• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

సామాన్యులే కాదు, కార్పొరేట్ల సంపాదనా తగ్గింది!

12 Friday Apr 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Commoners, India elections 2019, India Inc's earnings, Modi era

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ తొలి రోజుల్లో విమానాల్లో విహరించి గత ప్రధానుల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. విదేశాల వారికి మన పేదరికం లేదా పిసినారితనం ఎక్కడ కనపడుతోందో అని దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రతిపక్షాల విమర్శలను కూడా దిగమించి ఖరీదైన సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగారు, విదేశీ అతిధులు వచ్చినపుడు వారితో సమంగా వ్యవహరించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా విదేశీయులు మన దగ్గర వస్తువులన తయారు చేయించుకొనేందుకు ఎగబడే విధంగా చేయటం కోసమే అని బిజెపి నేతలందరూ సమర్ధించారు. ఐదేండ్ల పాలన తరువాత అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్‌ సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక వార్తను విడుదల చేసింది.

అసాధ్యం అనుకున్న వాటిని అయిదేండ్లలో సుసాధ్యం చేశానని ఎన్నికల ప్రచారంలో వూరూ వాడా ప్రచారం చేస్తున్నారు. తాను తీసుకున్న చర్యలన్నీ దేశంలో వర్తక,వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి కోసమే అని తద్వారా వుపాధి పెరుగుతుందని నరేంద్రమోడీ నాయకత్వం చెబితే జనం ఎలాంటి శషభిషలు లేకుండా నమ్మారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం రోజుల తరబడి తమ సొమ్మును తామే తీసుకొనేందుకు బ్యాంకుల ముందు రోజుల తరబడి నిలబడి ప్రదర్శించిన దేశ భక్తిని చూశాము. రాష్ట్రాల అమ్మకపు పన్ను అధికారాన్ని తొలగించి జిఎస్‌టి అంటే దానికీ సై అన్నారు. అయితే రాయిటర్స్‌ వార్త సారాంశం ఏమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య అనుకూల అజెండా ఎక్కువ కార్పొరేట్‌ సంస్ధల లాభాల పెరుగుదల ప్రతిబింబించటంలో విఫలమైంది. అయినా మదుపుదారుల్లో ఇంకా ఆశచావలేదు. వడ్డీ రేట్లు గణనీయంగా పడిపోయాయి. చిన్న మదుపుదార్లకు అవకాశాలు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మాడీ మార్కెట్లను వుత్సాహంతో వుంచారు అని అలాట్‌ మెంట్‌ కాపిటల్‌ అధికారి కృష్‌ సుబ్రమణ్యం చెప్పారు.

మోడీ తిరిగి ప్రధానిగా వస్తారనే ఆశలతో విదేశీ మదుపుదారులు వుత్సాహంతో వున్నారు.గతేడాది జనవరి-మార్చినెలల్లో 4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితే ఈ ఏడాది ఆ మొత్తం 6.7బిలియన్లకు పెరిగింది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిఫ్టీ 63శాతం పెరిగితే ఈ ఏడాది ఇంతవరకు ఏడు శాతం పెరిగింది. స్వల్ప మెజారిటీతో బిజెపి తిరిగి అధికారానికి వస్తుందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఒక వేళ మోడీ తిరిగి రాకపోతే కొంత మేర నీరసం ఆవహిస్తుందని యుబిఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఛోఛోరియా అన్నారు. ఆర్జన లేకుండానే స్టాక్‌ మార్కెట్‌ పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 399 కంపెనీల వివరాలను విశ్లేషించినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఐదేండ్ల పాలనలో ఒక ఏడాది పడిపోతే మోడీ హయాంలో ఐదేండ్లలో నాలుగేండ్లు పడిపోయాయి.

రీఫినిటివ్‌ అనే సంస్ధ సేకరించిన సమచారాన్ని విశ్లేషిస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా 11.94% ఆర్జన పెరగ్గా మోడీ హయాంలో అది 3.72%కు పడిపోయింది.పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదలను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో నిప్టీ 500 సూచిక కంపెనీల లాభం జిడిపిలో 2.8శాతం వుందని అది గత పదిహేను సంవత్సరాలలో కనిష్టమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. 2014లో మోడీ అధికారంలోకి రాగానే భారత ఆర్ధిక రూపురేఖలనే మార్చివేస్తారన్న ఆశాభావం వుండేది, అయితే ఆశించిన వేగంగా అభివృద్ధి లేకపోయినప్పటికీ సంస్కరణలు తమకు ప్రయోజనం చేకూర్చుతాయని పెట్టుబడిదారులు ఇంకా ఆశాభావంతో వున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సాంప్రదాయకంగా రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్లకు బదులు మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌కు మళ్లారు. మోడీ హయాంలో నిఫ్టీ 75శాతం పెరిగింది. అయితే అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలో ప్రతి ఐదేండ్లకు ఆ పెరుగుదల వందశాతం చొప్పున వుంది. అంటే మోడీ పాలన ఈ విషయంలో కూడా వెనుకపడే వుంది.

గతం కంటే ఆర్జన తక్కువగా వున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచిక పెరిగింది అంటే దాని అర్ధం కంపెనీల విలువలు ఎక్కువగా వుండటమే. స్టాక్‌ మార్కెట్‌ పరిభాషలో నిఫ్టీ 500 సూచిక కంపెనీలలో సగటు పియి గత ఐదు సంవత్సరాలలో 18 వుంది. అదే అంతకు ముందు ప్రభుత్వ హయాంలో 14.22 మాత్రమే. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు.ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక రూపాయి ఆర్జించాలనుకుంటే గత ఐదు సంవత్సరాలలో 18 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే అంతకు ముందు రూ. 14.22 మాత్రమే పెట్టారు. ఏది లాభమో వేరే చెప్పనవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించటం ఎన్నికల ముందు బిజెపికి ఒక ఎదురుదెబ్బ అనవచ్చు.పాకిస్ధాన్‌ అభివృద్ధి రేటును తగ్గించటం కొన్ని రాజకీయ పక్షాలకు వూరట కలిగిస్తే, ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు పెంచటం మింగుడు పడని విషయం అనవచ్చు. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన అభివృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న.

ఇక మన దేశంలో అనేక మంది అభివృద్ధి విషయంలో చైనా కంటే మనం ముందున్నామని పోల్చుకుంటారు. కానీ మిగతా విషయాలకు వచ్చే సరికి అబ్బే అది కమ్యూనిస్టు నియంతృత్వం మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం, దానికి దీనికి పోలిక పెట్టకూడదంటారు. ఈ ఏడాది దాని అభివృద్ధి 6.2 నుంచి 6.3శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. డిసెంబరులో 4.9శాతంగా వున్న నిరుద్యోగ రేటు జనవరిలో 5.3శాతానికి పెరిగింది. అభివృద్ధి రేటు పెరగనున్నందున నిరుద్యోగశాతం తగ్గనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నందిగ్రామ్‌లో తిరిగి ఎగిరిన ఎర్రజెండా !

09 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CPI(M), Nandigram, West Bengal Lok sabha Elections 2019

Image result for nandigram, cpi(m)

ఎం కోటేశ్వరరావు

నందిగ్రామ్‌, పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన పేరు, ప్రాంతం. భూసేకరణకు వ్యతిరేకంగా అక్కడ జరిగిన వుదంతాల కారణంగా అప్పటికే సిపిఎం పాలనపై వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న మమతాబెనర్జీ కమ్యూనిస్టులను గద్దె దింపి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల క్రితం రెండవ సారి కూడా గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో పన్నెండు సంవత్సరాల తరువాత గత ఆదివారం నాడు తిరిగి సిపిఎం తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఆక్రమించుకోవటం, కార్యకర్తలను నివాస ప్రాంతాల నుంచి వేలాది మందిని తరిమివేసినట్లు గతంలో పలుసార్లు సిపిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లోని సిపిఎం కార్యాలయం సుకుమార్‌ సేన్‌ గుప్తా భవనం గత పది సంవత్సరాలుగా మూతపడి వుంది. ఆదివారం నాడు కార్యాలయ ప్రారంభంతో పాటు తమ్లుక్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్ధి ఇబ్రహీం ఆలీకి మద్దతుగా పెద్ద ప్రదర్శన కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీనేత రబిన్‌దేవ్‌ మాట్లాడుతూ ఒకనాడు వామపక్ష వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా వున్న చోట తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించటానికి కారణం తృణమూల్‌ కాంగ్రెస్‌ దుష్పరిపాలనను గమనించిన జనం తిరిగి తమవైపు రావటమే కారణం అన్నారు.

అయితే తృణమూల్‌ వ్యతిరేకులందరూ తమ వైపు వచ్చిన కారణంగా ప్రతిపక్ష ఓట్లలో చీలిక తెచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ వారే సిపిఎంతో కుమ్మక్కై పార్టీ కార్యాలయ ప్రారంభానికి అవకాశమిచ్చారని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌ దాస్‌ ఆరోపించారు. దీన్ని తృణమూల్‌ అభ్యర్ధి దివ్యేందు అధికారి తోసి పుచ్చారు. బిజెపి పగటి కలలు కంటున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, మావోయిస్టు తదితర సిపిఎం వ్యతిరేకశక్తులన్నీ రైతులకు మద్దతు ఇచ్చి ఆందోళన చేయించాయి. ఆసందర్భంగా జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తరువాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ ప్రతిపక్షాలు హింసాకాండను కొనసాగించాయి.

ఈ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్‌ మధ్య పరస్పర పోటీ నివారించుకొనేందుకు జరిగిన చర్చలు విఫలం కావటంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నందిగ్రామ్‌ ప్రాంతం వున్న తమ్లుక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మార్చిచివరి వారంలో బిజెపి నుంచి చేరిన లక్ష్మన్‌ సేథ్‌ను ప్రకటించారు. సేథ్‌ గతంలో సిపిఎం తరఫున మూడుసార్లు ఎంపీగా పని చేసి నందిగ్రామ్‌ వుదంతం తరువాత పార్టీ నుంచి వుద్వాసనకు గురయ్యాడు. తరువాత బిజెపిలో చేరాడు, ఈ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలిపేది లేదని ఆ పార్టీ స్పష్టం చేయటంతో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరాడు. రాష్ట్ర కాంగ్రెస్‌ అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా అధిష్టానవర్గం అభ్యర్ధిత్వాన్ని ప్రటించింది. తాను చెప్పిన అభ్యంతరాన్ని ఖాతరు చేయలేదని పార్టీ కార్యకర్తలు తగినన సమాధానం చెబుతారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అబ్దుల్‌ మన్నన్‌ వ్యాఖ్యానించారు. తాము చేయగలిందేమీ లేదని పిసిసి అధ్యక్షుడు సోమేన్‌ మిత్రా అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు పార్టీలు పోటీలో వున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం 42 స్ధానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు స్ధానాలు మినహా 38 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటన పుంజుకుంటుందా, బిజెపి తన స్ధానాలను సంఖ్యను పెంచుకుంటుందా అన్నది ప్రధాన చర్చ నీయాంశంగా వుంది. పార్టీలన్నీ చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి.తృణమూల్‌ను పక్కకు నెట్టి వామపక్ష వ్యతిరేక శక్తిగా తాను ముందుకు రావాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘపరివార్‌ శక్తులు శ్రీరామనవమి, దుర్గాపూజ, వంటి మతపరమైన సందర్భాలన్నింటినీ వినియోగించుకొని ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు విమర్శలు వున్నాయి.

ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను అందుకు వేదికగా చేసుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన సభలను చూస్తే మోడీ పాల్గన్నది అత్యంత పేలవంగా వుంది, ఆ సభకోసం బిజెపి 32కోట్ల రూపాయలను ఖ ర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభకు రెండులక్షల మంది వరకు రాగా ఫిబ్రవరి మూడున వామపక్షాలు జరిపిన సభకు పదిలక్షల వరకు జనం హాజరయ్యారు. ఈ సభ వామపక్షాలలో ఎంతో ఆత్మస్ధైర్యాన్ని నింపింది.

నరేంద్రమోడీ ఒక వలస పక్షి వంటి వారు, ఎన్నికలపుడే వస్తారు, కాగానే వెళ్లిపోతారు, మాకు కావాల్సింది నిజమైన చౌకీదారు తప్ప మోసగాడు కాదు అని మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తుతున్నారు. తృణమూల్‌ శారద-నారద పార్టీ అని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. అయితే శారద-నారద- హవాలా లీడర్లందరూ ఇప్పుడు బిజెపి అవతారమెత్తారని మమతా బెనర్జీ తిప్పికొడుతున్నారు.

Image result for after 12 years red flags again unfurled in nandigram

గత పార్లమెంట్‌,అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాయిజం గురించి మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా పంచాయతీలన్నీ ఏక గ్రీవం అయ్యేట్లు చూశారన్న విమర్శలు వున్నాయి. ఎన్నికలు జరిగిన చోట్ల రిగ్గింగ్‌ చేశారు. అవినీతి కేసులు వున్న తృణమూల్‌ ఎంపీలు, నేతలు దాడుల భయంతో బిజెపికి ఫిరాయించారు. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్‌ వ్యతిరేక ఓట్లను పొందేందుకు వామపక్ష సంఘటన, బిజెపి, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. వామపక్ష సంఘటనలో సిపిఎం 29, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ, ఆర్‌ఎస్‌పి మూడేసి సీట్లుకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు సీట్లకు వామపక్ష సంఘటన అభ్యర్ధులను ప్రకటించలేదు.కాంగ్రస్‌ స్పందనను బట్టి వాటి మీద కూడా తాము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి. మొత్తం ఏడు దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల పరంగా చూస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ తరువాత వామపక్ష సంఘటనకే ఎక్కువ వున్నాయి. 2016లో వామపక్ష సంఘటన, కాంగ్రెస్‌ సర్దుబాట్లు చేసుకున్నాయి. అందువలన పొందిన ఓట్లు వాస్తవ బలాన్ని ప్రతిబింబించవు. ఆ సర్దుబాటును సిపిఎం కేంద్ర కమిటీ తప్పు పట్టింది. పార్టీ ఆమోదించిన విధానానికి వ్యతిరేకం అని పేర్కొన్నది.

2014లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

తృణమూల్‌    39.05     34

లెఫ్ట్‌ ఫ్రంట్‌     29.71     2

బిజెపి          17.02    2

కాంగ్రెస్‌         9.58      4

2016అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం సీట్లు

తృణమూల్‌   44.9    211

లెఫ్ట్‌ ఫ్రంట్‌    25 .8   30

సిపిఎం       19.8    26

సిపిఐ          1.5    1

ఆర్‌ఎస్‌పి       1.7    3

ఫార్వార్డ్‌బ్లాక్‌   2.8     2

బిజెపి        10.2    3

కాంగ్రెస్‌      12.3    44

ఇతరులు      0      4

Share this:

  • Tweet
  • More
Like Loading...

అద్వానీ వూడగొట్టిన నాగటి కర్రు ?

07 Sunday Apr 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP, L K Adavani, Lal Krishna Advani's recent blog, LK Advani Comment, Narendra Modi, Rhul Gandhi on Advani, RSS

Image result for Adavani  an useless entity  In BJP

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో పిలుపు ఇచ్చారు. బిజెపి అగ్రనాయకుడు ఎల్‌కె అద్వానీ ఇప్పుడు వూడగొట్టిన నాగటి కర్రు. అది నాగలికి వుంటేనే దున్నటానికి పనికి వస్తుంది. ఒట్టి కర్రుతో పొలం దున్నలేరు. తాను ఏమి మాట్లాడినా తనకు ఇంతకు మించి పోయేదేమీ లేదన్నట్లుగా తొమ్మిది పదులు దాటిన బిజెపి కురువ ద్ధుడు ఎల్‌కె అద్వానీ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా ! బిజెపిలో అంత ధైర్యమూ లేదు, ఎవరికీ అంతసీన్‌ లేదు. అందుకే వుక్రోషంతో తన బ్లాగ్‌లో తన అంతరంగం ద్వారా నరేంద్రమోడీ తీరు తెన్నులపై పరోక్షంగా ధ్వజమెత్తారని కొందరి అభిప్రాయం.

