• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

కేరళ ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరుగుతున్నారా – ఒక పరిశీలన !

01 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Politics, Believers in Kerala LDF, CPI(M), Kerala LDF, Sabarimala controversy


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఏ అధ్యక్షుడికి మత ముద్ర వేసిన కాషాయ దళం- రామ్‌దేవ్‌ బాబాకు జూన్‌ ఒకటిన వైద్యుల నిరసన !

29 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, Uncategorized

≈ Leave a comment

Tags

Ayush systems, Baba Ramdev, Christianity, Dr Johnrose Austin Jayalal, Gaytri Mantra, Hindu Fundamentalism, IMA, RSS Propaganda, Yoga


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ భక్తులూ గుండె నిబ్బరం చేసుకోండి – అఘాయిత్యాలకు పాల్పడకండి !

27 Thursday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

Amezon Master Stroke, China companies to India, China goods boycott, India imports from China, narendra modi bhakts, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీద విమర్శల ధాటికి బిజెపి వారు ఉత్సవాలు జరుపుకోలేకపోయారు(ఆన్‌లైన్‌లోనే లెండి). చైనా లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో రెండు దేశాల మిలిటరీ మధ్య విచారకర ఉదంతం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా మోడీ గారిని ఒక విషయంలో అభినందించాల్సి వస్తోంది. విదేశీ పెట్టుబడుల ద్వారా మన జనానికి ఉపాధి, ఎగుమతులు పెంచుతామనే కదా తొలిరోజుల్లో గాలిమోటారెక్కి(విమానాలు) అనేక దేశాలు చుట్టివచ్చారు. గాల్వాన్‌లోయ ఉదంతాల నేపధ్యంలో కాషాయ అభిమానుల, వారి ప్రచారదాడికి గురైన వారి మనోభావాలకు అనుగుణ్యంగా చైనా యాప్‌లను నిషేధించారు. అక్కడి నుంచి వస్తున్న పెట్టుబడులను అడ్డుకున్నారు. కొన్ని దిగుమతులను కూడా తగ్గించినట్లు చెప్పారు. యాప్‌లను పక్కన పెడితే పెట్టుబడులను వదులుకోవటం అంటే మనకు కొన్ని ఉద్యోగాలు రాకుండా చేశారు.ఉద్యోగాల కంటే దేశభక్తి ముఖ్యం అని భావించిన వారు నిజంగానే ఆ చర్యలను సమర్ధించారు. కాని నరేంద్రమోడీ వారికి ఒక విపత్కర పరిస్ధితిని తెచ్చిపెట్టారు. ఇరకాటంలోకి నెట్టారు. అదేమంటే చైనాలో మరింత ఉపాధి పెంచే విధంగా రికార్డు స్ధాయిలో అక్కడి నుంచి వస్తు దిగుమతులు చేసుకున్నారు. ఈ వివరాలను వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు గానీ, పాకేజ్‌ల మీడియాతో సహా మోడీ భక్తులు గానీ ఎక్కడా ప్రచారం చేయరు.తేలు కుట్టిన దొంగలంటే ఇలాంటి వారే.


ట్రేడింగ్‌ ఎకనోమిక్స్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం 1991 నుంచి 2021 వరకు సగటున ఏడాదికి 136.71 బిలియన్‌ (వంద కోట్లు ) రూపాయల విలువగల దిగుమతులు చేసుకున్నాము. 1991ఏప్రిల్‌ నెలలో రు.0.01బిలియన్‌లు కాగా 2021 మార్చినెలలో ఆల్‌టైమ్‌ రికార్డు రు.498.29 బిలియన్ల మేరకు దిగుమతులు ఉన్నాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా పధకాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మార్చి ఎగుమతులు చేసి ఇబ్బడి ముబ్బడిగా చేయలేనంత ఉపాధి కల్పిస్తామని చెప్పిన వారి హయాంలోనే ఇది జరిగింది. సెన్సెస్‌ అండ్‌ ఎకనమిక్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (సిఇఐసి) విశ్లేషణ ప్రకారం 2002 నుంచి 2021వరకు సగటున ఏటా రు. 222 బిలియన్ల మేరకు దిగుమతులు చేసుకున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో 459.6 బిలియన్‌ రూపాయల మేర దిగుమతులు చేసుకున్నాము. ఇవేవీ కమ్యూనిస్టులో, దేశద్రోహులో నిర్వహిస్తున్న సంస్దలు కాదు. లేదా మోడీని వ్యతిరేకించిన వారు తయారు చేసిన టూల్‌కిట్ల సమాచారమూ కాదు.

మరి ఈ వార్త తెలిస్తే చైనా వస్తువులను దిగుమతులు చేయవద్దు, నిషేధించండి, దిగుమతులు ఆపివేసి చైనాను మన కాళ్ల దగ్గర పడేట్లు చేయండి అని వీరంగం వేసిన వారందరికీ కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ రాదు గానీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ రుషిగా మారే క్రమంలో ఉన్నారు కనుక ఆయనకేమీ కాదు, నమ్ముకున్న వారంతా ఆత్మలను నిర్భరంగా ఉంచుకోవాలి, గుండెలను దిటవు చేసుకోవాలి. అనుకున్నదొకటీ అవుతున్నదొకటి అని అవమానాన్ని తట్టుకోలేక ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా నిజాలను తెలుసుకోవటం ప్రారంభించాలి. భజనే చేయాలనుకుంటే మోడీ గారు గాకపోతే మరొకరు. బ్రతుకు ముఖ్యం కదా ! భక్తులు శత్రుదేశం అని ప్రచారం చేస్తున్నా ఖాతరు చేయకుండా దిగుమతుల్లో రికార్డు సాధించినందుకు మోడీని ”అభినందించక” తప్పదు. విశ్వగురువా మజాకానా ! ఎవరైనా ఇది కమ్యూనిస్టు లేదా మోడీ వ్యతిరేక ప్రచారం అని నిరూపిస్తే సవరించుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నా.


భారత-చైనా ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు చూసినపుడు చైనాకు మనం వలస దేశంగా మారుతున్నామా అని ప్రశ్నిస్తూ ది ప్రింట్‌ పోర్టల్‌ 2021 ఏప్రిల్‌ ఒకటిన ఒక విశ్లేషణను ప్రచురించింది. తమను వెర్రి వెంగళప్పలను చేయటానికి ఈ పని చేశారని లేదా రాశారని మోడీ భక్తులు ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. వారి స్వర్గంలో వారిని ఉండనిద్దాం. మన దేశం చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు ఐదో వంతు మాత్రమే ఉన్నాయి.2019-20తో ముగిసిన ఆరు సంవత్సరాలలో మన దేశ ఎగుమతులు సగటున 13 బిలియన్‌ డాలర్లు ఉండగా దిగుమతులు 66 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనాకు మన ఎగుమతులు పెరిగిన తరువాతనే ఈ పరిస్ధితి ఉంది. ఈ వివరాలు చెబుతున్నామంటే చైనాను పొగడటంగానో మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారో అని ఎవరైనా అనుకుంటే వారికి కృష్ణ పట్నం ఆనందయ్య మందుతోనో లేక గుజరాత్‌లో మాదిరి గోమూత్రం, ఆవు పేడ పులిమిగాని చికిత్స చేయాల్సిందే.


స్వాతంత్య్రానికి ముందు మన దేశం బ్రిటన్‌కు ముడిసరకులు ఎగుమతి చేసేదిగాను అక్కడి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, పెట్టుబడులను దిగుమతి చేసేదిగానూ ఉండేదన్న విషయం తెలిసిందే. అదే ధోరణి ప్రస్తుతం చైనాతో మన లావాదేవీలు ఉన్నందున ప్రింట్‌ విశ్లేషకులు మనం చైనాకు వలసదేశంగా ఉంటున్నామా అని ప్రశ్నించాల్సి వచ్చింది. గతంలో జాతీయ వాదులు వలస నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. మనమే పరిశ్రమలు స్ధాపించాలని కలలు కన్నారు. అసలు సిసలు జాతీయ వాదుల వారసులం అని చెప్పుకున్న కాంగ్రెస్‌ వారు గానీ, మేమే అసలైన జాతీయవాదులం అని చెప్పుకుంటున్న కాషాయ వాదులు గానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నవస్తువులతో మన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పొందుతున్న లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్‌ వారిని విమర్శించి గద్దెనెక్కిన బిజెపి గత ఏడు సంవత్సరాలలో ఈ ధోరణిని మార్చేందుకు చేసిన ప్రయత్నాలేమిటో ఎవరైనా చెప్పాలి.

2020 జనవరి నుంచి డిసెంబరు వరకు మన దేశం చైనా నుంచి 58.71 బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఈ ఏడాది మార్చి 17న లోక్‌సభకు చెప్పారు. చైనా తరువాత అమెరికా నుంచి 26.89, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి 23.96, సౌదీ అరేబియా నుంచి 17.73, ఇరాక్‌ నుంచి 16.26 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాము.


ప్రపంచానికి ఎదురయ్యే అఘాతాలు, వత్తిళ్లను తట్టుకొనే స్ధితి స్ధాపకత ఉన్నట్లు చైనా సరఫరా వ్యవస్ధలు రుజువు చేశాయని అమెరికాలోని ఆర్కాన్సాస్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె జెంగ్‌ ఈస్ట్‌ ఆసియా ఫోరమ్‌లో తాజాగా రాశారు. చైనా అంతర్గత మార్కెట్‌లో సొమ్ముచేసుకొనేందుకు, తమ దేశాలలో ఉత్పాదక ఖర్చులను మిగుల్చుకొనేందుకు బహుళజాతి గుత్త సంస్దలు భారీ ఎత్తున చైనాలో పెట్టుబడులు పెట్టాయి, ప్రపంచ ఫ్యాక్టరీగా, ప్రపంచ సరఫరా వ్యవస్ధ కేంద్రంగా చైనాను మార్చాయి. అమెరికా – చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్దం, కరోనా మహమ్మారి సంక్లిష్టమైన ప్రపంచ సరఫరా వ్యవస్ధ భేద్యతను వెల్లడించాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనా అధిక విలువను జతచేసే పారిశ్రామిక ఉన్నతీకరణ, విలువ వ్యవస్దలో పెరుగుదల వైపు పయనించింది. వాణిజ్య యుద్దం, మహమ్మారి గానీ చైనా కేంద్రంగా ఉన్న సరఫరా వ్యవస్దను ఏమేరకు ప్రభావితం చేశాయో ఇంకా తెలియదు గానీ ప్రాధమిక రుజువులను బట్టి ప్రభావం అన్ని రకాల పరిశ్రమల మీద ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద స్వదేశీ విదేశీ మార్పులకు అనుగుణ్యంగా వత్తిళ్లను తట్టుకొనే విధంగా తగిన వ్యూహాలను రూపొందించుకొన్నాయని సదరు ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. మన సంస్కృత ఘనాపాటీలు ఎలాంటి పాఠాలు చెబుతారో తెలియదు.

భారీ పరిశ్రమలుగా వర్గీకరించిన చైనా పరిశ్రమల లాభాలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో 57శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో గతేడాదితో పోలిస్తే లాభాలు గనుల రంగంలో 1.06 రెట్లు, ముడిపదార్ధాల తయారీ రంగంలో 3.66 రెట్లు పెరిగాయని జాతీయ గణాంక సంస్ద వెల్లడించింది. ఇటీవల రెండు సంవత్సరాల సగటు లాభాలు 29.2శాతం ఉండగా ఫార్మా రంగంలో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 80.2శాతం పెరిగాయి. దుస్తులు, వస్త్రాలు, ముద్రణ పరిశ్రమల్లో గత రెండు సంవత్సరాల్లో లాభాలు గణనీయంగా పడిపోయాయి, అయితే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో మెరుగు పడి తేడా తగ్గినట్లు గణాంక సంస్ద వెల్లడించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా జిడిపి 18.3శాతం పెరగ్గా దక్షిణ కొరియా 1.8, ఫ్రాన్స్‌ 1.5, అమెరికాలో 0.4శాతం వృద్ది రేటు నమోదు కాగా జపాన్‌ 1.8, జర్మనీ 3.1, ఇటలీ 4.8, బ్రిటన్‌లో 6.1శాతం తిరోగమన వృద్ధి నమోదైంది.

ఏ నేతకైనా వైఫల్యాలు సహజం. ఒక మత గ్రంధంలో పాప ప్రక్షాళన చేసుకుంటే పరలోక ప్రాప్తి అని ఉంది తప్ప పుణ్య ప్రస్తావన లేదంటారు.అలాగే నరేంద్రమోడీ నిఘంటువులో వైఫల్యాలకు అర్ధమే లేదు.ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో సహా ఇంతవరకు అన్నీ విజయాలే అన్నారు తప్ప ఒక్క వైఫల్యం గురించి కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ మోడీ ఎంతగా అపహాస్యం పాలయ్యారంటే కొద్ది రోజుల క్రితం బహుళజాతి గుత్త సంస్ద అమెజాన్‌లో ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందండి అంటూ ప్రచారం సాగింది. దాని పేరు ఆంగ్లంలో ”మాస్టర్‌ స్రోక్‌ ” ( తిరుగులేని దెబ్బ లేదా తిరుగులేని యుక్తి ) రచయిత పేరు బెరోజ్‌గార్‌ భక్త్‌, అట్టమీద ప్రధాని నరేంద్రమోడీ బొమ్మ వేసి భారత్‌లో ఉపాధి వృద్ధికి గాను ప్రధానికి తోడ్పడిన 420 రహస్యాలు అని రాసి ఉంది. తీరా 56 పేజీల ఆ పుస్తకాన్ని తీసుకున్నవారు తెరిస్తే అంతా ఖాళీగా దర్శనమివ్వటాన్ని బట్టి నరేంద్రమోడీ మీద విసిరిన ఒక మాస్టర్‌ ్టస్టోక్‌ అని చెప్పవచ్చు. అది వైరల్‌ అయిన తరువాత అమెజాన్‌ దాన్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. బెరోజ్‌గార్‌ భక్త్‌ అంటే తెలుగులో పనిపాటా లేని భక్తుడు అని అర్ధం. ఇక 420 అంటే ఏ సందర్భంలో వాడతారో తెలిసిందే. ఉపాధి పోగొట్టటం తప్ప ఉపాధి కల్పనలో ఘోరవైఫల్యం గురించి ఒకవైపు చర్చ నడుస్తున్ననేపధ్యంలో మరోవైపు మీడియా, ఇతరంగా నరేంద్రమోడీ దేశానికి అందించిన అద్భుతమైన సేవ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మోడీకి తోడ్పడిన 420 రహస్యాలు అంటే మోసాలు అని అర్ధం. మోడీ ఏలుబడిలో పెద్ద లేదా సానుకూలమైనవి ఏవీ లేవని చెప్పటమే.

