• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక వున్మాదం ఎందుకు ?

28 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Bernie Sanders, communist, Indonesian Communist Party (PKI).

ఎం కోటేశ్వరరావు

అమెరికాతో సహా అనేక దేశాలలో మరోసారి ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు గాను గతంలో చెప్పిన వాటికి భిన్నమైన కారణాలను చూపుతున్నప్పటికీ పూసల్లో దారంలా వున్న ఏకైక అంశం కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటమే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాలో తొలి శ్రామిక రాజ్య ఆవిర్భావం, రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ను కమ్యూనిస్టులు మట్టి కరిపించటం, వలసరాజ్యాలకు జాతీయోద్యమాలు మంగళం పాడటం, చైనాతో సహా సోషలిస్టు శిబిర విస్తరణ వంటి పరిణామాలు అమెరికా నాయకత్వాన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాయి. స్వయంకృత వైఫల్యాలు కొన్ని వున్నప్పటికీ పాతికేండ్ల క్రితం తొలి సోషలిస్టు రాజ్యం, దాని అండతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను సామ్రాజ్యవాదులు పతనం కావించారు. సోషలిజం, కమ్యూనిజం వెనుక పట్టు పట్టిందనే వాతావరణం ఎల్లెడలా ఏర్పడింది. తాము విజయం సాధించామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకున్నారు. అయినా సరే ప్రస్తుతం ప్రపంచంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఎందుకు ?

కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ కమ్యూనిస్టులు ప్రభుత్వ వుద్యోగాలలో చేరటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది ఎగువ సభ ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుందని వచ్చిన వార్తలపై రాసిన ఒక విశ్లేషణను మీరు చదివారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడిపై వచ్చిన తీవ్ర వత్తిడి కారణంగా ఎగువ సభ ఆమోదానికి పెట్టకుండానే దానిని వుపసంహరించుకున్నాడు.1950 దశకంలో ఒక అసెంబ్లీలో అలాంటి నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడటమే అనూహ్యం, అలాంటిది 2017లో ఒక ప్రముఖ రాష్ట్రంలో డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన రోబ్‌ బంటా ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టటం తీవ్ర చర్చ, వాదోపవాదాల మధ్య అది ఆమోదం పొందటమే ఆశ్చర్యం. విజయం కమ్యూనిస్టు శక్తులకు వుత్తేజం కలిగించినప్పటికీ దాంతో అంతా అయిపోయిందని, కమ్యూనిస్టు వ్యతిరేకత అంతరించిందని ఎవరూ భావించలేదు, కనుకనే బిల్లు వుపసంహరణ నిరుత్సాహకారణం కాలేదు.

తీర్మానం పెట్టినందుకు నన్ను కమ్యూనిస్టు అన్నారు, చైనా వెళ్లమన్నారు, హత్య చేస్తామని బెదిరించారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేదని భావించి నేను ఇప్పటికీ భావిస్తున్నప్పటికీ ఈ సమస్య లేవనెత్తిన మనోభావాల కారణంగా ఆ ప్రతిపాదనతో ముందుకు పోరాదని నిర్ణయించుకున్నానని రోబ్‌ చెప్పాడు. నిజానికి అవి ప్రధాన కారణాలుగా కనిపించటం లేదు. గతేడాది ఎన్నికలలో తాను సోషలిస్టును అని బహిరంగంగా చెప్పుకున్న బెర్నీశాండర్స్‌కు పెద్ద ఎత్తున యువత మద్దతు తెలపటం, అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందని, కొంత మంది రష్యాతో కుమ్మక్కయ్యారంటూ రోజూ వస్తున్న వార్తా కథనాలు, అక్కడ కూడా పెట్టుబడిదారీవిధానమే వున్నప్పటికీ ప్రచ్చన్న యుద్ధకాలం నాటి మనోభావాలు ఇంకా అమెరికన్లలో బలంగానే వున్న కారణంగా రోబ్‌పై వత్తిడి అధికమైందని చెప్పవచ్చు.

నిజానికి కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఇదే మొదటిది కాదు. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక రూపంలో కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాలను చేశాయి. అయితే సుప్రీం కోర్టు అలాంటివి చెల్లవు అని చెప్పటంతో అమలు చేయకుండా అలాగే వుంచేశారు. అరిజోనా రాష్ట్రంలో వున్న చట్టాన్ని 2003లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడను కాను అని ప్రమాణం చేయటానికి బదులు ఏ వుగ్రవాద సంస్ధలోనూ సభ్యుడను కాను అని సవరించారు. కొన్ని చోట్ల విధేయత ప్రమాణాన్ని స్వచ్చందం చేశారు. అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2008లో అలాంటి తీర్మానం లేదా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్‌గా వున్న సినీ నటుడు ష్కావర్జ్‌నెగ్గర్‌ దానిని వీటో చేశాడు. ‘చట్టాన్ని మార్చాల్సినంత తప్పనిసరి కారణం నాకు కనిపించటం లేదు, అమెరికా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కమ్యూనిస్టు కార్యకలాపాలకు ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్న చట్టాన్ని కొనసాగించాల్సి వుంది ‘ అని కారణం చెప్పాడు. 2012 నుంచి ఇప్పటికి మూడు సార్లు జో ఇట్జ్‌గిబ్బన్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి అలాంటి చట్టాన్ని సవరించాలని వాషింగ్టన్‌లో ప్రయత్నించి రిపబ్లికన్ల వ్యతిరేకత కారణంగా విఫలమయ్యాడు. అయితే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వుంటానని, రిపబ్లికన్లు తమ వైఖరిని మార్చుకోవాలని, వారి రష్యన్‌ స్నేహితులతో సంప్రదింపులు జరుపుకోవచ్చని జో చెప్పాడు.

అమెరికా ఇలా జరుగుతోంటే దాని కుట్రలో భాగంగా కమ్యూనిస్టులను వూచకోత కోసిన ఇండోనేషియాలో అక్కడి పాలకవర్గం తన నీడను తానే నమ్మలేనంతగా అదిగో కమ్యూనిస్టుల పునరుజ్జీవనం, ఇదిగో కమ్యూనిస్టు చిహ్నం అంటూ వులికి పడుతోంది. ఇండోనేషియాలో కమ్యూనిజ పునరుద్ధరణ గురించి భయపడాల్సిందేమీ లేదంటూనే ఈ సమస్యను అధిగమించాల్సి వుందని ఇండోనేషియా మంత్రి లుహుట్‌ పాండ్‌ జైతాన్‌ తన గోల్కార్‌ పార్టీ జాతీయ నాయకుల సమావేశంలో చెప్పారు.’ సిద్దాంతాన్ని మనం పాతి పెట్టలేము, అది వునికిలోనే వుంటుంది, అయితే దేశ సిద్ధాంతమైన పంచశీలను మార్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే వారిని మనం ఎదుర్కోవాలి, ఈ సమస్యను పరిష్కరించేందుకు గోల్కార్‌ పార్టీ సభ్యులందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి, కమ్యూనిజం పెరగటానికి వీలు లేకుండా చూడాలి అని లుహుట్‌ చెప్పాడు. సుత్తీ, కొడవలి చిహ్నాలున్న టీ షర్టులు అమ్మేవారిని, వేసుకొనే వారిని కమ్యూనిస్టులుగా అనుమానించి అరెస్టులు చేస్తోంది. అక్కడి పాలకవర్గం ఎంతగా వులిక్కి పడుతోందంటే ఇండోనేషియా రిజర్వుబ్యాంకు నకిలీ నోట్లను గుర్తించేందుకు వీలుగా కాపీ చేయటానికి వీల్లేకుండా కొత్తగా ముద్రించిన నోట్లలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన లోగో కమ్యూనిస్టు చిహ్నాలను పోలి వుందంటూ అక్కడి ముస్లింమతోన్మాద శక్తులు నానా యాగీ చేశాయి. దాంతో అదేమీ లేదని బ్యాంకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు ఇవి కాదోయ్‌ చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . తర తరాలుగా దోపిడీదార్లపై జరిగిన ప్రజా ప్రతిఘటనలో ధీరోదాత్తుల కథలు వుత్తేజాన్ని కలిగిస్తాయి. చారిత్రాత్మక తెలంగాణా ప్రజాప్రతిఘటనలో విసునూరు దేశముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ, నైజాం నవాబు రాజ్యం ఎలా ధ్వంసమైందీ ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే విధంగా జనం చెప్పుకుంటారు. కానీ ఆ దేశముఖ్‌, నిజాం వారసులు ఇప్పుడు వచ్చి కమ్యూనిస్టుల చేతిలో తమ కుటుంబాలు బాధపడిన చరిత్రను నమోదు చేయాలని, తమ ప్రతిఘటనను వీరోచితంగా చిత్రించాలని కోరితే ఎలా వుంటుంది? తూర్పు ఐరోపాలో అదే జరుగుతోంది. సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తూర్పు ఐరోపా దేశాలలో జనాన్ని సంతృప్తి పరచటంలో విఫలమైన పాలకవర్గం రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకతను సజీవంగా వుంచేందుకు నానా గడ్డీ కరుస్తోంది. సోషలిస్టు వ్యవస్ధ ఏర్పాటు సమయంలో తిరుగుబాటు చేసిన భూస్వామిక, పెట్టుబడిదారీ, వాణిజ్యవేత్తల కుటుంబాలకు చెందిన వారి కథలతో దోపిడీ వర్గ చరిత్రను సమాజంపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాల ఏర్పాటు, అణచివేతకు గురైన వారి పేరుతో స్మారక కేంద్రాల నిర్మాణాలు చేస్తున్నారు.

ఇలాంటి చరిత్రకు గతంలో స్ధానం ఇవ్వలేదు, భవిష్యత్‌లో వుండదన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడ సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం వ్యాపించినా అమెరికాలో అందుకు స్ధానం లేదన్నది అనేక మంది భావన. ఎవరి నమ్మకం వారిది, వారి విశ్వాసాన్ని అంగీకరించకపోయినా భావ స్వాతంత్య్రంలో భాగంగా గౌరవిద్దాం. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి. అంతా అయిపోయింది, ఇక భవిష్యత్‌ లేదు అని మెజారిటీ అనుకుంటున్న సమయంలో కమ్యూనిజం గురించి భయపడేవారు వున్నారనే విషయం కూడా ఆ మెజారిటీకి తెలియటం అవసరం. అమెరికాలోని పాలకవర్గ డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ అనే ఒక ఎంపీ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధిగా ఎన్నుకోవాలని పోటీకి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అమెరికాలోని క్రిస్టియన్‌ లీగల్‌ సొసైటీ అనే ఒక సంస్ధ సిఇఓ డేవిడ్‌ నమో అనే పెద్దమనిషి నేషనల్‌ రివ్యూ అనే పత్రిక మార్చినెల సంచికలో ఒక వ్యాసం రాసి అమెరికా భవిష్యత్‌కు సోషలిస్టు భావజాలం ముప్పు తెస్తున్నది గమనించండి అంటూ మొర పెట్టుకున్నాడు. ఓ సర్వే ప్రకారం పది మందిలో నలుగురు పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్త్నుట్లు తేలిందని హెచ్చరించాడు. బెర్నీ శాండర్సు పలుకుబడి వలన ఈ వుద్యమం ఆదరణ పొందిందని భావించటం గాక అసలు వుద్యమానికి అదొక సూచికగా పరిగణించాలని పేర్కొన్నాడు. అంటే శాండర్స్‌ గాక పోతే మరొకరిని ఆ వుద్యమం ముందుకు తెచ్చేది. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నది అందుకే.అనేక అనుభవాల తరువాత దోపిడీ వర్గంతో పాటు దానిని వ్యతిరేకించే వారు కూడా తమ ఎత్తుగడలు, భాషకు నగిషీ పెడుతున్నారు. దోపిడీ వర్గం తన అధికారాన్ని కాపాడుకొనేందుకు సాయుధ శక్తులను నిరంతరం పెంచిపోషిస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ దోపిడీ వర్గాల ప్రతినిధిగా పని చేయటం తప్ప వారికి వ్యతిరేకంగా ఒక్క వుదంతంలో కూడా వ్యతిరేకంగా వ్యవహరించిన వుదంతం మనకు కనపడదు. దోపిడీ, దోపిడీ శక్తులను ఎదుర్కోవటానికి కార్మికవర్గం శాంతియుత మార్గాన్నే ఎంచుకుంటుంది, అనివార్యమైతేనే ఆయుధాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది.ఈ విషయాన్ని కమ్యూనిస్టులు ఎన్నడూ దాచుకోలేదు. తుపాకీ గొట్టం ద్వారానే ఆధికారం తప్ప ఇతర పద్దతులలో రాదంటూ కొందరు హింసాత్మక పద్దతులతో సోషలిజాన్ని సాధిస్తామని పిలుపులు ఇవ్వటం, శ్రామికవర్గ నియంతృత్వాన్ని అమలు చేస్తామనే పదజాలాన్ని వినియోగించటం, అన్ని దేశాలలో దోపిడీ శక్తుల నిర్మూలనకు ఆయుధాలు పట్టిన వుదంతాలను చూపి కమ్యూనిస్టు వ్యతిరేకులు చేయని తప్పుడు ప్రచారం లేదు.

నైజాం నవాబు, అతగాడికి వెన్నుదన్నుగా వున్న దేశముఖులు, జాగీర్దార్లు కోరిన వెంటనే వెట్టి చాకిరీ రద్దు, భూములను దున్నేవారికే అప్పగించి వుంటే తెలంగాణా రైతాంగం ఆయుధాలను పట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. నిర్బంధం పెరిగిన కొద్దీ వడిసెలలతో ప్రారంభించిన దళాలు తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోరిన వెంటనే బ్రిటీషు వారు స్వాతంత్య్రం ఇచ్చి వుంటే భగత్‌ సింగుకు బాంబులతో, సుభాష్‌ చంద్రబోస్‌కు విముక్తి దళాల నిర్మాణం అవసరమయ్యేది కాదు. వినతి పత్రాలతో ప్రారంభమైన స్వాతంత్య్ర వుద్యమం అల్లూరి సీతారామరాజు కాలం నాటికి విల్లంబులు, తుపాకులు పట్టాల్సి వచ్చింది. స్వపరిపాలన, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలను క్రమంగా ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రారంభంలో విద్యావంతులైన భారతీయులకు ప్రభుత్వంలో మరింత భాగస్వామ్యం కల్పించాలని మాత్రమే కోరింది.

ప్రస్తుతం అమెరికాలో సోషలిస్టులుగా సగర్వంగా చెప్పుకుంటున్న బెర్నీ శాండర్స్‌ వంటి వారు ప్రజాస్వామిక సోషలిజం గురించి మాట్లాడుతున్నారు తప్ప అమెరికా దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనో, సాయుధపోరాటం చేస్తామనో చెప్పటం లేదు. ఆర్ధిక సంక్షోభం, అసమానతలు, దారిద్య్రం, సంక్షేమ పధకాలకు కోత వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారు కూడా తుపాకి గొట్టం ద్వారానే అధికారం వంటి నినాదాలు ఇచ్చి వుంటే అణచివేత సులభమై వుండేది. తాము కోరుతున్న ప్రజాస్వామిక సోషలిజాన్ని, సంక్షేమ చర్యలను అమలు జరిపేందుకు నిరాకరించినపుడు ఏం చేయాలో అమెరికన్లే నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్న అంశమిదే.అందుకే మొగ్గలోనే సోషలిజం కోరుకొనే వారిని తుంచి వేయాలని కోరటంలో అంతరార్ధమిదే. అమెరికాలో కమ్యూ నిస్టు పార్టీ వున్నప్పటికీ ప్రజాస్వామిక సోషలిస్టు పార్టీ(డిఎస్‌ఏ) కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నామ మాత్రంగా వుంది. అలాంటి పార్టీలో గతేడాది ఎన్నికల నాటికి 8,500 సభ్యత్వం వుంటే మే నాటికి 21వేలకు చేరిందని అఫింగ్టన్‌ పోస్టు పత్రిక తాజాగా రాసింది. దశాబ్దాలుగా సోషలిజం అనే పదం గిట్టనివారు నేడు దాన్ని వదిలించుకుంటున్నారన్నది స్పష్టం. ఎందుకు ?

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో యువత విద్యకోసం తీసుకున్న అప్పులపాలై వున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో మరింత యాంత్రీకరణ కారణంగా అమెరికాలో ప్రభుత్వ వుద్యోగాలతో సహా మొత్తం యాభై శాతం వుద్యోగాలు రద్దవుతాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తమ తలిదండ్రుల కంటే దుర్భర పరిస్థితులను అనుభవించే తొలి తరంగా యువత జీవనం గడపబోతున్నది. పర్యావరణ ముప్పు సరేసరి. ఇంతకాలం తాము బలపరిచిన పెట్టుబడిదారీ విధానం ఇంతకంటే తమకు మెరుగైన జీవితాన్ని ఇవ్వదనే విషయాన్ని యువత క్రమంగా గ్రహిస్తున్నది. అందుకే దాని బదులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.

గతంలో సోషలిజం ఆకర్షణీయంగా వుండటం కారణమైతే, ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో పడటం, అనేక భ్రమలతో సోషలిజాన్ని వదులుకున్న దేశాలు పెట్టుబడిదారీ విధానం గురించి పునరాలోచించటం, అంతకు మించి సోషలిస్టు విధానంలో వున్న వాటి కంటే పరిస్ధితులు దిగజారటం గురించి జనంలో చర్చ జరగటం, ప్రపంచ ఆర్ధిక సంక్షోభం చైనా తదితర సోషలిస్టు దేశాలను అంతగా ప్రభావితం చేయకపోవటం వంటి కారణాలు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, జనం ఆ వైపు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని వక్రీకరించవచ్చు తప్ప వాస్తవ సమాచారాన్ని కోరుకొనే వారిని నిరోధించటం సాధ్యం కాదు. సోషలిజం, కమ్యూనిజం గురించి గతంలో మాదిరి కట్టుకధలు చెబితే యువత బుర్ర ఆడించే పరిస్ధితి లేదు. ఆస్ట్రేలియాలో ఒక హైస్కూలు విద్యార్ధిని ఆ స్కూలు నిరంకుశ యాజమాన్యం రెచ్చగొట్టి దేనికి పురికొల్పిందో చూడండి.

స్వేచ్చా ప్రపంచంగా వర్ణితమయ్యే దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. మేనెల ఏడవ తేదీన సిడ్నీ నగరంలో జరిగిన ఒక మేడే ప్రదర్శనకు జస్సీ అనే 16 సంవత్సరాల హైస్కూలు విద్యార్ధి హాజరయ్యాడు. అది అతనికి తొలి మేడే ప్రదర్శన. అదే రోజు అతని స్కూలు స్ధాపకుడి సంస్మరణార్దం నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా జెస్సీ మేడే ప్రదర్శనకు వెళ్లాడు. అందుకు గాను శనివారం నిర్బంధ శిక్ష విధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. తలిదండ్రులకు పంపిన లేఖలో స్కూలు కార్యక్రమానికి బదులు మేడే ప్రదర్శనకు వెళ్లినట్లు, శనివారపు శిక్షలు ఎక్కువగా వుంటే స్కూలు నుంచి బయటకు పంపే విషయాన్ని ఆలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు.

