• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

విద్రోహిగా మారిన విడి సావర్కర్‌ భారత రత్నమా ?

20 Sunday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A militant turned british agent vd savarkar, Bharat Ratna ?, Saverkar Hindutva, vd savarkar

Image result for savarkar, chitragupta

ఎం కోటేశ్వరరావు
విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చితే ఫలాన చర్యలు చేపడతామని ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తాము వినాయక దామోదర్‌ సావర్కర్‌కు (విడి సావర్కర్‌) భారత రత్న అవార్డు ఇప్పించేందుకు కృషి చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి పరోక్షంగా తన హిందూత్వ అజెండాకు ఆమోదం పొందేందుకు పూనుకుంది. పెన్సిలిన్‌ ఇంజక్షన్లు అందరి శరీరాలకు సరిపడవు. అందువలన పరీక్ష చేసేందుకు రోగికి పరిమిత మొత్తంలో ముందు ఎక్కించి వికటించిన లక్షణాలు కనిపించకపోతే నిర్ణీత డోనుసు అందించటాన్ని మనం చూశాము. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగం బిజెపి ద్వారా అటువంటి ప్రయోగానికే పూనుకుందని చెప్పవచ్చు. సావర్కర్‌ ఒక్కడి గురించి చెబితే తలెత్తే వ్యతిరేకతను నీరు గార్చేందుకు లేదా ఒక ఎత్తుగడగా మహారాష్ట్రకు చెందిన సంస్కర్తలు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే పేర్ల సరసన సావర్కర్‌ను చేర్చారు. ఇది పూలే దంపతులను అవమానించటం తప్ప మరొకటి కాదు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మతోన్మాద శక్తులు తప్ప వామపక్ష భావజాలం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్ధను కోరుకొనే వారి వరకు సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రాతిపదికగా పని చేశారు. దేశంలో ఉన్న సామాజిక పరిస్ధితుల్లో లౌకిక వాదం ఒక ఐక్యతా శక్తిగా పని చేసింది. అందువల్లనే మన చరిత్రను దానికి అనుగుణ్యంగానే చరిత్రకారులు రచించారు. అనేక మంది చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంలో శాస్త్రీయంగా రూపొందించేందుకు ప్రయత్నించారు. వారిలో కమ్యూనిజంతో సంబంధం లేని వారు, కమ్యూనిస్టులు కాని వారు ఎందరో ఉన్నారు.

బిజెపి నయా భారత్‌ , నయా దేశ పిత, నయా భారత రత్నలు !
జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కోణంతో చూసే తిరోగమన శక్తులు మతకోణంతో చరిత్రను జనాల మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా మతోన్మాద భావజాల ప్రాతిపదికగా పని చేసే వారు పార్లమెంటరీ వ్యవస్ధలోని నాలుగు ప్రధాన పదవులైన తొలిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్లుగా బాధ్యతల్లో ఉన్న సమయమిది. గతంలో అనేక రంగాలలో ఆశక్తులు ప్రవేశించినప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని కలిగిన సమయమిదే. అంటే ఆ శక్తులు విజయం సాధించాయి. వారి చర్యలు ఇప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ చరిత్ర గురించి చెప్పిన అంశాలను గుర్తుకు తెస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ తాను నూతన భారత్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పుకోవటం ద్వారా నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశ పిత అని వర్ణించాడు. దేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన భారత రత్నలో మతోన్మాదులు ఎవరూ లేరు. నయా భారత్‌ కనుక రాబోయే రోజుల్లో వారే నిజమైన జాతీయవాదులు, జాతి రత్నాలుగా చరిత్రకు ఎక్కనున్నారంటే అతిశయోక్తి కాదు.

విప్లవకారుడు-విద్రోహి -మతోన్మాది !

మన దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ వాద భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసేందుకు సుభాస్‌ చంద్రబోస్‌ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేస్తే యువకులు బ్రిటీష్‌ సైన్యంలో చేరేందుకు సావర్కర్‌ తోడ్పడ్డారని, స్వాతంత్య్ర సమరాన్ని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ భావజాలాన్ని ముందుకు తెచ్చారని విమర్శకులు పేర్కొన్నారు. చివరకు మహాత్మా గాంధీ హత్యకేసులో కూడా సావర్కర్‌ ఒక ముద్దాయని, సాంకేతిక కారణాలతో కేసునుంచి బయటపడ్డారని పరిశీలకులు పేర్కొన్నారు.

Image result for vd savarkar chitraguptaఇద్దరు దేశ భక్తులు – రెండు లేఖలు- ఎంత తేడా !
సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించాడు. అదే సావర్కర్‌ విషయానికి వస్తే తనను జైలు నుంచి విడుదల చేసిన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిపోయి స్వాతంత్య్ర వుద్యమం నుంచి దూరం అయ్యాడు. హిందూత్వశక్తిగా మారాడు.

ద్విజాతి సిద్ధాంతం, పాక్‌ ఏర్పాటును కోరిన ముస్లింలీగ్‌తో అధికారం !

పాకిస్ధాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి రెండు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. 1948 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్‌ నెహ్రూకు రాసిన లేఖలో గాంధీ హత్యలో సావర్కర్‌ పాత్ర గురించి ప్రస్తావించారు. హిందూమహాసభకు చెందిన మతపిచ్చిగల వారు నేరుగా సావర్కర్‌ నాయకత్వంలో చేసిన, అమలు జరిపిన కుట్రలో భాగంగానే బాపూ హత్య జరిగిందని పేర్కొన్నారు. కుట్ర గురించి విచారణ జరిపిన కపూర్‌ కమిషన్‌ కూడా పటేల్‌ వ్యాఖ్యలను నిర్ధారించింది.

Related image
సావర్కర్‌ ‘విలువల ‘ ప్రాతిపదికన జాతి నిర్మాణం-మోడీ !

సావర్కర్‌ విలువల ప్రాతిపదికనే జాతీయవాదంతో జాతి నిర్మాణం జరుగుతున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారే వీర సావర్కర్‌ను కించపరుస్తూ ఇంతవరకు భారత రత్న అవార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డారని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.సావర్కర్‌ భరతమాత నిజమైన పుత్రుడని గతంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వారు కొద్ది రోజులు పోతే మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేకు సైతం భారత రత్న ఇస్తారని కాంగ్రెస్‌ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తే సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా గుర్తించింది సావర్కర్‌ అని హౌమంత్రి అమిత్‌ షా ఒక సభలో చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ఇందిరా గాంధీ స్వయంగా సావర్కర్‌ను అనుసరించారని ఆయన సమీప బంధువు రంజీత్‌ చెప్పారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని బిజెపి చెప్పిన అంశం జనం ముందు వుంది. అది తప్పనుకుంటే జనం వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నాడు.

కాంగ్రెస్‌ అవకాశవాదం !
వాజ్‌పేయి ప్రధానిగా వున్న సమయంలో సావర్కర్‌ చిత్రపటాన్ని పార్లమెంట్‌ హాలులో పెట్టాలన్న స్పీకర్‌ మనోహర్‌ జోషి ప్రతిపాదనను కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. స్పీకర్ల ప్రతిపాదనలను ఎవరూ వ్యతిరేకించరని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ స్మారక నిధికి 1970లో వ్యక్తిగతంగా పదకొండు వేల రూపాయల విరాళం ఇచ్చారని, ఆయన స్మారకంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారని అయితే సోనియా గాంధీ సావర్కర్‌ను వ్యతిరేకిస్తున్నారని బిజెపి విమర్శలు కురిపించింది. బ్రిటీష్‌ పలకులకు సావర్కర్‌ క్షమాభిక్ష పెట్టమని లేఖలు రాసిన విషయం ఇందిరా గాంధీకి తెలిసి వుండకపోవుచ్చు, తెలిసిన తరువాత సోనియా గాంధీ ఎందుకు సమర్ధించాలి అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి.సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు, అయితే ఆయన హిందూత్వను మాత్రం అంగీకరించం అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.

Image result for savarkar, chitraguptaImage result for savarkar, chitragupta
వీర సావర్కర్‌ బిరుదు వెనుక అసలు కధ !
సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.

