• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Kerala BJP

దొంగ డబ్బు కేసు : కేరళ బిజెపి నేతలను కాపాడుతున్న ఇడి !!

11 Saturday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

APP, BJP, ED and IT, Kerala BJP, Kerala CPI(M), Kodakara Black Money Heist, Narendra Modi, RSS, The Enforcement Directorate


ఎం కోటేశ్వరరావు


కేేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, ఇతర బిజెపి నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్న హవాలా కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వినోద్‌ మాథ్యూ విల్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ద్వారా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున దాన్ని అనుమతించవద్దని ఇడి న్యాయవాదులు కోర్టును కోరింది. ఆమ్‌ ఆద్మీనేత కోరికపై తీర్పును రిజర్వుచేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలతో ఈ కేసులో దాఖలైన ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌ను ఇడి కోర్టుకు సమర్పించింది. 2021లో తాము జరిపిన ప్రాధమిక దర్యాప్తు గురించి కూడా కోర్టుకు తెలిపింది.ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టును 2023లో తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నది. ఇప్పటికే తాము అనేక మందిని ప్రశ్నించి వారు చెప్పిన అంశాలను నమోదు చేశామని, డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న అంశాలను దర్యాప్తు చేస్తున్నామని, సమగ్రంగా దర్యాప్తు జరిపి తరువాత నివేదిక సమర్పిస్తామని చెప్పింది. రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నింటి మీద తాము దర్యాప్తు జరపలేమని ఇడి వాదించింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన అంశాలలో హవాలా మార్గం ద్వారా 2021 ఎన్నికల కోసం బిజెపికి సంబంధించిన వారు డబ్బుతెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, కానీ దీని గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నదని, మూడు సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి చర్యలు లేవని హవాలా గొలుసు గురించి ఉపా చట్టం కింద ఇడి మరియు ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది.


వాద ప్రతివాదనల సందర్భంగా విచారణ జరిపిన విచారణ బెంచ్‌లోని న్యాయమూర్తి గోపీనాధ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర్ర పోలీసు లేదా సిబిఐ వంటి సంస్థలు ఒక నేరంపై ఎఫ్‌ఐఆర్‌ సమర్పించిన తరువాత ఇడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.” సిబిఐ లేదా మరేదైనా కావచ్చు వాటి ఎఫ్‌ఐఆర్‌లను పక్కన పెట్టి దర్యాప్తు జరిపేందుకు వాటి మీద ఉన్న సంస్థ ఇడి కాదు. వారి పని రెండు అంశాలకే పరిమితం ఒకటి విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం(ఫెమా) రెండవది మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పిఎంఎల్‌ఏ). ఒక కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో అది గానీ ఇది గానీ ఉందా అన్నది, ఉంటే వాటిని ఉపయోగించటం తప్ప ఒక దర్యాప్తు సంస్థ మాదిరి దర్యాప్తు చేయటానికి ఇడి దర్యాప్తు సంస్థ కాదు.పిఎంఎల్‌ఏ కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవటం లేదా పోయిన వాటిని స్వాధీనం చేసుకోవటానికి మించి సదరు చట్టంలో ఇంకా ఏమైనా ఉందా అన్నది కోర్టుకు చెప్పండి. మీరు ఉన్న దర్యాప్తు సంస్థలకు అతీతమైన ఉన్నత దర్యాప్తు సంస్థకాదు అని న్యాయమూర్తి అన్నారు.


కేరళ అసెంబ్లీ 2021ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. దాంతో పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు కోరినంత నల్లధనాన్ని పంపారు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు మూడున్నర కోట్లుగా తేలింది ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో చెప్పనవసరం లేదు. దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో బిజెపిలో రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది అప్పుడు జరిగిన చర్చ. ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయనున్నట్లు అప్పుడు రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు.


ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నించారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు బుకాయించారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా పని చేసినట్లు ఆరోపణ. అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని తేలింది. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు.
ఈ కేసులో ఇడి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఇడి అరెస్టు చేసిన నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కేజరీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులను అరెస్టు చేసి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నది. అదే ఒక రాష్ట్ర పోలీసుశాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం తేల్చటానికి మూడు సంవత్సరాలు దాటినా ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నామని చెప్పటం అసమర్ధత లేదా ఆ కేసులో ప్రమేయం ఉన్న బిజెపి నేతలు, వారికి నిధులు ఇచ్చిన వారిని రక్షించేందుకు వీలైనంత వరకు కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. ఇడి కొందరి పట్ల దయగల దేవత, మరికొందరి పట్ల వేధించే దయ్యం మాదిరిగా మారిందన్నది ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధమిక ఆధారాలు, డబ్బు రవాణా చేసిన వారి వివరాలు ఉన్నప్పటికీ ఇంత చిన్న కేసును కూడా సంవత్సరాల తరబడి పరిష్కరించలేని దుస్థితిలో ఇడి ఉందా ?


బిజెపికి అనుకూలంగా ఇడి, ఐటి పని చేయటంలో భాగంగానే త్రిసూర్‌లో తమ పార్టీ బాంకు ఖాతాలను స్థంభింపచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు. సిపిఎం ఎన్నికల పనిని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అన్నారు. పార్టీకి దేశవ్యాపితంగా ఒకే పాన్‌ నంబరు ఉందని, ఆదాయపన్ను సంబంధిత వివరాలను ఆ శాఖకు సమర్పించినప్పటికీ అక్రమంగా ఐటిశాఖ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఖాతాను నిలిపివేసిందన్నారు.తమ ఖాతాలున్న బాంకు సిబ్బంది వేరే పాన్‌ నంబరు నమోదు చేసినకారణంగా అనవసర చర్చ ఎందుకని తాము మౌనంగా ఉన్నామని, తమ సిబ్బంది చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తూ సదరు బాంకు తమకు ఒక లేఖ కూడా రాసిందని గోవిందన్‌ చెప్పారు. బాంకు తప్పిదం వెల్లడైన తరువాత కూడా తమ ఖాతాల స్థంభన కొనసాగించటం వేధింపు గాక ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు పాన్‌ నంబరును ఆధారం చేసుకొని త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యదర్శిని విచారణ పేరుతో వేధించారని, పాన్‌ నంబరు గురించి వివరించినా పట్టించుకోలేదన్నారు.ఈ విచారణను మీడియా పెద్దఎత్తున సిపిఎంకు వ్యతిరేక ప్రచారానికి వాడుకుందని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటన చేయటాన్ని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వివాదాస్పదం కావించారు. పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారని, అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బిజెపిని మంచిచేసుకొనేందుకే విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పర్యటన పూర్తిగా కుటుంబపరమైందని, ఖర్చంతా వారే భరిస్తారని సిపిఎ స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వీళ్లు పొట్టకూటి మాయలోళ్లు కాదు : కేరళలో మాదిరి ఈద్‌ రోజున హైదరాబాద్‌ ఇతర చోట్ల బిజెపి ముస్లింలను సంతుష్టీకరిస్తుందా !

14 Friday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, EID, Kerala BJP, Mohan Bhagwat, Muslims, Narendra Modi, Ramzan, RSS


ఎం కోటేశ్వరరావు


ఈస్టర్‌ రోజున ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఒక చర్చి ప్రార్ధనలకు వెళ్లగానే క్రైస్తవులందరూ తమ చంకనెక్కినట్లు, ఇదే ఊపులో ఈద్‌ రోజున ముస్లింలను సంతుష్టీకరించి వారిని మరో చంకనెక్కించుకుందామని కేరళలో బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు కార్యకర్తలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వీర, శూర హిందూత్వ వాదులకు ఇది మింగుడు పడని అంశమే. వారు మైనారిటీ విద్వేషం అనే పులిని ఎక్కి ఉన్నారు. అధికారం కోసం దేనికైనా నరేంద్రమోడీ సిద్దపడేట్లు ఉన్నారు. ఉన్న ఒక్క అసెంబ్లీ సీటును పొగొట్టుకొని కొరకరాని కొయ్యగా ఉన్న కేరళలో పాగా వేసేందుకు చూస్తున్న బిజెపి ఆత్రం అంతా ఇంతా కాదు. అదే పని ఇతరులు చేస్తే వ్యభిచారం తాము చేస్తే సంసారం అన్నట్లుగా ఫోజు పెడుతోంది. ఒక రాజకీయపార్టీగా జనాభిమానం పొందాలన్న కోరిక ఉండటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇంతకాలం తమనేతలు, మద్దతుదార్లు చేసిన క్రైస్తవ, ముస్లిం విద్వేష ప్రసంగాలు, ప్రచారాన్ని ఆ సామాజిక తరగతుల వారు మరిచినట్లు, మారుమనసు పుచ్చుకొని ఇతర పార్టీలను వదలి తమ వైపు వచ్చినట్లు బిజెపి భావిస్తున్నది. వారు మరీ అంత అమాయకంగా ఉన్నట్లు భావిస్తున్నారా ? అవకాశ వాదులు ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఈ రోజుల్లో అన్ని సామాజిక తరగతుల్లో ఉన్నట్లుగానే వీరిలో కూడా ఉన్నారు. లేకుంటే చెట్టపట్టాలు వేసుకొని తిరగరు. అదే విధంగా మెజారిటీ మతోన్మాదం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా దానికి తక్కువేమీ కాదు. రెండూ ఒకే నాణానికి బొమ్మ బొరుసు వంటివి. ఒకదాన్ని మరొకటి ఆలంబనగా చేసుకొని తమ అజెండాలను అమలు జరుపుతున్నాయి.


కేరళ రాష్ట్ర బిజెపికి మార్గదర్శకుడిగా ఉన్న ప్రకాష్‌ జవదేకర్‌ తాజాగా రీడిఫ్‌ డాట్‌ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ(ఏప్రిల్‌ పన్నెండవ తేదీ)లో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది.కేరళలో ఓటు అనుబంధాలు మారతాయి. గత పార్లమెంటు ఎన్నికల తరువాత జన వైఖరి మారింది.నరేంద్రమోడీ సుపరిపాలన ఎలా ఉంటుందో ఇంతకు ముందు కేరళవాసులు చూడలేదు.2019 ఎన్నికల్లో జనం రెండు శిబిరాలుగా చీలారు. ఒకసారి గెలిచిన మోడీ తిరిగి గెలవరని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని అప్పుడు భావించారు.అందుకే కాంగ్రెస్‌కు 20కి గాను పందొమ్మిది ఇచ్చారు.ఈ సారి బిజెపికి కనీసం ఐదు సీట్లు వస్తాయి. క్రైస్తవులు, ఇతర సామాజిక తరగతులు ఇతర ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు.కాంగ్రెస్‌ ఓటు బాంకు బాగా పడిపోయింది. క్రిస్మస్‌ రోజు నుంచి వేలాది మంది బిజెపి కార్యకర్తలు వేలాది క్రైస్తవుల గృహాలను సందర్శించారు.వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. వారికి కేకులు ఇచ్చారు, వారిని లంచ్‌, డిన్నర్లకు ఆహ్వానించారు.అందరూ సంతోషించారు. మరోలక్ష ఇండ్లను సందర్శించే పధకం ఉంది. మళయాళీ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 15న ” విషు ” సందర్భంగా హిందూ కార్యకర్తలు క్రైస్తవులు, ముస్లింల ఇండ్లను సందర్శించి తమ ఇండ్లలో జరిగే ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తారు. ఈద్‌ రోజున శుభాకాంక్షలు తెలుపుతారు.


ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవులు సురక్షితంగా ఉన్నారని పొగిడిన సిరో మలబార్‌ కాథలిక్‌ చర్చి అధిపతి మార్‌ జార్జి అలంచెరీ తీరును కాథలిక్‌ పత్రిక ” సత్యదీపం” సంపాదకీయంలో కడిగిపారేసింది. ఒక పత్రిక ఇంటర్వ్యూలో అలంచెరీ మాట్లాడుతూ కేరళలో బిజెపి ప్రజల ఆమోదం పొందుతున్నదని కూడా చెప్పారు.చిన్న చిన్న ప్రయోజనాల కోసం అలా మాట్లాడితే చరిత్ర క్షమించదని హెచ్చరించింది. దేశంలో క్రైస్తవుల మీద పెరుగుతున్న దాడుల గురించి బాధ్యత కలిగిన కాథలిక్‌ చర్చ్‌ ఆఫ్‌ ఇండియా ఆర్చిబిషప్‌ ఒకరు (బెంగలూర్‌ మెట్రోపాలిటన్‌ ఆర్చిబిషప్‌ పీటర్‌ మచాడో) సుప్రీం కోర్టు ముందు ఒక పిటీషన్‌ దాఖలు చేసి ఉండగా అలంచెరీ ఇలా మాట్లాడటం ఏమిటని నిలదీసింది.క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని వర్ణించిన, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పనిచేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ”ఆలోచనల గుత్తి ” అనే పుస్తకంలో రాసినదాన్ని ఇప్పటికీ బోధిస్తున్నప్పటికీ చర్చి నాయకత్వం తమ బుర్రలను మార్చుకొనేందుకు దోహదం చేసిందేమిటని ప్రశ్నించింది. రాజకీయాలేమీ లేవంటూ బిషప్పులు, క్రైస్తవుల ఇండ్లకు తిరుగుతున్న బిజెపి నేతల రాజకీయం గురించి లౌకిక కేరళ సులభంగానే అర్ధం చేసుకోగలదని పేర్కొన్నది. స్టాన్‌ స్వామిని ఎలా చంపేశారు ? కందమాల్‌ బాధితులకు (2008లో ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులను చంపి, వందలాది చర్చ్‌లను ధ్వంసం చేసిన ఉదంతం) న్యాయాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారో తమ వద్దకు వచ్చిన అతిధులను అడగకుండా బిషప్పులు ”రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారని ” ఎద్దేవా చేసింది.


” హిందూ సమాజం యుద్దంలో ఉంది, అందువలన కలహశీలంగా ఉండటం సహజం.అంతర్గతంగా ఉన్న శత్రువుతోనే యుద్దం. కాబట్టి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని రక్షించుకొనేందుకు యుద్దం జరుపుతున్నది. విదేశీ దురాక్రమణలు, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలుగా పోరులో ఉంది. దీనికి సంఫ్‌ు మద్దతు ఇచ్చింది ”అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇటీవల తమ పత్రిక ” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో పేర్కొన్నారు. గోల్వాల్కర్‌ చెప్పినదే మరో రూపంలో చెప్పారు. అలాంటి సంస్థ ఏర్పాటు చేసిన బిజెపికి మద్దతు ప్రకటించేందుకు కేరళలోని చర్చి అధికారులు సాకులు చూపుతున్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ (ఆలోచనల గుత్తి ) పేరుతో 1940,50 దశకాల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇప్పుడు పనికిరావని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంటి రమేష్‌ నమ్మబలుకుతున్నారు. అ పుస్తకంలోని అంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళి కాదని కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. క్రైస్తవులు భారత్‌ గాక తమ విదేశాల్లోని తమ పవిత్ర ప్రాంతానికే విధేయులుగా ఉంటారని, 1857 నుంచి బ్రిటీష్‌ వారితో కుమ్మక్కు అయ్యారని,బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, క్రైస్తవ మిషనరీలు రక్తం తాగుతారని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలకు చెందిన వారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత ఆ పేరుతో మతమార్పిడి నిరోధ చట్టాలను చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ గోల్వాల్కర్‌ భాషలోనే క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ క్రిస్మస్‌, ఆంగ్ల సంవత్సరాదులను విమర్శించింది. రబ్బరు ధరలను పెంచితే కేరళలో బిజెపికి మద్దతు ఇస్తారని తెలిచ్చేరి ఆర్చిబిషప్‌ ఎంజె పంప్లానీ ప్రకటించారు. కొందరు చర్చి నేతలు భూమితో సహా కొన్ని కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి కొందరిని తమకు అనుకూలంగా బిజెపి మార్చుకుంటున్న తీరు తెన్నులు మనకు తెలిసిందే అని మాజీ ఎంపీ సెబాస్టియన్‌ పాల్‌ అన్నారు. గుర్తు చేసుకుందాం అనే పేరుతో ఏప్రిల్‌ 17న ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు క్రైస్తవులపై దాడులను వివరించేందుకు ఎగ్జిబిషన్లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నట్లు డివైఎఫ్‌ఐ ప్రకటించింది.


తమ అజెండాను జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు ఊహాజనితమైన అంశాలను ముందుకు తేవటం, వాటి ప్రాతిపదికగా విద్వేషాన్ని రెచ్చగొట్టటం సంఘపరివార్‌ ఎత్తుగడ అన్నది తెలిసిందే.” ఆర్గనైజర్‌ ” తో జరిపిన సంభాషణలో మోహన్‌ భగవత్‌ చెప్పింది అదే. ” కపటం లేని నిజం ఏమంటే హిందూస్తాన్‌ ఎప్పటికీ హిందూస్తాన్‌గానే ఉండిపోవాలి. నేటి భారత్‌లో నివశిస్తున్న ముస్లింలకు హాని ఉండదు.వారి విశ్వాసానికి వారు కట్టుబడి ఉండాలని కోరుకుంటే వారు ఉండవచ్చు. ఒక వేళ వారు తమ పూర్వీకుల విశ్వాసానికి తిరిగి రావాలంటే వారు రావచ్చు. అది పూర్తిగా వారిష్టం. హిందువుల్లో అలాంటి పంతం లేదు, ఇస్లాం భయపడాల్సిందేమీ లేదు. కానీ ఇదే సమయంలో ముస్లింలు తాము ఉన్నతులమనే ప్రచండమైన వాక్పటిమను వదులుకోవాలి…… జనాభా అసమతూకం అనేది ఒక ప్రధాన ప్రశ్న, దాని గురించి మనం ఆలోచించాలి…..అది ఒక్క జననాల రేటు గురించే కాదు. అసమతూకం ఏర్పడటానికి మతమార్పిడులు, అక్రమ చొరబాట్లు ప్రధాన కారణం. వీటిని నిరోధిస్తే సమతూకం పునరుద్దరణ అవుతుంది.మనం దీన్ని కూడా చూడాలి.” గురువుగా సంఘీయులు భావించే గోల్వాల్కర్‌ బోధనల సారం కూడా ఇదే. ఒక వైపు అవి ఇప్పుడు పనికి రావు అని అదే సంఘీయులు కొందరు మరోవైపు చెప్పటం ఎప్పటికా మాటలాడి అప్పటికి తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు నాలుకలతో మాట్లాడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. మేకతోలు కప్పుకున్నప్పటికీ పులి స్వభావం మారదు. కుటుంబనియంత్రణ పాటించకుండా జనాభాను పెంచివేస్తున్నారని,హిందువులు మైనారిటీగా మారనున్నట్లు చేస్తున్న ప్రచారం ఎవరు చేస్తున్నదీ తెలిసిందే.


జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కాదు అసలు ఉండదు అన్నది కొందరి భావన అందుకే గతంలో ఎవరేం చెప్పారో, ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకోవటం అవసరం.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ 2021 జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. అలాంటపుడు జనాభా సమతూకం ఎలా ఉంటేనేం ?దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు ?
ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శనదేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.

2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. అలాంటి శక్తులకు మద్దతు ఇచ్చేందుకు ఇస్లాం, క్రైస్తవ మతాధికారులుగా ఉన్నవారు ముందుకు వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బిజెపిని ఒక్క ప్రశ్న అడగాలి. కేరళలో ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులకు కేకులిచ్చి మంచి చేసుకోవాలని చూశారు. ఈద్‌(రంజాన్‌) సందర్భంగా ముస్లింలను కూడా అదే విధంగా కలవాలని నిర్ణయించారు. కేరళ సిఎం పినరయి విజయన్‌ అన్నట్లు గతంలో చేసిన దానికి పశ్చాత్తాపంగా అలా చేస్తే మంచిదే.కేరళలో మాదిరి దేశంలోని ఇతర ప్రాంతాలు అంటే హైదరాబాద్‌ వంటి చోట్ల కూడా బిజెపి అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందా, అసదుద్దీన్‌ ఒవైసి తదితరులను ఆలింగనం చేసుకొని శుభం పలుకుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వద్దకు కేరళ గవర్నర్‌ : పదవి గౌరవాన్ని మంటకలిపిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ! అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !!

21 Wednesday Sep 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arif Mohammed Khan, BJP, CPI(M), Kerala BJP, Kerala Governor Arif Mohammed Khan, Kerala LDF, Pinarai Vijayan, RSS



ఎం కోటేశ్వరరావు


తన ఆహ్వానాన్ని మన్నించి రాజ్‌భవన్‌ కార్యక్రమానికి రాలేదని, తనను కలవటం లేదని, ప్రోటోకాల్‌ మర్యాదలను మంట గలుపుతున్నారని తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ తమిళశై వాపోవటం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి, ఆమె రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చారనే విమర్శలకు గురైన అంశం తెలిసినదే. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మరొక అడుగు ముందుకు వేసి స్వయంగా ప్రోటోకాల్‌ను తీసి గట్టున పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను 2022 సెప్టెంబరు 17న ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంటికి వెళ్లి కలసి వచ్చారు. అంతే కాదు, మరీ ఎక్కువ మాట్లాడితో మరోసారి వెళ్లి కలుస్తా, నా ఇష్టం అంటూ చిందులు వేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారమే త్రిసూర్‌లో పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు గవర్నర్‌ కలిసినట్లు అధికారులు చెప్పారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. తరువాత గవర్నర్‌ విలేకర్లతో మాట్లాడుతూ 2019లో కన్నూరులో తనపై దాడికి యత్నించినవారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులను ప్రభుత్వం అడ్డుకుంటున్నదని గవర్నర్‌ ఆరోపించారు.


రాజభవన్‌ వెలుపలికి తానుగా వెళ్లి ప్రయివేటు వ్యక్తులను గవర్నర్లు కలిసిన దాఖలా లేదు. 2015లో ఉత్తర ప్రదేశ్‌ రాజభవన్లో నాటి గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ను కలిశారు. వేరే చోట కలిసిన కేరళ గవర్నర్‌ సోమవారం నాడు(19వ తేదీ) తొలిసారిగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన చర్యను సమర్ధించుకోవటమే కాదు, మోహన్‌ భగవత్‌ రాష్ట్రానికి వస్తే మరోసారి వెళ్లి కలుస్తా అని చెప్పారు. తాను అధిపతిగా ఉన్న రాష్ట్రానికి భగవత్‌ వచ్చారు, అసలు ఆయన వస్తున్నట్లు నాకు తెలియదు, తెలియగానే వెళ్లి కలిశాను. మరోసారి గనుక వస్తే తిరిగి కలుస్తాను అంటూ తన చర్య గురించి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని తరువాత గవర్నర్‌ వస్తారు. అలాంటి పదవిలో ఉండి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను వెళ్లి కలవటం మర్యాదలను అతిక్రమించటం కాదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించటంతో పాటు తాను వ్యక్తిగతంగా కలసినట్లు సమర్ధించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారు అనేక రాజభవన్ల పదవుల్లో ఉన్నారు. మీరంతా వారిని కలుస్తున్నారు. అలాంటపుడు రాజభవన్లో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కలిస్తే తప్పేమిటంటూ ఎదురుదాడి, కుతర్కానికి దిగారు. తాను కనీసం ఆరుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సభలకు వెళ్లానని, ఆ సంస్థతో తనకు ఉన్న అనుబంధం అలాంటిదంటూ దానిలో అసాధారణత ఏముందని ప్రశ్నించారు. సిపిఎం హింసాత్మక భావజాలంతో పని చేస్తున్నదని ఆరోపిస్తూ కేరళలో జరుగుతున్న రాజకీయ హత్యలు తనకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని గవర్నర్‌ చెప్పుకున్నారు. వాటిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర కూడా ఉందని విలేకర్లు చెప్పగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ అధికారంలో లేదు, ప్రభుత్వం అలాంటి హింసాకాండను అదుపులో పెట్టాలి అన్నారు.


ఈ పెద్దమనిషి ప్రజాస్వామ్యాన్ని కూడా వద్దంటారు : ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌పై పినరయి విజయన్‌


కమ్యూనిజం విదేశీ సిద్దాంతమంటున్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా అలాగే తృణీకరిస్తారని కేరళ సిఎం పినరయి విజయన్‌ చెప్పారు. సోమవారం నాడు కన్నూరులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ పదవి గౌరవాన్ని మంటకలిపి వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతల స్థాయి దిగజారవద్దని గవర్నర్‌కు హితవు చెప్పారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ స్వామిభక్తిపరుడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉండి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదన్నారు. వామపక్ష ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం విదేశీ, ఇక్కడికి తీసుకువచ్చారని, అసమ్మతిని అణచేందుకు హింసను అనుమతిస్తుందని అంతకు ముందు గవర్నర్‌ విలేకర్ల సమావేశంలో ఆరోపించారు.దాన్ని ప్రస్తావించిన విజయన్‌ ఇటలీలోని ఫాసిజం ప్రాతిపదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉందని దాన్ని అక్కడి నుంచి, కమ్యూనిజం, క్రైస్తవం, ముస్లిం వ్యతిరేకతను హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ రోజు కమ్యూనిజం విదేశీ అంటున్న గవర్నర్‌ రేపు ప్రజాస్వామ్యం కూడా అలాంటిదే వద్దంటారని ధ్వజమెత్తారు.


గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా దిగజార్చమే కాదు, పార్టీ నేత మాదిరి అవకాశం వచ్చినపుడల్లా ప్రభుత్వం, పాలక సిపిఎం మీద విరుచుకుపడుతున్నారు. 2019 డిసెంబరులో కన్నూరులో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడిస్తానంటూ 2022 సెప్టెంబరు 19న విలేకర్లను రాజభవన్‌కు రప్పించారు. కొండంత రాగం తీసి కీచుగొంతుతో అరచినట్లు ప్రహసన ప్రాయంగా ముగించారు. మూడు సంవత్సరాల నాడు కన్నూరులో జరిగిన భారత చరిత్రకారుల సభలో ప్రారంభ ఉపన్యాసం పేరుతో చేసిన గవర్నర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సభలో పాల్గొన్నవారు తీవ్ర నిరసన తెలిపారు. ఆ సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగింది.చరిత్రకారుల సభలో సంబంధిత అంశాలు గాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ(సిఎఎ), ఎన్‌ఆర్‌సికి మద్దతు పలుకుతూ వ్యతిరేకిస్తున్నవారిని విమర్శించటంతో సభలో కొందరు తీవ్రనిరసన తెలిపారు. ఆ సభలో వేదిక మీద ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ చర్యకు నిరసన తెలుపుతూ ఈ విధంగా మీరు మాట్లాడేట్లయితే గాంధీ బదులు గాడ్సే గురించి చెప్పండనటాన్ని పత్రికలు ప్రస్తావించాయి. తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందంటూ నిరసన తెలుపుతున్నవారితో గవర్నర్‌ వాదులాటకు దిగారు.ఈ తరుణంలో వేదిక మీద ఉన్న సిపిఎం నేత కెకె రాగేష్‌ పోలీసులు-నిరసన తెలుపుతున్నవారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌ను గవర్నర్‌ విలేకర్లకు అందచేశారు.


ఆ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రాగేష్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం, తనను అవమానించటం,భయపెట్టటం కుట్రలో భాగమని ఆరోపించారు.ఆ సభకు తనను ఆహ్వానించిన కన్నూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోపీనాధ్‌ రవీంద్రన్‌ కూడా కుట్రలో భాగస్వామే అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారన్న ప్రశ్నకు తనకు ఇటీవలే నాటి వీడియో దొరికిందని, దాన్లో పోలీసులను అడ్డుకుంటున్న రాగేష్‌ను చూశానని గవర్నర్‌ చెప్పుకున్నారు. ఈ కుట్ర గురించి ఇటీవలే తెలిసిందని కూడా చెప్పారు. అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు కన్నూరులో ఏం జరగనుందో తమకు ఐదు రోజుల ముందే తెలుసునని చెప్పాడని కేరళ ఇంటిలిజెన్స్‌ ఏం చేస్తున్నదని కూడా అడిగాడంటూ గవర్నర్‌ కథ వినిపించారు. ప్రముఖ చరిత్ర కారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తనపై హత్యాయత్నం చేశాడని చెప్పటం అతిశయోక్తి కాదా అన్న ప్రశ్నకు గవర్నర్‌ ఇర్ఫాన్‌ హబీబ్‌ను కించపరుస్తూ దూషణలకు దిగి హబీబ్‌ తనను బెదిరించేందుకు, భయపెట్టేందుకు చూశారని ఆరోపించారు. అంతే కాదు అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయరోజుల నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడేవారని, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్నారని, దెబ్బలాటలకు దిగేవారని అందువలన ఇక్కడ కూడా అదే చేశారని అనుకున్నానని కానీ తరువాత ఒక కుట్ర ప్రకారమే జరిగిందని తెలిసిందని ఆరోపించారు. గవర్నర్‌ ప్రదర్శించిన క్లిప్పింగ్‌ను చూసిన వారెవరికీ ఇర్ఫాన్‌ హబీబ్‌ అనుచితంగా ప్రవర్తించినట్లు ఏమాత్రం అనిపించలేదు.అయితే దాన్ని చూసినపుడు గవర్నర్‌ చేసిన అనుచిత ప్రసంగం హబీబ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపించింది.మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ గురించి తప్పుగా ఉటంకిస్తున్నారని దాని బదులు గాడ్సే గురించి చెప్పాలని తన స్ధానం నుంచి లేచి ఇర్ఫాన్‌ హబీబ్‌ అన్నట్లు దానిలో ఉంది. గవర్నర్‌ ఆరోపణలు పసలేని, కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ఆ సభలో సంబంధం లేని అంశాలను గవర్నర్‌ మాట్లాడతారని ఎవరికైనా ముందుగా ఎలా తెలుస్తుంది. ఈ పత్రికా గోష్టిలోనే గవర్నర్‌ కమ్యూనిజం మీద, పాలకపార్టీ నేతల మీద నోరుపారవేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు.


వివాదాస్పద బిల్లులపై తాను ఆమోదం వేసేది లేదని ప్రకటించిన గవర్నర్‌ అదే చేశారు.అసెంబ్లీ ఆమోదించిన పదకొండింటికి గాను ఐదింటి మీద సంతకం చేసి అక్టోబరు మూడు వరకు ఢిల్లీలో ఉండేందుకు బుధవారం నాడు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. ప్రతిదాని మీద సంతకం చేసేందుకు తాను రబ్బరు స్టాంపును కానని కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ ప్రకటించారు. అసెంబ్లీలకు బిల్లులను ఆమోదించే అధికారం ఉంటే వాటిని తన ఆమోదానికి పంపినపుడు అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం తనకు ఉన్నదని అన్నారు. ఒకసారి తిప్పి పంపిన బిల్లులను మరోసారి సవరణలతో లేదా వాటినే తిరిగి అసెంబ్లీ పంపితే వాటిని ఆమోదించటం మినహా మరొక మార్గం గవర్నర్లకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వంతో లడాయి పెట్టుకొనేందుకు గవర్నర్‌ సిద్దపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.


కాంగ్రెస్‌ జోడో యాత్రలో సావర్కర్‌ చిత్రం !
తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి లొంగి వారి సేవ చేసుకుంటానంటూ లేఖలు రాసి జైలు నుంచి బయపడిన వివాదాస్పద హిందూత్వ నేత విడిసావర్కర్‌ చిత్రాన్ని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల సరసన బానర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ నిర్వాకం కేరళలో జరిగింది.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర బుధవారం నాడు ఎర్నాకుళం జిల్లా ఆలువలో ప్రవేశించినపుడు ఏర్పాటు చేసిన బానర్లలో ఇది ఒకటి. ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌ నేతలు సావర్కర్‌ బొమ్మ మీద మహాత్మా గాంధీ చిత్రాన్ని అంటించారు. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగింది. దీనికి చెంగన్మాడ్‌ నియోజకవర్గ ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సురేష్‌ కారకుడంటూ అతడిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనికి కాంగ్రెస్‌కు లేదా జోడో యాత్ర నిర్వాహకులకు సంబంధం లేదని, స్థానిక కార్యకర్తలు చేసినపని అని కాంగ్రెస్‌ సంజాయి షి చెప్పుకుంది.


అవినీతి కేసులో అడ్డంగా దొరికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ !
ఆదివాసి గోత్ర మహాసభ నేతగా కేరళలో ప్రాచుర్యం పొందిన సికె జాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు, బిజెపి కూటమిలోకి వచ్చేందుకు గాను లంచం ఇచ్చిన కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అడ్డంగా దొరికారు. జనాధిపత్య రాష్ట్రీయ సభ పేరుతో 2016లో ఆమె ఏర్పాటు చేసిన పార్టీ అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ పేరుతో బిజెపితో కలసి పోటీ చేసింది.ఎన్‌డిఏ నుంచి విడిపోతున్నట్లు 2018లో ప్రకటించింది. తిరిగి 2021 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేయాలని కోరిన బిజెపి ఆమెకు డబ్బు ఇచ్చింది. మంతన్‌వాడి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తొలి విడతగా పది లక్షలు ఇచ్చారు. ఫోన్లో మాట్లాడారు. మరో పాతిక లక్షలు ఇస్తానని చెప్పారు. ఈ అంశాన్ని జాను సహచరిగా ఉన్న ప్రసీత చెప్పటమే గాక ఆధారంగా ఫోన్‌ సంభాషణ రికార్డులను వెల్లడించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సురేంద్రన్‌, ఇతరుల గళాలను రికార్డు చేసి ఫోరెన్‌సిక్‌ లాబ్‌ పరీక్షకు పంపారు. బుధవారం నాడు వెలువడిన పరీక్ష నివేదికలో ప్రసీత విడుదల చేసిన రికార్డుల్లో ఉన్న గళం సురేంద్రన్‌ గళం ఒక్కటే అని నిర్ధారణైంది. ఇప్పుడు పోలీసులు చార్జిషీట్లను దాఖలు చేయాల్సి ఉంది. సురేంద్రన్‌పై మరొక అవినీతి కేసు ఉంది. 2016 ఎన్నికల్లో మంజేశ్వరమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సురేంద్రన్‌ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బిఎస్‌పి తరఫున కె సుంద్ర పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు పక్క పక్కనే ఒకే విధంగా ఉండటంతో తనకు పడాల్సిన ఓట్లు సుంద్రకు పడి తాను ఓడినట్లు బిజెపి నేత భావించారు.తిరిగి 2021 ఎన్నికల్లో కె సుంద్ర పోటీకి దిగారు. దాంతో పోటీ నుంచి తప్పుకుంటే కొంత డబ్బుతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇల్లు, ఒక వైన్‌ షాపు ఇప్పిస్తానని బిజెపి నేత ప్రలోభపెట్టారు. ఆ ఎన్నికల్లో 1,143 ఓట్ల తేడాతో ఓడారు. తనకు కేవలం రెండున్నర లక్షల నగదు, పదిహేను వేల విలువ గల సెల్‌ ఫోన్‌ మాత్రమే ఇచ్చారని, వాగ్దానం మేరకు ఇతరంగా ఏమీ ఇవ్వలేదని కె సుంద్ర వెల్లడించాయి .దాంతో పోలీసులు అవినీతితో పాటు ఎస్‌సి,ఎస్‌టి వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనం కేసులో గిల గిలా కొట్టుకుంటున్న కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి !

03 Thursday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP Hawala Case, Kerala BJP, Kerala RSS, Kodakara Hawala Case


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. నిజమే అని నమ్మిన వారు కోరినంత నల్లధనాన్ని పంపారు. దాన్ని పంచుకోవటం లేదా దొంగ డబ్బు కనుక లెక్కా పత్రం ఉండదు కనుక బొక్కేసిన వారి మధ్య వచ్చిన తేడా వంటి కారణాలతో బయట పడి పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ డబ్బంతా హవాలా మార్గంలో వచ్చిన నల్లధనం అని వేరే చెప్పనవసరం లేదు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువే అని తేలింది,మూడున్నర కోట్లుగా చెబుతున్నారు. ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ ఉదంతంలో రాష్ట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎన్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో పార్టీలోని రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు కోటి రూపాయల దొంగడబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయక ముందే బిజెపి నేతలకు దొంగడబ్బు మాయం గురించి తెలుసునని వెల్లడైంది.


తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌, ఆయన అనుయాయులు మాత్రమే మాట్లాడుతుండగా మిగతావారు మౌనం దాలుస్తున్నారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది ఇప్పుడు చర్చ. చివరికి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌లో ఓడించేందుకు కొందరు బిజెపి నేతలు ప్రత్యర్ధికి ఓట్లను అమ్ముకున్న కారణంగానే అరవైవేల ఓట్లు రావాల్సింది 50వేలు వచ్చాయనే ఫిర్యాదు కూడా కేంద్రానికి పంపారు.