చైనాతో పోటీ పడి మన దేశాన్ని వృద్ధి చేయవద్దని ఎవరూ చెప్పలేదు. చైనాకు వ్యతిరేకంగా మనల్ని నిలిపేందుకు పధకం వేసిన అమెరికన్లు, జపనీయులు చెప్పిన మాటలు నమ్మిన మన నేతల పరిస్ధితి సినిమాల్లో హాస్యగాళ్లలా తయారైంది. ఇంకే ముంది వెంటనే చైనా నుంచి వెయ్యి కంపెనీలు వస్తున్నాయి, అందుకొనేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పగానే నిజమే అని హడావుడి చేశారు. ఏడాదైంది, ఏమైందో ఎవరైనా చెప్పారా ? ఎందుకని చైనా నుంచి అమెరికా సంస్ధలు మన దేశానికి రావటం లేదు. సరిహద్దుల్లో వాటిని అడ్డుకున్నారా ? గతేడాది మోడీ గారు చెప్పిందేమిటి ? ” రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఒక నూతన ప్రపంచ వ్యవస్ధ ఏర్పడటాన్ని మనం చూశాము. కోవిడ్‌-19 తరువాత అలాంటిదే జరగ నుంది. ఈ సారి ఉత్పాదక బస్‌ను భారత్‌ నడపనుంది, ప్రపంచ సరఫరా వ్యవస్ధలతో అనుసంధానం కానుంది. మనకు ప్రజాస్వామ్యం, జనాభా సంఖ్య, గిరాకీ రూపంలో నిర్దిష్టమైన అనుకూలతలు ఉన్నాయి.” అని 3డి సినిమా చూపారు. దాని కొనసాగింపుగా ముఖ్యమంత్రులందరూ పరిశ్రమలను అందుకొనేందుకు ఎర్రతివాచీలు పరిచి సిద్దంగా ఉండాలన్నట్లు మాట్లాడారనుకోండి.


నిజానికి చైనా నుంచి కంపెనీలు ఎన్ని బయటకు పోతున్నాయనేది పక్కన పెడితే అంతకు ముందే కొన్ని బయటకు వచ్చాయి. 2019 అక్టోబరు వరకు 56 కంపెనీలు బయటకు వస్తే వాటిలో మూడంటే మూడే మన దేశం వచ్చాయి, 26 వియత్నాం, 11 తైవాన్‌, 8 థారులాండ్‌ వెళ్లాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ ఎగుమతి సబ్సిడీలను వ్యతిరేకిస్తున్న కారణంగా దానికి పేరు మార్చి మన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకాన్ని ప్రవేశ పెట్టింది. దాని ద్వారా పదిలక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మాదిరి గ్రాఫిక్స్‌ చూపింది.2020-21 సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను నిర్ణయించింది. పదహారు కంపెనీలు ఆసక్తి చూపగా పదిహేను విఫలమయ్యాయి. ఒక్క శాంసంగ్‌ మాత్రమే పూర్తి చేసింది. దాంతో మరొక ఏడాది పాటు వ్యవధిని పొడిగించి 2021-22లో చేసిన ఉత్పత్తిని తొలి ఏడాది లక్ష్యంగా పరిగణించాలని ఆలోచన చేస్తోంది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు మొదటి ఏడాది నాలుగువేల కోట్ల మేరకు రెండవ ఏడాది ఎనిమిదివేల కోట్ల మేరకు ఉత్పత్తిని పెంచితే దాన్ని బట్టి రాయితీలు చెల్లిస్తారు.ఇలాంటివి గతంలో ఎగుమతుల పేరుతో ఉన్నా ప్రయోజనం కలగలేదు.


చైనా నుంచి లేదా ఇతర దేశాల నుంచి మన దేశానికి కంపెనీలు ఎందుకు రావటం లేదు. ఒకటి చైనా కంటే పన్ను ఎక్కువ. రెండవది ఇతర సౌకర్యాలకు పట్టే వ్యవధి, భూమి లభ్యతలోనూ సమస్యలుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అన్నింటికంటే మన కరెన్సీ విలువలో స్ధిరత్వం లేకపోవటం కూడా సమస్యగానే ఉంది. 2000 జనవరిలో చైనా కరెన్సీ మారకం ఒక డాలరుకు 8.27 ఉంది. గతేడాది అక్టోబరు నాటికి 6.69 యువాన్లకు పెరిగింది. ఇదే కాలంలో మన కరెన్సీ విలువ 43.55 నుంచి 74.54కు తగ్గింది. చైనా కరెన్సీ రెండు దశాబ్దాలలో 19శాతం బలపడగా మన కరెన్సీ 71శాతం బలహీనపడింది.కరెన్సీ విలువలో ఇంతటి ఒడిదుడుకులు ఉంటే కంపెనీలకు రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. డాలర్లలో పెట్టుబడి పెట్టిన వారికి వాటి విలువ తగ్గిపోతుంది. లాభాలు తీసుకుంటాయి తప్ప కంపెనీలు ముప్పుకు ఎందుకు సిద్దపడతాయి. అయితే మన దేశానికి కరెన్సీతో ఉన్న సమస్య ఏమిటి ? అది బలపడితే మన ఎగుమతులు తగ్గుతాయి, బలహీనపడితే పెరుగుతాయి, మనకు విదేశీ చెల్లింపులకు డాలర్లు కావాలి కనుక రూపాయి విలువను తగ్గించి ఎగుమతులు పెరిగేట్లు చూస్తున్నాం. మరోవైపు కనిపించే చిత్రం ఏమిటి ? దిగుమతి చేసుకొనే వస్తువుల ధర ఎక్కువగా ఉంటే మన ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు చమురు ధరలు పెరిగితే రాష్ట్రాలకు దాని మీద వచ్చే పన్ను ఆదాయం దామాషా ప్రకారం పెరుగుతుంది. దాన్ని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని చెల్లించే స్ధితిలో కేంద్రం లేదు. ఎవరి గోల వారిది.


మన దేశంలో మధ్య తరగతి, ధనికులు గణనీయంగా ఉన్నారనే అంచనాతో అనేక కంపెనీలు వినియోగవస్తువులను మన మార్కెట్లో నింపేందుకు చూస్తున్నాయి. అయితే కరోనా సమయంలో నరేంద్రమోడీ ఒకందుకు చేసుకున్న ప్రచారం మరొక విధంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పప్పులు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమం మానవ జాతి చరిత్రలో మరొకటి లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. నూట ముప్పై కోట్ల జనాభాలో ఇంత మంది పేదలు ఉన్న దేశంలో ఖరీదైన వస్తువులను తయారు చేస్తే ఎవరు కొంటారు, పెట్టుబడులు దండగ అవుతాయోమో అని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వెనకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు. విదేశీ కంపెనీలకు కావాల్సింది పెద్ద సంఖ్యలో జనం కాదు, తమ వస్తువుల కొనుగోలు శక్తి ముఖ్యం. ఇదే సమయంలో నూటనలభై కోట్ల జనాభా ఉన్న చైనాలో 80 కోట్ల మంది మధ్యతరగతి, అధిక ఆదాయం కలవారు ఉన్నారు కనుక దానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప మనవైపు చూడరు.చైనాతో పోలిస్తే మన దేశంలో కొనుగోలు శక్తి కేవలం 20శాతమే. 1990 దశకం వరకు రెండు దేశాల తలసరి జిడిపి పోటా పోటీగా ఉంది. 2021 నాటికి నామినల్‌ పద్దతిలో మన కంటే చైనా తలసరి జిడిపి 5.4రెట్లు, పిపిపి పద్దతిలో 2.58 రెట్లు ఎక్కువ. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఎందుకంటే మన తలసరి ఆదాయం 2019లో 2104 డాలర్లు ఉంటే 2020లో 1965 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో చైనాలో 10,261 నుంచి 10,484కు పెరిగింది. కనుకనే చైనా ఉత్పత్తి చేయటంలోనే కాదు, వినియోగించటంలోనూ మనకంటే ముందుంది.

ఈ నేపధ్యంలో అమెరికన్‌ లేదా జపాన్‌ కంపెనీ అయినా అక్కడ ఉండేందుకే ప్రయత్నిస్తాయి తప్ప మన దేశానికి వచ్చేందుకు, చేతులు కాల్చుకొనేందుకు ఎందుకు పూనుకుంటాయి. ఒకవేళ బయటకు పోవాల్సి వస్తే మనకంటే రిస్కు తక్కువ ఉన్న దేశాలకే పోతాయి. కరోనాలో మన దిగజారుడు చూసిన తరువాత కనీసం అలాంటి ఆలోచన కూడా చేయరు. గిరాకీ మన నేతల ప్రకటనల్లో తప్ప వాస్తవంలో ఎక్కడుంది. అమెరికన్లు చైనాతో పోట్లాడతారు అక్కడే ఉంటారని ట్రంప్‌ పాలనా కాలం నిరూపించింది. మన దేశాన్ని వినియోగించుకుంటారని వారి చమురును మనకు అంటగట్టి వారు లబ్దిపొందటాన్ని కూడా ఇదే కాలంలో చూశాము. చైనాకు వ్యాపారం, మనకు కౌగిలింతలు ఇచ్చారు. హౌడీ మోడీ-నమస్తే ట్రంప్‌ వంటి జిమ్మిక్కులు చేసి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అమెరికా వైట్‌హౌస్‌లో ఎవరు కూర్చున్నా జరిగేది ఇదే.


అంతర్జాతీయ రాజకీయాల్లో అనుసరించే విధానాలు కూడా వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో మన దేశం చైనాకు వ్యతిరేకంగా పని చేయటం బహిరంగ రహస్యం. ఇదే సమయంలో చైనా తన అవసరాల కోసం పాకిస్దాన్ను దగ్గరకు తీస్తున్నది. మన పంచదార వ్యాపారులు పాకిస్ధాన్‌ కంటే పంచదారను టన్ను 40 డాలర్లకు తక్కువ ఇస్తామన్నప్పటికీ పాక్‌ నుంచి దిగుమతి చేసుకొనేందుకు చైనా మొగ్గుచూపింది. మన దేశం ఔషధ పరిశ్రమ చైనా మీద ఎంతగా ఆధారపడిందంటే అక్కడి నుంచి అవసరమైన పదార్ధాల దిగుమతి ఆగిపోతే పెన్సిలిన్‌ వంటి వాటిని మనం తయారు చేసుకోలేనంతగా అని చెప్పాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని లొంగదీసుకుంటున్నట్లు కాషాయ మరుగుజ్జులు ప్రచారం చేస్తారు. ఇది జనాన్ని మోసం చేయటమే. మనం నిజంగా చేయాల్సింది మొత్తంగా దిగుమతులను నిలిపివేసి స్వయంగా తయారు చేసుకోవటం. కానీ జరుగుతోందేమిటి ? గతంలో మనం 2015లో చైనా నుంచి 2.8 బిలియన్‌ డాలర్ల మేర ఉక్కు దిగుమతులు చేసుకున్నాం ఇప్పుడు ఒక బిలియన్‌కు పడిపోయింది. ఎందుకు ? చైనా నుంచి దిగుమతి చేసుకోవాలంటే పదిహేనుశాతం ధర ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా తాను ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా మనకు ఎలాంటి పన్నులు లేని ఉక్కును సరఫరా చేస్తున్నందున చౌకగా దొరుకుతోంది గనుక అక్కడి నుంచి కొంటున్నాం. ఇలా అనేక అంశాల మీద జనాన్ని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోంది. కనుక బిజెపి లేదా మరొక పార్టీ ఏది చెప్పినా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు, ఏ దేశం మీదా గుడ్డి ద్వేషాలను పెంచుకోవద్దు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

26 Wednesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), NATIONAL NEWS, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Congress, Kerala BJP, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా మరణాలపై నరేంద్రమోడీ రోదన – మొసలి కన్నీరు !

23 Sunday May 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

crocodile tears, narendra modi crocodile tears, Narendra Modi Failures, Narendra Modi Tears, Rahul gandhi


ఎం కోటేశ్వరరావు


ఎంతలో ఎంత మార్పు ! రోజులు ఎలా మారిపోయాయి !! కరోనా వైరస్‌ మన జీవితాలనే మార్చివేసింది. మనలో భాగమైన ప్రధాని నరేంద్రమోడీని ప్రభావితం చేయకుండా ఉంటుందా ? కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శల నేపధ్యంలో ఆయనను గుడ్డిగా నమ్మే జనంలో ఏదో తేడా కొడుతోంది అన్న ఆలోచన అంకురించింది. నమ్మకాన్ని తప్పు పట్టలేం – గుడ్డి నమ్మకాన్ని ఏ మాత్రం అంగీకరించకూడదు. మోడీని విమర్శించిన వారి మీద గతంలో మాదిరి దాడి చేసే స్దితిలో బిజెపి లేదా దానికి మద్దతు ఇచ్చే మీడియా ఆయుధాలు పనికి రావటం లేదు. గతంలో మాదిరి ఎవరైనా విరుచుకుపడితే సహించే రోజులకు కాలం చెల్లుతోంది అని చెప్పవచ్చు.


గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీ గద్దెనెక్కే వరకు, తరువాత కూడా నరేంద్రమోడీ బహిరంగ సభల్లో మాట్లాడే తీరు, ప్రదర్శించే హావభావాల గురించి చర్చ ఇప్పటిది కాదు. ఒక విషయాన్ని -అది ఎలాంటిది అనేది వేరే అంశం- జనం ముందుకు తేవటం, మెదళ్లకు ఎక్కించటంలో మోడీని అనుసరించాలని కార్పొరేట్‌ శక్తులే తమ సిబ్బందికి నూరిపోశాయి. వినియోగదారులకు తమ ఉత్పత్తుల మీద విశ్వాసం కలిగించేందుకు మోడీ మాదిరి మాటలు చెప్పాలని, హావభావాలు ప్రదర్శించాలని సూచనలు ఇచ్చిన అంశాల గురించి గూగుల్తల్లిని అడిగితే పుంఖాను పుంఖాలుగా -వస్త్రాల షాపులో మన ముందు చీరలు పడవేసినట్లు- పడవేసి ఎంచుకోమని చెబుతుంది. అందువలన వర్తమానంలో ఈ విషయంలో నరేంద్రమోడీని మించిన వారు లేరని అంగీకరించేందుకు ఇబ్బంది పడాల్సిందేమీ లేదు.

ఎంత కఠినాత్ముడికైనా ఒకానొక సమయంలో కంట నీరు రాకపోదని పెద్దలు చెబుతారు. మోడీ అలాంటి వారా అంటే అవునని-కాదని రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. ఏనుగు గురించి ఏడుగురు అంధులను అడిగితే ఎవరు తడిమినదాన్ని బట్టి వారు ఏనుగు రూపాన్ని వర్ణించినట్లుగా అనుభవాన్ని బట్టి ఒక వ్యక్తి లేదా వ్యవస్ధ మీద అభిప్రాయాలను ఏర్పరుచుకోవచ్చు. హిట్లర్‌ ముందుకు తెచ్చిన జర్మన్‌ జాతీయవాదానికి ప్రభావితులైన వారు, జర్మన్‌ జాతిని శుద్ది చేస్తానంటే నిజమే అని భ్రమించిన వారు నెత్తికెక్కించుకున్నారు-అతగాడి మారణ కాండకు గురైన యూదులు, ఇతర దేశాలు ఎంతగా ద్వేషించాయో చూశాము.


