• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

ఏది ముందు పుట్టింది ? జ్ఞానమా , అజ్ఞానమా – మత శక్తులెందుకు జ్ఞానం మీద దాడి చేస్తాయి ?

07 Monday Jun 2021

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, imperialism, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, USA

≈ Leave a comment

Tags

Anandaiah's K medicine, Ignorance, knowledge, pseudoscience, Science, science literacy, scientific temper


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనం కేసులో గిల గిలా కొట్టుకుంటున్న కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి !

03 Thursday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP Hawala Case, Kerala BJP, Kerala RSS, Kodakara Hawala Case


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. నిజమే అని నమ్మిన వారు కోరినంత నల్లధనాన్ని పంపారు. దాన్ని పంచుకోవటం లేదా దొంగ డబ్బు కనుక లెక్కా పత్రం ఉండదు కనుక బొక్కేసిన వారి మధ్య వచ్చిన తేడా వంటి కారణాలతో బయట పడి పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ డబ్బంతా హవాలా మార్గంలో వచ్చిన నల్లధనం అని వేరే చెప్పనవసరం లేదు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువే అని తేలింది,మూడున్నర కోట్లుగా చెబుతున్నారు. ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ ఉదంతంలో రాష్ట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎన్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో పార్టీలోని రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు కోటి రూపాయల దొంగడబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయక ముందే బిజెపి నేతలకు దొంగడబ్బు మాయం గురించి తెలుసునని వెల్లడైంది.


తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌, ఆయన అనుయాయులు మాత్రమే మాట్లాడుతుండగా మిగతావారు మౌనం దాలుస్తున్నారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది ఇప్పుడు చర్చ. చివరికి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌లో ఓడించేందుకు కొందరు బిజెపి నేతలు ప్రత్యర్ధికి ఓట్లను అమ్ముకున్న కారణంగానే అరవైవేల ఓట్లు రావాల్సింది 50వేలు వచ్చాయనే ఫిర్యాదు కూడా కేంద్రానికి పంపారు.


గిరిజన నాయకురాలిగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన సికె జాను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఐదు అసెంబ్లీ స్దానాల్లో పోటీ చేసేందుకు, కేంద్రంలో మంత్రిపదవికోసం బేరమాడినట్లుగా అందుకోసం పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్‌ చేయగా సురేంద్రన్‌ కేవలం పదిలక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు ఆపార్టీ కోశాధికారి ప్రసీత మీడియాకు చెప్పారు. పదిలక్షలు తీసుకొని పోటీ చేసేందుకు జాను అంగీకరించిన విషయాన్ని ప్రసీత ఫోను ద్వారా సురేంద్రన్‌కు చెప్పగా తిరువనంతపురంలో జాను బసచేసిన హౌటల్‌కు పంపినట్లు ఆమె చెబుతున్నారు. ఈ మేరకు వారి ఫోను సంభాషణ ఆడియోను స్వయంగా ప్రసీత విడుదల చేశారు. కొడక్కరలో పట్టుబడిన దొంగ డబ్బు కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసిన మొత్తం కంటే ఎక్కువ సొమ్మునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో సురేంద్రన్‌ వంటి బడానేతలు కూడా ఉన్నారని దొరికిన వారు చెప్పటంతో వారిని కూడా ప్రశ్నిస్తారని వార్తలు వచ్చాయి. గురువారం నాడు సురేంద్రన్‌ కోజికోడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సికె జాను నన్ను డబ్బు అడగలేదు, ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఆమె పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ఆడియోలు బయటకు వచ్చి ఉండవచ్చన్నారు. పోలీసులు పిలిచిన వారందరూ విచారణకు వెళుతున్నారు తప్ప కోర్టును ఆశ్రయించలేదు,భయపడలేదు. కొడక్కరలో దొరికింది నల్లధనమో, తెల్లధనమో నాకు తెలియదు. ఆడియో సంభాషణ తనది కాదు అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ముస్లిం లీగ్‌, సిపిఎం మద్దతుదారులు ఉన్నారని సురేంద్రన్‌ ఆరోపించారు.


ఆడియో సంభాషణ బయటకు వచ్చిన దృష్టా పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందని సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ చెప్పారు. లేనట్లయితే రాష్ట్రంలో పార్టీ అసంగత సంస్ధగా మారిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరువు పోయిందని, దీనికి సురేంద్రనే కారణమని అన్నారు. నిధుల చెల్లింపులకు సంబంధించి పరస్పర విరుద్దంగా పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేంద్ర పెద్దలకు తెలుసునని, తనను సంప్రదిస్తున్నారని, విచారణ కూడా జరుపుతున్నారని ముకుందన్‌ చెప్పారు.


ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు. సురేంద్రన్‌ చేసిన ప్రకటనను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ కోశాధికారి ప్రసీత బహిరంగ సవాలు చేశారు. ఆడియో నిజమైనదో, నకిలీదో కావాలంటే పరీక్షలు జరపాలన్నారు. తిరువనంతపురంలోని హొరైజన్‌ హౌటల్‌లో సికె జానుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ డబ్బు అందచేశారన్నారు. అంతకు ముందు తనకు ఫోన్‌ చేశారని కావాలంటే నిర్ధారించుకోవచ్చన్నారు. రెండు నిషేధిత సంస్దలతో జానుకు సంబంధాలు ఉన్నాయని, కొంత మంది ఆమెను కలిశారని, డబ్బును వాటి కార్యకలాపాలకు వినియోగించి ఉండవచ్చు అన్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికల నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాల కారణంగా జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జానును తొలగించినట్లు రాష్ట్రకమిటీ ప్రకటించగా తాను పదవిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడతాను తప్ప మధ్యవర్తులనెవరినీ నియమించలేదని, తన పేరుతో వారేమైనా డబ్బు తీసుకున్నారో తెలియదు కనుక విచారణ జరపాలని సికె జాను చెప్పారు. ఆమె పోటీ చేసిన సుల్తాన్‌ బాతరే నియోజకవర్గంలో ఎన్‌డిఏ ప్రచారం నిమిత్తం కోటీ 25లక్షల ఖర్చుకు సంబంధించిన వివరాలు బయటకు రావటం దొంగడబ్బు వివాదాన్ని మరో మలుపు తిప్పింది. కోజికోడ్‌ నుంచి రెండు కార్లలో కోటీ 25లక్షలు సుల్తాన్‌బాతరేకు తరలించారని, అక్కడ కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కొడకర పద్దతుల్లో పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా తెలుస్తోంది. అయితే అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని మరొకొ సందర్భంగా చెప్పారు. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది.పార్టీ ఆఫీసులోని వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు. మొత్తం మీద చివరకు వెల్లడయ్యే వివరాలు కేరళలో బిజెపికి తద్వారా కేంద్ర నాయకత్వానికి తలవంపులు తేవటం ఖాయం అని చెప్పవచ్చు.

మూడున్నర కాదు కేరళ బిజెపి దొంగ సొమ్ము ఇప్పటికి 9.8 కోట్లు !

పోలీసులు తవ్విన కొద్దీ బిజెపి కేరళ ఎన్నికల దొంగ సొమ్ము బయటకు వస్తోంది.కొడక్కర వంతెన వద్ద తమ కారును ఆపి సొమ్ము దోపిడీ చేశారంటూ కారు డ్రైవర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కర్ణాటక నుంచి వచ్చిన దొంగ సొమ్ముతో బిజెపి అభ్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది కొంతైతే దాచుకున్నది ఎంతో అన్నది అంతుచిక్కటం లేదు. రోజు రోజుకూ మరింత సమాచారం వెల్లడికావటంతో దిక్కుతోచని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నష్టనివారణతో పాటు కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి మార్గాలు వెతుకుతున్నారు.ధర్మరాజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత త్రిస్సూర్‌కు తెచ్చిన దొంగ సొమ్ము 9.8 కోట్లని పోలీసులు చెప్పారు. దీనిలో త్రిస్సూర్‌లోని ఒక వ్యక్తికి 6.30 కోట్లు ఇచ్చిన తరువాత మిగతా సొమ్మును వేరే చోటికి తరలిస్తూ దోపిడీ కట్టుకధలు అల్లారని తేలుతోంది. ధర్మరాజన్‌ అంతకు ముందు కూడా సొమ్మును తెచ్చారని, అది ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాల మీద పోలీసులు కేంద్రీకరించారు. త్రిస్సూరు నియోజకవర్గంలో బిజెపి రాజ్యసభ ఎంపీ సురేష్‌ గోపి పోటీ చేసి మూడవ స్ధానంలో నిలిచారు. అక్కడ ఖర్చుల కోసం రెండు కోట్లు ఇచ్చినట్లు తేలింది.

మంజేశ్వరమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్ల తేడాదో ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కె సుంద్రా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తన మద్దతుదార్లు పొరపాటున సుందర్‌కు ఓటు వేసిన కారణంగా తాను ఓటమి పాలైనట్లు సురేంద్రన్‌ భావించారు.ఈ సారి కూడా అదే వ్యక్తి బిఎస్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరటంతో తనకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని, సురేంద్రన్‌ గెలిస్తే పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక మద్యం షాపు ఇప్పించాలని సుంద్రా డిమాండ్‌ చేశాడు. అయితే రెండున్నర లక్షల రూపాయలు , పదిహేను వేల రూపాయల విలువ గల ఫోను ఇచ్చారు. మిగతా కోర్కెల గురించి ఎన్నికల తరువాత చూద్దాం లెమ్మని సురేంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని, స్ధానిక బిజెపి నేతలు తనకు సొమ్ము ఇచ్చినట్లు ఉపసంహరణ అనంతరం అతను బిజెపిలో చేరుతున్నట్లు ఒక సభలో ప్రకటన కూడా చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు ముందు రోజు తమ అభ్యర్ధి కనిపించటం లేదంటూ బిఎస్‌పి నేతలు పోలీసు సేష్టన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొడక్కర దొంగ సొమ్ము ఉదంతం బయటకు వచ్చిన తరువాత సదరు సుంద్రా ఈ విషయాలన్నీ స్వయంగా బయట పెట్టాడు. వాటి ఆధారంగా బిజెపి నేత సురేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజేశ్వరమ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి వివి రమేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సురేంద్రన్‌తో పాటు స్ధానిక బిజెపి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టిన తరువాత బిజెపి నేతలు తమ కుటుంబం మీద వత్తిడి తెస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాలని, సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సుంద్ర చెప్పాడు. తన తల్లి మీద వత్తిడి తెచ్చారని, ఆ సొమ్మంతా ఖర్చయిపోయిందని, తాను తిరిగి ఇవ్వలేనని , ఈ విషయాలను వెల్లడించటానికి తన మీద ఎవరి వత్తిడీ లేదని సుంద్ర చెప్పాడు. ఇతను ఇప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు.