గిరిజన నాయకురాలిగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన సికె జాను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఐదు అసెంబ్లీ స్దానాల్లో పోటీ చేసేందుకు, కేంద్రంలో మంత్రిపదవికోసం బేరమాడినట్లుగా అందుకోసం పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్‌ చేయగా సురేంద్రన్‌ కేవలం పదిలక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు ఆపార్టీ కోశాధికారి ప్రసీత మీడియాకు చెప్పారు. పదిలక్షలు తీసుకొని పోటీ చేసేందుకు జాను అంగీకరించిన విషయాన్ని ప్రసీత ఫోను ద్వారా సురేంద్రన్‌కు చెప్పగా తిరువనంతపురంలో జాను బసచేసిన హౌటల్‌కు పంపినట్లు ఆమె చెబుతున్నారు. ఈ మేరకు వారి ఫోను సంభాషణ ఆడియోను స్వయంగా ప్రసీత విడుదల చేశారు. కొడక్కరలో పట్టుబడిన దొంగ డబ్బు కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసిన మొత్తం కంటే ఎక్కువ సొమ్మునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో సురేంద్రన్‌ వంటి బడానేతలు కూడా ఉన్నారని దొరికిన వారు చెప్పటంతో వారిని కూడా ప్రశ్నిస్తారని వార్తలు వచ్చాయి. గురువారం నాడు సురేంద్రన్‌ కోజికోడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సికె జాను నన్ను డబ్బు అడగలేదు, ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఆమె పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ఆడియోలు బయటకు వచ్చి ఉండవచ్చన్నారు. పోలీసులు పిలిచిన వారందరూ విచారణకు వెళుతున్నారు తప్ప కోర్టును ఆశ్రయించలేదు,భయపడలేదు. కొడక్కరలో దొరికింది నల్లధనమో, తెల్లధనమో నాకు తెలియదు. ఆడియో సంభాషణ తనది కాదు అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ముస్లిం లీగ్‌, సిపిఎం మద్దతుదారులు ఉన్నారని సురేంద్రన్‌ ఆరోపించారు.


ఆడియో సంభాషణ బయటకు వచ్చిన దృష్టా పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందని సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ చెప్పారు. లేనట్లయితే రాష్ట్రంలో పార్టీ అసంగత సంస్ధగా మారిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరువు పోయిందని, దీనికి సురేంద్రనే కారణమని అన్నారు. నిధుల చెల్లింపులకు సంబంధించి పరస్పర విరుద్దంగా పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేంద్ర పెద్దలకు తెలుసునని, తనను సంప్రదిస్తున్నారని, విచారణ కూడా జరుపుతున్నారని ముకుందన్‌ చెప్పారు.


ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు. సురేంద్రన్‌ చేసిన ప్రకటనను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ కోశాధికారి ప్రసీత బహిరంగ సవాలు చేశారు. ఆడియో నిజమైనదో, నకిలీదో కావాలంటే పరీక్షలు జరపాలన్నారు. తిరువనంతపురంలోని హొరైజన్‌ హౌటల్‌లో సికె జానుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ డబ్బు అందచేశారన్నారు. అంతకు ముందు తనకు ఫోన్‌ చేశారని కావాలంటే నిర్ధారించుకోవచ్చన్నారు. రెండు నిషేధిత సంస్దలతో జానుకు సంబంధాలు ఉన్నాయని, కొంత మంది ఆమెను కలిశారని, డబ్బును వాటి కార్యకలాపాలకు వినియోగించి ఉండవచ్చు అన్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికల నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాల కారణంగా జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జానును తొలగించినట్లు రాష్ట్రకమిటీ ప్రకటించగా తాను పదవిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడతాను తప్ప మధ్యవర్తులనెవరినీ నియమించలేదని, తన పేరుతో వారేమైనా డబ్బు తీసుకున్నారో తెలియదు కనుక విచారణ జరపాలని సికె జాను చెప్పారు. ఆమె పోటీ చేసిన సుల్తాన్‌ బాతరే నియోజకవర్గంలో ఎన్‌డిఏ ప్రచారం నిమిత్తం కోటీ 25లక్షల ఖర్చుకు సంబంధించిన వివరాలు బయటకు రావటం దొంగడబ్బు వివాదాన్ని మరో మలుపు తిప్పింది. కోజికోడ్‌ నుంచి రెండు కార్లలో కోటీ 25లక్షలు సుల్తాన్‌బాతరేకు తరలించారని, అక్కడ కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కొడకర పద్దతుల్లో పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా తెలుస్తోంది. అయితే అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని మరొకొ సందర్భంగా చెప్పారు. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది.పార్టీ ఆఫీసులోని వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు. మొత్తం మీద చివరకు వెల్లడయ్యే వివరాలు కేరళలో బిజెపికి తద్వారా కేంద్ర నాయకత్వానికి తలవంపులు తేవటం ఖాయం అని చెప్పవచ్చు.

మూడున్నర కాదు కేరళ బిజెపి దొంగ సొమ్ము ఇప్పటికి 9.8 కోట్లు !

పోలీసులు తవ్విన కొద్దీ బిజెపి కేరళ ఎన్నికల దొంగ సొమ్ము బయటకు వస్తోంది.కొడక్కర వంతెన వద్ద తమ కారును ఆపి సొమ్ము దోపిడీ చేశారంటూ కారు డ్రైవర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కర్ణాటక నుంచి వచ్చిన దొంగ సొమ్ముతో బిజెపి అభ్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది కొంతైతే దాచుకున్నది ఎంతో అన్నది అంతుచిక్కటం లేదు. రోజు రోజుకూ మరింత సమాచారం వెల్లడికావటంతో దిక్కుతోచని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నష్టనివారణతో పాటు కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి మార్గాలు వెతుకుతున్నారు.ధర్మరాజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత త్రిస్సూర్‌కు తెచ్చిన దొంగ సొమ్ము 9.8 కోట్లని పోలీసులు చెప్పారు. దీనిలో త్రిస్సూర్‌లోని ఒక వ్యక్తికి 6.30 కోట్లు ఇచ్చిన తరువాత మిగతా సొమ్మును వేరే చోటికి తరలిస్తూ దోపిడీ కట్టుకధలు అల్లారని తేలుతోంది. ధర్మరాజన్‌ అంతకు ముందు కూడా సొమ్మును తెచ్చారని, అది ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాల మీద పోలీసులు కేంద్రీకరించారు. త్రిస్సూరు నియోజకవర్గంలో బిజెపి రాజ్యసభ ఎంపీ సురేష్‌ గోపి పోటీ చేసి మూడవ స్ధానంలో నిలిచారు. అక్కడ ఖర్చుల కోసం రెండు కోట్లు ఇచ్చినట్లు తేలింది.

మంజేశ్వరమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్ల తేడాదో ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కె సుంద్రా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తన మద్దతుదార్లు పొరపాటున సుందర్‌కు ఓటు వేసిన కారణంగా తాను ఓటమి పాలైనట్లు సురేంద్రన్‌ భావించారు.ఈ సారి కూడా అదే వ్యక్తి బిఎస్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరటంతో తనకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని, సురేంద్రన్‌ గెలిస్తే పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక మద్యం షాపు ఇప్పించాలని సుంద్రా డిమాండ్‌ చేశాడు. అయితే రెండున్నర లక్షల రూపాయలు , పదిహేను వేల రూపాయల విలువ గల ఫోను ఇచ్చారు. మిగతా కోర్కెల గురించి ఎన్నికల తరువాత చూద్దాం లెమ్మని సురేంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని, స్ధానిక బిజెపి నేతలు తనకు సొమ్ము ఇచ్చినట్లు ఉపసంహరణ అనంతరం అతను బిజెపిలో చేరుతున్నట్లు ఒక సభలో ప్రకటన కూడా చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు ముందు రోజు తమ అభ్యర్ధి కనిపించటం లేదంటూ బిఎస్‌పి నేతలు పోలీసు సేష్టన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొడక్కర దొంగ సొమ్ము ఉదంతం బయటకు వచ్చిన తరువాత సదరు సుంద్రా ఈ విషయాలన్నీ స్వయంగా బయట పెట్టాడు. వాటి ఆధారంగా బిజెపి నేత సురేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజేశ్వరమ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి వివి రమేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సురేంద్రన్‌తో పాటు స్ధానిక బిజెపి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టిన తరువాత బిజెపి నేతలు తమ కుటుంబం మీద వత్తిడి తెస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాలని, సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సుంద్ర చెప్పాడు. తన తల్లి మీద వత్తిడి తెచ్చారని, ఆ సొమ్మంతా ఖర్చయిపోయిందని, తాను తిరిగి ఇవ్వలేనని , ఈ విషయాలను వెల్లడించటానికి తన మీద ఎవరి వత్తిడీ లేదని సుంద్ర చెప్పాడు. ఇతను ఇప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు.

దొంగ సొమ్ము పంపిణీదారైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ అనేక మంది బిజెపి నేతలతో ఫోన్‌ ద్వారా సంభాషించాడు. వారిలో సురేంద్రన్‌ కుమారుడితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగ సొమ్ము ఉదంత దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని, పట్టుబడిన సొమ్ము తీవ్ర ఆర్ధిక నేర స్వభావం కలిగినదని , అయినా పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మీద చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌తాంత్రిక్‌ యువ జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌ మాదవుర్‌ కేసు దాఖలు చేశారు. దీని గురించి ఇడి అధికారులకు నోటీసలు ఇవ్వగా తమకు సమయం కావాలని కోరారు, పది రోజుల్లో తీసుకున్న చర్యలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. సీనియర్‌ బిజెపి నేత సికె పద్మనాభన్‌ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఉప్పు తిన్న వారు నీరు తాగటం ప్రకృతి ధర్మమని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు.కొడకర దొంగ సొమ్ము ఉదంతంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, మరింత సమగ్ర దర్యాప్తు జరపాలసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియరి బాలకృష్ణన్‌ అన్నారు. దొంగ సొమ్ము గురించి వార్తలు రాగానే ఇడి వెంటనే రంగంలోకి దిగుతుందని, కానీ ఈ ఉదంతంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టి దాని వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. భవిష్యత్‌లో తాము ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌కు పోటీగా వస్తామని భయపడుతున్నవారు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, పధకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనం రాజశేఖరన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్ధానంలో రాజశేఖరన్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

26 Wednesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), NATIONAL NEWS, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Congress, Kerala BJP, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనాన్ని ఆదుకోవటంలో కేరళ సిఎం విజయన్‌ – శవ రాజకీయాల్లో బిజెపి !

15 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP Propaganda, Kerala BJP, Kerala Free Food Kits, Kerala LDF, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళలో బిజెపి ఓట్లు పెరిగాయా ? తరిగాయా ? ఫలితాల తీరు తెన్నులేమిటి ?

04 Tuesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala BJP vote Share, Kerala LDF, Kerala Mandate


ఎం కోటేశ్వరరావు


కిందపడ్డా విజయం మాదే అని ప్రచారం చేసుకోవటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అనేందుకు మరో ఉదాహరణ కేరళ ఎన్నికల ఫలితాలే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి 10.6శాతం ఓట్లు, 2021లో 11.3శాతం తెచ్చుకుంది. అంటే గతం కంటే అదనంగా ఓట్లు తెచ్చుకున్నట్లే కదా అని బిజెపి చెబుతోంది. దీనిలో నిజము – వక్రీకరణ ఉంది. కేరళ అగ్రశ్రేణి మీడియా సంస్ధ మళయాల మనోరమ నివేదించినదాని ప్రకారం 2016 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి ఓట్లు 14.96శాతం, 2019 లోక్‌సభ ఎన్నికలలో వచ్చినవి 15.53, 2021లో వచ్చినవి 12.47 శాతం, అంటే రెండు సంవత్సరాలలో దాని ఓట్లు 3.06శాతం తగ్గాయి. మరి బిజెపి ఓట్లు పెరిగాయనటంలో నిజం ఏమిటి ? 2016 ఎన్నికలలో అది 140కి గాను 98 చోట్ల పోటీ చేసి 10.6శాతం తెచ్చుకుంది, తాజా ఎన్నికలలో 113 చోట్ల పోటీ చేసి తెచ్చుకున్నది 11.3శాతం. అది ఎక్కువ సీట్లలో పోటీ చేసింది, దాని మిత్రపక్షాలు తక్కువగా పోటీ చేశాయి. రెండు చోట్ల నామినేషన్‌ పత్రాలు సరిగా వేయటం చేతగాక పోటీలో లేదు తప్ప 138 చోట్ల ఎన్‌డిఏ పక్షాలు పోటీ చేశాయి. వాటన్నింటికీ కలిపి గత ఎన్నికల కంటే 2.49 శాతం తగ్గిపోయాయి. బిజెపి పోటీ చేసిన స్ధానాల్లో గత ఎన్నికల కంటే ఐదు చోట్ల అదనంగా ఓట్లు తెచ్చుకుంది. ఈ అంకెలను బట్టి బిజెపి చెబుతున్నదానిలో నిజం ఏమిటో వక్రీకరణ ఏమిటో అంతిమంగా ఏం జరిగిందో పాఠకులే అర్ధం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా వంటి అగ్రనేతలు పర్యటించిన చోట్ల కూడా కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగి బిజెపికి ఓట్లు తగ్గాయని, దీని మీద ఆ పార్టీ విచారణ కమిటీని వేస్తే మంచిదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చమత్కరించారు.

