• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi Failures

ఉచితాలు – అనుచితాల చర్చ : నరేంద్రమోడీకి జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా లేక బిజెపి చేస్తే సంసారం…. !

15 Thursday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Freebies, Narendra Modi, Narendra Modi Failures, Politics Of Freebies, Revadi Politics


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్రమోడీ మరోమారు ఉచితాలు – అనుచితాల చర్చకు తెరతీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు అజండాను ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు గనుకనే ఇటీవల నాగపూర్‌లో టికెట్‌ కొని మెట్రో రైలు ఎక్కి తాను ప్రధాని పదవిలో ఉన్నా ఉచితంగా రైలెక్కను అనే సందేశమిచ్చారు.ఏదీ ఊరికే రాదు అన్న ఒక నగల వర్తకుడి వాణిజ్య ప్రకటనను చాలా మంది చూసే ఉంటారు. మోడీ టికెట్‌ కౌంటర్‌లో ఉన్న ఫొటో మాదిరి ఉచితాల వ్యతిరేక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఏది ఉచితం, ఏది కాదు అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతున్నది. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. విశ్వగురువు నరేంద్రమోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రవచనాల సారం ఏమిటి ? రివాదీ (ఉచితాలు) సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరం. ఈ రోజు దేశంలో ఉచితాల ద్వారా ఓట్లను దండుకొనేందుకు కొన్ని పార్టీల వారు చూస్తున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఉచిత సంస్కృతి గురించి జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా మీకు అవసరమైన రహదారులు, విమానాశ్రయాలు లేదా రక్షణ నిర్మాణాలు జరగవు. ఈ ఆలోచనలు చేసే వారిని ఓడించాల్సి ఉంది.


మోడీ గారి వయస్సు ఇప్పుడు 73 నడుస్తున్నది. బహుశా ఇతర మానవ మాత్రుల మాదిరి ఆయనకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. దానిలో పేర్కొన్న అంశాలను చూస్తే ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్దు స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. బహుశా బిజెపి నిఘంటువులో వీటికి వేరే అర్ధం ఏమన్నా ఉన్నట్లా లేక నరేంద్రమోడీ గారికి ఈ సంకల్పం గురించి గుర్తు లేదా లేక నటిస్తున్నారా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


ఈ ఏడాది మాదిరే 2017లో కూడా హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన పక్షం రోజులకు గుజరాత్‌ ఎన్నికలను ప్రకటించారు. ” హిమచల్‌ ఎన్నికల ప్రకటన తేదీ నుంచి గుజరాత్‌లో కురుస్తున్న ఉచితాల వాన ” అని సిఎన్‌ఎన్‌ – న్యూస్‌ 18 అక్టోబరు 26, 2017న ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే 24 గంటల ముందు బిజెపి సర్కార్‌ నాలుగు పెద్ద పధకాలను ప్రకటించిందని దానిలో పేర్కొన్నారు.( మోడీ నైతిక విలువల వెలుగులో పెరిగిన బిజెపి కూడా ఇతర పార్టీల మాదిరే ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోవద్దు, ఎంతవారలైనా కాంతదాసులే అన్న కవి ఇప్పుడుంటే పార్టీలన్నీ అధికార దాసులే అనే వారు) డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల కొనుగోలుపై రైతులకు 18శాతం జిఎస్‌టి రద్దు, రైతులకు సున్నా వడ్డీకి రుణాలు వాటిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతాంశానికి వస్తే అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి కేంద్ర ఆఫీసులో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రాధాన్యత అన్నది బిజెపి విధానమని, ఏది తమకు అనుకూలంగా పని చేస్తుందో ఏది వ్యతిరేకమో ఓటర్లకు తెలుసునని, దగ్గరదారి రాజకీయాలు దేశానికి నష్టమని వారికి తెలుసు అన్నారు. దేశం బాగుపడితే ప్రతి ఒక్కరూ సంపదలు పొందుతారని చెప్పారు. ఉచితాలు కొనసాగితే ఈ రోజు మన పొరుగుదేశాల్లో జరుగుతున్న మాదిరే పరిస్థితి ఉంటుందని, అందువలన అలాంటి ఎత్తుగడలు ఎవరికీ లబ్ది ఉండదు అన్నారు. ఇలాంటి సుభాషితాలను ఒక వైపు వినిపిస్తూ మరోవైపు గుజరాత్‌ నేతలకు ఏ మార్గదర్శనం చేశారో చూడండి.


” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. బిజెపి కూడా ఉచితాల క్రీడా బరిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతిని ఆకర్షించేందుకు పూనుకుంది. గుజరాత్‌ ఆర్థిక వ్యవస్థను(జిఎస్‌డిపి) లక్ష కోట్ల డాలర్లకు పెంచుతామని(2022-23లో అంచనా రు.22 లక్షల కోట్లు, డాలర్లలో 280 బిలియన్లు.2018-19లో రు.15 లక్షల కోట్లు, అది గత ఐదేండ్లలో 22లక్షల కోట్లకే పెరిగింది. అలాంటిది ఐదేండ్లలో లక్షకోట్ల డాలర్లంటే 1000 బి.డాలర్లకు ఎలా చేరుతుంది.) 2036లో అహమ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నది.(గుజరాత్‌పై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 నవంబరు 27 తేదీ సంపాదకీయం). ఆలూ లేదూ చూలూ లేదు, 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ ఎవరికి అప్పగిస్తారనేది 2025-29 సంవత్సరాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది,మన దేశానికి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము.అలాంటిది ఏకంగా నిర్వహిస్తామని ఇప్పుడే బిజెపి చెప్పటం జనాలను అమాయకులుగా పరిగణించటం తప్ప మరొకటి కాదు. తాను ప్రకటించే ఉచితాలు సాధికారతలో భాగమని, ఇతరులు ప్రకటించే వాటిని ప్రలోభాలని బిజెపి చిత్రిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో రైతులకు విద్యుత్‌ సబ్సిడీగా రు.15,700 కోట్లు ఇస్తున్నట్లు 2021 అక్టోబరులో అక్కడి బిజెపి సర్కార్‌ ప్రకటించింది. అదేవిధంగా గృహాలకు 2021-22కు గాను రు.4,980 కోట్లు కేటాయించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమను తిరిగి ఎన్నుకుంటే వృద్దాప్య పెన్షన్‌ మొత్తాన్ని రు.200 నుంచి 1000కి పెంచుతామని మణిపూర్‌ బిజెపి ప్రకటించింది.


నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రధానిగా ప్రతి పైసాకు జవాబుదారీ అన్న సంగతి తెలిసిందే. ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చూస్తున్నారు.గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త).ఇవన్నీ బడాబాబులు, కావాలని ఎగవేసిన రుణాలన్నది అందరికీ తెలిసిందే. పారు బాకీల రద్దు కాదు, వేరు ఖాతాల్లో చూపుతున్నామని అంటున్నారు. ఇంత తక్కువగా వారి నుంచి రాబట్టటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నది స్పష్టం. అలాంటి పెద్ద మనుషుల పేర్లు వెల్లడిస్తే వారి మర్యాదలకు భంగం అని చెబుతున్నారు. వారితో బాంకులు ఉన్నతాధికారులు కుమ్మక్కు కాకుండా అలాంటి రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్ర రుణాలను తీసుకోవటం తప్ప తిరిగి చెల్లించనవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఎగవేసిన వారు చిన్నవారా పెద్దవారా అని కాదు ఎలాంటి సందేశం జనాల్లోకి వెళుతున్నదనేది కీలకం.ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ పధకాల కారణంగానే తిరిగి అధికారానికి వచ్చిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. అక్కడ ముద్రా రుణాల కింద పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పధకం కింద ఇచ్చే రుణాలను క్రెడిట్‌ గారంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ద్వారా మంజూరు చేస్తారు గనుక చెల్లించకున్నా బాంకులు ఎలాంటి ఇబ్బందులు పడవని బాంకు అధికారుల సంఘం పేర్కొన్నది. చిన్న, సన్నకారు సంస్థలకు ఇచ్చే ఈ రుణాల నిరర్ధక ఆస్తుల మొత్తం 2021 మార్చి 31నాటికి 11.98శాతం లేదా రు.2.84లక్షల కోట్లని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం వెల్లడించింది.2018 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఏలు కేవలం 5.38శాతమే. ఇదేమీ చిన్న మొత్తం కాదు, పైసల్లో అంతకంటే లేదు. ఇది కూడా పన్ను చెల్లించిన వారి సొమ్మే మరి.


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లేగా ! తమిళనాడు ప్రభుత్వం కార్పొరేట్లకు రద్దు చేస్తున్న రుణాల గురించి సుప్రీం కోర్టు కేసులో ప్రస్తావించింది. మోడీ తొలి మూడేండ్ల పాలనలో అదానీ తీసుకున్న రుణాల్లో 75వేల కోట్లను మాఫీ చేసిందని పేర్కొన్నది, లేదూ పక్కన పెట్టామంటే ఎంత వసూలు చేసిందీ చెప్పాలి కదా ! ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది, ఏమంటే అవి ఎగుమతికి పనికి వస్తాయట. కాసేపు అంగీకరిద్దాం, రైతులు పండించే వరి, గోధుమలు, చెరకు నుంచి తీసే పంచదార కూడా ఎగుమతి చేస్తున్నాం, మరి వారికి ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వటం లేదు.


దేశ సంపద పెరిగితే జనమూ ధనవంతులౌతారని నరేంద్రమోడీ చెబుతున్నారు. దానికి ఆధారాలుండాలి కదా ! సంపదల పంపిణీలో తీవ్ర అసమానలు ఉన్న దేశాల్లో మనది ఒకటి.1990 నుంచి 2020 నాటికి ధనికులుగా ఉన్న ఒకశాతం మంది వద్ద ఉన్న దేశ సంపద 10.4 నుంచి 21.7 శాతానికి పెరగ్గా, పేదల్లోని దిగువ 50శాతం మంది సంపద వాటా 22 నుంచి 14.7శాతానికి తగ్గింది. ఈ కారణంగానే కదా పేదలు ఉచితాల కోసం ఆకర్షితులౌతున్నది. స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఏది ఉచితమో, ఏది సంక్షేమమో ఏది కాదో టీకా తాత్పర్యాలు చెప్పేవరకు ఇది సాగుతూనే ఉంటుంది. చెప్పేవారెవరు ? దాని మీద ఏకాభిప్రాయం ఎలా వస్తుంది ? ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల వాటాను 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా ఆచరణలో దక్కుతున్నది 29శాతమే అని చెబుతున్నారు. మరి దీని సంగతేమిటి ? ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవటం కాదా ! ఉచితాల పేరుతో అందించే సేవలు లేక నగదు బదిలీగానీ అవి పొందిన వారి కొనుగోలు శక్తిని పెంచి దేశానికి తోడ్పడేవే తప్ప వేరు కాదు. వాటి వలన ప్రభుత్వాలకు జిఎస్‌టి లేదా మరో రూపంలో రాబడి, పారిశ్రామికవస్తువుల కొనుగోలు, తద్వారా ఉపాధి పెరుగుదలకు పరోక్షంగా తోడ్పడే వాటి మీద దాడికి దిగుతున్నారు. మరోవైపు అంతకు మించి కార్పొరేట్లకు సంపదలు దోచిపెడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌ ఓటమి ఎవరిది ! ముస్లిం విద్వేషం రెచ్చగొడితేనే బిజెపికి ఓట్లా ?

11 Sunday Dec 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Gujarat verdict 2022, Himachal verdict 2022, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో 182కు గాను 156 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 సీట్లు తెచ్చుకుంది. గతంలో కాంగ్రెస్‌ తెచ్చుకున్న 149 సీట్ల రికార్డును బిజెపి బద్దలు కొట్టింది. గత ఎన్నికలతో 49.05 శాతం తెచ్చుకున్న బిజెపికి ఈసారి 52.5 శాతం రాగా కాంగ్రెస్‌కు 41.44 నుంచి 27.28 శాతానికి తగ్గగా , ఆమ్‌ ఆద్మీ 12.92శాతం తెచ్చుకుంది. హిమచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు మూడు సీట్లు తెచ్చుకున్నారు. హౌరా హౌరీగా సాగిన పోరులో ఈ సారి బిజెపి ఓట్లు 48.8 నుంచి 43శాతానికి తగ్గగా కాంగ్రెస్‌ 41.7 నుంచి 43.9శాతానికి పెంచుకుంది. ఈ ఫలితాల గురించి వెంటనే కొన్ని సాధారణ విశ్లేషణలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో లోతైన పరిశీలనలు రావచ్చు. ఈ లోగా దేశంలో తిరిగి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో బిజెపి లేదా దాని మిత్రపక్షాల ఏలుబడిలోని త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, మే నెలలో కర్ణాటక, నవంబరులో చత్తీస్‌ఘర్‌ (కాంగ్రెస్‌), మిజోరాం(ఎంఎఎన్‌ఎఫ్‌), మధ్య ప్రదేశ్‌(బిజెపి), డిసెంబరులో తెలంగాణా(బిఆర్‌ఎస్‌), రాజస్తాన్‌(కాంగ్రెస్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి గడువు ప్రకారమే జరిగితే మూడు సార్లు అంటే దాదాపు ఏడాది మొత్తం ఎక్కడో ఒక చోట ఎన్నికల వాతావరణం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పాలకపార్టీల నేతలు ముందుస్తు ఎన్నికలు లేవని చెబుతున్నప్పటికీ రావని చెప్పలేము. జరుగుతున్న మధింపు, సర్వేలు ముగిశాక ఒక స్పష్టత రావచ్చు. కర్ణాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.


