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా పరిస్థితి తీవ్రంగా ఉంది.
అంశం××××××× సర్వే 4 ××× సర్వే 5×× 2014××2022
గిడసబారినపిల్లలు×× 38 ××× 36 ××××× 38.7 ×× 35.5
బలహీన పిల్లలు ×× 21 ××× 19 ××××× 15.1 ×× 19.3
శిశుమరణాలు ×× 22.7 ××× 25 ××××× 4.6 ×× 3.3
పోషకాహారలేమి ×× 00 ××× 00 ××××× 14.8 ×× 16.3
బరువు తక్కువపి.×× 36 ××× 32 ××××× 000 ×× 000
రక్తహీన పిల్లలు ×× 58.6 ×× 67 ××××× 000 ×× 000
రక్తహీనమహిళలు×× 53.1 ××× 57 ×××× 000 ×× 000
రక్తహీనపురుషులు×× 22.7 ××× 25 ×××× 000 ×× 000

పైన పేర్కొన్న అంకెల్లో 2014 నుంచి 2022 వివరాలను ఆకలి సూచికల విశ్లేషణలో పేర్కొన్నారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు మన ప్రభుత్వం ప్రకటించినవే. దశాబ్దాల పాటు ఎలాంటి సర్వేలు నిర్వహించని మన ప్రభుత్వాలు, పాలకులకు, వారి మద్దతుదార్లకు సూచికలను రూపొందించే సంస్థలను విమర్శించేందుకు ఉన్న నైతిక అర్హత ఏమిటి ? తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021వరకు ఉన్న ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది.2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు రాంకుల గొడవ ఉండదు కదా !


2014లో పేర్కొన్న76 దేశాల్లో మనది 55వ రాంకు వాస్తవం కాదు అని కొందరు చెబుతున్నారు. మరి ఎంత ? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 122 మన రాంకు 99 అవుతుంది. తాజా రాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా ? మనం తెచ్చుకున్న మార్కులను చూస్తే 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 మాత్రమే ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. మామ తిట్టినందుకు కాదు తోడల్లు తొంగి చూసి కిసుక్కుమన్నందుకు అన్నట్లుగా మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం, తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు !


చివరిగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి చూద్దాం. సమగ్ర శిశు అభివృద్ధి పధకం(ఐసిడిఎస్‌) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మన్మోహన్‌ పాలన చివరి ఏడాది బడ్జెట్‌ 2013-14లో ఈ పధకానికి రు.16,312 కోట్లు కేటాయించారు. తరువాత నరేంద్రమోడీ పాలన తొలి ఏడాది 2014-15లో రు. 16,561, 2015-16లో రు.8,336, 2016-17లో 14,850, 2017-18లో 16,745 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌ 2022-23లో రు.20,263 కోట్లుగా ప్రతిపాదించారు.2013-14 బడ్జెట్‌ ఖర్చు అంచనా రు.16,65,297 కోట్లు కాగా 2022-23 లో అది రు.39,44,909 కోట్లుగా ప్రతిపాదించారు. దీన్ని బట్టి తొమ్మిది సంవత్సరాల నాడు ఐసిడిఎస్‌కు మొత్తం ఖర్చులో 0.98 శాతం కేటాయిస్తే 2022-23 నాటికి అచ్చేదిన్‌ స్వర్ణయుగంలో అది 0.51 శాతానికి తగ్గింది. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు మాత్రం భీముడిలా ఉండాలి అనుకోవటం కాదా ఇది ? నేటి బాలలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం కాదు, ఆచరణ కావాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకలి సూచికలో మరింత దిగజారుడు : పొట్టకూటి పాములోళ్ల బొమ్మ అవమానమైతే….. మరి రాజకీయ ఆవులోళ్ల చిత్రాల సంగతేమిటి ?

16 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK

≈ Leave a comment

Tags

BJP, Congress party, cow politics, Cow pooja, Indian economy, La Vanguardia, Narendra Modi Failures, RSS, snake charmer


ఎం కోటేశ్వరరావు


మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్‌ సింగ్‌ పాలనలో మన దేశపరువు ప్రతిష్టలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్రమోడీ వాటిని తిరిగి ప్రతిష్టించారని, లోకమంతా మనవైపు చూస్తోందని కొందరు చెప్పారు. ఇప్పుడు మోడీ ఏలుబడిలో మన ఆర్ధిక ప్రగతిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, ఐఎంఎఫ్‌ ప్రశంసే దానికి నిదర్శనం చూడండని చెబుతున్నారు. అటువంటి స్థితిలో మనలను అవమానించే వారికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి ఆఫ్టరాల్‌ 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ దేశ వార పత్రిక లా వాన్‌గార్డియా అవమానించటమా ? మన ఆర్ధిక రంగ వృద్ది తీరుతెన్నులను పాములను ఆడించే వ్యక్తి చిత్రంతో పోల్చి చూపి, అందునా మొదటి పేజీలో విశ్లేషించటమా ?ఆర్ధిక రంగం గురించి రాస్తే రాశారు పో, ఆ బొమ్మ తప్ప మరొకటి దొరకలేదా ! దాన్ని మేము ఏల చూడవలె !! హతవిదీ,ó అని కౌరవ రారాజు సుయోధనుడి మాదిరి అనేక మంది రగిలిపోతున్నారు. వారిని అర్ధం చేసుకోవచ్చు. మయసభలో ధుర్యోధనుడికి ఆగ్రహం తాను భ్రమ అనుకున్న నీటి మడుగులో పడినందుకు కాదు, దాన్ని చూసి ద్రౌపది నవ్వినందుకు అన్నది తెలిసిందే. ఈ వార్త కూడా అలాంటిదే. మరో కోణంలో అలాంటి దానికి అవకాశం ఇచ్చిందెవరు అన్న ప్రశ్నను వేసుకోవాలి. ఆక్టోబరు తొమ్మిదవ తేదీన ” భారత ఆర్ధిక వేళ ” అనే అర్ధం వచ్చే శీర్షికతో ప్రచురించిన ఆ వార్త గురించి శుక్ర,శనివారాల్లో మన దేశంలోని అనేక టీవీలు, జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు పుండు మీద కారం చల్లినట్లుగా సదరు చిత్రాన్ని ముద్రించి మరీ మన పాఠకులకు అందచేశారు.మన జనాలు మన పత్రికలనే సరిగా చదవరు, అలాంటిది స్పెయిన్‌ పత్రికను మన దేశంలో కొద్ది మంది ఆ భాష వచ్చిన వారు తప్ప ఎవరూ చదవరు. దాన్ని తీసుకొని మన పత్రికలు బహుళ ప్రచారమిచ్చిన వార్తలు మన ప్రధాని నరేంద్రమోడీకి గౌరవ ప్రదమా ? మీడియా పెద్దలు ఆలోచించకుండా అలా చేశారని అనుకుందామా ? లేక ప్రధాని మెప్పు పొందేందుకు చేసిన విన్యాసమా ?


ఆ స్పానిష్‌ భాష పత్రికలో మన ఆర్ధిక రంగం మీద చేసిన విశ్లేషణ సారం ఏమిటో అనువాదం కోసం వెతికినా దొరకలేదు. ఏదైనా కావచ్చు, మన ప్రధాని నేతృత్వంలో ఆర్ధికంగా దేశం ఎలా గంతులు వేస్తూ ముందుకు పోతున్నదో రాసి ఉండవచ్చు లేదా ఎలా దిగజారుతున్నదో కూడా చెప్పి ఉండవచ్చు. ఏది రాసినా అసలు అభ్యంతరం అది కాదు. దానికి పాములనాడించే వ్యక్తి చిత్రాన్ని జోడించి ప్రచురించటమే. జనాన్ని కాటువేసే ద్రవ్యోల్బణమనే నాగుపాము బుసలు ప్రపంచమంతటితో పాటు మన దేశంలో కూడా ఉన్నందున దాన్ని బుజ్జగించి బుట్టలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ ఊదుతున్న నాగస్వరానికి చిహ్నంగా ఆ చిత్రాన్ని చూపారా ? అసలు ఆ బొమ్మ వేస్తే తప్పేంటి, పత్రికల్లో అనేక బొమ్మలు వేస్తున్నారు, దాన్ని సానుకూల వైఖరితో ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. ఆర్ధికరంగం మాంద్యంలోకి జారకుండా, మన గానానికి అనుగుణ్యంగా నృత్యం చేయిస్తూ ఉన్నతి వైపు తీసుకువెళ్లే ప్రయత్నానికి ప్రతిబింబంగా దాన్ని ఎందుకు పరిగణించకూడదు, ఆత్మన్యూన్యతకు ఎందుకు గురికావాలి ? చిన్న వ్యంగ్యాన్ని సహించలేని స్థితికి ” ఎదిగామా ” అన్నది వారి ప్రశ్న. నూరు పూవులను పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి.


పాములను ఆడించే వ్యక్తి చిత్రాన్ని మన దేశానికి ప్రతీకగా చూపటం అవమానించటమే అని కొందరు పేర్కొన్నారు.” బలమైన భారత ఆర్ధిక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా పాములోళ్ల బొమ్మలతో మనల్ని చూపటం బుద్దిలేని తనం. వారిని వలసవాద భావన నుంచి మరల్చటం సంక్లిష్టమైనది ” అని స్పెయిన్‌ వారపత్రిక కథనం గురించి బెంగలూరు సెంట్రల్‌ బిజెపి ఎంపీ పిసి మోహన్‌ అన్నారు. నిజమే, వారిని మార్చటం అంత తేలిక కాదు, విదేశీయులు మారకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన దేశంలో పాములోళ్ల కాలం నాటి నుంచి ఉన్న, అంధ, మూఢవిశ్వాసాలను, అశాస్త్రీయ అంశాలను జనాల మెదళ్లకు ఒక పధకం ప్రకారం ఇప్పటికీ సరికొత్త పాకింగ్‌లు, రంగులది ఎక్కిస్తున్న మీడియా, రాజకీయ నేతల సంగతేమిటి అన్నది ప్రశ్న.


మన దేశంలో అశాస్త్రీయ అంశాలను నమ్మి, బహిరంగంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాలను ప్రపంచమంతా చూసి నవ్వుకుంది, దేశాన్ని అపహాస్యం పాలుచేశారు. వినాయకుడికి ఏనుగు తల ఉందంటే అ రోజుల్లోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జన్లు ఉండి ఉండాలని మోడీగారే చెప్పారు. ఇక ఇంథనం, పైలెట్లతో పని లేకుండా ఎక్కిన వారు ఎటు పొమ్మంటే అటు, పైకీ కిందికీ తిరిగే విమానాల గురించి,క్షిపణుల గురించి చెప్పిన పెద్దమనుషుల విన్యాసాలు మూఢవిశ్వాసాలను పెంపొందించేందుకు, జనం చేత వాటిని గుడ్డిగా నమ్మించేందుకే కదా ! పాములనాడించేవారు పొట్ట కూటికోసం పడిన, పడుతున్న తిప్పల్లో భాగం. మరి వీరు ఎందుకు అలా చేస్తున్నట్లు ? అందువలన దేశానికి జరిగిన అవమానం, అపఖ్యాతి తెచ్చిన వారిని వదలి స్పెయిన్‌ పత్రిక అవమానించిందని చెపుతున్నవారి చిత్తశుద్ది ప్రశ్నార్ధకం. విదేశీయులు మన దేశానికి వచ్చినపుడు భారతీయులు నాగుల చవితి పేరుతో పాములను పూజించటం, కోతులకు, ఆవులకు మొక్కటాన్ని, ఆవు మూత్రాన్ని తల మీద చల్లుకోవటాన్ని చూశారు. కనిపించిన చెట్టు, పుట్ట, రాతిని పూజించటాన్ని గమనించారు, భారత్‌ అంటే అలాగే ఉంటుందన్నట్లుగా రాశారు. దానిలో కొంత అతిశయోక్తి, చులకన భావం ఉంది. కానీ వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక శాస్త్రీయ అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జరుగుతున్నదేమిటి ? పాములు పాలు తాగవని తెలిసీ రెచ్చిపోయి పోస్తున్నవారి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా మనోభావాలను కించపరుస్తున్నారని దెబ్బలాటలకు వస్తారు. ఆ మాటకు వస్తే దేవతా రూపాలైన పాములను పూజించాలే తప్ప వాటి కోరలు తీసి ఆడించటం, బుట్టలో పెట్టటం దేవతలను అవమానించటం కాదా అని ఎవరైనా అంటే ? పాములోళ్ల కడుపు మీద కొట్టినట్లే. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు, రాకెట్లను తీసుకువెళ్లి గ్రామ దేవతలు, ఇతర దేవుళ్ల ముందుంచి పడిపోకుండా ఎగిరేట్లు చూడండని వేడుకుంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ గారే గోమాత, కామధేనువు అంటూ ఆవులను పూజిస్తూ ఫోజులిస్తున్న తరువాత, వాటిని ప్రపంచమంతా చూస్తున్నపుడు పాములోళ్ల బొమ్మవేసి ఎవరో అవమానించారు అని గుండెలు బాదుకోవటం కొందరిని సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


ఇక కరోనా మహమ్మారి గురించి ప్రచారం చేసిన మూఢనమ్మకాలు, పిచ్చిపనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంగామాత ఆశీర్వాదం ఉన్నందున గంగలో మునిగితే కరోనా రాదని చెప్పి కుంభమేళాకు అనుమతిచ్చి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి కారకుడైన ఉత్తరాఖండ్‌ బిజెపి సిఎం నిర్వాకం, తరువాత దాన్ని మధ్యలోనే నిలిపివేసిన ప్రహసనం తెలిసిందే. ఇంతకంటే పరువు తక్కువ పనేముంటుంది. ఆవు మూత్ర తాగింపు పార్టీలు, ఆవు పేడ పూసుకొని గంతులు, పాటలు, భజనలు ఇలా ఎన్నని చెప్పుకోవాలి. వీటన్నింటినీ మన టీవీలు తమ రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున చూపిందీ తెలిసిందే. ఇవన్నీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచేవా ? వందల మంది మూత్రం తాగేందుకు, పేడ పూసుకొనేందుకు పోటీపడటంతో మూత్రం లీటరు, పేడ కిలో రు.500 చొప్పున ధర పలికింది. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసి దేశభక్తులందరూ రావాలని కోరారు. అంతే కాదు నరసింహడి అవతారమే కరోనా అని, మాంసాహారం తినేవారిని శిక్షించేందుకే వచ్చిందని సెలవిచ్చారు. ఆవు మూత్రం తన కాన్సర్‌ను మాయంచేసినట్లు బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా చేస్తే కరోనా వైరస్‌ నివారణ అవుతుందని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. దీపాలు వెలిగిస్తే కరోనా నశిస్తుందని అదొక సైన్సు అని చెప్పిన వారు, పో కరోనా పో కరోనా అంటూ శాపాలు పెట్టిన వారు, మంత్రాలు చదివిన వారి గురించీ తెలిసిందే.


