• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

25 Friday Jun 2021

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, COVID- 19 pandemic, excess corona death trends, Kerala Corona Deaths, Kerala LDF


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో ట్రంప్‌ చెలగాటం – బైడెన్‌కు ప్రాణ సంకటం !

24 Thursday Jun 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Donald trump, Joe Biden, Narendra Modi, Propaganda War, US-CHINA TRADE WAR


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు: ”తిరగరాసిన” చరిత్ర

24 Thursday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ 7 Comments

Tags

1989 Tiananmen Square protests, china communist party, Tiananmen square - Facts


యం. జయలక్ష్మి


జూన్‌ 24, 1989, చైనాపార్టీ వందేళ్ళ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం. సోషలిస్టు చైనా నిలదొక్కుకోటానికి పునరంకితమైన రోజది. తూర్పుయూరపులో, సోవియట్‌ యూనియన్‌లో మాదిరే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలను వమ్ముచేస్తూ చర్యలు తీసుకొన్న రోజు. 24వతేదీన ముగిసిన రెండురోజుల విస్త త ప్లీనరీ సమావేశంలో నాటివిద్యార్థి ఆందోళనపై ప్రధాని, పోలిట్‌ బ్యూరో సభ్యుడు లీపెంగ్‌ నివేదికను చర్చించి ఆమోదించారు. కేంద్రనాయకులు 557మంది పాల్గొని, ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధానకార్యదర్శి జావోజియాంగుని అన్ని పదవులనుంచీ తొలగించారు. సంస్కరణలక్రమంలో ”బూర్జువా లిబరలైజేషన్‌”ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన నాలుగు మౌలిక సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను పాటించని వారు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను నిర్వహించారని, ప్రజా చైనా, పార్టీ భవితవ్యాన్ని దెబ్బతీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్రస్వభావాన్ని అర్థంచేసుకోకుండా, దాన్ని బలపరిచి, ఆయనతోపాటు మరి కొద్దిమంది తీవ్రమైన తప్పుని చేశారని వివరించారు.


1989జూన్‌4 నాడు ”తియనన్మెన్‌ స్క్వేర్‌ లో పదివేలమంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” ఒక విషప్రచారంతో అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తమ కుట్రను కప్పిపెట్టుకో చూశారు. ఆ ఆందోళనను చైనా మరిచిపోయినా, అమెరికా, పశ్చిమదేశాలు, భారతీయమీడియా ఏటా జూన్‌ నెలలో గుర్తుచేస్తుంటాయి. కాగా చైనాపార్టీ నాడు చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. దానిక్లుప్త పరిచయమే ఈ వ్యాసలక్ష్యం.
చైనావ్యతిరేక దుమారాన్ని తిరిగి ప్రోత్సహిస్తున్ననేటి బైడెన్‌ యుగంలో నాటిచరిత్రని ”తిరగరాసిన” పుస్తకం ” తియన్మెన్‌ స్క్వేర్‌ : ద మేకింగ్‌ ఆఫ్‌ ఏ ప్రొటెస్ట్‌ – ఏ డిప్లొమాట్‌ లుక్స్‌ బాక్‌ ” సాదాసీదా రచయిత కథనం కాదది: ఆనాడు చైనాలో ఇండియా దౌత్యవేత్తగా వుండిన చైనా నిపుణుడు, ప్రత్యక్షసాక్షి విజరు గోఖలే రాశారు. ఈ ఏడాది మేనెలలో విడుదలైన 181పేజీల (399రూ. హార్పర్‌ కాలిన్స్‌) పుస్తకం దౌత్యప్రపంచంలో సంచలనం. ఆతర్వాత భారత విదేశాంగశాఖ కార్యదర్శి అయిన గోఖలే కథనం విలువైనది, మరుగునపడిన అనేక వాస్తవాలను వెలికి తెచ్చినది అని గతంలో చైనాలో పనిచేసి, తర్వాత అదే పదవిని అలంకరించిన శ్యాంశరణ్‌, శివశంకరమీనన్‌ వంటివారు ప్రశంసించారు. ‘ఎంతోకాలంగా బైటపెట్టాలనుకున్న విషయాలివి. కానీ ”నేనున్న పరిస్థితులలో” కుదరలేదు’ ుఅని రాశారు గోఖలే. గతఏడాదే విదేశాంగ కార్యదర్శిగా రిటైరయ్యారు. .


ఆ ఘటనల గురించిన పాశ్చాత్య కథనాన్ని మీ పుస్తకంలో సవాలు చేశారు. అది ఎందుకు అవసరమయ్యింది? అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (మే23) విదేశీవ్యవహారాల నిపుణులు ప్రశ్నించారు. ఇరుపక్షాల మీడియా కూడా భావజాలపర పక్షపాతాలతో కూడివుంది. ఆ 50రోజుల ఘటనలను స్వంత అనుభవంతో చూశాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు. ప్రశ్నించదగినవి, నాకు స్వయంగా తెల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈమొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన రీతితో వక్రీకరించింది. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను అని గోఖలే జవాబిచ్చారు.


కరోనా గురించి చైనావ్యతిరేక పాశ్చాత్య దుమారం (భారత మీడియా దానికి యుద్ధోన్మాద భేరీలను జోడించి ప్రచారం చేస్తుంటుంది: స్వంత విలేకరుల కథనాలు దాదాపు లేవని ఈ వ్యవహారాలు ఏకాస్త తెల్సినవారయినా ఇట్టే గ్రహించగలుగుతారు) ఈ నేపధ్యంలో గోఖలే రచన ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అమెరికా అంటే ప్రపంచవ్యాప్త దోపిడీదారనీ, పసిపిల్లలతో సహా లక్షలాది మంది పౌరులను బలిగొన్న యుద్ధోన్మాదరాజ్యం అనీ, ప్రత్యేకించి నల్లవారిని అణగదొక్కిన జాత్యహంకార పోలీసువ్యవస్థ కలిగినదనీ తెల్సినదే. వియత్నాంలో ఘోరమైనఓటమి (1975) తర్వాత అమెరికా మిలటరీ వెనక్కితగ్గిన కాలమిది.


చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. 1970తర్వాత అమెరికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలోహలో అని పలకరించుకుంటున్న వాతావరణం. ఆతర్వాత పుట్టిపెరిగిన విద్యార్థితరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత త్వంల గురించిన పైపైఅవగాహనే వుంది. ”సంపూర్ణ పాశ్చాత్యీకరణ”ను, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ విగ్రహ నమూనాని కూడా తలకెత్తుకున్నారు కొందరు చైనావిద్యార్థులు.


ఆ నేపథ్యంలో నాటి చైనా నాయకత్వంలో ఒక ఆందోళన మొదలైంది. ””ఎర్ర జన్యువు”ని తర్వాతితరాలకి అందించాలి అని నేటి అధ్యక్షుడు జిన్పింగ్‌ అన్నారు. నాడూనేడూ కూడా ఈ ‘రెడ్‌ జీన్‌’ కీలక సంకేతం ు అన్నారు గోఖలే (టైమ్సులో). అభివ ద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలన్నీ కలిసి ‘రెడ్‌ జీన్‌’ని పలుచనచేసేస్తాయేమో అన్నది ఒక అభిప్రాయం. డెంగ్‌ ఆర్థిక సంస్కరణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడిదారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ”చైనా తరహా సోషలిజం” పేరిట అనుసరించిన వ్యూహం-ఎత్తుగడల పట్ల అవగాహనలో గందరగోళం నెలకొనివుంది, ముఖ్యంగా యువతరంలోని పార్టీకేడర్లో, నాయకత్వంలో కూడా వున్నది. ఆనాటికే కొన్ని భ్రమలూ, అలజడులూ తలెత్తాయి. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ”బూర్జువా లిబరలైజేషన్‌’కి వ్యతిరేకంగా చైనాపార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్నిసంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడిమాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశికసూత్రాలను ప్రకటించారు(పార్టీ 13వ మహాసభలో, 1987అక్టోబరు). సంస్కరణలక్రమంలో పెచ్చరిల్లిన ”బూర్జువా లిబరలైజేషన్‌ ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన ఆ సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం.


ఆ పరంపరలో వచ్చినవే తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు.హఠాత్తుగా వచ్చినవి కాదు.
ఆర్థిక సంస్కరణలతో సోషలిస్టు చైనా ‘ ఉదారవాద (పెట్టుబడిదారీ) చైనా’గా మారిపోతుందని పాశ్చాత్యదేశాలు భావించాయి. అది తప్పుదారి పట్టిన పాశ్చాత్య ఊహ మాత్రమే అంటారు గోఖలే. 1989నుంచీ భారత విదేశాంగశాఖ, రాజకీయ నాయకత్వంకూడా దాన్ని విశ్వసించటంలేదు. ఆమాట పాశ్చాత్యులకు చెప్పాం కూడా. అయినా చైనా మార్కెటు, అక్కడ వస్తున్న లాభాలతో వారు మిన్నకుండిపోయారు అన్నారు గోఖలే(టైమ్స్‌).
”పాశ్చాత్యీకరించబడిన” ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. దీన్ని భారతీయులు కూడా బాగా అర్థంచేసుకోవాలి. మనతో సరిహద్దు తగాదా చైనా కమ్యూనిస్టులు స ష్టించినది కాదు. అంతకుముందటి ”జాతీయ” చైనా, అమెరికా అనుకూల చియాంగ్‌ కై షేక్‌ కాలపు చైనా వైఖరీ ఇదే. వారెవ్వరూ మెక్‌ మహన్‌ లైనుని, సిక్కింని (దలైలామా కూడా 2008దాకా) గుర్తించలేదు అని ఎత్తిచూపారు గోఖలే.


ఆనాటి ఘటనల గురించి ఎన్నో కథనాలున్నాయి. భారత ద క్కోణం గల ”విశిష్టమైన కాంట్రిబ్యూషన్‌ ఈ పుస్తకం” అని ప్రశంసించారు సి.ఉదయభాస్కర్‌. ఆయన చైనా వ్యూహవ్యవహారాల నిపుణుడు, వ్యాఖ్యాత. ఇప్పటిదాకా చెప్పని కథనాన్ని ఎంతో నచ్చచెప్పేరీతిలో, ఆచితూచి రాసిన పుస్తకం అన్నారాయన. నేను కళ్ళారాచూసిన వాస్తవాలకు అన్వయంజోడించి, 30ఏళ్ళతర్వాత వెనక్కిచూసుకుంటే అర్థమయ్యేద ష్టితో రాసిన 10అధ్యాయాల పుస్తకం అని చెప్పుకున్నారు గోఖలే. ఆనాడు 500బిలియన్‌ డాలర్లున్న చైనా జీడీపీ నేడు 14000బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నవంతులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్‌ చూపెట్టిన, ఆతర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంతో వారు ఈ స్థాయికి చేరారు. 1989తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనామార్గం స్థానంలో ”ప్రజాస్వామ్యం పేరిట మరోవ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీప్రజల్లో కన్పించటంలేదు” అని నిర్ధారించారు గోఖలే అని ఉదయభాస్కర్‌ చెప్పారు. పాశ్చాత్యదేశాలకు తమ తప్పులను గుర్తించటానికి 30ఏళ్ళు పట్టింది అంటారు గోఖలే.


ఆనాటి కొందరు విద్యార్థినేతలు ఎలాంటి వారంటే చాటుగా భోజనాలుచేస్తూ నిరాహారదీక్షలు చేసినవారు, పాశ్చాత్యదేశాల, మీడియాల ఆకర్షణ గలవారు అని గోఖలే రాశారు. నిజానికి నిరాహారదీక్షలు చేయరాదని విద్యార్థుల ఫెడరేషన్‌ తీర్మానించింది కూడా. అయినా ఒక నాయకుడు మీడియాముందు ఈ ”డ్రామాను” మొదలుపెట్టాడు. విద్యార్థులలోబాగా చీలిక వుండేదనీ, తమనితాము నాయకులుగా చెప్పుకునేవారు రహస్య ఎజెండాలతో ఎలాపనిచేశారో బయటపెట్టారు గోఖలే. సంస్కరణలగురించి పార్టీనాయకత్వంలో విభేదాలు, చర్చలు కొనసాగుతున్నకాలం. అలాంటి ఒక పొలిట్‌ బ్యూరో సమావేశంలో హుయావో బాంగ్‌ గుండెపోటుతో 15-4-1989న మరణించారు. డెంగ్‌ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్‌ వైపు మొగ్గిన నేత. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధానకార్యదర్శిగా (16-1-1987) రాజీనామాచేసి, పొలిట్‌ బ్యూరోలో వుండగా మరణించారు. నాటి వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యంపోశాయి విదేశాలు, విదేశీమీడీయా. అలా ఏప్రిల్‌18-22న సంతాపంపేరిట వేలాదిమంది తరలివచ్చారు.అదే ముదిరి 50రోజులు కొనసాగింది. ప్రధానే మైదానంలోకివచ్చి తమతో చర్చలు జరపాలని మొండి డిమాండు పెట్టారు కొందరు. ప్రధాని లీపెంగ్‌ జనంమధ్యకి వచ్చి, నేలపైకూర్చొని మే18న జరిపిన సుదీర్ఘచర్చలను, ఫోటోలను ఆనాటి చైనా టీవీ, పత్రికలు ప్రచురించాయి.