గతేడాది స్కూలు స్ధాపకుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లిన తనకు అక్కడి తంతు విసుగు పుట్టించిందని జెస్సీ చెప్పాడు. మరి మేడే ప్రదర్శనకు ఎందుకు వెళ్లావు అనిఅడిగితే మేడే గురించి ట్విటర్‌లో అమెరికన్ల మరియు ప్రపంచమంతటి నుంచీ జరిగిన రచ్చ గురించి నేను ఎంతో తెలుసుకున్నాను. హాజరైతే ఎలా వుంటుందో తెలుసుకోవాలనే వుబలాటంతో వెళితే నిజంగానే ఎంతో వుద్వేగం కలిగింది అని చెప్పాడు. శనివారం నాడు విధించిన శిక్షా సమయంలో మౌనంగా వుండకుండా స్కూలు చర్యను నిరసిస్తూ అణచివేత గురించి తాను రాసుకు వచ్చిన మార్క్సిజం విశ్లేషణను చదివాడు. వచ్చే ఏడాది మేడే ప్రదర్శనకు హాజరయ్యేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తాను. ఒక వేళ ఇవ్వకపోతే ఎలాగైనా సరే మేడే ప్రదర్శనకు వెళతా. స్కూలు విధించే శిక్ష నన్ను నిరసన తెలపకుండా ఆపలేదు అని చెప్పాడు. అంతే కాదు ఆరోజు స్కూలు ప్రారంభానికి ముందు వుదయం, స్కూలు తరువాత సాయంత్రం రెండు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడు జెస్సీ. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత తెలిసిందే. అమెరికా, ఇతర దాని వుపగ్రహ దేశాల పాలకవర్గ కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా చివరికి దానికే దారి తీస్తుందా ? అవును అని చెప్పటానికి సందేహించనవసరం లేదు, చరిత్ర చెప్పిన సత్యమది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాలిఫోర్నియా ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేత !

14 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti communist, California state, California state assembly, Communists, Oakland Democrat Rob Bonta, The first Red Scare

ఎం కోటేశ్వరరావు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులు పని చేయటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ మేనెల ఎనిమిదవ తేదీన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తదుపరి శాసన మండలి ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుంది. కమ్యూనిస్టులకు ఇది సంతోషకరమైన వార్త అయితే మింగుడుపడని వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహిస్తోందంటూ భయపడిన అమెరికన్‌ పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక, నిషేధ చట్టాలను చేసింది. వుద్యోగం, వుపాధి, కార్మిక, కళా ఇలా ఒకటేమిటి అన్ని జీవన రంగాలలో అనేక లక్షల మందిని కమ్యూనిస్టులు అన్న అనుమానాలతో వెంటాడి వేధించింది. ఇప్పటికీ వేధిస్తోంది, న్యూయార్క్‌ నగరంలో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో అక్కడి విద్యాశాఖ విచారణ చేపట్టిన విషయం, దానిని ఆపాలని కోరితే కోర్టు తిరస్కరించిన వుదంతం ఇదే సమయంలో జరిగింది.

మరోవైపున అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఫ్రీడం ఫెస్టివల్‌ పేరుతో జరిపే కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది ‘వందేళ్ల భావజాల పోరులో పెట్టుబడిదారీ విధానమా ? మ్యూనిజమా ఎవరు గెలిచారు?’ అనేపేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఐరోపా, సోవియట్‌లో సోషలిజాన్ని కూల్చివేసిన సమయంలో రాబర్ట్‌ హెయిల్‌బర్టన్‌ అనే అమెరికన్‌ ఆర్ధికవేత్త న్యూయార్కర్‌ అనే పత్రికలో రాసిన వ్యాసంలో ‘పెట్టుబడిదారీ విధానం-సోషలిజం మధ్య యుద్ధం ముగిసింది. సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది. దీంతో చరిత్ర ముగసింది ‘ అని రాశాడు. ఆ పెద్దమనిషి 2005లో 85 ఏండ్ల వయస్సులో వృద్ధాప్యంతో మరణించాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరు విజయం సాధించారు అనే చర్చకు ఆ పెద్దమనిషి వారసులైన కమ్యూనిస్టు వ్యతిరేకులు తెరతీశారంటే అనుకున్న, ఆశించిన దానికి భిన్నంగా జరుగుతోందనే అనుమానం వారిలో తలెత్తినట్లే !

కాలిఫోర్నియా అసెంబ్లీలోని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు రోబ్‌ బోంటా గతేడాది డిసెంబరులో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలనే బిల్లును ప్రవేశపెట్టాడు. కమ్యూనిస్టు అనే ముద్ర పాతదైన పుక్కిటి పురాణ ప్రస్తావన వంటిది. దానిని దుర్వినియోగం చేసే అవకాశం వుంది, నిర్మొగమాటంగా చెప్పాలంటే గతంలో మన చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలలో అది జరిగింది, అందువలన సాంకేతికంగా దానిని తీసివేయాల్సి వుంది అని తన బిల్లు వుద్దేశ్యాన్ని వివరించాడు. ఈ సవరణ ప్రకారం కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అనే పదాన్ని మాత్రమే తొలగిస్తారు. హింసా మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే ఏ సంస్ధ సభ్యుల నైనా ప్రభుత్వ వుద్యోగాల నుంచి తొలగించ వచ్చు అనే నిబంధన ఇక ముందు కూడా కొనసాగుతుంది. కమ్యూనిస్టుల నుంచి ఇప్పటికీ ముప్పు వుందని ఆ పదాన్ని తొలగించటం మొత్తం కాలిఫోర్నియన్లను అవమానించటమే అని రెచ్చగొట్టే విధంగా కొందరు రిపబ్లికన్‌ సభ్యులు వ్యాఖ్యానించారు.

ఆండ్రూ మిల్లర్‌ అనే వ్యాఖ్యాత ఒక పత్రికలో ఇలా గగ్గోలు పెట్టాడు. ‘1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు అమెరికా విశ్వవిద్యాలయాలలో తప్ప ప్రతి చోటా మార్క్సిజం చచ్చిపోయింది అని కొంత మంది జోకు వేశారు. ఇరవైఆరు సంవత్సరాల తరువాత విద్యావేత్తల వలయం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. కాలిఫోర్నియా సెనెట్‌(మన శాసనమండలి మాదిరి)లో ఈ బిల్లు విజయవంతంగా ఆమోదించబడుతుందా లేదా అన్నది తార్కికాంశం. ఒక వాస్తవం ఏమంటే త్వరలో కమ్యూనిస్టులు త్వరలో అధికారానికి వస్తారా అన్నది రాజకీయాలలో గొప్ప ప్రాధాన్యత వున్న అంశం కాదు. ఎన్నికలలో మార్క్సిజాన్ని కూడా సాధ్యమైన అంశంగానే పరిగణిచాలని నమ్మేంత వరకు అమెరికా సంస్కృతి రావటమే భయంగొలుపుతున్న వాస్తవం. 2006లో జరిగిన ఒక సర్వే ప్రకారం అమెరికన్‌ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లలో మూడు శాతం మంది స్వయంగా తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నారు. హ్యుమానిటీస్‌ ప్రొఫెసర్లలో ఐదుశాతం, సామాజిక శాస్త్రాల వారిలో 18శాతం వున్నారు. మితవాదులతో పోల్చితే ఒక సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌ తాను మార్క్సిస్టును అని మూడు రెట్లు ఎక్కువగా స్పష్టంగా చెబుతారని ఈ సర్వేలో తేలింది.2011లో రాస్‌ముసేన్‌ నివేదిక ప్రకారం వర్తమాన అమెరికా రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధల కంటే నైతికంగా కమ్యూనిజం వున్నతమైందని అమెరికన్‌ ఓటర్లలో 11శాతం మంది భావించటం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు………..అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ)లో 14శాతం మంది అభ్యుదయగామి సభ్యులున్నారని డెమోక్రటిక్‌ సోషలిస్టులు కనుగొన్నారు. మార్క్సిజం మరణించలేదు అనటానికి ఇది పెరుగుతున్న సాక్ష్యం. అది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో సజీవంగా వుంది సమాజంలోని ఇతర చోట్లకు విస్తరిస్తోంది…..1960 దశకపు ‘నూతన వామపక్ష విద్యార్ధి విప్లవకారులు’ ఇప్పుడు ఆధునిక డెమోక్రటిక్‌ పార్టీ నాయకులుగా వున్నారు. కాలిఫోర్నియాలోని అలంకార ప్రాయమైన రాజకీయ నేతల గురించే మనం మాట్లాడటం లేదు. ఈ విప్లవ నాయకులు నూతన సహ్రాబ్ది యువతరాన్ని ఆకర్షించేందుకు తమ పార్టీని మరింతగా వామపక్షం వైపునకు తీసుకుపోతున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా డెమోక్రటిక్‌ మరియు చివరికి సోషలిస్టులవైపు మొగ్గితే ఈ వ్యూహం చివరికి పౌర అశాంతి మరియు హింసాత్మక విప్లవానికి దారితీస్తుంది.’అని మిల్లర్‌ హెచ్చరిక చేశాడు.https://www.thetrumpet.com/15791-california-mulls-communists-in-government

మరో కమ్యూనిస్టు వ్యతిరేకి మార్క్‌ స్కౌసెన్‌ ‘మ్యూనిజం ఎందుకు పని చేయదు, అయినా ఇప్పటికీ ఆకర్షిస్తోంది’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాశాడు. తాను మార్క్సిజం గురించి జీవిత కాలంలో ఎక్కువగా చదివానని చెప్పుకున్న ఆ పెద్దమనిషి తన తండ్రి కమ్యూనిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌బిఐ ఏజంట్‌ లియోరీ స్కౌసెన్‌ అని, పినతండ్రి ది నేకెడ్‌ కమ్యూనిస్టు అనే పుస్తకం రాసిన క్లియోన్‌ స్కౌసెన్‌ అని స్వయంగా చెప్పుకున్నాడు కనుక అతనేమిటో చెప్పనవసరం లేదు. అనేక విషయాలను ఏకరువు పెడుతూ అయినప్పటికీ ఇంకా విప్లవకారులు ఆకర్షణీయంగానే వున్నారని అనేక విశ్వవిద్యాలయాలలో &ద్యార్ధులు చే గువేరా టీ షర్టులు ధరించటం, ప్రొఫెసర్లు మార్క్సిజం గురించి చెబుతున్నారని వాపోయాడు. ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి వెళ్లినపుడు ఎదురైన తన స్వంత అనుభవాన్ని ఇలా వివరించాడు. అక్కడి ఒక మార్క్సిస్టు ప్రొఫెసర్‌ను గుర్తించి నేను నీకు 1883 నాటి ఒక వెండి డాలర్‌ ఇస్తాను, అయితే దానిని ముద్రించిన సంవత్సరంలో మరణించిన ఒక ఆర్ధికవేత్త పేరు చెప్పాలి అని షరతు పెట్టాడట. వెంటనే ఓ అదెంతో సులభం, ఆయన కారల్‌ మార్క్స్‌ అని జవాబు వచ్చిందట. సరైనదే, ఎప్పుడూ మరచి పోవద్దు ఆయన మరణించాడు అన్నాడట.దానికి ఠకీమని ఆ ప్రొఫెసర్‌ ఇలా జవాబు చెప్పాడట.’ అవును మీరు చెప్పింది కరేక్టే, ఆయన మరణించాడు కానీ నేను బతికి వున్నాను, మార్క్సిజం లోని శక్తి, ప్రభావం వంటి గురించి మీ విద్యార్దులకు నేను బోధిస్తున్నాను ‘ అన్నాడట. అడిగిన పెద్దమనిషికి ఏమై వుంటుందో చెప్పనవసరం లేదు. వ్యక్తులు మరణించినంత మాత్రాన శాస్త్రీయ భావజాలాలు మరణిస్తాయి, వుద్యమాలు అంతరిస్తాయని భ్రమపడే చరిత్ర జ్ఞానం లేని లేదా తెలిసీ అడ్డంగా వాదించే వారికి ఇంతకంటే జవాబు అనవసరం.

మార్క్‌ స్కౌసెన్‌ ఇంకా ఇలా రాశాడు.’ పిల్లలకు కమ్యూనిజం’ పేరుతో రాసిన ఒక చిన్న పుస్తకాన్ని ఇటీవలే మిట్‌ ప్రెస్‌ ముద్రించటాన్ని చూశాను. అది రాసిన ఓ జర్మన్‌ కమ్యూనిస్టు పెట్టుబడిదారీ విధాన లోపాలను మాత్రమే చూశారు, కమ్యూనిజం లోపాల గురించి ఏమీ చెప్పలేదు.అది ఇరవయ్య శతాబద్దంలో పదికోట్ల మందిని చంపింది, ఇప్పటికీ కోట్ల మందికి క్యూబా,వెనెజులా, వుత్తర కొరియాలో జీవితం, స్వేచ్చ,ఆస్ధిని మరియు సంతోషంగా వుండటాన్ని నిరాకరిస్తోంది. ఈ రోజు విద్యార్ధులు మరియు అనేక మంది పౌరులు కమ్యూనిస్టు లేదా సోషలిస్టు తత్వశాస్త్ర ప్రయోజనాలకు ఆకర్షితులౌతున్నారు, ప్రత్యేకించి విద్య, వైద్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు వుచితంగా అందచేయాలనే దానికి ఆకర్షితులౌతున్నారు.’

అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు చెప్పారు, ఎంత ఎత్తు పెరిగితే అంత త్వరగా కూలిపోయే అవకాశం వుంటుంది. బొల్లు బొల్లరా ఎంకన్నా అంటే మా వూళ్లో మిరియాలు తాటికాయలంత వుంటాయి దొరా అన్నట్లు కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి అతిశయోక్తులతో ఎంతో చెత్తరాశారు. ఇప్పటికీ కిరాయి రచయితలు రాస్తూనే వున్నారు. చైనాలో చర్చిలను కూల్చివేస్తున్నారని, క్రైస్తవుల సమావేశాలను అడ్డుకుంటున్నారని మీడియాలో ప్రతి రోజూ ఒక పధకం ప్రకారం వార్తలు వస్తుంటాయి. గతంలో సోవియట్‌లో చర్చిలన్నింటినీ కూల్చివేశారని చేసిన ప్రచారం తెలిసిందే. నిజానికి ఏ ఒక్క చర్చిని కూడా కూల్చివేయలేదు. యథాతధంగా వున్నాయని ఇప్పుడందరూ చెబుతున్నారు. చైనాలోని హోనాన్‌ రాష్ట్రంలో మావో పుట్టారు. ఆయన పెరిగిన చాంగ్‌షా పరిసరాలన్నీ క్రైస్తవులు ఎక్కువగా వుండేవి. అక్కడే స్కూలులో మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి పట్టణంలో మావో విగ్రహం కంటే ఎత్తైన 260 అడుగుల చర్చి భవనాన్ని నిర్మిస్తున్నారని, దానికి ప్రభుత్వ సబ్సిడీ కూడా వుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్న చోట చర్చికి అనుమతించటం, దానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం ఏమిటని కొందరు అభ్యంతర పెట్టినప్పటికీ ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే మతశక్తులు ఎవరైనా అలాంటి వారిపై చైనా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అంతే తప్ప మత స్వేచ్చను అణచటం లేదు.http://www.gospelherald.com/articles/70424/20170511/massive-church-being-built-city-where-mao-zedong-first-embraced.htm  కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి నూరిపోసిన వారి మాటలకు ఇప్పుడు విశ్వసనీయత సమస్య ఎదురవుతోంది. పెట్టుబడిదారీ దేశాలలో తలెత్తిన తీవ్ర సమస్యలు, సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి పెట్టుబడిదారీ వ్యవస్దలను తిరిగి రుద్దిన చోట జనం అనుభవిస్తున్న జీవితాన్ని చూసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఇప్పుడు పశ్చిమ దేశాలలో అంత ఆకర్షణీయంగా లేదు. అయినా చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే తిరోగమన వాదులు తమ ప్రయత్నాలను మానుకోవటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చల్లేవారు పార్టీ ప్రతినిధులు-రాసే వారు ప్రచారకర్తలు !

12 Friday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Gandhi Peace Foundation, Indian media, journalism, journalists, Kuldip Nayyar Award, ndtv, NDTV anchor Ravish Kumar, Ravish Kumar

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రతి వారికి ఒక రోజు అవకాశం వస్తుందన్నపుడు కమ్యూనిస్టులకు ఎందుకు రాదు ?

04 Thursday May 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Left politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, communist, Donald trump, mayday, pope, Pope Francis

Image result for anti communist

ఎం కోటేశ్వరరావు

మొన్ననే మహాకవి శ్రీశ్రీ జయంతి జరుపుకున్నాం. అనేక అంశాలను విస్మరిస్తున్నట్లుగానే ఆయన చేసిన రచనలను కూడా చదవటం తగ్గిపోతోంది. ఆయన రచనలలో ఒకదానిలో ఎంత వున్నతమైన సందేశం దాగి వుందో చూడండి.

కుక్క పిల్లా / అగ్గిపుల్లా/ సబ్బు బిళ్లా

హీనంగాచూడకుదేన్నీ/కవిత్వమేనోయ్‌ అన్నీ

రొట్టె ముక్కా/అరటి తొక్కా/బల్లచెక్కా

నీ వైపే చూస్తుంటాయ్‌/ తమ లోతు కనుక్కో మంటాయ్‌

ఇక శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ భాషలో చెప్పాలంటే ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది. రోజులన్నీ ఒకే విధంగా వుండవు. అంటే ప్రతి వారికీ ఏదో ఒక రోజు తామేమిటో నిరూపించుకొనే అవకాశం వస్తుంది. దానికి కమ్యూనిస్టులు మినహాయింపు ఎలా అవుతారు ? ఎరుపంటే భయం భయంగా చూసే అనేక మందికి ఈ చిన్న లాజిక్కు ఎందుకు అర్ధం కాదో తెలియదు. సినిమా వారు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పదాలలో ‘గీకటం లేదా గోకటం ‘ ఒకటి. ఇష్టం వున్న వారు ఆ పని చేస్తే కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఏం జరిగేదీ మనం రోజూ చూస్తున్నదే. బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయిన చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య ఒక కుటుంబం తమ అమ్మాయికి కమ్యూనిస్టు రాజకీయాలు వున్న వరుడు కావాలని ఒక ప్రకటనలో కోరినట్లు వార్తలు వచ్చాయి. అంటే కమ్యూనిస్టు అబ్బాయి చాలా మంచోడు ( సమాజ దుష్ట ప్రభావం పడో, మరొకటో జరిగో మిగతావారి మాదిరి భార్యలను వేధించే వారు లేరని కాదు) అన్నది వారి అనుభవం. చాలా మంది దృష్టిలో కమ్యూనిస్టులు ఈ కాలానికి పనికిరాని మంచి వారు. వారి వలన ముప్పు లేదని ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక అధిపతి అమెరికా పాలకులే పాతికేండ్ల క్రితం ప్రకటించారు. అలాంటపుడు వారి మానాన వారిని వదిలేయాలి కదా !

ఆ పని చేయకుండా అనవసరంగా కొంత మంది వ్యతిరేకులు కమ్యూనిస్టులను గోకుతున్నారు. అమెరికాలోని సియాటిల్‌ మరికొన్ని చోట్ల మేడే రోజున కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రదర్శనలు జరటం, ఆ సందర్భంగా మీడియా నిండా చెడరాయటం, చూపటం దానిలో భాగమే. వామపక్షం, సోషలిజం, కమ్యూనిజం భావజాలానికి దూరంగా వున్న యువతలో కూడా ఇదేమిటి అన్న ఆసక్తి కలిగించి కొంత మందిని అయినా ఆ వైపు నెడుతున్నందుకు అలాంటి వారిని సహజంగానే కమ్యూనిస్టులు అభినందిస్తారు. అలా వచ్చిన వారు మరింత గట్టిగా తయారు కావటం తెలిసిందే.

