• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: CPI(M)

ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !

12 Thursday May 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala LDF, Thrikkakara by-election, UDF Kerala


ఎం. కోటేశ్వరరావు


ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్‌, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు పిటి థామస్‌ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌ తరఫున థామస్‌ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్‌ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్‌ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్‌ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..


ఆమ్‌ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్‌ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్‌ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్‌ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్‌, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.


సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్‌ చర్చ్‌ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కెవి థామస్‌ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్‌ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్‌, నార్కోటిక్‌ జీహాద్‌ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.


ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సంస్ధలో దొంగబంగారం కేసు నిందితురాలు – పక్కా బిజెపి ప్రతినిధిగా కేరళ గవర్నర్‌ !

18 Friday Feb 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Arya Rajendran, BJP, CPI(M), governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పక్కా బిజెపినేతగా పని చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధానపరమైన ప్రసంగంపై సంతకం చేయకుండా బ్లాక్‌మెయిలుకు పాల్పడ్డారు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన కేరళ దొంగబంగారం కేసులో నిందితురాలుగా ఉండి పదహారు నెలల పాటు జైలులో ఉన్న స్వప్న సురేష్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ లేదా దానికి సంబంధించిన నేతలు నడిపే ఒక స్వచ్చంద సంస్ధలో డైరెక్టర్‌గా చేరారు. బంగారం కేసులో అరెస్టయినపుడు ప్రభుత్వ స్పేస్‌ పార్క్‌ పధకంలో ఒక కన్సల్టెంట్‌గా ఉన్నారు. అంతకు ముందు యుఏఇ కాన్సులేట్‌లో పని చేశారు. ఆ సంబంధాలను వినియోగించుకొని బంగారాన్ని అక్రమంగా తెప్పిస్తున్నట్లు ఆమె, మరికొందరి మీద కేసు దాఖలు చేశారు. దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుండగానే స్వచ్చంద సంస్దలో చేరారు. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా అనే సంస్ధ తరఫున కేరళలోని పాలక్కాడ్‌ కేంద్రంగా ఆమె పని చేస్తారు. మళయాల మనోరమ పత్రిక కథనం ప్రకారం ఈ సంస్ధకు తొలుత పాట్రన్‌గా తరువాత అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌ కృష్ణ కుమార్‌ కాంగ్రెస్‌లో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా పని చేశారు.2004 ఆపార్టీ నుంచి వెలుపలికి వచ్చి బిజెపిలో చేరారు. తరువాత తిరిగి కాంగ్రెస్‌లో , 2019 తిరిగి బిజెపిలో చేరారు.


హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్దలో కేరళకు చెందిన అనేక మంది డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కెజి వేణుగోపాల్‌ ఉపాధ్యక్షుడు. ఆ సంస్దలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత విభాగ డైరెక్టర్‌గా యుఏఇ , ఇతర కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకురావటం ఆమె విధిగానూ వాటితో పేద గిరిజనులకు అట్టపాడి ప్రాంతంలో ఉచితంగా ఇండ్లు నిర్మిస్తారని కేరళకౌముది పత్రిక పేర్కొన్నది. కోర్టులో ఉన్న కేసులు, తన ప్రస్తుత బాధ్యతలకు ముడి పెట్టవద్దని స్వప్ప మీడియాను కోరారు. కేసులు కేసులే ఉద్యోగం తన కడుపు నింపుకొనేందుకు అన్నారు.హెచ్‌ఆర్‌డిఎస్‌ ఇండియా సంస్ద మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనుల భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిందని, అనుమతులు లేకుండా గిరిజనులకు కొన్ని ఔషధాలను పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఔషధాల ప్రయోగాలకు స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్నవారితో గ్రామీణులు, గిరిజనులను వినియోగించుకోవటం తెలిసిందే.


కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ సంయమనం కారణంగా ఒక వివాదాన్ని నివారించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కావటం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం రూపొందించి ఇస్తుంది. దానిలోని అంశాలను చదవటం తప్ప గవర్నర్‌ తన స్వంత అభిప్రాయాలను చొప్పించకూడదు. గతంలో ఒకసారి అలాంటి చర్యకు పాల్పడి కొన్ని పేరాలను చదివేందుకు నిరాకరించారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు, జర్నలిస్టుగా ఉన్న హరి ఎస్‌ కర్తాను తన సహాయకుడిగా నియమించాలని ప్రభుత్వాన్ని గవర్నర్‌ కోరారు. రోజువారీ రాజకీయాల్లో ఉన్నవారిని సాధారణంగా సిబ్బందిగా తీసుకోరు. అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వం ఆమోదించింది. ఐతే ప్రభుత్వ అభ్యంతరాలను తెలుపుతూ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ (జిఏడి) ముఖ్యకార్యదర్శి కె జ్యోతిలాల్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. అది మీడియాకు వెల్లడైండి. ఆ పని జ్యోతిలాలే చేయించినట్లు భావించిన గవర్నర్‌ సదరు అధికారిని జిఏడి నుంచి తప్పిస్తే తప్ప తాను అసెంబ్లీ ప్రసంగాన్ని ఆమోదిస్తూ సంతకం చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ప్రభుత్వం సదరు అధికారిని వేరే బాధ్యతలకు బదిలీ చేస్తామని చెప్పిన తరువాతనే సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.


శుక్రవారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు జరిగి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఆమోదం తెలిపిన తరువాత మార్చి 23న ముగుస్తాయి. తరువాత పూర్తి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్‌ సభలో ప్రసంగం చదవటం మొదలు పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌ గవర్నర్‌ గోబాక్‌ అంటూ నినాదాలు చేశారు. తరువాత సభనుంచి వెళ్లిపోయారు. గవర్నర్‌ ప్రసంగం చదువుతుండగా సాధారణంగా అధికారపక్ష సభ్యులు తమ ప్రభుత్వ విజయాలను పేర్కొన్నపుడు బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేస్తే ప్రతిపక్షం నిరసన తెలుపుతుంది. దీనికి భిన్నంగా పాలక సభ్యులు మౌనంగా ఉంటూ గవర్నర్‌ తీరుతెన్నులకు నిరసన తెలిపినట్లు మీడియా పేర్కొన్నది. ప్రభుత్వం బిజెపి నేత నియామక పత్రంతో పాటు అభ్యంతరం తెలిపే లేఖను కూడా గవర్నర్‌కు పంపింది. దీన్ని గవర్నర్‌ అవమానంగా భావించి భరించలేకపోయారు.


మంత్రుల వద్ద సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ ఇవ్వటం కేరళలో ఒక పద్దతిగా ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేస్తున్నారు. రాజభవన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన వారిని గవర్నర్‌ సిబ్బందిగా నియమించటం అసాధారణం అని ప్రభుత్వం రాసిన లేఖలో ఉంది. దానికి ప్రతిగా ఎక్కడా మంత్రుల సిబ్బందిగా పని చేసిన వారికి పెన్షన్‌ చెల్లింపు పద్దతి లేదని దాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించటమే కాదు వెంటనే అమలు జరపాలని గవర్నర్‌ కోరారు. ఈ అంశాన్ని మరింతగా చర్చించాలని ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా లీకైంది. జ్యోతిలాల్‌ను తొలగించినట్లు రాజభవన్‌కు సమాచారం అందిన తరువాతే గవర్నర్‌ ప్రసంగంపై సంతకం చేశారు.


గవర్నర్‌ను వెనకేసుకు వస్తూ బిజెపి రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని మంత్రుల సిబ్బందిగా నియమించుకోవటం, వారికి పెన్షన్లు చెల్లించటం చట్టబద్దమో కాదో ఆలోచించాలని కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అన్నారు. రాజభవన్ను నియంత్రించాలని సిఎం విజయన్‌ చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల సిబ్బందికి పెన్షన్‌ చెల్లించటం గురించి సిపిఎం నేత, మాజీ మంత్రి ఎంఎం మణి మాట్లాడుతూ ఐదు పార్టీలు మారిన తరువాత ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బిజెపిలో చేరారని, గవర్నర్‌ పదవిలో ఉంటూ చౌకబారు ఆటలు ఆడుతున్నారని, పెన్షన్‌ సొమ్ము ఖాన్‌ కుటుంబ సంపద నుంచేమైనా చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. మరోమారు గవర్నర్‌ పదవి కోసం చెత్త మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారాని అన్నారు. గవర్నర్‌- ప్రభుత్వం నాటకాలాడుతున్నాయని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత విడి సతీషన్‌ ఆరోపించారు. కేరళలో బిజెపి అధికార ప్రతినిధిగా గవర్నర్‌ పని చేస్తున్నారని విమర్శించారు.


దేశంలోని మేయర్లలో పిన్న వయస్కురాలైన ఆర్య రాజేంద్రన్‌(తిరువనంతపురం-సిపిఎం) కేరళ అసెంబ్లీలో పిన్న వయస్కుడైన సచిన్‌దేవ్‌ ఒకింటివారు కాబోతున్నారు. వారిద్దరూ బాలసంగం నుంచి ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తూ చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవారే. రెండు కుటుంబాలూ ఆమోదం తెలిపాయి. మార్చినెలలో వివాహం జరగవచ్చు.ఆర్య ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నపుడు సచిన్‌ దేవ్‌ ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం ఆలిండియా సహాయకార్యదర్శి. తామిద్దరం ఒకే భావజాలంతో ఉన్నామని, ఇద్దరం ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశామని, మంచి స్నేహితులమని ఆర్య విలేకర్లతో చెప్పారు. తామిద్దం ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత రెండు కుటుంబాలకు, పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందున పార్టీకి తెలిపామని, రెండు కుటుంబాలు, పార్టీతో చర్చించిన తరువాత వివాహతేదీని ఖరారు చేసుకుంటామని తెలిపారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాజ్యాంగాన్ని నిలువునా పాతిపెట్టిన వారికి పద్మ అవార్డులా ! దేశం ఎటుపోతోంది !!

03 Thursday Feb 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Buddhadeb Bhattacharjee, CPI(M), Padma Awards, Padma Awards 2022, RSS


ఎం కోటేశ్వరరావు


బుద్దదేవ్‌ భట్టాచార్యకు పద్మ విభూషణ్‌ ప్రకటించటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి ? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం, కేరళ వంటి చోట్ల దాని హత్యాకాండ గురించి పదే పదే వివరించాల్సిన అవసరం లేదు. ఏ గల్లీ నేతను గిల్లినా వరదలా అదే ద్వేషం పారుతుంది. అలాంటిది బుద్దదేవ్‌ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చినట్లు ? వివిధ రంగాలలో ప్రముఖులైన వారితో పాటు వివాదాస్పద కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌, బిజెపి మత చిహ్నాలలో ఒకరైన కల్యాణ సింగ్‌, మచ్చలేని మార్క్సిస్టు బుద్దదేవ్‌ భట్టాచార్యలకు కేంద్ర ప్రభుత్వం 73వ రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా పద్మవిభూషన్‌ ప్రకటించింది. ప్రజాజీవితంలో జీవితంలో వీరి అసమానకృషికి ఇది గుర్తింపు అని చెప్పారు. రాజకీయ నేతలకు పద్మ అవార్డులు ఇవ్వటం ఇదేమీ కొత్త కాదు బుద్ధదేవ్‌ మాదిరి తిరస్కరించటమూ మొదటిసారే జరగలేదు. పాలకపార్టీకి అమ్ముడుపోయినట్లుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్న నేపధ్యంలో గులాంనబీ అజాద్‌కు అవార్డు ప్రకటించటంపై కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ చురక అంటించారు. బుద్దదేవ్‌ మంచి పని చేశారు అజాద్‌గా మరాలనుకున్నారు గులాముగా కాదు అన్నారు. కాంగ్రెస్‌లో చిచ్చును కొనసాగించాలన్నదే గులాంనబీ అజాద్‌ పేరు వెనుక ఉన్న అసలు కథ.