కరోనా మరణాల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురైనట్లుగా కంటతడి పెట్టినట్లు కొందరికి కనిపిస్తే మొసలి కన్నీరు అని కొందరికి అనిపించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా నరేంద్రమోడీ కంటతడి పెట్టుకున్నట్లుగా వీడియో దృశ్యాలు, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని చూసి మోడీ అంతటి వ్యక్తే కన్నీరు పెట్టుకున్నారంటూ బాధపడిపోయి కన్నీరు పెట్టుకున్నవారు – మోడీలో జనం గోడు పట్టని దిగంబర రాజును చూసిన గుజరాతీ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ వంటి వారు కూడా ఎందరో ఉంటారు. అయితే ఒక రాజకీయ నేత వ్యాఖ్యానిస్తే….. అదంతా వట్టిదే వాక్సిన్ల కొరత, పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు, దిగజారి పోయిన జిడిపి విషయాలను పక్కదారి పట్టించటానికి మోడీ మొసలి కన్నీరు కార్చారని కాంగ్రెస్‌ నేత రాహులు గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ సినిమాల్లో అయితే నటనతో బాగా రాణిస్తారు అని వ్యాఖ్యానించారు. ఆర్‌జెడి కూడా మొసలి కన్నీరు అని వ్యాఖ్యానించింది. జనం చస్తుంటే నరేంద్రమోడీ ఎన్నికల సభల మీద కేంద్రీకరించి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవటం మోసం కాదా అని ప్రశ్నించింది. దీని మీద బిజెపి నేతలు, మోడీ భక్తులు వెంటనే స్పందించలేకపోయారు.

నరేంద్రమోడీ నిజంగా ఏడ్చారా ? అలా నటించారా అనే చర్చ కూడా సామాజిక మాధ్యమంలో జరుగుతోంది. ఏది నిజం అని తేల్చటం ఎంతో కష్టం. మొసలి కన్నీటి గురించిన నిజా నిజాలను ఎవరైనా ఎవరైనా శాస్త్రవేత్తలు తేల్చారా అంటే కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం తప్ప నిర్దిష్టంగా తెలియదు. అందుబాటులో ఉండే మొసళ్ల సంగతే తేల్చలేని వారు నరేంద్రమోడీ గారి దగ్గరకు వెళ్లి మీరు నిజంగా రోదించారా లేదా అని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. మీడియాకు ఎలాగూ అలాంటి అవకాశం లేదు, మీరు ఏం చెప్తే అది రాసుకుంటాం, ఏం చూపిస్తే దాన్ని చూపుతాం అనే జీ హుజూరు మీడియా అలాంటి ప్రశ్నలు ఎలాగూ అడగదు. ఇతరులెవరైనా అలా చేస్తే ఇంకేమైనా ఉందా ! మొసలి కన్నీరు గురించి సమాచారం, కొన్ని భాష్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జాన్‌ మండవిల్లే అనే బ్రిటీష్‌ యాత్రీకుడు తన యాత్రల అనుభవాలను (1300-71) అక్షర బద్దం చేశారు. ఆ రచనలో మొసళ్ల గురించి ప్రస్తావన ఉంది. ఆ దేశంలో మొసళ్లు మనుషులను తింటూ ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి అని రాసినట్లు ఒక ముక్క చదివాను. అప్పటికి మన దేశానికి సముద్రమార్గం కనిపెట్టలేదు, రవాణా సౌకర్యాలు లేవు గనుక మన దేశంలోని మొసళ్ల గురించైతే మాత్రం కాదని చెప్పవచ్చు. అయినా మొసళ్లు ఎక్కడైనా ఒకటే కదా ! ఏమాత్రం కనికరం లేకుండా మనుషులను మట్టుబెట్టే అనేక మంది ఎలా దొంగేడుపులు ఏడుస్తారో సినిమాల్లో చూడటం, అలాంటి చర్యలను మొసలి కన్నీరు కార్చటం అంటారని వినటం తప్ప ప్రత్యక్ష అనుభవం లేదు. మొసలి నోటితోనే కాదు తోకతో కూడా దాడి చేసి చంపివేస్తుంది. మొసళ్లకు దొరికితే ఏమాత్రం కనికరం చూపవు, వాటికి దొరికిన వాటిని తినేటపుడు కన్నీరు కారుస్త్తాయి, అయితే ఆ చర్యకు భావోద్వేగానికి సంబంధం లేదు. నీటి నుంచి బయటకు వచ్చినపుడు కండ్ల మీద పడే దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకొనేందుకు ద్రవాన్ని విడుదల చేయటాన్ని చూడవచ్చని కొందరు పేర్కొన్నారు. అమెరికా ప్రాంతంలో, అదే విధంగా ఉప్పునీటిలో ఉండే మొసళ్లు తీసుకొనే ఆహారంలో అధికంగా ఉండే ఉప్పును బయటకు పంపేందుకు కండ్లద్వారా ద్రవరూపంలో విడుదల చేస్తాయని చెబుతారు. అదే విధంగా నీటి నుంచి బయటకు వచ్చేటపుడు కండ్ల నుంచి కారే నీటిని కన్నీరుగా భ్రమిస్తామని కూడా కొందరంటారు.


ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ తన రచనల్లో మొసలి కన్నీటిని చాలా సందర్భాలలో వాడుకున్నారు.తనను వంచిస్తున్న భార్య గురించి ఒథెల్లో అనే పాత్ర తనను తాను ఇలా సమాధానపరుచుకుంటుంది.” ఆ భూమి మీద మహిళల కన్నీరు పారితే, ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక మొసలిగా రుజువు చేసుకుంటుంది.” అదే విధంగా దొంగ ఏడుపులు, సంతాపాలు ప్రకటించిన వారిని మొసలి కన్నీటితో వర్ణించాడు. అలాంటి వారి కళ్లు తడిబారితే అర్దం లేదంటాడు. ఇంకా అనేక మంది తమ రచనల్లో ఇలాంటి పోలికలను పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నాడే ఇలాంటి పోలికలను ముందుకు తెచ్చారంటే దానికి నాంది ఎక్కడో తెలుసుకోవటం నిజంగా కష్టమే. ఇది ఒక్క ప్రాంతానికో ఖండం, దేశానికో పరిమితం కాదు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మాల్కొం షానెర్‌, కెంట్‌ వెయిట్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో 2006లో ఒక పరిశోధన చేశారు. మొసళ్లు కన్నీరు కారుస్తాయనే ప్రచారంలో నిజమెంతో తేల్చాలనుకున్నారు. మొసళ్ల జాతిలో ఉపజాతికి చెందిన భయంకర తొండలను అందుకు ఎంచుకున్నారు. సెయింట్‌ అగస్టీన్‌ మొసళ్ల పార్కులో ఏడు తొండలను ఎంచుకొని వాటికి పొడినేలపై ఆహారం అందచేశారు. వాటిలో ఐదు కన్నీరు కార్చటాన్ని చూశారు. ఆహారం తినేటపుడు వాటి గ్రంధులలో సంభవించే మార్పుల వలన కండ్లలోకి ద్రవాన్ని పంపినట్లుగా అదే రోదిస్తున్నట్లుగా కనిపిస్తుందని విశ్లేషించారు. మొసళ్లలో కూడా అదే విధంగా జరుగుతుండవచ్చని నిర్దారణకు వచ్చారు.


ఒక ఉదంతం జరిగితే దానికి చిలవలపలవలతో కువ్యాఖ్యానాలు, మార్పిడి చేసిన చిత్రాలతో ప్రత్యర్ధుల పరువు తీయటం లేదా కొందరికి లేని వాటిని ఆపాదించి మహానుభావులుగా ప్రచారం చేయటం తెలిసిందే. జవహర్‌ లాల్‌ నెహ్రూ, సోనియా గాంధీ ఇలా ఎందరో అలాంటి ప్రచారాలకు గురయ్యారు. వాటి వెనుక కాషాయ దళాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కమ్యూనిస్టు యోధుడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జ్యోతిబసు అమ్మాయిలతో కాబరే నృత్యాలు చేసినట్లు చిత్రాలను సృష్టించటం వెనుక నాటి కాంగ్రెస్‌ పెద్దలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మన ప్రధాని నరేంద్రమోడీ గారి గొప్పతనాన్ని తెలియచెప్పే పధకంలో భాగంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా జీవితం ప్రారంభించిన కొత్తలో ఆ సంస్ద సమావేశాలు జరిగినపుడు స్నానపు గదులు, మరుగుదొడ్లు కడిగిన సేవకుడిగా చిత్రిస్తూ ఫొటోలను సామాజిక మాధ్యమంలో పెట్టిన విషయం తెలిసిందే. వాటిని కించపరుస్తూ పెట్టినట్లు భావిస్తే వెంటనే తొలగించమని కోరి ఉండే వారు. అలాంటిదేమీ జరగలేదు గనుక వాటి వెనుక ఎవరున్నారో చెప్పనవసరం లేదు.

ఇక తాజా ఉదంతానికి వస్తే ఎవరి గడ్డిని వారిచేతే తినిపించినట్లుగా న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ఆ పత్రిక సూర్యరశ్మితో సిరియాలో విద్యుత్‌ తయారీ గురించి రాసిన కథనానికి ఒక పెద్ద చిత్రాన్ని తోడు చేసింది. అయితే ఆ చిత్రం స్దానంలో కంటి నుంచి ద్రవాన్ని కారుస్తున్న ఒక మొసలి బొమ్మ పెట్టి పైన రోదించిన భారత ప్రధాని అనే శీర్షిక పెట్టారు. అంటే నరేంద్రమోడీ మొసలి కన్నీరు కార్చారు అనే అర్ధం వచ్చేట్లుగా తయారు చేసిన ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ దాన్ని ట్వీట్‌ చేసి నకిలీదని తేలటంతో వెనక్కు తీసుకున్నారు. అలాంటి హుందాతనాన్ని సంఘపరివార్‌ పెద్దలు ఎంత మంది పాటించారన్నది ప్రశ్న.


కొద్ది రోజుల క్రితం నరేంద్రమోడీని బదనామ్‌ చేయాలని సూచిస్తూ కాంగ్రెస్‌ ఒక టూల్‌కిట్‌ను తయారు చేసిందంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సంబిత్‌ పాత్రా తదితరులు ఒక నకిలీ పత్రాన్ని పట్టుకొని సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తీరా అది కాంగ్రెస్‌ తయారు చేసిన డాక్యుమెంట్‌ అనేందుకు ఆధారాలు లేవని, కాషాయ దళాల పనితనం అని తేలిపోయింది. కాంగ్రెస్‌ పోలీసు కేసు దాఖలు చేయటంతో పాటు అదే విషయాన్ని ట్విటర్‌ కంపెనీకి కూడా ఫిర్యాదు చేసింది. దాంతో సదరు సంస్ద సంబిత్‌ పాత్రా టూల్‌ కిట్‌ ట్వీట్‌కు ఇది ”తిమ్మిని బమ్మిని చేసిన మాధ్యమం ” (మానిప్యులేటెడ్‌ మీడియా) అని తానే ముద్రవేసి ప్రచారంలో పెట్టింది. దీనికి మోసపూరిత మాధ్యమం అనే అర్ధం కూడా ఉంది. ఈ సమాచారాన్ని చూసిన వారు గుడ్డిగా నమ్మవద్దు అనే సందేశం దీని వెనుక ఉంది. ఇంతకంటే బిజెపి నేతలకు మరొక అవమానం అవసరం లేదు. అయితే ఇది బిజెపి పెద్దలకు కొత్తేమీ కాదు. ప్రపంచ వ్యాపితంగా ఇలాంటి తప్పుడు వార్తలు, ఫొటోలను వ్యాప్తి చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఉన్నంతలో అనుసరించే వారిని అప్రమత్తం గావించేందుకు ట్విటర్‌ తీసుకున్న చర్య ఇది. ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని తొలగించకుండా అనుమానం వచ్చిన వాటికి 2020 మార్చి నెల నుంచి ఇలాంటి ముద్రలు వేయటం ప్రారంభించింది. మన దేశంలో తొలిసారిగా అలాంటి ఘనతను దక్కించుకున్న వ్యక్తి బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయగారు. రైతు ఉద్యమం సందర్భంగా ప్రచారం-వాస్తవం అనే పేరుతో ఉన్న ఒక వీడియోను ఆ పెద్ద మనిషి షేర్‌ చేసి దాన్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మీద అనుచిత వ్యాఖ్య చేశారు. దాంతో ఆ ట్వీట్‌కు మోసపూరిత మాధ్యమం అని ట్విటర్‌ ముద్రవేసింది.


ఒకటి మాత్రం స్పష్టం, మోడీ సర్కార్‌ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో మీడియాలో సానుకూల కథనాలు ఎక్కువ వచ్చేట్లు చూడాలని సంఘపరివార్‌ అపరిమిత సానుకూలత అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా దాని కార్యకర్తే గనుక జనంలో సానుకూలత కోసం నటించారా లేదా నిజంగానే రోదించారా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ముందే చెప్పుకున్నట్లు జనానికి దగ్గరయ్యేందుకు నరేంద్రమోడీ చేసే ఉపన్యాసాలు, ప్రదర్శించే హావభావాలే ఇప్పుడు ఆయన నిజం చెప్పినా నమ్మని స్ధితిని కల్పిస్తున్నాయా ? ఎవరైనా ఊహించారా ! ఎంతలో ఎంత మార్పు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వగురువులో దిగంబర రాజును చూసిన కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ !

21 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP’s trolling army, Naked King, Narendra Modi Failures, Parul Khakhar, Shav-vahini Ganga


ఎం కోటేశ్వరరావు


హిట్లర్‌, రెండవ ప్రపంచ యుద్దంలో ఓటమి పాలై అవమానం భరించలేక ఆత్మ హత్యకు పాల్పడి దిక్కులేని చావు చచ్చి ప్రపంచమంతా ద్వేషించిన జర్మన్‌ నాజీ పాలకుడు.
నరేంద్రమోడీ, దేశ రాజకీయ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి గద్దెనెక్కి ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఏలిక.
మార్టిన్‌ నియోములర్‌, లూథరన్‌ క్రైస్తవ పూజారి, తొలి రోజుల్లో హిట్లర్‌ అభిమాని-కమ్యూనిస్టు వ్యతిరేకి.హిట్లర్‌ నిజస్వరూపం తెలుసుకొని వ్యతిరేకించినందుకు జైలు పాలైన వారిలో ఒకడు.
పారుల్‌ ఖక్కర్‌, నరేంద్రమోడీ అభిమాని, భవిష్యత్‌లో గుజరాతీ కవులకు ప్రతీకగా మారతారని సంఘపరివార్‌ ప్రశంసలు పొందిన కవయిత్రి. మోడీ పాలనా తీరును భరించలేక కవిత రాసినందుకు అదే పరివార్‌ బూతులతో అవమానాల పాలైన బాధిత మహిళ.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు….. అనే పదాలతో ప్రారంభించి నాజీల తీరు తెన్నులు- సమాజ స్పందనను వర్ణించి దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదమైన కవితను జైలు గోడల మధ్య రాసిన రచయిత నియోములర్‌. హిట్లర్‌ను బలపరిచినందుకు పశ్చాత్తాప పడుతూ భవిష్యత్‌ తరాలను హెచ్చరిస్తూ చేసిన రచన అది.
అన్ని దేశాలలో, భాషలలో చెప్పుకొనే దిగంబర రాజు కథలో రాజుకు బట్టలు లేవంటూ అమాయకత్వం తప్ప అభం శుభం తెలియని ఒక పిల్లవాడు నిజం చెబుతాడు. గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలతో సంబంధం లేని భక్తి గీతాలు, భావ కవితలు రాసే అలవాటున్న ఖక్కర్‌ నరేంద్రమోడీ పాలన తీరు తెన్నులు చూసి భరించలేని పసిపిల్ల మాదిరి ఆవేదనతో అల్లిన కవిత. ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని భాషల్లో అనువాదమై వైరల్‌ అవుతోంది.
హిట్లర్‌ అంతమైన తరువాత మార్టిన్‌ నిములర్‌ను మిత్రరాజ్యాల సేనలు జైలు నుంచి విముక్తి చేశాయి.
కవిత రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు పారుల్‌ను నోరుబట్టని బూతులతో బిజెపి సంస్కృ(తి)త పండితులు నిందిస్తున్నారు. వారు నిత్యం ప్రవచించే ఏకత, శీలము, సంస్కారానికి అర్ధం ఇదా అని జనం విస్తుపోతున్నారు.