Image result for vd savarkar chitragupta
అతిశయోక్తులు – అవాస్తవాలు !
‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

ఆవు దేవత కాదన్న సావర్కర్‌ !
గోమాత అంటూ గోరక్షకుల పేరుతో కొందరు చేసిన దాడులతో మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా అడుగంటిన విషయం తెలిసిందే. అసలైన హిందూ హృదయ సామ్రాట్‌గా పరిగణించే సావర్కర్‌ ఆవు ఒక సాధారణ జంతువు తప్ప దేవత కాదని అన్నారు. అవి మానవులకు ఉపయోగపడతాయి గనుక వాటిని కాపాడుకోవాలి తప్ప దేవతలు కాదని రాశారు. పాలకు ప్రతీక ఆవు తప్ప హిందూ దేశానికి కాదని కూడా పేర్కొన్నారు.
‘స్వంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు సావర్కర్‌కు ఉంది. ఆయన హేతువాదాన్ని నమ్మారు.మనోద్వేగాల కంటే వుపయోగితావాదానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే అదే సమయంలో గాంధీ కూడా ప్రజల మనోద్వేగాలను గౌరవించారు ‘ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త ఎంజివైద్య వ్యాఖ్యానించారు.

అమిత్‌ షా అతియోక్తి !
1857లో జరిగిన ఉదంతాన్ని సిపాయిల తిరుగుబాటుగా బ్రిటీష్‌ పాలకులు ప్రచారం చేశారు. కొందరు చరిత్రకారులు కూడా అదే విధంగా చూశారు. అయితే ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు.

హిందూత్వ-నాజీ పోలిక !
హిందూత్వ ఒక జీవన విధానం తప్ప మతానికి సంబంధించింది కాదని సంఘపరివార్‌ శక్తులు పదే పదే చెబుతారు, కొంత మంది అది నిజమే అనుకుంటున్నారు. యావత్‌ ప్రపంచం హిట్లర్‌ మూకలు, అనుయాయులను నాజీలు అని పిలిచే విషయం తెలిసిందే. అయితే హిట్లర్‌, ఆతగాడి అనుయాయులు ఎన్నడూ దాన్ని అంగీకరించలేదు, తమను జర్మన్‌ జాతీయ సోషలిస్టులుగా, తమది జాతీయ సోషలిజంగా వర్ణించుకున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన హిందూత్వశక్తులుగా రంగంలో వున్నాయి. హిందూత్వకు సావర్కర్‌ ప్రతీకగా వున్నారు. స్వాతంత్య్రవుద్యమసమయంలో సావర్కర్‌ భావజాలాన్ని మరాఠాలు ఆమోదించలేదు. అయితే మారిన పరిస్ధితుల్లో అనేక దశాబ్దాలపాటు ఆయన అనుయాయులు చేసిన ప్రచారం కారణంగా అనేక మంది సావర్కర్‌ నిజమైన జాతీయవాది అని భావిస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆయనకు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బిజెపి ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
ముందు వక్రీకరణలతో గందరగోళాన్ని సృష్టించటం, మెల్లగా తమ అజెండాను ఎక్కించటాన్ని చూస్తున్నాము. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని అమలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మెజారిటీ హిందూ మతోన్మాదశక్తులను జాతీయవాదులుగా చిత్రించి అసలైన జాతీయవాదులు, లౌకికశక్తుల మీద దాడి చేస్తున్నారు. దానిలో భాగమే సావర్కర్‌కు భారత రత్న బిరుదు సాధన వాగ్దానం. అది అమలు జరిగితే తదుపరి గాంధీని హత్యచేసిన గాడ్సేను ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. విజేతలే చరిత్రను రాయటం అంటే ఇదే. అందువలన ‘చరిత్రను విస్మరించిన తరానికి గతమూ, భవిష్యత్‌ రెండూ ఉండవు ‘ అని చెప్పిన రాబర్ట్‌ హెయిన్‌లిన్‌ మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తేవాల్సి ఉంది. ఏది అసలైన చరిత్ర ? ఏది నకిలీ ? వాట్సాప్‌ యూనివర్సిటీ చరిత్ర పాఠాల పట్ల తస్మాత్‌ జాగ్రత్త ! అక్కడ వైద్య శాస్త్రం చదవకుండా వైద్యం చేసే నకిలీ వైద్యుల మాదిరి చరిత్ర తెలియని వారు సుప్రసిద్ధ చరిత్ర కారులుగా మనకు బోధిస్తారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు : బిజెపి, మిత్ర పక్షాల వైఖరి ఏమిటి ?

07 Monday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Narendra Modi, Prime Minister Narendra Modi, sedition case against 49 celebrities

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

crony capitalism, crony capitalism BJP, crony capitalism in India, crony capitalism INC

Image result for crony capitalism in indiaమొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది పాత సామెత. లాభం వుంటేనే రాజకీయనేతలు, వ్యాపారులు కూడా వరద, కరవు ప్రాంతాలకు పోతారు అన్నది సరికొత్త నానుడి. ప్రస్తుతం లాభం, వ్యాపారం, రాజకీయాలను, వాటికోసం పని చేసే వారిని విడదీసి చూడలేని స్ధితి. తొలి పార్లమెంట్‌లో లక్షాధికారులైన ఎంపీలు ఎందరున్నారు అని వెతకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు కోట్లకు పడగలెత్తని, వ్యాపారులు కాని ఎంపీలు ఎందరున్నారు అని తెలుసుకొనేందుకు బూతద్దాలతో చూడాల్సి వస్తోంది.
రాజకీయం-వ్యాపారానికి వున్న సంబంధాలను మన దేశంలో రెండుగా చూడాల్సి వుంది. ఇది పరాయి దేశాల వలసలుగా, అక్రమణలుగా మారిన అన్ని దేశాలలో పూసల్లో దారంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు పరాయి పాలకులను పారద్రోలేందుకు సమాజంలోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సహా అన్ని తరగతుల వారూ పాల్గొన్నారు. ఏ తరగతి అజెండా వారికి వున్నప్పటికీ వాటిని ముందుకు తీసుకుపోవాలంటే పరాయిపాలకులు ఆటంకంగా వున్నారన్న ఏకైక కారణమే వారిని ఒక వేదిక మీదకు తెచ్చింది. అందువల్లనే జాతీయ వాదంలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి దోపిడీకి గురయ్యే కష్టజీవులు తాము దోపిడీ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. రెండవది స్వదేశీ పారిశ్రామిక, వాణిజ్య శక్తులు బలపడి తాము స్వంతంగా వ్యవహరించగలం అనుకున్న తరువాత విదేశీ కంపెనీలతో పోటీకి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని ముందుకు తేవటం. స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో బ్రిటీష్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా అక్కడి పెట్టుబడిదారులు విధానాలను నిర్దేశించారు. తరువాత మన దేశంలో పెట్టుబడిదారులు, ఫ్యూడల్‌ వ్యవస్ధ ఇంకా బలంగా వున్న వున్నందున పెట్టుబడిదారులు, భూస్వామ్య తరగతులను కలుపుకొని తమ అజెండాను అమలు జరిపారు. తమ పెట్టుబడులు, వ్యాపారాలకు పోటీ రాకుండా చూసేందుకు అప్పటికే ఒక స్ధాయికి చేరిన వారు లైసన్స్‌ పద్దతిని ముందుకు తీసుకు వచ్చారు. భూస్వాముల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆ వ్యవస్ధను కాపాడేందుకు చేయాల్సిందంతా చేశారు. భూ సంస్కరణల చట్టాలను ఆలశ్యం చేయటం, చేసిన వాటిని నీరుగార్చటం దానిలో భాగమే.
స్వాతంత్య్రం తరువాత ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలను ఏర్పాటు చేయాలంటే లైసన్సులు అవసరం. వాటికోసం పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అధికారంలో వున్న రాజకీయ నేతలను ఆశ్రయించటంతో అవినీతి ప్రారంభమైంది. తమ పనులు జరిపించుకొనేందుకు కొందరు రాజకీయనేతలను లాబీయిస్టులుగా మార్చుకోవటం లేదా అలాంటి వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించి నిధులిచ్చి గెలిపించుకోవటం చేసే వారు. 1991కి ముందే వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయటం, రాజకీయాల్లో వున్న వారు వ్యాపారాల్లో ప్రవేశించటం ప్రారంభమైనా ఆ తరువాత అది మరింత వేగం పుంజుకుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం, పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలనే విధానపర నిర్ణయాల తరువాత అది జనానికి మరింత స్పష్టంగా కనిపించింది. దాన్నే నీకది, నాకిది అని అందరూ కుమ్మక్కై పంచుకోవటంగా చూస్తున్నాము. ఇది వాటంగా వున్న తరువాత పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. బెల్లం ఎక్కడ వుంటే అక్కడకు చీమలు చేరినట్లు ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరటం, దానికి కార్యకర్తల అభీష్టమనో, నియోజకవర్గ అభివృద్ధి అనో చెప్పే వారు. ఇప్పుడు వాటి జాబితాలోకి దేశ ప్రయోజనాల కోసం అని కొత్త పదాన్ని చేర్చారు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు వేటికీ అంటూ సొంటూ, నీతి, అవినీతి తేడా లేదు.

