• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

గడువుల పేరుతో అమెరికా అబద్దాలు – కొనసాగుతున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తత !

20 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, Donbass, Joe Biden, Minsk agreements, NATO, RUSSIA, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా డాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్నమాటలు. ఇప్పటి వరకైతే జోబైడెన్‌ ఎత్తుగడ ఈ ఉదంతంలో అభాసుపాలైంది. చివరికి పశ్చిమదేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్దోమిర్‌ జెలెన్‌స్కీ కూడా అసహనాన్ని వెలిబుచ్చాడు.” ఈ రోజు రష్యా దాడి చేస్తుంది, రేపు చేస్తుందీ అంటూ రోజుకొక తేదీని చెబుతారెందుకు ? మీరు నిజంగా మాకు సాయం చేయాలనుకుంటే తేదీలు చెప్పవద్దు. ఫిబ్రవరి 16, మార్చి ఒకటి, డిసెంబరు 31 ఏదైనా కావచ్చు, మా నేలను కాపాడుకొనే సత్తా మాకు ఉంది. మీరు ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇవ్వండి. కొంత సొమ్మును కేటాయించిన ప్రతిసారీ ఒకటి ,రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పది సంస్కరణలు మేమెందుకు చేయాలి. రండి, మా మిలిటరీని పటిష్టపరిచేందుకు తోడ్పడండి, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, మా ఆర్ధిక రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలతో పెట్టించండి. మాకు నిధులు, గ్రాంట్లు ఇవ్వండి. దానికి బదులు ఫలానా రోజు రష్యా దాడి చేస్తుంది అంటూ నిరంతరం చెప్పటం అవసరమా ” అని జెలెనెస్కీ ప్రశ్నించాడు. మ్యూనిచ్‌ నగరంలో జరిగిన ఐరోపా భద్రతా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, తరువాత ఆంక్షలు ప్రకటిస్తే జరిగేదేమీ ఉండదు కనుక ముందుగానే ఆ పని చేయాలని ఆదివారం నాడు ఉక్రెయిన్‌ కోరింది. ఈ వారంలోనే దాడి జరగవచ్చు, అది రాజధాని కీవ్‌ పట్టణం మీదే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. శనివారం నాడు రష్యా ఖండాంతర క్షిపణులతో విన్యాసాలు జరిపి నిర్ణీత లక్ష్యాాలను గురితప్పకుండా కొట్టింది. ఆదివారం నాడు ముగియాల్సిన రష్యాతో సైనిక విన్యాసాలను మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు బెలారస్‌ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిను తిరుగుబాటు ప్రాంతాల నుంచి ఆదివారం నాడు కూడా పౌరులు ముఖ్యంగా పిల్లలు రష్యాకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదార్లు, మిలిటరీ పరస్పరం కాల్పులు జరిపినట్లు కూడా చెబుతున్నారు.


రేపేం జరుగుతుంది అన్నది అనిశ్చితం. ఇప్పటి వరకు ఉక్రెయిను మీద దాడి గురించి చెప్పిన మాటలు వాస్తవం కాదని, ప్రచార దాడి అని తేలింది. గతంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు సద్దాం హుసేన్‌ ప్రభుత్వం మారణాయుధాలను గుట్టలుగా పోసి ఉంచిందంటూ తప్పుడు ప్రచారం చేసింది అమెరికా, వాటిని కనుకొని నాశనం చేసే పేరుతో ఏకంగా ఇరాక్‌ మీద దాడి చేసింది, సద్దాంను ఉరితీసింది. తీరా అక్కడ అలాంటి వాటి జాడలు కూడా లేవని అదే అమెరికా అధికారులు అంతా ముగిశాక ప్రకటించారు. ఇప్పుడు తిరిగి ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇది 1990 దశకం కాదు, రష్యా – ఇరాక్కు, సద్దాం హుసేన్‌, వ్లదిమిర్‌ పుతిన్‌కు పోలిలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఐరోపాలో అమెరికా పలుకుబడి మరింత తగ్గటానికి, దాని పరువు పోగొట్టటంలో పుతిన్‌ తన తెలివితేటలను ఉపయోగించాడనే చెప్పాలి.


ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినెలా వివిధ దేశాల సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ యుద్దం చేసేందుకు కాదు, బల ప్రదర్శన మాత్రమే. ఉక్రెయిన్‌, రష్యా సరిహద్దులు కలిగిన బెలారస్‌తో కొద్ది రోజుల క్రితం రష్యా సైనిక విన్యాసాలు జరిపింది. వాటిని చూపి ఇంకేముంది అవి ముగియగానే పనిలో పనిగా ఉక్రెయిన్‌ మీద ఫిబ్రవరి 16న దాడి చేస్తారని అమెరికా చెప్పింది. అనేక మంది నిజమే అని నమ్మారు. కీవ్‌ నుంచి తమ రాయబార సిబ్బంది కుటుంబాలను వెనక్కు రప్పించే నాటకాన్ని కొన్ని దేశాలు రక్తి కట్టించాయి. సరిహద్దుల్లోని తమ దళాలను కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించగానే మా దెబ్బకు దిగివచ్చిందని ఉక్రెయిన్‌ నేత తన జబ్బలను తానే చరుచుకున్నాడు. కానీ కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలు రెండో ఎత్తుగడలో భాగంగా కొత్త కతలు చెప్పటం ప్రారంభించాయి. మరోవైపున స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కుల మీద అదేశ మిలిటరీ దాడులు జరిపి రష్యాను రెచ్చగొట్టింది.


2014 నుంచి ఆ రెండు ప్రాంతాల్లోని జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాదాపు పదిహేనువేల మంది మరణించారు. మిలిటరీ సరిహద్దుల రక్షణ, ఇతర దేశాల దాడులను ఎదుర్కొనేందుకు తప్ప స్వంత జనం మీద దాడులు చేసేందుకు కాదు.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి.దీనిలో గమనించాల్సిన అంశం ఏమంటే స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్కులు రష్యాసరిహద్దులో ఉన్నందున ఉక్రెయిన్‌ మిలిటరీని సరిహద్దు ప్రాంతాల్లో అనుమతించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సరిగా అమలు జరగనప్పటికీ అమల్లోనే ఉన్నాయి.


ఈ ఒప్పందాల అమలు గురించి కాకుండా, అమెరికా, నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఉక్రెయినుకు ముప్పు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. నాటో విస్తరణలో భాగంగా జరిగిన కుట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆ కూటమి గద్దెనెక్కించింది. ఏ క్షణంలోనైనా విస్తరణ జరగవచ్చని భావించిన రష్యా వెంటనే పావులు కదిపింది. ఒకప్పటి తన భూభాగమైన క్రిమియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రష్యాలో విలీనం కావాలని మెజారిటీ పేర్కొనటంతో వెంటనే రష్యా ఆపని పూర్తి చేసింది. దీంతో కంగుతిన్న పశ్చిమ దేశాలు అప్పటి నుంచి రష్యామీద ఆంక్షలను అమలు జరుపుతున్నాయి. వాటి వలన ఫలితం లేకపోవటంతో అసలు మొత్తంగా ఉక్రెయిన్‌ ఆక్రమణ జరుపుతుందంటూ ప్రచారం, తేదీల నిర్ణయం చేశారు.


మిన్‌స్క్‌ ఒప్పందాల్లో రష్యా భాగస్వామి కనుక దానికి భిన్నంగా ఆ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తే ఆ పేరుతో దాడికి దిగాలని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో కాచుకున్నాయి. పుతిన్‌ అందుకు అవకాశం ఇవ్వలేదు. గుర్తింపు ఇవ్వాలంటూ ఇటీవల కమ్యూనిస్టు ఎంపీలు ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ పుతిన్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నాటో విస్తరణ-ఉక్రెయిన్‌ చేరిక గురించి మాట్లాడేదేమీ లేదని పుతిన్‌ చెబుతుండగా దానికి తాము సిద్దంగా లేమని అమెరికా చెబుతోంది. స్వాతంత్య్ర ప్రకటన చేసిన రిపబ్లిక్కులు రష్యాలో విలీనానికి కూడా సిద్దమే. అయితే అవి క్రిమియా వంటివి కాదు గనుక రష్యాతొందరపడటం లేదు. ఆ పని చేస్తే వెంటనే నాటో ఉక్రెయిన్లో తిష్టవేసి రోజువారి తలనొప్పి కలిగిస్తుంది. తన సభ్యదేశం కాని చోట నాటో దళాలను మోహరించే వీలు లేదు. ఐరోపాను మరింతగా తన కబంధ హస్తాల్లో బిగించేందుకు అమెరికా పావులు కదపటాన్ని జర్మనీ వంటి దేశాలు అంగీకరించటం లేదు.


నిబంధనలు, అవగాహనలకు విరుద్దంగా నాటో దేశాలు ఉక్రెయినుకు అన్ని రకాల సాయం చేస్తూ రష్యాను కవ్విస్తున్నాయి.2014 నుంచి 270 కోట్ల డాలర్ల మేర మిలిటరీ సాయం అందించగా ఒక్క 2021లోనే అమెరికా 65 కోట్ల డాలర్ల మేర అందించింది. ఈ ఏడాది ఇప్పటికి 20 కోట్ల మేరకు అందించారు. బ్రిటన్‌ 460టన్నుల మేరకు అనేక రకాల ఆయుధాలను చేరవేసింది. నిబంధనల మేరకు చూస్తే వీటిని చూపి రష్యా మిన్‌స్క్‌ ఒప్పందం నుంచి వైదొలిగి నేరుగా తిరుగుబాటు రిపబ్లికులకు అన్ని రకాల సాయం చేయవచ్చు గానీ దానికి పూనుకోలేదు.


అమెరికా, ఐరోపాలోని నాటో దేశాలకు రష్యన్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా, దాని మిత్రదేశాలు చెబుతున్నట్లుగా ఉక్రెయిను మీద ఎలాంటి దాడి ఉండదు. ఆశ్చర్యకర పరిణామాలూ జరగవచ్చు. మూడవది చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అమెరికాకు పంపిన ఒక పత్రంలో నిర్దిష్ట ప్రతిపాదనలను చేశారు. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది. ” ఉక్రెయిన్‌, జార్జియాలను నాటోలో చేర్చుకోవటమే కాదు, నామమాత్ర సభ్యత్వం కూడా ఇవ్వకూడదు. సభ్యులు కాని దేశాలలో అమెరికా మిలిటరీ కేంద్రాలు, ఆయుధ నిల్వల వంటి మిలిటరీ చర్యలు, రష్యాను లక్ష్యంగా చేసుకొనే ద్విపక్ష మిలిటరీ ఒప్పందాలు ఉండకూడడు ”. రుమేనియా, పోలాండ్‌లో ఉన్న మధ్యంతర, స్వల్పశ్రేణి అణుక్షిపణులను, బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలోని యుద్దనావలు, రష్యాగగన తలానికి సమీపంలోని అణుబాంబర్లను తొలగించాలని కూడా కోరింది. మిన్‌స్క్‌ ఒప్పందాలను అమలు జరపాలి, ఆ మేరకు డాన్‌బాస్‌ ప్రాంతానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ చెప్పారు. ఈ ఒప్పందాల ప్రకారం తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా ఎలాంటి ఆయుధాలను పంపకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ మిలిటరీ దాడి చేస్తే తిరుగుబాటుదార్లకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగేట్లుగా ఇప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సంస్ధలో దొంగబంగారం కేసు నిందితురాలు – పక్కా బిజెపి ప్రతినిధిగా కేరళ గవర్నర్‌ !