దొంగ సొమ్ము పంపిణీదారైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ అనేక మంది బిజెపి నేతలతో ఫోన్‌ ద్వారా సంభాషించాడు. వారిలో సురేంద్రన్‌ కుమారుడితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగ సొమ్ము ఉదంత దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని, పట్టుబడిన సొమ్ము తీవ్ర ఆర్ధిక నేర స్వభావం కలిగినదని , అయినా పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మీద చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌తాంత్రిక్‌ యువ జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌ మాదవుర్‌ కేసు దాఖలు చేశారు. దీని గురించి ఇడి అధికారులకు నోటీసలు ఇవ్వగా తమకు సమయం కావాలని కోరారు, పది రోజుల్లో తీసుకున్న చర్యలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. సీనియర్‌ బిజెపి నేత సికె పద్మనాభన్‌ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఉప్పు తిన్న వారు నీరు తాగటం ప్రకృతి ధర్మమని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు.కొడకర దొంగ సొమ్ము ఉదంతంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, మరింత సమగ్ర దర్యాప్తు జరపాలసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియరి బాలకృష్ణన్‌ అన్నారు. దొంగ సొమ్ము గురించి వార్తలు రాగానే ఇడి వెంటనే రంగంలోకి దిగుతుందని, కానీ ఈ ఉదంతంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టి దాని వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. భవిష్యత్‌లో తాము ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌కు పోటీగా వస్తామని భయపడుతున్నవారు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, పధకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనం రాజశేఖరన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్ధానంలో రాజశేఖరన్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరుగుతున్నారా – ఒక పరిశీలన !

01 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Politics, Believers in Kerala LDF, CPI(M), Kerala LDF, Sabarimala controversy


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఏ అధ్యక్షుడికి మత ముద్ర వేసిన కాషాయ దళం- రామ్‌దేవ్‌ బాబాకు జూన్‌ ఒకటిన వైద్యుల నిరసన !

29 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, Uncategorized

≈ Leave a comment

Tags

Ayush systems, Baba Ramdev, Christianity, Dr Johnrose Austin Jayalal, Gaytri Mantra, Hindu Fundamentalism, IMA, RSS Propaganda, Yoga


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

26 Wednesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), NATIONAL NEWS, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Congress, Kerala BJP, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆనందయ్య అద్భుత మందు – తర్కం, కుతర్కం అసలు లక్ష్యం !

24 Monday May 2021

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Anandaiah miracle medicine, Ayurvedic, Krishnapatnam medicine, Religious fanatics, Traditional Medicine


ఎం కోటేశ్వరరావు


నిజం గడప దాటక ముందే ఒక అబద్దం ఊరంతా తిరిగి వచ్చి నిజానికే తన మీద తనకే అనుమానం వచ్చేట్లు చేస్తుంది. ఆనందయ్య మందు గురించి సామాజిక మాధ్యమంలో వస్తున్న తర్క-కుతర్కాల గురించి చూద్దాం.
గతంలో కూడా పసరు లేదా ఇతర నాటు మందులు, వాస్తు గురించి కూడా వాటిని సమర్దించే వారు, నమ్మేవారు పుష్కలంగా ఉన్నారు. తాజా ఆనందయ్య మందుకు హిందూ మతాన్ని జోడించటం ద్వారా మతోన్మాద శక్తులు దీన్ని కూడా వెంటనే వినియోగించుకున్నాయి.


వనమూలికలు, పసరు మందులు లేదా ఆయుర్వేదం సాంప్రదాయకమైనవి అని చెబుతున్నారు. ఇది కుతర్కం. అవి సాంప్రదాయకం కాదు. మానవ జాతి జీవన పోరాటంలో తమ అనుభవంలోకి వచ్చిన వాటితో గాయాలు, రుగ్మతలను రూపు మాపేందుకు ఎందరో చేసిన ప్రయోగాలే. జ్వరం, కడుపు, తలనొప్పులు వస్తే మా తాత, మానాన్న ఫలానా మూలికలు, ఆకుపసరులు ఇచ్చే వారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నా అని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజానికి వాటిలో వుండే శాస్త్రీయ లక్షణాలు తెలిసి ఇచ్చేవి కాదు. అవి పూర్తిగా పని చేస్తాయనే నిర్దారణతో ఇచ్చేవి కాదు. నిజానికి జనానికి పూర్తి విశ్వాసమే ఉంటే అన్ని రకాల గాయాలు, జబ్బులను నయం చేసే లక్షణం ఉంటే అల్లోపతి ఆసుపత్రులు ఇలా కిటకిటలాడుతుండేవా ? జనం వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో సమర్ధకులు చెప్పాలి. రోడ్డు మీద పోతుంటే ఒక పూజలు చేసిన ఒక చెట్టో, పుట్టో, గుండ్రాయో కనిపించగానే కొందరు ఒక దండం పడేసి పోతారు. వస్తే సంపదలు వస్తాయి, దండంతో పోయేదేమీ లేదు కదా అన్నదే వారి ఆలోచన. ఒక పక్క ప్రాణాలు తీస్తున్న మహమ్మారికి సరైన మందు లేదన్న ప్రచార నేపధ్యంలో తెల్లవారేసరికి అలాంటి మందు ఉంది అని చెప్పగానే జనం ఎగబడటం మన సామాజిక రుగ్మతల్లో ఒకటి. వాటిని అర్ధం చేసుకోవాలే గానీ ఆగ్రహిస్తే ప్రయోజనం లేదు.


నమ్మకం లేకపోతే జనం ఎందుకు ఎగబడుతున్నారు ? జనం ఎగబడే వన్నీ సమర్దనీయమేనా ? కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు పక్కనే ఉండే పలకలూరు అనే గ్రామం(ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లోని ఒక బావిలో నీరు తాగితే రోగాలు నయం అవుతున్నాయని ప్రచారం సాగి జనం ఎగబడ్డారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక హైదరాబాదు బత్తిన సోదరుల చేప మందు సంగతి తెలిసిందే. ఉబ్బసానికి – మృగశిర కార్తెకు సంబంధం ఏమిటి అని ఎవరైనా ఆలోచించారా ? 1845లో ఒక సాధువు తమ పూర్వీకుడికి మందు గురించి చెప్పారని అప్పటి నుంచి తమ కుటుంబం పంపిణీ చేస్తున్నదని ఆ సోదరులు చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న వారి పూర్వీకులకు సాధువు ఇవ్వక ముందు ఉబ్బసం లేదా దానికి ఎవరు మందు ఇచ్చారు ? అది ప్రపంచవ్యాపిత జబ్బు. పుప్పొడి, బొద్దింకలు, దుమ్ము ప్రధాన కారణం అని నిర్ధారించారు. ఉబ్బసం అనేది సర్వకాలాల్లోనూ వస్తున్న వ్యాధి. దీనికి ఉపశమనం తప్ప ఇంతవరకు చికిత్సలేదు. జలుబు కూడా అంతే. ఇవి అందరికీ ఒకే కారణంతో రావాలని లేదు.ఎవరి కారణాలు వారికి ప్రత్యేకమే. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఆస్తమా రోగులు ఉన్నారు. అయితే దానికి బలి అవుతున్నవారు ఎక్కువగా పేద, వర్ధమాన దేశాల వారే. ప్రపంచంలో ప్రతి పది మంది ఆస్తమా రోగుల్లో ఒకరు మన దేశంలో ఉంటున్నారు. వారి సంఖ్య ఒకటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటోంది. బత్తిన సోదరులు తమ మందు లేదా ప్రసాదం తీసుకున్న వారి సంఖ్య ఆరున్నర లక్షలు. అతి అతిశయోక్తి అంతలేరు అనే వారున్నారు. పోలీసు లెక్కల్లో అది కనపడదు, పోనీ అంత మంది తీసుకున్నారనుకున్నా మిగతావారు ఏం చేస్తున్నట్లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లే కదా. అందువలన మెడికల్‌ మాఫియాకు బత్తిన సోదరులు సవాలుగా తయారైందీ లేదు ఆసుపత్రుల వారు ఆందోళన చెందిందీ లేదు. ప్రతి మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకొనే వారే జనవిజ్ఞాన వేదికను చూసి ఆందోళన చెందారు. అందువలన ఇలాంటి వాటితో పాటు, మహమ్మారులు తలెత్తినపుడు, చికిత్సలేనపుడు సూక్ష్మంలో మోక్షం కోరుకున్నట్లుగా ఒకసారి వాడి చూద్దాం పని చేస్తే చేస్తుంది లేకుంటే ఏమీ కాదంట కదా అని జనం ఎగబడుతున్నారు తప్ప మరొకటి కాదు. వారికి అన్నీ తెలిసి ఎగబడుతున్నారని ఎవరైనా నిరూపించగలరా ?


1890దశకంలో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నివారణ కోసం సిబ్బంది ఇండ్లకు వచ్చినపుడు మతం, ఆచారాల పేరుతో కనీసం లోపలికి ప్రవేశించేందుకు సైతం అంగీకరించకుండా అడ్డుకున్నారని చదువుకున్నాం. చివరికి మత పెద్దల సాయంతో సిబ్బంది ప్లేగు బాధితులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే కొన్ని చోట్ల బ్రిటీష్‌ మిలిటరీ, పోలీసు, ఆరోగ్య యంత్రాంగం అలాంటి వారి మీద బల ప్రయోగం చేయాల్సి వచ్చిందని కూడా తెలిసిందే. ఇప్పుడు కూడా ఎవరికన్నా కరోనా ఉందని తెలిస్తే ఇంటి యజమానులు అద్దెకుండే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న ఉదంతాలెన్ని లేవు. అందువలన జనం చేసేవన్నీ మంచివే అనీ చెప్పలేం. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు జరిపే పేరుతో పోలీసుల అతి చర్యలను కూడా చూస్తున్నాం-జనం కోసమే అయినా అలాంటి వాటిని సమర్ధిస్తామా ? ప్లేగు వ్యాధి నివారణకోసం నాటి నిజాం నవాబులు వేరే దిక్కుతోచక హైదరాబాద్‌లో చార్మినార్‌ను నిర్మించారన్నది తెలిసిందే. అదే సమయంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా వచ్చిందిగా, బిజెపి భాషలో చెప్పాలంటే మరి హిందూ పాలకులు అనేక మంది ఉన్నారు కదా చికిత్సకు వారేం చేశారు, వారెందుకు కట్టడాలు కట్టించలేదు అంటే ఏం సమాధానం చెబుతారు ? కుతర్కానికి జవాబులుండవు ?

వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో లేనిది లేదు అని చెబుతారు. నిజమే ఉన్నాయనుకుందాం, మనకు పోయేదేమీ లేదు. వాటన్నింటినీ బయటకు తీసి దేశంలో కోట్లాది మందిని బలితీసుకున్న ప్లేగు, మసూచి, కలరా, మలేరియా, కుష్టు వంటి వాటికి ఔషధాలను ఎందుకు తయారు చేయలేదు, ప్రపంచ దేశాలకు ఎందుకు ఎగుమతి చేయలేదు ? 1890లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం రష్యా నుంచి బాక్టీరియాలజిస్టు డాక్టర్‌ వాల్డమర్‌ హాఫికిన్‌ను రప్పించింది. ఆయన రూపొందించిన వాక్సిన్‌ తరువాత కాలంలో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అదే శాస్త్రవేత్త కలరా నిరోధ వ్యాక్సిన్ను కూడా రూపొందించాడు. మరి వేల సంవత్సరాల ఆయుర్వేదం, దాన్ని ఔపోసన పట్టిన వారు, సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పేవారు ఎందుకు కనిపెట్టలేకపోయారు ? ప్రతి దేశంలోనూ అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులు లేదా ఔషధాలకు చాదస్ధాలను తగిలించి అభివృద్ధి నిరోధకంగా తయారు చేశారు. ఈ పరిణామం అన్ని దేశాలలో తరతమ స్ధాయిల్లో జరిగింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ముందు వాటికి ఆదరణ తగ్గింది. అల్లోపతితో పాటు స్ధానిక వైద్య విజ్ఞానాన్ని అభివృద్ది చేస్తే ఎవరు అడ్డుకున్నారు ? ఆయుర్వేదం గురించి భారతీయులకు మాత్రమే తెలుసు, కొంత మందిలో విశ్వాసం ఉంది. ఔషధాలకు ప్రపంచ మార్కెట్‌లేదు, కనుకనే ఆ రంగంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రావటం లేదు. అందువలన దానికి, అల్లోపతి వైద్యానికి పోటీ పెట్టి ఇది విదేశీ అని ఆయుర్వేదం హిందూ వైద్యం కనుక అణచివేస్తున్నారని ప్రచారం చేయటం ఉన్మాదం ముదరటం తప్ప మరొకటి కాదు. ఆయుర్వేదంలో బిపికి, మధుమేహానికి మహా గొప్ప మందులు ఉన్నాయి, వాటిని మెడికల్‌ మాఫియా బయటకు రానివ్వటం లేదన్నది ఒక ప్రచారం. ఆడలేక మద్దెల ఓడని ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటారు. భారతీయ పద్దతులను పరిరక్షించేవారు, వెలికి తీసేవారే కదా గత ఏడు సంవత్సరాలుగా కేంద్రంలో, ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. వారంతా ఏమి చేస్తున్నట్లు ? సొల్లు కబ్లురు తప్పితే, చైనా అంత పెద్ద దేశాన్నే లొంగదీసుకొని చర్చలకు రప్పించామని చెప్పుకొంటున్న 56 అంగుళాల ఛాతీ గల నేతలు మెడికల్‌ మాఫియాను అదుపు చేయలేరా ?

ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ది క్రమంలో ఏవరైనా ఒక ఔషధాన్ని తయారు చేశామని ప్రకటిస్తే దానికి రుజువులు చూపాలని, సామర్ద్యం సంగతి తేల్చాలని కోరుతున్నారు గనుకనే అనేక ఔషధాలు, వాక్సిన్లపై సంవత్సరాల తరబడి ప్రయోగాలు చేస్తున్నారు. అల్లోపతి ఔషధాలను ఎవరూ ప్రశ్నించటం లేదనేది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. దానికి చట్టాలే ఉన్నాయి. ఆయుర్వేద వైద్యానికి శిక్షణా కళాశాలలు, విద్యార్ధులకు సిలబస్‌, పరీక్షల వంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఆనందయ్య వంటి వారు ఆయుర్వేదం పేరుతో ఏ అర్హతలతో వైద్యం చేస్తున్నారు, తయారు చేసిన పసరు మందులు ఇస్తున్నారు ? కొందరు అలాంటి వారిని ప్రోత్సహించటం ఏమిటి ? ప్రశ్నించిన వారిని హిందూ ద్రోహులుగా చిత్రిస్తారా ? అల్లోపతి ఆసుపత్రుల్లో జరిగే వాటిని ప్రశ్నించరు అని ఒక ప్రచారం. ఈ ప్రశ ్న అడిగేవారు వేదికలను ఏర్పాటు చేసుకొని ఆ పని ఎందుకు చేయరు ? ఈ దేశంలో ఒక చట్టం, ఒక విధానం అన్నీ ఉన్నాయి. ఒక వేళ ఆనందయ్య లాంటి వారు ఆయుర్వేద వైద్యం చేయటానికి అర్హతలు ఉన్నాయనుకుంటే వారికి డిగ్రీలు ప్రదానం చేసి చట్టబద్దంగానే చేయించండి, ఎవరు వద్దన్నారు. కల్వరి తైలం గురించి శాస్త్రీయ నిరూపణ చేయాలని ఎవరూ అడగలేదు ఎందుకు అని ఒక ప్రశ్న. కల్వరి అయినా మరొకటి అయినా ఔషధం అని ప్రచారం చేస్తే జనవిజ్ఞానవేదికో మరొకటో రంగంలోకి వస్తాయి. లేదూ రాలేదు అనుకోండి ఈ ప్రశ్న వేస్తున్నవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు? వారికి బాధ్యత లేదా ? గుళ్లూ గోపురాల్లో ప్రసాదం పేరుతో పెట్టేవాటిలో, పవిత్ర తీర్ధంలో , చర్చ్‌లలో బాప్తిజం, ఇతర సందర్భాలలో పవిత్ర జలంలో ఏముంది అని ఏ జనవిజ్ఞాన వేదిక కార్యకర్త అయినా ఎప్పుడైనా ప్రశ్నించిన ఉదంతం ఉదంతం ఉందా ? ఎందుకంటే వాటిని వారు ఔషధాలుగా ప్రచారం చేసుకోవటం లేదు. అడ్డగోలు తర్కాలకు అంతు ఉండదు.


ఉచితంగా ఇస్తున్న మందు గురించి ఇన్ని విచారణలా ? లక్షలు తీసుకుంటున్న ఆసుపత్రులను ఎందుకు పట్టించుకోరు ? ఈ దేశంలో ఒక చట్టం ఉంది. దాని ప్రకారం ఎవరైనా తెల్లవారే సరికి ఒక మందు ఇస్తున్నామంటూ ముందుకు వస్తే దానికి అనుమతి ఉందా , ఎక్కడ తయారైంది, ఇతర వివరాలన్నీ ముద్రించిన సమాచారం ఉండాలి. రామర్‌ పిళ్లే పెట్రోలు తయారీ, ఆనందయ్య మరొక వెంకయ్య గానీ వివరాలు, అనుమతుల్లేని మందు గురించి చెబితే ఈ సమస్యలన్నీ ముందుకు వస్తాయి. ఈ ప్రశ్న వేసే వారు చట్టాన్ని గౌరవిస్తున్నట్లా లేక అడ్డగోలు తనాన్ని ప్రోత్సహిస్తున్నట్లా ? విచారణ చట్టబద్దంగా జరుగుతోందా, విరుద్దంగా జరుగుతోందా ? ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక మగవాడు ప్రకటిస్తే డిఎన్‌ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారా లేదా అదే విధంగా ఆనందయ్య తయారు చేసినట్లు చెబుతున్న మందును ఎవరైనా ప్రశ్నించినా లేక వార్తలు తెలిసి తనంతటతానే అయినా ప్రభుత్వాలు, సంబంధిత సంస్దలు విచారణ జరుపుతాయి. అదే విధంగా ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిగ్గుతేల్చాలి. విచారణ సక్రమంగా జరగలేదు అంటే అది వేరే విషయం.

జనవిజ్ఞాన వేదిక లక్ష్యం ఈ దేశ అనాది సంస్కృతుల్ని విజ్ఞానం పేర నాశనం చేసి చైనాకు బానిసలుగా చేయటం అని ఒక ముక్తాయింపు. సంస్కృతి, సాంప్రదాయాల పేరిట అసలు ప్రశ్నించే తత్వాన్నే నాశనం చేసింది, నగుబాట్ల పాలు చేస్తున్నదీ జనవిజ్ఞానవేదిక లేదా అలాంటి మరొక సంస్ధ కాదు. విదేశీ పాలకులు వారు పశ్చిమ, మధ్య ఆసియా నుంచి వచ్చినా ఐరోపా నుంచి వచ్చినా ప్రతిఘటించకుండా జనాన్ని దద్దమ్మలుగా తయారు చేసింది, ఈ దేశంలో పుట్టి పెరిగిన బౌద్ధమతాన్ని విదేశాలకు తరిమి వేసింది ఎవరు ? ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనాన్ని పెంచి పోషించింది హిందూమతం లేదా గొప్పదని చెప్పుకుంటున్న హిందూ సంస్కృతా లేక జన విజ్ఞానవేదికలా ?


ఔషధ కంపెనీల మాఫియా లేదా వత్తిడి అని ఒక ప్రచారం. నిజమే మాఫియా లేదా వారి మాయాజాలం ఉన్న మాట నిజమే. అది ఉండబట్టే కదా భారత్‌ బయోటెక్‌, సీరం సంస్దల వాక్సిన్లు తప్ప నెలల తరబడి మరొక వాక్సిన్‌ రాకుండా మన నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒకసాకుతో మోకాలడ్డి జనం ప్రాణాల మీదకు తెచ్చింది. కాదంటారా ? నిజంగా జనం ప్రాణాలు కాపాడటం ముఖ్యం అనుకుంటే వాటికి అనుమతి ఇచ్చినట్లుగానే అత్యవసర ప్రాతిపదికన ఇతర వాక్సిన్లకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు ? ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేక ఆనందయ్యను అడ్డుపెట్టుకొని కాషాయ తాలిబాన్లు ఔషధ మాఫియా పేరుతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. లేదూ నిజంగానే ఔషధ మాఫియా పని చేస్తోందని అనుకుందాం. కొత్తగా ఆనందయ్య మందుతో వారు ముందుకు రాలేదుగా, ప్రధాని, మంత్రులు, వారందరికీ మార్గదర్శనం చేస్తున్న సంఘపరివార్‌ మేథావులు ఏడు సంవత్సరాలుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదేండ్లలో చేశామని చెప్పుకున్న గొంతులు మాట్లాడవేం. కంపల్సరీ లైసన్సులు ఇచ్చి ప్రాణావసర ఔషధాలు, వాక్సిన్లు తయారు చేయించి మెడికల్‌ మాఫియాను దునుమాడితే ఎవరు వద్దన్నారు ?


ఇప్పుడు కొంత మంది కోవిడ్‌ -19ను చైనా వైరస్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగానే బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో మన దేశంలో తలెత్తిన కలరాను ఐరోపా, అమెరికా ఖండాలలో ఆసియా లేదా ఇండియన్‌ కలరా అని వర్ణించారు. తమ ప్రాంతంలో వచ్చిన కలరా కూడా దీని వలనే నిందించారు. బహుశా కరోనా గురించి చైనా మీద మన టీవీ యాంకర్లు, వాట్సప్‌ యూనివర్సిడీ పండితులు రెెచ్చి పోవటానికి ప్రేరణ ఇదే అయి ఉండవచ్చు. భారత్‌లోని హరిద్వార్‌, పూరీ, పండరిపూర్‌, పశ్చిమాసియాలోని మక్కా, మదీనా వంటి చోట్ల జరిగే మతకార్యక్రమాలకు హాజరయ్యే జనాలు దీనికి ఒక కారణమని నాటి బ్రిటీష్‌ పాలకులు భావించారు. 1892లో ఒక అమెరికన్‌ భారత్‌లో పారిశుధ్య నిబంధనలు అమలు చేయాలంటే ప్రతి యాత్రీకుడికి ఇద్దరు సిపాయిలు అవసరమని రాశాడు. భారత్‌లో హిందూ భక్తులు, ఈజిప్టులో ముస్లిం భక్తులు కొనసాగినంత కాలం ఐరోపా, అమెరికాలకు ముప్పుకొనసాగుతూనే ఉంటుందన్నాడు. ఒక మతం వారు, మరొక మతంలోని కొన్ని సామాజిక తరగతుల వారు పరిశుభ్రత పాటించరంటూ ఇప్పటికీ ప్రచారం చేసే వారు దీన్ని గమనంలో ఉంచుకోవాలి.

