• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2020

వందేళ్లలో ఎరగని, అంతుబట్టని ఆర్ధిక సంక్షోభం- పర్యవసానాలు !

12 Sunday Jul 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Economic Crisis In India, Indian economy, worst economic crisis


ఎం కోటేశ్వరరావు
భారత ఆర్ధిక వ్యవస్ధ పురోగమనం గురించి ఏ సంస్ధ ఏ రోజు ఏ జోశ్యం చెబుతుందో తెలియని అయోమయంలో దేశ ప్రజలు ఉన్నారు. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమంటే అసలు విషయాలు తెలిసిన పాలకులు వాస్తవాలను మూసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి మీద గుడ్డి నమ్మకంతో ఉన్న జనం అది పాచిపోతే ఏమౌతుందో ఆలోచించే స్ధితిలో లేరు. ఏ మంత్రదండమో తమను ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందనే భ్రమల్లో ఉన్నారు. ఈ పరిస్దితికి కారణం నయా ఉదారవాద విధానాలు జనంలో కల్పించిన భ్రమలు అని ప్రపంచ పరిణామాలను చూసిన వారు చెబుతున్నారు. భిన్న ఆలోచనలు-అభిప్రాయాల చర్చకు మీడియాలో చోటు దొరకటం లేదు. ఏకపక్ష సమాచారం జనం మెదళ్లలోకి ఎక్కుతోంది. ఎందుకు అనే ప్రశ్న మన మస్థిష్కాల సాప్ట్‌వేర్‌ నుంచి అంతర్దానమైందా ? చెడిపోయిందా ?
కోవిడ్‌-19 మహమ్మారి గత వంద సంవత్సరాలలో సాధారణ సమయాల్లో ఎరగనంత ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని భారత రిజర్వుబ్యాంకు గవర్నరు శక్తికాంత దాసు శనివారం నాడు చెప్పారు. ఎస్‌బిఐ బ్యాంకింగ్‌ మరియు ఆర్ధిక సమావేశంలో గవర్నరు మాట్లాడారు. ఈ సంక్షోభం వలన ఉత్పత్తి, ఉద్యోగాలు, సంక్షేమ రంగాలలో అసాధారణ ప్రతికూలతలు చోటు చేసుకుంటాయని, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని హెచ్చరించారు.
ఆల్ఫా ఇన్వెస్కో అనే వార పత్రిక శనివారం నాడే ఒక విశ్లేషణను వెలువరించింది. ముందే చెప్పుకున్నట్లు ఎప్పుడు ఏ జోశ్యం వెలువడుతుందో తెలియదు. అలాంటి వాటిలో మచ్చుకు ఈ విశ్లేషణలోని ముఖ్యాంశాలను చూద్దాం. ” మదుపుదార్లు రెండు అంశాల మీద అంచనా, ఆశలతో ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమం ప్రారంభమైంది గనుక ఏడాదిలోపు సాధారణ పరిస్ధితిలు నెలకొని 2020 జనవరి స్ధాయికి చేరుకుంటాయి. ఆదాయాల పునర్దురణ జరిగి వినియోగదారులు డబ్బు ఖర్చు పెడతారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన అంచనాలు. ఆర్ధిక స్ధితి అస్తవ్యస్దంగా అదుపు తప్పి ఉంది. అంచనావేస్తున్నదాని కంటే కోలుకోవటం ఆలస్యం కావచ్చు. పూర్వపు స్ధితికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కరోనా వైరస్‌ ప్రారంభ దినాలలో తాత్కాలిక మైన ఎదురు దెబ్బ, పరిణామం అనే అభిప్రాయం ఉండేది. అయితే అందరం అనుకున్నదాని కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. మూడు దృశ్యాలను ఊహించుకోవచ్చు.
1.ఆశావహ దృశ్యం: ఆర్ధిక వ్యవస్ధ రానున్న ఏడాది కాలంలో సాధారణ స్ధితికి చేరుకోవచ్చు.భారత్‌లో నష్టం ప్రస్తుత పరిస్దితిని బట్టి తక్కువగా ఉండవచ్చు.
2.వాస్తవిక దృశ్యం : భారత ఆర్ధిక వ్యవస్ధ భారీ ఆర్ధిక మూల్యాన్ని చెల్లించవచ్చు. అయితే రెండు మూడు సంవత్సరాలలో పునరుద్దరణ అవుతుంది.ఈ మూల్యాన్ని ప్రయివేటు రంగమా, ప్రభుత్వమా, సాధారణ జనమా లేక ద్రవ్య వ్యవస్ధా ఎవరు చెల్లించాలన్నది పెద్ద అనిశ్చితంగా ఉంటుంది.
3.అత్యంత చెడు దృశ్యం : రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యాక్సిన్‌ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు వైరస్‌ ఉండవచ్చు. తలసరి ఆదాయం పడిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి భారత్‌ కొన్ని సంవత్సరాలు వెనక్కు పోవచ్చు. కోలుకోవటానికి ఐదు సంవత్సరాల వరకు పట్టవచ్చు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ దాదాపు 20బిలియన్‌ డాలర్ల మేరకు నిధులు పెంచుకుంది. అన్ని ప్రధాన ప్రయివేటు బ్యాంకులు మరింత నగదును పెంచుకొనేందుకు చూస్తున్నాయి. జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా నుంచి విద్యుత్‌ ఆస్ధులను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను జెఎస్‌డబ్ల్యు రద్దు చేసుకుంది. స్నోమాన్‌ లాజిస్టిక్సును తీసుకోవాలనుకున్న అదానీ కూడా వెనక్కు తగ్గారు. ఇవన్నీ అదనపు జాగ్రత్తలు, ఆర్ధిక వ్యవస్ధకు తాకబోయే దెబ్బలను సూచిస్తున్నాయి. ప్రమోటర్ల కంటే మదుపుదార్లు ఎక్కువ ఆశాభావంతో ఉన్నారు” ఇవి ఆల్ఫా ఇన్వెస్కో విశ్లేషణలోని కొన్ని అంశాలు.
2008లో ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభమే ఇంకా పూర్తిగా తొలగకపోగా ప్రభావం చూపుతుండగానే అంతకు ఎన్నో రెట్లు పెద్దదని భావిస్తున్న సంక్షోభం ఇప్పుడు మన ముందున్నది. ఈ నేపధ్యంలో మన నేతలు జనానికి వాస్తవాలు చెబుతున్నారా ? అసలు వాస్తవ పరిస్ధితి ఏమిటో ఒక్కసారి చూద్దాం.
వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2020-21)లో తొలి మూడు మాసాలు గడచి పోయాయి. ఆర్ధిక వ్యవస్ద పురోగతికి కొలమానంగా పరిగణించే జిడిపి ఎంతశాతం పడిపోయిందో ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 4.5శాతం తిరోగమనంలో ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వేసిన అంచనాను మన ఆర్ధిక మంత్రిత్వశాఖ జూన్‌ నెలవారీ నివేదికలో ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో ఐఎంఎఫ్‌ వేసిన అంచనాలు అనేకం తప్పాయి. ఈ వార్త వెలువడక ముందే తిరోగమనం 6.4శాతం వరకు ఉండవచ్చని కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ పేర్కొనగా మరికొన్ని అంచానాలు ఐదుశాతానికి ఎక్కువే ఉండవచ్చని జోశ్యం చెప్పాయి.ప్రపంచ సగటు తిరోగమనం 4.9శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది.
ఒక ప్రామాణిక సంస్దగా పేరున్న సిఎంఐయి(సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) జూలై ఎనిమిది నాటి వెబ్‌ సైట్‌ సమాచారం ప్రకారం 2019 సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల కాలంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనల విలువ రూ.2.3లక్షల కోట్లు కాగా డిసెంబరునాటికి అవి 5.15, మార్చినాటికి 3.37 లక్షల కోట్లుగా ఉండగా 2020 జూన్‌ నాటికి అది కేవలం 56వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక పూర్తయిన ప్రాజెక్టుల పరిస్ధితిని చూస్తే పైన పేర్కొన్న మాసాలలో వరుసగా 0.85, 1.65, 1.70, 0.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. అన్నింటి కంటే మార్చినెలతో ముగిసిన మూడు మాసాలలో నిలిపివేసిన ప్రాజెక్టుల విలువ రూ.9.24 లక్షల కోట్లంటే కరోనాతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆర్ధిక దిగజారుడు ఎలా ఉందో సూచిస్తోంది. అందువలన ఎవరైనా కరోనాను సాకుగా చూపుతున్నారంటే వాస్తవ పరిస్ధితిని మరుగుపరుస్తున్నట్లే ! మూసిపెడితే పాచి పోతుందన్న సామెత తెలిసిందే. దేశంలో ఇప్పుడు అదే జరుగుతోందా ?
దేశంలో వలస కార్మికుల సంఖ్య ఎంతో మన ప్రభుత్వాల దగ్గర సమాచారం లేదన్నది కరోనా బయట పెట్టిన ఒక చేదు నిజం. అంటే ఎందరికి ఉపాధికల్పించారో కూడా అనుమానమే, కాకి లెక్కలు లేదా అంచనాలు తప్ప వాస్తవ పరిస్ధితిని అవి ప్రతిబింబించవు. సిఎంఐయి సమాచారం ప్రకారం ఏప్రిల్‌, మే నెలలో 23.5శాతానికి చేరిన నిరుద్యోగం జూన్‌ మాసంలో 11శాతం ఉంది. ఇది కరోనాకు ముందు అక్టోబరునెలలో ఉన్న గరిష్ట 8.2శాతానికి ఎక్కువ అన్నది తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు వేతనాలు తగ్గిపోవటం అన్నది సాధారణ సూత్రీకరణ. అసలు సమాచారమే సేకరించే యంత్రాంగమే అస్తవ్యస్తం అయిన స్ధితిలో సరైన గణాంకాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు.ఎలక్ట్రానిక్‌ వే బిల్లుల విలువ మొత్తం జూన్‌ నెలలో రూ.11.4 లక్షల కోట్లని ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకుంటోందని కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజంగా కోలుకుంటే సంతోషించని వారెవరు ? అంతకు ముందు పూర్తి లాక్‌డౌన్‌ విధించటం, జూన్‌లో గణనీయంగా సడలించిన కారణంగా ఈ పెరుగుదల ఉండవచ్చు. సాధారణ స్ధితి నెలకొన్న తరువాత గతంతో పోల్చినపుడు వాస్తవాలు వెల్లడి అవుతాయి.
చరిత్రలో తొలిసారిగా ప్రపంచమంతటా 2020లో ఆర్ధిక పురోగతి తిరోగమనంలో ఉండబోతున్నదని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఇదే సమయంలో చైనాలో ఒకశాతం అభివృద్ధి ఉంటుందని చెప్పింది. చైనా ప్రభుత్వం ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించటం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న చైనాను విస్మరించటం సాధ్యం కాదు. అందువలన ప్రతి సంస్ద లేదా ప్రధాన దేశాలన్నీ దాని అభివృద్ధి గురించి తమ తమ అంచనాలను వెల్లడిస్తూనే ఉన్నాయి.చైనా ఆర్ధిక సంవత్సరం జనవరితో ప్రారంభమౌతుంది. తొలి మూడుమాసాల్లో 6.8శాతం తిరోగమనంలో ఉన్నది కాస్తా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 1.1శాతం పురోగమనంలోకి వచ్చినట్లు జపాన్‌ నికీ తెలిపింది. ఏడాది సగటు 3.3శాతం ఉండవచ్చని తొలుత అంచనా వేసినప్పటికీ దాన్ని ఇప్పుడు 1.6శాతానికి తగ్గించారు. మరో ఆరు నెలల్లో ఏమి జరగనుందో చూడాల్సి వుంది. లాక్‌డౌన్‌ తరువాత పూర్తి స్ధాయిలో అక్కడ ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి గనుకనే తిరోగమనం నుంచి పురోగమనంలోకి వచ్చింది. మన వ్యవస్ద లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత పురోగమనం నుంచి తిరోగమనంలో జారనున్నట్లు జోశ్యాలు వెలువడుతున్నాయి, ఎంత తేడా !
మన ఆర్ధిక వ్యవస్ధ విషయానికి వస్తే కరోనా ఉద్దీపనగా ప్రకటించిన 21లక్షల కోట్ల పాకేజి ఏమైందో తెలియదు. లడఖ్‌ లడాయితో పాలకులు, వారి కనుసన్నలలో మెలిగే ప్రధాన స్రవంతి మీడియా రోజుకో కొత్త కథతో కాలక్షేపం చేస్తోంది. జనంలో ప్రమాదకరమైన జాతీయ భావనలను రెచ్చగొడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోనందున మిగులు ఏమైందో తెలియదు, జనం మీద మోపిన చమురు పన్నులు, ధరల పెంపు రాబడి ఎటుపోయిందో తెలియదు.గత ఏడాదితో పోలిస్తే తొలి మూడునెలల్లో తెచ్చిన అప్పులు 51శాతం పెరిగాయి, రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయి.
నిరుద్యోగ సమస్య విషయానికి వస్తే మూడుపదుల లోపు యువతీ యువకులు పెద్ద ఎత్తున కరోనా కారణంగా తలెత్తే నిరుద్యోగ బాధితులుగా ఉంటారని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అనేక మంది పట్టణాల్లో ఉండే ఖర్చులను భరించలేక, ఉపాధి లేక గ్రామాలకు తరలి పోయారు. మూడు పదుల లోపు యువతీ యువకులు నైపుణ్యం తక్కువగా ఉండే ఉపాధివైపు ముందుగా మొగ్గుచూపుతారు,పనిలో కొంత నైపుణ్యం సాధించిన తరువాత మెరుగైన ఉపాధిని చూసుకుంటారు. అర్ధిక తిరోగమన, కరోనా మహమ్మారుల వంటి సమయాల్లో యజమానులు ఇలాంటి వారితో ప్రయోగాలు చేసేందుకు సిద్ధ పడరు.కరోనా వైరస్‌ ఎంతకాలం ప్రభావం చూపుతుందో ఎందరిని బలిగొంటుందో తెలియదు గానీ దాని సంక్రమిత సమస్యలు దశాబ్దాల పాటు ఉంటాయని అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) హెచ్చరించింది. వంతుకు విరుద్ధంగా ప్రతి ఆరుగురిలో ఒకరు లేదా 17శాతం మంది యువత మహమ్మారికి ప్రభావితులై ఉపాధి కోల్పోయారని తన తాజా నివేదికలో పేర్కొన్నది. మన దేశంలో అది ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అంచనా.2018-19లో 15-29 సంవత్సరాల వయస్సులోని వారు 17.3శాతం మంది నిరుద్యోగులుగా ఉంటే ఈ ఏడాది మేనెలలో వారు 41శాతం ఉన్నట్లు, 2.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు సిఎంఐయి తెలిపింది. యువతరం పొదుపు చేయలేనట్లయితే అది తరువాతి తరం మీద కూడా ప్రభావం చూపుతుందని సంస్ధ అధికారి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రతి నెలా 13లక్షల మంది పని కావాల్సిన వారిలో చేరుతున్నారు. ప్రస్తుతం దేశంలోని జనాభా తీరుతెన్నులను చూసినపుడు 2040 వరకు పని చేసే వయస్సు వారు తమ మీద ఆధారపడే పిల్లలు, వృద్ధుల కంటే ఎక్కువగా ఉంటారని అయితే కరోనా కారణంగా ఈ పరిస్ధితి వలన కలిగే లబ్దిని కోల్పోతారని, వారికి ఉపాధి కల్పించకపోతే లబ్ది కాస్తా నష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనాకు ముందే యువతకు ఉపాధి కష్టంగా మారిన దేశాల్లో ఒకటిగా మన దేశం మారిన విషయం తెలిసిందే. నాలుగుదశాబ్దాల నాటి నిరుద్యోగ రికార్డును బద్దలు కొట్టటం, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టటం, బయటకు వచ్చినా తప్పుడు లెక్కలని బుకాయించి తరువాత అవి సరైనవే అని చెప్పిన విషయం తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు జీతం ఎంతని కాదు ముందు ఏదో ఒక పని చేయాలనే యావతతో తక్కువ వేతనాలకు యువత సిద్దపడే విషయం తెలిసిందే. తమ తలిదండ్రుల కంటే తక్కువ సంపాదించే దుస్ధితికి లోనవుతారు.
ఏదో ఒక డిగ్రీ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వారు 2018లో ఆరుశాతం ఉంటే ప్రస్తుతం 12.7శాతం ఉన్నారు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు పారిశ్రామిక ఉత్పాదక, నిర్మాణ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు.2012 నుంచి అటువంటి పెట్టుబడులు తగ్గిపోతున్నాయని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనంలో తెలిపింది.2016 నుంచి చూసినపుడు మన దేశంలో 40.5 కోట్ల ఉద్యోగాలకు అటూ ఇటూగా ఉండటం తప్ప పెరుగుదల లేదు. పెద్ద నోట్ల రద్దు, నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం, కంపెనీలు కొత్త సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టే పరిస్ధితి లేకపోవటం, దాంతో కొత్త ఉద్యోగాలు లేకపోవటాన్ని చూస్తున్నాము. సులభతర వాణిజ్య సూచికను ఏటేటా మెరుగు పరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం తప్ప 2019 జూన్‌ నాటికే వాణిజ్యం చేయాలన్న సంకల్పం పదేండ్ల నాటి కంటే తక్కువ స్ధాయికి పడిపోయినట్లు ఒక సంస్ధ సర్వే వెల్లడించింది. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, బ్యాంకుల్లో నగదు లభ్యత పెంపు వంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జనంలో కొనుగోలు శక్తి ఎంతగానో క్షీణించిందన్న అంశం తెలిసిందే. సరైన ఉద్యోగాలు, సరైన వేతనాలు లేకపోతే జనం కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన జనాభా గణనీయంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం వారి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది.
దేశ ఆర్ధిక విషయాలకు వస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్ధితిని దాచేందుకు ప్రయత్నిస్తోంది.2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 19.6లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అంచనా వేశారు. తరువాత దాన్ని 18.5లక్షల కోట్లకు సవరించారు. కానీ వాస్తవంగా వచ్చింది 16.8లక్షల కోట్లేనని తేలింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకు ముందు సంవత్సరం కంటే వాస్తవ ఆదాయం తగ్గింది. అంటే అసలు జబ్బు కరోనా వైరస్‌ కంటే ముందే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చమురు పన్ను, ధరలను పెంచుతున్నది. ఈ అడ్డగోలు చర్యల గురించి ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పరు. ఏ విధాన ప్రాతిపదికన ధరలను పెంచుతున్నారో చెప్పని ఒక నిరంకుశ వైఖరి తప్ప మరొకటి కాదు. ఎలాంటి కసరత్తు లేదా సరైన అంచనాలు లేకుండా ప్రారంభించిన జిఎస్‌టితో తలెత్తిన సమస్యలు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అవి జనం చావుకు తెచ్చాయంటే అతిశయోక్తి కాదు. చమురు ఉత్పత్తుల మీద పెంచిన అదనపు పన్ను లేదా ధర ద్వారా వచ్చిన ఆదాయం దేనికి ఖర్చు చేస్తారో చెప్పరు.
కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పోనీ ఈ మేరకు లబ్ది పొందిన కార్పొరేట్లు తిరిగి ఆ సొమ్మును పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నాయా అంటే అదీ లేదు.2018-19లో వసూలైన రూ.11.36లక్షల కోట్ల పన్ను మొత్తం 2019-20కి రూ.10.49 లక్షల కోట్లకు తగ్గింది. ఉద్దీపన పేరుతో కార్పొరేట్‌ పన్ను, దానికి సెస్‌, సర్‌ఛార్జి 34.61శాతంగా ఉన్నదానిని 25.17కు తగ్గించారు. 2019 అక్టోబరు ఒకటి తరువాత ఉనికిలోకి వచ్చే సంస్ధలకు ఆ పన్నును 17.01శాతంగా నిర్ణయించారు. ఇక పరోక్ష పన్ను అయిన జిఎస్‌టి విషయానికి వస్తే అంచనా వేసిన విధంగా లేదా కోరుకున్న విధంగా ఏటా 14శాతం పెరగటం లేదు. పధకం ప్రారంభంలో ఉన్న ఆదాయాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఏటా 14శాతం వంతున పన్ను ఆదాయం పెరగకపోతే తగ్గిన మేరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్‌ మొత్తం నుంచి చెల్లిస్తామన్నది రాష్ట్రాలకు చేసిన వాగ్దానం. అంటే కనీసం ఏటా 14శాతం పెరుగుతుందనే అంచనాతో దీన్ని ప్రారంభించారని అనుకోవాలి.2019-20లో ఎనిమిది శాతమే పెరిగాయి. జిఎస్‌టిని 2017జూలైలో ప్రారంభించారు. దేనికైనా కొన్ని ప్రారంభ సమస్యలు ఉంటాయని సరిపెట్టుకుందాం.అలాంటివి 2017-18 ఆర్ధిక సంవవత్సరంలోనే బయట పడ్డాయి. తరువాత సంవత్సరాలలో ఆదాయం తగ్గటానికి ఇంకా ప్రారంభ సమస్యలే అని చెప్పటం సమర్ధనీయం ఎలా అవుతుంది. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే వైఫల్యం అనాలి. ఈ విధానం కారణంగా మద్యం, చమురు ఉత్పత్తుల వంటి కొన్నింటి మీద తప్ప మిగతా అంశాల మీద రాష్ట్రాలు పన్నులు విధించే లేదా తగ్గించే అవకాశాలు లేవు.
దీని పర్యవసానాలు ఇంకా పూర్తిగా ప్రభావం చూపటం లేదు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు,జిఎస్‌టి వైఫల్యం, దేశంలో తలెత్తిన ఆర్ధిక మాంద్యం కారణంగా బడ్జెట్లలో భారీ లోటు ఏర్పడుతోంది. దాంతో కేటాయింపులకు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక సబ్సిడీలను ఎత్తివేశారు. ఎరువుల సబ్సిడీలను పరిమితం చేశారు. కొన్ని సంక్షేమ పధకాలకు కోతలు పెట్టారు, మిగిలిన వాటికి రానున్న రోజుల్లో కోతలు పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లోటు బడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు భారాలు మోపటం పెట్రోలియం ఉత్పత్తులతో ప్రారంభమైంది. అంతకు ముందే అనేక రాష్ట్రాలు ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మి లోటును పూడ్చుకున్నాయి. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడి పెడితే ఉపాధి పెరుగుతుందని సరిపెట్టుకోవచ్చు దానికి బదులు కేంద్ర ప్రభుత్వం లాభాలు రానివాటినే కాదు వచ్చే వాటిని కూడా వదలించుకొని లోటును పూడ్చుకొనేందుకు నిర్ణయించింది.
కేంద్రం లేదా రాష్ట్రాలు చమురు ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్నాయి. ఇది ఆర్ధిక వ్యవస్దను మరింతగా దెబ్బతీయనుంది. అత్యధికంగా వినియోగమయ్యే డీజిల్‌ మీద గతంలో సబ్సిడీ ఇచ్చిన కారణంగా ధరలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేశారు. ధరలు కూడా పెట్రోలు కంటే డీజిల్‌ మీద ఎక్కువ పెంచారు. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు, ఎక్కువ ఆదాయం రావాలంటే ఎక్కువ వినియోగంలో ఉన్నదాని మీద పిండుకోవాలంతే ! ఆదాయపన్ను రేటు పెంచితే ధనికులకు ఆగ్రహం వస్తుంది కనుక దాని జోలికి పోరు. చమురు ధరలు పెంచితే అధిక భారం మోసేది సామాన్య, మధ్యతరగతి వారే. నిత్యావసర వస్తువుగా ఉన్న చమురు ధర పెరిగితే వినియోగం పెద్దగా తగ్గే అవకాశాలు లేవు. పరోక్షంగా దానికి చెల్లింపుల కారణంగా ఇతర వస్తువినియోగం మీద పడి, డిమాండ్‌ తగ్గుదలకు దోహదం చేస్తుంది. అది ఉత్పాదకత తగ్గేందుకు, ఉపాధి పరిమితం, నిరుద్యోగం అపరిమితం అయ్యేందుకు తోడ్పడుతుంది.ధరలు పెరుగుతాయి. ఈ విషయాలను దాచిపెట్టి జనం దృష్టిని మళ్లించేందుకు పాలకులు రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో వివాదాలు, అంతుబట్టని ఉగ్రవాద ఉదంతాలు వాటిలో భాగమే అని అనేక మంది నమ్ముతున్నారు. ఏతా వాతా చెప్పవచ్చేదేమంటే ప్రభుత్వాలు లోటుబడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు ధనికుల మీద, కార్పొరేట్‌ పన్నుల ద్వారా పూడ్చుకోవాలి తప్ప జనం మీద భారాలు మోపితే అది మొత్తం ఆర్ధిక వ్యవస్ధనే దెబ్బతీస్తుంది. దేశంలో ఇప్పుడు జరుగుతోంది అదే. ఈ దివాలా కోరు, ప్రజావ్యతిరేక విధానాలకు ఇప్పుడు కరోనా మహమ్మారి తోడైంది. గతంలో విధానాల వైఫల్యం ధరలు, నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుదల వంటి సమస్యలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఈ రెండూ జమిలిగా జనాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఊహించటం కష్టం !
గమనిక : ఈ విశ్లేషణ తొలుత 2020 జూలై 12వ తేదీ నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైంది. దాని నవీకరణలో భాగంగా తాజా అంశాలు జోడించటమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనక్కు తగ్గని రైతాంగం- కరోనాతో కుదేలు !