తన బ్లాగ్‌లో అద్వానీ విప్పిన అంతరంగ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. బిజెపిలో వున్న మనమందరం పార్టీ వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా వెనుకా, ముందూ చూసుకోవటం, ఆత్మపరిశీలన చేసుకోవటం మంచిది అని చెప్పారు. పార్టీలోపలా, విశాలమైన దేశ వ్యవస్ధలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడు కోవటం బిజెపి ప్రమాణ చిహ్నంగా వుండాలి.మన ద ష్టిలో జాతీయ వాదం అంటే రాజకీయంగా మనతో ఏకీభవించని వారిని మనం ఎన్నడూ జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు, వ్యక్తిగతంగా రాజకీయ స్దాయిలో వ్యక్తులు ఎంచుకొనే స్వేచ్చకు బిజెపి కట్టుబడి వుంటుంది. ముందు దేశం, తరువాత పార్టీ,మన గురించి చివరిగా ఆలోచించాలన్న సూత్రం తనకు జీవిత మార్గదర్శిగా వుందని, జీవితాంతం దానికి కట్టుబడి వుంటానని అద్వానీ పేర్కొన్నారు.

బిజెపి నిజమైన స్వభావాన్ని అద్వానీ గారు పక్కాగా చెప్పారు. దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివర వుండాలనే మార్గదర్శక మంత్రం బాగా తెలిసిందే. బిజెపి కార్యకర్తగా గర్వపడుతున్నాను మరియు ఎల్‌కె అద్వానీ వంటి గొప్పవారు దాన్ని మరింత బలపరిచారు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ద్వారా వ్యాఖ్యానించారు. అద్వానీ ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఆయనకు పోయేదేమీ లేదు అంటూ ఒక పత్రికలో వ్యాఖ్యానం మొదలైంది. అద్వానీకి నోరు విప్పటానికి ఐదేండ్లు పట్టింది, అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు అని బిజెపి మిత్రపక్షం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ప్రశ్నించింది.

Image result for Advani , modi in different occasions

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు కిసుక్కున నవ్వటం తగని పని అన్నట్లు అద్వానీ గురించి రాహుల్‌ గాంధీ చేసిన వాటి కంటే చౌకీదారు పంగనామాలు పెట్టుకున్న బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడిన రాహులు ఇలా అన్నారు.’ బిజెపి హిందూయిజం గురించి మాట్లాడుతుంది, హిందుస్దాన్‌లో గురువు అధిపతి. పార్టీ గురుశిష్య సంబంధాల గురించి మాట్లాడుతుంది. మోడీ గురువు ఎవరు? అద్వానీ, అద్వానీని ప్రజాజీవన వేదిక మీది నుంచి తోసివేశారు’ అన్నారు. గురువును అవమానించటం హిందూ సంస్క తి కాదంటూ నరేంద్రమోడీని వుద్దేశించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యా నించారు. హిందూ సంస్క తి గురించి మాట్లాడే హక్కు తమకే వుందని, పేటెంట్‌ తీసుకున్నామన్నట్లుగా చెప్పుకొంటుంది బిజెపి. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు హిందూత్వను హిందూత్వతోనే దెబ్బతీయాలి అన్నట్లుగా రాహుల్‌ గాంధీ మాట్లాడారా ? లేక తామూ హిందూ సంస్కృతి గురించి చెప్పగలమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లుగా వుంది. అదే హిందూ సంస్క తిలో గురువు తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన ఒక శిష్యుడి కోసం తనను పరోక్షంగా గురువుగా భావించిన మరొక శిష్యుడి బొటనవేలిని కానుకగా కోరిన దారుణం కూడా తెలిసిందే. దాని మంచి చెడ్డలను మరోసారి చూడవచ్చు.

Image result for Advani , modi in different occasions

అసలు విషయం ఏమంటే బిజెపి వ్యవస్దాపక నేతలలో ఒకరైన ఎల్‌కె అద్వానీ పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పటం మినహా మిగిలిన అవమానాలన్నీ జరిగాయి. వాటన్నింటినీ దిగమింగుతూ ఏప్రిల్‌ ఆరున బిజెపి వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా ఎవరూ కోరకుండానే పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు తన బ్లాగ్‌ ద్వారా అద్వానీ ఈనెల నాలుగు ఒక సందేశాన్ని పంపారు. గత ఐదు సంవత్సరాలలో ఒక బ్లాగ్‌ పోస్టు పెట్టటం ఇదే ప్రధమంట. నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ పేరుతో రేడియోలో ప్రతి నెలా తన అంతరంగాన్ని బయట పెడితే, అంతకు ముందే అద్వానీ తన ఇంటర్నెట్‌ బ్లాగ్‌లో తన అంతరంగాన్ని అభిప్రాయాల రూపంలో అప్పుడు రాస్తుండేవారు. ఏమి రాస్తే, ఏమి మాట్లాడితే ఎవరికేమి కోపం వస్తుందో అన్నట్లుగా గత ఐదేండ్లుగా బ్లాగులో రాయట మానుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా లోక్‌సభకు హాజరు కావటం, అలవెన్సులు తీసుకోవటం తప్ప ఒక్కసారి కూడా నోరు విప్పని సభ్యుల జాబితాలో ఆయన కూడా చేరిపోయారనే విమర్శలకు గురయ్యారు. ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం 365పదాలను మాత్రమే మాట్లాడారని, అది కూడా 2014లో అని ఇండియా టుడే పత్రిక పేర్కొన్నది, బహుశా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అయి వుండవచ్చు.

ఆరు సార్లు గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి ఎంపీగా వున్న అద్వానీని వయసు మీరిందనే సాకు చూపి ఈ సారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోగా ఆయనే పోటీ చేయటం లేదని చెప్పారంటూ బిజెపి నేతల నుంచి మీడియాకు వుప్పందించారు. ఈ చర్య ఆయనను అవమానించటంగా మీడియా, ప్రతిపక్షాలు వర్ణించాయి తప్ప బిజెపి ప్రముఖులెవరూ నోరు విప్పలేదు. రాహుల్‌ గారూ మీ మాటలు మమ్మల్ని ఎంతగానో గాయపరిచాయి, అద్వానీ మాకు బిజెపిలో తండ్రితో సమానుడు . మీ వుపన్యాసాల్లో కాస్త ఔచిత్యం ప్రదర్శించండి’ అని సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

నిజానికి రాహులు గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించారు గానీ నరేంద్రమోడీ గురువుకు పంగనామాలు పెట్టారని ఐదు సంవత్సరాల క్రితమే జనానికి అర్దమైంది. అనుమానాస్పద స్దితిలో జరిగిన గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మారణ కాండ సమయంలో నరేంద్రమోడీయే ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ప్రధానిగా వున్న వాజ్‌పేయి పదవి నుంచి తప్పుకోవాలని మోడీని ఆదేశించారని, అద్వానీ మద్దతుతో మోడీ తిరస్కరించి ముఖ్యమంత్రిగా కొనసాగారని, చేసేదేమీ లేక రాజధర్మం పాటించాలన్న వుద్బోధతో వాజ్‌పేయి సరిపెట్టారని అప్పుడే వార్తలు వచ్చాయి. నాడు అద్వానీ మద్దతు లేకపోతే నేడు ప్రధానిగా నరేంద్రమోడీని వూహించలేము.

ప్రధాని పదవిపై ముందునుంచీ కన్నేసిన నరేంద్రమోడీ పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి కోసం 2013లోనే పావులు కదిపి విజయం సాధించారు. ఆయన పేరును పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించగానే అద్వానీ మౌనంగా వుండటం తప్ప మరేమీ చేయలేని స్దితిలో పడ్డారు. అద్వానీకి పదవి నిరాకరించితే సమస్యలు వస్తాయని వూహించి 75 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని ఒక నిబంధను ముందుకు తెచ్చారు. దానికి అనుగుణంగా అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారితో మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామంటూ మండలి ఏర్పాటు గురించి ప్రకటించారు. అది ఐదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదు, నరేంద్రమోడీ సర్కార్‌ సలహా ఇమ్మని ఒక్కసారి కూడా కోరలేదు.ఇది పొమ్మన కుండా పొగపెట్టటమే అని అందరూ అప్పుడే వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని అస్త్రాలను నరేంద్రమోడీ ప్రయోగిస్తున్న దశలో అధికారం కోసం ఏం చేసినా తప్పులేదనే ఒక అభిప్రాయాన్ని దిగువ స్దాయి కేడర్‌ వరకు బిజెపి ఎక్కించింది. దేశంలో హిందూత్వ, హిందూ మతాన్ని కాపాడాలంటే నరేంద్రమోడీ తప్ప మరొకరి వల్ల కాదనే అభిప్రాయాలు నిత్యం సామాజిక మాధ్యమంలో వెల్లడి అవుతున్నాయంటే దాని అర్దం అదే. అందువలన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల గురించి బిజెపి కార్యకర్తలకు ఎంత మేరకు ఎక్కుతాయనేది ప్రశ్న. నరేంద్రమోడీ గోరక్షకులు హద్దులు మీరవద్దంటూ అనేక సుభాషితాలు పలికారు. అలా హద్దులు మీరి, హత్యలు చేసిన నిందితులు అనేక మంది వుత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న బిజెపి ఎన్నికల సభల్లో ముందువరుసల్లో కూర్చున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అలాంటి వారికి విద్వేషం వద్దు ప్రేమే ముద్దు అంటే ఎక్కుతుందా ?

భిన్నాభి ప్రాయం చెప్పిన వారందరినీ దేశద్రోహులుగా సంఘపరివార్‌ సంస్ధలూ, వాటికి వంత పాడిన మీడియా గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంచిత్రీకరిస్తోంది.గతంలో అనేక మంది ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేసి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని దేశం ఇంకా మరచి పోలేదు. ఇప్పుడు చెప్పిన మాటలను అద్వానీ అప్పుడు చెప్పివుంటే వాటికి ఎంతో విలువ వుండేది. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్ధలను, స్వతంత్ర అధికార వ్యవస్దలను నాశనం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వెలువడిన సమయంలో అద్వానీ ఎందుకు నోరు విప్పలేకపోయారు, పార్లమెంటులో ఒక్కసారి కూడా నోరు విప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు. నక్కబోయిన తరువాత బక్కపూడ్చినట్లు ఇప్పుడు చెప్పారు అనే వారిని తప్పు పట్టలేము. తనకు తిరిగి సీటు ఇచ్చి వుంటే ఇలా మాట్లాడేవారా అనే వారు కూడా లేకపోలేదు. దేశమంతటికీ ముఖ్యంగా బిజెపికి ఎన్నికల, మరోసారి అధికార జ్వరం తీవ్ర స్దితికి చేరిన సమయంలో చెబితే ఎంత మంది వినిపించుకుంటారు అన్నది ప్రశ్న.

దేశంలో అత్యవసర పరిస్దితి విధించి నాలుగు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా 2015లో అద్వానీ మాట్లాడుతూ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నలిపివేశే శక్తులు బలంగా వున్నాయని వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరుతో పశువుల వ్యాపారులు, మైనారిటీల మీద దాడులు ప్రారంభమైన సమయ మది. దేశంలో హిందూత్వ పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభమైనపుడే ఇలాంటి వాటిన్నింటికీ బీజాలు పడ్డాయి. అవి పెరిగి పెద్ద వ క్షాలుగా ఎదగటానికి తోడ్పడిన వారిలో అద్వానీ పాత్ర లేదా అని ప్రశ్నించే వారు లేకపోలేదు.1980లో బిబిసితో మాట్లాడుతూ బిజెపిని హిందూ పార్టీ అని పిలవటం తప్పేమీ కాదు అన్నారు. తరువాత కొన్ని సంవత్సరాలకు దేశ లౌకిక విధానం హిందువుల ఆకాంక్షలపై సహేతుకంగాని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. ఎవరైతే హిందువుల ప్రయోజనాలకోసం పోరాడతారో ఇక నుంచి వారే దేశాన్ని ఏలుతారు అన్నారు. కుహనా లౌకిక వాదం అనే పదాన్ని ప్రయోగించటం, ప్రాచుర్యంలోకి తేవటంలో అద్వానీ చేయాల్సిందంతా చేశారు.

Image result for Advani , modi in different occasions

అయితే అద్వానీకి అలా హితబోధ చేసే హక్కు లేదా అని ఎవరైనా అనవచ్చు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి వుద్బోధలు మోడీ, బిజెపికి హాని కలిగిస్తాయి కనుక అద్వానీ అయినా సరే అలా మాట్లాడటాన్ని సహించం అని హిందూత్వ పులినెక్కిన వారు హూంకరించవచ్చు. అద్వానీకి ఆ హక్కు, అవకాశం వుందని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే చరిత్ర నిర్దాక్షిణ్యమైనది. గాంధీని మోసిన రైలేే గాడ్సేను కూడా అనుమతించింది. అద్వానీ వుద్బోదధలను నమోదు చేసి సానుభూతి కలిగేట్లు చేసినట్లుగానే ఆయన విద్వేష పూరిత రాతలు, ప్రసంగాలను కూడా జనం ముందుంచి ఆయన మీద ద్వేషం, వ్యతిరేకతను కలిగేట్లు చేసింది.

ప్రస్తుతం మీడియాలో, జన వాడకంలో వున్న కుహనా లౌకిక వాదం అనే పదాన్ని వుపయోగించి హిందువుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ బహుళ ప్రచారం తెచ్చింది అద్వానీయే. ఆ పదం మరింత ముదిరి బిజెపి నేతలు,అనుచరులు లౌకికవాదులంటే దేశాన్ని ముక్కలు చేసే గాంగ్‌ అని నిందిస్తున్నది.1997 ఆగస్టులో బిజెపి టు డే అనే పత్రికలో అద్వానీ రాసిన దానిలో ఇలా వుంది.’ హిందుత్వ లేదా సాంస్క అతిక జాతీయ వాదం మతపరమైనది కాదు,(ముస్లింలు) రాముడు, క అష్ణుడు ఇతరులను జాతీయ సంస్క అతికి చిహ్నాలుగా అంగీకరించాలి మరియు అయోధ్యలో రామాలయానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే రాముడు భారత సంస్క అతి మరియు నాగరికతకు చిహ్నం’ అని రాశారు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

Image result for Advani , modi in different occasions

రధయాత్ర పేరుతో అద్వానీ దేశంలో ఎలాంటి రాజకీయాలకు తెరలేపారో, ఎంతటి మారణకాండకు ఆద్యుడయ్యారో తెలిసిందే. ఆయన కళ్ల ముందే బాబరీ మసీదు కూల్చివేత, దాన్ని ఆపేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. తనకు రాజకీయ భిక్షపెట్టిన అద్వానీని ప్రధాని నరేంద్రమోడీ విస్మరించారని, అవమానించారని అంటున్నారంటే వూరికే కాదు. 2008లో అద్వానీ తన ఆత్మకథను ప్రచురించారు.దానిలో ఇలా రాశారు.’ గోద్రాలో కరసేవకుల సామూహిక హత్యల అనంతరం గుజరాత్‌లో మతహింసాకాండ చెలరేగింది. ఆ దారుణమైన సంఘటన గురింఎతీ గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తీవ్ర ఖండనలకు గురయ్యారు. మోడీని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారు. నా అభిప్రాయంలో జరిగిన దానికంటే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నారు.’ అలావెనకేసుకు వచ్చిన పెద్దమనిషి ఇప్పుడు మోడీ చేశారని చెబుతున్నదానిని ఎలా ఖండించగలరు, ప్రత్యక్షంగా మోడీని ఎలా విమర్శించగలరు.

దేశంలో 1990దశకలో తలెత్తిన మత హింసాకాండకు అద్వానీ రధయాత్ర ఎంతగానో దోహదం చేసింది. బాబరీ మసీదు కూల్చివేత కుట్రలో అద్వానీ, మురళీ మనోహర జోషి, వుమా భారతి(బిజెపి లేదా నరేంద్రమోడీ పక్కన పెట్టిన జాబితాలోని వారు) తదితరుల ప్రమేయం గురించి రోజువారీ విచారణ జరిపి 2019 ఏప్రిల్‌ 19లోగా రెండు సంవత్సరా వ్యవధిలో పూర్తి చేయాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది.