కుక్క మనిషిని కరవటం సాధారణం, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అవుతుంది.నరేంద్రమోడీ నాయకత్వానికి ఎదురు లేదు, ఎవరైనా వస్తే పుట్టగతులుండవన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇందిరా గాంధీ గురించి కూడా ఇలాగే చెప్పారు. రెండు సార్లు నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసినట్లుగా భావించాలని మోడీ కోరినప్పటికీ హిమచల్‌ ప్రదేశ్‌లో ఫలితం దక్కలేదు. అందుకే గుజరాత్‌లో గెలుపు కంటే ఇక్కడ ఓటమి వార్తగా మారింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా వృద్ది చెందుతాయని గతంలో కాంగ్రెస్‌ ఇప్పుడు బిజెపి అంటున్నది. కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీతో సఖ్యతతో ఉంటే రాష్ట్రాలకు నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చని చెప్పే ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులను చూస్తున్నాము. ” గుజరాత్‌ పర్యటనలో రు. 9.4లక్షల కోట్ల పధకాలను ప్రారంభించనున్న ప్రధాని ” అంటూ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్తను 2022 సెప్టెంబరు 30న ప్రచురించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పధకాలే అనుకోవాల్సిన అవసరం లేదు, కొన్నింటికి శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉండవచ్చు. హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా ఉన్నది బిజెపి ప్రభుత్వమే కదా అక్కడ ప్రారంభించిన పథకాల గురించి అలాంటి వార్తలు కనిపించలేదు. హిమచల్‌ ప్రదేశ్‌లో రు.3,650 కోట్ల మేర వివిధ పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని అంటూ 2022 అక్టోబరు మూడవ తేదీ దక్కన్‌ క్రానికల్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. పోనీ అంతకు ముందు అక్కడ మరో రెండు రెట్ల విలువగల పథకాలను ప్రారంభించారనుకుందాం అవి గుజరాత్‌కు సాటి వచ్చేవేనా ? ఒకే పార్టీ రెండు ఇంజన్ల పాలన ఉన్నప్పటికీ గుజరాత్‌కు మరొక రాష్ట్రానికి ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఏ పీఠమెక్కినా, ఎందుకాలిడినా చూపరా గుజరాత్‌ పక్షపాతం అన్నట్లుగా నరేంద్రమోడీ గుజరాత్‌ ప్రధాని అని ఎవరైనా ఎద్దేవా చేస్తే , కాదు దేశానికే ప్రధాని అని బిజెపి పెద్దలు లేదా వారిని సమర్ధించేవారు ఎలానో వెల్లడించాలి.


సిఎంగా నరేంద్రమోడీ గుజరాత్‌ను ఎంతో వృద్ది చేశారని అందుకే దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ను అమలు చేస్తామని 2014లో చెప్పారు, మోడీ ప్రధాని పీఠమెక్కారు గానీ సదరు మోడల్‌ను చివరికి తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో కూడా అమలు జరపలేదు, అసలు ఇంతవరకు ఎక్కడా దాని ప్రస్తావన కూడా తేలేదు. ఇది నరేంద్రమోడీ విశ్వసనీయతను ప్రశ్నించటం లేదూ ! ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి తన పేరును శాశ్వతంగా తలచుకొనే విధంగా మోడీ నీతిఅయోగ్‌ను రంగంలోకి తెచ్చారు. అది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 దేశ ఆరోగ్యసూచికలో మొత్తం మీద పని తీరులో కేరళకు 82.2 పాయింట్లు రాగా దేశానికే నమూనా అని పేర్కొన్న గుజరాత్‌కు వచ్చింది 63.59 మాత్రమే. నరేంద్రమోడీ ఏలుబడిలో ఏమి సాధించించినట్లు ? రెండో ఇంజను తగిలించిన తరువాత కూడా కేరళ కంటే అంత వెనుకబడి ఎందుకు ఉన్నట్లు ? అక్కడే కాదు మధ్య ప్రదేశ్‌లో కూడా దశాబ్దాల తరబడి బిజెపి పాలనే కొనసాగుతున్నది దానికి వచ్చిన పాయింట్లు 36.72 , పందొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ చివరన ఉన్నాయి, గుజరాత్‌లో, ఇతర చోట్ల తమ పని తీరును చూసి జనం ఓటేశారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. వారి ముందు నవ్వటానికి జనానికి భయం అన్నది తెలిసిందే. అదే అభివృద్దని బిజెపి చెప్పినా జనం భావించినా ఎవరూ చేసేదేమీ లేదు.దారిద్య్రనిర్మూలనలో ఆర్‌బిఐ ప్రకటించిన 2013 నివేదిక ప్రకారం గుజరాత్‌ 14వ స్థానంలో ఉంది.అది నరేంద్రమోడీ పన్నెండేళ్ల పాలన తరువాత. తాజా వివరాల ప్రకారం దేశంలో సగటున 2021-22లో 21.92 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉంటే గుజరాత్‌లో 16.63 శాతం ఉన్నారు. కేరళలో 0.71శాతం మాత్రమే ఉన్నారు. రెండింజన్లు ఉండి ఏమి సాధించినట్లు ? ఇది దేశానికి ఆదర్శం(మోడల్‌) ఎలా అవుతుంది.


గుజరాత్‌లో ఘన విజయానికి కారకుడు నరేంద్రమోడీ అని బ్రహ్మరధం పడుతున్నారు.అమిత్‌ షా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని చెబుతున్నారు. వరుసగా గెలవటమే గొప్ప అనుకుంటే గతంలో కాంగ్రెస్‌కూ అలాంటి రికార్డులున్నాయి. అక్కడ బిజెపి ఏలుబడి ప్రారంభం నుంచి చూస్తే క్రమంగా తగ్గుతూ 2017ఎన్నికల్లో 182కు 99 (మెజారిటీ 92 ) మాత్రమే బిజెపి తెచ్చుకుంది. తమ నేత ప్రధానిగా ఎదిగిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడి జనం పెద్దగా స్పందించలేదు. అంతకు ముందు మోడీ నేతగా ఉన్నపుడు వచ్చిన 115 సీట్లు 99కి తగ్గాయి. దీనికి కారకులెవరు ? అమిత్‌ షా మంత్రాంగం అప్పుడు ఎందుకు పని చేయలేదు. నరేంద్రమోడీ తరువాత 2014 నుంచి ముగ్గురు సిఎంలను అక్కడ బిజెపి మార్చింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయించి 99 నుంచి 112కు పెంచుకుంది.ఇదంతా నీతి సూత్రాలు వల్లించే నరేంద్రమోడీకి తెలియకుండా జరిగిందనుకోలేము. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరిగినా మోడీ వలనే అని చెబుతున్నారు గనుక దీనికి మినహాయింపు ఎందుకివ్వాలి ?


గుజరాత్‌లో బిజెపి ఈ సారి ముందు జాగ్రత్త పడింది. అనేక సామాజిక తరగతులను సంతుష్టీకరించింది. ముస్లిం విద్వేషాన్ని కొనసాగించింది. అనేక చోట్ల కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలనే పునరావృతం గావించింది. ఆ పార్టీ నుంచి డజన్ల కొద్దీ నేతలను తెచ్చుకొని బరిలో నిలిపింది. బలమైన పటేల్‌ సామాజిక తరగతి లేకుండా గెలవలేమని గ్రహించి జైన్‌ బనియా సామాజిక తరగతికి చెందిన విజయ రూపాని చేత అవమానకరంగా సిఎం పదవికి రాజీనామా చేయించి 2021 సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గద్దె నెక్కించారు. రూపాని నాయకత్వంలో 2017లో ఎన్నికలు జరిగినపుడు నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి దూరంగా లేరు. ఆ ఎన్నికల్లో 99 రావటానికి రూపాని బలహీన నాయకత్వమే కారణమని, బలహీనమైన సిఎం అని, కరోనాను ఎదుర్కోవటంలో విఫలం చెందారని ప్రచారం చేసి రాజీనామా చేయించారు. అలాంటపుడు ఐదేండ్లు ఎందుకు కొనసాగించినట్లు? మోడీ-షా ఏం చేస్తున్నట్లు ? ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన సీట్లకు కారకుడు నరేంద్రమోడీ అంటున్నారు. అంటే గెలుపు మోడీ ఖాతాకు, పరాజయం ఇతరుల ఖాతాకు వేస్తారని స్పష్టమైంది. ప్రస్తుత సిఎం భూపేందర్‌ పటేల్‌ ఎక్కువ మంది జనానికి తెలియదని రాష్ట్ర బిజెపి ప్రధాన ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ చెప్పినట్లు 2022 డిసెంబరు ఐదవ తేదీ అవుట్‌లుక్‌ పత్రిక పేర్కొన్నది. అంటే పలుకుబడి కలిగిన పటేల్‌ సామాజిక తరగతి మద్దతు కోసమే ఒక బొమ్మగా సిఎం గద్దె మీద కూర్చోపెట్టారన్నది స్పష్టం. రూపాని కాబినెట్‌లోని మంత్రులందరినీ తొలగించారు. తాజా ఎన్నికల్లో 41మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. రాష్ట్ర పార్టీ సారధినీ మార్చివేశారు. చిత్రం ఏమిటంటే మూడు దశాబ్దాల పాలన తరువాత గుజరాత్‌ ఆత్మగౌరవం అంటూ బిజెపి కొత్త పల్లవి అందుకుంది. ఎవరి నుంచి దాని గౌరవానికి ఎసరు వచ్చినట్లు ?


ఇక ఏకత, శీలము అంటూ కబుర్లు చెప్పే సంఘపరివార్‌కు గుజరాత్‌ పెట్టని కోట. ఆ కోటలోకి కాంగ్రెస్‌ నుంచి2007, 2012లో గోద్రాలో గెలిచిన సికె రావుల్జీ 2017 ఎన్నికల ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ తరఫున అదే ఏడాది కేవలం 258 ఓట్ల తేడాతో గెలిచారు.అతగాడు 2002 గోద్రా మారణకాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో కేసులో శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న 11 మంది శిక్షా కాలం తగ్గించి వెలుపలికి రప్పించేందుకు కృషి చేసిన అపర శీలవంతుడు. 2022 ఆగస్టు 19న కోర్టు నిర్ధారించి నేరగాండ్లుగా తేల్చిన 11మంది గురించి మాట్లాడుతూ ” వారు నేరానికి పాల్పడిందీ లేనిదీ నాకు తెలియదు. వారు బ్రాహ్మలు, బ్రాహ్మలు మంచి సంస్కారవంతులని తెలిసిందే ” అని అప్పటికే ఏడు సార్లు గెలిచి ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిన ఆ పెద్దమనిషి సెలవిచ్చారు.తాజా ఎన్నికల్లో 35వేల 198 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు. గుజరాత్‌లో తిరుగులేని ప్రభావం చూపుతున్న సంఘపరివార్‌ సంస్థలు అక్కడి జనాలకు నేర్పిన ” సంస్కారానికి ” ఫలితమిది. ఇలాంటి వారిని బరిలోకి దించిన బిజెపి తప్ప గుజరాత్‌ గౌరవాన్ని మరో పార్టీ ఎలా దెబ్బతీస్తుంది ? జర్మనీలో హిట్లర్‌ యుూదుల మీద ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టినపుడు అక్కడి జనం నీరాజనాలు పలికిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు హిట్లర్‌ను నెత్తిమీద పెట్టుకున్న జర్మన్లు నేడు వాడి పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా రోజులన్నీ ఒకే విధంగా ఉండవు.


హిమచల్‌ ప్రదేశ్‌లో ఓటమికి అక్కడ ఒకసారి కాంగ్రెస్‌ ఉంటే మరోసారి బిజెపి అధికారానికి రావటం రివాజుగా ఉందని దాని కొనసాగింపు తప్ప వేరేఏమీ కాదని బిజెపిని సమర్ధించే వారు కొట్టి పారవేస్తున్నారు. ఆ ముక్క ఎన్నికలకు ముందే చెప్పి ఈ వుంటే అది వేరుగా ఉండేది. నరేంద్రమోడీ పరువు దక్కేది. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా ఫలితాల తరువాత చెబుతున్నారు. దేశంలో రివాజులను మార్చటమే మోడీ గొప్పతనమని, ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ చేయలేని వాటిని ఐదేండ్లలో మోడీ చేసి చూపించారని నీరాజనాలు పలికారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాగే ఉన్న రివాజును మార్చివేశామని, హిమచల్‌ ప్రదేశ్‌లో కూడా అదే జరగనున్నట్లు బిజెపి పెద్దలు చెప్పారు. పార్టీ అభ్యర్ధులను చూసి కాదు, కమలం గుర్తుకు ఓటేస్తే తనకు వేసినట్లే అని మోడీ స్వయంగా చెప్పుకున్నారు. కమలం ఓడి వాడింది కనుక నరేంద్రమోడీ కూడా అక్కడ ఓడినట్లా కాదా ? తిరుగుబాటు అభ్యర్ధులు బిజెపిని దెబ్బతీశారని ఒక ముక్తాయింపు. జెపి నడ్డా బిజెపి పార్టీ దేశ అధ్యక్షుడు కావచ్చుగానీ హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపిలో ఒక ముఠానేత అని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నది. లేకుంటే దానికి ఇంకా సీట్లు వచ్చేవేమో ? అయినా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి పెద్ద పీటవేస్తే బిజెపిలో అధికార రుచిమరిగిన వారు మడి కట్టుకు కూర్చుంటారా ? వారంతా రంగంలో ఉన్నప్పటికీ తమదే అధికారం అని చెప్పినవారు ఇప్పుడు అంతా వారే చేశారు అంటే కుదురుతుందా ? ఒకసారి అధికారం వస్తే వారు వీరవుతారన్నది స్పష్టం.


బిజెపి అంటే మోడీ – మోడీ అంటే బిజెపి అంటున్నారు. దేశంలో మోడీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఇడి చురుకుగా పని చేస్తుందని జనం గ్రహిస్తున్నారు. ఇతర పార్టీలు బలంగా ఉంటే వారి మద్దతుదార్ల మీద దాడులు జరుగుతాయి, భయపెడతారు. అత్యాచారం చేసిన వారు సంస్కారవంతులని కితాబునిచ్చిన గుజరాత్‌ బిజెపి ఎంఎల్‌ఏ తిరిగి రికార్డు మెజారిటీతో గెలిచిచారంటే అక్కడి జనానికి కాషాయ దళాలు కలిగించిన అపర చైతన్యానికి నిదర్శనం. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ సాదర్‌లో తొలిసారిగా ఒక హిందువు అసెంబ్లీకి ఎన్నికైనట్లు మరొక వార్త. వీటి గురించి మరొక విధంగా చెప్పాలంటే ఎక్కడ ముస్లిం విద్వేషాన్ని, హిందూ భావోద్వేగాలను రెచ్చగొడితే అక్కడ బిజెపికి ఓట్ల పంట ఎక్కువగా పండుతున్నది. గుజరాత్‌లో గోద్రా మారణకాండ ఇంకా లబ్ది చేకూర్చుతూనే ఉంది. అక్కడ జనాభాలో 2011లెక్కల ప్రకారం 88.6శాతం హిందువులు, 9.7శాతం ముస్లింలు ఉన్నారు. గోద్రా మారణకాండకు ముందు 1960, 80దశకాల్లో తీవ్రమైన మత ఘర్షణలు జరిగిన పూర్వరంగం ఉంది. అదే హిమచల్‌ ప్రదేశ్‌లో ముస్లింలను బూచిగా చూపేందుకు అవకాశం లేదు.అక్కడ జనాభాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 95.17శాతం మంది హిందువులే ఉన్నారు. అక్కడ 2.18శాతం మందే ముస్లిం జనాభా ఉంది. ఈ కారణంగా అక్కడ ముస్లిం విద్వేష భావోద్వేగాన్ని రగిల్చే అవకాశం లేనందున మోడీ-బిజెపి ఎత్తుగడలు పారలేదని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరును బట్టే జనం ఓట్లేశారని, ఆమేరకు బిజెపి వైఫల్యం ఓటమికి దారి తీసిందని అభిప్రాయపడుతున్నారు. హిందూమతానికి ముప్పు వచ్చిందని, లవ్‌ జీహాద్‌, ఉమ్మడి పౌరస్మృతి, వెనుకబడిన తరగతుల వంటి అంశాలు అక్కడ ఓటర్లను ఆకర్షించేవికాదు.జనాభాలో మూడోవంతు మంది ఠాకూర్లు, 25.2శాతం దళితులు(33శాతం మంది ఉన్న పంజాబ్‌ తరువాత ఇంత మంది మరొక రాష్ట్రంలో ఎక్కడా లేరు) 18శాతం బ్రాహ్మణులు,13.5శాతం వెనుకబడిన తరగతులు 5.7శాతం మంది గిరిజనులు ఉన్నారు. ఇక్కడ మరొక పార్టీ ఎదగలేదు. జనాభాలో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్నవారే ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక సమీకరణలకూ అవకాశం లేదు. పంజాబ్‌లో కూడా ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు వీలుగా అక్కడ ఆ సామాజిక తరగతి జనాభా లేకపోవటంతో బిజెపి ఓటు బాంకును ఏర్పరుచుకోలేకపోయిందని సూత్రీకరించిన వారున్నారు.

