• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !

18 Saturday Mar 2023

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Asle Toje, BJP, BJP Propaganda, fake news, godi media, Narendra Modi, Nobel peace prize, PM Modi


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ – ఇంద్రుడు చంద్రుడు అంటూ భజన చేస్తున్న గోడీ మీడియా పరిస్థితి మింగా కక్కలేకుండా ఉంది. సామాజిక మాధ్యమాల్లో మోడీ, హిందూత్వ సంస్థలు, శక్తులకు సంబంధించి అనేక అతిశయోక్తులతో కూడిన కుహనా(ఫేక్‌), వక్రీకరణ సమాచారం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజమే అని నమ్మిన మీడియా కూడా భుజాన వేసుకొని తరువాత తేలుకుట్టిన దొంగల్లా ఉన్న ఉదంతాలు ఎన్నో. తాజాగా నరేంద్రమోడీని అపహాస్యం పాలు చేసే ఉదంతం జరిగింది. అది ఏ బిబిసి లేదా మరొక విదేశీ సంస్థ చేసి ఉంటే ఇంకేముంది ? నోబెల్‌ శాంతి బహుమతికి నరేంద్రమోడీ అతిపెద్ద పోటీదారుగా ఉన్నట్లు, విశ్వసనీయత ఉన్న పెద్దవాడైన రాజనీతిజ్ఞుడిగా గుర్తించినట్లుగా నోబెల్‌ బహుమతి కమిటీ ఉపనేత అస్లీ టోజె చెప్పారని జాతీయ మీడియా ప్రచారం చేసింది.రామ రామ తానసలు అలా చెప్పలేదని టోజె ఖండించాడు. అది ఫేక్‌ వార్త అని దానికి శక్తి లేదా ప్రాణ వాయువును అందించవద్దని అన్నాడు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించే ప్రబుద్దుల మాదిరి మోడీకి శాంతి బహుమతి లాంఛనంగా ప్రకటించటమే తరువాయి అన్నట్లుగా మీడియా పెద్దలు కథలు అల్లారు. ఎవరో ఒక కొత్త రిపోర్టరు లేదా సబ్‌ ఎడిటర్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. ఒక టీవీ సంపాదకుడు, బడా టీవీ ఛానళ్లు, పత్రికలు దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా వ్యవహరించాయి.


నోబెల్‌ కమిటీ నిబంధనల ప్రకారం ఫలానా సంవత్సర బహుమతుల కోసం ఎందరు, ఎవరు పోటీ పడ్డారు అన్న వివరాలను 5 దశాబ్దాల పాటు వెల్లడించకూడదు అన్నది నిబంధన. అలాంటిది కమిటీ ఉపనేతే మోడీ ప్రధాన పోటీదారు అని చెప్పాడంటే వాస్తవమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. అసలు గతంలో పోటీ పడుతున్నారంటూ ఎవరి గురించీ అలాంటి వార్తలు రాలేదు.ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అస్లీ టోజెతో విలేకర్లు మాట్లాడారు.టోజె చెప్పినదానిని వక్రీకరించారు. తాను నోబెల్‌ కమిటీ ఉపనేత హౌదాలో ఢిల్లీ రాలేదని, అంతర్జాతీయ శాంతి మరియు అవగాహన సంస్థ డైరెక్టర్‌గా ఇండియా సెంటర్‌ ఫౌండేషన్‌(ఐసిఎఫ్‌) స్నేహితుడిగా వచ్చానని టోజె ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు.” ఒక కుహనా వార్త ట్వీట్‌ను చేశారు.దాన్ని కుహనా వార్తగా చూడాలి. ఇక్కడకు భారత రాజకీయాలు, అభివృద్ది గురించి మాట్లాడటానికి వచ్చాను.కుహనా వార్త గురించి చర్చించకూడదు లేదా దానికి శక్తి లేదా ప్రాణవాయువును అందించాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్‌లో రాసినట్లుగా నేనేమీ చెప్పలేదని విస్పష్టంగా చెబుతున్నాను.” అన్నాడు.


అస్లీ టోజె టైమ్స్‌నౌ ఛానల్‌ విలేకరితో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ సంక్షోభంలో ప్రధాని నరేంద్రమోడీ ఒక సానుకూల వైఖరితో స్పందించారు.అణ్వాయుధాలను వాడవద్దని రష్యాను హెచ్చరించారు.వర్తమానం యుద్ధాల యుగం కాదని వ్లదిమిర్‌ పుతిన్‌కు చెప్పారు.ప్రపంచంలో బాధ్యత కలిగిన ఏ నేత అయినా ఇలాంటి సందేశమివ్వటానికే ఇష్టపడతారు. అన్నింటి కంటే ముఖ్యమైనదేమంటే భారత్‌ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఇలాంటి సందేశం వచ్చింది.” అని చెప్పాడు.ఫేక్‌న్యూస్‌ను వండి వార్చింది టైమ్స్‌ నౌ అని తేలింది. ఏకంగా దాని సంపాదకుడు రాహుల్‌ శివశంకర్‌ తప్పుదారి పట్టించే ట్వీట్లు చేశారు. నరేంద్రమోడీని పొగడటాన్ని అవకాశంగా తీసుకొని నోబెల్‌ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు చిత్రించి ఆ మాటలను టోజె నోట్లో పెట్టారు.దీంతో మోడీని ఆకాశానికి ఎత్తుతూ మిగతా వారంతా నిర్ధారించుకోకుండా ప్రచారం చేశారు. టైమ్స్‌నౌ ఛానల్‌తో మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా అసలు ఆ ప్రస్తావన లేదు. ఐసిఎఫ్‌ చైర్మన్‌ వైభవ్‌ కె ఉపాధ్యాయ ఈ వార్త గురించి మాట్లాడుతూ టోజె చెప్పిన మాటలను తప్పుడుగా చిత్రించారన్నారు.టీవీ ఛానళ్లు పొరపాటున లేదా అత్యుత్సాహంతో అలా చేసి ఉండవచ్చు.పధకం ప్రకారం చేసి ఉంటే అది నేరపూరితం అన్నారు. ఐసిఎఫ్‌ కార్యక్రమం కోసం ఏర్పడిన కమిటీ సభ్యుడైన మనోజ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ తాను పూర్తిగా అస్లీ టోజెతోనే ఆ రోజు మౌర్య షెరటన్‌ హౌటల్లో ఉన్నానని, టైమ్స్‌ నౌ విలేకరితో సహా ఇతరులతో మాట్లాడినపుడు తాను విన్నానని వారితో లేదా ప్రధాన ప్రసంగంలో గానీ మోడీ గురించి అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. న్యూ ఇండియన్‌ ఛానల్‌ యాంకర్‌ మోడీ-బహుమతి గురించి అడిగిన అంశం మీద టోజె మాట్లాడుతూ ఏ నాయకుడైనా బహుమతిని గెలుచుకొనేందుకు తగినంత కృషి చేయాలి, ముందు పని జరగాలి తరువాత బహుమతులు వస్తాయి ” అన్నాడు తప్ప మోడీ పోటీదారనో మరొకటో చెప్పలేదు.నోబెల్‌ బహుమతి సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 2023 బహుమతికి 305 నామినేషన్లు రాగా వాటిలో 212 మంది వ్యక్తులు, 93 సంస్థలవి ఉన్నాయి. అసలు నరేంద్రమోడీ నామినేషన్‌ ఉన్నదో లేదో కూడా తెలియదు.


మన పత్రికలు, టీవీ ఛానళ్ల తీరు తెన్నులు, అవి ప్రచారం చేసే ఫేక్‌ వార్తల గురించి గత సంవత్సరంలో లాజికల్‌ ఇండియా పేర్కొన్నవాటిని కొన్నింటిని చూద్దాం. టిప్‌ టిప్‌ భర్సాపానీ అనే మన హిందీ పాటకు పాకిస్తాన్‌ రాజకీయవేత్త అమీర్‌ లియాకత్‌ హుసేన్‌ డాన్స్‌ చేసినట్లు ఒక వీడియో వైరలైంది.నిజానికి అతను సొహాయిబ్‌ షుకూర్‌ అనే డాన్స్‌మాస్టర్‌. టైమ్స్‌ నౌ, నవభారత్‌ రాజకీయవేత్తగా చిత్రించాయి. అసోంలోని ఒక టీ అమ్మే కుర్రాడు రాహుల్‌ కుమార్‌ దాస్‌ నీట్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రాంకు తెచ్చుకొని ఎయిమ్స్‌లో సీటు పొందినట్లు మీడియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టింది. తీరా చూస్తే అతను పరీక్ష రాసింది నిజమే కానీ వచ్చిన రాంకు 9,29,881. మార్కులను తిమ్మినిబమ్మిని చేసి అతను చెప్పిన కథనాన్ని గుడ్డిగా ప్రచారం చేశారు. నిజం వెల్లడి కాగానే అతను, అతని సోదరి, తల్లి కనిపించకుండా పోయారు. టీవీ9 భరత్‌వర్ష్‌ ఛానల్‌ శ్రీ లంకలోని హంబంటోటా రేవు గురించి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ ప్రాంతమంతా చైనా అదుపులో ఉందని, మొత్తం 500 వందల తనిఖీ కేంద్రాలున్నట్లు, పైకి కనిపించకుండా చైనా మిలిటరీ ఉందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలను బానిసలుగా తెచ్చి అక్కడ పని చేయిస్తున్నారని దానిలో పేర్కొన్నది. అదంతా అవాస్తవం అని, సంచలనం కోసమే అలాంటి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది.