11 Saturday Jul 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

corona affect on farmers, corona pandemic, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌
కరోనా మహమ్మారి నేపధ్యంలోనూ వ్యవసాయ రంగం సాధించిన విజయాలు శ్లాఘనీయమని పలువురు పేర్కొంటున్నారు. విపత్కర పరిస్ధితులలో కూడా అంకితభావంతో కఠోరశ్రమతో కషి చేసిన వారికి అభినందనలు తెలియచేస్తున్నారు.
హైవేలు, సెజ్‌లు,పరిశ్రమలు, అభివృద్ధి పేరున భూమి నుండి కొంతమంది రైతులను వెళ్ళగొట్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుగా లేనందున యువకులు పొట్టచేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్తున్నారు. యువతీ యువకుల వలసలు ప్రరిశ్రమాధిపతులకు వేటగాని చేతిలోపడ్డ లేడిపిల్లలాగావుంది. మురికి కూపాలలో నికష్ట జీవనం గడుపుతూ పరిశ్రమలలో కూలి పనికి అవకాశంకోసం ఎదురుచూస్తూ, కూలీకి ఎపుడు పిలుస్తారా అని ఎదురు చూసే పరిస్ధితి దాపురించింది. వ్యవసాయం ఒక జీవన విధానంగా భావించినవారు, వలసలు వెళ్ళలేని వారు, అంతకుమించి ఏమీ చేతకానివారు, వ్యవసాయం గిట్టుబాటుగా లేకపోయినా వ్యవసాయం చేస్తూనేవున్నారు.
మన రైతులు రికార్డుస్ధాయిలో పంటలను పండిస్తున్నారు. గోధుమ, వరి, చిరుధాన్యాలను గత సంవత్సరం కన్నా 6.74 మిలియన్‌ టన్నుల ఎక్కువగా 291.95 మి.ట, పప్పుధాన్యాలను 23.02 మి.ట, నూనె గింజలు 34.19 మి.ట పత్తి 34.89 మిలియన్‌ బేళ్ళకు స్వేదం చిందించారు.ఫలాలు రైతుకుఅందటంలేదు.
కరోనా మహమ్మారి దుష్ప్రభావాలు రైతులను చావుదెబ్బ కొట్టాయి. మార్చి 24 రాత్రి విధించిన కరోనా లాక్‌ డౌన్‌ ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనేవుంది. ఒక్క వ్యవసాయరంగం మాత్రం మూతపడలేదు. కానీ మార్కెట్‌ రైతుకు అనుకూలంగాలేదు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది.
రైతులను, వ్యవసాయ కూలీలను, గ్రామాలను ప్రభుత్వాలు ఆదుకుంటాయని వాగ్దానాలు చేస్తున్నారు. కష్టాలలో వున్నవారికి సహాయం చేయటంలో తేడా చూపకూడదు. దివాళాతీసిన బ్యాంకులను, పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లుగానే ఆదుకోవాలి. ధనవంతులయిన వారికి ఏరకంగా అప్పులను రద్దు చేశారో అదేవిధంగా గ్రామీణప్రజలకు అప్పులను రద్దుచేయాలి. ప్రభుత్వం గ్యారంటీ వుండి పరిశ్రమలకు అప్పులు ఇచ్చినట్లుగానే రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు అప్పులను ఇవ్వాలి.

60 నుండి 70 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం 1700 రూపాయలు . రోజుకి 19 రూ . ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. వ్యవసాయ రుణాలు పక్కదోవ పట్టి కార్పోరేట్‌ కంపెనీలకే అందుతున్నాయి.ఉదా-మహారాష్ట్ర లో ముంబాయి పట్టణం లోనే 53 శాతం వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. ముంబాయి సిటీ లోవ్యవసాయం చేయరన్న సంగతి అందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతంలోని రైతులకివ్వవలసిన వ్యవసాయ రుణాలను ముంబాయి బడాబాబులకు ఇచ్చి ఎంతోమంది రైతులకు రుణాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. వ్యవసాయం నష్టాలలో వుంది. వ్యవసాయరంగాన్ని రక్షించుకుంటే ఆర్ధిక వ్యవస్ధను ఆదుకోగలదు.

కొన్ని పంటలను పండిస్తున్న రైతుల దీనావస్ధలను పరిశీలించండి.

1) టమాటాను సాగు చేయాలంటేఎకరానికి 2 లక్షల నుండి 2.50 లక్షలవరకూ ఖర్చవుతున్నది. పంట దిగుబడి బాగుందనుకునే సమయానికి కరోనా లాక్‌ డౌన్‌ విధించారు. కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం కారణంగా రవాణా ఆగిపోయింది. బయటిమార్కెట్లకు ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా ధరలు నేలచూపు చూశాయి. కాయకోత కూలిఖర్చులుకూడా రాక పంటను పశువులకు వదిలేశారు, పొలాన్ని దున్నేశారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 50 వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. 35 వేల కుటుంబాలు టమాటా సాగు పై ఆధారపడి జీవితం సాగిస్తున్నాయి గత ఏడాది జూన్‌ నుండి 2020-05-26 వరకూ 19 మంది టమాటా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. (26-05-2020 ఈనాడు.)

2) గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 17 వేల హెక్టార్లలో పొగాకు పంట సాగు చేస్తున్నారు. కరోనా లాక్‌ ఔట్‌ వలన పొగాకు అమ్ముకునే ముఖ్యమైన 2 నెలల కాలంపోయింది. మొత్తం రాష్ట్రంలో 79,384 హెక్టార్లలో సాగవుతున్నది. ప్రస్తుత ఏడాది 137 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా మే నెల వరకు 16.30 కిలోలనే వ్యాపారులు కొన్నారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న విలువైన పొగాకు పంటను వదులు కోవటానికి ప్రభుత్వం కూడా సిద్దంగా లేదు. సాగు ఖర్చులు పెరిగినా, చివరకు మిగిలేది తక్కువయినా, నమ్మకమయిన ప్రత్యామ్నాయ పంటలు లేనందున పొగాకు పంటను కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారి రాకముందే జనవరి నెలలో వచ్చిన అకాల వర్షాల వలన పంటనాణ్యతతగ్గి 60 శాతం పంట లోగ్రేడ్‌ అయింది. లో గ్రేడ్‌ పొగాకు ను కొనేవారేలేరు. కరోనా లాక్‌ డౌన్‌ ఫలితంగా ఏప్రియల్‌ నెలలో కొనుగోళ్ళు నిలిచాయి. ఎండకు ఆకు ఆరిపోయి బరువు తగ్గటమేకాక రంగుమారి నాణ్యతతగ్గింది. ఐ టీ సీ గుత్తాధిపత్యంతో పాటుగా కరోనా దెబ్బ రైతులపై పడింది. 30 శాతం రేటు పడిపోవటంవలన రైతులు ఆందోళనతో రోడ్డెక్కారు. ఒక్క బారన్‌ కు 3 లక్షల నష్టం అని రైతులు ఆవేదనచెందుతున్నారు.

3) స్టాక్‌ మార్కెట్లు మూయలేదు- మిర్చి యార్డు మూసేశారు: రైతులు అధిక వ్యయప్రయాసలకోర్చి మిర్చిని పండించారు. ఆసియాలో అతి పెద్ద మార్కెట్‌ గా పేరుపొందిన గుంటూరు మిర్చి యార్డు ను కరోనా వలన మూసేశారు. కరోనా వలన ఎగుమతులు ఆగిపోయాయని మిర్చి రేటును సగానికి దిగకొట్టారు. పంటను అమ్ముకునే అవకాశం లేనందున చాలామంది రైతులు పంటను కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేశారు.
మిర్చిలో తేజ వెరైటీకి చైనాలోనే కాకుండా శ్రీలంక, సింగపూర్‌, మలేసియాలలో కూడా మంచి డిమాండ్‌ వున్నది. 135 కోల్డ్‌ స్టోరేజీలలో దాదాపు కోటి టిక్కీల మిర్చి ని నిల్వ చేశారు. ఒక్కో టిక్కీకి సగటున 40 కిలోల మిరప కాయలుంటాయి. మొత్తంగా దాదుపుగా 4 లక్షల టన్నుల మిర్చి నిల్వలు కోల్డ్‌ స్టోరేజీలలో వున్నాయి. వీటిలో కొంత సరుకు వ్యాపారులది కూడా వుంటుంది. అంతేగాక గ్రామాలలో రైతుల ఇండ్ల వద్ద దాదాపు 40 వేల టన్నుల మిర్చి వుంటుందని అంచనా. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా మిర్చియార్డు ప్రారంభమయింది. కానీ పాత రేటులేదు. 65 రోజులపాటు యార్డు మూసివేయటంవలన రైతులకు జరిగిన నష్టం ప్రభుత్వ పధకాలవలన తీరేదికాదు. యార్డు మూయకముందు , ఒక్క క్వింటాలు మిర్చి, 16 వేల రూపాయలనుండి 20 వేల రూ. వరకూ అమ్ముడుపోయింది. తరువాత సగటున 10 వేలు వుంది. ఎకరానికి 30 క్వింటాళ్ళ మిర్చి పండితే ,కరోనాలాక్‌ డౌన్‌ వలనఎకరానికి 1 లక్షా 80 వేల నుండి 3 లక్షలదాకా నష్టం దాపురించింది.

4) శనగకు గిట్టుబాటు ధర లేకపోవటంవలన రెండు సంవత్సరాల శనగ పంట కోల్డ్‌ స్టోరోజిలలోనే మగ్గుతున్నది..శనగ పంటవేసి నష్టపోయిన ఆ రైతులకు క్వింటాలుకు 1500 రూపాయలు సబ్సిడీగా ఇస్తామని 10 నెలల క్రితం కేబినెట్‌ ప్రకటించింది. ప్రకటనను రైతులు స్వాగతించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ప్రాంతంలో ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ 1500 రూ. ఇంతవరకూ (జూన్‌ మొదటి వారం) రైతులకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 4.75 లక్షల హెక్టార్లలో 6.32 లక్షల మెట్రిక్‌ టన్నుల శనగల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనావేసింది. ఈ సంవత్సరం శనగ పంటను కొనుగోలు కేంద్రాలలో 10 శాతం పంట కూడా కొనలేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు ధర రూ.4875.
అకాల వర్షాల వలన కొన్ని గింజలకు నల్లమచ్చ వచ్చింది. పైకి నల్లగా వున్నా లోపల గింజ బాగానేవుంది.నల్ల గింజలు వున్నాయని కొన్ని శనగలను కొనలేదు. కరోనా కారణంగా మినుముల ధర దిగజారిపోయింది. రబీ మినుము ఫిబ్రవరి, మార్చి నెలలలో క్వంటాలు ధర రూ 7500 వుంది. ఇపుడు (జూన్‌ మొదటి వారం) 6200 కి కూడా ఎవరూ అడగటంలేదు.విదేశాలనుండి పప్పుధాన్యాల దిగుమతులను ఆపాలి.

5) ఐ టీ సీ కంపెనీ ప్రోత్సహించి సుబాబుల్‌ పంట : ప్రత్యామ్నాయ పంటగా ఐ టీ సీ కంపెనీ ప్రోత్సహించిన సుబాబుల్‌ వేసి పేపర్‌ మిల్లుల దోపిడీతో రైతులు నష్టపోయారు. కరోనా లాకవుట్‌ తో రవాణా సౌకర్యాలు లేనందున సుబాబుల్‌ రేటు ఇంకా దించేశారు, గతంలో ఎకరాకు 25 వుంచి 30 టన్నులవరకు దిగుబడి వచ్చే తోటలు ప్రస్తుతం 15- 20 టన్నులకు పరిమతమవుతున్నాయి.ఇదివరకు ఎకరం తోట రెండు సంవత్సరాల తరువాత అమ్మితే 90 వేల రూ. వచ్చేవి. ఇపుడు 40 వేలుకూడా రావటం లేదు. ఒక వైపు ధర లేక మరోవైపు కొట్టుడుకు వచ్చినా కరోనా దెబ్బతో అమ్ముకునే అవకాశంలేక సుబాబుల్‌ రైతులు అల్లాడుతున్నారు. ఖరీఫ్‌ లో వరి తర్వాత అత్యధికంగా పండించేది మొక్కజొన్న. కోళ్ళమేతలో మొక్కజోన్నను అత్యధికంగా వాడతారు. రబీలో రాష్ట్రంలో 5.59 లక్షల ఎకరాలలో రైతులు సాగు చేశారు. దిగుబడి అంచనా 14.56 లక్షల టన్నులు. కనీసం 3.64 లక్షల టన్నులు కొనాలని ప్రభుత్వం నిర్ణయించి ఏ పీ మార్క్ఫెడ్‌ ను నోడల్‌ ఏజెన్సీగా నిర్ణయించారు. ఇప్పటివరకూ లక్ష టన్నులు కూడా కొనలేదంటున్నారు. రాష్ట్రంలో అత్యదికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,32,097 ఎకరాలలో గుంటూరు జిల్లాలో 1,19139 ఎకరాలలో సాగయింది. పొలాలవద్ద ఎటువంటి ఖర్చులు లేకుండా రూ.3400 ఇస్తే ఇపుడు 2150 ఇచ్చేసరికి కష్టమవుతుంది.

అతిపెద్ద అరటి మార్కెట్‌ రావులపాలెం. రోజుకి 25 వేల గెలలు బయటకు వెళ్ళేవి.కరోనా దెబ్బ తో మార్కెట్‌ పడిపోయింది.ఎంత పెద్ద గెల తెచ్చినా వంద రూపాయలు, ఇష్టమైతే దింపండి. లేకుంటే వెళ్ళండి అన్నారు, రైతు ఏమవ్వాలి. 70 80 వేలు పెట్టుబడ,ి కూలిగిట్టక నరికేశారు.

