• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

మన్‌కీ బాత్‌ కాదు – మోడీ మభ్య పెట్టే మాటలు !

02 Monday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy 2019, Manki baat, manki baat-modi, modi duping and diversionary tactics, Narendra Modi and Nero

Image result for not his manki baat-modi duping and diversionary tactics

మిత్రమా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు అక్షింతలు కూడా అందుకో ! గత ఐదు సంవత్సరాలుగా దేశభక్తి, జాతీయవాదాన్ని జనం చేత తినిపించి, తాగించి, పీల్పించారు. అదేదో సినిమాలో డివైన్‌ అంటే వైన్‌ ఎంత తాగితే అంత జ్ఞానం వస్తుంది అని చెప్పినట్లుగా వాటికి అర్ధం తెలియకుండానే, తప్పుడు లేదా అనర్ధక అర్ధాలను వ్యాపింప చేసిన వారి స్వరూపం తెలియకనే చాలా మంది వాటిని పాటించారు, పాటిస్తున్నారు.

మన ఘనత వహించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలివితేటలు, సామర్ధ్యం, ఆర్ధిక విషయాల్లో ఆయన పరిజ్ఞానం గురించి మీ వంటి వారంతా ఇప్పటికీ నమ్ముతూ ఆహా, ఓహో అంటూ హారతులు పడుతూనే వున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు తరువాత చూడండి అంటే నిజమే కామోసు అనుకున్నారు, నాలాంటి వారు ఎవరైనా కాదంటే ఖండించి మీద పడి కొట్టినంత పని చేశారు. మూడేండ్లు కావస్తోంది, ఆ ఛాయలు లేవు, మోడీ మాటల్లో ఆ వూసుల్లేవు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే అది మా మోడీ ప్రత్యేకం మోడినోమిక్స్‌ అన్నారు. ఇప్పుడు దేశం మాంద్యంలోకి పోతోంది అంటే అది ప్రపంచ పరిణామాల్లో భాగం అని పన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీవి నోళ్లా , మరింకేమైనానా ! మోడీ-షా ద్వయం తెలివితేటలు ఏ మయ్యాయి. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే వారికి డామిట్‌ కధ అడ్డం తిరిగింది అని గిరీశాన్ని తలచుకోవాల్సిన రోజులు దగ్గరలోనే వున్నాయి.

సందర్భం ఏమంటే మిత్రమా గతనెల మన్‌కీ బాత్‌ విన్న తరువాత అవధానం గుర్తుకు వచ్చింది. అష్టావధాని గారికి ఎనిమిది మంది ప్రచ్చకులు సమస్యలను, ప్రశ్నలను సంధిస్తారు. అలాంటి వారిలో ఒకరు అసందర్భ ప్రలాపి వుంటారు. అంటే అవధాని దృష్టిని మళ్లించినా గాడి తప్పకుండా తన పాండిత్యాన్ని ప్రదర్శించటానికి వుద్దేశించింది. దేశమంతటా దిగజారుతున్న ఆర్ధిక స్ధితి గురించి పృచ్ఛకులు అంటే ప్రాశ్నికులు లేదా ప్రశ్నించేవారు సంధిస్తున్న ప్రశ్నలకు అవధాని స్ధానంలో వుండి సమాధానం చెప్పాల్సిన నరేంద్రమోడీ తానే ఒక పృచ్ఛకుడిగా మారి అదీ అసందర్బ Ûప్రలాపి పాత్ర తీసుకున్నారని నేనంటే నీకు, నీ బృందానికి చెప్పుకోలేని చోట మండటం సహజం.

మన్‌కీ బాత్‌ కంటే ముందు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి మోడీగారు సెలవిచ్చారు. ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి ఎందరో ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటో వాటి ఫలితాలేమిటో చెప్పి సుభాషితాలను కొనసాగించి వుంటే విశ్వసనీయత వుండేది. ఇలా వ్యాఖ్యానించిన వారు మీ దృష్టిలో దేశద్రోహులు అవుతారని తెలుసు. రాబోయే రోజుల్లో ఇలాంటి దేశద్రోహులు మరింతగా పెరిగే విధంగా మోడీగారి తీరు తెన్నులు వున్నందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే వుంటారు అని కమ్యూనిస్టు అగ్రనేత లెనిన్‌ మహాశయుడు చెప్పారు. కొందరిని కొంత కాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేరని మన పెద్దలు చెప్పారు. రెండింటి అర్ధం ఒకటే. ఐదేండ్ల క్రితం మోడీ చెప్పిందేమిటి, దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, మోడీ నోట వెలువడుతున్న మాటలేమిటి ? ఒకదానికికొకటికి పొంతన వుందా ? ఏ ఒక్క సమస్యపై అయినా సమగ్రంగా పని చేశారా? ఫలితాలు సాధించారా ?

మిత్రమా నా లాంటి వారు చెబితే కుహనా మేథావులు, విదేశీ తొత్తులు, తప్పుదారి పట్టించేందుకు ఇస్తున్న తప్పుడు సలహాలు అని పక్కన పెట్టేస్తారు. మీ మోడీగారికి ప్రసంగాలు, అంశాలను రాసిచ్చే వారు మోడీని విమర్శించే వారికి అవసరమైన సమాచారాన్ని సరఫరా చేస్తున్నారని మీరైనా చెప్పండి. గొడ్డు మాంసం ద్వారా గో సంతతికి ముప్పు తెస్తున్నారని మోడీ అండ్‌కో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆవు మనోభావాలను రెచ్చగొట్టిన విషయం గుర్తుందా ? అదే మోడీ గారి చేత గో హంతకులంటే ప్లాస్టిక్‌ వల్లనే ఆవులకు ముప్పు ఎక్కువగా వుందని,చనిపోతున్నాయని చెప్పించిన దానిని యాది చేసుకోండి.2015 సెప్టెంబరు 28 గో రక్షకుల ముసుగులో మహమ్మద్‌ అఖ్లక్‌ను దాద్రి గ్రామంలో హత్య చేసిన పదకొండు నెలలకు మోడీగారు నోరు తెరిచారు. ఆ దురంతాన్ని ఖండించేందుకు కాదు సుమా !

పంజాబ్‌, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని మాట్లాడారు తప్ప మరొకటి కాదు. ‘ కొందరు జనాలు గో రక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది రాత్రిపూట సంఘవ్యతిరేక పనులు చేస్తారు, పగలు గోరక్షకులుగా వ్యవహరిస్తారు. ఇలాంటి చెడ్డ పనులు చేసిన వారిలో 70 నుంచి 80శాతం మంది చర్యలను సమాజం అంగీకరించలేదు, వారి చెడు కార్యకలాపాలను కప్పి పుచ్చుకొనేందుకు గోరక్షకుల ముసుగు వేసుకున్నారు ‘ అని చెప్పిన ప్రధాని పార్టీ వారు ఆ పేరుతో నేరాలకు పాల్పడిన వారిని బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎందరిని శిక్షించారు. మోడీ అంతటితో ఆగలేదు గోహంతకుల చేతుల్లో కంటే ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్న ఆవులే ఎక్కువ అని కూడా చెప్పారు. జనం సంగతి వదలి పెట్టండి వుద్యోగం సద్యోగం, ఆదాయం లేకపోయినా మోడీగారి పుణ్యమా అని దేశభక్తి, జాతీయవాదంతో ప్రాణాలు నిలుపు కుంటున్నారు. గోవులకు అంత బుర్రలేదు కనుక కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా తీసుకున్న చర్యలు ఏమిటో సెలవిస్తారా మిత్రమా ? గోరక్షకులు లేదా వారి వెనుక వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగుతున్న ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెనుక తిరుగుతూ కాపాడుతున్న సేవా దృశ్యాలు మనకు ఎక్కడా కానరావు.

ఆవులు తిన కుండా వుండేందుకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలంటూ కరుణా సొసైటీ సుప్రీం కోర్టులో 2012లో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.2016లో దాని మీద తీర్పు చెబుతూ నిషేధం గురించి పరిశీలించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇంతవరకు మోడీ సర్కార్‌ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ నిషేధం గురించి కబుర్లు చెబుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవుల రక్షణకు చట్టాలను చేశారు గానీ మోడీ చెప్పినట్లు వాటి మరణాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్‌ గురించి ఎలాంటి చర్యలూ లేవు. గతంలో స్కైలాబ్‌ కూలిపోతోందనే వార్తలతో జనం రాత్రింబవళ్లు అదేదో తమ మీదే పడనుందన్నట్లు భయపడ్డారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ ముప్పు గురించి కొత్తగా వెలువడిన ఆకస్మిక సమాచారమూ లేదు, కొత్తగా ఆందోళన పడాల్సిందీ లేదు. మరొక సమస్యదీ లేనట్లు మోడీ గారు దాని గురించి చెబుతుంటే ఆయన గారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. రిజర్వుబ్యాంకు నిధులను ఖాళీ చేసి దాన్ని దివాలా తీయించటానికి రంగం సిద్ధం చేశారన్న విమర్శలూ పట్టవు, ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతోందన్న ఆందోళనా లేదు. రోమ్‌ తగులబడుతోంటే పట్టించుకోకుండా ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ప్లాస్టిక్‌, ఫిట్‌ నెస్‌ గురించి కబుర్లు చెప్పటం ఏమిటి ?

మిత్రమా నీకు ఒక ప్రశ్న వేయక తప్పదు. ప్లాస్టిక్‌ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే వినాయకవిగ్రహాలు, వాటిని నీటి వనరుల్లో కలిపి కలుషితం చేస్తున్న తీరు గురించి ఎందుకు నోరు విప్పరు. మీరే చెప్పినట్లు మెజారిటీ రాష్ట్రాల్లో మెజారిటీ జనం మీ వెనుకే వున్నారు, అంటే మెజారిటీ కాలుష్య వినాయక విగ్రహాలకు కూడా మీరే బాధ్యులు. మరి దాని గురించి ఎందుకు చెప్పరు? వినాయకుడి పేరుతో వసూలు చేసే వారి వుపాధి, ఆదాయాలు పోతాయనా, మీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందనా? కాలుష్యం, పర్యావరణ రక్షణ అంటే సమగ్ర చర్యలు తీసుకోవాలి తప్ప ప్లాస్టిక్‌ వరకే పరిమితం కాకూడదు. బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ది పర్యావరణ పట్ల శ్రద్ద వుంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన వినాయక బొమ్మలు పెట్టిన పందిళ్లను సందర్శించటం మానుకోవాలి, నిమజ్జనాలకు దూరంగా వుండాలి.లేకపోతే మోడీ ప్లాస్టిక్‌ మీద చెప్పిన సుద్దులను తుంగలో తొక్కినట్లే అనుకోవాల్సి వస్తుంది.

మోడీగారి మన్‌కీ బాత్‌లో మరొక అంశం ఫిట్‌ ఇండియా ! మిత్రమా కాలేజీ రోజుల్లో నువ్వెంత కష్టపడినా బక్కపీచుగానే వుండిపోయావు గుర్తుందా ? మోడీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. మీరిచ్చిన ప్రోత్సాహంతో ప్రబోధకుడు చాగంటి కోటేశ్వరరావు గారు కోడి గుడ్లు తినేవారి దగ్గరకు దేవతలు రారని వేదాల్లో వుంది అంటారు. మీరేమో ప్రొటీన్లు అధికంగా వుండి చౌకగా లభించే బీఫ్‌ను ఎవరైనా తింటే ఆవు మాంసం తింటున్నారంటూ దాడులు చేస్తారు, బీఫ్‌ నిషేధించాలంటారు. మరోవైపు ఫిట్‌గా వుండాలంటారు, ఇదెక్కడి విపరీతం ! దేశంలో 2022 నాటికి మన పిల్లల్లో 31.4శాతం మంది గిడసబారి పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్ధితిలో కడుపునిండా తిండి లేని వారికి ఫిట్‌నెస్‌ గురించి మోడీ గారు పాఠాలు చెబుతున్నారు. ఇంతకు ముందు యోగా, స్వచ్చ భారత్‌ గురించి హడావుడి చేశారు. జనం వాటిని మరచి పోయారు గనుక ఫిట్‌నెస్‌ గురించి కొత్త పల్లవి అందుకున్నారు. మీరు, మీ మిత్రులు పరిపాలన సాగించే బీహార్‌, యుపిల్లో ప్రతి ఇద్దరిలో ఒక పిల్ల లేదా పిల్లవాడు గిడసబారి వున్నారు.

Image result for manki baat-modi

బండ బడ మీ వ్యవహారం చూస్తా వుంటే దేశంలో ముంచుకు వస్తున్న ఆర్ధిక తిరోగమనం, మాంద్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ప్రధాని పని చేస్తున్నట్లుగా వుంది. ఆర్ధికరంగంలో పరిస్ధితి గురించి మీడియాకు ఇష్టం వున్నా లేకపోయినా వార్తలు ఇవ్వక తప్పటం లేదు. గత నెల రోజులుగా ఏదో ఒక వార్త వస్తోంది. మీడియాతో మాట్లాడటానికి అంటే ధైర్యం లేదు గనుక పత్రికా గోష్టి పెట్టరు అని సరిపెట్టుకుందాం. ఇష్టం వచ్చింది మాట్లాడటానికి అవకాశం వున్న మన్‌కీ బాత్‌లో ఆ విషయాలు ప్రస్తావించరా ? మీడియా వార్తలన్నీ తప్పు , దేశమంతా భేషుగ్గా వుంది, అచ్చేదినాల్లోనే వున్నాం అని చెప్పొచ్చుగా ! ప్రతిపక్షాలకు మోడీ అన్నా ఆయన సర్కార్‌ అన్నా గిట్టదు అనుకుందాం. నీతి అయోగ్‌ అధిపతి రాజీవ్‌ కుమార్‌ 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్ధితి వచ్చిందన్నారు, మోడీ కోరి ఎంచుకున్న రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా మాట్లాడారు. మోడీగారు పత్రికలు చదవరు, టీవీలు చూసే తీరిక వుండదు, సంసార బంధనాలు లేవు ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తారు అనుకుందాం, కనీసం తాను నియమించుకున్న వారి మాటలు కూడా పట్టించుకోరా ?

ఈ మధ్య ప్రధాని, రాష్ట్రాలో ముఖ్యమంత్రులు ఇబ్బంది కలిగించే, వివాదాస్పద అంశాలపై నేరుగా మాట్లాడకుండా వుత్సవిగ్రహాలతో మాట్లాడించి స్పందన ఎలా వుందో చూస్తున్నారు. మోడీ మౌనంతో బిజెపి నేతలు తమ అతితెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియటం లేదు.ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ లక్ష్యానికి తిలోదకాలివ్వాలి. మనకు ధైర్యం లేదు, ఆర్ధిక వ్యవస్ధను ఎలా కాపాడాలో తెలివీ లేదు అని బిజెపి నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో మాంద్యం వున్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్ధ ఎంతో బాగా పని చేస్తోందని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర వర్ణించారు. దీనికి గత ఆరు సంవత్సరాలలో జిఎస్‌టి, పన్నుల సంస్కరణల వంటి పునాదులు వేశారని అన్నారు. అంతటితో ఆగలేదు, మోడీ ఆర్ధిక విధానం ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో ఒకదానిగా దేశాన్ని తీసుకుపోయింది, మోడీ కారణంగానే ఇది సాధ్యమైందనే వాతావరణం ఇప్పుడుంది అన్నారు. బిజెపికి చెందిన బీహార్‌ వుప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ కొత్త ప్రచారానికి తెరతీశారు. ప్రతి ఏటా ఐదు, ఆరు హిందూ నెలల్లో ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందట. ఎన్నికల్లో ఓడిపోయిన అసంతృప్తిని వెల్లడించేందుకు రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఈ ఏడాది గోల చేస్తున్నాయట. తొలిసారిగా గత ఆరు సంవత్సరాల్లో మొదటి మూడు మాసాల్లో అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని ప్రభుత్వమే ప్రకటించినా, ఇది ప్రతి ఏటా జరిగేదే అని బుకాయిస్తున్నారంటే జనం ఇంకా చెవుల్లో పూలు పెట్టుకున్నారనే అనుకుంటున్నారు.

మిత్రమా ఇంకా నయం దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూయే కారణం అని చెప్పినా మీ లాంటి వారంతా గొర్రెల్లా తలలూపుతారనే నమ్మకం బిజెపి నేతల్లో గట్టిగా వున్నట్లుంది,జనం తాము తాగించిన దేశభక్తి, జాతీయవాద మత్తులోనే జనం వూగుతూ తూగుతున్నారనే అనుకుంటున్నారు ! ఈ స్ధితిలో వున్న వారికి ఎదుటి వారు చెప్పేది ఎక్కదు కదా ! మరో సమస్య మీద మరో లేఖ రాస్తా ! వుంటా మరి.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి నిర్మాణం- బొత్స శల్యసారధ్యం !

01 Sunday Sep 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravati capital, Amaravati capital controversy, ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, Chandra Babu, pavan kalyan, YS jagan

Image result for amaravati capital

ఎం కోటేశ్వరరావు

మహాభారతాన్ని ఒక రచనగా నమ్మేవారు గానీ, నిజంగా జరిగిందని విశ్వసించే వారికి గానీ శల్యుడి గురించి తెలిసిందే. యుద్ధంలో కర్ణుడి రధ సారధిగా వ్యవహరించిన తీరు శల్యసారధ్యంగా గణుతికెక్కింది. అర్జునుడిని గెలిపించేందుకు గాను కర్ణుడి సారధిగా వుంటూ అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి దృష్టిని పక్కదారి పట్టించే అంటే ఒక నమ్మక ద్రోహి పాత్రను పోషించాడు. ఇదంతా ధర్మరాజు కోరిక మేరకే చేశాడని, తరువాత కృష్ణుడి సలహా మేరకు ఆ ధర్మరాజు చేతిలోనే శల్యుడు హతమయ్యాడన్నది కధ.

తెరవెనుక ఏమి జరిగిందన్నది ఎవరికి వారు వూహించుకోవటం తప్ప ఎవరూ విన్నది లేదు కన్నదీ లేదు గానీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి విషయంలో శల్యుడి పాత్రను పోషిస్తున్నట్లుగా స్పష్టమైంది. వెంటనే దీనికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదీ రహస్యం కాదు, కాస్త వెనుకో ముందో అన్నీ బయటకు వస్తాయి. చివరికి బొత్స ఏమౌతారో తెలియదు గానీ, ఈ పరిణామాలను చూస్తున్న వారు సహజంగానే పెద్దన్న అంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వైపే వేలెత్తి చూపటం సహజం.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించటం వేరు, దానికి భూములు సేకరించిన తీరును విమర్శించటం మరొకటి. ఈ విషయంలో వైసిపి పక్ష నాయకుడిగా జగన్‌ అసెంబ్లీలో ఆమోదించారు. భూ సేకరణ పద్దతిని విమర్శించారు. ఐదు సంవత్సరాల తరువాత వారు వీరయ్యారు. రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రాంత భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుయాయులకు వుప్పందించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని, వాటికి రేట్లు పెరిగే విధంగా తరువాత రాజధాని ప్రాంత పరిధిని విస్తరింపచేసి లబ్ది చేకూర్చారనే విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. వైసిపి నాయకత్వం కూడా చెప్పింది. వాటన్నింటి మీద విచారణ జరిపి అక్రమాలను బయట పెడతామంటే అంతర్గతంగా ఏమనుకున్నప్పటికీ తమకేమీ అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది.

గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు బయట పెట్టటానికి తీసుకున్న చర్యలేమీ లేవు. కొన్ని విద్యుత్‌ ఒప్పందాల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్‌ టెండర్ల విషయంలో వేగంగా తీసుకున్న చర్యలను చూసిన జనం అమరావతి అక్రమాల విషయంలో లేస్తే మనిషిని కాదు అన్న కాళ్లు లేని మల్లయ్య మాదిరి అవసరమైనపుడు బయట పెడతాం అంటున్నారు. ఇది ఒక వైపు సాగుతుండగానే ముందే చెప్పుకున్న శల్యసారధ్యం మాదిరి బొత్స సత్యనారాయణ తెల్లారితే వెలుగు వస్తుంది, పొద్దు గూకితే చీకటి పడుతుంది అన్నట్లుగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది. పునాదులు లోతుగా తీయాలి, కట్టడాలను ఎత్తుగా కట్టాలి, మిగతా చోట్ల కంటే ఖర్చు రెట్టింపు అవుతుంది, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అనే రీతిలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అభివృద్ధి అంటే ఇష్టం లేదు, మరో ప్రాంతానికి తరలిస్తారు అని ప్రచారం చేసేందుకు, జనం నమ్మేందుకు ఆస్కారం కలిగించారు. బొత్స చెబుతున్నదాని ప్రకారం అయితే గతంలో రాజులు, రంగప్పల మాదిరి కొండలు, గుట్టల మీద దుర్గాలు, కోటల మాదిరి నిర్మాణాలు చేయాలి. మంత్రిగారికి మద్దతుగా వైసిపి నేతలు ఆయన మాట్లాడిందాంటో తప్పే ముంది, రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అంటూ సమర్దనకు దిగారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అమెరికాలో వుండగా ప్రారంభమైంది. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత బొత్సవ్యాఖ్యలతో తలెత్తిన వివాదం లేదా గందరగోళానికి తెరదించుతారని, ముఖ్యమంత్రిగా ఒక వివరణ ఇవ్వాలని అందరూ ఆశించారు, కోరుకున్నారు. అదేమీ చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యమంత్రి స్పందించలేదంటే, కావాలనే ఇదంతా చేస్తున్నారు, సిఎం ఆశీస్సులు లేకుండా మంత్రి మాట్లాడి వుండరనే అభిప్రాయాన్ని నిర్దారించినట్లే భావించాల్సి వుంటుంది.

అమరావతి ప్రాంతం రాజధానిగా వుంటే ఎదురయ్యే సమస్యల గురించి శివరామ కృష్ణన్‌ కమిషన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి మద్దతు తెలిపిన సమయంలో వైసిపి నాయకత్వానికి ఆ ప్రాంతంలో వరద ముప్పు తెచ్చే కొండవీటి వాగు గురించి తెలియదని, వారంతా అమాయకులని అనుకోలేము. రాజధానితో నిమిత్తం లేకుండానే రైతాంగాన్ని నష్టపరిచే ఆ వాగు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని మంగళగిరికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఎం ఎంఎల్‌ఏ నిమ్మగడ్డ రామమోహనరావు, ఆ పార్టీ ఆధ్యర్యంలో అనేక సార్లు పాలకుల దృష్టికి తెచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, వైసిపి మాతృక కాంగ్రెస్‌ పాలకులు గానీ పట్టించుకోలేదన్నది తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ముంపు నివారణకు కొన్ని పధకాలను రూపొందించారు. వాటన్నింటినీ విస్మరించి మంత్రి ఆ సమస్యను ఇప్పుడు ముందుకు తేవటం ఏమిటి? అమరావతిపై అసెంబ్లీ చర్చ సందర్భంగా వైసిపి నేతలు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?

అమరావతి అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాంతాలు ఏమి కావాలన్నట్లు వైసిపి నేతలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్ధలను హైదరాబాదులోనే కేంద్రీకరించి అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన నేరానికి అందరినీ బోనులో నిలబెట్టాల్సిందే. మన దేశ అనుభవం తీసుకున్నా లేక ప్రపంచ దేశాల తీరు చూసినా ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడికే తరలి వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి తప్ప మరోచోటికి రావటం లేదు. 1991 నుంచి కొన్ని రక్షణ సంబంధ సంస్ధల విషయంలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేశాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి చెబుతున్న వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల గురించి తప్ప తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఏఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలకు పెట్టుబడులు పెడతానో ఎందుకు చెప్పలేదు. పాలకులు కోరిన చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు వారు ఎవరూ ముందుకు రారు. అదే గనుక జరిగితే గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు, లోకేష్‌ బాబు దేశ విదేశాల్లో చేసిన హడావుడికి ఇంక చాలు బాబో అన్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్ధలూ వచ్చి వుండాల్సింది. ఇంత ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని వుండేవారు కాదు. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదు, అయినా పెట్టుబడిదారులు అక్కడ పరిశ్రమలు, సేవలపై పెట్టుబడులు పెట్టటం మాని శ్రమశక్తి చౌకగా వున్న చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులు, పరిశ్రమలను పెట్టి వుత్పత్తులను తిరిగి తమ దేశాలకే ఎగుమతులు చేస్తున్నారు. ఆయా దేశాల కంపెనీలు మన దేశంలో ఐటి ఇంజనీర్లు వెట్టి చాకిరీ చేయటానికి అందుబాటులో వున్నారు గనుక పొరుగు సేవల రూపంలో ఐటి రంగ సేవలను పొందుతున్నాయి, కంపెనీలను పెడుతున్నాయి.

అమరావతి విషయంలో ఎన్నికబుర్లు చెప్పినా, భ్రమరావతిగా గ్రాఫిక్స్‌ ఎన్ని చూపినా తాత్కాలిక నిర్మాణాలు చేసినపుడే కాలక్షేపం చేయటానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు, దాన్ని సాగదీస్తూ పూర్తి చేయాలంటే తనకు తిరిగి అధికారం కట్టాబెట్టాలని జనం కోసం ముందుకు వెళ్లాలని పధకం వేసినట్లు రుజువైంది.ఐదేండ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును నిలవేయని జనం మరో ఐదేండ్ల పాటు అదే పని చేస్తే వైసిపిని ప్రశ్నిస్తారని అనుకోలేం. తమకు ఖాళీ ఖజానా అప్పగించారని వైసిపి సర్కార్‌ వాపోతోంది, అందులో వాస్తవం కూడా వుంది. ఏ సర్కార్‌ అయినా వేలు లేదా లక్షల కోట్లు మిగిల్చి తరువాత వచ్చే ప్రభుత్వాలకు ఖజానా అందించిన వుదంతాలు ఎక్కడా లేవు. ఏ ప్రభుత్వం కూడా అలా మిగిల్చిన దాఖలాలు లేవని బడ్జెట్టను చూస్తేనే తెలుస్తుంది. అందువలన ఆ పేరుతో జగన్‌ సర్కార్‌ కాలక్షేపం చేయవచ్చు. రాజధాని నిర్మాణాలను పూర్తి చేయటానికి మా దగ్గర డబ్బు లేదు, అందువలన మరో ఐదేండ్లు తాత్కాలిక నిర్మాణాల్లోనే కాలక్షేపం చేస్తాం, రాజధాని అక్కడే వుంటుంది అని చెప్పండి. వివాదానికి తెరదించండి, అలా చేస్తే బొత్స సత్యనారాయణ ప్రతిష్టకు వచ్చే భంగమూ లేదు, జగన్‌ సర్కార్‌కు పోయే పరువూ లేదు. ఏదో ఒక స్పష్టత ఇచ్చి మంచి పని చేశారనే సానుకూల వైఖరే వ్యక్తం అవుతుంది. అలాగాక నాలుగు ప్రాంతాల్లో లేదా పదమూడు జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా మాట్లాడితే తుగ్గక్‌తో పోల్చుకుంటారు. తుపాకి రాముడు లేదా పిట్టల దొరలు అనుకుంటారు.

రాజధాని నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీ దాని సమర్ధకులు మరో వైపు లాగుతున్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వశాఖల ప్రధాన కేంద్రం. సిబ్బందికి అవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు. అలాంటి రాజధానికి, రాజధాని నగర నిర్మాణానికి ముడిపెట్టి రియలెస్టేట్‌ స్పెక్యులేషన్‌కు తెలుగుదేశం తెరలేపింది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పులేదు. చత్తీస్‌ఘర్‌ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. రాయపూర్‌ను రాజధానిగా ఎంచుకున్నారు. దాని శివార్లలో నయా రాయపూర్‌ నిర్మించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2031 నాటికి అక్కడ ఐదులక్షల ముఫ్పై వేల మంది నివసించటానికి ఏర్పాట్లు అవసరమైని రూపకల్పన చేశారు. ఝార్ఖండ్‌ కాత్త రాష్ట్రాన్ని కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. రాజధానిగా రాంచీని ఎన్నుకున్నారు. అలాగే వుత్తరాఖండ్‌ రాజధానిగా డెహ్రాడూన్‌ వుంది. గుజరాత్‌లో పెద్ద నగరం అహమ్మదాబాద్‌ వున్నప్పటికీ గాంధీనగర్‌ పేరుతో ప్రత్యేకంగా రాజధాని ప్రాంతాన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత కూడా దాని జనాభా మూడులలక్షలు దాటలేదు. హైదరాబాదు నగరం వంటి దానిని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది, ఆ దిశగా అమరావతి నిర్మాణం అని చెబుతున్నారు. ఆదాయం కోసం ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రాజధాని నగరాల నిర్మాణాలు జరపలేదు. అలా జరపటం అంటే అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించటం అనే ఒక తప్పుడు ఆలోచనలో భాగమే.హైదరాబాద్‌ లేదా ఏ మహానగర చరిత్ర చూసినా వందల సంవత్సరాల చరిత్ర, లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి, వాటిని ఆసరా చేసుకొని ప్రయివేటు రంగ విస్తరణ కనిపిస్తుంది.

చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగటం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు అంటూ ఒక మీడియా సంస్ధ అధిపతి, జర్నలిస్టు సెలవిచ్చారు. దీన్ని గుర్తించటానికి నిరాకరించే నాయకులు, కుహనా మేథావులు వివాదాస్పదం చేశారు అంటూ అమరావతి గురించి, అందుకోసం చంద్రబాబు నాయుడు పడిన తపన గురించి వ్యాఖ్యానించారు. నాయకులందరూ, మేథావులు గానీ చంద్రబాబు నాయుడు లేదా జగన్‌మోహన్‌ రెడ్డి నందంటే నంది పందంటే పంది అని తలలూపే గంగిరెద్దులు కాదు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే ఆ బాపతు వేరే వుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసిన సందర్భంగా అది వెల్లడైంది. ఇప్పుడు రాజధాని విషయంలో వైసిపి నేతలు అలాంటి పనిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒక అభిప్రాయం, అంచనాలతో వ్యతిరేకించే వారిని, విబేధించేవారందరినీ కుహనా మేథావులుగా ముద్రవేస్తే సదరు మీడియా సంస్ధ నడిపే పత్రికలు, టీవీ ఛానల్స్‌లో అలాంటి విబేధాలను నిత్యం ఏదో ఒక అంశం మీద వెల్లడిస్తూనే వున్నారు. అంటే వాటిని నిర్వహించే వారు, పని చేసే వారు కుహనా జర్నలిస్టులే అనుకోవాల్సి వుంటుంది. అది రాజధాని కావచ్చు లేదా పదమూడు జిల్లాల్లో కావచ్చు అసలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి అని చెప్పటమే జనాన్ని తప్పుదారి పట్టించటం. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను పెడితే హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వస్తాయా అని ఒక ముక్తాయింపు, అభివృద్ధి అంటే మాల్స్‌, హోటళ్లా ? గుంటూరు పొగాకు, పత్తి, మిర్చి పంటలకు పెద్ద వాణిజ్య కేంద్రం. ఎందరో విదేశీ పొగాకు వ్యాపారులు ప్రతి ఏడాది అక్కడకు వచ్చే వారు. అలాంటి చోట నిన్నమొన్నటి వరకు పెద్ద హోటళ్లు ఎన్ని వున్నాయి? లాభం వుంది గనుకనే గుంటూరులో పొగాకు వ్యాపారులు హోటళ్లను మించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. లాభం వస్తే వ్యాపారి వరదన పోవటానికైనా వెనుకాడడు. విమానాల సౌకర్యమే ప్రాతిపదిక అయితే ఢిల్లీ, ముంబైకి వచ్చినన్ని విమానాలు ఏ నగరానికి రావు. అయినప్పటికీ బెంగలూరు, హైదరాబాదు మాత్రమే ఐటి రంగంలో ఒకటి రెండు స్ధానాల్లో ఎందుకు ఎదిగాయి. హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి చోట్ల హైదరాబాదు నుంచి వెళ్లి మరీ ఔషధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వున్న విమాన సౌకర్యాలు ఏపాటి ? లాభాల కోసం పరిశ్రమలు, వాణిజ్యం చేయాలనుకున్న పెట్టుబడిదారులు గానీ, వుద్యోగం కావాలనుకున్న యువత విమాన సౌకర్యాన్ని బట్టి నగరాలను ఎంచుకోరు. అవకాశం వుంటే ఆఫ్రికాకు అయినా వెళుతున్నారు.

Image result for amaravati capital

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కోరటం పైన పేర్కొన్న మీడియా అధిపతికి ఆశ్చర్యం కలిగిస్తోందట.ఇది ఒక రాజకీయ నేత నోటి నుంచి వస్తే అర్ధం చేసుకోగలం, ఒక జర్నలిస్టు కలం నుంచి వెలువడటం అంటే చౌకబారు జర్నలిజం తప్ప మరొకటి కాదు. ఒక్క పవన్‌ కల్యాణ్‌ ఏమిటి? చంద్రబాబు వైఖరిని విమర్శించిన వామపక్షాలు కూడా అదే కోరుతున్నాయి, రాజధాని నిర్మాణం అక్కడే జరపాలని చెబుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్‌ నిర్వాకం చూసి అనేక మంది ఇలాంటి స్వాతంత్య్రాన్ని కాదు మేము కోరుకున్నది అని ఆవేదన చెందారు. అయినంత మాత్రాన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేయకుండా వదల్లేదు. అమరావతిపై చర్చ సందర్భంగా ప్రతి పార్టీ, మేథావులు అనేక అభిప్రాయాలు చెప్పారు, వాటిలో వ్యతిరేకమైనవీ వున్నాయి. చంద్రబాబు భూసేకరణ తీరును తప్పు పట్టారు. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ వైఖరి మాత్రం సదరు జర్నలిస్టుకు ఆమోదం అయింది గానీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇష్టమైన రైతులు ప్రలోభాలకు గురయ్యో, అత్యాశలకు లోనయ్యో భూములు ఇచ్చారు. కొందరిని బెదిరించారని కూడా విమర్శలు వున్నాయి. స్వాతంత్య్ర వుద్యమ సమయంలో ఎందరో మహిళలు తమ వంతు త్యాగంగా భావించి వంటి మీద వున్న నిలువెత్తు బంగారాన్ని మహాత్మాగాంధీకి ఇచ్చారు. రాజధాని విషయంలో చంద్రబాబును కూడా అంతటి మహోన్నతుడిగా భ్రమించి కొందరు మహిళలు బంగారాన్ని ఇవ్వటం, కొన్ని మీడియాలు దాన్ని బాహుబలి స్ధాయిలో ప్రచారం చేయటం తెలిసిందే. ఇప్పుడు సదరు మహిళలు, భూములిచ్చిన వారికి నష్టం జరిగేట్లుగా కనిపిస్తున్నపుడు న్యాయం చేయాలని ఎవరైనా అడగవచ్చు, దానికి తప్పు పట్టటం ఏమిటి. అత్త పెత్తనం సామెత మాదిరి జనాన్ని ముంచినా తేల్చినా చంద్రబాబే చేయాలని చెప్పటమా ?

రాజధాని నిర్మాణం జరగని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోందని అనే భావన కలిగేలా చిత్రిస్తున్నారు. అసలు దేశం మొత్తంగానే ఆ పరిస్ధితి ఎందుకు ఏర్పడిందో కనిపించదా? హైదరాబాదూ, ఆదాయం అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న వారు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆదాయం పడిపోయిందని, పొదుపు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆదాయం వున్న తెలంగాణా కూడా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీకి చెల్లింపులు చేయలేక ఆసుపత్రులు సమ్మెకు దిగాల్సిన పరిస్దితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి. రాజధాని నిర్మాణం గురించి వెంటనే జగన్‌మోహన్‌ రెడ్డి జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి, అది ఒక ముఖ్యమంత్రి విధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నీ ‘దేశ భక్తి, జాతీయవాదం ‘ భారం భరించలేకున్నాం గురూ !

25 Sunday Aug 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP patriotism and nationalism, Naredra Modi, nationalism, patriotism, Rupee Fall

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి పాటలు -వైసిపి, తెరాస, తెలుగుదేశం డిస్కో డ్యాన్సులు !

11 Sunday Aug 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

370 article, Abrogation of Article 370 and 35A, abrogation of j&k state, Article 370 and 35A, BJP, tdp, trs, Ycp

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు చర్చలు – కొన్ని ప్రశ్నలూ !

10 Saturday Aug 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

Abrogation of Article 370 and 35A, Article 370 and 35A, BJP, Kashmir Valley, tdp, Ycp

ఎం కోటేశ్వరరావు

1.గతంలో ఏం జరిగిందనేది వదిలేద్దాం !

గతంలో జరిగిందాన్ని వదిలేద్దాం, ఎందుకు వదలి వేయాలి, ఎలా వదలి వేస్తాం, సరే వాదన కోసం అంగీకరిద్దాం. ఒక్క కాశ్మీర్‌ విషయమేనా లేక భారత చరిత్ర మొత్తాన్ని వదలి వేయాలా ? మనం ఒకదారిలో కొంతదూరం ప్రయాణించాం. ఎటువైపు నుంచి వచ్చామో గుర్తులేకపోతే, మననం చేసుకోకపోతే ఎటుపోవాలో ఎలా తెలుస్తుంది. కాశ్మీర్‌ విషయంలో చారిత్రక తప్పిదం జరిగింది, దానికి నెహ్రూ అసలు కారకుడని బిజెపి, సంఘపరివార్‌ లేదా వారి మద్దతుదారులు, వారు రాసిందాన్ని గుడ్డిగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నవారంతా చేస్తున్న గోబెల్స్‌ ప్రచారానికి ఆధారం ఏమిటి? గత చరిత్రే కదా. వారు దాన్ని విస్మరించనపుడు మిగతా వారెందుకు వదిలివేయాలి. తమకు ఒక ప్రమాణం, ఇతరులకు మరొకటా ? చరిత్రను, వాస్తవాలను వక్రీకరించే కదా ఇంతవరకు తెచ్చింది. అందువలన చరిత్రలోకి పోవద్దు అనటం అంటే వారి బండారం బయటపడుతుందనే భయమే కారణమా ?

