• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

ఆంగ్లేయుల దోపిడీ, అణచివేతలపై బ్రిటన్‌ అధినేతగా రిషి సునాక్‌ భారతీయులకు క్షమాపణ చెబుతారా !

26 Wednesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Jallianwala Bagh massacre, Liz Truss, Rishi Sunak, RSS


ఎం కోటేశ్వరరావు


కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ కొత్త చరిత్రను సృష్టించాడు.పంజాబు మూలాలున్న తొలి ఆసియన్ను బ్రిటన్‌ నూతన ప్రధానిగా బకింగ్‌హామ్‌ పాలెస్‌లో మంగళవారం నాడు రాజు ఛార్లెస్‌ నియమించాడు. హిందువు, భారతీయుడు,మనవాడు అంటూ మన మీడియా స్పందించింది. ఏడు వారాలలో ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారటం బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు తాజా పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు. అంతకు ముందు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా కారణంగా ప్రధాని పదవికి కన్సర్వేటివ్‌ పార్టీలో జరిగిన పోటీలో సునాక్‌ను వెనక్కు నెట్టి ట్రస్‌ మొదటి స్థానంలో నిలవటంతో సెప్టెంబరు ఆరున ఆమె పదవిలోకి వచ్చారు.(బ్రిటన్‌ పార్టీల నిబంధనల ప్రకారం పార్లమెంటులో పార్టీ నేతగా ఎన్నిక కావాలంటే నిర్ణీత సంఖ్యలో పార్టీ ఎంపీల మద్దతు పొందిన వారు పోటీ పడతారు, తొలి రెండు స్థానాల్లో వచ్చిన వారికి ఆ పార్టీల సాధారణ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక్కరే ఉంటే ఏకగ్రీవం అవుతారు). ప్రధానిగా సునాక్‌ తొలిసారి మాట్లాడుతూ దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సి ఉందన్నాడు.ప్రతిపక్ష లేబర్‌ పార్టీ, ఇతరులు డిమాండ్‌ చేసినట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశాడు.


ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు భిన్నంగా పన్ను రాయితీలు ప్రకటించటంతో విమర్శలపాలు కావటమే కాదు, స్వంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత తలెత్తటంతో లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. తొలుత తాను రాజీనామా చేసేది లేదని బీరాలు పలికినా చివరకు తలొగ్గక తప్పలేదు. దీంతో మరోసారి పార్టీలో పోటీ తలెత్తింది. ఈ సారి ప్రధాని పదవికి పోటీ పడేవారికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉన్నవారే అర్హులని నిర్ణయించారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రేసులో నిలిచేందుకు పావులు కదిపినా ఆశించిన మద్దతురాకపోవటంతో వెనక్కు తగ్గి పరువు నిలుపుకున్నాడు. పార్లమెంటులో పార్టీ నాయకురాలు పెనీ మోర్డాంట్‌ అర్హతకు అవసరమైన మద్దతును కూడగట్టటంలో విఫలం కావటంతో చివరి క్షణంలో ఆమె కూడా తప్పుకోవటంతో సునాక్‌ ఒక్కరే మిగిలారు. లండన్‌ కాలమానం ప్రకారం అక్టోబరు 25వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు(మన దేశం కంటే నాలుగున్నర గంటలు వెనుక) తన చివరి కాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లిజ్‌ ట్రస్‌ రాజీనామా ప్రకటించి రాజు ఛార్లెస్‌కు అందచేశారు. చివరి మంత్రి వర్గ సమావేశం తరువాత లిజ్‌ ట్రస్‌ పన్నుల తగ్గింపు తన చర్యను సమర్ధించుకున్నారు.అధికారంలో ఉన్న వారు ధైర్యంగా ఉండాలన్నారు.


సునాక్‌ పదవి నిజానికి ముళ్ల కిరీటం వంటిదే. లిజ్‌ ట్రస్‌ సెప్టెంబరు 23న మినీ బడ్జెట్‌గా పిలిచిన చర్యలలో కొన్ని ఇలా ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థల మీద పన్ను మొత్తాన్ని 25శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు భిన్నంగా 19శాతానికి తగ్గించారు. జి20 దేశాలలో ఇది కనిష్టం. మౌలిక ఆదాయపన్ను 20 నుంచి 19శాతానికి తగ్గించారు.లక్షన్నర పౌండ్లకు మించి రాబడి ఉన్నవారికి పన్ను మొత్తాన్ని 45 నుంచి 40శాతానికి తగ్గించారు. బీమా పధకానికి పెంచిన 1.25 శాతం చెల్లింపును రద్దు చేశారు. ఇండ్ల కొనుగోలుపై పన్నుల తగ్గింపు, పన్ను తగ్గింపు జోన్ల ఏర్పాటు, అక్కడ నిబంధనలను నీరు గార్చటం, టూరిస్టులు తాము చెల్లించిన అమ్మకపు పన్నును తిరిగి తీసుకొనే వెసులుబాటు, మద్యంపై పెంచిన పన్నుల తగ్గింపు. నలభై ఐదు బిలియన్‌ పౌండ్ల మేర ఖజానాకు గండిపడేచర్యలివి. నిజానికి ఈ కారణంగా ఆమె పదవిని కోల్పోవటం పెట్టుబడిదారీ వ్యవస్థలో చిత్రంగానే కనిపించవచ్చు. దీని వలన దేశ లోటు, రుణ భారం మరింతగా పెరగనుంది, సంక్షేమ చర్యలకు కోత పడుతుంది. ఇప్పటికే కార్మికులు, మధ్యతరగతి వారి మీద గతంలో పెంచిన పన్నులు, ఇటీవలి కాలంలో ధరల పెరుగుదలతో జీవన వ్యయం విపరీతంగా పెరిగి జనజీవితాలు అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో కార్పొరేట్‌లు, ధనికులకు ప్రకటించిన రాయితీలు తీవ్ర విమర్శలకు, అధికారపార్టీలో కుమ్ములాటలకు దారి తీశాయి.


ఏక్షణంలోనైనా ఆర్ధిక రంగం మాంద్యంలోకి జారనుందనే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 10.1శాతం దాటింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో రుణాల భారం పెరుగుతుంది. మరోవైపు పౌండు విలువ దారుణంగా దిగజారింది. అధికారపక్ష పలుకుబడి అధమ స్థాయికి పడిపోయింది. ట్రస్‌ – రిషి ఇద్దరూ ఒకే తానులో ముక్కలైనా అనుసరించే పద్దతుల్లో మాత్రమే తేడా. 2024 వరకు పార్లమెంటు గడువు ఉన్నందున వెంటనే ఎన్నికలు జరగాలని టోరీ పార్టీ కోరుకోవటం లేదు. ఇంకా తగినంత గడువు ఉన్నందున ఆర్ధిక రంగాన్ని పునరుజ్జీవింపచేసి, జీవన ప్రమాణాలను పెంచి ఓటర్ల ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోవటం ఖాయం. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు ద్వారా లోటు బడ్జెట్‌ తగ్గింపు, పన్నుల పెంపును ఐఎంఎఫ్‌ కోరుతున్నది.ఇదే జరిగితే కార్మికుల జీవితాలు మరింతగా దిగజారతాయి. అందువలన రానున్న రోజుల్లో రిషి సునాక్‌ కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31న తన విధానాల గురించి సునాక్‌ చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


పెరిగిన ఇంథన, ఆహార, ఇతర వస్తువుల ధరల తగ్గింపు, నిజవేతనాల పెరుగుదల కోసం జనాలు చూస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని సునాక్‌ చెప్పాడు.2020 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు ఆర్ధిక మంత్రిగా పని చేసిన సునాక్‌ 1950 దశకం తరువాత తొలిసారిగా పన్నుల భారాన్ని పెంచాడు. ప్రభుత్వ ఖర్చునూ పెంచాడు. ద్రవ్యోల్బణం తగ్గి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పన్నులను తగ్గిస్తానని లిజ్‌ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడినపుడు రిషి చెప్పాడు. 2029 నాటికి ఆదాయపన్నును 20 నుంచి 16శాతానికి తగ్గిస్తామని చెప్పాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కన్సర్వేటివ్‌ పార్టీలో విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగానే బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌ ఇంటిదారి పట్టారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరుపడాలన్న వైఖరిని రిషి సమర్ధించాడు. అది పొరపాటని తిరిగి చేరాలంటూ కొందరు ఇప్పుడు వత్తిడి చేస్తున్నారు. వెలుపల ఉండటం ద్వారా బ్రిటన్‌కు కలిగే ప్రయోజనాలను వెంటనే చూపకపోతే ఆ డిమాండ్‌ మరింతగా పెరగవచ్చు. విదేశీ వలసలను అరికట్టాలని కన్సర్వేటివ్‌ పార్టీలో మెజారిటీ కోరుతున్నారు. అయితే అలాంటి వలసవచ్చిన వారి సంతతికి చెందిన సునాక్‌ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినందుకు తాను గర్వస్తానని అన్నాడు. ఆర్ధిక రంగ సమస్యలను నిర్ధారించి, పార్టీని ఐక్య పరచి దేశాన్ని ముందుకు తీసుకుపోతానని సునాక్‌ చెప్పాడు. విధ్వంసం జరిగిన ప్రాంతంలోకి సునాక్‌ అడుగుపెడుతున్నాడని ఒక టీవీ వ్యాఖ్యాత చేసిన వర్ణన వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రభుత్వ ఖర్చును 30బిలియన్‌ పౌండ్ల మేర తగ్గించటం లేదా ఆ మేరకు అదనపు రాబడిని చేకూర్చాల్సి ఉంది.రానున్న మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ రుణభారాన్ని తగ్గిస్తామన్న వాగ్దానాన్ని కూడా అమలు జరపాల్సి ఉంది.


బ్రిటన్‌లో ప్రధాని పదవిని చేపట్టిన రెండవ క్రైస్తవేతరుడిగా, తొలి హిందువుగా రిషి సునాక్‌ చరిత్రకెక్కారు. అతడు భారతీయ మూలాల కంటే హిందువు కావటంతోనే మన దేశంలో మీడియా, సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతున్నది. నిజానికి సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతంలోని గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. అక్కడే సునాక్‌ తండ్రి జన్మించాడు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980లో రిషి సునాక్‌ బ్రిటన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. సునాక్‌ నానమ్మ ఆఫ్రికన్‌. వారి కుటుంబం పుట్టింది, పెరిగిందీ ఆఫ్రికాలోనే ఉగండాలో ఇడీ అమీన్‌ పాలనలో జరిగిన దాడులపుడు అనేక మంది బ్రిటన్‌ ఇతర దేశాలకు వలస వెళ్లారు. అలాంటి కుటుంబాలలో సునాక్‌ తండ్రి ఒకరు. అందువలన నిజంగా చెప్పాల్సి వస్తే ఆఫ్రికా మూలాలు లేదా తాతలు పుట్టిందీ పెరిగినదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే పాక్‌ మూలాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. మన మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌, మన్మోహన్‌ సింగ్‌, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ కుటుంబాలు విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చినవే. అలాగే పాక్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పర్వేజ్‌ ముషారఫ్‌ కుటుంబం భారత్‌ నుంచి పాక్‌ వలస వెళ్లింది. వారు పదవుల్లోకి వచ్చినపుడు వారి మూలాల గురించి ఎలాంటి చర్చ లేదు. సోనియా గాంధీ 1983లోనే పూర్తిగా భారత పౌరురాలిగా మారినప్పటికీ తరువాత 2004లో బిజెపి లేని వివాదాన్ని ముందుకు తెచ్చి ప్రధాని గాకుండా మనోభావాలతో ఆడుకొనేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఇటలీ మూలాల గురించి ఏదో రూపంలో ప్రస్తావిస్తూనే ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. వసుధైక కుటుంబం కబుర్లు చెప్పేది కూడా వారే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిషి సునాక్‌ మూలాలు భారత్‌లో ఉన్నట్లు మన మీడియా చిత్రిస్తున్నది, దాన్ని ఏ ప్రాతిపదికన చెబుతారు. దాని వలన ఒరిగేదేమిటి ? అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా తొలి ఆఫ్రికన్‌ సంతతికి చెందినవాడు. లాటిన్‌ అమెరికా, ఐరోపాలోని అనేక దేశాల్లో ఇలా వలస వచ్చిన వారు, వారి సంతతి ఉన్నత పదవులను పొందారు. అందువలన అదేమీ వింత కాదు.


ఈ దేశంలో పుట్టిన ముస్లింలను పాకిస్తాన్‌ పోవాలని చెబుతున్న విద్వేష శక్తులే రిషి సునాక్‌ మూలాల గురించి ఎక్కువగా ముందుకు తెస్తున్నాయి.బ్రిటన్‌లో కూడా జాత్యహంకార శక్తులు లేకపోలేదు. వారికి భారత్‌, పాకిస్తాన్‌, చైనా ఇలా ఎక్కడ నుంచి వలస వచ్చిన కుటుంబాలనైనా ఆసియన్లంటూ చులకనగా చూసేవారున్నారు.మొత్తం మీద చూస్తే అలాంటి సంకుచిత భావాలకు అతీతంగా అక్కడి సమాజం ఎదిగిన కారణంగానే సునాక్‌తో సహా అనేక మంది ఇతర ఖండాల మూలాలు ఉన్న సంతతికి చెందినప్పటికీ మంత్రులుగా, ఏకంగా ఇప్పుడు ప్రధానిగానే అంగీకరించారు. రిషి సునాక్కు అమెరికా గ్రీన్‌ కార్డు కూడా ఉందని కూడా తెలిసిందే. రిషి సునాక్‌ కుటుంబం మీద విమర్శలు కూడా ఉన్నాయి. భార్య అక్షిత 20లక్షల పౌండ్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విమర్శలు రాగా తరువాత ఆ మొత్తాన్ని తాను చెల్లిస్తానని ఆమె వివాదానికి స్వస్థిపలికారు. సునాక్‌ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది కాదు, వర్తమానంలో ఎవరి కోసం పని చేస్తున్నాడు అన్నది కీలకం. ఆ విధంగా చూస్తే కార్పొరేట్లకు చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ నేతగా వారి సేవలోనే తరిస్తున్నాడు. ఒకనాడు తెల్లవారు మన దేశాన్ని పరిపాలిస్తే నేడు మన వాడు బ్రిటన్‌ పాలకుడిగా ఉన్నారని కొందరు చెబుతున్నారు. గతంలో ఎంపీగా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు మురిసిపోతున్నారు. ఎవరి విశ్వాసం వారిది. వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన సంపదలను కొల్లగొట్టి తమ దేశానికి తరిలించారు. అణచివేతలో భాగంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. వారు చేసిన నేరాలకు ఎన్నడూ క్షమాపణ కాదు కదా తమ పూర్వీకులు తప్పు చేసినట్లు విచారం కూడా ప్రకటించలేదు. చెప్పేందుకు సిద్దంగా కూడా లేరు.అందరూ చెబుతున్నట్లు భారత మూలాలు ఉన్న ఒక పంజాబీగా జలియన్‌వాలా బాగ్‌ దురంతాన్ని రిషి గుర్తు చేసుకోగలరా ? ఇదే రిషి సునాక్‌ ఆర్ధిక మంత్రిగా తమ దేశానికి లబ్ది చేకూర్చే వాణిజ్య ఒప్పందాల చర్చలను కొనసాగించారని తెలుసా ? వాటితో మన దేశాన్ని కొత్తగా కొల్లగొట్టకుండా ప్రధానిగా తన గడ్డ రుణం తీర్చుకుంటారని అతను మనవాడని భుజాన వేసుకుంటున్న వారు చెప్పగలరా ? అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి తన జాతికి చేసిన అన్యాయాలకు బ్రిటన్‌ అధినేతగా క్షమాపణ సరే కనీసం విచారమైనా ప్రకటించగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌హ‌త‌హ‌..  శ‌ర‌వేగంగా మారుతున్న పరిస్థితులు

25 Tuesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

American hegemony, Joe Biden, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin

 

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడి కాన్పించని

కధలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగని సత్యం …

అంటారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ప్ర‌స్తుతం జరుగుతున్న  ఉక్రేయిన్, ర‌ష్యా దాడి అనంత‌రం   ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనేక అంశాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా చేస్తున్న కుట్ర‌లు స్ప‌ష్ట‌మౌతాయి. ఉద్దేశ పూర్వ‌కంగానే అమెరికా సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌కు మ‌డుగులొత్తుతూ మీడియా చేస్తున్న ప్రాప‌కాండ అంతా ఇంతా కాదు.  అమెరికా దేశానికి మ‌ద్దతు ఇస్తున్న అనేక దేశాల్లో తెర‌చాటుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఆయా దేశాల రాజ‌కీయ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విష‌యం బ‌హిర్గ‌తమౌతుంది. 

రష్యాను లొంగతీసుకోవాలనే ఎత్తుగడతో అమెరికా ఆంక్షలను విధించింది. ఎత్తుగడ బెడిసికొట్టింది. రష్యా తన ఆయిల్ నిల్యలను ఆయుధాలుగా వాడుకుని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను వణికిస్తున్నది.  అమెరికా- రష్యాలనే కాకుండా ప్రపంచాన్నేఆర్ధికసంక్షోభంలోకి, ఆర్ధిక మాంద్యం దిశగా నెట్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం మొదటిసారిగా చిక్కుల్లో పడింది. బ్రిటన్ పౌండ్ రికార్డు స్ధాయిలో పతన మయింది. ఆర్ధిక సంక్షోభం వలన ధరలు పెరిగిపోతున్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుపొందిన బ్రిటన్లో సంక్షోభం వలన ఇద్దరు ప్రధానులు మారిపోయారు. మూడో ప్రధాని వరసలో వున్నాడు. ఆహార ధరలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కార్పోరేట్ అనుకూల విధానాలతో  ప్రధాని లిజ్ ట్రస్ 44 రోజులలోనే తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. *ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు.

. పోరాట సాంప్రదాయాలు కలిగిన ఫ్రెంచ్ కార్మికులు, విద్యార్ధులు ఆందోళనాపధంలో వున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది.ఇటలీ. ఆస్ట్రియా, హంగెరీ, యూరోపియన్ దేశాలన్నిటిలో అసంతృప్తి ప్రజాందోళనలను ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి.సౌదీ అరేబియా అమెరికాకు ఎదురుతిరిగింది. అక్టోబరు 5 న ఒపెక్ ప్లస్  దేశాలు 2మిలియన్ బారళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించటానికి నిశ్చయించారు. ఫలితంగా ఆర్ధిక మాంద్యం కి చేరువలో వున్న యూరప్. అమెరికా లలో తీవ్ర ఆందోళన మొదలయింది.  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసివస్తుంది.

 *అమెరికా లో రాజకీయ కల్లోలం* .

నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపేస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్ కార్తీ విలేఖరుల సమావేశం లో చెప్పాడు. ఫిబ్రవరి లో రష్యా-ఉక్రెయిన్-నాటో యుద్ధం ప్రారంభమయిన దగ్గరనుంచీ అమెరికా ఆయుధాలు, నిధులు, నిఘా పరికరాలతోపాటుగా సైనిక శిక్షణ ను అందిస్తున్నది. శాటిలైట్ ల ద్వారా అత్యంత ఆధునిక నిఘావ్యవస్ధను ఉక్రెయిన్ కు ప్రతి నిముషం రష్యా సైనికుల కదలికలను తెలుపుతున్నది. ఇప్పటివరకూ 16.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిందని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. ప్రజాగ్రహం తో యుద్ద‌వ్యతిరేక ప్రదర్శనలు పెరుగుతున్నాయి.   