బిజెపి విషయానికి వస్తే నరేంద్రమోడీ పలుకుబడి-శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రవేశ సమస్యల మీద పెట్టుకున్న ఆశలు నిరాశలయ్యాయని చెప్పవచ్చు. 2014లో కేంద్రంలో బిజెపి విజయం తరువాత 2015లో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీకి 13.3శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14.96 శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 15.64 శాతం ఓట్లు రావటాన్ని చూపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే 2020 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దాని బలం 14.5శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలలో 12.47కు పడిపోయింది. అధికార యావలో ఈ సారి క్రైస్తవుల ఓట్ల కోసం బిషప్పుల బంగ్లాల చుట్టూ బిజెపి నేతలు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. 2016లో ఆ పార్టీ ఏడు నియోజకవర్గాలలో రెండవ స్ధానంలో వచ్చింది. ఈ సారి మరొక స్ధానంతో, నీమమ్‌తో తొమ్మిదికిి చేరాయి. అంతకు మించి పెరగలేదు. ఆ ఏడు చోట్లా ఈసారి విజయం సాధిస్తామని గట్టిగా ఆశలు పెట్టుకుంది. వాటిలో నాలుగు చోట్ల గతం కంటే స్వల్పంగా ఓట్లు పెంచుకోగా నీమమ్‌తో సహా నాలుగు చోట్ల రెండవ స్ధానాన్ని కాపాడుకున్నప్పటికీ బలం కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 15శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలు 54, ఇరవైశాతం తెచ్చుకున్నవి మరో 24 ఉన్నాయి. వాటిని చూసి ఈ సారి తమదే అధికారం అని ఆ పార్టీ పేరాశలు పెంచుకుంది.ఆ నియోజకవర్గాలు ఇప్పుడు 34-16కు తగ్గిపోయాయి. ఎజవా సామాజిక తరగతి కేరళలో ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. ఆ ఓట్లను రాబట్టేందుకు భారత ధర్మ జనసేన పేరుతో ఉన్న పార్టీని బిజెపి కలుపుకుంది. గత ఎన్నికల్లో అనేక చోట్ల ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించినా ఈసారి ఘోరంగా విఫలమైంది. దాని ప్రభావం ఎన్‌డిఏ కూటమి ఓట్ల శాతం మొత్తంగా తగ్గింది. బిజెపి రాష్ట్రనేతలు పోటీ చేసిన చోట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేసిన రెండింటిలో ఒక చోట స్వల్పంగా ఓట్లశాతం పెరిగింది, శబరిమల ఆలయం ఉన్న నియోజకవర్గంలో బాగా తగ్గాయి, మిగతా అగ్రనేతలు పోటీ చేసిన చోట్ల కూడా ఓట్లశాతాలు తగ్గాయి. మెట్రోమాన్‌ శ్రీధరన్‌, సినీ హీరో సురేష్‌ గోపి పోటీ చేసిన చోట ఓట్లశాతాలు పెరిగాయి. గిరిజన నాయకురాలిగా పేరున్న సికె జాను పోటీ చేసిన నియోజకవర్గంలో గతంలో 16.35 శాతం ఓట్లు తెచ్చుకోగా ఈసారి 9.08 శాతం మాత్రమే వచ్చాయి. నరేంద్రమోడీ పలుకుబడి పని చేయక, అయ్యప్ప స్వామి వివాదం ఓట్లు రాల్చక బిజెపి పరిస్దితి అగమ్య గోచరంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


నోట మాటరాని బిజెపి నాయకత్వం – ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసిందన్న బిడిజెఎస్‌ !


ముప్పై ఐదు స్ధానాలు వస్తాయని, వాటితోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన బిజెపి నేతలు ఇప్పుడు ఎన్నికలలో తలెత్తిన పరిస్ధితిని కార్యకర్తలకు వివరించలేని స్ధితిలో ఉన్నారు. ఉన్న ఒక్క స్ధానం పోయి ఖాతా రద్దయింది. దానికి తోడు కూటమి ఓట్లశాతం తగ్గటం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు.గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి మద్దతు ఇచ్చిన వెనుకబడిన తరగతుల ఓట్లు సిపిఎంకు పడ్డాయని భావిస్తున్నారు. బిజెపి తమను మోసం చేసిందని బిజెపితో కలసి 21 సీట్లలో పోటీ చేసిన బిడిజెఎస్‌ పార్టీ ఫలితాల తరువాత గగ్గోలు పెడుతోంది. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోయామని అలాంటి పార్టీతో ఇలా అయితే కలసి పనిచేయలేమని ఆ పార్టీ నేతలు వాపోతున్నారని వార్తలు. ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహం కేరళలో పని చేస్తుందనుకోవటం తెలివితక్కువ తనమని బిజెపి సీనియర్‌ నేత సికె పద్మనాభన్‌ విమర్శించారు. గతంలో ఒకే పార్టీకి వరుసగా రెండవ సారి అధికారమిచ్చిన ఉదంతం లేనప్పటికీ విజయన్‌ ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు, దాన్ని మనం అంగీకరించాలని తమ పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. పొరపాట్లను సరిచేయకపోతే పార్టీ పెరిగే అవకాశం లేదన్నారు. విజయోత్సవ సభల్లో సిపిఎం దాని మిత్ర పక్షాలు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) మీద విమర్శలు చేస్తున్నాయని దాన్ని తాము సహించేది లేదని కేంద్ర మంత్రి, బిజెపి నేత వి మురళీధరన్‌ చెప్పారు. ఇతరుల మాదిరే ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమారన్‌కూ తన రాజకీయ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందన్నారు. ఏప్రిల్‌ ఆరున ఉదయమే ఓటు వేసేందుకు వచ్చిన సురేంద్రన్‌ అంతకు ముందు చెప్పిన తటస్ధ వైఖరికి విరుద్దంగా ప్రభుత్వ మార్పుకోసం ఓటు వేయాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక ప్రకటన చేశారు.


ఎల్‌డిఎఫ్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?


కేరళలో వామపక్షాలు గతంలో ఎన్నడూ సాధించని రీతిలో 97 స్దానాలు తెచ్చుకొని గత యుడిఎఫ్‌ రికార్డును సమం చేశాయి, ఘనవిజయం సాధించాయి, రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లు వరుసగా రెండవ సారి అధికారపక్షానికి పట్టం గట్టి చరిత్రను తిరగరాశారు. సంతోషించాల్సిందే. కానీ మరోవైపు పరిస్ధితి ఏమిటి ? కేరళలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చిన ఓట్లు 45.43 శాతం, దాన్ని వ్యతిరేకించే పార్టీలకు వేసిన ఓటర్లు యుడిఎఫ్‌కు వచ్చిన 39.47, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు వచ్చిన 12.47శాతం కలుపు కుంటే 51.94 శాతం ఉన్నారు. ఇలా చెప్పటం అలాంటి కలయిక వెంటనే ఏర్పడుతుందని కాదు, ఒకవేళ అదే జరిగినా ఆ పార్టీల వెనుక ఉన్న సామాన్య ఓటర్లు అలాగే స్దిరపడిపోతారనీ కాదు. ఆ పార్టీల వెనుక ఉన్నవారందరూ కమ్యూనిస్టు లేదా ప్రజావ్యతిరేకులు కారు. వీరిలో గణనీయమైన భాగాన్ని ఎల్‌డిఎఫ్‌లోకి ఆకర్షించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయి. వివిధ తరగతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఎల్‌డిఎఫ్‌ వెలుపల ఉన్న ప్రజాతంత్రశక్తులను ఎలా కూడగట్టాలో ఆ కూటమి నాయకత్వం ఆలోచించాలి. మనోరమ విశ్లేషణ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు 2.67, లోక్‌సభ కంటే 10.73శాతం ఈసారి అదనంగా వచ్చాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 0.66శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని వికీపీడియా విశ్లేషణ పేర్కొంటే 0.78 అని, పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చితే 7.87 తగ్గినట్లు మనోరమ విశ్లేషణ తెలిపింది. (స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ధోరణిని గమనించాలి).

కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్న బిజెపి !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్లతో చెప్పిన అంశాల ప్రకారం 140కి గాను 90 చోట్ల కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగిందన్నారు. కొన్ని చోట్ల దీన్ని అధిగమించి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు విజయం సాధించారని అన్నారు. ఈ వ్యాపారం అగ్రనాయకుల మధ్యనే జరిగిందని విమర్శించారు. విజయన్‌ చెప్పిన కొన్ని నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌ బతరేలో బిజెపికి 12,458 ఓట్లు తగ్గాయి, కాంగ్రెస్‌ అభ్యర్ధి 11,822 మెజారిటీతో నెగ్గారు.పెరుంబవూరులో యుడిఎఫ్‌ 2,889 తేడాతో నెగ్గగా బిజెపికి 4,596 తగ్గాయి, ఓడిపోయిన సిపిఎం నాయకురాలు, ఏకైక మంత్రి మెర్సికుట్టి అమ్మ 4,452 ఓట్ల తేడాతో ఓడిపోగా అక్కడ బిజెపి ఓట్లు 14,160 తగ్గాయి. త్రిపురినితురలో సిపిఎం ఎంఎల్‌ఏ మీద గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి మెజారిటీ 992 కాగా అక్కడ బిజెపికి 6,087 తగ్గాయి. చలక్కుడిలో కాంగ్రెస్‌ 1,057 ఓట్లతో గెలవగా బిజెపికి అక్కడ కూడా 6,087 తగ్గాయి. తిరువనంతపురంలోని కోవలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 11,562 మెజారిటీతో నెగ్గగా బిజెపికి 12,323 తగ్గాయి. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌(ఎం) అధ్యక్షుడు జోస్‌కె మణిని ఓడించేందుకు యుడిఎఫ్‌-బిజెపి కుమ్మక్కయ్యాయి. గెలిచిన మణి సికప్పన్‌కు 15,378 మెజారిటీ రాగా బిజెపికి 13,952 తగ్గాయి. కడుత్తురత్తిలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి 4,251 ఓట్ల తేడాతో ఓడిపోగా బిజెపికి 5,866 తగ్గాయి. ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికలో తమ బలం పెరుగుతోందని చెప్పిన బిజెపి ఈ తగ్గుదలను ఎలా సమర్ధించుకుంటుందో చెప్పాలని విజయన్‌ ప్రశ్నించారు. నీమమ్‌ నియోజకవర్గంలో ఈ సారి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఓట్లశాతం పెరగటాన్ని గతంలో ఆమేరకు బిజెపికి ఓట్లు బదిలీ అయి అక్కడ బిజెపి గెలిచిందని, ఈ సారి కాంగ్రెస్‌ పోటీలో ఉండటంతో బిజెపి ఖాతా మూతపడిందన్నారు. రెండు రెళ్లు నాలుగు అవుతాయని కాంగ్రెస్‌-బిజెపి భావించాయని అయితే ఓటర్లు భిన్నంగా ఆలోచించి ఎల్‌డిఎఫ్‌కు ఘనవిజయం చేకూర్చారన్నారు.


కాంగ్రెస్‌ ఎదురుదాడి – బిజెపి ఓటమి బాధ్యత తనదే అన్న సురేంద్రన్‌ !


ముఖ్యమంత్రి విజయన్‌ చేసిన విమర్శలతో దిక్కుతోచని కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ నేత రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరలేపారు. సిపిఎం-బిజెపి 69 నియోజకవర్గాలలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బిజెపి చెబుతున్న కాంగ్రెస్‌ ముక్తభారత్‌లో భాగంగానే రెండు పార్టీలు కుమ్మక్కై తమను దెబ్బతీశాయన్నారు. బిజెపికి తగ్గిన ఓట్లన్నీ సిపిఎంకు పడ్డాయన్నారు. మరోవైపు బిజెపి ఓటమికి ప్రాధమిక బాధ్యత తనదే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ ప్రకటించారు. ఓటమి కారణాలను పార్టీకి వివరించానని పార్టీ ఏ చర్య తీసుకున్నా తాను సిద్దమే అని విలేకర్లతో చెప్పారు. కాంగ్రెస్‌ -సిపిఎం కుమ్మక్కయినట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందే ముస్లిం ఓట్ల సమీకరణ జరిగిందని, ముస్లింలీగ్‌ లేని చోట్ల ఎస్‌డిపిఐ పార్టీతో సహా అనేక బృందాల ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయన్నారు.మతశక్తులైన ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ ఓట్లను సిపిఎం పొందిందని చెప్పుకున్నారు. కేరళ విద్యుత్‌ శాఖ మంత్రి మణిపై ఓడిపోయిన యుడిఎఫ్‌ అభ్యర్ది అగస్తీ ముందుగా ప్రకటించినట్లుగా ఓడిపోయినందుకు గుండు గీయించుకున్నారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ దానిపై మనం మాట నిలుపుకోవాలని శీర్షికగా పెట్టారు.