పూరీ జగన్నాధ రధయాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులు కలరా వ్యాప్తికి ప్రధాన కారకులౌతున్నారనే అభిప్రాయంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్‌ పాలకులు ఒక దశలో ఆలోచించి, జనం నుంచి వచ్చే వ్యతిరేకతకు భయపడి పోతే పోనివ్వండి పోయేది వారేగా అన్నట్లు అలాంటి నిషేధాన్ని మానుకున్నారని చరిత్రకారులు రాశారు.బొంబాయి ప్లేగు, కలరా ఉదంతాలు 150 సంవత్సరాల క్రితం జరిగాయి. మహమ్మారుల గురించి ఎంతో పరిజ్ఞానం, విజ్ఞానం వచ్చిందనుకుంటున్న సమయంలో హిందూత్వశక్తుల అజ్ఞానం ఏ స్ధాయిలో ఉందో వారిని నమ్మి జనం ఎలా ప్రవర్తించారో చూశాము. గంగలో మునిగితే వైరస్‌ అంటుకోదని ప్రచారం చేశారా లేదా ! కుంభమేళాలో అంత మంది గుమికూడటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా బిజెపి ముఖ్యమంత్రులు, నేతలు దానికి అనుమతి ఇవ్వాల్సిందే అని వాదించి జనాన్ని గంగలో మునకలేయించారు కదా ! కొందరు అఖారాలు మరణించటం, వ్యాధి ప్రబలటంతో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకొని మధ్యలోనే నిలిపివేశారు. ఎందుకు అనుమతించారో, ఎందుకు నిలిపివేయించారో, హిందూ భక్తుల మనోభావాలు ఏమయ్యాయో ఎవరైనా చెప్పగలరా ?


ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎబోలా మహమ్మారి తలెత్తినపుడు జనం ఎలా ప్రవర్తించారో మనం చూశాము. వాటిని సమర్ధిస్తామా ? ఎబోలా చికిత్స కేంద్రాలకు జనం వెళితే కొన్ని శరీర భాగాలను అపహరిస్తారని కొందరు, తమ సాంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లుతుందని ముందుకు రాని వారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. అందువలన జనం పేరు చెప్పి మూఢవిశ్వాసాలను పెంచి పోషించే వారు పెద్ద దేశద్రోహులు. దాన్ని ప్రశ్నించారా,దీన్ని ప్రశ్నించారా అంటూ అనేక మంది ఇప్పుడు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఆనందయ్య మందును కొందరు ప్రశ్నించారు గనుక వీరంతా రంగంలోకి దిగారు. ఆ మందు లేనపుడు కూడా వీరు చెబుతున్న అంశాలు ఉన్నాయి కదా వీరెందుకు స్పందించలేదు. అంటే వీరి ప్రశ్నలు,ప్రచార అసలు లక్ష్యం హిందూత్వతో సహా దేన్నీ ప్రశ్నించకూడదు. అది కుదిరేది, జరిగేది కాదు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎందరు అడ్డుకున్నా సమాజాన్ని వెనక్కు నడపాలని గతంలో ప్రయత్నించినా కుదరలేదు, ఇక ముందు కుదరదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వగురువులో దిగంబర రాజును చూసిన కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ !

21 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP’s trolling army, Naked King, Narendra Modi Failures, Parul Khakhar, Shav-vahini Ganga


ఎం కోటేశ్వరరావు


హిట్లర్‌, రెండవ ప్రపంచ యుద్దంలో ఓటమి పాలై అవమానం భరించలేక ఆత్మ హత్యకు పాల్పడి దిక్కులేని చావు చచ్చి ప్రపంచమంతా ద్వేషించిన జర్మన్‌ నాజీ పాలకుడు.
నరేంద్రమోడీ, దేశ రాజకీయ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి గద్దెనెక్కి ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఏలిక.
మార్టిన్‌ నియోములర్‌, లూథరన్‌ క్రైస్తవ పూజారి, తొలి రోజుల్లో హిట్లర్‌ అభిమాని-కమ్యూనిస్టు వ్యతిరేకి.హిట్లర్‌ నిజస్వరూపం తెలుసుకొని వ్యతిరేకించినందుకు జైలు పాలైన వారిలో ఒకడు.
పారుల్‌ ఖక్కర్‌, నరేంద్రమోడీ అభిమాని, భవిష్యత్‌లో గుజరాతీ కవులకు ప్రతీకగా మారతారని సంఘపరివార్‌ ప్రశంసలు పొందిన కవయిత్రి. మోడీ పాలనా తీరును భరించలేక కవిత రాసినందుకు అదే పరివార్‌ బూతులతో అవమానాల పాలైన బాధిత మహిళ.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు….. అనే పదాలతో ప్రారంభించి నాజీల తీరు తెన్నులు- సమాజ స్పందనను వర్ణించి దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదమైన కవితను జైలు గోడల మధ్య రాసిన రచయిత నియోములర్‌. హిట్లర్‌ను బలపరిచినందుకు పశ్చాత్తాప పడుతూ భవిష్యత్‌ తరాలను హెచ్చరిస్తూ చేసిన రచన అది.
అన్ని దేశాలలో, భాషలలో చెప్పుకొనే దిగంబర రాజు కథలో రాజుకు బట్టలు లేవంటూ అమాయకత్వం తప్ప అభం శుభం తెలియని ఒక పిల్లవాడు నిజం చెబుతాడు. గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలతో సంబంధం లేని భక్తి గీతాలు, భావ కవితలు రాసే అలవాటున్న ఖక్కర్‌ నరేంద్రమోడీ పాలన తీరు తెన్నులు చూసి భరించలేని పసిపిల్ల మాదిరి ఆవేదనతో అల్లిన కవిత. ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని భాషల్లో అనువాదమై వైరల్‌ అవుతోంది.
హిట్లర్‌ అంతమైన తరువాత మార్టిన్‌ నిములర్‌ను మిత్రరాజ్యాల సేనలు జైలు నుంచి విముక్తి చేశాయి.
కవిత రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు పారుల్‌ను నోరుబట్టని బూతులతో బిజెపి సంస్కృ(తి)త పండితులు నిందిస్తున్నారు. వారు నిత్యం ప్రవచించే ఏకత, శీలము, సంస్కారానికి అర్ధం ఇదా అని జనం విస్తుపోతున్నారు.


తన కవిత మీద తీవ్ర దుమారం, బెదిరింపులు, దూషణలు వెల్లడైనప్పటికీ తన రచనను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని తానెలాంటి తప్పు చేయలేదని పారుల్‌ ఖక్కర్‌ చెప్పారు. నరేంద్రమోడీని ఆయన అంతరంగం అమిత్‌ షాను విమర్శించిన వారికి ఏ గతి పడుతుందో తెలియనంత ఎడారిలో, అడవిలో ఆమె లేరు. అందుకే ఒకే ఒక్కడు అన్నట్లుగా గుజరాత్‌లో మోడీని తప్పు పట్టిన ఆమెను ఒకే ఒక్కతె అనవచ్చు. కేవలం పద్నాలుగు పంక్తుల కవితతో విశ్వగురువు పీఠాన్ని, పరివారాన్ని గడగడలాడించిన ఆ రచనలోని ఆవేదనను అర్ధం చేసుకొని మరింతగా ప్రచారంలోకి తేవటమే ఆమెకు మనమిచ్చే ఘనమైన గౌరవం. మే పదకొండవ తేదీ వరకు కేవలం గుజరాత్‌కే తెలిసిన ఆమె నేడు దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందారు. అన్నింటికీ మించి హమ్మయ్య చివరికి గుజరాత్‌లో కూడా స్పందించే వారు ఉన్నారంటూ అనేక మందికి ప్రాణం లేచి వచ్చేట్లు చేశారు.


ఎందరో పేరు ప్రఖ్యాతులున్న కవులు, కవయిత్రులు ఉన్నారు. కరోనాతో నిమిత్తం లేకుండానే గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఉన్న భావ ప్రకటన స్వేచ్చ పరి(దు)స్ధితిని చూసి మన కెందుకులే అని కలాలను, గళాలను మూసుకున్నవారే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరం అని తెలిసీ దురలవాట్లను మానుకోని వారి మాదిరి వారంతా చెవులు కొరికే లక్షణంతో బాధపడుతున్నారన్నది స్పష్టం. గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. ఎక్కడైనా ఒకటో అరా విమర్శనాత్మక రచన చేసినా, గళం విప్పినా, శిరమెత్తినా వాటికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్న బూతు పురాణాలను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఖక్కర్‌ కవితకు గుజరాత్‌లోని ప్రముఖ కవులు, కళాకారుల నుంచి మద్దతు రాలేదు. అయితే గుజారాతీ లేఖక్‌ మండల్‌ అనే సంస్ధ మాత్రం మద్దతు ప్రకటించింది. ఆమెను నిందించే బిజెపి మరుగుజ్జులను ఖండించింది.

గుజరాతీ రచయిత్రి, సినిమా దర్శకురాలు మెహుల్‌ దేవకళ పారుల్‌ ఖక్కర్‌ గురించి, తన అనుభవాన్ని వివరిస్తూ రాసిన వ్యాసాన్ని కొన్ని ఆంగ్ల మీడియా సంస్ధలు ప్రచురించాయి. దాని సారం ఇలా ఉంది. ” నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత తొలిసారిగా ఆయన మాతృభాష గుజరాతీలో మోడీని విమర్శించటమే గాక కరోనా రెండవ తరంగం గురించి సామాన్యుల ఆవేదనను వ్యక్త పరిచిన కవిత బహుశా ఇదేనేమో. శవవాహిని గంగ పేరుతో రాసిన కవిత దావాలనంలా వ్యాపించింది, గుజరాతీ సాహిత్యకారులు మొద్దుబారి పోయారు, ఎలా స్పందించకూడదో వారికి తెలుసు. అయితే సాహిత్యంతో పనిలేని సామాన్య గుజరాతీలు ఆ కవితలో తమ మనోభావాలు ప్రతిబింబించినట్లు భావించారు. విస్కృతంగా పంచుకున్నారు.యాభై ఒక్క సంవత్సరాల ఖక్కర్‌ భావ గీతాల కవయిత్రిగా పరిచయం. అమె గతంలో రాజకీయ అంశాలను సృజించలేదు.వివాహమై, పిల్లలు పుట్టి స్ధిరపడిన తరువాత ఆలస్యంగా అమె సాహితీ ప్రయాణం ప్రారంభించారు.త్వరలోనే సాహితీ బృందాలలో ఒక స్ధానం సంపాదించుకున్నారు. గృహిణిగానే ఉన్న ఆమెతో కలసి నేను అనేక సాహితీ సమావేశాలలో కవితా గానాలు చేశాను. ఆమె రాసిన తాజా కవిత మితవాద శక్తులకు పిడుగు పాటు వంటిది.ఆమె ఎన్నడూ ప్రభుత్వ వ్యతిరేకిగా లేరు, అలాంటి కవితలు ఆమె రాస్తారని అనుకోరు. అయితే ఆమె చుట్టూ ఉన్న పరిస్ధితులు, ప్రభుత్వ ఘోరవైఫల్యం ఆమెను అందుకు పురికొల్పాయి.నేను ఫోనులో మాట్లాడి ఫేస్‌బుక్‌ నుంచి కవితను తొలగించనందుకు ఆమెను అభినందించినపుడు నేనెందుకు దాన్ని తొలగించాలి, నేను చెప్పినదానిలో తప్పేముంది అంటూ సన్నగా నవ్వుతూనే ధృడంగా చెప్పారు.