మే ఒకటవ తేదీన ప్రపంచ వ్యాపితంగా కార్మికదినాన్ని పాటించారు. ఈ సందర్బంగా ఇష్టం వున్న, లేని మీడియా పెద్దలు కూడా ఆరోజు గురించి చెప్పక తప్పలేదు. ‘అమెరికన్‌ స్పెక్టేటర్‌ ‘ అనే ఒక పత్రికలో ‘ డియర్‌ కామ్రేడ్‌ ఏ ట్రంప్‌డ్‌ అప్‌ మే డే ‘ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశారు. దీనిలో రెండు అర్ధాలున్నాయి. ప్రియమైన కామ్రేడ్‌ మేడే నగారా వూరించిన ‘ట్రంప్‌ ‘ అని ఒకటైతే ప్రియమైన కామ్రేడ్‌ మే డే నగరా అన్నది మరొకటి. ‘ విధిగా కూలదోయాల్సిన జారు చక్రవర్తి మాదిరి మన అధ్యక్షుడిని చూస్తున్నారు’ అంటూ వుక్రోషంతో తొలి వ్యాక్యంతో ఆ వ్యాసాన్ని ప్రారంభించారు. (అమెరికాలో సామాన్య జనం అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నిజంగా అమెరికా అభినవ జారు చక్రవర్తిగా భావించే మెజారిటీ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే అక్కడున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం వలన ప్రత్యక్ష ఓట్లకు బదులు ఎలక్టొరల్‌ కాలేజీలో ట్రంప్‌ను బలపరిచేవారు మెజారిటీ తెచ్చుకొని అతగాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.)https://spectator.org/a-trumped-up-may-day/ దీనిని జోష్‌ డెక్‌, పాల్‌ కెంగర్‌ అనే ఇద్దరు రాశారు. దీనిలో కమ్యూనిస్టు వ్యతిరేకతకు, వుక్రోషం, వ్యంగ్యానికి, ఆరోపణలకు కొదవ లేదు. డ్రడ్జ్‌ రిపోర్ట్‌ అనే బహుళాదరణ గల వెబ్‌ సైట్‌లో గతంలో తామెన్నడూ చూడని ఒక ప్రత్యేక అంశం అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌ పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసపు లింక్‌ను చూశామని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే మంటే అమెరికా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగపు కార్యదర్శి ఎమిలీ షెపర్స్‌ క్యూబా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్రాన్మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. దానిలో http://www.peoplesworld.org/article/communist-party-membership-numbers-climbing-in-the-trump-era/ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తరువాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం గురించి అభ్యర్ధనలు పెద్ద ఎత్తున పెరిగాయని, అయితే అమెరికా అంతటా ఇప్పటికీ మెకార్ధీ కాలం నాటి భూతం(కమ్యూనిస్టు వ్యతిరేక) ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాల గురించి ఆసక్తి పెరుగుతోందని చెప్పటాన్ని వారు నొక్కి వక్కాణించారు. వారు కమ్యూనిస్టు పార్టీతో పాటు డిఎస్‌ఏ అనే ఒక వామపక్ష పార్టీ గురించి కూడా తమ వ్యాసంలో వ్యాఖ్యానించారు. వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు పైన ఇచ్చిన లింక్‌ ద్వారా చదువు కోవచ్చు. అయితే వ్యాసాన్ని ముగిస్తూ వారు చెప్పిన మాటలను మననం చేసుకోవటం అవసరం.

Image result for anti communist

‘ అందరికీ కొంత ప్రత్యేకమైనది వుంది ప్రియమైన కామ్రేడ్‌, అది నిజమైన కమ్యూనిస్టు పూలు, పండ్లతో నిండి వున్న కల్పవృక్షం’. దేశ వ్యాపితంగా మేడేను నిర్వహించటం ద్వారా వలస వచ్చిన వారు, మహిళలు, కార్మికులు, నల్లజాతి జీవన్మరణ వుద్యమం, పర్యావరణవేత్తలు, మరియు ట్రంప్‌ ముప్పు ఎదుర్కొంటున్న అందరూ ఐక్యం కావటానికి మంచి అవకాశమని జాకోబిన్‌ పత్రిక రచయిత్రి కష్మా సావంత్‌ వివరించినట్లుగా పెద్ద బృందాలైన ప్లానెడ్‌ పేరెంట్‌ హుడ్‌ ( ఏంజెలా డేవిస్‌ సహ అధ్యక్షురాలితో పాటు మహిళా ప్రదర్శన నిర్వహించినవారు) వంటి పెద్ద బృందాల మద్దతు పొందటం ద్వారా మేడే ట్రంప్‌ వ్యతిరేక ప్రతిఘటనలో అది అంతర్బాగం అవుతుందనే ఆశాభావాన్ని సావంత్‌ వ్యక్తం చేశారు. విస్తృతమైన వామపక్షం -దీనిలో డెమోక్రటిక్‌ పార్టీ వుంటుందని చెప్పనవసరం లేదు- అణచివేత, దోపిడీ, వివక్ష రూపాలు, వ్యవస్ధల గురించి వాటికి గురైన శక్తులు తరచుగా పరస్పరం తమ అనుభవాలను కలబోసుకుంటూ వుమ్మడి సామాజిక అస్తిత్వాన్ని పంచుకొనే నూతన అవగాహనను(ఇంటర్‌ సెక్షనాలిటీ) అనుసరించటం ఇటీవల వామపక్ష శక్తుల మధ్య ప్రారంభమైంది. దీనిని ప్రముఖంగా ప్రస్తావించటం ద్వారా పలు బాధిత బృందాలను కలుపుకొంటూ వారి అణచివేతకు మూలం ట్రంప్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీ అని స్పష్టం చేయటం ద్వారా కొత్త ప్రాంతాలకు విస్తరించటం , కొత్త వారిని ఆకర్షించటం సమరశీల వామపక్ష లక్ష్యంగా వుంది. ఈ 2017 మేడే ఒక పెద్ద ప్రచారం, ఐక్యతను పెంపొందించే అవకాశం.ఈ ఏడాది అంతర్జాతీయ మేడేను పాటించటానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది రష్యన్‌ విప్లవ శతవార్షిక సందర్బం.’

ఇలా చెబుతూనే చివరికి తమ వుక్రోషాన్ని కూడా ఎలా వెలిబుచ్చారో చూడండి.’ బోల్షివిక్‌లు తమ చారిత్రాత్మక హింస, అణచివేత ప్రారంభించిన వంద సంవత్సరాల తరువాత కూడా నూతన అధ్యక్షుడికి వ్యతిరేకంగా ‘భిన్నత్వం, ఏకీకరణ,’ప్రతిఘటన పేరుతో పెద్ద సంఖ్యలో అమెరికన్‌ వామపక్ష వాదులు తమకు తెలియకుండానే లెనిన్‌ చెప్పినట్లు ప్రయోజనకరమైన బుద్ధి హీనుల( యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌) మాదిరి ఒక అణచివేత భావజాలానికి విశ్వాసపాత్రులుగా మారుతున్నారు.’ ముందే చెప్పినట్లు ‘పీపుల్స్‌ వరల్డ్‌ ‘లోని కమ్యూనిస్టు ఇంటర్వ్యూను గోకటం ద్వారా స్పెక్టేటర్‌ పత్రిక తన పాఠకులందరికీ దాని మీద ఆసక్తి రేకెత్తించింది. అంతకు ముందు వినని వారు తప్పకుండా ఏం చెప్పారో, లెనిన్‌ ఆ పదాన్ని ఏ సందర్భంగా వాడారో, దాని మీద ఈ వ్యాస రచయితలు ఎందుకు విరుచుకుపడుతున్నారో అనే వుత్సుకత కలుగుతుంది. వానపడుతున్నా కదలని…… మాదిరి ఏమీ పట్టని వారికి ఇది వర్తించదని మనవి.

అమెరికన్‌ మేథావులు తాజాగా మార్క్సిజం లెనినిజం పట్ల ఆకర్షితులు కావటంపై కొందరు వుక్రోషం వెలి బుచ్చటం అర్దం చేసుకోగలిగినదే. పెట్టుబడిదారీ విధానం ఎందుకు విఫలం అవుతున్నదో, ఆర్ధిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ఆ విధాన సమర్ద పండితులు చెప్పలేకపోతున్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాల విశ్లేషకులు వాటికి కారణాలు చెబుతున్నపుడు యువతరం, మేథావులు ఆకర్షించటం సహజం. లెనిన్‌ వుపయోగించిన పదాన్ని అసందర్బంగా వుపయోగించటం రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. అందువల పై వ్యాస కర్తలు పేర్కొన్న గ్రాన్మా పత్రికలో అమెరికా కమ్యూనిస్టు నేత ఏం చెప్పారో చూద్దాం. సెర్గియో అలెగ్జాండరో గోమెజ్‌ స్పానిష్‌ భాషలో వున్న ఇంటర్యూను ఆంగ్లంలో సంక్షిప్తీకరించారు. దానిని గ్రాన్మాతో పాటు పీపుల్స్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు. ‘ అమెరికాలో అంతర్ధానం అయ్యేందుకు తిరస్కరిస్తున్న కమ్యూనిజం ‘ అనే శీర్షికతో గ్రాన్మా ప్రచురించింది. http://en.granma.cu/mundo/2017-04-17/communism-refuses-to-disappear-in-the-united-states

‘డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని దాని కంటే అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వ అభ్యర్దనలు అందుతున్నాయి. 1919లో వారి పార్టీ ఏర్పడినప్పటికీ 1917లో అక్టోబర్‌ విప్లవం సంభవించినపుడు తొలిసారిగా మార్క్సిస్టు భావజాలంతో సంఘటితమైన వారిలో అమెరికన్‌ పౌరులు కూడా వున్నారు, త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్నారు. పార్టీ ఏర్పాటయిన నాటి నుంచి రెండు యుద్దాల మధ్యకాలం, ప్రచ్చన్న యుద్ద అణచివేతలో, దీనిలో వాస్తవంగా రహస్య సంస్దగా పని చేయాల్సి వచ్చింది. ముఫ్పై కోట్ల మంది జనం వున్న దేశంలో ప్రస్తుతం ఐదువేల మంది సభ్యులు వున్నారు. మెకార్ధీ కాలం నాటి భూతం అమెరికా అంతటా ఇప్పటికీ వున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాలం పట్ల అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది.

ఎమిలీ షెపర్స్‌ వృత్తి రీత్యా మానవశాస్త్రవేత్త, దక్షిణాఫ్రికాలో జన్మించారు. జాత్యహంకార వ్యవస్దను తప్పించుకొనేందుకు ఆయన తలిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఎమిలీ 1987లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. అయితే మార్క్సిస్టు భావజాలం ఆయన చిన్నతనంలోనే మేరీ లాండ్‌, చికాగో సమీపంలోనిఒక పోర్టారికో నివాస ప్రాంతంలోనే అబ్బింది. ‘ కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే అమెరికాలో ఏ రీత్యా చూసినా విప్లవానికి ముందుండే పరిస్ధితి లేనప్పటికీ ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం అంత్య దశలో వున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనేక మందిని ప్రభావితం చేసింది. వామపక్షాలుగా చెప్పాలంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలు అత్యంత హీన స్ధితిలో వున్నారు. దేశంలోని మెజారిటీ పౌరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఇటీవలి డెమోక్రటిక్‌ లేదా రిపబ్లికన్‌ పార్టీల ప్రభుత్వాలు పరిష్కరించగలిగిన స్ధితిలో లేవు. జనంలో వున్న అసంతృప్తి అన్ని వేళలా సరైన పురోగమన బాట పట్టదు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికలలో సైద్ధాంతిక పరమైన తిమ్మినిబమ్మిని కారణంగా ఒక మితవాద వైఖరికి దారితీసింది. మా స్వంత రాష్ట్రమైన వర్జీనియా కేవలం ధనవంతమైనదే కాదు, ఎందరో తెల్లవారైన పేదలు కూడా వున్నారు. వారంతా ట్రంప్‌కు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. బొగ్గు తవ్వకం ఆప్రాంతంలో ప్రధాన వుపాధి వనరు. ఇటీవలి సంవత్సరాలలో వేలాది మంది కార్మికులను పనుల నుంచి తొలగించారు. రిపబ్లికన్లు దీనంతటికీ బరాక్‌ ఒబామా పర్యావరణ విధానాలు కారణమని ప్రచారం చేశారు.

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి ఎన్నిక ప్రచారం సందర్బంగా మిలియన్ల మంది యువత బెర్నిశాండర్స్‌ పురోగామి భావజాలం వైపు సమీకృతమయ్యారు.శాండర్స్‌ కనుక ట్రంప్‌ ప్రత్యర్ధి అయి వుంటే ఆయన గెలిచి వుండేవారు.ఈ నేపధ్యంలోనే షెపర్స్‌ ప్రస్తావించిన ‘కుహనా వర్గ చైతన్యం ‘ మరియు తిమ్మిని బమ్మిని చేయటాన్ని వ్యతిరేకించటానికి వామపక్షం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఎత్తి చూపింది.’ మీడియాను కార్పొరేషన్లు అదుపు చేసిన స్ధితిలో స్ధానిక న్యూస్‌ ఛానల్స్‌లో ప్రసార బోధకులు ప్రపంచం అంతం కావటం గురించి చెబుతున్నపుడు ఇది చాలా కష్టం ‘అని షెపర్స్‌ చెప్పారు. అందుకే అన్ని రకాల పద్దతులలో సాధ్యమైనంత మేరకు తన భావజాలాన్ని జనంతో పంచుకోవటానికి, వారిని చైతన్యవంతులను చేయటాన్ని కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఆ రీత్యానే కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం, పార్టీలో ఎలా చేరాలనే సమాచారాన్ని పొందుపరిచారు. అయినప్పటికీ కార్మికుల హక్కులను రక్షించుకుంటూ వారి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా కార్మికులు, కార్మిక సంఘాలను సంఘటితపరచటం ఒక పెద్ద సవాలే అన్నారు.

అమెరికా కమ్యూనిస్టు పార్టీ పాలస్తీనాను సమర్ధిస్తుంది మరియు అమెరికా మిలిటిరిజాన్ని వ్యతిరేకిస్తుంది. అనేక సంవత్సరాలుగా క్యూబా విప్లవాన్ని మరియు ఇటీవల బొలివేరియన్‌ రిపబ్లిక్‌ వెనెజులాను సమర్ధిస్తున్నది. క్యూబాతో సాధారణ సంబంధాలను పునరుద్దరించుకోవాలని అమెరికా ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రకటనను కమ్యూనిస్టు స్వాగతించింది.’2014 డిసెంబరు 17వ తేదీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది,అయితే అది మంచి వార్త. కొన్ని విషయాలలో ముందుకు పోయినప్పటికీ ఒబామా తాను చేయగలిగినదంతా చేయలేదు’ అని షెపర్స్‌ చెప్పారు. అయినప్పటికీ క్యూబాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనేందుకు పార్లమెంట్‌లోని డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండింటిలోనూ పెరుగుతోంది.’దీనికి మానవతాపూర్వకమైన మనోభావాలతో కొందరు ఇతరులు ఆర్ధిక ప్రయోజనాలకోసం ఇద్దరూ దిగ్బంధం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దిగ్బంధనాన్ని కొనసాగించాలని కోరుతున్న ఏకైక తరగతులెవరంటే ప్రత్యేకించి ఫ్లోరిడాలోని క్యూబన్‌-అమెరికన్లు మాత్రమే ‘ అన్నారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని తాజా సర్వేలో మెజారిటీ అమెరికన్‌ పౌరులు వెల్లడించారు. ట్రంప్‌ ఏం చేస్తాడో మాకు తెలియదు, జనం మాట వింటారా సిద్ధాంతవేత్తల మాట వింటారో తెలియదు. అయితే మొత్తంగా చెప్పాలంటే అమెరికన్‌ కమ్యూనిస్టులు ఆశాభావంతో వున్నారు ‘ అని చెప్పారు.

Image result for pope francis communist

మే డే రోజునే ‘పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు గురువు’ అనే శీర్షికతో స్పెక్టేకర్‌ పత్రికే మరో వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘ రాజకీయ పోప్‌ ‘ అనే పేరుతో జార్జి న్యూమర్‌ రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను దానిలో వుటంకించారు.https://spectator.org/pope-franciss-communist-mentor/ ‘ పోప్‌ నోటి నుంచి వెలువడిన స్వచ్చమైన మార్క్సిజం ఇది ‘ అని రేడియో వ్యాఖ్యాత రష్‌ లింబా, ‘ లెనిన్‌ గారి పోప్‌ ‘ అని మరో వ్యాఖ్యాత మైఖేల్‌ శావేజ్‌ నోరు పారవేసుకున్నారు. వాటి గురించి ఇటాలియన్‌ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పోప్‌ తోసి పుచ్చారు.’ నా జీవితంలో నేను ఎందరో మంచి వారైన మార్క్సిస్టులను కలుసుకున్నాను. అందువలన అలాంటి మాటలకు నేను బాధపడటం లేదు’ అన్నారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్ధ మధ్యకాలం 1922-39 మధ్య పని చేసిన పోప్‌ పదకొండవ పయస్‌ కమ్యూనిస్టు వ్యతిక ప్రకటన చేశారు.’ ఒకే సారి మంచి కాథలిక్‌గానూ నిజమైన సోషలిస్టుగానూ ఎవరూ వుండలేరు’ అని పయస్‌ ప్రకటిస్తే దానికి విరుద్దంగా ఈ రోజు పోప్‌ ఫ్రాన్సిస్‌ చెబుతున్నది వింటే ‘ ఒక మంచి కాథలిక్‌ సోషలిజం వ్యతిరేకిగా వుండజాలరు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు అని సదరు రచయిత వ్యాఖ్యానించారు.

‘పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ మరియు పోప్‌ 16వ బెండిక్ట్‌ శిలువతో అసహజంగా ప్రవర్తించారా వారు దానిని తమ మోకాళ్ల ముందు వుంచుకొని వుండవచ్చు, పోప్‌ ఫ్రాన్సిస్‌ అలా కాదు. సుత్తీ కొడవలి చిహ్నంగా వున్న శిలువను ఎంతో సాదరంగా స్వీకరించారు. విమానంలో రోమ్‌కు తిరిగి వస్తూ విలేకర్లతో మాట్లాడుతూ ‘ఈ పనిని నేను అర్ధం చేసుకోగలను, నా వరకు ఇదేమీ ఒక అపరాధం కాదు’ అన్నారు. పోప్‌ పర్యటన తరువాత నాకు ఒక పోప్‌ వున్నారనే భావన నాకు ఇప్పుడు కలిగింది. ఇంతకు ముందు నాకు ఆభావన కలగలేదు ‘ అని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.ఈ రెండు వ్యాసాలలోని అంశాలను చూసినపుడు సోషలిజం, కమ్యూనిజంపై అటు రాజకీయంగానూ ఇటు మతపరంగానూ దాడి ఎలా జరుగుతోందో, పేదలకు మంచి జరగాలి, దోపిడీ వుండకూడదని చెప్పిన జీసస్‌ తొలి కమ్యూనిస్టు అని చెప్పిన పోప్‌ ఫ్రాన్సిస్‌ వంటి వారి మీద ఎలా వ్యతిరేకత రెచ్చగొడుతున్నారో చూడవచ్చు. పాడిందే పాడరా పాచి పళ్ల పాటగాడా అన్నట్లుగా కమ్యూనిస్టు మానిఫెస్టోను రాయక ముందే ప్రారంభమైన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కమ్యూనిస్టు భావజాల ప్రచారం, ప్రభావం, విస్తరణను అడ్డుకోలేకపోయింది. ఇంకా ఆ తుప్పు పట్టిన ఆయుధంతోనే ఈ ఇంటర్నెట్‌ యుగంలో కూడా ప్రయత్నిస్తున్నారు.