నీమమ్‌లో జరిగిందేమిటి ?


కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన బిజెపి ఉన్న ఒక్క సీటు నీమమ్‌ను కోల్పోయి ఖాతాను నిలబెట్టుకోలేకపోయింది. యుడిఎఫ్‌లోని ఒక చిన్న పార్టీ అభ్యర్ధిని నిలిపిన కాంగ్రెస్‌ నేతలు బిజెపితో కుమ్మక్కై తమ ఓట్లను బదలాయించి సీనియర్‌ బిజెపి నేత ఓ రాజగోపాల్‌ను గెలిపించారు. అది తీవ్ర విమర్శలకు దారి తీయటంతో అలాంటి తెరచాటు బాగోతం లేదని నమ్మించేందుకు కాంగ్రెస్‌ అక్కడ తన అభ్యర్ధినే నిలిపింది. అనేక మంది సీనియర్‌ నేతలను అక్కడ నిలిపేందుకు ప్రయత్నించి విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని నిలపాలని ఆయన మీద వత్తిడి తెచ్చారు. అయితే చాందీ పుతుపల్లిని వదిలితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద బెదిరింపులకు దిగారు. నీమమ్‌లో గతంలో మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ ప్రాతినిధ్యం వహించి ఉన్నందున ఆ పేరుతో ఆయన కుమారుడు, ఎంపీ అయిన కె మురళీధరన్‌ను నిలిపారు.
గతంలో బిజెపి సీనియర్‌ నేత రాజగోపాల్‌కు అక్కడ 67,813 రాగా ఈ సారి కుమనం రాజశేఖరన్‌కు 51,888 వచ్చాయి. యుడిఎఫ్‌కు గతంలో 13,860 రాగా ఈ సారి 36,524 వచ్చాయి. సిపిఎం అభ్యర్ధి, తిరువనంతపురం మాజీ మేయర్‌ అయిన వి శివన్‌కుట్టికి గత ఎన్నికల్లో 55,837 రాగా ఈ సారి 59,142 వచ్చాయి. గతంలో కుమ్మక్కులో భాగంగా బిజెపికి పడిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.


వెలుగు దివ్వెలతో ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు : ఎల్‌డిఎఫ్‌


కరోనా దృష్యా ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ కోరారు. ఏడవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాపితంగా ఒకేసారి మద్దతుదారులందరూ దివ్వెలను వెలిగించి ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నిర్ణయించినట్లు విజయరాఘవన్‌ చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కె కె శైలజ టీచర్‌ పదిహేనవ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని అధిష్టించనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే నూతన సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుతో పాటు కేరళ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మరో రికార్డు సృష్టిస్తారు. గతంలో ముగ్గురు మహిళలు ఉపసభాపతులుగా పని చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

04 Sunday Apr 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M), Kerala political scene


ఎం కోటేశ్వరరావు


” ప్రియమైన భక్తులారా నేను ఎన్నికలలో పోటీ చేయటం లేదు. దయచేసి నా పేరుతో ఓట్లు అడిగే వారు దొంగ భక్తులని తెలుసుకోండి. వారి గడ్డాలు, జులపాలు చూసి మోసపోకండి. మీ అయ్యప్ప, స్వామి శరణం ” అంటూ అయ్యప్ప బొమ్మతో పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు కేరళలో సంచలనం అయింది. స్వామి సందీపానందగిరి తన ఖాతాలో అయ్యప్ప స్వామి భక్తులతో మాట్లాడినట్లు పెట్టిన పోస్టు ద్వారా బిజెపి, గడ్డం పెంచుతున్న నరేంద్రమోడీని ఉతికి ఆరేసినట్లయింది. కేరళ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో ప్రసంగాలను ప్రారంభించి సుప్రీం కోర్టులో ఉన్న వివాదాన్ని పరోక్షంగా ముందుకు తెచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వెలువడ్డాయి. కేరళకు చేసిన అన్యాయానికి ప్రాయచిత్తంగా నరేంద్రమోడీ అయ్యప్ప నామ స్మరణతో క్షమించాలని వేడుకొని ఉంటారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చురక అంటించారు. అయ్యప్ప భక్తుల మీద పోలీసులను ప్రయోగించిన దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్ర మంత్రి చేసిన పాపం ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసినా పోదని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, దాన్ని ప్రశ్నించిన వారి కాళ్లు ఇరగ్గొడుతున్నారని కన్నూరులో జరిగిన ప్రచారంలో ఆమె ఆరోపించారు. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా అన్ని పార్టీలు ప్రధానంగా రోడ్డు షోలు నిర్వహించాయి. ప్రచార గడువు ముగియటంతో మైకులు, నాయకుల నోళ్లు మూతపడ్డాయి.


అదానీ విద్యుత్‌ కొనుగోలు -రమేష్‌ చెన్నితల అబద్దాలు !


అదానీతో ఒప్పందం చేసుకొని అత్యధిక రేట్లకు ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ సౌర విద్యుత్‌ కొనుగోలు చేసిందన్న ఆరోపణ చేసిన కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల తన మాటలను తానే మింగాల్సి వచ్చింది. మార్కెట్లో యూనిట్‌ రెండు రూపాయలకు విద్యుత్‌ లభిస్తుండగా పాతిక సంవత్సరాల పాటు అమలులో ఉండే ఒప్పందం ద్వారా యూనిట్‌కు రు.2.83 చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని వెయ్యి కోట్ల లబ్ది చేకూర్చే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని, అదానీ ప్రత్యేక విమానంలో కన్నూరు విమానాశ్రయానికి వస్తే ఆయనతో కలసి ముఖ్యమంత్రి, ఇతరులు మంతనాలు జరిపారని చెన్నితల తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని పట్టుకొని ఇతర కాంగ్రెస్‌ నేతలు పాడిందే పాడారు. అయితే వాస్తవాలు ఇలా ఉన్నాయి. కేరళ ప్రభుత్వం సౌరవిద్యుత్‌ను అసలు కొనుగోలు చేయలేదు. ఏప్రిల్‌, మే మాసాల్లో అదనపు విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ వేలం కేంద్రం ద్వారా రెండు వందల మెగావాట్ల సాంప్రదాయ విద్యుత్‌ కోసం బహిరంగ టెండర్లు పిలిచింది.దానిలో వంద మెగావాట్లు రోజంతా, మరో వంద మెగావాట్లు మధ్యాహ్నం రెండు నుంచి అర్ధరాత్రి వరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మొదటి వంద మెగావాట్లకు ఆరు కంపెనీలు టెండర్లు వేశాయి.వాటిలో జిఎంఆర్‌ కంపెనీ యూనిట్‌ రు.3.04కు సరఫరా చేస్తామని వేసిన ధర అతితక్కువగా ఉంది. అయితే ఆ కంపెనీ టెండరు ఖరారు అయిన తరువాత తాము 50మెగావాట్లకు మించి సరఫరా చేయలేమని చెప్పింది. అయితే అదే ధరకు తాము మిగిలిన 50మెగావాట్లను సరఫరా చేస్తామని అదానీ గ్రూప్‌ చెప్పగా విద్యుత్‌ బోర్డు ఆమేరకు దానికి అర్డరు ఇచ్చింది. రెండవ వంద మెగావాట్లకోసం కూడా ఆరు కంపెనీలు పోటీ పడ్డాయి. దానిలో కూడా జిఎంఆర్‌ కంపెనీ రూ.3.41తో అతి తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనిలో కూడా తాము 50మెగావాట్లే సరఫరా చేస్తామని చెప్పటంతో మిగిలిన 50 మెగావాట్లను పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌కు ఇచ్చారు. ఇది వాస్తవం అని కావాలంటే ఫిబ్రవరి 15నాటి విద్యుత్‌ బోర్డు సమావేశ వివరాలు ఎవరైనా చూడవచ్చని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

డబ్బిచ్చి సర్వేలు చేయించుకున్న ఎల్‌డిఎఫ్‌ – రాహుల్‌ గాంధీ ఉక్రోషం ! ఇరకాటంలో కాంగ్రెస్‌ !!

మరోసారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రానుందని చెప్పిన సర్వేలన్నీ డబ్బిచ్చి రాయించుకున్నవి తప్ప మరొకటి కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. బిజెపిని సిపిఎం ఎన్నడూ వ్యతిరేకించదని అందుకే ఆ పార్టీ దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేయాలని చెప్పింది గానీ సిపిఎం నుంచి విముక్తి చేయాలని అనలేదన్నారు. కేరళలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలను ఆర్‌ఎస్‌ఎస్‌ కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా వ్యవహరిస్తున్నాయని, కేరళ దొంగబంగారం కేసులో వాస్తవాలు బయటకు రావన్నారు. కేరళలో గట్టిగా జోక్యం చేసుకోవటం లేదని విమర్శిస్తున్న రాహుల్‌ గాంధీ ఇతర రాష్ట్రాలో జోక్యం చేసుకుంటే అదే సంస్ధలను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి విజయన్‌ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తమ వైఖరి అన్ని చోట్లా ఒకే విధంగా ఉందన్నారు.
కాసరగోడ్‌ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గంలో యుడిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న ముస్లింలీగ్‌ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ చేసిన ప్రకటన కాంగ్రెస్‌ కూటమిని ఇరుకున పెట్టింది. ఆ మద్దతు తీసుకుంటున్నదీ, తిరస్కరిస్తున్నదీ స్పష్టం చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మంజేశ్వరంలో పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఓటమికి తాము ముస్లింలీగుకు మద్దతు ఇస్తున్నట్లు ఎస్‌డిపిఐ ప్రకటించింది. దీని గురించి యుడిఎఫ్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమకు మంజేశ్వరంలో 7,800 ఓట్లు వచ్చాయని, వాటిని ముస్లింలీగుకు వేస్తే బిజెపి ఓడిపోతుందని తమ సర్వేలో తేలిందని ఎస్‌డిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌ ఫైజీ చెప్పారు. మద్దతు గురించి తమకు తెలియదని ముస్లింలీగు నేత ఒకరు చెప్పారు.
వైనాడ్‌ జిల్లా మనంతవాడి నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ పర్యటన సమయంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకపోవటం ఒకచర్చగా మారింది. కాంగ్రెస్‌-బిజెపి మధ్య కుదిరిన అవగాహన ప్రకారం బిజెపి ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయిస్తారు. దానికి గాను ప్రచారంలో ముస్లింలీగు పతాకాలు కనిపించకూడదని బిజెపి షరతు పెట్టిందని సిపిఎం నేతలు పేర్కొన్నారు.


విదేశీ కంపెనీకి ఓటర్ల వివరాలు అందించినందుకు రమేష్‌ చెన్నితల మీద బిజెపి కేసు !


కేరళ ఓటర్ల వివరాలను సింగపూర్‌ కంపెనీకి వెల్లడించినందుకు గాను బిజెపి నేత జార్జి కురియన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు. పౌరుల వ్యక్తిగత వివరాలను విదేశాలకు వెల్లడించటం తీవ్రమైన నేరమని, జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ఓటర్ల మౌలిక సమాచారానికి ఎన్నికల కమిషన్‌ సంరక్షకురాలని, దాని అనుమతి లేకుండా విదేశీ సంస్ధకు సమాచారం అందించటం పౌరుల గోప్యతకు భంగకరమని పేర్కొన్నారు. రమేష్‌ చెన్నితల ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో 4,34,000 మంది రెండేసి ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించగా ఎన్నికల కమిషన్‌ ఆ సంఖ్యను 38వేలని పేర్కొన్నదని, 2017లో సుప్రీం కోర్టు విన్న పుట్టుస్వామి కేసు ప్రకారం రమేష్‌ చెన్నితల, కాంగ్రెస్‌ కమిటీ పౌరహక్కులను ఉల్లంఘించిందని కురియన్‌ పేర్కొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ ఫిర్యాదు చేయనప్పటికీ రమేష్‌చెన్నితల సమాచారాన్ని బహిర్గతపరిచారని విమర్శించారు. అయితే ఎన్నికల జాబితాను ఎవరైనా చూడవచ్చని తాను చేసిన దానిలో తప్పేమీ లేదని చెన్నితల సమర్ధించుకున్నారు. ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేసినందున ఎన్నికల కమిషన్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


నేను ఈల వేశా చూడండి అంటున్న మెట్రోమాన్‌ !