ఆమెను దీర్ఘకాలంగా అభిమానిస్తున్నవారు ముఖం చాటేశారు, దూరం జరిగారు.తరువాత ఖక్కర్‌కు ఏమి జరుగుతుందో నేను చెప్పగలను. దేశంలో అసహన సంస్కృతి పెరుగుతున్న నేపధ్యంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాయాలని 2015 అక్టోబరులో నేను నిర్ణయించుకున్నాను. గుజరాత్‌లోని అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులను కలసి దాని మీద సంతకం చేయాలని కోరాను.నైతికంగా మద్దతు తెలిపారు తప్ప సంతకాలు చేసేందుకు తిరస్కరించారు. నిజం చెబితే వచ్చే ముప్పును స్వీకరించేందుకు సిద్దపడలేదు. భయంతో గుసగులాడుకోవటాన్ని అలవాటు చేసుకున్నారు. నా లేఖపై సంతకాలు చేయని గుజరాతీ సాహిత్యకారుల గురించి మొద్దుబారిపోయారని ఒక జాతీయ పత్రిక మొదటి పేజీలో వ్యాఖ్యానించింది. ఆ లేఖ తరువాత సాహితీ సమావేశాల్లో , అవార్డులకు సిఫార్సుల్లో నా పేరును తొలగించారు. ఖక్కర్‌ కవిత తరువాత ప్రభుత్వ అనుకూల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక ప్రముఖ మహిళా కాలమిస్టు తన వ్యాసం మొత్తాన్ని ఖక్కర్‌కు కేటాయించి కవిత ఉద్ధేశ్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక ఫాషనై పోయింది అని ఆగ్రహించారు. కొందరు బిల్లా -రంగా, ఫిడేలు వంటి పదాలను ఉపయోగించటం ఏమిటని ప్రశ్నించారు. మరికొందరు కవితాత్మకంగా సమాధానాలిచ్చారు. మరొక రచయిత ఎవరూ ఖక్కర్‌ను అనుసరించి అలాంటి విమర్శనాత్మక కవితలు రాయకూడదన్నది వారి స్పష్టమైన ఉద్దేశ్యం. అనేక మంది రచయితలు, వ్యాసకర్తలు సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి అనుకూలం వాదనలతో రంగంలోకి దిగారు. ఎక్కువ మంది గుజరాతీ కవులు మౌనం దాల్చారు.నేను సామాజిక మాధ్యమంలో రాసిన వాటిని చూసి వెనక్కు తగ్గమని తోటి గుజరాతీ రచయితలు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఖక్కర్‌ పేరు వినని వారు కూడా ఆమె కవితకు మద్దతు ఇస్తున్నారు. అది ఇప్పుడు భాషా సరిహద్దులు దాటిపోయింది. చివరికి రచయిత్రితో సహా ఎవరూ కూడా దాని ప్రయాణాన్ని ఆపలేరు.” అని దేవకళ పేర్కొన్నారు.


1973-74లో గుజరాత్‌లో నవనిర్మాణ ఆందోళన పేరుతో ఏర్పడిన సంస్ధ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి చిమన్‌భారు పటేల్‌ ఉద్వాసనకు కారణమైంది. ఆ సంస్ద అధ్యక్షుడిగా పని చేసిన మానిషీ జానీ ప్రస్తుతం గుజరాతీ లేఖక్‌ మండల్‌ అధ్యక్షుడిగా ఒక ప్రకటన చేస్తూ ఈ కవితను పూర్తిగా సమర్ధించిన వారిలో ఉన్నారు. బిజెపి నిందా ప్రచారాన్ని ఖండించారు. సంస్ధ కార్యదర్శి మన్‌హర్‌ ఓజా కూడా సమర్ధించటమే గాక సామాజిక మాధ్యమంలో ప్రతి భారతీయుడు ఆమెకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.


తన కవిత వైరల్‌ అవుతున్న సమయంలో ఒక గృహిణిగా ఖక్కర్‌ ఇల్లు తుడుస్తూ లేదా చపాతీలు చేస్తూ ఉండి ఉంటుందని ఆమె బంధువు ఒకరు ది వైర్‌ పోర్టల్‌తో చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె భర్త ఒక బ్యాంకు ఉద్యోగి.తన భార్య కవితల పట్ల ఆయన గర్వపడతారు. అనేక మంది యువతుల మాదిరి కళాశాలలో చదువుతూ డిగ్రీ రెండవ సంవత్సరంలో మానివేసి వివాహం చేసుకొని గృహిణిగా స్ధిరపడ్డారు. అయితే ఆమెకు స్కూలు దశలోనే రాయటంపై మక్కువ ఏర్పడింది. పదవతరగతిలో ఉండగా 1984లో తొలి కవిత రాశారు. ఇందిరా గాంధీ మరణం, ఆమె వ్యక్తిత్వం గురించి దానిలో పేర్కొన్నారు. అయితే వివాహం తరువాత కవితలు రాయటం నిలిపివేశారు. 2011లో కుమారుడు ఆమెకు ఇంటర్నెట్‌ను, సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమెలోని కవయిత్రి మేలుకున్నది. గజల్స్‌ ఇతర కవితలు రాసింది.తాను ఆధ్యాత్మికవాదినని, కవిత్వం తన జీవితానికి నిశ్శబ్దంగా మద్దతు ఇస్తుందని, కవితలంటే ఇష్టమని తన గురించి రాసుకున్నారు. ఆమె రాసిన అనేక భక్తి గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. విష్ణు పాండ్య అనే రాజకీయ చరిత్రకారుడు ఆర్‌ఎస్‌ఎస్‌ గుజరాతీ పత్రిక సాధనలో పని చేసేవ్యక్తి. నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత పాండ్యకు పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. పారుల్‌ ఖక్కర్‌ భవిష్యత్‌లో గుజరాతీ కవితకు పెద్ద ప్రతీకగా ఎదుగుతారని వర్ణించారు. శవగంగ పేరుతో కవిత రాసిన తరువాత బిజెపి మరుగుజ్జులు ఆమె పరిణితిలేనిది, హిందూ వ్యతిరేకి, నైతిక విలువలు లేనిది, బజారు మనిషి అంటూ బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే ఆమెను అంతగా పొగిడిన ఆ పెద్దమనిషి ఖక్కర్‌ రక్షణకు రాలేదు. రాజకీయంగా ఆమె కుటుంబం బిజెపికి మద్దతు ఇస్తుంది, ఎప్పుడూ ఆ పార్టీని వ్యతిరేకించలేదు. ఖక్కర్‌ కవితను ఆమె ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని బిజెపి వారు ప్రచారం చేశారు. అయితే వారి దాడి నుంచి తట్టుకొనేందుకు తన ఫేస్‌బుక్‌కు తాళం వేశారు తప్ప కవితను తొలగించలేదు. ఆమె ఖాతాలోని స్నేహితులు తప్ప బయటి వారు చూడలేరు.


ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప వాటి మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాదు గానీ దిగంబర రాజు, బిల్లా-రంగా వంటి పదాలను వాడినందుకు మోడీ భక్తులు ఆమె మీద దాడిచేస్తున్నారంటూ సమర్ధించేవారు వారు తయారయ్యారు.


ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద వత్తిడి ఎలా ఉంటుందో అవుట్‌లుక్‌ పత్రిక ఉదంతమే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం కనిపించటం లేదు, కనుగొని చెప్పండి అంటూ తయారు చేసిన ముఖపత్రాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగించింది. ఎందుకంటే ప్రచారం కోసం పెట్టాము, దాని పని అయిపోయింది కనుక తొలగించాం తప్ప ముద్రణలో పేజీ తొలగించలేదని వివరణ ఇచ్చింది. దీని వెనుక సదరు పత్రిక యాజమాన్యం రహేజా గ్రూప్‌పై కేంద్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి అని వేరే చెప్పనవసరం లేదు.ముఖ చిత్రం గురించి ప్రపంచ వ్యాపితంగా తెలిసిపోయింది. అందువలన కొత్త ముఖచిత్రంతో పత్రిక ముద్రణ జరిగితే అది నరేంద్రమోడీ సర్కార్‌కు మరింత నష్టదాయకం. కరోనా సమయంలో దుకాణాల్లో పత్రిక కొనేవారి కంటే ఆన్‌లైన్లో చూసే వారు గణనీయంగా ఉంటారు. కనుక ఉన్నంతలో ప్రచారం, చర్చను నిలువరించేందుకు ఇలా చేశారన్నది స్పష్టం.

ప‌రుల్ క‌క్క‌ర్ (గుజ‌రాతీ క‌వ‌యిత్రి) శవవాహిని గంగ

అనువాదం : రాఘ‌వ‌శ‌ర్మ‌

భ‌య‌ప‌డ‌కు..ఆనంద‌ప‌డిపో..

ఒకే గొంతుతో శ‌వాలు మాట్లాడుతాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వాలు గంగాన‌దిలో ప్ర‌వ‌హించ‌డం చూశాం

ఓ రాజా..అడ‌వి అంతా బూడిద‌య్యింది,ఆన‌వాళ్ళు లేవు, అంతా శ్మ‌శాన‌మైపోయింది,

ఓ రాజా..బ‌తికించే వాళ్ళు లేరు,

శ‌వాల‌ను మోసేవాళ్ళూ క‌నిపించ‌డం లేదు,

ధుఃఖితులు మాత్రం మిగిలారు.

అంతా కోల్పోయి మిగిలాం

మాట‌లు లేక‌ బ‌రువెక్కిన మా హృద‌యాలు శోక‌గీతాలైనాయి

ప్ర‌తి ఇంటిలో మృత్యుదేవ‌త ఎగిసిప‌డుతూ తాండ‌వ‌మాడుతోంది

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..క‌రిగిపోతున్న పొగ‌గొట్టాలు క‌దిలిపోతున్నాయి, వైర‌స్ మ‌మ్మ‌ల్ని క‌బ‌ళించేస్తోంది

ఓ రాజా.. మా గాజులు ప‌గిలిపోయాయి, భార‌మైన మా హృద‌యాలు ముక్క‌ల‌య్యాయి

అత‌ను ఫిడేలు వాయిస్తున్న‌ప్పుడు మా న‌గ‌రం కాలిపోతోంది

బిల్లా రంగాల బ‌రిసెలు ర‌క్త‌ద‌ప్పిక గొన్నాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..నీవు మెరిసిపోతున్న‌ట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు త‌ళుక్కుమ‌న‌డం లేదు

ఓ రాజా..ఈ న‌గ‌రమంతా చివ‌రిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి

ఇక‌ ప‌రిమితులు, మిన‌హాయింపులు లేవు నీ ద‌మ్ము చూపించు,

రా..బయిటికి రా.. గ‌ట్టిగా చెప్పు, పెద్ద‌గా అరువు,

దిగంబ‌ర రాజు అవిటివాడు, బ‌ల‌హీనుడు

ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండ‌లేన‌ని చెప్పు

కోపంతో ఊగిపోతున్న న‌గ‌రం మంట‌లు ఎగిసిప‌డుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి

,ఓ రాజా.. నీ రామ‌రాజ్యంలో శ‌వ‌గంగా ప్ర‌వాహాన్ని చూశావా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను ఎవరేం కోరుతున్నారు : జనం నెగిటివ్‌ – నరేంద్రమోడీ పాజిటివ్‌ !