Image result for crony capitalism in india
సంపదలను పోగేసుకొనేందుకు ఎంతకైనా తెగించే వ్యాపారులు, రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నత అధికారగణం ఒక దగ్గర చేరినపుడు నీకిది, నాకది, వారికది అని పంచుకుంటారు. దీన్నే క్రోనీ కాపిటలిజం లేదా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటున్నాము. మీడియా రంగంలో సైతం ఏ పత్రిక, ఏ ఛానల్‌ చరిత్ర చూసినా ఏమున్నది కొత్తదనం, సమస్తం వ్యాపారమయం అన్నట్లుగా ఇలాంటి వ్యాపార-రాజకీయవేత్తలు వాటి వెనుక వుంటారు. వార్తలను అందించి జనానికి సేవ చేద్దామని కాదు, అది కూడా తమ రాజకీయ లాభం కోసమే అన్నది తెలిసిందే. గత ప్రభుత్వం తమ ఆశ్రితులకు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి అపరిమితంగా రుణాలిప్పించి అక్రమాలకు పాల్పడిందన్నది ప్రస్తుత పాలకుల తీవ్ర ఆరోపణ. చిత్రం ఏమిటంటే అలాంటి అక్రమార్కుల మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నది అంతగా ఎవరూ అడగటం లేదు. గతంలో వారు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నది.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం దేశం మీద ఎలా ప్రభావం చూపుతుందో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా పని చేస్తున్న సమయంలో 2014 ఆగస్టు 11న లలిత్‌ దోషి స్మారక వుపన్యాసంలో రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. దీని వుచ్చునుంచి బయట పడాలంటే పౌర సేవలను పటిష్టం చేయటం ఒక మార్గం అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పారదర్శకత, పోటీని దెబ్బతీసి చివరకు ఆర్ధిక పురోగతిని మందగింప చేస్తుందని అన్నారు.(అంటే లైసన్స్‌ రాజ్యాన్ని మరోరూపంలో ముందుకు తెస్తుంది) ” వుపాధి, పౌర సేవలను పొందేందుకు పేదలు, నోరు లేని వారికి రాజకీయ నేతల అవసరం వుంది. కుటిల రాజకీయవేత్తకు అందుకు గాను నిధులు, ఇతర అవసరాల కోసం వాణిజ్యవేత్తల ప్రాపకం అవసరం. అవినీతి పరులైన వాణిజ్యవేత్తలు పౌర వనరులు, కాంట్రాక్టులను చౌకగా పొందాలంటే కుటిల రాజకీయవేత్తల మద్దతు అవసరం. రాజకీయవేత్తలకు పేదలు, నోరులేని వారి ఓట్లు అవసరం. ఇలా ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడే బంధంతో ఒక వలయంలో వున్నారు. అది యథాతధ స్ధితిని పటిష్టపరుస్తుంది….ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రాజ్యాధికారం గల కొందరు ధనిక పెద్దలను సృష్టిస్తుంది, అది అభివృద్ధిని మందగింప చేస్తుంది” అన్నారు.

Image result for crony capitalism in india

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి తిరిగి చెల్లించగల శక్తి వుండి కూడా ఎగవేసే వారిని బుద్ది పూర్వక ఎగవేతదారులు అంటున్నాము. 2015 మార్చి నెల నుంచి 2019 మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరం వరకు బుద్ధి పూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి సంఖ్య 5,349 నుంచి 8,582కు పెరిగిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూన్‌ 25న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. అంటే ఐదేండ్లలో 60శాతం పెరిగారు. వీరిలో 6,251కేసులలో తనఖా వున్న ఆస్ధుల మీద చర్యలు ప్రారంభించారు, 8,121కేసులలో రుణ వసూలు దావాలు వేశారు, 2,915 కేసులలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగవేసిన వారి నుంచి 7,600 కోట్ల రూపాయలను వసూలు చేశారు. బ్యాంకులకు ఇలాంటి బాపతు చెల్లించాల్సిన సొమ్మునే నిరర్ధక ఆస్తులంటున్నాము. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ మొత్తం 8.06లక్షల కోట్ల రూపాయలు. 2016-19 ఆర్ధిక సంవత్సరాల మధ్య బ్యాంకులు వసూలు చేసిన సొమ్ము 3.59లక్షల కోట్లు పోను ఇంకా రావాల్సింది పైన పేర్కొన్న మొత్తం. యాభై కోట్ల రూపాయలు, అంతకు మించి రుణాలు తీసుకొని ఎగవేసిన వారి ఫొటోలను బ్యాంకుల్లో ప్రదర్శించాలని(పోలీస్‌ స్టేషన్లలో పాత నేరస్దులు, కేడీ గాండ్ల మాదిరి) ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. వారి కోసం గాలింపునకు నోటీసులు జారీ చేయాలని కూడా కోరింది. వారి పాస్‌పోర్టుల సర్టిఫైడ్‌ కాపీలను సంపాదించాలని సూచించింది.

Image result for crony capitalism in india

సాధారణ పెట్టుబడిదారీ విధానంలో పరిశ్రమలు, వ్యాపారం వర్ధిల్లాలి అంటే నష్టభయం వుంటుంది. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో లాభాలను ఎలా సంపాదించాలో వ్యాపారులు-అధికారంలో వున్న రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నతాధికారులు కుమ్మక్కై ముందుగానే నిర్ధారించుకొని అందుకు అనుగుణ్యం పావులు కదుపుతారు. దీనిలో మరొకరితో పోటీ వుండదు. కావాల్సిన అనుమతులు, ప్రభుత్వ నిధులు, పన్నుల రాయితీలు ఇతర అన్ని రకాల సౌకర్యాలను అధికారంలో వున్న పెద్దలు సమకూర్చుతారు. దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇలాంటి వారు మన కళ్ల ముందే అనూహ్యంగా అపార సంపదలను పోగేసుకుంటారు. దీనికి అనువైన అవకాశాలను నయావుదారవాద విధానాలు కల్పించాయి. తెలంగాణాలో ప్రాజక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో చేసిన పనుల మీద తలెత్తిన అవినీతి ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింత, టెండర్ల విధానం. రెండు చోట్లా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వివాదాలు వీటి పర్యవసానమే.
మిలిటరీ, సరిహద్దులు, కరెన్సీ, పోలీసుల వంటి విభాగాలు మినహా మిగిలిన అన్ని రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి, ప్రయివేటు రంగానికి, విదేశీ కంపెనీలకు గేట్లు బార్లా తెరవాలని సంస్కరణల పేరుతో ఎప్పుడైతే నిర్ణయించారో అప్పటి నుంచి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఏ దోపిడీ విధానమైనా దానికి అవినీతి తోడుగా వుంటుంది. ఈ కారణంగానే దేశంలో నేడు ఏ పెద్ద కంపెనీ ఏ అక్రమానికి పాల్పడింది, దాని వెనుక ఏ రాజకీయనేతలున్నారో అనే వార్తలు వెలువడుతున్నాయి. అధికార అండచూసుకొని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి ఇచ్చిన మేరకు అప్పులు, ప్రభుత్వం నుంచి రాయితీలు దండుకో, నిధులను దేశం దాటించు, వాటినే విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి తీసుకురా లేదా ఇతర బినామీ కంపెనీలకు మళ్లించు, సంస్ధలను దివాలా తీయించు. కేసులు పెడతారా విదేశాలకు పారిపో లేదా దొరికిపోతావా పోయేదేముంది పైసాకు కొరగాని పరువు తప్ప కూడబెట్టుకున్న ఆస్ధులేవీ పోగొట్టుకున్నవారెవరూ లేరుగా ! ఇదే కదా పై నుంచి కింది వరకు నేడు దేశంలో వున్న ఆలోచనా సరళి.
Image result for crony capitalism in india
మన దేశంలో నయా వుదారవాదం 1980దశకంలోనే ప్రారంభమైనా 1991లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత సంస్కరణల పేరుతో గత విధానాలకు తిలోదకాలివ్వటం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు, నిధులు ఎప్పుడైతే తీసుకున్నామో వాటికి విధించిన షరతుల్లో భాగంగా విదేశీ వస్తువులపై ఆంక్షలను ఎత్తివేసి ఆ కంపెనీలకు మార్కెట్‌ను తెరిచే, ప్రయివేటు రంగానికి అన్ని బాధ్యతలు, అవకాశాలను ఇచ్చే నయా వుదారవాద విధానాలు ప్రారంభమయ్యాయి. వీటిని కాంగ్రెస్‌ ప్రారంభించినా తరువాత అధికారానికి వచ్చిన బిజెపి నాయకత్వం కూడా పూర్తిగా, మరింత ఎక్కువగా అమలు జరిపింది, జరుపుతోంది. అంతకు ముందు వివిధ కారణాలతో అప్పులపాలైన రైతులు కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడినా, 1991లో నూతన విధానాలు అమలులోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తి రోజూ ఏదో ఒక మూలన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీని దేశపితగా అంగీకరించకపోతే భారతీయులు కాదా ?

