• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

గుజరాత్‌్‌ఎన్నికల రాజకీయం : వృద్దుల పెన్షన్‌ రు. 1000, ఆవుకు రు. 900 !

09 Sunday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, Gujarat, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Pensioners, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

appeasement politics, BJP, cow politics, Gujarat Election 2022, Gujarat Election politics, Narendra Modi, old age pension, RSS


ఎం కోటేశ్వరరావు


వృద్దులు, ఆధారం లేని ఇతరులకేనా సామాజిక న్యాయం, పెన్షన్‌, వీధుల్లో తిరిగే ఆవులకూ ఇవ్వాలి కదా అంటున్నారు ఓటు రాజకీయనేతలు. గుజరాత్‌లో ప్రతి పార్టీ పోటీ పడుతోంది. డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనుషులతో పాటు ఆవులూ పార్టీలను ప్రభావితం చేస్తాయా అని కొందరు చర్చ చేస్తున్నారు. వట్టి పోయిన(పాలివ్వని) ఆవులను గతంలో రైతులు వధ శాలలకు తరలించే వారు, కొంత రాబడి వచ్చేది. కాషాయ మూకలు దిక్కుమాలిన ఆవు రాజకీయాలను రంగంలోకి తెచ్చిన తరువాత అలాంటి ఆవులను అమ్ముకోలేరు, గో గూండాల దాడులకు భయపడి కొనుగోలు చేసే వారూ లేరు. దాంతో రైతులు వాటిని మేపే స్తోమత లేక లేదా నష్టదాయకంగా భావించి వీధుల్లోకి వదలివేస్తున్నారు. అవి ఇబ్బడి ముబ్బడి కావటంతో గుజరాత్‌ హైకోర్టు అనేక సార్లు వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. దాంతో విధిలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం అలాంటి ఆవులను వదలివేసిన వారికి జరిమానా విధించే నిబంధనలతో తీవ్ర చర్చల తరువాత పట్టణాలలో ఆవుల నియంత్రణ బిల్లు-2022ను తేవాల్సి వచ్చింది. మార్చి నెల 31న మెజారిటీ ఓటింగ్‌తో ఆమోదించిన బిల్లుకు నిరసనగా ఆవుల యజమానుల ఆందోళనలు చేశారు. జుమ్లా, వుత్తినే బిల్లు తెచ్చాం తప్ప అమలు జరపం అని ప్రభుత్వం చెప్పినా వారు తగ్గలేదు, ఎన్నికల్లో బిజెపిని బహిష్కరిస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం, వాటికి ఎక్కడ గండిపడుతుందో అన్న భయరతో సెప్టెంబరు నెల అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవంగా వెనక్కు తీసుకున్నారు.


చిత్రం ఏమిటంటే గోమాంసం కోసం ఆవులను తరలిస్తున్నారంటూ గో రక్షకుల ముసుగులో చేసిన దాడుల గురించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాపితంగా మన దేశానికి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. అలాంటిది గుజరాత్‌లో గత పది నెలల్లో వీధుల్లో వదిలేసిన ” ఆవులు జరిపిన దాడుల్లో ” 4,860 ఉదంతాల్లో 28 మంది మనుషులు మరణించారని అధికారిక లెక్కలే పేర్కొన్నాయి. ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా ఎనిమిది పెద్ద పట్టణాలు, 162మున్సిపాలిటీల్లో ఇవి జరిగాయి. మాజీ ఉపముఖ్య మంత్రి నితిన్‌ పటేల్‌ను పోరుబందరు పట్టణంలో ఒక ఆవు కుమ్మటంతో కాలు విరిగింది. మరుసటి రోజే కొత్త సిఎం భూపేంద్ర పటేల్‌ ఒక ప్రదర్శనలో ఉండగా ఒక ఆంబోతు దాని మీదకు వచ్చింది. వేశ్యా గృహాలకు తరలించే బాలికలను రక్షించి ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలలో ఉంచటం తెలిసిందే. కబేళాలకు తరలించే ఆవులను కాపాడేందుకు ఏర్పడిన గో దళాలు రక్షించిన ఆవులను సంరక్షించేందుకు ప్రభుత్వం దాతృత్వ సంస్థలు ఏర్పాటు చేసే 450 గోశాలలకు( అవి ఎవరికి కేటాయిస్తారో చెప్పనవసరం లేదు) 2022-23లో గోమాత పోషణ యోజన కింద ఐదు వందల కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆరునెలలు గడిచినా పైసా విదల్చలేదు. ఈ పధకం కింద గోశాలలో చేర్చిన ప్రతి ఆవుకు రోజుకు 30 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం గుజరాత్‌లో అమల్లో ఉన్న వున వృద్దాప్యపెన్షన్‌ పధకం కింద 60ఏండ్లు దాటిన వృద్ధ కుటుంబాలకు నెలకు రు.400, ఎనభై ఏండ్లు దాటిన వారికి రు.700 ఇస్తున్నారు. ఎన్నికల కోసం ఈ మొత్తాలను రు.1000-1250గా పెంచుతామని 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నారు.


ఆవులను గాలికి వదిలేస్తే జరిమానా వేస్తామంటే ఆవుల పెంపకందార్లు ఆగ్రహించారు. ఆ బిల్లును ఎత్తివేసి గోశాలల్లో చేర్చిన ప్రతి ఆవుకు నెలకు రు.900 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఇప్పుడు గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఈ కేటాయింపు నిధులు వెంటనే ఇవ్వాలని, ఇది ఒక ఏడాదికి పరిమితం చేయకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 1,700 గోశాలలు ఉండగా 450కి మాత్రమే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆవుల పెంపకందార్లు వట్టిపోయిన వాటిని వదలి వేస్తే ఇప్పుడు గోశాల నిర్వాహకులు ఆందోళనకు దిగి నిరసనగా గోశాలల్లో ఉన్న ఆవులన్నింటినీ వీధుల్లోకి వదలాలని చూస్తున్నారు. గత నెలాఖరులో వనస్కాంత జిల్లాలోని వీధులు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారు. తదుపరి ఆందోళనలో భాగంగా జిల్లా, తాలూకా ప్రభుత్వ ఆఫీసుల్లో గోమూత్రం, పేడ చల్లుతామని ప్రకటించారు.


గతంలో గోశాలల్లోని ప్రతి ఆవుకు రోజుకు రు.8 సబ్సిడీ ఇచ్చే పధకాన్ని 2001లో నరేంద్రమోడీ సిఎం కాగానే నిలిపివేశారని పదివేల మంది గోశాల ట్రస్టీల ప్రతినిధి కిషోర్‌ శాస్త్రి చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ఉత్తర గుజరాత్‌లో తీవ్ర వరదలు వచ్చినపుడు ఒక్కో ఆవుకు రు.25 చొప్పున కేవలం రెండు-మూడు నెలలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లట్‌(కాంగ్రెస్‌) ప్రభుత్వం రోజుకు ప్రతి ఆవుకు రు.50 ఖర్చు చేసిందని, ఉత్తరాఖండ్‌ సర్కార్‌ 1000 గోశాలలను నిర్వహిస్తుండగా గోమాత మీద ప్రమాణం చేసి అధికారానికి వచ్చిన గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం వార్షిక బడ్జెట్లను ఎందుకు కేటాయించదని శాస్త్రి ప్రశ్నించారు. వివిధ కోర్టులు ఇచ్చిన ఆదేశాల మేరకు వీధుల్లో తిరుగుతున్న ఆవులను పట్టుకొని దీశా-రాజపూర్‌ గోశాల వంటి వాటికి తరలించిన ప్రభుత్వానికి వాటి సంరక్షణ పట్టదా అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న 8,900 ఆవుల్లో సగం ప్రభుత్వ పంపినవే అన్నారు. పోలీసులు పట్టుకున్న వస్తువులను కూడా అలాగే ఎక్కడో ఒక చోట పడవేస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాలలో గుజరాత్‌ ఒకటి. పరిశ్రమలు, పట్టణాల విస్తరణలో భాగంగా గ్రామాలు వాటిలో కలిసిపోతున్నాయి. ఆవులు, ఇతర పశువుల మేతకు గ్రామాల్లో ఉన్న గడ్డి భూములను కూడా పరిశ్రమలు, గృహనిర్మాణాలకు కేటాయిస్తుండటంతో పశువుల మేత కొరత ఏర్పడింది. దాంతో మరొక దారిలేని పెంపకందార్లు వాటిని వదలివేస్తున్నారు. పట్టణాల్లో ఇది సమస్యలకు దారి తీస్తున్నది.


గుజరాత్‌లో ఆవుల పెంపకందార్లను మాల్దారీలని పిలుస్తారు. సంతుష్టీకరణలో భాగంగా, వారి ఓట్ల కోసం ప్రతి పార్టీ, నేత ఆవుల మీద ప్రేమ ఒలకబోస్తారు. అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను 46 చోట్ల ఈ సామాజిక తరగతికి చెందిన వారు సమీకరణలను తారు మారు చేస్తారని అంచనా. సంతుష్టీకరణ రాజకీయాలకు బద్ద వ్యతిరేకమని, కాంగ్రెస్‌ను నిరంతరం విమర్శించే ప్రధాని నరేంద్రమోడీ దీనికి మినహాయింపు కాదు.ఎక్కడైతే ప్రభుత్వానికి నిరసనగా ఆవులను ప్రభుత్వ ఆఫీసుల్లోకి వదిలారో అదే వనస్కాంత జిల్లాలోని అంబాజీలో సెపెంబరు 30 న నరేంద్రమోడీ ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన పథకాన్ని ప్రారంభించారు.ఆగస్టు నెలలో బిజెపి ఆధీనంలోని సూరత్‌ మునిసిపల్‌ అధికారులు అనుమతి లేని ఆవుల షెడ్లంటూ 222 కట్టడాలను కూల్చివేశారు. వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్‌ పాటిల్‌ రంగంలోకి దిగి మాల్దారీ సమాజానికి జోలపాడారు. కూల్చివేతలను నిలిపి వేయించారు. ఎన్నికల రాజకీయమంటే ఇదే, అధికారులతో కూల్చివేయిస్తారు, తరువాత వచ్చి నిలిపివేసినట్లు కనిపిస్తారు. గుజరాత్‌ ప్రభుత్వం మాల్దారీల కోసం కామధేను విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నదని, ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి గురించి అక్కడ పరిశోధనలు చేస్తారని బిజెపి మాల్దారీ విభాగ నేత సంజయ దేశాయి చెబుతున్నారు.


ఆవు రాజకీయంలో కాంగ్రెసేమీ తక్కువ తినలేదు. గతంలో పశు సంవర్ధన గురించి పేర్కొన్నప్పటికీ తొలిసారిగా ఆవు సంరక్షణ గురించి ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. ఆవు పాలకు లీటరుకు ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తామని, రాజస్తాన్‌ పధకాలను అమలు జరుపుతామని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లను వెనక్కు నెట్టి అధికారాన్ని పొందుతామని చెబుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ తక్కువ తినలేదు. తమకు అధికారమిస్తే రోజుకు ప్రతి ఆవుకు రు.40ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీలో ఇస్తున్నట్లు అరవింద కేజరీవాల్‌ చెప్పారు. లంపీ వైరస్‌ కారణంగా గుజరాత్‌లో లక్షకు పైగా ఆవులు మరణించినా ప్రభుత్వం కదల్లేదని తాము వాక్సిన్లు వేస్తామని గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ నేత సుదాన్‌ గధ్వీ ప్రకటించారు. గుజరాత్‌లో రు.40 ఇస్తామని ప్రకటించిన కేజరీవాల్‌ ఢిల్లీలో రు.20 మాత్రమే ఇస్తున్నారని, మరో రు.20 తమ ఏలుబడిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ చెల్లిస్తున్నదని చెప్పిన బిజెపి ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రు.40 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.


గుజరాత్‌ దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. గర్బా పేరుతో పెద్ద ఎత్తున నృత్యం చేస్తారు. ఈ సందర్భంగా ప్రతిపార్టీ రాజకీయాలు చేసింది. పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ సిఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ గర్బా డాన్సు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అంబాజీలో ఆవు పూజ చేశారు. ఆరు నెల్లనాడు ప్రకటించిన పధకాన్ని ఎన్నికల ముందు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు చూసిన మజ్లిస్‌ పార్టీ గుజరాత్‌లో కూడా అదే పని చేసేందుకు అక్కడ పోటీలో ఉంటానని ప్రకటించిందనే విమర్శలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షాంఘై సహకార సంస్థ భేటీ : ఉక్రెయిన్‌పై చైనా వైఖరి కూడా మారితే మోడీతో షీ జింపింగ్‌ను కలిపి అమెరికా మీడియా ఎందుకు పొగడలేదు ?

21 Wednesday Sep 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, US Media, US Media Praises PM Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరమైన సామరకండ్‌లో 2022 సెప్టెంబరు 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశం జరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రాంతీయ కూటమి ఇది.యురేసియా (ఐరోపా-ఆసియా ఖండం) లోని 60శాతం విస్తీర్ణం, ప్రపంచ జనాభాలో 40శాతం, ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న కూటమి ఇది. తొలుత షాంఘై ఐదుగా పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్‌, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్‌ చేరింది. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం 27 దేశాలు, మూడు సంస్థలతో ఉంది.2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. సామరకండ్‌ సమావేశంలో ఇరాన్‌ పూర్తి సభ్య దేశంగా చేరింది. అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రపంచ దేశాలను మాతో చేరతారా లేదా మేం చెప్పినట్లు చేస్తారా చస్తారా అన్నట్లుగా ప్రవర్తిస్తున్న పూర్వరంగంలో దానికి భిన్నమైన పద్దతుల్లో అభివృద్ధి,ఆర్ధిక, సాంస్కృతిక సహకారం, సమానత్వం ప్రాతిపదికగా ఐరాస నిరంత అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఎస్‌సిఓ సామరకండ్‌ ప్రకటన పునరుద్ఘాటించింది.


ఈ కూటమి ఒక దేశానికి లేదా నాటో వంటి మిలిటరీ కూటములకు వ్యతిరేకంగా ఏర్పడినది కాదు. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత దానిలోని పూర్వ రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అవి చైనాతో కొత్త సరిహద్దులకు తెరలేపిన పూర్వరంగంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు, మిలిటరీల మధ్య సమన్వయం-విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు గాను చైనా చొరవతో ఏర్పడింది.ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలతో కొన్నింటికి విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అనేక ఖనిజాలకు కూడా ఈప్రాంతం పెట్టింది పేరు. మరోవైపు అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928 ఉన్నాయి. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ విధంగానూ ఏ దేశానికైనా అంత తేలిక కాదు.


ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల కారణంగా అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ దీన్ని భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా తీరు ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. పరిశీలక దేశాలుగా బెలారస్‌, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్‌ , చర్చల భాగస్వాములుగా టర్కీ, శ్రీలంక, కంపూచియా, అజర్‌బైజాన్‌, ఆర్మీనియా, నేపాల్‌ ఇప్పటికే ఉండగా 2023 నుంచి ఈజిప్టు, సౌదీ అరేబియా, కతార్‌లకు అదే స్థాయి కల్పించేందుకు అవగాహన కుదిరింది. ఈ జాబితాలో చేరేందుకు బహరైన్‌, మాల్దీవులు, కువైట్‌, ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌,మయన్మార్‌లను అంగీకరించారు. బెలారస్‌ శాశ్వత దేశహౌదా పొందనుంది. అతిధులుగా ఐరాస, సిఐఎస్‌, ఆసియన్‌ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్‌ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ వివాదంలో ఒక వైపు మధ్యవర్తిగా ఉంటూనే అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్‌, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్‌, బెలారస్‌ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో మన దేశం చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు.ఇదే దాని విజయ రహస్యం. ఈ దిశగా మరొక ముందడుగు అని చెప్పవచ్చు.