రబీ క్రింద లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట వేశారు.పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి కరోనా ప్రభావంతో మార్కోట్‌ లో ధరలు పడిపోయాయి. గత ఏడాది కత్తెర పురుగు వలన నష్టాలు వస్తేఈ ఏడాది కరోనా కాటేసింది. గిట్టుబాటు ధర లేక లాభసాటి దర పక్కన పెడితే కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్ధితి కనిపించటంలేదు. డీ ఏ పీ బస్తా 1330, గింజ చేతికి వచ్చేసరికి 30 వేలకు పైననే ఖర్చులు అవుతున్నాయి. పోయిన సంవత్సరం 2200 పైననే అమ్మిన బస్తామొక్కజొన్నలు ఈరోజున 1200 కి కొనేవారులేరు.
ఆక్వా రైతులు కరోనాదెబ్బకు కుదేలవుతున్నారు. కోస్తాజిల్లాలలో లక్షల ఎకరాల రొయ్యల సాగు జరుగుతుంది. 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. వివిధ ప్రోసెసింగ్‌ కంపెనీలు రైతుల నుండి కొనుగోలు చేసి చైనా,యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా దెబ్బతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. రైతులకష్టమే కాదు పెట్టుబడికూడా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేసించిన ధరలకు రొయ్యలను కొనుగోలు చేయటంలేదు. ప్రభుత్వం రైతుల తోనూ ప్రోసెస్‌ చేసే యజమానులతోనూ చర్చలు జరిపింది. కనీస ధరలను నిర్ణయించింది. ఆ కనీస ధరలకు రొయ్యల వ్యాపారులు కొనుగోలు చేయటంలేదు.
త్వరగా చెడిపోయే పూలు, పండ్లు
కరోనా వలన పువ్వుల పంటలు, పండ్ల తోటలు, కూరగోయలు వేసిన రైతుల పాట్లు చెప్పేవి కావు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలోనేకాక అన్నిజిల్లాలోపూలతోటలను వేశారు.
ఉదాహరణకు ప్రకాశంజిల్లాలో ఒక రైతు ు మల్లేతోటకు అర ఎకరం కౌలు కి తీసుకుని వేసిన కౌలు కాకుండా 25 వేలు పెట్టుబడి పెట్టిన రైతు వేసవి లో మల్లెతోట ను జాగ్రత్తగా పెంచి పూలు అమ్ముకుందామని మార్కెట్‌ కి వెళ్తే లాక్‌ డౌన్‌ అన్నారు. పుచ్చకాయలు, జామకాయలు, నిమ్మకాయలు, బత్తాయి, సపోటా లు, మామిడి పళ్ళు పండినతర్వాత ఎక్కువ రోజులు నిలవ వుండక ర్వరలో కుళ్ళిపోతాయి. కూరగాయల పరిస్ధితి కూడా అంతే.
ఈ-కర్షక్‌ లో పేరు లేకుంటే ఉత్పత్తిని కొనుగోలు చేసేదిలేదని ప్రభుత్వ కొనుగోలు సంస్ధలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయశాఖ ఈ-కర్షక్‌ లోనమోదుచేస్తున్నది. రెవెన్యూ శాఖభూముల వివరాలను నమోదుచేస్తుంది. వ్యవసాయశాఖ- రెవెన్యూ శాఖ-మార్కెటింగ్‌ శాఖల మధ్య సమన్వయం లేదు. పంటను అమ్ముకోవటానికి మార్కెటింగ్‌ కేంద్రాలకు వెళ్ళినపుడు , పేరులేదనే నెపంతో ఉత్పత్తులను కొంటానికి నిరాకరిస్తున్నారు. రైతులే తమ పంటను మంచి ధర వచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని మూడు స్వేఛ్ఛా వ్యాపార ఆర్డినెన్సులు తేవాలని కాబినెట్‌ నిర్ణయించింది. 82 శాతంగా వున్న సన్న చిన్నకారు రైతులు ఏ పంటకు ఎక్కడ గిరాకీ ఉందో కనుక్కొని అమ్ముకోగలగటం అసాధ్యం. యార్డుకి తీసుకెళ్ళి అమ్ముకునే శక్తి లేక రవాణా ఖర్చులు భరించలేక అయినకాడకు ఇంటి వద్దనే దళారీలకు అమ్ముకుంటున్నారు.
జూన్‌ 1న పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటించింది. గతేడాది పెరిగిన ఖర్చులతోపోలిస్తే పెంచింది నామమాత్రమే. వరికి 2 శాతం అంటే 53 రూ. పెంచారు.
స్వామినాదన్‌ కమిటీ చెప్పినట్లు వాస్తవ సేద్య ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే మొత్తం పంటను కొనే ఏర్పాట్లు చేసే సమగ్ర ప్రణాలిక తయారు చేయాలి. వ్యవసాయ రుణాలనన్నిటినీ రద్దు చేయాలి. యువత మేల్కోవాలి. ప్రభుత్వాన్ని కదిలించాలి. వ్యవసాయ పంటలనన్నిటినీ ప్రభుత్వం చేత కొనిపించాలి. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ఉద్దీపనలు, ప్రోత్సాహకాలు, వెసులుబాటులు, సౌకర్యాలు వ్యవసాయం చేసే రైతు కూలీలకు కల్పించేటట్లు పోరాడి సాధించాలి.

వ్యాస రచయిత నల్లమడ రైతుసంఘం, గుంటూరుజిల్లా నేత. రచనా కాలం జూన్‌నెల మొదటి వారం. సెల్‌ నం: 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాజ్‌పేయిని అవమానిస్తున్న బిజెపి-సిక్కింను భారత్‌ ఆక్రమించిందా !

11 Saturday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

AB Vajpayee, Five fingers of Tibet, RSS Outfits anti china feets, Sikkim, Sikkim annexation facts, Tibet


ఎం కోటేశ్వరరావు
టిబెట్‌ దలైలామా : అమెరికా వదిలించుకుంది-భారత్‌ తగిలించుకుంది ! అనే శీర్షికతో నేను రాసిన విశ్లేషణ మీద సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ శక్తులు తూలనాడాయి. వారికి ఏకత, శీలము, సభ్యతలపై ఇచ్చిన ”శిక్షణ ” అలాంటిది మరి. వారు తిడుతున్నది నన్ను కాదు వారి గౌరవనీయ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయిని అని తెలియని అజ్ఞానంతో ఉన్నారని చెప్పాలి. టిబెట్‌ స్వయం పాలిత ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూ 2003లో ప్రధాని వాజ్‌పాయి-చైనా ప్రధాని వెన్‌ జియాబావో ఒప్పందం మీద సంతకాలు చేశారని తెలుసా ! అని గుర్తు చేసిన తరువాత ఎవరు చేసినా తప్పే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అనేక దేశాలలో ఉన్న పరిస్ధితులకు అనుగుణ్యంగా స్వయం పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. టిబెట్‌తో సహా ఐదు స్వయం పాలిత ప్రాంతాలు చైనాలో ఉండగా, మన దేశంలో త్రిపుర స్వయంపాలిత గిరిజ ప్రాంతం, గూర్ఖాలాండ్‌(డార్జిలింగ్‌) వంటివి పది ఉన్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం టిబెట్‌ను లాంఛనంగా చైనాకు చెందినదిగా గుర్తిస్తే, అదే ఒప్పందంలో సిక్కిం మన దేశంలో అంతర్భాగమని చైనా గుర్తించిన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు టిబెట్‌ సమస్యను తిరగదోడటం, దాన్ని తురుపు ముక్కగా వాడుకోవాలని బిజెపి మేథావి శేషాద్రి చారి సలహా ఇవ్వటాన్ని, ఐదు వేళ్ల పేరుతో సిక్కింను స్వాధీనం చేసుకొనేందుకు చైనా పూనుకొన్నదని ప్రచారం చేయటాన్ని ఏమనాలి. సదరు పెద్ద మనిషి 2003లో వాజ్‌పాయి ప్రధానిగా చైనాతో ఒప్పందం చేసుకున్నపుడు ఆర్‌ఎసెస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా ఉన్నారు. ఆయనకు వాస్తవాలేమిటో తెలియవా ? ఎవరి పాటకు అనుగుణ్యంగా వారు ఈ నృత్యం చేస్తున్నట్లు ? వాజ్‌పారు అంత అమాయకంగా, సంఘపరివార్‌ అనుమతి లేకుండానే చైనాతో ఒప్పందం చేసుకున్నారని భావించాలా ? ఒక వేళ అనుమతి లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వాజ్‌పాయి ఒప్పందాన్ని ఆనాడే బహిరంగంగా ఎందుకు ఖండించలేదు? తిరగదోడాలనుకుంటే దానికి కారణాలేమిటో చెప్పి ఆ పని చేయవచ్చు. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీకి ఇదొక లెక్కా !
వాజ్‌పేయి చైనా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందం సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత గడ్డమీద టిబెట్‌ నుంచి పారిపోయి వచ్చిన వారు సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టంగా ఉంది. అదే ఒప్పందంలో బౌద్ద దలైలామా (టిబెట్‌ అధినేతగా కాదు ) స్ధితి యథాతధంగా కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. ఆ కారణంగానే దలైలామా మన దేశంలో ఇప్పటికీ ఉండగలుగుతున్నారు.టిబెట్‌లో ఏమి జరిగిందో పైన పేర్కొన్న వ్యాసంలో వివరించిన కారణంగా ఇంతకు మించి చెప్పనవసరం లేదు. టిబెట్‌ చైనాలోని స్వయం పాలిత ప్రాంతం అంటే దాని అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోకూడదని అర్ధమంటూ కొందరు స్వయం సేవకులు విపరీత టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. అదే సూత్రం మన దేశంలోని స్వయం పాలిత ప్రాంతాలకూ వర్తిస్తుందా ? నిర్ధిష్ట అంశాలకు సంబంధించి ఆయా ప్రాంతాల పాలక మండళ్లకు ఆయా దేశాల రాజ్యాంగం ప్రకారమే అధికారాలు ఇచ్చారు. వాటిలో ఆయా రాష్ట్రాల లేదా కేంద్ర ప్రభుత్వం రోజువారీ జోక్యం చేసుకోకూడదు, దాని అర్ధం అక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం, ఇతర అవాంఛనీయ పరిణామాలు జరిగినా జోక్యం చేసుకోకూడదని కాదు.
టిబెట్‌ చరిత్రను చూసినపుడు చైనా పాలకులకు సామంత రాజ్యంగా లేదా స్వయంపాలిత ప్రాంతంగా ఉండటం తప్ప ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదు. సిక్కిం విషయం అలా కాదు. అది బ్రిటీష్‌ వారు మన దేశాన్ని, ఆక్రమించే సమయానికే స్వతంత్ర రాజ్యంగా ఉంది. అంతకు ముందు నుంచే సిక్కిం పాలకులకు నేపాల్‌, భూటాన్‌ రాజులతో వైరం ఉంది. దాంతో నేపాల్‌ నుంచి రక్షణ పొందేందుకు గాను సిక్కిం రాజు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకొని దాని రక్షణ దేశంగా ఉండేందుకు అంగీకరించారు. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి వెళ్లిపోయిన సమయంలో సిక్కిం స్వతంత్ర రాజ్యం. అయితే మన నాయకులు ఇతర సంస్ధానాలను విలీనం చేసుకున్న సమయంలో సిక్కింను కూడా విలీనం కమ్మని అడిగారు. అక్కడి రాజు అంగీకరించలేదు. దాంతో 1950లో భారత రక్షిత రాజ్యం లేదా సామంత రాజ్యంగా ఉండేట్లు ఒప్పందం కుదిరింది.
1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశ సహకారంతో చైనాకు వ్యతిరేకంగా సిఐఏ కార్యకలాపాలు ప్రారంభించింది. 1964లో చైనా తొలి అణుపరీక్ష జరిపింది. దాంతో చైనా మీద నిఘావేయాలని నిర్ణయించిన అమెరికన్‌ సిఐఏ మన ప్రభుత్వాన్ని సంప్రదించింది. చైనా మీద ఉన్న కోపంతో అది మన ప్రయోజనాలకూ నష్టమే అనే ముందు చూపు లేకుండా అంగీకరించింది. ఇంటిలిజెన్స్‌ బ్యూరో అధికారి కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లి ఆధ్వర్యంలో సిఐఏ అధికారులతో కలసి హిమాలయాల్లోని నందదేవి శిఖరం మీద అణుశక్తితో పని చేసే ఒక గూఢచార పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఎలా అమర్చాలో 1965 జూన్‌ 23న అమెరికాలోని అలాస్కా మౌంట్‌ మెకెన్లీ శిఖరం మీద ట్రయల్‌ వేసి తరువాత నందదేవి మీద పెట్టేందుకు తీసుకుపోయారు. అయితే వాతావరణం అనుకూలించకపోవటంతో దాన్ని అక్కడే వదలి వెనక్కు వచ్చారు. తరువాత దాన్ని అమర్చేందుకు 1966లో వెళ్లినపుడు ఎక్కడుందో కనపడలేదు, 1967లో కూడా వెతికారు, చివరకు 1968లో దాని మీద ఆశవదులుకున్నారు. ఉష్ణోగ్రతను ఎక్కువగా వెలువరించే పరికరం మంచులో కూరుకుపోయినపుడు రాయి తగిలేంతవరకు లోపలికి పోతూనే ఉంటుందని, ఆ అణుపరికరం వంద సంవత్సరాలు ప్రభావం చూపుతుందని, అది రిషి గంగలో కలిస్తే నీరు కలుషితమై జనం మరణించే అవకాశం కూడా ఉందని అయితే, ప్రధాన గంగా జలాల్లో కలిస్తే నీరు కలుషితం అవుతుంది, కొందరు ఇబ్బంది పడవచ్చు తప్ప ప్రాణాలు తీస్తుందని తాను అనుకోవటం లేదని ఢిల్లీలో నివసిస్తున్న 88 ఏండ్ల నాటి కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లీ చెప్పినట్లు 2018 ఆగస్టు పదిన ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇప్పటికీ దాన్ని వెతికితే ఉపయోగమే అని, ఇదంతా తాము దేశం కోసమే చేశామని సింగ్‌ చెప్పారు. ఉత్తరా ఖండ్‌ పర్యాటకశాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వచ్చి నీటి కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరికరాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ రాసింది. ఇక్కడ దీని ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదే అమెరికా సిఐఏ సిక్కింలో పాగా వేసి మన దేశం, చైనాను రెండింటినీ దెబ్బతీసేందుకు కూడా పధకం వేసింది.
హౌప్‌ కోక్‌ అనే కుర్రదాన్ని సిక్కిం పన్నెండవ రాజు(చోగ్యాల్‌) పాల్డెన్‌ తొండుప్‌ నామగ్యాల్‌కు ఎరగా వేసి, చివరికి 1963లో వివాహం చేసి సిక్కిం యువరాణిగా ప్రకటించారు.డార్జిలింగ్‌లోని ఒక హౌటల్‌లో హౌప్‌ కలిసే నాటికి చోగ్యాల్‌ వయస్సు 36, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది, భార్యతో విడాకులు తీసుకొని ఉన్నాడు. వివాహమైన తరువాత తన సిఐఏ బంధు గణాన్ని హౌప్‌ సిక్కింకు రప్పించింది. భారత రక్షిత రాజ్యాలుగా ఉన్న సిక్కిం, భూటాన్‌లను స్వతంత్ర రాజ్యాలుగా మార్చేందుకు పూనుకున్నారు.1971లో భూటాన్‌ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం జరిగింది. పోరాడుతున్న వారికి మద్దతుగా మన దేశం మిలిటరీని దించింది. దాంతో పాకిస్ధాన్‌కు మద్దతుగా తమ సప్తమ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా బెదిరించింది. ఈ పరిణామం తరువాత మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పాక్‌ మిలిటరీతో తలపడి బంగ్లా విముక్తికి చేయాల్సింది చేసింది. ఈ పూర్వరంగంలో సిక్కింలో సిఐఏ కార్యకలాపాలు, సిక్కిం కూడా స్వతంత్ర రాజ్యంగా ఐక్యరాజ్యసమితిలో చేరితే అక్కడ అమెరికన్లు తిష్టవేసి మనకు ప్రమాదకరంగా మారతారనే ముందు చూపుతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న చర్యలతో సిక్కింలో రాజుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. వారి వెనుక మన ”రా” గూఢచారులు ఉన్నారు. సిక్కింలో రాజు బౌద్దమతస్ధుడు. మెజారిటీ జనాభా నేపాలీ హిందువుల వారసులు. రాజు తమ పట్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం ఉండటాన్ని ఆసరాగా తీసుకొని సిక్కిం విలీనానికి 1971లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ 1975వరకు అది సాధ్యం కాలేదు.
ప్రజల వత్తిడికి తట్టుకోలేక 1974 ఏప్రిల్‌ సిక్కిం రాజు పార్లమెంట్‌ ఎన్నికలు జరిపాడు. వాటిలో మన దేశంతో స్నేహాన్ని కోరుకొనే సిక్కిం జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తీర్పును ఆమోదించేందుకు రాజు తిరస్కరించి అణచివేతకు పూనుకున్నాడు.అయితే మేనెలలో పార్లమెంట్‌ ఒక చట్టాన్ని చేసి భారత్‌తో మరింత సన్నిహితంగా ఉండాలని తీర్మానించింది. తరువాత జూలై నెలలో సిక్కిం కొత్త రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. దాని ప్రకారం సిక్కిం భారత్‌లో ఒక రాష్ట్రంగా చేరేందుకు వీలు కలిగింది. మన దేశ వత్తిడితో రాజు దాన్ని ఆమోదించకతప్పలేదు.సెప్టెంబరు నాలుగున మన పార్లమెంట్‌ సిక్కింను సహ రాష్ట్రంగా ఆమోదిస్తూ ఒక తీర్మానం చేసింది. అదే వారంలో సిక్కిం రాజు దీని మీద ప్రజాభిప్రాయాన్ని కోరాడు.1975 మార్చినెల ఐదున సిక్కిం పార్లమెంట్‌ మరోసారి భారత్‌తో అనుసంధానాన్ని కోరింది. తిరిగి రాజు ప్రజాభిప్రాయాన్ని కోరాడు. మన దేశంతో విలీనాన్ని కోరుకొనే నేతలను హత్య చేయించేందుకు రాజు ఆదేశించినట్లు ఉప్పందటంతో ఏప్రిల్‌ తొమ్మిదిన మన మిలిటరీ గ్యాంగ్‌టక్‌లో ప్రవేశించి అక్కడి సాయుధ దళాలను నిరాయుధులను గావించి, రాజును గృహనిర్బంధంలో ఉంచింది.ఏప్రిల్‌ 14న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 97.55 శాతం మంది భారత్‌లో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో నాటి సిక్కిం ముఖ్యమంత్రి భారత ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వినతిని పంపుతూ విలీనానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్‌ 26న మన పార్లమెంట్‌ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించి సిక్కింను 22 రాష్ట్రంగా ఆమోదించింది. మే 15న రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి సిక్కింలో రాజరికానికి స్వస్తి పలికారు. సిక్కిం ప్రజాభిప్రాయం సక్రమంగా జరగలేదని, భారత్‌ దాన్ని ఆక్రమించుకుందని కొందరు విమర్శించారు. తరువాత ప్రధాన మంత్రి అయిన మొరార్జీ దేశారు సిక్కిం విలీనం అనైతికం, అన్యాయం అని వ్యాఖ్యానించారు. అయితే వ్యవహారం మొత్తం సిక్కింలోనూ, మనదేశంలోనూ చట్టబద్దంగానే జరిగింది. నాడు ఇందిరగాంధీ ఆపని చేయనట్లయితే సిక్కిం ఒక స్వతంత్ర రాజ్యంగా అమెరికా చేతిలోకి పోయి ఉండేది. మన నెత్తిమీద కూర్చొని మనకూ అటు చైనాకూ ముప్పు తెచ్చి ఉండేదన్నది జగమెరిగిన సత్యం.
అయితే మన దేశంతో నాడున్న విబేధాల నేపధ్యంలో భారత్‌ చర్యను చైనా తప్పు పట్టింది. సిక్కిం విలీనాన్ని గుర్తించేందుకు నిరాకరించింది.2003లో జరిగిన భారత్‌-చైనా ఒప్పందాల ప్రకారం సిక్కింను భారత ప్రాంతంగా చైనా గుర్తించింది. అదింకేమాత్రం రెండు దేశాల మధ్య వివాదాస్పదం కాదని చైనా ప్రధాని వెన్‌ జియాబావో 2005లో ప్రకటించాడు. ఆ ఒప్పందంలోనే టిబెట్‌ను చైనా అంతర్భాగంగా మన దేశం గుర్తించింది. ఇప్పుడు బిజెపి నేతలు కొందరు టిబెట్‌ సమస్యను తిరగదోడటం, ఐదువేళ్ల ఆక్రమణ అంటూ ప్రచారం చేయటం, దలైలామా పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం వలన ప్రయోజనం ఉందా ? ఎవరి తరఫున ఎవరికోసం పని చేస్తున్నట్లు ? సద్దుమణిగిన వివాదాన్ని తిరిగి రేపటం, మిగిలి ఉన్న వివాదం మరింత సంక్లిష్టం కావటానికి దోహదం చేయదా ? కాశ్మీర్‌ సమస్యపై తనకు పాకిస్ధాన్‌ మిత్రదేశంగా ఉన్నపుడు ఒక వైఖరి, ఇప్పుడు మన దేశం తన కౌగిల్లోకి వచ్చింది కనుక మరొక వైఖరితో వ్యవహరిస్తున్నది అమెరికా. టిబెట్‌ విషయంలో కూడా తమకు చైనా దగ్గర అవుతుంది అనుకున్నపుడు దాన్ని వదలివేసింది. ఎప్పుడైతే చైనాయే తనకు ఏకు మేకైందని గ్రహించిందో అప్పటి నుంచి పరోక్షంగా టిబెట్‌, ఇతర అంశాల మీద అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అందువలన దాని పాటకు అనుగుణ్యంగా మనం నృత్యం చేయటమా ? చైనాతో సహా అనేక అంశాలపై స్వతంత్ర వైఖరిని అనుసరించటమా అన్నది తేల్చుకోవాలి. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అవుతున్నామో అదే సమయంలో పాకిస్ధాన్‌ చైనాకు దగ్గర అయింది. అందువలన కాశ్మీరు, ఇతర వ్యవహారాల గురించి చైనాలో మార్పులు ఉంటున్నాయి. చైనా వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకున్నా, మన వ్యవహారాల్లో చైనా అదే తప్పు చేసినా వివాదాలు పరిష్కారం గావు. అలా రావణాకాష్టంలా మండుతూనే ఉంటే తాము లబ్ది పొందవచ్చన్న అమెరికా గుంటకాడ నక్కలా కూర్చుంది. దానికి అవకాశం ఇద్దామా ? విజ్ఞులు ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌ దలైలామా :అమెరికా వదిలించుకుంది- భారత్‌ తగిలించుకుంది ‌ !