2.వారి బండారం, చరిత్ర అంటున్నారు, అసలు వారెవరు ?

బ్రిటీష్‌ ఇండియాలో అఖిల భారత హిందూ మహాసభను ఏర్పాటు చేస్తే జమ్మూలోని డోగ్రా హిందువులను సమీకరించేందుకు ఆల్‌ జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తే జమ్మూలో 1939లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ ఏర్పడింది. తరువాత దాన్ని మరింత విస్తరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ను తొలుత జమ్మూకు, తరువాత కాశ్మీర్‌ లోయకు పంపారు. సదరు హిందూ సభ నేత ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌చాలక్‌ ప్రేమనాధ్‌ డోగ్రా. దేశ విభజన నిర్ణయం జరిగిన తరువాత 1947 మే నెలలో కాశ్మీర్‌ సంస్ధాన భవిష్యత్‌ గురించి రాజు హరి సింగ్‌ ఏ వైఖరి తీసుకుంటే అదే తమ వైఖరి అని హిందూ సభ చెప్పింది. అపర దేశభక్తి అంటే ఇదేనా ? రాజు స్వతంత్ర దేశంగా వుంటామని ప్రకటించాడు. అయితే అదే ఏడాది అక్టోబరులో పాకిస్ధాన్‌ మూకలు కాశ్మీర్‌ ఆక్రమణకు పూనుకుంటే రాజు భారత రక్షణ కోరాడు. రాజుగారితో పాటు దేశభక్తులూ మారారు. తరువాత హిందూ సభను ప్రజాపరిషత్‌ పార్టీగా మార్చారు. దీని లక్ష్యం ఏమిటయ్యా అంటే కాశ్మీర్‌ను దేశంతో పూర్తిగా విలీనం గావించటం, కమ్యూనిస్టుల ఆధిపత్యం వున్న డోగ్రా వ్యతిరేక షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం అని బలరాజ్‌ మధోక్‌ ప్రకటించాడు. మరి ఈ చరిత్రను కూడా మరచి పోవాలా ?

2. ఆర్టికల్‌ 370,35ఏ రద్దు దేశానికే మంచిది? అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి జరగలేదు. ఈ చర్యతో దేశంలో పూర్తి విలీనం జరిగింది.

సదరు ఆర్టికల్స్‌ కాశ్మీర్‌కే పరిమితం, వాటి రద్దు వలన దేశానికి లేదా ఇతర రాష్ట్రాలకు జరిగే మంచేమిటి ? ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు రద్దయితే మొత్తం దేశానికి వచ్చేదేమిటి? పూర్తి విలీనం జరగకపోతే గత ఏడు దశాబ్దాలుగా అక్కడ ఏడులక్షల మంది సైనికులు, ఇతర భద్రతా బలగాలు ఎందుకు, ఎలా వున్నట్లు ? ఇప్పుడు పూర్తి విలీనం అయింది కనుక వారంతా వెనక్కు వస్తారా ? జమ్మూకాశ్మీర్‌లో చేసిన ఖర్చు మొత్తం ఆ రాష్ట్ర ప్రజలకు చేసినట్లు ఎలా అవుతుంది. మిలిటరీ, సిఆర్‌పిఎఫ్‌, సరిహద్దు రక్షణ ఖర్చును కూడా కాశ్మీరీల ఖాతాలో వేస్తారా ? అదే అయితే చైనా, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కూడా సరిహద్దులు, వాటి రక్షణకు సైనిక బలగాలు వున్నాయి, ఆ ఖర్చు మొత్తాన్ని ఆయా పరిసర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఇచ్చిన నిధులుగా పరిగణిస్తారా ?

3. ఇప్పుడు ఆర్టికల్స్‌ రద్దువద్దని చెప్పే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారు వుగ్రవాదుల దాడుల సమయంలో కాశ్మీర్‌ పండిట్లను తరిమివేసినపుడు ఎ్కడ వున్నారు ?

కాశ్మీరీ పండిట్లపై కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, పాక్‌ మద్దతువున్న మతశక్తులు జరిపిన దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వేర్పాటు, వుగ్రవాద సంస్ధలు తప్ప కమ్యూనిస్టులతో సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సమర్ధించలేదు. ఖండించాయి. పండిట్ల పేరుతో గుండెలు బాదుకుంటున్న బిజెపి ఇతర పార్టీలు అంతకు మించి అదనంగా చేసింది ఏమిటి?

4.పాకిస్తానీ యువకులు కాశ్మీర్‌కు వచ్చి అక్కడి యువతులను వివాహం చేసుకొని పౌరసత్వం పొందుతున్నారు.!

గత ఐదు సంవత్సరాలుగా బిజెపి కేంద్రంలో అధికారంలో వుంది, మధ్యలో పిడిపితో కలసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ కాలంలో ఎంత మంది పాక్‌ యువకులు వచ్చి కాశ్మీరీ యువతులను వివాహం చేసుకొని భారత పౌరసత్వం పొందారో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి వారు లెక్కలు చెప్పగలరా ? పాకిస్ధాన్‌ నుంచి ఎవరైనా భారత్‌కు రావాలంటే వీసా వుండాలి. లేదా దొంగచాటుగా రావాలి. కేంద్రప్రభుత్వం ఎందరికి వీసా ఇచ్చింది? లేదా దొంగచాటుగా వచ్చే వారిని కేంద్ర ఆధీనంలోని సరహద్దు భద్రతా దళాలు లేదా ఇతర భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నట్లు ? భద్రతా సిబ్బంది గానీ, లవ్‌ జీహాద్‌ను వ్యతిరేకిస్తున్నామని తిరిగే హిందూత్వ సంస్ధలవారు గాని ఎంత మంది దొంగ పెళ్లికొడుకులను పట్టుకున్నారో చెబుతారా ?

5.కాశ్మీర్‌ హిందువులు, సిక్కులు మైనారిటీలు,దళితులు, గిరిజనులు, బిసిల వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు !

మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీర్‌లో రిజర్వేషన్లు లేవన్నది పచ్చి అబద్దం. దేశంలో అన్ని చోట్లా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వుంటే ఎక్కడా లేని విధంగా కాశ్మీరులో వెనుకబడిన ప్రాంతాల వారికి రిజర్వేషన్లు వున్నాయి.2005 రిజర్వేషన్‌ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి.

6. పాకిస్ధాన్‌ నుంచి వలస వచ్చిన వారికి కాశ్మీర్‌లో పునరావాసం కల్పించే అవకాశం లేదు !

పాకిస్ధాన్‌ లేదా మరొక దేశం ఎక్కడి నుంచి వలస వచ్చినా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వారికి ఎక్కడైనా పునరావాసం కల్పించవచ్చు. కాశ్మీర్‌లోనే అని ఎందుకు పట్టుబడుతున్నారు? గతంలో పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా , శ్రీలంక, టిబెట్‌ నుంచి వచ్చిన వారికి దేశంలో అనేక ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. తెలుగు ప్రాంతాల్లో బర్మా కాలనీల పేరుతో అనేకం వున్నాయి. ఏదో ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయలేదు. ఒక ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనటం వెనుక వున్న వుద్ధేశ్యాలేమిటి ?

7. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కలిగించినందువలన ప్రయోజనం లేదని తేలిపోయింది !

ఈ అంశంపై బిజెపికి ఎప్పుడు జ్ఞానోదయం అయింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరింది తామే అని ప్రచారం చేసుకున్న అంశం, 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ వాగ్దానాన్ని మరచిపోయారా ? పార్లమెంట్‌లో కాశ్మీర్‌ హోదా రద్దుకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, వైసిపి పార్టీలు 70ఏండ్లుగా కాశ్మీర్‌కు ప్రయోజనం లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పదేండ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఎందుకు అడుగుతున్నట్లు ? ఏమిటీ రెండు నాలుకల వైఖరి ?

8. కాశ్మీర్‌పై ఇంతకంటే ఏమి చర్చించాలి?

అదే ప్రాతిపదిక అయితే రేపు మరొక అంశానికి ఈ మాత్రం కూడా చర్చించాల్సిన పనేమిటి, ఎలాగూ వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు కనుక మేము చేయదలచుకున్నది చేశాం, పార్లమెంట్‌,అసెంబ్లీల్లో మాకు మెజారిటీ వుంది కనుక ఆమోదించుకుంటాం అంటే ఏం చేస్తారు ? ప్రజాస్వామ్యం అంటే ఇదా ? ఒక బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టాలంటే ముందుగా సభానిర్వహణ సలహా కమిటీకి తెలియచేయాలి, సభ్యులకు ముసాయిదా బిల్లులను ముందుగా అందచేయాలి. కాశ్మీర్‌ విషయంలో అదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంట్‌ తలుపులు మూసి చేశారు మేము, తెరిచే చేశాము అంటున్నారు. అప్పుడు తలుపులు మూసినపుడు ఆ చీకట్లోనే బిజెపి, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ కలిసే కదా చేసింది. నాడు చేయని విమర్శ బిజెపి ఇప్పుడెందుకు చేస్తున్నట్లు ? ఏ ఒక్క రాష్ట్ర విభజన సమయంలో అయినా ఆ రాష్ట్రాల్లో కాశ్మీరులో మాదిరి 144సెక్షన్లు, కర్ఫ్యూలు, పోన్లు, ఇంటర్నెట్‌ బంద్‌ పెట్టలేదు, వ్యతిరేకించినా, అనుకూలించినా అసెంబ్లీల్లో చర్చకు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎందుకు జరపలేదు. అసెంబ్లీ లేని సమయంలో బిల్లులు పెట్టాల్సిన తొందరేమొచ్చింది?

9. పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత వ్యతిరేకించటం ఏమిటి ?

పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన ప్రజలకు, పార్టీలకు వ్యతిరేకించే హక్కులేదా ? ప్రపంచంలో ప్రతి నియంత అన్నింటినీ చట్టబద్దంగానే చేశారు. వాటిని ప్రజలెందుకు వ్యతిరేకించినట్లు ? 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితికి అంతర్గత కల్లోలం, విదేశీ ముప్పు కారణాలుగా చూపారు. పార్లమెంట్‌లో పూర్తి ఆమోదం పొందారు. దాన్ని బిజెపి పూర్వరూపం జనసంఘం ఆమోదించిందా వ్యతిరేకించిందా, ఇంకా అనేక పార్టీలు ఎందుకు వ్యతిరేకించినట్లు ? జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ కూడా అంతా పార్లమెంట్‌ ఆమోదం పేరుతోనే ప్రపంచాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నాడు. మరి హిట్లర్‌ను ఎందుకు వ్యతిరేకించినట్లు ?

10. రిజర్వేషన్లు కూడా ఆయా తరగతుల వారిని వుద్దరించింది లేదు !

కాశ్మీర్‌ విషయంలో 370 చేకూర్చిన ప్రయోజనం లేదని వాదిస్తున్న వారిలో అనేక మంది విద్యా, వుద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఆయా తరగతులను వుద్దరించలేదు, గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు నిషేధ చట్టాల వలన గిరిజనులు కూడా అభివృద్ధి చెందలేదు, అక్కడ పరిశ్రమలు రావటం లేదు కనుక ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజమే కదా అని వాటిని కూడా రద్దు చేస్తే పరిస్ధితి ఏమిటి ?

వక్రీకరణలు – వాస్తవాలు !

పాకిస్తానీయులు కాశ్మీర్‌ వచ్చి అక్కడి యువతిని వివాహం చేసుకొని స్ధానికులుగా మారి వుగ్రవాదానికి పాల్పడుతున్నారు- ఒక ప్రచారం.

పాకిస్ధానీ యువకులే కాదు, ఏ విదేశీయువకులైనా కాశ్మీరీ యువతినే కాదు, ఇష్టమైతే ఏ రాష్ట్ర యువతిని అయినా వివాహం చేసుకోవచ్చు. భారతీయ పౌరసత్వం తీసుకోవచ్చు. చట్టంలో అటువంటి అవకాశం వుంది. వుగ్రవాదానికి పాల్పడుతున్నారంటారా? వారే కాదు, మన గడ్డమీద పుట్టి పెరిగిన వారు అయినా వుగ్రవాదానికి పాల్పడితే చర్యలు తీసుకోవటానికి కూడా చట్టాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల యువతీ యువకులు అనేక మంది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎందరో వెళుతున్నారు. వారు అక్కడి యువతీ, యువకులను వివాహాలు చేసుకొని పౌరసత్వం పొందుతున్నారా లేదా ? ఏ విదేశానికి వెళ్లాలన్నా పాస్‌పోర్టు, వీసాలు కావాలి.మనం విదేశాలకు వెళుతున్నట్లే పాకిస్ధాన్‌ లేదా మరొక దేశ వాసులు ఎవరైనా అలాంటి చట్టబద్ద పద్దతుల్లో మన దేశం రావటానికీ అవకాశం వుంది.

పాకిస్ధాన్‌ గురించి ముస్లింల గురించీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలూ వారిని అనుసరించే వ్యక్తులూ నిరంతరం విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రచారాలను చేస్తున్నారు. వాటిని అనేక మంది నమ్ముతున్నారు. ఆ తప్పుడు ప్రచారం చేసే వారూ వాటిని గుడ్డిగా నమ్ముతున్నవారికి ఒక చేదు నిజం చెప్పకతప్పదు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ చివరి మూడు సంవత్సరాల్లో విదేశీయులకు మంజూరు చేసిన పౌరసత్వం కంటే నరేంద్రమోడీ మొదటి మూడు సంవత్సరాల్లో మంజూరు చేసిన వారి సంఖ్య రెట్టింపుకు పైగా వుంది. రెండు ప్రభుత్వాల ఆరు సంవత్సరాల కాలంలో 5,477 మందికి భారతీయ పౌరసత్వం ఇస్తే మోడీ గారు వచ్చిన తరువాత 3,800 మందికి ఇచ్చారు. మొత్తం ఆరు సంవత్సరాల కాలంలో 2,157 మంది పాకిస్ధానీయులు,1,461 మంది ఏ దేశానికీ చెందని వారు,918 మంది ఆఫ్ఘన్స్‌, 218 బంగ్లా, 145 బ్రిటన్‌, 108 శ్రీలంక, 66 ఇరాన్‌, 61 మంది అమెరికా నుంచి వచ్చిన వారితో సహా మొత్తం 56దేశాల నుంచి వచ్చిన వారు పౌరసత్వం పొందారు. రామన్‌ శర్మ అనే జమ్మూ ప్రాంతానికి చెందిన సమాచార హక్కు దరఖాస్తుదారుకు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ 2017లో ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలున్నట్లు 2017 మార్చి 31న ట్రిబ్యూన్‌ పత్రిక ప్రచురించింది. ‘ 2014 నుంచి 2016 డిసెంబరు మధ్య కాలంలో భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 3,801, ఇదే అంతకు ముందు ప్రభుత్వ(కాంగ్రెస్‌ సర్కార్‌) హయాంలో 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకు భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 1,676 ‘ అని సమాధానంలో వున్నట్లు ట్రిబ్యూన్‌ రాసింది.

సంవత్సరాల వారీ చూస్తే 2016లో గరిష్టంగా 660 మంది పాకిస్ధానీయులకు పౌరసత్వం ఇచ్చారు.అంతకు ముందు 2014,2015లో 267,263 చొప్పున ఇచ్చారు. మొత్తం 918 మంది ఆఫ్ఘన్‌ జాతీయులకు పౌరసత్వం ఇస్తే 204ా16 మధ్య ఇచ్చిన వారే 700 మంది వున్నారు. పాకిస్తానీయులకు మోడీ సర్కార్‌ పౌరసత్వం ఇచ్చిందంటే దాని అర్ధం వుగ్రవాదులకు ఇచ్చినట్లా ?

మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కానట్లయితే, ఎవరైనా విదేశీయులు భారత పౌరులను వివాహం చేసుకుంటే చట్టబద్దంగా మన దేశంలో ఏడు సంవత్సరాలు నివశించిన తరువాత వారు స్ధానిక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే వారికి మంజూరు చేస్తారు. మన పౌరులు విదేశీయులను వివాహం చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. ఇందాద్‌ షామిల్‌ అనే కేరళ అబ్బాయి, మరయం యూసఫ్‌ అనే పాకిస్ధాన్‌ అమ్మాయి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం లాహోర్‌లోనూ, పాలక్కాడ్‌లోనూ వివాహం, వివాహం, విందులు ఇచ్చి ఒక్కటయ్యారు. 2008లో మరయం కేరళకు వచ్చింది. వారికి ఇద్దరు పిల్లులు, ఏడు సంవత్సరాల భారత నివాస నిబంధన పూర్తి అయిన తరువాత 2017లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది జనవరిలో మంజూరైనట్లు మళయాళ మనోరమ పత్రిక తెలిపింది.

ఇలా పాకిస్ధానీయులు కాశ్మీర్‌ యువతులను లేదా భారతీయులు పాక్‌ యువతులనే కాదు, ఏ ప్రాంతం, రాష్ట్రం, మతం, కులం వారైనా ఏదేశం వారినైనా వివాహాలు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఎందరికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసిందో, వారిలో ఎందరు వుగ్రవాదులుగా మారారో, ఎంత మందిని పట్టుకున్నారో తెలుపుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచార పూర్వరంగంలో అధికారయుతంగా ప్రకటించి వక్రీకరణలకు తెరదించాల్సిన అవసరం వుందా లేదా ?

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికనేతను కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు గనుక నోరు మూసుకున్నాను

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం మాట్లాడేవారు ఎవరూ మిగల్లేదు

ఇది హిట్లర్‌ నాజీ మూకల గురించి జైల్లో ఒక మతాధికారి రాసిన ప్రఖ్యాత కవిత. కాశ్మీరీల ప్రత్యేక హక్కుల మీద జరిగిన దాడిని వ్యతిరేకించకపోతే రేపు తమదాకా వస్తే ఏమిటో ప్రతివారూ ఆలోచించాలా వద్దా ? అది రెండు తెలుగు రాష్ట్రాల్లో జోనల్‌ వ్యవస్ధ కావచ్చు,లోకల్‌, నాన్‌ లోకల్‌ కావచ్చు. వుద్యోగుల వేతన సంఘాలు కావచ్చు, కార్మిక చట్టాలు, ఇతర సంక్షేమ చట్టాలు ఏవైనా దాడికి, రద్దుకు గురి అయితే ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తన వలలో తానే చిక్కుకున్న ట్రంప్‌ ?