అజెండాలో సంచలనాత్మక లేదా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే విధంగా సామరకండ్‌ సమావేశంలో ఎలాంటి చర్చలూ, పరిణామాలు లేవు. కానీ ఈ సందర్భంగా వివిధ దేశాల నేతల మధ్య జరిగిన విడి విడి సమావేశాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా విశ్లేషణలు, భాష్యాలు వెలువడ్డాయి. ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్లు ఒక వార్త. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై భారత వైఖరిలో మార్పు వచ్చిందని, పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా దానితో జతకలిసే ఐరోపా పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. ఇక అమెరికా మంత్రులు, అధికారులు తమవైన శైలిలో మాట్లాడారు. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌ నోట వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం తగినపని కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటానికి, కొత్తగా తంపులు పెట్టటానికి ఇది తగిన తరుణం కాదని నరేంద్రమోడీ ఎన్నడూ అమెరికా కూటమికి ఇంతవరకు చెప్పలేకపోయారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, దాని సెగ మన దేశానికి కూడా తాకింది. తన ప్రభుత్వానికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అది నిలిచిపోతే అంబానీకి వస్తున్న లాభాలకు గండిపడుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. అన్నింటినీ మించి ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పెరుగుతున్నందున ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. అయితే ఆ మాత్రం కూడా గత ఆరున్నర నెలలుగా మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని భారత్‌ కూడా తప్పు పట్టింది, మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా పాలకులకు వంతపాడే పత్రికలు చేసిన హడావుడి అది. ఇదే సమయంలో చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ కూటమిలో మోడీ చురుకుగా ఉన్నారు. తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులనుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక వారిని సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు.


ఇది ఒకటైతే చైనా అధినేత షీ జింపింగ్‌ ాపుతిన్‌ భేటీలో ఉక్రెయిన్లో జరుగుతున్నదాని గురించి జింపింగ్‌ ప్రశ్నించినట్లు, ఆందోళన వ్యక్తం చేసినట్లు, మద్దతుపై పునరాలోచనలో పడినట్లుగా కూడా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.” దీని గురించి షి జింపింగ్‌ ప్రశ్నలు, ఆందోళనను మేము అర్ధం చేసుకున్నాం, మా వైఖరిని కూడా వివరించామనుకోండి. దీని గురించి ఇంతకు ముందే మాట్లాడినప్పటికీ మరింతగా వివరిస్తాం ” అని పుతినే చెప్పారు. వీటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ భాష్యం చెప్పవచ్చు. ఏ తీరులో మాట్లాడిందీ విన్నవారెవరూ లేరు. నిజంగా ప్రతికూలంగా చెప్పినా లేదా చైనా వైఖరిలో మార్పు ఉంటే అమెరికా మీడియాలో నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తినట్లుగా షి జింపింగ్‌ను పొగడలేదేం !


ఉక్రెయిన్‌ సంక్షోభ తీరు తెన్నులు, పూర్వరంగాన్ని చూసినపుడు ప్రపంచ భద్రతకు నూతన రూపకల్పన జరగాల్సిన అగత్యం కనిపిస్తున్నది. తనకు దక్కనిదాన్ని ఇతరులకూ దక్కనివ్వను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏర్పడిన ప్రపంచ వ్యవస్థలపట్ల సామ్రాజ్యవాదులు వ్యవహరిస్తున్నారు. తన నేతృత్వంలో ఏక ధృవ ప్రపంచాన్ని సృష్టించాలని అమెరికా చూస్తుంటే సర్వజన సంక్షేమం కోసం బహుధృవ ప్రపంచాన్ని రూపొందించాలని దాన్ని వ్యతిరేకించే శక్తులు చూస్తున్నాయి.ఐరాస నిబంధనల మేరకు పాలన సాగాలని కోరుకుంటున్న శక్తులే దాన్ని ఖాతరు చేయటం లేదు, పరస్పర సహకారం, అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ సంస్థలను ధనిక దేశాలు తమ వస్తువుల మార్కెట్ల కోసం వత్తిడి చేసే, బలహీన దేశాల మీద షరతులను రుద్దే అస్త్రాలుగా మార్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన వారే దాన్ని పక్కన పెట్టి మనం మనం విడిగా చూసుకుందామంటూ ద్విపక్ష వాణిజ్య ఒప్పందాలకు, ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. వాటి గత చరిత్రంతా అదే. వలస దేశాల ఆక్రమణ పోరులో ఎనభై సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్న స్పెయిన్‌-డచ్‌, 30 సంవత్సరాల జర్మన్‌ యుద్ధాలకు రాజీగా 1648లో అమల్లోకి వచ్చిన వెస్ట్‌ ఫాలియా శాంతి ఒప్పందాన్ని తొలి ప్రపంచ వ్యవస్థకు నాందిగా పరిగణిస్తారు. తరువాత ఐరోపాను ఆక్రమించుకొనేందుకు ఫ్రెంచి పాలకుడు నెపోలియన్‌ ప్రారంభించిన దురాక్రమణలు, దానికి వ్యతిరేకంగా కట్టిన కూటముల మధ్య రెండు దశాబ్దాల పాటు సాగిన పోరు తరువాత 1815 వియన్నా ఒప్పందం జరిగింది. అది కూడా విఫలమై మొదటి ప్రపంచ యుద్దం తరువాత నానాజాతి సమితి ఏర్పాటు, దాన్ని తుంగలో తొక్కిన కారణంగా రెండవ ప్రపంచ యుద్దం పర్యవసానంగా ఐరాస ఏర్పడింది. ప్రత్యక్ష వలసలకు అవకాశం లేకపోవటంతో మార్కెట్ల ఆక్రమణ కోసం తీసుకు వచ్చిందే 1995లో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు గతం మాదిరి సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మరో వ్యవస్థ ఏర్పాటు అంత తేలిక కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాను సంతుష్టీకరించిన నరేంద్రమోడీ ! అందుకే అక్కడి మీడియా పొగడ్తలా !!

18 Sunday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Narendra Modi, SCO Summit 2022, Ukraine-Russia crisis, US Media Praises PM Modi, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికన్‌ మీడియా ఆ మాటకొస్తే ఏ దేశ వాణిజ్య పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ముసుగులో ఉన్న సంస్థలైనా తమ పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరినైనా తెగడాల్సి వస్తే చీల్చి చెండాడుతాయి. పొగడాల్సి వస్తే వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకొని ఎక్కే వారిని కూడా ఆజానుబాహువులుగా వర్ణిస్తాయి.2022 సెప్టెంబరు 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లోని సామరకండ్‌ పట్టణంలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 2022 వార్షిక సమావేశాల్లో మన ప్రధాని నరేంద్రమోడీ-రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ విడిగా భేటీ అయ్యారు.


సదరు భేటీలో ” నేటి యుగం యుద్ద యుగం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడినపుడు చెప్పాను ” అని ప్రధాని నరేంద్రమోడీ సామరకండ్‌లో పుతిన్‌తో చేప్పినట్లు మోడీ యంత్రాంగం వెల్లడించింది. దీన్ని తీసుకొని ఉక్రెయిన్‌పై పోరుకు ఇది సమయం కాదని మోడీ చెప్పినట్లుగా, ఇలా చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలని అమెరికా మీడియా పతాక శీర్షికలతో టాంటాం వేసింది. అమెరికా వెంట నడిచే ఐరోపా పత్రికల్లోనూ ఇదే జరిగింది. కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ” ఉక్రెయిన్‌ మీద యుద్దంపై పుతిన్‌కు చివాట్లు పెట్టిన మోడీ ” వాషింగ్టన్‌ పోస్టు, ” ఇది యుద్ధాలకు తగిన సమయం కాదంటూ పుతిన్‌కు చెప్పిన భారత నేత ” న్యూయార్క్‌ టైమ్స్‌. రష్యా దురాక్రమణ ప్రభావాల గురించి ప్రపంచమంతటా ఉన్న ఆందోళనకు ప్రతిస్పందనను మీరు చైనా, భారత్‌నుంచి వింటున్నారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విలేకర్లతో అన్నాడు. ” మీ ఆందోళన గురించి నాకు తెలుసు, సాధ్యమైన మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నాం, కానీ జెలెనెస్కీ సిద్దం కావటం లేదని ” మోడీకి పుతిన్‌ బదులిచ్చినట్లుగా వార్తలొచ్చాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన చర్చలను అమెరికా, బ్రిటన్‌ అడ్డం గొట్టి తామిచ్చే అస్త్రాలతో పుతిన్‌ సేనలను ఓడించవచ్చని జెలెనెస్కీని వెనక్కు రప్పించిన సంగతి తెలిసిందే.


ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచటం భారత ప్రయోజనం కోసం కాదని చెప్పాడు. తరువాత అమెరికా ఉప భద్రతా సలహాదారు దలీప్‌ సింగ్‌ మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలను విఫలం చేసేందుకు భారత్‌ చురుకుగా ప్రయత్నిస్తే పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని బెదిరించిన సంగతి తెలిసిందే. దీని మీద దేశాధినేతగా నరేంద్రమోడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రుద్దింది పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అన్నది నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు, ఆ కారణంగా తన ప్రభుత్వం-జనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ ఎరిగినప్పటికీ పశ్చిమ దేశాల వైఖరిని మిత్రధోరణిలో కూడా ఇంతవరకు తప్పు పట్టలేదు. కాశ్మీరు సమస్యలో తనను మధ్యవర్తిత్వం వహించమని నరేంద్రమోడీ కోరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు కూడా మోడీ స్పందించలేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం చైనా మీద కత్తిగట్టి అమెరికాతో ఉండటం అమెరికా మీడియాకు సంతోషమే. ఆ వైఖరితో ఉన్నా కొన్ని సందర్భాల్లో మోడీని ఏకిపారవేసింది. మరికొన్ని సార్లు ఆకాశానికి ఎత్తింది.


” అవాక్కయ్యేలా దుస్సాహస నిర్ణయాలు, విపత్కర ఫలితాలనిస్తున్న ప్రజారోగ్య విధానం, నివారించదగిన మరణాలు, కరోనా నరకం, లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ” భారత్‌లో కరోనా నివారణ వైఫల్యంపై అమెరికా, ఐరోపా, ఇతర ప్రపంచ పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి.తమ నేత మోడీ మీద బురదజల్లే రాతలు తప్ప వాస్తవాలు కాదని బిజెపి వారు ఆరోపించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలను దాచిపెట్టిన తీరు, బాధ్యత లేకుండా కుంభమేళా వంటి వాటిని అనుమతించటం, పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, కరోనా మీద విజయం సాధించామని ప్రకటించటం, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు రాజధానిలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించటం, వారి మీద తప్పుడు ప్రచారం వంటి అనేక అంశాల మీద అంతర్జాతీయ మీడియాలో విమర్శలతో కూడిన సంపాదకీయాలు, విశ్లేషణలు వెలువడ్డాయి. వాటిని ఖండించాలని ప్రపంచంలోని భారత దౌత్యవేత్తలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విమర్శలు ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి వచ్చాయి తప్ప ఊరికే రాలేదు. ప్రధాని మోడీ మితిమీరిన విశ్వాసం అని గార్డియన్‌, భారత్‌ను రక్షించటానికంటే నరేంద్రమోడీ పేరును కాపాడేందుకు బాధ్యతా రహిత చర్యలకు పాల్పడినట్లు వాషింగ్టన్‌ పోస్టు, మహావిపత్తు పట్ల తాపీగా మోడీ ఉన్నారని ఎకానమిస్టు, ముందుచూపు లేమి, దురహంకారం, వాక్శూరత్వంతో మోడీ వ్యవహరించినట్లు లీమాండే, జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు మహమ్మారికి సంబంధం కలిపినట్లు గ్లోబల్‌ టైమ్స్‌, జయధ్వాన ధ్యాసలో పడి తప్పుగా అర్ధం చేసుకోవటం తరువాత స్పందన లేకుండా ఉన్నట్లు కతార్‌ ట్రిబ్యూన్‌, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లేక రోగులు విలవిల్లాడుతుంటే పార్లమెంటు భవన పధకానికి ప్రాధాన్యన ఇచ్చిన అహంకారి, సిగ్గులేని వాక్శూరుడు మోడీ అని, గాంధీ, నెహ్రూ మాదిరి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని డైలీ మెయిల్‌ వంటి పత్రికలు విమర్శించాయి. పశ్చిమ దేశాల మీడియా ఏమిరాసిందనే దాని కంటే మన మీడియా రాయాల్సినవాటిని రాయటం లేదని, సంపాదక పేజీల్లో రాసిన వాటిని భారతీయులు చదవరనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా వారి మీద సునిశిత విమర్శలు చేసే ధోరణి పశ్చిమ దేశాల్లో ఉంది, అదే సమయంలో వారిని కాపాడేందుకు కూడా చూస్తాయి. మన దేశంలో మొదటిదాన్ని వదలి రెండోదానికే ప్రాధాన్యత ఇవ్వటంతో జనం సంపాదక పేజీలను భజన సరకుగా చూస్తున్నారు. అందుకే చదవటం లేదు.


మన దేశంలో 2016నవంబరులో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పెద్ద ప్రహసనమని వివేచనా శక్తి ఉన్నవారందరికీ తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను కాదు కదా దాని గొద్దెను కూడా పట్టలేదు. నల్లధనం వెలుపలికి రాకపోగా అది పూర్తిగా లెక్కల్లోని ధనంగా చెలామణిలోకి వచ్చింది. అవినీతి గురించి చెప్పనవసరం లేదు. విధిలేక మాట మార్చి ధనం మొత్తం లెక్కలోకి రావటమే గొప్ప ఘనతగా మోడీ భక్తులు భజన చేశారు. జనం ఎన్ని ఇబ్బందులు పడిందీ వారికి పట్టలేదు. ఏం రాస్తే ఏం మాట్లాడితే ఎటుబోయి ఎటువస్తుందో, ఏం జరుగుతుందో మనకెందుకు లెమ్మని మన మీడియా సంస్థలు వైఫల్యం లేదా విజయం గురించి చెప్పకుండా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి. నోట్ల రద్దు జరిగిన 50 రోజుల తరువాత దేశం బంగారం మాదిరి వెలిగిపోతుందని నరేంద్రమోడీ ఒక సభలో చెప్పారు. జనధన్‌ బాంకు ఖాతాల్లో ఎవరైనా వచ్చి రెండున్నర లక్షలు డిపాజిట్‌ చేసి ఆరునెలల తరువాత మాకు రెండు లక్షలు ఇచ్చి మిగతావి మీరు తీసుకోండి అని చెబితే అలా చేయవద్దు అని కూడా సెలవిచ్చారు. తన చర్య ఉగ్రవాదుల నడుం విరిచేస్తుందని అక్రమార్కులను అంతం చేస్తుందన్నారు.ఇంకా ఎన్నో చెప్పారనుకోండి.
ఇంతకీ జరిగిందేమిటి ? అసలు ఎంత కరెన్సీ తిరిగి వచ్చిందో, ఎంత నల్లధనం వెలికి వచ్చిందో ప్రకటించిన వారే లేరు. ఏమిటి అని అడిగితే ఇంకా లెక్కతేలలేదని చెప్పారు. నోట్లను లెక్కించుకోలేని అసమర్ధ స్థితిలో ఉన్నట్లు అంగీకరించారు. రెండు సంవత్సరాల తరువాత 2018లో 2017-18 సంవత్సర వార్షిక నివేదికలో లెక్కింపు పూర్తైనట్లు ఆర్‌బిఐ పేర్కొన్నది. 2016 నవంబరు ఎనిమిదిన 500, 1000 పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రు.17.74 లక్షల కోట్లు. రద్దుచేసిన నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు, బాంకులకు తిరిగి వచ్చిన నోట్ల విలువ రు. 15.31లక్షల కోట్లు, రాని సొమ్ము కేవలం రు.10,720 కోట్లు మాత్రమే. అంటే నల్లధనం విలువ ఇది. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవటం తెలియని మామూలు జనాలెందరో తరువాత గొల్లుమన్నారు. ఇక రద్దు చేసిన వాటి బదులు కొత్త 500, 2,000 నోట్లు అచ్చేసేందుకు ప్రభుత్వానికి లేదా ఆర్‌బిఐకి ఐన ఖర్చు రు.12,927 కోట్లు, జనం ఇబ్బందులు, కొత్త నోట్ల కోసం వరసల్లో నిలిచి పోగొట్టుకున్న పనిదినాలు, వేతనాల నష్టం లెక్కించిన వారెవరూ లేరు. దాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి అయిన జిడ్డు ఆముదం ఖర్చు రు. 2,207 కోట్లు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేసినట్లు ?