 *ఫ్రాన్స్, జర్మనీ ప్రజల  ప్రదర్శనలు  

అమెరికా మాట విని యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా తో వ్యాపారాలనన్నిటినీ ఆపేశారు. గ్యాస్ సరఫరా బందయింది. అమెరికా లిక్విఫైయిడ్ గ్యాసును సరఫరా చేస్తామంటే సంతోషించారు. లిక్విఫైయిడ్ గ్యాసును నాలుగు రెట్లు ధర ఎక్కువతో అందుబాటులోవుంచింది. కావాలంటే కొనుక్కోండంది. చౌకగా వస్తున్న రష్యన్ గ్యాసు రాకుండా చేసి కష్టకాలంలోవున్నమిత్రదేశంతో నెత్తురు పిండే వ్యాపారమేమిటని ఫ్రాన్స్, జర్మనీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తోంది. చలి రోజులు రానున్నాయి. ఎముకలు కొరుక్కుతినే చలిని తట్టుకోవటానికి వాతావరణాన్నివేడిగా వుంచే హీటర్లు కావాలి. హీటర్లు పని చేయటానికి గ్యాసు కావాలి. ఇంధనం కొరతతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి  పరిశ్రమలు నడవనందున కార్మికులు నిరుద్యోగులయ్యారు. వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. నాటో విధానాల ఫలితంగా రష్యా పై విధించిన ఆంక్షల వలన ప్రజలు ఆకలితో అలమటించడమే కాకుండా, నిరుద్యోగులుగా మారుతున్నారని జర్మన్లు గుర్తించడంతో వీధిలో ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీడియాలో చోటు చిక్కని యూరప్ ప్రజల నాటో వ్యతిరేక ప్రదర్శనలు..

ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. సైన్యంతో వీధి పోరాటాలకు దిగారు. బారికేడ్లను, ముళ్ళకంచెలను ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. నాటో సైనికకూటమి నుండి వైదొలగమని కార్మికులు, విద్యార్దులు దేశవ్యాపిత సమ్మెకు దిగారు. ఆదివారం ప్యారిస్ లో భారీ మార్చ్ ను నిర్వహించారు. దేశవ్యాపితంగా 180 చోట్ల భారీ ప్రదర్షనలను నిర్వహించారు. అమెరికా ప్రేరేపిత యుద్ధం వలన. ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.  పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఏమీకొనేటట్లు లేదు.  ఏమీ తినేటట్లులేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి 6.2 శాతానికి మించింది. ఇంధన కొరతతో పెట్రోల్ పంపులముందు బారీక్యూ లైన్ల తో ప్రజలు విసుగెత్తిపోయారు. కొన్ని పెట్రోల్ పంపులలో ఇంధనం అందుబాటులో లేనందున ధరలు  ఆకాశాన్నంటాయి. దేశంలోని మూడోవంతు గ్యాసు స్టేషన్లలో ఇంధనం అయిపోయింది. రాబోయే చలికాలంలో ఇంటిలో వేడిచేసే గ్యాస్ లేక చలికి గడ్డకట్టుకుపోయే  పరిస్ధితులను ఊహించుకొని ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం, ఇంధన కొరత, ధరల పెరుగుదల వలన సంభవించిన కార్మికుల, ప్రజల ఆగ్రహం  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది. ఫ్రాన్స్ లో ప్రపంచ యుధాలకు, అణచివేటకు కారణమైన నాటోను  రద్దు చేయమని ఫ్రెంచ్ కార్మికులు కోరుతున్నారు

 *అణుయుద్ధం తప్పదా..?* 

రష్యా భూభాగాన్ని రక్షించటానికి మాస్కో “తనకున్న అన్ని మార్గాలనూ” ఉపయోగిస్తుందని, తప్పనిసరి పరిస్ధితులలో అణ్వాయుధాలు ఉపయోగించటానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించటం ద్వారా అమెరికా ఒక “ఆనవాయితీని” సృష్చించిందని హిరోషిమా, నాగసాకీలపై ణుబాంబుల దాడిని పుతిన్ గుర్తు చేశాడు. రష్యా మరియు నాటోదేశాల మధ్య అస్తిత్వ యుద్ధంగా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పుతిన్ అభివర్ణించారు. రష్యాను రక్షించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాశ్చాత్య దేశాలను హెచ్చరించాడు. కొంతమంది విశ్లేషకులు పుతిన్‌ను “బ్లఫ్“చేస్తున్నారని అంటున్నారు, అయితే వాషింగ్టన్, పుతిన్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది.60 ఎళ్ళ క్రితం క్యూబా మిస్సైల్ సంక్షోభం వచ్చింది. మరల ఇపుడు అణుయుధ ప్రమాదం తీవ్ర స్ధాయిలో వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

 అణ్వాయుధాలను తమ జాతీయ భద్రతకు హామీ ఇచ్చే ఆయుధాలుగా, యుధనిరోధక సాధనాలుగా అణ్వాయుధ దేశాలు పరిగణిస్తున్నాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియార్ వార్ హెడ్స్ రష్యావద్ద 5977 వుండగా అమెరికా వద్ద 5428 న్యూక్లియార్ వార్ హెడ్స్ వున్నాయి తమ ప్రజల సంపదను ఫణంగా పెట్టి, తమ శక్తికి మించి ఖర్చు చేసి అణ్వాయుధాలను నిర్మిస్తున్నాయి.

యద్దం ఎపుడు ఆగుతుందో తెలియని అనిశ్చిత పరిస్ధితి దాపురించింది. బైడెన్ జనవరి 2021న అధ్యక్షపీఠాన్ని అదిష్టించినప్పటినుండీ  రష్యా సరిహద్దుదేశాలన్నిటిలో రష్యా వ్యతిరేక విష ప్రచారాన్నిఉధృతంచేశాడు.  రష్యాని నాశనం చేయపూనుకున్నాడు. సరిహద్దుల వైపు నాటో విస్తరణను కొనసాగించాడు. ఉక్రెయిన్ ను తటస్ధదేశంగా వుంచే అవకాశాన్ని జారవిడిచి రష్యాను నాశనం చేయాలనే తలంపుతో యుధానికి పాచికలు విదిలాడు. రష్యా, చైనాలపై విషాన్ని చిమ్మాడు. నాటో సైనిక కూటమి లో సభ్యత్వాలను ఆధారం చేసుకుని యూరోపియన్ యూనియన్ దేశానన్నిటినీ  ఉక్రెయిన్ కి సహాయంగా యుద్ధం లోకి లాగారు. రష్యా పైకి రెచ్చకొట్టాడు. సైనికంగా అమెరికా పై ఆధారపడిన నాటో దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ల నాయకత్వాలు అమెరికా ఉచ్చులో పడి బయటకు రాలేక ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా యుధోన్మాధం వలన ప్రపంచ ప్రజలంతా ద్రవ్యోల్బణంలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. రష్యా సరిహద్దు దేశాలను నాటో సైనిక కూటమిలో చేర్చుకునేప్రయత్నంలో అమెరికా సఫలం అయింది. రష్యాను వేరు చేసి ఒక మూలకునెట్టి నాశనం చేయాలనే తలంపుతో పావులు కదుపుతుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కాకపోయినా అమెరికా ను ఎదుర్కొనే సైనిక శక్తి, అణ్వాయుధాలు, సహజవనరులు గల శక్తివంతమైన దేశంగా వుంది. రష్యా కమ్యూనిజాన్నివదిలి , స్వేఛామార్కెట్ , ప్రజాస్వామ్యం అంటూ పెట్టుబడిదారీ విధానాన్ని, నాటోపట్ల మెతక వైఖరిని అనుసరించినా అమెరికా సామ్రాజ్యానికి తృప్తి కలగలేదు. యూరప్ కు దగ్గర కానీయలేదు. అమెరికా అగ్రరాజ్య అధిపత్యాన్ని ప్రశ్నించేవారిని సహించే పరిస్ధితి లేదు. బలమైన ప్రత్యర్ధిగా రూపొందే అవకాశం వున్నపెద్ద దేశాన్ని నాశనం చేయటమే ధ్యేయంగా అమెరికా నాటో ను విస్తరించింది. సోవియట్ యూనియన్ ని విఛిన్నం చేసిన గోర్బచేవ్ తో నాటో ను రష్యా వైపు విస్తరించబోమన్నవాగ్దాన భంగమే ఈ యుధానికి కారణం. నాటోను విస్తరించి పుతిన్ ని యుద్ధంలోకి లాగి ప్రపంచ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా యుద్దోన్మాదంతో ప్రపంచాధిపత్యంకోసం ఉక్రెయిన్ లో అంతర్యుధాన్నిప్రోత్సహించి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాని రెచ్చకొట్టింది.

 *అమెరికా దేశ భధ్రత… Vs…క్యూబా దేశభధ్రత* 

1962, క్యూబా మిస్సైల్ సంక్షోభానికి ఉక్రెయిన్ యుధానికి ఉన్న పోలికలను గమనించాలి. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మా దేశ భధ్రతకు ప్రమాదం అనే కారణంతో ఉక్రయిన్ పై రష్యా యుద్దానికి దిగింది. స్వతంత్రదేశమైన ఉక్రెయిన్ నాటో లో చేరాలనే నిర్ణయం తీసుకునే స్వేఛ ఉందని అమెరికా వాదన. అమెరికాకి 90 మైళ్ళ దూరంలో తన భధ్రతకు ప్రమాదమైన  అమెరికా వ్యతిరేక సోవియట్ అనుకూల ప్రభుత్వం వుంటానికే వీలులేదంది. ఆకాశమార్గంకుండా వేలాదిమంది తో సాయుధ దళాలను  క్యూబాదేశంలో దింపింది. ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నికూలదోయటానికి “ బే ఆఫ్ పిగ్స్” పేరున సైనిక చర్య చేపట్టింది. క్యూబాప్రజలు విద్రోహ సైన్యాన్నిబంధించి అమెరికా కుట్రను భగ్నం చేశారు. చిన్న దేశమైన క్యూబా తన రక్షణ కోసం సోవియట్ సహాయం తీసుకుంది. సోవియట్ అణు క్షిపణులను క్యూబాలో ఏర్పాటు చేసుకున్నారు. మామీద దాడిచేస్తే 5 నిముషాలలో అమెరికా ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగటన్ లపై దాడి చేయగలమన్నారు. అమెరికాభధ్రతకు ప్రమాదమైన అణు క్షిపణులను క్యూబా నుండి తీసేయకపోతే యుద్ధం తప్పదని కెన్నడీ హెచ్చరించాడు. సోవియట్ నౌక లు క్యూబా రాకుండా నావికా దిగ్బంధాన్నివిధించారు. ఆరోజున అమెరికా తన భధ్రత కోసం స్వతంత్ర దేశమైన క్యూబా భూభాగం నుండి అణు క్షిపణులు తీసేయకపోతే యుద్ధం తప్పదన్నది. ఈ రోజున రష్యా తన భధ్రత కోసం ఉక్రెయిన్ దేశాన్ని నాటో సైనిక కూటమి లో చేర్చుకోవద్దంటున్నది. తన దేశ సరిహద్దుదేశాలలో అణ్వాయుధాలు మోహరించి నిముషాలలో దాడి చేసేపరిస్ధితి వస్తే అణుయుద్దానికైనా సిధం అంటున్నది.   

క్యూబా మిస్సైల్స్ సంక్షోభంలో ప్రపంచం అణుయుధపుటంచుకు చేరింది. ఏ క్షణమైనా క్యూబా పై అమెరికాదాడి చేయవచ్చనీ మరో క్షణంలో సోవియట్ అణ్వాయుధాలు అమెరికా పై ప్రయోగించటం తప్పదనీ ప్రపంచ నాశనం అనివార్యమనే పరిస్ధితి దాపురించింది.  క్యూబా నుండి అణు క్షిపణులను తొలగించటానికి రష్యా అంగీకరించింది. క్యూబా పై దాడి చేయనని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా సరిహద్దున వున్న టర్కీనుండి అణుక్షిపణులను తొలగించటానికి అమెరికా అంగీకరించింది.  సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించి ప్రపంచ యుధాన్ని నివారించారు.

 *ప్రజలే చరిత్ర నిర్మాతలు.* 

ఈ రోజున రష్యా ఒక మూలకు నెట్టబడింది. అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంది. ఆర్ధిక మాంద్యం అంచుల్లో వుంది. నాటో నుండి వైదొలగమని యూరప్ ప్రజలు తిరగపడుతున్నారు. ప్రపంచ ప్రజల ఆహార భధ్రత ప్రమాదంలో పడింది. అణ్వాయుధ ప్రమాదం ముంచుకొస్తున్నది. అమెరికా కుట్రలను అర్దం చేసుకున్నయూరప్ యువత, కార్మికుల  ప్రజాందోళనలు యుద్ద‌గ‌తిని  మార్చబోతున్నాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు.

——————————————

డాక్టర్ కొల్లా రాజమోహన్,

నల్లమడ రైతు సంఘం.

9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌ వేర్పాటు వాదులు, అమెరికాకు షీ జింపింగ్‌ హెచ్చరిక !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CPC 20th congress, Taiwan independence, Taiwan Matters, Xi Jinping, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అతి పెద్ద దేశం చైనా. అతి పెద్ద రాజకీయ సంస్థ చైనా కమ్యూనిస్టు పార్టీ. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభల్లో భాగంగా 20వ మహాసభ అక్టోబరు 16-22 తేదీలలో జరుగుతున్నది.తొమ్మిది కోట్ల 67లక్షల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మిలిటరీతో సహా వివిధ విభాగాలు, తిరుగుబాటు ప్రాంతంగా ఉన్న తైవాన్‌ నుంచి మొత్తం 2,296 మంది పాల్గ్గొంటున్నారు. తదుపరి మహాసభ 2027లో జరగనుంది. సహజంగానే చైనా అధికార పార్టీ మహాసభ తీసుకొనే నిర్ణయాలు, చేసే దశ, దిశ నిర్దేశాల గురించి ప్రపంచం ఆసక్తితో ఎదురు చూస్తుంది. కొంత మంది ఆ ఏముంది, నేతలు ఏమి చెబితే ప్రతినిధులు దానికి తలూపటం తప్ప భిన్నాభిప్రాయాలను వెల్లడి కానివ్వరుగా అని పెదవి విరుస్తారు.వీరిలో కమ్యూనిస్టు పార్టీల పని పద్దతుల గురించి తెలియని వారు కొందరైతే, తెలిసీ బురద చల్లేవారు మరి కొందరు. మన దేశంలో సిపిఎం మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు.గతం, వర్తమాన పరిస్థితులను బేరీజు వేసి వచ్చే మూడు సంవత్సరాల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానం గురించి పాత కేంద్ర కమిటీ కొత్త మహాసభకు ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి దిగువన ఉన్న ప్రాధమిక శాఖ నుంచి రాష్ట్ర కమిటీల వరకు చర్చకు పంపుతారు, సవరణలు, వివరణలను ఆహ్వానిస్తారు. అంతిమంగా ఖరారు చేసిన దానిని ప్రతినిధుల మహాసభ ఆమోదానికి పెడతారు. అక్కడే దాన్ని ఖరారు చేస్తారు. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ దాని నిబంధనావళి ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధికారంలో ఉంది గనుక రాజకీయ విధానంతో బాటు దేశ అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గం గురించి కూడా చర్చిస్తుంది.


కొంత మంది ఆశిస్తున్నట్లు లేదా కోరుకుంటున్నట్లుగా అనేక పార్టీల మాదిరి భిన్నాభిప్రాయాలను పార్టీ ప్రతినిధులు వీధుల్లోకి తీసుకురారు. పార్టీ వేదికల మీదే కుస్తీ పడతారు. మెజారిటీ అంగీకరించిన విధానాన్ని మిగతావారు కూడా అనుసరిస్తారు. నేను పార్టీలోనే దీన్ని గురించి నిరసన తెలిపాను, కనుక అంగీకరించను, అమలు జరపను అని వెలుపల చెప్పటం క్రమశిక్షణా రాహిత్యం, కేంద్రీకృత ప్రజాస్వామిక విధానానికి విరుద్దం. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే పార్టీ నుంచి బహిష్కరణతో సహా తగిన చర్యలుంటాయి.చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ చేసే నిర్ణయాలు, విశ్లేషణలు, ప్రపంచ స్పందనల గురించి ఒక వ్యాసంలో వివరించటం కష్టం. ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడి కూడా కాలేదు. ప్రారంభ సభలో పార్టీ అధినేత షీ జింపింగ్‌ చేసిన ప్రసంగంలో తైవాన్‌ గురించి చేసిన ప్రస్తావన గురించి చూద్దాం.


ఈ మహాసభ పూర్వరంగంలోనే చైనాను రెచ్చగొట్టేందుకు వేసిన ఎత్తుగడ, చేసిన కుట్రలో భాగంగా అమెరికా అధికార వ్యవస్థలో మూడవ స్థానంలో ఉండే ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) స్పీకర్‌ నాన్సీ పెలోసీని అడ్డదారిలో తైవాన్‌ పంపారు, అక్కడి వేర్పాటు వాదులకు మద్దతు తెలిపి గతంలో తాను అంగీకరించిన ఒకే చైనాఅన్న విధానానికి తూట్లు పొడిచారు. ఈ వైఖరి ఐరాస, భద్రతా మండలి నిర్ణయాలకు సైతం వ్యతిరేకమే. అది వేరుగా ఉన్నందున శాంతియుత పద్దతుల్లో విలీనం జరగాలన్నది వాటి తీర్మానాల సారాంశం. దానికి భిన్నంగా తైవాన్‌లో కొంత మంది చైనా వ్యతిరేక దేశాల తెరచాటు మద్దతుతో తమది స్వతంత్ర దేశమని చెబుతున్నారు. ఒక వైపు విలీనం జరగాలని చెబుతూనే అమెరికా వంటి దేశాలు తైవాన్‌ వేర్పాటు వాదులకు అవసరమైన ఆయుధాలను అందిస్తూ తిరుగుబాటుకు పురికొల్పుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే షీ జింపింగ్‌ తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న దేశాలకు ఈ మహాసభలో తమ వైఖరి గురించి మరోసారి పునరుద్ఘాటించారు. తైవాన్‌ విలీనానికి శాంతియుత పద్దతులు విఫలమైతే అవసరమైతే బలప్రయోగం తప్పదన్న తమ ప్రకటన, వైఖరిని వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదని జింపింగ్‌ చెప్పారు.” తైవాన్‌ సమస్య పరిష్కారం చైనీయులకు సంబంధించింది. దాన్ని పరిష్కరించుకోవాల్సింది చైనీయులే. పూర్తి చిత్తశుద్ది, చివరి క్షణం వరకు శాంతియుత పద్దతుల్లో విలీన యత్నాలను కొనసాగిస్తాం. బలప్రయోగం చేయబోము అని మేము వాగ్దానం చేసే ప్రసక్తే లేదు. అన్ని రకాల చర్యలు తీసుకొనే అవకాశాలను అట్టి పెట్టుకుంటాం. వెలుపలి శక్తుల జోక్యం, తైవాన్‌ స్వాతంత్య్రం కోరుతున్న కొంత మంది, వారి వేర్పాటు వాద కార్యకలాపాలే ఈ వైపుగా మమ్మల్ని నడిపిస్తున్నాయి. దీని అర్దం ఏ విధంగానూ మా తైవాన్‌ సోదరులను లక్ష్యంగా చేసుకోవటం కాదు ” అన్నారు. షీ జింపింగ్‌ మాటలను బట్టి మరింత వేగంగా తైవాన్ను చైనా స్వాధీనం చేసుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చెప్పాడు. మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌తో మాట్లాడినపుడు ఈ మాటలు చెప్పాడు.