18 Friday Feb 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arya Rajendran, BJP, CPI(M), governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పక్కా బిజెపినేతగా పని చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధానపరమైన ప్రసంగంపై సంతకం చేయకుండా బ్లాక్‌మెయిలుకు పాల్పడ్డారు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన కేరళ దొంగబంగారం కేసులో నిందితురాలుగా ఉండి పదహారు నెలల పాటు జైలులో ఉన్న స్వప్న సురేష్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ లేదా దానికి సంబంధించిన నేతలు నడిపే ఒక స్వచ్చంద సంస్ధలో డైరెక్టర్‌గా చేరారు. బంగారం కేసులో అరెస్టయినపుడు ప్రభుత్వ స్పేస్‌ పార్క్‌ పధకంలో ఒక కన్సల్టెంట్‌గా ఉన్నారు. అంతకు ముందు యుఏఇ కాన్సులేట్‌లో పని చేశారు. ఆ సంబంధాలను వినియోగించుకొని బంగారాన్ని అక్రమంగా తెప్పిస్తున్నట్లు ఆమె, మరికొందరి మీద కేసు దాఖలు చేశారు. దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుండగానే స్వచ్చంద సంస్దలో చేరారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా అనే సంస్ధ తరఫున కేరళలోని పాలక్కాడ్‌ కేంద్రంగా ఆమె పని చేస్తారు. మళయాల మనోరమ పత్రిక కథనం ప్రకారం ఈ సంస్ధకు తొలుత పాట్రన్‌గా తరువాత అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌ కృష్ణ కుమార్‌ కాంగ్రెస్‌లో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా పని చేశారు.2004 ఆపార్టీ నుంచి వెలుపలికి వచ్చి బిజెపిలో చేరారు. తరువాత తిరిగి కాంగ్రెస్‌లో , 2019 తిరిగి బిజెపిలో చేరారు.


హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్దలో కేరళకు చెందిన అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కెజి వేణుగోపాల్‌ ఉపాధ్యక్షుడు. ఆ సంస్దలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత విభాగ డైరెక్టర్‌గా యుఏఇ , ఇతర కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకురావటం ఆమె విధిగానూ వాటితో పేద గిరిజనులకు అట్టపాడి ప్రాంతంలో ఉచితంగా ఇండ్లు నిర్మిస్తారని కేరళకౌముది పత్రిక పేర్కొన్నది. కోర్టులో ఉన్న కేసులు, తన ప్రస్తుత బాధ్యతలకు ముడి పెట్టవద్దని స్వప్ప మీడియాను కోరారు. కేసులు కేసులే ఉద్యోగం తన కడుపు నింపుకొనేందుకు అన్నారు.హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్ద మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనుల భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిందని, అనుమతులు లేకుండా గిరిజనులకు కొన్ని ఔషధాలను పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఔషధాల ప్రయోగాలకు స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్నవారితో గ్రామీణులు, గిరిజనులను వినియోగించుకోవటం తెలిసిందే.


కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ సంయమనం కారణంగా ఒక వివాదాన్ని నివారించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావటం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం రూపొందించి ఇస్తుంది. దానిలోని అంశాలను చదవటం తప్ప గవర్నర్‌ తన స్వంత అభిప్రాయాలను చొప్పించకూడదు. గతంలో ఒకసారి అలాంటి చర్యకు పాల్పడి కొన్ని పేరాలను చదివేందుకు నిరాకరించారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, జర్నలిస్టుగా ఉన్న హరి ఎస్‌ కర్తాను తన సహాయకుడిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ కోరారు. రోజువారీ రాజకీయాల్లో ఉన్నవారిని సాధారణంగా సిబ్బందిగా తీసుకోరు. అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదించింది. ఐతే ప్రభుత్వ అభ్యంతరాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ (జిఏడి) ముఖ్యకార్యదర్శి కె జ్యోతిలాల్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. అది మీడియాకు వెల్లడైండి. ఆ పని జ్యోతిలాలే చేయించినట్లు భావించిన గవర్నర్‌ సదరు అధికారిని జిఏడి నుంచి తప్పిస్తే తప్ప తాను అసెంబ్లీ ప్రసంగాన్ని ఆమోదిస్తూ సంతకం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ప్రభుత్వం సదరు అధికారిని వేరే బాధ్యతలకు బదిలీ చేస్తామని చెప్పిన తరువాతనే సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.


శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరిగి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఆమోదం తెలిపిన తరువాత మార్చి 23న ముగుస్తాయి. తరువాత పూర్తి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్‌ సభలో ప్రసంగం చదవటం మొదలు పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ గవర్నర్‌ గోబాక్‌ అంటూ నినాదాలు చేశారు. తరువాత సభనుంచి వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం చదువుతుండగా సాధారణంగా అధికారపక్ష సభ్యులు తమ ప్రభుత్వ విజయాలను పేర్కొన్నపుడు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేస్తే ప్రతిపక్షం నిరసన తెలుపుతుంది. దీనికి భిన్నంగా పాలక సభ్యులు మౌనంగా ఉంటూ గవర్నర్‌ తీరుతెన్నులకు నిరసన తెలిపినట్లు మీడియా పేర్కొన్నది. ప్రభుత్వం బిజెపి నేత నియామక పత్రంతో పాటు అభ్యంతరం తెలిపే లేఖను కూడా గవర్నర్‌కు పంపింది. దీన్ని గవర్నర్‌ అవమానంగా భావించి భరించలేకపోయారు.


మంత్రుల వద్ద సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ ఇవ్వటం కేరళలో ఒక పద్దతిగా ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారు. రాజభవన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన వారిని గవర్నర్‌ సిబ్బందిగా నియమించటం అసాధారణం అని ప్రభుత్వం రాసిన లేఖలో ఉంది. దానికి ప్రతిగా ఎక్కడా మంత్రుల సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ చెల్లింపు పద్దతి లేదని దాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించటమే కాదు వెంటనే అమలు జరపాలని గవర్నర్‌ కోరారు. ఈ అంశాన్ని మరింతగా చర్చించాలని ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా లీకైంది. జ్యోతిలాల్‌ను తొలగించినట్లు రాజభవన్‌కు సమాచారం అందిన తరువాతే గవర్నర్‌ ప్రసంగంపై సంతకం చేశారు.


గవర్నర్‌ను వెనకేసుకు వస్తూ బిజెపి రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని మంత్రుల సిబ్బందిగా నియమించుకోవటం, వారికి పెన్షన్లు చెల్లించటం చట్టబద్దమో కాదో ఆలోచించాలని కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. రాజభవన్ను నియంత్రించాలని సిఎం విజయన్‌ చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల సిబ్బందికి పెన్షన్‌ చెల్లించటం గురించి సిపిఎం నేత, మాజీ మంత్రి ఎంఎం మణి మాట్లాడుతూ ఐదు పార్టీలు మారిన తరువాత ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బిజెపిలో చేరారని, గవర్నర్‌ పదవిలో ఉంటూ చౌకబారు ఆటలు ఆడుతున్నారని, పెన్షన్‌ సొమ్ము ఖాన్‌ కుటుంబ సంపద నుంచేమైనా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. మరోమారు గవర్నర్‌ పదవి కోసం చెత్త మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారాని అన్నారు. గవర్నర్‌- ప్రభుత్వం నాటకాలాడుతున్నాయని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత విడి సతీషన్‌ ఆరోపించారు. కేరళలో బిజెపి అధికార ప్రతినిధిగా గవర్నర్‌ పని చేస్తున్నారని విమర్శించారు.


దేశంలోని మేయర్లలో పిన్న వయస్కురాలైన ఆర్య రాజేంద్రన్‌(తిరువనంతపురం-సిపిఎం) కేరళ అసెంబ్లీలో పిన్న వయస్కుడైన సచిన్‌దేవ్‌ ఒకింటివారు కాబోతున్నారు. వారిద్దరూ బాలసంగం నుంచి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవారే. రెండు కుటుంబాలూ ఆమోదం తెలిపాయి. మార్చినెలలో వివాహం జరగవచ్చు.ఆర్య ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నపుడు సచిన్‌ దేవ్‌ ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ఆలిండియా సహాయకార్యదర్శి. తామిద్దరం ఒకే భావజాలంతో ఉన్నామని, ఇద్దరం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశామని, మంచి స్నేహితులమని ఆర్య విలేకర్లతో చెప్పారు. తామిద్దం ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత రెండు కుటుంబాలకు, పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందున పార్టీకి తెలిపామని, రెండు కుటుంబాలు, పార్టీతో చర్చించిన తరువాత వివాహతేదీని ఖరారు చేసుకుంటామని తెలిపారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో బలవంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక బోధన – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాల చీలిక !

13 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

emmanuel macron, Fabien Roussel, french communist party, French elections 2022


ఎం కోటేశ్వరరావు


అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను బలవంతంగా రుద్దుతున్నారు. మితవాద రిపబ్లికన్‌ పార్టీ ఏలుబడిలో ఉన్న అరిజోనా రాష్ట్రంలోని హైస్కూళ్లలో స్వేచ్చ, ప్రజాస్వామ్య అమెరికన్‌ ప్రమాణాలతో సంఘర్షిస్తున్న కమ్యూనిజం, నిరంకుశత్వం ప్రమాదకారి అనే పాఠాలు చదవకుండా విద్యార్ధులకు డిగ్రీలు ఇవ్వకూడదని ప్రతిపాదించారు. వియత్నాం నుంచి పారిపోయి వచ్చిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక కుటుంబానికి చెందిన అసెంబ్లీ సభ్యుడు క్వాంగ్‌ గుయన్‌ ఈ బిల్లును విద్యా కమిటీలో పెట్టి ఆమోదం పొందాడు. దీన్ని అసెంబ్లీలో ఆమోదిస్తే అమలు చేస్తారు. పౌర విద్య ముసుగులో సోషలిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించే ఇలాంటి బిల్లునే గతేడాది ఫ్లోరిడా రాష్ట్రంలో కూడా ఆమోదించారు. అరిజోనాలో జరిగే పరీక్షల్లో కమ్యూనిజం-నియంతృత్వాన్ని పోలుస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా అమలు జరపాలా అని చర్చిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ భావజాలాల గురించి పాఠాలు ఉన్నాయని, శాసనసభ్యులు పాఠశాల సిలబస్‌ను నిర్ణయించటం ఒక ప్రమాదకర సంప్రదాయం అవుతుందని అనేక మంది విమర్శిస్తున్నారు.