300మందికిపైగా కీలకపార్టీ, ప్రభుత్వ నాయకులంతా వుండే కేంద్రస్థానం అది. వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్‌ కూడా అందులోనే. అలాంటిస్థానాన్ని లక్షమంది విద్యార్థులు చుట్టుముట్టిన నెలతర్వాత, మే18న పొలిట్‌ బ్యూరో నిర్ణయంతో, మే20నగానీ మార్షల్‌ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం, కానీ నగరం వెలుపలే ఉంచారు. మే15-16న రష్యానేత గోర్బచేవ్‌ పర్యటన సందర్భంగా స్క్వేర్‌ లో కార్యక్రమాలకోసం మైదానాన్ని ఖాళీ చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు. జూన్‌ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్నిరోజులు అనుమతించిన రాజ్యం మరొకటిలేదు. ఏదైనావుంటే ఎవరైనా ఉదహరించవచ్చు. చర్చలద్వారా 90-95 శాతంమందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా 5నుంచి10వేలమంది దాకావుంటారు.
”మొత్తం” ఎంతమంది చనిపోయారు? చైనాలెక్క 300 (సైనికులతోసహా). జూన్‌3రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్నపుకార్లు: పదివేలమంది. అమెరికాగూఢచారి సంస్థ ఎన్‌ఎస్‌ఏ 500 మందిదాకా, యామ్నెస్టీ 1000దాకా, న్యూయార్క్‌టైమ్స్‌(జూన్‌21)400-800దాకా. స్క్వేర్‌ లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. నిజమే ‘ అక్కడ అలాంటి ఆధారాలేవీ లేవ’ని వాషింగ్టన్‌ పోస్టు, సిబిఎస్‌ విలేకరులు, ”అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద”ని సంఘీభావంగా జనంమధ్యేవున్న తైవాన్‌ విలేకరి, ”అక్కడ” రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్‌ చెప్పాయి. పాశ్చాత్యకపటాన్ని చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. దానితో కొన్ని ఏజెన్సీలు (వాయిస్‌ ఆఫ్‌ అమెరికా) తమతప్పులను కొంత అంగీకరించాయి. మరయితే జూన్‌ 3 రాత్రి ఏంజరిగింది? పూర్తివివరాలు ఈ పుస్తకంలోనూ లేవు. జర్నలిస్టిక్‌ నియమాలను తుంగలోతొక్కి ఊహాగానాలతో, రూమర్లతో, కట్టుకథలతో పాశ్చాత్యమీడియా పచ్చికపటంతో ఎలా వ్యవహరించిందో అద్భుతంగా వెల్లడించారు గోఖలే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఈ ”తిరగరాసిన చరిత్ర”ని తరచి చూడాల్సిన అవసరం వుంది.

వ్యాస రచయిత్రి ఆంధ్రప్రదేశ్‌ కోపరేటివ్‌ బ్యాంకు మాజీ అధికారిణి

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి వ్యతిరేక కూటమి : వివిధ పార్టీల ముందున్న సవాళ్లు – అవకాశాలు !

23 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti BJP Front, CPI(M), Narendra Modi, Sharad Pawar, TMC


ఎం కోటేశ్వరరావు

జూన్‌ 22వ తేదీన న్యూ ఢిల్లీలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ నివాసంలో బిజెపిని వ్యతిరేకించే కొన్ని పార్టీలు, కొందరు మేథావుల ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. దీనికి బిజెపి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా నిర్వహిస్తున్న రాష్ట్ర మంచ్‌ ఫోరమ్‌ పేరుతో ఆహ్వానాలు పంపారు. దీనిలో శరద్‌ పవార్‌, యశ్వంత సిన్హా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) ఘనశ్యామ్‌ తివారీ (సమాజవాది), జయంత్‌ చౌదరి(ఆర్‌ఎల్‌డి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), నీలోత్పల్‌ బసు( సిపిఎం) , వినరు విశ్వం( సిపిఐ), పవన్‌ వర్మ (జనతాదళ్‌-యునైటెడ్‌), మాజీ న్యాయమూర్తి ఎపి షా, ఆర్ధికవేత్త అరుణ్‌ కుమార్‌, మాజీ దౌత్యవేత్త కెసి సింగ్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొందరికి ఆహ్వానాలు పంపినప్పటికీ ఎవరూ రాలేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కాన్ని పార్టీలకు ఆహ్వానాలు అందిందీ లేనిదీ కూడా స్పష్టత లేదు. ఇది బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ సమావేశం కాదని, కరోనా, నిరుద్యోగం, దేశంలోని వ్యవస్ధలపై జరుగుతున్నదాడుల వంటి అంశాల మీద ఆలోచనలను పంచుకొనేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల సమావేశం అని సిపిఎం నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. మిగతావారు కూడా ఇదే పద్దతుల్లో మాట్లాడారు. అయితే ఇది రాజకీయ అంశమే అని జనం భావిస్తున్నారు. బిజెపి గురించి చెప్పాల్సిన పనిలేదు.


ఇప్పటి వరకు దేశంలో జరిగిన పరిణామాలను, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయ ప్రక్రియను చూసినపుడు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి వన్నీ ఎన్నికలు, అధికారం చుట్టూనే తిరిగాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను అమలు జరపటం తప్ప వాటి పర్యవసానాలకు ప్రత్నామ్నాయ విధానాలు లేవు. సంకీర్ణ ధర్మం కారణంగా తమ అసలు సిసలు విధానాలను అమలు జరపలేమని ఏ పార్టీ కూడా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఎవరితో నిమిత్తం లేకుండానే బిజెపికి గత రెండు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ చేకూర్చేందుకు ఇతర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైంది. అయినప్పటికీ గతంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన సంస్కరణలను మరింత వేగంగా, అమానవీయంగా అమలు జరపటం తప్ప కొత్త విధానాలేమీ లేవు. అందువలన ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేని ఫ్రంట్‌ మరొకటి ఉనికిలోకి వచ్చినా ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న.


గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించటం వెనుక దాని అవినీతి అక్రమాలే కాదు, జనానికి ప్రయోజనం లేని విధానాల పర్యవసానం కూడా ఇమిడి ఉంది. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం గానీ గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో కూడా అలాంటిదే. ఇందిరా గాంధీ పార్టీలో తన ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు దాన్ని ముందుకు తెస్తే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పేరుతో నరేంద్రమోడీ కొత్త నినాదాలిచ్చారు. తన ప్రయోజనాల కోసం అధ్యక్ష తరహా పద్దతుల్లో ప్రధాని అభ్యర్ధి అంటూ గతంలో వాజ్‌పారు, తాజాగా నరేంద్రమోడీని బిజెపి రంగంలోకి తెచ్చింది. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పడవచ్చేమోగానీ ప్రధాని అభ్యర్ధిని అంగీకరించే అవకాశాలు లేవు.అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.


శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు కొత్తవి కాదు. గతంలో కూడా ఉన్నాయి, అయినప్పటికీ గత ఏడు సంవత్సరాలలో ఇలాంటి సమావేశాలు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సమావేశంలో పాల్గొన్నవారు లోపల ఏమి చర్చించారు, బయటికి ఏమి చెప్పారన్నదానిని పక్కన పెడితే ఇది బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పడాలన్న వాంఛ నేపధ్యంలోనే జరిగిన ప్రయత్నమన్నది స్పష్టం. అయితే అది రూపుదిద్దుకుంటుందా ? తీరుతెన్నులు ఎలా ఉంటాయి ? ఆటంకంగా ఉన్న అంశాలేమిటి ?ఎదురయ్యే సవాళ్లేమిటన్న వాటి గురించి రాబోయే రోజుల్లో చర్చ ప్రారంభం అవుతుంది. మరి ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా ? ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని చెప్పలేము. గతంలో ఏర్పడిన ఫ్రంటులు, సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ఫలితాలు, వైఫల్యాలూ అన్నీ పార్టీలు, మేథావుల అన్నింటికీ మించి జనం ముందు ఉన్నాయి. వాటిని విస్మరించి ఏ ప్రయత్నమూ సఫలం కాదు.


దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు తొలిసారిగా కాంగ్రెస్‌ వ్యతిరేకత అంశం ముందుకు వచ్చింది. 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో ఐక్యంగా పోటీ చేశాయి. తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తొలిసారిగా ఓడిపోయింది. వాటిని కూల్చివేయటంతో కాంగ్రెస్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.


బిజెపి పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన 2014 ఎన్నికలు మూడు ఫ్రంట్ల మధ్య పోటీగా జరిగాయి. ఒకటి బిజెపి నాయకత్వాన ఉన్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌, కాంగ్రెస్‌ నాయకత్వాన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఏ), కాంగ్రెస్‌ను తిరస్కరించండి, బిజెపిని ఓడించండి అనే పిలుపుతో వామపక్షాలు ఒక ఫ్రంట్‌గా విడిగా పోటీ చేశాయి. అందువలన కాంగ్రెస్‌కు భిన్నంగా బిజెపి వ్యతిరేక కూటములు ప్రారంభం నుంచీ ఉన్నాయి. ఇంకా పదేండ్లు ముందుకు పోతే కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ లేని కారణంగా బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్షాలు యుపిఏ కూటమికి మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందువలన బిజెపి వ్యతిరేకత అన్నది అది తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే అంకురించింది. సరికొత్త ఆలోచన అయితే కాదు.


కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, అన్నింటికీ మించి రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల అనుసరించిన కక్ష పూరిత వైఖరి, రాష్ట్రాల పట్ల అనుసరించిన విధానాల వంటి వాటి ప్రాతిపదికన ప్రారంభమైంది. 1975లో అత్యవసర పరిస్ధితిని విధించి మొత్తం ప్రజాస్వామిక హక్కులకే ముప్పుగా తయారైన నేపధ్యంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకీయంగా తనను వ్యతిరేకించిన పార్టీలు, వ్యక్తులు, శక్తులను అది జైలు పాలు చేసింది. అందువల్లనే అనంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జనతా పార్టీలో సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) పూర్వ రాజకీయ విభాగమైన మతశక్తి జనసంఘం, స్వతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ఉన్నప్పటికీ సిపిఎం దాన్ని బలపరిచేందుకు వెనుకాడలేదు.


గత ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ఒక్క అత్యవసర పరిస్ధితి విధింపు మినహా మిగతా అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల కూల్చివేతలకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తు సంస్దల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం వంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మతోన్మాద మహమ్మారిని ముందుకు తెచ్చింది. వివిధ ఉద్యమాల్లో తన విధానాలను వ్యతిరేకించిన వారి మీద ఉగ్రవాద, దేశద్రోహ నేరాలను మోపుతూ తమను వ్యతిరేకిస్తే అందరికీ ఇదే గతి అని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేసింది. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి పాలనకు వ్యతిరేకత పెరిగే కొద్దీ అది రాజకీయ పార్టీలకు విస్తరించే రోజు ఎంతో దూరంలో లేదు. అందువలన వీటిని వ్యతిరేకించే శక్తులన్నీ సహజంగానే ఐక్యం కావాలని కోరుకుంటాయి. అలాంటి వాంఛకు నిదర్శనమే శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశం. కరోనా రెండవ దశను నిర్లక్ష్యం చేయటం, వచ్చిన తరువాత అయినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడకపోవటం అన్నింటినీ మించి ఆక్సిజన్‌, వాక్సిన్ల విషయంలో సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలిసిందే. ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి బలహీనత, దాన్ని వ్యతిరేకించే శక్తుల బలం వెల్లడైంది. బిజెపి వ్యతిరేక శ క్తుల సమావేశానికి పురికొల్పిన అంశాలు ఇవే. వచ్చే ఏడాది జరిగి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ప్రయత్నాలు ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పవచ్చు.


గత అనుభవాలను చూసినపుడు కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిలోకి వచ్చేందుకు బిజెపి ఎన్నడూ తటపటాయించలేదు. అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపేందుకు అది అర్రులు చాచింది. రాజకీయంగా ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తపించి పోయింది. తన అజెండాను దాచుకోకపోయినా ముందుకు తేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు దాన్నే ముందుకు తెచ్చి అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల వివాదంలో తాము సంఘపరివార్‌ను వదులుకొనేది లేదని బహిరంగంగా ప్రకటించి జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘం విడిపోయి బిజెపి పేరుతో కొత్త దుకాణం తెరిచింది. ఈ కారణంగానే తరువాత కాలంలో దానికి ఉన్న మతోన్మాద లక్షణం కారణంగా వామపక్షాలు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. (పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమన్వయం చేసుకోవటం వేరు ) మిగతా పార్టీలు మతకోణాన్ని పక్కన పెట్టి అవకాశవాదంతో దానితో చేతులు కలిపాయి. ఇప్పుడు అవి తమ వైఖరిని తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.


బిజెపి వ్యతిరేక కూటమి విషయానికి వస్తే గతంలో బిజెపి లేదా దాని పూర్వ రూపం జనసంఘం మాదిరి ఎవరితో అయినా కలవటానికి ముందుకు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ రావటం లేదు. రాజకీయంగా బలహీనపడినప్పటికీ తన షరతుల మీద నడవాలని అది కోరుకుంటోంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని వ్యతిరేకించే శక్తులతో రాజీపడేందుకు సిద్దం కావటం లేదు. వాస్తవ పరిస్ధితిని గుర్తించేందుకు సిద్దంగా లేదు. ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా తానే ఏక పార్టీగా చక్రం తిప్పగలననే భ్రమలతో ఉంది.బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలను ఖాతరు చేయటం లేదు. తొక్కివేసేందుకు వెనుకాడటం లేదు. అయితే ఎంత బలహీనపడినప్పటికీ బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ లేకుండా లక్ష్యం నెరవేరదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే రెండు రకాలు. గతంలో కాంగ్రెస్‌ బాధిత పక్షాలు,సహజంగానే కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసిన కారణంగానే తరువాత ఎన్‌టి రామారావు దానికి కేంద్రంగా మారారు. అయితే కాంగ్రెస్‌ బలహీనపడిన తరువాత అవే పార్టీలు బిజెపితో అవకాశవాదంతో జట్టు కట్టాయి. అలాంటి వాటిలో తెలుగుదేశం పార్టీ ఒకటి. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపింది. గత ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి ఆ పార్టీతో సంబంధాలకు తహతహలాడుతోంది.


మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి కూడా కూడా అవకాశవాదానికి మారుపేరుగా ఉంది. సమాజవాది పార్టీతో మిత్రపక్షంగా ప్రారంభమై శత్రుపక్షంగా మారింది. గతలోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జట్టుకట్టింది. ఇప్పుడు దానితో కలిసే పరిస్ధితి లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవికోసం బిజెపితో చేతులు కలిపింది. రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. అదే పార్టీతో వైరమూ పెట్టుకుంది. యుపిఏ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఉపసంహరించుకుంది.
శివసేన విషయానికి వస్తే అది బిజెపి బాధిత పార్టీ. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో బిజెపితో చేతులు కలిపింది, కేంద్ర మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.తరువాత అధికారం దగ్గర పంచాయతీ వచ్చి బిజెపితో పోరాడాల్సి వచ్చింది. బిజెపి బాధిత పార్టీగా మారింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. ఒడిషాలో బిజెడి ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉంది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌-బిజెపిలను రెండింటినీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి తీసుకొనే అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇస్తుంది. వైసిపి విషయానికి వస్తే కాంగ్రెస్‌తో దానికి పేచీ లేదు. ఆ పార్టీని అంతం చేసి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత బిజెపితో సమస్యలున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ముందుకు వస్తుందా అంటే అనుమానమే. బిజెపిని సమర్ధించే విషయంలో బిజెపితో పోటీ పడుతోంది.


పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలు లేవు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ ్వంత సిన్హా ఆహ్వానం మేరకు ఇతర పార్టీలతో పాటు సమావేశానికి హాజరైనప్పటికీ ఆ పార్టీ ఉండే కూటమిలో చేరటం అనుమానమే. కర్ణాటకలో జెడిఎస్‌ పార్టీ కూడా అవకాశ వాదంతో వ్యవహరించింది. అధికారం కోసం బిజెపి-కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపేందుకు అది సిద్దం. కనుక ఇప్పటికిప్పుడు బిజెపి వ్యతిరేక కూటమి రూపుదిద్దుకోవటం అనేక సమస్యలతో కూడి ఉంది.

కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టి బిజెపిని రాజకీయంగా కొంత మేరకు రక్షించింది. అయితే దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితి రాబోయే రోజుల్లో అసలైన పరీక్ష పెట్టనుంది. బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు అది కూడా దోహదం చేస్తుంది. గతంలో ఇందిరా గాంధీ తన అధికారానికి ఎసరు వచ్చినపుడు రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సంఘపరివార్‌ తన అజెండాను అమలు జరిపేందుకు అధికారంలో కొనసాగాలని కోరుకుంటోంది. అందువలన ఒక వేళ ఎన్నికల్లో ఓటమి తధ్యమని తేలితే ఎంతకైనా తెగించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది. అందువలన ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్నే అయినప్పటికీ అధికారం కోసం ఏమైనా చేయవచ్చు. అదే జరిగితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల ప్రాతిపదికన ఏకీకరణ జరుగుతోంది. మన దేశంలో కూడా అలాంటి మధనం జరగాలి. దానికి శరద్‌ పవార్‌ నివాసంలో నిర్వహించిన సమావేశం నాంది పలికితే దాని ప్రాధమిక ప్రయోజనం నెరవేరినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కోవాగ్జిన్‌ కుంభకోణంలో బ్రెజిల్‌ బోల్సనారో – కరోనా వైఫల్యంపై రాజీనామాకు జనం డిమాండ్‌ !

23 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Covaxin, Covid-19 in Brazil, Jair Bolsonaro, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
వాక్సిన్లు, ఆహారం అందించలేని బోల్సనారో గద్దె దిగు అంటూ గత శనివారం నాడు బ్రెజిల్‌లోని నాలుగు వందల పట్టణాలలో ఏడున్నరలక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలకారణంగా ప్రదర్శనలు నిర్వహించలేదు. అంతకు ఇరవై రోజుల ముందు జరిగిన నిరసనలో కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు.పదిహేడు దేశాలలో ఉన్న బ్రెజిల్‌ పౌరులు, ఇతరులు కూడా నిరసన తెలిపారు. కరోనా మరణాలు ఐదులక్షలకు చేరిన సందర్భంగా జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరసనతో గుక్కతిప్పుకోలేకపోతున్న అధ్యక్షుడు బోల్సనారో సోమవారం నాడు తన ఆగ్రహాన్ని ఒక టీవీ జర్నలిస్టు మీద చూపాడు.అతగాడి దురుసు ప్రవర్తనను ఖండిస్తూ పదవికి రాజీనామా చేయాలని జర్నలిస్టు యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపున మన దేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి కోవాగ్జిన్‌ వాక్సిన్ల కొనుగోలుకు ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద ఎత్తున వత్తిడి చేసినట్లు వెలువడిన వార్తలు బోల్సనారోను మరింత ఇరకాటంలోకి నెట్టాయని చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో వామపక్ష వర్కర్స్‌ పార్టీకి వ్యతిరేకంగా బోల్సనారోకు ఓటు వేసిన వారు కూడా రెండేళ్లలో దేశానికి చేసిన నష్టం చాలు గద్దె దిగు అంటూ శనివారం నాటి ప్రదర్శనల్లో నినదించారంటే వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో కోటీ 78లక్షల మందికి వైరస్‌ సోకింది, వారిలో ఐదు లక్షల మంది మరణించారు. ఐసియు పడకలు, ఆక్సిజన్‌ సరఫరాలేక అనేక మంది దుర్మరణం పాలయ్యారు. అయినప్పటికీ బోల్సనారో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు ఒక మిలిటరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినపుడు కూడా ముఖానికి తొడుగు లేకుండా ఉన్నారు. దాంతో గతంలో మీరు ముఖతొడుగు ధరించనందుకు అనేక సార్లు జరిమానా చెల్లించారు కదా అని బ్రెజిల్‌ అతిపెద్ద మీడియా సంస్ద వాన్‌గార్డ్‌ విలేకరి గుర్తు చేయటంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నా ప్రాణం, నా ఇష్టం, తొడుగులేకుండా వస్తాను, నువ్వు నోరు మూసుకో, మిమ్మల్ని చూస్తే అసహ్యం, మీది చెత్త జర్నలిజం, మీదొక పెంట మీడియా, మీరు బ్రెజిల్‌ కుటుంబాలను, మతాన్ని నాశనం చేశారు అంటూ వీరంగం వేశాడు. ఇదిగో ముఖతొడుగు దీన్ని నేను ధరించటం లేదు, ఇప్పుడు మీకు సంతోషమేగా రాత్రి జాతీయ వార్తా కార్యక్రమంలో చూపండి అన్నాడు.మీడియా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సోమవారం నాడు బోల్సనారో విలేకర్ల సమావేశంలో ఆరోపించాడు. సిఎన్‌ఎన్‌ టీవీ శనివారం నాడు ప్రదర్శనలు జరిపిన వారిని ప్రశంసించిందన్నారు. ఆ సందర్భంగానే వాన్‌ గార్డ్‌ టీవి విలేకరి శాంటోస్‌పై విరుచుకుపడ్డారు.
తానుగా ముఖతొడుగును ధరించకపోవటమే గాక కరోనా నిరోధ చర్యలను తీసుకోవటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. ముఖతొడుగులు, వాక్సిన్ల వలన ఉపయోగం లేదని పదే పదే చెప్పాడు. తాను అధికారంలో ఉన్నంత వరకు కరోనా మీద పోరాడతా, ముఖతొడుగులు ధరించాల్సిన అవసరం లేదని ప్రతి గురువారం దేశ ప్రజల నుద్దేశించి చేసే ఉపన్యాసంలో కూడా చెప్పాడు. ఫార్మాకార్పొరేట్ల ప్రయోజనం కోసం కరోనాను నిరోధించలేని ఔషధాలను వినియోగించాలని ప్రబోధించాడు. ప్రయోజనం లేదని తేలినప్పటికీ దిగుమతి చేసుకున్న కంపెనీలకు అనుకూలంగా మలేరియా నిరోధానికి వినియోగించే క్లోరోక్విన్‌తో చికిత్స చేయాలని వివిధ సందర్భాలలో 84 సార్లు చెప్పాడు. ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం కారణంగా జనంలో తీవ్ర అభద్రతా భావం ఏర్పడింది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద కూడా తాజా నిరసనల ప్రభావం పడటం అనివార్యం. పదవికి రాజనామా చేయాలని కోరుతూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడవ తరంగం కరోనా రానుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం మీద మరింత వత్తిడి తెచ్చేందుకు మే, జూన్‌లో జరిగిన ప్రదర్శనల కొనసాగింపుగా తదుపరి కార్యాచరణకు ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్దలూ త్వరలో సమావేశం కానున్నాయి.ఇంతకాలం బోల్సనారోకు మద్దతు ఇచ్చిన మీడియా కూడా ప్రజల్లో వెల్లడౌతున్న నిరసన కారణంగా గుడ్డిగా సమర్ధిస్తే పూర్తిగా విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందనే భయం లేదా ఎంత బలపరిచినా తదుపరి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్న అంచనాకు రావటం వల్లగానీ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా మహమ్మారి సమస్య మీద రాజకీయంగా విబేధించే శక్తులు కూడా ఈ ప్రదర్శనల్లో భాగస్వాములయ్యాయి. బహుశా ఈ కారణంగానే చీటికి మాటికి నియంత బోల్సనారో మీడియా మీద విరుచుకుపడుతున్నాడు. అయితే ధనిక తరగతులు మాత్రం బోల్సనారోకు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బోల్సనారోపై ప్రతిపక్షం 122 అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టింది. వాటి మీద పార్లమెంట్‌ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఏ అధ్యక్షుడూ ఇలాంటి నిరసనను ఎదుర్కోలేదు.
కరోనా పట్ల నిర్లక్ష్యానికి నిరసనలు ఒక్క బ్రెజిల్‌కే పరిమితం కాలేదు, కొలంబియా, పరాగ్వే,పెరూల్లో కూడా జరిగాయి.బ్రెజిల్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఇరుగు పొరుగు దేశాలకు కూడా అక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక కొత్త రకాల వైరస్‌లు బయటపడ్డాయి. జనంలో వ్యతిరేకత పెరుగుతుండటాన్ని గమనించిన బోల్సనారో మే ఒకటవ తేదీన తన మద్దుతుదార్లతో ప్రదర్శనలు చేయించాడు. ఇప్పుడు మిలిటరీ జోక్యం చేసుకోవాలి, నేను అంగీకరిస్తున్నాను అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కరోనా నిబంధనలను జనాలు పాటించటం లేదు కనుక మిలిటరీ జోక్యం చేసుకొని అయినా నియంత్రణలను అమలు జరపాలని జనం కోరుతున్నారనే పేరుతో ఆ ప్రదర్శనలు చేయించారు. మే 29వ తేదీన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు జరిపిన ప్రదర్శనల్లో వాటికి ప్రతిగా నేను అంగీకరించటం లేదు, మిలిటరీ వద్దు అంటూ ప్రదర్శకులు బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. తనకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారు సామాన్య జనం అని వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వారు కిరాయి, అల్లర్లు చేసే వారు, ఉగ్రవాదులు అని బోల్సనారో వర్ణించాడు.
అధికారానికి వచ్చినప్పటి నుంచి బోల్సనారో వివాదాస్పద అధ్యక్షుడిగా తయారయ్యాడు. గతేడాది ఆగస్టులో అతగాడి పాలన బాగుందని చెప్పిన వారు 37శాతం మంది కాగా జనవరిలో 31శాతానికి పడిపోయింది. కరోనా సాయం నిలిపివేసిన తరువాత అదే నెలలో జరిగిన సర్వేలో 24శాతానికి దిగజారింది. దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారింది.కోటీ44లక్షల మంది నిరుద్యోగులున్నారు.వారిలో కేవలం 16శాతం మంది మాత్రమే బోల్సనారోను సమర్ధిస్తున్నారు. బెల్జియన్‌ రియల్స్‌ 2,200(మన కరెన్సీలో 32వేలు) లోపు ఆదాయం వచ్చే వారిలో 55శాతం మంది బోల్సనారోకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారని సర్వే తెలిపింది. ఏడాదిన్నర తరువాత జరిగే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే నిర్ధారణలకు రావటం తొందరపాటు కావచ్చుగానీ అప్పటికి పరిస్ధితి మెరుగుపడే సూచనల్లేవు.
భారత బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ వాక్సిన్లను కొనుగోలుకు హామీ ఇవ్వాలని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య నిఘా సంస్ధ మీద తీవ్ర వత్తిడి వచ్చినట్లు పోహా అనే పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుగుతోంది. మారినో అనే ఒక సైనికాధిరిని ఆర్యోగ వస్తు,ఔషధాల సరఫరా నిమిత్తం గతేడాది ఆరోగ్యశాఖ మంత్రి నియమించాడు. సదరు సైనికాధికారి జాతీయ ఆరోగ్య సంస్ద మీద వత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. వాక్సిన్ల సరఫరా గురించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న బ్రెజిల్‌ సంస్ధ ఒప్పంద షరతులను ఉల్లంఘించినట్లు తేలింది. ఇతర కంపెనీలు తక్కువ ధరలకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చినప్పటికీ భారత బయోటెక్‌ నుంచి ఒక మోతాదు 15 డాలర్ల చొప్పున రెండు కోట్ల మోతాల కొనుగోలుకు అవగాహన కుదిరింది.ఒప్పందం ప్రకారం ఈపాటికే వాక్సిన్‌ బ్రెజిల్‌ చేరి ఉండాలి.ఈ ఒప్పందం చేసుకున్న సంస్ద బోల్సనారోకు సన్నిహితమైంది కావటంతో అధ్యక్ష కార్యాలయం నుంచే వత్తిడి జరిగిందన్నది స్పష్టం.వాక్సిన్‌ గురించి ప్రదాని నరేంద్రమోడీకి బోల్సనారో ఫోన్‌ చేసిన తరువాతే ఒప్పందం ఖరారైనట్లు చెబుతున్నారు. గత సంవత్సరం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు ప్రయివేటు సంస్దల తరఫున బోల్సనారో మన ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసినట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. అందువలన క్లోరోక్విన్‌, వాక్సిన్‌ తయారీ కంపెనీలతో నరేంద్రమోడీకి ఆసక్తి ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
బ్రెజిల్‌లో ప్రస్తుతం చైనా వాక్సిన్‌ సినోవాక్‌, అమెరికా ఫైజర్‌, మరో కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను మూడవ దశ ప్రయోగాల తరువాత సాధారణ లేదా అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని అనుమతి ఇచ్చారు. వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన మార్పి ఒప్పందాలన్నీ మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రభుత్వ సంస్దలే చేసుకున్నాయి. దానికి భిన్నంగా కోవాగ్జిన్‌కు ఆ నిబంధనలను సడలించారు. ఒప్పందం జరిగిన సమయానికి బ్రెజిల్‌లో కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు జరగలేదు, భారత్‌లో జరిగిన ప్రయోగాల సమాచారాన్ని కూడా అందచేయలేదు. ఇతర వాక్సిన్లకంటే ముందే చెప్పుకున్నట్లు మధ్యవర్తి కంపెనీ అధికధరలకు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 25న ఒప్పందం చేసుకున్న తరువాత నెల రోజుల్లోపల 80లక్షల మోతాదులను సరఫరా చేయాలి.అయితే ఆ గడువు సెప్టెంబరుకు పెరగవచ్చంటున్నారు. మన దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ప్రభుత్వం మీద తీవ్రవత్తిడి రావటంతో ఎగుమతులపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒప్పందానికి తొమ్మిది రోజుల ముందు బ్రెజిల్‌ మంత్రి కోవాగ్జిన్‌ గురించి బ్రెజిల్‌ రాష్ట్రాల గవర్నర్లకు వివరించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 80లక్షల మోతాదుల చొప్పున మే నెలలో నలభై లక్షల మోతాదులు సరఫరా అవుతాయని చెప్పాడు. వాక్సిన్‌కు సంబంధించి వివరాలు లేకపోవటం, తయారీలో ప్రమాణాలు పాటిస్తున్నట్లు తమకు విశ్వాసం లేనందున వాక్సిన్ను తిరస్కరిస్తున్నట్లు మార్చి 31న బ్రెజిల్‌ ప్రభుత్వ సంస్ద ప్రకటించింది. భారత వాక్సిన్లను రానివ్వకుండా బ్రెజిల్‌ నియంత్రణ సంస్ద జాతీయవాదంతో వ్యవహరించిందని భారత బయోటెక్‌ అధిపతి ఎల్లా కృష్ణ ఆరోపించారు. మొత్తం మీద బ్రెజిల్‌ విచారణ ఎవరి పాత్రను ఎలా బయట పెడుతుందో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేను గాని ఈలవేస్తే……బిజెపికి కొరకరాని కొయ్య కర్ణాటక యడియూరప్ప !