గతంలో నంబూద్రిపాద్‌కు కాంగ్రెస్‌ హయాంలోనే ప్రకటించారు. అది ఆయన మీద గౌరవమా ? తొలిసారిగా దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చివేసింది కాంగ్రెస్‌ పెద్దలే కదా ! తొలిసారిగా రాజ్యాంగాన్నే సాధనంగా మార్చుకొని దానితోనే కేరళలో నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. తరువాత అదే నేతకు అదే రాజ్యాంగం పేరుతో అవార్డును ప్రకటించారు. ఇఎంఎస్‌ తొలుత గాంధీజీ భావజాలంతో ప్రభావితుడై తరువాత పక్కా కమ్యూనిస్టుగా మారారు. పూర్వపు అనుబంధం కారణంగా కాంగ్రెస్‌ పాలకులు అవార్డు ప్రకటించారనుకుందాం! మరి ఆఎస్‌ఎస్‌ ఆధిపత్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏ అనుబంధంతో బుద్దదేవ్‌కు ప్రకటించినట్లు? అసలు బుద్దదేవ్‌ పేరును ఎవరు సిఫార్సు చేశారని ఒక తెలంగాణా బిజెపి నేతను ఒకటీవీ చర్చలో అడిగితే ఎవరూ సిఫార్సు చేయనవసరం లేదు, ఇప్పుడు నిబంధనలు సులభం ఎవరైనా పేరు పంపి అవార్డు ఇవ్వండి అంటే అవార్డుల కమిటీ పరిశీలించి సిఫార్సు చేస్తుందని సమాధానం చెప్పారు. బుద్దదేవ్‌ అనుమతి లేకుండా పంపిన వారి చిరునామా ఇస్తారా అంటే తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, అవన్నీ ఎందుకు అని ఎదురుదాడి. రాజకీయాలు రాజకీయాలే, ఏ పార్టీలో ఉన్నా నేతలంటే గౌరవం గౌరవమే కనుక బుద్దదేవ్‌ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే అంతకంటే సీనియర్‌ కేరళ నేత విఎస్‌ అచ్యుతానందన్‌ను ఎందుకు ఎంచుకోలేదని అవుట్‌లుక్‌ పత్రిక ప్రశ్నించింది.


కొందరు జర్నలిస్టులు, ఆ పేరుతో ఉంటూనే పార్టీల ప్రతినిధులుగా మారిన వారు అవసరమైనపుడు పార్టీలకు అనుకూలంగా కచేరీలకు దిగుతారు. ఇప్పుడు అదే బాటలో కొందరు పద్మ అవార్డును బుద్దదేవ్‌ తిరస్కరించటాన్ని దేనితోనో ముడిపెట్టేందుకు తెగఆయాస పడ్డారు.” ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అనే 1950 నినాదం నుంచి బుద్దదేవ్‌ పద్మ అవార్డు తిరస్కరణ వరకు ” వరకు అంటూ ఒక జర్నలిస్టు దాడికి దిగారు.1950 దశకపు నినాదం ఒక తప్పిదం అన్నట్లుగా పద్మ అవార్డు తీరస్కరణను కూడా తప్పిందంగా భవిష్యత్‌ కమ్యూనిస్టులు అంగీకరిస్తారా అంటూ ఒక సవాలు విసిరారు. కమ్యూనిజానికి భవిష్యత్తే లేదు, కమ్యూనిస్టులే ఉండరనే ప్రచారదాడి తరుణంలో సదరు జర్నలిస్టు భవిష్యత్‌లో కమ్యూనిస్టులు ఉంటారని చెప్పినందుకు వారి పోషకులు ఏమంటారో !

చరిత్రను విస్మరించాలని నియంతలు, శాశ్వతంగా అధికారంలో నిలిచిపోవాలని కోరుకొనే శక్తులు, వాటి మద్దతుదారులు తప్ప మిగతావారెవరూ కోరుకోరు.గత చరిత్ర నూతన తరాలకు మార్గదర్శి.స్పార్టకస్‌ తిరుగుబాటును విస్మరిస్తే తదుపరి బానిసల తిరుబాట్లు జరిగేవా ? బానిసత్వం లేని సమాజం ఉనికిలోకి వచ్చేదా ? అణచివేతకు గురైన 1857నాటి ప్రధమ స్వాతంత్య్ర తిరుగుబాటును విస్మరిస్తే మరో పోరాటం జరిగి తెల్లవారి పాలన అంతరించేదా ? బ్రిటీష్‌ వారికి భజన చేసిన వారిని చూసిన జనం నీరుగారి పోయి ఉంటే కొత్తవెల్లువలు వచ్చి ఉండేవా ? బుద్దదేవ్‌ పద్మఅవార్డు తిరస్కరణను అవకాశంగా తీసుకొని మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకదాడి జరిగింది.1940-1950 దశకంలో దేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక పరిణామాలు జరిగాయి. వాటిని సైద్దాంతిక, ఆచరణాత్మక అంశాలకు సంబంధించిన మధనంలో భాగంగా చూడాలి. వాటిలో అనేక కోణాలున్నాయి. తాత్కాలిక రాజీలు, ఎవరి అభిప్రాయం సరైనదో తరువాత చూద్దాం అనే వాయిదాలు ఏవైనా కావచ్చు.


ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అని అప్పుడే కాదు, ఇప్పటికీ కొందరు చెబుతున్నారు. వచ్చేంతవరకు చెబుతూనే ఉంటారు. వారు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ఒకవైపు నిజాం సర్కార్‌దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరుసల్పుతున్న సంస్ధాన కమ్యూనిస్టులకు మద్దతుగా పక్కనే ఉన్న తెలుగువారు తాము సైతం బందూకులు పట్టి ప్రాణాలు అర్పించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. కమ్యూనిస్టులు తప్ప ఎందరు కాంగ్రెస్‌ వాదులు, ఇతర పార్టీల వారూ అలాంటి త్యాగాలకు పాల్పడ్డారో ఎవరినైనా చెప్పమనండి ? నెహ్రూ సర్కార్‌ నైజామ్‌ సర్కార్‌ను అణచివేస్తే అదొక తీరు. దానికి బదులుగా తిరుగుబాటు చేసిన జనం మీదనే ఏండ్ల తరబడి దాడులకు దిగి వేలాది మందిని బలితీసుకుంది. భూస్వాములను గ్రామాలకు రప్పించింది. కోస్తా ప్రాంతాలలో అనేక గ్రామాలను పోలీసు చిత్రహింసల శిబిరాలుగా మార్చివేసింది, అనేక మంది మానవతుల మీద అత్యాచారాలు జరిపించింది, వందలాది మంది ప్రాణాలు తీసింది. వేలాది మీద కేసులు, జైళ్ల పాలు చేసింది. అలాంటి స్ధితిలో వాటిని మరచిపోయి జండా పండగవచ్చింది, స్వాతంత్య్ర సంబంరాల్లో bాల్గొనాలని, అక్కడ పెట్టే పప్పు బెల్లాలు తినాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వగలదా ? ఉద్యమానికి విద్రోహం చేసి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాలు తమ హిందూత్వకు అనుకూలంగా లేదనే కారణాలతో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని ఆమోదించలేదనేది బహిరంగ రహస్యం.


స్వాతంత్య్రతీరు తెన్నుల గురించి పార్టీలు, సంస్ధల చర్చలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం వేరు.అదేమీ దేశద్రోహమూ కాదు, రాజాంగ వ్యతిరేకమూ కాదు. ఒకసారి రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత దానికి కట్టుబడి ఉన్నాయా లేదా అన్నదే గీటు రాయి. న్యూస్‌ 18 టీవీ చర్చల్లో మాట్లాడిన బిజెపి నేతగా మారిన జర్నలిస్టు స్వపన్‌దాస్‌ గుప్తా విపరీత వ్యాఖ్యానం చేశారు. రాజ్యగౌరవాన్ని బుద్దదేవ్‌ తిరస్కరించటాన్ని చూస్తే వారి రాజ్యాంగబద్దత ప్రశ్నార్దకంగా మారింది.అలా చేయటం రాష్ట్రపతినే అవమానించటంతో సమానం. వారు లెనిన్‌ శాంతి బహుమతి తీసుకుంటారు కానీ భారత రిపబ్లిక్‌ ఇచ్చేదానితో మాత్రం సమస్య వస్తుంది. ఈ స్వాతంత్రం నిజమైంది కాదు అన్నది వారి వైఖరి. ఇది రాజకీయంగా సంకుచితమైన వైఖరి ” అని అరోపించారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా అడిస్తే అలా ఆడాలన్నమాట.దేశం తోలుబొమ్మలాట తెరకాదు. అసలు ఈ ఎంపికే దురుద్దేశంతో కూడుకుంది కనుక బిజెపి నేతల నుంచి ఏది సంకుచిత వైఖరో ఏది విశాలమైనదో తెలుసుకోవాల్సినంత దుస్ధితిలో బుద్దదేవ్‌ లేరు.


తీసుకొనేవారి అంగీకారంతో నిమిత్తం లేకుండా ప్రకటించటమే ఒక అప్రజాస్వామిక లక్షణం. కేంద్రం ఇచ్చే అవార్డు విధిగా పుచ్చుకోవాలి లేకపోతే అది దేశద్రోహం అని రాజ్యాంగం నిర్దేశిస్తే అదొక తీరు. కానపుడు తిరస్కరించే హక్కు ఉంటుంది. తిరస్కరించిన వారిలో కమ్యూస్టులకంటే ముందే ఇతరులున్నారు. ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అన్న నినాదాన్ని ప్రస్తావించిన తరుణమే వంకబుద్ధి, అసందర్భమూ. పద్మ అవార్డులు స్వాతంత్య్రం,శాంతి గురించి ఇస్తున్నవి కాదు. అందువలన దానితో ముడిపెట్టటం సంస్కారహీనత. ” ఇప్పటికీ ఆర్ధిక స్వాతంత్య్రం లేదుకనుక ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్లుగా మరేపార్టీ చేయటం లేదు. అలాంటి అవార్డులను తిరస్కరించకూడదని ఎక్కడ రాసి ఉందో చూపమనండి. దీనిలో రాజకీయాలు ప్రభుత్వ దురుద్ధేశ్యాలను చూడాలని ” సిపిఎం రాజ్యసభ ఎంపీ వికాష్‌ భట్టాచార్య అన్నారు.
అవార్డులతో నిమిత్తం లేకుండానే ప్రజాజీవనంలో కొన్ని విలువలకు కట్టుబడి పని చేయాలని ఎవరైనా భావిస్తారు. అసలు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చేసిన ప్రమాణానికే కట్టుబడని వ్యక్తి కల్యాణ సింగ్‌. బాబరీ మసీదు కట్టడానికి ఎలాంటి హాని జరగకుండా కాపాడతానని ఉత్తర ప్రదేశ్‌ ముఖమంత్రిగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చిన పెద్దమనిషి. దానికి ఏమైంది ? కూల్చివేస్తున్నంతసేపూ అచేతనంగా అవకాశమిచ్చి తరువాత ఎలాగూ చర్యతప్పదని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి అదే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పురస్కారమా ? ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం కాకపోతే రాజ్యాంగాన్ని పరిహసించేందుకు ఇంతకంటే ఏమిచేయాలి ?ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన కె బి హెగ్డెవార్‌, సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు భారత రత్న అవార్డులు ప్రకటించనంతవరకు తాను పద్మఅవార్డు స్వీకరించలేనని 2003లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దత్తోపంత్‌ టేంగిడీ ప్రతిజ్ఞ చేశారు.వీరి వారసులు, రాజ్యాంగ వ్యవస్ధలను దిగజారుస్తున్న వారు రేపు చివరకు సావర్కర్‌, గాడ్సేలను కూడా జాతి రత్నాలుగా అందలమెక్కించినా ఆశ్చర్యం ఏముంటుంది ? ఆ క్రమంలోనే ఇదంతా జరుగుతోందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతవిశ్వాసులపై లెనిన్‌ చెప్పిందేమిటి ? కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేకత !

16 Sunday Jan 2022

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, anti communist resolution, CPI(M), IUML, Samastha Kerala Jamayat Ulema, Vi Lenin on believers


ఎం కోటేశ్వరరావు


శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసింది సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. దానిపై జనాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సంబంధిత సంస్ధలు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, కుట్రలను జనం వమ్ము చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ముస్లిం లీగు పార్టీ, కొన్ని మత సంస్ధలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, చర్యలకే పూనుకున్నాయి. హిందూత్వ శక్తులకు బుద్ది చెప్పిన జనాలు ముస్లింమతశక్తులను సహిస్తారా ?


సమస్త కేరళ జమాయతుల్‌ ఉలేమా(ఎస్‌కెజెయు) మలప్పురం గోల్డెన్‌ జూబిలీ సమావేశంలో ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమం, భావజాలానికి వ్యతిరేకంగా చేసిన ఒక తీర్మానం ఆ సంస్ధలోను, వెలుపలా వివాదం రేపింది. తనకు తెలియకుండా చేసిన దానితో తనకు సంబంధం లేదని, తన ఫొటోను జత చేసి ఆ తీర్మానాన్ని ప్రచారం చేయటం పట్ల తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంస్ధ అధ్యక్షుడు సయద్‌ మహమ్మద్‌ జిఫ్రీ ముతుకోయా తంగల్‌ తమ పత్రిక సుప్రభాతంలో ప్రకటించారు. ముస్లింలు కేరళలో కమ్యూనిస్టు భావజాలం, ఉద్యమం పట్ల జాగరూకులై ఉండాలని నాస్తికవాదం, దేవుడున్నాడో లేడో తెలియదనే ధోరణిని పధకం ప్రకారం మత విశ్వాసుల్లో కలిగించేందుకు చేసే ప్రయత్నాల పట్ల జాగరూకులై ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం, వారితో కలవటం ప్రమాదకరమని నూరిపోయటం తప్ప మరొకటి దాని లక్ష్యం కాదన్నది స్పష్టం. ఆ తీర్మానం తనకు తెలియకుండా చేయటమే కాదు అనుమతి కూడా లేదని తంగల్‌ పేర్కొన్నారు.