బాబరీ మసీదుకు ముందు రామాలయం వుండేదని రుజువు అవుతుందని సంఘపరివార్‌ సంస్ధలు చెబుతుండేవి. అయితే క్రీస్తుపూర్వం పదకొండవ శతాబ్దిలో అయోధ్యలో మానవ ఆవాసాలు వున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని రామాయణ స్ధల ప్రాజెక్టు నివేదికలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఎస్‌ఐ) తెలిపింది. దాంతో రామాలయ వాదుల నోట్లో వెలక్కాయపడింది. సరిగ్గా ఆ సమయంలో అద్వానీ వారిని ఆదుకున్నారు. రాముడు ఒక నమ్మకం దానికి సాక్ష్యాలు ఎలా వెతుకుతారంటూ అద్వానీ వాదించారు.అప్పటి నుంచి కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు చెప్పలేవంటూ సంఘపరివార్‌ వాదించటం మొదలు పెట్టింది. అంటే కోర్టు తీర్పును తాము అంగీకరించేది లేదని చెప్పేందుకు వేసిన ప్రాతిపదిక ఇది. శబరిమల ఆలయంలో కూడా అదే వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయోధ్యలో రామాలయ నిర్మాణమే తమ లక్ష్యం అని చెప్పేవారు. దానికి సాంస్కృతిక జాతీయవాదాన్ని పైన చేర్చింది అద్వానీ మహాశయుడే అన్నది తెలిసిందే.

మసీదు కూల్చివేత కేసులో అద్వానీని ప్రభుత్వ సకల వసతి గృహంలో నిర్భందించారు. ఆ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన వ్యాసాలలో డిసెంబరు ఆరు తన జీవితంలో విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఇలా చెప్పటం మసీదును కూల్చివేసినందుకు క్షమాపణగా భావించవచ్చా అన్న ప్రశ్నకు కాదని సమాధానమిచ్చారు. తరువాత స్మృతులలో అద్వానీ మరొక కధనాన్ని వినిపించారు. బాబరీ మసీదు వద్ద చేరిన జనాన్ని అదుపు చేయటంలో విఫలమైనందుకు తాను విచారపడుతున్నానని,వ్యక్తిగతంగా తనకు పరువు నష్టమని, ఆ స్ధలంలోని కట్టడానికి ఎలాంటి నష్టం కలిగించకుండా నామ మాత్రంగా రామాలయ నిర్మాణ కార్యక్రమం చేపడతారని అనుకున్నానని పేర్కొన్నారు. కూల్చివేత పట్ల విచారం ప్రకటించినందుకు సంఘపరివార్‌లో, బయటి లౌకికవాదులు కూడా తనను విమర్శించారని, తన వ్యక్తిగత విశ్వసనీయత కరిగిపోయిందని చెప్పుకున్నారు.

Image result for Advani , modi in different occasions

అద్వానీ గళం అప్పుడేమైంది? భిన్నాభిప్రాయం కలిగినంత మాత్రాన వారిని జాతి వ్యతిరేకులు అనాల్సిన అవసరం లేదని అద్వానీ ఇప్పుడు అంటున్నారు. అసలు నోరు మూసుకోవటం కంటే ఎప్పుడో ఒకప్పుడు తెరవటం మంచిదే కదా అనే అరగ్లాసు సంతృప్తి జీవులుంటారు. ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి జరిగిన తరువాత మార్చిమూడవ తేదీన బీహార్‌లో మోడీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాని వారందరినీ పాకిస్దాన్‌కు మద్దతుదార్లుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెలవిచ్చినపుడు మార్గదర్శక మండలి సభ్యుడిగా అద్వానీ నోరు మెదపలేదు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

స్వాతంత్య్ర వుద్యమ సమయంలోనే కమ్యూనిస్టులు మహాత్మా గాంధీ వైఖరితో విబేధించారు, వ్యతిరేకించారు. తరువాత కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు, బిజెపి మత పోకడలు చూసి కనీసం గాంధీ చెప్పిన అంశాలకైనా కట్టుబడండని అదే కమ్యూనిస్టులు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్దితి తలెత్తింది. దేశమంటే బిజెపి,బిజెపి అంటే దేశం, బిజెపిని విమర్శించటమంటే దేశాన్ని విమర్శించటమే అనే ఒక వున్మాద వాతావరణం దేశంలో నెలకొన్న స్దితిలో అద్వానీ మంచి మాటలు ఎందరికి ఎక్కుతాయన్నది ఒక ప్రశ్న. ప్రపంచ చరిత్రలో అనేక మంది నియంతలను చూశాము. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మనీలో హిట్లర్‌ను చూసిన తరువాత వాడి కంటే పూర్వపు నియంతలే మెరుగు అనిపించాడు. బాబరీ మసీదును కూలదోస్తున్న సమయంలో స్వయంగా అక్కడే వున్న ఎల్‌కె అద్వానీ నాడు ఒక పెద్ద మతోన్మాది, పచ్చిమితవాదిగా కనిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బిజెపిని విమర్శించిన తెలుగుదేశం వంటి పార్టీలు ఆ పార్టీకే కేంద్రంలో ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగితే వాజ్‌పేయిని చూసి తప్ప బిజెపిని చూసి కాదని చెప్పుకున్న విషయాన్ని మరచి పోరాదు. ఇప్పుడు అలాంటి అద్వానీయే మెరుగని నరేంద్రమోడీ తీరుతెన్నులు జనం చేత అనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలు చెప్పింది వినకపోతే పాయే మీ అద్వానీ చెప్పింది అయినా పాటించమని జనం గళం విప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతకు ముందుంది మరింత కష్ట కాలం !

04 Thursday Apr 2019

Posted by raomk in Congress, Current Affairs, Economics, employees, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

gloomy jobs scenario in india, jobs for machines in india, jobs scenario in india, Machines Vs humans

Image result for gloomy jobs scenario in india

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను నమ్మి జనం ఓటేసి గెలిపిస్తే తరువాత దాని అమలు విషయానికి వస్తే జుమ్లా (ఏదో అవసరానికి అలా చెబుతాం) అవుతుందా ? ఏమో ! నరేంద్రమోడీ వాగ్దానం చేసిన మేరకు నల్లధనాన్ని వెలికి తీసి ఆ మొత్తం నుంచి ప్రతి ఒక్కరికి వేస్తామన్న పదిహేను లక్షల రూపాయల సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే అమాయకులు ఇంకా వున్నారు కదా ! ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలకు అచరణకూ పొంతన వుండదని ఏడు దశాబ్దాల అనుభవం చెబుతోంది. రానున్న పది సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానుంది. అందువలన యువత, వారి భవిష్యత్‌ను కోరే వారు ఆలోచించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి వుంది.

తాము అధికారంలోకి రాగానే 2020 నాటికి నాలుగు లక్షల కేంద్ర వుద్యోగాలను భర్తీ చేస్తామని ఇవిగాక రాష్ట్రాలలో వున్న మరొక ఇరవై లక్షల వుద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పేర్కొన్నది. ఇవి గాక ఏటా 22లక్షల కొత్త వుద్యోగాల కల్పన కూడా చేస్తామని చెప్పారు. స్ధానిక సంస్దలలో పదిలక్షల సేవామిత్రల ఏర్పాటు గురించి కూడా వాగ్దానం వుంది. 2013 మార్చినెల నాటికి ఆరులక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ వుద్యోగ ఖాళీలు వుండగా 2014 మార్చి ఒకటి నాటికి అవి 4లక్షల 21వేల వుద్యోగాలు ఖాళీగా వుండగా గత ఐదు సంవత్సరాలలో కూడా దాదాపు అదే స్దాయిలో ఖాళీలు వున్నాయి.గత ఏడాది పార్లమెంటులో వివిధ సందర్భాలలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను క్రోడీకరించగా కేంద్ర, రాష్ట్రాలలో, ప్రభుత్వ రంగ సంస్ధలలో మొత్తం 24లక్షల మేరకు ఖాళీలు వున్నాయి. విద్యా రంగంలో పదిలక్షలు, పోలీసుశాఖల్లో 5.4, రైల్వేల్లో 2.5, రక్షణ రంగంలో 1.2లక్షలు, పారా మిలిటరీలో 61వేలు ఖాళీలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వశాఖలలో మంజూరైన పోస్టుల సంఖ్య 36,33,935 కాగా వున్న సిబ్బంది 32,21,183 మాత్రమే.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలలో (సిపిఎస్‌ఇ) 2013-14లో 13.49లక్షల మంది సిబ్బంది వున్నట్లు నమోదు కాగా మోడీ అధికారానికి వచ్చాక 2016-17 నాటికి ఆ సంఖ్య 11.31లక్షలకు పడిపోయిందని తాజా ప్రభుత్వ రంగ సంస్దల సర్వే వెల్లడించింది. ఈ అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? ఖాళీగా వున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్దల వుద్యోగాల గురించి కాంగ్రెస్‌ ఏమీ చెప్పలేదు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కూడా నాలుగు లక్షల ఖాళీలు వున్నాయి. పదేండ్లు అధికారంలో వున్నపుడు చేయలేని పనిని రేపు వస్తే గిస్తే ఎలా చేస్తారో చెప్పాలా లేదా ?

India-automation-jobs-layoffs

దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, వునికిలో వున్నవాటి నవీకరణ వలన మనుషుల కంటే యంత్రాలకే ఎక్కువగా వుపాధి దొరుకుతోంది. విల్స్‌ టవర్‌ వాట్సన్‌ కంపెనీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పశ్చిమ భారత్‌లో అంటే మహారాష్ట్ర, గుజరాత్‌ వస్త్ర,నూలు మిల్లుల్లో కార్మికుల కంటే యంత్రాలే ఎక్కువగా వుండబోతున్నాయి. కార్ల తయారీలో నలుగురు కార్మికులు చేసే పనిని ఒక రోబో చేస్తోంది.ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుతం 13శాతం పనిని యంత్రాలు చేస్తుండగా రానున్న మూడు సంవత్సరాలలో అది 23శాతానికి పెరగనుంది. అదే మన దేశంలో 14 నుంచి 30శాతానికి పెరగనుంది. అందువలన అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు ఎన్ని కబుర్లు చెప్పినా వుద్యోగాలు రోబోట్లకు తప్ప అనంతపురం జనానికి కాదు.ఈ పరిశ్రమను తమ రాష్ట్రానికి తీసుకురాలేదని తెలంగాణా యువత నిరాశ చెందనవసరం లేదు.

పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో ప్రస్తుతం యువతరం ఎక్కువ శాతం వున్నారు. ఈ కారణంగా రానున్న దశాబ్దిలో వుద్యోగాలు లేదా వుపాధి అవసరమైన వారు లేబర్‌ మార్కెట్‌లో 13.8కోట్ల మంది తోడు కానున్నారు. దేశంలో వున్న శ్రామిక శక్తిలో కేవలం 18.5శాతమే ఇంటర్‌ లేదా అంతకు మించిన విద్యతో నైపుణ్యం కలిగిన కార్మికులు వున్నారు. యాంత్రీకరణ కారణంగా దిగువ తరగతి కార్మికులే ఎక్కువగా వుద్యోగాలను కోల్పోతారని సర్వేలు తేల్చాయి. రాజకీయ పార్టీలు, నాయకులు వుపాధి గురించి ఎన్ని కబర్లు చెప్పినప్పటికీ రానున్న పది సంవత్సరాలలో యాంత్రీకరణ మరింత పెరిగి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానున్నదని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే వుపాధి రహిత అభివృద్ది, వేతన వృద్ధి లేని వుపాధి పెరుగుతుంది. ఈ పరిణామం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం.

కేంద్ర ప్రభుత్వ వుద్యోగులకు కనీస వేతనంగా నెలకు 18వేలు వుండాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడు ఖాళీగా వున్న నాలుగులక్షల ఖాళీలను నింపితే ఏడాదికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వేతనం పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన నుయంతమ్‌ ఆయ యోజన(న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పధకం కింద ఏటా ఇరవై శాతం పేదలు ఐదు కోట్ల కుటుంబాలకు 72వేల రూపాయలు నేరుగా బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. అందుకు గాను తొలి ఏడాది 3.6లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, మరుసటి ఏడాది ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. సార్వత్రిక కనీస ఆదాయ పధకం గురించి 2016-17 ఆర్ధిక సర్వేలో నాటి ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం ప్రతిపాదించారు. దాని అమల్లో వున్న సమస్యల గురించి ఆయనే చెప్పారు. ప్రస్తుతం వున్న దారిద్ర నిర్మూలన పధకాలను రద్దు చేసి దాన్ని అమలు జరపకపో అదనపు భారం అవుతుందన్నారు. అందువలన కాంగ్రెస్‌ గానీ ఇలాంటి వాటి గురించే చెబుతున్న ఇతర పార్టీలుగానీ ముందుగా ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. వున్న పధకాలను కొనసాగిస్తూనే దీన్ని అమలు జరుపుతారా లేక వాటిని రద్దు చేసి ఈ కొత్త పధకాన్ని పెడతారా ? రెండవదే అయితే పేదలకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదు. లేదూ రెండూ అమలు జరుపుతామంటే అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చుతారో వివరించాలి. ఇండియా రేటింగ్స్‌ సంస్ధ ప్రధాన ఆర్దికవేత్త దేవేంద్రకుమార్‌ పంత్‌ రెండూ ఒకేసారి అమలు సాధ్యం కాదని ఆర్ధికంగా ఎంతో వత్తిడి పెరుగుతుందన్నారు. విద్యమీద జిడిపిలో ఖర్చును ఆరుశాతానికి పెంచుతామన్నారు. గతంలో మోడీ సర్కార్‌ మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పిన మేరకు విద్యకు 4.6శాతం అంటే 8.76లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ చెప్పినదాని ప్రకారం ప్రతి ఏడాది మరొక 2.66లక్ష కోట్ల రూపాయలు కావాలి, ఏటా 11.4లక్షల కోట్ల రూపాయలు అవసరం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చు జిడిపిలో మూడు శాతానికి పెంచుతామన్నది ఒకటి. ఇప్పుడు 1.3శాతంగా వున్న ఖర్చుకు ఏటా 2.47లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మూడుశాతానికి పెంచితే 5.71లక్షల కోట్లు కావాలి. ఇలా కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను అమలు జరపాలంటే ఏటా కనీసం పదిలక్షల కోట్లరూపాయలు అవసరం అని అంచనా వేస్తున్నారు.2018-19 బడ్జెట్‌ 24.57లక్షల కోట్ల రూపాయలు, 2023-24 నాటికి 45లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. వాగ్దానాల అమలుకు అదనపు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మరోవైపున జిఎస్‌టిని తగ్గిస్తామని వాగ్దానం చేసింది. జనానికి తగిన ఆదాయం లేనందున ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దాని అర్ధం జిఎస్‌టి వసూళ్ల మీద పడుతుంది.

గతంలో రైల్వేకు వున్న మాదిరి రైతాంగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రతి తరగతి తనకు ప్రత్యేక బడ్జెట్‌ కోరుతున్న నేపధ్యంలో ఇది చెప్పటానికి ఆకర్షణీయంగా వుంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులకు వుప ప్రణాళికలు వున్నాయి. అయినా వారి స్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని గమనించాలి. రైతాంగానికి అలాంటి ప్రణాళిక ఆచరణ సాధ్యమా ? వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూటికి 76 మంద సాగుదార్లు వ్యవసాయం మానుకొని అంతకంటే మెరుగైన వుపాధికి మరలాలని కోరుతున్నట్లు గతేడాది సిఎస్‌డిఎస్‌ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే తరువాత దేశంలో వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరిగింది. రైతుల్లో 62శాతం మందికి కనీస మద్దతు ధరల గురించి అవగాహన లేదని, వాటి గురించి తెలిసిన వారిలో 64శాతం మంది మద్దతు ధరలు సంతృప్తికరం లేవని చెప్పారు.

జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేశంలో రైతాంగ సంఖ్య తగ్గిపోతుండగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని 2011 జనాభా వివరాలు తెలిపాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుదల కారణంగా వ్యవసాయ కార్మికుల పని దినాలు తగ్గిపోతున్న పూర్వరంగలో ఆ మేరకు వారికి పని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. కనుక అది సమర్ధనీయమే.