20 Sunday Jun 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BJP Dynastic Politics, BJP Karnataka rumble tumble, BS Yediyurappa, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


రెండు తెలుగు రాష్ట్రాలకూ పొరుగు అయిన కర్ణాటకలో ఏమి జరుగుతోంది ? బిజెపి రాజకీయ నాటకంలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు ? టీవీ సీరియల్‌ మాదిరి ఎంత కాలం సాగనుంది ? తాజాగా ముగిసిన భాగంలో పాత్రధారులు చెప్పిందేమిటి ? అధిష్టానం ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగుతా అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడియూరప్ప. లేదు, ఆయన పూర్తి పదవీ కాలంలో ఉంటారు, మార్పులేదు అన్నారు కేంద్ర పార్టీ ప్రతినిధి అరుణ్‌ సింగ్‌. మేము వెనక్కు తగ్గేది లేదు అంటున్నాయి ఇతర పాత్రలు.మొత్తం మీద మూడు ముక్కలాట నడుస్తోంది.


బిజెపి ఎంఎల్‌ఏలు, మంత్రులు లేవనెత్తుతున్న అవినీతి ఆరోపణలు, పాలనా వ్యవహారాల్లో ఎడియూరప్ప కుమార రత్నం జోక్యం గురించి పార్టీ అధిష్టానం మాట్లాడటం లేదు. ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా సజావుగా ఉంది) అంటోంది. పాచిపోతుందని తెలిసినా ఇద్దరు ముగ్గురు ఎంఎల్‌ఏలు చేస్తున్న రచ్చ తప్ప మరింకేం లేదని మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్ప బిజెపి కేంద్ర నాయకత్వానికి, ముఖ్యంగా తిరుగులేని మోడీ-అమిత్‌ షా ద్వయానికి కొరకరాని కొయ్యగా మారారా ? దేశంలోని పరిస్ధితులు వారిని బలహీన పరిచాయా ?

కర్ణాటకలో కరోనా ఎలా విజృంభించిందో ఎంత మంది మరణించారో, మరణాలను ఎలా దాచిపెట్టారో లోకానికి తెలిసిందే. అభివృద్ది పనులేమీ లేవని బిజెపి వారే చెబుతున్నారు గనుక వివాదం లేదు. డెబ్బయి అయిదు సంత్సరాలు దాటిన వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదన్నది స్వయంగా బిజెపి విధించుకున్న నిబంధన అని అమిత్‌ షా వంటి వారు చెప్పారు. దాని వెనుక ప్రధాని పదవి రేసు నుంచి ఎల్‌కె అద్వానీ తప్పించే ఎత్తుగడ ఉందంటారు. అసలీ నిబంధన నిర్ణయం ఏ సమావేశంలో జరిగిందో తనకు తెలియదని, అమిత్‌ షానే చెప్పాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గతలోక్‌ సభ ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. ఆ నిబంధనను చూపి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ను, కేంద్ర మంత్రి నజమా హెప్తుల్లాను పదవుల నుంచి తప్పించారు. కానీ అదే బిజెపి పెద్దలు 75 ఏండ్లు దాటిన తరువాతనే యడియూరప్పను మరోమారు కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించారు ( లేకపోతే ఆయనే గద్దెనెక్కితే ఆమోద ముద్రవేశారు). కేరళలో యడియూరప్పకంటే పదేళ్ల పెద్ద అయిన 88 ఏండ్ల మెట్రో మాన్‌ శ్రీధరన్‌ పిళ్లేను ఎన్నికల్లో నిలపటమే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించారు. నిజానికి ఈ రెండూ ఆ పార్టీ ప్రవచించిన స్వయం ప్రవర్తనా నియమావళికి విరుద్దమైనవే.మోడీ-షా ద్వయం తమకు వ్యతిరేకం లేదా ఎవరినైనా దెబ్బతీయాలనుకుంటే ఈ నిబంధనను ముందుకు తెస్తారు. 2014 ఎన్నికల్లో సీట్లు ఇచ్చినప్పటికీ అద్వానీ, మురళీ మనోహర జోషిని ఈ నిబంధన చూపే దూరంగా పదవులకు దూరంగా పెట్టారు. అన్నింటికంటే అవమానం ఏమిటంటే ఇలాంటి వయస్సు మీరిన వారందరితో ఒక మార్గదర్శక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, మార్గదర్శనం చేయాలని అడిగిన వారు లేరు.

ఎడియూరప్పకు ఇప్పుడు 78 సంవత్సరాలు, ఆ నిబంధనకు మినహాయింపు ఇస్తే కారణం ఏమిటో చెప్పాలి, ఎలాంటి ప్రకటన, వివరణ లేకుండానే ముఖ్యమంత్రిగా ఆమోదించారు, కొనసాగిస్తున్నారు. అధిష్టానం ఏమి చెప్పినప్పటికీ కర్ణాటక బిజెపి వ్యవహారాలు వీధుళాలకెక్కాయి. కుమారుడే తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందున యడియూరప్పను తప్పిస్తే తప్ప తాము వెనక్కు తగ్గేది లేని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. ఎంఎల్‌సి హెచ్‌ విశ్వనాధ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఎడియూరప్పకు వయసైపోయింది, ఆరోగ్య సమస్యలున్నాయి, కుటుంబ సభ్యులు పాలనలో జోక్యం చేసుకుంటున్నారు, ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర అన్ని శాఖలల్లోనూ వేలు పెడుతున్నారని ఆరోపించారు. అయితే విశ్వనాధ్‌ ప్రకటన వ్యక్తిగతం పార్టీకి సంబంధం లేదని, యడియూరప్పే ముఖ్యమంత్రి అని కేంద్ర ప్రతినిధి అరుణ్‌ సింగ్‌ ఇప్పటికే చెప్పారని బళ్లారి మంత్రి బి శ్రీరాములు సిఎంకు మద్దతుగా ప్రకటించారు. జెడిఎస్‌ నుంచి ఫిరాయించిన వారిలో విశ్వనాధ్‌ ఒకరు. వీరశైవ సామాజిక తరగతి నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి ఉంది. అందువలన కొత్త ముఖంతో ఎన్నికలకు పోవాలన్నది వ్యతిరేకుల ప్రతిపాదన. అదే చేస్తే అసలు ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని కేంద్ర పెద్దల భయం.


కరోనా నిరోధంలో ముఖ్యమంత్రి పని తీరు బాగుందని, పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉండాలని, ఎవరికైనా సమస్యలుంటే నాతో మాట్లాడాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయకూడదు, ఎవరైనా అలా చేస్తే సంజాయిషీ కోరతాం అని కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ చెప్పారు. ఇద్దరు ముగ్గురు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, వారిలో ఒకరికి బిజెపి సంస్కృతి గురించి తెలియదని అన్నారు. మూడు రోజుల పాటు బెంగళూరులో మకాం వేసి మంత్రులు, ఎంఎల్‌ఏలతో చర్చలు జరిపారు. అంతకు ముందు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రి నియంత పోకడల మీద గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాశారు. పర్యాటక శాఖ మంత్రి సిపి యోగేశ్వర్‌ స్వయంగా ముఖ్యమంత్రి మీద ధ్వజమెత్తారు.ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. మంత్రులను పార్టీ గానీ, ముఖ్యమంత్రిగానీ ఇంతవరకు ఎలాంటి సంజాయిషీ కోరలేదు. ముఖ్యమంత్రి మార్పు గురించి డిమాండ్లు వస్తుండటంతో యడియూరప్పకు మద్దతుగా 65 మంది సంతకాలు చేసినట్లు సిఎం రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌ఏ రేణుకాచార్య ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు శాసనసభా పక్ష సమావేశం జరపాలని కొందరు ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేసిన నేపధ్యంలో సంతకాల కార్యక్రమం చేపట్టారు.

గతంలో యడియూరప్ప మార్పు గురించి అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో తాజాగా మే రెండవ తేదీ తరువాత ఎప్పుడైనా ఆయన ఉద్యోగం ఊడుతుందని చెప్పారు. ” సూర్యుడు-చంద్రుడు ఉన్నంత వరకు యడియూరప్ప ముఖ్యమంత్రగా ఉంటారని కొందరు చెబుతున్నారు.అదెలా సాధ్యం, 2023లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటారా ? 75 సంవత్సరాల వయోపరిమితి నిబంధన వర్తించదా ? ఇప్పటికే రెండు సంవత్సరాల బోనస్‌ పొందారు. అందుకుగాను పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలి, ఏప్రిల్‌ 17 తరువాత స్వచ్చందంగా వైదొలగాలి, మే రెండవ తేదీ తరువాత మార్పు ఏ రోజైనా మార్పు జరగనుంది. ఉత్తర కర్ణాటక నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ” అని సీనియర్‌ బిజెపి ఎంఎల్‌ఏ బసన్‌గౌడ పాటిల్‌ ఏప్రిల్లో విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్‌ 17న బెలగామ్‌ లోక్‌సభ, బసవకల్యాన్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌, మే రెండవ తేదీన ఫలితాల ప్రకటన గనుక ఆ తేదీలను బసవన గౌడ ప్రకటించారు. అంతకు ముందు ఇలాంటి ప్రకటనలే చేసినందుకు సంజాయిషీ లేఖ ఇచ్చినప్పటికీ వెనక్కు తగ్గకుండా బహిరంగ దాడికి దిగారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు, బదిలీల మాఫియా గురించి, హైకోర్టు మందలింపుల గురించి పార్టీ అధిష్టానానికి తెలుసు అని కూడా గుర్తు చేశారు.పక్షం రోజుల క్రితం కూడా బసన్‌గౌడ తన దాడిని కొనసాగించారు.ముఖ్యమంత్రిని మార్చటం తధ్యం, ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయం, కర్ణాటకలో పార్టీ బతకాలంటే బయటకు పంపేయాల్సిందే అన్నారు.


అందరికీ తెలిసిన అంశం కుక్క తోకను ఆడిస్తుంది తప్ప తోక కుక్కను ఆడించదు. కానీ కర్ణాటకలో రెండోదే జరుగుతోంది. యడియూరప్పే పార్టీని నిర్దేశిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత జరిగింది అదే. అంతకు ముందు బళ్లారి ఇనుప ఖనిజం కుంభకోణంలో యడియూరప్ప ప్రమేయం కారణంగా 2011లో ముఖ్యమంత్రి పదవి నుంచి కేంద్ర పార్టీ తొలగించింది. దాంతో బయటికి వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు, బిజెపి ఓటమే ధ్యేయంగా పని చేశారు. 2013 ఎన్నికల్లో అదే జరిగింది. తరువాత యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు, పూర్తి అధికారాలు ఇచ్చారు. 2014లో నరేంద్రమోడీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన తరువాత మిత్ర పక్ష పార్టీల పట్ల, అదే విధంగా రాష్ట్రాల్లో బిజెపి వ్యవహారాల్లోనూ మోడీ-షా ద్వయం మాటకు తిరుగులేకుండా పోయింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారానికి అవసరమైన సీట్లు తగ్గాయి. కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది. తరువాత అసలు కథ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల గురించి బిజెపి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా అధికార కూటమిలోని ఎంఎల్‌ఏలకు ఎరవేయకుండా యడియూరప్పను అధిష్టానం నివారించలేకపోయింది. ఆయన చెప్పినట్లు తలాడించకతప్పలేదు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిరాయింపు ఎంఎల్‌ఏలకు సీట్లు ఇవ్వటం గురించి పార్టీలో వ్యతిరేకత వెల్లడైనా యడియూరప్ప మాటే చెల్లుబాటైంది. మంత్రివర్గంలో తన అనుచరులకే పెద్ద పీటవేశారు.

ఆర్ధిక రంగం, కరోనా నిరోధంలో నరేంద్రమోడీ వైఫల్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపధ్యంలోనే యడియూరప్పను తొలగించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపి ప్రత్యర్ధులు పావులు కదిపారు. దాని మీద ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్య నరేంద్రమోడీని ఉద్దేశించే అన్నది స్పష్టం. జూన్‌ మొదటి వారంలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు స్పందించారు.” నేను ఎవరినీ విమర్శించను, నాకు ప్రత్యామ్నాయం లేరంటే నేను అంగీకరించను, ప్రత్యామ్నాయ వ్యక్తులు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎల్లవేళలా ఉంటారు, నాకు ఎలాంటి గందరగోళమూ లేదు, హైమాండ్‌ నాకు అవకాశం ఇచ్చింది, నాశక్తికి మించి పని చేస్తున్నాను. మిగిలిందంతా అధిష్టానమే చూసుకుంటుంది. వారి విశ్వాసం ఉన్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా.” అన్నారు.
దక్షిణ భారత్‌లో ఉన్న ఒక్క కర్ణాటకలో కూడా కాషాయ జెండా ఎగరకపోయినా ఫరవాలేదు, యడియూరప్పను తొలగించాల్సిందే అనుకుంటే తప్ప నాయకత్వమార్పిడి జరిగే అవకాశాలు లేవు. ప్రత్యర్ధుల మీద మాదిరి ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యుల లేదా ఆశ్రితుల అక్రమ సంపాదనల మీద దాడులు చేసినా, కేసులు నమోదు చేసినా పోయేది పార్టీ పరువే. ఇప్పటికీ ముఖ్యమంత్రి, కుటుంబసభ్యుల మీద కేసులు పరిష్కారం కాలేదు. సెక్స్‌ కుంభకోణంలో ఇప్పటికే ఉద్యోగం పొగొట్టుకున్న మంత్రి రమేష్‌ జర్కిహౌలికి యడియూరప్ప పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఒక భూమి డీనోటిఫికేషన్‌ వ్యవహారంలో యడియూరప్ప ప్రమేయం ఉందనే ఫిర్యాదులు రావటంతో ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశించింది. జెడిఎస్‌ ఎంఎల్‌ఏ కుమారుడిని డబ్బు, మంత్రిపదవితో ప్రలోభపెట్టారంటూ 2019లో యడియూరప్పమీద దాఖలైన కేసు ఇంకా ఉంది.ఇలాంటివి అనేక ఆరోపణలు ఉన్నా చలించటం లేదు.