07 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Currency war, Donald trump trade war, Rupee, TRADE WAR, Trump Sets Trap for China, US-CHINA TRADE WAR, yuan

Image result for worried Donald trump

ఎం కోటేశ్వరరావు

చైనాకు వలపన్నినట్లు సంబరపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తానే దానిలో చిక్కుకున్నాడా ? అదే జరిగిందని బ్లూమ్‌బెర్గ్‌ మీడియా సంపాదకవర్గం వ్యాఖ్యానించింది. ‘చైనాతో వాణిజ్య యుద్దంలో ఎల్లవేళలా పైచేయిగా వున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆర్ధిక బాధను తట్టుకొనే చైనా సామర్ద్యాన్ని తక్కువగా అంచనా వేశారు. ఎదుటి వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే గతవారంలో పన్నుల పెంపు బెదిరింపులకు పాల్పడ్డారు. అనేక విధాలుగా వాటిని తిప్పికొడుతున్న చైనా కరెన్సీ యుద్ధానికి కూడా తాను సిద్దం అన్న హెచ్చరిక చేసింది.అది స్టాక్‌ మార్కెట్‌కు మాత్రమే కాదు మాంద్య ముప్పును కూడా ముందుకు తెచ్చింది. ప్రత్యర్ధిని ఒక మూలకు నెట్టేందుకు ప్రయత్నించిన ట్రంప్‌ ఆర్ధిక వ్యవస్ధను రక్షించుకొనే చర్యలేమీ లేకుండానే తన వలలో తానే చిక్కుకున్నాడు.’ అని పేర్కొన్నది.

తాను విధించిన పన్నుల దెబ్బకు చైనా అతలాకుతలం అయిందని ట్రంప్‌ చెప్పింది అబద్దం అని తన కరెన్సీ పతనాన్ని అనుమతించిన చైనా చర్య స్పష్టం చేసిందని కార్ల్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. రెండు పక్షాలూ ఫలవంతమైన చర్చలు జరపకుండా చైనాను కరెన్సీ బెదిరింపుల వైపు నెడితే అది చివరకు ప్రపంచ కరెన్సీ అంతానికి దారి తీస్తుందని జార్జి మాగ్నస్‌ వ్యాఖ్యానించాడు. ఫెడరల్‌ రిజర్వు(అమెరికాకు మన రిజర్వుబ్యాంకు వంటిది) విధి ఆర్ధిక వ్యవస్ధను స్ధిరంగా వుంచటం, కనుక ట్రంప్‌ ఎప్పుడు ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరపరిస్తే అప్పుడు అది రంగంలోకి దిగి వడ్డీ రేట్లను తగ్గించాలి. ఈ విధంగా ఫెడరల్‌ రిజర్వును కూడా వూబిలోకి దించుతున్నట్లే అని, ఇది రాజకీయంగా కూడా రాజీపడుతున్నట్లు కనిపిస్తున్నదని కార్ల్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆర్ధిక మందగమనం లేదా మాంద్యానికి ఫెడరల్‌ రిజర్వు కారణమని విమర్శించాడు, ఇప్పుడు తనను తాను అంతకంటే పెద్ద బలిపశువుగా చేసుకుంటున్నారని, 2020వరకు మెరుగుపడే ధోరణి కనిపించటం లేదని బ్రెయిన్‌ చపట్టా పేర్కొన్నారు. ద్రవ్యవిధానం గురించి మౌలికమైన తప్పుడు అభిప్రాయాలతో ట్రంప్‌ పని చేస్తున్నట్లు కనిపిస్తోందని పొన్నూరు రమేష్‌ వ్యాఖ్యానించారు. ద్రవ్య పరిస్ధితిని సరళతరం మరియు డాలర్‌ను బలహీన పరచి వడ్డీ రేట్లను తగ్గించటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధకు బలం చేకూర్చాలనుకోవటం వాటిలో ఒకటి అన్నారు. మిగతా ప్రపంచం కూడా అదే చేస్తే ఆ లబ్ది త్వరలోనే అంతర్దానం అవుతుంది. ప్రస్తుతం 14.5లక్షల కోట్ల ప్రపంచ రుణ మార్కెట్‌లో వస్తున్న వడ్డీ సున్నా కంటే తక్కువ వుండటంతో వడ్డీరేట్లు కృష్ణ బిలాల్లోకి పోతున్నాయని మార్క్‌ గిల్‌బర్ట్‌ వ్యాఖ్యానించారు. ప్రతికూల వడ్డీ రేట్లతో జర్మన్‌ పొదుపుదార్లను ఐరోపా కేంద్రబ్యాంకు శిక్షించకూడదని టైలర్‌ కోవెన్‌ పేర్కొన్నారు.

2008తరువాత తొలిసారిగా సోమవారం నాడు చైనా కరెన్సీ యువాన్‌ విలువ ఒక డాలర్‌కు ఏడుకు పడిపోయింది. అమెరికా సాగిస్తున్న వాణిజ్య యుద్దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీదాడికి దిగిందని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువుల మీద పదిశాతం దిగుమతి విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. తాముగా యువాన్‌ విలువను పతనం చేయలేదని, అమెరికా తీసుకుంటున్న చర్యల పర్యవసానమని చెబుతోంది. దిగుమతి పన్నుల పెంపుతో తమ వస్తువుల ధర పెరగకుండా చూసుకొనేందుకు యువాన్‌ విలువ పతనాన్ని అడ్డుకోకుండా చైనా కేంద్రబ్యాంకు వ్యవహరించిందని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలతో వాణిజ్య యుద్దం మరింత తీవ్రం అవుతుందనే భయాలు వెల్లడయ్యాయి. ఇదే జరిగితే మన వంటి దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకుంటారు.

యువాన్‌తో మన రూపాయి విలువ కూడా పతనమైంది. యువాన్‌ పతనమైతే వర్ధమాన దేశాలు తమ ఎగుమతులు గిట్టుబాటుగా వుండేందుకు తమ కరెన్సీ విలువలను కూడా తగ్గించుకుంటాయి. అయితే ప్రస్తుతం మన రూపాయి విలువ పతనం కావటానికి పూర్తిగా యువాన్‌ సంక్షోభం కాదని ఇతర అంశాలు తోడైనట్లు కొందరు, వుండాల్సినదాని కంటే విలువ ఎక్కువ వుందని మరి కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి పతనం చెడుకానప్పటికీ ఇతర పర్యవసానాలు వుంటాయి. వడ్డీ రేట్లను పెద్దగా తగ్గించేందుకు అవకాశాలు తగ్గుతాయి. వడ్డీ రేటు ఎక్కువగా, బలమైన రూపాయి వుంటేనే విదేశీ పెట్టుబడిదారులు మన దేశానికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు.యువాన్‌ పతనమైతే చైనా నుంచి సరకులను దిగుమతి చేసుకొనే వారికి లబ్ది కలుగుతుంది. ట్రంప్‌ కనుక దిగుమతులపై ఇంకా సుంకాలను పెంచితే యువాన్‌ విలువ ఇంకా పతనం అవుతుందని భావిస్తున్నారు.ఇదే జరిగితే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఇంకా పెరిగి అమెరికా నష్టపోనుంది.

The days of this polite deference are over.

చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా అస్త్రాలు హాంకాంగ్‌, తైవాన్‌ !

మరో వైపు రెచ్చగొట్టేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. దానికి ధీటుగా చైనా తాను చేయాల్సింది చేసుకుపోతోంది. ఒక వైపు హాంకాంగ్‌లో అల్లర్లను రెచ్చగొట్టి ఏదో ఒక పెద్ద వుదంతం జరిగేలా చూసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తోంది. మరోవైపున తైవాన్‌కు తాజాగా 220 కోట్ల డాలర్ల మేర ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించి చైనాను రెచ్చగొడుతోంది. చైనా నుంచి 300బిలియన్‌ డాలర్ల దిగుమతులపై పదిశాతం సుంకాన్ని పెంచనున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. దానికి ప్రతిగా చైనా యువాన్‌ విలువను తగ్గించటం లేదా పతనాన్ని నిరోధించకుండా చైనా వుపేక్షించిందని వార్తలు వచ్చాయి.

హాంకాంగ్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా నేరాలు చేసిన వారిని విచారించేందుకు ప్రధాన భూ భాగానికి అప్పగించేందుకు వుద్దేశించిన బిల్లును ఆమోదించరాదనే డిమాండ్‌తో అక్కడ తొమ్మిది వారాల క్రితం ఆందోళన ప్రారంభమైంది. ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నామని, అది రద్దయినట్లే అని పాలక మండలి ప్రకటించిన తరువాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాంటి బిల్లును ఎన్నడూ పెట్టకూడదు అంటూ ఆందోళనకారులు పాలనా మండలి భవనం మీద దాడి చేశారు. రోజుకో పేరుతో ఆందోళనకు వీధుల్లోకి వస్తూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మీద దాడులు చేసి రెచ్చగొట్టటం, తద్వారా శాంతి భద్రతల పరిస్ధితిని సృష్టించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. అంతే కాదు, తమకు మరింత ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కావాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. దానికి బ్రిటన్‌, అమెరికా తదితర దేశాలు వంతపాడుతున్నాయి.

తాజాగా ఐదు రోజుల నిరవధిక ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం నుంచి మెట్రో స్టేషన్లలో ప్రవేశించి ప్రయాణీకులను దించి వేయటం, తలుపులను మూసుకోకుండా చేసి రైళ్లను కదలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానిలో భాగంగానే విమానాశ్రయాల్లో ప్రవేశించి తిష్టవేయటం, విధి నిర్వహణలో వున్న సిబ్బందిని అడ్డుకోవటం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేయటం వంటి చర్యలనూ ప్రారంభించారు. ఇంతగా రెచ్చగొట్టినప్పటికీ పాలనా యంత్రాంగం, స్ధానిక పోలీసులు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ఇదే మరొక చోట అయివుంటే ఏమి జరిగి వుండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా మిలిటరీ దళాలను రంగంలోకి దించేందుకు పాలక మండలికి అవకాశం వున్నప్పటికీ వాటిని వుపయోగించలేదు. ఆందోళనకారుల వెనుక అమెరికా ఇతర దేశాల హస్తం వుందని గ్రహిస్తున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. మరోవైపు శాంతి భద్రతల సమస్యను సృష్టించే విధంగా ఆందోళనకారుల చర్యలు వున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా ప్రభుత్వం ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పూనుకున్నట్లు ముఖ్యంగా పశ్చిమ దేశాల మీడియాలో వీటి గురించి చిలవలు పలవలుగా కధనాలు వండి వార్చుతున్నది. మిలిటరీని దించబోతున్నారన్నది వాటిలో ఒకటి.

జూన్‌ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చట్టవిరుద్దంగా సమావేశాలు జరపటం, పోలీసుల మీద దాడి, కొట్లాటలకు దిగటం వంటి చర్యల్లో పాల్గొన్నందుకుగాను 420 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ఒక్క సోమవారం నాడు అరెస్టు చేసిన వారే 82 మంది వున్నారు. కొందరు సిబ్బంది సమ్మెకారణంగా 170 విమానాలు నిలిచిపోయాయి. వారాల తరబడి జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆర్ధికంగా కొన్ని రంగాలు దెబ్బతిన్నాయి. టూరిజం, దాని సంబంధిత కార్యకలాపాలు, దుకాణాల్లో అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్లో సూచీలు పడిపోయాయి. హాంకాంగ్‌ పాలనా మండలి అధ్యక్షురాలు లామ్‌ రాజీనామా చేయాలన్నది ఆందోళనా కారుల డిమాండ్లలో ఒకటి. అయితే తాను పదవి నుంచి తప్పుకోబోవటం లేదని,నగరంలో పరిస్ధితి ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తామని అదే సమయంలో నిరసనకు దూరంగా వున్న వారి హక్కులను నిరసనకారులు కూడా గౌరవించాలని అన్నారు. ఆందోళన ప్రారంభంలో చేసిన డిమాండ్లకు బదులు ఇప్పుడు కొత్తవాటిని ముందుకు తెస్తున్నారని, ప్రాణాలకు సైతం తెగించి అమీ తుమీ తేల్చుకుంటామని చెబుతున్నారని ఆమె చెప్పారు.మరోవైపున ఆందోళన నిర్వహిస్తున్న వివిధ బృందాలలో అంతర్గత విబేధాలు కూడా వెల్లడయ్యాయి.శాంతియుత నిరసన స్ధానంలో హింసాపూరితమైన వేర్పాటు వాదశక్తులు ప్రవేశించారని సామాజిక మాధ్యమంలో కొందరు విమర్శించారు. 2016 జూలై ఒకటిన ఇచ్చిన నిరసన పిలుపు విఫలం కావటంతో తీవ్రవాద బృందాల మధ్య మీరంటే మీరు కారకులనే ఆరోపణలు చివరకు దెబ్బలాటలకు దారితీశాయని పరిశీలకులు గుర్తుచేశారు.

ఆందోళనకారులపై మిలిటరీ చర్య తీసుకుంటే చైనా ఆర్ధిక వ్యవస్ధకే నష్టమని అమెరికా టీవీ సిఎన్‌ఎస్‌ బెదిరించింది. హాంకాంగ్‌ వీధుల్లో చైనా మిలిటరీ కవాతు గురించి కొద్ది వారాల క్రితం వూహించ లేదని ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యాత పేర్కొన్నారు. నిరసనకారుల హింసాకాండను సహించరాదని హాంకాంగ్‌లోని కమాండర్‌ గత వారంలో చేసిన వ్యాఖ్యను వుటంకిస్తూ మిలిటరీ రంగంలోకి దిగే అవకాశం వుందని అమెరికా మీడియా చెబుతోంది.1989లో తియన్మెన్‌ మాదిరి జరగవచ్చని వూహాగానాలను కుమ్మరిస్తోంది. హాంకాంగ్‌లో పరిస్ధితి చేయిదాటిపోయినపుడు అక్కడ వున్న ఆరువేల మంది సైన్య సహాయం కోరేందుకు అక్కడి పాలనా వ్యవస్ధకు చట్టబద్దమైన అవకాశం వుంది.

ఒకే దేశం రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని అమలు జరిపి 2050వరకు చైనాలో విలీనమైన హాంకాంగ్‌, మకావో దీవుల్లో విలీనానికి ముందున్న వ్యవస్ధలనే కొనసాగిస్తామని చైనా వాటి అప్పగింతల సమయంలో బ్రిటన్‌, పోర్చుగీసులతో ఒక ఒప్పందం చేసుకుంది. అందువలన అనేక బహుళజాతి కంపెనీలకు ఇప్పటికీ హాంకాంగ్‌ ఒక కేంద్రంగా కొనసాగుతోంది. దీని వలన చైనాకు ఎంతో లబ్ది కలుగుతోంది. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నవారి వెనుక ఆమెరికా హస్తం వుందని ఇప్పటికే చైనా విమర్శించింది. ఆందోళనలతో హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటం ద్వారా చైనాకు నష్టం కలిగించాలన్న దుష్టాలోచన కూడా అమెరికాకు వుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తన మార్కెట్‌ను అంతర్జాతీయ కంపెనీలకు పూర్తిగా తెరవకుండానే హాంకాంగ్‌ ద్వారా చైనా లబ్ది పొందుతోంది.2016లో చైనాకు వచ్చిన ఎఫ్‌డిఐలో 61శాతం హాంకాంగ్‌నుంచే వుందని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. చైనా సైన్యం కనుక ఆందోళనకారులను అణచివేస్తే ప్రపంచ స్టాక్‌మార్కెట్లో హాంకాంగ్‌కు వున్న ఐదవ స్దానం తీవ్రంగా పడిపోతుందని, కంపెనీలు సింగపూర్‌కు తరలిపోతాయని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. హాంకాంగ్‌కు వున్న సానుకూల వాణిజ్య హోదాను రద్దు చేయాల్సి వుంటుందని కొంత మంది అమెరికా ఎంపీలు బెదిరించారు. ఒక వేళ సైన్యాన్ని దించి మరో తియన్మెన్‌ వుదంతం పునరావృతమైతే దాన్ని ప్రపంచానికంతటికీ ప్రత్యక్ష ప్రసారం చేస్తారని ఆస్ట్రేలియాకు చెందిన బెన్‌ బ్లాండ్‌ హెచ్చరించాడు.

తైవాన్‌ ఒక దేశం కాదు. ఐక్యరాజ్యసమితి వేదికలపై దాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్న అమెరికా శాంతియుత పద్దతుల్లో విలీనం కాకుండా చేయాల్సిందంతా చేస్తోంది.తమ కౌలు గడువు ముగిసిన తరువాత హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారు తిరిగి చైనాకు అప్పగించారు. తైవాన్‌ గత ఏడు దశాబ్దాలుగా తిరుగుబాటు రాష్ట్రంగా వుంది. దానిని స్వాధీనం చేసుకోవటానికి చైనాకు కొద్ది గంటలు చాలు, అయినా అక్కడి జనం అంగీకారంతో జరగాలి గనుక ఎలాంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు.హాంకాంగ్‌ విలీనమైనా అక్కడి పరిస్ధితుల కారణంగా వెంటనే ప్రధాన భూభాగంతో మమేకం చేయకుండా ఒకే దేశం, రెండు వ్యవస్ధల పేరుతో 2050వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని, ప్రత్యేక పాలనా వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని విలీన సమయంలో ఒక హామీ పత్రం రాసి ఇచ్చింది. ఇదే సూత్రాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేసేందుకు చైనా ఆ విధానాన్ని ఎంచుకుంది. పోర్చుగీసు కౌలు నుంచి విలీనమైన మకావో దీవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేసింది.

Image result for worried Donald trump

తాజాగా తైవాన్‌ ప్రభుత్వానికి 220 కోట్ల డాలర్ల విలువ గల ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించుకుంది. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నాం కనుక తాము ఆయుధాలు విక్రయిస్తాం అంటూ అమెరికా అడ్డగోలు వాదనలు చేస్తోంది. అమెరికా చర్యకు ప్రతిగా చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. ఇంకేముంది చూడండి తైవాన్‌ స్వాతంత్య్రం కోరే వారిని భయపెట్టేందుకే అవని అమెరికా నానాయాగీ చేస్తోంది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే మిలిటరీ విన్యాసాలు నిర్వహించాలని చైనా నిర్ణయించింది. అయితే ఈ చర్య తైవాన్‌ స్వాతంత్య్రం కోరుకొనే వారిని బెదిరించటమే అని అమెరికా మీడియా వక్రీకరిస్తోంది. తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోకుండా వుండేందుకే తాము ఆయుధాలు అందచేస్తున్నామని, ఆ ప్రాంతానికి మిలిటరీని తరలిస్తున్నామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది.

ఈ పూర్వరంగంలో పరిస్ధితులు ఎటువైపు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. నిరసనకారులు ఎంతగా రెచ్చగొడుతున్నా వారి మీద స్ధానికుల్లో వ్యతిరేకత మరింత పెరిగే వరకు మౌనంగా వున్నవారు నిరసనకు వ్యతిరేకంగా గళం విప్పే వరకు హంకాంగ్‌ విషయంలో చైనా వేచి చూసే అవకాశం వుంది. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం అమెరికాకు ఇదే కొత్త కాదు. ఇక వాణిజ్య యుద్దం మరింత ముదురనున్నదనే వార్తల పూర్వరంగంలో చైనా కరెన్సీ యుద్ద రంగాన్ని తెరిచేందుకు నిర్ణయించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేథావులూ మీ రెటు వైపో తేల్చుకోండి !