నేను గానీ ఈల వేస్తే అని గారడీలు చేసే వ్యక్తి కబుర్లు చెప్పే మాదిరి మెట్రోమాన్‌గా సుపరిచితుడైన బిజెపి అభ్యర్ధి శ్రీధరన్‌ మాట్లాడుతున్నారు. తాను రంగంలోకి దిగిన కారణంగా బిజెపికి 30శాతం వరకు ఓట్లు వస్తాయని, కనీసం 40 సీట్లు, గరిష్టంగా 75 వచ్చినా ఆశ్చర్యం లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నేను బిజెపిలో చేరిన తరువాత ఎంతో మంది ప్రముఖులు తనను చూసి పార్టీలో చేరారన్నారు. బిజెపి వ్యక్తిగా కాదు మెట్రోమాన్‌గా చూసి తనకు ఓటు వేయాలన్నారు. తమకు మెజారిటీ సీట్లు వస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ కూడా చెప్పారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ మాట్లాడుతూ సర్వేలలో పేర్కొన్నదానికి భిన్నంగా తమకు జనం ఆదరణను ప్రకటించటాన్ని తాను చూశానని చెప్పారు.
దౌత్య సిబ్బంది ఉపయోగించే సంచుల్లో తెచ్చిన దొంగబంగారం కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తదితరులను ఇరికించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనపై వత్తిడి తెచ్చారని ఆ కేసులో నిందితుడైన సందీప్‌ నాయర్‌ రాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. తప్పుడు ప్రకటనలు చేయించిన ఇడి అధికారుల చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయటమేగాక విచారణ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఆ కేసులను కొట్టివేయాలన్న ఇడి దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది.


మీ నిర్వాకం మీ అద్దాల్లోనే చూసుకోండి : విజయన్

‌
ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ ఆర్ధిక పని తీరుతో రాష్ట్రాన్ని రుణ ఊబిలో దింపిందన్న ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌, బిజెపిలు తమ ప్రభుత్వాల నిర్వాకాలను చూసి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చురకలంటించారు.రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 2019-20లో కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌కు 40.3, రాజస్దాన్‌కు 33.1, బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌కు 34.బీహార్‌కు 31.9, పశ్చిమ బెంగాల్‌కు 37.1శాతం అప్పులు ఉంటే కేరళకు 30.2శాతమే అన్నారు. 2006లో యుడిఎఫ్‌ పాలన పూర్తి అయిన సమయానికి 35శాతం అప్పు ఉంటే 2011లో ఎల్‌డిఎఫ్‌ దిగిపోయే నాటికి 31.8శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరు అప్పులో ఊబిలో దించారో, ఎవరు తేల్చారో జనం చూస్తున్నారని అన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌తో కుమ్మక్కు నిజమే : అప్రూవర్‌గా మారిన మరో బిజెపి నేత !

02 Friday Apr 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Co-le-b nexus in Kerala, Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala CPI(M)


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌-ముస్లింలీగుతో చేతులు కలిపింది నిజమే అంటూ మరో బిజెపి నేత సికె పద్మనాభన్‌ అప్రూవర్‌గా మారారు.2001లో కూడా అలాంటి అవగాహన ఉందన్నారు. ముస్లింలీగు నేత కున్హాలీకుట్టి, దివంగత కేరళ కాంగ్రెస్‌ నేత మణి, తాను, తమ నేతలు పిపి ముకుందన్‌, కేరళ బిజెపి పర్యవేక్షకుడు దేవ ప్రకాష్‌ గోయల్‌ కాసరగోడ్‌లో సమావేశమై సహకరించుకొనే విషయాలను చర్చించినట్లు పద్మనాభన్‌ చెప్పారు. 1991 ఎన్నికల్లో తాను కాసరగోడ్‌ లోక్‌సభ స్ధానంలో పోటీ చేయగా తమ నేత మరార్‌ మంజేశ్వరం అసెంబ్లీకి పోటీ చేశారని, మరార్‌ విజయం సాధించేట్లు చూడాలని కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ ఒక అవగాహనకు వచ్చాయని తమకు తెలిపారని, అయితే రాజీవ్‌ గాంధీ హత్యతో అంతా తారుమారైందని పద్మనాభన్‌ మాతృభూమి న్యూస్‌తో చెప్పారు. ప్రతిసారీ కాంగ్రెస్‌ తమను మోసం చేస్తున్నదని చెప్పారు.అదింకే మాత్రం కుదరదన్నారు. 2001 ఎన్నికల్లో తాను మంజేశ్వరమ్‌ బిజెపి అభ్యర్దిగా ఉన్నపుడు జరిగిన సమావేశంలో సిపిఎం వ్యతిరేక ఓట్ల గురించి చర్చించామన్నారు.1991లో మాదిరి మోసం చేస్తే కుదరదని తాను స్పష్టం చేశానన్నాను. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లకు తమ ఓట్లు కావాలని అయితే మైనారిటీలు దూరం అవుతారనే భయంతో వారు బయటకు చెప్పరని, ఇప్పుడు వారి జిమ్మిక్కులు తమ మీద పని చేయవని వారు గ్రహించి ఉంటారని పద్మనాభన్‌ చెప్పారు. మూడు పార్టీల మధ్య ఉన్న అవగాహన నిజమే అని సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌ కొద్ది రోజుల క్రితం నిర్దారించిన విషయం తెలిసిందే. తమ మధ్య కుమ్మక్కు లేదని ముస్లింలీగులో ప్రముఖుడిగా ఉన్న కున్హాలీకుట్టి చెబుతున్నారు. పద్మనాభన్‌తో సహా బిజెపి నేతలను తాను కలసినట్లు గుర్తు లేదన్నారు. బిజెపి-సిపిఎం కుమ్మక్కు గురించి తాము బయట పెట్టిన తరువాత దాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.


క్రైస్తవుల మీద దాడులు చేసిన వారు ఏసు పేరు చెప్పి ఓట్లడుగుతున్నారు : విజయన్

‌
క్రైస్తవుల మీద దాడులు చేసిన వారే కేరళలో ఏసు క్రీస్తు పేరుతో ఓట్లడిగేందుకు వచ్చారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. కొద్ది పాటి వెండికోసం యూదులు ఏసుక్రీస్తును దెబ్బతీశారని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపధ్యంలో విజయన్‌ స్పందించారు. ఏసు క్రీస్తు, యూదులు అంటూ మాట్లాడుతున్నవారు క్రైస్తవులను ప్రయాణాలు, ప్రార్ధనలు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఒడిషాలోని కందమాల్‌ ప్రాంతంలో గ్రాహమ్‌ స్టెయిన్స్‌, ఆయన ఇద్దరు పిల్లలను సజీవదహనం చేసి హత్య చేసిన దారుణం వెనుక ఉన్న వారికి కేంద్రంలో మంత్రి పదవులిచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం తరువాత దేశంలో పాలక పార్టీల అండతో రెండు పెద్ద మారణకాండలు జరిగాయని ఒకటి 1984లో కాంగ్రెస్‌ నాయకత్వాన ఢిల్లీలో వేలాది మంది సిక్కులను చంపివేశారని, 2002లో గుజరాత్‌లో సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు ముస్లింలను ఊచకోశారని, అలాంటి పార్టీల వారు కేరళ వచ్చి తమకు అహింస గురించి బోధలు చేస్తున్నారని, గత ఏడాది జరిగిన స్ధానిక సంస్ద ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బిజెపిలకు చెందిన వారు ఆరుగురు కమ్యూనిస్టులను హత్య చేశారని వారు ఇప్పుడు శాంతిదూతలుగా ఫోజు పెడుతున్నారని విజయన్‌ అన్నారు. మన పొరుగునే ఉన్న మయన్మార్‌లో రోహింగ్యా మైనారిటీల మీద సైన్యం దాడులు చేసినపుడు మెజారిటీ మౌనంగా ఉందని , ఇప్పుడు మెజారిటీ పౌరుల మీదనే అదే మిలిటరీ విరుచుకుపడుతోందని, ఫాసిస్టులు ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని విజయన్‌ చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి చర్చించేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్దంగా ఉన్నారా అంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సవాల్‌ విసిరారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ ఉన్నట్లు, కాంగ్రెస్‌ పాలనలోని రాజస్దాన్‌లో పెద్ద ఎత్తున ఉందని తేలిందన్నారు. కేరళ పరిస్దితులను తెలుసుకోకుండా రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని నోట కరుచుకొని జాతీయ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు.


2,224 దొంగబంగారం కేసుల్లో అధికారులు, బిజెపి నేతలకు సంబంధాలు !


తిరువనంతపురం విమానాశ్రయంలో రాయబార కార్యాలయ సంచుల్లో దొరికిన 30 కిలోల దొంగబంగారం గురించే మీడియా తరచూ ప్రస్తావిస్తున్నది. దాన్ని ముఖ్యమంత్రికి, ఇతర ఎల్‌డిఎఫ్‌ ప్రముఖులకు అంటకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం చూస్తున్నది, దానికి కాంగ్రెస్‌ వంతపాడుతున్నది. సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కస్టమ్స్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌ఆర్‌ గోస్వామి ఇచ్చిన సమాచారం మేరకు 2015 ఏప్రిల్‌ నుంచి 2021 ఫిబ్రవరి 28వరకు కేరళలోని నాలుగు విమానాశ్రయాలలో 2,224 కేసుల్లో 374.52 కోట్ల రూపాయల విలువగల 1327కిలోల బంగారం దొరికింది.
చిత్రం ఏమంటే ఈ కేసుల్లో ఏమి చేశారు అన్న ప్రశ్నకు బంగారాన్ని తీసుకువస్తున్నవారి మీద ఆరోపణలు మోపటం తప్ప అసలు ఆ బంగారం స్వంతదారుల మీద ఎలాంటి చర్యలూ లేవు. అత్యధిక సందర్భాలలో ఈ బంగారం గుజరాత్‌లోని మార్వాడీలకు చేర్చేందుకు ఉద్దేశించిందని తేలింది. వారందరికీ బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.ఈ కారణంగానే కేసులు నమోదు తరువాత అడుగు ముందుకు సాగటం లేదు. అసలు నేరగాండ్లలో ఒక్కరిని కూడా బయటకు లాగలేదు. యుఏయి నుంచి దౌత్యపరమైన సంచుల్లో వచ్చి పట్టుబడిన బంగారాన్ని పంపింది ఎవరు, ఎవరికోసం పంపారో కూడా గత తొమ్మిది నెలల్లో కేంద్ర సంస్దలు తేల్చలేకపోయాయి. మలప్పురం సమీపంలో కరిపూర్‌ విమానాశ్రయంలో దొరికిన దొంగబంగారానికి సంబంధించి ముగ్గురు సూపరింటెంట్లతో సహా 14 మంది కస్టమ్స్‌ అధికారులను సిబిఐ పట్టుకుంది.


కాంగ్రెస్‌ అబద్దాల యంత్రానికి చార్జింగ్‌ చేస్తున్న బిజెపి – ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన చర్చి !


కాంగ్రెస్‌లోని రమేష్‌ చెన్నితల అబద్దాల యంత్రానికి బిజెపి నేత సురేంద్రన్‌ చార్జింగ్‌ చేస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయాన్నే ఒక అబద్దాన్ని చెన్నితల తన యంత్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ యంత్రానికి సురేంద్రన్‌ చార్జింగ్‌ చేస్తున్నారని అన్నారు.కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యుడిఎఫ్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడరని, కేరళలో ప్రత్యేకంగా తయారు చేసిన ఫెవికాల్‌ అంటించుకొని నోళ్లు మూసుకు వస్తారని బృందా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితలకు బుర్ర సరిగా పని చేస్తున్నట్లు లేదని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి వ్యాఖ్యానించారు. అదానీ కంపెనీ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుందని చెన్నితల ఆరోపణ చేయటం ఆయన స్ధితిని వెల్లడిస్తున్నదన్నారు. ఎవరి దగ్గర నుంచి ఎంతకు విద్యుత్‌ కొనుగోలు చేసిందీ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది చూడవచ్చన్నారు. రాష్ట్రం కేంద్ర గ్రిడ్‌ నుంచి కొనుగోలు చేసింది తప్ప ప్రయివేటుగా చేయలేదన్నారు. యుడిఎఫ్‌ హయాంలో పది సంవత్సరాలకు కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను రద్దు చేయాలన్నా కుదరలేదని మణి చెప్పారు. దానిలో షరతులు ప్రకారం రాష్ట్రం ఒప్పందం నుంచి వైదొలిగితే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. విమానాశ్రయంలో బంగారం దొరికితే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయలేదని గతంలో రమేష్‌ చెన్నితల చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన బుర్రపని చేయటం లేదని తేలిందన్నారు.
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జోక్యం చేసుకొన్న చరిత్ర ఉన్న కేరళ చర్చి అధికారులు ఈ ఎన్నికల్లో కూడా అదేపనిలో నిమగమైనట్లు కనిపిస్తోంది. త్రిసూరు నుంచి వెలువడే ” కాథలికో సభ ” అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో కాంగ్రెస్‌ ప్రస్తావన లేకుండా ఎల్‌డిఎఫ్‌, బిజెపిల మీద ధ్వజమెత్తటాన్ని చూస్తే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. పరోక్షంగా బిజెపి మతతత్వాన్ని విమర్శించటంతో పాటు దొడ్డిదారిన సిపిఎం కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను కూడా పునశ్చరణ కావించటం ద్వారా ఎవరికి ఓటు వేయాలో సూచించినట్లయింది.