నాజీజం మాదిరి ఎందుకు కమ్యూనిజాన్ని ద్వేషించటం లేదు అనే శీర్షికతో ఒక వ్యాఖ్యాత మరో పత్రికలో రాశాడు. http://www.theblaze.com/news/2017/05/01/watch-why-isnt-communism-as-hated-as-nazism/ . దానిలో ఏం చెప్పినప్పటికీ నాజీజం అన్నది లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నదని, అంతర్జాతీయ న్యాయస్ధానంలో అందుకు బాధ్యులైన వారిని విచారించిన విషయం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి జరిపిన వ్యతిరేక ప్రచారం అక్కడ అంత మందిని చంపారు ఇక్కడ ఇంత మందిని చంపారు అంటూ తప్పుడు లెక్కలు, కట్టుకధలు ప్రచారం చేయటం తప్ప రుజువులను జనం ముందుంచలేకపోయారు. సిద్ధాంత పరంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారందరూ కమ్యూనిస్టులు హంతకులు అనే కట్టుకధలను నమ్మరు. తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులు అనేది కళ్ల ముందున్న వాస్తవం. ఆ సందర్భంగా కమ్యూనిస్టు గెరిల్లాల చేతిలో హతమైన వారందరూ దోపిడీదారులు, వారికి ఏజంట్లుగా, గూండాలుగా, జనంపై దాడులు చేసిన పోలీసులు, రజాకార్లు తప్ప సామాన్యులను కమ్యూనిస్టులు చంపలేదనే విషయం జనానికి తెలుసు. అందుకే కమ్యూనిస్టులపై నాటి నిజాం, కాంగ్రెస్‌, నెహ్రూ ప్రభుత్వం, మీడియా చేసిన ప్రచారాన్ని తోసిరాజని తొలి ఎన్నికలలో వుద్యమం జరిగిన, దాని ప్రభావం వున్న ప్రాంతాలన్నింటా కమ్యూనిస్టులనే జనం గెలిపించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో కమ్యూనిస్టుల గురించి చేసిన తప్పుడు ప్రచారం ఎల్లకాలం జనాన్ని మోసం చేయలేదు. చైనాలో నానాటికీ దారిద్య్రం తగ్గుతోందని ప్రపంచబ్యాంకే చెబుతోంది, అదే సమయంలో అమెరికాలో దారిద్య్రంలోకి చేరే వారి సంఖ్య పెరుగుతోంది. సోషలిస్టు దేశమైన చైనా ఎన్నో విజయాలు సాధిస్తున్నపుడు అదే మాదిరి మన దేశంలో కూడా సోషలిస్టు వ్యవస్ధను నెలకొల్పుకుంటే నిరుద్యోగం, దారిద్య్రాల నుంచి బయటపడవచ్చు కదా అన్న ఆలోచన రాకుండా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల యువత మెదళ్లను ఎవరైనా ఎలా కట్టడి చేయగలరు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మే డే, పూలే, అంబేద్కర్‌ !

29 Saturday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

'Bombay Mill Hands Association, b-r-ambedkar, Father of the Trade Union Movement in India, jyothi-rao-pule, may day, narayan meghaji lokhande

Image result

ఎం కోటేశ్వరరావు

మే డే, కార్మికుల దీక్షా దినం. ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గం తన హక్కుల సాధనకోసం పునరంకితమయ్యే అంతర్జాతీయ దినం. అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( మరీ కొంత మంది అయితే దళితులలో ఒక వుప కులానికే పరిమితం చేసే విచారకర ప్రయత్నం గురించి చెప్పనవసరం లేదు.) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఓబిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చరిత్రలో వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. ఈ ప్రచారానికి ప్రభావితమైన వారు మే డే సందర్భానికి పూలే,అంబేద్కర్‌లకు సంబంధం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

Image result for narayan meghaji lokhande

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాల కే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికుల పని పరిస్థితుల గురించి ఎలాంటి చట్టాలు లేవు. పొద్దు పొడవక ముందే మిల్లు పనిలోకి రావాలి.పొద్దు పోయేంత వరకు పని చేయాలి. ఇంటికి వెళ్లి రావటంలో అలస్యం అయితే యజమానులు అంగీకరించరు కనుక అనేక మంది రాత్రి డ్యూటీ దిగి గేటు దగ్గరే నిద్రపోయి తెల్లవారు ఝామున లేచి తిరిగి పనికి వెళ్లే వారు. మధ్యలో భోజనానికి పావు గంటా ఇరవై నిమిషాలు మాత్రమే అనుమతించేవారు. ఇక ఫ్యాక్టరీలలో కాలకృత్యాలు తీర్చుకొనే సౌకర్యాలు, తగిన గాలి, వెలుతురు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొన్ని పండుగలకు ఇచ్చే సెలవులు తప్ప 365రోజులూ పని చేయాల్సిందే. దీనికి తోడు దాదాపు రోజంతా యంత్రాలు పని చేసిన కారణంగా వాటి రాపిడికి ఫ్యాక్టరీలో వేడి వాతావరణం వుండేది. దీంతో కార్మికులు అయిదారు సంవత్సరాలకు మించి పని చేయలేకపోయే వారు.1881 లెక్కల ప్రకారం బొంబాయి మిల్లులలో పని చేసే వారిలో 23శాతం మంది 15 ఏండ్ల లోపు బాల కార్మికులు వుండేవారు. రోజు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన నారాయణ్‌ ఆ పరిస్థితులు మారాలనే ప్రచారానికి పూనుకున్నారు.1877లో ప్రారంభమైన దీన బంధు పత్రిక ఆర్ధిక ఇబ్బందులతో వెంటనే మూత పడింది. దానిని తిరిగి పునరుద్ధరించి 1880లో సంపాదక బాధ్యతలు చేపట్టిన నారాయణ్‌ మరో నాలుగు సంవత్సరాలకే బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో ఏర్పాటు చేశారు. అమెరికా, తదితర దేశాలలో జరుగుతున్న కార్మికోద్యమాలను చూసిన బ్రిటీష్‌ ప్రభుత్వం 1875లోనే ఒక కమిషన్‌ వేసి 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసింది. అయితే దానితో కార్మికుల పని పరిస్థితులలో పెద్దగా మార్పేమీ లేదు. అదెంత కంటి తుడుపు వ్యవహారమంటే ఏడు సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టరాదని, 7-12 ఏండ్ల బాల కార్మికులతో తొమ్మిది గంటలకు మించి పని చేయించరాదని, యంత్రాల చుట్టూ కంచెలు వేయించాలనే తరహా నిబంధనలు పెట్టింది. వీటిని కూడా యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం దానిని కూడా అమలు జరిపే యంత్రాంగం, ఆసక్తి ప్రభుత్వానికి లేదు. నారాయణ్‌ మేఘాజీ తన పత్రిక ద్వారా, ఇతర పద్దతులలో దాని వలన పెద్ద కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రచారం చేయటంతో పాటు, కార్యాచరణకు గాను ముందే చెప్పుకున్నట్లు 1884లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హోదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు.

1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయంగా ఒకటి. మార్కెట్‌లో వున్న మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొకటి.

అంతకు ముందు ఆమోదించిన ఫ్యాక్టరీ చట్టం కార్మికులను సంతృప్తి పరచకపోవటం, ఆందోళనలు పెరిగి పోవటంతో ప్రభుత్వం 1890లో ఫ్యాక్టరీ లేబర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.దానిలో లోఖండేను సహ సభ్యునిగా నియమించింది. దాని సిఫార్సుల మేరకు 1891లో ఆమోదం పొంది మరుసటి ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం పది మంది వున్న ఫ్యాక్టరీలన్నింటికీ వర్తించింది. తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలతో పనిపై నిషేధం, 14 ఏండ్ల లోపు వారికి, మహిళల చేత 9,11 గంటలు మాత్రమే పని చేయించాలని, వారికి నెలకు నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు.

Image result for jyothi rao pule

జ్యోతిబా పూలే తిరుగులేని అనుచరుడిగా వున్న లోఖాండే కార్మికనేతగా పని చేయటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సంస్కర్తగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు అమానుష దోపిడీ, దుర్భర పని పరిస్ధితులలో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి ప్రతిఘటన పోరాట యోధుడు. నాటి పరిస్థితులలో మహజర్లు సమర్పించటం, సభలు జరపటం వంటి రూపాలనే ఎంచుకోవటం సహజం. తన పత్రికలో రాసిన సంపాదకీయాలను చూస్తే ఈ రెండు అంశాలతో పాటు 1893లో జరిగిన మత ఘర్షణల సందర్భంగా హిందూ-ముస్లిం ఐక్యత అవసరం గురించి ఆయన రాసిన సంపాదకీయాలు మతశక్తుల పట్ల వైఖరిని వెల్లడించాయి. అన్ని మతాల వారితో ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 60వేల మంది హాజరయ్యారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలను ఆయన నిరసించాడు.కార్మిక నేతగా ప్రత్యేకంగా మహిళాకార్మికులను సమీకరించి కూడా సభలు జరిపారు. భర్త మరణించినపుడు స్త్రీల తలలు గొరిగి గుండ్లు చేయటాన్ని ఆయన వ్యతిరేకించారు.1890 మార్చినెలలో దాదాపు ఐదు వందల మంది క్షురకులను సమీకరించి ఏర్పాటు చేసిన సభలో మహిళలకు గుండ్లు చేయబోమని వారిచేత ప్రతిజ్ఞ చేయించటం ఒక అపూర్వ ఘట్టం. పేదలకు సేవ చేసేందుకు ఆయన ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించారు.1886లో బొంబాయి, పరిసరాలలో వ్యాపించిన ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూనే 1887 ఫిబ్రవరి తొమ్మిదిన ఆయన మరణించారు.

2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. మొత్తం మీద చూసినపుడు లోఖండేలో సంఘసంస్కర్త పాలు ఎక్కువా లేక కార్మికోద్యమ నేత పాలు ఎక్కువగా అన్నది పక్కన పెడితే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు.

Image result for ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ జీవితాన్ని పరిశీలించినపుడు ఆయనలో వున్నన్ని భిన్న పార్శ్వాలు మరే నాయకుడిలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుడిని కొందరు నేడు దళితులలో ఒక వుప కుల ప్రతినిధిగా చూస్తూ కొందరు ఆరాధిస్తుంటే అదే కారణంతో మరికొందరు ఆయనను విస్మరిస్తున్నారు. రెండు వైఖరులూ సరైనవి కావు. అంబేద్కర్‌ రాజ్యాంగ పద్దతులలో కార్మికవర్గానికి చేసిన మేలు తక్కువేమీ కాదు. ఆయన ఇండియన్‌ లేబర్‌ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా రైతాంగ సమస్యలపై కూడా పని చేశారు. మొత్తం మీద చూసినపుడు మొగ్గు రాజ్యాంగం, చట్టాలు, దళితుల అభ్యుదయానికి ఆయన మారుపేరుగా మారారు.

Image result for may day

మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కృషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. దాని మంచి చెడ్డల విషయానికి వస్తే అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కృషిని గుర్తించిన మాట వాస్తవం. కార్మిక, కర్షక వుద్యమాలు, సంఘాల నిర్మాణాలతో పాటు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మహిళల ప్రత్యేక సమస్యలు, హక్కుల గురించి పోరాడేందుకు ఏర్పాటు చేస్తున్న సంఘాలు, వాటి కార్యకలాపాలే అందుకు నిదర్శనం. వాటిని గుర్తించేందుకు కొంతకాలం పట్టవచ్చు. గతంలో పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించ వచ్చు. లేదూ అది చాలదు అనుకుంటే తమ అభిప్రాయాలను తాము అట్టి పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారి గురించి కూడా కొన్ని విమర్శలున్నాయనే అంశాన్ని మరచి పోకూడదు. కార్మిక, కర్షక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యతను కమ్యూనిస్టులు కుల వివక్ష సమస్యకు ఇవ్వలేదని ఎలా విమర్శలు వచ్చాయో, పూలే-అంబేద్కరిస్టులు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ పోరాటాలను విస్మరిస్తున్నారనే ఆ విమర్శ. అందువలన ఇద్దరు మిత్రులూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి మిత్ర వైరుధ్యాలు తప్ప శత్రువైరుధ్యాలు కావు. అందువలన ఇప్పుడు రెండు వైపుల నుంచీ వినిపిస్తున్న లాల్‌ -నీల్‌ ఐక్యతను పెంపొందించేందుకు చిత్తశుద్దితో కృషి చేయటం అవసరం. ఈ మేడే సందర్భంగా రెండు శక్తులూ కర్తవ్యానికి పునరంకితం కావటమే చికాగో అమర జీవులు, పూలే-అంబేద్కర్‌లకు నిజమైన నివాళి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు కమ్యూనిస్టులు ! నేడు వ్యతిరేకుల బెంబేలు !!

28 Friday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, anti communists, Bernie Sanders, Communists, french communist party, french left party, post communist mafia state, Socialist

Image result for The communists, now anti communists are worrying

ఎం కోటేశ్వరరావు

సోషలిజం, కమ్యూనిజాలకు కాలం చెల్లింది అన్న తీవ్ర ప్రచార దాడికి గురైన అనేక మంది కమ్యూనిస్టులు దానిని తట్టుకోలేక, కోలుకోలేక నిజమే అనుకున్న మాట వాస్తవం. కావమ్మ మొగుడని అందరూ అంటే కామోసని ఇన్నేళ్లూ కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్రా ఇస్తే నా దారి నే చూసుకుంటాను అన్న సామెత తెలిసిందే. అలాగే అంతగా సైద్ధాంతిక అవగాహన లేని వారు, కమ్యూనిస్టు అనుకూల పరిణామాలతో వుత్తేజితులై వచ్చిన వారు అనేక మంది దూరమయ్యారు. కొత్తవారిలో వుత్సాహం తగ్గిపోయింది. అయినా అనేక మంది అచంచల విశ్వాసంతో ఎత్తిన జెండా దించకుండా కొనసాగుతున్నవారున్నారు. పాతికేండ్ల తరువాత యువతలో సోషలిస్టు అనుకూల భావాలపై ఆసక్తి పెరగటాన్ని చూసి పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు బెంబేలెత్తుతున్నారు.

ఏప్రిల్‌ 23న ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఇంకేముంది కమ్యూనిస్టు అభ్యర్ధి దూసుకు వస్తున్నాడు బహుపరాక్‌ అని కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, వ్యతిరేక శక్తులు ప్రచారం చేశాయి. తుది విడత పోటీకి అర్హత సంపాదిస్తాడనుకున్న కమ్యూనిస్టులు బలపరిచిన వామపక్ష అభ్యర్ధి మెలెంచన్‌ కొద్ధి శాతం ఓట్ల తేడాతో అవకాశాన్ని కోల్పోయాడు. అధికారానికి దగ్గర దారులు లేవు, పోరాటాన్ని కొనసాగిస్తామంటూ ఈ ఫలితాన్ని కమ్యూనిస్టులు సాధారణంగానే స్వీకరించారు. కమ్యూనిజం అంతరించిందన్న ప్రచారాన్ని నిజంగానే నమ్మిన ఫ్రాన్స్‌లోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కొందరికి ఇప్పుడు మనోవ్యాధి పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, అమెరికాలో కూడా తీవ్రంగానే విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలే అందుకు నిదర్శనం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార దాడి సైనికులు, కమాండర్లు ఇప్పుడు కొట్టబోతే కడుపుతో వుంది, తిట్టబోతే అక్క కూతురు అన్న స్ధితిని ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది.

తొలి విడత ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఒక ఫ్రెంచి పత్రికలో వచ్చిన వ్యాఖ్యానం ఇలా సాగింది.’ ఫ్రాంకోయిస్‌ ఫిలన్‌(మితవాద రిపబ్లికన్‌ పార్టీ) దేశాన్ని సంస్కరించేందుకు కట్టుబడి వుంటానని ప్రకటించిన వైఖరి ఎంతో ప్రభావం చూపినప్పటికీ ఆయనకు లభించిన మద్దతు చూసి ఆశాభంగం చెందాను. దానికి నేను చేయగలిగింది లేదు గానీ తుది విడత పోటీలో లీపెన్‌-మెలాంచన్‌ మధ్య పోటీ జరగనందుకు నాకు ఎంతో భారం తీరింది. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ సోషలిస్టు కాదు, ప్రచారంలో చెప్పినదానికంటే పెద్ద స్వేచ్చా మార్కెట్‌ వాది, అయితే తన అధ్యక్ష పదవితో దేశాన్ని మెరుగుపరిచేందుకేమీ చేయలేడు….. ఎన్నికలలో 55శాతం మంది ఓటర్లు తీవ్రవాద భావాలున్న వారికి ఓటు చేసిన దాని గురించి నేను చెప్పాలి…. దాని కంటే ఎక్కువగా మిలియన్ల మంది మరణాలకు కారణమైంది కమ్యూనిస్టు సిద్ధాంతం అనే అబేధ్యమైన ప్రచారాన్ని బద్దలుకొట్టి కమ్యూనిస్టు మెలంచన్‌కు ఫ్రెంచి జనాలు ఓటు వేయటం నా బుర్రను బద్దలు చేస్తున్న అంశం…. ఫిలన్‌ సంపాదించినన్ని ఓట్లు దాదాపు 20శాతానికి దగ్గరగా మెలంచన్‌ సాధించాడు.ఇదొక వెర్రి. హ్యూగో ఛావెజ్‌ ఇతర కమ్యూనిస్టు నియంతలను మెలంచన్‌ తిరుగులేని విధంగా సమర్ధించాడు. అంతకంటే హీనమైనది ఏమంటే ఒక్క ఫ్రాన్సే కాదు -ఫెడల్‌ కాస్ట్రో ఎట్టకేలకు మరణించాడు. జనం ఏమి ఆలోచిస్తున్నారు ? నేను జీవించి వున్నంత వరకు ఫ్రాన్స్‌లో, వెలుపలా కమ్యూనిజం కళంకానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో, 2017లో ఈ సిద్ధాంతం ఎందుకు పెరుగుతోందో నేను ఎన్నడూ అర్ధం చేసుకోలేను.’ అని పోయాడు.http://www.nationalreview.com/corner/446992/france-marine-le-pen-presidential-election-normalization-extremes ఇలాంటి వారెందరో కనిపిస్తున్నారు.

