• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: May 2021

టూల్‌ కిట్‌ ఉదంతం : నరేంద్రమోడీ పరువు తీస్తున్నది ? బిజెపి పెద్దలా ? కాంగ్రెస్‌ నేతలా !

19 Wednesday May 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress Toolkit case, Disa Ravi, Naked King, Narendra Modi Failures, Parul Khakhar


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీని అర్ధం ఇంకేమీ లేవని, కనిపించటం లేదని కాదు. మచ్చుకు పదకొండు సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ఏప్రిల్‌ నెలలో టోకు ధరల పెరుగుదల 10.5శాతంగా నమోదైంది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆగిపోయిన చమురు ధరల పెరుగుదల ఫలితాలు వచ్చిన తరువాత నుంచీ రోజు రోజుకూ ఎలా పెరుగుతోందో కనిపిస్తూనే ఉంది. ఇక ప్రధాన దృశ్యాలలో ఒకటి తమను ఎప్పుడు ఎలా కబళించి ఏం చేస్తుందో అన్న భయంతో వణికి పోతున్న దేశ ప్రజలు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ బిజెపి నేతలు గుండెలు బాదుకుంటున్నది రెండవది. మొదటి దాని విషయానికి వస్తే వైద్య సౌకర్యాలు సరిగా లేవు, చెట్ల కింద చికిత్స చేస్తున్నారంటూ మీడియాకు చెప్పిన గ్రామీణులపై మాన్యశ్రీ యోగి ఆదిత్యనాధ్‌ గారి ఏలుబడిలోని ఉత్తర ప్రదేశ్‌ గౌతమ బుద్ద నగర్‌ జిల్లా పోలీసులు పుకార్లు వ్యాపింప చేస్తున్నారంటూ మీడియా ఫొటోలు వచ్చిన తరువాత కూడా కేసులు పెట్టారు. ఇక రెండవ దాని విషయంలో బిజెపి పెద్దలను తప్పుపట్టాల్సిన పని ఏముంది ఎవరికి ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యత కదా ! వినూత్న దుస్తుల రాజు పాలనలో ఇంతకంటే మరొకటి జరుగుతుందా !


బిజెపి నేతలు గుండెలు బాదుకుంటున్న దారుణం ఏమిటట ! కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని ప్రధాని నరేంద్రమోడీ, ఇతర కేంద్ర మంత్రుల ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా దేశ విదేశాల్లో ప్రచారం చేయాలంటూ కాంగ్రెస్‌ తన శ్రేణులకు అందచేసేందుకు రూపొందించిన ఒక రహస్య టూల్‌ కిట్‌ బయటపడిందట. బిజెపి నేతలు వర్ణించిన దాని ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా మహమ్మారిని ” మోడీ (రకం) వంశ ” రకం అని వర్ణించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు, టీవీల్లో మాట్లాడే వారికి, ప్రకటనలు చేసే అధికార ప్రతినిధులకు, ఆ పేరుతో వర్ణనలు చేస్తూ రాయాలని, చర్చల్లో మాట్లాడాలని దేశ, విదేశీ జర్నలిస్టులను ప్రభావితం చేయాలని దానిలో ఉందని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర చెబుతున్నారు. ఆ పత్రాల్లో మోడీ వైరస్‌, భారతీయ వైరస్‌, తప్పి పోయిన అమిత్‌ షా, క్వారంటైన్‌లో జై శంకర్‌, మంద బుద్ది నిర్మలా సీతారామన్‌, పక్కకు తప్పించిన రాజనాధ్‌ , కుంభమేళాతో పెద్ద ఎత్తున వైరస్‌ వ్యాప్తి తదితర అంశాలను ప్రచారం చేయాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. నరేంద్రమోడీని ద్వేషిస్తే అది దేశాన్ని ద్వేషించినట్లే అని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌ భాష్యం చెప్పారు. ఇందిరే ఇండియా – ఇండియాయే ఇందిర అని గతంలో డికె బారువా అనే కాంగ్రెస్‌ పెద్దమనిషి చెప్పిన అంశాన్ని ఇది గుర్తు చేసింది.


అలాంటి టూల్‌కిట్‌ తాము తయారు చేయలేదని, అది కల్పితం అని కాంగ్రెస్‌ చెబుతోంది. తమ పార్టీ లెటర్‌ హెడ్‌ను ఫోర్జరీ చేసి దాని మీద కల్పిత, కట్టుకథలతో ఉన్న అంశాలను ముద్రించి సామాజిక మాధ్యమంలో ఇతరులకు పంచినందుకు గాను ఢిల్లీలో ఒక కేసును నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసు కమిషనరుకు ఫిర్యాదు చేసింది. దానిలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ నేతలు సంబిత్‌ పాత్ర, బిఎల్‌ సంతోష్‌ తదితరుల పేర్లను చేర్చింది. మత విరోధం కలిగించేందుకు, వర్తమాన మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితిలో ప్రజలకు సాయం చేయటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యాల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి నేరానికి పాల్పడినట్లు కాంగ్రెస్‌ పేర్కొన్నది.


ఇక్కడ ప్రతి వారూ గమనించాల్సిన అంశం ఏమంటే మన దేశానికి చెందిన రాజకీయ పార్టీలు, సంస్ధలు దేశంలో, వెలుపలా కొన్ని ఫేక్‌ న్యూస్‌, ఫొటోలు, రచనలను తయారు చేసే ఫ్యాక్టరీలను నడుపుతున్నాయి. సామాజిక మాధ్యమం ద్వారా వాటిని వ్యాపింప చేస్తున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో వస్తూత్పత్తి లేదు గానీ ఇవి పుష్కలంగా తయారవుతున్నాయి. అలాంటి వాటిలో తమకు ఆపాదించిన టూల్‌కిట్‌ను తాము తయారు చేయలేదని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత దానిలోని అంశాల గురించి చర్చ జరపటంలో అర్ధం లేదు. కానీ బిజెపి వారు దాన్ని అంగీకరించటం లేదు, మీరే తయారు చేశారు అంటూ ఇవిగో అంశాలని అధికారికంగా చెబుతున్న మాటలు, ప్రచారాన్ని చూసిన తరువాత వారి తీరుతెన్నుల గురించి చర్చించాల్సి వస్తోంది. కరోనా రెండవ తరంగాన్ని గుర్తించటంలో, జాగ్రత్తలు తీసుకోవటంలో వైఫల్యంతో దిక్కుతోచని మోడీ యంత్రాంగ ప్రచారదాడిలో ఇది ఒక ఆయుధం. మన దేశంలో ఇంటర్నెట్‌ను ఎందరు ఉపయోగిస్తున్నారు. వారిలో సామాజిక మాధ్యమంలో ఎందరు ఉన్నారు. బిజెపి నేతలు అందచేస్తున్న వాటిని పంచుకొనే వారు ఎందరు, వారు ఎవరు అన్నది ప్రశ్న. చాలా తక్కువ అన్నది జవాబు. కానీ బిజెపి నేతలు చేసిన ప్రకటనలు, దాని మీద కాంగ్రెస్‌ స్పందన వార్తలను పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకున్నవారే ఎక్కువ. వారందరూ నరేంద్రమోడీకీ అంటించదలచిన లేదా అంటించినట్లు చెబుతున్న మచ్చ – రచ్చ గురించి చర్చించుకోవటం సహజం. ఆక్సిజన్‌ కూడా అందించలేని కేంద్ర నిర్వాకం చూసి విస్తుపోతున్న వారు ఒక వేళ కాంగ్రెస్‌ వారు నిజంగా అంటే మాత్రం తప్పేముందిలే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ కంటే బిజెపి వారే సినిమాల్లో మాదిరి మోడీ మచ్చ గురించి రచ్చ చేశారు. జనానికి ఎక్కువ మందికి తెలియ చేశారు. జనానికి లేని ే ఆలోచనను కలుగ చేశారు. నరేంద్రమోడీ రాజీనామా చేయాలంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్ల స్పందన మీద కాషాయ నటి కంగన రనౌత్‌ వెల్లడించిన ఆగ్రహం తీరు కూడా నరేంద్రమోడీ ప్రతిష్టను మరింత దిగజార్చింది తప్ప పెంచలేదు.


బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ ప్రజలను పట్టించుకోని పాలకుల గురించి ప్రపంచంలో ఒక కధ ఉంది. మన దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. అదేమంటే ” రాజుగారి వింత బట్టలు లేదా దిగంబర మహరాజు ” గురించి చాలా మంది వినే ఉంటారు. గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన కవితలో దిగంబర రాజు గురించి ప్రస్తావన రావటంతో దేశ వ్యాపితంగా ఆమె గురించి జనం మెచ్చుకుంటున్నారు. గతంలో సంఘపరివార పత్రిక ఒకదానిలో భవిష్యత్‌ గుజరాతీ కవయిత్రిగా వెలుగొందుతారు అని ఆమెను ప్రశంసించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె రాసింది మహా కావ్యమేమీ కాదు. దేశంలోని పరిస్ధితులను చూసి చలించి రాసిన పద్నాలుగు పంక్తుల ఆమె కవితలో నగరాజు, బిల్లా-రంగా పదాలకు ఎవరి భాష్యం వారు చెబుతున్నారు. నగరాజు అంటే నరేంద్రమోడీ, బిల్లా-రంగా అంటే మోడీ-అమిత్‌ షా అని సామాజిక మాధ్యమంలో వారి చిత్రాలతో సహా వర్ణించారు. గీతా-సంజరు అనే సోదరీ సోదరుల కిడ్నాప్‌-హత్యలో నేరగాండ్ల పేర్లు వేరే ఉన్నప్పటికీ వారు బిల్లా-రంగాలనే పేర్లతో వ్యవహరించిన వారన్నది తెలిసిందే.


దిగంబర రాజు కధ గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకుందాం. జనం గోడు పట్టని రాజుగారికి దుస్తుల సరదా. కొత్త కొత్తవి వేసుకొని పురవీధుల్లో తిరిగి తన దర్పాన్ని ప్రదర్శించుకోవటం అలవాటు. అలాంటి రాజు ఒక రోజు ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ధరించని వస్త్రాలను తయారు చేసి ఇవ్వాలని నేతగాండ్లను ఆదేశించాడట, అపని చేయకపోతే వారి సంగతి చూస్తానని బెదిరించాడు. దీంతో ఒక తెలివిగల యువకుడు ఒక రోజు ఉదయాన్నే వచ్చి రాజా మీరు కోరిన దుస్తులు తెచ్చాను ధరించండి అని చెప్పాడు. అదేమిటి నీ చేతుల్లో ఏమీ లేవు కదా అంటే రాజా అవి తెలివిగల వారికి మాత్రమే కనిపిస్తాయి, మిగతావారు చూడలేరు అన్నాడట. ఆ విషయం రాజ్యంలో వైరల్‌ అయింది. మరుసటి రోజు ఆ యువకుడు రాజుగారికి బట్టలు వేసినట్లు హావభావాలు ప్రదర్శించాడు. రాజు గారికి బట్టలేమీ కనిపించలేదు. నిండు పేరోలగంలో తెలివిగల వారికే కనిపిస్తాయని చెప్పినందున తనకు కనిపించటం లేదని అంటే తననెక్కడ తెలివి తక్కువ దద్దమ్మ అనుకుంటారో అనుకొని రాజు గారు బాగున్నాయి బాగున్నాయి అని పరివారంతో కలసి పురవీధుల సందర్శనకు వెళ్లాడు. రాజుగారిని విమర్శిస్తే పట్టే గతేమిటో జనానికి తెలుసు, దానికి తోడు తెలివి గలవారికే కనిపిస్తాయని అన్నారు గనుక ఎవరూ కనిపించలేదని చెప్పేందుకు ముందుకు రాలేదు. అయితే ఒక తల్లి చేతిలోని చిన్న పిల్లవాడు రాజుగారు దగ్గరకు రాగానే షేమ్‌ షేమ్‌ పప్పీ షేమ్‌ అంటూ నవ్వాడు. రాజుగారికి కోపం వచ్చి నేరుగా ఆ పిల్లవాడినే అడగ్గా అభశుభం తెలియని బాలుడు మీకు బట్టల్లేవు అందుకని నవ్వా అన్నాడట. వెంటనే రాజుగారికి అర్ధం అయింది.ఆ పిల్లవాడు కల్మషం లేకుండా తాను చూసింది చెప్పినట్లుగానే గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ కూడా కరోనా మరణమృదంగం, గంగలో కొట్టుకువస్తున్న శవాలు, పాలకుల నిర్లక్ష్యంతో దేశంలో ఉన్న పరిస్ధితి గురించి సహజంగానే స్పందించారు.

రైతు ఉద్యమానికి మద్దతుగా దిశా రవి అనే కర్ణాటక యువతి టూల్‌కిట్‌ను సరఫరా చేసిందంటూ దేశద్రోహం కేసును కేంద్ర ప్రభుత్వం బనాయించిన విషయం తెలిసిందే. దిశా రవిపై మోపిన ఆరోపణలో దేశద్రోహం కనిపించలేదంటూ బెయిలు మంజూరు చేశారు. తన గోప్యత ఉల్లంఘన, విచారణ న్యాయంగా జరగాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటీషన్‌ మీద మార్చి నెలాఖరులోగా సమాధానం దాఖలు చేసేందుకు ఆఖరి గడువు ఇస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు గతంలో కేంద్రానికి తెలిపింది. అయినా స్పందించలేదు. కరోనా కారణంగా దాఖలు చేయలేకపోయినట్లు మే 18వ తేదీన కేంద్రం చెప్పటం మీద హైకోర్టు మండిపడింది. ఆఖరి అవకాశం అంటే అర్ధం తెలియదా అని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆగస్టు నాటికి వాయిదా వేసింది.


ఇక టూల్‌కిట్ల విషయానికి వస్తే ప్రతి పార్టీ తన ప్రతినిధులు, టీవీ చర్చలలో పాల్గొనే వారికి, తమ అనుయాయి టీవీ ఛానళ్లు, రాతలు రాసే జర్నలిస్టులు, పత్రికలకు ప్రతి రోజూ ఒక టూల్‌కిట్‌ అందిస్తుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యం. వాటిని పట్టుకొని వారు తమ పాత్రలను తాము పోషిస్తారు.సింగపూర్‌ కరోనా వైరస్‌ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ చేసిన ప్రకటన బాధ్యతా రహితమని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తప్పు పట్టారు. ఒక ముఖ్యమంత్రిగా కేజరీ వాల్‌ అలా వర్ణించటం తగనిపని, తప్పదమే. ఒక వైరస్‌కు ఒక దేశం, ఒక ప్రాంతం, జాతి వంటి పేర్లను ఉపయోగించకూడదన్నది అంతర్జాతీయ ఒప్పందం. కానీ ఊహాన్‌, చైనా, కమ్యూనిస్టు వైరస్‌ అంటూ చర్చలలో బిజెపినేతలు ఉపయోగించటం తెలిసిందే. అలా ఉపయోగించకూడదని ఎన్నడూ బిజెపి బహిరంగప్రకటన చేయలేదు. అలా నిందించటం చైనాతో సంబంధాలను మెరుగుపరుస్తాయని అనుకుంటున్నారా ?

దిశ రవి టూల్‌కిట్‌ను పంచుకోవటం(షేరింగ్‌) దేశద్రోహంగా వర్ణించిన బిజెపి నేతలు ఇదిగో కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ అంటూ తాము అభ్యంతరం చెబుతున్నదానికి ఎందుకు తమ అనుయాయులతో పంచుకున్నట్లు ? అభ్యంతర వర్ణణలను ఎందుకు తామే వ్యాప్తి చేస్తున్నట్లు ? కాంగ్రెస్‌ టూల్‌ కిట్‌ నిజమైనదే అయితే అది నిజంగా ప్రధాని, ఇతర నేతలకు మచ్చ తెచ్చేది, విదేశీ జర్నలిస్టులకు తోడ్పడేదే అయితే బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం కేసు ఎందుకు దాఖలు చేయలేదు, మీడియా పరంగా ఎందుకు సమస్యను ముందుకు తెస్తున్నారనే ప్రశ్న సహజంగానే వస్తుంది. తమ నేతలే తనను గబ్బు పట్టిస్తున్నారనే అంశం నరేంద్రమోడీకి అర్ధం అవుతున్నదా ? అనే సందేహం తలెత్తుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను ఎవరేం కోరుతున్నారు : జనం నెగిటివ్‌ – నరేంద్రమోడీ పాజిటివ్‌ !