10 Friday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

14th Dalai Lama, Dalai Lama, Five fingers of Tibet, Tibet


ఎం కోటేశ్వరరావు


బిజెపి నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” మాజీ సంపాదకుడు శేషాద్రి చారి (లడఖ్‌ ఉదంతం జరగక ముందు ) డెబ్బరు సంవత్సరాలుగా టిబెట్‌ సందిగ్దత, నెహ్రూ చేయలేనిదానిని మోడీ చేయగలరు అంటూ జూన్‌లో ఒక విశ్లేషణ రాశారు. టిబెట్‌ కుడి అరచేతికి ఉన్న సిక్కిం, భూటాన్‌, నేపాల్‌, లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ అనే ఐదు వేళ్లను ఆక్రమించాలని చైనా నేత గ్జీ జింపింగ్‌ కోరుతున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచంలో చైనా వ్యతిరేకత కనిపిస్తోందని, మన దేశం టిబెట్‌ తురుపు ముక్కను వినియోగించుకోవాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చారు. టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించాలని, దలైలామాకు భారత రత్న ఇవ్వాలన్నది మొత్తం వ్యాస సారాంశం.
టిబెట్‌ను చైనా నుంచి వేరు చేసి అక్కడ పాగా వేసి మన దేశాన్ని, చైనాను దెబ్బతీయాలని చూసింది అమెరికా. అందుకు గాను బౌద్దమత నేత, అధికారాన్ని చెలాయించే దలైలామాను తిరుగుబాటుకు రెచ్చగొట్టటమే కాదు, అనుచరులకు ఆయుధాలిచ్చి విఫల తిరుగుబాటు చేయించింది. విధిలేని స్ధితిలో కొత్త ఎత్తుగడల్లో భాగంగా దలైలామాను వదిలించుకున్న అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అసలైన ప్రతినిధిగా కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు దిగి వచ్చారు. అలాంటి దలైలామాను మనం తలకెక్కించుకొన్నాం. దీంతో సాధించేదేమిటి ? గుడ్డి చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత జబ్బుతో ప్రేలాపనలు తప్ప అంత పెద్ద అమెరికాయే వదలి పెట్టిన టిబెట్‌ సమస్యను తురుఫు ముక్కగా వాడు కోవటం ఏమిటి ? పర్యవసానాలను ఆలోచించే, అసలు ఆట తెలిసిన వారు ఇచ్చే సలహాయేనా ఇది !
టిబెట్‌ తిరుగుబాటుదార్లను సృష్టించి వారికి ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన వారిలో ఒకడైన సిఐఏ అధికారి జాన్‌ కెన్నెత్‌ నాస్‌ రాసిన పుస్తకంలో 1950దశకం నుంచి రెండున్నర దశాబ్దాల పాటు టిబెట్‌లో అమెరికా నిర్వాకం గురించి వివరించాడు. మావో జెడాంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులను నిలువరించి సోషలిస్టు దేశంగా మారకుండా చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వం చైనాను కాపాడుతుందన్న అంచనాకు వచ్చిన అమెరికా, అది అసాధ్యమని చాలా ఆలస్యంగా గ్రహించింది. దాంతో దింపుడు కళ్లం ఆశ మాదిరి టిబెట్‌లో దలైలామాతో తిరుగుబాటుకు కుట్ర చేసింది. టిబెట్‌ సరిహద్దులోని నేపాల్‌ ముస్టాంగ్‌ కేంద్రంగా చేసుకొని సిఐఏ ఆయుధాలను అందచేసి తిరుగుబాటు దార్లను టిబెట్‌లోకి ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వమ్ము చేసింది.1969 వరకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేసింది. అమెరికన్ల మాటలు, అంచనాలను నమ్మి దలైలామా నాయకత్వంలోని తిరుగుబాటుదార్లు టిబెట్‌ను స్వాధీనం చేసుకుంటారని భావించిన నెహ్రూ, తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ కూడా టిబెటన్లకు సాయం చేశారు. చివరికి అది సాధ్యం కాదని అమెరికా చేతులెత్తేసింది. తిరుగుబాటుదార్లకు ఆశ్రయం కల్పించిన నేపాల్‌ కూడా చివరకు గెరిల్లాలు ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని వత్తిడి తీసుకు వచ్చింది.1974జూలై 23న విధిలేని పరిస్ధితుల్లో దలైలామా తన అనుచరులు లొంగిపోవాలని వర్తమానం పంపాడు. అయితే దాన్ని ఉల్లంఘించిన ఒక బృందం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా నేపాలీ దళాలు హతమార్చాయి. దాంతో దలైలామా తిరుగుబాటు ముగిసినట్లయింది.
అప్పటికే అంటే 1970దశకం ప్రారంభం నాటికే అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అనుమతించేందుకు అంగీకరించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌, టిబెట్‌తో సహా చైనా ఒక్కటే అని గుర్తించారు. కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌లో అనేక విజయాలు సాధిస్తూ ఒక్కో ప్రాంతం మీద పట్టుసాధిస్తున్న సమయంలో రెండవ ప్రపంచ యుద్దం తరువాత చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని మిలిటరీకి నేపాల్‌, సిక్కిం, భారత్‌ ద్వారా టిబెట్‌ మీదుగా ఆయుధాలు చేరవేయాలని కొల్‌కతా రాయబార కార్యాలయం కేంద్రంగా అమెరికా పధకాలు వేసింది. టిబెట్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేందుకు అవసరమైన కుట్ర చేసింది. అయితే చాంగ్‌కై షేక్‌ దాన్ని అడ్డుకున్నాడు. టిబెట్‌లోని శక్తులు స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ అది చైనాలో టిబెట్‌ అంతర్భాగమే అనే వైఖరిని తొలి నుంచీ కొమింటాంగ్‌ పార్టీ తీసుకుంది. టిబెట్‌కు స్వాతంత్య్రం ప్రకటించితే తీరా కమ్యూనిస్టులను ఓడించి చాంగ్‌కై షేక్‌ చైనాపై ఆధిపత్యం సాధిస్తే ఆ స్వాతంత్య్రం నిలవదని అమెరికాకు తెలుసు. అందుకే తొందరపడలేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టుల ఆధిపత్యానికి తిరుగులేదని, వారిని అడ్డుకొనే సత్తా కొమింటాంగ్‌ సేనలకు లేదని తేలిపోయిందో, టిబెట్‌ను కూడా విముక్తి చేసేందుకు కమ్యూనిస్టు దళాలు ప్రవేశించాయో అప్పుడు అమెరికన్లు టిబెట్‌కు స్వాతంత్య్రం, చైనా ఆక్రమణ వంటి ఆరోపణలతో తిరుగుబాటును రెచ్చగొట్టారు. ఇదంతా 1950 తరువాతే జరిగింది. అప్పటికి చైనాలో అనేక చోట్ల కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు తమ సంపూర్ణ అధికారాన్ని ఇంకా నెలకొల్పని స్ధితి ఉంది. ముందు ప్రధాన భూభాగంలో అధికారాన్ని స్ధిరపరచుకొని తైవాన్‌లో తిష్ట వేసిన చాంగ్‌కై షేక్‌ సేనల సంగతి చూడవచ్చని కమ్యూనిస్టులు భావించారు. ఈ నేపధ్యంలో తమ పని సులువు అవుతుందనే అంచనాతో అమెరికన్లు తమ కుట్రలతో ముందుకు పోయి భంగపడ్డారు.
అమెరికా పధకాలకు అనుగుణ్యంగా మన పాలకులు ద్వంద్వ వైఖరిని అనుసరించారు. టిబెట్‌ ప్రాంతంతో సహా చైనా ఒక్కటే అని గుర్తిస్తూనే అమెరికన్ల సలహామేరకు దలైలామాకు మతపెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటం, ప్రవాస తిరుగుబాటు ప్రభుత్వం కొనసాగటానికి అనుమతి, వారి అవసరాలను చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమెరికన్లు టిబెట్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో చర్చనీయాంశంగా చేసేందుకు సర్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మానవహక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.న్యూయార్క్‌, లండన్‌, జెనీవాలలో కార్యాలయాల ఏర్పాటుకు దలైలామాకు సాయం చేశారు.
సోవియట్‌ యూనియన్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య 1960 దశకంలో తలెత్తిన వివాదాలను సాకుగా తీసుకొని చైనాతో చేతులు కలిపి సోవియట్‌ను దెబ్బతీయాలని అమెరికన్లు పధకం వేశారు. దానిలో భాగంగానే చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు, చైనాతో అమెరికన్లు దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారన్నది ఒక అభిప్రాయం. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ బీజింగ్‌ పర్యటన జరిపాడు. ఇరు దేశాల చర్చలలో ఎక్కడా టిబెట్‌ ప్రస్తావన లేదు. అంతకు ముందు నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకు విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్‌ రాక సమయంలో చైనా నాయకత్వం టిబెట్‌ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. 1975లో డెంగ్‌సియావో పింగ్‌ తనదైన శైలిలో న్యూయార్క్‌లో దలైలామా ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు విన్నాం అన్నట్లుగా అమెరికన్లతో ప్రస్తావించారట. అప్పుడు అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ టిబెట్‌కు సంబంధించినంత వరకు ప్రభుత్వ పరంగా మేము ఎలాంటి చర్యలనైనా వ్యతిరేకిస్తాం, మద్దతు ఇవ్వం. అంతే కాదు టిబెట్‌కు సంబంధించి భారతీయులు తీసుకొనే చర్యలను కూడా మేము సమర్ధించం అని స్పష్టం చేశాడు.దాంతో డెంగ్‌ నవ్వుతూ అయితే దలైలామా అక్కడ ఉండటం భారతీయులకు భారంగా మారుతుందన్నమాట అంటూ ఆ ప్రస్తావనను ముగించారు.
ఆ తరువాతే దలైలామా దూకుడు తగ్గించారు. దలైలామాను చైనాకు అనుమతించటం గురించి డెంగ్‌ సియావో పింగ్‌ మాట్లాడుతూ ఆయన చైనా పౌరుడిగా తిరిగి రావాలి, అదే దేశభక్తి అని చెప్పారు. అయితే ఎలాంటి షరతులు విధించకుండా ఉంటేనే తాను చైనా వెళతానని దలైలామా చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దలైలామాతో రాజకీయం చేయాలని చూస్తున్నది. దానివలన మన దేశానికి ఒరిగేదేమీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఒక పెద్ద బౌద్ధ కేంద్రం ఉన్న తవాంగ్‌ ప్రాంతం నుంచే దలైలామా టిబెట్‌ నుంచి పారిపోయి మన దేశంలో ప్రవేశించాడు. దలైలామా ఆ పట్టణాన్ని సందర్శించటాన్ని తాము అభ్యంతర పెడుతున్నామని చైనా మోడీ సర్కార్‌కు తెలియచేసింది. మక్‌మోహనరేఖ ప్రకారం తవాంగ్‌తో సహా కొన్ని ప్రాంతాలు తమ టిబెట్‌లోని దక్షిణ భూభాగాలని చైనా చెబుతున్నది. అయితే అవి ఎన్నడూ చైనాలో లేవు. చైనా అభ్యంతరాలను తోసి పుచ్చి అరుణాచల్‌పై ఆధిపత్యం మనదే అని స్పష్టం చేసే ప్రక్రియలో భాగంగా దలైలామా పర్యటనను మోడీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సమస్యకు, దలైలామా పర్యటనకు ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.
దలైలామా మన దేశంలో ఎంతకాలం ఉంటారు, కాందిశీకులుగా మనం గుర్తించని ఏ దేశానికీ చెందని వారిగా పరిగణిస్తున్న టిబెటన్లు ఎంతకాలం చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిస్తారు ? వంటి సమస్యలు దలైలామా, ఆయన గణం ముందు ఉన్నాయి. ఎక్కువకాలం వారు బతకలేరన్నది వాస్తవం. టిబెట్‌ మీద చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించనంత వరకు వారి పరిస్ధితి అగమ్యగోచరమే. అమెరికా వదిలించుకున్న దలైలామాను కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పుడు బిజెపి పాలకులు తగిలించుకొని భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నారు. బిజెపి నేతలు మరొక అడుగు ముందుకు వేసి ఆయనకు భారత రత్న ఇవ్వాలని మోడీ సర్కార్‌కు వినతులు పంపారు. తమ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమకు తామే సంతుష్టీకరించుకొనేందుకు తప్ప దీని వలన సాధించేదేమీ ఉండదని వారికి చెప్పినా ప్రయోజనం లేదు ! దలైలామాకు మద్దతు ఇచ్చిన సమయంలో అమెరికన్లు చెప్పిన మాటలు, సమాచారాన్ని ఇంకా వదలని సంఘపరివార్‌ శక్తులు ఆ పాతబడిన అంశాలనే పట్టుకు వేలాడుతుంటాయి. వాస్తవ, వర్తమానాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అసాధ్యమైన అంశాన్ని తలకెత్తుకొని చైనాతో తలపడి సాధించేదేమిటి ? చైనాతో తలెత్తిన సరిహద్దు సమస్య వేరు, టిబెట్‌ వేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో సహా సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిజంగానే కోరుకుంటే టిబెట్‌తో లంకె పెట్టటం తగని పని ? చైనా తిరుగుబాటు దారు దలైలామాకు, ఖలిస్ధాన్‌ లేదా వేర్పాటు కాశ్మీర్‌ పేరుతో విదేశాల్లో తిష్టవేసిన మన దేశ వేర్పాటు వాదులకు పెద్ద తేడా ఏముంది ? మత పెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటమే ఒక తప్పిదం. ప్రతిదానికి జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాన్ని విమర్శించే బిజెపి దలైలామా విషయంలో తప్పిదం చేసిన అదే నెహ్రూ బూట్లలో కాళ్లు పెట్టి నడవటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

విత్తన స్వాతంత్య్రం- అధిక దిగుబడుల ఆవశ్యకత !