18 Tuesday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Coronavirus, COVID-19, Narendra Modi Failures, Negative, Positive, RSS, RSS Mohan Bhagavat, RSS Propaganda


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు జనమంతా తమకు నెగెటివ్‌ రావాలని కోరుకుంటున్నారు- మరోవైపు నరేంద్రమోడీకి పాజిటివ్‌ రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది. ఇదేమిటనుకుంటున్నారా ? అవును నిజం… అవును నిజం. కరోనా వైరస్‌ గురించి జనం నెగెటివ్‌ రావాలని అనుకుంటుంటే – కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యం మీద జనంలో వస్తున్న వ్యతిరేకతను పాజిటివ్‌గా మార్చాలని సంఘపరివార్‌ నడుం కట్టింది. ఆ కసరత్తులో భాగంగా అనేక చర్యలు తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, ఎత్తుగడలు తెలిసిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. అన్ని తరగతుల్లోనూ ప్రత్యక్ష, పరోక్షంగా తీవ్ర విమర్శలకు గురైన నరేంద్రమోడీని పూర్తిగా భుజాన వేసుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోతాయి.పిర్ర గిల్లి జోల పాడినట్లుగా విమర్శించినట్లూ ఉండాలి- ఆదుకోవాలి అనే ఎత్తుగడలో భాగంగా ” పరిమితులు లేని సానుకూలత ” అనే ఇతివృత్తంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) ఐదు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని ముగింపు వక్తగా భగవత్‌ పాల్గన్నారు. ఆ సంస్ధ ఏర్పాటు చేసిన కరోనా స్పందన బృందంతో కలసి దీన్ని నిర్వహించారు. దీనిలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఇదేవిధమైన ఉద్బోధలు చేశారు. వంద వేదికల ద్వారా ఈ ఉపన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.


అన్నమైతేనేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా వక్తలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. కరోనా తొలి తరంగం తరువాత ప్రభుత్వం-జనం ఇద్దరూ నిశ్చింతగా ఉన్నారు ఇద్దరూ తప్పు చేశారు అందువలన సానుకూలంగా ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం అన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పారు. కరోనా మొదటి దశపై విజయం సాధించామని ప్రకటించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనంగా ఉంది. నిపుణులు చేసిన హెచ్చరికల గురించి ఏం చేశారని ఆరా తీసిందో లేదో తెలియదు. రెండవ దశ పరిస్ధితి ఆందోళనకరంగా తయారైంది. ఇంటా బయటా తీవ్ర విమర్శలు, వైఫల్యాల గురించి జనం మాట్లాడుకోవటం ప్రారంభించగానే ఆ సంస్ధలో ఆందోళన మొదలైంది, నష్ట నివారణ చర్యల్లో భాగంగానే జనానిది, ప్రభుత్వానిది ఇద్దరిదీ తప్పు ఉందంటూ ప్రచారం మొదలు పెట్టింది. జనంలో అసంతృప్తి మోడీ పలుకుబడిని తగ్గిస్తుందా పూర్తిగా దిగజారుస్తుందా అన్న మదింపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాను పెంచి పెద్ద చేసిన వ్యక్తి, ప్రభుత్వం గురించి అలా ఆలోచించటం సహజం. రెండోది జరిగితే పరివార్‌ అజెండాకు ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పుడు గౌరవ ప్రదంగా మోడీని పక్కన పెడతారు. అసంతృప్తి తాత్కాలికమే అయితే కొనసాగిస్తారు. దానికి తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవటం తప్ప వ్యక్తులుగా ఎవరినైనా ఉపయోగించుకుంటుంది.అందుకు ఏమైనా చేస్తుంది.

వాజ్‌పారు బతికి ఉండగా కూడా అందరికీ తెలిసిన, నలుగురిలో నానిన విషయాన్నే ఇప్పుడు ” జుగుల్‌ బందీ ” పేరుతో గ్రంధస్ధంగావించిన వినరు సీతాపతి పేర్కొన్నారు. రాజకుమారి కౌల్‌ అనే వివాహితతో వాజ్‌పేయి సంబంధం తెలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు గురుగోల్వాల్కర్‌, నానాజీదేశముఖ్‌ ఆమెకు దూరంగా ఉండాలని ఇచ్చిన ఆదేశం లేదా హితవును వాజ్‌పేయి తిరస్కరించి జీవితాంతం కొనసాగించారు. ఒకే ఇంట్లో ఉన్నారు. దీని గురించి సంఘపరివార్‌ సర్దుకుపోయింది గానీ వాజ్‌పాయిలో మార్పులేదు. విలువలు-వలువల గురించి కబుర్లు చెప్పే సంఘపరివార్‌ నాయకత్వానికి ఇవన్నీ తెలిసినప్పటికీ వాజ్‌పారు-అద్వానీ ఇద్దరిలో సౌమ్యుడిగా పేరున్న వాజ్‌పారును ప్రధానిగా చేయటం ద్వారా మిగతా పార్టీల మద్దతు కూడ గట్టవచ్చు అన్న దూరాలోచనతో నిర్ణయానికి వచ్చింది. బిజెపి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కె ఎన్‌ గోవిందాచార్య బ్రిటీష్‌ దౌత్యవేత్తలతో మాట్లాడుతూ పార్టీకి వాజ్‌పాయి ఒక ముసుగు మాత్రమే అసలైన నేత అద్వానీయే అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటలతో ఆయన ఉద్యోగం ఊడిందనుకోండి అది వేరే విషయం. తరువాత గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ ” పని తనాన్ని ” చూసిన తరువాత అద్వానీని పక్కన పెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయే అసలు సిసలు వ్యక్తిగా మోడీని గుర్తించి ముందుకు తెచ్చిన కథ తెలిసిందే. కరోనా రూపంలో వచ్చిన మహమ్మారికి మతం లేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా ప్రకారం నడిచేది కాదు గనుక చివరికి మోడీ పదవికి ముప్పు తెచ్చిందా ?


కరోనా వైఫల్యం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ మీద వీర భక్తి ఇప్పటికీ అనేక మందిలో పతాక స్ధాయిలోనే ఉంది. జనానికి ఆక్సిజన్‌ అందించలేకపోతే అదే జనం మోడీ అధికార ప్రాణవాయువును లాగేస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు కార్పొరేట్లకు కూడా మోడీ ” తగిన ” వ్యక్తి అని ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నారు గనుక ప్రధానిగా గద్దెనెక్కించటానికి వారు కూడా ” చేయాల్సిందంతా ” చేశారు. ప్రపంచ బ్యాంకు నమ్మిన బంటుగా అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్లకు ఇష్టుడిగా ఉన్నారు కనుకనే మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాటు పదవిలో కొనసాగారు. ఆయనకు కొన్ని పరిమితులు ఏర్పడిన తరువాత అపరిమిత సానుకూలంగా వ్యవహరించేందుకు నరేంద్రమోడీ సరైన నేతగా కనిపించారు. కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది, కరోనా దాన్ని వేగవంతం చేసింది. ఈ దశలో గత ఏడు సంవత్సరాల మాదిరే కార్పొరేట్లకు దోచిపెడితే జనం ఊరుకోరు, ఒకసారి తినటానికి అలవాటుపడిన కార్పొరేట్లకు వాటా తగ్గితే అవి సహించవు. ఇదే సమస్య. దీన్ని సంఘపరివార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది కొంతకాలం చూడాల్సిందే. అవసరమైతే మరొకరిని ముందుకు తేవాలనుకుంటే కాస్త సద్దుమణిగిన తరువాత చేయాల్సిన పని చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏమీ చేయదు. గతంలో మొరార్జీ దేశారు ప్రభుత్వానికి ముందు రోజు వరకు వీర విధేయుడిగా మాట్లాడిన జార్జిఫెర్నాండెజ్‌ తెల్లవారేసరి ఎలా ప్లేటు ఫిరాయించారో చూశాము. అనేక మంది ప్రముఖులు పార్టీ మారే ముందు కూడా ఇలానే ఉంటున్నారు. పరివారం తలచుకుంటే తెల్లవారే సరికి పరిస్ధితి మారిపోతుంది.భక్తులు కొత్త దేవుడి భజనకు మారటం చొక్కా మార్చినంత సులభం !


కరోనా వైరస్‌ మొదటి దశలో, రెండవ దశలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రతిపక్ష పార్టీలన్నీ సానుకూలంగానే తీసుకున్నాయి. ఎక్కడా వాటికి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపు ఇచ్చిన ఉదంతం లేదు. తమ స్వస్ధలాలకు చేరేందుకు జనానికి తగిన వ్యవధి, రవాణా ఏర్పాట్లు చేయకుండా గతేడాది ప్రకటించిన లాక్‌డౌన్‌, 27లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించిన కేంద్రం వలస కార్మికులు స్వస్ధలాలకు చేరేందుకు అయ్యే రైలు ఛార్జీలను ఎవరు భరించాలనే చిన్న అంశంపై చేసిన రచ్చ , ఆత్మనిర్భర పాకేజి బూటకం గురించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తప్ప మిగతా వన్నీ అపరిమిత సానుకూలమే.


ఇక వర్తమానానికి వస్తే సంఘపరివార్‌ ఇప్పుడు జనంలో మోడీ సర్కార్‌ పట్ల సానుకూల వైఖరిని ఎక్కించేందుకు ఎందుకు పూనుకున్నది అన్న ప్రశ్న. ఇదేమీ సమాధానం చెప్పక పోతే తలలు ఎగిరిపోయే సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న కాదు. దీని గురించి పైనే చెప్పుకున్నాం. నిపుణుల అభిప్రాయాలు, హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన వర్తమాన నీరో, అదృశ్యమైన పాలన, పాలకులంటూ ఒక పత్రిక పెట్టిన శీర్షిక చాలు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటానికి. సజావుగా సాగుతోందనుకుంటున్న తన అజెండా అమలుకు విఘాతం కలిగే విధంగా మోడీ సర్కార్‌ వ్యవహరించిందని సంఘపరివార్‌ గ్రహించటమే ఈ నష్ట నివారణ చర్య. మోహన్‌ భగవత్‌ గారు చెప్పినదాన్ని సానుకూలంగా తీసుకుంటే ప్రభుత్వం- జనం కూడా నిశ్చింతగా ఉన్నారు.ఇద్దరిదీ తప్పే. దాన్నే మరోవిధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేశారు. జనంతో ఉన్నామని చెప్పుకొనే, పరిస్ధితిని ఎప్పటికప్పుడు కన్నార్పకుండా పరిశీలించే పరివార్‌ నిపుణులు ఏం చేస్తున్నారు ? ఆర్నాబ్‌ గోస్వామి వంటి కాషాయ మీడియా పెద్దలేమి హెచ్చరికలు చేశారు అన్నది ప్రశ్న. ఇది ” దేశ భద్రత అంశం ” కనుక సమాధానాలు చెప్పరు. జనం బాధ్యతాయుతంగా వ్యహరించటం లేదనే ప్రచారం గత కొద్ది వారాలుగా సామాజిక మాధ్యమంలో, బిజెపి ప్రతినిధుల చర్చలలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇది, ప్రశ్నించేవారి నోరు మూయించే ఎదురుదాడి వ్యూహం. భగవత్‌గారు ఇచ్చిన సలహా ఏమిటి ? సమాజానికి తోడ్పడాలంటే యోగా చేయాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి. గతేడాది మోడీ గారు ఇచ్చిన గ్లాసులు, పాత్రల మోగింపు, దీపాలు వెలిగింపు కార్యక్రమానికి దీనికి పెద్ద తేడా ఏముంది. అంతేనా కరోనాతో చస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పునర్జన్మ గురించి భారతీయులకు వేరే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది నిర్లక్ష్యం చేసిన జనానికి చెప్పారు బానే ఉంది, మరి లక్షలాది మంది పునర్జన్మకు కారకులౌతున్న నరేంద్రమోడీ గారి సంగతేమిటి ?