2001లో దేశంలో రైతులు 12,73,12,851 మంది వుండగా 2011 నాటికి 11,87,00,000కు తగ్గిపోయారు. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 10,67,75,330 నుంచి 14,43,00,000కు పెరిగారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరుగుదల కారణంగా అనేక చేతి వృత్తులు నశించి వాటిలో వున్న వారు వ్యవసాయ కార్మికులుగా మారుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరల ప్రాతిపదిక ఆశాస్త్రీయంగా వుంటోంది. వ్యవసాయ ఖర్చులను పూర్తిగా పరిగణనలోకీ తీసుకోవటం లేదు. అన్ని పంటలకు ప్రకటించటం లేదు పోనీ ప్రకటించిన మేరకైనా అమలు జరిపే యంత్రాంగం రాష్ట్రాలలో లేదు. తెలంగాణాలో గతం కంటే ఎర్రజన్నలు, పసుపు ధరలు గణనీయంగా పడిపోవటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అచేతనంగా వుండటంతో రైతాంగం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. చివరకు చేసేదేమీ లేక నిజామాబాద్‌ ఎన్నికల బరిలో 178 మంది రైతులు నామినేషన్లు వేసి కొత్త రూపంలో నిరసన తెలుపుతున్నారు. తమిళనాట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అక్కడి అన్నాడిఎంకె, కేంద్ర సర్కార్‌ విఫలం కావటంతో వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేసేందుకు వంద మంది రైతులు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. చివరి దశలో ఎన్నికలు జరగనున్నందున నామినేషన్లకు ఇంకా గడువు వుంది.

నిజామాబాద్‌ రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన రైతు బంధు నగదు తీసుకున్నా, పడిపోయిన ధరలతో పోల్చితే ఆ మొత్తం ఏమాత్రం చాలకనే ఆందోళనలకు దిగారు. అందువలన వివిధ పార్టీలు ఇప్పుడు ప్రకటిస్తున్న నగదు బదిలీ పధకాలు సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించేవి కాదు, ఇప్పుడున్న వాటితో పాటు అమలు జరిపితే కాస్త వుపశమనం మాత్రమే దొరుకుతుంది.

Image result for jobs scenario in india

దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో జిడిపి రీత్యా ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వుంది. ఏడుశాతానికి అటూ ఇటూగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి వున్నా దానికి అనుగుణంగా వుపాధి ఎందుకు పెరగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వేసిన ప్రశ్నకు ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవారంగాలలో యాంత్రీకరణ, ఐటి కారణంగా ఆయా సంస్ధల ఆదాయాలు, లాభాలు పెరగటం తప్ప వుద్యోగాల వుపాధి తగ్గిపోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైనాడ్‌లో ‘అమూల్‌ బేబీ ‘ రాహుల్‌ గాంధీ పోటీ !

03 Wednesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CPI, CPI()M, Kerala, Naredra Modi, Rahul gandhi, Rahul gandhi Amul Baby, VS Achuthanandan, wayanad lok sabha

Image result for wayanad lok sabha assembly constituency map manorama

ఎం కోటేశ్వరరావు

దాదాపు రెండు నెలల పాటు  తర్జన భర్జన పడి ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వైనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమేధీతో పాటు ఎన్నికల ఫోకస్‌ ఇక్కడ కూడా ప్రసరించనుంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికీ నుంచీ రెండు సార్లు కాంగ్రెస్‌దే పై చేయిగా వుంది. వైనాడ్‌, కోజికోడ్‌, మలప్పురం జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దీనిలో వున్నాయి. ఈనెల 23న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌ గాంధీని ఓడించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపీని పోటీకి దించవచ్చని మీడియాకు అనధికారికంగా వుప్పందించిన బిజెపి చివరకు బలహీనమైన భారత జన ధర్మ సేన అనే మిత్రపక్షానికి చెందిన వి.నటేశన్‌ను పోటీకి దింపింది. ఈ చర్య కమ్యూనిస్టులను ఓడించేందుగా, రాహుల్‌ గాంధీని గెలిపించేందుకా అన్న సందేహం ఓటర్లలో కలుగుతోంది. రాజకీయ పరిస్ధితులను అర్ధం చేసుకోవటంలో విఫలమైన కారణంగా గతంలో తాను రాహుల్‌ గాంధీని అమూల్‌ బేబీ అని వ్యాఖ్యానించానని, ఇప్పుడు వైనాడ్‌లో పోటీకి దిగి తన వ్యాఖ్యను మరోసారి నిజం చేశారని కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ వ్యాఖ్యానించారు. పరిస్ధితులను పిల్లచేష్టలు, ఆవేశంతో ఎదుర్కొంటారని నడి వయస్సు వచ్చినా పెద్ద మార్పేమీ లేదని అన్నారు. రాహుల్‌ను పోటీకి దింపటం ద్వారా కాంగ్రెస్‌ కూర్చున్న కొమ్మనే నరుక్కొనే రీతిలో వ్యవహరిస్తోందని, తప్పుదారి పట్టించే కాంగ్రెస్‌ నేతల మాటలను రాహుల్‌ అనుసరిస్తున్నారని చెప్పారు.

రాహుల్‌ గాంధీ పోటీకి నిర్ణయించుకోవటంతో కేరళ ఎన్నికల రంగం వేడెక్కిందనే చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్దాన్ని ప్రచారంలో పెట్టటంతో పాటు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే స్ధాయికి దిగజారారు. ఈనెల ఒకటవ తేదీన మహారాష్ట్రలోని వార్దా ఎన్నికల సభలో మాట్లాడుతూ అమేథీలో హిందువుల ఆగ్రహానికి భయపడి మైనారిటీలు మెజారిటీగా వున్న నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పోయారని ఎద్దేవా చేశారు. అక్కడ సగం మంది ఓటర్లు హిందువులున్నారు. వైనాడ్‌ ఎన్నిక అధికారంలో వున్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డిఎఫ్‌) ఐక్య ప్రజాతంత్ర కూటమి(యుడిఎఫ్‌), బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారనుంది.గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడి పోటీ తీరు తెన్నులను ముందుగా చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వైనాడ్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, మలప్పురం జిల్లాలోని మూడు, కోజికోడ్‌ జిల్లాలోని ఒక నియోజకవర్గంతో ఇది ఏర్పడింది. ఇక్కడ రాహుల్‌ గాంధీ పోటీ చేసినందువలన కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటా కాంగ్రెస్‌కు వూపు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ఆయన పోటీ చేయని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ డీలాపడుతుంది. రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా రాహుల్‌ గాంధీ తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు. అలాంటిది దేశంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అన్నది ప్రశ్న.

ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వున్నారన్న అంచనాతో రాహుల్‌ గాంధీ పోటీలోకి దిగుతున్నారు.అది కూడా వాస్తవం కాదు. తాజా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో 13,25,788 మంది ఓటర్లు వున్నారు. వీరిలో మహిళలు 6,70,002, పురుషులు 6,55,786 మంది వున్నారు. సామాజిక తరగతుల రీత్యా చూస్తే హిందువులు 49.48, ముస్లింలు 28.65, క్రైస్తవులు 21.34, ఇతరులు 0.53శాతం వున్నారు.

Image result for pp suneer cpi

వైనాడ్‌ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ మలప్పురం జిల్లా కార్యదర్శి పిపి సునీర్‌ పోటీ చేస్తున్నారు.1968లో జన్మించారు. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని ముగించి రెెండవ దశలో ప్రవేశించారు. ప్రజా మన్ననలను పొందిన సునీర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌. భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ద్వారా విద్యార్ధి వుద్యమాలు, యువజన రంగం, అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో 2004లో పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో తమ అవకాశాలను పెంచుకొనేందుకు రాహుల్‌ గాంధీని బరిలోకి దించి.గతంలో ఇందిరా గాంధీ, పివి నరసింహారావు, ఎన్‌టిఆర్‌, నరేంద్రమోడీ రెండు చోట్ల పోటీ చేసిన వుదంతాలు వున్నాయి. రాహుల్‌ గాంధీ ఒక్కసారి కూడా అధికార పీఠం ఎ్కకుండానే ఆ పనిచేస్తున్నారు. ఈ పోటీ తమకు బలాన్నిస్తుందని కాంగ్రెస్‌ చెబుతుంటే ఆ పార్టీ బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమేథీ నుంచి పారిపోయి వస్తున్నారని బిజెపి ఎద్దేవా చేసింది. గుజరాత్‌ నుంచి నరేంద్రమోడీ వారణాసిలో పోటీ చేస్తున్నారంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాహుల్‌ గాంధీ వైనాడ్‌లో పోటీ చేయటం అంటే కేరళలో ప్రధాన శత్రువుగా వామపక్షాలను ఎంచుకున్నట్లే అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ వ్యాఖ్యానించారు.రాహుల్‌ను పోటీకి దించటమంటే వారి ప్రాధాన్యత కేరళలో వామపక్షాల మీద వ్యతిరేకత, బిజెపిని ఓడించాలన్న కాంగ్రెస్‌ జాతీయ విధానానికి వ్యతిరేకం, కేరళలో ప్రధాన శక్తి బిజెపి కాదు, ఎల్‌డిఎఫ్‌ అందువలన రాహుల్‌ను ఓడిస్తాం అన్నారు. ఈ చర్య కాంగ్రెస్‌లో తలెత్తిన విశ్వాసరాహిత్యాన్ని వెల్లడిస్తున్నదని, రాహుల్‌ గెలిస్తే ఏ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తారో తెలుసుకోగోరుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియెరి బాలకృష్ణన్‌ అన్నారు.

Image result for rahul gandhi wayanad

కాంగ్రెస్‌కు బలమున్న స్ధానంగా వున్న వైనాడ్‌లో తమ అభ్యర్ధులను నిలిపేందుకు కాంగ్రెస్‌లోని ప్రధాన ముఠా నాయకులందరూ ప్రయత్నించారన్నది కొద్ది రోజులుగా వచ్చిన మీడియా వార్తలు తెలిపాయి. రాహుల్‌ గాంధీ ఒక దశలో విముఖంగా వుండటంతో కోజికోడ్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి సిద్దికిని అభ్యర్ధిగా ప్రకటించారు. పార్టీలో ‘ఎ’ వర్గనాయకుడిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ సిద్దికీ పేరును ప్రతిపాదించగా ‘ఐ ‘ గ్రూప్‌ నాయకుడిగా వున్న రమేష్‌ చెన్నితల షానిమోల్‌ వుస్మాన్‌, వివి ప్రకాష్‌ పేర్లను ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన లక్షలాది కార్యకర్తలు రాహుల్‌ పోటీ చేయాలని కోరినట్లు కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వర్ణించారు.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీని పోటీకి దించినా, దించకపోయినా అక్కడ ప్రధాన పోటీ సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ మధ్యనే జరుగుతుంది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును తొలుత స్వాగతించి తరువాత ఓటు బ్యాంకు రాజకీయాలకు వుపయోగించుకోవాలని చూసిన కాంగ్రెస్‌, బిజెపిలో భక్తుల మనోభావాల పేరుతో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే తమకు ఓటింగ్‌ శాతం పెరగనుందని బిజెపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌కూడా ఆ ఓట్లమీదనే కన్నేసింది. అయితే రాజకీయంగా ఎప్పటి నుంచో సమీకరణ అయిన కేరళ ఓటర్లు ఎంత మేరకు మొగ్గుతారన్నది ప్రశ్న.

వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ ప్రవేశంతో బిజెపికి ఒక విధంగా ఇరకాటం అని చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ ఓటింగ్‌ తీరుతెన్నులే ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయని చెప్పవచ్చు. గత ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చిందీ వివరాలను పట్టికలో చూడవచ్చు. గత లోక్‌సభ ఎన్నికలలో 80వేల ఓట్లు తెచ్చుకున్న బిజెపి రెండు సంవత్సరాల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏడు నియోజకవర్గాలలో 93,641 ఓట్లు తెచ్చుకుంది. నాలుగు సీట్లలో విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌కు 4,55,019 ఓట్లు వస్తే మూడు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌కు 4,73, 434 ఓట్లు వచ్చాయి. 2014లోక్‌ సభ ఎన్నికలలో సిపిఐ అభ్యర్ధి కంటే కాంగ్రెస్‌కు 20వేలు మాత్రమే. దాదాపు అదే తేడా అసెంబ్లీ ఎన్నికలలో 17,600కు పడిపోయింది.

Image result for Amul Baby Rahul Gandhi in Wayanad Fray

కేరళలో బిజెపి పైకి ఏమి చెప్పినప్పటికీ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను కూడగడుతున్నది. దేశవ్యాపితంగా ముక్త కాంగ్రెస్‌ పేరుతో ఆపార్టీని మట్టికరిపిస్తానని చెబుతున్నది. వైనాడ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నందున బిజెపి ప్రధాన లక్ష్యం ఏమిటన్నది ప్రశ్న. అంతకు ముందు ఆ స్దానాన్ని దాని మిత్రపక్షానికి కేటాయించింది. ఇప్పుడు రాహుల్‌ ఖరారు కావటంతో ఆ స్ధానాన్ని తాము తీసుకొని ప్రముఖ అభ్యర్ధిని దించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మలా సీతారామన్‌ లేదా సినీ నటుడు సురేష్‌ గోపి కావచ్చని మీడియా పేర్కొన్నది. చివరకు తోక ముడిచి మిత్రపక్ష అభ్యర్ధినే ఖరారు చేసింది. గతంలో అనేక చోట్ల బిజెపి బలహీనమైన వారిని పోటీ పెట్టి కమ్యూనిస్టులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు సహకరించింది. ఈ సారి అదే జరుగు తుందా లేక రాహుల్‌ గాంధీని ఓడించేందుకు తన ఓట్లను తమ అభ్యర్ధికే వేయిస్తుందా అన్నది దాని ముందున్న ప్రశ్న. శబరిమల ఆలయం పేరుతో చేసిన ఆందోళనతో కాంగ్రెస్‌, బిజెపి రెండూ లబ్ది పొంద చూస్తున్నాయి. అదే జరిగితే బిజెపి ఏ మాత్రం ఓట్లు పెంచుకున్నా అవి కాంగ్రెస్‌కు సంబంధించినవి తప్ప వామపక్షాల నుంచి పోయేవి కాదన్నది స్పష్టం. ఒకవేళ అదే జరిగితే బొటాబొటీ మెజారిటీ వున్న స్ధితిలో అక్కడ రాహుల్‌ గాంధీ ఓడిపోవటం ఖాయం. ఇప్పుడున్న రాజకీయ పరిస్ధితిలో ఒక వేళ రాహుల్‌కు ఓటు వేసి గెలిపించినా ఆయన అమేథీని ఎంచుకుంటారు, వైనాడ్‌ను వదిలి వేస్తారు, ఆ మాత్రానికి ఎందుకు వేయటం, వుప ఎన్నికలకు పోవటం ఎందుకని తటస్ధ ఓటర్లు ఆలోచించవచ్చు. మరొక వూహ ప్రకారమైతే రాహుల్‌ గాంధీని నిజంగా బిజెపి ఓడించాలనుకుంటే ప్రధాన ప్రత్యర్ధి సిపిఐకి ఓటు వేయటం ద్వారానే ఆపని చేయగలగుతుంది. మరొక మార్గం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టిన స్ధితిలో అది జరుగుతుందా అన్నది సందేహమే. అందువలన ఏ రీత్యా చూసినప్పటికీ వైనాడ్‌ ఎన్నిక ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పవచ్చు.

2014 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు,

కాంగ్రెస్‌ 3,77,035 41.20

సిపిఐ 3,56,165 38.92

బిజెపి 80,752 8.82

ఇండి 37,123 4.60

ఎస్‌డిపిఐ 14,327 1.57

డబ్ల్యుపిఐ 12,645 1.38

ఆప్‌ 10,684 1.17

2009 వైనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు

కాంగ్రెస్‌ 4,10,703 41.20

సిపిఐ 2,57,264 31.23

ఎన్‌సిపి 99,663 12.10

బిజెపి 31,687 3.85

2016లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

సిపిఎం 26.7 58

సిపిఐ 8.2 19

ఎల్‌డిఎఫ్‌ ఇండి 2.4 4

జెడిఎస్‌ 1.5 3

ఎన్‌సిపి 1.2 2

కాంగ్రెస్‌ 23.8 22

ముస్లింలీగ్‌ 7.4 18

బిజెపి 10.6 1

కెసిఎం 4 6

బిడిజెఎస్‌ 4 0

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాహుల్‌ గాంధీ కనీస ఆదాయ పధకం వెనుక లాజిక్కేమిటి ?