అలబామా రాష్ట్రంలోని సదరన్‌ పావర్టీ లా సెంటర్‌ కె-12 విద్యార్దుల కోసం రూపొందించిన పాఠాలు అమెరికాను మౌలికంగా సోషలిస్టు సమాజంగా మార్చివేసేందుకు ఉద్దేశించినవంటూ, వాటిని పూర్తిగా తొలగించాలని ఒక పత్రికలో సంపాదకలేఖ ప్రచురితమైంది. తన కుటుంబం రష్యా నుంచి వచ్చిందని, అమెరికాలో కమ్యూనిజం పెరుగుదలను చూస్తున్నానని దానిలో ఉంది. ” నాలుగు సంవత్సరాల పాటు పిల్లలకు బోధించే అవకాశం నాకు ఇవ్వండి, నేను నాటే విత్తనాలను ఎవరూ తొలగించలేరు-వ్లదిమిర్‌ లెనిన్‌, ” పాఠ్యపుస్తకాలను అదుపు చేసేందుకు నాకు అవకాశమిస్తే దేశాన్నే అదుపులోకి తెస్తాను-అడాల్ఫ్‌ హిట్లర్‌, ” ప్రయివేటు ఆస్ధి, స్వేచ్చ విడదీయరానివి-జార్జి వాషింగ్‌టన్‌ చెప్పారంటూ మీకు స్వేచ్చ కావాలా నిరంకుశత్వం కావాలో తేల్చుకోవాలంటూ రెచ్చగొడుతూ ఆ లేఖ ప్రచురితమైంది.


ఏప్రిల్‌ పదవ తేదీన ఫ్రెంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసిన వారిలో సగానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వారు గెలుస్తారు. లేనట్లయితే 24వ తేదీన ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. 2017లో జరిగిన ఎన్నికలలో తొలి ఇద్దరికి 24.1, 21.3, మూడు,నాలుగు స్ధానాల్లో ఉన్నవారికి 20.1, 19.58శాతాల చొప్పున వచ్చాయి. మొదటి స్ధానంలో ఉన్న ఇమ్మాన్యుయల్‌ మక్రాన్‌ రెండవ రౌండులో 66.1శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సారి కూడా మక్రాన్‌ పోటీ పడుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి జీన్‌ లక్‌ మెలెంచన్‌ 19.58శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో ఉన్నాడు.ఈ సారి ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా ఫాబియన్‌ రౌసెల్‌ రంగంలో ఉన్నారు.


” ఫ్రాన్స్‌కు మంచి రోజులు ” అనే నినాదంతో కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలలో కమ్యూనిస్టులు పోటీ చేయటం ఇదే ప్రధమం. గత రెండు ఎన్నికల్లో పార్టీ మెలెంచన్‌కు మద్దతు ఇచ్చింది. సోవియట్‌ పతనం తరువాత బలహీన పడిన పార్టీలలో ఫ్రెంచి పార్టీ ఒకటి. ఐనప్పటికీ పారిస్‌, దాని శివార్లలోని పలు మున్సిపాలిటీలలో వరుసగా కమ్యూనిస్టులు గెలుస్తున్నారు. జనంతో ఉండటమే దీనికి కారణం. జాతీయ అసెంబ్లీలోని 577కు గాను 12, ఎగువసభ సెనెట్‌లోని 348 స్ధానాలకు 14 సీట్లు కమ్యూనిస్టులకు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న రౌసెల్‌కు మీడియా సర్వేల ప్రకారం మూడు-నాలుగు శాతం మంది మద్దతు ఇస్తున్నారు. ఇంకా పెరగవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇతర వామపక్ష పార్టీలు, శక్తులు కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించాయి. అనేక పార్టీలు మార్పు గురించి చాలాకాలంగా చెబుతున్నప్పటికీ అలాంటిదేమీ కనిపించటం లేదని ఈ సారి సంభవించనున్నదని రౌసెల్‌ అన్నాడు. కరోనా కాలంలో ప్రభుత్వ సొమ్మును జనానికి బదులు బహుళజాతి గుత్త సంస్ధలకు అప్పగించారన్నారు. పెద్ద బాంకులన్నింటినీ, ఇంధన కంపెనీలు టోటల్‌, ఎంగీలను జాతీయం చేయాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.

అసంతృప్తితో ఉన్న యువ ఓటర్లను మెలెంచన్‌ ప్రజాకర్షక నినాదాలు లేదా పచ్చి మితవాది మారినె లీపెన్‌కు మద్దతుదార్లుగా మారిన వారందరినీ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు, తిరిగి వారి హృదయాలను చూరగొనటమే తమ ప్రధాన సవాలని రౌసెల్‌ ప్రచార సారధి, పారిస్‌ ఉప మేయర్‌ ఇయాన్‌ రోసాట్‌ చెప్పాడు. దేశమంతటా స్ధానిక సంస్దల్లో 600 మంది కమ్యూనిస్టు మేయర్లు, వేలాది మంది కౌన్సిలర్లు అధికారంలో ఉన్నారు. వారందరూ ఉత్సాహంగా రంగంలో దిగవచ్చని వార్తలు. ఫ్రెంచి కమ్యూనిస్టు పత్రిక ఎల్‌ హ్యూమనైట్‌ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావటాన్ని చూస్తే మరోమారు కమ్యూనిస్టుల పట్ల జనంలో వ్యామోహం కనిపిస్తున్నట్లు చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకుడు,ఫాప్‌ పరిశోధనా సంస్ధ అధిపతి ఫ్రెడరిక్‌ డాబీ అన్నాడు. భావజాలాన్ని తిరస్కరించే వారు కూడా కమ్యూనిస్టులు సభ్యతగా, మాటకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తారని అన్నాడు. ఏవియన్‌ అనే పట్టణంలో ప్రతి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 60శాతం ఓట్లతో కమ్యూనిస్టులు గెలుస్తారని, 2017 ఎన్నికల్లో అక్కడ మితవాద నేత మారినే లీపెన్‌కు గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఈ సారి కమ్యూనిస్టు పార్టీ స్వయంగా పోటీ చేస్తున్నందున పార్టీకే ఓటు వేస్తారనే ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు.


ప్రస్తుతం వామపక్ష భావాలు కలిగిన వారు ఏడుగురు పోటీ చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో జరిగిన ప్రాతీయ ఎన్నికల్లో వామక్షాలన్నింటికీీ కలిపి 26.4శాతం ఓట్లు ఉన్నాయని ఒక విశ్లేషణ.రెండవ దఫా గ్రీన్స్‌, సోషలిస్టుల మధ్య ఐక్యత కారణంగా పదమూడు మెట్రోపాలిటన్‌ ప్రాంతీయ మండళ్లలో ఐదు చోట్ల గెలిచారు.వామపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగా జాతీయ ఎన్నికల్లో మితవాద అభ్యర్ధులకు అవకాశం వస్తోంది.2012 ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ అభ్యర్ది ఫ్రాంకోయిస్‌ హౌలాండేకు తొలి విడత 28.6శాతం ఓట్లు వచ్చి తుది పోటీలో గెలిచాడు. అదే పార్టీ గత ఎన్నికల్లో తొలి విడత కేవలం ఐదు శాతం ఓట్లు తెచ్చుకొని తుది పోటీకి అర్హతను కూడా కోల్పోయింది. ఆ ఓట్లు వామపక్ష అభ్యర్ధికి వేసి ఉంటే పోటీ వేరుగా ఉండేది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మక్రాన్‌ ఏర్పాటు చేసిన ఎన్‌ మార్చ్‌ పార్టీలో 85 మంది ఎంపీలు చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో వామపక్షాలు ఒకే అభ్యర్ధిని నిలిపి ఉంటే పోటీ రసవత్తరంగా ఉండేది. గత ఎన్నికల మాదిరే ఇద్దరూ మితవాదులే పోటీలో మిగిలితే పెద్ద మితవాదికి బదులు చిన్న మితవాదిని బలపరచటం తప్ప వామపక్షాలు, ఇతర ఓటర్లకు మరొక అవకాశం లేదు. పచ్చి మితవాదుల్లో కూడా ఐక్యత లేదు. ఎరిక్‌ జెమ్మర్‌, వారినే లీపెన్‌ అనే ఇద్దరు పోటీపడుతున్నారు. వామపక్ష నేత మెలంచన్‌కు తొలి రౌండులో ఈ సారి పదిశాతం, పారిస్‌ నగర మేయర్‌ సోషలిస్టు పార్టీ నాయకురాలు హిడాల్గోకు మూదుశాతం వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ధనిక దేశాలను ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఊపివేస్తున్న తరుణంలో జరుగుతున్న ఫ్రెంచి ఎన్నికలలో మక్రాన్‌ ఎదురీదుతున్నట్లే చెప్పవచ్చు. ఒక మితవాది స్ధానంలో పచ్చి మితవాదిని ఎన్నుకుంటారా లేక గతం మాదిరే తిరిగి మక్రాన్‌కే పట్టం కడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకే దెబ్బతో చైనా, రష్యాలను కొట్టాలన్న అమెరికా ఆత్రం !

12 Saturday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China Threat, Quad, Quadrilateral Security Dialogue, RUSSIA, Two-front wars’ with China and Russia, Ukraine war


ఎం కోటేశ్వరరావు
ఆత్రగాడికి బుద్ది మట్టు(తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు.లేకపోతే రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘన్‌ తాలిబాన్లనే అదుపు చేయలేక సలాం చేసి తోకముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి ! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో అమెరికా, భారత్‌, జపాన్‌,ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ(క్వాడ్‌) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్‌ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం , ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధం లేదు, ఐనా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతిదానికి ప్రతిదేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్‌ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా ? అంతసత్తా ఉందా ? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.


భారత్‌ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దానివల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్‌ భాగస్వామికోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా ? అందరిని, కాస్త దూరంలో ఉన్న ఇరాన్‌ వంటి మిత్రదేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్న దేశమైన భూటాన్‌ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా ! మనలిన్న తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది.మీ ఊరు చుట్టుపక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్‌ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది.

మరోవైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేంగా రెచ్చగొట్టాల్సిన పనిలేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా ?
ఈ కాలంలో జరిగిందేమిటి ? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది.2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్‌ నుంచి 1.1బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి ? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.


నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జోబైడెన్‌ కనిపిస్తేనే ఓట్లు పడతాయి.అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310బి.డాలర్ల విలువగల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120బి.డాలర్ల విలువగల వస్తువులపై పన్నును 15నుంచి 7.5శాతానికి తగ్గించాలి.2021లో రెండు దేశాల మధ్య 755.6బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి.డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరులక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండుశాతంగా ఉంది.


మెల్‌బోర్న్‌ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్‌ – చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్‌ భావ సారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్‌ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈసందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


మెల్‌బోర్న్‌ సమావేశంలో రష్యాగురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.క్వాడ్‌ బృందం విబేధాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఉక్రెయిన్‌ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయ కుండా రష్యానుంచి క్షిపణి వ్యవస్దలను మనదేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము దలదూర్చటం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. ఒక దేశంతో ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యామీద ధ్వజమెత్తారు.నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్‌ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడమీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తువేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటికోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్‌ అన్నారు. ఇటీవలి భద్రతామండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది. జపాన్‌-రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్‌ సిద్దంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్‌ తెగేవరకు లాగేందుకు సిద్దంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది.