పాములోళ్ల బొమ్మ మన దేశానికి ప్రతీకగా ప్రచురించటం అవమానం అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నపుడే ప్రపంచ ఆకలి సూచికల తాజా (2022) నివేదిక వెలువడింది. దీన్లో మన స్థానం దేశానికి ప్రతిష్టను తెచ్చేదిగా ఉందా ? ఈ సూచికల రూపకల్పనకు తగిన సమాచారం ఇచ్చిన దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది అలా ఇచ్చిన 116 దేశాలకు గాను వందవ స్థానంలో ఉన్న నరేంద్రమోడీ ఇప్పుడు 121 దేశాల్లో 107 దగ్గర నిలిచారు. మన దగ్గర ప్రతి ఊర్లో కామధేనువులకు, వాటిని పూజించేవారికీ కొదవ లేదు. కొంత మంది ఓట్ల కోసం నటించినప్పటికీ ఫలితాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్దితో జనం చేసే పూజల్లో విశ్వాసం, నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. మరి ఇంత ఆకలి ఎందుకు ఉన్నట్లు ?2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 అచ్చే దిన్‌ ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. వర్గీకరణ ప్రకారం 9.9 మార్కుల లోపు వచ్చిన దేశాలను ఆకలి లేని లేదా సమస్య తక్కువగా ఉన్నట్లు, పది నుంచి 19.9 వరకు ఒక మితమైన సమస్య, 20 నుంచి 34.9వరకు తీవ్రమైన, 35 నుంచి 49.9 వరకు ఆందోళన కరమైన, 50 దాటితే విషమంగా ఉన్నట్లు పరిగణిస్తారు.ప్రతి ఏటా పరీక్ష పేపరు, ప్రశ్నలు మారుతుంటాయి, వాటికి ఇచ్చే మార్కులూ అంతే గనుక గత సంవత్సరాలతో పోల్చ కూడదని కొందరు వాదిస్తారు. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులున్నప్పటికీ మొత్తంగా వచ్చే మార్కులను బట్టే సూచికల్లో స్థానం ఉంటుంది. దానిలో ఎంత మేరకు ఎదిగామన్నది లెక్క.మన మెరుగుదల ఒక లెక్కలోనిది కాదు, మిగతా దేశాలు మనకంటే ఎక్కువగా మెరుగుపడిన కారణంగానే గత ఏడాది కంటే దిగజారాం.


2013లో మన దేశం 63వ స్థానంలో ఉండగా 2014లో 76 దేశాలకు గాను 55వ స్థానంలో ఉన్నాం. ఆ ఏడాది సూచికల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే దిగువన 57లో, ఎగువన శ్రీలంక 39, నేపాల్‌ 41వ స్థానాల్లో నిలిచాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో పాక్‌, బంగ్లాదేశ్‌ కూడా మన కంటే ఎగువకు చేరాయి. 2022 సూచికలో ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌ 109, మన పాలకులు, కాషాయ దళాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో స్మరించే పాకిస్తాన్‌ 99, బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 81,మయన్మార్‌ 71, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక 64 స్థానాల్లో ఉండగా ప్రపంచానికే ఆహారం అందించగలం అని కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో మన పరిస్థితి ఇలా ఉందేమిటి ? ఇది మన దేశ గౌరవం, ప్రతిష్టలను పెంచేదా ? రేపు మరొక దేశ పత్రిక ఓ కామధేనువూ మా జనాల ఆకలి తీర్చి ప్రపంచ ఆకలి సూచికలో మా స్థానాన్ని పెంచు, మా దిగుమతులను తగ్గించు, ఎగుమతులను పెంచు, ఆవుల మూత్రంలో బంగారం సంగతి తరువాత ముందు దాన్ని ముడిచమురుగా మారిస్తే సంతోషం తల్లీ అని ప్రార్ధిస్తున్నట్లుగా వీధుల్లో ఆవులను చూపుతూ అడుక్కొనే వారి బొమ్మ లేదా నరేంద్రమోడీ ఆవును పూజిస్తున్న బొమ్మను వేస్తే గౌరవంగా ఉంటుందా ? జనాల మనోభావాలతో ఆడుకోవటం తప్ప పాములోళ్ల బొమ్మ గురించి ఇంత రాద్దాంతం అవసరమా ?


జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ వారు అపహాస్యం చేయటమా అంటే అర్ధం ఏమిటి ? అనేక అభివృద్ధి సూచికల్లో అది మన కంటే చాలా ఎగువున వుంది. అందువలన మన మీడియా స్పందన తెలుసుకొని ఆ దేశస్థులు మీ దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ జనాభాకంటే తక్కువగా ఉన్న మేము రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపిని కలిగి ఉంటే అంత పెద్ద దేశం ఇంకా మూడున్నర లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఉండటం ఏమిటో చూసుకోండి, ఒక నాడు చైనా కంటే ముందుండి ఇప్పుడు దాని కంటే ఎంత వెనుక ఉన్నారో తెలుసుకోండి అని స్పందిస్తే మన దగ్గర సమాధానం ఏమిటి ? ఐరోపా వారు తమ వలస కళ్లద్దాలతో గతాన్నే చూస్తున్నారు, వర్తమాన భారతాన్ని చూడటం లేదని సాధించిన ఆర్ధిక ధీరత్వాన్ని చూడలేకపోతున్నారని, బ్రిటన్ను అధిగమించిన అంశం కనపడటం లేదా అని కొందరు అంటున్నారు. నిజమే జనాల ఆకలి తీర్చని జడిపి, ఉన్నత స్థానాలు ఎందుకు ? తరతరాలుగా మరోదారి లేని పాములోళ్లు జీవన పోరాటంలో పాములను అదుపు చేసి బుట్టలో , ఎవరైనా పిలిస్తే పట్టుకొని సాయ పడుతున్నారు, కొత్తగా రంగంలోకి దిగిన రాజకీయ ఆవులోళ్లు అధికార పోరులో దేశ ఆర్ధిక రంగాన్ని తాము చెప్పినట్లుగా కూడా ఎందుకు నడిపించలేకపోతున్నారు ? దేశంలో ఆవు-దూడను గుర్తుగా తీసుకొని కాంగ్రెస్‌ ఆవు రాజకీయం మొదలెట్టింది. ఇప్పుడు బిజెపి దాన్ని మరో రూపంలో కొనసాగిస్తున్నది. నాటి ఆవు-దూడ గరీబీ హఠావో అని చెప్పినట్లుగానే నేటి ఆవులోళ్లు చెప్పిన అచ్చేదిన్‌, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, నల్లధనం వెలికితీత ఏమైనట్లు ? ఒకరిది అన్నం కోసం ఆరాటం, మరొకరిది అధికారం, ఓట్ల కోసం బహుకృత్వ వేషాలు కావా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌్‌ఎన్నికల రాజకీయం : వృద్దుల పెన్షన్‌ రు. 1000, ఆవుకు రు. 900 !

09 Sunday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, Gujarat, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Pensioners, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

appeasement politics, BJP, cow politics, Gujarat Election 2022, Gujarat Election politics, Narendra Modi, old age pension, RSS


ఎం కోటేశ్వరరావు


వృద్దులు, ఆధారం లేని ఇతరులకేనా సామాజిక న్యాయం, పెన్షన్‌, వీధుల్లో తిరిగే ఆవులకూ ఇవ్వాలి కదా అంటున్నారు ఓటు రాజకీయనేతలు. గుజరాత్‌లో ప్రతి పార్టీ పోటీ పడుతోంది. డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనుషులతో పాటు ఆవులూ పార్టీలను ప్రభావితం చేస్తాయా అని కొందరు చర్చ చేస్తున్నారు. వట్టి పోయిన(పాలివ్వని) ఆవులను గతంలో రైతులు వధ శాలలకు తరలించే వారు, కొంత రాబడి వచ్చేది. కాషాయ మూకలు దిక్కుమాలిన ఆవు రాజకీయాలను రంగంలోకి తెచ్చిన తరువాత అలాంటి ఆవులను అమ్ముకోలేరు, గో గూండాల దాడులకు భయపడి కొనుగోలు చేసే వారూ లేరు. దాంతో రైతులు వాటిని మేపే స్తోమత లేక లేదా నష్టదాయకంగా భావించి వీధుల్లోకి వదలివేస్తున్నారు. అవి ఇబ్బడి ముబ్బడి కావటంతో గుజరాత్‌ హైకోర్టు అనేక సార్లు వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. దాంతో విధిలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం అలాంటి ఆవులను వదలివేసిన వారికి జరిమానా విధించే నిబంధనలతో తీవ్ర చర్చల తరువాత పట్టణాలలో ఆవుల నియంత్రణ బిల్లు-2022ను తేవాల్సి వచ్చింది. మార్చి నెల 31న మెజారిటీ ఓటింగ్‌తో ఆమోదించిన బిల్లుకు నిరసనగా ఆవుల యజమానుల ఆందోళనలు చేశారు. జుమ్లా, వుత్తినే బిల్లు తెచ్చాం తప్ప అమలు జరపం అని ప్రభుత్వం చెప్పినా వారు తగ్గలేదు, ఎన్నికల్లో బిజెపిని బహిష్కరిస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం, వాటికి ఎక్కడ గండిపడుతుందో అన్న భయరతో సెప్టెంబరు నెల అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవంగా వెనక్కు తీసుకున్నారు.


చిత్రం ఏమిటంటే గోమాంసం కోసం ఆవులను తరలిస్తున్నారంటూ గో రక్షకుల ముసుగులో చేసిన దాడుల గురించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాపితంగా మన దేశానికి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. అలాంటిది గుజరాత్‌లో గత పది నెలల్లో వీధుల్లో వదిలేసిన ” ఆవులు జరిపిన దాడుల్లో ” 4,860 ఉదంతాల్లో 28 మంది మనుషులు మరణించారని అధికారిక లెక్కలే పేర్కొన్నాయి. ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా ఎనిమిది పెద్ద పట్టణాలు, 162మున్సిపాలిటీల్లో ఇవి జరిగాయి. మాజీ ఉపముఖ్య మంత్రి నితిన్‌ పటేల్‌ను పోరుబందరు పట్టణంలో ఒక ఆవు కుమ్మటంతో కాలు విరిగింది. మరుసటి రోజే కొత్త సిఎం భూపేంద్ర పటేల్‌ ఒక ప్రదర్శనలో ఉండగా ఒక ఆంబోతు దాని మీదకు వచ్చింది. వేశ్యా గృహాలకు తరలించే బాలికలను రక్షించి ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలలో ఉంచటం తెలిసిందే. కబేళాలకు తరలించే ఆవులను కాపాడేందుకు ఏర్పడిన గో దళాలు రక్షించిన ఆవులను సంరక్షించేందుకు ప్రభుత్వం దాతృత్వ సంస్థలు ఏర్పాటు చేసే 450 గోశాలలకు( అవి ఎవరికి కేటాయిస్తారో చెప్పనవసరం లేదు) 2022-23లో గోమాత పోషణ యోజన కింద ఐదు వందల కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆరునెలలు గడిచినా పైసా విదల్చలేదు. ఈ పధకం కింద గోశాలలో చేర్చిన ప్రతి ఆవుకు రోజుకు 30 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం గుజరాత్‌లో అమల్లో ఉన్న వున వృద్దాప్యపెన్షన్‌ పధకం కింద 60ఏండ్లు దాటిన వృద్ధ కుటుంబాలకు నెలకు రు.400, ఎనభై ఏండ్లు దాటిన వారికి రు.700 ఇస్తున్నారు. ఎన్నికల కోసం ఈ మొత్తాలను రు.1000-1250గా పెంచుతామని 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నారు.


ఆవులను గాలికి వదిలేస్తే జరిమానా వేస్తామంటే ఆవుల పెంపకందార్లు ఆగ్రహించారు. ఆ బిల్లును ఎత్తివేసి గోశాలల్లో చేర్చిన ప్రతి ఆవుకు నెలకు రు.900 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఈ కేటాయింపు నిధులు వెంటనే ఇవ్వాలని, ఇది ఒక ఏడాదికి పరిమితం చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,700 గోశాలలు ఉండగా 450కి మాత్రమే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆవుల పెంపకందార్లు వట్టిపోయిన వాటిని వదలి వేస్తే ఇప్పుడు గోశాల నిర్వాహకులు ఆందోళనకు దిగి నిరసనగా గోశాలల్లో ఉన్న ఆవులన్నింటినీ వీధుల్లోకి వదలాలని చూస్తున్నారు. గత నెలాఖరులో వనస్కాంత జిల్లాలోని వీధులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారు. తదుపరి ఆందోళనలో భాగంగా జిల్లా, తాలూకా ప్రభుత్వ ఆఫీసుల్లో గోమూత్రం, పేడ చల్లుతామని ప్రకటించారు.