18 Tuesday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Coronavirus, COVID-19, Narendra Modi Failures, Negative, Positive, RSS, RSS Mohan Bhagavat, RSS Propaganda


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు జనమంతా తమకు నెగెటివ్‌ రావాలని కోరుకుంటున్నారు- మరోవైపు నరేంద్రమోడీకి పాజిటివ్‌ రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది. ఇదేమిటనుకుంటున్నారా ? అవును నిజం… అవును నిజం. కరోనా వైరస్‌ గురించి జనం నెగెటివ్‌ రావాలని అనుకుంటుంటే – కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యం మీద జనంలో వస్తున్న వ్యతిరేకతను పాజిటివ్‌గా మార్చాలని సంఘపరివార్‌ నడుం కట్టింది. ఆ కసరత్తులో భాగంగా అనేక చర్యలు తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, ఎత్తుగడలు తెలిసిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. అన్ని తరగతుల్లోనూ ప్రత్యక్ష, పరోక్షంగా తీవ్ర విమర్శలకు గురైన నరేంద్రమోడీని పూర్తిగా భుజాన వేసుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోతాయి.పిర్ర గిల్లి జోల పాడినట్లుగా విమర్శించినట్లూ ఉండాలి- ఆదుకోవాలి అనే ఎత్తుగడలో భాగంగా ” పరిమితులు లేని సానుకూలత ” అనే ఇతివృత్తంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) ఐదు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని ముగింపు వక్తగా భగవత్‌ పాల్గన్నారు. ఆ సంస్ధ ఏర్పాటు చేసిన కరోనా స్పందన బృందంతో కలసి దీన్ని నిర్వహించారు. దీనిలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఇదేవిధమైన ఉద్బోధలు చేశారు. వంద వేదికల ద్వారా ఈ ఉపన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.


అన్నమైతేనేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా వక్తలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. కరోనా తొలి తరంగం తరువాత ప్రభుత్వం-జనం ఇద్దరూ నిశ్చింతగా ఉన్నారు ఇద్దరూ తప్పు చేశారు అందువలన సానుకూలంగా ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం అన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పారు. కరోనా మొదటి దశపై విజయం సాధించామని ప్రకటించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనంగా ఉంది. నిపుణులు చేసిన హెచ్చరికల గురించి ఏం చేశారని ఆరా తీసిందో లేదో తెలియదు. రెండవ దశ పరిస్ధితి ఆందోళనకరంగా తయారైంది. ఇంటా బయటా తీవ్ర విమర్శలు, వైఫల్యాల గురించి జనం మాట్లాడుకోవటం ప్రారంభించగానే ఆ సంస్ధలో ఆందోళన మొదలైంది, నష్ట నివారణ చర్యల్లో భాగంగానే జనానిది, ప్రభుత్వానిది ఇద్దరిదీ తప్పు ఉందంటూ ప్రచారం మొదలు పెట్టింది. జనంలో అసంతృప్తి మోడీ పలుకుబడిని తగ్గిస్తుందా పూర్తిగా దిగజారుస్తుందా అన్న మదింపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాను పెంచి పెద్ద చేసిన వ్యక్తి, ప్రభుత్వం గురించి అలా ఆలోచించటం సహజం. రెండోది జరిగితే పరివార్‌ అజెండాకు ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పుడు గౌరవ ప్రదంగా మోడీని పక్కన పెడతారు. అసంతృప్తి తాత్కాలికమే అయితే కొనసాగిస్తారు. దానికి తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవటం తప్ప వ్యక్తులుగా ఎవరినైనా ఉపయోగించుకుంటుంది.అందుకు ఏమైనా చేస్తుంది.

వాజ్‌పారు బతికి ఉండగా కూడా అందరికీ తెలిసిన, నలుగురిలో నానిన విషయాన్నే ఇప్పుడు ” జుగుల్‌ బందీ ” పేరుతో గ్రంధస్ధంగావించిన వినరు సీతాపతి పేర్కొన్నారు. రాజకుమారి కౌల్‌ అనే వివాహితతో వాజ్‌పేయి సంబంధం తెలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు గురుగోల్వాల్కర్‌, నానాజీదేశముఖ్‌ ఆమెకు దూరంగా ఉండాలని ఇచ్చిన ఆదేశం లేదా హితవును వాజ్‌పేయి తిరస్కరించి జీవితాంతం కొనసాగించారు. ఒకే ఇంట్లో ఉన్నారు. దీని గురించి సంఘపరివార్‌ సర్దుకుపోయింది గానీ వాజ్‌పాయిలో మార్పులేదు. విలువలు-వలువల గురించి కబుర్లు చెప్పే సంఘపరివార్‌ నాయకత్వానికి ఇవన్నీ తెలిసినప్పటికీ వాజ్‌పారు-అద్వానీ ఇద్దరిలో సౌమ్యుడిగా పేరున్న వాజ్‌పారును ప్రధానిగా చేయటం ద్వారా మిగతా పార్టీల మద్దతు కూడ గట్టవచ్చు అన్న దూరాలోచనతో నిర్ణయానికి వచ్చింది. బిజెపి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కె ఎన్‌ గోవిందాచార్య బ్రిటీష్‌ దౌత్యవేత్తలతో మాట్లాడుతూ పార్టీకి వాజ్‌పాయి ఒక ముసుగు మాత్రమే అసలైన నేత అద్వానీయే అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటలతో ఆయన ఉద్యోగం ఊడిందనుకోండి అది వేరే విషయం. తరువాత గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ ” పని తనాన్ని ” చూసిన తరువాత అద్వానీని పక్కన పెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయే అసలు సిసలు వ్యక్తిగా మోడీని గుర్తించి ముందుకు తెచ్చిన కథ తెలిసిందే. కరోనా రూపంలో వచ్చిన మహమ్మారికి మతం లేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా ప్రకారం నడిచేది కాదు గనుక చివరికి మోడీ పదవికి ముప్పు తెచ్చిందా ?


కరోనా వైఫల్యం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ మీద వీర భక్తి ఇప్పటికీ అనేక మందిలో పతాక స్ధాయిలోనే ఉంది. జనానికి ఆక్సిజన్‌ అందించలేకపోతే అదే జనం మోడీ అధికార ప్రాణవాయువును లాగేస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు కార్పొరేట్లకు కూడా మోడీ ” తగిన ” వ్యక్తి అని ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నారు గనుక ప్రధానిగా గద్దెనెక్కించటానికి వారు కూడా ” చేయాల్సిందంతా ” చేశారు. ప్రపంచ బ్యాంకు నమ్మిన బంటుగా అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్లకు ఇష్టుడిగా ఉన్నారు కనుకనే మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాటు పదవిలో కొనసాగారు. ఆయనకు కొన్ని పరిమితులు ఏర్పడిన తరువాత అపరిమిత సానుకూలంగా వ్యవహరించేందుకు నరేంద్రమోడీ సరైన నేతగా కనిపించారు. కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది, కరోనా దాన్ని వేగవంతం చేసింది. ఈ దశలో గత ఏడు సంవత్సరాల మాదిరే కార్పొరేట్లకు దోచిపెడితే జనం ఊరుకోరు, ఒకసారి తినటానికి అలవాటుపడిన కార్పొరేట్లకు వాటా తగ్గితే అవి సహించవు. ఇదే సమస్య. దీన్ని సంఘపరివార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది కొంతకాలం చూడాల్సిందే. అవసరమైతే మరొకరిని ముందుకు తేవాలనుకుంటే కాస్త సద్దుమణిగిన తరువాత చేయాల్సిన పని చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏమీ చేయదు. గతంలో మొరార్జీ దేశారు ప్రభుత్వానికి ముందు రోజు వరకు వీర విధేయుడిగా మాట్లాడిన జార్జిఫెర్నాండెజ్‌ తెల్లవారేసరి ఎలా ప్లేటు ఫిరాయించారో చూశాము. అనేక మంది ప్రముఖులు పార్టీ మారే ముందు కూడా ఇలానే ఉంటున్నారు. పరివారం తలచుకుంటే తెల్లవారే సరికి పరిస్ధితి మారిపోతుంది.భక్తులు కొత్త దేవుడి భజనకు మారటం చొక్కా మార్చినంత సులభం !


కరోనా వైరస్‌ మొదటి దశలో, రెండవ దశలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రతిపక్ష పార్టీలన్నీ సానుకూలంగానే తీసుకున్నాయి. ఎక్కడా వాటికి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపు ఇచ్చిన ఉదంతం లేదు. తమ స్వస్ధలాలకు చేరేందుకు జనానికి తగిన వ్యవధి, రవాణా ఏర్పాట్లు చేయకుండా గతేడాది ప్రకటించిన లాక్‌డౌన్‌, 27లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించిన కేంద్రం వలస కార్మికులు స్వస్ధలాలకు చేరేందుకు అయ్యే రైలు ఛార్జీలను ఎవరు భరించాలనే చిన్న అంశంపై చేసిన రచ్చ , ఆత్మనిర్భర పాకేజి బూటకం గురించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తప్ప మిగతా వన్నీ అపరిమిత సానుకూలమే.


ఇక వర్తమానానికి వస్తే సంఘపరివార్‌ ఇప్పుడు జనంలో మోడీ సర్కార్‌ పట్ల సానుకూల వైఖరిని ఎక్కించేందుకు ఎందుకు పూనుకున్నది అన్న ప్రశ్న. ఇదేమీ సమాధానం చెప్పక పోతే తలలు ఎగిరిపోయే సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న కాదు. దీని గురించి పైనే చెప్పుకున్నాం. నిపుణుల అభిప్రాయాలు, హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన వర్తమాన నీరో, అదృశ్యమైన పాలన, పాలకులంటూ ఒక పత్రిక పెట్టిన శీర్షిక చాలు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటానికి. సజావుగా సాగుతోందనుకుంటున్న తన అజెండా అమలుకు విఘాతం కలిగే విధంగా మోడీ సర్కార్‌ వ్యవహరించిందని సంఘపరివార్‌ గ్రహించటమే ఈ నష్ట నివారణ చర్య. మోహన్‌ భగవత్‌ గారు చెప్పినదాన్ని సానుకూలంగా తీసుకుంటే ప్రభుత్వం- జనం కూడా నిశ్చింతగా ఉన్నారు.ఇద్దరిదీ తప్పే. దాన్నే మరోవిధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేశారు. జనంతో ఉన్నామని చెప్పుకొనే, పరిస్ధితిని ఎప్పటికప్పుడు కన్నార్పకుండా పరిశీలించే పరివార్‌ నిపుణులు ఏం చేస్తున్నారు ? ఆర్నాబ్‌ గోస్వామి వంటి కాషాయ మీడియా పెద్దలేమి హెచ్చరికలు చేశారు అన్నది ప్రశ్న. ఇది ” దేశ భద్రత అంశం ” కనుక సమాధానాలు చెప్పరు. జనం బాధ్యతాయుతంగా వ్యహరించటం లేదనే ప్రచారం గత కొద్ది వారాలుగా సామాజిక మాధ్యమంలో, బిజెపి ప్రతినిధుల చర్చలలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇది, ప్రశ్నించేవారి నోరు మూయించే ఎదురుదాడి వ్యూహం. భగవత్‌గారు ఇచ్చిన సలహా ఏమిటి ? సమాజానికి తోడ్పడాలంటే యోగా చేయాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి. గతేడాది మోడీ గారు ఇచ్చిన గ్లాసులు, పాత్రల మోగింపు, దీపాలు వెలిగింపు కార్యక్రమానికి దీనికి పెద్ద తేడా ఏముంది. అంతేనా కరోనాతో చస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పునర్జన్మ గురించి భారతీయులకు వేరే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది నిర్లక్ష్యం చేసిన జనానికి చెప్పారు బానే ఉంది, మరి లక్షలాది మంది పునర్జన్మకు కారకులౌతున్న నరేంద్రమోడీ గారి సంగతేమిటి ?


” కరోనా తొలి తరంగం తరువాత జనం, ప్రభుత్వాలు, యంత్రాంగాలు దారి తప్పాయని అందరికీ తెలుసు, వైద్యులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ అందరూ ఇప్పటికీ దారి తప్పి ఉన్నారు. అందుకే మనం ఈ రోజు ఈ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు మూడవ తరంగం గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి, అయితే మనం భయపడాలా, కూడదు. అన్ని విబేధాలను మరచిపోయి అందరం ఐక్యంగా పనిచేయాలి. ప్రస్తుతానికి లోపాల చర్చలను నిలిపివేయాలి, ఒక జట్టుగా పనిచేయాలి.” అని భగవత్‌ చెప్పారు.


ఎంత చక్కటి మాట ? నిజంగా అభినందించాల్సిందే. నరేంద్రమోడీ గారు పరివార్‌ కుటుంబ సభ్యుడే. ప్రతి ఏటా తన ప్రభుత్వ పని తీరు గురించి దాని నాయకత్వానికి విధేయుడిగా నివేదించటం తెలిసిందే. సరిగ్గా ” పరిమితులు లేని సానుకూలత ” గురించి ఉపన్యాసాలు ఇప్పిస్తున్న సమయంలోనే పన్నెండు ప్రతిపక్ష పార్టీలు నరేంద్రమోడీకి ఒక లేఖ రాశాయి. అంతకు ముందు ఎలాగూ అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా యుద్దం మీద తీసుకుంటున్న చర్యలను వివరించలేదు, తరువాత అయినా నరేంద్రమోడీ ఎందుకు సానుకూలంగా స్పందించలేదు ? ప్రతిదాన్నీ విమర్శించే ప్రతిపక్షాలతో సమావేశం జరిపి ప్రయోజనం లేదని టీవీల్లో బిజెపి ప్రతినిధుల సమర్ధన. సానుకూల నాటకం భలే సాగుతోంది కదూ !


పుండు మీద కారం రాయటం అంటే ఇదేనా ?

కరోనాతో ఆకస్మికంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు, అనాధలైన పిల్లల గురించి, వీధులపాలైన బతుకుల గురించి రోజూ విషాదకర కథనాలు వెలువడుతున్నాయి.చివరి చూపుకు సైతం నోచుకోవటం లేదు. ఏ రోజు ఎవరి వంతు వస్తుందో తెలియని స్ధితిలో ఉన్న జనానికి భగవత్‌ గారు చెప్పిందేమిటి ? ” భారత పౌరుల గురించి మనకు తెలుసు. జీవన్మరణాల చక్రం తిరుగుతూనే ఉంటుందనీ మనకు తెలుసు. అది ఎలా అంటే పాతపడిన, జీర్ణావస్తలో ఉన్న దుస్తులను మనం ఎలా మార్చుకుంటామో అదే మాదిరి ముసలితనం, పనికిరాని శరీరాన్ని వదలి కొత్త శరీరం కోసం మానవులు ముందుకు పోతారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు మరియు ఈ పరిస్ధితి మనల్ని భయపెట్టటం లేదా కలవరప్టెకూడదు ”
ఇక భగవత్‌ గారు చెప్పిన ఇతర విషయాలకు వస్తే జనం అనుభవంలోకి రాని, శాస్త్రీయంగా రుజువు గాని వాటిని ఆయుర్వేదం పేరుతో చెప్పేవాటిని, శాస్త్రాలు చెప్పని వాటిని నమ్మవద్దని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితిని సమాజం తిరస్కరించాల్సిన అవసరం లేదు, ఏమీ జరగలేదు, అంతా బాగుంది అనే భావాలకు చోటివ్వాలి, శరీరం వైరస్‌ను ప్రతిఘటించాలి, మనస్సు సానుకూలంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఉపాధి, ఆర్ధికరంగాలలో సంక్షోభం, ద్రవ్య సంబంధ వెనుకబాటు తలెత్తనుంది, దానికి మనం సిద్దంగా ఉండాలి.


ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ రవిశంకర్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, అజీమ్‌ ప్రేమ్‌ జీ వంటి వారు ధర్మోపన్యాసాలు చేశారు.సానుకూల ధోరణి అవలంభించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.వారు చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.యోగా, ఆయుర్వేదం రోగ నిరోధక శక్తిని పెంచుతుందనే ప్రచారం ఇప్పటిది కాదు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా అదే పాట పాడారు.
” ప్రభుత్వం పట్ల ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. మీడియాను, వీక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నించటం, ఒకరి నొకరు దెప్పుకోవటం వలన మీరు సమస్యలో భాగం అవుతారు తప్ప పరిష్కారంలో కాదు.దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు తగినన్ని లేవు అయితే తెల్లవారేసరికి మార్పు రాదు.” జగ్గీవాసుదేవ్‌.
మనలో దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని మేల్కొలపాలి. దేవుడు ఉన్నాడని మనకు విశ్వాసం ఉండాలి.మనం బలహీనంగా, నిరుత్సాహంగా ఉన్నట్లు అనుకుంటున్నాము. ఇలాంటి సమయాల్లో నిర్భరతను కోల్లోకూడదు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే వత్తిడి నుంచి దూరం అవుతాము” శ్రీ శ్రీ రవి శంకర్‌.
” అనేక మంది పునర్మజన్మ గురించి పరిశోధనలు చేశారు. అది ఉన్నందున మరణం గురించి భయపడకూడదు. కరోనాతో మరణించినప్పటికీ తదుపరి జన్మలో కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఐదు పది సార్లు ఓం కారాన్ని పలికితే బలం వస్తుంది. సానుకూల వైఖరి కలిగిస్తుంది.” సామాజిక కార్యకర్త నివేదిత భిడే. మూడు నిమిషాలు మాట్లాడిన విప్రో సిఇఓ అజీమ్‌ ప్రేమ్‌ జీ పేదల్లో అత్యంత నిరుపేదలను ఇప్పుడు అదుకోవాలన్నారు. మంచి శాస్త్రాల మీద ఆధారపడిన చర్యలను వేగంగా అన్ని రంగాలలో తీసుకోవాలన్నారు. విబేధాలను మరచి అందరూ ఐక్యం కావాలన్నారు.

కరోనిల్‌ అనే ఔషధం కరోనా చికిత్సకు పనికి వస్తుందనే ప్రచారంతో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్న రామ్‌దేవ్‌ బాబా ఆస్తా టీవీ ఛానల్లో ఆక్సిజన్‌ కొరత గురించి ప్రస్తావించిన వారితో చెప్పిన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూడండి.” మనకు దేవుడు ఇక్కడ రెండు సిలిండర్లు ఇస్తే జనాలు బయట ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం చూస్తున్నారు. వాటిని ఉపయోగించండి అమాయకులారా ” అంటూ గుండెలోని ఊపిరితిత్తులను చూపారు. ”ఇక్కడ రెండు సిలిండర్లు ఉన్నాయి. మీ రెండు కాళ్లు ఇద్దరు వైద్యుల వంటివి, మీ రెండు చేతులు ఇద్దరు నర్సుల వంటివి ” అన్నారు. ఇదే పెద్ద మనిషి ఆవనూనె పీలిస్తే కరోనా వైరస్‌ నశిస్తుందని సెలవిచ్చిన విషయం తెలిసిందే. భోపాల్‌ బిజెపి ఎంపీ, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఆవు మూత్రం తాగి కరోనా సోకుండా ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

దృష్టి మళ్లించే ఎత్తుగడలు


ఒకవైపు ఢిల్లీ శివార్లలోని రైతులంతా వెళ్లిపోయారని ప్రచారం చేశారు. కొంత మంది వెళ్లారు తప్ప నిరసన శిబిరం ఖాళీ కాలేదు. వేలాది మంది అక్కడే ఉన్నారు. అయితే గోధుమ కోతల తరుణంలో గ్రామాలకు చేరుకున్న వారు ఆపనులు పూర్తయిన తరువాత, కొత్త రైతులు తిరిగి ఢిల్లీ శివార్లకు వస్తున్నారన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో మే నెల 14వ తేదీన నరేంద్రమోడీ నోటివెంట పిఎం కిసాన్‌ నిధుల అందచేత ప్రకటన వెలువడింది. పోనీ వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు విధించినా ఆర్ధిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో, ఎంత మందికి ఉపాధి కల్పించారో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో వంటి విషయాలను ప్రకటిస్తూ వాటితో పాటు రైతుల నిధుల గురించి చెబితే సాధారణ వ్యవహారం అనుకుంటారు.వాటి గురించి ఆందోళనకరమైన వార్తలు ఎన్ని వచ్చినా నోరు విప్పని వారు దీని గురించి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే మోడీ అజెండాలో కరోనా లేదన్నది స్పష్టం.


తాను కరోనా గురించి ఎంతో ఆవేదన, బాధ పడుతున్నట్లు మోడీ చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ఇది ఓదార్పు అనుకుందాం. సురక్షితమైన చేతుల నుంచి చేతల బాధ్యత కదా ఇప్పుడు కావాల్సింది.టన్నుల కొద్దీ ఆవేదన వ్యక్తం చేస్తే ఒక లీటర్‌ ఆక్సిజన్‌ అవుతుందా ? ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపడతాయా ? కావాల్సిన ఔషధాలు దొరుకుతాయా ? కరోనాపై పోరు, యుద్దం, సమూల నాశనం వంటి ఉపమాలంకారాలతో కూడిన మాటలు బాధితులకు ఉపయోగపడవు. యుద్దాన్ని ఎదుర్కొనే తీరులో సన్నాహాలు, చర్యలు ఉన్నాయా? అధికారాలను ఉపయోగిస్తున్నారా ? అందరికీ ఉచితంగా వేస్తామన్న వాక్సిన్‌ విషయంలో మడమ తిప్పారు, జనానికి విశ్వాసం కల్పించలేకపోగా సగం భారాన్ని రాష్ట్రాల మీద నెట్టారు. రాష్ట్రాలకు అధిక రేటు, కేంద్రానికి తక్కువ రేటట. ఏమిటీ వ్యాపారం ? వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోది, వాటిదే బాధ్యత అంటున్నారు. మీ పరిధిలోని ఆక్సిజన్‌ కూడా అందించలేని పరిస్ధితి ఎందుకు తలెత్తింది అంటే జవాబు లేదు. దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు. అసలు సమస్య ఏమంటే తమ వైఫల్యాలను అంగీకరించేందుకు బిజెపి నేతలు సిద్దంగా లేరు. ఆక్సిజన్‌ కొరత అన్నది దేశ వ్యతిరేకులు చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ వర్ణించారు.

కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని ప్రధాని చెప్పారు. దాని మీద విజయం సాధించామని చెప్పినపుడు కనిపించిందా ? హెచ్చరికలను పెడచెవిన పెట్టినపుడు ఎక్కడైనా నక్కిందా ? ప్రపంచ వ్యాపితమైన మహమ్మారిని జయించినట్లు ప్రకటించాల్సింది ప్రపంచ ఆరోగ్య సంస్ద తప్ప ఒక దేశం కాదు. చైనా వంటి దేశాల్లో కొత్త కేసులేవీ లేనందున అదుపులో ఉంచామని చెబుతున్నారు తప్ప జయించామని వారే చెప్పలేదు. మరి మన దేశం ఏ సాధికారతతో అలాంటి ప్రకటనలు చేసినట్లు ?కేరళ ముఖ్యమంత్రి ప్రతి రోజూ విలేకర్లతో మాట్లాడుతున్నారు, కరోనా, ఇతర అంశాలను చెబుతున్నారు. ప్రధానికి విలేకర్లతో మాట్లాడే అలవాటు లేదు కనుక ఎవరూ ఆశించరు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఏమయ్యారు. అందుకే కదా అవుట్‌లుక్‌ పత్రిక ఏడేళ్ల వయసున్న ప్రభుత్వం కనపడటం లేదు అని ముఖచిత్ర కధనాన్ని రాసింది. అది కూడా ” జాతి వ్యతిరేకుల ” శిబిరంలో చేరింది. ఒక నాడు సంఘీయుల ప్రశంసలు అందుకున్న గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన కవిత మే 11వ తేదీ నుంచి దేశంలో వైరల్‌ అవుతోంది. అన్ని భాషల్లోకి అనువదించి వ్యాపింప చేస్తున్నారు. నరేంద్రమోడీని నగచక్రవర్తితో పోల్చి తన ఆవేదనను వ్యక్తం చేసి ఇప్పుడు పరివార్‌ ఆగ్రహానికి గురయ్యారు.శీలము, ఏకత, సంస్కారం గురించి మాట్లాడేవారు నోరుబట్టని బూతులతో ఆమెను ట్రోల్‌ చేస్తున్నట్లు వార్తలు. ఎంతలో ఎంత మార్పు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌ పోస్టర్లు : కేసులతో నరేంద్రమోడీని గబ్బు పట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు !

17 Monday May 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, Aam Aadmi Party, Delhi Police, Delhi Vaccine Posters


ఎం కోటేశ్వరరావు
మలయమారుతం వీస్తున్నపుడు, చిరు జల్లుల మబ్బుల కింద అహౌ… తీపి కబుర్లు చెప్పమని ఎవరు- ఎవరిని ఏమి అడిగినా సానుకూల ఫలితాలు వస్తాయి. అదే గాలి దుమారం రేగినపుడు, తుపాను ముంచుకు వస్తున్నపుడు ముద్దు ముచ్చట్లాడుకుందాం అంటే ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ కార్యక్రమానికి అదే ఎదురైంది. ” నూటముప్పయి కోట్ల మంది సానుకూలత శక్తి గురించి పండుగ చేసుకొనేందుకు ఈనెల మన్‌కీ బాత్‌ తిరిగి వచ్చింది. ఉత్తేజకరమైన కథలు ఉంటే ప్రధాని నరేంద్రమోడీతో పంచుకోండి ” అని ప్రధాని యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉన్న జాబితాలోని వారికి, బహిరంగంగా ట్వీట్‌ చేశారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని అన్ని విధాలుగా వైఫల్యం చెందినట్లు చివరికి నిన్నటి వరకు భజన చేసిన మీడియా కూడా చెబుతున్న తరుణంలో మన్‌కీబాత్‌ ఉపన్యాసం తయారు చేసే వారికి తత్వం బోధపడినట్లు లేదు.ఫ్రాన్సులో 1789లో ఫ్రెంచి రాణి మేరీ ఆంటోనెటెతో అమ్మా మన ఏలుబడిలో జనానికి రొట్టె దొరకటం లేదు అని సహాయకులు విన్నవించినపుడు రొట్టె లేకపోతే కేకులు తినమనండి అని సెలవిచ్చిన ఉదంతాన్ని మోడీ యంత్రాంగం గుర్తుకు తెచ్చింది. యధా రాజా తధా అధికార కదా మరి !


ఏ మూల నుంచి ఏ విషాద గాధ వినాల్సి వస్తుందో, ఆదుకొనే వారెవరో తెలియటం లేదు అని జనం భయపడుతున్నారు.రామ రాజ్యాన్ని ఏలుతున్న ఓ నగ చక్రవర్తీ శవవాహిని గంగను చూడవయ్యా అంటూ గతంలో కాషాయ శ్రేణుల ప్రశంసలు అందుకున్న గుజరాత్‌కు చెందిన పారుల్‌ ఖక్కర్‌ వంటి కవయిత్రులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే , మన ప్రధాని మన్‌కీ బాత్‌ కోసం ఉత్తేజకరమైన కరోనా విజయ గాధలను పంపండి అంటూ అధికార యంత్రాంగం కోరింది. రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి చరిత్రను జ్ఞప్తికి తేవటం లేదూ. ప్రధాని యంత్రాంగమింకా కరోనాపై విజయం సాధించామన్న ప్రచార హౌరులోనే ఉన్నారు తప్ప వాస్తవంలో లేరని తేలిపోయింది. ఈ ఉత్తేజకర గాధల ట్వీట్‌ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో అధికార యంత్రాంగం దాన్ని వెనక్కు తీసుకుంది.
కరోనా పోరులో భాగంగా ధ్యానం, యోగా చేయాలన్న ప్రధాని సూచనను పంచుకోండి అంటూ మే పదకొండవ తేదీన ఆయన యంత్రాంగం చేసిన మరొక ట్వీట్‌ కూడా అభాసుపాలైంది. జనానికి ఆక్సిజన్‌, ఆసుపత్రులు, ఔషధాలు, వెంటిలేటర్లు కావాలి ప్రభో అంటుంటే వాటి సంగతి చెప్పకుండా ధ్యానం చేయమంటారేమిటి అని నెటిజన్లు ఆగ్రహం వెలిబుచ్చారు.అయ్యా మేం పేదవారం మృత్యువుతో పోరాడాలా ? యోగా చేయాలా ? మీరు యోగా చేయాలంటున్నారు. మేం యోగాను ప్రారంభిస్తే ఆసుపత్రి బయట వేచి ఉన్న మా తలిదండ్రులు, పిల్లలను ఎవరు చూడాలి అని ఒక వ్యక్తి ప్రశ్నించిన తీరు వైరల్‌ అయింది.


అధికార యంత్రాంగం ఎందుకిలా వ్యవహరించినట్లు ? ఏప్రిల్‌ 30వ తేదీన జరిగిన ఉన్నతాధి కారుల వర్క్‌షాపులో ప్రభుత్వం తీసుకుంటున్న ‘ సానుకూల చర్యలు, పని మీద ‘ మరింత మెరుగ్గా ప్రచారం చేయటం గురించి చర్చించారు. విదేశీ రాయబారులు, హైకమిషనర్లు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్సులో విదేశాంగ మంత్రి జై శంకర్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ మీడియాలో ఏకపక్షంగా వెలువడుతున్న కధనాలకు ధీటుగా తగిన సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. దాని కొనసాగింపుగా మే 12వ తేదీ బిజెపి మీడియా జాతీయ బృంద సభ్యుడైన సుదేష్‌ వర్మ రాసిన ఒక వ్యాసాన్ని బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ట్వీట్‌ చేశాయి. ” ఎంతో కష్టపడి పని చేస్తున్న ప్రధాని మోడీ- ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దు ” అని దానికి పేరు పెట్టారు. దానిలో ఒక పేరాలో ఇలా ఉంది. ” ఒక సంక్షోభం వచ్చినపుడు నిశ్శబ్దంగా పని చేసేందుకు ప్రయత్నించే ఒక ప్రధాని ఇక్కడ ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించటం ముఖ్యం తప్ప రాజకీయ ప్రకటనలకు స్పందించరు. ఆయన తన యావత్‌ శక్తిని మళ్లించి రెట్టింపు వేగంతో పని చేసేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు దృష్టిపెడతారు. ఆయన కూడా ఇతరుల మాదిరే పసిపిల్లల్లా రోదిస్తే పరిష్కారాలతో ఎవరు ముందుకు వస్తారు ” అని రాశారు. నిజంగా ప్రధాని అసహాయతతో రోదిస్తే సానుభూతి వెల్లువెత్తేదేమో ! లేదా సమస్యలను పరిష్కరిస్తే ఇంటా బయటా ఇన్ని విమర్శలు వచ్చేవా, ఢిల్లీలో ఏడేళ్ల ప్రభుత్వం కనపడటం లేదు అని రాయగలిగే వారా ? అతిధుల ముందు మన గొప్ప చెప్పరా మంకెన్నా అంటే మా ఆయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత ఉంటాయి బాబయ్యా అన్నట్లుగా పరిస్ధితి ఉంది.


దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఎలా పెరిగిందో, ఆక్సిజన్‌లేక ఎంత మంది మరణించారో, హైకోర్టు, సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో పదే పదే చెప్పుకోనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని నరేంద్రమోడీ – మోడీ అంటే ప్రభుత్వమే అన్నట్లుగా పరిస్ధితి తయారైన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ వాక్సిన్‌ విధానాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు వేశారు. వాటిని చూసీ చూడనట్లు ఉంటే మొత్తం ఢల్లీీ వాలాలకు, దేశంలోని యావత్‌ జనాలకు తెలిసేది కాదు. కానీ ఢిల్లీ పోలీసులా మజాకానా ” నరేంద్రమోడీ ఖ్యాతిని ప్రపంచ వ్యాపితం ” కావించేందుకు పూనుకున్నారు. పాతిక మందిని అరెస్టు చేశారు, మరి కొందరికోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అది అంతర్జాతీయ వార్త అయింది. పోస్టర్లు వేయటం వెనుక ఎవరున్నారని పోలీసులు విచారణ చేపట్టారు. రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు పాతి ఖ్యాతిని అంతర్జాతీయం చేసిన వారే వీరు. కొంత మంది అనుమానితులను పట్టుకుంటే వారు స్ధానిక ఆమ్‌ ఆద్మీనేత పేరు చెప్పారట. వారు నిజంగానే చెప్పారో లేక పోలీసులే ఎవరో ఒకరి మీద కేసులు పెట్టాలి గనుక అలా చెప్పించారో మనకు తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఆమ్‌ ఆద్మీది, పోలీసులు మాత్రం బిజెపి అమిత్‌ షా ఆధీనంలో పని చేస్తారు కనుక ఏమైనా జరిగి ఉండవచ్చు. పోస్టర్లను తామే వేశామని ఆమ్‌ ఆద్మీ స్ధానిక నేతలు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇంతకీ హిందీ భాషలో ముద్రించిన ఆ పోస్టర్లలో ఏమి ఉంది.” మన పిల్లలకు వేయాల్సిన వాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపారు ప్రధాని మోడీ గారూ ” అని ప్రశ్నించారు. మా దేశంలో తయారైన టీకాలు ముందుగా మాకే అని అమెరికా, బ్రిటన్‌ ఒక్కటంటే ఒక్క డోసు కూడా బయటకు పంపలేదు. మన దేశంలో టీకాలకు అవసరమైన ముడి పదార్దాలు, వస్తువుల మీద అమెరికా ఏకంగా నిషేధమే విధించిన నేపధ్యంలో మన ప్రభుత్వం విదేశాలకు టీకాలు పంపటం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వచ్చింది.దీనిలో తప్పేముందో, దేశద్రోహం లేదా మోడీ గారి ప్రతిష్టకు వచ్చిన ముప్పేమిటో ఎవరికైనా అర్ధం అవుతోందా ? గత కొద్ది రోజులుగా టీవీ చర్చలలో, నేతల వ్యాఖ్యల్లో ఇలా ప్రశ్నించిన వారు లేదా విమర్శించిన వారు ఎందరో ఉన్నారు.లేదూ అలా ప్రశ్నించటం తప్పయితే తప్పని చెప్పండి, విలేకర్ల సమావేశాలు పెట్టే , ప్రశ్నలను ఎదుర్కొనే అలవాటు, ధైర్యం ఎలాగూ లేదు గనుక ఎలా తప్పో మన్‌కీబాత్‌లో చెప్పి జనాన్ని ఒప్పించండి. ప్రకటనలు, వ్యాఖ్యలు చేయటానికి వాటిని పోస్టర్లుగా ముద్రించి గోడల మీద అంటిచటానికి పెద్ద తేడా ఏముంది ? కేసులేమిటి ? అరెస్టులేమిటి ?


వాక్సిన్లు ఎగుమతి చేయటాన్ని మోడీ ఘనతగా, చైనాతో పోటీ పడి వాక్సిన్‌ దౌత్యంతో ఇతర దేశాలను ఆకట్టుకున్నట్లు చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు. ఆ విధానాన్ని ఎవరైనా తప్పు పడితే సహించరా ! ఇదేమి ప్రజాస్వామ్యం !! ” మహమ్మారి సమయంలో యావత్‌ ప్రపంచం ఒక్కటే.ఒక అంటువ్యాధి మహమ్మారిగా మారినపుడు యావత్‌ ప్రపంచాన్ని ఒకటిగానే భావించి దాన్ని అదుపు చేయాలి.టీకాలు వేసే ప్రపంచ కార్యాచరణలో భాగమే వాక్సిన్ల ఎగుమతులు. ” ఈ మాటలు మార్చి 11వ తేదీన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మోడీ సర్కారే స్వయంగా చెప్పింది. అంతే కాదు, తొంభై దేశాలకు మేడిన్‌ ఇండియా కోవిడ్‌-19 వాక్సిన్‌ సరఫరాల్లో భాగంగా 663.698 లక్షల డోసులు(ఆరుకోట్ల 63లక్షలకు పైగా) జనవరి- ఏప్రిల్‌ మధ్య ఎగుమతి చేసినట్లు విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇది నరేంద్రమోడీ సర్కార్‌ వాక్సిన్‌ దౌత్యంలో భాగం సాధించిన ఘనతగా వర్ణించారు. ఇంతేకాదు, ఒకేసారి పెద్ద మొత్తంలో వాక్సిన్‌ అందిస్తే జనాలకు వేసే యంత్రాంగం, సౌకర్యాలు లేవని కూడా కేంద్రం పేర్కొన్నది. తీరా మహమ్మారి తీవ్రత పెరిగి వాక్సిన్లకు డిమాండ్‌ ఏర్పడటంతో అవసరాలకు అనుగుణ్యంగా అందించలేని స్ధితి. నెల రోజులకు రెండవ డోసు వేస్తామన్న వారు ఇప్పుడు నెలల వ్యవధి గురించి చెబుతున్నారు. అసలు విషయం వాక్సిన్‌ కొరతను దాచిపెట్టటమే. కొద్ది వారాల క్రితం ఎగుమతుల గురించి ఘనతగా ప్రచారం చేసుకున్న బిజెపి పెద్దలకు విమర్శల సెగ తగలటంతో ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఎగుమతి చేసిన ఆరుకోట్ల డోసుల్లో ఒక కోటి మాత్రమే సాయం అని మిగిలినవన్నీ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఎగుమతి చేసినవే అని ప్రభుత్వంపై వచ్చిన విమర్శల తీవ్రతను తగ్గించేందుకు జాతీయ నేత సంబిత్‌ పాత్ర ప్రయత్నించారు. మన దేశంలో వినియోగించకుండా ఎగుమతులతో వాణిజ్యం చేయటం ఏమిటి ? దానికి ప్రభుత్వం ఎలా అనుమతించినట్లు ? ఇదేనా కేంద్ర ప్రభుత్వ వాక్సిన్‌ విధానం ?


ఢిల్లీ పోస్టర్లపై కేసులు నమోదు చేసిన పోలీసుల తీరు మీద విమర్శలు వెల్లువెత్తటంతో మోడీ సర్కార్‌ ఇరకాటంలో పడింది.నేనూ అదే అంటున్నా నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని సవాల్‌ చేశారు. మోడీని ప్రశ్నించినందుకు అంటే మరింత గబ్బు పడతారు కనుక పోస్టర్లు అంటించి గోడలను ఖరాబు చేశారంటూ పోలీసులు కేసులు బనాయించటం విశేషం. ఆ పోస్టర్ల మీద ఎవరు ప్రచురించిందీ,ఎక్కడ ముద్రించిందీ లేదు. ఒక వేళ అలాంటి కేసులు బనాయించాల్సి వస్తే ప్రతి పట్టణం, గ్రామాలలో లక్షల కేసులను నమోదు చేయవచ్చు. అనుమతి లేకుండా పోస్టర్లను అంటించటం, బ్యానర్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలన్నీ అభ్యంతరకరమైనవే. స్పూను కొంటే పట్టు చీర ఉచితం, ఒకటి కొని రెండు తీసుకుపోండి వంటి లేదా అశ్లీల చిత్రాల పోస్టర్ల వాటిమీద చర్యలు తీసుకుంటే ఇంత రచ్చయ్యేది కాదు. తాజా పోస్టర్లలో మోడీ విధానాన్ని ప్రశ్నించటంతో వాటికి అంత ప్రాధాన్యత వచ్చింది.


నరేంద్రమోడీని ప్రశ్నిస్తూ అంటించిన పోస్టర్ల మీద కేసుల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం, దేశవ్యాపితంగా మీడియాలో వార్తలు రావటంతో అబ్బే ఇలాంటి కేసులు పెట్టటం ఢిల్లీలో మామూలే అని గత కొద్ది సంవత్సరాలలో ఏ ఏ సందర్భాల్లో కేసులు బనాయించిందీ, ఎందరిని అరెస్టు చేసిందీ వివరిస్తున్నారు. సిఎఎ,ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా, జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సమయంలో మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ, ఇతరంగా వేసిన పోస్టర్ల మీద అనుమతి లేకుండా అంటించకూడదనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వీటిని మొత్తంగా పరిశీలించినపుడు మోడీ సర్కార్‌ మీద విమర్శ, అసమ్మతి వ్యక్తం చేసిన పోస్టర్లే ఎక్కువగా ఉన్నందున వాటికి వ్యతిరేకంగానే పోలీసులు కేసులు బనాయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనాన్ని ఆదుకోవటంలో కేరళ సిఎం విజయన్‌ – శవ రాజకీయాల్లో బిజెపి !

15 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP Propaganda, Kerala BJP, Kerala Free Food Kits, Kerala LDF, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరఫరాలు ఆపొద్దు, ధరలు పెంచొద్దని చైనాను కోరిన మోడీ సర్కార్‌ !

14 Friday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, UK, USA

≈ 1 Comment

Tags

Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్‌ మార్కెట్‌ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.

మన దేశంలో కరోనా వాక్సిన్‌ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్‌ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.


తాజా విషయానికి వస్తే భారత్‌ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రియాంక చౌహాన్‌ అక్కడి నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.


మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్‌ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్‌ నుంచి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్‌ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్‌ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్‌ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్‌ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్‌ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్‌ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్‌ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.

కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్‌ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్‌ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్‌ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్‌ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్‌ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్‌ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్‌ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్‌ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్‌ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్‌ (అమెరికా-బ్రిటన్‌) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.


చైనా వాక్సిన్‌ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్‌ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్‌ సిన్‌వాక్‌ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్‌ పేరుతో వాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్‌ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్‌ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్‌ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్‌ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్‌ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్‌ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్‌ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్‌ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.


మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వికె పాల్‌ చెప్పారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్‌ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్‌ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్‌ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్‌ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్‌ దౌత్యం కావచ్చు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలిన చైనా రాకెట్‌ – పతనమైన అమెరికా స్కైలాబ్‌ !

12 Wednesday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK

≈ Leave a comment

Tags

Long March-5B Y2, NASA, skylab failure, US anti China Propaganda


ఎం కోటేశ్వరరావు


అదుపు తప్పిన చైనా రాకెట్‌ గురించి మీడియా వర్ణనలతో ఎవరికి వారు తమమీదే పడబోతోందని భయపడిపోయిన వారున్నారు. అలాంటిదేమీ లేకుండానే భూతలంలోకి రాగానే మండిపోగా మిగిలిన శకలాలు ఏమైనా ఉంటే మాల్దీవుల సమీపంలోని అరేబియా సముద్రంలో పడ్డాయి. జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు జరిపిన రాకెట్‌ ప్రయోగాలు విఫలమై కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చైనా రాకెట్‌. విఫలమైన రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న చైనా శాస్త్రవేత్తలు చెప్పక ముందే అమెరికా వారు దాన్ని రచ్చ చేశారు. కూలిపోక ముందే ఫలానా చోట పడింది, ఇవిగో ఫొటోలంటూ కుహనా వార్తలను ప్రచారంలో పెట్టారు. చైనా బాధ్యతా రహితంగా వ్యవహరించిందని, శకలాలు ఎక్కడ పడతాయో ఏ ముప్పు సంభవిస్తుందో అన్నట్లుగా నానా యాగీ చేశారు. అసలే కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాకెట్‌ చైనాది, చెప్పింది అమెరికా, రెచ్చిపోవటానికి మన మీడియాకు అంతకంటే కావాల్సిందేముంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆరుదశాబ్దాల అనుభవంలో రాకెట్లు కూలిన ఉదంతాలు అంత తీవ్రమైనవి కాదని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా నోరు మూసుకొని తప్పుడు ప్రచారానికి ఊతమిచ్చారు.


తయాన్హీ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగంగా అవసరమైన పరికరాలను మోసుకు పోయి క్షక్ష్యలో ప్రవేశపెట్టే లాంగ్‌ మార్చ్‌-5బి వై2 వాహక నౌక(రాకెట్‌)ను ఏప్రిల్‌ 29న చైనా ప్రయోగించింది. దానికి అమర్చిన వాటిని నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టటాన్ని బట్టి దాని విస్వసనీయత సరైనదే అని రుజువైంది. తిరిగి వచ్చే క్రమంలో చోదన ( ప్రొపల్షన్‌ ) వ్యవస్ధ విఫలమైంది, దాన్నే అదుపు తప్పటంగా పరిగణించారు. దాని గమనం, అదే విధంగా ఎక్కడ భూమిని చేరనుందనే అంశాలకు సంబంధించి చైనా చెప్పినట్లుగానే మే తొమ్మిదవ తేదీ అది గాలిలో మండగా, అవశేషాలు సముద్రంలో పడ్డాయి.
సాధారణమైన అంశాన్ని అమెరికా ఎందుకు ఇంత రచ్చ చేసింది ? ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టేసి చైనా ప్రధమ స్ధానంలో ఉండబోతున్నది. అన్నింటికీ మించి ఆధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవటంలో వేగంగా దూసుకుపోతోంది. ఇలా చైనా ప్రతి అడుగునూ ప్రపంచానికి ముప్పుగా చూపేందుకు, కుట్ర సిద్దాంతాలను జనం మెదళ్లలో చొప్పించేందుకు అడుగడుగునా అమెరికా ప్రయత్నిస్తోంది. తాజా ఉదంతం దానిలో భాగమే అని చెప్పవచ్చు. ఇది ఒక్క చైనాకే అనుకుంటే పొరబాటు మన దేశం ఆ స్ధితిలో ఉన్నా అదే చేస్తుంది. రాకెట్లు భూ తలంలోకి వచ్చేటపుడు జరిగేదేమిటో సామాన్యులకంటే శాస్త్రవేత్తలకే బాగా తెలుసు. అమెరికన్లు తప్ప మిగిలిన అంతరిక్ష అగ్రరాజ్యాలేవీ రచ్చ చేయలేదు. అంతరిక్ష ప్రయోగశాలను చైనా నిర్మించటం అంటే ఆ రంగంలో అమెరికా, రష్యా సరసన చేరినట్లే. అందుకే నిష్పాక్షికంగా పరిశీలించే వారు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్నారు, ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. శకలాలతో జరిగే హాని పెద్దగా ఉండదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ దాన్ని బూతద్దంలో చూపి ఒక దోషిగా చూపేందుకు ప్రయత్నించారు. దీనికి నాసాతో పాటు అమెరికా రక్షణశాఖ, మీడియా అన్నీ కలసి ప్రచారదాడి చేశాయి.చైనా రాకెట్‌ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని రెండు గ్రామాల మీద పడ్డాయని కొన్ని పత్రికలు రాశాయి. వాటి మీద చైనా గుర్తులున్నాయని కూడా పేర్కొన్నాయి. ఇవిగో ఫొటోలంటూ ప్రచురించాయి. అవన్నీ తప్పుడు కధనాలని తేలిపోయింది.


అంతరిక్ష ప్రయోగాల శకలాల సమస్య చైనా ఒక్కదానితోనే తలెత్తింది కాదు, ఆ రంగంలో ప్రయోగాలు నిర్వహించే ప్రతిదేశమూ ఎదుర్కొంటున్నదే. సాంకేతిక పరమైనదానిని రాజకీయం చేయటం, జనాన్ని భయపెట్టేందుకు వినియోగించటమే గర్హనీయం. ప్రతి రాకెట్‌ ప్రయోగంలోనూ విజయవంతం చేయటంతో పాటు విఫలమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ శాస్త్రవేత్తలు పాటిస్తారు. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా సంస్ధ నాసా, మిలిటరీ చైనా రాకెట్‌ జాడను వెంబడించటం మిలిటరీ కోణాన్ని వెల్లడించింది. ఒక క్షిపణి వ్యతిరేక కార్యక్రమ శిక్షణగా అవి పరిగణించాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ రంగంలో ప్రావీణ్యత ఉన్న ఏదేశమైనా అదే చేస్తుంది.
తియాన్‌హి అంతరిక్ష కేంద్ర కేంద్ర నిర్మాణంలో తొలి కీలక పరికరాలను లాంగ్‌ మార్చ్‌ మోసుకుపోయింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో మరో పది రాకెట్‌ ప్రయోగాల ద్వారా అవసరమైన అన్నింటినీ సమకూర్చిన తరువాత 2022 నాటికి అది పని చేయటం ప్రారంభిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2024లో పని చాలించనుంది. ఆ తరువాత విదేశీ భాగస్వాములకు అవకాశమిచ్చే అంతరిక్ష కేంద్రం తియాన్‌హి అని భావిస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలకు ఈర్ష్య పుట్టిస్తున్న అంశమిదే. అంతరిక్ష రంగంలో చైనా అభివృద్ధిని అవి సహించలేకపోతున్నాయి.


