• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు : బిజెపి, మిత్ర పక్షాల వైఖరి ఏమిటి ?

07 Monday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Narendra Modi, Prime Minister Narendra Modi, sedition case against 49 celebrities

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీని దేశపితగా అంగీకరించకపోతే భారతీయులు కాదా ?

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP motor mouths, Donald trump, father of the country, Father of the Nation, Mahatama Gandhi, Narendra Modi, Nathuram Godse

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, father of the country, Howdy Modi, is narendra modi india's divider in chief or unifier, Narendra Modi, narendra modi father of the country, narendra modi india's divider in chief, narendra modi india's unifier in chief

Image result for modi unifier

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

మొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ చరిత్రలో రాజులు, రంగప్పలే కాదు, ప్రజాస్వామిక వ్యవస్ధలని చెప్పుకొనే చోట కూడా అధికారంలో వున్న వారికి లేని ప్రతిష్టను చేకూర్చే ప్రయత్నాల గురించి చెప్పనవసరం లేదు. వాటి వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే కాదు తమను ఆశ్రయించుకున్న వారికి అవకాశాల కోసం కూడా పాత పద్దతులైన సామ, దాన, బేధ, దండోపాయాలే కాదు అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడటం చూస్తున్నాము.

అమెరికాలోని హూస్టన్‌ నగరంలో సెప్టెంబరు 22న జరిగిన ప్రవాస భారతీయుల హౌడీ మోడీ (మోడీ గారూ ఎలా వున్నారు) సభలో మన ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు నరేంద్రమోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు చూసిన తరువాత నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా అని ఎవరైనా అనుకుంటే వారు సరిగానే ఆలోచిస్తున్నట్లు లెక్క. కొందరికి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి, మరి కొందరు నరేంద్రమోడీ అందుకు అర్హులే అని కీర్తిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని ఎవరి అంచనా సరైనదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

హిందూ హృదయ సామ్రాట్‌ అని కొందరు నరేంద్రమోడీని కీర్తిస్తే, ఆయన హిందూ ఏమి ఖర్మ ఏకంగా భారత హృదయ సామ్రాట్‌ అని మరికొందరు ప్రస్తుతించారు. భారత విభజన దళపతి అని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాక ముందు ఒక అంతర్జాతీయ పత్రిక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించిది. అదే పత్రిక ఎన్నికల తరువాత దశాబ్దాల కాలంలో ఏ ప్రధానీ నరేంద్రమోడీ మాదిరి దేశాన్ని ఐక్యం చేయలేదు అని మరొక వ్యాసాన్ని ప్రచురించింది. కాలం నరేంద్రమోడీని ఐక్యతా దళపతిగా నిరూపించింది అని ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి నేత సంబిత్‌ పాత్ర వంటి వారు వర్ణించారు. ఇప్పుడు అది మరింత వేగం పుంజుకొని ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఏదీ వూరికే రాదు అన్న విషయం తెలిసిందే. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుగా మోడీ- ట్రంప్‌ వ్యవహరించారా ?

ఎవరైనా ఒకరిని అసాధారణ వ్యక్తులతోనో, అసాధారణ రీతినో ఏ కారణంతో అయినా పొగిడితే వారేదో అలా అన్నారు గానీ నాకంత లేదు అని వినమ్రంగా చెప్పుకుంటారు. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి అలాంటి వినమ్రత ఆశించే వారిని ఆయన హతాశులను గావించారు. ఒక్క విషయం స్పష్టమైంది.దేశద్రోహం, నువ్వు భారతీయుడివా కాదా అని నిర్ధారించేందుకు ప్రమాణాలుగా సంఘపరివార్‌, దాని రాజకీయ సంస్ధ బిజెపి తయారుచేసిన నిఘంటువులోకి మరొక అంశం తోడైంది. అదే ‘భారత దేశ పిత’ నరేంద్ర దామోదరదాస్‌ మోడీ.

మన రాజ్యాంగంలో ఎవరినీ అధికారికంగా జాతిపితగా లేదా భారత దేశ పితగా పరిగణించేందుకు అవకాశం లేదు. అయినా యావత్‌ సమాజం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీని గుర్తించేందుకు, నరేంద్రమోడీని భారత దేశ పితగా పరిగణించకపోవటాన్ని అంగీకరించేందుకు బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు సిద్దంగా లేరు.

ఇప్పటికే జాతిపిత గాంధీని చంపిన విడి సావర్కర్‌ అసలైన దేశభక్తుడు అని చెబుతున్న వారు రేపు గాంధీ జాతి పిత ఏమిటి అసలైన జాతిపిత సావర్కర్‌, ఆయన వారసుడు నరేంద్రమోడీ భారత దేశ పితి అని చెప్పేందుకు ఎంతో సమయం పట్టదా అనిపిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తన మనసులో వున్న విషయాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఒక విధంగా ఆయనకు ‘అభినందనలు’ చెప్పకతప్పదు. భారత దేశ పితగా నరేంద్రమోడీని అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారన్నదే ఆయన ప్రశ్న.

‘ ప్రధాని వ్యక్తిత్వం,చొరవ కారణంగా ఈ రోజు విదేశాల్లో వున్న వారు గర్వపడుతున్నారు. ఎవరైనా ఒకరి గురించి అమెరికా దాని అధ్యక్షుడి నుంచి ఒక నిష్పాక్షిక మరియు ధైర్యవంతమైన ప్రకటన వచ్చిందంటే ఏదైనా పార్టీతో అతని రాజకీయ అనుబంధాలు లేదా భావజాలంతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడు గర్వపడాలని నేను భావిస్తున్నాను.ఒక అమెరికా అధ్యక్షుడు అలాంటి పదాలతో ప్రశంసలు కురిపించటం ఒక భారత ప్రధాని గురించే కాదు ఇతర ఏ ఒక్క ప్రపంచ నేత గురించి చేయలేదు. దీనికి ఎవరైనా గర్వపడకపోతే, తరువాత వారు తమను తాము భారతీయులుగా పరిగణించుకోకపోవచ్చు’ అని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. జాతిపిత ఒకరే వుంటారు అన్న కాంగ్రెస్‌ వ్యాఖ్య గురించి అడగ్గా దాని గురించి ట్రంప్‌తో కాంగ్రెస్‌ను వాదించమనండి అన్నారు. దీన్ని చూసిన తరువాత జర్మన్‌ భావజాలానికి వ్యతిరేకం అనేపేరుతో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను దగ్దం చేసిన నాజీల చర్య గుర్తుకు వస్తోంది.

హిట్లర్‌ పుట్టటానికి వంద సంవత్సరాల ముందే హెన్రిచ్‌ హైనే అనే రచయిత ” ఎక్కడైతే పుస్తకాలను తగులబెడతారో (భావజాలం లేదా విజ్ఞానం) అక్కడ మానవులను కూడా సజీవదహనం చేస్తారు ” అని ప్రకటించాడు. 1933 మే 10ప తేదీ రాత్రి బెర్లిన్‌ నగరంలో నాజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో కూడి 20వేల పుస్తకాలను దగ్దం చేశారు. వాటిలో కమ్యూనిస్టు రచయితలు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, ఆల్బర్‌ ఐనిస్టీన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాక్‌లండన్‌, హెచ్‌జి వెల్స్‌ వంటి ఎందరో కమ్యూనిస్టేతర, పురోగామి రచయితల పుస్తకాలు వాటిలో వున్నాయి. నరేంద్రమోడీని భారత దేశ పితగా అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని ప్రశ్నించినట్లుగానే హిట్లర్‌, నాజీ భావజాలానికి వ్యతిరేకమైన రచనలన్నీ జర్మన్‌ వ్యతిరేకమైనవే అన్న వున్మాదానికి లోనైన వారు దీనికి పాల్పడ్డారు. ఇప్పటికే మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటివి భారతీయతకు వ్యతిరేకులు, దేశద్రోహులతో చేతులు కలిపే వారితో నిండి వున్నాయనే ప్రచారాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్న, ఆశించిన రీతిగా పరిస్ధితులు లేవు. తమ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, విదేశీతొత్తులుగా చిత్రిస్తున్నారు. పరమత, పురోగామి భావజాలాలు, వాటిని కలిగి వున్నవారి మీద ద్వేషం, ఆవుల రక్షణ పేరుతో హత్యాకాండ, అసహనం,రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం వంటి పరిణామాలను సమర్ధించేవారు, ముందుకు తీసుకుపోయే వారు తమకు ఒక ప్రతీక కావాలనుకుంటున్న వారు నరేంద్రమోడీని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు మాననీయ మహోదయ ఎప్పుడేం మాట్లాడతాదో తెలియని తలతిక్క మనిషిగా పేరు మోసిన (నిజానికి అది వాస్తవం కాదు, తమకు హాని కలిగించే వారిని అమెరికా కార్పొరేట్‌ రంగం తమ ప్రతినిధిగా కొనసాగనివ్వదు.) డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలే కారణం. మన ప్రధానిని ‘భారత దేశ పిత’ గా వర్ణించటంతో వచ్చింది అనుకొనే వారికి కాదు మహానుభావులారా మన దేశంలో అనేక మంది మనసులో వున్న మాటనే వెల్లడించాడు అని చెప్పాల్సి వస్తోంది. హూస్టన్‌ సభ తరువాత న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్రమోడీ మరోసారి భేటీ అయ్యారు. పరస్పర పొగడ్తలు కిక్కు ఇవ్వలేదని అనుకున్నారేమో తెలియదు. ఇద్దరూ విలేకర్లతో మాట్లాడారు.’ హూస్టన్‌ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరైనందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు మంచి స్నేహితుడు’ అని మోడీ చెప్పారు. అంతగొప్ప స్నేహితుడు కాశ్మీర్‌ గురించి మధ్యవర్తిత్వం వహించమని మోడీ తనను అంతర్గత సమావేశంలో అడిగారు అని పచ్చి అబద్దం చెప్పి ఎంతో కాలం గడవ లేదు. స్నేహితుల మధ్య బయటి ప్రపంచానికి వెల్లడి కాని అనేక అంశాలు దొర్లుతాయి. బహుశా వారి స్నేహం చెడకుండా వుండేందుకే మోడీ దాని మీద నోరు విప్పలేదు అనుకోవాలి. అలాంటి అబద్దాల కోరు ట్రంప్‌ మోడీని భారత దేశ పిత అనటం కూడా మరొక అబద్దం లేదా అతిశయోక్తి కావచ్చు కదా ! అంతగా మంచి స్నేహితుడు అని మోడీ స్పందించిన తరువాత ట్రంప్‌ బదులు తీర్చుకోకపోతే భారత జాతికే అవమానం కదా !

బొల్లు బొల్లరా వెంకన్నా అంటే మా గురించి గొప్ప చెప్పుకోవటం కాదు గానీ బాబయ్యా మా అయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత వుంటాయండయ్యా అన్నట్లుగా ట్రంప్‌ స్పందించారు. ‘ అంతకు ముందు భారత్‌ నాకు గుర్తుంది. అంతబాగా తెలియదు గానీ నాకు గుర్తుంది, అది చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు. మనం ఆయన్ను భారత దేశ పితగా పిలవవచ్చు, ఆయనొక అసాధారణ మంచిపని చేశారు అనుకుంటున్నా’ అని డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Image result for narendra modi india's divider in chief

వివిధ రాజ్యాలుగా వున్న భారతావనిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని దోపిడీని యధేశ్చగా కొనసాగించేందుకు దేశమంతటా కొన్ని సంస్ధానాలను కొనసాగించేందుకు అనుమతించినా వాటిని కూడా తమకు లోబడి వుండేట్లు చేసుకొని దేశాన్ని ఒక్కటిగా చేసింది బ్రిటీష్‌ వారే.అయినంత మాత్రాన వారిని దేశాన్ని ఆక్రమించుకున్నవారిగా తప్ప ఆధునిక భారత నిర్మాతలుగా చరిత్ర పరిగణించలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందల సంఖ్యలో వున్న చిన్నా, పెద్ద సంస్దానాలను విలీనానికి భారత ప్రధానిగా నెహ్రూ కృషి చేశారు. కాశ్మీర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు ఏకంగా సైన్యాన్నే నడిపించారు. పోర్చుగీసు పాలనలో వున్న గోవాను భారత్‌లో విలీనం చేసేందుకు అదే నెహ్రూ సైన్యాన్ని నడిపించిన చరిత్ర తెలిసిందే. ఫ్రాన్స్‌ ఆధీనంలో వున్న నేటి పుదుచ్చేరి ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసింది కూడా ఆయన హయాంలోనే. సంఘపరివార్‌ గొప్పగా చిత్రించే సర్దార్‌ పటేల్‌ కారణంగానే హైదరాబాదు సంస్దానం దేశంలో విలీనం అయింది అని చేసే వాదనను కాసేపు అంగీకరిద్దాం. భారత రక్షణలో స్వతంత్ర రాజ్యంగా వున్న సిక్కిం మన దేశంలో విలీనం అయింది ఇందిరా గాంధీ ఏలుబడిలో, అలాంటి ఏ చరిత్రా లేని నరేంద్రమోడీ భారత్‌ను ఐక్యం చేశారనే పేరుతో భారత దేశ పిత అని పిలిస్తే పై ముగ్గురిని కూడా భారత దేశ పితలు, మాత అని పిలవాల్సి వుంటుంది. ఒక వేళ జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగమే కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులను రద్దు చేయటమే దేశాన్ని ఐక్యం చేయటమే అయితే, గిరిజన ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణల కొనసాగింపు మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందువలన భారత చరిత్ర తెలియని ట్రంప్‌ చేసే ప్రకటనలు, వర్ణణలకు విలువేమిటి అన్నది సమస్య.