08 Wednesday Jul 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, farmers seeds rights


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

రైతాంగం పూర్తి స్ధాయిలో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగమయ్యారు. విత్తన స్వాతంత్య్రం కోల్పోయిన రైతాంగం విదేశీ కంపెనీల మీదనే ప్రధానంగా పత్తి విత్తనాల కోసం ఆధారపడక తప్పటం లేదు. బీటీ విత్తనాలు పురుగును రాకుండా చేస్తాయని మార్కెట్‌ లోకి 2002లో ప్రవేశించి ఇపుడు మార్కెట్‌ ను పూర్తిగా శాసిస్తున్నాయి. పత్తి రైతులు 95 శాతం బీటీ విత్తనాలనే వాడుతున్నారు. విదేశీ ఎంఎన్‌సీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్న జాతీయ కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. 2019లో 354 లక్షల బేళ్ళ పత్తిని పండించారు.
ప్రపంచంలో హెక్టారుకు 109 కిలోలకు మించి దిగుబడులతో పత్తి పండించే దేశాలు 77 ఉన్నాయి. మరికొన్నింటిలో పండించినప్పటికీ దిగుబడి అతి తక్కువగా ఉన్నందున పరిగణనలోకి తీసుకోవటం లేదు. వాటిలో ఆస్ట్రేలియా 2,056 కిలోలతో దిగుబడిలో ప్రధమ, 1,905 కిలోలతో ఇజ్రాయెల్‌, 1,748 కిలోలతో చైనా ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నాయి. 623కిలోలతో పాకిస్ధాన్‌ 32వ, 496కిలోలతో మన దేశం 36వ స్ధానంలో ఉంది. ప్రపంచ సగటు 765 కిలోలు. దీని కంటే ఎక్కువ దిగుబడులు 17దేశాలలో వస్తున్నాయి.
అనేక దేశాల మాదిరి హై డెన్సిటీ ప్లాంటింగ్‌ చేసి సూటిరకాల విత్తనాలను వాడుతూవుంటే పత్తి సగటు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందుండేవాళ్ళం. రైతుల ఆదాయం పెరిగేది. మన దేశ శాస్త్రజ్ఞులు, పాలకులు , రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక్క భారతదేశంలోనే హైబ్రిడ్‌ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నారు. అమెరికా , బ్రెజిల్‌, చైనా తో సహా ప్రపంచంలో పత్తి పండించే దేశాలన్నీ హైబ్రిడ్‌ విత్తనాలతో పత్తి పండించటంలేదు. జన్యుమార్పిడి బీటీ విత్తనాలతో సహా వెరైటీలను అంటే సూటి రకాల విత్తనాలను అంటే పంటనుండి తీసిన విత్తనాలనే కంపెనీలు పేటెంట్‌ చట్టం పేరున రైతులకు అమ్ముతున్నాయి.
మన దేశంలో హైబ్రిడ్‌ విత్తనాల తయారీని మోన్సాంటో, బేయర్స్‌ లాంటి కంపెనీలు ప్రోత్సహించాయి. అపార లాభాలను పొందాయి. ప్రతి సంవత్సరం తన విత్తనాలను అమ్ముకోవటానికి కంపెనీల దుష్ట ప్రణాలిక వలన రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. 1.విత్తనాల ఖర్చు ఎక్కువ అవుతున్నది,2. పత్తి దిగుబడులు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు.
తన పంటలో మంచి గింజలను గుర్తించి తరువాత విత్తనాలుగా వాడే అలవాటును మెల్లగా మాన్పించి హైబ్రిడ్‌ విత్తనాలను అలవాటు చేశారు. నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాలను తయారుచేసిస్తామన్నారు. ఆ టెక్నాలజీ వేరన్నారు. 50 పత్తి గింజలను తెచ్చి మన దేశంలో మన చేతనే మల్టిప్లై చేయించి, మన మొక్కలతో సంకరం చేసి, అందమైన పాకింగ్‌ చేయించి, ప్రచారార్భాటాలతో రైతులచే కొనిపిస్తున్నారు. ఆడ మొగ మొక్కలను వేరుగా పెంచి , మొగచెట్ల పుప్పొడిని ఆడ మొక్కల పూవులపై అంటించి క్రాస్‌ (సంపర్కం) చేయాలి. మన దేశంలో చౌకగా వున్న బాల కార్మికులతో క్రాసింగ్‌ జరిపించి హైబ్రిడ్‌ విత్తనాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. విత్తన ఉత్పత్తికి కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడనుండే హైబ్రిడ్‌ విత్తనాలు తయారీ అవుతున్నాయి.. అనుకూల వాతావరణం, చౌకగా అందుతున్న బాలకార్మికుల శ్రమ కంపెనీలకు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెట్టాయి. దీనికి తోడుగా పేటెంట్‌ చట్టం పేరుచెప్పి తమ అనుమతి లేనిదే మరెవ్వరూ ఆ విత్తనాలను తయారు చేయరాదని కట్టడి చేశారు. పంటకు పురుగులు, చీడ పీడ విరగడౌతుందనీ దిగుబడి పెరుగుతుందనే ఆశతో రైతులు మోన్శాంటో బీటీ విత్తనాలను ఆశ్రయించారు. బీటీ జన్యవును మన పత్తి మొక్కలలోని దేశీయవిత్తనాలలో పెట్టవచ్చని తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నవారు ధైర్యంచేయలేకపోయారు. మన దేశీయ విత్తనాలు పురుగులను బాగా తట్టుకుంటాయని గ్రహించలేకపోయారు. మోన్సాంటో కంపెనీ గుత్తాధిపత్యాన్నిపొందింది. ఇష్టమొచ్చిన రేటును వసూలు చేసింది. విత్తనాలు తయారుచేసే రైతుకి 250 రూ. ఇచ్చి 750 గ్రాములవిత్తనాలను మోన్శాంటో కంపెనీ తీసుకున్నది. పత్తి పండించే రైతుకి 450 గ్రాముల విత్తనాలను 1850 రూ. కి మించి అమ్మింది. ఇది దారుణమని నల్లమడ రైతుసంఘం ప్రచారం చేసింది. 2005 జూన్‌ నెల లో లామ్‌ ఫార్మ్‌ సభ లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విత్తనాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈ వ్యాస రచయిత, తేళ్ళ క్రిష్ణమూర్తి, దండా వీరాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆందోళన ప్రారంభించి సదస్సులు, సభలు. ధర్నాలు చేశారు. జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి, కొల్లా రాజమోహన్‌ ఊరూరు తిరిగి రైతులను చైతన్య పరిచారు. రైతునాయకులు కొల్లి నాగేశ్వరరావు, యలమంచిలి శివాజీ, జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి , కొండా శివరామిరెడ్డి లాంటివారు కదిలారు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై యసే రాజశేఖరరెడ్డి గారు స్పందించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఎమ్‌ఆర్పీటీయస్‌ లో కేసు వేశారు. మోన్శాంటో కంపెనీ 1850 రూ. పత్తి విత్తనాల పాకెట్‌ ను 750 రూ.కి. తగ్గించకతప్పలేదు. మన దేశంలో బీటీ విత్తనాలపై పేటెంట్‌ లేకపోయినా పేటెంట్‌ వున్నదని దబాయించి రౌడీ మామూలుగా టెక్నాలజీ ఫీజు-రాయల్టీ పేరున వందల వేల కోట్ల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. బీటీ 1 అనీ, బీటీ 2 అనీ, బీటీ 3 అనీ రైతులకు ఆశలు కల్పంచి సొమ్ము చేసుకుంటున్నారు. సూటిరకాల విత్తనాలను సాంద్రతను పెంచి సాగుచేసి అధికదిగుబడులను సాధించటమే దీనికి పరిష్కారం ,
అనేకదేశాలలో, ప్రయోగాలు, పరిశోధనల తర్వాత హై డెన్సిటీ ప్లాంటింగ్‌ అంటే మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఎక్కువ మొక్కల వలన ఎక్కువ దిగుబడి వస్తుందనీ, దేశీయ సూటిరకాల విత్తనాలకు పురుగును తట్టుకునే శక్తి ఎక్కువనికూడా అధ్యయనాలు నిరూపించాయి. బలాలు కూడా సగంపెట్టినా దిగుబడి తగ్గదంటున్నారు. బ్రెజిల్‌ లాంటి దేశాలు లాభపడ్తూఉండగా మనం మోన్సంటో, బేయర్‌ కంపెనీల మాటలు విని వారికి లాభాలు చేకూర్చేవిధంగా హైబ్రిడ్‌ విత్తనాలనే ఎందుకు వాడుతున్నామో ఆలోచించాలి.
బ్రెజిల్‌, చైనా, అమెరికా, భారతదేశాలలో ప్రయోగాలు చేశారు. ఒక ప్రయోగంలో హెక్టరుకు 1500 నుండి 1,05,000 మొక్కల వరకూ 6 ప్లాట్లుగా పెంచారు. మెపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే గ్రోత్‌ రెగ్యులేటర్‌ మందును ఉపయోగించి పెరుగుదలను నియంత్రించారు. తక్కువ మొక్కలున్న ప్లాటు తక్కువ దిగుబబడి నిచ్చింది. బాగా ఎక్కువ మొక్కలున్న ప్లాటు లోకి సూర్యరశ్మి, గాలి అందక మరీ ఎక్కువ పత్తినివ్వలేదు. మధ్యస్ధంగా 87,000 మొక్కలున్న ప్లాటు హెక్టారుకు 1682కేజీల లింటు కాటన్‌( 4546కేజీల సీడ్‌ కాటన్‌) వచ్చింది. నేలను బట్టి, భూసారాన్నిబట్టి, నీటి లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను సైంటిస్టులు, అనుభవజ్నులైన రైతులు నిర్ణయించుకుని ఎక్కువ మొక్కలను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు.
మన దేశ కాటన్‌ సైంటిస్టులు ఆ దేశాలకు వెళ్ళి హై డెన్సిటీ ప్లాంటేషన్‌ సాగు విధానాన్ని పరిశీలించారు. నాగపూర్‌ కాటన్‌ రీసర్చ్‌ సెంటర్‌ వారు సూరజ్‌ అనే సూటి రకాల వెరైటీని, నంద్యాల కాటన్‌ పరిశోధనా సంస్ధ, దేశీయ 1938 వెరైటీలను అభివధిచేసి రైతులకు ఇచ్చారు. హై డెన్సిటీ ప్లాంటేషన్‌ తో మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వ సంస్ధలు ప్రదర్శనాక్షేత్రాలు ఏర్పాటుచేసారు. ప్రత్యమ్నాయంగా దేశీ విత్తనాల సాంద్రతను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని చూపారు. మన దేశరైతులు మోన్సాంటో, బేయర్స్‌ లాంటికంపెనీల మాటలువిని హైబ్రిడ్‌ విత్తనాలనే వాడుతున్నారు. మన పొలంలో మన పంట విత్తనాలను ఎక్కువగా నాటి ఎక్కువ మొక్కలను పెంచి పత్తి దిగుబడిని అంతర్జాతీయస్ధాయికి తేవచ్చని నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధవారు ప్రయోగాలు చేసి నిర్ధారించారు. ప్రదర్శనాక్షేత్రాలను ఏర్పాటు చేశారు. వారు సరఫరా చేసిన సూరజ్‌ వెరైటీని , నంద్యాల పత్తి పరిశోధనా సంస్ధ ఇచ్చిన వెరైటీలను రైతు రక్షణ వేదిక ప్రొఫెసర్‌ యన్‌ వేణుగోపారావు గారి నాయకత్వాన గుంటూరు జిల్లాలో ప్రచారం చేసింది. వెయ్యికన్నా ఎక్కువ సభ్యులతో సహకార సంస్ధగా ఏర్పడి సూటిరకాల అభివధికి దాదాపు 10 సం.కు పైగా కషిచేసింది. బీటీ వున్న సూటిరకాలుకూడా రైతు రక్షణ వేదిక రైతులు అభివద్దిóచేశారు. తక్కువ వనరులతో విషేషమయిన కషి జరిగింది. కార్పోరేట్‌ కంపెనీల హైబ్రిడ్‌ అనుకూల ప్రచారాల ముందు కొద్దిమంది కషి రైతులను ఉత్తేజపరచలేక పోయింది. నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధ, నంద్యాల పరిశోధనాసంస్ధలకు తోడుగా వ్యవసాయశాఖ, వ్యవసాయ విద్యాలయం కదలలేదు. ప్రయోగాలను, పరిశోధనలను కొనసాగించలేదు. రైతు సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నాయకులు సూటి రకాలగురించి, హై డెన్సిటీ ప్లాంటేషన్‌ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా మన రైతులు అదిక దిగుబడులద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవటమేకాదు. దేశప్రజల విత్తన స్వాతంత్య్రాన్ని మోన్సాంటో లాంటి కోర్పోరేట్‌ శక్తులకు ధారపోసి దేశసార్వభౌమాధికారానికే ప్రమాదం తెచ్చి పెట్టారు. అంతర్జాతీయ అనుభవాలను మన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. చిన్న రైతులను ఆర్ధికంగా నిలబెట్టినపుడే వ్యవసాయం రక్షించబడతుంది.
రైతు తన పొలంలోనుండి విత్తనాలను తీసుకొని కనీసం మూడు నాలుగు సంవత్సరాలు విత్తుకోవచ్చు. మొక్కల సాంద్రతను పెంచి అధిక దిగుబడిని పొంది , అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సగటు దిగుబడులలో అంతర్జాతీయ స్ధాయిని అందుకోవచ్చు. ఎమ్‌ యన్‌ సీ ల దోపిడీ ని ఎదుర్కొని విత్తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవచ్చు.
ఈ వ్యాస రచయిత నల్లమడ రైతు సంఘం, రైతు రక్షణ వేదిక నేత, గుంటూరు, ఫోన్‌ 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌ అరచేయి -ఐదువేళ్లు-అఖండ భారత్‌ పగటి కలలేనా ?

07 Tuesday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Akhand Bharat, China, Dalai Lama, Five fingers of Tibet, INDIA, Tibet


ఎం కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమంలోనూ, సాంప్రదాయ మీడియాలోనూ కొన్ని సమస్యల మీద వెల్లడిస్తున్న అభిప్రాయాలూ, సమాచారమూ జనాలను తప్పుదారి పట్టించేదిగా ఉందా ? ఎందుకు అలా చేస్తున్నారు ? దాని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి ? కొంత మంది భిన్న ఆలోచన లేకుండా ఎందుకు నమ్ముతున్నారు ? జనం మెదళ్ల మీద ప్రచార యుద్ధం జరుగుతోందా ? విజేతలు ఎవరు ? వారికి కలిగే లాభం ఏమిటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! అన్నింటినీ తీర్చటం సాధ్యం కాదు. కొన్ని అంశాలను పరిశీలించుదాం.
కమ్యూనిజం గురించి జనంలో భయాలను రేపితే దానివైపు అమెరికన్‌ కార్మికవర్గం చూడదనే అభిప్రాయంతో అక్కడి పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారదాడిని ఒక ఆయుధంగా చేసుకుంది. దాని దెబ్బకు అనేక మంది కోలుకోలేని మానసిక వికలాంగులయ్యారు. అయితే కాలం ఎల్లకాలమూ ఒకే విధంగా ఉండదు. ” కొంత మందిని మీరు వారి జీవితకాలమంతా వెర్రివాళ్లను చేయగలరు, అందరినీ కొంత కాలం చేయగలరు, కానీ అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు” అని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారానికి, పాలకులకు ఇది వర్తిస్తుందా ?
మన దేశ చరిత్ర గురించి చెబుతూ ఎప్పుడైనా పొరుగుదేశం మీద దండెత్తిన చరిత్ర ఉందా అడుగుతారు. మనకు తెలిసినంత వరకు అలాంటి చరిత్ర లేదు. అదే సమయంలో ఇరుగు పొరుగుదేశాలతో స్నేహంగా ఉండటం తప్ప పాలకులు ఇప్పటి మాదిరి విద్వేషం రెచ్చగొట్టిన చరిత్ర కూడా లేదు. మిత్రులుగా ఉండేందుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారం కంటే వాటి మీద నిత్యం ద్వేషాన్ని రెచ్చగొట్టటం, అదే అసలైన దేశభక్తి అని ప్రచారం చేయటం , నరేంద్రమోడీ ఏమి చేసినా సరైనదే, బలపరుస్తాం అనే వెర్రిని జనాల మెదళ్లలోకి ఎక్కించి బిజెపి తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కమ్యూనిస్టు నేత లెనిన్‌ ” ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” అని చెప్పారు. అయన కంటే ఎంతో ముందు వాడైన అబ్రహాం లింకన్‌ చెప్పినట్లు అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు.
” చైనా కుడి చేతి అరచేయి టిబెట్‌ . లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల ప్రదేశ్‌ దాని అయిదు వేళ్లు, వాటిని విముక్తి చేయాలని చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ చెప్పారు ” అన్నది ఒక ప్రచారం. వాస్తవం ఏమిటి ? మావో జెడాంగ్‌ ఆ విధంగా చెప్పిన దాఖలాలు గానీ, కమ్యూనిస్టు చైనాలో అధికారిక చర్చ జరిగినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది ఎలా ప్రచారం అయింది ?
క్రీస్తు పూర్వం 221లో ప్రారంభమైన చైనా క్విన్‌ రాజరిక పాలన నుంచి 1912వరకు సాగిన పలు రాజరికాలు నేపాల్‌, సిక్కిం,భూటాన్‌ తమ టిబెట్‌లో భాగమే అని భావించాయి. 1908లో టిబెట్‌లోని చైనా రాజప్రతినిధి నేపాల్‌ అధికారులకు పంపిన వర్తమానంలో నేపాల్‌ మరియు టిబెట్‌ చైనా అశీస్సులతో సోదరుల్లా కలసి పోవాలని, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యంగామెలగాలని, చైనా, టిబెట్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌లు పంచరంగుల మిశ్రితంగా ఉండాలని, బ్రిటీష్‌ వారిని ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. ఇది బ్రిటన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన ఒక అంశం, చైనా ప్రభువుల వాంఛకు ప్రతిబింబం అని కూడా అనుకోవచ్చు. దానిని ప్రస్తుతం చైనాకు వర్తింప చేస్తూ ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే మరి మావో జెడాంగ్‌ రంగంలోకి ఎలా తెచ్చారు ?
ఇక్కడ అఖండ భారత్‌ గురించి చెప్పుకోవటం అవసరం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన జనాన్ని సమీకరించేందుకు నేను సైతం అన్నట్లుగా అనేక మంది తమ భావజాలం, నినాదాలతో ముందుకు వచ్చారు. వాటితో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ అదొక వాస్తవం. దానిలో ఒకటి అఖండ భారత్‌. దీనికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దీవులు, ఆఫ్రికా ఖండం, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, అస్త్రాలయ(ఆస్ట్రేలియా) ప్రాంతంలోని అనేక దేశాలలోని భాగాలతో కూడినది అఖండ భారత్‌ అన్నది ఒకటి. ఈ ప్రాంతంలోని ఇప్పటి దేశాల పేర్లు పేర్కొనాల్సి వస్తే భారత్‌, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్ధాన్‌, టిబెట్‌, మయన్మార్‌, ఇరాన్‌,యుఏయి, బహరెయిన్‌, తుర్క్‌మెనిస్ధాన్‌, తజికిస్తాన్‌, లావోస్‌, కంపూచియా, వియత్నాం, థాయలాండ్‌, ఇండోనేషియా, బ్రూనె, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాలలోని కొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మహాభారతం, మరికొన్ని పురాణాల్లో అందుకు సంబంధించిన కొన్ని ప్రస్తావనల ఆధారంగా అలా చెప్పారు. ఇవన్నీ చరిత్రలో ఒక మహారాజ్యంగా ఉన్నాయటానికి ఆధారం లేదు గానీ మతపరమైన, సాంస్కృతిక అంశాలలో సారూపత్యల కారణంగా అలా పరిగణించారని చెప్పాలి. ఉదాహరణకు ఇండోనేషియా నేడు ముస్లిం దేశం, అయినా అక్కడి వారి పేర్లు ఎలా ఉంటాయో చూడండి. మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో(సుకర్ణుడు) ఆయన కుమార్తె మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణో పుత్రి.
మన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పేందుకు కెఎం మున్షీ తొలిసారిగా అఖండ హిందుస్తాన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారు. మన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్‌ వారిని విమర్శించే సమయంలో మహాత్మాగాంధీ కూడా దాన్ని ఉదహరించారు. ఖాన్‌ సోదరుల్లో ఒకరైన మజహర్‌ అలీఖాన్‌ కూడా అఖండ హిందుస్తాన్‌ గురించి చెబితే ముస్లిం లీగు వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా, జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిన హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ అఖండ భారత్‌తో పాటు హిందూ రాష్ట్ర భావనను కూడా ముందుకు తెచ్చారు. తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్ధలన్నీ ఇప్పటికీ ఈ భావనలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి, అఖండ భారత్‌ ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నాయి. అది సాధించినపుడే నిజమైన స్వాతంత్య్రం అని ప్రచారం చేస్తాయి.1993లో సంఘపరివార్‌కు చెందిన బిఎంఎస్‌ తన డైరీ మీద ముద్రించిన చిత్రపటంలో పాకిస్ధాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌,శ్రీలంక, థాయలాండ్‌, కంబోడియాలతో కూడిన అఖండభారత్‌ ప్రచురించినట్లు వికీ పీడియా పేర్కొన్నది. నరేంద్రమోడీ కూడా సంఘపరివార్‌కు చెందిన వ్యక్తే గనుక 2012లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింధీల సభలో మాట్లాడుతూ పాకిస్ధాన్‌లో సింధు రాష్ట్రం ఒకనాటికి మన దేశంలో కలుస్తుందని సెలవిచ్చారు.2025 నాటికి పాకిస్ధాన్‌, టిబెట్‌లోని మానస సరోవరం తిరిగి మన దేశంలో కలుస్తుందని, లాహౌర్‌, మానసరోవర ప్రాంతాల్లో భారతీయులు స్ధిర నివాసం ఏర్పరచుకోవచ్చని, బంగ్లాదేశ్‌లో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నందున ఐరోపా యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.
1937 జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించారు. దాంతో చైనీయులు రెండో సారి జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరుసల్పారు. చాంగకై షేక్‌ నాయకత్వంలోని చైనా మిలిటరీతో పాటు లాంగ్‌ మార్చ్‌ జరుపుతున్న కమ్యూనిస్టు గెరిల్లాలు కూడా జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అనేక మంది యుద్ధ ప్రభువులు జపాన్‌కు లొంగిపోయారు. ఈ నేపధ్యంలో చరిత్రలో చైనా పొందిన అవమానాలను గుర్తుచేస్తూ జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు పార్టీనేతగా మావో చైనీయులకు చెప్పారు. ఆ సందర్భంగా చరిత్రను ప్రస్తావిస్తూ సామ్రాజ్యవాదులు చైనాను యుద్దాలలో ఓడించి అనేక సామంత రాజ్యాలను బలవంతగా చైనా నుంచి వేరు చేశారని, జపాన్‌ వారు కొరియా, తైవాన్‌,రైకూ దీవులు, పోర్ట్‌ ఆర్ధర్‌, పెస్కాడోర్స్‌ను, బ్రిటీష్‌ వారు బర్మా, నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్‌లను వేరు చేశారని, ఫ్రాన్స్‌ అన్నామ్‌(ఇండోచైనా ప్రాంతం)ను, చివరకు ఒక చిన్న దేశం పోర్చుగల్‌ చైనా నుంచి మకావోను స్వాధీనం చేసుకుందని మావో చెప్పారు. అంతే తప్ప ఎక్కడా ఐదువేళ్ల గురించి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏనాడూ చెప్పలేదు. తైవాన్‌ చైనా అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, దాని మీద ఎలాంటి వివాదమూ లేదు. అయితే 1948 నుంచి అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉంటూ అమెరికా అండచూసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సామరస్య పూర్వకంగా విలీనం కావాలని చైనా కోరుతోంది తప్ప సైనిక చర్యకు పూనుకోలేదు.
అయితే నిప్పులేనిదే పొగ వస్తుందా ? రాదు.1954లో టిబెట్‌లోని చైనా అధికారులు మాట్లాడుతూ భారత సామ్రాజ్యవాదులు అక్రమంగా పట్టుకున్న సిక్కిం, భూటాన్‌, లడఖ్‌,నీఫా(నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజన్సీ-అరుణాచల్‌ ప్రదేశ్‌)ను విముక్తి చేయాలని చెప్పినట్లు, అదే ఏడాది 1840-1919 మధ్య సామ్రాజ్యవాదులు చైనా ప్రాంతాలను కొన్నింటినీ ఆక్రమించారంటూ రాసిన ఒక స్కూలు పాఠంలో లడఖ్‌, నేపాల్‌,భూటాన్‌, సిక్కిం, ఈశాన్య భారతాన్ని విముక్తి చేయాలని దానిలో రాసినట్లుగా చెబుతారు.1959లో చైనా జనరల్‌ ఝాంగ్‌ గుహువా టిబెట్‌ రాష్ట్ర రాజధాని లాసాలో మాట్లాడుతూ భూటానీలు, సిక్కిమీయులు, లఢకీలు టిబెట్‌ ఉమ్మడి కుటుంబంలో ఐక్యం కావాలని అన్నట్లు వార్తలు ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి. అధికారికంగా అఖండ భారత్‌ గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా పరిగణించుతారు. అందుకే ఆయా దేశాలు ఎన్నడూ మన దేశంతో దాన్నొక సమస్యగా చూడలేదు. మన మీద ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. చైనా నుంచి వేరు పడి స్వాతంత్య్రం కావాలని 1912కు ముందుగానీ తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చేంత వరకు గానీ ఎన్నడూ టిబెట్‌లో ఉద్యమించిన ఉదంతాలు లేవు. అమెరికా జరిపిన కుట్రలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టిన నాటి నుంచి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి, ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చిన గత కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పటికీ టిబెట్‌ తురుపుముక్కను ఉపయోగించాలనే సంఘపరివార్‌ ఎత్తుగడలు కొనసాగుతున్నంత కాలం అటూ ఇటూ అలాంటి రెచ్చగొట్టే, వివాదాస్పద మాటలు వెలువడుతూనే ఉంటాయి. అధికారికంగా పాలకుల వైఖరి ఏమిటనేదే గీటురాయిగా ఉండాలి. అలా చూసినపుడు అఖండ భారత్‌ను ఎలా విస్మరించాలలో, టిబెట్‌ ఐదు వేళ్ల ప్రచారాన్ని కూడా అదేపని చేయాలి. కానీ సంఘపరివారం తన అజెండాలో భాగంగా ఐదువేళ్ల వార్తలను అధికారికమైనవిగా చిత్రించి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఆ ప్రచారానికి కొట్టుకపోతే బుర్రలను ఖరాబు చేసుకోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు.
చైనా ఆక్రమించుకుంటుంది అని చేస్తున్న ప్రచారంలో ఒకటైన సిక్కింను 1975లో మన దేశం విలీనం చేసుకుందని, తరువాత మన దేశ చర్యను చైనా అధికారికంగా గుర్తించిందని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తెలియదా? తెలిసీ ఇంకా ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నట్లు ? దలైలామాను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి మన దేశానికి రప్పించింది అమెరికా. తీరా చైనాతో సర్దుబాటు కుదరగానే ఆ పెద్దమనిషిని, టిటెటన్‌ తిరుగుబాటుదార్లను తాను వదలించుకొని మనకు అంటగట్టింది. తమ దేశానికి రావటానికి కూడా ఆంక్షలు పెట్టింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కాదని మన దేశం ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. ఆ వైఖరిని తీసుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా వేలాది మంది టిబెటన్లు మన దేశంలో విదేశీయులుగా నమోదై ఉన్నారు తప్ప వారికి పౌరసత్వం ఇచ్చేందుకు గానీ, శరణార్ధులుగా గుర్తింపుగానీ ఇవ్వలేదు. అక్రమంగా టిబెట్‌ నుంచి తరలిస్తున్నవారిని అనుమతిస్తున్నది. అనేక చోట్ల వారికి నివాసాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించారు. సంఘపరివార్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను సంతుష్టీకరించటానికి తప్ప దలైలామాను నెత్తికి ఎక్కించుకొని మనం ఎందుకు వీరంగం వేస్తున్నామో, దాని వలన ప్రయోజనం ఏమిటో ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కాఠిన్యం -కర్షకులకు కష్టకాలం, అనిశ్చితి !