ఇతర దేశాల రాకెట్లు కూలిపోలేదా ? చైనా రాకెట్‌ కూలిపోవటాన్ని ప్రమాదకరంగా వర్ణించిన వారు మార్చి నెల 26వ తేదీన కూలిపోయిన అమెరికా ఫాల్కన్‌ 9 రాకెట్‌ గురించి మాట్లాడలేదేం ? వాషింగ్టన్‌ రాష్ట్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో దాని శకలాలు పడ్డాయి. అది ఒక తోక చుక్క మాదిరి వెలుగులతో భూమిని తాకినట్లు ఎపి వార్తా సంస్ధ వర్ణించింది. కొందరికి అది ఎగిరే పళ్లాల మాదిరి అనిపించిందట. అదే జనావాసాల మీద పడి ఉంటే ఏమై ఉండేదన్న ఆందోళన, దానికి అనుగుణ్యమైన హెచ్చరికను కూడా అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు.

నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌ పతనమై కూలిపోయిన ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించటం అవసరం. దాని గురించి నాటి పత్రికల్లో అల్లిన కథనాలు చదివి తెలుగు జనాలు ఎంత ఆందోళనకు గురయ్యారో నాటి తరాలకు తెలిసిందే. అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే కొంత మంది తమ పిల్లలకు స్కైలాబ్‌ అని పేరు పెట్టుకున్నారు. సాధారణంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని గడువు మీరిపోయిన తరువాత తిరిగి భూమికి తెచ్చే విధంగా రూపొందిస్తారు. దీర్ఘకాలం అంతరిక్షంలో బరువు కోల్పోయే మానవ శరీరాల మీద పడే ప్రభావం వంటి అనేక అంశాలను పరిశోధించేందుకు 77 టన్నుల బరువుగల స్కైలాబ్‌ను రూపొందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు పని చేయించాలని నిర్ణయించి 1973లో ఏర్పాటు చేశారు. అయితే 1978 చివరిలో లోపాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్ధితుల్లో దాన్ని సురక్షితంగా కిందికి దించటం ఎలా అనే అంశాన్ని నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన సమయంలోనే పట్టించుకోని కారణంగా అది పతనం అవుతోందని గ్రహించారు. అయితే జనం ఆందోళన చెందటంతో దాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల పాటు తిరిగేట్లు చేస్తామని, తరువాత అది అలా తిరుగుతూనే ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే అదేమీ జరగలేదు. 1979 జూలై 11న దాని బూస్టర్‌ రాకెట్లను పేల్చివేసి కూలిపోయేట్లు చేశారు. ఆస్ట్రేలియా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో కూలిపోవచ్చని ఊహించారు. దాంతో మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. చివరకు అనేక భాగాలు సముద్రంలో పడిపోగా కొన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని జనావాసాల్లో పడ్డాయి ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
సరిగ్గా అదే సమయంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గిడసబారింది, చమురు సంక్షోభం తలెత్తింది. జనానికి ప్రభుత్వం, పార్లమెంట్‌ మీద విశ్వాసం సన్నగిల్లింది. స్కైలాబ్‌ కూలిపోనుందనే వార్తలు రావటంతో ప్రభుత్వాన్ని అపహాస్యం చేయటం ప్రారంభించారు. కొందరు దాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. దేశమంతటా స్కైలాబ్‌ విందులు జరుపుకున్నారు. వాటిలో పాల్గొవారి మీద స్కైలాబ్‌ శకలాలు పడితే తలలు పగలకుండా గట్టి హెల్మెట్లు పెట్టుకురావాలని నిబంధనలు పెట్టారు. కొన్ని హౌటళ్లయితే ఇదిగో ఈ ప్రాంతంలోనే శకలాలు పడతాయంటూ ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతం చుట్టూ విందులు ఏర్పాటు చేశాయి. టీషర్టులను అమ్మారు. కొన్ని పత్రికలయితే అపహాస్యం చేస్తూ స్కైలాబ్‌ బీమా గురించి ప్రకటించాయి. శకలాలు పడి ఎవరైనా గాయపడినా, మరణించినా 72 గంటల్లోగా చెబితే పదివేల డాలర్లు చెల్లిస్తామని ఒక పత్రిక ప్రకటించింది. శకలాలు ఎప్పుడు, ఎక్కడ పడతాయో నాసా చెప్పలేకపోయింది. ఆస్ట్రేలియా-హిందూ మహాసముద్రం మధ్య 7,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా పడవచ్చని పేర్కొన్నది. ఆ ప్రాంతం వెలుపల ఉన్న దేశాల వారు చివరికి ఐరోపా వారు కూడా ఎక్కడ తమ మీద పడతాయో అని అందోళన చెందారు. 1978లో సోవియట్‌ ఉపగ్రహం ఉత్తర కెనడా ప్రాంతంలో కూలిపోవటంతో స్కైలాబ్‌ కూడా ఇదే విధంగా కూలిపోనుందని జనం భయపడ్డారు.1979 జూలై పదకొండున స్కైలాబ్‌ కూలిపోనుందని ప్రకటించటంతో ఇంగ్లండ్‌లోని కొందరు డీవన్‌ ప్రాంతంలోని ఒక గుహలోకి వెళ్లి కూర్చున్నారు. బెల్జియంలో శకలాలు పడతాయనే భయంతో అక్కడి ప్రభుత్వం యుద్ద సమయంలో వైమానిక దాడుల గురించి హెచ్చరిస్తూ మోగించే 1250 సైరన్లను సిద్దం చేసుకుంది.

1995 జనవరి పదిహేనున రష్యా తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని జపాన్‌ రాకెట్‌తో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.దానికి జర్మనీ సాంకేతిక పరికరాలను అందించింది. తీరా అది ఏమైందో తెలియకుండా పోయింది. అందరూ కక్ష్యలోకి వెళ్లిందనుకున్నారు. అది నిర్ధారణగాకపోవటంతో భూమీ మీద పడిందని భావించారు గాని ఎక్కడ పడిందో తెలియలేదు.తరువాత కొంత కాలానికి ఆఫ్రికాలోని ఘనాలో ఉపగ్రహంలోని కాప్సూల్‌ దొరికింది. దానికి అమర్చిన పారాచూట్‌తో కింద పడింది. దాన్నుంచి సంకేతాలు పంపినా ఎవరూ గ్రహించలేకపోయారు. ఒక స్కూలు టీచరు దాన్ని గుర్తు పట్టి ఒక రూములో భద్రపరిచాడు. కొన్ని నెలల తరువాత అది లండన్‌ చేరింది. 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన అమెరికా కు చెందిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ కూలిపోయి ఏడుగురు వ్యోమగాములు మరణించారు. 1967 జనవరిలో అమెరికా ఉపగ్రహం అపోలో 1 పేలిపోయి ముగ్గురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌లో సోవియట్‌ తొలి వ్యోమగామి కొమరోవ్‌ భూమికి తిరిగి వస్తూ పారాచూట్‌ విఫలం కావటంతో మరణించాడు.1971 జూలైలో 24 రోజుల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో గడిపి తిరిగి వస్తూ ముగ్గురు సోవియట్‌ వ్యోమగాములు మరణించారు.1986 జనవరి 28న కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన 72 సెకండ్లలోనే ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌ పేలిపోయి ఒక స్కూలు టీచరుతో సహా ఏడుగురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌ 18న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన ఒక మిలిటరీ ఉపగ్రహం పేలిపోయింది. మే మూడవ తేదీన కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన డెల్టా రాకెట్‌ పేలిపోయింది. 1990 ఫిబ్రవరి 22న పశ్చిమ ఐరోపాకు చెందిన ఏరియానె 36వ రాకెట్‌ ఫ్రెంచి గుయానాలో ప్రయోగించిన రెండు నిమిషాలకు పేలిపోయింది.ఇలా ఎన్నో ఉదంతాలను పేర్కొన వచ్చు.


ఈ సందర్భాలలో అవన్నీ ఆయా దేశాల బాధ్యతా రాహిత్యమూ, ప్రమాణాలను పాటించలేదు, ఎంత ప్రమాదమో చూడండంటూ చైనా రాకెట్‌ వైఫల్యం గురించి చిత్రించిన కధనాలు వెలువడలేదు, ఎందుకంటే అవన్నీ ప్రమాదాలు. ఫుకుషిమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం కారణంగా కలుషితమైన జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్‌ ప్రకటించగానే ప్రపంచం గగ్గోలు పెట్టింది. ఆ చర్యకు అమెరికా మద్దతు పలికిగింది. వివాదాస్పదమూ, ప్రమాదకరమైన ఆ చర్యను సమర్ధించటానికి కారణం జపాన్‌ మిత్రపక్షం. అలాంటి ప్రమాదాలేమీ లేని చైనా రాకెట్‌ పతనం గురించి పెడబొబ్బలు పెట్టటం చైనాతో ఉన్న శతృత్వం తప్ప మరొకటి కాదు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్ధిక విధానాలతో తలపడటానికి అమెరికాతో అన్ని దేశాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అక్కసుతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ద్వారా ఎవరి నిజ స్వరూపం ఏమిటో, చిత్తశుద్ది ఏమిటో స్పష్టం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా జీవ ఆయుధాలు : ” ఆస్ట్రేలియన్‌ ” అల్లిన కథ వాస్తవం ఏమిటి ?

11 Tuesday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, Anti China Propaganda, The Australian


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌ పుట్టుక గురించి తేలక ప్రపంచం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు శాస్త్రవేత్తలు దాన్ని నివారించేందుకు యుద్దంతో పాటు, గుట్టు విప్పేందుకు భాష, ప్రాంతీయ తేడాలు లేకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు మీడియా సంచలన కథనాలతో జనం మెదళ్లను ఖరాబు చేస్తోంది. దున్న ఈనిందనగానే దూడను గాటన కట్టివేయమన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఆస్ట్రేలియన్‌ కధనాన్ని తెలుగు మీడియా కూడా సొమ్ము చేసుకుంది. కష్టకాలంలో ఉన్నపుడు కుట్ర సిద్దాంతాలకు జనం త్వరగా ఆకర్షితులౌతారు. మూడవ ప్రపంచ యుద్దం వస్తే అది జీవ ఆయుధాలతోనే జరుగుతుందని అందుకోసం వాటిని తయారు చేయటం గురించి చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు చేసిన సమాలోచనల 2015 నాటి రహస్య పత్రం తమకు దొరికిందంటూ ”ది ఆస్ట్రేలియన్‌ ” అనే పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.


జీవ ఆయుధాలకు సంబంధించిన కట్టుకథలు-పిట్టకథలతో పాటు వాస్తవాలు కూడా జనానికి అందుబాటులో ఉన్నాయి. కావాల్సింది కాస్త ఓపికగా తెలుసుకోవటమే. బ్రిటన్‌లోని సన్‌ పత్రిక పేర్కొన్నదాని ప్రకారం అమెరికా విదేశాంగ శాఖ నుంచి పత్రాలు తీసుకొని ఆస్ట్రేలియన్‌ చైనా జీవ ఆయుధ పరిశోధన కథ రాసింది. కోవిడ్‌-19 మూలాలను శోధించే క్రమంలో మిలిటరీ మరియు చైనా ప్రజారోగ్య అధికారులు రాసిన పత్రాలు తమకు దొరికాయని అమెరికా అధికారులు చెప్పారట. అమెరికా వైమానిక దళ కల్నల్‌ మైఖేల్‌ జె కఫ్‌ మూడవ ప్రపంచ యుద్దం జీవాయుధాలతో జరుగుతుందని చెప్పిన విశ్లేషణను పరిగణనలోకి తీసుకొని చైనా శాస్త్రవేత్తలు సార్స్‌ వైరస్‌తో జీవ ఆయుధాన్ని తయారు చేయటం గురించి చర్చించారట.2003లో చైనాలో సార్స్‌ వైరస్‌ వ్యాపించింది.


ఆస్ట్రేలియన్‌ పత్రిక కధనం చదివిన వారందరూ దాని మీద చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. పత్రిక పేర్కొన్న పత్రాలు నకిలీవి కాదని ఇంటర్నెట్‌ నిపుణులు చెప్పేశారు. రాజకీయ నేతలు గళం విప్పేశారు. మరికొందరు తెలివి తేటలు ఎక్కువగా ఉన్న వారు కరోనా వైరస్‌ మానవ కల్పితం అని చెప్పేందుకు, కావాలని చైనా బయటకు వదిలిందనేందుకూ ఆధారం లేదని చెబుతూనే ఊహాన్‌ రహస్య పరిశోధనాశాల నుంచి తప్పించుకొని వచ్చి ఉండవచ్చనే ఆనుమానాలను చొప్పిస్తున్నారు. అసలింతకీ ఆస్ట్రేలియన్‌ కధనానికి ఆధారం ఏమిటి ?


ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. దానిలో రహస్యాలు, కుట్ర ఆలోచనలు ఉంటే చైనా సర్కార్‌ అనుమతిస్తుందా ? అమెరికా విదేశాంగశాఖ పుస్తకంలోని అంశాలను రహస్య పత్రాలని చెప్పటం వాటిని గుడ్డిగా ఆస్ట్రేలియన్‌ పత్రిక సంపాదకులు నమ్మి నిజమే అని ప్రచురించారని అనుకోజాలం. అంత రహస్యం అయితే అమెరికా అధికారులు తమ పత్రికలకు ఇవ్వకుండా ఆస్ట్రేలియా పత్రికను ఎంచుకోవటం ఏమిటి ? అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయంలో అది భాగస్వామి, అమెరికా పెట్టిన చిచ్చుకారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యపోరు సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాతో వాణిజ్య చర్చలను నిరవధికంగా వాయిదా వేసినట్లు చైనా ప్రకటించిన నేపధ్యంలోనే ఈ వార్తలు వెలువడ్డాయి. అంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, ఆస్ట్రేలియా భుజం మీద నుంచి తుపాకి కాల్చే అమెరికా ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. పధకం ప్రకారం రాసే పత్రికల నుంచి జర్నలిస్టు ప్రమాణాలను ఆశించలేము. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించారన్నట్లుగా చైనా ప్రచురించిన పుస్తకంలోని అంశాలకు వక్రభాష్యాలు చెప్పి రాసిన కధనం అన్నది స్పష్టం. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు. ఇన్ని అంశాలుండగా వాటన్నింటినీ పక్కన పెట్టి చైనా శాస్త్రవేత్తలు చైనాలో సార్స్‌ నుంచి జీవ ఆయుధాల గురించి చర్చ చేశారంటూ ఆస్ట్రేలియన్‌ వర్ణించింది.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పారు.భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. బిల్‌గేట్స్‌ వ్యాఖ్యల మీద మీడియా ఎలా స్పందించిందో ఎవరికి వారు పరిశీలించుకోవచ్చు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు. ఆస్ట్రేలియన్‌కు, అమెరికాకు దీనిలో ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదా ?

వాక్సిన్లు మేధోసంపత్తి హక్కుకు సంబంధించినవి కాదు, లేదా ఖాళీగా పడి ఉన్న వాక్సిన్‌ కర్మాగారమూ కాదు. నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు. ప్రపంచ వ్యాపితంగా తక్కువ ఖర్చుతో కరోనా వాక్సిన్లు వేయాల్సిన అవసరం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద, ఇతర నిపుణులు సూచించినందున దాన్ని సొమ్ము చేసుకోవాలని కార్పొరేట్లు నిర్ణయించాయి. అనేక కంపెనీలలో వాటాదారుగా ఉన్న బిల్‌గేట్స్‌ నుంచి ఇలాంటి మాటలు గాక భిన్నంగా వస్తాయని ఎవరూ ఆశించరు.


రష్యా-చైనా సరిహద్దుల సమీపంలో అమెరికన్లు ప్రయోగశాలల్లో జీవ ఆయుధాలను అభివృద్ది చేస్తున్నారని, వాటి పరిసరాలలో తడపర (తట్టు) వంటి ప్రమాదకర అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని దాని మీద విచారణ జరపాలని ఏప్రిల్‌ మొదటి వారంలో రష్యా కోరింది. దానికి ప్రతిగా కూడా ఆస్ట్రేలియన్‌ కధనాన్ని ప్రచురించి ఉండవచ్చు. ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

జనాలను కొంత మంది ఎలా బురిడీ కొట్టిస్తారో ఒక ఉదంతాన్ని చూద్దాం . అమెరికన్‌ రచయిత డీన్‌ కూన్జ్‌ ఎప్పుడో కరోనా గురించి జోశ్యం చెప్పారని కరోనా వైరస్‌ బయట పడిన కొత్తలో గత ఏడాదే వార్తలు వచ్చాయి. డీన్‌ 1981లో రాసిన ది ఐస్‌ ఆఫ్‌ది డార్క్‌నెస్‌ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్‌ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్‌ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 ముద్రణ నాటికి ఊహాన్‌గా మారిపోయింది. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్‌ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టమైంది.
జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనా, భారత్‌ వంటి దేశాలకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి.

చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.

1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.

మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్‌, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్‌ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్‌ హుసేన్‌ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.

అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్‌ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.

మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్‌ పెరల్‌ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్‌ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్‌ నిరీ?త స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్‌ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బ ందం నేత షిరోషిని జపాన్‌ విడిచినా సోవియట్‌ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే దొంగే దొంగ అన్నట్లు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియా దానికి సాధనంగా ఉపయోగపడుతోంది. ఆస్ట్రేలియన్‌ కధ దానిలో భాగమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఏలుబడి : కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టి అమెరికానైనా అనుసరిస్తారా !

09 Sunday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Media, Corona vaccine, Fuel Price in India, Joe Biden, Narendra Modi Failures, Saudi Arabia


ఎం కోటేశ్వరరావు


దేశంలో, మన చుట్టుపట్ల, ప్రపంచంలో ఏం జరుగుతోంది ? అన్నింటినీ ఒకేసారి చూడలేం. ఆలోచనలను రేకెత్తిస్తున్న కొన్ని అంశాలను చూద్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. స్వతంత్ర భారతచరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధాన అభిశంసనకు గురైందంటే అతిశయోక్తి కాదు. పేరు పెట్టి మందలించకపోవచ్చు, కొన్ని హైకోర్టుల మాదిరి తీవ్ర వ్యాఖ్యలు చేయకపోవచ్చు గానీ తీసుకున్న చర్య చెంప పెట్టువంటిది. ఆక్సిజన్‌, కరోనా సంబంధిత సమస్యను గతనెలలో సుప్రీం కోర్టు తనంతట తానుగా విచారణకు చేపట్టినపుడే నరేంద్రమోడీ సర్కార్‌ మొద్దు నిద్రను వీడి తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది. అదేమీ లేకపోగా తన చర్యలను సమర్ధించుకొనేందుకు పూనుకుంది. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కేటాయింపు విషయంలో ప్రభుత్వం సూచించిన విధానాన్ని తోసి పుచ్చి శాస్త్రీయ పద్దతిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్‌ కేటాయింపులకు ఒక కార్యాచరణ కమిటీని ఆరునెలల కాలానికి సుప్రీం కోర్టు నిర్ణయించటం నరేంద్రమోడీ సర్కార్‌ను అభిశంచించటం గాక మరేమనాలి ? వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేస్తున్న వ్యాఖ్యల నేపధ్యంలో సుప్రీం కోర్టు తగినంత గడువు ఇచ్చినప్పటికీ సంతృప్తికరమైన విధానాన్ని కేంద్రం రూపొందించలేకపోయింది. దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది అని చెప్పిన వారు ఇప్పుడు ఏమంటారో తెలియదు. చెడు వినను, చెడు కనను, చెడు చెప్పను అన్న మూడు కోతుల బొమ్మలను చాలా మంది చూసే ఉంటారు. చెప్పింది చేయను, జరుగుతున్నది చూడను, నోరు విప్పను అన్నట్లుగా కేంద్ర పాలకుల వ్యవహారం ఉంది.

సురక్షితమైన చేతుల్లో జనం అంటే ఇదేనా ?


ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర పాకేజ్‌ ప్రకటించామని ఎంత ప్రచారం చేసుకున్నారో తెలిసిందే. వాక్సినేషన్లకు 35వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. ఆ సొమ్ముతో రెండువందల కోట్ల వాక్సిన్‌ డోసులు కొనుగోలు చేయవచ్చు. వంద కోట్ల మందికి వేయవచ్చు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోకుండా 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే తాము వేస్తామని, మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఎవరికి వారు స్వంత ఖర్చుతో వేయించుకోవాలని చెబుతోంది. చిన్న వయసు వారికి కూడా కరోనా సోకుతున్నందున అందరికీ వాక్సిన్‌ వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఖర్చుకు వెనకాడాల్సిన సమయమా ఇది. అందులోనూ దేశ రక్షకులమని తమకు కితాబు ఇచ్చుకుంటున్న వారు. పోనీ వాక్సిన్లు అందుబాటులోకి తెచ్చే చర్యలేమైనా తీసుకుందా అంటే అదీ లేదు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ రెండింటిని అత్యవసర వినియోగ ప్రాతిపదిక మీదనే అనుమతి ఇచ్చారు. రష్యా స్పుత్నిక్కుకు కూడా అదే పద్దతిలో అనుమతి ఇచ్చి ఉంటే ఈ పాటికి అది కూడా ఉత్పత్తిలోకి వచ్చి ఉండేది. రెండు కార్పొరేట్‌ సంస్ధలకు వచ్చే లాభాలు, వాటి నుంచి అందే నిధుల గురించే ఆలోచించారని జనం అభిప్రాయం పడితే తప్పు పట్టగలమా ? తాజాగా చైనా వాక్సిన్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్ద అనుమతి ఇచ్చింది. దాన్నైనా అనుమతిస్తారా లేక పంతానికి పోయి జనం ప్రాణాలను ఫణంగా పెడతారా ? అనుమతిస్తే చైనా కంపెనీ అనుబంధ సంస్ధ హైదరాబాద్‌లోని గ్లాండ్‌ ఫార్మాలో వెంటనే తయారీ మొదలు పెట్టవచ్చు.

బాధ్యతల నుంచి వైదొలగిన మోడీ సర్కార్‌ !


గత ఏడాది రాష్ట్రాలతో సంప్రదించకుండా, జనం స్వస్ధలాలకు చేరే అవకాశం ఇవ్వకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆకస్మికంగా ప్రకటించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపట్టాయి తప్ప లాక్‌డౌన్ను వ్యతిరేకించలేదు.ఈ సారి లాక్‌డౌన్‌ విధించాలా లేదా అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదలివేస్తున్నట్లు ప్రకటించి ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. అసలు విషయం ఏమంటే కేంద్రం బాధ్యతలను వదలించుకోవటమే. ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న రాష్ట్రాలు వాక్సిన్‌ ఉచితంగా వేసేందుకు నిర్ణయించాయి. లాక్‌డౌన్‌ లేదా అలాంటి చర్యలు తీసుకుంటే ఉపాధి కోల్పోతున్న వారికి సాయం చేసే స్ధితిలో రాష్ట్రాల ఆర్ధిక స్ధితిలేదు. కేంద్రం నుంచి ఇంతవరకు ప్రత్యేకమైన చర్యలు ఏమీ లేవు. ఐదేసి కిలోల బియ్యం ఇస్తే సరిపోతాయా ? కేరళలో 17 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన ఆహారకిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తే అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, ఎన్నికల కోసం అని కాంగ్రెస్‌, బిజెపి ప్రచారం చేశాయి. ఓటర్లు వాటికి చెప్పాల్సిన బుద్ది చెప్పారు. ప్రభుత్వం సాయం అందని వారు ఆరుశాతం మందే అని ఎన్నికల తరువాత జరిగిన ఒక సర్వేలో తేలింది. కేరళ ఇప్పుడు కూడా అదే కిట్‌ను అందిస్తున్నది, లాక్‌డౌన్‌ ప్రకటించినందున సామూహిక వంటశాలలను ప్రారంభించి అవసరమైన వారికి ఆహారం సరఫరా చేస్తున్నది. అలాంటి చర్యలను ఏ బిజెపి లేదా కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల పాలిత ప్రభుత్వాలలో అయినా అమలు జరుపుతున్నారా ?

రచ్చ చేసిన మీడియా ఎందుకు మౌనం దాల్చినట్లు ?


చైనా వస్తువుల కొనుగోలు గురించి గత ఏడాది కాషాయ దళాలు, వాటికి వంత పాడి రేటింగ్‌ పెంచుకున్న టీవీ ఛానళ్లు, పత్రికలు ఎంత రచ్చ చేశాయో చూశాము. ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వస్తాయి, వాటిని పరిష్కరించుకొనేందుకు చూడాలి గానీ శాశ్వతవైరంతో వ్యహరిస్తే ఉభయులకూ నష్టమే. బలహీనులకు మరింత నష్టం.మన దేశంలో కరోనా పెరిగిన కారణంగా చివరికి తమ పౌరులు స్వదేశానికి వచ్చినా జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఎదుటి వారు మంచి పని చేసినప్పటికీ ఎవరికైనా ఇష్టం లేకపోతే మౌనంగా ఉండటం ఒక పద్దతి. కానీ ఇష్టంలేని వారు చేసే ప్రతిదానిని బూతద్దంలో చూపి దాడి చేసేందుకు పూనుకునే వారిని ఏమనాలి ? కరోనా కారణంగా చైనా ప్రభుత్వరంగ విమానయాన సంస్ద మన దేశానికి తాత్కాలికంగా వాణిజ్య విమానాల నిలిపివేత ప్రకటన చేయగానే ఇంకేముంది చైనా మనకు వెన్ను పోటు పొడిచింది అని టీవీ చానల్స్‌ నానా యాగీ చేశాయి. కానీ అదే చైనా గురించి ఇప్పుడు మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఏమన్నారు.” మా దేశానికి చెందిన అనేక కంపెనీలు చైనా నుంచి వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు పెడుతున్నాయి. రవాణాలో మేము సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిని పరిశీలించి తగుచర్యలు తీసుకొంటే మేము శ్లాఘిస్తాము ” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇతో మాట్లాడారు.” మా సంభాషణ తరువాత పని జరిగింది. మన విమాన సంస్దలు కొన్నింటికి వెంటనే అనుమతులు వచ్చాయి.రవాణా జరుగుతోంది, అదెంతో శ్లాఘనీయం ” అని చెప్పారు. ఇప్పుడు యాగీ చేసిన ఛానల్స్‌ ఏమంటాయి ? అసలేమీ జరగనట్లు మౌనంగా ఉన్నాయా లేదా ?

భారత ఆర్డర్లతో చైనా కంపెనీల లాభాలు – భావ స్వేచ్చ సమస్య !


చైనా వస్తువులు, వాటి నాణ్యత గురించి ఏదేదో మాట్లాడిన వారు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. రికార్డు స్ధాయిలో మన దేశానికి చెందిన కంపెనీలు, ఏప్రిల్‌, మే మాసాల్లో చైనా వస్తువుల దిగుమతికి ఆర్డర్లు పెట్టాయి. ఏప్రిల్‌ ఆఖరు నాటికి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు అర్డరు పెట్టారు, వాటిలో 21వేలు వచ్చాయి. ఐదువేల వెంటిలేటర్లు, 2.1కోటి ముఖ తొడుగులు(మాస్క్‌లు),3,800 టన్నుల ఔషధాలకు ఆర్డర్లు పెట్టినట్లు చైనా కస్టమ్స్‌ వివరాలు తెలుపుతున్నాయి( ది హిందూ మే 9, 2021) మన దేశ ఆర్డర్ల కారణంగా చైనా కంపెనీల అమ్మకాలు, లాభాలు విపరీతంగా పెరిగాయి.
చైనాలో భావ ప్రకటనా స్వేచ్చ లేదనే ప్రచారం గురించి తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే. సోషలిజం, కమ్యూనిజాలకు, దానికొరకు పనిచేసే రాజ్యాంగానికి దాన్ని అమలు జరిపే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రచారానికి స్వేచ్చ లేదు. ఆ మాటకు వస్తే మన దేశంలో గానీ మరొక కమ్యూనిస్టేతర దేశంలో గానీ ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే స్వేచ్చ ఉందా ? అలాంటి వారిని శిక్షించకుండా వదులుతారా ? రాజ్యాంగపరిధిలో అనుమతించిన స్వేచ్చ మేరకు మాట్లాడితేనే దేశద్రోహులుగా మనదేశంలో చిత్రిస్తున్న విషయం దాస్తే దాగుతుందా ? ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగమైన చట్ట అమలు కమిటీ ట్విటర్‌ ఖాతా నుంచి ఒక ట్వీట్‌ వెలువడింది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. వివాదాస్పదమైన ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. దాని గురించి కూడా మన మీడియాలో వార్తలు వచ్చాయి.(అలాంటి అవాంఛనీయమైన ట్వీట్లను మన కాషాయ దళాలు ఎన్ని తొలగించాయో వారే చెప్పాలి ) ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది ? రెండు ఫొటోలు పెట్టారు. ఒకటి నింగిలోకి దూసుకుపోతున్న చైనా రాకెట్‌, మరొకటి మన దేశంలోని శ్మశానంలో చితిమంటల చిత్రం. వాటి కింద చైనా వెలిగిస్తున్న మంటలు-భారత్‌ వెలిగిస్తున్న మంటలు అని వ్యాఖ్యానించారు.ఒక దేశంలోని విపత్తును అలా పోల్చటం తగిన చర్య కాదు, తప్పు పట్టాల్సిందే. ఒక వ్యక్తి లేదా ఆ విభాగాన్ని చూస్తున్న కొందరు వ్యక్తులు అనాలోచితంగా పెట్టినప్పటికీ దాన్ని యావత్‌ కమ్యూనిస్టు పార్టీకి అంట గట్టారు. కానీ ఆ ట్వీట్‌ మీద చైనా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. అక్కడ స్వేచ్చ లేకపోతే ఆ చర్చ ఎలా జరిగినట్లు ? ఆ ట్వీట్‌ను గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక సంపాదకుడు గ్జీ జిన్‌ విమర్శించినందుకు పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడ్డారు.ఆ ట్వీట్‌ను విమర్శించటంతో పాటు భారత్‌కు చైనా స్నేహ హస్తం అందిస్తున్నప్పటికీ భారత్‌ ద్వేషంతో, సంకుచితంగా వ్యవహరిస్తోంది, అయినప్పటికీ సాయం చేయాల్సిందే అని సంపాదకుడు పేర్కొన్నారు.గ్జీ విమర్శపై ధ్వజమెత్తిన షాంఘైలోని పుడాన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షెన్‌ ఇ తొలగించిన ట్వీట్‌ను సమర్దించాడు. భారత్‌కు సానుభూతి చూపినందువలన సానుకూల ఫలితం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించాడు. నెటిజన్లు గ్జీ-షెన్‌ వర్గాలుగా చీలిపోయినట్లు కొందరు వ్యాఖ్యానించారు.దీని గురించి అమెరికా అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ రాసింది.

చమురు ధరలపై జనం ఊహించిందే జరిగింది !


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత చమురు ధరలు పెరుగుతాయని జనం సరిగానే ఎంతగా అంటే పగలు తరువాత రాత్రి వస్తుందన్నంత కచ్చితంగా ఊహించారు. అదే జరుగుతోంది. చలికాలంలో గిరాకీ ఉంటుంది కనుక అది ముగిసిన తరువాత చమురు ధరలు తగ్గుతాయని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కనుక ధరలు స్ధిరంగా ఉండి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పెరుగుతున్నాయి. ఓట్ల కోసం అలాంటి పనులు బిజెపి చేయదు అని మరో వైపు ఆ పార్టీ నేతల డాంబికాలను జనం చూశారు. వేసవిలో జనాలు ఎక్కువగా తిరుగుతారు కనుక గిరాకీ పెరిగి వర్షాకాలం నాటికి ఎవరి పనుల్లో వారుంటారు గనుక ధరలు తగ్గుతాయని మంత్రిగారు చెబుతారేమో చూడాలి. పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలసిస్‌ విభాగం ప్రకటించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో మన దేశం దిగుమతి చేసుకొన్న ముడిచమురు పీపా సగటు ధర 61.22 డాలర్లు, మార్చినెలలో 64.73, ఏప్రిల్‌ నెలలో 63.40 డాలర్లు ఉంది. చైనా వస్తువుల కొనుగోలును ఆపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పినట్లుగా మనం దిగుమతి చేసుకొనే దేశం కనుక దాన్ని ఆయుధంగా చేసుకొని ఒపెక్‌ దేశాలకు బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే అవి దిగివచ్చి ధరలు తగ్గిస్తాయని మంత్రిగారు సెలవిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచాం గాని ధరలు దిగిరాలేదు. ఏ దేశమూ మన కాళ్ల దగ్గరకు రాలేదు-వృతం చెడ్డా ఫలం దక్కలేదు.