తన కవిత మీద తీవ్ర దుమారం, బెదిరింపులు, దూషణలు వెల్లడైనప్పటికీ తన రచనను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని తానెలాంటి తప్పు చేయలేదని పారుల్‌ ఖక్కర్‌ చెప్పారు. నరేంద్రమోడీని ఆయన అంతరంగం అమిత్‌ షాను విమర్శించిన వారికి ఏ గతి పడుతుందో తెలియనంత ఎడారిలో, అడవిలో ఆమె లేరు. అందుకే ఒకే ఒక్కడు అన్నట్లుగా గుజరాత్‌లో మోడీని తప్పు పట్టిన ఆమెను ఒకే ఒక్కతె అనవచ్చు. కేవలం పద్నాలుగు పంక్తుల కవితతో విశ్వగురువు పీఠాన్ని, పరివారాన్ని గడగడలాడించిన ఆ రచనలోని ఆవేదనను అర్ధం చేసుకొని మరింతగా ప్రచారంలోకి తేవటమే ఆమెకు మనమిచ్చే ఘనమైన గౌరవం. మే పదకొండవ తేదీ వరకు కేవలం గుజరాత్‌కే తెలిసిన ఆమె నేడు దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందారు. అన్నింటికీ మించి హమ్మయ్య చివరికి గుజరాత్‌లో కూడా స్పందించే వారు ఉన్నారంటూ అనేక మందికి ప్రాణం లేచి వచ్చేట్లు చేశారు.


ఎందరో పేరు ప్రఖ్యాతులున్న కవులు, కవయిత్రులు ఉన్నారు. కరోనాతో నిమిత్తం లేకుండానే గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఉన్న భావ ప్రకటన స్వేచ్చ పరి(దు)స్ధితిని చూసి మన కెందుకులే అని కలాలను, గళాలను మూసుకున్నవారే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరం అని తెలిసీ దురలవాట్లను మానుకోని వారి మాదిరి వారంతా చెవులు కొరికే లక్షణంతో బాధపడుతున్నారన్నది స్పష్టం. గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. ఎక్కడైనా ఒకటో అరా విమర్శనాత్మక రచన చేసినా, గళం విప్పినా, శిరమెత్తినా వాటికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్న బూతు పురాణాలను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఖక్కర్‌ కవితకు గుజరాత్‌లోని ప్రముఖ కవులు, కళాకారుల నుంచి మద్దతు రాలేదు. అయితే గుజారాతీ లేఖక్‌ మండల్‌ అనే సంస్ధ మాత్రం మద్దతు ప్రకటించింది. ఆమెను నిందించే బిజెపి మరుగుజ్జులను ఖండించింది.

గుజరాతీ రచయిత్రి, సినిమా దర్శకురాలు మెహుల్‌ దేవకళ పారుల్‌ ఖక్కర్‌ గురించి, తన అనుభవాన్ని వివరిస్తూ రాసిన వ్యాసాన్ని కొన్ని ఆంగ్ల మీడియా సంస్ధలు ప్రచురించాయి. దాని సారం ఇలా ఉంది. ” నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత తొలిసారిగా ఆయన మాతృభాష గుజరాతీలో మోడీని విమర్శించటమే గాక కరోనా రెండవ తరంగం గురించి సామాన్యుల ఆవేదనను వ్యక్త పరిచిన కవిత బహుశా ఇదేనేమో. శవవాహిని గంగ పేరుతో రాసిన కవిత దావాలనంలా వ్యాపించింది, గుజరాతీ సాహిత్యకారులు మొద్దుబారి పోయారు, ఎలా స్పందించకూడదో వారికి తెలుసు. అయితే సాహిత్యంతో పనిలేని సామాన్య గుజరాతీలు ఆ కవితలో తమ మనోభావాలు ప్రతిబింబించినట్లు భావించారు. విస్కృతంగా పంచుకున్నారు.యాభై ఒక్క సంవత్సరాల ఖక్కర్‌ భావ గీతాల కవయిత్రిగా పరిచయం. అమె గతంలో రాజకీయ అంశాలను సృజించలేదు.వివాహమై, పిల్లలు పుట్టి స్ధిరపడిన తరువాత ఆలస్యంగా అమె సాహితీ ప్రయాణం ప్రారంభించారు.త్వరలోనే సాహితీ బృందాలలో ఒక స్ధానం సంపాదించుకున్నారు. గృహిణిగానే ఉన్న ఆమెతో కలసి నేను అనేక సాహితీ సమావేశాలలో కవితా గానాలు చేశాను. ఆమె రాసిన తాజా కవిత మితవాద శక్తులకు పిడుగు పాటు వంటిది.ఆమె ఎన్నడూ ప్రభుత్వ వ్యతిరేకిగా లేరు, అలాంటి కవితలు ఆమె రాస్తారని అనుకోరు. అయితే ఆమె చుట్టూ ఉన్న పరిస్ధితులు, ప్రభుత్వ ఘోరవైఫల్యం ఆమెను అందుకు పురికొల్పాయి.నేను ఫోనులో మాట్లాడి ఫేస్‌బుక్‌ నుంచి కవితను తొలగించనందుకు ఆమెను అభినందించినపుడు నేనెందుకు దాన్ని తొలగించాలి, నేను చెప్పినదానిలో తప్పేముంది అంటూ సన్నగా నవ్వుతూనే ధృడంగా చెప్పారు.


ఆమెను దీర్ఘకాలంగా అభిమానిస్తున్నవారు ముఖం చాటేశారు, దూరం జరిగారు.తరువాత ఖక్కర్‌కు ఏమి జరుగుతుందో నేను చెప్పగలను. దేశంలో అసహన సంస్కృతి పెరుగుతున్న నేపధ్యంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాయాలని 2015 అక్టోబరులో నేను నిర్ణయించుకున్నాను. గుజరాత్‌లోని అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులను కలసి దాని మీద సంతకం చేయాలని కోరాను.నైతికంగా మద్దతు తెలిపారు తప్ప సంతకాలు చేసేందుకు తిరస్కరించారు. నిజం చెబితే వచ్చే ముప్పును స్వీకరించేందుకు సిద్దపడలేదు. భయంతో గుసగులాడుకోవటాన్ని అలవాటు చేసుకున్నారు. నా లేఖపై సంతకాలు చేయని గుజరాతీ సాహిత్యకారుల గురించి మొద్దుబారిపోయారని ఒక జాతీయ పత్రిక మొదటి పేజీలో వ్యాఖ్యానించింది. ఆ లేఖ తరువాత సాహితీ సమావేశాల్లో , అవార్డులకు సిఫార్సుల్లో నా పేరును తొలగించారు. ఖక్కర్‌ కవిత తరువాత ప్రభుత్వ అనుకూల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక ప్రముఖ మహిళా కాలమిస్టు తన వ్యాసం మొత్తాన్ని ఖక్కర్‌కు కేటాయించి కవిత ఉద్ధేశ్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక ఫాషనై పోయింది అని ఆగ్రహించారు. కొందరు బిల్లా -రంగా, ఫిడేలు వంటి పదాలను ఉపయోగించటం ఏమిటని ప్రశ్నించారు. మరికొందరు కవితాత్మకంగా సమాధానాలిచ్చారు. మరొక రచయిత ఎవరూ ఖక్కర్‌ను అనుసరించి అలాంటి విమర్శనాత్మక కవితలు రాయకూడదన్నది వారి స్పష్టమైన ఉద్దేశ్యం. అనేక మంది రచయితలు, వ్యాసకర్తలు సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి అనుకూలం వాదనలతో రంగంలోకి దిగారు. ఎక్కువ మంది గుజరాతీ కవులు మౌనం దాల్చారు.నేను సామాజిక మాధ్యమంలో రాసిన వాటిని చూసి వెనక్కు తగ్గమని తోటి గుజరాతీ రచయితలు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఖక్కర్‌ పేరు వినని వారు కూడా ఆమె కవితకు మద్దతు ఇస్తున్నారు. అది ఇప్పుడు భాషా సరిహద్దులు దాటిపోయింది. చివరికి రచయిత్రితో సహా ఎవరూ కూడా దాని ప్రయాణాన్ని ఆపలేరు.” అని దేవకళ పేర్కొన్నారు.


1973-74లో గుజరాత్‌లో నవనిర్మాణ ఆందోళన పేరుతో ఏర్పడిన సంస్ధ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి చిమన్‌భారు పటేల్‌ ఉద్వాసనకు కారణమైంది. ఆ సంస్ద అధ్యక్షుడిగా పని చేసిన మానిషీ జానీ ప్రస్తుతం గుజరాతీ లేఖక్‌ మండల్‌ అధ్యక్షుడిగా ఒక ప్రకటన చేస్తూ ఈ కవితను పూర్తిగా సమర్ధించిన వారిలో ఉన్నారు. బిజెపి నిందా ప్రచారాన్ని ఖండించారు. సంస్ధ కార్యదర్శి మన్‌హర్‌ ఓజా కూడా సమర్ధించటమే గాక సామాజిక మాధ్యమంలో ప్రతి భారతీయుడు ఆమెకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.


తన కవిత వైరల్‌ అవుతున్న సమయంలో ఒక గృహిణిగా ఖక్కర్‌ ఇల్లు తుడుస్తూ లేదా చపాతీలు చేస్తూ ఉండి ఉంటుందని ఆమె బంధువు ఒకరు ది వైర్‌ పోర్టల్‌తో చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె భర్త ఒక బ్యాంకు ఉద్యోగి.తన భార్య కవితల పట్ల ఆయన గర్వపడతారు. అనేక మంది యువతుల మాదిరి కళాశాలలో చదువుతూ డిగ్రీ రెండవ సంవత్సరంలో మానివేసి వివాహం చేసుకొని గృహిణిగా స్ధిరపడ్డారు. అయితే ఆమెకు స్కూలు దశలోనే రాయటంపై మక్కువ ఏర్పడింది. పదవతరగతిలో ఉండగా 1984లో తొలి కవిత రాశారు. ఇందిరా గాంధీ మరణం, ఆమె వ్యక్తిత్వం గురించి దానిలో పేర్కొన్నారు. అయితే వివాహం తరువాత కవితలు రాయటం నిలిపివేశారు. 2011లో కుమారుడు ఆమెకు ఇంటర్నెట్‌ను, సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమెలోని కవయిత్రి మేలుకున్నది. గజల్స్‌ ఇతర కవితలు రాసింది.తాను ఆధ్యాత్మికవాదినని, కవిత్వం తన జీవితానికి నిశ్శబ్దంగా మద్దతు ఇస్తుందని, కవితలంటే ఇష్టమని తన గురించి రాసుకున్నారు. ఆమె రాసిన అనేక భక్తి గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. విష్ణు పాండ్య అనే రాజకీయ చరిత్రకారుడు ఆర్‌ఎస్‌ఎస్‌ గుజరాతీ పత్రిక సాధనలో పని చేసేవ్యక్తి. నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత పాండ్యకు పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. పారుల్‌ ఖక్కర్‌ భవిష్యత్‌లో గుజరాతీ కవితకు పెద్ద ప్రతీకగా ఎదుగుతారని వర్ణించారు. శవగంగ పేరుతో కవిత రాసిన తరువాత బిజెపి మరుగుజ్జులు ఆమె పరిణితిలేనిది, హిందూ వ్యతిరేకి, నైతిక విలువలు లేనిది, బజారు మనిషి అంటూ బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే ఆమెను అంతగా పొగిడిన ఆ పెద్దమనిషి ఖక్కర్‌ రక్షణకు రాలేదు. రాజకీయంగా ఆమె కుటుంబం బిజెపికి మద్దతు ఇస్తుంది, ఎప్పుడూ ఆ పార్టీని వ్యతిరేకించలేదు. ఖక్కర్‌ కవితను ఆమె ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని బిజెపి వారు ప్రచారం చేశారు. అయితే వారి దాడి నుంచి తట్టుకొనేందుకు తన ఫేస్‌బుక్‌కు తాళం వేశారు తప్ప కవితను తొలగించలేదు. ఆమె ఖాతాలోని స్నేహితులు తప్ప బయటి వారు చూడలేరు.


ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప వాటి మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాదు గానీ దిగంబర రాజు, బిల్లా-రంగా వంటి పదాలను వాడినందుకు మోడీ భక్తులు ఆమె మీద దాడిచేస్తున్నారంటూ సమర్ధించేవారు వారు తయారయ్యారు.


ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద వత్తిడి ఎలా ఉంటుందో అవుట్‌లుక్‌ పత్రిక ఉదంతమే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం కనిపించటం లేదు, కనుగొని చెప్పండి అంటూ తయారు చేసిన ముఖపత్రాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగించింది. ఎందుకంటే ప్రచారం కోసం పెట్టాము, దాని పని అయిపోయింది కనుక తొలగించాం తప్ప ముద్రణలో పేజీ తొలగించలేదని వివరణ ఇచ్చింది. దీని వెనుక సదరు పత్రిక యాజమాన్యం రహేజా గ్రూప్‌పై కేంద్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి అని వేరే చెప్పనవసరం లేదు.ముఖ చిత్రం గురించి ప్రపంచ వ్యాపితంగా తెలిసిపోయింది. అందువలన కొత్త ముఖచిత్రంతో పత్రిక ముద్రణ జరిగితే అది నరేంద్రమోడీ సర్కార్‌కు మరింత నష్టదాయకం. కరోనా సమయంలో దుకాణాల్లో పత్రిక కొనేవారి కంటే ఆన్‌లైన్లో చూసే వారు గణనీయంగా ఉంటారు. కనుక ఉన్నంతలో ప్రచారం, చర్చను నిలువరించేందుకు ఇలా చేశారన్నది స్పష్టం.