యడియూరప్ప మీద తిరుగుబాటును సమర్ధిస్తే కలిగే లాభనష్టాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మదింపు వేస్తున్నట్లు వార్తలు. లింగాయత్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్ల అంశం ఎటూ తేలటం లేదు. యడియూరప్ప ఆ సామాజిక తరగతిలో ఒక కులానికి చెందిన వ్యక్తి. ఒక వేళ ముఖ్యమంత్రిపదవి నుంచి తొలగిస్తే మరొక బలమైన సామాజిక తరగతి మీద ఆధారపడాల్సి ఉంటుందన్నది ఒక ఆలోచన. అలాంటపుడు కురుబల మీద ఆధారపడాల్సి వస్తుందని, అందువల్లనే ఆ సామాజిక తరగతికి చెందిన మంత్రి ఈశ్వరప్పతో ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగురవేయించారన్నది ఒక అభిప్రాయం. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలలో ఆరితేరిన యడియూరప్ప అంత తేలికగా లొంగబోరని చెబుతున్నారు. ప్రస్తుతం 224 సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి ఉన్న బలం 119 మాత్రమే. అంటే కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి గెలిచిన వారు దూరమైనా ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు. తనతో పాటు కనీసం 30-35 మందిని యడియూరప్ప తీసుకుపోగలరని భావిస్తున్నారు. ఒక వేళ జెడిఎస్‌తో మిగిలిన బిజెపి సభ్యులు చేతులు కలిపినా ప్రయోజనం ఉండదు. నరేంద్రమోడీ పేరుతో ఓట్లడిగి బీహార్‌లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడినా అసోంలో పెద్ద మెజారిటీ రాలేదు, పశ్చిమబెంగాల్లో అనూహ్య ఓటమి నేపధ్యంలో కర్ణాటకలో మోడీ బొమ్మను చూపి ఓట్లడిగే పరిస్ధితిలో బిజెపి ఉందా అంటే అనుమానమే. తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, షా వంటి పెద్దలు ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటా మిగతా చోట్ల మాదిరే ఓట్లు తగ్గాయి.

కుల రాజకీయాలు నడుస్తున్నంత కాలం ఎడియూరప్ప తన సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. దానికి తోడు ఐక్యంగా పనిచేసే కుటుంబం కూడా ఉంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారందరూ ఐక్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీపాలు చక్కపెట్టుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. కుటుంబపాలన గురించి అనేక చోట్ల బిజెపి పెద్ద కబుర్లు చెబుతుంది, ఆ పేరుతో ఓట్లు దండుకుంది. కానీ కర్ణాటకలో అసలు అలాంటిదేమీ లేదన్నట్లుగా ఉంటుంది. పెద్ద కుమార్తె పద్మావతి యడియూరప్ప ఇంట్లోనే ఉంటారు, ఆయన అధికారిక పర్యటనలను కూడా ఖరారు చేస్తారు. రెండవ కుమార్తె అరుణాదేవీ అఖిల భారత వీరశైవ మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలు. మూడవ కుమార్తె ” కుటుంబ వ్యాపారాలను ” చూసుకుంటారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర షివమొగ్గ లోక్‌సభ సభ్యుడు. కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రెండవ కుమారుడు విజయేంద్రకు ఎలాంటి పదవులు లేకపోయినా సూపర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌-జెడిఎస్‌ల నుంచి రెండు సంవత్సరాల క్రితం ఎంఎల్‌ఏల కొనుగోలులో ప్రధాన పాత్రధారి అని చెబుతారు.తనను ముఖ్యమంత్రిగా తొలగిస్తే విజయేంద్రను వారసుడిగా అంగీకరిస్తే యడియూరప్ప ఏ క్షణంలో అయినా వైదొలుగుతారు. వచ్చే ఎన్నికల్లో విజయేంద్ర మైసూరు జిల్లా వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ముందే ప్రకటించేశారు. బిజెపిలో కుమ్ములాటలకు ఇదే మూలం.


కర్ణాటక బిజెపిలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎవరి ప్రయోజనాలు వారివి. ఆ పార్టీ వ్యవహారాలు చూసినపుడు యడియూరప్ప కొరకరాని కొయ్య. ఆయన చుట్టూ పార్టీ నడవాలి తప్ప పార్టీ చెప్పినట్లు నడిచే తత్వం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. యడియూరప్ప లేకపోతే అదీ ఉండదు, వారికి కావాల్సింది అధికారం, విలువలు-వలువలతో పనిలేదు కనుక బిజెపి కేంద్ర పెద్దలు కూడా ఇప్పటికైతే చేయగలిగింది లేదు. నేను గాని ఈలవేస్తే అనే పరిస్దితి లేదు. కానీ అదే యడియూరప్ప ఈల వేస్తే బిజెపి ఖాతా నుంచి కర్ణాటక అవుట్‌ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగి కొనసాగితే బిజెపి అదృష్ట యోగం 50 సీట్లే : కేంద్ర ఇంటిలిజెన్స్‌ హెచ్చరిక !

17 Thursday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CM Yogi Adityanath, Modi vs Yogi, Narendra Modi, RSS, UP Politics


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్‌. నాలుగు సంవత్సరాలు గడిచే సరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు సూచించినట్లుగా వార్తలు రావటం విశేషం. అబ్బే అదేమీ లేదు, అంతా సజావుగా ఉంది అని చెప్పుకున్నా అది నష్ట నివారణ చర్య తప్ప మరొకటి కాదు. బిజెపి వంటి పార్టీలలో అలాంటి మార్పులు జరపాల్సి వచ్చినా దాని తీరే వేరుగా ఉంటుంది గనుక సమస్య పూర్తిగా ముగిసింది అని చెప్పలేము. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ, హౌం మంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలతో యోగి భేటీ అయ్యారు. ఎందుకు ఆ సమావేశం జరిగిందో, ఒక్కరే వచ్చి ఏమి చర్చించారో బయటకు తెలియదు. పైకి చెబుతున్నది మాత్రం మర్యాదపూర్వక కలయిక, మార్గదర్శనం కోసం అని. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. ఒకటి మాత్రం స్పష్టం, యోగి సర్కార్‌ వైఫల్యాలు, పార్టీనేతలతో పాటు వివిధ తరగతుల్లో అసంతృప్తి, కరోనా వైఫల్యం, రైతాంగ ఉద్యమం వంటి అంశాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ముప్పు తెస్తాయనే ఆందోళన పార్టీ పెద్దల్లో ఉంది. కేంద్ర గూఢచార శాఖ ఇటీవల జరిపిన సర్వేలో యోగి నాయకత్వంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపికి 403కు గాను 50 మించి రావని తేలినట్లు చెబుతున్నారు. అదే తాజా పరిణామాలకు మూలంగా భావిస్తున్నారు.

యోగీ తొలగింపు వార్తల వెనుక అసలేమీ లేదా అంటే చాలా ఉంది. మొదటిది నరేంద్రమోడీ ఇష్టనేతల్లో యోగి లేరు. అనివార్యమై అంగీకరించారు. గత ఎన్నికల్లోనే మనోజ్‌ సిన్హా అనే మాజీ కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు.నరేంద్రమోడీ మద్దతుదారు. నరేంద్రమోడీ వైఫల్యాల చర్చ వచ్చినపుడు నితిన్‌ గడ్కరీ ప్రత్యామ్నాయంగా పేరు ఎక్కువగా వినిపిస్తున్నది, పెద్ద రాష్ట్రం గనుక రాజనాధ్‌ సింగ్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. యోగి ఆదిత్యనాధ్‌ వీరి పట్ల మొగ్గుచూపుతున్నారు. రాజనాధ్‌ సింగ్‌-యోగి ఇద్దరూ ఠాకూర్‌ సామాజికతరగతికి చెందిన వారే. వారెప్పుడైనా తనకు విరోధులుగా మారతారనే అనుమానం నరేంద్రమోడీలో ఉంది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఘోరపరాజయం, కరోనా వైఫల్యాలపై చర్చ నేపధ్యంలో అనుమానం పెనుభూతమైందని వార్తలు. కరోనా విషయంలో యోగి వైఫల్యంతో మోడీ అనుకూలురకు మంచి అవకాశం వచ్చినందున దీన్ని వదులు కోకూడదని తమ వంతు యత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. యోగి కొరకరాని కొయ్యగా మారిన కారణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు లక్నో పర్యటన జరిపి పరిస్ధితిని మదింపు వేశారని చెబుతున్నారు. తరువాతనే యోగి ఆదిత్యనాధ్‌ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర నేతలను ఢిల్లీలో ” మర్యాద ” పూర్వకంగా కలిసి ” మార్గదర్శనాన్ని” అందుకున్నారు.


ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద అనుమానాలు తలెత్తటంతో సామాజిక సమీకరణలకు బిజెపి తెరలేపింది. ఉత్తర ప్రదేశ్‌లో సామాజికంగా 21శాతం మంది దళితులు ఉన్నారు. పన్నెండుశాతం మంది బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో వారు 20శాతం వరకు ఉన్నారు. యోగి సర్కార్‌ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి వారిలో మొదలైంది. దళితుల కంటే తమ వారు ఎక్కువ మంది హత్యలకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు ఒక బ్రాహణ నేతగా పేరున్న కాంగ్రెస్‌ ప్రముఖుడు జితిన్‌ ప్రసాదను బిజెపి వైపు ఆకర్షించటం వెనుక కథ ఇదే. హక్కుల కోసం పోరాడేందుకంటూ 2020 జూలైలో బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో జితిన్‌ ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న తమ సామాజిక తరగతికి సాయం చేసేందుకు టి-20 పేరుతో ప్రతి జిల్లాలోనూ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తరువాత ప్రకటించారు. యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత బ్రాహ్మణుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగినట్లు గతంలో జితిన్‌ ప్రసాద విమర్శించారు. ఇప్పుడు జితిన్‌ ప్రసాదను పార్టీలో చేర్చుకోవటం ద్వారా వారిని బుజ్జగించవచ్చన్నది బిజెపి ఎత్తుగడ.


పార్టీ రహిత ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి పెద్దలు జిల్లాపరిషత్‌ స్ధానాలకు తమ అభ్యర్ధులు వీరే అని ప్రకటించి చేతులు కాల్చుకున్నారు. వారిలో అత్యధికులు ఓడిపోయారు. దీనికి ఆదిత్యనాధే సూత్రధారి. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలో, రామాలయానికి శంకుస్దాపన చేసిన అయోధ్యలో కూడా ఓడిపోవటంతో నరేంద్రమోడీ పరువు కూడా పోయింది. అదే యోగి వ్యతిరేకులకు ఆయుధంగా మారింది. స్ధానిక సంస్దలలో ఓటమితో పాటు కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం, హైకోర్టు న్యాయమూర్తులతో చివాట్లు తినటం, అనేక చోట్ల ఆక్సిజన్‌ మరణాలు సంభవించటంతో తీవ్ర విమర్శలు, అసంతృప్తి వెల్లడైంది. వీటికి పరాకాష్టగా కరోనా మృతుల దేహాలను గంగానదిలో పారవేయటంతో బిజెపి పరువు గంగలో కలిసింది. గుజరాత్‌ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ నరేంద్రమోడీని దిగంబర రాజుగా వర్ణిస్తూ రాసిన కవిత్‌ వైరల్‌ కావటం తెలిసిందే. ఇన్ని జరిగిన తరువాత నష్ట నివారణ చర్యగా యుపిలో అంతా బాగుంది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయించి యోగి మరిన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. వాణిజ్య ప్రకటనలు, పాకేజ్‌ (డబ్బిచ్చి) వార్తలు, ఇంటర్వ్యూల వంటివి చేయించారు. పార్టీ ఢిల్లీ పెద్దల వ్యూహం మేరకు గుజరాత్‌ కాడర్‌గా పని చేస్తున్న యుపికి చెందిన ఆలిండియా అధికారి ఎకె శర్మ చేత రాజీనామా చేయించారు. ఎంఎల్‌సిగా నియమించి కాబినెట్‌లో చోటు కల్పించాలని ప్రతిపాదించారు. అయితే ఆదిత్యనాధ్‌ ఎంఎల్‌సి పదవిని ఇచ్చారు తప్ప మంత్రిమండలిలో చేర్చుకోలేదు, కనీసం శర్మను కలుసుకొనేందుకు కూడా నిరాకరించారని వార్తలు వచ్చాయి.