ఈ మహాసభకు తైవాన్‌ ప్రాంతం నుంచి పది మంది ప్రతినిధులు వచ్చారు. వారు పార్టీ వైఖరిని సమర్ధిస్తూ ఒక చైనా, రెండు వ్యవస్థలనే విధానం ( బ్రిటీష్‌ వారి 99 సంవత్సరాల కౌలు గడువు తీరిన హంకాంగ్‌ , అదే విధంగా పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన మకావో దీవులను చైనాలో విలీనం చేశారు. ఆ సందర్భంగా అక్కడి వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను 50 సంవత్సరాల పాటు ఉన్నవి ఉన్నట్లుగా కొనసాగిస్తామని, పౌరపాలనకు ప్రత్యేక పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అంటే ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్థ-విలీన ప్రాంతాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించటం. ఇదే విధానాన్ని తైవాన్‌ ప్రాంతానికి కూడా వర్తింప చేస్తామని చైనా చెబుతోంది. హాంకాంగ్‌, మకావో విలీనాలు జరిగి పాతికేండ్లు అవుతోంది. ఈ ప్రాంతాలకు చైనా భద్రతా చట్టాలు వర్తిస్తాయి, వాటితోనే అక్కడి వేర్పాటు వాదులను అదుపులోకి తెచ్చారు.) శాంతియుత విలీనం అన్న విధానానికి అనుగుణంగా, విలీనం కోసం పార్టీ చేస్తున్న యత్నాలకు రుజువుగా నివేదిక ఉందని పేర్కొనటం పట్ల సభ ప్రతినిధులందరూ హర్షాతిరేకాలు వెల్లడించారు. బ్రిటీష్‌ వారి పాలనలో ఎన్నడూ స్వాతంత్య్రం, ఎన్నికల గురించి మాట్లాడని కొన్ని శక్తులు చైనాలో విలీనం తరువాత తొలిసారిగా జరిపిన ఎన్నికలను తప్పు పట్టటం, విద్యార్దులను రెచ్చగొట్టి స్వాతంత్య్రం పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి కుట్రల గురించి తెలిసిందే. తైవాన్‌లో ఏకంగా అక్కడి ప్రభుత్వం ఏకంగా మిలిటరీ, ఆయుధాలను సేకరిస్తున్నది. ఈ కారణంగానే అవసరమైతే చివరి అస్త్రంగా బలప్రయోగం తప్పదని చైనా చెబుతోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆయుధాలను మోహరించి రష్యాకు పక్కలో బల్లెంలా మారేందుకు అమెరికా, నాటో కూటమి పూనుకుంది. అదే మాదిరి టిబెట్‌, తైవాన్లను స్వతంత్ర దేశాలుగా చేసి అక్కడ పాగా వేసి చైనా, భారత్‌లకు తల మీద కుంపటి పెట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకే అక్కడ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. దలైలామా తిరుగుబాటు, మన దేశంలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటు కూడా దానిలో భాగమే.

1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చినపుడు పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ మిగిలిన మిలిటరీ, ఆయుధాలను తీసుకొని తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ తిష్టవేశాడు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు పరోక్షంగా మద్దతు ఇచ్చాయి. అప్పటికే ఉన్న ఐరాస భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఉన్న చైనా ప్రభుత్వం తన ఆధీనంలోనే కొనసాగుతున్నదంటూ ఐరాసలో చాంగ్‌కై షేక్‌ నియమించిన వారినే ఐరాస గుర్తించింది. ఉన్నది ఒకే చైనా అని పేర్కొన్నారు. ఇది 1970 దశకం వరకు కొనసాగింది. విధిలేని పరిస్థితిలో అసలైన చైనా అంటే ప్రధాన భూభాగంలో ఉన్న కమ్యూనిస్టులదే ప్రభుత్వమని గుర్తించిన తరువాత తైవాన్‌ గుర్తింపు రద్దు, దాన్ని కూడా చైనాలో అంతర్భాగంగానే పరిగణించారు. అందువలన సాంకేతికంగా దాని స్వాతంత్య్ర ప్రకటనను అమెరికాతో సహా శాశ్వత సభ్యదేశాలేవీ సమర్దించే అవకాశం లేదు. దొడ్డిదారిన ఏదో ఒకసాకుతో విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. 1950 దశకంలో ఒకసారి విలీనానికి చైనా ప్రయత్నించినపుడు అణుబాంబులు వేస్తామని అమెరికా బెదిరించింది. దాంతో అప్పటికే హిరోషిమా-నాగసాకీలపై అవసరం లేకున్నా బాంబులు వేసిన దాని దుర్మార్గాన్ని చూసిన తరువాత అలాంటి పరిస్థితిని చైనా పౌరులకు కలిగించకూడదనే జవాబుదారీతన వైఖరితో పాటు తరువాత చూసుకుందాం లెమ్మని చైనా తన ఇతర ప్రాధాన్యతలపై కేంద్రీకరించింది. అంతే తప్ప తైవాన్‌పై తన హక్కును ఎన్నడూ వదులు కోలేదు. సందర్భం వచ్చినపుడల్లా పునరుద్ఘాటిస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో తడిక రాయబారాలు జరుగుతూనే ఉన్నాయి.


పార్టీ మహాసభ ప్రారంభంలో షీ జింపింగ్‌ తైవాన్‌ గురించి చెప్పిన మాటలు, చేసిన హెచ్చరిక అమెరికాకే అని అనేక మంది విశ్లేషించారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. తన ఉపన్యాసంలో విలీన ప్రక్రియలో భాగంగా చైనాకు చెందిన తైవాన్‌ జలసంధి సంబంధ సంస్థ, తైవాన్‌లోని జలసంధి ఎక్సేంజ్‌ ఫౌండేషన్‌, బ్రిటీష్‌ పాలనలోని హాంకాంగ్‌ ప్రతినిధులతో చైనా జరిపిన సంప్రదింపుల్లో కుదిరిన అవగాహన 1992 ఏకాభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా షీ చెప్పారు. అయితే ప్రస్తుతం తైవాన్‌ అధికారంలో ఉన్న వేర్పాటు వాదులు దాన్ని తిరస్కరిస్తున్నారు. తైవాన్‌లో అప్పుడున్న జాతీయ ఐక్యతా మండలి ఇప్పుడు లేదు. నాటి ఏకాభిప్రాయం ప్రకారం చైనా అంటే ఒకటే గానీ అసలు చైనా అంటే ఏమిటి అన్నదానిపై విబేధం ఉందని తప్పుడు భాష్యం చెబుతున్నారు. విలీనం తరువాత ప్రత్యేక పాలిత ప్రాంతంగా తైవాన్‌ ఉంటుందని చైనా చెబుతుండగా, 1911 నాటిదే అసలైన చైనా అని దానిలో తైవాన్‌, ఇతర ప్రాంతాలతో పాటు ప్రధాన భూభాగం కూడా ఒక ప్రాంతమే అని తైవాన్‌ వేర్పాటువాదులు అన్నారు. దివంగత తైవాన్‌ నేత లీ టుంగ్‌ హుయి అసలు 1992ఏకాభిప్రాయం లేదని, ఒకే చైనాలో రెండు దేశాలు అనే ప్రతిపాదనను ముందుకు తేగా చైనా తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా తమది స్వతంత్ర దేశమని అక్కడి పాలకులు అంటున్నారు. అమెరికా ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఒకసారి చెప్పినదాన్ని మరోసారి చెప్పటం లేదు. మొత్తం షీ జింపింగ్‌ మాటల సారం గురించి చెప్పాలంటే స్వాతంత్య్రం అంటున్న తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర చైనా వ్యతిరేకుల ఆటలు సాగనివ్వబోమన్నదే హెచ్చరిక !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామ తిట్టినందుకా, తోడల్లుడు కిసుక్కుమన్నందుకా ? దేశ ఆకలి సూచికలపై మండిపడుతున్న కాషాయ దళాలు !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

BJP, GHI, Global Hunger Report 2022, hunger, India’s GHI-2022, Narendra Modi Failures, RSS, Saffron gangs Furiousness


ఎం కోటేశ్వరరావు


తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. ఇంకేముంది ! సామాజిక మాధ్యమాల్లో, ఇతరంగా కొందరు పెద్ద గగ్గోలు. గుండెలు పగిలేట్లు బాదుకుంటున్నారు, నివేదిక ఇచ్చిన వారిని శాపనార్ధాలు పెడుతున్నారు. తప్పుడు లెక్కలంటున్నారు, దేశ(నరేంద్రమోడీ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదని కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తెచ్చినవారు కొందరు. 2020 ఏప్రిల్‌లో తొలి కరోనా లాక్‌డౌన్‌ నాటి నుంచి 2022 సెప్టెంబరు వరకు ప్రతి నెలా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా 80కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఇంకా ఆకలి ఏమిటి అని నటనా చక్రవర్తులను తలపించిన వారు ఉన్నారు. మహానుభావులారా ఆకలి సూచిక రూపొందించేందుకు తీసుకున్న అంశాలను, వాటిలో ఒకదాని గురించి మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీజీ ఆగస్టు నెల మన్‌కీ బాత్‌లో పోషకాహార లేమి మీద ప్రజా ఉద్యమం జరపాలని పిలుపునిచ్చారని తెలుసుకోండిి అని చెప్పాల్సి వస్తోంది. ఇన్ని నెలలుగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఇస్తే ఇంకా పోషకాహారం లేదంటారేమిటి అని ఆ పెద్దమనిషి చెప్పలేదని గ్రహించండి.మీరు చెబుతున్నదే సరైనదనుకుంటే ప్రజా ఉద్యమం జరపాలని ఎందుకు పిలుపునిచ్చారో ప్రశ్నించండి ! బియ్యం ఇస్తే సరిపోతున్నపుడు అంతకు ఎంతో ముందు నుంచే పోషణ్‌, ఐసిడిఎస్‌ పధకాలు వాటి కింద అంగన్‌వాడీలు గట్రా ఎందుకు నిర్వహిస్తున్నట్లు ?


గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పుపడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్దతే తప్పు, పరిగణనలోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జిఓ) చెప్పేవాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడువేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింప చేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121మాత్రమే. అది స్వచ్చందం తప్ప ఇవ్వకపోతే తలతీసేదేమీ ఉండదు. అమెరికా, ఐరోపా దేశాల్లో సమాచారం ఇవ్వకపోతే మీడియాలో విమర్శించే స్వేచ్చను అక్కడి జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. మన దగ్గర ఇంకా అలాంటి అవకాశాలు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నా అడిగే దమ్మున్న జర్నలిస్టులు లేరు, అడిగేవారున్నా ఇంతవరకు మనది అపర ప్రజాస్వామిక దేశం గనుక మన నరేంద్రమోడీ ఎవరికీ ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అందువలన మనం కూడా అసలు అధికారిక సమాచారం ఇవ్వటం మానేస్తే సూచికల ప్రసక్తి ఉండదు, వాటి మీద విమర్శలు, ఉక్రోషాలు, ఉడుక్కోవటాలు, కుట్ర సిద్దాంతాల ప్రచారం వంటివి ఉండదు. కాషాయదళాలు వేరేపని చూసుకుంటాయి కదా ! మరి ప్రభుత్వం ఆపని ఎందుకు చేయదు ? లేదా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన విశ్లేషణలు అందించవచ్చు, సూచికలు ప్రకటించవచ్చు. దేశానికి మచ్చతెచ్చే వారికి బుద్ది చెప్పవచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితిలో నరేంద్రమోడీ అడిగితే సమాచారం ఇవ్వని దేశం ఉంటుందా ? నిధుల కొరత లేదే, ఎందుకు చేయరు ? కావాలంటే అప్పులు తీసుకురావచ్చు, 55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వమే అంచనా వేసింది, కనుక మరో లక్ష కోట్లు అప్పుచేసి సరైన సూచికలు వెల్లడిస్త్తే మన ప్రతిభ లోకానికి తెలుస్తుంది. అప్పు తీర్చేది జనమే, ఎవరి జేబుల్లోంచి పెట్టటం లేదు కదా !


ఇక ఐరాస సంస్థలకు సమాచారం ఇవ్వకపోతే మచ్చపడుతుంది, అక్కడ మనం సుభాషితాలు మాట్లాడే అవకాశం ఉండదు, అవి టీవీ చర్చలు కాదు గనుక వాటిలో మాదిరి మాట్లాడితే మర్యాద దక్కదు. పవన్‌ కల్యాణ్‌ భాషలో చెప్పాలంటే కొడకా అంటూ తాటతీస్తారు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, వాటికి సమాచారం ఇవ్వకపోతే తిప్పలు తెచ్చుకున్నట్లే ! ప్రపంచవాణిజ్య సంస్థకూడా అంతకంటే ఎక్కువ. అమెరికా వంటి మన ” సోదర ” దేశాలు మనం సమాచారం ఇస్తున్నా అక్కడ కేసులు పెడుతున్నాయి. మన దేశంలో ఆకలి సంబంధిత అంశాల గురించి స్వచ్చంద సంస్థలు ఏమి చెబుతున్నాయో, మన ప్రభుత్వ సంస్థలు ఎలాంటి నివేదికలిస్తున్నాయో ఆకలి సూచికలను తప్పుపడుతున్నవారు జనానికి చెబుతున్నారా ? వారి నిజాయితీ ప్రశ్నార్దకం కాదా ! మన దేశం తప్ప ఈ నివేదికను ఆమోదించటం లేదని గానీ, తప్పుడు పద్దతుల్లో రూపొందించారని గానీ ఎన్నిదేశాలు స్పందించిందీ సమాచారం లేదు, ఎవరైనా అలాంటి వివరాలు అందచేస్తే ఈ విశ్లేషణలో వాటిని చేర్చవచ్చు. ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా ? లేదు, ఎందుకంటే అన్నింటా అధమస్థానాలే.


మోడీ సర్కార్‌, మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సులభతర వాణిజ్య సూచిక గురించి చూద్దాం.2014లో 142లో ఉన్నదాన్ని 2020 నాటికి 63కు తీసుకువచ్చామని, 79 స్థానాలు ఎగబాకిందని చెప్పారు. చివరికి ఈ సూచికలు రూపొందించిన తీరు పెద్ద కుంభకోణమని, సమాచారాన్ని తారు మారు చేశారని, ప్రపంచ బాంకు పెద్దలు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ మరుసటి ఏడాది నుంచి ఏకంగా సూచికల రూపకల్పనకే స్వస్థి పలికారు. పోనీ మన దేశం ఇప్పుడు నిజాలు మాత్రమే చెప్పే సత్యహరిశ్చంద్రుల వారసులని చెబుతున్నారు గనుక సరైన సమాచారమే ఇచ్చారని, నిజంగానే అంత ప్రగతి సాధించిందనే అనుకుందాం, మరి ఆ మేరకు మన దేశానికి ఆ స్థాయిలో ఎందుకు పెట్టుబడులు రాలేదు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా ఎందుకు విఫలమైనట్లు ? సూచికను ఎగబాకించి సాధించిందేమిటి ? రాంకులను చూపినంత మాత్రాన పెట్టుబడులు పెట్టే అమాయకులు ఉండరని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రపంచానికి రుజువు చేసింది.


ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. ఆ ప్రాతిపదికను మన దేశానికి మాత్రమే వర్తింప చేస్తే తప్పే, అన్ని దేశాలకూ ఒకటే పద్దతిని అనుసరించారు కదా ! పోషకాహార లేమికి గాను కేవలం మూడువేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్దతి. ఏ సర్వేకైనా జనాభాలో ఎంత మందిని తీసుకుంటే సరైన వాస్తవాలు వెల్లడౌతాయో ఎవరైనా చెప్పగలరా ? మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు ఎంతమంది మీద జరుపుతున్నారో చెప్పి ప్రభుత్వం ఒప్పించగలదా ? ఒక పద్దతి ప్రకారం మన దేశం గురించి తప్పుగా చూపేందుకు ప్రతి ఏటా తప్పుడు సమాచారమిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ డిమాండ్‌ చేసినట్లు సదరు సూచికలు ఇచ్చే సంస్థలను అంతర్జాతీయ కోర్టుకు లాగి బోనులో నిలబెట్టి వాస్తవాలేమిటో వెల్లడించాలి. ఒట్టి అరుపులెందుకు ? నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడువేల మంది సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. దాని సమాచారాన్నే నివేదికను రూపొందించిన జర్మనీకి చెందిన ” వెల్ట్‌ హంగర్‌ హిల్‌ఫీ ” ఐర్లండ్‌లోని ” కన్సరన్‌ వరల్డ్‌వైడ్‌ ” తీసుకున్నాయి, అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. 2021 ఆకలి సూచిక నివేదిక తప్పుల తడక అంటూ 2021నవంబరు పదవ తేదీ పయనీర్‌ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. దాన్లో దేశంలో కూరగాయలు, గుడ్లు, పండ్లు, పాలు ఇతర ఆహార ఉత్పత్తులు ఎలా పెరిగాయో పేర్కొంటూ ఇవన్నీ ఉన్నపుడు పోషకాహార లోపం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.( వాటిని కొనుగోలు చేసి రోజూ తినేవారెందరో ఆ పెద్దమనిషి చెప్పి ఉంటే అసలు నిజాలు తెలిసేవి. ) ఆకలి సూచికల రూపకల్పనకు నేషనల్‌ శాంపుల్‌ సర్వే సంస్థ(ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) నుంచి ఆహార వినియోగ సమాచారాన్ని తీసుకోవాలని చెప్పారు. 2011-12 తరువాత అసలు అలాంటి సమాచారాన్ని ప్రచురించలేదని, 2015-16 సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నందున అసలు దాన్ని ప్రచురించకుండా వెనక్కు తీసుకున్నారని, అందువలన 2021 ఆకలి సూచిని 2011-12 సమాచారంతో రూపొందించారని మహాజన్‌ ఆరోపించారు. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సరైన సర్వే నిర్వహించలేదు, పోనీ మా దగ్గర తాజా సమాచారం లేనందున మా దేశాన్ని జాబితాలో చేర్చవద్దని ఎందుకు కోరలేదు. సమాచారాన్ని సేకరించేందుకు మోడీ సర్కార్‌ ఎందుకు శ్రద్ద చూపలేదు ? 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తే ఎన్నికలు ముగిసేవరకు దాన్ని వెలుడకుండా అడ్డుకున్నారు, అది వాస్తవం కాదన్నారు, తరువాత అదే వాస్తవమని అధికారికంగా అంగీకరించారు.


గతంలో ఎఫ్‌ఏఓ మన దేశంలో ఆహార వినియోగం గురించి జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణ బోర్డు (ఎన్‌ఎన్‌ఎంబి) సమాచారం మీద ఆధారపడేది. 2011 తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, 2016 తరువాత పట్టణ ప్రాంతాల్లో తాము ఎలాంటి సర్వేలు జరపలేదని ఎన్‌ఎన్‌ఎంబి చెప్పిందని కూడా మహాజన్‌ పేర్కొన్నారు.( ప్రభుత్వం దగ్గర సమాచారం లేనపుడు గాలప్‌పోల్‌ వంటి సంస్థల మీద ఆధారపడి దాన్ని విశ్లేషణకు తీసుకున్నట్లు చెప్పవచ్చు. దానికి ఎవరిది బాధ్యత ఎవరిది ?)
అశ్వనీ మహాజన్‌ సరికొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) 2016లో చేసిన సర్వే ప్రకారం 16 రాష్ట్రాల్లో కార్లు, ఇళ్లు ఉన్న ధనికుల పిల్లల్లో కూడా 17.6శాతం మంది గిడసబారి ఉన్నారని, 13.6 శాతం మంది బలహీనంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెబుతూ, ధనికులకు ఆహారం అందుబాటులో ఉంటుంది కదా ఇలా ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే పిల్లల్లో 22 శాతం మంది గిడసబారటం, 11.8 శాతం బలహీనంగా ఉంటారని చెప్పారు. ఈ వాదన ఎందుకు చేశారంటే డబ్బున్న వారు కూడా సరిగా పిల్లల్ని పెంచటం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు దీనికి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నరేంద్రమోడీ ఏమి చేస్తారని వాదించటం, వాస్తవాన్ని వక్రీకరించటం, వైఫల్యాన్ని అంగీకరించకపోవటమే.
వాస్తవం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను 2014-15లో ఐదవ సర్వేను 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేల మధ్య వచ్చిన మార్పు, ఆకలి సూచికల్లో 2014-2022 కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి ? దిగువ పట్టికలో చూద్దాం. అంకెలను శాతాలుగా గమనించాలి.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రక్తహీనత అంశంలో ఒక్క కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా పరిస్థితి తీవ్రంగా ఉంది.
అంశం××××××× సర్వే 4 ××× సర్వే 5×× 2014××2022
గిడసబారినపిల్లలు×× 38 ××× 36 ××××× 38.7 ×× 35.5
బలహీన పిల్లలు ×× 21 ××× 19 ××××× 15.1 ×× 19.3
శిశుమరణాలు ×× 22.7 ××× 25 ××××× 4.6 ×× 3.3
పోషకాహారలేమి ×× 00 ××× 00 ××××× 14.8 ×× 16.3
బరువు తక్కువపి.×× 36 ××× 32 ××××× 000 ×× 000
రక్తహీన పిల్లలు ×× 58.6 ×× 67 ××××× 000 ×× 000
రక్తహీనమహిళలు×× 53.1 ××× 57 ×××× 000 ×× 000
రక్తహీనపురుషులు×× 22.7 ××× 25 ×××× 000 ×× 000

పైన పేర్కొన్న అంకెల్లో 2014 నుంచి 2022 వివరాలను ఆకలి సూచికల విశ్లేషణలో పేర్కొన్నారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు మన ప్రభుత్వం ప్రకటించినవే. దశాబ్దాల పాటు ఎలాంటి సర్వేలు నిర్వహించని మన ప్రభుత్వాలు, పాలకులకు, వారి మద్దతుదార్లకు సూచికలను రూపొందించే సంస్థలను విమర్శించేందుకు ఉన్న నైతిక అర్హత ఏమిటి ? తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021వరకు ఉన్న ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది.2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు రాంకుల గొడవ ఉండదు కదా !