అడుసు తొక్కనేల – కాలు కడగనేల !

ఇప్పుడు ఏమైంది ? మన బెదిరింపులు, చమురు కొనుగోలు తగ్గింపు వంటి చర్యలను మనసులో పెట్టుకోకుండా మనకు అవసరమైన ద్రవరూప ఆక్సిజన్ను ఆరునెలల పాటు సరఫరా చేసేందుకు సౌదీ, యుయేఇ, కతార్‌ దేశాల ప్రభుత్వాలు కంటెయినర్లలో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి.అమెరికా నుంచి అలాంటిది రాలేదు.ప్రభుత్వరంగ చమురు కంపెనీలు సౌదీ నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పూర్వం మాదిరే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా మబ్బులను చూసి గల్ఫ్‌ దేశాల చమురు ముంతలను వలకపోసుకుంటే ఏమౌంతుందో మోడీ సర్కార్‌కు తెలిసివచ్చింది. ఇంతేనా, కాదు గత ఏడాది కాలంలో జరిగిన పరిణమాలను చూస్తే మన విదేశాంగ విధానం ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికైనా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును కేంద్రం ప్రారంభిస్తుందా ?

మనం సౌదీని బెదిరించిన సమయంలోనే సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ అరామ్‌కో ఒకశాతం వాటాను చైనా పెట్టుబడి-చమురు కంపెనీలకు విక్రయించే చర్చలు మరింత పురోగమించాయని వార్తలు.సౌదీ-అమెరికా ప్రభుత్వం మధ్య సంబంధాల గురించి 1945లో ఒక ఒప్పందం కుదిరింది. దాని నిబంధనలు, స్ఫూర్తికి మరింత దూరం జరిగి సౌదీ అరేబియా వాటా అమ్మకం గురించి చర్చలు జరుపుతోందన్నదే కీలక అంశం.ఈ పరిణామం ఒక అడుగు అమెరికాకు దూరం చైనాకు దగ్గర కావటంగా చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టేసి 2030 నాటికి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్దగా చైనా అవతరించనుందనే అంచనాలు తెలిసిందే. అరామ్‌కో కంపెనీ వాటాలను చైనా కొనటం గురించి జరిగే చర్చలు కొత్తవేమీ కాదు. గత ఏడాది తప్ప అంతకు ముందు మూడు సంవత్సరాలలో దీని గురించి చర్చలు జరిగాయి. గత కొద్ది సంవత్సరాల పరిణామాలను చూస్తే సౌదీ – అమెరికా సంబంధాలలో ముద్దులాట-దెబ్బలాట తీరుతెన్నులు కనిపిస్తాయి. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై 2011 సెప్టెంబరులో జరిగిన దాడికి సౌదీ మద్దతు ఉందన్న దగ్గర నుంచి అనేక పరిణామాల నేపధ్యంలో అమెరికాలో సౌదీ గురించి ప్రతికూల భావాలు పెరిగాయి.ఈ కారణంగానే అమెరికా,బ్రిటన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లలో అరామ్‌కో కంపెనీ వాటాల లావాదేవీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ వైఖరి కూడా చైనాకు వాటాలను అమ్మేందుకు సౌదీని పురికొల్పిందని చెబుతున్నారు. ఈ ఒప్పంద వివరాలు అన్నీ రహస్యమే. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా తన కరెన్సీ డాలరుతో ప్రపంచంపై పెత్తనం చేస్తోంది. గతేడాది పెద్ద మొత్తంలో సౌదీ నుంచి చైనా చమురు కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలలో డాలర్లకు బదులు తమ కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌)ను స్వీకరించాలని చైనా చేసిన ప్రతిపాదనకు సౌదీ అంగీకరిందని చెబుతున్నారు. ఇది అమెరికాకు ఆగ్రహం తెప్పించే చర్య. దాని పర్యవసానాలను అంచనా వేస్తున్నందున ఇవేవీ ఇంకా ఖరారు కాలేదు. ఇదే జరిగితే అనేక దేశాలు డాలర్లను పక్కన పెట్టి యువాన్లవైపు మళ్లుతాయని, తమ పలుకుబడికి దెబ్బ అన్నది అమెరికా భయం. ఇప్పటికే ఎస్‌డిఆర్‌ ఆస్ధులలో చైనా కరెన్సీని 2016లో చేర్చారు. దాని కొనసాగింపుగా డాలరు బదులు మరొక కరెన్సీని రిజర్వుగా ఉంచాలన్నది ఆలోచన. ఆర్ధికంగా చైనా అగ్రరాజ్యంగా మారనున్నందున దాని కరెన్సీ అవుతుందని మిగతా దేశాల భయం. అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో తాము డాలర్లకు బదులు మరొక కరెన్సీని ఉపయోగంచక తప్పదని రష్యా హెచ్చరిస్తున్నది. ఇరాన్‌, వెనెజులా, రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తున్నది, అందువలన వాటికి డాలర్‌ బదులు మరొక ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరం కనుక చైనా కరెన్సీ వైపు చూస్తున్నాయి.

సౌదీ అరేబియాను కూడా దూరం చేసుకుంటున్నామా ?


అరామ్‌కో కంపెనీలో ఒక శాతం వాటాను 19 బిలియన్‌ డాలర్లకు చైనా కొనుగోలు చేయనున్నదని వార్తలు వచ్చాయి. అంతే కాదు రెండు దేశాలు సంయుక్తంగా చెరిసగం వాటాలతో 20 బిలియన్ల డాలర్లతో పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని కూడా సూత్ర ప్రాయంగా నిర్ణయించాయి. గత నాలుగు సంవత్సరాలలో వివిధ రంగాలలో వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. అరామ్‌కోలో చైనా వాటా కొనుగోలు చేస్తే దాని ప్రభావం, పర్యవసానాలు మన దేశం మీద ఎలా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. గతంతో పోలిస్తే సౌదీ నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించినప్పటికీ గణనీయంగానే కొంటున్నాము. అయితే చైనాతో సౌదీ ఒప్పందాలు చేసుకొని సంబంధాలు పెంచుకుంటే మన దేశంతో జరిగే వాణిజ్యం మీద దాని ప్రభావం పడుతుంది. మన ఎగుమతులు తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అంతే కాదు రాజకీయంగా కీలకమైన ప్రాంతంలో చైనా మరొక మంచి మిత్రదేశాన్ని సంపాదించుకుంటుంది. సౌదీ మన దేశంతో కూడా పెట్టుబడుల గురించి సంప్రదింపులు జరిపింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌లో పెట్రోకెమికల్స్‌ వాణిజ్యంలో 20శాతం వాటా తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్ధలతో కలసి చమురుశుద్ధి మరియు పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది. తరువాత ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల చమురు ధరలను పెంచటంతో సౌదీపై చమురు దిగుమతి ఆయుధాన్ని వినియోగిస్తామని మన చమురుశాఖ మంత్రి చేసిన బెదిరింపు అందుకు నిదర్శనం. గతేడాది చౌకగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్న చమురును వినియోగించుకోండని సౌదీ మంత్రి తిప్పికొట్టారు. చైనాలో పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలలో నియంత్రణలు ఎత్తివేస్తున్న కారణంగా అక్కడ చమురు డిమాండ్‌ పెరుగుతున్నదని ఇప్పుడున్న 68 డాలర్ల రేటు 80వరకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మన పరిస్ధితి ఏమిటి ? మే నెలలో 0.40 డాలర్లు పెంచిన సౌదీ అరేబియా జూన్‌ మాసంలో సరఫరా చేసే చమురుకు గాను ఆసియా దేశాలకు పీపాకు 0.28 డాలర్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. దీని వలన వినియోగదారులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. గతేడాది డిసెంబరులో కూడా ఇదే విధంగా తగ్గించింది. నరేంద్రమోడీ కోరిన కారణంగానే తగ్గించినట్లు కాషాయ దళాలు ప్రచారం చేశాయి.

చైనా సంగతి పక్కన పెట్టండి అమెరికా పద్దతయినా అనుసరిస్తారా !


కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు, దానిలో భాగంగా ఉపాధి కల్పించేందుకు రెండు లక్షల కోట్ల డాలర్లను ( మన రూపాయల్లో 146లక్షల కోట్లు ) ఖర్చు చేయాలని అమెరికాలో జోబైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనుల్లో రోడ్లు, విద్యుత్‌ వాహన స్టేషన్ల మరమ్మతులు, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూలు భవనాల నిర్మాణం, మరమ్మతులు,అల్పాదాయ వర్గాల, వృద్దుల ఇండ్ల నిర్మాణం, ఇంటర్నెట్‌ వేగం పెంపుదల వ్యవస్ధలు, ఇలా శాశ్వత వనరులను సమకూర్చటంతో పాటు ఉపాధికల్పించే పనులు ఈ మొత్తంతో చేపట్టనున్నారు. దీన్నుంచి పరిశోధన-అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రజల మీద పన్నులు విధింపునకు బదులు కార్పొరేట్‌ సంస్దల పన్ను పెంచాలని బైడెన్‌ నిర్ణయించారు. గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ కార్పొరేట్లకు పన్ను తగ్గించారు.కనీస కార్పొరేట్‌ పన్ను 21శాతానికి పెంచటంతో పాటు గరిష్టంగా 28శాతం విధించి నిధులు సమకూర్చి పైన పేర్కొన్న పనులను చేపడతారు. కార్పొరేట్‌ కంపెనీలు పన్నులు ఎగవేసేందుకు పెట్టుబడులు, లాభాలను పన్ను స్వర్గాలకు తరలించకుండా మేడ్‌ ఇన్‌ అమెరికా టాక్స్‌ పధకం పేరుతో స్వదేశంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే సంస్ధలకు పన్ను రాయితీలను ప్రోత్సాహంగా ప్రకటించనున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెడితే తొలి పదిశాతం ఆదాయంపై పన్నులు చెల్లించనవసరం లేదన్న నిబంధనను ఎత్తివేయనున్నారు.


ఉపాధి పెంచే పేరుతో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రాయితీలుఇచ్చింది. కరోనా కాలంలో సామాన్య జనం దివాలా తీస్తే కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, బిలియనీర్లు కూడా పెరిగారు. వారు పెట్టుబడులు పెట్టకుండా తమ మూటలను అలాగే ఉంచారు. కనీసం కరోనా వాక్సిన్లు, వ్యాధి గ్రస్తుల వైద్య ఖర్చులకు అయినా కార్పొరేట్ల నుంచి తాత్కాలికంగా అయినా పన్ను రేటు పెంచి నిధులు సేకరించి దేశంలో ఖర్చు చేయవచ్చు. అలాంటి ప్రయత్నాలు గానీ ఆలోచనలు గానీ లేవు. అమెరికా మాదిరి అనేక ఐరోపా దేశాలలో ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది గీటు రాయి అన్న సామెత మాదిరి వ్యవస్ధ ఏదనికాదు. కమ్యూనిస్టు చైనా మాదిరి మన దేశాన్ని కూడా ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామంటూ ఆర్ధిక సర్వేల్లో పుంఖాను పుంఖాలుగా రాసుకున్నాం. కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టండి కాపిటలిస్టు అమెరికా, ఐరోపా దేశాల పద్దతి అయినా అనుసరిస్తారా ? అసలు జనం కోసం పని చేస్తారా ? వట్టిస్తరి మంచి నీళ్ల ఆత్మనిర్భరతోనే సరిపెడతారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ – పర్యవసానాలు !

07 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BSP, CM Yogi Adityanath, Samajwadi Party, UP panchayat poll


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తమ విజయం నల్లేర మీద బండి నడక మాదిరి అనుకుంటున్న బిజెపికి స్ధానిక సంస్దల ఎన్నికలు పెద్ద షాకిచ్చాయి.ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, హిందూత్వకు ప్రతీకగా చూపుతూ కూల్చివేసిన మసీదు స్ధానంలో నిర్మిస్తున్న రామాలయం ఉన్న అయోధ్య, ముఖ్యమంత్రి కోట అని చెబుతున్న గోరఖ్‌పూర్‌ వంటి చోట్ల బిజెపికి చావు దెబ్బలు తగలటం గమనించాల్సిన అంశం. రామాలయ నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, వారణాసి అభివృద్దికి పెద్ద పీటవేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అన్నింటికీ మించి ఇదే పరిస్దితి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతం అయితే భవిష్యత్‌లో ప్రధాని పదవి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ఆదిత్యనాధ్‌ పరిస్దితి ఎలా ఉంటుందో తెలియదు.


మార్చి 14వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌ ప్రస్తుత విధాన సభ గడువు ముగియ నుంది. అందువలన ఆ లోగా ఎన్నికల జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో యోగి ఆదిత్యనాధ్‌ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగలటం కమలనాధులకు కంటి మీద కునుకు లేకుండా చేయటం ఖాయం. పార్టీ రహితంగా జరిగినప్పటికీ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన అభ్యర్ధుల తీరుతెన్నులు చూస్తే పార్టీల వారీగా జిల్లా పరిషత్‌ స్ధానాలలో సమాజవాద పార్టీ పెద్ద పార్టీగా వచ్చింది. పార్టీల కంటే స్వతంత్రులు ఎక్కువ మంది గెలిచారు. దీంతో సహజంగానే అధికార బిజెపి వారిని టోకుగా లేదా విడివిడిగా కొనుగోలు చేసి జిల్లా పరిషత్‌లలో తమకే మెజారిటీ అని చూపించుకొనే యత్నంలో ఉంది. దాని కంటే
7.32 లక్షల గ్రామ పంచాయతీల వార్డులు, 826 సమితులలో 75,852 స్ధానాలు, 75 జిల్లాల్లోని 3,121 జిల్లా పరిషత్‌ స్ధానాలు అంటే మొత్తం ఎనిమిది లక్షల స్దానాలకు 13లక్షల మంది అభ్యర్దులు పోటీ చేశారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా బిజెపి ఏ ఏ స్దానాలలో ఎవరిని బలపరుస్తున్నదో జాబితా ప్రకటించింది. దాని ప్రకారం రెండువేలకు పైగా స్ధానాలలో అది ఓడిపోయింది. ఈ ఎన్నికలలో తమ సత్తా చాటేందుకు గాను జనవరిలోనే బిజెపి ఆరు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక మంత్రి, ఒక సీనియర్‌ నేతలను అధిపతులుగా నియమించింది. ముఖ్యమంత్రి యోగి, కేంద్ర పార్టీ పరిశీలకుడు రాధామోహన్‌ సింగ్‌ అనేక సమీక్షా సమావేశాలు జరిపారు. ఈ ఎన్నికలలో గెలిచిన వారు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్న షరతును పార్టీ విధించింది. ఇప్పుడు గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందనే ఆశతో అనేక మంది ముందే రాజీనామాలు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.


రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్‌లలో మొత్తం 3,121 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. పార్టీల వారీ సమాజవాద పార్టీ 1000,బిజెపి 900, బిఎస్‌పి 320, కాంగ్రెస్‌ 270, ఆమ్‌ ఆద్మీ 70 మిగిలిన స్ధానాల్లో స్వతంత్రులు గెలిచినట్లు ఆ పార్టీలు ప్రకటించుకున్నాయి ( ఆయా పార్టీలు ప్రకటించుకున్న వివరాల మేరకు వివిధ పత్రికలలో వచ్చిన సంఖ్యలలో తేడాలు ఉన్నాయి. ఉదా కొన్ని పత్రికల్లో కాంగ్రెస్‌కు 72 మాత్రమే). గతంలో గ్రామీణ స్ధానిక సంస్దల ఎన్నికలలో బిజెపి పెద్ద శక్తి కాదు కనుక గత ఎన్నికలలో దాని తీరుతెన్నులు ఇతర పార్టీలతో పోల్చలేము. 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల బిజెపి ఫలితాలతో బిజెపి 2021 పనితీరును పోల్చాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రామాలయ భూమి పూజ జరిగిన ప్రాంతం అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ జిల్లాలో 43 సీట్లకు గాను సమాజవాది పార్టీ 24, బిజెపి 8, బిఎస్‌పి 4, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. అయోధ్య తరువాత దేశంలో చిచ్చుపెట్టేందుకు ఎంచుకున్న మధుర కృష్ణ జన్మభూమి వివాద జిల్లాలో 33కు గాను బిఎస్‌పి 13, బిజెపి 8 సీట్లు గెలుచుకుంది. రెండు సార్లు ప్రధాని నరేంద్రమోడీని గెలిపించిన వారణాసి జిల్లాలో 48 స్దానాలకు గాను సమాజవాద పార్టీ 15, బిఎస్‌పి, అది బలపరచిన స్వతంత్రులు 17, బిజెపికి 8 వచ్చాయి.