ప‌రుల్ క‌క్క‌ర్ (గుజ‌రాతీ క‌వ‌యిత్రి) శవవాహిని గంగ

అనువాదం : రాఘ‌వ‌శ‌ర్మ‌

భ‌య‌ప‌డ‌కు..ఆనంద‌ప‌డిపో..

ఒకే గొంతుతో శ‌వాలు మాట్లాడుతాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వాలు గంగాన‌దిలో ప్ర‌వ‌హించ‌డం చూశాం

ఓ రాజా..అడ‌వి అంతా బూడిద‌య్యింది,ఆన‌వాళ్ళు లేవు, అంతా శ్మ‌శాన‌మైపోయింది,

ఓ రాజా..బ‌తికించే వాళ్ళు లేరు,

శ‌వాల‌ను మోసేవాళ్ళూ క‌నిపించ‌డం లేదు,

ధుఃఖితులు మాత్రం మిగిలారు.

అంతా కోల్పోయి మిగిలాం

మాట‌లు లేక‌ బ‌రువెక్కిన మా హృద‌యాలు శోక‌గీతాలైనాయి

ప్ర‌తి ఇంటిలో మృత్యుదేవ‌త ఎగిసిప‌డుతూ తాండ‌వ‌మాడుతోంది

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..క‌రిగిపోతున్న పొగ‌గొట్టాలు క‌దిలిపోతున్నాయి, వైర‌స్ మ‌మ్మ‌ల్ని క‌బ‌ళించేస్తోంది

ఓ రాజా.. మా గాజులు ప‌గిలిపోయాయి, భార‌మైన మా హృద‌యాలు ముక్క‌ల‌య్యాయి

అత‌ను ఫిడేలు వాయిస్తున్న‌ప్పుడు మా న‌గ‌రం కాలిపోతోంది

బిల్లా రంగాల బ‌రిసెలు ర‌క్త‌ద‌ప్పిక గొన్నాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..నీవు మెరిసిపోతున్న‌ట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు త‌ళుక్కుమ‌న‌డం లేదు

ఓ రాజా..ఈ న‌గ‌రమంతా చివ‌రిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి

ఇక‌ ప‌రిమితులు, మిన‌హాయింపులు లేవు నీ ద‌మ్ము చూపించు,

రా..బయిటికి రా.. గ‌ట్టిగా చెప్పు, పెద్ద‌గా అరువు,

దిగంబ‌ర రాజు అవిటివాడు, బ‌ల‌హీనుడు

ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండ‌లేన‌ని చెప్పు

కోపంతో ఊగిపోతున్న న‌గ‌రం మంట‌లు ఎగిసిప‌డుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి

,ఓ రాజా.. నీ రామ‌రాజ్యంలో శ‌వ‌గంగా ప్ర‌వాహాన్ని చూశావా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

టూల్‌ కిట్‌ ఉదంతం : నరేంద్రమోడీ పరువు తీస్తున్నది ? బిజెపి పెద్దలా ? కాంగ్రెస్‌ నేతలా !

19 Wednesday May 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress Toolkit case, Disa Ravi, Naked King, Narendra Modi Failures, Parul Khakhar


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీని అర్ధం ఇంకేమీ లేవని, కనిపించటం లేదని కాదు. మచ్చుకు పదకొండు సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ఏప్రిల్‌ నెలలో టోకు ధరల పెరుగుదల 10.5శాతంగా నమోదైంది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆగిపోయిన చమురు ధరల పెరుగుదల ఫలితాలు వచ్చిన తరువాత నుంచీ రోజు రోజుకూ ఎలా పెరుగుతోందో కనిపిస్తూనే ఉంది. ఇక ప్రధాన దృశ్యాలలో ఒకటి తమను ఎప్పుడు ఎలా కబళించి ఏం చేస్తుందో అన్న భయంతో వణికి పోతున్న దేశ ప్రజలు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ బిజెపి నేతలు గుండెలు బాదుకుంటున్నది రెండవది. మొదటి దాని విషయానికి వస్తే వైద్య సౌకర్యాలు సరిగా లేవు, చెట్ల కింద చికిత్స చేస్తున్నారంటూ మీడియాకు చెప్పిన గ్రామీణులపై మాన్యశ్రీ యోగి ఆదిత్యనాధ్‌ గారి ఏలుబడిలోని ఉత్తర ప్రదేశ్‌ గౌతమ బుద్ద నగర్‌ జిల్లా పోలీసులు పుకార్లు వ్యాపింప చేస్తున్నారంటూ మీడియా ఫొటోలు వచ్చిన తరువాత కూడా కేసులు పెట్టారు. ఇక రెండవ దాని విషయంలో బిజెపి పెద్దలను తప్పుపట్టాల్సిన పని ఏముంది ఎవరికి ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యత కదా ! వినూత్న దుస్తుల రాజు పాలనలో ఇంతకంటే మరొకటి జరుగుతుందా !


బిజెపి నేతలు గుండెలు బాదుకుంటున్న దారుణం ఏమిటట ! కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని ప్రధాని నరేంద్రమోడీ, ఇతర కేంద్ర మంత్రుల ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా దేశ విదేశాల్లో ప్రచారం చేయాలంటూ కాంగ్రెస్‌ తన శ్రేణులకు అందచేసేందుకు రూపొందించిన ఒక రహస్య టూల్‌ కిట్‌ బయటపడిందట. బిజెపి నేతలు వర్ణించిన దాని ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా మహమ్మారిని ” మోడీ (రకం) వంశ ” రకం అని వర్ణించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు, టీవీల్లో మాట్లాడే వారికి, ప్రకటనలు చేసే అధికార ప్రతినిధులకు, ఆ పేరుతో వర్ణనలు చేస్తూ రాయాలని, చర్చల్లో మాట్లాడాలని దేశ, విదేశీ జర్నలిస్టులను ప్రభావితం చేయాలని దానిలో ఉందని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర చెబుతున్నారు. ఆ పత్రాల్లో మోడీ వైరస్‌, భారతీయ వైరస్‌, తప్పి పోయిన అమిత్‌ షా, క్వారంటైన్‌లో జై శంకర్‌, మంద బుద్ది నిర్మలా సీతారామన్‌, పక్కకు తప్పించిన రాజనాధ్‌ , కుంభమేళాతో పెద్ద ఎత్తున వైరస్‌ వ్యాప్తి తదితర అంశాలను ప్రచారం చేయాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. నరేంద్రమోడీని ద్వేషిస్తే అది దేశాన్ని ద్వేషించినట్లే అని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌ భాష్యం చెప్పారు. ఇందిరే ఇండియా – ఇండియాయే ఇందిర అని గతంలో డికె బారువా అనే కాంగ్రెస్‌ పెద్దమనిషి చెప్పిన అంశాన్ని ఇది గుర్తు చేసింది.


అలాంటి టూల్‌కిట్‌ తాము తయారు చేయలేదని, అది కల్పితం అని కాంగ్రెస్‌ చెబుతోంది. తమ పార్టీ లెటర్‌ హెడ్‌ను ఫోర్జరీ చేసి దాని మీద కల్పిత, కట్టుకథలతో ఉన్న అంశాలను ముద్రించి సామాజిక మాధ్యమంలో ఇతరులకు పంచినందుకు గాను ఢిల్లీలో ఒక కేసును నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసు కమిషనరుకు ఫిర్యాదు చేసింది. దానిలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ నేతలు సంబిత్‌ పాత్ర, బిఎల్‌ సంతోష్‌ తదితరుల పేర్లను చేర్చింది. మత విరోధం కలిగించేందుకు, వర్తమాన మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితిలో ప్రజలకు సాయం చేయటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యాల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి నేరానికి పాల్పడినట్లు కాంగ్రెస్‌ పేర్కొన్నది.


ఇక్కడ ప్రతి వారూ గమనించాల్సిన అంశం ఏమంటే మన దేశానికి చెందిన రాజకీయ పార్టీలు, సంస్ధలు దేశంలో, వెలుపలా కొన్ని ఫేక్‌ న్యూస్‌, ఫొటోలు, రచనలను తయారు చేసే ఫ్యాక్టరీలను నడుపుతున్నాయి. సామాజిక మాధ్యమం ద్వారా వాటిని వ్యాపింప చేస్తున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో వస్తూత్పత్తి లేదు గానీ ఇవి పుష్కలంగా తయారవుతున్నాయి. అలాంటి వాటిలో తమకు ఆపాదించిన టూల్‌కిట్‌ను తాము తయారు చేయలేదని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత దానిలోని అంశాల గురించి చర్చ జరపటంలో అర్ధం లేదు. కానీ బిజెపి వారు దాన్ని అంగీకరించటం లేదు, మీరే తయారు చేశారు అంటూ ఇవిగో అంశాలని అధికారికంగా చెబుతున్న మాటలు, ప్రచారాన్ని చూసిన తరువాత వారి తీరుతెన్నుల గురించి చర్చించాల్సి వస్తోంది. కరోనా రెండవ తరంగాన్ని గుర్తించటంలో, జాగ్రత్తలు తీసుకోవటంలో వైఫల్యంతో దిక్కుతోచని మోడీ యంత్రాంగ ప్రచారదాడిలో ఇది ఒక ఆయుధం. మన దేశంలో ఇంటర్నెట్‌ను ఎందరు ఉపయోగిస్తున్నారు. వారిలో సామాజిక మాధ్యమంలో ఎందరు ఉన్నారు. బిజెపి నేతలు అందచేస్తున్న వాటిని పంచుకొనే వారు ఎందరు, వారు ఎవరు అన్నది ప్రశ్న. చాలా తక్కువ అన్నది జవాబు. కానీ బిజెపి నేతలు చేసిన ప్రకటనలు, దాని మీద కాంగ్రెస్‌ స్పందన వార్తలను పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకున్నవారే ఎక్కువ. వారందరూ నరేంద్రమోడీకీ అంటించదలచిన లేదా అంటించినట్లు చెబుతున్న మచ్చ – రచ్చ గురించి చర్చించుకోవటం సహజం. ఆక్సిజన్‌ కూడా అందించలేని కేంద్ర నిర్వాకం చూసి విస్తుపోతున్న వారు ఒక వేళ కాంగ్రెస్‌ వారు నిజంగా అంటే మాత్రం తప్పేముందిలే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ కంటే బిజెపి వారే సినిమాల్లో మాదిరి మోడీ మచ్చ గురించి రచ్చ చేశారు. జనానికి ఎక్కువ మందికి తెలియ చేశారు. జనానికి లేని ే ఆలోచనను కలుగ చేశారు. నరేంద్రమోడీ రాజీనామా చేయాలంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్ల స్పందన మీద కాషాయ నటి కంగన రనౌత్‌ వెల్లడించిన ఆగ్రహం తీరు కూడా నరేంద్రమోడీ ప్రతిష్టను మరింత దిగజార్చింది తప్ప పెంచలేదు.


బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ ప్రజలను పట్టించుకోని పాలకుల గురించి ప్రపంచంలో ఒక కధ ఉంది. మన దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. అదేమంటే ” రాజుగారి వింత బట్టలు లేదా దిగంబర మహరాజు ” గురించి చాలా మంది వినే ఉంటారు. గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన కవితలో దిగంబర రాజు గురించి ప్రస్తావన రావటంతో దేశ వ్యాపితంగా ఆమె గురించి జనం మెచ్చుకుంటున్నారు. గతంలో సంఘపరివార పత్రిక ఒకదానిలో భవిష్యత్‌ గుజరాతీ కవయిత్రిగా వెలుగొందుతారు అని ఆమెను ప్రశంసించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె రాసింది మహా కావ్యమేమీ కాదు. దేశంలోని పరిస్ధితులను చూసి చలించి రాసిన పద్నాలుగు పంక్తుల ఆమె కవితలో నగరాజు, బిల్లా-రంగా పదాలకు ఎవరి భాష్యం వారు చెబుతున్నారు. నగరాజు అంటే నరేంద్రమోడీ, బిల్లా-రంగా అంటే మోడీ-అమిత్‌ షా అని సామాజిక మాధ్యమంలో వారి చిత్రాలతో సహా వర్ణించారు. గీతా-సంజరు అనే సోదరీ సోదరుల కిడ్నాప్‌-హత్యలో నేరగాండ్ల పేర్లు వేరే ఉన్నప్పటికీ వారు బిల్లా-రంగాలనే పేర్లతో వ్యవహరించిన వారన్నది తెలిసిందే.


దిగంబర రాజు కధ గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకుందాం. జనం గోడు పట్టని రాజుగారికి దుస్తుల సరదా. కొత్త కొత్తవి వేసుకొని పురవీధుల్లో తిరిగి తన దర్పాన్ని ప్రదర్శించుకోవటం అలవాటు. అలాంటి రాజు ఒక రోజు ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ధరించని వస్త్రాలను తయారు చేసి ఇవ్వాలని నేతగాండ్లను ఆదేశించాడట, అపని చేయకపోతే వారి సంగతి చూస్తానని బెదిరించాడు. దీంతో ఒక తెలివిగల యువకుడు ఒక రోజు ఉదయాన్నే వచ్చి రాజా మీరు కోరిన దుస్తులు తెచ్చాను ధరించండి అని చెప్పాడు. అదేమిటి నీ చేతుల్లో ఏమీ లేవు కదా అంటే రాజా అవి తెలివిగల వారికి మాత్రమే కనిపిస్తాయి, మిగతావారు చూడలేరు అన్నాడట. ఆ విషయం రాజ్యంలో వైరల్‌ అయింది. మరుసటి రోజు ఆ యువకుడు రాజుగారికి బట్టలు వేసినట్లు హావభావాలు ప్రదర్శించాడు. రాజు గారికి బట్టలేమీ కనిపించలేదు. నిండు పేరోలగంలో తెలివిగల వారికే కనిపిస్తాయని చెప్పినందున తనకు కనిపించటం లేదని అంటే తననెక్కడ తెలివి తక్కువ దద్దమ్మ అనుకుంటారో అనుకొని రాజు గారు బాగున్నాయి బాగున్నాయి అని పరివారంతో కలసి పురవీధుల సందర్శనకు వెళ్లాడు. రాజుగారిని విమర్శిస్తే పట్టే గతేమిటో జనానికి తెలుసు, దానికి తోడు తెలివి గలవారికే కనిపిస్తాయని అన్నారు గనుక ఎవరూ కనిపించలేదని చెప్పేందుకు ముందుకు రాలేదు. అయితే ఒక తల్లి చేతిలోని చిన్న పిల్లవాడు రాజుగారు దగ్గరకు రాగానే షేమ్‌ షేమ్‌ పప్పీ షేమ్‌ అంటూ నవ్వాడు. రాజుగారికి కోపం వచ్చి నేరుగా ఆ పిల్లవాడినే అడగ్గా అభశుభం తెలియని బాలుడు మీకు బట్టల్లేవు అందుకని నవ్వా అన్నాడట. వెంటనే రాజుగారికి అర్ధం అయింది.ఆ పిల్లవాడు కల్మషం లేకుండా తాను చూసింది చెప్పినట్లుగానే గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ కూడా కరోనా మరణమృదంగం, గంగలో కొట్టుకువస్తున్న శవాలు, పాలకుల నిర్లక్ష్యంతో దేశంలో ఉన్న పరిస్ధితి గురించి సహజంగానే స్పందించారు.