Image result for narendra modi india's divider in chief

ట్రంప్‌కు గత చరిత్ర తెలియదు లేదా తెలిసినా కావాలని తన ప్రయోజనం కోసం నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తారనుకోవాల్సి వుంటుంది. నరేంద్రమోడీ ‘భారత విభజన దళపతి’ అని అమెరికాకు చెందిన టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది మేనెలలో తన ముఖచిత్ర కధనానికి శీర్షిక పెట్టింది. అదే పత్రిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరొక అడుగు ముందుకు వేసి గత దశాబ్దాలలో ఏ ప్రధానీ చేయని విధంగా నరేంద్రమోడీ ఐక్యతా దళపతిగా వ్యవహరించారు అని మరొక కధనాన్ని ప్రచురించింది. వాటి లోని అంశాలను మరోసారి వివరించుకోవచ్చు. బ్రిటన్‌, ఇతర అనేక దేశాల నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏమి వ్యాఖ్యానించిందో దిగువ కొన్ని వ్యాక్యాలను చూడండి.

”భారతీయ ఆత్మకు చెడు !

ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు.” అని పేర్కొన్నది.

బ్రిటీష్‌ వారి పాలనకు చరమ గీతం పాడేందుకు సాగిన మహోద్యమానికి నాయకత్వం వహించింది గాంధీ. ఆయన అనుసరించిన కొన్ని వుద్యమ పద్దతులు, కొన్ని అంశాల మీద ఆయన వైఖరులను మ్యూనిస్టులు, ఇతరులు కూడా విబేధించారు గానీ గాంధీ దేశభక్తి, చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు. కానీ నరేంద్రమోడీ, ఆయన మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆరాధించే, ఆయన వారసులం అని చెప్పుకొనే సదరు వినాయక దామోదర్‌ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి. సంఘపరివార్‌కు చెందిన వారి చరిత్ర భారత సమాజాన్ని మతప్రాతికన విడదీసే, పరమత ద్వేషులుగా వుంది తప్ప ట్రంప్‌ చెప్పినట్లు ఐక్యపరిచేదిగా లేదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా టైమ్‌ పత్రిక మాదిరి ఇదే ట్రంప్‌ లేదా మరొక అమెరికా అధ్యక్షుడు తన అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించవచ్చు. అందువలన ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే లేదా మెప్పించుకొనే వారు కాదు, వ్యక్తుల ఆచరణే గీటురాయిగా వుండాలి.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రయాన్‌ 2 ప్రయోగం : తీవ్ర ఆశాభంగం చెందింది నరేంద్రమోడీనా , శాస్త్రవేత్తలా !

09 Monday Sep 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chandrayaan 2, ISRO scientists, Narendra Modi, Vikram Lander

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి ఎన్నికలు- అసలు లక్ష్యం ఏమిటి ? సమర్ధనల బండారం !

20 Thursday Jun 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Uncategorized

≈ Leave a comment

Tags

Narendra Modi, one election, one nation, one nation one election

Image result for bjp motive behind one nation, one election call and it's nature

ఎం కోటేశ్వరరావు

ఒక దేశం, ఒకేసారి ఎన్నిక అ ంటే పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అనే ప్రతిపాదన గురించి నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చే విధంగా త్వరలో ప్రధాని నరేంద్రమోడీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ 2019 జూన్‌ 19న జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం ప్రకటించారు.నలభై పార్టీలకు ఆహ్వానం పంపగా 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనను సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మజ్లిస్‌ పార్టీలు వ్యతిరేకించినట్లు వార్తలు రాగా ,అమలు ఎలా అని ప్రశ్నించారు తప్ప ఎవరూ ఆ భావనను వ్యతిరేకించలేదని రాజనాధ్‌ సింగ్‌ విలేకర్లతో చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదన వెనుక వున్న వుద్దేశ్యాలేమిటి, వివిధ వాదనలు, వాటి బండారం గురించి చూద్దాం.భిన్న అభిప్రాయాలను వినటానికి మేము సిద్దంగా లేము, మా మనోభావాలు దెబ్బతింటాయి అనుకొనే వారు దీనిలో మిగతా భాగం చదవకుండా వదలి వేయటానికి స్వేచ్చ వుంది.

ముందుగా తెలుసుకోవాల్సింది ఈ ప్రతిపాదన సరికొత్తది కాదు, మూడున్నర దశాబ్దాలుగా ఏదో ఒక రూపంలో ముందుకు వస్తూ వెనక్కు పోతున్న అంశం.1983లో ఎన్నికల సంఘం దీని గురించి ప్రస్తావించింది.1999లో వాజ్‌పేయి సర్కార్‌ మరోసారి ముందుకు తెచ్చింది. తరువాత ఎల్‌కె అద్వానీ, ఇప్పుడు నరేంద్రమోడీ వంతుగా వచ్చింది. గతేడాది లా కమిషన్‌ సమర్పించిన నివేదికలో మిగతా అంశాలతో పాటు ప్రస్తుతం వున్న రాజ్యాంగ పరిధిలో జమిలి ఎన్నికలు జరపటానికి అవకాశం లేదని న్యాయశాఖకు నివేదించింది.అంతకు ముందు నీతి అయోగ్‌ కూడా దీని గురించి సూచనలు చేసింది. నరేంద్రమోడీ ఏర్పాటు చేయబోయే కమిటీ ఏమి చెబుతుందో చూద్దాం. బిజెపిని నడిపిస్తున్న సంఘపరివార్‌ తన అజెండాను మరింత ముందుకు తీసుకుపోవాలంటే ప్రస్తుతం వున్న రాజ్యాంగం అనువుగా లేదు. కొంత మేరకు ఆటంకంగా వుంది. అందువలన దాని లౌకిక మౌలిక స్వరూపాన్ని, స్వభావాన్ని సమూలంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే దుష్ట ఆలోచన వుంది. ఇప్పటికే ఆర్టికల్‌ 370కోసం రాజ్యాంగాన్ని మార్చాలనే దాని వైఖరి తెలిసిందే. అది జరగాలంటే నూతన రాజ్యాంగసభకు తప్ప పార్లమెంట్‌, సుప్రీం కోర్టులకు కూడా అలాంటి అవకాశం లేదనే అభిప్రాయంలను నిపుణులు ఇంతకు ముందే అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగపరిషత్‌తో నిమిత్తం లేకుండా సదరు ఆర్టికల్‌ను సవరించాలంటే పార్లమెంట్‌ ఆమోదంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఆమోదం కూడా అవసరం. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ అలాంటి తీర్మానం శాసనసభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అలా జరగాలంటే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటం, హిందువులు మెజారిటీగా వున్న ప్రాంతాలలో సీట్లను పెంచి, ముస్లింలు ఎక్కువగా వున్న చోట తగ్గించి మెజారిటీగా హిందువులు ఎన్నికయ్యేట్లు చూస్తేనే అలాంటి తీర్మానం ఆమోదం పొందే అవకాశం వుంది. కనుకనే బిజెపి ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదల, మార్పు గురించి ఆలోచనలు చేస్తున్నది. ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం దేశంలో మిగతా చోట్ల ఐదు సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ వ్యవధి ఆరు సంవత్సరాలు. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన ఒకేసారి ఎన్నికలకు తొలి రాజ్యాంగపరమైన అడ్డంకి ఇక్కడే మొదలౌతుంది. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటం పోయి కొత్త వివాదాలను ముందుకు తేవటం అంటే అసలు సమస్యలనుంచి జనం దృష్టిని మళ్లించే ఎత్తుగడ దీనిలో వుందన్నది స్పష్టం.

1967వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తరువాత దేశంలో ఎన్నికలు నిరంతరం జరుగుతున్న కారణంగా అభివృద్ధి కుంటుపడుతున్నది, పధకాలను అమలు జరపాలంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డువస్తున్నది. అందువలన ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. భద్రతా సిబ్బంది మీద వత్తిడిని తగ్గించవచ్చు. ప్రధానంగా ముందుకు తెస్తున్న వాదనలు ఇవి. 1999లో లా కమిషన్‌ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. ఒక వేళ అవిశ్వాస తీర్మానం పెడితే, దానితో పాటు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి విశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టాలని సూచించింది. అంటే ఒక ప్రభుత్వం పడిపోయినా చట్టసభలను రద్దు చేయకుండా ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నికచేసి కొనసాగించాల్సిందే.

2015లో పార్లమెంటరీ కమిటీ నివేదికలో జమిలి ఎన్నికలను సిపార్సు చేశారు. తరువాత నరేంద్రమోడీ సూచనల మేరకు 2019, 2021లో రెండు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను జరపాలని నీతి అయోగ్‌ సూచించింది. కానీ దాని మీద రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి మోడీ మరింత మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తిరిగి ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు. గతంలో నీతి ఆయోగ్‌ ముందుకు తెచ్చిన సూత్రం ప్రకారం 2018,19లో జరగాల్సిన 12 అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి జరపాలి. మిగిలిన అసెంబ్లీలకు 2021లో జరపాలి. అంటే దీని ప్రకారం ఐదు సంవత్సరాలలో ఒకసారికి బదులు రెండు సార్లు జరుగుతాయి. మరొక సూచన ప్రకారం 2024 నుంచి ఒకేసారి జరపాలి. దీనికి గాను రాజ్యాంగ సవరణలు చేయాలి.

అభివృద్ధికి ఎన్నికలకు లంకె !

ఇది ఒక అసంబద్దమైన వాదన.1952తొలిసాధారణ ఎన్నికల నుంచి 1967వరకు కేరళ వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ కాలంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ 1967 ఎన్నికలలో లోక్‌సభలో మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ తొలిసారిగా తొమ్మిది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. నాడు మొదలైన రాజకీయ సంక్షోభం మరో రెండు సంవత్సరాలలో కాంగ్రెస్‌లో చీలికకు, పర్యవసానంగా లోక్‌సభను ఏడాది ముందుగానే రద్దు చేసి 1971లో ఎన్నికలకు పోవటం, ఆ సందర్భంగా ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలపై కోర్టు తీర్పు, దాన్ని వమ్ము చేసేందుకు రాజ్యాంగసవరణ, అత్యవసర పరిస్ధితి వంటి పరిణామాలన్నీ తెలిసిందే. నిజానికి పదిహేను సంవత్సరాల పాటు రాజకీయ స్ధిరత్వం వున్నా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? నిరుద్యోగం, ధరల పెరుగుదల, చెల్లింపుల సమస్య తలెత్తటం, ప్రపంచబ్యాంకు పెత్తనాన్ని అంగీకరించటం ఈ కాలంలో జరిగినవే. జయప్రకాష్‌ నారాయణకేమీ పనిపాటా లేక లేదా అధికారం కోసం ఆందోళనలు నిర్వహించలేదు. తరువాత వాజ్‌పేయి పాలనా కాలంలో ప్రభుత్వ స్ధిరత్వానికి ఎలాంటి ముప్పు లేదు, దేశం వెలిగిపోతోందంటూ బిజెపి ప్రచారం చేసుకుంది, అయినా ఆ పార్టీ ఓడిపోయింది. గత అయిదు సంవత్సరాలలో కూడా రాజకీయంగా ఎలాంటి అస్ధిర పరిస్ధితి లేదు, బిజెపి ఏ బిల్లుపెడితే ఆ బిల్లు, ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు జరిగింది. అయినా 1971 నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ఇద్దరు రిజర్వుబ్యాంకు గవర్నర్లు, ఒక ప్రధాన ఆర్ధిక సలహాదారు అర్ధంతరంగా రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అభివృద్ధి అంకెల గారడీ చేసి లేని అభివృద్ధిని వున్నట్లు చూపారని మాజీ ప్రధాన ఆర్ధిక సలహాదారు చెబుతుంటే, అభివృద్ధి అంకెలే నిజమైతే దానికి అనుగుణ్యంగా వుపాధి ఎందుకు లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు. ఇలాంటి వాటి మీద చర్చ జరిగితే తమకు నష్టం కనుక వేరే అంశాలను జనం ముందు పెడుతున్నారనే అభిప్రాయం వుంది.