2014లో పేర్కొన్న76 దేశాల్లో మనది 55వ రాంకు వాస్తవం కాదు అని కొందరు చెబుతున్నారు. మరి ఎంత ? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 122 మన రాంకు 99 అవుతుంది. తాజా రాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా ? మనం తెచ్చుకున్న మార్కులను చూస్తే 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 మాత్రమే ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. మామ తిట్టినందుకు కాదు తోడల్లు తొంగి చూసి కిసుక్కుమన్నందుకు అన్నట్లుగా మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం, తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు !


చివరిగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి చూద్దాం. సమగ్ర శిశు అభివృద్ధి పధకం(ఐసిడిఎస్‌) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మన్మోహన్‌ పాలన చివరి ఏడాది బడ్జెట్‌ 2013-14లో ఈ పధకానికి రు.16,312 కోట్లు కేటాయించారు. తరువాత నరేంద్రమోడీ పాలన తొలి ఏడాది 2014-15లో రు. 16,561, 2015-16లో రు.8,336, 2016-17లో 14,850, 2017-18లో 16,745 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌ 2022-23లో రు.20,263 కోట్లుగా ప్రతిపాదించారు.2013-14 బడ్జెట్‌ ఖర్చు అంచనా రు.16,65,297 కోట్లు కాగా 2022-23 లో అది రు.39,44,909 కోట్లుగా ప్రతిపాదించారు. దీన్ని బట్టి తొమ్మిది సంవత్సరాల నాడు ఐసిడిఎస్‌కు మొత్తం ఖర్చులో 0.98 శాతం కేటాయిస్తే 2022-23 నాటికి అచ్చేదిన్‌ స్వర్ణయుగంలో అది 0.51 శాతానికి తగ్గింది. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు మాత్రం భీముడిలా ఉండాలి అనుకోవటం కాదా ఇది ? నేటి బాలలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం కాదు, ఆచరణ కావాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకలి సూచికలో మరింత దిగజారుడు : పొట్టకూటి పాములోళ్ల బొమ్మ అవమానమైతే….. మరి రాజకీయ ఆవులోళ్ల చిత్రాల సంగతేమిటి ?

16 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK

≈ Leave a comment

Tags

BJP, Congress party, cow politics, Cow pooja, Indian economy, La Vanguardia, Narendra Modi Failures, RSS, snake charmer


ఎం కోటేశ్వరరావు


మన దేశాన్ని ఎవరైనా అవమానిస్తే కచ్చితంగా ఖండించాల్సిందే. 2014కు ముందు మన్మోహన్‌ సింగ్‌ పాలనలో మన దేశపరువు ప్రతిష్టలు మురికి గంగలో కలిశాయని ప్రపంచమంతా తిరిగి ప్రధాని నరేంద్రమోడీ వాటిని తిరిగి ప్రతిష్టించారని, లోకమంతా మనవైపు చూస్తోందని కొందరు చెప్పారు. ఇప్పుడు మోడీ ఏలుబడిలో మన ఆర్ధిక ప్రగతిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, ఐఎంఎఫ్‌ ప్రశంసే దానికి నిదర్శనం చూడండని చెబుతున్నారు. అటువంటి స్థితిలో మనలను అవమానించే వారికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రపంచ జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి ఆఫ్టరాల్‌ 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ దేశ వార పత్రిక లా వాన్‌గార్డియా అవమానించటమా ? మన ఆర్ధిక రంగ వృద్ది తీరుతెన్నులను పాములను ఆడించే వ్యక్తి చిత్రంతో పోల్చి చూపి, అందునా మొదటి పేజీలో విశ్లేషించటమా ?ఆర్ధిక రంగం గురించి రాస్తే రాశారు పో, ఆ బొమ్మ తప్ప మరొకటి దొరకలేదా ! దాన్ని మేము ఏల చూడవలె !! హతవిదీ,ó అని కౌరవ రారాజు సుయోధనుడి మాదిరి అనేక మంది రగిలిపోతున్నారు. వారిని అర్ధం చేసుకోవచ్చు. మయసభలో ధుర్యోధనుడికి ఆగ్రహం తాను భ్రమ అనుకున్న నీటి మడుగులో పడినందుకు కాదు, దాన్ని చూసి ద్రౌపది నవ్వినందుకు అన్నది తెలిసిందే. ఈ వార్త కూడా అలాంటిదే. మరో కోణంలో అలాంటి దానికి అవకాశం ఇచ్చిందెవరు అన్న ప్రశ్నను వేసుకోవాలి. ఆక్టోబరు తొమ్మిదవ తేదీన ” భారత ఆర్ధిక వేళ ” అనే అర్ధం వచ్చే శీర్షికతో ప్రచురించిన ఆ వార్త గురించి శుక్ర,శనివారాల్లో మన దేశంలోని అనేక టీవీలు, జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు పుండు మీద కారం చల్లినట్లుగా సదరు చిత్రాన్ని ముద్రించి మరీ మన పాఠకులకు అందచేశారు.మన జనాలు మన పత్రికలనే సరిగా చదవరు, అలాంటిది స్పెయిన్‌ పత్రికను మన దేశంలో కొద్ది మంది ఆ భాష వచ్చిన వారు తప్ప ఎవరూ చదవరు. దాన్ని తీసుకొని మన పత్రికలు బహుళ ప్రచారమిచ్చిన వార్తలు మన ప్రధాని నరేంద్రమోడీకి గౌరవ ప్రదమా ? మీడియా పెద్దలు ఆలోచించకుండా అలా చేశారని అనుకుందామా ? లేక ప్రధాని మెప్పు పొందేందుకు చేసిన విన్యాసమా ?


ఆ స్పానిష్‌ భాష పత్రికలో మన ఆర్ధిక రంగం మీద చేసిన విశ్లేషణ సారం ఏమిటో అనువాదం కోసం వెతికినా దొరకలేదు. ఏదైనా కావచ్చు, మన ప్రధాని నేతృత్వంలో ఆర్ధికంగా దేశం ఎలా గంతులు వేస్తూ ముందుకు పోతున్నదో రాసి ఉండవచ్చు లేదా ఎలా దిగజారుతున్నదో కూడా చెప్పి ఉండవచ్చు. ఏది రాసినా అసలు అభ్యంతరం అది కాదు. దానికి పాములనాడించే వ్యక్తి చిత్రాన్ని జోడించి ప్రచురించటమే. జనాన్ని కాటువేసే ద్రవ్యోల్బణమనే నాగుపాము బుసలు ప్రపంచమంతటితో పాటు మన దేశంలో కూడా ఉన్నందున దాన్ని బుజ్జగించి బుట్టలో పెట్టేందుకు మోడీ సర్కార్‌ ఊదుతున్న నాగస్వరానికి చిహ్నంగా ఆ చిత్రాన్ని చూపారా ? అసలు ఆ బొమ్మ వేస్తే తప్పేంటి, పత్రికల్లో అనేక బొమ్మలు వేస్తున్నారు, దాన్ని సానుకూల వైఖరితో ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. ఆర్ధికరంగం మాంద్యంలోకి జారకుండా, మన గానానికి అనుగుణ్యంగా నృత్యం చేయిస్తూ ఉన్నతి వైపు తీసుకువెళ్లే ప్రయత్నానికి ప్రతిబింబంగా దాన్ని ఎందుకు పరిగణించకూడదు, ఆత్మన్యూన్యతకు ఎందుకు గురికావాలి ? చిన్న వ్యంగ్యాన్ని సహించలేని స్థితికి ” ఎదిగామా ” అన్నది వారి ప్రశ్న. నూరు పూవులను పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి.


పాములను ఆడించే వ్యక్తి చిత్రాన్ని మన దేశానికి ప్రతీకగా చూపటం అవమానించటమే అని కొందరు పేర్కొన్నారు.” బలమైన భారత ఆర్ధిక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా పాములోళ్ల బొమ్మలతో మనల్ని చూపటం బుద్దిలేని తనం. వారిని వలసవాద భావన నుంచి మరల్చటం సంక్లిష్టమైనది ” అని స్పెయిన్‌ వారపత్రిక కథనం గురించి బెంగలూరు సెంట్రల్‌ బిజెపి ఎంపీ పిసి మోహన్‌ అన్నారు. నిజమే, వారిని మార్చటం అంత తేలిక కాదు, విదేశీయులు మారకపోతే మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన దేశంలో పాములోళ్ల కాలం నాటి నుంచి ఉన్న, అంధ, మూఢవిశ్వాసాలను, అశాస్త్రీయ అంశాలను జనాల మెదళ్లకు ఒక పధకం ప్రకారం ఇప్పటికీ సరికొత్త పాకింగ్‌లు, రంగులది ఎక్కిస్తున్న మీడియా, రాజకీయ నేతల సంగతేమిటి అన్నది ప్రశ్న.


మన దేశంలో అశాస్త్రీయ అంశాలను నమ్మి, బహిరంగంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాలను ప్రపంచమంతా చూసి నవ్వుకుంది, దేశాన్ని అపహాస్యం పాలుచేశారు. వినాయకుడికి ఏనుగు తల ఉందంటే అ రోజుల్లోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జన్లు ఉండి ఉండాలని మోడీగారే చెప్పారు. ఇక ఇంథనం, పైలెట్లతో పని లేకుండా ఎక్కిన వారు ఎటు పొమ్మంటే అటు, పైకీ కిందికీ తిరిగే విమానాల గురించి,క్షిపణుల గురించి చెప్పిన పెద్దమనుషుల విన్యాసాలు మూఢవిశ్వాసాలను పెంపొందించేందుకు, జనం చేత వాటిని గుడ్డిగా నమ్మించేందుకే కదా ! పాములనాడించేవారు పొట్ట కూటికోసం పడిన, పడుతున్న తిప్పల్లో భాగం. మరి వీరు ఎందుకు అలా చేస్తున్నట్లు ? అందువలన దేశానికి జరిగిన అవమానం, అపఖ్యాతి తెచ్చిన వారిని వదలి స్పెయిన్‌ పత్రిక అవమానించిందని చెపుతున్నవారి చిత్తశుద్ది ప్రశ్నార్ధకం. విదేశీయులు మన దేశానికి వచ్చినపుడు భారతీయులు నాగుల చవితి పేరుతో పాములను పూజించటం, కోతులకు, ఆవులకు మొక్కటాన్ని, ఆవు మూత్రాన్ని తల మీద చల్లుకోవటాన్ని చూశారు. కనిపించిన చెట్టు, పుట్ట, రాతిని పూజించటాన్ని గమనించారు, భారత్‌ అంటే అలాగే ఉంటుందన్నట్లుగా రాశారు. దానిలో కొంత అతిశయోక్తి, చులకన భావం ఉంది. కానీ వందల సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక శాస్త్రీయ అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జరుగుతున్నదేమిటి ? పాములు పాలు తాగవని తెలిసీ రెచ్చిపోయి పోస్తున్నవారి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా మనోభావాలను కించపరుస్తున్నారని దెబ్బలాటలకు వస్తారు. ఆ మాటకు వస్తే దేవతా రూపాలైన పాములను పూజించాలే తప్ప వాటి కోరలు తీసి ఆడించటం, బుట్టలో పెట్టటం దేవతలను అవమానించటం కాదా అని ఎవరైనా అంటే ? పాములోళ్ల కడుపు మీద కొట్టినట్లే. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు, రాకెట్లను తీసుకువెళ్లి గ్రామ దేవతలు, ఇతర దేవుళ్ల ముందుంచి పడిపోకుండా ఎగిరేట్లు చూడండని వేడుకుంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ గారే గోమాత, కామధేనువు అంటూ ఆవులను పూజిస్తూ ఫోజులిస్తున్న తరువాత, వాటిని ప్రపంచమంతా చూస్తున్నపుడు పాములోళ్ల బొమ్మవేసి ఎవరో అవమానించారు అని గుండెలు బాదుకోవటం కొందరిని సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


ఇక కరోనా మహమ్మారి గురించి ప్రచారం చేసిన మూఢనమ్మకాలు, పిచ్చిపనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గంగామాత ఆశీర్వాదం ఉన్నందున గంగలో మునిగితే కరోనా రాదని చెప్పి కుంభమేళాకు అనుమతిచ్చి పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తికి కారకుడైన ఉత్తరాఖండ్‌ బిజెపి సిఎం నిర్వాకం, తరువాత దాన్ని మధ్యలోనే నిలిపివేసిన ప్రహసనం తెలిసిందే. ఇంతకంటే పరువు తక్కువ పనేముంటుంది. ఆవు మూత్ర తాగింపు పార్టీలు, ఆవు పేడ పూసుకొని గంతులు, పాటలు, భజనలు ఇలా ఎన్నని చెప్పుకోవాలి. వీటన్నింటినీ మన టీవీలు తమ రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున చూపిందీ తెలిసిందే. ఇవన్నీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచేవా ? వందల మంది మూత్రం తాగేందుకు, పేడ పూసుకొనేందుకు పోటీపడటంతో మూత్రం లీటరు, పేడ కిలో రు.500 చొప్పున ధర పలికింది. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసి దేశభక్తులందరూ రావాలని కోరారు. అంతే కాదు నరసింహడి అవతారమే కరోనా అని, మాంసాహారం తినేవారిని శిక్షించేందుకే వచ్చిందని సెలవిచ్చారు. ఆవు మూత్రం తన కాన్సర్‌ను మాయంచేసినట్లు బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. యోగా చేస్తే కరోనా వైరస్‌ నివారణ అవుతుందని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. దీపాలు వెలిగిస్తే కరోనా నశిస్తుందని అదొక సైన్సు అని చెప్పిన వారు, పో కరోనా పో కరోనా అంటూ శాపాలు పెట్టిన వారు, మంత్రాలు చదివిన వారి గురించీ తెలిసిందే.


పాములోళ్ల బొమ్మ మన దేశానికి ప్రతీకగా ప్రచురించటం అవమానం అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నపుడే ప్రపంచ ఆకలి సూచికల తాజా (2022) నివేదిక వెలువడింది. దీన్లో మన స్థానం దేశానికి ప్రతిష్టను తెచ్చేదిగా ఉందా ? ఈ సూచికల రూపకల్పనకు తగిన సమాచారం ఇచ్చిన దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది అలా ఇచ్చిన 116 దేశాలకు గాను వందవ స్థానంలో ఉన్న నరేంద్రమోడీ ఇప్పుడు 121 దేశాల్లో 107 దగ్గర నిలిచారు. మన దగ్గర ప్రతి ఊర్లో కామధేనువులకు, వాటిని పూజించేవారికీ కొదవ లేదు. కొంత మంది ఓట్ల కోసం నటించినప్పటికీ ఫలితాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్దితో జనం చేసే పూజల్లో విశ్వాసం, నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. మరి ఇంత ఆకలి ఎందుకు ఉన్నట్లు ?2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 అచ్చే దిన్‌ ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. వర్గీకరణ ప్రకారం 9.9 మార్కుల లోపు వచ్చిన దేశాలను ఆకలి లేని లేదా సమస్య తక్కువగా ఉన్నట్లు, పది నుంచి 19.9 వరకు ఒక మితమైన సమస్య, 20 నుంచి 34.9వరకు తీవ్రమైన, 35 నుంచి 49.9 వరకు ఆందోళన కరమైన, 50 దాటితే విషమంగా ఉన్నట్లు పరిగణిస్తారు.ప్రతి ఏటా పరీక్ష పేపరు, ప్రశ్నలు మారుతుంటాయి, వాటికి ఇచ్చే మార్కులూ అంతే గనుక గత సంవత్సరాలతో పోల్చ కూడదని కొందరు వాదిస్తారు. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులున్నప్పటికీ మొత్తంగా వచ్చే మార్కులను బట్టే సూచికల్లో స్థానం ఉంటుంది. దానిలో ఎంత మేరకు ఎదిగామన్నది లెక్క.మన మెరుగుదల ఒక లెక్కలోనిది కాదు, మిగతా దేశాలు మనకంటే ఎక్కువగా మెరుగుపడిన కారణంగానే గత ఏడాది కంటే దిగజారాం.


2013లో మన దేశం 63వ స్థానంలో ఉండగా 2014లో 76 దేశాలకు గాను 55వ స్థానంలో ఉన్నాం. ఆ ఏడాది సూచికల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే దిగువన 57లో, ఎగువన శ్రీలంక 39, నేపాల్‌ 41వ స్థానాల్లో నిలిచాయి. ఈ ఎనిమిది సంవత్సరాల్లో పాక్‌, బంగ్లాదేశ్‌ కూడా మన కంటే ఎగువకు చేరాయి. 2022 సూచికలో ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌ 109, మన పాలకులు, కాషాయ దళాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో స్మరించే పాకిస్తాన్‌ 99, బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 81,మయన్మార్‌ 71, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక 64 స్థానాల్లో ఉండగా ప్రపంచానికే ఆహారం అందించగలం అని కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో మన పరిస్థితి ఇలా ఉందేమిటి ? ఇది మన దేశ గౌరవం, ప్రతిష్టలను పెంచేదా ? రేపు మరొక దేశ పత్రిక ఓ కామధేనువూ మా జనాల ఆకలి తీర్చి ప్రపంచ ఆకలి సూచికలో మా స్థానాన్ని పెంచు, మా దిగుమతులను తగ్గించు, ఎగుమతులను పెంచు, ఆవుల మూత్రంలో బంగారం సంగతి తరువాత ముందు దాన్ని ముడిచమురుగా మారిస్తే సంతోషం తల్లీ అని ప్రార్ధిస్తున్నట్లుగా వీధుల్లో ఆవులను చూపుతూ అడుక్కొనే వారి బొమ్మ లేదా నరేంద్రమోడీ ఆవును పూజిస్తున్న బొమ్మను వేస్తే గౌరవంగా ఉంటుందా ? జనాల మనోభావాలతో ఆడుకోవటం తప్ప పాములోళ్ల బొమ్మ గురించి ఇంత రాద్దాంతం అవసరమా ?