27 Saturday Jul 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adoor Gopalakrishnan, Jai Sri Ram, letters war, open letter to Prime Minister Modi

Image result for martin luther king jr quotes on intellectuals

ఎం కోటేశ్వరరావు

” చెడ్డవారి ద్వేష పూరితమైన మాటలు, చేతలకే కాదు, భయంకరమైన నిశ్శబ్దాన్ని పాటించే మంచి వారి గురించి కూడా మనం ఈ తరంలో పశ్చాత్తాప పడాల్సి వుంటుంది.” మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన మాటలివి. దేశంలో నేడు పెరుగుతున్న విద్వేష ధోరణులు, వాటిని పెంచి పోషిస్తున్న వారి తీరును గురించి నోరు విప్పని వారికి ఇవి చక్కగా వర్తిసాయి.కొంత కాలం క్రితం ఆవుల సంరక్షణ పేరుతో దాడులు చేసి చంపివేస్తే, ఇప్పుడు కొంత మంది ఆకస్మికంగా ప్రత్యక్షమై మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని జై శ్రీరామ్‌ అనాలని వత్తిడి చేయటం, నిరాకరించిన వారి మీద దాడులు చేస్తున్న వార్తలు నిత్యం ఏదో ఒక మూలన జరుగుతున్నాయి. వీటిని న్యాయ విచారణ పద్దతిని పాటించని దాడులు, హత్యలు(ఆటవిక) అంటున్నారు. అలాంటి వాటిని నిరోధించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ రాశారు. దానికి ప్రతిగా ప్రతిగా 62 మంది ప్రముఖులు మోడీకి లేఖ రాసిన వారి మీద దాడి చేస్తూ మరో లేఖ రాసి మోడీకి మద్దతు పలికారు. రాముడి పేరుతో ఆటవిక దాడులు చేసి పేరును దుర్వినియోగం చేయవద్దు అని కోరిన రాముడి భక్తుల మీద దాడి ప్రారంభించి పేరు మార్చుకోండి, భూమ్మీద వుండవద్దు అని బరితెగిస్తున్నారు.

ఈ ఏడాది మార్చినెలలో సుప్రీం కోర్టు ముందుకు ఒక పిటీషన్‌ వచ్చింది. అదేమంటే దేశంలోని ముస్లింలను పాకిస్ధాన్‌ పంపాలంటూ కోర్టు ఆదేశించాలంటూ దాన్ని దాఖలు చేశారు. దాన్ని న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ మరియు వినీత్‌ శరణ్‌లతో కూడిన బెంచ్‌ విచారణకు చేపట్టింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాదిని పిటీషన్‌లోని అంశాన్ని గట్టిగా చదవమని న్యాయమూర్తి నారిమన్‌ అడిగారు. చదివిన తరువాత మీరు నిజంగా ఈ కేసును వాదించదలచుకున్నారా, తరువాత మీ మీద విమర్శలు చేయాల్సి వుంటుంది అని వ్యాఖ్యానించటంతో సదరు న్యాయవాది లేదు అని చెప్పి జారుకున్నాడు. ఆటవిక హత్యల గురించి నరేంద్రమోడీకి లేఖ రాసిన 49 మందిలో ప్రఖ్యాత దర్శకుడు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ ఒకరు. ఆ లేఖను సహించలేని కేరళ బిజెపి నేత ఒకరు గోపాలకృష్ణన్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.చేశారు. జై శ్రీరామ్‌ నినాదాన్ని భరించలేకపోతే శ్రీహరి కోటలో పేరు నమోదు చేసుకొని చంద్రుడి మీదకో లేదా మరో గ్రహానికో పొమ్మని, పేరు మార్చుకుంటే మంచిదని నోరు పారవేసుకున్నాడు. అయితే అలాగే వెళతా చంద్రుడి మీదకు టిక్కెట్‌ ఏర్పాటు చేయండి అని మరోమారు నోరెత్తకుండా కృష్ణన్‌ సమాధానమిచ్చారు అనుకోండి.

Image result for adoor gopalakrishnan

విద్వేషం ముదిరి ముస్లింలు అయితే పాకిస్ధాన్‌ పోవాలంటున్న వారు హిందువుల వరకు వచ్చే సరికి అసలు భూమ్మీదే వుండకూడదని చెబుతున్నారు. దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి, గౌరీ లంకేష్‌లను అలాగే లేకుండా చేసిన విషయం తెలిసిందే. గోపాలకృష్ణన్‌ విషయానికి వస్తే ఆయన ప్రముఖ మళయాళీ, కేరళ వాసి కావటంతో పర్యవసానాలను గమనంలో వుంచుకొని అంతం చేస్తామని బెదిరించలేదు తప్ప ఈ దేశంలోనే కాదు, అసలు భూమ్మీదే వుండవద్దని చెప్పారు. అంతే కాదు, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం నుంచి గోపాలకృష్ణన్‌కు ఇంతవరకు ఎలాంటి సత్కారాలు జరగలేదు కనుక ఇలా మాట్లాడుతున్నారని కూడా నోరు పారవేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రతిభా పాటవాలను బట్టిగాక భావజాలాన్ని బట్టి బిజెపి గుర్తిస్తుందన్న వాస్తవాన్ని ఆ పెద్ద మనిషి దాచుకోలేకపోయాడు. ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అనటానికి తాను వ్యతిరేకం తప్ప ఎవరైనా వచ్చి తన ఇంటి ముందు ఆ నినాదం చేస్తే తాను కూడా వారితో గొంతు కలుపుతానని, తనకు ఇప్పటికే ఎన్నో ఘనమైన గౌరవాలు దక్కాయని, ఇంకా కావాలన్న ఆసక్తి లేదని కూడా గోపాల కృష్ణన్‌ చెప్పారు. తాను కూడా భక్తుడనేనని, రాముడు ఆదర్శ పురుషుడు, ఆయనను ఇలాంటి పద్దతుల్లో అవమానించకూడదని ఆయన స్పష్టం చేశారు.

తమతో విబేధించిన వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం సంఘపరివార్‌ శక్తులకు కొత్త అంశం కాదు. మధ్యలోనే రాజీనామా చేసిన రిజర్వుబ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌, ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక వారు బాధ్యతల్లో వున్నపుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో ఆశించి విమర్శిస్తున్నారంటూ దాడి చేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు. జరుగుతున్న లోపాలు తెలిసి కూడా అనేక మంది నోరు విప్పటం లేదు. గుడులకు పరిమితం కావాల్సిన దేవుళ్లను వీధుల్లోకి లాక్కువ వచ్చిన కాషాయ దళాలు తమ కుతర్కంతో తమ మానాన తాము వున్న మేథావుల మీద కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను,దేశంలో జరిగే అవాంఛనీయ ధోరణులను విమర్శించే వారికి ‘ ఏదో ఆశించి లేదా ఆశించింది దక్కక ‘ అన్న ముద్రవేస్తున్నారు. నచ్చని విధానాల మీద బహిరంగంగా స్పందించే ధైర్యవంతులను కాసేపు పక్కన పెడదాం. స్పందించని వారి సంగతేమిటి? స్పందించే వారి మీద ఎదురుదాడులు పెరిగే కొద్దీ నోరు మూసుకొని వుండే వారికి మోడీ ఎంత ముట్టచెప్పారు లేదా ఏ పదవి ఇస్తానని ప్రలోభ పెట్టారు అన్న ప్రశ్నలు ప్రారంభం అవుతాయి. ఇక నరేంద్రమోడీకి అనుకూలంగా ప్రకటన చేసేవారికి అంతకంటే ఎక్కువే ముట్టింది కనుక బస్తీమే సవాల్‌ అంటూ మోడీ విమర్శకుల మీద తొడ కొడుతున్నారని అనుకోవాలి. ఈ దేశంలో జై శ్రీరామ్‌ అనకూడదా అంటూ కు తర్కం, విపరీతార్ధం తీసి వ్యాఖ్యానించిన తెలుగు సినీ రంగంలో వర్దమాన రచయిత అనంత శ్రీరామ్‌ 49 మంది మీద విమర్శలకు దిగాడు,మరో 62 మంది పోటీ ప్రకటన చేశారు, వారూ, శ్రీరామ్‌ మోడీకి, బిజెపికి ఎంతకు అమ్ముడు పోయారు అంటే ఎవరు జవాబు చెబుతారు.

ఏదో ఆశించి విమర్శలు చేస్తున్నారనేది ఇప్పుడు అన్ని రంగాలలో ఒక ఆయుధంగా మారిపోయింది. ఎవరూ సరైన వారు కాదు, అందరిలో లోపాలు వున్నాయనే దాడి వెనుక తమ తప్పిదాలను, దుర్మార్గాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడ దాగి వుంది. తమకు నచ్చని ఏ చిన్న సూచన, లేదా విమర్శ చేసినా సహించే స్ధితి లేదు. అందుకే 49 మంది లేఖపై అంత అసహనం. ఇంతకీ ఆ లేఖలో ఏముందో చూద్దాం.

Image result for narendra modi on lynchings

‘ జూలై 23, 2019,

శ్రీ నరేంద్ర దామోదర్‌ మోడీ,

గౌరవనీయమైన భారత ప్రధాని.

ప్రియమైన ప్రధాన మంత్రి,

శాంతిని ప్రేమించే మరియు భారతీయులంగా గర్వించే మేము ఇటీవలి కాలంలో మన ప్రియమైన దేశంలో జరుగుతున్న అనేక విషాదకర ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము. అన్ని మతాలు,తెగలు,కులాలు, లింగపరంగా అందరినీ సమానులుగా పరిగణించే మన రాజ్యాంగం దేశాన్ని సమసమాజ, ప్రజాస్వామ్య సర్వసత్తాక దేశంగా వర్ణించింది. అందువలన అతడు లేదా ఆమెకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ప్రతి వారూ అనుభవించేట్లు చూడాల్సి వుంది. అందుకు గాను మావినతి ఇలా వున్నది.

1. ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలను న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపటాన్ని(ఆటవిక హత్యలు) వెంటనే నిలుపుదల చేయించాలి.2016లో దళితుల మీద 840 అత్యాచారాలు జరిగినట్లు, ఆ వుదంతాలలో శిక్షలు పడుతున్న శాతం పడిపోతుండటాన్ని జాతీయ నేర నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) ద్వారా తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాము. అంతేకాదు 2009 జనవరి ఒకటి నుంచి 2018 అక్టోబరు 29 మధ్య మత సంబంధమైన గుర్తింపు ప్రాతిపదికన 254విద్వేష పూరిత నేరాలు జరిగినట్లు నమోదైంది. వాటిలో 91 మంది మరణించగా 579 మంది గాయపడ్డారు.(ఫ్యాక్ట్‌ చెకర్‌ డేటా, 2018 అక్టోబరు 30) ది సిటిజన్స్‌ రిలీజియస్‌ హేట్‌ క్రైమ్‌ వాచ్‌ నమోదు చేసిన దాని ప్రకారం 62శాతం కేసులలో ముస్లింలు (భారత జనాభాలో 14శాతం మంది), క్రైస్తవులు(దేశ జనాభాలో రెండుశాతం) 14శాతం కేసులలో బాధితులు. వీటిలో 90శాతం దాడులు జాతీయంగా మీ ప్రభుత్వం అధికారం స్వీకరించిన 2014 మే నెల తరువాత నమోదైనవి.

ఎటువంటి న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపిన వుదంతాలను ప్రధాన మంత్రిగా మీరు పార్లమెంట్‌లో విమర్శించారు, అయితే అది చాలదు. దుష్కార్యాలకు పాల్పడిన వారి మీద ఏ చర్య తీసుకున్నారు ? అటువంటి నేరాలకు పాల్పడిన వారికి బెయిలు ఇవ్వకూడదని, ఇతరులు భయపడేవిధంగా శిక్షలు వుండాలని, వేగంగా, తప్పకుండా పడాలని మేము గట్టిగా భావిస్తున్నాము.హత్యలు చేసినపుడు ఎలాంటి పెరోల్‌ లేకుండా జీవితకాల శిక్షలు వేయటానికి అవకాశం వున్నపుడు అంతకంటే క్రూరమైన ఆటవిక హత్యలకు పాల్పడుతున్నవారికి అలాంటి శిక్షలు ఎందుకు వేయకూడదు ? ఆమె లేదా అతను ఎవరూ తమ స్వంత దేశంలో భయంతో బతక కూడదు.

దురదృష్టకరంగా నేడు ‘జై శ్రీరామ్‌’ రెచ్చగొట్టే పోరు నినాదంగా మారింది. అది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తున్నది.ఆ పేరుతో ఆటవిక హత్యలు చోటు చేసుకుంటున్నాయి. మతం పేరుతో ఎక్కువగా హింసాకాండకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఇవి మధ్య యుగాలు కావు. భారత్‌లో మెజారిటీగా వున్న జనంలో అనేక మందికిి రాముడి పేరు పవిత్రమైనది. దేశంలోనే అత్యున్నత బాధ్యతల్లో వున్న మీరు రాముడి పేరును ఈ విధంగా భష్ట్రు పట్టించటాన్ని వెంటనే నిలుపుదల చేయించాలి.

2.భిన్నాభి ప్రాయం లేపోతే ప్రజాస్వామ్యమే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతిని వ్యక్త పరచేవారిని ఆ కారణంతో దేశ వ్యతిరేకులు లేదా అర్బన్‌ నక్సల్‌ అని నిర్బంధించకూడదు. రాజ్యాంగం కల్పించిన రక్షణ ఆర్టికల్‌ 19ప్రకారం భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్చలో అసమ్మతి అంతర్భాగం.

పాలకపార్టీని విమర్శించటం అంటే దేశాన్ని విమర్శించినట్లు కాదు. అధికారంలో వున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా దేశానికి పర్యాయపదం కాదు. అది ఆ దేశంలోని రాజకీయ పార్టీలలో ఒకటి మాత్రమే. అందువలన ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని జాతీయ వ్యతిరేక మనోభావాలతో సమంగా చూడకూడదు. ఎక్కడైతే అసమ్మతిని అణచివేయని స్వేచ్చా వాతావరణం వుంటుందో అది మాత్రమే బలమైన దేశాన్ని తయారు చేస్తుంది. మన దేశ భవితవ్యత కొరకు సమంజసమైన మరియు ఆతృత కలిగిన భారతీయులంగా మేము దేనికొరకైతే సూచనలు చేశామో వాటిని ఆ స్ఫూర్తితో పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము.’

అంటూ 49 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, మణిరత్నం, అపర్ణాసేన్‌, రామచంద్ర గుహ వంటి ప్రముఖులు వున్నారు. దీనికి ప్రతిగా 62 మంది ప్రముఖులు పై లేఖ రాసిన వారి మీద ఎదురు దాడి చేస్తూ అంతకంటే పెద్ద లేఖను రాశారు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదు, నరేంద్రమోడీ దేశాన్ని ఐక్యంగా వుంచుతుంటే, విదేశాల్లో దేశపరువు తీసే విధంగా, మోడీని ప్రతినాయకుడిగా చూపుతున్నారంటూ 49 మంది లేఖలో లేని అంశాలను ఏకరువు పెట్టారు. దేశంలో ఎవరు ఏ అంశం మీద అయినా స్పందించేందుకు హక్కు వుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే 49 మంది లేఖలో ఎక్కడా ప్రధానిని కించపరచలేదు, జరుగుతున్నదాడులకు బాధ్యుడు మోడీ అని లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, సంస్ధలని ఎక్కడా ప్రస్తావించలేదు. తాము చూస్తున్న,జరుగుతున్న పరిణామాల మీద స్పందించారు. దానికి జవాబు నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని ఎవరైనా ఆశిస్తారు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం లేదా తీర్పు చెప్పాలని తనను నరేంద్రమోడీయే స్వయంగా కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. స్వయంగా తన మీద వచ్చిన అంశానికే నోరు విప్పేందుకు నరేంద్రమోడీకి ధైర్యం లేకపోయింది. మా ప్రధాని అలా అడగలేదు అనటం తప్ప ట్రంప్‌ అబద్దం చెప్పాడు అని మంత్రులు లేదా ప్రభుత్వం ప్రకటన చేసే దమ్మును 56 అంగుళాల ఛాతీ ప్రదర్శించలేకపోయింది.

నలభై తొమ్మిది మంది మన దేశానికే పరిమితమై మన ప్రధానికే లేఖ రాశారు. ఇదే పరువు తీసే అంశమైతే అంతర్జాతీయ స్ధాయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మోడీ గురించి చెప్పిన అంశం మన దేశ, ప్రధాని పరువు నిలబెట్టేదని 62 మంది మేథావులు భావిస్తున్నారా? అవునంటే ట్రంప్‌ను అభినందించారా కాకపోతే ఖండిస్తూ ప్రకటన ఏమైనా చేశారా అంటే లేదు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదని ఇతరులను ప్రశ్నిస్తున్న వారు యావత్‌ దేశ ప్రతిష్టకు, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా మోడీ అడిగినట్లు చెప్పిన అంశం మీద ఎందుకు స్పందించలేదో చెబుతారా ? అంతర్జాతీయంగా మోడీ గబ్బుపట్టినా, అపహాస్యం పాలైనా ఫరవాలేదని 62 మంది అనుకుంటున్నారా ? కొన్ని ఎంపిక చేసిన అంశాల మీదనే స్పందిస్తున్నారని 62 మంది మేథావులు ప్రశ్నించారు. మీ లేఖలో మీరు ఎంపిక చేసుకున్న అంశాలు గాక ఇతర వాటిని ఎందుకు విస్మరించారో చెప్పాలి.ఈ దేశంలో 49 మందే కాదు 62 మంది కూడా అన్ని అంశాల మీద స్పందించాలని నిర్ణయించుకున్న బృందాలు కావు, అది సాధ్యం కూడా కాదు. కొందరు ప్రస్తావించిన దాని మీద చర్చ లేక స్పందనకు పరిమితం కాకుండా లేని అంశాలను ఎందుకు లేవనెత్తలేదనటం అడ్డగోలు వాదన తప్ప మేథావితనం కాదేమో ! ప్రధానికి లేఖ రాస్తే స్పందించాల్సింది ఆయన లేదా ప్రధాని కార్యాలయం, వారు చేయాల్సిన దాని మీద స్పందించే బాధ్యతను మీకు ఎవరైనా ఇచ్చారా ? లేదూ ఆ బాధ్యతను మీరు స్వచ్చందంగా పుచ్చుకుంటే మీరు ఎన్నింటి మీద, ఎప్పుడు, ఎలా స్పందించారో వివరించండి.