మత విశ్వాసులైన పార్టీ సభ్యులు ఆరాధనా స్ధలాలకు వెళ్లటం, క్రతువుల్లో పాల్గొనటాన్ని పార్టీ వ్యతిరేకించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. ఏ విశ్వాసానికి, నమ్మకానికి పార్టీ వ్యతిరేకం కాదు, అలాంటి వారికి పార్టీ సభ్వత్వం ఇవ్వకూడదని నిబంధనావళిలో ఎక్కడా లేదు అన్నారు. పూజారులు కూడా పార్టీలో చేరవచ్చని ఒక సందర్భంలో మార్క్సిస్టు మహౌపాధ్యులలో ఒకరైన లెనిన్‌ చెప్పారని కోజికోడ్‌ జిల్లా సిపిఎం మహాసభలో చెప్పారు. నాస్తికత్వాన్ని పాటించటం, మతానికి పార్టీ వ్యతిరేకమని కొన్ని శక్తులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల కోసం విమర్శలు చేశారు. మతాన్ని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారని ఒక వైపు మతశక్తులు ధ్వజమెత్తుతుంటే మరోవైపు మరికొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి రెండు పరిణామాలు ఎలా జరుగుతాయి. శాస్త్ర, తర్కవిరుద్దం, ఏదో ఒకటే వాస్తవం కావాలి. సిపిఎంపై విమర్శలు చేసే వారు రెండు రకాలు. కమ్యూనిస్టు, లౌకిక భావాజాలాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే సానుకూల వైఖరితో ఆందోళన చెందేవారు, విమర్శలు చేసే వారు కొందరైతే, సందట్లో సడేమియా అన్నట్లుగా రాళ్లేసే వ్యతిరేకులు రెండవ తరగతి.


పార్టీ సభ్వత్వానికి కావలసిన అర్హతల గురించి సిపిఎం కార్యక్రమం, నిబంధనావళి అనే పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. అవేమీ రహస్యపత్రాలు కావు. ఎవరైనా పుస్తకాల్లో షాపుల్లో కొనుగోలు చేసి లేదా పార్టీ వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు. నాస్తికులైనే సభ్వత్వం అని లేదు. అలాగే దిద్దుబాటు కార్యక్రమం చేపట్టి అనుసరించాల్సిన పద్దతులు, పార్టీ సభ్యులకు ఉండకూడని అంశాల గురించి కూడా సిపిఎం చెప్పింది. ఇవేవీ పరస్పర విరుద్దంగా కనిపించటం లేదు. ఒకసారి పార్టీ సభ్వత్వాన్ని అంగీకరించిన తరువాత అనుసరించాల్సి ప్రవర్తన గురించి చెప్పిన అంశాలే దిద్దుబాటు. దీని అర్దం ఏదో ఘోరమైన తప్పిదం చేశారని కాదు. పార్టీ ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని ఏ స్ధాయిలో ఉన్న వారైనా పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలోని ప్రతి పార్టీ అనుసరించిన పద్దతే అది. దానికి ఇమడలేని వారు సభ్యులుగా వైదొలగి మద్దతుదారులుగా ఉండవచ్చు. ఇక పార్టీ సభ్యులు- మత విశ్వాసాల గురించి లెనిన్‌ చెప్పిన సందర్భం ఏమిటి ? ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. లెనిన్‌ కాలంలో మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్య కూల్చివేతలో నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు ప్రధాన పాత్రధారులు. అందువలన అనేక మంది ముస్లింలు బ్రిటీష్‌ వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. అదే విధంగా రష్యాలో జారుచక్రవర్తిని వ్యతిరేకించిన మత పూజారులు, విశ్వాసుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించారు.


ఒక క్రైస్తవ పూజారీ,మత విశ్వాసుడైన కార్మికుల పట్ల పార్టీ ఏ వైఖరి అనుసరించాలనే అంశం గురించి లెనిన్‌ వివరణ ఇచ్చారు. ” ఒక పూజారి పార్టీ లక్ష్యాలను ఆమోదించి వాటి కోసం పార్టీలో చురుకుగా పని చేస్తానని ముందుకు వస్తే అతను పార్టీలో చేరవచ్చు. అతని మతవిశ్వాసం-కమ్యూనిజం మధ్య వైరుధ్యం వస్తే అది అతనికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ పూజారి పార్టీలో చేరి ఇతరులను మతంలోకి ప్రోత్సహిస్తే, తన మతభావాలను ఇతరుల మీద రుద్దితే, మతం పట్ల పార్టీ కలిగివున్న అంగీకృత వైఖరికి కట్టుబడి ఉండకపోతే అప్పుడు సభ్వత్వాన్ని కోల్పోతాడు. ఇదే సూత్రం విశ్వాసుడైన ఒక కార్మికుడు పార్టీలో చేరినపుడు కూడా వర్తిస్తుంది. పార్టీలో చేరి తన మత భావాలను ఇతరుల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది.” అన్నారు. ఇలా చెబుతున్నపుడు అసలు మత విశ్వాసులను పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకు ? అనే ప్రశ్న వస్తుంది.


విప్లవాన్ని సాధించాలన్నా, అందుకు అవసరమైన సాధనం పార్టీ నిర్మాణం జరగాలన్నా సభ్యులను ఎక్కడి నుంచి తేవాలి. ప్రతి వారికీ సమాజంలో ఉన్న వాటిలో ఏదో ఒక బలహీనత, విశ్వాసం ఉంటుంది. వారి నుంచే విప్లవ సైనికులను తయారు చేసుకోవాలి. వివిధ ఆందోళనలు, పోరాటాల సమయంలో చురుకుగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుంది. అదే విధంగా వివిధ అంశాలపై పార్టీ తీసుకొనే సూత్రబద్ద వైఖరి, పోరాటాల సమయంలో పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, త్యాగాలను చూసి సాధారణ కార్మికులు, జనాలు తాము కూడా పార్టీలో చేరాలని అనుకోవచ్చు. అలాంటి వారిని కొంత కాలం రెండు మూడు దశల్లో తీరుతెన్నులను గమనించి బలహీనతలను సరిదిద్దుకొంటే వారిని సభ్యులుగా తీసుకుంటారు. తరువాత పార్టీ వైఖరికి అనుగుణంగా వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటారు. ఆ సమయంలో దిద్దుబాటు అంశాలు ముందుకు వస్తాయి.ఒక స్త్రీ లేదా పురుషుడికి అన్నీ మంచి లక్షణాలు ఉండి, మత విశ్వాసాలు ఉన్నాయను కోండి. వారు పార్టీలో చేరతామని ముందుకు వస్తే ముందు మీరు కులాన్ని, మతాన్ని, దేవుడు, దేవతల మీద విశ్వాసాలను వదులుకొని రండి అప్పుడు పరిశీలిస్తాం అంటే కుదురుతుందా ? మతం, విశ్వాసాలు కుటుంబాలు, వ్యక్తిగతం అని చెప్పే కమ్యూనిస్టులు వాటికి కట్టుబడి ఉండేవారికి ఇతర అన్ని అర్హతలు ఉన్నపుడు పార్టీలో చేర్చుకోకపోతే నష్టం ఎవరికి? పార్టీలో చేరిన తరువాత అన్యవర్గ ధోరణులు, మత, మూఢవిశ్వాసాలను పోగొట్టేందుకు తగిన కృషి చేయకపోతే అది పార్టీ లేదా నాయకత్వ తప్పిదం అవుతుంది. సకాలంలో దిద్దుబాటు జరగకపోతే పార్టీలు దెబ్బతింటాయి.


కమ్యూనిజానికి మన మతం వ్యతిరేకం అని ప్రతి మతం వారు చెబుతారు. అలాగని ఏ మతం చెప్పింది. పురాతన మతమైన హిందూ, తరువాత వచ్చిన క్రైస్తవం దాన్నుంచి పుట్టిన తాజా మతం ఇస్లాం ప్రవక్తలు, దేవదూతలు గానీ ఎక్కడా కమ్యూనిజం గురించి చెప్పలేదు, అప్పటికీ అసలా భావనే లేదు కదా ! ఆ మతాలు పుట్టి పెరిగిన సమయంలో కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని కమ్యూనిస్టులు మార్చి వేస్తారని, దోపిడీ శక్తులకు మద్దతు ఇచ్చే, తమ తిరోగమన, జనాన్ని తమ అదుపులో ఉంచుకొనే అజెండాలు సాగవనే భయంతోనే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దలు అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలాన్ని, పార్టీలను వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టులు రాజీపడితే, భావజాలాన్ని పలుచన చేస్తే మతవాదులకు పేచీ ఉండదు కదా ?
సమస్త మలప్పురం సమావేశ తీర్మానం గురించి చర్చ జరుగుతోంది. తమ సమస్త సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేసేందుకు వేదికలు కాదని జిఫ్రీ కోయా తంగల్‌ స్పష్టం చేశారు. సమావేశాలను ముస్లిం లీగు హైజాక్‌ చేసిందని, రాజకీయ ప్రచారం కోసం వాడు కుంటున్నదని, వాస్తవానికి దీనిలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నవారున్నారని చెప్పారు. సమస్త ప్రభుత్వంతో సహకరిస్తుందని, దాని అర్ధం చేతులు కలిపినట్లు కాదని సమస్త సున్నీ యువజన సంఘం నేత అబ్దుస్‌ సమద్‌ పూకొత్తూర్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ముస్లిం మతవిశ్వాసులకు స్ధానం ఉండదని, అంత మాత్రాన ఆ పార్టీలతో సంబంధాలు ఉన్న వారందరూ నాస్తికులు,లు, మతవ్యతిరేకులు కాదన్నారు.ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రభుత్వంతో విరోధ పంధాను ఎంచుకోవటం గాక సహకరించాలని తాము కోరుతున్నట్లు పూకొత్తూర్‌ చెప్పారు.


వక్ఫ్‌బోర్డులో ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారపు నమాజు సందర్భంగా మసీదులలో ప్రచారానికి పిలుపు ఇచ్చిన ముస్లింలీగ్‌ వైఖరిని సమస్త వ్యతిరేకించింది. దాంతో లీగ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు కోజికోడ్‌ బీచ్‌లో లీగ్‌ నిర్వహించిన సభలో మాట్లాడిన అబ్దుర్‌ రహమాన్‌ కల్లాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అవాంఛనీయ పదజాలం ప్రయోగించినందుకు ఇతర లీగ్‌ నేతలు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి, డివైఎఫ్‌ఐ నేతగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌తో విజయన్‌ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అది అక్రమ సంబంధం అంటూ కల్లాయి నోరుపారవేసుకున్నాడు. అదే సభలో మరో లీగ్‌ నేత కెఎం షాజీ మాట్లాడుతూ మతం మాకు సంబంధించిన అంశం, మతమే మాకు గుర్తింపు, మా చివరి శ్వాసవరకు మతమే మాకు పునాది ” అన్నారు. మతోన్మాదులు తప్ప మరొకరి నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మరుసటి రోజు సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభ మాటలను ప్రస్తావిస్తూ ముస్లింలీగ్‌ ఒక రాజకీపార్టీనా లేక మత సంస్తో నిర్ణయించుకోవాలని అన్నారు. లీగ్‌ను మతోన్మాద జమాతే ఇస్లామీ నడిపిస్తున్నదని సిపిఎం పేర్కొన్నది.


వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలకు పాలుపోవటం లేదు. ముస్లింమతోన్మాద ఎస్‌డిపిఐ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముస్లింలీగు పోటీ పడి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ పునాదిని నిలుపుకోవాలని చూస్తోంది. నిజానికి వక్ఫ్‌బోర్డు వ్యవహారాలలో ఎల్‌డిఎఫ్‌ చేసిందేమీ లేదు. బోర్డు పాలకవర్గమే సిబ్బంది నియామకాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరపాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. నియామక నిబంధనలను కూడా మార్చింది లేదు. ముస్లిమేతరులను సిబ్బందిగా నియమిస్తారంటూ ముస్లింలీగ్‌ రాజకీయ దాడికి, ముస్లింల్లో అనుమానాలను రేకెత్తించటానికి, సిపిఎంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముస్లిం సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించిన తరువాత సమస్త నేతలు ఆందోళన మార్గం నుంచి విరమించారు, మసీదుల్లో లీగు ప్రచారాన్ని వ్యతిరేకించారు. మరింతగా చర్చలు జరిపిన తరువాతే అంతిమంగా నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు యధాతధ స్ధితి కొనసాగుతుందని సిఎం ప్రకటించారు.ఆశించిన విధంగా అధికారం దక్కకపోవటంతో లీగు తన మద్దతుదార్లు చెదరకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని ముందుకు తెస్తోంది. అది నెరవేరేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడవ ప్రత్యామ్నాయం-కెసిఆర్‌ ముందున్న సమస్యలు !

15 Saturday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), KCR, RJD, Third front formation in India, trs


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కాగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోనున్నారా? మూడో రాజకీయ సంఘటన ఏర్పాటులో భాగస్వామి అవుతారా ? దక్షిణాది రాష్ట్రాలు ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పుతాయా ? కెసిఆర్‌ ప్రకటనలు, చర్యలు దేనికి చిహ్నం అనే చర్చ కొంత మందిలో జరుగుతోంది. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అలాంటి నిర్ధారణలకు రావటం లేదా ఆ దిశగా చర్చించటం తొందరపాటవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరోసారి ఎందుకీ చర్చ ? దానికి దోహదం చేసిన అంశాలేమిటి ? జనవరి నెల మొదటి పక్షంలో తెలంగాణాలో కొన్ని ముఖ్యఘటనలు జరిగాయి. సంఘపరివార్‌ భేటీ, ఆ వెంటనే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం, ఇదే సమయంలో ఏఐవైఎఫ్‌ జాతీయ సభ, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ కౌన్సిలు సమావేశం,బీహార్‌ ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ సిఎం కెసిఆర్‌తో భేటీ, బిజెపి నేత బండి సంజయ అరెస్టు, విడుదల దానికి నిరసనగా జరిగిన సభలు, బిజెపి జాతీయ నేతల ప్రకటనల దాడి వంటివి ఉన్నాయి.


కేరళలోని కన్నూరులో జరిగే సిపిఎం జాతీయ మహాసభలో వచ్చే మూడు సంవత్సరాలలో అనుసరించాల్సిన రాజకీయ తీర్మానం ముసాయిదా ఖరారుకు హైదరాబాదులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ను కెసిఆర్‌ విందుకు ఆహ్వానించారు.ఏఐవైఎఫ్‌ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ రాష్ట్రనేతలను విడిగా కెసిఆర్‌ ఆహ్వానించారు.అదే విధంగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ కలసినపుడూ మొత్తంగా మూడు పార్టీల నేతలతో రాజకీయ పరిస్ధితులపై అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు. బిజెపితో సంబంధాలు సజావుగా ఉంటే సంఘపరివార్‌ సమావేశాలకు వచ్చిన నేతలకూ శాలువాల సత్కారం జరిపి ఉండేవారు. కానీ బిజెపిని గద్దెదింపాలని చెబుతున్న పార్టీల నేతలతో భేటీ ద్వారా కెసిఆర్‌ పంపదలచుకున్న సందేశం ఏమిటి ? తాను బిజెపి వ్యతిరేక కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు టిఆర్‌ఎస్‌ నేత జనానికి చెప్పకనే చెప్పారు.


తేజస్వి యాదవ్‌ భేటీ సందర్భంగా తండ్రి, ఆర్‌జెడినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కెసిఆర్‌ ఫోన్లో మాట్లాడారు. మూడవ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్‌ను లాలూ కోరినట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బిజెపి ముక్త భారత్‌ కోసం లౌకిక పార్టీలన్నీ దగ్గరకు రావాలన్న కోరిక రెండు పార్టీల వైపు నుంచి వ్యక్తమైనట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో కెసిఆర్‌ ఇంతకంటే బలమైన సూచనలే పంపారు.బిజెపి, కాంగ్రెస్‌ లేని ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంటూ బెంగళూరు వెళ్లి జెడిఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. తెలుగువారంతా ఆ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. తరువాత ఎలాంటి చొరవా చూపలేదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను కలసి రాజకీయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి.తిరిగి మరోసారి అలాంటి సూచనలు ఇస్తున్నందున వివిధ పార్టీలు, జనంలో సహజంగానే సందేహాలు ఉంటాయి.కెసిఆర్‌తో భేటీ ఐన మూడు పార్టీలు కూడా బిజెపిని వ్యతిరేకించటంలో తిరుగులేని రికార్డు కలిగినవే కనుక, ఇప్పుడు కెసిఆర్‌ మీదనే చిత్తశుద్ది నిరూపణ బాధ్యత ఉందన్నది స్పష్టం.


వివిధ ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్‌తోనూ, ఇటు బిజెపితోనూ జత కట్టటం-విడిపోవటం-తిరిగి కూడటం వంటి పరిణామాలను చూస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు దేశానికి ప్రధాన ముప్పుగా బిజెపి ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. అవి బిజెపికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడ్డాయి.గతంలో ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఆమేరకు ఆహ్వానిస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి.గతంలో బిజెపితో చేతులు కలినందున ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే అర్హత లేదని అనలేవు కదా ! ఆ గూటికి ఈగూటికి తిరుగుతున్న అవకాశవాదుల పట్ల ఎలా ఉండాలనేది జనం నిర్ణయించుకుంటారు. ఒక వేళ నిజంగానే కొంత మంది అనుకుంటున్నట్లుగా బిజెపితో కుదరాలనుకుంటున్న రాజీ మేరకు లోక్‌సభ సీట్లను బిజెపికి వదలి, అసెంబ్లీని తమకు వదలివేయాలని టిఆర్‌ఎస్‌ కోరుతుందా ? ఆ బేరం చేసేందుకే బిజెపి మీద విమర్శలను తీవ్రం చేశారా? మరో ఫ్రంట్‌ గురించి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారా ? అన్న అనుమాలను తీర్చాల్సిందే కెసిఆరే.


టిఆర్‌ఎస్‌ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి బిజెపిని వ్యతిరేకించింది,2009లో అదే పార్టీ బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ఎన్‌డిఏ కూటమిలో ఉంది.రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల నుంచే టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వాటి మధ్య పంచాయతీ అదే కదా ! అందుకే అవిలేని మూడవ ఫ్రంట్‌ గురించి కెసిఆర్‌ మాట్లాడుతున్నారన్నది స్పష్టం. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం ఒకరికి రాష్ట్రం ఒకరికి అనే ఒప్పందం ఏ పార్టీతో కుదిరినా ఆ రెండు పార్టీలు ఒకటిగా ముందుకు పోతాయి. విధానాల పరంగా మూడు పార్టీలకు మౌలికమైన తేడాలేమీ లేవు.


రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వ విధానాలను సిపిఎం, సిపిఐ రెండూ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అటువంటపుడు ఒక వేళ కెసిఆర్‌ జాతీయంగా బిజెపిని వ్యతిరేకించే శక్తులతో కలిసే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల వైఖరి ఏమిటన్న ప్రశ్న వెంటనే వస్తుంది. వామపక్షాలకు ఎన్నికలే సర్వస్వం కాదు, ఓడినా గెలిచినా అవి తమ విధానాలతో ముందుకు పోతున్నాయి. ఎప్పుడో ఎన్నికలు వస్తాయని, వాటిలో బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాము గనుక ప్రభుత్వాలు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను అవి సమర్దిస్తూనో లేదా మౌనంగానో ఆ పార్టీలు ఉండవు. అలా ఉండేట్లైతే విడిగా కొనసాగాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒక పార్టీలో చేరి పోవచ్చు. ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలతో అప్పుడు తమ ఎత్తుగడలు వుంటాయని, ఎన్నికలకు ముందు ఫ్రంట్‌ ఆలోచనలేదని సిపిఎం చెప్పింది. అంతిమంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కన్నూరు మహాసభ ఖరారు చేయనుంది. కోల్పోయిన తమ ప్రజాపునాదిని తిరిగి తెచ్చుకోవాలని సిపిఎం గట్టిగా భావిస్తోంది. అలాంటి ప్రక్రియకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎవరితో సర్దుబాటు లేకుండానే పరిమిత సీట్లలో బరిలోకి దిగవచ్చు. మిగిలిన చోట్ల బిజెపిని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు, లేదా పరిస్ధితిని బట్టి సర్దుబాట్లకు సిద్దం కావచ్చు. ఒకసారి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన ఆ పార్టీ పాలన ఎలా ఉన్నా మౌనంగా ఉండాలనే కట్టుబాటేమీ లేదు.


ఎన్నికలు వేరు, ప్రజాసమస్యలు వేరనే చైతన్యం ఓటర్లలో కూడా రావటం అవసరం. ఇటీవలి చిలీ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలో పోటీ పడ్డాయి. వాటిలో వామపక్షం నిలిపిన అభ్యర్ధి రెండవ స్ధానంలో, పచ్చి మితవాది,నిరంకుశ శక్తులను బలపరిచే అతను మొదటి స్ధానంలో వచ్చాడు. అక్కడి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు తెచ్చుకున్నవారే విజేత, కనుక తొలి ఇద్దరి మధ్య తిరిగి పోటీ జరిగింది. వామపక్ష అభ్యర్ధి తిరుగులేని మెజారిటీతో గెలిచాడు.తొలి విడత ఓటు వేయని లేదా వ్యతిరేకించిన ఓటర్లు రెండోసారి ఓటు చేశారు. అంటే దాని అర్ధం తరువాత కూడా వారంతా వామపక్ష అభిమానులుగా మారతారని కాదు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలివిడతలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లశాతాన్ని బట్టి ఆ దామాషాలో పార్లమెంటులో సీట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా వామపక్ష నేత గెలిచినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేదు. మన దగ్గర అలాంటి విధానం ఉంటే వేరు, ప్రతి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, దామాషా పద్దతిలో సీట్లు తెచ్చుకుంటుంది.దేశ ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులకు ఎన్నికలు జరిగినపుడు తొలి రెండు స్ధానాల్లో ఉన్న పార్టీలలో ఏదో ఒకదానిని మిగతాపార్టీల ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తుంది.


టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఐదేండ్ల పాటు వామపక్షాలు వ్యతిరేకించవచ్చు. ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బిజెపిని ఓడించాలని నిర్ణయించుకున్నపుడు అదే ప్రధాన ఎన్నికల అంశంగా మారినపుడు, రెండు ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ గట్టిగా బిజెపిని వ్యతిరేకిస్తున్నపుడు సమస్య వస్తుంది.ప్రస్తుతానికి దాన్ని ఊహాజనిత అంశంగానే చెప్పవచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌, ఇతర నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు, గుణపాఠాలను బట్టి పార్టీలు వ్యవహరిస్తాయి. ఇప్పటికి ఇప్పుడున్న స్ధితిలో టిఆర్‌ఎస్‌ను బిజెపి సవాలు చేసే స్ధితిలో లేదు. అందరూ ఊహిస్తున్నట్లుగా బిజెపి ఓడిపోతే బరిలో టిఆర్‌ఎస్‌-కాంగ్రెసే మిగులుతాయి. లేదూ దానికి భిన్నంగా గెలిస్తే బిజెపి మరింత రెచ్చిపోతే, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు అన్నీ చేతులు కలపాల్సి రావచ్చు.


అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన పెద్దమనిషి.శారదా చిట్‌ఫండ్‌ మొదలు అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే హిమంతను జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికిని వారిలో అమిత్‌ షా ఒకరు. అవినీతి గురించి బుక్‌లెట్స్‌ను విడుదల చేసింది బిజెపి. అలాంటి పార్టీ అతగాడిని తమ పార్టీలోకి చేర్చుకోవటం మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవినే కట్టబెట్టింది.


కెసిఆర్‌ మీద ప్రస్తుతం ఆరోపణల ప్రచారదాడి తప్ప ఎలాంటి కేసులు లేనప్పటికీ ప్రతి ఒక్కరూ జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. అవినీతిని ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా లొంగదీసుకొనేందుకే ఇలాంటి ప్రచారం అని భావిస్తున్న తరుణంలో కెసిఆర్‌ బిజెపి మీద తన దాడిని కూడా పెంచుతున్నారు. తాజాగా పెరగనున్న ఎరువుల ధరల మీద కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం మీద చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు జనానికి, ఇతర పార్టీలకు విశ్వాసం కలిగించాలంటే టిఆర్‌ఎస్‌, దాని అధినేత కెసిఆర్‌ మరింత స్పష్టంగా ముందుకు రావాల్సిన, బిజెపి వ్యతిరేక శక్తులకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నందున ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పి అన్యాయాన్ని సరిదిద్దాలని కొందరు చెబుతున్నారు. అనేక అంశాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో జనభా నియంత్రణ ఎక్కువగా ఉంది. కేంద్ర నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నందున నష్టం జరుగుతున్నది వాస్తవం. దాన్ని ఎలా పరిష్కరించాలన్నది వేరు, రాజకీయ కూటమి వేరు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి, అవకాశం లేదు అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ?