Image result for socialists in Present USA

పాతిక సంవత్సరాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయినందుకు కమ్యూనిస్టులు విచారిస్తే తిరిగి కమ్యూనిజం పట్ల జనం సానుకూలత వ్యక్తం చేయటాన్ని చూసి కమ్యూనిస్టు వ్యతిరేకులలో ఆందోళన ప్రారంభమైందన్నది స్పష్టం. కమ్యూనిస్టు భూతం గురించి ఐరోపాను వెన్నాడుతోందని 1848 నాటి కమ్యూనిస్టు ప్రణాళిక ముందు మాటలోనే మార్క్స్‌-ఎంగెల్స్‌ రాశారు. అంటే అంత కంటే ముందే ఐరోపాలో తత్వవేత్తలు సోషలిజం, కమ్యూనిజాల గురించి చర్చించటం, ఆ భావజాలం తమ దోపిడీ వ్యవస్ధను కూల్చివేస్తుందని పెట్టుబడిదారీ వర్గం అప్పుడే గుర్తించటం, నిరోధించటానికి నాటి నుంచే ప్రయత్నించటం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక రూపంలో జనాన్ని భయపెడుతూనే వున్నారు. ఏదైనా ఒక వ్యవస్ధ సమాజంలోని మెజారిటీ వర్గం ముందుకు పోవటానికి ఆటంకంగా మారినపుడు దానిని కూల్చివేసి నూతన సామాజిక వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటమే ప్రపంచ మానవాళి చరిత్ర. దారుణంగా వున్న భూస్వామిక వ్యవస్ధతో పోల్చితే పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైన పెట్టుబడిదారీ వ్యవస్ధ తొలినాళ్లలో జనానికి మెరుగ్గా కనిపించింది.’ అరే ఒరే అన వీల్లేదంటా, వారం వారం బట్వాడంటా ….బస్తీకి పోదాము’ పాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. భూస్వామిక వ్యవస్ధ ఆటంకంగా మారింది కనుకే దానికంటే మెరుగైన వ్యవస్ధ కోసం జనం దానిని నాశనం చేసేందుకు పెట్టుబడిదారులకు సహకరించారు. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు గ్రహించగానే పెట్టుబడిదారీ వ్యవస్ధను నాశనం చేయటం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టక ముందే సమసమాజం, సోషలిజం, కమ్యూనిజం గురించి చర్చ ప్రారంభమైందంటే అది ఒక సహజ పరిణామం తప్ప మరొకటి కాదు. వారు గాక పోతే మరొకరు కమ్యూనిస్టు ప్రణాళికను రచించి వుండేవారు.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని దాచటం అసాధ్యం. అత్యంత పకడ్బందీగా దాచే అమెరికా రహస్యాలనే అసాంజే లోకానికి అందించిన విషయం తెలిసినదే. పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించిన అమెరికా విశ్వవిద్యాలయ ముద్రణ సంస్దపై అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు విరుచుకుపడుతున్నారు. మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాదు యూనివర్సిటీల వంటివి బిజెపి సర్కారుకు కంటగింపుగా మారి వాటిని దెబ్బతీయాలని చూస్తున్నట్లే తాజాగా తూర్పు ఐరోపాలోని హంగరీలోని సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ(సిఇయు)ను మూసివేయాలని ప్రజాస్వామ్య ముసుగు వేసుకున్న అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Image result for post communist mafia state

ఆ విశ్వవిద్యాలయం చేసిన తప్పిదం ఏమిటి ? ‘ కమ్యూనిస్టు అనంతర మాఫియా రాజ్యం-హంగరీ వుదంతం ‘( పోస్ట్‌ కమ్యూనిస్టు మాఫియా స్టేట్‌ – ఏ కేస్‌ ఆఫ్‌ హంగరీ) అనే పేరుతో 2016లో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. రచయిత కమ్యూనిస్టు కాదని ముందు తెలుసుకోవాలి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత హంగరీ ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణాలను దాచి పెట్టేందుకు అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ఐరోపాకు పదిలక్షల మంది వలస రావటానికి జార్జి సోరెస్‌ ప్రధాన కారణమని, అలాంటి వారి కేంద్రంగా విశ్వవిద్యాలయం వుందంటూ ప్రభుత్వ పత్రిక ద్వారా జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. పైన పేర్కొన్న పుస్తకాన్ని సదరు విశ్వవిద్యాలయం ముద్రించిన కారణంగా దానిని మూసివేయాలనే యత్నాలను 63శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది.మాఫియా శక్తులకు ఆశ్రయమిచ్చిన పాలకుల నిజస్వరూపాన్ని ఆ పుస్తకంలో ఎండగట్టటమే అసలు కారణం. సోషలిస్టు వ్యవస్ధ స్ధానంలో ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన కమ్యూనిస్టు వ్యతిరేకులు గత పాతిక సంవత్సరాల కాలంలో నిరంకుశ పాలనను రుద్దేందుకు అనుసరిస్తున్న నూతన పద్దతులను దానిలో వివరించారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆ పుస్తకాన్నిరాసింది ఒక మాజీ మంత్రి కావటంతో దానికి విశ్వసనీయత పెరిగింది. ప్రజాస్వామ్యం గురించి పంచరంగుల్లో చూపిన వారు దాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టటాన్ని గమనించిన జనం ఎలా ఆలోచించేది చెప్పనవసరం లేదు. సాంప్రదాయక మాఫియా బహిరంగంగా ఎలా సంపదలను బలవంతంగా లూటీ చేస్తుందో తెలిసిందే. అదే కమ్యూనిస్టు పాలన అనంతర రాజకీయ మాఫియా చట్టాలను అడ్డం పెట్టుకొని ఎలా లూటీ చేస్తుందో ఒక్క హంగరీకే గాక ఎక్కడైతే ఇతర కమ్యూనిస్టు అనంతర రాజ్యాలలో నిరకుశపాలకులు వున్నారో ఆ దేశాల వారందరూ తెలుసుకోవాల్సిన అంశాలున్న ఈ పుస్తకం సమయోచితంగా వెలువడిందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.ఈ పుస్తకం గురించి అడిగితే గూగులమ్మ తల్లి ఎంతో సమాచారాన్ని మన ముందు ప్రత్యక్షం చేస్తోంది. అలాంటపుడు మన కంటే ఎక్కువ చదువుకున్న, సమస్యలను ఎదుర్కొంటున్న ఫ్రెంచి యువతరానికి తమ పొరుగునే వున్న తూర్పు రాజ్యాలలోని ఈ మంచి చెడ్డలన్నీ తెలియకుండా వుంటాయా? ప్రజాస్వామ్యం పేరుతో ఇంతకాలం ఇతర పార్టీల ప్రజావ్యతిరేక పాలన చూసిన తరువాత రెండవ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్‌ వ్యతిరేక పోరాటంలో ఘనమైన గత చరిత్ర వున్న కమ్యూనిస్టులకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచన ఫ్రెంచి వారిలో కూడా ఏ మూలన అయినా ప్రారంభమైందేమో ? ఏమీ లేకుండా 20శాతం ఓట్లు ఎలా వస్తాయి?

Image result for socialists in Present USA

అమెరికా అంటే ప్రపంచ దోపిడీ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల, యుద్దోన్మాదుల, కమ్యూనిస్టు వ్యతిరేకుల నిలయంగా అందరికీ తెలిసిందే. మరి అలాంటి రాజ్యంలో ‘ సోషలిజం అంత జనరంజకంగా ఎలా తయారైంది ?’ అనే ప్రశ్నతో ఒక విశ్లేషణ చేశారు.https://www.thetrumpet.com/15721-how-did-socialism-become-so-popular-in-america అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేక, తటస్ధ, సానుకూల ఏదో ఒక రూపంలో మీడియాలో ఇటీవలి కాలంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతేడాది ఎన్నికల సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.’ ప్రచ్చన్న యుద్ధ సమయంలో కమ్యూనిజం గురించి అమెరికాలో ఎంతో భయం వుండేది. కమ్యూనిజం వ్యాప్తి గురించి అతిశయోక్తులు చెప్పారని ఇప్పుడు ఎక్కువ మంది అమెరికన్లు నమ్ముతున్నారు. ప్రధాన స్రవంతి సోషలిస్టు భావజాలం గురించి నేడు ఎంత విస్తృతంగా ప్రచారంలో వున్నాయో చూడండి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దాదాపు ఒక బహిరంగ సోషలిస్టు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దిత్వాన్ని గెలుచుకున్నారు. మూడు పదుల లోపు వయసు వారు మాత్రమే ఓటు వేసి వున్నట్లయితే ఆ వ్యక్తి నేడు అమెరికా అధ్యక్షుడు అయి వుండేవాడు. ప్రభుత్వ అధికారం మరియు పాత్రను ఎంతో పెంచాలన్న ఆయన విప్లవాత్మక పధకాలు ఇప్పటికీ బహుళఆదరణ పొందుతున్నాయి. ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్ధిక వ్యవస్ధలోని ప్రధాన రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. మన సమాజం ఆలోచనలో ఇది పెద్ద మార్పు, అది ఎంతో వేగంగా జరుగుతోంది…….ఈ రోజు అమెరికాను కమ్యూనిజం ప్రభావితం చేస్తోంది అన్న రుజువు కోసం మీరు పెద్దగా కష్టపడనవసరం లేదు……..సగటు కాలేజీ ఫ్రొఫెసర్‌ను మీరు సోషలిస్టా లేక మార్క్సిస్టా అని అడిగితే అతడు లేక ఆమె అవును నేను అదే అని చెప్పే అవకాశాలున్నాయి……అమెరికన్లు నేడు మన జాతిపితలు లేదా మన స్వంత తండ్రులు నిర్మించిన దేశంలో నివశించటం లేదు. అనేక మంది గుర్తించిన దానికంటే ఎక్కువ విప్లవ భావాలవైపు మొగ్గుతున్నారు. సోషలిస్టు మరియు కమ్యూనిస్టు ఆలోచనా వివేచనను మనం ఈ క్షణంలో స్వతహాగా గుర్తించటం కాదు. ఒక పధకం ప్రకారం ఆశ్చర్యకరంగా ఈ స్వేచ్చా భూమిని మరియు ధైర్యవంతులకు నిలయమైన దీనిని కూల్చివేసేందుకు విజయవంతంగా అనుసరించిన వ్యూహం ఫలితంగానే ఈ భావ జాలం ఇంతగా జనంలో ప్రచారమైందన్నది వాస్తవం.’ అని జోయెల్‌ హిలికర్‌ అనే రచయిత వాపోయాడు.

చిత్రం ఏమిటంటే సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత కూడా అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ నిధులు అందచేసిందని అలవాటులో భాగంగా చెడరాసి పడేశాడు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ అనేక దేశాలలో కమ్యూనిస్టు వుద్యమాలకు తోడ్పాటు అందించేందుకు అనేక రూపాలలో సాయం చేసింది. భావజాల ప్రచారంలో భాగంగా ఎక్కువ భాగం పుస్తకాల రూపంలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం.ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేయటానికి అమెరికన్లు ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారో, పెట్టుబడులు పెట్టారో లోకవిదితమే. మొదటిది పధకం అయితే రెండవదీ వ్యూహమే, దానికి అనుగుణ్యంగా పధకమే. భావజాల ప్రచారానికి పధకం వేయటం ద్వారా అమెరికాలో వ్యాప్తి చెందిందన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధ, తమ కమ్యూనిస్టు వ్యతిరేక పధకాల, వ్యూహాల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనే కుంటి సాకు తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు భావజాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఇంతకాలం అమెరికన్లు చేయని ప్రయత్నం లేదు. అరచేతిని సూర్యకాంతిని ఆపే విఫలయత్నం చేసినట్లుగానే కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికన్లు అసహజ చర్యలకు పాల్పడ్డారు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించారు. దాన్ని సామాన్య జనంపై మోపిన కారణంగానే అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలలో సంక్షోభం తలెత్తింది. ఇండో చైనా దేశాలపై దశాబ్దాల పాటు చేసిన యుద్దం ఒకటైతే ఆప్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభావాన్ని అరికట్టే పేరుతో అమెరికన్లు చేసిన ప్రయోగం అమెరికా సైనికులను ఫణంగా పెట్టటం ఒకటైతే అంతకు మించి ఒక్క కమ్యూనిస్టులకే గాక యావత్‌ స్వయంగా తనతో పాటు యావత్‌ ప్రపంచానికి ముప్పుగా తాలిబాన్లు అనే వుగ్రవాదులను తయారు చేసింది. అక్కడ 16లక్షలకు పైగా తన సైన్యాన్ని మోహరించి కూడా తాలిబాన్లను అణచలేక చేతులెత్తేసింది.

ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనేక సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? 2008లో అన్ని పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన మాంద్యం ఎప్పుడు అంతరిస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా సమాజంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయని, అది మంచిది కాదని పెట్టుబడిదారీ ఆర్ధిక నిపుణుడు పికెటీ చేసిన విశ్లేషణను ఇంతవరకు ఎవరూ సవాలు చేయలేదు. వీటన్నింటి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నపుడు అమెరికా, ఫ్రాన్స్‌ ఇలా ఏ దేశ యువత అయినా మెదళ్లకు పదును పెట్టకుండా, ఎందుకు అని ప్రశ్నించకుండా ఎలా వుంటుంది?

కమ్యూనిస్టు బూచిని ఎంతకాలం మమ్మల్ని మభ్యపెడతారు, భయపెడతారు రాబోయే కమ్యూనిజంతో వచ్చే ప్రమాదం ఏమిటో తెలియటం లేదుగానీ పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను నాశనం చేస్తోందని పశ్చిమ దేశాల వారు భావిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లు, తూర్పు ఐరోపా దేశాలు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల సంపదలను లూటీ చేసే వారి చేతులలోకి పోయాయి. ప్రజాస్వామ్యం అంటే నేతి బీరలోని నెయ్యి మాదిరి అని తేలిపోయింది. దాదాపు అన్ని దేశాలలో నిరంకుశ పాలకులదే పెత్తనం. అక్కడ అంతకు ముందులేని దారిద్య్రం, నిరుద్యోగం, సకల అవలక్షణాలు వచ్చాయి. వాటిని చూసిన ప్రపంచంలోని ఇతర దేశాల యువత సోషలిజం గురించి పునరాలోచనలో పడదా ? గత నాలుగు దశాబ్దాలుగా సోషలిస్టు చైనా అప్రతిహత విజయాలు సాధిస్తున్నది. అక్కడ పేదరికాన్ని చాలా వరకు నిర్మూలించినట్లు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ స్వయంగా అనేక సార్లు స్పష్టం చేశాయి. మరోవైపు ధనిక దేశాలలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు పెరుగుతున్నాయని అవే సంస్ధలు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పటం లేదు.

Image result for bernie sanders i am socialist

అటువంటపుడు అమెరికాలోగాని మరొక ధనిక దేశంలో గాని పేదలు,యువత తమకూ సోషలిస్టు వ్యవస్తే మంచిదేమో అన్న ఆలోచన వైపు మళ్లకుండా ఎలా వుంటారు. పెట్టుబడిదారీ విధాన అమానుష స్వభావం కారణంగా దానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో కొంత మంది బయలు దేరి తోడేలుకు ఆవు వేషం వేసినట్లుగా దానిని మానవతా ముఖంతో వుండే విధంగా మార్చుతామని చెప్పిన వారు ఎక్కడ వున్నారు. మరింత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. సంస్కరణల పేరుతో సామాన్య జనం అనుభవిస్తున్న వాటికి కోతపెడుతున్నారు తప్ప పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు ఏమాత్రం తగ్గకపోగా పోటీని ఎదుర్కొనే పేరుతో మరింతగా పెంచుతున్నారు. దానికి దేశ భక్తి, జాతీయవాదం అని ముద్దు పేర్లు పెడుతున్నారు, పెంచుతున్నారు.http://www.theepochtimes.com/n3/2237411-why-a-gospel-of-envy-is-gaining-traction-in-america/  అమెరికాలో సోషలిజం ఎందుకు వ్యాపిస్తున్నది అన్నదే ఈ వ్యాసకర్త ప్రశ్న.

Image result for bernie sanders i am socialist

అమెరికాలోని పెద్ద వారిలో 37శాతం మంది పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అమెరికన్‌ ఫెయిత్‌ అండ్‌ కల్చర్‌ అనే సంస్ధ ఫిబ్రవరిలో జరిపిన ఒక సర్వేలో వెలుగు చూడటమే సదరు వ్యాసకర్తను పురికొల్పింది. ఇది మేలుకొలుపు పిలుపు అని వ్యాఖ్యానించాడు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బెర్నీ శాండర్స్‌ చేసి ప్రచారం ద్వారా సోషలిజం ప్రజాదరణ పొందటం ఆశ్చర్యార్ధకమైంది…..అమెరికాలో ఎందుకు అనేక మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరిని కలిగి వున్నారు.’ అని ప్రశ్నించుకొని వ్యాసకర్త తన అభిప్రాయాలను వెల్లడించాడనుకోండి. వాటితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. అవే ఎత్తుగడలు లేదా కారణాలతో గతంలో అమెరికన్లు సోషలిజం గురించి దురభిప్రాయం ఏర్పరుచుకున్నారని కూడా భాష్యం చెప్పవచ్చు. దీనిని అంగీకరిస్తే రచయిత అభిప్రాయపడినట్లు అవే కారణాలతో అమెరికన్‌ యువత సోషలిజం గురించి ఆసక్తి , పెట్టుబడిదారీ విధానంపై వ్యతిరేకత పెంచుకుంటున్నారు అన్న తర్కాన్ని కూడా అంగీకరించవచ్చు. ‘కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక యుద్ధ భూములుగా మారటం విచారకరమని’ అంటూ ‘లెనిన్‌ ఏం చెప్పారో విందాం ‘పిల్లలకు బోధించటానికి నాకు నాలుగు సంవత్సరాల వ్యవధి ఇవ్వండి, ఎన్నటికీ పెకలించలేని విధంగా విత్తనాలు నాటతాను ‘ అని చెప్పారని సదరు వ్యాసకర్త వుక్రోషం వెలిబుచ్చటాన్ని చూస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం ఎందుకు చిన్న పిల్లల విద్యాలయాలను ఏర్పాటు చేస్తోందో అక్కడేమి బోధిస్తున్నారో, జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాల గురించి ఎందుకు నానా యాగీ, దాడులు చేస్తున్నారో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. ఇది భావజాల పోరు. ఒకరు విషబీజాలు నాటితో మరొకరు ప్రయోజనకరమైన వాటిని విత్తేందుకు ప్రయత్నం. ఎవరిది పై చేయి అయితే అవే ఫలితాలు వస్తాయి.విద్యా సంస్ధలలో ఒక పద్దతి ప్రకారం సోషలిస్టు భావజాలాన్ని ఎలా అభ్యాసం చేయిస్తున్నారో ‘ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కాలర్స్‌(ఎన్‌ఏఎస్‌) జనవరి నివేదిక వెల్లడించిందని, వున్నత విద్యా సంస్ధలలో ఒక వుద్యమంగా 1960 దశకపు విప్లవాత్మక కార్యక్రమంతతో ఒక పురోగామి రాజకీయ చురుకుదనంతో ‘నూతన పౌర శాస్త్రాన్ని ‘ బోధిస్తున్నారని’ కూడా సదరు రచయిత ఆరోపించారు. మన పిల్లలు ఏమై పోతున్నారో చూడండి అంటూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అంటే రెండు రెళ్లు నాలుగు, భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అసమాన సమాజాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పటం కూడా సోషలిస్టు భావజాల ప్రచారంగానే కమ్యూనిస్టు వ్యతిరేకులు చూస్తున్నారు. ఈ ఆరోపణ చేసేవారిని ఒక ప్రశ్న అడగాలి. పడకగదుల్లో సైతం ఎప్పుడేం జరుగుతోందో ప్రత్యక్ష ప్రసారం చేయగల నిఘా వ్యవస్ధ వున్న అమెరికా భద్రతా సంస్ధలు ఒక వుద్యమంగా అమెరికా విద్యా సంస్ధలలో జరుగుతున్న ఈ బోధనను చూడకుండా ఎలా వున్నాయి ? ఒక వేళ అదే నిజమైతే అమెరికాకే కాదు ప్రపంచానికే మంచి రోజులు వస్తాయి. యుద్దోన్మాదులు, తాలిబాన్లను సృష్టించే నేతలకు బదులు వాటికి దూరంగా వుండే సమాజాన్ని నెలకొల్పే నేతలు అమెరికాలో అధికారానికి వస్తారు. ఇవన్నీ చూస్తుంటే కమ్యూనిస్టు వ్యతిరేకుల విశ్వాసం సడలుతున్నట్లు, వారు కోరుకున్న విధంగా సమాజం నడవటం లేదని అర్ధం కావటం లేదూ ! ఆలోచించండి !!