గతంలో గోశాలల్లోని ప్రతి ఆవుకు రోజుకు రు.8 సబ్సిడీ ఇచ్చే పధకాన్ని 2001లో నరేంద్రమోడీ సిఎం కాగానే నిలిపివేశారని పదివేల మంది గోశాల ట్రస్టీల ప్రతినిధి కిషోర్‌ శాస్త్రి చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ఉత్తర గుజరాత్‌లో తీవ్ర వరదలు వచ్చినపుడు ఒక్కో ఆవుకు రు.25 చొప్పున కేవలం రెండు-మూడు నెలలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లట్‌(కాంగ్రెస్‌) ప్రభుత్వం రోజుకు ప్రతి ఆవుకు రు.50 ఖర్చు చేసిందని, ఉత్తరాఖండ్‌ సర్కార్‌ 1000 గోశాలలను నిర్వహిస్తుండగా గోమాత మీద ప్రమాణం చేసి అధికారానికి వచ్చిన గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం వార్షిక బడ్జెట్లను ఎందుకు కేటాయించదని శాస్త్రి ప్రశ్నించారు. వివిధ కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకు వీధుల్లో తిరుగుతున్న ఆవులను పట్టుకొని దీశా-రాజపూర్‌ గోశాల వంటి వాటికి తరలించిన ప్రభుత్వానికి వాటి సంరక్షణ పట్టదా అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న 8,900 ఆవుల్లో సగం ప్రభుత్వ పంపినవే అన్నారు. పోలీసులు పట్టుకున్న వస్తువులను కూడా అలాగే ఎక్కడో ఒక చోట పడవేస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాలలో గుజరాత్‌ ఒకటి. పరిశ్రమలు, పట్టణాల విస్తరణలో భాగంగా గ్రామాలు వాటిలో కలిసిపోతున్నాయి. ఆవులు, ఇతర పశువుల మేతకు గ్రామాల్లో ఉన్న గడ్డి భూములను కూడా పరిశ్రమలు, గృహనిర్మాణాలకు కేటాయిస్తుండటంతో పశువుల మేత కొరత ఏర్పడింది. దాంతో మరొక దారిలేని పెంపకందార్లు వాటిని వదలివేస్తున్నారు. పట్టణాల్లో ఇది సమస్యలకు దారి తీస్తున్నది.


గుజరాత్‌లో ఆవుల పెంపకందార్లను మాల్దారీలని పిలుస్తారు. సంతుష్టీకరణలో భాగంగా, వారి ఓట్ల కోసం ప్రతి పార్టీ, నేత ఆవుల మీద ప్రేమ ఒలకబోస్తారు. అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను 46 చోట్ల ఈ సామాజిక తరగతికి చెందిన వారు సమీకరణలను తారు మారు చేస్తారని అంచనా. సంతుష్టీకరణ రాజకీయాలకు బద్ద వ్యతిరేకమని, కాంగ్రెస్‌ను నిరంతరం విమర్శించే ప్రధాని నరేంద్రమోడీ దీనికి మినహాయింపు కాదు.ఎక్కడైతే ప్రభుత్వానికి నిరసనగా ఆవులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారో అదే వనస్కాంత జిల్లాలోని అంబాజీలో సెపెంబరు 30 న నరేంద్రమోడీ ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన పథకాన్ని ప్రారంభించారు.ఆగస్టు నెలలో బిజెపి ఆధీనంలోని సూరత్‌ మునిసిపల్‌ అధికారులు అనుమతి లేని ఆవుల షెడ్లంటూ 222 కట్టడాలను కూల్చివేశారు. వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్‌ పాటిల్‌ రంగంలోకి దిగి మాల్దారీ సమాజానికి జోలపాడారు. కూల్చివేతలను నిలిపి వేయించారు. ఎన్నికల రాజకీయమంటే ఇదే, అధికారులతో కూల్చివేయిస్తారు, తరువాత వచ్చి నిలిపివేసినట్లు కనిపిస్తారు. గుజరాత్‌ ప్రభుత్వం మాల్దారీల కోసం కామధేను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నదని, ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి గురించి అక్కడ పరిశోధనలు చేస్తారని బిజెపి మాల్దారీ విభాగ నేత సంజయ దేశాయి చెబుతున్నారు.


ఆవు రాజకీయంలో కాంగ్రెసేమీ తక్కువ తినలేదు. గతంలో పశు సంవర్ధన గురించి పేర్కొన్నప్పటికీ తొలిసారిగా ఆవు సంరక్షణ గురించి ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. ఆవు పాలకు లీటరుకు ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తామని, రాజస్తాన్‌ పధకాలను అమలు జరుపుతామని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లను వెనక్కు నెట్టి అధికారాన్ని పొందుతామని చెబుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ తక్కువ తినలేదు. తమకు అధికారమిస్తే రోజుకు ప్రతి ఆవుకు రు.40ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో ఇస్తున్నట్లు అరవింద కేజరీవాల్‌ చెప్పారు. లంపీ వైరస్‌ కారణంగా గుజరాత్‌లో లక్షకు పైగా ఆవులు మరణించినా ప్రభుత్వం కదల్లేదని తాము వాక్సిన్లు వేస్తామని గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ నేత సుదాన్‌ గధ్వీ ప్రకటించారు. గుజరాత్‌లో రు.40 ఇస్తామని ప్రకటించిన కేజరీవాల్‌ ఢిల్లీలో రు.20 మాత్రమే ఇస్తున్నారని, మరో రు.20 తమ ఏలుబడిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెల్లిస్తున్నదని చెప్పిన బిజెపి ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రు.40 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.


గుజరాత్‌ దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. గర్బా పేరుతో పెద్ద ఎత్తున నృత్యం చేస్తారు. ఈ సందర్భంగా ప్రతిపార్టీ రాజకీయాలు చేసింది. పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ సిఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ గర్బా డాన్సు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అంబాజీలో ఆవు పూజ చేశారు. ఆరు నెల్లనాడు ప్రకటించిన పధకాన్ని ఎన్నికల ముందు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు చూసిన మజ్లిస్‌ పార్టీ గుజరాత్‌లో కూడా అదే పని చేసేందుకు అక్కడ పోటీలో ఉంటానని ప్రకటించిందనే విమర్శలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించని సురక్షిత హస్తం : పిడుగులు, ఉరుములతో డాలర్‌ – భయంతో వణుకుతున్న రూపాయి !

08 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India Exports, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, rupee value


ఎం కోటేశ్వరరావు


” ప్రబల డాలర్‌ ఉరుములతో శాంతి లేని భారత రూపాయి ” అనే శీర్షికతో అక్టోబరు ఏడవ తేదీన రాయిటర్‌ సంస్థ ఒక వార్తను ప్రపంచానికి అందించింది. శనివారం నాడు రూపాయివిలువ 82.82గా ఉన్నట్లు ఎక్సేంజ్‌ రేట్స్‌ అనే వెబ్‌సైట్‌ చూపింది. ఇలా రికార్డుల మీద రికార్డులు నమోదవుతుండటంతో గతంలో సిఎంగా ఉన్నపుడు రూపాయివిలువ పతనం గురించి నిర్దాక్షిణ్యంగా మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను తూర్పారపట్టినది గుర్తుకు వచ్చి ఇప్పుడు నరేంద్రమోడీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండాలి లేదా దానికి విరుద్దంగా ప్రశాంతంగా ఉండి ఉంటారు. కానీ దేశం, జనం అలా ఉండలేరే !


సెప్టెంబరు 30తో ముగిసిన వారంలో దేశ విదేశీమారక నిల్వలు 532.664 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితంతో పోల్చితే 110బి.డాలర్లు తక్కువ. 2008 సంక్షోభ తరుణంలో 20శాతం నిల్వలు తగ్గాయి. ఇప్పుడు కొందరు దాన్ని గుర్తు చేస్తున్నారు. తీవ్ర మాంద్య ముప్పు పొంచి ఉండటంతో డబ్బున్నవారందరూ ఇతర కరెన్సీల్లో ఉన్న ఆస్తులన్ని అమ్మి డాలర్లలో దాచుకోవటం మంచిదని కొందరు, బంగారంలో మంచిదని మరికొందరు వాటి వైపు పరుగుతీస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించేదే ! అన్నీ ప్రతికూల వార్తలే !!


కేంద్ర ప్రభుత్వం జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 వైపు పరుగు పెడుతోంది. అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. చైనా యువాన్‌తో కూడా మన కరెన్సీ గత ఐదు సంవత్సరాల్లో రు. 9.8 నుంచి 11.64కు పతనమైంది. మరి ఇదెలా జరిగింది?


అమెరికా ఫెడరల్‌ రిజర్వు మరొక శాతం వడ్డీ రేటు పెంచవచ్చని ముందే సూచించింది. అదే జరిగితే దేశం నుంచి డాలర్లు మరింతగా వెనక్కు పోతాయి. రూపాయి పతనం కొనసాగుతుంది. ఇప్పటికే అంచనాలకు మించిన వేగంతో దిగజారింది. ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మరింతగా తెగనమ్మవచ్చు. ఎగుమతులు తగ్గటం దిగుమతులు పెరగటం, వాణిజ్యలోటు పెరుగుదలకు దారితీస్తోంది. రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో పాల్గ్గొన్న ఆర్ధికవేత్తలు, విశ్లేషకులెవరూ సమీప భవిష్యత్‌లో రూపాయి విలువ పెరిగే అవకాశం లేదని, 82కు దిగజారవచ్చని చెప్పగా శనివారం నాడు 83కు చేరువలో ఉంది. డిసెంబరు నాటికి 82-84 మధ్య కదలాడవచ్చని కొందరు చెప్పారు. ఒక వేళ కోలు కుంటే ఆరు నెలల్లో 81.30కి ఏడాదిలో 80.50కి పెరగవచ్చన్నారు. వర్దమాన దేశాల కరెన్సీ విలువ పెరగాలంటే పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచాలని ఎక్కువ మంది చెప్పారు. అదే జరిగితే పారిశ్రామిక, వాణిజ్య, నిర్మాణ రంగాలు పడకేస్తాయి. ఇప్పటి వరకు విదేశీ వత్తిళ్లకు విదేశీమారక నిల్వలు గురైతే ఇక వడ్డీ రేట్లు కూడా తోడు కానున్నాయి. అక్టోబరులో మన కరెన్సీ విలువ రు.80.17-82.65 మధ్య ఉంటుందని గతనెలలో స్పెక్యులేటర్లు చెప్పగా,అది మొదటి పది రోజుల్లోనే తప్పింది. ఆకస్మికంగా 80.80కి దిగజారవచ్చని చెప్పారు, అది కూడా జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ సమాచారం ప్రకారం అక్టోబరు మూడు నుంచి ఏడువరకు రుణ మార్కెట్‌ నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడుల మొత్తం రు.2,948 కోట్లు కాగా, స్టాక్‌మార్కెట్‌కు వచ్చిన ఎఫ్‌పిఐ మొత్తాలు రు.2,440 కోట్లు. సెప్టెంబరు నెలలో వెళ్లిన మొత్తం రు.7,624 కోట్లు తప్ప వచ్చినవేమీ లేవు. వర్తమాన సంవత్సరంలో మార్కెట్‌ నుంచి వెనక్కు వెళ్లిన మొత్తం రు.1,72,891 కోట్లు.


మన ఇరుగు పొరుగు దేశాల గురించి తమకు అవసరమైనపుడు పోల్చుకొనే కాషాయ దళాల గురించి తెలిసిందే. ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అక్టోబరు ఏడవ తేదీతో ముగిసిన వారంలో ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరెన్సీగా పాకిస్తాన్‌ రూపీ ఉన్నట్లు ఇండియా అబ్రాడ్‌ న్యూస్‌ సర్వీస్‌(ఐఎఎన్‌ఎస్‌) శనివారం నాడు ఒక వార్తనిచ్చింది. ఐదు పని దినాల్లో డాలరుకు రు. 219.92కు చేరి 3.9శాతం బలపడింది. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ దేశంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనా దీనికి కారణంగా పేర్కొన్నారు. పదకొండు రోజులుగా అది బలపడుతూనే ఉంది. జూలై నెలలో రికార్డు కనిష్టంగా 240 నమోదైంది. పాకిస్తాన్‌ దివాలా అంచున ఉన్నట్లు అప్పుడు చెప్పారు.పాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న కారణంగా కరెన్సీ కోలుకుందని విశ్లేషకులు చెప్పారు. అక్టోబరు చివరి నాటికి 200కు పెరగవచ్చని ఆర్ధిక మంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు.దిగుమతులు తగ్గుతుండటం, రానున్న రోజుల్లో 2.3 నుంచి 2.5 బిలియన్‌ డాలర్లవరకు ఏడిబి రుణం ఇవ్వనుందనే వార్తలు పాక్‌ కరెన్సీ విలువ పెరుగుదలకు దోహదం చేస్తోంది. సెప్టెంబరు 20న మన ఒక రూపాయి 2.99 పాకిస్తాన్‌ రూపీకి సమానంగా ఉండగా అక్టోబరు 8వ తేదీకి 2.67కు బలపడింది.


మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో రూపాయి ప్రభుత్వ చేతగాని తనం వల్లనే పతనమైందని ధ్వజమెత్తిన నరేంద్రమోడీ ఇంతవరకు తన పాలనలో పతనం గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా బిజెపి ఎంపీ, మాజీ మంత్రి జయంత్‌ సిన్హా( యశ్వంత సిన్హా కుమారుడు) గతంలో మన కరెన్సీ ఒక్కటే పతనమైందని, ఇప్పుడు మన కంటే ఇతర ప్రధాన కరెన్సీలన్నీ పడిపోతున్నట్లు చెబుతూ గతానికి ఇప్పటికీ పోలికే లేదని సమర్ధించుకున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే వాదనలు చేశారు. కొందరు విశ్లేషకులు కూడా అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదనే వాదనలు ముందుకు తెచ్చారు. కాసేపు అది నిజమే అని అంగీకరిద్దాం. అదో తుత్తి అన్నట్లుగా ఉండటం తప్ప మనకు ఒరిగేదేమిటి ? గతంలో ఇతర కరెన్సీలతో కూడా పతనమైనందున మనకు జరిగిన భారీ ఆర్ధిక నష్టం ఎంతో, ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో విలువ పెరిగినందువలన వచ్చిన లాభం ఏమిటో బిజెపి పెద్దలు వివరిస్తే వారి వాదనల డొల్లతనం వెల్లడవుతుంది. ఇప్పుడు అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నందున మనకు వస్తువులను అమ్మేవారు డాలర్లను తప్ప మరొక కరెన్సీ తీసుకోరు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ? దీనికి కూడా కాంగ్రెస్‌, నెహ్రూ పాలనే కారణమంటారా ?