రైతు ఉద్యమానికి మద్దతుగా దిశా రవి అనే కర్ణాటక యువతి టూల్‌కిట్‌ను సరఫరా చేసిందంటూ దేశద్రోహం కేసును కేంద్ర ప్రభుత్వం బనాయించిన విషయం తెలిసిందే. దిశా రవిపై మోపిన ఆరోపణలో దేశద్రోహం కనిపించలేదంటూ బెయిలు మంజూరు చేశారు. తన గోప్యత ఉల్లంఘన, విచారణ న్యాయంగా జరగాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటీషన్‌ మీద మార్చి నెలాఖరులోగా సమాధానం దాఖలు చేసేందుకు ఆఖరి గడువు ఇస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు గతంలో కేంద్రానికి తెలిపింది. అయినా స్పందించలేదు. కరోనా కారణంగా దాఖలు చేయలేకపోయినట్లు మే 18వ తేదీన కేంద్రం చెప్పటం మీద హైకోర్టు మండిపడింది. ఆఖరి అవకాశం అంటే అర్ధం తెలియదా అని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆగస్టు నాటికి వాయిదా వేసింది.


ఇక టూల్‌కిట్ల విషయానికి వస్తే ప్రతి పార్టీ తన ప్రతినిధులు, టీవీ చర్చలలో పాల్గొనే వారికి, తమ అనుయాయి టీవీ ఛానళ్లు, రాతలు రాసే జర్నలిస్టులు, పత్రికలకు ప్రతి రోజూ ఒక టూల్‌కిట్‌ అందిస్తుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యం. వాటిని పట్టుకొని వారు తమ పాత్రలను తాము పోషిస్తారు.సింగపూర్‌ కరోనా వైరస్‌ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ చేసిన ప్రకటన బాధ్యతా రహితమని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తప్పు పట్టారు. ఒక ముఖ్యమంత్రిగా కేజరీ వాల్‌ అలా వర్ణించటం తగనిపని, తప్పదమే. ఒక వైరస్‌కు ఒక దేశం, ఒక ప్రాంతం, జాతి వంటి పేర్లను ఉపయోగించకూడదన్నది అంతర్జాతీయ ఒప్పందం. కానీ ఊహాన్‌, చైనా, కమ్యూనిస్టు వైరస్‌ అంటూ చర్చలలో బిజెపినేతలు ఉపయోగించటం తెలిసిందే. అలా ఉపయోగించకూడదని ఎన్నడూ బిజెపి బహిరంగప్రకటన చేయలేదు. అలా నిందించటం చైనాతో సంబంధాలను మెరుగుపరుస్తాయని అనుకుంటున్నారా ?

దిశ రవి టూల్‌కిట్‌ను పంచుకోవటం(షేరింగ్‌) దేశద్రోహంగా వర్ణించిన బిజెపి నేతలు ఇదిగో కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ అంటూ తాము అభ్యంతరం చెబుతున్నదానికి ఎందుకు తమ అనుయాయులతో పంచుకున్నట్లు ? అభ్యంతర వర్ణణలను ఎందుకు తామే వ్యాప్తి చేస్తున్నట్లు ? కాంగ్రెస్‌ టూల్‌ కిట్‌ నిజమైనదే అయితే అది నిజంగా ప్రధాని, ఇతర నేతలకు మచ్చ తెచ్చేది, విదేశీ జర్నలిస్టులకు తోడ్పడేదే అయితే బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం కేసు ఎందుకు దాఖలు చేయలేదు, మీడియా పరంగా ఎందుకు సమస్యను ముందుకు తెస్తున్నారనే ప్రశ్న సహజంగానే వస్తుంది. తమ నేతలే తనను గబ్బు పట్టిస్తున్నారనే అంశం నరేంద్రమోడీకి అర్ధం అవుతున్నదా ? అనే సందేహం తలెత్తుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను ఎవరేం కోరుతున్నారు : జనం నెగిటివ్‌ – నరేంద్రమోడీ పాజిటివ్‌ !

18 Tuesday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Coronavirus, COVID-19, Narendra Modi Failures, Negative, Positive, RSS, RSS Mohan Bhagavat, RSS Propaganda


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు జనమంతా తమకు నెగెటివ్‌ రావాలని కోరుకుంటున్నారు- మరోవైపు నరేంద్రమోడీకి పాజిటివ్‌ రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది. ఇదేమిటనుకుంటున్నారా ? అవును నిజం… అవును నిజం. కరోనా వైరస్‌ గురించి జనం నెగెటివ్‌ రావాలని అనుకుంటుంటే – కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యం మీద జనంలో వస్తున్న వ్యతిరేకతను పాజిటివ్‌గా మార్చాలని సంఘపరివార్‌ నడుం కట్టింది. ఆ కసరత్తులో భాగంగా అనేక చర్యలు తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, ఎత్తుగడలు తెలిసిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. అన్ని తరగతుల్లోనూ ప్రత్యక్ష, పరోక్షంగా తీవ్ర విమర్శలకు గురైన నరేంద్రమోడీని పూర్తిగా భుజాన వేసుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోతాయి.పిర్ర గిల్లి జోల పాడినట్లుగా విమర్శించినట్లూ ఉండాలి- ఆదుకోవాలి అనే ఎత్తుగడలో భాగంగా ” పరిమితులు లేని సానుకూలత ” అనే ఇతివృత్తంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) ఐదు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని ముగింపు వక్తగా భగవత్‌ పాల్గన్నారు. ఆ సంస్ధ ఏర్పాటు చేసిన కరోనా స్పందన బృందంతో కలసి దీన్ని నిర్వహించారు. దీనిలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఇదేవిధమైన ఉద్బోధలు చేశారు. వంద వేదికల ద్వారా ఈ ఉపన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.


అన్నమైతేనేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా వక్తలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. కరోనా తొలి తరంగం తరువాత ప్రభుత్వం-జనం ఇద్దరూ నిశ్చింతగా ఉన్నారు ఇద్దరూ తప్పు చేశారు అందువలన సానుకూలంగా ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం అన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పారు. కరోనా మొదటి దశపై విజయం సాధించామని ప్రకటించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనంగా ఉంది. నిపుణులు చేసిన హెచ్చరికల గురించి ఏం చేశారని ఆరా తీసిందో లేదో తెలియదు. రెండవ దశ పరిస్ధితి ఆందోళనకరంగా తయారైంది. ఇంటా బయటా తీవ్ర విమర్శలు, వైఫల్యాల గురించి జనం మాట్లాడుకోవటం ప్రారంభించగానే ఆ సంస్ధలో ఆందోళన మొదలైంది, నష్ట నివారణ చర్యల్లో భాగంగానే జనానిది, ప్రభుత్వానిది ఇద్దరిదీ తప్పు ఉందంటూ ప్రచారం మొదలు పెట్టింది. జనంలో అసంతృప్తి మోడీ పలుకుబడిని తగ్గిస్తుందా పూర్తిగా దిగజారుస్తుందా అన్న మదింపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాను పెంచి పెద్ద చేసిన వ్యక్తి, ప్రభుత్వం గురించి అలా ఆలోచించటం సహజం. రెండోది జరిగితే పరివార్‌ అజెండాకు ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పుడు గౌరవ ప్రదంగా మోడీని పక్కన పెడతారు. అసంతృప్తి తాత్కాలికమే అయితే కొనసాగిస్తారు. దానికి తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవటం తప్ప వ్యక్తులుగా ఎవరినైనా ఉపయోగించుకుంటుంది.అందుకు ఏమైనా చేస్తుంది.

వాజ్‌పారు బతికి ఉండగా కూడా అందరికీ తెలిసిన, నలుగురిలో నానిన విషయాన్నే ఇప్పుడు ” జుగుల్‌ బందీ ” పేరుతో గ్రంధస్ధంగావించిన వినరు సీతాపతి పేర్కొన్నారు. రాజకుమారి కౌల్‌ అనే వివాహితతో వాజ్‌పేయి సంబంధం తెలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు గురుగోల్వాల్కర్‌, నానాజీదేశముఖ్‌ ఆమెకు దూరంగా ఉండాలని ఇచ్చిన ఆదేశం లేదా హితవును వాజ్‌పేయి తిరస్కరించి జీవితాంతం కొనసాగించారు. ఒకే ఇంట్లో ఉన్నారు. దీని గురించి సంఘపరివార్‌ సర్దుకుపోయింది గానీ వాజ్‌పాయిలో మార్పులేదు. విలువలు-వలువల గురించి కబుర్లు చెప్పే సంఘపరివార్‌ నాయకత్వానికి ఇవన్నీ తెలిసినప్పటికీ వాజ్‌పారు-అద్వానీ ఇద్దరిలో సౌమ్యుడిగా పేరున్న వాజ్‌పారును ప్రధానిగా చేయటం ద్వారా మిగతా పార్టీల మద్దతు కూడ గట్టవచ్చు అన్న దూరాలోచనతో నిర్ణయానికి వచ్చింది. బిజెపి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కె ఎన్‌ గోవిందాచార్య బ్రిటీష్‌ దౌత్యవేత్తలతో మాట్లాడుతూ పార్టీకి వాజ్‌పాయి ఒక ముసుగు మాత్రమే అసలైన నేత అద్వానీయే అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటలతో ఆయన ఉద్యోగం ఊడిందనుకోండి అది వేరే విషయం. తరువాత గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ ” పని తనాన్ని ” చూసిన తరువాత అద్వానీని పక్కన పెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయే అసలు సిసలు వ్యక్తిగా మోడీని గుర్తించి ముందుకు తెచ్చిన కథ తెలిసిందే. కరోనా రూపంలో వచ్చిన మహమ్మారికి మతం లేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా ప్రకారం నడిచేది కాదు గనుక చివరికి మోడీ పదవికి ముప్పు తెచ్చిందా ?


కరోనా వైఫల్యం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ మీద వీర భక్తి ఇప్పటికీ అనేక మందిలో పతాక స్ధాయిలోనే ఉంది. జనానికి ఆక్సిజన్‌ అందించలేకపోతే అదే జనం మోడీ అధికార ప్రాణవాయువును లాగేస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు కార్పొరేట్లకు కూడా మోడీ ” తగిన ” వ్యక్తి అని ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నారు గనుక ప్రధానిగా గద్దెనెక్కించటానికి వారు కూడా ” చేయాల్సిందంతా ” చేశారు. ప్రపంచ బ్యాంకు నమ్మిన బంటుగా అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్లకు ఇష్టుడిగా ఉన్నారు కనుకనే మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాటు పదవిలో కొనసాగారు. ఆయనకు కొన్ని పరిమితులు ఏర్పడిన తరువాత అపరిమిత సానుకూలంగా వ్యవహరించేందుకు నరేంద్రమోడీ సరైన నేతగా కనిపించారు. కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది, కరోనా దాన్ని వేగవంతం చేసింది. ఈ దశలో గత ఏడు సంవత్సరాల మాదిరే కార్పొరేట్లకు దోచిపెడితే జనం ఊరుకోరు, ఒకసారి తినటానికి అలవాటుపడిన కార్పొరేట్లకు వాటా తగ్గితే అవి సహించవు. ఇదే సమస్య. దీన్ని సంఘపరివార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది కొంతకాలం చూడాల్సిందే. అవసరమైతే మరొకరిని ముందుకు తేవాలనుకుంటే కాస్త సద్దుమణిగిన తరువాత చేయాల్సిన పని చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏమీ చేయదు. గతంలో మొరార్జీ దేశారు ప్రభుత్వానికి ముందు రోజు వరకు వీర విధేయుడిగా మాట్లాడిన జార్జిఫెర్నాండెజ్‌ తెల్లవారేసరి ఎలా ప్లేటు ఫిరాయించారో చూశాము. అనేక మంది ప్రముఖులు పార్టీ మారే ముందు కూడా ఇలానే ఉంటున్నారు. పరివారం తలచుకుంటే తెల్లవారే సరికి పరిస్ధితి మారిపోతుంది.భక్తులు కొత్త దేవుడి భజనకు మారటం చొక్కా మార్చినంత సులభం !


కరోనా వైరస్‌ మొదటి దశలో, రెండవ దశలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రతిపక్ష పార్టీలన్నీ సానుకూలంగానే తీసుకున్నాయి. ఎక్కడా వాటికి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపు ఇచ్చిన ఉదంతం లేదు. తమ స్వస్ధలాలకు చేరేందుకు జనానికి తగిన వ్యవధి, రవాణా ఏర్పాట్లు చేయకుండా గతేడాది ప్రకటించిన లాక్‌డౌన్‌, 27లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించిన కేంద్రం వలస కార్మికులు స్వస్ధలాలకు చేరేందుకు అయ్యే రైలు ఛార్జీలను ఎవరు భరించాలనే చిన్న అంశంపై చేసిన రచ్చ , ఆత్మనిర్భర పాకేజి బూటకం గురించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తప్ప మిగతా వన్నీ అపరిమిత సానుకూలమే.


ఇక వర్తమానానికి వస్తే సంఘపరివార్‌ ఇప్పుడు జనంలో మోడీ సర్కార్‌ పట్ల సానుకూల వైఖరిని ఎక్కించేందుకు ఎందుకు పూనుకున్నది అన్న ప్రశ్న. ఇదేమీ సమాధానం చెప్పక పోతే తలలు ఎగిరిపోయే సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న కాదు. దీని గురించి పైనే చెప్పుకున్నాం. నిపుణుల అభిప్రాయాలు, హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన వర్తమాన నీరో, అదృశ్యమైన పాలన, పాలకులంటూ ఒక పత్రిక పెట్టిన శీర్షిక చాలు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటానికి. సజావుగా సాగుతోందనుకుంటున్న తన అజెండా అమలుకు విఘాతం కలిగే విధంగా మోడీ సర్కార్‌ వ్యవహరించిందని సంఘపరివార్‌ గ్రహించటమే ఈ నష్ట నివారణ చర్య. మోహన్‌ భగవత్‌ గారు చెప్పినదాన్ని సానుకూలంగా తీసుకుంటే ప్రభుత్వం- జనం కూడా నిశ్చింతగా ఉన్నారు.ఇద్దరిదీ తప్పే. దాన్నే మరోవిధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేశారు. జనంతో ఉన్నామని చెప్పుకొనే, పరిస్ధితిని ఎప్పటికప్పుడు కన్నార్పకుండా పరిశీలించే పరివార్‌ నిపుణులు ఏం చేస్తున్నారు ? ఆర్నాబ్‌ గోస్వామి వంటి కాషాయ మీడియా పెద్దలేమి హెచ్చరికలు చేశారు అన్నది ప్రశ్న. ఇది ” దేశ భద్రత అంశం ” కనుక సమాధానాలు చెప్పరు. జనం బాధ్యతాయుతంగా వ్యహరించటం లేదనే ప్రచారం గత కొద్ది వారాలుగా సామాజిక మాధ్యమంలో, బిజెపి ప్రతినిధుల చర్చలలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇది, ప్రశ్నించేవారి నోరు మూయించే ఎదురుదాడి వ్యూహం. భగవత్‌గారు ఇచ్చిన సలహా ఏమిటి ? సమాజానికి తోడ్పడాలంటే యోగా చేయాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి. గతేడాది మోడీ గారు ఇచ్చిన గ్లాసులు, పాత్రల మోగింపు, దీపాలు వెలిగింపు కార్యక్రమానికి దీనికి పెద్ద తేడా ఏముంది. అంతేనా కరోనాతో చస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పునర్జన్మ గురించి భారతీయులకు వేరే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది నిర్లక్ష్యం చేసిన జనానికి చెప్పారు బానే ఉంది, మరి లక్షలాది మంది పునర్జన్మకు కారకులౌతున్న నరేంద్రమోడీ గారి సంగతేమిటి ?