జిడిపిలో ఐదవ స్థానంలో ఉన్న మన గురించి 15వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ వారు అపహాస్యం చేయటమా అంటే అర్ధం ఏమిటి ? అనేక అభివృద్ధి సూచికల్లో అది మన కంటే చాలా ఎగువున వుంది. అందువలన మన మీడియా స్పందన తెలుసుకొని ఆ దేశస్థులు మీ దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ జనాభాకంటే తక్కువగా ఉన్న మేము రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపిని కలిగి ఉంటే అంత పెద్ద దేశం ఇంకా మూడున్నర లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఉండటం ఏమిటో చూసుకోండి, ఒక నాడు చైనా కంటే ముందుండి ఇప్పుడు దాని కంటే ఎంత వెనుక ఉన్నారో తెలుసుకోండి అని స్పందిస్తే మన దగ్గర సమాధానం ఏమిటి ? ఐరోపా వారు తమ వలస కళ్లద్దాలతో గతాన్నే చూస్తున్నారు, వర్తమాన భారతాన్ని చూడటం లేదని సాధించిన ఆర్ధిక ధీరత్వాన్ని చూడలేకపోతున్నారని, బ్రిటన్ను అధిగమించిన అంశం కనపడటం లేదా అని కొందరు అంటున్నారు. నిజమే జనాల ఆకలి తీర్చని జడిపి, ఉన్నత స్థానాలు ఎందుకు ? తరతరాలుగా మరోదారి లేని పాములోళ్లు జీవన పోరాటంలో పాములను అదుపు చేసి బుట్టలో , ఎవరైనా పిలిస్తే పట్టుకొని సాయ పడుతున్నారు, కొత్తగా రంగంలోకి దిగిన రాజకీయ ఆవులోళ్లు అధికార పోరులో దేశ ఆర్ధిక రంగాన్ని తాము చెప్పినట్లుగా కూడా ఎందుకు నడిపించలేకపోతున్నారు ? దేశంలో ఆవు-దూడను గుర్తుగా తీసుకొని కాంగ్రెస్‌ ఆవు రాజకీయం మొదలెట్టింది. ఇప్పుడు బిజెపి దాన్ని మరో రూపంలో కొనసాగిస్తున్నది. నాటి ఆవు-దూడ గరీబీ హఠావో అని చెప్పినట్లుగానే నేటి ఆవులోళ్లు చెప్పిన అచ్చేదిన్‌, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, నల్లధనం వెలికితీత ఏమైనట్లు ? ఒకరిది అన్నం కోసం ఆరాటం, మరొకరిది అధికారం, ఓట్ల కోసం బహుకృత్వ వేషాలు కావా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” మావో ఆలోచనావిధానంలో భాగమే

12 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

China socialist market economy, chinese communist party, Mao Zedong, Mao Zedong thought, People's Republic of China

ఆదిత్య కృష్ణ  

చైనాకీ,  చైనాపరిశీలకులకీ చాలాముఖ్యమైనది ఈ అక్టోబరు16 న మొదలౌతున్న చెనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభ. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలోనూ, చైనా ప్రత్యేక లక్షణాలతోనూ కూడి వున్నది అని అక్కడి నాయకత్వం చెప్తున్నది. 2050 నాటికి ప్రపంచంలోని మధ్యస్థాయి (యూరపు) దేశాల అభివృద్ధి స్థాయిని అందుకొంటుందనీ వారు చెప్తున్నారు. దాన్ని కొట్టిపారేస్తూ – చైనా పాలకులు సోషలిజం ముసుగులో పెట్టుబడిదారీ పాలనను సాగిస్తున్నారని మీడియాలో నిత్యం ప్రచారం సాగుతున్నది. సోషలిజం సార్వజనీనమైనది, మళ్లీ ‘చైనా మాదిరి’ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషలిజానికి ఒకే రకమైన రెడీమేడ్‌ మోడల్‌ ఏమీ లేదు.

అక్కడితో ఆగక, చైనాది సామ్రాజ్యవాదం, లేదా సోషల్‌ సామ్రాజ్యవాదం అని మరి కొందరు – మావో వాదులమని  చెప్పుకొనేవారు ‘సిద్ధాంతాల’ పేరిట – విమర్శిస్తున్నారు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ; గుత్తపెట్టుబడిదారీ విధాన అత్యున్నత రూపం సామ్రాజ్యవాదం అవుతుంది – అని లెనినిజం చెప్తుంది. చైనాలో గుత్త పెట్టుబడిదారీ విధానం అనే పునాదే లేదు; అనేక (పబ్లిక్, సమిష్టి, ప్రైవేటు, వ్యక్తిగత) సెక్టార్లున్న చైనాలో – దానికి ప్రాతిపదిక లేదు. అలాంటిచోట (సోషల్‌) సామ్రాజ్యవాదం ఎలా ఏర్పడుతుంది?

సామ్రాజ్యవాదాన్ని, అమెరికా అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన ప్రపంచ శక్తిగా ఉన్న  చైనాపై అలాంటి ఆరోపణలు అర్థరహితం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మూడవ ప్రపంచదేశాల్లో  చైనాకి  ఉన్న ఆదరణను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల పాలకవర్గాలకు ఈ ప్రచారాలు ఆచరణలో తోడ్పడుతున్నాయి. సిద్ధాంతరీత్యా చూసినా, ఆచరణలో చూసినా చెల్లని ఆరోపణలివి. స్వతంత్ర పరిశీలనకన్నా పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య మేధావులూ వండి వార్చినదే  వారి విమర్శలకి మూలాధారం. చైనా పార్టీతో, వారి డాక్యుమెంట్ల పరిశీలనతో వారికి పనిలేదు. 

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం , అనేక తప్పులు చేసి, ఎదురుదెబ్బలు తిని,విప్లవ గమనంలో కుంటుపడి చిక్కుల్లో ఉన్నది. మనదేశంలో మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనావిధానం పేరిట బలమైన పిడివాదం వుంది. తప్పుడు విమర్శలకు ఒక పునాది అదే. మనదేశంలో చాలా మంది కమ్యూనిస్టులకూ, అభ్యుదయవాదులకూ అల నాటి రష్యాపట్ల అపార అభిమానం. వారికి ఎంగెల్స్‌ నొక్కి చెప్పిన “శాస్త్రీయ సోషలిజం” కన్నా ఆదర్శవాద, ఊహాజనిత సోషలిజమే ఒంట బట్టింది. అందుకే అశాస్త్రీయమైన అవగాహనతో విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం అవసరం. దానికిది క్లుప్త పరిచయం.

అంతర్జాతీయ, చైనా వ్యవహారాల నిపుణులైన జె.యన్‌.యు. ప్రొఫెసర్‌ అల్కా ఆచార్య క్జి జిన్‌పింగ్‌ ఎన్నికపై లోగడ ఒక సమీక్షావ్యాసం రాశారు (EPW 5-5-2018). బీజింగ్‌లో ఒక యువపరిశోధకుడు 2017లో అన్న మాటతో ఆమె తనవ్యాసం ముగించారు: “మావో మమ్మల్ని విముక్తి చేశారు. డెంగ్‌   మ మ్మల్ని సంపన్నులుగా మార్చారు. ఇప్పుడు జిన్‌పింగ్‌ మా పార్టీని, చైనాను శక్తివంతంగా  రూపొందిస్తారు.”  విప్లవ విజయం (1949) తర్వాత  చైనా – సోషలిస్టు నిర్మాణంలో అంచెలంచెలుగా ముందుకుసాగుతున్నది. పై వాక్యాలు అక్కడి పరిణామాల క్రమాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి. 

వాస్తవాలకు విరుద్దమైన విమర్శలు : చైనాలో వ్యవసాయ భూమినేటికీ  ప్రభుత్వ ఆస్తిగానే వుంది   

మావోకాలంలో అంతా సవ్యంగా వుందని, మావో తర్వాత డెంగ్‌ అంతా తిరగ దోడారనీ విమర్శలు చేస్తుంటారు. చెనాలో మావో పద్ధతులని పక్కనపెట్టి, “స్వేచ్చామార్కెటు” (డెంగ్‌) విధానాలను అనుసరిస్తున్నారని అంటూ చైనాలో పెట్టుబడిదారీ పునరుద్దరణ జరిగిందన్న సిద్దాంతాన్ని – లోతుపాతులు తెలుసుకోకుండా-కమ్యునిస్టు వ్యతిరేకులు కూడా- ప్రచారం చేస్తున్నారు. నిజానికి అచ్చంగా “స్వేచ్భామార్కెట్‌” విధా నాలు ఈ నాడు ఏ సామ్రాజ్యవాదదేశంలో సైతం అమల్లో లేవు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ . స్వేచ్చా మార్కెటు‌కీ, గుత్త వెట్టుబడికీ పొత్తు కుదరదు. ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో అక్కడితో ఆగలేదు. ప్రొటెక్షనిజం, ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ పద్దతులు గుత్తపెట్టుబడికి తోడైనాయి. చైనా పాలకులు సోషలిజం ముసుగువేసుకొన్నారు;  ఆచరణలో సొంత ఆస్థిని పునరుద్ధరించారు; కమ్యూన్‌లను రద్దు చేసారు అని కొందరు చెప్తున్నారు. చైనాలో కమ్యూన్‌లను రద్దు చేసి “వ్యక్తిగత బాధ్యతావిధానం”  (Individual Responsibility system) అనే వ్యవసాయరంగ సంస్క రణను చేసా రన్నది నిజమే. కానీ సొంత ఆస్తిని పునరుద్ధరించారన్నది వాస్తవం కాదు. చైనాలో వ్యవసాయ భూమి ఈనాడు కూడా ప్రభుత్వ ఆస్తిగానే వుంది. రైతులకు అనుభవించే హక్కు, ఆ హక్కుని తర్వాతి తరం పొందే హక్కు కూడా వుంది. ఆస్తి వ్యవస్థ  వేరు, నిర్వహణా పద్ధతి వేరు. సంస్కరించింది రెండో అంశం మాత్రమే. ఈ కీలకమైన వాస్తవాన్ని విస్మరించి, వ్యాఖ్యానించటం తప్పు. ఇది అవాస్తవం, అశాస్త్రీయం, హేతువిరుద్ధం కూడా.

సోషలిస్ట్ మార్కెట్‌ ఎకానమీ అంటే.. చైనాలో అనుసరిస్తున్నది “స్వేచ్చా మార్కెట్‌ పద్ధతి” కాదు. దాన్ని “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” అంటారు. దానికే “సోషలిస్ట్ ప్లాన్డ్‌ కమోడిటీ ఎకానమీ” అనే పేరు కూడా ఉంది. “పబ్లిక్‌ ఓనర్‌షిప్‌” పైచేయిగా వుండే వ్యవస్థ అది. రాజ్యం మార్కెటుని రెగ్యు లేటు చే స్తుంది; మార్కెట్‌ ఎంటర్ ప్రైజెస్ ని గైడ్ చేస్తుంది” అన్నది దాని ప్రాతిపదిక. ఆ విధంగా ప్లానింగు, మార్కెటు మేళవించబడుతాయి. ఈ అవగాహ నను చైనాపార్టీడాక్యుమెంట్లలో చూడవచ్చును. కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను  తెలుసుకోకుండా, లేదా విస్మరించి, తప్పు అవగాహనలు చలామణీలో వున్నాయి. పెట్టుబడిదారీ విధానం=మార్కెటు; సోషలిజం=ప్లానింగు; ఇవి విడదీయరాని జంటలని ఒక అవగాహన విస్తృతంగా వుంటూ వచ్చింది. ఇది తప్పు అని చైనా పార్టీ, డెంగ్‌ వివరించారు. ఫ్యూడల్‌ యుగంలోనూ మార్కెటు- వాణిజ్యం, ఎగుమతులూ – ఉన్నాయి;  బడా పెట్టుబడిదారీ సంస్థలు ప్లానింగ్ చే సుకొన్నాకే  రంగంలోకి దిగుతాయని గుర్తుచేసారు. దాని అధ్యయనం అవసరం, ఉపయోగకరం. 

‘ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం‘: లెనిన్‌

లెనిన్‌ కాలంలో రష్యా విప్ణవం (1917) విజయవంత మైంది. ఆ వెంటనే సామ్రాజ్యవాదుల జోక్యం, అంతర్యుద్ధం రష్యాని అతలాకుతలం చేశాయి. 1922 దాకా అలాంటి సంక్షోభం కొనసాగింది. సోషలిస్ట్ నిర్మాణం- అభివృద్ధి తొలిదశలోనే 1924 జనవరిలో లెనిన్‌ మరణించారు. ఆ దశలో లెనిన్‌ నూత న ఆర్థిక విధానం ( NEP) పేరిట దేశ, విదేశ పెట్టుబడిదారులనూ, వారి పద్ధతులనూ రష్యా లో  అనుమతించారు. 

ఈ విధానం ప్రమాదకరం కాదా? అంటే అది పెట్టుబడిదారీ అభివృద్ధే అవుతుంది, నిజమే. కానీ ప్రమాదకరం కాదు; ఎందుకంటే అధికారం కార్మికుల, రైతులచేతిలోనే ఉంటుంది. కంట్రాక్టు షరతుల్ని అమలు చేస్తాం; దాని వల్ల కార్మికుల పరిస్థితులు బాగుపడుతాయి… ఇది సరైందే కూడా; ఎందుకంటే ఇతరదేశాల్లో విప్లవం ఆలస్యమైపోయింది; ఈ లోగా మన పారిశ్రామిక తదితర ఉత్పత్తులు పెరుగుతాయి; మన కార్మికుల, రైతుల, ప్రజల పరిస్థితి బాగుపడుతుంది, అది అవసరం.ఈ అవకాశాన్నివదులుకొనే హక్కు మనకిలేదు“…ఈ క్రమంలో (విదేశీ) పెట్టుబడిదారులు కొంత లాభపడుతారు; మనం కొంత వదులుకోవాల్సివస్తుంది నిజమే,  ఈ త్యాగం మృత్యుసమానం కాదు, ప్రమాదకరం కాదు”, అని లెనిన్‌  వివరించారు ( 1921 ఏప్రెల్‌ 25; CW volume 32). ఈ ఏర్పాట్లు ఒక రకం యుద్ధమే;  ఆయుధాలతోకాక, ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం; ఈ యుద్ధంలో మన ఉత్పత్తిశక్తుల్ని ధ్వంసం చేసుకోము; పెంపొందించుకొంటాం. పెట్టుబడిదారులు మనని మోసం చేయ జూస్తారు, నిజమే; వారిని మన రాజ్యం, చట్టాలద్వారా, ఇతరత్రా ఎదుర్కొంటాం; గెల్చి తీరుతాం. మనం వారిని కేవలం ఆయుధాల ద్వారానే ఓడించగల్గుతామని భావించటంలేదు…’ప్రపంచ విప్లవ చెయిన్‌ లో మనమొక లింకుమాత్రమే; మనమొక్కరమే ప్రపంచ విప్లవాన్ని సాధించలేము, ఆ లక్ష్యాన్ని  మనం పెట్టుకోలేదు కూడా.. అని ఆ రోజుల్లోనే ( Lenin On Concessions, 1920 నవంబరు 26; మాస్కో పార్టీ సమావేశంలో ఉపన్యాసం) వివరించారు. సామ్రాజ్యవాదం మరణశయ్యపై ఉన్నదని లెనిన్ సూత్రీకరించి శతాబ్దం దాటిపోయినా, నేటికీ అది ఎంతబలంగా ఉన్నదో చూస్తూనే ఉన్నాం. 

లెనిన్‌ తర్వాత ఆ బాధ్యతల్నిస్టాలిన్‌ చేపట్టి 1953 లో తన మరణందాకా కొనసాగించారు. రష్యాలో ‘సోషలిజం చాలా పరిణతి చెంది, వర్గరహిత కమ్యూనిజంవలె’ రూపొందుతున్నదన్న అతివాద అంచనావేసి, పొరపాటుచేసినట్టు స్టాలిన్ కాలం చివరిలో గుర్తించబడింది. ఆ పొరపాటుని మావో కాలంలోనే చైనా పార్టీ గుర్తించింది. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలో వున్నది; అక్కడ సోషలిస్ట్ మార్కెటు వ్యవస్థకి  కీలక పాత్ర వున్నది – అని డెంగ్‌ నాయకత్వంలో చైనా పార్టీ సూత్రీకరించింది.

‘సోషలిజంలో కూడా  మార్కెట్‌ పాత్ర వుంటుంది’ : మావో  

సోషలిస్ట్  నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆర్థికనియమాలు (EconomicLaws)వున్నాయి, వుంటాయి. వాటిపట్ల శాస్త్రీయ అవగాహన వుండాలని, అవి మన ఇష్టాయిష్టాల ప్రకారం వుండవని లెనిన్‌, స్టాలిన్‌, మావో, డెంగ్  నొక్కి చెప్పారు. వాటి అవగాహన, అన్వయాలలో అనేక ప్రయోగాలు, అనుభవాలు, సాఫల్యవైఫల్యాలు, అంగీకారాలు – అనంగీకారాలు కూడా వున్నాయి, సహజమే. ఆ నియమాలు ఇలా వున్నాయి:

“ఎకనామిక్‌ ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ సోషలిజం ఇన్‌ యు.యస్.‌యస్.‌ఆర్‌” పేరుతో స్టాలిన్‌(1951 లో) రచించిన గ్రంధం ఒకటుంది. మానవాళి చరిత్రలో మొదటిసారిగా శాస్త్రీయ సోషలిజం అమలు జరిగింది రష్యాలోనే.  కార్మికవర్గం అధికారం చేజిక్కించుకోవటం సోషలిస్ట్ విప్లవానికి నాంది. అది బతికి బట్టకట్టాలంటే     ‘సోషలిస్టు నిర్మాణం-అభివృద్ధి’  కీలకం; ఆ రెంటిలోనూ   రష్యాది కొత్త అనుభవం, కొత్త ప్రయోగం. ఆ అనుభవాలనే స్టాలిన్‌ పై పుస్త కంలో చర్చిం చారు; సోషలిజంలో కూడా సరుకుల (కమోడిటీ) ఉత్పత్తి వ్యవస్థ, మార్కెట్‌ పాత్ర వుంటాయని, అవి పెట్టుబడిదారీ సమాజంతోనే ముగియవని స్టాలిన్‌ (1951) నిర్ధారించారు. ఈ పుస్తకంపై మావో ఒక విమర్శతో కూడిన సమీక్షను (క్రిటిక్‌)1958లో రచించారు.  చైనా భవిష్యత్తుకి ఉపయోగ పరచుకునే లక్ష్యంతో రష్యా అనుభవాలను మావో పరిశీలించారు. పారిశ్రామిక రష్యా స్థితి అది;  చైనాలోని వాస్తవ పరిస్థితులతో కలిపి చూడాలని,  వెనుకబడిన వ్యవసాయ దేశమైన చైనాలో మార్కెట్ మరింత అవసరం అని మావో ఆ రచన ప్రారంభంలోనే నొక్కిచెప్పారు. ఆ ‘సమీక్ష’లోని అంశాలు గమనించదగినవి. “సరకుల ఉత్పత్తి వ్యవస్థ అనగానే మనలో కొందరికి చిర్రెత్తుతుంది; అది పెట్టుబడిదారీ విధానమే అని భావిస్తాం. కానీ కోట్లాది రైతుల సంఘీభావాన్ని సమీకరించుకోగలగాలంటే, సరకుల ఉత్పత్తిని, మనీ సప్లయిని పెద్ద  యెత్తున పెంపొందించాల్సి వస్తుందని కన్పడుతుంది- అని వెనుకబడిన, రైతాంగదేశాల ప్రత్యేకతల దృష్ట్యా మావో చెబుతారు.  ప్రయోగాల అవసరం మావో గుర్తిస్తారు. 

“కమ్యూనిస్టు స్వర్గంలోకి ఒక్క అంగలో వెళ్ళలేము, క్రమ క్రమంగానే వెళ్ళగలం. సరకుల వ్యవన్థను, విలువ సూత్రాన్ని, అవి బూర్జువా స్వభావం కలవే అయినా, వాటిని మన ఇష్టానుసారం రద్దు చేయలేము..” పీపుల్స్‌కమ్యూన్లున్నా,  అక్కడ సరుకుల వినిమయాన్ని, విలువ సూత్రాన్ని వినియోగించాల్సి వస్తుంది; సోషలిస్టు పరిణామక్రమానికి అవి తోడ్పడుతాయి అంటారు మావో. వ్యవసాయ ప్రధానదేశంగా, గ్రామీణ జనాభా 80 శాతందాకా వున్న దేశంగా చైనా పరిస్థితులు వేరు (రష్యాలో కన్నా వెనుకబడి వుంటాయి) అని కూడా ఎత్తిచూపారు. అక్కడ మార్కెటు పాత్రని నొక్కి చెప్పారు. ‘పెట్టుబడిదారీ కాలంలో అయినా, సోషలిస్టు కాలంలో అయినా ఆర్థికాభివృద్దికి, రాజకీయార్థిక శాస్త్రానికి చెందిన కొన్ని నియమాలు వర్తిస్తాయని చెప్పాల్సివుంటుంది. ప్రకృతి విజ్ఞాన శాస్త్రంలో వలెనే, ఆర్థికాభివృద్ది నియమాలు కూడా వస్తుగతమైనవి (ఆబ్జెక్టివ్)‌, అవి మానవుని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వుంటాయ’ని మావో రాశారు.  ‘సోషలిస్ట్ ఆర్థికానికి సంబంధించిన “రెడీమేడ్‌” అంశాలేవీ లేనందున,  ‘కొత్తవైన సోష లిస్ట్ ఆర్థిక రూ పాలను సృష్టించాల్సి వుంటుంద’నీ, ఈ క్రమాన్నీ అ-ఆ ల నుంచి మొదలు పెట్టాల్సివస్తుందనీ… నిస్సందేహంగా ఇది “జటిలమైన, సంక్లిష్ట మైన, ఇంతకుముందెన్నడూ లేని కర్తవ్యంగా” వుంటుందనీ మావో చెప్పారు.’సోవియట్‌ యూనియన్‌ నుంచి నేర్చుకుని మనం మెరుగుపరుచుకోవాలని, ఆర్థిక నియమాలను రష్యా రద్దు చేయగలుగుతుందని, కొత్త వాటిని సృష్టించుకోగలుగుతుందని భావిస్తే- అది పూర్తిగా అసత్యం’-అని చెప్పారు మావో. 