పోనీ ప్రపంచంలో అనేక దేశాలలో పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలు,చివరికి స్ధానిక సంస్ధలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న వుదంతాలు వున్నాయి. వాటి అభివృద్ధి సంగతేమిటి? ప్రతి ఏటా ఎక్కడో ఒకదగ్గర ఎన్నికలు జరుతున్నా, కేంద్రీకరణ పక్కదారి పడుతున్నా మన దేశ అభివృద్ధి ఏడుశాతంపైగా వుందని, చైనాను అధిగమించామని మన పాలకులు చెబుతున్నారు కదా ! అమెరికాలో అలాంటి పరిస్ధితి లేదు, ఐరోపా దేశాలలో లేదు, అనేక చోట్ల ప్రభుత్వాలు కూలిపోయినా, ఏదోఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి తప్ప చట్ట సభలు రద్దు కావటం లేదు. మరి అక్కడ ఒకటి నుంచి మూడుశాతంలోపే అభివృద్ధి రేటు ఎందుకు వుంటున్నట్లు? ధనిక దేశాలన్నీ సంక్షోభాలను ఎందుకు ఎదుర్కొంటున్నట్లు ? వాణిజ్య యుద్దాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? అనేక దేశాలలో నియంతలు ఎన్నికలే లేకుండా , లేదూ జరిపినా తూతూ మంత్రంగా చేసి దశాబ్దాల తరబడి అధికారంలో పాతుకుపోయిన చోట్ల కూడా అభివృద్ధి ఆమడ దూరంలో వుండటాన్ని చూశాము. అభివృద్ధి అనుసరించే విధానాలను బట్టి తప్ప ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎవరైనా వుంది అంటే పైన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ఖర్చు తగ్గింపు వాదన !

ఎన్నికల ఖర్చు తగ్గించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, అయితే ఏ ఖర్చు అన్నది అసలు సమస్య. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ఖర్చు 60వేల కోట్ల వరకు వుంటుందని, దానిలో ఎక్కువ భాగం బిజెపి చేసిందన్నది జగమెరిగిన సత్యం. దాన్ని తగ్గించటం ఎలా అన్నది చర్చిస్తే అర్ధం వుంటుంది. దాన్ని మరుగుపరచి అధికారిక ఖర్చు తగ్గింపు గురించి జనం దృష్టిని పక్కదారి మళ్లిస్తున్నారు. ఒక పోలింగ్‌ బూత్‌లోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే కలసి వచ్చేది భద్రతా సిబ్బంది, కొంత మేర రవాణా ఖర్చు తప్ప మిగిలినవేవీ తగ్గవు. ఓటింగ్‌ యంత్రాలు, వాటి నిర్వహణకు ఎన్నికల సిబ్బందిలో తగ్గేదేమీ వుండదు. ఒక రాష్ట్రంలో ఒక రోజు ఎన్నికలు జరిపే పరిస్ధితి లేదు, రాను రాను ప్రతి ఎన్నికకూ భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాల్సి వస్తోంది. దానికి కారణం ఎన్నికలు ఎప్పుడూ జరగటం కాదు. శాంతిభద్రతల సమస్యలు, ఓట్ల రిగ్గింగు, గూండాయిజం వంటి ఆవాంఛనీయ ధోరణులు పెరగటం. అలాంటపుడు ఒకేసారి జరిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? ఓట్ల కొనుగోలు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతుల వంటి ఇతర ప్రలోభాలను తగ్గించటం ఎలా అన్నది అసలు సమస్య. వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ఒకటో అరో తప్ప రిజర్వుడు నియోజకవర్గాలలో కూడా డబ్బు ఖర్చుపెట్టగల వారినే అభ్యర్ధులుగా నిలుపుతున్న తరువాత వారు గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయకుండా ఎలా వుంటారు. ఎన్నికల తరువాత పెట్టిన పెట్టుబడికి వడ్డీతో సహా వసూలు చేసుకోవటమే కాదు, వచ్చే ఎన్నికలకు సైతం అవసరమైన నిధులను సంపాదించుకొనేందుకు చూస్తున్న స్ధితి.ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఎవరైనా తక్కువ ఖర్చు చేశారా, ఓట్ల కొనుగోలు, అమ్మకాల ధరలేమైనా తగ్గాయా ? ఏ ఎన్నికలలో పోటీ చేసే వారు ఆ ఎన్నికలకే వుంటారు. ఎంపీ, ఎంఎల్‌ఏలుగా ఒకేసారి ఒకరే పోటీ చేయరు. ఈ ఎన్నికల బరిలోకి దిగిన వారు స్ధానిక సంస్దల వైపు రారు. ఎవరి స్ధాయిలో వారి కొనుగోళ్లు, ప్రలోభాలు వుంటాయని తెలంగాణాలో ఆరు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌, గ్రామీణ స్ధానిక సంస్ధ ఎన్నికలు రుజువు చేశాయి. కాళేశ్వరం పనులేమీ ఆగలేదు, ఆరు నెలలకు ముందు వుద్యోగఖాళీలనేమీ నింపలేదు, ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో కూడా అదే పరిస్దితి. అందువలన అభివృద్ధి ఆగటం అంటే ఏమిటి? ఈ వాదన చివరకు అసలు ఎన్నికలే లేకపోతే అంతా సాఫీగా సాగుతుంది, ఓట్ల ఖర్చు వుండదు, అంతా అభివృద్ధికే మళ్లిస్తారన్న వాదనలనూ ముందుకు తెచ్చేవారు వుంటారు.

అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి !

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అన్ని అభివృద్ధి పధకాలు ఆగిపోతాయి. ఇదొక పచ్చి అవాస్తవం. చట్టసభల పదవీ కాలం అరవై నెలలు అనుకుంటే ఎన్నికల నిర్వహణ జరిగేది గరిష్టంగా ఒక నెల, రెండు నెలలు. ఈ కాలంలో అభివృద్ధి ఆగిపోతుందా? అసలు అభివృద్ధి అంటే ఏమిటి? కేంద్రంలో లేదా రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాక ముందే పధకాలను ప్రకటిస్తున్నారు, నిబంధనావళి అమల్లోకి వచ్చిన తరువాత కొత్త పధకాలు ప్రకటించకూడదు, ఓటర్లను ప్రభావితం చేసే వాగ్దానాలను ఎన్నికల ప్రణాళిక రూపంలో ఎలాగూ చేయవచ్చు. అంతే తప్ప పాతవాటిని అమలు నిలిపివేయాలన్న నిబంధనలేవీ లేవు. సంక్షేమ పెన్షన్లు, వుద్యోగుల జీతభత్యాలు ఆగవు.మహా అయితే కరువు భత్యం వంటివి వాయిదా పడతాయి. రోజూ ఎన్నికలైతే అధికారులు పనులేమి చేస్తారు అన్నది మరొక వాదన. ఎన్నికలు లేనపుడు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నట్లయితే లక్షలాది ఫైళ్లు ఎందుకు గుట్టలుగా పేరుకుపోతున్నట్లు ? కోర్టులలో కేసుల విచారణకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆటంకం కాదు, అయినా ఏండ్లతరబడి ఎందుకు సాగుతున్నట్లు ? మంత్రుల పని కుంటుపడుతుంది, ఇంతకంటే హాస్యాస్పద వాదన మరొకటి లేదు.

స్ధిరత్వం కావాలి !

ఎన్నికైన చట్ట సభలు స్ధిరంగా పని చేయాలి. రద్దు కాగూడదు. కొన్ని దేశాలలో ప్రభుత్వం పడిపోతే మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తప్ప సభలను రద్దు చేసి మాటి మాటికి ఎన్నికలకు పోరు. అసలు ప్రభుత్వాలు పడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అవినీతి, అక్రమాలకు పాల్పడితేనో, ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన తెలిపితేనో ఏదో ఒక బలమైన కారణం వుంటే తప్ప ప్రభుత్వాలు పతనం కావు. తూచ్‌ ఈ రోజు ఈ ఆట, రేపు ఇంకొక ఆట ఆడుకుందామని చెప్పటానికి ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఏమైనా పసిపిల్లలా ! స్దిరత్వం పేరుతో ఒక ప్రభుత్వం కూలినా మనకేమీ ఢోకా లేదు మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం లెమ్మని ప్రజాప్రతినిధులు రెచ్చిపోయే పరిస్ధితిని జనం మీద రుద్దాలని చూస్తున్నారా ? తమకు వాగ్దానం చేసిన విధంగా లేదా తాము ఆశించిన విధంగా తమ ప్రజాప్రతినిధి పని చేయటం లేదని వెనక్కు పిలిపించాలని కోరే హక్కు ఓటర్లకు ఇస్తారా అంటే దాని ప్రస్తావనే లేదు.

Sitaram Yechury news

బిజెపి ఎందుకు జమిలి ఎన్నికలను కోరుతోంది ?

లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు ఓటర్లు ఏదో ఒక పార్టీనే ఎన్నుకున్నట్లు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంది. అందువలన అది తమకు అనుకూలంగా వుంటుందని బిజెపి భావిస్తోంది. గతంలో ఆ పార్టీ కొన్ని చోట్ల బలంగా వున్నప్పటికీ దేశవ్యాపితంగా లేదు, ఇప్పుడు దేశవ్యాపితంగా పెద్ద పార్టీగా ఎదిగింది కనుక తమకు అనుకూలం కనుక ఎలాగైనా ఆ విధానాన్ని అనుసరించాలనే ఆతృత ఇప్పుడు దానిలో కనిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో ఢిల్లీలో బిజెపికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు వెంటనే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని చావు దెబ్బతీసి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి పరిస్ధితి రాకుండా చూడాలని కోరుకుంటోంది. గత ఎన్నికల్లో రెచ్చగొట్టిన మాదిరి మతభావాలు, విద్వేష ప్రచారం, వుపయోగించుకొనేందుకు పుల్వామా, కార్గిల్‌ వంటివి ప్రతి సంవత్సరం, ప్రతి సందర్భంలోనూ రావు. రెండవది విద్వేష ప్రచారాన్ని ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో రెచ్చగొట్టటం ప్రారంభిస్తే అది ఎల్లకాలమూ, అన్నివేళలా ఆశించిన ఫలితాలు రావు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే మతం, అది కూడా హిందూమతం ఇలా అజెండాను అమలు జరపవచ్చు. ప్రస్తుతం అన్ని పార్టీల కంటే అది ఆర్ధికంగా, ఇతరత్రా బలంగా వుంది కనుక ఒకేసారి ఎన్నికలు జరిపితే మిగతా వాటి కంటే ముందుండవచ్చు. ఇలా దాని కారణాలు దానికి వున్నాయి.

జమిలి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది ఎవరు ?

పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది కాంగ్రెస్‌ పార్టీ అని బిజెపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దానికి గాను 1959లో కేరళలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయటాన్ని చూపుతున్నారు. దానిలో కాదనాల్సిందేమీ లేదు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. నేటి బిజెపి పూర్వ రూపం జనసంఘం. నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయటంలో కాంగ్రెస్‌,ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఘం, కేరళలోని మెజారిటీ, మైనారిటీ మతశక్తులు, మీడియా, వీటన్నింటినీ సమన్వయ పరచిన అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ, అమెరికా రాయబారులు తమ వంతు పాత్రను పోషించారు. ఇదంతా విమోచన సమరం పేరుతో సాగించారు. దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎత్తుగడలు ఎవరు రూపొందించారో అన్నింటినీ పాట్రిక్‌ మోయిన్‌ హన్‌ అక్షర బద్దం చేశారు. ఆ పధకంలో భాగంగా జనసంఘం నేత వాజ్‌పేయి కొట్టాయం వచ్చి మళయాల మనోరమ పత్రిక అధిపతి మామెన్‌ మాప్పిలై అధ్యక్షతన జరిగిన సభలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశారు. 1959 జూలై 31న ఆర్టికల్‌ 356ను తొలిసారిగా వుపయోగించి నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆగస్టు ఒకటం తేదీన విజయ దినం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘంతో సహా కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ సంబరాలు చేసుకున్నారు.

ప్రభుత్వాన్ని రద్దు చేసిన తరువాత అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ పార్లమెంట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టినపుడు జనసంఘం నేతగా వాజ్‌పేయి బలపరుస్తూ ఏం మాట్లాడారో చూడండి.’ కేరళ జనం అభినందనలకు అర్హులు, భవిష్యత్‌లో కూడా వారు కమ్యూనిస్టు పార్టీకి తగిన జవాబు చెబుతారని ఆశిస్తున్నాను.నేను కాంగ్రెస్‌ను విమర్శించే వాడినే అయినప్పటికీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని 13 రాష్ట్రాలలో ఏం జరిగిందో చెప్పటానికి నేను వెనుకాడను, ఎక్కడా సెల్‌ కోర్టులను ఏర్పాటు చేయలేదు(కమ్యూనిస్టు పార్టీ శాఖల కోర్టులని వాజ్‌పేయి భావం), పద్నాలుగు సంవత్సరాల యువకులు వారి ఇండ్ల నుంచి బయటకు రాకుండా నిషేధించలేదు. కమ్యూనిస్టులను వివాహం చేసుకోవాలని ఏ తలిదండ్రులూ తమ బిడ్డలకు చెప్పలేదు, సెల్‌ కోర్టులను దిక్కరించిన వారిని ఎక్కడా కత్తిపోట్లకు గురిచేయలేదు. ఈ మాటలు చెబుతూ నేను తీర్మానాన్ని బలపరుస్తున్నాను ‘ అన్నారు. తరువాత జనతా పార్టీలో విభాగమైన వాజ్‌పేయి తదితరులు అదే ఆర్టికల్‌ను వుపయోగించి కాంగ్రెస్‌ ప్రభుత్వాలను రద్దు చేయటం గురించి వేరే చెప్పనవసరం లేదు.