” కరోనా తొలి తరంగం తరువాత జనం, ప్రభుత్వాలు, యంత్రాంగాలు దారి తప్పాయని అందరికీ తెలుసు, వైద్యులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ అందరూ ఇప్పటికీ దారి తప్పి ఉన్నారు. అందుకే మనం ఈ రోజు ఈ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు మూడవ తరంగం గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి, అయితే మనం భయపడాలా, కూడదు. అన్ని విబేధాలను మరచిపోయి అందరం ఐక్యంగా పనిచేయాలి. ప్రస్తుతానికి లోపాల చర్చలను నిలిపివేయాలి, ఒక జట్టుగా పనిచేయాలి.” అని భగవత్‌ చెప్పారు.


ఎంత చక్కటి మాట ? నిజంగా అభినందించాల్సిందే. నరేంద్రమోడీ గారు పరివార్‌ కుటుంబ సభ్యుడే. ప్రతి ఏటా తన ప్రభుత్వ పని తీరు గురించి దాని నాయకత్వానికి విధేయుడిగా నివేదించటం తెలిసిందే. సరిగ్గా ” పరిమితులు లేని సానుకూలత ” గురించి ఉపన్యాసాలు ఇప్పిస్తున్న సమయంలోనే పన్నెండు ప్రతిపక్ష పార్టీలు నరేంద్రమోడీకి ఒక లేఖ రాశాయి. అంతకు ముందు ఎలాగూ అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా యుద్దం మీద తీసుకుంటున్న చర్యలను వివరించలేదు, తరువాత అయినా నరేంద్రమోడీ ఎందుకు సానుకూలంగా స్పందించలేదు ? ప్రతిదాన్నీ విమర్శించే ప్రతిపక్షాలతో సమావేశం జరిపి ప్రయోజనం లేదని టీవీల్లో బిజెపి ప్రతినిధుల సమర్ధన. సానుకూల నాటకం భలే సాగుతోంది కదూ !


పుండు మీద కారం రాయటం అంటే ఇదేనా ?

కరోనాతో ఆకస్మికంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు, అనాధలైన పిల్లల గురించి, వీధులపాలైన బతుకుల గురించి రోజూ విషాదకర కథనాలు వెలువడుతున్నాయి.చివరి చూపుకు సైతం నోచుకోవటం లేదు. ఏ రోజు ఎవరి వంతు వస్తుందో తెలియని స్ధితిలో ఉన్న జనానికి భగవత్‌ గారు చెప్పిందేమిటి ? ” భారత పౌరుల గురించి మనకు తెలుసు. జీవన్మరణాల చక్రం తిరుగుతూనే ఉంటుందనీ మనకు తెలుసు. అది ఎలా అంటే పాతపడిన, జీర్ణావస్తలో ఉన్న దుస్తులను మనం ఎలా మార్చుకుంటామో అదే మాదిరి ముసలితనం, పనికిరాని శరీరాన్ని వదలి కొత్త శరీరం కోసం మానవులు ముందుకు పోతారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు మరియు ఈ పరిస్ధితి మనల్ని భయపెట్టటం లేదా కలవరప్టెకూడదు ”
ఇక భగవత్‌ గారు చెప్పిన ఇతర విషయాలకు వస్తే జనం అనుభవంలోకి రాని, శాస్త్రీయంగా రుజువు గాని వాటిని ఆయుర్వేదం పేరుతో చెప్పేవాటిని, శాస్త్రాలు చెప్పని వాటిని నమ్మవద్దని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితిని సమాజం తిరస్కరించాల్సిన అవసరం లేదు, ఏమీ జరగలేదు, అంతా బాగుంది అనే భావాలకు చోటివ్వాలి, శరీరం వైరస్‌ను ప్రతిఘటించాలి, మనస్సు సానుకూలంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఉపాధి, ఆర్ధికరంగాలలో సంక్షోభం, ద్రవ్య సంబంధ వెనుకబాటు తలెత్తనుంది, దానికి మనం సిద్దంగా ఉండాలి.


ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ రవిశంకర్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, అజీమ్‌ ప్రేమ్‌ జీ వంటి వారు ధర్మోపన్యాసాలు చేశారు.సానుకూల ధోరణి అవలంభించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.వారు చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.యోగా, ఆయుర్వేదం రోగ నిరోధక శక్తిని పెంచుతుందనే ప్రచారం ఇప్పటిది కాదు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా అదే పాట పాడారు.
” ప్రభుత్వం పట్ల ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. మీడియాను, వీక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నించటం, ఒకరి నొకరు దెప్పుకోవటం వలన మీరు సమస్యలో భాగం అవుతారు తప్ప పరిష్కారంలో కాదు.దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు తగినన్ని లేవు అయితే తెల్లవారేసరికి మార్పు రాదు.” జగ్గీవాసుదేవ్‌.
మనలో దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని మేల్కొలపాలి. దేవుడు ఉన్నాడని మనకు విశ్వాసం ఉండాలి.మనం బలహీనంగా, నిరుత్సాహంగా ఉన్నట్లు అనుకుంటున్నాము. ఇలాంటి సమయాల్లో నిర్భరతను కోల్లోకూడదు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే వత్తిడి నుంచి దూరం అవుతాము” శ్రీ శ్రీ రవి శంకర్‌.
” అనేక మంది పునర్మజన్మ గురించి పరిశోధనలు చేశారు. అది ఉన్నందున మరణం గురించి భయపడకూడదు. కరోనాతో మరణించినప్పటికీ తదుపరి జన్మలో కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఐదు పది సార్లు ఓం కారాన్ని పలికితే బలం వస్తుంది. సానుకూల వైఖరి కలిగిస్తుంది.” సామాజిక కార్యకర్త నివేదిత భిడే. మూడు నిమిషాలు మాట్లాడిన విప్రో సిఇఓ అజీమ్‌ ప్రేమ్‌ జీ పేదల్లో అత్యంత నిరుపేదలను ఇప్పుడు అదుకోవాలన్నారు. మంచి శాస్త్రాల మీద ఆధారపడిన చర్యలను వేగంగా అన్ని రంగాలలో తీసుకోవాలన్నారు. విబేధాలను మరచి అందరూ ఐక్యం కావాలన్నారు.

కరోనిల్‌ అనే ఔషధం కరోనా చికిత్సకు పనికి వస్తుందనే ప్రచారంతో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్న రామ్‌దేవ్‌ బాబా ఆస్తా టీవీ ఛానల్లో ఆక్సిజన్‌ కొరత గురించి ప్రస్తావించిన వారితో చెప్పిన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూడండి.” మనకు దేవుడు ఇక్కడ రెండు సిలిండర్లు ఇస్తే జనాలు బయట ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం చూస్తున్నారు. వాటిని ఉపయోగించండి అమాయకులారా ” అంటూ గుండెలోని ఊపిరితిత్తులను చూపారు. ”ఇక్కడ రెండు సిలిండర్లు ఉన్నాయి. మీ రెండు కాళ్లు ఇద్దరు వైద్యుల వంటివి, మీ రెండు చేతులు ఇద్దరు నర్సుల వంటివి ” అన్నారు. ఇదే పెద్ద మనిషి ఆవనూనె పీలిస్తే కరోనా వైరస్‌ నశిస్తుందని సెలవిచ్చిన విషయం తెలిసిందే. భోపాల్‌ బిజెపి ఎంపీ, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఆవు మూత్రం తాగి కరోనా సోకుండా ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

దృష్టి మళ్లించే ఎత్తుగడలు


ఒకవైపు ఢిల్లీ శివార్లలోని రైతులంతా వెళ్లిపోయారని ప్రచారం చేశారు. కొంత మంది వెళ్లారు తప్ప నిరసన శిబిరం ఖాళీ కాలేదు. వేలాది మంది అక్కడే ఉన్నారు. అయితే గోధుమ కోతల తరుణంలో గ్రామాలకు చేరుకున్న వారు ఆపనులు పూర్తయిన తరువాత, కొత్త రైతులు తిరిగి ఢిల్లీ శివార్లకు వస్తున్నారన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో మే నెల 14వ తేదీన నరేంద్రమోడీ నోటివెంట పిఎం కిసాన్‌ నిధుల అందచేత ప్రకటన వెలువడింది. పోనీ వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు విధించినా ఆర్ధిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో, ఎంత మందికి ఉపాధి కల్పించారో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో వంటి విషయాలను ప్రకటిస్తూ వాటితో పాటు రైతుల నిధుల గురించి చెబితే సాధారణ వ్యవహారం అనుకుంటారు.వాటి గురించి ఆందోళనకరమైన వార్తలు ఎన్ని వచ్చినా నోరు విప్పని వారు దీని గురించి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే మోడీ అజెండాలో కరోనా లేదన్నది స్పష్టం.


తాను కరోనా గురించి ఎంతో ఆవేదన, బాధ పడుతున్నట్లు మోడీ చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ఇది ఓదార్పు అనుకుందాం. సురక్షితమైన చేతుల నుంచి చేతల బాధ్యత కదా ఇప్పుడు కావాల్సింది.టన్నుల కొద్దీ ఆవేదన వ్యక్తం చేస్తే ఒక లీటర్‌ ఆక్సిజన్‌ అవుతుందా ? ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపడతాయా ? కావాల్సిన ఔషధాలు దొరుకుతాయా ? కరోనాపై పోరు, యుద్దం, సమూల నాశనం వంటి ఉపమాలంకారాలతో కూడిన మాటలు బాధితులకు ఉపయోగపడవు. యుద్దాన్ని ఎదుర్కొనే తీరులో సన్నాహాలు, చర్యలు ఉన్నాయా? అధికారాలను ఉపయోగిస్తున్నారా ? అందరికీ ఉచితంగా వేస్తామన్న వాక్సిన్‌ విషయంలో మడమ తిప్పారు, జనానికి విశ్వాసం కల్పించలేకపోగా సగం భారాన్ని రాష్ట్రాల మీద నెట్టారు. రాష్ట్రాలకు అధిక రేటు, కేంద్రానికి తక్కువ రేటట. ఏమిటీ వ్యాపారం ? వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోది, వాటిదే బాధ్యత అంటున్నారు. మీ పరిధిలోని ఆక్సిజన్‌ కూడా అందించలేని పరిస్ధితి ఎందుకు తలెత్తింది అంటే జవాబు లేదు. దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు. అసలు సమస్య ఏమంటే తమ వైఫల్యాలను అంగీకరించేందుకు బిజెపి నేతలు సిద్దంగా లేరు. ఆక్సిజన్‌ కొరత అన్నది దేశ వ్యతిరేకులు చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ వర్ణించారు.

కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని ప్రధాని చెప్పారు. దాని మీద విజయం సాధించామని చెప్పినపుడు కనిపించిందా ? హెచ్చరికలను పెడచెవిన పెట్టినపుడు ఎక్కడైనా నక్కిందా ? ప్రపంచ వ్యాపితమైన మహమ్మారిని జయించినట్లు ప్రకటించాల్సింది ప్రపంచ ఆరోగ్య సంస్ద తప్ప ఒక దేశం కాదు. చైనా వంటి దేశాల్లో కొత్త కేసులేవీ లేనందున అదుపులో ఉంచామని చెబుతున్నారు తప్ప జయించామని వారే చెప్పలేదు. మరి మన దేశం ఏ సాధికారతతో అలాంటి ప్రకటనలు చేసినట్లు ?కేరళ ముఖ్యమంత్రి ప్రతి రోజూ విలేకర్లతో మాట్లాడుతున్నారు, కరోనా, ఇతర అంశాలను చెబుతున్నారు. ప్రధానికి విలేకర్లతో మాట్లాడే అలవాటు లేదు కనుక ఎవరూ ఆశించరు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఏమయ్యారు. అందుకే కదా అవుట్‌లుక్‌ పత్రిక ఏడేళ్ల వయసున్న ప్రభుత్వం కనపడటం లేదు అని ముఖచిత్ర కధనాన్ని రాసింది. అది కూడా ” జాతి వ్యతిరేకుల ” శిబిరంలో చేరింది. ఒక నాడు సంఘీయుల ప్రశంసలు అందుకున్న గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన కవిత మే 11వ తేదీ నుంచి దేశంలో వైరల్‌ అవుతోంది. అన్ని భాషల్లోకి అనువదించి వ్యాపింప చేస్తున్నారు. నరేంద్రమోడీని నగచక్రవర్తితో పోల్చి తన ఆవేదనను వ్యక్తం చేసి ఇప్పుడు పరివార్‌ ఆగ్రహానికి గురయ్యారు.శీలము, ఏకత, సంస్కారం గురించి మాట్లాడేవారు నోరుబట్టని బూతులతో ఆమెను ట్రోల్‌ చేస్తున్నట్లు వార్తలు. ఎంతలో ఎంత మార్పు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌ పోస్టర్లు : కేసులతో నరేంద్రమోడీని గబ్బు పట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు !

17 Monday May 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, Aam Aadmi Party, Delhi Police, Delhi Vaccine Posters


ఎం కోటేశ్వరరావు
మలయమారుతం వీస్తున్నపుడు, చిరు జల్లుల మబ్బుల కింద అహౌ… తీపి కబుర్లు చెప్పమని ఎవరు- ఎవరిని ఏమి అడిగినా సానుకూల ఫలితాలు వస్తాయి. అదే గాలి దుమారం రేగినపుడు, తుపాను ముంచుకు వస్తున్నపుడు ముద్దు ముచ్చట్లాడుకుందాం అంటే ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ కార్యక్రమానికి అదే ఎదురైంది. ” నూటముప్పయి కోట్ల మంది సానుకూలత శక్తి గురించి పండుగ చేసుకొనేందుకు ఈనెల మన్‌కీ బాత్‌ తిరిగి వచ్చింది. ఉత్తేజకరమైన కథలు ఉంటే ప్రధాని నరేంద్రమోడీతో పంచుకోండి ” అని ప్రధాని యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉన్న జాబితాలోని వారికి, బహిరంగంగా ట్వీట్‌ చేశారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని అన్ని విధాలుగా వైఫల్యం చెందినట్లు చివరికి నిన్నటి వరకు భజన చేసిన మీడియా కూడా చెబుతున్న తరుణంలో మన్‌కీబాత్‌ ఉపన్యాసం తయారు చేసే వారికి తత్వం బోధపడినట్లు లేదు.ఫ్రాన్సులో 1789లో ఫ్రెంచి రాణి మేరీ ఆంటోనెటెతో అమ్మా మన ఏలుబడిలో జనానికి రొట్టె దొరకటం లేదు అని సహాయకులు విన్నవించినపుడు రొట్టె లేకపోతే కేకులు తినమనండి అని సెలవిచ్చిన ఉదంతాన్ని మోడీ యంత్రాంగం గుర్తుకు తెచ్చింది. యధా రాజా తధా అధికార కదా మరి !