మా నరేంద్రమోడీ విశ్వగురు పీఠం ఎక్కారు , అందునా పుతిన్‌ -జెలెనెస్కీ మధ్య రాజీకోసం కేంద్రీకరించారు . రూపాయి పతనం గురించి చూసుకోమని నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు గనుక దీన్ని పట్టించుకోలేదు గానీ, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగిసిన తరువాత రూపాయి విలువ పెంచటం చిటికెలో పని అని మోడీ మద్దతుదారులు అంటే అనవచ్చు. కాసేపు వారిని సంతుష్టీకరించేందుకు నిజమే అనుకుందాం. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ స్థానిక వస్తువులనే కొనాలని నినాదమిచ్చిన మోడీ గారు మిగతా దేశాల కరెన్సీలు ఏ గంగలో కలిస్తే మన కెందుకు ముందు లోకల్‌ రూపాయిని రక్షించాలి కదా అని ఎవరైనా అంటే ఉడుక్కోకూడదు మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆందోళన కలిగిస్తున్న ఆర్ధిక రంగం – జాడలేని మోడినోమిక్స్‌, పారని మంత్ర దండం !

07 Friday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, India Economic worries, India GDP, Manmohan Singh, Manmohanomics, modinomics, Narendra Modi Failures, RSS, Rupee Fall, UNCTAD, World Bank


ఎం కోటేశ్వరరావు


మన దేశ ఆర్ధిక పురోగతి గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న జోశ్యాలు గందర గోళం, ఆందోళన కలిగిస్తున్నాయి. మన్మోహానోమిక్స్‌ నుంచి మోడినోమిక్స్‌కు దేశం మారిందని గతంలో అనేక మంది చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. మోడినోమిక్స్‌ అంటే నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలో అమలు చేస్తున్న ఆర్ధిక విధానం. అనేక మంది పండితులు 2014 నుంచి అమలు జరుగుతున్నది మోడినోమిక్స్‌ అని తేల్చారు. పత్రికలు చదివే పాఠకులు, టీవీలు చూసే వీక్షకులు సంవత్సరం అంటే ఏదీ అని గందరగోళపడుతున్న అంశం మరొకటి. సంస్థలన్నీ ఒకే విధంగా చెప్పటం లేదు. కొన్ని కాలండర్‌(జనవరి నుంచి డిసెంబరు వరకు) మరికొన్ని ఆర్ధిక సంవత్సరం( ఒక ఏడాదిఏప్రిల్‌ నుంచి తదుపరి ఏడాది మార్చి వరకు) అని పేర్కొంటున్నాయి. ఒక విధంగా ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చుగానీ ”అసలు విషయం ”లో పెద్ద తేడా ఉండదు.


వర్తమానానికి వస్తే ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి కార్పొరేషన్‌(అంక్టాడ్‌) తాజాగా ప్రకటించినదాని ప్రకారం మన దేశ వృద్ధి రేటు కాలండర్‌ సంవత్సరం 2022లో 5.7శాతం, 2023లో4.7 ఉంటుందని ప్రకటించింది. ఆ తరువాత ప్రపంచబాంకు ఆర్ధిక సంవత్సరం 2023(2022-23)లో వృద్ధి రేటు 6.5శాతంఉంటుందని ప్రకటించింది. ఏ సంస్థ చెప్పినా వృద్ధి రేటు ఎంత అంటే సవరించిన ప్రతిసారీ తగ్గించి చెప్పటం తప్ప స్థిరత్వం కనిపించటం లేదు, ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం.అక్టోబరు ఏడవ తేదీన రూపాయి విలువ రు.82.63కు దిగజారి మరో కొత్త రికార్డు నెలకొల్పింది.


2022 ఆగస్టు ఒకటిన లోక్‌సభకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021-22లో వాస్తవ జిడిపి వృద్ది రేటు 8.7శాతమని, కరోనాకు ముందున్న అర్ధిక స్థితికి పూర్తిగా దేశం కోలుకున్నదని, 2019-20 వాస్తవ జిడిపి వృద్ది కంటే 1.5శాతం ఎక్కువని పేర్కొన్నారు. ఇక్కడే ఒక తిరకాసుంది.కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 29న ప్రకటించిన వివరాల ప్రకారం 2019-20 జిడిపి గురించి తొలుత వేసిన అంచనాలన్నింటినీ సవరించి చివరకు వృద్ధి రేటు నాలుగు శాతమని ఖరారు చేశారు. అది కూడా కొత్త సంవత్సరంలో పది నెలల తరువాత అని గమనించాలి. దీని ప్రకారం ఒకటిన్నర శాతం ఎక్కువ అంటే 5.5 కానీ పార్లమెంటుకు 8.7 శాతమని ఎలా చెప్పారు. అంటే ఇది అంచనా మాత్రమే. దీన్ని కచ్చితంగా సవరిస్తారు. 2020-21లో 6.6శాతం తిరోగమనంలో( మైనస్‌) ఉన్నట్లు ప్రభుత్వం ఖరారు చేసింది.


దేశాన్ని సాధారణ పరిస్థితికి తిరిగి తీసుకు వచ్చామని చెబుతున్నారు. కనుకనే జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి దేశాన్ని పైకి లాగామన్నారు. అంతకంటే కావాల్సిందేముంది. మనం దిగుమతి చేసుకొనే లేదా ఎగుమతి చేసే వస్తువులకు సరఫరా వ్యవస్థల అంతరాయాల్లేవు. గాల్వన్‌ ఉదంతాల పేరుతో కాషాయ దళాలు తాట తీస్తాం,తోలు వలుస్తా అన్న పవర్‌స్టార్‌ మాదిరి ఎంతగా రెచ్చగొట్టినా చైనా మనకు వస్తువులను విక్రయిస్తూనే ఉంది. చైనాతో గత రికార్డులను బద్దలు కొట్టి నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులు చేసుకున్నట్లు తిరుగులేని ఆధారాలుగా అంకెలున్నాయి. రష్యా నుంచి రికార్డులు సృష్టిస్తూ తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నాము. మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు జనానికి కొనుగోలు శక్తిని పెంచిన కారణంగానే పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నట్లు పాలకపార్టీ పెద్దలు వర్ణిస్తున్నారు. కాసేపు అంగీకరిద్దాం ! ఉత్పాదకతతో ముడి పేరుతో ప్రభుత్వం వేల కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? లేక అదంతా అమిత్‌ షా మార్కు జుమ్లానా ! కార్పొరేట్‌లకు పన్ను తగ్గింపు, ఇతర నజరానాల వలన ఖజానాకు కచ్చితంగా రాబడి తగ్గుతుంది. దాన్ని పూడ్చుకొనేందుకు కొన్ని వస్తువుల మీద జిఎస్‌టి పెంచుతున్నారు. ఇక అప్పుల సంగతి సరేసరి. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల ఏలుబడి చివరిలో రు.55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2022 నాటికి 136లక్షల కోట్లకు పెంచారు. 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ఇదంతా అభివృద్ది కోసమే అంటున్నారు, ఇంత చేస్తున్నా వృద్ధి రేటు ఎందుకు తగ్గుతున్నట్లు ? అడిగినా సమాధానం చెప్పేదెవరు ?వివిధ సూచికల్లో ఎక్కడో వెనుక లేదా దిగజారటం తప్ప మెరుగుపడింది లేదు.


నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు కొందరు పండితులు మోడినోమిక్స్‌ అంటూ కొత్త అర్ధాలు చెప్పేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2004 నుంచి 2020 వరకు దేశ వార్షిక జిడిపి వృద్ధిరేటు 6.8 శాతం ఉంది. మంత్రదండం ఉందని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో 2014 నుంచి 2020వరకు వార్షిక సగటు కూడా 6.8శాతమే ఉంది. మన్మోహన్‌ ఏలుబడి సగటు కూడా అంతే. మోడీ పాలన పది సంవత్సరాల సగటు తగ్గటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఇక గృహస్తులు చేసిన ఖర్చును చూస్తే 2004-14 మధ్య జిడిపిలో 10.56శాతం ఉండగా, 2014-20లో 10.61 శాతం ఉంది. ప్రభుత్వ ఖర్చును చూస్తే ఈ కాలంలో 56.54-59.23 శాతాలుగా ఉంది. ఇక చేసిన అప్పులను చూస్తే మాక్రో ట్రెండ్స్‌.నెట్‌ సమాచారం ప్రకారం దేశం వెలిగిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల బరిలో దిగిన వాజ్‌పాయి ఏలుబడిలో 1998లో జిడిపిలో 50.32 శాతంగా ఉన్న అప్పు 2004 నాటికి 62.59శాతానికి పెరిగింది. అది తరువాత మన్మోహన్‌ సింగ్‌ కాలంలో 2013 నాటికి 50.31 శాతానికి తగ్గింది. స్టాటిస్టా సంస్థ సమాచారం మేరకు 2017లో 69.68 శాతం ఉన్న అప్పు 2020లో 90.06 శాతానికి పెరిగింది.2021 నుంచి 2027 వరకు 86.76 నుంచి 84.18 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. గతంలో రిజర్వు బాంకు పేర్కొన్న ప్రకారం మన పరిస్థితుల్లో దేశ అప్పు జిడిపిలో 61శాతం లోపుగా ఉండాలని పేర్కొన్నది. అప్పులను తగ్గించిన మన్మోహన్‌ కాలంలో, విపరీతంగా పెంచిన మోడీ ఏలుబడిలోనూ సగటు వృద్ధి రేటు ఒకే విధంగా ఉంది.అభివృద్ది కోసమే అప్పులైతే తెచ్చిన అప్పులకు అనుగుణ్యంగా ఖర్చు పెరగలేదు.తేడా ఏమిటంటే మన్మోహనామిక్స్‌ పదేండ్ల కాలంలో మూడు సార్లు అంతకు ముందు సంవత్సరాల కంటే వృద్ధి రేటు తగ్గితే మోడినోమిక్స్‌లో ఏడు సంవత్సరాల్లోనే నాలుగేండ్లు తిరోగమనంలో పడింది. ఎందుకిలా ?


ఇదేమీ సమాధానం లేని అపూర్వ చింతామణి లేదా నువ్వు ఎవరు ప్రశ్న కాదు. జిడిపి ఖర్చులో ఫిక్స్‌డ్‌ గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌ అంటే సులభంగా చెప్పుకోవాలంటే పెట్టుబడి 2004-14 సంవత్సరాల్లో 33.38 శాతం ఉండగా అది అచ్చేదిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ధిని తెచ్చినట్లు చెప్పుకుంటున్న 2014-2020 మధ్య (కరోనాకు ముందే సుమా) 28.88 శాతానికి పడిపోయింది. పిండి కొద్దీ రొట్టె, పెట్టుబడి కొద్దీ వృద్ధి, కబుర్లతో కడుపునిండదు. వివిధ సంస్థలు మన జిడిపి గురించి వేసిన అంచనాలు- సవరించటంలో అంత తేడా ఎందుకు ఉంటోంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా నరేంద్రమోడీ దగ్గర మంత్ర దండం ఉందని అవి కూడా నమ్మినట్లా ? అంచనాలే గనుక పిసినారి తనం ఎందుకు మోడీని సంతోష పెడదామని అనుకున్నట్లా ? వివిధ సంస్థలు గతంలో వేసిన, తాజాగా సవరించిన అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంస్థ పేరు ×××× గతంలో చెప్పినది×× తాజా అంచనా
ప్రపంచ బాంకు ×× 8.7 ××× 6.5
ఎస్‌ అండ్‌ పి ×××× 00. ××× 7.3
ఫిచ్‌ రేటింగ్స్‌ ×××× 7.8 ××× 7.0
ఇండియా రేటింగ్స్‌×× 7.0 ××× 6.9
ఓయిసిడి ×××× 00 ××× 7.0
అంక్టాడ్‌ ×××× 00 ××× 5.7
ఏడిబి ×××× 7.5 ××× 7.0
ఐఎంఎఫ్‌ ×××× 8.2 ××× 7.4
నొమురా ×××× 5.4 ××× 4.7
ఫిక్కి ×××× 7.4 ××× 7.0
ఎస్‌బిఐ ×××× 7.5 ××× 6.8
క్రిసిల్‌ ×××× 7.8 ××× 7.3
ఆర్‌బిఐ ×××× 7.2 ××× 7.0
ప్రపంచ ఆర్ధిక పురోగతి మందగించటం, దేశంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుదల వలన మన ఎగుమతులకు, ఇతరంగా దెబ్బ అని అందరూ చెబుతుంటే ఆ పరిస్థితి మన దేశానికి సానుకూలమని, ముడి చమురు,ఇతర వస్తువుల ధరలు, పారిశ్రామిక లోహాలు, ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వృద్ది రేటు 7.2-7.4 శాతం మధ్య ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పారు. అంకెలతో జనంలో గందరగోళం, ఆందోళనకరంగా పరిణామాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

5జి వశీకరణ మంత్రం : మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ, జోడీగా కార్పొరేట్‌ మహా మాంత్రికుడు ముకేష్‌ అంబానీ !