29 Friday Mar 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Congress party, LOK SABHA Election 2019, Nyay scheme, populist schemes, Rahul Nyay scheme

Image result for rahul gandhi

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ అధికారానికి వస్తే తాము ప్రతి కుటుంబానికి నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేద కుటుంబాలకు అందచేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దీని మీద కొందరికి లోపల ఇది జరిగేదేనా అన్న గుంజాటన వుంటే అటు సమర్ధించలేక, ఇటు వ్యతిరేకించలేక కొన్ని రాజకీయ పార్టీలు డోలాయమానంలో వున్నాయి. ఈ పధకాన్ని రూపొందించింది, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయనే ఆర్ధిక మంత్రి అవుతారన్న వార్తలు వచ్చాయి. దాని మంచి చెడ్డల గురించి చర్చించుకోబోయే ముందు ఆ పధకం ఆచరణ సాధ్యమేనా అని సందేహించే వారు ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.

ఏడాదికి 25కోట్ల మంది జనాభా వుండే ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి 72వేల రూపాయల చొప్పున కనీస ఆదాయాన్ని అందచేస్తామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేసిన ఎన్నికల వాగ్దానం మోసం, జనాలూ జాగ్రత్త అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ గుండెలు బాదుకుంటున్నారు. అదే సమయంలో ఆ పెద్ద మనిషి మరో మాట కూడా చెప్పారు. తాము అమలు చేస్తున్న పధకాలన్నింటినీ కలిపి చూస్తే అంతకంటే ఎక్కువగానే వివిధ రూపాలలో పేదలకు చెల్లిస్తున్నామని అన్నారు. అంటే రాహుల్‌ గాంధీ ప్రకటించింది అసాధ్యమైన దేమీ కాదని జెట్లీ అంగీకరించినట్లే కదా !

ఇంతకీ రాహుల్‌ గాంధీ ఏమి చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు కనీసం పన్నెండువేలకు ఆదాయం తగ్గకూడదన్నది తమ ఆకాంక్ష అని దానిలో భాగంగా డెబ్బయి రెండు వేల రూపాయలను నేరుగా కుటుంబాల ఖాతాలో వేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద 14కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు చేర్చామని, దాని కొనసాగింపుగా ఈ రెండవ పధకంలో 25కోట్ల మందిని దారిద్య్రరేఖనుంచి ఎగువకు తీసుకు వస్తే దేశంలో మొత్తం దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని కాంగ్రెస్‌ నమ్మబలుకుతున్నది. ఇందుకు గాను 3.6లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కాంగ్రెస్‌ చెబుతున్నది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ 1970దశకంలో గరీబీ హఠావో నినాదమిచ్చి ఓట్లను కొల్లగొట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత మనవడు పేదరికం నిర్మూలనకు బదులు పేద కుటుంబాలకు నగదు బదలాయింపు గురించి చెబుతున్నారు. అంటే పేదరిక నిర్మూలన చేయలేం, దానికి బదులు డబ్బు ఇస్తాం అనటమే. అంటే సమస్య తిరిగి మొదటికి వచ్చింది.

మన దౌర్భాగ్యం ఏమంటే మన పాలకులు వారు కాంగ్రెస్‌ అయినా బిజెపి అయినా మన దేశంలో దరిద్రం ఏ స్దాయిలో, ఎంత మంది వున్నారన్నది ఇంతవరకు నిజాయితీగా నిక్కచ్చి లెక్కలు చెప్పలేదు. దారిద్య్రం నిర్వచనం మీద ఏకాభిప్రాయం లేదు. మన పాలకులు జిడిపి విషయానికి వస్తే ప్రపంచ ధనిక దేశాలతో పోటీ పడుతున్నామని త్వరలో రెండవ స్ధానంలో వున్న చైనాను అధిగమిస్తామని చెబుతారు. కానీ దారిద్య్రరేఖ విషయానికి వస్తే మాత్రం అంతసీను లేదు. రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు ( మార్చినెల 28 డాలరు మారకం రేటులో రు 131) దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు లెక్క. ఇది అంతర్జాతీయ దారిద్య్రరేఖ పాతలెక్క, ప్రపంచ బ్యాంకు తాజాగా వేసిన మదింపులో రెండు రేఖలను సూచించింది ఒకటి రోజుకు 3.2 డాలర్లు రెండవది 5.5 డాలర్లకంటే తక్కువ సంపాదించే వారు దారిద్య్రంలో వున్నట్లే. రెండవదాని ప్రకారం ప్రపంచంలో 58శాతం మంది దారిద్య్రంలో వున్నారు.

2012లో మన కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 22శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నారు. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2005లో 23.6శాతం మంది వున్నారు. ఐక్యరాజ్యసమితి సహ్రస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వున్నవారు 2012లో 21.9శాతం. సురేష్‌ టెండూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం కూడా అంతే వుంది. తరువాత రంగరాజన్‌ కమిటీ 2014లో చెప్పిన లెక్క 29.5శాతం. 2015లొ రోజుకు 1.9 డాలర్ల ప్రకారం 12.5 శాతం వున్నారు. జిడిపిలో దూసుకుపోతున్న మనం ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు చెప్పిన 3.2 డాలర్లతో లేదా 5.5డాలర్లతో దేని ప్రాతిపదికన దారిద్య్రాన్ని, దరిద్రులను లెక్కించాలి. రెండవదాని ప్రకారం అయితే ప్రపంచ సగటు 58శాతం లేదా అటూ ఇటూగా మన జనం దరిద్రంలో వున్నట్లే .

రాజీవ్‌ గాంధీ లేదా ఆయనకు సలహాలు ఇస్తున్నవారు రెండవ దానిని పరిగణనలోకి తీసుకొని రోజుకు 5.5 డాలర్లు (రు 380) లేదా నెలకు 12000 వేల రూపాయలు కనీస ఆదాయం అవసరమని తెల్చారు. అందుకే దానిలో సగం సంపాదించుకుంటే సగం నెలకు ఆరు చొప్పున ఏడాదికి 72వేలను ప్రభుత్వం నేరుగా కుటుంబాలలోని మహిళల ఖాతాలలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇదంతా మోసం అని చెబుతున్న ఆర్దిక మంత్రి అరుణ్‌ జెట్లీ ఏమంటున్నారు. ప్రస్తుతం తాము అమలు జరుపుతున్న వివిధ పధకాలు వుపాధి హామీ పధకం, ఆయుష్మాన్‌ భవ, ఎరువుల సబ్సిడీ వంటి వాటికింద ఏటా 7.8లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దీనివలన లబ్ది పొందుతున్నది పేదవారే నని అయితే వివిధ పధకాల కింద వున్నందున మొత్తం ఎంత లభిస్తుందో లెక్కవేసుకోవచ్చు అంటున్నారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు పన్నెండు వేల చొప్పున ఆదాయం వచ్చేట్లు చేయాలంటే జిడిపిలో 1.5శాతం అవుతుందని కాంగ్రెస్‌ లెక్కలు వేసింది. తాము వాగ్దానం చేసిన పధకాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు రెండూ పంచుకోవాల్సి వుంటుందని కూడా చెబుతున్నది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల మొదలు పెట్టి రెండు సంవత్సరాల వ్యవధిలో దేశ మంతటికీ విస్తరింప చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి చెప్పారు. ఏటా కేంద్ర ప్రభుత్వ ఎగుమతుల ప్రోత్సాహం, పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, పన్నుల రాయితీలతో పోల్చుకుంటే 3.6లక్షల కోట్ల రూపాయలను పేదలకు ఇవ్వటం పెద్ద లెక్కలోనిది కాదు

రాహుల్‌ గాంధీ ప్రకటించిన ఈ పధకం కొత్తదేమీ కాదు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వివిధ సబ్సిడీలు, పధకాలకు అయ్యే ఖర్చు తగ్గించేందుకు గాను వాటిని అందుకు కేటాయిస్తున్న నిధులను నగదు బదిలీ రూపంలో అందచేయాలన్నది ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ చేసిన సూచనల సారం.వుదాహరణకు వరి పండించే రైతులకు నగదు బదిలీ పధకం కింద కొంత మొత్తం, పేదలకు సబ్సిడీ బియ్యం బదులు నగదు ఇస్తే భారత ఆహార సంస్ధను పూర్తిగా ఎత్తివేయవచ్చు. ఈ దిశగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని చోట్ల పేదలకు బియ్యం బదులు నగదు బదిలీని ప్రయోగాత్మకంగా అమలు జరుపుతున్నారు. రైతులకు రైతు బంధు మరొక పేరుతో నగదు అందచేసేందుకు నిర్ణయించారు. తెలంగాణాలో ఆ రైతు బంధు పధకం కింద సొమ్ము తీసుకున్న రైతులు తమ ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేదని బంద్‌లు చేయటమే కాదు, అరెస్టులయ్యారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో 178 మంది రైతులు అధికార పార్టీ అదిరింపులు, బెదిరింపులను లెక్కచేయకుండా పోటీకి నిలిచారు. ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తే తాము చేయాల్సిందేమీ లేదని అధికార పార్టీ వూహించింది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే ఎకరానికి ఎనిమిది వేలు ఒక లెక్క కాదు. అందుకే రైతులు రోడ్డెక్కారు.

కాంగ్రెస్‌ చెబుతున్న నెలకు 12వేల కనీస ఆదాయం కూడా ఇప్పటి ధరల ప్రకారం నలుగురు లేక ఐదుగురు వున్న కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోయే మొత్తం కాదు. అంతకు రెట్టింపు అవసరమని గణాంకాలు తెలుపుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఒక వ్యక్తికి రోజుకు 2100, గ్రామాలలో 2400 కాలరీల శక్తినిచ్చే ఆహారం కావాలని అందుకు 1973-74లో రు.56.64, 49.09ల చొప్పున అవసరమని లెక్కవేశారు. ఇప్పుడు అంత మొత్తాలు రోజూ తాగే టీ, టిఫిన్‌ ఖర్చులకే చాలవు. అందువలన ఏటేటా దిగజారుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా ప్రతి కుటుంబానికి అవసరమైన ఆదాయం వచ్చే విధంగా వుపాధి చూపితే దయాదాక్షిణ్యాలతో ఇచ్చే సొమ్ముకు ఎవరూ ఆశపడరు.

పేదలకు కనీస ఆదాయ పధకం అన్నది కొత్త ఆలోచన కూడా కాదు. మహమ్మద్‌ ప్రవక్త మామ, ఇస్లామిక్‌ రాజ్య తొలి పాలకుడు అయిన అబూ బకర్‌ ఏటా ప్రతి స్త్రీ, పురుషుడు, పిల్లలకు పది దిర్హామ్‌లు కనీసంగా అందచేయాలనే పధకాన్ని ప్రవేశపెట్టాడు. తరువాత ఆ మొత్తాన్ని ఇరవైకి పెంచాడు. క్రైస్తవ రాజ్యాలకు వ్యతిరేకంగా తమ పాలనను సుస్ధిర పరచేందుకు జనాన్ని ఆకర్షించే పధకమే ఇది. అమెరికాలో 1795లో భూ యాజమాన్య వ్యవస్ధను ప్రవేశపెట్టిన సందర్భంగా సహజంగా వచ్చిన వారసత్వ ఆస్ధులు కోల్పోయినందున నాటి మానవతా వాది ధామస్‌ పెయిన అమెరికా పౌరులందరికీ పరిహారంగా పౌర లాభం పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని ప్రతిపాదించాడు. అమెరికా ఆర్ధికవేత్త హెన్రీ జార్జి భూమి విలువ పన్నుద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని అమెరికన్లందరకూ డివిడెండ్‌గా చెల్లించాలని కోరాడు. 1966లో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల పూర్వరంగంలో సంక్షేమ కార్యక్రమాల ఖర్చును తగ్గించేందుకు దారిద్య్ర నిర్మూలనకు కనీస వార్షిక ఆదాయం పేరుతో ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.1968లో 1200 మంది ఆర్దికవేత్తలు ఒక మెమో రాండంపై సంతకాలు చేసి ఆదాయ హామీ పధకాన్ని అమలు జరపాలని కోరారు. అయినా ఇప్పటికీ అమెరికాలో పేదరికం పోలేదు. ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ బోనపార్టే కూడా పౌరుల మనుగడకు నిమిత్తం అవసరాలు తీర్చేందుకు కొంత మొత్తాన్ని తీసుకోవటం వారి జన్మహక్కని చెప్పాడు.

దీని వెనుక వున్న లాజిక్కును కూడా అర్ధం చేసుకోవాలి. మహమ్మద్‌ ప్రవక్త మామ అయినా మరొకరు అయినా వర్గ సమాజాలకు ప్రతినిధులు. అది బానిస సమాజం, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానమైనా యజమానులకు పనిచేసేందుకు కార్మికులు కావాలి. వారు కావాలంటే కనీసం బతికి, పని చేసేందుకు అవసరమైన శక్తి అవసరం. ఆ కనీసఅవసరం వారికి తీరకపోతే పని చేసే వారు దొరకరు. అందుకే కనీస సంక్షేమ పధకాలను అమలు జరిపిన తీరు ప్రతి సమాజంలోనూ మనకు కనిపిస్తుంది. పశ్చిమ దేశాలలో కార్మికులు జబ్బుపడి పని మానితే వచ్చే నష్టం కంటే వారికి ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే యజమానులకు వచ్చే లాభమే ఎక్కువగా వుంది కనుక పరిమితంగా అయినా ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఏదీ వుచితం కాదు, అలాంటపుడు అమలు జరిపే సంక్షేమ పధకాలను వుచితంగా అమలు జరుపుతారని ఎందుకు అనుకోవాలి.

ప్రస్తుతం అనేక దేశాలలో కనీస ఆదాయ హామీ పధకాలు అమలు జరుగుతున్నాయి, అయితే వాటికి షరతులు వర్తిస్తాయి. బ్రెజిల్‌లో పిల్లలను బడులకు పంపటం ఒక షరతు. మన దేశంలో 1934లో కాంగ్రెస్‌ నేత సుభాస్‌ చంద్రబోస్‌ తొలుత ఇలాంటి పధకం గురించి ప్రతిపాదించారు. తరువాత 1942లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ప్రతిపాదనలు చేయాలని కోరినప్పటి అది జరగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవకాశ వాదానికి మారు పేరే మహారాష్ట్ర బిజెపి-శివసేన పొత్తు !

25 Monday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

BJP, bjp sena alliance, Congress-NCP alliance, Maharashtra elections 2019, NCP, Shiv sena

Image result for bjp sena alliance  cartoons

ఎం కోటేశ్వరరావు

దేశ రాజకీయాలలలో అధికారమే పరమావధిగా వుండే రాజకీయ నేతల అవకాశవాదానికి హద్దులు ఎన్నడో చెరిగిపోయాయి.రాత్రి వరకు కత్తులు దూసుకున్నవారు తెల్లవారే సరికి పొత్తులు కుదుర్చుకుంటున్నారు. గతంలో ఎన్నికల ముందు వరకు ఎవరు ఏ పార్టీలో వుంటారో తెలియని స్ధితి. ఇప్పుడు ఎన్నికల తరువాత ఎటువైపు చేరతారో కూడా తెలియని విధంగా అధికార రాజకీయాలు తయారయ్యాయి. అధికార దాహంగల పార్టీల తరఫున పోటీ చేస్తున్న అమీర్లు స్పష్టంగా వున్నారు. ఎన్నికల వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని లాభంతో సహా రాబట్టుకోవాలంటే ఏమి చేయాలన్నది బరిలోకి దిగే ముందే వారికి తెలుసు. బీద ఓటర్లే ఇంకా అయోమయంలో వున్నారు.