17 Tuesday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, UK, Uncategorized, WAR

≈ 1 Comment

Tags

75 years India Independence, BJP, CPI(M), indian national flag matters, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. అలాంటపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా సిపిఎం అయినా మారకుండా ఎలా ఉంటుంది. తన వైఖరిలో మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించుకున్నపుడు, సిపిఎం వైఖరిలో మార్పు మీద వ్యాఖ్యాతలకు అంత ఉక్రోషం ఎందుకు ? మార్పు సరైనదిగాక పోతే విమర్శించవచ్చు. అది ఎవరికైనా ఉన్న హక్కు. సంఘపరివార్‌ దాని సోదర సంస్ధలు జమాతే ఇస్లామీ, ముస్లింలీగ్‌, మజ్లిస్‌ వంటివి మతాన్ని ఇంటికి పరిమితం చేసి ఆరోగ్యకర రాజకీయాల్లో పాల్గొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాంటి పార్టీలు సరైన వైఖరి తీసుకోమనే ఎవరైనా చెప్పేది. అదే సూత్రంతో కమ్యూనిస్టులకూడా తప్పు చేస్తున్నారని ఎవరికైనా అనిపిస్తే వారికీ అలాంటి సలహా ఇవ్వవచ్చు. ఏ సంస్ధలు, పార్టీలు ఏం మార్చుకుంటాయి, ఏం మార్చుకోవు అన్నదాని మీద నిరంతరం చర్చ, విమర్శలు చేసేందుకు ఎవరికైనా హక్కుంది.” జాతీయ జెండా ఆవిష్కరణ అంశం : గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ” అనే శీర్షికతో ఆ సంస్ద తీరుతెన్నుల గురించి చర్చించాము. దిగువ లింకులో దాన్ని చదవవచ్చు. ఇప్పుడు సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పు, కారణాల గురించి చూద్దాం.


స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషి, భారత్‌ అన్న భావనను పటిష్టపరచటం, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారితో ఆర్‌ఎస్‌ఎస్‌ కుమ్మక్కు, వర్తమానంలో రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివరించాలని, వివిధ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు ఆగస్టు తొమ్మిదిన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపటం, జాతీయ జెండాను ఎగురవేయటమే దేశభక్తికి నిదర్శనం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అధికారిక సంస్దలు స్వాతంత్య్రదినం, రిపబ్లిక్‌ దినోత్సవం, గాంధీ జయంతి రోజులలో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే నిబంధనలు ఉన్నాయి తప్ప ప్రయివేటు సంస్ధలు, పార్టీలు విధిగా జరపాలని, జాతీయ జెండాలను ఎగురవేయాలనే అంశం రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు కొత్తగా మారిందేమీ లేదు. స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోవటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు, బలవంతం ఏమీ లేదు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు జండా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది కనుకనే అది అవాస్తవం చెబుతోందని,పైన చెప్పిన మూడు రోజుల్లో ఎవరైనా ఆపని చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలను పేర్కొనాల్సి వచ్చింది. కానీ ఎన్నడూ కమ్యూనిస్టులు అలాంటి నిబంధనల కుంటి సాకులు చెప్పలేదు. సిపిఎం నిర్ణయాన్ని కొందరు 75 సంవత్సరాల్లో తొలిసారి అని శీర్షికలు పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. సిపిఎం ఏర్పడిందే 1964లో అంటే 57 సంవత్సరాల క్రితం ఏర్పడింది. రాయి వేసేవారికి ఈ చిన్న విషయం కూడా తెలియదంటే ఏమనుకోవాలి. ఇది చిన్న విషయం వదిలివేద్దాం.


కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం వారు తమ కార్యాలయాల మీద జాతీయ జెండాలను ఎగురవేసి ఉత్సవాలు జరపలేదుగాని ముఖ్యమంత్రులుగా లేదా స్ధానిక సంస్థల అధిపతులుగా ఎన్నికైన సందర్భాలలో రాజ్యాంగవిధిగా దాన్ని పాటించారు, పాటిస్తున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినప్పటి నుంచీ సిపిఐ జాతీయ జెండాలను ఎగురవేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుతున్నది. సిపిఎం నుంచి విడిపోయి సాయుధ పోరాటం పేరుతో రహస్యంగా పని చేస్తున్న కమ్యూనిస్టు గ్రూపుల వారు అసలు స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్నే గుర్తించటం లేదు గనుకు వారు ఎగురవేసే సమస్యే ఉత్పన్నం కాదు. తరువాత పలు ముక్కలై తమదే అసలైన కమ్యూనిస్టు పార్టీ అని ప్రకటించుకున్న వివిధ బృందాలలో కొన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పాల్గొంటున్నా జండా పండగలకు దూరంగా ఉంటున్నాయి.


స్వాతంత్య్రానికి ముందే తెలంగాణాలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు. వచ్చిన తరువాత నిజాం బదులు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మిలిటరీని పంపి కమ్యూనిస్టులను అణచివేసిన చరిత్ర తెలిసిందే. ఆ నేపధ్యం, దానితో పాటు దేశ రాజ్యాంగం స్వాతంత్య్ర ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదనే వైఖరి కారణంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కమ్యూనిస్టుల్లో ఉంది. స్వాతంత్య్రం ఒక మేడి పండు అన్నట్లుగా భావించారు. అంతే తప్ప తాము స్వాతంత్య్రాన్ని, జాతీయ పతాకాన్ని గుర్తించటం లేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎక్కడా చెప్పలేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి జండా గురించి రచ్చచేసిన దాఖలాలు అంతకంటే లేవు. సిపిఎం నుంచి విడిపోయిన తరువాత రాజ్యాంగాన్ని గుర్తించని నక్సల్‌ గ్రూపులు చెప్పిన అంశాలకు, భాష్యాలకు సిపిఎంకు సంబంధం ఉండదు. రాజ్యాంగాన్ని గుర్తించి దానికి అనుగుణ్యంగా తొలి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పాల్గొన్నది, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికయింది. మరి ఇప్పుడు ఎందుకు ఎగురవేయాలని సిపిఎం నిర్ణయించింది అనే ప్రశ్న వస్తుంది.


కమ్యూనిస్టు సిద్దాంతం ఒక దేశానికి పరిమితమైంది కాదు. అందువలన దాన్ని పాటించిన వివిధ కమ్యూనిస్టు పార్టీలు వివిధ సమస్యల పట్ల ఎప్పుడు ఎలాంటి వైఖరులు తీసుకున్నాయో అర్ధం చేసుకుంటే తప్ప వాటిలో వచ్చిన మార్పులు తలకు ఎక్కవు. మార్క్సిజం-లెనినిజం అనే సిద్దాంతాలు గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు, వేదాల్లో, ఉపనిషత్తులో, మనుస్మృతి, ఫలానా పురాణం లేదా బైబిల్‌, ఖురాన్‌లలో ఫలాన చోట ఫలానా విధంగా చెప్పబడింది, అవి అంతే అన్నట్లుగా కమ్యూనిస్టు సిద్దాంతం పిడివాదం కాదు. అది ఒక పురోగామి శాస్త్రం. అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా మార్పులు జరుగుతాయి. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా మూసపోసినట్లుగా పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా పని చేయవు.


పొరుగునే ఉన్న చైనా, ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీల చరిత్రను చదివిన వారికి అర్ధం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను ఓడించేందుకు సోవియట్‌ యూనియన్‌తో బ్రిటన్‌ చేతులు కలిపింది. సోవియట్‌ బలపడాలనే అభిప్రాయంతో భారత కమ్యూనిస్టులు ఆ రోజుల్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఇచ్చిన క్విట్‌ ఇండియా పిలుపుకు దూరంగా ఉన్నారు. తరువాత కాలంలో అలా వ్యవహరించటం తప్పని గుణపాఠం నేర్చుకున్నారు. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినట్లు ? బ్రిటీష్‌ వారికి సహకరిస్తామని ఎందుకు చెప్పినట్లు ? కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి దూరంగా ఉంది తప్ప పాల్గొన్నవారిని తప్పు పట్టలేదు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ వారికి తోడ్పడలేదు. అలాంటి ఉదాహరణలు ఉంటే ఎవరైనా చూపవచ్చు.


ఇన్ని దశాబ్దాలుగా స్వాతంత్య్ర దినం పాటించని కమ్యూనిస్టులు ఎందుకు వైఖరి మార్చుకున్నారు ? పరిస్ధితులే వారిని అలా మారేందుకు పురికొల్పాయి. చైనాలో కొమింటాంగ్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం, యుద్ద ప్రభువులను పక్కన పెట్టేందుకు పోరాడింది, విజయం సాధించి 1911లో రాజరికాన్ని కూలదోసి స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే రాజరిక పాలన అయితే తప్పింది గానీ సామాన్యులు ముఖ్యంగా రైతాంగంపై జరిగే దోపిడీకి అడ్డుకట్టపడలేదు. యుద్ద ప్రభువులు తిరిగి తలెత్తి సవాలుగా మారారు. దాంతో చైనా జాతిపితగా పరిగణించబడిన సన్‌ఏట్‌ సేన్‌ 1921లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానించి 1924లో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి యుద్ద ప్రభువుల అణచివేతకు పూనుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే కాన్సర్‌తో మరణించాడు. కొమింటాంగ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన చాంగ్‌కై షేక్‌ తమతో కలసి పోరాడుతున్న కమ్యూనిస్టులు రోజు రోజుకూ బలం పెంచుకోవటం చూసి వారిని ఊచకోత కోయించాడు. 1927 నాటికి రెండు పార్టీలు వైరిశిబిరాలుగా మారిపోయాయి.1931లో జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకోవటం మొదలు పెట్టారు. దాంతో 1936లో తమ కార్యకర్తలను ఊచకోత కోయించిన ఆ చాంగ్‌కై షేక్‌తోనే ఐక్యసంఘటనగా ఏర్పడిన కమ్యూనిస్టులు జపాన్‌ సామ్రాజ్యవాదులను తరిమి వేశారు. తరువాత ఆ చాంగ్‌కై షేక్‌నే తరిమికొట్టి దేశాన్ని విముక్తి చేశారు. అనేక మంది ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. మన కార్యకర్తలు, నాయకులను చంపించిన వాడితో చేతులు కలపటం ఏమిటని చర్చ జరిగింది. అక్కడ అందరికీ ఉమ్మడి శత్రువైన జపాన్ను తరిమి వేయాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టులను ఐక్య సంఘటనకు పురికొల్పింది.


జయప్రకాష్‌ నారాయణ ప్రారంభించిన ఉద్యమంలో నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి. జయప్రకాష్‌ నారాయణ మతశక్తి కానప్పటికీ జనసంఘం ఉన్న కారణంగా దానిలో పాల్గొనాలా లేదా అన్న అంశం మీద సిపిఎంలో తీవ్ర చర్చలు జరిగాయి. తరువాత 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌, సిపిఎం, సోషలిస్టు ఇతర తనను రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల వారందరినీ జైలు పాలు చేశారు. ఆ నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే అంశం ప్రధానంగా ముందుకు వచ్చింది. ఆ కారణంగానే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసిన తరువాత జనసంఘం, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇతర పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. దానిలో జనసంఘం-ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి అని తెలిసినప్పటికీ సిపిఎం తన రాజకీయ కర్తవ్యంలో భాగంగా జనతా పార్టీని బలపరిచింది. జనతా పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న సిపిఎం అభ్యర్ధులకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జనతా పార్టీలోని జనసంఘం కార్యకర్తలు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కుల రక్షణ కోసం తన వైఖరిని మార్చుకొనేందుకు నాడు సిపిఎం తన వైఖరిని సవరించుకుంది.