ఉత్తర ప్రదేశలో చేసిన మాదిరి పదమూడు శాతం ఉన్న ముస్లింలు ఉన్న కర్ణాటకలో రెచ్చగొడుతున్న వివాదాలు, తెలంగాణాల టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నది మజ్లిస్‌ అని ప్రచారం చేయటం, కేరళలో ముస్లిం మతశక్తుల గురించి చేస్తున్న ప్రచారం వంటివన్నీ ఈ సూత్రీకరణలకు ఊతం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొడితే కుదరదు, జగన్మోహన్‌ రెడి ్డ క్రైస్తవమతానికి చెందిన వారు గనుక హిందూ మతానికి ముప్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో తీవ్ర విద్వేషాన్ని రెచ్చగొట్టినా పదిహేను సంవత్సరాలు మున్సిపల్‌ పాలన సాగించిన బిజెపి తాజాగా దెబ్బతిన్నది. కేరళలో దాని ఎత్తుగడలు పారలేదు, ఉన్న ఒక్క సీటును, గతంలో తెచ్చుకున్న ఓట్లనూ అది పోగొట్టుకుంది. శబరిమల పేరుతో మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టాలని చూసినా కుదరలేదు. క్రైస్తవుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది. బెంగాల్లో కొంత మేరకు ముస్లిం విద్వేషం ఫలించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అంతకు ముందు తెచ్చుకున్న ఓట్లను తెచ్చుకోలేకపోయింది. ఇలా బిజెపికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నా దాని ముస్లిం విద్వేషం తగ్గలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌, వికాస్‌ అని చెబుతున్న ఆ పార్టీ గుజరాత్‌లో పదిశాతం ఉన్న ముస్లింలకు ఒక్క సీటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఇచ్చిన వారికి ముస్లిం సంతుష్టీకరణ పార్టీలని ముద్రవేస్తున్నది. స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కూడగట్టేందుకు కాంగ్రెస్‌ అనుసరించిన ఎత్తుగడలు, తరువాత మైనారిటీలను ఓటు బాంకుగా మార్చుకున్న తీరును బిజెపి బాగా ఉపయోగించుకుంది.అసలు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేని సంఘపరివార్‌, తరువాత దాని రాజకీయ ముసుగులుగా ముందుకు వచ్చిన జనసంఘం, బిజెపి డిఎన్‌ఏలోనే ముస్లిం విద్వేషం ఉంది. షాబానో కేసు వంటి వాటితో మైనారిటీలను సంతుష్టీకరిస్తూనే బిజెపిని ఎదుర్కొనేందుకు బాబరీ మసీదును కూడా తెరిపించి మెజారిటీ మతస్తుల సంతుష్టీకరణకు కాంగ్రెస్‌ తెరలేపింది. రెండింటికీ చెడింది. బిజెపి గతంలో జరిగిన వాటి పేరుతో ముస్లిం విద్వేషం, మెజారిటీ హిందువుల సంతుష్టీకరణకు తెరతీసింది. కానీ ఎక్కడా దానికి మెజారిటీ హిందువుల మద్దతు ఇంతవరకు రుజువు కాలేదు. ప్రతిపక్షాల్లో చీలికల కారణంగానే అది ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నది.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీపై గుజరాత్‌ మారణకాండ మచ్చ : వీసా నిరాకరణపై మరోసారి గుర్తు చేసిన అమెరికా !

21 Monday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, AB Vajpayee, BJP, Immunity, Joe Biden, journalist Jamal Khashoggi, Narendra Modi Failures, RSS, Saudi Crown Prince Mohammed bin Salman


ఎం కోటేశ్వరరావు


పెళ్లికొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్‌ అవసరం లేని అంశాన్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్రమోడీ మీద ఉన్న గుజరాత్‌ మారణకాండ మచ్చను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని గతంలో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్న అభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది. ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణల నుంచి ప్రభుత్వ పరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది.


అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, జింబాబ్వే నేత రాబర్ట్‌ ముగాబే, కాంగోనేత కబిల, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారని విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత పటేల్‌ పేర్కొన్నాడు. వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్య వంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికి పోవటం లేదు.ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్యలో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది . దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్‌ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్‌ సౌదీ రక్షణ, గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పధకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరును చూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్నదానికి ఎంబిఎస్‌ ఆమోదం వుందని పేర్కొన్నారు.
.
ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగశాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ” అంటరాని ” వాని జోబైడెన్‌ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు.వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్‌ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు. సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపై చర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు.ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్‌ చెప్పాడు.


చట్టబద్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్‌ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రి లోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది. దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్రమోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపు వర్తింప చేశామని వేదాంత పటేల్‌ చెప్పాడు. హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్‌ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలు చేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్రమోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్‌ మోడీ అధికారిక పర్యటనతో పాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది.తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్‌, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్‌ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హౌదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్‌ కోర్టు నరేంద్రమోడీకి సమన్లు జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో నరేంద్రమోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్‌ కోర్టుకు తెలిపింది.2015 జనవరిలో న్యూయార్క్‌ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.

సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్దంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్దతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్రమోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్చ అమెరికన్‌ కమిషన్‌ సంస్థ(యు ఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ” ముఖ్యనేతలందరి ” మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్‌ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్రమోడీ, అమిత్‌ షాల గురించే అన్నది స్పష్టం.


జర్నలిస్టు ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ రాజు సల్మాన్‌ హస్తం ఉందని గతంలో చెప్పిన అమెరికా నాలుక మడిచి ఇప్పుడు ఏజంట్ల పాత్ర గురించి చెబుతోంది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పాయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.దీన్ని 2013లో నరేంద్రమోడీ తిరస్కరించటమే గాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పాయి చెప్పారని అన్నారు. ” ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని ” అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్రమోడీ 2014లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్‌ మారణకాండలో సంఘపరివార్‌ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా ? గుజరాత్‌ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

2002 నాటి ఉదంతాలకు నరేంద్రమోడీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని 2012లో సుప్రీం కోర్టు చెప్పింది. తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్‌, సంఘపరివార్‌ సంస్థల తీరు తెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్‌ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్‌ రెండున గార్డియన్‌ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు. వేదాంత పటేల్‌ స్పందనలో నరేంద్రమోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యధాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోడీ తనను కాశ్మీరు వివాదంలో పెద్దమనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు . స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా ? అనుమానం ఎందుకు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవినీతి నిరోధంపై సుభాషితాలు,సుద్దులు : ప్రధాని మోడీ ఆచరణ చూస్తే విస్తుపోతారు !

13 Sunday Nov 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Anna Hazare, BJP, Central Vigilance Commission, Lokayukta, Lokpal India, Narendra Modi, Narendra Modi Failures, Vigilance Awareness Week, War on Corruption


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అందరూ శాకాహారులే రొయ్యలబుట్ట మాయం అన్నట్లుగా దేశంలో అందరూ సత్యహరిశ్చంద్రుల వారసులం, అవినీతి అంటే అదేమిటో తెలియని వారం అన్నట్లుగా ఉంటారు. అయినా అవినీతి గురించి మాట్లాడని రోజు లేదు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఒక నిపుణుల కమిటీని వేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే బిజెపి నేతలు మరొక వైపు దేశంలో అవినీతి లేదు అక్రమాలు లేవంటూ రోజూ ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. స్వచ్చత సూచికలను ప్రకటిస్తున్న మాదిరి నెల లేదా మూడు నెలలకు ఒకసారి అవినీతి అధికారుల మీద ఉన్న కేసుల ఆధారంగా వివిధ శాఖలకు కూడా సూచికలను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతారు. ఆచరణ చూస్తే విస్తుపోతారు. అవినీతి గురించి 2014 తరువాత చెప్పిన వాటిని అమలు చేయకుంటే బిజెపికి వ్యతిరేకంగా తమ బృందం ఆందోళనకు దిగుతుందని అన్నాహజారే కార్యదర్శి కల్పనా ఇనాందార్‌ ప్రకటించారు. కొంత మంది నమ్ముతున్నట్లుగా ఆ జగన్నాటక సూత్రధారి ఎవరిని ఎలా ఆడిస్తున్నాడో, ఎందుకు అలా ఆడిస్తున్నాడో అర్ధం కావటం లేదు.


అవినీతి సూచికలో మన దేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాలు అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలు, అవగాహన ఏమిటో తెలుసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిపుణులతో కమిటీలు వేసేవిధంగా, దేశ అవినీతి సూచిక మెరుగుపడే విధంగా అవగాహనకు సూచనలు చేసే విధంగా లా కమిషన్ను ఆదేశించాలని అశ్వినీ ఉపాధ్యాయ పిటీషన్‌ దాఖలు చేశారు. సంబంధిత అంశాలపై పని చేస్తున్న వారిని సంప్రదించాలని, మన దగ్గర ఇప్పటికే ప్రత్యేక చట్టాలున్నాయని, అవినీతి నిరోధానికి చర్యల గురించి లా కమిషన్ను అడుగుతామంటూ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. నరేంద్రమోడీకి అధికారాన్ని కట్టబెట్టంలో కాంగ్రెస్‌ నేతల అవినీతి, అక్రమాలు ప్రధాన పాత్ర పోషించిన అంశం తెలిసిందే.ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ (టిఐ) ప్రకటించిన అవినీతి సూచికలో 2012, 13 సంవత్సరాల్లో మన దేశం 94వ స్థానంలో 2014లో 85, 2015లో 76కు ఎదిగింది. తరువాత క్రమంగా దిగజారుతూ 2020లో 86, 2021లో 85లో ఉంది.2022 సూచికను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. అవినీతి అంతం గురించి చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో తిరిగి అది కోరలు చాస్తోందన్నది స్పష్టం. టిఐ సూచికలు సరైనవా కాదా అన్న చర్చకు వస్తే కాంగ్రెస్‌ పాలనలో-బిజెపి ఏలుబడిలో సూచికలను ఇచ్చింది కూడా అదే సంస్థ కనుక మోడీ పాలన గురించి ఇచ్చింది తప్పైతే కాంగ్రెస్‌ పాలన గురించి చెప్పింది కూడా తప్పే అవుతుంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది కనుకనే అసలు దాని గురించి చర్చకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వచ్చినా మా మోడీ మీద ఇంతవరకు ఒక్క ఆరోపణలేదుగా అని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ మాటకొస్తే మన్మోహన్‌ సింగ్‌ మీద కూడా ఏమీ లేవు.


ఇటీవల నిఘా చైతన్య వారోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నో సుభాషితాలు పలికారు. అధికారుల మీద అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను బట్టి వివిధ శాఖలకు సూచికలు ఇవ్వాలని సూచించారు. ఆ నిర్ణయం చేసి ఆ సభలో పాల్గొని ఉంటే విశ్వసనీయత ఉండేది.ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర నిఘా సంస్థలో ఫిర్యాదుల యాజమాన్య వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. అవినీతి నిరోధక సంస్థలలో పని చేస్తున్నవారి మీద బురద చల్లేందుకు, పని చేయనివ్వకుండా చూసేందుకు స్వప్రయోజనపరులు చూస్తారని,ఆ క్రమంలోనే తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, కానీ జనం దేవుళ్లు వారికి నిజం తెలుసు, తరుణం వచ్చినపుడు వారు నిజానికి మద్దతుగా నిలుస్తారు అన్నారు. కేంద్ర నిఘా సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిపై వచ్చిన 1,09,214 ఫిర్యాదుల్లో ప్రధాని తరువాత స్థానంలో ఉన్న అమిత్‌ షా నిర్వహిస్తున్న హౌంశాఖ మీద వచ్చినవి 37,670, తరువాత 11,003తో రైల్వే, 6,330తో బాంకులు ఉన్నాయి. 2013లో సివిసికి 35,332 వచ్చాయి. ఆ తరువాత నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. దీని భావమేమి తిరుమలేశా ! మోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికారుల్లో అవినీతి పెరిగినట్లా తగ్గినట్లా !!


కేసుల గురించి సూచికలు ఇమ్మని ప్రధాని చెప్పారు సరే, తన ఏలుబడిలోని ప్రభుత్వ శాఖలు ఎలా పనిచేస్తున్నట్లు ? కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషిఏటివ్‌ సంస్థ ఒక సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని వెల్లడించింది. దాని ప్రకారం 2013 ఏప్రిల్‌ నుంచి 2017 ఫిబ్రవరి వరకు డిజిఎఫ్‌టి కార్యాలయాలకు అందిన 181 అవినీతి ఫిర్యాదులపై ఒక్కదాని మీద కూడా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని, 2009లో వచ్చిన వాటిలో ఒక కేసులో ఒక అధికారిపై విధించిన పెనాల్టి వివరాలను కూడా సమాచార హక్కు కింద ఇవ్వలేదని తేలింది.దరఖాస్తులకు సమాధానాలు కూడా ఇవ్వలేదు. కర్ణాటక లోకాయక్త సమాచారహక్కు ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మరింత దారుణంగా ఉంది. అవినీతి కేసులు,తాను దర్యాప్తు చేసిన వాటి వివరాలను గణాంకాలను నిర్వహించాల్సిన బాధ్యత తమకు లేదని, 2006లో కేంద్ర సమాచార కమిషన్‌ జారీ చేసిన ఉత్తరువు ప్రకారం పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప సమాచారం ఇవ్వనవసరం లేదని, సమాచారం గనుక ఇస్తే నిందితులైన అధికారుల గోప్యతకు భంగం కలుగుతుందని కూడా సమాధానమిచ్చింది. నిఘా చైతన్య వారోత్సవాల్లో ఇలాంటి సంస్థలు, వ్యవస్థ అధికారులకే నరేంద్రమోడీ సుభాషితాలను వినిపించారు.