06 Monday Jul 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Agriculture, Corona Virus impact on farmers, Fuel Price in India, Pandemic Corona Virus, WTO


ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విజృంభణ తగ్గలేదు.రానున్న రోజుల్లో ఏ రంగంపై ఎలాంటి దుష్ట ప్రభావం చూపనుందో అంతుచిక్కటం లేదు. రానున్నది రాకమానదు-కానున్నది కాకమానదు-కాడి పట్టుకోక తప్పదు అన్నట్లుగా రైతాంగ ఏరువాక ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలలో ఖరీఫ్‌ సాగు ముమ్మరంగా సాగుతున్నట్లు వార్తలు. ఇప్పటి వరకు వర్షాలు సకాలంలో, తగిన మోతాదులో పడిన కారణంగా కొన్ని చోట్ల విత్తనాల కొరత ఏర్పడిందని జార్ఖండ్‌, బీహార్‌ వంటి చోట్ల 15 నుంచి 25శాతం మేరకు విత్తన ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఎక్కడైనా పెద్ద రైతులు ముందే కొనుగోలు చేస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది, భారమూ ఉండదు, అప్పటి కప్పుడు కొనుగోలు చేసే చిన్న రైతుల మీద ఇది అదనపు ఖర్చు. కరోనా కారణంగా వలస కార్మికులు తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన కారణంగా పంజాబ్‌, హర్యానా వంటి ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడితే, మరికొన్ని చోట్ల మిగులుగా మారారు. దీనివలన కొన్ని చోట్ల వేతనాలు పెరిగితే, మరికొన్ని చోట్ల పడిపోయే పరిస్ధితి. ప్రపంచీకరణ యుగం కనుక రైతాంగాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలను చూద్దాం.
నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే సంగతి నోరు లేని గోమాత కెరుక. చమురు పన్ను, ధరల పెంపుదల ద్వారా వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని మాత్రం గణనీయంగా పెంచుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు డీజిల్‌ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. గతంలో డీజిల్‌ మీద ఉన్న సబ్సిడీలను తొలగించారు, కొంతకాలం డీజిల్‌ మీద పన్ను తక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా దాదాపు సమం చేసి పెట్రోలు కంటే డీజిల్‌ రేటు ఎక్కువ ఉండేట్లు చేశారు. ఎందుకంటే ఎక్కువగా అమ్ముడు పోతున్నది డీజిలు కనుక కంపెనీలకు బాగా లాభాలు రావాలంటే డీజిల్‌ ధరలు పెంచాలి మరి. దీని ధర పెరిగితే వ్యవసాయం, పంటల రవాణా, పురుగుమందులు, ఎరువులు ఇలా అన్ని రకాల వ్యవసాయ పెట్టుబడుల ధరలూ గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు పంట వేసేందుకు ఎకరం పొలాన్ని సిద్దం చేయాలంటే ఇంతకు ముందు అవుతున్న రెండున్నర వేల రూపాయల ఖర్చు కాస్తా మూడున్నరవేలు అవుతుందని ఒక అంచనా. చేపలు పట్టేందుకు డీజిల్‌ సబ్సిడీ ఇస్తున్నట్లుగానే రైతాంగానికి కూడా సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవటం లేదు. దేశంలోని డీజిల్‌ వినియోగంలో 2013లోనే ట్రాక్టర్లు, నాటు, కోత యంత్రాల వంటి వాటికి 10.8శాతం అయితే పంపుసెట్లకు 3.3శాతంగా అంచనా మొత్తంగా చూసినపుడు 14.1శాతం ఉంది. ఇప్పుడు యాంత్రీకరణ ఇంకా పెరిగినందున వినియోగ వాటా గణనీయంగా పెరుగుతుంది. రవాణా రంగం, అది ప్రయివేటు అయినా, ప్రభుత్వరంగమైనా చమురు ధరలను వినియోగదారుల మీద వెంటనే మోపుతాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచి, అమలు జరిపితే తప్ప రైతాంగానికి అలాంటి అవకాశం లేదు.
లాక్‌డౌన్‌ సమయంలో మొత్తంగా మూతపడటంతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. తమ ఉత్పత్తులను ముఖ్యంగా నిలవ ఉంచటానికి అవకాశం లేని కూరగాయలు, పండ్లు, పూల వంటి వాటిని రవాణా చేయటానికి, విక్రయించటానికి కూడా అవకాశం లేకపోయింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వమూ చెల్లించలేదు. కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన పరిస్ధితిని అధిగమించేందుకు ప్రకటించిన ఉద్దీపన పధకం 21లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌలిస సదుపాయాల నిధిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ఆహార తయారీ సంస్ధలకు పెట్టుబడి అని ఒక ముక్తాయింపు. వ్యాపారుల ఉల్లి, బంగాళా దుంపలు, ధాన్య నిల్వలపై ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులుగా ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. దీని వలన వ్యాపారులంతా వాటిని ఎగబడి కొంటారు, రైతులకు ధరలు పెరుగుతాయి అని మనల్ని నమ్మమంటారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ సంస్ధల పట్టును మరింత పెంచేందుకు తోడ్పడే చర్య ఇది.
ప్రభుత్వం ఒక వైపు చైనాతో పోల్చుతూ ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ పత్రాలలో పుంఖాను పుంఖాలుగా రాస్తుంది. కానీ అదే ఎవరైనా చైనాతో పోల్చితే చూడండి అని చైనా మద్దతుదారులు అంటూ సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు దాడి చేస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఒక కారణం పెట్టుబడులు తగ్గిపోవటం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌లో 18శాతం వ్యవసాయ రంగానికి వస్తే ఇప్పుడు ఎనిమిదిశాతానికి పడిపోయింది. అది కూడా అనుత్పాదక సబ్సిడీల రూపంలో ఎక్కువ భాగం ఉంటున్నందున పెద్ద రైతులకే ఎక్కువ లబ్ది కలుగుతున్నదని ఆ రంగ నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే 2019-20లో చైనాను ఉదహరిస్తూ కార్మికులు ఎక్కువగా పని చేసే వస్తు ఎగుమతుల కారణంగా కేవలం ప్రాధమిక విద్య మాత్రమే ఉన్న వారికి 2001-06 మధ్య 70లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని, మన దేశంలో ఎగుమతుల కారణంగా 1999-2011 మధ్య కేవలం పది లక్షల లోపే అసంఘటిత రంగ ఉద్యోగాలు పెరిగాయని, మనం కూడా చైనా మాదిరి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పని తీరులో అలాంటి చిత్తశుద్ది ఎక్కడా కనపడదు. మేకిన్‌ ఇండియా పిలుపు ద్వారా ఎన్ని కొత్త ఉద్యోగాలు ఆరేండ్లు గడిచినా చెప్పటం లేదు. మన దేశంలో ఒక కమతం సగటు విస్తీర్ణం 1.4హెక్టార్లు కాగా చైనాలో 0.6 మాత్రమే. అయినా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. వ్యవసాయరంగంలో కేంద్ర పెట్టుబడులే కాదు, దిగుబడులు, నాణ్యత పెంచేందుకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, వ్యవసాయ విస్తరణను గాలికి వదలివేశారు. అన్ని పంటల ఉత్పాదకత, దిగుబడులు చైనాలో గణనీయంగా పెరిగేందుకు తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ మార్కెట్లో వచ్చే ఎగుడుదిగుడులు అక్కడి రైతాంగాన్ని పెద్దగా ప్రభావితం చేయటం లేదు. రైతాంగానికి ప్రభుత్వం అందచేసే రాయితీలు కూడా మన కంటే ఎంతో ఎక్కువ.
2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఎన్‌డిఏ ప్రభుత్వం చెప్పింది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర భారత పధకాన్ని అమలు జరపనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలంటే 2022 నాటికి 30 బిలియన్‌ డాలర్లుగా వున్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 60బిలియన్‌ డాలర్లకు పెంచాలని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం మన దేశం వాణిజ్యంలో చైనాతో బాగాలోటులో ఉంది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మిగుల్లో ఉంది. వాటి దిగుమతులను ఇంకా పెంచుకోవాలని వత్తిడి చేస్తోంది, కొంత మేరకు చేసుకుంటామని చైనా కూడా చెప్పింది. 2018-19లో మన దేశం చైనాకు 190 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు చేస్తే మన దేశం 28.2 కోట్ల మేరకే చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ముడిపత్తి, రొయ్యల వంటి ఎగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 117 శాతం ఎక్కువ. అయితే తాజాగా లడఖ్‌ సరిహద్దు వివాదం కారణంగా మన దేశం చైనా వస్తువుల దిగుమతులపై నిషేధాలను విధిస్తామని ప్రకటించింది. అదే జరిగితే మొక్కజొన్న, చింతపండు, కాఫీ, పొగాకు, జీడిపప్పు, నూకల బియ్యం వంటి మన వ్యవసాయ దిగుమతులను చైనా కూడా ఏదో ఒక పేరుతో నిలిపివేయటం లేదా నామమాత్రం చేయటం ఖాయం. యుపిఏ ప్రభుత్వ చివరి ఏడాది మన దేశం గరిష్టంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత ఆరు సంవత్సరాలుగా మధ్యలో కొంత మేరకు తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే అంతకు తగ్గలేదు, అయితే దిగుమతులు గణనీయంగా తగ్గిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఇప్పుడు మిగుల్లోనే ఉన్నాము. ఆర్ధిక సర్వే ప్రకారం 2018-19లో మన వ్యవసాయ ఎగుమతులు 2.7లక్షల కోట్ల రూపాయల మేర ఉంటే దిగుమతులు 1.37లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అయితే ధనిక దేశాలు సబ్సిడీలు ఇచ్చినా, చైనా వంటివి మన దిగుమతులను నిలిపివేసినా ఈ మిగులు హరించిపోతుంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ దేశాలు తమ రైతాంగానికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. కానీ ఆ దేశాలు మాత్రం మన వంటి దేశాలు ఇచ్చే సబ్సిడీల మీద ధ్వజమెత్తుతాయి. ఉదాహరణకు అంబర్‌ బాక్స్‌ వర్గీకరణ కిందకు వచ్చే, ఇతరంగా మొత్తం సబ్సిడీల గురించి మన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డబ్ల్యుటిఓ స్టడీస్‌ అనే సంస్ధ ఒక పత్రాన్ని ప్రచురించింది. దానిలో దిగువ వివరాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు సగటున ఆ ఏడాదిలో సబ్సిడీ మొత్తాన్ని డాలర్లుగా పరిగణించాలి. ఉపాధి పొందుతున్నవారిని మిలియన్లలో సూచించారు.
దేశం == సంవత్సరం ==ఉపాధి పొం సంఖ్య == అంబర్‌బాక్సు == స్ధానిక మద్దతు
ఆస్ట్రేలియా == 2017-18 ==== 0.3 ==== 222 ==== 5357
కెనడా == == 2016 ==== 0.3 ==== 7414 ==== 13010
ఇయు ==== 2016 ==== 9.8 ==== 1068 ==== 8589
జపాన్‌ ==== 2016 ==== 2.3 ==== 3492 ==== 11437
నార్వే ==== 2018 ==== 0.1 ==== 22509 ==== 53697
రష్యా ==== 2017 ==== 4.2 ==== 855 ==== 1378
స్విడ్జర్లాండ్‌==== 2018 ==== 0.1 ==== 9716 ==== 57820
అమెరికా ==== 2016 ==== 2.2 ==== 7253 ==== 61286
బంగ్లాదేశ్‌ ==== 2006 ==== 24.6 ==== 8 ==== 11
బ్రెజిల్‌ ==== 2018 ==== 8.6 ==== 134 ==== 332
చైనా ==== 2016 ==== 212.9 ==== 109 ==== 1065
ఈజిప్టు ==== 2016 ==== 6.7 ==== 0 ==== 9
భారత్‌ ==== 2018-19 ==== 200 ==== 49 ==== 282
ఇండోనేషియా ==== 2018 ==== 37.6 ==== 7 ==== 139
ఫిలిప్పీన్స్‌ ==== 2018 ==== 10.4 ==== 0 ==== 125
ద.కొరియా ==== 2015 ==== 1.4 ==== 547 ==== 5369
థాయలాండ్‌ ==== 2016 ==== 12 ==== 11 ==== 367
ప్రపంచంలోని భారత్‌, చైనాలతో సహా 54 ప్రధాన దేశాలు వ్యవసాయంలో వచ్చే మొత్తం ఆదాయంలో పన్నెండుశాతానికి సమానమైన 700 బిలియన్‌ డాలర్లను ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నట్లు ఓయిసిడి తాజా నివేదిక ఒకటి పేర్కొన్నది. వర్ధమాన దేశాల కంటే ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల రెట్టింపు ఉంటున్నాయి. వర్దమాన దేశాలు 8.5శాతం ఇస్తుంటే ఓయిసిడి దేశాలు 17.6శాతం ఇస్తున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా 40శాతం ఇస్తుండగా, చైనా, ఇండోనేషియా, ఐరోపా యూనియన్‌ ఇస్తున్న సబ్సిడీలు 54దేశాల సగటు 12 నుంచి 30శాతం వరకు ఇస్తున్నాయి.అమెరికాలో ఈ ఏడాది సబ్సిడీలు 33 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని, అవి వ్యవసాయ ఆదాయంలో నేరుగా రైతులకు అందచేసే మొత్తం 36శాతమని కొన్ని వార్తలు సూచించాయి. మన ప్రభుత్వం చైనా స్దాయిలో అయినా రైతాంగానికి రాయితీలు ఇస్తుందా ? నల్లధనం వెలికితీత, దేశమంతటా గుజరాత్‌ నమూనా అమలు, అచ్చేదిన్‌ వంటి అనేక వాగ్దానాలకు ఏ గతి పట్టించారో ఇప్పుడు రైతుల ఆదాయాల రెట్టింపు వాగ్దానానికి కూడా అదే గతి పట్టిస్తున్నారు.
ప్రపంచంలో ధనిక దేశాలు రైతాంగానికి ఎలా సబ్సిడీలు ఇస్తున్నాయో ముందు చూశాము. వాటిని నియంత్రించాల్సిన ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను పని చేయనివ్వకుండా అమెరికా ఆటంకాలు కల్పిస్తున్నది. దానిని నిరసగా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ అజెవీడో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 2013లో ఈ బాధ్యతలను చేపట్టిన బ్రెజిలియన్‌ దౌత్యవేత్త అమెరికా, మరికొన్ని దేశాల వైఖరితో విసిగి పోయారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్దను ఖాతరు చేయకుండా సభ్యదేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకోవటం ఒకటైతే వివాదాల పరిష్కారానికి అమెరికా మోకాలడ్డుతుండటం సంస్ధ పని తీరు, విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. డబ్ల్యుటిఓ సమగ్రమైనది కాకపోవచ్చు గానీ అందరికీ అవసరమైనదే, ప్రపంచమంతటా ఆటవిక న్యాయం అమలుజరుగుతున్న తరుణంలో కనీసం వాణిజ్యానికి ఇది అవసరం అని అజెవీడో రాజీనామా ప్రకటన సమయంలో వ్యాఖ్యానించాడు.
2015లో దోహాదఫా చర్చలను అర్ధంతరంగా వదలి వేసిన తరువాత 164 సభ్యదేశాలు గల ఈ సంస్ధ ఒక పెద్ద అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా కుదర్చలేకపోయింది. అమెరికా-చైనా మధ్య 2018లో ప్రారంభమైన దెబ్బకు దెబ్బ వాణిజ్యపోరు మూడో ఏడాదిలో ప్రవేశించింది. దీనికి కరోనా మహమ్మారి సంక్షోభం తోడైంది. తమ పెత్తనం, తన సరకులను ఇతర దేశాల మీద రుద్దాలనే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్దను ముందుకు తెచ్చింది అమెరికా. అయితే అనుకున్నదొకటీ అయింది ఒకటీ కావటంతో చివరకు ఆ సంస్దనే పని చేయకుండా అడ్డుకోవటం ప్రారంభించింది. సంస్ధలో సభ్య దేశాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినపుడు ఫిర్యాదులను పరిష్కరించటం ఒక ప్రధాన విధి. అందుకుగాను ఏడుగురు సభ్యులతో ఒక ట్రిబ్యునల్‌ ఉంది. దానిలో న్యాయమూర్తుల నియామకం ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. వారి పదవీ కాలం ముగియగానే కొత్తవారిని నియమించాల్సి ఉండగా కుంటి సాకులతో అమెరికా అంగీకరించటం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ వలన చైనాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది కనుక నిబంధనలను మార్చాలని అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు ఒక పల్లవి అందుకున్నాయి. చైనాను తమతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలన్నది వాటి డిమాండ్‌. మన దేశం కూడా వరి, గోధుమల వంటి వాటికి కనీస మద్దతు ధరలను అనుచితంగా పెంచుతున్నదని, పత్తికి కనీస మద్దతు ధర పేరుతో రాయితీలు ఇస్తున్నదని అమెరికా, మరికొన్ని దేశాలు ఫిర్యాదు చేశాయి. అన్నింటికీ మించి వివాదాలు దీర్ఘకాలం కొనసాగటం ఒకటైతే అనేక కేసులలో తీర్పులు తమకు వ్యతిరేకంగా రావటాన్ని అవి సహించలేకపోతున్నాయి. తీర్పులన్నీ నిబంధనలు ఏవి ఉంటే వాటికి అనుగుణ్యంగానే వస్తాయి తప్ప అడ్డగోలుగా ఇవ్వలేరు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చైనా వర్దమాన దేశ తరగతిలోకే వస్తుంది. అందువలన సబ్సిడీలు, ఇతర అంశాలలో దానికి వెసులు బాటు ఉంది. అది ధనిక దేశాల లాభాలకు గండికొడుతోంది. చైనాను ధనిక దేశంగా తీర్పు చెప్పాలన్నది అమెరికా డిమాండ్‌. అమెరికాకే అగ్రస్ధానం అనే నినాదంతో అధికారానికి వచ్చిన ట్రంప్‌ సర్కార్‌ మరింత అడ్డంగా వ్యవహరించింది. ఏడుగురికి గాను కనీసం ముగ్గురు ఉంటే కేసులను విచారించవచ్చు. ఇటీవలి వరకు అదే జరిగింది. ఆరునెలల క్రితం ముగ్గురిలో ఇద్దరి పదవీ కాలం ముగియటంతో వారు తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసులు దాఖలైనా విచారించే వారు లేరు. ప్రపంచ వాణిజ్య సంస్దలో సంస్కరణలు తేవాలి గానీ అవి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉండకూడదని, అంటే తాము చేసిన దాన్ని ప్రశ్నించే అధికారం ఆ సంస్ధకు ఉండకూడదని అమెరికా పరోక్షంగా చెబుతోంది. ఈ నేపధ్యంలో న్యాయమూర్తుల నియామకం జరగదు, సంస్కరణలకు అవకాశం లేదు. అమెరికా అడ్డగోలు కోరికలు, ఆకాంక్షలను మిగిలిన దేశాలు అంగీకరించే ప్రసక్తే లేదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అమెరికా చూస్తుంటే, స్వేచ్చా వాణిజ్య సూత్రాలను పరిరక్షించాలని చైనా వాదిస్తోంది. ఈ సంస్దలో చేరిన 164 దేశాలు ఏడాదికి తమ జిడిపిని 855 బిలియన్‌ డాలర్లు పెంచుకున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. వీటిలో అమెరికా 87, చైనా 86, జర్మనీ 66 బిలియన్‌ డాలర్ల చొప్పున లబ్ది పొందాయని తేలింది. అగ్రరాజ్యాలకే అధిక ఫలం అన్నది స్పష్టం. అయితే ఈ సంస్ద నిబంధనలలో పెద్ద మార్పులు లేకపోయినా అనేక అంశాలలో మార్పులకు ఒక్కో దఫా చర్చలు దోహదం చేస్తున్నాయి. వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను మరింతగా తొలగించేందుకు, సబ్సిడీల తగ్గింపు తదితర అంశాలపై 2001లో దోహాలో మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ముగియలేదు, 2015లో విసుగుపుట్టి వదలివేశారు. అమెరికా-ఐరోపా యూనియన్‌ ధనిక దేశాల మధ్య తలెత్తిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సబ్సిడీ ఒక పెద్ద పీఠముడి. జరుగుతున్న పరిణామాలను చూస్తే న్యాయమూర్తుల నియామకాన్ని ఇలాగే అడ్డుకుంటే చివరకు ప్రపంచ వాణిజ్య సంస్ధ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.
వ్యవసాయ దిగుమతులపై పన్నుల గురించి అమెరికాాఐరోపా యూనియన్‌ తమకు అనుకూలమైన పద్దతుల్లో ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ధనిక దేశాలు వ్యవసాయ సబ్సిడీలను గణనీయంగా తగ్గించకుండా ప్రయోజనం లేదని, వాటి సంగతి తేల్చాలని చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలు పట్టుబట్టటంతో 2005 నుంచి ప్రతిష్ఠంభన ఏర్పడింది. అంతకు ముందు ఉరుగ్వే దఫా చర్చలలో కొన్ని దేశాలు తమలో తాము ఒక ఒప్పందం చేసుకొని ఇతర దేశాలను క్రమంగా వాటిలో చేర్చుకున్నాయి. అయితే దోహా చర్చలలో వర్ధమాన దేశాలు మొత్తంగా ఒప్పందం జరగాలి తప్ప ప్రయివేటు వ్యవహారాలు కుదరవని తేల్చి చెప్పాయి. ఉరుగ్వే దఫా చర్చల నాటికి చైనా ప్రపంచ వాణిజ్యంలో భాగస్వామి కాదు, దోహా చర్చల సమయంలోనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరింది. చర్చల సమయంలోనే చైనా అమెరికా తరువాత రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వృద్ధి చెందింది. దీంతో వర్దమాన దేశాల పట్టు పెరిగింది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకుంటున్నది. మనకు మిత్ర దేశం,సహ భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి చెబుతున్న అమెరికాతో లడాయిలో మన దేశం చైనాతో కలసి వ్యవహరిస్తోంది. ఇప్పుడు లడఖ్‌ లడాయితో చైనా మీది కోపంతో అమెరికా పంచన చేరుతుందా ? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువులు, ఇతర రాయితీలను పెంచకుండా పరిమితం చేసి ధనిక దేశాలను సంతృప్తి పరుస్తోంది. ఇప్పుడు మరింతగా వాటికి లొంగిపోనుందా ?
ప్రపంచమంతటా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆహార ధాన్య నిల్వల గురించి ఎలాంటి ఆందోళన లేదు. అనేక చోట్ల పంటలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ఆహార జాతీయవాదం ప్రబలి కొన్ని దేశాలలో ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షల వంటి రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా,బ్రెజిల్‌, ఐరోపా దేశాలలో కరోనా కారణంగా మాంస పరిశ్రమలు మూతపడ్డాయి. మన దేశం మాదిరే అనేక చోట్ల వలస కార్మికుల సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన పరిస్ధితి లేదు గానీ కరోనా మరింత ముదిరితే ఆహార ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండగా చైనాలో కట్టడి చేసి సాధారణ ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా డోనాల్డ్‌ ట్రంప్‌ తన విజయావకాశాల కోసం పిచ్చి పనులకు పూనుకుంటే రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యం యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాపై ప్రపంచంలో మీడియాకు ముఖం చూపని ఒకే ఒక్క నేత నరేంద్రమోడీ !