మన స్వాతంత్య్రానికి చైనాలో జరిగిన మాదిరి విదేశాల నుంచి ప్రత్యక్ష ముప్పు లేకపోయినా అంతర్గతంగా బిజెపి పాలకులు అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను దిగజార్చటం ప్రజాస్వామ్యం, పౌరహక్కులకే ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని కమ్యూనిస్టులు కాని వారు కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి వారసులు నేడు ఆ పరిమిత స్వాతంత్య్ర లక్ష్యాలు, ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారని గత కొద్ది సంవత్సరాలుగా సిపిఎం హెచ్చరిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ జెండాలకు దూరంగా ఉంటూ వాటిని కాపాడేందుకు జనం ముందుకు రావాలని పిలుపు ఇస్తే అర్ధం ఉండదు. అందుకే సిపిఎం వైఖరిలో ఈ మార్పు అన్నది స్పష్టం.
సంబంధిత వ్యాసం మొదటి భాగం లింకు దిగువ ఉంది. .

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ! https://vedikaa.com/2021/08/16/indian-national-flag-matter-why-rss-disowned-ms-golwalkar-thoughts/

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి !

16 Monday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75 years India Independence, CPI(M), India Flag, MS Golwalkar, RSS Duplicity, RSS Hindutva, RSS Mohan Bhagavat, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


చారిత్రాత్మక దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకసారి చెప్పింది మరొకసారి మాట్లాడని ప్రధాని నరేంద్రమోడీ తన శైలి, సంప్రదాయాన్ని తప్పి వరుసగా మూడవ సంవత్సర ప్రసంగంలో కూడా వంద లక్షల కోట్ల పెట్టుబడుల గురించి పునశ్చరణ చేశారు. మార్పు ఏమంటే దానికి ” ప్రధాన మంత్రి గతిశక్తి ” అని పేరు పెట్టారు. ఈ మాత్రానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే దాని అమలు గురించి చెప్పుకుంటే చాల బాగోదు. కరోనా సందర్భంగా ప్రకటించిన 25లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి బండారం ఏమిటో తెలిసిందే. 75వారాల ముందే అమృతోత్సవంగా ఈ సందర్భాన్ని ప్రారంభించుకున్నాము. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూసిన తరువాత వాటిని మరోమారు సమీక్షించుకుందాం.
డెబ్బయి అయిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం గురించి మీడియాలో చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఇంకా రావచ్చు. కొత్త బిచ్చగాడికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమే లేకపోగా లేకపోగా బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాల వారసులు సిపిఎం నిర్ణయం మీద ఉక్రోషాన్ని దాచుకోలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు తమ విజయం అని బిజెపి నేతలు కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. మార్క్సిస్టుల నిర్ణయాన్ని మీడియాలో ఇంత సంచలనాత్మకంగా ఎందుకు చేశారు ? కమ్యూనిస్టుల్లో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారా లేక వారిమీద వేసే రాళ్ల సంఖ్య తగ్గిపోయిందనే దుగ్దా ? ఏమైనా కావచ్చు.


సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో స్పందించాయి. ప్రజాజీవనంలో ఒక ఉదంతం జరిగినపుడు స్పందించటం ఒక ప్రజాస్వామిక హక్కు. అందువలన దాన్ని తప్పు పట్టనవసరం లేదు. స్పందనలో ఉన్న విషయం ఏమిటనే అంశంపై ఇతరులకూ అదే హక్కు ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు, కాషాయవాదుల్లో వచ్చిన మార్పుల తీరుతెన్నుల గురించి ఒక పరిశీలన ఇది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌-దేశభక్తి, జాతీయ జెండా బండారాన్ని చూద్దాం. నిజాలను తట్టుకొనగలిగే, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ముందుకు పోవచ్చు. లేని వారు ఇంతటితో ముగించవచ్చు.


అతల్‌ బిహారీ వాజపాయి ప్రధాన మంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో లోక్‌సభలో జాతీయ పతాకం గురించి చర్చ జరిగింది. బిఆర్‌ అంబేద్కర్‌ మనవడు, తొలుత రిపబ్లికన్‌ పార్టీ తరువాత భరిపా బహుజన మహాసంఘ పార్టీ తరఫున ఎన్నికైన ప్రకాష్‌ అంబేద్కర్‌ జీరో అవర్‌లో మాట్లాడుతూ నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని, మువ్వన్నెల జెండా అంటే గౌరవం లేదని విమర్శించారు. అప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ కొల్‌కతాలో సిపిఎం కార్యాలయం మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదని గొంతు కలిపారు. అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న ప్రమోద్‌ మహాజన్‌ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నానని సంస్ధ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేశారని చెప్పారు. అలాంటి ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందటం తగదన్నారు. కావాలంటే జనవరి 26న ప్రకాష్‌ అంబేద్కర్‌ను నాగపూర్‌ తీసుకు వెళ్లి ఆయనతోనే జెండా ఎగురవేయిస్తామన్నారు.మంత్రి మాటలను ఖండిస్తూ 1998లో నాగపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించాలని ప్రతినిధి వర్గాన్ని పంపాలని, ఒక వేళ వారే స్వంతంగా ఎగురవేయకపోతే వెళ్లిన వారు ఎగురవేయాలని నిర్ణయించినట్లు ప్రకాష్‌ అంబేద్కర్‌ గుర్తు చేశారు.1999లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లి జండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారి మీద లాఠీచార్జి జరిగిందని, 2000 సంవత్సరంలో కూడా అదే ప్రయత్నం చేయగా తమ భవనం మీద జెండా ఎగురవేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకున్నదని ప్రకాష్‌ అంబేద్కర్‌ చెప్పారు. వ్యక్తులు, సంస్ధలు ఎవరైనా తమ ఇండ్ల మీద భవనాలపై జెండాను ఎగురవేయవచ్చని, ఈ సందర్భంగా ఎంపీలు అందరూ తమ ఇండ్ల మీద జెండాలు ఎగురవేయటాన్ని తాను చూడలేదని, అంతమాత్రాన వారు దేశభక్తి లేని వారని అర్ధమా అని మంత్రి మహాజన్‌ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జెండా ఎగురవేయటం గురించి మహాజన్‌ నిజం చెప్పులేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సభను తప్పుదారి పట్టించారు.


2002 జనవరి 26న తొలిసారిగా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆగస్టు 15న రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్ధకు చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ముందు జండా ఎగురవేశారు. జాతీయ జండాను ఎందుకు ఎగురవేయటం లేదు అని అడిగితే జెండా నిబంధనల ప్రకారం ప్రయివేటు వ్యక్తులు ఎగురవేయకూడదనే నిబంధన ఉందని, 2002లో దాన్ని సవరించినందున అప్పటి నుంచి ఎగురవేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెబుతారు. వారు ప్రచారం చేసే పచ్చి అబద్దాల్లో ఇది ఒకటి. పోస్ట్‌ కార్డ్‌ న్యూస్‌ పేరుతో నిరంతరం ఫేక్‌ న్యూస్‌ వండి వడ్డించే విక్రమ్‌ హెగ్డే, ఓప్‌ ఇండియా పేరుతో వక్రీకరణ రాతలు రాయించే నూపూర్‌ శర్మ వంటి అనేక మంది ఈ మేరకు ట్వీట్లు చేశారు. జండా నిబంధనలను సడలించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ ఎగురవేస్తున్నదని చెప్పారు. వాస్తవం ఏమిటి ?


1995 ఫిబ్రవరిలో నవీన్‌ జిందాల్‌ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు.తన ఫ్యాక్టరీ వద్ద అన్ని రోజులూ జాతీయ జెండాను ఎగురవేయకుండా అధికారులు ఆటంకాలు కల్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పౌరులు జాతీయ జెండాను ఎగురవేయరాదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తరువాత 2002 జనవరి 15న ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నియమించిన పిడి షెనారు కమిటీ నివేదికను ఆమోదించారు. అదే జనవరి 26 నుంచి అన్ని రోజులూ ఎవరైనా ఎగురవేయవచ్చని ప్రకటించారు. అయితే 1971 జూన్‌ 15న హౌంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలో ఈ మూడు రోజులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చని పేర్కొన్నారు.1982లో పంజాబ్‌ ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఆ మూడు రోజులతో పాటు జలియన్‌వాలాబాగ్‌ అమరజీవుల సంస్మరణ వారమైన ఏప్రిల్‌ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు, జాతియావత్తూ సంతోష పడే ఏదైనా రోజు కూడా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా మరొకరు గానీ ఆ పని చేయవచ్చు, కానీ అనుమతి లేనందున తాము ఎగురవేయటం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల భాష్యం కుంటి సాకు,అవాస్తవం తప్ప మరొకటి కాదు.


నాగపూర్‌లో బిజెపిఏతర పార్టీలు, సంస్ధలకు చెందిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేసేందుకు చేసిన యత్నాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశం కావటం, సరిగ్గా ఆ సమయంలో వాజపాయి ప్రధానిగా ఉండటంతో విధిలేక తన వ్యతిరేకతను దిగమింగి ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ జెండాను ఎగురవేయటం ప్రారంభించింది. ఒకసారి అధికార రుచి మరిగిన తరువాత మైనారిటీలు, ఇతరుల సంతుష్టీకరణలో భాగంగా, ప్రపంచంలో ఉన్న మత శక్తి అనే ముద్రను చెరిపివేసుకొనేందుకు గురువుగా దశాబ్దాలుగా పిలుస్తున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రచనలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేంతవరకు వెళ్లింది. ఆయన ప్రఖ్యాత రచన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుచ్చము), ఇతర పుస్తకాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రామాణికంగా తీసుకొని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. ఆ సంస్ధ చెప్పే జాతీయతకు గోల్వాల్కర్‌ చెప్పిన అర్ధం ఏమిటి ? ” మేము లేదా మన జాతి గుర్తింపు నిర్వచనం(ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ )” అనే శీర్షికన 1938లో రాసిన పుస్తకంలో ” హిందూస్తాన్‌లో హిందూయేతరులు వారు విధిగా హిందూమతంలోకి మారాలి లేదా హిందూ రాజ్య చేతికిందివారుగా(రెండవ తరగతి) దేశంలో ఉండవచ్చు.ఎలాంటి ప్రత్యేకహక్కులు, చివరికి పౌరహక్కులు కూడా కోరకూడదు.” 1940 నుంచి 1973లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన గోల్వాల్కర్‌ ఆ కాలమంతా తన భావాలను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు నూరిపోశారు. తరువాత కూడా అదే సాగింది.


2004లో దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బిజెపి ఎన్నికల్లో దిగి పరాజయం పాలు కావటం, దాని సిద్దాంతాలను చూసి కొన్ని పార్టీలు ఇబ్బంది పడటం తదితర కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ తన పులిచారలను కనపడకుండా చేసేందుకు ప్రయత్నించింది. దానిలో భాగంగానే 2006లో తొలిసారిగా గోల్వాల్కర్‌ జాతి గుర్తింపు నిర్వచన పుస్తకానికి – తమకూ సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ” గోల్వాల్కర్‌ పుస్తకంతో తమకు సంబంధం లేదని అధికారికంగా చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ ” అనే శీర్షికతో 2006 మార్చి 9న అక్షయ ముకుల్‌ అనే విలేకరి రాసిన వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. ” అందరూ నమ్ముతున్నట్లుగా ఉరు పుస్తకం ఆర్‌ఎస్‌ఎస్‌ బైబిలు కాదు. అది నిజంగా బైబిల్‌ అయి ఉంటే సంఘకార్యకర్త ప్రతిఒక్కరూ దాన్ని చదివి ఉండేవారు, ప్రతి వారి ఇంట్లో ఉండేది, అలా జరగలేదు ” అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధిగా పని చేసిన ఎంజి వైద్య చెప్పిన మాటలను ఆ వార్తలో పేర్కొన్నారు. చిత్రం ఏమిటంటే గోల్వాల్కర్‌ బతికి ఉన్నంతవరకు మూడుదశాబ్దాలకు పైగా ఆ పుస్తకంలోని అంశాలను పక్కన పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. మరణించిన తరువాత మరో మూడు దశాబ్దాలు కూడా ఎవరూ మాట్లాడలేదు.


ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లెక్చరర్‌ రాకేష్‌ సిన్హా 2006లో ”శ్రీ గురూజీ-ముస్లింలు ” అనే పేరుతో రాసిన పుస్తకంలో సరికొత్త కథను ముందుకు తెచ్చారు. గోల్వాల్కర్‌ రచన ఉరు పుస్తకంలోని అంశాలు నిజానికి గూరూజీవీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదట. ఆ పుస్తకంలోని అంశాలు తనవి కాదని గురూజీ బతికి ఉండగా చెప్పేవారట. జిడి సావర్కర్‌ రాసిన ” రాష్ట్ర మీమాంస” అనే పుస్తక సంక్షిప్త రూపం తప్ప గోల్వాల్కర్‌ భావాలు కాదని, కానీ వాటిని గురూజీకి ఆపాదించి లౌకిక సామాజిక శాస్త్రవేత్తలు ఉపశమనం పొందారని రాకేష్‌ సిన్హా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఆ పుస్తకం మినహా గోల్వాల్కర్‌ ఇతర పుస్తకాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచురించి బోధ చేస్తూనే ఉంది. గోల్వాల్కర్‌ పేరుతో సాగిన బోధనల గురించి సిగ్గుపడటం సరే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి ? ఆ పుస్తకంలోని భావాలు, సూత్రీకరణలను ఆరు దశాబ్దాల పాటు సంఘపరివార్‌లోని వారెవరికీ అభ్యంతరం అనిపించలేదా ? భిన్నాభిప్రాయం వెల్లడికాలేదా ? ఎవరూ నోరుమెదపలేని పరిస్ధితి పరివార్‌లో ఉన్నట్లే అని భావించాలా ? జిడి సావర్కర్‌ పేరుతో సదరు పుస్తకాన్నే సంక్షిప్తం చేసి ప్రచురించవచ్చు, కానీ దాని సంక్షిప్త రూపానికి పేరు మార్చి గోల్వాల్కర్‌ తన పేరు ఎందుకు పెట్టుకున్నట్లు ? గోల్వాల్కర్‌ స్వయంగా చెప్పారు అంటున్నవారు అలా ఎందుకు చేశారనే ప్రశ్నించే స్వేచ్చ పరివార్‌లో లేకపోయిందా ? పోనీ ఆయన బతికి ఉండగా పక్కన పెట్టేందుకు ధైర్యం లేకపోతే మరణించిన తరువాత అయినా వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు ? మొత్తం ఆరు దశాబ్దాల పాటు దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రచారం చేసింది. అందుకే విశ్వసనీయత సమస్య ముందుకు వస్తోంది. అది గురూజీది కాదంటున్నారు గనుక ఆయన పెద్ద కాపీ మాస్టర్‌ అని తేలిపోయింది.


2018 సెప్టెంబరు 20న న్యూస్‌ 18 టీవీ, ఇతర పత్రికలు కూడా ఒక వార్తను ప్రచురించాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా ఉన్న మోహనభగవత్‌ ఒక కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 1966లో గురు గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచన గుచ్చము) అనే పుస్తకం తమకు నిత్య అఖండజ్యోతి కాదని వాటిలో కొన్ని కాలానుగుణ్యంగా లేవని అన్నారు. హిందూయేతర మతపరమైన మైనారిటీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి గురించి భయాలున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిలో చెప్పిన అంశాలు కొన్ని పరిస్ధితులు, ఒక నిర్దిష్ట పూర్వోత్తర సంబంధంగా చెప్పినవి. మేము ”గూరూజీ- విషన్‌ అండ్‌ మిషన్‌ ” (గురూజీ ఊహ-కార్యక్రమం) అనే పుస్తకాన్ని ప్రచురించాము. వాటిలో కొన్ని పరిస్ధితుల్లో చెప్పిన వాటిని తొలగించాము. గురూజీ అనశ్వర ఆలోచనలను కొనసాగించాము” అన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గురించి చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ పరిధీకృత సంస్ధ కాదు (గీసుకున్న గిరికి పరిమితం), కాలంతో పాటు మా ఆలోచనలు, వాటి స్పష్టత వక్కాణింపులో కూడా మార్పులు ఉంటాయి. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌లో రాసిన అంశాల ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ అనే సందేహాలుంటే మా పనేమిటో చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ కానట్లయితే మహిళలకు, మైనారిటీ మతస్ధులకు సభ్యత్వాన్ని, బాధ్యతలు లేదా నాయకత్వ స్దానాలను ఎందుకు అనుమతించటం లేదు.


ఇక జాతీయ జెండా విషయానికి వస్తే ఆర్‌ఎఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 1947 జూలై 17తేదీ సంచిక, తరువాత రాసిన సంపాదకీయాల్లో చెప్పిందేమిటి ? తంతే గారెల బుట్టలో పడ్డట్లు జనాలు అధికారానికి వచ్చి మన చేతుల్లో మూడు రంగుల జండాను పెట్టవచ్చు, కానీ హిందువులెవరూ ఎన్నడూ దాన్ని గౌరవించరు, తమదానిగా చేసుకోరు. మూడు అనే పదమే ఒక దుశ్శకునం, జండాకు ఉన్న మూడు రంగులు మానసిక ప్రభావాన్ని కలుగ చేస్తాయి, జెండా దేశాన్ని గాయపరుస్తుంది” అని పేర్కొన్నారు. 1946 జూలై 14న గోల్వాల్కర్‌ నాగపూర్‌ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే మన ఘనమైన సంస్కృతికి ప్రతీక, అది దేవుని అవతారం, అంతిమంగా యావత్‌ జాతి కాషాయ జెండా ముందు మాత్రమే తలవంచుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం ‘అన్నారు.


శ్యామ ప్రసాద ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ తమ హీరోగా పరిగణిస్తుంది. ఆయన 1943 నుంచి 46వరకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయాలని బెంగాల్‌ కాబినెట్‌ మంత్రిగా ఉంటూ 1942 జూలై 26న నాటి బెంగాల్‌ గవర్నర్‌ జాన్‌ హరబర్టుకు లేఖ రాసిన అపర దేశభక్తుడు. బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని సదరు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ దేశభక్తుడిని పార్టీలో చేర్చుకొనేందుకు, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు నాడు నెహ్రూకు అభ్యంతరం లేకపోయింది. కొద్ది కాలంలోనే నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేరదీసి 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేయించింది.


సంఘపరివారం వీర సావర్కర్‌గా పిలిచే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జాతీయ జెండాను గురించి చెప్పిందేమిటి ? ( ఆయనకు వీర బిరుదు ఎవరిచ్చారంటే ఎవరూ సమాధానం చెప్పరు ) ” మూడు రంగుల జండాను హిందూస్తాన్‌ జాతీయ జండాగా ఎన్నటికీ గుర్తించలేము. కాషాయ జెండా మాత్రమే ఉండాలి… హిందువులు మరొక జెండాకు ఏ స్దాయిలోనూ విధేయులుగా వందనం చేయరు.” అన్నారు. పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలని 1940లో ముస్లింలీగ్‌ డిమాండ్‌ చేసింది.దానికి మూడు సంవత్సరాల ముందే 1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ 19వ సమావేశంలో సావర్కర్‌ మాట్లాడుతూ రెండుదేశాల సిద్దాంతాన్ని సమర్ధించారు. ఈ రోజు దేశం ఇంకేమాత్రం ఐక్యంగా ఒకటిగా ఉండలేదు, హిందూ, ముస్లిందేశాలుగా ఉన్నాయి. జిన్నా రెండు దేశాల సిద్దాంతంతో నాకేమీ పేచీ లేదు, చారిత్రకంగా చూస్తే హిందూ ముస్లింలు రెండుదేశాలుగా ఉన్నారని 1943ఆగస్టు 15న నాగపూర్‌ సమావేశంలో సావర్కర్‌ చెప్పారు. తిరువాన్కూర్‌ సంస్ధాన దివానుగా ఉన్న సిపి రామస్వామి అయ్యర్‌ తమ సంస్దానం ప్రత్యేక దేశంగా ఉంటుందని 1947జూన్‌ 11న ప్రకటించారు.అఖండ భారత్‌ గురించి చెప్పిన సావర్కర్‌ జూన్‌ 20 ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టెలిగ్రామ్‌ పంపారు. ” తిరువాన్కూరును మన హిందూ స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు ముందు చూపు, దైర్యం కావాలి” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన జనం దాన్ని వ్యతిరేకించి విలీనానికి పోరాడారు. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి మెరుగని వాటిని ప్రపంచమంతా ఆరాధిస్తుంటే మన రాజ్యాంగ పండితులకు అది పట్టలేదని 1949నవంబరు 30 ఆర్గనైజర్‌ పత్రిక రాసింది.


నిషేధాన్ని ఎత్తివేయించుకొనేందుకు రాజకీయాల్లో పాల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా ఉంటా మంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సంతకాల తడి ఆరక ముందే జనసంఫ్‌ును ఏర్పాటు చేయించి తమవారిని నేతలుగా పెట్టింది. ఇప్పుడు బిజెపిలో ఉన్నవారందరూ వారే. అయినా తమది రాజకీయ సంస్ద కాదని ఇప్పటికీ చెప్పుకుంటుంది. నిత్యం స్వదేశీ అని పశ్చిమ దేశాలను విమర్శించే ఆర్‌ఎస్‌ఎస్‌ తన యూనిఫామ్‌ విషయానికి వస్తే ఆ పశ్చిమ దేశాల నుంచే అరువు తెచ్చుకుంది.నిక్కర్ల నుంచి పాంట్లకు మారినా స్వదేశీ ఊసులేదు.ఆరు సార్లు యూనిఫామ్‌లో మార్పులు చేసుకుంది. తమ వెనుక ఇన్ని పిల్లి మొగ్గలు, అవగాహనలను మార్చుకున్న చరిత్ర తమ వెనుక ఉంచుకొని సిపిఎం వైఖరి మార్చుకున్నదని చెప్పటం విశేషం. ఇక్కడ గమనించాల్సిందేమంటే గోల్వాల్కర్‌ పుస్తకాలను పక్కన పెట్టినా, జెండా ఎగరవేయటం గురించి విధానాన్ని మార్చుకున్నా, అవగాహన మారిందని చెప్పుకున్నా అదంతా పైపై వ్యవహారం తప్ప అసలైన హిందూత్వ అజెండాలో ఎలాంటి మార్పు లేదు. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే గతంలో తాము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు పునశ్చరణ చేసినా, ముందుకు తీసుకుపోయినా కుదరదు కనుకనే పులిచారలు కనిపించకుండా కొత్త దుస్తులు వేసుకుంటోంది, మాటలను మారుస్తోంది. మరి కమ్యూనిస్టుల సంగతేమిటి ? వారెందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు, జాతీయ జండాను ఎగురవేసేందుకు నిర్ణయించుకున్నారు ? మరో భాగంలో చూద్దాం !

సంబంధిత వ్యాస రెండవ భాగ లింకు దిగువ ఉంది.

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? https://vedikaa.com/2021/08/17/indian-national-flag-matters-what-changed-in-cpim-stand/

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిర్మలమ్మ తాయిల పొట్లంలో ఏముంది ? ఎంత మేరకు ప్రయోజనం !

29 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

CPI(M), Narendra Modi Failures, Nirmala Sitaraman stimulus package, SITARAM YECHURY


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి వ్యతిరేక కూటమి : వివిధ పార్టీల ముందున్న సవాళ్లు – అవకాశాలు !

23 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti BJP Front, CPI(M), Narendra Modi, Sharad Pawar, TMC


ఎం కోటేశ్వరరావు

జూన్‌ 22వ తేదీన న్యూ ఢిల్లీలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ నివాసంలో బిజెపిని వ్యతిరేకించే కొన్ని పార్టీలు, కొందరు మేథావుల ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. దీనికి బిజెపి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా నిర్వహిస్తున్న రాష్ట్ర మంచ్‌ ఫోరమ్‌ పేరుతో ఆహ్వానాలు పంపారు. దీనిలో శరద్‌ పవార్‌, యశ్వంత సిన్హా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) ఘనశ్యామ్‌ తివారీ (సమాజవాది), జయంత్‌ చౌదరి(ఆర్‌ఎల్‌డి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), నీలోత్పల్‌ బసు( సిపిఎం) , వినరు విశ్వం( సిపిఐ), పవన్‌ వర్మ (జనతాదళ్‌-యునైటెడ్‌), మాజీ న్యాయమూర్తి ఎపి షా, ఆర్ధికవేత్త అరుణ్‌ కుమార్‌, మాజీ దౌత్యవేత్త కెసి సింగ్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొందరికి ఆహ్వానాలు పంపినప్పటికీ ఎవరూ రాలేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కాన్ని పార్టీలకు ఆహ్వానాలు అందిందీ లేనిదీ కూడా స్పష్టత లేదు. ఇది బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ సమావేశం కాదని, కరోనా, నిరుద్యోగం, దేశంలోని వ్యవస్ధలపై జరుగుతున్నదాడుల వంటి అంశాల మీద ఆలోచనలను పంచుకొనేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల సమావేశం అని సిపిఎం నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. మిగతావారు కూడా ఇదే పద్దతుల్లో మాట్లాడారు. అయితే ఇది రాజకీయ అంశమే అని జనం భావిస్తున్నారు. బిజెపి గురించి చెప్పాల్సిన పనిలేదు.