04 Tuesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, GDP growth, India GDP, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ముందుగా పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్‌ గురించి చెప్పాలి. సార్‌ మన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ గల్లీలో కూర్చుని అదేదో ఐరోపా దేశమంట అక్కడి కారు నడిపిండట నిజమేనా అని ఒకతను అడిగాడు. నిజమే అన్నాను. మా పక్కింటి పిల్లోడు ఆఫీసుకు పోకుండా ఇంటి నుంచే పని చేస్తే కంపినోళ్లు నెలాఖరుకు బాంకులో పైసలేస్తున్నరు. నేను కూడా అదే చేస్త అన్నాడు. ఇంతకూ నువ్వేం చేస్తావని అడిగా , ఓలా కాబ్‌ డ్రైవర్‌ను సార్‌ అన్నాడు. అలాగా , నువ్కొక్కడివే ఏమిటి మీ ఇంటిలో అందరి పేరా తలా ఒక కారు కొని అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, బిర్యానీ తింటూ, టీ తాగుతూ మజా చేసుకుంటూ కార్లు నడుపుతూ మస్తుగా సంపాదించుకోవచ్చు అని చెప్పా. ఏంది సార్‌ మజాక్‌ చేస్తున్నరా అని అనుమానంగా అడిగాడు.మజాక్‌ చేసేందుకు, మభ్య పెట్టేందుకు నేనేమన్నా నరేంద్రమోడీ, కెసిఆర్‌,జగనన్న, చంద్రబాబు అనుకుంటున్నవా ఏమిటి, నిజమే చెబుతున్నా అన్నా. ఏం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేసిండో బాలన్స్‌ లేక అదే ఆగిందో తెలియదు గానీ, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయా !


మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహాభారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్ధాలను ఎలా సృష్టించారో మాయాబజార్‌ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపునింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్‌ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్‌ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే ! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ సదరు డ్రైవర్‌ అడిగినట్లు అక్కడి నుంచి ఐరోపాలోని ఒక దేశంలో కారు నడిపినట్లు అందరూ చూశారు. ఏదో ఒక పెద్ద బొమ్మకారు ముందు చక్రాలు కదులుతున్నట్లు నాకుమాత్రమే కనిపించిందా, అందరికీనా అన్న సందేహం, అడిగితే ఏమనుకుంటారో అన్న సంకోచం. తీర్చితే దేశానికి వచ్చే లాభం సంగతి తెలీదు, తీర్చకపోతే నాకు ఎలాంటి నష్టమూ ఉండదు.


ఇంతకూ మన ప్రధాని మోడీ చెప్పిందేమిటి ? 5జి(ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ది, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారధిగా దేశం ఉంటుంది.(2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్‌ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41రాంకులు పెంచుకుంటే పాకిస్తాన్‌ 44 పెంచుకుంది.అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారధి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి) 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేండ్ల క్రితం ఒక జిబి(సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రు.300 ఉంటే, ఇప్పుడు రు.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జిబిలు వాడుతున్నారు. అంటే నెలకు రు.4,200 గా ఉండేది రు.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేసింది. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ ( పేటిఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్దిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు ఇది భారత శతాబ్దం.నాల్గవతరం పారిశ్రామిక విప్లవానికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మనిర్భర్‌ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి.


బహుశా నరేంద్రమోడీ గారు గంగిరెద్దుల వారిని చూసి ఉండరు. ఆ ఎద్దుల మొహాల మీద కూడా యుపిఐ అట్టలను వేలాడదీస్తున్నారు. ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి,కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిన్నరేండ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్చేదిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం ,అలాంటిది మోడీ ఏలుబడిలోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు ? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా ? ఇక పెంచిన చమురు పన్నులు, గాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?


ఇక అరవై ఐదేండ్ల ముకేష్‌ అంబానీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు ? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి తాలుకా కేంద్రం వరకు తమ 5జి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ 5జిలో ఎక్కువ భాగం భారత్‌లోనే రూపొందినందున దీన్ని ఆత్మనిర్భర్‌ ముద్రతో ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.


ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా ? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే ,ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు ? ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్‌ ఫోను, పరిజ్ఞానం వచ్చింది.1979లో నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ మరియు టెలిఫోన్‌ కంపెనీ జపాన్‌లో ఒకటవ తరం సెల్‌ఫోన్‌ను టోకియో నగరంలో ప్రవేశపెట్టింది.1984 నాటికి దేశమంతటికీ విస్తరించింది.1983లో అమెరికా, తరువాత కెనడాలకు వచ్చింది.1991లో ఫిన్లండ్‌ 2జిని, 2001లో జపాన్‌ 3జి, నార్వే 2009 చివరిలో 4జి, 2019లో దక్షిణ కొరియా 5జిని ప్రవేశపెట్టింది. 1995 జూలై 21న మన దేశంలో తొలి సెల్‌ఫోన్‌తో పశ్చిమ బెంగాల్‌ సిఎం జ్యోతిబాసు నాటి టెలికాం మంత్రి సుఖరామ్‌తో మాట్లాడారు. అది మూడవ తరం ఫోను. తరువాత 2012లో అదే కొల్‌కతాలో 4జి ఫోన్లను ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ 5జిని ప్రారంభించారు.


మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి.2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు.2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్లడాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.


2010లో అమెరికాలో 4జిని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దాని జిడిపి వృద్ధి రేటు 2.71 శాతం, ఆ ఏడాదితో సహా 2021నాటికి పన్నెండు సంవత్సరాల సగటు వృద్ధి రేటు 2.06శాతం. అందువలన జిడిపి వృద్ధి రేటుకు 4జి తోడ్పడినట్లా అడ్డుపడినట్లా ? అక్కడి 4జి వేగానికి మన దేశంలో 4జి వేగానికి ఎక్కడైనా పొంతన ఉందా ? సమాచార విశ్లేషణ, దాన్ని బట్టి ఉత్పత్తులు, మార్కెటింగ్‌ ఎత్తుగడల వంటివాటితో కంపెనీల లాభాలను పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మనుషులు తప్ప కార్పొరేట్స్‌ కాదు కదా ! 5జి, తరువాత వచ్చే ప్రతితరం కూడా చేసేది అదే.


5జి వస్తే జరిగేదేమిటి ? నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్‌ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్ధిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పధకాలకు సంబంధించి రు. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రు 1.1లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21లక్షల కామన్‌ సర్వీసు సెంటర్స్‌(సిఎస్‌సి) ద్వారా పదిలక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పధకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరులక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్‌ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018నాటికే సిమ్మీ చెప్పినట్లు 22లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి ? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది ?


జిఎస్‌ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్ధిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455బిలియన్‌ డాలర్ల లబ్ది ఉంటుంది. ముకేష్‌ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40లక్షల కోట్లడాలర్లని చెప్పారు తప్ప ఏ పద్దతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్‌ పద్దతిలో ఆ నాటికి 30లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్దతిలో 40లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు, అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్‌ అంచనాను తీసుకొని పిపిపి పద్దతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు. కనుక దీన్ని అంగీకరించాలా ? 2021 జూన్‌ 21న ప్రకటించిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం మన నామినల్‌ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్దతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011నవంబరు 12 ఎకనమిక్‌ టైమ్స్‌లో మిన్హాజ్‌ మర్చంట్‌ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్దతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. మరి దీన్ని తిరస్కరించాలా, అంబానీ అంచనాను అంగీకరించాలా? ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఇక ఫోన్‌ చేసిన కాబ్‌ డ్రైవర్‌కు నేను చెప్పదలచుకున్నదేమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి కాబ్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఓలా కంపెనీ నీకు ఎందుకు ఇస్తుంది. కార్లు కొని తక్కువ ఖర్చుతో ఇతరులతో అదే ఆపని చేస్తది, కలలు కనొద్దు బాబూ అని ! కలలు కనేందుకు, అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకని పెద్దలు మందలిస్తారు. మాయ మహామాయ లోకంలో ఉన్నాం ! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్రమోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్‌ అంబానీ కార్పొరేట్‌ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడి కుదిరిందని ఎనిమిదేండ్ల అనుభవం చెబుతోంది మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒక చంకలో భారత్‌ మరొక చంకలో పాకిస్తాన్‌ అంటున్న అమెరికా ! ఎవరి సంతుష్టీకరణకు జైశంకర్‌ విమర్శలు !!

02 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, S Jaishankar, US- Pakistan F-16s deal


ఎం కోటేశ్వరరావు


ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గాను పాకిస్తాన్‌ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ద విమానాలను మెరుగుపరుస్తున్నట్లు అమెరికా చెబితే నమ్మేంత వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. అది నిజమే ! అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 25 ఆదివారం నాడు వాషింగ్టన్‌ నగరంలో భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గౌతముడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమై బుద్ధుడిగా మారినట్లు చెప్పే అంశం తెలిసిందే. అమెరికా గురించి జైశంకర్‌ లేదా మన పాలకులకు ఎప్పుడు, ఎలా జ్ఞానోదయమైందో తెలుసుకొనే హక్కు దేశపౌరులందరికీ ఉంది. నిజంగా బుద్ది వికసించిందా లేక ప్రశ్నించేవారిని, అమెరికా వైఖరిని బహిరంగంగా సమర్ధించలేని కాషాయ దళాలను సంతుష్టీకరించేందుకు,ప్రచార అవసరార్ధం అలా మాట్లాడారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆ మరుసటి రోజే అదే అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలసి ఉమ్మడిగా విలేకర్ల సమావేశంలో భద్రతా అంశాలకు సంబంధించి అమెరికా ఎంతగానో అంతర్జాతీయ వైఖరితో వ్యవహరిస్తోందని అదే నోటితో జై శంకర్‌ ప్రశంసలు కురిపించటం ఎవరిని వెంగళప్పలను గావించేందుకు ?


అమెరికా-ఇరాన్‌ మధ్య తలెత్తిన వివాదంలో మన మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేయవద్దని బెదిరిస్తే అమెరికాను సంతుష్టీకరించేందుకు చిత్తం అని నిలిపివేసిన మన పాలకుల ధైర్య, సాహసాలు తెలిసినవే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి మన దేశంలో ఉన్న తిబలాజీ పెట్రోకెమ్‌ అనే పెట్రోకెమికల్‌ కంపెనీ లావాదేవీల మీద అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది.ఈ కంపెనీ వివిధ దేశాలతో ఉన్న కంపెనీలతో సమన్వయం చేసుకొని ఇరాన్‌ చమురు, ఇతర ఉత్పత్తులతో లావాదేవీలు నిర్వహిస్తున్నది.ఇరాన్‌ నుంచి పెట్రోకెమికల్స్‌ను తెచ్చి వాటిని ట్రిలియన్స్‌ అనే మరో కంపెనీ ద్వారా చైనాకు సరఫరా చేస్తున్న కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అసలు ఇరాన్‌ మీద ఏకపక్ష ఆంక్షలు విధించటమే తప్పు, వాటికి ఐరాస ఆమోదం లేదు. భాగస్వామ్యం, స్నేహం పేరుతో అమెరికా పాటలకు నృత్యం చేసేందుకు మనం అంగీకరించి ఇరాన్నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాము. ఇప్పుడు దాని కొనసాగింపుగా అది మన దేశంలోని కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఎవరో మనల్ని అదుపు చేయటం ఏమిటి, డామిట్‌ ! మనమే అందరినీ అదుపుచేసే స్థితిలో ఉన్నామని చెప్పుకొనే గిరీశాలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇలా అమెరికా ఆంక్షలకు తలొగ్గితే విదేశాల నుంచి మన దగ్గరకు రావాలనుకొంటున్న కంపెనీలు వస్తాయా ? దేశంలో ఉన్న కంపెనీలు అమెరికా గీచిన గీతల్లోనే నడిచేందుకు పెట్టుబడులు పెడతాయా ?


ఇక మంత్రి జైశంకర్‌ విమర్శలకు సంబంధించిన అంశాన్ని చూద్దాం. నలభై ఐదు కోట్ల డాలర్ల విలువ గల ఎఫ్‌-16 విమానాలకు అవసరమైన మెరుగుదల, పరికరాలకు సంబంధించి అమెరికా-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్‌ సభలో దీనికి సంబంధించిన ప్రశ్నకు జైశంకర్‌ బదులిస్తూ చివరకు ఒకరోజు ఎవరైనా వచ్చి ఉగ్రవాద నిరోధం కోసమే ఇదంతా అని చెబుతారు, మీరు చెబుతున్నది ఎఫ్‌-16 విమానం గురించి కనుక, వాటిని ఎక్కడ మోహరిస్తారో, వాటి ఉపయోగం, సామర్ధ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి మాటలు చెప్పటం ద్వారా మీరు(అమెరికా) ఎవరినీ వెంగళప్పలను చేయలేరు.” అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ పూర్వపు సోవియట్‌ తరువాత రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా 1965 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మన దేశానికి అమెరికా ఎలాంటి మిలిటరీ పరికరాలను విక్రయించలేదని, దీనికి రెండు వైపుల నుంచి కారణాలున్నాయని, అణుఒప్పందంతో ఈ పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు మనం అనేక అమెరికా విమానాలు, హెలికాప్టర్లను వాడుతున్నామని, రెండు దేశాల సంబంధాలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.


భారత్‌ – పాక్‌లతో సంబంధాల అంశంలో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని, దేనికదేనంటూ రెండు దేశాలూ తమకు కావలసినవే అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పాడు. రెండింటితో అవసరాలు వేర్వేరన్నాడు. తమ గడ్డ మీద ఉగ్రవాద నిరోధానికి కృషి చేయటం లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో పాకిస్తాన్‌కు సాయం నిలిపినట్లు ప్రకటించిన తరువాత ఇప్పుడు ఉగ్రవాద నిరోధానికి అనే సాకుతో బైడెన్‌ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు ఏమిటో చెప్పటం లేదు. తాము ఇప్పుడు చేస్తున్న సాయంతో ఇప్పటికే పాక్‌ వద్ద ఎనభైకి పైగా ఉన్న ఎఫ్‌-16 విమానాలు లేదా వాటి ఆయుధ సామర్ధ్యం పెంచటం లేదని మనలను నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. ఇవి యుద్ధాలకు తప్ప ఉగ్రవాదుల నిరోధానికి పనికి వచ్చేవి కాదు. 2019లో బాలకోట్‌ దాడుల తరువాత పాకిస్తాన్‌ వాటిని మన దేశం మీద మోహరించింది. ఒక విమానాన్ని మన దళం కూల్చివేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విమానాల ద్వారా మాత్రమే సంధించే ఆధునిక క్షిపణి శకలాలను తరువాత మన మిలిటరీ ప్రదర్శించింది.