ఈ మతిమాలిన పనిని ఐఎంఎఫ్‌, ఐరోపా సమాఖ్య, ప్రపంచబాంక్‌, ఇతర అనేక సంస్థలు, అమెరికా పత్రికలు పెద్ద ఎత్తున పొగిడాయి. ప్రపంచబాంక్‌ అధిపతి మరొక అడుగు ముందుకు వేసి తాను మోడీ అభిమానిని అన్నాడు. ఎంతో పెద్ద మొత్తంలో నగదును బాంకుల్లో జమ చేశారని ఫోర్బ్స్‌ పత్రిక, ఎంతో తెలివైన పని అని పేర్కొన్న ఇద్దరు నిపుణుల మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఉటంకించింది. విత్త నిపుణులు ఇదెంతో ధైర్యవంతం, దేశాన్ని మార్చి వేస్తుందని సెలవిచ్చారు. కొన్ని పత్రికలు భారత్‌లో 400 బిలియన్‌ డాలర్లమేర నల్లధనం ఉందని అదంతా వెలుపలికి వస్తుందని నమ్మబలికారు. ఆ వార్తలను తెలుసుకొని బహుశా నరేంద్రమోడీ కూడా నిజమే అని భ్రమించి ఉంటారు.

షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పుతిన్‌తో మాట్లాడుతూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా ప్రశంసలు కురిపించటంలో ఆశ్చర్యం లేదు. తమ శిబిరంలో ఉంటారనుకున్న మోడీ తటస్థంగా ఉంటారని పశ్చిమ దేశాలు ఊహించలేదు. ఆగ్రహించినా, రెచ్చగొట్టినా, బెదిరించినా, బ్రతిమాలినా ఇప్పటివరకు అదే వైఖరితో ఉన్నారు. నిజానికి పుతిన్‌తో నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు శత్రుపూరితం కాదు, అలా మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమెరికా శిబిరంలో చేరితే మనకు రష్యా నుంచి వస్తున్న చౌక చమురు వెంటనే ఆగిపోతుంది. అంబానీకి లాభం తగ్గుతుంది. మన మిలిటరీకి అవసరమైన సాయుధ సంపత్తి, విడిభాగాలు, ఎస్‌-400 వంటి కీలక రక్షణ వ్యవస్థలు నిలిచిపోతాయి. ఇప్పుడున్న వాటిని పూర్తిగా పక్కన పెట్టి అమెరికా అస్త్రాలతో మన మిలిటరీని నిర్వహించాలంటే మన జుట్టును దాని చేతికి అందించటమే కాదు, అంత సొమ్ము మన దగ్గర లేదు. అందువలన ఒక పెద్దమనిషి కోరుకున్నట్లుగానే ఉన్నాయి. ఆ మాత్రం కూడా ఇంతవరకు మోడీ నోట వెలువడనందున చూశారా ఇన్ని నెలల తరువాత పుతిన్‌ వైఖరిని నరేంద్రమోడీ కూడా తప్పు పట్టారు మనం చేస్తున్నది సరైనదే అని తమ జనాన్ని, తమ మద్దతుదార్లను సంతుష్టీకరించేందుకు అమెరికా చేసిన కసరత్తు అది. ఎవరు ఏమి చెప్పినా షాంఘై సహకార సంస్థలో ఉన్న మెజారిటీ దేశాలు అమెరికా బాధితులే. ఆ సంస్థలో చేరిన నరేంద్రమోడీ, చైనాను పక్కాగా వ్యతిరేకిస్తున్న చతుష్టయ(క్వాడ్‌) కూటమిలో చురుకుగా ఉన్నారు. అందువలన తటస్థ వైఖరితో రష్యాను మంచి చేసుకున్నట్లుగానే ఆగ్రహిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మిత్రులను సంతృప్తిపరచేందుకు కూడా మోడీ ఆ మాట చెప్పి ఉండవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి గోల్‌ మాల్‌ గోవిందాలు : ఆర్ధిక రంగ అంకెలతో జనాన్ని ఆడుకుంటున్నారు !

06 Tuesday Sep 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani, Ambani and Adani, BJP, India GDP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, Per Capita Income in the India, UK GDP


ఎం కోటేశ్వరరావు


గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి.రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం కలిగినవే అయినా నేరుగా జనాన్ని తాకేవి కాదు గనుక అంతగా పట్టించుకోరు. దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయనేతలు, అందునా అధికారంలో ఉన్నవారు అంకెలతో గారడీలు చేస్తూ జనాలను ఆడుకుంటున్నారు. కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం.


బ్రిటన్ను వెనక్కు నెట్టి మన దేశం జిడిపిలో ప్రపంచంలో ఐదవ స్థానానికి వచ్చిందని కొంత మంది సంతోషం ప్రకటిస్తున్నారు, మంచిదే. వెనుకటికి ఎవరో మాది 101 అరకల వ్యవసాయం తెలుసా అని మీసాలు మెలివేశాడట. మాది అంటున్నావు ఎవరెవరిది అని అడిగితే మా భూస్వామికి వంద, నాటి ఒకటి అన్నాడట. అలాగే మరొకడు మా ఇంటి పక్కనే ముకేష్‌ అంబానీ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడట.ఆ చెప్పిన వాడి ఇల్లు చిరిగిన ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన గుడారం వంటిది కాగా అంబానీ ఇల్లు 27అంతస్తులు, మూడు హెలిపాడ్లు కలిగి ఉంది. కరోనాకు ముందు కేవలం పది బిలియన్‌ డాలర్ల సంపద కలిగి అదానీ ఇప్పుడు 141 బి.డాలర్లకు చేరిందని తాజా వార్త.పేద వాడి ప్లాస్టిక్‌ పాక, వీధుల్లో అడుక్కొనే బిచ్చగాండ్ల రాబడి అంబానీ ఇల్లు, అదానీ సంపదలు అన్నింటినీ కలిపే దేశ జిడిపిగా పరిగణిస్తారు. దీన్ని నరేంద్రమోడీ సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా కొందరు వర్ణిస్తున్నారు. అంకెలను ఎవరూ తారు మారు చేయలేరు గానీ ఎవరి భాష్యం వారు చెప్పవచ్చు. నాలుగు ఎలా వచ్చిందంటే నాలుగు ఒకట్లను కలిపితే అని, రెండును రెండుతో హెచ్చవేస్తేఅని, కాదు కలిపితే అనీ చెప్పవచ్చు. ఏప్రిల్‌-జూన్‌ మూడు మాసాల జిడిపిని లెక్కలోకి తీసుకుంటే మన దేశానిది 823 బిలియన్‌ డాలర్లుండగా బ్రిటన్‌లో 763బి.డాలర్లని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అదే సంస్థ జనవరి-మార్చి మాసాల్లో మనది 864, బ్రిటన్‌లో 813 బి.డాలర్లు ఉన్నట్లు కూడా పేర్కొన్నది. అంటే గడచిన మూడు నెలల్లో మన జిడిపి 41బి.డాలర్లు తగ్గింది.బ్రిటన్‌తో పోల్చుకొని సంతోష పడాలా మన తీరు తెన్నులను చూసి విచారపడాలా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.


ఇవన్నీ డాలరు లెక్కల్లో చెబుతున్న అంకెలు. ఈ కాలంలో మన కరెన్సీ, బ్రిటన్‌ పౌండ్‌ విలువ కూడా డాలరుతో పోలిస్తే తగ్గింది కనుక రెండు దేశాల జిడిపి తగ్గినట్లు ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. కనుక ఈ అంకెలను చూపి విరగబాటును ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మన కరెన్సీ విలువ మరింత తగ్గి, బ్రిటన్‌ పౌండ్‌ విలువ పెరిగినా లేక తారుమారైనా భౌతిక సంపదలతో నిమిత్తం లేకుండానే విలువలు మారతాయి.ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2022 చివరినాటికి బ్రిటన్‌ జిడిపి 3.38 లక్షల కోట్ల డాలర్లుగా, మనది 3.54లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ మాత్రానికే సంబరాలు చేసుకుంటే ఎలా ! అదే ఐఎంఎఫ్‌, దాని కవల సోదరి ప్రపంచబాంక్‌ మన దేశం గురించి చెప్పిన ఇతర అంకెల గురించి ఇలాంటి సంబరాలు చేసుకున్నామా ? ఐదో స్థానానికి చేరినందుకు సంతోషపడితే తలసరి జిడిపిలో మనం 159వ స్థానంలో ఉన్నామని, పక్కనే ఉన్న శ్రీలంక 148లో ఉందని ఎంత మందికి తెలుసు. 2021లో అదే బ్రిటన్‌ 47,334 డాలర్లుండగా మనది 2,277 డాలర్లు, చైనాలో 12,556 డాలర్లుంది.


కనీసం చైనా స్థాయికి చేరాలంటే ఇప్పుడున్న జిడిపి ఐదున్నర రెట్లు పెరగాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ గారిని తన మంత్రదండంతో పెంచమనండి. కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అనే పాత సామెత తెలిసిందే. మన జిడిపి తొలి త్రైమాసికంలో రెండంకెల 13.5శాతం పెరుగుదల ఉన్నా ఏడాది చివరకు అది ఒక అంకెకు పడిపోతుందని రిజర్వుబాంకే చెప్పింది. ఒకవైపు అది 6 లేదా ఆరున్నర శాతం అని కొందరు చెబుతుంటే ఎస్‌బిఐ 6.7 నుంచి 7.7శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. అప్పుడు విచార ప్రదర్శనలకు దిగుతామా ? మన వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు, ఉండవచ్చు, గతంలో మన కంటే తక్కువ ఉన్న స్థితి నుంచి జిడిపిలో మనల్ని వెనక్కు నెట్టి చైనా ఎలా ముందుకు పోతోందని ఎవరైనా ప్రశ్నిస్తే వారితో మనకు పోలిక ఎందుకని తప్పించుకుంటారు. ఇంకా పొడిగిస్తే మనది ప్రజాస్వామ్యం వారిది నిరంకుశత్వం అని చెబుతారు. చైనాలో ఉన్నది నిరంకుశమో కాదో కాసేపు పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్దతుల్లో మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నామో తర్కానికి నిలిచే సమాధానం చెప్పాలి. మన దేశంలోకి రానున్న పెట్టుబడులు వాటి మంచి చెడ్డల గురించి చెబితే ఒకటి, దాని కంటే చైనా నుంచి తరలివచ్చే పెట్టుబడులు, సంస్థల గురించి కొందరు ఎక్కువగా చెబుతున్నారు. పోనీ ఆ వచ్చే కొన్ని వియత్నాం లేదా మరొక చోటికో వెళుతున్నట్లు వార్తలు తప్ప మన దేశానికి ఎన్ని వచ్చాయో ఎవరినైనా చెప్పమనండి.


జిడిపి గురించి గొప్పలు చెబుతున్నవారు ఆగస్టు చివరివారంలో మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రెండేళ్ల నాటి కనిష్ట స్థాయికి ఎందుకు తగ్గినట్లో చెప్పాలి. ఆగస్టు 26తో ముగిసిన వారంలో నిల్వలు 561 బి.డాలర్లకు తగ్గాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభం తరువాత 27 వారాలకు 21 వారాల్లో తగ్గుదల నమోదైంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే 80బి.డాలర్లు తగ్గాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో జడిపి వృద్ది రేటు 16.2 శాతం వరకు ఉంటుందని ఆర్‌బిఐ చెప్పగా 13.5శాతం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 20.1శాతం నమోదైంది. అంటే పురోగమనంలో ఉన్నట్లా తిరోగమనంలో ఉన్నట్లా ? ఇది ఒక అంకెల గారడీ. వచ్చే రోజుల్లో మన జిడిపి పెరిగి 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్ను వెనక్కు నెట్టి మూడవ స్థానంలోకి వెళుతుందని ఎస్‌బిఐ చెప్పింది. దానికి ఎస్‌బిఐ చెబుతున్నదేమిటి ? చైనాలో కొత్త పెట్టుబడులు మందగిస్తాయని, ఆ మేరకు మన దేశంలో పెరుగుతాయని చెబుతూ చైనాలో జరుగుతున్నదానిలో ఐదో వంతు ఉత్పత్తిని భారత్‌కు తరలించనున్నట్లు చెప్పిన యాపిల్‌ కంపెనీ ప్రకటన ఆశాభావానికి దోహదం చేస్తున్నట్లు చెప్పింది. అదే కంపెనీ ఐపాడ్‌ల ఉత్పత్తిని వియత్నాంకు తరలించనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.యాపిల్‌ కంపెనీ బ్రెజిల్‌,భారత్‌లో తలపెట్టిన ఉత్పత్తులు స్థానిక అవసరాలకు తప్ప ఎగుమతుల కోసం కాదని ఆగస్టు ఏడవ తేదీన లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక రాసింది.


మన దిగుమతులు పెరిగి దానికి అనుగుణంగా ఎగుమతులు లేక వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు జిడిపి ఐదవ స్థానానికి ఎదుగుదల వార్తలతో పాటే ప్రభుత్వం వెల్లడించింది. ఇన్వెంటియా డాట్‌కామ్‌ విశ్లేషణ ప్రకారం 2022 ఏప్రిల్‌-ఆగస్టు నెలల్లో మన ఎగుమతులు 192.59 బి.డాలర్లు కాగా దిగుమతులు 317.81 కాగా లోటు 125.22 బి.డాలర్లు. గతేడాది ఇదే నెలల లోటు 53.78 బి.డాలర్లు మాత్రమే. గతేడాది ఆగస్టుతో పోల్చితే లోటు 13.81 నుంచి 28.68 బి.డాలర్లకు పెరిగింది. ఎగుమతులు0.8శాతం తగ్గగా దిగుమతులు 31శాతం పెరిగాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన ఎగుమతులు పెరిగి మన జనానికి పని కల్పించే ఎగుమతులు పెరగకుండా మనలను నిరుద్యోగులుగా మార్చే దిగుమతులు పెరుగుతున్నపుడు జిడిపి పెరుగుదలతో సామాన్యులకు ఒరిగేదేమిటి ? సంతోషించే వారు దీనికేమి చెబుతారు.2001 నుంచి చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న కారణంగా 2018 నాటికి అమెరికాలో 40లక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఇదే కాలంలో చైనాతో అమెరికా వాణిజ్య లోటు 83 నుంచి 420 బి.డాలర్లకు పెరిగింది. దిగుమతులు పెరిగితే మన పరిస్థితి ఇంతే కదా !