కేరళలో కమ్యూనిస్టుల గురించిన తప్పుడు ప్రచారం ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్నట్లుగా కమ్యూనిస్టు గ్రామాల్లో మరొక పార్టీని బతకనివ్వరని, వ్యతిరేకించేవారిని చంపివేస్తారనే ప్రచారం 1950దశకంలోనే ప్రారంభమైంది. వాజ్‌పేయి అంతటి వ్యక్తే దాన్ని పార్లమెంట్‌ వేదికగా కొనసాగించిన తరువాత ఆయన వారసులుగా చెప్పుకొనే అంతర్జాల పోకిరీల గురించి చెప్పాల్సిన పనిలేదు. లవ్‌ జీహాద్‌ పేరుతో ఇప్పుడు ముస్లింలపై తప్పుడు ప్రచారం చేసినట్లుగానే గతంలో కమ్యూనిస్టుల మీద కూడా ఇలాంటి నిందా ప్రచారం జరిగినట్లు వాజ్‌పేయి వుపన్యాసమే సాక్షి.

Image result for one nation, one election

రాజ్యాంగ నిబంధనలు, స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలను వామపక్షాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కాన్ని ప్రాంతీయ పార్టీలు వాటి పర్యవసానాలు, తెరవెనుక లక్ష్యాలను గుర్తించలేక సమర్దిస్తున్నాయి. ఎన్నికల్లో కండబలం, ధనబలం, అధికార దుర్వినియోగాన్ని గణనీయంగా అరికట్టేందుకు ఇప్పుడున్న మార్గం దామాషా పద్దతిలో ఎన్నికల నిర్వహణ చేపట్టటమే. ఎవరైనా ఫిరాయింపులను ప్రోత్సహించినా, పాల్పడినా వారి సభ్యత్వం రద్దయి, ఆ పార్టీ జాబితాలో వున్న ఇతరులతో ఆ స్ధానాన్ని పూర్తి చేసే విధంగా సంస్కరణలు చేపట్టాలి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఎంతమందికి అవకాశం వస్తుందో ముందుగా తెలియదు కనుక అభ్యర్ధులు డబ్బు ఖర్చు చేసే పరిస్ధితి వుండదు. ఎవరైనా వ్యక్తులుగా పోటీ చేయదలచుకుంటే, నియోజకవర్గాలు ఎలాగూ వుంటాయి కనుక వాటిలో పోటీ చేసి సత్తా వుంటే తగిన ఓట్లు తెచ్చుకొని ఎన్నిక కావచ్చు. అందువలన ఇలాంటి ఆచరణ సాధ్యమైన విధానాల గురించి చర్చిస్తే వుపయోగం. అందుకు బిజెపితో సహా ఎన్ని పార్టీలు సిద్ధం అన్నది ప్రశ్నార్దకం.ఎందుకంటే ప్రతి పార్టీ డబ్బు, రెచ్చగొట్టటం వంటి పద్దతుల్లో గెలవటం సులభం అనుకుంటున్నందున ప్రతి ఓటు తన ప్రతినిధిని చట్టసభలకు పంపే న్యాయం జరిగే ఇలాంటి ప్రజాస్వామ్యబద్దమైన సంస్కరణలకు అనుకూలంగా వున్న పార్టీలను ప్రోత్సహించటంతో పాటు పౌర సమాజమే ముందకు వచ్చి, అడ్డుపడుతున్న వారిని నిలదీయాల్సిన అవసరం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పకోడానోమిక్స్‌ ఫలితాలేమిటి !

14 Friday Jun 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Arvind Subramanian, ‘Pakodanomics’ and employment, India employment, India Unemployment, Narendra Modi, pakodanomics, Raghuram Rajan

Image result for pakodanomics results

ఎం కోటేశ్వరరావు

లాహిరి లాహిరిలో ఓహో జగమే వూగెనుగా తూగెనుగా అంటూ సాగుతున్న నరేంద్రమోడీ 2.0 నావ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. నాలుగు సంవత్సరాల పాటు ఆయనకు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణియన్‌ జిడిపి వృద్ధి రేటు గురించి పేల్చిన బాంబు ప్రభావమది. కోర్టు తీర్పు పూర్తి కాపీ వచ్చిన తరువాత స్పందిస్తామన్నట్లుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆయన లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం చెబుతామని ప్రస్తుతం ప్రధాని ఆర్ధిక సలహాదారులుగా వున్న బృందం ఒక ప్రకటన చేసింది. 2011 నుంచి 2017 మధ్య వాస్తవ జిడిపి వృద్ధి రేటు అంటే యుపిఏ 2 చివరి మూడు సంవత్సరాలు, ఎన్‌డిఏ 1 మొదటి మూడు సంవత్సరాల అభివృద్ధి రేటును అంకెల గారడీ చేసి లేనిదాన్ని వున్నట్లుగా చూపారన్నది సుబ్రమణియన్‌ విమర్శ. సత్యం కంప్యూటర్స్‌ దగా మాదిరి లేని లాభాలను వున్నట్లు కాగితాల మీద చూపిన తీరు అనుకోండి. వాస్తవ అభివృద్ధి ఏడు కాదు నాలుగున్నరశాతమే అన్నారు సుబ్రమణియన్‌. ఆయన ప్రధాన ఆర్దిక సలహాదారుగా వున్నపుడే ఈ విషయం చెప్పి వుండాల్సింది, అంకెలను తయారు చేసేది రాజకీయ నాయకులు కాదు, అంగీకరించిన ప్రమాణాల ప్రకారమే అంకెలు తయారు చేశాము, ఈ పద్దతి యుపిఏ హయాంలోనే ప్రారంభమైంది, సుబ్రమణియన్‌ లెక్కించిన విధానం అసాధారణమైనది, దాన్ని కూడా ప్రశ్నించాల్సిందే అంటూ సన్నాయి నొక్కులతో కేంద్రం ఒక వివరణ కూడా జారీ చేసింది. అభివృద్ధి అంకెలతో నరేంద్రమోడీకి ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పటం ఇది.

Image result for arvind subramanian, raghuram rajan

ప్రభుత్వం చెప్పినట్లు సుబ్రమణియన్‌ లేవెనెత్తిన అంశాలకు జవాబు ఏమి చెబుతారో చూద్దాం. అయితే ఆయన కంటే ముందుగానే రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ లేవనెత్తిన ప్రశ్నకు మూడునెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రధాని ఆర్ధిక సలహాదారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రాజన్‌ లేవనెత్తిన విమర్శను తట్టుకోలేని బిజెపి మరుగుజ్జులు (పోకిరీలు అని కూడా అంటున్నారు) మాత్రం సామాజిక మాధ్యమంలో విరుచుకుపడ్డారు. పదవి నుంచి దిగిపోయిన ప్రతివారూ ఇలాగే అంటారు, మోడీని బదనామ్‌ చేసే కుట్రలో భాగం, ఆయన కాంగ్రెస్‌ మనిషి ఇలా దాడి సాగింది. ఇప్పుడు అరవింద్‌ సుబ్రమణియన్‌ మీద కూడా అదే తరహాదాడి జరగటంలో ఆశ్చర్యం లేదు. ఆయన విధుల్లో వున్నపుడే ఈ మాటలు చెప్పి వుండాల్సిందని మోడీ ప్రభుత్వం ప్రకటించింది అంటే ఎలా దాడి చేయాలో వుప్పందించటమే. సమస్యను పక్కదారి పట్టించటమే. రఘురామ్‌ రాజన్‌ లేవనెత్తిన ప్రశ్న ఏమిటి ? ప్రభుత్వం ప్రకటించినట్లు జిడిపి వృద్ధి రేటు ఏడుశాతం అయితే తగినన్ని వుద్యోగాలు వచ్చి వుండాలి కదా, ఎందుకు రాలేదు అన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ఎన్నికలకు ముందు అధికారిక సమాచారాన్ని అనధికారికంగా ఒక పత్రిక ప్రచురించినపుడు దానిని ఖండించిన సర్కార్‌ ఎన్నికల తరువాత సదరు సమాచారం వాస్తవమే అని చెప్పింది. ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారని అనుకుందా. నిరుద్యోగం ఎందుకు పెరిగిందో అధికారులు చెప్పరు, రాజకీయనేతలు మాట్లాడరు ? ఇప్పుడు సుబ్రమణియన్‌ లేవనెత్తిన అంశాలకు జవాబు చెబుతామని పలికితే నమ్మే దెట్లా ? మరో అయిదేండ్లు చేసేదేమీ లేదు కనుక గోళ్లు గిల్లుకుంటూ ప్రభుత్వం చెప్పేదాన్ని వినేందుకు వేచి చూద్దాం.

Image result for pakodanomics results

మోడీ1.0 హయాంలో తెచ్చిన మంచి రోజు లేమిటో తాజాగా వెల్లడించిన కొన్ని అంకెలు వెల్లడించాయి. మరోసారి మోడీ పాలన కోరుకోవటంలో జనానికి కనిపించిన, అనిపించిన కారణాల గురించి మోడీ 2.0 పనితీరుమీద చర్చ జరిగినపుల్లా ప్రస్తావన వస్తూనే వుంటుంది. ఎవరైనా అలాంటిదేమీ వద్దు అనే ప్రజాస్వామిక భావనను వ్యక్తీరిస్తే ఈ దేశంలో ఇంకా భావప్రకటనా స్వేచ్చ అంతరించి పోలేదు అని చెప్పాల్సి వుంటుంది. జూలై ఐదున కొత్త ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వర్తమాన సంవత్సర పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి క్రతువుకు ఒక తతంగం వున్నట్లుగానే బడ్జెట్‌ గురించి అభిప్రాయసేకరణ వుంటుంది. అది ఈనెల 11-23 మధ్య జరుగుతుంది. దానికి చాయ్‌వాలాలు, చౌకీదార్లెవరూ రారు. పారిశ్రామిక- వాణిజ్యవేత్తలూ, వారి ప్రయోజనాలను కాపాడే బ్యాంకర్లూ, ఆర్ధికవేత్తలు, వారి ఆకాంక్షలకు అనుగుణ్యంగా వార్తలు రాసే జర్నలిస్టులూ హాజరై చెప్పాల్సింది చెబుతారు, పాలకులు చేయాల్సింది చేస్తారు. అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రభుత్వం ముందు కొత్త అజెండాను ముందుకు తెచ్చారు కనుక బడ్జెట్‌ సమాలోచనలు ఎలా సాగుతాయో చూద్దాం !

ఐదు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలకు ‘ మోడినోమిక్స్‌ ‘ అని పేరు పెట్టారు. మరో ఐదు సంవత్సరాలకు ఓటర్లు ఆమోదం తెలిపారు కనుక నిజం చెబితే ఎవరైనా చేసేదేముంది అనే వుదారబుద్దితో కేంద్ర ప్రభుత్వం అసలు లెక్కలను బయట పెట్టింది. దాని ప్రకారం 2017-18లో నిరుద్యోగ రేటు 6.1శాతం, అది 45సంవత్సరాల రికార్డు స్దాయి. మోడీ నావ వడ్డుకు చేరింది, నిరుద్యోగులు మునిగారు. బతికి వున్నవారు అర్ధం చేసుకోవాల్సిందేమంటే సిఎంఐఇ సమాచారం మేరకు 2018 జూన్‌ నుంచి 2019 మే నెల వరకు పన్నెండు నెలల సగటు నిరుద్యోగశాతం 6.66, జూన్‌ ఒకటి నుంచి తొమ్మిది వరకు సగటు 7.36 శాతంగా గ్రాఫ్‌ పైకి ఎగబాకుతోంది. మరోవైపున జిడిపి వృద్ధి రేటు గతేడాది చివరి మూడు మాసాలలో 5.8శాతానికి పడిపోయింది. ఇది మూడు సంవత్సరాలలో కనిష్టం. అరవింద్‌ సుబ్రమణియన్‌ చెప్పిన ప్రకారం ఏడు అంటే నాలుగున్నర, ఏడుకు తగ్గితే ఇంకా పడిపోతుంది. వాస్తవం చెప్పటం మన ధర్మం, కార్యాచరణ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు, నిరుద్యోగులకు వదలివేద్దాం.

గతేడాది ఒక టీవీ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ గారు చెప్పిందేమిటి? ‘ ఒక ఏడాది కాలంలో 70లక్షలకు పైగా ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలు జత అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్ర యోజన పధకం ద్వారా పది కోట్ల మంది లబ్ది పొందారు. కేంద్ర ప్రభుత్వ చొరవల కారణంగా చిన్న తరహా సంస్ధలు, అసంఘటితరంగాలకు సాధికారత ఒనకూడింది. మీ కార్యాలయం ముందు ఎవరైనా ఒకరు పకోడీ బండిని ప్రారంభించారనుకోండి, అది వుద్యోగం లెక్కలోకి రాదా ? సదరు వ్యక్తి రోజువారీ ఆదాయం రెండు వందలు ఏ పుస్తకాలకు, ఖాతాలకు ఎక్కదు. వాస్తవం ఏమంటే పెద్ద సంఖ్యలో జనం వుపాధి కలిగి వున్నారు.’అని నరేంద్రమోడీ సెలవిచ్చారు కనుక దాన్ని కొందరు ‘ పకోడినోమిక్స్‌’ అని వర్ణించారు. ఇంత అభివృద్ధి జరిగిన తరుణంలోనే నిరుద్యోగులు రికార్డు స్ధాయిలో పెరిగారు అంటే ఇప్పుడు పరిస్ధితి ఏమిటి? కొనుగోలు చేసే వారు లేక, కొందరికి వుపాధి వున్నా కొనుగోలు శక్తి పడిపోయిన కారణంగా బండ్లను పక్కన పడేసి పకోడీలు చేసే వారు పని కోసం అడ్డామీదకు చేరుతున్నారని అనుకోవాలి.