మన దేశం గాల్వన్‌ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్దాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కోవీషీల్డ్‌ కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే. కేంద్రంలో ఉన్న అధికారపార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజభాగస్వాములే ఐతే, జపాన్‌, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గుచూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయినే ముందుగా దాడికి దిగుతుందా ? చమురు ధరల పెరుగుదలతో బలపడుతున్న రష్యా !

08 Tuesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

NATO allies, NATO war threats against Russia, RUSSIA, Ukraine attack on Donbass, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఆయుధ ఉత్పత్తిదారులు, వారికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మీడియా ఉన్మాదులు తప్ప యుద్దాలు జరగాలని ఏ ఒక్కదేశమూ కోరుకోదు, ఎవరూ సిద్దంగా కూడా లేరు. ఉక్రెయిన్‌ యుద్ధం వస్తుందా రాదా, రేటింగులు పెరుగుతాయా లేదా అని కొందరు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, రష్యా గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులకు తమ మిలిటరీలను తరలిస్తున్నాయి. వాస్తవంగా అక్కడేం జరుగుతోందో చెప్పలేము గాని ఏ క్షణంలోనైనా రష్యాదాడులకు దిగవచ్చని పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికన్‌ వార్తా సంస్దలు రెచ్చిపోయాయి.


తాజాగా వస్తున్న ఊహాగానాలు, వార్తల స్వభావం ఏమంటే రష్యా సంగతేమోగానీ దాని మద్దతు ఉన్న ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలలో ఒకటైన డాన్‌బాస్‌పై అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌ దళాలే దాడులకు దిగి రష్యాను కవ్వించవచ్చని చెబుతున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ నాటో కూటమిలోని విబేధాలు మరింతగా వెల్లడి అవుతున్నాయి. వీటికి తోడు ముడి చమురు ధర ఇప్పటికే 93డాలర్లు దాటింది. వంద దిశగా వెళతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా-ఐరోపా దేశాలలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల భయపెడుతున్నాయి.యుద్దం వస్తుందో లేదో, ఎవరు గెలుస్తారో, వస్తే ఎంతకాలం జరుగుతుందో తెలియదు గానీ రష్యానుంచి చమురు, గాస్‌ ఆగిపోతే ఏమి చేయాలా అని పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.నలభైశాతం గాస్‌ అక్కడి నుంచే వస్తున్నది.


ప్రస్తుతం ఐరోపా యునియన్‌ అధ్యక్ష స్ధానంలో ఉన్న ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మాస్కోలో పుతిన్‌తో భేటీ జరిపారు.సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను నివారించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని అంగీకరించే సమస్యే లేదని పుతిన్‌ మరోసారి తెగేసి చెప్పారు.పూర్వం తనలో భాగమై తరువాత పాలనా పరంగా ఉక్రెయిన్‌కు అప్పగించిన క్రిమియా ప్రాంతాన్ని అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ తీర్పు ప్రకారం 2014లో రష్యా తనలో విలీనం చేసుకున్న అంశం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. ఆ తరువాత రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ స్వయపాలిత ప్రాంతాలు కొన్నింటిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవి కూడా రష్యాతో విలీనానానికి మొగ్గుచూపాయి. ఉక్రెయిన్‌ పాలకులు అంగీకరించకపోవటంతో అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. వాటిలో ఒకటే డాన్‌బాస్‌. అది భౌతికంగా ఉక్రెయిన్లో ఉన్నా తిరుగుబాటుదార్లదే పెత్తనం, వారికి రష్యామద్దతు బహిరంగ రహస్యం.


తనది గాకపోతే తాటిమట్టతో అన్నట్లుగా అమెరికా, ఇతర దేశాలను చూసి చేతులు కాల్చుకొనేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉందా అన్నది సందేహమే. 2015లో తిరుగుబాటుదార్ల చేతిలో జరిగిన పరాభవాన్ని అక్కడి పాలకులు మరచిపోలేదు. ఇతరులు ఇచ్చిన ఆయుధాలతో ఈసారి దెబ్బతీయవచ్చని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటుదార్లకూ మెరుగైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి,వాటికి రష్యా అండ కూడా ఉంది. అమెరికాకు యుద్దం ఎందుకు ?


2008 ఆర్దిక సంక్షోభం నుంచి అమెరికా, ఇతర ఐరోపాధనిక దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ద ఇంకా కోలుకోలేదు.కరోనాకు ముందే మరో మాంద్యంలోకి కూరుకుపోనుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనాతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు గనుక కొత్తగా లాభాల కోసం దారులు వెతుకుతున్నారు.2008 సంక్షోభం తరువాత అమెరికా కేంద్రీకరించిన దేశాల్లో చమురు ఎగుమతి చేసే ఇరాన్‌, వెనెజులా,రష్యా, ఇరాక్‌, సిరియా వంటివి ఉన్నాయి. వాటిపై ఆంక్షలు విధించిన అమెరికా ఈ కాలంలో మనవంటి దేశాలకు చమురు ఎగుమతిదేశంగా ముందుకు వచ్చి సొమ్ము చేసుకున్న అంశం తెలిసిందే. రష్యానుంచి ఐరోపాకు గాస్‌ను సరఫరా చేసే రెండవ పైప్‌ లైన్‌ నోర్డ్‌ స్ట్రీమ్‌ దాదాపు పూర్తి కావచ్చంది. దాన్ని అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ పేరుతో అమెరికా రాజకీయాలు చేస్తోంది.


యుద్దం లేదా యుద్దవాతావరణం నాటోలోని ప్రధాన దేశాలకు లాభాల పండిస్తోంది.1991-2014 మధ్య ఉక్రెయిన్‌కు అమెరికా నాలుగుబిలియన్‌ డాలర్లు కేటాయించగా, గత ఎనిమిది సంవత్సరాల్లో 2.5బిడాలర్లు ఇచ్చింది. అదిగాక ఇతర దేశాలు కూడా 10బి.డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. ఉక్రెయిన్‌ నౌకాదళాన్ని నవీకరించే పేరుతో బ్రిటన్‌ 1.7బి.పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ బ్రిటన్‌, ఇతర కంపెనీలకు లబ్ది చేకూర్చేవే. నాటో దేశాల ఆయుధ కంపెనీలను మేపేందుకు 2014-22 మధ్య ఉక్రెయిన్‌ జిడిపిలో మూడు నుంచి ఆరుశాతానికి మిలిటరీ ఖర్చు 11బి.డాలర్లకు పెంచింది. అనేక ఐరోపా దేశాలు అమెరికా మీద ఆధారపడటం కూడా మరోవైపు అవి ఇష్టం లేకున్నా రష్యామీద పోరుకు సిద్దం అనాల్సి వస్తోంది.బ్రిటన్‌ ప్రపంచాధిపత్యంలో జూనియర్‌ వాటాదారుగా అమెరికాతో చేతులు కలుపుతోంది. రష్యామీద ఆంక్షలను వ్యతిరేకించే దేశాల్లో ఇటలీ ఒకటి. దాని పెట్టుబడులు అక్కడ ఉండటమే కారణం.


ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు యుద్దాన్ని కోరుకోవటం లేదు.దానికి రష్యా హీటింగ్‌ చమురు, గాస్‌ అవసరం. ఒకవేళ పోరు జరిగితే అమెరికా నుంచి అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది వారి భయం. ఇదే పరిస్ధితి మిగతా దేశాలకూ దాపురిస్తుంది. తమ కంపెనీల లాభం కోసం అమెరికా సృష్టించిన ఈ సంక్షోభానికి పావులుగా మారటమా లేదా అన్నది వాటి ముందున్న సమస్య. ఘర్షణలో ఉన్న పక్షాలకు ఆయుధాలు అందించ కూడదన్న తమ రెండవ ప్రపంచ యుద్ద అనంతర విధానానికి అనుగుణంగా బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాల రవాణాను తమ గగన తలం మీద నుంచి అనుమతించటం లేదని జర్మనీ ప్రకటించింది. దాంతో బ్రిటన్‌ విమానాలు అనేక గంటల పాటు అదనంగా వేరే మార్గంలో వెళ్లాల్సివచ్చింది. అంతే కాదు తాను సరఫరా చేసిన హొవిట్జర్లను ఉక్రెయిన్‌కు దారి మళ్లించరాదని ఎస్తోనియాకు జర్మనీ స్పష్టం చేసింది.ప్రపంచవ్యాపిత బాంకుల ఆర్ధిక సమాచార వ్యవస్ధ (స్విఫ్ట్‌) నుంచి రష్యాను దూరంగా పెట్టాలన్న అమెరికాకు ఐరోపా దేశాల నుంచే ఎదురుదెబ్బతగిలింది. ఇప్పుడున్న స్ధితిలో అమెరికా ఎన్నికబుర్లు చెప్పినా తన శత్రుదేశాల నుంచి చమురు, గాస్‌ దిగుమతులను నిరోధించేశక్తి దానికి లేదు. స్లోవేకియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లోని చమురుశుద్ది కర్మాగారాలకు, జర్మనీకి రష్యాగొట్టపు మార్గాల ద్వారానే చమురు సరఫరా జరగాలి. అందువలన చెల్లింపులు జరపాలంటే స్విఫ్ట్‌నుంచి రష్యాను పక్కన పెడితే కుదరదు.


గత కొద్ది సంవత్సరాలుగా నయా నాజీ కిరాయి ముఠాలకు దేశభక్తి ముద్రవేసి అమెరికా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తోంది. సిఐఏకు కిరాయి మూకలను సరఫరా చేసే బ్లాక్‌ వాటర్‌ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారిని, ఉక్రెయిన్‌ మిలిటరీని జతచేసి డాన్‌బాస్‌ వంటి ప్రాంతాల మీద దాడులు చేయించాలని చూస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపిన స్టెఫాన్‌ బందేరాను ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించి నీరాజనాలు పడుతోంది. ఎనిమిది సంవత్సరాల నాడు క్రిమియా విలీనాన్ని అడ్డుకోలేని నాటో కూటమి ఇప్పుడు దాన్ని విముక్తి చేస్తామని దాడులకు దిగితే యుద్దాన్ని ప్రారంభించిన నేరం దానిదే అవుతుంది. నెపం రష్యామీద నెట్టాలి గనుక పశ్చిమ దేశాలు సాకుకోసం చూస్తున్నాయి.