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నది తెలిసిందే. ఇది సుమతీ శతకంలోనిది. రచయిత బద్దెన లేదా భద్రభూపాలుడు అని చెబుతారు. సదరు శతకకారుడు ఇప్పుడు బతికి ఉంటే దీన్ని రాజకీయపార్టీలకు వర్తింప చేసి ఉండేవాడు. గతంలో కాంగ్రెస్‌ పాలనా కాలంలో డాలరుతో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి పెద్దలు మౌనంగా ఉంటే అదొక దారి. దానికి బదులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మన కరెన్సీ పతనం కాలేదు, డాలరు విలువ పెరిగితే మనమేం చేస్తాం, ఇతర కరెన్సీలతో పోల్చి చూడండి మనది బలపడింది అని చెబుతున్నారు.గతంలో మన్మోహన్‌ సింగు ఏలుబడిలో ఇదే జరిగినపుడు కూడా జరిగింది అదే కదా ! అప్పుడు ఎందుకు విమర్శించినట్లు ? మన కరెన్సీ బలపడితే లేదా దిగజారితే తలెత్తే పరిణామాలు ఏమిటన్నది గీటురాయి. ముందుగా మన బలపడిందని చెబుతున్న మన కరెన్సీ, ఇతర వాటిని చూద్దాం. ఒక రూపాయికి వివిధ కరెన్సీల మారకపు విలువ.
దేశం ××××× సంవత్సరం,నెల, తేదీ ×× విలువ ×××××సంవత్సరం,నెల, తేదీ××× విలువ
బంగ్లాదేశ్‌ ××× 2021.9.04 ×××××× 1.16649××× 2022.9.4 ××××××× 1.7507
పాకిస్తాన్‌ ××× 2022.3.08 ×××××× 2.3235 ××× 2022.9.3 ××××××× 2.19289
శ్రీలంక ××× 2022.3.08 ×××××× 2.9515 ××× 2022.9.3 ××××××× 4.5166
చైనా ××× 2022.3.08 ×××××× 0.082244 ×× 2022.9.3 ××××××× 0.086548
రష్యా ××× 2022.3.08 ×××××× 1.6893 ××× 2022.9.3 ××××××× 0.75604
ఐరోపా ××× 2022.3.08 ×××××× 0.011933 ××× 2022.9.3 ××××××× 0.012603
అమెరికా ××× 2022.3.08 ×××××× 0.013004 ××× 2022.9.3 ××××××× 0.012544
పై వివరాలను గమనించినపుడు బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, చైనా, ఐరోపా కరెన్సీలతో పోల్చినపుడు మన రూపాయి కాస్త బలపడింది. రష్యా, అమెరికా డాలరుతో పోలిస్తే బలహీనపడింది.ఏ దేశ కరెన్సీ అయినా బలపడితే దాని ఎగుమతులకు దెబ్బ, కరెన్సీ విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. మన కరెన్సీ విలువ పతనం అవుతున్నా ఆ మేరకు మన ఎగుమతులు పెరగటం లేదు, రెండింటికీ చెడ్డ రేవడిలా మారాము.


మన నరేంద్రమోడీ ఘనత కారణంగా రష్యా మనకు తక్కువ ధరలకు అదీ మన రూపాయలు తీసుకొని చమురు విక్రయిస్తున్నదని ప్రచారం చేస్తున్నారు. అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ధిక్కరించి తమకు మద్దతు ఇస్తున్నవారికి వారి చమురు కొనుగోలు చేస్తున్న చైనాతో ఇతర అనేక దేశాలకు కూడా తక్కువ ధరలకే ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభానికి ముందు మనం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు నామమాత్రం. ఇప్పుడు అక్కడి నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాము.భారత్‌ నాటి సోవియట్‌, తరువాత రష్యాతో రూపాయి-రూబుల్‌ సంబంధాలు కొనసాగాయి, ఇప్పుడేదో కొత్తగా మొదలైనట్లు చెప్పటం వాస్తవదూరం.2019లో రెండు దేశాల వాణిజ్యంలో సగం డాలర్లలో చెల్లించాము, అది 2021లో 38.3శాతానికి తగ్గి 53.4శాతం రూబుళ్లలో చెల్లించాము. ఇక వర్తమానానికి వస్తే మన చమురు దిగుమతుల్లో కేవలం 0.2శాతంగా ఉన్న రష్యా చమురు ఆరునెలల్లో ఇప్పుడు పదిశాతానికి చేరింది. రూపాయి-రూబుల్‌ లావాదేవీలతో ఆర్‌బిఐకి విదేశీమారక ద్రవ్యం పదహారు శాతానికి పైగా మిగిలింది. అసలే మన డాలర్లు దేశం వదలి పోతున్న తరుణంలో ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. ఇక మన దిగుమతులు చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి డాలర్లలో చెల్లిస్తే మనకు కలిగే లబ్ది ఏమీ ఉండదు, అదే యువాన్‌ – రూపాయి లావాదేవీలు జరిగితే స్వల్పంగా మన కరెన్సీ విలువ పెరిగినందున కొంతమేరకు లబ్ది ఉంటుంది. కానీ చైనాకు మన ఎగుమతులు తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఇప్పుడు రూపాయితో పోల్చితే రూబుల్‌ విలువ కూడా పెరిగినట్లు పై వివరాలను చూస్తే తెలుస్తుంది. మీ డాలరు విలువ పెరిగింది తప్ప మా రూపాయి తగ్గలేదని చెబుతున్న బిజెపి నేతలు తమ పిల్లల విదేశీ విద్యకు అవసరమైన డాలర్లను ఏ ధరకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి లేదా జనం అడగాలి. మనం వాడే సెల్‌ఫోన్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర పరికరాల ధరలు ఎంత పెరిగాయో ఎవరికి వారు తెలుసుకోవచ్చు.2021లో 57బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్‌ వస్తువులను దిగుమతి చేసుకున్నాము.


మన దేశం డాలర్లు చెల్లించి విదేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది.2014 ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 పక్షం రోజుల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 99.52 డాలర్లు, ఆ రోజుల్లో సగటున మన కరెన్సీ మారకపు విలువ డాలరుకు రు.60.54, ఈ రేటున ఒక పీపాకు మనం చెల్లించిన మొత్తం రు.6,020.94, అదే చమురుకు 2022 జూలై 27 నుంచి ఆగస్టు 26వరకు సగటున పీపాను 98.18 డాలర్లకు కొనుగోలు చేశాము, దీనికి గాను మన రూపాయల్లో డాలరుకు రు.79.52 చొప్పున పీపాకు రు.7,807.27 చెల్లించాము. 2014 ఎన్నికలకు ముందు బిజెపి నేతలు చెప్పినట్లు మన కరెన్సీ విలువను డాలరుతో మారకం రు.40కి పెంచే సామర్ధ్యాన్ని నరేంద్రమోడీ లేదా ప్రభుత్వం గానీ ప్రదర్శించి ఉంటే మనకు ఇప్పుడు ముడిచమురు పీపా రు.3,927.20కే వచ్చేది, ధరల పెరుగుదల ఆమేరకు తగ్గి జనానికి ఎంతో భారం తగ్గేది. నిజంగా మోడీ చెప్పిన అచ్చేదిన్‌ వచ్చి ఉండేవి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండేండ్ల వరకు ధరల పెరుగుదల తగ్గదన్న ఆర్‌బిఐ గవర్నర్‌ !

25 Thursday Aug 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, Consumer Price Index, India inflation, India Price Rise, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor


ఎం కోటేశ్వరరావు

నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే ఇప్పుడు పెరిగిన ధరల రేటు తగ్గేందుకు మరో రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పటమే. నిజానికిది జనాలతో ధరల చేదు మాత్రను మింగించేందుకు, ఆందోళన చెందుతున్న నరేంద్రమోడీ సర్కార్‌కు ఊరట కలిగించేందుకు వెలిబుచ్చిన ఆశాభావం తప్ప పరిస్థితులు ఇప్పటి కంటే దిగజారితే ఏమిటన్నది ప్రశ్న. గవర్నరే చెప్పినట్లు ఇటీవలి గరిష్టం 7.8శాతానికి చేరుతుందని కూడా ఎంతో ముందుగానే ఆర్‌బిఐ చెప్పి ఉంటే విశ్వసనీయత ఉండేది. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఇంతకంటే తీవ్ర స్థాయికి చేరినపుడు కూడా అప్పటి గవర్నర్లు ఇలాంటి మాటలే చెప్పారు. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు ఆందోళన చెందుతున్నది ? ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, అందుకు ముందు గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ మహిమల మంత్రదండం గురించి మీడియా చెప్పిన కథలు, అన్నింటికి మించి మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో దిగజారిన పరిస్థితులు, అవినీతి అక్రమాల కారణంగా మోడీ అధికారానికి వస్తే తెల్లవారేసరికి అద్బుతాలు చేస్తారని నమ్మినవారికి ఎనిమిదేండ్లు గడిచినా రెచ్చిపోతున్న హిందూత్వ నూపుర్‌ శర్మలు, రాజాసింగ్‌లు తప్ప ఆర్ధికంగా జనానికి ఉపశమనం గురించి చెప్పాల్సిన వారు ఎక్కడా కనిపించటం లేదు. గత పదహారు నెలలుగా రెండంకెలకు పైగా నమోదవుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఐదు నెలల తరువాత జూలై నెలలో 13.93కనిష్ట స్థాయికి తగ్గింది. గత సంవత్సరం 11.57శాతం ఉంది. ఇంథనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 43.75 స్థాయికి పెరిగింది.


– ద్రవ్యోల్బణం ఎందుకు సంభవిస్తుంది అన్నదాని మీద ఎవరి భాష్యం, కారణాలు వారివే. ప్రతికూల ప్రభావాలను జనం అనుభవిస్తున్నారు గనుక ఎవరు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. ఆర్ధిక రంగంలో నగదు చెలామణి పెంపుదల కూడా దవ్యోల్బణానికి దారితీస్తుంది.1951 నుంచి 2022 వరకు దేశంలో నగదు సరఫరా నెలవారీ సగటున రు. 26,168.65 బిలియన్లు.1952అక్టోబరులో కనిష్ట రికార్డు రు.20.57 బిలియన్లు కాగా 2022 జూలై గరిష్ట రికార్డు 2,09,109.47 బి. రూపాయలు. సరఫరా పెరిగితే దవ్యోల్బణం పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఆర్ధిక రంగంలో ద్రవ్య సరఫరాకు అనుగుణంగా ఉత్పత్తి, సేవలు, వస్తు సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్నది ఒక సూత్రీకరణ. ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో పదివేల బిలియన్లు కాగా 2010నాటికి 50వేలకు, 2015కు లక్ష, 2020కి 160వేలకు, 2022 జూలైలో 2,09,109.47 బి. రూపాయలకు చేరింది.


ఉద్యోగుల వేతనాలు పెరిగితే ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అసలు వేతన పెరుగుదల లేకున్నా ధరలు పెరుగుతాయని కొన్ని బుర్రలకు ఎక్కదు.2020-21 మూడవ త్రైమాసిక ఆదాయంలో గృహ పొదుపు అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌,ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో పది నుంచి ఇరవై శాతం ఉంది. అదే మన దేశంలో 2.8శాతం, ఇండోనేషియాలో రెండు శాతం తిరోగమనంలో ఉంది.అలాంటపుడు రెండు చోట్లా ఒకే కారణంతో ద్రవ్యోల్బణం పెరగకూడదు. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు వేతనాలు ఎంతవరకు కారణం ? దేశంలో 2014 నుంచి ద్రవ్యోల్బణ వార్షిక పెరుగుదల ఇలా ఉంది.
ఏడాది×× ద్రవ్యోల్బణ శాతం
2014 ×× 6.6
2015 ×× 4.9
2016 ×× 4.9
2017 ×× 3.3
2018 ×× 3.9
2019 ×× 3.7
2020 ×× 6.6
2021 ×× 5.1
2022 ×× 6.8(ఏడునెలల సగటు)
ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు 2017లో అమల్లోకి వచ్చాయి.కరోనా కాలంలో కొన్ని నెలలు అసలు ప్రైవేటు రంగంలో ఉపాధి, వేతనాల్లేవు, అనేక చోట్ల వేతన కోతలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో 70శాతం కార్మికశక్తి గ్రామాల్లోనే ఉంది.2020లో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు 3.5శాతం తగ్గాయి, మరుసటి ఏడాది అరశాతం పెరగ్గా, 2021-22 తొలి తొమ్మిది నెలల్లో వ్యవసాయ పెరుగుదల 1.6శాతం, గ్రామీణ ఇతర కార్మికుల వేతనాలు 1.2శాతం తగ్గాయి.ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనాలేమీ పెరగలేదు.కొన్ని రంగాల్లో కాస్త పెరిగినప్పటికీ మొత్తం మీద చూసినపుడు దేశంలో వేతనాలు పెద్దగా పెరగకున్నా ద్రవ్యోల్బణం పెరిగిందంటే దానికి వేరే కారణాలు దోహదం చేస్తున్నట్లే. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు గృహస్తుల కోసం కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున చేపట్టిన ద్రవ్య ఉద్దీపన పధకాలు కారణంగా చెబుతున్నారు.మన దేశంలో పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, కిలోపప్పులు, జనధన్‌ ఖాతాలున్న వారికి మూడు నెలలు ఐదేసి వందల నగదు, కొన్ని గాస్‌ బండలు తప్ప ఇచ్చిందేమీ లేదు. కరోనాతో నిమిత్తం లేని కిసాన్‌ నిధులు కూడా కలుపు కొని మొత్తం పాకేజి విలువ రు.1.76వేల కోట్లు మాత్రమే. మన దేశంలో కరోనా గృహస్తుల పొదుపు మొత్తాలను హరించటమే కాదు అప్పులపాలు చేసింది.
కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ల వల్ల ఖర్చు చేసేందుకు వీలులేక బలవంతపు పొదుపు పెరిగిందని చెబుతున్నారు. పరిస్థితి చక్కబడిన తరువాత కొనుగోళ్లకు పూనుకోవటంతో అలాంటి చోట్ల అధిక ద్రవ్యోల్బణం తలెత్తిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ధనికులుగా ఉన్నవారి కొనుగోళ్లు పెరిగినప్పటికీ మొత్తం మీద ఇది మన దేశానికి వర్తించదు.

మాక్రోట్రెండ్స్‌ సంస్థ సమాచారం ప్రకారం కరోనాకు ముందు మన వినియోగదారుల 2018,19 రెండు సంవత్సరాల వార్షిక సగటు ఖర్చు 1,664.28 బిలియన్‌ డాలర్లు కాగా 2020,21 వార్షిక సగటు 1,751.73 బి.డాలర్లు అంటే 5.25 శాతం మాత్రమే పెరిగింది. ఇది ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు 5.85 శాతం కంటే తక్కువ, అంటే వాస్తవ ఖర్చు తగ్గింది. ఇదే అమెరికాను చూస్తే 2021 మే నుంచి 2022 మార్చినెల మధ్య ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగా 2022 మార్చినెలలో అక్కడి వినియోగదారుల ఖర్చు 18శాతం పెరిగింది. అంతకు రెండు సంవత్సరాల ముందు పన్నెండు శాతమే ఉండేది.2019తో పోలిస్తే అమెరికన్ల వద్ద ఉన్న పొదుపు మొత్తం 2.8లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. వారంతా ఆ మూటలను విప్పి కొనుగోళ్లకు పూనుకోవటంతో వస్తువులకు డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగింది. మన దేశంలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పట్టణాల్లో 16శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 16.6శాతం అమ్మకాలు పడిపోయాయినా ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గటం లేదు ? కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితి నుంచి ఆర్ధిక రంగాలను కాపాడుకొనేందుకు అనేక ధనిక దేశాలు పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించి జనానికి నగదు అందచేశాయి. అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు అదొక కారణమైతే, జనాలు ఆ సొమ్ముతో కొనుగోళ్లకు పూనుకోవటంతో సరకుల కొరత ఏర్పడటం, దిగుమతుల ధరలు పెరగటం వంటి కారణాలు దానికి ఆజ్యం పోశాయి.


ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు అన్ని దేశాలూ ఒకే ప్రాతిపదికను అనుసరించటం లేదు. పరిగణనలోకి తీసుకొనే అంశాల ప్రాముఖ్యత దేశదేశానికీ మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో ఆహార వస్తువులకు 7.8శాతం ఇస్తే చైనాలో అది 18.4శాతం, మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మొత్తానికి 22.62శాతం కాగా వాటిలో ఆహార వస్తువులకు 15.26, పారిశ్రామిక ఉత్పత్తులకు ఇస్తున్న 64.23 శాతంలో ఆహార ఉత్పత్తులకు 19.12 శాతం ఉంది. అమెరికాలో రవాణా రంగానికి 15.1శాతం కాగా చైనాలో 10.1 మన దేశంలో 5.2 శాతం ఉంది. చైనాలో దుస్తులకు 6.2 శాతం, అమెరికాలో 2.8, మన దేశంలో 7.3 శాతం ఉంది. చైనా వస్తువులను ఎగుమతి చేస్తుండగా అమెరికా దిగుమతి చేసుకొనే దేశంగా ఉంది. కనుక వాటి ప్రాధాన్యతలు ఒకే విధంగా ఉండవు.


మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయకపోతే ఇబ్బందని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పటికే అర్ధమైంది. వాటిలో లబ్ది పొందటంతో పాటు ధరల అదుపునకు ఇంథన ధరలను స్థంభింప చేశారు. ఎన్నికల తరువాత కూడా 2022 ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి అదే స్థంభన కొనసాగుతోంది. అదొక్కటే చాలదు కనుక కేంద్రం పెద్ద మొత్తంలో విధించిన సెస్‌ను కొంత తగ్గించారు. దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాట్‌ను ఎందుకు తగ్గించవంటూ దాడి చేశారు. పెట్రోలు మీద లీటరుకు రు.8, డీజిలు మీద రు.6 తగ్గించి దీని వలన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష కోట్ల మేరకు ఆదాయాన్ని ” త్యాగం ” చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని పెంచినపుడేమో మిలిటరీకోసమని జనానికి దేశభక్తి కబుర్లు చెప్పారు, తగ్గించినపుడు కేంద్ర ప్రభుత్వానికి దేశభక్తి తగ్గిందని అనుకోవాలా ? ఈ తగ్గింపు ప్రక్రియను మరో విధంగా చెప్పాలంటే చమురుపై భారీగా పన్నుల పెంపుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నదని అంగీకరించటమే. సత్యహరిశ్చంద్రుడివారసులమని, ఒకటే మాట ఒకటే బాణం అన్న రాముడి భక్తులమని చెప్పుకొనే వారికి నిజాన్ని అంగీకరించే ధైర్యం ఎందుకు లేదు ? 2021 ఏప్రిల్‌-మే మాసాల్లో ద్రవ్యోల్బణం రేటు 2.5శాతం కాగా అదే 2022లో మార్చి నెలలో ఆరుశాతానికి చేరింది.


2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తక ముందే పెరుగుదల బాటలో ఉన్న ద్రవ్యోల్బణం తరువాత ఈ కారణంగా మరికొంత పెరిగింది. డాలరు నిల్వలను పెంచుకొనేందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో పాటు మన స్టాక్‌ మార్కెట్లో వాటాల కొనుగోలుకు విదేశీ సంస్థలను ప్రభుత్వం అనుమతించింది.ఇదే విధంగా విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు దొరుకుతున్న డాలరు రుణాలను కూడా ప్రోత్సహించింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవటంలో ఘోరవైఫల్యం, అమెరికాలో వడ్డీ రేటు పెరుగుదల కారణంగా మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి డాలరు పెట్టుబడులు వెనక్కు మరలాయి. ఇది కూడా ద్రవోల్బణం పెరుగుదలకు దారి తీశాయి.చమురు, ఇతర దిగుమతి వస్తువుల ధరల పెరుగుదలకు రూపాయి పతనం కూడా తోడైంది. దేశంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు విదేశీ ధోరణులే కారణమని తప్పించుకొనేందుకు కొందరు ప్రభుత్వానికి వంతపాడుతున్నారు. మన దేశాన్ని నయా ఉదారవాద చట్రంలో బిగించినందున ఆ విధానాలను అనుసరిస్తున్న దేశాల జబ్బులన్నీ మనకూ కొంతమేర అంటుకుంటాయి. జనాలకు చమురు, గాస్‌, ఇతర సబ్సిడీలను ఎత్తివేసి, పరిమితం చేసి, కోతలు పెట్టటం, కార్పొరేట్లకు పన్నురాయితీలు ఇవ్వటం, జనాల మీద పన్ను బాదుడు దానిలో భాగమే.పన్నుల పెంపుదల గురించి చట్ట సభల్లో చర్చకు తావులేకుండా జిఎస్‌టి మండలి, విద్యుత్‌ క్రమబద్దీకరణ మండళ్ల ఏర్పాటు, ప్రభుత్వ అదుపులేని ప్రైవేటు రంగానికి అన్నింటినీ అప్పగించటమూ అదే. జిఎస్‌టి విధానం రాక ముందు ధనికులు వాడే విలాస వస్తువులపై 30 నుంచి 45శాతం వరకు పన్నులు ఉండేవి. జిఎస్‌టి దాన్ని 28శాతానికి తగ్గించింది. ఆ మేరకు తాజాగా పెంచిన పన్నులు, విస్తరించిన వస్తువుల జాబితాను చూస్తే సామాన్యుల నడ్డి విరవటమే కాదు ద్రవ్యోల్బణ పెరుగుదలకూ దోహదం చేస్తున్నది. వస్తూత్పత్తిదారులు తమ మీద పడిన భారాన్ని జనం మీదకే నెడతారన్నది తెలిసిందే.


2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా అది 2021-22కు 79.18కి పెరిగింది. 2022-23లో రష్యా తక్కువ ధరలకు చమురు ఇచ్చినప్పటికీ ఆగస్టు 23వ తేదీ వరకు ఏప్రిల్‌ నుంచి ఐదు నెలల సగటు 106.13 డాలర్లకు చేరింది. దీన్ని బట్టి మన దిగుమతుల బిల్లు పెరుగుతుంది, దానికి రూపాయి విలువ పతనంతో మరింత భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు విదేశాల నుంచి వస్తువులనే కాదు ద్రవ్యోల్బణాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. దేశంలో బొగ్గు నిల్వలున్నా వాటిని తవ్వకుండా ఖరీదైన బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం విద్యుత్‌ సంస్థల మీద రుద్దటం ద్రవ్యోల్బణ దిగుమతిలో భాగం కాదా ? ఇలాంటి వాటి కారణంగానే వెంటనే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మంత్రదండం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారనుకోవాలి. –

Share this:

  • Tweet
  • More
Like Loading...

” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?

14 Sunday Aug 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor, RSS


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు ఐదవ తేదీతో ముగిసిన వారంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 572.978 బిలియన్‌ డాలర్లని ఆర్‌బిఐ నివేదికలో పేర్కొన్నది. అంతకు ముందు వారంలో ఉన్న మొత్తం 573.875బి.డాలర్లు. జూలై మాస ఆర్‌బిఐ నివేదిక ప్రకారం ఆ నెలలో ఉన్న స్థితిని బట్టి 2022-23లో తొమ్మిదిన్నర నెలల దిగుమతులకు డాలర్‌ నిల్వలు సరిపోతాయి. ఈ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.2014 జూలై 28 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషణ ప్రకారం డాలర్‌ నిల్వలు 317బి.డాలర్లకు పెరిగాయి.అవి ఎనిమిది నెలల దిగుమతులకు సరిపోతాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి(2008) ముందున్న కొనుగోలు శక్తి స్థాయికి తిరిగి పుంజుకోవాలంటే వాటిని 500బి.డాలర్లకు పెంచాల్సి ఉంటుందని, 2008కి ముందు మన దగ్గర ఉన్న నిల్వలు పదిహేను నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని పేర్కొన్నారు. 2013 ఆగస్టులో 275 బి.డాలర్లు ఉండగా 2014 జూలై 18 నాటికి అవి 317.8 బి.డాలర్లకు పెరగటానికి ఆర్‌బిఐ ప్రవాస భారతీయుల డిపాజిట్లకు ప్రోత్సాహాకాలివ్వటం, విదేశీ బాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని ప్రోత్సహించటమని కూడా చెప్పారు. డాలరు అప్పులు 420 బి.డాలర్లు ఉన్నందున ఆ పరిస్థితి మన కరెన్సీని వడిదుడులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడిలో 2022 మార్చినెలాఖరు నాటికి మన విదేశీ అప్పు 620.7 బి.డాలర్లకు పెరిగింది. ఎనిమిదేండ్ల క్రితం డాలరుకు రు.68 ఉండగా ఇప్పుడు 80కి దిగజారిన సంగతి తెలిసిందే.


2022 మార్చి నెలాఖరుకు ఉన్న 607.3 బి.డాలర్లు అంతకు ముందు ఏడాది లావాదేవీలను బట్టి పన్నెండు నెలల దిగుమతులకు సరిపడా ఉన్నట్లు ఏప్రిల్‌ 16న ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. సిఇఐసి సమాచారం ప్రకారం 2022 మే నెలలో ఉన్న నిల్వలు 8.5 నెలల దిగుమతులకు సరిపడా ఉంటే జూన్‌ నాటికి అవి 7.5నెలలకు తగ్గాయి. మన డాలరు నిల్వలు 573 బి.డాలర్లలో సింహభాగం 509.646 బి.డాలర్లు విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సిఏ)గా ఉన్నాయి. అవి నెలనెలా తగ్గుతున్నాయి.(జూలై 8నాటికి 518.089 బి.డాలర్లు) మన రూపాయి విలువ పతనం, పెరుగుదల మీద ఈ నిల్వలు ప్రభావం చూపుతాయి. ఇవిగాక బంగారం నిల్వల విలువ 40.313 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి ఎస్‌డిఆర్‌లు 18.031 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నిల్వలు 4.987 బి.డాలర్లు ఉన్నాయి.
తొలిసారిగా మన డాలరు నిల్వలు 2020 జూన్‌లో 500 బిలియన్‌లకు,2021జూన్‌లో 600, అదే ఏడాది సెప్టెంబరు ఎనిమిదిన మరో రికార్డు 642.453 చేరాయి.2022 జూలై 29కి 573.9 బి.డాలర్లకు తగ్గాయి


చమురు మార్కెట్లో ధరల పెరుగుదల వివరాలను చూస్తే మన విదేశీ మారకద్రవ్యంపై దాని వత్తిడి ఎలా ఉందో అర్ధం అవుతుంది. 2014-15 నుంచి 2021-22వరకు ఎనిమిది సంవత్సరాల్లో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 61.08 డాలర్లు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు13 వరకు అది 106.45 డాలర్లకు పెరిగింది. దీన్ని బట్టి మన దిగుమతి బిల్లు ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని కూడా తన ఘనతగా బిజెపి చెప్పుకోవటమే కాదు, పాత అప్పులు తీర్చేందుకని, మిలిటరీకి ఖర్చు చేసేందుకని, రోడ్లు వేసేందుకని, కరోనా వాక్సిన్ల కోసమనీ పెద్ద ఎత్తున చమురుమీద పెంచిన భారాన్ని సమర్ధించింది. 2014 మే 29 నుంచి జూన్‌ 11 వరకు సగటున ఒక డాలరు రు.59.17 ఉంటే ఇప్పుడది 2022 జూన్‌ 29 నుంచి జూలై 27వరకు రు.79.54 ఉంది. దీన్ని గోడదెబ్బ చెంపదెబ్బ అనవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరను అదుపుచేసే శక్తి నరేంద్రమోడీకి లేదు. కానీ రూపాయి విలువ దిగజారకుండా కాపాడి ఉంటే ఒక డాలరుకు ఇరవై అదనంగా చెల్లించవలసి వచ్చేది కాదు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్‌ నిర్వాకానికి జనం చెల్లిస్తున్న మూల్యమిది.


రూపాయి పతనం ఒక్క చమురుకే కాదు, మనం చేసుకుంటున్న దిగుమతులన్నింటికీ అదనపు భారమే. మన విద్యార్ధుల విదేశీ చదువులు కూడా భారంగా మారాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి కబుర్లతో ఎనిమిదేండ్లుగా జనాన్ని మభ్య పెట్టటం తప్ప దేశం నుంచి ఎగుమతులు పెరగటం లేదు. గత ఏడాది వాణిజ్యలోటు జిడిపిలో 1.2శాతం ఉండగా వర్తమానంలో మూడుశాతం కావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఎగుమతులు 2.14శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే మాసంలో దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.27 బి.డాలర్లకు చేరాయి. గతేడాది జూలై వాణిజ్య లోటు 10.63 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 30బి.డాలర్లకు పెరిగింది.ఏప్రిల్‌-జూలై ఎగుమతులు 157.44 బి.డాలర్ల విలువ గలవి జరగ్గా దిగుమతుల విలువ 256.43 బి.డాలర్లు. వాణిజ్య లోటు గతేడాది 42బి.డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 98.99 బి.డాలర్లకు చేరింది. దిగుమతుల్లో చమురు వాటా గతేడాదితో పోలిస్తే జూలైలో 12.4 నుంచి 21.13 బి.డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో చైనాతో మన వాణిజ్యలోటు 48 బి.డాలర్లు ఉంది. ఒక వైపు చైనా వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ, మరోవైపు భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులకు మోడీ సర్కార్‌ అనుమతిస్తున్నది. కమ్యూనిస్టు వ్యతిరేకులను మానసికంగా సంతృప్తి పరచేందుకు చైనా వ్యతిరేక కబురు, ప్రచారం, కార్పొరేట్ల నుంచి నిధులు పొందేందుకు వారి లాభాల కోసం చైనా నుంచి గత రికార్డులను బద్దలు కొడుతూ వస్తు దిగుమతులకు పచ్చజెండా, జనానికి దేశ భక్తి సుభాషితాలు.విశ్వగురువు లీలలు ఎన్నని చెప్పుకోగలం !