Image result for pakodanomics results

ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడయినా విజయవంతమైన తమ విధానాలను కొనసాగిస్తామని బిజెపి నేతలు చెప్పారు. అదేగనుక జరిగితే రానున్న రోజుల్లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నడిపే చౌక భోజన కేంద్రాలు, షిరిడీ సాయి బాబా, ఇతర దేవాలయాల్లో పెట్టే వుచిత అన్నం కోసం నిలబడే వారు మరింత పెరిగిపోతారు. కార్యాలయాలల్లో ఫ్లాస్కుల్లో టీ అమ్ముకొనే వారు కూడా గిట్టుబాటుగాక నిరుద్యోగ సైన్యంలో చేరతారు. ఆర్ధిక వ్యవహారాలు, నిరుద్యోగం మీద, వుపాధి మరియు నైపుణ్యశిక్షణ వంటి 14 అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ వుపసంఘాలలో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌కు చోటు కల్పించని కారణంగా ఆయన అలిగినట్లు వచ్చిన వార్తల కారణంగానే అనేక మంది అలాంటి కమిటీలు వుంటాయని తెలుసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీలు గతంలో కూడా వున్నాయి. దేశంలో పరిస్ధితులు దిగజారుతుంటే గత ఐదేండ్లుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నాయి, ఇప్పుడేం చేయనున్నాయన్నది ప్రశ్న.15-29 సంవత్సరాల వయస్సున్న గ్రామీణ యువకుల్లో 2017-18లో 17.4శాతం, యువతుల్లో 13.6శాతం, పట్టణ యువకుల్లో 18.7, యువతుల్లో 27.2శాతం నిరుద్యోగం వుందని తేలింది. గత ఏడాది కాలంలో ఇంకా పెరిగాయి. గ్రామాల్లో మహిళల వుపాధి, పట్టణాల్లో మొత్తంగా వుపాధి అవకాశాలు పడిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవభారత నిర్మాణం చేస్తానంటున్న నరేంద్రమోడీ బండి నల్లేరు మీదమాదిరి సాఫీగా సాగదని చెబుతున్నాయి.

రైతాంగానికి ఏటా ఆరువేల రూపాయల నగదు ఇస్తామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. దానికి కారణం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధ మరింతగా దిగజారటమే. అసంతృప్తి మరింత పెరగకుండా వుండాలన్నా, ఎన్నికల్లో లబ్ది పొందాలన్నా ఏదో ఒకటి చేయాలి గనుక చివరి క్షణంలో ఆపని చేశారు. మన జిడిపిలో వ్యవసాయ రంగ వాటా తక్కువే అయినప్పటికీ వుపాధి పొందుతున్నవారు ఎక్కువగా వున్నారు.2017-18 సంవత్సర చివరి మూడు మాసాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి 6.5 శాతం కాగా తరువాత సంవత్సరంలో ప్రతి మూడు మాసాలకు 5.1,4.2,2.7,0.1శాతాలకు పడిపోయింది. అది 2019-20లో కూడా కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. దాని నివారణలో భాగంగానే ఏడాదికి ఆరువేల రూపాయల అందచేత అనుకోవాలి. ఇది రైతాంగాన్ని గట్టుకు చేరుస్తుందా అంటే కాదనే చెప్పాలి. మొత్తంగా జిడిపి వృద్ధి రేటు 2018-19తొలి త్రైమాసికంలో 8శాతం వుండగా తరువాత మూడు త్రైమాసికాలలో అది వరుసగా 7, 6.6, 5.8శాతాలకు పడిపోయింది.అంకెలు ఎక్కువగా చెబితే కాస్త గందరగోళంగా వుండవచ్చుగానీ మరొక మార్గం లేదు.2018 మార్చినెలలో పారిశ్రామికవుత్పత్తి వృద్ధి రేటు 5.3శాతం వుండగా 2019 మార్చినాటికి అది 0.1కి చేరింది.

Image result for what are the pakodanomics results

ఇతర అనేక అంశాలు ప్రతికూలంగా వున్నప్పటికీ మొదటి సారి మోడీ అధికారానికి వచ్చిన తొలి మూడు సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు బాగా పడిపోయిన కారణంగా అది అనుకోని వరంలా మారింది. ఇప్పుడు మరోసారి పైవైపు చూసే ధోరణే తప్ప తగ్గే పరిస్ధితి కనిపించటం లేదు. రంజాన్‌ మాసం ముగిసింది కనుక పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో యుద్దం వంటి పిచ్చిపనులకు డోనాల్డ్‌ట్రంప్‌ పాల్పడితే మోడీ సర్కార్‌కు పెద్ద పరీక్ష అవుతుంది. ఐదేండ్లు అంతా బాగుంది అని చెప్పిన తరువాత బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్ధక ఆస్ధులకు కాంగ్రెసే కారణమని చెబితే ఇంకేమాత్రం అతకదు. పడిపోతున్న పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని నిలబెట్టేందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలిస్తే పరిస్ధితి మెరుగుపడుతుందనే అభిప్రాయంతో రిజర్వుబ్యాంకుద్వారా వడ్డీని తగ్గిస్తున్నారు. గతంలో తగ్గించిన ఫలితాలేమీ కనపడలేదు. అనేక పెట్టుబడిదారీ దేశాలలో వడ్డీ రేటు మన కంటే చాలా తక్కువ, జపాన్‌లో అయితే డబ్బు దాచుకున్నవారే బ్యాంకులకు సొమ్ము చెల్లించాల్సిన పరిస్ధితి. అయినా అక్కడ వృద్ధి రేటు పెరగటం లేదు. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవటం, తదితర కారణాలతో చైనాలో వృద్ధి రేటు కాస్త తగ్గినప్పటికీ నిలకడగా వుంటోంది. దానికి ప్రధాన కారణం ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూడటంతో పాటు అంతర్గత వినియోగ మార్కెట్‌ను పెంచటమే. అందుకోసం అది కార్మికుల వేతనాలను ఏడాదికేడాది పెంచుతోంది. ఈ కారణంగానే తమకు గిట్టుబాటు కావటం లేదు కనుక అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తమ పరిశ్రమలను తరలిస్తామని అమెరికా, తదితర దేశాల యజమానులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అమెరికాాచైనా వాణిజ్య యుద్దం, ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటం(బ్రెక్సిట్‌), అమెరికా – ఇరాన్‌ వైరం, ఐరోపాలో పరిష్కారం కాని ఆర్దిక ఇబ్బందులను అవకాశాలుగా మలుచుకొని మన దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చినా, మరొకటి చేసినా మన దేశానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు లేవు, ఎగుమతులూ పెరగలేదు. అమెరికాతో ఎంతగా అంటకాగుతున్నా మన ఎగుమతులకు ఎంతో కాలంగా ఇస్తున్న పన్ను తగ్గింపు ప్రాధాన్యతను తగ్గించటం వంటి చర్యలతో మనకు మరింత నష్టం జరగనుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి, మరో సందర్భంలో చెప్పుకోవచ్చు. ఒకవైపు రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ప్రభుత్వమే అంగీకరించింది కనుక దాని గురించి ఎలాంటి అనుమానాలు లేవు. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పినట్లు పెద్ద ఎత్తున మన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిందనే అంగీకరిద్దాం, మరి వుద్యోగాలెందుకు రాలేదు ? ఈ సారైనా మోడీ నోరు విప్పుతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అప్పుడెందుకు మూసి పెట్టారు – ఇప్పుడెందుకు బయట పెట్టారు !

01 Saturday Jun 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

India Unemployment, Narendra Modi, Narendra Modi 2.0, narendra modi bhakts, Unemployment Rate NSSO Report

Image result for modi 2.0

ఎం కోటేశ్వరరావు

2019 మే 23కు ముందు, తరువాత వచ్చిన మార్పు ఏమిటి? మీడియాలో వర్ణించిన దాని ప్రకారం నరేంద్రమోడీ 2.0గా మారారు. దీని భావం ఏమిటంటే తిరుమలేశా, మారుతున్న కాలంతో మారని మీకు అది వర్తించదు. అసలైన భావం, తొలి వుత్పత్తి, తొలి సేవల వంటివి ఏవైనా మలిగా ఆధునిక రూపం, మార్పులు సంతరించుకొంటే దాన్ని వ్యక్తీకరించటానికి 2.0ను సూచికగా వాడుతున్నారు. దాని ప్రకారం మోడీలో వచ్చిన మార్పు ఏమిటి? నిరుద్యోగం గురించి ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అసలు సిసలు పాత మోడీ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే లెక్కలు బయటకు రాకుండా చేశారు. ఒక పత్రికలో వెల్లడైన వాటిని తప్పుల తడకలని వర్ణించారు. ఇప్పుడు కొత్త మోడీ తన భక్తుల నోరు మూయించేందుకు ఆ లెక్కలనే అధికారికంగా విడుదల చేయించారు. విడుదల చేయక తప్పని స్ధితి, ఎందుకంటే నాటకంలో రెండో అంకం మొదలు కావాలి కదా ! మోడీ సర్కార్‌ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి గతంలో వాస్తవాలను బయట పెట్టిన మీడియా, ప్రతిపక్షాల మీద వీరంగం వేసిన పార్టీ కార్యకర్తలు, గుడ్డి భక్తులు వాస్తవాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేరు, జీర్ణించుకున్నా నోరు తెరవలేరు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఎలాగూ అసలు విషయాల గురించి మోడీ నోరెత్తరు. నాటకం నడవక తప్పదు, మద్దతుదారులకు ఏదో ఒక పని చెప్పాలి కనుక వారు తేరుకొని గళం విప్పేందుకు కొత్త వాదనను అందుబాటులోకి తెచ్చారు. నిరుద్యోగ అంకెలు తప్పుల తడకలని గతంలో మోడీ అండ్‌కో రాగం తీస్తే ఇప్పుడు భారత ప్రధాన గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ కొత్త పల్లవి అందుకున్నారు.

ఇంతకీ ప్రవీణ్‌ శ్రీవాత్సవ గారి వేద గణిత తర్క సారాంశం ఏమిటి ? ‘ తాజాగా అధికారికంగా విడుదల చేసిన నమూనా సర్వేక్షణ వుద్ఘాటన ఏమంటే ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు హైస్కూలు విద్య, అంతకు మించి చదుకొని వుండి వుంటారు అనే ప్రాతిపదిక మీద జరిగింది, గత సర్వేలన్నీ తలసరి నెలవారి వినియోగం ఎంత అనే ప్రాతిపదిక మీద నిరుద్యోగాన్ని అంచనా వేశాయి కనుక గత సర్వేలతో పోల్చకూడదు. ఈ సర్వేలో ఆచార నవీకరణ లేదా కొత్త మార్పుల వంటి అనేక అంశాలు వున్నాయి. ప్రతి మూడు నెలలకు పట్టణాలు, గ్రామాలలో విడివిడిగా, రెండింటినీ కలిపి ఏడాదికి ఒకసారి గణించటం వంటి వన్నీ కొత్తమార్పులు. ఎవరైనా కొత్తగా ఒకదానిని ప్రారంభించినపుడు అది ఎలాంటి రాతలు లేని కొత్త పలక మాదిరి వుండాలనటాన్ని మీరు అభినందించాలి. అనేక విద్యా కోర్సులు యువతకు వుపాధి చూపేవిగా లేవు. వుద్యోగాలు చేయగల యువకులను యజమానులు పొందాలంటే నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరచే విధంగా కార్యకలాపాలు పెరగాలి. అది జరగాలంటే అవసరం-సరఫరా తేడా ఎంత వుందో చూడాలి, దాన్ని కేవలం సంఖ్యతో మాత్రమే కాదు నైపుణ్య స్ధాయితో కూడా చూడాలి.’