ఒకవైపు రష్యాను బూచిగా చూపుతున్న పశ్చిమ దేశాలు మరోవైపు మరోకారణంతో నిజంగానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.చమురు ధరల పెరుగుదలతో రష్యా ఆర్ధికంగా బలపడటమే దానికి కారణం. అది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేశక్తి ఇస్తుంది. చమురు ధరల పెరుగుదల కారణంగా దాని విదేశీమారక ద్రవ్య నిల్వలు 640బి.డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ రుణం జిడిపిలో 12శాతానికి తగ్గింది. ముడి చమురు ధర కనీసం వందడాలర్లకు చేరుతుందని అమెరికా వాల్‌స్ట్రీట్‌ భావిస్తున్నది.వివిధ కారణాలతో ఈఏడాది చివరికి 125 డాలర్లవుతుందని జెపి మోర్గాన్‌ అంచనా. నిత్యం రష్యామీద ఆంక్షల గురించి చెప్పే అమెరికన్లు అదే రష్యానుంచి మూడేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రస్తుతం డీజిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం 1.55 మిలియన్‌ పీపాల డీజిలు ఈనెలాఖరుకు అమెరికా చేరనుంది. అమెరికా తూర్పు కోస్తాలోని చమురుశుద్ధి కర్మాగారాలకు లాభాలు తక్కువగా ఉండటంతో శుద్దిని పరిమితం చేశాయని, ఒక కర్మాగారంలో పేలుడు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. కెనడా ఒక కర్మాగారాన్ని మూసివేయటం, ఐరోపా దేశాలే ప్రత్నామ్నాయం కోసం వెతుకున్నందున రష్యామీద ఆధారపడక తప్పటం లేదని తెలిపింది. దీనికి తోడు టెక్సస్‌లో చలి కారణంగా ఉత్పత్తికూడా తగ్గనుంది.


అమెరికా మీడియా అంతటా ప్రజాస్వామ్యం, ఐరోపాకు ముప్పు తక్షణం ఉక్రెయిన్‌ మీద దాడి జరగబోతున్నదంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా మరో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యన్లు మెజారిటీగా ఉన్న డాన్‌బాస్‌ ఇతర స్వయం పాలిత ప్రాంతాలపై ఉక్రెయిన్‌, నాటో, కిరాయి మూకలు దాడులు చేయనున్నట్లు రష్యా మీడియాలో రాస్తున్నారు.2014లో ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులను డాన్‌బాస్‌ తిరుగుబాటుదార్లు తిప్పికొట్టారు.రష్యా సైనిక సమీకరణ చేస్తోందని చెబుతున్నవారు దశాబ్దాల తరబడి దానికి వ్యతిరేకంగా ఐరోపాలో 64వేల మందిని అమెరికా నిలిపివుంచిందని, మరో ఎనిమిదిన్నరవేల మందిని దింపుతోందని, అవసరమైతే మరో 50వేల మందిని దించేందుకు నిర్ణయించిందనే అంశాలను చెప్పటం లేదు. రష్యా లక్ష మందిని సరిహద్దులకు తరలించినట్లు గుండెలుబాదుకుంటున్నారు. నిజమే, రెండోవైపు ఉక్రెయిన్‌ తన మిలిటరీలో సగం అంటే లక్షా 25వేల మందిని రష్యా ముంగిట్లోకి తరలించింది.డాన్‌బాస్‌తో పాటు తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌టెస్క్‌, లుగాన్‌స్క్‌ ప్రాంతాలలోనే వారిని మోహరించింది. అక్కడి తిరుగుబాటుదార్లపై మిలిటరీ చర్యకు దిగి రష్యాను రెచ్చగొట్టి రంగంలోకి దింపాలన్నది అమెరికా ఎత్తుగడ. అదే జరిగితే ఆ పేరుతో మరిన్ని కఠినమైన ఆంక్షలు,నాటో విస్తరణ, మరిన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చని, యుద్దంలోకి దిగవచ్చన్నది వ్యూహం. దాని దురూహలు ఫలిస్తాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాకులు అవసరమా ?

06 Sunday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, BSP’s Jatav vote bank, Farmers, Lakhimpur Kheri killings, Mayawati, RSS, UP CM, UP election 2022, YogiAdityanath


ఎం కోటేశ్వరరావు


మఠాల్లో ఉంటూ సర్వసంగ పరిత్యాగులైనట్లు చెప్పుకొనే యోగులు, యోగినులకు తుపాకులు అవసరమా ? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌కు ఉన్న వ్యక్తిగత ఆస్తి రు.1.5 కోట్లలో లక్ష రూపాయల విలువైన ఒక రివాల్వరు, రు.80వేల ఖరీదైన ఒక రైఫిల్‌, రుద్రాక్షలతో కూడిన రెండు బంగారు గొలుసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.యోగులు రుద్రాక్షలు కలిగి ఉండటంలో అబ్బురం ఏమీ లేదు, తుపాకులెందుకని ? సిఎం గాక ముందు ఐదు దఫాలు ఎంపీగా పని చేసిన యోగికి అవసరమైన భద్రతను అధికారికంగా కల్పిస్తారు.ఐనా స్వంతంగా రెండు మారణాయుధాలను ఎందుకు వెంట ఉంచుకుంటున్నట్లు ? రాత్రుళ్లు ప్రాణభయం ఉందా ? 2017 ఎంఎల్‌సి ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నాలుగు కేసులు, రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్న యోగి తాజా అఫిడవిట్‌లో కేసులేమీ లేవని,స్వంత వాహనాలేమీ లేవని తెలిపారు.
గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్ధానం నుంచి పోటీలో ఉన్న ఆదిత్యనాధ్‌పై తాను పోటీ చేయనున్నట్లు గత 26సంవత్సరాలుగా నిరవధిక ధర్నా చేస్తున్న మాజీ టీచర్‌ విజయ సింగ్‌ ప్రకటించారు.ముజఫర్‌నగర్‌లో భూమాఫియా మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. యోగి మీద పోటీతో పాటు ఎస్‌పి నేత అఖిలేష్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న చోట వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.


ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక తరగతి కీలకపాత్ర పోషిస్తున్నారు.1989 తరువాత వారి నుంచి సిఎం గద్దెనెక్కిన వారు లేరు. కారణం తరువాత కాలంలో ఓబిసి కులాలు, రాజకీయాలు ముందుకు వచ్చాయి.మండల్‌ (కమిషన్‌) ఆందోళన తరువాత ఈ తరగతి నుంచి ఎవరూ సిఎం కాలేదు. కులాలు, మతాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 21 మంది సిఎంలుగా పని చేస్తే వారిలో ఆరుగురు గోవిందవల్లభ పంత్‌, సుచేతా కృపలానీ,కమలాపతి త్రిపాఠీ, శ్రీపతి మిశ్రా, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డి తివారీ ఈ సామాజిక తరగతికి చెందినవారే.పదిశాతంపైగా ఓటర్లుగా కూడా ఉన్నందున వీరు మొగ్గినవైపు అధికారం చేతులు మారుతూ వస్తోంది. విధాన సభలోని 403 స్ధానాలకు గాను 115 చోట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని అంచనా. ఆ రీత్యానే గతంలో బిఎస్‌పి నేత మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, గత ఎన్నికల్లో యోగి గద్దెనెక్కారన్నది కొందరి సూత్రీకరణ. దానిలో భాగంగానే ఇప్పుడు యోగి పట్ల ఆగ్రహంగా ఉన్నందున బిజెపి ఇంటిదారి పట్టవచ్చని చెబుతున్నారు.నిజానికి దీనికంటే ఇతర అంశాలు బలంగా పని చేస్తున్నాయి.


ఈ సామాజిక తరగతి సమాజవాది పార్టీకి మద్దతు ఇచ్చినపుడు యాదవులు వీరిని చిన్నచూపు చూశారని బిజెపి, ఇతర పార్టీలు రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదే ఆయుధాన్ని బిజెపి మీద ఇతరులు ప్రయోగిస్తున్నాయి. ఠాకూర్ల మోచేతి నీళ్లు తాగాల్సి వస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. యోగి పాలనలో కనీసం ఐదువందల మంది బ్రాహ్మలను హత్య చేశారని,20 మందిని నకిలీ ఎన్‌కౌంటర్లలో చంపినట్లు విమర్శలున్నాయి. దీని తీవ్రతను గమనించే అనేక మంది బ్రాహ్మణనేతలకు బిజెపి పెద్దపీటవేస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తోంది.లఖింపూర్‌ ఖేరీలో రైతుల మీద వాహనాలను తోలి హత్యకావించిన కేసులో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఉన్నట్లు విచారణలో తేలినా మంత్రి మీద చర్య తీసుకొనేందుకు బిజెపి వణికి పోవటానికి ఇదే కారణం. అంతేకాదు బ్రాహ్మలతో ఏర్పాటుచేసిన కమిటీలో కూడా మంత్రిని చేర్చారు.


ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్ల కోసం పార్టీల పాట్లు ఇన్నిన్ని కావు. లక్నో నగరంలో పరశురాముడి విగ్రహాన్ని సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. గండ్రగొడ్డలితో కూడిన పరశురాముడు-అఖిలేష్‌ చిత్రాలు తరువాత దర్శనమిచ్చాయి.యాదవులు, బ్రాహ్మలు మాతోనే ఉన్నారని అఖిలేష్‌ చెప్పారు. బిఎస్‌పి నేత మాయావతి ఎన్నికల ప్రచారంలో దిగకపోయినా ఆ పార్టీ అగ్రనేత సతీష్‌ చంద్ర మిశ్రాను రంగంలోకి దించి బ్రాహ్మల ఓట్లకోసం తిప్పుతున్నారు. ప్రతిపక్షాల దాడికి తట్టుకోలేక బ్రాహ్మలను సంతృప్తి పరచేందుకు బిజెపి 16మందితో ఒక కమిటీని వేసి సమస్యలను గుర్తిస్తామంటూ బుజ్జగింపులకు దిగింది. గాంగస్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ సమయంలో మరణించిన అమర్‌దూబే భార్య ఖుషీ దూబే, ఆమెతో పాటు తల్లి గాయత్రీ తివారీకి సీట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ తనవంతు తిప్పలు పడుతోంది.


ఆదిత్యనాధ్‌ తప్పక గెలవాలని తాము కోరుకుంటున్నామని, ఎందుకంటే అసెంబ్లీలో బలమైన ప్రతిపక్ష నేత అవసరం కనుక అని రైతు ఉద్యమనేత రాకేష్‌ తికాయత్‌ జోక్‌ వేశారు. పోటీ 80శాతం, 20శాతం మధ్యనే అంటూ హిందూ-ముస్లిం పోటీగా రెచ్చగొట్టేందుకు బిజెపి వేసిన ఎత్తుగడ దానికే నష్టకరంగా మారుతున్నట్లు వార్తలు రావటంతో నష్టనివారణ చర్యలకు పూనుకుంది. బిజెపి చేసిన ప్రచారంతో వివిధ పార్టీల వెనుక చీలిన ముస్లిం సామాజిక తరగతి బిజెపిని ఓడించేందుకు మొత్తంగా సమాజవాదికి మద్దతు ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దాంతో మొదటిదశ ఎన్నికలు కూడా ప్రారంభంగాక ముందే 80-20 కాస్తా 90-10శాతంగా మారినట్లు స్వయంగా యోగి ఎన్నికల ప్రచారంలో చెప్పటం ప్రారంభించారు.మతంతో సంబంధం లేని ఎన్నికలని, ముస్లింలతో సహా అందరూ తమ వెనుకే ఉన్నారని చెప్పటమే ఇది.