ప్రధాని తరువాత ఆదిత్యనాధ్‌ను ప్రధాన ప్రచారకుడిగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి పంపారు. ఇప్పుడు మరోసారి అసలు యుపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఓటర్ల ముందుంచుతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్‌, బీహార్‌, హర్యానాల్లో మిత్రపక్షాలు ఉన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. అసోంలో మాత్రమే గట్టెక్కింది. యుపిలో బలమైన మిత్రపక్షం కూడా బిజెపికి లేదు. అనేక చోట్ల హిందూత్వ తురుపుముక్క పని చేయలేదు, యుపిలో కూడా అదే పునరావృతం అవుతుందేమో అన్న అనుమానాలు సంఘపరివార్‌లో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఓబిసి, షెడ్యూలు కులాలకు చెందిన వారు తమను ఉపయోగించుకొని వదిలేశారనే భావంతో ఉన్నారు. చిన్న పార్టీలే అయినప్పటికీ మిత్ర పక్షాలు అసంతృప్తితో ఉన్నాయి.భారతీయ సమాజ్‌ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. బిజెపి మునిగిపోయే నావ దానిలో ఎవరైనా ఎక్కాలనుకుంటే వారిష్టం, నేను మాత్రం ఎక్కను అని ఆ పార్టీ నేత నేత ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగుతులను వాడుకొని వదిలేస్తున్నారని, నాలుగున్నర సంవత్సరాలలో తమకు చేసిన వాగ్దానం దేన్నీ అమలు జరపలేదన్నారు. బిజెపిని ఓడించేందుకు తాముప్రయత్నిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అప్నాదళ్‌ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక ముక్క సమాజవాదితో చేతులు కలిపేందుకు నిర్ణయించుకుంది. మరో ముక్క కేంద్రంలో తమకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని బేరం పెట్టింది. నిషాద్‌ పార్టీ కూడా ఇదే విధంగా బేరం పెట్టింది, పదవులు ఇవ్వకపోతే సమాజవాది పార్టీ వైపు చేరతామనే సంకేతాలు ఆ పార్టీలు ఇస్తున్నాయి.


ఈ పార్టీల బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని వాటితో నిమిత్తం లేకుండా హిందూత్వ అజెండాతో తిరిగి విజయం సాధిస్తామనే అభిప్రాయంతో యోగి ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు చెప్పేది వినకుండా తనకు నమ్మకస్తులైన అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసగా అసెంబ్లీలోనే 2019లోనే 200 మంది ఎంఎల్‌ఏలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన ఉదంతం తెలిసిందే. బిజెపికి చెందిన నందకిషోర్‌ గుర్జార్‌ తమ జిల్లా అధికారయంత్రాంగం, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం పట్ల నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బిజెపి ఎంఎల్‌ఏలతో సహా రెండు వందల మంది వివిధ పార్టీలకు చెందిన వారు మూడు గంటల పాటు సభలో ధర్నా జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు అవినేతి కేంద్రాలుగా మారాయని కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సమక్షంలోనే ఒక మాజీ ఎంఎల్‌ఏ చెప్పిన మాటలను ఎంఎల్‌ఏలు, నేతలు అందరూ అభినందించిన ఉదంతం ఈ ఏడాది మార్చినెలలో జరిగింది. రైతు ఉద్యమం పట్ల యోగి సర్కార్‌ అనుసరించిన వైఖరి ముఖ్యంగా రాకేష్‌ తికాయత్‌ను అరెస్టు చేసేందుకు చేసిన యత్నం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సంచలనమైంది, తికాయత్‌ జాతీయ నేతను చేసింది.రైతు ఉద్యమం బలపడింది. యోగి ఆదిత్యనాధ్‌ జన్మదినాన్ని నిరుద్యోగదినంగా జరపాలని ఇచ్చిన పిలుపు పెద్ద చర్చనీయాంశమైంది.ఉద్యోగులు, టీచర్లలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది.


ఎన్నికలకు కొద్ది నెలల ముందు యోగిని మార్చటం చిన్న విషయం కాదని బిజెపి పెద్దలకు అర్దమైంది. గతంలో బిజెపితో ఉంటూనే హిందూ యువవాహిని పేరుతో తనదైన దళాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ మెడలు వంచిన ఉదంతాలు ఉన్నాయి. తనకు అధికారం వచ్చిన తరువాత దాన్ని వదిలేశారు. అయినప్పటికీ హిందూత్వకు ప్రతీకగా యోగి ఉన్నందున ఆయనను మారిస్తే ఎలా అన్న గుంజాటన కూడా ఉంది. ఆ ప్రాతిపదికన ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాతో ముందుకు పోవాలంటే యోగి లేకుండా కష్టం అని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, పెద్ద రాష్ట్రమైన యుపి మీద ప్రయోగాలకు పూనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఏదైతే అది అవుతుందన్న తెగింపుతో కేంద్ర బిజెపి పెద్దలకు అవగతం అయి ఉండాలి. అయితే పూర్తిగా పగ్గాలు యోగికే ఇస్తారా అన్నది సందేహమే. యోగికి ఒక సందేశం పంపారు, సూచన చేశారు. గతంలో మాదిరి నరేంద్రమోడీ తిరుగులేని నేతగా ఉంటే అదొక దారి, ఇప్పుడు వైఫల్యాల బాటలో ఉన్నందున యోగి వంటి వారు ఒక పట్టాన అంగీకరిస్తారని చెప్పలేము. ఎందుకంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్‌ చేజారితే అది రాజకీయంగా బిజెపికి కోలుకోలేని దెబ్బ.యోగి మార్పు గురించి చర్చ ప్రారంభమైంది గనుక కొనసాగిస్తే బిజెపిలో, ఆర్‌ఎస్‌ఎస్‌లో నరేంద్రమోడీ పలుకుబడి కోల్పోయినట్లుగా పార్టీలోనే కాదు, దేశ వ్యాపితంగా సందేశం వెళుతుంది. తొలగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు యోగి కానసాగితే నష్టం-మార్చినా యుపిలో గెలుపు కష్టం అన్నట్లుగా ఉంది. నష్టం కంటే కష్టాన్ని ఎలాగోలా అధిగమిద్దాం అని భావించారా ? పరిస్ధితిని మరింత మదింపు వేసేందుకు సమయం తీసుకుంటున్నారా ? అయోధ్య రామజన్మభూమిని పరిష్కరించాం అనే ప్రచారం చేసుకొనేందుకు ఒక అవకాశం ఉంది. యోగి మీద వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా రానున్న రోజుల్లో వారణాసిలోని గ్యానవాపి మసీదు వివాదాన్ని, మధురలో షాహీమసీదు సమస్యను ముందుకు తేవటం ద్వారా దాన్ని అధిగమించి విజయం సాధించవచ్చా అనే మదింపులో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 2 ఇతరుల భుజాల మీద తుపాకితో చైనాను కాల్చాలని చూస్తున్న అమెరికా – జి7 47వ శిఖరాగ్ర సభ, !

14 Monday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

47th G7 Summit, China, G7, G7-India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడు ధనిక దేశాల (జి7) బృంద 47వ వార్షిక సమావేశం జూన్‌ 11-13 తేదీలలో బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌ సముద్రతీరంలోని కారన్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి భారత్‌,ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాను ఆహ్వానించారు. ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా అనేక అంశాల మీద తీర్మానాలు చేశారు, సంకల్పాలు చెప్పుకున్నారు. హడావుడి చేశారు. చైనా మీద జబ్బ చరచటం ఈ సమావేశాల ప్రత్యేకత. జి7కు భారత్‌ సహజ మిత్రదేశమని మన ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాలంద్వారా చేసిన ప్రసంగంలో చెప్పటం ద్వారా తామెటు ఉన్నదీ మరోసారి స్పష్టం చేశారు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత ధనిక దేశాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు( ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ) తమ ప్రయోజనాలను సక్రమంగా నెరవేర్చటం లేదనే అసంతృప్తి వాటిని ఏర్పాటు చేసిన దేశాల్లోనే తలెత్తింది. దాంతో వాటిని కొనసాగిస్తూనే తమ ప్రయత్నాలు తాము చేయాలనే లక్ష్యంతో 1973లో అమెరికా చొరవతో సన్నాహక సమావేశం జరిగింది. దానిలో అమెరికా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు.మీకు అభ్యంతరం లేకపోతే జపాన్ను కూడా కలుపుకుందాం అన్న అమెరికా ప్రతిపాదనకు మిగతా దేశాలు అంగీకరించటంతో జి5గా ప్రారంభమైంది.1975లో తొలిశిఖరాగ్ర సమావేశానికి ఇటలీని కూడా ఆహ్వానించారు.మరుసటి ఏడాది సమావేశంలో బృందంలో ఆంగ్లం మాట్లాడేవారు మరొకరు ఉంటే బాగుంటుందంటూ కెనడాను కూడా ఆహ్వానించాలని అమెరికా ప్రతిపాదించటంతో 1976 నాటికి జి7గా మారింది. ఈ బృంద సమావేశాలకు ఐరోపా యూనియన్ను శాశ్వత ఆహ్వానితురాలిగా నిర్ణయించారు. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత 1997లో రష్యాను జి7లోకి ఆహ్వానించి, జి8గా మార్చారు. 2014వరకు సభ్యురాలిగా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించటంతో అదే ఏడాది దాన్ని సస్పెండ్‌ చేశారు. 2018లో ఈ బృందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే 2020లో అమెరికా, ఇటలీ రెండు దేశాలూ తిరిగి రష్యాను చేర్చుకోవాలని చేసిన ప్రతిపాదనను మిగిలిన దేశాలు తిరస్కరించాయి. తమకసలు చేరాలనే ఆసక్తి లేదని రష్యా చెప్పేసింది. ఏ దేశంలో సమావేశం జరిగితే ఆ దేశం ఎవరిని కోరుకుంటే వారిని ఆహ్వానితులుగా పిలుస్తారు. మన దేశం పెద్ద మార్కెట్‌ గనుక ప్రతి దేశమూ ప్రతిసారీ మనలను ఆహ్వానిస్తున్నది.


జి7 మౌలికంగా సామ్రాజ్యవాద దేశాల కూటమి. వలసలుగా చేసుకోవటం ఇంకేమాత్రం కుదిరే అవకాశం లేకపోవటంతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ కూటమి దేశాలన్నీ రాజీకి వచ్చి దేశాలకు బదులు మార్కెట్‌ను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాటి మధ్య విబేధాలున్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే రష్యా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారి రంగంలోకి వచ్చిన తరువాత అది కూడా తన వాటా సంగతేమిటని డిమాండ్‌ చేసింది. ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకు సిద్దం కాదని ప్రధమ స్ధానంలో ఉండాలని కోరింది కనుకనే జి7 మొత్తంగా దాని మీద దాడికి దిగాయి. దాన్నుంచి తట్టుకొనేందుకు వర్గరీత్యా ఒకటి కాకున్నా ప్రస్తుతానికైతే చైనాతో కలసి ఎదిరించాలని రష్యా నిర్ణయించుకుంది. ఈ కూటమి దేశాలు మన దేశాన్ని కూడా వినియోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప తమ భాగస్వామిగా చేసుకొనేందుకు సిద్దం కావటం లేదు. బ్రెజిల్‌ పరిస్ధితీ అదే.

జి7 47వ సమావేశం ఆమోదించిన అంశాలను క్లుప్తంగా చూద్దాం. వీటిలో రెండు రకాలు, ఒకటి రాజకీయ పరమైనవి, రెండవది ఆర్ధిక, ఇతర అంశాలు. మొదటిదాని సారం ఏమంటే అన్ని దేశాలు కలసి చైనా మెడలు వంచాలి, కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలి. గ్జిన్‌ జియాంగ్‌, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు, తైవాన్ను బెదిరిస్తున్నట్లు ప్రచారం చేయాలి, వత్తిడి తేవాలి. అర్ధిక అంశాలలో తప్పుడు పద్దతులకు పాల్పడుతున్నని ఊదరగొట్టాలి. రెండవ తరగతిలో కంపెనీలు పన్ను ఎగ్గొట్టేందుకు పన్నుల స్వర్గాలుగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నందున కార్పొరేట్‌ పన్ను కనీసంగా 15శాతం విధించాలని పేర్కొన్నాయి. పేద దేశాలకు వందకోట్ల డోసుల కరోనా వాక్సిన్‌ అందించాలి. అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ధికి తోడ్పడాలి.దానిలో భాగంగా బి3డబ్యు పధకాన్ని అమలు చేయాలి.


ఈ బృందంలో ఒకటైన బ్రిటన్‌ మన దేశాన్ని వలసగా చేసుకొని మన మూల్గులను పీల్చింది. మనం ఎదగాల్సినంతగా ఎదగకపోవటానికి అది కూడా ఒక కారణం. అదే విధంగా మిగిలిన దేశాలు కూడా అలాంటి చరిత్ర కలిగినవే. అలాంటి వాటికి మన దేశం సహజ బంధువు అని చెప్పటం అసలు సిసలు దేశభక్తుడిని అని చెప్పుకొనే నరేంద్రమోడీ చెప్పటం విశేషం. మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అది విరుద్దం. సంఘపరివార్‌ దానిలో భాగం కాదు కనుక ఆ స్ఫూర్తితో దానికి పనిలేదు. ఆ కూటమి దేశాలతో వాణిజ్య లావాదేవీలు జరపటం వేరు, వాటికి సహజ మిత్రులం అని చెప్పుకోవటం తగనిపని. అణచివేసినవారు-అణిచివేతకు గురైన వారు సంబంధీకులు ఎలా అవుతారు? జి7 కూటమి దేశాల పాలకవర్గాల చరిత్ర అంతా ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం లేదా అణచివేతకు మద్దతు ఇచ్చిందే తప్ప మరొకటి కాదు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవారసుడైన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా సమావేశాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చైనా వంటి నియంతృత్వ దేశం కంటే తమ కూటమి పేద దేశాలకు మంచి స్నేహితురాలని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు చైనా ఉనికిలో లేకముందు ఆ దేశాల చరిత్ర ఏమిటో లోకానికి తెలియదా ? పులిమేకతోలు కప్పుకున్నంత మాత్రాన సాధు జంతువు అవుతుందా ?

నలుగురు కూర్చుని ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో గతించాయని జి7 కూటమి గ్రహిస్తే మంచిదని చైనా తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికన నిజమైన ఉమ్మడి లక్ష్యంతో మాత్రమే నిర్మాణం జరగాలని పేర్కొన్నది. దేశాలు చిన్నవా – పెద్దవా, బలమైనవా – బలహీనమైనవా పేద-ధనికా అన్నది కాదు అన్నీ సమానమైనవే, వ్యవహారాలన్నీ అన్ని దేశాలు సంప్రదింపులతో నిర్ణయం కావాల్సిందే. ఏదైనా ఒక పద్దతి అంటూ ఉంటే అది ఐరాస వ్యవస్ధ ప్రాతిపదికనే తప్ప కొన్ని దేశాలు నిర్ణయించేది కాదు అని స్పష్టం చేసింది. ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న కూటమి ఇది. మరో మూడు సంవత్సరాల్లో ఐదు దశాబ్దాలు నిండనున్నాయి. ఈ కాలంలో ఈ కూటమి తన సమస్యలనే పరిష్కరించుకోలేకపోయింది, ఇక పేద దేశాల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? కరోనా విషయంలో ఇవన్నీ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యక్షంగా చూశాము. కరోనాను అదుపు చేయటమే గాక ఆర్ధికంగా పురోగమిస్తున్న చైనా మరింత బలపడుతుందన్న దుగ్ద, దాన్ని అడ్డుకోవాలన్నది తప్ప మరొకటి ఈ సమావేశాల్లో వ్యక్తం కాలేదు.