ప్రపంచంలో విదేశీమారకద్రవ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది నాల్గవ స్థానమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆగస్టు ఐదవ తేదీన చెప్పారు. ఇది నరేంద్రమోడీ భజనపరులకు వీనుల విందు, కనులకు పసందుగా ఉంటుంది. ఇదే ప్రాతిపదికైతే మనం అమెరికా కంటే కూడా గొప్పవారం అని చెప్పాల్సి ఉంటుంది. బంగారం మినహా విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం అది పదమూడవ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు వారానికి ఒకసారి మరికొన్ని నెలకు ఒకసారి వివరాలు వెల్లడిస్తాయి. అందువలన అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 2022లో కొన్ని దేశాల విదేశీమారకద్రవ్య వివరాలు బిలియన్‌ డాలర్లలో ఇలా ఉన్నాయి. చైనా 3,275.490(జూలై),జపాన్‌ 1,311.254(జూన్‌), స్విడ్జర్లాండ్‌ 960.084(జూన్‌), రష్యా 574.8(ఆగస్టు 5), భారత్‌ 572.978(ఆగస్టు 5), తైవాన్‌ 548.960(జూన్‌), అమెరికా 234.430(జూలై 8). అంతకు ముందు నెలతో పోలిస్తే చైనా నిల్వలు 28.895, రష్యా 3.6 బి. డాలర్ల చొప్పున పెరిగాయి. కరోనా లాక్‌డౌన్ల కారణంగా చైనా, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఇబ్బందులు పడినప్పటికీ వాటి నిల్వలు పెరగ్గా అంతా సజావుగా ఉందని చెబుతున్న మన దేశ నిల్వలు ఎందుకు తగ్గుతున్నట్లు ? పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనుకుందాం, సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో దేశాన్ని పెట్టామని అనేక మంది చెప్పారు, బిజెపి కూడా స్వంత డబ్బా కొట్టుకుంది. జనం కూడా నిజమే అని నమ్మారు. మరి ఇప్పుడీ పరిస్థితి ఎందుకు తలెత్తినట్లు ?కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో సాధించలేని దానిని నరేంద్రమోడీ ఐదు సంవత్సరాల్లో చేసి చూపారని 2019 ఎన్నికలపుడు ఊదర గొట్టారు. మోడీ సాధించిన ఘనతల్లో విదేశీ మారక ద్రవ్య పెంపుదల ఒకటని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి అంతగా తెలియని(విద్యావంతులైన) జనం ఉన్నారు గనుక బిజెపి ప్రచార దళాలు వాట్సాప్‌ పండితులతో ఏది ప్రచారం చేసినా నడుస్తోందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !

09 Tuesday Aug 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Politics, BJP, JDU vs BJP, Narendra Modi, Narendra Modi Failures, Nitish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


బీహార్‌లో మరో ఏకనాధ్‌ షిండేను సృష్టించాలన్న బిజెపి మంత్రాంగం బెడిసి కొట్టింది. అక్కడ అధికారంలో ఉన్నది ఎత్తుగడలలో తలపండిన జెడియు నితీష్‌ కుమార్‌ను తక్కువ అంచనా వేసినట్లు కనిపిస్తోంది.గత కొద్ది రోజులుగా బీహార్‌లో జరుగుతున్న బిజెపి-జెడియు కూటమి కుమ్ములాటలు మంగళవారం నాడు కేవలం ఆరుగంటల్లోనే అధికారాన్ని మార్చివేశాయి. బిజెపితో తెగతెంపులు చేసుకున్న నితీష్‌ కుమార్‌ మహాకూటమి మద్దతుతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏడు పార్టీలు, కొందరు స్వతంత్రులతో సహా 164 మంది మద్దతు ఉన్న తాను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిసేందుకు వచ్చినట్లు నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. మంగళవారం నాటి పరిణామాల క్రమం ఇలా ఉంది.


ఉదయం పదకొండు గంటలకు జెడియు ఎంఎల్‌ఏలు, ఎంపీలతో నితీష్‌ కుమార్‌ సమావేశం.11.15కు వేరే చోట ఆర్‌జెడి ఎంఎల్‌ఏల భేటీ, ఒంటి గంట మాజీ సిఎం రబ్రీదేవి ఇంట్లో ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన మహాకూటమి భేటీ.నితీష్‌ కుమార్‌కు మద్దతుగా లేఖపై సంతకాలు. నాలుగు గంటలకు నితీష్‌ కుమార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో భేటీ, పదవికి రాజీనామా, 4.45కు రబ్రీదేవి ఇంటికి వచ్చిన నితీష్‌ కుమార్‌. 5.20కి తిరిగి గవర్నర్‌ను కలసి కొత్త కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేస్తానంటూ ఎంఎల్‌ఏల సంతకాలతో కూడిన లేఖ అందచేత. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల వారీగా ఆర్‌జెడి 79, బిజెపి 77, జెడియు 45, కాంగ్రెస్‌ 19, సిపిఐ(ఎంఎల్‌ లిబరేషన్‌) 12,హెచ్‌ఎంఎం 4, సిపిఎం, సిపిఐలకు ఇద్దరేసి, మజ్లిస్‌ ఒకటి, ఇండిపెండెంట్లు ఒకరు ఉన్నారు. అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 కావాల్సి ఉంది. ఆర్‌జెడి-జెడియు రెండు పార్టీలకే 124తో సంపూర్ణ మెజారిటీ ఉంది..


2020 నవంబరు నెలలో అధికారం చేపట్టినప్పటి నుంచి బిజెపి-జెడియు కూటమిలో ఎవరి ఎత్తుగడలతో వారు కొనసాగుతున్నారు.ఆగస్టు ఆరవ తేదీన రాజీనామా చేసిన జెడియు నేత ఆర్‌సిపి సింగ్‌ను బీహార్‌ ఏకనాధ్‌గా మార్చేందుకు బిజెపి పూనుకుందని చెబుతున్నారు. సింగ్‌కు రాజ్యసభ్యత్వాన్ని కొనసాగించేందుకు నితీష్‌ కుమార్‌ నిరాకరించినపుడే తెరవెనుక జరుగుతున్నదానిని పసిగట్టారన్నది స్పష్టం. జెడియు మునిగిపోతున్న పడవ అని ఆర్‌సిపి సింగ్‌ పార్టీ నుంచి రాజీనామా తరువాత ప్రకటించాడు. ఆర్‌సిపి సింగ్‌ శరీరం జెడియులో ఆత్మ బిజెపిలో ఉందని జెడియు అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌ అన్నారు.


2005 నుంచి ఇప్పటి వరకు 2014లోక్‌సభ ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ నితీష్‌కుమార్‌ గెలిచిన కూటమిలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమిలో బిజెపి పెద్ద పార్టీగా అవతరించింది. దానికి ఆర్‌జెడి మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. నిజానికి నితీష్‌ను అడ్డుతొలగించుకోవటం దానికి ఒక సమస్య కాదు. అయితే రాజకీయ నాటకం రంజుగా కొనసాగాలంటే అలాంటి పాత్రలు అవసరం. అంతకు ముందే పంజాబ్‌లో అకాలీదళ్‌, మహారాష్ట్రలో శివసేనతో బెడిసి కొట్టింది. అదే పరిణామం బీహార్‌లో పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరై బిజెపి లొంగి ఉంది తప్ప మరొకటి కాదు. తమిళనాడులో అన్నాడిఎంకె నాయకత్వాన్ని బెదిరించే యత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. మాతో ఉంటారో లేదో తేల్చుకోండి అన్నట్లుగా అన్నాడిఎంకె నేతలు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ కూడా లేకపోతే బీహార్‌లో అధికారం రాదు. బిజెపి తమనెక్కడ మింగివేస్తుందో అన్న భయంతో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్న స్థితిలో అలాంటిదేమీ ఉండదు చూడండి బీహార్‌ను అని ఇంతకాలం చెప్పుకున్నారు. అదే సమయంలో తమ పార్టీని బలపరుచుకొనేందుకు పావులు కదిపారు. ఏకనాధ్‌ షిండే రూపంలో మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీశారు. తప్పనిసరై తామే పెద్ద పక్షంగా ఉన్నప్పటికీ ఏకనాధ్‌ను సిఎంను మాజీ సిఎం ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిని చేసి తెరవెనుక నుంచి కథ నడిపిస్తున్నారు. నితీష్‌ కుమార్‌ కీలుబొమ్మగా పని చేసే రకం కాదు గనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తంగా బీహార్‌ను తమ దారికి తెచ్చుకొనేందుకు ముందునుంచే ఎసరు పెట్టారు. మూడవ పక్ష స్థాయికి తగ్గినా అక్కడున్న లెక్కల్లో ఏదో ఒక పక్షానికి నితీష్‌ అవసరం. అందుకే అందలం ఎక్కిస్తున్నారు.


గత మూడు దశాబ్దాల ఎన్నికలను చూసినపుడు బీహార్‌లో లాలూ, నితీష్‌, బిజెపి ప్రధాన శక్తులుగా ఉన్నాయి. 2014లోక్‌సభ ఎన్నికల్లో లాలూ-నితీష్‌ విడిగా పోటీ పడిన కారణంగా బిజెపి గెలిచింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో లాలూ-నితీష్‌ కలయికతో బిజెపి చతికిల పడింది. కొంత మందికి ఇష్టం లేకున్నా నితీష్‌తో సర్దుబాటుకు దిగక తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌-బిజెపి బంధంతో ఆ కూటమి స్వల్ప మెజారిటీతో గెలిచింది. నితీష్‌ పార్టీని ఓడించేందుకే బిజెపి పని చేసిందని, దానిలో భాగంగా అనేక మంది తన నేతలను పాశ్వాన్‌ పార్టీ ఆర్‌ఎల్‌జెపి గుర్తు మీద పోటీకి దింపిందని, కొన్ని చోట్ల జెడియును పని గట్టుకు ఓడించినట్లు విమర్శలు వచ్చాయి. అది కూడా ఇప్పుడు ఆ కూటమి పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. మహారాష్ట్ర పరిణామాలను చూసిన తరువాత బిజెపి లోబరచుకున్న తమ నేత ఆర్‌సిపి సింగ్‌ మరొక ఏకనాధ్‌ షిండే కాకున్నప్పటికీ మరో పద్దతిలో తనను ఎంతో కాలం సిఎంగా కొనసాగనివ్వదనే అంచనాకు నితీష్‌ వచ్చినట్లు చెబుతున్నారు. సిఎం నితీష్‌ అధికారాలను అడ్డుకోవటం, తాము చెప్పిన పద్దతిలో నడవాలని నిర్దేశించేందుకు పూనుకున్నదని వార్తలు. బిజెపి కారణంగా తన పునాదులు కదులుతున్నట్లు నితీష్‌ గ్రహించారు. గత కొద్ది రోజులుగా రెండు పార్టీలు పైకి ఏమి మాట్లాడినప్పటికీ అంతర్గతంగా ఎవరి పావులు వారు కదుపుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం గురించి అమిత్‌ షా జూలై 17న ఏర్పాటు చేసిన సమావేశానికి నితీష్‌ డుమ్మా కొట్టారు.ఈ నెల ఏడవ తేదీన నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్‌ సమావేశానికీ రాలేదు. జూలై 22న దిగిపోనున్న రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ వీడ్కోలు విందుకు, తరువాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికీ వెళ్లలేదు. కరోనా గురించి ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి అనారోగ్యం అని చెప్పి రాలేదు.


బిజెపికి చెందిన స్పీకర్‌ విజయ కుమార్‌ సిన్హాను తొలగించాలని నితీష్‌ చేసిన యత్నాలను బిజెపి అడ్డుకుంది. అంతే కాదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లుగా స్పీకర్‌ చేసిన విమర్శలను బిజెపి అనుమతించింది. స్పీకర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు నితీష్‌ కుమార్‌ విమర్శించారు.2019 లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తమకు రెండు మంత్రి పదవులు కావాలని నితీష్‌ అడిగితే ఒకటి కంటే ఇచ్చేది లేదని మోడీ తిరస్కరించటంతో తమకసలు పదవులే వద్దని నితీష్‌ చెప్పారు. అయితే జెడియు నేతగా ఉంటూ అప్పటికే బిజెపి ప్రభావంలో ఉన్న ఆర్‌సిపి సింగ్‌ను పార్టీ అనుమతి, నితీష్‌ కుమార్‌తో నిమిత్తం లేకుండా నేరుగా బిజెపి కేంద్ర మంత్రిగా చేసింది. తనకు పదవి గురించి అమిత్‌ షాతో నితీష్‌ కుమార్‌ చర్చించినట్లు ఆర్‌సిపి సింగ్‌ ప్రకటించారు. తాజాగా సింగ్‌కు జెడియు సీటు నిరాకరించటంతో మంత్రి పదవి పోయింది. ఆ ఉక్రోషంతో తాజాగా రాజీనామా చేసి పార్టీ మునికిపోతున్న పడవ అంటూ ధ్వజమెత్తారు.ఏడు జన్మలెత్తినా నితీష్‌ ప్రధాని కాలేరని అన్నారు. రామవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ బహిరంగంగానే నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తారు. నిత్యం బిజెపి సంబంధాలలో ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమిలో ఉంటూనే జెడియు పోటీ చేసే స్థానాల్లో మాత్రమే తన అభ్యర్ధులను నిలిపి ఓట్లను చీల్చారు. దీన్ని చిరాగ్‌ మోడల్‌ అని పిలిచారు. ఇప్పుడు ఆర్‌సిపి సింగ్‌ ద్వారా పార్టీని చీల్చేందుకు బిజెపి పూనుకున్నట్లు చెబుతున్నారు. దాన్ని గమనించిన నితీష్‌ కుమార్‌ ఆర్‌సిపి సింగ్‌, అతని కుటుంబం పొందిన 24 ఎకరాల భూమి గురించి సంజాయిషి ఇవ్వాలని పార్టీ ద్వారా నోటీసు పంపించారు.తరువాతే సింగ్‌ రాజీనామా చోటు చేసుకుంది. అంతకు ముందు సింగ్‌తో సంబంధాలు ఉన్న పార్టీ వారి మీద చర్యలు తీసుకున్నారు. ఇటీవలి అగ్నిపధ్‌ ఆందోళనల్లో బీహార్‌లో బిజెపి నేతల ఇండ్ల మీద దాడులు జరిగాయి. వాటిని జెడియు ప్రోత్సహించినట్లు బిజెపి ఆరోపణ. దుండగులకు స్వేచ్చ నిచ్చారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ జైస్వాల్‌ ధ్వజమెత్తారు. నిరసనకారులతో కేంద్రం చర్చించాలని జెడియు కోరింది. తాజా పరిణామాలు దేశంలోని వివిధ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు : బిజెపిలో పెరుగుతున్న వారసులు – తాజాగా ఎడియూరప్ప కుమారుడు !

23 Saturday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

B. S. Yediyurappa, BJP, BJP Dynasty Politics, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో వారసత్వ రాజకీయాలకు తావు లేదని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నవారి మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు, అన్నింటికీ మించి వారితో దెబ్బలాటకు అసలు దిగకూడదు. ఆజాదీకా అమృత ఉత్సవాల్లో వారిని కంగన రనౌత్‌ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 పోరులో పాల్గొన్న సమరయోధులుగా సన్మానించినా, పెన్షన్‌ ఇచ్చినా తప్పు లేదు. షా నవాజ్‌ హుసేన్‌ అనే బిజెపి నేత శ్రీనగర్‌లో కూర్చుని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. పేరెత్త కుండానే తాత, తండ్రి, మనవడు ముఖ్యమంత్రులయ్యే రోజులు గతించాయి. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు పాల్పడిన వారు గతంలో చేసిన వ్యాపారం, హౌటళ్లు ఏదో ఒకటి చూసుకోవాల్సిందే అన్నారు. సరిగ్గా అదే సమయంలో నాలుగు సార్లు సిఎం, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న బిఎస్‌ ఎడియూరప్ప కర్ణాటకలోని షిమోగా సభలో తన రెండవ కుమారుడు విజయేంద్రకు తన నియోజకవర్గం షికారపుర రాజకీయ వారసత్వాన్ని ఇస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటించారు.2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ తన బదులు కుమారుడు పోటీ చేస్తాడని ప్రకటించేశారు. తన తండ్రి వారసత్వాన్ని అంగీకరిస్తూ కుటుంబ పేరు ప్రతిష్టలను కాపాడతానని తనయుడు చెప్పారు. తనకు తండ్రి-పార్టీ రెండు కళ్లు అని ఏ ఒక్కటి లేకున్నా చేసేదేమీ ఉండదని కూడా అన్నారు.ఎడియూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర ప్రస్తుతం షిమోగా ఎంపీగా ఉన్నారు. అయినా సరే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని అనకపోతే పరువు దక్కదు మరి. పేద కుటుంబంలో పుట్టిన ఎడియూరప్ప చిన్నతనంలో నిమ్మకాయలు అమ్మితే తప్ప కుటుంబం గడవని స్థితి. తరువాత కార్మికుడిగా కూడా పని చేశారు. ఒక రైస్‌ మిల్లులో గుమస్తాగా చేరి సినిమాల్లో మాదిరి యజమాని కూతుర్నే వివాహం చేసుకున్నారు. తండ్రీ కొడుకులు వారసత్వ రాజకీయాలను వదలి పూర్వపు వ్యాపారం చేసుకోవాలని షా నవాజ్‌ హుస్సేన్‌ ఇప్పటికైనా తమ పార్టీ నేతలకు చెప్పి మర్యాద దక్కించుకుంటారా ?