సమాజవాది పార్టీ విషయానికి వస్తే తమకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పటం తప్ప జాబితాను ప్రకటించలేదు. ఇతరులు ఎవరైనా తమతో కలసి వస్తే అవసరమైతే వారికి పార్టీ ముద్రవేసి బలపరిచేందుకు వీలుగా వ్యవహరిస్తున్నది. ఎన్ని సమితి, జిల్లా పరిషత్‌లను కైవశం చేసుకోవాలన్నదే ఇప్పుడు దాని లక్ష్యంగా ఉంది. తాము అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధులతో పాటు గెలిచిన వారిలో తమ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు బిజెపి చెప్పుకుంటోంది. పార్టీ రహితంగా గెలిచినందున ఫిరాయింపుల సమస్య ఉండదు కనుక ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకొనేందుకు ద్వారాలు తెరిచింది. బిఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తాయనేది రాజకీయంగా కీలకంగా మారింది.
వివిధ పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కరోనా వ్యాపిస్తున్నది. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నా నమోదు కావటం లేదు. దక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక సమాచారం ప్రకారం మే 7వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం కేసులు 14,25,916 కాగా, మరణాలు 14,501 అంటే వందకు ఒక మరణం జరుగుతోంది. ఆదిత్యనాధ్‌ ఇటీవల కేరళ వెళ్లి తమ అభివృద్దిని చూసి నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే. అక్కడ ఇటీవల కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ మే 7 నాటికి వందకు మరణాలు 0.3 మాత్రమే. యోగి ఆదిత్యనాధ్‌ పలుకుబడి బాగా ఉన్న తూర్పు ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాలలో పరిస్ధితి దారుణంగా ఉందని వార్తలు వస్తున్నాయి.


ఇక రాజకీయాల విషయానికి వస్తే 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి ఒంటరిగా అన్ని స్ధానాలకు పోటీ చేయగా సమాజవాది పార్టీ 298, దానితో కలసిన కాంగ్రెస్‌ 105 చోట్ల పోటీ చేసింది. రెండేళ్ల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా కాంగ్రెస్‌ విడిగా పోటీ చేశాయి.ఓటింగ్‌ను చూస్తే ఎస్‌పి-బిఎస్‌పి కుడి ఎడమలుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత బిఎస్‌పి అనేక కీలక సమస్యల మీద బిజెపికి మద్దతు ఇచ్చి దానికి దగ్గరైందనే అభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించింది. అందుకే బిజెపి బీ టీమ్‌ బిఎస్‌పి అని ప్రియాంక గాంధీ వర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో సమాజవాది పార్టీతో పోలిస్తే బిఎస్‌పికి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాల కోసం ఫలితాల గురించి ఎస్‌పి ఆచితూచి వ్యాఖ్యానిస్తోంది.


వివిధ పార్టీల బలాబలాలకు సంబంధించి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వివరాలను చూద్దాం. 2017అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 384 స్ధానాల్లో దాని మిత్ర పక్షాలు 19 స్ధానాల్లో పోటీ చేశాయి.బిజెపికి 39.67శాతం, మిత్రపక్షాలకు 1.7శాతం వచ్చాయి. సమాజవాది పార్టీ పోటీ చేసిన 298 స్దానాల్లో 21.82, బిఎస్‌పి అన్ని చోట్లా 403 పోటీ చేసి 22.23శాతం తెచ్చుకుంది. సమాజవాది పార్టీతో సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌కు 105 స్దానాల్లో 6.25శాతం వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల ఓట్ల చీలిక బిజెపికి 312 సీట్లు తెచ్చిపెట్టింది.యాభైశాతం పైగా ఓట్లు తెచ్చుకున్న పార్టీలకు వచ్చింది 73 మాత్రమే. తరువాత 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూటమికి 51.19శాతం ఓట్లు 80కి గాను 69 సీట్లు వచ్చాయి. ఓట్లు పెరిగినా అంతకు ముందుతో పోలిస్తే 9 సీట్లు తగ్గాయి. ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 39.23శాతం ఓట్లు 15 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్‌కు 6.41శాతం ఓట్లు ఒక సీటు వచ్చింది.


అయోధ్యలో రామాలయ నిర్మాణ వాగ్దానం నెరవేర్చామని చెప్పుకుంటూ యోగి మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని కలలు కంటున్నవారికి స్ధానిక సంస్ధల ఫలితాలు షాక్‌ వంటివే. ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పడిన కారణంగానే తాజా ఎన్నికలలో బిజెపి అనేక చోట్ల ఓడిపోయిందని వార్తలు వచ్చాయి. కరోనా నిర్లక్ష్యంతో జరిగే పరిణామాలు రాబోయే రోజుల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు దేవుళ్ల వరాలు !

07 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP-Kerala, Kerala Assembly Elections 2021, Kerala Congress Blame Game, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


తామేం చేసినా, ఏం మాట్లాడినా జనం గతం మాదిరి అధికారం అప్పగించక తప్పుదు అన్నట్లు వ్యవహరించిన కేరళ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఓటమికి మీరు బాధ్యులంటే కాదు మీరే అనే కీచులాటలకు దిగారు. అధికారం ఖాయం అన్న ఆశతో మీతో పాటు ఐదేండ్లు ఎదురు చూశాము, మీ తీరు తెన్నులతో మరో ఐదేండ్లు ప్రతిపక్షంలో ఎలా కూర్చోవాలి, అసలు ఆ తరువాతైనా అధికారానికి వస్తామా అన్నది అనుమానమే అన్నట్లుగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు మధనపడుతున్నాయి. పైపై మెరుగులు కాదు సమూల ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి వత్తిడి వస్తోంది. ఇరవై మంది ప్రస్తుత ఎంఎల్‌ఏలను నిలిపితే ముగ్గురే ఓడిపోయారు, కొత్త ముఖాల పేరుతో 50 మందిని రంగంలోకి రప్పిస్తే గెలిచింది ఇద్దరే , ఎందుకీ పని చేశారు అని అడుగుతున్నారు. ఓటమికి అందరూ బాధ్యులే అయితే నన్ను ఒక్కడినే బలిచేసి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు పూనుకుంటారా అని ముళ్లపల్లి రామచంద్రన్‌ ఆగ్రహించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కోరితే రాజీనామాకు సిద్దం, అదే విషయం చెప్పాను అన్నారు. రెండు సంవత్సరాల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడేమో దానికి బాధ్యత నాది అని ఎవరూ చెప్పలేదు, ఇప్పుడేమో అంతా మీరే చేశారు అన్నట్లు ప్రతివారూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర నాయకత్వం ఈసారి ఎన్నికల్లో జోక్యం చేసుకుంది, అందువలన ప్రతివారూ దీనికి బాధ్యులే, నన్ను అవమానించి పార్టీ నుంచి వెలివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కష్టకాలంలో పార్టీ వదలి వెళ్లాననే అభిప్రాయం రాకుండా ఉన్నాను, పార్టీ అధినాయకత్వం అనుమతిస్తే వెంటనే రాజీనామా చేస్తా అన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌కు వ్యతిరేకంగా తిరువనంత పురంలో బ్యానర్లు వెలిశాయి. ఆయన ఎప్పుడూ నిద్రపోతున్నట్లు ఉంటారని, అలాంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా పనికిరారని హిబి ఇడెన్‌ అనే నేత ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ముఠా తగాదాలే ఓటమికి ముఖ్యకారణమని కేరళ కాంగ్రెస్‌ నేత పిజె జోసెఫ్‌ విమర్శించారు. ముళ్లపల్లి రామచంద్రన్‌, రమేష్‌ చెన్నితల ఇద్దరినీ ఆ పదవుల నుంచి తప్పించి కొత్త వారిని ఎన్నుకోవాలని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ చొరవతో జరిగిన ఒక సమావేశంలో ఒక వర్గం అభిప్రాయంపడింది.
పిసిసి అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేతను మార్చాల్సిందే అయితే అది ఉన్నవారిని బలవంతంగా తొలగించారనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని పార్టీ నాయకత్వం చూస్తోంది. కరోనా వలన ఎల్‌డిఎఫ్‌కు లబ్ది చేకూరింది, అందువలన పార్టీ ఓటమికి ఎవరినీ నిందించనవసరం లేదని కన్నూరు ఎంపీ కె సుధాకరన్‌ చెప్పారు. కరోనా కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు చురుకుగా పనిచేయలేకపోయారు. కానీ అలాంటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ సృష్టిలో సిపిఎం విజయవంతమైంది.వారి మాదిరి ఏ పార్టీ జనానికి మద్దతు ఇవ్వలేదు, అది ఈ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిందని సుధాకరన్‌ చెప్పారు. ప్రతిపక్ష నేతగా రమేష్‌ చెన్నితల బాగా పని చేశారని, అయితే దాన్ని పార్టీ వినియోగించుకోలేకపోయిందన్నారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని అనేక మంది సుధాకరన్ను కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ అంతరించదని యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన నీమమ్‌ నియోజకవర్గంలో మూడవ స్దానంలో నిలిచిన కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు వి మురళీధరన్‌ చెప్పారు. తమ ఓట్లశాతం పెరిగిందని, అయితే బిజెపి ఓట్ల శాతం తగ్గిపోవటం పట్ల ముఖ్యమంత్రి విజయన్‌ ఎక్కువ ఆందోళన వ్యక్తం చేశారని అరోపించారు.యుడిఎఫ్‌ను అంతం చేసేందుకు ఒక సాధనంగా బిజెపిని ఉపయోగించుకుంటున్నారని చెప్పుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఇక్కడ బిజెపి ఎదిగేది లేదన్నారు. యుడిఎఫ్‌లో రెండవ పెద్ద పార్టీ అయిన ముస్లింలీగులో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవటానికి నాయకత్వమే కారణమని, కొందరు నేతలు వారిలో వారు పదవులను పంచుకుంటూ కొత్తవారికి అవకాశం ఇవ్వటం లేదని ధ్వజమెత్తుతున్నారు. బలమైన స్దానాల్లో ఓటమి కారణాలు వెల్లడించాలని కోరుతున్నారు.

బిజెపి కూటమిలోనూ కీచులాటలు !


ఉన్న ఒక్క సీటు పోగొట్టుకోవటంతో పాటు ఓట్లు కూడా గణనీయంగా తగ్గిన ఎన్‌డిఏ కూటమిలోనూ కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఎన్‌డిఏ రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న భారత ధర్మ జనసేన (బిడిజెఎస్‌) తుషార్‌ వెల్లపల్లి రాజీనామాకు సిద్దపడినట్లు, బిజెపితో కొనసాగాలా లేదా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు. కేంద్ర ప్రభుత్వ బోర్డులు, కమిటీలలో తమకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్న వాగ్దానాన్ని బిజెపి నిలబెట్టుకోలేదని, తాము పోటీ చేసిన చోట బిజెపి నేతలు ప్రచారం చేయలేదు, కార్యకర్తలు ఓట్లుకూడా వేయలేదని ఆ పార్టీ చెబుతోంది. ఒకవేళ బిడిజెస్‌ ఎన్‌డిఏ నుంచి బయటకుపోయి ఎల్‌డిఎఫ్‌లో చేరినా తమకు జరిగే నష్టం ఏమీ లేదని బిజెపి నేత ఒకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక పేర్కొన్నది.

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు వరాలు !

అసెంబ్లీ ఎన్నికల సమయంలో శబరిమల అయ్యప్ప, ఇతర దైవ సంబంధ అంశాలను ముందుకు తెచ్చి కాంగ్రెస్‌, బిజెపి తీవ్రంగా ప్రయత్నించాయి. పోలింగ్‌ జరుగుతుండగా నాయర్‌ సర్వీసు సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయ్యప్ప శాపం తగిలిన ప్రభుత్వం రెండవ సారి అధికారానికి రాదని, జనం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అయ్యప్ప ఇతర దేవుళ్లందరూ ఎల్‌డిఎఫ్‌తో ఉన్నారని ఫలితాలు రుజువు చేశాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. పుణ్యక్షేత్రాలుగా, ప్రాంతాలుగా పేరున్న తొమ్మిది పట్టణాలు లేదా నియోజకవర్గాలు, ప్రతిపక్ష కూటమికి కంచుకోటలుగా భావించిన చోట కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు పెద్ద మెజారిటీలతో విజయాలు సాధించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో శబరిమల ప్రాంతం ఉన్న కొన్ని నియోజకవర్గంలో యుడిఎఫ్‌ గెలిచింది. అయితే శాసనసభ్యుడి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో 23 సంవత్సరాల తరువాత సిపిఎం గెలిచింది. తిరిగి తాజా ఎన్నికలలో ఎనిమిదిన్నర వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయ్యప్ప పేరుతో పాగా వేయాలని చూసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడ మూడవ స్ధానంలో నిలిచారు. త్రిసూర్‌లో వడక్కున్హా పేరుతో ఉన్న శివాలయం ఎంతో ప్రాచుర్యం కలిగింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గతసారి సిపిఐ గెలిచి, ఈ సారి కూడా విజయం సాధించింది. సినిమా హీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమార్తె పద్మజ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. సురేష్‌ గోపి మూడవ స్ధానంలో నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రార్ధనా స్ధలాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందిన అనంత పద్మనాభ స్వామి ఉన్న తిరువనంతపురంలోని నియోజకవర్గంలో దీర్ఘకాలం తరువాత కాంగ్రెస్‌ను ఓడించి సిపిఎం విజయం సాధించింది. ఇక్కడ కూడా బిజెపికి మూడవ స్ధానమే. ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయూర్‌లో యుడిఎఫ్‌ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్‌ పోటీ చేశారు. అక్కడ బిజెపి నామినేషన్‌ చెల్లకపోవటంతో ఆయన విజయం సాధించాలని సురేష్‌ గోపి బహిరంగంగానే ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇక్కడ కూడా ఎల్‌డిఎఫ్‌ గెలిచింది. వైకోం మహదేవ దేవాలయం, శ్రీ కురుంబ భగవతి వంటి ప్రముఖ క్షేత్రాలలో కూడా ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించింది.
ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రలో భాగంగానే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ కాంగ్రెస్‌-బజెపిలతో చేతులు కలిపారని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ దేశాభిమాని పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.మతపరమైన చీలిక తెచ్చే విధంగా ఆయన ప్రకటనలు చేశారని విమర్శించారు. తాము ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకం కాదని తన మాటలను వక్రీకరించారని సుకుమారన్‌ నాయర్‌ ఆరోపించారు. అయితే నాయర్‌ చేసిన ప్రకటనను కాంగ్రెస్‌, బిజెపి సమర్ధించాయి.
కొన్ని సంస్ధలు ఎన్నికల అనంతరం జరిపిన సర్వేల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మతాలలో ఉన్న పేదలు, బడుగు జీవులు ఎల్‌డిఎఫ్‌కు ఓటు వేసినట్లు తేలింది. కొన్ని చోట్ల గతం కంటే ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారు ఎక్కువగా ఓటు చేశారు. వెనుకబడిన తరగతులు, దళితులు అత్యధికులు కమ్యూనిస్టులకు ఓటు వేశారు.

ఇరవైన విజయన్‌ ప్రమాణస్వీకారం !

రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ముగిసిన తరువాతనే ఈనెల 20న నూతన ప్రభుత్వం ఏర్పడ నుంది ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు పూర్తి స్ధాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. పదిహేడవ తేదీన ఎల్‌డిఎఫ్‌ సమావేశం పద్దెనిమిదిన సిపిఎం కార్యదర్శివర్గ సమావేశం, పందొమ్మిదవ తేదీన మంత్రివర్గ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రికి తీర్మానం అందచేత, ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.ఈలోగా వివిధ పార్టీలకు కేటాయించే మంత్రుల సంఖ్య, శాఖల కేటాయింపులో మార్పుల గురించి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రద్దయిన మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగాక 19 మంది మంత్రులు ఉన్నారు. ఈ సారి ఒక ఎంఎల్‌ఏ ఉన్న పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే మంత్రుల సంఖ్య 21కి పెరగవచ్చు.గతంలో యుడిఎఫ్‌ మంత్రివర్గంలో 21 మంది మంత్రులు ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d