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP motor mouths, Donald trump, father of the country, Father of the Nation, Mahatama Gandhi, Narendra Modi, Nathuram Godse

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, father of the country, Howdy Modi, is narendra modi india's divider in chief or unifier, Narendra Modi, narendra modi father of the country, narendra modi india's divider in chief, narendra modi india's unifier in chief

Image result for modi unifier

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

మొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ చరిత్రలో రాజులు, రంగప్పలే కాదు, ప్రజాస్వామిక వ్యవస్ధలని చెప్పుకొనే చోట కూడా అధికారంలో వున్న వారికి లేని ప్రతిష్టను చేకూర్చే ప్రయత్నాల గురించి చెప్పనవసరం లేదు. వాటి వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే కాదు తమను ఆశ్రయించుకున్న వారికి అవకాశాల కోసం కూడా పాత పద్దతులైన సామ, దాన, బేధ, దండోపాయాలే కాదు అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడటం చూస్తున్నాము.

అమెరికాలోని హూస్టన్‌ నగరంలో సెప్టెంబరు 22న జరిగిన ప్రవాస భారతీయుల హౌడీ మోడీ (మోడీ గారూ ఎలా వున్నారు) సభలో మన ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు నరేంద్రమోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు చూసిన తరువాత నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా అని ఎవరైనా అనుకుంటే వారు సరిగానే ఆలోచిస్తున్నట్లు లెక్క. కొందరికి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి, మరి కొందరు నరేంద్రమోడీ అందుకు అర్హులే అని కీర్తిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని ఎవరి అంచనా సరైనదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

హిందూ హృదయ సామ్రాట్‌ అని కొందరు నరేంద్రమోడీని కీర్తిస్తే, ఆయన హిందూ ఏమి ఖర్మ ఏకంగా భారత హృదయ సామ్రాట్‌ అని మరికొందరు ప్రస్తుతించారు. భారత విభజన దళపతి అని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాక ముందు ఒక అంతర్జాతీయ పత్రిక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించిది. అదే పత్రిక ఎన్నికల తరువాత దశాబ్దాల కాలంలో ఏ ప్రధానీ నరేంద్రమోడీ మాదిరి దేశాన్ని ఐక్యం చేయలేదు అని మరొక వ్యాసాన్ని ప్రచురించింది. కాలం నరేంద్రమోడీని ఐక్యతా దళపతిగా నిరూపించింది అని ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి నేత సంబిత్‌ పాత్ర వంటి వారు వర్ణించారు. ఇప్పుడు అది మరింత వేగం పుంజుకొని ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఏదీ వూరికే రాదు అన్న విషయం తెలిసిందే. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుగా మోడీ- ట్రంప్‌ వ్యవహరించారా ?

ఎవరైనా ఒకరిని అసాధారణ వ్యక్తులతోనో, అసాధారణ రీతినో ఏ కారణంతో అయినా పొగిడితే వారేదో అలా అన్నారు గానీ నాకంత లేదు అని వినమ్రంగా చెప్పుకుంటారు. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి అలాంటి వినమ్రత ఆశించే వారిని ఆయన హతాశులను గావించారు. ఒక్క విషయం స్పష్టమైంది.దేశద్రోహం, నువ్వు భారతీయుడివా కాదా అని నిర్ధారించేందుకు ప్రమాణాలుగా సంఘపరివార్‌, దాని రాజకీయ సంస్ధ బిజెపి తయారుచేసిన నిఘంటువులోకి మరొక అంశం తోడైంది. అదే ‘భారత దేశ పిత’ నరేంద్ర దామోదరదాస్‌ మోడీ.

మన రాజ్యాంగంలో ఎవరినీ అధికారికంగా జాతిపితగా లేదా భారత దేశ పితగా పరిగణించేందుకు అవకాశం లేదు. అయినా యావత్‌ సమాజం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీని గుర్తించేందుకు, నరేంద్రమోడీని భారత దేశ పితగా పరిగణించకపోవటాన్ని అంగీకరించేందుకు బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు సిద్దంగా లేరు.

ఇప్పటికే జాతిపిత గాంధీని చంపిన విడి సావర్కర్‌ అసలైన దేశభక్తుడు అని చెబుతున్న వారు రేపు గాంధీ జాతి పిత ఏమిటి అసలైన జాతిపిత సావర్కర్‌, ఆయన వారసుడు నరేంద్రమోడీ భారత దేశ పితి అని చెప్పేందుకు ఎంతో సమయం పట్టదా అనిపిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తన మనసులో వున్న విషయాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఒక విధంగా ఆయనకు ‘అభినందనలు’ చెప్పకతప్పదు. భారత దేశ పితగా నరేంద్రమోడీని అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారన్నదే ఆయన ప్రశ్న.

‘ ప్రధాని వ్యక్తిత్వం,చొరవ కారణంగా ఈ రోజు విదేశాల్లో వున్న వారు గర్వపడుతున్నారు. ఎవరైనా ఒకరి గురించి అమెరికా దాని అధ్యక్షుడి నుంచి ఒక నిష్పాక్షిక మరియు ధైర్యవంతమైన ప్రకటన వచ్చిందంటే ఏదైనా పార్టీతో అతని రాజకీయ అనుబంధాలు లేదా భావజాలంతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడు గర్వపడాలని నేను భావిస్తున్నాను.ఒక అమెరికా అధ్యక్షుడు అలాంటి పదాలతో ప్రశంసలు కురిపించటం ఒక భారత ప్రధాని గురించే కాదు ఇతర ఏ ఒక్క ప్రపంచ నేత గురించి చేయలేదు. దీనికి ఎవరైనా గర్వపడకపోతే, తరువాత వారు తమను తాము భారతీయులుగా పరిగణించుకోకపోవచ్చు’ అని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. జాతిపిత ఒకరే వుంటారు అన్న కాంగ్రెస్‌ వ్యాఖ్య గురించి అడగ్గా దాని గురించి ట్రంప్‌తో కాంగ్రెస్‌ను వాదించమనండి అన్నారు. దీన్ని చూసిన తరువాత జర్మన్‌ భావజాలానికి వ్యతిరేకం అనేపేరుతో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను దగ్దం చేసిన నాజీల చర్య గుర్తుకు వస్తోంది.