దేశంలో వుత్తర ప్రదేశ్‌ తరువాత 48లోక్‌సభ స్ధానాలతో ఎక్కువ సీట్లున్న రాష్ట్రం మహారాష్ట్రలో ఏప్రిల్‌ 11,18,23,29 తేదీలలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబరుతో ముగిసే అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ దేశంలో బిజెపి విజయంపై నీలి నీడలు కమ్ముకోవటంతో అసెంబ్లీ ఎన్నికల ఆలోచనను ఆ పార్టీ విరమించుకుంది.  దీర్ఘకాలంగా ఈ రాష్ట్రం సంకీర్ణ రాజకీయాలకు నిలయంగా వుంది. ఒక నాడు పెద్ద పార్టీలుగా వున్న కాంగ్రెస్‌, శివసేన ప్రాభవం కోల్పోయాయి. గత ఎన్నికలలో యుపిఏ కూటమిలో కాంగ్రెస్‌ 26, శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌(ఎన్‌సిపి) 21 స్ధానాల్లో పోటీ చేయగా ఎన్‌డిఏ కూటమిలో బిజెపి 24,శివసేన 20 చోట్ల పోటీ చేశాయి. మిగిలిన స్ధానాలలో కాంగ్రెస్‌, బిజెపి ప్రాంతీయ మిత్రపక్షాలు పోటీ చేశాయి.

Image result for bjp sena alliance  cartoons

మహారాష్ట్ర రాజకీయాలలో ఒకనాడు పులిలా వున్న శివసేన ఇప్పుడు బిజెపి ముందు పిల్లిలా తయారైంది. ఒక వైపు కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో అధికారం పంచుకుంటూనే గత ఐదు సంవత్సరాలలో శివసేన అనేక సందర్భాలలో బిజెపిని విమర్శించింది.ఏండాది క్రితం తాము ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించటమే కాదు, విమర్శల జోరు పెంచింది. కొండంత రాగం తీసి కీచు గొంతుతో అరచినట్లు ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు బిజెపితో ఎన్నికల అవగాహనకు అంగీకరించింది. సామ్నా పత్రికలో, మీడియా సమావేశాలలో గతంలో ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసినప్పటికీ విడిగా పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసిన బిజెపి వాటన్నింటినీ దిగమింగింది. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి పాలన వైఫల్యాలను విమర్శించి వాటితో తమకేమీ సంబంధం లేదని జనం ముందు ప్రదర్శించుకొనేందుకు శివసేన ప్రయత్నించింది. నోట్ల రద్దు నిర్ణయం మాదిరే రామాలయ నిర్మాణంపై ఎందుకు నిర్ణయం తీసుకోరని మోడీని ప్రశ్నించింది. గోమాతల రక్షణ గురించి మాట్లాడుతున్నారు సరే మన మాతలను ఎలా రక్షిస్తారంటూ నిలదీసింది. చివరికి చౌకీదార్‌ చోర్‌ అన్న కాంగ్రెస్‌ నినాదాన్ని కూడా పునరుద్ఘాటించింది. అలాంటి పార్టీ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. మిగతా చిన్న పార్టీలను విస్మరించి బిజెపి 25,శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.కాంగ్రెస్‌ 24, ఎన్‌సిపి 20 సీట్లలో పోటీ చేసేందుకు, రెండేసి సీట్ల చొప్పున ఆయా పార్టీల అభీష్టం మేరకు ఇతర పార్టీలకు కేటాయించుకొనే విధంగా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

Image result for bjp sena alliance  cartoons

శివసేన తీరు తెన్నులను చూస్తే చివరి నిమిషం వరకు బిజెపితో దోస్తీ లేదని చెప్పటం వెనుక బేరసారాలలో సాధ్యమైనన్ని సీట్లు రాబట్టుకోవటం, బాబరీ మసీదు వంటి విషయాల్లో మతోన్మాదం, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్న ఎత్తుగడే కనిపిస్తున్నది.అనేక రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా తమకు పడవు అనుకొనే తరగతుల ఓట్లను తొలగించారనే విమర్శలు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి, జనతాదళ్‌(ఎస్‌) జాతీయ కార్యదర్శి బిజి కోల్సే పాటిల్‌ చెబుతున్నదాని ప్ర కారం దాదాపు 40లక్షల ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాయి. ఇదంతా బిజెపి కుట్రలో భాగమని, తొలగించిన ఓట్లలో 17లక్షలు దళితులు, పదిలక్షలు ముస్లింలకు చెందినవన్నారు. మిస్సింగ్‌ ఓటర్‌ యాప్‌ను తయారు చేసిన ఖాలిద్‌ సైఫుల్లా నాయకత్వంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలో మూడు కోట్ల మంది ముస్లింలతో సహా దాదాపు 12.7కోట్ల మంది ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాని పాటిల్‌ అన్నారు.

రాష్ట్ర రాజకీయాలలో చిన్న రాజకీయ పార్టీలు కొన్ని ప్రాంతాలలో పట్టు కలిగి వుండటంతో ఏదో ఒక పార్టీ వాటితో సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. శివసేన నుంచి విడిపోయిన వుద్దావ్‌ ధాకరే ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ఒకటి. ముంబై, మరికొన్ని పట్టణ ప్రాంతాలలో వున్న బలంతో శివసేన,బిజెపి అభ్యర్ధుల ఓటమికి తోడ్పడేది. కాంగ్రెస్‌,ఎన్‌సిపి కూటమితో కలసి పనిచేసింది. ఈ ఎన్నికలో ఎంఎన్‌ఎస్‌తో ఎలాంటి ఒప్పందం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. బిజెపి, శివసేనలను గట్టిగా వ్యతిరేకించే ఆ పార్టీ ఈసారి ఏవైఖరి తీసుకుంటుందో వెల్లడి కావాల్సి వుంది.

అంబేద్కర్‌ ప్రభావంతో మహారాష్ట్ర దళిత వుద్యమాలు, రాజకీయ పార్టీలు, సంస్ధలకు కేంద్రంగా వుంది.  అయితే వాటిలో ఐక్యత లేదు. అవకాశవాదం, అధికార దాహంతో వ్యవహరిస్తుంటాయనే విమర్శ వుంది. పార్లమెంట్‌ సభ్యుడు, అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ నాయకత్వంలోని భారతీయ రిపబ్లికన్‌ బహుజన్‌ మహాసంఘ్‌ ఈ సారి అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ పార్టీతో కలసి పని చేస్తానని ప్రకటించింది. బీమా కొరేగావ్‌ వుదంతం, అదే విధంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరాఠాల ఆందోళనల పూర్వరంగంలో జనాభాలో 12-14శాతం మధ్య వున్న దళితులు ఆగ్రహంతో వున్నారు. వీరికి ముస్లింలు కూడా తోడై ఒక సంఘటిత శక్తిగా వుంటే ప్రధాన  పార్టీలను కొన్ని చోట్ల దెబ్బతీసే అవకాశం వుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు దళిత సంస్ధల మధ్య ఐక్యత లేకపోవటంతో కాంగ్రెస్‌,బిజెపి వంటివి వాటిని ఖాతరు చేయటం లేదు. వంచిత్‌ బహుజన్‌ అగాధీ వంటి పార్టీలు ముఖ్యంగా దళితుల్లో పని చేసేవి వున్నాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు, సీట్లు

పార్టీ    ఓట్ల వాటా        మార్పు     సీట్లు      మార్పు

బిజెపి    27.30%    9.13%    23        14

శివసేన    20.60%    3.60%    18       7

కాంగ్రెస్‌    18.10%    -1.51      2      -15

ఎన్‌సిపి    16.00%    -3.28      4      -4

స్వాభిమానిపక్ష            2.30%     1      0

Image result for bjp sena alliance  cartoons

అధికారం కోసంమే కాంగ్రెస్‌ నుంచి చీలి వేరు కుంపటి పెట్టుకున్న శరద్‌ పవార్‌ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. ఆయన కుమార్తె సుప్రియ సూలే రంగంలో వున్నారు. ఈ వయసులో తాను పోటీ చేసినా చేయకపోయినా ఒకటే అని, అయినా ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పోటీ చేయటం ఎబ్బెట్టుగా వుంటుందని పవార్‌ అంటున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన బిజెపి-శివసేన కూటమి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్యపై పేచీ కారణంగా వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమి కూడా విడిపోయింది. అసెంబ్లీలోని 288 సీట్లకు గాను బిజెపి 27.8శాతం ఓట్లతో 122, శివసేన 19.3శాతం ఓట్లతో 63, ఎన్‌సిపి 17శాతం ఓట్లతో 41, కాంగ్రెస్‌కు 18శాతం ఓట్లు 42 సీట్లు వచ్చాయి.ఎంఎన్‌ఎస్‌ పార్టీ ఒక సీటు 3.7శాతం ఓట్లు తెచ్చుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో బిజెపి, శివసేన పార్టీల ఓట్లు దాదాపు సమంగా వున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి ఓట్లుస్వల్పంగా పెరిగాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్నికల ముందు వరకు శివసేన, బిజెపి కుమ్ములాటలు ఆ కూటమి అవకాశాలను దెబ్బతీస్తాయని కొందరి అంచనా. అయితే ఆ రెండు పార్టీల కలయిక మెజారిటీ సీట్లను స్వంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. పది నుంచి పన్నెండు సీట్లు తాము గెలిచే అవకాశం వుందని ఎన్‌సిపి అంచనా వేసుకుంటున్నది. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 18 నుంచి 23 సీట్లవరకు వస్తాయని జనవరి పోల్‌ సర్వేలు తెలిపాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆదిత్యనాధ్‌ ఇలాకాలో బిజెపి తొలి ఓటమి !

24 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Bahujan Samaj Party, BJP, Congress party, Modi, Samajwadi Party, Shah, UP Loksabha elections 2019, UP's kairana, Yogi Adityanath

Image result for up lok sabha election 2019

ఎం కోటేశ్వరరావు

అవును ఎన్నికలు ఇంకా జరగముందే ఓడిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నిజంగానే ఏడాది క్రితం నిలిపిన అభ్యర్ధిని ఇప్పుడు మార్చటం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించటం కాదా ? కైరానా నియోజకవర్గం ఏడాది క్రితం ఒక సంచలనం. మూడో వంతుకు పైగా ముస్లిం జనాభా వున్న ఈ నియోజకవర్గంలో వారు మెజారిటీగా వున్న చోట్ల నుంచి హిందువులను తరిమి వేస్తున్నారంటూ ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి నేత హుకుం సింగ్‌, తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సదరు సింగ్‌ హఠాన్మరణంతో ఏడాది క్రితం వుప ఎన్నిక అవసరమైంది. అది ఒక్క వుత్తర ప్రదేశ్‌ రాజకీయాలనే కాదు, దేశ వ్యాపితంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఒక్కతాటి మీదకు వస్తే కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో వెల్లడించింది.

ఆ ఎన్నికలో బిజెపి అభ్యర్దిగా హుకుంసింగ్‌ కుమార్తె మృగాంకను నిలిపి సానుభూతి ఓట్లతో గెలవాలని చూసింది. అయితే సమాజవాదిపార్టీ, ఆర్‌ఎల్‌డి వుమ్మడి అభ్యర్ధిగా ఆర్‌ఎల్‌డికి చెందిన తబుసుమ్‌ హసన్‌ను రంగంలోకి దిగటమే కాదు గణనీయ మెజారిటీతో బిజెపిని ఓడించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.బిజెపిని ఓడించండి అని కార్యకర్తలకు పిలుపునివ్వటం తప్ప ఫలానా వారికి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజవాది పార్టీ నాయకురాలు మాయావతి సూచించలేదు. ఈ ఎన్నిక తరువాత అనూహ్యంగా దశాబ్దాలుగా వుప్పు నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ఒక ఫార్ములాను రూపొందించుకొని సీట్ల సర్దుబాటు చేసుకొని బిజెపి మీద బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగాయి.

శనివారం నాడు బిజెపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కైరానాలో మృగాంకకు మొండి చేయి చూపి పక్క జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను ఎంపిక చేశారు. వేరే కారణాలేమీ లేకుండా ఏడాదిలోనే అభ్యర్ధిని మార్చటం అంటే నైతికంగా బిజెపి ఓటమిని అంగీకరించటమే. వుప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డి అభ్యర్ధినిగా వున్న తబుసుమ్‌ ఈ సారి సమాజవాది పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ తమ అభ్యర్ధిని నిలిపే అవకాశం వుంది. ఏడుశాతంపైగా గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్దానాలలో మద్దతు ప్రకటించి మిగిలిన అన్ని చోట్ల ఎస్‌పి, బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్దులను రంగంలోకి దించుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర బిజెపి సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ప్రధాన ప్రత్యర్ధులకే దోహదం చేస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చదు. అయినా అన్ని చోట్లా తమ అభ్యర్ధులను నిలుపుతామని ఆ పార్టీ ప్రకటించింది.ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.

Image result for up lok sabha election 2019

అయోధ్య ! రాముడిని వీధుల్లోకి, భారతీయ జనతాపార్టీతో పాటు దేశంలో అనేక మందిని మత రాజకీయాలవైపు నెట్టిన పేరు. పక్కా కాషాయంతో మతం, అయోధ్య రాముడిని వుపయోగించుకొని బిజెపి లాభపడిందన్నది నిస్సందేహం. దాని తీరు చూసి కాంగ్రెస్‌ కూడా పలుచబారిన కాషాయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అయోధ్యలోని బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణం అన్నది గత ఎన్నికలలో బిజెపి వాగ్గానం. దానికి నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి, నల్లధనం వెలికితీత వంటి నినాదాలు తోడయ్యాయి. సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌, తదితర పార్టీలు విడివిడిగా పోటీపడటం బిజెపికి అనూహ్యంగా 80కిగాను 71, దాని మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు, సమాజవాది పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు వచ్చాయి.

Image result for ayodhya priest surendra das

ఈ సారి రామ మందిరం కాదు, పుల్వామాయే బిజెపిని రక్షిఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని పుల్వామా మాత్రమే రక్షించగలదు తప్ప రామ మందిరం కాదని అయోధ్యలోని వివాదాస్పద తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సురేంద్రదాస్‌ అన్నారు. సాధారణంగా రాజకీయాల గురించి నోరు విప్పని ఆ పెద్దమనిషి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ‘కాశ్మీర్‌పై దాడితో బిజెపి రామ మందిర సమస్యను పక్కన పెడుతుంది. రామ్‌ రామ్‌ అని నినాదాలు ఇచ్చేవారు ఇప్పుడా పని చేయరు. వారు గనుక రామ మందిరం సమస్యను ముందుకు తెస్తే ఓడిపోతారు, జనం వారిని నమ్మటం లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

గతంలో బాబరీ మసీదు వున్న చోట ఇప్పుడు తాత్కాలిక గుడారంలో భద్రతా సిబ్బంది రక్షణ మధ్య నాలుగు రాముడి విగ్రహాలు వున్నాయి. నాలుగంచలలో సందర్శకులను తనిఖీ చేసిన తరువాత 50 మీటర్ల దూరం నుంచి ఆ విగ్రహాలను చూడనిస్తారు. గతంలో సంస్కృత పండితుడిగా పని చేసిన సురేంద్రదాస్‌ కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. బాబరీ మసీదు కూల్చివేత ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా బాధించిందని, కూల్చాల్సిన అవసరం లేదని అంటారు.

పుల్వామా వుదంతం బిజెపిని తిరిగి అధికారంలోకి తెస్తుందనే అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించటం లేదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని, యూరి సర్జికల్‌ దాడులను బిజెపి ఎన్నికలలో వుపయోగించుకొని జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ఓటర్లకు దూరమైన విషయాలను గుర్తు చేస్తున్నారు. పుల్వామా తాత్కాలికంగా భావోద్వేగాలను రగిలించగలదు తప్ప నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని ఓటర్లు మరచిపోయే అవకాశం లేదంటున్నారు. పుల్వామా వుదంతాన్ని, అయోధ్య స్ధల వివాదం సుప్రీం కోర్టులో ఇంకా విచారణలో వుండగా దాన్ని ఏ రూపంలో ముందుకు తెచ్చినా బిజెపి విమర్శపాలయ్యే అవకాశం వుంది. రామాలయ నిర్మాణ వాగ్దానంతో అధికారానికి వచ్చిన యోగి ఆదిత్యనాధ్‌ భక్తులను తప్పుదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ఆలయ నిర్మాణం బదులు ఫైజాబాద్‌ జిల్లా పేరును శ్రీ అయోధ్య అని మార్చటం, అయోధ్యలో అతి పెద్ద రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే. బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరిన ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు ఎన్నికలు రాగానే మౌనం దాల్చాయి.