ఒక వైపు అమెరికాలో ఉన్న వాక్సిన్లు సకాలంలో వినియోగంచకు మురిగిపోతున్నాయనే వార్తలు మరోవైపు ప్రపంచాన్ని ఆదుకుంటామనే గంభీర ప్రకటనలు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడోసును కూడా అమెరికా ఇతర దేశాలకు ఇవ్వలేదు. వాటి తయారీకి అవసరమైన ముడిసరకులు, పరికరాల ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తూనే ఉంది. చైనా బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పేరుతో తలపెట్టిన ప్రాజెక్టుల అమలుకు ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ పధకాన్ని 2049లో కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ వందవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నిజానికి ఇలాంటి పధకాలను ఏ దేశం లేదా కొన్ని దేశాల బృందం ప్రారంభించటానికి ఎలాంటి ఆటంకం లేదు. చైనా చెప్పేది అమలు జరిగేనే పెట్టేనా అని నిర్లక్ష్యం చేసిన దేశాలు దాని పురోగమనాన్నిచూసి ఎనిమిది సంవత్సరాల తరువాత దానికి పోటీగా ఇప్పుడు బి3డబ్ల్యు (బిల్డ్‌ బాక్‌ బెటర్‌ వరల్డ్‌ )పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని ప్రతిపాదించాయి. మంచిదే, అభివృద్దిలో పోటీ పడటం కంటే కావాల్సింది ఏముంది.


బ్రిటన్‌ సమావేశాల్లో జి7 ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రస్తుతం చైనాతో యుద్దానికి సిద్దంగా లేదన్నది స్పష్టం. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నది. అయితే మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న యుద్దం ముగిసింది, విజేతలం మేమే అని ప్రకటించుకున్న తరువాత ఇప్పటి వరకు అమెరికన్లు తమ మిలిటరీ మీద 19లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో చైనా ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా. అయినప్పటికీ అమెరికా యుద్దాన్ని కోరుకోవటం లేదని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా ఏ ఒక్క యుద్దంలోనూ చిన్న దేశాల మీద కూడా విజయం సాధించలేదు, అలాంటిది చైనాతో తలపడే అవకాశాలు లేవన్నది వారి వాదన. అయితే ఉక్రోషం పట్టలేక తెగించి అలాంటి పిచ్చిపనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చైనా గనుక పూనుకుంటే అడ్డుపడే అమెరికా మిలిటరీని పనికిరాకుండా చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతకాలం అమెరికా అనుసరించిన మిలిటరీ ఎత్తుగడలు దానికి పెద్ద భారంగా మారాయి.అందువల్లనే నాటో ఖర్చును ఐరోపా దేశాలే భరించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు పోటీగా భారత్‌ను తీర్చి దిద్దుతామనే బిస్కట్లు వేసి ముగ్గులోకి దించి మన దేశం కేంద్రంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. ఇన్ని దశాబ్దాల నాటో కూటమితో ఐరోపా బావుకున్నదేమిటో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అమెరికన్లు యుద్దాన్ని కూడా లాభనష్టాల లెక్కల్లో చూస్తారు. 1986లో అమెరికా దళాల చర్యలు, నిర్వహణకు పెంటగన్‌ (రక్షణ) బడ్జెట్‌లో 28శాతం ఖర్చు అయ్యేది, ఇప్పుడది 41శాతానికి పెరిగింది, ఆయుధాల కొనుగోలు కంటే ఇది రెండు రెట్లకంటే ఎక్కువ.

అమెరికా మిలిటరీ బడ్జెట్‌, ఆయుధాలతో పోలిస్తే చైనా బలం తక్కువే అని వేరే చెప్పనవసరం లేదు. వేల మైళ్ల దూరం నుంచి అమెరికా వచ్చి యుద్దం చేయాలన్నా లేదా దానికి ముందు చైనా చుట్టూ తన దళాలను మోహరించాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కానీ చైనాకు అలాంటి అదనపు ఖర్చు, ప్రయాస ఉండదు. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ చేతులెత్తేసిన తరువాత అణుబాంబులు వేసి భయపెట్టింది అమెరికా. ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికాను ఎదిరించే ఇరాన్‌, సిరియా వంటి దేశాలు, సాయుధశక్తుల వద్ద ఉన్న ఆయుధాలు అంతగొప్పవేమీ కాదు, అలాంటి వారి మీద అమెరికా అత్యంత అధునాతన ఆయుధాలను ప్రయోగించి చూడండి మా ప్రతాపం అంటున్నది. అది చైనా విషయంలో కుదిరేది కాదు. నిజంగా చైనాతో యుద్దమంటూ వస్తే అది ఒక్క దక్షిణ చైనా సముద్రానికే పరిమితం కాదు.కరోనా నేపధ్యంలో వైరస్‌ పేరుతో అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న ప్రచార యుద్దంతో జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అది వాస్తవ యుద్దంలో అంత తేలిక కాదు. సాధ్యమైన మేరకు అదిరించి బెదిరించి తన పబ్బంగడుపుకొనేందుకే అమెరికా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.తాజా జి7 సమావేశాలను కూడా అందుకే వినియోగించుకుంది. అమెరికాను నమ్ముకొని తాయత్తులు కట్టుకొని ముందుకు దూకిన దేశాలకు చైనా చుక్కలు చూపుతుందని ఇప్పటికే కొన్ని ఉదంతాలు వెల్లడించాయి.మన దేశం వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తుందా ? దుస్సాహసం, దుందుడుకు చర్యలకు మొగ్గుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి -1 వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకు మరో వివాదం : మోడీపై చైనా అనుమానం !

13 Sunday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ 1 Comment

Tags

anti china, Anti China Propaganda, Indo-China trade, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఘర్షణ జరిగి ఏడాది గడిచింది. మనవైపు 20 మంది మరణించగా తమవారు నలుగురు చనిపోయినట్లు చైనా చెప్పింది. అది ఒక బాధాకరమైన, అవాంఛనీయ ఉదంతం. సాధారణ పరిస్ధితులను పునర్దురించాలని ఇరుదేశాలూ సంకల్పం ప్రకటించాయి, చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయినా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తొలగలేదు. అందుకే ఉభయులూ కొన్ని చోట్ల బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకున్నా, పూర్తిగా వైదొలగలేదు. చైనా వైపు నుంచి బలగాలను మోహరిస్తున్నారని మన మీడియాలో, మనమూ అదే పని చేస్తున్నామని చైనా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఏడాది గడచిన సందర్భంగా ప్రపంచ మీడియాలోనూ దాని గురించి రాశారు.

బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రిక జూన్‌ ఎనిమిదవ తేదీన రాసిన వార్తలో కొత్త వివాదాలు తలెత్తుతాయనే భయంతో భారత్‌ సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పటిష్ట పరుస్తున్నదని పేర్కొన్నది. వేసవి కాలం వచ్చినందున రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే పెద్ద ముప్పు ఉన్నట్లు రష్యా పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ఈ పత్రికల వార్తలను ప్రస్తావిస్తూ అనేక పత్రికలు విశ్లేషణలు రాశాయి.కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించవచ్చని చైనా విశ్లేషకులు చెప్పిన అంశాలను చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ ప్రచురించింది. ” యుద్దం రాదు, అయితే 2020 మేనెలలో సంక్షోభం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంది, ఉభయపక్షాలూ పోరుకు ఎంతో సన్నద్దంగా ఉన్నాయి ” అని ఆసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు అర్జన్‌ తారాపోర్‌ చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ రాసింది. కరోనా మహమ్మారి, ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారితే సరిహద్దుల్లో భారత్‌ మరో ఘర్షణకు పాల్పడవచ్చని షాంఘైలోని సామాజిక అధ్యయనాల సంస్ధ అంతర్జాతీయ సంబంధాల విభాగపు పరిశోధకుడు హు ఝియాంగ్‌ చెప్పారు.దేశీయంగా సంక్షోభం ఉన్నపుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ సరిహద్దు సమస్యలవైపు చూసే రాజకీయ సంప్రదాయం భారత్‌కు ఉందని, ఈ విషయమై చైనా చాలా జాగ్రత్తగా ఉండాలని హు చెప్పాడు.

ఎక్కువ భాగం సైన్యాలను రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి. హాట్‌స్ప్రింగ్స్‌, డెస్పాంగ్‌ మైదానాల వంటివాటి నుంచి ఇంకా జరగాల్సి ఉందని సింఘువా విశ్వవిద్యాలయంలోని జాతీయ వ్యూహ సంస్ధ డైరెక్టర్‌ క్వియాన్‌ ఫెంగ్‌ చెప్పారు.సరిహద్దు వెంబడి చైనా మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయి,అయినప్పటికీ ముందు పీఠీన అక్కడ ఎక్కువ దళాలు లేవు, రెండవ వరుసలో బలాలను మోహరించాల్సి ఉందని క్వియాన్‌ చెప్పారు. వివాదం చిన్నదే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే సరిహద్దులో పరిస్దితి ఎంతో మెరుగ్గా ఉంది, అయితే ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగితే రెండు దేశాల మిలిటరీ మధ్య సంబంధాలకు, పశ్చిమ సరిహద్దులో స్ధిరత్వానికి ముప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు. సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో చైనా తన దళాలం సంఖ్యను పెంచిందని కొన్ని వార్తలు సూచించాయి. భారత-చైనా నేతలు జనాలకు జవాబుదారీ కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగలరని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించాడు. మే నెలలో జరిగిన కీలక ఎన్నికలలో ఓటమి తరువాత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి వచ్చే ఎన్నికల్లో మద్దతు పొందాలని చూస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు.

రెండు దేశాల సైన్యాల ఉపసంహరణకు రెండు రోజుల ముందు చైనా నుంచి బెదిరింపులు ఉన్నందున ఇండో – పసిఫిక్‌ అవగాహనను మరింత పటిష్టపరుచుకోవాల్సిఉందని ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అంగీకరించినట్లు ప్రకటించారు.ఇరు దేశాల సంబంధాలు చౌరాస్తాలో ఉన్నాయి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం సహకారం గురించి ఆలోచించలేమని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మేనెలలో వ్యాఖ్యానించారు. పరిస్ధితి ఇలా ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి-మే మాసాల మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డాలర్ల విలువలో చూస్తే 70.1శాతం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 64.1 పెరిగితే, భారత్‌ నుంచి చైనా దిగుమతుల 90.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 86.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. తిరిగి అమెరికాను వెనక్కు నెట్టేసి మన దేశం చైనాతో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించింది. ఈ ఏడాది తొలి ఐదునెలల్లో 48.16బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు చైనా కస్టమ్స్‌శాఖ వద్ద జూన్‌ ఏడవ తేదీనాటికి నమోదైన వివరాలు వెల్లడించాయి. గతేడాది జరిగిన సరిహద్దు వివాదాలు చాలా వరకు వెనక్కు పోయినట్లు అసాధారణ వాణిజ్య లావాదేవీలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో చైనా 63 బిలియన్‌ డాలర్ల మేరకు మిగుల్లో ఉంటే 2020-21లో అది 44 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.మన ఎగుమతులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.


ఒక వైపు చైనాను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పడిన చతుష్టయ బృందంలో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా,మన దేశం ఉన్నప్పటికీ మరోవైపున వాణిజ్యంలో మన దేశం చైనాతో ప్రధమ స్దానంలో ఉంది. వాణిజ్యం గురించి చర్చిందేందుకు మేము సిద్దమే అని ఆస్ట్రేలియా ప్రకటించింది. అమెరికా వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు వాణిజ్యానికి లంకె పెట్టవద్దని చైనా చెబుతున్నది. అయితే చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా మన శత్రువు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒకవైపున ప్రచారంతో జనాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మరోవైపు అదే చైనా నుంచి వస్తువుల దిగుమతులు, లాభాలతో వాణిజ్యవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ సంతుష్టులను గావిస్తున్నారు. టెలికామ్‌ రంగంలో ఐదవ తరం ఫోన్లను ప్రవేశపెట్టేందుకు చౌకగా ఉండే చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించి అధిక ఖర్చుతో కూడిన అమెరికా, ఐరోపాల వైపు మన దేశం చూస్తున్నది. అదే జరిగితే సెల్‌ఫోన్‌ ఛార్జీలు ఇంకా పెరుగుతాయి.
బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి)లో మన దేశం ఒక వాటాదారు. చైనాకు దానిలో 30.34శాతం వాటాలు ఉండగా మన దేశం 8.52, రష్యా 6.66శాతంతో రెండు, మూడు స్ధానాలలో ఉన్నాయి. చైనా వద్దుగానీ దాని డబ్బు ముద్దు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ బ్యాంకులో మనమూ వాటాదారులమే గనుక సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ రుణం తీసుకుంటే తప్పేముందని మన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడిబి), ప్రపంచబ్యాంకు వంటి సంస్దల నుంచి రుణాలు తీసుకుంటే ఆ పధకాలకు సభ్యదేశాల కంపెనీలన్నీ టెండర్లు వేసి పాల్గొనేందుకు హక్కును కలిగి ఉంటాయి. గతేడాది ఏడిబి రుణంతో చేపట్టిన రైల్వే ప్రాజక్టులలో చైనా కంపెనీలను అనుమతించవద్దని కొందరు పెద్ద వివాదం సృష్టించిన విషయం తెలిసినదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భవిష్యత్‌ కోసమే మోడీ చమురు బాదుడా – తల్లికి కూడు పెట్టని వారు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తారా !