05 Sunday Jul 2020

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

COVID-19, Narendra Modi


నందిని మార్వా
కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ప్రపంచంలో భారత్‌ ఇప్పుడు నాలుగవ స్ధానంలో ఉంది.దిగువ నుంచి ప్రారంభమై ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. వాస్తవానికి ఎక్కడ తప్పు జరిగింది? చాలా తక్కువ కేసులు ఉన్న రోజు నుంచి భారత్‌ లాక్‌డౌన్‌లో ఉంది, అప్పుడు చాలా తక్కువ కేసులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్ధితిని చూస్తే అందరం అలక్ష్యంలో ఉన్నాము. మొత్తం లాక్‌డౌన్‌ ఒక లక్ష్యం లేనిదిగా కనిపిస్తోంది. ఈ మహమ్మారి గురించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఏమంటే అధికారంలో ఉన్నవారి అవినీతి, తప్పిదాల గురించి ప్రతి వారిని కళ్లు తెరిచేట్లు చేయటం.
ప్రతివారికీ అర్ధమైన, చాలా ముఖ్యమైన అంశం ఏమంటే: ప్రజల కోసం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇది అన్నది పెద్ద బూటకం.ఈ చేదు వాస్తవాన్ని పక్కన పెడితే మరొక పరిశీలనను చూద్దాం. ప్రాణాలు తీసే కరోనా వైరస్‌ రెండువందలకు పైగా దేశాలను ప్రభావితం చేస్తే దేశంలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వారెవరైనా ఉన్నారా అంటే మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కరే. ఒక దేశాధినేత బహిరంగ చర్చలో దేశ ప్రజలను ఉద్దేశించి ఎందుకు మాట్లాడరు ? ఆత్మనిర్భర భారత్‌ గురించి ఉపన్యాసాలు చేశారు, ప్రజలు నిర్వహించాల్సిన వివిధ లక్ష్యాల గురించి చెప్పారు, సహాయ చర్యల గురించి చెప్పారు కానీ మీడియా ముందుకు రాని అసలైన కారణం ఏమిటో ఎన్నడూ చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడి కంటే మన ప్రధాని ఎంతో ముఖ్యమైన, విలువైన వారా ?
ప్రజాస్వామ్య భారత్‌లో పత్రికా గోష్టి నిర్వహించని తొలి ప్రధాని నరేంద్రమోడీ. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ”మౌన మోహన్‌ సింగ్‌ ” అని మోడీ వెక్కిరించిన రోజులున్నాయి. ఇప్పుడు అది ఆయనకే వర్తించటం లేదూ ? ప్రధాని నరేంద్రమోడీ ఎన్ని పత్రికా గోష్టులు నిర్వహించారు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో తెలియచేయాలని ప్రధాని కార్యాలయాన్ని కోరుతూ ఒక పౌరుడు సమాచార హక్కు కింద దరఖాస్తు చేశాడు. వీటికి సంబంధించి ప్రధాని కార్యాలయంలో ఎలాంటి పత్రాలు లేవు. నిజానికి మన దేశంలో జరుగుతున్నదేమిటి ? మన నేతలు వర్తమాన అంశాల మీద స్పందించకుండా ప్రతి అంశానికి సంబంధించిన వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఎందుకు కేంద్రీకరిస్తున్నారు ?
ప్రముఖ పాత్రికేయులు ప్రధానితో కఠినంగా ప్రశ్నించటంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధాని పని తీరు, ప్రయాణాలు, యోగా తదితర అంశాల గురించి ప్రశ్నిస్తే వాటి గురించి చెప్పేందుకు సిద్ధం సుమతీ అన్నట్లుగా ఉంటారు. కానీ ఇబ్బంది కరమైన ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యూల నుంచి వెళ్లిపోవటమో, ప్రస్తావన అంశానికి దూరంగా పోవటమో చేస్తారు. మీడియాతో మోడీకి సత్సంబంధాలు లేవని కూడా చెబుతారు. కరణ్‌ థాపర్‌ అనే సీనియర్‌ పాత్రికేయుడు ప్రధాని మోడీని గుజరాత్‌ హింసాకాండ గురించి అడిగినపుడు మన ప్రధాని మాట్లాడకుండా ఇంటర్వ్యూ నుంచి లేచి వెళ్లిపోయారు. బహుశా మన ప్రధాని గతం ఆయన్ను ఇప్పటికీ వెంటాడుతున్నదేమో !
భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌ గురించి ప్రపంచమంతటా జనం మాట్లాడుకుంటున్నారు. మహమ్మారి నుంచి మనం బతికి బయటపడినా, ఆర్ధిక పతనం నుంచి కోలుకోలేమని ప్రముఖ ఆర్ధికవేత్తలు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి గిరాకి అంతం కావటానికి దోహదం చేశాయి, దాంతో మన ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కరోనా మహమ్మారి తోడైంది. ఏ మాత్రమూ ముందుగా చెప్పకుండానే దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించారు. దేశ ప్రజలు దానికి సిద్దం కాలేదు. ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. కానీ దేశంలోని పోలీసులు వాటిని అర్ధం చేసుకోలేకపోయారు. జనాన్ని లాఠీలతో మోదారు. ఇదే సమయంలో అనేక మంది వలస కూలీలు రోడ్డున పడ్డారు. తమ స్వస్ధలాలకు తిరిగి పోతున్నారు. వారిలో కొందరు నిద్రిస్తుండగా హతులయ్యారు. పొలాల్లో ఉన్న పంటలను రైతులు ఎలా ఇంటికి తెచ్చుకుంటారో ఎవరూ ఆలోచించలేదు. వైద్య సరఫరాల గొలుసు తెగిపోయింది. న్యూఢిల్లీలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు(కొత్త పార్లమెంట్‌, నివాసాలు, ఇతర కార్యాలయాల నిర్మాణం)తో పాటు చాలా కాలం తరువాత ఆర్ధిక ఉద్దీపన పధకాన్ని ప్రకటించారు. అదింకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తీరు, విధానాలను అన్నింటినీ చూస్తే భారతీయులు కరోనాతో కంటే ఆకలితో మరణించవచ్చు. అనేక మంది ప్రముఖులు చెప్పినట్లుగా అధ్వాన్నమైన పాలన, విధానాల అమలుకు ఏ మాత్రం లేని అనుభవం, ప్రభుత్వ నియంతృత్వ లక్షణం అతి పెద్ద విపత్తుకు దారి తీయవచ్చు.
ఇదిలా ఉండగా కోవిడ్‌-19 మహమ్మారి విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అమిత్‌ షా అంగీకరించారు, అయితే అదే సమయంలో ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇదీ మన దేశ స్ధితి. నేతలు జనానికి, తమ కింది వారికీ సమాధానాలు చెప్పకపోగా ప్రతిపక్ష ప్రభుత్వాలతో తమను పోల్చుకుంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని లాక్‌డౌన్‌ వాయిదా వేసింది తప్ప జనానికి తప్పించలేదు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవటానికి, అత్యవసర సంరక్షణ సౌకర్యాలను పటిష్ట పరుచుకొనేందుకు వ్యవధిని ఇచ్చింది. మన దేశంలో సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం ఇప్పటికీ చెబుతూనే ఉంది. అయితే పెరుగుతున్న కేసులను చూస్తే సామాజిక వ్యాప్తి పరిమితం అన్నది కేవలం నిర్వచనానికి పరిమితం కావచ్చుగానీ వ్యవహారికానికి పనికి రాదు.
తొలి కేసు బయటపడి నాలుగు నెలలు, లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలలు గడిచినా పరీక్షలు చేయటంలో, అవసరానికి తగిన డిమాండ్‌కు అనుగుణంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో అత్యవసర పరిస్ధితికి తగిన విధంగా ఐసియు పడకలు లేవని తేలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తరచుగా దేశంలోని మహమ్మారి గురించి జనానికి చెబుతారు. కెనడా ప్రధాని దాదాపు ప్రతి రోజూ దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడతారు. ఇద్దరూ వర్తమాన అంశాల మీద మీడియాతో బహిరంగంగా మాట్లాడతారు. మనం న్యూజిలాండ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే కరోనా వ్యాప్తి నుంచి న్యూజిలాండ్‌ విముక్తి పొందింది. మహిళాశక్తి దాన్ని అలా ముందుకు నడిపించింది.మన దేశంలో మాదిరి ఏ దేశంలోనూ ఇప్పటి వరకు వారి జాతిని ఉద్దేశించి వర్తమాన సమస్యల మీద మాట్లాడని నేతలు లేరు.
దేశంలోని దీర్ఘకాలిక సమస్యల గురించి పట్టించుకోకుండా కేవలం సానుకూల అంశాల గురించే మాట్లాడుతుంటే అది దేశంలో ఇప్పుడున్న వాస్తవ పరిస్ధితిని చూపదు. సరైన సమయంలో సరైన జోశ్యం చెప్పగల సరైన వారిని మన దేశం ఎంచుకోవాలి.భారత్‌ రోజుకు రెండు లక్షల ఎన్‌-95 ముఖతొడుగులను ఉత్పత్తి చేస్తున్నదని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. వాస్తవం ఏమంటే ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే అది చాలా తక్కువ. ప్రతిదానికీ సమయం సందర్భం లేకండా మతోన్మాదం గురించి మాట్లాడటాన్ని మన దేశం ఎందుకు నిరోధించదు ? వర్తమాన అంశాల మీద మాట్లాడకుండా, కేంద్రీకరించకుండా కేవలం టీవీలలో ఉపన్యాసాలు దంచటమెందుకు ?
గమనిక : ఇన్వెంటివా డాట్‌కామ్‌ ఇన్‌ వెబ్‌ సైట్‌ సౌజన్యంతో( ఈ ఆంగ్ల వ్యాసాన్ని తొలుత జూన్‌ పన్నెండున ఇన్వెంటివా డాట్‌కామ్‌ ఇన్‌ ప్రచురించినది. పాఠకులకు అందించేందుకు అనువదించబడినది. ఎం కోటేశ్వరరావు )

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహం-చక్రవ్యూహం : చైనా, భారత్‌ ముత్యాల హారాలు !

03 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Asian Arc of Democracy, China and India strings of pearls, Encirclements, Quad, Quadrilateral Security Dialogue, strategies