‘మన ప్రణాళికా సంస్థలు సామాజిక ఉత్పత్తిని సరిగ్గా (కరెక్ట్‌ గా) ప్లాన్ చేయడం సాధ్యమే…ఐతే దాన్నీ వాస్తవంలో సాధించటాన్నీకలగా పులగం చేయకూడదు. అవి రెండూ వేర్వేరు విషయాలు.’సాధ్యత’ను వాస్తవంగా మార్చగలగాలంటే, ఆర్థికాన్ని అధ్యయనం చేయటం, దానిపై పట్టు సాధించటం, పూర్తి అవగాహనతో దాన్ని అన్వయించగలగటం అవసరం. “ఆయా నియమాలను పూర్తిగా ప్రతిబింబించగల్గినటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి’- అంటారు మావో. అలాంటి నియమాల్లో భాగమే సరకుల వ్యవస్థ, మార్కెటూ. ‘గతంలో మనం అలాటి కొన్ని ప్రణాళికలు రూపొందించాం; కానీ తరచుగా అవి తుఫానులని సృష్టించాయి. ఐతే అతి, కాకపోతే మరీ తక్కువ..అయింది. అనేక వైఫల్యాల తరువాత,“40 అంశాల వ్యవసాయ కార్యక్రమం” రూపొందించుకున్నాం. ఇప్పటికీ-వాస్తవిక ఆచరణలో దీన్ని ఇంకా నిరూపించాల్సే వున్నది-అని ప్రయోగాల అవనరాన్ని మావో నొక్కిచెప్పారు. “మన ప్రణాళికలు వాస్తవిక సూత్రాలను పూర్తిగా ప్రతిబింబించలేదు…అంతిమ పరిశీలనలో సరకుల ఉత్పత్తి ఉత్పాదక శక్తులతోకూడా ముడిపడి వుంటుంది. అందువల్ల – పూర్తిగా సోషలైజు చేయబడిన పబ్లిక్‌ ఓనర్‌ షిప్‌ క్రింద కూడా- సరకుల  వినిమయం అమలులో వుండడం-కొన్ని రంగాల్లో నైనా- తప్పనిసరవుతుంది’ అని మావో అంటారు. “పట్టణాలకు-గ్రామాలకు, పరిశ్రమలకు వ్యవసాయానికి మధ్య ఆర్థిక సంబంధాన్ని గట్టిపరచాలంటే, సర కుల ఉత్పత్తి వ్యవస్థని కొంతకాలం వుంచాల్సిందేనని బోధపడుతుంది. పట్టణాలతో అలాంటి బంధం మాత్రమే రైతాంగానికి ఆమోదయోగ్యంగా వుం  టుంది” -అంటారు మావో. ఇక్కడ కార్మిక రైతాంగ ఐక్యసంఘటన కూడా ఇమిడిఉంది.  ఇంకా ఇలా అంటారు: అభివృద్ది చెందిన పెట్టు బడిదారీ దేశాలకీ, వెనుకబడిన పారిశ్రామిక వ్యవస్థలకూ, వ్యవసాయ ప్రధాన దేశాలకూ తేడా వుంటుంది. ఒకే దేశంలో పరిశ్రమలకూ-వ్యవసాయానికీ, పట్టణ వర్గాలకూ రైతాంగానికీ కూడా తేడాలుంటాయి..కొన్ని వాస్తవిక ఆర్థిక సూత్రాలకు, నియమాలకు లోబడి వుంటాయి; మానవుడి ఇష్టాయిష్టాల ప్రకారం వుండవు. వాటిని అవగాహన చేసుకుని, అన్వయించుకోవలసివుంటుంది.  ‘సరకుల ఉత్పత్తి వ్యవస్థ వద్దే వద్దు’ -అని కొందరనుకుంటారు. కానీ అది తప్పు. ఆ వ్యవనను గురించి లెనిన్‌ నుంచి స్టాలిన్ నేర్చుకున్నారు. స్టాలిన్ నుంచి మనం నేర్చుకోవాలి” అంటారు మావో.”సరకుల ఉత్పత్తి వ్యవస్థ కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినదే కాదు..సరకుల ఉత్పత్తి విడిగా ఒంటరిగా వుండదు. సందర్భాన్నిబట్టి- పెట్టుబడి దారీ విధానంలోనా, సోషలిజంలోనా అని దాన్ని చూడాలి. పెట్టుబడిదారీ సందర్భంలో అది పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి వ్యవస్థ గాను, సోషలిస్ట్ సందర్భంలో అది సోషలిస్ట్ ఉత్పత్తి వ్యవస్థగాను వుంటుంది. నిజానికి సరుకుల ఉత్పత్తి ప్రాచీనకాలం నుంచీ వుంటూ వచ్చింది”-అని మావో అంటారు. సరకుల ఉత్పత్తి వ్యవస్థ అంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థేనని నిర్దారించటానికి వీల్లేదని, దాని చారిత్రిక పూర్వ రంగాన్ని గుర్తు చేస్తారు మావో.

రష్యాలో సోషలిజం నిర్మాణ అనుభవాలతో “రాజకీయ ఆర్థిక శాస్త్రం  పాఠ్యపుస్తకం” ఒకటి రష్యాలో ప్రచురించబడింది. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్‌ ఆర్థిక వేత్తల బృందం దాన్ని రూపొందించింది. దాన్ని సమీక్షిస్తూ మావో ఒక “రీడింగ్‌ నోట్స్‌”ని రచించారు. 1961-62లో రచించిన, 1969లో వెలుగుచూ సిన ఈ సమీక్షలో కూడా పైన పేర్కొన్న అవగాహనే వుంది. రష్యాతో విభేదిస్తూనే, కొన్ని ఆర్థిక నియమాలను గుర్తిస్తూ మావో రచించారు. ఇవన్నీ మావో ఆలోచనావిధానంలో భాగంగా, మార్క్సిజం-లెనినిజం కొనసాగింపుగా అధ్యయనం చేయాల్సినవే. మావో తనజీవితకాలమంతటా నమ్మి, వివ రించిన పై సిధ్ధాంతాల్ని ‘సాంస్కృతికవిప్లవ’ (1966 తర్వాత)  కాలంలో పక్కనపెట్టి, అతివాదమార్గం పట్టారు. డెంగ్ ని పెట్టు బడిదారీ మార్గీ యుడని నిందించి, తొలగించారు. రష్యాలో స్టాలిన్ తర్వాత జరిగిన తప్పుల్ని నివారించాలనే ఆదుర్దాతో అలా చేసారు. 

 ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, ‘సోషలిస్టు నిర్మాణ‘ సిధ్ధాంతాల్ని అభివృధ్ధి చేసిన డెంగ్ 

కానీ అనతికాలంలో తన అతివాద తప్పుని గ్రహించి,1973లోనే  డెంగ్ ని మళ్లీ పిలిచి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పూర్తి బాధ్యతల్ని పునరుధ్ధరించారు. ఈ వాస్తవాల్ని చూడానిరాకరించే పిడివాదులు కొందరు మావోపేరిట డెంగ్ ని తిట్టిపోస్తుంటారు. వారికి ఒక దశలోని మావోయే వేదం, డెంగ్ విషం!   

‌ పై ప్రాతిపదికనే డెంగ్ వివరించి, విస్తరించి,’సోషలిస్టు మార్కెటు ఆర్థికవ్యవస్థను ప్రతిపాదించి, అమలు చేసి, ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, చైనాని అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో బూర్జువా లిబరలైజేషన్ ని వ్యతిరేకించే  ఉద్యమాన్ని నడిపించారు; అలాంటి ధోరణులపట్ల మెతకగా ఉన్న ఇద్దరు (హు యావో బాంగ్‌, ఝావో జియాంగ్‌) నాయకులు ప్రధాన కార్యదర్శి పదవినుంచే – డెంగ్‌ మార్గదర్శకత్వంలోనే – తొలగించబడ్డారు. దేశం మొత్తం విధిగా పాటించాల్సిన సూత్రాలను డెంగ్‌ నొక్కిచెప్పి, తమ పార్టీ మౌలిక సిద్ధాంతంలో భాగం చేసారు: సోషలిస్టు మార్గం, జనతాప్రజాతంత్ర నియంతృత్వం, పార్టీ, మాలెమా సిద్ధాంతం – వీటి నాయకత్వ పాత్ర -ఈ ‘నాల్గు మౌలిక సూత్రాల’కి (Four Cardinal Principles)  లోబడిమాత్రమే ఏ సంస్కరణలైనా సాగాల్సి ఉంటుంద’ని నిర్ణయించారు. రష్యాలో గోర్బచేవ్‌ నేతృత్వంలోని సంస్కరణలు పట్టాలు తప్పి, సోవియట్‌ పతనానికి దారితీసాయి; కాగా చైనా గ్లోబలైజేషన్‌ తుఫాన్లనీ,2008 ఆర్థిక సంక్షోభాన్నీ, కోవిడ్ మహమ్మారి పర్యవసానాల్నీ తట్టుకొని ముందుకు సాగుతున్నది.”సోషలిస్ట్ యుగంలో మనం సరకుల వ్యవస్థని సంపూర్ణ వికనన దశవరకూ అభివృద్ధి చేయాలి..యుద్దాన్ని దశాబ్దాల పాటు సాగించాం…తైవాన్‌ విముక్తి కోసం ఇప్పటికీ ఓపిగ్గా ఎదురు చూస్తున్నాం…అలాగే సోషలిజం పరిణతి కోసమూ ఎదురు చూడాల్సి వస్తుంది. మరీ త్వరగా విజయాలు వచ్చేస్తాయని ఆశించవద్దు”  అంటారు మావో. చైనాలో సోషలిజం అంతిమవిజయానికి ‘వెయ్యేళ్లయినా పట్ట వచ్చు, ఇది సుదీర్ఘ ప్రయాణం’ అన్నా రు (1950లలొ) ఒక సందర్భంలో. చైనాలో సోషలిజం ప్రాథమిక దశలోనే వుంది అని డెంగ్‌ సూత్రీకరించింది ఈ అవగాహనతోనే. 

తొమ్మిది కోట్లమంది కమ్యూనిస్టు సభ్యులూ, మూడుతరాల శ్రేణులూ నాయకుల అవిఛ్చిన్న, పటిష్ట నేతృత్వంలో చైనా తనదైన స్వతంత్ర, సోషలిస్టు అభివృద్ధిపధంలో ముందుకు సాగుతున్నది.  ఎవరో కొద్దిమంది  తూలనాడితే, చైనాకి పోయేదేమీ లేదు; ఆ పిడివాదం మనకే నష్టదాయకం. మనదేశంలో ఏం చేయాలి, ఎలా ఉద్యమాల్ని ముందుకు తీసుకువెళ్లాలి అన్నది మనకి ముఖ్యం. చైనాపార్టీ 20వ మహాసభను కీలకమైనదిగా భావించి, ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నది. ఆ సందర్భంగా పై అవగాహన అవసరం. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సమస్య :రణమా ! శరణ్యమా ? నాటోలో కొత్త భయం ! మరో మలుపు తిరిగిన సంక్షోభం !!

12 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Crimea bridge blast, Crimea., NATO, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


కొందరు వర్ణిస్తున్నట్లు ఉక్రెయిన్లో అసలైన పోరు ఇప్పుడే ప్రారంభమైందా లేక మరో పెద్ద మలుపు తిరిగిందా ? రోజులు గడిచే కొద్దీ కొత్త సందేహాలు, సమస్యలు. తాజా పరిణామాలను ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభ పునరుద్భవంగా కొందరు పేర్కొన్నారు. అసలేం జరగనుంది అనే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు 231 రోజుల తరువాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి.గత కొద్ది వారాలుగా ఎలాంటి దాడులు లేవు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు వెళ్లాయి.నాలుగు ప్రాంతాల పౌరులు కోరుకున్నట్లుగా వాటిని రష్యా విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన తరువాత విమర్శలు తప్ప పెద్ద పరిణామాలేవు. అలాంటిది ఒక్కసారిగా సోమ, మంగళవారాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్‌ అంతటా అనేక పట్టణాలపై పెద్ద ఎత్తున రష్యా క్షిపణి దాడులు జరిగాయి. అనేక పట్టణాల్లో అంధకారం అలుముకుంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. మిలిటరీ వ్యవస్థలతో పాటు విద్యుత్‌ కేంద్రాలపై సోమ, మంగళవారాల్లో పుతిన్‌ దళాలు కేంద్రీకరించాయి. రాజధాని కీవ్‌లోని కొన్ని కీలక కేంద్రాలపై క్షిపణిదాడులు జరిగినా జెలెనెస్కీ నివాసం, అధికార కేంద్రాలపై ఇంతవరకు గురిపెట్టలేదు. ఇక ముందు అది జరగదని చెప్పలేము. ఇదంతా ఎందుకు అంటే !


అక్టోబరు 8 తేదీ శనివారం నాడు రష్యా క్రిమియా ద్వీపకల్పంలోని క్రిమియా లేదా కెర్చ్‌ వంతెన మీద పెద్ద పేలుడు జరిగింది. ఐదుగురు మరణించారని వార్తలు. ఉదయం ఆరు గంటలపుడు (మన కాలమానం ప్రకారం 9.30 గంటలు) ఈ ఉదంతం జరిగింది. ఉక్రెయిన్‌ ఉగ్రవాద ఆత్మాహుతి దళం తాము తెచ్చిన ఒక కారు, ట్రక్కును పేల్చివేసినట్లు ఒక కథనం కాగా, వంతెన కింద ఉన్న సముద్ర జలాల్లోనుంచి వచ్చిన ఒక అస్త్రంతో పేల్చివేసినట్లు మరొక విశ్లేషణ. ఈ ఉదంతం జరిగినపుడే ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసిన ఒక మానవరహిత పడవ రష్యా ఓడరేవు సమీపంలో కనిపించటంతో ఈ అనుమానం తలెత్తింది. ఎలా జరిగిందనేది ఇంకా నిర్ధారణగాకున్నా పేలుడు జరిగింది. దానికి ప్రతి స్పందనగా సోమవారం నాడు వివిధ పట్టణాల మీద రష్యా త్రివిధ దళాల క్షిపణుల దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో అనుమానితులుగా ఐదుగురు రష్యన్‌, ముగ్గురు ఉక్రేనియన్‌, ఆర్మీనియన్‌ పౌరులను అరెస్టు చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.


ఈ వంతెన మీదుగా వెళ్లే ప్రతి వాహనం ఒక పెద్ద స్కానర్‌ గుండా వెళుతుంది. వాటిలో ఒకవేళ పేలుడు పదార్ధాలు ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. దాన్ని తప్పించుకొని వాహనాలు వెళ్లాయా, అప్పుడు అది పని చేయలేదా, తనిఖీలోపమా, విద్రోహమా లేక సముద్ర జలాల్లో నుంచి వచ్చిన ఏదైనా పడవ నుంచి పేలుడు జరిపారా అన్నది తేలాల్సి ఉంది. గతంలో అనేక మార్లు ఉక్రెయిన్‌ అధికారులు వంతెనలను పేల్చివేస్తామని ప్రకటించారు.జూలై నెలలో జెలెనెస్కీ సలహాదారు అరెస్తోవిచ్‌ త్వరలో తమ మిలిటరీ దాడి చేస్తుందని చెప్పాడు. వంతెనల మీద దాడి చేసినందుకు బహిరంగంగా ఎస్తోనియా విదేశాంగ మంత్రి అభినందనలు తెలిపాడు.ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రత్యేక కార్యకలాపాల దళపు హస్తం ఉందని కూడా చెప్పాడు. గత కొద్ది సంవత్సరాలుగా సిరియా, ఇతర ఇస్లామిక్‌ తీవ్ర వాదులను జెలెనెస్కీ సర్కార్‌ చేరదీస్తున్నదని, వారు ఐరోపా సమాఖ్య దేశాల్లో తిరిగేందుకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చూసేందుకు ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులు ఇచ్చారని, ఆ ఆత్మాహుతి దళాలతో పేలుడుకు పాల్పడి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
వంతెన మీద పేలుడుతో సంబంధం లేకుండానే తమపై దాడికి ముందుగానే రష్యా పధకం వేసిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. వంతెన పేలుడు గురించి మౌనంగా ఉన్న అమెరికా, ఇతర దేశాలూ మరోవైపు క్షిపణి దాడులను ఖండిస్తూ విమర్శలకు దిగాయి. పుతిన్‌ సేనలను, రష్యాను దెబ్బతీయాలంటే ఎక్కువ దూరం ప్రయాణించి రష్యా మీద బాంబులను కురిపించే క్షిపణులను తమకు ఇవ్వాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ అమెరికా, ఇతర నాటో దేశాలను కోరుతున్నాడు. అందుకు గాను పుతిన్ను మరింత రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగంగా క్రిమియా వంతెన పేల్చి వేతకు పధకం వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అది ఎంతో కీలకమైన రోడ్డు, రైలు వంతెన గనుక పుతిన్‌ తీవ్రంగా స్పందిస్తే ఆ సాకుతో అలాంటి క్షిపణులు ఇవ్వాలన్న ఎత్తుగడ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వేళ అందచేస్తే కొందరు చెబుతున్నట్లు అసలైన పోరు ప్రారంభానికి నాంది అవుతుంది. దానిలో అమెరికా, ఇతర నాటో దేశాల సైనికులు భౌతికంగా పాల్గొంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకమైతే ఆ దేశం ఆధునిక ఆయుధాల ప్రయోగశాలగా మారుతుంది.