దీని భావం ఏమిటంటే, ఫీజు రీఇంబర్సుమెంటో మరొకదానితోనో ఇంటికొకరు చదుకొని తగలడ్డారు, ఆ చదువు చట్టుబండలైంది తప్ప వుద్యోగం లేదా వుపాధికి పనికి రాదు. అలాంటి వారు పెద్ద సంఖ్యలో వున్నంత మాత్రాన వారందరినీ నిరుద్యోగులంటే ఎలా ! వారి నైపుణ్యం కూడా చూడాలి. అంటే ఇప్పుడు పెద్ద సంఖ్యలో వున్నవారందరూ పనికి రాని చదువులు చదివి, ఎలాంటి నైపుణ్యం లేకుండా వున్నారు. వారందరినీ నిరుద్యోగులంటే కుదరదు, రాబోయే రోజులలో పరిస్ధితిని, సర్వేలను పోల్చుకోవాలి తప్ప పాతవాటిని అంగీకరించం, బాగా చదువుకొని, బాగా నైపుణ్యం సంపాదించి పని పాటలు లేకుండా నిరుద్యోగిగా వుంటేనే అసలు సిసలు నిరుద్యోగి, అటువంటి వారెందరున్నారో అన్నది తేల్చేందుకు పూనుకున్నాం, కొత్త లెక్కలు రానున్నాయి, పాతలెక్కలను మరచిపోండి అన్నది ప్రవీణ్‌ గారి ప్రావీణ్య తర్కం. దీన్ని అంగీకరిస్తామా లేదా, దీన్ని అర్ధం చేసుకోగల చదువు సంధ్యల విజ్ఞానం లేదా నైపుణ్యం నిరుద్యోగులకు వుందా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎవరైనా నోరు తెరిచి కాదు గీదంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా భావించి గోరక్షకుల మాదిరి చెలరేగి పోవటానికి మోడీ సర్కార్‌ రక్షకులు సిద్ధంగా వుంటారు మరి ! జాతీయ వాదానికే అర్ధం మార్చి కొత్త అర్ధాలు చెబుతున్నవారు చెప్పే నిరుద్యోగ కొత్త అర్దం తెలుసుకోవటానికి, అలవాటు పడటానికి మనం మరో ఐదేండ్లు సిద్దం కావాలి మరి.

సమస్యను పక్కదారి పట్టించటంలో నిరుపమాన సామర్ధ్యం కలిగిన వ్యక్తి గనుక 2018 ప్రారంభంలో ఒక ఛానల్‌తో ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలో ఒక వ్యక్తికి పకోడీలు అమ్మితే రోజుకు 200 మిగులు తుంది, దాన్ని వుపాధి కల్పనగా లెక్కవేయాలా వద్దా అని నరేంద్రమోడీ ఎదురు ప్రశ్నించారు.అది కూడా వుపాధి కల్పనే కదా, మా ఖాతాలోకే రావాలి కదా అని అప్పుడు మోడీ గారు చెప్పారు. ఇప్పుడేమో ప్రవీణ్‌ శ్రీవాత్సవగారు నైపుణ్యం, చదవు వున్నవారే నిరుద్యోగి అని మాట్లాడుతున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదేనా ?

ప్రపంచ వ్యాపితంగా వేగంగా జరుగుతున్న యాంత్రీకరణ, రోబో, ఇతర ఆధునిక పరిజ్ఞానం కారణంగా ఒక బ్యాచి యువతీ యువకులు నాలుగేండ్ల ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసి డిగ్రీ చేతబట్టి బయటకు వచ్చేసరికి వారు నేర్చుకున్నది పాతబడిపోతోంది. అందుకే కంపెనీలు కొత్త నైపుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చి అవి వున్నవారినే ఎంచుకుంటున్నాయి. ఈ పూర్వరంగలో నైపుణ్యశిక్షణ పేరుతో మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున వూదరగొట్టింది.కంపెనీలు వుద్యోగాలు ఇచ్చి నైపుణ్యాన్ని పెంచితే అందుకయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని లేదా ఇతరంగా రాయితీలు కల్పిస్తామని, ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లిస్తామని పేర్కొన్నది. పోనీ దాన్నయినా సక్రమంగా అమలు జరిపిందా?

ఒక వైపు వాజ్‌పేయి పాలన, కాంగ్రెస్‌పాలనా కాలంలో వున్నత విద్య ప్రయివేటీకరణ గావించి పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలను కేవలం డిగ్రీ ముద్రణ కేంద్రాలుగా మార్చివేసినా గత ఐదు సంవత్సరాలలో నాణ్యతను పెంచేందుకు ఎవరూ పట్టించుకోలేదు. బయటకు వచ్చిన వారు పెద్ద మొత్తంలో ప్రయివేటు శిక్షణకు ఖర్చు చేయటం తెలిసిందే. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(నైపుణ్య అభివ అద్ధి) పధకం 2016-20 ఒక ప్రహసనంగా మారింది. అందుకే ఈ మధ్య ఎక్కడా దాని ప్రస్తావనరావటం లేదు. ఈ కాలంలో కోటి మంది యువతీ యువకుల నైపుణ్యాలను పెంచాలన్నది లక్ష్యం. ఇందుకు గాను 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి గాను 2018 నవంబరు 30 నాటికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 36లక్షలు మాత్రమే. వారిలో 33.9లక్షల మందికి శిక్షణ ఇచ్చారు, 30.02లక్షల మంది గురించి మదింపు వేశారు. వారిలో 26లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చామని, వారు వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఈ ఏడాది జనవరి ఏడున లోక్‌సభలో ఒక ప్రశ ్నకు ప్రభుత్వం తెలిపింది. మరొక సమాచారం ప్రకారం 2018 ఆగస్టు నాటికి పది లక్షల మందికి వుద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా కోటి మందిలో ఇంతవరకు పదిలక్షలు అంటే పదిశాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. మరి ప్రవీణ్‌ గారు దీని గురించి ఏమంటారు?

వీరికి శిక్షణ ఇచ్చిన సంస్ధలది ఒక ప్రహసనం. బోధనా సిబ్బంది లేని ఇంజనీరింగ్‌,వైద్య, విద్యా శిక్షణా సంస్దల గురించిన సమాచారం బహిరంగ రహస్యమే. గతేడాది జనవరిలో పార్లమెంటరీ కమిటీ నైపుణ్య శిక్షణ సంస్ధల తీరు తెన్నుల గురించి తీవ్ర విమర్శలు చేసింది. కొన్ని సంస్ధలు అప్పటికింకా నిర్మాణ దశలోనే వుండటం, కొన్నింటిలో పరికరాల లేమి, ఇతర అవసరాలకు వుపయోగిస్తున్నవి కొన్ని, అసలు చిరునామా తప్ప జాడలేనివి కూడా వున్నాయట. ఈ శిక్షణా సంస్ధలపై వివిధ రాష్ట్రాలలో 1173 కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. దీన్ని బట్టి అవిచ్చిన శిక్షణ ఏమిటో, ఈ తతంగమంతా తెలిసి వారికి వుద్యోగాలు ఇచ్చిన వారెవరో అంతా ఒక పెద్ద ప్రహసనం. నిరుద్యోగులు వుద్యోగాలకు పనికొచ్చే వారు కాదని మోడీ సర్కార్‌ మన్‌కీ బాత్‌ను ప్రవీణ్‌ గారు బయటపెట్టారు. విషాదం ఏమిటంటే నిరుద్యోగులు తమను మభ్యపెడుతున్నవారెవరో కూడా తెలుసుకోలేని దుస్ధితిలో వున్నారు. ఎవరు చేసుకున్న ఖర్మను వారు మరో ఐదేండ్లు అనుభవించక తప్పదనే వాస్తవాన్ని అయినా నిరుద్యోగులు గ్రహిస్తారా ?

Image result for Unemployment Rate NSSO Report : why now  released then suppressed

మన కుర్రకారు భాషలో చెప్పాలంటే పాత మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతల దౌత్యంతో పడేయాలని చూశారు. ఫలించినట్లు కనపడటం లేదు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు కొనవద్దంటే గడువుకు ముందే మానేశాం సార్‌ అని చెప్పారు. మీరు చెప్పినట్లు చేశాము, మరి మాకు ఇప్పుడు ఇరాన్‌ మాదిరి ఎక్కడైనా చౌకగా చమురు ఇప్పిస్తారా అంటే, ఏం మాట్లాడుతున్నారు, మేము ఇప్పించటం ఏమిటి , బయట కావాల్సినంత వుంది, ఎంతరేటు వుంటే అంతకు ఎంతకావాలంటే అంత కొనండి, కావాలంటే మాదగ్గర కూడా వుంది, రేటేమీ తగ్గదు, మీకు తెలిసిందే కదా, అంతా ప్రయివేటు వ్యవహారం అని చెప్పేసింది అమెరికా. మోడీ 2.0అవతారం ఎత్తి సంతోష తరంగాలలో తేలియాడుతుండగానే పెండ్లి అయిన మరుసటి రోజే కట్నం సంగతి ఏమిటని మొదలు పెడుతున్నట్లుగా కౌగిలింతల భాగస్వామి ట్రంప్‌ మరోబాంబు పేల్చాడు. రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణులు కొనుగోలు చేయటాన్ని నిలిపివేయకపోతే ఆంక్షలు తప్పవని అమెరికా అధికారి ఒకరు స్పష్టం చేశారు. మొండిగా ముందుకు పోతే అమెరికాతో కుదిరిన రక్షణ ఒప్పందాల భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడుతుందని, మినహాయింపులు ఇవ్వక ఎ్కడకు పోతారులే అంటే కుదరదని అమెరికా అధికారి చెప్పినట్లు హిందూ పత్రిక కధనం. ఇప్పటి వరకు మన దేశం నుంచి 560కోట్ల డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతులపై ఇస్తున్న పన్ను రాయితీలను వుపసంహరించుకుంటామని గతంలోనే ప్రకటించామని దానిని ఇప్పుడు అమలు జరపబోతున్నామని గురువారం నాడే మరో అమెరికా అధికారి విలేకర్లతో చెప్పాడు. మన మాదిరే టర్కీకి ఇచ్చిన ప్రాధాన్యతను రద్దు చేస్తూ మే17న ట్రంప్‌ వుత్తరువులు జారీ చేశారు. మనకు సంబంధించి తమ షరతులకు భారత్‌ అంగీకరించకపోతే ఏ క్షణంలో అయినా అలాంటి ప్రకటనే వెలువడవచ్చన్నది బహిరంగ బెదిరింపు అది. పాత మోడీ కౌగిలించుకుంటే , కొత్త మోడీ కాళ్ల బేర దౌత్యానికి పూనుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ ముందున్న సవాళ్లు, సమస్యలూ !

29 Wednesday May 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Indian economy, Issues and Challenges before Narendra Modi, Narendra Modi, pakoda, pakoda self employment

Image result for Issues and Challenges before Narendra Modi

ఎం కోటేశ్వరరావు

రాజకీయనేతలు, ప్రత్యేకించి ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులు క్లిషంగా వున్నపుడు తమ అధికారాన్ని పదిల పరచుకొనేందుకు జాతీయవాదాన్ని ఒక సాధనంగా చేసుకుంటారు అని రిచర్డ్‌ ఎన్‌ హాస్‌ అనే అమెరికన్‌ దౌత్యవేత్త చెప్పారు. అమెరికన్ల దృష్టిలో జాతీయ వాదం అంటే ఒక దేశం లేదా ప్రపంచ మీద లేదా మార్కెట్‌ మీద ఆధిపత్యం చెలాయించాలనే వాదం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి జాతీయ వాదం. అదే జాతీయ వాదం మరొక దేశం కూడా కలిగి వుంటే జరిగేది ఘర్షణే. అయితే మన దేశంలో జాతీయవాదులుగా చెప్పుకొనే బిజెపి, సంఘపరివార్‌ది అటువంటిది కాదు, హిందూత్వ జాతీయ వాదం. దాని మంచి చెడ్డలను పక్కన పెడితే హాస్‌ చెప్పిన ఆర్ధిక, రాజకీయ క్లిష్ట పరిస్ధితులు ఏ జాతీయవాదులకైనా వర్తిస్తాయి. అధికారం ఒక ముళ్ల కిరీటం, నరేంద్రమోడీ రెండవసారి దాన్ని మరోసారి ధరించబోతున్నారు. ఆయన ఘనతను జాతీయ వాదుల విజయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణించింది. ప్రస్తుతం నరేంద్రమోడీకి రాజకీయ క్లిష్ట పరిస్ధితులు లేవు. ఎందుకంటే ఆ పార్టీకే సంపూర్ణ మెజారిటికీ మించి లోక్‌సభలో సీట్లు వచ్చాయి. మరికొద్ది నెలల్లో రాజ్యసభలో కూడా మెజారిటీ రానుందనే వార్తలను మనం చూశాము. అందువలన నరేంద్రమోడీ ముందు ఆర్ధిక పరమైన, ఇతర సవాళ్లు ఏమి వున్నాయి, వాటి స్వభావం ఏమిటన్నది చూద్దాం.

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీలు లేదా అధికారం కోసం పాకులాడే పార్టీలు గానీ అర్ధసత్యాలను, అసత్యాలనే చెబుతాయి. నిజం చెప్పే వారిని పరిగణనలోకి తీసుకొనే లేదా వారు చెప్పే అంశాలనైనా చర్చించే స్ధితిలో ప్రస్తుతం మన జనం, మీడియా లేదు. ఎన్నికలు ముగిశాయి కనుక వాస్తవ దృక్పధంతో సమస్యలను చూడటం అటు జనానికి, ఇటు నరేంద్రమోడీ పది కాలాలపాటు వుండాలని కోరుకొనే వారికి కూడా అవసరం.

ఆర్ధిక అంకెలే అసలు సమస్య !