నరేంద్రమోడీ పాలనలో అవినీతి పెరిగిందని, గ్రామాల సంపదలను పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉందని అన్నా హజారే కార్యదర్శి కల్పన నవంబరు పదవ తేదీన లక్నోలో రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.2011లో అన్నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఆందోళన కారణంగా కాంగ్రెస్‌కు మారుగా బిజెపి అధికారానికి వచ్చిందని ఎనిమిది సంవత్సరాలుగా చేసిందేమీ లేదన్నారు. గతంలో కూడా అన్నా హజారే ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఇడి తదితర సంస్థల దాడులు విపరీతంగా పెరిగాయి. అవినీతి మీద పోరులో తమ తీరుకు ఇది నిదర్శనం అని బిజెపి చెప్పుకుంటుంది. అసలు కథలు వేరే అన్నది తెలిసిందే. ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేదంటున్నారు, మరి గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు కారణం ఏమిటి ? 2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 దాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు , 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ఇలా అవినీతి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.


ఇటీవలి కాలంలో సమాచార కేంద్రాల అనుసంధానం కారణంగానే చట్టబద్దంగా జరిగే లావాదేవీల మీద నిఘాతో పాటు అక్రమాలను కనుగొనటం కూడా సులభతరమైంది. వాటి ఆధారంగా అక్రమార్కుల మీద తీసుకొంటున్న చర్యలే ప్రశ్నార్దకం. రెండవది అక్రమాలకు పాల్పడుతున్నవారు గతంలో మాదిరి నగదుతోనే పని నడిపిస్తున్నారు. అందుకే దాడులు జరిపితే టన్నుల కొద్దీ నగదు పట్టుబడుతున్నది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్ధిక రంగంలో నగదు సరఫరా 17.7లక్షల కోట్ల నుంచి 32లక్షల కోట్లకు పెరిగింది. అవినీతి పెరుగుదలకు ఇదొక సూచిక. మోడీ సర్కార్‌ చెబుతున్నట్లు లావాదేవీలన్నీ బాంకుల ద్వారా జరిగితే ఇటీవల తెలంగాణాలోని మునుగోడు, అంతకు ముందు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు గుట్టువెల్లడికావాలి. అలాంటిదేమీ లేదు.


2014కు ముందు అవినీతి ప్రభుత్వానికి ఒక అత్యవసరమైన భాగంగా ఉండేది, ఇప్పుడు ఏ మాత్రం సహించని విధానం అనుసరిస్తున్నామని నరేంద్రమోడీ హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సభల్లో చెప్పారు. మాటలు కాదు ఆచరణ అన్నది అసలు జరుగుతున్నదేమిటో మనకు చూపుతుంది.లోక్‌ పాల్‌ జోక్‌ పాల్‌గా మారిందని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ సభ్యుడు శైలేష్‌ గాంధీ చమత్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఆందోళనకు మోడీ అండ్‌ కో మద్దతు ఇచ్చింది. దాన్నే ఒక ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకొని లబ్ది పొందింది. అలాంటి పెద్దలు సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాతనే ప్రధాని పీఠం ఎక్కిన ఐదు సంవత్సరాల తరువాత ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లు లోక్‌పాల్‌ నియామకం జరిపారు.
అన్నా హజారే తదితరుల ఆందోళన, అనేక అవినీతి ఆరోపణల పూర్వరంగంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాలను చేసింది. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల తరువాత ఏర్పాటు చేశారు. లోక్‌పాల్‌ వ్యవస్థలో బిజెపి అనుకూలురను నింపి దాన్ని ఒక ప్రహసన ప్రాయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. అన్నా హజారే బృందంలోని కిరణ్‌ బేడి తరువాత బిజెపిగా అసలు రూపాన్ని వెల్లడించారు.అరవింద్‌ కేజరీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన లోక్‌పాల్‌ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసిన తరువాత దాదాపు నాలుగు సంవత్సరాలు నరేంద్రమోడీ ఆ కమిటీతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదని 2018లో సమాచర హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వెల్లడించిందని అంజలీ భరద్వాజ తెలిపారు. అంతకు ముందు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయకుంటే ఆందోళన చేస్తానని 2015లో అన్నా హజారే ప్రకటించారు. రెండేళ్ల తరువాత 2017లో మోడీని ప్రశ్నిస్తూ ఒక ప్రకటన చేశారు.2018లో ఆరు రోజులు నిరసన దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌ అంశం సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు అది ” ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ” అని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సుప్రీం కోర్టు అన్నది. చివరకు 2019లో నియమించారు. ఎంపిక కమిటీ కూడా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రధాని అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్‌, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రతినిధి, ప్రతిపక్ష నేత, మరో ప్రముఖ న్యాయవాది, అంటే ముగ్గురు అధికారపార్టీ వారే ఉంటారు లేదా మద్దతుదారులు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను కమిటీ ఆహ్వానితుడిగా మాత్రమే పిలిచారు.ఎంపికలో తన పాత్ర ఉండదు కనుక సమావేశాన్ని బహిష్కరించారు. ఆ కమిటీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చినెలలో లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన పినాకి చంద్రను ఎంపిక చేశారు.


ఇక లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల తీరుతెన్నులను చూస్తే 2019-20లో వచ్చిన 1,427లో 85 శాతం తమ పరిధిలోకి రావని, ఆరుశాతం సరైన పద్దతిలో నింపలేదని తిరస్కరించారు. మిగిలిన వాటిని విచారించి నిగ్గుతేల్చిందేమిటో జనానికి తెలియదు. నియామకం జరిగి ఏడాది కూడా నిండక ముందే లోక్‌పాల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న దిలీప్‌ భోంసలే 2020 జనవరి ఆరున ” వ్యక్తిగత కారణాల ”తో రాజీనామా చేశారు. తరువాత వెల్లడైనదేమంటే భోంసలేకు ఆఫీసు లేదా అధికారిక పనిగానీ లేదంటూ మూడు లేఖలు రాసినా లోక్‌పాల్‌ చైర్మన్‌ పట్టించుకోలేదు.” తొలి రోజు నుంచీ పని చేయకపోవటాన్ని, మబ్బుగా ఉండటాన్ని చెబుతూనే ఉన్నాను. చైర్మన్‌ నా సూచనలను పూర్తిగా పక్కన పడేశారు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు, స్పందన ప్రతికూలంగా ఉంది ” అని భోంసలే చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. తన వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం నిరర్థకమైనవని, వాటి గురించి మూడు సంవత్సరాల తన పదవీకాలాన్ని గడిపితే సమయం వృధా తప్ప మరొకటి కాదని భోంసలే అన్నారు. పని చేయాల్సిన పద్దతి ఇది కాదు, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చైర్మన్‌ ఎలాంటి చొరవ చూపలేదని అన్నారు.


జస్టిస్‌ భోంసలే రాజీనామా తరువాత మరొక జడ్జి కరోనాతో మరణించారు. ఆ రెండు పోస్టులను ఇంతవరకు నింపలేదు. విచారణ, ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్ల పోస్టులతో పాటు అవసరమైన ఇతర సిబ్బందిని కూడా కేంద్రం నియమించలేదు. కేటాయించిన నిధుల్లో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదని 2021లో పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వెల్లడించింది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ లోకాయక్త గురించి అనుసరించిన వైఖరిని చూస్తే లోక్‌పాల్‌ జోక్‌ పాల్‌గా ఎందుకు మారిందో అర్ధం చేసుకోవచ్చు. పదేండ్ల పాటు గుజరాత్‌ లోకాయక్త నియామకం జరపలేదు లేదా వ్యతిరేకించారు. 2011లో నాటి గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి జస్టిస్‌ ఆర్‌ఏ మెహతాను నియమించగా తొలగించాలంటూ నరేంద్రమోడీ సుప్రీం కోర్టు తలుపు తట్టి విఫలమయ్యారు. నరేంద్రమోడీ తీరు తెన్నులతో ఆగ్రహించిన జస్టిస్‌ మెహతా బాధ్యతలను తీసుకొనేందుకు తిరస్కరించారు. లోకాయక్తలు ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో ఉండకూడదని మోడీ సర్కార్‌ వాదించింది. జస్టిస్‌ మెహతా తిరస్కరణ తరువాత ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చారు. నియామక ప్రక్రియలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా చేశారు.మొత్తం ప్రభుత్వానికే అధికారాన్ని కట్టబెట్టారు. నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత 2016లో లోక్‌పాల్‌, లోకాయక్త చట్టాన్ని నీరుగార్చారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లతో దాచుకుంటారు. సవరణల ప్రకారం అధికారుల పేరుతో ఉన్నవి తప్ప మిగతా కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ సమాచారం వెల్లడించాలో లేదో నిర్ణయించే అధికారం సమాచార కమిషన్‌కు ఇచ్చింది.

ప్రస్తుత లోక్‌పాల్‌, కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సమావేశాల మినిట్స్‌ ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఇవ్వనవసరం లేదని 2021లో ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర సమాచార కమిషనర్ల ప్రక్రియలోనూ మోడీ సర్కార్‌ ఇలాగే తిరస్కరించింది. ఆచరణ ఇలా ఉంటే మరోవైపు బహిరంగ వేదికల మీద చెబుతున్న సుభాషితాలను చూస్తే దగా దగా కుడి ఎడమల దగా దగా అన్న మహాకవి శ్రీశ్రీ గుర్తుకు రావటం లేదూ ! ” నేను తినను ఇతరులను తిననివ్వను ” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అనుకున్నారు. ఇప్పుడెవరూ చౌకీదార్‌ అని చెప్పుకోవటం లేదు. లోక్‌పాల్‌కు ఫిర్యాదులు ఎందుకు రావటం లేదంటే తమ పాలనలో అవినీతి లేనపుడు ఎలా వస్తాయంటూ బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు ! మహిమ కలికాలానిది అందామా నరేంద్రమోడీది అందామా ?అవినీతి గురించి అందరికీ తెలిసినందున ఎవరికి తోచింది వారు అనుకోవచ్చు. పైకి అంటే పంచాయితీ గానీ లోలోపల అనుకునేందుకు ఇంకా స్వేచ్చ ఉంది. మహాభారతంలో ధర్మపీఠం ఎక్కిన శకుని కౌరవులను నాశనం చేయాలనేఅంతరంగాన్ని వెల్లడిస్తాడు. మన పూర్వీకుల దగ్గర ఆ పాత పీఠాలు ఎక్కడైనా ఉన్నా లేదా దేశ భక్తులైన మన సంస్కృత పండితులు ఆ పరిజ్ఞానాన్ని వెలికి తీసి వాటిని రూపొందించి పుణ్యం కట్టుకుంటే మన పాలకులను వాటి మీద ఎక్కించి అంతరంగాలను బయట పెట్టించవచ్చు, అది తప్ప మరొక మార్గం లేదు, దేశం కోసం వారా పని చేస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నుంచి కంపెనీలు ఏ దేశం వెళుతున్నాయి ? నిజానిజాలేమిటి ?

09 Wednesday Nov 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, exodus of manufacturing from China, factory of the world, Narendra Modi Failures, US-CHINA TRADE WAR, Vietnam


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వెలుపలికి వస్తున్నాయి. అదింకేమాత్రం ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండదు. చైనా వైఫల్యం – భారత అదృష్టం ఇలాంటి వార్తలు, విశ్లేషణలు ఇటీవల మరోసారి పెరిగాయి. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పరిస్థితులన్నీ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. చైనా దానికి మినహాయింపు కాదు.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమని చెప్పి పాలు పితికేందుకు పూనుకున్నట్లుగా కొందరున్నారు.ఆత్ర పడినంత మాత్రాన లేదా అదృష్టాన్ని నమ్ముకుంటే కంపెనీలు వస్తాయా ? మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా, పోటీ పడి మారాలని కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అది వాస్తవాల ప్రాతిపదికగా ఉండాలి. ఇంతకూ అసలు నిజానిజాలేమిటి ?


2022 అక్టోబరు చివరి వారంలో అమెరికాకు చెందిన సిఎన్‌బిసి ఒక విశ్లేషణను ఇచ్చింది.2016 నుంచి 2022లో ఇప్పటి వరకు వచ్చిన మార్పులను అది పేర్కొన్నది. దాని ప్రకారం ప్రపంచ దుస్తులు, వాటి సంబంధిత వస్తువుల ఎగుమతుల్లో చైనా వాటా 41 నుంచి 37శాతానికి, ఫర్నీచర్‌లో 64 నుంచి 53కు, పాదరక్షలు 72 నుంచి 65, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 83 నుంచి 70శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వియత్నాం వాటా ఫర్నీచర్‌లో 8 నుంచి 17 శాతానికి, పాదరక్షలు 12 నుంచి 16, ప్రయాణ వస్తువులు, చేతి సంచుల వాటా 6 నుంచి 10శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు పది నుంచి 12 శాతానికి పెరగ్గా, మలేషియా నుంచి దుస్తులు 14 నుంచి 19శాతానికి పెరిగి తిరిగి 14శాతానికి తగ్గాయి. మన దేశ వివరాలను అది అసలు పరిగణనలోకే తీసుకోలేదు. కఠినమైన కరోనా నిబంధనలు, లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా తగ్గటానికి ఒక కారణంగా సిఎన్‌బిసి పేర్కొన్నది. జీరో కరోనా విధానాల కారణంగా ఉత్పత్తిమీద తిరోగమన ప్రభావం పడటంతో దిగుమతిదారులు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారని ఎండిఎస్‌ ట్రాన్స్‌మోడల్‌ సలహాదారు ఆంటోనెలా టియోడోరో చెప్పాడు. చైనా వాటా తగ్గినందున అత్యధికంగా లబ్ది పొందింది వియత్నాం తప్ప మరొక దేశం కాదని అందరూ చెబుతున్నారు.2014 నుంచి అది సుదూర వాణిజ్యాన్ని 360 శాతం పెంచుకుందని ఆంటోనెలా చెప్పాడు. కరోనా నిబంధనలను ఎత్తివేస్తే తిరిగి చైనా వాటా పెరగనూ వచ్చు.


మన దేశంలో ఉన్న వారు ఆలోచించాల్సింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో నరేంద్రమోడీ సర్కార్‌ఎందుకు విఫలమైందన్నదే. వస్తూత్పత్తి చౌకగా అంటే చౌకగా దొరికే శ్రామిక శక్తి వియత్నాంలో ఉన్నందున పరిశ్రమలు, పెట్టుబడులు అక్కడకు వెళుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అదే గనుక అసలు కారణమైతే ఈ పాటికి మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉండాలి. వికీపీడియా సమాచారం ప్రకారం వియత్‌నామ్‌లో 2020 వివరాల ప్రకారం ఏడాది కనీస వేతనం సగటున 1,591 డాలర్లు, మన దేశంలో 2015 వివరాల ప్రకారం 664 డాలర్లు, చైనాలో 2018 ప్రకారం 2,084 డాలర్లు ఉంది.( తాజా వివరాల ప్రకారం అదింకా పెరిగింది) పోనీ నరేంద్రమోడీ అచ్చేదిన్‌లో భాగంగా ఇప్పటికి కనీసవేతనం రెట్టింపు చేశారని అనుకున్నా, వియత్‌నామ్‌ కంటే తక్కువే ఉంటుంది.మోడీ సర్కార్‌ నైపుణ్యశిక్షణ ఇచ్చింతరువాత కూడా మరెందుకు చైనా కంపెనీలు మన వైపు రాకుండా అక్కడికి పోతున్నట్లు ?


ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది చైనా నుంచి గానీ మరొక దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులను అమెరికా లేదా ఐరోపాలోని ధనిక దేశాలు ఉత్పత్తి చేయలేనివి, అసాధ్యమైనవి అంతకంటే కాదు. శ్రమశక్తికి చెల్లించే వేతనాలు అసలు అంశం. తమ దగ్గర ఉన్న రేట్లను పోల్చి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడి ధనిక దేశాల పెట్టుబడిదారులు అక్కడికి పోతున్నారు. చైనాలో తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు, జనాభా, అక్కడి మౌలిక సదుపాయాలు, మార్కెట్‌, తదితర అవకాశాలను చూసి గత నాలుగు దశాబ్దాల్లో చలో చైనా బాట పట్టారు.చైనాలో వేతనాలను పెంచుతున్న కొద్దీ చైనాలో ఉన్న విదేశీ కంపెనీల లాబీలు ప్రభుత్వాన్ని బెదిరించి వేతనాలు పెంచకుండా చూసేందుకు విశ్లేషణల పేరుతో కథనాలను వండివారుస్తున్నాయి. ఉదాహరణకు 2010 జూన్‌ నెలలో ఫైబర్‌ టు ఫాషన్‌ అనే వెబ్‌సైట్‌(పత్రిక)లో కార్మికవేతన ఖర్చు పెరుగుతున్న కారణంగా వస్తున్న వత్తిడితో అమెరికా దుస్తుల కంపెనీల సంస్థలు చైనా నుంచి వెలుపలికి పోయి ఇతర దేశాల్లో తమ సంస్థల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని భారత్‌తో సహా ఆసియాలోని సహదేశాలు వినియోగించుకుంటాయా అనే పద్దతిలో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. చిల్లర అమ్మకాల దిగ్గజాలైన కోచ్‌,ఆన్‌ టైలర్‌ స్టోర్స్‌,గస్‌,జె సి పెనీ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను విదేశాలకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నది. 2010 ఒక నివేదిక ప్రకారం గంటలకు కార్మికవేతన వేతనం( పెట్టుబడిదారుల పదజాలంలో ఖర్చు ) 1.84 డాలర్లని అంతకు ముందు ఏడాది కంటే 17శాతం పెరిగినట్లు అదే భారత్‌లో గంటకు 2.99 డాలర్లు, వియత్నాంలో 0.49 డాలర్లు ఉన్నట్లు తెలిపింది. చైనా వేతన ప్రమాణాలను పెంచటం, కరెన్సీ ఎన్‌ విలువ పెరగటం వంటి కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు.


ఆ తరువాత గడచిన పది సంవత్సరాల్లో కరోనాకు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణలను ప్రచురించని ఏడాది లేదంటే అతియోక్తి కాదు. అయినప్పటికీ పొలోమంటూ మొత్తంగా చైనాను ఖాళీ చేసి విదేశీ బాట పట్టిందేమీ లేదు. దాని ఎగుమతుల్లో వచ్చిన మార్పును పైన చూశాము. 2022 నవంబరు ఏడవ తేదీన అంతకు ముందు ప్రచురించిన వివరాలను నవీకరించి చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ చైనాలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వారికోసం అనేక వివరాలను ప్రచురించింది. దానిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కనీసవేతనాలు, నిబంధనలు తదితర అంశాలను వెల్లడించింది. దాని ప్రకారం 31రాష్ట్రాలలో షాంఘైలో కనీసవేతనం గరిష్టంగా నెలవారి 2,590యువాన్లు లేదా 400 డాలర్లు ఉండగా బీజింగ్‌లో గంటకు 25.3 యువాన్లు లేదా 3.99 డాలర్లు ఉంది. మిగతా చోట్ల రాష్ట్రాల వారీ అంతకంటే తక్కువ ఉన్నాయి. కనిష్టంగా అన్‌హులో 1,340యువాన్లు లేదా 212 డాలర్లు ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్లలో చివరిది ఒకటవ జోన్‌లో 1,650యువాన్లు ఉంది. ప్రతి చోటా ఇలా జోన్ల వారీ హెచ్చు తగ్గులుంటాయి. నవంబరు 8వ తేదీన ఒక డాలరుకు మన కరెన్సీ మారకం విలువ రు.81.80కి అటూ ఇటుగా, ఒక యువానుకు రు.11.26 ఉంది.
మన కనీస వేతనాల్లో వైద్య బీమా – ఇఎస్‌ఐ నిమిత్తం కార్మికులు,యజమానులు చెల్లించాల్సి వాటాలు ఎలానో చైనాలో ఇతర అంశాలతో పాటు ఇంటి బీమా కోసం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రితపు ఏడాదిలో మూడు నెలల సగటు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగం దానిలో కార్మికుడు చెల్లిస్తే మరో సగం కంపెనీ చెల్లిస్తుంది. ఆ నిధులను కార్మికులు గృహాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మొత్తాలు కనీస వేతనం పెరిగినపుడల్లా దానికి అనుగుణంగా పెరుగుతాయి. ఇవి కనీసవేతనాలు మాత్రమే. ఉదా షాంఘై నగరంలో 2020లో సగటు నెల కనీసవేతనం 1,632 డాలర్లు అంటే రు.1లక్షా 33వేలు. ఇది ప్రభుత్వం ప్రకటించిన నాటి కనీసవేతనం కంటే నాలుగు రెట్లు. మొత్తం వేతనంతో పాటు ఇతర సామాజిక రక్షణ పధకాలకు గాను యజమానులు చెల్లించాల్సిన మొత్తం 37శాతం ఉంటుందని వీటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చైనా బ్రీఫింగ్‌ డాట్‌ కామ్‌ సమాచారం పేర్కొన్నది.


చైనా ఉత్పత్తులు నాసిరకమని అనేక మంది ప్రచారం చేశారు. నిజానికి చైనా బజార్ల పేరుతో మన దేశంలో విక్రయించే వస్తువులన్నీ చైనావి కాదు. తక్కువ ధరలకు వచ్చేవన్నీ నాసిరకమనే భావన మనలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అమెరికా, ఐరోపా దుకాణాలన్నింటా చైనా వస్తువులే అన్నది తెలిసిందే. చైనా తన ఎగుమతుల్లో కేవలం రోజువారీ అవసరమైనవే గాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. ఈ రంగంలో ఇప్పటికీ అమెరికా, ఐరోపా ధనిక దేశాలదే అగ్రస్థానం. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మేడిన్‌ చైనా 2025 పేరుతో అక్కడి ప్రభుత్వం 2015 ప్రారంభించిన పారిశ్రామిక విధానంలో ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే వాటికి గండితో పాటు పోటీ పెరుగుతుంది. ధరలు కూడా తగ్గుతాయి. ఇది తమకు ముప్పు అని అందరికంటే ముందు గుర్తించింది అమెరికా, అందుకే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు.తమ ఉత్పత్తులకు ఎదురుకానున్న పోటీ గురించి చెప్పటానికి బదులు చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరించిందని, తమ భద్రతకు ముప్పు ఉందంటూ అమెరికా ప్రచారం చేస్తున్నది.


ఏ దేశానికి ఆ దేశం భిన్నమైన పేర్లతో ఇలాంటి విధానాలనే చేపట్టింది.” పరిశ్రమలు 4.0 అభివృద్ధి ప్రణాళిక ” పేరుతో జర్మనీ ప్రకటించింది. మన మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి వాటి గురించి తెలిసిందే. ప్రపంచం వంద సెమీ కండక్టర్లను వాడుతుంటే అందులో చైనా వాటా 60, దానికి గాను అది ఉత్పత్తి చేస్తున్నది పదమూడు మాత్రమే. చైనా ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 2025నాటికి ఈ రంగంలో 70శాతం స్వయం సమృద్ధి సాధించాలని, 2049లో వందేళ్ల చైనా కమ్యూనిస్టు పాలన నాటికి హైటెక్‌ పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండాలని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే దుస్తులు, పాదరక్షల వంటి వాటి మీద పని చేస్తూనే ఇతర కీలక రంగాల మీద కేంద్రీకరించారు.లాభాలను మాత్రమే చూసుకొనే విదేశీ కంపెనీలు చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు, ఇతర రాజీలేని నిబంధనల కారణంగా ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. అందువలన కొన్ని పరిశ్రమలు వెళ్లవచ్చు. అలా వెళితే వాటికే నష్టం. వాటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశం ఉండదు. అందువలన ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, పారిశ్రామికవేత్తల ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి.

చైనా చేపట్టిన సంస్కరణల గురించి భిన్న అభిప్రాయం వెల్లడించే కొందరు వామపక్ష వాదులు గానీ, అది కూలిపోతుంది, వాలిపోతుంది అని గత నాలుగు దశాబ్దాలుగా జోశ్యాలు చెబుతున్న చైనా వ్యతిరేకులకు గానీ ఇంత కాలం ఆశాభంగమే తప్ప మరొకటి లేదు. అయితే చైనాకు ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేవా ? లేవని ఎవరు చెప్పారు ! పెట్టుబడిదారీ సమాజాన్ని నెలకొల్పేందుకు పూనుకున్నవారికి అంతా పూలబాటగా ఎలాంటి ప్రతిఘటన, సవాళ్లు లేకుండా అంతా సాఫీగా నడిచిందా, ఆధిపత్యం కోసం ఖండాలు, ప్రపంచ యుద్ధాలు చేసుకున్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణంలో పెట్టుబడిదారుల నుంచి ప్రతిఘటన లేకుండా ఎలా ఉంటుంది ?


చైనా ఒక విధానాన్ని అనుసరించి అనూహ్య విజయాలను సాధించింది. ఆ…. అది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం ఎక్కడుంది అనే వారు కొందరు. నిజమే, సోషలిజం లేనపుడు అది వద్దని కోరుకొనే వారు ఆ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంతో చైనా మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదు ? అక్కడంతా నిరంకుశత్వం ఉంటుంది అనే వాదన మరొకటి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశపాలనలో ఉన్నాయి,మరి అవెందుకు చైనా మాదిరి పురోగమించలేదు. పత్రికల రాతలను చూసి గతంలో కంపెనీలు చైనాకు వరుసలు కట్టలేదు. ఇప్పుడు వీటిని చూసి తిరుగుముఖం పడితే ఏం చేయాల్సిందీ చైనా వారు చూసుకుంటారు. వసుధైక కుటుంబం, సర్వే జనా సుఖినో భవా, అందరూ బాగుండాలి-అందులో నేనుండాలి అనుకొనే దేశంలో చైనా ఆర్థికంగా దెబ్బతింటే బాగుపడేది మనమే లేదా మనకు మంచి అవకాశం అనే ఆలోచనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. చైనా మీద విద్వేషాన్ని విపరీతంగా రెచ్చ గొట్టిన పర్యవసానమిది. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి కష్టపడకుండా లక్కు మీద ఆధారపడి పనీ పాటా లేకుండా తిరిగే సోంబేరుల మాదిరి ఉండి బాగుపడిన వారెవరూ లేరు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా దెబ్బతింటే తప్ప మనకు అవకాశాలు రావని చెప్పే ప్రబుద్దుల మాటలు విని దాని కోసం ఎదురు చూస్తూ చేయాల్సినవి చేయకుండా కూర్చుంటే ఫలితం ఉండదని పాలకులకు, ఇతరులకు ఎవరు చెప్పాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

30 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Boris Johnson, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, RSS, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఘోర వైఫల్యం : ఆరేండ్ల నాటి పెద్ద నోట్ల రద్దుకు నేడు అడ్డగోలు సమర్ధనలా !

26 Wednesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Ashima Goyal, BJP, Demonetisation, Indian economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ నోట రెండోసారి పలికేందుకు ఇబ్బంది పడిన పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ రిజర్వుబాంకు ద్రవ్యవిధాన పర్యవేక్షక కమిటీ సభ్యురాలుద, ఆర్ధికవేత్త అషిమా గోయల్‌ ఇటీవల ముందుకు వచ్చారు. దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడకల, పాలకులకు ఘోర వైఫల్యం. దీని గురించి ఆరు సంవత్సరాల తరువాత ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం కోర్డు డివిజన్‌ బెంచ్‌ పెద్ద నోట్ల రద్దు లక్షా˜్యన్ని సాధించిందా అన్న అంశాన్ని విచారించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ విధానాల సమీక్ష మీద తమకు ఉన్న లక్ష్మణ రేఖ గురించి తెలుసునని కూడా కోర్టు పేర్కొన్నది. అందువలన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం గురించి ఊహాగానాలు అవసరం లేదు. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి, పాలకుల మాటలను, నాటి పరిస్థితి, ప్రహసనాలను జనాలకు మరోసారి గుర్తుకు తెస్తాయి.


పెద్ద నోట్ల రద్దు బడా వైఫల్యమని తెలిసినప్పటికీ పన్ను వసూళ్ల ప్లవనశక్తి వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఉన్నదని అషిమా గోయల్‌ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజమా, ఆ వైఖరితో అందరూ ఏకీభవించాలా? అఫ్‌ కోర్సు ఇదే తర్కం ఆర్ధికవేత్తలందరికీ వర్తిస్తుంది కదా అని ఎవరైనా అనవచ్చు. నిజమే, ఎవరేం చెప్పినా వారు చెప్పినదానికి ప్రాతిపదికలే విశ్వసనీయతను వెల్లడిస్తాయి. ఇదే అషిమాకూ వర్తిస్తుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ముందు- తరువాత పన్ను వసూళ్ల అంకెలు ఏమి చెబుతున్నాయి ? ఇలా అనేక అంశాలను చూడాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లలో ఏమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశమే. అషిమా గోస్వామి చెప్పిన అంశాల ప్రాతిపదిక, వాదనే వాటిలో ఉంటుందా ? చూద్దాం.


పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులు, ఇతర విద్రోహశక్తులకు నిధులు అందకుండా చూస్తామని,సమాంతర ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తామని, తెరవెనుక లావాదేవీలను బహిర్గతపరుస్తామని ప్రధాని నరేంద్రమోడీ 2016నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో చెప్పారు. ” ప్రభుత్వ అధికారుల పరుపుల కింద కరెన్సీ కట్టలు లేదా గోనె సంచుల్లో నగదు దొరికింది అనే వార్తలతో నిజాయితీపరులైన పౌరులు బాధపడకూడదనే ” పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్‌) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణాలో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఇప్పుడు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా ? ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇండ్లలో అధికారికంగా ప్రకటించిన రు.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు ? ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిది. ఆ పెద్దమనిషి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు గనుక, మమతాబెనర్జీకి కూడా వాటా వుండి చూసీ చూడనట్లు ఉన్నారనుకుందాం, మరి కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నట్లు ? నిజానికి చిత్తశుద్దితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సినపని లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు దాని ఫలాలు అందుతున్నట్లు అషిమా చెప్పారు. ఫలాలంటే ఏమిటి ? ఆర్ధిక వ్యవస్థ క్రమబద్దీకరణ జరిగింది, డిజిటైజేషన్ను పెంచింది, పన్నుల ఎగవేతను నిరోధించింది అని ఆమె చెప్పారు. గత ఏడాదితో పోల్చితే వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను చెల్లింపు 24శాతం పెరిగి రు.8.98లక్షల కోట్లకు, జిఎస్‌టి గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది 26శాతం చేరినట్లు అక్టోబరు 9న పన్నుల శాఖ చెప్పిన అంశాన్ని ఆమె తన వాదనకు రుజువుగా పేర్కొన్నారు.


పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నరలక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారుగా ఉన్న సౌమ్యకాంతి ఘోష్‌ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్‌ స్టాండర్డ్‌ అనే పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు.( అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ది చేకూరినట్లే) అంతే కాదు ఇప్పటికే ఉన్న ఢిల్లీ పొగను మరింత పెంచేవిధంగా అంత మొత్తాన్ని తగుల పెట్టబోరనే చతురోక్తిని కూడా విసిరారు. అషిమా అభిప్రాయం కూడా అలాంటిదేనా ? ఇద్దరూ ఆర్ధికవేత్తలే కదా ! చివరికి ఏమైంది, ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్లు తగలబెట్టలేదు, పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి.ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా భలే ఉందే అన్న సామెతను గుర్తుకు తెచ్చారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు.కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరోసాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.

2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు.


పెద్ద నోట్ల రద్దు గురించి దివంగత ఆరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా 2017 ఫిబ్రవరి రెండున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో చెప్పిందేమిటి ? 2016 నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు 30వరకు రెండు నుంచి 80లక్షల వరకు డిపాజిట్లు చేసిన ఖాతాలు 1.09 కోట్లు కాగా ఒక్కొక్క ఖాతా సగటు మొత్తం రు.5.03 లక్షలు, 80లక్షలకు మించి దాఖలు చేసిన ఖాతాలు 1.48 లక్షలు, వీటి సగటు రు.3.31 కోట్లు. వీటిని మరొక విధంగా చెప్పారు కొందరు. రు.80లక్షల లోపు డిపాజిట్లు చేసిన ఖాతాల్లో చేరిన మొత్తం రు.5.48 లక్షల కోట్లు కాగా అంతకు మించి చేసిన ఖాతాల మొత్తం రు.4.89 లక్షల కోట్లు.ఆర్‌బిఐ ప్రకటించిన దాని ప్రకారం 99శాతంపైగా నగదు వెనక్కు వచ్చింది, రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. రద్దు చేసిన నోట్ల విలువ రు.15.44లక్షల కోట్లు. మూడోవంతు(31శాతం) సొమ్ము రు.4.89 లక్షల కోట్లు 80లక్షలకు పైగా డిపాజిట్లు కేవలం 1.48 లక్షల మంది నుంచే వచ్చిందంటే నోట్ల రద్దు వలన లబ్ది పొందింది నల్ల మహా ధనికులా మరొకరా ?


పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్‌, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పేవారితో నాకు పేచీ లేదు. అది వేరే సమస్య. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్రమోడీ గారే చెప్పారు.” పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవినీతి స్థాయితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అవినీతి పద్దతుల్లో నగదు సమీకరణతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. పేదలు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. మీరు స్వయంగా అనుభవించి ఉంటారు. భూమి లేదా ఇంటినో కొనుగోలు చేసినపుడు చెక్కు ద్వారా చెల్లించేదానితో పాటు పెద్ద మొత్తంలో నగదును డిమాండ్‌ చేస్తారు. ఒక నిజాయితీ పరుడు ఆస్తిని కొనుగోలు చేసినపుడు సమస్యలను సృష్టిస్తుంది. నగదును దుర్వినియోగం చేస్తే వస్తువుల ధరలు, సేవలైన ఇండ్లు, భూమి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ ఇంకా ఎన్నింటి ధరలో కృత్రిమంగా పెరుగుతాయి.” ఇవన్నీ చెప్పింది మన గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గారే. నోట్ల రద్దు జరిగి ఆరేండ్లు కావస్తోంది, నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే. నిజాయితీపరులైన వారు చెక్కుల ద్వారా ఇండ్లు కొనుక్కున్న ఉదంతం ఒక్కదాన్ని ఎవరైనా చూపగలరా ? ఆత్మవంచన చేసుకోకుండా ఎవరికి వారు అవలోకించుకోవాలి.


పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015 -16లో నగదు చెలామణి జిడిపిలో 12.1శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి – అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది. మోడినోమిక్స్‌ ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.


పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జూలైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకువచ్చారు.ఆ తరువాత కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి ? పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది.మరుసటి ఏడాది కరోనాతో 7.3శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు అషిమా గోయల్‌ ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు ? అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు.యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016ఏప్రిల్‌ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు.2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు. ఈ లావాదేవీల పెరుగుదలకు వాటి మీద అవగాహన పెరగటం, ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ జనాలకు అందుబాటులోకి రావటం, వేగం పెరగటమే కారణంగా చెప్పవచ్చు. దీన్ని ఆర్ధిక రంగ క్రమబద్దీకరణ అని చెప్పగలమా ?


ఆర్ధికరంగం క్రమబద్దీకరణ జరిగి పన్ను ఎగవేతలు, ఆర్ధిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో దాడుల సంఖ్య విపరీత పెరుగుదలకు ఏ భాష్యం చెబుతారు ? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి.2004 నుంచి 2014 వరకు 112 ఇడి దాడులు జరిగితే 2014నుంచి 2022 వరకు3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రు.5,346 కోట్లు సగటున 47.73 కోట్లు కాగా 3010 దాడుల్లో చేసుకున్నది రు.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమలావాదేవీలు ఇంతేనా ? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు.3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్‌ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించే అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టులో తన చర్యను కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో ఏ వాదనలను ముందుకు తెస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మత తటస్థ దేశంలో విద్వేష వాతావరణం ఉందన్న సుప్రీం కోర్టునూ తప్పు పడతారా !

22 Saturday Oct 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, cbi, Hate crime, Hate-Speech, Narendra Modi, Narendra Modi Failures, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకుపోవాలి, ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా ? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా ! నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశమే. ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింప చేయాలి ? ఎవరు పాటించాలి ? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్‌ ప్రకటించారని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని హిందూమత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్‌ అంటే మధ్య యుగాల నాటి మతవిద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో లేదా స్వదేశంలో విమర్శలకు అవకాశం కల్పిస్తున్నదెవరు ? ఏం చెబుతున్నారు ? ఆచరణలో ఏం చేస్తున్నారు ?


ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమౌతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాల ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా ? మన పత్రికలను చదవరా,టీవీలను చూడరా ? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్యులు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేష వాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబల్‌ చెప్పారు. ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన జన అక్రోశ్‌ నిరసన సభలో బిజెపి ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాదన ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయపక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా అని పేర్కొన్నది.దాని మీద సిబల్‌ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా ? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆమ్‌ అద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా ? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా ? ఎవరు సమాధానం చెబుతారు ! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అభిశంసించటమే.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. పదకొండు మంది దోషులు పెరోలు, శిక్ష పడక ముందే జైల్లో ఉన్నారనే పేరుతో సంవత్సరాల తరబడి వెలుపలే ఉన్నారు. గడువు తీరిన తరువాత జైలుకు వచ్చినా ఇదేమిటని అడిగిన వారు లేరు. కారణం వారంతా బిజెపికి చెందిన వారు, అక్కడున్నది వారి ప్రభుత్వమే గనుక. వారిలో ఒకడు పెరోలు మీద వచ్చి ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించాడంటూ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అతడిని విడుదల చేయ కూడదని పోలీసుల డైరీలో రాసినా ఖాతరు చేయకుండా విడుదల చేశారు. మరొకరిని విడుదల చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని బిల్కిస్‌ కుటుంబాన్ని అడగ్గా కూడదని చెప్పినప్పటికీ విడుదల చేశారు, ఇతరుల గురించి అసలు అలా అడగనూ అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలకు మెరుపువేగంతో కదిలింది. గుజరాత్‌ సర్కార్‌ 2022 జూన్‌ 28న కేంద్రానికి లేఖరాస్తే జూలై 11న అనుమతి మంజూరైంది. ఏ కారణంతో విడుదలకు కేంద్రం అనుమతించిందో గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించలేదు. సిపిఎం నాయకురాలు సుభాషిణీ ఆలీ నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాహిత కేసును దాఖలు చేశారు. ఆమెకు ఈకేసుతో ఎలాంటి సంబంధమూ లేదని మూడవ పక్షపు కేసును స్వీకరించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది.నవంబరు 29న కేసు విచారణకు రానుంది.


చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖైదీలను విడుదల చేశారు. ఈ నేరగాండ్లకు దానితో నిమిత్తం లేకుండా అదే రోజున వదిలారు. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ, సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని సిబిఐ కోర్టు జడ్జి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నపుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టటం అంటే దొంగే దొంగని అరవటం తప్ప వేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులు మరొకపేరుతో నిందిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామ తిట్టినందుకా, తోడల్లుడు కిసుక్కుమన్నందుకా ? దేశ ఆకలి సూచికలపై మండిపడుతున్న కాషాయ దళాలు !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

BJP, GHI, Global Hunger Report 2022, hunger, India’s GHI-2022, Narendra Modi Failures, RSS, Saffron gangs Furiousness


ఎం కోటేశ్వరరావు


తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. ఇంకేముంది ! సామాజిక మాధ్యమాల్లో, ఇతరంగా కొందరు పెద్ద గగ్గోలు. గుండెలు పగిలేట్లు బాదుకుంటున్నారు, నివేదిక ఇచ్చిన వారిని శాపనార్ధాలు పెడుతున్నారు. తప్పుడు లెక్కలంటున్నారు, దేశ(నరేంద్రమోడీ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదని కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తెచ్చినవారు కొందరు. 2020 ఏప్రిల్‌లో తొలి కరోనా లాక్‌డౌన్‌ నాటి నుంచి 2022 సెప్టెంబరు వరకు ప్రతి నెలా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా 80కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఇంకా ఆకలి ఏమిటి అని నటనా చక్రవర్తులను తలపించిన వారు ఉన్నారు. మహానుభావులారా ఆకలి సూచిక రూపొందించేందుకు తీసుకున్న అంశాలను, వాటిలో ఒకదాని గురించి మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీజీ ఆగస్టు నెల మన్‌కీ బాత్‌లో పోషకాహార లేమి మీద ప్రజా ఉద్యమం జరపాలని పిలుపునిచ్చారని తెలుసుకోండిి అని చెప్పాల్సి వస్తోంది. ఇన్ని నెలలుగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఇస్తే ఇంకా పోషకాహారం లేదంటారేమిటి అని ఆ పెద్దమనిషి చెప్పలేదని గ్రహించండి.మీరు చెబుతున్నదే సరైనదనుకుంటే ప్రజా ఉద్యమం జరపాలని ఎందుకు పిలుపునిచ్చారో ప్రశ్నించండి ! బియ్యం ఇస్తే సరిపోతున్నపుడు అంతకు ఎంతో ముందు నుంచే పోషణ్‌, ఐసిడిఎస్‌ పధకాలు వాటి కింద అంగన్‌వాడీలు గట్రా ఎందుకు నిర్వహిస్తున్నట్లు ?


గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పుపడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్దతే తప్పు, పరిగణనలోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జిఓ) చెప్పేవాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడువేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింప చేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121మాత్రమే. అది స్వచ్చందం తప్ప ఇవ్వకపోతే తలతీసేదేమీ ఉండదు. అమెరికా, ఐరోపా దేశాల్లో సమాచారం ఇవ్వకపోతే మీడియాలో విమర్శించే స్వేచ్చను అక్కడి జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. మన దగ్గర ఇంకా అలాంటి అవకాశాలు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నా అడిగే దమ్మున్న జర్నలిస్టులు లేరు, అడిగేవారున్నా ఇంతవరకు మనది అపర ప్రజాస్వామిక దేశం గనుక మన నరేంద్రమోడీ ఎవరికీ ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అందువలన మనం కూడా అసలు అధికారిక సమాచారం ఇవ్వటం మానేస్తే సూచికల ప్రసక్తి ఉండదు, వాటి మీద విమర్శలు, ఉక్రోషాలు, ఉడుక్కోవటాలు, కుట్ర సిద్దాంతాల ప్రచారం వంటివి ఉండదు. కాషాయదళాలు వేరేపని చూసుకుంటాయి కదా ! మరి ప్రభుత్వం ఆపని ఎందుకు చేయదు ? లేదా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన విశ్లేషణలు అందించవచ్చు, సూచికలు ప్రకటించవచ్చు. దేశానికి మచ్చతెచ్చే వారికి బుద్ది చెప్పవచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితిలో నరేంద్రమోడీ అడిగితే సమాచారం ఇవ్వని దేశం ఉంటుందా ? నిధుల కొరత లేదే, ఎందుకు చేయరు ? కావాలంటే అప్పులు తీసుకురావచ్చు, 55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వమే అంచనా వేసింది, కనుక మరో లక్ష కోట్లు అప్పుచేసి సరైన సూచికలు వెల్లడిస్త్తే మన ప్రతిభ లోకానికి తెలుస్తుంది. అప్పు తీర్చేది జనమే, ఎవరి జేబుల్లోంచి పెట్టటం లేదు కదా !