హిట్లర్‌ పుట్టటానికి వంద సంవత్సరాల ముందే హెన్రిచ్‌ హైనే అనే రచయిత ” ఎక్కడైతే పుస్తకాలను తగులబెడతారో (భావజాలం లేదా విజ్ఞానం) అక్కడ మానవులను కూడా సజీవదహనం చేస్తారు ” అని ప్రకటించాడు. 1933 మే 10ప తేదీ రాత్రి బెర్లిన్‌ నగరంలో నాజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో కూడి 20వేల పుస్తకాలను దగ్దం చేశారు. వాటిలో కమ్యూనిస్టు రచయితలు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, ఆల్బర్‌ ఐనిస్టీన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాక్‌లండన్‌, హెచ్‌జి వెల్స్‌ వంటి ఎందరో కమ్యూనిస్టేతర, పురోగామి రచయితల పుస్తకాలు వాటిలో వున్నాయి. నరేంద్రమోడీని భారత దేశ పితగా అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని ప్రశ్నించినట్లుగానే హిట్లర్‌, నాజీ భావజాలానికి వ్యతిరేకమైన రచనలన్నీ జర్మన్‌ వ్యతిరేకమైనవే అన్న వున్మాదానికి లోనైన వారు దీనికి పాల్పడ్డారు. ఇప్పటికే మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటివి భారతీయతకు వ్యతిరేకులు, దేశద్రోహులతో చేతులు కలిపే వారితో నిండి వున్నాయనే ప్రచారాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్న, ఆశించిన రీతిగా పరిస్ధితులు లేవు. తమ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, విదేశీతొత్తులుగా చిత్రిస్తున్నారు. పరమత, పురోగామి భావజాలాలు, వాటిని కలిగి వున్నవారి మీద ద్వేషం, ఆవుల రక్షణ పేరుతో హత్యాకాండ, అసహనం,రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం వంటి పరిణామాలను సమర్ధించేవారు, ముందుకు తీసుకుపోయే వారు తమకు ఒక ప్రతీక కావాలనుకుంటున్న వారు నరేంద్రమోడీని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు మాననీయ మహోదయ ఎప్పుడేం మాట్లాడతాదో తెలియని తలతిక్క మనిషిగా పేరు మోసిన (నిజానికి అది వాస్తవం కాదు, తమకు హాని కలిగించే వారిని అమెరికా కార్పొరేట్‌ రంగం తమ ప్రతినిధిగా కొనసాగనివ్వదు.) డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలే కారణం. మన ప్రధానిని ‘భారత దేశ పిత’ గా వర్ణించటంతో వచ్చింది అనుకొనే వారికి కాదు మహానుభావులారా మన దేశంలో అనేక మంది మనసులో వున్న మాటనే వెల్లడించాడు అని చెప్పాల్సి వస్తోంది. హూస్టన్‌ సభ తరువాత న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్రమోడీ మరోసారి భేటీ అయ్యారు. పరస్పర పొగడ్తలు కిక్కు ఇవ్వలేదని అనుకున్నారేమో తెలియదు. ఇద్దరూ విలేకర్లతో మాట్లాడారు.’ హూస్టన్‌ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరైనందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు మంచి స్నేహితుడు’ అని మోడీ చెప్పారు. అంతగొప్ప స్నేహితుడు కాశ్మీర్‌ గురించి మధ్యవర్తిత్వం వహించమని మోడీ తనను అంతర్గత సమావేశంలో అడిగారు అని పచ్చి అబద్దం చెప్పి ఎంతో కాలం గడవ లేదు. స్నేహితుల మధ్య బయటి ప్రపంచానికి వెల్లడి కాని అనేక అంశాలు దొర్లుతాయి. బహుశా వారి స్నేహం చెడకుండా వుండేందుకే మోడీ దాని మీద నోరు విప్పలేదు అనుకోవాలి. అలాంటి అబద్దాల కోరు ట్రంప్‌ మోడీని భారత దేశ పిత అనటం కూడా మరొక అబద్దం లేదా అతిశయోక్తి కావచ్చు కదా ! అంతగా మంచి స్నేహితుడు అని మోడీ స్పందించిన తరువాత ట్రంప్‌ బదులు తీర్చుకోకపోతే భారత జాతికే అవమానం కదా !

బొల్లు బొల్లరా వెంకన్నా అంటే మా గురించి గొప్ప చెప్పుకోవటం కాదు గానీ బాబయ్యా మా అయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత వుంటాయండయ్యా అన్నట్లుగా ట్రంప్‌ స్పందించారు. ‘ అంతకు ముందు భారత్‌ నాకు గుర్తుంది. అంతబాగా తెలియదు గానీ నాకు గుర్తుంది, అది చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు. మనం ఆయన్ను భారత దేశ పితగా పిలవవచ్చు, ఆయనొక అసాధారణ మంచిపని చేశారు అనుకుంటున్నా’ అని డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Image result for narendra modi india's divider in chief

వివిధ రాజ్యాలుగా వున్న భారతావనిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని దోపిడీని యధేశ్చగా కొనసాగించేందుకు దేశమంతటా కొన్ని సంస్ధానాలను కొనసాగించేందుకు అనుమతించినా వాటిని కూడా తమకు లోబడి వుండేట్లు చేసుకొని దేశాన్ని ఒక్కటిగా చేసింది బ్రిటీష్‌ వారే.అయినంత మాత్రాన వారిని దేశాన్ని ఆక్రమించుకున్నవారిగా తప్ప ఆధునిక భారత నిర్మాతలుగా చరిత్ర పరిగణించలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందల సంఖ్యలో వున్న చిన్నా, పెద్ద సంస్దానాలను విలీనానికి భారత ప్రధానిగా నెహ్రూ కృషి చేశారు. కాశ్మీర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు ఏకంగా సైన్యాన్నే నడిపించారు. పోర్చుగీసు పాలనలో వున్న గోవాను భారత్‌లో విలీనం చేసేందుకు అదే నెహ్రూ సైన్యాన్ని నడిపించిన చరిత్ర తెలిసిందే. ఫ్రాన్స్‌ ఆధీనంలో వున్న నేటి పుదుచ్చేరి ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసింది కూడా ఆయన హయాంలోనే. సంఘపరివార్‌ గొప్పగా చిత్రించే సర్దార్‌ పటేల్‌ కారణంగానే హైదరాబాదు సంస్దానం దేశంలో విలీనం అయింది అని చేసే వాదనను కాసేపు అంగీకరిద్దాం. భారత రక్షణలో స్వతంత్ర రాజ్యంగా వున్న సిక్కిం మన దేశంలో విలీనం అయింది ఇందిరా గాంధీ ఏలుబడిలో, అలాంటి ఏ చరిత్రా లేని నరేంద్రమోడీ భారత్‌ను ఐక్యం చేశారనే పేరుతో భారత దేశ పిత అని పిలిస్తే పై ముగ్గురిని కూడా భారత దేశ పితలు, మాత అని పిలవాల్సి వుంటుంది. ఒక వేళ జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగమే కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులను రద్దు చేయటమే దేశాన్ని ఐక్యం చేయటమే అయితే, గిరిజన ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణల కొనసాగింపు మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందువలన భారత చరిత్ర తెలియని ట్రంప్‌ చేసే ప్రకటనలు, వర్ణణలకు విలువేమిటి అన్నది సమస్య.

Image result for narendra modi india's divider in chief

ట్రంప్‌కు గత చరిత్ర తెలియదు లేదా తెలిసినా కావాలని తన ప్రయోజనం కోసం నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తారనుకోవాల్సి వుంటుంది. నరేంద్రమోడీ ‘భారత విభజన దళపతి’ అని అమెరికాకు చెందిన టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది మేనెలలో తన ముఖచిత్ర కధనానికి శీర్షిక పెట్టింది. అదే పత్రిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరొక అడుగు ముందుకు వేసి గత దశాబ్దాలలో ఏ ప్రధానీ చేయని విధంగా నరేంద్రమోడీ ఐక్యతా దళపతిగా వ్యవహరించారు అని మరొక కధనాన్ని ప్రచురించింది. వాటి లోని అంశాలను మరోసారి వివరించుకోవచ్చు. బ్రిటన్‌, ఇతర అనేక దేశాల నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏమి వ్యాఖ్యానించిందో దిగువ కొన్ని వ్యాక్యాలను చూడండి.

”భారతీయ ఆత్మకు చెడు !

ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు.” అని పేర్కొన్నది.

బ్రిటీష్‌ వారి పాలనకు చరమ గీతం పాడేందుకు సాగిన మహోద్యమానికి నాయకత్వం వహించింది గాంధీ. ఆయన అనుసరించిన కొన్ని వుద్యమ పద్దతులు, కొన్ని అంశాల మీద ఆయన వైఖరులను మ్యూనిస్టులు, ఇతరులు కూడా విబేధించారు గానీ గాంధీ దేశభక్తి, చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు. కానీ నరేంద్రమోడీ, ఆయన మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆరాధించే, ఆయన వారసులం అని చెప్పుకొనే సదరు వినాయక దామోదర్‌ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి. సంఘపరివార్‌కు చెందిన వారి చరిత్ర భారత సమాజాన్ని మతప్రాతికన విడదీసే, పరమత ద్వేషులుగా వుంది తప్ప ట్రంప్‌ చెప్పినట్లు ఐక్యపరిచేదిగా లేదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా టైమ్‌ పత్రిక మాదిరి ఇదే ట్రంప్‌ లేదా మరొక అమెరికా అధ్యక్షుడు తన అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించవచ్చు. అందువలన ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే లేదా మెప్పించుకొనే వారు కాదు, వ్యక్తుల ఆచరణే గీటురాయిగా వుండాలి.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాకమ్మ కథలు కాదు – సుదర్శన చక్రాలు, సమ్మోహనాస్త్రాలకు సమయమిదే !