ఈ ఉదంతాల తరువాత ఈ ఏడాది జరిగిన ఒక సంఘటనకు తాజా ఒప్పందానికి సంబంధం ఉందా అన్నదాన్ని కూడా చూడాల్సి ఉంది.2022 మార్చి 9న మన దేశం రష్యా భాగస్వామ్యంతో రూపొందించిన బ్రహ్మౌస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని వదిలింది. అది నలభైవేల అడుగుల ఎత్తులో 124 కిలోమీటర్లు వెళ్లి పాకిస్తాన్‌లోని చన్ను అనే పట్ణణ సమీపంలో పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాని గురించి పాకిస్తాన్‌ వెల్లడించిన తరువాతనే మన దేశం స్పందించి సాంకేతిక లోపంతో వచ్చి మీ గడ్డమీద పడిందని చెప్పింది.తరువాత మరొక ప్రకటనలో మానవ తప్పిదమని పేర్కొన్నది. ఆరునెలల తరువాత ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దీన్ని అంగీకరించని పాకిస్తాన్‌ ఈ ఉదంతం మీద ఉమ్మడి విచారణ జరపాలని ఇది అనధికారికంగా వదిలినదా నిజంగా తప్పిదమా అన్నది తేల్చాలని కోరుతోంది.


అమెరికా తన వ్యూహంలో మన దేశాన్ని ఇరికించేందుకు 1947 నుంచి చూస్తున్నది. చైనాను దెబ్బతీసేందుకు బలమైన సాధనంగా మన దేశం, పశ్చిమాసియాలో తన ఎత్తుగడల అమలుకు పాకిస్తాన్‌ పనికి వస్తుందన్నది దాని అంచనా. అందుకోసం రెండు దేశాలనూ చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు చూసింది. ఇప్పుడు కూడా వేర్వేరు అంశాలతో అవసరం ఉందని చెప్పటం దానిలో భాగమే. పాక్‌ భుజం మీద తుపాకి పెట్టి మనలను లొంగదీసుకోవాలని చూసింది. కాశ్మీరు ఆక్రమణకు పాక్‌ను ప్రోత్సహించటం, తరువాత ఉగ్రవాదులను మన మీదకు వదలటం, కాశ్మీరులో చిచ్చు ఇవన్నీ దానిలో భాగమే. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా పధకాలకు పాకిస్తాన్‌ ప్రధాన సాధనంగా తాలిబాన్ల సృష్టి, శిక్షణకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. మన పాలకవర్గం తనకు ప్రయోజనం కలిగించే విదేశీ, స్వదేశీ విధానాలకే ప్రాధాన్యత ఇవ్వటం, స్వంతంగా తాము కూడా ఎదిగేందుకు సోవియట్‌తో సంబంధాలే మెరుగు అని భావించిన కారణంగానే అది ఉనికిలో ఉన్నంత వరకు అమెరికాకు అవకాశం దొరకలేదు. దాని పతనం తరువాత అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉంటూ లబ్ది పొందవచ్చని భావించటం, మరొక మార్గం లేకపోవటంతో ఆవైపు మొగ్గింది. ఎప్పుడైతే ఇది జరిగిందో తనకు కావాల్సిన భారత్‌ దొరికిన తరువాత పాకిస్తాన్‌తో సంబంధాలను కొనసాగిస్తూనే మన దేశంలో ఉన్న పాక్‌ వ్యతిరేకతను గమనంలో ఉంచుకొని తన ఎత్తుగడలను మార్చుకుంది. మనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నమ్మించేందుకు చూసింది.

ఎప్పుడైతే మనతో సంబంధాలను బలపరచుకుంటున్నదో ప్రచ్చన్న యుద్దసమయంలో మన పాలకవర్గం అనుసరించిన ఎత్తుగడను తరువాత పాక్‌ అనుసరిస్తున్నది. అమెరికాను వ్యతిరేకించే చైనాకు దగ్గర కావటం దానిలో భాగమే. చైనాకు పాకిస్తాన్‌ అవసరం ఉంది కనుక వచ్చిన అవకావశాన్ని అది అందిపుచ్చుకుంది. ఇది కొత్త పరిణామాలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు తన అవసరాలకు భారత్‌ – పాకిస్తాన్‌ రెండూ అవసరమే గనుక, మన దేశం తమ బంధం నుంచి తప్పుకొనే అవకాశాలు లేకుండా బిగింపు పూర్తైనట్లు భావిస్తున్న కారణంగా, అంతర్జాతీయ అవసరాల రీత్యా అమెరికా ఇప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి తన సాయాన్ని అందిస్తున్నది. నిజానికి దాన్ని ఎన్నడూ వదలిపెట్టలేదు. 1970దశకంలో చైనాతో సంబంధాలు పెట్టుకొనేందుకు అమెరికన్లు పాకిస్తాన్‌ ద్వారానే కథ నడిపించారన్నది తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ను పటిష్టపరచటాన్ని ఎలా చూడాలి. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థం పేరుతో తమ కూటమిలో చేరనందుకు గుర్రుగా ఉన్న అమెరికా దాన్నే గనుక కొనసాగిస్తే మీ ఇష్టం అని పరోక్షంగా హెచ్చరించటం కూడా కావచ్చు. నరేంద్రమోడీ దాన్ని తట్టుకొని నిలబడగలరా ? ఇది మన దేశం మీద మాత్రమే వత్తిడి అనుకుంటే పొరపాటు, పాకిస్తాన్‌పై చైనా ప్రభావం పెరగకుండా చూసుకోవటం కూడా దీని వెనుక దాగి ఉంది.అమెరికా తన ప్రయోజనాలకే ఎల్లవేళలా పెద్ద పీటవేస్తుంది అని మరచిపోరాదు. ముందే చెప్పినట్లు అటు అమెరికా ఇటు చైనా మద్దతు, సాయం పొందేందుకు పాక్‌ పాలకవర్గం చూస్తున్నది.
ఎఫ్‌-16 విమానాలను ఉగ్రవాద నిరోధం కోసం అని అమెరికా ఎందుకు చెబుతున్నది ? టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాల్లో ఉన్న కర్దులు తాము నివసించే ప్రాంతాలతో కర్దిస్తాన్‌ ఏర్పాటు కోరుతూ దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నారు. వారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచేందుకు టర్కీ ఎఫ్‌ -16 యుద్ధ విమానాలతో వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదులపై దాడులకు వాటిని మోహరించలేదు. పాకిస్తాన్‌కు చేస్తున్న సాయాన్ని సమర్ధించుకొనేందుకు చెబుతున్నసాకు తప్ప మరొకటి కాదు. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను అణచేపేరుతో తిష్టవేసిన అమెరికా వాటిని వినియోగించిన దాఖల్లాలేవు. అమెరికా మనకు ఎఫ్‌ – 16 విమానాలు అమ్మితే పాక్‌ వైపు నుంచి కూడా జై శంకర్‌ మాదిరి స్పందనే వస్తుంది. మనం కూడా ఉగ్రవాదుల అణచివేతకే అని చెప్పగలమా ?


మన పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా సాయం చేస్తుంటే మౌనంగా ఎందుకు ఉన్నారనే ప్రశ్న సహజంగానే తన మద్దతుదార్ల నుంచే నరేంద్రమోడీ సర్కార్‌కు ఎదురౌతుంది. పాకిస్తాన్‌ మీద విద్వేష ప్రచారంలో తలమునకలైన కాషాయదళాలు ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.బహుశా వారి కోసం జైశంకర్‌ గట్టిగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఎవరి అవసరం వారిది. అమెరికా మనకు మరింత దగ్గర అవుతుందని చంకలు కొట్టుకొనే వారి గాలి తీస్తూ అమెరికా ప్రతినిధి మాత్రం రెండు దేశాలు తమకు సమానమనే చెప్పారు తప్ప మనవైపు మొగ్గుచూపలేదు. గతంలో మనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భావించిన పాకిస్తాన్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేందుకు ఎఫ్‌-16 విమానాల మెరుగుదలకు అంగీకరించటం, ఇద్దరూ సమానమే అని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా వెనుదిరిగినప్పటికీ అమెరికా దాన్ని పూర్తిగా వదులుకోదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అందుకు నిఘా సమాచారంతో సహా అన్ని రకాలుగా పాకిస్తాన్‌ అవసరం ఉంది. ఒసామా బిన్‌ లాడెన్‌ తరువాత ఆల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ నేతగా ఉన్న అల్‌ జవాహిరీని ఈ ఏడాది జూలై 31న ఆఫ్ఘనిస్తాన్‌లో డ్రోన్‌ ద్వారా అమెరికా మట్టుపెట్టింది. ఇది పాకిస్తాన్‌ సాయంతోనే జరిగిందని అందరూ నమ్ముతున్నారు.


అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఎలాంటి శషభిషలు లేకుండా సరళంగా సూటిగా చెప్పాడు. భారత్‌-పాకిస్తాన్లతో భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన ప్రయోజనాలున్నట్లు చెప్పటమంటే రెండు దేశాలను ఎక్కడ ఎలా అవసరమైతే అక్కడ అలా ఉపయోగించుకుంటామని చెప్పటమే. గతంలో పాకిస్తాన్‌ అలా ఉపయోగపడిన చరిత్ర ఉంది. మన దేశాన్నీ అదే బాటలో నడిపిస్తారా ? ఐరోపాలో హంగరీ నాటో సభ్య దేశం. ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఇతర ధనిక దేశాలు విధించిన ఆంక్షలను అది కూడా సమర్ధించింది. తీరా అవి తమ మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపించటంతో ఈ ఏడాది ఆఖరు నాటికి ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఐరోపా అడగాల్సిన తరుణం వచ్చిందని ఆ దేశ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ పార్లమెంటులో చెప్పాడు. అమెరికా చమురు కంపెనీలు ఈ యుద్ధంతో లాభాలు పొందుతున్నాయని విమర్శించాడు.రష్యాపై ఆంక్షలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు. మరోవైపున ఈ సంక్షోభం కారణంగా రష్యా నుంచి చౌక ధరలకు చమురును తెచ్చుకుంటున్న మన (దేశం) నరేంద్రమోడీ సామరకండ్‌ షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో ఇది యుద్దాల యుగం కాదంటూ పుతిన్‌కు చెప్పి అమెరికాను సంతుష్టీకరించేందుకు తెరతీశారు. ఆరునెలల్లో వారు వీరవుతారు అంటే ఇదేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నేత షీ జింపింగ్‌ నిర్బంధం వార్త : మీడియాను వెర్రి వెంగళప్పలను చేసిన ఫాలున్‌ గాంగ్‌ మహిళ !

28 Wednesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP, cia, Coup Attempt in China, fake stories in media, Falun Gong, Jennifer Zeng, Propaganda War, RSS Duplicity, saffron trolls lies- facts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనా నేత షీ జింపింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు, అధికారాలన్నీ లాగేసుకున్నారంటూ మన దేశంలోని కొన్ని మీడిియా సంస్థలు, సామాజిక మాధ్యమంలోని కాషాయ మరుగుజ్జులు (ట్రోల్స్‌), వారిని గుడ్డిగా నమ్మే వారు చేసిన ప్రచారం వామపక్ష శ్రేణుల్లో అనేక మందిని గందరగోళానికి గురిచేసింది. ఈ వార్తలను చూసి అనేక మంది కమ్యూనిస్టు అభిమానులు ఆందోళన చెందారు. చైనా వ్యతిరేకులైతే ఇంకే ముంది జింపింగ్‌ శకం ముగిసింది, చైనా పతనం మన దేశానికి శుభసూచకం అంటూ సంబరపడ్డారు.సామాజిక, సంప్రదాయ మీడియా సంస్థలలో ఉన్న అలాంటి వారంతా వండి, వార్చి, వడ్డించిన దాన్ని తిన్నవారు పండగ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఉత్తిదే అని తేలటంతో వారంతా మానసికంగా తీవ్రంగా గాయపడ్డారు. అసలీ వదంతి ఎలా పుట్టింది, మన దేశంలోని వారు వాటిని ఎందుకు భుజాన వేసుకున్నారు, వారి మానసిక స్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా ముందుకు వచ్చింది. వాట్సప్‌ పండితులు వండి వారుస్తున్న కుహనా వార్తలను ప్రధాన స్రవంతి మీడియా జనాలకు అందించటం ఒక ప్రధాన పరిణామంగా ఉన్నట్లు గత కొంత కాలంగా తెలుస్తున్నప్పటికీ ఈ ఉదంతం మరింతగా నిర్ధారించింది.