తన పాలనా కాలంలో సూట్‌ కేస్‌ కంపెనీలలో చాలా వాటిని మూసివేయించానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషించాల్సిన అంశమే. అయితే ఆ బోగస్‌ కంపెనీలు ఇచ్చిన సమచారాన్ని కూడా కలిపి అభివృద్ధి అంకెలను తయారు చేశారని, అందుకే అభివృద్ధి జరిగినట్లు కనిపించినా ఆచరణలో వుపాధి పెరుగుదల కనిపించలేదన్న ఒక విమర్శ వుంది. ఎన్ని మరుగుదొడ్లు కట్టించిదీ, ఎన్ని గ్యాస్‌ పొయ్యిలు ఇచ్చిందీ, ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసిందీ, ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందీ ఏ బిజెపి కార్యకర్తను అడిగినా గడగడా చెప్పారు గాని, వాగ్దానం చేసినట్లుగా ఎన్ని వుద్యోగాలు కల్పించారు అంటే తయారు చేసిన అంకెలు సక్రమంగా లేవని, వాస్తవ స్ధితిని ప్రతిబింబించే లెక్కలను తయారు చేస్తున్నామని నరేంద్రమోడీయే స్వయంగా చెప్పారు కనుక వాటిని వెల్లడించాలి. పకోడీల బండి పెట్టుకోవటం కూడా వుపాధి కల్పనలో భాగమే అని చెప్పినందున ఎంత మంది పకోడీలు, బజ్జీలు , టీ అమ్ముతూ వుపాధి పొందుతున్నారు అనే వాటితో సహా అన్ని వివరాలు తెలుసుకోవటం జనానికి సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది.

రెండువేల పదమూడో సంవత్సరం జూన్‌ తరువాత మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరం మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక గతేడాదితో పోల్చినప్పుడు నిరపేక్షంగా 0.1శాతం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వ ద్ధి ఫిబ్రవరిలో కేవలం 0.07మాత్రమే ఉంది. అలాగే జనవరిలో 1.7శాతం, డిసెంబరులో 2.6శాతం, నవంబరులో 0.3శాతంగా నమోదు అయింది. క్లుప్తంగా చెప్పాలంటే కొంతకాలంగా పారిశ్రామిక వ ద్ధి మందగిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. పారిశ్రామిక రంగంలో పాతవైనా, కొత్త పరిశ్రమల్లో అయినా ఆధునిక యంత్రాలను, కంప్యూటర్లు, రోబోట్లను ప్రవేశపెడుతున్నారు. గుమస్తాలు చేయాల్సిన పనులను కంప్యూటర్లు చేస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల లాభాల రేటు తగ్గలేదు, నష్టాలు వచ్చి ఫలానా తరహా పరిశ్రమ మూతపడింది అనే సమాచారాన్ని కూడా పాలకులు మనకు చెప్పలేదు కనుక అంతా బాగుందనే అనుకోవాలి. ఇక్కడే సమస్య వస్తోంది.

రైతు లేనిదే రాజ్యం లేదు !

పదిహేను సంవత్సరాల క్రితం దేశ జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 21శాతంగా వున్నది కాస్తా ఇప్పుడు 13శాతానికి పడిపోయింది. అయితే ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య ఆ దామాషాలో తగ్గలేదు. దేశంలో పనిచేసే వారిలో 55శాతం మంది అంటే 26 కోట్ల మంది వ్యవసాయ రంగంలో వున్నారు. అంటే జనాభాలో సగానికి పైగా దాని మీదే ఆధారపడి వున్నట్లు లెక్క. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగంలో తలెత్తిన సమస్యలు అనేక రాష్ట్రాలలో రైతులను రోడ్ల మీదకు తెచ్చాయి. నరేంద్రమోడీ కంటే తెలంగాణాలో చంద్రశేఖరరావు సర్కార్‌ రైతు బంధుపేరుతో ఎక్కువ మొత్తాలు చెల్లించిన నిజామాబాదులో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరగురించి చేసిన ఆందోళన, ఎన్నికల్లో దాని పర్యవసానాలను ఏ పాలకులైనా గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ మంతటా వ్యవసాయ పంటల ధరలు తగ్గుతున్నాయని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ గణాంకాలు చెబుతున్నాయి. మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కాదు. ప్రాణం పోకుండా చేసే ప్రాధమిక చికిత్స వంటివే. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అరుంధతి నక్షత్రంలా వుంది. వ్యవసాయ రంగంలో రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే యాంత్రీకరణ అవసరం అని యంత్రాలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. అవి పారిశ్రామికవేత్తల, వాణిజ్యవేత్తల జేబులు నింపుతున్నాయి తప్ప రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది పెద్ద ప్రశ్న. మరోవైపున యాంత్రీకరణ కారణంగా వ్యవసాయ కార్మికులకు వుపాధిపోయి వారంతా నిరుద్యోగసేనలో చేరుతున్నారు. చేతివృత్తుల వారి పరిస్ధితీ అంతే. అందువలన ఈ పెద్ద సమస్యను పరిష్కరించకుండా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్న పరిస్ధితినే నరేంద్రమోడీ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది.

Image result for Narendra Modi, pakoda

నిరుద్యోగ సమస్య తీరు తెన్నులేమి !

నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారనే విమర్శను మోడీ సర్కార్‌ ఎదుర్కొన్నది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధిచిన సమాచారాన్ని ప్రచురించటానికి తిరస్కరించటం సహజంగానే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏదైనా మూసి పెడితే పాచిపోతుంది అని తెలిసిందే. ఆ సమస్య మీద సంబంధిత వున్నత అధికారి రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వ గణాంక కార్యాలయం నుంచి లీక్‌ అయిన నివేదిక ప్రకారం నిరుద్యోగం 6.1శాతందాకా ఉంది. ఇది గత 45సంవత్సరాలలో అత్యంత గరిష్టం. ఏప్రిల్‌లో నిరుద్యోగం రేటు 7.6శాతం ఉందని ద సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. నిరుద్యోగం రేటులో చలనాలు నిరుద్యోగం ఏ దిశగా పయనిస్తుందో సూచిస్తాయని తెలుసుకోవాలి. కేవలం రేటుతో సమస్య తీవ్రత తెలియదు. ఎందుకంటే భారతదేశంలో అనేకమందికి పూర్తి కాలం ఉద్యోగం ఉండటం, పూర్తి కాలం ఉద్యోగం లేకపోవటం కాకుండా ఉద్యోగిత కొంతకాలమే ఉంటుంది.

దేశంలో జనాభా 136 కోట్లు, వారిలో పని చేయగలిగిన వారు 15-64 సంవత్సరాల వయసు వారు అనుకుంటే 91 కోట్ల మంది వుంటారు.అయితే వారంతా వుద్యోగాల కోసం చూస్తారని కాదు గాని మన వంటి దేశానికి, ఏ పాలకులకు అయినా అదొక పెద్ద సమస్య అని చెప్పక తప్పదు. దీన్ని పరిష్కరించకుండా, వాగ్దానం చేసిన మాదిరి ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాలు కల్పించకుండా జనానికి ‘మంచి రోజులు ‘ రావు కదా ! నల్లధనాన్ని వెలికి తీసి బాత్‌రూముల్లో, మంచల మీద దాచిన సొమ్మును చలామణిలోకి తెచ్చి వుత్పాదక, వుపాధి అవసరాలకు అందుబాటులోకి తెస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. అలాగే పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎగవేతలను అరికట్టేందుకు అని చెప్పి జిఎస్‌టిని ప్రవేశపెట్టారు. దాని వలన పెద్ద ఎత్తున వుపాధి పోయిందని జనం గగ్గోలు పెడితే ఒక చర్య ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, కొద్ది రోజులు ఆగాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పడినా జనం వాటిని మరచిపోయి నరేంద్రమోడీకి ఓటేశారు. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ రూపంలో జనానికి వుపయోగపడుతున్నాయో చూపించాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌ ముందు వుంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్ధ మోడీ సర్కార్‌ కంటే ముందే ఏర్పడింది. అనేక అంశాలను అది ఎప్పటికపుడు వెల్లడిస్తోంది. అలాంటి సంస్ధ ఇచ్చిన లెక్కల ఆధారంగానే 2014లో నరేంద్రమోడీ రెండు కోట్ల వుద్యోగ కల్పన వాగ్దానం చేసినట్లు మరచి పోరాదు. 2016లో పెద్ద నోట్ల రద్దు, తరువాత జిఎస్‌టి పర్యవసానాల కారణంగా 2018లో కోటీ పదిలక్షల మందికి వుపాధి పోయిందని ఆ సంస్ధ చెప్పింది. ఆ సంస్ధతో పోల్చితే ప్రభుత్వానికి వున్న పెద్ద యంత్రాంగం అసలు వాస్తవాలను బయట పెట్టాలి. లేకపోతే విశ్వసనీయత సమస్యను సర్కార్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భవిష్యత్‌ కోసం నాకు ఓటు వేయండని నరేంద్రమోడీ స్వయంగా కోరిన విషయాన్ని మరచిపోరాదు.

ఇండియా స్పెండ్‌ వెబ్‌ సైట్‌ విశ్లేషణ ప్రకారం అనేక నెలలుగా నిరుద్యోగశాతం ఏడుశాతానికి అటూ ఇటూగా వుంది. ప్రతి ఏటా 1.2కోట్ల మంది వుద్యోగార్ధులు అడ్డామీదకు వస్తున్నారు.వారిలో కేవలం 47.5 లక్షల మందికి మాత్రమే పని దొరుకుతోంది.దేశ జనాభాలో 80శాతం హిందువులే వున్నారు, అంటే నిరుద్యోగుల్లో కూడా వారి వాటా అంతకు తగ్గదు. ఈ సమస్య ఏ క్షణంలో అయినా పేలే టైంబాంబు వంటిది, అది పేలకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. కాబట్టి నిరుద్యోగితను తగ్గించటానికి ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యాలి.ఏం చేస్తారో ఎన్నికల్లో చెప్పలేదు. ఇప్పుడా పని చేసి యువతకు భరోసా కల్పించాలి.

ధనమేరా అన్నిటికీ మూలం !

నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలు, రేపిన ఆశలు వేటిని నెరవేర్చాలన్నా కావాల్సింది ధనం.సంపదల సృష్టి లేకుండానే నోట్లను ముద్రిస్తే ప్రయోజనం లేదు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగా ఎంతకాలం చెప్పుకుంటాం అంటూ ఎన్‌డిఏ కొత్త ఎంపీల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మన దగ్గర మంత్రదండాలేమీ లేవు.

పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం 77.6శాతం ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్చిలో ఇది 0.4శాతం తగ్గింది. క్యాపిటల్‌ గూడ్స్‌ 8.7శాతం, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ 5.1శాతం, ఇంటర్‌మీడియట్‌ గూడ్స్‌ 2.5శాతం క్షీణించటం, కన్సూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 0.3శాతం పెరగటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వ ద్ధి కేవలం 3.6శాతంగా నమోదైంది. 2017-18 సంవత్సరంలో నమోదైన 4.4శాతంతో పోల్చినప్పుడు ఇది తక్కువ. అయితే ఆర్థిక సంవత్సరంలోని తరువాతి నెలల్లో మాంద్యం తీవ్రమైంది.

ఎగుమతులు, వినియోగమూ పెరగాలి !

మాంద్య పరిస్ధితులు ఏర్పడినపుడు అభివృద్ది రేటు పెరగకపోగా పతనం అవుతుంది. మనది ఎగుమతి ఆధారిత వ్యవస్ధ కాదు. అనేక దేశాల వ్యవస్ధలతో పోల్చుకుంటే మన ఎగుమతులు పరిమితమే. మేకిన్‌ ఇండియా పేరుతో గత ఐదు సంవత్సరాలలో జరిగిందేమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. మన ద్రవ్యోల్బణం అదుపులో, తక్కువగా వుందని మన పాలకులు, అధికారులు తరచూ చెబుతుంటారు. అంటే ధరల పెరుగుదల కూడా తక్కువగా వుందని అర్ధం.అలాంటపుడు వినియోగం పెరగాలి, వినియోగం పెరిగితే పైన పేర్కొన్న విధంగా తయారీ రంగం వెనుక పట్టు పట్టదు. వివిధ రంగాల సమాచారాన్ని విశ్లేషించినపుడు గత నాలుగు నెలల కాలంలో మన వినియోగం తగ్గుతోందన్నది స్పష్టం. అది విదేశీ దిగుమతులైన బంగారం, రాళ్లు, ఆభరణాల వంటివి అయితే మనకే లాభం కాని మనదేశంలో తయారయ్యే వస్తు వినియోగం తగ్గితే అది ప్రమాదకరం. మారుతీ కంపెనీ మిగిలిపోతున్న కార్లను తగ్గించుకొనేందుకు వుదారంగా కార్మికులకు ఒకరోజు సెలవు ఇచ్చిందని వార్త చదివాము. ఒకవైపు మన మధ్యతరగతి మార్కెట్‌ బ్రహ్మాండంగా వుందని చెప్పుకుంటున్నపుడు మారుతీ కార్లెందుకు అమ్ముడుపోవటం లేదు, లేదా మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశాలకు ఎందుకు ఎగుమతి కావటం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

Image result for Challenges before Narendra Modi

పర్యవసానాలు ఎలా వుంటాయి !

కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నా 1991 నుంచి అనుసరిస్తున్నది నయా ఉదారవాద విధానాలే. ఆ విధానం మార్గాంతరం లేని స్థితికి చేరుకోగా, దాని స్థానాన్ని ఆక్రమించటానికి దేశీయ మార్కెట్‌ ఆవిర్భవించనప్పుడు ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలవలెనే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒక అనిశ్చిత స్థితిలో కూరుకుపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం భారత, చైనా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ఇది ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటం కారణంగా జరుగుతోంది. అయితే తగ్గిన ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటంవల్ల ఏర్పడిన దుస్థితిని పాక్షికంగానైనా సరిదిద్దటానికి దేశీయ మార్కెట్‌ను విస్త తపరచలేదు. అలా జరగకపోగా అదే సమయంలో గ్రామీణ నైరాశ్యంవల్ల, ఎగుమతుల వ ద్ధి మందగించటం వల్ల ఏర్పడే ద్వితీయ శ్రేణి ప్రభావాల కారణంగా, నిరర్ధక ఆస్తుల పరిమాణం పెరగటంవల్ల, ఇతర విషయాలతోపాటుగా దీనివల్ల పారిశ్రామిక వ ద్ధి మందగించటం వల్ల పెద్ద ఎత్తున అవసరమయ్యే వ్యయాలకు అందుబాటులో వుండే రుణ సౌకర్యం బలహీనపడింది. పర్యవసానంగా దేశీయ మార్కెట్‌ కూడా కుదింపునకు గురయింది. వేరేమాటల్లో చెప్పాలంటే ఎగుమతుల వ ద్ధిలో ఏర్పడిన మందగమనానికి విరుగుడుగా తుల్యాన్ని సాధించనందున దేశీయమార్కెట్‌ కుదింపునకు గురయింది. దానితో ఎగుమతుల వ ద్ధి మరింతగా దెబ్బతింది. కన్‌స్యూమర్‌ డ్యూరబుల్‌ రంగం కుదింపునకు గురికావటం, కన్‌స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్‌ రంగం గత ఏప్రిల్‌తో పోల్చినప్పుడు స్తంభించటమనే వాస్తవాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి నాటికే కుదింపునకు గురైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు క్షీణిస్తున్నాయని సూచిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు తరువాత తెలుస్తాయని మూడు సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అంతకు ముందే పెట్టుబడుల కోసమే తరచూ విదేశీ ప్రయాణాలు చేశానని మోడీ చెప్పారు. మరి వాటి ఫలితాలు, పర్యవసానాలను ఇప్పుడు జనానికి చూపాలి, లేకపోతే వేరే విధంగా అర్ధం చేసుకొనే ప్రమాదం వుంది.

బ్యాంకింగ్‌ రంగం ఎందుకు సమస్యల్లో వుంది?

అంతా బాగుంది అని చెప్పుకుంటున్న ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్ధులు ఎందుకు పెరిగాయి అంటే గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులే కారణం అని చెప్పారు. అదింకేమాత్రం చెల్లదు. నిబంధనల ప్రకారం గడువు మీరి వాయిదాలు చెల్లంచని వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించటం, వాటి ఆస్ధులను స్వాధీనం చేసుకొని సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లు కూడా చెప్పినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా లక్షల కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత రెండు సంవత్సరాలుగా దాదాపు రెండులక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు బదలాయించింది. ఎన్నడూ లేని స్ధాయిలో 2018డిసెంబరు నాటికే నిరర్ధక ఆస్తులు ఎనిమిది క్షల కోట్లకు చేరాయి. రుణాలు ఇస్తాం తీసుకోండి అంటూ ఇటీవలి కాలంలో టెలిమార్కెటర్లు జనాన్ని ఫోన్ల మీద చంపుతున్నారు. బ్యాంకులు తమ దగ్గర డబ్బు నిల్వవుంచుకుంటే వాటికి వడ్డీ దండుగ. అందుకే అవి వెంటపడుతున్నాయి. అయినా వాటి ఫలితాలు ఆర్ధిక రంగం మీద పెద్దగా ప్రతిఫలించటం లేదు. ఈ ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలు గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున ఉపశమన పథకాలను ప్రవేశపెడతామని మాట ఇచ్చాయి. దానితో తప్పకుండా దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అది పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరింపబడటానికి దారితీస్తుంది. చిన్న రైతు కుటుంబాలకు చెందిన 12కోట్లమందికి వార్షికంగా తలసరి 6000రూపాయలను అందిస్తానని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో మరింత ముందుకుపోయింది. న్యారు పథకం ద్వారా అత్యంత అథమస్థాయిలో గల 5కోట్ల కుటుంబాలకు నెలకు 6000 రూపాయలు అంటే సంవత్సరానికి రూ.72,000 సమకూరుస్తానని మాట ఇచ్చింది. ఈ పథకాలవల్ల దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అయితే ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమంటే ఈ పథకాలకు అవసరమైన వనరులను ఎలా సమకూరుస్తారు అనేదే.

సంపన్నుల నుంచి అధికంగా వసూలు చేయాలి !

సంపన్నులపై పన్ను వేయటం ముఖ్యంగా భారతదేశంలో అస్థిత్వంలో కూడా లేని సంపదపై పన్నును విధించటం ద్వారా గణనీయమైన స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. వనరులను సమకూర్చుకోవటానికి ఇది మనముందున్న స్పష్టమైన మార్గం. అయితే దీనిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వనరులను సమకూర్చుకోవటం అంత కష్టం కాదని, అయితే నయా ఉదారవాద వ్యవస్థలో వనరులను అన్వేషించటం కష్టతరమౌతుందని కాంగ్రెస్‌ పార్టీ న్యారు పథకాన్ని ప్రకటించినప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌ నర్మగర్భంగా అన్నారు. ఆ విధంగా ఒకవేళ ఈ పథకానికి కావలసిన వనరులను విత్తలోటుతో కూడా పాక్షికంగా సమకూర్చుకోవచ్చనుకున్నా అటువంటి విత్తలోటు స్థూల జాతీయోత్పత్తిలో అనుమతించబడిన 3.4శాతం పరిమితిని మించుతుంది. అప్పుడు అది భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించటానికి దారితీస్తుంది. దానితో విదేశీ మారకపు చెల్లింపుల శేషం(బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌)కు చెందిన కరెంట్‌ ఖాతా లోటును పూడ్చటం కష్టమవుతుంది. అమెరికా ఆదేశం మేరకు భారతదేశం బహిరంగ మార్కెట్‌ కంటే చౌకగా లభించే ఇరాన్‌ చమురును కొనుగోలు చేయకపోతే ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. అమెరికా ఆదేశాన్ని పాటిస్తానని మోడీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలవల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుంది. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే కరెంటు ఖాతా లోటు మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ దీనికి అదనంగా విత్తలోటులో పెరుగుదల పరిమితిని మించితే భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ పడిపోయి దేశంలోకి వచ్చే ద్రవ్య ప్రవాహాలు ఎండిపోతాయి. ఈ లోటును సాధారణ మార్గాలలో పూడ్చగలుగుతామనే ఆశ నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక విపరీత స్థితిలో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ముంచుకొస్తున్న మాంద్యాన్ని అధిగమించా లంటే కరెంటు ఖాతా లోటును పూడ్చటం దానికి కష్టమౌతుంది. మరోవైపు మాంద్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఇప్పటికే తీవ్రంగావున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది.ఈ సమస్యను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా అధిగమిస్తుందన్నది శేష ప్రశ్న !

మైనారిటీలకు భరోసా కల్పించాలి !

ఏ దేశంలో అయినా మైనారిటీలు అభద్రతకు గురౌతారు. ఇది అంతర్జాతీయంగా వున్న పరిస్ధితి. మన దేశంలో అంతకంటే ప్రత్యేక పరిస్ధితులు వున్నాయి. మెజారిటీ జనాన్ని సంతుష్టీకరించేందుకు మైనారిటీల మీద దాడులు చేస్తున్నా పట్టించుకోలేదనే విమర్శ ప్రభుత్వం మీద ఇప్పటికే వుంది. ఎన్నికలు ముగియటంతోనే మైనారిటీలను వేధించే శక్తులు విజృంభిస్తున్నాయని తాజాగా జరిగిన రెండు వుదంతాలు స్పష్టం చేశాయి. బీహార్‌లో పేరు అడిగి మరీ తుపాకితో దాడి చేసిన వుదంతం, దేశ రాజధాని పక్కనే వున్న గురుగ్రామ్‌లో జై శ్రీరాం అనేందుకు తిరస్కరించినందుకు దాడి, మధ్య ప్రదేశ్‌లో ఆవు మాంసం కలిగి వున్నారంటూ జరిగిన దాడులు పరిమితమే అయినా దేశ వ్యాపిత చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి శక్తులను తక్షణమే అదుపు చేయలేకపోతే జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో సబ్‌ కా విశ్వాస్‌( అందరి విశ్వాసం) సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంటే అందరి అభివృద్ధికి అందరితో కలసి పనిచేస్తామని చెప్పిన మాటలను ఆచరణలో నిరూపించుకోవాలి.

నోటి తుత్తరను అదుపు చేయాలి !

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు మిగతా పార్టీల కంటే బిజెపి వారి మీదనే ఎన్నికల సంఘం ఎక్కువగా చర్యలు తీసుకున్నది. తీసుకోవాల్సినన్ని, తీవ్ర చర్యలు లేవనే విమర్శలు సరేసరి. దేశ నాగరికత, విలువలకు ప్రతీక అని వర్ణించిన సాధ్వి ప్రజ్ఞ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని కీర్తించటం తెలిసిందే. దానిని బిజెపి ఆమోదించకపోవటం కాదు, అసలు అలాంటి శక్తులను భవిష్యత్‌లో ఎలా అదుపు చేస్తారన్నదే సమస్య. ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో అలాంటి వారి గురించి మోడీ చేసిన హెచ్చరికను తు.చ తప్పకుండా అమలు చేయాలి.

Image result for Issues and Challenges before Narendra Modi

ఇరుగు పొరుగుతో సంబంధాలు !

ఇరుగు పొరుగుతో సంబంధాలు సజావుగా వుంటే దేశం అనేక విధాలుగా లబ్ది పొందుతుంది.ముఖ్యంగా ఆయుధాలు, మిలిటరీ ఖర్చును తగ్గించుకోవచ్చు.ఆ సొమ్మును వుపాధి కల్పన, సంక్షేమానికి వినియోగించుకోవచ్చు. వుగ్రవాద సమస్యను ఎన్నికల ప్రచారానికి, ఓట్ల లబ్దికి వినియోగించుకున్నారన్న విమర్శలు దాస్తే దాగేవి కాదు. నిజానికి అవి నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మేలు చేసేవి కాదు. పాక్‌తో సంబంధాలు నిరంతర సమస్యలు తెచ్చిపెడుతున్నవే. అయితే నిరంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రెచ్చగొట్టటాన్ని జనం కొంత మేరకు అర్ధం చేసుకుంటారు. మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. వుగ్రవాది మసూద్‌ అజహర్‌ విషయంలో చైనా అనుసరించిన వైఖరి రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యల పట్ల వర్తించే విధంగా వుండాలి. అందుకు సంఘపరివార్‌ నోటి తుత్తర బ్యాచిని అదుపు చేయాల్సి వుంటుంది.

ఇక చివరిగా విదేశాంగ విధానం గురించి చెప్పుకోవాల్సి వస్తే అమెరికాతో మరింతగా కలసి ముందుకు పోతే మనకు సమస్యలే తప్ప రిగే ప్రయోజనం లేదు. మా దేశానికి వస్తూ మాకేమి తెస్తారు, మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తారనే వైఖరే దానిది. అమెరికాలో వున్న మన వారి కుటుంబీకులు వుద్యోగాలు చేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజంగా ఆందోళన కలిగించేవి. ఒక మిత్ర దేశంగా చేయాల్సినవి కాదు. ఇప్పటికే వాణిజ్యంపై అమెరికా నియంత్రణలను ప్రవేశపెడుతున్నది. భారతదేశం కూడా అమెరికా కార్యశీలత నీడలో అటువంటి నియంత్రణలను ప్రవేశపెట్టి వుండాల్సింది. అయితే నయా ఉదారవాదం మార్గాంతరంలేని స్థితికి చేరుకున్నదనే వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించినట్టు కనపడటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దాని లక్షణం. అంటే సంపన్నులు మరింత సంపన్నులౌతారు, మిగిలినవారు మరింత దిగజారి పోతారు. అటువంటి పరిస్ధితి రానున్న రోజుల్లో మరింత వేగిరం కానున్నది. దీనిని మోడీ ఎలా ఎదుర్కొంటారన్నది నిజంగా పెద్ద సవాలే. ప్రారంభం అమెరికా దౌత్యవేత్త చెప్పిన అంశంతో ప్రారంభమైంది. ముగింపు కూడా దానితోనే చేద్దాం. జాతీయ వాదం ఇతరులను అణచివేసేందుకు ఒక మార్గం అని అమెరికా సామాజికవేత్త చోమ్‌ నోమ్‌స్కీ చెప్పారు. నరేంద్రమోడీ అందుకు తన జాతీయ వాదాన్ని వినియోగించరని ఆశిద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d