21 Saturday Sep 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, STATES NEWS, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP on Uranium, cock and bull stories, puranic weapons, saffron talibans, TRS government, Uranium

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆవు కథలు కాదు మోడీ గారూ ఆర్ధిక అంశాల మీద నోరు విప్పండి !

13 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Cow excreta, Cow excreta start-ups, India cow commoission, Panchgavya, Rashtriya Kamdhenu Aayog

Image result for not cow stories Mr narendra modi speak on country economy

ఎం కోటేశ్వరరావు

చరిత్రకు పక్షపాతం లేదు. దాన్నుంచి తీసుకొనే పాఠాలకే ఏదో ఒక పక్షపాతం. అది దోపిడీదారులకు అనుకూలమైనది కావచ్చు, దోపిడీకి గురయ్యేవారిని మేల్కొలిపేదిగానూ వుండవచ్చు. గాంధీ గురించి ఎంత రాసినా స్వీకరించింది, ఆయన హంతకుడు గాడ్సేను ఎంత పొగిడినా అదే రీతిలో చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంటున్నది. అదే చరిత్ర మనకు కావలసినంత వినోదం, విషాదాలతో పాటు చతురతను కూడా అందిస్తుంది.

మనకు జ్ఞాపకశక్తి తక్కువని గుర్తు చేయటం కాదుగానీ మన ప్రధాని నరేంద్రమోడీ 2018వ సంవత్సరానికి ఒక అంతర్జాతీయ అవార్డును స్వీకరించారు. మోడీకి ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే ‘మోడినోమిక్స్‌’ (మోడీ అర్ధశాస్త్రం- ఎవరైనా ఒక ప్రత్యేక సిద్దాంతం లేదా మరొకదాన్ని కనిపెట్టినా, అభివృద్ధి చేసినా వారి కృషికి గుర్తింపుగా ఆ పేరుతో వ్యవహరిస్తారు) ద్వారా భారత్‌, ప్రపంచ ఆర్ధిక పురోభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారని మన విదేశాంగశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికి ఆయన పునరంకితమైన తీరు, ప్రపంచ ఆర్ధిక అభివృద్ధిని పెంచేందుకు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా రూపుదిద్ది భారతీయుల అభివృద్ధికి చేసిన కృషికి, అవినీతి వ్యతిరేక చర్యలు, సమాజాన్ని ఒకటిగా చేసిన కృషికి గుర్తింపు అని వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీగారికి ఏ డిగ్రీలు వున్నాయో తెలియదు, తెలిసినా దేశభద్రత దృష్ట్యా వెల్లడించకూడదనుకోండి. మరోవైపు అందరికీ తెలిసిన డిగ్రీలు కలిగి ఆర్ధిక నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లు ప్రధానిగా వున్నా అదేమిటో ఒక్క అంతర్జాతీయ అవార్డూ రాలేదు. (ఆయన ఆర్ధిక విధానాలు, వైఖరితో ఏకీభవించినా లేకున్నా, అవి ఎవరికి వుపయోగపడతాయన్నది వేరే అంశం కావచ్చుగానీ ఆయన పట్టాలు వున్న ఒక ఆర్ధికవేత్త )

చరిత్రలో వినోదం, విషాదం అని ఎందుకన్నానంటే మన్మోహన్‌ సింగ్‌ దేశంలో తలెత్తిన ఆర్దిక మందగమనం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ అవార్డు గ్రహీత నరేంద్రమోడీ మాత్రం ఆర్ధిక వ్యవస్ధకు బదులు ఆవు వ్యాసం, కథల గురించి దేశ ప్రజలకు చెబుతున్నారు. ఓం, ఆవు అనే మాటలు వినపడితే కొంత మందికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని, దేశం 16,17 శతాబ్దాల వెనక్కు పోయిందని మాట్లాడతారని 2019 సెప్టెంబరు పదకొండున చెప్పారు. ఓం, ఆవులకు ఆ రెండు శతాబ్దాలకు సంబంధం ఏమిటో ఎంత వెతికినా కనపడలేదు. ఎందుకంటే అవి రెండూ అంతకంటే చాలా పురాతనమైనవి. దేశాన్ని ఆ కాలానికి తీసుకుపోవాలన్నది మోడీ అండ్‌కో ప్రయత్నం అన్నది తెలిసిందే. మేకిన్‌ ఇండియా పిలుపు ఏమైందో, అచ్చేదిన్‌ ఎప్పుడొస్తాయో, ఒక వేళ ఆర్ధిక మాంద్యం లేకపోతే లేదనైనా చెప్పకుండా ఈ అవుగోలేందో, ఎవరో దేశాన్ని వెనక్కు తీసుకుపోతున్నారని అంటూ ఎదురుదాడి చేయటం ఏమిటో ఎవరికైనా అంతుపడుతోందా ?

అంటే అన్నారని ఏడుస్తారు. మోడీ సర్కార్‌ రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ అనే సంస్ధను తాత్కాలిక బడ్జెట్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేయాల్సి వుంది. జాతీయ మహిళ, జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ల మాదిరి ఇది జాతీయ ఆవు కమిషన్‌. ఆవు పేడ, గోమూత్రం, వాటితో వుత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు యువతీ, యువకులు ఏర్పాటు చేసే అంకుర సంస్ధలకు 60శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నదని జాతీయ ఆవు కమిషన్‌ అధ్యక్షుడు వల్లభ్‌ కథిరియా నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. పేడ, మూత్రాలతో ఔషధాలను తయారు చేస్తున్నామని, వాటిని మనుషులతో పాటు వ్యవసాయానికి వినియోగించవచ్చని చెప్పారు. ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. పాడి ఎండిపోయిన తరువాత ఆవులు దేనికీ పనికిరావనుకోవటం సరైంది కాదని పేడ, మూత్రం వస్తాయని, వాటిలో వున్న ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కోరినట్లు కథిరియా చెప్పారు. గోశాల నిర్వాహకుల నైపుణ్య అభివృద్దికి శిక్షణ ఇస్తామని కూడా అన్నారు. ఆవు పేడ, మూత్రాలతో తయారు చేసే ప్రత్యేక ఔషధం పంచగవ్యను గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వున్నతమైన తెలివిగల పిల్లలు పుడతారని ఆయుష్‌, జాతీయ ఆవు కమిషన్‌ అధికారులు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Image result for cow stories,narendra modi cartoon

గ్రామాల నుంచి వుద్యోగాల కోసం యువత పట్టణాలకు రాకుండా చూసేందుకు మోడీనోమిక్స్‌లో ఇదొకటి. పంచగవ్యతో పాటు ఆవు, పేడ మూత్రాలతో సబ్బులు, దోమల నివారణ పిడకలు, కాగితం తయారీ వంటి వాటిని యువకులకు వుపాధిగా చూపాలని తలపెట్టారు. వీటిని వ్యాపారపరంగా తయారు చేసే వారికి పన్నెండు సంవత్సరాల్లో తీర్చే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక ఆవు వుండే విధంగా చేయాలన్నది మోడీగారి లక్ష్యం. తాము అధికారానికి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామన్నది తెలంగాణా బిజెపి ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి.

కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌) పధకాల్లో గోశాలల నిర్మాణం కూడా ఒకటిగా చేరుస్తూ యుపి యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది, రెండు శాతం ఆవు పన్ను విధించింది. అన్ని దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆయుర్వేద, ఖాదీ కేంద్రాలలో ఆవు సంబందిత వుత్పత్తులను విక్రయిస్తారు.