” కరోనా తొలి తరంగం తరువాత జనం, ప్రభుత్వాలు, యంత్రాంగాలు దారి తప్పాయని అందరికీ తెలుసు, వైద్యులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ అందరూ ఇప్పటికీ దారి తప్పి ఉన్నారు. అందుకే మనం ఈ రోజు ఈ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు మూడవ తరంగం గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి, అయితే మనం భయపడాలా, కూడదు. అన్ని విబేధాలను మరచిపోయి అందరం ఐక్యంగా పనిచేయాలి. ప్రస్తుతానికి లోపాల చర్చలను నిలిపివేయాలి, ఒక జట్టుగా పనిచేయాలి.” అని భగవత్‌ చెప్పారు.


ఎంత చక్కటి మాట ? నిజంగా అభినందించాల్సిందే. నరేంద్రమోడీ గారు పరివార్‌ కుటుంబ సభ్యుడే. ప్రతి ఏటా తన ప్రభుత్వ పని తీరు గురించి దాని నాయకత్వానికి విధేయుడిగా నివేదించటం తెలిసిందే. సరిగ్గా ” పరిమితులు లేని సానుకూలత ” గురించి ఉపన్యాసాలు ఇప్పిస్తున్న సమయంలోనే పన్నెండు ప్రతిపక్ష పార్టీలు నరేంద్రమోడీకి ఒక లేఖ రాశాయి. అంతకు ముందు ఎలాగూ అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా యుద్దం మీద తీసుకుంటున్న చర్యలను వివరించలేదు, తరువాత అయినా నరేంద్రమోడీ ఎందుకు సానుకూలంగా స్పందించలేదు ? ప్రతిదాన్నీ విమర్శించే ప్రతిపక్షాలతో సమావేశం జరిపి ప్రయోజనం లేదని టీవీల్లో బిజెపి ప్రతినిధుల సమర్ధన. సానుకూల నాటకం భలే సాగుతోంది కదూ !


పుండు మీద కారం రాయటం అంటే ఇదేనా ?

కరోనాతో ఆకస్మికంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు, అనాధలైన పిల్లల గురించి, వీధులపాలైన బతుకుల గురించి రోజూ విషాదకర కథనాలు వెలువడుతున్నాయి.చివరి చూపుకు సైతం నోచుకోవటం లేదు. ఏ రోజు ఎవరి వంతు వస్తుందో తెలియని స్ధితిలో ఉన్న జనానికి భగవత్‌ గారు చెప్పిందేమిటి ? ” భారత పౌరుల గురించి మనకు తెలుసు. జీవన్మరణాల చక్రం తిరుగుతూనే ఉంటుందనీ మనకు తెలుసు. అది ఎలా అంటే పాతపడిన, జీర్ణావస్తలో ఉన్న దుస్తులను మనం ఎలా మార్చుకుంటామో అదే మాదిరి ముసలితనం, పనికిరాని శరీరాన్ని వదలి కొత్త శరీరం కోసం మానవులు ముందుకు పోతారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు మరియు ఈ పరిస్ధితి మనల్ని భయపెట్టటం లేదా కలవరప్టెకూడదు ”
ఇక భగవత్‌ గారు చెప్పిన ఇతర విషయాలకు వస్తే జనం అనుభవంలోకి రాని, శాస్త్రీయంగా రుజువు గాని వాటిని ఆయుర్వేదం పేరుతో చెప్పేవాటిని, శాస్త్రాలు చెప్పని వాటిని నమ్మవద్దని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితిని సమాజం తిరస్కరించాల్సిన అవసరం లేదు, ఏమీ జరగలేదు, అంతా బాగుంది అనే భావాలకు చోటివ్వాలి, శరీరం వైరస్‌ను ప్రతిఘటించాలి, మనస్సు సానుకూలంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఉపాధి, ఆర్ధికరంగాలలో సంక్షోభం, ద్రవ్య సంబంధ వెనుకబాటు తలెత్తనుంది, దానికి మనం సిద్దంగా ఉండాలి.


ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ రవిశంకర్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, అజీమ్‌ ప్రేమ్‌ జీ వంటి వారు ధర్మోపన్యాసాలు చేశారు.సానుకూల ధోరణి అవలంభించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.వారు చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.యోగా, ఆయుర్వేదం రోగ నిరోధక శక్తిని పెంచుతుందనే ప్రచారం ఇప్పటిది కాదు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా అదే పాట పాడారు.
” ప్రభుత్వం పట్ల ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. మీడియాను, వీక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నించటం, ఒకరి నొకరు దెప్పుకోవటం వలన మీరు సమస్యలో భాగం అవుతారు తప్ప పరిష్కారంలో కాదు.దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు తగినన్ని లేవు అయితే తెల్లవారేసరికి మార్పు రాదు.” జగ్గీవాసుదేవ్‌.
మనలో దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని మేల్కొలపాలి. దేవుడు ఉన్నాడని మనకు విశ్వాసం ఉండాలి.మనం బలహీనంగా, నిరుత్సాహంగా ఉన్నట్లు అనుకుంటున్నాము. ఇలాంటి సమయాల్లో నిర్భరతను కోల్లోకూడదు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే వత్తిడి నుంచి దూరం అవుతాము” శ్రీ శ్రీ రవి శంకర్‌.
” అనేక మంది పునర్మజన్మ గురించి పరిశోధనలు చేశారు. అది ఉన్నందున మరణం గురించి భయపడకూడదు. కరోనాతో మరణించినప్పటికీ తదుపరి జన్మలో కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఐదు పది సార్లు ఓం కారాన్ని పలికితే బలం వస్తుంది. సానుకూల వైఖరి కలిగిస్తుంది.” సామాజిక కార్యకర్త నివేదిత భిడే. మూడు నిమిషాలు మాట్లాడిన విప్రో సిఇఓ అజీమ్‌ ప్రేమ్‌ జీ పేదల్లో అత్యంత నిరుపేదలను ఇప్పుడు అదుకోవాలన్నారు. మంచి శాస్త్రాల మీద ఆధారపడిన చర్యలను వేగంగా అన్ని రంగాలలో తీసుకోవాలన్నారు. విబేధాలను మరచి అందరూ ఐక్యం కావాలన్నారు.

కరోనిల్‌ అనే ఔషధం కరోనా చికిత్సకు పనికి వస్తుందనే ప్రచారంతో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్న రామ్‌దేవ్‌ బాబా ఆస్తా టీవీ ఛానల్లో ఆక్సిజన్‌ కొరత గురించి ప్రస్తావించిన వారితో చెప్పిన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూడండి.” మనకు దేవుడు ఇక్కడ రెండు సిలిండర్లు ఇస్తే జనాలు బయట ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం చూస్తున్నారు. వాటిని ఉపయోగించండి అమాయకులారా ” అంటూ గుండెలోని ఊపిరితిత్తులను చూపారు. ”ఇక్కడ రెండు సిలిండర్లు ఉన్నాయి. మీ రెండు కాళ్లు ఇద్దరు వైద్యుల వంటివి, మీ రెండు చేతులు ఇద్దరు నర్సుల వంటివి ” అన్నారు. ఇదే పెద్ద మనిషి ఆవనూనె పీలిస్తే కరోనా వైరస్‌ నశిస్తుందని సెలవిచ్చిన విషయం తెలిసిందే. భోపాల్‌ బిజెపి ఎంపీ, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఆవు మూత్రం తాగి కరోనా సోకుండా ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

దృష్టి మళ్లించే ఎత్తుగడలు


ఒకవైపు ఢిల్లీ శివార్లలోని రైతులంతా వెళ్లిపోయారని ప్రచారం చేశారు. కొంత మంది వెళ్లారు తప్ప నిరసన శిబిరం ఖాళీ కాలేదు. వేలాది మంది అక్కడే ఉన్నారు. అయితే గోధుమ కోతల తరుణంలో గ్రామాలకు చేరుకున్న వారు ఆపనులు పూర్తయిన తరువాత, కొత్త రైతులు తిరిగి ఢిల్లీ శివార్లకు వస్తున్నారన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో మే నెల 14వ తేదీన నరేంద్రమోడీ నోటివెంట పిఎం కిసాన్‌ నిధుల అందచేత ప్రకటన వెలువడింది. పోనీ వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు విధించినా ఆర్ధిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో, ఎంత మందికి ఉపాధి కల్పించారో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో వంటి విషయాలను ప్రకటిస్తూ వాటితో పాటు రైతుల నిధుల గురించి చెబితే సాధారణ వ్యవహారం అనుకుంటారు.వాటి గురించి ఆందోళనకరమైన వార్తలు ఎన్ని వచ్చినా నోరు విప్పని వారు దీని గురించి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే మోడీ అజెండాలో కరోనా లేదన్నది స్పష్టం.


తాను కరోనా గురించి ఎంతో ఆవేదన, బాధ పడుతున్నట్లు మోడీ చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ఇది ఓదార్పు అనుకుందాం. సురక్షితమైన చేతుల నుంచి చేతల బాధ్యత కదా ఇప్పుడు కావాల్సింది.టన్నుల కొద్దీ ఆవేదన వ్యక్తం చేస్తే ఒక లీటర్‌ ఆక్సిజన్‌ అవుతుందా ? ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపడతాయా ? కావాల్సిన ఔషధాలు దొరుకుతాయా ? కరోనాపై పోరు, యుద్దం, సమూల నాశనం వంటి ఉపమాలంకారాలతో కూడిన మాటలు బాధితులకు ఉపయోగపడవు. యుద్దాన్ని ఎదుర్కొనే తీరులో సన్నాహాలు, చర్యలు ఉన్నాయా? అధికారాలను ఉపయోగిస్తున్నారా ? అందరికీ ఉచితంగా వేస్తామన్న వాక్సిన్‌ విషయంలో మడమ తిప్పారు, జనానికి విశ్వాసం కల్పించలేకపోగా సగం భారాన్ని రాష్ట్రాల మీద నెట్టారు. రాష్ట్రాలకు అధిక రేటు, కేంద్రానికి తక్కువ రేటట. ఏమిటీ వ్యాపారం ? వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోది, వాటిదే బాధ్యత అంటున్నారు. మీ పరిధిలోని ఆక్సిజన్‌ కూడా అందించలేని పరిస్ధితి ఎందుకు తలెత్తింది అంటే జవాబు లేదు. దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు. అసలు సమస్య ఏమంటే తమ వైఫల్యాలను అంగీకరించేందుకు బిజెపి నేతలు సిద్దంగా లేరు. ఆక్సిజన్‌ కొరత అన్నది దేశ వ్యతిరేకులు చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ వర్ణించారు.

కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని ప్రధాని చెప్పారు. దాని మీద విజయం సాధించామని చెప్పినపుడు కనిపించిందా ? హెచ్చరికలను పెడచెవిన పెట్టినపుడు ఎక్కడైనా నక్కిందా ? ప్రపంచ వ్యాపితమైన మహమ్మారిని జయించినట్లు ప్రకటించాల్సింది ప్రపంచ ఆరోగ్య సంస్ద తప్ప ఒక దేశం కాదు. చైనా వంటి దేశాల్లో కొత్త కేసులేవీ లేనందున అదుపులో ఉంచామని చెబుతున్నారు తప్ప జయించామని వారే చెప్పలేదు. మరి మన దేశం ఏ సాధికారతతో అలాంటి ప్రకటనలు చేసినట్లు ?కేరళ ముఖ్యమంత్రి ప్రతి రోజూ విలేకర్లతో మాట్లాడుతున్నారు, కరోనా, ఇతర అంశాలను చెబుతున్నారు. ప్రధానికి విలేకర్లతో మాట్లాడే అలవాటు లేదు కనుక ఎవరూ ఆశించరు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఏమయ్యారు. అందుకే కదా అవుట్‌లుక్‌ పత్రిక ఏడేళ్ల వయసున్న ప్రభుత్వం కనపడటం లేదు అని ముఖచిత్ర కధనాన్ని రాసింది. అది కూడా ” జాతి వ్యతిరేకుల ” శిబిరంలో చేరింది. ఒక నాడు సంఘీయుల ప్రశంసలు అందుకున్న గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన కవిత మే 11వ తేదీ నుంచి దేశంలో వైరల్‌ అవుతోంది. అన్ని భాషల్లోకి అనువదించి వ్యాపింప చేస్తున్నారు. నరేంద్రమోడీని నగచక్రవర్తితో పోల్చి తన ఆవేదనను వ్యక్తం చేసి ఇప్పుడు పరివార్‌ ఆగ్రహానికి గురయ్యారు.శీలము, ఏకత, సంస్కారం గురించి మాట్లాడేవారు నోరుబట్టని బూతులతో ఆమెను ట్రోల్‌ చేస్తున్నట్లు వార్తలు. ఎంతలో ఎంత మార్పు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనాన్ని ఆదుకోవటంలో కేరళ సిఎం విజయన్‌ – శవ రాజకీయాల్లో బిజెపి !

15 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP Propaganda, Kerala BJP, Kerala Free Food Kits, Kerala LDF, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ – పర్యవసానాలు !

07 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BSP, CM Yogi Adityanath, Samajwadi Party, UP panchayat poll


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తమ విజయం నల్లేర మీద బండి నడక మాదిరి అనుకుంటున్న బిజెపికి స్ధానిక సంస్దల ఎన్నికలు పెద్ద షాకిచ్చాయి.ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, హిందూత్వకు ప్రతీకగా చూపుతూ కూల్చివేసిన మసీదు స్ధానంలో నిర్మిస్తున్న రామాలయం ఉన్న అయోధ్య, ముఖ్యమంత్రి కోట అని చెబుతున్న గోరఖ్‌పూర్‌ వంటి చోట్ల బిజెపికి చావు దెబ్బలు తగలటం గమనించాల్సిన అంశం. రామాలయ నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, వారణాసి అభివృద్దికి పెద్ద పీటవేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అన్నింటికీ మించి ఇదే పరిస్దితి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతం అయితే భవిష్యత్‌లో ప్రధాని పదవి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ఆదిత్యనాధ్‌ పరిస్దితి ఎలా ఉంటుందో తెలియదు.


మార్చి 14వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌ ప్రస్తుత విధాన సభ గడువు ముగియ నుంది. అందువలన ఆ లోగా ఎన్నికల జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో యోగి ఆదిత్యనాధ్‌ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగలటం కమలనాధులకు కంటి మీద కునుకు లేకుండా చేయటం ఖాయం. పార్టీ రహితంగా జరిగినప్పటికీ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన అభ్యర్ధుల తీరుతెన్నులు చూస్తే పార్టీల వారీగా జిల్లా పరిషత్‌ స్ధానాలలో సమాజవాద పార్టీ పెద్ద పార్టీగా వచ్చింది. పార్టీల కంటే స్వతంత్రులు ఎక్కువ మంది గెలిచారు. దీంతో సహజంగానే అధికార బిజెపి వారిని టోకుగా లేదా విడివిడిగా కొనుగోలు చేసి జిల్లా పరిషత్‌లలో తమకే మెజారిటీ అని చూపించుకొనే యత్నంలో ఉంది. దాని కంటే
7.32 లక్షల గ్రామ పంచాయతీల వార్డులు, 826 సమితులలో 75,852 స్ధానాలు, 75 జిల్లాల్లోని 3,121 జిల్లా పరిషత్‌ స్ధానాలు అంటే మొత్తం ఎనిమిది లక్షల స్దానాలకు 13లక్షల మంది అభ్యర్దులు పోటీ చేశారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా బిజెపి ఏ ఏ స్దానాలలో ఎవరిని బలపరుస్తున్నదో జాబితా ప్రకటించింది. దాని ప్రకారం రెండువేలకు పైగా స్ధానాలలో అది ఓడిపోయింది. ఈ ఎన్నికలలో తమ సత్తా చాటేందుకు గాను జనవరిలోనే బిజెపి ఆరు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక మంత్రి, ఒక సీనియర్‌ నేతలను అధిపతులుగా నియమించింది. ముఖ్యమంత్రి యోగి, కేంద్ర పార్టీ పరిశీలకుడు రాధామోహన్‌ సింగ్‌ అనేక సమీక్షా సమావేశాలు జరిపారు. ఈ ఎన్నికలలో గెలిచిన వారు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్న షరతును పార్టీ విధించింది. ఇప్పుడు గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందనే ఆశతో అనేక మంది ముందే రాజీనామాలు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.


రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్‌లలో మొత్తం 3,121 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. పార్టీల వారీ సమాజవాద పార్టీ 1000,బిజెపి 900, బిఎస్‌పి 320, కాంగ్రెస్‌ 270, ఆమ్‌ ఆద్మీ 70 మిగిలిన స్ధానాల్లో స్వతంత్రులు గెలిచినట్లు ఆ పార్టీలు ప్రకటించుకున్నాయి ( ఆయా పార్టీలు ప్రకటించుకున్న వివరాల మేరకు వివిధ పత్రికలలో వచ్చిన సంఖ్యలలో తేడాలు ఉన్నాయి. ఉదా కొన్ని పత్రికల్లో కాంగ్రెస్‌కు 72 మాత్రమే). గతంలో గ్రామీణ స్ధానిక సంస్దల ఎన్నికలలో బిజెపి పెద్ద శక్తి కాదు కనుక గత ఎన్నికలలో దాని తీరుతెన్నులు ఇతర పార్టీలతో పోల్చలేము. 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల బిజెపి ఫలితాలతో బిజెపి 2021 పనితీరును పోల్చాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రామాలయ భూమి పూజ జరిగిన ప్రాంతం అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ జిల్లాలో 43 సీట్లకు గాను సమాజవాది పార్టీ 24, బిజెపి 8, బిఎస్‌పి 4, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. అయోధ్య తరువాత దేశంలో చిచ్చుపెట్టేందుకు ఎంచుకున్న మధుర కృష్ణ జన్మభూమి వివాద జిల్లాలో 33కు గాను బిఎస్‌పి 13, బిజెపి 8 సీట్లు గెలుచుకుంది. రెండు సార్లు ప్రధాని నరేంద్రమోడీని గెలిపించిన వారణాసి జిల్లాలో 48 స్దానాలకు గాను సమాజవాద పార్టీ 15, బిఎస్‌పి, అది బలపరచిన స్వతంత్రులు 17, బిజెపికి 8 వచ్చాయి.


సమాజవాది పార్టీ విషయానికి వస్తే తమకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పటం తప్ప జాబితాను ప్రకటించలేదు. ఇతరులు ఎవరైనా తమతో కలసి వస్తే అవసరమైతే వారికి పార్టీ ముద్రవేసి బలపరిచేందుకు వీలుగా వ్యవహరిస్తున్నది. ఎన్ని సమితి, జిల్లా పరిషత్‌లను కైవశం చేసుకోవాలన్నదే ఇప్పుడు దాని లక్ష్యంగా ఉంది. తాము అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధులతో పాటు గెలిచిన వారిలో తమ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు బిజెపి చెప్పుకుంటోంది. పార్టీ రహితంగా గెలిచినందున ఫిరాయింపుల సమస్య ఉండదు కనుక ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకొనేందుకు ద్వారాలు తెరిచింది. బిఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తాయనేది రాజకీయంగా కీలకంగా మారింది.
వివిధ పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కరోనా వ్యాపిస్తున్నది. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నా నమోదు కావటం లేదు. దక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక సమాచారం ప్రకారం మే 7వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం కేసులు 14,25,916 కాగా, మరణాలు 14,501 అంటే వందకు ఒక మరణం జరుగుతోంది. ఆదిత్యనాధ్‌ ఇటీవల కేరళ వెళ్లి తమ అభివృద్దిని చూసి నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే. అక్కడ ఇటీవల కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ మే 7 నాటికి వందకు మరణాలు 0.3 మాత్రమే. యోగి ఆదిత్యనాధ్‌ పలుకుబడి బాగా ఉన్న తూర్పు ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాలలో పరిస్ధితి దారుణంగా ఉందని వార్తలు వస్తున్నాయి.


ఇక రాజకీయాల విషయానికి వస్తే 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి ఒంటరిగా అన్ని స్ధానాలకు పోటీ చేయగా సమాజవాది పార్టీ 298, దానితో కలసిన కాంగ్రెస్‌ 105 చోట్ల పోటీ చేసింది. రెండేళ్ల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా కాంగ్రెస్‌ విడిగా పోటీ చేశాయి.ఓటింగ్‌ను చూస్తే ఎస్‌పి-బిఎస్‌పి కుడి ఎడమలుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత బిఎస్‌పి అనేక కీలక సమస్యల మీద బిజెపికి మద్దతు ఇచ్చి దానికి దగ్గరైందనే అభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించింది. అందుకే బిజెపి బీ టీమ్‌ బిఎస్‌పి అని ప్రియాంక గాంధీ వర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో సమాజవాది పార్టీతో పోలిస్తే బిఎస్‌పికి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాల కోసం ఫలితాల గురించి ఎస్‌పి ఆచితూచి వ్యాఖ్యానిస్తోంది.


వివిధ పార్టీల బలాబలాలకు సంబంధించి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వివరాలను చూద్దాం. 2017అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 384 స్ధానాల్లో దాని మిత్ర పక్షాలు 19 స్ధానాల్లో పోటీ చేశాయి.బిజెపికి 39.67శాతం, మిత్రపక్షాలకు 1.7శాతం వచ్చాయి. సమాజవాది పార్టీ పోటీ చేసిన 298 స్దానాల్లో 21.82, బిఎస్‌పి అన్ని చోట్లా 403 పోటీ చేసి 22.23శాతం తెచ్చుకుంది. సమాజవాది పార్టీతో సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌కు 105 స్దానాల్లో 6.25శాతం వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల ఓట్ల చీలిక బిజెపికి 312 సీట్లు తెచ్చిపెట్టింది.యాభైశాతం పైగా ఓట్లు తెచ్చుకున్న పార్టీలకు వచ్చింది 73 మాత్రమే. తరువాత 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూటమికి 51.19శాతం ఓట్లు 80కి గాను 69 సీట్లు వచ్చాయి. ఓట్లు పెరిగినా అంతకు ముందుతో పోలిస్తే 9 సీట్లు తగ్గాయి. ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 39.23శాతం ఓట్లు 15 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్‌కు 6.41శాతం ఓట్లు ఒక సీటు వచ్చింది.


అయోధ్యలో రామాలయ నిర్మాణ వాగ్దానం నెరవేర్చామని చెప్పుకుంటూ యోగి మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని కలలు కంటున్నవారికి స్ధానిక సంస్ధల ఫలితాలు షాక్‌ వంటివే. ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పడిన కారణంగానే తాజా ఎన్నికలలో బిజెపి అనేక చోట్ల ఓడిపోయిందని వార్తలు వచ్చాయి. కరోనా నిర్లక్ష్యంతో జరిగే పరిణామాలు రాబోయే రోజుల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d