ఇక ఐరాస సంస్థలకు సమాచారం ఇవ్వకపోతే మచ్చపడుతుంది, అక్కడ మనం సుభాషితాలు మాట్లాడే అవకాశం ఉండదు, అవి టీవీ చర్చలు కాదు గనుక వాటిలో మాదిరి మాట్లాడితే మర్యాద దక్కదు. పవన్‌ కల్యాణ్‌ భాషలో చెప్పాలంటే కొడకా అంటూ తాటతీస్తారు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, వాటికి సమాచారం ఇవ్వకపోతే తిప్పలు తెచ్చుకున్నట్లే ! ప్రపంచవాణిజ్య సంస్థకూడా అంతకంటే ఎక్కువ. అమెరికా వంటి మన ” సోదర ” దేశాలు మనం సమాచారం ఇస్తున్నా అక్కడ కేసులు పెడుతున్నాయి. మన దేశంలో ఆకలి సంబంధిత అంశాల గురించి స్వచ్చంద సంస్థలు ఏమి చెబుతున్నాయో, మన ప్రభుత్వ సంస్థలు ఎలాంటి నివేదికలిస్తున్నాయో ఆకలి సూచికలను తప్పుపడుతున్నవారు జనానికి చెబుతున్నారా ? వారి నిజాయితీ ప్రశ్నార్దకం కాదా ! మన దేశం తప్ప ఈ నివేదికను ఆమోదించటం లేదని గానీ, తప్పుడు పద్దతుల్లో రూపొందించారని గానీ ఎన్నిదేశాలు స్పందించిందీ సమాచారం లేదు, ఎవరైనా అలాంటి వివరాలు అందచేస్తే ఈ విశ్లేషణలో వాటిని చేర్చవచ్చు. ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా ? లేదు, ఎందుకంటే అన్నింటా అధమస్థానాలే.


మోడీ సర్కార్‌, మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సులభతర వాణిజ్య సూచిక గురించి చూద్దాం.2014లో 142లో ఉన్నదాన్ని 2020 నాటికి 63కు తీసుకువచ్చామని, 79 స్థానాలు ఎగబాకిందని చెప్పారు. చివరికి ఈ సూచికలు రూపొందించిన తీరు పెద్ద కుంభకోణమని, సమాచారాన్ని తారు మారు చేశారని, ప్రపంచ బాంకు పెద్దలు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ మరుసటి ఏడాది నుంచి ఏకంగా సూచికల రూపకల్పనకే స్వస్థి పలికారు. పోనీ మన దేశం ఇప్పుడు నిజాలు మాత్రమే చెప్పే సత్యహరిశ్చంద్రుల వారసులని చెబుతున్నారు గనుక సరైన సమాచారమే ఇచ్చారని, నిజంగానే అంత ప్రగతి సాధించిందనే అనుకుందాం, మరి ఆ మేరకు మన దేశానికి ఆ స్థాయిలో ఎందుకు పెట్టుబడులు రాలేదు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా ఎందుకు విఫలమైనట్లు ? సూచికను ఎగబాకించి సాధించిందేమిటి ? రాంకులను చూపినంత మాత్రాన పెట్టుబడులు పెట్టే అమాయకులు ఉండరని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రపంచానికి రుజువు చేసింది.


ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. ఆ ప్రాతిపదికను మన దేశానికి మాత్రమే వర్తింప చేస్తే తప్పే, అన్ని దేశాలకూ ఒకటే పద్దతిని అనుసరించారు కదా ! పోషకాహార లేమికి గాను కేవలం మూడువేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్దతి. ఏ సర్వేకైనా జనాభాలో ఎంత మందిని తీసుకుంటే సరైన వాస్తవాలు వెల్లడౌతాయో ఎవరైనా చెప్పగలరా ? మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు ఎంతమంది మీద జరుపుతున్నారో చెప్పి ప్రభుత్వం ఒప్పించగలదా ? ఒక పద్దతి ప్రకారం మన దేశం గురించి తప్పుగా చూపేందుకు ప్రతి ఏటా తప్పుడు సమాచారమిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ డిమాండ్‌ చేసినట్లు సదరు సూచికలు ఇచ్చే సంస్థలను అంతర్జాతీయ కోర్టుకు లాగి బోనులో నిలబెట్టి వాస్తవాలేమిటో వెల్లడించాలి. ఒట్టి అరుపులెందుకు ? నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడువేల మంది సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. దాని సమాచారాన్నే నివేదికను రూపొందించిన జర్మనీకి చెందిన ” వెల్ట్‌ హంగర్‌ హిల్‌ఫీ ” ఐర్లండ్‌లోని ” కన్సరన్‌ వరల్డ్‌వైడ్‌ ” తీసుకున్నాయి, అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. 2021 ఆకలి సూచిక నివేదిక తప్పుల తడక అంటూ 2021నవంబరు పదవ తేదీ పయనీర్‌ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. దాన్లో దేశంలో కూరగాయలు, గుడ్లు, పండ్లు, పాలు ఇతర ఆహార ఉత్పత్తులు ఎలా పెరిగాయో పేర్కొంటూ ఇవన్నీ ఉన్నపుడు పోషకాహార లోపం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.( వాటిని కొనుగోలు చేసి రోజూ తినేవారెందరో ఆ పెద్దమనిషి చెప్పి ఉంటే అసలు నిజాలు తెలిసేవి. ) ఆకలి సూచికల రూపకల్పనకు నేషనల్‌ శాంపుల్‌ సర్వే సంస్థ(ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) నుంచి ఆహార వినియోగ సమాచారాన్ని తీసుకోవాలని చెప్పారు. 2011-12 తరువాత అసలు అలాంటి సమాచారాన్ని ప్రచురించలేదని, 2015-16 సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నందున అసలు దాన్ని ప్రచురించకుండా వెనక్కు తీసుకున్నారని, అందువలన 2021 ఆకలి సూచిని 2011-12 సమాచారంతో రూపొందించారని మహాజన్‌ ఆరోపించారు. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సరైన సర్వే నిర్వహించలేదు, పోనీ మా దగ్గర తాజా సమాచారం లేనందున మా దేశాన్ని జాబితాలో చేర్చవద్దని ఎందుకు కోరలేదు. సమాచారాన్ని సేకరించేందుకు మోడీ సర్కార్‌ ఎందుకు శ్రద్ద చూపలేదు ? 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తే ఎన్నికలు ముగిసేవరకు దాన్ని వెలుడకుండా అడ్డుకున్నారు, అది వాస్తవం కాదన్నారు, తరువాత అదే వాస్తవమని అధికారికంగా అంగీకరించారు.


గతంలో ఎఫ్‌ఏఓ మన దేశంలో ఆహార వినియోగం గురించి జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణ బోర్డు (ఎన్‌ఎన్‌ఎంబి) సమాచారం మీద ఆధారపడేది. 2011 తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, 2016 తరువాత పట్టణ ప్రాంతాల్లో తాము ఎలాంటి సర్వేలు జరపలేదని ఎన్‌ఎన్‌ఎంబి చెప్పిందని కూడా మహాజన్‌ పేర్కొన్నారు.( ప్రభుత్వం దగ్గర సమాచారం లేనపుడు గాలప్‌పోల్‌ వంటి సంస్థల మీద ఆధారపడి దాన్ని విశ్లేషణకు తీసుకున్నట్లు చెప్పవచ్చు. దానికి ఎవరిది బాధ్యత ఎవరిది ?)
అశ్వనీ మహాజన్‌ సరికొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) 2016లో చేసిన సర్వే ప్రకారం 16 రాష్ట్రాల్లో కార్లు, ఇళ్లు ఉన్న ధనికుల పిల్లల్లో కూడా 17.6శాతం మంది గిడసబారి ఉన్నారని, 13.6 శాతం మంది బలహీనంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెబుతూ, ధనికులకు ఆహారం అందుబాటులో ఉంటుంది కదా ఇలా ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే పిల్లల్లో 22 శాతం మంది గిడసబారటం, 11.8 శాతం బలహీనంగా ఉంటారని చెప్పారు. ఈ వాదన ఎందుకు చేశారంటే డబ్బున్న వారు కూడా సరిగా పిల్లల్ని పెంచటం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు దీనికి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నరేంద్రమోడీ ఏమి చేస్తారని వాదించటం, వాస్తవాన్ని వక్రీకరించటం, వైఫల్యాన్ని అంగీకరించకపోవటమే.
వాస్తవం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను 2014-15లో ఐదవ సర్వేను 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేల మధ్య వచ్చిన మార్పు, ఆకలి సూచికల్లో 2014-2022 కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి ? దిగువ పట్టికలో చూద్దాం. అంకెలను శాతాలుగా గమనించాలి.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రక్తహీనత అంశంలో ఒక్క కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా పరిస్థితి తీవ్రంగా ఉంది.
అంశం××××××× సర్వే 4 ××× సర్వే 5×× 2014××2022
గిడసబారినపిల్లలు×× 38 ××× 36 ××××× 38.7 ×× 35.5
బలహీన పిల్లలు ×× 21 ××× 19 ××××× 15.1 ×× 19.3
శిశుమరణాలు ×× 22.7 ××× 25 ××××× 4.6 ×× 3.3
పోషకాహారలేమి ×× 00 ××× 00 ××××× 14.8 ×× 16.3
బరువు తక్కువపి.×× 36 ××× 32 ××××× 000 ×× 000
రక్తహీన పిల్లలు ×× 58.6 ×× 67 ××××× 000 ×× 000
రక్తహీనమహిళలు×× 53.1 ××× 57 ×××× 000 ×× 000
రక్తహీనపురుషులు×× 22.7 ××× 25 ×××× 000 ×× 000

పైన పేర్కొన్న అంకెల్లో 2014 నుంచి 2022 వివరాలను ఆకలి సూచికల విశ్లేషణలో పేర్కొన్నారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు మన ప్రభుత్వం ప్రకటించినవే. దశాబ్దాల పాటు ఎలాంటి సర్వేలు నిర్వహించని మన ప్రభుత్వాలు, పాలకులకు, వారి మద్దతుదార్లకు సూచికలను రూపొందించే సంస్థలను విమర్శించేందుకు ఉన్న నైతిక అర్హత ఏమిటి ? తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021వరకు ఉన్న ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది.2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు రాంకుల గొడవ ఉండదు కదా !


2014లో పేర్కొన్న76 దేశాల్లో మనది 55వ రాంకు వాస్తవం కాదు అని కొందరు చెబుతున్నారు. మరి ఎంత ? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 122 మన రాంకు 99 అవుతుంది. తాజా రాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా ? మనం తెచ్చుకున్న మార్కులను చూస్తే 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 మాత్రమే ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. మామ తిట్టినందుకు కాదు తోడల్లు తొంగి చూసి కిసుక్కుమన్నందుకు అన్నట్లుగా మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం, తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు !


చివరిగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి చూద్దాం. సమగ్ర శిశు అభివృద్ధి పధకం(ఐసిడిఎస్‌) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మన్మోహన్‌ పాలన చివరి ఏడాది బడ్జెట్‌ 2013-14లో ఈ పధకానికి రు.16,312 కోట్లు కేటాయించారు. తరువాత నరేంద్రమోడీ పాలన తొలి ఏడాది 2014-15లో రు. 16,561, 2015-16లో రు.8,336, 2016-17లో 14,850, 2017-18లో 16,745 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌ 2022-23లో రు.20,263 కోట్లుగా ప్రతిపాదించారు.2013-14 బడ్జెట్‌ ఖర్చు అంచనా రు.16,65,297 కోట్లు కాగా 2022-23 లో అది రు.39,44,909 కోట్లుగా ప్రతిపాదించారు. దీన్ని బట్టి తొమ్మిది సంవత్సరాల నాడు ఐసిడిఎస్‌కు మొత్తం ఖర్చులో 0.98 శాతం కేటాయిస్తే 2022-23 నాటికి అచ్చేదిన్‌ స్వర్ణయుగంలో అది 0.51 శాతానికి తగ్గింది. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు మాత్రం భీముడిలా ఉండాలి అనుకోవటం కాదా ఇది ? నేటి బాలలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం కాదు, ఆచరణ కావాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకలి సూచికలో మరింత దిగజారుడు : పొట్టకూటి పాములోళ్ల బొమ్మ అవమానమైతే….. మరి రాజకీయ ఆవులోళ్ల చిత్రాల సంగతేమిటి ?

16 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK

≈ Leave a comment

Tags

BJP, Congress party, cow politics, Cow pooja, Indian economy, La Vanguardia, Narendra Modi Failures, RSS, snake charmer


ఎం కోటేశ్వరరావు


మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్‌ సింగ్‌ పాలనలో మన దేశపరువు ప్రతిష్టలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్రమోడీ వాటిని తిరిగి ప్రతిష్టించారని, లోకమంతా మనవైపు చూస్తోందని కొందరు చెప్పారు. ఇప్పుడు మోడీ ఏలుబడిలో మన ఆర్ధిక ప్రగతిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, ఐఎంఎఫ్‌ ప్రశంసే దానికి నిదర్శనం చూడండని చెబుతున్నారు. అటువంటి స్థితిలో మనలను అవమానించే వారికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి ఆఫ్టరాల్‌ 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ దేశ వార పత్రిక లా వాన్‌గార్డియా అవమానించటమా ? మన ఆర్ధిక రంగ వృద్ది తీరుతెన్నులను పాములను ఆడించే వ్యక్తి చిత్రంతో పోల్చి చూపి, అందునా మొదటి పేజీలో విశ్లేషించటమా ?ఆర్ధిక రంగం గురించి రాస్తే రాశారు పో, ఆ బొమ్మ తప్ప మరొకటి దొరకలేదా ! దాన్ని మేము ఏల చూడవలె !! హతవిదీ,ó అని కౌరవ రారాజు సుయోధనుడి మాదిరి అనేక మంది రగిలిపోతున్నారు. వారిని అర్ధం చేసుకోవచ్చు. మయసభలో ధుర్యోధనుడికి ఆగ్రహం తాను భ్రమ అనుకున్న నీటి మడుగులో పడినందుకు కాదు, దాన్ని చూసి ద్రౌపది నవ్వినందుకు అన్నది తెలిసిందే. ఈ వార్త కూడా అలాంటిదే. మరో కోణంలో అలాంటి దానికి అవకాశం ఇచ్చిందెవరు అన్న ప్రశ్నను వేసుకోవాలి. ఆక్టోబరు తొమ్మిదవ తేదీన ” భారత ఆర్ధిక వేళ ” అనే అర్ధం వచ్చే శీర్షికతో ప్రచురించిన ఆ వార్త గురించి శుక్ర,శనివారాల్లో మన దేశంలోని అనేక టీవీలు, జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు పుండు మీద కారం చల్లినట్లుగా సదరు చిత్రాన్ని ముద్రించి మరీ మన పాఠకులకు అందచేశారు.మన జనాలు మన పత్రికలనే సరిగా చదవరు, అలాంటిది స్పెయిన్‌ పత్రికను మన దేశంలో కొద్ది మంది ఆ భాష వచ్చిన వారు తప్ప ఎవరూ చదవరు. దాన్ని తీసుకొని మన పత్రికలు బహుళ ప్రచారమిచ్చిన వార్తలు మన ప్రధాని నరేంద్రమోడీకి గౌరవ ప్రదమా ? మీడియా పెద్దలు ఆలోచించకుండా అలా చేశారని అనుకుందామా ? లేక ప్రధాని మెప్పు పొందేందుకు చేసిన విన్యాసమా ?