పశ్చిమ దేశాలలో అలా వుందేమో గానీ భారత్‌లో తిరిగి కమ్యూనిస్టులు కోలుకోలేరు అని ఎవరైనా అన వచ్చు. ఎవరి నమ్మకం వారిది. ప్రకృతి ధర్మం ప్రకారం ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలలో ఒకేసారి వేసవి, వర్షాలు, ఆకురాల్చి మొగ్గతొడగటం జరగదు. చక్రభ్రమణంలో ఇప్పుడు కింద వున్న వారు కొద్ది సేపటి తరువాత పైకి వస్తారు. కమ్యూనిస్టులూ అంతే. ఒక దగ్గర ప్రారంభమై అన్ని ప్రాంతాలకూ విస్తరించినట్లే తిరిగి కోలుకోవటం కూడా అదే మాదిరి జరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫ్రెంచి తొలి విడత ఎన్నికలు-సంప్రదాయ పార్టీలకు చెంప దెబ్బ

25 Tuesday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

emmanuel macron, french communist party, french left party, french national front, French presidential election, French presidential election results round 1, jean luc melenchon, marine le pen, pcf, traditional parties

Image result for emmanuel macron epouse

తనకంటే 25 ఏండ్ల పెద్ద అయిన  భార్య బ్రిగిట్టితో 39 ఏండ్ల ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు ఫ్రాన్స్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఓటర్లు ఆ పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు గానీ గత యాభై సంవత్సరాలుగా అధికారంలో వుంటున్న రెండు పార్టీలను తుది విడత పోటీకి కూడా అనర్హులను గావించి తొలిసారిగా కొత్త వారిని ఎన్నుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. పోటీ చేసిన పది మంది అభ్యర్దులలో ఏ ఒక్కరికీ మెజారిటీ ఓట్లు రాకపోవటంతో తొలిరెండు స్ధానాలలో వున్న ఇద్దరు అభ్యర్ధుల మధ్య మే నెల ఏడవ తేదీన మరోసారి ఓటింగ్‌ జరగనుంది. ఈ ఫలితాలు వెలువడిన తరువాత ఫ్రెంచి, ఐరోపా స్టాక్‌ మార్కెట్ల సూచీలు పెరగటం, అనేక మంది విశ్లేషకులు హర్షం వెలిబుచ్చటాన్ని బట్టి , ప్రత్యర్ధిగా పచ్చి మితవాది వున్న కారణంగా మొదటి స్ధానంలో వుండి, మధ్యేవాదిగా వర్ణితమైన ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ తుది విడత ఓటింగ్‌లో విజేతగా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపా కమిషన్‌ పదవులలో వున్న వారు ఎన్నికల సమయంలో ఒక అభ్యర్ధికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేయటం, వ్యాఖ్యానించటం వుండదు. ఈ సారి దీనికి విరుద్ధంగా ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ప్రధమ స్ధానంలో వున్నందుకు అభినందించటమే గాక తుది విడత కూడా విజయం సాధించాలని, మారీ లీపెన్‌ గెలిస్తే ఐరోపా యూనియన్‌ను నాశనం చేస్తారని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌ ప్రకటించారు. పోటీకి అర్హత సాధించటంలో విఫలమైన మితవాద రిపబ్లికన్‌, సోషలిస్టు పార్టీ కూడా మే ఏడవ తేదీ ఎన్నికలలో బలపరుస్తామని ప్రకటించాయి. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మితవాది లీపెన్‌ గెలిచే అవకాశాలు లేవు.ఈ ఎన్నికలలో వామపక్ష సంఘటన అభ్యర్ధి జీన్‌లక్‌ మెలంచన్‌ తుది విడత అధ్యక్ష పదవి పోటీలో వుంటారని భావించిన వామపక్ష అభిమానులు ఆశించిన విధంగా ఓటింగ్‌ లేకపోవటంతో ఒకింత ఆశాభంగానికి గురికావటం సహజం. ఫలితాల సరళిపై కమ్యూనిస్టు పార్టీ నేత పిరే లారెంట్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకోవటం ఫ్రాన్స్‌లోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా వామపక్ష అభిమానులలో ఆశలు పెంచే అంశం.రెండు, మూడు, నాలుగు స్ధానాలలో నిలిచిన అభ్యర్ధుల మధ్య వ్యత్యాసం రెండుశాతం కంటే తక్కువగా వుండటాన్ని బట్టి పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో వూహించవచ్చు. వివిధ పార్టీల అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా వున్నాయి. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌( ఇఎంఎ) 24.01, లీపెన్‌(ఎఫ్‌ఎన్‌) 21.3, ఫిలన్‌(ఎల్‌ఆర్‌) 20.01,మెలంచన్‌ (ఎల్‌ఎఫ్‌) 19.58, హమన్‌ ( పిఎస్‌) 6.36, డ్యూపాంట్‌ ఇగ్నన్‌(డిఎల్‌ఎఫ్‌) 4.7,లాసాలే (ఆర్‌) 1.21,పౌటు (ఎన్‌పిఏ) 1.09 మరో ముగ్గురికి 0.92,0.64,0.18 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ప్రాధాన్యత, విశేషాలను క్లుప్తంగా చూద్దాం.

Image result for marine le pen

మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌  మారినే లీపెన్‌

1965 నుంచి 2012 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో సోషలిస్టు పార్టీ మూడు సార్లు, పలు పేర్లు మార్చుకున్న మితవాద పార్టీ ఆరుసార్లు అధికారానికి వచ్చింది. ఈ సారి ఆ రెండు పార్టీలకు చెందిన అభ్యర్ధులలో ఒక్కరు కూడా పోటీకి అర్హమైన సంఖ్యలో ఓట్లను సంపాదించుకోలేకపోయారు.అధికారానికి వచ్చి రెండవ సారి కూడా అధికారాన్ని కోరకుండా పోటీకి దూరంగా వున్న వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు హోలాండే చరిత్రకెక్కారు. ఆయన బదులు పోటీ చేసిన సోషలిస్టు పార్టీ (పిఎస్‌) అభ్యర్ధి హమన్‌ ఐదవ స్ధానంలో నిలిచారు. గత ఎన్నికలలో ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఫ్రాంకోయిస్‌ హాలాండే తొలి విడత 28.63 శాతం ఓట్లతో ప్రధమ స్ధానంలో నిలిచారు. అంతకు ముందు ఎన్నికలలో 25.87శాతంతో రెండవ స్ధానంలో వున్నారు. ఐరోపాలో సోషలిస్టు పార్టీలుగా వున్న శక్తులు మితవాద శక్తులకు భిన్నంగా వ్యవహరించకపోవటం, నయా వుదారవాద విధానాలలో భాగంగా అంతకు ముందు అమలులో వున్న సంక్షేమ పధకాలకు కోతలు పెట్టటంలో మితవాద శక్తులకు భిన్నంగా సోషలిస్టులు వ్యవహరించకపోవటంతో కార్మికవర్గం ఆ పార్టీలకు క్రమంగా దూరం అవుతోంది.ఇదే సమయంలో ప్రత్యామ్నాయశక్తులు రూపొందలేదు.

ఇక సాంప్రదాయక మితవాద శక్తులకు ప్రాతినిధ్యం వహించే యుఎంపి ఈ ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ(ఎల్‌ఆర్‌)గా పేరు మార్చుకొని పోటీ చేసి 19.9శాతం ఓట్లతో మూడవ స్ధానంలో నిలిచింది. గత ఎన్నికలలో 27.18శాతం ఓట్లతో రెండవ స్ధానం, 2007లో 31.18శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచింది.

ఫ్రెంచి రాజకీయ రంగంలో మితవాదులు, అతివాదులిద్దరినీ ఏకం చేస్తాను నేను ఏ భావజాలానికి చెందిన వాడిని కాదు, తనది మూడవ మార్గం అంటూ ఏడాది క్రితం ‘ముందుకు పోదాం’ పేరుతో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసిన మాజీ ప్రభుత్వ వుద్యోగి, మాజీ విత్త మంత్రి, ఐరోపా యూనియను కొనసాగాలని కోరుకొనే బ్యాంకరు అయిన ఇమ్మాన్యుయెల్‌ మక్రానన ప్రజారంజక నినాదాలతో, ప్రభుత్వ వ్యతిరేక వుపన్యాసాలతో ఓటర్ల ముందుకు వచ్చాడు. సోషలిస్టు పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభిన ఇతగాడు హోలాండు ప్రభుత్వంలో విత్త మంత్రిగా కూడా పని చేశాడు. హోలాండే ప్రభుత్వం ప్రజల నుంచి దూరం కావటాన్ని గమనించి గతేడాది ఆగస్టులో రాజీనామా చేసి అంతకు ముందే తాను ఏర్పాటు చేసిన ‘ముందుకు పోదాం’ పేరుతో రంగంలోకి దిగాడు. ఏడాది కూడా గడవక ముందే అధికార పీఠాన్ని అధిష్టించేందుకు సిద్దమయ్యాడు. కొంత మంది విశ్లేషకులు ఇతడిని వుదారవాది అని పిలిస్తే మరి కొందరు సోషల్‌ డెమాక్రాట్‌ అన్నారు. సోషలిస్టు పార్టీలో వున్న సమయంలో దాని లోని మితవాదులను బలపరిచాడు.

గతేడాది సోషలిస్టు పార్టీ నుంచి రాజీనామా చేసిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సోషలిస్టును కాదు అని చెప్పాల్సిందిగా నా నిజాయితీ నన్ను వత్తిడి చేసింది, వామపక్ష(సోషలిస్టు పార్టీని కూడా వామపక్షం అని పిలుస్తారు) ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకున్నానంటే ఇతరుల మాదిరి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలనుకున్నాను ‘ అన్నాడు. ఫ్రాన్స్‌లో యూరో అనుకూల ఏకైక రాజకీయ పార్టీ తమదే అని స్పష్టీకరించాడు. ఆర్ధికంగా నయా వుదారవాద విధానాలను కొనసాగించాలని కోరే ఇతగాడు రాజకీయంగా అమెరికా అనుకూల వైఖరిని వివిధ సందర్భాలలో వెల్లడించాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించేందుకు వ్యతిరేకి. సిరియా విషయంలో అమెరికాను అనుసరిస్తాడు. ఈ కారణంగానే అతను ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిగా ముందు వరుసలో వుండటంతో ఫ్రెంచి, ఐరోపా, ప్రపంచ పెట్టుబడిదారులందరూ హర్షం వెలిబుచ్చారు. స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీశాయి. రెండవ విడత ఎన్నికలలో తమ ఓట్లు మాక్రాన్‌కే వేస్తామని వెంటనే రిపబ్లికన్‌ పార్టీ, సోషలిస్టు పార్టీల అభ్యర్ధులిద్దరూ ప్రకటించారు. వామపక్ష సంఘటన ఇంకా ప్రకటించలేదు. వామపక్ష, కమ్యూనిస్టు మద్దతుదారులు పచ్చి మితవాది మారినే లీపెన్‌కు ఓటు వేసే అవకాశం లేదు కనుక ప్రపంచ మీడియా మొత్తం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ కాబోయే ఫ్రెంచి అధ్యక్షుడు అన్న రీతిలో వార్తలు ఇచ్చాయి. కొందరు విశ్లేషకులు లీ పెన్‌ గెలుపు అవకాశాల గురించి కూడా చర్చించారు.

ఫ్రెంచి రాజకీయాలలో పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ ఎదుగుదల ఒక ముఖ్యాంశం.అల్జీరియాకు స్వాతంత్య్రం ఇవ్వటం, దానిపై ఆధిపత్యాన్ని వదులుకోవటం ఇష్టం లేని పచ్చి మితవాదుల బృందానికి చెందిన వ్యక్తి మారీ లీపెన్‌. అల్జీరియా ఫ్రాన్స్‌లో భాగమే అనే అవగాహనను వదులుకుంటున్నట్లు ఫ్రెంచి మితవాద పార్టీ అధ్యక్షుడు డీగాల్‌ ప్రకటించిన పూర్వరంగలో లీపెన్‌ తదితరులు 1972లో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. దానికి లీ పెన్‌ నాయకుడయ్యాడు. 1973 పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసిన ఈ పార్టీకి దేశం మొత్తం మీద కేవలం 0.5శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. పారిస్‌లోని లీపెన్‌ నియోజకవర్గంలో ఐదుశాతం వచ్చాయి. ఇటువంటి పార్టీ 1981 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయటానికి తగిన అర్హతను కూడా సంపాదించలేకపోయింది. 1984 ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో 11శాతం ఓట్లు పది సీట్లు సంపాదించి ఫ్రెంచి రాజకీయాలలో సంచలనం సృష్టించింది.1988 అధ్యక్ష ఎన్నికలలో లీ పెన్‌ ఫ్రెంచి ప్రయోజనాలు ముందు అనే ప్రచారంతో పోటీ చేసి 14.4 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మూడవ ప్రధాన పార్టీగా అవతరించింది. 2002 అధ్యక్ష ఎన్నికలలో అనూహ్యంగా 16.86 శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ స్ధానంతో తొలిసారిగా లీపెన్‌ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.2007 ఎన్నికలలో 10.44 శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో, 2012లో 17.9 శాతంతో మూడవ స్ధానంలో తాజా ఎన్నికలలో 21.3 శాతంతో రెండవ స్ధానంలోకి నేషనల్‌ ఫ్రంట్‌ అవతరించింది. మారి లీపెన్‌ కుమార్తె మారినే లీపెన్‌ 2012 ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేశారు. మారీ లీపెన్‌ వివాదాస్పద, నేర చరిత్ర, వదరుబోతు తనం కారణంగా నేషనల్‌ ఫ్రంట్‌ను అభిమానించేవారికంటే వ్యతిరేకించే వారు ఎక్కువయ్యారు. ఈ పూర్వరంగంలో 2015లో ఒక ప్రత్యేక సమావేశంలో లీ పెన్‌ను ఆయన కుమార్తె స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఐరోపా యూనియన్‌ నుంచి ఫ్రాన్స్‌కు విముక్తి కలిగించటమే తన లక్ష్యమని ఆమె తన ప్రచార అస్త్రంగా చేసుకుంది.

Image result for jean luc melenchon

వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన  మెలెంచన్‌

ఈ ఎన్నికలలో మూడవ స్ధానంలో రిపబ్లికన్‌ పార్టీ వుండగా స్వల్ప తేడాతో నాలుగవ స్ధానంలో వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన జీన్‌ లూ మెలెంచన్‌ వున్నారు. ఆయన 19.58శాతం ఓట్లు సాధించటం ఈ ఎన్నికల ప్రత్యేకతలలో ఒకటి. ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పార్లమెంట్‌ ఎన్నికలలో గరిష్టంగా 28శాతం సంపాదించగా అధ్యక్ష ఎన్నికలలో 1969 ఎన్నికలలో ఆ పార్టీ గరిష్టంగా 21.7శాతం ఓట్లు సాధించింది. ఆ దశకంలో అక్కడ జరిగిన యువజన-విద్యార్ధి వుద్యమాల పూర్వరంగంలో ఈ ఫలితం వచ్చింది. తరువాత 1981ఎన్నికలలో 15.35 శాతం వచ్చాయి తరువాత క్రమంగా తగ్గుతూ 2007 ఎన్నికలలో 1.93శాతానికి పడిపోయాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో 1989-2014 మధ్య 7.7-5.9 శాతం మధ్య ఓట్లు వచ్చాయి. ఫ్రెంచి పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా దాదాపు అదే ప్రతిబింబించింది. 2012 ఎన్నికలలో మెలెంచన్‌ వామపక్ష ఫ్రంట్‌ అభ్యర్ధిగా పోటీ చేసి 11 శాతం తెచ్చుకున్నారు. తాజా ఎన్నికలలో ఒక దశలో మొదటి రెండు స్ధానాలలో వుంటారా అన్నట్లుగా ప్రచారం జరిగింది. అభిప్రాయ సేకరణలో తొలి నలుగురు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవటంతో తొలిసారిగా ప్రాన్స్‌లో తీవ్ర మితవాద, సమరశీల వామపక్ష అభ్యర్ధి మధ్య పోటీ వుంటుందా అన్న వాతావరణం వచ్చింది. ఆ కారణంగానే మెలెంచన్‌ గనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే తాము ఫ్రాన్స్‌ నుంచి పెట్టుబడులతో సహా వెళ్లిపోతామని కొందరు పెట్టుబడిదారులు ఎన్నికల ముందు బెదిరింపులకు దిగారు. సోషలిస్టు పార్టీలో తీవ్ర వామపక్ష వాదిగా వున్న మెలెంచన్‌ ఆ పార్టీ విధానాలతో విబేధించి 2008లో దాన్నుంచి విడివడి వామపక్ష పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామిగా వున్న వామపక్ష సంఘటన అభ్యర్ధిగా గత రెండు ఎన్నికలలో పోటీ చేశారు. అయితే మీడియా ఆయనను కమ్యూనిస్టుగా వర్ణించింది తప్ప ఆయనేనాడూ కమ్యూనిస్టుపార్టీలో పని చేయలేదు. కార్మికుల పని గంటలను వారానికి 35 నుంచి 32కు తగ్గించాలని,నెలకు 33వేల యూరోలు దాటిన వారి ఆదాయాన్ని బట్టి పన్ను రేటును 100శాతానికి పెంచాలని, వుద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రభుత్వ ఖర్చును పెంచాలని, మెలెంచన్‌ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నాటో నుంచి ఫ్రాన్స్‌ వైదొలగాలని, రష్యాతో సఖ్యతగా వుండాలని,మితవాదులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వున్న విధానాలను ఐరోపా యూనియన్‌ సంస్కరించని పక్షంలో యూనియన్‌ నుంచి వైదొలగాలని అన్నారు. ఆయన ప్రచార తీరును చూసి మితవాద పత్రిక లీ ఫిగారో ‘ఫ్రెంచి ఛావెజ్‌ ‘ అంటూ ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద పారిశ్రామిక సంస్ధ మెడెఫ్‌ ప్రతినిధి పిరే గాటెజ్‌ మాట్లాడుతూ ఆర్ధిక విధ్వంసం-ఆర్ధిక గందరగోళం మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వుంటుందని, లీపెన్‌-మెలెంచన్‌ మధ్య పోటీ పరిస్ధితి గురించి వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాల గురించి కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో చేసిన వ్యాఖ్యలలోని కొన్ని అంశాలు ఇలా వున్నాయి.’ తొలి విడద ఎన్నికల ఫలితాలు దేశంలోని తీవ్ర పరిస్ధితికి నిదర్శనం. జీన్‌ లక్‌ మెలాంచన్‌ దాదాపు 20శాతం ఓట్లు తెచ్చుకోవటం భవిష్యత్‌పై నూతన ఆశలను రేకెత్తిస్తోంది. నూతన సమాజం కోసం గొంతెత్తిన లక్షల మంది పోరాటం కొనసాగుతుంది. వారి ఆకాంక్ష ఇంకా పెరగనుంది.పట్టణాలలో మంచి ఫలితాలు వచ్చాయి. ఫ్రెంచి రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.మానవాళి విముక్తి అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పని చేస్తున్నది.తక్షణ కర్తవ్యంగా మే ఏడున జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష పదవికి మారినె లీపెన్‌ ఎన్నిక కాకుండా అడ్డుకోవటం. అంటే దీని అర్ధం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ మంత్రిగా వున్నపుడు ఆయన అమలు జరిపిన వుదారవాద, సామాజిక వ్యతిరేక కార్యక్రమానికి మద్దతు పలికినట్లు కాదు, వాటికి వ్యతిరేకంగా రేపు కూడా పోరాడుతాము.అధ్యక్ష ఎన్నికలలో రెండవ దఫా ఎన్నికలతో ఎదురైన పరిస్ధితులలో జూన్‌ 11,18 తేదీలలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. తొలి విడత ఎన్నికలలో సాధించిన ఓట్లను బట్టి ప్రజా ప్రయోజనాలకు బద్దులై వుండే కమ్యూనిస్టుపార్టీ, వామపక్ష సంఘటనలోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించుకోవాల్సి వుంది.’ అని పేర్కొన్నది.

ఫ్రెంచి రాజకీయాలలో మఖలో పుట్టి పుబ్బలో అంతరించింది అన్నట్లుగా అనేక పార్టీలు పుట్టి ఒకటి రెండు ఎన్నికలలో పోటీ చేసి తరువాత కనుమరుగు కావటం ఒక ధోరణిగా వుంది. అలాంటి కోవకే చెందిన ముందుకు పోదాం (ఎన్‌ మార్చ్‌) అనే పార్టీ సాంప్రదాయ పార్టీలను తోసి రాజని తొలిసారిగా ఏకంగా అధికారానికి వచ్చే బలాన్ని సంపాదించుకోవటం ఒక నూతన పరిణామం. ఐరోపాలోని అనేక దేశాలలో నెలకొన్న రెండు పార్టీల వ్యవస్ధలకు కాలం చెల్లనుందా అనేందుకు ఇది సూచన. అదే జరిగితే సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు వేగవంతమౌతాయి. ఫ్రాన్స్‌లో మితవాద నినాదాలు, రాజకీయాలతో నేషనల్‌ ఫ్రంట్‌ బలం పుంజుకోవటంతో పాటు వామపక్ష పార్టీ క్రమంగా బలం పెంచుకోవటం కూడా ఒక ముఖ్య పరిణామమే.