రెండు ఇంజిన్లతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు ఎన్నికల్లో తానే చెమటలు కారుస్తోంది. పండిన గోధుమల్లో 15శాతం, బియ్యంలో 32శాతం మాత్రమే మద్దతు ధరకు రాష్ట్రంలో సేకరించారు. మిగిలిన మొత్తాన్ని రైతులు అంతకంటే తక్కువకే అమ్ముకొని నష్టపోయారు. రైతుల ఉద్యమం, ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే 10 నుంచి 15శాతానికి గోధుల సేకరణ పెరిగినప్పటికీ 2018-19లో 16శాతం సేకరణతో పోలిస్తే తక్కువే. బియ్యం సేకరణ మరీ ఘోరంగా ఉంది. గత ఐదేండ్ల సగటు 34.8శాతం కాగా, గతేడాది 43 నుంచి ఈ ఏడాది 32శాతానికి దిగజారింది. కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని సాగు చట్టాల రద్దు ప్రకటనతో పాటు చెప్పారు. ఇంతవరకు దాని ఊసే లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత అంటూ ఇప్పుడు కొత్త కబుర్లు చెబుతున్నారు.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయరాదంటూ 57రైతుల సంఘాల పిలుపు మేరకు ఎస్‌కెఎం మిషన్‌ ఉత్తర ప్రదేశ్‌ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ప్రతి గ్రామాన్ని సందర్శించి బిజెపి పాల్పడిన విద్రోహం గురించి రైతులు, ఇతర జనాలకు వివరిస్తామని నేతలు తెలిపారు. తాము ఏ పార్టీకి ఓటు వేయాలన్నది చెప్పటం లేదని, మోసం చేసిన బిజెపిని ఓడించాలని కోరతామన్నారు. జనవరి 15న సమావేశమైన ఎస్‌కెఎం కమిటీ ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడవు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటికీ ఏర్పాటును ప్రకటించకపోతే జనవరి 31న దేశమంతటా విద్రోహదినంగా పాటించాలని పిలుపు ఇచ్చారు. ఆ మేరకు పలుచోట్ల పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆందోళన పునరుద్దరణలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలల్లో బిజెపి ఓటమికి పిలుపు ఇచ్చారు.


ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతంలో సమాజవాది-ఆర్‌ఎల్‌డి కూటమి ప్రచారం బిజెపికి చెమటలు పట్టిస్తున్నట్లు వార్తలు. విజయ రధం పేరుతో బస్సు ద్వారా అఖిలేష్‌ యాదవ్‌ – జయంత్‌ చౌదరి చేస్తున్న పర్యటన యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.జాట్‌ – ముస్లిం ఐక్యతను ముందుకు తెస్తున్నారు. తరచుగా జయంత్‌ చౌదరి సభలకు హాజరైన యువతను ఇలా అడుగుతున్నారు ” ఇక్కడున్న అందరికీ వివాహమైందా ? మీరు పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా ? గుర్తు పెట్టుకోండి, వివాహం కావాలంటే మీరు ఇంట్లో సామరస్యతను పాటించాలి. ఇంట్లో ప్రశాంతత లేదని ఇతరులకు తెలిస్తే వివాహానికి ఎవరూ ముందుకు రారు ” అని చెబుతున్నారు. అఖిలేష్‌ రైతులను ఆకర్షించేందుకు ఇలా మాట్లాడుతున్నారు.” మీకు వికాసం కావాలా లేక రోడ్ల మీద తిరిగే పశువులు కావాలా ?” గో సంరక్షణ పేరుతో ఒట్టిపోయిన పశువులను అమ్ముకోనివ్వకుండా రైతులను బిజెపి సర్కార్‌ అడ్డుకుంటున్నది. వాటిని మేపటం దండగ అని రైతులు రోడ్ల మీదకు వదలి వేయటంతో వాటిని నుంచి రైతులు పంటలను కాపాడుకోవటం మరొక సమస్యగా మారుతోంది. దాంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తుతోంది.


ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికలు బిఎస్‌పి చావుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. దళితుల్లో జాతావులు మాయావతి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని బిజెపి ఇతరులను రెచ్చగొట్టి కొంత మేరకు తమవైపు తిప్పుకోగలిగింది. ఇప్పుడు బిఎస్‌పి ఎక్కడా రంగంలో కనిపించకపోవటంతో జాతావులు, ఇతర దళితులను తమ వైపు ఆకర్షించేందుకు బిజెపి, ఎస్‌పి పూనుకున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో దళితులు 21శాతం కాగా వారిలో జాతావులు తొమ్మిదిశాతం ఉన్నారు.గత ఎన్నికల్లో 84రిజర్వుడు స్ధానాల్లో బిజెపికి 69, దానితో జతకట్టిన పార్టీలకు మరోఐదు వచ్చాయి. గిరిజనులకు ఉన్న మరో రెండుతో మొత్తం 86 స్ధానాల్లో బిఎస్‌పికి వచ్చింది కేవలం రెండంటే రెండు మాత్రమే. ఎస్‌పి ఎనిమిది చోట్ల గెలిచింది. ఈ సారి బిజెపి జాతావు సామాజిక తరగతికి చెందిన మాజీ ఉన్నతాధికారులతో పాటు ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ను కూడా రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రలను అధిగమించి పురోగమనంలో వెనెజులా !

02 Wednesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#viva Venezuela, Chavez, crude oil price, Maduro, President Maduro, Venezuela, Venezuela’s economy, Yandamuri, Yandamuri Veerendranath


ఎం కోటేశ్వరరావు


వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్‌(రిజర్వు)బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు,వేలశాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి ? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది.దీని అర్ధం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్‌ ద్రవోల్బణం గత చరిత్రే అని, ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.


లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు చెందిన ఐరాస ఆర్ధిక కమిషన్‌ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలిసానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా ? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్దతులు కావు.ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్యవిభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనెజులా వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బిజెపి పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా,కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.


మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది.ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెల దేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా ? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి ? వారికి నచ్చితే, విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి ? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?


2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీ ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రు.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి.చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి.అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్‌ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్‌ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్‌ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది.

అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్‌ లిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేక వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్‌ తోడ్పాడుతూ రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పధకాలు వేశారు.


వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి ? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు.అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్దాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని,సిగిరెట్‌ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్రదృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. ఇలాంటి పెద్దలకు మాదాపూర్‌, కొండాపూర్‌ పబ్బుల్లో తాగితందనాలతున్న కొందరు చిన్న పెగ్గు, బిర్యానీ, ఇతర విలాసాల కోసం రాత్రంగా కాలక్షేపసరకుగా మారుతున్న వారు కనిపించరు. వీరు ఏ పేదరికం నుంచి వచ్చినట్లు ? కరోనా లాక్‌డౌన్‌ తరుణంలో అనేక మంది యువతులు ఆధునిక దస్తులు వేసుకొని వైన్‌ షాపుల ముందు వరుసలు కట్టింది కనిపించలేదా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనెజులాతో పోల్చుకొనే పరిస్ధితులేమీ లేవు కదా ? చీకటిపడితే చాలు వెలుతురులేని సందులు, గోడలు, లైటు స్థంభాలపక్కన కడుపు కక్కుర్తి కోసం కనిపించే అభాగినులు చేయితిరిగిన రచయితలకు కథావవస్తువులౌతారు. వారిపట్ల సానుభూతో మరొక పేరుతో సొమ్ము చేసుకుంటారు. వెనెజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.


ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్‌ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుతోంది. ఎంత పెద్ద అబద్దాలను అలోకగా ఆడతారంటే 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాశారు. నిజమా అమెరికా లెక్కల ప్రకారం 210, ఐఎంఎఫ్‌ అంచనా మేరకు 191, ఎక్కడనా పోలీక ఉందా ?


అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు ? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే ? సైద్దాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్చ మనది మరి., వెెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. ‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్‌ ? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా నుంచి వస్తు దిగుమతులా ! తగ్గేదేలే !!

27 Thursday Jan 2022

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti China Propaganda, BJP, India imports from China, India-China trade in 2021, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మన పాలకులు, వారికంటే ఎక్కువగా మన మీడియా జనాలకు ఎక్కిస్తున్న దేశభక్తి ఎక్కడికి పోతున్నది ? గాంధీ, నెహ్రూ వంటి నేతలు సరైన పునాది వేయని కారణంగా దేశభక్తి అంటే పంద్రాగస్టు, రిపబ్లిక్‌ దినోత్సవాలకే పరిమితం అయిందని అనుకుందాం కాసేపు. వారి కంటే దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు, ప్రపంచానికే గురువు అని చెబుతున్న నరేంద్రమోడీ ఓకల్‌ ఫర్‌ లోకల్‌( స్ధానిక వస్తువులనే వాడండి), మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వగైరా , దేశ కాలాలతో నిమిత్తం లేకుండా ముందుకు తెచ్చిన చైనా వ్యతిరేకత ఏమైనట్లు ? ఎక్కడా ఆ ఛాయలే కనిపించటం లేదు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని సెలవిచ్చిన కంగనా రనౌత్‌ వంటి అసలు సిసలు సమరయోధులు గుండెలు దిటవు చేసుకోవాలి.


2021 చైనా-భారత వాణిజ్య లావాదేవీలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. డిసెంబరు నాటికి వంద బి.డాలర్లకు చేరతాయని అంచనా వేస్తే ఏకంగా 126 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నది 97.52 బి.డాలర్లు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 46.2శాతం ఎక్కువ. మనం చైనాకు ఎగుమతి చేసిన సరకుల విలువ 28.14బి.డాలర్లు. ఇది 34.2శాతం పెరిగింది. మన సరకుల ఎగుమతుల పెరిగినందుకు సంతోషించాలా, దిగుమతు ఎక్కువైనందుకు విచారించాలా ? ఎందుకిలా దిగుమతుల రికార్డులను బద్దలు కొడుతున్నాము ? మీకేం బాబూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాళ్లు ఎన్ని కబుర్లైనా చెబుతారు. వీలుపడక గానీ లేకపోతేనా దేశాన్ని వేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయి ఉండేవారు.చైనా సెల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏవీ లేకుండా వారి వాట్సాప్‌ విశ్వవిద్యాలయాలు, ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు ఒక్క క్షణం పని చేయవు. వారికి ఒక న్యాయం ఇతరులకు ఒకటా ? పది మందికి పని కల్పించి తిండిపెడుతున్నాం. తగ్గేదేలే ! దిగుమతులను ఆపేదేలే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఎవరు, ఇంకెవరు, చైనా వస్తు దిగుమతిదారులు.


రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ముందు ఎవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిస్టులెవరూ తీర్మానాలు చేయలేదు. ధర్నాలు, రాస్తారోకోల వంటివి అసలు చేపట్టలేదు. పార్టీ నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దిగుమతిదారులు ఉన్నట్లు ఎవరూ నిరూపించలేదు.మన దేశంలోని మూలస్దంభం వంటి పరిశ్రమల్లో ఔషధరంగం ఒకటి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిలో 50-60శాతం వరకు ఈ రంగానికి అవసరమైన రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులే అని తెలుసుకోవాలి. ఒక అర్ధరాత్రి అమెరికా వాడు కల్లోకి వచ్చి తెల్లవారేసరికి మీరు చైనా వ్యతిరేకతను ప్రచారం చేయాలి అనగానే చిత్తం దేవరా అన్నట్లు చేశారా లేదా ? ఎలాంటి అజెండా లేకుండానే మన ప్రధాని మోడీ ఊహాన్‌, చైనా అధినేత షీ మహాబలిపురం వచ్చి ఉయ్యాలలూగి, విందులు ఆరగించి, ఊసులు చెప్పుకున్నవారు ఒక్కసారిగా శత్రువులు ఎలా అవుతారు? జనం అమాయకులు కాదు కదా !


చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అక్కడి నేతలు మన కాళ్ల దగ్గరకు వస్తారని ప్రచారం చేశారు.చైనా తొలిసారిగా ప్రస్తుతం ఏటా ఆరులక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి దిగుమతులు జరుపుతున్నది. దానిలో పన్నెండవ వంతు అంటే 755బి.డాలర్ల మేరకు అమెరికాతో జరుగుతున్నాయి. మొదటి స్ధానంలో ఉన్న వారే ఎందుకు పెట్టుకున్నామురా బాబూ వీరితో తగాదాని తలలు పట్టుకుంటున్నారు. పదిహేనవ స్ధానంలో ఉన్న మనతో ఉన్న లావాదేవీలు కేవలం 126 బి.డాలర్లు మాత్రమే. అలాంటిది మనం దిగుమతులు ఆపేస్తే చైనా దారికి వస్తుందా ? పగటి కలలు గాకపోతే, మన గురించి మనకు అవగాహన ఉందా లేక హనుమాన్‌ తాయత్తు కట్టుకొని మాట్లాడుతున్నామా ? వెనుకటి రోజుల్లో పిచ్చి మంత్రం పెడతామని పిల్లల్ని బెదిరించినట్లుగా చైనా యాప్‌ల నిషేధం వలన ఒరిగిందేమిటి ? ఔషధ పరిశ్రమకు అవసరమైన దిగుమతులు చేసుకున్నామంటే అర్ధం ఉంది. పోనీ వాటిని కూడా అక్కడి నుంచి గాక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అడ్డుకున్నదెవరు? అమెరికా నేతలతో కౌగిలింతలకు దిగినా మరొకటి చేసినా రెండు దేశాల లావాదేవీలు 2021లో 110 బి.డాలర్లు మాత్రమే. చైనా వస్తువులా అబ్బే అవి నాశిరకం, చౌకరకం అని ఒక వైపు ఈసడించుకుంటారు. కానీ అదే చైనా నుంచి విలాసవంతమైన సెల్‌ఫోన్లు, రంగురాళ్లు, ఆటోమొబైల్స్‌కు మన విలువైన విదేశీమారక నిల్వలను ఖర్చు చేయాలా? ఎందరు సామాన్యులకు ఉపయోగం ఉంటుంది ? వీటి మీద దిగుమతి పన్నులు పెంచినా జనం తగ్గటం లేదు, అసలు అనుమతి ఎందుకివ్వాలి ? మన దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి, మన దేశం నుంచి చైనా దిగుమతి చేసుకొనే సరకులేవీ ప్రపంచంలో ఎక్కడా దొరకనివి కాదు. వివాదాలు ఎన్ని ఉన్నా సర్దుకుంటాయనే భావంతో లావాదేవీలను నిర్వహిస్తున్నదా ?
ఒకవైపు పశ్చిమ దేశాలతో బేరసారాలు, మరోవైపు చైనా మీద అనధికారికంగా తప్పుడు ప్రచారం, మరోవైపు రికార్డులను బద్దతు కొడుతూ దిగుమతులు. పరస్పర విరుద్దం కదా ? ప్రపంచంలో మనకు విలువ ఉంటుందా ? గతంలో మన దేశాన్ని బ్రిటీష్‌ పాలకులు ఏలినపుడు మన దగ్గర నుంచి ముడిసరకులు దిగుమతి చేసుకొని వారి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులను మన మీదకు వదిలారు. రెండింటిలోనూ వారికే లాభం. ఇప్పుడు చైనా విషయంలో కూడా జరుగుతున్నది అదే. మనం వాణిజ్య లోటుతో ఉన్నాము అంటే అది చైనా, మరొక దేశం ఏదైనా సరే మన సంపదలకు అక్కడకు తరలుతున్నట్లే కదా ?నాడు మనది ఆక్రమిత దేశం, పరాధీనత, నేడు మనది స్వతంత్ర దేశమైనా స్పష్టమైన వైఖరి లేకపోవటంమే కారణం. మనం నేర్చుకున్నది ఏమిటి ? చైనాను పక్కన పెట్టి పశ్చిమ దేశాలతో సంబంధాలు పెట్టుకొని జనాన్ని ఉద్దరించమనండి. ఎవరు వద్దన్నారు. కావలసింది పిల్లి ఎలుకలను పడుతుందా లేదా అన్నది తప్ప నల్లదా తెల్లదా అన్నది కాదు. చైనాతో సంబంధాలను వెనక్కు మళ్లించుకొనేందుకు అమెరికా వంటి బడా దేశాల వల్లనే కావటం లేదు, చైనా మూడు చెరువుల నీరు తాగిస్తున్నది. దీని అర్ధం చైనాకు లొంగిపొమ్మని కానే కాదు. చైనా వస్తువుల మీద అక్రమంగా దిగుమతి పన్ను విధించటం చట్టవిరుద్దమని జనవరి 16న ప్రపంచ వాణిజ్య సంస్ధ తీర్పు ఇచ్చింది. అంతే కాదు, పరిహారంగా అమెరికా వస్తువుల మీద 64.5 కోట్ల డాలర్ల మేర ఏటా పన్నులు విధించుకోవచ్చని కూడా తీర్పు ఇచ్చింది. నిబంధనలకు చెప్పిన భాష్యం అంతా తొండి, మొత్తంగా ప్రపంచ వాణిజ్య సంస్దనే సంస్కరించాలని అమెరికా ఇప్పుడు గోలగోల చేస్తున్నది.


ఇక్కడ జనం తీవ్రంగా ఆలోచించాలి. ఒకవైపు చైనా మీదకు మనల్ని ఉసిగొల్పుతున్న అమెరికా మరోవైపు వారితోనే ఏడాదికేడాది లావాదేవీలను ఎందుకు పెంచుకుంటున్నట్లు ? అంతకు ముందుతో పోల్చితే 2021లో 28.7శాతం లావాదేవీలు పెరిగాయి.చైనా మిగులు 396.5 బి.డాలర్లు ఉంది.2018లో వాణిజ్యయుద్దం ప్రారంభానికి ముందు ఇది 323 బి.డాలర్లు మాత్రమే ఉంది. 2021లో తొలిసారిగా చైనా ఆరులక్షల కోట్ల డాలర్ల వాణిజ్యలావాదేవీల మైలు రాయిని అధిగమించింది. అమెరికా తనను తానే రక్షించుకోలేని స్ధితిలో ఉన్నపుడు మరొక దేశాన్ని రక్షించగలదా ? అమెరికా అడ్డగోలుగా ప్రపంచాన్ని నడిపే రోజులు కావివి అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతవిశ్వాసులపై లెనిన్‌ చెప్పిందేమిటి ? కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేకత !

16 Sunday Jan 2022

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, anti communist resolution, CPI(M), IUML, Samastha Kerala Jamayat Ulema, Vi Lenin on believers


ఎం కోటేశ్వరరావు


శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసింది సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. దానిపై జనాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సంబంధిత సంస్ధలు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, కుట్రలను జనం వమ్ము చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ముస్లిం లీగు పార్టీ, కొన్ని మత సంస్ధలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, చర్యలకే పూనుకున్నాయి. హిందూత్వ శక్తులకు బుద్ది చెప్పిన జనాలు ముస్లింమతశక్తులను సహిస్తారా ?


సమస్త కేరళ జమాయతుల్‌ ఉలేమా(ఎస్‌కెజెయు) మలప్పురం గోల్డెన్‌ జూబిలీ సమావేశంలో ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమం, భావజాలానికి వ్యతిరేకంగా చేసిన ఒక తీర్మానం ఆ సంస్ధలోను, వెలుపలా వివాదం రేపింది. తనకు తెలియకుండా చేసిన దానితో తనకు సంబంధం లేదని, తన ఫొటోను జత చేసి ఆ తీర్మానాన్ని ప్రచారం చేయటం పట్ల తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంస్ధ అధ్యక్షుడు సయద్‌ మహమ్మద్‌ జిఫ్రీ ముతుకోయా తంగల్‌ తమ పత్రిక సుప్రభాతంలో ప్రకటించారు. ముస్లింలు కేరళలో కమ్యూనిస్టు భావజాలం, ఉద్యమం పట్ల జాగరూకులై ఉండాలని నాస్తికవాదం, దేవుడున్నాడో లేడో తెలియదనే ధోరణిని పధకం ప్రకారం మత విశ్వాసుల్లో కలిగించేందుకు చేసే ప్రయత్నాల పట్ల జాగరూకులై ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం, వారితో కలవటం ప్రమాదకరమని నూరిపోయటం తప్ప మరొకటి దాని లక్ష్యం కాదన్నది స్పష్టం. ఆ తీర్మానం తనకు తెలియకుండా చేయటమే కాదు అనుమతి కూడా లేదని తంగల్‌ పేర్కొన్నారు.


మత విశ్వాసులైన పార్టీ సభ్యులు ఆరాధనా స్ధలాలకు వెళ్లటం, క్రతువుల్లో పాల్గొనటాన్ని పార్టీ వ్యతిరేకించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. ఏ విశ్వాసానికి, నమ్మకానికి పార్టీ వ్యతిరేకం కాదు, అలాంటి వారికి పార్టీ సభ్వత్వం ఇవ్వకూడదని నిబంధనావళిలో ఎక్కడా లేదు అన్నారు. పూజారులు కూడా పార్టీలో చేరవచ్చని ఒక సందర్భంలో మార్క్సిస్టు మహౌపాధ్యులలో ఒకరైన లెనిన్‌ చెప్పారని కోజికోడ్‌ జిల్లా సిపిఎం మహాసభలో చెప్పారు. నాస్తికత్వాన్ని పాటించటం, మతానికి పార్టీ వ్యతిరేకమని కొన్ని శక్తులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల కోసం విమర్శలు చేశారు. మతాన్ని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారని ఒక వైపు మతశక్తులు ధ్వజమెత్తుతుంటే మరోవైపు మరికొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి రెండు పరిణామాలు ఎలా జరుగుతాయి. శాస్త్ర, తర్కవిరుద్దం, ఏదో ఒకటే వాస్తవం కావాలి. సిపిఎంపై విమర్శలు చేసే వారు రెండు రకాలు. కమ్యూనిస్టు, లౌకిక భావాజాలాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే సానుకూల వైఖరితో ఆందోళన చెందేవారు, విమర్శలు చేసే వారు కొందరైతే, సందట్లో సడేమియా అన్నట్లుగా రాళ్లేసే వ్యతిరేకులు రెండవ తరగతి.