Image result for karl marx on intellectuals

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు కోపం అన్నట్లు 62 మంది స్పందన వుంది. దేశంలో జరుగుతున్న నేరాల గురించి జాతీయ నేరాల నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన అంశాలనే 49 మంది తమ లేఖలో వుటంకించారు. అంటే సదరు ఎన్‌సిఆర్‌బి అంతర్జాతీయంగా దేశం, మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని నమోదు చేసినట్లా ? ఆటవిక హత్యల గురించి గతంలో ఎన్నడూ ఎవరూ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయలేదు. గతంలో జరిగిన ఆటవిక హత్యలేమైనా వుంటే అవి శాంతి భద్రతల సమస్యల్లో భాగంగా జరిగాయి. గత ఐదు సంవత్సరాలుగా ఆవు సంరక్షణ పేరుతో, జైశ్రీరామ్‌ పేరుతో మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, హత్యలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఆటవిక దాడులు, వాటిని నిరోధించేందుకు, శిక్షాపరంగా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని ఒక వాజ్యంలో సుప్రీం కోర్టు గతేడాది జూలైలో కేంద్రం, మానవహక్కుల కమిషన్‌, రాష్ట్రాలను కోరింది. ఆటవిక హత్యలను ప్రత్యేక నేరంగా పరిగణించాలని పార్లమెంట్‌ను కూడా కోరింది. ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్‌ వెల్లడించిన 45పేజీల తీర్పు మన దేశంలో నెలకొన్న పరిస్ధితికి పాలకులను తీవ్రంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. పరువు, ప్రతిష్ట గురించి పాకులాడే వారికి ఇంతకంటే పరువుతక్కువ మరొకటి వుండదు. అలాంటి తీర్పు ఇచ్చి ఏడాది గడిచినా గడచినా స్పందన లేదేమిటని అదే కోర్టు మరోసారి ఈనెలల అడగటం అంటే మన చర్మాలు ఎంత మొద్దుబారాయో గుర్తు చేయటమే. ఎంపిక చేసుకున్న అంశాల మీద లేఖలు రాస్తున్నారని 49 మందిని విమర్శించిన 62 మంది సుప్రీం కోర్టు స్పందన గురించి ఏమంటారు. కోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో వుండగా దీన్ని పట్టించుకోవటంలో దురుద్ధేశ్యం వుందని, కేంద్రాన్ని ఎండగట్టేందుకు కేసులను ఎంపిక చేసుకుందని తప్పుపడతారా ? ఆవేదన చెందిన ప్రముఖులు కోరినా, చివరకు సర్వోన్నత న్యాయస్ధానం అడిగినా స్పందించని వారి గురించి 62 మంది ఏమంటారు? అసలు 62 మంది సమస్య ఏమిటి?

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ కొద్ది రోజుల క్రితం ముంబై సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ 150 వార్షికోత్సంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి తన పాలనా కాలంలో ఆర్ధిక వ్యవస్ధను రెండింతలు చేసి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచేందుకు నిర్ణయించటం అభినందనీయం అన్నారు. అయితే దేశంలో అంతా సవ్యంగా లేదు, సామాజిక రంగంలో తీవ్ర ఆందోళనకర పరిస్ధితులు వున్నాయి. తీవ్రమైన దారిద్య్రం మన సమాజాన్ని పీడిస్తోంది. అది వేగాన్ని మందగింప చేసి మనం ముందుకు పోవటానికి ఆటంకం అవుతుంది. అసహనం పెరగటం, విద్వేష పూరిత నేరాలు, తమకు తోచిన నీతి, రీతిని ఇతరుల మీద బలవంతంగా రుద్దటం వంటి అంశాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దేశంలో సామాజిక అస్ధిరత పెరుగుతోంది.మహిళల మీద నేరాలు, కుల, మత ప్రాతిపదికన హింసాకాండ వంటి ఇతర అన్ని రకాల అసహనం దేశమంతటా ప్రబలిపోయింది. సామాజిక సామరస్యతను సాధించేందుకు ఆటంకంగా మారుతున్నది. దేశంలో నిరుద్యోగం 6.1శాతం వుండటం నాలుగుదశాబ్దాల రికార్డు, దాన్ని త్వరలో పరిష్కరించాలి. నీటి సంక్షోభం వుంది, వైద్య సదుపాయాలు కుంటుపడుతున్నాయి. తోటి వర్ధమాన దేశాలతో పోల్చుకుంటే దేశంలో ఆర్యోగ సంరక్షణకు చేస్తున్న ఖర్చు అట్టడుగున వుంది. కొన్ని అంశాలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు పూనుకోవాలి అని కూడా ఆది గోద్రెజ్‌ చెప్పారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఆటవిక హత్య గురించి పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ తనకు బాధ కలిగించిందని, నిందితులకు సాధ్యమైన మేరకు కఠిన శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు.పోలీసుల ముందే జరిగిన మూకదాడి గురించి పార్లమెంటులో మాట్లాడక తప్పని స్ధితి వచ్చింది. వీటి గురించి 62 మంది మేథావులు ఏమంటారు? ఆది గోద్రెజ్‌ కూడా ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని కాలేజీ సభను ఎంపిక చేసుకొని మాట్లాడారా ?

ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయటాన్ని లేదా ఆ నినాదాలు చేస్తూ ఆటవిక చర్యలు చేపట్టటాన్ని సభ్య సమాజం తప్పుపడుతోంది. ఆ చర్యలు మన దేశ సంస్కృతి కాదు, పురాణాలు, ఇతర గ్రంధాల్లో చరిత్రలో ఎక్కడా జై శ్రీరామ్‌ పేరుతో ఆటవిక పద్దతులను పాటించటమే మన సంస్కృతి అని ఎక్కడా చెప్పలేదు. మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో, జర్మనీలో హిట్లర్‌ను పొగిడే సందర్భంలో ఇలాంటి వున్మాద పూరితమైన వ్యవహారాలు జరిగాయి తప్ప మరెక్కడా కానరాదు. మోడీకి లేఖ రాసిన 49 మంది తమవైన రాజకీయ అభిప్రాయాలు కలిగి వుండవచ్చు తప్ప వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు, రాజకీయాల్లో వున్న వారు కాదు.అలాగే మోడీకి మద్దతుగా లేఖ రాసిన వారు 62 మంది ఏ పార్టీకి చెందినవారన్నది సమస్య కాదు. ఎవరు ఏ భావజాలానికి ప్రతినిధులుగా జనం ముందుకు వచ్చారన్నదే ముఖ్యం.

Image result for intellectual's

మతోన్మాదులు, ఫాసిస్టులు, నాజీలు, ఇతర నియంతలు ఏలిన దేశాల చరిత్రను చూస్తే మేథావులు ఎప్పుడూ, ఎక్కడా ఒకే వైఖరితో లేరు. దోపిడీ పద్దతులు, విధానాలను రూపొందించిందీ, దోపిడీని నిర్మూలించే, సమసమాజాన్ని నిర్మించే పద్దతులనూ చెప్పింది కూడా మేథావులే. 1925లో ఇటలీలో ఫాసిస్టు మేథావులు సభ జరిపి తమ ప్రణాళికను ప్రకటించిన తరువాత ఫాసిస్టు వ్యతిరేక మేథావులు తమ ప్రణాళికను ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు అనేక దేశాల్లో జరిగాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి సమీకరణ జరుగుతున్నది. వాస్తవానికి దాన్ని సంఘపరివార్‌ శక్తులు వేగవంతం చేస్తున్నాయి. మేథావులుగా వున్న వారు తాము ఎటు వైపో తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వారు కల్పిస్తున్నారు. మేము అటు వామపక్షం కాదు ఇటు మితవాద పక్షం కాదు అనుకునే వారు కూడా ఏదో ఒకవైపు సమీకరణ అయ్యేందుకు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మితవాదులు వారిని మధ్యలో వుండనివ్వరు. తమను విమర్శించే వారందరూ తమకు వ్యతిరేకులే అన్నది ఇప్పుడు నడుస్తున్న ధోరణి. తమకు అనుకూలంగా లేనివారందరూ కూడా వ్యతిరేకులే అనే సూచనలు కనిపిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చను మన దేశంలో ఫాసిస్టులు, నాజీలకు ప్రతిరూపాలుగా వున్న శక్తులు సహించే స్ధితిలో లేవు. మేథావులు ఎప్పుడూ రెండు తరగతులుగా వుంటారని చరిత్ర చెప్పింది. ఒక తరగతి పాలకవర్గాలకు వూడిగం చేసేందుకు తమ మేథోశక్తిని వుపయోగించి చరిత్ర చెత్తబుట్టలోకి పోతే, మరో తరగతి ప్రజల గొంతుకగా ముందుండి నిరంతరం జనం నోళ్లలో నానుతున్నారు. అందువలన మేథావులు ఎటు వైపు వుండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్న మైంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వృద్ధి రేటు పతనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?

17 Wednesday Jul 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, china’s economic growth, china’s economic growth slides, Donald trump, world Trade

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వంచన, వాస్తవ దూరంగా కేంద్ర బడ్జెట్‌ !

13 Saturday Jul 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, India budget 2019-20, Nirmala Sitharaman

Image result for india budget 2019-20, nirmala

ఎం కోటేశ్వరరావు

2019-20 సంవత్సర పూర్తి బడ్జెట్‌ను జూలై ఐదున నూతన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు కుహనా మేథావుల కేంద్రంగా వర్ణిస్తారు. అయితే వారి అదృష్టమో దురదృష్టమోగానీ అదే విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తీరుకు మొత్తంగా మీడియా ప్రశంసలు కురింపించింది. అఫ్‌ కోర్స్‌ అది కార్పొరేట్లకు, ప్రయివేటీకరణకు పెద్ద పీట వేసినందువలన కూడా కావచ్చు. ఒక వ్యక్తి హావభావాలు, ప్రవర్తన తీరుతెన్నులు వ్యక్తిగతమైనవి తప్ప వేరు కాదు. సదరు వ్యక్తులు ఏ భావాలకు, విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాటి పర్యవసానాలు,ఫలాలు ఏమిటన్నదే సమాజం చూస్తుంది. అందువలన నిర్మలా సీతారామన్‌ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు గనుక దానిలోని అంశాలపై విమర్శలు లేదా ప్రశంసలను వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు.

ఐదేండ్ల క్రితం నాటి అర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, నిర్మల బడ్జెట్‌కు సామ్యాలను చూపుతూ ఎన్ని నిమిషాలు, ఎన్నిపదాలు, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించారు అనే పద్దతుల్లో విశ్లేషించిన వారు కూడా లేకపోలేదు.ఆ రీత్యా చూసినపుడు 16,489 పదాలను జైట్లీ రెండు గంటల ఏడు నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేస్తే నిర్మల 20,223 పదాలను రెండు గంటల తొమ్మిది నిమిషాల 13 సెకండ్లలోనే ముగించారంటే వాగ్ధాటితో తక్కువ సమయంలో ఎక్కువ పదాలను కుమ్మరించారన్నది స్పష్టం. బడ్జెట్‌ తీరు తెన్నులను చూసే ముందు నాలుగవ తేదీన ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేను కూడా కలిపి విశ్లేషించటం సముచితంగా వుంటుంది.

గతానికి చెందిన అంకెల వివరాలు ఇచ్చినప్పటికీ వాటికి చెప్పే భాష్యం, వుగాది పంచాంగంలా ఆశాభావం వెలిబుచ్చే నివేదికలుగానే మన అర్ధిక సర్వేలు వుంటున్నాయి. బడ్జెట్‌ కూడా అంతే. భవిష్యత్‌ మాసాల్లో సంభవించే పరిణామాల మీద అంచనాల ప్రాతిపదికగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలు వుంటాయి. అంచనాలు తప్పితే కోతలతో సవరణలను ఆమోదించటం మనం చూస్తున్నాం. ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అదే చేస్తుంది. ఏడాదిన్నర క్రితం పార్లమెంటుకు సమర్పించిన సర్వే 2018-19లో వ ద్ధిరేటు ఏడునుంచి ఏడున్నర శాతందాకా ఉండనుందన్నా, వాస్తవంలో అది 6.8శాతానికే పరిమితమైంది. కాగా వర్తమాన సంవత్సరంలో ఏడు శాతం ఆశాభావం, అంచనా మాత్రమే. ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆర్ధిక వ్యవస్ధను పెంచుతామని అందుకుగాను ప్రతి ఏటా కనీసం ఎనిమిది శాతం అభివృద్ది వుండాలని చెప్పిన వారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు అంచనాలోనే ఒకశాతాన్ని తగ్గించారు. అలాంటపుడు ఆశించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు ?

Image result for india budget 2019-20, nirmala

అంకెల్లోకి పోతే ఒక పట్టాన తేలే అవకాశం వుండదు. వాటిని ఎలాగైనా వినియోగించవచ్చు, భాష్యం చెప్పవచ్చు. అందువలన ఎవరి భాష్యం వాస్తవాలకు దగ్గరగా వుందన్నది జనం నిర్ణయించుకోవాల్సిందే.ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ వుపన్యాసం రెండింటిలోనూ 2024-25 నాటికి అంటే ఐదు సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షలకోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యంగా చెప్పారు. తప్పులేదు, అందుకు గాను ఏటా 8శాతం అభివృద్ధి రేటు వుండాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి చెప్పినదాని ప్రకారం మన జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు వుంది.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా ప్రభుత్వాలు, మంత్రులూ తమ పబ్బంతాము గడుపుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన దీపాంకర్‌ దాసుగుప్తా చెబుతున్న లెక్కల ప్రకారం ఐదు లక్షల కోట్ల డాలర్లకు జిడిపి పెరగాలంటే 2018-19 రేట్ల ప్రకారం ఐదేండ్లలో ఎనిమిది శాతం వృద్ధి రేటు బదులు 13శాతం వుంటేనే సాధ్యం అంటున్నారు. అదే 2011-12 ధరల ప్రకారం అయితే 19శాతం వంతున పెరిగితే నాలుగేండ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని, అదే ఎనిమిదిశాతం చొప్పున అయితే 2030-31వరకు ఆగాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుత మన పాలకులు చెబుతున్న లక్ష్యం సాధించటం గురించి ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అసలు నీవు దేశభక్తుడవేనా అని ప్రశ్నిస్తారు. మన గురించి ఐఎంఎఫ్‌ ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం.2020 నుంచి 2024 సంవత్సరాలలో సగటున 7.59శాతం అభివృద్ధి రేటుతో మన జిడిపి 2.97లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.30లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన అభివృద్ధి రేటు 6.8శాతమే. అది ఈ ఏడాది ఏడుశాతంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటపుడు ఎనిమిదిశాతం వుంటే గింటే ఐదులక్షల కోట్ల డాలర్లకు చేరతామని చెప్పటం ఏమిటి? అదేమన్నా ప్రామాణిక సంఖ్యా? అంతకు మించి సాధిస్తే జనం వద్దంటారా ? లేకపోతే మరేదైనా చేస్తారా ? ఐదు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌(మంచి రోజులను) తెస్తామని, గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తామని, 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పినట్లుగానే మైండ్‌ గేమ్‌లో ఇదొక భాగం అనుకోవాలి.

ఆర్ధిక సర్వే రచయితలు అభివృద్ధి గురించి పలుసార్లు చైనాను వుదహరించారు. బ్రిటీష్‌ వారి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు. చైనా మాదిరి పురోగమించాలని కోరుకోవటం తప్పుకాదు. బ్రిటీష్‌ వారి నమూనా వారి దేశాన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది గనుక మనకు వాంఛనీయమూ కాదు. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనంలో వుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో ఎలాంటి పెద్ద సంక్షోభాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా వుంటే అది చైనా ఒక్కటే. కొంత మంది విమర్శకులు అక్కడ కమ్యూనిస్టు పార్టీ పేరుతో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్నారని ఆరోపిస్తారు. వారు చెప్పిందాన్ని కాసేపు అంగీకరిద్దాం.చైనా సంస్కరణలకు నాలుగు పదులు నిండాయి. ఈ కాలంలో అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ ప్రతి పది సంవత్సరాలకు ఏదో ఒక ఆర్ధిక సంక్షోభం, మాంద్యం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. ధనిక దేశాల్లో 2008లో ప్రారంభమైన సంక్షోభం పరిష్కారం గాకపోగా త్వరలో మరో సంక్షోభానికి తెరలేవనుందనే వార్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ సంక్షోభ ప్రభావం మనమీద కూడా పడుతోంది. చైనా ఎన్నడూ ధనిక దేశాల మాదిరి సంక్షోభాలను ఎదుర్కొన్నదా అంటే లేదు. అభివృద్ధి రేటులో స్వల్పతగ్గుదల వుండవచ్చు గానీ ఇతర దేశాల మాదిరి నామ మాత్రం లేదా తిరోగమన దారి పట్టలేదు కదా ? ఎందుకనో ఎప్పుడైనా మనం ఆలోచించామా ?

మన దేశంలో కొంత మంది భలే చిత్రమైన వాదనలు చేస్తుంటారు, వాటిని నిజమని నమ్మేవారు కూడా లేకపోలేదు. వాటిలో కొన్ని పచ్చి అబద్దాలు కూడా వున్నాయి. వాటి తీరుతెన్నులు ఎలా వున్నాయో చూద్దాము. చైనా అభివృద్ధి చెందిన మాట నిజమేగానీ అది కమ్యూనిస్టు దేశమండీ, మనది ప్రజాస్వామ్యం, ఒక నిర్ణయం చేస్తే అక్కడ తప్పయినా ఒప్పయినా అమలు జరగాల్సిందే, మన దగ్గర అలా కాదు. చైనా భిన్నమైన దారుల్లో పయనిస్తున్నది, దాని తరువాత స్ధానం పొందేందుకు భారత్‌ ప్రయత్నించకూడదు, అది సాధ్యం కాదు.ఏక పార్టీ నిరంకుశ పాలనతో పాటు దశాబ్దాల తరబడి మౌలిక సంస్కరణల గురించి చేసిన ప్రచారంతో పాటు మెజారిటీగా వున్న హాన్‌ జాతీయులు, చైనా భాష మాట్లాడేవారిని సమీకరించారు. భారత్‌లో అటువంటి అవకాశం లేదు.బహుళపార్టీ వ్యవస్ధ వున్నది. సామాజిక పరంగా, భాషా పరంగా వందలాది మైనారిటీలను ఒక లక్ష్యం కోసం సమీకరించటం సాధ్యం కాదు. చైనాలో రైతులను భూముల నుంచి తరమివేశారు, మన దగ్గర అలా కుదరదు. నిరంకుశ పాలకులు వున్న అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పలేము, క్యూబా, వుత్తర కొరియా, వెనెజులాల్లో వైఫల్యం చెందారు. మంచి నియంతలను కలిగి వుండటం చైనీయుల అదృష్టం. ఇంకా ఇలాంటి బుర్రతక్కువ ప్రచారాలు చాలా వున్నాయి. అలాంటపుడు మన అభివృద్ధి రేటు చైనా కంటే ఎక్కువ వుంది, త్వరలో మనం చైనాను అధిగమిస్తాము, ఎగుమతుల్లో చైనాతో పోటీపడతాము, దాన్ని వెనక్కు నెట్టి ముందుకు పోతాము అని చెప్పుకోవటం ఎందుకు అన్నది ప్రశ్న.

సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాల్లో జనం ఆహారం తిని బతికితే ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్చతో ప్రాణాలు నిలుపుకుంటారా? అక్కడ అభివృద్ధి చెందితే ఇక్కడ నిత్యదరిద్రంతో బతకాలా ? అసలు ఇలాంటి వాదనలు చేసే వారి సమస్య ఏమిటో మనకు అర్ధం కాదు. కమ్యూనిస్టులు ఏపనైనా మెడమీద కొడవలి, తలమీద సుత్తిపెట్టి చేస్తావా, చస్తావా అంటారన్నట్లుగా కొందరు చెబుతారు. పోనీ, మచ్చుకు అలా చేసి చైనాలో హెక్టారుకు1,751 కిలోల పత్తి పండిస్తే మనది ప్రజాస్వామ్యం గనుక 502కిలోలే పండిస్తారని అనుకుందాం. మరి బ్రెజిల్‌, టర్కీ, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్ధలున్నవేగా అక్కడ చైనా తరువాత అధికంగా 1,600-1700 కిలోల వరకు పండిస్తున్నారుగా దాన్నేమనాలి? పత్తి రైతులు మన దేశంలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే గుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకత తప్ప సరైన సమాధానం వుండదు.

Image result for india budget 2019-20, nirmala

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో భిన్న భాషలు, జాతులు, మతాలు, కులాలు, ఆచారాలు వున్న మాట నిజం. ఇలాంటి చోట హిందూత్వ పేరుతో మెజారిటీవాదాన్ని బలవంతంగా రుద్ద చూస్తున్నారు. ఇది జనాన్ని ఏకత్రాటి మీద నడిపించటానికి దోహదం చేస్తుందా ? ఫలానా వారి ఇంట్లో ఆవు మాంసం వుందనో, ఫలానా వారు ఆవులను వధించటానికే తరలిస్తున్నారనో సాకులు చూపి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సామూహికంగా దాడులు, హత్యలు చేసే వారు గోరక్షకుల పేరుతో చలామణి అవుతున్నారు. వారికి పాలకపార్టీ అండదండలున్నాయి. ఒక్క వుదంతంలో కూడా ఇంతవరకు దుండగులకు శిక్షలు పడలేదు. అది అలా వుండగా కొత్తగా ఆకస్మికంగా కొందరు ప్రత్యక్షమై మైనారిటీ తరగతులకు చెందిన వారిని పట్టుకొని నీవు దొంగతనానికి వచ్చావు లేదా జైశ్రీరామ్‌ అంటావా లేదా అంటూ చావచితక కొట్టి పోతుంటే వారిని అడ్డుకొనే వారు లేరు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే అదిగో చూడండి వీరు హిందూమతానికి, హిందూత్వకు వ్యతిరేకులు, మెజారిటీగా వున్న వారికి తమ దేవుడిని తలచుకొనే అవకాశం కూడా వుండకూడదా అంటూ విద్వేష ప్రచారాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో వారి ఏలుబడిలో చైనా మాదిరి దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఎవరైనా చెబితే ఎలా నమ్మాలి?

ఏ దేశ పురోగమనానికైనా పరిశోధన, అభివృద్ధి కీలకం. వేల సంవత్సరాల నాడే మన వారు సముద్ర వాణిజ్యం చేశారని ఒకవైపు గొప్ప చెప్పుకుంటాం. మరోవైపు సముద్రం దాటి ప్రయాణిస్తే మ్లేచ్చులు అవుతారు, మైలపడతారు, ధర్మం చెడుతుంది, కులం నుంచి వెలి అంటూ గిరులు గీసి కూర్చోపెట్టిన కారణంగానే మనకు ఒక కొలంబస్‌ లేకుండా పోయాడు. మన పూర్వులు పెట్రోలు లేకుండానే విమానాలు నడిపారు, ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండేది, అసలు వేదాల్లోనే అన్నీ వున్నాయంటూ లొట్టలు వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవటానికే మనకు సమయం చాల్లేదు. మిగతా దేశాల్లో ఇలాంటి పిచ్చి ముదరలేదు కనుకనే కొత్తవాటిని కనిపెట్టాలనే తపనతో ఎంతో ముందుకు పోయారు. దేశంలో జరిగిన ప్రతి అనర్ధానికి లేదా తమకు నచ్చని ప్రతి అంశానికి కారకుడు నెహ్రూ అంటూ బిజెపి నేతలు దాడిచేస్తుంటారు. వాదనకోసం సరే అందాం. గత ఐదు సంవత్సరాల్లో నరేంద్రమోడీ, అంతకు ముందు వాజ్‌పేయి పాలనా కాలంలో బిజెపి చేసిందేమిటి? చైనా గత కొద్ది సంవత్సరాలుగా పరిశోధన, అభివృద్ధికి తన జిడిపిలో రెండుశాతం మొత్తం ఖర్చు చేస్తున్నది. మనం 0.7శాతం దాటలేదు. ఐదు సంవత్సరాల క్రితం స్ధానికుల పేటెంట్‌ దరఖాస్తుల విషయంలో మనం 52వ స్ధానంలో వుంటే 2018లో అది 55కు దిగజారింది. ఇదే సమయంలో చైనా మూడు నుంచి ఒకటవ స్ధానానికి చేరుకుంది. ఆవు మూత్రంలో బంగారం వుందా, అవితాగితే కాన్సర్‌ నయమౌతుందా, ఆవు పేడలో ఏముంది, దాన్ని పూసుకుంటే సొగసుగా తయారవుతామా అనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. యధారాజా తధా పరిశోధకా అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. కావాలంటే వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పే సంస్కృత పండితులకు, అగ్రహారాలకు వాటి పరిశోధన అప్పగించి వాటిలో దాగి వున్నవాటిని వెలికి తీయమనండి. పైసా ఖర్చు కాదు. ఇప్పటికే ఐదేండ్ల కాలాన్ని వృధా చేశారు. దాని దారిన అది నడుస్తుంటే మిగతా అంశాల మీద ఇతరులను ప్రోత్సహించాలి, పోటీ పెట్టాలి తప్ప కాలు గడపదాట కుండా వేదకాలం గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది.

ఏ దేశంలోనూ ఇవ్వని విధంగా పరిశోధన పేరుతో చేసే ఖర్చులకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు ఇస్తున్నాయి. ప్రయివేటు సంస్ధలు ఆ రాయితీలను ఎలా స్వాహా చేయాలనే అంశం మీద పెడుతున్న శ్రద్ద పరిశోధన మీద లేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. దాంతో పన్ను మినహాయింపులను తగ్గించగానే ప్రయివేటు రంగం గగ్గోలు పెడుతోంది. మరో వైపున అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నట్లుగానే పరిశోధనా రంగం నుంచి కూడా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి.1996లో చైనా జిడిపిలో 0.56శాతం ఖర్చు చేయగా మన దేశం 0.63శాతం పెట్టింది. అదే 2015నాటికి చైనా 2.07శాతానికి పెంచగా మనది అదే 0.63దగ్గరే వుండిపోయింది.ఇదే కాలంలో ప్రపంచ సగటు 1.97 నుంచి 2.23శాతానికి పెరిగింది. మనం ప్రపంచ సగటుకు ఇంకా ఎంతో దూరంలో వున్నాం. ఇజ్రాయెల్‌ గరిష్టంగా 4.27శాతం ఖర్చు చేస్తోంది. పరిశోధనకు కూడా ప్రజాస్వామ్యమే అడ్డువస్తోందనుకోవాలా ? రాజకీయంగా ఎవరైనా అడ్డుపడుతున్నారా ?

Image result for india budget 2019-20, nirmala

దేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే 2004జూన్‌ నుంచి 2019 మార్చి వరకు లభ్యమైన సమాచారం మేరకు జిడిపిలో ప్రతి మూడు మాసాల పెట్టుబడి సగటు 34.8శాతంగా వుంది. గరిష్టం 2011సెప్టెంబరులో 41.2శాతం కాగా కనిష్టం 2017 మార్చిలో 29.5శాతం వుంది. తాజా పరిస్ధితికి వస్తే గతేడాది చివరి మాసాల్లో 32.2శాతం వుండగా ఈ ఏడాది మార్చిలో 29.8శాతం వుంది. చైనాలో ఏడాదికి ఒకసారి వివరాలను వెల్లడిస్తారు. ఆ మేరకు 2018 డిసెంబరులో పెట్టుబడి జిడిపిలో 44.8శాతం వుంది. అంతకు ముందు ఏడాది 44.6 శాతం. 1952 డిసెంబరు నుంచి 2018 డిసెంబరు వరకు సగటు 36శాతం వుంది. 2011 డిసెంబరులో గరిష్టంగా 48 శాతం కాగా 1962లో కనిష్టంగా 15.1శాతం నమోదైంది.

నరేంద్రమోడీ 2.0 సర్కార్‌ ప్రయివేటు పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున మరులుగొన్నట్లు కనిపిస్తోంది. మనదేశంలో ప్రయివేటు రంగ పెట్టుబడులు ప్రస్తుతం 14సంవత్సరాల కనిష్ట స్ధాయికి పడిపోయిన తరుణంలో వాటి గురించి జనానికి భ్రమలు కొల్పే విధంగా పారాయణం చేస్తున్నది. మంచి రోజులు తెస్తా మంచి రోజులు తెస్తా అని నరేంద్రమోడీ చెప్పటం తప్ప అలాంటి సూచనలు ఎండమావుల్లా కూడా కనిపించటం లేదు. 2018 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలని సిఎంఐఇ(భారత ఆర్ధిక వ్యవస్ధ పర్యవేక్షణ కేంద్రం) పేర్కొన్నది. అయితే ఆ మొత్తం సెప్టెంబరుతో ముగిసిన మూడునెలలతో పోల్చితే 53శాతం, ఏడాదితో పోల్చితే 55శాతం తక్కువ అని తెలిపింది. ప్రయివేటు రంగం పధకాలు ఇదే కాలంలో 62,64శాతాల చొప్పున తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్ధల పధకాలు కూడా 37,41శాతాల చొప్పున పడిపోయాయి. ఇది 2004 తరువాత ఇది కనిష్టం. కొత్త పధకాలు రాకపోవటం ఒకటైతే అమల్లో వున్న ప్రాజెక్టులు నిలిచిపోవటం మరింత ఆందోళనకరం. మొత్తంగా 11శాతం వుంటే ప్రయివేటు రంగంలో ఇది 24శాతం వరకు వుంది. అనేక రాష్ట్రాలలో విద్యుత్‌ కోతలు ఎత్తివేత గురించి పాలకులు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాల స్ధాపక సామర్ధ్యం పెరిగినంతగా విద్యుత్‌ వినియోగం పెరగకపోవటమే కొరతలేకపోవటానికి కారణం. ప్రయివేటీకరణలో భాగంగా విదేశాల నుంచి అప్పులు దొరుకుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా తెచ్చి విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. నిలిచిపోయిన ప్రాజెక్టులలో 35.4శాతం విద్యుత్‌, 29.2శాతం వస్తూత్పత్తి రంగానికి చెందినవి. నిధులు, ఇంధనం, ముడిసరకుల కొరత, మార్కెట్‌ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవటం దీనికి ప్రధాన కారణాలు. వీటిలో కూడా ఎక్కువ శాతం నిధుల కొరతే. ఇటువంటి స్ధితిలో ప్రయివేటు పెట్టుబడుల గురించి దేశ ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. ఈ పేరుతో మరిన్ని ప్రజా, కార్మిక వ్యతిరేక సంస్కరణలను రుద్దే యత్నం తప్ప ఇది వేరు కాదు.

ఆశలు ఆకాశంలో ఎగురుతుంటే భూమ్మీద పరిస్ధితి ఎలా వుంది ? అన్నదాతలు సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయ ప్రధాన దేశంలో రైతుల రాబడిని రెండింతలు చేసేందుకు 14.5శాతం మేర వ్యవసాయాభివ ద్ధి రేటు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వానలు కురిసినప్పుడే రెండు శాతానికి పరిమితమైనప్పుడు, లోటు వర్షపాత సూచనలు కనిపిస్తున్న ఈ ఏడాది ఎలా పుంజుకోగలదో ఆర్థికవేత్తలే వివరించాలి! పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులు, వ ద్ధి, ఉపాధి అవకాశాలు ఇతోధికమైతే భారత ఆర్థిక స్వస్థతకు తిరుగుండదని క ష్ణమూర్తి సుబ్రమణియన్‌ విరచిత సర్వే నమ్మకంగా చెబుతోంది. ప్రపంచ ధనిక దేశాలు వ ద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు వాణిజ్య యుద్ధమేఘాలు కలవరపరుస్తుండగా- మన వ ద్ధి ప్రస్థానం గతాన్ని అధిగమిస్తుందన్నది ప్రశ్న.

Image result for india budget 2019-20, nirmala

సోషలిస్టు చైనా గురించి ఇటీవలనే కొన్ని వార్తలు వచ్చాయి. అక్కడ కార్మికుల వేతనాలు పెరుగుతున్న కారణంగా అనేక మంది ప్రయివేటు పారిశ్రామికవేత్తలు తమ సంస్ధలను అక్కడి నుంచి తరలించేందుకు చూస్తున్నారని, భారత్‌ అనువుగా వుంటుందని భావిస్తున్నారన్నది వాటి సారాంశం. దీని అర్ధం ఏమిటి? తన ఎగుమతులను చౌకగా ప్రపంచానికి అందించేందుకు కార్మికుల శ్రమను ఫణంగా పెడుతోందన్న కొందరి వక్రీకరణలకు ఇది చెంపపెట్టు. ఆ స్ధాయిలో మన దేశంలో వేతనాలు లేవన్నది మన పాలకులకు అభిశంసన. ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ ధనిక దేశాలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కారణంగా దాని ఎగుమతులపై కొంత ప్రభావం పడినా ఆరుశాతం పైగా అభివృద్ధి రేటు కొనసాగించటానికి కారణం తన జనాల ఆదాయాలను పెంచి అంతర్గత వస్తు వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవటమే. కేవలం ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మారిన లాటిన్‌ అమెరికా దేశాలు దెబ్బతినటానికి కార్మికవర్గ ఆదాయాలను పెంచకపోవటం ప్రధాన కారణం. వ ద్ధి, ఉపాధి చెట్టపట్టాలు కట్టి సాగితేనేగాని ప్రగతి సాధ్యం. రిజర్వ్‌బ్యాంక్‌ బాధ్యతలు చేపట్టకముందు ఏడేళ్లనాటి ఆర్థిక సర్వేలో రఘురాం రాజన్‌ ఉపాధి కల్పన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఉద్బోధించారు. రెండేళ్ల క్రితం తనవంతుగా ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వ ద్ధి’పై ఆందోళన చెందినా- కార్యాచరణ లేదు. దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దోహదపడగలదంటున్న తాజా సర్వే- ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ)లకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు లక్ష్యానికి ఇది విరుద్దం. భారీ పరి శమలతో పెద్ద ఎత్తున వుత్పత్తి చేసి వుత్పాదక ఖర్చు తగ్గిస్తే తప్ప ఎగుమతుల్లో మనం పోటీ పడలేము. చిన్న, మధ్య తరహా సంస్దలకు అలాంటి వెసులుబాటు వుండదు.

ప్రయివేటు పెట్టుబడులతో పెద్ద ఎత్తున వుపాధి కల్పిస్తామని యువతకు భ్రమలు కల్పిస్తున్నారు. అభివృద్ధి రేటు గురించి డబ్బాకొట్టుకుంటున్న పాలకులు వుపాధి గురించి మాట్లాడటం లేదు. గతంలో వుపాధి రహిత అభివృద్ధి సంఘటిత రంగ సంస్ధలకే పరిమితం అయింది. ఇప్పుడు అది అసంఘటిత రంగానికి కూడా విస్తరించటం వుపాధి కల్పన మరింత క్లిష్టం కానుంది. దేశంలో పదిహేను సంవత్సరాలకు పైబడిన వారిలో పని చేస్తున్నవారు లేదా పనికోసం ఎదురుచూస్తున్నవారు గానీ 2012లో 55.5 శాతం మంది వుంటే 2018లో 49.7శాతానికి పడిపోయింది. అంటే నిరుద్యోగులు పెరిగారు.

ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదల, ఆర్థికాభివ ద్ధి తదితరాలు పరస్పరం ముడివడిన అంశాలంటున్న సర్వే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రాబడి పెంపొందే అవకాశాలు ఉంటాయని ఒకవైపు చెబుతోంది. మరోవైపు వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాలలో నాట్లు, కోత, నూర్పిడి పనులను యంత్రాలే చేస్తున్నాయి. వుపాధి రహిత అభివృద్దికి ఇది ఒక సూచిక. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల కారణంగా సేద్య రాబడి 20-25 శాతం మేర క్షీణిస్తుందన్న గత సర్వే మాటేమిటి అంటే సమాధానం లేదు. చిన్నా, పెద్ద అనేతేడా లేకుండా అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధిక సర్వే చెబుతున్నదానికి భిన్నంగా నీతి ఆయోగ్‌ వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ వాదన వుంది. గత ఐదు సంవత్సరాలుగా సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు అవుతోంది. ప్రస్తుత స్ధితిని చూస్తే ఆరో సంవత్సరం కూడా ఇదే స్ధితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా వ్యవసాయ వృద్ధి రేటు 2.9శాతం తక్కువేమీ కాదు.కానీ వృద్ది రేటు ఐదుశాతం గనుక వుంటే పంటల ధరలు పడిపోయి రైతుల ఆదాయాలు 30 నుంచి 40శాతం వరకు పడిపోయే అవకాశం వుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్న మోడీ సర్కార్‌ ప్రచారం ఒక వాగాడంబరమే తప్ప వాస్తవం కాదని కూడా రమేష్‌ తేటతెల్లం చేశారు. ఆదాయాలు రెట్టింపు కావాలంటే ఏడాదికి పదిశాతం వృద్దిరేటు అవసరం. తన అంచనా ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ఆరుశాతానికి మించి లేదు. ఇప్పుడున్న ధరలకు పదిశాతం అదనంగా రైతులు పొందితే వారి ఆదాయం 16శాతం పెరుగుతుందని రమేష్‌ అంటారు. మరి ఆ పరిస్ధితి ఇప్పుడు వుందా ? ప్రతి పభుత్వ పథకానికి, కార్యక్రమానికి ‘గావ్‌, గరీబ్‌, కిసాన్‌’ కేంద్ర బిందువులని ఘనంగా చాటిన ఆర్థిక మంత్రి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ప్రత్యేకించింది బడ్జెట్‌లో అయిదు శాతమే! పెట్టుబడి లేని వ్యవసాయంపై ద ష్టి సారించామని, రైతుల రాబడి రెండింతలయ్యేందుకు అది దోహదపడుతుందన్న హామీ ఉత్తచేతులతో మూరలేసిన చందమే. ‘కిసాన్‌ సమ్మాన్‌’ అల్పసంతోషులను కొంత ఊరడిస్తున్నా, రైతుకు జీవన భద్రత కల్పించగల విశేష చొరవ ఈ బడ్జెట్‌ కసరత్తులోనూ కొరవడింది. రైతాంగంలో కేవలం ఆరు శాతానికే దక్కుతున్న కనీస మద్దతు ధరల పెరుగుదల ఎంత ప్రహసన ప్రాయంగా వుందో బడ్జెట్‌కు ముందు పెంచిన నామమాత్ర ధరలను చూస్తే తెలుస్తుంది.