ఆ స్పానిష్‌ భాష పత్రికలో మన ఆర్ధిక రంగం మీద చేసిన విశ్లేషణ సారం ఏమిటో అనువాదం కోసం వెతికినా దొరకలేదు. ఏదైనా కావచ్చు, మన ప్రధాని నేతృత్వంలో ఆర్ధికంగా దేశం ఎలా గంతులు వేస్తూ ముందుకు పోతున్నదో రాసి ఉండవచ్చు లేదా ఎలా దిగజారుతున్నదో కూడా చెప్పి ఉండవచ్చు. ఏది రాసినా అసలు అభ్యంతరం అది కాదు. దానికి పాములనాడించే వ్యక్తి చిత్రాన్ని జోడించి ప్రచురించటమే. జనాన్ని కాటువేసే ద్రవ్యోల్బణమనే నాగుపాము బుసలు ప్రపంచమంతటితో పాటు మన దేశంలో కూడా ఉన్నందున దాన్ని బుజ్జగించి బుట్టలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ ఊదుతున్న నాగస్వరానికి చిహ్నంగా ఆ చిత్రాన్ని చూపారా ? అసలు ఆ బొమ్మ వేస్తే తప్పేంటి, పత్రికల్లో అనేక బొమ్మలు వేస్తున్నారు, దాన్ని సానుకూల వైఖరితో ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. ఆర్ధికరంగం మాంద్యంలోకి జారకుండా, మన గానానికి అనుగుణ్యంగా నృత్యం చేయిస్తూ ఉన్నతి వైపు తీసుకువెళ్లే ప్రయత్నానికి ప్రతిబింబంగా దాన్ని ఎందుకు పరిగణించకూడదు, ఆత్మన్యూన్యతకు ఎందుకు గురికావాలి ? చిన్న వ్యంగ్యాన్ని సహించలేని స్థితికి ” ఎదిగామా ” అన్నది వారి ప్రశ్న. నూరు పూవులను పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి.


పాములను ఆడించే వ్యక్తి చిత్రాన్ని మన దేశానికి ప్రతీకగా చూపటం అవమానించటమే అని కొందరు పేర్కొన్నారు.” బలమైన భారత ఆర్ధిక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా పాములోళ్ల బొమ్మలతో మనల్ని చూపటం బుద్దిలేని తనం. వారిని వలసవాద భావన నుంచి మరల్చటం సంక్లిష్టమైనది ” అని స్పెయిన్‌ వారపత్రిక కథనం గురించి బెంగలూరు సెంట్రల్‌ బిజెపి ఎంపీ పిసి మోహన్‌ అన్నారు. నిజమే, వారిని మార్చటం అంత తేలిక కాదు, విదేశీయులు మారకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన దేశంలో పాములోళ్ల కాలం నాటి నుంచి ఉన్న, అంధ, మూఢవిశ్వాసాలను, అశాస్త్రీయ అంశాలను జనాల మెదళ్లకు ఒక పధకం ప్రకారం ఇప్పటికీ సరికొత్త పాకింగ్‌లు, రంగులది ఎక్కిస్తున్న మీడియా, రాజకీయ నేతల సంగతేమిటి అన్నది ప్రశ్న.


మన దేశంలో అశాస్త్రీయ అంశాలను నమ్మి, బహిరంగంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాలను ప్రపంచమంతా చూసి నవ్వుకుంది, దేశాన్ని అపహాస్యం పాలుచేశారు. వినాయకుడికి ఏనుగు తల ఉందంటే అ రోజుల్లోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జన్లు ఉండి ఉండాలని మోడీగారే చెప్పారు. ఇక ఇంథనం, పైలెట్లతో పని లేకుండా ఎక్కిన వారు ఎటు పొమ్మంటే అటు, పైకీ కిందికీ తిరిగే విమానాల గురించి,క్షిపణుల గురించి చెప్పిన పెద్దమనుషుల విన్యాసాలు మూఢవిశ్వాసాలను పెంపొందించేందుకు, జనం చేత వాటిని గుడ్డిగా నమ్మించేందుకే కదా ! పాములనాడించేవారు పొట్ట కూటికోసం పడిన, పడుతున్న తిప్పల్లో భాగం. మరి వీరు ఎందుకు అలా చేస్తున్నట్లు ? అందువలన దేశానికి జరిగిన అవమానం, అపఖ్యాతి తెచ్చిన వారిని వదలి స్పెయిన్‌ పత్రిక అవమానించిందని చెపుతున్నవారి చిత్తశుద్ది ప్రశ్నార్ధకం. విదేశీయులు మన దేశానికి వచ్చినపుడు భారతీయులు నాగుల చవితి పేరుతో పాములను పూజించటం, కోతులకు, ఆవులకు మొక్కటాన్ని, ఆవు మూత్రాన్ని తల మీద చల్లుకోవటాన్ని చూశారు. కనిపించిన చెట్టు, పుట్ట, రాతిని పూజించటాన్ని గమనించారు, భారత్‌ అంటే అలాగే ఉంటుందన్నట్లుగా రాశారు. దానిలో కొంత అతిశయోక్తి, చులకన భావం ఉంది. కానీ వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక శాస్త్రీయ అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జరుగుతున్నదేమిటి ? పాములు పాలు తాగవని తెలిసీ రెచ్చిపోయి పోస్తున్నవారి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా మనోభావాలను కించపరుస్తున్నారని దెబ్బలాటలకు వస్తారు. ఆ మాటకు వస్తే దేవతా రూపాలైన పాములను పూజించాలే తప్ప వాటి కోరలు తీసి ఆడించటం, బుట్టలో పెట్టటం దేవతలను అవమానించటం కాదా అని ఎవరైనా అంటే ? పాములోళ్ల కడుపు మీద కొట్టినట్లే. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు, రాకెట్లను తీసుకువెళ్లి గ్రామ దేవతలు, ఇతర దేవుళ్ల ముందుంచి పడిపోకుండా ఎగిరేట్లు చూడండని వేడుకుంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ గారే గోమాత, కామధేనువు అంటూ ఆవులను పూజిస్తూ ఫోజులిస్తున్న తరువాత, వాటిని ప్రపంచమంతా చూస్తున్నపుడు పాములోళ్ల బొమ్మవేసి ఎవరో అవమానించారు అని గుండెలు బాదుకోవటం కొందరిని సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


ఇక కరోనా మహమ్మారి గురించి ప్రచారం చేసిన మూఢనమ్మకాలు, పిచ్చిపనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంగామాత ఆశీర్వాదం ఉన్నందున గంగలో మునిగితే కరోనా రాదని చెప్పి కుంభమేళాకు అనుమతిచ్చి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి కారకుడైన ఉత్తరాఖండ్‌ బిజెపి సిఎం నిర్వాకం, తరువాత దాన్ని మధ్యలోనే నిలిపివేసిన ప్రహసనం తెలిసిందే. ఇంతకంటే పరువు తక్కువ పనేముంటుంది. ఆవు మూత్ర తాగింపు పార్టీలు, ఆవు పేడ పూసుకొని గంతులు, పాటలు, భజనలు ఇలా ఎన్నని చెప్పుకోవాలి. వీటన్నింటినీ మన టీవీలు తమ రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున చూపిందీ తెలిసిందే. ఇవన్నీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచేవా ? వందల మంది మూత్రం తాగేందుకు, పేడ పూసుకొనేందుకు పోటీపడటంతో మూత్రం లీటరు, పేడ కిలో రు.500 చొప్పున ధర పలికింది. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసి దేశభక్తులందరూ రావాలని కోరారు. అంతే కాదు నరసింహడి అవతారమే కరోనా అని, మాంసాహారం తినేవారిని శిక్షించేందుకే వచ్చిందని సెలవిచ్చారు. ఆవు మూత్రం తన కాన్సర్‌ను మాయంచేసినట్లు బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా చేస్తే కరోనా వైరస్‌ నివారణ అవుతుందని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. దీపాలు వెలిగిస్తే కరోనా నశిస్తుందని అదొక సైన్సు అని చెప్పిన వారు, పో కరోనా పో కరోనా అంటూ శాపాలు పెట్టిన వారు, మంత్రాలు చదివిన వారి గురించీ తెలిసిందే.


పాములోళ్ల బొమ్మ మన దేశానికి ప్రతీకగా ప్రచురించటం అవమానం అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నపుడే ప్రపంచ ఆకలి సూచికల తాజా (2022) నివేదిక వెలువడింది. దీన్లో మన స్థానం దేశానికి ప్రతిష్టను తెచ్చేదిగా ఉందా ? ఈ సూచికల రూపకల్పనకు తగిన సమాచారం ఇచ్చిన దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది అలా ఇచ్చిన 116 దేశాలకు గాను వందవ స్థానంలో ఉన్న నరేంద్రమోడీ ఇప్పుడు 121 దేశాల్లో 107 దగ్గర నిలిచారు. మన దగ్గర ప్రతి ఊర్లో కామధేనువులకు, వాటిని పూజించేవారికీ కొదవ లేదు. కొంత మంది ఓట్ల కోసం నటించినప్పటికీ ఫలితాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్దితో జనం చేసే పూజల్లో విశ్వాసం, నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. మరి ఇంత ఆకలి ఎందుకు ఉన్నట్లు ?2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 అచ్చే దిన్‌ ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. వర్గీకరణ ప్రకారం 9.9 మార్కుల లోపు వచ్చిన దేశాలను ఆకలి లేని లేదా సమస్య తక్కువగా ఉన్నట్లు, పది నుంచి 19.9 వరకు ఒక మితమైన సమస్య, 20 నుంచి 34.9వరకు తీవ్రమైన, 35 నుంచి 49.9 వరకు ఆందోళన కరమైన, 50 దాటితే విషమంగా ఉన్నట్లు పరిగణిస్తారు.ప్రతి ఏటా పరీక్ష పేపరు, ప్రశ్నలు మారుతుంటాయి, వాటికి ఇచ్చే మార్కులూ అంతే గనుక గత సంవత్సరాలతో పోల్చ కూడదని కొందరు వాదిస్తారు. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులున్నప్పటికీ మొత్తంగా వచ్చే మార్కులను బట్టే సూచికల్లో స్థానం ఉంటుంది. దానిలో ఎంత మేరకు ఎదిగామన్నది లెక్క.మన మెరుగుదల ఒక లెక్కలోనిది కాదు, మిగతా దేశాలు మనకంటే ఎక్కువగా మెరుగుపడిన కారణంగానే గత ఏడాది కంటే దిగజారాం.


2013లో మన దేశం 63వ స్థానంలో ఉండగా 2014లో 76 దేశాలకు గాను 55వ స్థానంలో ఉన్నాం. ఆ ఏడాది సూచికల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే దిగువన 57లో, ఎగువన శ్రీలంక 39, నేపాల్‌ 41వ స్థానాల్లో నిలిచాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో పాక్‌, బంగ్లాదేశ్‌ కూడా మన కంటే ఎగువకు చేరాయి. 2022 సూచికలో ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌ 109, మన పాలకులు, కాషాయ దళాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో స్మరించే పాకిస్తాన్‌ 99, బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 81,మయన్మార్‌ 71, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక 64 స్థానాల్లో ఉండగా ప్రపంచానికే ఆహారం అందించగలం అని కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో మన పరిస్థితి ఇలా ఉందేమిటి ? ఇది మన దేశ గౌరవం, ప్రతిష్టలను పెంచేదా ? రేపు మరొక దేశ పత్రిక ఓ కామధేనువూ మా జనాల ఆకలి తీర్చి ప్రపంచ ఆకలి సూచికలో మా స్థానాన్ని పెంచు, మా దిగుమతులను తగ్గించు, ఎగుమతులను పెంచు, ఆవుల మూత్రంలో బంగారం సంగతి తరువాత ముందు దాన్ని ముడిచమురుగా మారిస్తే సంతోషం తల్లీ అని ప్రార్ధిస్తున్నట్లుగా వీధుల్లో ఆవులను చూపుతూ అడుక్కొనే వారి బొమ్మ లేదా నరేంద్రమోడీ ఆవును పూజిస్తున్న బొమ్మను వేస్తే గౌరవంగా ఉంటుందా ? జనాల మనోభావాలతో ఆడుకోవటం తప్ప పాములోళ్ల బొమ్మ గురించి ఇంత రాద్దాంతం అవసరమా ?


జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ వారు అపహాస్యం చేయటమా అంటే అర్ధం ఏమిటి ? అనేక అభివృద్ధి సూచికల్లో అది మన కంటే చాలా ఎగువున వుంది. అందువలన మన మీడియా స్పందన తెలుసుకొని ఆ దేశస్థులు మీ దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ జనాభాకంటే తక్కువగా ఉన్న మేము రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపిని కలిగి ఉంటే అంత పెద్ద దేశం ఇంకా మూడున్నర లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఉండటం ఏమిటో చూసుకోండి, ఒక నాడు చైనా కంటే ముందుండి ఇప్పుడు దాని కంటే ఎంత వెనుక ఉన్నారో తెలుసుకోండి అని స్పందిస్తే మన దగ్గర సమాధానం ఏమిటి ? ఐరోపా వారు తమ వలస కళ్లద్దాలతో గతాన్నే చూస్తున్నారు, వర్తమాన భారతాన్ని చూడటం లేదని సాధించిన ఆర్ధిక ధీరత్వాన్ని చూడలేకపోతున్నారని, బ్రిటన్ను అధిగమించిన అంశం కనపడటం లేదా అని కొందరు అంటున్నారు. నిజమే జనాల ఆకలి తీర్చని జడిపి, ఉన్నత స్థానాలు ఎందుకు ? తరతరాలుగా మరోదారి లేని పాములోళ్లు జీవన పోరాటంలో పాములను అదుపు చేసి బుట్టలో , ఎవరైనా పిలిస్తే పట్టుకొని సాయ పడుతున్నారు, కొత్తగా రంగంలోకి దిగిన రాజకీయ ఆవులోళ్లు అధికార పోరులో దేశ ఆర్ధిక రంగాన్ని తాము చెప్పినట్లుగా కూడా ఎందుకు నడిపించలేకపోతున్నారు ? దేశంలో ఆవు-దూడను గుర్తుగా తీసుకొని కాంగ్రెస్‌ ఆవు రాజకీయం మొదలెట్టింది. ఇప్పుడు బిజెపి దాన్ని మరో రూపంలో కొనసాగిస్తున్నది. నాటి ఆవు-దూడ గరీబీ హఠావో అని చెప్పినట్లుగానే నేటి ఆవులోళ్లు చెప్పిన అచ్చేదిన్‌, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, నల్లధనం వెలికితీత ఏమైనట్లు ? ఒకరిది అన్నం కోసం ఆరాటం, మరొకరిది అధికారం, ఓట్ల కోసం బహుకృత్వ వేషాలు కావా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d