ఎనిమిదిసార్లు ఎంఎల్‌ఏ, ఒకసారి ఎంపీగా గెలిచిన బూకనకరె సిద్దలింగప్ప ఎడియూరప్పను 75 ఏండ్లు దాటిన వారికి ముఖ్యమైన పదవులను అప్పగించేది లేదన్న బిజెపి తాను చెప్పిన సుభాషితాన్ని తానే దిగమింగి నాలుగోసారి సిఎం గద్దెమీద కూర్చోపెట్టింది. పదవీ కాలం పూర్తిగాక ముందే రాజీనామా చేయించి బసవరాజు బొమ్మైకి అప్పగించింది. జీవితం తనకు అగ్నిపరీక్షగా ఉందని పదే పదే చెప్పిన ఎడియూరప్ప విధిలేక పదవికి రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొనేది లేదని తన పాత్రను పోషిస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే చెప్పారు. విలువల వలువలతో పని చేస్తామని చెప్పే ఈ బిజెపి నేత నాలుగవసారి సిఎంగా గద్దె నెక్కేందుకు పడరాని పాట్లు పడ్డారు. హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆరుసార్లు విఫలయత్నం చేసి ఏడవ సారి ఎవరేమనుకుంటే నాకేమి అన్నట్లుగా 76 ఏండ్ల వయస్సులో నాలుగోసారి గద్దెనెక్కారు. అంతకు ముందు మూడోసారి పెద్ద పార్టీ నేతగా ప్రభుత్వాన్ని ఏర్పరచి కేవలం 55 గంటలు మాత్రమే పదవిలో ఉండి అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. తొలిసారి 2007లో జెడి(ఎస్‌)తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. రెండవ సారి 38 నెలలు, నాలుగవసారి రెండు సంవత్సరాలు పదవిలో ఉన్నారు. అవినీతి కేసులో ఒకసారి జైలుకూ వెళ్లారు, ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న ఎడియూరప్ప పదవి కోసం బిజెపి మీద తిరుగుబాటు చేసి గతంలో స్వంత కుంపటి పెట్టుకున్నారు. తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిఏ ఎడియూరప్ప – ఎడియూరప్పే బిజెపిగా ఉన్నారు. అలాంటి నేతను ఇటీవల పక్కన పెట్టారు. పార్టీకి ఇతర నేతలు ఉన్నారని రుజువు చేసుకొనేందుకు అధిష్టానం పూనుకున్నది. వారసత్వాన్ని ప్రకటించటం బిజెపి చెప్పే సుభాషితాలకు వ్యతిరేకం. ఎన్నికల ముందు ఎడియూరప్పతో వైరం పెట్టుకుంటుందా ? కుమారుడి కోసం ఏం చేస్తారో చూడాలి.


ఇంకా ఎన్నికలకు ఎంతో వ్యవధి ఉండగా ఇప్పుడెందుకు ఆకస్మికంగా వారసత్వ ప్రకటన చేశారన్నది ప్రశ్న. దాని గురించి విజయేంద్ర మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాను వరుణ లేదా చామరాజనగర్‌లో పోటీ చేయనున్నట్లు మీడియాలో ఊహాగానాలు వెలువడినందున ఒక స్పష్టత ఇవ్వాలని స్థానిక నేతలు తన తండ్రిపై వత్తిడి తెచ్చిన కారణంగా ఈ ప్రకటన చేశారని చెప్పారు. షికారిపురాలో పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా మద్దతు ఇస్తానని కొన్ని నెలల క్రితం ఎడియూరప్ప చెప్పినందున పార్టీనేతలు ఆశాభంగం చెందారని, అక్కడ ఎడియూరప్ప లేదా విజయేంద్ర మాత్రమే పోటీ చేయాలని వత్తిడి చేస్తున్నారని, అందువలన తప్పనిసరై ప్రకటించాల్సి వచ్చిందన్నారు. నాటి ప్రకటనల గురించి తాను ఇప్పుడు చెబుతున్నానని అంటూ అప్పుడు కాంగ్రెస్‌, జెడిఎస్‌ల నుంచి అనేక మంది బిజెపిలో చేరేందుకు వచ్చారని దాంతో తనను పక్కన పెడుతున్నారేమోనని విచారంతో పాటు ఆశాభంగం చెందానని, అప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తున్నానని అన్నారు. ఒక కార్యకర్తగా పార్టీలో పని చేస్తున్నాను తప్ప ఎడియూరప్ప కుమారుడిగా కానందున వారసత్వ వాదన తనకు వర్తించదన్నారు. ఈ సారి ఎలాగైనా పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు వత్తిడి చేసినందున తన తండ్రి ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తమకు సీట్లు కావాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదన్నారు. 2018లో వరుణా నియోజకవర్గం నుంచి పోటీకి పక్షం రోజులు ప్రచారం చేసుకున్న తరువాత, తాజాగా ఎంఎల్‌సీ అవకాశం ఇచ్చేందుకు విజయేంద్రకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎడియూరప్పకు పార్టీ మీద పట్టును తగ్గించేందుకు ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. దానిలో భాగంగానే బొమ్మై మంత్రివర్గంలో తన మద్దతుదారులైన మంత్రుల ఎంపికను నిరాకరించారు.కుమారుడికి మంత్రి పదవీ ఇవ్వలేదు. పదవి కోసం ఎంతకైనా తెగించే చరిత్ర ఉన్న ఎడియురప్ప తన కుమారుడిని రాజకీయ నిరుద్యోగిగా చూసి భరించగలరా !


బిజెపి లబ్ది పొందిన అంశాల్లో ప్రత్యర్ధి పార్టీల కుటుంబ వారసత్వంపై దాడి ఒకటి. విధానాలను పక్కన పెట్టి జనం దృష్టిని ఆకర్షించే ఎత్తుగడ అది. ఇప్పుడు ఆ జబ్బుదానికి కూడా అంటుకుంది.రోజు రోజుకూ పెరుగుతోంది. మాధవరావు సింధియా కాంగ్రెస్‌ నేత. అతని మరణం తరువాత కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా పదవిలోకి రావటంతో బిజెపి వారసత్వ రాజకీయమని చెప్పింది. అదే పెద్దమనిషి బిజెపిలో చేరిన తరువాత ఎంపీ పదవితో పాటు మంత్రిపదవి ఇచ్చారు. జ్యోతిరాదిత్య మేనత్త వసుంధరరాజే. ఆమె రాజస్తాన్‌ సిఎంగా చేశారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఆమె స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. వసుంధరరాజే తల్లి విజయరాజే సింధియా తొలుత కాంగ్రెస్‌, తరువాత స్వతంత్ర పార్టీ, అక్కడి నుంచి జనసంఘం, తరువాత బిజెపి నేతగా ఉన్నారు.ఎంపీ, ఎంఎల్‌ఏగా చేశారు. గోవాలో మాజీ సిఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు బిజెపి తిరస్కరించింది. కానీ అదే పార్టీ అనేక మంది నేతల వారసులకు సీట్లు ఇచ్చింది.జెన్నిఫర్‌ మాన్సరటా మంత్రి, ఆమె భర్త అటానాసియో ఇద్దరికీ సీట్లు ఇచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి, అతని భార్యకు సీట్లు ఇచ్చారు.


2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 మందికి గాను వివిధ పార్టీల నుంచి 114 మంది కుటుంబవారసుల నుంచే వచ్చారు. తరువాత 2019లో వారి సంఖ్య 162కు పెరిగింది, ఇది తొమ్మిది శాతం. చిత్రం ఏమిటంటే సగటు కంటే బిజెపి వారసులు ఆ పార్టీకి ఉన్న 388 మందిలో 45 అంటే పదకొండుశాతం ఉన్నారు.2009లో బిజెపి, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిలో వారసులు పదకొండు, పన్నెండుశాతాల చొప్పున ఉంటే 2014కు వచ్చేసరికి అవి 20-8 శాతాలుగా మారాయి. ఈ కారణంగానే నరేంద్రమోడీ వారసత్వ రాజకీయాల గురించి కొత్త పల్లవి అందుకున్నారు. 2021 నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులు రాజకీయ పదవుల్లోకి వస్తే తప్పులేదంటూ ఒక కుటుంబమే తరతరాలుగా పార్టీని నడపటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని సూత్రీకరించారు. కుటుంబాల కోసం పార్టీలు, కుటుంబాలే పార్టీలను నడిపితే ప్రజాస్వామిక లక్షణం ఉండదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమని మరో సందర్భంగా చెప్పారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఫొటోలతో జర జాగ్రత్త – ఉద్యోగాలు పోతాయి, ఊచలు లెక్కించాలి !

18 Monday Jul 2022

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, PM.CM photos in trash, UP CM, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసి పారిపోక ముందు మే పదవ తేదీన ఒక ఉదంతం జరిగింది. మహింద వీర విధేయుడైన అభిమాని ఒకడు కొలంబో వీధుల్లో మద్దతు ప్రకటించాడు. అప్పటికే మద్దతుదార్లను జనం మీదకు ఉసిగొల్పిన మహింద సంగతి తేల్చాలని నివాసం వైపు నిరసనకారులు వెళుతుండగా ఈ ఉదంతం జరిగింది. ఆగ్రహించిన జనం అతన్ని చితక్కొట్టి దారిన వస్తున్న ఒక చెత్తబండిలో కూర్చోపెట్టి తరిమికొట్టారు. ఆ వీడియో వైరలైంది. దెబ్బలు తిన్న అతను సింహళీయుడే చితక బాదిన వారు కూడా ఆ సామాజిక తరగతికి చెందిన వారే. ఆదివారం నాడు (జూలై 17)న ఉత్తర ప్రదేశ్‌లోని మధుర పట్టణంలో ఒక కాంట్రాక్టు పారిశుధ్యకార్మికుడు తన బండిలో చెత్తతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, సిఎం యోగి ఆదిత్యనాధ్‌ ఫొటోలను తరలిస్తున్న వీడియో వైరల్‌ కావటం, దాన్ని చూసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సదరు కార్మికుడిని విధుల నుంచి తొలగించటం సంచలనాత్మక ఘటనగా మారింది. దేశ అదృష్టం కొద్దీ ఉపాధి పోగొట్టుకున్న కార్మికుడూ హిందువే, చెత్తబండి నుంచి మోడీ, యోగి, అబ్దుల్‌ కలామ్‌ చిత్రాలను రక్షించిన వారూ హిందువులే.


ఈ ఉదంత వివరాల్లోకి వెళితే మున్సిపల్‌ కార్మికుడు బాబీ బండిలో మోడీ, యోగి ఫొటోలు ఉండటాన్ని రాజస్తాన్‌లోని ఆళ్ల్వారు నుంచి మధుర వచ్చిన ఇద్దరు భక్తులు గమనించారు. సదరు బండిని వీడియో తీశారు. అంతటితో ఆగలేదు. కార్మికుడిని నిలిపి ఆ ఫొటోలను ఎందుకు చెత్తబండిలో వేశావని అడిగారు. వాటితో తనకేమీ సంబంధం లేదని చెత్తకుప్పలో ఉన్నవాటిని తీసి బండిలో వేసి తీసుకుపోతున్నట్లు చెప్పాడు. ఆళ్వారు భక్తులు మోడీ,యోగి చిత్రాలను బండిలో నుంచి తీస్తుండగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్రం కూడా కనిపించిందట. ఆ ఫొటోలను తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేసి తమతో ఆళ్వారు తీసుకు వెళతామని, మోడీగారు,యోగి గారు ఈ దేశ ఆత్మలని వారు అన్నారు.


ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమంలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి చిత్రాలను అందరూ గౌరవించాలి. వారి చిత్రాలను చెత్తబండిలో తీసుకుపోవటం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదమే కనుక శిక్షించాలని కొందరు అన్నారు. కార్మికుడిపై వేటును కొందరు ప్రశ్నించారు. ఫొటోలు పాతబడి, చిరిగినపుడు అవి ఎవరివైనా ఒకటే. అధికారంలో ఉన్నవారి పాత పొటోలను ఏం చేయాలి, ఎలా తొలగించాలి అనేందుకు ఏదైనా పద్దతి ఉందా అని కొందరు ప్రశ్నించారు. చెత్తకుప్పలో ఉన్న వాటిని బండిలో వేసిన కార్మికుడిది విధి నిర్వహణ తప్ప తప్పెలా అవుతుంది, అతన్ని ఎందుకు శిక్షించాలి అని కొందరు ప్రశ్నించారు. కార్మికుడు తన బండిలో ఆ ఫొటోలను తెలియకుండానే ఉంచాడు. అతని నిర్లక్ష్యానికి గాను అతన్ని వెంటనే పని నుంచి తొలగించినట్లు మధుర-బృందావన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సత్యేంద్ర కుమార్‌ తివారీ ప్రకటించారు. సదరు కార్మికుడు వాటిని బండిలో వేసేటపుడు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు.


ప్రముఖులు, ప్రజాప్రతినిధుల చిత్రాలు చెత్తలో కనిపించినపుడు ఏమి చేయాలో కార్మికులకు ఎందుకు వివరించలేదో సంజాయిషీ ఇవ్వాలంటూ శానిటరీ ఇనస్పెక్టర్‌, సూపర్‌వైజర్లకు కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించింది.తనను పనిలోంచి తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచించాలని కార్మికుడు బాబీ ఒక దరఖాస్తులో ప్రార్ధించాడు. చెత్తసేకరణ కేంద్రంలో ఉన్నదాన్నే తన బండిలో వేశానని, తనకు చదువురాదని, ఫొటోలను గుర్తించలేకపోయానని, జరిగిందానికి మన్నించాలని కోరాడు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు తెలియదంటే కుదరదని, వాటిని సులభంగా గుర్తించవచ్చని ఒక అధికారి అన్నారు. ఈ ఉదంతం గురించి నిజనిర్దారణకు ఒక కమిటీని వేసి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అనునయ ఝా చెప్పారు.


వారం రోజుల ముందు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ పట్టణంలో జూలై పదిన నరేంద్రమోడీని విమర్శిస్తూ రెండు చోట్ల హౌర్డింగులు పెట్టినందుకు గాను పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వాటిలో ధరల పెరుగుదల, రైతుల నిరసన, నిరుద్యోగం వంటి అంశాల కార్టూను, బై బై మోడీ అనే హాస్టాగ్‌ ఉన్నాయి. జాతీయ సమగ్రతకు భంగం కలిగించటం, వివిధ తరగతుల మధ్య విద్వేషం, శత్రుత్వం, తప్పుడు ఆలోచనలు కలిగించటం వంటి సెక్షన్లతో కేసులు పెట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాని పేరుకు మచ్చ తెచ్చేందుకు వాటిని ఉద్దేశించారని ఆరోపించారు. వాటిని తెలంగాణాలోని టిఆర్‌ఎస్‌కు చెందిన శాయి అనే అతని కోరిక మేరకు పెట్టారని పోలీసులు చెప్పారు. అనికేత్‌ కేశర్వాని, అభయకుమార్‌ సింగ్‌, రాజేష్‌ కేశర్వాని, శివ, ధర్మేంద్ర కుమార్‌ అనే వారిని అరెస్టు చేశారు.వారిలో ఫ్లెక్సీని ముద్రించిన ఒకరిని, ఒక కార్యక్రమాల నిర్వహణ కంపెనీ ప్రతినిధి ఉన్నారు. హౌర్డింగ్‌లు పెట్టినందుకు శాయి అనే అతను తమకు పదివేల రూపాయలు ఆన్‌లైన్లో చెల్లించినట్లు అనికేత్‌ కేశర్వానీ చెప్పాడు.