ఇప్పటి వరకు దేశంలో జరిగిన పరిణామాలను, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయ ప్రక్రియను చూసినపుడు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి వన్నీ ఎన్నికలు, అధికారం చుట్టూనే తిరిగాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను అమలు జరపటం తప్ప వాటి పర్యవసానాలకు ప్రత్నామ్నాయ విధానాలు లేవు. సంకీర్ణ ధర్మం కారణంగా తమ అసలు సిసలు విధానాలను అమలు జరపలేమని ఏ పార్టీ కూడా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఎవరితో నిమిత్తం లేకుండానే బిజెపికి గత రెండు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ చేకూర్చేందుకు ఇతర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైంది. అయినప్పటికీ గతంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన సంస్కరణలను మరింత వేగంగా, అమానవీయంగా అమలు జరపటం తప్ప కొత్త విధానాలేమీ లేవు. అందువలన ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేని ఫ్రంట్‌ మరొకటి ఉనికిలోకి వచ్చినా ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న.


గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించటం వెనుక దాని అవినీతి అక్రమాలే కాదు, జనానికి ప్రయోజనం లేని విధానాల పర్యవసానం కూడా ఇమిడి ఉంది. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం గానీ గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో కూడా అలాంటిదే. ఇందిరా గాంధీ పార్టీలో తన ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు దాన్ని ముందుకు తెస్తే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పేరుతో నరేంద్రమోడీ కొత్త నినాదాలిచ్చారు. తన ప్రయోజనాల కోసం అధ్యక్ష తరహా పద్దతుల్లో ప్రధాని అభ్యర్ధి అంటూ గతంలో వాజ్‌పారు, తాజాగా నరేంద్రమోడీని బిజెపి రంగంలోకి తెచ్చింది. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పడవచ్చేమోగానీ ప్రధాని అభ్యర్ధిని అంగీకరించే అవకాశాలు లేవు.అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.


శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు కొత్తవి కాదు. గతంలో కూడా ఉన్నాయి, అయినప్పటికీ గత ఏడు సంవత్సరాలలో ఇలాంటి సమావేశాలు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సమావేశంలో పాల్గొన్నవారు లోపల ఏమి చర్చించారు, బయటికి ఏమి చెప్పారన్నదానిని పక్కన పెడితే ఇది బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పడాలన్న వాంఛ నేపధ్యంలోనే జరిగిన ప్రయత్నమన్నది స్పష్టం. అయితే అది రూపుదిద్దుకుంటుందా ? తీరుతెన్నులు ఎలా ఉంటాయి ? ఆటంకంగా ఉన్న అంశాలేమిటి ?ఎదురయ్యే సవాళ్లేమిటన్న వాటి గురించి రాబోయే రోజుల్లో చర్చ ప్రారంభం అవుతుంది. మరి ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా ? ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని చెప్పలేము. గతంలో ఏర్పడిన ఫ్రంటులు, సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ఫలితాలు, వైఫల్యాలూ అన్నీ పార్టీలు, మేథావుల అన్నింటికీ మించి జనం ముందు ఉన్నాయి. వాటిని విస్మరించి ఏ ప్రయత్నమూ సఫలం కాదు.


దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు తొలిసారిగా కాంగ్రెస్‌ వ్యతిరేకత అంశం ముందుకు వచ్చింది. 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో ఐక్యంగా పోటీ చేశాయి. తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తొలిసారిగా ఓడిపోయింది. వాటిని కూల్చివేయటంతో కాంగ్రెస్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.


బిజెపి పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన 2014 ఎన్నికలు మూడు ఫ్రంట్ల మధ్య పోటీగా జరిగాయి. ఒకటి బిజెపి నాయకత్వాన ఉన్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌, కాంగ్రెస్‌ నాయకత్వాన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఏ), కాంగ్రెస్‌ను తిరస్కరించండి, బిజెపిని ఓడించండి అనే పిలుపుతో వామపక్షాలు ఒక ఫ్రంట్‌గా విడిగా పోటీ చేశాయి. అందువలన కాంగ్రెస్‌కు భిన్నంగా బిజెపి వ్యతిరేక కూటములు ప్రారంభం నుంచీ ఉన్నాయి. ఇంకా పదేండ్లు ముందుకు పోతే కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ లేని కారణంగా బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్షాలు యుపిఏ కూటమికి మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందువలన బిజెపి వ్యతిరేకత అన్నది అది తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే అంకురించింది. సరికొత్త ఆలోచన అయితే కాదు.


కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, అన్నింటికీ మించి రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల అనుసరించిన కక్ష పూరిత వైఖరి, రాష్ట్రాల పట్ల అనుసరించిన విధానాల వంటి వాటి ప్రాతిపదికన ప్రారంభమైంది. 1975లో అత్యవసర పరిస్ధితిని విధించి మొత్తం ప్రజాస్వామిక హక్కులకే ముప్పుగా తయారైన నేపధ్యంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకీయంగా తనను వ్యతిరేకించిన పార్టీలు, వ్యక్తులు, శక్తులను అది జైలు పాలు చేసింది. అందువల్లనే అనంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జనతా పార్టీలో సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) పూర్వ రాజకీయ విభాగమైన మతశక్తి జనసంఘం, స్వతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ఉన్నప్పటికీ సిపిఎం దాన్ని బలపరిచేందుకు వెనుకాడలేదు.


గత ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ఒక్క అత్యవసర పరిస్ధితి విధింపు మినహా మిగతా అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల కూల్చివేతలకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తు సంస్దల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం వంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మతోన్మాద మహమ్మారిని ముందుకు తెచ్చింది. వివిధ ఉద్యమాల్లో తన విధానాలను వ్యతిరేకించిన వారి మీద ఉగ్రవాద, దేశద్రోహ నేరాలను మోపుతూ తమను వ్యతిరేకిస్తే అందరికీ ఇదే గతి అని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేసింది. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి పాలనకు వ్యతిరేకత పెరిగే కొద్దీ అది రాజకీయ పార్టీలకు విస్తరించే రోజు ఎంతో దూరంలో లేదు. అందువలన వీటిని వ్యతిరేకించే శక్తులన్నీ సహజంగానే ఐక్యం కావాలని కోరుకుంటాయి. అలాంటి వాంఛకు నిదర్శనమే శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశం. కరోనా రెండవ దశను నిర్లక్ష్యం చేయటం, వచ్చిన తరువాత అయినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడకపోవటం అన్నింటినీ మించి ఆక్సిజన్‌, వాక్సిన్ల విషయంలో సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలిసిందే. ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి బలహీనత, దాన్ని వ్యతిరేకించే శక్తుల బలం వెల్లడైంది. బిజెపి వ్యతిరేక శ క్తుల సమావేశానికి పురికొల్పిన అంశాలు ఇవే. వచ్చే ఏడాది జరిగి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ప్రయత్నాలు ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పవచ్చు.


గత అనుభవాలను చూసినపుడు కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిలోకి వచ్చేందుకు బిజెపి ఎన్నడూ తటపటాయించలేదు. అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపేందుకు అది అర్రులు చాచింది. రాజకీయంగా ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తపించి పోయింది. తన అజెండాను దాచుకోకపోయినా ముందుకు తేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు దాన్నే ముందుకు తెచ్చి అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల వివాదంలో తాము సంఘపరివార్‌ను వదులుకొనేది లేదని బహిరంగంగా ప్రకటించి జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘం విడిపోయి బిజెపి పేరుతో కొత్త దుకాణం తెరిచింది. ఈ కారణంగానే తరువాత కాలంలో దానికి ఉన్న మతోన్మాద లక్షణం కారణంగా వామపక్షాలు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. (పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమన్వయం చేసుకోవటం వేరు ) మిగతా పార్టీలు మతకోణాన్ని పక్కన పెట్టి అవకాశవాదంతో దానితో చేతులు కలిపాయి. ఇప్పుడు అవి తమ వైఖరిని తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.


బిజెపి వ్యతిరేక కూటమి విషయానికి వస్తే గతంలో బిజెపి లేదా దాని పూర్వ రూపం జనసంఘం మాదిరి ఎవరితో అయినా కలవటానికి ముందుకు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ రావటం లేదు. రాజకీయంగా బలహీనపడినప్పటికీ తన షరతుల మీద నడవాలని అది కోరుకుంటోంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని వ్యతిరేకించే శక్తులతో రాజీపడేందుకు సిద్దం కావటం లేదు. వాస్తవ పరిస్ధితిని గుర్తించేందుకు సిద్దంగా లేదు. ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా తానే ఏక పార్టీగా చక్రం తిప్పగలననే భ్రమలతో ఉంది.బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలను ఖాతరు చేయటం లేదు. తొక్కివేసేందుకు వెనుకాడటం లేదు. అయితే ఎంత బలహీనపడినప్పటికీ బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ లేకుండా లక్ష్యం నెరవేరదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే రెండు రకాలు. గతంలో కాంగ్రెస్‌ బాధిత పక్షాలు,సహజంగానే కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసిన కారణంగానే తరువాత ఎన్‌టి రామారావు దానికి కేంద్రంగా మారారు. అయితే కాంగ్రెస్‌ బలహీనపడిన తరువాత అవే పార్టీలు బిజెపితో అవకాశవాదంతో జట్టు కట్టాయి. అలాంటి వాటిలో తెలుగుదేశం పార్టీ ఒకటి. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపింది. గత ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి ఆ పార్టీతో సంబంధాలకు తహతహలాడుతోంది.


మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి కూడా కూడా అవకాశవాదానికి మారుపేరుగా ఉంది. సమాజవాది పార్టీతో మిత్రపక్షంగా ప్రారంభమై శత్రుపక్షంగా మారింది. గతలోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జట్టుకట్టింది. ఇప్పుడు దానితో కలిసే పరిస్ధితి లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవికోసం బిజెపితో చేతులు కలిపింది. రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. అదే పార్టీతో వైరమూ పెట్టుకుంది. యుపిఏ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఉపసంహరించుకుంది.
శివసేన విషయానికి వస్తే అది బిజెపి బాధిత పార్టీ. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో బిజెపితో చేతులు కలిపింది, కేంద్ర మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.తరువాత అధికారం దగ్గర పంచాయతీ వచ్చి బిజెపితో పోరాడాల్సి వచ్చింది. బిజెపి బాధిత పార్టీగా మారింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. ఒడిషాలో బిజెడి ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉంది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌-బిజెపిలను రెండింటినీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి తీసుకొనే అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇస్తుంది. వైసిపి విషయానికి వస్తే కాంగ్రెస్‌తో దానికి పేచీ లేదు. ఆ పార్టీని అంతం చేసి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత బిజెపితో సమస్యలున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ముందుకు వస్తుందా అంటే అనుమానమే. బిజెపిని సమర్ధించే విషయంలో బిజెపితో పోటీ పడుతోంది.


పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలు లేవు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ ్వంత సిన్హా ఆహ్వానం మేరకు ఇతర పార్టీలతో పాటు సమావేశానికి హాజరైనప్పటికీ ఆ పార్టీ ఉండే కూటమిలో చేరటం అనుమానమే. కర్ణాటకలో జెడిఎస్‌ పార్టీ కూడా అవకాశ వాదంతో వ్యవహరించింది. అధికారం కోసం బిజెపి-కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపేందుకు అది సిద్దం. కనుక ఇప్పటికిప్పుడు బిజెపి వ్యతిరేక కూటమి రూపుదిద్దుకోవటం అనేక సమస్యలతో కూడి ఉంది.

కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టి బిజెపిని రాజకీయంగా కొంత మేరకు రక్షించింది. అయితే దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితి రాబోయే రోజుల్లో అసలైన పరీక్ష పెట్టనుంది. బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు అది కూడా దోహదం చేస్తుంది. గతంలో ఇందిరా గాంధీ తన అధికారానికి ఎసరు వచ్చినపుడు రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సంఘపరివార్‌ తన అజెండాను అమలు జరిపేందుకు అధికారంలో కొనసాగాలని కోరుకుంటోంది. అందువలన ఒక వేళ ఎన్నికల్లో ఓటమి తధ్యమని తేలితే ఎంతకైనా తెగించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది. అందువలన ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్నే అయినప్పటికీ అధికారం కోసం ఏమైనా చేయవచ్చు. అదే జరిగితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల ప్రాతిపదికన ఏకీకరణ జరుగుతోంది. మన దేశంలో కూడా అలాంటి మధనం జరగాలి. దానికి శరద్‌ పవార్‌ నివాసంలో నిర్వహించిన సమావేశం నాంది పలికితే దాని ప్రాధమిక ప్రయోజనం నెరవేరినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరుగుతున్నారా – ఒక పరిశీలన !

01 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Politics, Believers in Kerala LDF, CPI(M), Kerala LDF, Sabarimala controversy


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d