అసోంలో భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో ఒక వంతెన కూలినట్లు ఆజ్‌తక్‌, టీవీ9, ఇండియాటీవి,ఆసియానెట్‌, ఇతర సంస్థలు ప్రసారం చేశాయి.నిజానికి ఆ వంతెన ఏడాది క్రితం ఇండోనేషియాలో కూలింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ముస్లిం దుండగులు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు మీడియా సంస్థలన్నీ ప్రసారం చేశాయి.నిజానికి ఆ ఉదంతంలో పాల్గొన్నది హిందువులని తేలింది. తెలంగాణాలో వరదలు అంటూ టీవీలు ఒక వీడియోను ప్రసారం చేశాయి. జెసిబి ట్రాక్టర్‌ నుంచి వరద బాధితులను కాపాడుతున్న హెలికాప్టర్‌ దృశ్యమది. నిజానికి ఆ ఉదంతం 2021నవంబరులో అదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదిలో జరిగింది. ఒక కామెడీ కథనాన్ని నిజమని నమ్మి చైనా అధినేత షీ జింపింగ్‌ను అరెస్టు చేశారంటూ సాగించిన తప్పుడు వార్తలు, దృశ్యాల గురించి తెలిసిందే. పదకొండు సంవత్సరాల నాటి 2జి కుంభకోణం అరెస్టయిన మాజీ మంత్రి ఏ రాజా అంటూ ఒక వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అనేక పత్రికలు, టీవీలు గుడ్డిగా తాజా వార్తగా ప్రసారం చేశాయి.పీఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మీద గెలిచిన సౌదీ అరేబియా క్రీడాకారులందరికీ రోల్స్‌రాయిస్‌ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు వచ్చిన తప్పుడు వార్తను ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఇచ్చాయి.


అసలు గమనించాల్సిందేమంటే ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి చేసిన కృషి ఏమిటి అన్నది ప్రశ్న. తటస్థంగా ఉండటం, ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి మాట్లాడిన వారిలో మోడీ ఒకరు తప్ప నివారణకు ఇతరుల కంటే భిన్నంగా చేసిందేమీ లేదు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో విశ్వగురువు, ప్రపంచ నేత అని ఎవరెన్ని చెప్పినా ఏ అంశంలోనూ నిర్దిష్టపాత్రను పోషించి ఒక అంశాన్ని కొలిక్కితెచ్చిన ఉదంతం లేదు. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా రెండూ మనకు మిత్రదేశాలే. అలాంటి స్థితిలో అమెరికా బెదిరింపులు, వత్తిడికి లొంగి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అంటే అమెరికా వైపు నిలిచినట్లు సందేశమిచ్చాము. ఆ రెండు దేశాలూ ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసినా మన దేశం వైపు నుంచి చేసిందేమీ లేదు. చిత్రం ఏమంటే ఇష్టం ఉన్నా లేకున్నా వెంటనే అమెరికా సానుకూలంగా స్పందించింది. ఆరు రోజుల తరువాత మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మాట్లాడుతూ సమస్యల పరిష్కార చర్చలకు మన దేశం ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందని ముక్తసరిగా మాట్లాడారు.ఇరాన్‌-సౌదీ ఒప్పందం కుదరటానికి చైనా నిర్వహించిన పాత్ర చివరి క్షణం వరకు ప్రపంచానికి బహిరంగంగా తెలియదు. ఇలాంటి చొరవ తొమ్మిదేండ్ల కాలంలో నరేంద్రమోడీ వైపు నుంచి ఎక్కడా లేదు. మన దేశంలోని జాతీయ టీవీలు, పత్రికలకు దీని గురించి తెలియదని అనుకోగలమా ? ప్రపంచ శాంతికి నరేంద్రమోడీ ఏమి చేశారని నోబెల్‌ బహుమతి వస్తుందని అలాంటి కుహనా వార్తలకు తావిచ్చినట్లు ?ఎవరినైనా ప్రభావితం చేయగల నరేంద్రమోడీ నోబెల్‌ కమిటీని పైరవీ చేసి బహుమతి తెచ్చుకోగల సమర్థత ఉందని జర్నలిస్టులు నిజంగా నమ్ముతున్నారా ? నోబెల్‌ కమిటీ ఉపనేత గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన అంశాన్ని ప్రపంచ మీడియా మూసిపెడుతుందా ? విశ్వగురువుగా చెబుతున్న నరేంద్రమోడీకి ప్రపంచంలో ఎంత పరువు తక్కువ ? ప్రపంచ నేతలకు ఈ వార్తలు చేరకుండా ఉంటాయా ? భారత్‌ గురించి విదేశీ మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు మోడీ మద్దతుదార్లు ఊరూవాడా నానా యాగీ చేస్తున్నారు. తమ నేత పరువు తీసిన ఈ ఉదంతం గురించి ఎలా స్పందిస్తారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

17 Friday Mar 2023

Posted by raomk in AP, AP NEWS, BRS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2023-24, AP CM YS Jagan, AP debt, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్‌ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్‌ పత్రాల్లో ఎకౌంట్స్‌ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్‌ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.


చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్‌ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్‌ సర్కార్‌ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్‌ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్‌ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.


గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్‌ సర్కార్‌ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?


ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్‌ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్‌ఆర్‌ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్‌ సర్కార్‌ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్‌సి (సబ్‌ప్లాన్‌ )నిధులుగా రు.20,005, ఎస్‌టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్‌ఆర్‌ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.


పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?


ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్‌ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్‌ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్‌ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !

15 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Iran Tanker, Israel, Narendra Modi Failures, Saudi Arabia, Saudi-Iran Deal, U.S. Mideast designs, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్య ప్రాచ్యంలో ఉప్పు నిప్పు మాదిరి ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మార్చి నెల పదవ తేదీన కుదుర్చుకున్న ఒప్పందం కొన్ని దేశాలను కంపింప చేస్తే, అనేక మందికి నిజమా అన్న ఆశ్చర్యానికి గురి చేసిందనే వర్ణనలు వెలువడ్డాయి. ఈజిప్టులోని సూయజ్‌ కాలువ 1956 వివాదం తరువాత బ్రిటిష్‌ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడినట్లే ఈ ఒప్పందం ఆమెరికా పెత్తనానికి తెరదించేందుకు నాంది అన్నట్లుగా కొందరు వర్ణించారు. దీని కంటే ఆ ఒప్పందం చైనా రాజధాని బీజింగ్‌లో కుదరటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ఇరాన్‌-సౌదీ ప్రత్యక్ష పోరుకు తలపడనప్పటికీ అనేక చోట్ల ఏదో ఒక పక్షానికి మద్దతు ఇస్తూ గడచిన నాలుగు దశాబ్దాలుగా పరోక్షంగా శత్రుదేశాలుగా మారాయి. గత ఏడు సంవత్సరాలుగా దౌత్య సంబంధాలు కూడా లేవు. బీజింగ్‌ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు నెలల్లోగా రాయబార కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది.ఇటీవలి కాలంలో దేశాలు ఏదో ఒక పక్షాన చేరటం లేదా తటస్థంగా ఉండటాన్ని ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం స్పష్టం చేసింది. అమెరికా, పశ్చిమ దేశాలకు తాన తందాన అనేందుకు పేద, వర్ధమాన దేశాలు సిద్దంగా లేవు అనే సందేశాన్ని కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఇరాన్‌-సౌదీ ఒప్పందం ఈ కూటమికి మింగుడుపడకపోయినా అమెరికా హర్షం ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం నాటి వరకు మన దేశం దీని గురించి ఎలాంటి స్పందన వెల్లడించలేదు.


రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి దారితీసిన కారణాలేమిటి ? షియా మతపెద్ద నిమిర్‌ అల్‌ నిమిర్‌తో సహా 50 మందిని సౌదీ అరేబియా 2016 జనవరి రెండున ఉరితీసింది. దీనికి నిరసనగా టెహరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం మీద ఇరానియన్లు దాడి చేశారు. ఇరాన్‌ అధిపతి అయాతుల్లా అలీ ఖమేనీ కక్ష తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. జనవరి మూడవ తేదీన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ ప్రకటించింది. ఎమెన్‌లోని తమ రాయబార కార్యాలయం మీద సౌదీ వైమానిక దాడులు చేసినట్లు ఏడవ తేదీన ఇరాన్‌ ఆరోపించింది. వాస్తవం కాదని సౌదీ ఖండించింది. వార్షిక హాజ్‌ యాత్రకు వెళితే రక్షణకు హామీ లేదని, సౌదీ కుట్రకు పాల్పడవచ్చంటూ తన యాత్రీకుల మీద ఇరాన్‌ మేనెల 29న నిషేధం విధించింది.తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడికి ఇరాన్‌ కారకురాలని, దాని వలన తమ దేశంలో సగం సరఫరా నిలిచిందని సౌదీ చేసిన ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ గ్రూపు తామే దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్‌ మిలిటరీ అధికారి ఖాశిం సొలిమనీ బాగ్దాద్‌లో 2020జనవరి మూడున అమెరికా డ్రోన్‌దాడిలో మరణించారు. అతను ఇరాన్‌-సౌదీ మధ్య సంబంధాల పునరుద్దరణకు కృషి చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత 2021 ఏప్రిల్‌ తొమ్మిదిన బాగ్దాద్‌లో సౌదీ-ఇరాన్‌ తొలి చర్చలు జరిగాయి. ఐదవ దఫా చర్చలు జరగనుండగా 41 మంది షియా ముస్లింలను సౌదీలో ఉరితీశారు. దాంతో ఎలాంటి కారణం చూపకుండా 2022 మార్చి 13న చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 21న ఐదవ దఫా చర్చలు జరిగాయి. అక్టోబరు 19న రాయబార కార్యాలయాలను రెండు దేశాలూ తెరవాలని ఇరాన్‌ అధిపతి ఖమేనీ సలహాదారు ఒక ప్రకటన చేశాడు. డిసెంబరు తొమ్మిన చైనా అధినేత షీ జింపింగ్‌ సాదీ సందర్శన జరిపి రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపాడు.ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బిజింగ్‌ను సందర్శించి షీ జింపింగ్‌తో చర్చలు జరిపాడు. మార్చి పదవ తేదీన ఒప్పందం కుదిరింది.


ఒప్పందం కుదరటమే గొప్ప ముందడుగు. సంవత్సరాల తరబడి తెరవెనుక చైనా మంత్రాంగంతో రెండు దేశాలనూ ఒక దగ్గరకు తేవటం ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం అని చెప్పటం కంటే తరుగుతున్న అమెరికా, పశ్చిమ దేశాల పలుకుబడి అనటం సముచితంగా ఉంటుంది. ఈ ఒప్పందం ఇరాన్‌-సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యం, చైనా విజయంగా కొందరు చూస్తున్నారు. ప్రపంచం అమెరికా చెప్పినట్లు నడిచే రోజులు గతించాయనే సందేశాన్ని కూడా ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉన్న చమురు సంపదలు, భౌగోళికంగా ఉన్న ప్రాధాన్యత రీత్యా గతంలో బ్రిటన్‌, తరువాత అమెరికా ఆప్రాంతంపై పట్టుకోసం చూశాయి.దానిలో భాగంగా చిచ్చు రేపాయి.ఏదో ఒక పక్షం వహించి రెండోదాన్ని దెబ్బతీసి తన అదుపులో పెట్టుకోవటం, చివరకు నాటో తరహా కూటమిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తన పట్టులో బిగించుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. సాధారణ సంబంధాల ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ఇరాన్‌-సౌదీ మధ్య తలెత్తిన వివాదాలు, పరస్పర అనుమానాలు కూడా పరిష్కారం కావాల్సిఉంది. ఈ ఒప్పందానికి హామీదారుగా ఉన్న చైనా ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వివాదాల్లో ఏదో ఒక పక్షంవైపు మొగ్గుచూపిన దాఖలాల్లేని కారణంగానే రెండు దేశాలూ దాన్ని నమ్మి ముందుడుగువేశాయి. ఇది మిగతా వివాదాలకూ విస్తరిస్తే అమెరికాను పట్టించుకొనే వారే ఉండరు గనుక దీన్ని ముందుకు పోకుండా చూసేందుకు చేసేందుకు అది చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.1979లో అమెరికా మద్దతు ఉన్న ఇరాన్‌ షా ప్రభుత్వం పతనమైన తరువాత అమెరికా ఆ ప్రాంతంలో తలెత్తిన వివాదాల్లో ఇరాన్‌-సౌదీ ఘర్షణ పెరిగింది. ఇరాన్ను శత్రువుగా, సౌదీని మిత్రదేశంగా అమెరికా పరిగణించింది.


సయోధ్య అవసరమని రెండు దేశాలూ గుర్తించినందువల్లనే ఈ ఒప్పందానికి దారి తీసింది తప్ప చైనా వత్తిడేమీ దీనిలో లేదు.దీనిలో చైనా ప్రయోజనాలు లేవా అంటే దాని కంటే ఆ రెండు దేశాల, ప్రాంత ప్రయోజనాలు ఎక్కువ అన్నది స్పష్టం. ప్రస్తుతం ఉన్న కొన్ని వివాదాలను చూద్దాం. లెబనాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో హిజబుల్లా సంస్థకు ఇరాన్‌, ప్రత్యర్ధి పక్షాలకు సాదీ మద్దతు ఉంది. సిరియాలో దశాబ్దికాలానికి పైగా సాగుతున్న పోరులో సౌదీ మద్దతు ఉన్న జీహాదీలకు, ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హిజబుల్లా, ఇతర మిలిటెంట్లకు వైరం ఉంది. ఎమెన్‌లో అమెరికా మద్దతుతో సౌదీ దాడులకు దిగుతున్నది. అక్కడ హౌతీ మిలిటెంట్లకు ఇరాన్‌ మద్దతు ఉంది.వారు కొన్ని సందర్భాలలో సౌదీ చమురు టాంకర్ల మీద కూడా దాడులు జరిపారు. ఇరాన్‌లో అత్యధికులు షియా తెగ ముస్లింలు కాగా సౌదీలో సున్నీలు ఉన్నారు.ఇరాక్‌, బహరెయిన్‌లో, చివరికి సౌదీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న సున్నీ-షియా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో అవి క్రమంగా తగ్గుతాయి తప్ప పెరగవు అన్నది అందరూ చెబుతున్నారు. ఇంతకాలం సౌదీ-ఇరాన్‌ వివాదాలతో లాభపడిన అమెరికాకు ఈ పరిణామం సుతరామూ అంగీకారం కాదు. దానికి నిరంతరం ఉద్రిక్తతలు, ఘర్షణలు ఉండాల్సిందే. ప్రపంచంలో అస్థిరతకు అమెరికా చూస్తుంటే సుస్థిరతకు చైనా చేయూత నందిస్తోంది. అమెరికా ఎక్కడ కాలుపెట్టినా తన ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకొనే ఉద్రిక్తతల సృష్టి తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదు.