ఈ రెండు ఉదంతాలను చూసినపుడు జనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల పాలు కావచ్చు, ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు, ఊచలు లెక్కించవచ్చు. మనోభావాలను దెబ్బతీశారంటూ కేసులు ఎక్కడ నుంచైనా, ఎవరిమీదనైనా పెట్టవచ్చు, అందుకే జర జాగ్రత్త. అసలు చెత్తబండిలో ఫొటోల వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఆ ఫొటోలను చెత్తకుప్పలో వేసింది ఎవరన్నది తేల్చేందుకు యోగి సర్కార్‌ సిబిఐ, ఎన్‌ఐఏలతో దర్యాప్తు జరిపిస్తుందేమో చూడాలి. మరోసారి చెత్తబండ్ల పాలు కాకుండా వీధికి ఒక ఫొటో రక్షకుడిని ఏర్పాటు చేసి ఎవరు చిత్రాలను చెత్తలో వేస్తున్నదీ నిఘాపెట్టిస్తుందో చెప్పలేము. దోషులు తేలితే వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయించినా ఆశ్చర్యం లేదు. ఈ ఉదంతం తరువాత రాష్ట్రాల్లోని మున్సిపల్‌ కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రముఖుల ఫొటోలు చిరిగినా, దుమ్ముపట్టినా, చీడపట్టినా, చెదపురుగులు తిన్నట్లు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలి లేదా వారికి అప్పగించాలి. లేనట్లయి అనవసర వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. సిఎం యోగి మెప్పు పొందేందుకు మధుర అధికారుల మాదిరి ఎక్కడైనా ఉన్నతాధికారులు అదే చేయవచ్చు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెయ్యి చైనా కంపెనీల రాక జుమ్లా – 2,783 భారత కంపెనీల పోక నిజం !

11 Monday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Chinese companies, Chinese investment, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి వెయ్యి కంపెనీలు మన దేశానికి వస్తున్నట్లు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఇంకే ముంది చైనాలో ఫ్యాక్టరీలన్నీ ఖాళీ అవుతున్నాయన్నట్లుగా వాటిని చూసి అనేక మంది కొండంత రాగాలు తీశారు. తాజాగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది.దానిలో జెపి మోర్గాన్‌ కంపెనీ ప్రతినిధులతో మన దేశానికి ఉన్న ఎగుమతుల అవకాశాల గురించి చెప్పించారు. చైనా ప్రస్తుతం తక్కువ నైపుణ్యంతో ఉత్పత్తి చేసే దుస్తులు, పాదరక్షలు, తోలు వస్తువులు, ఫర్నీచర్‌ వంటి ఎగుమతుల నుంచి వైదొలుగుతున్నదని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు భారత్‌కు అవకాశం వచ్చింది కనుక వినియోగించుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. దాని కొనసాగింపుగా రాష్ట్రాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పెద్దలు చెప్పారు. పూర్వకాలంలో రాజుల దగ్గర ఉండే కొందరు వారి మనసెరిగి దానికి అనుగుణంగా కబుర్లు చెప్పేవారు. ప్రస్తుతం రెండింజన్ల సర్కార్లున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు మేకిన్‌ ఇండియా ఎగుమతుల బదులు బుల్డోజర్ల మీద కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎగుమతులకు అవకాశం లేదు గనుక ఇప్పుడైనా వాటిని పక్కన పెడతారేమో, పనికి వచ్చే పనులు చేస్తారేమో చూద్దాం. ఇంతకూ చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలేమైనట్లు ? జనాలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు గనుక ఎప్పటికప్పుడు కొత్త కతలు చెబుదాం మిత్రోం !


తాజాగా వచ్చిన వార్తల ప్రకారం చైనా కంపెనీలు కొన్ని అమెరికా సరిహద్దుల్లో ఉన్న మెక్సికోకు తరలేందుకు చూస్తున్నట్లు, అక్కడ వేతనాలు తక్కువ, పన్ను రాయితీలు ఎక్కువ, సరకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నది సారాంశం. దాన్ని వేరే విధంగా చూస్తే చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు తగ్గుతున్నాయి. చైనాలో పెట్టిన కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాయి. ఎందుకని ? అమెరికా మాజీ నేత నోటి దూల ట్రంప్‌ అధికారంలో ఉండగా 2018లో చైనా మీద ప్రారంభించిన వాణిజ్యం యుద్ధం నుంచి ఎలా వెనక్కు తగ్గాలా అని ప్రస్తుత నేత జో బైడెన్‌ చూస్తున్నాడు. చైనా నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్ను పెంచి వారిని దెబ్బతీస్తానని ట్రంప్‌ కలలు గన్నాడు. అవే పన్నులు అమెరికన్ల మీద భారాలు మోపాయి. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు అక్కడ తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను నివారించాలంటే చైనా వస్తువుల మీద పన్ను తగ్గించటం మినహా మరొక మార్గం లేదని బైడెన్‌కు అర్ధమైంది.

ఈ పూర్వరంగంలోనే చైనాలో ఉన్న కొన్ని కంపెనీల ఆలోచనల గురించి ఎటి కియర్నీ అనే కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. చైనా నుంచి కంపెనీలను మెక్సికో, కెనడా లేదా మధ్య అమెరికా దేశాలకు తరలిస్తే లాభదాయకమని గతేడాది 78శాతం మంది అమెరికన్‌ కంపెనీల అధికారులు భావిస్తే ఈ ఏడాది మార్చి నెలలో 92శాతానికి పెరిగారట.పదహేడు శాతం మంది ఇప్పటికే మెక్సికో వెళ్లినట్లు చెప్పారు. 2018లో అమెరికా-కెనడా-మెక్సికో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఫర్నీచర్‌ తయారీదారులు స్థానికంగా దొరికే వాటి నుంచి 50శాతం ముడివస్తువులను ఉపయోగిస్తేనే మెక్సికో పన్ను రాయితీలు వర్తిస్తాయి.దీన్ని అమలు జరపటం కష్టం కనుక ఏం జరుగుతుందో చెప్పలేం. జో బైడెన్‌ దిగుమతి పన్ను ఎత్తివేస్తే చైనాలోనే కొన్ని కానసాగవచ్చు, కొన్ని మెక్సికోకు తరలవచ్చు తప్ప మన దేశం వైపు వచ్చే అవకాశం లేదు. లాభసాటిగా ఉంటే అమెరికన్లతో పాటు కొన్ని చైనా కంపెనీలు కూడా మెక్సికోలో కొత్తగా పరిశ్రమలు పెట్టవచ్చు. అలా పెట్టకూడదనే ఆంక్షలను చైనా ప్రభుత్వం విధించలేదు.మెక్సికోకు చైనా కంపెనీలు తరలే అవకాశం గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా కొందరు చెబుతున్నారు. ఎవరిష్టం వారిది ఎవరి లాభం వారిది గనుక వారికే వదిలేద్దాం !


చైనా మార్కెట్లో ప్రవేశించేందుకు విదేశాల నుంచి అనేక మంది అక్కడకు వెళ్లి కంపెనీలు పెట్టటం, తరువాత ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడకు పోవటం నిరంతరం జరుగుతున్నదే.దుస్తుల ఉత్పత్తి బంగ్లాదేశ్‌, వియత్నాంలో లాభసాటిగా ఉంటుందని దశాబ్దక్రితమే అనేక మంది తరలి వెళ్లారు. మొత్తం మీద చూసినపుడు అనేక మంది భావిస్తున్నట్లు లేదా కొందరు కోరుకుంటున్నట్లుగా పొలోమంటూ చైనా నుంచి వలసలు లేవు. విదేశీ పెట్టుబడుల పెరుగుదల రేటు తగ్గటం, పెరగటం తప్ప పూర్తిగా ఆగిపోలేదు. కనీస వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది చైనా గ్వాంగఝౌ దుస్తుల పరిశ్రమలో కనీసవేతనం 313 డాలర్లుంటే, ఇండోనేషియాలో 243, కంపూచియాలో 190,మయన్మార్‌లో 157, బంగ్లాదేశ్‌లో 95 డాలర్లుందని జర్మనీ స్టాటిస్టా సంస్థ పేర్కొన్నది. ఇతర దేశాల్లో లేని సంక్షేమ పధకాలు చైనాలో అదనం అన్నది తెలిసిందే. చైనా ప్రస్తుతం అధిక విలువ గలిగిన ఉత్పత్తుల తయారీ మీద కేంద్రీకరించినందున గిట్టుబాటుగాని తక్కువ విలువగల వస్తు తయారీ సంస్థలు రాకపోవచ్చు, ఉన్నవి వెళ్లిపోవచ్చు.


కరోనా, ఇతర పరిణామాల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాటికి తోడు రాజకీయాలు ఉండనే ఉన్నాయి. దానిలో భాగంగా చైనా మీద ఆధారపడటం తగ్గించాలని అనేక మంది చెబుతున్నారు. నిజానికి ఆధారపడాలని ఎవరూ వత్తిడి తేలేదు. అమెరికా ముందుకు తెచ్చిన ఇండో పసిఫిక్‌ ఆర్ధిక చట్రం(ఐపిఇఎఫ్‌) మీద ఎక్కువగా ఆధారపడాలని కొందరు సూచిస్తున్నారు. ఎవరూ మనకు సరకులు ఉచితంగా ఇవ్వనపుడు ఎక్కడ తక్కువ ధరలు ఉంటే అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఎవరు మన వస్తువులను కొంటే వారికే అమ్ముతాం. మబ్బులను చూసి చేతిలో ఉన్న ముంత నీళ్లు పారపోసుకున్నట్లుగా పరిస్థితి మారకుండా చూసుకోవాలి.చైనాకు మన ఎగుమతులు దెబ్బతినకూడదు. చెరువు మీద అలిగే వారు కొందరు చైనా వస్తువుల కొనుగోలు నిలిపివేసి, వారికి వస్తువులు ఎగుమతి ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తారని పగటి కలలు కనేవారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. రాత్రంతా సత్రాలు, మఠాల్లో గంజాయి దమ్ము లేదా బార్లలో మందుకొట్టి అది చేయాలి, ఇది చేయాలి అని వాగి తెల్లవారి మత్తుదిగిన తరువాత ఎవరిదారిన వారు పోవటం తెలిసిందే.


పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా కాకుండా వస్తూత్పతికి చైనాను అనుకరించాల్సిన అవసరం లేదని, గత కొద్ది సంవత్సరాలుగా అది పని చేయలేదని అందువలన సేవారంగం మీద కేంద్రీకరించాలని రఘురామ్‌ రాజన్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పెట్టుబడుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం కనిపించటం లేదు. 2014 నుంచి 2021 నవంబరు వరకు వివిధ కారణాలతో మన దేశం నుంచి 2,783 విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయి.2021 నవంబరు 30 నాటికి దేశంలో 12,458 విదేశీ కంపెనీలు చురుకుగా పని చేస్తున్నట్లు కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పినట్లు 2021 డిసెంబరు ఎనిమిదవ తేదీన ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. మన దేశంలోని జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ను చైనా సంస్ధ అనుబంధ ఎంజి మోటార్‌ ఇండియా 2017లో కొనుగోలు చేసింది. ఇటీవల మహారాష్ట్రలోని తాలేగాంలోని ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్‌ కంపెనీ ముందుకు రాగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటంతో లావాదేవీ ఆగింది. ” గుజరాత్‌ను ఆదర్శంగా చూపుతూ చైనా పెట్టుబడులను కోరిన మోడీ ” అనే శీర్షికతో 2011నవంబరు తొమ్మిదిన తన బీజింగ్‌ ప్రతినిధి పంపిన వార్తను హిందూ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ససేమిరా చైనా పెట్టుబడులను అంగీకరించేది లేదంటున్నారు. పదేండ్లలో ఎంత మార్పు ! పెట్టుబడులు వద్దుగానీ మనకు చైనా కరెన్సీ యువాన్లు కావలసి వచ్చాయి.


రష్యా నుంచి దిగుమతులు చేసుకొని మన చమురు సంస్థలు ఎంతో లబ్ది పొందుతున్నాయి.పశ్చిమ దేశాల ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేము. ఈ లోగా రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే మన దేశ సంస్థలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మన దేశంలో సిమెంటు తయారీలో పెద్ద కంపెనీ ఆల్ట్రాటెక్‌. అది చైనా కరెన్సీ యువాన్లు చెల్లించి రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గు దిగుమతి చేసుకొంటోంది. ఇది మన కస్టమ్స్‌ పత్రాల్లో నమోదైన సమాచారమని రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ 29న తెలిపింది.ఈ లావాదేవీల విలువ 17,26,52,900 యువాన్లు లేదా 2.581 కోట్ల డాలర్లు. రష్యా – మన దేశం మధ్య రూపాయి-రూబుల్‌ లావాదేవీల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మన కరెన్సీ విలువ పడిపోతున్నందున అది ఏ మేరకు ఖరారు అవుతుందో చెప్పలేము. ఈ లోగా చైనా కరెన్సీతో చెల్లింపులు జరిపే అవకాశాన్ని మన కార్పొరేట్‌ సంస్థలు కనుగొన్నాయి.దీనితో వచ్చే సమస్యల గురించి, తదుపరి కూడా కొనసాగుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పటం లేదు. మన దేశంలోని బాంకులు చైనా, హాంకాంగ్‌, సింగపూర్లలో ఉన్న బ్రాంచీల ద్వారా డాలర్లతో యువాన్‌లు కొనుగోలు చేసి రష్యాకు చెల్లిస్తారు. లేదా చైనా బాంకుల నుంచి మన బాంకులు యువాన్‌ల రుణాలు తీసుకుంటాయి. దీన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటి వరకు అడ్డుకున్నట్లు వార్తలు లేవు. వచ్చే రోజుల్లో ఈ లావాదేవీలు ఇంకా పెరుగుతాయా, మన ఆర్ధిక రంగం మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పటికైతే చెప్పగలిగింది లేదు.


చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు బారులు తీరాయంటే అక్కడ చౌకగా వస్తు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుకు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఉన్న స్థానిక మార్కెట్లో అమ్ముకొనేందుకు అని గ్రహించాలి. ప్రపంచ కంపెనీలు 2020లో చైనా నుంచి 900 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు చేయగా 1.4లక్షల కోట్ల డాలర్ల మేర స్థానికంగా విక్రయించారంటే దాని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చని కియర్‌నీ గ్రేటర్‌ చైనా సంస్థ చైర్మన్‌ హి షియావోక్వింగ్‌ అన్నాడు. 2015 నాటికి చైనాలో విదేశీ పెట్టుబడులతో పని చేసే వివిధ కంపెనీల 8,36,595 ఉన్నట్లు, 2020 చివరి నాటికి అవి 10,40,480కి పెరిగినట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. అందువలన కొన్ని వేల కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్లినా అదేమీ పెద్ద పరిణామం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d