అసలే కోతి, దానికి పిచ్చి ఎక్కింది, దొరికిన కల్లుతాగింది,ఆపై నిప్పు తొక్కింది అన్న కథ తెలిసిందే. కొంత మందికి చైనా అంటే అసలే ద్వేషం, అందునా అక్కడి సోషలిస్టు వ్యవస్థ, కమ్యూనిస్టు పార్టీ అంటే పిచ్చి ఎక్కినట్లుంటుంది. గాల్వన్‌ ఉదంతంతో మానసికంగా చికిత్సలేని వ్యాధికి గురైన వారికి అధ్యక్షుడు షీ జింపింగ్‌ గృహ నిర్బంధం, పదవి నుంచి తొలగింపు వార్తలంటే స్టెరాయిడ్స్‌ వంటివి. ఇంకేముంది అలాంటి వారంతా రెచ్చిపో యారు. ఇంతకీ వారికి వాటిని ఇచ్చిందెవరో తెలుసా ? ఉల్లాసయువతుల( ఛీర్‌ గరల్స్‌ ) పెద్దక్క లేదా అమెరికా సిఐఏ ఒళ్లో కూర్చుని చెప్పమన్న కబుర్లు చెప్పే జెన్నిఫర్‌ జెంగ్‌ అనే మహిళ.ఆమె చైనాలో అసంతృప్తవాదిగా మారి అమెరికా చేరుకొని అక్కడి నుంచి పుంఖాను పుంఖాలుగా విషం చిమ్ముతోంది.ఆమెతో సహా అనేక మంది ఫాలున్‌ గాంగ్‌ (ధర్మ చక్రం ) పేరుతో ధ్యానంతో కొన్ని క్రీడలను ప్రచారం చేస్తున్నామనే పేరుతో తలెత్తిన కమ్యూనిస్టు వ్యతిరేక ముఠా. చైనా ప్రభుత్వం తొలుత వారిని ఉపేక్షించినప్పటికీ వారి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించిన తరువాత కత్తెర వేసింది. దాని నేతతో సహా అందరూ ఇప్పుడు అమెరికాలో కొలువుదీరారు. వారి చెత్తను ప్రచారం చేసేందుకు ఎపోచ్‌ టైమ్స్‌ అనే ఒక పత్రికను కూడా సిఐఏ ఏర్పాటు చేసింది. అదిగాక ఇతర పత్రికల్లో కూడా రాస్తుంటారు, స్వంతంగా దుకాణాలు కూడా తెరిచారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు సరేసరి. వారు సముద్రం ఉందన్న చోట ఎడారి తప్ప నీటి చుక్క కనిపించదు.


దేశభక్తి గురించి మన జనానికి ఎవరూ కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో తమ మాన ప్రాణాలను,సంపదలను తృణ ప్రాయంగా అర్పించిన వారు వేగుచుక్కలా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అలాంటి వారు ఒక వైపు ఉంటే అసలు ఉద్యమంతో ఎలాంటి సంబంధాలు లేని, బ్రిటీష్‌ వారికి లొంగి ప్రేమలేఖలు రాసి తెరవెనుక పడి ఉంటామని చెప్పిన వారి వారసులు ఇప్పుడు జనాలకు దేశభక్తి గురించి బోధలు చేస్తున్నారు. వారికైనా ఎవరికైనా దేశభక్తి గురించి చెప్పే అర్హత లేదని ఎవరూ అనటం లేదు. అసలైన దేశభక్తులం మేమే, మేము చెప్పేదే సిసలైన దేశభక్తి అంటున్నందునే కాదన్నవారిది దేశద్రోహం అన్న దగ్గరే సమస్య మొదలౌతున్నది. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి.చైనాతో సరిహద్దు వివాదానికి బ్రిటీష్‌ వారు కారకులు, కాశ్మీరు సమస్యకు అమెరికా,బ్రిటన్‌, వారికి మద్దతు ఇస్తున్నదేశాలు బాధ్యులు. వాటి పరిష్కారం కంటే ఆ దేశాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటాన్ని, వ్యతిరేకతను నూరిపోయటం, దాన్ని బుర్రల నిండా ఎక్కించుకోవటమే దేశభక్తి అని చెబుతున్నారు. తప్పన్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు.ఉచ్చగుంటల్లో చేపలు పట్టేవారి మాదిరి సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగితే ఆ పేరుతో ఓట్లు దండుకోవచ్చని చూస్తున్నారు. పరిష్కారానికి పూనుకోవటం లేదు.


పశ్చిమ దేశాల్లో కూడా జనాలను చైనా వ్యతిరేక వార్తలతో అలరించినప్పటికీ మన దేశంలో మాదిరి జనాల్లో విద్వేషాన్ని ఎక్కించలేదు. రెండవది గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లుగా ఫాలున్‌ గాంగ్‌ చెప్పే కబుర్ల బండారం ఏమిటో మనకంటే ఎక్కువగా వారికి తెలిసి ఉండటం కూడా షి జింపింగ్‌పై పుకార్ల గురించి సంయమనం పాటించటానికి కారణంగా కనిపిస్తున్నది. కాషాయ దళాలు ఒక పధకం ప్రకారం వివిధ సంస్థల్లోకి తమ భావజాలం ఉన్నవారిని పంపటమే గాక వాట్సాప్‌ ఉన్నవారి బుర్రలను చాలావరకు ఖరాబు చేశాయి. పిచ్చి మొక్కలు మొలిచేందుకు అనువైన వాతావరణం ఉంది గనుక షీ జింపింగ్‌ నిర్బంధం అనగానే దున్నఈనిందంటే దూడను కట్టివేయమన్నట్లుగా తాము అనుకుంటున్నదీ లేదా కోరుకుంటున్నది జరిగింది అనగానే వెనుకా ముందూ చూడకుండా ఎలాంటి నిర్ధారణలకు పూనుకోకుండా మీడియాలో ఉన్నవారు రెచ్చిపోయారు. తామే కాదు, తమ వార్తలను గుడ్డిగా నమ్మేవారిని కూడా వెర్రి వెంగళప్పలుగా మార్చివేశారు. ఇప్పటికే మీడియా సంస్థలు విశ్వసనీయత సమస్యలను ఎదుర్కొంటుండగా తాజా వార్తను పతాక శీర్షికలకు ఎక్కించి మరింత ప్రశ్నార్ధకంగా మార్చివేశారు,ప్రతిష్టను దిగజార్చారు.


ప్రపంచంలో కొందరు ప్రధానులు, అధ్యక్షుల మాదిరి కొత్త చొక్కాలు వేసుకొని ప్రతిరోజూ కెమెరాల ముందు చైనా నేతలు ఎప్పుడూ నిలవలేదు. ప్రతి రోజూ టీవీల్లో ఫోజులు కొట్టరు. షి జింపింగ్‌ కూడా అంతే. సామరకండ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చిన తరువాత కరోన జాగ్రత్తల్లో భాగంగా కొద్ది రోజులు కనిపించలేదు. అదే సమయంలో కొందరు ప్రముఖ మాజీల మీద చర్యలు తీసుకున్నట్లు వార్తలు రావటం.ఆరుగురు మాజీ మంత్రులు లేదా ఉన్నతాధికారుల అవినీతి రుజువు కావటంతో ఇటీవలనే వారికి శిక్షలు వేశారు.వారు తిరుగుబాటుకు పూనుకున్నారని చిత్రించారు. గత కొద్ది నెలలుగా జింపింగ్‌ మీద కుట్ర, ప్రత్యర్ధులు సవాలు చేస్తున్నారు, జీరో కరోనా పేరుతో లాక్‌డౌన్లు విధించి జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప దేశ ఆర్ధిక వృద్ధి పట్టలేదు వంటి అంశాలతో కుట్ర విశ్లేషణలను ఒక పధకం ప్రకారం రాస్తున్నవారు ఇప్పుడు చెబితే జనం కచ్చితంగా నమ్ముతారు అంటూ ఏకంగా జింపింగ్‌ను నిర్బంధించారని సృష్టించారు. చైనా గురించి రాసే నిపుణుడిగా పేరున్న మనోజ్‌ కేవల్‌రమణి ఈ తప్పుడు వార్త గురించి చెబుతూ ” భారత మీడియా దాన్ని అందిపుచ్చుకొని పరుగెత్తుతూ దాన్ని టాంటాం వేసింది. ఒక్క తూటా కూడా పేలకుండా ఇలాంటిది జరిగే అవకాశం ఉందని అనుకోవటం విడ్డూరంగా ఉంది. బీజింగ్‌ ఉత్తర కొరియా కాదు, అక్కడ విదేశీ విలేకర్లు జీవిస్తున్నారు. భారత్‌లో చైనా వ్యతిరేకత విశేషంగా ఉంది. అది లడఖ్‌లో రెండు దేశాలు ఘర్షణ పడక ముందునుంచీ ఉంది ” అన్నారు. ” భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ఈ పుకార్లపై స్పందన వారు కోరుకుంటున్నదానికి ప్రతిబింబం, షీ జింపింగ్‌ను అరెస్టు చేశారు అన్న పుకారు షికారు చేసేందుకు కారణం బీజింగ్‌లో సున్నితమైన రాజకీయ కదలికలు ఉండటమే ” అని సింగపూర్‌లోని చైనా అంశాల నిపుణుడు డ్రా థాంప్సన్‌ చెప్పాడు. ” చైనా రాజకీయాలు బ్లాక్‌బాక్స్‌(విమానాల్లో జరిగేవాటిని రికార్డు చేసే ఒక పరికరం. విమానం మొత్తం ధ్వంసమైనా అది చెక్కుచెదరదు. దాన్ని విప్పిచూస్తే జరిగిందేమిటో తెలుస్తుంది) కంటే కఠినంగా ఉంటాయి . సామాజిక మాధ్యమంలోని పుకార్లను ధృవీకరించేందుకు ఈ రోజు బీజింగ్‌లో ఎలాంటి óఆధారం దొరకలేదు ” అని హిందూ పత్రిక బీజింగ్‌ విలేకరి అనంత కృష్ణన్‌ పేర్కొన్నారు.

శుక్రవారం(23వ తేదీ) ప్రారంభమైన వదంతులు శనివారం నాటికి పతాకస్థాయికి చేరాయి. అమెరికాలో ఫాలున్‌ గాంగ్‌ పేరుతో తిష్టవేసిన చైనా అసంతృప్త జీవులు, సిఐఏ కిరాయి మనుషులు సృష్టించిన ఈ పుకారును వారు నడిపే ఎన్‌టిడిటివి అనే మీడియా వదిలింది, దాన్ని ట్విటర్‌, యు ట్యూబ్‌లో ఆ ముఠావారే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దాన్ని మన దేశంలోని సామాజిక మాధ్యమంలోని చైనా వ్యతిరేకులు మరింత పెద్దగా వ్యాపింప చేశారు.చైనాలో ఈ ఏడాది లాక్‌డౌన్లు లేనపుడు మార్చి నెలలో రోజుకు ఆరువేల విమానాలు ఎగిరేవి, లాకడవున్ల కారణంగా తగ్గాయి .అలాంటిది బీజింగ్‌ గగనతల మీద రోజుకు 16వేలు ఎగురుతాయని వాటిలో తొమ్మిదివేలను రద్దు చేశారని ప్రచారం జరిగింది.చైనా నుంచి పారిపోయి జర్నలిస్టుగా చెప్పుకొనే ఝావో లాంజియాన్‌ అనే వాడు విమానాల రద్దు ఈ కథను అల్లాడు. ఆ మేరకు ఉపగ్రహాల చిత్రాలంటూ కొన్నింటిని చూపారు. అదంతా వట్టిదే అని తరువాత కొందరు స్పష్టం చేశారు. శనివారం నాడు అమెరికాలో స్థిరపడిన చైనా మహిళ జెన్నిఫర్‌ జెంగ్‌ ట్వీట్‌ చేస్తూ బీజింగ్‌ వైపుకు కదులుతున్న 80కిలోమీటర్ల పొడవైన మిలిటరీ దళాల బారు అంటూ ఒక వీడియోను జత చేసింది. సంచలనం కోసం ఎదురు చూసే మీడియా దున్న ఈనిన దూడను మనకు చూపెట్టింది. మన దేశంలో జరిగిన ప్రచారాన్ని చూసి బీజింగ్‌లో ఉన్న డెర్‌ స్పీగల్‌ అనే జర్మన్‌ పత్రిక విలేకరి జార్జి ఫారియన్‌ ఒక సైకిల్‌ రిక్షాలో కూర్చున్న ఒక మహిళ, తియనన్‌మెన్‌ మైదానం దగ్గర ఉన్న కొందరు సందర్శకుల చిత్రాలను పోస్టు చేస్తూ వాటి కింద ” ఆశ సన్నగిల్లుతున్నది, కుట్రదారుల అదనపు బలాలు సాయుధశకటాల్లో వచ్చాయని ” అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్‌ను కొన్ని టీవీ ఛానళ్లు మరోరకంగా చెప్పాయి. చైనా మిలిటరీ రకరకాల వేషాల్లో రూపంలో ఉంటుందన్నాయి .

అధికారాలన్నీ లాగేసుకొని వేరేవారికి అప్పగించారంటూ వచ్చిన ఆధారం లేని వార్తలను సరి చూసుకోకుండా రెచ్చిపోయిన వారు అది అవాస్తవం అని తేలిన తరువాత ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కొందరు తేలుకుట్టిన దొంగల మాదిరి నోరు మూసుకుంటే, కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ఉత్తిదే అని ప్రశ్నార్ధకమిచ్చిన వారు కొందరు. సిద్దాంతం పట్ల స్థిరత్వం లేని వారు, అవినీతి అక్రమాల పట్ల చూసీ చూడనట్లు ఉన్నవారు, ప్రధాన అంశాల మీద స్పష్టత లేని వారిని అక్టోబరు 16 నుంచి జరగనున్న కమ్యూనిస్టు పార్టీ మహాసభకు ప్రతినిధులుగా ఎన్నుకోలేదని వార్తలు. ఈ సభకు ఎన్నికైన మొత్తం ప్రతినిధులు 2,296 కాగా వారిలో లడఖ్‌ సరిహద్దులలో పని చేస్తున్న 13 మందితో సహా పిఎల్‌ఏ పశ్చిమ కమాండ్‌కు చెందిన 30 మంది మిలిటరీ అధికారులు, ఇతర కమాండ్‌ల నుంచి మొత్తంగా మిలిటరీ నుంచి 304 మంది ఎన్నికైనట్లు వచ్చిన వార్తలు. పుకార్ల గురించి ప్రస్తావించకుండా చైనాలో ఎలాంటి పరిణామాలూ జరగలేదని అర్ధం వచ్చేలా వాటికి తెరదించుతూ షీ జింపింగ్‌ నేతృత్వంలోని పార్టీ మార్గదర్శకాల మేరకు ఎన్నికైన ప్రతినిధులందరూ పార్టీ మహాసభకు సిద్దమౌతున్నారంటూ కమ్యూనిస్టు పార్టీ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పాపాయి విల విల – డాలరు నిల్వలు వెల వెల ! నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి!!