క్రిమియా ద్వీపకల్పంలో పేల్చిన వంతెన ఆ ప్రాంతానికి రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే పందొమ్మిది కిలోమీటర్ల రోడ్డు, పక్కనే ఉన్న రైలు వంతెన.పౌరులకు అవసరమైన సరఫరాలతో పాటు మిలిటరీ రవాణాకు సైతం అది కీలకం. ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి జనం తమ ప్రాంతాన్ని తిరిగి రష్యాలో కలపాలని కోరారు. ఆ మేరకు 2014లో విలీనం జరిగింది. తరువాతనే పుతిన్‌ ప్రభుత్వం ఆ వంతెనల నిర్మాణం చేసింది.స్వయంగా పుతిన్‌ కారు నడిపి వంతెనలను ప్రారంభించారు. నిజానికి ఆ వంతెనల వలన రవాణా వేగంగా జరగటం తప్ప ఆ ప్రాంతానికి దారి లేక కాదు. ఇక శనివారం నాటి పేలుడు జరిగిన చోట రోడ్డు వంతెన మీద ఒక వైపున ఉన్న ఇనుపకంచె(రెయిలింగ్‌) కొంత మేర విరిగి సముద్రంలో పడింది. పక్కనే ఉన్న రైలు వంతెన మీద ఉన్న రైలులోని ఇంధన టాంకర్లకు నిప్పంటుకుంది. కొంత సేపు రవాణా నిలిపివేసి అదే రోజు పునరుద్దరించారు. నష్టం పెద్దది కాదు గానీ తరువాత జరిగిన పరిణామాలకు అది నాంది పలికింది. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని చెప్పుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉక్రెయిన్లో సంబరాలు, నర్మగర్భంగా ఆ దేశ నేతలు చేసిన ప్రకటనలు, అది ఉక్రెయిన్‌ చేసిందే అని పేరు చెప్పని వారు తమకు చెప్పినట్లు అమెరికా పత్రికలు ప్రకటించటం వంటి పరిణామాలన్నీ వేలు జెలెనెస్కీవైపే చూపుతున్నాయి. ఇది పౌర, కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ఉగ్రవాద చర్య అంటూ భద్రతా మండలిలోని శాశ్వత దేశాల ప్రతినిధులతో పుతిన్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించాడు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ఉగ్రవాద దళాలు స్వదేశంలోనూ, తమ ప్రాంతంలోనూ దాడులకు పాల్పడినట్లు రష్యా గతంలో కూడా పేర్కొన్నది.హిట్లర్‌ మూకలు పార్లమెంటు భవనాన్ని తగులబెట్టి నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపినట్లుగా జెలెనెస్కీ దళాలు స్వంత అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడులకు పాల్పడి నెపాన్ని తమ మీద మోపేందుకు చూసినట్లు కూడా ఐరాసకు ఫిర్యాదు చేసింది. తమ కురుస్క్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా మూడు సార్లు విద్యుత్‌ లైన్ల మీద దాడులు చేసినట్లు, టర్క్‌ స్ట్రీమ్‌ గాస్‌పైప్‌లైన్‌ పేల్చివేతకు చూసిందని కూడా పేర్కొన్నది. బాల్టిక్‌ సముద్రంలో ఉన్న అంతర్జాతీయ గాస్‌ పైప్‌లైన్ల విధ్వంసానికి జరిపిన పేలుళ్ల విచారణ బృందంలో తమ ప్రతినిధులను అనుమతించలేదని రష్యా పేర్కొన్నది.
క్రిమియా వంతెన పేల్చివేతకు ప్రతిగా రష్యా క్షిపణులు జనావాసాలపై బాంబులు వేసినట్లు జెలెనెస్కీ, పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా తాము ఉక్రెయిన్‌ ఇంథన, మిలిటరీ, సమాచార కేంద్రాల మీద దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పుతిన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. సోమవారం నాటి రష్యా దాడుల్లో 14 మరణించారని, 97 మంది గాయపడినట్లుగా ఉక్రెయిన్‌ పేర్కొన్నది. నిజంగా జనం ఉన్న ప్రాంతాల మీద క్షిపణులు పడి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది.రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రారంభమై మంగళవారం నాటికి 230 రోజులు.(ఫిబ్రవరి 24) అప్పటి నుంచి ఐరాస లెక్కల ప్రకారం అక్టోబరు రెండవ తేదీనాటికి మరణించిన పౌరుల సంఖ్య 6,114 అంటే సగటున రోజుకు పాతిక మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాడు ఒకే సారి అనేక పట్టణాల మీద క్షిపణి దాడి జరిగింది. ఏ కారణంతోనైనా అమాయక పౌరుల మరణాలను సమర్ధించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాడుల స్వభావం గురించి జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకొనేందుకే ఈ వివరాలు. తమ ప్రతీకారం తీవ్రంగానే ఉంటుందని రష్యన్లు బాహాటంగానే చెబుతున్నారు. సోమవారం నాడు పుతిన్‌ సేనలు వదలిన 83క్షిపణుల్లో 43ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైనికులు 60 మంది మరణించినట్లు, అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు , ఒక మిగ్‌ విమానాన్ని కూల్చినట్లు రష్యా లెక్కలతో సహా ప్రకటించింది. నిజానికి ఇప్పటి వరకు 230 రోజుల పోరులో ఎటువైపు ఎంత నష్టం అన్నది ఇంతవరకు నిర్దారణగా వెల్లడికాలేదు. దేశమంతటా తమ విద్యుత్‌ వ్యవస్థకు ముప్పు వచ్చినట్లు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. పదకొండు ప్రధాన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ప్రధాని వెల్లడించాడు. అనేక చోట్ల మంచినీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉక్రెయిన్‌లో ఫ్రెంచి పౌరులందరూ తమ ఇండ్లలోనే ఉండాలని ఫ్రాన్స్‌ కోరగా, దేశం విడిచి పోవాలని తమ పౌరులను అమెరికా కోరింది. అదనపు మిలిటరీ సరఫరాలను పంపుతామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అనేక దేశాల నేతలకు ఫోన్‌ చేసిన జెలెనెస్కీ అందరం కలసి పోరాడాలని కోరాడు.


అనేక దేశాలలో అమెరికా కూటమి కిరాయి మూకలను రంగంలోకి దించుతోంది. ఉక్రెయిన్లో కూడా అదే జరుగుతోంది. వేలాది మందిని రష్యా మిలిటరీ పట్టుకోవటం, హతమార్చటం తెలిసిందే. ఇంకా వేలాది మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వస్తున్న వార్తలను బట్టి గతంలో తిరుగుబాటుదార్లుగా ఉండి పుతిన్‌ సర్కార్‌కు లొంగిపోయిన చెచెన్‌ సాయుధులను ఉక్రెయిన్‌పై దాడులకు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న అనుభవంతో ఉగ్రవాదుల తీరుతెన్నులు వారికి కొట్టిన పిండేగనుక ఉక్రెయిన్‌ ఉగ్రవాదులను అరికట్టేందుకు వారే సరైన వారని భావిస్తున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే తమ వారు పదివేల మంది ఉన్నారని 70వేల మందిని రంగంలోకి దించనున్నట్లు కొద్ది రోజుల క్రితం రష్యా మిలిటరీలో జనరల్‌గా చేరిన రమజాన్‌ కదరయోవు చెప్పాడు. నాటో కూటమి నేర్పిన పాఠాలను తిరిగి వారికే నేర్పేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. అమెరికా, ఇతర నాటో ప్రధాన దేశాల తీరు తెన్నులను చూసినపుడు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఒక తీరులో దీర్ఘకాలం కొనసాగిస్తూ రష్యాను బలహీనపరిచి తమకు ఎదురులేదని, తమను ప్రతిఘటించేవారికి ఇదే గతి అని ప్రపంచానికి చెప్పేందుకు చూస్తున్నట్లు చెప్పవచ్చు.ఈ క్రమంలో వారు ఊహించని ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత శీతాకాలం గడవటం ఒకటైతే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి నుంచి ఎలా నెగ్గుకు రావాలా అన్నది వాటి ముందున్న ప్రధాన సవాలు.


ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీకి నాటో కూటమి అందచేసిన అస్త్రాలన్నీ పరిమిత ప్రాంతాలకు పరిమితమైనవే. మూడు వందల కిలోమీటర్లు అంతకు మించి వెళ్లగల క్షిపణులను ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని ఇస్తే సంక్షోభ స్వరూపం, స్వభావమే మారుతుంది. నాలుగు ప్రాంతాలను తనలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన తరువాత కూడా ఈ వైఖరిలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. రష్యా భూభాగమైన క్రిమియా వంతెనపై దాడి చేస్తే ఎలాంటి ప్రతి స్పందన ఉంటుందో చూసేందుకు ఒక పధకం ప్రకారం పశ్చిమ దేశాలు చేయించిన దాడి అన్నది స్పష్టం. రెండు రోజులుగా జరుపుతున్న దాడులను పుతిన్‌ నిలిపివేస్తారా, కానసాగిస్తారా? కొనసాగితే ఉక్రెయిన్‌ పౌరుల్లో తలెత్తే భయ, సందేహాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయి, సంక్షోభం ఏ రూపం తీసుకుంటుంది, జెలెనెస్కీని మునగచెట్టు ఎక్కించిన పశ్చిమ దేశాలు ఏం చేస్తాయి. ఇలాంటి అనేక సందేహాలకు ఇప్పట్లో సమాధానం కనిపించేట్లు లేదు.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే మానవ నష్టాన్ని పరిమితం చేసేవిగా రష్యా దాడులున్నాయి. ఇక ముందు అలానే ఉంటాయా లేదా అన్నది ఎర్ర గీతలు దాటి రెచ్చగొడుతున్న పశ్చిమ దేశాలు, వాటిలో కీలుబమ్మగా మారిన ఉక్రెయిన్‌పై ఆధారపడి ఉంది.తనపై విధించిన ఆంక్షల కారణంగా ఐరోపాకు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యాను దెబ్బతీసేందుకు నోర్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్లను కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రష్యామహిళా జర్నలిస్టు దర్యా దుగీనాను హత్య చేశారు. కెర్చ్‌ వంతెనల పేల్చివేతకు చూశారు. రష్యా సరిహద్దులకు టాంకులు, క్షిపణులను తరలిస్తున్నారు.


తొలి రోజుల్లో చర్చలకు సిద్దమన్నట్లు జెలెనెస్కీ కనిపించినా అదంతా ఉత్తిదే అని తేలింది. తదుపరి చర్చలను నిషేధించే ఒక ఫర్మానాను జెలెనెస్కీ విడుదల చేసిన తరువాత అసలు స్వరూపం వెల్లడైంది. రష్యా ఇంథన సరఫరాల్లేకుండా చలికాలాన్ని అధిగమించటం ఐరోపాకు కాస్త ఇబ్బందైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటుంది గానీ, పరిశ్రమల మూత, ద్రవ్యోల్బణం వంటి ఆర్ధికపరమైన అంశాలతో పుట్టి మునుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు చూస్తుంటే జెలెనెస్కీ మీద పుతిన్‌ గురిపెట్టాడు. అన్ని దేశాలకూ ఈ సంక్షోభాన్ని పంచాలని చూస్తున్న అతను లొంగితే ఆ పరాభవం పశ్చిమ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ఆయుధ సరఫరాలు చేస్తున్నాయి. మొదటికే మోసం వస్తే అంటే తమ జీవితాలనే ఈ సంక్షోభం అతలాకుతలం గావిస్తే ఐరోపా జనం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో పుతిన్‌ విజయం సాధిస్తాడేమోనని నాటో భయపడితే ఇప్పుడు ఓడిపోతే అణ్వాయుధాలను రంగంలోకి తెస్తాడేమో అని భయపడుతున్నట్లు ఒక వార్తా సంస్థ కొత్త కథనాన్ని రాసింది. ఇది ఊహాజనితమే గాని దీని వెనుక రష్యా ఓడిపోనుందని, కొద్ది రోజులు ఇబ్బందులను భరించాలనే భావనలోకి పశ్చిమ దేశాల జనాన్ని తీసుకు వెళ్లే ఎత్తుగడ కూడా ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించని సురక్షిత హస్తం : పిడుగులు, ఉరుములతో డాలర్‌ – భయంతో వణుకుతున్న రూపాయి !

08 Saturday Oct 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India Exports, India's Forex Reserves, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, rupee value


ఎం కోటేశ్వరరావు


” ప్రబల డాలర్‌ ఉరుములతో శాంతి లేని భారత రూపాయి ” అనే శీర్షికతో అక్టోబరు ఏడవ తేదీన రాయిటర్‌ సంస్థ ఒక వార్తను ప్రపంచానికి అందించింది. శనివారం నాడు రూపాయివిలువ 82.82గా ఉన్నట్లు ఎక్సేంజ్‌ రేట్స్‌ అనే వెబ్‌సైట్‌ చూపింది. ఇలా రికార్డుల మీద రికార్డులు నమోదవుతుండటంతో గతంలో సిఎంగా ఉన్నపుడు రూపాయివిలువ పతనం గురించి నిర్దాక్షిణ్యంగా మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను తూర్పారపట్టినది గుర్తుకు వచ్చి ఇప్పుడు నరేంద్రమోడీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండాలి లేదా దానికి విరుద్దంగా ప్రశాంతంగా ఉండి ఉంటారు. కానీ దేశం, జనం అలా ఉండలేరే !


సెప్టెంబరు 30తో ముగిసిన వారంలో దేశ విదేశీమారక నిల్వలు 532.664 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితంతో పోల్చితే 110బి.డాలర్లు తక్కువ. 2008 సంక్షోభ తరుణంలో 20శాతం నిల్వలు తగ్గాయి. ఇప్పుడు కొందరు దాన్ని గుర్తు చేస్తున్నారు. తీవ్ర మాంద్య ముప్పు పొంచి ఉండటంతో డబ్బున్నవారందరూ ఇతర కరెన్సీల్లో ఉన్న ఆస్తులన్ని అమ్మి డాలర్లలో దాచుకోవటం మంచిదని కొందరు, బంగారంలో మంచిదని మరికొందరు వాటి వైపు పరుగుతీస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించేదే ! అన్నీ ప్రతికూల వార్తలే !!


కేంద్ర ప్రభుత్వం జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 వైపు పరుగు పెడుతోంది. అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. చైనా యువాన్‌తో కూడా మన కరెన్సీ గత ఐదు సంవత్సరాల్లో రు. 9.8 నుంచి 11.64కు పతనమైంది. మరి ఇదెలా జరిగింది?


అమెరికా ఫెడరల్‌ రిజర్వు మరొక శాతం వడ్డీ రేటు పెంచవచ్చని ముందే సూచించింది. అదే జరిగితే దేశం నుంచి డాలర్లు మరింతగా వెనక్కు పోతాయి. రూపాయి పతనం కొనసాగుతుంది. ఇప్పటికే అంచనాలకు మించిన వేగంతో దిగజారింది. ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మరింతగా తెగనమ్మవచ్చు. ఎగుమతులు తగ్గటం దిగుమతులు పెరగటం, వాణిజ్యలోటు పెరుగుదలకు దారితీస్తోంది. రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో పాల్గ్గొన్న ఆర్ధికవేత్తలు, విశ్లేషకులెవరూ సమీప భవిష్యత్‌లో రూపాయి విలువ పెరిగే అవకాశం లేదని, 82కు దిగజారవచ్చని చెప్పగా శనివారం నాడు 83కు చేరువలో ఉంది. డిసెంబరు నాటికి 82-84 మధ్య కదలాడవచ్చని కొందరు చెప్పారు. ఒక వేళ కోలు కుంటే ఆరు నెలల్లో 81.30కి ఏడాదిలో 80.50కి పెరగవచ్చన్నారు. వర్దమాన దేశాల కరెన్సీ విలువ పెరగాలంటే పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచాలని ఎక్కువ మంది చెప్పారు. అదే జరిగితే పారిశ్రామిక, వాణిజ్య, నిర్మాణ రంగాలు పడకేస్తాయి. ఇప్పటి వరకు విదేశీ వత్తిళ్లకు విదేశీమారక నిల్వలు గురైతే ఇక వడ్డీ రేట్లు కూడా తోడు కానున్నాయి. అక్టోబరులో మన కరెన్సీ విలువ రు.80.17-82.65 మధ్య ఉంటుందని గతనెలలో స్పెక్యులేటర్లు చెప్పగా,అది మొదటి పది రోజుల్లోనే తప్పింది. ఆకస్మికంగా 80.80కి దిగజారవచ్చని చెప్పారు, అది కూడా జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ సమాచారం ప్రకారం అక్టోబరు మూడు నుంచి ఏడువరకు రుణ మార్కెట్‌ నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడుల మొత్తం రు.2,948 కోట్లు కాగా, స్టాక్‌మార్కెట్‌కు వచ్చిన ఎఫ్‌పిఐ మొత్తాలు రు.2,440 కోట్లు. సెప్టెంబరు నెలలో వెళ్లిన మొత్తం రు.7,624 కోట్లు తప్ప వచ్చినవేమీ లేవు. వర్తమాన సంవత్సరంలో మార్కెట్‌ నుంచి వెనక్కు వెళ్లిన మొత్తం రు.1,72,891 కోట్లు.


మన ఇరుగు పొరుగు దేశాల గురించి తమకు అవసరమైనపుడు పోల్చుకొనే కాషాయ దళాల గురించి తెలిసిందే. ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అక్టోబరు ఏడవ తేదీతో ముగిసిన వారంలో ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరెన్సీగా పాకిస్తాన్‌ రూపీ ఉన్నట్లు ఇండియా అబ్రాడ్‌ న్యూస్‌ సర్వీస్‌(ఐఎఎన్‌ఎస్‌) శనివారం నాడు ఒక వార్తనిచ్చింది. ఐదు పని దినాల్లో డాలరుకు రు. 219.92కు చేరి 3.9శాతం బలపడింది. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ దేశంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనా దీనికి కారణంగా పేర్కొన్నారు. పదకొండు రోజులుగా అది బలపడుతూనే ఉంది. జూలై నెలలో రికార్డు కనిష్టంగా 240 నమోదైంది. పాకిస్తాన్‌ దివాలా అంచున ఉన్నట్లు అప్పుడు చెప్పారు.పాక్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న కారణంగా కరెన్సీ కోలుకుందని విశ్లేషకులు చెప్పారు. అక్టోబరు చివరి నాటికి 200కు పెరగవచ్చని ఆర్ధిక మంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు.దిగుమతులు తగ్గుతుండటం, రానున్న రోజుల్లో 2.3 నుంచి 2.5 బిలియన్‌ డాలర్లవరకు ఏడిబి రుణం ఇవ్వనుందనే వార్తలు పాక్‌ కరెన్సీ విలువ పెరుగుదలకు దోహదం చేస్తోంది. సెప్టెంబరు 20న మన ఒక రూపాయి 2.99 పాకిస్తాన్‌ రూపీకి సమానంగా ఉండగా అక్టోబరు 8వ తేదీకి 2.67కు బలపడింది.


మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో రూపాయి ప్రభుత్వ చేతగాని తనం వల్లనే పతనమైందని ధ్వజమెత్తిన నరేంద్రమోడీ ఇంతవరకు తన పాలనలో పతనం గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా బిజెపి ఎంపీ, మాజీ మంత్రి జయంత్‌ సిన్హా( యశ్వంత సిన్హా కుమారుడు) గతంలో మన కరెన్సీ ఒక్కటే పతనమైందని, ఇప్పుడు మన కంటే ఇతర ప్రధాన కరెన్సీలన్నీ పడిపోతున్నట్లు చెబుతూ గతానికి ఇప్పటికీ పోలికే లేదని సమర్ధించుకున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే వాదనలు చేశారు. కొందరు విశ్లేషకులు కూడా అప్పటికీ ఇప్పటికీ పోలిక లేదనే వాదనలు ముందుకు తెచ్చారు. కాసేపు అది నిజమే అని అంగీకరిద్దాం. అదో తుత్తి అన్నట్లుగా ఉండటం తప్ప మనకు ఒరిగేదేమిటి ? గతంలో ఇతర కరెన్సీలతో కూడా పతనమైనందున మనకు జరిగిన భారీ ఆర్ధిక నష్టం ఎంతో, ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో విలువ పెరిగినందువలన వచ్చిన లాభం ఏమిటో బిజెపి పెద్దలు వివరిస్తే వారి వాదనల డొల్లతనం వెల్లడవుతుంది. ఇప్పుడు అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నందున మనకు వస్తువులను అమ్మేవారు డాలర్లను తప్ప మరొక కరెన్సీ తీసుకోరు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ? దీనికి కూడా కాంగ్రెస్‌, నెహ్రూ పాలనే కారణమంటారా ?


మా నరేంద్రమోడీ విశ్వగురు పీఠం ఎక్కారు , అందునా పుతిన్‌ -జెలెనెస్కీ మధ్య రాజీకోసం కేంద్రీకరించారు . రూపాయి పతనం గురించి చూసుకోమని నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు గనుక దీన్ని పట్టించుకోలేదు గానీ, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగిసిన తరువాత రూపాయి విలువ పెంచటం చిటికెలో పని అని మోడీ మద్దతుదారులు అంటే అనవచ్చు. కాసేపు వారిని సంతుష్టీకరించేందుకు నిజమే అనుకుందాం. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అంటూ స్థానిక వస్తువులనే కొనాలని నినాదమిచ్చిన మోడీ గారు మిగతా దేశాల కరెన్సీలు ఏ గంగలో కలిస్తే మన కెందుకు ముందు లోకల్‌ రూపాయిని రక్షించాలి కదా అని ఎవరైనా అంటే ఉడుక్కోకూడదు మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో లూలా ముందంజ -పార్లమెంటులో మితవాదులది పైచేయి !