ఎం కోటేశ్వరరావు
ఒకరు వ్యూహాన్ని పన్నితే మరొకరు చక్రవ్యూహాన్ని రచిస్తారు. ఆర్ధిక లేదా యుద్ద రంగం, పోటీ ఉన్న దేనిలో అయినా పై చేయి సాధించేందుకు పోటీ పడేవారు చేసిందీ, చేసేది, చేస్తున్నదీ ఇదే. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌లకు బాసటగా అటూ ఇటూ మోహరించిన వారిని గమనించాము. ఎటూ చేరకుండా తటస్దంగా ఉంటూ మన ప్రయోజనాలను సాధించుకొనేందుకు, అమెరికా బాధిత దేశాలకు మనవంతు సాయం చేసేందుకు మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని చూశాము.
ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేదు. ప్రచ్చన్న యుద్దం ముగిసింది, తామే విజేతలమని అమెరికా ప్రకటించినప్పటికీ కమ్యూనిజం వ్యాప్తి నిరోధ లక్ష్యంగా ప్రారంభమైన ఆ యుద్దం నిజానికి ముగియలేదు. ప్రచ్చన్న యుద్దం 2.0 ప్రారంభమైందనే చెప్పవచ్చు. అమెరికా ప్రధాన లక్ష్యంగా సోవియట్‌ యూనియన్‌ స్ధానంలో చైనా వచ్చింది. అయితే నాటికీ నేటికీ అగ్రరాజ్యంగా అన్ని రంగాలలో అమెరికాయే ముందున్నది. సామ్రాజ్యవాదుల కుట్రలకు సోవియట్‌ బలైతే చైనా కమ్యూనిస్టు పార్టీ జాగరూకత కారణంగా తియన్మెన్‌ స్వేర్‌ నిరసన రూపంలో అక్కడి సోషలిస్టు వ్యవస్దకు తలపెట్టిన ముప్పును తప్పించారు. మూడు దశాబ్దాల నాటికీ నేటికీ పరిస్ధితిలో ఎంతో మార్పు వచ్చింది.చైనా అన్ని విధాలుగానూ ఎంతో బలపడింది, అమెరికాతో సమంగా ఉందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. అదే సమయంలో నేటి అమెరికా ముందు ఎన్నో సవాళ్లు ఉన్న విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
ఇప్పుడు అలీన విధానమూ లేదు, దాన్ని పునరుద్దరించి నాయకత్వం వహించాలని మన (పాలకవర్గం) దేశమూ కోరుకోవటం లేదు. సోవియట్‌ను చూపి అమెరికా వద్ద, అమెరికాను చూపి సోవియట్‌ నుంచి ప్రయోజనాలు పొందేందుకు అనుసరించిన వ్యూహం నుంచి తప్పుకొని అమెరికాతో రాజీపడి తానూ స్వతంత్రంగా ఎదగాలన్నది మన పాలకవర్గ ఎత్తుగడగా మొత్తం మీద చెప్పవచ్చు. అందకనే కొన్ని అంశాలలో ప్రతిఘటన కూడా ఉంటోంది. అణుపరీక్షలను జరిపినపుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. అయినా మన విదేశాంగ విధానంలో దానికి అనుకూలమైన మార్పు వచ్చింది. ఈ నేపధ్యంలోనే చైనా ముత్యాల హారాన్ని చూడాల్సి ఉంది. అలీన విధానంలో స్వతంత్రంగా ఉండటంతో పాటు అమెరికా దుశ్చర్యలను అనేక సందర్భాలలో వ్యతిరేకించాల్సి వచ్చినపుడు సోవియట్‌ అనుకూల శిబిరంలో ఉన్నట్లు మన దేశం కనిపించింది. కొన్ని విధానాలలో సారూప్యత, సామీప్యత ఉన్నందువలన అలాంటి అభిప్రాయం కలిగింది. దాని వలన మనకు జరిగిన నష్టమేమీ లేదు. ఆర్ధికంగా ఎంతో లబ్ది పొందాము. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో మనం అనేక విజయాలు సాధించామంటే దానికి సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అందిస్తున్న సహకారం తప్ప మరొకటి కాదు. ఈ ప్రయోగాలను దెబ్బతీసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేసింది.
సర్వేజనా సుఖినోభవంతు, వసుధైక కుటుంబాన్ని కోరుకొన్న విశాల భావాన్ని మన పూర్వీకులు వ్యక్త పరిచారు. మన పౌరుల సంక్షేమంలో అగ్రస్ధానంలో అంటే మనం అన్ని రంగాలలో ముందుండాలి అనే భావంతో పోటీపడటం, ఆలోచించటం తప్పు కాదు. భారత్‌ మాత్రమే ఉండాలి అంటే అది జాతీయవాదానికి బదులు జాతీయ దురహంకారం అవుతుంది. సమస్యలు వస్తాయి. ఈ మాట చెప్పిన వారిని దేశద్రోహులు అని చిత్రించినా ఆశ్చర్యం లేదు. జాతీయ దురహంకారానికి అమెరికాయే ఉదాహరణ. అలాంటి అమెరికా అడుగులకు మనం మడుగులొత్తుతున్నామా లేదా అనే అభిప్రాయాలను చర్చించటం,దానిలో భాగంగా విమర్శలు చేయటం జాతి వ్యతిరేకం కాదు, ద్రోహమూ కాదు. అమెరికా అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అనేక విధానాలను అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకించి రోడ్డెక్కిన ఉదంతాలు ఎన్నో. వియత్నాంపై దాడి చేయటాన్ని నిరసిస్తూ యువత ఆ సమయంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. జాతీయంగా వర్ణవివక్షను పాటించటాన్ని, అణచివేయటాన్ని ఎలా నిరసించారో ఇటీవలనే జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంలో చూశాము.
మన పాలకవర్గం లేదా పాలకపక్షం తీసుకుంటున్న విదేశీ, స్వదేశీ విధానాలు, తప్పిదాలు వాటి మద్దతుదార్లకు కనిపించవు. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ పాలకుల మీద విమర్శలు చేసేందుకు సంఘపరివార్‌ సంస్ధలైన బిజెపి వంటివి ఎలా హక్కును కలిగి ఉన్నాయో, పాలక పార్టీగా బిజెపి అనుసరిస్తున్న విధానాలను విమర్శించే హక్కు ఇతరులకూ ఉంటుందా లేదా ?
2020 జూలై ఒకటవ తేదీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక బిజెపి ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రామ్‌ మాధవ్‌ ఇంటర్వ్యూను ప్రచురించింది. ”గత నాలుగైదు సంవత్సరాలలో భారత విధానంలో వచ్చిన మార్పు చైనాను అప్రమత్తం గావించింది, డోక్లాం వారికి పెద్ద కుదుపు ” అన్నది దాని శీర్షిక. గత శతాబ్దిలో పసిఫిక్‌ అట్లాంటిక్‌ కేంద్రంగా సాగిన పశ్చిమ ఐరోపా-అమెరికా కూటమి ప్రపంచ అధికార పంపిణీ ఇప్పుడు ఇండో-పసిఫిక్‌ వైపు మారిందని, ఈ ప్రాంతంలో ఒక ముఖ్య అధికార శక్తిగా ఉన్న మనం ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధం కావాలని రామ్‌ మాధవ్‌ చెప్పారు. ఆసియాలో చైనా తరువాత మన దేశానికి ఉన్న స్ధానం తెలిసిందే. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించాలనుకోవటంలో కూడా తప్పులేదు. ఆ పాత్ర స్వభావం ఎలా ఉండాలన్నదే అసలైన ప్రశ్న. అయితే బిజెపినేతలు తామేదో ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యపాత్రకు కొత్తగా తెరలేపుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలీన ఉద్యమం ద్వారా మన దేశం గతంలోనే ఒక ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే.
తమ నేత నరేంద్రమోడీకి ఘనతను ఆపాదించేందుకు గత నాలుగైదు సంవత్సరాలలో మన విధానంలో వచ్చిన మార్పు అని బిజెపి రామ్‌ మాధవ్‌ చెప్పవచ్చుగానీ మన దేశ వైఖరిలో మార్పు యుపిఏ కాలంలోనే ప్రారంభమైంది. అమెరికా అనుకూల వైఖరికి వ్యతిరేకంగా వామపక్షాలు యుపిఏకు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఒక విధాన మార్పు తెల్లవారేసరికి రాదు.
చైనాను దెబ్బతీసేందుకు దాని చుట్టూ అమెరికా ఎప్పటి నుంచో వ్యూహం పన్నుతోంది. సహజంగానే చైనా కూడా ప్రతి వ్యూహాన్ని అమలు జరుపుతోంది. ఏ దేశమూ మిలిటరీ వ్యూహాలు, లక్ష్యాలను బహిరంగంగా చెప్పదు.చైనా కూడా దానికి మినహాయింపు కాదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసి జపాన్‌ లొంగిపోయిన తరువాత ఆరు సంవత్సరాలకు అమెరికా -జపాన్‌ రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. అసలు విషయం చెప్పాలంటే అమెరికా బలవంతంగా జపాన్‌ మీద ఒప్పందాన్ని రుద్దింది. బాధ్యతా రహిత మిలిటరీవాదం ప్రపంచంలో ఇంకా ఉందనే సాకును చూపి నిరాయుధం గావించిన జపాన్‌ మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంది. జపాన్‌లో అమెరికా సైన్యాన్ని, సైనిక స్దావరాలను ఏర్పాటు చేసేందుకు జపాన్‌ అంగీకరించింది. అంతే కాదు అమెరికా అనుమతి లేకుండా మరోదేశం సైనిక కేంద్రాల ఏర్పాటు సైనిక సంబంధ అనుమతులు జపాన్‌ ఇవ్వకూడదు. ఇది వియత్నాంలో 1945లో చైనాలో 1948లో కమ్యూనిస్టులు అధికారానికి రావటం, ఇండోనేషియా, కంబోడియా, లావోస్‌లలో కమ్యూనిస్టులు ఒక బలమైన శక్తిగా ఉన్న నేపధ్యంలో ఇది జరిగిందని గమనించాలి. అప్పటి నుంచి చైనాను ఇబ్బందులు పెట్టేందుకు అమెరికా చేయాల్సిందంతా చేసింది. తైవాన్‌లో కేంద్రీకృతమైన కమ్యూనిస్టు వ్యతిరేక మిలిటరీని బలోపేతం గావించింది. మయాన్మార్‌లో తిష్టవేసిన కమ్యూనిస్టు వ్యతిరేక చైనా సైన్యాన్ని కొంత కాలం అమెరికా పోషించి దాడులు చేయించింది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐక్యరాజ్యసమితిలో స్దానం లేకుండా తిరుగుబాటు తైవాన్‌ను అసలైన చైనాగా చలామణి చేయించింది.
అమెరికా వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు చైనా తన ఎత్తుగడలను తాను అమలు చేస్తోంది. దానికి ముత్యాల హారం పధకం అని మన మీడియా విశ్లేషకులు నామకరణం చేశారు. వాణిజ్య, దౌత్య, సముద్ర మార్గాలు, మిలిటరీ లక్ష్యాలతో చైనా తన పధకాన్ని అమలు జరుపుతోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం ప్రాంతాలలో ఉన్న మయన్మార్‌లోని సిటివెక్యాకుపు, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌, శ్రీలంకలోని హంబంటోటా, పాకిస్ధాన్‌లోని కరాచీ, గ్వాదర్‌ రేవులు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నది. ఇవన్నీ మన దేశం చుట్టూ ఉన్నాయి. ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2017లో అక్కడికి చైనా మిలిటరీ ప్రయాణించింది. ఈ సైనిక కేంద్రం ఎర్ర సముద్ర ప్రారంభంలో ఉంది. మధ్యధరా-ఎర్ర సముద్రాన్ని కలిపే సూయజ్‌ కాలువ ద్వారా ప్రయాణించే తమ నౌకలకు జిబౌటీ పరిసరాల్లోని సముద్రపు దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు, శాంతి పరిరక్షక కార్యకలాపాలకు, మానవతా పూర్వక సాయం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చైనా చెబుతున్నది. చైనా కంటే ముందే ఇక్కడ అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ సైనిక కేంద్రాలు చిన్నా పెద్దవి ఉన్నాయి. ఏ దేశమైనా ఆ కేంద్రాలకు సైన్యాన్ని తరలించవచ్చు, కానీ చైనా మాత్రమే అందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశానికి అతి సమీపంలో మారిషస్‌కు చెందిన డిగోగార్షియాలో అమెరికా సైనిక కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని మారిషస్‌కు అప్పగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది, బ్రిటీష్‌ వారు తమకు లేని అధికారంతో అమెరికాకు ఆ దీవులను కౌలుకు ఇవ్వటం చెల్లదని అంతర్జాతీయ న్యాయ స్ధానం తీర్పు చెప్పింది. అయినా వైదొలిగేందుకు ఆ రెండు దేశాలు మొరాయిస్తున్నాయి. చైనా-పాకిస్ధాన్‌ ఆర్ధిక నడవా(సిపిఇసి)లో భాగంగా గ్వాదర్‌ రేవును అభివృద్ధి చేశారు. యుద్ధ పరిస్థితి వస్తే మన దేశంమీద పశ్చిమం వైపు నుంచి చైనా దాడి చేసేందుకు దీన్ని ఉద్దేశించారన్న ఆరోపణలు ఉన్నాయి. చిట్టగాంగ్‌ రేవులో చైనా కేంద్రాన్ని కూడా అదే విధంగా చూస్తున్నారు. ఇవిగాక మాల్దీవులు, షెషల్స్‌లో కూడా చైనా సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటోంది.
దక్షిణ చైనా సముద్రం-బంగాళాఖాతాన్ని కలిపే మలక్కా జలసంధి ప్రాంతం చైనాకు ఎంతో కీలకమైనది. చైనా దిగుమతి చేసుకొనే చమురులో 80శాతం మధ్య ప్రాచ్యం నుంచి ఈ మార్గం ద్వారానే చైనాకు రావలసి ఉంది. అందువలన ఈ ప్రాంత దేశాలతో చైనా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేందుకే నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. ఎవరైనా అదే చేస్తారు. తూర్పు కార్యాచరణ విధానం పేరుతో మన దేశం కూడా ఆ ప్రాంత దేశాల మీద పలుకుబడిని పెంచుకొనేందుకు పూనుకుంది. మయన్మార్‌కు 175కోట్ల డాలర్ల గ్రాంటు మరియు రుణం, బంగ్లాదేశ్‌కు 450 కోట్ల డాలర్ల రుణ వాగ్దానం, చైనాకు దగ్గరగా ఉండే మధ్య ఆసియా దేశాలైన తుర్కుమెనిస్ధాన్‌, ఉజ్బెకిస్ధాన్‌, కిర్ఖిజిస్తాన్‌, కజకస్తాన్‌, మంగోలియా దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఆర్ధికపరమైన దౌత్యం ద్వారా ఇతర దేశాలను ఆకట్టుకొనే విషయంలో చైనాతో మనం పోటీ పడే స్ధితిలో లేము అన్నది ఒక మింగుడుపడని వాస్తవం. ఈ నేపధ్యంలో ఏమి చేయాలి అన్నది సమస్య. తమ వస్తువులను కొనుగోలు చేయాలని ఏ దేశాన్ని అయినా చైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. తమ దేశంలో తయారు చేసుకోవటం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకొని విక్రయించటమే లాభదాయకమని అమెరికా కార్పొరేట్లే అందుకు శ్రీకారం చుట్టాయి. మన వ్యాపారవేత్తలు మడి కట్టుకొని ఎలా కూర్చుంటారు ?
2019లో చైనా 421 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్య మిగులుతో ఉండగా మన దేశం 153 బిలియన్‌ డాలర్ల లోటులో ఉంది. కనుక ఆర్ధిక దౌత్యంలో దానితో పోటీ పడే అవకాశం లేదు. అయినంత మాత్రాన చైనాకో మరొక దేశానికో అణగి మణగి ఉండాల్సిన అవసరం లేదు. తిరుగులేని అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాతో చైనా ఏనాడూ రాజీ పడలేదు. మన ప్రయోజనాలను మనం రక్షించుకోవాలి, ఎదగాలి, అందుకు అనువైన స్వంత, స్వతంత్ర మార్గాలను ఎంచుకోవాలి. దానికి బదులు ప్రమాదకరమైన అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా కూటమి కట్టి మన సాధించేదేమిటన్నది ప్రశ్న. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వీరతాడు వేసుకొని వీరంగం వేస్తున్నది. మన దేశంలోని బిజెపి కమ్యూనిజానికి వ్యతిరేకంగా అలాంటి వీరంగం వేస్తోంది. అయితే ఇంతవరకు మన దేశంగా అనుసరించిన విధానం కమ్యూనిస్టు వ్యతిరేకమైనది కాదు. లేదూ మేము కూడా అమెరికా బ్యాండ్‌లో చేరతామంటే అది బహిరంగంగా ప్రకటించాలి.
చతుర్ముఖ భద్రతా సంభాషణ పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా,భారత్‌తో ఒక కూటమిని కట్టేందుకు అమెరికా పావులు కదుపుతోంది. 2007నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఆసియన్‌ ఆర్క్‌ ఆఫ్‌ డెమోక్రసీ (ఆసియా ప్రజాస్వామ్య విల్లు) అని ఒక ముద్దుపేరు పెట్టారు. ఈ విల్లును ఎవరి మీద ఎక్కు పెట్టినట్లు ? ఈ కూటమిని తనకు వ్యతిరేకంగా తయారవుతున్న దుష్ట చతుష్టయం అని చైనా భావిస్తోంది. వాటి ప్రతి చర్యనూ అనుమానంతో చూస్తోంది. నిజానికి ఈ దేశాలకు ఎవరి నుంచి ముప్పు తలెత్తినట్లు ? అమెరికా తన పెత్తనాన్ని రుద్దేందుకు కుట్ర సిద్ధాంతాలను నిరంతరం ముందుకు తెస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు దేశాల మధ్య తంపులు పెట్టి నిరంతరం తన ఆయుధాలను, అదిరించి బెదిరించి తన వస్తువులను అమ్ముకొని లబ్ది పొందే ఎత్తుగడ తప్ప దానికి మరొక పని లేదు.ఐరోపాలో సాగిన అనేక యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ఐరోపా సామ్రాజ్యవాదులు, వారితో చేతులు కలిపిన జపాన్‌ తప్ప మరొక దేశం కారణం కాదు. చతుర్ముఖ భద్రతా సంభాషణ నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రారంభంలోనే ఆస్ట్రేలియా ప్రకటించటంతో కొన్ని సంవత్సరాల పాటు ముందుకు సాగలేదు. అక్కడ పాలకులు మారిన తరువాత 2017లో ఆసియన్‌ సమావేశాల సందర్భంగా తిరిగి ఈ నాలుగు దేశాలు కూటమిని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించాయి. దానిలో భాగంగానే మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరిపాయి. ఈ నేపధ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూలో బిజెపి నేత రామ్‌ మాధవ్‌ ”గత నాలుగైదు సంవత్సరాలలో భారత విధానంలో వచ్చిన మార్పు చైనాను అప్రమత్తం గావించింది, డోక్లాం వారికి పెద్ద కుదుపు ” అంటూ చెప్పిన అంశాలకు, తాజా సరిహద్దు ఉదంతాలకు సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ?
గాల్వాన్‌ లోయలో ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు,అసలేం జరిగింది అన్నది ఇప్పటికీ బ్రహ్మపదార్దంగానే ఉంది. చైనీయులు మన ప్రాంతాల్లో లేరు, మన సైనిక పోస్టులను ఆక్రమించలేదు, చొచ్చుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టాము అని అని మన ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన గందరగోళాన్ని కలిగించింది. ప్రధాని ప్రసంగాన్ని వక్రీకరించారంటూ ప్రభుత్వం చెప్పిన వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలను ముందుకు తెచ్చింది. రామ్‌ మాధవ్‌ మాటల పూర్వరంగంలో గాల్వాన్‌ ఉదంతానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలను చూడకుండా సమగ్రత రాదు. డోక్లాం ప్రాంతం చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం. మన సిలిగురి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. నివాస యోగ్యం గాని ఆ ప్రాంతానికి ఆనుకొన్ని ఉన్న కొంత ప్రాంతాన్ని తమకు అప్పగించి దాని బదులు వేరే ప్రాంతాన్ని తీసుకోవాలని రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సంప్రదింపులు జరుగుతున్నాయి తప్ప అంగీకారానికి రాలేదు.2017లోమన సైన్యం ఆ ప్రాంతానికి వెళ్లి చైనా ప్రాంతంలో ఉన్న చైనా మిలిటరీతో మోహరించింది. అక్కడ తలపెట్టిన నిర్మాణాలను చైనా వాయిదా వేసింది తప్ప వెనక్కు తగ్గిందీ లేదు, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిందీ లేదు. అణు సరఫరా దేశాల గ్రూపులో చేరాలన్న మన దేశ వాంఛను చైనా అడ్డుకుంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందంపై భారత్‌ సంతకం చేస్తేనే తాము అంగీకరిస్తామని చెప్పింది. భారత్‌, పాకిస్ధాన్‌, ఇజ్రాయెల్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ మూడింటితో పాటు కొత్త దేశమైన దక్షిణ సూడాన్‌ కూడా ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు మన ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌, అది చైనా అంతర్భాగమని అధికారయుతంగా మన దేశం గుర్తించింది. కానీ తైవాన్‌లోని చైనా వ్యతిరేకశక్తులు అక్కడ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి బిజెపి ఇద్దరు ఎంపీలను దానికి పంపాలని నిర్ణయించటం చైనాను రెచ్చగొట్టే చర్య అవుతుందా మిత్ర చర్యా ? కరోనా కారణంగా వారు వెళ్లలేదు గానీ ఇంటర్నెట్‌ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత-చైనా సంబంధాలలో దలైలామా ఒక పెద్ద సమస్య.చరిత్రలో టిబెట్‌ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేదు. వివిధ చైనా రాజరికాలలో స్వయంపాలిత ప్రాంతంగా చెప్పుకోవటం తప్ప స్వతంత్ర దేశంగా ఎన్నడూ లేదు.క్వింగ్‌ రాజరికాన్ని కూల్చివేసిన తరువాత 1912లో ఏర్పడి 1949వరకు ఉన్న జాతీయ ప్రభుత్వం కూడా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించలేదు. తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. అమెరికా, ఇతర దేశాల జోక్యంతో దలైలామా తదితరులు కమ్యూనిస్టుల అధికారాన్ని గుర్తించేందుకు తిరస్కరించటమే గాక చివరకు 1959లో తిరుగుబాటు చేశారు. చైనా ప్రభుత్వం దాన్ని అణచివేసిన తరువాత దలైలామా మన దేశానికి పారిపోయి వచ్చి ధర్మశాల కేంద్రంగా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏ దేశమూ గుర్తించలేదు. అమెరికా, మన దేశం కూడా నిధులు సమకూర్చింది. దలైలామా తరువాత దాన్నుంచి వైదొలిగి ఇతరులకు బాధ్యత అప్పగించాడు. దలైలామా, ఇతర తిరుగుబాటు టిబెటన్‌ నేతలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అధికార ప్రతినిధులెవ్వరూ హాజరు కావద్దని 2018లో మన విదేశాంగశాఖ ఆదేశించింది. ఆ చర్య చైనా వత్తిడికి లొంగినట్లు కాదా అన్న ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిధి ప్రశ్నకు తనకు అసలా విషయం తెలియదని రామ్‌ మాధవ్‌ సమాధానమిచ్చారు. ఇది తప్పించుకొనే గడుసుదనం తప్ప నిజాయితీతో కూడింది కాదు. దలైలామా తిరుగుబాటు, భారత రాక, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించటం 1962లో భారత-చైనా యుద్ద పరోక్ష కారణాలలో ఒకటన్నది బహిరంగ రహస్యం. టిబెట్‌ను చైనా ప్రాంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ గుర్తించదు. తాజాగా దలైలామా 84వ జన్మదినంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కొందరు బిజెపి పెద్దలు బహిరంగంగానే చెప్పటాన్ని ఏ విధంగా చూడాలి. ఇప్పుడు కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాలు, రానున్న బీహార్‌ ఎన్నికల నేపధ్యంలోనే సరిహద్దు సమస్యలని ఎవరైనా విమర్శిస్తే వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు అవుతారా ?అన్నింటికీ మించి బిజెపికి అవసరమైనపుడే ఉగ్రవాద దాడులు, సరిహద్దు సమస్యలు తలెత్తుతాయని గతంలో వచ్చిన విమర్శ తెలిసిందే.తాము అటువంటి వాళ్లం కాదు,పునీతులమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత బిజెపి మీద లేదా ! అనేక మంది మన దేశాన్ని డ్రాగన్‌(చైనా) కోరల్లో పెట్టామని చెప్పేవారు ఉన్నారు. ఎవరి అభిప్రాయం వారిది. మన నరేంద్రమోడీ గారు దాన్నుంచి రక్షించేందుకు ఆరు సంవత్సరాల్లో తీసుకున్న చర్యలేమీ లేవు. పాకిస్ధాన్‌ మీద మెరుపుదాడులు చేశామని మన జనాన్ని సంతృప్తి పరచారు. చైనా మీద అటువంటి అవకాశాలు లేవు. దాంతో జన సంతుష్టీకరణలో భాగంగా చైనా తయారీ యాప్‌లను నిషేధించి డిజిటల్‌ స్ట్రైక్‌ చేశాం చూశారా అన్నట్లు జనం ముందు నిలిచారు. ఈ చర్య దిగజారిన మన ఆర్ధిక వ్యవస్ధను ఏమాత్రం మెరుగుపరిచినా సంతోషమే. పెద్ద నోట్ల రద్దుతో ఏదో ఒరగబెడతామని చెప్పి జనాన్ని హతాశులను చెయ్యకుండా ఉంటే సంతోషమే. డ్రాగన్‌ కోరల నుంచి తప్పించుతామంటూ అమెరికా దృతరాష్ట్ర కౌగిలిలోకి తీసుకుపోతున్నారని చెబితే, ఆలోచించాల్సిందే అని ఒక్కరు అనుకున్నా చాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d