2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పూర్వరంగంలో మితవాద శక్తులు జాతీయవాదం ముసుగులో ప్రపంచీకరణను వ్యతిరేకించటం, దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారులకు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కోరటం, ప్రజలపై భారాలు మోపే విధానాలకు మద్దతు పలకటం అనేక దేశాలలో వెల్లడౌతున్న కొత్త పరిణామం. ఐరోపా యూనియన్‌ నుంచి విడివడి తన పలుకుబడి, పూర్వపు సంబంధాలతో తమ దేశ పెట్టుబడిదారులకు మేలు చేయగలమనే ధీమాతో బ్రిటన్‌ పాలకవర్గం ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐరోపా యూనియన్‌లో ప్రస్తుతం జర్మనీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తన ఆర్ధిక బలంతో మిగతాసభ్య దేశాలతో వాణిజ్య మిగులు సాధించిన జర్మన్లపై మిగతా దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. మే ఏడున జరిగే ఎన్నికలలో అందరూ వూహిస్తున్నట్లు కొత్త పార్టీ నేత ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ ఎన్నికై తన విధానాలను ప్రకటించిన తరువాత మరింత స్పష్టత వస్తుంది. అయితే స్టాక్‌ మార్కెట్‌ సంబరాలను బట్టి కార్పొరేట్‌ శక్తులకు అనుకూల వైఖరి తీసుకుంటారని, పెను మార్పులేమీ వుండవని కొందరు విశ్లేషకుల అంచనాలు వాస్తవానికి దగ్గరగా వున్నాయి. అదే జరిగితే ఆగ్రహం, నిరాశా నిస్పృలతో వున్న ఫ్రెంచి యువత ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లండన్‌లో ప్రయోగాత్మక నాటకం ‘ యువ మార్క్స్‌’

20 Thursday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Literature.

≈ Leave a comment

Tags

Karl Marx, Karl Marx and Friedrich Engels, Karl Marx comedy, London's new Bridge theatre, Young Marx

నాటికలో యువ మార్క్స్‌ పాత్రధారి రోరీ కిన్నియర్‌

ఎం కోటేశ్వరరావు

కారల్‌ మార్క్స్‌ ! 1848లో స్నేహితుడు ఫెడరిక్‌ ఎంగెల్స్‌తో కలసి కమ్యూనిస్టు ప్రణాళికను రచించి, విడుదల చేసిన నాటి నుంచి ప్రపంచంలో ప్రతి మూలా ప్రతి రోజూ వ్యతిరేకులో, సమర్ధకులో వారి పేర్లు, వాటితో విడదీయరాని కమ్యూనిస్టు భావజాలం గురించి చర్చించని, ప్రస్తావించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మానవ జాతి చరిత్రలో ఒక పెద్ద మలుపుకు కారణమైన ‘యువ కారల్‌ మార్క్స్‌ ‘ లండన్‌లో గడిపిన జీవితం గురించి ఒక నాటికను అక్టోబరు నుంచి ప్రదర్శించనున్నారనేది తాజా వార్త. నూతనంగా ప్రారంభమైన బ్రిడ్జి ధియేటర్‌ నుంచి వెలువడుతున్న తొలి ప్రదర్శన ఇది. థేమ్స్‌ నదిపై వున్న న్యూ బ్రిడ్జి ప్రాంతంలో 900 సీట్లతో కొత్తగా నిర్మించిన వాణిజ్య ప్రదర్శనశాల ఇది. గత పదిహేను సంవత్సరాలలో లండన్‌లో ధియేటర్లకు వచ్చి నాటకాలు చూసే ప్రేక్షకులు 25శాతం పెరిగినట్లు ఒక సర్వేలో తేలింది.

Nick Starr and Nicholas Hytner.

బ్రిడ్జి ధియేటర్‌ వ్యవస్ధాపకులు నిక్‌స్టార్‌, నికొలస్‌ హిట్నర్‌

నాటిక, నాటక, సినిమా తదితర కళారూపాల నిర్మాణానికి వృత్తాంతంగా మార్క్సు-ఎంగెల్స్‌లను ఎంచుకోవటమే ఒక ప్రత్యేకత. వారి గంభీర జీవితాలను, రచనల ద్వారా ప్రపంచానికి అందచేసిన సందేశాన్ని టిక్కెట్లు కొని చూసే వీక్షకుల ముందు రక్తి కట్టించటం సాహసం, పెద్ద ప్రయోగమే. లండన్‌లో మార్క్సు కుటుంబం అష్టకష్టాలు పడిందన్నది లోకవిదితం. అలాంటి జీవితం 1850 తొలిరోజుల గురించి ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారన్నదే ఆసక్తికరం. కుటుంబ జీవనం ఇబ్బందుల్లో పడింది, అప్పటికే జర్మనీ నుంచి అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయి కాళ్లు, చేతులు కాయలు కాచిన విప్లవకారుడు.నాటి పాలకవర్గాలు అత్యంత భయంకరమైన తీవ్రవాదిగా పరిగణించిన మార్క్స్‌ పశ్చిమ లండన్‌లోని సోహో ప్రాంతంలోని డీన్‌ వీధిలో ఎవరికీ తెలియకుండా జీవించిన రైల్వేలో వుద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, తదితర అంశాలను ఈ నాటికలో ప్రదర్శించనున్నారు. వ్యంగ్య, హాస్య రచనలు చేసే రిచర్డ్‌ బీన్‌, క్లైవ్‌ కోల్‌మెన్‌ ద్వయం గంభీరమైన కారల్‌మార్క్సు జీవితంలో వాటిని ఎలా చొప్పించారో చూడాల్సి వుంది. లండన్‌లోని ప్రఖ్యాత నేషనల్‌ ధియేటర్‌లో మాజీ డైరెక్టర్‌గా వున్న సర్‌ నికోలస్‌ హిట్నర్‌ ఈ నాటిక దర్శకుడు, బ్రిడ్జి ధియేటర్‌ సహ వ్యవస్దాపకుడు. రోరీ కిన్నియర్‌ మార్క్స్‌గా ఎంగెల్స్‌గా ఆలివర్‌ క్రిస్‌ నటిస్తున్నారు.

The Bridge theatre will open in October 2017

ప్రారంభానికి సిద్ధమైన బ్రిడ్జి ధియేటర్‌

ఏడాదికి కనీసంగా నాటకాలను ప్రదర్శించటం తమ లక్ష్యమని ‘యువ మార్క్స్‌’ తరువాత ప్రదర్శనకు సిద్దం చేస్తున్న ఎనిమిది నాటకాల పేర్లను కూడా నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. వీటిలో షేక్సిపియర్‌ రచన జూలియస్‌ సీజర్‌ తప్ప మిగిలిన వన్నీ కొత్త రచనలే. వాటిలో నాలుగింటిలో మహిళలే నటిస్తున్నారు. లండన్‌కు కొత్త నాటక సంస్ధల అవసరం వుందని, తాము ప్రజాకర్షకమైన,సాహసవంతమైన ఇతివృత్తాలతో వీక్షకులను వుద్వేగ భరితులను చేసే విధంగా, నిజంగా ఒక రాత్రిని మంచిగా గడిపామనుకొనే విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లండన్‌లో వాణిజ్య తరహా నాటక ధియేటర్లు తొమ్మిది వున్నాయి. కొత్త ధియేటర్‌ కొత్త ప్రాంతంలో రాకతో వాటి మధ్య పోటీ పెరగవచ్చని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు వ్యతిరేక పెద్దలను వణికిస్తున్న ‘పిల్లల కోసం కమ్యూనిజం’

17 Monday Apr 2017

Posted by raomk in Current Affairs, Economics, Education, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Bini Adamczak, CAPITALISM, communism, Communism for Kids

Image result for Bini Adamczak

ఎం కోటేశ్వరరావు

యాభై సంవత్సరాల తరువాత ఇటీవల జపాన్‌లోని కొయోటో పట్టణంలో ఒక ప్రాంతాన్ని సందర్శించిన ఒక అమెరికన్‌ అక్కడి కమ్యూనిస్టులను చూసి రాసిన ఒక వ్యాఖ్యను ఇలా ముగించాడు.’ కమ్యూనిజం చావటానికి తిరస్కరించే ఒక వైరస్‌ వంటిది- చివరికది దారిద్య్రం నుంచి సంపదలవైపు పయనించిన దేశంలో కూడా వుందంటే మార్కెట్ల శక్తికి కృతజ్ఞతలు ‘ అన్నాడు. అంటే ప్రపంచంలో ఇటీవలి వరకు అమెరికా తరువాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వున్న జపాన్‌లో కూడా మ్యూనిస్టులు వుండటాన్ని జీర్ణించుకోలేక వెల్లడించిన వుక్రోషం అనుకోవాలి. వదిలేద్దాం ! గోడకు బంతిని ఎంత వేగంతో అంతే వేగంతో తిరిగి వస్తుందని తెలియని ఎందరో కమ్యూనిస్టు వ్యతిరేక మహానుభావులు. ప్రతి తరంలో పుట్టి కమ్యూనిజాన్ని నిలబెడుతున్నందుకు వారందరికీ వందనాలు. ఒక సారి పుట్టిన వ్యక్తి మరోసారి తల్లి గర్భంలోకి ప్రవేశించాలని కోరుకోవటమే ప్రకృతి విరుద్దం. అలాంటి కోరికలు వున్నవారికి అది ఎలా సాధ్యం కాదో కాలగతిని, చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే వారికి కూడా అదే జరుగుతుంది. ప్రపంచంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు అలాంటి కోవకు చెందిన వారే. హిరణ్యకశ్యపుడి కడుపులో ప్రహ్లాదుడు వుట్టినట్లే ప్రపంచవ్యాపితంగా సోషలిజాన్ని నాశనం చేశామని చెప్పుకున్న అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఏలుబడిలో సోషలిజాన్ని అభిమానించేవారు పెరుగుతున్నట్లు గ్రహించలేకపోయారు.

గతేడాది నిర్వహించిన ఒక సర్వేలో 18-29 సంవత్సరాల మధ్య వయస్సు యువకులు 51శాతం మంది పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పగా 42శాతం అనుకూలతను వ్యక్తం చేశారు, 33శాతం సోషలిజానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌లో వీరిశాతం 36వరకు వుండగా సోషలిజాన్ని వ్యతిరేకించే వారు 32శాతం వున్నారని, కాపిటలిజాన్ని వ్యతిరేకించే వారు 39శాతం కాగా అనుకూలించే వారు 33 శాతమే వున్నారు. దీనంతటికీ కారణం పెట్టుబడిదారీ వైఫల్యాలను గ్రహిస్తున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరగటమే. ఒకసారి పెట్టుబడిదారీ విధానం పనికిరాదనుకున్న తరువాత దానికి ప్రత్యామ్నాయం వైపు చూడటం అవసరం. కమ్యూనిస్టులు గతంలో ఏవైనా పొరపాటు చేశారని భావిస్తే అలాంటివి జరగకుండా నూతన తరాలు జాగ్రత్తపడతాయని వేరే చెప్పనవసరం లేదు. లేదూ పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేసి సమ సమాజాన్ని స్ధాపింపచేసే మరొక ప్రత్యామ్నాయం ఏదైనా వుంటే దాని వైపు మొగ్గుతారు తప్ప తిరిగి వెనక్కు పోరు.గత రెండువందల సంవత్సరాలలో పెట్టుబడిదారీ విధానం అనేక విజయాలు సాధించటంతో పాటు ఇంతకాలం తరువాత సమాజంలో అంతులేని అసమానతలను కూడా అదే తెచ్చిందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రతివారూ దానిని సరిచేస్తామని చెప్పటమే తప్ప కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు.

చరిత్రలో పెట్టుబడిదారీ విధానానికి అనేక తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ విధానాన్ని అవలంభిస్తున్న వారి మధ్య దోపిడీలో వాటాలు కుదరకనే ఇప్పటికీ రెండు ప్రపంచ యుద్ధాలు తెచ్చారు. వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ వరకు ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ ఏకమై దాడులు, దురాక్రమణలకు పాల్పడినా అవి చావు దెబ్బలు తిని తోకముడుస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారీ విధానం పాఠాలు నేర్చుకున్నట్లే దాని కంటే వయసులో చిన్నది, అనుభవం కూడా పరిమితమే అయిన సోషలిస్టు వ్యవస్ధ, కమ్యూనిస్టు పార్టీలు కూడా పాఠాలు నేర్చుకొని దోపిడీ వ్యవస్ధను నిర్మూలించి సమసమాజాన్ని స్ధాపించేందుకు ముందుకు పోవటం అనివార్యం.

Image result for Bini Adamczak

బినీ ఆదామ్‌ జెక్‌

తన రాజ్యంలో హరి నామ స్మరణ వినిపించరాదని ప్రహ్లాదుడిని తండ్రి ఆజ్ఞాపించినట్లే తమ దేశంలో కమ్యూనిజం, సోషలిజం అనే పదాలకు తావు లేదని అమెరికా హిరణ్యకశ్యపులు చెబుతున్నారు. అలాంటి చోట బాలలకు సోషలిజం, కమ్యూనిజం పాఠాలు చెబుతుంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు మిన్నకుంటారా ? కొద్ది వారాల క్రితం అమెరికాలోని ‘మిట్‌ ప్రెస్‌’ అనే ఒక ప్రముఖ ప్రచురణ సంస్ధ ‘కమ్యూనిజం ఫర్‌ కిడ్స్‌ ‘ పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించి మార్కెట్లో పెట్టింది. ఒకసారి ఏమైందంటే పెట్టుబడిదారీ విధాన దురవస్ధల నుంచి బయపడాలని జనం కోరుకున్నారు. మరి దాన్ని ఎలాసాధించారో తెలుసుకోవాలనుందా పిల్లలూ అన్నట్లుగా ఆ పుస్తకం మొదలౌతుంది. పిడుగులు మరి పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి అని అడుగుతారు కదా ! రాజకుమారి వంటి సోషలిజాన్ని సాధించటానికి ప్రయత్నించిన రాజకుమారుడిని దుష్ట పెట్టుబడిదారులు ఎన్నో కష్టాలు పెట్టటం, చివరికి ఎలా విజయం సాధించిందీ దానిలో వివరించిన తరువాత పిల్లలు ఆకర్షితులు కాకుండా వుంటారా ? వారికి అర్ధమయ్యే రీతిలో, భాషలో జర్మన్‌ భాషలో బినీ ఆదామ్‌ జెక్‌ అనే సామాజిక సిద్ధాంతవేత్త, చిత్రకారిణి కార్టూన్లతో సహా వివరిస్తూ రాసిన పుస్తకాన్ని అమెరికా సంస్ధ అనువాదం చేసి ఆంగ్లంలో ప్రచురించింది. దానిని అమెజాన్‌ సంస్ధ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు గుండెలు బాదుకుంటూ పిల్లలకు కమ్యూనిజం పాఠాలు బోధించటమా అంటూ నానా యాగీ చేస్తున్నారు.

పెట్టుబడిదారీ విధానం మీద అసంతృప్తిని పెంచుకుంటున్న యువత సోషలిజం పట్ల సానుకూలత పెంచుకుంటూ చివరికి ఏ దారి పడుతుందో అని ఆందోళన పడుతున్న పాలకవర్గ శక్తులకు, కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇటువంటి పుస్తకాలు ఎక్కడ మండాలో అక్కడ మండేట్లు చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు. కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికను రచించేంత వరకు విజేతలే చరిత్రను రచించారు, వ్యాఖ్యానించారన్నది ఒక వాస్తవం. ఆ తరువాత చరిత్రను ప్రజాస్వామ్యీకరించటం, శాస్త్రీయ వ్యాఖ్యానం చేయటం ప్రారంభమైంది. ఇది పాలకవర్గానికి మింగుడు పడని వ్యవహారం. పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు ఒక వ్యక్తి పెద్ద పెట్టుబడిదారు, గుత్త పెట్టుబడిదారుగా మారే క్రమంలో ఎన్నికష్టాలు పడిందీ చివరికి ఎంత పెద్ద ఆర్ధిక సామ్రాజ్యాన్ని స్ధాపించిందీ లొట్టలు వేసుకుంటూ చదివే విధంగా అనేక విజయ గాధలు రచించిన విషయం తెలిసిందే. కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిదానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు అన్నట్లుగా పెట్టుబడిదారు విజయ గాధ వెనుక వున్న ఎందరివో కష్ట గాధలను ఈ పుస్తకంలో వివరించారని సమీక్షలను బట్టి వెల్లడైంది.

ఈ పుస్తక సమీక్షలలో ఒకదానికి పెట్టిన పెట్టిన పేరు ‘బ్రెయిన్‌ వాషింగ్‌ షాకర్‌’ అంటే బుద్ధి శుద్ధి చేసే ఘాతము అని అర్ధం. ఎవరైతే గతాన్ని గుర్తు పెట్టుకోలేరో అది పునరావృతం కావటానికి వారు దండనార్హులు అన్న అమెరికన్‌ రచయిత జార్జి శాంతాయన మాటల మాదిరి గత పొరపాట్లను ఎవరైతే ప్రేమిస్తారో అవి పునరావృతం కావటానికి వారు దండనార్హులు అని ఆ సమీక్షకుడు వ్యాఖ్యానించారు. మరొక సమీక్షకుడు ‘ఈ పిల్లల పుస్తక సిద్ధాంతమైన కమ్యూనిజం ఏదైతే వుందో అది అంత కఠినమైనది కాదు, కాకపోతే దానిని సరైన దారిలో అమలు జరపలేదు ‘ అని ఈ పుస్తకం చెబుతుంది. వావ్‌ ఇలాంటి మాటలను నేను గతంలో వినలేదు, అంటే మీరు చెప్పిన దానికర్ధం ఏమంటే వేడిగా వున్న స్టౌను నేను మరోసారి ముట్టుకుంటే నా చేతిని కాల్చకపోవచ్చు అనే కదా ? అని వుక్రోషం వెలిబుచ్చాడు. మరొక సమీక్షకుడు ఈ పుస్తకం ఆలోచనను నాశనం చేస్తుంది. ఇదొక కథల పుస్తకం దీనిలో మరోసారి ఈర్షాపరులైన రాజకుమార్తెలు, కత్తులు, భూముల నుంచి గెంటివేతకు గురైన రైతులు, దుష్ట యజమానులు, అలసిపోయిన కార్మికులు, వారి గురించి మాట్లాడే ఒక కుర్చీ, కుండ అనే రాజ్యం అన్నీ వున్నాయిందులో. పెట్టుబడిదారుల గురించి చెప్పాల్సి వస్తే లాభాల కోసం కార్యకలాపాలు నిర్వహించే సంస్ధ మిట్‌ ప్రెస్‌ దీనిని ప్రచురించింది.పోనీ ఈ పుస్తకాన్నేమైనా తక్కువ ధరకు అందించారా అంటే అదీ లేదు, అది మామూలుగా వసూలు చేసే 12.95 డాలర్ల కంటే తక్కువేమీ కాదు. ఇలా సాగుతూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారనుకోండి. పుస్తకాన్ని ప్రచురించిన మిట్‌ ప్రెస్‌కు వుచిత సలహా కూడా ఇచ్చారు. పిల్లలకోసం కమ్యూనిజం అన్న పుస్తకం ప్రచురించి సొమ్ము చేసుకుంటున్న మీరు పిల్లల కోసం నాజీజం, 9-12 సంవత్సరాల వయస్సు వారిని సులభంగా వూచకోయట ఎలా ? వంటి పుస్తకాలనుకూడా ప్రచురించి సొమ్ము చేసుకోవచ్చు అని దెప్పిపొడిచారు. మరొక వ్యాఖ్యాత ఏమన్నాడో చూడండి. ‘కమ్యూనిస్టు మూల సూత్రాల గురించి ఏదైనా ఒక సినిమాలో ప్రస్తావించటంగానీ లేదా పాఠశాల సిలబస్‌లో చేర్చటంగానీ మనం ఎన్నడైనా చూశామా ఈ సైద్ధాంతిక పోరులో విజేతలం మనమే అని నిజంగా చెప్పుకోగలమా’ అంటూ మితవాదులకు ప్రశ్న వేశాడు. ఒక పుస్తకాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు తిడుతున్నారంటే అది తప్పకుండా చదవాల్సిన పుస్తకమే అని అర్ధం చేసుకోవాలి. మరొక వ్యాఖ్యాత పుస్తక ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు అది అమెజాన్‌ కంపెనీ అగ్రశ్రేణి వంద పుస్తకాలలో స్ధానం సంపాదించటంలో విఫలమైంది అన్నాడు. కమ్యూనిజం మరియు సోషలిజం గురించి వెలువడిన నూతన పుస్తకాల విభాగంలో అదే అమెజాన్‌ కంపెనీలో ఈ పుస్తకం ప్రధమ స్ధానంలో వుంది. ఈ పుస్తక సమీక్ష పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక పండితులు మరోసారి పాతపడిప పాచిపాటలనే పాడి బోరు కొట్టించారు తప్ప తాము సమర్ధించే పెట్టుబడిదారీ విధానం ఎలా గొప్పదో, ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి అదెప్పుడు బయటపడుతుందో ఒక్క ముక్కా చెప్పలేదు. మెరుగైన ప్రపంచం కోసం ఇప్పటికీ మనల్ని ముందుకు నడిపించేది వర్గపోరాటమే అనే సందేశంతో ఈ పుస్తకం ముగుస్తుంది.