పార్టీ సభ్వత్వానికి కావలసిన అర్హతల గురించి సిపిఎం కార్యక్రమం, నిబంధనావళి అనే పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. అవేమీ రహస్యపత్రాలు కావు. ఎవరైనా పుస్తకాల్లో షాపుల్లో కొనుగోలు చేసి లేదా పార్టీ వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు. నాస్తికులైనే సభ్వత్వం అని లేదు. అలాగే దిద్దుబాటు కార్యక్రమం చేపట్టి అనుసరించాల్సిన పద్దతులు, పార్టీ సభ్యులకు ఉండకూడని అంశాల గురించి కూడా సిపిఎం చెప్పింది. ఇవేవీ పరస్పర విరుద్దంగా కనిపించటం లేదు. ఒకసారి పార్టీ సభ్వత్వాన్ని అంగీకరించిన తరువాత అనుసరించాల్సి ప్రవర్తన గురించి చెప్పిన అంశాలే దిద్దుబాటు. దీని అర్దం ఏదో ఘోరమైన తప్పిదం చేశారని కాదు. పార్టీ ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని ఏ స్ధాయిలో ఉన్న వారైనా పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలోని ప్రతి పార్టీ అనుసరించిన పద్దతే అది. దానికి ఇమడలేని వారు సభ్యులుగా వైదొలగి మద్దతుదారులుగా ఉండవచ్చు. ఇక పార్టీ సభ్యులు- మత విశ్వాసాల గురించి లెనిన్‌ చెప్పిన సందర్భం ఏమిటి ? ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. లెనిన్‌ కాలంలో మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్య కూల్చివేతలో నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు ప్రధాన పాత్రధారులు. అందువలన అనేక మంది ముస్లింలు బ్రిటీష్‌ వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. అదే విధంగా రష్యాలో జారుచక్రవర్తిని వ్యతిరేకించిన మత పూజారులు, విశ్వాసుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించారు.


ఒక క్రైస్తవ పూజారీ,మత విశ్వాసుడైన కార్మికుల పట్ల పార్టీ ఏ వైఖరి అనుసరించాలనే అంశం గురించి లెనిన్‌ వివరణ ఇచ్చారు. ” ఒక పూజారి పార్టీ లక్ష్యాలను ఆమోదించి వాటి కోసం పార్టీలో చురుకుగా పని చేస్తానని ముందుకు వస్తే అతను పార్టీలో చేరవచ్చు. అతని మతవిశ్వాసం-కమ్యూనిజం మధ్య వైరుధ్యం వస్తే అది అతనికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ పూజారి పార్టీలో చేరి ఇతరులను మతంలోకి ప్రోత్సహిస్తే, తన మతభావాలను ఇతరుల మీద రుద్దితే, మతం పట్ల పార్టీ కలిగివున్న అంగీకృత వైఖరికి కట్టుబడి ఉండకపోతే అప్పుడు సభ్వత్వాన్ని కోల్పోతాడు. ఇదే సూత్రం విశ్వాసుడైన ఒక కార్మికుడు పార్టీలో చేరినపుడు కూడా వర్తిస్తుంది. పార్టీలో చేరి తన మత భావాలను ఇతరుల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది.” అన్నారు. ఇలా చెబుతున్నపుడు అసలు మత విశ్వాసులను పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకు ? అనే ప్రశ్న వస్తుంది.


విప్లవాన్ని సాధించాలన్నా, అందుకు అవసరమైన సాధనం పార్టీ నిర్మాణం జరగాలన్నా సభ్యులను ఎక్కడి నుంచి తేవాలి. ప్రతి వారికీ సమాజంలో ఉన్న వాటిలో ఏదో ఒక బలహీనత, విశ్వాసం ఉంటుంది. వారి నుంచే విప్లవ సైనికులను తయారు చేసుకోవాలి. వివిధ ఆందోళనలు, పోరాటాల సమయంలో చురుకుగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుంది. అదే విధంగా వివిధ అంశాలపై పార్టీ తీసుకొనే సూత్రబద్ద వైఖరి, పోరాటాల సమయంలో పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, త్యాగాలను చూసి సాధారణ కార్మికులు, జనాలు తాము కూడా పార్టీలో చేరాలని అనుకోవచ్చు. అలాంటి వారిని కొంత కాలం రెండు మూడు దశల్లో తీరుతెన్నులను గమనించి బలహీనతలను సరిదిద్దుకొంటే వారిని సభ్యులుగా తీసుకుంటారు. తరువాత పార్టీ వైఖరికి అనుగుణంగా వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటారు. ఆ సమయంలో దిద్దుబాటు అంశాలు ముందుకు వస్తాయి.ఒక స్త్రీ లేదా పురుషుడికి అన్నీ మంచి లక్షణాలు ఉండి, మత విశ్వాసాలు ఉన్నాయను కోండి. వారు పార్టీలో చేరతామని ముందుకు వస్తే ముందు మీరు కులాన్ని, మతాన్ని, దేవుడు, దేవతల మీద విశ్వాసాలను వదులుకొని రండి అప్పుడు పరిశీలిస్తాం అంటే కుదురుతుందా ? మతం, విశ్వాసాలు కుటుంబాలు, వ్యక్తిగతం అని చెప్పే కమ్యూనిస్టులు వాటికి కట్టుబడి ఉండేవారికి ఇతర అన్ని అర్హతలు ఉన్నపుడు పార్టీలో చేర్చుకోకపోతే నష్టం ఎవరికి? పార్టీలో చేరిన తరువాత అన్యవర్గ ధోరణులు, మత, మూఢవిశ్వాసాలను పోగొట్టేందుకు తగిన కృషి చేయకపోతే అది పార్టీ లేదా నాయకత్వ తప్పిదం అవుతుంది. సకాలంలో దిద్దుబాటు జరగకపోతే పార్టీలు దెబ్బతింటాయి.


కమ్యూనిజానికి మన మతం వ్యతిరేకం అని ప్రతి మతం వారు చెబుతారు. అలాగని ఏ మతం చెప్పింది. పురాతన మతమైన హిందూ, తరువాత వచ్చిన క్రైస్తవం దాన్నుంచి పుట్టిన తాజా మతం ఇస్లాం ప్రవక్తలు, దేవదూతలు గానీ ఎక్కడా కమ్యూనిజం గురించి చెప్పలేదు, అప్పటికీ అసలా భావనే లేదు కదా ! ఆ మతాలు పుట్టి పెరిగిన సమయంలో కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని కమ్యూనిస్టులు మార్చి వేస్తారని, దోపిడీ శక్తులకు మద్దతు ఇచ్చే, తమ తిరోగమన, జనాన్ని తమ అదుపులో ఉంచుకొనే అజెండాలు సాగవనే భయంతోనే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దలు అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలాన్ని, పార్టీలను వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టులు రాజీపడితే, భావజాలాన్ని పలుచన చేస్తే మతవాదులకు పేచీ ఉండదు కదా ?
సమస్త మలప్పురం సమావేశ తీర్మానం గురించి చర్చ జరుగుతోంది. తమ సమస్త సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేసేందుకు వేదికలు కాదని జిఫ్రీ కోయా తంగల్‌ స్పష్టం చేశారు. సమావేశాలను ముస్లిం లీగు హైజాక్‌ చేసిందని, రాజకీయ ప్రచారం కోసం వాడు కుంటున్నదని, వాస్తవానికి దీనిలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నవారున్నారని చెప్పారు. సమస్త ప్రభుత్వంతో సహకరిస్తుందని, దాని అర్ధం చేతులు కలిపినట్లు కాదని సమస్త సున్నీ యువజన సంఘం నేత అబ్దుస్‌ సమద్‌ పూకొత్తూర్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ముస్లిం మతవిశ్వాసులకు స్ధానం ఉండదని, అంత మాత్రాన ఆ పార్టీలతో సంబంధాలు ఉన్న వారందరూ నాస్తికులు,లు, మతవ్యతిరేకులు కాదన్నారు.ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రభుత్వంతో విరోధ పంధాను ఎంచుకోవటం గాక సహకరించాలని తాము కోరుతున్నట్లు పూకొత్తూర్‌ చెప్పారు.


వక్ఫ్‌బోర్డులో ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారపు నమాజు సందర్భంగా మసీదులలో ప్రచారానికి పిలుపు ఇచ్చిన ముస్లింలీగ్‌ వైఖరిని సమస్త వ్యతిరేకించింది. దాంతో లీగ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు కోజికోడ్‌ బీచ్‌లో లీగ్‌ నిర్వహించిన సభలో మాట్లాడిన అబ్దుర్‌ రహమాన్‌ కల్లాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అవాంఛనీయ పదజాలం ప్రయోగించినందుకు ఇతర లీగ్‌ నేతలు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి, డివైఎఫ్‌ఐ నేతగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌తో విజయన్‌ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అది అక్రమ సంబంధం అంటూ కల్లాయి నోరుపారవేసుకున్నాడు. అదే సభలో మరో లీగ్‌ నేత కెఎం షాజీ మాట్లాడుతూ మతం మాకు సంబంధించిన అంశం, మతమే మాకు గుర్తింపు, మా చివరి శ్వాసవరకు మతమే మాకు పునాది ” అన్నారు. మతోన్మాదులు తప్ప మరొకరి నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మరుసటి రోజు సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభ మాటలను ప్రస్తావిస్తూ ముస్లింలీగ్‌ ఒక రాజకీపార్టీనా లేక మత సంస్తో నిర్ణయించుకోవాలని అన్నారు. లీగ్‌ను మతోన్మాద జమాతే ఇస్లామీ నడిపిస్తున్నదని సిపిఎం పేర్కొన్నది.


వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలకు పాలుపోవటం లేదు. ముస్లింమతోన్మాద ఎస్‌డిపిఐ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముస్లింలీగు పోటీ పడి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ పునాదిని నిలుపుకోవాలని చూస్తోంది. నిజానికి వక్ఫ్‌బోర్డు వ్యవహారాలలో ఎల్‌డిఎఫ్‌ చేసిందేమీ లేదు. బోర్డు పాలకవర్గమే సిబ్బంది నియామకాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరపాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. నియామక నిబంధనలను కూడా మార్చింది లేదు. ముస్లిమేతరులను సిబ్బందిగా నియమిస్తారంటూ ముస్లింలీగ్‌ రాజకీయ దాడికి, ముస్లింల్లో అనుమానాలను రేకెత్తించటానికి, సిపిఎంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముస్లిం సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించిన తరువాత సమస్త నేతలు ఆందోళన మార్గం నుంచి విరమించారు, మసీదుల్లో లీగు ప్రచారాన్ని వ్యతిరేకించారు. మరింతగా చర్చలు జరిపిన తరువాతే అంతిమంగా నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు యధాతధ స్ధితి కొనసాగుతుందని సిఎం ప్రకటించారు.ఆశించిన విధంగా అధికారం దక్కకపోవటంతో లీగు తన మద్దతుదార్లు చెదరకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని ముందుకు తెస్తోంది. అది నెరవేరేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d