12 Saturday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP’s trolling army, India oil bonds, India oil Tax, Narendra Modi Failures, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


మన జనాల సహనానికి (బి పాజిటివ్‌ వైఖరి) ముందుగా శతకోటి నమస్కారాలు చెప్పక తప్పదు. భరతమాత ఆమెను పక్కకు నెట్టేసి పెత్తనం చేస్తున్న గోమాత మహత్తులో, నరేంద్రమోడీ గమ్మత్తులో గానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధిరంగా ఉన్న చమురు ధరలు అదేమిటో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచీ పెరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాల్లో చమురు ధరల పెంపు ఉద్యమాలకు దారితీసి పాలకులను గడగడలాడించింది, వెనక్కు తగ్గేట్లు చేసింది. మన జనం సహనంతో ఇంతగా సహకరిస్తున్నా ఖాతరు చేయటం లేదు. జనాన్ని వెర్రివెంగళప్పలుగా భావిస్తున్నారు కొందరు, అయినా భరిస్తున్నాం, మన మీద మనకే జాలి వేస్తోంది కదా ! సామాజిక మాధ్యమాల్లో కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఊరూ పేరూ లేకుండా కొన్ని పోస్టులు తిప్పుతున్నారు. భవిష్యత్‌ కోసమే నరేంద్రమోడీ చమురు బాదుడు కొనసాగిస్తున్నారంటూ రంగుల కలను చూపుతూ జనాన్ని తప్పుదారి పట్టించే పోస్టు ఒకటి తిరుగుతోంది. దాని మంచి చెడ్డలను, ముఖ్య అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించుదాం.


” మీ చుట్టూ జరుగుతున్న మార్పులను మీరు నిశితంగా గమనిస్తే, ఇది అందరి వల్ల కాదు. మోడీ ప్రభుత్వం మీ కోసం మరియు మీ సౌలభ్యం కోసం ఏమి మన భవిష్యత్‌ తరాల కోసం ఏమి చేస్తుందో మీకు అర్థం అవుతుంది.”
ఏ పాలకులైనా వర్తమాన, భవిష్యత్‌ తరాలకోసమే తప్ప గతించిన వారికోసం చేయరు. వర్తమానం వాస్తవం, భవిష్యత్‌ ఆశ. అందువలన ఇప్పుడు ఏమి చేస్తున్నారనేది కీలకం. జనాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మోడీ ఇంకా కొనసాగుతున్నారు గనుక ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది, ఏమి చేస్తున్నదీ చెప్పకుండా పిట్టల దొర లేదా తుపాకీ రాముడి కబుర్ల వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు తల్లికి కూడు పెట్టని వాడు రేపు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తానంటే నమ్మగలమా ? పది రూపాయల నుంచి 33 రూపాయలకు పెంచిన చమురు ఎక్సయిజు పన్ను నిర్వాకం గురించి చెప్పతరమా ? దేశమంతటికీ ఉచితంగా వాక్సిన్లు వేయించేందుకు సిద్దపడని పెద్దలు పెద్దలు మహమ్మారి నివారణ, నిరోధానికి ఉపయోగపడే పరికరాలు, వాక్సిన్లపై జిఎస్‌టి ఎత్తివేసేందుకు గీచిగీచి బేరాలాడుతున్నారు. అలాంటి వారు డబ్బుదా(దో)చి రాబోయే వారికి ఖర్చు చేస్తారంటే నమ్మాలట !

గతంలో బిజెపి పెద్దలు చేసిన హడావుడి గురించి మరిచిపోతే ఎలా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలపై మన చుట్టూ చాలా మంది హడావిడి చేస్తారు ఎందుకంటే వారికి భారత్‌ భవిష్యత్‌ ఎలా. వున్నా ఈ పుట గడిస్తే చాలు సరే ఆ విషయాలు పక్కన పెడితే…”
ఇదొక తప్పుడు ప్రచారం ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో స్మృతి ఇరానీ సిలిండర్లు వేసుకొని చేసిన ప్రదర్శనలు, బిజెపి నేతలు చేసిన ఆర్భాటాలూ జనానికి తెలుసు. కాస్త ఓపిక తెచ్చుకొని గూగులమ్మను కోరుకుంటే వాటన్నింటినీ భక్తా ఇంద అంటూ వారి నాటకాల చిత్రాలు, వార్తలను మన ముందు ప్రత్యక్షం చేస్తుంది. మోడీ అనుచరుల బండారాన్ని బయటపెడుతుంది. గతంలో ఆందోళన చేసినపుడు ఈ పెద్దలకు భారత భవిష్యత్‌ గురించి తెలియదా లేక శ్రద్దలేదా ? పోనీ ఎందుకు ఆందోళన చేశారో అయినా చెప్పాలి. చిత్తశుది,్ద నిజాయితీ లేని రాతలు, ఆరోపణలు.

మోడీ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న రోజుల నుంచే శుభ్రమైన చమురు !

” ప్రస్తుతం ప్రపంచంలోనే పరిశుభ్రమైన యూరో 6 గ్రేడ్‌ పెట్రోల్‌ ఈ రోజు భారతదేశంలో దొరుకుతోంది.”
ఇది ఎలా ఉందంటే అరే పాతికేండ్ల క్రితం నువ్వు పుట్టినపుడు చాలా చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఎత్తు, బరువు పెరిగావో గ్రేట్‌ కదా అన్నట్లుంది. పుట్టినోళ్లు ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటారు ! పెట్రోలు, డీజిలు వాడకం పెరుగుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నందున ప్రతి దేశం, ప్రతి ఖండం దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇదేదో నరేంద్రమోడీతోనే దేశంలో ప్రారంభమైందన్నట్లుగా నమ్మబలుకుతున్నారు. ఆ పెద్దమనిషి నిక్కర్లు వేసుకొని(ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా) తిరుగుతున్న రోజుల్లోనే అంటే 1990దశకంలోనే ఇంధన శుద్ధి కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. 1994లో ఢిల్లీ, ముంబై, కొల్‌కతా, చెన్నరు నగరాల్లో తక్కువ సీసం ఉండే పెట్రోలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సీసం, గంధకం వంటి వాటిని తగ్గించటానికి, తొలగించటానికి మన చమురు శుద్ది కర్మాగారాల్లో మార్పులు చేసుకోవాలి, దానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ఇప్పటికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలు 95వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అన్నింటికీ మించి అలాంటి చమురును వాడే విధంగా వాహనతయారీదారులు కూడా ఇంజన్లలో మార్పులు చేయాలి.ఇవన్నీ మంత్రదండాలతో జరిగేవి కాదు.యూరో-3కు సమానమైన భారత్‌-3 రకం చమురు 2010 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఆరో గ్రేడ్‌కు వచ్చాము. ఇది మనవంటి అన్ని దేశాల్లోనూ ఉంది. ఇది నరేంద్రమోడీ గొప్ప అని చెబితే జనాలకు దేనితో నవ్వాలో అర్ధం కావటం లేదు. ఏ గ్రేడ్‌ అయినా దాని ఉత్పత్తి ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసేదే తప్ప రాయితీలేమీ లేవు కదా. దాన్ని బట్టే ఉత్పాదక ఖర్చు నిర్ణయిస్తున్నారు. పోనీ చమురు సంస్దలకు ప్రభుత్వం 95వేల కోట్లు ఇస్తే అది మోడీగారి ఘనత అని చెప్పుకుంటే అర్ధం ఉంది. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జనం సొమ్ముతో మోడీకి ప్రచారం అంటే ఇదే.

ముందేం మాట్లాడుతున్నారో తరువాతే చెబుతున్నారో స్పృహ ఉందా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌పై మొత్తం పన్నులో 71% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది, కేంద్రానికి 29% మాత్రమే లభిస్తుంది.”
తిమ్మిని బమ్మిని చేయటంలో కాషాయ దళాలకు మించిన మాయగాండ్లు మరొకరు లేరు. సముద్రాలున్నయన్న దగ్గర ఎడారి ఉంటుంది. ఏడు సంవత్సరాల మోడీ ఏలుబడిలో పెట్రోలు మీద లీటరుకు రు.10.38 నుంచి రు. 32.98( రెండు వందల శాతం)డీజిలు మీద రు.4.58 నుంచి రు.31.83 (600శాతం) పెంచింది. రాష్ట్రాలు పెంచిన మొత్తం ఈకాలంలోనే 60, 68శాతాలకు అటూ ఇటూగా ఉన్నాయి తప్ప ఎక్కడా వందల రెట్లు పెరగలేదు. కేంద్రం పెంచిన దానిలో ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 41శాతం తిరిగి రాష్ట్రాలకు బదలాయిస్తారు, అందువలన మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటాయే ఎక్కువ అని వాదిస్తారు. ఇక్కడే అసలు మోసం ఉంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి ఏలుబడిలోనే ఉన్నాయి కదా ? ఎన్ని రాష్ట్రాలు, ఎంత మొత్తం పన్నుతగ్గించాయో ఎవరినైనా చెప్పమనండి. కేంద్రం ఎక్సయిజ్‌ పేరుతో విధించే పన్నులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్సయిజ్‌, రెండవది సెస్‌. మొదటిదానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది. సర్‌ఛార్జీలు, సెస్‌లో ఉండదు.
ఇలాంటి జిమ్మిక్కుల కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి , రోడ్లను ఉపయోగించినందుకు టోలు పన్ను వసూలుకూ నాంది పలికారు. మన దగ్గర నుంచి వసూలు రోడ్లు వేసి మన చేతనే పన్ను కట్టిస్తున్నారు. ఎంత మోసం ?
ప్రస్తుతం ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది.

” మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సరఫరాను వేగవంతం చేయటానికి మొబైల్‌ రీఫిల్లింగ్‌ యూనిట్‌ నడుస్తోంది. ”
వీటితో జనానికి ఒరిగేదేమిటి ? జొమాటో, స్వీగ్గీ వంటి కంపెనీల ద్వారా తెప్పించుకొనే ఆహారానికి ఎక్కువ వెల చెల్లించాలి. అలాగే వీటికీ అదనంగా సేవా రుసుము చెల్లించాలి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో గతంలో కిరోసిన్‌ డీలర్లు చిన్న పీపాల్లో తెచ్చి వినియోగదార్లకు అందించేవారు. ఇది అలాంటిది కాదు, కనీసం రెండు వందల లీటర్లు, అంతకు మించి ఆర్డరు పెట్టిన వారికే అందచేస్తారు, అందుకు ఛార్జీ వసూలు చేస్తారు. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమా ?

” ఇవే కాకుండా, కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పదవీకాలంలో తీసుకున్న 2026 నాటికి చెల్లించవలసి ఉన్న 2.48 లక్షల కోట్ల ఆయిల్‌ బాండ్‌ రుణం కూడా మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ”

ఇది హిమాలయమంత పచ్చి అబద్దం, జనాన్ని మోసపుచ్చే వ్యవహారం. ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. 2010వరకు అంతకు ముందున్న వాజ్‌పారుతో సహా ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయి. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది వక్రీకరణ. వినియోగదారుల మీద వడ్డించే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరో విధంగా చెప్పాలంటే గతంలో వినియోగదారులు పొందిన సబ్సిడీ మొత్తాలను ఇప్పుడు వారి నుంచి మోడీ సర్కార్‌ తిరిగి వసూలు చేస్తోంది. లేదూ మంత్రి చెప్పిందే నిజమైతే, అప్పు తీరింది కదా పన్ను ఎందుకు తగ్గించటం లేదు ? అసత్యాలను చెప్పటంలో కాషాయ దళం ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ?పన్నులు పెంచకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని ఒకసారి అంటారు, సరిహద్దు రక్షణకు పన్నులేయకపోతే ఎలా అని మరోసారి సెంటిమెంట్‌ రెచ్చగొడతారు. ఇవన్నీ మోడీ పాలనలోనే కొత్తగా వచ్చిన సమస్యలా ?


” పెట్రోల్‌ లో 2025 నాటికి 20% దేశీయ ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 5 లేదా 10 సంవత్సరాల్లో, హైబ్రిడ్‌ వాహనాలు అందుబాటులో రానున్నాయి, ఇవి 100% పెట్రోల్‌, డీజిల్‌, ఇథనాల్‌, సిఎన్జి మరియు బ్యాటరీపై నడుస్తాయి.


సాధారణ పెట్రోల్‌ బుంకుల వద్ద ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా విద్యుత్‌ రహదారిని నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాలలో, రోడ్‌ రైల్‌ ట్రక్కులు కూడా భారతదేశ రహదారులపై పరుగులెత్తనున్నాయి. ఎల్‌పిజి గ్యాస్‌ను దేశవ్యాప్తంగా ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా అందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. డీజిల్‌ ట్రాక్టర్‌ను సిఎన్‌జి ట్రాక్టర్‌గా మార్చడానికి కిట్‌ వచ్చింది. దీంతో డీజిల్‌ కోసం ఖర్చు చేసే రైతులకు వేల రూపాయల ఆదా అవుతుంది. హైడ్రోజన్‌ ఇంధన బ్యాటరీలు మరియు అల్యూమినియం ఎయిర్‌ బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై భారతదేశంలో వేగంగా పరిశోధన మరియు అభివ ద్ధి జరుగుతోంది. ఇది కొత్త భారత్‌ యొక్క భవిష్యత్తు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆగమనంతో, మనము క్రమంగా పెట్రోల్‌ మరియు డీజిల్‌పై ఆధారపడవలసిన అవసరం వుండదు. రాబోయే పదేళ్లలో ఇవన్నీ జరగబోతున్నాయి.ఇవన్నీ మన సౌలభ్యం కోసం భవిష్యత్‌ కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇందనాల పై వస్తున్న కేంద్ర 29% పన్నుల ద్వారా మౌలిక సదుపాయాల అభివ ద్ధి, సైనిక దళాల ఆధునీకరణ సశక్తికరణ సాధికారత మొదలైన వాటిపై ఖర్చు జరుగుతున్నాయి. ”

ఇవన్నీ చేస్తున్నాం, చేయబోతున్నాం కనుక జనం మీద ఎంత పన్ను భారం మోపినా నోరు మూసుకొని చెల్లించాలి అని చెప్పటమే. రాజీవ్‌ గాంధీ దేశాన్ని కొత్తశతాబ్దంలోకి తీసుకు పోబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్‌ 2020 అన్నారు. కేబుల్‌ టీవీ రాక ముందు విదేశాల్లో చూసివచ్చి సెటప్‌బాక్సుల గురించి వాటి ద్వారా కొన్ని వందల ఛానళ్లు రావటం గురించి కథకథలుగా చెప్పారు. అందువలన నవీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరున్నా లేకపోయినా ఆగేది కాదు. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు. అవన్నీ ఎక్కడా కానరావటం లేదు గనుక ఇప్పుడు కొత్త కహానీలు వినిపిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d