ఎందుకు సౌదీ అరేబియా అమెరికా నుంచి దూరంగా జరుగుతోంది ? పెట్రో డాలరు బదులు పెట్రో యువాన్‌కు సౌదీ మొగ్గుచూపుతున్నదన్న వార్తలు అమెరికా నేతలకు రక్తపోటును పెంచుతున్నాయి. దీనికి తోడు బ్రెజిల్‌,రష్యా,భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు, తద్వారా రష్యా, చైనాలకు దగ్గర కావాలని సౌదీ చూడటం కూడా దానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఒప్పందాన్ని వ్యతిరేకిస్తే మరింత నష్టమని కావచ్చు, మంచిదేగా అన్నట్లు తడిపొడిగా స్పందించింది. నిజానికి ఒప్పందం కుదరకుండా తెరవెనుక ఎంత చేసినా సాధ్యం కాలేదు.” దీని గురించి మాకు ఎప్పటికప్పుడు సౌదీ చెబుతూనే ఉంది. మేము చేసేది మేము చేస్తున్నాంగానీ నేరుగా ప్రమేయం పెట్టుకోలేదు.ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గటానికి చేసే యత్నాలకు మేము మద్దతు ఇస్తాం, అది మాకూ అవసరమే, మా పద్దతిలో మేమూ చేశాం ” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ అన్నాడు. ఇరాన్‌ పట్ల అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనత కారణంగానే సౌదీ తన దారులు తాను వెతుక్కొంటోందని ఒప్పంద ప్రకటన వార్త వెలువడగానే ఇజ్రాయెల్‌ స్పందించింది. అమెరికా పధకాల ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాల మీద దాడులు జరపాలన్న తమ కలనెరవేరదనే దుగ్గదానికి ఉంది. పాతిక సంవత్సరాల పాటు అమెరికా విదేశాంగశాఖలో మధ్య ప్రాచ్య విధాన సలహాదారుగా పనిచేసిన అరోన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఎన్‌బిసి టీవీతో మాట్లాడుతూ ” ఆ ప్రాంతంలో అమెరికా పలుకుబడి, విశ్వసనీయత తగ్గుతున్నట్లుఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కొత్త అంతర్జాతీయ ప్రాంతీయ పొందికలు చోటు చేసుకుంటున్నాయి, అవి చైనా, రష్యాలకు సాధికారతను, వాటి స్థాయిని పెంచినట్లుగా ఉంది ” అన్నాడు.ఉక్రెయిన్‌ వివాదం పేరుతో రష్యామీద ప్రకటించిన ఆంక్షలను అనేక దేశాలు తిరస్కరించిన నేపధ్యంలో అమెరికా పలుకుబడి గురించి ఏ దేశమైనా ఒకటికి రెండు సార్లు తన విధానాలను సమీక్షించుకుంటుంది. దానికి సౌదీ అరేబియా మినహాయింపు కాదని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


మధ్య ప్రాచ్యపరిణామాల్లో అమెరికా వైఖరిని చూసిన తరువాత ఇరాన్‌-సౌదీ రెండూ పునరాలోచనలో పడటంతో పాటు, సర్దుబాట్లకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి అమెరికా విధించిన ఆంక్షలతో ఆ ప్రాంత దేశాల నుంచి ఇరాన్‌ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. సౌదీదీ అదే పరిస్థితి, అమెరికాను నమ్ముకొని దాని పధకంలో భాగంగా పని చేస్తే సాధించేదేమీ ఉండదని తేలింది. ఇరాన్‌తో చైనా, రష్యాల సంబంధాలు మరింతగా బలపడటంతో అమెరికాతో వైరం కారణంగా ఇరాన్‌ మరింత బలపడుతుందనేది సౌదీకి అర్దమైంది.దీనికి తోడు ఈ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా మాదిరి ఏ ఒక్క దేశంతోనూ అది ఘర్షణాత్మకవైఖరిని ప్రదర్శించటం లేదు.తన ఎత్తుగడలు, భావజాలాన్ని రుద్దటం లేదు. ఒకదానితో మరొకదానికి తంపులు పెట్టి పబ్బంగడుపుకోవటం లేదు.పరస్పర లబ్ది పొందే పెట్టుబడులు పెడుతున్నది.అందువల్లనే దానితో ప్రతి దేశమూ సంబంధాలు పెట్టుకొనేందుకు చూస్తున్నది. ఇరాన్‌-సౌదీ ఒప్పందం గురించి తొలుత ఇరాక్‌, ఒమన్‌ వంటి ప్రాంతీయ తటస్థ దేశాల్లో ఐదు దఫాలు ప్రాధమిక చర్చలు జరిగాయి. 2030నాటికి ప్రపంచంలో అగ్రశ్రేణి పది దేశాల్లో స్థానం సంపాదించాలంటే అమెరికా ఆధారిత విధానాలతో లాభం లేదని సౌదీకి అర్ధమైంది. అన్నింటి కంటే ఇరుగు పొరుగుదేశాల్లో అస్థిరత్వం, ఘర్షణల వాతావరణం ఉంటే అది ప్రారంభించిన హరిత చొరవ ముందుకు వెళ్లే అవకాశం లేదు. సౌదీతో సర్దుబాటు చేసుకుంటే ఇతర అరబ్బుదేశాలు తమ మీద దాడికి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని ఇరాన్‌కు అర్ధమైంది. ఒంటరి తనం నుంచి అభివృద్ధి వైపు వెళ్లాలంటే మరొక దగ్గరదారి లేదు.తనను బూచిగా చూపి మధ్య ప్రాచ్య నాటో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు మరొక మార్గం లేదు. ఒప్పందాలకు చైనా హామీదారుగా ఉన్నందున రెండు దేశాలకు పెద్ద భరోసా అన్నది స్పష్టం. చైనాకు తెరవెనుక అజండా లేదు. బిఆర్‌ఐ పేరుతో అది రూపొందించిన పథకంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్నది. తమ మీద వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన పోరుకు దిగిన అమెరికాను ఎదుర్కొనేందుకు అంతర్గతంగా మార్కెట్‌ను సృష్టించుకోవటంతో పాటు తన ఎగుమతులకు ఇతర మార్కెట్లను వెతుక్కోవలసిన అవసరాన్ని పశ్చిమ దేశాలు ముందుకు నెట్టాయి. ఇరాన్‌-సౌదీ ఒప్పందం మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

11 Saturday Mar 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, kavitha, Narendra Modi, Narendra Modi Failures, SITARAM YECHURY, women reservation, Women's Quota Bill


ఎం కోటేశ్వరరావు


ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది ! మన గడ్డ అలాంటిదేమరి అంటూ తెగమురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం !! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం.ఎంతటి ఆత్మవంచన ! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా ? ఆమె దీక్ష తెరవెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెరముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా ? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛన ప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు.నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మాగాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది.తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పధకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వుచేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992,93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడోవంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దుకావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఏ సర్కార్‌ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్‌ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది.మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199-1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్టరూపందాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు.


రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడోవంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది.అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిదిశాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్‌ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా(61.25) , క్యూబా( 53.22),బొలీవియా(53.08), న్యూజిలాండ్‌( 50.42), యుఏయి (50), మెక్సికో(48.2), నికరాగువా(47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40శాతంపైగా, ప్రపంచవ్యాపితంగా సగటున 26శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్‌ 43, బంగ్లాదేశ్‌ 98, పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182వదిగా ఉంది.


మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెనమెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు.పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్‌ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీచేసే వారిలో నిర్ణీతశాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.


చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడోవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీటవేసేందుకు ముందుకు వస్తున్నాయి. దోషులుగా తేలేంతవరకు నిందితులు తప్ప ఎవరూ నేరస్థులు కాదనే నిబంధనను అవకాశంగా తీసుకొని వారి కండబలాన్ని తోడు చేసుకొనేందుకు బరిలో నిలుపుతున్నాయి.తొలి లోక్‌సభలో ధనికులు, నేరచరితులు ఎందరు అని వెతికేందుకు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ధనికులు కానివారు ఎందరు, నేర చరిత లేనివారు ఎందరు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది.


గతంలో రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం మూడోవంతు సీట్లను చట్ట సభల్లో మహిళలకు కేటాయించాలి. షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయించిన సీట్లలో కూడా మూడోవంతు మహిళలుండాలి.ఏ రాష్ట్రంలోనైనా మూడు కంటే తక్కువ లోక్‌సభ సీట్లుంటే అక్కడ మూడోవంతు సూత్రం వర్తించదు.ఎక్కడైనా మూడు సీట్ల కంటే తక్కువ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తే అక్కడ కూడా రిజర్వేషన్‌ ఉండదు. రిజర్వుడు సీట్లను రొటేషన్‌ పద్దతిలో కేటాయించాలి. మైనారిటీ,ఓబిసి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు.రాజ్యసభ, శాసనమండళ్లకు రిజర్వేషన్‌ వర్తించదు.పదిహేను సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.


ఎన్నికల నిబంధనవాళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్‌ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43శాతం మంది ఉన్నారు.లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీల వారీగా బిజెపి 116(39శాతం), కాంగ్రెస్‌ 19(57శాతం), జెడియు 13(81శాతం), డిఎంకె 10(43శాతం) తృణమూల్‌ 9(41) మంది ఉన్నారు.గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162(30శాతం) నుంచి 2014లో 185(34శాతం), 2019లో 233(43శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేరచరితుల మీద ఉన్న కేసులలో 29శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి.బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌,ఎన్‌సిపి,వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్యకేసులు, బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఉగ్రవాద కేసు ఉంది.ఆమె భోపాల్‌ నుంచి గెలిచారు, మాలెగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియకోస్‌ మీద దొంగతనంతో సహా 204కేసులు గరిష్టంగా ఉన్నాయి.


ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు.2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్దిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కాశ్మీరు రాష్ట్ర రద్దు, ఆర్టికల్‌ 370 రద్దును ఆఘమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం కమిటీపై కందకు లేని అనుమానం కాషాయదళాలకెందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై మద్దతుదార్ల మండిపాటు !

05 Sunday Mar 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, Narendra Modi Failures, RSS, Saffron gang, Supreme Court of India



ఎం కోటేశ్వరరావు


తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీం కోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది.సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.


దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు.నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు ? భీమకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటిదానికి అవకాశం లేదు.వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు ? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీం కోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీం కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.


ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోడీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీం కోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు.అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు ? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా,దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్రమోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.


సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే ! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు.కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి ? మేము చెప్పిన వారితో చెప్పినపద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే.పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోడీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు.తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో కేసుల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రభుత్వాలు, ఏజన్సీలను కోరిన సమాచారాన్ని సీల్డు కవర్‌లో అందించాలని అడుగుతాయి. అదానీ కంపెనీలదంతా బహిరంగం అయినపుడు విచారణ రహస్యంగా జరగాల్సిన అవసరం ఏముంది ? కమిటీ విచారణ అంశాలు, పరిధి గురించి పిటీషనర్లకు తెలియాల్సి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించి ఒక కమిటీని తానే ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరులో కేరళ టీవీ ఛానల్‌ మీడియా వన్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ సీల్డుకర్‌ను సుప్రీం తిరస్కరించింది. కక్షిదారు వాటిని చూడకుండా అవకాశాన్ని నిరోధించటమే అవుతుందని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఒక అంశాన్ని రహస్యమని భావించి సీల్డు కవర్‌లో ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు గనుక నిర్ణయిస్తే ప్రజా ప్రయోజనం పేరుతో దాన్ని చూసేందుకు, కాపీ కావాలని కోరేందుకు అవకాశం లేదు. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన ఢిల్లీ హైకోర్టును 2019లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది.తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది.రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది.2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.


ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి.ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీం కోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూత్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక(హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది.సుప్రీం కోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది.భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీం కోర్టు.అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ అదానీ ఎంత లబ్ది పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చౌకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత ! అదానీ సంపదను సృష్టించాడు.భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పేర్కొన్నారు.


మితవాద శక్తులలో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే.చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్‌ మీదకు కూడా మళ్లుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్‌ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.” లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఫ్‌ు పుట్టింది.పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది.వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు.దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు.విద్య,దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు. ఇలాంటివి బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనూ జరగలేదు.కానీ ఈ సమస్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్‌ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు.బాధ్యతల్లో ఉన్న సంఫ్‌ు నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్‌, సుదర్శన్‌,మధోక్‌, వాజ్‌పాయి) ఏ సర్‌ సంఫ్‌ు సంచాలక్‌ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నారు తప్ప సంఫ్‌ుకు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఫ్‌ు భావజాలం, పని ఏమిటి ?” అని శంకర్‌ సహారా ప్రశ్నించారు.


పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ,శాసన,కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు. చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార,పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికి కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడినపుడు అధికారంలో ఉన్న పాలకులు లేదా అధికారులు కొందరికి అనుకూలంగా ఉంటున్నకారణంగానే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు వాటిని బయట పెడతారంటే కొందరు నిజాయితీపరులైన వారు లేదా పోటీలో నష్టపోకపోయినా అవకాశం పొందని వారు అన్నది తెలిసిందే. అందువలన తాము బలపరుస్తున్నవారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేస్తే వాటిని మితవాద శక్తులు వ్యతిరేకించటం అంటే తామనుకున్నదాన్ని పొందలేకపోవటం తప్ప అవి కోర్టులకు పూర్తిగా వ్యతిరేకం అనో కోర్టులు పురోగామి వైఖరితో ఉంటాయనో అర్ధం కాదు.కోర్టుల మీద భ్రమలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది.జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింలపట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్గ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సియాటిల్‌ నగరంలో కులవివక్షపై నిషేధం – మహిళలందు కమ్యూనిస్టు క్షమా సావంత్‌ వేరయా !

26 Sunday Feb 2023

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination, Caste Discrimination Ban in Seattle, Casteism in America, Hindu Fundamentalism, Hinduthwa, Kshama Sawant, RSS, Seattle


ఎం కోటేశ్వరరావు


ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం గర్వంతో తల ఎత్తుకొనే పరిణామం.అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్‌ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్‌ క్షమా సావంత్‌ అనే 49 సంవత్సరాల భారతీయ మహిళ.తొలిసారి ఎన్నికైనపుడు కనీస వేతనం గంటకు 15 డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్‌ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు.రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ పత్రిక ” అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి ? ” అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నపుడు మేయర్‌ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మితవాదులు, కార్పొరేట్‌ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసిలోని అమెరికా అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ ప్రాంతం కొంత భాగం కూడా క్షమా సావంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ వార్డు(జిల్లా అని పిలుస్తారు) పరిధిలోకి వస్తుంది.


సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న మొత్తం తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. అటువంటి శక్తులకు క్షమా సావంత్‌ ప్రతినిధి. కానీ ఎక్కడకు వెళ్లినా కులవివక్ష కంపును మోసుకుపోతున్న సంస్కారం లేని జనాలు అమెరికాలో కూడా ఆ జాఢ్యాన్ని వదిలించుకోకపోగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.చివరికి ఇటీవల సినిమా అభిమానులు కొట్టుకొని కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే. అనేక మంది తాము కులవివక్ష పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఎలా చూడాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు అక్కడ కూడా మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు.


సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. వత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిస ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. కులాలు లేకపోతే హిందూత్వ వాదులకు ఉలుకెందుకు ? తాజాగా సియాటిల్‌ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలు లేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది ) ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎవరైనా చూడవచ్చు. భుజం మీద చేయివేసి జంధ్యం ఉందా లేదా అని నిర్ధారించుకొనే టెక్నాలజీ మన సొంతం. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను బ్లడీ బాస్టర్డ్స్‌అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం జరిగింది. అమెరికాలోని స్వామినారాయణ సంస్థ్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా వారే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్థులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్థలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.


మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్‌ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి.భర్త వివేక్‌ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్ధశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు.సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్‌ నగరపాలక సంస్థకు తొలిసారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమే సీనియర్‌. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమౌతానని ఆమె ప్రకటించారు. మన దేశం నుంచి అనేక మంది అమెరికా వెళ్లారు. ఎంపీలు, మంత్రిపదవులు వెలగబెట్టారు. ఇప్పుడు ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కష్మా సావంత్‌ మాదిరి ఎందుకు ఆలోచించలేదు ? మహిళలకు మాత్రమే వారి సమస్యలు అలాగే దళితులకు మాత్రమే దళితుల వారి సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా మాట్లాడేవారికి దళితురాలు కాని క్షమా సావంత్‌ ఆచరణ ఆలోచింపచేస్తుందా ? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ది కావాలి. అది ఉండబట్టే నాడు ఉన్నవ లక్ష్మీనారాయణను మాలపల్లి నవలా రచనకు పురికొల్పింది. లేనందునే అనేక మంది దళితులమని చెప్పేవారు మనువాదుల చంకనెక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. నాడు దళితుల కోసం పోరాడిన ఇతరులు అనేక మంది వారి సామాజిక తరగతికి ద్రోహం చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, మరి నేడు మనువాదుల వెంట తిరిగే దళితులు ఎవరికి ద్రోహం చేస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోడేళ్లను బుజ్జగిస్తున్న మేకలు : కేరళలో వివాదంగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌ – జమాతే చర్చలు !

23 Thursday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), JIH, Kerala LDF, Muslim League, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమదారికి తెచ్చుకోవటం అసాధ్యమా ? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్‌ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.


జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్‌ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.” ఆర్‌ఎస్‌ఎస్‌తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు.ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్చకు రక్షణ. దాన్ని విచ్చిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం ? సంఘపరివార్‌ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకు మద్దతు ఇస్తాయి.మతశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు.లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్‌ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్‌, సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమా, ముస్లిం లీగ్‌, కేరళ నదవతుల్‌ ముజాహిదీన్‌, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్‌ కాంతాపురం ఏపి అబూబకర్‌ ముస్లియార్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్‌ పేర్కొన్నది.మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది.భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పి పుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ఒక పనిముట్టుగా మారుతున్నది ” అని విమర్శించింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్‌ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్‌ పేర్కొన్నారు.


ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘపరివార్‌ నేతలు ఇంద్రేష్‌ కుమార్‌, రామ్‌లాల్‌, కృష్ణ గోపాల్‌ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్‌, జమాతే ఉలేమా ఇ హింద్‌, అజ్మీర్‌ దర్గా సల్మాన్‌ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, నజీబ్‌ జంగ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హౌటల్‌ ఓనరు సయిద్‌ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్‌ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్‌ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగాస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు భావించారు.ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్‌ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది.అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.


ఆర్‌ఎస్‌ఎస్‌-జమాతే ఇస్లామీ హింద్‌ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్‌ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్‌ పార్టీ, జమాతే పట్ల ముస్లింలీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్‌ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్‌ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్‌ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్‌ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్‌ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు.సిఎం పినరయి విజయన్‌ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.


ఖురాన్‌లో మూడుసార్లు తలాక్‌ అనే పద్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు ? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్‌ అనేదాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు.వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కులవృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు(బ్రాహ్మలు కాదు మేథావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా ! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు.కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారా ? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?


సిపిఐ(ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకువెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, యాత్ర సారధి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు.లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ ఎలా అంటారు ? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లింలీగ్‌ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్‌, సిఎస్‌ సుజాత, ఎం స్వరాజ్‌, కెటి జలీల్‌, జేక్‌ సి థామన్‌ సారధులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రు.40వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రు.9,000 కోట్లు, రెవెన్యూలోటు పరిహారం రు.6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పధకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది.రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

22 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, New START treaty, Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓరి మాయలోడో ఓరి మందులోడో : మోదానీ సినిమాలో ఒక రైల్వే పోర్టర్‌ సంచలనం !!

22 Wednesday Feb 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Modani, BJP, Gautam Adani, George Soros, Hindenburg effect, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.


ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.


భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్‌ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్‌ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఓటమి కోసం డెమోక్రటిక్‌ పార్టీకి సోరస్‌ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్‌ సెల్లింగ్‌ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్‌ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.


హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్‌ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్‌లో 1930లో జన్మించిన సోరస్‌ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్‌ చేరుకున్నాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్‌గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అసలు పడదు. ట్రంప్‌-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్‌ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్‌ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.

సోరస్‌ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్‌ సెల్లింగ్‌ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్‌ బాంకు షేర్లను అలాగే షార్ట్‌ సెల్లింగ్‌ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్‌కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్‌ ప్రభుత్వం పౌండ్‌ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్‌ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్‌ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రచార ఆర్భాటం తో మోసం- కంపెనీలకు ధనరాసులు-రైతులకు కన్నీరు-జన్యుమార్పిడి ఆవాలు

20 Monday Feb 2023

Posted by raomk in Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, corporates, Farmers, Gm Mustard seeds, GMO hybrids, Narendra Modi

డాక్టర్ కొల్లా రాజమోహన్,  

అధిక ధిగుబడులు వస్తాయనీ, గులాబీరంగు పురుగు బెడద తప్పుతుందనీ 2002 సం. లో బీ టీ పత్తిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రైతులకు తాత్కాలికంగా ఉపయోగపడింది. మోన్సాంటో లాంటి కంపెనీలకు లాభాల పంటపండింది. కాలం గడిచేకొద్దీ, బీటీ పత్తి వలన రైతులకు ప్రయోజనం లేకపోగా పురుగు బెడద విషమించింది. ప్రురుగు మందుల ఖర్చు ఎక్కువయింది. 2002 సం.లో హెక్టారుకు 100 కేజీల పురుగుమందుల వాడకం 2013సం.కి 220 కేజీలకు పెరిగింది. అయినా పురుగులు కంట్రోలుకాక పంట సగటు దిగుబడి హెక్టారుకు 554 కిలోలనుండి 445 కిలోలకు తగ్గిపోయి, పత్తికి ధర లేక, అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

బీటీ పత్తి విత్తనాలలో లాభాలను రుచిమరిగిన మోన్సాంటో, బేయర్స్ లాంటికంపెనీలు మానవులందరూ తినే కూరగాయలు, ఆహారధాన్యాలలో బీటీ ప్రవేశపెట్టి అధిక లాభాలనార్జించాలని కంపెనీలు విరామమెరుగని కృషి సాగిస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి  బీటీ వంకాయ, బీటీ బెండ పై గుంటూరు జిల్లా నారాకోడూరు లో 2005 సం.లో ప్రయోగాలను చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజాసంఘలు, మీడియా చేసిన ఆందోళన ఫలించి ఆ ప్రయోగాలను ప్రభుత్వం ఆపక తప్పలేదు. బీటీ వంకాయ పై మారటోరియం విధించారు. 

మొట్టమొదటి జన్యుమార్పిడి ఆహార పంట – ధారామస్టర్డ్ హైబ్రిడ్-11

ఇపుడు జన్యుమార్పిడి ఆవాలను (GM MUSTARD) ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం రంగం సిధంచేసింది. కేంద్ర పర్యావరణ శాఖ( MOEFC) క్రింద పనిచేసే జనిటెక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ (GEAC) జన్యుపరంగా మార్పు చేసిన బీ టీ ఆవాలకు 2022 అక్టోబర్ 25న అనుమతించింది. భారతదేశ శాస్త్రవేత్త దీపక్ పెంటేల్, ప్రభుత్వ నిధుల సహాయంతో ” ధారా మస్టర్డ్ హైబ్రిడ్-DMH-11”విత్తనాలను అభివృధిచేశారు. ఆవ మొక్క ఒక్క పువ్వు లోనే మగ స్టేమెన్-ఆడ పిస్టిల్  వుండటంవలన ప్రకృతిలో స్వతహాగా సహజసిధంగా సంపర్కం తేలికగాజరుగుతున్నది. కొత్తజన్యువులను పువ్వులో చొప్పించటానికి బార్-బార్నేస్-బార్ స్టార్ టెక్నాలజీని ఉపయోగించారు. బార్నేస్ పధతివలన మొగ స్టేమెన్ ను నిర్వీర్యం చేసి, బార్ స్టార్ పధతివలన భూమిలో నుండి సేకరించిన బాక్టీరియా బేసిల్లస్ ఆక్వాఫిసియన్స్ జన్యువు ను చొప్పించి ఆడ పిస్టిల్ నుఉత్తేజపరచి, సాంప్రదాయ ఆవాల మొక్కఅయిన వరుణ  జన్యువు తో సంకరం చేశారు. హెర్బిసైడ్ రెసిస్టెంట్ కలుపు మందును తట్టుకునేటట్లుగా బార్ జన్యువు ను ప్రవేశపోట్టారు. జన్యుమార్పిడి విత్తనాలే కాకుండా స్ధానిక “వరుణ “తో సంకరం వలన అధిక దిగుబడులు లభిస్తాయంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ గా జన్యు మార్పిడి చేసినందువలన పొలంలో కలుపు తీసే పని లేదంటున్నారు. హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపు మందు ను తట్టుకునే విధంగా జన్యువులను మార్చటం. కలుపు మందు కొట్తే ఈ జన్యుమార్పిడి ఆవాల పంట మాత్రమే బతుకుతుంది. కలుపు మొక్కలన్నీ నాశనం అవుతాయి.

ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు బహిరంగంగా పొలాలలో ప్రయోగాత్మకంగా సాగుచేయటానికి, ప్రదర్శనకు, విత్తనాల ఉత్పత్తికి అనుమతించారు. రాజస్ధాన్, పంజాబ్,హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 100 చోట్ల ప్రయోగాలను ఐ.సీ.ఏ. ఆర్ నిర్వహిచాలన్నారు. జీ ఎమ్ ఆవాల అనుమతి, దేశంలోతీవ్రమైన చర్చనీయాంశమయింది. జన్యుపరంగా మార్పుచెందిన ఆవాల పంట మన దేశంలో తేనె ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని జన్యుమార్పిడి పంట లో వచ్చిన తేనె ను విదేశాలు కొనవనీ, విదేశీ మారకద్రవ్యం రాదనీ గ్లూఫోసినేట్ హెర్భిసైడ్ కలుపుమందు ఆవ పంటలో వాడితే, ఎవరూ కొననందున మా బతుకు బజారున పడుతుందని తేనె సాగుదారులు ఆందోళనకు దిగారు. రైతులు 150,000 టన్నుల తేనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. . ఇది మనకు రూ. 75,000 కోట్లు ( రూ. 750 బిలియన్లు ) ఆర్జించే తేనె ఎగుమతులపై ప్రభావం చూపుతుంది

GM ఆవాలతో తేనెటీగ జనాభా నశిస్తుంది. నేడు, తేనెటీగల రైతులు ఆధారపడిన ఏకైక సహజ పంట ఆవాలు.