దేశంలో పారిశుద్ధ్య సేవలు అంతంతమాత్రమేనని గత ఏడాది పార్లమెంటరీ స్థాయీసంఘం విమర్శించింది. వివిధ రాష్ట్రాల్లో రూ.14 వేలకోట్లకు పైగా స్వచ్ఛ నిధులు మురిగిపోతున్నాయని లెక్కచెప్పింది. ఆ ఊసెత్తని తాజా ఆర్థిక సర్వే స్వచ్ఛభారత్‌ నుంచి స్వస్థ భారత్‌ మీదుగా సుందర భారత్‌ వైపు నడుద్దామని పిలుపునిచ్చింది. బడ్జెట్‌ పరిమాణం 27 లక్షల 86 వేలకోట్ల రూపాయలకు ఎగబాకింది. నిరుటి బడ్జెట్‌ ప్రతిపాదనలకన్నా మూడు లక్షల 44 వేలకోట్ల రూపాయలు అధికం! ఆదాయపన్ను మినహాయింపుల గురించి ఎదురు చూసిన ప్రభుత్వ వుద్యోగుల ఆశాభంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగునెలల క్రితం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదనలనే తిరిగి వల్లించారు. నిజానికి వుద్యోగులకు మినహాయింపులు పెంచితే ఆ మేరకు మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుంది. అధిక ఆదాయం వచ్చే వారి మీద సర్‌ఛార్చి పెంపుదల హర్షణీయమే అయినా అసమానతల తగ్గింపు రీత్యా చూస్తే ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిదే. మరోవైపు బడా సంస్ధలకు ఇచ్చిన రాయితీలను చూస్తే 25శాతం ఆదాయపన్ను జాబితాలోకి వచ్చి సంస్ధల వార్షిక లావాదేవీల మొత్తాన్ని 250 నుంచి 400 కోట్లకు పెంచారు. పోనీ దీని వలన ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుందా అంటే చెప్పలేము. అనేక సంస్ధలు తమ లాభాలను, పన్ను రాయితీలను సరిహద్దులు దాటించి విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చి వాటి మీద కూడా రాయితీలు పొందుతున్నారు.

మోదీ ప్రభుత్వం ‘సాగరమాల’ పేరిట రేవుల్ని నవీకరించి, నూతనంగా ప్రపంచ స్ధాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పుతామన్నా- జల మార్గాల గురించి చెప్పినా ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్లుగా వుంది. ఇప్పుడు హైవేల గ్రిడ్‌ గురించి కబుర్లు చెబుతున్నారు. ‘గ్రామీణ సడక్‌ యోజన’ నిధులు ఖర్చు చేయలేదు. ఈ సారి మొత్తాన్ని పెంచలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కేటాయింపులు తగ్గాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను కుదించారు. ఇవన్నీ గ్రామీణుల ఆదాయాలను తగ్గించేవే తప్ప పెంచేవి కాదు. గత బడ్జెట్‌లో వివిధ పధకాలకు చేసిన కేటాయింపుల్లో దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయల మేర కోతలు పెట్టి లోటు అదుపులో వుందని నమ్మబలికారు. జనాన్ని మాయ చేయటం తప్ప వేరే కాదు. ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల వుపసంహరణ ద్వారా వచ్చిన నిధులను కొత్త పెట్టుబడిగా పెడితే ప్రయోజనం, అలాగాక వాటిని లోటును పూడ్చు కోవటానికి వినియోగిస్తున్నారు.

Image result for india budget 2019-20

రానున్న ఐదు సంవత్సరాలలో మౌలిక వసతుల కల్పనకు వందలక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని కొండంత రాగం తీసి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం 3.38లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరోవైపు రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తమే 2030 సంవత్సరంలోగా రూ.50 లక్షల కోట్లు కావాలని చెప్పి కేటాయించిన మొత్తం 66వేల కోట్ల రూపాయలు మాత్రమే. తొలిసారి అధికారానికి వచ్చిన కొత్తలో తెల్లారి లేస్తే నరేంద్రమోడీ ఏదో ఒక దేశంలో వుండేవారు. ఎందుకయ్యా అంటే దేశానికి అవసరమైన విదేశీ పెట్టుబడులు తీసుకురావటానికి అని చెప్పారు. మరోవైపు తమ నేత కొత్తగా అప్పులు చేయటం లేదని, పాత అప్పులను తీర్చినట్లు మోడీ అనుయాయులు ఎన్నికల ముందు వూదరగొట్టారు. తాజా బడ్జెట్‌లో విదేశీ బాండ్ల ద్వారా రుణాలను సేకరిస్తామని చెబుతున్నారు. ఐదేండ్లుగా సాగించిన కౌగిలింతల దౌత్యం, విదేశీయులకు పరచిన ఎర్రతివాచీ మర్యాదలద్వారా ఏమి సాధించినట్లు? ఏమాటను, ఏ చేతనూ విశ్వసించే స్దితి కనిపించటం లేదు.

మరోవైపు జనాన్ని బాదేందుకు ఏ అవకాశాన్నీ వదలటం లేదు. వివాహ సమయంలో నూతన వధూ వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెబుతారు. వారికి అది కనిపిస్తుందో లేదో తెలియదు గానీ అమ్మాయి తండ్రికి అప్పులు స్పష్టంగా కళ్ల ముందుంటాయి. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వెలిబుచ్చినట్లు చమురు ధరలు తగ్గుతాయో లేదో గాని పెట్రోలు, డీజిల్‌ మీద ప్రకటించిన ఒక రూపాయి ప్రత్యేక సుంకం మాత్రం స్పష్టంగా ధరల పెరుగుదలకు దారి తీసింది. గత ఐదు సంవత్సరాలలో తగ్గిన చమురు ధరలను వినియోగదారులు లబ్ది పొందకుండా పన్నులను పెంచారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చమురు ధరలు తగ్గుతాయని ఏ అంచనాతో చెబుతున్నారో తెలియదు గానీ ఆ పేరుతో జనానికి వడ్డించారు. ఇష్టమైనపుడు వుంగరాల వేళ్లతో మొట్టినా సరదాగానే వుంటుందంటారు. ఇది కూడా అంతేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర విబేధాలను వెల్లడించిన జి 20 ఒసాకా సభ !

30 Sunday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

G20, G20 Osaka 2019, G20 Osaka 2019 summit

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఎం కోటేశ్వరరావు

అనేక మంది వూహించినట్లు ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన నిర్ణయాలు, నిర్ధిష్ట కార్యాచరణ లేకుండానే ముగిసిందని చెప్పాలి. ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ ప్రధాని మర్యాద పూర్వకంగా సభ విజయవంతమైందని చెప్పవచ్చు తప్ప ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకుండా కేవలం ఆశాభావాలతో ముగిసింది. ప్రపంచీకరణ మరింత ముందుకు పోతున్న వర్తమానంలో అనేక అంతర్జాతీయ వేదికల సందర్భంగా జరిగిన పరిణామాలే పునరావృతం అయ్యాయి. నేను కూడా రాజుగారి గంగాళంలో పాలుపోయటానికే వచ్చాను గానీ నీతో ముఖ్యవిషయాలు మాట్లాడాలి పక్కకు రా అన్నట్లుగా ఒసాకాలో నేతల ద్వైపాక్షిక సమావేశాలకే ప్రాధాన్యత ఏర్పడిందన్నది స్పష్టం. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మిగతా దేశాల నేతలతో-మన ప్రధాని నరేంద్రమోడీతో సహా- జరిపిన సంప్రదింపులన్నీ మా యింటికొస్తే మీరేమి తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేమి పెడతారు అన్న పద్దతుల్లో అమెరికా ప్రయోజనాల చుట్టూ చర్చలను తిప్పారు. మద్దులాట-దెబ్బలాట పద్దతిలో ఒక వైపు ట్రంప్‌తో భాయీ భాయీ అంటూనే మరో ఏకపక్ష వ్యవహారాలను సహించరాదని మిగతా దేశాల నేతలతో పరోక్షంగా అమెరికా వైఖరిని విమర్శించే ప్రకటన జారీలో మన ప్రధాని నరేంద్రమోడీ భాగస్వామి అయ్యారు.

ఈ సమావేశాల సందర్భంగా వివిధ దేశాల మధ్య వున్న వివాదాలను కూడా పలువురు నేతలు ప్రస్తావించారు. నిజానికి వాటిని వేరే సందర్భాలలో చర్చించేందుకు అవకాశం వున్నప్పటికీ జి 20ని వేదిక చేసుకోవటాన్ని బట్టి ఎవరూ ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే ధోరణిలో లేరన్నది స్పష్టమైంది.నాటోలో సభ్యరాజ్యమైన టర్కీ తన మిలిటరీ అవసరాల కోసం రష్యా తయారీ ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయటాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. కొనుగోలుతో ముందుకు పోతే ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన విషయం తెలిసిందే.తమ వ్యవహారాల్లో రష్యా బాధ్యతారహిత, అస్ధిర కార్యకలాపాలకు దూరంగా వుండాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే చెప్పారు. గతేడాది శాలిస్బరీలో సెర్గీ స్కిరిపాల్‌ మీద విషపూరిత దాడికి పాల్పడిన ఇద్దరు రష్యన్లను తమకు అప్పగించాలని పుతిన్‌తో జరిపిన భేటీలో కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా హాంకాంగ్‌ అంశాన్ని లేవనెత్త కూడదని తాము కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జింపింగ్‌ చెప్పారు. అయినప్పటికీ జపాన్‌ ప్రధాని షింజో అబె దాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని కోరారు.

పందొమ్మిది దేశాలు, ఐరోపా యూనియన్‌ సభ్యురాలిగా వున్న జి20 పద్నాలుగవ శిఖరాగ్ర సమావేశం జపాన్‌లోని ఒసాకాలో ఈనెల 28,29 తేదీలలో జరిగింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 80శాతం వుత్పత్తి, మూడింట రెండువంతుల జనాభాను కలిగివున్న దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈ బృంద సమావేశం జపాన్‌లో జరగటం ఇదే తొలిసారి. ఒకవైపు వాణిజ్య యుద్ధాలు, మరోవైపు ఇరాన్‌ మీద భౌతిక దాడులు జరుపుతామని అమెరికా బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇతర అనేక అంశాల గురించి దేశాల నేతలు ప్రస్తావించి చర్చించినప్పటికీ ఈ సమావేశాల అజెండాలో అగ్రస్ధానం వాణిజ్య యుద్ధం ఆక్రమించింది. భారత్‌ మార్కెట్లో మరింతగా ప్రవేశించేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనేక వలపు బాణాలు విసిరారు. అమెరికాతో దోస్తీకి నరేంద్రమోడీ తహతహలాడుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్ధితి, దేశీయంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తల ప్రయోజనాలు ఇమిడి వున్నందున మోడీకి ఇష్టం వుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ట్రంప్‌కు దూరంగా వుండాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది. స్వేచ్చా, న్యాయమైన, వివక్షలేని, పారదర్శక, స్ధిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించేందుకు సభ్యదేశాలు పని చేయాలని సమావేశం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వాంఛలకు విరుద్దంగా పర్యావరణ పరిరక్షణపై కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయంతో మార్పు లేదని అమెరికా స్పష్టం చేయటంతో ఈ అంశంపై పడిన పీఠముడి విడిపోలేదు. పర్యావరణానికి హానిచేసే విషవాయువుల విడుదలను తగ్గించాలన్నది ఆ ఒప్పంద సారం. దాన్ని తాము అమలు జరిపితే తమ కార్మికుల, పన్ను చెల్లింపుదార్ల ప్రయోజనాలకు హాని కలుగుతుందంటూ అమెరికా ఆ ఒప్పందంతో తనకు సంబంధం లేదంటోంది.

తన పంతం నెగ్గించుకోవాలని, తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడాలని అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఆటలు సాగలేదనే చెప్పాలి. చైనాలోని హువెయ్‌ టెలికాం కంపెనీ వుత్పత్తులు ఇంతకాలం తన భద్రతకు ముప్పు అని ప్రకటించి వాటిని కొనుగోలు చేయరాదని ఇతర దేశాలను కూడా బెదిరించిన ట్రంప్‌ ఆ కంపెనీకి అమెరికన్లు విడిభాగాలను విక్రయించవచ్చు అని ఒసాకాలో ట్రంప్‌ ప్రకటించటం విశేషం. ఇదే విధంగా తాము ఇప్పటి వరకు 300 బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై విధించిన పన్ను మినహా ప్రస్తుతానికి అదనంగా పన్నుపెంచటం లేదని కూడా చెప్పారు. అయితే ఇది డిసెంబరులో చేసిన ప్రకటన పునశ్చరణ తప్ప కొత్తదేమీ కాదు. చైనాతో తమ సంబంధాలు వూహించినదాని కంటే మెరుగ్గా వున్నాయని, రెండు దేశాలు తిరిగి పట్టాలు ఎక్కాయని, చైనా నేత గ్జీ జింపింగ్‌తో చాలా చాలా మంచి సమావేశం జరిగిందని ట్రంప్‌ విలేకర్లతో అన్నాడు. వుద్రిక్తతలను గమనంలో వుంచుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముందుకు తీసుకుపోవాలని సమావేశంలో నేతలు అంగీకరించినట్లు జపాన్‌ ప్రధాని షింజో అబే శిఖరాగ్ర సభ ముగింపు సమావేశంలో ప్రకటించారు.

ఒసాకా సమావేశాల్లో వుమ్మడిగా అజెండా అంశాలను చర్చించటంతో పాటు అనేక దేశాల నేతల మధ్య ద్విపక్ష సమావేశాలు చోటు చేసుకున్నాయి. ముదిరి వాణిజ్య యుద్ద నేపధ్యంలో ట్రంప్‌, గ్జీ జింపింగ్‌ మధ్య అలాంటి సమావేశం గురించి ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూసింది.వారు భేటీ అయ్యే ముందు మీడియాకు విడివిడిగా ప్రకటనలు చేశారు. 1970దశకంలో అమెరికాాచైనా మధ్య సంబంధాలు ఒక టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రారంభమయ్యాయని, ఒక చిన్న బంతి తరువాత కాలంలో ప్రపంచ పరిణామాలను ముందుకు తీసుకుపోవటంలో ఎంతో పెద్ద పాత్రపోషించిందని జింపింగ్‌ గత చరిత్రను గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో అంతర్జాతీయ పరిస్ధితులు, వుభయ దేశాల సంబంధాల్లో ఎంతో మార్పు జరిగినా సహకారం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందటం, ఘర్షణతో నష్టపడ్డాయన్న మౌలిక వాస్తవంలో మార్పులేదని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఒసాకాలో ట్రంప్‌, జింపింగ్‌ ఏమి చెప్పినప్పటికీ వాణిజ్య యుద్దం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రతి వారూ వాణిజ్యం గురించి మాట్లాడుతూ మనం తప్పు చేయకూడదని చెబుతున్నారు. వాటిని విన్నవారికి ఏదో ఒక పరిష్కారానికి వస్తారన్న ఆశకలుగుతుంది, కానీ వారి నడక తీరు చూస్తే మరింత ప్రతికూలంగా సాగుతున్నట్లు కనిపిస్తోందనే చెప్పవచ్చు. మరో 350బిలియన్‌ డాలర్ల వుత్పత్తుల మీద పన్నులు విధించాల్సి వున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పని చేయటం లేదని ట్రంప్‌ చెప్పారు. అయితే ఒసాకా నుంచి వాషింగ్టన్‌ చేరేలోగా ట్రంప్‌ వైఖరిలో మార్పు రాదని చెప్పలేము. ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏం చేస్తారో వూహించలేము. రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయి మరింత సంక్లిష్టం అవుతుందా అన్నట్లుగా తయారైన అంశం తెలిసిందే. అదే జరిగితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలం అయ్యే అవకాశం వుందని భయపడిన వారంతా ఈ సమావేశాల్లో రెండు దేశాల వైఖరి ఎలా వుంటుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.

అగ్రరాజ్యాల మధ్య తలెత్తిన పోటీ నివారణకు గాను ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను ఏర్పాటు చేసినప్పటికీ ఏ దేశానికి ఆదేశం రక్షణాత్మక విధానాలను చేపట్టటంతో దానితో నిమిత్తం లేకుండానే, సంస్ధ స్ఫూర్తికి విరుద్దంగా దాని వెలుపల దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవటం ఎక్కువైంది. దీంతో రక్షణాత్మక చర్యలను నిరోధించేందుకు సంస్కరణలు అవసరమనే అజెండా ముందుకు వచ్చింది. అవును నిజమే, సంస్కరణలు తేవాల్సిందే అనే అభిప్రాయం ఒసాకాలో కూడా వెల్లడైనప్పటికీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నట్లుగా పరిస్ధితి తయారైందని చెప్పవచ్చు. బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జరిగిన గత సమావేశంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా వుండాలని అమెరికా కోరింది. అయితే ఆచరణలో ఈ కాలంలో చూస్తే అమెరికన్లు బస్తీమే సవాల్‌ అంటూ అనేక దేశాల మీద పన్నులు విధించి తమ షరతులకు అంగీకరించే విధంగా వత్తిళ్లకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆంబోతుల వంటి అమెరికా-చైనాలు ముందుగా ఒక అంగీకారం, అవగాహనకు వస్తే తమ పని సులభం అవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య వివాదం పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నట్లు ఎగుమతి ఆధారిత ఆర్దిక వ్యవస్ధ వున్న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఒసాకాలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ అంశాల గురించి తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అమెరికన్లు ఒకవైపు జర్మనీ, రెండోవైపు చైనాతో కూడా లడాయి పడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వాణిజ్య సంస్ధలో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా నేతల సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలతో ప్రపంచ వ్యవస్ధ నడుస్తోందని, ఈ పూర్వరంగంలో డబ్ల్యుటిఓను సంస్కరించాలని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఏకపక్ష నిర్ణయాలను ఎదుర్కోవాలని ఈ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ ఒక సంయుక్త ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు నేతల సమావేశ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.దీనిలో అమెరికా పేరు ప్రస్తావన లేనప్పటికీ దాని గురించే అన్నది స్పష్టం. అంతర్జాతీయ చట్టాల మీద ఆధారపడాలని, జాతీయ సార్వభౌమత్వాలను గౌరవించాలని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో పర్యావరణ సమస్యల మీద ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నారు.అయితే పర్యావరణాన్ని కాపాడాలనే సాధారణ తీర్మానాన్ని ఒక తంతుగా ఆమోదించారు. విడిగా మాట్లాడినపుడు కొన్ని దేశాల వారు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి వుండాలని కోరారు. ఈ అంశంపై తయారు చేసిన ప్రకటనలో ఎక్కడా 2015నాటి పారిస్‌ ఒప్పందం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవటంతో తాము సంతకం చేయటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా, జపాన్‌ కూడా దాని ప్రస్తాన ఒసాకా ప్రకటనలో వుండరాదని పట్టుబట్టాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d