ఏ మూల నుంచి ఏ విషాద గాధ వినాల్సి వస్తుందో, ఆదుకొనే వారెవరో తెలియటం లేదు అని జనం భయపడుతున్నారు.రామ రాజ్యాన్ని ఏలుతున్న ఓ నగ చక్రవర్తీ శవవాహిని గంగను చూడవయ్యా అంటూ గతంలో కాషాయ శ్రేణుల ప్రశంసలు అందుకున్న గుజరాత్‌కు చెందిన పారుల్‌ ఖక్కర్‌ వంటి కవయిత్రులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే , మన ప్రధాని మన్‌కీ బాత్‌ కోసం ఉత్తేజకరమైన కరోనా విజయ గాధలను పంపండి అంటూ అధికార యంత్రాంగం కోరింది. రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి చరిత్రను జ్ఞప్తికి తేవటం లేదూ. ప్రధాని యంత్రాంగమింకా కరోనాపై విజయం సాధించామన్న ప్రచార హౌరులోనే ఉన్నారు తప్ప వాస్తవంలో లేరని తేలిపోయింది. ఈ ఉత్తేజకర గాధల ట్వీట్‌ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో అధికార యంత్రాంగం దాన్ని వెనక్కు తీసుకుంది.
కరోనా పోరులో భాగంగా ధ్యానం, యోగా చేయాలన్న ప్రధాని సూచనను పంచుకోండి అంటూ మే పదకొండవ తేదీన ఆయన యంత్రాంగం చేసిన మరొక ట్వీట్‌ కూడా అభాసుపాలైంది. జనానికి ఆక్సిజన్‌, ఆసుపత్రులు, ఔషధాలు, వెంటిలేటర్లు కావాలి ప్రభో అంటుంటే వాటి సంగతి చెప్పకుండా ధ్యానం చేయమంటారేమిటి అని నెటిజన్లు ఆగ్రహం వెలిబుచ్చారు.అయ్యా మేం పేదవారం మృత్యువుతో పోరాడాలా ? యోగా చేయాలా ? మీరు యోగా చేయాలంటున్నారు. మేం యోగాను ప్రారంభిస్తే ఆసుపత్రి బయట వేచి ఉన్న మా తలిదండ్రులు, పిల్లలను ఎవరు చూడాలి అని ఒక వ్యక్తి ప్రశ్నించిన తీరు వైరల్‌ అయింది.


అధికార యంత్రాంగం ఎందుకిలా వ్యవహరించినట్లు ? ఏప్రిల్‌ 30వ తేదీన జరిగిన ఉన్నతాధి కారుల వర్క్‌షాపులో ప్రభుత్వం తీసుకుంటున్న ‘ సానుకూల చర్యలు, పని మీద ‘ మరింత మెరుగ్గా ప్రచారం చేయటం గురించి చర్చించారు. విదేశీ రాయబారులు, హైకమిషనర్లు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్సులో విదేశాంగ మంత్రి జై శంకర్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ మీడియాలో ఏకపక్షంగా వెలువడుతున్న కధనాలకు ధీటుగా తగిన సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. దాని కొనసాగింపుగా మే 12వ తేదీ బిజెపి మీడియా జాతీయ బృంద సభ్యుడైన సుదేష్‌ వర్మ రాసిన ఒక వ్యాసాన్ని బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ట్వీట్‌ చేశాయి. ” ఎంతో కష్టపడి పని చేస్తున్న ప్రధాని మోడీ- ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దు ” అని దానికి పేరు పెట్టారు. దానిలో ఒక పేరాలో ఇలా ఉంది. ” ఒక సంక్షోభం వచ్చినపుడు నిశ్శబ్దంగా పని చేసేందుకు ప్రయత్నించే ఒక ప్రధాని ఇక్కడ ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించటం ముఖ్యం తప్ప రాజకీయ ప్రకటనలకు స్పందించరు. ఆయన తన యావత్‌ శక్తిని మళ్లించి రెట్టింపు వేగంతో పని చేసేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు దృష్టిపెడతారు. ఆయన కూడా ఇతరుల మాదిరే పసిపిల్లల్లా రోదిస్తే పరిష్కారాలతో ఎవరు ముందుకు వస్తారు ” అని రాశారు. నిజంగా ప్రధాని అసహాయతతో రోదిస్తే సానుభూతి వెల్లువెత్తేదేమో ! లేదా సమస్యలను పరిష్కరిస్తే ఇంటా బయటా ఇన్ని విమర్శలు వచ్చేవా, ఢిల్లీలో ఏడేళ్ల ప్రభుత్వం కనపడటం లేదు అని రాయగలిగే వారా ? అతిధుల ముందు మన గొప్ప చెప్పరా మంకెన్నా అంటే మా ఆయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత ఉంటాయి బాబయ్యా అన్నట్లుగా పరిస్ధితి ఉంది.


దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఎలా పెరిగిందో, ఆక్సిజన్‌లేక ఎంత మంది మరణించారో, హైకోర్టు, సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో పదే పదే చెప్పుకోనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని నరేంద్రమోడీ – మోడీ అంటే ప్రభుత్వమే అన్నట్లుగా పరిస్ధితి తయారైన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ వాక్సిన్‌ విధానాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు వేశారు. వాటిని చూసీ చూడనట్లు ఉంటే మొత్తం ఢల్లీీ వాలాలకు, దేశంలోని యావత్‌ జనాలకు తెలిసేది కాదు. కానీ ఢిల్లీ పోలీసులా మజాకానా ” నరేంద్రమోడీ ఖ్యాతిని ప్రపంచ వ్యాపితం ” కావించేందుకు పూనుకున్నారు. పాతిక మందిని అరెస్టు చేశారు, మరి కొందరికోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అది అంతర్జాతీయ వార్త అయింది. పోస్టర్లు వేయటం వెనుక ఎవరున్నారని పోలీసులు విచారణ చేపట్టారు. రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు పాతి ఖ్యాతిని అంతర్జాతీయం చేసిన వారే వీరు. కొంత మంది అనుమానితులను పట్టుకుంటే వారు స్ధానిక ఆమ్‌ ఆద్మీనేత పేరు చెప్పారట. వారు నిజంగానే చెప్పారో లేక పోలీసులే ఎవరో ఒకరి మీద కేసులు పెట్టాలి గనుక అలా చెప్పించారో మనకు తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఆమ్‌ ఆద్మీది, పోలీసులు మాత్రం బిజెపి అమిత్‌ షా ఆధీనంలో పని చేస్తారు కనుక ఏమైనా జరిగి ఉండవచ్చు. పోస్టర్లను తామే వేశామని ఆమ్‌ ఆద్మీ స్ధానిక నేతలు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇంతకీ హిందీ భాషలో ముద్రించిన ఆ పోస్టర్లలో ఏమి ఉంది.” మన పిల్లలకు వేయాల్సిన వాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపారు ప్రధాని మోడీ గారూ ” అని ప్రశ్నించారు. మా దేశంలో తయారైన టీకాలు ముందుగా మాకే అని అమెరికా, బ్రిటన్‌ ఒక్కటంటే ఒక్క డోసు కూడా బయటకు పంపలేదు. మన దేశంలో టీకాలకు అవసరమైన ముడి పదార్దాలు, వస్తువుల మీద అమెరికా ఏకంగా నిషేధమే విధించిన నేపధ్యంలో మన ప్రభుత్వం విదేశాలకు టీకాలు పంపటం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వచ్చింది.దీనిలో తప్పేముందో, దేశద్రోహం లేదా మోడీ గారి ప్రతిష్టకు వచ్చిన ముప్పేమిటో ఎవరికైనా అర్ధం అవుతోందా ? గత కొద్ది రోజులుగా టీవీ చర్చలలో, నేతల వ్యాఖ్యల్లో ఇలా ప్రశ్నించిన వారు లేదా విమర్శించిన వారు ఎందరో ఉన్నారు.లేదూ అలా ప్రశ్నించటం తప్పయితే తప్పని చెప్పండి, విలేకర్ల సమావేశాలు పెట్టే , ప్రశ్నలను ఎదుర్కొనే అలవాటు, ధైర్యం ఎలాగూ లేదు గనుక ఎలా తప్పో మన్‌కీబాత్‌లో చెప్పి జనాన్ని ఒప్పించండి. ప్రకటనలు, వ్యాఖ్యలు చేయటానికి వాటిని పోస్టర్లుగా ముద్రించి గోడల మీద అంటిచటానికి పెద్ద తేడా ఏముంది ? కేసులేమిటి ? అరెస్టులేమిటి ?


వాక్సిన్లు ఎగుమతి చేయటాన్ని మోడీ ఘనతగా, చైనాతో పోటీ పడి వాక్సిన్‌ దౌత్యంతో ఇతర దేశాలను ఆకట్టుకున్నట్లు చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు. ఆ విధానాన్ని ఎవరైనా తప్పు పడితే సహించరా ! ఇదేమి ప్రజాస్వామ్యం !! ” మహమ్మారి సమయంలో యావత్‌ ప్రపంచం ఒక్కటే.ఒక అంటువ్యాధి మహమ్మారిగా మారినపుడు యావత్‌ ప్రపంచాన్ని ఒకటిగానే భావించి దాన్ని అదుపు చేయాలి.టీకాలు వేసే ప్రపంచ కార్యాచరణలో భాగమే వాక్సిన్ల ఎగుమతులు. ” ఈ మాటలు మార్చి 11వ తేదీన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మోడీ సర్కారే స్వయంగా చెప్పింది. అంతే కాదు, తొంభై దేశాలకు మేడిన్‌ ఇండియా కోవిడ్‌-19 వాక్సిన్‌ సరఫరాల్లో భాగంగా 663.698 లక్షల డోసులు(ఆరుకోట్ల 63లక్షలకు పైగా) జనవరి- ఏప్రిల్‌ మధ్య ఎగుమతి చేసినట్లు విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇది నరేంద్రమోడీ సర్కార్‌ వాక్సిన్‌ దౌత్యంలో భాగం సాధించిన ఘనతగా వర్ణించారు. ఇంతేకాదు, ఒకేసారి పెద్ద మొత్తంలో వాక్సిన్‌ అందిస్తే జనాలకు వేసే యంత్రాంగం, సౌకర్యాలు లేవని కూడా కేంద్రం పేర్కొన్నది. తీరా మహమ్మారి తీవ్రత పెరిగి వాక్సిన్లకు డిమాండ్‌ ఏర్పడటంతో అవసరాలకు అనుగుణ్యంగా అందించలేని స్ధితి. నెల రోజులకు రెండవ డోసు వేస్తామన్న వారు ఇప్పుడు నెలల వ్యవధి గురించి చెబుతున్నారు. అసలు విషయం వాక్సిన్‌ కొరతను దాచిపెట్టటమే. కొద్ది వారాల క్రితం ఎగుమతుల గురించి ఘనతగా ప్రచారం చేసుకున్న బిజెపి పెద్దలకు విమర్శల సెగ తగలటంతో ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఎగుమతి చేసిన ఆరుకోట్ల డోసుల్లో ఒక కోటి మాత్రమే సాయం అని మిగిలినవన్నీ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఎగుమతి చేసినవే అని ప్రభుత్వంపై వచ్చిన విమర్శల తీవ్రతను తగ్గించేందుకు జాతీయ నేత సంబిత్‌ పాత్ర ప్రయత్నించారు. మన దేశంలో వినియోగించకుండా ఎగుమతులతో వాణిజ్యం చేయటం ఏమిటి ? దానికి ప్రభుత్వం ఎలా అనుమతించినట్లు ? ఇదేనా కేంద్ర ప్రభుత్వ వాక్సిన్‌ విధానం ?


ఢిల్లీ పోస్టర్లపై కేసులు నమోదు చేసిన పోలీసుల తీరు మీద విమర్శలు వెల్లువెత్తటంతో మోడీ సర్కార్‌ ఇరకాటంలో పడింది.నేనూ అదే అంటున్నా నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని సవాల్‌ చేశారు. మోడీని ప్రశ్నించినందుకు అంటే మరింత గబ్బు పడతారు కనుక పోస్టర్లు అంటించి గోడలను ఖరాబు చేశారంటూ పోలీసులు కేసులు బనాయించటం విశేషం. ఆ పోస్టర్ల మీద ఎవరు ప్రచురించిందీ,ఎక్కడ ముద్రించిందీ లేదు. ఒక వేళ అలాంటి కేసులు బనాయించాల్సి వస్తే ప్రతి పట్టణం, గ్రామాలలో లక్షల కేసులను నమోదు చేయవచ్చు. అనుమతి లేకుండా పోస్టర్లను అంటించటం, బ్యానర్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలన్నీ అభ్యంతరకరమైనవే. స్పూను కొంటే పట్టు చీర ఉచితం, ఒకటి కొని రెండు తీసుకుపోండి వంటి లేదా అశ్లీల చిత్రాల పోస్టర్ల వాటిమీద చర్యలు తీసుకుంటే ఇంత రచ్చయ్యేది కాదు. తాజా పోస్టర్లలో మోడీ విధానాన్ని ప్రశ్నించటంతో వాటికి అంత ప్రాధాన్యత వచ్చింది.


నరేంద్రమోడీని ప్రశ్నిస్తూ అంటించిన పోస్టర్ల మీద కేసుల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం, దేశవ్యాపితంగా మీడియాలో వార్తలు రావటంతో అబ్బే ఇలాంటి కేసులు పెట్టటం ఢిల్లీలో మామూలే అని గత కొద్ది సంవత్సరాలలో ఏ ఏ సందర్భాల్లో కేసులు బనాయించిందీ, ఎందరిని అరెస్టు చేసిందీ వివరిస్తున్నారు. సిఎఎ,ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా, జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సమయంలో మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ, ఇతరంగా వేసిన పోస్టర్ల మీద అనుమతి లేకుండా అంటించకూడదనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వీటిని మొత్తంగా పరిశీలించినపుడు మోడీ సర్కార్‌ మీద విమర్శ, అసమ్మతి వ్యక్తం చేసిన పోస్టర్లే ఎక్కువగా ఉన్నందున వాటికి వ్యతిరేకంగానే పోలీసులు కేసులు బనాయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనాన్ని ఆదుకోవటంలో కేరళ సిఎం విజయన్‌ – శవ రాజకీయాల్లో బిజెపి !

15 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP Propaganda, Kerala BJP, Kerala Free Food Kits, Kerala LDF, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d