సుప్రీమ్ కోర్టు స్టే

అరుణా రోడ్రిగ్జ్ , కవితా కురుగంటి లాంటి సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ జన్యుమార్పిడి పంటల సమస్యను పరిశీలించేటందుకు సాంకేతిక నిపుణుల కమిటీ ని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టుకి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ ( 2013 ) మరియు జన్యుమార్పిడి పంటలను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల ఏకగ్రీవ నివేదికలు జన్యుమార్పిడి పంటలపై పూర్తి నిషేధాన్ని సిఫార్సు చేశాయి.

భారతదేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ అంటే కలుపుమందులను చేలో చల్లితే తట్టుకునే పంటలు పనికిరావని కమిటీ చెప్పిందన్నారు. హెర్బిసైడ్లు అంటే కలుపు నివారణ మందులు కాన్సర్ కు కారణమవుతాయని కూడా కమిటీ అభిప్రాయపడింది. మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, జీవ వైవిధ్యం పై దీర్ఘకాలిక ప్రభావం గురించి ఎటువంటి అధ్యయనాలు నిర్వహించనందున హెర్బిసైడ్ అంటే కలుపు మందులు వాడే పంటలపై పూర్తి నిషేధాన్ని విధించాలని సుప్రీమ్ కోర్టు ఏర్పాటు చేసిన కమిటీసిఫార్సు చేసిందని కోర్టుకు గుర్తు చేశారు. జన్యుమార్పిడి పంటలపై స్వతంత్ర అధ్యయనం చేయకుండా స్వంత ఆర్ధిక ప్రయోజనాలున్న కంపెనీలే ప్రయోగాలు, అధ్యయనాలు చేయటం, ఆ రిపోర్టులపై ఆధారపడి పర్యావరణ అనుమతులివ్వడం తగదని ప్రశాంతభూషణ్ నివేదించారు.

 ప్రజారోగ్యం పై పర్యావరణంపై రహస్యనివేదికలకు బదులుగా స్వతంత్ర నిపుణుల సంస్ధలచే , నిర్వహించబడే పబ్లిక్ డొమైన్ లో సమగ్రమైన, పారదర్శకమైన, నిజాయితీతో వాస్తవ అంశాలతోకూడిన  బయోసేఫ్టీ రిపోర్టును జీ ఈ ఏ సీ  బహిరంగపరచాలన్నారు. 

జన్యుమార్పిడి ఆవాల విత్తనాలపై యధాస్ధితినినకొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.

 ఆహారం లో జన్యుమార్పిడి పదార్ధాలను ప్రవేశపెట్టే ముందు అందరికీ తెలిసేటట్లుగా క్షేత్ర ప్రయోగాలు భారీ ఎత్తున పారదర్శకంగా జరగాలి. కానీ జరగలేదు. రహస్యనివేదికలే తప్పబహిరంగ రిపోర్టులు లేవు. కనీసం ఇంటర్నెట్ లో కూడా పెట్టలేదు. తేనెటీగలు, తేనె పై బతికే వారి సమస్యలేకాకుండా ఆవాలు తిన్నందువలన, ఆవ నూనె వాడినందువలన మనుష్యులపై, తాగే నీటిపై, పశువులపై, భూమిపై, పర్యావరణంపై  ప్రభావం ఏమిటో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిశోధనలుజరగాలి. సైంటిఫిక్ గా పరిశోధనలతో నిర్ణయించవలసిన ఆహార భధ్రత అంశాన్ని రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను, విదేశీ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని అగ్ర రాజ్యాల వత్తిడికి లొంగి నిర్ణయం చేయటం మన దేశ స్వతంత్ర్యాన్నిఅమ్ముకోవటమే.  

కలుపు నివారణ మందులను, జన్యుమార్పిడి హైబ్రిడ్ విత్తనాలను  అమ్ముకోవాలనీ, లాభాలను దండుకోవాలనీ కంపెనీలు తహతహలాడుతున్నాయి. కలుపు నివారణ మందులవలన భూమి విషతుల్యమౌతుందనే వాస్తవాన్ని ప్రభుత్వంకాదనలేకపోతున్నది. ఒక పక్క ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అంటూ ప్రచారం చేస్తూ మరోపక్క భూమిని, భూసారాన్ని, ప్రజారోగ్యాన్ని నాశనం చేసే జన్యుమార్పిడి   పంటలకు, కలుపు మందుల పంటలకు అనుమతులనిస్తున్నది.  భూమికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న రుజువుల కారణంగా గ్లైఫోసేట్ కలుపు నివారణ మందులను నిషేధించక తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యం వలన ప్రమాదకరమైన నిషేధిత మందులు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కలుపు మందులు అమ్ముకోవటానికి వీలుగా విత్తనాలనే జన్యుమార్పిడి చేశారు. కలుపు మందులతో భూమికి, మనిషికి, పశువులకు, వాతావరణానికి ప్రమాదమని నిర్ధారించి నిషేధించారు. మరోప్రక్క హెర్భిసైడ్ టాలరెంట్ జన్యుమార్పిడి ఆవాల పంటలకు అనుమతిని ఇచ్చి హెర్బిసైడ్ కలుపు నివారణ మందులను యధేఛగా వాడుకోమంటున్నారు. బీ.జే.పీ. ఎన్నికల ప్రణాళికలలో ఆహారం లో జన్యుమార్పిడి పంటలను , హెర్బిసైడ్ కలుపునివారణ మందులకు అనుమతులు ఇవ్వమన్నారు. ఆచరణలో జన్యుమార్పిడి పంటలకు హెర్బిసైడ్ కలుపు నివారణ మందుల వ్యాపార కంపెనీలకు స్వేఛనిచ్చి ప్రజలను మోసంచేస్తున్నారు. జన్యుమార్పిడి పంటలతోపాటుగా , హెర్బిసైడ్స్ వాడకం వలన భూమి నాశనమవటం వలన ఏ మందులకూ లొంగని “సూపర్ వీడ్స్”, “సూపర్ వీడ్స్” అభివృధి చెందుతున్నాయి. ఇంకా ఎక్కువ పురుగు మందుల వాడే అవసరం పెరిగి భూమి, పర్యావరణం మరింతగా నాశనమయి ప్రకృతి విఛిన్నమై కాన్సర్ లాంటి జబ్బులతో మానవుని మనుగడ ప్రశ్నార్ధకమౌతున్నది. 

జన్యమార్పిడి ఆవాల పంటవలన ఆవాల దిగుబడి పెరిగి ఆవనూనె దిగుమతులను తగ్గించవచ్చనీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చనీ ప్రభుత్వం అసత్య ప్రచారం చెప్తోంది. 1980 సం.లో ఆయిల్ మిషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో వంటనూనెల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ హైబ్రిడ్ విత్తనాలతోనే హెక్టారుకు 3012 కేజీల దిగుబడిని రైతులు సాధించారు. DMH-11 జన్యుమార్పిడి విత్తనాలతో 30 శాతం అధిక దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వం అసత్యప్రచారం చేస్తున్నది. రుజువులను చూపించలేకపోతున్నది.. DDB-DMH -1. సాంప్రదాయ విత్తనంతో    2924 KG ల దిగుబడిని, DDB-DMH-4.  సాంప్రదాయ విత్తనంతో  3012 KG, ల దిగుబడిని సాధించారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జన్యుమార్పిడి హెర్బిసైడ్ టాలరెంటు విత్తనం  GM MUSTARD  వలన  2626 KG ల దిగుబడి మాత్రమే వచ్చింది. అదేమంటే మీరు సైన్సుకు వ్యతిరేకం అని దబాయిస్తున్నారు. 