05 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Get out Bolsonaro, Brazil election 2022, Jair Bolsonaro, Latin America’s Right, Latin American left, lula da silva


ఎం కోటేశ్వరరావు


” మనకు విశ్రాంతి లేదు, గెలుపుకోసం గట్టిగా పని చేయాలి. ఇంకా 28 రోజులే గడువు ఉంది ” బ్రెజిల్‌ వామపక్ష నేత లూలా డిసిల్వా అక్టోబరు రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఫలితాలు వెల్లడించిన తరువాత ఇచ్చిన పిలుపు, చెప్పిన మాటలవి. లూలా అంతిమ విజేతగా నిలిచేంత వరకు కార్మికులు, కష్టజీవులు రానున్న నాలుగు వారాలూ వీధులను ఆక్రమించాలని(ఎన్నిక కోసం పని చేయాలని) బ్రెజిల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు లూసియానా శాంటోస్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం తొలి దఫాలోనే 50శాతంపైగా ఓట్లు సంపాదించి లూలా డిసిల్వా ఎన్నికౌతారనే ఎన్నికల పండితులు, సర్వేలకు భిన్నంగా 48.4 శాతం(5,72,59,405ఓట్లు) లూలాకు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, పచ్చిమితవాది బోల్సనారోకు 43.2 శాతం(5,10,72,234 ఓట్లు) రాగా మరో మితవాద పార్టీ నేత టిబెట్‌కు 4.2శాతం(49,15,420 ఓట్లు) వచ్చాయి. మూడవ పక్షం మొత్తంగా బోల్సనారోకు బదలాయించినప్పటికీ స్వల్ప తేడాతో లూలా విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. సాధారణంగా అలా జరగదు. ఇవిగాక వామపక్ష వాదినని చెప్పుకొనే సిరో గోమ్స్‌ అనే మరోనేతకు(మూడు శాతం) 36లక్షల ఓట్లు వచ్చా ఇవి లూలా వైపే మొగ్గే అవకాశం ఉంది. ఈ ఓట్ల తీరు తెన్నులను చూసినపుడు పురోగామి వాదులా మితవాదులా అన్నదే గీటురాయిగా ఓటర్లు ఆలోచించారు తప్ప మధ్యేవాదులను పట్టించుకోలేదన్నది స్పష్టం. ఇటీవల జరిగిన లాటిన్‌ అమెరికా ఎన్నికల్లో తొలి దఫా మొదటి స్థానంలో ఉన్నవారే విజేతలుగా నిలిచారు. అయినప్పటికీ ఆ ఖండంలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ను వామపక్షాలకు దక్కకుండా తమ శిబిరంలో ఉంచుకొనేందుకు అమెరికా,ఇతర మితవాద శక్తులూ సర్వశక్తులను ఒడ్డుతాయి గనుకనే ఈనెల 30న జరిగే తుది ఎన్నికల వరకు విశ్రమించరాదని, జాగరూకులై ఉండాలన్నదే లూలా(వర్కర్స్‌ పార్టీ), కమ్యూనిస్టు పార్టీ పిలుపుల ఆంతర్యం. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తంగా చూసినపుడు మితవాద శక్తులు రెండు సభల్లోనూ మెజారిటీ తెచ్చుకున్నాయి.


వర్కర్స్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్‌ పార్టీలు కలసి ” బ్రెజిల్‌ విశ్వాసం ” అనే కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి మరో ఆరుపార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వీటిలోని సోషలిస్టు పార్టీనేత గెరాల్డో ఆల్కమిన్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో బ్రెజిల్‌ విశ్వాసం కూటమి ఒకటిగా, మిగతా ఆరు పార్టీలు విడిగా పోటీ చేశాయి. మరోవైపు మితవాది బోల్సనారోకు స్వంత లిబరల్‌ పార్టీతో పాటు మరో రెండు పార్టీలు మద్దతుగా నిలిచాయి. మరోసారి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బ్రెజిల్‌ వెల్లడించింది. తొలి రౌండ్‌లో విజేత లూలా, తుది దఫాలో కూడా మనమే విజేతలంగా ఉండాలని కమ్యూనిస్టు నేత శాంటోస్‌ చెప్పారు. తామింకేమాత్రం విద్వేషాన్ని,విభజన, హింస, ఆకలి, నిరంకుశత్వాన్ని కోరుకోవటం లేదని జనం వెల్లడించారు. అంతిమ విజయం, ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోనే ఉండి కృషి చేయాలని శాంటోస్‌ పిలుపునిచ్చారు. వీధులను ఆక్రమించండి, ప్రతి మనిషితో మాట్లాడేందుకు కృషి చేయండి, ప్రజాచైతన్యాన్ని పెంచండని శాంటోస్‌ కోరారు.


తాను గనుక గెలవకపోతే ఫలితాన్ని అంగీకరించేది లేదని అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ముందుగానే బోల్సనారో ప్రకటించాడు. రెండవ దఫా పోటీకి అవకాశం కల్పించటంతో ప్రజలు మార్పును కోరుతున్నారని అన్నాడు తప్ప మరొక మాట మాట్లాడలేదు. ఎన్నికలు స్వేచ్చగా జరిగిందీ లేనిదీ తెలుసుకొనేందుకు రక్షణ శాఖ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచమంతటా ఆసక్తి కలిగించిన ఎన్నికల్లో తనకు అవసరమైన 50శాతం పైగా మెజారిటీ రావటం లేదని స్పష్టం కాగానే తుది దఫా పోరుకు సిద్దం కావాలని ఆదివారం రాత్రే లూలా తన మద్దతుదార్లకు పిలుపినిచ్చాడు. గత ఎన్నికల్లో బోల్సనారో తొలిదఫా మొదటి స్థానంలో 46.03 శాతం ఓట్లు తెచ్చుకోగా రెండో స్థానంలో ఉన్న వర్కర్స్‌ పార్టీ నేత ఫెర్నాండో హదాద్‌కు 29.28 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తుది దఫా ఎన్నికల్లో వారికి 55.13-44.87 శాతాల చొప్పున వచ్చి బోల్సనారో గెలిచాడు. తొలి దఫా పోలింగ్‌లోనే అతగాడు ఈ సారి దౌర్జన్యకాండకు తన మద్దతుదార్లను పురికొల్పే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రానున్న నాలుగు వారాల్లో హింసాకాండ చెలరేగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బోల్సనారో మరింతగా రెచ్చగొట్టటంతో పాటు మిలిటరీ కుట్రకు తెరలేచే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.


అన్నీ సజావుగా ఉంటే ఈ ఎన్నికల్లో లూలా గెలిచినప్పటికీ బోల్సనారో, ఇతర మితవాద పార్టీల ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీలో ఉన్నందున లూలా పధకాలన్నింటినీ ఆమోదించే అవకాశాలు లేవు.లూలాపై మోపిన తప్పుడు కేసులో శిక్ష వేసి జైలుకు పంపి గత ఎన్నికల్లో పోటీలో ఉండకుండా చేసి తరువాత బోల్సనారో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ జడ్జి సెర్జీయో ఇతర అనేక మంది పేరు మోసిన మితవాదులందరూ తిరిగి పార్లమెంటుకు వచ్చారు. తొలి దఫా, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బోల్సనారో ముప్పు గురించి అనేక మంది హెచ్చరిస్తున్నారు. మేథావి, జర్నలిస్టు తియాగో ఆంపారో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సందర్భంగా బోల్సనారో అనుసరించిన విధానాలకు గాను అతన్ని శిక్షించేందుకు ఈ ఎన్నిక తోడ్పడాలని కోరుకున్నారు. అది జరిగేది కాదు, ఈ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత మనం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకూడదు, వీధుల్లోకి వెళ్లాల్సిన తరుణమంటూ, లేనట్లైతే మరోసారి అంధకార భవిష్యత్‌లోకి వెళతామని అన్నాడు.


తొలి దఫా ఓటింగ్‌లోనే లూలా గెలుస్తాడని వేసిన అంచనాలు ఎందుకు తప్పినట్లు అనే మధనం కొందరిలో ఇప్పుడు ప్రారంభమైంది. సర్వే సంస్థలు పేదలను ఎక్కువగా కలవటం, మితవాద శక్తుల మద్దతుదార్లు స్పందించకపోవటం వలన అంచనాలు తప్పినట్లు ఒక అభిప్రాయం. బోల్సనారోకు 36 లేదా 37శాతం ఓట్లు, లూలాకు 50శాతం పైన ఓట్లు వస్తాయని ప్రముఖ ఎన్నికల పండితులు చెప్పిన లెక్క తప్పింది. ప్రపంచంలో ఇలాంటి లెక్కలు తప్పటం ఇదే మొదటిది కాదు గానీ, బ్రెజిల్‌లో మితవాదులు-పురోగామి వాదుల సమీకరణలు ఇంత తీవ్రంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. ఇటలీలో పచ్చి ఫాసిస్టు శక్తి అధికారానికి రావటం అనేక దేశాల్లో మితవాదులు బలం పుంజుకోవటం శుభ సూచికలు కాదు.2015లో బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ రావటం ఖాయమన్న సర్వేలు తప్పి మితవాద కన్సర్వేటివ్‌ పార్టీ వచ్చింది. తరువాత ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వేరు పడటం గురించి వెలువడిన అంచనాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి.


పార్లమెంటు దిగువ సభ 513 మంది ఉండే ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో బోల్సనారో లిబరల్‌ పార్టీ తన స్థానాలను 77 నుంచి 99కి పెంచుకుంది. వామపక్ష ” బ్రెజిల్‌ విశ్వాసం ” కూటమి కూడా గతం కంటే మరో పదకొండు పెంచుకొని 80 గెలుచుకుంది. మొత్తం మీద చూసినపుడు పార్లమెంటు రెండు సభల్లో మితవాద శక్తులు 60శాతం సీట్లతో మెజారిటీగా ఉన్నారు. మొత్తం 27 రాష్ట్రాలలో, ముఖ్యంగా ధనికులు ఎక్కువగా ఉన్న ఎనిమిది చోట్ల మితవాదులే గెలిచారు.మరో ఆరుచోట్ల ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో రెండవ సారి ఎన్నికలు జరగాల్సి ఉంది.


ప్రస్తుతం వామపక్ష కూటమి తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అల్కమిన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. గతంలో లూలా పాలన, నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. అరెస్టును కూడా సమర్ధించాడు. గతంలో తాను చేసిన ఆరోపణలన్నింటినీ వెనక్కు తీసుకొని వామపక్ష కూటమితో జతకట్టాడు. బోల్సనారో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారితో పాటు మరికొన్ని శక్తులతో కూడా లూలా ఈసారి రాజీపడినట్లు కొన్ని విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. దేశంలో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది, ధరల పెరుగుదలను అదుపు చేయటంలో విఫలమైనట్లు ఒక సర్వేలో 73శాతం మంది చెప్పారు. అమెజాన్‌ అడవులను వాణిజ్య అవసరాలకు అప్పగించేందుకు సుముఖత చూపటాన్ని ఇంటా బయటా వ్యతిరేకించారు. 2019జనవరిలో అధికారానికి వచ్చిన బోల్సనారో దేశ మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.

ఎన్నికల ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమై 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కొన్ని అనధికారిక వార్తలు. వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని ఒక భాష్యం చెబుతుండగా ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అంటున్నారు. ఇంత జరిగినా, విముఖత వెల్లడైనా ఊహించినదాని కంటే తొలిదఫా ఓట్లు ఎక్కువగా తెచ్చుకున్నందున బోల్సనారో దేనికైనా తెగించే అవకాశం ఉంది.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయించాడని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆరోపణలు వెలువడనప్పటికీ సాకు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అతగాడి తీరుతెన్నులను చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. బహుశా అందుకే 30వ తేదీన రెండవ దఫా ఎన్నికల వరకు వామపక్షాలు వీధులను ఆక్రమించి కుట్రలను ఎదిరించాలని పిలుపు ఇవ్వటం అనుకోవాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

5జి వశీకరణ మంత్రం : మాటల మాంత్రికుడు నరేంద్ర మోడీ, జోడీగా కార్పొరేట్‌ మహా మాంత్రికుడు ముకేష్‌ అంబానీ !

04 Tuesday Oct 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, GDP growth, India GDP, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ముందుగా పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్‌ గురించి చెప్పాలి. సార్‌ మన ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ గల్లీలో కూర్చుని అదేదో ఐరోపా దేశమంట అక్కడి కారు నడిపిండట నిజమేనా అని ఒకతను అడిగాడు. నిజమే అన్నాను. మా పక్కింటి పిల్లోడు ఆఫీసుకు పోకుండా ఇంటి నుంచే పని చేస్తే కంపినోళ్లు నెలాఖరుకు బాంకులో పైసలేస్తున్నరు. నేను కూడా అదే చేస్త అన్నాడు. ఇంతకూ నువ్వేం చేస్తావని అడిగా , ఓలా కాబ్‌ డ్రైవర్‌ను సార్‌ అన్నాడు. అలాగా , నువ్కొక్కడివే ఏమిటి మీ ఇంటిలో అందరి పేరా తలా ఒక కారు కొని అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, టీవీల్లో సినిమాలు చూస్తూ, బిర్యానీ తింటూ, టీ తాగుతూ మజా చేసుకుంటూ కార్లు నడుపుతూ మస్తుగా సంపాదించుకోవచ్చు అని చెప్పా. ఏంది సార్‌ మజాక్‌ చేస్తున్నరా అని అనుమానంగా అడిగాడు.మజాక్‌ చేసేందుకు, మభ్య పెట్టేందుకు నేనేమన్నా నరేంద్రమోడీ, కెసిఆర్‌,జగనన్న, చంద్రబాబు అనుకుంటున్నవా ఏమిటి, నిజమే చెబుతున్నా అన్నా. ఏం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేసిండో బాలన్స్‌ లేక అదే ఆగిందో తెలియదు గానీ, చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయా !


మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహాభారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్ధాలను ఎలా సృష్టించారో మాయాబజార్‌ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపునింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్‌ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్‌ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే ! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ సదరు డ్రైవర్‌ అడిగినట్లు అక్కడి నుంచి ఐరోపాలోని ఒక దేశంలో కారు నడిపినట్లు అందరూ చూశారు. ఏదో ఒక పెద్ద బొమ్మకారు ముందు చక్రాలు కదులుతున్నట్లు నాకుమాత్రమే కనిపించిందా, అందరికీనా అన్న సందేహం, అడిగితే ఏమనుకుంటారో అన్న సంకోచం. తీర్చితే దేశానికి వచ్చే లాభం సంగతి తెలీదు, తీర్చకపోతే నాకు ఎలాంటి నష్టమూ ఉండదు.


ఇంతకూ మన ప్రధాని మోడీ చెప్పిందేమిటి ? 5జి(ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ది, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారధిగా దేశం ఉంటుంది.(2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్‌ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41రాంకులు పెంచుకుంటే పాకిస్తాన్‌ 44 పెంచుకుంది.అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారధి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి) 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేండ్ల క్రితం ఒక జిబి(సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రు.300 ఉంటే, ఇప్పుడు రు.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జిబిలు వాడుతున్నారు. అంటే నెలకు రు.4,200 గా ఉండేది రు.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేసింది. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ ( పేటిఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్దిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు ఇది భారత శతాబ్దం.నాల్గవతరం పారిశ్రామిక విప్లవానికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మనిర్భర్‌ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి.


బహుశా నరేంద్రమోడీ గారు గంగిరెద్దుల వారిని చూసి ఉండరు. ఆ ఎద్దుల మొహాల మీద కూడా యుపిఐ అట్టలను వేలాడదీస్తున్నారు. ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి,కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిన్నరేండ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్చేదిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం ,అలాంటిది మోడీ ఏలుబడిలోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు ? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా ? ఇక పెంచిన చమురు పన్నులు, గాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?


ఇక అరవై ఐదేండ్ల ముకేష్‌ అంబానీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు ? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి తాలుకా కేంద్రం వరకు తమ 5జి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ 5జిలో ఎక్కువ భాగం భారత్‌లోనే రూపొందినందున దీన్ని ఆత్మనిర్భర్‌ ముద్రతో ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.


ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా ? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే ,ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు ? ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్‌ ఫోను, పరిజ్ఞానం వచ్చింది.1979లో నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ మరియు టెలిఫోన్‌ కంపెనీ జపాన్‌లో ఒకటవ తరం సెల్‌ఫోన్‌ను టోకియో నగరంలో ప్రవేశపెట్టింది.1984 నాటికి దేశమంతటికీ విస్తరించింది.1983లో అమెరికా, తరువాత కెనడాలకు వచ్చింది.1991లో ఫిన్లండ్‌ 2జిని, 2001లో జపాన్‌ 3జి, నార్వే 2009 చివరిలో 4జి, 2019లో దక్షిణ కొరియా 5జిని ప్రవేశపెట్టింది. 1995 జూలై 21న మన దేశంలో తొలి సెల్‌ఫోన్‌తో పశ్చిమ బెంగాల్‌ సిఎం జ్యోతిబాసు నాటి టెలికాం మంత్రి సుఖరామ్‌తో మాట్లాడారు. అది మూడవ తరం ఫోను. తరువాత 2012లో అదే కొల్‌కతాలో 4జి ఫోన్లను ప్రవేశపెట్టారు. పది సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ 5జిని ప్రారంభించారు.


మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి.2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు.2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్లడాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.


2010లో అమెరికాలో 4జిని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దాని జిడిపి వృద్ధి రేటు 2.71 శాతం, ఆ ఏడాదితో సహా 2021నాటికి పన్నెండు సంవత్సరాల సగటు వృద్ధి రేటు 2.06శాతం. అందువలన జిడిపి వృద్ధి రేటుకు 4జి తోడ్పడినట్లా అడ్డుపడినట్లా ? అక్కడి 4జి వేగానికి మన దేశంలో 4జి వేగానికి ఎక్కడైనా పొంతన ఉందా ? సమాచార విశ్లేషణ, దాన్ని బట్టి ఉత్పత్తులు, మార్కెటింగ్‌ ఎత్తుగడల వంటివాటితో కంపెనీల లాభాలను పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మనుషులు తప్ప కార్పొరేట్స్‌ కాదు కదా ! 5జి, తరువాత వచ్చే ప్రతితరం కూడా చేసేది అదే.


5జి వస్తే జరిగేదేమిటి ? నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్‌ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్ధిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పధకాలకు సంబంధించి రు. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రు 1.1లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21లక్షల కామన్‌ సర్వీసు సెంటర్స్‌(సిఎస్‌సి) ద్వారా పదిలక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పధకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరులక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్‌ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018నాటికే సిమ్మీ చెప్పినట్లు 22లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి ? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది ?


జిఎస్‌ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్ధిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455బిలియన్‌ డాలర్ల లబ్ది ఉంటుంది. ముకేష్‌ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40లక్షల కోట్లడాలర్లని చెప్పారు తప్ప ఏ పద్దతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్‌ పద్దతిలో ఆ నాటికి 30లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్దతిలో 40లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు, అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్‌ అంచనాను తీసుకొని పిపిపి పద్దతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు. కనుక దీన్ని అంగీకరించాలా ? 2021 జూన్‌ 21న ప్రకటించిన ప్రపంచబాంక్‌, ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం మన నామినల్‌ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్దతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011నవంబరు 12 ఎకనమిక్‌ టైమ్స్‌లో మిన్హాజ్‌ మర్చంట్‌ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్దతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. మరి దీన్ని తిరస్కరించాలా, అంబానీ అంచనాను అంగీకరించాలా? ఇంత తేడా ఎందుకున్నట్లు ? ఇక ఫోన్‌ చేసిన కాబ్‌ డ్రైవర్‌కు నేను చెప్పదలచుకున్నదేమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి కాబ్‌ను ఆపరేట్‌ చేసే అవకాశం ఓలా కంపెనీ నీకు ఎందుకు ఇస్తుంది. కార్లు కొని తక్కువ ఖర్చుతో ఇతరులతో అదే ఆపని చేస్తది, కలలు కనొద్దు బాబూ అని ! కలలు కనేందుకు, అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకని పెద్దలు మందలిస్తారు. మాయ మహామాయ లోకంలో ఉన్నాం ! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్రమోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్‌ అంబానీ కార్పొరేట్‌ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడి కుదిరిందని ఎనిమిదేండ్ల అనుభవం చెబుతోంది మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d