ప్రపంచం నాశనమౌతున్న వర్తమానంలో ఆశించటానికి మరొక నూతన ప్రపంచమేదీ కనిపించని, నమ్మకంలేని స్ధితిలో ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకారి, అవసరం అని మరికొన్ని సమీక్షలు వెలువడ్డాయి. రెండు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ విధానం మనకు స్వేచ్చను తెచ్చిందా లేక భూమిపై మానవులు ఎన్నడూ ఎరగని అసమానతలను తెచ్చిందా అని కషనర్‌ అనే సమీక్షకుడు అమెరికా సమాజాన్ని ప్రశ్నించారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మానవుల విధిరాత కాదు, ఆడమ్‌చెక్‌ సాయంతో దానికి మించి ఆలోచించేందుకు ఈ పుస్తకం వుపకరిస్తుంది.స్వేచ్చకోసం మొదటి అడుగు వేసేందుకు ప్రాధమికంగా తోడ్పడుతుంది. కనీసం ఇతర ప్రపంచాల గురించి వూహించుకొనే స్వేచ్చ వైపు అడుగువేయిస్తుంది అని కూడా కషనర్‌ చెప్పారు. డ్యూక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఫ్రెడరిక్‌ ఆర్‌ జేమ్సన్‌ తన సమీక్షలో ఈ పుస్తకాన్ని ఎంతగానో పొగిడారు. ‘మనోజ్ఞమైన ఈ చిన్ని పుస్తకం ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాని కంటే జీవితం,జీవనంలో ఇతర పద్దతులు వున్నాయని చిన్నారులకు చూపటంలో తోడ్పడుతుంది. కొంత మంది పెద్దవారూ దీన్నుంచి నేర్చు కోవచ్చు. మన యువతరం కేవలం అసంతృప్తి చెందటమే కాదు, తమవైన నూతన ఆలోచనలతో నిజంగా పనిచేసే మంచి ప్రత్యామ్నాయం, రాజకీయ విద్య కోసం చురుకుగా అన్ని వైపులా చూస్తున్న తరుణమిది. ఈ పుస్తకం ద్వారా నూతన మార్గాలను తిరిగి కనుగొనవచ్చు.’ అన్నారు. నూటొక్క పేజీలున్న ఈ పుస్తకంలో పిల్లలకు అర్ధమయ్యే భాషలో కమ్యూనిజం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం ఎలా వునికిలోకి వచ్చింది? పని అంటే ఏమిటి ? మార్కెట్‌ అంటే ఏమిటి ? సంక్షోభం అంటే ఏమిటి? ఏం చేయాలి అనే శీర్షికల కింద వివరణలు ఇచ్చారు. ఎరుపంటే భయం వున్న వారు ఈ పిల్లల పుస్తకం చదివైనా దానిని పొగొట్టుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడే ప్రాధాన్యత-వుద్యోగుల, కార్మికుల కర్తవ్యం

14 Friday Apr 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Others

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, BJP, Central Government Employees, cps, EMPLOYEES, Government employees, heymarket, mayday, NDA, NPS, workers

Image result for mayday-haymarket

ఎం కోటేశ్వరరావు

మే డే ! కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. పశ్చిమార్ధ గోళంలో అనేక దేశాలలో, సమాజాలలో అది వసంత రుతు ఆగమన పండుగ రోజు. మే ఒకటవ తేదీని కార్మికులు వుత్సవంగా జరుపుకుంటే యజమానులకు పండుగ, వారు కూడా దానికి అవసరమైన నగదు మొత్తాలను సంతోషంతో సమకూర్చుతారు. అదే దీక్షా దినంగా పాటించే చోట సదరు కార్మిక సంఘాన్నే మొత్తంగా లేపేయటానికి, కార్మికులను భయపెట్టటానికి కూడా వెనుకాడరు. మే ఒకటవ తేదీ ప్రాధాన్యతను కార్మికవర్గం తెలుసుకోకుండా చేసేందుకు ఆ రోజుకు బదులు మరొక రోజును కార్మికదినంగా మార్చేందుకు మరోవైపున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సంప్రదాయ వసంత రుతు వుత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కార్మికుల బతుకులు మాడిపోతున్నా, యజమానులు, వారి అడుగులకు మడుగులొత్తే పాలకులు అణచివేస్తున్నా అవేమీ పట్టకుండా ప్రకృతి పరంగా చెట్లు చేమలు వికసిస్తాయి. కానీ మేడే వస్తే కార్మికుల బతుకులు వాటంతట అవే వికసించవని గుర్తించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరుపుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది వారి చైతన్యానికి గీటురాయి.

ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. అబ్బో దీని గురించి మాకు తెలియందేముంది, ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ఎన్నోసార్లు విన్నది, చదువుకున్నదేగా అని పెద్దలు అనుకుంటారు. ప్రపంచ పువ్వుల రోజు, లవ్వుల రోజు, నవ్వుల రోజుల మాదిరిగా ఇది కూడా 365రోజుల్లో ఇదొక రోజేగా అని యువత భావించవచ్చు. అనేక దేశాలలో చాలా మందికి ఇప్పటికీ , చివరికి దీనికి నాంది పలికిన అమెరికాలో సైతం మే డే గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రతిమనిషీ యాదృచ్చికంగానో లేదా కొంత మంది అన్నట్లు ప్రమాదవశాత్తో ఏదో ఒక మతాన్ని అవలంభించే కుటుంబంలో పుట్టటం తెలిసిందే. ఆయా మతాల దేవుళ్ల లేదా దేవ దూతలు లేదా ఇతర ప్రతినిధుల ప్రవచనాలు అనేకసార్లు విన్నప్పటికీ కుటుంబ, సామాజిక వుత్సవాల సందర్భాలలో మరోసారి వినేందుకు డబ్చిచ్చి మరీ ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే. అందువలన ప్రతి ఒక్కరూ తమ వర్గానికి చెందిన అంతర్జాతీయ రోజు గురించి మంత్ర తంత్రాలు, ప్రవచనాల క్రతువు మాదిరి అయినా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ?

Image result for mayday-haymarket

చాలా మంది మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for mayday-haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గానికే ముందు చూపు ఎక్కువని అనేక సందరా&భలలో రుజువైంది. తన చావు గోపబాలుడి చేతిలోనే వుందని గ్రహించిన కంసుడు చంపటానికి పుట్టుక నుంచి ఎలా ప్రయత్నించాడో అలాగే తనకు సమాధికట్టేది కార్మికవర్గం అని గ్రహించిన పెట్టుబడిదారీ వర్గం కూడా అదే చేసింది. చికాగో అమరజీవుల త్యాగం ప్రపంచ కార్మికవర్గానికి వుత్తేజం కలిగించేందు మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మికదినంగా పాటించాలని రెండవ ఇంటర్నేషనలన చేసిన నిర&ణయం తమ దేశ కార్మికవర్గాన్ని ప్రభావితం చేయకుండా చూసేందుకు అమెరికా పాలకవర్గం ప్రారంభం నుంచీ ప్రయత్నించింది. అమెరికా కార్మికోద్యమంలో సోషలిస్టు భావాలున్న శక్తులు చురుకుగా వుండటాన్ని గమనించిన పెట్టుబడిదారీ వర్గం తమ చెప్పుచేతలలో వుండే వారిని కార్మికనేతలుగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. సోషలిజాన్ని వ్యతిరేకించే నైట్స ఆఫ్‌ లేబరన పేరుతో వ్యవహరించేవారితో 1869లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. వారి ప్రతిపాదనలలో సెప్టెంబరులో కార్మికులకు ఒక రోజు సెలవు ఇవ్వాలనే ఒక డిమాండు వుంది. దానిని ఆసరా చేసుకొని మే డే వైపు తమ కార్మికవర్గం మొగ్గకుండా చూసేందుకు 1887లో ఓరేగాన్లో, తరువాత 1894 నుంచీ దేశ వ్యాపితంగా సెప్టెంబరులో మొదటి సోమవారాన్ని కార్మికదిన సెలవుగా, కార్మికదినోత్సవంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మే ఒకటవ తేదీని కార్మికదినంగా చేస్తే చికాగోలో హేమార్కెటన మాదిరి కార్మికులు కొట్లాటలకు దిగుతారని పాలకవర్గం ప్రచారం చేసింది. అయినప్పటికీ అక్కడి కార్మికులు మే డేను పాటించారు. తరువాత 1958లో కార్మికులను గందరగోళపరిచేందుకు, యజమానులకు విధేయులుగా చేసేందుకు మే ఒకటవ తేదీని అమెరికా విధేయతా దినంగా ప్రకటించింది. దానికి స్వాతంత్య్రవుద్యమ వారసత్వం అనే మనోభావాన్ని జోడించింది. ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచంలో అనేక చోట్ల పాలకవర్గం చేసింది, చేస్తోంది.

Image result for mayday-haymarket

మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు గాను 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. అయితే దాని సభ్యులుగా వున్న కార్మికులు మే డేను పాటిస్తున్నా వద్దని నివారిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచంలో తొలి కార్మికరాజ్యాన్ని, తరువాత అనేక దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను వునికిలోకి తేవటంలో కార్మికవర్గం ముందు పీఠీన వుంది. అదే కార్మికవర్గం 1990 దశకంలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడటమే కాదు, ఎండమావుల వంటి పెట్టుబడిదారీ వ్యవస్ద స్వర్గాలను చేరాలనే అత్యాశతో తాను కూడా సోషలిస్టు వ్యతిరేక శక్తులతో చేతులు కలపటం కూడా ఆ శతాబ్దంలోనే జరిగింది. కార్మికవర్గం సోషలిస్టు భావజాలం వైపు మొగ్గకుండా చూసేందుకు పెట్టుబడిదారీ వర్గం రెండవ ప్రపంచ యుద్దం తరువాత తన లాభాలను కాపాడుకొనేందుకు నూతన మార్గాలను వెతుకుతూనే కార్మికవర్గానికి కొన్ని రాయితీలు కల్పించి, సంక్షేమ కార్య క్రమాలను అమలు జరిపింది. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజం, సోషలిజాలకు కాలం చెల్లిందనే ప్రచారదాడితో పాటు అంతకు ముందు తాను అమలు జరిపిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయటం, కార్మికవర్గంపై కొత్త భారాలను మోపటం గత పాతిక సంవత్సరాలలో ఐరోపా, ఇతర ధనిక దేశాలలో చూశాము. ఇదే సమయంలో సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న దేశాల కార్మికవర్గ పరిస్థితులు మరింతగా దిగజారాయి. అనేక సమస్యలున్నప్పటికీ ఇప్పటికీ సోషలిస్టు వ్యవస్దలున్న చైనా, వియత్నాం, క్యూబా వంటి చోట్ల కార్మికవర్గ పరిస్థితులు మెరుగ్గా వున్నాయన్నది దాచినా దాగని సత్యం.

పెట్టుబడిదారీ వర్గం అమలు జరుపుతున్న వుదారవాద విధానాల ప్రభావం, ప్రపంచ సోషలిస్టు శిబిరానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన తరువాత యాజమాన్యవర్గాలదే పై చేయి అయింది. కార్మికవర్గాన్ని మరింతగా దోచుకొనేందుకు కార్మికవర్గంపై అనేక షరతులను రుద్దుతున్నారు. వాటిని వుల్లంఘిస్తే వుద్యోగాల నుంచి వూడగొడతామని బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. కార్మిక చట్టాలను నీరు గార్చటంతో పాటు వున్న చట్టాలను కూడా అమలు జరపకుండా, కనీసం తనిఖీ చేసే అధికారం కూడా కార్మికశాఖకు లేకుండా వ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నారు. అనేక చట్టాలను పూర్తిగా ఎత్తివేయటానికి పూనుకున్నారు. కార్మిక సంఘాలు కొన్ని వర్గసామరస్య విధానాల వూబిలో కూరుకుపోయాయి. పైరవీల ద్వారా కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పూనుకున్నాయి. భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను గాలికి వదలి పెట్టాయంటే అతిశయోక్తి కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వుదాహరణకు కేంద్ర ప్రభుత్వ వుద్యోగుల వేతన సవరణ విషయమే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తీసుకోవటం తప్ప న్యాయంగా తమకు రావాల్సిందాన్ని సాధించుకొనేందుకు కనీసం అన్ని తరగతుల వుద్యోగులు, కార్మికులు ఒక రోజు సమ్మె చేసేందుకు కూడా అనువైన పరిస్ధితులు నేడు లేకపోవటానికి ప్రపంచవ్యాపితంగా మారిన పరిస్థితులు, వర్గ సామరస్య వైఖరే కారణం. ఇదే ధోరణి కానసాగితే భవిష్యత్‌లో మరింత దారుణ స్ధితిలోకి నెట్టబడతారని గుర్తించాలి. 2004 తరువాత ప్రభుత్వ వుద్యోగాలలో చేరిన వారు నూతన పెన్షన్‌ పధకం పేరుతో తమ పెన్షన్‌కు తామే డబ్బు చెల్లించుకుంటున్నారు. దానిని ప్రారంభం నుంచీ వామపక్ష పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు పనిచేసే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కొంత మంది ఈ స్కీమును బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ప్రవేశపెట్టింది కనుక కమ్యూనిస్టులు వ్యతిరేకించారని కొందరు ఆ రోజుల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన వారున్నారు. అసలు ఇప్పుడు చాలా మందికి ఇది బిజెపి సర్కార్‌ పుణ్యమే అని తెలియదు. 1998-2004 మధ్య కాలంలో అధికారంలో వున్న వాజ్‌పేయి సర్కార్‌ 1999లో ‘ఒయాసిస్‌ ‘(ఓల్డ్‌ ఏజ్‌ సోషల్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ) పేరుతో ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దాని సిఫార్సుల ప్రాతిపదికన నూతన పెన్షన్‌ పధకాన్ని రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీని కూడా ఏర్పాటు చేశారు. 2003 డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2004 జనవరి ఒకటవ తేదీ తరువాత చేరిన సాయుధ దళాల సిబ్బంది తప్ప ప్రభుత్వ వుద్యోగులందరూ ఈ స్వచ్చంద పెన్షన్‌ స్కీములో విధిగా చేరాల్సి వచ్చింది. ఇది అమెరికాలో అమలులో వున్న 401(కె) పెన్షన్‌ స్కీముకు అనుకరణ తప్ప ‘భారతీయ’ పధకం కాదు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే బిజెపి అమలులోకి తెచ్చిన ఈ పధకాన్ని తరువాత పది సంవత్సరాలు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. ఆ నాడు వుద్యోగ సంఘాలు నామ మాత్ర వ్యతిరేకత తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, ప్రతిఘటించలేదు. అప్పటికే వుద్యోగులుగా వున్న వారు అది తమకు వర్తించదు కనుక రాబోయే వుద్యోగులే చూసుకొంటారు మనకెందుకు లెమ్మని వుదాసీనంగా వున్నారు. వారిలో తమ భవిష్యత్‌ కుటుంబ సభ్యులు వుంటారని కూడా ముందు చూపుతో ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు ఆ పెన్షన్‌ స్కీము కింద చేరిన వుద్యోగులు దాని తీరుతెన్నులు చూసి గొల్లు మంటూ రద్దు కోసం ఆందోళనలు చేయాలని కోరుతున్నారు. చిత్రం ఏమిటంటే గతంలో వుద్యోగ సంఘాల నేతలుగా వుండి ఏ మాత్రం పట్టించుకోని నేతలు తగుదునమ్మా అంటూ ఇప్పుడు నూతన పెన్షన్‌ వ్యతిరేక ప్రకటనలు చేయటం గమనించాల్సిన అంశం. తెలంగాణా వంటి చోట్ల వుద్యోగ సంఘాల నేతలుగా పని చేసిన వారు ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్నారు. అయినా ఆ ప్రభుత్వం నూతన పెన్షన్‌ స్కీమును అమలు చేస్తోంది తప్ప రద్దు చేసే విషయాన్ని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదు.

ఇక ఏడవ వేతన కమిషన్‌ చేసిన దారుణమైన సిఫార్సులు, వాటిని అమలు జరిపేందుకు మోడీ సర్కార్‌ వుద్యోగుల మెడలు వంచిన తీరు గురించి తెలిసిందే. వాటి మంచి చెడ్డల గురించి ఇక్కడ చర్చించనవసరం లేదు. సాధ్యమైన మేరకు తాము ఇవ్వదలచుకున్నదానికే వుద్యోగుల చేత ఆమోదింపచేయించేందుకు చేయాల్సిందంతా చేశారు, చేస్తున్నారు. కేంద్ర వుద్యోగులకు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వర్తింప చేసే అలవెన్సుల గురించి ప్రకటన వెలువడుతుందని ఎంతో ఆశించి ఫూల్స్‌ అయ్యారు.అసలు ఎప్పుడు వాటిని ఖరారు చేస్తారో కూడా తెలియని స్ధితి ఇప్పుడు నెలకొందంటే అతిశయోక్తి కాదు. ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నాయకత్వంలోని అలవెన్సుల కమిటీ నివేదిక గతేడాది నవంబరునెలలోనే వెలువడాల్సి వుంది. ప్రభుత్వం దాని గడువును మూడు నెలలు పొడిగించింది. ఫిబ్రవరిలో వెలువడాల్సిస సిఫార్సుల నివేదికకు ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చిందని చెప్పారు. ఎన్నికలైపోయాయి. ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు పాతపడుతున్నాయి. ఇంతవరకు నివేదికను సమర్పించలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానిని ప్రభుత్వం పరిశీలించేది ఎప్పుడు ఖరారు చేసేది ఎన్నడో చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ గతేడాది జనవరి నుంచి అమలు కావాల్సిన అలవెన్సుల బకాయిల గురించి వుద్యోగులు ఆశలు వదులుకొని ఏదో ఒకటి అసలు అలవెన్సులు ప్రకటిస్తే చాలనే విధంగా పరిస్ధితిని తెచ్చేందుకు చూస్తున్నారన్నది స్పష్టం. తాజాగా మూడు శాతం డిఎ వస్తుందని చూసిన వుద్యోగులు రెండుశాతం ప్రకటనతో కంగుతిన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే వేతన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్ధితి. మరో వేతన సవరణ నాటి వరకు వాయిదా వేస్తారని చెప్పినా అతిశయోక్తి కాదు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీపద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. వుద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిందానిని కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని కూడా విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం.

గమనిక:ఈ వ్యాసం ‘ ఎంప్లాయీస్‌ వాయిస్‌ ‘ పత్రిక కోసం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d