ఆవనూనెను దక్షిణ భారతదేశంలో వాడరు. ఆవ నూనెను ఉత్తర భారత దేశంలో విరివిగా వాడతారు. విస్తారంగా పండిస్తారు. మన దేశంలో వంటనూనెల ఉత్రత్తిలో 40 శాతం ఆవనూనెదే. ఆవపంట 80 లక్షల ఎకరాలలో60 లక్షలమంది రైతులు సాగు చేస్తున్నారు. 1993-1994లోనే, ఆవనూనెలో స్వయం సమృద్ధిని సాధించారు. దేశీయ ఉత్పత్తి అన్ని అంతర్గత అవసరాలను తీర్చింది.ఆవనూనె దిగుమతి అవసరం లేదు. దక్షిణ భారత దేశంలో ఆవనూనె వాడకం చాలా తక్కువ. ఊరకనే ఇచ్చినా వాడరు. తక్కువ ఉత్పత్తి వుండి, ఎక్కువమంది ప్రజలు వాడే పామాయిల్, వేరుశనగనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనెలకు ప్రోత్సాహం కరువయింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నపుడు రైతులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తున్నారు.

విదేశాల నుండి దిగుమతి చేస్తున్న పామాయిల్, సన్ ఫ్లవర్ వంటనూనెలకు దిగుమతి సుంకాలను తగ్గించి సింగపూరు, ఇండోనేషియా, ఉక్రెయిన్ ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. మన దేశంలోని పామాయిల్, వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరినూనె రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. లాభసాటి ధర, గిట్టుబాటు ధరల మాటేలేదు. ప్రకృతి వైపరీత్యాల లో రైతుకు దిక్కే లేదు. 2022 సం.కు రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని మరిచారు. 

బీ టీ కాటన్ వలన కలిగిన దుష్పరిణామాలన్నిటికీ మోన్సాంటో లాంటి బహుళజాతుల సమస్ధలే కారణం అని ఫ్రజలు గుర్తిస్తున్నందున కార్పోరేట్ సంస్ధలు కొత్తముసుగులో ప్రవేశిస్తున్నాయి.  బార్, బార్నేజ్, టెక్నాలజీని ఢిల్లీ యూనివర్సిటీ అధ్యయన బృందం మన దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగం లో కొత్తగా కనుగొన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. బార్, బార్నేజ్, టెక్నాలజీపై బేయర్స్ కంపెనీకి పేటెంట్ వున్నది. 2001 సం లో బార్నేజ్ ,బార్ స్టార్ టెక్నాలజీని బేయర్సకంపెనీ వాడింది. 

యూరప్ లో జన్యుమార్పిడి ఆహారాలను తినరు. పంటలకు అనుమతిలేదు. యూరప్ దేశాలు జీ ఎమ్ పంటలను గట్టిగా వ్యతిరేకించాయి.  యూరప్ ప్రజలు తినని ఆహారం మనం ఎందుకు తినాలో ప్రభుత్వం చెప్పాలి. తినే ఆహారంలో విషతుల్యమైన జన్యుమార్పిడి పదార్ధాలున్నయ్యేమో అని అమెరికా ప్రజలు అనుమానిస్తున్నారు. ఆహార పదార్ధాలపై జీ యమ్ లేబుల్స్ అతికించమని  ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అమెరికా లో శక్తివంతమైన విత్తన సంస్ధల వత్తిడికి లొంగి మాన్సాంటో, బేయర్స్ కంపెనీలకు అనుమతులు, పేటెంట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. మన దేశంలోజన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని  అనుమతించబోమని ఎన్నికల ప్రణాళిక లో స్పష్టంగా  చెప్పిన బీజేపీ , ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత పంధా మార్చుకుంది. ఎమ్ ఎన్ సీ ల వత్తిడికి ప్రభుత్వం లొంగిపోయింది. ఆర్.యస్.యస్ అనుబంధ సంస్ధయిన స్వదేశీ జాగరణమంచ్ జన్యుమార్పిడి ఆవాలను వ్యతిరేకించింది. అయినా విత్తన కార్పోరేట్ కంపెనీలు తమ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యొక్క శక్తిని చూపించి ధారా మస్టర్డ్ హైబ్రిడ్ DMH-11 కు అనుమతులను పొందాయి.

 దుష్ట పరిణామాలకు భాధ్యత ఎవరిది  

 అమెరికా లో “లైబిలిటీ లా” వుంది. పరిశోధనల ఫలితాలకు భిన్నంగా దుష్ట పరిణామాలు సంభవిస్తే ఎవరు బాధ్యులో నిర్ణయించి తగిన చర్యలు చేపడ్తారు. మనదేశంలో, మీకేమీ కాదన్నప్రభుత్వం, దిగుబడులు పెరుగుతాయన్న కంపెనీలు, ఆరోగ్యానికి ఢోకా లేదన్న జీ ఈ ఏ సీ సభ్యులు, ప్రభుత్వం – ఎవరిదీ బాధ్యత? 2015 సం. లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫోసేట్ను “మానవ క్యాన్సర్ కు ముఖ్య కారణం” గా వర్గీకరించింది. నాన్ హాడ్కిన్స్ లింఫోమాతో సహా 10 రకాల క్యాన్సర్లకుకారకమైన గ్లైఫోసేట్ ఆధారిత హెర్బిసైడ్ వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించనందుకు మోన్ శాంటో / బేయర్ కంపెనీపై లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  జీన్ క్యాంపెయిన్‌క జన్యు శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ సహాయ్ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి వాణిజ్య బిటి పత్తి పంటకు సంబంధించిన భద్రతా డేటా ఏదీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడలేదన్నారు. అక్టోబర్ 25, 2022న పర్యావరణ విడుదలకు ఆమోదం లభించిన GM మస్టర్డ్‌కు కూడా అదే విధానాన్ని అవలంబించి విత్తనాల విడుదల తర్వాత అవసరమైన పరీక్షలు నిర్వహించబడతాయా? 

మన దేశంలో GM ఆవాలు పండించడానికి అన్నిఅడ్డంకులు తొలగినతరువాత ఇతర GM పంటలకు కూడా వరద గేట్లను తెరుస్తారు. బీటీ వంకాయ,బీటీ బెండ, గోల్డెన్ రైస్, వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంప-అన్నిటిలో కాస్తోకూస్తో జన్యుమార్పు చేసి వ్యవసాయ వ్యాపారాన్ని పెంచుకోవటానికి కార్పోరేట్ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని ఎదిరించలేని ప్రభుత్వాలన్నీలొంగిపోయి మాన్సాంటో, బేయర్స్ లాంటి కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. జీ యమ్ ఆవాలు ప్రవేశపెట్టటానికి బలమైన అమెరికా ఒత్తిడి వున్నదని జర్నలిస్టు రష్మీ సెహగల్ అంటున్నారు.
మన దేశంలో వ్యవసాయం ఒక జీవన విధానం. 66శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడిజీవిస్తున్నారు.53 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది.దేశ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం క్రమేపీ 15 శాతానికి తగ్గింది. జన్యుమార్పిడి పంటలు మన నేలను, నీటిని  కలుషితం చేస్తాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రక్రియ కోలుకోలేనిది. వివిధ వాతావరణ పరిస్ధితులున్నభారతదేశం జీవ వైవిధ్యానికి ప్రసిధి చెందింది. వైవిధ్యమైన జన్యు వనరులున్నాయి. మన విత్తనోత్పత్తి చాలా శక్తివంతమయినది. మన రైతులు ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తిదారులు.జీవ వైవిధ్యం మన గొప్ప బలాలలో ఒకటి. అది నాశనం చేసి ఒకటే దేశం, ఒకటే విత్తనం, ఒక్కటే పంట అంటూ విశాల భూక్షేత్రాలలో మోనోక్రాప్ తో కోర్పోరేట్ స్ధాయి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు.

వ్సవసాయం లో వున్న వారిలో సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికే 86 శాతం మంది చిన్న రైతులు ఒత్తిడిలో ఉన్నారు. GM టెక్నాలజీ పేరున కంపెనీలు దారుణంగా పెంచుతున్న రేట్లలోఖరీదైన GM విత్తనాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. పెరుగుతున్న ధరలతో ఎరువులనుకొనలేరు. పెంచనున్నవిధ్యుత్ ఛార్జీలను భరించలేరు. అప్పులను కట్టలేరు. కనీల ధరకు చట్టపరమైన గ్యారంటీ లేదు. వారేం చేయాలి. వారికి ఏమవుతుంది? ఢిల్లీ సరిహద్దుల లో సంవత్సరంపైగా సాగిన రైతాంగ పోరాటమే రహదారి. అదే స్పూర్తితో మరింత శక్తివంతంగా సాగించే రైతాంగ పోరాటాలే వ్యవసాయ సమస్యలన్నిటికీ పరిష్కారం. 

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d