మోడీ గారు దేశం గురించి ఎప్పుడు నోరు తెరుస్తారో, శాశ్వతంగా మూసుకుంటారో తెలియదు. ఆది గోద్రెజ్‌, ఆయనేమీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకి కాదు, పాకిస్ధానీ మద్దతుదారు లేదా తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ అసలే కాదు. ప్రముఖ పారిశ్రామిక సంస్ధ గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌. ‘ త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది, వుదాహరణకు కాశ్మీర్‌, కానీ వాణిజ్య విషయాల్లో వేగంగా నిర్ణయాలు చేయకపోవటం మంచిది కాదు ‘ అన్నారాయన. దేశంలో వాణిజ్య, పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న అసహనం లేదా అసంతృప్తికి నిదర్శనం. ఈ వ్యాఖ్య ఈ ఏడాది తొలి త్రైమాసిక ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని, ఎనిమిది ప్రధాన రంగాలలో గతేడాది జాలైలో 7.3శాతంగా వున్న వృద్ధి రేటు ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోయిందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖే ప్రకటించటానికి ముందే గోద్రెజ్‌ మాట్లాడారు. తన ప్రభుత్వంలో ఎవరైనా పాక్‌ ఏజంట్లు చొరబడ్డారేమో, వారి మీద మెరుపు దాడులు చేయాలేమో మోడీ గారు ఆలోచించాలి. రాయిటర్స్‌ వార్తా సంస్ధ చేసిన ఇంటర్వ్యూలలో డజనుకు పైగా ప్రముఖులు గోద్రెజ్‌ మాదిరే ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు, కొంత మంది పేరు రాయటానికి ఇష్టపడలేదు. వారంతా మోడీ విజయానికి హారతులు పట్టిన వారే సుమా ! వీరి అభిప్రాయాలపై వ్యాఖ్యానించాలని అడగ్గా ప్రధాని కార్యాలయం తిరస్కరించిందట. మోడీ గారే మాట్లాడనపుడు కందకు లేని దురద కత్తి పీటకెందుకు అన్నట్లుగా ఆయన ఆఫీసు ఎలా స్పందిస్తుంది. జూలై నెలలో ఈ విదేశీ మదుపుదార్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు వుపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వుద్దీపన చర్యలు, బ్యాంకుల విలీనాలు ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

తాము అప్పుల పాలయ్యామని, దివాలా తీశామని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు కనుక రుణాల రద్దు, సబ్సిడీలను కొనసాగించాలన్న కోట్లాది రైతాంగ వినతుల సందర్భంగా మీడియా, పారిశ్రామికవేత్తలు కూడా వాటికి వ్యతిరేకమైన వాదనలు చేస్తున్న విషయం తెలిసింది. ఎవరైనా స్వంత కాళ్ల మీద నిలబడాలి తప్ప ప్రభుత్వాలు ఆదుకుంటే సోమరితనాన్ని పెంచినట్లే అని సుభాషితాలు పలికారు. అవే నోళ్లు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని బయటపడవేసేందుకు వుద్దీపన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. రాయిటర్స్‌ కధనం ప్రకారం కొంత మంది బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన ప్రముఖులు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గ.ారిని కలిశారు. వారు చెప్పిన అంశాల మీద ఎలాంటి చర్చ లేకుండా కృతజ్ఞతలు, మేం పరిశీలిస్తామని చెప్పి పంపారు. ఎక్కువ సమావేశాల తంతు ఇలాగే వుంటోంది.

ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతుండటంతో దిక్కుతోచని ప్రభుత్వం జనం దృష్టిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున సిబిఐ, ఇడి, ఇతర ఆర్ధిక దర్యాప్తు సంస్ధల దాడులను ప్రారంభించింది. అక్రమాల మీద చర్య తీసుకోవటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇదే సమయంలో ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు తీసుకున్న చర్యలేమిటన్నది అసలు ప్రశ్న. ఐదేండ్ల క్రితం ఒక నవయువకుడు ప్రేమలో పడినట్లుగా మేము వున్నాం, ఇప్పుడు కలలు కల్లలైనట్లుగా తయారైంది అని ఒక వాణిజ్య వేత్త వ్యాఖ్యానించారు. అది నరేంద్రమోడీ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.

Image result for cow stories,narendra modi cartoon

దేశం ఆర్ధికంగా దిగజారుతోంది అని గుర్తించటానికి కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడటం లేదు. ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దేందుకు స్ధిరచిత్తం గలవారు చెప్పే మాటలను ఆలకించండి అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యల గురించి ఏం చెబుతారని విలేకర్లు అడిగితే ఆయనేం చెప్పారో నాకు తెలియదు, చెప్పినదాని మీద నాకెలాంటి ఆలోచన లేదు, ఆయన చెప్పింది నేను విన్నాను అంతే అని ముక్తసరిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువతీ యువకులు కార్లు కొనటం మాని ఓలాలు, వూబర్‌లు ఎక్కుతున్నారని ఆమె సెలవిచ్చిన విషయం తెలిసిందే.

దేశంలో నిరుద్యోగుల శాతం 8.2కు పెరిగిందని, పట్టణాల్లో అది 9.4శాతంగా వుందని సిఎంఐఇ చెప్పింది. పెంచిన సర్‌ఛార్జిని వుపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కూడా విదేశీ (ఎప్‌పిఐ) మదుపుదార్లు పెట్టుబడులను వుపంసంహరించటం ఆగలేదు. రూపాయి విలువ 72 దాటి పతనమైంది. ఒక వైపు పరిస్ధితి ఇలా వుంటే ఇప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది అంటూ గతనెల 26న బిజెపి ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. పని గట్టుకొని ఎగవేస్తున్న వారి నుంచి బ్యాంకు రుణాలు వసూలు చేయటం మీద అంతగా శ్రద్ద పెట్టని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని ముందుకు తెచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రస్తుతం అభివృద్ధి మందగించటానికి అవే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నా అంగీకరించటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. వీటి గురించి రోజూ మీడియాలో వార్తలు వస్తుంటే ప్రస్తావించని మోడీ గారు దేశానికి ఆవు పాఠాలు చెబుతున్నారు. దేశాన్ని ఎవరు వెనక్కు తీసుకుపోతున్నారు ? ఇది వినోదమా దేశానికి పట్టిన విషాదమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిర్మలమ్మా నిజాలను అంగీకరించండి, నివారణ చర్యలు తీసుకోండి !

11 Wednesday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

automobile, BoycottMillennials, mindset of millenials, Nirmala Sitharaman

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

అమ్మా నిర్మలమ్మా ఒక తెలుగింటి కోడలివనే గౌరవంతో ఒక తెలుగువాడిగా ఈ బహిరంగ లేఖలో నాలుగు ముక్కలు రాస్తున్నా. ఆటో మొబైల్‌ పరిశ్రమలో తలెత్తిన పరిస్ధితికి కారణాలను వివరించాలని మీరే అనుకున్నారో, విలేకర్లు ఎవరైనా వ్యాఖ్యానించమని కోరారో తెలియదు. మీ అధినేత ప్రధాని నరేంద్రమోడీయే ఇంతవరకు నోరు విప్పలేదు, మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ప్లాస్టిక్‌ గురించి, ఫిట్‌నెస్‌ వంటి సుభాషితాలనే పలికారు. మీ రెందుకమ్మా అలా వ్యాఖ్యానించారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువత ఓలాలు, వూబర్‌లు, మెట్రోలు ఎక్కటం, వాయిదాలు కట్టేందుకు సిద్దం గాకపోవటం, బిఎస్‌ 6 కారణాలని చెప్పటం ఏమిటి తల్లీ ?