25 Sunday Sep 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు


చైనాను వెనక్కు నెట్టి అమెరికాతో పోటీ పడే విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోగల సమర్ధుడు ప్రధాని నరేంద్రమోడీ అని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. దాని వలన దేశానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా వారి మనోభావాలను గౌరవిద్దాం, అదే సమయంలో ప్రపంచం, దేశంలో జరుగుతున్నదాన్ని గురించి కూడా చెప్పుకుందాం. వారు వింటారా లేదా అన్నది వారికే వదలివేద్దాం. శుక్రవారం నాడు (2022 సెప్టెంబరు 23) ప్రధాని నరేంద్రమోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. లండన్‌లోని ఎక్సేంజ్‌ రేట్స్‌ . ఓఆర్‌జి.యుకె సమాచారం ప్రకారం శుక్రవారం నాడు మన దేశంలో రాత్రి ఎనిమిది గంటలు, లండన్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలపుడు డాలరుకు రూపాయి విలువ రు.81.4101గా ఉంది.( అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం రేట్లు మారుతూ ఉంటాయి .) సహజంగా ఏ దేశంలో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం-ముగింపు సమయాల్లో ఎంత ఉంటుందో ఆ రోజుకు ముగింపు విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మన దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రు.81.11 ఉంది. అంతకు ముందు 81.23కు పతనమైంది. శనివారం నాడు లండన్‌లో తెల్లవారు ఝామున 3.20కి (మన దగ్గర 7.50) రు.81.2485 దగ్గర ఉంది. రానున్న మూడు నాలుగు నెలల్లో అది రు.82- 83 మధ్య ఉంటుందని, తరువాత 85-86కు దిగజారవచ్చని కొందరి అంచనా.

తరలిపోతున్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు నిలిచినా, తిరిగి వచ్చినా రు.81-82 దగ్గర స్థిరపడవచ్చని, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మిగిలిన రోజుల్లో 79-83 మధ్య ఉండవచ్చని, పరిపరి విధాల ఎవరి జోశ్యం వారిది. ఎవరు చెప్పినా 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పిన రు.38-48కి పెరగటం గురించి ఎవరూ ప్రస్తావించటం లేదు. ఆర్‌బిఐ ఇప్పటికే రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఆర్‌బిఐ 80బి.డాలర్లను విక్రయి ంచిందని, రూపాయి పతనమైతే దాన్ని వదలివేయటం తప్ప ఆర్‌బిఐకి మరొక మార్గం లేదని కొందరు చెబుతున్నారు. గత ఏడు నెలల కాలంలో గురువారం నాడు ఒక్కరోజే 83పైసలు పతనమైంది. ఎవరేం చెప్పినప్పటికీ ప్రపంచీకరణతో బంధం వేసుకున్నందున మన చేతుల్లో అనేక అంశాలు ఉండవు. ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పినా అయితే లేదా కాకుంటే అన్న జాగ్రత్తలతో చెప్పేవే తప్ప మరొకటి కాదు. కొద్ది వారాలుగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినందున కొంత మేర ఒకవైపు ఊరట కలుగుతున్నది.మరోవైపు కరెన్సీ విలువ పతనంతో హరించుకుపోతున్నది.


ఆర్‌బిఐ శుక్రవారం నాడు విడుదల చేసిన సమాచారం ప్రకారం గత ఏడు వారాలుగా వరుసగా మన విదేశీమారక ద్రవ్య నిల్వలు పడిపోతూ సెప్టెంబరు 16 నాటికి 545.652 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.2020 అక్టోబరు రెండవ తేదీ తరువాత ఇంత తక్కువగా ఎన్నడూ లేవు. తగ్గటానికి కరెన్సీ మారకపు విలువలో మార్పులు కొంత మేరకు కారణం కాగా రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కొందరి అభిప్రాయం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై నెలలో రూపాయి పతనాన్ని అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ 35 బి.డాలర్లను, ఈ మొత్తంలో జూలై నెలలో 19బి.డాలర్లను విక్రయించింది. సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఒక్క రోజే రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించినట్లు వార్తలు. 2021 సెప్టెంబరు మూడవ తేదీన 642.45బి.డాలర్లు మన దగ్గర ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లటం, మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరగటంతో పాటు మన కరెన్సీ విలువ తగ్గినందువలన కూడా డాలరు నిల్వ కరిగిపోతున్నది.


ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రూపాయికి ఏం జరిగితే అది జరుగుతుందని(పాత సినిమాల్లో డాక్టర్లు ఇక ఆ దేవుడిదే భారం అన్నట్లు) వదలి పెట్టటం తప్ప అక్టోబరు-మార్చి నెలల్లో ఆర్‌బిఐ అరకొర తప్ప తీసుకొనే పెద్ద రక్షణ చర్య లేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసుకున్న జోక్యం ఫలితాలనివ్వలేదని పతన తీరు సూచిస్తున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెబుతున్న మొత్తంలో అన్నీ డాలర్లే ఉండవు. ఆర్‌బిఐ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్న 545.652 బిలియన్‌ డాలర్లలో నగదు 484.901 బి.డాలర్లు కాగా బంగారం రూపంలో 38.186, ఎస్‌డిఆర్లు 17.686, ఐఎంఎఫ్‌ వద్ద 4.880బి.డాలర్లు ఉన్నాయి . ప్రస్తుతం దిగుమతులు-ఎగుమతుల అంతరం పెరిగి జిడిపిలో 4శాతానికి కరెంటు ఖాతాలోటు పెరిగినా మొత్తం నిల్వలు 510 బి.డాలర్లకు తగ్గవచ్చని, 2013 మే నెలలో ఉన్న 300 బి.డాలర్లతో పోలిస్తే పరిస్థితి మెరుగేనని కొందరి అభిప్రాయం. పది సంవత్సరాల క్రిందట ఆ నిల్వలు 4.1నెలల దిగుమతులకు సరిపోగా ఇప్పుడున్న నిల్వలు 8.9 నెలలకు వస్తాయని అంచనా. రూపాయి విలువ పతనమైతే మన దేశం నుంచి డాలర్లు వెలుపలికి పోతే విదేశాల్లో ఉన్న మన జాతీయులు డాలర్లను మన దేశానికి పంపుతారు. వాటికి గతం కంటే ఇక్కడ ఎక్కువ రూపాయలు వస్తాయి.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి గురించి గతంలో వేసిన అంచనాలను క్రమంగా తగ్గించటమే తప్ప స్థిరంగా ఉంటుందని ఏ సంస్థా చెప్పటం లేదు. ప్రస్తుతం ఏడు శాతంగా చెబుతున్నారు, వచ్చే ఏడాది 6.4శాతానికి తగ్గుతుందని అంచనా. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను ఇంకా పెంచనుందనే వార్తల పూర్వరంగంలో వృద్ధి రేటు ఇంకా తగ్గేందుకే అవకాశం ఉంది. డాలరు రేటు పెరిగింది తప్ప మన కరెన్సీ విలువ తగ్గలేదని కొందరు వాదిస్తున్నారు. ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద అమెరికా కూటమి దేశాలు అనేక ఆంక్షలు విధించినా దాని కరెన్సీ రూబుల్‌ విలువ పెరిగింది. మన జిడిపి ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంటే దాని జిడిపి పదకొండవదిగా ఉంది. అలాంటపుడు మన కరెన్సీ విలువ ఎందుకు పెరగలేదు ? జపాన్‌ ఎన్‌ విలువ పెరిగింది, దక్షిణ కొరియా కరెన్సీ వన్‌ పెరిగింది. అందువలన పతనమైన వాటితో చూపి మనదీ అలాగే ఉందని చెబుతామా, మెరుగ్గా ఉన్నవాటితో పోల్చుకుంటామా ? మనకు పతనం కావటమా, పెరగటమా ఏది లాభం. దిగుమతులు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మందికి పెరగటం లాభం. ఎగుమతులు తక్కువగా ఉన్నందున కొందరికి తగ్గటం లాభం.


మన కరెన్సీతో దిగుమతులు చేసుకొనేందుకు కొన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.దీంతో డాలర్లకు గిరాకీ తగ్గి కొంత వెసులుబాటు కలుగుతుంది తప్ప మనకు కలిగే లబ్ది ఏముంటుంది. ఏ దేశమైనా డాలరుతో పోల్చి దాని బదులు దాని విలువకు సమానమైన రూపాయలు అడుగుతుంది తప్ప రోజు రోజుకు దిగజారుతున్న మన కరెన్సీని స్థిర విలువకు ఎవరూ అంగీకరించరు. మనం ఇతర దేశాల కరెన్సీ తీసుకున్నప్పటికీ ప్రాతిపదిక అదే ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతున్నారు గనుక అక్కడ పెట్టుబడులు పెట్టినా లేదా ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినా మదుపుదార్లకు లాభం కనుక ఇతర దేశాల నుంచి డాలర్లు అమెరికా చేరుతున్నాయి. వడ్డీ రేటు తగ్గితే అంతకంటే ఎక్కువ వడ్డీ వచ్చే దేశాలకు తిరిగి దారిపడతాయి . మన ఆర్‌బిఐ వడ్డీ రేటు పెంచటం వెనుక మతలబు ఇదే. అయి తే అది మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు, రుణాలు తీసుకొని ఇండ్లు, వాహనాలు కొనుగోలు చేసిన వారి మీద అదనపు భారం మోపుతుంది. డాలర్లు కొని విదేశాల్లో చదువుకొనే వారికి, టూర్లకు వెళ్లే వారికి భారం పెరుగుతుంది. మంచి పనితీరును కనపరచిన ఎనిమిది కరెన్సీలలో మనది ఒకటని విశ్లేషణలు వెల్లడించాయి.దాన్ని పట్టుకొని మన సామర్ధ్యానికి భంగం కలగలేదని బిజెపి నేతలు చెబుతున్నారు. నిజం కావచ్చు, దాని వలన మనకు ఒరిగేదేమిటి ? కేసుపోతేనేం గానీ మన ప్లీడరు భలేవాదించాడు అన్నట్లుగా ఉంది.


ప్రపంచంలో తమ వద్ద డిపాజిట్‌ చేసిన మదుపుదార్లకు బాంకులు వడ్డీ చెల్లించటం తెలిసిందే. కానీ ఐదు దేశాల్లోని బాంకులు తమ వద్ద డబ్బుదాచుకున్న వారి నుంచి ఎదురు వడ్డీ వసూలు చేస్తున్నాయి, వినటానికి చిత్రంగా ఉన్న అది నిజం. పెట్టుబడిదారులు ఏది చేసినా తమ లాభాలకే అన్నది గ్రహిస్తే ఇది కూడా దానిలో భాగమే అన్నది స్పష్టం. బహిరంగ మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్ల కంటే మన దేశంలో బాంకుల వడ్డీ రేటు తక్కువ. పెట్టుబడిదార్లకు చవకగా రుణాలు కావాలంటే బాంకులు కావాలి. వాటి దగ్గర డిపాజిట్లు ఉండాలి కనుక మన బాంకులు డిమాండ్‌ను బట్టి వడ్డీ రేట్లను ఖరారు చేస్తాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు అక్కడి వారికి లబ్ది చేకూర్చేందుకే. వడ్డీ తక్కువ ఉంటే వారి వస్తువుల తయారీ ఖర్చు తక్కువగా ఉండి ప్రపంచ మార్కెట్లో పోటీ పడవచ్చు.ఐదు దేశాల బాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారే అవి నిర్ణయించిన మేరకు ఎదురు వడ్డీ చెల్లించాలి. డబ్బు వచ్చేకొద్దీ అవి కూడా రేట్లు మారుస్తూ ఉంటాయి. ఎదురు వడ్డీ స్విడ్జర్లాండ్‌లో 0.75, డెన్మార్క్‌ 0.60, జపాన్‌ 0.1, స్వీడన్‌ 0.25, స్పెయిన్‌0.0 శాతం ఉంది. అనేక ఐరోపా ధనిక దేశాల్లో వడ్డీ రేట్లు నామమాత్రంగా ఉంటాయి. ఇలా ఎందుకు అంటే పొదుపు వద్దు- ఖర్చే ముద్దు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఖర్చు చేస్తేనే కదా కార్పొరేట్ల వస్తువులు, సేవలకు గిరాకీ ఉండేది, లాభాలు వచ్చేది. జపాన్‌లో ఎలాంటి వడ్డీ లేకుండా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం, బాంకులు రుణాలు ఇస్తాయి. డాలరు దెబ్బకు జపాన్‌ ఎన్‌ కూడా ప్రభావితమైంది. దాంతో 1998 తరువాత తొలిసారిగా గతవారంలో జపాన్‌ రిజర్వుబాంక్‌ రంగంలోకి దిగి తమ కరెన్సీ విలువ పడిపోకుండా, పెరిగేందుకు జోక్యం చేసుకుంది.2011లో ఎన్‌ విలువ పెరగటంతో తగ్గేందుకు లేదా స్థిరంగా ఉండేందుకు చూసింది. ఎగుడు దిగుడులు సహజం, ఇబ్బందులు, పతనాలు తాత్కాలికం అంటూ కొందరి నోట ఉపశమనాలు వినిపిస్తున్నాయి , మంచిదే అంతకంటే కావాల్సింది ఏముంది ? అందుకోసం సమర్ధుడైన నరేంద్రమోడీ చేస్తున్నదేమిటి అన్నదే ప్రశ్న.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d