కాంగ్రెస్‌ స్వామిగా పేరున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఫిబ్రవరి 21న అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేస్తానని ప్రకటించి తన అనుచరులందరూ రావాలని పిలుపునిచ్చారు. అయితే 14వ తేదీన పుల్వామా వుగ్రదాడితో ఆ కార్యక్రమం వెనక్కు పోయింది. బిజెపి ఎంతగానో వూపిరి పీల్చుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతుందని రామ ప్రభు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు, రామ మందిరం చుట్టూ నాటకం నడుస్తోంది, అదొక ప్రహసనంగా మారుతోంది, బిజెపి ఏమి చెప్పింది, ఏమి చేస్తుంది అన్నది సమస్య కాదు, చివరికి సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది, దాని పట్ల బిజెపి నిజాయితీతో వుండాలి అని పూజారి సురేద్రదాస్‌ వ్యాఖ్యానించారు.

లెక్కలు ఏమి చెబుతున్నాయి !

దేశంలో వుపాధి కల్పన మొదలు, అభివృద్ధి అంకెల వరకు ఎవరు చెప్పేది నిజమో దేన్ని నమ్మాలో నమ్మకూడదో నిర్ణయించుకోలేనంతగా జనాన్ని ఆయోమయంలో పడవేశారు. ఐదేండ్లలో ఎంత మందికి వుపాధి కల్పించారంటే వున్న లెక్కలు తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అంటారు. పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పిన తరువాత పకోడీ బండ్లను కూడా తాను కల్పించిన వుపాధిలో భాగంగా పరిగణిస్తున్నారా ? వాటిని వదలి వేద్దాం. గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల లెక్కలను తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అనటం కుదరదు. అందువలన వాటి ప్రాతిపదికగానే విశ్లేషణలు చేయటం మినహా మరొక మార్గం లేదు.

వుత్తర ప్రదేశ్‌లోని 80 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.జరుగుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలలో చిన్న పార్టీలను కలుపుకొని బిజెపి ఎన్‌డిఏ కూటమి పేరుతో, కాంగ్రెస్‌, ఎస్‌పి,బిఎస్‌పి, ఇతర పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బిజెపి పోటీచేసిన 78 స్ధానాల్లో 71, మిత్రపక్షం అప్నాదళ్‌ రెండు చోట్ల పోటీ చేసి రెండూ గెలిచింది. కాంగ్రెస్‌ 66కు రెండు, సమాజవాది పార్టీ 78కి ఐదు గెలవగా 80చోట్ల పోటీ చేసిన బిఎస్‌పి అన్నింటా ఓడిపోయింది. బిజెపికి 42.3శాతం ఓట్లు రాగా ఎస్‌పికి 22.2, బిఎస్‌పికి 19.6, కాంగ్రెస్‌కు 7.5శాతం వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి 38, ఎస్‌పి 37 చోట్ల వుమ్మడిగా పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డిని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్‌ అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత గానీ నిజంగా ఎన్నిసీట్లలో పోటీ చేసేది తెలుస్తుంది. బిఎస్‌పి, ఎస్‌పి కూటమి గతంలో వచ్చిన ఓట్లను కలిపితే 41.8శాతం ఓట్లున్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ను చూస్తే బిజెపికి 39.7, దాని మిత్రపక్షానికి ఒక శాతం ఓట్లు వచ్చాయి. అదే బిఎస్‌పి,ఎస్‌పిలకు 22.2, 22శాతం వంతున 44.2శాతం వచ్చాయి. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు సగానికి సగం అంతకంటే ఎక్కువగా పడిపోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సర్వేలలో వెల్లడించిన అంకెల సగటును తీసుకుంటే బిజెపికి 29, కాంగ్రెస్‌కు 4, ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 47 వస్తాయని తేలింది.

వుత్తరాది రాష్ట్రాలలో, వుత్తర ప్రదేశ్‌లో బిజెపికి అయోధ్య అంశం ఓట్లు తెచ్చి పెట్టిందేమో కానీ అయోధ్య పట్టణం వున్న ఫైజాబాద్‌ నియోజకవర్గం ఎప్పుడూ దానితో లేదు. బిజెపి ఆయోధ్య ఆందోళన చేపట్టిన తరువాతే అక్కడ అది ఓట్లు తెచ్చుకోగలిగింది. బాబరీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఎన్నికలలో దానికి ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 1957 నుంచి 2014వరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఏడు సార్లు విజయం సాధించింది. 1991 తరువాత జరిగిన ఏడు ఎన్నికలలో బిజెపి నాలుగు సార్లు విజయం సాధించగా సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌ ఒక్కోసారి విజయం సాధించాయి. గత ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి లాలూ సింగ్‌కు 48శాతం ఓట్లు రాగా సమాజవాది పార్టీ మిత్రసేన్‌ యాదవ్‌కు 20.43, బిఎస్‌పికి 13.87, కాంగ్రెస్‌కు 12.7శాతం వచ్చాయి.

Image result for up lok sabha election 2019

బాబరీ మసీదు కూల్చివేసిన రోజు సాయంత్రమే జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన పరిస్ధితిని చక్కదిద్ది ప్రశంసలు పొందిన విజయ శంకర్‌ పాండే తాజా ఎన్నికల్లో లోక్‌ ఘటబంధన్‌ పార్టీ(ఎల్‌జిపి) అభ్యర్దిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న విజయ శంకర్‌ బాబరీ మసీదు కూల్చివేత అనంతరం ఏర్పడిన పరిస్ధితిని చక్కదిద్దటంలో ఎంతో సమర్ధవంతంగా పని చేశారు. ముక్కుసూటిగా, అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే పాండేను 52సార్లు బదిలీ చేశారంటే అవినీతి రాజకీయవేత్తలకు ఎంత దడపుట్టించారో అర్ధం అవుతుంది. అరవై రెండు సంవత్సరాల వయస్సున్న ఈ మాజీ అధికారి తాను ఇప్పుడు వునికిలో వున్న ఏ దైనా రాజకీయ పార్టీలో చేరితే ఇంతరకు తాను చేసిందంతా వృధా అయినట్లే అన్నారు.మార్పుకోసం సహకరించమని తాను సూటిగా ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. తాను కలెక్టర్‌గా నియమితమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అయోధ్యలో మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. రోడ్లన్నింటినీ మూసివేశారు. ఫైజాబాద్‌ వెళ్లే రోడ్డును కూడా మూసివేయటంతో లక్నో నుంచి హెలికాప్టర్‌లో వచ్చి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. వివాదాస్పద చంద్రస్వామి వివాదాస్పద స్దలం వద్ద హోమం చేయటానికి అనుమతించని కారణంగా కేవలం ఐదు నెలలకే తనను ఫైజాబాద్‌ నుంచి బదిలీ చేశారని చెప్పారు. మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ తనను వేధించారని చెప్పిన పాండే 2017లో వుద్యోగ విరమణ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశమంతటా కుస్తీ, కేరళలో కాంగ్రెస్‌ – బిజెపి దోస్తీ !

23 Saturday Mar 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Kerala, Kerala CPI(M), Kerala LDF, UDF Kerala, understanding between Congress-BJP

Image result for kerala cpm

ఎం కోటేశ్వరరావు

దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేస్తామని చెప్పుకుంటున్న బిజెపి కేరళలో దాన్ని బలపరచటమా ? దక్షిణాది అయోధ్య అని కొందరు వర్ణించిన శబరిమల అయ్యప్ప ఆలయం ఈ సారి కమ్యూనిస్టుల పాలనలోని కేరళ లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన అంశంగా మారనున్నదా ? ఈ ఎన్నికల్లో అయ్యప్ప భక్తుల మనోభావాలను మరోసారి రెచ్చగొట్టి లబ్ది పొందాలని కాంగ్రెస్‌, బిజెపి రెండూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు గాను రెండూ పరస్పర అవగాహనతో ఓట్ల బదిలీకి కొన్ని చోట్ల పరోక్ష ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన మార్గదర్శక సూత్రాల మేరకు వడకర, కన్నూరు, కొల్లం, కోజికోడ్‌, ఎర్నాకులం నియోజకవర్గాలలో బిజెపి నామమాత్రంగా పోటీ చేయాలని, దానికి ప్రతిగా తిరువనంతపురంలో బిజెపి అభ్యర్ధికి కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలని అవగాహనకు వచ్చినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. గతంలో 1991లో వడకరలో ఇలాంటి ప్రయోగమే జరిగిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అవగాహనతోనే నేమమ్‌ అసెంబ్లీ స్ధానంలో బిజెపిని కాంగ్రెస్‌ గెలిపించిందని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి బంధం మాదిరే ఎస్‌డిపిఐ-ముస్లిం లీగ్‌ వ్యవహరిస్తున్నాయని అలాంటి ఎస్‌డిపిఐతో కాంగ్రెస్‌ చేతులు కలుపుతున్నదని చెప్పారు.

బిజెపి విషయానికి వస్తే కేరళలో అసలైన పోటీ తమకూ కమ్యూనిస్టులకే నని, తదుపరి తమ లక్ష్యం కేరళ అని చెప్పుకొనే బిజెపి ఇరవైకి గాను కేవలం 14సీట్లలోనే పోటీ చేయాలని, మిగిలిన ఆరు సీట్లను మరో రెండు పార్టీలకు వదిలిపెట్టాలని నిర్ణయించింది. పోటీ చేసే చోట కూడా అభ్యర్ధుల విషయంలో కుమ్ములాటల కారణంగా ఎంతో ఆలస్యంగా 13మందినే ప్రకటించారు. శబరిమల ఆలయం వున్న పత్తానంతిట్ట నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయనే ఆశతో ఆ సీటు తమకు కావాలంటే తమకు కావాలని కుమ్ములాడుకున్నారు.దాంతో తలలు పట్టుకున్న అధిష్టానం ఆ సీటు అభ్యర్ధి ప్రకటన వాయిదా వేసింది. మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖరన్‌ పదవికి రాజీనామా చేయించి బిజెపి తిరువనంతపురం అభ్యర్ధిగా నిలబెట్టింది. అక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యుడు శశిధరూర్‌, సిపిఐ అభ్యర్ధి దినకరన్‌ పోటీలో వున్నారు.

Image result for kerala cpm

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా గత అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని చోట్ల పరోక్ష అవగాహనకు వచ్చినట్లుగానే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, బిజెపి అవగాహనకు వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ కాదంటున్నది. కేరళలో తమకూ సిపిఎంకు మధ్య మాత్రమే పోటీ అని మతశక్తుల నుంచి తమకు ఒక్క ఓటు కూడా అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అంటున్నారు. కొన్ని చోట్ల ఒకరికి మించి అభ్యర్ధులను పరిశీలించాల్సిన కారణంగా తమ జాబితా ఆలస్యమైంది తప్ప బిజెపితో పరోక్ష అవగాహన కోసం ఆపలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పటికే అక్కడి 20 నియోజకవర్గాలలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అందరి కంటే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్ధులను ప్రకటించి రెండవ దశ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బిజెపి, కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్ధులను పూర్తిగా ప్రకటించలేని దశలోనే వున్నాయి.

పిల్లల్ని కనే వయస్సులో వున్న మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఆంక్షలు విధించటాన్ని సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పులో తప్పు పట్టి ప్రవేశం కల్పించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును బిజెపి, కాంగ్రెస్‌ తొలుత స్వాగతించిన స్ధానిక పార్టీల నాయకత్వాలు వెంటనే ఈ అంశాన్ని రాజకీయంగా మార్చి ఓట్లు దండుకొనేందుకు ప్లేటు ఫిరాయించాయి. భక్తుల మనోభావాలను గౌరవించాలంటూ మహిళలకు ఆలయ ప్రవేశ హక్కును అడ్డుకొనేందుకు అయ్య ప్ప భక్తుల పేరుతో ఆందోళనలను నిర్వహించాయి. అవి హింసాత్మకంగా కూడా మారాయి. కమ్యూనిస్టులు అయ్యప్ప ఆలయ పవిత్రతను మలినం చేసేందుకు పూనుకున్నారని తప్పుడు ప్రచారం చేశాయి. నిజానికి అయ్యప్ప కేసుతో కమ్యూనిస్టులకు ఎలాంటి ప్రమేయం లేదు. దీనిపై కొంత మంది న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌పై కేరళ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినపుడు అధికారంలో వున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తాము మహిళల ప్రవేశానికి అనుకూలమే అని సుప్రీం కోర్టుకు నివేదించింది. తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత సంప్రదాయాలను పరిరక్షించేందుకు తాము కట్టుబడి వున్నామంటూ మరొక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కేసు విచారణ చివరి దశకు వచ్చిన సమయంలో ప్రస్తుతం పినరయ్‌ విజయన్‌ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గతంలో వున్న వైఖరికే తాము కట్టుబడి వుంటామని తన అభిప్రాయాన్ని చెప్పింది.

కేసు విచారణ సమయంలో పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తీర్పు తామూ వూహించని విధంగా రావటంతో కంగుతిని కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తీర్పును పునర్విచారణ జరపాలని కోరుతూ పిటీషన్లు దాఖలు చేయించారు.వాటిపై సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పాల్సి వుంది. ఈ లోగా లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌, బిజెపి ద్వంద్వ వైఖరులను ఎండగడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాతంత్ర వుద్యమ సాంప్రదాయాలను ముందుకు తీసుకు పోయే కృషిలో భాగంగా కేరళలో పలు సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన మహిళా మానవ హారంలో 40లక్షల మందికి పైగా అన్ని మతాలకు చెందిన మహిళలు పాల్గన్నారు.

Image result for congress and bjp friends in kerala cartoons

పోటీల తీరు తెన్నులకు వస్తే ఇరవైకి గాను 18 చోట్ల సిపిఎంాకాంగ్రెస్‌ కూటమి మధ్య ముఖాముఖి పోటీ వుంటుందని, తిరువనంతపురం, శబరి మల ఆలయం వున్న పత్తానంతిట్ట నియోజకవర్గాలలో బిజెపి కూడా పోటీలో వుంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇరవై సీట్లలో సిపిఎం బలపరిచే స్వతంత్రులతో సహా 16చోట్ల పోటీ చేస్తుండగా సిపిఐ నాలుగు స్ధానాలలో వున్నది. కాంగ్రెెస్‌ 16చోట్ల, ముస్లింలీగ్‌ రెండు, మరో రెండు పార్టీలు రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. బిజెపి 14, దాని మిత్రపక్షాలు ఆరు చోట్ల బరిలో వున్నాయి. గత ఎన్నికలలో యుడిఎఫ్‌ 12సీట్లు, ఎల్‌డిఎఫ్‌ ఎనిమిది చోట్ల గెలుపొందింది. గత ఎన్నికలలో యుడిఎఫ్‌ కూటమికి 41.98శాతం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు 40.12శాతం బిజెపి కూటమికి 10.82 శాతం ఓట్లు వచ్చాయి. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు కూటములకు వరుసగా 38.81,43.48,15.10శాతాలు వచ్చాయి.

Image result for kerala bjp,congress

తాజా ఎన్నికల్లో శబరిమలై ఆలయ పవిత్రత పరిరక్షణ పేరుతో ఆందోళన సాగించిన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ హిందూ ఓట్లకోసం ఏదో విధంగా మత అంశాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య నడుస్తున్న వివాదం వెల్లడించింది. శబరిమల ఆందోళనలు జరిగిన తరువాత జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ వుప ఎన్నికలలో ఆ అంశం బిజెపికి లాభించిన దాఖలాలు లేవు. అనేక చోట్ల ఘోరపరాజయం పాలైంది. అయినప్పటికీ ఈ ఎన్నికలు మూడు పక్షాలకూ సవాలుగానే పరిణమించాయని చెప్పవచ్చు. లౌకిక, వామపక్ష భావాలకు నిలయమైన కేరళలో గతంలో ముస్లిం, క్రైస్తవ మత శక్తులు కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. తొలిసారిగా హిందూత్వశక్తులు అటువంటి ప్రయత్నంలోనే వున్నాయి. అందువలన అక్కడి ఫలితాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చాయ్‌ వాలా, చౌకీదార్‌ రెండూ నరేంద్రమోడీ కాపీ నినాదాలే !