తెలుగునాట ఒక సామెత వుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడుందో చూడటానికని చెప్పాడట ఒకడు. అసలు విషయం కల్లుకోసం ఎక్కాడని వేరే చెప్పనవసరం లేదు. మీరు కూడా సమస్య వుంది, పరిశీలిస్తున్నాం, తగిన సమయంలో తగు చర్యలు తీసుకుంటాం ఇలా ఏదో ఒకటి చెప్పకుండా ఈ సహస్రాబ్ది కుర్రకారు మానసిక స్ధితి గురించి అలా మాట్లాడారేమి తల్లీ ! అయినా కార్ల అమ్మకాలు, కుర్రకారు గురించి మీరు చెప్పిన మాటలను ఏడాది క్రితమే మహింద్రా సంస్ధ అధిపతి ఆనంద్‌ మహింద్ర, మారుతి కంపెనీ చైర్మన్‌ ఆర్‌సి భార్గవ చెప్పారమ్మా. వాటినే ఇప్పుడు మీరు పునశ్చరణ చేశారు. కార్లంటే అదేదో కుర్ర వ్యవహారంగా మార్చి వేశారు. మన దేశంలో వున్న జనాభాలో 40 కోట్ల మంది కుర్రకారే. వారిలో ఒక కోటి మంది కొనుగోలు చేసినా ఎంతో మార్కెట్‌ వుంటుంది. 2018 మార్చినెలతో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో మన దేశంలో వుత్పత్తి అయిన అన్ని రకాల మోటారు వాహనాల సంఖ్య 2.91 కోట్లు. వీటిలో ద్విచక్ర వాహనాలు 2.31 కోట్లు, కార్లు 21.7లక్షలు, త్రిచక్ర వాహనాలు పది లక్షలు, వాణిజ్య వాహనాలు ఆరులక్షల అరవై వేలు,ఎగుమతి చేసిన కార్లు ఏడు లక్షలు, ద్విచక్ర వాహనాలు 32.6లక్షలు, వాణిజ్యవాహనాలు లక్ష,త్రిచక్ర వాహనాలు 5.3లక్షలు.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు వూహా లోకంలో వున్నట్లున్నారు. మన యువతీ, యువకులందరూ కార్లు కొనేంతగా వేతనాలు తెచ్చుకోవటం లేదు గనుక మన దగ్గర అంత సీన్‌ లేదు తల్లీ. 2018 డిసెంబరు 12న ఆటో. ఎకనమిక్‌ టైమ్స్‌ సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యి మందికి 22 కార్లు వుంటే చైనాలో 164, జపాన్‌లో 591, కెనడాలో 662, ఆస్ట్రేలియాలో 740, న్యూజీలాండ్‌లో 774, బ్రిటన్‌లో 850, అమెరికాలో 980 వున్నాయట. సహస్రాబ్ది కుర్రకారు అందరూ కార్లు కొనటం మానుకోలేదు. వారికి అంత ఆర్ధిక శక్తి కూడా లేదు. అంతర్జాతీయ చమురు సంస్ధ(ఐఇఏ) అంచనా ప్రకారం 2040 నాటికి మన దేశంలో వెయ్యి మందికి 175 కార్లు వుంటాయట. మోడీగారు చెప్పినట్లు పకోడీల బండ్లు నిర్వహించే వారు కూడా వుద్యోగులే అయితే వారందరికీ ఐటి ఇంజనీర్లలో కొంత మందికి వస్తున్న మంచి ఆదాయాలు వారికి కూడా వస్తే వారు కూడా కారులో వచ్చి పకోడీలు అమ్మి తిరిగి కారుల్లోనే ఇండ్లకు వెళతారు. అమెరికాలో రోడ్లు వూడ్చే వారు కూడా కార్లలో వస్తారని మా చిన్నపుడు చెబితే అబ్బో అక్కడికి వెళ్లి వీధులూడ్చినా మన జీవితం ధన్యం అనుకొనే వాళ్లం. ఎందుకంటే అసమయంలో సినిమాల్లో తప్ప పల్లెటూళ్లలో వాస్తవంగా కార్లు చూసిన వారి సంఖ్య చాలా నామమాత్రంగా వుండేది మరి.

అనేక కంపెనీలు మందగమనం కారణంగా తమ వుత్పాదకతను తగ్గించిన తరువాత ఈ ఏడాది జూలై నెలలో కార్లు 25-30 రోజుల వుత్పత్తి, వాణిజ్య వాహనాలు 55-60 రోజుల, ద్విచక్ర వాహనాలు 60ా65 రోజుల వుత్పత్తి నిల్వలు వున్నాయని ఆటో పరిశ్రమ అంచనా. కుర్రకారంటే కార్లు కొనటం లేదు, మరి వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో ఎందుకు మాంద్యం ఏర్పడినట్లు ? బిఎస్‌ 6 ను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది కూడా అంతగా అతకటం లేదమ్మా! బిఎస్‌ ఒకటి నుంచి ఐదు వరకు లేని సమస్య ఆరుకు వచ్చిందంటే ఎలా? కొత్తగా వచ్చే తరం వాహనాల కోసం ఎదురు చూసే వారు చాలా నామమాత్రంగా వుంటారు తప్ప అసలు కొనుగోళ్లను బంద్‌ చేసిన వుదంతం లేదు. అసలు కంపెనీలే కొత్త తరం గడువుకు అనుగుణ్యంగా తమ పాత తరం వుత్పత్తి క్రమంగా తగ్గించటం లేదా నిలిపివేసే ప్రణాళికలను రూపొందించుకుంటాయి తప్ప అమాయకంగా అమ్ముడు పోని వాహనాలను తయారు చేసి పెట్టుకుంటాయా ? మన కార్పొరేట్‌ సంస్ధలు మరీ అంత అమాయకంగా లేవు తల్లీ !

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు గానీ మీ సర్కార్‌ గానీ దేశంలో ఆర్దిక మాంద్యం పెరుగుతోంది అని అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కుర్రకారు కార్లు కొనేందుకు విముఖత చూపుతున్నారు గనుక ఆటోమొబైల్‌ రంగం కుదేలైందని కాసేపు మీ అభిప్రాయాన్ని అంగీకరిద్దాం. అమెరికా-చైనా వారు వాణిజ్య యుద్ధంలో మునిగితే దాన్ని వుపయోగించుకొని మన దేశం చైనా స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా ? అదే వాస్తవమైతే గత ఏడాది కాలంలో మన ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గాయి ఎందుకని ? ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు గతేడాది జూలైలో 7.3శాతం వుంటే ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోవటానికి కారకులు ఎవరు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గత 25నెలల్లో అత్యంత కనిష్టంగా టోకు ధరల సూచి పెరుగుదల 1.8శాతంగా నమోదైంది. అంటే ధరల పెరుగుదల వున్నా పెద్దగా లేవు. అయినప్పటికీ వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి. వినియోగవస్తువులను వుపయోగించే విషయంలో సహస్రాబ్ది కుర్రకారు పాత తరాలను మించిపోయింది కదా ! మరి ఆ వస్తువులకు డిమాండ్‌ ఎందుకు తగ్గినట్లు ? చివరకు ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్లు కూడా సరిగా అమ్ముడు పోవటం లేదని పార్లే కంపెనీ ముంబైలోని విల్‌ పార్లే ఫ్యాక్టరీని మూసివేసింది. వీటికి ఓలా, వూబర్‌లు ఎక్కే కుర్రకారేనా ? అందుకే తల్లీ నిజాలను అంగీకరించండి, ఆత్మావలోకనం చేసుకోండి. వైఫల్యానికి ఎవరో ఒకరిని బలి చేయాలి కనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మరో కొత్త బమ్మను రంగంలోకి తెస్తే ఏమో గాని లేకపోతే మరో నాలుగు సంవత్సరాల వరకు మీ సర్కార్‌కు ఎలాంటి ఢోకా వుండదు. నిజాన్ని అంగీకరించి నివారణ చర్యలు చేపట్టండి, మూసిపెడితే పాచిపోతుందని గుర్తించండి.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

చెన్నయ్‌లో మీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మాటలు విన్న వారు టీవీల్లో కన్నవారిలో కుర్రకారు ఒకటే జోకులు వేసిన విషయం మీ వరకు వచ్చే వుంటుంది. ఏది ఏమైతేనేం ఒకందుకు మాత్రం మిమ్మల్ని అభినందించక తప్పదు. రేపేం కానుందో అని అన్ని తరగతుల వారు ఆందోళనపడుతున్న తరుణంలో మీ ప్రకటనతో పేలుతున్న జోకులతో విషాదంలో వినోదం మాదిరి నవ్వుకుంటున్నారంటే అది మీ పుణ్యమే. ఇదే మాట నరేంద్రమోడీ నోట వచ్చి వుంటే దేశం ఇంకా విరగబడి నవ్వి వుండేది. కొన్ని జోకులు ఎలా వున్నాయో మీకు చెబుదామనుకుంటున్న. దేశంలో మంచి నీటి కొరతకు మిలీనియల్స్‌ ఎక్కువగా తాగటం, ఆక్సిజన్‌ కొరతకు ఎక్కువగా పీల్చటం. పారగాన్‌ చెప్పుల అమ్మకాలు పడిపోవటానికి మిలీనియల్స్‌ చెప్పులు లేకుండా తిరగటమే కారణం. ఎంఎల్‌ ఏలను కొనేందుకు అమిత్‌ షా పేటిఎంను వినియోగిస్తున్న కారణంగా నల్లధనం తగ్గిపోయింది. అనిల్‌ అంబానీ అప్పులు చెప్పులు చెల్లిస్తున్నందున నిరర్ధక ఆస్ధులు తగ్గుతున్నాయి. పార్లమెంట్‌ సభ్యురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ బిజెపి మంత్రుల మీద చేతబడి చేస్తున్న కారణంగా జనాభా తగ్గుతోంది. కార్ల అమ్మకాలు ఢమాల్‌ అన్నందుకు దేశం నుంచి మిలీనియన్స్‌ను బహిష్కరించాలంటూ ఒకటే ట్వీట్లు. ఇంకా వున్నాయి గానీ వినోదం కాస్త విషాదం అవుతుంది. వుంటా మరి

ఓ తెలుగోడు

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d