35 చోట్ల హౌరా హౌరీ పోటీ -ఓట్ల వ్యాపారులుగా మోడీ అనుచరులు !


ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం నాడు ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నూట నలభైకి గాను 35 చోట్ల హౌరా హౌరీ పోటీ జరుగుతోందని ప్రస్తుత సరళి వెల్లడిస్తోంది. తమకు బలం ఉందని భావిస్తున్న రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌-ముస్లిం లీగుతో కుమ్మక్కయిన కారణంగానే నామినేషన్‌ పత్రాలు సరిగా వేయకుండా తిరస్కరణకు గురయ్యేట్లు చూసుకుందని బిజెపి మీద విమర్శలు వచ్చాయి. అవి పోను ఐదు చోట్ల చావో రేవో అన్నట్లు బిజెపి అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. నరేంద్రమోడీ అనుచరులుగా ఉన్న వారు ఓట్ల వ్యాపారంలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో నీమమ్‌లో బిజెపి ఎలా గెలిచిందో మోడీ చెప్పాలని అన్నారు. రాజ్యసభ ఎన్నికల గురించి స్వతంత్ర నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని కేంద్ర మంత్రి వి. మురళీధరన్‌ చెప్పారు. కేరళలో ఏప్రిల్‌ 12న జరగాల్సిన మూడు రాజ్యసభ స్ధానాల ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసినదే. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ మీద స్పందించిన ఎన్నికల కమిషన్‌ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది తెలుపుతామని హామీ ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చివరిక్షణంలో ప్రత్యర్ధుల ప్రచార బాంబు : పినరయి విజయన్‌ హెచ్చరిక !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala BJP, Kerala UDF, Narendra Modi, Priyanka gandhi, propaganda bomb in last minute


ఎం కోటేశ్వరరావు


సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక పెద్ద ప్రచార బాంబు ప్రయోగం కేరళ ఓటర్ల మీద జరగబోతున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కాసరగోడ్‌ ఎన్నికల సభలో హెచ్చరించారు. అదేమిటి ? ఎలా ఉండబోతున్నది అనే చర్చ ఇప్పుడు మీడియాలో జరుగుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విజయన్ను ప్రశ్నించాలని, విజయన్‌ కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ కోరారు. కొంత మంది రాబోయే రోజుల్లో పెద్ద బాంబు పేలబోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు ఎలాంటి బాంబులనైనా ఎదుర్కొనేందుకు మన నేల సిద్దంగా ఉందని, అలాంటి ప్రచారాల ఉద్దేశ్యం ఏమిటో జనానికి తెలుసునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వాస్తవాల ముందు ఎంత పెద్ద అబద్దమైనా నిలవదని, నిజాలేమిటో బయటకు వచ్చేంత వరకే అలాంటివి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచార ముగింపులో అబద్దాలను ప్రచారంలోకి తెస్తే జవాబు చెప్పేందుకు అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారని, సమాధానం చెప్పేందుకు తగిన వ్యవధి ఉండదు, అబద్దాలు మనల్నేమీ చేయకపోయినప్పటికీ , వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే వాటి పట్ల ఎల్‌డిఎఫ్‌ కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయన్‌ కోరారు.


ప్రచార బాంబు ఏమై ఉంటుంది అన్న చర్చ అంశాల సారాంశం ఇలా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్దలు దొంగబంగారం, డాలర్ల కేసుల్లో అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల మేరకు ముఖ్యమంత్రిని, ఇతర ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉండవచ్చు. విచారణకు హాజరు కావాలని ఎన్నికలకు ముందు రోజు నోటీసులు జారీ చేయవచ్చు. వామపక్ష సంఘటన నేతల కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని కంపెనీలపై ఐటి, ఇతర దాడులు జరగవచ్చు. పెరియ ప్రాంతంలో జరిగిన జంట హత్యల కేసులో సిబిఐ సంచలనాత్మకంగా ఆరోపణలు చేయవచ్చు. ఇలా పరిపరి విధాల చర్చ జరుగుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ అగ్రనేతలు, కార్యకర్తలు కుటుంబాల ఆత్మీయ సమావేశాలు, ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసే కార్యక్రమంలో ముమ్మరంగా నిమగమయ్యారు. ఏప్రిల్‌ ఆరవ తేదీ పోలింగ్‌ కనుక రెండు రోజుల ముందుగా బహిరంగ ప్రచార కార్యక్రమం ముగియనున్నది.


ముఖ్యమంత్రి చెబుతున్న బాంబు ఆ పార్టీలోనే పేల నున్నదని, కన్నూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను విజయన్‌ పక్కన పెట్టారని వారి కోసమైనా ఇడి అధికారులు విజయన్‌ను విచారించాలని, ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఐటి కంపెనీపై దాడులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అన్నారు. ఇడి కనుక విజయన్ను ప్ర శ్నించకపోతే మోడీ-అమిత్‌ షా తమ ప్రతిష్టను కోల్పోతారని చెప్పారు.

నీమమ్‌లో తెరిచిన బిజెపి ఖాతా మూత !


గత ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గంలో విజయం ద్వారా బిజెపి తెరిచిన ఖాతా ఈసారి మూసివేయక తప్పదని ముఖ్యమంత్రి విజయన్‌ చెప్పారు. గతం కంటే ఎల్‌డిఎఫ్‌ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రానికి చేసిందేమీ లేకపోగా వివాదాల ఉత్పత్తిదారులు, పంపిణీదారులుగా తయారయ్యారన్నారు. ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్ధలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్దంగా లేవని, వారు ఎన్ని అవాస్తవాలు చెప్పినా అభివృద్ది గురించి జనానికి తెలుసునని, ఏప్రిల్‌ ఆరవ తేదీన తగిన జవాబు ఇస్తారని చెప్పారు. పినరయి విజయన్‌తో కేరళలో సిపిఎం అధికారం కుప్పకూలుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే త్రిపుర, బెంగాల్లో దాని ఖాతాను మూసివేశామని త్వరలో కేరళలో కూడా అదే జరుగుతుందన్నారు. దొంగబంగారం కేసులో అనుచితంగా వ్యవహరించిన ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులపై కేసు నమోదు చేశామని, అప్రూవర్‌గా మారిన సందీప్‌ నాయర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కేరళ పోలీసులు రాష్ట్ర హైకోర్టును కోరారు. ఇడి అధికారి రాధాకృష్ణన్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాను వ్యక్తిగతంగా వ్యహరించటం లేదని అందువలన తనపై నమోదు చేసిన కేసును తిరస్కరించాలని కోరారు.

దొంగ ఓట్లకు హైకోర్టు తెర – రమేష్‌ చెన్నితల నోటికి మూత !

దొంగ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్ల గురించి కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చేసిన ఫిర్యాదులకు హైకోర్టు తెరవేసింది. అలాంటి ఓటర్లు ఎవరైనా వస్తే వారి ఫొటో, అఫిడవిట్‌ తీసుకొని నమోదు చేయాలని, వారి వేలు మీద వేసిన సిరా ఎండిపోయిన తరువాతే వారిని పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పోనివ్వాలని హైకోర్టు పేర్కొన్నది. ఇలాంటి ఓట్ల గురించి తీసుకోదలచిన చర్యల వివరాలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఈ తరుణంలో ఓటర్ల జాబితాలను సవరించటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. అలాంటి ఓటర్ల వివరాలన్నింటినీ బహిరంగంగా ప్రకటిస్తామని రమేష్‌ చెన్నితల చెప్పారు. కోర్టు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. రమేష్‌ చెన్నితల ఫిర్యాదు మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసిన ఎన్నికల కమిషన్‌ చర్యకు హైకోర్టు అడ్డుకట్టవేసింది. విద్యార్దులు, ఇతరులకు ప్రత్యేక కోటా కింద బియ్యం పంపిణీ చేయవచ్చని, అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో కూడా రమేష్‌ చెన్నితలకు ఎదురుదెబ్బ తగిలింది.

ప్రధాని చౌకబారు ప్రచారం-క్రైస్తవ ఓటర్ల సంతుష్టీకరణ యత్నం !

ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారం సందర్బంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి క్రైస్తవ ఓటర్లను సంతుష్టీకరించేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. కొంత వెండి కోసం యూదులు ఏసు ప్రభువుకు ద్రోహం చేశారని అలాగే బంగారం కోసం ఎల్‌డిఎఫ్‌ జనాన్ని మోసం చేసిందని నరేంద్రమోడీ చెప్పారు. ఒక ఐదు సంవత్సరాలు యుడిఎఫ్‌, మరొక ఐదు సంవత్సరాలు ఎల్‌డిఎఫ్‌ రాష్ట్రాన్ని దోచుకొనే విధంగా పంచుకున్నారని ఇప్పుడు బిజెపి వచ్చినందున అదింకేమాత్రం సాగదని మోడీ అన్నారు. పాలక్కాడ్‌లో పోటీ చేస్తున్న మెట్రో మాన్‌ శ్రీధరన్‌ అధికారం కావాలనుకుంటే రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో చేరి ఉండేవారన్నారు. శబరిమల సమస్య రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినవని , వాటిని కాపాడేందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అరెస్టయ్యారని, ఆ సమయంలో యుడిఎఫ్‌ మౌనంగా ఉందని నరేంద్రమోడీ ఆరోపించారు. అనేకసార్లు వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నదని, దాని నాయకులనేక మంది గూండాల మాదిరి వ్యవహరించారని, బిజెపి అధికారానికి వస్తే వాటన్నింటికీ తెరపడుతుందని ప్రధాని అన్నారు.
కేరళలో తాము అధికారానికి వస్తే నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేదవారికి అందచేస్తామని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నలభై ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు రాజకీయాల్లోకి రాని కారణాన్ని వివరిస్తూ అందరు గృహిణుల్లాగే తాను కూడా పిల్లల సంరక్షణ, ఇల్లు, వంట కోసం ఇంటికే పరిమితం అయ్యానని అన్నారు. నేను ఎప్పుడూ వంట చేయలేదని ఇల్లు శుభ్రం చేయలేదని అనుకోవచ్చు, కానీ నేనా పని చేశానని నమ్మండి అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే అధికారంలో ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బిజెపి చౌకబారు ప్రచారం – గడ్డి పెట్టిన వరదల హీరో !

కేరళలో సంభవించిన అసాధారణ వరదల సమయంలో అనేక మందిని రక్షించిన మత్స్యకారుడు జైసాల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఇంటికి వచ్చిన బిజెపి అభ్యర్ది సత్తార్‌ హాజీ వరదల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొన్నందుకు అభినందించాలనుకుంటున్నామని చెపితే అంగీకరించగా వారి పార్టీ కండువా కప్పి ఫొటో తీసుకున్నారని, తాను చేసిన దానికి గతంలో అనేక పార్టీలు, సంస్దలు తనను అభినందించాయని, దానిలో భాగంగానే ఇది అనుకున్నాను తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారానికి దాన్ని వినియోగించుకుంటారని తాను భావించలేదన్నారు. బిజెపిలో చేరేది లేదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. తాను సిపిఎం అభిమానినని, ఆ పార్టీ భావజాలంతో ఏకీభవిస్తానని చెప్పారు. తన పడవ ద్వారా వరద బాధితులను రక్షించిన వీడియో పెద్ద సంచలనం కలిగించి జైసాల్‌కు ఎంతో పేరు తెచ్చింది. తాజా ఎన్నికల్లో తిరురంగడి నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ది నియాల్‌ పులికలకమ్‌కు ధరావత్తు సొమ్ము చెల్లించి జైసాల్‌ తన అభిమానాన్ని ప్రదర్శించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d