21 Thursday Mar 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Chaiwala, chowkidar, chowkidar narendra modi, Naredra Modi

Image result for chai wala narendra modi cartoons

ఎం కోటేశ్వరరావు

గత లోక్‌సభ ఎన్నికల్లో చాయ్‌ వాలా నినాదం మాదిరి తాజా ఎన్నికల్లో నేను కూడా చౌకీదారునే అనే నరేంద్రమోడీ ప్రచారం ఫలితాలనిస్తుందా లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. సామాన్య ఓటర్ల స్పందన ఇంకా తెలియదు. గతంలో బిజెపి వారందరూ చాయ్‌ వాలా టీ షర్టులు వేసుకున్నారు. వెంకయ్య నాయుడి వంటి పెద్దలు కూడా టీ దుకాణాలు ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులిచ్చి టీతో పాటు తమ ప్రచార సామగ్రిని జనానికి అందచేశారు. మహిళలకు ప్రత్యేకం అన్నట్లు చాయ్‌ వాలాలు కూర్చొనేందుకు ప్రత్యేక జాగాలు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ సారి ప్రస్తుతానికి విధేయులందరూ మోడీ మాదిరే తమ పేర్లకు ముందు చౌకీదార్‌ అని తగిలించుకుంటున్నారు. సభల్లో చాయ్‌ వాలాలను కూర్చోబెట్టిన మాదిరి చౌకీదార్లను సమీకరించే అవకాశం లేదు. నామ మాత్రంగా జీతాలు వచ్చే వుద్యోగాలు కూడా పోతాయి. బిజెపి వారంటే చావో రేవో తేల్చుకోవాలి గనుక ఇష్టం వున్నా లేకపోయినా పొలోమంటూ నరేంద్రమోడీని అనుకరించాలి కనుక ఆ పని చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జుల ఆర్భాటం చూస్తే రాబోయే ఎన్నికల్లో దాన్నొక ప్రధాన ప్రచార నినాదంగా చేసేందుకు తలపెట్టినట్లు ఈ పరిణామం స్పష్టం చేసింది. మోడీ అనుయాయులందరూ తమ పేర్లకు చౌకీదార్లని తగిలించుకోవటాన్ని కాంగ్రెస్‌ మోడీ బాబా మరియు 40 మంది దొంగలు అని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఆ పేరుతో జనాన్ని వెర్రివాళ్లను చేసిందని వ్యాఖ్యానించింది.గతంలో టీ స్టాల్స్‌ ఏర్పాటు చేసిన మాదిరే ఈ సారి దేశంలో ఐదువందల చోట్ల వీడియో కాన్ఫరెన్సుద్వారా నరేంద్రమోడీ నేనూ చౌకీదారునే అనే ప్రతిజ్ఞలు చేయిస్తారని ఇప్పటికే కోటి మంది దీనికి మద్దతు పలికారని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

Image result for chai wala narendra modi cartoons

గతంలోనూ ఇప్పుడూ బిజెపికి కాంగ్రెస్‌ నేతలే ప్రచార అస్త్రాలను అందించారనే ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ బిజెపి ప్రధాన ప్రతిపక్షమూ కాదు, నరేంద్రమోడీ ప్రధాని కాలేడు, కావాలంటే మా ఏఐసిసి సమావేశాల్లో టీ అమ్ముకొనేందుకు అవకాశం ఇస్తాం ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. వెంటనే దాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌ అవినీతిని ప్రస్తావిస్తూ దేశాన్నే ఏకంగా అమ్మేవారి కంటే టీ విక్రయించేవారే మెరుగు అంటూ బిజెపి చాయ్‌ వాలా మా ప్రధాని అంటూ నరేంద్రమోడీని ముందుకు తెచ్చింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంతో సమర్ధుడు, గుజరాత్‌ నమూనాను దేశమంతటికీ విస్తరింప చేస్తారు అన్న ప్రచారంతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన మా మోడీ టీ అమ్మటాన్ని అపహాస్యం చేస్తారా, చాయ్‌ వాలా ప్రధాని ఎందుకు కాకూడదు అంటూ సెంటిమెంటును కూడా రెచ్చగొట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రధాని అయ్యాక మిగతా నల్లధనం వెలికితీత, అవినీతి పరులపై చర్య వంటి వాటి మాదిరే మోడీ చాయ్‌ వాలా, చాయ్‌ పే చర్చా ప్రస్తావనలే రాకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్‌ వారు దొంగలైతే తానొక కాపలాదారునని ప్రధాని అని గాక చౌకీదార్‌ అని పిలిపించుకోవటానికి ఇష్టపడతానని గతంలో చెప్పుకున్నారు. రాఫెల్‌ విమానాల లావాదేవీల్లో ప్రధాని మోడీ కాపలాదారు కాదు దొంగ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రచారం ప్రారంభించటంతో మోడీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు తన పేరుకు ముందు చౌకీదారు పేరు తగిలించుకొని నేనూ చౌకీదార్‌నే అని అందరూ ముందుకు రావాలని తన మద్దతుదార్లకు పిలుపునిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇది 2014 కాదు, నరేంద్రమోడీ ఏ పిలుపునిస్తే దానిని గుడ్డిగా నమ్మటానికి జనమూ సిద్ధంగా లేరు. చాయ్‌ వాలా నినాదం పేలితే చౌకీదారు పిలుపు తుస్సుమనే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. భారతీయ జనతా పార్టీకి, నరేంద్రమోడీకీ ఇప్పుడు అంతసీను లేదు.ఎన్‌డిఏలోని మిత్రపక్షాల నేతలు, కొందరు మంత్రులు ఆపని చేసేందుకు సిగ్గుపడి మొహం చాటేస్తున్నారని, తటపటాయించి ఎందుకు మోడీతో అనవసర పంచాయతీ అని ఎట్టకేలకు తగిలించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది బిజెపికి తొలి ఎదురుదెబ్బ అనవచ్చు. వారా పని చేస్తే కేంద్ర సర్కార్‌ చేసిన అవినీతి అక్రమాలన్నింటికీ వారు కూడా జవాబుదారీ అవుతారు. ప్రతిపక్షాలు వారిని వదలిపెట్టవు. అయితే చౌకీదారు పేరును బిజెపి మిత్రపక్షాలు తగిలించుకోకపోయినా వదలవు అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైనా చౌకీదారు అని చెప్పుకున్నాడు అంటే దొంగలను స్వేచ్చగా వదలి వేసేబాపతు అనే అభిప్రాయం జనంలో ఇప్పటికే వ్యాపించింది, సామాజిక మీడియాలో ప్రస్తుతం అది పెద్ద ప్రచారంలో వుంది. ప్రచారం వూపందుకున్న తరువాత అదింకా పెరుగుతుంది. అందువలన బిజెపి దీన్ని ఎంతగా జనంలో తీసుకుపోతే అంతగా ఎదురు తన్నవచ్చు.

Image result for chowkidar narendra modi cartoons

గత ఎన్నికల్లో నల్లధనం, అవినీతి అక్రమాలు, వాటి నివారణ గురించి చెప్పని మాట లేదు. ఐదు సంవత్సరాలకు ముందు దేశంలోని వివిధ తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలను పదేండ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి గురించి ఎదురుదాడి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు తన ఐదేండ్ల పాలనలో జరిగిన అక్రమాల గురించి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్ధితిలో పడ్డారు. కాంగ్రెస్‌ మీద గతంలో మాదిరి దాడి చేస్తే కుదరదు. ఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించపోగా రాఫెల్‌ విమానాల కొనుగోలు కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అత్యంత భద్రంగా వుండే రక్షణశాఖ కార్యాలయంలోకి ప్రవేశించి తీరిగ్గా జిరాక్స్‌లు తీసుకొని వాటిని మీడియాకు అందచేసి ప్రచురించే వరకు కాపలదారును అని చెప్పుకున్న మోడీ ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతూ తన విధి నిర్వహణలో విఫలమయ్యారు? హిందూ పత్రికలో ప్రచురితమైన తరువాత పార్లమెంట్‌లోనూ వెలుపలా కూడా నోరు మెదపకుండా సుప్రీం కోర్టులో ఆ పత్రాలు చోరీ అయ్యాయని చెప్పటం ఏమిటి? ఏ చిన్న చోరీ జరిగినా వెంటనే కేసు నమోదు చేస్తారు. మరి రాఫెల్‌ పత్రాల చోరీ లేదా జిరాక్స్‌ గురించి ఎలాంటి ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇంత జరిగాక నేను కూడా చౌకీదార్‌నే అని చెప్పుకోవటం గోబెల్స్‌ స్ఫూర్తి తప్ప మరొకటి కాదు. వందసార్లు ఒక అబద్దాన్ని చెబితే చివరకు అది నిజమై కూర్చుంటుంది అన్నది గోబెల్స్‌ సూత్రం. దాని ప్రకారం తాను నికార్సయిన కాపలాదారును అని చెప్పుకుంటే సరిపోతుందా ? అంతకు ముందే వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయమల్య, ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోడీ వంటి వారు పారిపోతుంటే ఏమి చేస్తున్నారన్న ప్రశ్నకు ఇంతవరకు జవాబు లేదు.

నరేంద్రమోడీ ఇచ్చిన చౌకీదార్‌ పిలుపుకు తానూ సిద్ధమే అని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లూటీ ఫేం నీరవ్‌ మోడీ చేసిన ట్వీట్‌కు నరేంద్రమోడీ ప్రతి ట్వీట్‌ ద్వారా మీ భాగస్వామ్యం ద్వారా నేనూ చౌకీదార్‌నే అనే వుద్యమం మరింత బలపడుతుంది అభినందనలు అని చెప్పారంటే తాజా నినాదం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. మోడీ భక్తుడు, మహిళా జర్నలిస్టులను వేధించిన ఆరోపణలు ఎదుర్కొని కేంద్ర మంత్రి వుద్యోగం పోగొట్టుకున్న జర్నలిస్టు ఎంజె అక్బర్‌ తన పేరుకు చౌకీదార్‌ అని తగిలించి ట్వీట్‌ చేయగానే సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. సినీనటి రేణుకా సహానే చేసిన ట్వీట్‌లో మీరు కూడా చౌకీదార్‌ అయితే ఏ మహిళకైనా రక్షణ ఎక్కడుంటుంది, సిగ్గులేని వారికి హద్దేముంది అని వ్యాఖ్యానించారు. దాంతో వెంటేనే అక్బర్‌ తొలగించారు. అయితే ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అనుకున్నాడో ఏమో కొన్ని గంటల తరువాత తిరిగి చౌకీదారు అని తగిలించుకున్నాడు.

Image result for chowkidar narendra modi cartoons

గత ఎన్నికల సందర్భంగా చాయ్‌ పే చర్చా పేరుతో టీ స్టాళ్ల దగ్గర చర్చలంటూ వూదరగొట్టారు. కొన్ని చోట్ల బిజెపి ప్రచార సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్ధలాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ఏమైంది, టీ అమ్మేవారి బతుకులు ఏమైనా మారాయా ? చాయ్‌ వాలా నరేంద్రమోడీ చౌకీదారు అవతారమెత్తి దొంగలు పారిపోతుంటే పట్టనట్లు వూరుకొని ఆపని చేసే వారికి తీరని కళంకం తెచ్చారు. గతంలో చాయ్‌ వాలాల మాదిరి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చౌకీదార్లకు ప్రత్యేక స్ధలం ఏర్పాటు చేసి కూర్చోపెట్టారంటే పోలీస్‌ సేషన్లలో బోర్డులపై దొంగలను చూసిన మాదిరి జనం వారిని చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకుంటే ఎవరైనా చౌకీదార్‌ పని చేస్తానంటే అనుమానించే విధంగా బిజెపి సర్కార్‌, నరేంద్రమోడీ వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. నల్లధనం వెలికి తీత గురించి అరచేతిలో స్వర్గం చూపారు. చివరకు పెద్ద నోట్ల రద్దు అనే సర్జికల్‌ స్రైక్‌(మెరుపుదాడి) జరిపారు.నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారు. చివరకు అది ఖజానాకు, దేశ ఆర్ధిక వ్యవస్ధకు, అన్నింటికీ మించి జనానికి ఎంతో నష్టదాయకంగా మారిన విషయం తెలిసిందే. నోట్ల రద్ధు వలన సాధించిన విజయాలేమిటయ్యా అంటే కింద పడ్డా గెలుపు నాదే అన్నట్లుగా ధనం మొత్తాన్ని బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తెచ్చాముగా అని చెప్పుకున్నారు. అవినీతి నిరోధం గురించి బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లోక్‌పాల్‌ నియామకం చేయాలంటూ అన్నాహజారే చేసిన ఆందోళనకు మద్దతు పలికింది. లోక్‌పాల్‌ బిల్లును 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదించినా తరువాత అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ ఐదేండ్ల వరకు కుంటిసాకులు చెబుతూ అందుకు చర్యలు తీసుకోలేదంటే చిత్తశుద్ది ఏమిటో అర్దం చేసుకోవచ్చు. సాకులు చెబితే కుదరదు, ఫిబ్రవరిలోగా నియామకం సంగతి తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన కారణంగా దాన్ని అమలు చేయకపోతే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అదొక ప్రచార అస్త్రంగా మారుతుందనే భయంతోనే ఎట్టకేలకు నియామకాలను చేపట్టారు.లోక్‌పాల్‌ వ్యవస్ధ ఏర్పాటు తమ ఘనతే అని చెప్పుకోవటానికి కూడా వీలులేని విధంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ లోకాయుక్త నియామకాన్ని వ్యతిరేకించిన చరిత్ర తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల పాటు ఖాళీగా వున్న ఆ పోస్టు నింపకుండా ఏదో ఒకసాకుతో అడ్డుకున్న అతి పెద్ద అవినీతి వ్యతిరేక పితామహుడు. మంత్రివర్గఆమోదం లేకుండా నియామకం చెల్లదన్న వాదనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు నియామకాన్ని సమర్ధించింది.

Image result for chowkidar narendra modi cartoons

గత ఎన్నికల్లో చాయ్‌ వాలా, ఇప్పుడు నేనూ చౌకీదార్‌నే అనే నినాదాలను బిజెపి, నరేంద్రమోడీ మన అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ భావంలో చెప్పాలంటే ఇతరుల నుంచి తస్కరించారు లేదా జిరాక్స్‌ తీసుకున్నారు. గతంలో అనేక సందర్భాలలో నేను… నేను కూడా….. అనే నినాదాలు ప్రపంచ వ్యాపితంగా జనంలో ప్రాచుర్యం పొందినవే. ఆఫ్రికా నుంచి పట్టుకొచ్చిన బానిసలు, వారి సంతానాన్ని అమెరికన్‌ శ్వేతజాతీయులు తమ ‘కుర్రాళ్ల’ ని పిలిచేవారు. బానిసత్వ వ్యతిరేక పౌర వుద్యమంలో నేను కుర్రాడిని కాదు నేను మనిషిని అంటూ వుద్యమించారు.ఇటీవలి వుదంతాల విషయానికి వస్తే 2015లో ఫ్రాన్స్‌లోని వివాదాస్పద పత్రిక చార్లీ హెబ్డో మహమ్మద్‌ ప్రవక్త మీద ప్రచురించిన ఒక కార్టూన్‌ కారణంగా ఆల్‌ఖైదా తీవ్రవాదులు పత్రికా కార్యాలయం మీద దాడి చేసి పన్నెండు మందిని కాల్చి చంపారు. దానికి నిరసనగా నేనూ చార్లీనే అనే నినాదంతో లక్షలాది మంది ఐరోపాలో ప్రదర్శనలు చేశారు. మన దేశంలో జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను హిందూత్వ వుగ్రవాదులు హత్యచేసినపుడు దానికి నిరసనగా నేనూ గౌరీలంక్షేష్‌నే అంటూ పలుచోట్ల ప్రదర్శకులు ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. జనలోక్‌పాల్‌ బిల్లుకోసం అన్నా హజారే వుద్యమించిన సమయంలో నేనూ అన్నానే అంటూ అనేక మంది తమ టోపీల మీద రాసుకొని దానికి మద్దతు పలికారు. పని స్ధలాల్లో మహిళలపై వేధింపులకు నిరసనగా కొద్ది నెలల ముందు మీ టూ ప్రచారం సంగతి తెలిసిందే. అంటే నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని అనేక మంది మహిళలు ముందుకు వచ్చారు. ఇంకా ఇలాంటివే అనేక దేశాలలో జరిగాయి. వాటి నుంచి కాపీ కొట్టిందే నేనూ చౌకీదార్‌నే అనే నినాదం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d